సావిత్రి- ఎప్పటికీ ఒక అద్భుతం!

 

– కొత్తింటి సునంద 

~

FullSizeRender (1)1996 సంవత్సరానికి గాను ఆంగ్ల సాహిత్యానికి అత్యున్నత పురస్కారం నోబెల్‌ బహుమతి పొందిన ఆఫ్రికన్‌ అమెరికన్‌ రచయిత్రి టోని మారిసన్ను ఇంటర్వ్యూ చేసిన పత్రిక విలేఖరి ‘‘మీరు ఆంగ్ల భాషను ఇంత అందంగా  ఎలా రాయగలరు’’ అని అడిగాడట. దానికావిడ ఆంగ్ల భాషలోకేవం 26 అక్షరాలు  మాత్రమే ఉన్నాయి. ప్రపంచమంతటా వ్యాపించిన ఆంగ్లభాషను వాడే వ్యక్తులు  కోట్ల సంఖ్యలో ఉంటారు. వీరందరు వాడి వాడి ఆ అక్షరాలు  అరిగి పోయుంటాయి. మకిలి పట్టుంటాయి. వాటిని మర పాలిష్‌ చేసి మెరుగుపెట్టి వాడాల్సి ఉంటుంది. నేనదే చేస్తానుఅందట. మనకందుబాటులో వున్న దానికి మెరుగు పెట్టడమనే సూత్రం అన్ని రంగాలకు వర్తిస్తుంది. అది కళారంగంలో మరీ ముఖ్యం. ఉదాహరణకు సప్తస్వరాను లయబద్ధంగా  పలికించడమే సంగీతానికి ఆయువుపట్టు. మనకు వేలాది మంది గాయకులు , గాయనీమణులున్నారు.అందరూ  ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి  స్థాయిని చేరుకోలేకపోయారు. సినీ నటనారంగంలో అత్యున్నత స్థాయిని చేరుకొన్న నటి సావిత్రి ఆ కోవకు చెందిందే. కొన్ని తరాలపాటు దక్షిణభారత సినీ సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాణి లాగ ఏలిన నటి సావిత్రి..  తమిళులు ఆవిణ్ణి నటిగర్‌తిలకం అని, కలైమామణి అని అభిమానంగా పిలుచుకొన్నారు.

నటనకు ఆంగికం, వాచికం, ఆహార్యం అతిముఖ్యమైన హంగు. తమకున్న శరీరాకృతిని పాత్రోచితంగా  మలచుకోడం, దానికనుగుణంగా  నడుచుకోడం, ఆయా సంఘటన ప్రకారం తమ గొంతును సరిచేసుకోడం, రకరకాల  మాడ్యులేషన్‌తో సంభాషణను పలికించడం, భావ ప్రకటనచేయడం. తగిన దుస్తులు  ధరించడం ఇవన్ని ముఖ్యం. హీరోయిన్‌ నడుమిలాగ ఉండాలి, శరీరం ఇంత పొడవుండాలి అని కొలతలతో కూడిన శరీరాకృతి కాదు సావిత్రిది. మొదట్లో వేసిన కొన్ని సినిమాలలో తప్ప ఆవిడ దాదాపు అన్ని సినిమాలో లావుగానే ఉంది. మూగమనసుసినిమాలో రెండు పుస్తకాలు  చేతపట్టుకొని కాలేజి విద్యార్థిగా  ఎంతబాగా చెలామణి అయ్యిందో కదా అని మెచ్చుకొన్నారు శేఖర్‌ కమ్ముల. అదే లావుపాటి శరీరంతో డాక్టర్  చక్రవర్తి సినిమాలో “నీవు లేక వీణ” పాటకు అభినయించే సన్నివేశంలో మెట్లమీద వాలి ఆమె ఒలక బోసినవయ్యారం, కళ్ళలో పలికించిన విరహం ప్రతి మగవాడి గుండెల్లో గుబులు  పుట్టించి ఉంటుంది. ఆడవారిలో అసూయ రేకెత్తించి ఉంటుంది. “కలసి ఉంటే కలదు సుఖం” సినిమాలో గంప నెత్తికెత్తుకొని “అద్దమంటి  మనసు ఉంది అందమైన సొగసు ఉంది ఇంతకంటే ఉండేదేందిచెప్పయ్యా ” అనే పాటకామె నడుము ఊపుతూ, వయ్యారంగా  నడిచే సన్నివేశాన్ని మనం మరవగలమా. హంసలా నడచి వచ్చే చిట్టెమ్మో అని హీరోగారామెకు కితాబివ్వనే ఇస్తాడు. గుండమ్మ కథలో “కోలు కోలోయన్న”  పాటలో కూడ మేల్ మేలో యన్న మేలో పెద్దమ్మి చిలకలాకులికేను బాలా అని మురిసి పోతాడు హీరో. కులకడానికి ఆమెకు తన లావు అడ్డం కాలేదు. ఇంతకు ముందు చెప్పుకొన్నట్లు తమకున్న వనరునే అద్భుతంగా  వాడుకోడమనేదానికి ఇదొకమంచి ఉదాహరణ. అసలాపాట ఆ సినిమాకే హైలైటు. సాదా సీదా గెటప్పు. అందులో సావిత్రిముద్దుగా, గోముగా, మూతితిప్పినట్లుగా  ఇంకెవరైనా తిప్పగలరా అనిపిస్తుంది. మూతితో పాటు కళ్లను చక్రాల్లాగ తిప్పడం ఆమెకొక్కదానికే సాధ్యమనిపిస్తుంది.

ఒక వయ్యారమనే కాదు. ఆ బొద్దు శరీరంతో చెంగు చెంగుమని ఎగరడం, చలాకీగా  గెంతులేయడం, చకచకమని నడవడం ఎన్ని సినిమాలలో చూడలేదు మనం. “మంచి మనసులు ”  సినిమాలో ఏమండోయ్‌ శ్రీవారు పాట ఆవిడ ఎంత హుషారుగా , ఎంత ఉల్లాసంగా ,ఉత్సాహంగా అభినయించింది. అప్పుడామె వయస్సు గాని, లావు గాని మనకు గుర్తుకొచ్చాయా అదీ సావిత్రి నటనా చాతుర్యం.  ఇక మాయా బజారు సినిమాలో మాయా శశిరేఖగా  ఆమె చేసిన అల్లరి  అంతా ఇంతా కాదు. ఆ నటన గురించి, ఆ వన్నె చిన్నెల  గురించి ఒక వ్యాసమేరాయొచ్చు. అహ నా పెళ్ళంట పాట కామె చేసిన నాట్యం గాని, ప్రదర్శించిన హావభావాలు  గాని నభూతో నభవిష్యతి. నటనలో విశ్వరూపమే చూపిందావిడ. ఆ వేగమూ, ఆ విరుపు, మెరుపు, ఆ హోయలు  చాలా ప్రత్యేకం. అవన్ని ఒకెత్తు అప్పటికప్పుడు (ఆ పాటంతా ఒకే టేకులో తీసారంట – అదొక రికార్డు) వయ్యారి ముద్దుగుమ్మ కాస్త ఆజానుబాహుడైన ఘటోత్కచుడిగా  బారమైన అడుగు వేయడం, చిందు వేయడం, హుందాగ మగసిరిని ఒలకబోయడం, అంతలోనె గొంతు సవరించుకోడం, తడబడడం, గబగబ సర్దుకోడం, అల్లరిగా  నవ్వడం ` ఎన్ని కళలు! పరకాయ ప్రవేశం చేయడమంటే ఇదేనేమో. ఎన్నేళ్ళయింది చూసి ఆ సీను ఇంకా కళ్ళకు కట్టినట్లే ఉంది. ఆ షూటింగు చూస్తూ నిల బడిన కళాకారులు, టెక్నీషియన్స్‌ అప్పుడు ఆమెకి  స్టాండిరగ్‌ ఒవేషన్‌ ఇచ్చారట.  అదండి సావిత్రి తడాఖా. అసలా సినిమా విజయానికి సావిత్రి,ఎస్వి రంగారావులే ముఖ్య కారకులని చాలామంది అభిప్రాయం.

ఈ సందర్భంగా  మిత్రులొకరు చెప్పిన విషయం గుర్తొస్తున్నది. నటనకు, డైలాగు డెలివరికి మారుపేరని ఖ్యాతి గాంచిన ఎస్వీఆర్‌ తనకు సావిత్రితో షూటింగుంది అన్న రోజు ఇంట్లో చిరాకు పడి చిటపటలాడే వాడట. సావిత్రి నటన పక్కన తన నటన ఎక్కడ తేలిపోతుందోననిభయపడిపోయేవాడట. బాగా రిహార్సల్స్‌ చేసిగాని షూటింగుకి వెళ్ళే వాడు కాడట. ఎన్ని సినిమాలలో వారిద్దరు తండ్రికూతుళ్ళుగా  పోటీపడి నటించారో!  ఆ కాంబినేషన్లో సినిమాలు  చూసిన మనమెంత అదృష్టవంతులం!  తెలుగు  సినీ చరిత్రలో 50, 60, దశాబ్దాన్ని  స్వర్ణయుగమని పిలుస్తారు. దానికిగాను ఈ ఇద్దరూ   చేసిన దోహదం అంతా ఇంతా కాదు.

mayabazar

నాదీ ఆడజన్మేలో సావిత్రి ధరించిన పాత్ర చాలా ఛాలెంజింగ్‌ పాత్ర. అందము, ఆకర్షణ లేని నల్లని  రూపుతో వున్న స్త్రీ. అంతేకాదు చదువు సంధ్య లేని నిరక్షరకుక్షి. ఎవరి ప్రేమకు నోచని అభాగ్యురాలు. అయినా అందరి ఆనందం కోసం తాపత్రయపడే ఉత్తమ ఇల్లాలు.  ఆపాత్రలో సావిత్రి జీవించింది. అటువంటి పాత్రనంగీకరించడానికెంతో ధైర్యము, ఆత్మస్థైర్యము కావాలి. ఒకపక్క అందానికి పేరుపడ్డ ఎన్టీఆర్‌ పక్కన అందవిహీనంగా  కనపడడం, ఇంకొక పక్క నటనలో మేరునగధీర సమానుడైన ఎస్వీఆర్‌తో పోటీపడి నటించడం ఒక్క సావిత్రికే చెల్లు. మనిషికి అందము, ఆకర్షణ చదువు సంధ్యలే కాదు మనసు, మమత ముఖ్యమని ఆ సినిమా సందేశం. కుటుంబానికి ఆధారభరితమైన ఇల్లాలికవేవీ లేకపోయినా ఫరవా లేదనే ఆ సందేశాన్ని నూటికి నూరుపాళ్ళు ప్రజ మనసులోకి సూటిగా  తీసుకొని వెళ్ళగలిగింది సావిత్రి నటన.

ఎన్టీ రామారావు పక్కన ఎన్నో సినిమాలలో నటించి విజయఢంకా మోగించిన సావిత్రి రక్తసంబంధం సినిమాలో అతడికి చెల్లెలిగా  నటించింది. చాలామంది ప్రేక్షకులు  మిమ్మలని  అన్నా చెల్లెళ్ళగా  మెచ్చరు. మీరాపాత్ర ఒప్పుకోవద్దన్నారట. కాని వారిద్దరూ కూడ పక్కాప్రొఫెషనల్స్‌. తమ నటనాశక్తి మీద అపారమైన నమ్మకమున్నవారు. ఆ పాత్రలో వారు జీవించారు. నిజమైన అన్నా చెల్లెళ్ళేమో అన్నంత సహజంగా  నటించారు.

సినిమాలో చేరాలని సావిత్రి మద్రాసు చేరినప్పుడు ఆమెకు 15 ఏళ్ళ వయసు. సంసారం సినిమాలో హీరోయిన్‌గా  తీసుకోవాలనుకొన్నారు. ఏఎన్నారందులో హీరో. అతడిని విపరీతంగా  అభిమానించి అతడిని చూడాలనే కోరికతో విజయవాడలోని ఒక థియేటర్‌కెళ్లి ఆ తోపులాటలో కిందపడిన ఆ అమ్మాయికి ఏకంగ అతడి పక్కన హీరోయిన్‌గా వేషమేయడమంటే బెదరిపోయింది. బెంబేలు  పడింది.  ఈ అమ్మాయి హీరోయిన్‌ వేషానికి తగదని ఏదో ఒక చిన్న వేషమిచ్చి పంపారట. అటువంటి సావిత్రి మా పక్కన సావిత్రి కథానాయికగా ఉంటేగానిమేము నటించము అని హీరోలూ,  ఆమె లేకపోతే మా పిక్చర్‌ ఆడదని నిర్మాతలు  ఆమె కోసం పడిగాపులు  పడే స్థితికి చేరింది సావిత్రి. అది ఓవర్‌నైటు జరగలేదు. సినీ పాఠశాలలో చేరి అంచెలుగా ఎదిగి మహోన్నత స్థానం చేరుకొన్నది. నటనలో ఎంత పరిణతి చెందిందంటే తానుఎవరి పక్కన హీరోయిన్‌గా  పనిచేయడానికి భయపడిందో ఆ నాగేశ్వరరావుకే నటనలో డైలాగు డెలివరిలో పాఠాలు  చెప్పే స్థాయికి! నటనలో ఆమెకు ఆమే సాటి. నటనలో ఆమెతో పాటీ పడే స్థాయి తనకు కూడ లేదంటారు నాగేశ్వర్రావు. ఇది సుమంగళి సినిమా తీసేటప్పుడు జరిగింది. సినిమా షూటింగ్లోనే నేరుగ తెలుపలేని పాత్ర మనోగతాన్ని, మానసిక సంఘర్షణని గోడమీద పడే నీడ ద్వారా చిత్రీకరిస్తే బాగుంటుందని దర్శకుడికి సూచించింది. సినిమా కళనంతగా జీర్ణించుకొందప్పటికి.

సుమంగళి సినిమాలో ఆవిడ ధరించిన పాత్ర వైవిధ్యభరితమైనది. చాలా క్లిష్టమైనది. ప్రేమ పెళ్ళికి దారి తీసింది. ఇక దాంపత్య జీవనానికి నాంది పలికే శోభనం జరగడానికి ముందు జరిగిన ప్రమాదంలో భర్తకు వంద్యత్వం సంప్రాప్తిస్తుంది. అతడికి ఆ విషయం తెలపకూడదనికట్టడి. ఒక వంక వయసులో ఉన్న తనలో చెలరేగే కోరిక ఉధృతిని, తాపాన్ని చల్లబరచుకోవాలి. ఇంకొక వంక తమకంతో తన దరికి చేరుతున్న తన ప్రియుడిని కంట్రోల్ చేయాలి. మరొక వంక తన మీద నిఘాపెట్టిన అత్తకు అనుమానం రాకుండ మానేజి చేయాలి. వీటన్నిటి మధ్యనలిగిపోయే ఒక అసహాయమైన స్త్రీగా  సావిత్రి నటించిన తీరు అనన్య సామాన్యము. సినిమా మొత్తం కేవలం  తన చూపుతోటే నడిపిందంటే అతిశయోక్తి కాదేమో. అమితాబ్‌ బచ్చన్‌ కోసమె పాత్రను సృష్టించడం, ఆ పాత్రలతో సినిమాలు  తీయడం మనకు తెలుసు . అప్పట్లోనేసావిత్రిని దృష్టిలో పెట్టుకొని పాత్రను సృష్టించడం, సినిమాలు  తీయడం జరిగి ఉంటుంది. సందేహం లేదు. సావిత్రి వంటి నటి మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా మరి.

మనం మొదట్లో చెప్పుకొన్నాం ఆహార్యం గురించి. ఒంపు సొంపు గురించి. సావిత్రికి ఒంపుసొంపు లేవు. కాని మనకా సంగతే గుర్తు రాదు. ఆమె చందమామ లాంటి మోమును చూస్తూ మైమరచిపోతాము. చాలా అరుదైన అందమైన మొఖం సావిత్రిది. అందమైన సరస్సులోవిచ్చిన కమలాలు  ఆమె కళ్ళు. స్వచ్ఛమైన తటాకంలో ప్రతిబింబం ప్రతిఫలించినట్లే సావిత్రి కళ్ళలో ప్రతిఫలించని భావం లేదు. కళ్ళే ఆమె ఆభరణాలు. . కళ్ళే ఆమె ఆయుధాలు. అవి చల్లని  వెన్నెల  కురిపించ గలవు. నిప్పులూ  కురిపించగవు. చిలిపి నవ్వు రువ్వగలవు.చిరాకునూ ప్రదర్శించగవు. సావిత్రి ఏనాడూ అసూయ, ద్వేషాలున్న పాత్ర ధరించలేదు. ఉంటే కష్టాలు  కన్నీళ్ళు ఉంటాయి. లేదా బలిదానాలూ , త్యాగాలుం టాయి. లేదా చిలిపితనం, హుషారు ఉంటాయి. వాటిని ప్రదర్శించడం ఆమెకు బాయే హాత్‌కి ఖేల్‌ హై.

devadasu

బరువైన పాత్రలని సావిత్రి ఎంత అద్వితీయంగ పోషించగల దంటే, అటువంటి పాత్రను పోషించడంలో ప్రఖ్యాతి గాంచిన హిందీతార మీనాకుమారి మద్రాసుకొచ్చినప్పుడల్లా సావిత్రి సినిమాలు  చూసి, ఈ పాత్రను నేను ఇంతబాగా చేయగలనా అని ప్రశ్నించుకొనేదట. బాధాతప్తస్త్రీ వేదనని సావిత్రి ప్రజెంట్‌ చేయడంలో ఒక వరవడినే ఆమె సృష్టించింది. అంతకు ముందు కడవలతో కన్నీళ్ళు కార్చడమే దుఃఖాన్ని ప్రదర్శించే విధానం.  తాను కన్నీళ్ళే కార్చకుండ మన గుండె  పిండేసే విధంగ నటించడం సావిత్రి వంతు. అటువంటి పాత్రలు  పోషించడందేవదాసుతోనే మొదలు . అప్పటికామె వయసు పదహారో పదిహేడో, సాహిత్యంతో పెద్దగ పరిచయం లేని బ్యాగ్రౌండు. నటనానుభవము అంతంత మాత్రమే. ముందా పాత్రకి భానుమతిని గాని జానకిని గాని తీసుకోవాలను కొన్నారట. అయినప్పటికి ఆ పాత్రలో ఆమె జీవించింది.దేవదాసంటే నాగేశ్వర్రావే, పార్వతంటే సావిత్రే.. వారి స్థానంలో మరొకరిని ఊహించుకోలేము అన్నంత గొప్పగ వారిద్దరు నటించారందులో. ఆ సినిమా రికార్డు బద్దలు  కొట్టింది. అజరామరంగా నిచిపోయింది. పెద్ద నటనానుభవం లేకపోయినప్పటికీ  అంత చిన్న వయసులో అంతగాఢమైన భావాలనేలా  పలికించ గలిగిందో ఆశ్చర్యం కలు గుతుంది. కొన్ని సన్నివేశాలలో కళ్ళల్లో శూన్యభావాన్ని ప్రతిఫలింప చేయగలగడం మనకు కన్పిస్తుంది. అదెంత కష్టమో కదా. అంతేకాదు తన గొంతులో, డైలాగు పలికిన తీరులో నిరాశను, బాధను, వేదాంత సరళిని పలికించినతీరు కూడ గొప్పగ ఉంటాయి. మొహము, హావభావాలు  ఒకరివి – గొంతు,  డైలాగు డెలివరి మరొకరివి ఐన నేటి యుగంలో అన్ని కళలను తనలో ఇముడ్చుకొన్న సావిత్రి వంటి నటిని మళ్ళీ  చూడగమా అనిపిస్తుంది. అప్పట్లో అందరూ  తమ డబ్బింగు తామేచెప్పుకొనేవారేననుకోండి. అందులో ప్రత్యేకంగా  చెప్పుకొనే వారిలో ఎస్వీఆర్‌, జగ్గయ్య, ఎన్టీఆర్‌, సావిత్రి ముఖ్యులు.

ఇందాక కన్నీళ్లు కార్చడం గురించి అనుకొన్నాము కదా. అందులో సావిత్రి ప్రతిభ గురించి ఒక కథనముంది. మాయాబజార్‌ సినిమాలో “నీకోసమె నే జీవించునది” పాట చిత్రీకరిస్తున్నారట. “అమ్మాయ్‌ నీవిప్పుడు కన్నీరు కార్చాలి గ్లిసరిన్‌ తీసుకో”మన్నారట దర్శకు కె.వి.రెడ్డి. దానికి సావిత్రి “కన్నీరు కార్చడానికి నాకు గ్లిసరిన్‌ అవసరం లేదు. చెప్పండి మీరే కంటిలో కార్చమంటే ఆ కంటిలోనే కారుస్తా కుడికన్నా, ఎడమ కన్నా, అంతే కాదు ఎన్ని చుక్కలు  కార్చమంటే అన్ని చుక్కలే కారుస్తా”నందట. దర్శకుడికి పంతం కలిగి ఛాలెంజ్‌ చేసాడట.అప్పటికే ఆ యూనిట్‌ వాళ్ళంతా అక్కడ చేరారట. ఎవరు నెగ్గుతారో చూద్దామని. అందరిలో ఉత్కంఠ.  ఏ కన్ను కెమెరావైపున కనిపిస్తూ వుందో ఆ కంటినుండి మాత్రమే ముచ్చటగ మూడంటే మూడు కన్నీటి చుక్కలు  రాల్చిందట సావిత్రి. అటువైపున్న కంట్లో ఒక్కటంటే ఒక్క చుక్కరాల్చలేదట. ఆ అద్భుతాన్ని చూసి అందరూ అవాక్కై ఉంటారు. కాదంటారా!

ఇటువంటి చోద్యాలు  సావిత్రి నట జీవితంలో మరెన్ని జరిగాయో మనకేం తొలుసు. నటనలో ఉద్దండపిండాలైన నటులకే చెమటలు  పట్టించిందని తెలుసుకొన్నాం కద. సావిత్రి నటనా దురంధరతను గూర్చి ఏఎన్‌ ఆర్‌ మరొక సందర్భంలో ఇలా అన్నారు. సావిత్రి నటనఆర్భాటంతో కూడినది కాదు. బహు సున్నితంగా, సూచన ప్రాయంగా  ఉంటుంది. ఆంగ్లంలో” సటిలిటి” అంటారు. అంటే అతి సూక్ష్మమైన భావాను సైతం నటనలో ప్రతిఫలింప చేయటమన్నమాట. సుచిత్రాసేన్‌ కథానాయికగా  బెంగాలి భాషలో 1959లో “దీప్‌ జ్వలే జాయె” అనేసినిమా తీసారు. 1960లో దానినే సావిత్రితో “చివరికి మిగిలేది” అనే సినిమాగా  తీసారు. 1968లో వహీదా రెహమాన్‌ హీరోయిన్‌గ హిందీలో “ఖామోషి” తీసారు. ముగ్గురూ అగ్ర శ్రేణి నటీమణులు.  తమ హావభావాను అతి సున్నితంగా  డైలాగు అవసరం లేకుండచూపుతోనే తెలుపగల దిట్టలు.  అది చాలా బరువైన పాత్ర..  వారు మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేకూర్చగలరనే నమ్మకంతో ఆయా నిర్మాతలు , దర్శకులు  వారిని ఆ పాత్ర పోషించడానికి ఎన్నుకోవడం జరిగింది. ఎవరిమట్టుకు వాఋ అత్యద్భుతంగా  నటించారు.. ఎవరికి వారేగొప్ప వారు. అయినప్పటికీ సావిత్రి చూపించిన “సటిలిటి” నీ  ప్రత్యేకంగా చెప్పుకోవసిన అవసరముంది. ఆ పాత్ర ఒక నర్సుది. ఒకానొక రోగికి పరిచర్య చేయడానికి ప్రత్యేకంగా  నియమించబడినది. ఆ రోగి మానసిక స్థితి దుర్భరంగా   ఉండటం వలన అతడితో ప్రేమగా  ఉండమని,కంటికి రెప్పలాగ కాపాడవసిన అవసరముందని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఆ నర్సు నిజంగానే ఆ రోగి ప్రేమలో పడిపోతుంది. అతడికి శుశ్రూష చేయడం కేవలం  తన విధి మాత్రమే అనుకోదు. అది తన భాగ్యమనుకొంటుంది. అందులో లీనమై తానెవరో ఏమిటో మరచిపోయేస్థితికి చేరుకొంటుంది. ఆ రహస్యాన్ని మదిలోనే దాచుకొని ఉంటుంది. ఆమె చేసిన సేవల వలన ఆరోగ్యం కుదుటపడి ఆస్పత్రి నుండి డిస్చార్జికి సిద్ధపడతాడు. దీనికంతటికి కారకురాలైన నర్సును పిలిచి అభినందిస్తాడు డాక్టరు.

నిజమేమిటో తెలియని అతడు నీవు గొప్పగ నటించావు.నీది నిజమైన ప్రేమ అని నమ్మిన రోగి బాగుపడ్డాడు. అంతే చాలని మెచ్చుకుంటాడు. ఆ మాటలు  విన్న ఆ నర్సు దుఃఖంతో తల్లడిల్లిపోతుంది. గద్గద స్వరంతో సావిత్రి ఆ వేదనను అభివ్యక్తీకరించిన విధానం అనన్యసామాన్యం. కపటనాటకం ఆడడం ఎలా, నటన నా వల్ల  కాదు’ అనిరోదించే సన్నివేశం మనని కదిలించి వేస్తుంది. ఆ సినిమా మొత్తం తన భుజస్కందాల మీద మోసింది సావిత్రి.. ఆ సినిమా కమర్షియల్గా  విజయవంతమయ్యిందో లేదో కాని అదొక క్లాసిక్‌గా మిగిలిపోయింది. పెద్ద హీరోల తోనే కాదు అంతగా ప్రాబల్యం లేని వారితోకలసి  నటించడానికావిడ వెనకాడలేదు. తనమీద తనకు, నిర్మాతకు ఆవిడ మీద ఉన్న నమ్మకమటువంటిది.

kanyasulkam

మన తెలుగు సాహితీ సౌరభాలను దశదిశలా వెదచల్లిన వారిలో ముఖ్యులు  గురజాడ. ప్రపంచ సాహిత్యంలో విశిష్టమైన వంద కావ్యాలో కన్యాశుల్కం ఒకటి .  వంద గొప్పస్త్రీ పాత్రలలో  మధురవాణి ఒకటి. అంతటి ప్రాధాన్యమున్న ఆ పాత్రను పోషించడానికి సావిత్రి కాక మరి ఎవరు తూగగలరు. మధురవాణి ఒక నెరజాణ. తన ఆటపాటలతో మగవారి మనసు రంజింప చేయడమే కాకుండ తన కబ్జాలో చిక్కిన వారిని జారిపోనీకుండా  ఒడిసి పట్టుకొనిఉండే చాకచక్యం కలిగిన  జాణ. ఇతరుల  నొప్పింపక తానొవ్వక తిరిగగలిగిన చమత్కారి మధురవాణి. వృత్తికి సానే కాని ప్రవృత్తి హుందాతనం, దయ, అంతఃకరుణ కలిగిన స్త్రీ రత్నం. తన తెలివితేటల తో లుబ్దావధాన్లతో, రామప్పంతులు వగైరాతో మాట్లాడే సమయంలో ఆడే మాటలోఎకసెక్కం, వెటకారం నిండి ఉంటాయి. పెదవులు  నవ్వుతుంటాయి. నొసలు వెక్కిరిస్తుంటుంది. సావిత్రి బుగ్గనటుఇటు ఆడిస్తుంది. బుగ్గను నొక్కుకొంటుంది. కళ్ళను వంకరగా  పెట్టి ఓరచూపు చూస్తుంది. కళ్ళను చికిలిస్తుంది. మాటతూటాల నొదులు తుంది. మాటను విరుస్తుంది.దీర్ఘాలు తీస్తుంది. ఎదుటి వారి ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది. తన మనసులోని మాట బయటపడనీకుండా  ఎదుటి వారిని మాయలో ఉంచడానికి వారిని ఆనందింప చేస్తుంది. విసవిస నడుస్తుంది. రుస రుస లాడుతుంది. చిరుకోపం నటిస్తుంది. వారిని మోహావేశంలో ఉంచడానికిఅగ్గిపుల్ల వెలిగిస్తుంది. అదే కరటకశాస్త్రి, అతడి శిష్యుడిని చూసినప్పుడు మాత్రం అవ్యాజానురాగాలు  కురిపిస్తుంది. వారిని చూసే చూపే వేరు. మిస్సమ్మ సినిమా రిలీజయ్యేసరికి సావిత్రి అంతగా పేరు ప్రఖ్యాతి గాంచలేదు. అసలాపాత్రకి ముందు భానుమతిని ఎన్నిక చేశారట.హాస్యపాత్రను చేయడంలో ఆవిడ అందెవేసిన చేయి. మిస్సమ్మ ఆద్యంతం హాస్యభరితమైన సినిమా. భానుమతి మాత్రమే ఆ పాత్రకి న్యాయం చేకూర్చగల దని వారి నమ్మకం. కొన్ని కారణాల వల్ల భానుమతి తప్పుకుంది . అదే పాత్రను సావిత్రి అద్భుతంగా పోషించడమూ . ఆసినిమా విజయ దుందుభి మోగించడమూ మనకు తెలుసు. బరువైన పాత్రలే కాదు హాస్యభరిత పాత్రను కూడ పోషించగల దని రుజువు చేసుకుంది సావిత్రి .  విజయా సంస్థ సావిత్రిని, సావిత్రి విజయా సంస్థను వదిలి పెట్టలేదు. ఎస్వీ రంగారావు, సావిత్రి కాంబినేషను అప్పటినుండేమొదలైందనుకుంటా.

ఇక మిస్సమ్మ  పాత్రను గురించి చెప్పుకుందాం. సావిత్రి చూసే చూపు, పడే చిరాకు మనం మరచిపోలేము. ఎన్టీఆర్‌ను కూడా ఒక పట్టాన నమ్మదు. గమనిస్తూ ఉంటుంది. పెళ్లికాని అమ్మాయి తీసుకోవలసిన జాగ్రత్తలు  తీసుకొంటూ  ఉంటుంది. ఆ ఇద్దరు కలసి  పండించినహాస్యం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మీకు గుర్తుండే ఉంటుంది. కాలికి తగిలిన దెబ్బ ఉత్తుత్తిదని కట్టుతీసి అటూ ఇటూ చకచక తిరుగుతున్న అతడి వెంటపడి తిరిగే సావిత్రి కళ్లలో సంభ్రమాశ్చ ర్యాలులు చూడాల్సిందే కాని వర్ణించలేం. అతడి మీద నమ్మకం, ఇష్టం కలిగిన తరువాత ఆభావాల ను అవ్యక్తంగా వ్యక్తీకరించిన తీరు భేషుగ్గా  ఉంటుంది. “ఏమిటో నీ మాయా ఓ చ్లని రాజా ” పాటను ఎంత మధురంగా , ఎంత సున్నితంగా  అభివ్యక్తీకరించిందో గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ జమున ఎన్టీఆర్ ని  ఎగరేసుకొని పోతుందో నని భయపడడం, జమునని కసురుకోడం,రుసరుసలాడడం ఎంత సహజంగా  ఉన్నాయో, అసూయతో ఏఎన్నార్ని ఎగదోసే తీరు, అతడికి పాట నేర్పే సన్నివేశం తెలుగు  సినిమా చరిత్రలో హాస్య సన్నివేశాలో మకుటాయమానం. అందులో నటించిన ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌, సావిత్రి, రేలంగి, బాలకృష్ణ, ఆ సన్నివేశాన్ని కల్పించినదర్శకుడు అజరామరంగా  నిలిచి ఉంటారు. శ్రీమంతం సీనులో కూడ ఆ తతంగాన్నంత విధిలేక భరిస్తున్నట్లు సావిత్ర మొహంలో కనబరిచే హావభావాలు  చూడముచ్చటగా ఉంటాయి. చివర్లో అందరూ తనవారే అని తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తపరుస్తు అందరినీ  అక్కున చేర్చుకొన్నతీరు అత్యంత సహజంగా ఉంటుంది. సావిత్రి తరువాత వచ్చిన నటీమణులకు ఏవేవో బిరుదులిచ్చారు ప్రేక్షకులు. నటనకే భాష్యం చెప్పగలిగిన సావిత్రినేమని పిలవగలరు మహానటి అని కాకుండా !.

సామాన్యజనం నుండి మేధావుల  వరకు ఆమె నటనకు నీరాజనాలిచ్చిన వారే. ప్రజాకవి గద్దర్‌ ఆమెను గురించి ఇలా అన్నారు. మనసున్న మారాణి సావిత్రి. హీరోలు  రాజ్యమేలు తున్న తరుణంలో వారికి ధీటుగ నిలచిన సావిత్రి హీరోకు హీరో. తారలు  రావచ్చు తారలు  పోవచ్చు కానీ కలకాలం నిలిచే ధృవతార సావిత్రి. “సాము నలుపుదాన సక్కని దాన సల్లంగ ఉండాలె  సెల్లె నీవు” అని పాట కూడ రాశారు.

ఆనాడే సినిమాకి లక్ష  రెమ్యునరేషన్‌ తీసుకొన్న సత్తా కలిగిన తార సావిత్రి.. సినిమా ప్రపంచంలో ఉన్న ముగ్గురు శిల్పుల్లో  సావిత్రి ఒకరన్నారట శ్రీశ్రీ.  1960లో ఆవిడ కథానాయికగా  నటించిన 21 సినిమాలు  రిలీజయ్యాయట. అన్నీ సూపర్‌ డూపర్‌ హిట్టులే. ఆంధ్రయువతీ మండలి వారు ఆమెను ఏనుగు అంబారీ మీద ఊరేగించారట. ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అంబారీకి ఎదురేగారట.  సావిత్రి తన తరువాత వచ్చిన నటీమణుందరికీ  నటనలో మార్గదర్శకురాలు . దాదాపు అందరూ ఆమెలా నటించాలని కోరుకొన్నవారే. ఆమెను అనుకరించినవారే.

( డిశంబర్ 26 సావిత్రి వర్ధంతి సందర్భంగా )