కధలకో ఇల్లు

16

మనకు గ్రంధాలయ ఉద్యమాలు వచ్చాయి. అవి అనేక ఊళ్లలో గ్రంధాలయాలు తెచ్చాయి. ప్రభుత్వాలు సైతం పౌరుల గ్రంధపఠనం వారి అక్షరాస్యత, విద్యావ్యాప్తిలలో భాగంగా భావించి గ్రంధాలయాలకు నిధులు కేటాయించాయి. అవి గ్రంధ సేకరణ, భద్రతలకు ప్రయత్నించాయి. స్వచ్ఛంద సంస్థలు నడుం కట్టాయి. దాతలు విరాళాలు అందించారు. ఈ గ్రంధాలయాలు ఆరంభ లక్ష్యాలను చాలావరకు సాధించగలిగాయి. వినోదంకోసం చదివేవారికి ఇతర వినోదసాధనాలు అందుబాటులోకి రావటం, ఆసక్తిగా, ఆబగా చదవగలిగిన వయసులో పిల్లలకు పాఠ్యపుస్తకాలకు వెచ్చించాల్సిన సమయం అపరిమితంగా పెరిగిపోవటం వంటి పరిణామాలతో గ్రంధాలయాల వినియోగం తగ్గింది. ఒకప్పుడు జీవికనిచ్చిన అణా లైబ్రరీలూ, సర్క్యులేషన్ లైబ్రరీలూ అవి ఆధారపడిన పుస్తకాలు ఏ కోవకి చెందినవైనా కనుమరుగవసాగాయి. భద్రపరచటానికి అవసరమైన స్థలం, సంకల్పబలం, సాధనాలు కొరవడటంతో అనేక పత్రికలు పుస్తకాలు కాలగర్భంలో కలిసిపోసాగాయి. కనీసం అంగబలం, అర్ధబలం కల పత్రికలు సైతం తమ పత్రికలనైనా భద్రపరచటానికి గట్టిగా పూనుకోలేదు.

ఈ స్థితిలో-
శ్రీ కాళీపట్నం రామారావుగారికి ఒక ఆలోచన కలిగింది. ఒక కథ రాయటానికి ఒక వ్యక్తి కనీసం కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు వారాలు నెలలు శ్రమ పడతాడు. ఆ శ్రమ ఫలితానికి ఆయువు ఎన్నాళ్లు? అచ్చైన పత్రికని బట్టి ఒక రోజు, ఒక వారం, ఒక పక్షం, ఒక మాసం. ఆసక్తీ, శక్తీగలవారు పూనుకుని పుస్తకరూపంలో రూపంలో తెస్తే, తెచ్చుకుంటే కొన్నేళ్లు. ఇలా ఈ శ్రమంతా వృధాపోవలసిందేనా? నన్నింతవాడిని చేసిన కథాప్రక్రియలోని శ్రమనైనా కనీసం కొంతకాలమైనా భద్రపరచలేనా? అని ప్రశ్నించుకున్నారు.
అలా పుట్టింది 1996లో శ్రీకాకుళంలో కథానిలయం. గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు కథ వెలువడిన ఫిబ్రవరి 22వ తేదీన కథానిలయం ప్రారంభమయింది. రామారావు గారి సాహిత్య సంపాదనలో ప్రతి పైసా ఈ కథానిలయానికి అందించారు. అనేక మంది సాహిత్యాభిమానులు, రచయితలూ చేయివేసారు. రామారావుగారి సొంత పుస్తకాలు కథానిలయానికి తొలి పుస్తకాలు అయాయి. మొదటి సభలో పాల్గొన్న గూటాల కృష్ణమూర్తి గారు లండన్ నివాసి. చాలాకాలంగా బ్రిటిష్ లైబ్రరీతో సంబంధం ఉన్నవారు. ఆయన ఆనాటి సభలో ఉపన్యసిస్తూ – ఇలా ఒక ప్రక్రియకు లైబ్రరీ ఏర్పడటం ప్రపంచం మొత్తంమీద ఇదే ప్రప్రధమం. – అన్నారు. రామారావుగారి అవిరామ కృషితో వందలాది మంది సాహిత్య సేకరణకర్తలు కథాసంపుటాలూ, సంకలనాలూ, పత్రికల మూలాలుగాని, ఫొటో నకళ్లు గాని సమకూర్చారు.

2014 సెప్టెంబర్ నాటికి రమారమీ 900 పత్రికల వివరాలు, 3000కి పైగా కథాసంపుటాలూ, సంకలనాలూ కథానిలయం సేకరించగలిగింది. వీటితోబాటు దాదాపు 1000 మంది రచయితలు తమ వివరాలను, తమ కథల నకళ్లను( దొరికిన వాటిని) అందించారు. ఇవికాక ఈ కథల కాల నేపధ్యాన్నీ సమాజ నేపధ్యాన్నీ అధ్యయనం చేసేందుకు వీలుగా ఆత్మకథలు, జీవిత కథలు, సామాజిక చరిత్రలు, ఉద్యమ చరిత్రలు కూడా సేకరించబడుతున్నాయి. ఆయా కథలు వెలువడిన వెంబడే వచ్చిన స్పందనలు, ఆ మీదట విమర్శకుల తూనికలు వగైరా సమాచారమంతా పోగుచేయటానికి కృషి జరుగుతోంది. దీనికి తోడుగా రచయితల గొంతులను , ఛాయాచిత్రాలను, జీవిత వివరాలను కూడా సేకరించి భద్రపరచాలని ఆలోచన ఉంది. ఈ పనులు కూడా మొదలయాయి.

ఈ సమాచారానికి వినియోగం ఉండాలి. అందుకోసం-
ఇదంతా క్రోడీకరణ జరగింది. ఇక్కడ ఏముందో సాహిత్య జీవులకు అందించే ప్రయత్నంలో కథానిలయం వెబ్సైట్ ఏర్పడింది.

పోతే-
ఈ కృషిని ఇంతవరకూ ఉపయోగించుకున్నవారెవరు?
విశ్వవిద్యాలయాలలోని పరిశోధక విద్యార్ధులు, సాహిత్యాభిమానులు, రచయితలు, విమర్శకులు, ఎందరో కథానిలయం సేవలను వినియోగించుకోడం మొదలెట్టారు. ఈ వెబ్సైట్ వారందరికీ మరింత సేవలు అందిస్తుంది.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కథానిలయం సేకరణ, సహకారాలతో “ కథాకోశం” తీసుకు వచ్చింది. అనేకమంది రచయితలు తమ సంపుటాలను ప్రచురించారు.

కాళీపట్నం రామారావు గారు తమ సాహిత్య ఆర్జన అంతటినీ వినియోగించి 1997లో కథానిలయం పేరిట ఈ యజ్ఞం ఆరంభించిన తరవాత తనకి లభించిన పురస్కారాల సొమ్ము కథానిలయానికే ఖర్చుపెట్టారు. ఎందరెందరో చేతులు వేసి కథానిలయాన్ని ఇప్పుడున్న స్థితికి చేర్చారు. 15 వేల మంది రచయితల పేర్లతో వెలువడిన, 900 పత్రికలలో ప్రచురించబడిన, 2600 కథా సంపుటాలలో, 400 కథా సంకలనాలలో చేర్చబడిన   86వేల కథల వివరాలు కథానిలయం వెబ్ సైట్ లో లభిస్తున్నాయి. కథానిలయం గ్రంధాలయం కథానిలయం ట్రస్టు నిర్వహణలో నడుస్తోంది.

కథానిలయం వెబ్ సైట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు మనసు ఫౌండేషన్, బెంగళూరు స్వీకరించింది.

ఈ రెంటితోనూ సంబంధం లేకుండా తన స్వంత ధనంతో కాళీపట్నం రామారావు గారు ఆరంభిస్తున్న మూడవ పూనిక ఈ కారాయజ్ఞం అనే పుస్తక ప్రచురణ సంస్థ. దీని బాధ్యత కాళీపట్నం సుబ్బారావు, కాళీపట్నం వెంకట సత్యప్రసాద్, వివిన మూర్తిలకు అప్పగించారు. దీని లక్ష్యం కాళీపట్నం రామారావు గారికి నచ్చిన పుస్తకాలను ప్రచురించటం, వాటిని పాఠకులకు లాభాపేక్ష లేకుండా చవక ధరలకు అందించటం. ఈ ముగ్గురూ కారా సాహితీ అభిరుచుల మేరకు ఈ ప్రచురణలను కొనసాగించుతారు. తొలి ప్రయత్నంగా కారా మాస్టారికి 90 ఏళ్లు నిండుతున్న సందర్భంగా మూడు పుస్తకాల ప్రచురణ జరుగుతోంది.

మహమ్మద్ ఖాసింఖాన్ గారు 1944లో ప్రచురించిన కథానిక రచన మొదటిది.

రెండవది కోర్టుమార్షల్ అనే హిందీ నాటకానికి దాసరి అమరేంద్ర గారి తెలుగు అనువాదం.

1950 లవరకూ కథల మీదా, కథకుల మీదా, కథా వ్యాకరణం మీదా పత్రికలలో వచ్చిన వ్యాసాలు అన్నింటినీ సేకరించిన వ్యాస సంకలనం మూడవది. ఇది కథానిలయం 2015 వార్షికోత్సవం సమయానికి వెలువడుతుంది.

ఇటువంటి ప్రయత్నం కొనసాగాలంటే జనం సహకారం, ఆదరణ ముఖ్యం. ఉత్తమ సాహిత్యం ఉత్తమ సమాజానికి దోవ చూపిస్తుందన్న నమ్మకంతో లాభాపేక్ష లేకుండా కారా మాస్టారు ఆరంభిస్తున్న మూడవ పూనిక ఈ కారాయజ్ఞం ప్రచురణలని బ్రతికించుకునే బాధ్యత జనందేనని విశ్వసిస్తున్నాం.

vivinamurthy

vivinamurthy

-వివిన మూర్తి