ఒక రైతులా, ఒక యానాదిలా…కేశవ రెడ్డి!

రెండు నెలల కిందట బోధన్ లో స.వెం. రమేశ్ ‘కతలగంప’, శౌరీలు గారి ‘సిలువగుడి కతలు’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తిరుపతి నుంచి మధురాంతకం నరేంద్ర, నేనూ, విష్ణుప్రియా వెళ్ళాం. ముందు రోజు కుంతల జలపాతం ప్రయాణం. బుల్లి బస్సులో గలగలా ఉన్నారు మనుషులంతా. పచ్చని చిక్కని అడివిలో ప్రయాణం హాయిగా సాగింది. దారిలో నిర్మల్ లో బొమ్మల కోసం దిగాం. డాక్టర్ కేశవరెడ్డి నిజామాబాద్ లోనే కదా ఉండేది, ఇంత దూరం వచ్చి కలవకుండా ఎలా?

అలసిపోయిన చాలా మంది బోధన్ వెళ్ళిపోయారు. నేనూ, నరేంద్ర, సడ్లపల్లి చిదంబరరెడ్డి, నంద్యాల శ్రీనివాసులురెడ్డి, బత్తుల ప్రసాద్, గొరుసు జగదీశ్వరరెడ్డి, శిరంశెట్టి కాంతారావు నిజామాబాద్ వెళ్ళాల్సిందే అని పట్టుబట్టాం. విష్ణు తనూ వస్తానంది. బస్సులోంచి మేం మాత్రం ఒక కారులోకి మారాం. ఫోన్ లో అడ్రస్ కనుక్కుని వెతుక్కుంటూ వెళ్ళాం . చదవడమే తప్ప నేను అప్పటిదాకా కేశవరెడ్డిని చూడనేలేదు. ఉద్వేగభరితంగా పేజీల వెంట పరుగులు తీయించే అరుదైన తెలుగు రచయితని కలుసుకోబోతున్న ఉత్సాహం. ఏం మాట్లాడాలి?

స్నేహితుల మధ్య..

స్నేహితుల మధ్య..

మాలో చాలా మందికి ఆయనతో పరిచయం బానే ఉంది. మాటలు అవే దొర్లుతాయి. కరెంటు స్తంభం పక్కన కారు ఆగింది. పాత అపార్ట్ మెంట్..పాత ఇల్లు..కొంత దుమ్ముబారినట్టున్న అరలు..లోపల పాతబడిన పుస్తకాలు.. కుర్చీలో కేశవరెడ్డి. గళ్ళ లుంగీ, అరచొక్కా. పలచగా తెల్లని పోచల్లా తల మీద మిగిలిన వెంట్రుకలు.. ఎందుకో చూడగానే కొంచం దిగులుగా అనిపించింది. పొడి నవ్వుతో పలకరించారు. కొంచం మొహమాటంగా కనిపించారు. భార్యను పరిచయం చేశారు. ఇదంతా ఆయన స్వభావం.

అక్షరాల్లోనూ ఆయనేం ఆడంబరంగా ఉండరు. ఆయన రచనల్లోని ఒక పాత్ర లాగే కనిపించారు కేశవరెడ్డి నాకు. ఒక రైతు, ఒక యానాది, మనేదతో తనతో తనే మాట్లాడుకునే ఒక స్త్రీ. వీళ్ళంతా కేశవరెడ్డేనా?! బహుశా వీళ్ళలో చాలా పాళ్ళు ఆయనే కావచ్చు.

కేశవరెడ్డి పాత్రలు వెంటాడుతూ ఉండేది అందుకే. కథకీ, నవలకీ మధ్య ఎక్కడో ఒక గీత గీసుకుని రాసుకుంటూ పోయాడు ఆయన. చిత్తూరు జిల్లా తలపులపల్లె లో పుట్టి, ఈ పరిసరాల్లోనే పెరిగి, పాండిచ్చేరిలో చదువుకుని డాక్టరై, డిచ్ పల్లిలో వైద్యం చేసిన ఈయన మాటల్లో, వాక్యంలో ఈ ప్రయాణం ప్రభావం ఉంటుంది. ఇష్టంగా చదువుకున్న ఆంగ్ల రచనలు ఆయనను అంటిపెట్టుకునే ఉన్నాయి. పాత్రలు చిత్తూరు జిల్లా పల్లెలోనే ఉన్నా, కథా ఇక్కడే నడిచినా, నడకలో తేడా అందుకే అనిపిస్తుంది. కేశవరెడ్డి పుస్తకం తెరిస్తే, ఇంటర్ లో మధుబాబునో, ఇంకా ముందు జానపద కథలనో, ఇంకా కొంచం ముందు చందమామనో పట్టుకున్నట్టే.

ఎన్నడూ చూడకపోయినా ఆయన నన్ను గుర్తుపట్టారు. బిస్కెట్లు, టీలు, అందరికీ చాలినన్ని కుర్చీల కోసం వెతుక్కోవడం, దుమ్ము దులిపి, కడిగి కప్పుల్లో టీ అందించడం…ఎందుకో ఇష్టంగా అనిపించింది. నలుగురు వస్తే, ఒక స్టూలునో, కుర్చీనో, మంచాన్నో లాక్కుని సర్దుకుని కూర్చునే ఊళ్ళోని మా ఇల్లే ఇది. పరిసరాలు సహా ఆయనా, ఆమె కూడా పరిచయం లేనివాళ్ళలా కనిపించలేదు.

మాటలు నడిచేకొద్దీ ఆయన ఇంకా దగ్గరవుతున్నట్టనిపించింది. పొడి మాటలే గానీ, చతురమైన వాడే! వైద్యం వల్ల తల ఇట్లా తయారైందని చెప్పారు. ఆ మాటల్లో ఎక్కడో ఒక నిర్వేదపు గీర. ఇంతలో డాక్టర్ నక్కా విజయరామిరెడ్డి వచ్చారు. కేశవరెడ్డి మీద ఎంతో శ్రద్ధ. కొడుకంత బాధ్యతగా కనిపించాడాయన. ఒక గంట గడిపి బోధన్ కి బయలు దేరాం గానీ, దిగులు దిగనేలేదు. పుస్తకాల సభకి ఆయన రానేలేదు.
ఫిబ్రవరి 13న ఉదయం నరేంద్ర ఫోన్.. మునిసుందరం గారు చనిపోయారని. కోటకొమ్మల లేఅవుట్ ఇరుకు సందులోని ఆయన ఇంట్లోనే గాజుపెట్టెలో ఆయన. కాసేపు అక్కడే తచ్చాడి, ఆఫీసుకి రాగానే, మళ్ళీ నరేంద్ర ఫోన్..ఇంకో బ్యాడ్ న్యూస్ అంటూ.

ఒకే రోజు చిత్తూరు జిల్లా రచయితలు ఇద్దరూ వెళ్ళిపోయారు. ఒకరు ఇక్కడ. ఇంకొకరు నిజామాబాద్ లో, జ్ఞాపకాలుగా మారిపోయి.

-ఆర్. యం.ఉమా మహేశ్వర రావు 

దూకే జలపాతం చెప్పిన కథ – కలాపి

rm umamaheswararao‘కలాపి’. మన్నం సింధుమాధురి రాసిన కథ. ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రికలో అచ్చయిన కథ. కలాపి అంటే నెమలి. సింధుమాధురి మాత్రం నెమలి లాంటి కలాపి గురించి కథ రాయలేదు, జెర్రిగొడ్డు లాంటి కలాపి గురించి కథ రాసింది. ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్న కలాపి గురించి కథ రాసింది. ‘ఒక పాము నోట్లో నించీ ఇంకో పాము కోరల్లో ఇరుక్కుంటూ కొండలెక్కే’సాహసి గురించి రాసింది. కలాపికి ఎంతో ఇష్టమైన సాహస క్రీడ ఇది. ‘ఈ క్రీడ కలాపి శరీరానికే పరిమితం.’ ఈ క్రీడా వినోద యాత్రలో కలాపి పొందినదేమిటో, పోగొట్టుకున్నదేమిటో కథాఖరులో కలాపి చేతే చెప్పిస్తుంది సింధుమాధురి.

ఇట్లాంటి కథాంశంతో రాయడం ఒక సాహసమే. రాసి ఒప్పించడమూ, మెప్పించడమూ అంత సులువేమీ కాదు. ఐదుగురిని పెళ్ళి  చేసుకున్న ద్రౌపదిని అమోదించడానికి పవిత్రతనీ, దైవత్వాన్నీ కవచాలుగా వాడుకోక తప్పడంలేదు ఇప్పటికీ. మరి, మన మధ్య ఉన్న స్త్రీ ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని భరించగలమా? భరించి సహించగలమా? సహించి ఆమోదించగలమా? ఆమోదనీయమైన పరిస్థితులనూ, కారణాలనూ వివరించగలగాలి. లేకుంటే ఎంత సమర్థంగా రాసినా, ఎంత గొప్ప శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించినా కథ తిరస్కరణకు గురవుతుంది.

కలాపి కథలో ఆమోదనీయత కోసం రచయిత చేసిన ప్రయత్నం సఫలమైంది. జాగ్రత్తగా కథను చదివితే అసలు రచయిత ఉద్దేశ్యం కలాపి జీవితాన్ని పాఠకుల ముందుంచడమే అనిపిస్తుంది. బహుశా నిజజీవితంలో రచయితకు పరిచయమున్న పాత్ర కలాపి. యథాతథ చిత్రణ మాత్రమే కథ కాదు. కథను మలచుకోవాలి.  మలచుకోవడంలో మెలకువ ఉండాలి. ఈ మెలకువ తోనే  సింధుమాధురి మరణశయ్య మీద ఉన్న కలాపి చేత ఇలా చెప్పించింది..

“ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాను. ప్రపంచమంతా తిరిగాను. సంపదతో దొరికే ప్రతి సుఖమూ అనుభవించాను. అయినా ఎప్పుడూ ఏదో అన్వేషణ. ఎక్కడా స్వాంతన లేదు. ఎప్పుడూ సంతృప్తి లభించలేదు. ఏ మగవాడి దగ్గరా నాకు కావలసింది దొరకలేదు. నాకు కావలసినది నాలోనే ఉంది. నాకు నేనే దాన్ని ఇచ్చుకోగలను. మరెవ్వరికీ సాధ్యం కాదని తెలుసుకున్నాను. జీవితంలోకి మనుషులు వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. మనకి మనమే శాశ్వతం. అయామ్ వాట్ అయాం. ఈ వెతుకులాటలో నాకు మిగిలింది అనుభవాలు మాత్రమే.”

కలాపి పాతికేళ్ళ అన్వేషణే ఈ కథ. కొండల మీద కుండపోతగా కురిసిన వానకి దూకే జలపాతం కలాపి. రాళ్ళని ఒరుసుకుంటూ, చెట్లని వేళ్ళు సహా పెకలించుకుంటూ, మట్టీ నీళ్ళూ ఒక్కటై పోయి సుడులు తిరుగుతూ … ఏ నదిలోనో, సముద్రంలోనో కలిసేక గానీ నెమ్మదించదు. ఈ వడిలో, ఈ దూకుడులో తనకు అయిన గాయాలు గానీ, తను చేస్తున్న గాయాలు గానీ  గుర్తుకు రావు. బాధ తెలియదు. ఈ పరుగులో , ఈ ప్రవాహంలో, ఈ ప్రయాణంలో తన ఉనికే ప్రధానం. ఎన్ని హొయలు పోయినా ఈ జడిలోనే, ఈ ప్రాయపు పడిలోనే. అనంత సాగరంలో కలిసిపోయాక తనకిక ఉనికి లేదు. విడి అస్తిత్వం లేదు. అప్పుడిక అన్వేషణ బయట కాదు, లోపల. లోలోపల, తనలోపల.

ఇరవై రెండేళ్ళ కలాపికీ, హంపీ దగ్గరలో ఉండే పదేళ్ళ అమ్మాయికీ స్నేహం. బహుశా ఈ పదేళ్ళ అమ్మాయి రచయిత. పాతికేళ్ళు దాటాక ఈ అమ్మాయి కలాపి కథ చెబుతుంది. ఈ అమ్మాయికి కలాపి అంటే వెర్రి వ్యామోహం. కలాపి రంగూ, రూపం, నడకా, నడతా ప్రతిదీ ఇష్టమే.  కలాపి నల్లని పిల్ల. ఆ నలుపు  భయపడేంత ఇష్టం ఈ పదేళ్ళ పిల్లకి. ‘మిగలపండిన నేరేడు కాయ ఫఠ్ మని కిందపడి నలిగినపుడు కనిపిస్తుందే..ఆ రంగు’అని కలాపి ఒంటి నలుపుని వర్ణిస్తుంది. అయితే, అదీ తృప్తినివ్వదు. ‘నెమలి నలుపు’ అంటుంది కాసేపు. కాదు కాదు, ‘మంచి నల్ల ఓండ్రు’ అంటుంది. ‘కారు మేఘపు నీలం కలిసిన రంగు’అనీ అంటుంది. అంతటితోనూ ఆగదు. ‘ అమ్మమ్మ పట్టిన కాటుక పళ్ళెం తిరగేసి, ఆ మసిలో పచ్చకర్పూరం, తెల్ల వెన్న వేసి తాటాకుతో రంగరిస్తే వచ్చే పేస్టల్ బ్లాక్’అంటుందా..దాన్నీ నిర్ధారించదు. ‘ఏ చిత్రకారుడు ఎన్ని రంగులు కలిపినా ఆమె ఒంటి రంగుని తేలేరు’అని తేల్చేస్తుంది.

కలాపి ఒంటి మెరుపుని ఎట్లా వర్ణిస్తుందో చూడండి, ‘దొంగతనానికి బయలుదేరే ముందు గాడిద రక్తం తాగి బాగా పరిగెత్తి, అది ఒంట్లో ఇంకినాక, ఆముదం రాసుకుని తిరిగే దొంగల దేహం మీద మెరిసే నూనె మెరుపు’. బాబోయ్!  కలాపి ‘అవయవాల్లో చంద్ర చెక్క పచ్చడి బండ గట్టిదనం, చూపులో చుర్రుమని కాలే చురుకు’. ఇంక కలాపి ప్రేమలో పడకుండా కథ చదివే పాఠకులని ఆపడం ఎవరితరం?

యౌవనంలో ఉండే అందరమ్మాయిల్లాగే కలాపికీ అద్దం అంటే ఎంతో ఇష్టం. ‘అద్దంలో తనని తాను ప్రేమించుకుంటూ గంటలు గడపగలదు. తనలో తనను అన్వేషించుకుంటున్నట్టు, తనకి కావలసినది ఏదో అందులోని తనలో దాచుకున్నట్టు వెతుక్కుంటది’.

కలాపి సంపన్న కుటుంబంలో పుట్టింది. తండ్రి, ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న వాడు. కలాపికి కొండలెక్కడం అంటే ఇష్టం. తుంగభద్ర ప్రేమికురాలు. నడుముకి తాడు కట్టుకుని ఒడుపుగా రాళ్ళను పట్టుకుంటూ బల్లిలా బండలూ గుట్టలూ ఎక్కేది. ఈ పనిలో అంతు తెలియని ఆనందం ఆమెకి. చెమటలు కారే శ్రమా, శ్రమ వల్ల కలిగే అలసటా, అలసట నుంచి లభించే ఆనందమూ కలాపిని తరచూ హంపీకి రప్పించేవి.  వచ్చిన ప్రతిసారీ కలాపి కొత్త అందాలతో కనిపించేది.

యూనివర్శిటీ అధ్యాపకుడైన భర్తతో విడిపోయి, క్రికెటర్ ని పెళ్ళాడిన కలాపి‘కుబుసం విడిచిన తాచులా’కనిపించింది.  బరోడా రాజ కుటుంబీకుడి పరిచయం తర్వాత వింత ఆభరణాలు ధరించి ఆమె పర్వతారోహణకి వచ్చింది. ఇప్పుడామె ‘కళ్ళలో రేడియం కాంతి. శరీరంలో జర్రిగొడ్డు వేగం’.తుంగభద్ర ఇసుకలో తడి కాళ్ళతో ‘వర్ష రుతువు ముందు పురి విప్పి ఆడే నెమలిలా’ఉంది.  తెల్లగా, పొడవుగా, స్టయిల్ గా పాత హిందీ సినిమా హీరోలా ఉన్న బరోడా రాజకుటుంబీకుడితో కలసి తుంగభద్రకి వచ్చిన కలాపి ‘ మిన్నాగులాగా పరుషపు చలాకీతో’ ఉంది. ఆ తర్వాత జపాన్ రాజకుటుంబానికి సన్నిహితుడిని ఆమె పెళ్ళి చేసుకుంది. దాదాపు పాతికేళ్ళ ప్రయాణం ఇది. ఎందరో మనుషులు, ఎన్నో ఆభరణాలు, ఎంతో సంపద. ఆఖరికి అనారోగ్యం. కలాపి శరీర సౌందర్యం మీద కలాపికే కాదు, కలాపి కథ చెప్పిన స్నేహితురాలికీ ఎంత మోహమంటే, చర్మపు కేన్సర్ తో ఒళ్ళంతా గాయాలతో ఉన్న కలాపి, ‘ఒంటి నిండా సూర్య కాంతమణులు ధరించినట్టుగా’కనిపించింది .

కలాపి, కొండలెక్కే సాహసి. శ్రీమంతుడి కూతురు. ఆధునిక స్త్రీ. అందమైనది. అందాన్ని ప్రేమించేది. కలాపి ఆరాధించే సౌంధర్యం పురాతనమైనది. తుంగభద్రా, హంపీ నగరమూ, రాజులు, రాణులు తిరుగాడిన ప్రదేశాలూ, శిధిలాలూ, శిల్పాలూ, రాళ్ళూ, గుట్టలూ..లోలోపలి పొరల్లో దాగిన పురాతనత్వం ఏదో ఆమెను మేల్కొలిపేది. హంపి ఆమె ఊరు కాదు, అక్కడ పుట్టలేదు. అక్కడ పెరగలేదు. అయినా తెలియని బంధమేదో పెనవేసుకుపోయింది.

యూనివర్శిటీ అధ్యాపకుడు, క్రికెటర్, బరోడా రాజకుటుంబం, జపాన్ సంపన్న జీవితం, ఎక్కడున్నా, ఏ దేశాలు తిరిగినా మళ్ళీ మళ్ళీ అక్కడకి రావలసిందే. అక్కడి గుట్టల్లో, గుహల్లో పడి దేన్నో వెతుక్కుంటున్నట్టుగా తిరుగాడవలసిందే. అలసట కలిగితే, అమ్మమ్మనో, నాయనమ్మనో, తాతమ్మనో గుర్తు చేసుకుంటుంది. వాళ్ళతో గడిపిన క్షణాలు ఆమెకి కొత్త శక్తినిస్తాయి. కొండలెక్కిన ప్రతిసారీ అమెకి కలిగే అనుభవం కూడా అదే. పురాతనత్వం నుంచి పునరుత్తేజం. వెతకడమే తప్ప, దేని కోసం వెతుకుతున్నదో ఆమెకీ తెలియదు. అయినా, వెతకడంలోని ఆనందం మాత్రం ఆమెకి అందేది. ఎందరు మనుషులు, ఎన్నెన్ని జీవితాలు, ఎన్ని ప్రదేశాలు..? ఆమె వెతకని చోటు ఏది? వెలుగు వెంటా, చీకటి వెంటా పడి పరుగెత్తింది.

కలాపి అన్వేషణ దేని కోసం?. మిల మిల మెరిసే శరీరం, ఖణ ఖణ మండే వయస్సు, గలగల పారే స్వభావం. ఉరకలెత్తే ఉత్సాహం. పగడాలు, ముత్యాలు, వజ్రాలు, అంతులేని సంపద వైపు పరుగులు . కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు, చేతులు సాచి పిలిచే కొత్త  ప్రపంచాలు. కలాపి పరుగులో మిడిసిపాటు లేదు, ఇంకా ఇంకా ఏదో కావాలనే తపన తప్ప. ఒక రాయి మీద నుంచి ఇంకో రాయి మీదకి ఎగబాకినట్టే, ఒక మగవాడి మీదుగా ఇంకో మగవాడిని అందుకుంది కలాపి.

]ఈ ప్రయత్నంలో అలసటలేదు, ఆనందం తప్ప. కలాపి ప్రయాణంలో తప్పటడుగులుండవచ్చు, తప్పుల్లేవు. ఘర్షణలుండవచ్చు, పశ్చాత్తాపం లేదు. ప్రయాణం ఎక్కడికి అని అడగగలం గానీ, ప్రయాణమే ఎందుకూ అనడగలేం కదా! ప్రయాణంలో మరణం కూడా ఒక సంఘటనే. మరణంతో కలాపి ప్రయాణం ఆగలేదు. యుద్ధగాయాలతో ఉన్న దేశానికి తను చేయాల్సిందేమిటో కలాపి గుర్తించింది. చేయగలిగింది చేయడం మొదలు పెట్టింది.[/note

పడిలేచిన పరుగుల  ప్రయాణంలోనే కలాపికి తాను వెతుకుతున్నదేదో దొరికింది. అమూల్యమైన నిధి అది.   ఆ నిధి ఆమెకు రాజకుటుంబాల్లో దొరకలేదు. ఆమె కోసం తపించిన మగవాళ్ళ ప్రేమలోనూ లభించలేదు. దిగిన లోయలూ,ఎక్కిన కొండల్లోనూ కనిపిపంచ లేదు. పొందిన సుఖాలు, ధరించిన ఆభరణాలు..ఊహూ..ఎక్కడా జాడ లేదు.  అద్భుతమైన ఆ నిధి అచ్చంగా ఆమె లోనే ఉంది. అప్పటిదాకా తాను వెతుకులాడింది తనలో దాగిన తన కోసమే. తనకు తాను దొరికిపోయాక, తన ప్రయాణం కొనసాగుతుందనే నమ్మకం కుదిరాక కలాపి కన్ను మూసింది ప్రశాంతంగా, తన నేస్తం లడ్డూ గొంతు మీద పుట్టుమచ్చగా మారిపోయి.

-------------------

కలాపి

sindhu2( resize)"పెళ్ళితో పనిలేని ప్రేమలున్న దగ్గర ప్రేమతో! పనిలేని పెళ్ళిళ్ళు ఉండకూడదా''
ఎందుకో ఈ వాక్యాలు నన్నెప్పుడూ ఆకర్షిస్తాయి. ఆలోచింపచేస్తాయి. దానిలో ఉన్న లోతయిన భావం, బాధ  ఎవరికి, ఎందుకు, ఎప్పుడు, ఏ సందర్భంలో కలిగాయో అడగాలనిపిస్తుంది. కానీ  ఎవరి వాక్యాలో నాకు తెలీదు.

ఈ మాటలు నా గదిలో గోడ మీద వేలాడుతూ ఉంటాయి. వీటిని చదివి కొందరు నవ్వుతారు. ముఖం చిట్లిస్తారు అదోలా.

ఓ రోజు ఉదయం కోదండరామాలయం దగ్గర పుట్టి ఎక్కి, తుంగభద్ర దాటాను. మీన మండపం మీదుగా రాళ్ళు దాటుకుంటూ 'మొల్ల మందిరం' దగ్గర కూర్చున్నాను. జనం పెద్దగా తిరగని చోటు అది. అంత పొద్దున్నే అసలెవరూ ఉండరు. నిశ్శబ్దంగా అందమయిన సూర్యోదయాన్ని చూడచ్చు.

ఫ్లాస్క్‌లో తెచ్చుకున్న తులసి టీని కప్పులో పోసుకుని, ప్రకృతితో కలిపి చప్పరిస్తున్నా. ఇంతలో నదిలోంచి పడవవాడి కేకలు వినిపించాయి. కొద్దిగా ఇవతలకి వచ్చి ఏంటని అడిగా.

"అక్కా మీ తమ్ముడూ ఇంకొకాయన నీ కోసం చూస్తన్నారు. నువ్వు కనపడితే రమ్మన్నారు. నువ్వు మొల్ల మందిరం దగ్గిర ఉంటావని అరస్తన్నా'' అంటూ నేనున్న గట్టుకి వచ్చాడు.
"సరే పద ''అని అతని పుట్టి ఎక్కా.

వడ్డుకి వచ్చాక చూస్తే, తమ్ముడూ అతని పక్కన ఇంకొక వ్యక్తి. అతనిని ఎప్పుడూ చూడలా. భారతీయుడిలా కూడా లేదు. సింహళీయుడి పోలికలు ఉన్నాయి. గుట్ట మీద ఉన్న నా కళాగృహ ( కవితల, కథల, చిత్రాల పూరిల్లు) కి నా వెంట వాళ్ళిద్దరూ వచ్చారు.  కూర్చున్నాక ఎవరూ అని తమ్ముడి వంక చూసి నొసలు ముడిచాను.

"శ్రీలంక నించీ వచ్చాడంట. కలాపి అక్క పంపిందంట. ఏమీ చెప్పటల్లేదు. నువ్వు కావాలి, మాట్లాడాలి అన్నాడు. తీసుకుని వచ్చా'' అని బయటకి వెళ్ళిపోయాడు.

కలాపి పంపిందనగానే సంతోషం వేసింది. అతిథులకి ఇచ్చే పాక చూపించి, "స్నానం కానిచ్చి రండి కాఫీ, టిఫిను అయినాక మాట్లాడదాం'' అని వంటమనిషికి పని పురమాయించాను.
కానీ అతను మాత్రం "ముందు ఈ ఉత్తరం  చదవండి '' అంటూ ఉత్తరంతో పాటూ ఒక ప్యాకెట్‌ నా చేతిలో పెట్టి స్నానాల గదిలోకి వెళ్ళిపోయాడు.

ఉత్తరం చేతిలోకి తీసుకున్నా.  అంత అందంగా లేని చేతి రాత. గజిబిజి అక్షరాలు.  ఎర్ర రంగు కాగితం మీద వణికి ఒలికినట్టున్నయ్యి.

కొలంబో,
చిన్ననాటి చిరునేస్తం లడ్డూకి,

కలాపి రాసే ఆఖరి ఉత్తరం. ఏంటి మధ్యలో పదేళ్ళు మాయమయ్యి అఖరి ఉత్తరం అంటంది అనుకుంటున్నావా. జీవితంలో, జీవనంలో పోరాడి పోరాడి అలసిపోయాను. దేని కోసమయితే అన్వేషించానో అది ఎవరిలోనూ దొరకలేదు. నేను నమ్మిన మనషుల్లోనే కాదు, నాకు ఇష్టమైన అద్దంలోనూ  కనిపించ లేదు.  చర్మపు క్యాన్సర్‌ అన్నారు. ఇంక బహుశా జీవితం నెలలే అనుకుంటాను. ఎందుకో నిన్ను చూడాలని పిస్తంది. నీ అల్లరి, తుంగభద్ర, మీ అమ్మమ్మ, నాగమ్మ కథలు, బంగ్లా శరణార్థులు, పది రూపాయలకి తెల్లవార్లు నడిపే పుట్టిలు, నీ బ్రహ్మజెముడు బూరల సంగీతం, తోట, దబ్బనం, పురికొసతో 'గయాన్‌'గాడు రెండు సంవత్సరాలు కష్టపడి  కుట్టిన నీ బొమ్మ, గడ్డి పీచులతో నువ్వు స్కర్టులు చేసి ఏమీ తెలియని తెల్లవాళ్ళకి అమ్మి వాళ్ళతో అవి కట్టిచ్చి డాన్సులు చేయించటం, యోగా నేర్పుతానని పది డాలర్లు తీసుకుని నెల రోజుల్లో నాలుగే ఆసనాలు తిరగా బోర్లా నేర్పటం.. ఇవన్నీ నీ సమక్షంలో గుర్తు చేసుకోవాలనిపిస్తంది. నా ఆఖరి కోరిక ఏమిటంటే నేను పంపిన ఇతనితో నీవు కొలంబో రావాలని. చిగుళ్ళు కనిపించేలా పళ్లు బయటపెట్టి నవ్వే నీ నవ్వుని చూడాలని. నువ్వు వచ్చి నన్ను ప్రశాంతంగా సాగనంపుతావని ఆశగా చూస్తున్నాను.
వచ్చేటప్పుడు మంచి అద్దం తీసుకుని రా.

ఇట్లు నీ త్రాచు పాము నేస్తం
కలాపి

ఉత్తరం చదవటం అయ్యేటప్పటికి నీటి చుక్క బరువుకి కనురెప్పలు వణికాయి. నన్ను వదిలి వెళ్ళిపోయిన అమ్మ , నాయనమ్మ గుర్తొచ్చారు. ఇక ఇప్పుడు ఏదో చెయ్యాలి. దూకక ముందే ఈ దుఃఖానికి కట్ట కట్టాలి, మూటకట్టి మూలకి విసరాలి. గంటలో వస్తానని పనమ్మాయితో  చెప్పి గుట్ట దిగి  రోడ్డు మీద పడ్డాను. నడక పరుగుగా మారింది. పరుగు.. పరుగు.. పరుగు.. కన్నీరు మొత్తం చెమటలా కారి బట్టలన్నీ తడిచిపోయాయి. ఓ గంటన్నర పరిగెత్తి, బట్టల మీద ఉప్పు చారికలు తేలాక, నా నాలుక నాకే జిగురుగా తగిలినాక ఇక ఏమ్రాతం పరుగెత్త లేను అనుకున్నాక.. దబ్‌ మని తుంగభద్రలో దూకి, ఓ గంట సేపు నా ప్రియ నేస్తంతో దుఖాన్ని పంచుకున్నాను. నా కన్నీటిని కడిగి  తనలో కలిపేసుకుని నన్ను తేలికపరిచింది దుంగభద్ర. తడి గుడ్డలతోనే ఇంటికొచ్చి మంచం పైన అలసటగా అడ్డంగా పడ్డాను.

...

కలాపిని తలుచుకుంటే కళ్ళూ మెదడూ ఉత్తేజితం అవుతాయి. అమె రంగూ, రూపూ, కళ్ళూ అన్నీ నలుపే. ఆమె క్రిష్ణ. బరువయినది. మిగలపండిన నేరేడు కాయ ఫఠ్‌ మని కిందపడి నలిగినపుడు కనిపిస్తుందే.. రంగు, ఊహూ..సరీగ్గా అదీ కాదనుకుంటా, నలుపు పేరులా నెమలి నలుపు, కాదు..అదీ కాదు, మంచి నల్ల ఒండ్రు, కారు మేఘపు నీలం కలిసిన రంగా..!? అమ్మమ్మ పట్టిన కాటుక పళ్ళెం తిరగేసి ఆ మసిలో పచ్చకర్పూం, తెల్లవెన్న వేసి తాటాకుతో రంగరిస్తే వచ్చే పేస్టల్‌ బ్లాక్‌ రంగా..?  ఏ చిత్రకారుడు ఎన్ని రంగులు కలిపినా ఆమె ఒంటి రంగుని తేలేరు. రంగ రంగా... అది రంగా.. కాదు నేనిక వర్ణించలేను.

కలాపి నాకు బంధువు కాదు, నా వయసుకు తగ్గ స్నేహితురాలూ కాదు. కానీ నాకు బాగా దగ్గర మనిషి.

కలాపి  మా అన్నయ్య నేస్తం. నన్ను పెంచుకున్న అమ్మకి అక్క కొడుకు అతను.  ఇద్దరూ బడిలో, కాలేజీలో కలిసి చదివారు.మొదట్లో కలాపిని చూసి భయం వేసేది. కొట్టేదా, తిట్టేదా అంటే అదేం కాదు. ఆమె అందానికి భయపడ్డాను. నిజం.. నలుపులో ఇంత అందం ఉంటందా అని భయపడ్డాను. నల్లని కళ్ళు, గోధుమ రంగు కనుపాపలు, దాని చుట్టూ నల్లటి చారలాంటి వలయం, ముక్కు కొన మీద పాయలాంటి గీత, అల్లుకుపోయి కలిసిపోయిన కనుబొమలు, పిరుదుల మీదుగా మోకాళ్ళు దాటిన జుట్టు, నల్లటి, మెత్తటి, పట్టు తప్పని ఆ జుట్టుని ఎప్పుడూ  పట్టి ఉంచే చేతి వేళ్ళ కళాత్మక కదలిక. తొలి పకలరింపులోనే తియ్యగా నవ్వుతుంది కలాపి. దొంగతనానికి బయలుదేరే ముందు గాడిద రక్తం తాగి బాగా పరిగెత్తి అది ఒంట్లో ఇంకినాక, ఆముదం రాసుకుని తిరిగే దొంగల దేహం మీద మెరిసే నూనె మెరుపు, కలాపి ఒంటి మెరుపు. చెంద్రచెక్క పచ్చడి బండ గట్టితనం ఆమె శరీర అవయవాల్లో. ఆకారంలో ఠీవి, చూపులో చుర్రుమని కాలే చురుకు.

ఒక్క చూపు చూసిందంటే నిమషంలో ఎదుటి వాళ్ళని చదివేసుద్ది. నీ ఆలోచనలు నేను పసిగట్టాను అన్నట్టుంటాయి ఆ చూపులు. కలాపికి  అద్దం అంటే ఎంతో ఇష్టం. నిద్దర లెగవటం అద్దంలో తనని తాను చూసుకోవటంతోనే రోజు మొదలు పెడతది. ముందు నన్ను చూసుకుని నేను తృప్తి పడితే, ఇతరులకి మనని చూసి తృప్తి కలుగుతుంది అనేది. ఆమె నా కిష్టమయిన  నేస్తం.

కలాపి అందం, మనుషులకే కాదు ప్రకృతికి కూడా నచ్చుతుంది.

****

ఓ రోజు పొద్దున్నే అమ్మమ్మ లేపితే లెగిసి పాల దాలి దగ్గిర కూచ్చుని చలికాసుకుంటున్నా. మొఖం కడక్కుండానే కుంపటి దగ్గిర చేరానని అమ్మమ్మ సణుగుతోంది. పుల్లతో పిడక కచ్చికిలని కెలుకుతున్నా. కుంపట్లో నించి వచ్చే సన్నటి పొగ మొహానికి తగలకుండా అటూ, ఇటూ వంగుతున్నా.
"ఏయ్‌ లడ్డూ" అన్న పిలుపు.
అన్న అట్టాగే పిలుత్తాడు.
"ఎప్పుడొచ్చా"
"ఇప్పుడే'', పక్కనే పెద్ద బ్యాగు,పక్కనే ఇంకొక పెట్టెతో కలాపి. చూడగానే ఎక్కడ లేని సంతోషం.
"నువ్వు కూడా వచ్చావా? ఎన్ని రోజులుంటావు? రోజూ మనం రాళ్ళెక్కొచ్చు, గుట్టలెక్కొచ్చు. అన్నా.
ఇంతలో  మా పనిమనిషి నాగమ్మ "ఆ కళ్ళాపి అమ్మా యొచ్చిందమ్మా''అని ఇంట్లో అందరూ వినేలా అరిచి చెప్పింది.।
"ఏయ్‌ కళ్ళాపి కాదు, ముగ్గూ కాదు.. కలాపి అంటే నెమలి అని అర్థం'' అన్నా.
"ఏదో లెమ్మా మొకాలు కడిగితే పాలు కలుపుతా, వంకర పేర్లు.. వంకర పేర్లు.. నోర్లు తిరుగుతయ్యా పాడా. ఓ అందవా, సందవా, ఏ సుబ్భలచ్చిమో, పోలేరో, నాంచారో, నాగమ్మో అని పెట్టుకోక'' అనుకుంటా పోయింది.
"నాకివ్వాళ పాలొద్దు'' అన్నా.
చక్కా నేనూ కలాపి కాఫీ తాగుతాం. నాకు అప్పుడప్పుడూ కాఫీ ఇష్టం. ఇంటో ఇవ్వరు. కలాపి వస్తే  కాఫీ తాగిచ్చుద్ది.
"కలాపిీ.. స్నానం చెయ్యి. ఆవిరి కుడుములు, గురెళ్ళ పొడితో తిని మనం కొండెక్కటానికి ఎల్దాం'' అన్నా.
స్నానం చేసి వచ్చి అద్దానికి అతుక్కు పోయింది. అద్దంలో తనని తాను ప్రేమించుకుంటూ గంటలు గడపగలదు. తనలో తనను అన్వేషించుకుంటున్నట్టు, తనకి కావలసినదేదో అందులోని తనలో దాచుకున్నట్టు వెతుక్కుంటది.

అన్నయ్యా, కలాపిీ, నేనూ కొండ దగ్గరకి వెళ్లాము. కలాపి వాళ్ళ నాన్న ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉండేవాడు. పుట్టటమే శ్రీమంతురాలిగా పుట్టింది.  ఎప్పుడూ హంపీ వచ్చే కలాపి, మాతో మామూలు  జీవితం గడపటానికే ఇష్టపడేది. అన్నయ్య వచ్చినప్పుడు కలాపి రావటమో, కలాపి వచ్చిన రోజుల్లోనే అన్నయ్య రావటమో జరిగేది. వీళ్ళిద్దరి రాక నాకు మాత్రం చాలా హాయి. నన్ను ఇద్దరూ చాలా ప్రేమించేవాళ్ళు.

కలాపికి కొండలెక్కడం అంటే  ఇష్టం.  నడుంకి తాడు కట్టుకుని దానికో చిన్న సంచి తగిలించుకుని, జారకుండా చేతుల్లో కొంచెం పౌడరు పోసుకుని , ఒడుపుగా రాళ్ళను పట్టుకుంటూ, బల్లిలా కలాపి  కొండలెక్కుతుంటే జనం నోళ్లు తెరుచుకుని చూసేవాళ్ళు. కొండలెక్కడం ఎలాగో నాకూ నేర్పింది. నేనూ, అన్నయ్యా చిన్న చిన్న రాళ్ళు నాలుగెక్కితే కలాపి రాతి కొండ సగం ఎక్కి ఎనక్కి తిరిగి చూస్తా, రా.... రా.... అని పిలిచేది. తనకి 22 ఏళ్ళ వయస్సుప్పుడు బహుశా నాకు పదేళ్ళు ఉంటయ్యేమో. అయినా గాఢ స్నేహితుల్లా తిరిగేవాళ్ళం.

కలాపి ప్రతి కదలికా నాకు అబ్బురంగానే ఉండేది. నా యవ్వనారంభంలో ఎన్నో విషయాల్లో కలాపి నాకు గురువు. హుందాగా సందర్భానికి తగ్గ బట్టలు ధరించటం ఎలాగో, శరీర కదలికలు అవతలి వాళ్ళకు ఎలాంటి సంకేతాలు ఇస్తయ్యో, కూర్చోటం, నడవటం, సాదాసీదాగా ఉండటం, మన గౌరవాన్ని కాపాడుకుంటూ అవతలి వాళ్ళని గౌరవించటం లాంటివెన్నో ఆమె నుంచి నేర్చుకున్నాను.

కలాపిది  వైకుంఠపాళి జీవితం. నిచ్చెనల పక్కనే పాములు,  కొండ చిలువలు. ఒక పాము నోట్టో నించీ ఇంకో పాము కోరల్లో ఇరుక్కుంటా కొండలెక్కేది. దేనినీ తనకి అన్వయించుకునేది కాదు. అన్నీ శరీరానివే. శరీరం కోసం క్రీడ అనేది.
ఓసారి నన్నో ప్రశ్న అడిగింది.
"ఈ శరీరాన్ని ఇంత అందంగా అలంకరించి, మేపి, బట్టలు కట్టి, నగలు పెట్టి ఎవరి కోసం పెంచుతామో తెలుసా?''
"స్మశానం కోసం, మట్టిలో కలపటం కోసం'' అని తనే సమాధానం చెప్పింది.

నాకు  పరిచయం అయ్యేటప్పటికే ఆమెకన్నా ఐదేళ్ళు పెద్దవాడైన ఒక యూనివర్శిటీ క్రీడా అధ్యాపకుడితో కలాపికి పెళ్ళయింది.  అతడు మా అన్నకి పరిచయస్తుడు.  ఒకసారి అతడిని తీసుకుని మా యింటి కొచ్చింది. చాలా అందంగా ఉన్నారు ఇద్దరూ. కొన్నాళ్ళున్నారు. ఆంధ్రలో ఓ పట్టణంలో కాపురం పెట్టారంట. కలాపి అందానికి చుట్టు పక్కల వాళ్ళకీ, యూనివర్శిటీ విద్యార్థులకి మతి పోయేదంట. ఆమెకి ఎన్నో పేర్లు స్మితా పాటిల్‌, నీనా గుప్త లాంటివి.

వాళ్ళ  ఊరికి ఒకసారి పేరున్న  క్రికెట్‌ క్రీడాకారుడు వస్తే వీళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారంట. అంతే ఈమె అందానికీ, హుందాతనానికీ దాసోహం అయిపోయాడు. కలాపికి ఆ క్రికెటర్‌తో పెళ్ళయిపోయింది. అతన్ని మా ఇంటికి తీసుకొచ్చింది. అతను చాలా బాగున్నాడు. కలాపి కూడా బాగుంది, కుబుసం విడిచిన త్రాచులా. అద్దంలో చూసుకోవటం మాత్రం మానేది కాదు. రెండు రోజులుండి ఆమె భర్త వెళ్ళిపోయాడు. కలాపి ఓ నెల రోజులు ఉంది. అన్నయ్య కూడా వచ్చాడు. అందరం కలిసి కొండలు గుట్టలు ఎక్కుతా గుహల్లో తిరుగుతా, వెన్నెలలో ఆడుతా  గడిపేవాళ్ళం. అన్నయ్య దగ్గర ఉంటే ఎందుకో కలాపి వెలిగిపోతూ ఉండేది. ఎప్పుడూ ఇద్దరూ మాట్లాడుకుంటానో, మౌనంగా ఒకరిని ఒకరు చూసుకుంటానో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడూ పోట్టాడుకునే వాళ్ళు కూడా.

తరవాత ఆమె మకాం హైదరాబాద్‌ మారింది. తన భర్తకి చాలా పరిచయాలని చెప్పేది. ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఉన్నా తుంగభద్రకి వస్తూ ఉండేది. కొండలు ఎక్కటం మానేది కాదు వచ్చినప్పుడల్లా. ఇవే ఈ రాళ్ళే నా నిజమయిన చెలికాళ్ళు. జారకుండా పడకుండా క్లిష్టమయిన లోయల్లో ఒక్కొక్క బండరాయినీ ఎక్కుతుంటే పునరుత్తేజం అవుతాను. ఇది నాకు శక్తి , ఇదంటే మోజు అనేది. అర్ధం అయ్యీ కాని ఆ మాటలు  నాకు చాలా నచ్చేవి.

ఈసారి వచ్చినప్పుడు కలాపి కళ్ళలో రేడియం కాంతి. శరీరంలో జర్రిగొడ్డు వేగం చూశాను.  సన్నటి దారాలకి రకరకాల రంగురాళ్ళు గుచ్చిన పట్టీలు కాళ్ళకి ధరించింది. పదిహేను రోజులుంది. ఉదయం, సాయంత్రం కూడా కొండలెక్కేది.చెమటలు కారిపోతూ, అలిసిపోతూ, ఆనందించేది. ఎందుకో నాకేదో అనుమానం వేసింది.
అన్నయ్య వడిలో తలా, కలాపి ఒడిలో కాళ్లూ పెట్టి పడుకుని "కలాపిీ'' అని పిలిచా. పలికింది.

"ఈసారి ఏదయినా కొత్త పని మొదలు పెడుతున్నావా? ఈ రాళ్ళని తెగ దాటేస్తున్నావు?''
నొసలు కొంచెం పైకెత్తి దించి పెదవి కొంచెం పక్కకి సాగదీసి నవ్వింది. "ఎంతో మంది పరిచయాలు ఉన్నా ,పన్నెండేళ్ళు చిన్నదానివయినా నువ్వే నాకు ఎందుకు స్నేహితురాలి వయ్యావో తెలుసా? నేను మనుషుల్ని చదివితే, నువ్వు నన్ను చదువుతావు. నువ్వో అమ్మవి'' అని దగ్గరకి తీసుకుంది. అప్పుడనిపించింది కలాపి స్పర్శ ఇక ఎవ్వరి దగ్గరా పొందలేనని. దేహపు రసాయినిక చర్య  అమ్మ తరువాత కలాపి దగ్గరే అనుభవించాను నేను.

"విషయం ఏంటి?''
"ఏముంది బరోడా రాజకుటుంబీకుడు ఒకడు నా భర్త కి మిత్రుడున్నాడు. అతను చాలా సంపన్నుడు.''
"అయితే ''
"ఎన్నో రాజాభరణాలు నా అందానికి కానుకగా ఇచ్చాడు''
"అందులో పగడాల నగలున్నయ్యా.''?
"ఉన్నయ్యి ఎందుకు?''
"తెలియదు, పగడాలంటే ఇష్టం.''
"అతను నన్ను పెళ్ళాడి బరోడా తీసుకెళతాడంట''.
"మరి ఇప్పుడున్నాయన?''
"విడాకులు ఇస్తన్నాడు'' అంది. ఏమీ అర్థం కాక వెర్రి దానిలా చూశాను.  అన్నయ్యా కలాపీ చాలా మౌనంగా,  తుంగభద్ర ఇసుకని కాళ్ళతో వెనక్కి నెట్టుతా నడుస్తా ఎక్కువసేపు గడిపారు. శక్తినింపుకున్న కళ్ళతో పొడవాటి తన జడ చివర్లు చూస్తా ఉంది కలాపి.  వర్ష ఋతువు ముందు పురివిప్పి ఆడే నెమలిలా ఉంది కలాపి నాకప్పుడు. ఆ విన్యాసపు నాట్య హొయలు ప్రకృతి కోసమే అన్నట్టు నడుస్తోంది. అన్నయ్యా కలాపీ ఇద్దరూ ఏం మాట్లాడుకోవట్లా . మౌనంగా ఉన్నారు. పిచ్చెక్కినట్టయ్యి నేనే అడిగా.

"మళ్లీ మా ఇంటికి ఎప్పుడొస్తావు?'' అన్నా
"నిన్నూ, తుంగభద్రనీ చూడకుండా ఉండలేను''
"మరి అన్నయ్యని?''
అప్పుడు కలాపి ఏం మాట్లాడకుండా పరవశంగా కళ్ళు మూసుకుంది. మూసిన రెప్పల కింద గోధుమ రంగు కనుపాపలు గుండ్రంగా తిరిగాయి. నెత్తి మీద ఒక్కటిచ్చి మనోహరంగా నవ్వింది.
" కలాపీ.. కొండలెక్కతా ఉంటావు కదా అలుపొచ్చినపుడు ఏం చేస్తావు''? అనడిగాను.
"నిండు తుంగభద్ర అలసిపోతుందా'' అని నన్నే ప్రశ్నించింది.
"ఒక వేళ అలసి పోతే''
"మా తాతమ్మనో, అమ్మమ్మనో, నాయనమ్మనో గుర్తు చేసుకుంటాను. వాళ్ళతో గడిపిన క్షణాలని, ఆనందమయిన, అందమయిన అనుభవాలని తలుచుకుంటాను, అంతే చిరునవ్వు మొలకెత్తుతుంది. నాకే కాదు, ఎవరికయినా. ''
కలాపి వెళ్ళిపోయింది, బరోడాకి.
నాకు ఉత్తరాలు రాసేది.
అప్పుడప్పుడూ ఫోన్‌ కూడా చేసేది.
కొంత కాలం తరువాత మళ్ళీ మా ఊరు వచ్చింది కలాపి.
ఇంకా అందంగా ఉంది. మిన్నాగులాగా పరుషపు చలాకీతో ఉంది.  మునుపటి కన్నా తియ్యగా ఉంది.  హిందీ బాగా నేర్చుకుంది. పాత హిందీ పాటలు ।పాడుతోంది. అతను కూడా పాత హిందీ సినిమా హీరోలా తెల్లగా, పొడవుగా, చాలా చాలా స్టైలుగా ఉన్నాడు.
కలాపి నాతో అంది "మేము విదేశీ యాత్రలకి వెళ్దామని అనుకుంటన్నాం. ఆయన మిత్రులు చాలా మంది ఉన్నారు. ఈయన చదువంతా కూడా బ్రిటన్‌లో జరిగింది''
నేను పకపకా నవ్వాను.
"ఏయ్‌ లడ్డూ..ఎందుకు నవ్వుతున్నావ్‌ అంది''.
"మన దేశంలో జనాన్నే పిచ్చెక్కిచ్చావు. ఇంక ఆ పిచ్చి విదేశీయులు. నిన్ను బతకనిస్తారా? ఎమ్మట పడి పీక్కు తింటారు. జాగ్రత్త.''
"పెద్ద దానివయ్యావు. మాటల్లో ఆరితేరావు.'' అంది.
"లడ్డూ ,ఆ సీతారాం బాబా గుహలో డేవిడ్‌తో బ్రహ్మజెముడు బూరల సంగీతం తరగతులు ఎంత వరకూ వచ్చాయి? ఏమన్నా నేర్చుకున్నావా'' అనడిగింది.
"రోజుకో బ్రహ్మజెముడు చెట్టు చస్తంది. సంగీతానికి గుహ సహకరించటం లేదు'' అన్నా.  పడి పడి నవ్వింది.
"ఈ సంవత్సరం డేవిడ్‌ రాలేదు కదా''.
"లేదు. కాలేజీలో చేరుతున్నాడంట. వచ్చే సంవత్సరం వస్తానన్నాడు.''
"నువ్వెన్ని రోజులు ఉంటావు విదేశాల్లో'' అనడిగా.
"వచ్చేదాకా తెలియదు''. అంది.
ఒక వారం తరవాత బయలుదేరి వెళ్ళింది. ముందుగా శ్రీలంక, అక్కడ నించీ సింగపూర్‌, మలేషియా, జపాన్‌, జర్మనీ చూసిందంట, ఉత్తరాలు రాసేది.
ఒక  సంవత్సరం దాకా ఉత్తరాలు రాలేదు. కలాపి ఏమయ్యిందో అర్థం కాలేదు. లోపలేదో దిగులుగా ఉండేది నాకు. తను  బాగుండాలి. తనిష్టమొచ్చినట్టుండాలి అనుకున్నాను. ఎందుకంటే కలాపిది ఓ శిఖరం లాంటి వ్యక్తిత్వం, నిటారుగా ఉంటేనే అందం. అది ఒంగినా, లొంగినా అందంగా కనిపించదు. తనేమయిందో తెలుసుకోవాలని బరోడాకి తనిచ్చిన నెంబర్‌కి ఫోన్‌ చేశాను. ఎవరూ లేరని  హిందీలో ఒక మగాయన చెప్పాడు.
తరువాత నాలుగేళ్ళకి కలాపి దగ్గర నించి ఒక ఉత్తరం వచ్చింది.  అచ్చమయిన తెలుగులో రాసింది.
బరోడా వ్యక్తితో విడిపోయినట్టూ, జపాన్‌ రాజకుటుంబపు బంధువుని వివాహం చేసుకున్నట్టు, అది చాలా వైభవంగా జరిగిందని రాసింది.
"పెళ్ళి కానుకగా చాలా నగలూ, సంపదా లభించాయి''అని రాసింది.
అంతే ఆ తర్వాత తన జాడ లేదు. ఏళ్ళు గడిచాయి. కలాపి కరగిపోని ఒక జ్ఙాపకంలానే ఉంది.
ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక ఉత్తరంతో పలకరించింది. ఉత్తరం తెచ్చిన  వ్యక్తిని కూచోమని మాట్లాడతన్నాను. కలాపి హోటల్స్‌ కట్టిచ్చిందంట. పిల్లలు లేరని చెప్పాడు. తనిచ్చిన ప్యాకెట్‌ విప్పి చూశాను. అందులో మూడు రకాల మేలిమి పగడాల సెట్‌లు, గాజులు, పగడపు రంగు కంచి పట్టు చీర ఉన్నాయి. చిన్న చీటీ కూడా ఉంది. "ఇవి ధరించి నాకు కనిపించు'' అని ఉంది.

***

నాలుగో రోజుకి కొలంబో చేరుకున్నాం. చాలా విశాలమయిన భవంతి. సెక్యూరిటీ గార్డ్స్‌ కాపలాగా ఉన్నారు. స్నానం , టిఫిన్‌ అయ్యాక  కలాపిని చూడచ్చన్నారు. నాకు మాత్రం ఆత్రుతగా ఉంది. అక్కడున్న ప్రతి గదీ వెతికాను. ఆ ఇంటిలో ఎక్కడా కలాపి కనిపించలా. నాతో వచ్చిన సింహాళీయుణ్ణి అడిగితే, "ఇది ఆమె అతిథిగృహం. మీరు తొందరగా తయారయితే ఆమెని చూడవచ్చు'' అన్నాడు.

గబగబా స్నానం చేసి తయారయ్యాను. రెండు మైళ్ళ దూరంలోని  ఇంటికి తీసుకెళ్ళాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పగడపు రంగుచీర, పగడాల సెట్‌, నా విటాన్‌ పగడపు రంగు క్లచ్‌తో బయలుదేరాను. ఒక నర్స్‌ కలాపి గదిలోకి తీసుకెళ్ళింది. చల్లని ఏసి గది. బెడ్‌ మీద దోమతెరలాంటి వస్త్రం కింద ఒక శరీరం. చిరునవ్వుతో విడిపోవాల్సిన పెదాలు చిగురుటాకులా ఒణికిపోయాయి. ఎలా చెప్పను. ఏం రాయను తనసలు కలాపినేనా. కాదు.. ఛ.. అని అనుకునే లోపల తిరిగి చూసింది. కళ్ళలో మాత్రం అదే మెరుపు. ఆ.. అవును, ఈ కళ్ళు కలాపివే.  ఇంకెవరీకి ఉండవు. "లడ్డూ దగ్గరకి రాకు, దూరంగా ఉండు. నేను, నా చర్మం అసహ్యంగా మారిపోయాయి'' అంది.

నేను ఏం చెయ్యాలి? నన్ను నేను సిద్ధం చేసుకున్నా. నేను కలాపి స్థానంలో ఉంటే కలాపి ఏం చేసేది? లేకపోతే అమ్మ కలాపి స్థానంలో ఉంటే దగ్గరకి వెళ్లనా, ముట్టుకోనా? ఏదో చెయ్యాలి!.  చేతిలోంచి పర్స్‌ కింద పడిపోయింది. నా తటపటాయింపుకి ఆ శబ్దం ముగింపు పలికింది.  ఒక్క ఉదుటున మంచం దగ్గరకి వెళ్లాను. తనని రెండు చేతులతో లేపాను. హృదయానికి హత్తుకున్నాను. ఎందుకో "అమ్మా, అమ్మా, అమ్మా... ''అని మూడు సార్లు అన్నాను.  చీము, రక్తం కారే శరీరాన్ని  అలా పట్టుకుని ఓ గంటపాటు ఉండిపోయాను. కలాపి వారించలేదు. తను కోరుకున్నదే జరుగుతున్నట్టుగా ఉండిపోయింది. నా కనుపాపల్లో ఉబికే నీటి పొరల్ని గుండెల్లోకి అదిమేసుకున్నాను. నన్ను నేను జోకొట్టుకున్నాను.
కలాపి ఆఖరి కోరిక నేను నెరవేర్చాలి. చివరి శ్వాస దాకా ఆమె చెంతన ఉండాలి అని నిర్ణయించుకున్నా.

కింద వేసిన రబ్బరు షీట్లు తీసేయించి, లేత అరిటాకులు పరిపించాను.  చల్లని నీళ్లు తాగించాను. కలాపి మొహంలో బాధ లేదు. ఒక రకమైన నిశ్చింత. ఆమె గాయాలు తుడుస్తూ ఉండే దాన్ని.  ఈ పుళ్ళూ, గాయాలతో  కూడా కలాపి చాలా అందంగా కనిపించడం మొదలు పెట్టింది.  వంటి నిండా  సూర్యకాంతమణులు ధరించినట్టు గా కనిపించేది కలాపి.
ఒక రోజు కలాపి మంచం ముందు పెద్ద స్కీన్‌ ఏర్పాటు చేశారు.  తన ముదు రిమోట్‌. "ఏంటి'' అన్నా. "చూడు'' అంది.

బాలికా పునరావాస కేంద్ర్రం ప్రారంభోత్సవం. నన్నే స్విచ్‌ నొక్కమంది.  నువ్వు మాత్రమే చెయ్యగలిగింది ఇది అని తన చేతే ప్రారంభం చేయించాను.
అప్పుడు కలాపి ఇలా చెప్పింది.

"లడ్డూ, ఎన్ని ఆభరణాలు..ఎన్ని ఆస్థులు.. ఏం చేసుకోను? సంపదనంతా డబ్బుగా మార్చాను. ఈ దేశం యుద్ధ గాయాలతో ఉంది.  అనాథలయిన స్త్రీలు, బాలికలు, లైంగిక హింసకి గురి అయిన వాళ్ళ పునరావాసం కోసం  ఈ డబ్బంతా ఖర్చు చేస్తున్నాను.  ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాను. ప్రపంచమంతా తిరిగాను. సంపదతో దొరికే ప్రతి సుఖమూ అనుభవించాను. అయినా ఎప్పుడూ ఏదో అన్వేషణ. ఎక్కడా స్వాంతన లేదు. ఎప్పుడూ సంతృప్తి లభించలేదు.  ఏ మగవాడి దగ్గరా నాకు కావలసింది దొరకలేదు. మగవాడెప్పుడూ శాశ్వతం కాదు. ప్రవాహంలాంటి వాడు. ఎక్కువ అడ్డుకట్టలు వేసినా, వదిలేసినా మనకి దక్కడు. నాకు కావలసిన శాంతి నాలోనే ఉంది. నాకు నేనే దాన్ని యిచ్చుకోగలను. మరెవ్వరికీ సాధ్యం కాదని తెలుసుకున్నాను. జీవితంలోకి మనుషులు వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. మనకి మనమే శాశ్వతం. అయామ్‌ వాట్‌ అయాం. ఈ వెతుకులాటలో నాకు మిగిలింది  అనుభవాలు మాత్రమే.'' నిదానంగా, శాంతిగా కలాపి గొంతులోంచి మాటలొస్తున్నాయి.।

"నేనప్ప చెప్పిన అన్ని పనులూ బాధ్యతగా పూర్తి చేసి నన్ను  సాగనంపటానికి ఓ వ్యక్తి వస్తాడు చూడు. అతను నాకు  జీవితంలో, అన్ని నిర్ణయాలలో తోడుగా నిలిచాడు. మొదటి నించీ కడ వరకూ మిగిలిన మనిషి''. అని చెప్పింది. ఈ మాటలు అంటున్నపుడు కలాపి ముఖంలో పాత కాంతిని కొత్తగా చూశాను. నాకు పరిచితమైన కాంతి అది.
మెల్లగా నీరసంగా అలసిపోయి ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తన్నాడు. అతను... అతను..అతను నా అన్న.

అమ్మ కలాపి దొంగ అనుకున్నా.
నా ఆఖరి కోరిక తీరుస్తారా అనడిగింది ఇద్దరినీ.
"ఏంటి'' అంటే
"అద్దం కావాలి, అద్దం. ''
"కళ్ళు మూసుకుని నేను చెప్పినప్పుడు తెరిస్తే నీకు  అద్దం చూపిస్తా ''అన్నాడు మా అన్న.
సరే అంది.
కళ్ళు మూసుకో అని పక్క గదిలోకి వెళ్లి అద్దం తెచ్చాడు. దాని పైన కలాపి యవ్వనంలో ఉండగా గీసిన బొమ్మ  ఉంది.
అది తన మొహం దగ్గరగా తెచ్చి," కళ్ళు తెరువు కలాపీ'' అన్నాడు.
తెరిచి చూసి, అందంగా చీమలు చుట్టి కుట్టిన సర్పంలా నవ్వింది.
విశాలమయిన ఆ గోధుమరంగు నల్ల వలయాల కళ్ళ దృష్టి అద్దంలోకి ఇంకి పోయింది.
కలాపి నా గొంతు మీద పుట్టు మచ్చగా మారిపోయింది.
--------------
అంకితం: కలాపి చిరకాల నేస్తం సురేన్‌కి

అతను- ఆమె – నేను – ఒక కథ

rm umamaheswararao‘ఇది ఫెయిల్యూర్ స్టోరీ,’ తలకోన అడవిలో ఖదీర్ బాబు అన్న మాట ఇది.

ఆకాశం ఎత్తుకు ఎదిగి, నీలిమబ్బులతో గుస గుసలాడుతున్న మహా వృక్షాల నీడలో కథలు రాసే ఎందరో, అప్పుడు కూర్చుని ఉన్నారు. అయ్యో… ఈ అడివి చెట్లు, నీలి మబ్బులతో మాట్లాడే భాష ఖదీర్ కి అర్ధం కాలేదే! అనుకున్నాను.

బహుశా ఖదీర్ పుష్పవర్ణమాసంలో పుట్టలేదనుకుంటాను.

కథని కంప్యూటర్ తెర మీద చదవడం కంటికీ, మనసుకీ కూడా అంత హాయిగా ఉండదు. అసలే ఉబ్బదీసిన మధ్యాహ్నం చిరచిరలాడుతోంది. తిరుమల కొండ ఎండుబారిపోయి దిగులు నింపుతోంది. సవాలక్ష కారణాలతో మనసంతా చికాగ్గా ఉంది. ‘మహిత’ రాసిన సామాన్య మెయిల్ లో పంపిన కథ చదవకుండా ఆగడం ఎలా? కథ పూర్తి చేసి చూద్దును కదా, కిటికీ బయట దిరిసెన చెట్టు, ఎర్రటి ఎండలో దగ దగా మెరిసిపోతోంది. ఎండా కాలపు ధూళిలో, వెలుగు రేఖలు ముదురుపచ్చ ఆకులను ముద్దాడి, చేతులు సాచి పిలుస్తున్నాయి. కొమ్మల నిండా అటూ ఇటూ ఎగురుతూ కిచకిచలాడుతున్న పిచుకలు, గుబురు ఆకుల నడుమ మౌనంగా కూర్చున్న కోయిల.

ఆ వెలుగుపచ్చ అందానికీ, నాకూ మధ్య ఇనుప ఊచల కిటికీ.

ఇంతదాకా నేను చదివిన కథ నా కంటి ముందు ప్రత్యక్షమయిన అనుభూతి. కథలోకి నేను వెళ్ళానా? కథ నాలోకి ప్రవేశించిందా? కథా, నేనూ కలగలసిపోయిన వింత అనుభవం. గొప్ప సౌందర్యం ఏదో గాలి తెమ్మెరలా నన్ను స్పర్శించి, నా లోలోపలికి ప్రవేశించింది. కంప్యూటర్ తెరమీది కథలోంచా, కిటికీ బయటి గుబురు పచ్చ వృక్షం లోంచా? ఎక్కడి నుంచో అర్ధం కాలేదు.

లేచి వాకిట్లోకి వచ్చాను. గంగిరేణి చెట్టు కింద పండి రాలిన ఆకుల పసుపుదనం, గోడ మీద పాకుతున్న కమ్మెట పురుగు వయ్యారపు నడక, ఎదురుగా కొబ్బరాకుల మీద వాలుతున్న గద్ద నైపుణ్యం, చింకి పొదల మీద ఆరేసిన రంగుబట్టలతో వాలెండ వర్ణ విన్యాసం, ఎప్పుడూ చూసే వరండాలోని కలంకారీ చిత్రంలోనూ కనిపించిన కొత్త అందం. సమస్తమూ సౌందర్యభరితంగా కనిపించిన క్షణం అది.

సామాన్య రాసిన ‘పుష్పవర్ణమాసం’ కథ చదివాక నాకు కలిగిన అనుభవం ఇది.

పుష్ఫవర్ణమాసం ఏమిటి? ఏముంది ఆ కథలో…?

అతను, ఆమె. ఆ ఇద్దరే.

భర్త, ఇల్లు, పని, పనివాళ్లు… ఇంతేనా? రోజూ ఇంతేనా?

పంజరం బంగారమైనంత మాత్రాన అనందం కలుగుతుందా?

అప్పుడు చూసింది ఆమె అతన్ని, కిటికీ అవతల గుబురు మామిడి చెట్టుమీద ఆకుల్లో ఆకులా కలగలిసిపోయిన అతన్ని. అతని భుజం మీద కోయిల.

ఎవరతను? దయ్యమా? దేవుడా? భ్రమా?

ఎందుకో, రోజూ అతని కోసం ఎదురు చూసేది ఆమె. ‘సౌందర్యం వెంట లేకుండా వచ్చేవాడు కాడతను.’ పలకరిస్తే మాయమయ్యేవాడు. కొన్ని రోజులు కనిపించేవాడు కాదు. ఉగ్ర రూపమెత్తి కురిసిన వానని వింటూ ఆమె నిద్ర పోయిన రాత్రి, తెల్లవారింది బీభత్సంగా. రాలిన ఆకులు, తెగిపడ్డ పిందెలు, విరిగిన కొమ్మలతో యుద్ధక్షేత్రంలా మారిన మామిడి చెట్టు మీద మొఖం నిండా దిగులుతో కనిపించాడతను. ఏమయ్యారు, ఇన్ని రోజులు? అని నిష్టూరంగా పలకరించిన క్షణమే చెరిపేసిన గీతలా మాయమయ్యాడతను. ‘రాత్రి కురిసిన వానలా’ ఏడ్చి ఏడ్చి పడుకున్నది ఆమె. పొద్దున్నే సంపెంగ పూ చెట్టు కొమ్మ మీద కూర్చుని కిటికీ ఊచలు పట్టుకుని పలకరించాడతను.

అప్పుడు నేర్చుకుంది ఆమె ‘నీలి మేఘం అడవితో మాట్లాడుతుందే, ఆ భాష.’

ఇక, ఒకటే మాటలు, గలగలా జలపాతంలా. ఆ ఇద్దరి మీదా వాలిన పిట్టలు పాటలు పాడేవి. ఆ పాటల్లో వాళ్ళ మాటలు వాళ్ళకే వినిపించేవి. భూమికీ, ఆకాశానికీ మధ్య కిటికీ. బయట అతను, లోపల ఆమె. అతను రాని రోజు రాత్రి, ‘బల్లంతా బంగారు రంగు జలతారు వెలుతురు పరుచుకుని, మనసు నిండుగా ఉత్తరం రాసేది’ ఆమె.

ఆమె నవ్వులూ, మాటలూ, పాటలూ ఆ ఇంట్లోని వాళ్ళకి వింతనిపించాయి. ఆమెకి దయ్యం పట్టిందన్నారు. పుట్టింటికి పంపారు. తిరిగి వచ్చింది ఆమె, అతని కోసం ఆర్తిగా.

అప్పుడు అనిపించింది ఆమెకి, ‘లక్ష ఊచల పంజరమై, అతన్నీ, అతని పక్షుల్నీ బంధించెయ్యాలని.’

అప్పుడు అర్ధమైంది ఆమెకి, అతనూ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడని. లంకె కుదరని మాటలేవో నడిచాయి, తడబాటుగా ఆ ఇద్దరి మధ్యా. ‘అడవి పచ్చరంగు చీర, ఆకాశ నీలం రవిక ధరించిన ఆమె, చినుకు చుంబించిన నేల పరిమళం’ లా కనిపించింది అతనికి. ‘ఆకాశ సముద్రాన్ని ఈదే చంద్రుడి’ లోంచి కొంత భాగం తీసుకుని ఇరవై నాలుగు రేకుల పువ్వు ఒకటి చేసి ఇచ్చాడు ఆమెకి.

అప్పుడు కలిగిందామెకి, ‘అతను కావాలి’ అని.

‘మనం మంచి స్నేహితులం, అంతే’ అన్నాడతను. అతను మాట్లాడుతుండగానే ఒక మొక్క ఆమె మనసులో మొలిచి, మారాకు వేసుకుని వేగంగా పెరిగింది. ‘అతను ఏడు మామిడి చెట్లంత పురాతనుడు’ అతనితో వాదించగలదా ఆమె! ఇరవై నాలుగు రేకుల ‘వెన్నెల పువ్వు గుప్పెడు బూడిదగా మారిపోయింది’. అతను రాలేదు, చాలా రోజులు. ‘అతను కావాలి’ అని ఆమె ఒంటరి ధ్యానం.

ఒక రోజు అతనొచ్చాడు. కృశించిపోయిన ఆమెని చూసి దిగులుపడి వర్షించాడు. ఇప్పుడతని చుట్టూ పక్షులు లేవు. ఎందుకు ఆమె అంతగా కోరుకుంది అతన్ని. ఏం చేసుకుంటుంది అతన్ని? అతనేమివ్వగలడు ఆమెకి? ఆమెకి లేనిదేమిటి? అతనికీ, ఆమెకీ మధ్య ఉన్న కిటికీని ఏం చేసి మాత్రం ఎవరైనా తొలగించగలరు?

అప్పుడు ఇంకా బలంగా అనిపించింది ఆమెకి, ‘అయినా సరే, అతను కావాలి’ అని.

అప్పుడు మాట్లాడాడు అతను అచ్చు ఒక మగవాడిలా ఆమెతో.

ఏడుపు దాచుకున్న వైరాగ్యపు నవ్వు ఆమె పెదవుల మీద నర్తించింది. అతను వెళ్ళిపోయాడు, తొలి పరిచయపు రోజుల్లో అతను ఇచ్చిన గోమేధికం మాత్రం ఉండి పోయింది, ఆమె మెడలో మోయలేనంత బరువుగా మారి.

దయ్యాలని తరిమేసే కామాక్షమ్మ గుడి మెట్ల మీద కూర్చుని ఆమె అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది, అతను వస్తాడనే నమ్మకంతో, మెడలో నిప్పులా కణకణ మండిపోతున్న బండరాయంత గోమేధికం ధరించి.

ఇంతకీ, అతనొస్తాడా?

ఈ కథలో రచయిత్రి సమాజానికి ఏం చెప్ప దలచుకుంది?

పెళ్ళయిన ‘ఆమె’,అతన్ని కోరుకోవడం అనైతికం కాదా?

దయ్యం ఏమిటి, అశాస్త్రీయంగా.

అసలు పుష్పవర్ణమాసం ఎక్కడుంది?

ఇట్లా అడిగే వాళ్ళతో ఏం మాట్లాడగలం?!

ఏ కథ అయినా మనసుకి దగ్గరగా ఎప్పుడు వస్తుంది? ఆ కథలో మనకి మనం కనిపించినపుడు. ముసుగులేసుకునో, రంగులు పూసుకునో, మనసు పొరల్లో దాక్కునో ఎక్కడో అక్కడ ఎలాగో ఒకలాగ మనకి మనం దొరికిపోతాం. అప్పుడిక అది మన కథే అనిపిస్తుంది. అద్దంలా మనల్ని మనకు చూపుతూనే, మెల్లగా ఎక్కడికో దారి తీస్తుంది. ఆ దారి మంచిదో చెడ్డదో తీర్పులు చెప్పకుండా, తేల్చుకోమని ఒక ఆలోచన ఇస్తుంది. అప్పుడిక మనసు, పగిలిన జిల్లేడు కాయలోంచి బయటపడి ఎగిరే విత్తనంలా మారుతుంది. ఎక్కడో ఏ చెమ్మ నేల మీదో వాలి, తొలి చినుకు కోసం ఎదురు చూస్తుంది.

పుష్పవర్ణమాసం కథ చదివాక, ‘ఆమె’ ఎవరు? ‘అతను’ఎవరు? అనే ప్రశ్రలు ఉదయిస్తాయి. ఆమె ఎవరో తెలిసిపోతుంది సులువుగానే. ఆమె ఎవరో తెలిసి పోయాక, అతని కోసం అన్వేషణ మొదలవుతుంది. అతను అమూర్తం. అతను అనేకం. ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నది అతని కోసమే కదా అనిపిస్తుంది. అబ్బ ఎంత సౌందర్యం! అతను కావాలి అనిపిస్తుంది. అతను కనిపించాక కానీ పంజరం గుర్తుకురాదు. సకల జీవన బంధాలనీ గుర్తు చేసే రెక్కల పిట్ట అతను. నడి అడవిలో గాలి ఊదే వెదురు గానం అతడు. మనిషా, దేవుడా, దయ్యమా..? ఎవరైతేనేం! అతని ప్రేమ కావాలనిపిస్తుంది, ఎక్కాల పుస్తకంలో ఇష్టంగా దాచుకున్న నెమలీక కొందరికి అతను. మరి కొందరికి మాత్రం అతను ఒక రహస్యోద్యమం. నిద్ర రాత్రి తల కింద దాచుకున్న ఆయుధం. పశువుల మందని అడవికి తోలుకెళ్ళే పాలేరు పిల్లగాడికి దొరికిన భరోసా. అందుకే, అతను కావాలి. అతని కోసమే నిరీక్షణ. అతనొస్తాడనే ఆశ. అతనొస్తాడనే నమ్మకాన్ని గుండెల నిండా నింపుతుంది పుష్పవర్ణమాసం కథ.

ఈ కథ నిర్మాణ రూపం మీద కూడా కొందరికి అసహనం, సూటిగా చెప్పొచ్చుగా, ఇన్ని ప్రతీకలెందుకని చిరాకు. మార్య్యూజ్ ని ఇలా ఎందుకు రాశావయ్యా అని అడగ్గలమా? అలా రాయడం అతని అవసరం, అప్పటి అవసరం. అవసరమే కదా కథకి రూపశిల్పాన్ని నిర్దేశిస్తుంది. అనుభవించి పలవరించినపుడే అది ప్రవాహంలా బయటకొస్తుంది. పుష్పవర్ణమాసం కూడా ఇంతే.

ఇంతకీ ఈ కథ నీకెందుకు నచ్చిందీ అనడిగితే, నేనేం చెప్పగలను?

బహుశా పుష్పవర్ణమాసంలో పుట్టానేమో అని తప్ప.

*****

పుష్పవర్ణమాసం

~సామాన్య

Painting of saamaanya -- pushpavarnamasam

ఆ  రోజు  నా మేనకోడలికి పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు. మా గ్రామ దేవత కామాక్షమ్మ గుడికి ఎడం చేతి వైపున వుంటుంది సుబ్బరాయుని పుట్ట. అందరం అక్కడ చేరాం. పుట్టు వెంట్రుకలు తీస్తుంటే, పిల్ల పాపం ఘోరంగా ఏడ్చేస్తుంది. కొందరు పొంగళ్ళు పొంగించేందుకు  పొయ్యి పెట్టడం కోసం రాళ్ళు వెదుకుతున్నారు. మా గుడి ఆవరణ అంతా పరుచుకుని గల గల లాడుతూ, ఎండలో  వెండిలా మెరిసిపోతూ  వుంటుందో పెద్ద రావి చెట్టు, దాని చుట్టూ ఎత్తుగా కట్టిన అరుగు వుంటుంది. పుట్ట దగ్గర జరుగుతున్న తతంగాలకి చిరాకు వచ్చి, నేను వెళ్లి ఆ అరుగు పైకి చేరి, మందిరం  ఆవరణలో అక్కడక్కడా తచ్చాడుతున్న భక్తుల్ని  చూస్తూ కూర్చున్నా.

గుడికి కుడి వేపున వున్న మండపంలో   స్తంభానికి ఆనుకుని ఎవరో ఒకామె  కూర్చుని వుంది. గొప్ప అందంగా వుంది. నేను అద్దాలు తీసి తుడిచి పెట్టుకుని మళ్ళీ చూశా. దానిమ్మ పువ్వు రంగు ఝరీ  చీరలో కొంత వాడిన మొగలిపువ్వులా వుంది. ఆవిడ వొంటి రంగు, చీర రంగుల అద్భుత సమ్మెళనమో, మరోటో, వద్దన్నా బలవంతంగా తనవైపుకి లాగేస్తుంది ఆమె  సౌందర్యం. నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరీవిడ?  ఇంతక ముందెప్పుడూ ఇక్కడ  చూడలేదే … ? ఎవరినడగాలి ఈవిడ గురించి … ఆలోచిస్తుంటే  విఘ్నేస్వరుడి మందిరం లో నుండి బయటకొచ్చాడు చిన్న పూజారి శేషాచార్యులు . శేషు చిన్నప్పుడు నా ఆటల పాటల  జట్టులో ప్రధాన సభ్యుడు. నా కంటే ఏడెనిమిదేల్లు  చిన్న వాడు. వాడిని పిలిచి గుసగుసగా “ఏం శేషు! ఏంటి సంగతి ఈ మధ్య తపస్సులూ గట్రా మొదలెట్టావా ఏంటి? దేవకన్యలని గుడికి రప్పించావ్” అన్నా. తలా తోక లేని నా మాటలకి  అచ్చు చిన్నప్పట్లానే వెర్రి ముఖం ఒకటి పెట్టేసి, “దేవకన్యలేంటి పెద్దక్కా?” అన్నాడు ఆశ్చర్యపడిపోతూ, నేను ఇంకా గుస గుస పెంచి, అదిగో ఆ మండపం లో స్తంభానికి ఆనుకుని కూర్చుని వుందే ఎవరేమిటి  ఆవిడ దేవకన్య కాకపోతే” అన్నాను. అది విని శేషు ముఖం వికాసంగా పెట్టి “దేవకన్య కాదు పెద్దక్క, దెయ్యం” అన్నాడు పూలు కొబ్బరిచిప్ప  చేతిలో పెడుతూ.

అప్పుడే అటోచ్చిన మా అత్త   “పెద్దమ్మాయ్  నడువ్, నడువ్ ఎక్కడకొస్తే అక్కడ స్నేహితులు, మాటలూ…అందరూ నీ కోసం వెతుకుతున్నారు” అన్నది. నేను అరుగు దిగి అత్త వెనకాలే నడుస్తూ ఆవిడను చూసాను. అదే ఫీలింగ్. దానిమ్మ పూరంగు పట్టుబట్టలో చుట్టిన మొగలి పూపొత్తిని చూసినట్లు. ఆవిడ దెయ్యమేంటి, ఈ శేషుకి చిన్నప్పట్నుంచి వేపకాయంత వెర్రి వుంది.ఇప్పుడది తాటికాయ అయ్యుంటది. మా  గుడికి దయ్యం పట్టిన వాళ్ళని చాలా మందినే తీసుకొస్తుంటారు. చాలా మంది నయమై కూడా వెళ్తుంటారు, కానీ వాళ్ళెవరూ ఈవిడలా శుభ్రంగా వుండరు, ఎందుకో ఆవిడతో మాట్లాడాలనిపించింది. ఆవిడ సౌందర్యం వల్లనేమో…మా అత్త చేతి నుండి నా చేతిని విడిపించుకుని ఇదిగో అత్తా నీ వెనకే వచ్చేస్తా గానీ నువ్వు  పద అని మండపం వైపు నడిచా.

పువ్వులా ఆ స్తంభానికి ఆనుకుని కూర్చుని వుంది ఆవిడ, నిశ్చలంగానో, పరధ్యానంగానో. నేను నిశ్శబ్దంగా, ధ్యానానికి వచ్చిన భక్తురాల్లా ఆవిడకి కొంచం ఎడమగా  కూర్చుని, శేషు  ఇచ్చిన కొబ్బరిచిప్ప  పగలకొట్టడం మొదలుపెట్టాను. ఆవిడ పరిసర స్పృహలో లేదు. దగ్గరగా ఇంకా బాగుంది. రింగుల జుత్తు, నిండు నవ్వు పెదవులు.

కాసేపటికి చేతికొచ్చిన చిన్న కొబ్బరి ముక్క ఆవిడ వైపుకు సాచి, పరిచయపూర్వకంగా నవ్వుతూ “తీసుకోండి” అన్నాను. ఆవిడ చిర్నవ్వి “థాంక్ యు” అంది.  అమ్మయ్య ఈవిడ  దయ్యం కాదు దేవతే. కానీ పలకరించడం  ఎట్లా?  కాస్తా బలంగా  ఊపిరి పీల్చుకుని ధైర్యం చేసి “మాది ఈ ఊరే. కానీ, మిమ్మల్ని ఇంతకు  ముందు ఎప్పుడూ ఇక్కడ చూసినట్టు జ్ఞాపకం లేదు” అన్నాను. ఆవిడ నా మాట విని, పల్లవి అసలే లేని పాటలా “ఇంతకు ముందు ఎప్పుడూ ఇక్కడికి రాలా నేను! దయ్యం పట్టిందట నాకు! దయ్యం పట్టాలని  నేను గాడాతి  గాడంగా కోరుకుంటున్నానూ… అయినా పట్టడం లేదు అని చెప్పా. ఎవరూ వినలా. ఇక్కడ తెచ్చి వదిలారు. కానీ నాకిక్కడ బాగుంది. సందె వాలిందంటే చాలు ఆ చెట్టు పైకి ఎన్ని పక్షులొస్తాయో తెలుసా. అతనితో పాటూ అట్లాగే వచ్చేవి రకరకాల పక్షులు, రంగు రంగులవి, సౌందర్యం వెంట లేకుండా వచ్చేవాడు కాడతను” అన్నది.

నాకు అయోమయం అనిపించింది. ఏం మాట్లాడుతుందీవిడ, శేషు చెప్పినట్లు ఈవిడ తేడానేనా ?కానీ టూ క్యూరియస్. అందుకే తల ఊపి “మీరు భలే అందంగా వున్నారు. ఎంతసేపైనా చూడాలనిపించేట్టు…ఇంతకీ ఎవరతను” అన్నాను

“ఎవరూ”

“అదే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, సౌందర్యాన్ని వెంట తెచ్చేవాడని అతను.”

“ఓ! అతనా, అతను దయ్యం! , పేరు నాక్కూడా తెలియదు”

నేను ఆశ్చర్య పడ్డాను. తల ఒకసారి విదిలించి, వెళ్దామా అని ఆలోచించాను. పగలు మద్యాహ్నం లోకి  జారబోతుంది. సుబ్బరాయుడి పుట్ట దగ్గర, పొయ్యికి మూడురాళ్ళు దొరికినట్టే వున్నాయి సన్నటి పొగ లేస్తుంది. ఎందుకో పోలేక ఆగి, ఆవిడ వైపు చూసి “దయ్యాలు ఉన్నాయంటారా?” అన్నాను. ఆవిడ “దయ్యాలున్నాయి, పుష్ప వర్ణ మాసంలో పుట్టిన వాళ్లకి కనిపిస్తాయి” అన్నది. పుష్ప వర్ణ మాసమా…! అదేం మాసం? నేనెప్పుడూ వినలేదే ఆ పేరు, బహుశ   పుష్య మాసాన్ని ఈవిడిట్లా చెప్తుందేమో అనుకుని, “అవునా… ఎక్కడ చూసారు దయ్యాన్ని మీరు?” అన్నాను.

ఆవిడంది “ఒకరోజు మధ్యాహ్నం పన్నెండూ అట్లా అయి వుంటుంది. వైశాఖ మాసపు చివరి రోజులవి. నా పడక గదిలో దిళ్ళకి ఆనుకుని, కిటికీలోంచి చూస్తూ వున్నాను. పెద్ద కిటికీ మాది. కిటికీ లోంచి లోపలికి రావడానికి తెగ ప్రయత్నిస్తూ వుంటుంది సంపెంగ చెట్టు. ఆ పువ్వుల రంగూ, మధురమైన ఆ  వాసన ఎంత బాగుంటాయో. దాని వెనక జామ చెట్టు, బాగా పెద్దది. మా అత్తగారు కాపరానికి వచ్చినప్పుడు వేసిందట. అది కూడా పూత పూసింది. తెల్లటి జామి పూలు. దాని వెనక మామిడి చెట్టు. ‘బేనిషాన్’. బోలెడు కాపు కాసింది ఆ ఏడాది. గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతున్నాయ్. ఆ అందమైన వర్ణాల కలివిడి ఎంత బాగుండిందో, చూస్తూ కూర్చున్నాను.

చాలా సేపటి నుండి ఒక కోయిల ఆర్తిగా, అదే పనిగా ఎవరినో పిలిచినట్టు కూస్తుంది. నేను లేచి, సరిగా కూచుని మామిడి చెట్టులో మూల మూలలా కోయిలని వెతకడం మొదలెట్టాను. అదిగో అప్పుడు చూశాను ఆ దయ్యాన్ని … అదే అతన్ని. కోయిల అతని భుజం పైనే వుంది. మొదట నాకేం అర్ధం కాలేదు. చెట్టు గుబురులో ఆకుల్లో ఆకులా అతను. ధ్యానంగా, ఎక్కడో దూరంలో నిమగ్నమై, శరీరం  మాత్రం అక్కడ వున్నట్లు. నేనేమైనా భ్రమ పడుతున్నానా? లేచి టేబిల్ పైన నీళ్ళు తీసుకుని తాగి, గదిలోనే మూడు నాలుగు సార్లు అటూ ఇటూ నడిచి, మళ్ళీ  వచ్చి చూశాను. అతను అక్కడే, అట్లానే వున్నాడు. చుట్టూ  పింద, దోర మామిళ్ళు, భుజం పైన కోయిల, ఆకులు గాలికి అటూ ఇటూ కదుల్తుంటే అతనిపై  పరుచుకుంటున్న వెలుగునీడల తారాటలు… ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఎంత సుందరమైన దృశ్యం కదా అది అని.

మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్పేది, పుష్ప వర్ణ మాసంలో పుట్టిన వాళ్ళకి దయ్యాలు కనిపిస్తాయని. మా అమ్మ కూడా అదే మాసంలో పుట్టింది. ఎంత బాగుండేదో మా అమ్మ. మొక్కల్ని, సీతాకోకల్ని,ఆకాశాన్నీ, ఆరుద్రల్నీ, వాన చినుకుల్నీ అన్నింటినీ ప్రేమించేది, తియ్యగా పాడేది, గొప్పగా రాసేది. ఎంత బాగుండేదో తెలుసా! బహుశా మా అమ్మమ్మ ఆ మాసంలో పుట్టలేదనుకుంటా ఆవిడ నగల్ని, వాహనాల్ని, నౌకర్లు చాకర్లు ఉండే మేడల్ని ప్రేమించేది. మా అమ్మ చీటికి మాటికీ మా నానతో గొడవపడి, నన్ను తీసుకుని మా అమ్మమ్మ దగ్గరకి వెళ్ళేది. కానీ మా అమ్మమ్మ మళ్ళీ మా అమ్మని నాన దగ్గరికే  పంపేసేది. ఒకసారి మా అమ్మ చచ్చిపోయింది. అప్పటి నుండి నేను మా అమ్మమ్మ దగ్గరే పెరిగా. మా అమ్మమ్మ, నేను కూడా పుష్ప వర్ణ మాసంలోనే పుట్టినందుకు బాగా దిగులు పడేది.ఆ దయ్యాన్ని చూడగానే నాకు అదంతా గుర్తొచ్చింది.

అట్లా నేను దాదాపు ఒక వారం రోజులు ఆ దయ్యాన్ని చూస్తూ వుండేదాన్ని. చూస్తూ చూస్తూ వుండగా నాకో రోజు అతన్తో మాట్లాడాలనిపించింది. ఏం చెయ్యాలి ఎలా అతని దృష్టి నా  వైపుకి తిప్పుకోవాలి. ఆలోచించి, ఆలోచించీ చివరికి  పని వాళ్ళని రప్పించి, దోర మామిళ్ళను కొయ్యమని చెప్పా. నేను ఆశించినట్టే ఆ మనుషుల అలజడికి అతను ధ్యానంలోంచి బయటకొచ్చాడు.

దయ్యాలలో మనీశ్వరుడు అనే దయ్యాలు కూడా ఉంటాయట. అవి ఎప్పుడూ మౌనంగా ఉంటాయట మా ఊర్లో చెప్పేవాళ్ళు. ఇతను అది కాదు కదా అనుకుంటూ, “మీరు నాకు కనిపిస్తున్నారు అదిగో ఆ గదిలోంచి మిమ్మల్ని చూశా, మీతో మాట్లాడాలని వుంది” అని చెప్పా. అతను తల వంచి ఎత్తైన ఆ చెట్టు పైనుంచి నన్ను చూశాడు. ఆ తరువాతి  నిమిషంలో అతనక్కడ లేడు. ఎంత గుచ్చి గుచ్చి,కొమ్మ కొమ్మా వెతికినా, అతను అక్కడ కనిపించలేదు. నా మాటలు విని, మామిడికాయలు కోస్తున్నవాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతున్నానేమో  అనుకున్నారు. నేను గబగబా నా గదిలోకి  వచ్చి  అక్కడినుండి చూశా. అతను లేడు. ఆ తరవాత నుండీ ప్రతి రొజూ అతని కోసం వెతికా. మధ్యాహ్నం పూట కదా అతను నాకు కనిపించింది. అందుకని, ప్రతి మధ్యాహ్నమూ అది పనిగా వెతికేదాన్ని. కానీ  అతను మళ్ళీ కనిపించలేదు.

ఒకరోజు పగలంతా బాగా ఎండ కాసింది, రాత్రి ఏడూ ఎనిమిది అవుతుండగా వర్షం మొదలయింది. ఉరుములూ, మెరుపులతో  ఆకాశం ఎర్రగా మెరుస్తూ ఉగ్రరూపమెత్తింది. రాత్రంతా వర్షమే. వర్షాన్ని వింటూ నిదురపోయాను. పొద్దుట లేచి చూద్దును కదా, ఎంత బీభత్సమో… ! మామిడికాయలు పిందెల తో సహా రాలి పొయ్యాయి. ఆకులూ, అక్కడక్కడా రాలి పడిన కొమ్మలూ  … గొప్ప యుద్ధక్షేత్రంలా వుంది అక్కడంతా. అదిగో ఆ రోజు మధ్యాహ్నం, మళ్ళీ చూశా అతన్ని. ఎంత దిగులో  ముఖం నిండా, గభ గభా లేచి, చెట్టు క్రిందకి వెళ్ళా. రాత్రి వర్షానికి తడిసి జడిసిన పక్షులు అతని దగ్గర సేద తీరుతున్నాయ్. నేను తల పైకెత్తి “ఇన్ని రోజులు రాలేదే, ఏమయ్యారు?” అన్నాను. అతను నన్ను చూశాడు. నేను అతన్నే చూస్తూ వున్నాను. చూస్తూ ఉండగానే, బోర్డు మీద వేసిన బొమ్మ డస్టర్తో చెరిపేస్తే ఎలా చెరిగిపోతుందో అలా చెరిగిపోయాడు. పక్షులు మాత్రం మిగిలాయి.

నాకు ఏడుపొచ్చింది. గదిలోకొచ్చి మామిడి చెట్టు వంక చూస్తుంటే, ఎందుకో తెలీదు… రాత్రి కురిసిందే ఉదృతమైన వర్షం, ఉరుముల మెరుపుల వర్షం, అట్లా వచ్చింది ఏడుపు. గది తలుపులు భిగించి, పెద్ద పెట్టున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుని ఏడ్చుకుని పడుకున్నాను. బహుశా గంట తర్వాత అనుకుంటా మెలకువ వచ్చింది. మామిడి చెట్టు వంక చూడటానికి తల తిప్పానో లేదో, నా కిటికీ దగ్గరగా ఊచల్ని పట్టుకుని, సంపెంగ పూచెట్టు కొమ్మ పైన కూర్చొని వున్నాడు అతను. నా మెలుకువ కోసమే చూస్తున్నట్లు, ఆత్రుతగా “ఎందుకు ఆ ఏడుపు?” అన్నాడు. నేనతన్ని చూశాను. యదావిదిగా అతని చుట్టూతా పక్షులు, సీతాకోకలూ, ఇప్పుడు సంపెంగలూ…చూసి చూసి, అతన్ని కళ్ళనిండుగా నింపుకుని “తెలీదు” అన్నాను. అతను నిశ్శబ్దంగా మామిడి చెట్టు వంకే చూసి, చాలాసేపటికి “ఒకటేరోజుటి వర్షం, చెట్టు చూడండి ఎట్లా అయిపోయిందో పిచ్చిదానిలాగా” అన్నాడు. అతని ముఖం నిండుగా దిగులు.

అట్లా మొదలయింది మా పరిచయం. అతను ‘నీలి మేఘం అడవితో మాట్లాడుతుందే, ఆ భాష’ మాట్లాడేవాడు. మొదట్లో ఆ భాష నాకు అర్ధమయ్యేదే కాదు. తరువాత నెమ్మదిగా నేర్చుకున్నాను. ఆ భాష, అతని మాటా ఎలా ఉంటుందంటే, అతనితో మాట్లాడిన తరువాత హృదయం, చినుకులతో తడిసిన పుడమిలా మారేది.

ఆ కొత్తల్లోనే ఒకసారి అడిగా “ఈ ఇంటితో మీకేమైనా అనుభందమా?” అని. ఎందుకడిగానో నిజంగా నాకూ తెలీదు. ఆ ప్రశ్న వినగానే అతను దిగులుగా తలవాల్చి “ఈ ఇంట్లో తనుంది” అన్నాడు.

“తనంటే?”

“నేనూ తనూ ప్రేమించుకున్నాం, కోతకొచ్చిన పంటని ఏనుగుల గుంపు ధ్వంసం చేస్తుందే …అట్లా వాళ్ళ  ఇంట్లో వాళ్ళు ఆమెకు పెళ్లి చేసేసారు. ఆ తరువాత నించీ నేనిట్లా. ఈ మామిడి చెట్టు వున్న చోటే. ఏడు మామిడి చెట్లు  పెరిగీ …మరణింఛీ … పెరిగాయి. కానీ ఆవిడ ఆ  ఇంట్లోంచి బయటకు రాదు ఎంత ప్రార్దించినా……..” అతని కళ్ళలో నీళ్ళు. ఎలా ఓదార్చను అతన్ని.

నాకు హట్టాత్తుగా గుర్తొచ్చింది. నా పెళ్ళైన కొత్తల్లో ఓ మధ్యాహ్నం తలారా స్నానం చేసి, ఎందుకో ఏడుస్తూ వట్టి గచ్చు మీదే పడుకున్నా. గచ్చు మీద పరుచుకుని నా జుత్తు. ఎందుకో, ఆ మగతలో ఎవరో తెల్లగా ఇంత పెద్ద కన్నులున్న ఒకావిడ చల్లగా నా నుదుటిని, జుట్టుని నిమిరినట్టు, నా దుఖాన్ని ఒదార్చినట్టు భ్రాంతి కలిగింది. మా అమ్మేమో అనుకున్నాను అప్పుడు. కానీ కాదు. ఆవిడ, ఇతను చెప్పే ఆవిడ. అతనితో  అన్నాను “ఆవిడ తెల్లగా ఉంటారా” అని. అతను దుఃఖంలోంచి ఒత్తిగిలి “తను మేలి ముత్యం లాగుంటుంది” అన్నాడు మురిపెంగా. అంతే ఆ తరువాత మా మధ్య ఆ సంభాషణ మళ్ళీ ఎప్పుడూ రాలేదు.

అతను ఎంత పురాతనుడో, ఎప్పటి వాడో, ఎక్కడి వాడో నాకేం అవసరం? నేనేం చేసుకుంటా ఆ వివరాలన్నీ? అదీకాక దుఃఖంతో నిండిపోయిన అతని గతాన్ని నేనెందుకు కదిలించాలి. అందుకే ఏడు మామిడి చెట్ల అతని గతాన్ని నేనెప్పుడూ ప్రస్తావించలేదు.

క్రమంగా అతను నాకొక వ్యసనమయ్యాడు. సంపెంగ పూ చెట్టుపైకి అతను రావడం ఆలస్యం  ఎక్కడెక్కడి  పక్షులూ  వచ్చి నా కిటికీ పైనా, నా పైనా, అతని పైనా వాలేవి. ఎన్నెన్నో పాటలు పాడేవి. ఆ పాటల్లో మా మాటలు మాకే కొన్నిసార్లు వినిపించేవి కాదు. ఆ పక్షుల్లో ఒక కోయిల నా గదిలోపలికొచ్చి గూడు పెట్టడం మొదలెట్టింది. ఎక్కడినుండో పుల్ల పుల్లా ఏరుకొచ్చి గూడు కట్టేది. పొరపాటున  అదెక్కడ  ఫాన్ రెక్కలు  తగిలి చచ్చిపోతుందోనని నాకు భయమేసేది. ఫాను స్విచ్చికి  గట్టి టేప్ ఒకటి అతికించి ఫాన్ తిరగకుండా చేసేశాను.

అప్పుడడిగాడు మా ఆయన ”ఫాన్ స్విచ్ ఎందుకిట్లా చేశావు” అని. నేను మామూలుగానే చెప్పా కోయిల గూడు కడుతుందండీ, ఫాన్ రెక్కలు  తగిలితే చచ్చిపోతుంది అని. విచిత్రంగా మా ఆయన నా వంక వెర్రి చూపు చూసి,”కోయిల  గూడా? ఎక్కడ? అసలు కోయిల గూడు పెట్టడం గురించి ఎప్పుడైనా విన్నావా?” అని వాదులాటకొచ్చాడు.

నేను ఓపికగా స్టూలు తెప్పించి కోయిల పేర్చిన పుల్లల్ని, సగం పూర్తయిన దాని గూటినీ  చూపించాను. అప్పుడు కోయిల, కిటికీ ఊచల మీదే నిలబడి మా ఆయన వంకే చూస్తుంది కూడా. అయినా సరే అదేం మా ఆయనకి  కనిపించలేదు. నా వంక అనుమానంగా చూట్టం మొదలెట్టాడు. ఇంట్లోవాళ్ళు, నేనతనితో  మాట్లాడేప్పుడు దొంగచాటుగా వినే వాళ్లు. ఏదో  పిచ్చి భాషలో మాట్లాడుతానట, నవ్వుతానట. ఆ విషయం మా ఆయన ఒక రాత్రి ప్రస్తావించాడు. నేనెట్లా చెప్పేది, నీలిమేఘం అడవితో మాట్లాడే భాష ఒకటి ఉంటుందని …ఆయనకి  నేనెట్లా అర్ధం చేయించగలను? ఆయన పుష్ప వర్ణ మాసంలో పుట్టలేదు కదా. ఆ దయ్యాన్ని, అదే అతన్ని నేనెలా ఈయనకి చూపించగలను? అందుకే అదేమీ లేదండీ, ఏదో పాట నేర్చుకుంటున్నాను, అంతే అని చెప్పా.

అప్పటి నుండి ఇక జాగ్రత్త పడడం మొదలు పెట్టాను. మా ఇంటికి  వెనక వైపు పది పన్నెండు మెట్లు పైన రెండు గదులున్నాయ్..ఒక దాంట్లో ఎప్పుడో ఒక వంటావిడ ఉండేదట. ఒకసారి వాళ్ళ ఊరికెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదట. ఎందుకనో ఆ గదికి, నేను వచ్చినప్పటినుండి తాళం వేళ్ళాట్టమే చూశాను గానీ, తెరవడం చూళ్ళేదు. దాని పక్కనే ఇంకో చిన్న రూమ్ వుంటుంది. దాంట్లో, మా తోటల్లోంచి కోసుకొచ్చిన దోర పళ్ళని పెట్టి మగ్గ వేస్తుంటారు. రక రకాల పళ్ళు. మగ్గిన తర్వాత ఇంటిలోపలికి తీసుకొస్తారు. ఆ గది భలే వుంటుంది. రంగురంగుల పళ్ళతో, మిళితమై పోయిన అనేక రకాల వాసనలతో…

మేమిద్దరం అక్కడ కలుసుకునేవాళ్ళం. అక్కడా కిటికీ బయట తను, లోపల నేను. భూమికి ఆకాశానికి మధ్య కిటికీ వుంటే ఎట్లా వుంటుందో అట్లా అనిపించేది నాకు. ఒక్కోసారి అతను రెండు మూడు రోజులు వొచ్చేవాడు కాదు. అప్పుడు నేనతనికి, రాత్రంతా కూర్చుని నా మనసు నిండుగా  ఉత్తరం రాసేదాన్ని. ఒకరోజు అట్లాగే నా మనసుని బల్లపైన పరచి రాస్తూ కూర్చున్నాను. బల్లంతా బంగారు  రంగు జలతారు వెలుతురు పరుచుకుంది. అతని స్మృతి నా పెదాలపై నవ్వై పరుచుకుంది. నేను రాసుకుంటూ పోతున్నాను. హటాత్ గా మా ఆయన నిదరనించి  లేచి “ఏం చేస్తున్నావ్” అన్నాడు. అంతే నేను గబగబా నా మనసునంతా జవిరి నా రెండు చేతుల మధ్యకు నెట్టి, కష్టపడి ఆ కాంతినంతా దాచి దాచి “ఏం లేదు ఏదో రాసుకుంటున్నా” అన్నాను. ఆయన ఆశ్చర్య పడి,”చీకట్లో ఏం రాస్తున్నావ్” అన్నాడు. చీకటా! చీకటెక్కడ! మిల మిల మెరిసిపోయే ఇంత కాంతి ఉండగా…నేను మౌనంగా ఉండిపోయాను. మా ఆయన చిరాకు పడి “వచ్చి పడుకో” అని గద్దించాడు. నేను నెమ్మదిగా లేచి వెళ్లి పడుకున్నాను.

మరుసటి రోజు అతనొచ్చాడు. ఉత్తరం చదివావా అని నేనతన్ని అడగలేదు, అడగాల్సిన అవసరమూ లేదు. ఆ ఉత్తరాన్ని ఎలా చదవాలో అతనికి తెలుసు.

ఆ రోజుల్లో మేం గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం. ఏం మాట్లాడుకునే వాళ్ళమో ఇప్పుడు కొంచేమన్నా గుర్తు  లేదు. కానీ అతనితో మాట్లాడటం నాకు చాలా బాగుండేది. ఎందుకంటె అతను, చీకటిని బంతాడే సూర్యుడి లాగా, మరో ప్రపంచపు కల లాగా, స్వప్నాలకే స్వప్నం లాగా సంభాషించే వాడు.  కొండవాలు లో పుట్టిన అనాది  గానం లా ఉండే వాడు. అతనికి పక్షుల భాష, పూల భాషా అన్నీ  తెలుసు. ఒక సారి నా ముందే మా కుక్క అతనితో మాట్లాడటం నేను చూశాను.

మా ఇంట్లో నా గురించి గుస గుసలు ఎక్కువై పోయాయి. నేను ఒక్కదాన్నే వెళ్లి ఆ మూల గదిలో కూర్చుంటున్నానని, నాలో నేను మాట్లాడుకుంటూ, నవ్వుకుంటున్నానని అనుకోవడం మొదలుపెట్టేరు. మా ఆయన విసిగి నన్ను మా అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్ళాడు.అందరికీ, సంక్రాంతి పండుగకి ఊరికెళ్ళిఒదని  చెప్పుకున్నారు. మా ఊరంటే మామూలు రోజుల్లో నాకెంత సంతోషమో .ఈసారి అట్లా అనిపించలేదు. నా బట్టలంతా నాకు తెలీకుండానే  పనిపిల్ల ఎప్పుడో సర్ది పెట్టేసింది  .రాత్రి పదిగంటల వేళ మా ఆయన “బయల్దేరు” అన్నాడు.నేను ముందు మొరాయించాను,ఏడ్చాను, అతనికి చెప్పకుండా ఎలా వెళ్ళగలను ?.అతను నన్ను వెతుక్కోడా …ఏమనుకుంటాడు,ఇంకెప్పటికీ రాకుండా అద్రుశ్యమైపోడా?

మా ఆయన, అమ్మమ్మకి ఏమిటేమిటో చెప్పాడు.నేను మాట్లాడుతున్న పిచ్చి భాష గురించి చెప్పాడు.వినివిని మా అమ్మమ్మ “ఏం చేసేది నాయనా  అన్నీ వున్నా సుఖ పడే రాత  నా నుదుటున రాసిపెట్టలేదు ఆ దేవుడు ,లేకుంటే తల్లిలాగే ఇదీ పుష్పవర్ణ మాసంలోనే పుట్టాలా” అని ఏడ్వటం మొదలుపెట్టింది.

నేను మా అమ్మమ్మ తిప్పిన గుడులూ, మసీదులూ అన్నీ తిరిగాను.నాకేం కాలేదని చెప్పినా మా అమ్మమ్మ వినిపించుకోలా. నీలిమేఘం అడవితో మాట్లాడే భాష గురించి చెప్పబోయినప్పుడల్లా టపటపా చేత్తో తల బాదుకునేది.నేనింక భయపడి ఆమాటే ఎత్తడం మానేశా.కొన్ని రోజులకిక  నేను కుదుట పడ్డానని చెప్పి  మా అమ్మమ్మ నన్ను మా ఇంటికి తెచ్చి వదిలి వెళ్ళింది.

ఆ రోజు తలస్నానం చేసి, కిటికీ దగ్గర కూర్చుని, వేళ్ళతో జుత్తు చిక్కులు  తీస్తూ వున్నాను.దిగులుగా ఉంది. అతను ఇక రాడా …నన్ను మరిచిపోయుంటాడా! అని.అతను వచ్చాడు.అతనితో పాటు వచ్చిన పక్షులు ,మేత తెచ్చిన అమ్మకోసం నోరంతా తెరిచి అరుస్తాయే బుజ్జి పిట్టలు, అట్లా నన్ను చూసీచూడగానే అరవడం మొదలుపెట్టాయి.అతన్నట్లా చూడగానే నాకు  ఒక్క సారిగా లక్ష ఊచల పెద్ద పంజరాన్నై పోయి అతన్ని చుట్టేసి అతన్నీ, అతని పక్షుల్నీ అట్లాగే బంధించేయ్యాలనిపించింది.  అతను నన్ను చూసి   గొంతు పెగల్చుకొని ,చాలా నీరసంగా  “ఇన్ని రోజులూ ఎక్కడికెళ్ళారు వీణాధరి” అన్నాడు.అదే అతని పెదవులు నా పేరుని మొదటిసారి పలకడం.నేనెప్పుడూ అతనికి నా పేరు చెప్పలేదు ,అతని పేరూ అడగలేదు.ఆ తరువాత ఇంకొక్కసారి అతను నన్ను పేరుతో పిలిచాడు మా మొత్తం పరిచయంలో.

అతని నోటి వెంట  నా పేరు వినగానే ఒక్కసారిగా  శరీరమంతా కంపింఛి పోయింది .గుండె దడదడమని కొట్టుకుంది.కళ్ళలో నీరు కమ్మింది.ఆ ఉద్వేగం నుండి బయటకు రాక మునుపే ,అతను చాలా మొరటుగా “ఏం గొంతు నొప్పా? మాట్లాడవేం…? చెప్పడానికేం…? ” అని ఏకవచనంతో గద్దించాడు. ఆ గద్దింపుకి నవ్వొచ్చింది.అతని అక్కరకి ఏడుపు పొంగుకొచ్చింది . నవ్వి ,కళ్ళ నీళ్ళని కళ్ళలోనే దాచిపెట్టేసి ”అచ్చు దయ్యం లాగే మాట్లాడుతున్నారు” అన్నాను.అతను నెమ్మదిగా శాంతించాడు.ఎన్ని ఆలోచనలో  తెలుసా?పగలూ రాత్రి ఆ మామిడి చెట్టు మీదే కూర్చున్నా తెలుసా !అన్నాడు.అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు ” మీకు ముగ్గులేయడం వచ్చా ?” అన్నాడు పిచ్చిగా .మళ్ళీ “పండగకి ఏం చీర కట్టుకున్నారు” అన్నాడు .నేను ఉక్కిరిబిక్కిరయ్యాను ఆ కొత్త కొత్త ప్రశ్నలకి .ఎట్లాగో మనసు కూడదీసుకుని “అడవి పచ్చ రంగు చీర,ఆకాశ నీలం రవిక “అన్నాను.అతను కళ్ళు మూసుకుని ధ్యానంగా  “చినుకు చుంబించిన నేల పరిమళంలా ఉన్నావ్ ” అన్నాడు.

ఆ రోజు రాత్రి ,మా ఆయన పని మీద ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళాడు.అతను మొగ్గలు విడుతున్నసంపెంగ చెట్టు మీద, నేను కిటికీ లోపల కూర్చుని వెన్నెల కౌగిట్లో తడిసి ముద్దయ్యాం.చంద్రుడు ఆకాశాన్ని  ఆ ఒడ్దు నుండి ఈ ఒడ్డుకి త్వరత్వరగా ఈదేస్తున్నాడు.అట్లా ఈదే చంద్రుడిలో కొంత భాగం తీసుకుని ,ఇరవై నాలుగు రేకుల పువ్వు ఒకటి చేసి నాకిచ్చాడు.ఆ పువ్వు ధగ ధగా మెరిసిపోతూంది.గమ్మత్తుగా గుబాలిస్తుంది .దాన్ని పక్కనుంచుకుని వేకువున, ఎప్పుడో అతను వెళ్ళాక నిదురపోయాను.

మరుసటి రోజు నిదురలేచినప్పట్నుంచి ఏదో దిగులు. ఒక చోట నిలువనీయని దిగులు .నాకేదో కావాలి ,ఏదో కాదు ,నాకు అతను కావాలి ,నాకు నాకే సొంతంగా కావాలి, అతను నావాడైపోయి నేను అతని దాన్నైపోవాలి,హృదయం లోంచి  పొంగుకుని పొంగుకుని వచ్చింది దుక్కం  .ఏడుస్తుంటే నా గదిలో గూడు కట్టుకున్న కోయిల నన్నే రెప్ప వేయకుండా చూడటం మొదలుపెట్టింది.చూసీ చూసి చివరకి  ” అతనితో నేను చెప్తానులే ఏడవకు” అన్నది.

అతనొచ్చాడు .ఇవాళ అతని ముఖం కాంతిగా ఉంది.పెదాలపై నవ్వుంది. అతనొచ్చీ రాగానే  కోయిల వెళ్లి అతని భుజంపై కూర్చుని, ఒక పాట పాడటం మొదలుపెట్టింది.’ ఆకుపచ్చటి పాట’.పాట వింటూ ఉండగానే అతని ముఖం వివర్ణమవడం  మొదలు పెట్టింది. పాట ముగిశాక, కోయిలని భుజంపై నుండి చేతిలోకి తీసుకుని “నువ్వు పాడకుంటే నేను తెలుసుకోలేననుకున్నావా  కోయిలా” అన్నాడు.

నేను తలవంచుకుని కూర్చున్నాను. మనసంత ఆందోళనగా, భయంగా ఉంది.దిగులు పొగలాగా కమ్ముకుంటూ ఊపిరాడనీయకుండా ఉంది.అయినా అట్లాగే దిగులుగా చెప్పాను “నాకు మీరు కావాలి” అని .అతనేం మాట్లాడలేదు చాలాసేపు .చివరికి “మీరు అతని భార్య వీణాధరి , మిమ్మల్ని ఎట్లా స్వీకరించగలను”అన్నాడు.నాకేం మాట్లాడాలో తోచలేదు.సంపెంగల గాలికి పక్షులన్నీ శాంతిగా ,నిశ్సబ్దంగా కూర్చున్నాయ్.ఆ నిశ్శబ్దం లోంచి నేను మొండిగా  “నాకు నువ్వు కావాలి” అన్నాను.అంత ఏక వచనపు చనువు ఎట్లా పుట్టిందో  నాకు …మళ్ళీ రెట్టించి ”నాకు నువ్వు కావాలి”అన్నాను.నాకు అదొక్కటే తెలుసు మరి.

అతను నిట్టూర్చి “మీకు అట్లాంటి ఆలోచన కలగడానికి నేను చేసిన తప్పేంటి? అన్నాడు.అతను మాట్లాడుతూ ఉండగానే, హటాత్తుగా  నా మనసులో ఒక మొక్క మొలవడం చూశాను.  అది మారాకు  వేసుకుంటూ అతి వేగంగా పైకి వస్తున్నది .నేనా మొక్కనే గమనిస్తూ వున్నాను .అతను  “నాకు మీతో మాట్లాడటం బాగుంటుంది.అయినా  నేను ఆమెని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు కదా.మనం మంచి స్నేహితులం అంతే ” అన్నాడు  .నేనేం మాట్లాడలేదు .నా మనసులో పుట్టిన మొలకను మొదలకంటా పీకి ,గోటితో చిన్న చిన్న తునకలుగా చేసి కిటికీలోంచి విసిరేశాను.అతనది చూశాడు, దిగులుగా “మీది చాలా మంచి జీవితం వీణా ,ఇది మీకు మంచిది కాదు ,కొంచెం  కూడా మంచిది కాదు”అన్నాడు.నేను ఊరుకున్నాను.అతను ఏడు మామిడి చెట్లంత పురాతనుడు.ఒక వేసం   కాలపు నీల మేఘం, అతని ప్రియమైన మామిడి చెట్టును ఏం చెయ్యగలిగిందో  తెలిసిన వాడు ,అతనికి బదులు మాట్లాడటం నాకెలా సాధ్యం?.సాధ్యా సాధ్యాల ప్రసక్తి ఎలా వున్నా ,నాకు ఇష్టం లేదు అంతే.నేను ఊరుకున్నాను. అతను వెళ్ళిపోయాడు.

తర్వాత రోజు అతను రాలేదు ,ఆ తర్వాత చాలా రోజులు రాలేదు. బట్టల అల్మారాలో  దాచిపెట్టుకున్న  వెన్నెల పువ్వు గుప్పెడు బూడిదగా మారిపోయింది.నేను కృశించి పోవడం మొదలుపెట్టాను.అయినా అష్ట సిద్దులలోని మూడు సిద్ధులు ప్రాప్తి,ప్రాకామ్య,వశత్వాలు పొందాలని తీవ్రంగా ధ్యానించేదాన్ని.ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు,గది తలుపులు భిగించుకునే దాన్ని .తిండి తినేదాన్ని కాదు .ఒకే ఒక్క ఆలోచన  ‘అతను కావాలి’ .ఈ సంఘటనకు ముందువున్న యధాతధ స్థితి ఇంకెలా సాధ్యం.ఏమో ఇదంతా కాదు, నాకు అతను కావాలి .

ఒకరోజు అతనొచ్చాడు.నా అవతారాన్ని చూసి దిగులుపడి ,వర్షించి , చివరికి  అన్నాడు “ఎందుకట్లా?”అని. నేను “ఎందుకు రావటం మానేశావ్”?అన్నాను .అతను తలొంచుకున్నాడు.అతని చుట్టూ ఇప్పుడు పక్షులు లేవు.”తప్పు చేసానో ఏమో ?” ఇదంతా ఎలా జరిగింది.అతన్ని కోరుకోవడమేంటి,ఏం చేసుకుంటానతన్ని నేను? అతను నాకేం ఇవ్వగలడు?నాకు లేనిదేమిటి?మా మధ్యనున్న కిటికీని ఏం చేసి ఎవరమైనా తొలగించగలం? ఒకర్నొకరు ఏం చేసుకోగలం? ఇదంతా సరే,అయినా సరే అతను నాకు కావాలి ,నువ్వు నాదానివని   అతను నాకు చెప్పాలి

నా మౌనాన్ని, ఆలోచనలని విరగగొడుతూ అతను “రాకూడదని కాదు ,రాకుండా వుండగలిగీ కాదు,మీరు బాగుండాలి మీ జీవితం మంచిది.మీరు కోరుకుంటున్నది మంచిది  కాదు ” అన్నాడు.ఏడు మామిడి చెట్లను చూసిన వాడు కదా అతను, అందుకని ఏడుపుని ఆపేసుకుని ,నవ్వి ఊరుకున్నాను.అతను వెళ్ళిపొయ్యాడు.

మా ఇద్దరి పరిచయపు మొదటి రోజుల్లో అతను, నాకో గోమేధికం పొదిగిన  పతకాన్ని ఇచ్చాడు.చిన్న కుంకుడు గింజంత రాయి అది.ఆవు పంచతం రంగులో ,నిప్పు కణిక రంగులో మెరిసి పోయేది .అదంటే నాకు చాలా ఇష్టం.ఎప్పుడూ నా గుండెల మీద అందంగా నిలిపి వుంచుకునేదాన్ని.ఎప్పుడైతే అతను రావడం మానేసాడో ,అప్పట్నిండి అది ప్రతి రోజూ కొంత కొంతగా పెరగడం మొదలు పెట్టింది. విపరీతమైన భరువు,మోయలేనంత భరువు ,మెడలు వంచేసేంత భరువు,ఏ పనీ తోచనీయంత భరువు,ఆ భరువు మోయడం కన్నా చచ్చి పోతే పోతుంది కదా హాయిగా అనిపించేంత భరువు వేసేది ఆ రాయి.

మొదట్లో దాన్ని తీసేద్దామని ప్రయత్నించాను. నాకు చేత కాలేదు,నువ్విచ్చింది  నువ్వే తీసుకెళ్ళు అని అతనికే చెప్తామనుకున్నాను. అయినా ఎందుకు చెప్పాలి.అతనికి తెలియకనా.అందుకే ఒక సానరాయి తీసుకుని గోమేధికాన్ని కొంత కొంతగా అరగదీయడం మొదలుపెట్టాను,గది తలుపులు బంధించుకునే అరగదీసేదాన్ని,అయినా ఇంట్లోవాళ్ళు  నా మీద గూడచర్యం చేశారు.నాకు దయ్యం పట్టిందనీ ,ఇదంతా దయ్యం చేష్టలేనని తేల్చారు.అక్కడికీ నేను చెప్పా ,మీరనుకున్నట్టు నాకు ఏ దయ్యమూ పట్టలేదు ,పట్టాలని నేను తపస్సు చేస్తున్నా అని .గోమేధికాన్ని కూడా చూపించా. ఏం చెప్పినా ,ఏం చూపించినా వాళ్లకి కొంచం కూడా అర్ధం కాలేదు.ఎక్కడ నీ గోమేధికం ?,ఎక్కడ నీ దయ్యం? అన్నారు.నన్నిక్కడకి  తీసుకొచ్చి వదిలారు.నాకేం దిగులు లేదు ,ఇక్కడ చాలా బాగుంది ,ఎప్పుడో ఒక రోజు అతను వస్తాడు.మా మధ్య  మాటలు  లేవు   కానీ  , నా గురించి అతను యోచించే క్షణాలు నాకు ,అతని గురించి నేను కలగనే క్షణాలు అతనికీ ,తెలిసి పోతూనే ఉంటాయ్.ఈ గాలిలోనో,ఈ కొమ్మల్లోనో దాగి అతను నన్ను చూస్తూనే ఉంటాడు ,నాకు తెలుసు . అన్నట్లు నేను చెప్పేదంతా మీరు నమ్ముతున్నారా ,చూడండీ పెద్ద మామిడికాయంత పెరిగి పోయింది ఈ గోమేధికం .మీకు కనిపిస్తుందా?’’ అన్నదావిడ.నేను భ్రాంతిలోంచి బయట పడ్డట్టు ఆవిడ గుండెవైపు చూశాను.మొదట ఏమీ కనిపించలేదు ,రెండవ క్షణంలో కనిపించింది ‘బండ రాయంత గోమేధికం’ కణకణ మండిపోతున్నట్లు నిప్పు రంగులో.

నేను దిగులుగా ఆవిడ వైపు చూసి “మీదే పొరపాటేమో అతను మొదటే చెప్పాడు కదా తను ఎవర్నో ప్రేమిస్తున్నట్లు”అన్నాను.ఆవిడ చిన్నగా నవ్వింది .”అతను నన్ను ప్రేమిస్తున్నాడని భ్రమ పడ్డాననా మీ భావన ” అన్నది.నేను తలూపాను. ఆవిడ “మా మధ్య నడిచిన గాలికి కూడా అమ్బిగుఇట్య్ [ఆమ్బిగ్యుటి]  ఉంది.దానిని మీకెలా కావాలంటే అలా మలుచుకోవచ్చు .నాకు కావలసినట్లు నేను, అతనికి కావలిసినట్లు అతను చెప్పుకోవచ్చు.మీ పేరేంటో నాకు తెలీదు కానీ  ,మీకో విషయం చెప్పేదా ,ఏనుగులను మచ్చిక చేసుకునే మావటీలు ,ఏనుగులతో ఒక ప్రత్యేక భాషలో సంభాషిస్తారు,అది మీకు ఐడియా ఉందా ? ఒకసారి నేనో  మావటీని ఇంటర్వ్యూ చేశా .’’ప్రేమని వ్యక్త పరచడానికి  ఏం పదాలు వాడుతారు మీరు ‘’అని. ఆ  ప్రశ్నకి అతనేం బదులిచ్చాడో తెలుసా ”అందుకేం పదాలూ లేవు .మన చేతలలలో, ప్రవర్తనలో నుండి మన ప్రేమ ,అనురాగ  భావనని అవి గ్రహించుకుంటాయి ” అని .ప్రేమ అట్లాటిది. దానికి భాషే అవసరం లేదు,ఆ ఇంట్లో వున్నావిడని ఇష్టపడ్డాడని కదా మీరు అడిగారు, ఆ ఇంట్లో వున్నది మరెవరో కాదు “నా మరో నేను ” అన్నది.

ఆవిడని తీసుకెళ్ళడానికి ఎవరో వచ్చారు .నేను లేచి మా  వాళ్ళ వైపు నడిచాను .వెళ్తున్న దారిలో ఎవరో ఒకావిడ మట్టిలో దొర్లి దొర్లి ఏడుస్తుంది.”ఒసేయ్ కామాక్షి ,నన్నొదిలి పెట్టే…నన్నొదిలి పెట్టే …నా చేతుల్ని  కట్టేయ్యకే కామాక్షి ,నేనీ బాలని తీసుకెళ్ళ డానికే వచ్చానే కామాక్షి ,దీని మీద నాకు మోజే కామాక్షి ,దీన్ని నేను వదిలి పెట్టనే …అని ఏడుస్తుంది .ఎందుకో  దిగులేసింది.చిన్నప్పటినుండీ అమ్మవారి మందిరం చుట్టూ,దయ్యాలు పట్టిన వాళ్ళని చూస్తూనే పెరిగా .ఎప్పుడూ భయం కలగ లేదు. ఇవాళెందుకో మొదటి సారి భయమేసింది .ఇందాక నేను ఆవిష్కరించలేక పోయిన ”పుష్ప వర్ణ మాసం”నాకు ఆవిష్క్రుతమవడం మొదలు పెట్టింది   .దిగులు,ఆవిడ చెప్పిన పొగలా ఊపిరాడనీయకుండా నన్ను కప్పేయడం మొదలు పెట్టింది.