కష్టజీవి ఆత్మాభిమానం… ‘ఆదివారం’!

 

karalogo
నిర్వహణ: రమా సుందరి బత్తుల

పని చేసేవారికి కాకుండా ఆ పనిని చేయించేవారికీ, చేయించుకునేవారికి గౌరవాలు దొరికే సమాజం మనది. అందుకే శ్రామికులకు పనిచేసే అవకాశం కల్పించి వారిని పోషిస్తున్నామని ధనికులు భావిస్తుంటారు. వారి జీవితాలు తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడివున్నాయనే అభిప్రాయంతో ఉంటారు.

కానీ నిజానికి ఎవరు ఎవరిపై ఆధారపడివున్నారు?

పని మనిషి పొద్దున్నే వచ్చి ఇల్లు ఊడ్చి, అంట్ల గిన్నెలు తోమకపోతే గృహ వాతావరణం గందరగోళంగా తయారై, ఇంటిల్లపాది సుఖశాంతులకూ ముప్పు వచ్చే సందర్భాలు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఇళ్ళలో సాధారణం. కానీ అంత చాకిరీ చేసేవారికి ప్రతిఫలంగా కొద్ది మొత్తం ఇవ్వటానికే కొందరు బాధపడిపోతుంటారు.

ఆ శ్రామికులపై సానుభూతి చూపటం అటుంచి … వాళ్ళ ఆశపోతుతనం, షోకులూ, ఫ్యాషన్ల గురించి వ్యంగ్యంగా విసుర్లూ, జోకులూ, కార్టూన్లూ చలామణిలోకి వచ్చాయి. ఈ ధోరణి చివరకు సాహిత్యంలో కూడా ప్రవేశించింది. ‘జీతం పెంచాలా? ఇంకా నయం- ఆస్తి రాసివ్వమని అడగలేదు’ అని ఆశ్చర్యాలుపడుతూ పనిమనుషుల దాష్టీకాలకు గురయ్యే మధ్యతరగతి గృహిణుల కష్టాలపై జాలి కురిపిస్తూ కథలు కూడా వచ్చేశాయి. వీటిని రాసినవారు శ్రామికులపై సానుభూతి లేనివారని తెలుస్తూనేవుంటుంది.

కానీ వీటికి భిన్నంగా… యాబై సంవత్సరాల క్రితమే కాళీపట్నం రామారావు రాసిన ‘ఆదివారం’కథ ఓ కష్టజీవి ఆత్మాభిమానాన్నీ, స్థైర్యాన్నీ కళాత్మకంగా చిత్రీకరించింది. శ్రామిక పక్షపాతంతో రాసి పాఠకులను ఒప్పించేలా కథను తీర్చిదిద్దారు రచయిత.

డబ్బున్న ఓ ఇంటి కోడలి కోణంలో ఈ కథ నడుస్తుంది. ‘మా యింట్లో పనిమనిషి లేనిదే పూట గడవదని ఏనాడో తేలిపోయింది’ అంటుందామె. (ఇది ఇప్పుడు మనం చాలా ఇళ్ళలో గమనిస్తున్న నిత్యసత్యం.) ఆమె అత్త లౌక్యురాలైన అరవై ఏళ్ల వయసున్న పెద్దావిడ.

ఆ ఇంట్లో పని మనిషి అంకాలు. ఈమె భయపెడితే జడుసుకోదు. కలియపడదామంటే తిరగబడుతుంది. డబ్బాశకూ లొంగిరాదు. మనసులో విషయం దాచి మసిపూసి మారేడుకాయ చెయ్యడంలో తమకన్నా రెండాకులు ఎక్కువ చదివిందనీ, ఆవలిస్తే పేగులు లెక్కపెట్టగలదనీ కోడలి అభిప్రాయం.

ఈ కొరకరాని కొయ్య అంకాలు వారానికో రోజు సెలవు కావాలని అడిగితే అత్త పేచీ పెట్టుకుంటుంది. వేరే పనిమనిషిని పెట్టుకోవాలని మూడు రోజులు ఎన్నిపాట్లు పడినా ఫలితం ఉండదు. గర్వభంగమై బింకం సడలిపోతుంది. కానీ ఏదోరకంగా తన పైచేయి ఉండాలని ఆదివారం కాకుండా మరే రోజునైనా సెలవు తీసుకొమ్మని అంకాలును ప్రాధేయపడుతుంది.

బలిష్ఠమైన మనిషి నిస్సహాయంగా బక్క వ్యక్తిని ఒప్పించటానికి ప్రయత్నిస్తుంటే ఆ అరుదైన దృశ్యం ఎవరికైనా సంతోషం కలగజేస్తుంది. ఇక్కడ అత్త మనస్ఫూర్తిగా కాకుండా ఎత్తుగడతోనే పని మనిషిని బతిమిలాడినా ఆ ఆక్రోశం వీనులవిందుగానే ఉంటుంది.

‘అంట్లు తోముతూ కూర్చుంటే నాకు నగుబాట్లుగా ఉంటుంది. ఆదివారం నాడు మాత్రం నా చుట్టాలు పక్కాలు మధ్య నా పరువు నిలబెట్టు.’ అని ప్రాధేయపడినప్పుడు- ‘దాసీ ముండన్నేనట- యీ యమ్మ పరువు నిలబెట్టాలట!’ అని ఆ పరువు డొల్లతనాన్ని అంకాలు బట్టబయలు చేస్తుంది.

అత్త తన పంతం నెగ్గించుకున్నానని తృప్తిపడటంతో కథ ముగుస్తుంది.

* * *

అంకాలు పాత్ర చిత్రణ గొప్పగా ఉంటుంది.   తనకు డబ్బు ఎక్కువ వస్తుందనేది కూడా పట్టించుకోకుండా తోటి పనిమనిషి సూరమ్మకు జరిగిన అన్యాయం గురించి ఆమె నిలదీస్తుంది.

‘నిజంగా కాయకష్టం చేసుకునే వాళ్ళ కష్టాలు యీ గవన్నెంటు కెప్పుడు పట్టాయి; మాకు వాళ్ళూ వీళ్ళూ రూలు పెట్టేదేవిటి; మేవే పడతాం రూల్సు’అనే ధీమా!

‘అదేటి కలకటేరా గవినేరా- నాలాగే పన్జేసుకునే కూలిముండ. దాన్తో సెప్పుకుంటే ఏటౌతాది?’ అంటూ వ్యంగ్యం!

‘అందరి పన్లూ ఆ ఒక్క గంటలోనే సేసీడానికి మాకేం పచ్చేతులూ, పది కాళ్ళూ ఉంటాయేటమ్మా? ఉన్నా అందరిళ్ళల్లోనూ ఒక్కపాలే పన్జేసీడానికి మావేం దేవతవా?’అంటూ ఎత్తిపొడుపు!

‘నిన్నూ నిన్నూ అడుక్కోడానికీ, నీ కాళ్ళూ నీ కాళ్ళూ పట్టుకు పిసకరించడానికీ నాకేం పట్టిందమ్మా. నానేం అవిటిదాన్నా, సెవిటిదాన్నా? … కష్టపడతాను.’ అని తిరుగులేని ఆత్మాభిమానం! .

కష్టజీవులకు ఇలాంటి ఆత్మాభిమానం అవసరమనీ; మోసపోయే అమాయకత్వం కాకుండా దీటుగా ఎదుర్కొనే తెలివితేటలు ఉండాలనీ రచయిత ఈ కథ ద్వారా సూచించినట్టు అర్థం చేసుకోవచ్చు.

* * *

kaaraa

కాళీపట్నం రామారావు రచనల గురించి చర్చించుకునేటపుడు పెద్దగా ప్రస్తావనకు రాని కథ ‘ఆదివారం’. మిగిలిన కథలకు అమితంగా ప్రాచుర్యం వచ్చేయటం ఇందుకో కారణం కావొచ్చు. ఇది 1968 జూన్ 7న మొదటిసారి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది

ఈ కథ వెనకున్న ఓ విశేషం ఏమిటంటే… కా.రా. తాను రాసిన నాలుగు సంవత్సరాలకు గానీ దీన్ని పత్రికకు పంపలేదు. అంటే ‘యజ్ఞం’ కంటే ముందే ఈ కథ రాశారన్నమాట!

 

‘తీర్పు (1.3.1964) రాసి నాకు కథ రాయడం వచ్చిందనుకున్నాను. ఇల్లు (1.4. 1964) రాసి పాత వాసనలు వదలేదని బాధపడ్డాను. ఆదివారం సరిగానే వచ్చినా పత్రికకు పంపకుండా నాలుగేళ్ళు దాచిపెట్టేను. యజ్ఞం (1.1. 1966 ) రాసేక నామీద నాకు నమ్మకం కుదిరింది. ’ అని కా.రా. 1986లో ‘నేను నా రచన’ అనే వ్యాసంలో రాశారు.

సహజసిద్ధమైన సంభాషణలు ‘ఆదివారం’ కథను ఆసక్తికరంగా మలిచాయి. ముఖ్యంగా మాండలిక, నుడికార ప్రయోగాలతో కథ పరిపూర్ణంగా, విశ్వసనీయంగా తయారైన భావన కలుగుతుంది..

– ‘అశిరమ్మంత గొంతు పెట్టుకొని ఆకాశమంత ఎత్తు లేచిపోయింది.’

– ‘అద్దముంది, ముఖముంది. అంతకు మించి నేనొక్కపొల్లు మాటన్లేదు.’

– ‘మౌన ముద్ర వహిస్తే కుదరదు. అనువులనో మినువులనో అనాలి.’

– ‘వీళ్ళ కట్టులో సగం కట్టుంటే మనం ఏనాడో బాగుపడుదుం’

అంకాలు, అత్తల పాత్రలను నిర్వహించిన తీరు, వారి మాట తీరులో రచయిత చూపిన వైవిధ్యం ఆకట్టుకుంటాయి.

శీర్షిక పేరు ‘ఆదివారం’ బాగా సరిపోయింది. సంఘర్షణ మొదలవటం- కొనసాగటం, రాజీ పడటం; పంతం నెగ్గించుకోవటం- ఇవన్నీ ఈ రోజు గురించే! ఈ కథలో అన్నీ స్త్రీ పాత్రలే ఉండటం ఒక విశేషం!

 – వేణు

 

ch venu

 

 

వేణుగారు పాతికేళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. సంగీతం, సాహిత్యం, చిత్ర లేఖనం ఈయన అభిమాన విషయాలు. ‘వేణువు’ పేరుతో వీరి బ్లాగ్ నెటిజన్స్ లో చాలా మందికి సుపరిచితమే. ఈనాడు, తెలుగువెలుగు, వాకిలి, పుస్తకం.నెట్ లలో వేణుగారి సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు వచ్చాయి. సాహిత్యాభిమాని అయిన వేణుగారికి రంగనాయకమ్మ, కొడవటిగంటి కుటుంబరావు అభిమాన రచయితలు.

 వచ్చే వారం “జీవధార” కధ గురించి వై. కరుణాకర్ పరిచయం 

కథ లింక్:

https://www.scribd.com/doc/242719892/%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-%E0%B0%95%E0%B0%A7