పావురం

 

ఇంగ్లీష్ మూలం: రస్కిన్ బాండ్ 

అనువాదం: శ్రీపతి పండితారాధ్యుల దత్తమాల 

~

         రస్కిన్ బాండ్  బ్ర్రిటీష్  సంతతికి  చెందిన భారతీయ రచయిత. 19 మే 1934 లో పంజాబ్ లోని  కౌశాలి లో  జన్మించాడు . ఇతను  ఏడు సంవత్సరాల  వయసున్నపుడు తల్లి  , తండ్ర్రి  నుంచి  విడిపోయి పంజాబ్ కు  చెందిన హరి  అనే అతన్నిపెళ్లి చేసుకుంది. చెప్పాలంటే  రస్కిన్  బాల్యంలోని   ఒంటరితనాన్ని  పోగొట్టుకోవడానికి కథలు  వ్రాయడం మొదలుపెట్టాడా   అనిపిస్తుంది. భారత  దేశం  మీద  ఉన్న మక్కువతో ముస్సోరీలో  ఉంటున్నాడు . అతని రచనల్లో బాల్యము, ఇంకా ఇతర దశలు , ముస్సోరిలో  గడిపిన  జీవితము  ప్రతిఫలిస్తాయి.”Our Trees still grow in Dehra” అనే  రచనకు 1992 లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. పద్మ శ్రీ ,పద్మ భూషణ్ అవార్డు లు కూడా ఇతన్ని వరించాయి . రస్కిన్  రాసిన కొన్ని  రచనలు చిన్న/పెద్ద తెర  మీద సీరియల్స్ ,సినిమాలుగా  వచ్చాయి .

“The Blue Umbrella”  అనే పిల్లల నవల  ని విశాల్ భరద్వాజ్ చిత్రంగా  తీసి , National Award for Best Children’s film ,దక్కించుకున్నారు . Alice in Wonderland లాంటి క్లాసిక్స్ అంటే తగని ప్ర్రీతి. పిల్లల కోసం 50 కంటే ఎక్కువ  రచనలే చేసాడు.దాంట్లో ప్రముఖంగా పెర్కొనాల్సింది చారిత్ర్రక నవల అయిన   “A Flight of Pigeons”. దీన్నితెలుగు వారైన, శ్యాం బెనెగల్   సినిమాకు  దర్శకత్వం వహిస్తే ,శశి కపూర్ నిర్మాత. ఇలా చెప్పుకుంటూ  పోతే  బావి  లోంచి నీరు తోడినట్టు వస్తూనే  ఉంటాయి. ఈ కథ ఆంగ్ల శీర్షిక “A Job Well Done”

~

ruskin

తోటమాలి దుకీపాడుబడిన బావి చుట్టూ దట్టంగా పెరిగిన కలుపును ఏరి పారేస్తున్నాడు. శరీరం బక్క చిక్కి , నడుం వంగి, పొడవైన, బలహీనమైన కాళ్ళతో  ఉన్న  వృద్దుడు దుకీ. ముందు  నుంచి  ఇలాగే ఉండేవాడు. కాని బలమంతా అతని చేతి మణికట్టు, పొడవైన తీగ లాగున్న వేళ్ళల్లో నిక్షిప్తమై ఉంది. పెటునియా మొక్కలా బలహీనంగా ఉన్నా,  సారాయి లోని పట్టు  ఉంది తనలో.

” బావిని మూసేస్తున్నావా ” దుకీని అడిగాను. అపుడు ఎనిమిదేళ్ళు నాకు. దుకీ  అంటే  ఇష్టం నాకు. నేను పుట్టక మునుపే  తోటమాలిగా చేరాడు. మా నాన్న చనిపోయేవరకు అతని కోసం పని చేసాడు. ఇప్పుడు మా అమ్మ కోసం,నా సవతి తండ్రి కోసం చేస్తున్నాడు.

“మూసేయ్యాలి…ఆనుకుంటా ” దుకీ సమాధానం. “బావిని మూసేయ్యడమే కదా మేజర్ సాహిబ్ కి కావాల్సింది. ఎప్పుడైనా తిరిగి రావచ్చు. వచ్చిన తర్వాత బావి మూసేయ్యలేదు  అని కనిపెట్టాడో, కల్లు తాగిన కోతే  అవుతాడు. నేను ఇంకో పని వెతుక్కోవాలి అప్పుడు ”

మేజర్ సాహిబ్  నా  సవతి తండ్రి.  పేరు మేజర్ సమ్మర్ స్కిల్ . పొడుగ్గా, ధృడంగా, డాంభికంతో ఉంటాడు. తనకి పోలో అన్నా, గుర్రం పై కూర్చొని చేతిలో ఈటె తో అడవి పందుల్ని వేటాడ్డం అన్నా తెగ పిచ్చి. పూర్తిగా మా నాన్న కు భిన్నం. మా నాన్న నాకెప్పుడు పుస్తకాలు ఇచ్చేవాడు చదవమని.

కాని ఎక్కువ చదివితే  నేనొక స్వాప్నికుడిని అవుతానని, నా పుస్తకాలు లాగేసుకున్నాడు మేజర్. ఇతనంటే నాకు  గిట్టదు, ఇతన్ని చేసుకున్న మా అమ్మ గురించి కూడా నేను పెద్దగా తలవను. మా అమ్మతో అనడం నేను చాల మెత్తన అని, నాకు గుర్రపు స్వారి నేర్పించే ఏర్పాటు చెయ్యాలని.

కాని నాకు ఆ ఏర్పాటు చేయ్యకమునుపే తనకి తన పై అధికారి నుంచి పిలుపు వచ్చింది. సరిహద్దు దగ్గర ఉన్న గిరిజనుల నుంచి ప్రమాదం ఏదో ఉందని పెషావర్ కు వెళ్ళమని. సుమారు రెండు నెలలు ఇంట్లో లేడు. పెషావర్ కు  వెళ్లేముందు దుకీని గట్టిగా హెచ్చరించాడు తను వచ్చేలోపు బావి మూసేసి ఉండాలని.

“తోట మధ్యలో ఇలా నుయ్యి  తెరిచి ఉండడం ఎప్పటికైనా  ప్రమాదమే. నేనోచ్చేలోపు బావిని పుడ్చెయ్యి ” దుకీ తో చెప్పడం విన్నాను.

కాని దుకీకి ఇష్టం లేదు బావిని పుడ్చేయ్యడం- ఈ ఇల్లు కట్టక ముందు నుంచి, అంటే యాభై సంవత్సరాల కంటే ముందు నుంచి ఉంది. ఎప్పటినుంచో ఆ  బావి గోడల మీద పావురాళ్ళు నివాసం ఉంటున్నాయి. వాటి  మృదు మధురమైన కలరవం  తోటంతా వ్యాపించేది. వేసవిలో ఎండలు మండిపోయేవి. కుళాయిలో నీళ్ళు వచ్చేవి కాదు. అప్పుడు ఈ బావే నీటికి ఆధారం.

అప్పుడు “భిస్తి” జన సమూహం మేకతోలు తో తయారు చేసిన సంచీలో చల్లటి నీరు నింపుకొని అందరికి సరఫరా చేసేవాళ్ళు. అదే  కదా వారి పని. ఇంటి చుట్టూ దుమ్ము లేవకుండ బావి నీటితో  చిలకరించేవారు.

పాపం దుకీ మా అమ్మను ఎంత బ్రతిమాలాడో బావిని పూడ్చనని, అలాగే వుండనివ్వని-

“పాపం పావురాళ్ళు ఎటు పోతాయి? ” అన్న దుకీ మాటలకు మా అమ్మ “అవి  ఇంకో నుయ్యిని చూసుకుంటాయిలే. ఎట్టి పరిస్థితిలో నువ్వు బావి  తెరచి ఉంచద్దు” అంది.  మా అమ్మను చూస్తేనే తెలుస్తుంది, మేజర్ అంటే  తనకి భయమని.

” ప్రేమించేవాళ్ళకు  భయపడ్డం ఏమిటి? ఆ ప్రశ్న నన్ను అప్పుడు తికమక  పెట్టింది. ఇప్పటికి పెడుతుంది. మేజర్ ఇంట్లో లేకపోవడంతో జీవితం మళ్ళీ ఆహ్లాదకరంగా మారింది. పుస్తకాలు మళ్ళీ నా చేతుల్లోకి వచ్చాయి. గంటలు గంటలు నాకిష్టమైన మర్రిచెట్టు నీడలో గడిపాను. బక్కెట్ల కొద్దీ మామిడి పళ్ళు తిన్నాను. దుకీతో కబుర్లు చెప్తూ  తోటలో కాలక్షేపం  చేసేవాడిని.

నేను, దుకీ మేజర్ కోసం  ఎదురు చూడ్డం లేదు.

మా అమ్మ రెండో పెళ్లి తర్వాత దుకీ ఇక్కడ నివాసం  మా అమ్మ మీద ఉన్న గౌరవంతో, నా మీదున్న ప్రేమతో.

నిజం చెప్పాలంటే అతను మా నాన్న మనిషి. కాని మా అమ్మ నటన ఎలా ఉండేదంటే  తను నిస్సహాయురాలినని ఎలాంటి సహాయం చేయలేని దానినని. మేజర్  సమ్మర్  స్కిల్ మనుషులు తనకు రక్షణగా ఉంటున్నారని అనుకుంటుంది. తన కోసం పని చేసేవారంటే  తనకు చాలా ఇష్టం.

” మీ నాన్న కు  ఈ బావి అంటే  చాలా  ఇష్టం.  సాయంత్రాలు ఇక్కడే కూర్చొని, పుస్తకంలో  పిట్టల్ని, పువ్వుల్ని, కీటకాలను  బొమ్మలుగా   వేసేవారు.” దుకీ అన్నాడు.

మా నాన్న గీసిన బొమ్మలు నాకింకా గుర్తున్నాయి. అలాగే ఈ మేజర్ సాహిబ్ ఈ ఇంట్లోకి వచ్చాక ఆ పేపర్లను గిరవాటు వెయ్యడం కూడా గుర్తుంది. దుకీకి కూడా అన్నీ తెలుసు. నేను ఏది దాచను.

“విచారంగా ఉంది ముయ్యాలంటే. ఎవరు  పడతారు దీంట్లో తెలివిలేనోళ్ళు, తాగుబోతులు తప్పితే.”

ఇష్టం లేకున్నా మూసేయ్యడానికి సిద్దమయ్యాడు . మద్ది చెట్ల దుంగలు ,ఇటుకలు ,సిమెంట్ అన్నిటిని పోగు చేసి పెట్టాడు నూతి  చుట్టూ.

“రేపు” అన్నాడు దుకీ “రేపు బావి మూసేస్తాను , ఈ  రోజు కాదు,  ఇంకో రోజు ఉండనీ పావురాలు .”

“బాబా , రేపు ప్రొద్దున  బావిలోంచి పక్షులను  తోలేప్పుడు నువ్వు నాకు సాయపడాలి ”

నా సవతి తండ్రి వచ్చే రోజు మా అమ్మ ఒక టాంగాను బాడుగకు మాట్లాడుకొని యేవో  కొనడానికి బజారుకు వెళ్ళింది. కొద్దిమందికే  ఉండేవి  కార్లు  ఆ రోజుల్లో. ‘కల్నల్ ” లు  కూడా  టాంగాలోనే వెళ్ళేవాళ్ళు. మరిప్పుడేమో  క్లర్క్ లు కూడా వాళ్ళ గౌరవానికి తక్కువని టాంగా లో  కూర్చోడానికి  వెనకాడుతున్నారు. మేజర్  ఎలాగూ సాయంత్రానికి ముందు రాడు కాబట్టి, ఈ  ఆఖరి ఉదయాన్ని సావకాశంగా వాడుకుంటాను.

నాకిష్టమైన  పుస్తకాలన్నీ అవుట్ హౌస్ లో దాచి ఉంచాను, ఎప్పటికప్పుడు తీసుకోవచ్చని.

జేబులు   మామిడిపండ్లతో నింపుకొని, మర్రి చెట్టెక్కాను. జూన్ నెల లో  ఉన్న పగటి ఎండ తాపాన్నుంచి  తప్పించుకోడానికి ఇంత కంటే ప్రశాంతమైన, చల్లనైన  స్థలం ఇంకోటి లేదు. నేను బయటకు కనపడకుండా తెరలా అడ్డున్న ఆకుల మాటు  నుంచి చూస్తుంటే, దుకీ బావి  దగ్గర తిరుగుతున్నాడు. బావిని మూసే పని అతనికి అస్సలు ఇష్టం లేదులా ఉంది.

“బాబా ” అంటూ చాలా సార్లు పిలిచాడు. కాని నాకు మర్రి  చెట్టు నుంచి కదిలే ఉద్దేశ్యం అస్సలు లేదు. దుకీ, పెద్ద చెక్క పలకతో   బావి ఒక చివర అంతా మూసేసాడు.  సుత్తి తో మేకులు బిగించే పని మొదలు పెట్టాడు. మర్రిచెట్టు పై నుంచి చూస్తుంటే, దుకీ  వంగిపోయి  మరీ ముదుసలిలా  అనిపిస్తున్నాడు.

గణ గణ గంటతో, చక్రాలు సమరు లేక  కీచుకీచుమనగా ఒక  టాంగా గేటు లోపలకు వచ్చింది.

బజారుకు వెళ్ళిన  అమ్మ అయితే ఇంత త్వరగా రాదు. జిగురుగా, మందంగా ఉన్న ఆకుల సందు నుంచి తొంగి చూస్తును కదా,  ఆశ్చర్యం! ,కొమ్మ మీంచి కింద పడ్డంత పనైంది.వచ్చింది మేజర్,  నా సవతి తండ్రి!.

రావాల్సిన టైం  కంటే ముందే వచ్చాడు. నేను చెట్టు దిగి కిందకు రాలేదు .మా అమ్మ వచ్చేవరకు ఆయనకు ఎదురుపడే ఉద్దేశ్యం నాకు లేదు. మేజర్ కిందకు  దిగి, టాంగావాడు  సామాను వరండా లోకి చేర వేస్తుంటే చూస్తున్నాడు .

మనిషిని  చూస్తుంటే చిరాగ్గా కనిపిస్తున్నాడు. అతని రొయ్య  మీసాలు Brilliantine రాయడం తో దళసరిగా ఉన్నాయి. దుకీ  అయిష్టంగానే దగ్గరికి వెళ్ళి సలాం  కొట్టాడు.

“ఓహ్! ఇక్కడున్నావా ముసలి నక్కా !” అదేదో జోక్ అయినట్టు, స్నేహితుడ్ని  అన్నట్టు  అన్నాడు.

“ఏంటో  ఇది  గార్డెన్  తక్కువ, అడవి ఎక్కువలా ఉంది .నీకు వయసయిపోయింది. పని నుంచి తప్పుకోవాలి. సరే  కాని మేమ్ సాబ్  ఎక్కడ?”

“బజారుకి వెళ్ళింది ” దుకీ  సమాధానం

“మరి పిల్లోడు?”

దుకీ  భుజాలెగరేస్తూ , “పిల్లోడా! కనిపించలేదు”

“డామిట్! ఇంటికొస్తే ఇలాగా  స్వాగతం చెప్పడం  నాకు- సరే వెళ్లి వంట చేసే పిల్లోడ్ని లేపి సోడాలు తెప్పించు”

“వాడు వెళ్లి పోయాడు సాహిబ్ ”

“డబల్ డామిట్ “అన్నాడు  మేజర్

టాంగా వెళ్ళిపోయింది .  మేజర్ గార్డెన్ ని ఆసాంతం పరిశీలించడం మొదలుపెట్టాడు. పూర్తికాని బావి పని మేజర్ కంట్లో పడనే పడింది. మేజర్  మొహం  నల్లబడింది. పెద్ద  పెద్ద  అంగలతో   బావి దగ్గరికి చేరుకున్నాడు.ఇంక మొదలుపెట్టాడు ముసలి  తోటమాలి మీద  తిట్ల  దండకం.

దుకీ  సాకులు చెప్పసాగేడు . ఇటుకలు సరిపోలేదని, మేనకోడలికి  ఆరోగ్యం బాలేదని, సిమెంట్  నాణ్యత  బాగాలేదని,  వాతావరణం అనుకూలంగా  లేదని, అనుకోని పనులు ఎదురయ్యాయని. పై సాకులేవి  పనిచెయ్యలేదు మేజర్  మీద. ఇక  చేసేదేమిలేక దుకీ  సణుగుతూ  “నీటి  అడుగు భాగం  నుంచి  ఏదో   బుడగల శబ్దం వినిపిస్తుంది” అంటూ బావి  లోపలికి  వేలు  సారించాడు. మేజర్  బావిని ఆనుకొని  కట్టిన  చిన్నగోడ  మీద  కాలు పెట్టి  బావి  లోపలికి  తొంగిచుస్తున్నాడు.

దుకీ  కిందకి చూపిస్తూనే ఉన్నాడు. మరి  కాస్త  వంగాడు మేజర్. అంతే దుకీ చేతులు వేగంగా  కదిలాయి, ఎలా అంటే ఇంద్ర్రజాలికుడు కదిల్చినట్టు.

నిజానికి దుకీ  తొయ్యలేదు మేజర్ని. ఊరికే అలా చేతితో తట్టాడు అంతే. నా కంటికి మేజర్ బూట్లు మట్టుకే కనిపించాయి  బావిలో పడుతూ.

Alice In wonderland ని  తలచుకోకుండా ఉండలేకపోయాను. అదే Alice కుందేలు కలుగులోకి  మాయమవడం. ఒక్కసారిగా  విపరీతమైన శబ్దం నీళ్ళు చెల్లాచెదురు అవడంతో. దానితో పావురాలన్నీ పైకి లేచాయి . బావి చుట్టూ మూడుసార్లు తిరిగి ఇంటి పైకప్పు మీద స్థిరపడ్డాయి.

భోజనం టైం కల్లా దుకీ  బావిని చెక్క పలకలతో కప్పేసాడు.

“మేజర్ చూసాడంటే చాలా సంతోషపడతాడు ” అంది మా  అమ్మ బజారు  నుంచి వస్తూనే.

“సాయంత్రం కల్లా మొత్తం పని అయిపోతుంది కదా దుకీ “?

మా అమ్మ అన్నట్టే  సాయంత్రం కల్లా ఇటుకలతో బావి మొత్తం కప్పేసాడు.

దుకీ ఇప్పటివరకు  అతి శీఘ్రముగా చేసిన  పని ఏది అంటే ఇదే .

కొద్ది వారాల్లో మా అమ్మ మేజర్ కోసం పడ్డ ఆదుర్దా …ఆందోళనగా,ఆందోళన కాస్తా విచారమై, విచారం కాస్త విడుపు లోకి వచ్చేసింది. నాకు కలిగిన సంతోష, ఉత్సాహాలతో  అమ్మను ఉల్లాసంగా ఉండేలా చూసాను.

అమ్మ రెజిమెంట్ కల్నల్ కి  ఉత్తరం రాసింది . కాని మేజర్ సెలవు మీద   పదిహేనురోజుల ముందే ఇంటికి బయలుదేరినట్టు తిరుగు టపాలో వార్త వచ్చింది.

ఈ విశాలమైన భారతదేశంలో పాపం మేజర్  ఎక్కడో అదృశ్యమయ్యాడు.

తప్పిపోయి తిరిగి ఎప్పటికి దొరక్కపోవడం సర్వ సాదారణమే  కదా!

నెలలు గడిచి పోయాయి మేజర్  లేకుండానే .

రెండు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి  మేజర్ అదృశ్యం వెనక..

ఒకటి రైలులో వస్తుంటే ఎవరైనా హత్య చేసి నదిలోకి విసిరేసి ఉండొచ్చు లేదా గిరిజనుల  పిల్లతో దేశం మారుమూల ప్రదేశానికి  పోయి బ్రతుకుతున్నాడో …

జీవితం కొన సాగింది మిగిలిన వాళ్లకు. వర్షాలు నిలిచి, జామకాయలు వచ్చే కాలం మొదలయ్యింది.

32 రెజిమెంట్ ఫూట్ నుంచి ఒక ఒక కల్నల్ రాకలు మొదలయ్యాయి మా ఇంటికి.

కొంచం వయసైపోయి, అందరితో కలివిడిగా ఉంటూ , ఇంకా  చెప్పాలంటే  పరధ్యానంగా, ఎవరి పనులకు అడ్డురాకుండా ఉన్నాడు. పలకలు పలకలు చాక్లేట్లు  ఇంట్లోవదిలేసేవాడు.

“మంచి సాహిబ్ “కితాబిచ్చాడు దుకీ.

కల్నల్ ఒక్కొక్క వరండా మెట్లు ఎక్కుతున్నపుడు  నేను , దుకీ బోగన్ విల్లా వెనక నిలబడి ఉండగా అన్నాడు

“చూడు…  ఎంత చక్కగా సోలా టోపి పెట్టుకున్నాడు ” అన్నాడు  దుకీ

“లోపలంతా బట్టతల” అన్నాన్నేను

“పర్లేదు , ఇతను సరైన వాడేమో అనుకుంటున్నాను ”

“ఒకవేళ కాకపోతే”? నా  సందేహం

” ఏముంది మళ్ళీ బావి తెరుద్దాం”

దుకీ గొట్టం పైప్ నాజిల్ తీసేయడం తో  నీళ్ళు ఒక్కసారిగా మా  కాళ్ళను తడిపాయి. వెంటనే సరిచేసి  దుకీ నా చెయ్యి పట్టుకొని పాత బావి దగ్గరికి తీసుకెళ్ళాడు.

బావి మీద సిమెంట్ తో  మూడంచెల  తిన్నె తయారు చేసాడు. అది చూడ్డానికి అచ్చు వెడ్డింగ్ కేక్ లా ఉంది .

“బాబా ,మనం ఈ పాత బావిని మర్చిపోవద్దు .దీన్ని పూలకుండిలతో అందంగా అలంకరిద్దాము”

ఇద్దరము కలిసి కుండీలు, వాటిలోకి సువాసన భరితమైన గెరానియం, అడవి మొక్కలతో బావి పై భాగం  అలంకరించాము..

పని చక్కగా చేసినందుకు అందరు అభినందించారు దుకీని .

పావురాలు  లేవనే బాధ తప్పిస్తే ఇంకే  విచారం లేదు నాకు.

sp dattamala

దత్తమాల

*

 

కొంత కాలం …కొంత కాలం …కాలమాగిపోవాలి

 

-శ్రీపతి పండితారాధ్యుల దత్తమాల

~

 

sp dattamalaకొంత కాలం …కొంత కాలం …కాలమాగిపోవాలి

నిన్న కాలం …మొన్న కాలం… రేపు కూడ రావాలి

ఒక ప్రేమికురాలు మనసు  పొంగి  పాడుకునే పాట.

ఇలాంటిదే, కాలానికి ఉన్న విలువను తెలుపుతూ, కాకపోతే  విషాద గీతం ఉంది.

జాలాది రాజారావు గారు  వ్రాసారు.

1976 లో విజయనిర్మల దర్శకత్వం వహించిన   “దేవుడే గెలిచాడు” సినిమాకు   రాసిన  పాట.

పల్లెసీమ కోసం వ్రాసిన “చూరట్టుకు జారతాది సిటుక్కు సిటుక్కు వాన చుక్క ” మొదటి పాటైతే ,ఇది  జాలాదిగారి రెండో పాట.

లిరిక్స్ వింటుంటే మాట పడిపోతుంది.

పాట సందర్భం అలాంటిది మరి …

నేను ఇద్దరు ప్రేమికులు  మాట్లాడుకోవడం చెవులారా విన్నాను …ఇలా

అతను : ఉన్నావా ? పోయావా ?

ఆమె : అదేంటి అలా అంటావ్? జస్ట్ ఒక వారమే కదా మాట్లాడలేదు.

అతను : అంతే కాంటాక్ట్ లో  లేకపోతే ఉన్నా… పోయినట్టే నాకు

 

అలాంటిది …చనిపోతున్నానని, తన వాడితో కలిసి బ్రతకనని  తెలిసిన ప్రియురాలి మానసిక క్షోభ ఎలా ఉంటుందో

ఈ పాటలో మనసు  పిండి పిండి  రాసారు.

సుశీలగారైతే చెప్పకర్లేదు .ఆవిడే  ఆ బాధంతా అనుభవించారా అన్నట్టు పాడారు.

ఇలా సాగుతుంది పాట ….

ఈ  కాలం పదికాలాలు బ్రతకాలని…ఆ బ్రతుకులో  నీవు, నేను  మిగలాలని…

చెరి సగాల భావనతో, యుగ యుగాల దీవెనతో రేపు,మాపులాగా కలిసిఉందాము …కరిగిపోదాము …కరిగిపోదాము

నాలో…నీలో…నాలో నీలో ….నువ్వు  నేనుగా  మిగిలి పాడతాను…

పాడి ఆడతాను …

నిన్నటి లో నిజం  లాగనే,  రేపు తీపిగా ఉంటె, ఆ తీపి గుండె రాపిడిలో ఊపిరిగా మిగిలుంటే,

చావని కోరిక లాగే…. పుడుతుంటాము

తిరిగి పుట్టి చావకుండ… బ్రతికుంటాము

నా జన్మకు ప్రాణం  నీవై

నీ ప్రాణికి ఆత్మను నేనై

కాలానికి ఋతువు నీవై, తిరుగాడే వలయం నేనై

ఎన్ని తరాలైనా … మరెన్ని యుగాలైనా…

వీడని బంధాలై… కావ్యపు గంధాలై….

నాలో…నీలో…నాలో నీలో ….నువ్వు  నేనుగా  మిగిలి పాడతాను

ఈ  కాలం పదికాలాలు బ్రతకాలని,ఆ బ్రతుకులో  నీవు, నేను  మిగలాలని..

 

పాట లింక్

http://www.allbestsongs.com/telugu_songs/telugu-Movie-Songs.php?st=3092

 

 

 

కొంచెం చేదు..కొంచెం కారం…ఇంకొంచెం తీపి!

namkeen

 

-శ్రీపతి పండితారాధ్యుల దత్తమాల 

~

sp dattamalaయండమూరి వీరేంధ్రనాథ్  “నిశ్శబ్దం నీకు నాకు మధ్య” అనే  నవల్లో  “One Flew Over the Cuckoo’s Nest” అనే ఇంగ్లీష్ సినిమాను ఉద్దేశించి “అది మంచి సినిమా కాబట్టి జనం అట్టే లేరు “అంటారు. గుల్జార్ దర్శకత్వం వహించిన సినిమాలకూ  ఈ మాట  వర్తిస్తుంది. ఎన్నో అవార్డ్స్ వరించినా కమర్షియల్  సక్సెస్ రాలేదు.అలాంటిదే “నమ్కీన్ ” …గుల్జార్  దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా. బెంగాలీ రచయిత సమరేష్ బాబు వ్రాసిన  “అకాల్ బసంత్ “కథ  ఆధారంగా తీసిన సినిమా.

సమరేష్ బాబు కథలు కొన్ని సినిమాలుగా వచ్చాయి. నేను కొన్ని చూసాను. గౌతం ఘోష్ తీసిన పార్, గుల్జార్ తీసిన కితాబ్ ,నమ్కీన్. తపన్ సిన్హా, మృణాల్ సేన్, బసు చటర్జీ   మొదలైన  వారందరు సమరేష్ బాబు కథలను సినిమాలుగా తీసారు.ఇక ” నమ్కీన్” సినిమా విషయానికి వస్తే దీనికి దర్శకత్వం , స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,పాటలు  అన్ని గుల్జారే. నటీ నటులు   అందరు ఉద్దండులె.సంజీవ్  కుమార్,వహీదా రెహమాన్, షర్మిల టాగోర్ ,షబానా అజ్మి,కిరణ్ వైరాలె. ఎవరికెవరు తీసిపోరు అన్నట్టు   నటించారు.

కొండప్రాంతంలో నివసించే  తల్లి,ముగ్గురు కూతుర్లు వారి ఇంట్లో కొద్ది నెలలు అద్దెకు ఉండే  బాటసారి కథ ఇది. ఇల్లు గడవడానికి తమ వంతుగా కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవారు.గుల్జార్ ఒక రైటర్ కాబట్టి ఆ కోణం నుంచి చూసానో లేక సన్నివేశాల చిత్రీకరణ వల్లనో   … పుస్తకం చదివినట్టు అనిపించింది.కాలక్షేపానికి సినిమా  చూసినపుడు రాని డౌట్స్ రాసేప్పుడు వచ్చాయి. ఉదాహరణకి .. చిత్రంలో షర్మిల టాగోర్ (పెద్ద కూతురు ,పేరు నిమ్కి ) రోజు రాత్రి బావి గట్టు దగ్గర స్నానం చేస్తుంది. ఇలా రెండు మూడు సందర్భాల్లో వస్తుంది ఆ ప్రస్తావన. రాత్రి పూటే ఎందుకు చేస్తుంది అనుకున్నాను. రోజంతా పని వత్తిడో   లేక  పగలు స్నానం చేసే వసతి(చాటు ) ఇంట్లో లేదేమో, రాత్రి అయితే చీకట్లో ఎవరికీ కనిపించదు అందుకే చేస్తుందేమో అనుకున్నాను. అలా అయితే ఇంట్లోని  అందరూ  రాత్రే చెయ్యాలి. అలా కాకుండా తను మట్టుకే ఎందుకు చేస్తుంది అని.పుస్తకములో అయితే వివరణ ఉంటుంది. కాని సినిమా కాబట్టి మనమే రాబట్టుకోవాలి,  కుతూహలం ఉంటె, లేదా వదిలెయ్యొచ్చు.  మళ్ళీ చూసాను ఒక్క సీన్ ,డైలాగ్ మిస్ అవ్వకుండ…ఒకసారి  తల్లి గొణుగుతుంది పెద్ద కూతురి గురించి “ఏదో ఒకరోజు  బావిలో పడి చస్తుంది”…అప్పుడర్దమయ్యింది  రాత్రిపూట బావి దగ్గర స్నానం చెయ్యడం తనకు సరదా అని. ఎలా అంటే “నీ సరదా ఎప్పుడో కొంప ముంచుతుంది” అంటూ మన సన్నిహితులు చనువుగా హెచ్చరించడం వింటూనే ఉంటాము.

సినిమా  హీరో సంజీవ్ కుమార్(గేరులాల్). మామూలు  సగటు మనిషి .పెద్దగా గొప్పదనాన్ని ఆపాదించలేము.  ట్రక్ డ్రైవర్. కష్టాల్లో ఉన్న హీరోయిన్  షర్మిల టాగోర్ కుటుంబానికి  ఎలాంటి చెప్పుకోదగ్గ ఆసరా ఇవ్వడు.దర్శకులు గుల్జార్ ఈ స్పృహ మనకు ఎప్పుడు  కలిగిస్తారు అంటే సినిమా ఆఖరులో షర్మిల టాగోర్ చిన్న చెల్లెలుగా నటించిన  కిరణ్ వైరాలే ( చింకి )తో చెప్పిస్తారు.”మా కోసం ఏమి చేసావని ?ఇంటికి కావాల్సిన  పప్పు ,బియ్యం, కూరగాయలు తేవడం తప్ప ఇంకేమి  చేసావు?మా అక్కను పెళ్లి  చేసుకోమన్నాను.  చేసుకున్నావా ?” అంటూ నిష్టూరాలాడుతుంది . అప్పుడు గాని మనకు అనిపించదు ఏమి చెయ్యలేదని. ఆ మాట కొస్తే చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. హీరో అనగానే అందర్నీ ఉద్దరించాలంటే ఎలా? వర్తమాన విషయాల మీద  కూడా సరయిన అవగాహన ఉండదు. ఉదాహరణకు : డబ్బులు మనీ ఆర్డర్ చెయ్యకుండా కవర్ లో పెట్టి పంపిస్తాడు.

వహీదా రెహమాన్ తల్లిగా నటించింది.పేరు జ్యోతి. పూర్వాశ్రమంలో జుగ్ని పేరుతో నాటకాల్లో నర్తిస్తుంది. అక్కడ సారంగి వాయించే వాడిని ప్రేమించి, పెళ్లి చేసుకొని ముగ్గురు ఆడపిల్లలకు తల్లి అవుతుంది. అలసిపోతుంది.తన పిల్లలు అలా బ్రతకకూడదని,భర్త నుంచి దూరంగా వచ్చి బ్రతుకుతుంది.వీళ్ళు వంటల్లో వేసే మసాల పొడులు తయారు చేసి ఆ ఊర్లోనే ఉన్న దుకాణాదారుడుకి అమ్మి జీవితం సాగిస్తారు.  ఈ దుకాణాదారుడి పేరు దనీరాం. ఈ కుటుంబ ఆర్ధిక పరిస్థితి చూసి, సరైన వసతులు లేకపోయినా తన మాట చాకచక్యం,హాస్య చతురతతో  గేరులాల్ కి వీళ్ళింట్లో, అద్దెకు ఉండే ఏర్పాటు చేస్తాడు. ఈ కాలంలో  ఇదొక వ్యాపారం. ఏజెంట్స్ ఇరు పార్టీల నుంచి కమిషన్ తీసుకుంటున్నారు. కాని ఒకప్పుడు  ఎలాంటి ధనాపేక్ష లేకుండ సహాయం చేసి,వారి  తిట్లు కూడా భరించేవారు.అందరి గురించి ఆరాలు తియ్యడం,సానుభూతి చూపించడం, ఆడవాళ్ళని అవహేళన చెయ్యడం,  ఆడవాళ్ళ పోట్లాటలు, ఇలా ఊరంటే ఎలా ఉంటుంది అనే సమగ్ర చిత్రీకరణకు సంబంధించిన   సన్నివేశాలను  ఏది వదలలేదు గుల్జార్.

ఈ చిత్రంలో వహీదా రెహమాన్ నటన తారాస్థాయికి చేరింది.వృద్దాప్యం వల్ల మతిమరుపుతో జనాలను గుర్తుపట్టక పోవడం, గుర్తు పట్టిన వెంటనే దేనికో తిట్టడం, అవసరాన్ని బట్టి తెలివిగా మాట్లాడ్డం,పిల్లల్ని అదుపులో పెట్టడం ఇలా బహుముఖ పాత్రలు… అతి సహజంగా పోషించింది .మళ్ళి మళ్ళి చూడాలనిపిస్తుంది.అవసరం లౌక్యాన్ని  నేర్పుతుందేమో .  ఇంటికి అద్దెకు వచ్చిన గేరులాల్ ని అడుగుతుంది. భోజనము ఎక్కడ చేస్తావని, ఎక్కడో బయట హోటల్ లో తినేబదులు, ఆ డబ్బేదో తమకే ఇస్తే ఇల్లు గడుస్తుందని.మర్నాడు సంజీవ్ కుమార్ ని చూసి “ఎవరు నువ్వు? నా ఇంట్లో ఎందుకున్నావు?” అని గద్దిస్తుంది.గుర్తుకొచ్చాక వెంటనే, ఏమైనా తిన్నావా ? అని తల్లి లా అడుగుతుంది.”లేదు ” అంటే “తినేసి వెళ్ళు ఖాళికడుపుతో వెళ్ళకూడదు” అంటుంది . “సరే ” అనగానే వెంటనే, “ఇక్కడ ఏది ఉచితంగా దొరకదు,డబ్బు  పెట్టి వెళ్ళు ” అంటుంది. మళ్ళీ  వెంటనే “నా దగ్గర ఉంటె నీకు ఊరికే పెట్టేదాన్ని ఏమి అనుకోకు” అంటుంది .ఇలా వెంట వెంటనే రకరకాల హావభావాలతో , “అపరిచితుడు”లో  విక్రం గుర్తొస్తాడు.

షర్మిలా  టాగోర్ నటన అందరికి తెలిసిందే.ఆ మాట తీరు,పొందిక ఎవరికి రాదు. మాటలతో మెత్తగా కొడుతుంది. తిరిగి ఎదురు చెప్పకుండా అలా అని పోట్లాడినట్టూ ఉండదు. పాపం గేరులాల్ కి  వీళ్ళింట్లో సరైన వసతులు ఉండవు. పాడుపడిన ఇల్లు, కొత్త ఊరిలో దొరకాల్సిన స్వాగతం , స్నేహం లేక మొదటి రోజు ఆ కోపం,తిక్క వీళ్ళ మీద చూపిస్తాడు.కాని రెండో రోజుకి నెమ్మదిస్తాడు. “ఇష్టం లేకపోతే ఇచ్చిన అద్దె తీసుకొని వెళ్ళిపో” అంటుంది నిమ్కి. “ఎదో మొదటి రోజు కదా అందుకే అలా చేశాను ” అంటాడు . అప్పుడు  “మాకు కూడా నీతో మొదటి రోజే కదా.” అంటుంది.

తర్వాత చెప్పుకోవాల్సింది షబానా ఆజ్మి గురించి(మిట్టు). రెండో కూతురు.చాల తెలివయినది. సంజీవ్ కుమార్ని  ప్రేమిస్తుంది. అది  హీరోకి ,ప్రేక్షకులకు తెలిసేది ఎలా?మిగతా సినిమాల్లా  అద్దం ముందు నిల్చొని తనలో తానూ  లేదా తన ఆత్మతో మాట్లాడడం లాంటి సీన్స్ లేకుండ ఇంకోలా చూపిస్తారు గుల్జార్. ఇంటికి  ఒక ఉత్తరం రాస్తూ,తనకి పెద్ద కూతురైన నిమ్కి నచ్చిందంటూ రాసి , ఉత్తరం అక్కడే మర్చిపోతాడు. మళ్ళి వచ్చి చూస్తే నిమ్కి స్థానం లో మిట్టు అని రాసి  ఉంటుంది. మిట్టు తనని ప్రేమిస్తుంది అని  గర్వంగా నవ్వుకుంటాడు. తర్వాత  గదిలోకి ఎవరు వచ్చారని? నీకు మాటలు రావా? అని మిట్టుని గద్దించి అడుగుతాడు. ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మనకూ ఇప్పుడే  తెలుస్తుంది మిట్టు మూగదని.ఆశ్చర్యం వేస్తుంది .అంతవరకు మనకు అస్సలు అనుమానం రాదు.అక్క, చెల్లెలు గురించి  చెప్తూ  “ఏది చేసినా ఎక్కువే చేస్తుంది. నవ్వు,కోపం,సంతోషం ఇలా అన్ని ఉన్నాయ్ ఒక్క పిచ్చి తప్పించి” అంటుంది. యే అశుభ గడియలో అంటుందో కాని, పాపం పిచ్చితోనే ఆత్మహత్య చేసుకుంటుంది.  మిట్టు కవితలు రాస్తుంది అని కూడా తెలుస్తుంది.

మిట్టు రాసిన  కవితే సినిమాలో ఒక పాట. మంచి ఆణిముత్యం. ఆర్డీ బర్మన్ సంగీతము. ఆశా భోంస్లే  గళంలోంచి జారిన అమృతధార అని చెప్పొచ్చు. ఇదీ గుల్జార్ విరచితమే కొన్ని కొన్ని గుల్జార్ వల్లే అవుతాయేమో అనిపిస్తుంది, ఎందుకంటే సినిమా చూడకుండ పాట వింటే అర్ధం ఒకలా తోస్తుంది.అదే సినిమా చూసి, పాట వింటే అర్ధం ఇంకోలా ఉంటుంది.యే విధంగా విన్నా బాగుంటుంది.  ఈ సం(గీతం)  ప్రేక్షకులకు వీనులవిందు అని చెప్పొచ్చు.

సరదా,సంతోషాలు  డబ్బుతో వచ్చేవి  కావు,  చుట్టూ నలుగురు ఉంటె చాలేమో అనిపిస్తుంది ఒక సీన్ చూస్తే. వాకిట్లో కళ్ళాపి పచ్చిగా ఉండడంతో నలుగురు అందులో  జారిపడి కాస్సేపు సరదాగా నవ్వుకునే సన్నివేశాలు ఉంటాయి.

అదేంటో ఏది ఎక్కువసేపు ఉండదు సినిమాలో , జీవితంలా    …సంజీవ్ కుమార్, ట్రక్ డ్రైవర్ కాబట్టి ఇంకో ఊరు వెళ్ళాల్సి వస్తుంది. తన ప్రేమ విషయం బయట పెడతాడు నిమ్కి దగ్గర. ఇక్కడ తెలుస్తుంది ఉత్తరంలో నిమ్కి బదులు మిట్టు అని మార్చింది నిమ్కి అని. చెల్లెల్ని(మిట్టు) చేసుకోమంటే  ఒప్పుకోడు. తన అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. రోడ్డు మీదే రోజులు గడుస్తాయి అనే అర్ధం వచ్చే పాట ఒకటి ఉంటుంది. బండి అన్నాక ఎక్కడో ఒకచోట ఆపాల్సిందే. వినోదం చూడాల్సిందే. వినోదం కాస్త విషాదం అవుతుంది. చిన్న చెల్లెలు చింకి నాటకంలో గంతులేస్తూ కనిపిస్తుంది.  తల్లి ఏదైతే తన పిల్లలు కాకూడదు అనుకుంటుందో అదే అవుతుంది.  గుండె ఆగినంత పనవుతుంది. తిడదామని వెళ్తే తానే మాటలు పడాల్సివస్తుంది. తిరిగి అనడానికి ఏమి ఉండదు.మళ్ళీ ఆ ఊరు వెళతాడు.ఇంకో విషాదం మూటగట్టుకోడానికి. రెండో చెల్లెలు మిట్టు మతి చెడి,  కొండపైనుంచి దూకి చనిపోతుందని  తెలుస్తుంది .

Shakespeare,  Mid Summer Night’s Dream లో  Thesues అనే ఒక పాత్ర ద్వారా “The lunatic, the lover, and the poet are of imagination all compact”. అని చెప్పిస్తారు.పిచ్చివాడు, ప్రేమికుడు,కవి ….వీరందరు వారి వారి ఊహాజనితమైన లోకంలో విహరిస్తూ ఉంటారు. ఇక మిట్టు అంటే షబానా అజ్మి విషయానికి వస్తే కవితలు రాస్తుంది. తర్వాత ఆమెలో ప్రేమ జనిస్తుంది. ఆఖరికి పిచ్చిదవుతుంది. పైన పేర్కొన్న ముగ్గురు ఈమెలో ఉన్నారు.ఒకటి ఉంటేనే తట్టుకోవడం కష్టం మరి మూడంటే …మూడినట్టే కదా!  సంజీవ్ కుమార్ ని ప్రేమించిందని,దాని వల్లే పిచ్చిది  అయ్యిందని  ఇంట్లో ఎవరికీ తెలియదు, చూసే మనకు తప్ప. తల్లి మంచం పట్టి కొద్దిరోజులకు చనిపోతుంది.ఇల్లు విడిచిన చిన్నచెల్లెలు ఎప్పుడైనా రాకపోతుందా అని నిమ్కి ఒక్కతే ఆ పాడుపడిన ఇంట్లో ఉంటుంది.ఆఖరుకి  గేరులాల్ ,నిమ్కి ఒక్కటవుతారు. పెళ్లి వయసు దాటిన తర్వాత ఒక్కటయ్యారు కాబట్టి “అకాల్ బసంత్ “అని కథకు  పేరు పెట్టి ఉంటారు సమరేష్ బాబు.

ఒకే విషయాన్ని ఎన్ని కోణాల నుంచైనా చూడొచ్చు.ఉప్పు,తీపి ,కారం వగైరా రుచులతో చేసే ఒక రకమైన పలహారాన్ని నమ్కీన్ అంటారు. ఇంకా చెప్పాలంటే చుడువ, కార, ఇలా చాలా  పేర్లు ఉన్నాయ్.ముగ్గురు అక్కాచెల్లెళ్ళ స్వభావాలకు తగ్గట్టు పేర్లు  అంటే   నిమ్కి అంటే ఉప్పు ,మిట్టు అంటే తీపి, చింకి అంటే కారం…మొత్తం కలిపితే “నమ్కీన్ “, ఇదే గుల్జార్  సినిమా కథ.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

వినిపించనా ఈ పూట ఆ పాట…

శ్రీపతి పండితారాధ్యుల దత్తమాల 

sp dattamala“ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం”

   అని పాడింది  ఎవరో తెలుసా? విస్సంరాజు రామకృష్ణగారు .

  భక్త తుకారాం చిత్రంలోని   “పాండురంగ నామం పరమపుణ్య ధామం” పాట.

 ఆయన పాటలు కూడా అంతే. ఇంకా చెప్పాలంటే బాపుగారి ముత్యాలముగ్గులో  

“ఎదో… ఏదో.. అన్నది ఈ మసక వెలుతురు,గూటి పడవలో విన్నది కొత్తపెళ్లికూతురు”

ఈ పాట ఎన్ని మార్లు విన్నా,  మళ్ళీ కొత్తగా ఉంటుంది.

ఆ చిత్ర కథానాయకుడు శ్రీధర్  స్టైల్ కి తగ్గట్టు పాడారు.

“ఎదో …ఏదో ” వినసొంపుగా ఉంటుంది.

భక్త తుకారాం లో ఘంటసాల గారు, రామకృష్ణ గారు ఇద్దరూ పాడారు. లోతైన పరిశీలన ఉంటేగాని ఎవరు ఏది పాడారు అనేది చెప్పడం  కష్టం. రామకృష్ణగారి పాట వింటే ఘంటసాల గారే పాడారా అన్నట్టు  ఉంటుంది . ఈయన్ని ఘంటసాల గారి ఏకలవ్య శిష్యుడు అంటారు.  ఘంటసాల గారి చివరి రోజుల్లో ఆయాసం వల్ల హై- పిచ్ అంటే  తారాస్థాయిలో స్వరపరిచిన పాటల్ని రామకృష్ణ గారే పుర్తిచేసారట. ఎవ్వరు గుర్తుపట్టలేదు. అలా 15 పాటలు ఉన్నాయ్. మచ్చుకి కొన్ని …కన్నకోడుకులో “తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి”, అల్లూరి సీతారామారాజులో “తెలుగువీర లేవరా దీక్ష బూని సాగరా “. కాని సినిమాలో ఆయన పేరు లేదు. ఈ విధంగా గురుదక్షిణ సమర్పించుకున్నారు అని చెప్పవచ్చు.

1974 లో ఘంటసాల మాస్టారు పరమపదించారు. ఆయన ఉన్నపుడే, 1972 నుంచే , రామకృష్ణ గారు సినిమాల్లో         నేపధ్య గానం  మొదలు పెట్టారు. ఘంటసాల గారి గొంతులా ఉన్నా, ఈయనకి రావాల్సిన పేరు వచ్చింది. ఆయన మొదటి  సినిమా  “విచిత్ర బంధం” లో పాడిన  “వయసే ఒక పూల తోట”. వాణిశ్రీ ఆట, రామకృష్ణ పాటతో హుషారుగా సాగుతుంది.

మహాకవి క్షేత్రయ్య లో, గోపికలతో శ్రీకృష్ణుని రాసలీలలు  తన్మయత్వం తో క్షేత్రయ్య పాడినట్టు ఓ పాట ఉంటుంది,  ” ఆ రేపల్లె లోని గోపాలుడంట యే పిల్లనైన చూస్తే తంటా ..తలచుకుంటే ఆ జగడం కన్నులపంట ఓ ఓ ఓ మజా మజా కన్నులపంట” బలిపీఠం లో  భార్య అలికను తీర్చే పాట  “చందమామ రావే జాబిల్లి రావే “. “ఇదెక్కడి న్యాయం”  లో  “ఎపుడైనా యే క్షణమైనా ” మొత్తం పాటంతా  సుశీలగారు   పాడినా ముగింపు రామకృష్ణగారు ఇస్తారు.  ఒకే  చరణమైనా చాలా  బాగుంటుంది.

“భక్త కన్నప్ప” అనగానే రామకృష్ణ గుర్తొస్తారు. ” అరె సిన్నమీ ! మబ్బు ఎనక మెర్పుతీగె, దుబ్బు ఎనక మల్లెతీగె! ఓ.. ఓ.. ఓ..  మబ్బు ఎనక మెర్పుతీగె, దుబ్బు ఎనక మల్లెతీగె! ఏడానున్నా దాగోలేవే మల్లెమొగ్గా అబ్బో సిగ్గా! మల్లెమొగ్గా అబ్బో సిగ్గా!”

కన్నప్ప ప్రేయసితో పాడుకునే పాట అద్భుతం.

బాపుగారు గోదావరినది నేపధ్యంలో తీసిన అందాలరాముడు లో చాలామట్టుకు రామకృష్ణ గారే పాడారు.

“కురిసే వెన్నెల్లో మెరిసే గోదారి లా

మెరిసే గోదారి లో విరబూసిన నురగ లా

నవ్వులారబోసే “పడుచు”న్నది

కలువపువ్వు వేయిరేకులతో విచ్చుకున్నది

పున్నమి ఎపుడెపుడా అని వేచియున్నది”

డాక్టర్ నారాయణరెడ్డి గారి రచనకు, బాపుగారి దృశ్య కావ్యానికి తన గాత్రంతో వన్నెలద్దారు. “విచ్చుకున్నది” అంటూ, కలువ విచ్చుకునే వైనం తన గొంతులో రంగరించి పాడారు. “ఇదా లోకం” సిన్మాలో “నీ మనసు నా మనసు ఏకమై ప్రతిజన్మలోన ఉందాము జతగా”  రామకృష్ణ గారి  పాట, శోభన్ బాబు ,శారద పైట చెంగుతో ఇద్దరు  చేసే విన్యాసాలు చూస్తూ పరవశించపోతాము.  ఈ పాట ఆడియో వింటే ఘంటసాల గారు పాడిన “సంగమం సంగమం అనురాగ సంగమం” గుర్తొస్తుంది. ఇక్కడ తేడా తెలుస్తుంది. ఘంటసాలగారి గొంతులో గాంభీర్యం…రామకృష్ణ గళంలో  లేతకొబ్బరి కమ్మదనం. “వసివాడి శశిచెడి వన్నెవాసీ లేక – విరహాన వనలక్ష్మి వేగిపిలుచూ/ పగిలి గుండెల దాక పొగలతో సెగలతో – దాహాన భూదేవి తపియించి పిలుచూ/రా, తొర తొరగా రా . . తొందరగా రా/ఓ దూరగగన విహారా ఓ శీతల వర్షాధారా/తరలిరా జలధరా . . కరుణించి కదలిరా తరలిరా జలధరా . . కరుణించి కదలిరా”      దేవులపల్లి రచనకు సాలూరు రాజేశ్వరరావు “రాగ మల్హార్ “లో స్వరపరచిన గీతాన్ని బాలుగారితో ఆలపించినప్పుడు నిజంగానే వర్షం కురిసిందట.  చిత్రం  అన్నదమ్ముల కథ.

అందాల రాముడు లో హరికథ  ” ధన్యుడనైతిని ఓ రామా! నా పుణ్యము పండెను ఓ రామ” వచనం చెప్పింది అక్కినేనిగారైతే పద్యాలు పాడింది  రామకృష్ణగారు.

యశోద కృష్ణ లో కూడా ఒక పాట ఉంది .

” నెల మూడు వానలు నిలిచి కురిశాయీ – పచ్చిక మేసి మన పశువులే బలిశాయీ దేశాన కరువు రాకుండాలిరా . . దేవేంద్రునకు పూజ చెయ్యాలిరా !”

భక్తి పాటలకు ఆయన గాత్రం  పుట్టినిల్లు అని చెప్పవచ్చు. “శ్యామ సుందరా  ప్రేమ మందిరా నీ నామమే వీనుల విందురా” “రామా  శ్రీరామా  జయ జయ రామా  రఘురామా””మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి”… మొదలైనవి  కరుణామయుడులో వినదగిన పాట ” పువ్వులకన్న పున్నమివెన్నెల కన్న  మిన్న అయినది పసిడి కుసుమం ”

దానవీరశూరకర్ణ , విశ్వనాథ నాయకుడు ,షిర్డీ సాయిబాబా మహత్యం ,వెంకటేశ్వర వైభవం, బ్రహ్మంగారి చరిత్ర మొదలైన వాటిల్లో పద్యాలు ,దండకాలు చాలానే ఉన్నాయ్.

“ఓహో చెలి ఓనా చెలి

ఇది తొలి పాట

ఒక చెలి పాట

వినిపించనా  ఈ పూట

ఆ  పాట”

దాసరి నారాయణరావుగారి దర్శకత్వం లో వచ్చిన కన్యాకుమారి చిత్రానికి పై పాట పాడారు, కాని ఎందుకో తీసేసారు.    చెప్పాలంటే మనము వినని పాట .

“ఎదగడానికెందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర”

“అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం” ఇలాంటి పాటలను  ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరి వల్ల ,ఎదో ఒక సందర్బంలో కనెక్ట్ చేసుకుంటూనే ఉంటాము.

“రాముడేమ్మాన్నాడోయ్ …సీతా రాముడేమ్మాన్నాడోయ్”…

బ్రహ్మంగారి చరిత్ర లో “ఏమండి పండితులారా ”

ఇవి  వ్యంగ్యపు పాటలు . మొత్తానికి చెప్పాలంటే పాటల్లో చేయని  ప్రక్రియ, ప్రయోగము లేదు.భక్తి పాటలు ,యుగళ గీతాలు,పద్యాలు ,దండకాలు మొదలైనవి .

ఇక వ్యక్తిగత విషయానికి  వస్తే ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఘంటసాలగారి ఏకలవ్య శిష్యుడు అంటేనే అర్ధం చేసుకోవాలి ఎంత కష్టపడ్డారో. నిచ్చెన ఎక్కించినట్టే ఎక్కించి డబ్బున కింద పడేసింది సినీ రంగం. అంటే వైకుంటపాళీ ఆటలో మాదిరి, నిచ్చెన ఎక్కారు ,పాము కాటుకూ  గురయ్యారు. పది సంవత్సరాలే ఉన్నారు ఇండస్ట్రీలో . తరువాత అరకొర ఆవకాశాలు ఆ తర్వాత అవీ లేవు. మనిషి వ్యక్తిత్వం బయటపడేది కష్టాలు ,సమస్యలు వచ్చినపుడే. రామకృష్ణగారి ఆశావహ ధృక్పధం ఆయనకు తోడ్పడింది. భక్తీ గీతాల ఆల్బమ్స్ , వివిధ కన్సర్ట్స్ , టీవీ సీరియల్స్ లో నటన, లాంటి  వ్యాపకాలు సృష్టించుకున్నారు.

మా ఊర్లో ఉన్న శివాలయం లో రోజు ప్రొద్దున్న ,సాయంత్రం “శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో” రికార్డు వేసేవారు .అప్పుడు తెలిసేది కాదు ఎవరు పాడారో. తర్వాత అది విన్నపుడల్లా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేవి. ఎపుడైనా ఆ గుడికి వెళ్తే రామకృష్ణగారు తప్పక గుర్తొస్తారు నాకు.

*