కథా నిర్మాణంపై శ్రద్ధ తక్కువ – సాయి బ్రహ్మానందం గొర్తి

కొత్త సంవత్సరం వస్తోందంటే గడచిన ఏడాదిలో జరిగిన సంఘటనలూ, నిర్ణయాలూ, సంతోషాలూ, బాధలూ అవలోకనం చేసుకోవడం చాలామందికి ఒక రివాజు. ఒకరకంగా రాబోయే ఏడాదికి అవి పాఠాలు కావచ్చు; మంచైనా, చెడయినా. సాహిత్యం కూడా జీవితంలో భాగం కాబట్టి ఈ రివాజు దానికీ వర్తిస్తుంది.  డిసెంబరు ఆఖరి వారంలో 2015లో వచ్చిన తెలుగు కథల మీద చెప్పమని ఎనిమిది ప్రశ్నలు పంపించారు సారంగ సంపాదకులు.
రాయాలా, వద్దా అన్న మీమాంసలో పడ్డాను. ఏటా  వెయ్యికి పైగా కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమవుతాయి.  నేను అన్ని కథలూ చదవలేదు. చదవడం అసాధ్యం కూడా. అలా అని చదవకుండానూ లేను. నా దృష్టికి వచ్చినవన్నీ చదివాను. కనుక ఈ ప్రశ్నలు వారివే అయినా ఇవి నా పరిశీలనలే తప్ప కథా విమర్శ కాదు.
 
నేను చదివినదాంట్లో కొన్ని కథలు గురించి ప్రస్తావిస్తాను. అంతకు ముందు ఏడాదితో (2015) పోలిస్తే గడచిన సంవత్సరంలో(2016) వచ్చిన కథలు వస్తుపరంగా, నాణ్యత పరంగా చాలా తక్కువగా వున్నాయి. నాణ్యత అంటే కథా వస్తువు కొత్తదై వుండాలి. నిర్మాణమూ, కథనమూ బావుండాలి. ముఖ్యంగా వాటిలో వాడిన భాష. సహజంగా ఉండాలి. చివర వరకూ పాఠకుల జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి చదివించాలి. ఇవీ నేనెంచుకున్న కొలమానాలు. 
 
1) 2016లో వచ్చిన కథల పై వస్తు పరంగా, శిల్ప పరం గా మీ అభిప్రాయాలు
 
ఇక్కడొక విషయం చెప్పాలి. చాలా కథలు వస్తువు చుట్టూతానే తిరుగుతున్నాయి. కథనం, భాష, నేపథ్యం వంటి విషయాలపై ఎవరికీ ఆసక్తి లేదు. ఎంతో ఇబ్బంది పెడుతున్న అంశం ఒకటుంది. అది – కథల్లో వాడే భాష. అసంపూర్తి వాక్యాలూ, అసంబద్ధ ప్రయోగాలూ చికాకు తెప్పిస్తున్నాయి. 
 
2. మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా-
 
బావున్న కథలు:
 
బౌండరీ దాటిన బాలు (వాకిలి) – మధు పెమ్మరాజు
భేతాళుడితో శైలజ (ఆంధ్ర జ్యోతి) – పి.వి.సునీల్ కుమార్
రాక్షస గీతం (సారంగ) – అనిల్ రాయల్
వలపల గిలక (కొత్తావకాయ ఘాటుగా బ్లాగు) – రచయిత్రి
ఆమ్మ (ఆంధ్రజ్యోతి) – కె.వి.గిరిధర రావు
ఎం. ఎస్.కె. కృష్ణజ్యోతి – (ఆంధ్రజ్యోతి) – నా నేల నాకు ఇడిసిపెట్టు సారూ
కస్తూరి పూలు (ఆంధ్ర జ్యోతి) – వెంకట్ సిద్ధారెడ్డి
ఒరాంగుటాన్ (వాకిలి) – మెహర్ 
సెల్ఫీ – మెట్రో కథలు – (సాక్షి) – ఖదీర్‌బాబు
అతనో అద్భుతం – (స్వాతి) – వంశీ
దుర్గారావు -(స్వాతి) – వంశీ 
రిసరక్షన్ – (సాక్షి) – వెంకట్ సిద్ధారెడ్డి (వస్తువు బర్నింగ్ ఇష్యూ అయినా కట్టిపడేసే కథనం ఉంది.)
 
 
ఎత్తుగడ బావుండి నిరాశ పరిచిన కథలు:
 
ఒక తలుపు వెనుక – అంధ్రజ్యోతి – అఫ్సర్
అశోకం – ఆంధ్రజ్యోతి – ఓల్గా
కొన్ని ముగింపులు – (సారంగ) – చంద్ర కన్నెగంటి 
 
 
నచ్చిన కొన్ని అనువాద కథలు: 
 
కసబ్.గాంధీ @ యారవాడ.ఇన్ – (సారంగ) – శాంతసుందరి 
కాపరి భార్య – (ఈమాట) – శారద
మా చిన్న చెల్లెలు – (సారంగ) – ఆరి సీతారామయ్య
(మల్లాది వేంకట కృష్ణ మూర్తి ఒక కథ అనువాదం చేసారు. ఆంధ్రభూమిలో వచ్చింది. పేరు గుర్తుకు రావడం లేదు.)  
 
3. మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు-
 
అపర్ణ తోట, చందు తులసి, మానస ఎండ్లూరి ఈ మధ్యనే కనిపించే రచయితలు. వీళ్ళకి రాయగలిగిన సత్తా ఉంది. 
 
కానీ వేరే అంశాలపైన శ్రద్ధ పెట్టడం వలన చెప్పదల్చుకున్న విషయం, ముఖ్యంగా కథా ప్రక్రియలో, ఇమడడం లేదు. 
 
ఎవరైనా సీనియర్ రచయితలు మార్గదర్శకం చూపిస్తే వీళ్ళు మంచి కథలు రాస్తారన్న ఆశ అయితే ఉంది. 
 
4. తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ  గలిగాయా?
 
పైన చెప్పినట్లు వస్తువుని దాటి కథ ముందుకెళ్ళడం లేదు. ఆ వస్తువుకి ప్రేరణ కూడా వార్తా కథనాలే. 
ఇవి దాటి సమాజంపైనా, జీవితాలపైనా పరిశీలన అన్నది కనిపించడం లేదు.   
ఇంగ్లీషుకథల్లో – ముఖ్యంగా అమెరికాలో – కథ చెప్పే పద్ధతి చాలా మారింది. వైవిధ్యమైన రీతుల్లో కథలు వస్తున్నాయి. ఉదాహరణకి పెంపుడు కుక్క ఇంట్లో వాళ్ళ కథ చెబుతుంది, తనదైన కోణంలో. అమెరికన్ కథతో తెలుగు కథని పోల్చడం కష్టం. 
 
5. మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?
ఇక్కడా అక్కడా అని లేదు.  ఎక్కడ కథ పడితే అక్కడే.
ఈ పత్రికలోనే మంచి కథలు వస్తాయి అన్న నమ్మకం ఎప్పుడూ లేదు. బ్లాగులో కూడా మంచి కథలు రావచ్చు.
పేరున్న పత్రికల్లో కూడా చెత్త కథలు వచ్చాయి. 
 
6.  కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?
తెలుగులో  కథా విమర్శ దాదాపుగా మృగ్యం. ఎవరైనా చెప్పాలనుకున్నా వినడానికి రచయితలు సిద్ధంగా లేరు. 
కథల బాగోగులు చెప్పే అలవాటు మనకి లేదు. వెబ్ పత్రికలు వచ్చాక కథకుడికీ, పాఠకుడుకీ తేడా పోయింది. 
వెబ్ పత్రికల్లో పాఠకులకంటే రచయితల కామెంట్లే ఎక్కువుగా ఉంటున్నాయి. 
రచయితలకి కామెంట్ల వ్యాధి సోకినట్లుంది. 
 
7.  కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?
రచయితల దృష్టంతా వీటిపైనే. తమ కథకూడా ఈ సంకలనాల్లో రావాలన్న తహతహ అయితే రచయిత్ల్లో బాగా కనిపిస్తోంది. 
అందులోకి ఎక్కడానికే అన్నట్లు కథా వస్తువులు కూడా ఎంచుకుంటున్నారు. కథా సంకలనాల్లో అచ్చైన కథల బాగోగులు 
ఏటా అచ్చేసే వారే చెప్పరు. అందులో వస్తే చాలు తమ కథ గొప్పది అన్న ధోరణికి ఈ సంకలనాలు నాంది పలుకుతున్నాయి. 
 
8.  మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా? 
నేను ఎక్కువగా ఇంగ్లీషు కథలు చదువుతాను. అమెరికన్ కథలకీ, మన కథలకీ చాలా వ్యత్యాసం ఉంది. 
ఉదాహరణకి – కథని ఒక దృశ్యంలా చూపిస్తూ రాస్తారు తప్ప, ఎక్కడా రచయిత పాత్రల్లోకి చొరబడడు. 
అనవసరమైన వర్ణనలూ, కవితాత్మకంగా వాక్యాలు రాయడం వంటివి ఉండవు. 
అలాగే కథల్లో వాడే భాష కూడా ఎంతో సరళంగా ఉంటుంది. భాషా పటాటోపం కనిపించదు.  
కథ చెప్పడానికి ఎన్నుకున్న కాన్వాసు కూడా ఎంతో మారింది. 

మూడు పాయల తెలుగు డయాస్పోరా   

 

చిత్రం: సృజన్ రాజ్

చిత్రం: సృజన్ రాజ్

 

-సాయి బ్రహ్మానందం గొర్తి

~

 

అశ్వశాల నుండి గుర్రాన్ని తీసుకురమ్మనమని ఆజ్ఞాపించాను. ఏం చెప్పానో పనివాడికి అర్థం కాలేదు. నేనే లేచి వెళ్ళి, జీను వేసి గుర్రం ఎక్కాను. దూరంగా ఎక్కడో శంఖనాదం వినిపించి, అదేమిటని పనివాణ్ణి అడిగాను. అతనికేమీ అది పట్టలేదు;వినిపించలేదు. గేటు దగ్గర నన్ను ఆపి “ఎక్కడికి ప్రయాణం?” అని ప్రశ్నించాడు.

“తెలీదు. ఇక్కడనుండి బయటకి. ఇంకాస్త దూరానికి. బయటకి వెళ్ళాలి. అదొక్కటే నా గమ్యాన్ని చేరుస్తుంది,” బదులిచ్చాను. “నీ గమ్యం ఎరుకా?” మరోసారి అడిగాడు.

“తెలుసు. ఇప్పుడే చెప్పాను కదా? ఇక్కడనుండి బయటకి. అదే నా గమ్యం!”

“ద డిపార్చర్” అనే కథలో చివిరి వాక్యాలు ఇవి. ఆ కథ రాసింది కాఫ్కా.

వలసజీవుల యాతనా, తపనా సూక్ష్మంగా చిన్న కథలో చూపించాడు కాఫ్కా.    

*******

ఏ మనిషయినా తన స్వస్థలం వదిలి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? అక్కడ భరించలేనంత ఇబ్బందయినా ఉండాలి. లేదా వేరే చోటకి వెళితే జీవితం మెరుగుపడచ్చన్న ఆశ అయినా వుండాలి. ఈ రెండే మనిషిని స్థాన భ్రంశం చేయిస్తాయి. కొత్త ప్రదేశం వేరే ప్రపంచాన్ని పరిచయం చేయిస్తుంది. కొత్త అనుభవాలని ఇస్తుంది. ఆలోచనలని రేకెత్తిస్తుంది. జ్ఞాపకాల కుదుపులున్నా, నిలదొక్కుకునే ధైర్యం ఇస్తుంది. ప్రవాస జీవితానికి ఒకటి కాదు. రెండు ప్రపంచాలు.  ఇంకా గట్టిగా చెప్పాలంటే మూడు ప్రపంచాలు.

000000000000  

ఊరు మారినా, ఉనికి మారునా?

దూరమయినప్పుడే కోల్పోవడం విలువ తెలుస్తుంది. అది – మనుషులు కావచ్చు; అలవాట్లు కావచ్చు; ప్రదేశాలు కావచ్చు; సంస్కృతి కావచ్చు – ఇంకా ముఖ్యంగా భాష కావచ్చు. ఈ కోల్పోవడం వెనుక నీడలా కనిపించని అదృశ్య పార్శ్వం  ఒకటి ఉంటుంది. ఆ పార్శ్వమే “ఉనికి” లేదా “గుర్తింపు”. ఈ ఉనికి అన్నది స్థానం బట్టి మారుతూ ఉంటుంది.

ఇల్లు దాటగానే ఒక రూపం, వీధి దాటగానే మరో రూపమూ, వూరు దాటగానే వేరొక రూపమూ సంతరించుకుంటుంది.  పరాయి రాష్ట్రం వెళితే ఒకవిధంగానూ, దేశం విడిచి వెళితే ఇంకో కొత్త రూపంలోనూ దర్శనమిస్తుంది. ఈ ఉనికి అన్నది కేవలం వ్యక్తిగతమే కాదు, దానికి చాలా పార్శ్వాలుంటాయి. వాటిలో ముఖ్యమైనవీ, చాలా ప్రభావితమైనవీ – భాషా, సంస్కృతి (అంటే జీవన విధానమూ, అలవాట్లు. ముఖ్యంగా ఆహారం). సంస్కృతి బయట ప్రపంచానికి తెలియకపోవచ్చునేమో కానీ, మొట్టమొదట కనిపించేదీ, వినిపించేదీ భాష ఒక్కటే.  ప్రపంచంలో ఏ మనిషికైనా తమ జీవన స్రవంతిలో భాషే ప్రధాన అంగమూ, ఆయుధమూ కూడా. అందువలనే భాష ఉనికిని అంటిపెట్టుకునే ఉంటుంది. అలాగే అలవాట్లూ, సంస్కృతీ. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. పరాయిదేశంలో అడుగు పెట్టీ పెట్టగానే ఇవి వారి ఉనికిని గుర్తు చేస్తూనే ఉంటాయి.

“ఊరు మారినా, ఉనికి మారునా? – ఉనికి మారినా, మనిషి మారునా?” అని పాత తెలుగు సినిమా పాటొకటుంది(ఆరుద్ర రాసినది). ఊరు మారితే ఉనికి మారినా, మారకపోయినా దాని పేరు మాత్రం మారుతుంది. రాయలసీమ వాస్తవ్యులూ, తెలంగాణా వాస్తవ్యులూ, కోస్తావాసులూ అన్నది రాష్ట్రం దాటితే తెలుగువారి గానే పరిగణించబడతారు. అదే దేశం వదిలి వెళితే భారతీయులుగా గుర్తించబడతారు.

వలస వెళ్ళిన దేశం అయితే అది “diaspOra”గా అవతరిస్తుంది. ఈ Diaspora (dispersed or scattered అన్నది గ్రీకు పదం. క్రీస్తు పూర్వం 586 కాలంలో యూదు జాతీయులు దేశ బహిష్కృతులై, ఈజిప్ట్‌ నుండి చెల్లాచెదరైపోయి పాలస్తీనా దగ్గర వలస చేరిన సందర్భంలో దీన్ని వాడేవారు. దాన్ని మెల్లగా వేరే దేశాలలో వలస వెళ్ళిన సమూహాలకి అన్వయించడం మొదలుపెట్టారు. ఈ అన్వయంలో చిన్న “d” తో వీరిని గుర్తించడం మొదలయ్యింది.  డయాస్పోరా (diaspora)కి ప్రధాన లక్షణం – ఉనికి.      

ఈ ప్రపంచంలో చాలా డయాస్పోరాలున్నాయి. ముఖ్యంగా అమెరికాలో.  వలసదారులతో ఏర్పడ్డ అమెరికా దేశంలో అనేక డయాస్పోరా కమ్యూనిటీలున్నాయి. చైనీస్, ఆఫ్రికన్లు, స్పానిష్, ఐరిష్ వాళ్ళనీ వీరిలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఉన్న ఊరునీ, కన్నవాళ్ళనీ, దేశాన్ని వదిలి ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టడంటే అంత తేలికయిన విషయం కాదు. భాషా పరంగా, సాంస్కృతిక పరంగా అనేక ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ నిలదొక్కుకొనీ తమకంటూ ఒక ప్రత్యేక ఉనికిని చాటుకోవడం ఈ డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేక లక్షణం.

మాతృదేశం వదిలి వలస వచ్చిన కొత్తలో ప్రతీ ఒక్కరినీ cognitive dissonance(అభిజ్ఞా వైరుధ్యం లేదా వ్యతిరేకత) ఆవరించుకొని ఉంటుంది.

వేరొక కొత్త సమాజపు అలవాట్లూ, సంస్కృతీ ఎదురుపడ్డప్పుడు – తమ నమ్మకాలకీ, ఆలోచనలకీ, నమ్మిన విలువలకీ మధ్య – వాటిద్వారా కలిగే ఒక మానసిక  ఒత్తిడి.  సూక్ష్మంగా చెప్పాలంటే – రెండు విభిన్న సంస్కృతులూ, నమ్మకాల మధ్య ఊగిసలాడే డోలాయమాన స్థితి.  ఈ సంఘర్షణకి అంతర్లీనగా సంస్కృతీ, అలవాట్లే హేతువులు అయ్యే అవకాశం చాలా వుంది.  వీటికంటే ప్రధానంగా మాట్లాడే “భాష” ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. అంతవరకూ మాతృభాషకి అలవాటు పడ్డ ఆలోచనలూ, భావాలూ ఒక్కసారి వేరే భాషలో రూపాంతరం చెందేటప్పుడు కొన్ని అర్థం మారిపోవచ్చు; కొన్ని జారిపోవచ్చు కూడా. ఇలాంటి సందర్భాలలో కొంత మానసిక సంఘర్షణ కలుగుతుంది.

ఈ సంఘర్షణలో – కొంత అస్పష్టతా, గందరగోళమూ, అపార్థమూ లేదా విబేధం ఏర్పడచ్చు. ఇవి కాకుండా కొంత ఉద్రిక్తతా, అఘాతం కూడా కలగవచ్చు. ఇవన్నీ వేరే జాతులు – అంటే అమెరికాలో ఉండే అమెరికన్లూ, ఆఫ్రికన్లూ, స్పానిష్ వాళ్ళూ, చైనీయులు, వంటి వారితో కలిసినప్పుడు కలగుతాయి. కేవలం మనుషుల మధ్యే కాకుండా వస్తుగతంగా కూడా ఉండచ్చు.

లండన్ యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ – Avtar Brah – “Cartographies of Diaspora” పుస్తకంలో ఇలా అంటారు – “డయాస్పోరా అన్నది కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తుంది. విడిపోయేటప్పడు కలిగే అనుభవంలో అఘాతాన్నీ, స్థానభ్రంశాన్నీ ఎత్తి చూపిస్తుంది. అదొక్కటే కాదు – కొత్త ఆశలనీ, సరికొత్త అధ్యాయాలనీ సృష్టిస్తుంది కూడా. ఈ కొత్త సాంస్కృతిక జాగాలో వ్యక్తిగతమైన, సామూహికమైన జ్ఞాపకాలు ఢీకొంటాయి. కొన్ని పెనవేసుకుంటాయి. ఇంకొన్ని రూపాంతరం చెందుతాయి. ఇదే దీనికున్న బలమూ; బలహీనతా కూడా.”

గత వందేళ్ళుగా డయాస్పోరా మీద కొన్ని వందల వ్యాసాలూ, పుస్తకలూ వచ్చాయి. ఎన్నో సిద్ధాంతలూ, ప్రతిపాదనలూ, చర్చలూ జరిగాయి. వాటిలో ఈ మధ్య పుట్టుకొచ్చిందే – Third Space Theory. ఈ పదాన్ని సృజన లేదా కోయిన్ చేసింది – Oxford University లో హోమీ.కె.భాభా అనే ఒక ఇండియన్ ప్రొఫెసరు. ఈ డయాస్పోరా కమ్యూనిటీల గురించి చెబుతూ – The diasporic communities occupy a unique interstitial third space, which enables negotiation and reconfiguration of different cultures through hybrid interactions. Third Space Theory explains the uniqueness of each person, actor or context as a “hybrid”.

దీన్ని బట్టి చూస్తే డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేకత – మిశ్రిత జీవనం; ఏకత్వంలో భిన్నత్వం. వీరికి రెండు కాదు – మూడు ప్రపంచాలు – మొదటి రెండూ, సొంత, వలస దేశాలయితే మూడోదే ఈ “కొత్త జాగా”. ఆ జాగాలో ఊపిరి పోసుకున్నదే డయాస్పోరా సాహిత్యం.

0000000000000

సాహిత్యం అనగానే మొట్ట మొదట గుర్తొచ్చేది భాష. భాష అంటే ఏది? మాతృభాషా? పరాయి భాషా? కొత్త దేశంలో మాతృభాష వెనక్కి వెళ్ళి పరాయి భాష ముందుకొస్తుంది. ఆ క్రమంలో వ్యక్తిగత భావ ప్రకటనే ప్రధానాంశం అవుతుంది. ఎవరికైనా భాష వచ్చూ అంటే – మాట్లాడడం, అర్థం చేసుకోవడం, చదవడం, రాయడం – వంటి వాటిలో నైపుణ్యం కావాలి.. ఈ నాలుగింటిలో నైపుణ్యత ఉన్నప్పుడే ఆ భాష వచ్చునని చెబుతాం.

ఎవరికైనా మాతృభాషలో ఉన్న ప్రావీణ్యత పరాయి భాషలో అంత తేలిగ్గా రాదు. కాబట్టి ప్రవాసీయులు తమ అనుభవాలానీ, జీవితాన్నీ చెప్పాలంటే మాతృభాషనే వాహకంగా ఎన్నుకుంటారు. తద్వారా తమ సొంత జాతీయులకి వారి జీవితం తెలిసే అవకాశం ఉంటుంది. ఇదొక పార్శ్వం. అమెరికాలో ఉన్న అనేకమంది తెలుగు రచయితలు అందిచ్చే సాహిత్యం, కథా, కవితా, నవలా, ఏ రూపమయినా ఈ కోవకి చెందుతాయి.

అలా కాకుండా పరాయి దేశపు భాషలో తమ అనుభవాలనీ, జీవితాన్నీ వ్యక్తీకరించినప్పుడు ఆయా దేశాలవారికీ తమ సంస్కృతీ, ఆలోచనలూ, సమస్యలూ, జీవితమూ తెలిసే అవకాశం ఉన్నాయి. అంటే ఇంగ్లీషులో సాహిత్య సృజన చెయ్యడం.

ఇంతకు ముందు ప్రస్తావించినట్లు యూదులు హీబ్రూ, అరామిక్ భాషల్లోనే అన్నీ వ్యవహారాలూ నడిపేవారు. మతంగురించి రాసినా, పండితులతో వ్యవహరించినా, మామూలు యూదు ప్రజలను ఉద్దేశించి చెప్పాలన్నా అవే భాషలు వాడేవారు. తమ దేశం వలస వచ్చిన వేరే జాతీయులకి చెప్పడానికీ ఇవే భాషలు వారికి బోధించి మరీ చేరవేసేవారు. తద్వారా వలస జాతీయుల ద్వారా కొంత సాహిత్యం పుట్టింది. వీరి అవస్థలూ, ఆలోచనలూ తెలిసాయి.

ప్రస్తుతం అమెరికా తెలుగు డయాస్పోరా సాహిత్యం తీసుకుంటే అది ఒంటికాలుతోనే ఉంది. ఎందుకిలా అనాల్సి వచ్చిందో చూద్దాం.

తెలుగు వారికంటే ముందు వచ్చిన చైనీస్ ఆరేడు తరాలు తమ జీవితాన్నీ, అనుభవాలనీ సాహిత్య పరంగా అందించాయి. మొదటి తరాలు తమ సొంత భాషల్లో చేస్తే, తరువాతి తరాలు ఇంగ్లీషులోనే రాయడం మొదలు పెట్టారు. తెలుగువారికంటే ముందు ఎక్కువగా వలస వచ్చిన భారతీయుల్లో గుజరాతీయులూ, పంజాబీలూ, బెంగాలీలు ఉంటారు (ఈ మాధ్యకాలంలో అంటే గత పదహారేళ్ళుగా మన తెలుగు వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. అది వేరే విషయం.). 1914 కాలంలోనే ఎంతోమంది పంజాబీలు కెనడా వలస వచ్చారు. వారిలో చాలమంది ఉపాధికోసం అమెరికాకి వచ్చారు. వీళ్ళతరువాత వచ్చిన వాళ్ళల్లో మరో ముఖ్యమైన గుంపు గుజరాతీయులు.

ఇందులో అన్ని రంగాల వారూ, అంటే వ్యాపారస్తులు మొదలుకొని, విద్యార్థులూ, నర్సులూ, పనివాళ్ళూ అందరూ వచ్చారు. దాంతో వారికి ఇక్కడి జన జీవనంతో సంబంధ బాంధవ్యాలు త్వరిత రీతిన ఏర్పడ్డాయి. అమెరికాలో మోటెల్స్ (చిన్నసైజు లాడ్జీలు) వ్యాపారంలో అందరూ గుజరాతీయులే! అలాగే టాక్సీ, రెస్టారెంట్ లాంటి వివిధ రంగాల్లో పంజాబీలూ ఎక్కువగానే ఉన్నారు. వీరుకాకుండా బెంగాలీయులూ ఉన్నారు. వీరందరికీ కొన్ని దశాబ్దాలుగా అమెరికన్ సమాజంలో వివిధ వర్గాల వారితోనూ అనుభవాలు ఉన్నాయి. అవన్నీ తమ మాతృభాషల్లోనూ, ఇంకా ముఖ్యంగా ఇంగ్లీషులోనూ అక్షర రూపం ఇచ్చారు. అందువలన ఇండియన్ డయాస్పోరా చెప్పగానే వీళ్ళ పేర్లే అమెరికాలో అందరికీ తెలుసు. ఇండియన్ డయాస్పోరా పేరు చెప్పగానే ఝుంపా లహరి, చిత్రా దివాకరునీ(బెంగాలీ) – బల్వంత్ జాని,  పన్నా నాయిక్ (గుజరీతీ) – దర్షన్ సింగ్ తట్ల,  వంటి పేర్లు అమెరికాలో అందరికీ చిర పరిచయమే.

ఈ వలస అన్నది ఈనాటిది కాదు. ఎంతో మంది భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు సౌత్ఆఫ్రికా, మారిషస్, ఫిజీ, మయన్మార్(ఒకప్పటి బర్మా) వంటి దేశాలకు వ్యాపార రీత్యా, ఉపాధి కోసమూ అనేకమంది వెళ్ళారు. కాల క్రమేణా వారందరూ ఆయా దేశాల జన స్రవంతిలో కలిసేపోయారు. కొత్త తరం వారు పేరుకి తెలుగు వారయినా ఆయాదేశపు సంస్కృతీ, జీవిన విధానంలో భాగం కనుక, వారి ఉనికిని కోల్పోవడం సహజ పరిణాంగానే భావించాలి. ఎప్పుడైతే భాష అంతరించిందో అప్పుడే సాహిత్యమూ గతిస్తుంది. అందువల్ల ప్రపంచంలో పలు ప్రాంతాల్లో తెలుగు వారు ఉన్నా, అక్కడి నుండి గుర్తించగలిగిన సాహిత్యం రాలేదు. సౌత్ఆఫ్రికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో అనేకమంది తెలుగు వారున్నారు. తెలుగులో రాయకపోయినా, కనీసం ఇంగ్లీషులో నయినా సాహిత్య సృజన చేపట్టినవారు కనిపించరు.

డయాస్పోరా అనగానే మాతృభాషలో వచ్చే సాహిత్యమే అన్న ధోరణి కనిపిస్తూ ఉంటుంది. కేవలం మాతృభాషలోనే కాకుండా పరాయి భాషలో (ప్రస్తుతం ఇంగ్లీషు అనుకుందాం) కూడా సాహిత్య సృజన ద్వారా వారి జీవన విధానమూ, అనుభవాలూ అందజేయాలి. అప్పుడే అది పరిపూర్ణ డయాస్పోరా సాహిత్యం అవుతుంది. ఇంగ్లీషులో రాసింది ఒక కోణమయితే,  మాతృభాషలో రాసింది మరొక కోణం అవుతుంది. ప్రస్తుతం అమెరికాలో తెలుగువారినీ, భాషనీ తీసుకుంటే, కేవలం తెలుగులో రాసే తెలుగు రచయితలు మాత్రమే ఉన్నారు.

ఇరవయ్యో శతాబ్దం మొదట్లో ఎంతో మంది పంజాబీలు అమెరికా, కెనడా వచ్చారు. కొంతమంది అక్కడున్న స్థానికులతో పెళ్ళి వంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించారు. ఇంకొతమంది మెక్సికనలని కూడా పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాత తరం వాళ్ళు విద్యలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్థిరపడి నిలదొక్కుకున్నారు. అమెరికాలో టాక్సీ వ్యాపారంలోనూ, డంకిన్ డోనట్స్ ఫ్రాంచైజ్ బిజినెస్సుల్లోనూ చాలామంది పంజాబీలు ఉన్నారు. అలాగే మోటెల్స్ నడపడంలోనూ, సబ్‌వే వంటి రెస్టారెంట్ బిజినెస్సుల్లో గుజరాతీయులు ఎక్కువగా కనిపిస్తారు.  గుజరాతీయులు మొదట వలస వెల్లింది సౌతాఫ్రికాకే. అక్కడినుండే అమెరికాకి వచ్చారు.   అమెరికాలో తెలుగువారి రాక 1950, 50లలో ఉన్నత విద్యకోసం ప్రారంభమయినా, డేబ్బైల్లో అనేకమంది డాక్టర్లు, నర్సుల రాకతో ఎక్కువయ్యింది. వీళ్ళందరూ సరాసరి ఉద్యోగలకే వచ్చారు. అందులోనూ వచ్చింది వైద్య వృత్తి రీత్యా కావడంతో వీరికి ఆర్థిక సమస్యలు అంతగా ఉండకపోవడం సహజం. ఆ తరువాత తొంభైల్లో సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలకోసం వచ్చిన వారిలో తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అమెరికా పౌర జీవన ప్రమాణాలతో చూస్తే వీరందరూ ఆర్థికపరంగా మధ్యతరగతి కంటే ఎక్కువే.

డెబ్బైల తరువాత వచ్చిన వారికి అమెరికాలో అనేక అనుభవాలూ, సంఘర్షణలూ, సర్దుబాట్లూ ఉండి ఉంటాయి. ఇప్పటిలా సౌకర్యాలూ, వార్తా ప్రవహామూ అంతగా లేదు. అందువల్ల నాస్టాల్జియా వెంటాడుతూనే ఉండేది. భాషా, సంస్కృతీ ఇవన్నీ ఉనికిలో భాగం కాబట్టి అవి నిలబెట్టుకోవడం కోసం ఆ తరంలో తపనా, యావా ఉండేవి. అందులో సాహిత్యం కూడా కొద్దిగా ఉంది. ఆ విధంగానే తానా, ఆటా వంటి సంస్థలు వుద్భవించాయి. ఎంత దూరంలో ఉన్నా తెలుగువారు కలవడం అన్నది ఒక ప్రధాన అంశంగా మారింది. ఆ కోవలోనే అనేకమంది తెలుగు ప్రముఖుల రాకపోకలు అమెరికాలో ఎక్కువయ్యాయి. సాహిత్య పిపాస ఉన్న కొంతమంది ప్రేరణతో సావనీర్లు పుట్టుకొచ్చాయి.  తెలుగులో రాయడం అన్నది ఒక రివాజుగా వుండేది. అడపాదడపా కొన్ని కథలూ, వ్యాసాలూ వచ్చినా సాహిత్య పరిధి పెరిగినది మాత్రం 1996 కాలంలో ఇంటర్నెట్ వచ్చిన తరువాతే. ఆ విధంగా సాహిత్య సృజనకి కంప్యూటర్ సాంకేతిక రంగం(ఇంటర్నెట్) ఎంతో దోహదం చేసింది. చాలామంది ఔత్సాహిక రచయితలు అమెరికా నుండి రచనలు చేయడం మొదలుపెట్టారు. అక్కడి అనుభవాలూ, నాస్టాల్జిక్ జ్ఞాపకాలూ కలగలిపి అనేక కథలూ, వ్యాసాలూ వచ్చాయి. ఆ విధంగా తెలుగు డయాస్పోరా అన్నది తెలుగు సాహిత్యంలో ఒక పాయగా మారింది.

ఇంతమంది తెలుగు వారు అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఎంతో కాలం నుండీ ఉంటున్నా ఏ ఒక్క తెలుగువాడూ ఇంగ్లీషులో రచనలు చేయడం కనిపించదు. వెల్చేరు నారాయణ రావు వంటి వారు అనువాదాలు చేసినా, అవి అందరి పాఠకులనీ చేరుతాయన్నది అనుమానమే. అమెరికాలో నవలలూ, కథల పుస్తకాలూ విరివిగా ప్రాచుర్యంలో ఉంటాయి. (వేరేవి కూడా ఉంటాయి. ప్రస్తుతం కథ/నవల గురించే చెప్పుకుందాం) కొన్ని తరాల తెలుగు వారు ఇంత కాలం నుండి ఉన్నా ఏ ఒక్కరూ ఇంగ్లీషులో తెలుగువారి జీవితం గురించి రాయలేదు. అదే బెంగాలీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో అయితే రెండు వైపులా సాహిత్యం వచ్చింది. అనేకమంది పేరున్న రచయితలు అమెరికాలో భారతీయ జీవన విధానాన్నీ, సాంస్కృతిక సంఘర్షణనీ సాహిత్య రూపంలో అందించారు. వెతికి చూస్తే, అమూల్య మల్లాది అన్న ఒక్క రచయిత్రి మాత్రమే కనిపిస్తారు. అటు కన్నడంలోనూ, తమిళంలోనూ నలుగురైదుగురైనా ఉన్నారు.

తెలుగు వారి జీవితం గురించి ఎవరైనా ఇంగ్లీషులో నవలా, కథా రాసినా అమెరికన్ల వరకూ అది ఇండియన్ల జీవితమే. మనకి భాషాపరంగా అనేకమంది ఉన్నా, అమెరికన్లకి మాత్రం గుజరాతీయులూ, బెంగాలీలూ, పంజాబీలూ, తెలుగువారూ అందరూ భారతీయులక్రిందే లెక్క. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న తెలుగు వారినుండి విరివిగా ఇంగ్లీషులో సాహిత్య సృజన జరిగితే తప్ప తెలుగువారి ఉనికీ, జీవితమూ, దాని వెండి వచ్చే కష్ట సుఖాలూ అమెరికన్లకి అర్థం కావు. ఈ విషయంలో ఝుంపా లహరి, బెంగాలీ రచయితని మెచ్చుకు తీరాలి. బెంగాలీ జీవితాన్ని అమెరికన్లకి బాగానే పరిచయం చేసింది. ఈమె రాసిన “నేమ్ నేక్” ఎంతో ప్రాచుర్యం పొందిన నవల.

వలస వచ్చిన తెలుగు వారు సాహిత్య సృజన చెయ్యకపోవడానికి నాకు కనిపించిన కారణాలు:

1) వస్తూనే మంచి ఉద్యోగాలతో రావడం వలన (90ల తరువాత వచ్చిన వారు) అమెరికన్ జీవన విధానంలో మమేకం అవ్వాల్సిన అవసరం లేకపోవడం.

2) వచ్చిన వారిలో చాలామందికి సాహిత్యం పట్ల ఆసక్తిలేకపోవడం.

3) సాంకేతిక ప్రగతీ, సౌకర్యాల వలన వేరే దేశం వచ్చామన్నా భావన అంతగా పట్టకపోవడం.

4) తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరగడం వలన ఇక్కడున్న వారితోనే సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం. అవసరమయినంత మేరకే అమెరికన్ జీవన స్రవంతిలో కలవడం.

పై కారణాల వలన ఇంతవరకూ వచ్చిన సాహిత్యం, అమెరికన్ జీవిన విధానంలో ఉపరితలంలో కనిపించిన వస్తువుల చుట్టూ తిరిగింది. లోతైన అవగాహన, అధ్యయనం లేకపోవడం వలన ఊహించిన రీతిలో తెలుగు సాహిత్యం పుట్టకపోవడం; అమెరికన్ జీవన స్రవంతిలో కలవకపోయినా గడిచిపోయే వాతావరణమూ, ఇలా పలు కారణాలు కనిపిస్తాయి.  ఇంత వరకూ వచ్చిన సాహిత్యం కూడా ఈ క్రింది అంశాల పరిధి దాటి లోతుగా అధ్యయనం కాలేదు.

1) స్త్రీల సమస్యలు, గృహ హింస

2) నాస్టాల్జియా, నాస్టాల్జియా, నాస్టాల్జియా

3) పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళు, వృద్ధాప్యంలో సమస్యలు, ఇండియా నుండి వచ్చే వారి తీరుతెన్నులూ

4) అమెరికా జీవితం పై వ్యంగ్య, హాస్య రచనలు

అడపాదడపా వేరే అంశాలపై కథలు వచ్చినా, సింహభాగం రచనలు పైన చెప్పిన వాటిని మించి పోలేదు. అమెరికన్ సంస్కృతీ, జీవన విధానంతో లోతుగా ముడిపడిన వారి జీవితం గురించీ, వాళ్ళకి మన సంస్కృతీ, జీవితం పట్ల ఉన్న అవగాహనా వంటివి ప్రతిబింబింస్తూ వచ్చిన కథా వస్తువులు కనిపించవు.

రాసేవాళ్ళకీ ఉపరితల పరిశీలనే తప్ప లోతైన అధ్యయనలోపం ప్రధాన సమస్య. ఎంతో కొంత కథలు వచ్చాయి కానీ, అమెరికా జీవితన్ని ప్రతిబింబిస్తూ తెలుగులోనే మనకి నవలలు అంతగా రాలేదు. కనీసం రాబోయే కొత్త తరం అంటే అమెరికాలో ఇప్పుడున్న వారి సంతతి అయినా ఇంగ్లీషులో తెలుగువారి జీవితం గురించి రాసి తెలుగు డయాస్పోరాకి పూర్తి న్యాయం చేకూరుస్తారన్న చిన్న ఆశ. అది ఎంత సఫలం అవుతుందో కాలామే నిర్ణయించాలి.

*

“ఇండియా గేట్”

IMG_0384

దాదాపు అరగంట నుండీ అతను ఇండియా గేట్ దగ్గర ఎదురుచూస్తున్నాడు. సాధారణంగా ఈ పాటికి తనని రిసీవ్ చేసుకోడానికి ఎవరో ఒకరు రావాలి. ఎందుచేత ఆలస్యం అయ్యిందో అనుకుంటున్నాడు. అతను – పేరేదయితేనేం, మంచి శారీర ధారుఢ్యంతో పొడవుగా ఉంటాడు. రంగు మరీ తెలుపు కాకపోయినా చామనచాయ. ఉంగరాల జుట్టు. తీక్షణమైన అతని కళ్ళల్లో కాంతి తలతిప్పి అతనికేసే చూసేలా చేస్తుంది. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి చూసుకున్నాడు. బీనాకి అతను సిగరెట్లు కాలిస్తే ఇష్టం. దగ్గరగా మాట్లాడుతున్నప్పుడు ఆ వాసన భలే మత్తుగా ఉంటుందంటుంది. అతనికి సిగరెట్టు అలవాటు లేదు. బీనా కోసం అలవాటు చేసుకున్నాడు. బ్యాక్‌పాక్ లోంచి గూచీ స్ప్రే తీసి చొక్కా మీద జల్లుకున్నాడు. బీనాకి గూచీ స్ప్రే వాసన కూడా ఇష్టమే. ఆమెను కలవాల్సినప్పుడల్లా ఆమెకిష్టమయినవన్నీ గుర్తు పెట్టుకుంటాడు. ఇంతలో సెల్ ఫోన్ మ్రోగింది. దీప్తి నుండి ఫోన్. ఆన్ చేసి హలో చెప్పాడు.

“చెప్పానుగా డిల్లీ వచ్చాను. రావడానికి వారం పట్టచ్చు. రేపూ ఎల్లుండీ ఇక్కడ ఉండి తరువాత చండీఘడ్ వెళ్ళాలి…”

అతనికి దీప్తి ఫోన్ కట్‌చెయ్యాలని ఉంది. మాంచి టెన్షన్లో ఉన్నప్పుడే కాల్ చేస్తుందనుకున్నాడు. దీప్తి చెబుతున్నది వింటూ ఊ కొడుతున్నాడు.
“ఎన్ని సార్లు చెప్పాలి? అనసూయమ్మ గారి పని మీద వచ్చాను. ఇంకెంత వారంలో వచ్చేస్తాను. పాప జాగ్రత్త. ఏమైనా అవసరం అయితే కాల్ చెయ్యి. ఉంటాను,” అంటూ అతను ఫోన్ కట్ చేసాడు.

ఇంతలో అతను నుంచున్న చోటుకి దగ్గర్లో ఒక బి.ఎం.డ్బ్ల్యూ వేన్ వచ్చి ఆగింది. విండొ తీస్తుండగానే అతను గుర్తించాడు. నల్లటి కళ్ళద్దాలు పెట్టుకొని బీనా చెయ్యూపింది. గబగబా అతను వ్యాను ఎక్కాడు. బయట ఎండకి అతనికి ఉక్కబోతగా ఉండడంతో అతను విండో గ్లాసు తీయబోయాడు. వద్దని వారిస్తూ ఏ.సీ ఆన్ చేసింది. సీట్లో కూర్చోగానే హై ఫై ఇచ్చింది ఆమె. అతనూ నవ్వాడు. ఇద్దరూ కబుర్లలో పడ్డారు.

మధ్యలో రెండు మూడు సార్లు అతని ఫోన్ రింగయ్యింది. మొదటి రెండు సార్లూ తియ్యలేదు. మూడోసారి తీసి చూసాడు. దీప్తి పేరు స్క్రీన్ మీద కనిపించింది. అతను వేంటనే సెల్ స్విచ్ ఆఫ్ చేసేసాడు.

“ఎవరు? మాట్లాడచ్చు కదా? ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు?” బీనా ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో తెలీలేదు. ఫ్రెండని చెప్పాడు.
తనకున్న కొద్ది పరిచయంలో బీనా అతనికి కాల్ రావడం చూళ్ళేదు. సాధారణంగా బీనా ఇంటికి రాగానే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. బీనాని కలవడం అతనికది నాలుగోసారి.

ఆ వ్యాను దూసుకుంటూ పటేల్ నగర్ వైపు వెళ్ళింది.

కారు దిగీ దిగగానే అతను సిగరెట్టు వెలిగించాడు. బీనాకి కారులో సిగరెట్ త్రాగడం ఇష్టం ఉండదు. కారంతా సిగరెట్ వాసన వస్తుందని అంటుంది.
వ్యాను దిగాక సరాసరి మేడమీదకి వెళ్ళాడు. బీనా ఇల్లు చాలా పెద్దది. ఆమె ఐశ్వర్యం అంతా ఆ ఇంట్లో ప్రతీ అంగుళంలోనూ కనిపిస్తుంది.
సరాసరి అతను బెడ్ రూం వైపు వెళ్ళాడు. వేంటనే షవర్ చేసుకోవడానికి బాత్‌రూమ్ వైపు వెళ్ళాడు. షవర్ అయ్యాక లుంగీ కట్టుకొని మంచమ్మీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు.

ఒక్కాసారి వెనక్కాలనుండి వచ్చి బీనా అతన్ని వాటేసుకుంది. ఆమె స్పర్శ అతనికి కొత్తకాదు. అతని చేరువ బీనాకి అంతే!
కొంతసేపయ్యాక అతను మంచమ్మీద నుండి లేచి బట్టలు మార్చుకుంటూండగా బీనా అతనికి చిన్న కవరు అందిచ్చింది. బీనా కేసి చూస్తూ నవ్వాడతను . రేపూ వస్తావా అనడగింది. సరేనన్నాడు అతను.

***

హొటలుకి తిరిగొస్తూండగా మధ్యాన్నం దీప్తి ఫోన్ చేసినట్లు గుర్తొచ్చింది. వేంటనే కాల్ చేసాడు.
“వచ్చిన పని కావడానికి ఇంకా రెండ్రోజులు పైనే పట్టచ్చు, ” ఆవతల దీప్తి ప్రశ్నలకి జవాబిస్తున్నాడు.

“నే చేప్పేది విను. అనసూయమ్మ గారు పంపితేనే వచ్చాను. వాళ్ళమ్మాయి ఐష్ మాటలు నమ్మకు. అయినా నా గురించి తెలిసీ ఆ అమ్మాయి మాటలు ఎలా నమ్మగలిగావు? అయినా నేను మొన్ననగా వచ్చాను. ఐష్‌ని కలిసే చాన్సే లేదు. నువ్వేం కంగారు పడకు. ఎవరైనా అడిగితే పని మీద సొంతూరు శ్రీకాకుళం వెళ్ళానని చెప్పు. పాప జాగ్రత్త. అవసరమయితే ఫోన్ చెయ్యి,” అని దీప్తికి సర్ది చెప్పాడు.
డిన్నర్ చేసి రాత్రికి నిద్రకి ఉపక్రమిస్తూండగా రూం బెల్ మ్రోగింది. వెళ్ళి డోర్ తీసి చూసి అవాక్కయ్యాడు.
అతని ఎదురుగా యూనిఫాంలో ఓ పోలీసాఫీసర్! అతని నోట మాట రాలేదు.

***

అతన్ని ఒక గదిలో పడేసి చచ్చేలా బాదుతున్నాడా పోలీసాఫీసర్.
“సార్! నాకు ఏమీ తెలియదు. నన్ను నమ్మండి. కిట్టని వాళ్ళెవరో నా నంబరిచ్చారు,” అంటూ హిందీలో బావురుమన్నాడు.
“నా గురించి మీకు వివరాలెవరిచ్చారో తెలీదు,” అంటూ అతను హిందీలో భోరున విలపించాడు. ఆ వచ్చిన పోలీసాఫీసరుకి తెలుగు రాదు. హైద్రాబాదులో ఆటో నడపడం వల్ల అతనికి హిందీ బానే వచ్చింది.
“ఇవాళ మధ్యాన్నం నా సెల్‌కి ఒక కాల్ వచ్చింది. ఒకమ్మాయి నీ వివరాలన్నీ చెప్పింది, నువ్వొక పెద్ద రాకెట్ నడుపుతున్నావనీ చెప్పింది,” ఆ పోలీసఫీసర్ చెప్పాడు.
అతనికి ఆ అమ్మాయెవరో అర్థమయ్యింది. అనసూయమ్మ కూతురు ఐష్ అయివుంటుంది. డిల్లీకి బయల్దేరేముందు అతనితో పిచ్చిగా ప్రవర్తించింది. అతను చీకొట్టడంతో కోపంతో ఈ పని చేసుండచ్చు. అయినా తను డిల్లీలో ఉన్న సంగతి అనసూయమ్మకి తప్ప ఇంకెవరికీ తెలిసే అవకాశం లేదు. దీప్తికి అతను వెళ్ళేది డిల్లీ అని చెప్పాడంతే! దేనికో, ఎక్కడికో చెప్పలేదు. ఎప్పుడూ చెప్పే అలవాటు కూడా లేదు. అనసూయమ్మ రియల్ ఎస్టేట్ పని మీదనే ఈ టూర్లని దీప్తి నమ్మకం.

అయితే, అనసూయమ్మే చేయించిందా ఈ పని ? అతనికేమీ అర్థం కావడం లేదు.

“డోంట్ వర్రీ, నీకేమీ భయం లేదు. నువ్వు నాకు సహకరిస్తే ఈ ఈ రాకెట్ని బయట పెట్టాలి. ఈ డిల్లీలోనే మినిస్టర్ల భార్యలూ, ఆర్మీ చీఫుల పెళ్ళాలూ వీళ్ళందరూ పెద్ద రాకెట్ నడుపుతున్నారని తెలుసు. నీలాంటి యువకులు చాలామంది ఈ రాకెట్లో ఉన్నారు. దేర్ ఈజ్ సంథింగ్ ఫిష్షీ హియర్!” అని ఆలోచనలో పడ్డాడా పోలీసాఫీసర్!

ఇంతలో అతని ఫోన్ మ్రోగింది. దీప్తి అన్న పేరు సెల్ ఫోన్ మీద కనిపించింది. ఫోన్ తియ్యాలా వద్దన్నట్లు పోలీసాఫీసరు కేసి చూసాడతను. మాట్లాడమన్నట్లు తలెగరేసాడా పోలీసాఫీసరు. వెంటనే ఫోన్ అందుకున్నాడతను.

“ముందు ఏడుపు ఆపి నే చెప్పేది శ్రద్ధగా విను. అనసూయమ్మ కూతురు ఎవడితోనే పారిపోయిండచ్చు. అతనెవరూ దొరికే వరకూ అనసూయమ్మ నన్ను వాడుకుంటోంది. అందుకే మీ అందరికీ నేను లేపుకుపోయానని చెప్పుండచ్చు. ఇది తల్లీ కూతుళ్ళ నాటకం. నేనొచ్చేవరకూ నువ్వు తొందర పడద్దు, ” అంటూ చెబుతూండగానే ఫోన్ లాక్కున్నాడా పోలీసాఫీసరు. ఒక్కసారి కంగారు పడ్డాడతను.

“కౌన్ హో తుమ్? క్యా చాహియే? తుమ్హారా ఆద్మీ మేరే జాల్ మే…” అంటూ ఫోన్ కట్ చేసాడు. దీప్తికి హిందీ అంత బాగా రాదు. కానీ వేరే గొంతు వినేసరికి కంగారు పడే అవకాశం ఉందనుకొని భయపడ్డాడతను.

“ఇప్పుడు చెప్పు? నీ వెనుక ఎవరెవరున్నారు? అసలీ రాకెట్ ఏవిటి?” అంటూ ఫోన్ అడ్రసు బుక్కులో నంబరు వెతుకుతున్నాడు. ఏమీ కనిపించక పోయే సరికి చాలా చికాకు పడ్డాడు ఆ పోలీసాఫీసరు.

“ఇంతకు ముందు ఫొన్ చేసిందెవరు?” గట్టిగా లాఠీతో కాళ్ళ మీద అదిలించాడు.
ఒక్కాసారి అదిరిపడి – “నా పెళ్ళాం, సార్!” అంటూ వణికిపోయాడతను.

“సాలే! నీ బ్రతుక్కి పెళ్ళి కూడా అయ్యిందా? లేక ఎవరైనా…” అంటూ మరో సారి లాఠీ అదిలించాడు. దూరంగా కానిస్టేబుల్స్ ఇదంతా గమనిస్తూనే ఉన్నారు.
“లేదు సార్! నన్ను నమ్మండి. నాకు ఎవరి వివరాలూ తెలీవు. నేను మా ఇంటి ఓనరు అనసూయమ్మ పంపితే పని మీద వచ్చాను…” అంటూ ఏడుస్తూ చెప్పాడతను. ఆ పోలీసాఫీసర్ని చూస్తే భయమేసింది.
తనకి తెలుసున్నది చెప్పడానికి ఉపక్రమించాడతను. అతని కళ్ళ ముందు దీప్తీ, పాప మెదిలారు.

 

***

“మాది శ్రీకాకుళం దగ్గరలో వున్న ఆముదాలవలస. మా నాన్న ఒక రైసు మిల్లులో పని చేసేవాడు. నేనే ఆఖరి వాణ్ణి. నాకు ఇద్దరు అక్కలూ, ఒక అన్న. నాకు చదువంత సరిగా అబ్బలేదు. ఆముదాలవలసలో ఉంటే చెడు తిరుగుళ్ళు ఎక్కవయ్యాయని నాన్న నన్ను శ్రీకాకుళం మా అత్తయ్య ఇంట్లో పెట్టాడు. శ్రీకాకుళంలోనే కాలేజీ చదువు ప్రారంభం అయ్యింది. ఇంటరు అత్తెసరు మార్కులు వచ్చి చచ్చి పాసవ్వడంతో బీ.కాం లో జాయిన్ అయ్యాను. డిగ్రీ రెండో ఏడు చదువుతూండగా దీప్తితో పరిచయం అయ్యింది. దీప్తి వాళ్ళు ఆర్థికంగా కాస్త ఉన్నవాళ్ళు. మా పరిచయం ప్రేమగా మారింది. చాటుగా ఏడాది పాటు ప్రేమాయణం సాగించిన మేము డిగ్రీ పరీక్షల చివర్లో వాళ్ళింట్లో పట్టుబడిపోయాం. దీప్తి వాళ్ళది మావీ కులాలు వేరు. వాళ్ళ నాయనకి కులాల పట్టింపు బాగా ఉంది. పైగా డబ్బూ, పలుకుబడీ ఉన్న వాళ్ళు. మమ్మల్ని కాదన్నారు వాళ్ళు. మేం వాళ్ళని వద్దనుకున్నాం. ఎవరికీ చెప్పా పెట్టకుండా హైద్రాబాదు ఉడాయించాం. హైద్రాబాదు రాగానే జీడిమెట్లలో ఉన్న నా స్నేహితుడొకడు మాకు ఆసరా ఇచ్చాడు. కొంతకాలం వాడింట్లో ఉన్నాం. ఈలోగా నేను ఉద్యోగం వెతుక్కోడం మొదలు పెట్టాను. ఒకటి రెండు ఫాక్టరీల్లో చిన్న చిన్న పనులు చేసాను కానీ, మా ఇద్దరికీ చాలేది కాదు. సరిగ్గా అదే సమయానికి దీప్తి నెల తప్పింది. అబార్షన్ చేయించుకోమని చెప్పాను. తను మొండి కేసింది. మాకే బ్రతకడానికి చచ్చే చావులా ఉంది. ఇంకో ప్రాణాన్ని ఎలా నెట్టుకు రావడం? సరిగ్గా అదే సమయానికి నా స్నేహితుడు ఇల్లు ఖాళీ చెయ్యాల్సొచ్చింది. ఇల్లు వెతుకులాట మొదలయ్యింది. ఎక్కడా ఇంటి అద్దె భరించే స్థితిలో నేను లేను. ఉద్యోగం కూడా అంతంత మాత్రం. అనుకోకుండా మా స్నేహితుడికి తెలుసున్నాయన మా కష్టాలు విని బాలానగర్ దగ్గర్లో ఒక అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో రెండు చిన్న గదుల ఇల్లు చూపించాడు. ఆ అపార్ట్మెంట్ ఓనరు అనసూయమ్మ. ఆవిడ మాగురించి తెలుసుకొని అద్దె లేకుండా మాకు ఉండడానికి ఇల్లిచ్చింది. నాకు కారు డ్రైవింగ్ వచ్చని తెలియడంతో ఆవిడ కారు డ్రైవరుగా నన్ను పెట్టుకుంది. దీప్తి అనసూయమ్మ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేది. నిజం చెప్పద్దూ, అనన్సూయమ్మ మా పాలిట దేవతలా అనిపించింది మాకు. నాకు దగ్గరుండి బ్యాంకు లోన్ ఇప్పించి ఒక ఆటో కొనిపించింది. ఆటో వచ్చాక మాకు డబ్బు కొరత కాస్త తీరింది. రోజుకి నాకు అయిదారొందలు మిగిలేవి. చూస్తూండగా దీప్తికి నెలలు నిండాయి. మా వూరు శ్రీకాకుళం వెనక్కి వెళిపోదామా అనుకున్న క్షణాలు చాలానే ఉన్నాయి. కానీ ఇద్దరకీ అభిమానం అడ్డొచ్చింది. ప్రేమించడం కంటే బ్రతకడం కష్టం అన్నది మాకు అర్థమవ్వడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఒక పక్క రోజు గడవాలి. ఆకలి తీరాలి. మరో పక్క అహం, అభిమానం. మా కాళ్ళమీద మేం బ్రతకాలన్న పౌరుషం మమ్మల్ని ఆపేసింది. దీప్తి పురుడికి అనసూయమ్మే దగ్గరుండి సాయం చేసింది. అప్పటికి నాకు ఇరవయ్యారేళ్ళు. దీప్తికి ఇరవై నాలుగు. మాకు పాప పుట్టింది. మొదటి నెల బాగానే గడిచింది. రెండో నెల వచ్చేసరికి పాపకి జబ్బు చేసింది. డాక్టరు తల్లి పాలు మానిపించి డబ్బా పాలు పట్టమన్నాడు. చూస్తూండగా ఖర్చులు పెరిగిపోయాయి. రాత్రింబవళ్ళు ఆటో నడిపినా చాలేది కాదు. పెళ్ళయ్యాక దీప్తిని సుఖపెట్టిందంటూ లేదు. తనెప్పుడూ ఒక్కసారి కూడా ఇది కావాలని అడిగేది కాదు. తను పెరిగిన వాతావరణాన్ని కూడా ఎప్పుడూ తలుచుకునేది కాదు. కానీ నాకు తెలుసు తనెంత గొప్పగా బ్రతికిందో! దీప్తి నాకోసం ఇంతలా మారిపోవడంతో నాలో నాకు తెలీని అంతర్మధనం మొదలయ్యింది. పైకి చెప్పుకోలేని ఆత్మన్యూనతా భావం బయల్దేరింది.

సరిగా అదే సమయానికి అనసూయమ్మ డబ్బు సులభంగా సంపాదించే కొత్త మార్గం చూపించింది. అనసూయమ్మ మొట్టమొదటి సారి ఆ ప్రతిపాదన చెప్పినప్పుడు ఆమెను నరికేయాలన్నంత కోపమూ, ఆవేశమూ వచ్చాయి. మా వూళ్ళొ చాలా మంది మగాళ్ళ ఇల్లీగల్ రిలేషన్స్ చూసాను. అప్పట్లో ఆడవాళ్ళనే తప్పుబట్టిన సందర్భాలున్నాయి. శృంగారానిక్కూడా హృదయమూ, ప్రేమా ముఖ్యమని నమ్మేవాణ్ణి. ఆ క్షణం మగాడిగా పుట్టినందుకు అసహ్యించుకున్నాను. మొదట్లో జుగుప్సాకరంగా అనిపించేది. “ఆమ్మాయిలు ఇటువంటి పనికి సిగ్గు పడ్డారంటే అర్థం వుంది. నేకేం పొయ్యకాలం వచ్చిందిరా? నువ్వు మగాడివి కావా?” అంటూ అనసూయమ్మ రెచ్చగొట్టేలా మాట్లాడేది. ఏం? సిగ్గూ, లజ్జా, ఏడుపూ మగాళ్ళకుండవా? అని ఆ క్షణం అయితే అడిగాను కానీ, మెల్లగా బ్రతుకు బలహీనత ఆవరించింది. ఒక్కసారి అంత మొత్తం కళ్ళ చూసాక ఒక రకమైన జస్టిఫికేసన్ మొదలయ్యింది. నెలంతా ఆటో తిప్పితే వచ్చే సొమ్ములు ఒక్క గంటలో వచ్చేస్తున్నాయి. అదీ ఏమాత్రం శ్రమ లేకుండా. మొదట రెండు మూడు సార్లు బెరుగ్గా అనిపించినా తరువాత తరువాత అలవాటయిపోయింది.

ఆ అలవాటులో భాగంగా దీప్తికి అబద్ధాలు చెప్పడం అవసరం అయ్యేది. ఏం చేసేది? డబ్బు పాపిష్టిది. ఉండి ఉన్నవాణ్ణీ, లేక లేనివాణ్ణీ హింసిస్తూ ఉంటుంది. ఎన్నో రాత్రుళ్ళు నాలో నేనే ఏడ్చేవాణ్ణి. మగాణ్ణి కదా పైకి ఏడ్చే హక్కు లేదు నాకు. దీప్తి ముందరయితే ఏమయ్యిందని ప్రశ్నిస్తుంది. అందుకే మా పాప దగ్గరే ఏడ్చేవాణ్ణి.

చెప్పద్దూ? బ్రతకడం వేరు. భరించడం వేరు. నాలో నేను చస్తూ నన్ను నేను భరిస్తున్నాను. ఎన్నోసార్లు దీప్తికి నా గురించి చెప్పేద్దామని ప్రయత్నించాను. ఆ పాపిష్టి డబ్బు నన్ను జుట్టు పట్టుకు గుంజేసేది. తలొగ్గేసేవాణ్ణి.

జూబ్లీ హిల్స్లో ఒక ఇండస్ట్రయిలిస్ట్ భార్య నా మొట్ట మొదటి కస్టమరు. మొదట్లో తెలియలేదు కానీ అనసూయమ్మకి చాలా పొలిటికల్ కనక్షన్స్ ఉన్నాయి. నేను ఈ వ్యవహారమంతా చూసి భయపడి చచ్చాను. పైగా చెప్పలేనంత సిగ్గు నన్ను అధః పాతాళానికి తోసేసింది. “ఏంట్రా? నువ్వూ ఓ మగాడివేనా? ఆడదాన్ని చూస్తె పురుగుని చూసినట్లు అలా ముడుచుకుపోతావేంటి?” అని ఓ సారి చెంప దెబ్బ కూడా వేసింది అనసూయమ్మ.
ఈ వ్యవహారమంతా చాలా విచిత్రంగా జరుగుతుంది. చాలాసార్లు మధ్యాన్నం ఇళ్ళలోనే జరుగుతాయి. వాళ్ళు కూడా చచ్చేటన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మొదటి సారి అనసూయమ్మ కూడా వచ్చింది. వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ తీసుకెళ్ళనీయరు. చాలా సీక్రెట్గా నడిపిస్తారు. వాళ్ళ ఇష్టాయిస్టాలకి అనుగుణంగా నడుచుకోవాలి. వీళ్ళల్లో కొంతమందికి తాగడం ఇష్టం. కొంతమందికి సిగరెట్ తాగడం ఇష్టం. ప్రతీ ఒక్కళ్ళకీ ఒక్కో రకమయిన పెర్ఫ్యూమ్స్ ఇష్టం ఉంటాయి. మొదట్లో అవన్నీ వాళ్ళే ఏర్పాటు చేసేవారు. రాన్రానూ నాకు అర్థమయ్యింది. చిత్రం ఏవిటంటే ఈ వ్యవాహరమంతా ఇళ్ళల్లోనే జరుగుతాయి. ఎవరూ బయటకి రారు. ఇదంతా ఒక పకడ్బందీ వ్యవహారం. మూడో కంటికి తెలియకుండా జరిగిపోతాయి. అన్నింటికన్నా నాకు నచ్చిందేవిటంటే పని అవ్వగానే డబ్బు కవర్లో ఇచ్చేస్తారు. మొదట్లో చేసే పని చాలా బాధ కలిగించేది. మొదటిసారి ఇండస్ట్రియలిస్ట్ భార్య నన్ను తాకినప్పుడు శరీరమంతా తేళ్ళూ, జెర్రులూ పాకినట్లనిపించింది. ఒక్క అరగంటలో లక్షల సార్లు చచ్చుంటాను. మనసు ఛీత్కరించుకుంది. బుద్ది డబ్బుతో నచ్చచెప్పింది.

నరమాంసపు రుచి అలవాటయిన పులి జింకల కోసం చూడదు. అలవాటు పడ్డ రుచి దహించేస్తూ ఉంటుంది. పులికి నరమాంసంలా డబ్బు నాకు కొత్త జిహ్వనీ, జీవితాన్నీ చూపించింది.

అనసూయమ్మ రాకెట్ చాలా పెద్దదని మెల్లగా అర్థమయ్యింది. పెద్ద పెద్ద సినిమా తారలూ, సాఫ్ట్ వేరు కంపెనీ మేనేజర్లూ చాలా మందే అనసూయమ్మ కస్టమర్లు. ఎప్పుడూ ఎవరి దగ్గరా ఈ ప్రస్తావన తెచ్చేది కాదు. నా దగ్గర ఎప్పుడూ ఏవీ జరగదన్నట్లే ప్రవర్తించేది. మా ఇద్దరికీ ఒక కోడ్ సైన్ ఉండేది. నా సెల్‌కి కాల్ చేసి బజార్నుండి కోక్ పట్టుకురమ్మనమనేది. అంటే ఆరోజు నాకు డబ్బులొస్తాయి.
ఒక సారి కోక్ అంటే ఏవిటని అడిగితే నవ్వుతూ చెప్పింది – “కోకో కోలా – కోక కావాలా?” అనర్థం చెప్పింది. అది తెలిసాక కోక్ త్రాగాలంటే మనసొప్పేది కాదు. దీప్తికి కోక్ అన్నా, థమ్సప్ అన్నా ఇష్టం. ఎప్పుడయినా బయటకి వెళ్ళినప్పుడు కోక్ అంటే వద్దనే వాణ్ణి.
అనసూయ్యమ్మకి కస్టమర్లు హైద్రాబాదుకే పరిమితం కాదు, డిల్లీ, కలకత్తా, ఇలా పలునగరాల్లో ఉన్నాయి. నా పెర్సనాలిటీ, వయసూ నా రేటుని పెంచేసాయి. డిల్లీ వెళ్ళినప్పుడల్లా వారంలో లక్ష రూపాయిలు దొరికేవి.

డబ్బు వస్తోందన్నది మినహాయిస్తే మానసికంగా నాకు స్థిమితమూ, శాంతీ లేదు. దీప్తిని తాకడానిక్కూడా మనస్కరించేది కాదు. చెప్పానుగా డబ్బు నన్నొక పులిలా తయారుచేసింది. మామూలు పులి కాదు, ధనమాంసపు పులి…”

***

Kadha-Saranga-2-300x268
అతని గురించి దీప్తికి తెలిసిపోయింది. తనని జైల్లో పెట్టారనీ, నానా చిత్రవధలూ పెడుతున్నారని తెలిసి జైలుకి వచ్చింది. అతను జైలు గది లోపలున్నాడు. వెలుపల ఆమె చంకలో పిల్లనెత్తుకొని ఏడుస్తూ ఉంది.
జరిగినదంతా దీప్తికి అతను చెప్పుకొచ్చాడు. “ఎందుకు చేసావ్? ఈ పాపిష్టి పనులు? నేనెప్పుడయినా డబ్బు కావాలని అడిగానా? ” ఏడుస్తూ అతని చెంప వాయించింది.
అతను దోషిలా నిలబడ్డాడు. అతను చేసిన తప్పు పనికన్నా, ఆమె ముందు దోషిగా నిలబడడం అతన్ని కృంగతీసింది. ఏడుస్తూ మౌనంగా ఉండిపోయాడు.

“దీప్తీ! నన్ను నమ్ము! ఒక పక్క నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేని నా అసమర్థత. మరో వైపు మన అవసరాలు. డబ్బుకోసమే ఇదంతా చేసాను తప్ప…” అంటూ గోడకి తలకొట్టుకుంటూ ఏడ్చాడతను. దీప్తి వచ్చి వారించి అతన్ని దగ్గరకి తీసుకుంది.
అతను చెప్పింది దీప్తి నమ్మ లేదు. వివరం చెప్పేసరికి అవాక్కయ్యింది. “డబ్బున్న మగాళ్ళకి ఇలాంటివి విన్నాను. ఆడవాళ్ళు కూడా…?” అంటూ ఆశ్చర్యపోతే – “ఏం? ఆకలికీ, సెక్స్ కీ ఆడా, మగా తేడాలుండవు. ఇలా గిరి గీసుకోవడం మన తప్పు. నీకే కాదు, నాకు మొదట్లో నమ్మకం కలగలేదు,” అంటూ అతను జవాబిచ్చాడు.

అంతే దీప్తి ఒక్కసారి తల జైలు తలుపు ఇనుప కమ్మీలకి ఏడుస్తూ కొట్టుకుంది. “దీప్తీ!” అంటూ గట్టిగా అరిచాడతను.
ఒక్కసారి ఉలిక్కి పడి లేచి చుట్టూ చూసాడు. తన పక్కనా, ఎదుటా ఎవరూ లేదు. కల వచ్చిందని గ్రహించాడతను.
దూరంగా పోలీసాఫీరు మాటలు వినిపిస్తున్నాయి.

తల విదిలించి అటుగా చూసాడు. వడి వడిగా పోలీసాఫీసరు తన సెల్ వైపు వస్తున్నట్లు గమనించాడు.

వస్తూనే – “నీ మొబైల్‌కి రాత్రంతా ఒకటే ఫోన్లు. స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇందాకనే మా పై ఆఫీసరుతో మాట్లాడాను. నువ్వు సహకరిస్తే ఒదిలి పెట్టేయమని చెప్పారయన. కాబట్టి నువ్వు నీకు తెలుసున్న నంబర్లు చెప్పు,” గట్టిగా అన్నాడు. ఆఫీసరు రాగానే లేచి నుంచున్నాడతను.
“సార్! చెప్పానుగా! అవసరమయితే వాళ్ళే కాల్ చేస్తారు తప్ప నాకెవరి నంబర్లూ తెలీవు. పైగా ప్రతీ సారీ వాళ్ళు ఫోన్లు మార్చేస్తారు,” అన్నాడతను.
“సార్! మీకు ఫోన్ వచ్చినప్పుడు నా గురించి చెప్పిన వాళ్ళ వివరాలు ఎందుకడగలేదు సార్?” పోలీసాఫీసర్ని ప్రశ్నించాడు.
“అడిగాను. చెప్పలేదు. తరువాత ఫోన్ పెట్టేసాక ఈ హొటల్కి కాల్ చేస్తే నీ పేరూ అవీ కరక్టుగా సరిపోయాయి. నాకు ఇలాంటివి ఇక్కడ జరుగుతున్నాయని మా డిపార్ట్మెంటుకి తెలుసు. సరే చూద్దామని హొటల్కి వస్తే నువ్వు దొరికావు…”
“మీకు ఫోన్ చేసిన అమ్మాయికి తిరిగి మీరు ఫోన్ చేసి కనుక్కోలేదా?”
“చేసాను. కానీ ఆ సెల్ నంబరు సర్వీసులో లేదని మెసేజ్ వచ్చింది. అందుకే నీ దగ్గర కూపీ లాగుతున్నాను, ” అన్నాడా పోలీసాఫీసరు.
అతను భయపడ్డాడు. “అయితే మమ్మల్ని అరెస్టు…” అంటూ మధ్యలో ఆపేసాడతను.
“నో! నిన్నేం అరెస్టు చెయ్యను. నీ పేరు బయటకి రాకుండా చూస్తాగానీ, నాకు మాత్రం వివరాలు కావాలి. నిన్న నువ్వు కలిసిన ఆవిడ ఎవరు?” ఆ పోలీసాఫీసరు అతన్ని అడిగాడు.
బీనా పేరు చెప్పాలా వద్దా అని తటపటాయించాడు. అయినా ధైర్యం చేసి ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పేసాడు. అది విని అతను ఆశ్చర్యపోయాడు.
“బీనా ఎవరనుకున్నావ్? నేవీ చీఫ్ భార్య. ఇంకా ఎవరు నీ కష్టమర్లు? నువ్వు కాక ఇందులో ఇంకా ఎంత మంది యువకులున్నారు? ” అతను ప్రశ్నల శరంపర తీసాడు.
“నవనీత్ కౌర్ అని చండీఘడ్ లో ఉండే ఆవిడ తెలుసు. చెప్పానుగా, నాకు చాలా మంది పేర్లు మాత్రమే తెలుసు సార్! వాళ్ళు పనయ్యాక సెల్ ఫోన్లు మార్చేస్తారు. బానీ నంబరు ప్రతీసారీ ఒక కొత్తది ఉంటుంది. ఒట్టు సార్! నిజంగా నాకెవరున్నారన్నది తెలీదు. ప్రతీ సారీ అనసూయమ్మ ఎక్కడికెళ్ళాలో చెప్పేది. నేను కలిసిన వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు. అంతా ప్యూర్ బిజినెస్! అంతకు మించి నాకు ఏవీ తెలీదు…” అంటూ అతను అతను భోరున ఏడ్చాడు.
“నీకు తెలుసున్న వివరాలు చెప్పు చాలు…”
“తెలుసున్నవన్నీ చెప్పాను సార్! హైద్రాబాదులో అనసూయమ్మకి అన్ని డిటైల్సూ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడే నా కాంటాక్ట్స్ కుదురుస్తుంది…సార్! ఆకలి గా ఉంది….” అని దీనంగా చూసాడు.
అది విని కానిస్టేబుల్ చేత పంపిస్తానని అక్కడనుండి వెళిపోయాడు. కొంత సేపయ్యాక ఒక కానిస్టేబుల్ వచ్చాడు. బయట హొటల్లో ఏదైనా తినడానికి తీసుకెళ్ళడానికి. పారిపోవడానికి ప్రయత్నిస్తే చావేనని బెదిరించాడు.
బయటకు వస్తూండగా పోలీసాఫీసరు బయట ఒక కారు దగ్గర ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. వీళ్ళని చూసి వెనక్కి రమ్మనమని పిలిచాడు. అతను కారు సమీపించగానే కారులో ఉన్న ఒకామెను చూసాడతను. వేంటనే గుర్తు పట్టాడు. ఆమె అతన్ని గుర్తుపట్టి తల తిప్పుకుంది. ఆమె పేరు గుర్తుకు రావడం లేదు. ఫోన్లు లాగనే వీళ్ళూ పేర్లు మార్చేసుకుంటారు. వేంటనే తల తిప్పి ఆ కానిస్టేబుల్ని అనుసరించాడు.
టిఫిన్ తిన్నాక అతని ప్రాణం లేచొచ్చింది. తిరిగి వస్తూ పోలీస్టేషన్ ప్రవేశిస్తూండగా అక్కడ ఒక రూములో పోలీసాఫీసరు కనిపించాడు.
ఆయనతో మాట్లాడాలి అన్నట్లు కానిస్టేబుల్తో సైగ చేసాడతను. ఆయన రూమువైపు తీసుకెళ్ళి బయటకి వెళిపోయాడా కానిస్టేబుల్.
“సార్! మీకో విషయం చెప్పాలి. ఇందాక మీరు బయట కారులో మాట్లాడుతున్న ఆమె నాకు తెలుసు సా…ర్!” అంటూండగా ఒక్కసారి కుర్చీలోంచి లేచి సాగదీసి లెంపకాయ కొట్టాడా పోలీసాఫీసరు.
అంతే అతని నోట మాట లేదు. కానిస్టేబుల్ని గట్టిగా కేకేసాడా పోలీసాఫీసరు. అతన్ని జైలు గది వైపు లాక్కెళ్ళాడు. కసితీరా అతన్ని చావబాదాడా పోలీసాఫీసరు.

***

అంతవరకూ నానా హింసలు పెట్టినా ఆ పోలీసాఫీసరు అతను చెప్పింది విన్నకా ఏమనుకున్నాడో కారెక్కించుకొని బయటకి తీసుకెళ్ళాడు.
“సార్! మీరు ఈ డొంకతా కదిపి మీకే ముప్పు తెచ్చుకునేలా వున్నారు….” అంటూ చెప్పాడు. ఆ పోలీసాఫీసరు మొహం కందగడ్డలా మారిపోయింది.
“లేదు సార్! నేను నిజమే చెబుతున్నాను. నమ్మండి. నేను అబద్ధం చెప్పడం లేదు!”
తనొక పెద్ద ఉచ్చులో ఇరుక్కున్నానని అతనికి అప్పుడర్థమయ్యింది. పోలీసాఫీసరు సమస్య వేరు.
“ఈ క్షణం నుండి నువ్వెవరో నాకు తెలీదు. నేనెవరో నీకు పరిచయం లేదు. ఒకవేళ నోరు జారితే నువ్వూ, నీ ఫామిలీ…” అంటూ ఒక విషపు నవ్వు నవ్వాడా పోలీసాఫీసరు.
అతన్ని నేరుగా తీసుకెళ్ళి ఇండియా గేట్ వద్ద వదిలేసాడు. ఆ ఆఫీసరు వెళ్ళాక దీప్తికి కాల్ చేసాడతను.
“నాకు భయంగా ఉంది. ఆ పోలీసాఫీసరు నిన్ను పట్టుకొని జైల్లో…” అంటూ ఫోనులో గట్టిగా ఏడ్చింది.
“అతను మన జోలికి రాడు, అతనికి మినిస్ట్రీ నుండి ఫోన్ వచ్చింది. పైగా ఇంకో విషయం…” చెప్తూ ఆపేసాడు.
దీప్తి విషయం ఏమిటని మరలా రెట్టించింది.
“ఈ ఆఫీసరు …ఇహ అతను మన జోలికి రాడు,” అని దీప్తికి ధైర్యం చెప్పాడు.
“నువ్వు వేంటనే బయల్దేరి ఇంటికొచ్చేయ్! మనకున్నది చాలు. బ్రతకడానికి చాలా దార్లున్నాయి. ఈ పాపిష్టి డబ్బు మనకొద్దు. నువ్వీ పనులు చెయ్యనని ప్రామిస్…” అంటూ ఫోనులో గట్టిగా ఏడ్చింది దీప్తి. ఆమె ఫోను పెట్టేసాక మనసు మనసులో లేదు. దీప్తికి తను మోసం చేసినా ఇంకా తననే నమ్ముకుంది.
ఇండియా గేట్ డిల్లీలో అతనికి నచ్చిన ప్రదేశం. ఎన్నో సాయంత్రాలు అక్కడ గడిపాడు. ఇదే తన పికప్ పాయింట్.
అక్కడే ఒక హొటల్లో చాట్ తిని టీ తాగాడు. రాత్రి తొమ్మిది కావస్తోంది.
మనసు పరిపరి విధాల పోతోంది. ఒక పక్క తనంటే తనకి అసహ్యం, గత్యంతరం లేని బ్రతుకు. మరొక పక్క కుటుంబం. కాలే కడుపుకి ఒక రకం ఆకలి. రగిలే డబ్బుకి మరో రకం ఆకలి. పనికి మాలిన జస్టిఫికేషన్! పరిపరి విధాల ఆలోచిస్తూ అక్కడున్న పచ్చిక మైదానంలో నడుస్తున్నాడు.
దూరంగా ఒకమ్మాయి అతన్ని చూసి నవ్వుతూ చెయ్యూపింది. మెల్లగా నడుచుకుంటూ అతని వైపే వచ్చింది.
దగ్గరకొచ్చాక ఆమెను చూసాడు. పెదాలకి ఎర్రటి లిప్స్టిక్‌తో విపరీతమైన మేకప్‌తో ఉంది.
అతనికి ఆమె ఎవరో అర్థమయ్యింది. దగ్గరకి రాగానే పెర్ఫ్యూం వాసన గుప్పున కొట్టింది.
“వాంట్ టూ హావ్ సమ్ డ్రింక్ టుగెదర్?”
వద్దన్నట్లు తలూపుతూ జేబులోంచి ఒక కవరు తీసి ఆమె చేతిలో పెట్టి వెళిపోయాడు. రెండ్రోజుల క్రితం బీనా అతనికిచ్చిందది.
ఆమె ఆ కవరు విప్పి చూసినట్లుంది, అతని వెనకాలే పరిగెత్తుకొచ్చి, చేతిలో కవరు చూపించి ఏవిటన్నట్లు సైగ చేసింది.
తీసుకో అన్నట్లు తలూపి బయల్దేరాడతను.
“హూ ఆర్ యూ? ” ఆమె అతన్ని వెనక్కి లాగి అడిగింది.
మెల్లగా ముందుకి నడుస్తూ చెప్పాడతను.
“జిగొలో!”

–సాయి బ్రహ్మానందం గొర్తి

బొమ్మల చక్రం!

(కోనసీమ లోని అమలాపురం లో పుట్టిన సాయి బ్రహ్మానందం గొర్తి ప్రస్తుతం కాలిఫోర్నియా లోని cupertino లో నివసిస్తున్నారు. దాదాపు 40 కి పైగా కథలు రాశారు. ఆయన కథల పుస్తకం ” సరిహద్దు” 2012 లో విడుదల అయింది. బ్రహ్మానందం రాసిన కొన్ని కథలు ఇంగ్లీష్, హింది, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోకి అనువాదమయ్యాయి. కథలతో పాటు 15 కు పైగా నాటికలు కూడా రాశారు. బ్రహ్మానందం రాసిన ” నేహాల” నవల కౌముది వెబ్ మాగజైన్ లో, మరో చిన్న నవల యథార్ధ చక్రం ప్రచురితమయ్యాయి. కర్ణాటక సంగీతం మీద రాసిన వ్యాసాల పుస్తకం ” త్యాగరాజ” త్వరలో విడుదల కానున్నది.} 
పిల్లలకి వేసవి శలవలిచ్చారు. రాత్రి పదిదాటింది. పగలంతా ఆడాడి అలసిపోయిన పల్లూ, బాబీలు మంచం మీద ఓళ్ళు తెలీకుండా పడుక్కున్నారు. బాబీ నిద్రలోకి  జారుకున్నాడని గ్రహించీ, మెల్లగా ఆ పిల్లాడి  చేతుల క్రిందనుండి పక్కకి జరిగింది రేసుకారు. ఒక్కసారి టైర్లు విదిలించుకుని, మెల్లగా భారీ కాయాన్ని తోసుకుంటూ అక్కడనుండి బయటకు జారుకుంది.
రేసుకారు ఇలా ప్రతీ రాత్రీ జారుకోవడం బార్బీకి కొత్త కాదు. మెల్లగా తనూ పల్లూ గుండెల మీదనుండి క్రిందకి జారి, ఒక్క అంగలో మంచం దూకి రేసు కారుని అనుసరించింది.
“బంగారు కోడిపెట్టా..హే హే” అని హుషారుగా పాడుకుంటూ వసారాలో తిరుగుతోంది రేసుకారు.  బార్బీ తన వెనకే ఉందన్న ధ్యాసే లేకుండా ఓ మూల నుండి మరో మూలకి రయ్యి రయ్యిమని వెళుతూ హఠాత్తుగా గుమ్మదగ్గర సడెన్ బ్రేకేసి ఆగిపోయింది. గుమ్మానికానుకొని ఎదురుగా బార్బీ కళ్ళెగరేస్తూ కనింపించింది.
“ఏంటి ఈ హుషారు?” అన్నట్లుగా కనుబొమ్మలెగరేసింది.  బార్బీని చూడగానే చిర్రెత్తుకొచ్చింది రేసు కారుకి.
“ఒక్క రోజయినా నా వెంట పడకుండా వుంటావేమోనని చూస్తాను. ఇవాళ కూడా..” అంటూ పళ్ళు కొరికింది.
“ఇదేమయినా నీ మేనమావిల్లా? ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకూ అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే నీకంటే కాస్త ఎక్కువే వుంది. అద్సరే గానీ, ఏంటి? రోజూ లేనిదివాళ ఇలా ఈ పాటలూ..పరుగులూ…?” విసురుగా అంది బార్బీ.
“ఓ అదా! నేను రెండ్రోజుల్లో హైద్రాబాదు వెళుతున్నాను, తెల్సా?” తలుపులెగరేస్తూ చెప్పింది రేసుకారు.
“హైద్రాబాదా? ఎందుకు?”
“ఎందుకేవిటి? నేనూ, బాబీ వెళుతున్నాం. నీకు తెలీదా? అమెరికానుండి బాబీ వాళ్ళ మావయ్య వస్తున్నాడు. ఆయన్ని రిసీవ్ చేసుకోడానికి బాబీ వాళ్ళ నాన్న వెళుతున్నాడు. అదీ సంగతి!” గెంతుతూ చెప్పింది రేసుకారు.
“బాబీ వాళ్ళ నాన్నెళితే, నీ కేంటి?”
“నీ బుర్రకి మేకప్పెక్కువయ్యి ఆలోచించన తగ్గిపోతోంది. బాబీ వాళ్ళ నాన్నతో వస్తానని గోల చేసాడు. నేను తోడు లేకుండా బాబీ ఎక్కడకీ కదలడు కదా?”
“అదా నీ బడాయి! ఒక్క పూట భాగోతానికి హైద్రాబాదు వరకూ ఒళ్ళు హూనమవ్వడం తప్ప ఏమీ లేదు. నేను చూడు. వచ్చే నెలలో పల్లూతో కలిసి వాళ్ళ పెద్దమ్మగారింటికి రాజమండ్రీ వెళుతున్నాను.”
బార్బీ చెప్పింది విని నవ్వాపుకోలేకపోయింది రేసు కారు.
“ఏంటి రాజమండ్రీకింత బిల్డప్పా? గొప్పలు చెప్పుకోడం మీ ఫారిన్ వాళ్ళకి అలవాటే కదా? ఇంతుంటే అంత చెప్పుకుంటారు. నేను మీ రాజమండ్రీ మీదుగానే ట్రైన్లో హైద్రాబాదెళుతున్నాను. నువ్వెప్పుడయినా ట్రైన్ మొహం చూసావా? నీకో విషయం తెలుసా? ట్రైన్లో ఏ.సీ ఉంటుంది,” రేసుకారు వెటకారంగా అంది.
“అబ్బో! ఏం తిరిగాడండీ ఈ డొక్కు చెక్రాలేసుకొని. మాకీ ట్రైన్లూ, బస్సులూ కాదు. ఏకంగా విమానంలో ఇరవై గంటలు ప్రయాణం చేసి అమెరికానుండి వచ్చాను. అన్నట్టు నీకు విమానం అంటే తెలుసా? గాల్లో ఎగురుతుంది. అందులో కూడా ఏ.సీ ఉంటుంది! ” బార్బీ వెక్కిరింతలు చూసి ఉడుకుమోత్తనం వచ్చింది రేసుకారుకి.
“ఉండు. నీ పని చెప్తా?” అంటూ బార్బీనీ వెంబడించింది. బార్బీ రేసుకారుకి దొరక్కుండా ఆగదంతా అటూ, ఇటూ పరిగెడుతోంది.
వీళ్ళిద్దరి గొడవా ఎంతో శ్రద్ధగా, నిశ్శబ్దంగా వింటున్నాయి షోకేసులోవున్న కొండపల్లి బొమ్మా, లేపాక్షి బొమ్మా, ఏటికొప్పాక బొమ్మలూ.  రాత్రి పది దాటితే చాలు ప్రతీరోజూ ఈ రేసుకారు రణగొణ ధ్వని వీళ్ళకి మామూలే! గతిలేక అలా గుడ్లప్పగించి చూస్తాయి. ఒకప్పుడు ప్రతీ ఇంటా తమ ఆధిపత్యమే ఉండేది. ఇప్పుడా పరిస్థితీ, వైభోగమూ లేదు. గాజు గోడల మధ్య జీవితం బందీ అయ్యింది. బాధగా తలదించుకుంది కొండపల్లి బొమ్మ.
ఇది గమనించిన లేపాక్షి బొమ్మ – “రోజూ చీకటి పడుతోందంటేనే చికాకేస్తోంది. వీటి గోల భరించలేకుండా ఉన్నాం. ఎప్పుడు చస్తారో ఏమిటీ? ఈ పీడ విరగడయ్యేట్లా లేదు,” పళ్ళు కొరుకుతూ అంది.
“నీ కోపం అర్థమయ్యింది. మనమేం చెయ్య గలం చెప్పు? ఈ గాజు తలుపు దాటి వెళ్ళలేం. బ్రతికున్నన్నాళూ ఈ గోల తప్పదంతే!” నిరాశగా అంది కొండపల్లి బొమ్మ.
ఎప్పటికయినా ఆ రేసుకారూ, బార్బీలపై పగ తీర్చుకోపోతామా అని ఎదుర్చూస్తున్నాయా బొమ్మలు.
రేసుకారుకి అందకుండా బార్బీ ఆ గదంతా తిప్పిస్తోంది. పరిగెత్తే ఓపిక లేక హాల్లో టీవీ పైన చతికిలపడింది బార్బీ. నేలమీద వెంబడించిన రేసుకారు టీవీ టేబులెక్కలేక అక్కడే కూలబడింది.
ఇదంతా చూసి కిసుక్కున నవ్వాయి, షోకేసులో బొమ్మలు. ఒక్కసారి విసూరుగా తలతిప్పి చూసింది రేసుకారు. వేంటనే షోకేసి బొమ్మలు తలదించుకున్నాయి.
“ఏంటా పకపకలూ?  ఒక్క సారి బయటకి రండి తడాఖా చూపిస్తాను.”
“అత్త మీద కోపం దుత్త మీదన్నట్లు బార్బీ మీదున్న ఉక్రోషం మామీద చూపిస్తావేమిటి? మీ ఆట చూసి నవ్వొచ్చింది. ఆ మాత్రం నవ్వకూడదా?” కొండపల్లి బొమ్మ నవ్వాపుకోలేక అంది.
“భలే చెప్పారు. ఏదో ఈ ఇల్లంతా వాడి బాబు సొత్తన్నట్లు మాట్లాడతున్నాడు. హక్కుల గురించి మాట్లాడాల్సొస్తే అందరికీ ఉన్నాయి…”
“అబ్బో హక్కులట హక్కులు. ఎంతసేపూ మేకప్పు చేసుకోవడమే ప్రపంచమనుకునే నువ్వూ, నాలుగ్గోడల మధ్యా బందీలా ఆ షోకేసే ప్రపంచమనుకునే మీరా హక్కుల గురించి లెక్చర్లిస్తున్నారు. ఈ టీవీ పైనుండి బార్బీ ఎలా దిగుతుందో చూస్తాను? ఈ రాత్రంతా ఇక్కడే ఉంటాను,” కోపంగా ఊగిపోతూ అంది రేసుకారు.
“హలో! నాకేం పరవాలేదు. హాయిగా ఇక్కడ పడుక్కోగలను. తెల్లారితే నీ సంగతే చూసుకో! ఇంట్లో వాళ్ళ కాలికడ్డం వస్తే ఓ తన్ను తన్నుతారు.” బార్బీ అంది.
“ఏవిటర్రా?ఎందుకొచ్చిన గొడవలు?మనంఉన్నదినలుగురం.ఇలా కొట్టుకుంటూ…” లేపాక్షి బొమ్మ అనునయించబోయింది.
“చ! ఆపండెహా! మీ సూక్తిముక్తావళి.. మీరెవరు నాకు చెప్పడానికి? ”  కటువుగా అంది రేసుకారు.
“నీకెందుకొచ్చింది చెప్పు. వాళ్ళ గొడవేదో వాళ్ళు పడతారు. మనం ఈ షోకేసి దాటి వెళ్ళనప్పుడు ఎవరెలా చస్తే మనకేంటి చెప్పు? అనవసరంగా వాళ్ళ మధ్య తలదూర్చద్దు.” కొండపల్లి బొమ్మ మెల్లగా లేపాక్షి బొమ్మతో అంది.
“పోనీ మనవాళ్ళేనని చెప్పానంతే?” లేపాక్షి బొమ్మంది.
“మనవాళ్ళేంటి? వాళ్ళు పరాయి దేశం నుండి వలసొచ్చారు. వాళ్ళకి మన సంస్కృతీ అవీ తెలీవు. అయినా మనం ఎక్కడుంటున్నాం? ఇదంతా తెలుగు గడ్డ మహత్యం! ఇహ నోరెత్తావంటే నాలుగిచ్చుకుంటాను,” కొండపల్లి బొమ్మ గట్టిగా హెచ్చరించింది.
“హలో! వలసా, గిలసా అంటూ ఏంటో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? మీరు మాత్రం వలసగాళ్ళు కాదా? అయినా తెలీకడుగుతాను? ఈ భూమ్మీద అందరవూ వలసొచ్చినాళ్ళే! కాబట్టి నోరు మూసుక్కూచోండి. లేదంటే..?” ఆవేశంగా అంది రేసుకారు.
“ఎందుకు ప్రతీ దానికీ అలా పెడర్థాలు తీస్తావు?” లేపాక్షి బొమ్మకి కోపం వచ్చింది.
“ఏంటి? మాటంటే మాటని రెచ్చిపోతున్నావు? నా సంగతి నీకు తెలీదు.” అంటూ పక్కనే నేల మీదున్న బంతిని బలంగా తన్నింది. ఆ అదురుకి అది ఎగురుకుంటూ వెళ్ళి షోకేసు అద్దమ్మీద పడింది. ఆ విసురుకి షోకేసులో ఉన్న లేపాక్షి, కొండపల్లి బొమ్మలు పక్కకొరిగాయి.
ఆ చప్పుడు విని పక్క గదిలో పడుక్కున్న బాబీ వాళ్ళ తాత “ఎవరూ?” అంటూ గట్టిగా అరుస్తూ వసారా వైపుగా వచ్చి లైటు వేసాడు. షోకేసులో బొమ్మలు పడిపోవడం చూసి పిల్లి వచ్చిందేమో అనుకుంటూ, అటూ ఇటూ పరికించి లైటార్పకుండానే తనగది వైపుగా వెళిపోయాడాయన, లైటు వేసుంటే ఎవరయినా మరలా వచ్చే అవకాశముందని ఆ బొమ్మలన్నీ మౌన ముద్ర వహించాయి.
***
తెల్లారగానే గదులన్నీ వూడ్చడానికొచ్చిన పనిమనిషి పొరపాటున రేసు కారు బొమ్మమీద కాలేసింది. గబుక్కున పడబోయి పక్కనే ఉన్న సోఫాని ఆనుకుంది.. రేసుకారు ఒక చక్రం విరిగి పక్కన పడిపోయింది.
చక్రం విరిగిన బాధతో ఒక్కసారి హారన్ కేక పెట్టింది రేసు కారు. ఆ కేకకి ఉలిక్కిపడ్డాయి షోకేసులో బొమ్మలు. నిద్రలేస్తూనే కారు కోసం వెతుకుతున్న బాబీ హాల్లో చక్రం ఊడిన కారుకేసి చూస్తూ బావురుమన్నాడు.
ఆ విరిగిన కారుబొమ్మనే చేతిలో పెట్టుకు తిరిగాడు. ఆ రాత్రి రేసుకారు వసారాలోకి రాలేదు. బార్బీ కూడా. రోజూ ఎంత కొట్టుకున్నా రేసుకారు కుంటుతూ నడవలేక నడవడం చూసి బాధ కలిగింది బార్బీకి.  చక్రం విరిగిన కారుని తీసుకొని హైద్రాబాదు బయల్దేరడానికి సిద్ధమయ్యాడు బాబీ.
***
ఆ రాత్రి బార్బీకి నిద్ర పట్ట లేదు. రేసుకారెలా ఉందోనన్న దిగులే ఎక్కువయ్యింది. ఓ రాత్రి వేళ ఏం చెయ్యాలో తోచక దిగాలుగా వసారాలోకి వచ్చి, నేల మీద కూలబడింది బార్బీ! కొంతసేపయ్యాక పక్కగదిలో చప్పుడయితే అటుగా వెళ్ళింది.
చీకట్లో ఏదో కదిలినట్లయ్యింది.  అక్కడ రేసుకారుని చూసి  ఆశ్చర్యపోయింది బార్బీ. చక్రం ఊడిన రేసుకారు  రేసుకారు బాధగా మూలుగుతూ వుంది.  చూసి జాలిపడింది బార్బీ!
“ఎలావుందిప్పుడు?”
“బానే వుంది.” ముక్తసరిగానే జవాబిచ్చింది రేసుకారు.
“నువ్వేటిక్కడ? హైద్రాబాదు వెళ్ళలేదా?”  గుర్తుకొచ్చి అడిగింది బార్బీ. రేసుకారు నెమ్మదిగా చెప్పింది.
“బయల్దేరబోయేముందు బాబీ నాన్న మాట విని నన్ను వీధి గుమ్మం వద్దే వదిలేసాడు. మీరనుకున్నట్లు నేను హైద్రాబాదు వెళ్ళలేదు.” తలదించుకొని నెమ్మదిగా చెప్పింది రేసుకారు.
“మరి ఇంతసేపూ ఎక్కడున్నావు?” బార్బీకి సందేహమొచ్చింది.
“గుమ్మం దగ్గర మెట్లదగ్గరే కూలబడిపోయాను. బాబీ నన్ను వదిలి వెళ్ళాడన్న బాధొకవైపూ, చక్రం విరిగిందన్న బాధ ఇంకోవైపూ – ఉదయం నుండీ అక్కడే ఉండిపోయాను….ఈ చక్రం మరలా వచ్చి మరలా మీ మధ్య తిరుగుతానా అనిపిస్తోంది” రేసుకారు గొంతు మారింది.
నడవడానికి ప్రయత్నిస్తూ, మూడు చక్రాలతో కుంటుకుంటూ నడవలేక ఓ మూల చతికిలబడింది.
ఇదంతా గమనిస్తూ ఉన్నాయి షోకేసులో బొమ్మలు. వాటికీ రేసుకారు పరిస్థితి అర్థమయ్యింది. ఇదే మంచి అదననుకొని కొండపల్లి బొమ్మ చొరవతీసుకొని ఇలా అంది.
“రేసుకారూ, నీ పరిస్థితి చూస్తే బాధ కలుగుతోంది. నేను నీకు సహాయం చెయ్యగలను. నీ చక్రం సరి చేసి, నువ్వు మామూలుగా తిరిగేలా చెయ్యగలను.”
ఈ మాటలు విని రేసుకారుకి అంత దుఃఖంలోనూ నవ్వొచ్చింది.
“ఉన్న చోటునుండి కదల్లేరు కానీ, నాకు సాయం చేస్తారా? ఎవరైనా వింటే నవ్వి పోతారు. మీరేదో నా మీద కక్ష సాధిద్దామని ఇలా దెప్పి పొడుస్తున్నారు. లేకపోతే మీరు సాయం చెయ్యడమెమిటి? “
“లేదు. లేదు నీ మీద కక్ష అలాంటివి కాదు. నిజంగానే నీకు సాయం చేద్దామనే చెప్పాను..” కొండపల్లి బొమ్మ మరోసారంది.
“పోనీ వాళ్ళేదో సాయం చేస్తామంటే,  ఆ పొగరేమిటి? అయినా నువ్వెవర్నీ నమ్మవు. ఇలాగే కుంటుకుంటూ ఈ వసారాలోనే పడుండాలి. బాబీ వచ్చాడంటే నిన్నో మూల పారేసి వేరే బొమ్మ కొనుక్కుంటాడు,” రేసుకారుతో అంది బార్బీ.
రేసుకారు ఏమనుకుందో ఏమో, కొండపల్లి బొమ్మ సాయానికి అంగీకారం చెప్పింది.
“మీరిద్దరూ ఎలాగయినా ఈ షోకేసు డొరు పక్కకు లాగితే మేం బయటకొస్తాం. ఆ పక్కగది అటకపైన పెట్టెలో మా వాళ్ళు చాలామందే ఉన్నారు. మా అవయవాలకి గాయమయితే  అతికే మందు వాళ్ళ దగ్గరుంది. అది రాస్తే చిటికలో అన్నీ సర్దుకుంటాయి. ఆ మందు పేరంటబ్బా? నోట్లో నానుతోంది కానీ గుర్తు రావడంలేదు…!” అనంటూ మధ్యలో ఆగిపోయింది,  కొండపల్లి బొమ్మ.
“అదే…దాన్ని క్విక్‌ఫిక్స్ అంటారు.” చటుక్కున అందిచ్చింది లేపాక్షి బొమ్మ.
“అవును. ఆ క్విక్‌ఫిక్సే!  ఇప్పటికే దెబ్బ తగిలి చాలాసేపయ్యింది. వేంటనే మందు వేసి కట్టు కట్టకపోతే  కష్టం. “
షోకేసు తలుపులెలా తీయడామని ఆలోచనలో పడింది రేసుకారు. బార్బీ, రేసుకారు ఎంతో శ్రమపడి మొత్తానికి స్టూలుని షోకేసు దగ్గరగా జరిపారు. చివరకి బార్బీ షోకేసు తలుపులు తెరిచింది.  ఒక్క ఉదుటున కొండపల్లి బొమ్మా, దానివెనుకే లేపాక్షి బొమ్మా, వారి తోటి బొమ్మలూ బయటకి దూకాయి.
వడి వడిగా అడుగులేసుకుంటూ పక్క గదిలో అటకవైపు చూసాయి. అటకమీదున్న బొమ్మల్ని గట్టిగా  పిలిచింది కొండపల్లి బొమ్మ.  అటకమీద పెట్టె తెరుచుకొని బొమ్మలూ,  వెనుకనే లక్క పిడత సైన్యమూ బిల బిలా వచ్చి క్రిందకి చూసాయి. కొండపల్లి బొమ్మ విషయం చెప్పింది. వేంటనే కొయ్య గుర్రం బొమ్మ పెట్టెలో వున్న క్విక్‌ఫిక్స్తెచ్చింది. దాంతో రేసుకారు చక్రం అతకడం ఆపరేషన్ మొదలెట్టారు. ఓ గంట తరువాత ఎలాగయితేనే ఊడిన చక్రాన్ని అతికించారు.
“ఇప్పుడే మందు రాసాను. ఇది ఆరి చక్రం అతుక్కోడానికి చాలా సేపే పడుతుంది. అంతవరకూ నువ్వు కదలకూడదు. తరువాత కదిలినా మెల్లగా నడవాలి కానీ, ఈ గాయం మానే వరకూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా పరుగులూ అవీ తీయకూడదు. తెలిసిందా?” కొండపల్లి బొమ్మ చెప్పింది. వాళ్ళు చేసిన సాయానికి రేసుకారు మనసు ద్రవించింది.
“మీరు నా చక్రం అతికించి నాకెంతో సాయం చేసారు. మీ మేలెప్పటికీ మరవలేను. ఇన్నాళ్ళూ మిమ్మల్ని కించపరుస్తూ తక్కువ చేసి మాట్లాడాను. క్షమించండి,” అంటూ కొండపల్లి బొమ్మవైపు చూసింది.
“పరవాలేదు. చెప్పానుగా మనందరం ఒకే జాతికి చెందిన వాళ్ళం. మనం ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోపోతే ఎలా? ఒక్క విషయం రేసుకారూ?నువ్వనుకున్నట్లు మాది ఆవారా జాతి కాదు.  ప్రస్తుతం నీకు పిల్లలమధ్య పాపులారిటీ, డిమాండూ ఉండచ్చేగాక!  గతంలో మాది పెద్ద వంశమే! ఈ వైభవాలూ అవీ మేమూచూసాం. నీకు తెలుసో తెలీదో పూర్వం దసరాకీ, సంక్రాంతికీ బొమ్మల కొలువు పెట్టేవారు. మేము లేని ఇల్లుండేది కాదు. మమ్మల్ని జనాలు ఎగబడి చూసేవారు. వయసుతో సంబంధంలేకుండా మాపై ప్రేమ చూపించేవారు. ఆ రోజులే వేరు. ఓడలు బళ్ళు అవుతాయి;బళ్ళు ఓడలవుతాయి. ఇదే కాల చక్ర మహిమ!,” అంటూ మనసులోమాట చెప్పింది కొండపల్లి బొమ్మా. మిగతా బొమ్మలూ తమ తమ పూర్వ చరిత్రని చెప్పాయి.
“చెప్పానుగా! నాకు మీ గురించి తెలీదు. మాది ప్లాస్టిక్ వంశం. మేం పక్క దేశాల్నుండి వలస వచ్చాం. మాదే గొప్ప జాతీ, మేమే ఎంతో ఆధునికంగా బ్రతుకుతామన్న భ్రమలో ఉన్నానిన్నాళ్ళూ! మాకు మీ చరిత్ర తెలీదు. తెలిసిందల్లా, మీకు ఈ సమాజంలో ఎక్కడా చోటు లేదన్న విషయమొక్కటే.  అది చూసే మిమ్మల్ని తక్కువగా మాట్లాడాను,” అంటూ కంట తడి పెట్టుకుంది రేసుకారు.
“జరిగిపోయింది కదా? ఇహ బాధపడడం అనవసరం. ఏదేమయినా మనమందరం ఒకటే! రేసూ! ఒక్క విషయం గుర్తుంచుకో! ఈ మనుష్యుల్ని నమ్మొద్దు. ఎప్పుడు దేని మీద ఇష్టపడతారో, ఎప్పుడు తిరస్కరిస్తారో వాళ్ళని పుట్టించిన దేవుడు కూడా చెప్పలేడు. అతిగా నమ్మడం మనకే మంచిది కాదు,”  అనంటూ కంటనీరు కారుస్తున్న రేసుకారుని కొండపల్లి బొమ్మ అక్కున చేర్చుకుంది.
మిగతా బొమ్మలూ రేసుకారు భుజం తట్టాయి. బొమ్మలన్నీ షోకేసులోకి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడ్డాయి.
***
రెండ్రోజుల తరువాత బాబీ వాళ్ళ మావయ్యతో కలిసి ఇంటికి తిరిగొచ్చాడు. అమెరికానుండి బాబీ మావయ్య ఒక రేడియో కంట్రోలు కారు బహుమతిగా ఇచ్చాడు. పల్లూకి మాట్లాడే మరో బార్బీ బొమ్మా, ఇంకా చాలా బొమ్మలు పట్టుకొచ్చాడు. బాబీ కొత్త కారు మోజులో రేసుకారుని పట్టించుకోడం మానేసాడు.
‘ఈ బాబీయేనా తనని ఎంతో అపురూపంగా చూసుకున్నది? ఒక్క సారి చక్రం వూడితే నేను పనికి రాకుండా పోయానా?’  అని వాపోయింది రేసుకారు.
రేడియోకంట్రోల్ కారు ముందుకీ వెనక్కీ వేగంగా తిరగడమూ, ఏదైనా అడ్డొస్తే చటుక్కున పక్కకు తిరగడమూ, ఎత్తైన వాటిపైకి బలంగా ఎక్కడమూ – ఇవన్నీ చూసి అవాక్కయ్యింది రేసుకారు. మిగతా బొమ్మల్లా కాకుండా తను ఎంతో వేగంగా ఎక్కడకి కావల్సివస్తే అక్కడకి వెళ్ళగలను అని అనుకునేది. ఈ రేడియో కంట్రోల్ కారు తనకంటే మించి పోయింది. దీన్ని చూస్తే తన మొహం ఏ పిల్లాడూ చూడడు. మెల్లగా తనూ కొండపల్లి బొమ్మల్లా తయారవుతుంది. ఇదంతా తలచుకుంటేనే భయమేసింది రేసుకారుకి.
రేడియో కంట్రోల్ కారుకి మిగతా బొమ్మలంటే చులకన.  అమితమైన వేగంతో మిగతా బొమ్మల్ని ఢీకొని వాటికి నరకం చూపించేది. ఆ కారొచ్చాక పాత బార్బీకి, రేసుకారుకీ చాలా సార్లు గాయాలయ్యాయి.  కొండపల్లి బొమ్మా, మిగతా బొమ్మలకీ అదే పరిస్థితి. వసారాలో అడుగుపెట్టడం మానేసాయి.
ఎలాగయినా ఈ రేడియో కంట్రొలు కారు ఆటకట్టించాలని మిగతా బొమ్మలన్నీ  కృత నిశ్చయంతో, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. దానికి రాకాసి కారని నిక్‌నేం పెట్టాయి.
“మనం తొందరపడి ఏమీ చెయ్యద్దు. ఆ రాకాసి కారుతో గొడవ పడకుండా గడుపుదాం. అందరూ దాని ప్రతి చర్యా గమనించండి. . ఈలోగా ఈ రాకాసి కారు పీడ ఎలా వదిలించుకోవాలన్నది మేం ప్లాన్ చేస్తాం. సరేనా?” కొండపల్లి బొమ్మ ఆదేశించింది.  అందరూ సరే నన్నారు.
కొండపల్లి బొమ్మ ప్రతిపాదన అందరికీ నచ్చింది. రేసుకారూ, బార్బీ ఏం చెయ్యాలని ప్లాన్ వేసుకున్నాయి.
***
కొత్త బార్బీ వచ్చాక పాత బార్బీ కేసే చూడ్డం మానేసింది పల్లూ. ఎలాగయినా కొత్త బార్బీ పని పట్టాలని నిశ్చయించుకుంది బార్బీ. రేసుకారు సాయం కోరింది. నాలుగు రోజుల తర్వాత పల్లూ రాజమండ్రీ ప్రయాణానికి సిద్ధమవుతుండగా మెల్లగా ఎవరూ చూడకుండా బేక్‌పాక్ లోకి చేరాయి బార్బీ, రేసుకారూ. పల్లూ వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఎలాగయినా మాట్లాడే బార్బీని హత మార్చాలి. ఇదీ ప్లాను. కొండపల్లి బొమ్మ, మిగతా బొమ్మలు వారించినా బార్బీ వినలేదు.
కానీ  వెళ్ళిన రెండ్రోజులకే తిరిగొచ్చేసింది పల్లూ. వస్తూనే పెద్దమ్మిచ్చిన బొమ్మలన్నీ వాళ్ళమ్మకి చూపించింది.
“అమ్మా! ఈ చైనా బొమ్మలు చూడు. ఎంత బావున్నాయో! పెద్దమ్మ నాకోసం తెప్పించిందట. ఈ రైలు బొమ్మా చూడు. ఎంత బావుందో? ఈ సీతారాముల విగ్రహాలూ భలే బావున్నాయి. వీటికి డ్రెస్సులు కూడా బాగా నప్పాయి.” అంటూ మొత్తం తెచ్చిన బొమ్మలన్నీ అక్కడ పరిచి బ్యాగ్ ఖాళీ చేసింది పల్లూ.
ఇది చూసి షోకేసు బొమ్మల మొహాలు మారిపోయాయి. ఎక్కడా రేసుకారూ, బార్బీల జాడే లేదు. ఏమీ అర్థం కాలేదు వాటికి. ఒకటికి రెండు సార్లు పరికించి చూసాయి. బార్బీ, రేసుకారూ రాలేదా? అంటే పల్లూ వాళ్ళ పెద్దమ్మా ఇంట్లోనే చిక్కుకుపోయారా?
ఇంతలో షోకేసు తలుపు తీసినట్లు చప్పుడయితే తలెత్తి చూసాయి. ఎదురుగా పల్లూ! కొండపల్లీ, లేపాక్షీ మిగతా బొమ్మల్ని షోకేసు వెనక్కి నెట్టి, ముందు వరసలో పెద్దమ్మిచ్చిన సీతారాముల బొమ్మలు పెట్టింది పల్లూ.
ఈ చర్యకి ఒక్కసారి అవాక్కయ్యాయి షోకేసు బొమ్మలన్నీ.
కొత్తగా వచ్చిన సీతారాముల బొమ్మల్ని చూసి మనవాళ్ళే అనుకున్నాయి. తీరాచూస్తే అవి వేరే భాషలో మాట్లాడుకుంటున్నాయి. వాటిని చూసి నవ్వాగింది కాదు లేపాక్షి బొమ్మకి. ఆ నవ్వుకి కారణం ఏమిటని మిగతా బొమ్మలడితే, “ఆ రాముడూ, సీతా బొమ్మలు చూడు. చిన్న చిన్న కళ్ళూ, చవిటి ముక్కూ! చూడ్డానికి ఇక్కడి వాళ్ళల్లా లేరు.” అంటూ పగలబడి నవ్వుతూ అంది.   మిగతా బొమ్మలూ గట్టిగా నవ్వాయి.
ఆ చైనా బొమ్మలు కోపంగా కళ్ళెర్ర జేస్తే, వచ్చే నవ్వుని ఆపుకున్నాయి ఆ బొమ్మలు.
***
చైనా బొమ్మలూ, రాకాసి కార్ల రాకతో తమ బ్రతుకులన్నీ మారిపోయాయి. రేసుకారూ, బార్బీ ఇహ ఈ ఇంటికి రావు. పాతబడిపోయాయని వాళ్ళు ఏ చెత్తబుట్టలోనయినా పారేసుండచ్చు. లేదా పల్లూనే ఆవతల విసిరేసుండచ్చు. ఏ విషయమూ తెలీదు. వీటికంతటికీ కారణం ఆ రాకాసి కారూ, మాట్లాడే బార్బీ! తమ అస్తిత్వానికే ఎసరు తెచ్చాయి ఈ చైనా బొమ్మలు. ఎలాగయినా వాటి అంతం చూడాలని నిర్ణయానికొచ్చాయి కొండపల్లీ, లేపాక్షి బొమ్మలు. అలా చేస్తేనే బార్బీ, రేసుకారు ఆత్మలకి శాంతి లభిస్తుందనుకున్నాయి.
ఆ రాత్రి టీవి చూస్తున్న బాబీకి వాళ్ళమ్మ పాల గ్లాసివ్వడం చూసింది కొండపల్లి బొమ్మ. పొరపాటున చేయిజారి పాలన్నీ పక్కనే ఉన్న రాకాసి కారు మీద పడ్డాయి.
“టీవీ చూస్తూంటే నీకస్సలు ఒళ్ళు తెలీదు. ముందా కారుని గుడ్డ తెచ్చి తుడు. తడి తగిలితే బాటరీలు చస్తాయి!” అంటూ బాబీ అమ్మ  విసుక్కోడం వింది కొండపల్లి బొమ్మ.
ఇది చూడగానే చటుక్కున బుర్రలో వెలిగింది. వేంటనే అటకమీదున్న బొమ్మలకి కబురంపింది. అందరూ ఓ మూల సమావేశమయ్యాయి.  ఏం చెయ్యాలో మిగతా బొమ్మలన్నింటికీ చెప్పింది.
“రేపు రాత్రి బాబీ పడుక్కునే సమయానికి అందరం అతని పడగ్గది చేరుకోవాలి. ఈలోగా ఈ లక్క పిడతలన్నీ శక్తి కొద్దీ నీళ్ళు మోసుకొస్తాయి. అందరం ఆ తలుపు వెనకాల  వేచుందాం. రాకాసి కారు మంచం దిగి రాగానే ముందు గుర్రం బొమ్మ  ఢీకుంటుంది. వెనుకనుండి ఈ లక్క పిడతలు రాకాసి కారుపై నీళ్ళొంపేయాలి. ఆ దెబ్బకి దానికి ఊపిరాడకూడదు. ఈలోగా మేమందరం వెనుకనుండి వచ్చి ఎదుర్కుంటాం.”
“ప్లాను అంతా బానే వుంది. అంత పెద్ద కారు ఈ నీళ్ళు పోస్తే చచ్చిపోతుందా?” అనుమానం వెలిబుచ్చాయి లక్కపిడతలు.
“తప్పకుండా! బాబీ వాళ్ళమ్మ పాలొలికితే ఈ రాకాసి కారు పాడవుతుందని చెప్పగా విన్నాను. పాలంటే ఏవిటి? తడే కదా? తడంటే నీళ్ళే కదా? కాబట్టి నీళ్ళు తగిలితే చచ్చే అవకాశముంది. అందుకే మన లక్కపిడతలు ఎంతమంది వుంటే అంతమందిని తరలించుకు రండి,” అని తన ప్లాను చెప్పింది.
వాళ్ళందరూ ఆ మర్నాడు పగలంతా భారంగా గడిపారు. ఎప్పుడు రాత్రవుతుందాని ఎదురుచూస్తున్నారు.
***
ఓ రాత్రి వేళ రాకాసి కారు ఎప్పటిలాగే మంచం దిగి హాల్లోకి బయల్దేరింది. తమ పధకం ప్రకారం కొయ్య గుర్రం ఎదురొచ్చి ఢీకుంది. వెనుకనుండి లక్కపిడతలు నీళ్ళొంపాయి. ఈ హఠాత్పరిమాణానికి ఒక్కసారి ఉలిక్కిపడింది రాకాసి కారు. వళ్ళంతా తడిసిపోయింది. ఊపిరాడక గిలగిలా కొట్టుకుంది. ఆలా కొట్టుకుంటూ పక్కనే ఉన్న గ్లాస్ టేబుల్ని కొట్టుకుంది. ఆ శబ్దానికి ఒక్క సారి ఉలిక్కిపడి లేచాడు బాబీ! చీకట్లో అతనికి ఏమీ కనిపించలేదు. చూసుకోకుండా లక్కపిడతల్ని తొక్కు కుంటూ హాల్లోకి వెళ్ళాడు. తలుపు బలంగా తీయబోయి వెనక్కి నెట్టాడు. దాని వెనుకే కొండపల్లీ, లేపాక్షి బొమ్మలున్నాయి.
అది ఆ పిల్లాడు గమనించలేదు.
***
ఆ మర్నాడు ఉదయం బాబీ వాళ్ళ పెద్దమ్మ దగ్గర పనిజేసే నౌకరొచ్చాడు. వస్తూ పల్లూ బొమ్మలు మర్చిపోయిందంటూ బార్బీనీ, రేసుకారుని తీసుకొచ్చాడు. పల్లూ వాళ్ళమ్మ ఆ బొమ్మల్ని వసారా టేబిల్ మీద పెట్టింది.
బయటకి రాగానే రేసుకారూ, బార్బీ షోకేసు వైపు చూసి ఆశ్చర్య పోయాయి. కొండపల్లీ, లేపాక్షి బొమ్మల స్థానంలో కొత్తగా వేరే బొమ్మలొచ్చాయి. తమ మిత్రులేమయ్యారాని ఆత్రంగా బాబీ గదివైపు పరిగెత్తాయి. అక్కడా కనిపించలేదు. అటక గది వైపూ వెళ్ళి చూసాయి. అక్కడా లేరు.  చివరకి పెరటివైపున్న చెత్త కుండీ దగ్గరకెళ్ళి చూసాయి.
అక్కడ ముక్కలైపడున్నాయి లక్క పిడతలూ, మిగతా బొమ్మలూ! కొండపల్లీ, లేపాక్షి బొమ్మలు మాత్రం కనిపించలేదు.
ఇల్లంతా గాలించాయి. చివరకి వసారా గదిలో చేరుకొని దీనంగా షోకేసు వైపు చూసాయి. కొత్త చైనా బొమ్మల కేసి చూడలేకపోయాయి.
రేసుకారుకీ, బార్బీకీ ఏం జరిగిందో అస్సలు అర్థం కాలేదు. ఏం జరిగిందో అడుగుదామనుకున్నా మిగిలిన చైనా బొమ్మలకి భాష తెలీదు. ఎప్పటికయినా షోకేసు బొమ్మలు తిరిగొస్తాయని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాయి! ఇద్దరికీ కొండపల్లి బొమ్మ మాటలు గుర్తుకొచ్చాయి – “…కాలం శక్తి ఇంతా అంతా కాదు…”.
నెల్లాళ్ళ తరువాత మాట్లాడే బార్బీ, రాకాసి కారూ, బార్బీ, రేసుకారు గుంపులో చేరాయి.
“గేమ్ బోయ్” వీడియో గేమ్ చేతిలో ఉంటే కాలమే తెలియడం లేదు, బాబీకీ, పల్లూకీ.

***