జాయపసేనాని

OLYMPUS DIGITAL CAMERA

 

దృశ్యం  : 3

 

(క్రీ.శ. 1225 జాయప వయస్సు 36 సంవత్సరములు. గుర్రపు డెక్కల, సైన్యసందోహధ్వని..వేయిస్థంబాల దేవాలయంలోకి గణపతిదేవుడు, జాయపనేనాని, గుండనామాత్యులు, రాజనర్తకి మాళవికాదేవి..ప్రవేశం…గర్భగుడిలోని రుద్రేశ్వరాలయంలో శివస్తుతితో కూడిన  మంత్రోచ్ఛారణ…మంగళకర ధ్వని…)

వందిమాగధులు :    జయహో…విజయహో..రాజాధిరాజా…రాజమార్తాండ…సకల దేశ ప్రతిష్ఠాపనాచార్య…కాకతి రాజ్యభార దౌరేయ శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తి…జయహో…విజయహో…

ఆలయ ప్రధాన అర్చకులు : స్వాగతము… మహాచక్రవర్తులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులుం గారికి స్వాగతం..సుస్వాగతం.

గ.ప.దే : రుద్రాలయ ప్రధాన అర్చకులుగారికి అభివాదములు..ఖడ్గాన్ని ధరించిన హస్తంతోనే నాట్యాభినయం చేసి కత్తినీ, కలాన్నీ ఒకే చేత్తో సమర్థవంతంగా ప్రయోగించి ఖ్యాతివంతుడు కావడం మన సేనానీ, గజసైన్య సాహిణి, నాట్యకోవిదుడు, వీరాగ్రేసరుడు, అరివీర భయంకరుడైన జాయపసేనానికే సాధ్యమైనది. వారు గత నాల్గు వత్సరములుగా సృజించిన కావ్యశాస్త్రము…’గీత రత్నావళి’ మహాగ్రంథము ఈనాటికి సంపూర్ణమైనది. దీనిని శివసాన్నిధ్యంలో పరమేశ్వరునికి అంకితమొనర్చుటకై మా రాక..తగువిధముగా ఆ గ్రంథసమర్చనకు ఏర్పాటు చేయండి. జాయనా..పట్టు వస్త్రములో ఒదిగిన ఆ ‘గీత రత్నావళి’ గ్రంథమును దైవసన్నిధిలో సమర్పించి ప్రజాపరం చేయండి..

జాయన : ఆజ్ఞ మహాప్రభూ…గణపతి దేవులుంగారి శుభాశీస్సులతో రూపుదిద్దుకున్న ఈ ‘గీత రత్నావళి’ గ్రంథ సృజనకు కారకులు, పోషకులు, ప్రేరకులు అన్నియును మహాప్రభువులే. వారికి కృతజ్ఞతాభివందన చందనములు అర్పించుకుంటూ..,

ప్ర.అ.: (గ్రంథమును పట్టుబట్టతో సహా అందుకుంటూ…) మహాప్రసాదం…ఈ అక్షరామృత నిధిని శివ కృపార్థం సమర్పించే మహాభాగ్యం మాకు లభించడం మా సుకృతం..ఓం రుద్రాయ…(రుద్రస్తుతి ప్రారంభం..ఆలయం గంటలు…అభిషేకం..సంరంభం… శంఖధ్వని..)

గ.దే : జాయనా…మాపెద్ద తండ్రిగారైన రుద్రదేవుడు 1162 ప్రాంతంలో కాకతీయ స్వతంత్ర సామ్రాజ్యమును ప్రకటించిన సందర్భంలో కట్టించిన త్రికూటాలయమే ఈ సహస్ర స్తంభాలయం. ఇక్కడ రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యదేవుడు కొలువై ఉన్నారు. విష్ణు ఆలయమునకు అద్భుతంగా అదిగో అక్కడే ఉత్తరాభిముఖముగా ఆసీనుడై ఉన్న నంది ”విష్ణునంది”. సర్వాంగ స్వర్ణాభరణ శోభితమై బలిష్టుడైన బసవేశ్వరుడు పొంగివచ్చిన రక్తనాళాలతో సహా సజీవ మహాసౌందర్యంతో మనను ఎప్పడూ పిలుస్తూంటాడు. నంది వెనుక ఉన్నది రంగ మండపము. నందీశ్వరుని అవతారమైన వీరభద్రునికి ప్రతీకగా, రుద్రుడు మన ఇలవేల్పుగా సిద్ధపరుస్తూ ఈ సహస్ర స్తంభాలయములో చెక్కిన ప్రతి శిల్పం మన సమకాలికులైన చాళుక్యుల, హొయసళుల శిల్పరీతులకు భిన్నమై ఉత్తమోత్తమమై , ఉన్నత  ప్రమా ణములతో విరాజిల్లుతున్నది.

గుండనా : సృజనకారులెవరైనా ఎప్పుడూ తన కృతిచేత, విలక్షణ శైలిచేత ప్రత్యేకంగా పరిగణించబడాలి. కాకతీయుల శిల్పం, నృత్యం, గీతం, వాద్యం…అన్నీ విశిష్టమైనవే. కాకతీయ శిల్పంలోని ప్రధాన లక్షణం గతి శీలత. ఇందులోని ప్రతి మూర్తీ ప్రాణ లయతో ప్రకంపిస్తున్నట్టు గోచరిస్తుంది. (అప్పుడే..రుద్రాభిషేకంతో పాటు…ఉచ్చైస్వరంలో పంచమహావాద్యాలు హోరెత్తాయి). మన ప్రత్యేకత..పంచ మహాశబ్దాలు…అవి అనంత విజయం, పౌండ్రము, దేవ దత్తం, సుఘోష, మణి పుష్పకం…మరియు పంచమహావాద్యాలు అవి శృంగము, శంఖము, మృదంగము, భేరి మరియు ఘనము. ఇవిగాక నిస్సహణము, కాంస్య తాళములు, కాహళము, మహామద్దెల…యివన్నీ శబ్ద గంభీరతను తురీయ స్థాయికి చేర్చి రుద్ర  తాండవ రౌద్రతను హెచ్చింపచేస్తాయి. కాకతీయ జీవనం ప్రధానంగా వీర రసభరిత, శౌర్య సమ్మిళితం.

మాళవిక : కాకతీయ నృత్యము కూడా అత్యంతోత్తమమైనది. రంగ మంటప నాట్యస్థలిపై ప్రవేశించి..త్రిభంగిమలో నిల్చి, అంగ సంచలనం చేస్తూ భ్రూ లతలను నర్తింపచేస్తూ, శిరః కంపనము అంగుళీ స్ఫోటనము చేస్తూ వంజళము, ఢాళము, వళి, దిరువు, బాగు, వాహిణి, సాళి, బయగతి, సుగతి, బహుగతి అనే వివిధ గతులను, భంగిమలను అభినయించడం మన కాకతీయుల విలక్షణ దేశీ నృత్యరీతి. యిది సకల జనరంజకమైనది, పరవశ ప్రధానమైనది.

ప్రధాన అర్చకుడు : శివానుగ్రహమునకు ప్రాత్రమైన ఈ ‘గీతరత్నావళి’ గ్రంథం ఆచంద్రార్థం బుధజనరంజకంగా వర్థిల్లుగాక.. స్వీకరించండి.

(జాయన పట్టు దస్త్రమును స్వీకరించి గణపతిదేవుని చేతుల్లో ఉంచి ముందు తలవంచాడు)

గ.దే : మహేశ్వరాశీర్వాద ప్రాప్తిరస్తు..ఈరోజు ఎంతో సుదినము. తెలుగుజాతికి ‘గీతరత్నావళి’ అనే సంగీత, సాహిత్య సమ్మేళనాల ఆత్మరహస్యాలను విప్పిచెప్పగల ఒక ప్రామాణిక గ్రంథము లభించినది. ఈ ఘట్టము చరిత్రలో శాశ్వతమై నిలిచిపోతుంది.

మాళవిక : మహాప్రభువులకొక విన్నపము.

గ.దే.: తెలియజేయుము మాళవికా…మా రాజనర్తికి ఊరికే కల్పించుకోదు

మాళవిక : సూర్యుడొక్కడే ఐనా చీకట్లను చీల్చగల వెలుగులనూ, ప్రాణకోటిని మేల్కొలిపి సృష్టిని జీవన్వంతం చేయగల ఉష్ణకిరణ సందోహాలనూ, ప్రచలిత మార్మిక జీవశక్తినీ ప్రదానం చేసినట్టు.. యిన్నాళ్ళూ నృత్యశాస్త్ర అధ్యయనంలో జాయపసేనానితో సహకరిస్తూ సంగతిస్తున్న నేను అతని యందు నిబిడీకృతమై ఉన్న యితర సృజన రంగాల కళా విశారదకతనూ గమనిస్తున్నాను. ఆయన నృత్య, వాయిద్య రంగాలతోనే కాకుండా కరి గణాధ్యక్షుడుగా ఉంటూనే యుద్ధ తంత్రజ్ఞతతో అనేక విజయాలనుకూడా కాకతీయ సామ్రాట్టులకు సంపాదించినారు కదా…అందుకని..

గ.దే : భళా..మాకర్థమైనది…సరిగ్గా మా మనసులో ఎప్పటినుండో నిప్పుకణికవలె మెరుస్తున్న మహదాలోచననే మాళవిక గ్రహించి వ్యక్తీకరించినది..భళా…జాయనా..,

జాయన : మహాప్రభూ..

గ.దే : ఎప్పుడైనా ప్రతిభాశీలి యొక్క  ప్రజ్ఞ స్వయంగా అతనికి పూర్తిగా తెలియదు. నీలోని బహుముఖ సమర్థత నీకంటే మాకే ఎక్కువ తెలియును. గత పదేళ్లుగా నాట్యాచార్య గుండనామాత్యుల వద్ద నీవు పొందుతున్న నృత్య శిక్షణ, మేము అప్పగించిన అనేక దండయాత్రల బాధ్యులను అద్భుతముగా నిర్వర్తించి మాకు సంప్రాప్తింపచేసిన విజయపరంపర..నీ వాద్య నిర్వహణ పద్ధతి…వీటన్నింటినీ మేము ప్రత్యేకముగా, సునిశితముగా ఎప్పటినుండో పరిశీలిస్తూనే ఉన్నాము…యిప్పుడిక ఒక స్ఫుట నిర్ణయానికొచ్చి నిన్ను ఆదేశిస్తున్నాము. భవిష్యత్తులో నీవు నీ సకల సృజనాత్మకశక్తులన్నింటినీ ప్రోదిచేసుకుని సరస్వతీ కటాక్షముతో మూడు ప్రధాన గ్రంథములను సృజియించవలె. అవి…’నృత్య రత్నావళి’, ‘వాద్య రత్నావళి’ మరియు సకల యుద్దతంత్ర రహస్యాలను, వ్యూహాలనూ, సంపుటీకరించే ‘యుద్ధ రత్నావళి’…ఊఁ.. ఏమందువు జాయనా…

గుండ : యిది చక్రవర్తుల సముచితాదేశము…భళా.

మాళవిక : మహాచక్రవర్తుల ఈ ఆదేశముతో తెలుగునేల చతుర్వేదాల వంటి నాలుగు గ్రంథ రత్నాలతో కాంతివంతమై సంపన్నమవుతుంది మహాప్రభూ..

గ.ప : విన్నావు కదా జాయనా…బుధజన గుప్తాభిప్రాయము…మా అందరి ఆశీస్సులు నిరంతరం నీకుంటాయి. ఈ అపూర్వ గ్రంథాల రచనకు మా సంపూర్ణ సహకారం ఎల్లవేళలా నీకుంటుంది అంగీకరించి అడుగు ముందుకువేయి.

జాయన : మహాప్రసాదం మహాప్రభూ..నా జన్మ తరించినది. మీ అభిమానమునకు పాత్రుడనై, కాకతీయ సామ్రాజ్య బుధజన ఆశీస్సులను పొందగలిగి చరితార్థుడనైన నేను అవశ్యము మీ ఆదేశమును శిరసావహిస్తాను. నాకు కూడా ఈ విభిన్న రంగములందు సమగ్రాధ్యయనము నిర్వహించి నూతన ప్రమాణాల పరికల్పనలతో గ్రంథరచన చేయవలెననే ఉన్నది..తమరి ఆజ్ఞ.

గ.దే.: ప్రధాన అర్చకులుంగారూ.. ఏదీ.. ఆ రుద్రలింగంపై ఉన్న ఆ పూలమాలను మాకందించండి. (ప్ర.అ. లావుపాటి పూమాలను గ.దే. న కందిస్తాడు. గ.ప దేవుడు తన వేలికున్న వజ్రపుటుంగరాన్ని తీసి.)

గ.దే.: జాయనా… యిటురా.. (అని.. దగ్గరకువచ్చిన తర్వాత)..యిదిగో ఈ మా ఆదేశపాలన శుభసందర్భాన్ని పురస్కరించుకుని మా ‘వజ్రపు అంగుళీయ ప్రదానం’.. శివాశీస్సులకు చిహ్నంగా ఈ గులాబీపూమాల. విజయోస్తు.. శీఘ్రమే కలాన్ని కత్తివలె ఝళిపించి  అక్షరాలను కురిపించు.

(చుట్టూ  చప్పట్లు.. శంఖ ధ్వని.. మంగళారావములు.. ఎట్సెట్రా)

జాయన : ధన్యోస్మి ప్రభూ.. ధన్మోస్మి…

దృశ్యం : 4

 

(1240 సం||. జాయప వయస్సు 50 సం.. తామ్రపురి ఆస్థానం (యిప్పటి చేబ్రోలు).గణపతిదేవుడు తన యిద్దరు సతులతో సందర్శన..జాయపసేనాని రాజ్యము..)

వందిమాగధులు : మహారాజాధిరాజ.. మహామండలేశ్వర..పరమమహేశ్వర.. శ్రీ స్వయంభూనాథదేవ దివ్యపాద పద్మారాధక.. ప్రత్యక్ష ప్రమథగణావతార.. లాడచోటకటక చూరకార.. శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తి.. జయహో..విజయహో…

(గణపతి దేవుడు పేరాంబ, నారాంబలతో సహా అంతఃపుర ప్రవేశం.. జాయపసేనాని సకుటుంబంగా.. ఎదురొచ్చి బావగారిని ఆలింగనము చేసుకుని.. ప్రసన్న వదనంతో..)

జాయన : మహాచక్రవర్తలకు మా హృదయపూర్వక స్వాగతము.. బావగారూ, కాకతీయ మహాసామ్రాజ్యంలో ఎల్లరూ సుఖులే కదా.. రాజపరివార, మహామంత్రిగణ, సకలసైన్య వీరసమూహాలూ, ప్రజాశ్రేణులన్నీ సౌఖ్యంగా వర్థిల్లుతున్నాయిగదా..,

గ.దే.: ఎల్లరూ సుఖులే జాయపసేనానీ.. వైరి గోధూమ ఘరట్టా.. మా మహామాత్యులూ, దండనాధులూ, సకలసేనాధిపతిలూ, శ్రీమన్మహాసామంత నామిరెడ్డీ.. నీ స్థానంలో నియమితులైన గజసాహిణి బొల్లమరాజూ..మీదుమిక్కిలి మా సువిశాల కాకతీ సామ్రాజ్యవాసులైన లక్షలమంది ప్రజాశ్రేణులన్నీ సౌభాగ్యముతో అలరారుతున్నాయి.

జాయన : ఈ రత్నఖచిత ఆసనాన్నధిష్టించండి మహాప్రభూ. సోదరీ పేరాంబా, నారాంబా.. అంతా క్షేమమేకదా.., సుఖాసీనులుకండి.

గ.దే.: దాదాపు ఇరవది ఐదు సంవత్సరముల క్రితం రాజ్యవిస్తరణలో భాగంగా అనేక యుద్ధములను గెలుచు బాధ్యతను మీకప్పగించగా.. జాయపసేనానీ, యుద్ధతంత్ర విశారదుడవూ, సకలకళాప్రవీణుడవూ, తంత్ర విద్యా నిపుణుడవూ.. ప్రత్యేకించి గజసైన్య నిర్వహణా ధురీణుడవూ ఐన నీవు సాధించిన విజయముల పరంపర తర్వాత మేము నిన్ను ఈ తామ్రపురికి సామంతులను చేసి పట్టముగట్టితిమి. మీరుకూడా ప్రజా సుభిక్షముగా పరిపాలను నొనరిస్తూ ఉత్తర రాజ్య నాయకుడగు ఇందులూరి సోమమంత్రినీ, రాచెర్ల రుద్రసేనాపతినీ తోడుగా చేసుకుని గజసైన్యమధికముగా గల కళింగ రాజులనోడించి కాకతీయ మహాసామ్రాజ్య పరిధిని అటు కళింగమునుండి యిటు నెల్లూరు వరకు విస్తరించి మాకు మహానందమును కల్గించితివి. ఈ మహాముదమును నీతో పంచుకొనుటకే యిప్పుడు నీవద్దకు మీ సోదరీమణులతో సహా మా రాక. కొద్దిరోజులు నీ అతిథిగా మేము విశ్రమించెదము.

జాయన : మహాభాగ్యము.. గణపతిదేవులకు ఆతిథ్యమొసగుటకంటే, మా  తోబుట్టువులైన పట్టపురాణుల సమక్షములో గడుపుటకంటే మాకు కృతార్థమేమున్నది.

గణ.దే.: జాయపా.. ఈ డెబ్బదిఏండ్ల సుదీర్ఘ జీవితకాలమంతయూ యుద్ధతంత్రములందూ, రాజ్యవిస్తరణయందూ, ప్రజాహితపాలనా ప్రణాళికా రచనయందూ, రక్షణ తంత్రములందూ అహర్నిశలూ శ్రమించి శ్రమించి అలిసితిమి. యిక మా మనము కించిత్తు విశ్రాంతిని కాంక్షిస్తున్నది.. వినోద, సంగీత, సాహిత్య, కళాత్మకరంగాలలో ఏదో చేయవలయునను కోరికా బలీయమౌతున్నది.

జాయప భార్య : అగ్రజులు.. గణపతిదేవులుంగారు మా వదినలను తోడ్కొని మా నేలను పావనం చేయడమే మా అదృష్టము.. రసహృదయులైన మీ బావమరిది జాయపసేనాని యిప్పటికే ఎంతో మగ్నతతో గ్రంథరచన చేస్తూనే ఉన్నారు. మీరు సాలోచనగా ఆ పుటలను అవలోకించవచ్చును.

 

గ.దే : అహాఁ.. ఎంత సంతోషము.. సోదరీ.. ఏమేమి సృజన చేసియున్నాడు జాయన.. చూడు.. ఎంత నిశ్శబ్దముగా గోప్యము నటిస్తున్నాడో.

జాయన : ప్రభువుల వద్ద గోప్యమేమున్నది.. మీరు అప్పగించిన పనినే చేయుచు ప్రత్యేకముగా మీముందు విశేషముగా నుడువుటకేమున్నది..,

గ.దే : అత్యంత విశేషమైనది కానిది మా జాయన అక్షరసృజన చేయడుకదా. ఆ విషయం మాకు తెలుసు.. వివరాలు తెలియజేయుము జాయపా.,

జాయన : మీరు ఆదేశించిన విధముగానే భరతముని ‘నాట్యశాస్త్రము’ లోని సకలశాస్త్ర సమ్మతములైన ‘మార్గ’ నృత్య పద్ధతులను సమగ్రపర్చి నాలుగాధ్యాయములు ‘నృత్తరత్నావళి’ పేర రచించడము పూర్తయినది మహారాజా.. యిక మన..అంటే ప్రధానముగా కాకతీయ సామ్రాజ్య పర్యంత ప్రజాజీవనములో జీవభరితమై ఒప్పుతున్న జానపద, ఆదిమ, గిరిజన, సామాన్య పల్లెప్రజల దేశీ నాట్యరీతులను సంపూర్ణముగా అధ్యయనము చేసి మరో నాలుగు అధ్యాయముల సృజన కొనసాగుతున్నది.

గ.దే.: మాకు కూడా.. ప్రజారంజకమైన ప్రజానాట్యరీతులను ప్రామాణికపర్చవలెనను అభిలాషయున్నది ..కొనసాగింపుము.. ఐతే, మొత్తము ఎనిమిది ప్రకరణములతో ‘నృత్త రత్నావళి’ సంపూర్ణమగునా.?

జాయన : ఔను మహాప్రభూ.. ఇరువది మూడు దేశిస్థానములతో శివారాధకులైన మన ప్రాంత ప్రజల ఉద్దీప్తమూ, ఉత్తేజకరమూ, వీర రౌద్ర రస ప్రధానముగా ఐన ‘ప్రేరణి’ అనే ఒక అతినూతన నృత్త రీతినీ, శివతాండవ తురీయస్థితినీ చాటిచెప్పగల ‘శృంగ నర్తనము’ నొకదానిని సృష్టిస్తున్నాను.

గ.దే : (సంతోషముతో చప్పట్లు చరుచును..) భళా జాయనా భళా.. మేమీ సమాచారము విని కేవలం ఆనందించడమేకాక ముదముతో పొంగిపోవుచున్నాము. శివానుగ్రహ ప్రాప్తిరస్తు.. ఔనూ.. రేచర్ల రుద్రదేవుడు గత రెండు దశాబ్దాలుగా పాలంపేట అను ప్రాంతంలో మహోత్తమ స్థపతి, శిల్పాచార్యులు రామప్పతో ఒక రుద్రాలయమును నిర్మిస్తున్న విషయం తెలుసుకదా. మనమే దానికి సకల నిధులనూ, సదుపాయములనూ, పోషణనూ కల్పిస్తున్నాము.. ఒకసారి నీవు పాలంపేట సందర్శించి నృత్యశాస్త్రము కొరకు సంభావిస్తున్న దేశీ నృత్య భంగిమలను ఎందుకు దేవాలయాలంకారములుగా స్థాపించకూడదు. మన రాజనర్తకి మాళవికా, రేచర్లరుద్రుని స్థానిక నర్తకి కేశికీ నీకు సహకరిస్తారు కదా..

జాయన : మహాప్రసాదం.. తప్పనిసరిగా ఆ విధముగనే చేసెదను.. నేనూహించిన దేశీ నృత్య భంగిమలతో రూపుదిద్దుకునే శిలాకృతులు అవశ్యము ఆ రుద్రాలయశోభను యినుమడింపజేస్తాయి.

గ.దే.: శుభం.. తామ్రపురిని చేరు త్రోవలో ఓరుగల్లు నుండి.. తలగడదీవి, తామ్రపురి వరకు మీ తండ్రిగారి జ్ఞాపకార్థం నిర్మించిన ‘చోడేశ్వరాలయం’..దాని అనుబంధ తటాకము ‘చోడసముద్రము’.. అదేవిధముగా భీమేశ్వరాలయం, గణపేశ్వరాలయం.. ద్రాక్షారామాలయం…వాటి ప్రక్కనున్న చెరువులు.. ఆవిధముగా నూటా ఒక్కటి.. మీ నిర్మాణాలలో నివి చాలావరకు సందర్శించి సంతసించితిమి .. “ఆలయమూ, ప్రక్కనే ప్రజోపయోగకరమగు తటాకము” అన్న కాకతీయ సంస్కృతిని పాటిస్తున్నందుకు అభినందనలు జాయనా.. దేవుడు నిన్ను కరుణించుగాక..

జాయన : మా వేగులవారిద్వారా మీరు మాచే నిర్మితములైన ఆలయములనూ, సరస్సులనూ సందర్శించిన సమాచారము మాకున్నది. మీ ప్రశంసతో, అభినందనలతో నేను ఉత్తేజితుడనైనాను.. మహాచక్రవర్తీ.. మరి మనం..మధ్యాహ్న భోజన ఆరగింపునకు..,

గ.దే.: అవశ్యము.. అంతా ఆనందకరముగా నున్నది..

WEEK-5

 

దృశ్యం : 5

(1241 :పాలంపేట..రామప్ప దేవాలయ నిర్మాణథ.. ప్రాంగణం.. మహాశిల్పి రామప్ప, రేచర్ల రుద్రదేవుడు, జాయపసేనాని, రాజనర్తకి మాళవిక..రుద్రదేవుని ఆలయ నర్తకి కేశికి.. ఉన్నారు.. సందర్భం.. పీఠంవరకు.. అధిష్ఠానం.. చుట్టూ స్తంభాలు, అరుగులు.. వరకు నిర్మాణమై.. అలంకరణ, పై కప్పు విశేషాలపై చర్చ.. ప్రతిపాదనలు..)

(అప్పుడే ఏనుగు అంబారితో కూడిన అలంకృతపీఠంపై నుండి దిగుతున్న జాయపసేనానిని ఉద్ధేశించి..)

రే.రు.: తామ్రపురి రాజులు..మహా గజసాహిణి, వైరి గోధూమ ఘరట్ట, శ్రీశ్రీశ్రీ జాయపసేనానికి రేచర్ల రుద్రమదేవుని ప్రణామములు.. స్వాగతం.. సుస్వాగతం.,

జా.సే.: (దిగి..రుద్రదేవుని స్నేహపూర్వకముగా కౌగలించుకుని..) విజయోస్తు రుద్రదేవా..మీ రాజ్యమును సందర్శించడముతో మా జన్మ పావనమైనది. గణపతిదేవుల ఆజ్ఞమేరకు.. మీరు ఒక జీవితకాల లక్ష్యంతో, శివాజ్ఞకు బద్ధులై నిర్వహిస్తున్న ఈ బృహత్‌ రుద్రేశ్వరాలయ నిర్మాణమునకు అదనపు సొబగులను అద్దడానికి, నాట్యశాస్త్ర సంబంధ వన్నెలు కూర్చడానికి మేమిక్కడికి..,

రే.రు.: మాకు సమాచారమున్నది సేనానీ.., రండి.. భావితరాలను మంత్రముగ్ధుల్ని చేయగల ఈ మహాశివాలయ నిర్మాణాన్ని మరింత జీవవంతం చేయడానికి విచ్చేసిన మీకు స్వాగతం.. యిదిగో వీరి పరిచము.. వీరు ఈ ఆలయ ప్రధానకర్త.. మహాశిల్పి రామప్ప.. అపరబ్రహ్మ.. రాతిని మైనపు ముద్దవలె రూపింపజేసి, శిల్పించగల ప్రజ్ఞాశీలి.. మీ రాకకు ముందే యిక్కడికి చేరుకున్న ఈమె కాకతీయ సామ్రాజ్య రాజనర్తకి మాళవికాదేవి.. మా సంస్థానికి చెందిన మా స్థానిక రాజనర్తకి కేశికి… వీరు ఆలయ అర్చకులు.. సోమశివాచార్యులు ..(చుట్టూ చూపిస్తూ..) వీళ్ళందరూ ముప్పదిరెండుమంది సుశిక్షితులైన యువ శిల్పులు.

జా.సే.: మాళవికాదేవి మాకు ఇదివరకే తెలిసిన అతిసన్నిహిత విదుషీమణి. అందరికీ ప్రణామములు.. మీవంటి మహానుభావుల కలయికతో నేను కృతార్థుడైనాను.. రుద్రదేవా.. ఈ ఆలయనిర్మాణ ప్రధానాంశములు వివరించండి.

రు.దే.: మీరు తొలుత ఈ శిలాసనముపై ఆసీనులుకండి.. కేశికీ, వివరాలు తెలియజేయి.

కేశికి : ఇది తూర్పుముఖ శివాలయం. నల్లరాతి కురివెంద కఠినశిలలతో నిర్మితమౌతున్న ఈ శివాలయమునకు దగ్గర్లోనే మూడు ప్రకృతి సిద్ధమైన కొండలను ఆలంబనగా చేసుకుని ఎనిమిది చదరపుమైళ్ళ విస్తీర్ణములో ఒక ప్రజోపయోగ జలవనరుగా తటాక నిర్మాణం జరుగుతున్నది. ఇసుక ఆధారపీఠంగాగల ఎనిమిది అడుగుల పునాదిపై ఆరు అడుగుల ఎత్తున గర్భగుడిలో శిలాపీఠం ఏర్పాటు చేయబడి లోపల అధిష్టానంపై రెండున్నర అడుగుల పొడవు, అంతే వెడల్పుగల రుద్రేశ్వర లింగం ప్రతిష్టితమౌతున్నది. గర్భగుడికి ఎదురుగా..పశ్చిమాన మహాశిల్పి ప్రత్యేకంగా రూపొందించిన ఈ శివనంది ప్రత్యేకతేమిటంటే.. ఒక్కటి, ఎవరు ఈ నందిని ఎటునుండి వీక్షించినా అది ఆ వీక్షకుణ్ణే చూస్తున్న అనుభూతిని కల్గించడం.. రెండు..ముఖంపై తేలిన రక్తనాళాలు, ఒంటిపై ఆభరణాలు వీక్షకున్ని స్పర్శించకుండా ఉండలేనివిధంగా ముగ్ధుణ్ణి చేయడం..గర్భగుడి ముఖద్వారంవద్ద..లతాలంకృత స్తంభం.. లోహధ్వనులతో సరిగమలను పలికించడం…

జాయన : మహాశిల్పి రామప్పా.. వింటూంటే మేము పులకించిపోతున్నాము.

రామప్ప : ధన్యుణ్ణి మహాసేనానీ.. మీ కూర్పుతో ఈ ఆలయం యింకా శోభిస్తుందని మా ఆకాంక్ష.

జాయన : అవశ్యం.., యింకా,

రామప్ప : ఈ ఆలయ శిల్పం ప్రధానంగా మూడు రకాల శిల్పరీతుల సంగమం.. హోయసళుల, చాళుక్య, చోళ శిల్పవిధానాలను అనుకరిస్తూనే స్థానిక దేశీ జీవనరీతులనూ, మన సంస్కృతినీ మేళవించి ఒక అద్వితీయ సృష్టిని కొనసాగిస్తున్నాము.

జాయన : బాగున్నది.. నేను ప్రధానంగా గజసైన్యాధ్యకక్షుణ్ణి.. అందువల్ల పలు గజవిన్యాసాలనూ, గజశ్రేణులనూ చిత్రించి తెచ్చినాను.. అదీకాక నేను ప్రామాణికంగా రచిస్తున్న ‘నృత్త రత్నావళి’ గ్రంథంలో దేశీ నృత్యరీతులననుసరించి తయారుచేసిన దాదాపు ఇరవై చిత్తరువులను, చిత్రాలను నా పరివారంతో తెప్పించిన పేటికలలో కూర్చి తెచ్చినాను.. వీటిని శిల్పాలుగా చెక్కి ఈ ఆలయ గోపుర పరివేష్ఠితములుగా అమర్చినచో మహాలంకారముగా భాసించునని మా ఊహ..ప్రతీహారీ.. ఆ పేటికలను తెరవండి.,

 

(ఒక సైనికుడు.. ఒక పెద్ద పేటికను తెరుస్తాడు.)

రే.రు.: సైనికా.. యిటివ్వు.. తొందరగా చూడవలెననే ఉత్కంఠ..రామప్పా.. రండి..చూడండి .. ఈ చిత్రాలు.ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాయో. ఒక్కో చిత్రం ..కళ్ళముందు..ఆయా సుందరాంగనలు నిలబడ్డట్టుగానే తోచుచున్నది)

(రే-రుద్రుడు, రామప్ప, కేశికి..అలంకృతమై ఉన్న మాళవికాదేవీ.. చూస్తారు)

జా.సే.: ఉహు..ఆ విధముగా కాదు.. శిల్పిముందు ఈ ఒక్కో భంగిమను ప్రదర్శింపజేస్తాను..అప్పుడుగాని ఆ నృత్త ఆంగికము రూపుకట్టదు.. మాళవికాదేవీ, ఏదీ..సిద్ధపడు..

(జాయన..ఏడెనిమిది చిత్రాలున్న పటాలను చేతిలోకి తీసుకున్నాడు.. ఆహార్యం ధరించిన మాళవికాదేవి పైనున్న సన్నని తెరను తొలగించి..శిలా రంగస్థలిపై చేరి నిలబడింది సిద్ధంగా..)

జా.సే.: చతుర విన్యాసము.,

(మాళవిక..క్షణకాలంలో..మెరుపువలె కదిలి ఒక విశిష్ట భంగిమలో స్థాణువై నిలబడింది.

కర్తరీ నర్తనము (మాళవిక భంగిమ మారింది)    (ఇక్కడ భంగిమల మధ్య శ్రావ్యమైన మ్యూజిక్‌)

భ్రమరీ నర్తనము (మరో భంగిమ)

సువ్యాపక నర్తనము (ఇంకో భంగిమ)

దక్షిణ భ్రమణ నర్తనము (మరో భంగిమ.)

దండలాస్యము (ఇంకో భంగిమ)

నాగిని, (భంగిమ)

రామప్ప : జాయపసేనానీ.. అద్భుతము.. ఈ ఒక్కో రీతి, భంగిమ మా హృదయమును జయించింది. మీరన్నట్లు ఈ ఒక్కో శిల్పమును ఆలయ శిఖర చూరుకు ఒడ్డాణమువలె అమర్చినచో రంజకంగా ఉంటుంది. ఈ దేశీ నృత్తభంగిమలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

జా.సే.: మా అభిలాష కూడా అదే మహాశిల్పీ..యివిగాక యింకా ‘ప్రేరిణి’ అనే శివతాండవ శృంగనర్తనంలో భాగమైన వీరరసప్రధాన భంగిమలు కొన్ని ఈ పటాలలో ఉన్నాయి. వీక్షించండి..

(రామప్ప అందుకుంటాడు చిత్రాలను)

రామప్ప : ‘ ‘ప్రేరిణి’ నృత్యం గురించి చెప్పండి

జా.సే.: మహాశిల్పీ.. సుకుమారమై కేవలం స్త్రీలచేతన నర్తితమయ్యేది లాస్యము.. ఉద్ధతమైన అంగహారములతో వీర, రౌద్ర భావనలు ప్రధానముగా గలిగి పురుషుల చేతమాత్రమే నర్తించబడేది ‘తాండవము, శివతాండవము ప్రధానముగా ఏడు విధములు.. అవి శుద్ధ, దేశి, ప్రేరణ, ప్రేంఖణ, దండిక, కుండలి మరియు కలశ..ఈ భంగిమలన్నీ మన రుద్రేశ్వరాలయ కీలకస్థానాల్లో స్థాపించబడాలి.

రామప్ప : అవశ్యము ఆచార్యా.. అది అర్థవంతముకూడా.. రుద్రునిచుట్టూ శుద్ధ, పూర్ణ పురుష వీర భావనలు పరిఢవిల్లడం సృష్టి ప్రతిఫలనయేకదా..తప్పక ఆ ఆకృతులను తీర్చిదిద్దుదాం.,

రే.రు : జాయపా.. మీరు సంకల్పించిన ఈ ప్రతిపాదనలన్నీ శ్లాఘనీయమైనవి.. వీటిని యథాతథముగా ప్రతిష్టిద్దాం.

జా.సే.:  స్తంభములపై..ప్రాకారములపై..పై కప్పులపై..స్తంభ తలములపై.. వక్రములపై..రామాయణ, భాగవత.. మహాభారతాది ఇతిహాస ఘట్టాలను కూడా శోభింపజేద్దాం రుద్రదేవా..

రే.రు.: అవశ్యము..తప్పక.. మీరు మా ఆతిధ్యమును స్వీకరించుటకు వేళయ్యింది. భోజనానంతరము తటాక నిర్మాణ ప్రాంతమును సందర్శిద్దాం.. జాయపసేనానీ ఈ పక్షము రోజులు యిక్కడే మాతో, రామప్ప మహాశిల్పితో గడిపి మాకు మార్గదర్శనం కావించండి…

జా.సే : మీ ఆతిథ్యం మాకూ అంగీకారమే. యిక్కడ కొద్దిరోజులుండి గణపతి దేవులను కూడా సందర్శించుకుని మా తామ్రపురికేగుతాం.,

దృశ్యం  : 6

(1254వ సం||. జాయప వయస్సు 60 సం||లు.. రామప్ప దేవాలయ ప్రాంగణం.. దేవాలయ ప్రదేశమంతా, సహస్ర దీపాలంకరణతో తేజోవంతమై కాంతిమయంగా, దేదీప్యమానమై ఉంది. రుద్రేశ్వర గర్భగుడి ఎదుట.. రాతి సింహాసనంపై గణపతి దేవుడు..ప్రక్కన  రాణులు.. మరో ఆసనంపై జాయపసేనాని, రేచర్ల రుద్రదేవుడు.. అటువేపు రామప్ప అతని యిద్దరు శిష్యులు.. వెనుక.. రాజనర్తకి మాళవికాదేవి.. కేశిక.. యితర పురప్రముఖులు దండనాయకుల..కోలాహలం..

సందర్భం.. ‘నృత్త రత్నావళి’ గ్రంథావిష్కరణ.. దేవాలయమునకు ‘రామప్ప’ నామప్రతిష్ట..

(రుద్రాభిషేక స్తుతి.. జమకం.. మంగళకర ధ్వని.. మంత్రఘోష..ఘంటలు క్రమంగా..తగ్గుతూండగా..)

ప్రధానార్చకులు సోమాచార్యులు : (శివలింగ సన్నిధి నుండి నృత్తరత్నావళి గ్రంథం ఉన్న పట్టువస్త్రపు మూటను తీసుకొని వచ్చి.. గణపతిదేవుని చేతుల్లో ఉంచి.. నమస్కరించి..) ఈశ్వర  ప్రసాదంగా ఈ మహత్తర కృతి.. భవిష్యత్‌ తరాలూ.. దాక్షిణాత్యులూ గర్వించదగ్గ నాట్యశాస్త్ర ప్రామాణిక గ్రంథం, జాయపసేనాని కృత ‘నృత్తరత్నావళి’ని తమ అమృతహస్తాలతో స్వీకరించండి మహారాజా.

గ.దే.: మహాప్రసాదము.. ఈ గ్రంథమును స్పర్శించిన మా యొల్లము పులకించుచున్నది.. ఎపుడో దాదాపు ముప్పది సంవత్సరముల నాడు ప్రజ్ఞాశాలియైన జాయనను మేము ‘నృత్యము’తో సహా వాద్య, యుద్ధ విద్యలపై ప్రామాణిక గ్రంథములను రచించి ఈ లోకమునకందించమని ఆదేశించియుంటిమి. యిన్నాళ్ళకు మా స్వప్నము సాకారమైనది. జాయపసేనానికి మేము మా కృతజ్ఞతలు తెలియపరుస్తూ..ఈరోజు నిర్వహించ తలపెట్టిన రెండు ప్రధాన కార్యాక్రమములు వివరములను రేచర్ల రుద్రదేవులను ప్రకటించవలసినదిగా అభ్యర్థిస్తున్నాము.

రే.రు.: చిత్తము మహాప్రభూ.. మనందరము ఆసీనులమై ఉన్న ఈ రుద్రేశ్వరాలయమును ఆమూలాగ్రం ఊహించి, రూపొందించి, శిల్పించి.. వన్నెలద్ది..భావితరాలకు అందించినవాడు మహాశిల్పి రామప్ప.. కాబట్టి యింతవరకు ఎక్కడా ఒక శిల్పినామముపై లేనివిధముగా ఈ దేవాలయమునకు ‘రామప్ప దేవాలయము’గా నామకరణం చేయవలసిందిగా మహాచక్రవర్తి శ్రీశ్రీశ్రీ గణపతి దేవులను ప్రార్థిస్తున్నాను.

గ.దే.: తథాస్తు.. భవిష్యత్తులో ఈ శివాలయం సురుచిరమై ‘రామప్ప దేవాలయం’ గా ప్రసిద్ధి పొందుగాక.. మహాశిల్పీ రామప్పా.. నీ జీవితం చరితార్థమైనది.. మీకు మా అభినందనలు.

రామప్ప : ధన్యోస్మి ప్రభూ.. ధన్యోస్మి.

రే.రు.: యిక.. భరతముని రచించిన ‘నాట్యశాస్త్ర’ సకల మార్గపద్ధతులను ఆంధ్రీకరించి, కాకతీయ సామ్రాజ్య స్థానీయ ప్రజానాట్య రీతులను కూడా థాబ్దాలుగా అధ్యయనము చేసి ‘దేశీ’ నృత్యపద్ధతులుగా గ్రంధస్థం చేసిన సకల కళాకోవిదులు శ్రీశ్రీశ్రీ జాయపసేనాని. ఈ దేశీ రీతులలో ప్రపంచ నాట్యచరిత్రలో ఎక్కడాలేని.. మగవారిలోని మగటిమినీ, పురుషుల్లోని పురుషత్వాన్నీ, వీరునిలోని వీరత్వాన్నీ సమ్మిళితం చేసి రుద్ర  ప్రేరణగా రూపొందించి అందిస్తున్న శృంగనర్తనం, శివతాండవం ‘ప్రేరణి’. ప్రేరణి నృత్యాన్ని ఒక బృందముగా పది, ఇరవై..నలభై మంది నర్తకులతో సామూహిక వీరనర్తనముగా ప్రదర్శించడం సముచితం. నిజానికి యిది బృంద నర్తనము. ఈ ప్రేరణి నృత్యాన్ని మన ఆస్థాన నర్తకుడు మల్లయనాథుడు గ్రంథకర్త జాయపసేనాని ప్రవేశిక తర్వాత ప్రదర్శిస్తారు..

(చప్పట్లు..మంగళ ధ్వనులు..)

జాయప : మహాచక్రవర్తులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులకు, సభాసదులైన బుధజనులందరికీ ప్రణామములు. ఏదేని ఒక విషయముపై సాధికారమైన అధ్యయనం జరుపనిది సృజనచేయడం భావ్యముకాదని తలంచి భారతీయ నాట్యశాస్త్రాలన్నింటినీ సంపూర్ణముగా పరిశోధించి ముప్పయ్యేళ్ళ కాలము సాగించిన సుదీర్ఘ కృషి ఫలితమే ఈ ‘నృత్తరత్నావళి’ గ్రంథము. యిక ‘ప్రేరణి’ అనే నామముతో ‘నృత్తరత్నావళి’ గ్రంథంలో ప్రస్తుతించబడినది పూర్తిగా నా స్వీయ సృష్టి. యిది గేయ ప్రాధాన్యంగల నర్తనం కాదు. వాద్య ప్రాధాన్యతగల నర్తనం. యుద్ధసన్నద్ధత కోసం వీరరస ప్రధాన ప్రేరక ఉత్సవాలలోనూ, ఆత్మశక్తిని తెలుసుకోవడం కోసం స్వయంచాలన లక్ష్యంగా రూపొందించబడ్డ పురుష నర్తనం ‘ప్రేరణి’. మార్ధంగికులు మహామద్దెలపై తన్నారకం, తత్కారం, తహనాలు, యతులు, గతులు, జతులు ‘భాం’కార ధ్వనితో పలికిస్తూంటే..నందిమద్దెల, ఉడుక్కు, కంచుతాళ మేళనతో నాదం గాంభీర్యమౌతూండగా రుద్రస్వరూపుడైన నర్తకుడు అంగ, ప్రత్యంగ, ఉపాంగాల సంచలనాల ద్వారా పరమశివుని తాండవకేళిని మన అనుభవంలోకి తీసుకురాగల మహారౌద్రానుభూతి యిది.. వినండి.. వీక్షించండి..,

 

(శబ్దం.. భాంకార ధ్వని.. పేరిణి..సిడి ఒకటుంది .. దాంట్లో పది ట్రాక్స్‌ ఉన్నై.. మొత్తం 3.5 ని||లు బిట్స్‌ బిట్స్ గా వేయాలి)

 

….ముగింపులో

గ.దే.: జాయపసేనాపతీ..మేము ఈ పంచముఖ శబ్ద ప్రపంచంలో ఓలలాడి మైమరిచి, లీనమై రుద్రున్ని మా మనోమయ లోకంలో దర్శించుకున్నాము. దీనిని సృజించి నీ జన్మను చరితార్థం చేసుకున్నావు.. ఏదీ..ఒక్కసారి మా బాహువుల్లో ఒదిగి మమ్మల్ని సంభావించు.

జా.సే: ధన్యుణ్ణి ప్రభూ.. ధన్యుణ్ణి.. మీరన్నట్లు నేను శివకృపతో, మీ అనురాగ స్పర్శతో తరించిపోయినాను.. ఆచంద్రార్కం ఈ నృత్తరత్నాళి కృతి శాశ్వతమై నిలుస్తుంది.. ధన్యోస్మి…

(ప్రేరణి నృత్యము కొనసాగుతూంటుంది.. ఆలయ ఘంటలు.. మంగళధ్వని.. సంతోష సంకేత కోలాహలం)

 -రామాచంద్ర మౌళి

Ramachandramouli 

జాయపసేనాని -2

 

OLYMPUS DIGITAL CAMERAదృశ్యం-2

 

స్వయంభూ దేవాలయం..రంగ మండపం

( గణపతిదేవుని అజ్ఞానుసారము గుండామాత్యులు జాయనను తనకు అభిముఖముగా కూర్చుండబెట్టుకుని నాట్యశాస్త్ర బోధనను ప్రారంభిస్తున్న రోజు..జాయన గురువుగారికి పాదాభివందనం చేసి..అశీస్సులను పొంది..ఎదుట కూర్చుని..)

 గుండామాత్యులు:నాయనా “గురు సాక్షాత్ పరబ్రహ్మ..కాబట్టి ఈరోజునుండి కాకాతీయ మహాసామ్రాజ్య చక్రవరులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులుంగారి ఆదేశానుసారము   నేను నీకు  బోధించడానికి ఉపక్రమిస్తున్న ఈ నాట్యశాస్త్ర రహస్యాలను అతిజాగ్రత్తగా గ్రహించు..ఓం….దైవస్వతమన్వంతరము తొల్లి త్రేతాయుగమందు,కామక్రోధాది అరిషడ్వర్గములకు లొంగి లోకులందరును సుఖదుఃఖములననుభవించుచుండగా,ఇంద్రుడు మున్నగు దేవతలు బ్రహ్మను “అందరూ చూడదగిన,వినదగిన వినోద సాధనమును” అపేక్షించుచున్నామని అర్థించగా బ్రహ్మ ఆత్మాంతర భావనచేసి అన్ని వర్ణముల,వర్గముల వారికిని హితమైన సారమును వేదములనుండి సంగ్రహించి “నాట్యవేదము”ను సృజించినాడు.తర్వాత ఆంగికాది అభినయములందు మనుషులకు గల చాతుర్యమును గమనించి తన మానసపుత్రుడైన భరతమునికి ఆ నాట్యకళను నేర్పించినాడు.భరతుడు తన కుమారుడు శాండిల్యుడు మొదలైనవారికి దానిని నేర్పెను.వారితోను,అప్సరసలతోను,భరతముని నాట్యవేదమును ప్రయోగించి ప్రవర్తింపజేసెను.

       జాయప:ఊ…ఆచార్యా..ఈ నృత్యకళకు ఆధారభూతములైన మూలభావనలేమిటి.?

గుండా:మంచి ప్రశ్న జాయపా..ఎప్పుడైనా మూలమునూ,కేంద్రకమునూ స్పృశిస్తేగాని అసలు రహస్యం బట్టబయలు కాదు..సృష్టిలోని పంచభూతముల ప్రతీకాత్మక వ్యక్తీకరణే నృత్తము.భూమిలోని రత్నకాంతుల తళతళలు,నీటి తరంగముల లాలిత్యము,అగ్నిజ్వాలల ఊపు,వాయుసహజమైన వింతనడక,ఆకాశంలోని మెరుపుతీగల విన్యాసము..యివే నాట్యవేదమునకు పునాది భావనలు.ఐతే సుఖ దుఃఖ మిశ్రమమైన లోకస్వభావముననుకరించి నాలుగు విధముల అభినయములతో ఏర్పడినదే నాట్యవిద్య.ఆంగికము,వాచికము,ఆహార్యము,సాత్వికము అని అభినయము నాల్గు విధములు.నాట్యకళ అంతయూ వీటియందే నెలకొని ఉన్నది.

   జాయప:ఆచార్యా..నాట్యము..నృత్యము..మున్నగు ఏకరీతి భావనలవలె,పర్యాయపదములవలె ధ్వనింపజేయు రూపాలన్నీ ఒకటేనా.?

గుండా:నాయనా..శాస్త్రరీతిలో భరతమునిచే నిర్వహించబడ్డ ఈ విశేషణాలన్నీ అతి సూక్ష్మ భిన్నతలతో స్పష్టముగా చెప్పబడి ఉన్నాయి…ప్రధానమైన “నర్తనము” మూడు విధములు.ఒకటి..పాట,వాద్యములు మొదలగువానితోగలిసి,లయనుమాత్రము ఆశ్రయించి,అభినయములేక,అంగముల నాడించుట ‘ నృత్తము ‘. రెండవది..భావముల నాశ్రయించినది,పదార్థములను అభినయించు స్వరూపముగలది ‘ నృత్యము ‘.మూడవది..సాత్త్విక భావములతోనిండి,రసాశ్రయమై,వాక్యార్థమును అభినయించునదై ఉన్నచో అది ‘ నాట్యము ‘.

జాయప:గురువర్యా..నా సంశయములు సూర్యసమక్షములో మేఘ శకలాలవలె తొలగిపోయినవి.

   గుండా:జాయనా..నాట్య,నృత్య,నృత్తములలోని ప్రధానమైన చేష్టలను నిర్వహించు అంగ,ప్రత్యంగ,ఉపాంగములు మొత్తము 18..ఒక్కొక్కటి ఆరు.శిరస్సు,చేతులు,వక్షము,ప్రక్కలు,మొల మరియి పాదములు అంగములనబడును.ప్రత్యంగములు మెడ,భుజములు,కడుపు,వెన్ను,తొడలు మరియుపిక్కలు.మొత్తము ఆరు.కన్నులు,బొమ్మలు,ముక్కు,పెదవులు,చెక్కిళ్ళు మరియు గడ్డము..ఇవి ఉపాంగములు.

జాయప:శాస్త్రసారము ఇసుకలోనికి నీరువలె నాలోకి ప్రవహిస్తున్నది గురుదేవా..ధన్యుడను.

  గుందన:నృత్తము మార్గము..దేశీ అని రెండు విధములు.నాట్యవేదమునుండి మహర్షులచేత వెలికితీయబడి,సజ్జనుల ద్వారా ప్రచారము చేయబడినదిగా ఉన్న శాస్త్రానుగుణ పద్ధతిని బుధులు ‘ మార్గము ‘ అనీ,దేశ కాల స్థితిగతులనుబట్టి ఎప్పటికప్పుడు కొంగ్రొత్త విధానాలతో ఆయా దేశ రాజుల,జనుల యిష్టానుసారము చెల్లుబాటు ఐన నృత్త విధానమును ‘ దేశీ ‘ అని వ్యవహరించినారు.

 జాయప: ఉహూ..

  గుండన:కాగా నృత్య,నృత్తములు లాస్యమని,తాండవమని మరల రెండు విధములు. అందు మొదటిది లాస్యము..సుకుమారముగా ఉండునది.రెండవది..తాండవమైనది.స్త్రీ పురుషుల పరస్పర విషయములైన భావనలు లాసము.దానికొరకైనది,లేదా దానికి తగినది అను అర్థము గలది లాస్యము.అది కామోల్లాసమునకు హేతువులగు మృదువైన అంగవిక్షేపములు గలది.పార్వతీదేవికి శివుడుపదేశించినది కనుక ప్రాయికముగా దీనిని స్త్రీలే ప్రయోగింతురు.

  జాయప:గురువర్యా..లాస్య సంబంధ నృత్యములు కేవలము స్త్రీలచేతనే నిర్వర్తింపబడ్తాయా.?

గుండన :ఔను జాయనా..సందర్భోచిత పురుష ప్రవర్తనను ప్రయోగాత్మకంగా నర్తించడము అప్పుడప్పుడు జరిగినా లాస్యము ప్రధానముగా స్త్రీల నృత్యక్రియే.ఉద్ధతము పురుషులచే ప్రదర్శింపబడునది.

లాస్యాంగములు పది.గేయపదము,స్థిత పాఠ్యము, ఆసీనము, పుష్పగంధిక, ప్రచ్ఛేదకము, త్రిమూఢము, సైందవము, ద్విమూఢకము, ఉత్తమోత్తకము, ఉక్త ప్రత్యుక్తము..అనేవి ఆ అంగములు.వీటిలో సంక్లిష్టమైనవి .. విరహమందు స్త్రీ కామాగ్నిచే దేహము తపించగా, ఆసనమందుండి ప్రాకృతభాషతో వ్యవహరించునది స్థితపాఠ్యము..నానావిధములైన నృత్తగీత వాద్యములతో మగవానివలె స్త్రీ వివిధ చేష్టలు చేయుట పుష్పగంధిక..వెన్నెలవేడి తాళలేక కామినులు సిగ్గువదిలి,తప్పుచేసిన ప్రియులనైననూ వెన్నాడుట ప్రచ్ఛేదకము.ముఖ ప్రతిముఖములు గలది,చతురశ్రమైన నడక గలది,భావరసములు శ్లిష్టముగా నుండు,విచిత్రములైన అర్థములు గలది ద్విమూఢకము.

ఇకపోతే..ఉద్ధతము మహేశ్వరుని ఆజ్ఞచే భట్టతండువు భరతమునికి చెప్పినది.అందువలన అది “తాండవము” అని వ్యవహరింపబడుతున్నది.దానిని ప్రాయికముగా ఉద్ధతమైన అంగహారములతో పురుషులే నెరవేర్తురు.

        జాయన:గురుదేవా..కేవలము కొన్ని స్త్రీలచేతనే,మరికొన్ని పురుషుల చేతనే నిర్వర్తించబడవలెనన్న నియమము ఎందుకు విధించబడినది.

 గుండన:ఏలననగా .. నాట్యక్రియలో కొన్ని శరీర పటుత్వ, శక్తి, సమర్థతా సంబంధ విషయములతో కూడిఉన్నవి.ఉదాహరణకు ..ఉద్ధత నృత్యములో ఎంతో దుష్కరమైన ప్రదర్శనను..అంటే గాలిలోకి పైకి ఎగిరి, గాలిలోనే పద్మాసనం వేసి,వెంటనే కాళ్ళను విడదీసి నేలమీద నిలుచోవడమో, కూర్చోవడమో చేయగల ‘ అంతరపద్మాసనం’,’ ఊరుద్వయ తాడితం ‘,’ లవణి ‘ వంటి సంక్లిష్ట భంగిమలను ప్రేక్షకులకందించి నర్తకుడు మన్నన పొందుతాడు.దీనికి బలిష్ఠమైన,సౌష్ఠవమైన,శరీరం,దారుఢ్యం అవసరం.

జాయప:ఆచార్యా..పరమ ఆసక్తికరమైన ఈ అంశములను వింటున్నకొద్దీ సముద్రాంతర లోలోతులను సందర్శిస్తున్న మహానందానుభూతి కలుగుతున్నది.నేనదృష్టవంతుడను.

     గుండన: అతి విసృతమైన నాట్యశాస్త్ర వివరాలు ఇంకెన్నో ఉన్నాయి జాయనా.26 రకముల శిరోభేదములు,36 రకముల దృష్టిభేదములు,స్థాయిదృష్టులు.సంచారి దృష్టులు,దర్శనరీతులు,పుటకర్మలు,భ్రూకర్మలు,నాసాకర్మలు,ఓష్ఠకర్మలు,68 రీతుల హస్తలక్షణములు,వక్షో,పార్శ్వ,జఠర,కటి,జాను,ఊరు,జంగా,పాదాంగుళీ కర్మలు,108 రకముల నృత్తకరణములు..ఈ విధముగా నృత్యశాస్త్రము ఒక అనంతాకాసము వంటిది పుత్రా.దీని అధ్యయనము తపస్సమానమైనది..ఉత్కృష్టమైనది.

 జాయన:ఈ మధుర శాస్త్రాన్ని మీనుండి ముఖతః వినే భాగ్యము నాకు కలుగడము నా పూర్వజన్మ సుకృతము ఆచార్యా.ధన్యుడను.

( రాజనర్తకి మాళవిక ప్రవేశము)

మాళవిక:ఆచార్య గుండనామాత్యులకు కాకతీయ సామ్రాట్టుల రాజనర్తకి మాళవికాదేవి ప్రణామములు.

     గుండన:ఆయుష్మాన్ భవ..చిరంజీవ.రా మాళవికా.ఈతడు జాయప…(పరిచయం చేస్తూందగా..)

మాళవిక:గణపతిదేవ చక్రవర్తులు మాకు విషయమంతా చెప్పి జాయనకు శాస్త్ర బోధన జరుపుతున్నపుడు మీతో సహకరించమని మమ్మల్ని అదేశించి ఉన్నారు.తమరి ఆజ్ఞ గురుదేవా.

 గుండన:జాయనా..కొద్దిరోజులు ఈ ప్రాథమికాంశాల చర్చ తర్వాత మన రాజనర్తకి మాళవికాదేవి స్వయముగా మూడు రకముల గతులు..అంటె నదక,ద్రుతము,మధ్యము మరియు విళంబితముల గురించీ,శుద్ధ సంకీర్ణ గతుల గురించీ ప్రదర్శించి అవగతపరుస్తుంది.

జాయన:సరే గురుదేవా..మాళవికాదేవి గారికివే మా నమోవాకములు.

మాళవిక: శివానుగ్రహ ప్రాప్తిరస్తు..చిరంజీవ.

     గుండన:ఈ నాటికీ పాఠం చాలు నాయనా..నీవిక విశ్రమించుము.

( తెర..)

జాయపసేనాని -1

OLYMPUS DIGITAL CAMERA

దృశ్యం :1

(క్రీ.శ. 1203వ సంవత్సరం . కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు తన రాజ్య విస్తరణలో భాగంగా తీరాంధ్రదేశంపై దండయాత్రను కొనసాగిస్తున్న క్రమంలో మల్యాల చాముండసేనాని సారథ్యంలో కృష్ణానదీ ముఖద్వార ప్రాంత”మైన తలగడదీవి, హంసల దీవి,  మోపిదేవి, నాగాయ లంక, అవనిగడ్డ మొదలైన వెలనాటి మండల క్షేత్రపాలకుడైన పృధ్వీశ్వరుని ఓడించి అతని సకల సంపదనూ, అనర్ఘ మణిమాణిక్యాలనూ ఓరుగల్లు కోశాగారానికి తరలించి అతని సైన్యాధిపతియైన పినచోడుని జయించి..దివి సీమను కాకతీయ సామ్రాజ్యంలో కలుపుకొనకుండా తన రాజనీతిలో భాగంగా  అయ్యవంశీకుడైన పినచోడున్నే సామంతరాజును చేసి రాజ్యమేలుకొమ్మని ఆదేశించిన క్రమంలో…,

పినచోడుని పరమ సౌందర్యవతులైన యిద్దరు కుమార్తెలు నారాంబ, పేరాంబలను వివాహమాడి…అతని ముగ్గురు పుత్రులలో ఒకడైన జాయపలో అజ్ఞాతమై ఉన్న ప్రతిభావ్యుత్పత్తులను గ్రహిస్తున్న సమయంలో..,

గణపతిదేవుని వివాహానంతర విజయవసంతోత్సవ వేడుకల వేదిక.,

పినచోడుని సామంతరాజుగా గణపతిదేవుని ప్రకటన…ప్రతిష్టాపన సందర్భం.

స్వాగత…మంగళధ్వనులు

                                                         పిన్నచోడనాయకుని   ఆస్థాన దృశ్యం:   

 వందిమాగదులు : రాజాధిరాజ .. కాకతీ సామ్రాజ్య రాజమార్తాండ .. శత్రుభీకర కదన వీరాధివీర .. కళాధురీణ .. ప్రతిష్ఠాపనాచార్య.. కదన ప్రచండ..చోడకటక చూఱకాఱ  శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తులుంగారికి  వెలనాటి  ఏలిక ద్వీపీలుంటాక .. దివిచూఱంకార .. అయ్యకుల సంజాత .. శ్రీ పిన్నచోడనాయక .. సకల అమాత్య,సైనిక నాయకజన, ప్రజా సమూహాల పక్షాన జయహో..విజయహో.. స్వాగతం . .సుస్వాగతం.

( వెనుకనుండి మంగళ ధ్వనులు వినిపిస్తూండగా గణపతిదేవుడు,తన ఇద్దరు నవ వధువులు నారాంబ పేరాంబ లతో వెనుక ఇతర పరివారంతో ప్రవేశం . గంభీరంగా మెట్లెక్కి , సింహాసనాన్నధిష్టించి ఆసీనుడై .. ఆస్థానంలో పరివేష్టితులై ఉన్న పిన్నచోడనాయకుడు, మల్యాల చాముండదేవుడు, కాటమ నాయకుడు తదాది బుధజన సమూహాలకు ప్రణామంచేసి కూర్చుని విరాజిల్లగానే .. స్వాగత గీతం..3 నిముషాలు)

జన హృదయ విరాజిత భోజా

వన వసంతకాంతులొలుకు రారాజా

స్వాగతం..తామ్రపురికి ఘనస్వాగతం

 

కళాధురీణా..కదన ప్రవీణా

యుద్ధవిద్యలలొ విక్రమతేజా

శతృసంహార..పురవరాధీశ్వరా

పరమ మహేశ్వర..మండలేశ్వరా       జన!!

 

కదన ప్రచండా..విభవ దేవేంద్ర

తిమిర మార్తాండ..లక్ష్మీ నిజేశ్వర

కాకతీరుద్ర..అరివీరభయంకర

గణాధీశ్వరా ..గణపతిదేవా           జన!!                          ( సాంప్రదాయ..కూచిపూడి పద్ధతిలో నిర్వహించాలి)

 

(గణపతిదేవుదు తన ఉన్నత సింహాసనం పైనుండి లేచి .. పినచోడ నాయునివైపూ.. అమాత్య .. సైనికాధిపతులవైపూ.. సభాసదులూ.. పురప్రజలందరివైపూ.. నిర్మలంగా చూస్తూ నిలబడి )

 

 గణపతిదేవుడు: ఈ నిండు పేరోలగంలో ఆసీనులైఉన్న తామ్రపురి పూర్వపాలకులైన చోళాధీశులు,పృధ్వీశ్వరులు,వారి సైన్యాధ్యక్షులు..ప్రస్తుతం కయ్యము విడిచి మాతో నెయ్యముతో వియ్యము గరిపిన పినచోడులుంగారికి..మావెంట యుద్ధములలో పాల్గొని మాకు విజయమును సాధించిపెట్టిన మా సేనాధిపతి మల్యాల చాముండదేవుడు,కాటమ నాయకుడు..తదితర ప్రముఖులకు..మేము మా సువిశాల కాకతీయ సామ్రాజ్యంలో దైవసమానులుగా సంభావించే మా ప్రజలతోపాటు ఈ రోజునుండి మహోజ్జ్వల వీర కాకతీయ సుభిక్ష పాలనలోకి ప్రవేశిస్తున్న మా ప్రియతమ వెలనాటి ప్రజలకూ..ఈ గణపతిదేవుని వినమ్ర ప్రణామములు.

ఈరోజు ఎంతో విశిష్టమైన సుదినము.దివిసీమను కాకతీయ సామ్రాజ్యాంతర్భాగంగా ప్రకటిస్తూ నిర్వహిస్తున్న ఈ విజయోత్సవ వసంత సభలో మేమొక విస్పష్ట స్నేహపూర్వక ప్రకటనను చేస్తున్నాము.ఇక ముందు అయ్యవంశీకులైన పినచోడులుంగారు ఈ వెలనాడు ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తులమైన మా పరిపాలనా విధానాలకు లోబడి ప్రజారంజకంగా,సుభిక్షముగా మా సామంతరాజు హోదాలో ఏలుబడిని కొనసాగిస్తారని ఈ నిండు ప్రజాసభలో సాధికారికంగా ప్రకటిస్తూ..అజ్ఞాపిస్తున్నాము.

పినచోడుడు: ధన్యవాదములు మహారాజా..మా జన్మ చరితార్థమైనది.ప్రజలను కన్నబిడ్డలవలె కాచుకునే మీ పరిపాలనా సూత్రములననుసరించి మేముకూడా మీ అజ్ఞాబద్దులమై జనరంజక పాలననందిస్తామని ఇందుమూలముగా మీకు సవినయముగా హామీ ఇస్తున్నాము.

 గణపతిదేవుడు:మల్యాల చాముండదేవుడుగారూ..ఒకసారి స్థూలముగా మన కాకతీయ పాలనా విధానాన్ని ఈ తామ్రపురివాసులకు తెలియజేయండి.

 చాముండదేవుడు:చిత్తము మహరాజా.రాజు అనగా ఒక కుటుంబమునకు తండ్రివలె తన సామ్రాజ్యములోని ప్రజలందరకూ సంరక్షకుడు మాత్రమే.ప్రజల ధన మాన ప్రాణ రక్షకుడై వారి నిత్యాభివృద్ధికోసం తపిస్తూ జనరంజకముగా అందరినీ సమదృష్టితో,సమన్యాయముతో ధర్మబద్ధంగా పాలించడమే కాకతీయుల విధానము.ప్రతి ఊరూ ఒక గుడితో,ప్రక్కనే పంటపొలాలతో విరాజిల్లే చెరువూ,తల్లి ఒడివంటి బడితో ప్రశాంతముగా వర్థిల్లడమే చక్రవర్తుల అభిమతము.గొలుసుకట్టు చెరువల నిర్మాణం మన సేద్యవిధానం.

 గణపతిదేవుడు:కాటమ నాయకా మీరు చెప్పండి.

 కాటమనాయుడు:చిత్తము మహాప్రభో.ప్రతి పౌరుడూ నైతిక విలువలు నిండిన జీవన విధానముతో ధర్మబద్ధముగా జీవిస్తూ సకల యుద్ధ విద్యలలోనూ,కళా రంగాలలోనూ,వృత్తి నైపుణ్యాలతోనూ పరిపూర్ణుడుగా వర్థిల్లడమే చక్రవర్తుల ఆకాంక్ష.

(ప్రజల జయజయ ధ్వానములు)

 గణపతిదేవుడు:ఇప్పుడు..ఈ దండయాత్రలో మా విజయానికి కారకులైన మా సేనాని మల్యాల చాముండదేవుణ్ణి మేము “ద్వీపలుంటాక”బిరుదుతో సత్కరిస్తున్నాము.ఎవరక్కడ..,

పినచోడుదు:ఏర్పాట్లు చేయబడ్డాయి మహరాజా..(చేయితో సైగ చేస్తాడు)

(మంగళ వాద్యాలతో..ఖడ్గమూ..హారమూ..కిరీటమూ తెస్తారు.గణపతిదేవుడు చాముండదేవునికి వాటిని ధరింపజేసి.,)

చాముండదేవుడు:మహాప్రసాదము మహారాజా.నా జన్మ ధన్యమైనది.మున్ముందుకూడా కాకాతీసామ్రాజ్య పరిరక్షణ బాధ్యతలో నా జన్మను పునీతం చేసుకుంటానని ఇందుమూలముగా ప్రతిజ్ఞ పూనుతున్నాను.

గణపతిదేవుడు:శెహబాస్ చాముండదేవా.ఇప్పుడు ఈ మా సామ్రాజ్య విస్తరణాయాత్రలో మాకు కుడి భుజముగా సహకరించిన మరో యోధుడు కాటమ నాయకుడిని మేము “దీవి చూరకార”బిరుదుతో సత్కరిస్తున్నాము.

(మళ్ళీ మంగళ ధ్వనులు…ఖడ్గము…ప్రదానము )

కాటమ నాయకుడు:నా జన్మ సార్థకమైనది మహారాజా.యుద్ధవిద్యలలో..రాజ్యవిస్తరణ వ్యూహ రచనలో అజేయులైన మా చక్రవర్తులకు బాహుసమానుడనై కంటికి రెప్పవలె నిరంతరమూ అహర్నిశలూ కాపలాదారుడనై ప్రవర్తిస్తాననీ,కాకతీ సామ్రాజ్య రక్షణలో నా జీవిత సర్వస్వాన్నీ ధారపోస్తానని ఇందుమూలముగా ప్రమాణము చేస్తున్నాను.

 గణపతిదేవుడు:భళా కాటమనాయకా భళా.నీవు మాకు నీడవే కాదు బహిర్ ప్రాణానివి కూడా.

ఈ విజయోత్సవ సందర్భంలో మేము ఇష్టపడి పవిత్ర వివాహ కార్యముతో మా దేవేరులుగా స్వీకరించిన మా సామంతరాజు పినచోడులుంగారి కుమార్తెలు నారాంబ మరియు పేరాంబలను మా కాకతీయ సువిశాల సామ్రాజ్య పట్టపురాణులుగా ప్రకటిస్తూ దివిసీమ ప్రజల ప్రేమమయ కానుకగా మా హృదయసీమలో భద్రపరుచుకుంటున్నాము.ఈ శుభ సందర్భముగా విజయోత్సవ సంరంభాలను ప్రారంభించవలసినదిగా మాచే నియమితులైన మా సామంతరాజు పినచోడులుంగారిని ఆదేశిస్తున్నాము.

 పినచోడుడు:చిత్తము మహారాజా..శాతవాహనుల అనంతరము ఆంధ్రదేశాన్నీ,జాతినీ ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చిన కాకతీయ మహాసామ్రాజ్యములో ప్రజలకు సంప్రాప్తించినది స్వర్ణ యుగము..స్వర్గ యుగము.మీ ప్రజారంజక పాలనలో నన్ను మీ సామంతునిగా నియమించినందుకు ధన్యవాదములు.నిబద్ధతతో,నిజాయితీగా,మీ ఆజ్ఞాబద్ధుడనై ఈ వెలనాటి సీమను విధేయంగా పాలిస్తానని ఈ నిండుసభలో ప్రమాణము చేస్తున్నాను. మానవుల మధ్య ఉందదగు మానవీయ బంధమును మన మధ్య స్థాపించి మా  కుమార్తెలు నారాంబ,పేరాంబలను మీ ధర్మపత్నులుగా స్వీకరించి మా జన్మలను ధన్యము చేసినారు.ఇక మేము ఈ పవిత్రబంధమును ప్రాణముకన్నా మిన్నగా కాపాడుకుని మీకు వినమ్రులుగా ఉంటామనీ జీవితాంతం ఋణగ్రస్తులమై ఉంటామనీ వాగ్దానము చేస్తున్నాము.

ఇక ..ఈ విజయోత్సవ కార్యక్రమంలో భాగముగా..మొదట మా వీరులచే “ఖడ్గప్రహార ప్రదర్శన”,”శబ్దవేది”,”విలువిద్యా విన్యాసము”,సాహిత్య కళారంగాలలో అభిజ్ఞతగల పండితులచే జ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయబడ్డాయి.తమరి అనుమతికోసం నిరీక్షణ ప్రభూ.,

  గణపతిదేవుడు:కొనసాగించండి పినచోడ రాజా..మేమూ వీక్షించుటకు ఉత్సుకులమై ఉన్నాము.

  పినచోడుడు:దండనాయకా..వీరులను ప్రవేశపెట్టుము.

(మ్యూజిక్..కోలాహలం..ప్రజలు,వీక్షకుల హడవుడి..ఉత్సుకత..మొద11)

  గణ.దే: దేవీ నారాంబా..అక్కడ ప్రదర్శన క్షేత్రంలోకి ప్రవేశించి కళ్ళకు నల్లని వస్త్రమును ధరించి నిలబడి ఉన్న బాలుడు మీ సోదరుడు జాయపకదా.

  నారాంబ: ఔను మహాప్రభూ..అతను జాయపే…జాయప జన్మతః అద్భుతమైన ప్రతిభాశీలి.గజవిన్యాస శిక్షణలో,గజనియంత్రణలో..ఖడ్గప్రహార విద్యలో..ఇతరేతర సకల సైనిక యుద్ధవిద్యల్లో..ఆయుధ ప్రయోగకళల్లో అతను అజేయుడు.ఏకసంతాగ్రాహి.మా అందరి ఊహలకు మించి మహోన్నతంగా ఎదుగుతున్న పరాక్రమవంతుడు.

 గణ.దే: భళా..బాగున్నది..ముచ్చటైన రూపురేఖలు,నిండైన విగ్రహం..సౌష్టవమైన శరీరం..ఊ..

 పేరాంబ: జాయప ప్రత్యేకముగా ప్రదర్శించే “శబ్దవేది విద్య” ఎంతో ఆసక్తికరమై చూపరులను ఊపిరిసలుపకుండా చేసేది.ఎలా సాధన చేశాడో తపస్సువలె.

 గణ.దే:జాయప అక్కలిద్దరూ సృష్టికే అలంకారాలైన సౌందర్యరాసులైనప్పుడు తమ్ముడు వీరుడూ పరాక్రమశాలి కావడం సహజమేకదా..ఏమంటావు నారాంబా.

 నారాంబ:ఔనంటాను ప్రభూ..చక్రవర్తులెప్పుడూ ఉచితమే తప్ప అన్యము పలుకరుకదా.

( ప్రదర్శన కొనసాగుతూంటుంది..)

 పేరాంబ:ప్రభూ..వివాహానంతరం మేము చక్రవర్తులవెంట రావడం మిగుల ఆనందదాయకమే ఐనా..జాయపను విడిచి.. పన్నెండేళ్ళైనా నిండని మా తమ్ముని సాంగత్యాన్ని కోల్పోయి ఎడబాటును పొందవలసిరావడం కించిత్తు దుఃఖకరముగానే ఉన్నది.జాయన సాంగత్యం చంద్రునితో వెన్నెల వంటిది.

గన దే: ఉహూ..అలాగా..సోదర సాన్నిహిత్య మాధుర్యాన్నీ,వియోగ విషాదాన్నీ ఈ మహరాజు అర్థం చేసుకోగలడు దేవీ..చూడు,జాయన కళ్ళు మూసుకుని ఖడ్గచాలనానికి సిద్ధపడుతున్నాడు.

దండనాయకుడు:.సభాసదులారా.ఇప్పుడు సుశిక్షితుడైన ఒక ఖడ్గవీరునితో కళ్ళకు గంతలు కట్టుకుని పన్నెండేండ్లుకూడా నిండని “జాయన” శబ్దాధార ప్రహార నైపుణ్యంతో మనముందు వీరోచితంగా తలపడబోతున్నాడు..ఇది ఒక రోమాంచితమైన ప్రాణాంతక ప్రదర్శన..వీక్షించండి.

( కాహళి ధ్వని దీర్ఘంగా..క్రీడ ప్రారంభం..ఖడ్గముల కరకు ధ్వని..వీరోచితంగా మధ్య మధ్య కరతాళ ధ్వనులు..కేరింతలు..హాహాకారాలు..ఉద్విగ్నత..)

దండనాయకుడు: బాలవీరుడు జాయప ఖడ్గ చాలన విద్యానైపుణ్యాన్ని వీక్షించిన చక్రవర్తులకు,దేవేరులకు పురప్రముఖులందరకూ ధన్యవాదములు..ఇప్పుడు..వినోదార్థం..యువకిశోరం జాయప కొన్ని సంవత్సరాలుగా తనంత తానుగా వృద్ధిపర్చిన ఒక వింత జంతుభాషతో,హృదయంగమ సాన్నిహిత్యంతో గజసమూహాలతో మనముందు చిత్రమైన గజవిన్యాస క్రీడను ప్రదర్శిస్తారు.గజసాధకునిగా జాయప ఈ రంగంలొ అజేయుడు.

( గజ విన్యాసాలను లైట్ అండ్ షేడ్ పద్ధతిలో..మ్యూజిక్ తో చూపిస్తూ..సౌండ్ ను డిం చేస్తూ..,)

గణ.దే:(పేరాంబనుద్దేశ్యించి) మీ తమ్ములుంగారు ఈ విధముగా భిన్నమైన వివిధ రంగాల్లో విశేష ప్రజ్ఞ కలిగి విద్యావిశారదుడు కావడం మమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతున్నది..భళా.,

 పేరాంబ: అదంతా దైవ ప్రసాదిత నైపుణ్యమె ప్రభూ.శివాజ్ఞ.జాయన సాధన..కృషి..పట్టువిడవని తపస్సమాన దీక్ష నిజముగా శ్లాఘనీయమైనదే.ప్రతిదినము ప్రాతఃసమయములో రెండవజాముననే అతను చేపట్టే నిరంతర సాధన మమ్మల్నందరినీ అబ్బురపరుస్తుంది.స్వామీ..మీరన్నట్టు చిత్రమే అతని తత్వము..నైపుణ్యము కూడా.

( ఏనుగుల చిత్ర విన్యాసాల ధ్వని..కొనసాగింపు)

ధ్వనిమాత్రంగా..

దండనాయకుడు:పది ఏనుగులు గల ఈ కరిసమూహముతో జాయన వివిధ భంగిమలలో, భిన్న శ్రేణులుగా,పరిపరి పరిస్థితులలో శాంత..ప్రసన్న..ఉగ్ర..మహోగ్ర..ఉద్విగ్న పద్ధతులలో ప్రవర్తించు విధములను ప్రదర్శిస్తారు..వీక్షించండి..చకితులమౌతాం మనం.. ( సౌండ్..గజ క్రీడ..శబ్దాలు).లైట్స్ ఆన్.

గణ.దే: భళా..బాగున్నది.జాయనయొక్క గజ నియంత్రణ..సాహిణత్వం బహుదా ప్రశంసనీయముగా ఉన్నది.మేము ముదముతో పొంగిపోయితిమి…ఊ..తర్వాత.,

దండనాయకుడు:చివరి అంశము..మహాచక్రవర్తుల సమక్షమున పురుషులు మాత్రమే చేయు సంధ్యాసమయ శివతాండవ శృంగనర్తనమును జాయన ఇపుడు ప్రదర్శిస్తారు..పంచశక్తులైన పృథ్వీ,జల,వాయు,తేజో,ఆకాశ లింగ మూర్తులను స్తోత్రం చేస్తూ..పంచముఖ శబ్దాలతో సునిశితమైన ప్రణవ,ప్రణయ,ప్రళయ నాదాలతో కూర్చిన ఈ నర్తనం కరణ,చారీ,అంగ హారాల సంపుటీకరణతో మనల్ని చకితుల్ని చేస్తుంది.ఈ నాట్యగతిని జాయన తనకుతానుగా రూపొందించుకుని కూర్చిన కళగా మహాచక్రవర్తులకు నివేదించబడుతున్నది..తిలకించండి.

గణ.దే:ఊ..మహదానందముగా ఉన్నది..ఖడ్గ విద్య..గజపాలనా నైపుణ్యము..ఇప్పుడు నృత్తమా.?పరస్పర సంబంధమే లేని ఈ భిన్న కళారంగాలలో నిపుణత్వం నిజముగా విచిత్రమే..అనితర సాధ్యమే ఇది..(పారవశ్యంతో)

“నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకథాయుతం

భావాభినయహీనంతు నృత్యమిత్యభిధీయతే

రసభావవ్యంజనాదియుక్తం నృత్యమితీర్యతే”..

అనికదా తన అభినయ దర్పణములో నందికేశ్వరుడు నాట్య,నృత్త,నృత్యములను నిర్వచించినది. అంటే పూర్వకథాయుతమై,పూజనీయమైన నాటకమే నాట్యము.భావాభినయ హీనమైనది నృత్తము.రసభావవ్యంజనాది యుక్తమైనది నృత్యము ..అని అర్థము.కానివ్వండి..మేము మిగుల ఉల్లాసభరితముగా ఈ ప్రదర్శనను వీక్షిస్తాము.

( గజ్జెల చప్పుడు.శంఖ ధ్వని..మద్దెల..మహా మద్దెల..ఉడుక్కు..పెద్ద కంచు తాళాల మేళప్రాప్తి..మార్దంగికుని బీభత్స రసవిన్యాస క్రీడ.కొనసాగుతూండగా..జాయన రంగప్రవేశం.నర్తనం..ధ్వనిపూర్వక శ్రవణం..మధ్య మధ్య..గణపతిదేవుణి పారవశ్య వ్యాఖ్యలు..భళా..అద్భుతం..మహాద్భుతం..చప్పట్లు..కేరింతలు..నవ్వులు..శ్లాఘత..పరాకాష్టల కరతాళధ్వనుల కెరటం..ఒక ఉత్తుంగ తరంగం ఎగిసి శాంతించిన స్థితి..తర్వాత..నడుస్తూ జాయన తన దగ్గరకు రాగా., )

  గణ.దే:జాయనా..నీ శృంగనర్తనము అపూర్వము..భావ,రాగ,తాళ యుక్తముగా సాగిన శివతాండవము అపురూపము.ఈ వీరనాట్యములో నీవు శివరౌద్రావాహన జరిపిన తీరు మమ్మల్ని పారవశ్యుల్ని చేసింది.భళా..(తన ఇద్దరు భార్యలనూ,పిన చోడునినీ ఉద్దేశ్యించి) ఈ బాలుడు దైవాంశసంభూతుడు..జన్మతః ప్రధాన సృజన విద్యలలో పూర్ణుడైన ఈ బాలునకు సశాస్త్రీయమైన శిక్షణ ఉన్నచో యితడు ఈ సైనిక,కళా విద్యలలో ఎంతో వన్నెకెక్కి జగత్ ప్రసిద్ధి చెందుతాడు.ఇతనిలోని కళాభిజ్ఞతను మేము గుర్తించితిమి..దేవీ..జాయనను మనతోపాటు కాకతీయుల రాజధానియగు ఓరుగల్లు నగరమునకు వెంట తోడ్కొనిపోయి అచట ఈ కళారంగాలన్నింటిలో , యుద్ధవిద్యలలో, నిష్ణాతులైన శ్రేష్టులతో ప్రామాణికమైన, శాస్త్రీయమైన శిక్షణనిప్పించెదము .. పినచోడులుంగారూ, బాలుని మాతోపాటు పంపించి సహకరించండి.

  పిన చోడుడు: ధన్యోస్మి ప్రభూ.కృతార్థులము..మా జాయన భవిష్యత్తు మీ స్పర్శతో సూర్య సందర్శనముతో కమలమువలె వికసిస్తుందిక.సకల సన్నహములను కావించెదము.

 గణ.దే:రేపే ఓరుగల్లు మహానగరమునకు మా పయనము.చాముండ నాయకా..మన సేనా పరివారమును సంసిద్ధులను చేసి జాయనతోసహా మన ప్రస్థానమునకు ఏర్పాట్లు గావింపుము.

 జాయన:( పరుగు పరుగున మెట్లెక్కి వచ్చి గణపతిదేవునికి పాదాభివందనం చేసి..ఎదుట నిలబడి)ధన్యుడను మహారాజా..మీ కరునకు,శ్లాఘతకు పాత్రుడనైన నా జన్మ ధన్యము..ఆజన్మాంతము మీకు నేను ఋణగ్రస్తుడనై,విధేయుడనై ఉంటాను.

గణ.దే:భళా జాయనా..నీవు జన్మతః ప్రతిభాశీలివి..వినమ్రుడవుకూడా.అందువల్ల రానిస్తావు.మాకు జ్వాలలో కాంతివలె తోడుండి కొనసాగు..శుభం..శివానుగ్రహ ప్రాప్తిరస్తు.

 జాయన:ధన్యులము మహారాజా..ధన్యులము.

(పిన చోడుడు,నారాంబ,పేరాంబలతో సహా..)

గణ.దే:శుభం..కాకతీయ మహాసామ్రాజ్యంలో ఒక భాగమై..దివిసీమ పినచోడుని సుపరిపాలనలో కలకాలం సకల సంపదలతో సంపన్నమై వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ..సర్వం శుభం..సకలం సుభిక్షం..సెలవిక.

(గణపతి దేవుడు ప్రాంగణంనుండి నిష్క్రమిస్తారు.వెంట అనుచరగణం..తదితరులుకూడా నిష్క్రమిస్తున్న చిహ్నముగా ధ్వని..కాహళి శబ్దం)

రామా చంద్ర మౌళి కలం నుంచి కొత్త సీరియల్ వచ్చే వారం నుంచి ప్రారంభం!

Saranga_1