కన్ఫెషన్ హద్దు దాటి కెరటమైన అరుణ్ సాగరం!

arun (2)

రుణ్ సాగర్  చివరి కవితా సంకలనం మ్యూజిక్ డైస్ పుస్తకం అట్ట మీద సీతా రాములోరి బొమ్మ. ఆ రోజు ప్రెస్ క్లబ్ లో కలిసాడు అప్పుడే ప్రెస్ నుండి వచ్చిన కవర్ పేజీ. రావుడి  చేతిలో ధనస్సు వెనక అభయం కోసం సీత. ఎంతో మందిని అడిగి ఒక  ఫోటో తీయమన్నాడు. చానా మంది తీసారు, ఎవరు తీసినా సీత కళ్ళల్లో దాగిన భయం రావడం లేదు. ఆయనకు కావాల్సింది సీతకు కేవలం రావణుడు నుంచి రక్షణ కోసం కాదు. పోలవరం మూలంగా కోల్పోతున్న సర్వస్వం ఆమె కళ్ళల్లో చూసాడు. ఒక సామూహిక దుఖం ఆమె కళ్ళలో కనుగొన్నాడు. వందలాదిగా గొడ్డూ గోడా అదృశ్యం అవుతుంటే వాళ్ళందరి సామూహిక దుఖాలు  ఆమె కళ్ళలో వెతికాడు.కానీ ఆయన కోరుకున్నట్లుగా ఫోటో దొరకలేదు.

ఏదో ఓక్ వెబ్సైటు లో చివరికి  వెబ్సైటులో వంశీ కార్తీక్ అనే అతను తీసిన  ఫోటో తీసుకొన్నాడు . ఇప్పుడు ముంపు మూలంగా పోతున్న సీతారావుని  పర్ణశాల కోసం కాకుండా దాని చుట్టూ ఉన్న అవాసాల కోసం ఏడవాలి. అందుకే ఒరే  రావుడూ ఇలా రారా మట్టి మరణ వాగ్మూలం విను, దమ్మక్క పెడుతున్న శాపనార్ధాలు వినరా విను” అని సీతతో రావుడికి వేడుకోలు చెప్పించాడు . పర్ణశాల లో మిగిలిన సీతా రావణుల బొమ్మలు అవి కేవలం బొమ్మ లేనా వాటి చుట్టూ మిగిలిన ఎట్టి మనుషులు కోల్పోతున్న ఆనవాళ్ళు , విరిగిన కళలు.అలంకార ప్రాయంగా మిగిలిపోతున్న ఎద్దుకొమ్ములు, వెదురు బుట్టలూ,జనావాసాల్లో అలంకరణ కోసం మిగిలిన ఆదిమ కళల ఆనవాళ్ళు. ఎవరయినా పాపికొండల విహార యాత్రకు వస్తే “గుడ్డి నాయాల, చెవిటి నా కొడకా అవి నీళ్ళు కాదురా కన్నీళ్లు కోట్ల క్యూసెక్కుల కన్నీళ్లు” ధైర్యం ఉందా మనకి అరుణ్ లా ఆలోచించడానికి? ఆయన చేసే ప్రతి పనిలో ఇంకా ఏదో మిగిలిపోయిన బాధ్యత. ఒక కొనసాగింపు కోసం నిరీక్షణ. అవును అరుణ్ తన పుస్తకానికి కవర్ పేజీ అట్ట కోసం  ఎన్నెన్ని లోతయిన విషయాలు ఆలోచించాడు.

ఏడాది కింద మువ్వా సార్ వాళ్ళ అమ్మానాన్న సాహిత్య పురస్కారం కోసం ఖమ్మం లో మీటింగ్. రాష్ట్ర వ్యాప్తంగా కవులంతా ఖమ్మం లోనే . మువ్వా సర్ మీటింగ్ అయినా అది అరుణ్ సాగర్ మీటింగ్ లాగానే చేసాడు .ఒక తమ్ముడికోసం అన్న చేసిన మీటింగ్.  వేలాది మంది కూర్చొనే చోటు లేక బయట ఏర్పాటు చేసిన తెరల మీద అరుణ సాగర్ ప్రసంగం. గోరటిపాట  రాష్ట్రంలో పేరుమోసిన కవుల తోబాటు, అప్పుడే కళ్ళు తెరిచిన కవికుంకల దాకా అంతా అక్కడే అదో కోలాహలం. మీటింగ్ అయ్యాక ఖమ్మం శివారులో ఒక రిసార్ట్ లో పార్టీ. గడ్డ కట్టే చలి,ఆ రాత్రి క్యాంపు ఫైర్ వేసారు. రాజేసిన నెగడులో రవ్వలు ఎగజిమ్ముతున్నాయి. ఎవరి చేతిలో ఏముందో వెచ్చటి ద్రావకం ఒక్కొక్కరి  గొంతులో జారుతోంది. ఎగిసి పడుతున్న  మంటల ముందు ఏదో ఆలోచిస్తూ అరుణ్. ఒంటరి ఊపిరితిత్తు ఆయన లోపలి ఎగసే ప్రశ్నలు, తడబడుతున్న హృదయ కవాటాలు, మొరాయిస్తున్న శ్వాస. చీకటి మధ్యలో మంటలు, తెనాలి పద్య నాటక మిత్రుల హరిచంద్ర పాటలు గోరటి   తో జుగల్బందీ . అంతా అవధులు లేని ఆనందం లో అక్కడ కేవలం ఒక్క మనిషి లో విషాదం.అదే అరుణ్ ఆయన  ఆలోచనలు. తరిగి పోతున్న నిముషాలు. ఒక్క్కొక్కటి మాయం అవుతూ ఆయన ఆయుషు తినేస్తున్నట్లు కానీ నాకు తెలుసు ఆయన మందగించిన చూపు, తడబడుతున్న శ్వాస. కోల్పోతున్న ప్రతి నిముషంకు అర్ధవంతం అయిన ముగింపు ఇవ్వాలని తపన, దగ్గరి వాళ్ళతో ఆయన బ్రతికిన క్షణాలు అన్నీ బోనస్ గా దొరికినవి అని. ఆ మిగిలిన  క్షణాలు అమూల్యమైనవి అనీ.తాను మొదలుపెట్టిన ప్రయాణం అర్దాంతరంగా ఆగడం ఇష్టం లేదు. ఆయనకు తెలుసు కాలం ఆయనని తరుముతూ ఉందని.

ఒక సారి లోయపల్లి అని ఒక ఊరు పోయాం . ఆ ఊరిలో ఒక చిరు ఉద్యోగి ఆయన పనిచేసే చానెల్ లో అతనూ,  పూసలోల్లు అని ఒక సంచార కులం నుండి వచ్చిన అతని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. రాష్ట్రం మొత్తం ఆ కులం నుండి  పాత్రికేయ ప్రపంచంలో ఒకడే ఉన్నాడు.ఆ పేరు ఇప్పుడు పాత్రికేయ వృత్తిలో సుపరిచయం. ఇంటర్వ్యూ సమయం లో అతని గురించి తెలుసో లేదో కానీ పూసలు అమ్ముకొనే ఒక తల్లి తన కొడుకుని పాత్రికేయ ప్రపంచానికి అందించిది అది కేవలం అరుణ్ మాత్రమె చేయగలడు. అగొ వృత్తిలో ఇలాంటి మానవీయ విలువలు ఉంటాయా ?

మళ్ళీ ఏడాదికి ఖమ్మంలో క్రాంతి సర్ వాళ్ళ మీటింగ్ అదే సమూహం మీటింగ్ ప్రాంగణం అరుణ్ పేరుతో. వందలాదిగా తరలి వచ్చారు,ఒక్క నిముషం అరుణ్ కోసం నివాళి. మళ్ళీ చిమ్మ చీకట్లో రాజేసిన మంటలు అక్కడ కూడిన అందరిలో ఒక పేరు మిస్ అవడం.పోయిన సారి అందరం ఇక్కడే కలిసాం కదా. అంతా నిశబ్దంగా . అంతకు ముందు. వైజాగ్ జగతి-రామతీర్ధ పిలుపు. మువ్వా,ఖాదర్అన్నా,ప్రసాద మూర్తి,పవనన్న నేను హైదరాబాదు,భద్రాచలం,సుక్మా, కుంట,మీదుగా పాపికొండలు,పోలవరం,మారేడుమిల్లి,లంబసింగి, వైజాగ్ ప్రయాణం.ప్రతి మూలమలుపులో కోల్పోయిన క్షణాలు.ఆయన పుట్టిన పరిసరాలు, శబరి వంపులో తొలి యవ్వన జ్ఞాపకాలు.అరుణ్ కు లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం. ‘’నాగరిక’ సమాజానికి సుదూరంగా కాస్త ప్రేమను వెతుక్కొనే క్రమంలో తిరిగాడు. అరుణ్ కుటుంబం రాజకీయ విశ్వాసాలకోసం విస్తాపితులు అయ్యారు. పుట్టుక,చదువు,కొలువు,చివరి మజిలీ ఏ ఒక్కటీ స్థిరంగా లేని విస్తాపన ఆయనది. నాలుగడుగుల తన చిన్న కాబిన్ లో మానసిక ఉక్కపోతలో ఆయన రాసుకున్న వాక్యాలలో స్వాంతన పొందాడు.ఆ రాతల్లో  అంతరించి పోతున్న ఒక రేలపాట, ఆ పాట  మృత్యు సంగీతంగా మారుతున్న సమయం.  లక్షలాది ఆదివాసీల గుండె గొంతుకకు ఆయన వాక్యాలతో కాస్త దైర్య వచనం అయ్యాడు . మనలో ఎక్కడయినా  కడంచున కాస్తంత మనిషి తనం మిగిలి ఉంటె ఆ వాక్యాలు చదవి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. మాయం అయిపోతున్న మనిషి జ్ఞాపకాలు ఆయన వాక్యాలు. కుంట,చీదరి చంద్రయ్య,ఇరపా లక్ష్మి. అరుణ్ సాగర్ రచనల్లో కావ్యకన్యకలు అయ్యారు.జ్ఞాపకంగా మారిన చీదర చంద్రయ్య కోసం కీట్స్ తన మిత్రునికోసం రాసినట్లు.

khader

అరుణ్ చనిపోయి ఏడాది కూడా కాలేదు. అనుకున్నట్లుగా ఆయనపేర ఒక అవార్డు రూపకల్పన చేసిన మిత్రులు.  ఈ పుట్టిన రోజు ఆయన మిత్రుల సహకారంతో ప్రెస్ అకాడమి ఆయన పేర మూడు అవార్డులు,విశ్వం బాబాయ్ అరుణ్ సాగర్  సమగ్ర కవితా సంకలనంతో ఆయనకు నివాళి. మానవీయ విలువలతో పాత్రికేయ వ్రుత్తి లో ఉన్న వాళ్ళను వెతికారు అల్లం అన్న,రాజకుమార్ అన్న. మొదటి సారి ఖాదర్ అన్నకి ఇస్తున్నారని తెలిసింది.

ఒక మనిషి పుడతాడు పోతాడు. కానీ పోయే లోపు నిన్ను కన్ననేల చెర బడుతున్నప్పుడు కాస్తంత కన్ఫెషన్ అవసరం. కానీ అరుణ్ సాగర్ ఎకంగా కోల్పోతున్నరేల పాటకోసం మరణ వాగ్మూలం రాసుకుండు. ఒక మైదాన వాసి విస్తాపితుడిగా తాను పుట్టి పెరిగిన ప్రాదేశిక ప్రాంతాలు చరిత్ర గతిలో గతంగా మారబోతున్న సంక్షుభిత సమయం లో  ఎనభై అడుగుల లోతులో సమాధి కాబోతున్న మన ఆనవాళ్ళను  దూరంగా మన బిడ్డలకు  చూపించి “అగొ అక్కడే నీ తాతలు తండ్రులు ఒకప్పుడు ప్రాణం తో ఉన్న మనిషి జ్ఞాపకాలు  అని కడసారి మనకు చూపించి కనుమరుగు అయ్యాడు అరుణ్. లేదు నలుగురు కూడిన ప్రతిచోటా అరుణ్ ఉంటాడు.

*

 

 

 

ఒక విస్థాపితుడి స్వగతం

 

 

-గుర్రం సీతారాములు

~

gurramఅరుణ్ సాగర్ తెలుగు బుద్దిజీవుల్లో ఒక మర్యాదగల పాత్రికేయుడు. చూడడానికి అత్యాదునికునిగా కనిపించే అతను ఆరణాల అచ్చం ఆదివాసీ. అకస్మాత్ గా అయన గుండె పనిచేయడం ఆగింది. అరుణ్ తండ్రి  టి.వి.ఆర్ చంద్రం అంటే గోదావరీ నదీలోయ పరీవాహక ప్రాంతం లో, పోడుకోసం గూడుకోసం, తునికాకు రేటుకోసం జీవితం త్యాగం చేసిన ఒక నికార్సయిన, నిబద్దత కలిగిన సాధారణ కార్యకర్త . ఉమ్మడి కమ్యునిస్ట్ పార్టీ నుండి మార్క్సిస్ట్ పార్టీ దాకా బద్రాచలం ప్రాంత పార్టీ నిర్మాతల్లో ఒకడుగా ఆయన  తాను నడిచిన నేలంతా పోరాటాల విత్తనాలు చల్లి ప్రజల జ్ఞాపకాల్లో మిగిలే ఉన్నాడు.

ప్రపంచ  వ్యాప్తంగా భూమి ఇరుసుగా అనేక సాయుధ, విముక్తి పోరాటాలు జరిగినవి. అవి వలసవాదుల కబ్జానుంచి భూమిని విముక్తి చేసుకునే క్రమం లో, స్వతంత్రం ఒక మేడిపండు అని, అది కేవలం అది ఒక అధికార మార్పిడీ అని అనేక ప్రత్యామ్నాయ, అస్తిత్వ వాద ఉద్యమాలు నడిచాయి. ఆ క్రమం లో  అంతులేని రక్తపాతాలు  జరిగినవి. వీటేనక  టి.వి.ఆర్ చంద్రం తరం చేసిన త్యాగాలూ ఉన్నవి. బద్రాచలం, బస్తర్ నేలలు  దశాబ్దాల పోరు భూమిగా పోరాట వారసత్వాన్ని కలగన్నది, దాని పొరల్లో పేరుకు పోయిన రక్తపు మరకల తడి ఆరని చిత్తడి నేలలు అవి . ఒక నాడు మహోజ్వలంగా వెలిగిన స్థానిక సంచార జాతుల రాజ్యాలు, రాజులు వర్తమాన  పోరాటాల మూలంగా కనుమరుగు అయ్యాయి . ఆధునికత పేరుతో జరిగిన అభివృద్ధి కోట్లాది మంది అత్మగౌరవంగా బ్రతికిన నేలనుంచి విడదీయ బడుతున్నారు . ఇలా వలస పాలన నుంచి విముక్తి పొందిన అనేక దేశాలలో దాదాపు ఇరవై కోట్లకు పైగా విస్తాపనకు తాకిడికి చిద్రం అయ్యారు అని లెక్కలు చెబుతున్నాయి.ఇంత విద్వంశం జరుగుతున్నా ‘నాగరికతకు’ ఆవడ కారడవుల్లో నాగరికం అని పిలవబడుతున్న ప్రపంచానికి  వేల ఏళ్ళ దూరంలో, సెలయేటి నీరంత  ప్రశాంతంగా, తమదయిన, అవధులు లేని, ఆంక్షలు లేని, దోపిడీ, పీడన లేని అసలు రేపు ఏంటి ? స్వంత ఆస్తి ఏంటి ? అనే ఆధునిక భావనల గాలి సోకనంత స్వచ్చంగా బ్రతుకుతున్న కోట్లాది మంది గోదావరి పరీవాహక  ఒడ్డున ఉన్నారు.

తాళ్లూరి అరుణ్ సాగర్ ఉరఫ్ చంద్రం గారబ్బాయి నాలుగున్నర దశబ్దాల కింద కొంట అనే చిన్న గిరిజన గ్రామం లో  కుడివైపు సీలేరు (ఆంధ్రప్రదేశ్ ) ఎడమవైపు శబరి (చత్తీష్ ఘడ్) దాని నడుమ కాసింత నేల  ఒడిసా లో బాగం అయిన ఆయన రాసుకున్నట్లు ‘ సరిగ్గా కొమ్ముబూర లా వంపుతిరిగిన చోట’ తన ఇంటి కిటికీ లోంచి  శబరీ గోదారీ సంగమస్థలి లో  కడంచున, ఆధునికత, పురాస్మ్రుతుల జ్ఞాపకాల సంగర్షణ ల మధ్య, భారత కల్లోల విస్పోటనల, ఖాకీ పద ఘట్టనల , ప్రత్యామ్నాయ భావ స్రవంతుల మధ్య ఆయన బాల్యం పురుడు పోసుకుంది. అలా కడగొట్టు నాగరికత విలసిల్లిన ప్రాంతాన అయన కవిత్వ మూలాలు ఉన్నాయి. అక్కడే ఒక మైదాన వాసి- మూలవాసీ నిర్వాశితుడు అవడం ఒక్కటి కాదని అన్నాడు.

అరుణ్ సాగర్  కవిత్వం లో కాసింత ఆంత్రోపాలజీ, నల్లజాతీ సంగీత సొబగు, అత్యాధునికమైన జీవితం లో ఒక మెట్రోపాలిటన్ జీవితం లో ఉన్న సందిగ్ధత, ఇన్ని వైరుధ్యాలు ఉన్నా త్యాగానికి  లింగ వివక్ష వద్దనీ తండ్రుల త్యాగాలు కొనియాడుతూ ప్రతి కొడుకూ తన తండ్రి జన్యు విశేషణగా, ఆయన కొనసాగింపుగా చేసిన అభివ్యక్తి తెలుగు సాహిత్య లోకాన ఒక కుదుపు. ‘పత్తి కాయలా గుండె పగిలిపోతుంటే పురుగు మందు తాగిన’ తండ్రుల గుండె కోతను ఆయన  లాగా చెప్పే సాహసం ఎవరూ చేయలేదు. అరుణ్ సాగర్ పుట్టిన పెరిగిన నెలలో ఉన్న ఆదిమ జాతుల  నడకకు ఒక లయుంది, ప్రకృతిలో బాగం అయి పరవశం తో పాడుకున్న రేల పాటలు గానం చేసుకున్న  గొంతుకు ఒక శ్రుతి ఉంది.  ఒక సామూహిక బృందగానం ఉంది. మట్టితో పెనవేసుకున్న వేల ఏళ్ళ జ్ఞాపకాల బరువూ ఉంది. ఒకప్పటి రాజులు ఒకప్పటి మూలవాసులు , ఇప్పటికీ గుడి బడికి దూరం అయ్యి గుడ్డి దీపాల వెలుగుల్లో కునారిల్లుతున్నారు. ఇప్పుడు  బస్తర్, నల్లమల లో గోండు, కోలం జాతులు  చిన్న మాత్రకు కూడా నోచుకోకుండా దోమకాటుకు, పాముకాటుకు బలవుతూ ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు. ఇప్పడు అడివి మనాదితో  మంచం ఎక్కింది. నాగరికతకు దూరం అయినా నమ్మిన నేల కపాడుద్ది అనే బరోసా తో పోడు తో ఏటికి ఏతం పెట్టి ఎట్టి మనుషుల నుండి భూమిని గుంజుకునే ఆధునిక రాజ్యాన్ని ఎదిరించ లేక పోతున్న బడుగు జీవులకు అరుణ్ సాగర్ ధైర్య వచనం అయ్యాడు.

అరుణ్ సాగర్ పుట్టిన ఊరులో కుమ్మూరు ఇరపా సీతక్క తన నుదుటున ముద్దేట్టి ‘కలెట్టరయ్’ రావాలి బిడ్డా అని దీవించింది ఆమె ఆకాంక్ష వినడానికి బాగానే ఉన్నా, ఆయన దృష్టిలో అది కేవలం అధికార దర్పానికి తప్ప కడగొట్టు జీవితం లో వెలుగును నింపదనీ, ‘కలెట్టరయ్’ అనపకాయ బుర్రలూ వెదురునార విల్లులూ, ఎద్దు పుర్రెలో గుదిగుచ్చిన నెమలి పించాలు ఇంట్లో అలంకరణ కు పెట్టుకోవడం తప్పా వాళ్ళ తలరాతలు మార్చని అభివృద్దిని ఈసడించుకున్న అరుణ్ పాత్రికేయుడిగా వాళ్ళకు ఏదన్నా చేయాలి అని ఎన్ని కలలు కన్నాడో. స్వతంత్రం, అభివృద్ధి, స్వయం ప్రతిపత్తి లాంటి లాబొరేటరీ లో తయారు చేయబడుతున్న ఆధునిక పదజాలం ఆ అలగా జనాల విముక్తికి ఏనాటికీ ఉపయోగ పడదనీ  ఆయనకు తెలుసు. ‘సమీకృత అభివృద్ధి-సాంస్కృతిక పృధక్కరణ-సామాజిక సమగ్రత’ వినడానికి గొప్పగా ఉన్నా అవన్నీ డొల్ల పదాలనీ ఎరిగిన వాడు , ఆరున్నర దశాబ్దాల అభివృద్ధి గిరిజన సంక్షేమ సూత్రాలూ ‘అప్లయిడ్ ఆంత్రోపాలజీ పరిశోదనలో వాడేసుకుని అలగా జనాల బతుకుల్ని మాత్రం నట్టనడి జలాశయాల్లో ముంచేస్తారా, అని అక్రోశించడం కూడా తెలుసు.ఇంత లోతయిన జీవితం ఆచరణ ఉన్న కవి నాడి అంచనా వేయడం లో తెలుగు మేధో సమాజం మరుగుజ్జు తనాన్ని నిరూపించు కుంది. కవితా వాకిళ్ళలో ఇమడని ఆయన వచనం చానా ఆలస్యం గా కవిత్వం గా చర్చించ బడ్డది. తండ్రుల వ్యధలూ సీదర సేంద్రయ్య లు అర్దంతర నిష్క్రమనలూ, ఆధునిక పద బందాల్లో తెలుగు కవిత్వానికి కాసింత ఆసరా అయ్యాయి.

చివరిరోజుల్లో అయన జీవితం అయ్యలనుండి వచ్చిన చైతన్యం ఎక్కిరించిన వైనాన్ని మౌనంగా స్వీకరించాడు. అది ఆయన్ను ఎంత బాదపెట్టిందో ఆయనకు దగ్గరగా ఉన్న మిత్రులకు నాకన్నా బాగా తెలుసు. సిరలు ధమనులు పగిలి నెత్తురు చిమ్మెంతగా’ విలవిల్లాడు అతను. ఆయన జేవితం లో అదో విషాదం. ఈ విషాదాల వికట్ట హాసాల ఉక్క పోతల మధ్య ఇమడలేని ఆయన తన మృత్యు శాసనాన్ని ముందే రాసుకుండు.

ఒక మనిషి పుడతాడు పోతాడు. కానీ పోయే లోపు నిన్నుకన్న నేల చెర బడుతున్నప్పుడు కాస్తంత కన్ఫెషన్ అవసరం. కానీ అరుణ్ సాగర్ ఎకంగా కోల్పోతున్నరేల పాటకోసం మరణ వాగ్మూలం రాసుకుండు. నేలకోసం , పలవరిస్తూ, మళ్ళీ ఒక సారి ఎనభై అడుగుల లోతులో సమాధి కాబోతున్న తన ఆనవాళ్ళు దూరంగా తన బిడ్డకు చూపించి అగొ అక్కడే నీ తాతలు తండ్రులు ఒకప్పుడు ప్రాణం తో ఉన్న మనిషి జ్ఞాపకం అని కడసారి చూపిస్తూ, మనందరి సామూహిక వైపల్యాల మీద అల్లుకున్నచిన్న పిచ్చిక గూడు మ్యూజిక్ డైస్ లా చిట్టచివరి అగ్రహ ప్రకటన చేసాడు .

బహుశా తెలుగు కవిత్వ చరిత్రలో ఒక వలపోతను మరణ వాంగ్మూలం గా రాసుకున్నది అయన ఒక్కడే కావొచ్చు. జీవిక కోసం కన్న ఊరును వదిలి రావాల్సి వచ్చినప్పటికీ అయనను  ప్రతి క్షణం బాల్యపు గుర్తులు వెంటాడాయి. అందుకే తప్పించుకోలేక కవిత రాసి దుఖాన్ని కడిగేసుకొనే ప్రయత్నం చేయలేదు. కొట్టుకొచ్చిన శవాలమీద నాలుగు వాక్యాలు ఏరుకొనే బ్రతకనేర్చిన తనాన్ని, కనీసం ఒక లాఠీ వైపు తేరిపార చూడలేని దౌర్భాగ్యాన్ని ఆయన చిన్న గుండె తట్టుకోలేక పోయింది. ఆచరణలో ఆయన నిజంగా నిలువెత్తు నిదర్శనం. ఆయన పుట్టిన కుటుంబంకు ఉన్న నిబద్దత, త్యాగమయ జీవితం కావొచ్చు. పెరిగిన నేలలో ఉన్న పోరాటాల వారసత్వం కావొచ్చు, వృత్తిలో, ప్రవృత్తిలో, స్నేహం లో, సహచర్యం లో అయన చుట్టూ ప్రాణంఇచ్చే స్నేహ సంపద కావొచ్చు, ఇవన్నీ ఆయన్ని పరిపూర్ణ మానవునిగా మార్చాయి. మార్కెట్ శాసించే  మానవ విలువలను తూకంలో వేసి బాగిస్తుంటే ఆ ఒరవడిలో కొట్టుకొని పోకుండా, తానెక్కడ ఉన్నా తన అంతరంగం లో ఒక వెతుకులాట తో ఉండేవాడు. నిజానికి  వేసవికాలం కాలం లో గోదావరిలా పైకి కనిపించే అయన లోలోపల వానాకాలంలో గోదారి వరద ఉదృతిలా అలజడి తో అల్లాడిపోయే వాడు . అలాంటి గోదావరి ప్రవాహానికి అడ్డంగా కడుతున్న ‘గాలికట్ట’ అయన గుండె కవాటాలను ఎంత ఉక్కిరిబిక్కిరి చేసిందో. అందుకే కాసింత విశ్రాంతి కోరుకుంది. ఆ  విశ్రాంతి శాశ్వతంగా అరుణ్ సాగర్ ని మన నుండి దూరం చేసింది.

దశాబ్దాల పోరాటాల తర్వాత మిగిలిన తెలంగాణా పంపకాల్లో అయనకు తెలియ కుండానే ఆయన నడయాడిన నేల మారకపు విలువగా మారడం మూలాన ఎంత క్షోభను అనుభవించాడో. ఒక నాగరికతను బలవంతంగా బట్వాడా చేయడాన్ని ఎంతగా నిరసించాడో. బహుశా  నిర్వాశిత సమష్య ను అత్యంత మానవీయంగా ఆయన లాగా ఎవరూ రాయలేదు. ‘కంకర తేలిన పదును, ఎర్ర మట్టి చదును, పెంచి పెద్ద జేసిన వీధి, వంటినిండా పాదముద్రలు వేసుకొని నడిచిన జాడలను మరవని వాడు’.      అందుకే తన తాతల తండ్రుల వారసత్వంగా వచ్చిన పోరాడుతున్న ఆకలి కేకల కోసం కనీసం గొంతయినా కలపక పోవడం నేరం అని భావించాడు. కవిత ఆచరణకు సాటి రాదు అని తెలిసీ ఒక నినాద రచనగా ఒక విధాన అనుసరణగా  కనుమరుగు అవుతున్న రేల పాటకోసం నినాదం అయ్యాడు.

పాత్రికేయ ప్రపంచం లో అరుణ్ సాగర్ జీవితాన్ని ఒక నమూనాగా చూడాలి. తన నాలుగున్నర దశాబ్దాల మొత్తం జీవితం లో రెండు దశాబ్దాల పాత్రికేయ వృత్తి, విభిన్న మాధ్యమాలు, విభిన్న సంస్కృతుల కలబోత.  వృత్తిలో అంత నిబద్దత నమ్మిన విలువలకోసం బ్రతకడం కోసం శరీరాన్ని ప్రయోగ శాల మార్చుకొని, శస్త్రచికిత్స తో, వడలిన శరీరంతో ఎక్కడికి పోయినా తనతో ఒక ‘మినీ డిస్పెస్సరి’ లా ఉండేది ఆయన జీవితం. అరుణ్ జీవించింది చానా తక్కువ కాలమే అయినప్పటికీ ఇంత మందికి ఇంత దుఖాన్ని మిగిల్చి మబ్బులా మాయం అయ్యాడు. అరుణ్ సాగర్ ఈ కల్లోలాలను మనసారా అక్షరీకరించాడు. మన అందరం అపరాధ రుసుము ఎప్పటికయినా చెల్లించాలి అని ఒక వార్నింగ్ ఇచ్చిమరీ పోయాడు. అరుణ్ ! మల్లెప్పుడు కనబడతావ్  బాస్ ?  నీతో మళ్ళీ లోయపల్లి, భద్రాచలం, చట్టి, కుంట, మారేడు మిల్లి, లంబసింగి, విశాక ఒడ్డు తిరగాలని ఉంది. అయినా నా పిచ్చిగానీ కొంత కాలానికి అవీ కాలగర్భంలో కనుమరుగు కాబోతున్నాయి. అవును మనందరి సామూహిక వైఫల్యాల సాక్షిగా వాగు కొమ్ముబూరలా వంపు తిరిగిన చోటు నీ పాదముద్రలూ, దమ్మక్క రోదనలాగా కనుమరుగు కాబోతున్నాయ్. కానీ నువ్విచ్చిన స్పూర్తీ కవిత్వమూ బ్రతికే ఉంటాయి అన్నా ..

*