మరో కథన కెరటం ‘ ప్రాతినిధ్య’ !

invitation

స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విద్య కోసం జీవితకాలం కృషి చేసిన మహాత్మా  సావిత్రీ బాయ్ ఫూలే ను ఆదర్శం గా తీసుకొని బాలికావిద్య ను ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఏర్పాటైన సంస్థ ‘సామాన్యకిరణ్ ఫౌండేషన్’.  మనిషి సహజాత లక్షణమైన ఆధిపత్య ధోరణిని తిరస్కరిస్తూ , ఏ రకమైన ఆధిపత్యాన్ని, అధికారాన్ని, పీడననైనా ప్రశ్నించగలిగే సమ సమాజ నిర్మాణ కాంక్ష లో భాగంగా అస్తిత్వం పేరిట మొలకెత్తిన ప్రశ్నలకు వేదిక ” ప్రాతినిధ్య”. అందుకు తొలి అడుగు ఈ ” ప్రాతినిధ్య” కథాసంకలనం.

“శైలీ, శిల్పసౌందర్యాల కోసం కథలు రాస్తున్న కాలం కాదు ఇది. కులం పేరిటో, స్త్రీ అనే పేరిటో, మతం, ప్రాంతం అనే పేరిటో దాడులకు, దోపిడీలకు, అణచివేతలకు గురవుతూ, బిట్వీన్ లైన్స్ మలిగిపోతున్న అనేకానేక అస్తిత్వాల  గొంతులు ఇవాళ సాహిత్య రూపాన్ని పొందుతున్నాయి. బలమైన ఈ గొంతుకలకు స్పేస్ ని కల్పించటం, ప్రధాన స్రవంతి సమాజం లోకి ప్రమోట్ చేయడమూ అనే అంశాలే ‘ ప్రాతినిధ్య’ కథల ఎంపిక లో ప్రాతిపదికగా నిలుస్తాయి. ఆయా కథలు వాచ్యంగా ఫలానా అస్తిత్వాన్నే చెప్పాల్సిన పని లేకున్నా, ప్రశ్నలు, వెదుకులాట, తపన, సహృదయత పట్ల ప్రేమ లేని కథలు మాత్రం ‘ ప్రాతినిధ్య ‘ లో చోటు చేసుకోవు.” అంటున్నారు సామాన్య కిరణ్ ఫౌండేషన్ వారు.

ప్రతి ఏడాది అనేకానేక కథాసంకలనాలు విడుదల అవుతున్నాయి.ప్రతి సంకలనం ఒక దిశా నిర్దేశాన్ని సూచిస్తోంది. సదుద్దేశ్యం తో, సంకల్పం తో ప్రారంభమైన ఈ ‘ ప్రాతినిధ్య’ కథా సంకలనానికి  సంపాదకులు గా కథా రచయిత్రులు సామాన్య, కుప్పిలి పద్మ  వ్యవహరించారు. ఈవస్ సంకలనం  లోని  కథలు, వాటి ఇతివృత్తాలు, శిల్పనైపుణ్యాల గురించి ప్రముఖ కవి, విమర్శకుడు అఫ్సర్ ముందు మాట రాశారు. ఈ సంకలనం లో అఫ్సర్, గోపరాజు నారాయణ రావు, సువర్ణకుమార్, వినోదిని, పసునూరు రవీందర్, మెహర్, కుప్పిలి పద్మ, పల్ల రోహిణీ కుమార్, పి, సత్యవతి, వేంపల్లె షరీఫ్, కోట్ల వనజాత, పెద్దింటి అశోక్ కుమార్, సామాన్య ల కథలున్నాయి.

2012 వ సంవత్సరం లో ప్రచురితమైన కథల నుంచి ఎంపిక చేసి  ప్రచురిస్తున్న ” ప్రాతినిధ్య” కథాసంకలనం ఆవిష్కరణ సభ మార్చి 28 , గురువారం  హైదారాబాద్ లోని సుందరయ్య విజ్నాన కేంద్రం మినీ హాలు లో  జరుగనున్నది. సంకలనాన్ని ప్రముఖ రచయిత జి. కళ్యాణ రావు ఆవిష్కరిస్తుండగా,  పాణి, ఖాదర్ మొహియుద్దీన్, జీలుకర శ్రీనివాస్, జి.ఎస్.కె. మీనాక్షీ  ప్రసంగించనున్నారు.