ఫేస్ బుక్ లో తొలి తెలుగు కథల పోటీ
‘జుమ్మా’ నాకొక పునర్జన్మ: వేంపల్లె షరీఫ్
ఆ రోజు అల్లా దినం. అల్లా పని తప్ప ఏ పనిచేసినా కలసి రాదని భయం. పైగా కీడు జరుగుతుందని ఆందోళన. ‘జుమ్మా’ రోజు ఏడిస్తే మళ్లీ ‘జుమ్మా’ వచ్చే వరకు ఏడుస్తూనే ఉంటామని ఒక పిచ్చి నమ్మకం. అందుకే అప్పుడప్పుడు మా అమ్మ, నాన్న మీద చిరాకు పడేది. ‘‘జుమ్మా రోజు ఏడిపిస్తావా.. బండరాయీ..’’ అని తిట్టేది.
అందరూ శుభకార్యాలు జుమ్మా రోజు చేస్తే మా ఇంట్లో మాత్రం చేసేవాళ్లు కాదు. ఒకవేళ అత్యవసరమై చేయాల్సి వొచ్చినా ‘జుమ్మా సమయం’ దాటి అంటే మధ్యాహ్న నమాజు సమయం దాటాక చేసేవాళ్లం. మధ్యాహ్నం నమాజు పూర్తయ్యేదాక జుమ్మా రోజు అక్షరాలా ఏ పనీ చేసేవాళ్లం కాదు. అంతేకాదు జుమ్మా రోజు ఇంట్లో ఏవైనా వస్తువులు కింద పడ్డా అపశకునమని బాధపడేవాళ్లం. పొరపాటున గాజులు పగిలిపోతే అమ్మ తన గుండె పగిలినంతగా బాధపడేది.
‘‘శుక్రవారం పూట గాజులు పగిలిపోయాయి… ఇంకా ఏమేం పగిలిపోతాయో..’’అని ఆందోళన చెందేది.
చిన్నపాటి నిమ్మకాయల వ్యాపారి అయిన మా నాయన మధ్యాహ్నం నమాజు పూర్తవనిదే ఎంత పనున్నా తోట దగ్గరికెళ్లేవాడు కాదు. ఇలాంటి నమ్మకాల మధ్య పెరిగిన నాకు కొన్నాళ్లు ఓ పీడకల వెంటాడేది.
భయంకరమైన నీళ్లు …భూమి ఆకాశాలను తలకిందులు చేస్తూ వచ్చి నన్ను ముంచేసేవి. దాంతో నాలో ఒక భయం గూడుకట్టుకుని ఉండిపోయింది. నాకు చావు వస్తే అది శుక్రవారమే వస్తుందని, అది కూడా నీళ్ల ద్వారే వస్తుందని నాలో ఎక్కడో ఏదో మూల ఒక చిన్న అనుమానం.
ఆ అనుమానం, ఆ భయానికి తోడు ఒక జుమ్మా రోజున హైదరాబాద్లో ఉండగా మక్కామసీదులో బాంబు బ్లాస్ట్ జరిగింది. ప్రశాంతమైన నమాజులో తెల్లటి జుబ్బాలు నెత్తురోడాయి. చిన్న పిల్లలు చనిపోయారు. నోరు లేని పావురాలు చాలావరకు చనిపోయాయి. ఆ బాధ.. భయం.. అమ్మ.. అన్నీ గుర్తుకొచ్చి రాసిన కథ జుమ్మా. మతానికి మించిన ఆప్యాయతలు ఇంకా ఈ భూమ్మీద చాలా ఉన్నాయని బలంగా చెప్పాలనిపించింది. జుమ్మా కథ రాశాను. ఈ కథ ఈ మధ్యే హిందీలోకి అనువాదమై కేంద్ర సాహిత్య అకాడెమి వాళ్ల ప్రతిష్టాత్మక ద్విమాస పత్రిక ‘సమకాలీన భారతీయ సాహిత్య’లో ప్రచురితమైంది. ఆ సంతోషం అలా ఉండగానే నాకు జుమ్మా కథల సంకలనానికి యువ పురస్కారం ప్రకటించారు.
ఆ అవార్డు తీసుకున్నాక నాకు జుమ్మా అంటే భయం పోయింది. జుమ్మా అంటే చావు కాదు పునర్జన్మ అని నమ్మకం కలుగుతోంది.
జుమ్మాలో పన్నెండు కథలున్నాయి. వాటిని రాయడానికి పదేళ్లు కష్టపడ్డాను. నేను చాలా స్లో రైటర్ని. దీనికేదో అవార్డు వస్తుందని నేను రాయలేదు. నాకు బాధ కలిగినప్పుడు ఊరట రచన. దు:ఖం కలిగినప్పుడు ఓదార్పు రచన. నా అశాంతికి ప్రశాంతత రచన. అన్ని సాహిత్య ప్రక్రియల్లోకెల్లా కథా ప్రక్రియ అంటే నాకు చాలా ఇష్టం. జీవిత శకలాన్ని పరిపూర్ణంగా కథలో చెప్పగలమనేది నానమ్మకం.
ఆంధ్రప్రదేశ్లో వెనుక బడ్డ ప్రాంతమైన కడపజిల్లాలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాను నేను. మా నాన్నకు చదువు లేదు. అమ్మక్కూడా చదువుకోలేదు. అమ్మతరపు బంధువులకు కానీ, నాన్న తరపు బంధువులకు కానీ చదువు లేదు. చదువు నా నుంచి మా తరంలో మొదలైంది.
సైకిల్ షాపుల్లో పంచర్లు వేసుకోవడం దగ్గరి నుంచి, టీకొట్టుల్లో పనిచేయడం దగ్గర్నుంచి, కుట్టు మిషన్ నడుపుకోవడం దగ్గర్నుంచి, గల్ఫ్ కంట్రీస్కి వలస పోవడం దగ్గర్నుంచి, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోవడం దగ్గర్నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే నా కుటుంబం అక్షరం వైపుకు పయనిస్తోంది.
సాహిత్యమంటే ఏంటో మా వాళ్లకు తెలీదు. ఎలాంటి అక్షర నేపథ్యం నాకు లేదు. నేను కథ రాస్తే ‘తిక్కోడు’ అన్నారు మా వాళ్లు. నేను ఏ అమ్మ గురించి కథ రాశానో ఆ అమ్మకే తెలియదు నేనేం రాశానో. వాళ్లూ వీళ్లూ చెప్పగా విని.. ‘‘మా అమ్మ ..నాక్కూడా చదువు చెప్పించి ఉంటే నా బిడ్డ రాసిన కథ నేనూ చదువుకుని ఉందును కదా..’’అని బాధపడేది.
అలాంటి కుటుంబం నుంచి అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన నాకు ఈ అవార్డు నిజంగానే ఒక అద్భుతం. భారతదేశంలో సెక్యులరిజం అనే మాటకు రూపమనేది ఏదైనా ఉంటే అది మా ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ముస్లిమని నేను గర్వంగా చెబుతాను. వాళ్ల జీవితాలనే నేను కథలుగా రాశాను కాబట్టి, వాళ్ల జీవితాలకే ఈ అవార్డు ఇచ్చారని నమ్ముతున్నాను కాబట్టి దీన్ని వాళ్లకే అంకితం చేస్తున్నాను.
(మార్చి 22న గౌహతిలో శుక్రవారం రోజు జరిగిన అవార్డ్ ప్రదానోత్సవ సభ లో చదివిన ప్రసంగం)
వింతశిశువు / వేంపల్లె షరీఫ్
టిఆర్పి రేటింగ్స్లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న టీవీ చానల్స్లో మురళీ పనిచేస్తున్న వార్తా చానల్ కూడా ఒకటి. ఆవేళ పొద్దుటి డ్యూటీలో ఉన్నాడు. వార్తా విభాగంలో అతని ఉద్యోగం. ఆ షిఫ్ట్కి మురళీ ఇన్చార్జ్. ఆ షిఫ్ట్లో వచ్చే వార్తల ప్రాధాన్యతను నిర్ణయించి ప్రసారం చేయాల్సిన బాధ్యత అతనిదే. సమయం తొమ్మిది గంటలవుతోంది. కంప్యూటర్ ముందు కూర్చోని ఉన్నాడు. ఎదురుగా గోడకు టీవీ దుకాణంలో తగిలించినట్టు వరుసగా పది టీవీలున్నాయి.
కుడినుంచి ఎడమకు లెక్కేసుకుంటే మొదటి టీవీలో మురళీ పనిచేసే చానల్ ‘టీవీ `ఎక్స్’ వస్తోంది. చివరి టీవీలో ‘టీవీ`7’ వస్తోంది. ఇక మధ్యలో ఉన్న టీవీల్లో కూడా రకరకాల పోటీ చానల్స్ వస్తున్నాయి. ఒకసారి వాటివైపు చూశాడు మురళీ. ఉద్యోగంలో భాగంగా అప్పుడప్పుడు పోటీ చానల్స్లో ఏయే వార్తలు వస్తున్నాయో గమనిస్తుండాలి. నిజానికి గోడమీద అన్ని టీవీలు ఉంచిందే అందుకు. టీవీ7లో బ్రేకింగ్ వస్తోంది. ‘‘పశ్చిమగోదావరిజిల్లాలో వింత, తోకతో ఉన్న శిశువు జననం, వింత చూడ్డానికి ఎగబడుతున్న జనం’’
ఎర్రెర్రటి గ్రాఫిక్ ప్లేట్లతో తాటికాయంత తెల్లటి అక్షరాలతో టీవీ7లో వార్త నడుస్తోంది. ఓవైపు రిపోర్టర్ ఫోన్లో విశ్లేషణ ఇస్తున్నాడు. మరోవైపు బాక్సులో శిశువు దృశ్యాలు వేస్తున్నారు. శిశువు ఎర్రగా, సాయంత్రపు ఎండలో మెరిసే పూమొగ్గలా ఉన్నాడు. ఎవరివో రెండు చేతులు అతన్ని ఎత్తుకుని అతని వెనుక భాగాన్ని కెమెరాకు చూపిస్తున్నారు. పిర్రల దగ్గర కొద్దిగా, గోరంత చర్మం ముందుకొచ్చినట్టు కనబడుతోంది. ‘‘దీన్నే తోకంటూ కనిపెట్టాడు కాబోలు టీవీ7 వాడు..’’ గొణుక్కున్నాడు మురళీ. వెంటనే సీట్లోంచి లేచెళ్లి టీవీ ముందు నిలబడి కొంచెం వాల్యుమ్ పెంచాడు. ‘జన్యుపరమైన సమస్య వల్ల శిశువు అలా పుట్టాడని, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందని, ఆపరేషన్ చేసి తీసేయొచ్చని, ఇదేం పెద్ద విషయం కాదని’ వైద్యులు చెబుతున్నట్టు రిపోర్టర్ తన విశ్లేషణలో వివరిస్తున్నాడు.
అయినా ఆ చానల్ వాళ్లకు అదేం పెద్ద పట్టడం లేదు. వాళ్ల శ్రద్ధంతా దాన్ని ఒక ఎనిమిదో ప్రపంచ వింత లాగ చూపడంపైనే ఉంది. మనసు చివుక్కుమంది అతనికి. ‘‘ఇంకాసేపుంటే ఆ శిశువు సాక్షాత్తు ఆంజనేయ స్వామి అవతారమన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు…’’ వచ్చి మళ్లీ కుర్చీలో కూలబడ్డాడు.
నిజానికి ఆ వార్త తన దగ్గర కూడా ఉంది. కానీ అతనే ప్రసారం చేయకుండా ఆపాడు. అలా ఆపడం పై బాసులకు తప్పుగా తోస్తుందని అతనికి తెలుసు. దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని కూడా తెలుసు. అయినా అతనికెందుకో ఆ వార్తలో జనాసక్తి తప్ప జనానికి ఉపయోగపడే విషయం ఏమీ లేదనిపిస్తోంది. అందుకే ఎవడొచ్చి అడిగినా ఆ వార్తను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ మొన్న మధ్యాహ్నం షిఫ్ట్లో జరిగిన అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి అతనికి గుర్తుకొచ్చింది.
ఆ వేళ మురళీకి ` సబ్ఎడిటర్ రమాదేవికి పెద్ద గొడవ. వింతలూ ` విశేషాలు, ఆసక్తికరమైన వార్తలు రాసి టిఆర్పి పెంచే సబ్ ఎడిటర్గా రమాదేవికి మంచి పేరుంది. ఆ చొరవతోనే ఆమె ` ఇన్చార్జ్ అయిన మురళీక్కూడా చెప్పకుండా రిపోర్టర్ దగ్గరి నుంచి వార్త రాగానే దానికి కావాల్సిన హంగులూ, పొంగులూ, మసాలాలు అన్నీ దట్టించి టిఆర్పి యుద్ధానికి సిద్ధం చేసి ఉంచింది. అంతేకాదు ఆవార్త చాలా ప్రముఖమైందని హెడ్లైన్ పెట్టి ప్రసారం చేయాల్సిందిగా మురళీకి సూచించింది.
అసలే ఆదివారం. వార్తలు కూడా పెద్దగా లేకపోవడంతో రమాదేవి చెప్పిన తీరును బట్టి ఆ వార్త మీద ఆసక్తి కలిగి కంప్యూటర్లోనే ఫైల్ ఓపెన్ చేసి చూశాడు మురళీ.
కానీ అడగలేడు. టీవీ మీడియాలో చేరినప్పటినుంచి అంటే సుమారు గత ఆరేళ్లుగా అతను ఇదే క్షోభను అనుభవిస్తున్నాడు. అంతకుముందు వివిధ పత్రికల్లో పనిచేశాడు. ఆయా పత్రికలకు కూడా కొన్ని సొంత ఎజెండాలున్నాయి. కడుపాత్రం కాబట్టి ఆయా ఎజెండాలకు తగ్గట్టు వార్తలు రాశాడు. పెద్ద బాధనిపించలేదు. కానీ టీవీ మీడియాలో చేరాక సామాజిక బాధ్యత ఉన్న వార్తల పట్ల కూడా ఆత్మవంచన చేసుకోవాల్సి వస్తున్నందుకు తెగ ఇబ్బంది పడుతున్నాడు. అలా అని ఉద్యోగం వదిలేయలేడు. పెరిగిన ఖర్చులు, సంసార భారం దృష్ట్యా తిరిగి పత్రికలో చేరి తక్కువ జీతానికి పనిచేయనూ లేడు. ఇలాంటి సందిగ్ధావస్థలో ఇలాంటి రకరకాల వార్తలు వచ్చి అతనికినరకం చూపిస్తున్నాయి.
ఒక మహిళై ఉండికూడా ఈ వార్త పట్ల ఇంత ఆసక్తి చూపిన రమాదేవి మీద ఒకరకమైన అసహనం కలిగింది మురళీకి. కానీ ఆమేం చేస్తుంది? టీవీ మీడియా ఆమెను అలా మార్చేసింది. టీవీ మీడియాను మార్కెట్ శాసిస్తోంది. సొంత ప్రయోజనాలు శాసిస్తున్నాయి. రకరకాల ఎజెండాలకు లోబడి ఇక్కడ పనిచేయాలి. లేకపోతే మనుగడ ఉండదు. అందుకే మనుషులు అప్పుడప్పుడు తాము మనుషులమనే సంగతిని మర్చిపోతుంటారు. ఒకసారి రమాదేవి కూర్చునే కంప్యూటర్ వైపు చూశాడు మురళీ. ఆమె ఇంకా ఆ వార్తకు సంబంధించిన గ్రాఫిక్స్ ఏవో తయారు చేస్తోంది. రమాదేవి ఆ వార్త రాసేముందే ఒకసారి చూపించి ఉంటే అప్పుడే వద్దని చెప్పేవాడు మురళీ. కానీ ఇప్పుడు ఆ వార్తను దిద్ది అన్ని రకాల మసాలాలు దట్టించి సిద్ధం చేసిన తర్వాత వద్దంటే ఆమెకు కోపమొచ్చే అవకాశమే ఎక్కువ.
అందుకే ‘‘ఎలా ఈ ప్రమాదాన్ని నివారించాలా..?’’అని ఆలోచనలో పడ్డాడు. ఎందుకైనా మంచిదని ఒకసారి దృశ్యాలు చూడ్డానికి పక్కనే ఉన్న ఎడిటింగ్ విభాగానికి వెళ్లాడు. వరాహావతారంలో శిశువు పుట్టిందని వచ్చిన వార్త తాలూకు దృశ్యాలు చూపించమని అడిగాడు. వాళ్లు కంప్యూటర్లో ప్లే చేశారు. కళ్లముందు దృశ్యాలు కదులుతున్నాయి. అది ఇల్లో..గుడిసో.. చెప్పడం కష్టం. ఇంటి లోపలి వాతావరణం దిగులుగా, చీకటిగా ఉంది. కేవలం కెమెరా వెలుతురులో మాత్రమే ఆ దృశ్యాలను తీసినట్టు తెలుస్తోంది. ఒక పక్కగా శిశువు తల్లి . ఆమె తల్లి వయసున్న ఆడమనిషి మీద తలపెట్టి కూలబడింది. పక్కనే చాప మీద తెల్లటి వస్త్రం పరిచి పడుకోబెట్టారు ఒక చిన్నటి, నల్లటి ఆకారాన్ని. వస్త్రంపై ఆ ఆకారం మెల్లగా పురుగులాగ కదులుతోంది. కాసేపటికి పోల్చుకున్నాడు మురళీ ఆ ఆకారమే శిశువు అని. నిజమే శిశువు అందవికారంగా ఉంది. ఏది ముక్కో ఏది నోరో పోల్చుకోలేని పరిస్థితిలో ఉంది. కానీ వరాహం మాత్రం కాదు.
‘‘వరాహావతారం అనేది కేవలం మీడియా, మీడియాలాంటి మనుషుల సృష్టి మాత్రమే. కడుపులో బిడ్డ పెరిగేటప్పుడే ఏదో తేడా జరిగింది. అసలే చదువులేని మనుషులు. ఎప్పటికప్పుడు డాక్టరు దగ్గరికెళ్లి ఏ నెలకానెల కడపులో బిడ్డ ఆరోగ్యం,పెరుగుదల గురించి తెలుసుకోవాలని తెలియనివాళ్లు. తెలిసినా చూపించుకోవడానికి డబ్బు లేనివాళ్లు.’’ అతనికి బాధేసింది. ‘‘పాపం ఆ తల్లి ఎంత క్షోభ అనుభవిస్తోందో?’’ అనుకున్నాడు. అంతలో శిశువు ఆకారంపై ఉన్న కెమెరా మెల్లగా కదిలి ఆ మాతృమూర్తి ఉన్న వైపుకు తిరిగి జూమ్ అయ్యింది.
ఇందాక పక్కనున్న మనిషిమీద తలపెట్టి కూలబడ్డ తల్లి ఇప్పుడు ఏడుస్తోంది. ‘‘ల్యాక ల్యాక పుట్టిండెనే సామి ఈ బిడ్డ. ఇట్ట పుట్టించినావేమిట్రా దేవుడా. నేనేం తప్పు చేసినాను సోమి. అడిగినోళ్లందరికీ పెట్టినదాన్నేనే. ఇప్పుడేం జెయ్యాల. ఇట్ట జరిగిండేదానికేనా ఇన్ని అగసాట్లు పడింది? ఇన్నినొప్పులు బరించింది? నా రాతెందుకు ఇట్టుండాది రా నాయనా.. ! ఏం చేయాల్ల ఈ పిల్లను? ఆడకూతురే. ఎట్ట పెద్ద చేయాల్రా దేవుడా..?’’ దీర్ఘాలు తీస్తోంది. కడుపు మీద దబాదబా గుద్దుకుంటోంది. ఇక ఆ దృశ్యాలను చూడలేకపోయాడు మురళీ. వాటిని తీసిన రిపోర్టర్ మీద, కెమెరా మెన్ మీద కోపమొచ్చింది. ‘‘అయినా వాళ్లదేం తప్పు? ఆ వార్తను తీసుకురాకపోతే వాళ్ల ఉద్యోగం పోతుంది. వాళ్ల బాధ్యతను వాళ్లు నిర్వర్తించారు. ఇలాంటి వార్తల్ని ప్రముఖంగా ప్రసారం చేసి వారితో ఇలాంటివాటిని తెప్పిస్తున్న మార్కెట్ మాయాజాలానిది తప్పు?’’ మౌనంగా వచ్చి అతని స్థానంలో కూర్చున్నాడు. మనసంతా దు:ఖంగా ఉంది.
ఓ నిమిషం పోయాక తేరుకుని ‘‘రమాదేవీ, తల్లి మాట్లాడింది విన్నావా?’’ అన్నాడు అటువైపు తిరిగి కూర్చోనున్న ఆమెతో. ‘‘విన్నాను.. బ్రహ్మాండంగా మాట్లాడింది కదా..’’ అంది రమాదేవి. మురళీకి ఏం చెప్పాలో తెలీలేదు. అంతటి విషాదంలో కూడా ఓ నవ్వు మొహం పెట్టాడు. అలా నవ్వాలి. అదే నాగరికత. అవతలివాడిని దవడ పగిలేలా కొట్టాలనిపించినా కొట్టకుండా పళ్లు ఇకిలించాలి. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ‘నాయకత్వ లక్షణాల’ పేరుతో ‘వ్యక్తిత్వ వికాస’ కోర్సుల్లో చేరి, నేడు యువత నేర్చుకుంటోంది ఇదే. ఆ విద్యే అతనూ నేర్చుకున్నాడు. కానీ ఎంత నేర్చుకున్నా మొహానున్న నవ్వుకి జీవం మాత్రం తీసుకురాలేక పోతున్నాడు. ఇక తప్పదనుకుని కొంచెం కఠినంగానే ‘‘ఆవార్త ప్రసారం చేస్తే బాగోదు. హెడ్లైన్ వద్దు. వార్త కూడా వద్దు,’’ అన్నాడు. మురళీ అనుకున్నట్టుగానే రమాదేవికి మండిరది. ‘‘వేరే ఇన్చార్జ్ ఉంటే చక్కగా నేను రాసిన వార్తలు పెట్టుకుంటాడు. నువ్వేంటి ఎప్పుడూ ఏది రాసినా ఇది అవసరం లేదు..అది అవసరం లేదు అని లాజిక్కులు మాట్లాడతావ్..’’ అంటూ అరిచిందా పిల్ల.
అందరిముందు అలా అరవడం మురళీకి కొంచెం అవమానంగా అనిపించినా నిబాయించుకున్నాడు.
ఏమనుకుందో ఏమో తర్వాత ఏం మాట్లాడలేదు రమాదేవి. కానీ ఎక్కడో అతనిలో ఓ చిన్న అనుమానం.
‘‘ఒకవేళ రమాదేవి ఈ విషయాన్ని పై వాళ్లతో(బాసులతో) చర్చించి పెద్దది చేస్తే ఏం చేయాలి?’’ అని. అందుకే మంచో చెడో..దానికి తగ్గ సమాధానం కూడా ఒకటి సిద్ధం చేసి ఉంచుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు ఈ వార్త మీద తర్వాత ఎలాంటి చర్చ జరలేదు. ఆరోజు గండం అలా గడిచిందనుకుంటే మళ్లీ ఇవ్వాళ టీవీ7 వాడి రూపంలో మరో గండం వచ్చి పడింది. అది అసలే నెంబర్ వన్ చానల్. అది ఆ వింత వార్తను పట్టుకుని అలా గింజుతుంటే మిగతా వాళ్లుకూడా అదే బాట పడతారు. అసలే టీవీ మీడియా ‘గొర్రెల మంద’ లాంటిదంటారు. ఒకరు ఒక వార్తను పట్టుకుని హడావిడి చేస్తే మిగతావాళ్లు కూడా దాన్నే పట్టుకుని లాగుతారు. అందులోని మంచి చెడుల గురించి ఆలోచించరు. అందరూ హడావిడి చేస్తే ఇక తనక్కూడ ఆ వార్తను ప్రసారం చేయక తప్పని పరిస్థితి వస్తుంది. అందుకే అతనికి గుండెల్లో గుబులు గుబులుగా ఉంది. మనసంతా కీడు శంకిస్తోంది. అన్నట్టే కాసేపటికి డెస్కులో అగ్గి రాజుకుంది.
‘‘వార్త మనకొచ్చి అరగంటైనా మనవాళ్లు బ్రేకింగ్ వేయలేదు. టీవీ 7 వాడు ఆడుకుంటున్నాడు’’ అని లేసింది ఓ గొంతు.
వెనక్కి తిరిగి చూస్తే శ్రవణ్. అతను న్యూస్ కో ఆర్డినేటర్. ఏదైనా వార్త చానల్కి రాకపోతే అతనే దగ్గరుండి తెప్పిస్తాడు. ఒకవేళ వచ్చి కూడా ప్రసారం కాకపోతే ఇలాగే అరుస్తాడు. అతన్ని చూడగానే మురళీకి గుండె గుభేలుమంది. మొన్న వైజాగ్ బీచ్లో ముగ్గురు పిల్లలు కొట్టుకుపోయారు. వాళ్ల శరీరాలు దొరికాయి. ఆ దృశ్యాలు అందరికన్నా ముందుగా తెప్పించాడు శ్రవణ్. కానీ కాస్త అటు ఇటుగా ఇతర చానల్స్కి కూడా ఆ దృశ్యాలు వస్తాయి. దొరకని, దొరకడానికి వీల్లేని దృశ్యాలైతే కాదు. కానీ శ్రవణ్ ఒకటే హడావిడి. దేశంలోనే ఒక పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టినట్టు.. గోల. ఆ శవాల దృశ్యాల మీద ‘ఎక్స్క్లూజివ్..మార్కు’ వేయమని ఒత్తిడి.
‘‘బిడ్డలు నీటిలో మునిగి చచ్చిపోయి ఆ తల్లులు పుట్టెడు దు:ఖంతో ఉంటే మనకోసమే చచ్చిపోయినట్టు ఆ దృశ్యాల మీద ఎక్స్ క్లూజివ్ వేయడం నైతికం కాదు,’’ అన్నాడు మురళీ కటువుగా. అనడమే కాదు ‘ఎక్స్ క్లూజివ్ మార్కు’ వేయకుండానే ఆ దృశ్యాలను ప్రసారం చేశాడు. అది మనసులో ఉంచుకున్నాడు శ్రవణ్. దానికి తోడు ఇప్పుడు మళ్లీ ఆజ్యం పోస్తే భగ్గుమంటాడు.
అందుకే `‘‘శ్రవణ్ అది అస్సలు వార్తేనంటావా?’’ వీలైనంత ప్రశాంతంగా అడిగే ప్రయత్నం చేశాడు మురళీ . ‘‘వార్తో…కాదో ముందు టిఆర్పి. టీవీ7 వాడు అంతలా ఆడుకుంటుంటే నేనేదో గాడిదలు కాస్తున్నాను ఆఫీసులో అనుకుంటారు అందరూ. వెంటనే వార్తను ఎక్కించు. ‘ఎక్స్క్లూజివ్’ అని వేయ్., ‘ఫస్ట్ అన్ `టీవీఎక్స్’ అని వేయ్. ‘వాటర్ మార్కు’ వాడు. ‘ఫుల్ ప్లేట్్ బ్రేకింగ్’ కొట్టు.’’ `తనకు తెలిసిన విద్యలన్నీ చెప్పి గగ్గోలు పెట్టాడతను. మురళీకి చిరాకేసింది. కానీ అంతలోనే అతని మీద జాలి కూడా కలిగింది. ఆ వార్తను ప్రసారం చేయకపోతే తెప్పించలేదనుకుని శ్రవణ్ని మేనేజ్మెంట్ తప్పుగా అనుకునే అవకాశం ఉంది. అది అతని ఉద్యోగానికే ప్రమాదం. శ్రవణ్ హడావిడిలోనూ అర్థముంది. ఆలోచించాడు మురళీ. మెల్లగా శ్రవణ్కు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించాడు.
‘‘సరే శ్రవణ్.., ఆ వార్తను నేనే ప్రసారం చేయకుండా ఆపాను. ఎవరైనా నిన్ను అడిగితే నా పేరు చెప్పు? నీ మీద వేసుకోవద్దు,’’ అన్నాడు.
శ్రవణ్ అప్పటికి ప్రశాంతంగా ఉన్నట్టే అనిపించినా పక్కకెళ్లి ఫిర్యాదు చేశాడని మురళీకి ఈజీగానే అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు అతని ల్యాండ్ లైన్ ఫోన్ అదే పనిగా మోగుతోంది. మురళీకి తెలుసు ఆఫోన్ తన బాసుల దగ్గర్నుంచే అని. మురళీకి తెలుసు ఆ ఫోన్ శ్రవణ్ ఫిర్యాదు ప్రభావమే అని. మురళీకి తెలుసు ఆ ఫోన్ ఎత్తితే ఆ వార్త ప్రసారం చేయక తప్పదని. ఒకసారి టీవీ7 వైపు చూశాడు. వింత శిశువు..వార్త ఇంతింత అక్షరాలతో ఇంకా ఇంకా వస్తూనే ఉంది. మురళీకి పిచ్చెక్కింది. గట్టిగా అరిచాడు. ‘‘తోకతో పుట్టిన వింతశిశువు ఆ పిల్లాడు కాదురా.. మీర్రా..మీరు..’’
Front Image: Anwar
తాజా కామెంట్లు