ఒళ్ళు మరిచిపోయిన చందమామ!

br passportచక్కని రాచకన్నియలు సౌధములన్ శ్రవణామృతంబుగా
మక్కువఁ బాడుచున్ లయ సమానగతిం బడఁ జెండుఁగొట్టుచోఁ
జుక్కల ఱేఁడు మైమఱచి చూచుచు నిల్వఁగ నప్పురంబునం
దక్కట చెండు తాకువడి యాతని మేనికిఁ గందు గల్గెఁగా.
శంతనుమహారాజుగారి కాలమది. హస్తినాపురం సౌధాల మీద చూడచక్కని రాచకన్నెలు సంగీతం పాడుతున్నారు. చెవులకు (శ్రవణ) అమృతమయ్యేట్టుగా పాడుతున్నారు. చాలా ప్రీతితో ఇష్టపడి (మక్కువన్) పాడుతున్నారు. కనకనే శ్రవణామృతంగా ఉంది. అలా పాడుతూనే (పాడుచున్) చెండు ఆడుతున్నారు. పువ్వుల్ని బంతిలాగా కట్టి ఎగరెయ్యడం పట్టుకోవడం, ఒకరు ఇటు కొట్టడం మరకొరు అటు కొట్టడం-ఇలా పూల చెండుతో బంతి ఆడుతున్నారు. పోనీ కొందరు పాడుతున్నారు, కొందరు ఆడుతున్నారనుకుందాం. ఆడేవాళ్ళు- పాటలో ఉన్న లయకు సమానమైన గతి పడేట్టు ఆడుతున్నారు. నాట్యగత్తెలు రంగస్థలం మీద ప్రదర్శించే బంతి ఆట చూసినవారికి ఇది బాగా తెలుస్తుంది. సరే, లయానుకూలంగా చెండు కొడుతున్నారు. ఆటా పాటా అద్భుతంగా సాగుతున్నాయి (పాడుచున్-చెండుఁగొట్టుచోన్).
పక్కనే –ఆకాశంలో పోతున్న చందమామకు ఇది కంటబడింది. అతడసలే చుక్కల ఱేడు. వీళ్ళు చక్కని చుక్కలు. అమృతంలాంటి పాట. దానికి తోడు చెండాట. ఇంకేముంది-ఒళ్ళు మరచిపోయాడు. మైమరిచి అలా చూస్తూ సౌధంమీద నిలబడిపోయాడు. వాళ్ళు విసురుతున్న చెండు వచ్చి తన బొజ్జమీదనో వీపుమీదనో థపా థపా తగులుతున్నా ఆ జీవుడికి ఏమీ తెలీడం లేదు. అయ్యయ్యో! (అక్కట) పాపం-చెండు తాకులు (తగలడాలు) పడీ పడీ అతడి శరీరం కందిపోయింది! అదే- అతడి బింబంలో ఉన్న మచ్చ. మేనుకి కలిగిన కందు (మచ్చ), -అని సానుభూతి ప్రకటిస్తున్నాడు కవి.
ఇంతకీ- చెండు ఆడటం అనలేదు. చెండు కొట్టడం అన్నాడు. కనక ఇది తెలుగునాట ప్రసిద్ధమైన ఉట్టికొట్టడమే కావచ్చు. ఉట్టి బదులుగా- చెండు. ఆటా పాటా దరువూ పరుగూ ఎగరబోవడం నీళ్ళు పోయడం ఉట్టిచెండు అందకపోవడం గాలిలో చెయ్యి విసరడం అది చంద్రుడికి తగలడం వాడి వీపు కందిపోవడం-ఆహా! ఏమి కోలాహలం!!
సౌధాల ఎత్తు, కన్నెల సౌందర్యం, సంగీత విద్యా ప్రావీణ్యం, క్రీడాకుశలత, సరసత, సంపన్నత, తీరుబాటు- ఇలా ఎన్నెన్నో వ్యంగ్యాలు స్ఫురిస్తాయి ఇందులో.

 

మ.     ప్రతి జన్మంబు సుమంగళీత్వగరిమన్ బ్రాపింప నింద్రాణి సు
వ్రత చర్య న్వరుణానికిన్ రవి హరిద్రా చూర్ణ రాశి న్నభ
స్తత శూర్పంబున వాయనం బొసఁగఁ బ్రత్యక్సింధు వీచీ పటా
వృతి యొప్పన్గొని, చల్లు నక్షతలు నాఁబెంపొందెఁ దారౌఘముల్
(తారాశశాంకవిజయము. ఆ. 4. పద్య. 110.)
ఇంద్రునిభార్య శచీదేవి (ఇంద్రాణి) ప్రతిజన్మలోనూ తనకు ఇలాగే సుమంగళీత్వం లభించడం కోసం (ప్రాపింపన్ ) ఒక వ్రతంచేసి, సువ్రతచర్యలో భాగంగా, పశ్చిమదిక్కుకు అధిపతి అయిన వరుణుని భార్య – వరుణానికి, సూర్యుడనే పసుపుపొడి ప్రోగును (హరిద్రా- చూర్ణ – రాశిన్ ) – పసుపు ముద్దను ఆకాశమనే పెద్ద చేటలో (తత శూర్పము) వాయనం ఇచ్చింది. ఇవ్వగా – వరుణాని ఏమి చేసిందంటే – పడమటి సముద్రపు కెరటాలు (ప్రత్యక్-సింధు – వీచీ) అనే తన పైట చెంగును ఆ చేట మీద కప్పి (పట – ఆవృతి – ఒప్పన్ ) ఆ వాయనం ఒప్పుగా అందుకొంది. పెద్దలు ఇచ్చే ప్రసాదాలను కొంగుపట్టి తీసుకోవడం ముత్తైదువులిచ్చే వాయనాలను కొంగు కప్పి అందుకోవడం తెలుగింటి సంప్రదాయం. అలా అందుకొని – అభీష్టసిద్ధిరస్తు – వ్రతఫల ప్రాప్తిరస్తు అని కోరుతూ – ఇంద్రాణిమీద వరుణాని జల్లే శుభాక్షతలు అన్నట్టుగా (నాన్ ) ఆకాశంలో తారల గుంపులు (తార – ఓఘముల్ ) శోభించాయి.

మంచి ముత్యాల్లాంటి పద్యాలు

br passport

ఎప్పుడు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో! సుమారు రెండు వేల సంవత్సరాలుగా నడుస్తోంది తెలుగు పద్యం. దీనితో కలిసి మనమూ నాలుగు అడుగులు వేద్దామంటారా. రండి మాతో పాటు. పద్యం కోసం పాదయాత్ర. పాడిందే పాటగా ఎక్కిన గుమ్మమే ఎక్కడం కాదు. భక్తితో భజన చెయ్యడమూ కాదు. చూడవలసిన చోట్లు కొన్ని ఉన్నాయి. ఎవరూ అంతగా దృష్టి పెట్టనివి. అవి చూద్దాం.

సముద్ర గర్భంలో ఆల్చిప్పలుంటాయనీ, వాటిలో ముత్యాలుంటాయనీ, వాటిని పట్టి తెచ్చి అమ్ముతారనీ విన్నాం. కానీ ఈ ముత్యాల వేట ఎలా ఉంటుందో తెలీదు. దీన్ని సూర్యాస్తమయం తారకోదయాలతో పోల్చి చెబుతున్నాడీ కవి.

178. చం.     శరనిధి సాంధ్యరాగ మనుచక్కని బచ్చెన యోడనెక్కి, దు
స్తరతర రశ్మి బద్ధ రవి జాలికు నీటను ముంచి, మౌక్తిక
స్ఫుర దురు శుక్తికల్గొని, నభోధరణిన్ సమయంపు బేరి ని
బ్బరముగఁ గొట్టి, రాలుచు సుపాణు లన, న్విలసిల్లెఁ దారకల్
(మిత్రవిందాపరిణయము. కుం. వేం. ఆ. 5. పద్య. 11.)

ముత్యాల వ్యాపారి కథను ముడిపెట్టాడు ఈ పద్యం లో – కవిగారు.

బేహారి –
బేరి = వ్యాపారి. సమయము అనే వ్యాపారి (బేరి). సాంధ్యరాగము అనే చక్కని రంగు
(బచ్చెన) ఓడను ఎక్కి సముద్రంలోకి (శరనిధి) ముత్యాలకోసం వెళ్ళాడు. సూర్యు డు (రవి)
అనే జాలరిని (జాలికున్ ) ఎక్కిం చుకుని మరీ వెళ్ళాడు. మధ్యలోకి వెళ్ళాక ఈ జాలికుణ్ని
శరనిధిలోకి దింపాడు. నడుముకి పొడవైన – తెగిపోని (దుస్తరతర) త్రాడుతో కట్టి
(రశ్మిబద్ధ) నీటను దించాడు. (రశ్మి = కిరణం. కిరణబద్ధుడై రవి పడమటి సముద్రంలోకి
మునగడం).

ఆ జాలరి – సముద్రగర్భంనుంచి ముత్యాలతో నిండి ఉన్న (మౌక్తికస్ఫురత్ ) పెద్ద పెద్ద
ఆల్చిప్పలు (శుక్తికల్) తెచ్చి తన బేరికి అప్పజెప్పాడు. ఆ శుక్తికలను ఆకాశమనే నేలమీద
(నభో – ధరణిన్ ) పోసి, లోపలి ముత్యాలు చితికిపోకండా నిబ్బరంగా వాటిని పగలగొట్టి,
వాటినుంచి ఆ సమయపు బేహారి (బేరి) రాల్చిన మంచి ముత్యాలు (సుపాణులు) అన్నట్టుగా
– ఆకాశంలో తారకలు విలసిల్లాయి.

చం.     సమయమహేంద్రజాలకుఁడుసారసమిత్రుఁడనేటి పద్మరా
గము వెస మాయఁ జేసి, కుతుకంబున “హా”యని నీలపంక్తులన్
భ్రమపడఁ జూపి “ఝా” యనుచుఁ బల్కి సుపాణులఁ జేసి చూపెఁ జి
త్ర మనఁగఁ బ్రొద్దుగ్రుంకెఁ దిమిరం బెసఁగెన్ దివినొప్పెఁ దారకల్
(హంసవింశతి, ఆ. 2. పద్య. 173.)

సూర్యుడు ఎర్రగా అస్తమించగా, నల్లని చీకటి పంక్తులు కమ్ముకున్నాయి. ఆకాశంలో తెల్లగా మిలమిలలాడుతూ నక్షత్రాలు కనిపించాయి. ఈ పరిణామక్రమం ఎలాగుందంటే:  కాలం అనే గొప్ప ఇంద్రజాలికుడు తన మంత్రదండం తిప్పి సూర్యుడనే (సారస మిత్రుడు-అనేటి) పద్మరాగమణిని చిటుక్కున (వెసన్) మాయంచేసి, ఆనందంతో (కుతుకంబునన్) ‘హా’ అని అరుస్తూ మరోసారి మంత్రదండం తిప్పి ప్రేక్షకులు భ్రమపడేట్టు ఇంద్రనీలమణుల్ని (నీలపంక్తులన్) చూపించాడు. పద్మరాగాన్ని నీలమణులుగా మార్చేసినట్టు. అంతటా నల్లటి కాంతులు పరుచుకున్నాయి. ఇప్పుడు మరోసారి దండం తిప్పి ‘ఝా’ అని అరుస్తూ ఇంద్రనీలాలను మంచిముత్యాలుగా మార్చేసి (సుపాణులన్-చేసి) చూపించాడు. ఆహా! ఎంత చిత్రం! ఎంత చిత్రం! అన్నట్టుగా-సూర్యబింబం క్రుంకింది, తిమిరం వ్యాపించింది (ఎసఁగెన్), ఆకాశాన తారకలు పొడిచాయి.

శైవల నీలముం గమలశాలియునైన యగడ్త నీరు ప
ద్మావళి వ్రాఁత తోడి కరకంచుగ నొప్పుచుఁ గోట శాటిలా
గై వఱలంగ హర్మ్య కనకాంశు నికాయము పేరఁ దత్పుర
శ్రీ విలసిల్లు నభ్రచర సింధువు-మౌళికి మల్లెదండగన్
(కళాపూర్ణోదయము 01-112)

ఇది ద్వారకా పురలక్ష్మి. ఈవిడ ఒక బంగారు చీర (శాటి) కట్టుకుంది. ప్రాకారమే (కోట) ఆ చీర. సౌధాల బంగారపు (కనక) అంశునికాయము- కాంతిపుంజం పేరుతో (వంకతో) అది అచ్చమైన శాటిలాగా భాసిస్తోంది (శాటి=చెంగావి చీర). ఈ శాటికి-కరక్కాయ రసంతో తీరిచి దిద్దిన అంచు ఉంది. కరక-అంచు. కరక్కాయ రసం కనక-నల్లటి అంచు. ఈ అంచుమీద ఉన్న వ్రాతపని (అద్దకం పని) పద్మాల వరుస. పద్మావళి దీని బోర్డరు. ఇంతకీ ఈ వ్రాతపనితో కూడిన కరకంచు ఏమిటి- అంటే-అగడ్త నీరు. నీరు మరి తెల్లగా ఉంటుంది కదా అది నల్లటి అంచు ఎలా అవుతుంది? నాచు తీగలు (శైవలం) కారణంగా అగడ్తనీరు నీలంగా ఉంది. కనక- కరకంచుగా ఒప్పుతోంది. అగడ్తలో –వికసించిన పద్మాలు చాలా చాలా ఉంటాయి కదా! అందుకని అగడ్తనీరు కమలాలు కలది కూడా (శాలియున్) అయ్యింది. ఇలా మొత్తానికి అగడ్తనీరు- పద్మావళి వ్రాఁతతోడి కరకంచుగన్ ఒప్పింది ఆ శాటికి.

హర్మ్య కనకాంశు నికాయము అనే బంగారు చీర ధరించిన తత్పురశ్రీ తన సిగలో ఒక మల్లెదండ తురుముకుంది. ఏమిటి ఆ మల్లెదండ అంటే- అభ్రచర సింధువు. దేవతల నది. ఆకాశగంగ. తెల్లగా ఉంటుంది గదా! అది ద్వారకాపుర లక్ష్మీదేవి మౌళికి మల్లెపూదండ కాగా-ఆ తల్లి అద్భుతంగా విలసిల్లుతోంది. జయహో! పింగళి సూరనా!!

చం.    పనుపడు వేణునాళములు పగ్గములుంబలెఁ గ్రింద బర్వు శో
భన కిరణప్రకాండములు భాసిలఁ జందురుఁడొప్పె నెంతయున్
మనసిజుఁ డెల్లప్రాణుల మనంబులు చేలుగ రాగబీజముల్
పెను జతనంబుతోడ వెదఁ బెట్టెడు రౌప్యపు జడ్డిగం బనన్
(ప్రభావతీప్రద్యుమ్నము. ఆ. 4. పద్య. 124.)

పూర్వకాలంలో పొలంలో విత్తనాలు నాటడానికి ‘జడ్డిగం’ అనే యంత్రం వాడేవారు.  ఇది ఒక పెద్ద పిడత. విత్తనాలు నింపి, దీనికి వెదురు గొట్టాలనమర్చి, వాటిద్వారా విత్తనాలు చాళ్ళలోకి జాలు వారేట్టు చేసేవారు. దీన్ని నాగలికి అమరుస్తారు. నాగలిని గిత్తలు లాగుతాయి. వాటి పగ్గాలు రైతు పట్టుకుంటాడు. పిడత ఖాళీ కాగానే మళ్ళీ విత్తనాలు నింపుతాడు. ఇదీ దీని కథ. చంద్రుడిని ఇటువంటి జడ్డిగంగా పోలుస్తూ కొత్త ఊహచేస్తున్నాడు కవి. విత్తనాలు నాటడంకోసం వెదురుగొట్టాల మాదిరి (వేణునాళములు) అలాగే పగ్గాల మాదిరిగానూ క్రిందకు జాలువారే అందమైన కిరణాలతో వెలుగొందే (కిరణప్రకాండములు భాసిలన్) చంద్రుడు- ఎంతయున్ ఒప్పెన్. ఎలా? మన్మథుడు (మనసిజుఁడు), ప్రాణులందరి మనస్సులు అనే చేలల్లో అనురాగబీజాలు, ఎంతో శ్రద్ధతో (పెను జతనంబు) నాటడానికి (వెదబెట్టుట) ఉపయోగిస్తున్న – వెండి (రౌప్యపు) జడ్డిగంలాగ చంద్రుడు కనిపిస్తున్నాడు.

అలవోకగా ఆమె అద్భుత జలవిన్యాసం!

br passportఎప్పుడు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో! సుమారు రెండు వేల సంవత్సరాలుగా నడుస్తోంది తెలుగు పద్యం. దీనితో కలిసి మనమూ నాలుగు అడుగులు వేద్దామంటారా. రండి మాతో పాటు. పద్యం కోసం పాదయాత్ర. పాడిందే పాటగా ఎక్కిన గుమ్మమే ఎక్కడం కాదు. భక్తితో భజన చెయ్యడమూ కాదు. చూడవలసిన చోట్లు కొన్ని ఉన్నాయి. ఎవరూ అంతగా దృష్టి పెట్టనివి. అవి చూద్దాం.

**

          క్రీడాభిరామం శ్రీనాధుడిదే. మన వరంగల్లులోదే. అక్కడ ఒక చిన్నది అలవోకగా ఒక ప్రదర్శన ఇస్తోంది. కళ్ళు చెదిరిపోయే ప్రదర్శన .చూద్దామా-

        చం.      వెనుకకు మొగ్గ వ్రాలి కడు విన్నను వొప్పఁగఁ దొట్టి నీళ్లలో          

                   మునిఁగి తదంతరస్థమగు ముంగర ముక్కునఁ గ్రుచ్చుకొంచు లే

                   చెను రసనాప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూస పే

                   రనుపమలీల నిప్పడు చుపాయము లిట్టివి యెట్టు నేర్చెనో

(క్రీడాభిరామము – పద్యం. 146)

ఓరుగల్లులో ఒక పడుచుపిల్ల చేస్తున్న అద్భుత విన్యాసాలను చూసి మంచనశర్మ ఆశ్చర్యచకితుడవుతున్న సందర్భం.

ఆ పడుచుపిల్ల – నిండా నీళ్ళున్న తొట్టెలోకి తన ముక్కెరను (ముంగర) విసిరేసింది.  ఆ తొట్టె చెంత – ప్రేక్షకులవైపు తిరిగి బోసి ముక్కుతో నిలబడింది.  చేతులు పొట్టకి పెట్టుకుని – అలవోకగా వెనక్కి వంగింది (మొగ్గవ్రాలి).  తొట్టె అంచుకి తన వెన్ను తాకకండా వంగింది.  తొట్టెనీళ్ళలోకి చాలా నేర్పు (విన్ననువు) ఒప్పేట్టు తలా మెడా ముంచింది.  అంతే నేర్పుగా అలవోకగా లేచి నిలుచుంది. ఇప్పుడు ఆమె ముక్కుకి ముంగర మెరిసిపోతోంది. చప్పట్లే చప్పట్లు.

చేటలో నల్లపూసలు పోసుకుంది.  ఒక చేత్తో పట్టుకుంది.  దారం ఎక్కించిన సూదిని మరో చేత్తో పుచ్చుకుంది.  చిగురాకులాగా ఎర్రగా ఉన్న తన నాలుకతో అతివేగంగా (శీఘ్రము) ఆ నల్లపూసలను దారానికి దండ గుచ్చింది.  సాటిలేని రీతిలో (అనుపమలీలన్‌) ఒయ్యారంగా నల్లపూసలపేరు తయారు చేసింది.  మళ్ళీ చప్పట్లే చప్పట్లు.

ఈ పడుచుపిల్ల ఇలాంటి విద్యలూ ఉపాయాలూ ఎన్ని నేర్చిందో ఎలా నేర్చిందో కదా – అని మంచనశర్మ ఆశ్చర్యపోయాడు.