కలెబడె కవి అలిశెట్టి  

 

వులు, రచయితలు, కళాకారుల్ని బతికున్నప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా చనిపోయిన తర్వాత మాత్రమే గౌరవించడమనేది ఇవ్వాళ తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాన్ని పీడిస్తున్న జాఢ్యం. సరే కనీసం చనిపోయిన తర్వాతైనా పట్టించుకుంటున్నారన్నది కొంత సంతృప్తి ఇచ్చే విషయం. అయితే ఈ పనిని వారి మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు మాత్రమే ఎక్కువగా చేస్తున్నారు. కానీ కవి, రచయిత తాను జీవితకాలం ఏదైతే సంస్థతో అసోసియేట్‌ అయి వున్నాడో ఆ సంస్థలు వాళ్ళని పట్టించుకోవడం లేదు. సమగ్ర రచనలు ప్రచురించకున్నా కనీసం జయంతి, వర్దంతులు కూడా నిర్వహించడం లేదు. ఇది ఏదో ఒక సంస్థను దృష్టిలో పెట్టుకొని చెబుతున్న విషయం కాదు. అన్ని సంస్థలు అట్లానే ఉన్నాయి. అరసం, విరసం, తెరసం ఏ సంఘమైనా కానివ్వండి అన్నీ అలానే వ్యవహరిస్తున్నాయి. ఇందులో కొంత విస్మరణ, మరికొంత వివక్ష, ఎక్కువగా నిర్బధ్యాత ఉన్నది. బాధ్యతగా భావించి గౌరవించాల్సిన ప్రభుత్వాలూ ఈ విషయంలో ‘సెలిక్టివ్‌’గా వ్యవహరిస్తున్నాయి.  ఈ వివక్ష, విస్మరణ ఇవ్వాళ 63వ జయంతి, 24వ వర్ధంతిని జరుపుకుంటున్న అలిశెట్టి ప్రభాకర్‌ విషయంలోనూ జరిగింది.

అభ్యుదయ రచయితల సంఘానికి ఆయువు పట్టుగా నిలిచి, నడిపించిన తాపీ ధర్మారావు సమగ్ర రచనలు ఇప్పటికీ తెలుగు పాఠకులకు ఒక్క దగ్గర అందుబాటులో లేవు. అలాగే విద్వాన్‌ విశ్వం రచనలు కూడా సమగ్ర సంపుటాలుగా అందుబాటులో లేవు. ఆళ్వారు స్వామి రచనలు సమగ్ర సంపుటంగా వెలువడలేదు. (తెలుగు అకాడెమీ ప్రచురించినా ఆ సంపుటం అసమగ్రం). వీళ్ళు పేరుకు మాత్రమే. ఇలాంటి సాహితీవేత్తలు ఎంతోమందివి సమగ్ర సంపుటాలు రావాల్సి ఉన్నవి. మరోవైపు పొట్లపల్లి రామారావు రచనల్ని భూపాల్‌ సాయంతో ఆయన కుటుంబ సభ్యులు వెలుగులోకి తెచ్చారు. విప్లవ రచయితల సంఘం స్థాపన నాటి నుంచి చనిపోయే వరకూ దాంట్లో భాగమైన కె.వి.రమణారెడ్డి రచనల్ని ఆయన కుటుంబ సభ్యులు వరుసగా ప్రచురిస్తున్నారు. అలాగే అలిశెట్టి ప్రభాకర్‌ రచనల్ని సమగ్ర సంకలనంగా ఆయన మిత్రులు నర్సన్‌, నిజాం వెంకటేశం, జయధీర్‌ తిరుమలరావు తదితరులు పూనుకొని వెలువరించారు. ఇందులో ఇంకా సిటీలైఫ్‌లో భాగంగా వెలువడ్డ కొన్ని కవితలు జోడించాల్సి ఉంది.

జీవిత కాలం సేవ చేసిన సంస్థలే పట్టించుకోకపోవడమనేది ఇవ్వాళ కొత్తగా జరుగుతున్నది కాదు. ఆది నుంచి ఈ తంతు ఇలాగే కొనసాగుతోంది. 1953కు ముందు హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ రచయిత సంఘం ఏర్పడింది. దీని ద్వారా ఎక్కువగా సంస్థ బాధ్యులైన దాశరథి, నారాయణరెడ్డిల స్వీయ ప్రచురణలే ప్రచురితమయ్యాయి. సురవరం ప్రతాపరెడ్డి లాంటి వారి రచనలు వీళ్లు వెలువరించలేదు. దీని వల్ల ఆయన రచనలు సమగ్రంగా అందుబాటులో లేకుండా పోయాయి. ఆ యా సంఘాల తరపున దాని బాధ్యుల స్వీయ రచనలు అప్పుడూ వెలువడ్డాయి. ఇప్పుడైతే ఇబ్బడి ముబ్బడిగా వెలువడుతున్నాయి. అయితే తెలుగు సాహిత్యానికి చిరస్మరణీయమైన సేవ చేసిన వెలుగుల రచనలన్నీ ఒక్క దగ్గర లేక పోవడం మూలంగా సాహిత్య చరిత్రకూ, సాహితీవేత్తలకు, సృజనకారుకు అన్యాయం జరుగుతోంది. న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన గౌరవం నుంచి వాళ్ళు వంచితువులతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున కొంతమంది విస్మ ృతుల్ని, వారి రచనల్ని పాఠ్యపుస్తకాల్లో జోడించాని ప్రయత్నించినపుడు అవి అందుబాటులోకి రాలేదు. దీనివల్ల వారి గురించి తెలుసుకునే అవకాశాన్ని కోల్పోయాం. అయితే అలిశెట్టి రచనలన్నీ ఒక్క దగ్గర ఉండడం మూలంగానే ఆయన రచనని పాఠ్యాంశంగా నిర్ణయించడానికి వీలయింది.

నిజానికి అలిశెట్టి ప్రభాకర్‌ 1993లో చనిపోతే 2013 వరకూ ఏ సంస్థా ఆయన మీద సభలు, సమావేశాలు నిర్వహించలేదు. ఒక్క విప్లవ రచయిత సంఘం మాత్రం ఆయన మరణానంతరం ‘మరణం నా చివరి చరణం కాదూ’ పేరిట చిన్న కవితా సంపుటిని వెలువరించింది. (అంతకు ముందు అలిశెట్టి తన సిటీలైఫ్ ని అచ్చేసి దాని ద్వారా వొచ్చిన డబ్బుని చెరబండరాజు చికిత్సకు అందించిండు) అయితే నర్సన్‌, నిజాం వెంకటేశం, దాసరి నాగభూషణం, వి.సామ్రాట్‌ అశోక్‌, గుండేటి గంగాధర్‌ ఇంకొంతమంది 2012 జనవరిలో అలిశెట్టి ప్రభాకర్‌ సంస్మరణ పెట్టేవరకు లబ్ధప్రతిష్టులైన ఆయన మిత్రులెవరికీ ఆయన స్మరణలో లేడు. బతికున్నప్పుడంటే తమకు పోటీ అవుతాడు కాబట్టి అలిశెట్టిని విస్మరించారు అనుకోవచ్చు. కానీ చనిపోయాక…అదీ 20 ఏండ్ల వరకూ ఆయన రచనలేవీ అందుబాటులో లేవు అంటే అలిశెట్టిని కవిగా ఖతం చేయడమే! ఇదే కాలంలో శ్రీశ్రీ రచనలు సమగ్ర సంపుటాలుగా విరసం, మనసు ఫౌండేషన్‌ వాళ్ళు ప్రచురించారు. అట్లాగే ఇప్పటికీ ఎవరో ఒకరు మహాప్రస్థానం ప్రచురిస్తూనే ఉన్నారు. ‘కవి’ అనే రెండక్షరాలతో ఇద్దరినీ పోల్చడం కాదు గానీ అలిశెట్టి కవిత్వం ఒక్కసారి చదివితే చాలు నిద్రాణంగా ఉన్నవాణ్ని సైతం నినాదమై మేల్కొల్పుతుంది

ఈ మేల్కొలుపు కవిత్వానికి పునాది జగిత్యాలలో పడింది. అలిశెట్టి 1974 నుంచి కవిత్వం రాస్తున్నా, 1978 జగిత్యాల జైత్రయాత్రలో ఔట్‌సైడర్‌గానే ఉన్నడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ కవుల రచనలు అతి తక్కువగా పత్రికల్లో  ప్రచురితమయ్యేవి. అడపా దడపా దాశరథి, సి.నారాయణరెడ్డి రచనలు మాత్రమే పత్రికల్లో అచ్చయ్యేవి. అయితే ఈ స్థితిని అధిగమించేందుకు తెలంగాణలో కొంత ప్రయత్నం అన్ని జిల్లాల్లో జరిగింది. దీంట్లో భాగంగా జగిత్యాల కేంద్రంగా బి.నర్సన్‌, గంగాధర్‌, రఘువర్మ, ధరన్‌ బాబులు పత్రికల వారికి ప్రత్యామ్నాయంగా కవితా సంకలనాలు తీసుకురావాని సంకల్పించారు. అందుకే తామే సొంతంగా వివిధ ప్రాంతాల్లోని కవులకు ఒక వేదికగా ‘సాహితీ మిత్ర దీప్తి’ ని ఏర్పాటు చేసిండ్రు. దీని ద్వారా దీప్తి, చైతన్య దీప్తి తదితర ఐదు కవితా సంపుటాలు వెలువరించిండ్రు. ఇందులో రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన వారి కవిత్వంతో పాటు తెలంగాణాకు చెందిన రామాచంద్రమౌళి, నందిని సిధారెడ్డి లాంటి ఆనాటి యువ కవుల కవిత్వం కూడా చోటు చేసుకునేది. ఈ కవితా సంపుటాల ప్రచురణ, నిత్య కవితా పఠనం, సాహితీ మిత్ర దీప్తి దోస్తానా అలిశెట్టిని కవిగా నిలబెట్టింది. అందుకు ఆయన ఎదిగొచ్చిన సమాజం, ఎదుర్కొన్న ఒడిదొడుకులు పాఠాలను నేర్పాయి. ఏదైనా పని ముందటేసుకుంటే దాని అంతు చూసే వరకూ, లేదా సమస్యకు పరిష్కారం కనుక్కునే వరకు దాంట్లోనే మునిగిపోయేవాడు. అందుకే తాను చూస్తున్న సమాజంలోని రుగ్మతలకు వెంటనే రియాక్ట్‌ అయ్యేవాడు.

నిజానికి 1970 నుంచే దొరలు, భూస్వాములు నక్సలైట్‌ ఉద్యమం రూపుదిద్దుకోవడాని కన్నా  ముందే తమ పిల్లల చదువు కోసం గ్రామాల నుంచి పట్టణాల బాట పట్టిండ్రు. దాదాపు ఇదే సమయంలో అప్పటికే పట్టణ ప్రాంతాల్లోని బీసీలు మొదటిసారిగా టీచర్‌, క్లర్క్‌ లాంటి చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరిండ్రు. అట్లాగే ఉత్తర తెంగాణలోని రైల్వే ట్రాక్‌ వెంబడి ఉన్న పట్టణాల నుంచి సింగరేణికి వలసలు పెరిగినయి. ఈ కాలంలోనే అలిశెట్టి ప్రభాకర్‌ తండ్రి చినరాజం టీచర్‌గా పనిచేసేవాడు. ఆయన అలిశెట్టికి 15 ఏండ్ల వయస్సున్నప్పుడు చనిపోయిండు. అప్పటి నుంచి అన్నీ తానే అయి తల్లి లక్ష్మి పెంచింది. నిజానికి అప్పటికీ ఇప్పటికీ జగిత్యాలో పద్మశాలీలది పెద్ద జనాభా. ఎక్కువ మందికి బీడీల్జేసుడే వృత్తి. ఈ దశలో తాను పుట్టినప్పటినుంచి ఉన్న జగిత్యాల పట్టణానికి చుట్టు పక్కల గ్రామల నుంచి వలసొచ్చిన వెలమ దొరలు, వాళ్ళ కొడుకుల దబాయింపు, అజమాయిషీని, ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక ప్రతిఘటించేవాడు. వాళ్ళ విచ్చలవిడితనం కూడా అలిశెట్టిని ప్రశ్నించేలా చేసింది. పిట్టపిల్ల కాయమైనా భౌతికంగా దాడిచేయడానికి కూడా వెనుకాడేవాడు కాదు. అందుకే అలిశెట్టి కవిత ‘రక్తరేఖ’లో ఇలా సాగుతుంది.

‘‘నువ్వు ఉరిమి చూసినప్పుడు

ఊరంతా పాలేర్లే

వాళ్ళే

ఊరినించి తరిమికొడితే

నీ బ్రతుకంతా పల్లేర్లే’’

అని దొరలను హెచ్చరించిండు. అలాగే నిరుద్యోగం గురించి..‘‘పుస్తకం లోంచి దులిపేసిన అక్షరాల్లా లక్షకి లక్షలు దేశమంతా నిరుద్యోగులై నిండుకున్నారు’’ అన్నడు. కవిత్వంలో రాజకీయాన్ని చీల్చి చెండాడిండు. తెలుగులో ఇంత పదునుగా రాజకీయ`కవిత్వం అల్లినవాళ్ళు అరుదు.

‘‘‘జలగాలు’ ‘బ్రహ్మ’జెముళ్ళూ

అవకాశవాది ‘రూలుకర్రా’

‘ఆరణాల కూలీ’

‘పునాది’లేని ‘భవనం’ నాచారం ‘సన్యాసులూ ’

వరుసగా ఎవరెవరు ముఖ్యమంత్రులైనా

ఇరవైనాలుగ్గంటలు కుట్ర ఇంకొకడ్ని ప్రమాణ స్వీకారం

చేయించినా-

అక్షరాలా అరాచకంలో మార్పుండదు’’ అని అంజయ్య, చెన్నారెడ్డి, ఎన్టీఆర్‌, నాదెండ్ల ఇలా ఆనాటి ముఖ్యమంత్రుల ముసుగుల్ని తొలగించిండు. వాళ్ళ ఆరాచకాల్ని చిత్రికగట్టిండు.

జగిత్యాలో ఉన్న సమయంలో అలిశెట్టి కవితలు రాయడం, పోస్టు చెయ్యడమే పనిగా పెట్టుకున్నడు. తాను అనుభవించిన పేదరికం, దగ్గర నుండి చూసిన అణగారిన వర్గాల వెతలే అక్షరాలుగా తెలుగు నేలంతా అలికిండు. ఆ పంట నుంచి ఒక్కసారైనా బువ్వ తినని కవులు లేరంటే అతిశయోక్తి కాదు. తన కవిత్వంలో మహిళల పట్ల ప్రేమ, ఆర్తిని కలగలిపిండు. కైగట్టిండు. దళిత, ముస్లిం, చేనేత, గౌడ బతుకుల వెతలను రాసిండు. రైతు, కార్మికుడు, విద్యార్థి, ఇలా అందరి గురించీ రాసిండు. నిత్య చైతన్యంతో ఎదిగి వచ్చిన ఒక తరానికి తన రాజకీయ కవిత్వాన్ని సమాజాన్ని శస్త్ర చికిత్స చేసేందుకు ఇన్స్‌ట్రుమెంట్సుగా ఇచ్చిండు. గుండె లోతుల్లోకి వెళ్ళి ఛిధ్రమౌతున్న సమాజాన్ని, అడుగంటుతున్న మానవీయ విలువల్ని హృదయంతో చూసిండు. రక్తంతో రాసిండు. అందుకే కవిత్వమంటే ఏమిటో తాను 1978లో ప్రకటించిన తొలి కవితా సంకనం  ‘ఎర్రపావురాలు’ లో

‘‘నా గుప్పిట్లో

మండుతున్నా

ఎన్నో గుండెలు …

ఒక్కొక్కదాన్లో

దూరి,  వాటిని చీరి ,

రక్తాశ్రువులు ఏరి

పరిశీలిస్తాను నేను’’ అన్నాడు. ‘’వర్తమానానికి భావితవ్యానికీ నడుమ // ప్రగతి వంతెన కట్టాలని అనుక్షణం// పరితపిస్తున్నాను అని రాసిండు .

పేదరికం, ఆకలితో సహవాసం చేయడాన్ని అలవాటు చేసుకున్నడు. నిరుద్యోగం, నగర జీవితం గురించి రాసిండు. మెజారిటీ ప్రజల బాధలూ గాధలే తన కవిత్వానికి ముడి సరుకని చెప్పుకున్నడు. ‘గొర్రె మందతో నడిచేకంటే.. చీమల బారులో చేరితే మేలు’ అనే సోయున్నవాడు. ‘కవిత్వం, జీవితం’ రెండూ వేర్వేరు కావని కవమనమల్లినవాడు. భావజాల వ్యాప్తికన్నా బాధితుల గుండె చప్పుడు వినిపించడానికే ఎక్కువ ఇష్టపడ్డడు. ఆఖరి వరకూ ఆత్మాభిమానంతో ఉన్నడు. అందుకే

‘‘చితికి…చితికి…చివరికి

పత్రిక పారితోషికమే జీవనాధారంగా

స్వీకరిస్తున్న నేపథ్యంలో

హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు

చెప్పుకోనివ్వండీ’’

అని రాసిండు.  సామాజిక స్పృహ ఉన్నవాడు కాబట్టే

‘‘గడ్డ కట్టిన కారంచేడు నెత్తుటి మడుగులో

అగ్రవర్ణాల అహంకారపు గొడ్డళ్ళు మునిగి

ఉపరితలమ్మీద

ఆరుగురి  హరిజనుల శిరస్సులు మొలిచి

హాహాకారాలు చేస్తుంటాయ్‌’’ అన్నడు.

అలిశెట్టి ప్రభాకర్‌ అర్దాంతరంగా ప్రయాణం ముగించినా… ఆయన వేసిన దార్లు ఇంకా కొత్తగానే ఉన్నాయి. ఈ దారుల్లో కొంతమంది ‘టేక్‌ డైవర్షన్‌’ అని కొత్తగా బోర్డులు పెట్టి తప్పుదోవ పట్టిస్తున్నవారూ ఉన్నరు. నిజానికి ఆయన గ్రామాల నుంచి నగరానికి దారులు వేసిండు. అక్షరాల్లో ‘సిటీ లైఫ్‌’ని చిత్రించిండు. అన్యాయం ఎక్కడ కనబడ్డా అక్షరాలనే గొడ్డళ్ళుగా చేసిండు. ఇవ్వాళ ఆయన్ని, ఆయన రచనల్ని ఆలింగనం చేసుకునే  సంస్థలు బాధ్యులూ ఎన్నడూ అలిశెట్టి కుటుంబం గురించి ఆలోచించలేదు. 1993లోనే కొంతమంది తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ మిత్రులం ఆనాటి తెలుగు యూనివర్సిటీ వీసీ సి.నారాయణరెడ్డి మీద ఒత్తిడి తెచ్చి అలిశెట్టి అర్ధాంగి భాగ్యకు అటెండర్‌ ఉద్యోగమైనా ఇప్పించాం. ఇన్నేండ్లూ కంటెజెన్సీగానే కొనసాగుతున్న ఆమెను తెలంగాణ ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసి, ఉండేందుకు ఇంత నీడ కల్పించాల్సిన అవసరమున్నది.

 

 

దిల్దార్‌ కథకుడు

Dilavar book 1రచయిత ఏది రాస్తే అది పాఠకుడు చదువుకోవాలె. అది రచయిత  లేదా సృజనకారుడి హక్కు. హక్కుని గౌరవిస్తూనే బాధ్యతను గుర్తు చేసేవాడు విమర్శకుడు. రచయిత ఏమి రాయాలె, ఏమి రాయొద్దు అనే దాంట్లో పాఠకుడి ప్రమేయం ఉండాలా? వద్దా అనేది ఇవ్వాళ సాహిత్య చర్చలో ప్రధానాంశమైంది.   నిజానికి ఏ రచయితైనా తాను చూసిన, అనుభవించిన, దృష్టికి వచ్చిన లేదా తన మనసుకు తట్టి చర్చకు పెట్టాల్సిన/ తెలియజేయాల్సిన విషయాల్నే రాస్తాడు. ఈ రచనలే సామాజిక చైతన్యానికి తోడ్పడతాయి. రచయిత ఏమి రాయాలో పాఠకుడు నిర్ణయించలేడు. పత్రిక, లేదా పాఠకుడి డిమాండ్‌ని బట్టి సాహిత్యం వస్తే/ రాస్తే అది కమర్షియల్‌/ కలుషిత సాహిత్యమే అవుతుంది గానీ కమనీయ సాహిత్యం కాదు. ‘మనీ’ సాహిత్యం ‘మెనీ’ సాహిత్యంగా మారాలె!
ఈ కథ రచయిత దిలావర్‌ ‘మెనీ’ అంటే సమాజంలోని మెజారిటీ జీవితాల్నే చిత్రికగట్టిండు. ఇందులో కథకుడు తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నడు. తాను దగ్గరి నుండి చూసిన పద్మశాలి, మాదిగ, లంబాడీ జీవితాల్లోని దయనీయమైన వ్యధాభరిత గాథల్ని కళ్ళముందుంచిండు. ఒక వైపు నోస్టాల్జియాను చిత్రికగడుతూనే, చిధ్రమవుతున్న రైతుల, స్త్రీ జీవితాల్ని ద్రవించిన హృదయంలోంచి పాఠకుల మెదళ్ళలోకి ఒంపిండు. దిల్‌ని, దిమాక్‌ని కలెగలిపి కమనీయ సాహిత్యాన్ని మనముందుంచిండు. పాత్రలు ఉరి బెట్టుకున్నా కథలకు మాత్రం పాణం బోసిండు. చేదు నిజాల్ని తీపి పూత లేకుండా పాఠకులకు అందించిండు. ‘ఉత్పత్తి’ జీవితా హృదయావిష్కరణ చేసిండు.
నిజానికి ఇవ్వాళ సమాజంలో జరుగుతున్న విషయాలను తీసుకొని వాటిలోతుల్లోకి పోకుండానే కొంతమంది తమది కాని, తమకు తెలియని జీవితాలను ‘డిమాండ్‌’ కథలుగా అల్లుతున్నరు. అట్లా గాకుండా సమాజ హితంగోరే రచయిత, పాఠకుడికి ఇది కావాలి, ఈ విషయం తెలియాలి అని వాటి మూలాల్లోకి వెళ్ళి తనదైన శైలిలో, శిల్పంలో, భాషలో చెబుతాడు. ఆ పని దిలావర్‌ సమర్ధంగా చేసిండు. కథాసృష్టిలో సమస్య ఉండవచ్చు, సంఘటనలూ, పాత్రలు, ఘర్షణ, జీవితమూ ఉండవచ్చు. అయినప్పటికీ ఆధునిక సమాజంలో సమస్యను తార్కికంగా ఆలోచించి మెజారిటీకి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించినప్పుడే సాహిత్యానికి విలువ, గౌరవం పెరుగుతుంది. కొన్నిసార్లు మెజారిటీ సమాజం తమ సుప్థచేతన వల్ల కొన్ని విషయాను తిరస్కరించవచ్చు. ఆ విషయాల ఆమోదం పట్ల గుంజాటన ఉండొచ్చు. అట్లాంటి సమయంలో సామరస్యంగా, సమన్వయంతో మనసు నొప్పించకుండానే వారిని కన్విన్స్‌ చేయాల్సిన బాధ్యత కూడా రచయితపై ఉంటుంది. అందుకు వాహిక అస్తిత్వవాదమే! ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని పెంపొందించే సాహిత్యమే సమాజానికి ఉపయోగమైంది. అవసరమైంది కూడా!
రచయిత లేదా సృజనకారుడు తనకిష్టంలేని ఏ విషయాన్ని, అంశాన్ని సాహిత్యీకరించబోడు. ఇతివృత్తంపై తాదాత్మ్యత, అవగాహన, పట్టు, లోతైన పరిశీలన, ప్రేమ లేకుండా రాసినట్లయితే అది పేలవంగా, నిస్తేజంగా, నిర్జీవంగా ఉంటుంది. ఆఖరికి రచయితను అభాసుపాల్జేస్తుంది. అందుకే నేటి సమాజంలో ఎట్లా జెప్పిండనే దాని కన్నా ఏమి జెప్పిండనేదే ప్రధానమైంది. ఎందుకు జెప్పిండనేది సామాజిక, రాజకీయాసక్తులపై, వ్యక్తిగత చైతన్యస్థాయిపై ఆధార పడి ఉంటది. వస్తువే అన్నింటికీ మూలం. అస్తిత్వోద్యమాలకు పూర్వం ఈ వస్తువుల ఎంపికలో రచయితలపై అభ్యుదయ, ప్రగతిశీల, విప్లవ భావజాలాల ప్రభావం ప్రస్ఫుటంగా ఉండింది. శైలీ, శిల్పాలు కథలను డామినేట్‌ చేసినవి. ప్రామాణిక భాష పేరిట అజమాయిషీ కొనసాగింది.
తెలుగు సాహిత్యంలో మొదట అగ్రకులస్తులు తమ జీవితంలో భాగమైన ‘సామాజిక సంస్కరణ’ ఇతివృత్తంగా రచనలు చేశారు. దీని లోని డొల్లతనాన్ని ముందు పేజీల్లో తెలుసుకుందాం. అయితే తొలి దశలో అక్షరాస్యులైన బ్రాహ్మణులతో పోలిస్తే వారి ద్వారా, వారి ఆలోచనలు, భావజాలం, ప్రభావాలకు అనివార్యంగా, పూర్తిగా లోబడాల్సి వచ్చిన కింది కులాల వాండ్లు మెల్లమెల్లగా ఒడిదొడుకుల్ని అధిగమించారు. తక్కువగానే అయినా రాజకీయ, ఆర్థిక అంశాలపై రచనలు చేసిండ్రు. తెలంగాణలో గూడూరి సీతారామ్‌, జి.రాము, సీమాంధ్రలో కొలుకలూరి ఇనాక్‌ తదితరులు అట్లాంటి వారికి ప్రతినిధులు. వీళ్ళు బహుజన జీవితాలను చిత్రికగట్టిండ్రు. బ్రాహ్మణాధిపత్య విద్యాబోధన నుంచి బయటపడ్డ వారు తర్వాతి కాలంలో ఆలస్యంగానే అయినా కొత్త విషయాలను కథలుగా మలిచిండ్రు. ఇట్లా రాసిన వారిలో రాయసీమ నుంచి కె.సభా లాంటి దళితులు, ఆంధ్రా నుంచి అందే నారాయణస్వామి లాంటి బహుజనులున్నారు. సాయుధ పోరాటం, నక్సలైట్‌ ఉద్యమ సందర్భంగా కొంత మేరకు కింది కులాల వారి జీవితాలు కథా సాహిత్యంలోకి వచ్చాయి. ఇందుకు ఉదాహరణ ఆవుల పిచ్చయ్య, అల్లం రాజయ్య కథలు. అయితే ఈ ‘పోరాట రచనలు’ అంతిమంగా అగ్రకులాల వారిని హీరోలుగా, రోల్‌ మోడల్స్‌గా, మరీ ముఖ్యంగా బ్రాహ్మణుల్ని ఉన్నతలుగా నిలబెట్టడానికీ, మరింతమంది ‘అమరు’లు కావడానికి మాత్రమే తోడ్పడ్డాయి.
బ్రాహ్మణాధిపత్య సాహిత్యానికి భిన్నంగా గ్లోబలైజేషన్‌ తర్వాత, మండల్‌ కమీషన్‌ అమలు, బాబ్రీమసీదు ‘షాహిద్‌’, కారంచేడు, చుండూరు దాష్టికాల  తర్వాత, మరీ ముఖ్యంగా 1990ల  అనంతరమే అస్తిత్వ సాహిత్యం పాదులూనుకుంది. దానికి పై సంఘటనూ, అవి సమాజంలో తెచ్చిన మార్పు, ఉద్యమాలు, ఉద్యమాలకు ఊతమిచ్చిన పత్రికలూ, వాటికి అక్షరరూపమిచ్చిన జర్నలిస్టు, సాహితీవేత్తల  మూలంగా అస్తిత్వ సాహిత్యానికి స్థిరత్వం ఏర్పడింది. దీన్ని తర్వాతి కాలంలో అన్నికులాల  అకడమిషయన్లు అనివార్యంగా గుర్తించాల్సి వచ్చి సాహిత్యచరిత్రలో భాగం చేశారు. 1980వ దశకం నుంచి విద్యారంగంలోకి   టీచర్లుగా బ్రాహ్మణేతరులు కూడా ఎక్కువగా వచ్చారు. దీనికి కొంత రిజర్వేషన్లు, మరికొంత బహుజన చైతన్యం కారణం. దీంతో అప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న అగ్రకులాల  వాండ్లు, బ్రాహ్మణులు  బహుజనుల  దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే వాళ్ళు అప్పటికే అందివచ్చిన ప్రైవేటు, కార్పోరేట్‌ కళాశాలలను ఆశ్రయించారు. గ్లోబలైజేషన్‌ కారణంగా ఈ దశలో ప్రైవేటు విద్యాసంస్థలు, కార్పోరేట్‌ కళాశాలలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటయ్యాయి. వీటిలో ఎక్కువభాగం బోధకు అగ్రకులాల  వాండ్లే కావడం యాధృచ్ఛికం కాదు. ఇవి డాక్టర్లు, ఇంజనీర్లను తయారుచేసే ఫ్యాక్టరీలుగా పనిచేశాయి. ఇట్లా తొలిదశలో ఈ విద్యాసంస్థల్లో అభ్యాసం చేసిందీ, దాని ద్వారా మల్టినేషనల్‌ కొలువులు సంపాదించింది అత్యధిక శాతం కచ్చితంగా అగ్రకులాల  వాండ్లే! నక్సలైట్‌ ఉద్యమం పుణ్యమా అని గ్రామాల నుంచి నగరాల్లోకి మకాం మార్చిన రెడ్లు, వెలమలు, దొరలు, భూస్వాములు, వారికి తోడు అప్పటికే పట్టణ/నగరబాట పట్టిన బ్రాహ్మణులు  తెంగాణలో ఈ అవకాలశాను అందిపుచ్చుకున్నారు. వీరికే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు  తొలిదశలో అందాయి. ఈ తరం పిల్లలు సామాజిక మార్పుకు అనుగుణంగా ప్రజలతో ఎన్నడూ మమేకం కాలేదు. తాము ‘ఎబోవ్‌ ద కట్‌’ అన్న దృక్పథంతోనే వ్యవహరించారు. అదే విషయాలు  సాహిత్యంలోనూ చోటు చేసుకున్నాయి. చేటు చేశాయి.
మొదట చెప్పుకున్నట్టు 1990 కన్నా ముందు ఒకటి రెండు మినహాయింపుతో సాహిత్యమంతా అగ్రకులాధిపత్యాన్ని నిలబెట్టే విధంగానే ఉండింది. (కేవలం  సక్సెస్‌ స్టోరీస్‌ మాత్రమే రాసిన కొలకలూరి ఇనాక్‌ సకల ఆధిపత్యాలను అస్తిత్వ సోయితో ఎదిరించిన వారిలో ఆద్యుడంటే అతిశయోక్తి కాదు) ఈ దశలోని విప్లవ సాహిత్యమూ వర్గ దృక్పథాన్ని మాత్రమే ప్రచారం చేసింది. బహుజనులూ  అదే పంథాను అనుసరించారు. కథా సంకలన కర్తలు, సాహిత్యరంగంలో బ్రాహ్మణాధిపత్య భావజాలం  గల  విమర్శకులు చెప్పిందే తీర్పుగా చలామణి అయింది. వారి ఆలోచన చట్రంలో ఇమడని సాహిత్యాన్ని తూర్పారా పట్టేవారు. చీల్చి చెండాడే వారు. అంతిమంగా అంతో ఇంతో రాయగలిగిన సత్తా వున్న వాళ్ళు సైతం ఈ విమర్శల  మూలంగా అసలే రాయడం మానేసిండ్రు. తప్పు సరిదిద్ది ముందుకు నడిపించేదిగా గాకుండా విమర్శ అనే ఖడ్గంతో కలాలను నరకడమే లక్ష్యంగా పనిచేసిండ్రు. ముఖ్యంగా కింది కులాలవారి అక్షరాలను నరికి కుప్పలు పోసిండ్రు.
kaifiyath
అనాది కాలం  నుంచి దాదాపు గ్లోబలైజేషన్‌ ప్రభావం విస్తృతమయ్యే వరకూ బ్రాహ్మణులు తమ కులంలోని సతీ సహగమనం, వేశ్యాలోలత, వితంతు వివాహం, మధ్యతరగతి ఉద్యోగస్థుల  బాధలు, ప్రేమలు, పెళ్ళి ళ్లు, లైంగిక స్వేచ్ఛ, శృంగారం ప్రధానంగా రచనలు చేసిండ్రు. ఇవే ‘విప్లవ’, ‘అభ్యుదయ’, ‘ప్రగతిశీల’ రచనలుగా చలామణి అయ్యాయి. ఈ సాహిత్యంలో కింది కులాల  జీవితాలుగానీ, ఘర్షణగానీ అతి స్వల్పంగా  రికార్డయింది. నిచ్చెనమెట్ల సమాజాన్ని ఈ సాహిత్యం నిలదీయలేదు. పరిష్కారాలన్నింటినీ వర్గ దృక్పథంతో తాము గిరిగీసుకున్న పరిధిలో, పరిమితిలోనే వెతికారు. 1980వ దశకం నుంచీ పాక్షికంగానే అయినా బెంగాల్‌ బుద్ధిజీవులు ‘సబాల్టర్న్’ జీవితాలను చరిత్రకెక్కించినారు. అయితే వీరికి అక్కడి కానూ సన్యాల్‌ మాత్రమే కనిపించిండు. అణగారిన కులాల వారి బాధలు  వీరి కలాలకు ఆనలేదు.
అందుకే ఇవ్వాళ అస్తిత్వోద్యమ సాహిత్యకారులు ప్రధానంగా సమాంతర సాహిత్యాన్ని సృజిస్తున్నారు. సబాల్టర్న్  దృక్కోణంతో సమాజాన్ని చూస్తున్నరు. ప్రతిమనిషికి సమాన విలువ ఉండే సమ సమాజ నిర్మాణం కోసం సాహిత్యాన్ని వాహికగా ఎంచుకున్నరు. అస్తిత్వ చైతన్యంతో కిందినుండి చరిత్రను నిర్మిస్తూ, తమ సమస్యలకు అదే సోయితో జవాబులు  వెతుకుతున్నారు. ప్రతి సమస్యకూ అస్తిత్వ సోయే సమాధానమిస్తుందని నమ్ముతున్నరు. సృజనకారులతో పాటు విమర్శకులూ  ఇప్పుడు కొత్త తూనికరాళ్ళను తయారు చేసుకున్నరు. మూస పద్దతిలో గాకుండా బహుజన సోయితో వివిధ అంశాలకు, సమస్యలకు సమాధానాలు వెతుకుతున్నరు. కొత్త విషయాల్ని వెలికి తీస్తున్నరు. ఘనతను చాటుతున్నరు. పాఠకుల  తరపున, సమాజం తరపున విమర్శకులు  మాట్లాడుతున్నరు. 1990 నాటి విమర్శకు ఇవ్వాలటి విమర్శకు తేడా ఉంది. అందుకు విప్లవ సంస్థల  నుంచి బయటికి వచ్చిన వారు కొత్తదారులు  వేసిండ్రు. శివసాగర్‌ పయనం అందుకొక ఉదాహరణ. దరకమే లాంటి సంస్థలు  కొత్త ఆలోచనను ప్రోది చేశాయి. దండోరా ఉద్యమం కొత్త వాదనకు వేదిక అయ్యింది. మహాజన, సమాంతర, బహుజన కెరటాలు లాంటి పత్రికలు దారి చూపాయి. ఆనాడు విమర్శ వర్గ దృక్పథంతోనే ఉండింది. ఇవ్వాళటి విమర్శ అస్తిత్వ సోయితోటి, వర్ణ దృక్పథంతోటి ఉన్నది. ఇది రియాలిటీ. ఆనాటిది హైపోథీసిస్‌. అనుభవంలో హైపోథీసిస్‌ తప్పని తేలింది. అనేక చేదు నిజాలు  ముస్లింలు, దళితులు, బహుజనులు తమపై జరిగే దాడుల్ని మరింత బలంగా ఎదుర్కునేందుకు సన్నద్ధం చేస్తోంది.
ఇండియాలో ఇవ్వాళ ప్రధానంగా రెండు అంశాలున్నాయి. ఒకటి కులం. రెండు మతం. అయితే విమర్శకుడు మాత్రం రచయితలకున్న హక్కులకు భంగం కలుగకుండానే ఏది? ఎందుకు? ఎలా? ఎప్పుడు? ఎవరు? రాయలేదు, రాశారు! అని విమర్శించడానికి వీలుంటది.  ఈ విషయాలు చర్చకు పెట్టడం ద్వారా మేలైన సాహిత్యం` మెరుగైన సమాజం కోసం రావడానికి వీలవుతుంది. సమస్యలోతుల్లోకి వెళితే పరిష్కారం దొరుకుతుంది. ఈ రెండు సమస్యల్ని రాజకీయార్థిక కోణాల్లో గాకుండా కులం, మతం దృష్టి కేంద్రంగా చూడాలి. రాజకీయంగా ఎవరి జనాభా నిష్పత్తి మేరకు వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎందుకు లేదో తెలుసుకోవాల్సి ఉంది. అలాగే ఆర్థిక విషయంలో పేదరికానికి నిర్వచనాలు మారుతున్నాయి. పేదరికానికి కులం, మతంలో కారణాలు వెతికినప్పుడు ఆధిపత్యుల దోపిడీ, అణచివేత తెలిసి వస్తుంది. అప్పుడు శత్రువెవరో తేట తెల్లమవుతుంది. పేదరికానికి, కులం మతంతో గ సంబంధాను, కార్య`కారణాను విశ్లేషించుకున్నప్పుడు కచ్చితంగా రచయిత జ్ఞానంలో, తద్వారా అభిప్రాయాల్లో మార్పు ఉంటది. కుంపై, మతాధిపత్యంపై తిరుగుబాటు ఉంటది. ఆర్థిక, రాజకీయ రంగాల్లో వర్గాధిపత్యం, అగ్రకులాధిపత్యమే సమాజంలో పేదరికానికి కారణమనే అవగాహన ఏర్పడినట్లయితే సమస్యలు  మరింత సుళువుగా పరిష్కరించుకోవడానికి మార్గమమేర్పడుతుంది. ఈ విషయంలో ఆధిపత్యుల  ‘మేధోత్వాన్ని’, కుట్రలను అర్థం చేసుకోవాలి. ఈ కుట్రలను చేధించడానికి ఫూలే, అంబేద్కర్‌ రచనలు, ఆచరణే శరణ్యం.
పూలే సామాజిక ఆధిపత్యాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. అందులో భాగంగా మేలైన మార్పుకోసం విద్యను ఆయుధంగా చేసుకున్నడు. కింది కులాలకు, మహిళలకు చదువు నేర్పడం ద్వారా  సమస్యకు పరిష్కారం చూపించిండు. ‘గులాంగిరీ’ ద్వారా సాహిత్యదారులేసిండు. పూలే చనిపోయిన తర్వాత పుట్టిన అంబేద్కర్‌ తన మేధో సంపత్తితో పూర్తిగా సామాజిక విప్లవానికి కృషి చేసిండు. అంబేద్కర్‌ రచనలు  ఎంత విరివిగా అందుబాటులోకి వస్తున్నాయో అంతే స్థాయిలో బహుజన చైతన్యం పెరిగి గతంలో పాదులూనుకున్న సిద్ధాంతాలను బద్ధలు  కొడుతోంది. తొలితరం అక్షరాస్యు లు ఇవ్వాళ అన్ని ఉద్యమాల్లో ముందున్నరు.
సంస్కరణ పేరిట బ్రాహ్మణీయ సాహిత్యాన్ని ఇంతకాలం  విప్లవ సాహిత్యంగా, అదే సమాజాన్ని మారుస్తుందని అభ్యుదయ వాదులు  తప్పుడు భావనల్ని ప్రచారంలో పెట్టడం జరిగింది. (శ్రీశ్రీ సాహిత్యాన్ని సమగ్రంగా చదివితే ఇది అర్థమైతది) దీని వల్ల  కులానికి వచ్చిన నష్టమేమీ లేదు. దాని స్థానంలో అది ఖాయంగానే ఉంది. ఈ నిచ్చెన మెట్ల సాహిత్యాన్ని తలకిందులుగా చేయాలి. అది సాధ్యం కాని స్థితిలో కనీసం సమాన స్థాయి ఏర్పడే సాహిత్య సృజన జరగాలి. ఆధిపత్యకులాలని తలకిందులు  చేయకుండా నాలుగైదు శాతం మాత్రమే ఉన్న వారి సామాజికాధిపత్యానికి చరమగీతం పాడడం సాధ్యం కాదు. నిజానికి సమాజ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి పనికొచ్చినంతగా సమాజాన్ని మార్చడానికి మార్క్సిజం పనికిరాదు. ‘అంతిమ ఘడియ’ (ఫైనల్‌ డిస్టినేషన్‌) వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది మార్క్సిజం చెప్పలేదు. అంతిమఘడియ అంటే విప్లవం వచ్చిన తర్వాత మనిషి పూర్తిగా స్వేచ్ఛా జీవి అవుతాడు. ఏ రకమైన సంకెళ్ళు ఉండవు. సొంత ఆస్తి ఉండదు. ఉదయం వేటాడటం, మధ్యాహ్నం చేపలు  పడుతూ, సాయంత్రం సాహిత్య విమర్శ చేస్తాడు అని మార్క్స్‌ భావన. ఇండియాలో ఈ పనులన్నీ  వేర్వేరు సామాజిక వర్గావారు చేస్తారు. అందుకోసమైనా కులం పోవాలి. అందుకే ఇండియాలో మార్క్సిజం ఆచరణ యోగ్యం కాదు. ఈ విషయాలన్నింటినీ కూలంకషంగా అర్థం చేసుకుంటే గానీ సమాజస్వభావం తెలిసి రాదు. ఇందులో ఆధిపత్యకులాలవారి అజమాయిషీకి ముందుగా తెరదించాలె. ఇది అస్తిత్వ సోయితోనే సాధ్యం. సకల  సమస్యలకు రాజ్యమే కారణం అని ఒక గంపగుత్త సూత్రంతో సామాజిక అంశాల్ని పరిశీలిస్తే సమస్యలకు ఎన్నటికీ పరిష్కారం దొరకదు.
భారతదేశంలో పారిశ్రామికీకరణ జరగకముందే (ప్రిమిటివ్‌స్టేజ్‌) ప్రాథమిక దశలోనే సామాజిక శ్రమ విభజన జరిగిందని మార్క్స్‌ ఇండియా మీద రాస్తూ చెప్పిండు. అంటే మార్క్స్‌ అర్థంలో పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందే క్రమంలో శ్రమ విభజన జరుగుతుందనే అవగాహన ఉంది. కాని భారతదేశంలో దానికన్నా ముందే ఈ విభజన సామాజికంగా జరిగింది అంటే దాని అర్థం కులవిభజనే!
దేశీయ మార్క్సిస్టు ఉద్దేశ్య పూర్వకంగానే కులాన్ని 1990కు ముందు పట్టించుకోలేదు. కారంచేడు, చుండూరు సంఘటనల తర్వాత కొంత మార్పు వచ్చింది. అయినా ఈనాటికీ మార్క్సిస్టులకు, వాటి కుల, ప్రజాసంఘాలకు  పైకి కనిపిస్తున్నట్టుగా కులమనేది ప్రధానమైన అంశం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే అంబేద్కర్‌ ‘ఇండియాలో శ్రమవిభజన కాదు. శ్రామిక విభజన ఉంది’ అని వాదించాడు. కుల సమస్యను గుర్తించ నిరాకరిస్తూ, అణగారిన వర్గాలపై అగ్రకులాధిపత్యాన్ని లెఫ్టిస్టు పార్టీలు ఇప్పటికీ స్థిరీకరించుకుంటున్నాయి.
ఇవ్వాళ కమ్యూనిస్టులు, మార్క్సిస్టులూ  రాజకీయ, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత నిస్తూ కులం, మతం వాటి మూల స్వభావాలను విస్మరిస్తున్నారు.  మార్క్సిస్టు భావజాలం  1990లకు ముందు నుంచి రాస్తున్న సృజనకారులను ఆవహించింది. అట్లా అనడానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటే ప్రభావం చూపిందని చెప్పొచ్చు. కులం, మతంతో సంబంధం లేకుండా చైతన్యవంతులైన అప్పటి సాహితీవేత్తలందరూ తమకు తెలియకుండానే బ్రాహ్మణాధిపత్య భావజాలానికి లోబడి ఉన్నారు. కులాన్ని, మతాన్ని వీళ్ళు ప్రశ్నించలేదు. ఈ బలహీనతకు కారణం మార్క్సిజం.
ఈ కథల రచయిత దిలావర్‌ కూడా ఈ బహీనతల నుంచి బయటపడలేదు. రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యలను సమర్దవంతంగా చిత్రించిండు. అట్లనే ముస్లిం పేదరికాన్ని చిత్రించిండు. దానికి తోడు లంబాడీ దయనీయమైన స్థితిగతుల్ని ఏకరువు బెట్టిండు. కరువు పీడననూ లెక్క గట్టిండు. అత్యాచారాలను ఎమర్జెన్సీ కాలంలోని రమీజాబీ నుంచి ఈనాటి ఆయేషా వరకు గుడ్లనీళ్ళు  తిరిగేలా చెప్పిండు. సరోగసీ లాంటి ఆధునిక అంశాలను అక్షరీకరించిండు. వీటన్నింటినీ ఆయన తనకున్న చైతన్యంతోటి రాజకీయ, ఆర్థిక దృక్కోణంలో రాసిండు. ఈ చైతన్యమంతా లెఫ్టిస్ట్‌ సాంగత్యంతోనే వచ్చింది. ఇది వర్గ దృక్పధాన్నే నేర్పింది గానీ వర్ణ దృక్పథాన్ని, మత దృక్పథాన్ని అలవర్చలేదు. మీదు మిక్కిలి అట్లా చూడడం తప్పని స్థిరీకరించింది. దీని వల్ల  ‘జరీనా’ కథలో లైంగిక హింస, పేదరికం ప్రధాన వస్తువైంది. దాన్ని అస్తిత్వ సోయితో జయించే అవకాశముండింది. ఇట్లా జయించి ఫెయిల్యూర్  స్టోరీని, సక్సెస్‌ స్టోరీగా చెప్పేందుకు అవకాశముండింది. ఇందుకు దిలావర్‌ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అస్తిత్వసోయిని అందుకోకుండా అడ్డుకున్న సిపిఎం కార్యశాలదే ప్రధాన బాధ్యత. అయినప్పటికీ తనలోని కాన్షియస్‌నెస్‌ ఈ విషయాలను మూగగా ఆమోదించడానికి సిద్ధపడలేదు. అందుకే ‘‘ధనిక పేద వర్గాల మధ్య, అగ్ర దళిత వర్ణాల మధ్య, పెత్తందార్లూ పనివాళ్ళ మధ్య ఈ వివక్ష ఇలాగే కొనసాగితే దేశం త్వరలోనే ప్రమాదపుటంచున పడుతుందని కూడా ఎవరైనా ప్రమాద ఘంటికలు  మోగిస్తే బాగుండును’’ అని తన మనసులోని మాటను ‘నగ్నసత్యం’ కథలో చెప్పిండు. ఇప్పుడు అస్తిత్వ సోయితోటి ముస్లింవాదులు, దళిత, బహుజన వాదులు, స్త్రీవాదులూ  ఈ ప్రమాదాలను ప్రచారం చేస్తున్నరు. నిజానికి తెలుగునాట స్త్రీవాదం పుట్టుకొచ్చిందే రమీజా బీ కేసు నుంచి అంటే అతిశయోక్తి కాదు. స్త్రీ వాదం రావడానికి అంతర్జాతీయ, జాతీయంగా అనేక కారణాలున్నప్పటికీ ఇది తక్షణ కారణమైందని చెప్పొచ్చు. దిలావర్‌ సీనియర్‌ రచయిత కావడం మూలంగానే ఎమర్జెన్సీ కాలం నాటి రమీజా బీ కేసును రెండు కథల్లో పేర్కొన్నడు.
1978 మార్చి 29`30 రాత్రి రమీజా బీ తన భర్తతో కలిసి ‘యమగోల’ సినిమా చూసి వస్తూ ఫీవర్‌ హాస్పిటల్‌ దగ్గర తన భర్త మూత్రం పోయడానికి వెళితే వెయిట్‌ చేస్తున్నది. ఈ సమయంలో నల్లకుంట  పోలీసులు  ఆమెను తీసుకెళ్ళి ఎస్సై, కానిస్టేబుల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే అత్యాచారం చేసి ఆమె ప్రాస్టిట్యూట్‌, విటులను ఆకర్షిస్తుండగా పట్టుకున్నామని కేసు పెట్టారు. భర్తని లాకప్‌ డెత్‌ చేసిండ్రు. ఈ కేసు ఆనాడు తెలుగునాట ప్రజాస్వామిక వాదులందరినీ కుల, మతాలకు అతీతంగా కదిలించింది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ముఖ్తదర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దోషులను నిర్ధారించింది. ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న వారే తర్వాతి కాలంలో ‘విమెన్స్‌ గ్రూప్‌’గా ఏర్పడ్డారు. రమా మెల్కోటె, వసంత కన్నబీరన్‌, లలిత తదితరులు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈనాటి తరానికి అంతగా తెలియని విషయాన్ని దిలావర్‌ పేర్కొని ఎనుకటి విషయాలను మరొక్కసారి తెరమీదికి తెచ్చిండు. గతాన్ని తోసుకొని వర్తమానంలో విశ్లేషించుకొని భవిష్యత్‌కు దారులు వేయాల్సిన సమయంలో రమీజా బీని గుర్తు చేసినందుకు దిలావర్‌ అభినందనీయుడు.
దిలావర్‌ ఖమ్మం జిల్లా వాడు కావడం, ఆనాదిగా ఆ జిల్లా రాజకీయాలు, ‘చైతన్య’, ‘ప్రగతిశీల’, ‘ప్రభావశీల’ కార్యక్రమాలు, సాహిత్యశాలలు, పుస్తక ప్రచురణలు, సమీక్షలూ  అన్నీ సిపిఎం, సిపిఐ కేంద్రంగా ఆ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ‘విజృంభణ’ ‘తిరుగుబాటు’, ‘న్యూడెమోక్రసీ’, ‘ప్రజాశక్తి’ ఇప్పటి నవ తెలంగాణ అన్నీ ఒకే సామాజిక వర్గం ఆధీనంలో ఉన్నయి. విప్లవ చైతన్యమంతా ఇక్కడే పోగయింది. పోగయింది అనేకంటే పోగు పెట్టబడిందంటే కరెక్టేమో! వీరి ప్రాబల్యం  ఇప్పటికీ అక్కడ కొనసాగుతది. దిలావర్‌ ముఖ్యంగా సిపిఎం పార్టీతో మమేకమై ఉండొచ్చు. శ్రీశ్రీ మొదలు  తెలకపల్లి రవి దాకా అంతా ఆంధ్రత్వమే అక్కడ పరుచుకుపోయి ఉంది. దీంతో తాను ప్రభావితం కావడమే గానీ తాను ప్రభావితం చేసేందుకు అవకాశం దక్కలేదు. వేదిక చిక్కలేదు. ఇది వన్‌వే. లెఫ్ట్‌ పార్టీ నుంచి దళిత, బహుజనులు స్వీకరించడమే గానీ తాను నేర్చుకున్నది అప్పజెప్పడానికి, ప్రభావితం చేయడానికి ఏ సాహిత్యశాలలూ, సాహిత్యకారులూ  అవకాశం కల్పించబోరు. అది వారి ఆచరణకు విరుద్ధం.
ఖమ్మం జిల్లా రాజకీయాలన్నీ ఒకే సామాజికవర్గం ఆధిపత్యంలో కొనసాగుతున్నాయి. పార్టీలు వేరైనా పీడితుల పక్షానా, పీడకుల పక్షానా కూడా వీళ్ళే వకాల్తా పుచ్చుకుంటారు. అందుకే ఇక్కడ అస్తిత్వవాద రాజకీయాలకు, విభిన్న అస్తిత్వాలకు ఆదరువు కరువు. ఉద్యమ కాలంలో తెలంగాణ రచయితల వేదిక అన్ని జిల్లాల్లో మీటింగ్‌లు పెట్టగలిగింది గానీ ఖమ్మం జిల్లాలో ఆ పనిచేయలేక పోయింది. ఖమ్మం జిల్లాలో శీలం సిద్దారెడ్డి, జలగం వెంగళరావు తర్వాత అన్నీ పార్టీల్లోనూ ఏక కులాధిపత్యం నెలకొంది. ఈ కులాధిపత్యం వర్ణ దృక్పథాన్ని తప్పుగా, ద్రోహంగా ప్రచారం చేసి, వర్గ దృక్పథాన్ని ప్రోత్సహించింది. ఈ ప్రోత్సాహ కార్యక్రమాలు క్రమం తప్పకుండా ‘సాహితీ స్రవంతుల’ ద్వారా, పార్టీ పత్రిక ద్వారా, వందిమాగధుల ద్వారా నిరంతరం కొనసాగుతున్నాయి. ఇప్పటికీ తెలంగాణకు అనుకూలంగా ఎక్కడా, ఎప్పుడూ తీర్మానం చేయకబోయినప్పటికీ సిపిఎం పల్లకీని ఇక్కడి బోయీలు మోస్తున్నారు.
ఇవ్వాళ మొత్తం తెలంగాణాలో ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం తెలంగాణలో 31,77,940 మంది (ఆంధ్రాకు పోయిన ఏడు మండలాల జనాభాతో కలిపి) ఆదివాసీలు/ గిరిజనులు అంటే ఎస్టీలున్నారు. మొత్తం ఖమ్మం జిల్లా జనాభా  26,07,066. ఇందులో 25.18 శాతం జనాభా 6,56,577 ఎస్టీలున్నారు. అలాగే 16.84శాతం ఎస్సీలున్నారు. అంటే ఈ జిల్లా మొత్తం జనాభాలో దాదాపు 42 శాతం మంది ఆదివాసీలు, దళితులున్నారు. ఈ 42 శాతంతోపాటు మొత్తం జిల్లా ప్రజలందరి తరపున కేవలం నాలుగు శాతం మాత్రమే అదీ ఒక్క సామాజిక వర్గమే మాట్లాడుతోంది. వాళ్ళు ఎంత చెబితే అంత అన్నట్టుగా ఇవ్వాళ పరిస్థితి ఉంది. అందుకే తెలంగాణలోని ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపినప్పుడు ఉద్యమం పెద్దగా రూపొందలేదు. ఈ సామాజిక వర్గాల ప్రయోజనాలు ఆంధ్రాతో ముడిపడి ఉండడంతోనే ఉద్యమాలు పెద్దగా రాలేదు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముదిగొండ ఘటనలో దళిత రైతులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరాటానికి సిపిఎం నేతృత్వం వహించింది. ఈ ఉద్యమంలో రైతుల ప్రాణాలు పోయినాయి తప్ప లభించిన ఫాయిదా ఏమీ లేదు. అంటే ఒక ఉద్యమం చేసి దళిత రైతుల ప్రాణాను బలిగొంటే మరో ఉద్యమం చేయకుండా ఉండి ఆదివాసీల ఉసురు తీసింది. నిజానికి సిపిఎం బలంగా ఉన్న ఈ జిల్లాలో ఆదివాసీలకు అండగా ఉండి చైతన్య కార్యక్రమాలు చేపట్టాల్సింది. సాహిత్యంలో వీటిని ప్రతిఫలింప జేసుండాల్సింది. ఉద్యమాలు లేవు, సాహిత్యంలో చోటూ లేదు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలంగా ఉండీ అంతో ఇంతో ఉద్యమం పట్ల జిల్లాలో సానుభూతి ఉన్నప్పటికీ సభలు నిర్వహించడానికి ఇక్కడి నుంచి ఎవ్వరూ ముందుకు రాలేదు. వ్యక్తులుగా కొంతమంది తెలంగాణ వాదులు ఇక్కడ ఉంటే ఉండొచ్చుగానీ సంస్థలుగా తెలంగాణ వాదానికి మద్ధతు దక్కలేదు. అయితే ముస్లిం అస్తిత్వ వాదానికి వచ్చే సరికి ఖమ్మం జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలసబోయిన వారే అండగా నిలిచారు. స్థానికంగా జిల్లాలో ఉన్న వాళ్ళు ముస్లిం వాదంతో పెద్దగా మమేకం కాలేక పోయిండ్రు. నిజానికి అనాది నుంచి ఖమ్మం జిల్లా తెలుగులోరాసే అత్యధిక ముస్లిం కవులను/ రచయితలను కన్నది.
ఈ జిల్లా నుంచి షంషుద్దీన్‌ (కౌముది), దావూద్‌ అలీ, సికిందర్‌ మొహసిన్‌, ఎం.ఎ. రెహమాన్‌, సయ్యద్‌ షఫీ, అఫ్సర్‌, షేక్‌ రఫీ, హనీఫ్‌, షుకూర్‌, షంషాద్‌, షాజహానా, ఇక్బాల్‌ చంద్‌, ఖాజా, అక్బర్‌, ఖమ్రొద్దీన్, జావేద్ ఇట్లా అనేక మంది ముస్లిం కవులు తెలుగులో రాసిండ్రు. అట్లనే ఉర్దూలో ముస్లింలతో పాటుగా కవిరాజమూర్తి, హీరాలాల్‌ మోరియా తదితరులు రాసిండ్రు. వీరిలో యాభై ఏండ్ల సాహితీ జీవితం ఉన్న ఏకైక వ్యక్తి దిలావర్‌ ఒక్కడే అంటే అతిశయోక్తి కాదు. 1974లో  ‘వెలుగు పూలు’ కవిత్వం వెలువరించిన నాటి నుంచీ భారతి పత్రికలో సీరియల్‌ నవలాకారుడిగా, ‘వెన్నెల కుప్పలు’ పోసి ‘జీవన తీరాల’కు చేర్చిండు. ‘కర్బలా’ కవిత్వంతో పాటు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ‘గ్రౌండ్‌ జీరో’ దీర్ఘ కవిత వెలువరించిండు. ఇటీవల తెలుగు యూనివర్సిటీ ‘ప్రతిభా’ పురస్కారం అందుకున్న దిలావర్‌ రచనకు దక్కాల్సినంత గౌరవం దక్కలేదనే చెప్పొచ్చు. పోలవరం, ఆదివాసీ జీవితాన్ని రికార్డు చేస్తూ ‘కొండా కోనల్లో’ పేరిట పుస్తకంగా వెలువరించినా దాన్ని ఏ ‘సాహిత్య శాల’లు గుర్తించలేదు. ఈయన ఎవరితోనైతే ఇన్నేండ్లూ అంటకాగాడో, లేదా కలిసి మెలిసి ఉన్నాడో వాళ్ళు ఆధిపత్య స్వభావంతో మెలగడంతో రాష్ట్ర స్థాయి వ్యక్తిని ఖమ్మం జిల్లాలో కూడా గుర్తించ లేదు. 1972 నుంచి ఇప్పటి  వరకు దాదాపు తన వయసుతో సమానంగా కథలు రాసిండు. అందులో కొన్ని గతంలో ‘మచ్చుబొమ్మ’, ‘కొండా కోనల్లో’ పేరిట పుస్తకాలుగా వెలువడ్డాయి. తన జిల్లా వాడే అయిన జాతీయ కవి ‘దాశరథి కవితా వ్యక్తిత్వ పరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా అందుకున్నడు. నిజానికి దిలావర్‌ తన ముస్లిం/ దూదేకుల అస్తిత్వాన్ని త్యాగం చేసి అభ్యుదయ, ప్రగతిశీల సాహిత్యానికి జీవితమంతా ధారపోసిండు. చివరికి ‘అభ్యుదయ’ సాహిత్యం గురించి విమర్శ చేసే వారెవ్వరూ దిలావర్‌ని పేర్కొనరు. ఆకాశంలో గాకుండా నేలమీద నిలబడి ఏ సామాజిక వర్ణాలకు వాళ్ళు ముందుగా తోడ్పడాలి అనే గుణపాఠాన్ని దిలావర్‌ సాహితీ జీవితం నేర్పుతుంది. ముస్లిం సమాజానికీ ఆ మేరకు నష్టం జరిగింది. అది ఇప్పట్లో పూడేది కాదు. అణచివేతకు గురైన దూదేకుల జీవితం దిలావర్‌కు లేకపోయి ఉండొచ్చు గానీ తాత కాలంలో వందెకరాల స్థలం తన కాలానికి రెండు ఎకరాలుగా మారిన విషయాన్ని, అందుకు కారణాలను  ఆయన వెతకాల్సింది. ‘అభ్యుదయం’లో గాకుండా ‘అస్తిత్వం’తోనే ఈ విద్య అలవడుతది.
తెలంగాణలోని అన్ని జిల్లాలతో పోలిస్తే ఖమ్మం జిల్లాలోనే అత్యల్పంగా ముస్లిములున్నారు. ఈ జిల్లాలో 2001 (2011 లెక్కలు అలభ్యం) లెక్క ప్రకారం 1,37,639 మంది ముస్లిమున్నారు. అయితే తెలుగులో ముస్లింవాద సాహిత్యాన్ని అగ్రభాగంలో నిలబెట్టింది ఖమ్మం జిల్లానే! కవిత్వం, కథలు, నవలల ద్వారా ఈ జిల్లా రచయితలు ముస్లిం జీవితాల ను చిత్రికగట్టిండ్రు. వాదాలను నిలబెట్టేందుకు సాహితీదావాలు ఎదుర్కొన్నరు. ముస్లిం/దూదేకుల స్త్రీల కథలూ, కవిత్వం ఇక్కడి నుంచి వచ్చాయి. దిలావర్‌ తాను స్వయంగా ముస్లిం వాదం గురించి విస్తృతంగా రాయక పోయినప్పటికీ ఆ లోటుని ఆయన కూతురు షాజహానా కథల్లోనూ, కవిత్వంలోనూ, పరిశోధనలోనూ పూరించింది. ఇది ఖమ్మం జిల్లాకు గర్వకారణం కూడా! దేశంలోనే గాకుండా డయోస్పోరా సాహిత్యంలోనూ ఈ జిల్లా ముస్లింలు ముందంజలో ఉన్నారు. అఫ్సర్‌, షంషాద్‌ అందుకుదాహరణ. ముస్లింవాదంతో పాటు తెలంగాణ అస్తిత్వోద్యమంలో కూడా ఇక్కడి వాళ్ళు పాల్గొన్నారు. అయితే వీళ్ళందరూ జిల్లాకు ఆవల ఉన్న వాళ్ళు కావడమే విశేషం.
తన 75 ఏండ్ల జీవితంలో సాహితీ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్న దిలావర్‌ ఇప్పటి వరకు ఎనిమిది కవితా సంపుటాలు, నాలుగు నవలలు, రెండు కథా సంపుటాలు వెలువరించాడు. ఇది మూడో కథా సంపుటి. నిజానికి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చాలా సాహిత్య చరిత్ర ఉంది. ఇక్కడే సింగరేణి గనులకు పునాదులేర్పడ్డాయి. 1945 ఆ ప్రాంతంలో జాతీయ గ్రంథాయ మహాసభలు ఇక్కడ జరిగాయి. ఈ మట్టి పునాదుల మీదుగానే తెలంగాణ సాయుధ పోరాట జీవితాన్ని పర్చా దుర్గాప్రసాదరావు కథలుగా మలిచిండు.
మళ్ళీ ఈ పుస్తకం విషయానికి వస్తే ఇది 15 కథల ఈ సంపుటి. ఇందులో దాదాపు పది కథలూ చావులూ, ఆత్మహత్యల చుట్టూ తిరుగుతాయి. రైతు, చేనేత కార్మికుడూ బాధితులు. శవాలు కాస్తున్న చెట్టు, నగ్నసత్యం, ఉరితాళ్ళు ఆత్మహత్యతో ముగిశాయి. క్షతగాత్రుడు, దగ్ధహృదయం, జరీన, నీ పెద్దోడొచ్చిండమ్మా, ఎడారి బతుకు, అమ్మా నన్ను చంపెయ్‌, తీజ్‌ కథల్లో చావు, దాని చుట్టూ ఉన్న వ్యదార్థ జీవితాలు రికార్డు చేసిండు. మరో శాకుంతలం, తీజ్‌లో మోసపోతున్న లంబాడీ స్త్రీల జీవితాలున్నాయి. ఆధునిక ఇతివృత్తంతో పద్మ లేశిపోయింది కథలో ‘సర్రోగసీ’కి ఒప్పుకున్న పేద మహిళ, నోస్టాల్జియాకు సంబంధించి చంద్రుడు గియ్యని బొమ్మలు, మృగణ ఇందులో ఉన్నాయి.
ముందుగా ఆత్మహత్యల విషయానికి వద్దాం. శవాలు కాస్తున్న చెట్లు కథలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఖమ్మం జిల్లా తల్లాడ అడ్డాగా కోట్ల రూపాయల నకిలీ విత్తనాల వ్యాపారం, అధికార్ల అలసత్వం, నకిలీ ఎరువులు,  నకిలీ పురుగు మందులు వెరసి రైతుని ఎట్లా పీల్చి పిప్పి చేస్తున్నాయో చెప్పిండు. దళారీల మోసం ఒక వైపూ, మరోవైపు వానల్లేక, బోర్లు తవ్వి, అప్పుల పాలై, రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడిన రైతు రామయ్య గురించీ, కూలీలు దొరక్క ఇంటిల్లిపాది పనిచేసినా ఫలితం లేక పోవడంతో రైతు చేనుగట్టు మీదున్న చెట్టుకు ఉరేసుకోవడాన్ని హృదయం ద్రవించేలా చెప్పిండు. అట్లాగే ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ‘నగ్నసత్యం’ కథలో ‘మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలోనే కలిసిపోవాన్నంత మమైకత్వంలో నేల తల్లిని నమ్ముకున్న బూమయ్య’ను పరిస్థితులు ఏ విధంగా ఆత్మహత్యకు పురిగొల్పాయో చెప్పిండు. కట్నం డబ్బు కోసం అత్తింటి వేదింపుల నెదుర్కొన్న కూతురు, ఇంజనీరింగ్‌ చదువుకు డబ్బుల్లేక దొంగగా మారిన కొడుకు సంగతి రాసిండు. చేతికొచ్చిన పంట తుపాను కారణంగా వర్షం పాలు కావడంతో ‘హలం పట్టిన ఆ చెయ్యి చీకట్లో హాలాహలం కోసం వెదికింది. పురుగుమందుకు పురుగుల్ని చంపే శక్తే కాదు, కష్టాలను రూపుమాపే శక్తి కూడా వుంది. బూమయ్య లాంటి కష్టజీవులకు ఆ విషయం బాగా తెలుసు. అందుకే కష్టాల నుండి శాశ్వతంగా దూరం గావడానికి గరళాన్ని గళంలోకి వంపుకున్నాడు’ అని రైతుని చంపేసిండు. ఇవన్నీ భరించలేక పిచ్చివాడిగా మారిన కొడుకు బతుకుని కూడా దిలావర్‌ గుడ్ల్ల నీళ్ళు తిరిగేలా చెప్పిండు. ‘ఉరితాళ్ళు’ కథలో ఇంటిల్లిపాది పనిచేసినా మగ్గం బతుకు ఆకలిని తీర్చలేకపోవడం, సర్కారీ దవాఖానాలో వైద్యం సరిగ్గా దొరక్క, ఇంకా చెప్పాలంటే చికిత్స నిరాకరించడంతో చనిపోయిన గర్భిణీ కూతురు గురించి చెప్పిండు. ‘‘నూలుకట్టలు ఎప్పుడైతే తడిసిపోయాయో అప్పుడే తన బ్రతుకు చీకిపోయింది. మగ్గం ఆడటం ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడే తన కాళ్ళూ చేతులూ పడిపోయాయి. రాట్నం తిరగడం ఎప్పుడైతే మానివేసిందో అప్పుడే తన జీవిత చక్రం ఆగిపోయింది. టకటకలాడే ఆసు ఎప్పుడైతే నిశ్చలనమైందో అప్పుడే తనలోని చైతన్యం మాయమైంది. ఇక ఇంతకన్నా మరణం అంటూ వేరే ఏముంటుంది’’ అని చంద్రం గోసను చిత్రించిండు. (అన్ని కథల్లోనూ  గ్రౌండ్‌ వర్క్‌ చేసి పదాలను ఉపయోగించిండు. అయితే ఇక్కడ ఆసు బదు నాడె అనే పదం వాడాల్సింది) పాణం తీసుకున్న తీరుని వివరించిండు. వీటికి భిన్నమైన కథ ‘అమ్మానన్ను చంపేసేయ్‌’. ఇందులో స్త్రీ వ్యదార్థ జీవితాలను, పసిపాపనుంచి ముసలి వాళ్ల వరకూ రోజూ అత్యాచారాలకు గురవుతున్న తీరుని గుండె తడయ్యేలా చెప్పిండు. దిమాక్‌ కన్నా ఎక్కువగా ‘దిల్‌’తోటి ఆలోచించిండు కాబట్టే ఇవి పాఠకుడి గుండెల్ని పిండేస్తయి. ‘అమ్మా నన్ను చంపేసెయ్‌’ కథలో నిర్భయ, ఆయేషా, రమీజాబీలను ప్రస్తావించిండు. వివిధ దేశాల్లో స్త్రీలు ఇంటా బయటా ఎట్లా లైంగిక హింసకు గురవుతుండ్రో రాసిండు. అయితే ఇందులో పాజిటివ్‌ అంశమేంటంటే స్త్రీలపైన ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ‘‘ఏది ఏమైనా.. నా చిట్టి తల్లీ..! నిన్ను నేను చంపుకోను… అవసరమైతే మీ నాన్నను.. బామ్మను.. తాతయ్యను.. బాబాయిలను.. అత్తమ్మను.. యీ లోకాన్నైనా ఎదిరించి… నా ప్రాణంలోని ప్రాణమా! నిన్ను బతికించుకుంటాను.. నిన్ను చంపుకోలేను.. నో..నో..నో..’’ అని కరుణతో కరాఖండిగా చెప్పిస్తాడు. చావు కన్నా పాణం విలువ ఎక్కువ అని తేల్చి చెప్పిండు. కథలో భాగంగా చాలా సంగతులు చెప్పుకొచ్చిండు. ఇవన్నీ ఇటీవల జరిగినప్పటికీ సాహిత్యంలో చోటు చేసుకోలేదు. సంఘటనలు సాహిత్యంలో చోటు చేసుకున్నప్పుడే వాటి చారిత్రక విలువ ఇనుమడిస్తది. నోయిడాలో అన్నెం పున్నెం ఎరుగని అమ్మాయి కళేబరాలు, యాసిడ్‌ దాడులు, కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు, ఆఖరికి అంధబాలికపై అత్యాచారాలు జరుగుతున్న తీరుని చెప్పిండు. ఇండ్లల్లో, స్కూళ్ళల్ల్లో, కాలేజిల్లో అమ్మాయిలకు ఎక్కడా భద్రత లేదంటూ, ఆయేషాను ఇబ్రహీంపట్నంలో ఎంత కిరాతకంగా హతమార్చి అనుభవించింది రాసిండు.
ఇక చావుల విషయానికి వస్తే స్త్రీ దృక్కోణంలో దగ్ధహృదయం కథలో  ప్రభుత్వాసుపత్రిలో అవినీతి నిండుగర్భిణిని ఎట్లా పొట్టన పెట్టుకుందో చెప్పిండు. మారుమూల పల్లెల్లో వైద్యసదుపాయం లేని కారణంగా ప్రజలు పడుతున్న ముఖ్యంగా రెక్కాడితేగాని డొక్కాడని రైతు, కూలీ జిందగీని చిత్రించిండు. చావు వాళ్ళ జీవితంలో ఎట్లా భాగమైనాయో రాసిండు. బోర్ల నీళ్ళు సరిగ్గ అందక, కరెంటు కోతకు ఎండిన పంటకు మంట పెట్టిన రైతు ధర్మయ్య గురించీ రాసిండు. ఇక్కడ గర్భిణిని, పొట్టకొచ్చి ఎండిపోతున్న పంటను పోలుస్తూ మనస్తాపానికి గురైన రైతు వ్యథను చిత్రించిండు. తీజ్‌ కథలో సొంత అన్ననే వదినను వశబరుచుకోవడానికి హతమార్చిన లంబాడీ మంగీలాల్‌ దురాగతాన్ని చెప్పిండు. లంబాడీ ఆచార వ్యవహారాలను, వారి భాషను, ఆ స్త్రీ హృదయాలను ఆవిష్కరించిండు. ఎడారి బతుకుల్లో గల్ఫ్‌కుపోయిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో, ఎలాంటి అత్యాచారాలకు గురవుతున్నారో, ఎవరెవరి మోసాలకు గురవుతున్నారో చెప్పిండు.
చావుల్లో కూడా భిన్నమైన కథ ‘క్షతగాత్రుడు’. స్కూలు చదువు రాకున్నా, నల్లగా ఉన్నా శ్రావ్యమైన గొంతుతో, కంఠస్థమైన భాగోత పద్యాలతో అందరి మన్ననలందుకున్న ‘కర్రోడి’ హృదయవిదారకమైన జీవితాన్ని చెప్పిండు. ఇందులో బయటికి మాత్రం స్వగతంలో కథ చెబుతున్న వ్యక్తే హీరోగా కనిపించినప్పటికీ నిజమైన కథానాయకుడు అభిమానంతో, ప్రాణత్యాగం చేసిన కర్రోడే గొప్ప.
‘పద్మ లేశిపోయింది’ కథ సరోగసీ అనే ఆధునిక అంశాన్ని తెరమీదికి తెచ్చింది. పేదరికం, దుబాయి పోయిన ప్లంబర్‌ భర్త, పిల్లలకు కనీస వైద్యసదుపాయం అందించలేని దయనీయమైన స్థితి పద్మని సరోగసీకి ఎలా ఒప్పుకునేలా చేసిందో రాసిండు. అట్లనే సరోగసీకి దాదాపు మూడు లక్షలు అడ్వాన్స్‌గా ముట్టజెప్పిన తీరు, ఆ డబ్బుని తనను కనీసం ఇంట్లకు కూడా రానివ్వని అత్తమామలకు అందేలా కిటికిలోంచి పడేయడాన్ని, దాన్ని అత్త కాలబెట్టానడం, మామ వాడుకోవాలని చూడడాన్ని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా చిత్రించిండు.
మూడుతరాలు కథలో మాదిగోళ్ళ పనిముట్లన్నీ రికార్డు చేసిండు. అంతేగాదు తరాలు మారిన తలరాతలు మారని మాదిగోళ్ళ జీవితాలను హైదరాబాద్‌ వలసొచ్చినా గ్లోబలైజేషన్‌ మూలంగా ఎదుగూబొదుగూ లేని సంసారాన్ని చిత్రికగట్టిండు.
గుండెను తడి చేసుకొని దిలావర్‌ తన కథల్ని రాసిండు. కండ్ల్ల నీళ్ళు నింపుకొని చదువుకునేలా రాసిండు. చావులు, హత్యలు, ఆత్మహత్యలు ఏది రాసినా వాళ్ళ దుఃఖాన్ని ఫీలయి రాసిండు. దేనికదే ఇగ ఇదే ఆఖరు చావు కావాలని ఆరాట పడ్డడు. దిలావర్‌ పూర్తి కాన్షియస్‌గా రాయకపోయినా దూదేకుల జీవితాన్ని చిత్రించిన కథలు కూడా ఇందులో ఉన్నాయి. అందులో చంద్రుడి గియ్యని బొమ్మలు ఒక బుక్కా ఫకీరు ఊరి నుంచి వలసొచ్చి నగరంలో ఇగ ఇంతకన్నా పోయేదేమి లేని జీవితాన్ని, వెన్నెల ఆస్వాదాన్ని, ఆ వెన్నెల అందరికీ ఒకే తీరుగ వెలుగునివ్వడాన్ని కవిత్వ రీతిలో కథ అల్లిండు. ఇందులోని భాష  తెలుగు-ఉర్దూ మిశ్రమాలతో పక్కా హైదరాబాదీ యాసను పట్టిచ్చింది. ఈ పుస్తకంలోని కథలన్నీ ఖమ్మం జిల్లా నానుడులు, సామెతలతో అలంకరించబడ్డాయి. అంతేగాదు జరీన కథలో బురఖాకు తావులేని, కూలీ బతుకును, రోజు రోజుకూ దిగజారుతున్న ముస్లిం/ దూదేకుల స్త్రీల జీవితాలను, లైంగిక దోపిడీని, భర్త, కొడుకూ ఇద్దరూ గుట్కాకు, తాగుడుకు బానిసలై చనిపోవడాన్ని, బతికుండీ శవంలాగా మారిన తాగుబోతు తండ్రినీ ఇందులో చిత్రించిండు.
అంతిమంగా ఇందులోని ఒకటి రెండు మినహా మిగతా అన్ని కథలూ కింది కులాల వారి ఫెయ్యిూర్‌ స్టోరీలను రికార్డు చేసింది. కనీసం తినడానికి తిండి దొరకని స్థితిలో ఒక పద్మశాలి చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని ‘ఉరితాళ్ళు’ కథలో, మరో శాకుంతం, తీజ్‌ కథల్లో లంబాడీ స్త్రీ మోసాలకు, లైంగిక దోపిడీకి, మైదాన ప్రాంతం వారి చేతిలో ఆటవస్తువుగా మారిన తీరుని చెప్పిండు. పద్మ లేశిపోయింది ఒక ప్లంబర్‌ దుబాయి పోయి సచ్చిండో బతికుండో తెలియని స్థితి. ఎడారి బతుకుల్లో కూడా బహుజనుల జీవితాలే రికార్డయ్యాయి. నగ్నసత్యం, దగ్దహృదయం, శవాలు కాస్తున్న చెట్లు, క్షతగాత్రుడులో బహుజన రైతు, కళాకారుడి చావుల్ని చిత్రించిండు. మూడు తరాలు పూర్తిగా మాదిగోళ్ళ కథ. అట్లనే జరీన, చంద్రుడు గియ్యని బొమ్మలు దూదేకుల పేదరికాన్ని పట్టిచ్చే కళాఖండాలు. జ్ఞాపకాల తెరలను చిన్నప్పటి బతుకును మృగణ, నీ పెద్దోడొచ్చిండమ్మా కథల్లో చెప్పిండు.
ఒక ఉపాధ్యాయుడు జీతంతో సంబంధం లేకుండా, అవిశ్రాంతంగా ఐదు దశాబ్దాలు సాహిత్యమే జీవితంగా గడపడమనేది అబ్బుర పరిచే విషయం. ముఖ్యంగా టీచర్లంతా జీతం రాగానే చిట్టీలు, భవిష్యత్తావసరాలు అని పొదుపు చేస్తూ ఉంటారు. అయితే దిలావర్‌ 1974 నుంచి పుస్తకాలు వేయడమే గాకుండా, ఎక్కడ సాహితీ సమావేశం జరిగినా వెళ్ళిండు. ఏ సాహితీవేత్త వచ్చినా తన ఇంట్లో ఇంత జాగా ఇచ్చిండు.  పరిశోధన, సృజనాత్మక రచనా రెండు భిన్నమైన అంశాలు. అయితే ఈ రెండిరటిని సమన్వయం చేసి నడిపించిన మార్గదర్శి దిలావర్‌. సాహిత్యం తనతోనే ఆగి పోకుండా తర్వాతి తరానికి షాజహానా, షంషాద్‌ రూపంలో అందించిన దిలావర్‌కు అభినందనలు.
*

కథలకు కొత్త వేకువ – లద్దాఫ్ని

 

   kaifiyath

 

   ‘హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌’లా గాకుండా గొంతు సరాయించుకొని ధిక్కార స్వరాన్ని, తన సొంత అస్తిత్వాన్ని అంతర్జాతీయ వేదికపై సైతం ఆలాపన చేస్తుంటే అగ్రకుల, బ్రాహ్మణాధిపత్య భావజాల ఆనకొండలు ఎప్పటికప్పుడూ ఆమెను మింగెయ్యాలని చూసినై. అనకొండల నుంచి తప్పించుకుంటూ దిగ్గజాలను ఢీకొంటూ తన సాహిత్యానికి సానబెడుతూ ఉంటే మరోవైపు పితృస్వామ్యం, పురుషాధిపత్యం ఫత్వాలను జారీ చేసింది. కలానికి సంకెళ్ళు వేయజూసింది. ఆంక్షలు విధించింది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు, స్వీయ ఉనికిని చాటుతున్న పూల విహంగాన్ని సైలెంట్‌ మిస్సైళ్లతో కూల్చాలని ప్రయత్నం చేసినారు. అయినా తన రేజర్‌ ఎడ్జ్‌ లాంటి షార్ప్‌నెస్‌తో అటు కవిత్వంలోనూ, ఇటు కథల్లోనూ షాజహానా తమ జీవితాల్ని  చిత్రిక గట్టింది. దూదేకుల బతుకుల్ని బాధిత, పీడిత మహిళా దృక్కోణంలో ఆవిష్కరించారు. ముఖ్యంగా దూదేకుల మహిళ దయనీయ స్థితిని రికార్డు చేసింది. నిజానికి తెలుగు సాహిత్యంలో కుటుంబ, ప్రేమ, రాజకీయ కథలు వచ్చినంతగా పేదరికాన్ని అంత బలంగా చిత్రించిన కథలు ఎక్కువగా రాలేదు. షాజహానా మాత్రం అణగారిన పేద బతుకులకు అక్షరాలద్దింది. బ్రాహ్మణాధిపత్యాన్ని బరిబత్తల చేసింది. కొందరు ఎనుకముందాడుతుంటే ఆమె ‘బిల్లి’మెడలో గంట కట్టి ఊరేగించింది. ‘నాన్‌ వెజ్‌’ని తినిపించింది. చైతన్య స్రవంతి పద్ధతిలో కవితాత్మకంగా కథలల్లింది. ‘మనిషి పగిలిన రాత్రి’లో ‘మంచిరాయి’ని వెతుకుతానని ‘వాదా’ చేసింది. తెలుగు సాహిత్యంలో నెలకొన్న ఖాళీలను కొంత పూరించింది.

తాజాగా వెలువడ్డ ‘లద్దాఫ్ని’ కథల సంపుటిలో వేదనాభరితమైన ముస్లిం/దూదేకుల మహిళల పేదరికాన్ని, దుర్భర జీవితాల్ని, అవిద్య, గుర్తింపుకు నోచుకోని అవిశ్రాంత శ్రమను, ఆచార వ్యవహారాలు, తాగుడు వ్యసనం, తినేతిండి, ప్రేమల్ని కథల్లో చర్చించింది. లైంగిక దోపిడీని నాలుగ్గోడల మధ్య నుంచి నడి రోడ్డు మీదికి తెచ్చింది. సన్నాయి ఊదింది. నిద్ర నటిస్తున్న  వారిని మేల్కొల్పింది. సోయిమాలినోళ్ళ మీద కొరడా ఝులిపించింది. ముసుగులో గుద్దులాట కాదు. తన మనసులో ఏముందో చెప్పింది. మెదడుకు పని పెట్టింది. తన చుట్టూ ఉన్న జీవితాల్ని పెద్దమ్మ, అమ్మమ్మ, అత్తగారిల్లు, పనిచేసే చోటు, కళ్ళముందరి సమాజాన్ని అక్షరీకరించారు. ఇవన్నీ బురఖాల్లో, చీకట్లో, పురుషాధిపత్య సర్పపరిష్వంగంలో ఇప్పటి వరకు కప్పివేయబడి ఉన్నాయి. వాటన్నింటినీ నఖాబ్‌ తొలగించి వెన్నెల్లో ఆరబోసింది. బంధనాలు తెంచుకొని అక్షరాలను తెలుగు వాకిట అలికింది. ‘సితారే జమీ పర్‌ బిఛాతే రహు’ అంటూ ఉంది.

   గతంలో నఖాబ్‌, దర్దీ కవితా సంపుటాలు, స్కైబాబతో కలిసి చాంద్‌తారల్ని పూయించిన షాజహానా కవిగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన కవితల్ని వినిపించారు. ముస్లిం స్త్రీవాద కవిగా తనదైన ముద్ర ఏసిండ్రు. ఇప్పుడు తాజా పుస్తకం ‘లద్దాఫ్ని’తో ముందుకొచ్చింది. వెల్‌కమ్‌ టు లద్దాఫ్ని. నిజానికి ఇంతరకూ ‘ప్యూర్‌ ముస్లింలు’ తమ తోటి దూదేకుల వారిని హేళన చేస్తూ ‘లద్దాఫ్‌’ అని పిలిచేందుకు వాడేవారు. అదే విషయాన్ని దూదేకుల స్త్రీకి అన్వయిస్తూ షాజహానా 1998లో తన స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, అవహేళనగా మారిన, అబ్యూజ్‌ అయిన పదానికి ఆత్మగౌరవాన్ని అద్దేందుకు

    ‘‘అబ్‌ సౌబార్‌ సబ్‌కే సామ్‌నే చిల్లావుంగీ

    హా… మై లద్దాఫ్నీ…హు!

           లద్దాఫ్నీ హీ రహూంగీ…’’ అని నినదించింది. తెలుగు అక్షరాల్లో ఉర్దూలో నినదించిందంటే ‘ప్యూర్‌ ముస్లిం’ని టార్గెట్‌ చెయ్యడమే ఉద్దేశ్యం. అందులో ఆమె సఫలీకృతమయింది. ఇప్పుడు ‘లద్దాఫ్ని’ పేరు తన కథల పుస్తకానికి పెట్టుకోవడమంటేనే తన స్వీయ అస్తిత్వాన్ని చాటుకోవడమే గాకుండా, సమాజంలో గౌరవాన్ని సాధించుకోవడంగా చూడాలి. తెంగాణలో ఇంకా చెప్పాలంటే మొత్తం తెలుగు సాహిత్యంలో (ఖాదర్‌ని మినహాయిస్తే) ముస్లిం జీవితాలు రికార్డు కావడానికి గట్టి పునాదులు ఖాజా, స్కైబాబ, అఫ్సర్‌, యాకూబ్‌, షాజహానాలు వేశారంటే అతిశయోక్తి కాదు. వీళ్ళంతా బాబ్రీ, గోద్రా, దాద్రీ, గుజరాత్‌, ముజఫర్‌ నగర్‌, హైదరాబాద్‌ను అతి దగ్గరగా చూడడమే గాకుండా నిరసన గళమెత్తిన దారిదీపాలు. తమ శక్తినంతా  చమురుగా చేసి సాహిత్య కాగడాలుగా వెలిగిస్తున్నారు. దీనికి తోడు షాజహానా తెలంగాణలో ‘మట్టిపూలు’ పూయిస్తున్నారు. స్త్రీ వాదం ముసుగులో కొనసాగుతున్న కోస్తాంధ్ర మనువాదాన్ని నిలదీశారు. నమ్మిన భావాజాలాన్ని నిక్కచ్చిగా, నిజాయితీగా ఆచరిస్తున్నారు.

sha

    ఇవ్వాళ ముస్లింల దుస్థితిని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరముంది. ముస్లింల హక్కుల గురించి మాట్లాడితే, ధిక్కార స్వరాన్ని వినిపిస్తే దేశద్రోహిగా ముద్రవేసే దుర్మార్గమైన పరిస్థితి ప్రస్తుతం దేశమంతటా నెలకొంది. ఢిల్లీ జెఎన్‌యూ ప్రధాన కార్యదర్శి షెహ్లా రషీద్‌ ప్రభుత్వ దమనకాండను, హక్కుల అణచివేతను నిలదీసినందుకు హిందూత్వ వాదులు హతమారుస్తామని ఆమెను బెదిరిస్తున్నారు. అదే వర్సిటీ విద్యార్థి ఉమర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసిండ్రు. ఆయన చేసిన ‘నేర’మల్లా ఉరిశిక్ష రద్దు కోరడమే! ఈ దేశంలో ఉండాలంటే మేము చెప్పినట్లు వినాలే లేదంటే పాకిస్తాన్‌కు పోవాలె అని బిజెపి ఎంపీలే ఉగ్రోపన్యాసాలిస్తున్నారు. కాషాయ మూక ప్రవచించేదే దేశభక్తి. వీళ్ల ఉన్మాద నినాదాలకు కోరస్‌ ఇవ్వనట్లయితే కుత్తుకలు ఉత్తరిస్తామని బరితెగిస్తున్నారు. ఆవు మూత్రానికి ఉన్న విలువ మనిషి ప్రాణానికి లేకుండా పోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ముస్లింలుగా, ముస్లిం స్త్రీలుగా మరింత లోతుగా జీవితాల్ని సాహిత్యీకరించాల్సిన అవసరముంది. ఖాళీలను పూరించాలి. అగ్రకుల సాహిత్య సంస్థలు, మీడియా సైలెంట్‌గా ఉన్న అంశాల్ని ఎజెండా మీదికి తీసుకురావాలి.

    నిజానికి దేశ విభజన, హైదరాబాద్‌ రాజ్యం బలవంతపు విలీనం నుంచి బాబ్రీ మసీదు మీదుగా తెలంగాణ ఏర్పాటు వరకూ ఆ తర్వాతి పరిస్థితుల్లో ముస్లిం/దూదేకుల జీవితాల్లో వచ్చిన, వస్తూ ఉన్న మార్పును కొంచెం సామాజిక స్పృహతో చూసినట్లయితే ముస్లిం సమస్యను మరింత సులువుగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. గల్ఫ్‌ వాకిళ్లలో షాదీ పేరిట షేక్‌ల చెరలో చిక్కుకున్న చిన్నారుల జీవితాలు, అత్యాచారాలు అన్నీ సాహిత్యం లోకి రావాలి. ఇవ్వాళ తెలుగులో రాస్తున్న ముస్లిం మహిళల్ని ఒక్క చేతి వేళ్ళమీద లెక్కబెట్టొచ్చు. అలాగే ఉర్దూలో రాస్తున్న హైదరాబాదీలు మహా అంటే ఇంతకు రెండింతలు ఉండొచ్చు.  అయితే వీళ్లలో ‘ఇస్లాం స్వీకరించినా ‘దూదేకుల’, ‘లద్దాఫ్‌’, ‘పింజారి’ ‘నూర్‌భాష్‌’ లాంటి పేర్లతో పిలువబడుతూ.. అవహేళన చేయబడుతూ..ఇస్లాం స్ఫూర్తికి విరుద్ధంగా న ఘర్‌ కా న ఘాట్‌ కా’ గా మారిన వారి జీవితాల గురించి కన్సిస్టెంట్‌గా రాస్తున్నది ఒక్క షాజహానానే అంటే అతిశయోక్తి కాదు.

    ‘‘నువ్వు ఎలా పెరిగావో నాకు తెలీదు. కాని నేను కనపడని కత్తులు మెరిసే చూపుల మధ్య పెరిగాను. ఏం చేయాలన్నా, ఏం చదవాలన్నా ఆఖరికి ఏం కట్టుకోవాలన్నా ఏం తినాలన్నా అమ్మా నాన్న, నానమ్మ తాతయ్య, అన్నయ్య ఇంటి పక్కవాళ్ళు, ఇంటెదురువాళ్ళు, వీధి వాళ్ళు… ఇన్నిన్ని ఆంక్షల మధ్య నేను పొందే ఉపశమనం ఒక్క ఈ లైబ్రరీ మాత్రమే’’ అని ముస్లిం స్త్రీలపై ఉన్న ఆంక్షల్ని ఎత్తి చూపింది.

    షాజాహానా సంప్రదాయ వ్యతిరేకి. పక్కా ప్రజాస్వామిక వాది. సంప్రదాయాన్ని వ్యతిరేకించినందువల్ల మైనారిటీల్లో మెజారిటీ వర్గం ఆగ్రహానికి గురయింది. దూదేకుల మహిళ కావడంతో సహజంగానే హిందూ ఫండమెంటలిస్టులకు కూడా  ఆమె వైఖరి నచ్చలేదు. దీంతో అటు ముస్లిం, ఇటు హిందూ అతివాదులను ఎదుర్కొంటూ సాహితీ సృజన చేశారు. మతోన్మాదులనే కాదు కులాన్ని అర్థం చేసుకోవడంలో విఫమయిన లెఫ్టిస్టులూ  ఆమెపై కన్నెర్ర జేసిండ్రు. లెఫ్టిస్టులు కులాన్ని అర్థం చేసుకోవడంలో ఎలా విఫలమయ్యారో ముస్లింలను అర్థం చేసుకోవడంలో కూడా అలాగే విఫలమయ్యారు.  ఎంత సేపు ఆర్థిక దృష్టితోనే సమాజాన్ని చూశారు. కొలిచారు. అరచేతిలో స్వర్గం చూపిచ్చిండ్రు. ఆర్థిక అసమానతలు  తొలగితే సమసమాజం ఏర్పడుతుందనే థియరీనే చెప్పారు తప్ప ప్రాక్టికల్స్‌ని పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే కుల, మత సమస్యలు వామపక్షీయుల ఎజెండా మీదికి రాలేదు.

    నిజానికి ప్రపంచీకరణే ప్రధాన శత్రువు అని కొత్తతరానికి దిశానిర్దేశం చేసిన వామపక్షీయులు కన్వీనియెంట్‌గా  బాబ్రీమసీదుని ‘కూల్చడం’పై నిశ్శబ్దంగా ఉన్నారు. ముస్లింలను చైతన్య పరిచేందుకు వీరికి అనుబంధంగా పనిచేస్తున్న సాహితీ సంస్థలు, సాహితీ వేత్తలు ఎలాంటి చొరవ చూపలేదు. అన్ని ఎన్‌కౌంటర్లూ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు వ్యతిరేకమయినవే! అయితే కొంత మంది మేధావులు మావోయిస్టు ఎన్‌కౌంటర్లను మాత్రమే ఖండిరచి ‘ఆలేరు’ ఎన్‌కౌంటర్‌పై నిశ్శబ్దాన్ని పాటించారు.  చావులో కూడా ముస్లింలపై వివక్ష ఇంకా కొనసాగుతోంది. తెలుగు ప్రాంతాల్లో కారంచేడు, చుండూరు సంఘటనలు దళితోద్యమానికి దిశా నిర్దేశం చేశాయి. అలాగే బాబ్రీ మసీదు షహీద్‌ కావడం, బొంబాయి అల్లర్లు, ఉరితీతలు సాహిత్యంలో స్థానం సంపాదించుకోలేక పోయాయి. కనీసం బహిరంగంగా మాట్లాడుకునేందుకు చర్చనీయాంశాలు కాకుండా పోయాయి. వామపక్ష పార్టీలు, సాహితీవేత్తలు, వారి అనుబంధ సాహిత్య సంస్థలు దాన్నొక ఉద్యమంగా తీర్చి దిద్దడంలో విఫమయ్యారు. గుజరాత్‌ గాయం నుంచి మాత్రమే ముస్లిం సాధకబాధకాలు తెలుగు సమాజానికి తెలియ వచ్చింది. అది కూడా హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌ రిహాబిలిటేషన్‌లో పాల్గొన్న ముస్లిం కవుల పుణ్యమా అని ఆ విషయం చర్చనీయాంశమైంది. మొత్తం తెలుగు సమాజాన్ని వీళ్ళు కదిలించగలిగారు. బాధితుల పట్ల సానుభూతిని, వారి పోరాటానికి సంఫీుభావాన్ని సాధించగలిగారు.

    బాబ్రీ మసీదు సంఘటన ఒక కట్టడం కూల్చివేతగా కాకుండా ఒక నమ్మక ద్రోహంగా, గంగా`జమునా తెహజీబ్‌లో దరార్ గాచూడాలి. ఆనాటి నుంచే తెలుగు సమాజం కూడా హిందూ`ముస్లింలుగా చీలిపోవడం ప్రారంభమయింది. ఈ చీలిక జిల్లాల్లో కూడా కనిపించింది. ఈ చీలిక నేపథ్యంలో బిజేపీ, దాని అనుబంధ సంస్థల ఆగడాలు గుజరాత్‌లో గాయాలు చేశాయి. దేశమంతటా చిచ్చు బెడుతున్నాయి. గ్రామాల్లో ముస్లింలు బతకలేని దుర్భరమైన పరిస్థితి నెలకొంది.  పీర్ల పండుగ చేసుకోలేని స్థితి. అట్లనే దర్గాకు పొయ్యెటోళ్ల మీద ఆంక్షలు. వీటన్నింటి నేపథ్యంలో షాజహానా కథల్ని (కవిత్వాన్ని కూడా) పరిశీలించాలి. విశ్లేషించాలి. కథలన్నీ ఒకదానికొకటి సంబంధం లేనివిగా పైకి కనిపిస్తున్నప్పటికీ అత: సూత్రంగా ముస్లిం మహిళా దృక్కోణం కనిపిస్తుంది. అంతేకాదు చైతన్య స్రవంతి పద్ధతిలో కథలు రాసి తన ప్రతిభను చాటుకున్నారు.

    సిల్‌సిలా కథ దుర్భర పేదరికాన్ని రికార్డు చేసింది. తాగుడు వ్యసనాన్ని, అవిద్య, గ్రామాల్లో ఎన్ని పనులు చేసినా రెండు పూటల తినడానికి తిండిదొరకని దయనీయ స్థితి. మాదిగ వాడలకు ఆనుకొని ఉన్న దూదేకుల కరీంబీ ఎన్ని ఢక్కామొక్కీలు తింటూ జీవితాన్ని గడుపుతున్నది షాజహానా హృద్యంగా చిత్రించింది. ‘‘ఇంగ మీ బడెబాపు ఎండా కాలం వాయించబోతడు, కతం, బిడ్డా! గా వాయించబోయినపుడు దెచ్చిన పైసలే పైసలు! ఇంగ పైసా సంపాయించడు. మీంచి దినామూ తాగుడు గావాలె. గా మూన్నెల్ల సంపాదన ఎన్నాలొస్తది నువ్వే చెప్పు బిడ్డా. నిఖా అయిన  కాణ్ణుంచి ఇప్పటిదాంక సుఖమంటేందో ఎర్కలేకపాయె! నాట్లకు, కలుపుకు, కోతకు బోవుడు.. అయినంక పెసలేర, దూదేర, మీర్చేర బోవుడు. ఏ పని దొర్కితే దానికి బొయ్యి పుట్టెడు పుట్టెడు గింజలు దెచ్చి ఇంట్ల బోస్తుంటే సంసారం నడుస్తుండె’’ అంటూ గ్రామీణ ప్రాంతాల్లో దూదేకుల స్త్రీలు పడుతున్న కష్టాలను, తెచ్చిన గింజలు తీస్కపోయి తాగుడుకు అలవాటయిన భర్తల్ని భరిస్తున్న భార్యల్ని షాజహానా కళ్ళకు కట్టిండ్రు. ఏడాదిలో కేవలం మూన్నెళ్ళు మాత్రం పనిదొరికే స్థితిలో మగవాళ్ళు, అందుకు తాగుడు తోడు కావడం మహిళపై భారం ఎంత పడుతుందో ఈ కథ తెలియజెప్పుతుంది. కరీంబీ ఒక్క షాజహాన పెద్దమ్మే కాదు. కింది కులాల వారి ప్రతి ఇంట్లో ఇట్లాంటి పెద్దమ్మో, చిన్నమ్మో కనిపిస్తారు. పేదరికమెంత దుర్భరంగా ఉన్నా ప్రేమ, ఆప్యాయతలకు, కమ్మని కాయి బువ్వకు ఎక్కడా లోటు రాదు.

    ‘సండాస్‌’ పూర్తిగా ముస్లిం స్త్రీ కథ. గ్రామాల్లో కింది కులాల వారందరూ చెంబట్కొని ఊరవుతలికి బహిర్భూమికెల్తరు. అయితే ముస్లిం స్త్రీలు  ఇంట్లోనే సండాస్‌కెల్తరు. పురుగులు జిబజిబలాడే సండాస్‌ కథ సదువుతుంటే ముక్కుకు వాసన పట్టేస్తదంటే కథ శక్తి అర్థం చేసుకోవొచ్చు. అనివార్యంగా కర్చీఫ్‌ని ముక్కుకు అడ్డం పెట్టుకొని కథ చదివేలా ఉంటది. పెండ్లికి ఇల్లు అమ్మి కిరాయింటికి మారే తల్లి, చెల్లి దీనగాథ కూడా ‘సండాస్‌’లో ఉంది. పాయఖాన సాఫ్‌గ ఉన్న తన ఇంటికే భర్తను తోడుకొని వచ్చి కాపురం పెట్టాలని ఆలోచిస్తున్న దశలో తల్లి పెళ్ళి కర్సు కింద యిల్లు అమ్మి రేకుల యింటికీ అదీ సండాస్‌ మాత్రమే ఉన్న ఇంటికే కిరాయికి మారడంతో కథ ముగుస్తుంది. స్త్రీ దృష్టి కోణంలో బహిర్భూమిని కూడా కథాంశంగా చేయడమే గాకుండా ప్రస్తుతమున్న భారీ స్వచ్ఛభారత్‌ పథకాలు, ప్రచారార్భాటాలు లేని కాలం లోనే పేదరికం దాని ద్వారా అంటిన అపరిశుభ్రతని ఆంగ్ల పుస్తకాల్లోకి కూడా ఎక్కించింది. కవితాత్మకంగా చైతన్య స్రవంతి పద్ధతిలో రాసిన మంచిరాయి నిజంగా ఫిలాసాఫికల్‌ అప్రోచ్‌తో సాగుతుంది. అట్లాంటిదే మరో కథ ‘మనిషి పగిలిన రాత్రి’. పెళ్ళుబుకుతున్న దు:ఖ సముద్రాలను, ఎంత అణచుకున్న అణగారని హృదయాంతరాల్లోని అలల్ని అక్షరీకరించారు. ‘వాదా’ ‘నేను’ కథల్ని ప్రేమకు ప్రతిరూపాలుగా ఆవిష్కరించారు. రంది కథా సంకనంలో బిల్లి కథ తీసుకున్నప్పుడు కొంతమంది శైలీ, శిల్పాలను లెక్కబెట్టిండ్రు. ఈ లెక్కబెట్టినోళ్ళంతా అగ్రకుల బాపనోళ్ళే. ‘బిల్లి’ కథలో అలెగరీ పద్ధతిలో బ్రాహ్మణిజాన్ని దోషిగా నిలబెట్టింది. టిఫిన్‌ బాక్స్‌ కథలో కూడా అంటు పాటించే అగ్రకులాల వారికి బుద్ధి చెప్పింది. అలాగే దివారే కథ తాత్విక చింతనను ఒక గైడ్‌, ఫిలాసఫర్‌ లాగా మెదళ్లలోకి ఎక్కేలా చెప్పింది. ఖతీజ గఫూరి కథలో లైంగిక దోపిడీకి గురవుతున్న ముస్లిం సమాజాన్ని ఆర్ద్రంగా చిత్రించింది. కంచెకాకర కథలో ఇంకా మనుషుల్లో మిగిలి ఉన్న మంచిని తెలియ జెప్పింది.

    ఒక దూదేకుల మహిళ చదువుకోవడమే గొప్ప. అలాంటిది పిహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ అందుకున్న విద్యావంతురాలు షాజహాన. చదువుకున్న కాలం నుంచి పనిచేస్తున్న కాలం వరకూ తాను అనుభవించిన, చూసిన జీవితాల్ని అక్షర బద్దం చేసింది. అంబేద్కర్‌ కృషి వల్ల  ‘హిందూ కోడ్‌ బిల్లు’ వచ్చి హిందూ స్త్రీలకు విడాకులు తీసుకోవడానికి వీలు ఏర్పడింది. అయితే ఇందుకు భిన్నంగా ముస్లిం సమాజంలో ఉన్న తలాక్‌ పద్ధతిని వ్యతిరేకిస్తూ కవిత్వమల్లింది. ఈ విషయం ఇప్పుడు మళ్ళీ   రంగం మీదికి వచ్చింది. దేశభక్తి వర్సెస్‌ దేశద్రోహం చర్చలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళు హేట్‌ పాలిటిక్స్‌ని, హేట్రెడ్‌ను  ప్రచారం చేస్తున్నారు. సహనానికి తావు లేకుండా అసహనంతో ఊగిపోతున్నారు. క్రికెట్‌లో పాకిస్తాన్‌ ఓడిపోవాలని ప్రార్థించడం దేశభక్తికి గీటురాయిగా మారింది. ఎవ్వరు బాగా ఆడితే వాళ్ళు గెలవాలె అంటే దేశద్రోహిగా ముద్ర వేస్తున్నారు. నిజానికి ముస్లింలంటేనే పాకిస్తాన్‌కు పంపించేయాల్సిన వాళ్ళు అని సంఫీుయుల ఉవాచ. పాకిస్తాన్‌లో ఏమో గానీ ఇండియాల మాత్రం ‘దాయాది’ని సాకుగా చూపిస్తూ ప్రజలు ఆకలితో చస్తున్నా అణ్వస్త్రాల స్టాకును పెంచుతున్నారు. దేశ ప్రజల మధ్య చిచ్చు రేపే ప్రకటనలే తప్ప ప్రేమ, ఆప్యాయతలకు ప్రభుత్వ చర్యల్లో తావుండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో షాజహానా రచనలు అటు బురఖాను, తలాక్‌ని ఎదిరించినందుకు ముస్లింలకు, బ్రాహ్మణీయ భావజాలాన్ని, హిందూ అగ్రకుల మతోన్మాదాన్ని నిరసించినందుకు ‘హిందువుకు’ కంటగింపుగా మారాయి. ఇప్పుడు కంటగింపుగా మారినా భవిష్యత్‌లో అందరికీ సమానమైన విలువ దక్కే సమాజ నిర్మాణానికి ‘లద్దాఫ్ని’ కథలు  ఖాళీలు పూరించే ప్రయత్నంలో భాగంగా చూడాలి. మరిన్ని ఖాళీల పూరింపుకు మరిన్ని కథల్ని ఆమె నుండి ఆశిస్తూ…

*

1930 తరవాతనే తెలంగాణా ఆధునికత

 

 

 

(ఛాయ 12 వ సమావేశం 1 మే, ఆదివారం సాయంత్రం 6 గంటలకి హైదరబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ, హైదరబాద్ లో జరగబోతోంది.  ప్రఖ్యాత రచయిత, విమర్శకుడు, పాత్రికేయుడు, సంపాదకుడు,    కె. శ్రీనివాస్ “సాహిత్య చరిత్రలో ఖాళీలు “ అనే విషయం మీద మాట్లాడుతారు.  ఈ సంధర్భంగా ప్రఖ్యాత రచయిత, విమర్శకుడు,  సంగిశెట్టి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకి,  కె. శ్రీనివాస్ యిచ్చిన వివరణలు.)

  • తెలంగాణలో ఆధునిక సాహిత్యం ఎప్పటి నుండి ప్రారంభమైంది?

ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించేముందు, అనేక అంశాలను స్పష్టం చేసుకోవాలి. ఆధునిక సాహిత్యం అంటే ఏమిటి? ఆధునికత అంటే ఏమిటి? తెలంగాణలోనే కాదు, తెలుగులో ఆధునిక సాహిత్యం ఎప్పటినుంచి మొదలయింది? –  చాలా మాటలను మనం నిర్దిష్ట నిర్వచనాలు లేకుండా ఉపయోగిస్తూ ఉండడం వల్ల కొంత అస్పష్టత  ఉన్నది. పాతవి ముగిసిపోవడం, కొత్తవి మొదలుకావడం- ఇవి కొన్ని తేదీలకో సంవత్సరాలకో ముడిపెట్టగలిగిన సంఘటనలు అనుకోవడం కూడా పొరపాటు. 1900-1940 మధ్య కాలాన్ని నేను నా పుస్తకం( తెలంగాణ సాహిత్య వికాసం)లో ఆధునికతలోకి తెలంగాణ సొంత అడుగులు వేసిన కాలంగా చెప్పాను.  ఆధునికత ప్రవేశించని భౌగోళిక ప్రాంతాలు, భావప్రాంతాలు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి. అయినంత మాత్రాన తెలంగాణ ఇంకా ఆధునిక పూర్వ దశలో ఉన్నదని అనలేము. భారతదేశంలో అయినా, బ్రిటిష్‌ ఆంధ్రలో అయినా ఆధునికతలోకి జరిగింది ప్రయాణమే. ఆ ప్రయాణం ఇంకా సాగుతూనే ఉన్నది. ముగిసిపోలేదు.

హేతుబద్ధమైన ఆలోచనలు, సంస్కార దృష్టి, సార్వత్రిక విద్యాకాంక్ష,  సార్వజనీన విలువల వక్కాణింపు, వ్యక్తుల స్వేచ్ఛాభావనలు, బృందాల హక్కులు- ఇవన్నీ సమాజంలో కనిపిస్తున్నాయంటే, ఆ సమాజంలో ఆధునికత బలంగానే ఉన్నదన్న మాట. ఆధునికత గుణవాచి. అటువంటి గుణాలు ఒకానొక నిర్దిష్టకాలంలోనే సాధ్యమైనప్పుడు కాలవాచి కూడా. అయితే, అసమాన ప్రపంచంలో ఒక్కొక్క సమాజం ఒక్కో దశలో ఉంటుంది కాబట్టి,  వాస్తవార్థంలో సమకాలికమైనవన్నీ కూడా సమకాలికమైనవి కావు. దశలు అంటున్నామంటే, అనివార్యంగా ఒకదాని తరువాత మరో దశ వచ్చి తీరాలని, పారంపరిక దశలని కాదు. నైజాము పాలనలో ఉన్న తెలంగాణ, బ్రిటిష్‌ పాలనలో ఉన్న ఆంధ్ర ప్రాంతాలు 1900-1940 మధ్య కాలంలో ఒకే రకంగా లేవు. ఆధునికత లోకి ప్రవేశించిన తీరు, సమయం ఒకటే కాదు. తెలంగాణ ఆలస్యంగా ఆధునికతలోకి రావడమే కాక, భిన్నంగా కూడా వచ్చింది. ఒక ప్రతిపాదనగా చెబుతున్నది ఏమిటంటే, వలసవాదంతో ముడిపడిన ఆధునికత, దాని బౌద్ధిక చట్రం తెలంగాణలో బలంగా లేదు.

  • స్థూలంగా ఆధునికత తెలంగాణలో ఫలానా కాలంలో ప్రవేశించిందని చెప్పలేమా?

మన సదుపాయం కోసం చెప్పుకోవచ్చు. 1930ల తరువాతనే ఆధునిక సాహిత్యం అని చెప్పదగ్గది తెలంగాణలో వచ్చింది. అంతకు ముందు కాలంలో కొందరు వ్యక్తుల రచనలలో ఆధునిక భావాలు, వ్యక్తీకరణ రీతులు లేవని కాదు. ఆధునికతకు కావలసిన సన్నాహాలలోనే 1940 దాకా తెలంగాణ ఉద్యమసమాజం తలమునకలయింది. 1920లు, 1930లు అందులో క్రియాశీల కాలం.

తెలంగాణ నుంచి వచ్చిన మొదటి పత్రిక  శేద్యచంద్రిక (1887), అది అనువాద పత్రిక, ప్రభుత్వ పత్రిక అయినప్పటికీ, వివిధ రంగాలలో హైదరాబాద్‌ తలపెట్టిన ఆధునిక వ్యవస్థల నిర్మాణాల పురోగతిని నమోదు చేసింది. ముఖ్యంగా వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులను ప్రచారం చేయడానికి ఉద్దేశించిన ఆ పత్రికలో,  టెలికమ్యూనికేషన్‌, రోడ్లు వంటి ఇతర ఆధునిక వ్యవస్థల గురించి కూడా ప్రస్తావనలు ఉన్నాయి.  దానిని సాహిత్యేతర పత్రిక అని పరిగణనలోకి తీసుకోకపోయినా,  సాహిత్యాంశాలు కలిగిన మొదటి తెలంగాణ పత్రిక హితబోధిని (1913) లో కూడా ఆధునిక భావాలను పుష్కలంగా చూడవచ్చు. సంస్థానాధీశులలో నూతన భావాలు కలిగిన సంస్కారిగా నాడు పేరు పొందిన బరోడా రాజు ప్రసంగాలను పునర్ముద్రించింది కూడా ఆ పత్రిక.  తెలంగాణ నుంచి మొదటి మహిళాకవి రచన కూడా ఆ పత్రికలోనే ఉన్నది. ఆధునికమనదగ్గ రీతిలో రాసిన కథనాలున్నాయి.  అయినప్పటికీ, 1915 నాటికి తెలంగాణ సమాజం ఆధునికతలోకి ప్రవేశించిందని చెప్పలేము. వ్యావహారిక భాషా రచనలు 1930లోపే వచ్చాయి. మాండలికంలో కథారచన  1930లలో నే చురుకుగా మొదలయింది. గోలకొండ కవుల సంచిక  లో ఆధునిక సాహిత్యం తక్కువే అయినప్పటికీ, ఆ ప్రయత్నమే ఆధునికమయినది.

1930 దశాబ్దారంభంలో ఆంధ్రమహాసభ ప్రారంభమయింది.  ఆధునిక విద్యావంతుల వర్గం ఒకటి చిన్నగా అయినప్పటికీ ఏర్పడింది. పత్రికల సంఖ్య పెరిగింది. వివిధ సామాజిక, కుల సంఘాలు క్రియాశీలంగా పనిచేయసాగాయి. గ్రంథాలయాలు విస్తృతంగా వ్యాపించి, ఊరూరా మార్పును కోరే యువతరం ఒకటి రూపుదిద్దుకున్నది. ఇవన్నీ సాహిత్యంలో ఆధునికత కు తోడ్పడ్డాయి. తెలంగాణ సమాజ వికాసానికి సాహిత్యంలో ఆ మార్పులు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది.

  • తెలంగాణ అస్తిత్వ ఉద్యమ సాహిత్యం ఎప్పటి నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు?

తెలంగాణవాద సాహిత్యం లేదా తెలంగాణ అస్తిత్వ ఉద్యమసాహిత్యం 1995 తరువాతనే మొదలయిందని చెప్పాలి. 1969 ఉద్యమ సందర్భంగా వచ్చిన సాహిత్యం తెలంగాణవాద సాహిత్యం కాదా? అన్న సందేహం వస్తుంది.జాషువా కవిత్వాన్ని దళిత వాద కవిత్వం గా అనడం సాంకేతికంగా ఎట్లా పొరపాటు అవుతుందో, 1970ల నాటి కవిత్వాన్ని తెలంగాణ వాద కవిత్వం అని అనడం కూడా పొరపాటు అవుతుంది. 1969 ఉద్యమానికి  కూడా సైద్ధాంతికత లేదని కాదు. చైనా సాంస్కృతిక విప్లవం ప్రతిఫలనంగా తెలంగాణ ఉద్యమాన్ని చెప్పినవారు, భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన దశగా నాటి కాలాన్ని నిర్వచించినవారు ఉన్నారు. లోతుగా నాటి ఆకాంక్షల మూలాన్ని వెదికిన వారున్నారు. కానీ, ఆ సైద్ధాంతికత ఒక బలమైన, సమగ్రమైన రూపం తీసుకోలేదు. ప్రాంతీయ వివక్షను తీవ్రంగా ఖండించడం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఉద్వేగపూరితంగా వ్యక్తం చేయడం, సాంస్కృతిక భేదాలను ప్రస్తావించడం నాటి సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో కనిపిస్తుంది కానీ, దాన్ని 1990ల నాటి తెలంగాణవాదంతో సమానం చేయలేము. నాటి ఉద్యమానికి ఉండిన పరిమితులు సాహిత్యంలోనూ ఉన్నాయి.

మలిదశ తెలంగాణ ఉద్యమం- ఉద్యోగ, విద్యావకాశాలతో పాటు, వనరుల పరిరక్షణ, మనుగడల సంరక్షణలను ప్రధానంగా తీసుకున్నది. సాగునీటి సమస్య, గ్రామీణ సంక్షోభం- నేపథ్యంలో, ప్రజలను ఏకత్రితం చేసేవిధంగా సాగిన సాంస్కృతిక సాహిత్యోద్యమాలు ఉద్యమానికి చోదకాలుగా ఉన్నాయి. మాది మాకు కావాలె- అన్న నినాదం- ప్రపంచీకరణ నేపథ్యంలోనూ, అస్తిత్వవాదాల ప్రభంజనంలోనూ భాగంగా వచ్చినది. ఆ రెండు పరిస్థితులూ 1970 నాటికి లేవు.

  • తెలంగాణలో మధ్యతరగతి ఏర్పడిందా? ఏర్పడితే ఎప్పటినుంచి?

తెలంగాణలో మధ్యతరగతి ఉనికి గురించి గతంలో నేను వ్యాఖ్యానించినప్పుడు మిత్రులు కొందరు సందేహం వ్యక్తం చేశారు. మధ్యతరగతి- ఒక  నిర్దిష్ట ఆర్థికవర్గాన్ని సూచించే వాడుక పదం. పట్టణజీవితంలోని వేతనజీవులు, వృత్తినిపుణులు, చిన్నవ్యాపారులు- వీరితో కూడిన వర్గం అది. గ్రామీణమూలాలతో నామమాత్రపు సంబంధాలు మిగలడమో, పూర్తి తెగదెంపులో జరిగిన వర్గం అది.  దాని ఆలోచనావిధానం భిన్నంగా ఉంటుంది. సమాజంలో విలువల ఘర్షణకు ఆ వర్గం వేదికగా ఉంటుంది.  బ్రిటిష్‌ ఆంధ్రలో తొలిదశల్లో బ్రాహ్మణవిద్యావంతులతో ప్రాథమికంగా ఈ వర్గం ఏర్పడింది. అక్కడి ఆధునిక సాహిత్యం ఈ వర్గం నుంచి అధికంగా వచ్చింది. తెలంగాణలో మధ్యతరగతి సాహిత్యం తక్కువ.  కథలు, నవలలు వంటి ఆధునిక ప్రక్రియలలో కూడా ఈ వర్గ జీవితం ఉన్నవి తక్కువే.

ఇందుకు కారణమేమిటి?

1913 నాటికి తెలంగాణలో చదువుకున్నవారే 3 శాతం ఉన్నారట. అందులో తెలుగువారు పది శాతం కూడా లేరు. నిజాం ప్రభుత్వంలో పనిచేసిన తెలుగువారు స్వల్పం. ఉర్దూ చదువుకుని న్యాయవాద వృత్తిలో ఉన్నవారు అక్కడక్కడా కనిపించేవారు. వారు కాక ఉపాధ్యాయులు. అంతే. ఆ పరిస్థితి 1948 నాటికి కూడా విప్లవాత్మకంగా ఏమీ మారలేదు. ఇప్పటికయినా, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చదగ్గరీతిలో తెలంగాణలో మధ్యతరగతి లేదు. ఆ కాలంలో  హైదరాబాద్‌, వరంగల్‌ తప్ప పట్టణాలని చె ప్పదగ్గవే లేవు. ఈ మధ్యకాలంలో మాత్రం తెలంగాణలో మధ్యతరగతి వేగంగా ఏర్పడుతున్నది. అయితే వారిలో మధ్యతరగతి స్వభావం ప్రస్ఫుటంగా వ్యక్తం కావడానికి ఇంకా సమయం పడుతుంది.   తెలంగాణ ప్రాంతం వివక్షకు లోనయిందని చెబుతున్న రంగాలలో విద్యా, ఉద్యోగరంగాలు ముఖ్యమయినవి. ఆ అంతరమే మధ్యతరగతి నామమాత్రం కావడానికి, మధ్యతరగతి కేంద్రిత  సాహిత్యం రాకపోవడానికి కారణాలని చెప్పుకోవచ్చు.

 

  • తెలంగాణ సాహిత్యంపై మార్క్సిజం ప్రభావం ఏ మేరకు ఉన్నది?

వికాసోద్యమకాలంలో ఉన్నదని చెప్పలేము. 1930 ద్వితీయార్థం నుంచి మొదలుపెట్టి, మార్క్సిస్టు భావాల ప్రత్యక్ష, పరోక్ష ప్రస్తావనలు కనిపిస్తాయి. సమకాలంలోని వివిధ రాజకీయ సిద్ధాంతాల గురించిన ఆసక్తితో, వాటిని ప్రజలకు తెలియజెప్పాలన్న సంకల్పంతో  కెసి గుప్త, వట్టికోట ఆళ్వారుస్వామి  పనిచేశారు. 1940ల ఆరంభం నుంచి కమ్యూనిస్టుపార్టీ తెలంగాణలో క్రియాశీలంగా విస్తరిస్తూ వచ్చింది. ప్రపంచపటం మీద తెలంగాణను ఆవిష్కరించిన  తెలంగాణ సాయుధపోరాటంమీద, పోరాట సాహిత్యం మీద మార్క్సిజం ప్రభావం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. స్తబ్దంగా ఉన్నదని అనుకున్న 1960లలో కూడా ప్రగతిశీల సాహిత్యం, కవిత్వం, కథలు రెండూ తెలంగాణ నుంచి వచ్చాయి.  1965 తరువాత విప్లవోద్యమం ప్రభావం గురించి కూడా తెలిసిందే. 1990 దాకా విప్లవసాహిత్యోద్యమ ప్రభావం గణనీయంగా ఉన్నది.  తరవాత కాలంలో కూడా  ఒక ప్రధాన కోవగా కొనసాగుతూనే ఉన్నది.  తొలి, మలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలో పార్లమెంటరీ కమ్యూనిస్టుల వైఖరులు ఎలాగ ఉన్నా, విప్లవ కమ్యూనిస్టులు క్రియాశీలంగా పాలుపంచుకున్నారు.  అందువల్ల 1995 తరువాతి తెలంగాణవాద సాహిత్యంపై కూడా మార్క్సిజం ప్రభావం స్పష్టంగా చూడవచ్చు.

  • మార్క్సిజం వరమా, శాపమా?

వరాలు ఇవ్వడానికి అది దైవమూ కాదు, శపించడానికి దెయ్యమూ కాదు. అది ఒక సైద్ధాంతిక సాధనం, ఆచరణ మార్గం.   కమ్యూనిస్టు పార్టీలతో మనకు సమస్యలు ఉండవచ్చు, వారి ఆచరణ విధానాలతో విభేదాలు ఉండవచ్చు. కానీ, చరిత్రను, వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తును నిర్మించుకోవడానికి పనికివచ్చే  శాస్త్రీయమైన సిద్ధాంతం గా  విలువైనది మార్క్సిజం.  భౌతికవాద ఆలోచనలకు భారతీయ గతంలో కూడా మూలాలున్నాయి. మార్క్సిజం ఇప్పటికే అనేక కొత్త వ్యాఖ్యానాలకు, జోడింపులకు, విస్తరణలకు గురిఅయింది.  వర్తమాన భారతానికి అవసరమైన అన్వయాలను, సవరణలను చేసుకోవడం ఇక్కడి మార్క్సిస్టుల పని. వారికి ఆ తెలివిడి  కలగడానికి లోపలినుంచి, బయటినుంచి కూడా ఒత్తిడులు పెరుగుతున్నాయని మనకు తెలుసు.

  • సమాజంలో వివిధ డైమన్షన్లలో ఉండే ఖాళీలను సాహిత్యం ఎప్పటికైనా పరిపూర్ణంగా పూరించగలదా?

బాలగోపాల్‌ చెప్పినదాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అడుగుతున్నట్టున్నారు. ప్రామాణికతా భావనలకూ నిజజీవితాని కీ మధ్య ఉండే అంతరం గురించి చెబుతూ, ఆ అంతరం వల్ల ఏర్పడే ఖాళీ కారణంగా ఏర్పడే దాహం గొప్ప సాహిత్య సృష్టికి దోహదకారి అవుతుందని ఆయన అన్నారు.  విస్మృతి వల్ల, అజ్ఞానం వల్ల, పాక్షికత వల్ల చూడలేకపోయిన వాస్తవికతలు కూడా ఖాళీలేనని, మంచి సాహిత్యం వాటిని భర్తీచేసి, అగోచరాలను కూడా గోచరం చేస్తుందని బాలగోపాల్‌ అన్నారు. మనం చూడలేకపోయిన వాస్తవికతలను కళ్లముందుకు లాక్కురాగలిగే సాహిత్యం సమాజంలోని ఖాళీలను పూరించే ప్రయత్నాలకు దోహదకారి అవుతుంది.  పరిపూర్ణత అనేది సాపేక్షం. భర్తీచేసుకుంటూ పోవడం ఒక ప్రక్రియ.

  • తెలంగాణ భాషను పూర్తిస్థాయిలో, కనీసం పాలన, విద్య, పత్రికారంగాలలో, అమలులోకి తీసుకురావడానికి తీసుకోవలసిన చర్యలేమిటి?

ఈ విషయంలో నావి ఉద్యమకారులు అంతగా మెచ్చని అభిప్రాయాలు. తెలంగాణ భాష అనడం పొరపాటు. దేన్ని భాష అనాలి, దేన్ని మాండలికం అనాలి – నిర్ణయించడానికి భాషాశాస్త్రం ఉన్నది. మాండలికం ( అది కూడా పరిభాషాపదమే) అన్న మాట నచ్చకపోతే, మరో మాట పెట్టుకోవచ్చు.

మనం చేయగలిగింది, తెలుగుభాషలో తెలంగాణ పదజాలం ప్రాతినిధ్యం పెంచడం. తెలంగాణ వ్యక్తీకరణలను, జాతీయాలను, సామెతలను మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావడం. సాహిత్యకారులు ఇప్పటికే విస్తృతమైన స్థానిక పదజాలాన్ని తమ రచనల ద్వారా ఆవిష్కరించారు. ఏది తెలంగాణ పదం, ఏది కాదు అని నిర్ణయించడం నిఘంటుకారులు చేయవలసిన పని. సమగ్ర తెలంగాణ పదకోశం ఒకటి రూపొందాలి. అప్పటికి కూడా అందులోని పదజాలం ఇతర తెలుగు ప్రాంతాల్లో ఎక్కడా వాడుకలో ఉండదని చెప్పలేము. తెలంగాణ లోని వివిధ వృత్తులవారు, కులాల వారు ఉపయోగించే పదజాలాన్ని మొత్తం సేకరించాలి. సాహిత్యంలోని పదప్రయోగాలను క్రోడీకరించాలి. సాంకేతిక పరిభాషా నిర్ణయంలో స్థానిక పదజలాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయాలి.  అచ్చమైన తెలంగాణ స్థానిక వాడుకను సృజనాత్మక రచనల్లో మిగుల్చుకోవచ్చు. కానీ ఆధునిక వినియోగం కోసం, మాధ్యమాల వినియోగం కోసం ప్రమాణీకరణ అవసరం. యంత్ర భాషగా వాడడానికి కూడా ప్రమాణీకరణ కావాలి. తెలుగును యంత్రానువాదం కోసం, కంప్యూటర్‌ వినియోగం కోసం ప్రమాణీకరించే ప్రయత్నాలు మునుపే మొదలయ్యాయి, ఒకమేరకు పూర్తయ్యాయి కూడా. వారు వినియోగించే పదజాలంలో  స్థానిక పదజాలం ఎంత ఉన్నదో పరిశీలించి, తెలంగాణ పాఠాంతరాలను, వాడుకను కూడా అందులో చేర్చాలి.

  • పరిశోధన అనేది థ్యాంక్‌ లెస్‌ జాబేనా?

ఎవరి కృతజ్ఞతలూ  మనకు అవసరం లేదు కానీ, ఇదొక అనాకర్షణీయమైన వ్యాసంగం. ఎంతో కష్టపడాలి. ఫలితం ఏమీ ఉండదు. మనకు మాత్రమే ఎక్సైటింగ్‌గా ఉంటుంది, ఎదుటివారికి చాదస్తంగా ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు, ముఖ్యంగా సాహిత్యరంగ పరిశోధనలు, చాలా వరకు మొక్కుబడిగా సాగుతుంటాయి. సామగ్రి సిద్ధంగా ఉన్న అంశాన్నే ఎంచుకొమ్మని గురువులూ చెబుతుంటారు, లఘువులూ అదే చేస్తుంటారు. మౌలిక సమాచారం సేకరించవలసి వచ్చే పని తీసుకోవడంలో ఎవరికీ ఆసక్తి ఉండదు.  స్వచ్ఛంద పరిశోధకులలో ఉండే తపన, డిగ్రీల పరిశోధకులలో లేదేమో అనిపిస్తుంది, ఏ డిగ్రీ కోసమని మీరు అంత పరిశోధన చేశారు?

*

ఖమ్మం సాహిత్య చరిత్ర రచనకి ఇది శ్రీకారం!

 

kaifiyath

సాంస్కృతిక  పునర్వికాసానికి ఖమ్మం జిల్లా తోడ్పాటు చిరస్మరణీయమైనది. ఆధునిక కాలంలో తెలంగాణాలో  సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది హైదరాబాద్‌లో 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనతో పడింది.. ఈ భాషానిలయం స్థాపనంలో తెంగాణలోని ప్రముఖమైన సంస్థానాధీశులు వారికి తోడుగా కొమర్రాజు క్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, నాయని వెంకట రంగారావు, మైలవరపు నరసింహారావు, ఆదిపూడి సోమనాథరావు తదితరులు కీలక పాత్ర పోషించారు.

ఈ ప్రముఖ సంస్థానాధీశుల్లో నేటి ఖమ్మం జిల్లాకు చెందిన పాల్వంచ సంస్థానాధీశులు రాజా పార్థసారథి అప్పారావు ఆర్థికంగా ఆదుకోవడమే గాకుండా లైబ్రరీ ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు కూడా. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానియానికి జీవితాంతం రాజపోషకునిగా ఉన్నారు. ఈయనకు ‘సాహిత్య విశారద’ అనే బిరుదు కూడా ఉంది. పాల్వంచలో ‘ఆంధ్రవాఙ్మయ సేవాసమితి’ని స్థాపించి దాని తరపున ప్రత్యేక సాహిత్య సంచికను ‘కిన్నెర’ పేరిట ప్రచురించారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వ్యాసభారతాన్ని యథాతథంగా అనువదించి అచ్చేసేందుకు అనేకమంది పోషకుల్ని ఆర్థిక సహాయం అర్థించాడు. అందరూ నిరాకరించారు. చివరికి పార్థసారథి అప్పారావు చేసిన సహాయముతో దాన్ని ఆయన ముద్రించాడు. అంతేగాదు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాష నిలయం స్థాపన కాంలో 11 ఏళ్ళ బాలుడిగా సమావేశానికి వచ్చిన వారందరికీ తాంబూలాలు అందించి అనంతర కాలంలో తెలుగుజాతి గర్వించే పరిశోధనలను, రచనలు చేసిన ఆదిరాజు వీరభద్రరావు కూడా ఖమ్మం జిల్లా (మధిర తాూకా, దెందుకూరు) వాడే! అంటే తెంగాణ పునర్వికాసానికి ఖమ్మం తోడ్పాటు ఏమిటో అర్థమౌతుంది. చందాల కేశవదాసు, మాడపాటి తిరుమలరావు, మాడపాటి రామచంద్రరావు, జమలాపురం వెంకటేశ్వరరావు, సోమరాజు రామానుజరావు, సోమరాజు ఇందుమతీ దేవి, జమలాపురం కేశవరావు, పండిట్‌ రుద్రదేవ్‌, హీరాలాల్‌ మోరియా, సర్వదేవభట్ల నరసింహమూర్తి, సర్వదేవభట్ల రామనాథం, ఊటుకూరి రంగారావు, కౌముది, సుగ్గు అక్షయలింగం గుప్త, ఎ. పూర్ణానంద గుప్త, గెల్లా కేశవరావు, ఉత్ప సత్యనారాయణాచార్య, ఇటికాల నీలకంఠరావు, దాశరథి సోదరులు, కోదాటి నారాయణరావు, బొమ్మకంటి సత్యనారాయణ, చేకూరి కాశయ్య, శీలం సిద్ధారెడ్డి, జలగం వెంగళరావు, డి.రామలింగం, బెల్లంకొండ రంగాచార్యులు, బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి, బెల్లంకొండ లక్ష్మణసూరి, పబ్బరాజు గోపాలరావు, పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు, పాలడుగు వెంకటేశ్వరరావు, జాతశ్రీ, విశిష్ట పరిశోధకులు దూపాటి వేంకటరమణాచార్యుల మిత్రులు అన్నపరెడ్డి పల్లికి చెందిన జమీందారు కాళ్లూరి వెంకటరామారావు ఇలా ఎందరో మహానుభావు తెంగాణ రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో తమదైన ప్రత్యేకమైన ముద్రను వేసిండ్రు.

సాయుధ పోరాట కాలంలో పర్చా దుర్గాప్రసాదరావు, పి.వెంకటేశ్వరరావు, వట్టికొండ రామకోటయ్య, అడ్లూరి అయోధ్యరామకవి(?), తాళ్ళూరి రామానుజస్వామి, కవిరాజమూర్తి, హీరాలాల్‌ మోరియా, డి.రామలింగం, విరివిగా రచనలు చేసిండ్రు. ఇందులో కమ్యూనిస్టులున్నారు. కాంగ్రెస్‌ సానుభూతి పరులూ ఉన్నారు. తమ భావాజాలాకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి కృషి చేసిండ్రు.

మరుగున పడ్డ ఎన్నో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక, చారిత్రక అంశాలను మలుగులోకి తెచ్చి ప్రాచుర్యం కల్పించిన పరిశోధకులు శేషాద్రి రమణకవులు. ఇంకా వెలుగులోకి రావాల్సిన విషయాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ పరిశోధనంతా చేసింది రమణకవులు పేరిట దూపాటి వేంకట రమణాచార్యులు. ఖమ్మం జిల్లాకు ఈయనకు విడదీయరాని బంధం ఉంది. దూపాటి రెండో సోదరి భద్రాచలం దగ్గరలోని అన్నపరెడ్డిపల్లిలో నివాసం ఉండేది. అందువల్ల తరచూ అక్కడికి వస్తూ ఉండేవాడు. ఈయన మొట్టమొదట తెంగాణాలో పరిశోధన మొదలు బెట్టింది ఖమ్మం జిల్లా నుంచే! ఎర్రుపాలెం కరణం, భాషాప్రియులైన జమలాపురం వెంకటకిషన్‌రావు ఇంట్లో ఆయన తోడ్పాటుతో పరిశోధక ప్రయాణం సాగించాడు. ఈ ప్రయాణంలో కొన్ని వందల అముద్రిత తాళపత్రాలను సేకరించారు. ఇదే గ్రామానికి చెందిన అడ్వకేటు మాడపాటి తిరుమలరావు కూడా అండగా నిలిచాడు. అలా తెలంగాణ పరిశోధనకు చేయూత లభించింది. అంతకముందు 1922లో ఆదిరాజు వీరభద్రరావు హైదరాబాద్‌లో ఆంధ్ర పరిశోధక మండలిని ఏర్పాటు చేసిండు.

ఈ పరిశోధక మండలి 1923లో కొమర్రాజు క్ష్మణరావు చనిపోవడంతో అది ‘కొమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర పరిశోధక మండలి’గా మారింది. ఈ మండలి తరపున ‘తెంగాణ శాసనాలు’ ప్రచురించడంలోనూ, ఆ తర్వాత ఆధునిక తెంగాణ ఆత్మగౌరవాన్ని సాహిత్య రంగంలో సగౌరవంగా నిబెట్టిన ‘గోలకొండ కవుల సంచిక’ మలువడడంలోనూ ఆదిరాజు వీరభద్రరావు విశేషమైన కృషి చేసిండు. ఇది ఖమ్మం జిల్లాకే గౌరవ కారణం. ఈ గోలకొండ కవు సంచికలో ఖమ్మం జిల్లాకు చెందిన దాదాపు 30 మంది కవున్నారు. ఇందులో జ్ఞానమాంబ, సోమరాజు ఇందుమతీదేవి రచనలు కూడా చోటు చేసుకున్నాయి. వీరిద్దరు కూడా కవిత్వ పుస్తకాలను అచ్చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు ముందే అర్వపల్లి సత్యవతీదేవి, పబ్బరాజు ఇందిరాదేవి లాంటి కథకులు ఈ ప్రాంతం నుంచి రాసిండ్రు. సోమరాజు ఇందుమతీదేవి సోదరుడు సోమరాజు రామానుజరావు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిలో నిలిచిపోయే రంగూన్‌ రౌడీ, స్వరాజ్య రథం లాంటి నాటకాలు రాసిండు. అనేక నవలలు  వెలువరించిండు. ఇందులో స్వరాజ్య రథం నాటకాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించింది. ఇందుమతీదేవి ఖండిక సంపుటి విజయవాడ నుంచి వెలువడింది. సరిహద్దు ప్రాంతం కావడంతోటి ఆంధ్రప్రాంతంతో ఇక్కడి రచయితలకు సన్నిహిత సంబంధాలుండేవి. వేలూరి శివరామ శాస్త్రితో పాటు అనేకమంది ఆంధ్రప్రాంత కవి పండితులు ఈ జిల్లాతో మొదటి నుంచి పెనవేసుకుపోయిండ్రు. తెలుగుతో పాటు ఉర్దూ కూడా ఈ జిల్లా రచయితలను ప్రభావితం చేసింది. గ్రంథాలయోద్యమంలో ఇక్కడి విజ్ఞాన నికేతనం, కుకునూరు, పాల్వంచ, ఎఱ్ఱుపాలెం, రేమిడిచర్ల, మధిర తదితర గ్రంథాయాలు కీలక పాత్ర పోషించాయి. తెంగాణలోనే మొట్టమొదటి సారిగా సింగరేణిలో అఖిలాంధ్ర గ్రంథాలయ సభలు జరిగాయి. ఈ సభకు హైదరాబాద్‌ నుంచి సురవరం ప్రతాపరెడ్డితో పాటు చాలామంది హాజరయ్యారు. ఇది స్థానికుల్లో చాలా చైతన్యాన్ని నింపింది.

khammam kathalu

ఖమ్మం జిల్లా రచయిత మీద ఉర్దూ, ఇంగ్లీషుతో బాటుగా పక్కనున్న ఆంధ్రప్రాంతం వారి ప్రభావం కూడా ఉండింది. హీరాలాల్‌ మోరియా, కవిరాజమూర్తి (సర్వదేవభట్ల నరసింహమూర్తి)పై ప్రేమ్‌చంద్‌, కిషన్‌చందర్‌ లాంటి ఉర్దూ కవుల, కథకుల ప్రభావం ఎక్కువగా ఉండింది. ఖమ్మం జిల్లా నుంచి మొదట ఆధునికత రీతిలో కథలు రాసింది మాడపాటి రామచంద్రరావు. ‘తిమిర ఝంజుమ్’ అనే కవితా సంకలనాన్ని ప్రచురించిన ‘మంజు’దావూద్‌ అలీ కాశ్మీరీ భాషలో కూడా రచను చేసిండు. ఉర్దూ కవి సికిందర్‌ మొహసిన్‌ గురజాడ ‘దేశమును ప్రేమించుమన్న’ గేయాన్ని ఉర్దూ పాఠకుకులకు అందించిండు. మోరియా, కవిరాజ మూర్తి ఇద్దరూ ఉర్దూలో కవిత్వం, కథలు, నవలలు రాసిండ్రు. వీరు ఉర్దూలో రాసినవి ఊటుకూరు రంగారావు, ఇటికాల నీకంఠరావు, కొలిపాక మదుసూదనరావు, గిడుతూరి సూర్యం లాంటి వాండ్లు తెలుగులోకి తర్జుమా చేసిండ్రు. అలాగే డి.రామలింగం లాంటి వారు తెలుగుసాహిత్యాన్ని ‘ఇండియన్‌ లిటరేచర్‌’ సంచిక ద్వారా 60వ దశకం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసిండ్రు. ఇప్పటికీ ఇంగ్లీషు మాత్రమే తెలిసిన వారికి తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవాలంటే ఈయన రాసిన వ్యాసాలే ప్రధాన ఆధారం. ఖమ్మం కథకుల్లో ఎక్కువ మంది, ఆనాటి మాడపాటి రామచంద్రుడు మొదలు షంషాద్‌ బేగం వరకూ  తాము పుట్టినూరు నుంచి వివిధ ప్రాంతాలకు, దేశాలకు ‘వలస’ లేదా జీవనోపాధి కోసం ప్రయాణం చేసినవారే కావడం విశేషం. మొబిలిటీ (చలనశీలత) కథకుడికి కొత్త కోణాల్ని అందిస్తుంది. కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వాతావరణం అన్నీ కగలిపి తాము అనుభవిస్తున్న, అనుభవించిన జీవితాలను పోల్చి చూసుకొని కథలుగా రికార్డు చేసిండ్రు. మెరుగైన సమాజం కోసం చేసిన సాహితీ కృషి ఇది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ తెలుగులో రాసే ముస్లిం రచయితలు ఎక్కువగా ఉన్న జిల్లా కూడా ఖమ్మమే అని చెప్పొచ్చు. షంషుద్దీన్‌ (కౌముది), దావూద్‌ అలీ, సికిందర్‌ మొహసిన్‌, ఎం.ఎ.రెహమాన్‌, దిలావర్‌, సయ్యద్‌ షఫీ, అఫ్సర్‌, షేక్‌ రఫీ, హనీఫ్‌, షుకూర్‌, షాజహానా, ఇక్బాల్‌ చంద్‌, ఖాజా, అక్బర్‌, షంషాద్‌ ఇట్లా అనేకమంది కవులు, రచయితలు తెలుగులో రాసిండ్రు. ఇంకా రాస్తున్నరు. అయితే వీళ్ళందరూ స్వాతంత్య్రానంతర తరం(?) కావడం, అప్పటికి ఉర్దూ మాధ్యమంలో బోధించే స్కూల్స్  ఖమ్మం ప్రాంతంలో లేకపోవడం, చుట్టూ తెలుగు వాతావరణమే ఉండడంతో అనివార్యంగా వీళ్ళు తెలుగులో రాయాల్సి వచ్చింది. దాని వల్ల ఉర్దూ సాహిత్యం నిఖార్సయిన తెలంగాణ జీవితాన్ని రికార్డు చేసే అవకాశం కోల్పోయింది.         ఈ ద్వివిదీ భావం చరిత్రలో కూడా కనబడుతుంది. దాశరథీ శతకముతో పాటు తన కీర్తనతో ‘ఎవడబ్బా సొమ్మాని కుకుతు వున్నావ్‌’ అని రాముడినే ప్రశ్నించిన కంచర్ల గోపన్న (రామదాసు) తానీషా కాంలో ఖైదు అనుభవిస్తాడు. అలాగే భద్రాచం ప్రాంతం వాడైన భల్లా పేరయకవి తన ‘భద్రగిరి శతకము’లో ముస్లిం రాజుల్ని నిందిస్తాడు.

‘‘అచ్ఛిద్ర కర్ణుయాజ్ఞ నుండగలేక

తురకల కెదురుగా పరుగ లేక

చేరి ఖానులకు తాజీములీయగ లేక

మును నమాజు ధ్వనుల్‌ వినుగలేక

‘‘కాడు చేసిరి కదా కళ్యాణ మండపా

గార వాహన గృహాంగనమలెల్ల

‘‘సంస్క తాంధ్రోక్తుల సారంఋడివోయె

నపసవ్య భాషల నమరె జగము

సత్రశాలంగణల్‌ చలువ పందిరులు

బబ్బరట ఖానుల చప్పరముయ్యె

‘‘పారిపోవగ నైన పట్టెలె నాకక

విడుతరే వైష్ణవ వితతి నెల్ల’’ అని రాసిండు.

jwalitha

జ్వలిత

అయితే ఇదే జిల్లాలో ఆరో నిజామ్‌ మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ చనిపోయిన తర్వాత ఆయన పేరిట 1911 జూలై 16వ తేదీనాడు ఎఱ్ఱుపాలెంలో జమలాపురం రామారావు, వెంకటకిషన్‌రావు, మాడపాటి తిరుమలరావు తదితయి పూనుకొని ‘మహబూబియా గ్రంథాలయా’న్ని ఏర్పాటు చేసిండ్రు. అలాగే మధిరలో మిరియాల నారాయణగుప్త గారు ‘ఉస్మానియా ఆంధ్ర భాషానియం’ పేరిట గ్రంథాయాన్ని ఏర్పాటు చేసిండు. ఇవి రెండు చాలా కాలం పాటు ప్రజలకు ఉచిత పుస్తక, పత్రికా పఠన సౌలభ్యాన్ని కలిగించాయి. ముస్లిం రాజు పేరిట కొన్ని దశాబ్దాల పాటు సేవ చేసిన ఈ గ్రంథాయాలు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయాయి. విదేశాల్లో కొన్ని వందల యేండ్ల క్రింతం స్థాపించబడ్డ లైబ్రరీలు ఆధునిక కాంలో కూడా నిరంతరంగా నడుస్తూ ఉన్నాయి. మన దగ్గర మాత్రం లుప్తమై పోతున్నాయి. రాజుని రాజుగా కాకుండా హిందూత్వ దృక్కోణం నుంచి చూసినప్పుడే సమస్య లెదురవుతున్నాయి. ఇప్పుడు ఉస్మాన్‌ అలీఖాన్‌ అంటే దుర్మార్గుడు, రాక్షసుడు, నిరంకుశుడు పేరిట ‘కమ్యూనిస్టు, బీజేపీ వాళ్ళు’ ఒకే రీతిగా పిలుస్తున్నారు. కమ్యూనిస్టులు మొదటి నుంచీ ఈ జిల్లాలో బలంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా సాయుధ పోరాట ఉద్యమం జరిగిందనే విషయాన్ని గుర్తించాలి. పోరాట వారసత్వాన్ని కాపడుకోవడం పేరిట నిజాంను నిందించడం ఎంత వరకు సమంజసమో కూడా ఆలోచించాలి.

స్వాతంత్య్రానికి పూర్వం తెలంగాణ అంతటా ఎక్కువ భాగం ఉర్దూ మాధ్యమంగానే ఉన్నత విద్య బోధన జరిగేది. అట్లా చదువుకున్న వారిలో సర్వదేవభట్ల నరసింహమూర్తి ఒకరు. ఈయన సాయుధ పోరాట కాంలో ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని చివరికి అనివార్య కారణాల వల్ల  హైదరాబాద్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నప్పుడే ‘మై గరీబ్‌ హూ(’, లాహూ కీ ఖీర్‌ లాంటి ఉర్దూ నమ రాసిండు. ఇవి తరువాత తెలుగులోకి తర్జుమా అయ్యాయి. తెలుగు మాతృభాషగా ఉండి ఎక్కువ భాగం ఉర్దూలో రాసిన రచయిత కవిరాజమూర్తి. ఈయన స్వాతంత్య్రానంతరం ‘ఉత్తర’, ‘దక్షిణ’ అన్న మారు పేర్లతో పటంచెరువు (ఇక్రిసాట్‌, మెదక్‌ జిల్లా) వ్యవసాయ క్షేత్రంలో ఉద్యోగం చేస్తూ అనేక వ్యాసాలు వెలువరించాడు. అలాగే హీరాలాల్‌ మోరియా కూడా ఉర్దూలో అనేక కథలు, నవలలు  రాసిండు. వాటన్నింటినీ ఖమ్మం మిత్రులే తెలుగులోకి తర్జుమా చేసి ప్రచురించేవారు. ఊటుకూరు రంగారావు స్వయంగా కథలు రాయడమే గాకుండా ఉర్దూలోకి కథలు తర్జుమా చేసిండు. శరధార అనే అద్భుతమైన కవితా సంపుటిని మెవరించిండు. ఇలా అటు ఉర్దూ సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి ఏక కాంలో అనేక రచనలు అందజేసిన వీరి గురించి, వీరి రచనల గురించీ ఎక్కువగా తెలియడం లేదు. వీరి సమగ్ర రచన సంపుటి వెలువడ్డట్లయితే తెలుగు సమాజం ఉర్దూ సాహిత్యంలో ఎట్లా రికార్డయ్యిందో వివరంగా తెలుసుకోవడానికి వీలు పడుతుంది. ఈ ప్రాంతానికున్న చరిత్ర కూడా పూర్తిగా ఇంకా వెలుగులోకి రాలేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన మూలాల్ని మనం వెతికి పట్టుకునే పని ప్రారంభమయింది. అలాంటి పునాది పని ఈ ‘ఖమ్మం కథలు’ద్వారా జ్వలిత గారు చేస్తున్నారు. ఇక్కడి చరిత్రను కూడా తవ్వితీయడానికి ఇదొక సందర్భం కూడా. ఈ ప్రాంతానికి గొప్ప చరిత్రుంది. అది అరకొరగా కొంత రికార్డయింది. రామాయణంలోని సీత నివసించిన పర్ణశాల భద్రాచలం ప్రాంతంలోనే ఉందని ప్రముఖ పరిశోధకుడు కొమర్రాజు క్ష్మణరావు మహారాష్ట్ర పండితుల వాదనను ఖండిస్తూ నిరూపించిండు. రావణుడు ఇదే పర్ణశాల నుంచి సీతను ఎత్తుకెళ్తూ ఉంటే జఠాయువు పోరాటం చేసి నేలకొరిగిండని  ఆ ప్రాంతంలో1870ల్లో నివసించిన జాన్‌ కెయిన్‌ అనే ఆంగ్లేయుడు పత్రికల్లో పరిశోధక వ్యాసాలు మెవరించిండు. జఠాయువు`రావణాసురుడి పోరులో ఆ ప్రాంతమంతా దుమ్మురేగడంతో దానికి దుమ్ముగూడెం అని, రావణుడి రథం తాక్కుంటూ వెళ్ళిన గోదావరి ఆవలివైపు గుట్టను రథపు గుట్ట అని, జఠాయువు పాక ఉన్న ప్రాంతాన్ని జటపాక అని అదే ఏటిపాక అనీ ఆయన రాసిండు.

గ్రంథాలయోద్యమం, విద్యాలయాల స్థాపన, పరిశోధన, పత్రిక నిర్వహణ, ఆంధ్రమహాసభ, వర్తక సంఘాలు, పుస్తకప్రచురణ, రైతు ఉద్యమాలు, కమ్యూనిస్టుల కార్యకలాపాలు అన్నీ కగలిసి ఇక్కడి ప్రజల్లో చైతన్యానికి దోహదం చేశాయి. ఖమ్మంలో 1936లో స్థాపించబడ్డ విజ్ఞాన నికేతనం గ్రంథాలయ వారోత్సవాల్లో ఆంధ్రప్రాంతానికి చెందిన విశ్వనాథ సత్యనారాయణ, అంబటిపూడి వెంకటరత్నం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, మ్లంపల్లి సోమశేఖరశర్మ, మారేపల్లి రామచంద్రశాస్త్రి, పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. వీటి కొనసాగింపుగా 1944లో సింగరేణి కారీస్‌లో 25వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ జరిగింది. ‘విశాలాంధ్ర’కు ఇక్కడే బీజాలు పడ్డాయి. అంతకుముందు కరువు పీడిత ప్రాంతాల నుంచి ముఖ్యంగా రాయసీమ నుంచి పుష్కంగా నీళ్లున్న ‘బనిగండ్ల పాడు’లాంటి ప్రాంతానికి వలసవచ్చిన వారు ఇక్కడి చైతన్య, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దాదాపు వందేండ్లకు ముందు ఇక్కడికి వలస వచ్చినవారు స్కూల్స్, వైద్యశాలలు ఏర్పాటు చేసుకోవడంలో ముందున్నారు.

1930ల్లోనే ఇక్కడి దళితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. వివిధ సంస్థల కార్యకలాపాల వల్ల  ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఆ చైతన్యంతోటే 1934లో ఖమ్మం జిల్లా పెదమండువ గ్రామంలో దళితు కోసం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసిండ్రు. ఈ పాఠశాలలో సుండ్రు రంగయ్య అనే అతను ఉపాధ్యాయుడిగా ఉండేవారు. ఆయన కూడా దళితుడే! తర్వాతి కాంలో నిజాం రాష్ట్ర హరిజన సేవక సంఘం వాళ్ళు ఈ పాఠశాలను ఆర్థికంగా ఆదుకున్నరు. పుస్తకాలు, పలకలు ఉచితంగా ఇవ్వడమే గాకుండా భవన నిర్మాణానికి కూడా ఈ సంస్థ సాయం చేసింది. దాదాపు ఇదే కాంలో ఖమ్మం తాూకాలోని ముష్టిగుంట్ల గ్రామంలో పోలీసు ఉన్నతాధికారి మౌల్వీ మహమ్మద్‌ తబియుద్దిన్‌ పూనిక మేరకు అస్పృశ్యత నివారణకు, స్త్రీ సమానత్వం కోసం సభలు జరిగాయి. ఇందులో చాలా మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. విశేషమేమిటంటే దళితులను కూడా సభా వేదికపై కూర్చుండబెట్టి సమావేశాలు నిర్వహించడం. ఈ సమావేశంలో ఖమ్మంకు చెందిన సనాతనధర్మదారణ సభ వారు ఉన్నప్పటికీ ఎలాంటి అడ్డంకులు జరగలేదని గోలకొండ పత్రికలో పేర్కొన్నారు. అలాగే మధిర తాలూకా గుండిపూడికి చెందిన నియోగి బ్రాహ్మణు జమీందార్‌ అయిన కాళ్ళూరు వెంకటరావు పినపాకలో చనిపోయారు. ఆయన స్మృత్యర్థం వారి కుమారులు రామకిషన్‌రావు, ఉమామహేశ్వరరావు ఖమ్మం పట్టణంలో హరిజన హాస్టల్‌ని      1941లో నిర్మించిండ్రు. నిజాం ప్రభుత్వంలో హైదరాబాద్‌ ఆవలి ప్రదేశంలో దళితు అభ్యున్నతికి ఎక్కువ కృషి జరిగింది ఖమ్మం జిల్లాలోనే అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ జిల్లా విశిష్టమైనది.

 

మొత్తం తెంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాది ఒక ప్రత్యేకమైన స్థితి. భారతదేశంలో హైదరాబాద్‌ రాజ్యం బలవంతంగా విలీనమైనప్పుడు ఖమ్మం జిల్లా ఉనికిలోనే లేదు. నిజానికి 1905వరకు వరంగల్‌, ఖమ్మం రెండు జిల్లాల్ని కలిపి ఖమ్మం జిల్లాగానే పిలిచేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం 1905లో జిల్లా కేంద్రాన్ని వరంగల్‌కు మార్చి ‘వరంగల్‌’ జిల్లాగా మార్చారు. భౌగోళికంగా మిగతా తెంగాణ జిల్లాతో పోల్చి చూస్తే పూర్తిగా భిన్నమైంది. గోదావరి, శబరి, కిన్నెరసాని, మున్నేరు లాంటి నదులతో, బయ్యారం ఉక్కుగనులతో, బొగ్గుగనులతో, పాలేరు నీటి వసతితో కొంత మెరుగైన పరిస్థితి ఉండింది. హైదరాబాద్‌ రాష్ట్రంలో ఏర్పడ్డ మొట్ట మొదటి ఇంకా చెప్పాంటే ఏకైక జిల్లా ఇది. హైదరాబాద్‌ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంతిభద్రతలు కాపాడేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం వరంగల్‌ జిల్లాను విభజించి 1953 అక్టోబర్‌ ఒకటిన ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేయడమైంది. జిల్లా ఆవిర్భావ కాలంలో ఖమ్మం, ఇల్లందు, మధిర, బూర్గుంపాడు, పాల్వంచ తాలూకాలు మాత్రమే భాగంగా ఉండేవి. ఖమ్మం తాలూకాలోని కామేపల్లి, సిరివోలు గ్రామాలను ఖమ్మం తాలూకా నుంచి తొలగించి వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ తాలూకాలో కలిపారు. ఇవ్వాళ ఆంధ్రలో కలిపిన గ్రామా ప్రజల గోడు వింటూంటే వాళ్ళ గొంతు ఎట్లా నొక్కబడుతుందో అర్థమైతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు ఆంధ్రా ‘మేధావులు’ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఖమ్మం జిల్లాలో కలిపిన భద్రాచలంని కూడా ఆంధ్రాలో కలపాలని డిమాండ్‌ చేసిండ్రు. భద్రాచలం ప్రాంతమనేతమ ది వారి వాదన. అయితే చారిత్రకంగా చూసినట్లయితే అది అసంబద్ధ వాదన.

 

1854లో ఆర్థర్‌ కాటన్‌ ధవళేశ్వరం ఆనకట్ట కట్టే సమయంలో  పరిపానా సౌలభ్యం కోసం సూగూరు, భద్రాచం తాలూకాను బ్రిటీష్‌ వారికి ఇవ్వాల్సిందిగా నిజాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పురస్కరించుకొని వాటిని బ్రిటీష్‌ ప్రభుత్వానికి బదలాయించారు. భద్రాచం, రేకపల్లి తాలూకాలు 1860 వరకూ నిజాం ఆధీనంలోనే ఉండేవి. 1860లో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వీటి అజమాయిషీని బదలాయించారు. ఆ తర్వాత ఈ తాలూకాని 1874లో సెంట్రల్‌ ప్రావిన్స్‌ నుంచి మద్రాసు ప్రావిన్స్‌కు బదలాయించిండ్రు. 1953లోనూ, 1959లోనూ భద్రాచలం ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు వచ్చాయి. వీటిని నదికి ఆవలితీరంలో చాలా దూరంలో ఉన్న జిల్లా కేంద్రం నుంచి పాలించడం కష్టసాధ్యమయ్యేది. దాంతో ప్రజల ఇబ్బందులను అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాను ఖమ్మం జిల్లాలో కలిపారు. ఈ ఉత్తర్వు 1959 నవంబర్‌ 30 నుంచి అమల్లోకి వచ్చింది. భద్రాచలం ప్రాంత ప్రజలది మొదటి నుంచీ దయనీయమైన స్థితి. 1959లో తెంగాణలో కలపడంతో ముల్కీ రూల్స్‌ వారికి వెంటనే అమలు కాకపోవడంతో స్థానికంగా కళాశాలల్లో అడ్మిషన్లు, ఉద్యోగాలు రెండూ దక్కలేదు. దానిపై వాణీ రమణారావు లాంటి గిరిజన ఎమ్మెల్యేలు పోరాటం చేయడంతో వారిని ముల్కీలుగా గుర్తించేందుకు జలగం వెంగళరావు చొరవ తీసుకొని చట్టంలో మార్పు తీసుకొచ్చారు. అయితే ఈ మార్పుల్ని ఆసరాగా ఎక్కడెక్కడి వారో తాము కూడా తెంగాణ వారమే అని ఉద్యోగాకు పోటీపడ్డారు. నిజానికి  ప్రత్యేక తెంగాణ ఉద్యమానికి పునాది కూడా ఖమ్మం జిల్లా నుంచే పడిందంటే అతిశయోక్తి కాదు. కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఆంధ్రప్రాంత ఉద్యోగులను 1969 జనవరి పది తారీఖులోగా తొలగించి  తెంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ‘కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌’ సంఘం కార్యదర్శి వి.వై.గిరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది ఆచరణకు రాకపోవడంతో విద్యార్థి రవీంద్రనాథ్‌ అమరణ నిరాహార దీక్ష చేపట్టిండు. ఇది విస్తరించి తెంగాణ అంతటా ఉద్యమానికి దారితీసింది.

 

నిజానికి 1961లో తెంగాణ కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డ నిధుల నుంచి ఈ ‘కొత్తగూడెం పవర్‌ థర్మల్‌ స్టేషన్‌’ ప్రారంభ మయింది. ఇందుకోసం రైతులు 1300 ఎకరాల భూమిని ధారదత్తం చేయాల్సి వచ్చింది. ఒక వైపు భూములు పోయాయి. మరోవైపు కరువు పరిస్థితులు, తమ కండ్ల ముందట రోజువారీ ఉద్యోగాలకు కూడా ఉన్నతస్థాయి ఆంధ్ర అధికారులు తమ ప్రాంతంవారిని పిలిపించి ఉద్యోగాలిచ్చారు. ముల్కీ నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘించి స్థానికంగా భూములు కోల్పోయిన వారికి ఇవ్వాల్సిన ఉద్యోగాలు కూడా ఆంధ్ర ప్రాంతం వారికే కట్టబెట్టారు. మొదట ఎం.ఎన్‌.ఆర్‌ అని తాత్కాలిక ఉద్యోగాల పేరిట వారిని పనిలోకి తీసుకొని, తర్వాతికాంలో ‘అనుభవం’ ఉన్నవారు అని సాకు జెప్పి వారికే ఉద్యోగాలిచ్చిండ్రు. మొత్తం 1200 ఉద్యోగాల్లో తెంగాణ వారు కేవం 200 మంది కూడా లేరు. తెంగాణలో అప్పటికే 30వేల మంది ఇంజనీరింగ్‌, డిప్లొమా, డి.టి.ఐ, హెచ్‌.ఎస్‌.సి, డిగ్రీలు పాసయినవారున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్న అటు ప్రభుత్వం గానీ, ఇటు ఎపిఎస్‌ఇబీ గానీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. నిజానికి తెలంగాణకు ఉన్న రక్షణల్ని ఆంధ్రాధికారులు ఉ్లంఘించిండ్రు. ఈ సేఫ్‌గార్డ్స్‌ 1958 నుంచీ అమల్లో ఉన్నాయి. కండ్ల ముందట అన్యాయం జరుగుతున్నా అడ్డుకోలేని అశక్తత ఆగ్రహానికి దారి తీసింది. అలా ప్రత్యేక తెంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి పునాది పడింది. రెండో సారి 2009లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైనప్పుడు రోశయ్య ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసి ఖమ్మంకు తరలించింది. ఖమ్మంలో తెంగాణ ఉద్యమం బాలహీనంగా ఉండడంతో అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత రాదు అనేది ప్రభుత్వం ఉద్దేశ్యం. అయితే ఉద్యమాల ఖిల్లా అయిన ఖమ్మం ఒక్కటిగా తరలి వచ్చి పోరాటానికి బాసటగా నిలిచింది. లాఠీలకు వెరవకుండా ఉద్యమకారులు చూపిన తెగువ మిగతా తెంగాణ బిడ్డకు స్ఫూర్తిగా నిలిచింది.

ఈ పోరాట స్ఫూర్తితో జ్వలిత గారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 104 కథలతో ఈ సంకలనాన్ని వెలువరించారు.  ఈ సంకలనం మిగతా జిల్లాల వారికి స్ఫూర్తి కావాలని స్ఫూర్తి కొరుకుంటూ …

(“ఖమ్మం కథల”కు రాసిన ముందుమాటలో కొంత భాగం)

 

బహుజనవాదానికి కొత్త చిరునామా  

 

                         1983లో తెలుగు దేశం పార్టీ ఏర్పాటయింది. పార్టీ స్థాపించిన తొమ్మిదినెల్లకే అధికారంలోకి వచ్చింది. ఎంత తొందరగా అధికారంలోకి వచ్చిందో అంత తొందరగా ఆగస్టు సంక్షోభంలో ఇరుక్కొని మళ్లీ ఎన్నికకు వెళ్లింది. ఈ సారి థంపింగ్‌ మెజారిటీతో గెలిచింది. ఇట్లా తిరుగులేని మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం, ఆ పార్టీని అన్ని విధాలా ఆదుకున్న కమ్మ సామాజిక వర్గం ప్రభుత్వం తమ కులానిది మాత్రమే అన్నట్టుగా, తమకు ఎదురులేదు అని విర్రవీగుతూ కారంచేడులో దళితును ఊచకోత కోసిండ్రు. ఇది 1985లో జరిగింది. ఇది తెలుగునాట దళిత చైతన్యానికి పునాది వేసింది. ప్రతి గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహం స్థాపించడం చైతన్య స్ఫూర్తిగా మారింది. అంబేద్కర్‌ తన గురువుగా చెప్పిన జ్యోతిరావు ఫూలే 1990వ దశకంలో తెలుగు వారికి పరిచయమయ్యిండు. మహారాష్ట్రలో గెయిల్‌ అంవెట్‌, ధనంజయ కీర్‌, రోజాలిండ్‌ తదితరులు చేసిన కృషితో ఆయన రచనలు ఆంగ్లంలోకి తర్జుమా అయ్యాయి. జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రు వెలువడ్డాయి. దాదాపు ఇదే కాంలో తెలుగునాట ‘నలుపు’ పత్రిక కొంత సామాజిక చైతన్యంతో పనిచేసింది. ఎదురీత పత్రిక దాన్ని పాక్షికంగానే అయినా కొనసాగించింది. నలుపు పత్రిక బాధ్యులే తర్వాతి కాంలో ‘హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌’ తరపున పూలే రచనల్ని, జీవిత చరిత్రను తెలుగులో ప్రచురించారు. 2009 ఎన్నిక సందర్భంలో చిరంజీవి సామాజిక న్యాయం పేరిట ఫూలే పేరును కొంత పాపులర్ చేసిండు. అంతకు ముందు మారోజు వీరన్న 1994లోనే బహుజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, రాజ్యాధికారాన్ని దక్కించుకోడానికి ‘ఇండియాలో ఏం జెయ్యాలి’ అని కొంత చర్చ చేసిండు. విద్యార్థి దశలో వీటన్నింటిని దగ్గర నుంచి చూసిన గాజుల శ్రీధర్‌ అదే ‘బహుజన’ భావజాలంతో, బ్రాహ్మణాధిపత్యాన్ని నిరసిస్తూ ‘వెన్నె కొలిమి’ కవితా సంపుటిని వెలువరించిండు.

    మలిదశలో ప్రత్యేక తెంగాణ ఉద్యమాన్ని 1987లో తెంగాణ ప్రభాకర్‌, హరనాథ్‌ు చిన్న పాయగా ప్రారంభించిండ్రు. వాళ్లు వెలిగించిన వత్తిని 1990లో ఉస్మానియా విద్యార్థులు  అందిపుచ్చుకున్నరు. అట్లా అందుకున్న విద్యార్థుల్లో నేనుకూడా ఒకణ్ణి. తెంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై, ఓపెన్‌ కోటా పేరిట మొత్తం 20శాతం సీట్లను ఆంధ్రా విద్యార్థుల తో నింపడాన్ని తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ నాయకత్వంలో అడ్డుకున్నరు. ఆ తర్వాత భువనగిరి మహాసభ, వరంగల్‌, సూర్యాపేట డిక్లరేషన్లు, ఇంద్రారెడ్డి, జానారెడ్డి తెలంగాణ జెండా అన్నీ రంగం మీదికి వచ్చినయి. టీఆర్‌ఎస్‌ స్థాపనతో తెలంగాణ ఉద్యమానికి ఒక అండ దొరికినట్లయింది. అప్పటి వరకూ అక్కడక్కడా వినిపిస్తున్న గొంతులు  ఒక్క దగ్గరికొచ్చాయి. అస్తిత్వ సోయితో చేసిన కృషి తెలంగాణ దశ, దిశనే మార్చేసింది. అప్పటి వరకూ ఎన్‌కౌంటర్లకు ఎరవుతున్న బిడ్డలు  తుపాకులు అడవుల్లోనే వదిలేసి ప్రత్యేక తెలంగాణ జెండా అందుకున్నరు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నందునే ఈ కాలంలో ఎన్‌కౌంటర్‌ హత్యలు తక్కువయినయి. ‘డెమోక్రాటిక్‌ స్పేస్‌’ దొరికింది. ఈ దొరికిన డెమోక్రాటిక్‌ స్పేస్‌ని ప్రత్యేక తెలంగాణ కోసం టీచర్లను సమాయత్తం చేసేందుకు గాజుల  శ్రీధర్‌, ఆయన మిత్రులు కృషి చేసిండ్రు. సభలు , సమావేశాలు  పెట్టిండు. వ్యాసాలు  రాసిండు. ఇప్పుడు తాను నాలుగేళ్లుగా రాసిన కవిత్వాన్ని మనముందుంచిండు.

IMG_8462 - Copy

    అత్యంత పేదరికంలో బాల్యం  గడిపిండు. టీచర్‌గా సర్కారు బడుల్ని అతి దగ్గరగా చూసిండు. అనుభవించిండు. అందుకే శ్రీధర్‌ కవిత్వంలో బడి, బాల్యం కండ్లముందు కనబడతాయి. నిలదీస్తయి. బహుజన భావజాలంతో రాసిన కవితలే గాకుండా, రాజకీయ కవితలు  కూడా ఇందులో ఉన్నాయి. విమలక్క విడుదలయినప్పుడూ, పైడి తెరేష్‌ చనిపోయినప్పుడూ కవిత్వం రాసిండు. బతికుండి కొట్లాడాలె గెలుచుకోవాలె అని భవిష్యత్‌పై భరోసా కల్పిస్తడు. వాళ్ల నాయిన మీదా, సహచరి మీదా కవిత్వమల్లిండు. ప్రపంచీకరణ, ఆత్మహత్యలు, ఉస్మానియా విద్యార్థులు, మహిళలు, పురుషాహంకారం వస్తువుగా పూర్తిగా తెలంగాణ సోయితో, ఈ మట్టి వాసనను పట్టిచ్చే విధంగా కవిత్వ మల్లిండు. 36 కవితలు , ఆరు పాటలతో పాణం పోసుకున్న ఈ సంపుటి ఉద్యమ సమయంలో అటు విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఇటు తెలంగాణ బిడ్డలు  చేసిన ఉద్యమాలను, త్యాగాలను శ్రీధర్‌ అక్షరీకరించిండు.

    మార్క్స్‌, మావో గురించి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు లెక్చర్ల రూపంలో, అరసం, విరసం మీటింగుల కు ఎప్పుడు పోయినా పుస్తకాల రూపంలో పరుచుకుండ్రు. అందుకే మార్క్స్‌, మావోలు 1940 నుంచి తెలుగు వారికి సుపరిచితం. అదే 1990 నాటికి కూడా బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్‌, పెరియార్‌, కాన్షిరామ్‌లు  అపరిచితులు. ఆంధ్రా వలసాధిపత్యంతో పాటుగా కులాధిపత్యం ఎట్లా ఉందనేది కూడా శ్రీధర్‌కు అర్థమయింది. లెఫ్టిస్టులు ఏనాడూ పట్టించుకోని ఫూలే, అంబేద్కర్‌ను శ్రీధర్‌ పట్టించుకుండు. అందుకే

    ‘‘ఇప్పుడిక

    మార్క్స్‌, మావో స్వప్న గీతాకు

    ఫూలే`అంబేద్కర్ల దండోరా దప్పు దరువు మోగాలి’’ అంటూ కర్తవ్య బోధ చేసిండు.

    బ్రాహ్మణాధిపత్యం సమాజాన్ని దిగజార్చిన తీరుని కళ్లముందుంచిండు.

    ‘‘ఈ దేశపు

    దేహమంతా జందెప్పోగు

    సాలెగూడలో బందీ’’

    ‘‘..అక్షరం మొదలు  ఆయుధం దాకా

    ఈ నేపై మొకెత్తే విత్తులన్నింటికీ

    నెత్తుటి గాయా గురుతులు

    నిత్యం శంబూకుని అంతిమ యాత్రలు’’

    ‘‘…నే నేంతా

    మూల వాసి దోసిలిలో పూదోటై విరిసినా

    మూలాల్ని తెగనరుకుతున్న

    గండ్రగొడ్డలిదే రాజ్యం’’

vennela kolimi

   రాజకీయ రంగంలో బ్రాహ్మణాధిపత్యం 1970 తర్వాత తగ్గు ముఖం పట్టింది. అయితే ఈ ఆధిపత్యం ప్రస్తుతం డైరెక్ట్‌గా తామే రాజకీయ నాయకుల  అవతారమెత్తకుండా, రాజకీయ నాయకుల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నరు. రాజ్యాన్ని నడిపే ఎగ్జిగ్యూటివ్‌ లందరూ బ్రాహ్మణులే! అంతెందుకు బీసీ ప్రధాని మోడీ అని జబ్బు చరుచుకుంటున్న వారికీ ఆ ప్రధానమంత్రి కార్యాయంలో 97 శాతం మంది అధికారులు బ్రాహ్మణులే అంటే ఆశ్చర్యం కలుగక మానదు. అయితే ఇది వాస్తవం. తెలంగాణలో ఈ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. అయితే రాజు. లేదంటే రాజగురువు. ఇదీ బ్రాహ్మణాధిపత్యం.  ఈ ఆధిపత్యాన్ని తుదముట్టించేందుకే ‘వెన్నెల కొలిమి మండిస్తున్న’ అని చెప్పిండు. ఇందులో కవితాత్మకంగా చెప్పిన శంబూకుని అంతిమయాత్ర, శంఖుతీర్థాలదే శాస్త్రీయత, గోత్రం గొడుగు పడగ నీడలు , బలి చక్రవర్తుల  సమాధులు, కారుమబ్బు కౌటిల్యానిదే ఆధిపత్యం అంటూ బ్రాహ్మనిజం సడుగులిరగొట్టిండు. మనువు మడిని మెటామార్ఫోస్‌ చేసి బడికి కార్పోరేట్‌ దడి కట్టాడు,

    ‘‘మట్టీ .. గుట్టా..

    అడవీ.. నీటి నెవూ..

    మొత్తంగా నే నేంతా

    మనువు పిడికిట పెట్టుబడి

    మట్టి గుండెకు నెత్తుటి తడిపై

    కట్టిన లోహపు దడి’’ అంటూ ఆధునిక మనువు రూపాన్ని పట్టించిండు.

    ‘‘.. మట్టి వాసన అస్తిత్వా మొకపై

    వామన పాదా దండు’’

    ‘‘..చిగురించే అక్షరంపై మొకెత్తే గజ్జెపై

    అమ్మపైనా.. అడవిపైనా..

    చెట్టు చాటు యుద్ధం

    అవునూ అమరుందరూ

    అసురులే!’’ అంటూ ఎవరి ఫిత్‌రత్‌ ఏందో జెప్పిండు.

    ‘‘ఉగాది రోజు

    పంచాంగాు, ఎన్నిక మేనిఫెస్టోు

    జమిలిగా

   నిద్రపుచ్చే మాదక ద్రవ్యాలు!’’ అంటూ మతం, మతాన్ని పెంచి పోషిస్తున్న రాజకీయాలపై అక్షరాయుధాన్ని సందించిండు. నిజానికి జందెప్పోగు జాతి, మనువూ.. మట్టి, చెట్టు చాటు యుద్ధం అని కవితా శీర్షికలు పెట్టడంలోనే శ్రీధర్‌ సాహసం కనిపిస్తది.

    రాజకీయ కవితల్లో 2004 ఎన్నికకు ముందు బిజేపి ప్రభుత్వం తమ ఎన్నిక ప్రచారాన్ని దేశం వెలిగిపోతున్నది అని ప్రచారం చేసింది. అయితే అది చేసుకున్న ప్రతి ప్రచార అంశాన్ని అబద్ధంగా విప్పి చెప్పిండు శ్రీధర్‌.

    ‘‘పదునైన పత్తి ఇత్తనం కత్తి వేటుకి

    తెగి పడ్డ మా అమ్మ నుదుటి కుంకుమ

    నూలు  పోగుకు వేలాడుతున్న తల తోరణాలు ’’

    ‘‘ ఇసుక బట్టీల్ల ఇంజనీర్లైన

    బడీడు బుడ్డోళ్లు’’

    ‘‘కూలి గుడిసెల్లో చీపులిక్కరు సీసా కెత్తిన నెత్తురు’’ అంటూ బీజేపి రంగు బహిరంగం చేసిండు.

    ‘‘లెక్కలేని దోపిడితో మీ సోపతి

    వారానికి నెలెన్నని లెక్కించే మీ మతి

    చర్చంటూ సాగదీసె కుటి రాజనీతి

   చరిత్రే సాక్షి కదా బేహారు దుర్గతికి’’ అంటూ గులాం నబీ ఆజాద్‌ ఆంద్రోళ్లకు గులామై తెంగాణను ఆజాద్‌ కాకుండా చేసినందుకు 2013లో కవిత రాసిండు.

    ప్రపంచీకరణ చేసిన నాశనాన్ని మననం చేసుకుంటూ

    ‘‘పాతికేళ్ళ గర్భందాల్చి పాడుకాం

    ప్రసవించిన మార్కెట్‌ మహమ్మారి

    ప్రపంచీకరణ వేటగాడు

    బిగిస్తున్న ఉచ్చుకు

    వేలాడుతున్న అస్తిపంజరాలం’’ బాధపడ్డడు.

    శ్రీధర్‌ వాళ్ళ నాయిన గురించి

    ‘‘దారపు కండెకు చుట్టు కోవాల్సిన నా కంటి చూపును

    పుస్తకాల  పేజీకు అతికిస్తివి’’ అని కృతజ్ఞత చెప్పుకుంటడు. అలాగే సహచరి గురించి

    ‘‘..నాలు కపై గడ్డ కట్టిన మౌనాన్ని

    ఎద లోతుల్లో ఘనీభవించిన దు:ఖాన్ని

    నీ పైట కొంగు వెచ్చదనంలో కరిగించుకుంటా

    సఖీ…’’ అంటూ సేదదీరిండు.

    మహిళా దినోత్సవం సందర్భంగా రాసిన మరో కవితలో వాళ్ళ అమ్మలాంటి అనేక మంది అమ్మలను యాద్జేసుకుంటూ

    ‘‘భూగోళాన్ని

    రాట్నానికి కట్టి

    అరిచేతుకు

    జీవితాల్ని అతికించి

    మీ గుండెల్ని

    చీల్చి

    కండెకు చుట్టుకున్న

    అమ్మలారా!’’ అంటూ తల్లి పాదాకు ప్రణమిల్లిండు.

    ‘‘అక్షరం అందరిదీ కాకూడదు

   జ్ఞానం ఇనుపకంచెల్ని దాటకూడదు’’ అంటూ సర్కారు బడుల  గురించీ, ‘‘అమ్మ కడుపు నుంచే పనిముట్లతో బయటపడిన వాళ్ళం’’ అంటూ పేదల బాల్యం గురించీ రాసిండు.

    ‘‘విచ్చుకత్తుల అంచుపై విమల గానమై

   దూలాడుతూ కదలివచ్చిన కాలిగజ్జెకు…’’ అంటూ జైలు నుంచి విడుదలయి వచ్చిన ప్రజా గాయకురాలు  విమలక్కకు స్వాగతం పలికిండు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కావడికుండలు మోసిన పైడి తెరేష్‌ చనిపోయినప్పుడు

    ‘‘కొన్నాళ్ల పాటు.. కొన్ని చావులపై ..

    నిషేధం విధించమని ధర్నా చేస్తాం

    దారి తప్పకుండా శిబిరానికొస్తావా?

    గులాబి ముళ్లతోటలో గానకచ్చేరి పెడతాం

    గబ్బిలమై గజల్‌ గానం చేస్తావా…?’’

    ‘‘నిశ్చల  సంద్రం లాంటి ముఖాన్ని

    అరిచేతుల్లో దాచుకుందామంటే

   ‘హిందూసముద్రం’లో అగ్ని కెరటాల్ని మొలిపిస్తున్నావు’’ అంటూ నివాళి అర్పించిండు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల  మీద కవిత్వం, పాటా రెండూ ఇందులో ఉన్నాయి.

    ‘‘ఈ నేల  కంటున్నది

    మగపిల్లల్ని కాదు!

    సామూహికంగా పురుషాంగాలకు

   పురుడు పోస్తున్నది’’ అని నిర్భయ అత్యాచారా సంఘటన జరిగినప్పుడు గుండెలోతుల్లోంచి రాసిండు. ఇక్కడ కూడా మనువాదం పనిచేస్తుంది అంటూ ‘‘మూల నపడి మూల్గుతున్న ముసలి మనువు భూజాలపై వేలాడుతూ వెక్కిరిస్తున్నాడు’’ అంటూ రాజకీయ నాయకు, పురుషాధిక్యతతో మాట్లాడే చాంధసుల  గురించి కవిత్వ మల్లిండు. అయితే

    ‘‘తలలు తీసే ఉరిశిక్షలు సరే గానీ!

   ఆరో నూరో తలలు తెగితే…’’ అని అన్నడు. ఉరి శిక్షలు సరే అనడం, అదీ ఎంత ఆవేశం ఉన్నా అన్నీ తెలిసిన శ్రీధర్‌ లాంటి కవి మాట్లాడ్డం అన్యాయం. ఆరో నూరో తలు తెగితే.. అనడం కూడా తగదు. సమాజంలో మార్పురావడానికి, బ్రాహ్మణాధిపత్యానికి, మనువాదానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉద్యమించడమే పరిష్కారం.

    అస్తిత్వ సోయితో తెంగాణ సాహిత్యానికి బహుజన సొబగుల ద్ది, కనుమరుగైతున్న తొర్ర, దారపు కండె , అలుకు పిడుచ, గాలింపు గిన్నె, ఎర్రని జాజు, కందిలి, మసిబట్ట, గొరుకొయ్యల్ని, బుడ్డోళ్లని కవిత్వంలోకి తెచ్చిన శ్రీధర్‌ బహుజనవాదానికి కొత్త చిరునామా!

-సంగిశెట్టి శ్రీనివాస్‌

చరిత్రకు ‘హిందూత్వ’ చెద

 

sangisetti- bharath bhushan photo

మొన్న పంద్రాగస్టు నాడు గోలకొండ కోటలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ జెండా ఎగరవేస్తే బిజెపికి ఎక్కడి లేని కోపమొచ్చింది. జాతీయ జెండాను అక్కడ 17సెప్టెంబర్ నాడు ఎగరెయ్యాలని ఉచిత సలహాలు కూడా ఇచ్చిండ్రు. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తే దానికి కూడా బిజెపితో పాటు కాంగ్రెస్ పార్టీలు కూడా మతం రంగు పూయడానికి ప్రయత్నించాయి. ఆఖరికి సానియాను ఏడిపిస్తేగాని వీళ్ల కండ్లు సల్లబడలేదు. హైదరాబాద్ని భారత ప్రభుత్వం ‘ఆక్కుపై’ చేసుకున్న 17 సెప్టెంబర్ విద్రోహ దినాన్ని ‘పండుగ రోజు’గా ప్రకటించాలని హిందూత్వ వాదులు పిలుపునిస్తున్నారు. 1948లో జరిగిన పోలీసు చర్యలో రెండు లక్షలకు పైగా ముస్లింలు ఊచకోతకు గురైన సంఘటనను ‘పండుగ’గా జరుపుకోవాలనడంలోనే వారి మానసిక స్థితి తెలియ వస్తుంది. వీళ్లంతా వచ్చే బల్దియా ఎన్నికల్లో లబ్ధిపొందే ఉద్దేశ్యంతో ప్రతిదానికి మతం రంగు పూస్తున్నారు.

అలాగే, రేపు జూబ్లిహిల్స్లోని కాసుబ్రహ్మానందరెడ్డి పార్క్ పేరుని ‘అసఫ్జాహీ’పార్కుగా మార్చే ఏర్పాటు జరుగుతోంది. నిజానికి చిరాన్ప్యాలెస్ పేరిట ఈ ప్రాంతం ఎప్పటి నుంచో ప్రఖ్యాతి. అయితే ఈ పార్కుకి 1969లో 369 మంది ఉద్యమకారుల్ని పొట్టనబెట్టుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి పేరు పెట్టడమంటేనే తెలంగాణను అవమానించడం. అట్లాంటిది ఈ ‘అసఫ్జాహీ’ పేరుపై అప్పుడే నిరసనలు షురువైనయి. హైదరాబాద్ గంగా`జమున తెహజీబ్కు, లౌకిక భావనలను అణచివేసేందుకు మతోన్మాద శక్తులు ఏకమవుతున్నాయి. ఇలాంటి దశలో హైదరాబాద్ అసలు చరిత్రను అందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది.

నిప్పులాంటి నిఖార్సయిన చరిత్రకు సైతం మతతత్వవాదులు చెదలు పట్టిస్తున్నారు. చరిత్రలో పరిఢవిల్లిన మతసామరస్యతకు మసి బూస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొని ప్రచారం చేస్తున్న ‘హింసోన్మాదులు’ హైదరాబాద్, తెలంగాణ ‘తెహజీబ్’ని సరిగా అర్థం చేసుకోలేదనే చెప్పవచ్చు. కుతుబ్షాహీల కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు చెదురుముదురుగా ఒకటీ అరా జరిగిన సంఘటనలనే భూతద్దంలో పెట్టి చూపిస్తూ కావాలనే ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడుతున్నారు. మతం రంగు పూస్తున్నరు. నిజానికి 450 ఏండ్ల ముస్లింల పాలనలో పరిఢవిల్లిన మత సామరస్యతను, పరమత సహనాన్ని లౌకిక ధృక్కోణంతో వెలుగులోకి తేవాల్సిన అవసరముంది. ఈ దిశలో ఇంతవరకు కృషి జరుగలేదు. కుతుబ్షాహీలు, అసఫ్జాహీల పాలన, కతుబ్షాహీల తెలుగు రాణుల స్మృతి, రాజులు తెలుగు సాహిత్యాన్ని పోషించడమే గాకుండా స్వయంగా తెలుగు కవిత్వాన్ని సృష్టించిన చరిత్ర రికార్డు కావాలి. మత విద్వేషాలకు దూరంగా ప్రజలందరినీ సమానంగా చూసిన గత వైభవానికి చిత్రికగట్టాలి.

కుతుబ్షాహీల కొలువులో అక్కన్న, మాదన్న సోదరులు కీలక భూమిక నిర్వహించారు. ఒకరు సైనికభారాన్ని వహించగా, మరొకరు ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టారు. అక్కన్న దేశభక్తిని శంకించడానికి వీలులేదు. డచ్ ఈస్టిండియా కంపెనీ వారు వ్యాపారం కోసం కొంత భూభాగాన్ని కోరినప్పుడు అక్కన్న మాట్లాడుతూ ‘‘ఇక్కడ పుట్టి పెరిగిన వారు మాత్రమే దేశ సౌభాగ్యం కోసం పాటుపడుతారు. హృదయపూర్వకంగా ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తారు. అంతేగాని వ్యాపార ఉద్దేశ్యాలతో విదేశాల నుంచి వచ్చిన వారు కాదు’’ అన్నాడు. తన దేశభక్తికి సాక్షిగా ‘డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ’ ఉద్యోగి మైఖేల్ జాంజూన్తో 1683లో అన్న మాటలివి. చివరికి అన్నదమ్ములిద్దరూ గోల్కొండ రాజ్యం కోసం కోటలోనే శత్రువుల చేతిలో ప్రాణాలర్పించారు. అంతటి త్యాగ నిరతి వారిది. అక్కన్న, మాదన్నలిద్దరూ గోల్కొండ రాజ్యంలో చాలా ప్రదేశాల్లో గుడులు నిర్మించారు. వాటి పోషణ కోసం భూములు కేటాయించారు.

సాక్షాత్తు గోల్కొండ కోటలోనే గుడిని కట్టించారు. ఆ గుడి ఇప్పటికీ పూజలందుకుంటోంది. తెలంగాణలో బోనాలు ఇప్పటికీ ఇక్కడనే ప్రారంభమవుతాయి. కూచిపూడి నాట్యాన్ని ప్రోత్సహించి సిద్ధేంధ్రయోగికి సకల వసతులతో కూడిన భూమిని సమకూర్చిందీ కుతబ్షాహీలే. ఇందులో అక్కన్న, మాదన్నల పాత్ర కూడా ఉన్నది. నిజానికి కుతుబ్షాహీల కొలువులో ‘సనదు’లను ఫార్సీలో రాయించే వారు. ఇవే విషయాలను తెలుగులో కూడా రాయించి ప్రకటించేవారు. అంటే తెలుగు భాషకు వారిచ్చిన గౌరవం అర్థమయితది.

సురవరం ప్రతాపరెడ్డి కుతుబ్షాహీల గురించి రాస్తూ ‘‘వారు స్వమతాభిమానులే గానీ బహమనీల వలె పరమతధ్వంసకులు కారు’’ అని పేర్కొన్నారు. దీనికి తగ్గట్టుగానే మొత్తం భారతదేశంలోనే ఉర్దూలో తొలి రచన వెలువడిన గోల్కొండ కోటలో నుంచే ముస్లింలు రాసిన తొలి తెలుగు సాహిత్యం వెలువడిరది. తెలుగు మండలములో తెలుగులోనే రాజ్య వ్యవహారాలను సాగించారు. మొహర్రం, విజయదశమి, కామదహనం, మృగశిర రోజుల్లో ప్రజలందరూ కలిసి వేడుకలు జరుపుకునేవారు. ఇప్పటికీ తెలంగాణలో మొహర్రం పండుగను మతాలకతీతంగా జరుపుకుంటారు. ఈ పండుగలు జరుపుకునేందుకు కుతుబ్షాహీ ప్రభుత్వమే ఖర్చంతా భరించేది. తొలి అచ్చ తెలుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ వీరి కాలంలోనే పొన్నగంటి తెలగన్న రచించారు. అలాగే కుతుబ్షాహీల ఆస్థానంలోని అద్దంకి గంగాధర కవి, సారంగు తమ్మయ మొదలైన వారంతా తెలుగు సాహిత్యంలో ఒక గుర్తింపుని తెచ్చుకున్నవారే!

కుతుబ్షాహీ రాజులు వివక్ష పాటించకుండా అన్ని మతాల వారికి ప్రభుత్వోద్యోగాల్లో ప్రాతినిధ్యాన్ని కల్పించారు. ఏ యితర ముస్లిం రాజ్యంలోనూ లేని మత స్వాతంత్య్రాన్ని హిందువులు కుతుబ్షాహీల పాలనలో అనుభవించారు. అయితే ఈ విషయాలేవి చరిత్ర పుటల్లోకి, పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కలేదు. పర్షియన్, ఉర్దూ, తెలుగు భాషా సాహిత్యాలు సమానంగా ఆదరించబడ్డాయి. తారామతి, ప్రేమావతి మొదలైన హిందూ స్త్రీల ప్రతిభకు ఆదరణ దక్కింది. భాగామతి పేరిట హైదరాబాద్ నగరమే నిర్మితమయింది.

హిందూ`ముస్లిం సఖ్యతకు అత్యంత ప్రాధాన్యత నిచ్చిన కులీకుతుబ్షా హైదరాబాద్ నగరాన్ని నిర్మింపజేయడమే గాకుండా తెలుగులో కవిత్వం కూడా అల్లిండు. ఇంతవరకెవ్వరూ ఈ విషయానికి తగిన ప్రాధాన్యతనిచ్చి చర్చించలేదు. దసరా పండుగ గురించి ఆయన ఇలా వర్ణించారు.

‘‘అందాల దసరా ఆనందముతో వచ్చినది
వనమంతా వెన్నెలమయమయినది
అందాల మనసులో బుల్ బుల్ పిట్టల పాటలు
అందాలొలుకబోసె
అంగనల పాటల వలె ఉన్నవి’’

అని కవిత్వీకరించిండు. ఇదే తెలుగులో ముస్లింలు రచించిన మొట్టమొదటి సాహిత్యం. రాజులే తెలుగును ఆదరించడమే గాకుండా స్వయంగా కవిత లల్లారు. ప్రజల్ని కన్నబిడ్డల వలె చూసుకున్నారు. కొంతమంది హిందూత్వ వాదులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాల్సిన ఘటనలకు కావాలనే స్థానం దక్కకుండా చేసిండ్రు. తవ్వినా కొద్దీ ఆనాటి వెలుగులు ఎన్నో కొత్త పుంతల్ని సంతరించుకుంటున్నాయి. ఇంత వరకూ తెలుగు సాహిత్యంలో కుతుబ్షాహీల సేవ గురించి సరైన పరిశోధన జరగలేదంటే విశ్వ విద్యాలయాల్లో ఉన్న వారి మేధో పరిధి, భావజాలం రెండూ తెలియ వస్తున్నవి.

కుతుబ్షాహీల అనంతరం అసఫ్జాహీలు కూడా ఇదే ఒరవడిని కొనసాగించారు. 1944`48లో మాత్రమే కొన్ని చోట్ల వివిధ కారణాల వల్ల మతపరమైన అలజడి చెలరేగింది. మొత్తం 225 సంవత్సరాల అసఫ్జాహీల పాలనలో కేవలం ఒకటి రెండు సంఘటనల ఆధారంగా ముస్లింల పాలన అంతా హిందూ వ్యతిరేక పాలన అని ఈనాడు కొంత మంది తీర్పులిస్తున్నారు. దీనిలో ఆరెస్సెస్ వాదులు మొదలు కమ్యూనిస్టుల వరకు చాలా మంది ఉన్నారు. ఈ విషయాన్ని గతంలో చాలా సార్లు చర్చకు పెట్టడం జరిగింది. నిజానికి ఏడో నిజామ్ మీర్ ఉస్మానలీఖాన్ తాను చేయాల్సి ఉండి చేయలేక పోయిన పనులకు ఆయనను జవాబుదారీగా నిలుపుతూనే అంతకుముందు జరిగిన అభివృద్ధి పనుల క్రెడిట్ ఆయనకు దక్కేలా చూడాల్సిన అవసరముంది.

నిజామ్ల పాలనలో తెలంగాణలోని వనపర్తి, గద్వాల, దోమకొండ, పాపన్నపేట, దుబ్బాక, రాజపేట ఇలా అనేక సంస్థానాలు హిందువుల పాలనలో ఉండేవి. వీటిలో వేటిని కూడా నిజామ్లు స్వాధీనం చేసుకోలేదు. పైపెచ్చు వీరికి కొన్ని విషయాల్లో ‘స్వయం పాలన’ అధికారాలు కూడా కట్టబెట్టారు. జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్ముఖ్లు, దేశ్పాండ్యాలు 95 శాతం హిందువులే. వీరి వల్ల నిజాం ఖజానాకు నష్టం కలుగుతుండటంతో సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్యంలో సంస్కరణలకు పునాదులు వేసిండు. దొరలు, దేశ్ముఖ్ల గుత్తాధిపత్యంలో ఉన్న కార్యకలాపాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకువచ్చారు. నిజామ్ల పాలనలో కూడా మత సహనం పరిఢవిల్లిందని చెప్పడానికి సాక్ష్యం కిర్క్ పాట్రిక్`ఖైరున్నీసాల వివాహం.

ఇప్పటి కోఠీలోని మహిళా కళాశాల, ఒకప్పటి బ్రిటీష్ రెసిడెన్సీని రెండువందల ఏండ్ల క్రితమే నిర్మించిన హైదరాబాద్లో బ్రిటీష్ రెసిడెంట్ జేమ్స్ అషిల్లిస్ కిర్క్ పాట్రిక్ నిజాం ఖాందాన్కు చెందిన ఖైరున్నీసా బేగమ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీనికి బ్రిటీష్ ప్రభుత్వాధికారుల నుంచి నిరసన వచ్చింది కానీ హైదరాబాద్లోని నిజాం ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇదీ ఇక్కడి వాతావరణం.

నిజాం పాలనలో మొదటి నుంచీ హిందువులకు స్థానం ఉండేది. కాయస్థులు అధికారంలో రెవెన్యూ పదవుల్ని నిర్వహించే వారు. అలాగే చందూలాల్, కిషన్ పర్షాద్ తదితరులందరూ నిజాం ప్రధానులుగా వ్యవహరించారు. పక్కా ఆర్య సమాజీయుడైన కేశవరావు కోరట్కర్ని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించిన ఘనత నిజాం ప్రభుత్వానిది. భద్రాచలం, యాదగిరిగుట్ట, సీతారామ్బాగ్, రaాం సింగ్ టెంపుల్ (గుడి మల్కాపూర్) మొదలైన మందిరాలకు ప్రత్యేక వేడుకల సందర్భాల్లో రాజ లాంఛనాలతో పట్టుబట్టల్ని నిజాం ప్రభుత్వం పంపించేది. అంతేగాదు తమ రాజ్యంలోనిది కాకపోయినప్పటికీ తిరుపతి వెంకటేశ్వర మందిరానికి నిజాం ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అందేవి. పూర్తిగా హిందూమతానికి సంబంధించిన మందిరాలైన అజంతా గుహల మరమ్మత్తుకు, అభివృద్ధికి గాను నిజాం ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది. హజ్కు వెళ్లే ముస్లిములతో సమానంగా కాశీయాత్ర చేసే వారి కోసం ప్రభుత్వమే ఖర్చులు భరించింది. కాశీలో బ్రాహ్మణులకు దానం చేసే రూపాయి దగ్గరి నుంచి అన్ని ఖర్చుల్ని నిజాం ప్రభుత్వమే భరించింది.

1908లో మూసీ నదికి వరదలు వచ్చి మూసీ తీర ప్రాంతమంతా కొట్టుకుపోయి అంతా అస్తవ్యస్తం కావడంతో గంగమ్మ తల్లిని శాంతింప చేయాలని పండితులు ఆరో నిజామ్ మహబూబ్ అలీఖాన్కు సలహా ఇచ్చారు. దాంతో ఆయన పసుపు బట్టలు ధరించి, ధూప దీప నైవేద్యాలతో మూసీ నదిలోకి తర్పణం చేశాడంటే పరమత సహనం, వారి నమ్మకాలకు అనుగుణంగా ఎలా నడుచుకున్నాడో అర్థమవుతుంది. అలాగే ఏడో నిజాం ఉస్మానలీఖాన్ పాలనలో హైకోర్టు కడుతున్నప్పుడు అప్పటికే అక్కడున్న ‘మాతాకా మందిర్’ అడ్డుగా ఉన్నది దాన్ని తొలగించి విశాలంగా కట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఇంజనీర్లు ఉస్మానలీఖాన్కు ప్రతిపాదనలు పంపారు. దాన్ని ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ ‘‘మనం కట్టేది న్యాయాలయం. దాన్ని అన్యాయపు పునాదులపై నిర్మించ కూడదు’’ అని మందిరానికి తగినంత చోటు వదిలి పెట్టి హైకోర్టుని నిర్మించారు. ఇప్పటికీ ఈ ఆలయం హైకోర్టు ఆవరణలో పూజలందుకుంటుంది.

అలాగే ఉస్మానలీఖాన్ పాలనలో మహాభారతం పుస్తక ప్రచురణ కోసం పూణేలోని పరిశోధనాలయానికి, బనారస్ విశ్వవిద్యాలయానికి నిజాం తన సర్ఫేఖాస్ నుంచి, ప్రభుత్వ ఖాతాల నుంచి విరివిగా విరాళాలు ఇవ్వడం జరిగింది. వాస్తవాలు ఇలా ఉంటే హిందూత్వ వాదులు, కమ్యూనిస్టులు నిజాంని కేవలం మతతత్వవాదిగానే చూస్తున్నారు. నిజాం పాలనలో బ్రిటీష్ వారు హద్దు మీరి జోక్యం చేసుకోవడం వల్ల రెవెన్యూ, పోలీస్, ఎక్సయిజ్ మిగతా ప్రాధాన్య శాఖలన్నింటికీ బ్రిటీష్ సంతతి వారే అధికారులుగా నియమితులయ్యేవారు. వారు చెప్పిందే వేదంగా సాగేది. ట్రెంచ్, టస్కర్ లాంటి వారు ఆంధ్ర మహాసభలకు అనుమతులివ్వకుండా అడ్డుకునేవారు. వీటన్నింటికి ఒక్క నిజామ్నే దోషీగా నిలబెట్టాలని, ఆయన్ని రజాకార్ల ప్రతినిధిగా చూడాలనడం సబబు కాదు. అందరితో పాటు 1944`48 సంవత్సరాల మధ్య కాలంలో జరగకూడని సంఘటనలకు, జరిగిన సంఘటనలకు నిజామ్ని బాధ్యుడ్ని చేస్తూనే ఆ కాలంలో జరిగిన సంఘటనల్ని సంయమనంతో, ఇతర అంశాలతో సమన్వయం చేస్తూ అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. 1944 ప్రాంతంలో హైదరాబాద్లో, 1927లోనే ‘మజ్లిస్’ని స్థాపించిన బహదూర్ యార్జంగ్ అల్లుళ్లు దూళ్పేట్లో జరిగిన మత కలహాల్లో మరణించారు. ఈ సమయంలో బహదూర్ యార్జంగ్ ప్రదర్శించచిన సంయమనాన్ని సరోజిని నాయుడు తన కవితల్లో నిక్షిప్తం చేసింది. మొత్తం తెలంగాణలో ఇలాంటి రెండు మూడు మత కలహాల సంఘటనలు జరిగాయి. ఈ కాలంలో అటు మజ్లిస్, మరొక వైపు ఆర్య సమాజ్, ఇంకోవైపు దళితులు, రజకార్లు తమ కార్యకలాపాలను నిర్వహించారు.

బీసీల్లో సంగెం సీతారామయ్య యాదవ్, వనమాల (హకీం) నారాయణదాసు, ధావత్ జనార్ధన్, చిరాగు వీరన్న గౌడ్, కే.రాములు, బొజ్జం నర్సింలు తదితరులు ఇక్కడి ప్రజల అభుయన్నతి కోసం కృషి చేసిండ్రు. వీరికి ప్రభుత్వం మతంతో సంబంధం లేకుండా ప్రోత్సాహాన్నిచ్చింది. వారు ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చే సమస్యలను సామరస్యంగా పరిష్కరించింది.

నిజాం పాలనలో ఆది హిందువులు అని పేరున్నప్పటికీ మాల, మాదిగలను ఏనాడు హిందువుల్లో భాగంగా జనాభా లెక్కల్లో చూపలేదు. అంతేగాకుండా సమాజంలో వెనుకబడ్డ ఈ ప్రజల కోసం నిజాం ప్రభుత్వం ప్రత్యేకమైన నిధిని కేటాయించింది. పష్తక్వామ్ పాఠశాలల పేరిట కొన్ని వందల పాఠశాలలను తెలుగు మీడియంలో దళితుల కోసం ప్రత్యేకంగా 1930కి ముందే ప్రారంభించింది.

భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బి.ఎస్.వెంకట్రావు, శ్యామ్సుందర్ లాంటి దళిత నాయకుల సలహా సంప్రదింపులకు అనుగుణంగా వారి అభ్యున్నతికి ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు. బి.ఎస్.వెంకట్రావు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ అంబేద్కర్ స్థాపించిన విద్యాలయాలకు విరివిగా గ్రాంట్లు మంజూరు చేసిండు. ఆర్య సమాజ్ `మజ్లిస్ల మధ్యన ఘర్షణ వాతావరణం తీవ్రం కావడంతో దళితులు గ్రామాల్లోని దొరలు, భూస్వాములు, దేశ్ముఖ్లు, దేశ్పాండ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిండ్రు. ఇలా ఉద్యమం చేసిన వారిలో పీసరి వీరన్న అనే దళిత నాయకుడు ముఖ్యుడు. ఈయన హైదరాబాద్లో గాంధీని బహిరంగ సభలో నిలదీసిండు. ‘హరిజనులు’ అనే పదం వాడకం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిండు. వేదిక మీద ఉన్న గాంధీ వీరన్నను సంతృప్తి పరిచే ఉద్దేశ్యంతో ఒక పండుని చేతిలో పెట్టగా ఆయన దాన్ని తిరస్కరిస్తూ మేము కష్టపడి పనిచేసి తింటాము. మీలాగా ఒకరి నుండి ఆయాచితంగా వచ్చింది త్ణీసుకోము అని తిరస్కరిస్తూ దళితుల ఆత్మగౌరవ బావుటాని ఎగరేసిండు. ఈయన ఆ తర్వాత వరంగల్లో ‘అల్లమ ప్రభువు’ పేరిట వరంగల్లో ‘‘అల్లా’’కు మందిరాన్ని నిర్మించి, నడిపించిండు. దీని కొనసాగింపుగా దేశ్ముఖ్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గౌరవంగా బతికేందుకై కొంతమంది దళితులు ‘ముస్లిం’ మతాన్ని స్వీకరించిండ్రు. అప్పటి వరకు వీరిని వేధించిన దొరలు ముస్లిములుగా మారిన వీరిని గౌరవంగా చూడడంతో అది మరికొందరికి ఆదర్శంగా మారింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ విలీన సమయంలో కొంతమంది ముస్లింలు ఖాసిం రజ్వీ నేతృత్వంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. ఇలా ఉద్యమించిన రజాకార్లలో కేవలం ముస్లింలే గాకుండా మతం మార్చుకున్న తెలుగు ముస్లింలు, నిజాం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న దొరలు, దేశ్ముఖ్లు, జాగీర్దార్లు, జమిందార్ల దగ్గర పనిచేస్తున్న కింది కులాల వాళ్లు ముఖ్యంగా దళితులు, తెనుగోళ్లు ఉన్నారు. అంటే రజాకార్లు కేవలం ముస్లింలు మాత్రమే కారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రజాకార్లను సాకుగా చూపించి హైదరాబాద్కు మతం రంగు పూయాలని బయటి వారు, హిందూత్వ వాదులు ప్రయత్నం చేస్తున్నారు. సహజీవనంతో గడిపిన కాలాన్ని విస్మరించి కేవలం ఒకటి రెండు సంఘటనల ఆధారంగా మొత్తం చరిత్రకు నెత్తురు అంటిస్తున్నారు.

బంగారు తెలంగాణ నిర్మించు కోవాలంటే ముందుగా లౌకిక పునాదుల్ని ఏర్పర్చాల్సి ఉంటుంది. తెలంగాణ వాదం ముసుగులో కొత్తగా ఆరెస్సెస్స్ దాని అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున హనుమాన్ జయంతులు, వేసవి శిక్షణ శిబిరాల పేరిట ఎక్కడి కక్కడ ప్రజల్ని మత పరంగా విడదీస్తోంది. ఇప్పుడు కేంద్రంలో కూడా బిజేపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరికి మరింత ఊతం అందే అవకాశం ఉంది. అందుకే గతంలో కన్నా ఇప్పుడు మరింత జాగరూకతతో ‘హైదరాబాద్ ఇమేజ్’ని కాపాడు కోవాల్సిన అవసరముంది. లౌకిక భావనలను, చారిత్రక వాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా మతోన్మాదులకు చెక్ పెట్టవచ్చు.

– సంగిశెట్టి శ్రీనివాస్

అస్తిత్వానికి ఆనవాళ్ళు తొలి తెలంగాణ కథలు

సంగిశెట్టి శ్రీనివాస్‌

సంగిశెట్టి శ్రీనివాస్‌

నిజాం పాలనలో హైదరాబాద్‌ రాజ్యంలో ముఖ్యంగా హైదరాబాద్‌/సికింద్రాబాద్‌ నగరాల్లో కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వెల్లి విరిసింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారితో పాటు అటు ఇరాన్‌ నుంచి ఇటు ఫ్రాన్స్‌ ఇంకా అనేక దేశాల నుంచి వలస వచ్చిన వారు హైదరాబాద్‌ని తమ శాశ్వత ఆవాసంగా మార్చుకున్నారు. అంతకు ముందరి కుతుబ్‌షాహీల పాలన కూడా విదేశీ పర్యాటకుల పొగడ్తలతోపాటు, దేశీయుల మన్ననలందుకుంది.

ఇబ్రహీం కులీ కుతుబ్‌షాను కవులు మల్కిభరాముడు అని కొనియాడిండ్రు.  హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించిన మొహమ్మద్‌ కులీకుతుబ్‌షా చంచల్‌గూడా బిడ్డ భాగమతిని వివాహమాడిండు. భాగమతి ` కుతుబ్‌షాహీ ఖాందాన్‌లో వీరమాతగా, వీరపత్నిగా వెలుగొందారు. తారామతి, ప్రేమావతిలు గోల్కొండ కోటలో నృత్య ప్రతిభతో దేశదేశాల్లో పేరు పొందిండ్రు. అక్కన్న మాదన్నలు కుతుబ్‌షాహీల సేవలో తరించారు. ఉన్నత పదవుల్ని అధిష్టించారు.  ఖైరున్నీసా బేగమ్‌ని పెళ్ళి చేసుకొని బ్రిటీష్‌ రెసిడెంట్‌ కిర్క్‌ పాట్రిక్‌ చరిత్రలో నిలిచి పోయాడు. స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్‌లో చైనీస్‌ రెస్టారెంట్స్‌ ఉండేవి. కరాచీ బేకరీ ఇప్పటికీ ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన సైనిక యోధుడు రేమండ్‌ సమాధి హైదరాబాద్‌ ఆస్మాన్‌ఘడ్‌లో ఇప్పటికీ ఉంది. బ్రిటీష్‌ ప్రధాని చర్చిల్‌ తాను సైన్యంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్‌లో నివాసమున్నాడు.   ఆయన కూడా హైదరాబాద్‌లో సర్వేయర్‌గా పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాత కవి టేలర్‌ ఇక్కడుండి కవిత్వం రాసిండు. తెలుగులో నవలలు రాకముందే హైదరాబాద్‌ నగర జీవితం ఇంగ్లీషు నవలల్లో రికార్డయింది.

బ్రిటీష్‌ రెసిడెంట్‌ హాలండ్‌ బంధువు వాల్టర్‌ స్కాట్‌ ఈ నవల రాసిండు. ఇలా ఎంతో మంది హైదరాబాద్‌ ‘షాన్‌’, ‘నిషాన్‌’ని విశ్వవ్యాప్తం చేసిండ్రు. తమ స్వీయ ‘అస్తిత్వా’న్ని ‘పోలీస్‌ యాక్షన్‌’ వరకూ ఇక్కడి ప్రజలు కాపాడుకున్నారు. ఈ కాపాడుకున్న అస్తిత్వం కథా సాహిత్యంలో కూడా ప్రతిఫలించింది. మాజీ మంత్రి, 1969 ఉద్యమ నేత టి.ఎన్‌. సదాలక్ష్మి మామ నిజాం మిలిటరీలో పనిచేస్తూ మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్‌లో పర్యటించాడు. ఆఫ్రికన్‌ కావల్రీ గార్డ్స్‌లో పనిచేసేందుకు అఫ్ఘనిస్తాన్‌, ఈజిప్ట్‌, గల్ఫ్‌, ఇథియోపియాల నుంచి సిద్దీలు, పఠాన్‌లు ఇంకా ఎంతోమంది తమ జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిండ్రు. ఇలా వచ్చిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ట్రెంచ్‌, టస్కర్‌లతో పాటు అనేక మంది యూరోపియన్‌ అధికారులూ ఉన్నారు. అలాగే సరోజిని నాయుడు, డాక్టర్‌ మల్లన్న తదితరులు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ నుంచి యూరోప్‌కు వెళ్ళిండ్రు.

హైదరాబాద్‌ నుంచి చదువుకునేందుకు ఇంగ్లండ్‌ వెళ్ళిన సంస్కర్త రాయె బాలకిషన్‌ విదేశాల్లో గదర్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. కొన్ని వేల మంది హైదరాబాదీలు విదేశాల్లో చదువుకున్నారు. హైదరాబాద్‌ ఉప ప్రధాని పింగళి వెంకటరామారెడ్డి కుమారుడు యూరోప్‌లో జరిగిన బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల సందర్భంగానే దెబ్బలు తగలడంతో బాక్సింగ్‌ రింగ్‌లోనే ప్రాణాలు వదిలాడు. ఇదంతా హైదరాబాద్‌ ప్రజలకు ప్రపంచం చేరువైన తీరు. మిగతా తెలుగు వాళ్లందరికన్నా ముందుగానే బాహ్య ప్రపంచం పరిచయమైందనే వాస్తవాన్ని తెలియజేస్తుంది. ఈ పరిచయం, చైతన్యం, భాషా విశేషాలు, భావాల మేలు కలయిక, కోర్టుల్లో వాడే ఇంగ్లీషు, ఉర్దూ భాషలు అన్నీ కలగలిసి తెలుగులో ఆనాడు కథలు రాసిన వారిపై గాఢమైన ప్రభావాన్నే వేశాయి. అందుకే నందగిరి వెంకటరావు లాంటి వారు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో 1930కి ముందే కథలు రాసిండ్రు. భాస్కరభట్ల కృష్ణారావు ఆరేడు భాషల్లో నిష్ణాతుడు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు, ఉర్దూ, ఫార్సీల్లో సమాన ప్రతిభ కలవాడు. వీరందరూ ఆనాడు సాహితీ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకుండ్రు.

585_luther_1
హైదరాబాద్‌పై పోలీసుచర్యకు పూర్వం అంటే 1948 సెప్టెంబర్‌ 13 కన్నా ముందు రాసిన తెలంగాణ` తెలుగు కథల్లో ప్రముఖంగా చోటు చేసుకున్న అంశం ఇక్కడి తెహజీబ్‌. హిందూ`ముస్లిం సోదరుల్లా కలిసిపోయిన సంస్కృతి. దాదాపు ఆనాటి తెలంగాణ కథకులందరూ తెలుగు`ముస్లిం జీవితాలను తమ కథల్లో నిక్షిప్తం జేసిండ్రు. నందగిరి వెంకటరావు, సురవరం ప్రతాపరెడ్డి, భాస్కరభట్ల కృష్ణారావు, నెల్లూరి కేశవస్వామి, వట్టికోట ఆళ్వారుస్వామి, వెల్దుర్తి మాణిక్యరావు, కాంచనపల్లి చినవెంకటరామారావు, నందగిరి ఇందిరాదేవి ఇంకా చాలా మంది ఈ జీవితాలకు తమ కథల ద్వారా శాశ్వతత్వాన్ని కల్పించిండ్రు.

ముస్లింల అబ్బాయిలతో తెలుగమ్మాయిలు, తెలుగువారితో ముడిపడ్డ ముస్లిం అమ్మాయిల జీవితాలు, ఉద్యోగాలు, కలివిడితనం, విద్య, సంస్కరణ, ఆత్మగౌరవం ఇవన్నీ ఈ కథల్లో ప్రతిఫలించాయి. గంగా జమునా తెహజీబ్‌తో పాటు 1945 తర్వాత మూడేళ్ళ కాలంలో నిజాం ప్రభుత్వ అసహాయ వైఖరిని కూడా తమ కథల్లో ఎత్తి చూపిండ్రు. దొరలు, పాలకులు చేస్తున్న దగా, దోపిడీ,  మోసాలను నిలదీసిండ్రు. రైతుల దీనావస్థను కళ్ళకు కట్టిండ్రు. ఆంధ్రమహాసభ కార్యక్రమాలు తీసుకొచ్చిన చైతన్యంతో కొంతమంది కథకులు గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, పుస్తక పఠనం, వెట్టి చాకిరి, రాజకీయ చైతన్యాన్ని తమ కథల్లో వస్తువుగా తీసుకున్నారు. కనుమరుగౌతున్న భాష పట్ల అవగాహన కల్పించే విధంగా కథలల్లిండ్రు. ఈ దశలో తెలంగాణ కథల్లో అనివార్యంగా జైలుకు సంబంధించిన జీవితాలు, పోరాటాలు చోటు చేసుకున్నాయి. పొట్లపల్లి రామారావు ‘జైలు’. వట్టికోట ఆళ్వారుస్వామి’ ‘జైలు లోపల’తో పాటు కాంచనపల్లి వెంకటరామారావు, ఆవుల పిచ్చయ్య తదితరుల కథలే దానికి సాక్ష్యం.
తొలి తెలుగు కథ రాసిన భండారు అచ్చమాంబ మొదలు 1948లో కథలు రాసిన నందగిరి ఇందిరాదేవి వరకూ 25మందికి పైగా రచయితలు తమ కథల్లో తెలంగాణ/హైదరాబాద్‌ రాజ్య అస్తిత్వాన్ని రికార్డు చేసిండ్రు.   1899 నాటికే తెలుగులో తొలి కథలు రాసిన భండారు అచ్చమాంబ హైదరాబాద్‌లో అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ (ఆంధ్రలో) బతుకలేని పరిస్థితి వస్తే హైదరాబాద్‌కు వలస వెళ్ళయినా జీవితాన్ని వెళ్ళదీయొచ్చు అని ‘సతాప్రత్రదానము’ (1902) కథలో చెప్పారు. అచ్చమాంబ బాల్యము ఒకప్పటి మునగాల, దేవరకొండలో గడిచింది. వివాహానంతరం మహారాష్ట్రలో గడిపింది. అందుకే ‘ధనత్రయోదశి’ ‘బీద కుటుంబం’ కథలో బొంబాయి, మహారాష్ట్ర ప్రజల జీవితాన్ని రికార్డు చేసింది. ఆనాడు హైదరాబాద్‌ రాజ్యంలో మరాఠీలు కూడా భాగమే. హైదరాబాద్‌లో మెరుగైన జీవన స్థితిగతులు ఉన్నందువల్లనే ఆమె తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు, మునగాల జమిందార్‌ రాజా నాయని వెంకటరంగారావు హైదరాబాద్‌ ఆవాసంగా చేసుకొని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం (1901`హైదరాబాద్‌) తో పాటు అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వంహించారు.
అచ్చమాంబ తర్వాత తెలంగాణ జీవితాల్ని ప్రతిఫలించే విధంగా కథలు రాసింది మాడపాటి హనుమంతరావు. ఆయన ‘హృదయశల్యము’ కథలో కాకతీయుల చారిత్రక మహిళ ‘రుద్రమదేవి’ గురించి రాసిండు. ఈయన రాసిన ‘నేనే’ కథలో కృష్ణాథియేటర్‌కు రమ్మని హీరోయిన్‌ హైమవతి తానెవరో చెప్పకుండా న్యాయవాది గణపతిరావుకు లేఖ రాస్తుంది. షోకుగా తయారై వెళ్ళిన రావుకు అక్కడ తన భార్య కనబడడంతో తమాయించుకొని ‘ఈ కొంటె తనము చేసింది నువ్వేనా?’ అని అడుగుతాడు. దానికి ఆమె ‘నేనే’ అని జవాబు చెబుతుంది. ఆనాటికి ఈనాటికి కృష్ణా థియేటర్‌ చార్మినార్‌ దగ్గర చరిత్రకు సాక్ష్యంగా నిలబడి ఇంకా సజీవంగా ఉంది. ‘నేనే’ కథ పురుషుల బలహీనతల్ని చెబుతుంది. ఇది ఆనాటి సమాజంలో వ్యాప్తిలో ఉన్న విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఆ లౌల్యానికి సాహిత్యంలో స్థానం దక్కింది. ఇదే కాలంలో బడారు శ్రీనివాసరావు అనే మహబూబ్‌నగర్‌కు చెందిన జర్నలిస్టు, ఆయుర్వేద వైద్యుడు, నాటకకర్త తాను వెలువరించిన ‘హితబోధిని’ (1913`15) పత్రికలో కథలు వెలువరించాడు. రాజయ్య సోమయాజులు, విషాదము, మృత్యువు దాని జ్ఞాపకము అనే కథలు వెలువరించాడు. ఇందులో మృత్యువు దాని జ్ఞాపకము మ్యూజింగ్స్‌ మాదిరిగా ఉంటుంది. ఈ కథలో దొరతనము గురించీ, దానికి గ్రామంలోని కరణాలు, ఆయుర్వేద వైద్యులు తమ స్వలాభం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసే జీవితాల్ని, దాసిరాండ్రని వాడుకునే స్థితిని, ఆనాటి పాలమూరు జిల్లా సంఘటనల్ని రికార్డు చేసిండు.
1921లో ప్రారంభమైన నీలగిరి, తెనుగు పత్రికల్లో కథకుల పేర్లు లేకుండా తెలంగాణ జీవితాల్ని ప్రతిబింబించే విధంగా అనేక కథలు వెలువడ్డాయి. నీలగిరిలో నైజగుణము, సాతాని జియ్యర్‌, కాపు, దురాశ తదితర కథలు అచ్చయ్యాయి. ఇందులోని పాత్రలన్నీ హైదరాబాద్‌, వరంగల్‌, తెలంగాణ జీవితాలనే ప్రతిబింబించాయి. అలాగే తెనుగు పత్రికలో ఒద్దిరాజు సోదరులు తమ పేరు లేకుండానే స్థానిక అంశాలపై అన్యాపదేశంగా కథనాలు వెలువరించారు. ఇవి విషయాల్ని కథలుగా చెప్పాయి. ఇదే పత్రికలో ఇతరుల కథలు కూడా అచ్చయ్యాయి. 1927`30 మధ్యకాలంలో హైదరాబాద్‌ నుంచి సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడ్డ ‘సుజాత’ పత్రికలో వీరి రచనలు చాలా వెలువడ్డాయి.
భారతి పత్రికలో మొట్టమొదటిసారిగా ఒక తెలంగాణ వాడి కథలు అచ్చుకావడమనేది వాసుదేవరావుతో ప్రారంభమయింది. పక్కా హైదరాబాదీ అయిన వాసుదేవరావు తొలి కథ ఆగస్టు,1924 భారతి సంచికలో ‘నేను జొన్నరొట్టె’ శీర్షికన అచ్చయింది. 1924`33 మధ్య కాలంలో డజనుకు పైగా కథలు అచ్చయ్యాయి. ఇందులో ఒకటి రెండు కథలు ప్రేమ్‌చంద్‌ కథలకు అనుసరణలు కాగా మిగతావన్నీ పక్కా హైదరాబాద్‌ ఠీవిని, ఆహార్యాన్ని, ఆహారపు అలవాట్లని పట్టిచ్చాయి. ‘ఆలోచన’, ‘ప్రయాణం’, ‘వివాహం’ సీక్వెల్‌ కథలు.

మూడిరటిలోనూ పెళ్ళిచూపులు, పెళ్ళి ఇతివృత్తం. ఒక దాంట్లో పెళ్ళి చూపులకు ఆంధ్ర ప్రాంతంలోని తన మామయ్య ఇంటికి వెళ్ళాలని నిశ్చయం, రెండో దాంట్లో అందుకోసం చేసిన ప్రయాణంలో జరిగిన సంఘటనలని, మూడో దాంట్లో పెళ్ళికి సంబంధించిన విషయాల్ని రికార్డు చేసిండు. బి.ఎ. పూర్తి చేసిన కథానాయకుడు ఇంగ్లండ్‌ వెళ్ళి ఎం.ఎ. చదవాలనుకుంటాడు. అలాగే హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసెస్‌లో ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.
సూటూ, బూటు నీటుగా టై వేసుకోవడం, విదేశీ అధికారుల మాదిరిగా తయారు కావడం, ఆంగ్ల భాషాభిమానం, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ సంస్కరణపట్ల ఆసక్తి, వితంతువివాహాలు, రజస్వాలానంతర వివాహాలకు సంబంధించిన విషయాలు ఈ కథల్లో ప్రస్తావనకు వస్తాయి. హైదరాబాద్‌ అస్తిత్వాన్ని, సంస్కృతిని, మాట తీరుని, భాషని, వ్యంగ్యాన్ని చాలా హృద్యంగా వాసుదేవరావు ‘‘నేనా? నేనా? నేను హైదరాబాదు `దక్కనీ! నా హృదయం వేరే. వాళ్ళ హృదయం వేరే. నేనూ వాళ్ళవంటి వాణ్ణే అయితే అయిదు కాదు పదేను వేలిస్తే గాని పెళ్ళి చేసుకోనని పట్టుబట్టి కూర్చుందును. పెద్ద పెద్ద సభలలో వేదికల మీద నెక్కి సంఘసంస్కర్తలని పేరు పెట్టుకొని, సంస్కార విషయాలు పెద్ద పెద్ద లెక్చర్లిచ్చి (బహిరంగంగా) లోలోపల, వందలు వేలు కట్నాలు పుచ్చుకొనే ఆంధ్ర బ్రాహ్మణులెక్కడ? నేనెక్కడ ఈ వ్యత్యాసం నీకు కనబడలేదామ్మా?’’ అంటూ హైదరాబాద్‌(దీ) ఔన్నత్యాన్ని ‘ఆలోచన’ కథలో చాటి చెప్పిండు.

కథానాయకుడి డ్రెస్సింగ్‌ చూసి అతను యూరోపియనా? అనే అనుమానం కలిగిందంటే ఆనాటి హైదరాబాదీ ఆహార్యాన్ని అర్థం చేసుకోవచ్చు. బడాయి కూడా అలానే ఉండేదని తల్లి పాత్ర ద్వారా వాసుదేవరావు చెప్పిస్తాడు. ఇవి గాకుండా ‘నేను జొన్నరొట్టె’, ‘పిశాచం’, ‘ఇదియేనా పునర్వివాహం’, మాటీలు, సుప్రభాతము, ముద్దుటుంగరము, అనర్థం, సంశయం తదితర కథలు హైదరబాదీ హృదయంతో వెలువడ్డాయి. వాసుదేవరావు లాగానే పక్కా హైదరాబాదీ తర్వాతి కాలంలో జడ్జిగా పనిచేసిన నందగిరి వెంకటరావు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథానికలు రాసిండు.
నందగిరి వెంకటరావు (1909`1985)  తెలంగాణ తొలితరం కథకుల్లో అగ్రగణ్యుడు. 1926`35 సంవత్సరాల మధ్యకాలంలో 50కి పైగా కథలు రాసిన ఈయన రచనలేవి పుస్తక రూపంలో రాకపోవడంతో వాటికి తగిన గుర్తింపు దక్కలేదు. ‘గిరి’ అనే కలం పేరుతో భారతి, ఉదయిని, కృష్ణాపత్రిక, సమదర్శిని, సుజాత, గోలకొండ పత్రికల్లో ఈ కథలు అచ్చయ్యాయి. 1935లోనే ప్రథమ అఖిలాంధ్ర కథకుల సమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహించిన వెంకటరావు భార్య నందగిరి ఇందిరాదేవి కూడా చాలా కథలు రాసింది.

ఆంధ్రమహాసభ నాయకుడిగా, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో జైలుకెళ్లిన స్వాతంత్య్ర యోధుడిగా, జడ్జిగా, గ్రంథాలయోద్యమ కార్యకర్తగా, స్త్రీవిద్య ప్రచారకుడిగా నందగిరి వెంకటరావు చేసిన కృషి చిరస్మరణీయమైనది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథా సాహిత్యాన్ని సృజించిన అరుదైన ప్రతిభాశాలి నందగిరి వెంకటరావు.
తెలుగు సాహిత్యం ముఖ్యంగా కథానికా సాహిత్యం దేదీప్యమానంగా వెలుగడానికి చమురునెంతో సరఫరా చేసిన వాడు నందగిరి. కథానికా సాహిత్యంలో తనకంటూ ఒక శైలిని ఏర్పర్చుకొని లో చూపుతో విశ్లేషించి, మానవ సంబంధాల్ని మానవీయ కోణంలో సున్నితంగా సృజించి జీవితాల్ని చిన్న కాన్వాస్‌పై ‘కథ’గా చిత్రీకరించిన అక్షర పెయింటర్‌ నందగిరి. హైదరాబాద్‌ హిందూ`ముస్లిం సంస్క ృతి, తెలంగాణ జీవితాల్ని కథలుగా మలిచిండు. 1935కు ముందే హైదరాబాద్‌ కేంద్రంగా జరిగే జాతీయ ఉద్యమాల్ని తన కథల ద్వారా అక్షర రూపమిచ్చిండు.
హైదరాబాద్‌ తెహజీబ్‌, హిందూ`ముస్లిం పండుగలు, సంస్కృతి, మతాలకతీతమైన రొమాన్స్‌, హిందూ`ముస్లిం ప్రజల సంబంధాల్ని, జీవన విధానాన్ని నందగిరి చిత్రికగట్టినంత సున్నితంగా ఇంకెవ్వరూ రాయలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతిఫలం, నూర్జహాన్‌, తప్పేమి, జరిగిన కథ మొదలైన కథల్లో హైదరాబాదీ ముస్లిం జీవితం, సంస్కృతి వ్యక్తమయ్యింది. నందగిరి అటు ఆంద్రమహాసభ ఉద్యమంలోనూ, గ్రంథాలయోద్యమంలోనూ, పత్రికోద్యమంలోనూ చురుగ్దా పాల్గొన్న వాడు కావడంతో ఆయన రచనలు అందరికన్నా ఒక అడుగు ముందున్నాయి. చలంతో పోటీపడి తెలంగాణ నుంచి కథలు రాసి యావత్తెలుగు ప్రజల్ని మెప్పించిన కథకుడు నందగిరి వెంకటరావు.
తెలంగాణ సాయుధపోరాటారంభానికి 15 యేండ్ల ముందే దొరల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ‘పటేలుగారి ప్రతాపం’ పేరిట కథ రాసిండు. గ్రామ పటేలు తన మాట వినని రామయ్య అనే రైతును కొట్టడమే గాకుండా వితంతువైన ఆయన సోదరిని అల్లరి చేయడం. దీనికి పటేలు తల్లి కూడా మద్దతుగా ఉండి నీ తండ్రి కాలంలో  ఎదురు తిరిగి మాట్లాడిన వాడు లేడు అని కొడుకుని రెచ్చగొట్టడం, అడ్డు వచ్చిన వారిని బెదిరించడం జరిగింది. దాదాపు ఇలాంటి ఘటనే సాయుధ పోరాట కాలంలో జరిగింది. ఈ కాలంలో విసునూరి దొరలు ఇలాగే దౌష్ట్యానికి దిగారు. విసునూరి ‘బాబుదొర’ను ప్రజలు చంపేసినట్లుగానే ఈ కథలో కూడా ప్రజలు దొరను చంపేస్తారు. అయితే వాస్తవానికి జరిగిన సంఘటనకన్నా 15 యేండ్లకు ముందే నందగిరి వెంకటరావు పటేలుగారి ప్రతాపంలో ఇవే సంఘటలను చిత్రీకరిస్తూ ప్రజలు తిరుగుబాటు చేయాలని పరోక్షంగా చెప్పిండు. చిత్రచోరులు కథలో ఒక అంశాన్ని భిన్న కోణాల్లో చూసే తెలంగాణ`ఆంధ్రవారిని గురించి రాసిండు.
తెనుగు పత్రికలో డిటెక్టివ్‌ కథలు కూడా అచ్చయ్యాయి. హైదరాబాద్‌ అమ్మాయి సినిమాల పట్ల వ్యామోహంతో ఆనాడే బొంబాయికి వెళ్ళి ఆ మాయలో చిక్కుకు పోయిన విషాదాన్ని నందగిరి వెంకటరావు తన కథల్లో చెప్పిండు. ఇదే కాలంలో ఒద్దిరాజు సోదరులు వివిధ పత్రికల్లో తమ రచనలు వెలువరించారు. వీరి కథలు ఎక్కువగా వారు వెలువరించిన తెనుగు పత్రికతో పాటు ‘సుజాత’ పత్రికలో అచ్చయ్యాయి. ఒద్దిరాజు సీతారామచంద్రరావు తెలుగులో తొలిసారిగా వైజ్ఞానిక కథలు రాసిన వాడిగా ప్రసిద్ధుడు. దీనికి నిదర్శనం ‘అదృశ్యవ్యక్తి’ కథానిక. ‘నటి’ కథలో జమీందారి కుటుంబానికి చెందిన నళినీకాంతుడు నటి తారాదేవితో సాన్నిహిత్యంగా ఉంటాడు. నళినీకాంతుడి సోదరులు తారాదేవిని వదిలిపెట్టాలని వత్తిడి తీసుకొస్తారు. కొంతమంది యూరోపియన్‌ మిత్రులు పెళ్ళి చేసుకొమ్మని సలహా ఇస్తారు. దాంతో పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమవుతాడు, అయితే తార పశ్చాత్తాపంతో నళినీకాంతుడికి ఉత్తరం రాస్తుంది. ప్రేమానుభవం కంటే ప్రేమ స్మృతి గొప్పదని అదే అధిక మాధుర్యం కలదిగా తోస్తుందని, వివాహమాడి భార్యతో సుఖంగా ఉండమని రాస్తుంది. హితబోద చేసినట్టుగా కథ ముగుస్తుంది. ఈయన కథలపై బెంగాళీ రచనల ప్రభావముంది. ఇక సీతారామచంద్రరావు సోదరుడు రాఘవరంగారావు తెలంగాణలో దేశ్‌ముఖ్‌ల, జమీందారుల జీవితాల్ని కథల్లోకి తెచ్చిండు. ‘లండన్‌ విద్యార్థి’ కథలో దేశ్‌ముఖ్‌ల సోమరితనం, విలాసాలు, మరో వైపు ఇంగ్లండ్‌లో విద్యాభ్యాసంపై మోజుని చెప్పిండు.
భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాడు. అంబేద్కర్‌ కన్నా ముందు మొత్తం జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నాయకుడు. ఈయన హైదరాబాద్‌ నుంచి ‘భాగ్యనగర్‌’ అనే పత్రిక తీసుకొచ్చాడు. ఇందులో వెట్టిమాదిగ పేరిట ఆనాటి సమాజంలో ఉన్నటువంటి దళితుల దుర్భర జీవితాన్ని తెలియజెప్పిండు. రామిరెడ్డి దురహంకారానికి బలయిన వంతు మాదిగ మల్లయ్య గురించి ఇందులో వివరించిండు. దీనికి కొనసాగింపుగా సురవరం ప్రతాపరెడ్డి అనేక కథలు రాసిండు. ప్రతాపరెడ్డి కథలు ముఖ్యంగా ‘సంఘాల పంతులు’ కథలో పంతులు ఊరి మాదిగలను, కోమట్లను కూడగట్టి వెట్టిచాకిరి, సప్లయిలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాడు. సంఘం అంటే కమ్యూనిస్టు సంఘమనే భావనలోనే ఆ పదాన్ని సురవరం వాడారు. తెలంగాణ వాతావరణ నేపథ్యంతో పాటు, పదాలు, తెలంగాణ ఆత్మని పట్టిస్తాయి. ఈయన మొగలాయి కథలు కూడా ఆయన విశిష్టతను చాటి చెబుతాయి. కరీంనగర్‌ జిల్లా మంథనికి చెందిన వెంకట రాజన్న అవధాని ‘తిరుగుబాటు’ కథలో స్త్రీ విద్య, సంస్కరణ గురించి రాసిండు. ఖమ్మంకు చెందిన దాశరథి కవిత్వంతో పాటు కథలు కూడా రాసిండు.
వీరితో పాటు మాడపాటి రామచంద్రుడు, జి.రాములు, జమలాపురం వెంకటేశ్వర్లు, శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యులు, జమలాపురం వెంకటేశ్వర్లు, తదితరులు ఖమ్మం, కరీంనగర్‌, నల్లగొండ ప్రాంతాల్లోని జీవితాలను రికార్డు చేసిండ్రు. నల్లగొండకు చెందిన బోయనేపల్లి రంగారావు, గం. గోపాలరెడ్డి తదితరులు కూడా ఆనాడు తెలంగాణ తనాన్ని కథల్లో చిత్రించారు. వీరిలో కథకుడు జి.రాములు మాజీ జడ్జి జీవన్‌ రెడ్డి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, ఎన్నో వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేసిన జి. రాంరెడ్డిలకు విద్యా గురువు. ఈయన పెరటి చెట్టు, బ్రహ్మపుత్ర భక్త సమాజం, ఆత్మఘోష, పిచ్చి శాయన్న, కొత్తదాసి కనకం తదితర కథలు బహుజన దృక్కోణం నుంచి తెలంగాణను ఆవిష్కరించాయి. పెరటిచెట్టు కథలో గౌడ కులస్థుల జీవన వ్యథల్ని చెప్పిండు. ఇందులో దున్నేవాడిదే భూమి అన్నట్టు గీసేవాడిదే చెట్టు అని సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
1943లో ఆంధ్రప్రాంతంలో ఆరంభమయిన అభ్యుదయ రచయితల సంఘం సమావేశాలకు తెలంగాణ నుంచి ఏకైక ప్రతినిధిగా వట్టికోట ఆళ్వారుస్వామి హజరయ్యిండు. ఆ తర్వాత ఆంధ్రలో జరిగిన ప్రతిసమావేశానికీ విధిగా ఆళ్వారుస్వామి హాజరయ్యిండు. 1944 నాటి భువనగిరి ఆంధ్రమహాసభల్లో కమ్యూనిస్టులు`కాగ్రెస్‌ వారికి సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు జేసిండు. కాంగ్రెస్‌లో కమ్యూనిస్టుగా, కమ్యూనిస్టుల్లో కాంగ్రెస్‌ ఆలోచనాపరుడిగా సంఘసంస్కరణకు పాటుపడే విమర్శకుడిగా, కార్యశీలిగా ఆళ్వారుస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, సత్యాగ్రహాల్లో విశిష్ట భూమిక పోషించిండు. పౌరహక్కుల కోసం పోరాడిరడు. జైల్లో దాశరథితోపాటు ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిండు.

తెలుగుతల్లి పత్రిక ప్రచురణ ద్వారా హైదరాబాద్‌లో అడివిబాపిరాజు, రాంభట్ల కృష్ణమూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు తదితరులతో కలిసి నగరంలో అభ్యుదయ రచయితల సంఘానికి ప్రాణం పోయడమే గాకుండా, ఆంధ్రప్రాంతంలో కూడా అరసంకు ఆసరాగా నిలిచిండు. ఈ సమయంలోనే వరంగల్‌లో జరిగిన మజ్లిస్‌ సభల్లో బహదూర్‌ యార్జంగ్‌ తన ఆవేశ పూరిత ప్రసంగంలో ‘‘హైదరాబాద్‌ రాజ్యం ఆలాహజ్రత్‌ సొంత జాగీరు కాదు. ఈ రాజ్యం ఏ ఒకరిదో అనుకుంటే అందుకు బలికావాడానికి నేను సిద్ధంగాలేను. ఇది ముస్లిం ప్రజలందరి ఆస్తి’’ అని చెప్పిండు. ఆ తరువాతి సంవత్సరం నిజాం ఇచ్చిన విందులో హుక్కా పీల్చి అనుమానాస్పద స్థితిలో చనిపోయిండు. అనంతరం మజ్లిస్‌ పగ్గాలు కాసీంరజ్వీ చేతుల్లోకి వెళ్ళాయి. ఆయనే రజాకార్ల ఉద్యమాన్ని లేవదీసిండు. మత పరమైన ఉద్రిక్తతలు ఒకవైపూ, అరసం కార్యకలాపాలు మరోవైపూ హైదరాబాద్‌లో కార్యక్రమాలు నిర్వహించాయి.
1946లో సాయుధ రూపం తీసుకున్న ‘రైతాంగ పోరాటం’, 1948లో ‘పోలీస్‌ యాక్షన్‌’, 1951లో పోరాట విరమణ, 1952లో మిలిటరీ పాలన, ఎన్నికలు, మిత్రుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పాలన, ముల్కీ ఉద్యమం, 1953లో ఆలంపూరులో అఖిలాంధ్ర సారస్వత సభ, 1955లో ఆంధ్రలో ఎన్నికలు, 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు 46 ఏండ్ల ఆళ్వారుస్వామి జీవితంపై ప్రభావం చూపిన అంశాలు. ఇవి ఎన్నో గుణపాఠాలు నేర్పాయి. అలాగే రెండు విడతలుగా జైలుశిక్ష, కమ్యూనిస్టుల ఏకపక్ష ధోరణి, బాధ్యతారాహిత్యం అన్నీ కలగలిసి ఆళ్వారుస్వామిని చివరి పదేళ్ళు పుస్తక ప్రచురణ, రచనా రంగానికే పరిమితం చేశాయి. ఈ కాలంలోనే ఆళ్వారుస్వామి తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రవేసే, ఉన్నత విలువల్ని ప్రతిష్టించే రచనలు చేసిండు.
‘తెలంగాణ మంటల్లో’ అనే కథా సంకలనాన్ని 1948లోనే వెలువరించిన అడ్లూరి అయోధ్యరామకవి స్వతహాగా కవి, గాయకుడు, జర్నలిస్టు. ‘నైజాం ప్రజావిజయం’ అనే బుర్రకథ, ఘంటారావంతో పాటు అనేక ఖండికలను రాసిన ఈయన బాంబుల భయం, కాలాన్ని తేవాలి, తల్లి ప్రేమ, చీకటి రాజ్యం, జనానా రజాకార్‌, అమరలోక యాత్రికులు అనే కథలు రాసిండు. ఇందులో ‘బాంబుల భయం’ కథలో సాయుధ పోరాట సమయంలో గ్రామ రక్షణ దళాలు సిరిపురం పై రజాకార్ల దాడిని అడ్డుకున్న అంశాన్ని చిత్రించాడు. సాయుధ పోరాట కాలంలో కాంగ్రెసు కార్యకర్తగా, దాశరథి కృష్ణమాచార్యతో కలిసి ప్రచారకుడిగా పనిచేసిన అడ్లూరి కథలన్నీ ఆనాటి పోరాటాన్ని చిత్రీకరించాయి.

కమ్యూనిస్టులు, ప్రజలు, కాంగ్రెస్‌, రజాకార్లు, దొరలు, గడీలు, సాయుధ పోరాటం, జైలు అన్నీ ఈయన కథాంశాలయ్యాయి. ఈయనతో పాటు కాళోజి నారాయణరావు కూడా సాయుధ పోరాట సమయంలో కథలు రాసిండు. కాళోజి రాసిన లంకాదహనం ఉద్యమానంతర పరిస్థితుల్ని రికార్డు చేశాయి. ఆశించిన ఫలితాలు అందకుండా పోయిన స్థితిని ఇందులో కాళోజి రికార్డు చేసిండు.
సాయుధ పోరాటం కన్నా ముందు నుంచే గోలకొండ పత్రికలో కథలు రాసిన వారిలో అగ్రగణ్యుడు భాస్కరభట్ల కృష్ణారావు. 1939 నుంచీ కథలు రాస్తూ వచ్చిన భాస్కరభట్ల మూడు కథా సంపుటాలు ప్రచురించాడు. మొదటి సంపుటం 1955లో ‘కృష్ణారావు కథలు’ పేరిట, తర్వాత ‘చంద్రలోకానికి ప్రయాణం’, ‘వెన్నెల రాత్రి’ పేరిట మిగతా రెండు సంపుటాలు ప్రచురితమయ్యాయి. ఈయన మొత్తం తెలంగాణ కథకుల్లో ముందు వరుసలో నిలబడాల్సిన వాడు. జన్మత: తెలంగాణ వాడు కావడంతో ఆయన కథల్లో తెలంగాణ మట్టి వాసన కనబడుతుంది. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, బాధలు, సంతోషాలు అందులో కనిపిస్తాయి.

భాస్కరభట్లకు బాగా పేరు తీసుకు వచ్చిన కథ ‘ఇజ్జత్‌’. ఇందులో కౌలుకు తీసుకున్న భూమిలో పంటలు సరిగా పండక పోవడంతో మల్లయ్య అనే రైతుల కౌలు చెల్లించ లేక పోతాడు. ఇందుకు అతనికి ‘శిక్ష’ వేస్తారు. ఆ అవమానాన్ని భరించలేక ఉరిబెట్టుకున్న రైతు కథను ఇందులో చిత్రీకరించాడు. భూసంస్కరణల అమలు చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో  పేద రైతు దీనస్థితిని ఈ కథలో భాస్కరభట్ల కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఈ కథ 1944లో మీజాన్‌ పత్రికలో అచ్చయ్యింది. మల్లయ్య అనే రౌతు రంగారావు పొలం కౌలుకి తీసుకొని క్రమం తప్పకుండా కౌలు గింజలు చెల్లిస్తూ ఉండేవాడు. అయితే కాలం సరిగా కాకపోవడంతో, కుంటకు గండిపడడం లాంటి ఇబ్బందులకు తోడుగా ఈ మధ్యనే కూతురు పెళ్ళి చేశాడు. దీంతో ఖర్చులో పడ్డాడు. అందువల్ల కౌలు గింజలు ఇవ్వలేక పోయాడు. గండి పూడ్చగల తాహతు మల్లయ్యకు లేదు. పైగా భూసంస్కరణల చట్టం ఒకటి వచ్చి పడుతోంది. ఈ పరిస్థితిలో తన కౌలుగింజల బకాయి రాబట్టుకోవడానికి రంగారావు గట్టి ప్రయత్నం చేస్తాడు. మల్లయ్య ఎంత ప్రాధేయపడినా ఫలితం లేక పోయింది. అతనికి శిక్ష వేస్తారు. వంగబెట్టి వీపుమీద బండ పెట్టించారు.

కొంత సేపటికి మల్లయ్య స్పృహ తప్పి పడిపోయాడు. సేదదీర్చి ఎవరో పుణ్యం గట్టుకున్నారు. అతని భార్య గొల్లున ఏడుస్తూ వస్తుంది. ఆమెతో ‘ఇజ్జత్‌’ పోయిందే పిల్లా అని చెబుతూ పరువు పోవడంతో బతకడం కష్టమని తలంచి ఇంట్లో దూలానికి ఉరివేసుకొని చనిపోతాడు. ఇందులో రైతుల కష్టపడే గుణాన్ని, కౌలుదారీ విధానం గురించి కథకుడు చెబుతాడు. ఆఖరికి ఆత్మాభిమానం మెండుగా గల రౌతు ఆత్మహత్య చేసుకోవడంతో కథ ముగుస్తుంది. ఇది 1944నాటి తెలంగాణ రైతుల స్థితిగతుల్ని లెక్కగడుతుంది.    మీజాన్‌ పత్రికలోనే 1945లో వెలువడ్డ మరో కథ ‘మార్పు’. ఇందులో దేవుడి మొక్కును వాయిదా వేసుకునేందుకు సాకులు వెతికే భర్త గురించి చెప్పాడు. చివరికి ఖైరతాబాద్‌లోని ఆంజనేయ గుడికి వచ్చి మొక్కు చెల్లించుకునేలా భర్తని మార్చిన భార్య గురించి చెప్పాడు. ఖైరతాబాద్‌లో ఆంజనేయ స్వామి గుడి ఇప్పటికీ ప్రతి శనివారం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది.

అలాగే మరో కథ ‘సానుభూతి’, ‘హృదయ పరివర్తనం’ కథల్లో మధ్యతరగతి ప్రజల్లోని అవకతవకలను ఎత్తి చూపిస్తూ వాటి నుంచి విముక్తులు కావాలని హెచ్చరిస్తాడు. ‘అవమానం’అనే కథలో స్వార్థపరుల నీచత్వాన్ని నగ్నంగా చూపించి, ఆత్మవంచన చేసుకునే వారికి గుణపాఠం చెప్పాడు.
హైదరాబాద్‌ నగర జీవన విధానం, రాజకీయ పరిస్థితులు, సామాజిక, సాంస్కృతికరంగాలు, హిందూ`ముస్లిం దోస్తానా దానితో పాటే మజ్లిస్‌ మతవిద్వేషం, జమీందార్లలో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయని భాస్కరభట్ల చెప్పిండు. ఆధునిక స్త్రీ స్వయం నిర్ణయాధికారం కోసం తండ్రిని సైతం ఎదిరించడం, విద్యా ప్రాధాన్యత ఈ నవలల్లో, కథల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయి. ‘యుగసంధి’ నవల్లో రుక్మిణి, రమణ, పద్మల పాత్రల ద్వారా ఆనాటి స్రీల ఆలోచనాసరళిని వారి తెగింపుని, కట్టుబాట్లకు లొంగని తిరుగుబాటు దోరణిని చదువుకున్న, ఆధునిక భావాలు గల స్త్రీల మనోభావాల్ని రికార్డు చేసి నవలకు సమగ్రత కల్పించిండు. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం కూడా ఇందులో అంతర్లీనంగా చోటు చేసుకున్నాయి. భాస్కరభట్ల  మీద ఉన్న ప్రేమతో నెల్లూరి కేశవస్వామి తన ‘పసిడి బొమ్మ’ కథా సంపుటిని అంకితమిచ్చాడు.
నెల్లూరి కేశవస్వామి కూడా పక్కా హైదరాబాదీ. ఈయన కథల్లో హిందూ`ముస్లింల మైత్రి, ప్రేమ, ఆచార వ్యవహారాలు, అంతర్లీనంగా నవాబుల పోకడలు అన్నీ ప్రతిఫలిస్తాయి. ‘పోలీసుచర్య’కు పూర్వం హైదరబాద్‌ నగరంలో ఉన్న జీవన స్థితిగతుల్ని ముఖ్యంగా ముస్లింల జీవితాలని నెల్లూరి కేశవస్వామి హృద్యంగా చిత్రీకరించాడు. ‘యుగాంతం’ అనే పెద్ద కథలో పోలీసుచర్య నాటి జీవన విధ్వంసాన్ని చిత్రించాడు. ‘చార్మినార్‌’, ‘పసిడి బొమ్మ’ పేరిట కథా సంపుటాలను వెలువరించాడు. సంపుటాల్లో చేరని కథలు ఇంకా చాలా ఉన్నాయి.
వీరితో బాటుగా వరంగల్‌కు చెందిన పెండ్యాల చినరాఘవరావు, ఖమ్మంకు చెందిన బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి, హీరాలాల్‌ మోరియా, ఊటుకూరి రంగారావు, కవిరాజమూర్తి, దాశరథి తదితరులు తెలంగాణ జీవితాల్ని తమ కథల్లో నిక్షిప్తం జేసిండ్రు. వీరందరూ ఉర్దూలో కూడా నిష్ణాతులే కావడం విశేషం. బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి స్వయంగా కథలు రాయడమే గాకుండా ఉర్దూ కథల్ని తెలుగులోకి అనువదించారు. హీరాలాల్‌ మోరియా ఎక్కువగా ఉర్దూలో కథలు రాసిండు. వీటిని ఊటుకూరి రంగారావు తెలుగులోకి అనువదించేవారు. ఈయన స్వయంగా కథకుడు కూడా. ఇక కవిరాజమూర్తి అయితే ఏకంగా ఉర్దూలో నవలలే రాసిండు. ఇవి కూడా ఉర్దూ నుంచి తెలుగులోకి తర్జుమా  చేయబడ్డాయి.
హైదరాబాద్‌లో మొదటి నుంచీ పంచభాషా సంస్కృతి ఉండేది. హైదరబాదీయులందరికీ గతంలో ఐదు భాషలు అవలీలగా వచ్చేవి. తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడం, ఇంగ్లీషు భాషలు హైదరాబాద్‌లో నివాసముండే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాట్లాడగలిగేవారు. నిజాం ప్రభుత్వం విధిగా తమ కార్యకలాపాలన్నింటినీ ఈ ఐదు భాషల్లో నిర్వహించేది. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నందగిరి వెంకటరావు, నెల్లూరి కేశవస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు, కాళోజి నారాయణరావు, పొట్లపల్లి రామారావు, బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి, కవిరాజమూర్తి, ఊటుకూరి రంగారావు, హీరాలాల్‌ మోరియా, బూర్గుల రంగనాథరావు, వట్టికోట ఆళ్వారుస్వామి,  కాంచనపల్లి చినవెంకటరామారావు ఇంకా అనేకమంది తెలుగుతో పాటుగా ఉర్దూలో కూడా రచనలు చేయదగ్గ సమర్ధులు. నందగిరి వెంకటరావు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథలు రాసిండు. కవిరాజమూర్తి, పొట్లపల్లి రామారావులు తెలుగుకన్నా ఎక్కువగా ఉర్దూలో తమ రచనలు వెలువరించిండ్రు.

అయితే ఈ బహుభాషా సంస్కృతి హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం అంతరించి పోయింది. పోలీసుచర్య తర్వాత ఏర్పడ్డ పరాయి పాలన, వలసాంధ్రాధిపత్యం, హిందీ ప్రాభవం అన్నీ కలగలిసి పంచభాషా సంస్క ృతిని మట్టుబెట్టాయి. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు హైదరాబాద్‌ రాజ్యంలో అంతో ఇంతో ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీలకు ఆదరణ లభించినప్పటికీ తర్వాత కనుమరుగయ్యాయి.
1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డ తర్వాత తెలుగుని మాత్రమే ముందుకు తీసుకువచ్చి ఆ భాషలోనూ తెలంగాణేతరులు రాసిన రచనలే గొప్పగా ప్రచారం కావడంతో వాటికి మాత్రమే గౌరవం దక్కింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడం వల్ల తెలంగాణకు జరిగిన పెద్ద నష్టమిది. బహుభాషా సంస్కృతి, కాస్మోపాలిటన్‌ కల్చర్‌కి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గొడ్డలి పెట్టయ్యింది. 1956 కు ముందు ఇంకా చెప్పాలంటే 1948 సెప్టెంబర్‌కు ముందు హైదరాబాద్‌ రాజ్యం నుంచి తెలుగులో వెలువడ్డ కథ, నవల, కవిత్వానికి తర్వాతి కాలంలో సరైన ఆదరణ లభించలేదు. ఇప్పటికైనా ఆనాటి అమూల్యమైన రత్నాలను వెతికి వెలుగులోకి తీసుకొచ్చి మన సాహిత్య చరిత్రను పునర్నిర్మించుకోవాలి. తెగిన తల్లివేరు భాషను బతికించుకోవాలి. ఇవన్నీ ఆనాటి రచనలను ఒక్కొక్కటిగా సంకలనాలుగా వెలువరించడం ద్వారా సాధించవచ్చు.
ఆనాటి రచనలను పునర్ముద్రించుకోవడం ద్వారా కనుమరుగై, గౌరవానికి నోచుకోకుండా పోయినా తెలంగాణ అస్తిత్వానికి చిత్రిక గట్టవచ్చు. మనమూ చరిత్రకెక్కదగిన వారమే, ఎవరికీ ఎందులోనూ తీసిపోము, మీదు మిక్కిలి ఆగమైన మన ఘనమైన చరిత్రను చెక్కిలిపై రాపాడిరచుకోవడానికి, నెత్తిన పెట్టుకొని ఊరేగించడానికి  ఈ అస్తిత్వ కథలు సమగ్ర సంకలనాలుగా వెలువడాల్సిన అవసరముంది.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

సీమాంధ్ర కత్తికి ఇంకెన్నాళ్లు ధారపడదాం ?

sangisetti- bharath bhushan photo

సీమాంధ్ర కవులు అభ్యుదయం, ప్రగతి, విప్లవం, వామపక్షం, ఇంకా పైకి కనపడని అనేక రూపాల్లో, హిడెన్‌ ఎజెండాలతో తెలంగాణపై తమ ఆధిపత్యాన్ని ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. ఇలా చలామణిలో పెట్టిన భావజాలం కారణంగానే నేటికీ తెలంగాణ సాహిత్యకారులు తమకు జరిగిన అన్యాయాన్ని, అభ్యుదయం ముసుగులో నొక్కేసిన/ నొక్కేస్తున్న సొంత గొంతుని పసిగట్టలేక పోతున్నారు. గొంతుని నొక్కుతున్నవారినే ఇంకా ఆరాధిస్తున్నారు. అందలాలెక్కిస్తున్నారు. తమ ఆత్మగౌరవాన్ని భంగ పరిచిన వారినే బానిస మనస్తత్వంతో భళిరా అని పొగుడుతున్నారు.1956 నుంచీ వారి మెప్పుకోసం, ఆమోద ముద్రకోసం తహతహలాడుతున్న తెలంగాణవాదులు చాలామందే ఉన్నారు. వీరంతా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమిది. సాయుధ పోరాట కాలంలో ఏమి వ్రాయని శ్రీ.శ్రీ 1969లో మాత్రం ‘విడిపోవడమంటే చెడిపోవడం’ అని శాపనార్థాలు పెట్టిండు. అయినా శ్రీశ్రీని ఆరాధించే వీర తెలంగాణవాదులకు కొదువలేదు. ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పీడితుల పక్షాన గాకుండా దోపిడి పాలక వర్గాల పక్షాన నిలబడ్డ శ్రీశ్రీది ముమ్మాటికీ అభ్యుదయం ముసుగులో ఆధిపత్యమే! ఇట్లాంటి వారు చరిత్రలో ఇంకా చాలా మంది ఉన్నారు.

ఆస్థానాల శృంఖలాలు తెంపుకొని ఆవిర్భవించిన అభ్యుదయ కవిత్వం ఆచరణలో మాత్రం సీమాంధ్ర ఆధిపత్యాన్నే కొనసాగించింది. ఒకవైపు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే తమ దబాయింపుని చలాయిస్తూనే తెలంగాణలో తమకు ఆమోదనీయతను సాధించుకున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తూ కూడా జేజేలు అందుకోవడం వీరికి మాత్రమే సాధ్యమయింది. పీడితుల పక్షాన నిలబడాల్సిన వారు అందుకు విరుద్ధంగా గుడ్డిగా పెట్టుబడిదారులు, దోపిడిదార్లతో అంటకాగుతూ అభ్యుదయవాదుల ముసుగులో అభినందనలు అందుకున్నారు. తాము తెలంగాణలో అడుగుపెట్టడానికి అనుకూలంగా ఉన్న సాయుధపోరాటాన్ని సమర్ధిస్తూ కవిత్వమల్లిన కవులు, అదే 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మీద దుమ్మెత్తి పోసిండ్రు. ఇట్లా ద్వంద్వ వైఖరులతో, విరోధబాసతో, పీడితులకు కాకుండా తమకు మాత్రమే మేలు జరిగే విధంగా తెలంగాణ కవులపై ‘థాట్‌పోలిసింగ్‌’కు దిగిండ్రు. ప్రస్తుత ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో గత చరిత్రను పునరావలోకనం చేసుకోవాలి. సీమాంధ్ర అభ్యుదయ వాదులు చారిత్రక క్రమంలో ఎలా వ్యవహరించారు. నిర్ణాయక సమయంలో ఎటువైపు మొగ్గారో నిగ్గు తేల్చాల్సిన సందర్భమిది. గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్‌ తెలంగాణ సాధనకు మార్గాలు వేసుకోవాల్సిన చారిత్రక తరుణమిది. ఈ అభ్యుదయవాద కవిత్వం చారిత్రక క్రమంలో నిజంగా అభ్యుదయవాదం పక్షాన్నే నిలబడిరదా? లేదా అభ్యుదయం ముసుగులో వామపక్ష భావజాలం పేరుమీద ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నారా? పీడిత, తాడిత ప్రజల పక్షాన నిలబడి ఉన్నారా? అని నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో జవాబులు దొరికే వరకూ పదే పదే వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఎవరెవరు? యే యే ముసుగులేసుకొని తెలంగాణను అడ్డుకున్నారో తెలుసుకున్నట్లయితే ఆ ప్రమాదాల నుంచి బయటపడడానికి మార్గాలేర్పడతాయి. ఆ దారి వెతుక్కునేందుకు ఇదో చిన్న ప్రయత్నం.
1990వ దశకం ఆరంభంలో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమం నేడు ఉచ్ఛదశలో ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్ప దేనికీ అంగీకరించేది లేదని తెగేసి తెలంగాణ సమాజం చెబుతుంది. ఇదే విషయాన్ని తెలంగాణ కవులు తమ రచనల ద్వారా తేటతెల్లం జేసిండ్రు. పొక్కిలి, మత్తడి, 1969`73 తెలంగాణ ఉద్యమ కవిత్వం, జాగో జగావో, ఊపిరి, దిమ్మిస, క్విట్‌ తెలంగాణ, మునుం, జిగర్‌ ఇలా వందల సంఖ్యలో వెలువడ్డ తెలంగాణ ఉద్యమ సంకలనాలు, అంతకు పదింతలు ఎక్కువగా ప్రతి జిల్లా నుంచి తెలంగాణ కవితా సంపుటాలు, వేల సంఖ్యలో పాటలు గత దశాబ్ద కాలంగా వెలువడుతూ వచ్చాయి. తెలంగాణ పేరు లేకుండా ఈనాడు ఏ సాహిత్య పత్రిక, సాహిత్యపేజీ అచ్చుకావడానికి వీలులేని పరిస్థితి ఉద్యమం కల్పించింది. వీటికి జోడిరపుగా, ఉద్యమానికి సంఫీుభావంగా సీమాంధ్ర కవులు ‘కావడి కుండలు’ వెలువరించారు. ప్రత్యేక తెలంగాణ న్యాయమైన, ప్రజాస్వామికమైన డిమాండ్‌ కావడంతో న్యాయం పక్షాన నిలబడుతూ, అన్యాయాన్ని ఎదిరించే ప్రతి ఒక్కరూ ఇందుకు మద్దతుగా నిలిచారు. కవిత్వంలో ప్రజల కష్టసుఖాలు ప్రతిఫలిస్తాయి. కవిత్వం భవిష్యత్తరాలకు చరిత్రను చెబుతాయి.
సమాజపు హృదయ స్పందనను రికార్డు చేస్తాయి. అయితే ఈ రికార్డు చేయడంలో ‘ప్రఖ్యాత’ ఆంధ్ర కవులు 1969 నుంచీ పక్షపాతంతోనే వ్యవహరించారు. ఉద్యమ ఉధృతిని పూర్తిగా విస్మరించారు. నిజానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఎంత న్యాయమైన డిమాండో 2009లోనూ ఈనాడు కూడా అంతే న్యాయమైన డిమాండ్‌. సాయుధ పోరాట సమయంలో ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వేచ్ఛకోసం, దోపిడి, పీడనలపై తమ కలాన్ని రaులిపించారు. తర్వాతి కాలములో ఈ కవులే తెలంగాణ వందకు వంద శాతం న్యాయమైన, ప్రజాస్వామిక ఉద్యమం అయినప్పటికీ రెండు చేతులా దుమ్మెత్తి పోసిండ్రు. దునుమాడిరడ్రు. ద్వంద్వ వైఖరి అవలంభించే  ఇలాంటి వారిని ‘స్పేర్‌’ చేసినట్లయితే భవిష్యత్‌ తెలంగాణ నేటి ఉద్యమకారుల్ని ఎంతమాత్రం క్షమించబోదు. అయితే ఈ మలిదశ ఉద్యమంలో సీమాంధ్ర బహుజన కవులు తెలంగాణ ఉద్యమానికి సంఫీుభావంగా ‘కావడి కుండలు’ తీసుకొచ్చిండ్రు. అయినా కూడా ఇప్పటికీ కొంత మంది సీమాంధ్ర కవులు మౌనంగానే ఉన్నరు. మౌనం కోర్టు భాషలో అర్ధాంగీకారం కాగలదేమో కాని సాహిత్య భాషలో వ్యతిరేకమన్నట్లే. బహిరంగంగా వ్యతిరేకించే వారితో ఎలాంటి పేచీలేదు. వారు ప్రజాస్వామిక డిమాండ్‌కు వ్యతిరేకమని తేల్చి చెప్పవచ్చు. అయితే ఎటూ తేల్చి చెప్పకుండా నంగి నంగి మాటలతో నాన్చుడు ధోరణితో సందర్భానుసారంగా వైఖరిని మార్చుకుంటూ ప్రజల ఆకాంక్షలపై పూర్తి గౌరవాన్ని ప్రకటిస్తూ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారితో నేడు తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాలి.
అభ్యుదయం మాటున ఆంధ్రాధిపత్యం!
1969లో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా శ్రీరంగం శ్రీనివాసరావు, ఆరుద్ర, కె.వి.రమణారెడ్డి, కె. శివారెడ్డి, జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇంకా అనేక మంది ఆంధ్ర కవులు కవిత్వాన్ని రాసిండ్రు. ఒక వైపు విప్లవ రచయితల సంఘం సూత్రప్రాయంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్ధతు నిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదిస్తే దానికి అధ్యక్షుడిగా ఉన్న శ్రీ.శ్రీ అందుకు వ్యతిరేకిస్తూ ఉద్యమానికి మద్ధతు ఇస్తే తాను రాజీనామాను ప్రకటిస్తానని హెచ్చరించాడు. సంఘాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసిండు. ఇదే శ్రీశ్రీ మరో వైపు అంతకుముందు ఆంధ్రరాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ తెలుగుతల్లి పేరిట కవితలల్లిండు. అంధ్రులు యేయే కారణాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్‌ చేసిండ్రో అవే కారణాలతో 1956 నుంచి ఈనాటి వరకూ తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీశ్రీకి ఆంధ్ర రాష్ట్రం న్యాయమైన డిమాండ్‌, తెలంగాణ ‘వేర్పాటువాదం’. ఇక్కడే ఆయన ద్వంద్వ నీతి తెలుస్తుంది. తెలంగాణ డిమాండ్‌ని వ్యతిరేకిస్తూ 1969లో శ్రీ.శ్రీ. ఇలా రాసిండు.
srisri
మర్కటాల కర్కటాల
సర్కస్‌ ఫీట్ల, పందెపు
కుక్కుటాల పోట్లాటలు
…..
విచిత్రమేమంటే మన
విశాలాంధ్ర గృహమందే
వేరు వేరు వంట గదులు
కోరి పోరు ధోరణులు
తిరుగుబాటు పేరిట ది
మ్మరులు చేయు హంగామా
చీలిక వాదుల సంఘపు
సెక్రటరీ చిరునామా
(సామ్యవాది మానిఫెస్టో)
విడిపోవడం అంటే చెడిపోవడం అని
వీళ్ళకెలా నచ్చచెప్పడం
చించడం సులభమే కాని అతికించడమే కష్టం
నిర్మూలనం కంటే నిర్మాణమే నయం
అలనాడు దేశాన్ని మూడుముక్కలు చేస్తూంటే
చూస్తూ ఉరుకున్నాడు గాంధీజీ
కొయ్యనీ, శస్త్ర వైద్యం చెయ్యనీ అని సలహా
యిచ్చాడు వియ్యంకుడు
డబ్బు సంచుల్తో అమ్మని కొనలేరు
అభిమానాన్ని కొనలేరు
ఆత్మల్ని కొనలేరు
పాపం అమాయకుడు తెలుగువాడు
మద్రాసు నుంచి పొమ్మంటే కర్నూలుకి వెళ్ళాడు
కర్నూలు కాదనుకొని హైద్రాబాదు కొచ్చాడు
ఇక్కణ్ణుంచి పొమ్మనడం ఏ భాషలోనూ సాధ్యంకాదు’ అన్నాడు.
నిజానికి పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందేవరకు మద్రాసు నుంచి పొమ్మని ఏ తమిళుడు కోరలేదు. అక్కడ కూడా వీళ్లు అత్యాశకు పోయి మద్రాసు నగరం కావాలని అప్పటి ముఖ్యమంత్రి రాజాజి  చేత ‘క్విట్‌ ద డాగ్స్‌’ అని తిట్టించుకొని కర్నూలు చేరారు. కావాలనే పొట్టి శ్రీరాముల్ని పొట్టన బెట్టుకున్నరు. మరుగు దొడ్లు లేని ప్రాంతానికి గవర్నర్‌ రావటానికి నిరాకరించడంతో తెలంగాణాపై వీళ్ల కళ్లు పడ్డాయి. అప్పటికే అన్ని హంగులతో మిగులు బడ్జెట్‌తో ఉన్న హైదరాబాద్‌లో తిష్ట వేయడం కోసం కుతంత్రాలు చేసారు. ఇది చేసింది ‘ఏదో అమాయకమైన తెలుగువాడు’ కాదు. అప్పటికే బ్రిటిష్‌ పాలనలో ఉన్న వీళ్లు, విభజించు పాలించు పద్ధతినవలంభించారు. రాష్ట్రావతరణ నాడే ఉపముఖ్యమంత్రి ‘ఆరోవేలు’ అంటూ  ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచిండ్రు. మోసం, వంచనతో తెలంగాణను నిలువుదోపిడి చేసిండ్రు. ఇప్పడా వంచన పరకాల ప్రభాకర్‌ ‘నూటొక్క అబద్దాల’ ‘టక్కరి’ ఆంధ్రుడిగా రూపాంతరం చెందింది. ప్రత్యేకాంధ్ర మేధావి రూపంలో తెలంగాణపై విషంగక్కే చలసాని శ్రీనివాస్‌ రూపంలో టీవీల్లో చర్చలు చేస్తోంది. ఒక వైపు హైదరాబాద్‌ని దోపిడి చేసి ఉన్నకాడికి స్వాహా చేసి తామేదో త్యాగం చేసినట్టు ఫోజు పెట్టడమంటేనే వలసవాదుల దురహంకారపు ఆధిపత్యం అర్థమవుతుంది. ఉన్న జుట్టంతా ఊడబీకి ఫ్రీగా ‘గుండు చేస్తే’ ఎందుకేడుస్తవ్‌ అన్నట్టుగుంది ఆంధ్రకవుల దబాయింపు.
…..
ఐకమత్యంగా ఉంటే
యావద్భారతంలోనూ రాణించగలం
పిండికేతిగాళ్ళ తోలుబొమ్మలాటలు కట్టించగలం
కామ రాజకీయాలకు విడాకు లిప్పించగలం
    (జన్మ దినోత్సవం)
శ్రీశ్రీ ఉద్యమకారుల్ని పిండికేతిగాళ్ళతోటి పోల్చిండు. ఉద్యమాన్ని కామ రాజకీయాలని తూలనాడిరడు. కర్నూలు కాదనుకొని హైద్రాబాద్‌ కొచ్చినామని అంగలార్చిండు. అసలు వాళ్ళని రమ్మని బతిలాడిరదెవరు? ఆనాడే భార్గవ కమిటీ, లలిత్‌ కమిటీలు లెక్కగట్టి మరీ తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కోట్ల రూపాయల సొమ్ముని సీమాంధ్రలో ఖర్చు పెట్టారని తేల్చి చెప్పిండ్రు. తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలని ప్రాంతేతరులు దోచుకు పోయారని లెక్కలేసి మరీ తేల్చిండ్రు. ఇంత అన్యాయం జరిగినా ఆయన తెలంగాణ ప్రజల ఆకాంక్షల వైపు గాకుండా దోపిడిదారుల, పీడకుల పక్షాన నిలబడిరడు. శ్రీశ్రీ వేసిన బాటలోనే సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో తెలంగాణను అనుబంధాలకు, ఉపశీర్షికలకు పరిమితం చేసిన ఆరుద్ర కూడా దోపిడిదారుల, పీడకుల తరపున వకాల్తా పుచ్చుకుండు.
Arudra
అన్న తమ్ముని యింట పగవాడా?
ఉన్న వూరును విడిచి పోవాలా?
కంట నెత్తుటి కణము కరుణ నోచని జనము
కాందీశీకుల బాట పట్టిందా?
స్వార్థ దేవత కచ్చ కట్టిందా
స్పర్ధానలము మిన్ను ముట్టిందా?
శ్రీలు పొంగిన గడ్డ పాలువారే గడ్డ
సిద్ధాన్నమే కుక్క ముట్టిందా?
రౌడీలకు సజ్జనులు జడవాలా?
రగడ చేస్తే అణిగి నడవాలా?
రక్షణే కరువాయె భక్షణే తిరమాయె
రాచరికమే కంపు గొట్టిందా?
ఒక్కతల్లికి మనము పుట్టాము
ఒక్క రక్తము పంచుకొన్నాము
ఒక్క దేహము నేడు ముక్కలుగునా మూడు
అక్కటా! శని మనకు పట్టిందా?
(అన్న తమ్ముని ఇంట పగవాడా?)
అన్న తమ్ముని ఇంట పగవాడా అని అమాయకంగా అడుగుతున్న ఆరుద్ర నాలుగువేల ఆరువందల మంది నాన్‌ముల్కీలు తెలంగాణలో పనిచేస్తున్నారని, న్యాయంగానైతే ఆ ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు దక్కాలని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశంలోనే చెప్పిండు. ఈ విషయాల్ని ఎక్కడ లెక్క చెప్పకుండా తెలంగాణ ఉద్యమాన్ని తప్పుబట్టిండు.  ఆరుద్రనే కాదు కె.వి.రమణారెడ్డి కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిరశిస్తూ కవిత్వాన్ని అల్లిండు. ‘జాతి వైర దుష్టజ్వాల’ అంటూ ఉద్యమాన్ని ఆడిపోసుకుండు. దీనికి మహబూబ్‌నగర్‌కు చెందిన ముకురాల రామారెడ్డి కవిత్వంలోనే అన్నన్నా రవణన్నా నీ ఆటలింక సాగవంటూ కవిత్వంలోనే జవాబిచ్చిండు.
‘‘..కుడిచేతిని ఎడమచేయి
పడగొట్టగ జూచినపుడు
కవి ప్రేక్షకుడై చూచే
కనికట్టు గారడీ గమ్మత్తు కాదిది
ఆ యింటివాని చేతులూ
ఈ యింటివాని చేతులూ
కలియబడుతున్న
‘జాతివైర దుష్టజ్వాల’ ఇది.
అవునా భువనఘోషనా ఇది.
అలనాడు సవరింపబడిన
‘తెలంగాణ కోటి రత్నాల వీణ’
తీగలను తెంపేసి
అతక నేర్చుకుంటున్నదా? నెరజాణ
‘‘వీర తెలంగాణానికి
వైరుల ఏకోదరులా?’’ అంటూ ముకురాల రామారెడ్డి జవాబిచ్చిండు.
ఇక ఫక్తు ఆరెస్సెస్‌ భావజాలం గల జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినట్లయితే అది దక్షిణ పాకిస్తాన్‌ అవుతుందని రాసిండు. తెలంగాణ ప్రజలు మాట్లాడేది ‘తౌరక్యాంధ్రమని’ ఎగతాళి చేసిండు.ఈ విషయాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారు రికార్డు కూడా చేసిండు. ‘‘ 1968`69లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు ఒక అనుభవం ఎదురైంది. ఆ రోజుల్లో జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒక గేయంలో , ఒక వేళ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే, అది దక్షిణ పాకిస్తానం అవుతుందని రాశాడు. అది అర్థం కాక నేను ఇంకో మిత్రుడు ఆయన దగ్గరికి వెళ్ళి ‘శాస్త్రి గారూ, మీ బాధేమిటని’ అడిగాము. దానికి ఆయన సమాధానమిస్తూ ప్రత్యేక తెలంగాణలో తెలుగంతా భ్రష్టుపట్టిపోయి, అది పూర్తిగా తౌరక్యాంధ్రం అవుతుందని అన్నాడు.’’ (సింగిడి` తెలంగాణ ముస్లిం ప్రత్యేక సంచిక, ఉర్దూ ఉసురు తీసిన ఆంద్రులు` జయశంకర్‌)
తెలుగుతల్లి, విశాలాంధ్ర పేరిట కవితలల్లిన పాపయ్యశాస్త్రి ఒక్కసారి కూడా న్యాయంగా ఆలోచించలేదు. కనీసం అవతలి పక్షంవారు ఏమడుగుతున్నారు? అని కూడా ప్రశ్నించుకోలేదు. ‘విజయీభవ’ పేరిట
‘పెద్ద తలలు గద్దెలకై
గుద్దులాడు కొంటున్నై
వద్దనవోయ్‌ స్వార్థబుద్ధి
కద్దనవోయ్‌ కార్య సిద్ధి’ అంటూ తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం గుద్దులాటగా వర్ణించిండు. బట్టకాల్చి మీదేసినట్లయితే అది ఆరిపేసుకునే పనిలోనే తెలంగాణ వాడుంటే ఈలోపు తమ దోపిడీని సులువు చేసుకోవచ్చనేది నాటికీ నేటికీ సీమాంధ్ర ఆధిపత్యవాదులు ఆచరిస్తున్న నీతి.
‘ తెలుగుతల్లి కన్నుల్లో
వెలుగుతుంది మన భాగ్యం
భాగ్యనగర వీధుల్లో
పండును మన సౌభాగ్యం’ అంటూ హైదరాబాద్‌లో సీమాంధ్రుల సంపదను ఆనాడే లెక్కేసిండు. విశాలాంధ్ర పేరిట
‘ఆ సీమని ఈ సీమని
ఆగం చేస్తారెందుకు
అంతా రాయలసీమే
అంతా మన తెలంగాణె’ అంటూ ప్రత్యేక తెలంగాణ వాదుల్ని జోకొట్టే ప్రయత్నం చేసిండు. ఆధిపత్య శక్తుల కొమ్ముకాసే వీరి పక్షపాత వైఖరి కారణంగా ఈనాడు తెలంగాణ ప్రజల్లో, మేధావుల్లో సీమాంధ్ర సాహితీవేత్తలు ఎంతటి ప్రతిభావంతులైనా వారి పట్ల గౌరవభావం ఏర్పడడంలేదు.
అలాగే అప్పటికి అంతగా పేరు పొందని చిన్నా చితక ఆంధ్ర కవులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై దుమ్మెత్తి పోసిండ్రు. ఇందులో వక్కలంక లక్ష్మీపతిరావు ఇలా రాసిండు.
అన్నాదమ్ములు కలబడి దేశం
ఛిన్నా భిన్నం చేస్తారా?
పచ్చని యింటికి చిచ్చులు రగిల్చి
పరమానందము చూస్తారా?
అంటే అన్న ఎంత దోసుకుంటున్నా తమ్ముడు మాత్రం సడి సప్పుడు చెయ్యకుండా ఉంటే అది ఐకమత్యము. అన్యాయాన్ని నిలదిస్తే అది చిచ్చులాగా వారికి కనబడిరది. మరో కవి ఎం.కె. సుగమ్‌బాబు తెలంగాణ ఉద్యమాన్ని సంకుచితమని తేల్చిసిండు.
ఆంధ్ర యేమిటి?
తెలంగాణా యేమిటి?
కులమేమిటి?
మతమేమిటి?
భాషేమిటి?
మనిషి యింతగా యెదిగినా
సంకుచితంగా ప్రాంతమ్మేమిటి?
ఇది నాచేయి
ఇది నాకాలు అని
కన్నతల్లిని కోతపాలు చేసే మూర్ఖతేమిటి
కసాయితన మేమిటి?
ఇంకెలా నిలుస్తుంది దేశం
ఏమైపోతుంది మృతవీరుల త్యాగం, సందేశం’
న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన వాటా అడగడం ఆంద్రోళ్ళకు మూర్ఖత్వంగా, కసాయితనంగా కనిపించింది. ఇదే అంశాన్ని కొంచెం సున్నితంగా సంగిరెడ్డి వెంకటరంగారెడ్డి అనే కవి ఇలా చెప్పిండు.
ఒకే ఇంటివాళ్ళు
అన్నదమ్ములు
అన్నా తమ్ముడి పైసలు వాడుకున్నాడు
అన్న తమ్ముడికి అన్యాయం చేశాడు
తమ్ముడు కోపంతో కల్లెర్ర చేశాడు
తమ్ముడు అన్న చేసిన తప్పులను చూపాడు
తప్పులను సరిదిద్దుకొందాం అన్నాడు అన్నయ్య
తమ్ముడు సంతోషంతో ‘సరే’ అన్నాడు
అన్యాయం చేసినంతమాత్రాన విడిపోతామా అన్నాడు తమ్ముడు
కలతలున్నంత మాత్రాన బంధాన్ని తెంపుతామా అన్నాడు అన్నయ్య”తప్పులను సరిదిద్దుకోవాలని వెంకటరెడ్డి చెప్పిండ్రు.
ఈ తప్పులు సరిదిద్దుకోక పోగా అంతకు వేల రెట్లు అధికంగా చేసి వాటినే ఒప్పుల కుప్పలుగా చూపెట్టే ప్రయత్నం జేసిండ్రు సీమాంధ్ర పక్షపాత అధికారులు, వారికి వత్తాసుగా వలసాధిపత్య ప్రభుత్వం నిలిచింది. గిర్‌గ్లానీ కమిటీ ఎన్ని సార్లు నిబంధనలు ఉల్లంఘించారో తనకు ఇచ్చిన అరకొర సమాచారంతోనే లెక్కగట్టిండు. 1984 డిసెంబర్‌లో ఇచ్చిన 610 జీవో 29 యేండ్లయినా ఇంకా అమలుకు నోచుకోలేదంటే ఇంకెంత సహనం కావాలి. తరాలకు తరాలు ఓపిక పట్టాలంటే అయ్యే ముచ్చటేనా?
యూ టూ శివారెడ్డి!
హైదరాబాద్‌ని అమితంగా ప్రేమిస్తానంటూనే దానిపై అభ్యంతరకరమైన కవిత్వమల్లి తెలంగాణవాదుల మనోభావాల్ని గాయపరిచిన కవి శివారెడ్డి. తాను ఏ శిబిరంలో ఉన్నా అభ్యుదయవాదిగా ఆమోదముంటుంది. వీర తెలంగాణ వాదులకు సైతం ఆయన ఆరాధ్యనీయుడవుతాడు. ప్రస్తుత సందర్భంలో నర్మగర్భంగా తెలంగాణకు వ్యతిరేకంగా కవిత్వమల్లే ఈయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు వ్యతిరేకేసిస్తూ ఏకంగా ‘తెలుగు బావుటా’ (సమైక్యతా సూచికా గేయకావ్యం) పుస్తకాన్ని ప్రచురించాడు.
కుడి చేయి ఎడమ కంట్లో
వేలుబెట్టి పొడిచింది
ఎడమ చేయి కుడికంట్లో
జిల్లేడు పాలు కొట్టింది-
రెండు కళ్ళు
భోరున ఏడుస్తున్నాయి
ఈ దేహం ఒకటే
ఆ కళ్ళు, చేతులు
ఈ దేహానికి చెందినవే
సరిగ్గా ఇలానే వుంది
తెలుగు గడ్డ పరిస్థితి
….
మనుషుల మనసుల్లో
కీనీడల జాడల హెచ్చింది
మమత పెల్లుబికిన ఇంట్లో
మచ్చరం పెను త్రాచులా
బుసలు కొడుతుంది
నిన్నటి మిత్రులు
నేడు శత్రువులు
అన్నదమ్ములిరువురు
పందెంలో కోడి పుంజుల తీరు
ఈ స్వార్థం తిని బలిసిన
రాకాసి పురికొల్పిందిలా?
అర్థమేమున్నది ` ఆ వేటలో
నీది ఆంధ్ర, నాది తెలంగాణా
తెలంగాణాణా`ఆంద్ర
పర్యాయ పదాలు కావా!
నిన్న మొన్న పురుడు బోసుకున్న
తెలుగు తల్లి గుండెల్లో బల్లెపు పోటా!
సిగ్గు విడచి చెప్పులు జత పట్టుకున్నాయి కదూ’
. అంటూ ఆనాడు అందరం ఒక్కటిగా ఉండాలని పిలుపు నిచ్చాడు.
అయితే అప్పటికే హైదరాబాద్‌లో శివారెడ్డి ఉద్యోగం చేయడమంటేనే ఒక స్థానికుడి అవకాశం గల్లంతు కావడం. తెలంగాణ ఫ్యామిలీకి దక్కాల్సిన చదువులూ, స్థానిక రిజర్వేషన్లు ఇట్లా వచ్చిన అనేకమంది తెలంగాణ బిడ్డలకు దక్కకుండా చేసిండ్రు. అట్లా ఒక్క శివారెడ్డే కాదు అంతకు ముందు 1944 నుంచీ తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమం ఊపందుకున్నాక ఆంధ్ర ప్రాంతం వారి రాక పెరిగి పోయింది. అడివి బాపిరాజు, విద్వాన్‌ విశ్వం, కొడవటిగంటి కుటుంబరావు, తల్లావరa్జల శివశంకర శాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, కురుగంటి సీతారామభట్టాచార్య, పిల్లలమర్రి వేంకట హనుమంతరావు ఇలా అనేక మంది తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్‌ని కేంద్రంగా చేసుకొని ఉద్యోగాలు చేసుకున్నారు.  ఇదే విషయాన్ని”నల్లవలుస”లో “శిరసులు ఇలా చెప్పిండ్రు.
‘‘గురజాడ ‘ఒఖడే’
అడుగు జాడల్లో వలసవచ్చినవారు
వేయిన్నొఖడు
నయాదళారుల వలసే
మహా ప్రస్థానం
త్వమేవాహమ్‌
త్వమ్‌ శూన్యమ్‌ అహమ్‌ సర్వమ్‌
ఆర్యా` స్వాహా సర్వమ్‌
దళ నిర్మూళనమే
మరో` మహాప్రస్థానం?

ఉద్యమం మీద
తేలుతూ వచ్చావ్‌
ఆంధ్రప్రస్థ నిర్మాణంలో
మయుడివి కావు
మనిషిని వస్తువుగా,
మా భూమిని
ముక్కలుగా విక్రయించావ్‌
నీ గణాంకాల
గారడీలో
నేనొక్క
గుండుసున్నానిమ మాత్రమే!
ముల్కీ పత్రం
ఒక మురికి పత్రమే
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దాదాపు అందరు సీమాంధ్ర కవులు ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా వ్యవహరించినప్పటికీ వారిని అందలం ఎక్కించే ఉద్దేశ్యంతో సాయుధ పోరాట సాహిత్యాన్ని దానికి వారు అందించిన తోడ్పాటును అటు అభ్యుదయవాదులు, విప్లవవాదులు ప్రచారంలో పెడుతుంటారు. నిజానికి 1946`51 నాటి ‘సాయుధ పోరాటం’ గురించి చాలామంది రచనలు చేసిండ్రు.
అయితే శ్రీ.శ్రీ ఒక్క కవిత కూడా రాయక పోవడానికి కూడా కారణముంది. ఆరుద్ర ‘త్వమేవాహా’నికి ఆపేరు సూచించిన శ్రీ.శ్రీ స్వయంగా నిజాం ప్రభుత్వం కొలువులో ఉన్నాడు. ప్రభుత్వ కొలువులో ఉంటూ దానికి వ్యతిరేకంగా రాస్తే ఉద్యోగం ఊడుతుందనే ఉద్దేశ్యంతో ఒక్క కవిత కూడా రాయలేదు. అలాగే తిన్న ఉప్పుకు ద్రోహం తలపెట్టొద్దు అనే ఉద్దేశ్యంతోనో ఏమో ఆ తర్వాత కూడా ఏమీ రాయలేదు. ఒక వైపు తాము నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన పేద రైతులు, ఉద్యమకారులు సాయుధ పోరాటం చేస్తూ ఉన్నారు. రోజూ  పోలీసుల చేతిలో కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు చనిపోయారు. చనిపోయిన వారిలో రజాకార్లు కూడా ఉన్నారు. బండి యాదగిరి లాంటి పాటగాడు, రేణికుంట రామిరెడ్డి లాంటి యోధుడు, అనభేరి ప్రభాకర్‌ లాంటి పోరాట నాయకులు అనేక వందల మంది 1946`48 మధ్య కాలంలో ఉద్యమంలో తమ ప్రాణాలర్పించారు. అయితే శ్రీ.శ్రీ నిజాం ప్రభుత్వ పోలీసు శాఖలో పౌరసంబంధాల విభాగంలో ఉంటూ ప్రభుత్వ ఎన్‌కౌంటర్ల గురించి, ఉద్యమ కారుల మరణాల గురించీ ఆంగ్లంలో ఇచ్చే వివరణలను తెలుగులో తర్జుమా చేసేవాడు. ఎంత మనసు చంపుకున్నా బూటకపు ఎన్‌కౌంటర్లనీ తెలుస్తూనే ఉన్నా శ్రీ.శ్రీ వాటిని ఎదురుకాల్పులుగా మార్చి రాసే పనిలో ఉన్నాడనే విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఒక్క శ్రీ.శ్రీయే కాదు పైన పేర్కొన్న ఏ ఒక్క ఆంధ్రప్రాంత సాహితీ వేత్త ఆనాడు ప్రభుత్వ దమన కాండను నిలదీయలేదు.
 సాయుధ పోరాటంపై రాయకపోయినప్పటికీ ‘మహాప్రస్థానం’ పాడెను ఇప్పటికీ తెలంగాణ వాదులుమోస్తున్నారు. ఆరుద్ర తెలంగాణను చూడకుండానే ‘త్వమేవాహా’న్ని రాసిండు. కె.వి.ఆర్‌. భువనఘోష వినిపించిండు. అట్లాగే విరసం తరపున సాయుధపోరాట సాహిత్య చరిత్రను రికార్డు చేసిండు. తెలంగాణ మీద ఇంత ప్రేమ ఉన్న వీళ్ళు ప్రత్యేక తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి నిర్ద్వందంగా వ్యతిరేకించిండ్రు. తమ ఆంధ్రాధిపత్యాన్ని ప్రదర్శించారు. తాము చెప్పిందే న్యాయం, తాము రాసిందే వేదం అన్నట్టుగా వ్యవహరించిండ్రు.
1969లో ప్రత్యేక తెలంగాణ నినాదం ఉధృతంగా రావడంతో దాన్ని అధిగమించడానికి కమ్యూనిస్టు పార్టీలు, ఆ భావజాలం ఉన్న రచయితలు తిరిగి సాయుధ పోరాటాన్నే తెలంగాణపై ఆయుధంగా మలిచారు. సాయుధ పోరాటాన్ని తామే నడిపించామన్న తీరుతో ‘చరిత్ర’ రచనలు చేసిండ్రు. 1972 నాటికి ‘సాయుద పోరాట’ ఉద్యమానికి రజతోత్సవాలు జరిపి తమ అనుభవాల్ని అక్షరీకరించి ‘విశాలాంధ్ర’ కోసమే సాయుధ పోరాటం జరిగిందని తీర్పులిచ్చారు. సాయుధ ఉద్యమానికి 60 యేండ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పనిని ఇప్పటికీ సిపిఎం పార్టీ బాహాటంగా చేస్తూనే ఉంది. అందుకే ఆంధ్రప్రాంతం వారి రచనల్లో స్వప్రయోజనాలున్నాయి. హిడెన్‌ ఎజెండాలున్నాయి.
సీమాంద్ర ఆధిపత్య శక్తుల రహస్య ఎజెండాలను పసిగట్టి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతూ దోపిడిదార్లను నిలదీయడమే నేటి తెలంగాణ కవుల కర్తవ్యం. ఎవరు ఏ రూపంలో వచ్చినా ఎన్ని మోసపు మాటలు చెప్పినా కరిగి పోవొద్దు. ఎబికె ప్రసాద్‌ లాంటి వాళ్ళు తెలంగాణమే ఆంధ్రప్రదేశ్‌ అని చెబుతూ ఎన్ని దోబుచులాటలాడిన మొక్కవోని ధైర్యంతో ఎదుర్కోవాలి. కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ప్రయోజనాల్ని పణంగా బెట్టి స్వీయప్రయోజనాల్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. మనల్ని నరికే “గొడ్డలి కామాలు కావొద్దని కోరుకుంటున్నా!
జర్నలిస్టులుగా, సాహిత్యకారులుగా, మేధావులుగా, విశ్లేషకులుగా, ప్రొఫెసర్‌లుగా, విద్యార్థి నాయకులుగా, రాజకీయ దళారులుగా, దోపిడీదార్లుగా, కబ్జాదార్లుగా, పెట్టుబడిదార్లుగా ఇలా అనేక రూపాల్లో తెలంగాణ ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తున్న వారిని ఎదుర్కోవాలి.
అనేక రూపాల్లో, వివిధ మార్గాల్లో తాము తెలంగాణ శ్రేయోభిలాషులం అని చెబుతూనే ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సాహిత్యకారుల గొంతును నొక్కేస్తూ కూడా వీళ్ళు గౌరవింపబడుతున్నారు. మీ కవిత్వంలో ఇమేజ్‌లు లేవు, మీ కథల్లో శిల్పం, శైలి లేదు, భాష ఇబ్బంది కరంగా ఉంది అంటూ తెలంగాణవాళ్ళను తొక్కేస్తున్నారు. ఈ ఆధిపత్యవాదులు వామపక్ష భావజాలం ముసుగులో ఎన్ని అడ్డంకులు కలిగించినా నిలదీయడానికి తెలంగాణ సాహిత్యసమాజం సిద్ధంగా లేదు. ఈ ఆధిపత్యాన్ని మౌనంగా అయినా సరే ఇంకా భరించినట్లయితే భవిష్యత్తెలంగాణ సమాజం క్షమించదు. అందుకే నిజంగా తెలంగాణకు మద్ధతిచ్చే వారెవరో, మద్ధతు ముసుగులో మనల్ని మంటగలిపేందుకు ప్రయత్నిస్తున్నదెవరో తెలుసుకొని మసులుకోవాలి. ప్రజాస్వామిక, న్యాయమైన ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసే కవులను మొహమాటాలు, భేషజాలను పక్కన బెట్టి సాహిత్య సమాజంలో దోషులుగా నిలబెట్టాలి. ఈ పని ఎంత తొందరగా చేస్తే తెలంగాణకు అంత మేలు జరుగుతుంది. వీరు గుర్తించ నిరాకరించిన, నిరాదరణ చేసిన తెలంగాణ సాహితీ ప్రతిభ గుర్తింపుకు ఇది పునాది అవుతుంది.
–సంగిశెట్టి శ్రీనివాస్

 

తన కాలానికన్నా ముందున్న కథకుడు ఆళ్వారు

sangisetti- bharath bhushan photoసంక్షుభిత సమయంలో తెలుగు సమాజం ఎదుర్కొన్న పీడన, ఘర్షణనలను చిత్రిక గట్టి గతాన్ని వర్తమానంలో సైతం ‘రిలవెంట్‌’ చేసిన ఉత్తమ సాహితీవేత్త వట్టికోట ఆళ్వారుస్వామి. 1945-1960ల మధ్య కాలంలో కథలు, నవలలు, నాటికలు, సమీక్షలు, వ్యాసాలు రాసిన వట్టికోట ఆళ్వారుస్వామి తెలుగు సాహిత్యంలో తనదంటూ ముద్ర వేసిండు. ఈ వ్యాసంలో కథకుడిగా తెలుగు సాహిత్యంలో వట్టికోట ఆళ్వారుస్థానం గురించి చర్చించడమైంది. మిగతా తెలుగు కథకులు/రచయితలతో పోలిస్తే ఆళ్వారుస్వామి ఎందుకు భిన్నమైన వ్యక్తి అనే అంశం కూడా ఇందులో చోటు చేసుకుంది. తెలంగాణ సాహితీ రంగంలో ఆళ్వారుస్వామి భూమిక గురించి ఈ వ్యాసంలో వివరించడమైంది.

ఆనాటి స్థల, కాలాలతో పాటుగా ఆయన రచనలూ ఇతర ప్రాంత సాహిత్యకారుల రచనల్ని తులనాత్మకంగా అంచనావేసినప్పుడుగాని కొత్త విషయాలు వెలుగులోకి రావు. ఆంధ్రప్రాంతం వారి సృజనతో ఆళ్వారు రచనల్ని పోల్చి చూసినప్పుడే వాస్తవాంశాలు తెలుస్తాయి. ఆళ్వారుని సగౌరవంగా, సమున్నతంగా నిలబెట్టుకోవాలంటే ఈ పనిజేయాల్సే ఉంటది. తెలంగాణ కథకులు ముఖ్యంగా సాయుధపోరాట కాలపునాటి వారి రచనల్ని ఆనాటి కోస్తాంధ్ర కథకులు వారి కథలతో పోలిస్తే ఎందుకు, ఎవరు భిన్నమైనవారో తెలుస్తుంది. ఆంధ్రప్రాంతానికి చెందిన శారద, ప్రయాగ, తెన్నేటి సూరి, తుమ్మల వెంకటరామయ్య, అట్లూరి పిచ్చేశ్వరరావు, రాంషా తదితర కథకులందరూ తాము తెలంగాణను చూడకుండానే పత్రికల్లో వార్తలు, కమ్యూనిస్టు నాయకులు చేసే ఉపన్యాసాలు అచ్చేసే పార్టీ కరపత్రాలు ఉపయోగించే ప్రచార సామాగ్రీ ఉద్యమ ఉధృతికి ఎత్తుగడగా వ్యాప్తిలో పెట్టే సంఘటనలు, ఆలోచనల్ని ఆసరాగా చేసుకొని రచనలు చేసిండ్రు. బొల్లిముంత శివరామకృష్ణ, మహీధర రామమోహనరావు లాంటి నవలాకారులు తెలంగాణ పోరాటాన్ని ‘పార్టీ’ప్రచార ప్రభావంతోనే అక్షరీకరించారు.

ఆరుద్ర, సోమసుందర్‌, కుందుర్తి, కె.వి.ఆర్‌, గంగినేని, రెంటాలలు తెలంగాణ కవిత్వాన్ని ఈ ప్రాంతాన్ని చూడకుండానే రాసిండ్రు. నాటకాల్ని రాసిన సుంకర, వాసిరెడ్డిలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ విషయాన్ని ఆరుద్ర తన ‘త్వమేవాహమ్‌’లో రికార్డు కూడా చేసిండు. చిత్రకారుడు చిత్తప్రసాద్‌, విశ్వవిఖ్యాత ఫోటోగ్రాఫర్‌ సునీల్‌జెనా లాంటి ఒకరిద్దరు కమ్యూనిస్టు పార్టి ప్రభావంతో స్వయంగా తెలంగాణలో పర్యటించారు. తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయమైన కృషిని ప్రపంచానికి అందించారు. అయితే పైన పేర్కొన్న ‘ఆంధ్ర’ సాయుధ పోరాట సానుభూతిపరులెవ్వరూ తెలంగాణను అప్పటివరకు చూడలేదు. అయినా వారి కవిత్వం, కథలు, నవలలకు విమర్శకులు, సాహితీవేత్తలు ప్రథమ ప్రాధాన్యత నిస్తారు. వీరి దృష్టిలో కాళోజి, సుద్దాల, దాశరథి, ఆళ్వారుస్వామిల రచనలు అంత ‘గొప్ప’వి కావు. నిజానికి ఆళ్వారుస్వామి కథలే కాదు, ధాశరథి కృష్ణమాచార్య లాంటి వారెందరో రాసిన కథలు కూడా తెలుగు పాఠకులకు అందుబాటులో లేవు. అట్లాంటప్పుడు తుది తీర్పులిచ్చేముందు తమ జ్ఞానంలోని ఖాళీల్ని పూరించుకొని మాట్లాడాల్సి, రాయాల్సి ఉంటది. అయినా ప్రాంతేతర సాహిత్యకారులు తమకు తెలిసింది మాత్రమే చరిత్ర, రచన అన్నట్టుగా తుది తీర్పులిస్తారు. ఇచ్చారు కూడా.

ఆంధ్రప్రాంతం వారి రచనలు, సాయుధ పోరాటాలు విశాలాంధ్రలో భాగంగానే, విశాలాంధ్ర కోసమే జరిగిందనే తప్పుడు భావనను ప్రచారంలోకి తెచ్చారు. ఇంకా తెస్తున్నారు కూడా. ప్రజాశక్తి, విశాలాంధ్ర సంస్థలు ఈ భావనను యథాస్థాయి పెంచి పోషించాయి. సాయుధ పోరాటం పేరుమీద తెలంగాణ చరిత్రను కమ్యూనిస్టులు తమకు అనుకూలమైన సాహిత్యాన్ని ఒక వైపూ, మరోవైపు ఇక్కడి స్థానిక ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన సాహిత్యాన్ని 1969 నుండీ ఎక్కువ రాశిలో ఎక్కువగా ప్రచురించారు. ఎలాంటి వివక్షకూ, విస్మరణకూ తావులేని విజ్ఞతగల్ల అసలు సిసలైన చరిత్ర ఆళ్వారు రచనల్లో కనిపిస్తాయి.

తెలంగాణ` రజాకార్లు

నిజాం prajalamanishi-manjeeraపాలనలోని ముస్లింలు, రజాకార్ల గురించి ఇప్పటికీ ఏకపక్షమైన, సర్వాంగీకారం లేని, వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యానాలు, అసమంజస నిర్ధారణలు అటు హిందూత్వవాదులు, ఇటు కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు కూడా చేస్తున్నారు. ఈ విషయంలో ‘కుడి’ ‘ఎడమ’ భావజాల పార్టీలందరిదీ ఒకటే దారి. ఆళ్వారుస్వామి తన కథల్లో మజ్లిస్‌ భావజాలం ఉన్న ముస్లిలంపై సైతం దొరలు, భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, ప్రభుత్వం` పోలీసులతో కుమ్మక్కై దాడులు చేయించిన సంగతులను రికార్డు చేసిండు. ముస్లింలుగా
మారిన దళితుల దౌర్భాగ్య స్థితిని ‘కాఫిర్లు’ ‘రాజకీయ బాధితులు’ కథల్లో చెప్పిండు. ముఖ్యంగా రాజకీయ బాధితులు’ కథలో కమ్యూనిస్టులు సాయుధ రైతాంగ పోరాట విరమణ అనంతరం అడవుల్లో ఉండి సాయుధులై కొట్లాడిన కార్యకర్తల్ని విస్మరించిన తీరు, పోరాట విరమణ తప్పు అన్నవాళ్ళని పార్టీ నుంచి వెలివేయడాన్ని నిలదీసే విధంగా చిత్రీకరించిండు. విరమణను పట్టించుకోకుండా కొట్లాడిన దళిత పోరాట యోధుని భార్య పెంటమ్మ, కాంగ్రెస్‌, మిలిటరీ వారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన పెళ్ళాం పిల్లల్ని తలుచకుంటూ తల్లడిల్లుతున్న దస్తగీర్‌గా మారిన దళితుని వ్యథను ఈ కథలో అక్షరీకరించిండు ఆళ్వారుస్వామి.

ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో ‘రజాకార్ల’ గురించి సరైన అంచనా వేస్తూ ఒక్క పుస్తకం కూడా రాలేదు. మొత్తం హైదరాబాద్‌ రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశపై హిందీ, ఉర్దూ, ఇంగ్లీషుల్లో అనేక నవలలు, కథలు, విమర్శనాగ్రంథాలు, చారిత్రక పుస్తకాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు, వైట్‌పేపర్లూ వెలువడ్డాయి. ‘అక్టోబర్‌ కూ’, ‘మర్డర్‌ ఆఫ్‌ ఎ స్టేట్‌’, ‘ట్రాజెడీ ఆఫ్‌ హైదరాబాద్‌’ (లాయక్‌ అలీ జీవిత చరిత్ర), కెప్టెన్‌ పాండురంగారెడ్డి రాసిన ‘ది ఫస్ట్‌ టెర్రరిస్ట్‌ మూవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియా’ లాంటి కొన్ని పుస్తకాలు రజాకార్ల గురించి చర్చించాయి. తెలుగు సాహిత్యంలో హిందూ`ముస్లింల సాన్నిహిత్య జీవితం, సామరస్య వైఖరిని నెల్లూరి కేశవస్వామి, వట్టికోట ఆళ్వారుస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు తదితరులు తమ రచనల్లో చిత్రించారు. నెల్లూరి కేశవస్వామి తన కథల సంపుటికి ‘చార్మినార్‌’ అని పేరు పెట్టడమే కాదు దాన్ని రజాకార్ల కాలంలో పాకిస్తాన్‌కు వలసెళ్లిన తన ముస్లిం మిత్రుడికి అంకితమిచ్చిండు. అదీ 1980 ప్రాంతంలో అంటే ఆ జ్ఞాపకాలు ఎంతగా వెంటాడాయో అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. హైదరాబాద్‌పై పోలీస్‌యాక్షన్‌ తర్వాత ఉర్దూ ప్రాధాన్యత కోల్పోయింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉర్దూ స్థానాన్ని తెలుగుతో పూర్తి చేశారు. అయితే కేవలం ఉర్దూ తెలిసిన ఉద్యోగులు ‘తెలుగుతో’ ఇమడ లేక ఉద్వాసనకు గురయ్యారు. ఇట్లా ఉద్వాసనకు గురైన వారిలో దాదాపు 95వేల మంది పాకిస్తాన్‌లోని ఒక్క కరాచీ నగరానికి వలసపోయిండ్రనే విషయం 1951 నాటి పాకిస్తాన్‌ జనాభాలెక్కలు తీస్తే తెలిసింది. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

‘‘ఇత్తెహాదుల్ముసలీమన్‌ వారు కొన్నాళ్ళు పాత మసీదుల నిర్మాణానికై పూనుకొన్నారు. కొన్నాళ్ళు పాత దేవాలయాల పునర్నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన సాగించారు. పట్టణాల్లో హిందూ, మహమ్మదీయ వైషమ్యాలు పెరిగిపోయి, సంఘర్షణలు జరుగుట సామాన్య విషయమై పోయింది.

రెండో వైపు హిందువుల రక్షణ పేర, మహమ్మదీయ వ్యతిరేకోద్యమం కూడా బలపడసాగింది. ఒకే ఊరిలో, ఒకే పాఠశాలలో చదువుకున్న హిందూ, మహమ్మదీయ బాలురల్లో కూడా వైషమ్యాలు జీర్ణించుకు పోయినవి. పట్టణాల్లో చదివిన గ్రామీణ హిందూ, మహమ్మదీయ విద్యార్థులు సెలవుల్లో ఇండ్లకు చేరి తమ మతాల ప్రచారం, ఇతరుల మతాలను ద్వేషించడం జరుగుతుండేది’’ అంటూ ఇరు మతాల వారి చాంధస ప్రవృత్తిని ‘కాఫిర్లు’ కథలో రికార్డు చేసిండు. ‘పైస దగ్గర ఎవరూ మనవాడు కాదోయ్‌’ అని ఈ కథలో చాంద్‌సాహెబు ద్వారా చెప్పించాడు. అలాగే ఊరికి వచ్చిన పోలీసు సిబ్బందికి భోజన ఏర్పాట్లు దేశముఖు జగన్మోహనరెడ్డి ఇంట్లో ఏర్పాటు చేయడంతోటే ఎవరి కనుసన్నల్లో అధికారులు నడుస్తున్నారో అర్ధమయ్యేలా చెప్పిండు. బాధితులు ముస్లింలైనప్పటికీ ఇక్కడ మతంతో సంబంధం లేకుండా ఆధిపత్యం దొరలు, దేశ్‌ముఖ్‌లదే నడుస్తది అని తేల్చేసిండు.

హిందూ నుంచి ముస్లిం మతంలోకి, ముస్లిం మతం నుంచి తిరిగి హిందూ మతంలోకి మార్పిడులకు (‘శుద్ధి’, ‘తబ్లీగ్‌’) గురవుతన్న‘హరిజనుల’ (దళితుల) జీవితాల గురించి ‘కాఫిర్లు’ కథలో చిత్రీకరించిండు. ఎన్ని మార్పిడులు జరిగినా ఆర్థికంగా ఏ మాత్రం ఎదుగు బొదుగూ లేని జీవితాన్ని, మారని సామాజిక స్థితిని, సాంఘిక కట్టుబాట్లను గురించి కూడా చెప్పిండు. లంచగొండి అధికారులు హిందువైనా, మహమ్మదీయుడైనా ప్రజలను పీడిరచే విధానంలో ఏమాత్రం తేడా ఉండబోదని తేల్చిండు. అలాగే పెట్టుబడిదారుడు ఏ మతస్థుడైనా స్వీయ లాభం కోసమే తపిస్తాడు తప్పితే కార్మికుల మేలుని కాంక్షించబోడు అని కూడా చెప్పాడు. కార్మికుల మతాలు వేరైనా వాళ్ళు ఐక్యంగా ఉండాలని కూడా కోరుకున్నాడు.

ప్రభుత్వాధినేతలు ముస్లింలే అయినప్పటికీ వారు గ్రామాల్లోని దేశ్‌ముఖ్‌ల తాబేదార్లుగా వ్యవహరిస్తారని ‘కాఫిర్లు’ కథలో చెప్పిండు. చివరికి ఇత్తెహాదుల్‌ సభ్యుడైనా దేశ్‌ముఖ్‌ల ఆగ్రహానికి బలికాక తప్పదని తేల్చి చెప్పిండు.

ఇది ఇత్తెహాదుల్‌ పార్టీ ‘ముస్లింలంతా పాలకులే’ (అనల్‌ మాలిక్‌) అనే సిద్ధాంతానికి విరుద్ధమనే విషయాన్ని గమనించాలి. మతంతో సంబంధం లేకుండా ప్రజలందరూ లంచగొండి అధికారుల చేతుల్లో, దోపిడీ, దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేసే దేశ్‌ముఖ్‌ల వెట్టికి బలైతున్న విషయాన్ని వివరంగా చెప్పిండు. దేశ్‌ముఖ్‌ల వెట్టి నుంచి విముక్తి పొందేందుకు, కొన్నిసార్లు సామాజిక హోదా కోసం, మరి కొన్ని సార్లు తాత్కాలికంగా దొరికే ఆర్థిక సహాయం ఆశించీ, బూటకపు వాగ్దానాలను నమ్మి మతం మార్చుకున్న హిందువులు, చివరికి గ్రామ పెత్తందార్లు, భూస్వాములు విధించే కట్టుబాట్లు, వత్తిళ్ళు, బెదిరింపులు వాళ్ళని తిరిగి ‘శుద్ధి’ చేసి ‘హిందూ’ మతంలోకి మారేలా చేస్తున్న పరిస్థితికి కూడా అక్షర రూపమిచ్చిండు. రైతులు హిందువులైనా, ముస్లింలైనా వాళ్ళని ప్రభుత్వానికి పన్నులు చెల్లించే వారిగానే చూశారు. మతం మార్చుకున్న వారికి కొంతమేరకు వెట్టినుంచి విముక్తి దొరికతే దొరికిందేమోగానీ ఎక్కువ మందికి మతమార్పిడి వల్ల దక్కుతుందనుకున్న సామాజిక హోదా భ్రమగానే మిగిలింది.

అందుకే ‘కాఫిర్లు’ కథలో ఈవిషయంపై పెద్ద చర్చ చేసిండు. చాంద్‌సాహెబ్‌ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో మిలిటరీలో పనిచేసిండు. అందుకు గాను ప్రభుత్వమిచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అయితే మజ్లిస్‌ ప్రభావం పెరుగుతున్న దశలో చాలా సార్లు మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించేవాడు. తన కొడుకు నిజాం ప్రభుత్వంలో పోలీసు ఉద్యోగం చేస్తున్న బందగీ ఫలానా గ్రామంలో హిందువులు పందిని కోసి మసీదులో వేసిండ్రనీ, మరో చోట మసీదు ముందట వాయిద్యాలు వాయించారనీ, ఇంకోచోట ఆవుని కొయ్యనియ్యలేదనీ చెబుతూ ఉండేవాడు.

దీనికి చాంద్‌ సాహెబ్‌ నచ్చచెప్పే విధంగా ఇలా జవాబు చెప్పాడు. ‘‘బందగీ! చూడు!! ఒక సంగతి చెప్తాను. నేను సిపాయిగా పనిచేస్తున్నప్పుడు మిలిటరీలో హిందూ, మహమ్మదీయ అధికారులు ఒకే బల్లపై కూర్చొని డబ్బాల్లో ఎక్కడినుంచో వచ్చిన మాంసాన్ని తినడం నేను కళ్ళారా చూశాను. దాంట్లో అన్ని రకాల మాంసాలుంటాయట. వాండ్లెట్లా తింటారో? వారెప్పుడూ జగడమాడలేదు.’’ అని తన అనుభవాన్ని చెప్పిండు. అలాగే మరో కథ ‘మెదడుకు మేత’ కథలో కూడా ఈ విధమైన చర్చ చేసిండు ఆళ్వారుస్వామి.

కథాంశంగా ఎద్దుమాంసం

తెలుగు సాహిత్యంలో ఎద్దు మాంసం గురించి చర్చ చేసిన మొట్టమొదటి సృజనకారుడు ఆళ్వారుస్వామి. ఎవరెవరి ఇష్టాయిష్టాల మేరకు ఏదైనా తినొచ్చని తీర్పిస్తూ, దీనికి మతం రంగు పూయడానికి చేసే కుట్రలో పావులు కావొద్దని బోధ చేసిండు. ఇప్పటికీ దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో, మత సంఘాలు, మఠాధిపతులు, ముల్లాలు, మతోన్మాదులు, చాంధసులు ఎద్దు మాంసం, పంది మాంసం విషయంలో తగాదా పడుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘పెద్దకూర’ పండుగ చేసుకుంటే ఏబీవీపీ, భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు వండుకున్న కూరలో మన్ను కలిపి నానా బీభత్సం సృష్టించిండ్రు. ఇదే రగడను అంతకుముందు ఎఫ్లూలోనూ కొనసాగించారు. ఇంత సున్నితమైన విషయాన్ని కూడా ఆళ్వారుస్వామి తన కథల ద్వారా విశ్లేషించి తన అభిప్రాయం చెప్పిండు.

మత వైషమ్యాలను పెంచిపోషిస్తున్న వారి గురించి, అందుకు కారణాలను, వాటిని అరికట్టాలని కూడా ఆళ్వారుస్వామి గట్టిగానే చెప్పిండు. ‘‘మహమ్మదీయులంతా ఒకటి కావాలి. కత్తితో సాధించిన మహమ్మదీయ రాజ్యాన్ని కాపాడు కోవాలె. మహమ్మదీయులంతా అన్నదమ్ముల వలె మెలగాలి’’ అని ఇత్తెహాదుల్ముసల్మీన్‌ చేసే ప్రచారాన్ని గురించీ చెప్పిండు. మత కలహాలాల్లో అమాయక, అజ్ఞాన ప్రజలే వీధుల్లో తలలు బద్దలు కొట్టుకుంటారన్నాడు. ఇప్పటి వరకూ ఏ మత కలహంలోగానీ మసీదు ఇమాంగానీ, మందిర పూజారి గాని పాల్గొనలేదు. ముల్లాలు పండితులు ముష్టియుద్ధాలకు దిగలేదు అని బోధ చేసిండు. మత స్వాతంత్య్రం అంటే ‘నీ శక్తి సామర్ధ్యాలను బట్టి, నీ శారీరక స్థితినిబట్టి, నీ దుస్తులు, నీ ఆహారము, నీవు ఉపయోగించుకున్నట్లే నీ విశ్వాసం, నీ విజ్ఞానాన్ని బట్టి నీవు నమ్మే మతవిధులను నీవు ఆచరించుకోవచ్చు. కానీ నీ మత స్వాతంత్య్రం ఇతరుల మత స్వాతంత్య్రాన్ని హరించుటకు మార్గం మాత్రం కాకూడదు’’ అని మెదడుకు మేత కథలో మోహన్‌బాబు పాత్ర ద్వారా చెప్పిస్తాడు. మతస్వేచ్ఛకు సంబంధించిన విషయంలో ఆళ్వారు తన అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం జేసిండు. అందుకే ఆయన దార్శనికుడు, వైతాళికుడు.

ఆవును తినడం మోక్షానికి మార్గమని చేసిన తప్పుడు ప్రచారాన్ని చైతన్యంతో ఎదుర్కోవాలని చెప్పిండు. ‘ప్రజలలో చైతన్యం, విజ్ఞానం, వికాసం కలుగుటతో వారి భావనా శక్తి ప్రధాన సమస్యలపై ప్రసరించి, విశాల హృదయముతో ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తారు. అప్పుడు ప్రజల నైతిక, రాజకీయ ఆర్థిక సమస్యలే ప్రధాన విషయాలుగా పరిగణించబడతాయి’’ అంటూ దృష్టిని కేంద్రీకరించాల్సిన అంశాలను తేటతెల్లం జేసిండు. వర్తమాన కాలంలో ఈ ‘ఫుడ్‌ రాజకీయాల’పై బుద్ధిజీవులు సవ్యంగానే స్పందిస్తున్నారు. దానికి నిదర్శనమే ‘అన్వేషి’ సంస్థ ప్రచురించిన ప్రత్యేక సంచిక.

ఫ్యూడలిజం`ఆళ్వారు కథలు

అప్పటి ఫ్యూడల్‌, దోపిడీ సమాజానికి లాభాలే తప్ప కార్మికుల శ్రేయస్సు అప్రధానమని కూడా ఆళ్వారుస్వామి తన కథల్లో బలంగా చెప్పిండు. పెట్టుబడిదారునికి దోపిడీ తప్ప మతం ఉండదని కూడా రాసిండు. మిల్లు యజామానులు ఏ మతస్థుడైనా దోపిడీ అతని ప్రధాన ఉద్దేశ్యమంటూ, ఇది ‘‘నవాబుగా, బంజరుదారుగా, మఖ్తదారుగా, లంచగొండి అధికారిగా ఉండే హిందూ మహమ్మదీయులకు`పన్నుభారంతో, లంచాలతో, దండుగలతో, నజరానాలతో కృంగి కృశించిపోతున్న హిందూ మహమ్మదీయ కూలీ రైతుల మధ్య ఐక్యత అంటే పిల్లికి ఎలుకకు ఐక్యత అనే విషయం ఇంకా అవగాహన కాలేదు జనసామాన్యానికి’’ అంటూ రావాల్సిన మార్పుల గురించి చెప్పిండు. రంజాన్‌ మాసంలో జైల్లో ఉన్న ఖైదీలకు బిర్యానీ, అరటిపండు, ఒక ఖర్జూరపండు ఇచ్చినతన్ని ఒక ఖైదీ దీవిస్తాడు. దీనికి అదే జైల్లో ఉన్న రాజకీయఖైదీ అభ్యంతరం చెబుతూ ‘‘పొట్టకు పెడ్తే దీవించావు? పొట్ట మాడినవాండ్లు దూషిస్తారు? అయితే అతనికి నీ దీవెన ఫలితమా? వాండ్ల దూషణ ఫలితమా కలిగేది? నీకు తెలియదు లతీఫ్‌. అతడు తన ఫ్యాక్టరీలో కూలీలకు, ఇంట్లో పనివాండ్లకు సరిగా జీతాలివ్వడు. అక్కడ వాండ్ల నెత్తికొట్టి యిక్కడ యీ విధంగా మీ పొట్ట నింపుతున్నాడు’’ అని కూడా తన కథల్లో చెప్పిండు.

‘‘ఈ విధంగా ఖర్చు పెట్టేవాడు తన నౌకరులకు సరిగా జీతాలెందుకివ్వడు నీ మాటలు కాని’’ అన్న లతీఫ్‌ మాటలకు జవాబు చెబుతూ ‘‘అక్కడే కిటుకంత. దానము, ధర్మము, కారుణ్యము పేర వేలు ఖర్చుపెట్టి వాండ్ల వల్ల వచ్చే కీర్తి ప్రతిష్టల ముసుగులో కష్టజీవుల నెత్తికొట్టి కోట్ల రూపాయలు గడిస్తారు. అంటే వాండ్లీవిధంగా ఖర్చుపెట్టే డబ్బు వాండ్ల విపరీత లాభాల కింద చేతిమైలతో సమానము’’ అని మోహన్‌బాబు ద్వారా భూస్వాముల దోపిడీని ఎండగట్టిండు. గ్లోబలైజేషన్‌ వచ్చిన తర్వాత ఇట్లాంటి కథలు మనం చూస్తున్నాము. కానీ 1950వ దశకంలోనే గుత్తాధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థ గురించీ అందులో శ్రమజీవుల దోపిడీ గురించి కూడా చర్చించిండు. ఫ్యూడల్‌ వ్యవస్థనీ వ్యతిరేకించిండు. పై అధికారులు, వారి భార్యలు కిందిస్థాయి నౌకర్లని పీడిరచడాన్ని ‘బదనిక’ కథలో నిక్షిప్తం చేసిండు.

సంఘం పేరిట కమ్యూనిస్టుల సాయుధ`రైతాంగ పోరాటాలను, ప్రజాభ్యున్నతికి చేపడుతున్న చర్యలను, కార్యక్రమాలను ‘రాజకీయ బాధితులు’ ‘అంతా ఏకమైతే’, ‘ఆలుకూలి’, ‘చిన్నప్పుడే’, ‘ఆక్షేపణలేదు’ ‘గిర్దావర్‌’ లాంటి కథల్లో రికార్డు చేసిండు.

గిర్దావర్‌ కథలో ఆళ్వారుస్వామి గ్రామాల నుంచి దొరలను తరిమేసిన తీరు, ‘పోలీస్‌యాక్షన్‌’ తర్వాత మిలిటరీ అండతో గ్రామాలకు తిరిగొచ్చి తమ భూముల్ని స్వాధీనం చేసుకున్న భూస్వాములు, దేశ్‌ముఖ్‌ల గురించి, వారి ఆధిపత్య పోకడల గురించీ మానవీయంగా రికార్డు చేసిండు. అలాగే పోలీస్‌ యాక్షన్‌ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉర్దూ భాష పట్ల చూపుతున్న నిరాదరణను, ప్రాంతీయ భాష`తెలుగు నేర్చుకోవాలనే నిబంధన తీసుకొచ్చి ఉర్దూమాత్రమే తెలిసిన వారి ముఖ్యంగా ముస్లింల ఉద్యోగాలను కొల్లగొట్టిన తీరు ‘పరిసరాలు’ కథలో రాసిండు. ఇదంతా చరిత్రకెక్కని మార్జినలైజ్‌డ్‌ సంఘర్షణ.

(మిగతా వచ్చే వారం)

హైదరాబాద్‌ చెప్పుకున్న ఆత్మకథ ‘యుగసంధి’

sangisetti- bharath bhushan photoహైదరాబాద్‌ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక జీవనానికి అక్షరరూపం భాస్కరభట్ల కృష్ణారావు నవలలు. 1950-66ల మధ్య మొత్తం నాలుగు నవలలు రాసిన ఈయన పైదాయిషీ హైదరాబాదీ.
నగరం స్మృతిని, జీవితాన్ని, జీవితాల్లోని సంఘర్షణలను, ఆలోచనలను, ఉన్నత ఆదర్శాలను, అంతకుమించి అత్యున్నత జీవిత విలువల్ని ఒకవైపూ ఛిద్రమవుతున్న బతుకుల్ని, చిదిమేస్తున్న దోపిడీ వ్యవస్థ, దానికి అండగా నిలిచిన వెన్నెముకలేని రాజకీయాలు, అన్ని విధాలుగా భాగ్యవంతులైన వారు అభాగ్యులుగా మారిన అమానవీయతను మరోవైపూ తన నవలల్లో కృష్ణారావు అక్షరీకరించారు.

హైదరాబాద్‌ నగర జీవితానికి సంబంధించినంత మేరకు భాస్కరభట్ల కృష్ణారావు నవలలు ఒక డాక్యుమెంటరీ. ప్రస్తుతం ‘అభివృద్ధి’ ఆవరించి మెట్రో రైలుపేరిట నగరాన్ని దిగమింగుతున్నాయి. చారిత్రక కట్టడాలు కనుమరుగవుతున్నాయి. సుల్తాన్‌ బజార్‌లాంటి నవలల్లోని ప్రదేశాలు రూపుమారనున్నాయి. కోఠీ విమెన్స్‌ కాలేజి కళావిహీనం కానుంది. వందల యేండ్లుగా సజీవ సంఘటనలకు సాక్ష్యాలుగా నిలిచిన ప్రదేశాలు మూగగా రోదిస్తూ రూపు మార్చుకుంటున్నాయి. తరిగిపోతున్న, నాశనం అవుతున్న ఒక చారిత్రక వారసత్వాన్ని ఈ నవలలు దివిటీపట్టి ఆకాశమెత్తు ఎత్తి చూపించాయి. ఇట్లాంటి నగరంపై, నగర చరిత్రపట్ల, సంస్కృతి పట్ల ఎలాంటి పట్టింపులేని పాలకులు, ప్రతిపక్షాలు ఒకేరీతిలో ప్రజాభిప్రాయాన్ని ‘బుల్‌డోజ్‌’ చెయ్యడమే పనిగా పెట్టుకున్నాయి.

‘బుల్‌డోజ్‌’కు గురవుతున్న చరిత్ర, సంస్కృతిని, సాహిత్యాన్ని కాపాడుకునేందుకు కొత్తతరం నడుంకట్టేందుకు కృష్ణారావు నవలలు స్ఫూర్తి కావాలి. యుగసంధి  నవల మొదట 1956లో ‘తెలుగు స్వతంత్ర’ పత్రికలో సీరియలైజ్‌ అయింది. తర్వాత 1957లో నవలగా వెలువడింది. ఇందులో 1920- 48 మధ్య కాలంలో హైదరాబాద్‌ కేంద్రంగా మొత్తం తెలంగాణలో చోటుచేసుకున్న సకల మార్పులు, ఉద్యమాలు, ఉద్వేగాలు, జీవితాలు, ఆర్థిక ప్రగతి, ఆదర్శాలు అన్నీ కలగలిసి ‘యుగసంధి.’.

ఐదారు దశాబ్దాల క్రితం వచ్చిన నవలల గురించి వర్తమానంలో చర్చించి, వ్యాఖ్యానించడం అంటేనే చరిత్రతో సంభాషించడం! ఈ సంభాషణలో గతంలో పాదుకొని ఉన్న కొన్ని ఉన్నత విలువలు ఈనాడు ఎక్కడా వినబడడం లేదు. మీదుమిక్కిలి ఆనాడు సమాజంలో ఉన్న అవలక్షణాలు ఈ ఆరున్నర దశాబ్దాల ప్రజాస్వామిక పాలన తర్వాత కూడా అంతకన్నా ఎక్కువగా వేళ్ళూనుకు పోయాయి. ఇది జాతి ప్రయాణిస్తున్న తిరోగమన దిశను సూచిస్తుంది. ఈ తిరోగమనానికి అనేక కారణాలు ఉన్నాయి. విలువలు నశించడం ఒక కారణం. నాశనం చేయడమే విలువలుగా చలామణి అవుతున్న కాలంలో మనం ఉన్నాము.

ఇట్లాంటి సందర్భంలో చారిత్రక విషయాలపై అవగాహన రాహిత్యంతో చేసే వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలిస్తాయి. నిజానికి ఒక సంఘటన జరుగుతున్నకాలంలో వాటిని చూసి అనుభవించి వ్యాఖ్యానిస్తే వాటిపై భావోద్వేగాల ప్రభావం ఉంటుంది. అందువల్ల రచయితకు ఆనాడు ఉన్న అభిప్రాయం భవిష్యత్తులో మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సంఘటన వాడి వేడిలో రూపుదిద్దుకునే అభిప్రాయం ఆ తర్వాతి కాలంలో పరిశోధనలు, భిన్న పార్శ్వాల నుంచి వ్యక్తుల వ్యాఖ్యానాల, విశ్లేషణ మూలంగానూ, స్వయంగా వ్యక్తి జ్ఞానం, ఆలోచనల్లో మార్పు మూలంగానూ మార్చుకునే అవకాశముంది.

ఆనాటి వుద్యమాల డాక్యుమెంటు

1921 మొదలు 1948 వరకు తెలంగాణలో జరిగిన ఉద్యమాలన్నీ ‘యుగసంధి’ నవలలో రికార్డయ్యాయి. ఉద్యమాలకు నవలలోని పాత్రలకు విడదీయరాని సంబంధం ఉండడంతో ఈ అంశాలు చొప్పించినట్లుగాకుండా సాఫీగా సాగిపోతాయి. ఆంధ్రమహాసభ మొదలు హైదరాబాద్‌పై పోలీసు చర్య వరకు వివిధ ఉద్యమాలు ఇందులో విస్తృతంగా చర్చకు వచ్చాయి. మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సందర్భంలో సంప్రదాయ, అంధ విశ్వాసాల/ మూఢనమ్మకాలను ఆచరించే వర్గానికి, ‘అభ్యుదయ’ భావాల ఆచరించే వారి మధ్యన జరిగే ఘర్షణను ‘యుగసంధి’గా ఆవిష్కరించాడు రచయిత. నిజానికి ఈ రచయిత కథలు, నవలలు 1940-60వ దశకంలో చదువుకున్న తెలంగాణ వారందరికీ గ్రాహ్యమే. గోలకొండ పత్రిక, దక్కన్‌ రేడియో ద్వారా తెలంగాణ సాహితీ ప్రియులందరికీ పరిచయమే!

హైదరాబాద్‌ స్టేట్‌ అస్తిత్వం కనుమరుగై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవతరిస్తున్న సందర్భంలో వచ్చిన ‘యుగసంధి’ నవలలో ఒక రాజ్యం అంతర్థానమై ఇంకొక రాష్ట్రం ఏర్పాటు సంధి కాలంలో హైదరాబాద్‌ ముఖ చిత్రాన్ని నవలాకర్త ఆవిష్కరిస్తాడు. నవల హైదరబాద్‌పై పోలీసు చర్యతో ముగిసినా ఆ తర్వాతి కాలంలో ఈ అంశాలేవి తెలుగు సమాజానికి పాఠ్యపుస్తకంగా గానీ, సాహిత్య రూపకంగా గానీ అందుబాటులోకి రాకపోవడంతో దీనిపై జరగాల్సినంత చర్చ జరగలేదు. ఇది ఒక్క భాస్కరభట్ల కృష్ణారావుకు జరిగిన అన్యాయం కాదు. 1956కు ముందు సాహిత్యసృజన చేసిన తెలంగాణ సాహితీవేత్తలందరికీ జరిగిన అన్యాయం. ఇక్కడి వారు ప్రచారానికి విముఖులు కావడం ఒక కారణం కాగా, వారి గురించి, వారి రచనల గురించి విమర్శ, విశ్లేషణ, చర్చ తెలుగు పత్రికల్లో తగినంతగా జరుగకపోవడం మరో కారణం.

ఈ కారణంగానే అటు ఒద్దిరాజు సోదరులు మొదలు సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి తదితరులెవ్వరికీ న్యాయంగా తెలుగుసాహిత్యంలో న్యాయంగా దక్కాల్సిన స్థానం దక్కలేదు. తెలంగాణ సాహిత్యాన్ని కేవలం సాయుధ పోరాటంతో ముడివేసి చూడడం కారణంగానే అంతకుముందూ ఆ తర్వాత వచ్చిన సాహిత్యానికి గుర్తింపు లేకుండా పోయింది. తెలంగాణ సాహిత్యం తెలుగు సాహిత్యంలో ఉపశీర్షికలకు, ఫుట్‌నోట్స్‌కు మాత్రమే పరిమితమై ఉన్న తరుణంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొత్త పరిశోధనలకు, కొత్త రచనలకు ఊతమిస్తున్నాయి. ఇదే విషయాన్ని భాస్కరభట్ల కృష్ణారావు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ‘న్యూరైటింగ్‌’ పేరిట అనేక రచనలు వెలువడ్డాయని, ఎక్కడైనా పోరాటం ఉంటేనే సాహిత్య సృజన ఎక్కువగా ఉంటుందని చెప్పకనే చెప్పిండు.

bhaskerabhatla-1

అందుకే ఇప్పటికీ తమ హక్కుల కోసం, పీడన నుంచి విముక్తి కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆఫ్రికన్స్‌, ‘బ్లాక్స్‌’ (పాజిటివ్‌ అర్థంలోనే) సృష్టిస్తున్న సాహిత్యం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది. ఈ సాహిత్యం మాదిరిగానే ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో వందల సంఖ్యంలో సంకలనాలు పది జిల్లాల నుంచి వెలువడుతున్నాయి. సంవేదనతో, ఆగ్రహంతో, పీడన నుంచి విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం పది జిల్లాల కవులు, కథకులు, రచయితలు తమ గళాన్ని, కలాల్ని, పిడికిళ్ళను ఎత్తిపడుతున్నారు. అదే విధంగా గతకాలపు ఆణిముత్యాలు కూడా కొత్తగా వెలుగులోకి తెస్తున్నారు. ఇప్పుడిక్కడ చర్చించుకుంటున్న ఈ నవలలు కచ్చితంగా జనం మరిచిన తెలంగాణను తెలుసుకునేందుకు అకరాలు అవుతాయి. గత కాలపు విస్మృత తెలంగాణను దర్శించేందుకు దివిటీలవుతాయి.

సరిగ్గా ఇవే విషయాలు ఇక్కడ మనం చర్చించుకుంటున్న నవలలకు కూడా వర్తిస్తాయి. ఇక్కడ గత కాలపు సంఘటన లేదా సంఘటనలను వర్తమానకాలంలో విశ్లేషించడమంటేనే వాస్తవాల్ని వాస్తవాలుగా వెలుగులోకి తేవడమే. ఈ వాస్తవాలు, ఉద్వేగాలు, ఉద్యమాలు, జీవన్మరణ సంఘర్షణలు అన్నీ కలగలిసి ‘యుగసంధి’, ‘వెల్లువలో పూచిక పుల్లలు’ నవలలుగా రూపుదిద్దుకున్నాయి ఈ రెండు నవలలు ఆనాటి తెలంగాణ పరిస్థితులకు అద్దం పట్టాయి. రచయిత వీటిల్లో మానసిక సంఘర్షణలను, పరిస్థితులు, వ్యక్తులు, సమాజంపై వేసిన ప్రభావాల్ని భిన్న పార్శ్వాల నుంచి తడిమి పాఠకుణ్ని తనతో పాటు నడిపించాడు. చైతన్యస్రవంతి శిల్పంతో, అధివాస్తవికత భావనలతో తన నవలల్ని తీర్చి దిద్ది తెలుగు పాఠకులకు ఒక కొత్త తరహా సాహిత్య రుచిని చవి చూపించాడు.
అక్షరమక్షరం పాతల్ర మానసిక సంఘర్షణను, జీవన పోరాటాలను, నింపాదిగా ఉండనివ్వని ఆలోచనలు, ఆదర్శాలు అన్నింటినీ ఈ నవలలు చిత్రించాయి. యుగసంధి నవలలో పైరవీలు, పటేలు`పట్వారీ తగాదాలు మొదలు, కొంతమంది రొహిలాలు, అరబ్బుల దౌర్జన్యాలు, విధవా వివాహాలు, ఆర్యసమాజ్‌, ఆంధ్రమహాసభ, వందేమాతరం, కమ్యూనిస్టులు, రజాకార్లు, అతలాకుతలమైన హైదరాబాద్‌ జీవనం, అవి ఆయా కుటుంబాల్లో తీసుకువచ్చిన మార్పులు, కాలంతో పాటు సమాజంలో చోటుచేసుకుంటున్న` మారుతున్న విలువలు, ఒకవైపు శుద్ధశ్రోతియ బ్రాహ్మణులు పాటించే ఆచారాలు, మరో వైపు బ్రాహ్మణుడైనప్పటికీ జంధ్యంతో పాటు అన్నీ త్యజించి తాగుడు, డిబాచిరీకి అలవాటు పడ్డ ‘లంపెన్‌’ వ్యక్తి విశ్వేశ్వరరావునీ ఇందులో చిత్రించాడు.

మంచీ చెడుల సహ గమనం

హైదరాబాద్‌ నగర జీవన విధానం, రాజకీయ పరిస్థితులు, సామాజిక, సాంస్కృతికరంగాలు, హిందూ`ముస్లిం దోస్తానా దానితో పాటే మజ్లిస్‌ మతవిద్వేషం, జమీందార్లలో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయని భాస్కరభట్ల చెప్పిండు. ఆధునిక స్త్రీ స్వయం నిర్ణయాధికారం కోసం తండ్రిని సైతం ఎదిరించడం, విద్యా ప్రాధాన్యత ఈ నవలలో ప్రధానంగా చోటు చేసుకున్నాయి.

ముఖ్యంగా రుక్మిణి, రమణ, పద్మల పాత్రల ద్వారా ఆనాటి స్రీల ఆలోచనాసరళిని వారి తెగింపుని, కట్టుబాట్లకు లొంగని తిరుగుబాటు దోరణిని చదువుకున్న, ప్రగతిశీల భావాలు గల స్త్రీల మనోభావాల్ని రికార్డు చేసి నవలకు సమగ్రత కల్పించిండు. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం కూడా ఇందులో అంతర్లీనంగా చోటు చేసుకున్నాయి.భాస్కరభట్ల మొత్తం నాలుగు నవలలు రాసిండు. అవి వింతప్రణయం, భవిష్యద్దర్శనం, యుగసంధి, వెల్లువలో పూచిక పుల్లలు. భాస్కరభట్ల నవలల్లో మొదటగా చెప్పుకోవాల్సింది యుగసంధి. ఇందులోని రఘు, రుక్మిణి, రమణ, పద్మ పాత్రలు భిన్న ధృక్కోణాల్లో ఆనాటి సమాజాన్ని ఆవిష్కరిస్తాయి. భిన్నమైన ఆలోచనలు కలవాళ్ళని ఒక్కదగ్గర చేర్చి నవల నడిపించడమంటే చాలా క్లిష్టమైనపని. ఆ పనిని భాస్కరభట్ల విజయవంతగా చేసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ‘యుగసంధి’ నవల్లో రఘుపాత్రలో అక్కడక్కడ భాస్కరభట్ల కనిపిస్తాడు.‘యుగసంధి’ నవల హీరో రఘు స్వయంగా ఇంగ్లీషు ఎమ్మే ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. రఘు పాత్ర  ద్వారా ఆనాటి తెలంగాణ సమాజానికి పరిచయమైన పాశ్చాత్య సాహిత్యాన్ని గురించి రచయిత విశ్లేషిస్తాడు.

నిజానికి హైదరబాద్‌లో 1917లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడే వరకు కూడా ఇంగ్లీషు మాధ్యమంగానే ఉన్నత చదువులు కొనసాగేవి. అయితే బ్రిటీషిండియాలో గాంధీ లేవదీసిన ‘ఉర్దూ`హిందుస్థానీ’ జాతీయ ఉద్యమాల ప్రభావంతో ఉస్మానలీఖాన్‌ తన పేరిట ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించడంతో ఇక్కడ విద్యాబోధన ఉర్దూమాధ్యమంగా ప్రారంభమయింది. ఈ విశ్వవిద్యాలయం ఉర్దూ మాధ్యమంగా ఆరంభం కావడానికి ప్రధాన కారకుడు రవీంద్రనాథ్‌ టాగోర్‌. ఆయన సూచనల మేరకే ఉర్దూ మాధ్యమంగా యూనివర్సిటీని ప్రారంభించారు. అయినప్పటికీ నిజాం కాలేజి, దాంతోపాటు మరి కొన్ని కళాశాలల్లో బోధన పూర్తిగా ఇంగ్లీషులోనే కొనసాగేది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉర్దూ బోధనా భాష చేయడంతో హైదరాబాద్‌ రాజ్యంలో తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు దెబ్బతిన్నాయని కూడా రచయిత చెప్పిండు.

ఎన్ని అవరోధాలు ఉన్నా నిజాం కాలంలో హైదరాబాద్‌ రాజ్యంలో ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో పంచభాషా సంస్కృతి ఉండేది. నగరంలోని దాదాపు చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఫార్సీ భాషలు వచ్చేవి. పోలీస్‌ యాక్షన్‌ తర్వాత ప్రభుత్వాలు ఎకాఎకిన తెలుగును అధికార భాష చేయడంతో ఈ భాష తెలిసిన ఆంధ్రప్రాంతీయులు ఇబ్బడి ముబ్బడిగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు సంపాదించారు. అంతేగాకుండా స్థానిక పంచభాషా సంస్కృతి కూడా సర్వ నాశనమయింది. భాషారాష్ట్రాల పేరిట ఐదారు భాషలు, కలిసిమెలిసి ఉండిన సంస్కృతిని భ్రష్టుపట్టించి ఏకైక భాష ‘తెలుగు’కు మాత్రమే పట్టం కట్టారు. ఉర్దూ మూలంగా కన్నా ‘తెలుగు’ మాత్రమే వెలిగించే ప్రభుత్వాల మూలంగా హైదరాబాద్‌ పంచభాష సంస్కృతి, తెహజీబ్‌ కనుమరుగయ్యింది.

హైదరబాద్‌ నగరంలో ఉద్యోగం చేయాలంటే కేవలం ఉర్దూ, కొంత ఫార్సీ వస్తే చాలు అన్న పరిస్థితులున్న కాలంలోనే భాస్కరభట్ల కృష్ణారావు కలకత్తా వెళ్ళి అక్కడ బి.ఎస్‌.సి చదివాడు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చి లా చదివాడు. దక్కన్‌ రేడియోలో ఉద్యోగం సంపాదించి ఎందరో తెలుగువారికి అవకాశం కల్పించాడు. స్వయంగా తన నాటకాలు ప్రసారం చేయడమే గాకుండా, పాటలకు ప్రథమ స్థానం కల్పించాడు. హైదరాబాద్‌ రాజ్యం తన అస్తిత్వాన్ని కోల్పోయి భారతదేశంలో విలీనం కావడంతో ‘దక్కన్‌ రేడియో’ కూడా ఆలిండియా రేడియోలో సంలీనమయింది. దీంతో తనదైన హైదరాబాద్‌ ముద్ర చెరిగిపోయి ప్రాంతేతర ‘తెలుగు ముద్ర’ పడింది.

అప్పటివరకూ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నందగిరి ఇందిరాదేవి, మాడపాటి సత్యవతి లాంటి వారికి పుట్టినిల్లుగా ఉండిన ‘రేడియో’లో ప్రాంతేతరుల ప్రవేశం ప్రారంభమయింది. దీంతో ఉర్దూ, తెలుగు మిశ్రిత భాష క్రమంగా తెరమరుగయింది. ఇవే విషయాల్ని నేడు తెలంగాణవాదులు ఉద్యమ సందర్భంలో పదే పదే ముందుకు తీసుకువస్తున్నారు. తెలంగాణ తనదైన తెలుగుభాషను కోల్పోయిందని చెబుతున్నారు. కేవలం భాష విషయమే గాకుండా ‘యుగసంధి’ నవల ద్వారా అనాటి అనేక సమకాలీన అంశాలను కూడా చరిత్రకెక్కించాడు.

‘యుగసంధి’ నవలలో రెండున్నర దశాబ్దాల తెలంగాణ ఉద్యమాలను ఆంధ్రమహాసభ మొదలు పోలీసు చర్య వరకు సుదీర్ఘంగానే చర్చించాడు. ఆంధ్రమహాసభ వారు ‘వర్తక స్వాతంత్య్రం’, ‘వెట్టిచాకిరి’, మగ్గంపన్ను, పేరిట వేసిన చిన్న పుస్తకాలు ఆనాడు ఉద్యమానికి ఎలా ఊతమిచ్చాయో ఈ నవల ద్వారా తెలుస్తుంది. అలాగే బహద్దూర్‌ యార్జంగ్‌ మజ్లిస్‌ పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వం వాక్‌, సభా స్వాతంత్య్రాలను అరిగడుతూ గస్తీనిషాన్‌`53 పేరిట వెలువరించిన జీవో, పాఠశాలలు స్థాపించుకోవాలంటే అనుమతి తప్పనిసరి, వార్షికోత్సవాలు జరుపుకోవాలంటే లిఖితరూపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానాలు ఉండబోవని రాసివ్వడం అన్నీ ఇందులో చర్చకు వచ్చాయి.

బ్రిటీషాంధ్రలో గాంధీజి పిలుపుమేరకు ఉద్యమాలు జరుగుతూ ఉండటం వాటి ప్రభావం హైదరబాద్‌లో ఏమాత్రం లేకపోవడంతో ఒక దశలో స్వయంగా ఉద్యమాన్ని లేవదీద్దామనే ఆలోచన కూడా ‘రఘు’కు వస్తుంది. అయితే అనంతర కాలంలో గోవిందరావ్‌ నానల్‌ వంటి వారు హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌లో ‘సత్యాగ్రహం’ చేపట్టడంతో తాను కూడా అందులో చేరాలని భావిస్తాడు. ఇలాంటి సందర్భంలోనే తాను ఎమ్మే చదువుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమం ప్రారంభం కావడంతో దానికి ‘రఘు’నాయకత్వం వహించి విజయవంతంగా ఒక సంవత్సరం పాటు నడిపిస్తాడు.

చందాలు వసూలు చేసి విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగకుండా నాగపూర్‌లాంటి ప్రాంతాలకు పంపించి అక్కడ విద్యాబుద్ధులు చెప్పిస్తాడు. అలా నాగపూర్‌ వెళ్ళి చదివిన ఉస్మానియా విద్యార్థుల్లో పి.వి. నరసింహారావు లాంటి వారు కూడా ఉన్నారు. ఆనాటి విద్యార్థుల కష్టాలు, విద్యార్థినులచే వందేమాతర ఉద్యమం చేయించాలని ప్రయత్నించి విఫలమైన తీరు అన్నీ ఇందులో చోటు చేసుకున్నాయి.

స్వయంగా వందేమాతర ఉద్యమానికి నాయకత్వం వహించడంతో, ఎమ్మే ఇంగ్లీషు ఫస్ట్‌ క్లాస్‌లో పాసయినా ఏ కళాశాల వారు కూడా రఘుకు ఉద్యోగం ఇవ్వలేదు. ఆనాటికి ఈనాటికి పరిస్థితుల్లో పెద్దగా మార్పేమి లేదనడానికి ఇదే సూచన. ఈనాడు కూడా ఉద్యమాలు చేస్తున్న విద్యార్థుల్ని అక్రమ కేసుల పేరిట భయపెడుతూ, మీకు ఉద్యోగాలు రావు అని హెచ్చరిస్తున్నారు. ఈ దశలో రఘుకి హైదరాబాద్‌ సివిల్‌సర్వీసెస్‌ రాయడానికి అవకాశమున్నా నిర్దయగా ఉన్న ప్రభుత్వంలో పనిచేయడానికి ఆయనకు మనస్కరించలేదు. నిజానికి ఒక మధ్యతరగతి హైదరాబాదీ ‘సివిల్‌ సర్వీస్‌’ ఉద్యోగం చేయాలని కలగనడమే ఒక అభివృద్ధి సూచిక. ప్రధాన పాత్ర పద్మ తండ్రి కూడా డాక్టర్‌ కావడం కూడా చూస్తే ఇది ఆనాటి ఉన్నత మధ్యతరగతి జీవితాలను చిత్రించిందనడంలో అతిశయోక్తి లేదు. అవినీతి, ఆశ్రితపక్షపాతం కారణంగా యూనివర్సిటీకంతటికీ ప్రథముడిగా నిలిచినా లెక్చరర్‌ ఉద్యోగం కూడా రాని సందర్భంలో రఘు ఉద్యోగ ప్రయత్నాలే విరమించుకున్నాడు.

ఆనాడు తెలంగాణలో స్వతంత్రప్రతిపత్తితో పనిచేసే అవకాశమున్న ఏకైక వృత్తి న్యాయవాదం. అందుకే స్వాతంత్య్ర సమరయోధులందరూ లా చదివిన వారే. అడ్వకేట్లుగా రాణించిన వారే. ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించిన దాదాపు అందరూ న్యాయవాదులే కావడం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకే రఘు చివరికి లా చదివి అడ్వకేటుగా స్థిరపడాలని నిర్ణయించుకుంటాడు. స్వాతంతత్య్రోద్యమంలో పాల్గొన్నందుకు ఉద్యోగాలు రాని పరిస్థితే గాకుండా, జపాన్‌ సైనికులు మణిపూర్‌పై దాడి మొదలు, హైదరాబాద్‌ స్వతంత్ర ప్రతిపత్తి, సిడ్నీకాటన్‌ ఆయుధాల సరఫరా, రజాకార్లు ఇలా హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమంలోని అన్ని అంశాల గురించి ఈ నవల చర్చించింది. వందేమాతరం ఉద్యమంలో పాల్గొనే మహిళల గురించి ఒకవైపు, మరోవైపు సిగరెట్‌ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల్ని చిత్రించిండు.

స్త్రీల ఆధునిక జీవన దృశ్యం

మహిళలు కార్మికులుగా పనిచేయడమంటేనే అది అభివృద్ధికి చిహ్నం. ఎందుకంటే నగరాల్లో ఫ్యాక్టరీలు వెలువడడం, వారు తమ ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకోవడానికి స్వీయ సంపాదనపై ఆధారపడడమంటేనే మారుతున్న సమాజానికి ఆనవాలు. ఇదే విషయాన్ని రమణ పాత్ర గురించి రచయిత ఇలా చెప్పాడు. ‘‘… తాను 20వ శతాబ్దపు యువతిగా బ్రతకదలచింది. తనకాళ్ళపై తాను నిలబడదలచింది. నేడు స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం వుంటేనే గాని ఆమెకి సంఘంలో గౌరవం లేదు. తాను ఆర్థిక స్వాతంత్య్రం కోసం పాటు పడదలచింది’’. ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే స్త్రీకి సంఘంలో గౌరవం వుంటుందనే విషయాన్ని 60యేండ్ల కిందనే గుర్తించి ప్రచారం చేశాడంటే ఆయన దార్శనికత అర్థమవుతుంది. నవలల్లో స్త్రీ పాత్రలను తీర్చి దిద్దడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడని అనిపిస్తుంది. పదికి పైగా ఉన్న మహిళా పాత్రలను ఒకదానితో ఒకటి ఎక్కడా సారూప్యత లేకుండా భిన్నంగా మలిచాడు. వీటన్నింటిలోకి రుక్మిణి పాత్ర విశిష్టమైనది.

ఎనిమిదో ఏట పెళ్ళయి ఆర్నెల్లకే ‘మొగుడ్ని’ కోల్పోయిన రుక్మిణికి విధవా పునర్వివాహం గురించి, దాన్ని ఆంధ్రదేశంలో ప్రచారం చేసిన కందుకూరి వీరేశలింగం గురించీ, హైదరబాద్‌లో కూడా వాటిని చేసుకున్న వాళ్ళ గురించీ ‘బావ’ రఘు ద్వారా తెలుసుకుంది. నిజానికి సరోజిని నాయుడు` ముత్యాల గోవిందరాజుల వివాహం కందుకూరి వీరేశలింగం చేయించిన నాటినుంచే ఆయన గురించి తెలంగాణ వారికి కూడా కొంత తెలిసింది. ఆర్యసమాజ పద్ధతిలో వివాహం చేసుకుంటానని చెప్పిన ‘విశ్వేశ్వరరావు’ తుదకు డొక్కలో తన్ని మానవ మృగంలా తనని ఆక్రమించుకున్నా ఏమిజేయలేని స్థితికి చేరుకుంటుంది. నమ్మి విశ్వేశ్వరరావుతో వచ్చినందుకు మానంతో పాటు కంటె, గొలుసు కూడా అర్పించుకుంది. ఇలాంటి అభాగ్యురాళ్లు అప్పటికీ, ఇప్పటికీ మన కండ్లముందు కనబడుతూనే ఉంటారు. అయితే వారి పట్ల సంవేదనతో, సానుభూతితో, సాంత్వనతో రాసిన వాళ్ళు అరుదు. ఆ అరుదైన ఘట్టానికి ‘యుగసంధి’లో భాస్కరభట్ల జీవం పోసిండు.

చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో ‘విధవ’ అయిన రుక్మిణి లంపెన్‌ ‘విశ్వేశ్వరరావు’ చేతిలో బలయిన తీరు. విశ్వేశ్వరరావు లైంగిక వాంఛను తీర్చడానికి అనుభవించిన హింసను నవలాకర్త భాస్కరభట్ల కృష్ణారావు మనస్సుల్ని కదిలించే విధంగా చిత్రిక గట్టిండు. ఈ నవల తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులను చిత్రిక గట్టాయి. తెలంగాణలో జరిగిన ఉద్యమాలను, భాష, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలను చర్చించాయి. భిన్న దృక్కోణాల్లో భిన్నమైన రీతిలో నవలలోని పాత్రలు సమాజాన్ని దర్శించాయి.

‘యుగసంధి’ నవల్లో ఈ భిన్నత్వాన్ని సహజసిద్ధంగా తీర్చిదిద్దిన పాత్ర రమణ. ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే స్త్రీకి గౌరవం దక్కుతుందని నమ్మి దాన్ని సాధించుకునేందుకు ఆత్మగౌరవంతో ముందడుగేసిన మహిళ రమణ. త్యాగం, ఆత్మగౌరవం, పట్టుదల, తిరుగుబాటు, అభ్యుదయ భావాలు అన్ని కలగలిపిన పాత్ర రమణ.ఇక పోతే ‘పద్మ’ పాత్రలో ఆనాడు ‘స్త్రీ’ స్వతంత్రంగా ఎదగడానికి తండ్రి తోడ్పాటు, దాన్ని దుర్వినియోగం కాకుండా ఆమె ఉపయోగించిన తీరు నవలలో ప్రస్తావనకు వస్తాయి. మనసులో ఉన్నది ఎదుటివారికి సూటిగా చెప్పే పాత్రగా పద్మని తీర్చాడు. రఘు డబ్బు తీసుకొని బాగా చదువుకున్నాడు. అదే డబ్బుని తీసుకోవడానికి కనీసం అప్పుగా కూడా తీసుకోవడానికి నిరాకరించి ‘రమణ’ తన ఆత్మగౌరవాన్ని చాటుకుంది.

రజాకార్ల రాజ్యంలో

ఇక్కడ రజాకార్ల గురించి కొంచెం విపులంగా చర్చించుకోవాలి. హైదరాబాద్‌పై పోలీసుచర్య జరిగిన నాడే రఘు`పద్మలకు కూతురు పుడుతుంది. ఆమె పేరు కళ్యాణి అని పెడతారు. లోక కళ్యాణం కోసం హైదరాబాద్‌పై పోలీసుచర్య జరిగింది కాబట్టి ఆ పేరు పెట్టారని రచయిత చెబుతాడు. అయితే తర్వాతి కాలంలో ఇది తప్పని రచయిత తెలుసుకొని ఉంటాడు. ఎందుకంటే అప్పటికప్పుడు రజాకార్ల దౌర్జన్యాలు, దుర్మార్గాలు మాత్రమే రచయితకి కనబడ్డాయి. నిజానికి 1948లో రజాకార్ల గురించి కాళోజి ‘నల్లగొండలో నాజీల కరాళ నృత్యం ఇంకెన్నాళ్ళు’ అని నిరసించాడు. అయితే 1969 వచ్చే సరికి రజాకార్లే నయం ఈ ఆధిపత్య ఆంధ్రులకన్నా అనే అభిప్రాయాన్ని వ్యక్తం జేసిండు. 1956లో సమైక్యవాదిగా ఉన్న కాళోజి 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటికి తెలంగాణవాదిగా మారిండు. దాశరథి 1964 నాటికి కొంత తెలంగాణ బాటపట్టిండు. ఇలా రజాకార్ల విషయంలో గానీ, తెలుగు భాష విషయంలో గానీ, పోలీసుచర్య విషయంలోగానీ అందరికీ ఎప్పటికీ ఒకే అభిప్రాయం లేదు. అది విషయపరిజ్ఞానంతో పాటు మారుతూ వచ్చింది. నిజానికి పోలీసుచర్య మూలంగా వేలాది కమ్యూనిస్టు వీరులు తెలంగాణలో పటేల్‌ సైన్యం చేతిలో హతులయ్యారు. నిజాం సైన్యం చేతిలో పదులు, వందల సంఖ్యలో కమ్యూనిస్టు నాయకులు/కార్యకర్తలు చనిపోతే అదే భారత ప్రభుత్వ సైన్యం చేతిలో ఒకవైపు వేలాది ముస్లింలు మరఠ్వాడా, హైదరాబాద్‌`కర్నాటక ప్రాంతాల్లో హతమయితే, మూడు వేలకు పైగా తెలంగాణ సాయుధ పోరాటవీరులు అమరులయ్యారు. ఇంతమందిని చంపి బలవంతంగా కైవసం చేసుకున్న హైదరాబాద్‌పై పోలీసుచర్య ఆక్షణంలో ‘లోకకళ్యాణం’ కోసం జరిగిందనే అభిప్రాయం కలిగి వుండవచ్చు.

అయితే దీన్ని మరింత లోతుగా విశ్లేషిస్తే హైదరాబాద్‌పై పోలీసుచర్య ఒక్క రాజ్యాధినేత ఉస్మాన్‌అలీఖాన్‌ని మాత్రమే మార్చింది. (ఇది కూడా పూర్తి నిజం కాదు. ఎందుకంటే 1956 వరకు హైదరాబాద్‌ రాష్ట్ర రాజ్‌ ప్రముఖ్‌ ఉస్మానలీఖానే) నిజానికి మిలిటరీ, ప్రజాస్వామ్యం పేరిట నియంతృత్వ పాలనను కొనసాగించింది. ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని అధికారుల్ని రుద్దింది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వెల్లోడి లాంటి అధికారులు ముఖ్యమంత్రులుగా చలామణి అయ్యారు. రజాకార్ల అణచివేత పేరిట వేలాది మంది కమ్యూనిస్టుల ప్రాణాలను హరించిన జె.ఎన్‌.చౌదరి సైన్యం హీరోలుగా వెలిగిపోయారు. ఇంత విషాదం దాగి ఉన్న హైదరాబాద్‌పై పోలీసుచర్యపై ఇప్పటికీ ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, మరాఠీ భాషల్లో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే పోలీసుచర్య, రజాకార్లపై 1948`56ల కాలంలో చేసిన వ్యాఖ్యానంలో కొన్ని ఖాళీలున్నాయి. కొన్ని మార్పులున్నాయి. మరి కొన్ని చేర్పులున్నాయి. ఇవన్నీ మేళవించి ఆలోచిస్తే గానీ అసలు విషయం అర్థం కాదు. ఇట్లా కొత్త సమాచారం అందుబాటులోకి రావడం మూలంగా భాస్కరభట్ల కృష్ణారావు వ్యక్తపరచిన అభిప్రాయాల్లో కొన్ని ఖాళీలున్నాయి. వాటిని పూరించే పని ఇప్పుడు జరుగుతోంది.

60 యేండ్ల కాలంలో రజాకార్ల విషయమై ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజాకార్లలో కేవలం ముస్లింలే గాకుండా దొరలు, దేశ్‌ముఖ్‌లు, దళిత, బీసీలు కూడా ఉన్నారనే విషయం రూఢీ అయింది. ముస్లిం మతంలోకి మారిన వారు కూడా చాలామంది దళితులే అనే విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రజాకార్ల అణచివేత పేరిట వేలాదిమందిని భారతసైన్యం ఊచకోత కోసిందనే విషయం ప్రభుత్వం నియమించిన కమిటీలే నిర్ధారించాయి. అంతేగాకుండా హిందూత్వవాదులు ప్రచారం చేసినట్లుగా ఈ రజాకార్లకు నిజాం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందేది కాదు. అందువల్లనే వాళ్ళు నవలలోని పద్మ తండ్రి దేశ్‌ముఖ్‌ ఆంజనేయుల్ని కూడా డబ్బులివ్వమని డిమాండ్‌ చేస్తారు.

అలాగే సిగరెట్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ రషీద్‌ని కూడా డబ్బులు డిమాండ్‌ చేస్తారు. అంతేగాకుండా రుక్మిణిని మత మార్పిడి చేయించాలని కూడా హెచ్చరిస్తారు. దీనికి రషీద్‌ తిరస్కరిస్తూ నేను జాతీయవాదిని రుక్మిణిని మతం మార్చుకొమ్మని చెప్పేది లేదని తెగేసి చెబుతాడు. తెగేసి చెప్పినందుకు గాకుండా అడిగిన డబ్బు ఇవ్వనందుకే ఆగ్రహంతో రజాకార్లు రషీద్‌ని కూడా చంపేస్తారు. అంటే రజాకార్లకు మతంతో సంబంధంలేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తమ పబ్బం గడుపుకునేందుకే ముస్లింలీగ్‌ రాజకీయాల్ని హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి బహద్దూర్‌ యార్‌జంగ్‌ ఇత్తెహాదుల్‌ పార్టీని ఏర్పాటు చేసిండు. ఇట్లాంటి సందర్భంలో మజ్లిస్‌పార్టీ, మతతత్వాన్ని బాహాటంగా ప్రచారం చేసిన కాసిం రజ్వీ చర్యల్ని తప్పకుండా ఖండిరచాల్సిందే. అయితే ఇక్కడ ముస్లింలందరూ కాసిం రజ్వీ అనుచరులే అన్న రీతిలో ఇప్పటికీ కొన్ని సంస్థలు, పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. వాటిని అడ్డుకోవాలంటే లేదా వారి ఆలోచనల్లోని డొల్ల తనాన్ని బయటపెట్టాలంటే ఇందులోని రషీద్‌ పాత్ర, రజాకార్ల చర్యల్ని రెండిటినీ జమిలిగా విశ్లేషించాల్సి ఉంటుంది. నగరానికి జమీందార్లు, దేశ్‌ముఖ్‌ల వలస వారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం కూడా ఈ న వల ద్వారా మనకు తెలుస్తాయి. వెలమ సామాజిక వర్గం అప్పటికే హైదరాబాద్‌ చేరుకోవడం తమ పిల్లల్ని చదివించడం, వారికి పూర్తి స్వేచ్ఛనివ్వడం కూడా అర్థమవుతుంది.