Archives for August 2015

కె. శివారెడ్డి @ 72

అరణ్యకృష్ణ
మట్టి మీద
మట్టి నుండి లేచిన చెట్టు మీద
చెట్టు మీదెక్కిన పిట్ట మీద
 
సముద్రం మీద
సముద్రం ఒడ్డున ఇసుక తిన్నెల మీద
ఇసుక తిన్నెల మీది పాదముద్రల మీద
 
ఆకాశం మీద
ఆకాశం పైని చీకట్ల మీద
చీకట్లు విసిరే కాంతిపుంజాల మీద
 
అడవుల మీద
అడవులు పెంచిన ఆకుపచ్చని ఆశల మీద
ఆకుపచ్చని ఆశలతో సాయుధమైన కలల మీద
 
పల్లె మీద
పల్లె ఒంటి గాయాల మీద
గాయాలు మిగిల్చిన కసి మీద
 
మనిషి మీద
మనిషంతటి ప్రేమ మీద
ప్రేమతో పరితపిస్తూ హత్తుకునే హృదయం మీద
 
గుండె మీద
గుండె లోతుల్లోని స్నేహం మీద
స్నేహం కురిపించే అత్తరు జల్లుల మీద
 
కళ్ళ మీద
కంటి కొసల నీటి మీద
కన్నీళ్ళు నింపుకున్న కలాల మీద
 
కవిత్వం జెండా ఎగరేసిన వాడు!
*
aranya

గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -14

 

    Anne Of Green Gables By L.M.Montgomery

పిక్ నిక్ కి ముందరి రోజు సాయంత్రం. ఆ రోజు సోమవారం. మెరిల్లా మెట్లు దిగి వస్తోంది , ఆమె మొహం వాడిపోయి ఉంది.

మచ్చ లేకుండా తుడిచిన బల్ల మీద బటానీలు ఒలుస్తూ ఆన్- డయానా నేర్పిన పాట  ‘ హేజెల్ కనుమ లో నెల్ ‘ పాడుకుంటోంది..గొప్ప భావావేశం తో.   మెరిల్లా అడిగింది – ” నా అమెథిస్ట్  పిన్ ని నువ్వుగానీ చూశావా ఆన్ ? నిన్న ఆదివారం చర్చ్ నుంచి వచ్చి పిన్ కుషన్ కి గుచ్చి పెట్టాను..ఇప్పుడు చూస్తే ఎక్కడా కనిపించట్లేదు…”

ఆన్ మెల్లిగా చెప్పింది- ” ఇందాక..మధ్యాహ్నం… చూశాను , నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. నీ గది పక్కనుంచి వెళుతూంటే కనిపించింది…చూద్దామని లోపలికి వెళ్ళాను ”

” తీశావా దాన్ని ? ” మెరిల్లా కటువుగా అడిగింది.

” ఆ..అవును ” – ఆన్ ఒప్పుకుంది. ” నా గౌన్ కి పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని…”

” నీకు అవసరమా అదంతా ? చిన్నపిల్లవి…నా గదిలోకి నేను లేనప్పుడు వెళ్ళటం ఒక తప్పు, నీది కాని వస్తువుని తీయటం ఇంకొకటి. ఎక్కడ పెట్టావు దాన్ని ? ”

” అక్కడే..బీరువాలో పెట్టేశాను…ఒక్క నిమిషమే పెట్టుకుని తీసేశాను మెరిల్లా. అలా లోపలికి వెళ్ళి చూడటం తప్పని అనుకోలేదు నేను..ఇంకెప్పుడూ చెయ్యను. నాలో అదొక సుగుణం- ఏ పిచ్చి పనీ రెండో సారి చెయ్యను ” – చెప్పుకుంది.

” నువ్వు పెట్టెయ్యలేదు. బీరువాలో లేందే..ఎక్కడుంది ?  ఏం చేశావు ? ”

” పెట్టేశాను ” – ఆన్ కొంచెందూకుడు  గా అనేసింది. ” పిన్ కుషన్ మీదో, పింగాణీ గిన్నెలోనో – ఎక్కడో గుర్తురావటం లేదు..ఖచ్చితంగా పెట్టేశాను ”

” సరే, మళ్ళీ వెళ్ళి చూసొస్తాను. అక్కడ ఉంటే నువ్వు పెట్టేసినట్లు, లేదంటే లేనట్లు ”

వెళ్ళి బీరువాలోనే కాకుండా మొత్తం గదంతా వెతికింది…లేదు.

”  పిన్ లేదు , పోయింది. ఆఖరిసారి చూసింది నువ్వే గనుక నువ్వే చెప్పాలి. నిజం చెప్పు. ఎక్కడైనా దాచావా ? పారేసుకున్నావా ?? ”

” నాకేం తెలీదు ” ఆన్ కోపంగా చూసింది. ” నేను గదిలోంచి బయటికి తేలేదు దాన్ని , అదే నిజం , అంతే ”

ఆ ‘ అంతే ‘ అన్న మాట పెడసరంగా ఉందనిపించింది మెరిల్లా కి .

” నువ్వు అబద్ధం చెబుతున్నావు ఆన్ ” .. పదునుగా అంది-  ” నిజం చెప్పదల్చుకోకపోతే ఇంకేమీ చెప్పకు నాకు . నీ గదిలోకి పోయి అక్కడే ఉండు, ఒప్పుకుంటానంటేనే బయటికి రా ”

” మరి బటానీలు ఎవరు ఒలుస్తారు ? ” ఆన్ దిగాలుగా అడిగింది.

” నేను చేసుకుంటాలే . చెప్పి నట్టు చెయ్యి నువ్వు ”

Mythili

ఆ సాయంత్రమంతా మెరిల్లా మనసు వికలంగానే ఉంది. ” ఎంతో విలువైన పిన్ అది..ఆన్ ఎక్కడ  పారే సిందో   ఏమో .. ఎలా ? అది తప్పించి ఎవరు తీస్తారు- ఎంతకీ ఒప్పుకోదేం ? దొంగిలించాలని తీసి ఉండదులే..దాని పిచ్చి ఊహలకి బావుంటుందని పట్టుకుపోయి ఎక్కడో పడేసి ఉంటుంది…ఆ మాట ఒప్పుకునేందుకు భయపడుతోంది. అబద్ధం చెబితే ఎలా మరి ? అది మోసం చేసినట్లు..ఇంట్లో ఉండే పిల్ల అలా చెయ్యకూడదు కదా..దాని కి  కోపం ఎక్కువనుకున్నాను..అబద్ధం కన్నా కోపమే నయం .   అది నిజం చెబితే చాలు నాకు, పిన్ పోయినా పర్వాలేదు…”

మధ్య మధ్యన గదిలోకి వెళ్ళి వెతుకుతూనే ఉంది..ఎక్కడా పిన్ జాడ లేదు. రాత్రి పొద్దుపోయాక ఆన్ గదికి వెళ్ళి మళ్ళీ నిలదీసింది- ఏం లాభం లేకపోయింది. మర్నాడు పొద్దున మాథ్యూ కి చెప్పింది. అతను కళవళ పడ్డాడు. ఆన్ మీద అతని నమ్మకం అంత త్వరగా పోయేది కాదు..కాని పరిస్థితులు ఆన్ కి వ్యతిరేకంగానే ఉన్నాయి.

” ఒకవేళ బీరువా వెనకాలకి పడిపోయిందేమో చూశావా ? ”

” ఆ. ముందుకి జరిపి మరీ చూశాను. అన్ని సొరుగులూ మూల మూలలా గాలించాను. అది పోయింది..ఆన్ తీసి ఎక్కడో పడేసింది, అబద్ధం చెబుతోంది …అంతే. మనకి మింగుడు పడకపోయినా ఆ సంగతి ఒప్పుకోవాల్సిందే ”

” ఏం చేస్తావు అయితే ? ” అడిగాడు…బొత్తిగా రుచించటం లేదు ఇదంతా.

” ఒప్పుకునేదాకా దాని గదిలోనే ఉండనీ ” – మిసెస్ రాచెల్ కి క్షమాపణ చెప్పే విషయం లో ఆ పద్ధతి పనిచేసినట్లు గుర్తు తెచ్చుకుని మెరిల్లా నిబ్బరించుకుంది. ” అది ఎక్కడ పెట్టిందో చెబితేనే కదా పిన్ దొరుకుతుంది ..ఏమైనా దాన్ని గట్టిగా శిక్షించాల్సిందే ”

” సరే. నీ ఇష్టం. నీకు తోచినట్లు చెయ్యి. నేను మటుకు కల్పించుకోను ” చెప్పేసి వెళ్ళిపోయాడు.

మెరిల్లాకి తనని అందరూ వదిలేశారనిపించింది. ఈ విషయం మిసెస్ రాచెల్ కి చెప్పి సలహా అడిగేందుకు కూడా లేదు. ఆన్ గదిలోకి మళ్ళీ వెళ్ళి ‘ నిజాన్ని ‘ రాబట్టే ప్రయత్నం చేసింది…ఆన్ మొండిగా అదే జవాబు. ఏడ్చేడ్చి ఆన్ కళ్ళు వాచిఉన్నాయి..మెరిల్లాకి జాలేసింది- కాని మనసు మార్చుకోదల్చుకోలేదు.

” ఏం జరిగిందో చెబితేనే నువ్వు బయటికొచ్చేది..తేల్చుకో ”

anne14-1

” అయ్యో..పిక్ నిక్ రేపే కదా మెరిల్లా ? నన్ను వెళ్ళనిస్తావు కదూ ..ఇక్కడే ఉంచెయ్యవు కదూ ? వెళ్ళొచ్చాక ఎన్ని రోజులు ఇక్కడే ఇలాగే ఉండిపొమ్మన్నా ఉంటాను ”- ఆన్ దీనంగా  బతిమాలుకుంది.

” పిక్ నిక్ లేదూ ఏం లేదు – నువ్వు ‘ ఒప్పుకుంటే ‘ నే ”

” మెరిల్లా…” ఆన్ కి ఊపిరి అందలేదు.

మెరిల్లా మాట్లాడకుండా తలుపు మూసి వెళ్ళిపోయింది.

.                  .                      .                    .                     .

పిక్ నిక్ కోసమా అన్నట్లు ఆ రోజున- బుధవారం – ఆకాశం ఎక్కడా మబ్బు తునకైనా లేకుండా నిర్మలంగా ఉంది…సూర్యుడు హాయిగా వెలుగుతున్నాడు. గ్రీన్ గేబుల్స్ చుట్టూ చెట్ల మీద పక్షులు పాడుకుంటున్నాయి. తోటలో  మడోనా లిల్లీలు విచ్చుకున్న పరిమళం గాలి తెరలమీంచి తేలివచ్చి ప్రతి గదినీ దేవతల ఆశీస్సులాగా నింపుతోంది. కొండవాలు లో బర్చ్ చెట్లు సంతోషంగా చేతులూపాయి…ప్రతిరోజూ ఆన్ వాటిని తనూ  చేతులూపి పలకరిస్తుంటుంది. అయితే ఇవాళ ఆన్   కిటికీ దగ్గరలేదు . మెరిల్లా ఉదయపు అల్పాహారం తీసుకెళ్ళినప్పుడు   తన మంచం మీదే బాసిపట్టు వేసుకు కూర్చుని ఉంది.  మొహం లో అదొకలాంటి పట్టుదల, బిగించిన పెదవులు.

” మెరిల్లా..ఒప్పుకుందుకు సిద్ధంగా ఉన్నాను ”

” అవునా ” మెరిల్లా పళ్ళెం కింద పెట్టింది. తన ‘ పద్ధతి ‘ మళ్ళీ పనిచేసింది – కాని ఆ విజయం మెరిల్లా కి చేదుగానే ఉంది .

” ఊ. చెప్పు. ఏమైందో ”

” నేను అమెథిస్ట్ పిన్ ని తీసుకున్నాను ” పాఠం అప్పజెబుతున్నట్లు మొదలుపెట్టింది ..” అచ్చం నువ్వు చెప్పినట్లే. ముం   దైతే తీసుకోవాలనుకోలేదు- కాని చాలా చాలా అందంగా ఉందనిపించింది. చాపల్యానికి లోనైపోయాను. నా గౌన్ కి తగిలించుకున్నదాన్ని తీయ బుద్ధి కాలేదు. మా ‘ తీరికగూడు ‘ కి పట్టుకుపోయి డయానా కి చూపించాలనిపించింది. మేము రోజ్ బెర్రీ లు గుచ్చి రత్నహారాలుగా ఊహించుకుంటూ ఉంటాము.. అమెథిస్ట్ ల ముందు అవేం పనికొస్తాయి .. కానీ డయానా అక్కడికి రాలేదు. నువ్వు వచ్చేలోపు వెనక్కి పెట్టెయ్యాలనుకున్నాను. ఎక్కువ సేపు పెట్టుకుని ఉండచ్చని చుట్టుదారిమీంచి ఇంటికి వస్తున్నాను. వంతెన మీద నడుస్తుంటే ఒకసారి తీసి చూడాలనిపించింది. ఎండలో తళ తళ తళా మెరిసిపోతోంది…వంతెన  ప్రకాశమాన సరోవరం మీద కదా ఉంది..వంగి చూస్తూ ఉంటే – టప్ మని నీళ్ళల్లో పడిపోయింది. ఊదారంగు లో వెలిగి పోతూ కిందికి..కిందికి..నీళ్ళ అడుక్కి ..పడిపోయింది…మునిగిపోయింది. అంతే మెరిల్లా- నేను చెప్పేది ”

మెరిల్లా కి మండిపోయింది. ” అంత అపురూపమైన పిన్ ని పోగొట్టేసి  ఎంత నిదానం గా చెబుతోంది , ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా ? ”

వీలైనంత నెమ్మదిగా అంది –  ” ఆన్- ఎంత ఘోరమైన పని చేశావు..పాపిష్టిదానా ”

” అవును. పాపిష్టిదాన్ని ” – ఆన్ ప్రశాంతంగా ఒప్పేసుకుంది. ” నన్ను శిక్షించాలి..నాకు తెలుసు. అది నీ బాధ్యత. అదేదో తొందరగా చేసెయ్యి మెరిల్లా, అయిపోతే పిక్ నిక్ కి వెళ్తాను ”

” పిక్ నికా ఇంకేమన్నానా ? నువ్వు వెళ్ళటానికి వీల్లేదు – అదే నీకు శిక్ష. నీ తప్పు కి వెయ్యాల్సినదాన్లో అది సగం శిక్ష కూడా కాదసలు ”

 

” పిక్ నిక్ కి వెళ్ళద్దా ….” ఆన్ దిగ్గున లేచి మెరిల్లా చెయ్యి పట్టేసుకుంది-  ” ఇది అన్యాయం మెరిల్లా. నువ్వు వాగ్దానం చేశావు నాకు వెళ్ళచ్చని. నేను వెళ్ళి తీరాలి మెరిల్లా- అందుకే ఒప్పుకున్నాను. దయ చేసి…దయచేసి – నన్ను వెళ్ళనీ మెరిల్లా. ఐస్ క్రీమ్   మెరిల్లా..మళ్ళీ జన్మ లో తినగలనా చెప్పు ? ”

మెరిల్లా చేతులు విడిపించుకుంది..రాయిలాగా అంది  – ” నువ్వు బతిమాలక్కర్లేదు ఆన్. నువ్వు పిక్ నిక్ వెళ్ళట్లేదు – అంతే. ఇంకేం మాట్లాడకు ”

ఇక మెరిల్లా మనసు మారదని ఆన్ కి అర్థమైంది. హృదయవిదారకం గా కేక పెట్టి పక్క మీద వాలిపోయింది. తీవ్రమైన ఆశాభంగం తో, నిర్వేదం తో , ఒంటరితనం తో – కుమిలి కుమిలి ఏడ్చింది.

మెరిల్లా ఉక్కిరిబిక్కిరైంది – ” ఓరి దేవుడా – ఏం పిల్ల ఇది.. దీనికి పిచ్చి గాని లేదు కదా ? లేదంటే నిజంగానే దీని కి వెధవ బుద్ధులున్నాయా…రాచెల్ మొదట చెప్పిందే నిజమా ? ‘’  – ఉక్రోషం వచ్చింది …’’ అయితే కానీ..పని మొదలుపెట్టాక  మధ్యలో విడిచేది లేదు ”

ఆ ఉదయమంతా దరిద్రంగా గడిచింది. మెరిల్లా పూనకం వచ్చినదానిలాగా అప్పటికే శుభ్రంగా ఉన్న ఇల్లంతా రుద్ది రుద్ది శుభ్రం చేసింది…ఇంకా దుగ్ధ తీరక పశువుల సాల ని పరా పరా ఊడవటం మొదలెట్టింది.

మధ్యాహ్నం భోజనానికి రమ్మని ఆన్ ని పిలిచింది. ఆన్ కి ఇష్టమైనవి వండానని చెప్పింది. కన్నీళ్ళతో తడిసిన చిన్న మొహం మేడ మీంచి బిక్కుబిక్కుమంటూ తొంగి చూసింది.

” నాకు భోజనం వద్దు మెరిల్లా ” వెక్కుతూ చెప్పింది – ” ఏం తినలేను నేను. నా గుండె బద్దలైపోయింది. దాన్ని పగలగొట్టినందుకు నువ్వు ఒకనాటికి పశ్చాత్తాపం చెందుతావు , కాని నిన్ను క్షమిస్తున్నాను. ఆ రోజు వచ్చినప్పుడు నిన్ను క్షమించానని గుర్తు చేసుకో. నన్నేమైనా తినమని మాత్రం అడక్కు …నాకు ఇష్టమైనవి అసలు తినను.  మనసు బాగాలేనప్పుడు మంచిభోజనం తినటం ఎంత మాత్రం బాగుండదు ”

మెరిల్లాకి నిస్సహాయం గా అనిపించింది. ఆగ్రహం వచ్చింది. మాథ్యూ రాగానే అంతా వెళ్ళబోసుకుంది. ఆన్ మీద మమకారం ఒక పక్కా తప్పు చేస్తే దండించాలనే న్యాయం ఒక పక్కా మాథ్యూ మనసులో యుద్ధం చేశాయి.

” ఆన్ ఆ పిన్ తియ్యటమూ పోగొట్టేసి అబద్ధాలు చెప్పటమూ తప్పేలే మెరిల్లా ” వడ్డించిన భోజనాన్ని చూస్తూ అన్నాడు. ఆ పదార్థాలు అతనికీ ఇష్టమే, అతనికీ తిన బుద్ధి కావటం  లేదు.  ఉండబట్టలేకపోయాడు – ” కాని పాపం చిన్న పిల్ల కదా అది..ఎంతో సరదా పడింది కూడానూ. పిక్ నిక్ మానిపించెయ్యటం మరీ  కఠినంగా లేదూ ? ”

” మాథ్యూ కుత్ బర్ట్- నాకు ఆశ్చర్యమేస్తోంది నీ మాటలు వింటుంటే. అది ఎంత వెధవపని చేసిందో తెలిసి కూడా.. ! కాస్త కూడా పశ్చాత్తాపం లేదు దానికి. తప్పు చేశానని దానికి అనిపిస్తోందంటే నయంగా ఉండేది . ఊరూరికే దాన్ని వెనకేసుకొస్తున్నావు – తెలుస్తోందా నీకు ? ”

” అవుననుకో.. పాపం..బుజ్జిది కదా అది…కొంచెం చూసీచూడనట్లు పోవచ్చు కదా.. దానికి సరైన పెంపకం లేదు..”

” ఇప్పుడు నేను చేస్తున్నది అదే- పెం-ప-కం ” – మెరిల్లా విసురుగా అడ్డుకుంది.

మాథ్యూ కి ఆ మాట నిజమనిపించలేదు – కాని ఇంకేం మాట్లాడలేకపోయాడు. పాలేరు కుర్రాడు జెర్రీ బ్యుయోట్ తప్ప ఇంకెవరూ మాట్లాడలేదు భోజనం చేస్తూ. జెర్రీ అంత ఉత్సాహం గా ఉండటం మెరిల్లాకేం నచ్చలేదు కూడానూ.

పనంతా అయిపోయాక మెరిల్లాకి తన నల్ల శాలువా లో చిరుగు ఉందని  గుర్తొచ్చింది . సోమవారం  బయటికి కప్పుకుని వెళ్ళింది , దోవలో చెట్టుకొమ్మకి పట్టుకుని చిరిగింది. ఇంటికి వెళ్ళగానే కుట్టుకోవాలనుకునీ ఆ పిన్ గొడవలో కుదర్లేదు.అప్పుడు వెళ్ళి శాలువాని పెట్టె లోంచి బయటికి తీ..స్తూ..ఉండగా..అందులో చిక్కుకుని ఉన్న వస్తువేదో..ఊదారంగు లో మిలమిలమంది. చూస్తే ఏముందీ…శాలువా లేస్ లో ఇరుక్కుని- అమెథిస్ట్ పిన్.

మెరిల్లాకి గుండె గుబుక్కుమంది. ” దేవుడా..ఇదేమిటిది ?? నా పిన్ ఇక్కడే ఉంది..బారీ చెరువులో కాదు !! తీశాననీ పోయిందనీ ఆ గాడిద ఎందుకు చెప్పినట్లు ? సోమవారం ఇంటికొచ్చి శాలువాని బీరువాలో పెట్టినట్లు గుర్తు..పిన్ ఆ బీరువాలోనేగా పెట్టానంది ఆన్…అప్పుడు శాలువాలో చిక్కుకుపోయి ఉంటుంది ”

మెరిల్లా పిన్ ని చేతిలో కనబడేలాగా పట్టుకుని ఆన్ గదికి వెళ్ళింది . ఆన్ ఏడ్చి ఏడ్చి అలిసిపోయి నిస్తేజంగా కిటికీ దగ్గర కూర్చుని ఉంది.

” ఆన్ షిర్లే ! ” మెరిల్లా గంభీరమైన గొంతుతో  పిలిచింది. ” ఇదిగో- నా పిన్ దొరికింది- నా నల్ల శాలువా లేస్ కి వేలాడుతోంది. తీసి బయటికి పట్టుకుపోయాననీ చెరువులో పడిపోయిందనీ ఎందుకు చెప్పావు నాతో ? ”

anne14-2

” నేను’ ఒప్పుకునే ‘ వరకూ బయటికి రాకూడదని నువ్వేగా చెప్పావు ? ” – ఆన్ నీరసంగా చెప్పింది – ”  పిక్ నిక్ కి వెళ్ళి తీరాలి గనుక ఒప్పుకోవాలనుకున్నాను. రాత్రి నిద్రపోయే ముందర , ఎలా చెబితే ఆసక్తిగా ఉంటుందో ఊహించి పెట్టుకున్నాను. మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ వల్లె వేసుకున్నాను. ఏం లాభం..నువ్వు నన్ను వెళ్ళనివ్వనే లేదు , నా శ్రమంతా వృధా అయిపోయింది ”

మెరిల్లాకి నవ్వూ బాధా ఒకేసారి వచ్చాయి.

” అఖండురాలివే నువ్వు ! నాదే తప్పు..ఒప్పుకుంటున్నాను. ..పాపం నువ్వు చెప్పిన మాట నమ్మలేదు , నువ్వు కథ కల్పించి చెప్పావు. చెయ్యని పని చేశానని ఒప్పుకోవటం నీదీ తప్పే- కాని దానికి నేనే కారణం. నన్ను క్షమించెయ్యి. త్వరగా తయారవు , పిక్ నిక్ కి పోదువుగాని ”

ఆన్ తారాజువ్వలాగా లేచింది – ” ఆలస్యమైపోలేదూ ?? ”

” లేదులే. ఇంకా మధ్యాహ్నం రెండు గంటలేగా అయింది- ఇప్పుడే అందరూ చేరుకుని ఉంటారు. ఇంకో గంట తర్వాత గాని తినటాలూ అవీ  ఉండవు. మొహం కడుక్కుని తల దువ్వుకో. కొత్త గౌను ఇంకోటి ఉందిగా, వేసుకో.  ఈ లోపు నీకు బుట్టలో కేకులూ బిస్కెట్లూ సర్దిపెడతాను. జెర్రీ బ్యుయోట్   ని బండి సిద్ధం చెయ్యమని చెబుతాను- నిన్ను అక్కడ దింపుతాడు ”

” ఓ మెరిల్లా ” ఆన్ ఎగిరివెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది. తల దువ్వుకుంటూ ” ఐదు నిమిషాల కిందట నేనెందుకు పుట్టానా అనుకుంటున్నాను..ఇప్పుడైతే స్వర్గానికి  రమ్మన్నా వెళ్ళను ”

చివరికంటా అలిసిపోయి , ఆనందం లో మునిగిపోయి –  ఆ రాత్రి ఇంటికి తిరిగొచ్చిన ఆన్ మనసు ఎంత అద్భుతమైన స్థితిలో ఉందో చెప్పేందుకు లేదు.

” పిక్ నిక్ ఎంత ‘ రుచిరం ‘గా గడిచిందో మెరిల్లా  ! ఆ ‘ రుచిరం ‘ అనే మాట ఇవాళే నేర్చుకున్నా…మేరీ ఆలిస్ బెల్ అంది అలా . బావుంది కదూ ? అంతా ఎంతో బావుంది. టీ తాగి కేకులు తిన్నాక మిస్టర్ హార్మన్ ఆండ్రూస్ మమ్మల్ని  ప్రకాశమాన సరోవరం లో పడవ మీద తీసుకువెళ్ళారు.  ఒకసారికి ఆరుగురు వెళ్ళాం. జేన్ ఆండ్రూస్ అయితే నీళ్ళల్లో పడిపోబోయింది తెలుసా ? తామర పువ్వులు కోసుకుందామని వంగాము..అప్పుడన్నమాట. మిస్టర్ ఆండ్రూస్ పట్టుకోకపోతే మునిగిపోయి ఉండేదే. నాకే అలా జరిగిఉంటే బావుండేది…ఇంచుమించు మునిగిపోయానని అందరికీ చెప్పుకోవటం భలే ఉండేది…! ఐస్ క్రీమ్   తిన్నాం…ఎలా ఉందో చెప్పేందుకు ఎన్ని మాటలూ సరిపోవు… దివ్యంగా ఉంది అంతే. ”

ఆ రాత్రి ఊలు మేజోళ్ళు అల్లుతూ మాథ్యూ కి అంతా చెప్పుకుపోయింది మెరిల్లా.

” తప్పు చేశానని ఒప్పుకుందుకు సిగ్గు పడను …గుణపాఠం కూడా నేర్చుకున్నాను. ఆన్ ‘ ఒప్పుకోలు ‘ తలచుకుంటే ఇప్పుడు నవ్వొస్తోంది. నవ్వకూడదు నిజానికి ,  కాని అది నిజం కాదు కదా…కాకపోవటం ఎంతో హాయిగా ఉంది ప్రాణానికి. ఈ పిల్లని అర్థం చేసుకోవటం కష్టమే- కాని మంచిగానే తయారవుతుంది , అందుకు  ఢోకా లేదు. ఒకటి మాత్రం నిజం..ఇది ఉంటే  తోచకపోవటమన్నది ఉండదు ”

                                                      [ ఇంకా ఉంది ]

 

 

 

 

 

‘బొమ్మ’ ఏ సక్సెస్ స్టోరీ  (part – 1)

 

భువన చంద్ర

 

bhuvanachandra (5)నంబర్ వన్ సినిమా.. టేబుల్ ప్రాఫిట్. బయ్యర్లకి అద్భుతంగా నచ్చింది. నిర్మాతకి రిలీజుకి ముందే లాభాల్ని తెచ్చిపెట్టింది. ఇంకేం కావాలి? ప్రివ్యూ షోలు వేశారు. చూసినవాళ్లకి మతిపోయింది. ఓ కొత్త డైరెక్టర్. ఓ సీనియర్ డైరెక్టర్ దగ్గర ఎన్నాళ్లో పని చేశాడు. అంతే!! కానీ అతని ఫస్ట్ పిక్చర్ టేకింగ్ చూసి అవాక్కయ్యారు సినీ జనాలు.

థియేటర్లో మాత్రం ‘క్లాస్’ టాక్ వచ్చింది అంటే కమర్షియల్‌గా ఫ్లాప్ అన్నమాట. చూసిన ప్రతీ ప్రేక్షకుడు”ఓహో!” అన్నాడు. కాని జనాలు ఎగబడలేదు. వాళ్లకి కావల్సినది అందులో వున్నా, తక్కువ మోతాదులో వుంది. మానవత్వం పాలు మాత్రం చాలా ఎక్కువగా ఆలోచింపచేసేంత వుంది.

“మాకు కావల్సింది  ఎంటర్‌టైన్‌మెంట్. మానవత్వమూ, మట్టిగడ్డలూ కాదు” ఓ సమీక్షకుడు  ఓపెన్‌గా చెప్పిన మాట ఇది. కమర్షియల్ సినిమాని ద్వేషించేది ఇతనే.

” ఈ కుర్రాళ్లంతా ఇంతే. సినిమా అంటే వినోదాన్ని ఇవ్వాలి గానీ, నీతిబోధలెందుకూ?”అన్నాడో సీనియర్ పాత్రికేయుడు. ఆ సినిమానీ, దర్శకుడ్నీ ఆకాశానికెత్తింది అతనే.

నవ్వుకున్నాడు ‘సారధి’. అతనే ఆ సినిమా డైరెక్టరు. ఓడలు బళ్ళూ, బళ్లు ఓడలూ అవుతాయన్న సామెత వినడమే కానీ ఇంత క్విక్‌గా క్షణాల మీద మారిపోతాయని అతను కలలో కూడా వూహించలేదు.

‘సినిమా అద్భుతం  కానీ ప్రేక్షకులు కరువయ్యారు.’ ఇదేమి కామెంటూ? ఈ కామెంటు ఈనాడు  ఉంది… “సినిమా సూపరు.. కలెక్షన్లే నిల్లు’ అని.

ఫస్ట్ ఎటెంప్ట్‌తోనే అన్ని ఏరియాలూ అమ్ముడుపోయాయని తెలిసిన రోజున కనీసం పదిమంది పెద్దా చిన్నా ప్రొడ్యూసర్లు సారధి వెంటపడ్డారు. ఓ పెద్ద నిర్మాత అయితే ఏకంగా ‘బ్లాంక్ చెక్’ ఇచ్చాడు. సారధి ఏమాత్రం తొందరపడలేదు.

‘సినిమా రిలీజయ్యాక చూద్దాం. అంతే కాదు. కథ రెడీ చేసుకోకుండా బ్లాంక్ చెక్ ఎలా తీసుకోనూ’ అని సున్నితంగా తిరస్కరించాడు. సిన్సియర్‌గా ఉండటం గొప్ప విషయమే. కానీ సారధిని అదే ముంచింది.

సినిమా ‘టాక్’ బాయటికి రాగానే తుపాకీగుండు శబ్దం విని ఎగిరిపోయే కాకుల్లాగా ప్రొడ్యూసర్లు ఎగిరిపోయారు. “నా రెండో సినిమాకి నువ్వే డైరెక్టరువి” అన్న మొదటి సినిమా నిర్మాత కూడా మొహం చాటేశాడు. రాజ్ కపూర్ పాటలో ఓ లైనుంది. “హీరోసే జోకర్ బన్‌జానా పడ్‌తా హై” అన్నట్టు నిన్నటిదాకా పరిచయం కోసం ఎగబడ్డ క్షణమాత్ర అభిమానులంతా ఇవాళ మొహం మీదే “ఏంటి గురూగారు  పిక్చర్ పోయిందంటగా..!” అని ఎగతాళిగా అడుగుతుంటే సారధి అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు.

*****

“ఎన్నాళ్లిలా ఇంట్లోనే కూర్చుంటారూ..” అనునయంగా అన్నది భార్య. “నా మీద నాకు నమ్మకం కుదిరి జనాన్ని పిచ్చెక్కించే  స్క్రిప్టు తయారయ్యేవరకు…! “నవ్వుతూనే అన్నాడు సారధి. ఆ నవ్వులో ‘కసి’ వుంది. “అంటే?” అయోమయంగా అన్నది భార్య. నేనో గొప్ప సినిమా తియ్యాలనుకుంటున్నాను. తీశాను. రిలీజ్‌కి ముందే నిర్మాతకి లాభం తెచ్చి పెట్టిన సినిమా అది. ప్రేక్షకులకి నచ్చలేదు. కారణాలు లక్ష వుండొచ్చు. కానీ నేను తీసిన సినిమా మాత్రం నిజంగా మానవత్వంతో కూడిన గొప్ప సినిమా. ఆ సినిమా గురించి ఎవరేమన్నా, అనుకున్నా నిజం నిజమే. అదీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది గొప్ప సినిమా గురించి కాదు. ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్‌కి రప్పించే సినిమా గురించి” వివరించాడు సారధి. చాలా కాలం తరవాత వీడిన మౌనం అది. ఏడాది గడిచింది. రెండేళ్లు గడిచాయి. జనలు సారధిని మరిచిపోయారు. జనాలు అంటే ఇక్కడ ప్రేక్షకులని అర్ధం కాదు. సినీజనాలు. ఆదాయం పొలం మీద వచ్చేది కొంచెమే అయినా సునీతి అంటే సారధి భార్య గుంభనంగా సంసారాన్ని నెట్టుకొచ్చింది. మూడేళ్లు దాటాక అవకాశం వచ్చింది సారధికి, వెతుక్కుంటూ… ఓ NRI సారధి తీసిన సినిమాని చూసి ఇంప్రెస్ అయి వెతుక్కుంటూ ఇంటికొచ్చాడు.

“సార్, మీ సినిమా చూశాను. అది ఓ మేధావి మాత్రమే తీయగల సినిమా. నాకెందుకో సినిమాలంటే చిన్నప్పటినించి పిచ్చి. నన్ను నేను నిర్మాతగా చూసుకోవాలన్న ఆత్రంతోటే అమెరికా వెళ్లాను. కడుపు కట్టుకొని సంపాయించాను. ఇప్పుడు రెండు కోట్లు పోయినా నాకొచ్చే నష్టం లేదు. కనుక మీరు నాకో సినిమా తీసిపెట్టండి. కథ గురించి నేను అడగను. రెమ్యూనరేషన్లూ అవీ ఎవరికి ఎంతో నాకు తెలీదు. ఇదిగో రెండు కోట్లకి విలువైన చెక్ బుక్. ఒక్కో చెక్ మీద పదిలక్షల చొప్పున ఇరవై చెక్కులు వున్నై. సినిమా తీసేటప్పుడు మాత్రం నేను మీ పక్కనుండాలి. అంతే. నేను ఏ విషయంలోనూ జోక్యం చేసుకోను. సినిమా నిర్మాణం గురించిన అవగాహన కోసం నేను మీ పక్కన వుండాలనుకుంటున్నాను. అదీ మీకు ఇష్టం అయితేనే..” అంటూ చెక్ బుక్ సారథి చేతిలో పెట్టాడు.

చిన్నగా నవ్వాడు సారధి. “నేను ఫ్లాప్ సినిమా డైరెక్టర్ని. జనాలు నన్ను మర్చిపోయారు. కానీ, మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. థాంక్యూ. సరిగ్గా రెండు నెలల తరవాత ఇదే చెక్‌బుక్‌తో రండి. కథ సిద్ధంగా వుంటుంది. “షేక్‌హాండ్ ఇచ్చి అన్నాడు. అతను ఆనందంగా “ముందుగా ధన్యవాదాలు అందుకోండి. 2 నెలల తరవాత కలుస్తా” అని వెళ్లిపోయాడు.

painting: Rafi Haque

painting: Rafi Haque

“అదేంటండి.. ఆయన పేరు కూడా అడగలేదు?” ఆశ్చర్యంగా అన్నది సునీతి.

“కథ సిద్ధంగానే వుంది. డైలాగ్స్‌తో సహా సిద్ధం చేయడానికి టైం అడిగాను. అతను వచ్చి నా మీద నాకున్న నమ్మకాన్ని వందరెట్లు పెంచాడు. అతని అసలు పేరు ఏదైనా నేను మాత్రం అతన్ని ‘విశ్వాసం’ షార్ట్‌కట్ విశ్వం అంటాను..” గలగలా నవ్వాడు సారధి మూడేళ్ళ తరవాత. సునీతి పొంగిపోయింది. గబగబా చేతి గాజులు తాకట్టు పెట్టి రెండు మంచి డ్రెస్సులూ, ఓ పది బాల్ పెన్నులూ, స్క్రిప్టు వ్రాయడానికి A4 కాయితాల కట్టలూ, ఓ టేబుల్ లైటూ మొదలైన సరంజామాతో పాటు అతనికి ఇష్టమైన పిండి వంటలు చేసింది. సారధి కళ్ళల్లో చెమ్మ.

 

*****

“ఇదిగో అయిదువేలు ఎడ్వాన్సూ. డైలాగ్స్ నువ్వే రాస్తున్నావు!” రమణ చేతికి కాష్ ఇచ్చి అన్నాడు సారధి. ఆ అయిదువేలూ భార్యవి. గాజులు తాకట్టు పెట్టిన బాపతువి.

కన్నీళ్లతో రమణ సారధిని కౌగిలించుకుని “థాంక్యూ సారధీ.. స్నేహానికి విలువిచ్చే నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. ప్రాణం పెట్టి డైలాగులు రాస్తా..” అన్నాడు.

సారధి , రమణ, గుప్త, శీనూ వీళ్లంతా ఒకప్పుడు రూంమేట్స్. ఒక్కోసారి డబ్బుల్లేక ఒకే దోశని నలుగుతూ పంచుకు రోజులున్నాయి. భగవతి మెస్ వాడు దయామయుడు. హార్లిక్స్ బాటిల్ నిండా సాంబారు ఇచ్చేవాడు.

ఇక్కడ ఓ విషయం చెప్పక తప్పదు. T.Nagar  కోడంబాకం సినిమావాళ్లకి నిలయాలు. గీతా కేఫ్, బాలాజీ కేఫ్, డబ్బులున్న సమయాల్లో స్వాగతిస్తే  టి.నగర్ పోస్టాఫీస్ దగ్గరుండే తోపుడుబండి హోటల్సు (వాటినే ‘కయ్యేంది’ భవన్లంటారు సరదాగా) సామాన్య సినీనటులకి రాజప్రాసాదాలు. రూపాయికి నాలుగిడ్లీలు ఆ రోజుల్లో. భగవతి హోటల్ సంగతి చెప్పక్కర్లా. హోటల్ చాలా చిన్నది. బిజినెస్ మాత్రం లెక్కలేనిది. నూటికి అరవై సినిమాలకి టిఫిన్ సప్లైలు అక్కడినించే. ఆ హోటల్ ఎదురు సందులోనే ‘మలర్‌కొడి’ మాన్షన్ వుండేది. 30 గదులు, 3 అంతస్థులు. అన్ని గదుల్లో 8/8. అద్దె నెలకి 400. సందు మొదట్లో మహా రచయిత ఆరుద్రగారి ఇల్లు, ఆయన అపురూపమైన లైబ్రరీ.

ఇహ తెలుగువాళ్లు. ఇంక్లూడింగ్ సినీ నటీనటుల అడ్డాలు రెండు. ఒకటి రాణీ బుక్ సెంటర్. రాణీగారు ఎంత కలివిడి మనిషి అంటే ఏ కష్టం వచ్చినా మొదట గుర్తొచ్చేది ఆవిడే. ఎడంచేతికి తెలీకుండా కుడిచేత్తో ఎంతమందిని ఆదుకున్నారో నాకూ తెలుసు. పుస్తకాలు దొరకాలంటే అక్కడే. ఫలానా పుస్తకం అని అడిగితే చాలు ఎక్కడినుంచైనా సరే తెప్పించి మరీ ఇస్తారు. అట్లూరి అనిల్ వారబ్బాయే.

రెండో అడ్డా పానగల్ పార్కు దగ్గర స్టాండర్డ్ ఎలక్ట్రికల్స్ ముందరున్న ప్లాట్‌ఫాం. అక్కడే డాక్టర్ గోపాలకృష్ణగారు ఉండేవారు. టీకి డబ్బులు లేవని బాధపడక్కర్లా. ఎవరొచ్చినా ఆయన స్వయంగా పక్కనున్న టీ కొట్లోంచి టీ పట్టుకొచ్చి ఇచ్చేవారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే వీళ్లు నలుగుతూ మలర్‌కొడి మేన్షన్‌లో ఓ గదిలో వుండేవారు. నేనూ అక్కడే (కొన్నాళ్ల తరవాతే అనుకోండి) వుండేవాడ్ని రూం నంబర్ 34.

“ప్రాణం కాదు రమణా. అడుగడుగునా హాస్యం వుండాలి. ఆలోచించు. ప్రతీ డైలాగు ఓ శ్వాసలాంటిది మనకి” భుజం తట్టి అన్నాడు సారధి. రమణలో పిచ్చి స్పార్క్ వుందని సారధికి తెలుసు. ఫుడ్‌కి లాటరీ కొట్టేటప్పుడు వాళ్ల పొట్టలకి అతని ‘మాట’లే ఆహారంగా  మారేవి. అతి సున్నితమైన హాస్యం అతని ప్రతి మాటలోనూ తొణికిసలాడేది. మొదటి సినిమా సమయంలో రమణ తండ్రి పోవడంతో వేరేవాళ్లచేత డైలాగ్స్ రాయించాడు. ఇప్పుడు యీ కథకి సరైన సంభాషణలు రమణ మాత్రమే రాయగలడని సారధికి ఖచ్చితంగా తెలుసు. శీనూ, గుప్తా అసిస్టెంటు డైరెక్టర్లు.  “ఫ్రెండ్స్ మీ ఎడ్వాన్సులు నిర్మాత వచ్చిన రోజే ఇస్తాను. అప్పటివరకూ చెరో వెయ్యి.” అని తలో వెయ్యి రూపాయలు ఇచ్చాడు. అదీ గాజుల పుణ్యమే.

యజ్ఞం  మొదలైంది. పొద్దున ఆరింటికి మొదలైతే అర్ధరాత్రి వరకు స్క్రిప్ట్ మీదే. హోటల్‌నించి తెప్పించేంత డబ్బులేదు. సునీతి వంటమనిషి అవతారం ఎత్తింది.

చిత్రంగా రెండు నెలల  తరవాత వస్తానన్న నిర్మాత పదిహేను రోజుల ముందే వచ్చాడు.  మిరకిల్స్ జరుగుతాయి. స్క్రిప్టు వర్క్‌లో అతనూ పాలు పంచుకున్నాడు. కురుక్షేత్రాన్ని ఏం వర్ణిస్తాం? యుద్ధాన్ని చూసినా అర్ధం కాదు. పాలుపంచుకుంటేనే అంటే సైనికుడిలా యుద్ధం చేస్తేనే అసలు విషయం అర్ధమవుతుంది. ఆ నిర్మాత పేరు రాఘవ చెరుకూరి. వచ్చిన రెండో రోజునే యజ్ఞవాటిక “బృందావన్” హోటల్‌లోకి మారింది. అది మధ్యతరగతివాళ్లకి ప్రియమైన హోటల్. రూములు కొంచెం పెద్దవే. అద్దె రోజుకి ఎనభై రూపాయలు. రాఘవ ‘సవేరా’ హోటల్ని ప్రిఫర్ చేశాడుగానీ సారధి ఒప్పుకోలేదు. “రాఘవగారూ మాకు ఇది చాలు. ఆలోచించడానికి ఇది సరిపోతుంది. ఆలోచించి, ఆలోచించి బుర్ర వేడెక్కితే తిరగడానికి పాండీబజారుంది. సరికొత్త ఆలోచనలు పుట్టుకొచ్చేది  ఈ రోడ్డు మీదే. ఎందరు మహారచయితలూ, దర్శకులూ, నటీనటులూ అక్కడ తిరిగారు. అదో ఆ గీతా కేఫ్‌లోనే రోజు ఘంటసాలగారు ఇడ్లీ తిని కాఫీ తాగేవారు. అదిగో ఆ చెట్టు కిందే సి.యస్.ఆర్‌గారూ కారు పార్కు చేసి దాన్ని ఆనుకుని నిలబడి స్టైలుగా సిగరెట్లు కాల్చేది. అదిగో ఆ  పానగల్ పార్కులో మల్లాది వారి సిమెంటు బెంచీ. ఓహ్.. యీ ఇన్స్పిరేషన్ స్టార్ హోటల్లో ఎలా దొరుకుతుందీ?” అని నవ్వాడు.

అదో అద్భుతమైన పాఠం అనిపించింది రాఘవ చెరుకూరికి. ఆ క్షణం నించే సారధిని ‘గురువుగారూ’ అని పిలవటం మొదలెట్టాడు. చిన్న చిన్న వేషాలు వేసే  ఓ నటుడ్ని హీరోగా బుక్ చేశాడు సారధి. అతనికి తగ్గట్టు సంభాషణల్ని కూడా మార్చారు. యజ్ఞంలో ఆ  యువకుడూ పాల్గొనడం మొదలైంది. కారణం ‘హీరో’ అవకాశం వస్తుందని జీవితంలో ఏనాడూ ఆతను అనుకోలేకపోవడంచేత. హీరోయిన్ కొత్త. కేరక్టర్ ఆర్టిస్టులు మాత్రం పాతవాళ్లూ, సారధి మీద నమ్మకం వున్నవాళ్ళూ. స్క్రిప్టు ‘బౌండ్ బుక్’గా మారింది. విజయా గార్డెన్స్‌లో విఘ్నేశ్వరుడి ముందు షూటింగ్ నిరాడంబరంగా ప్రారంభం అయింది. ప్రతీ డైలాగూ ఓ పంచ్ డైలాగే. రమణ మాడ్యులేషన్‌తో సహా నటీనటులకి తర్ఫీదిస్తే సారధి నటించి చూపించేవాడు. ముప్పై అయిదు రోజుల్లో గుమ్మడికాయ కొట్టేశారు (అంటే షూటింగ్ పూర్తయిపోయిందన్నమాట.) పగలూ, రాత్రీ లేకుండా ఎడిటింగ్, రీరికార్డింగ్ నెలరోజుల్లో పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీ ‘గుడ్‌లక్ థియేటర్’లో చూశారు. ( ఈ గుడ్‌లక్ థియేటర్ జి.వి గారిది. అంటే ద గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం అన్నగారిది. ఇప్పటికీ వుంది. అక్కడ ప్రివ్యూ వేస్తే లక్ అని చాలా మందికి నమ్మకం. నిజం కూడా). ప్రస్తుతం దాని పేరు 4 ఫ్రేమ్స్)

యూనిట్ వాళ్లు మాత్రమే చూశారు కుటుంబాలతో. హిలేరియస్. సాధారణంగా సిగ్గరి అయిన సునీతి  సినిమా పూర్తయ్యి లైట్లు వెలగగానే ఆనందంగా సారధిని కౌగిలించుకుంది. ఆ అపూర్వదృశ్యానికి అందరూ చప్పట్లు కొడితే మైమరపులోంచి ఇవతలపడ్డ సునీతి సిగ్గుల మొగ్గ అయింది.

“గురువుగారూ! ఇది హిట్ కాదు. సూపర్ డూపర్ హిట్” సారధి కాళ్లకి నమస్కారం చేసి అన్నాడు రాఘవ చెరుకూరి. డబ్బు అతని చేతిమీదుగానే ఇప్పిస్తూ ఉండటంతో అతనికి తెలుసు సారధి ఒక్క పైసా కూడా రెమ్యూనరేషన్‌గా తీసుకోలేదని. అంతే కాదు సునీతి రాళ్ల నెక్లేసూ, మూడు గొలుసులూ, చెవి దిద్దులూ ఆఖరికి నాంతాడు మాయమై మెడలో పసుపు కొమ్మ కట్టిన నల్లపూసల తాడు మాత్రమే వునందాన్న విషయాన్ని స్పష్టంగా గుర్తించాడు. ఒక కోటి ఎనభై లక్షల్లో పిక్చర్ పూర్తయింది. మిగిలిన ఇరవై వేలూ రాఘవ దగ్గరే వున్నాయి. ప్రతీదానికి రసీదులు వున్నాయి. ఫైనాన్సు వ్యవహారాలన్నీ అతని చేతిమీదుగానే నడిచాయి.

సినిమా వాళ్లంత భోళా మనుషులు ఎక్కడా కనిపించరు. ముఖ్యంగా ‘టెక్నీషియన్లు’. వాళ్ల పని వాళ్లదే తప్ప మిగతా విషయాలు వాళ్లకి పట్టదు. ‘టెక్నీషియన్స్’ రాజకీయాలు నడపరు. ‘టాక్’ బయటపడింది.

రీరికార్డింగ్‌లో పాల్గొన్న ప్రతీ మ్యూజీషియనూ సారధి సరికొత్త సినిమా “వసంతమా.. నువ్వే నా ప్రాణం” సినిమా సూపర్‌గా వుందనీ, ప్రతీ పాటా, ప్రతీ మాటా ఆణిముత్యమనీ ఫ్రెండ్స్‌లో చెప్పడంతో మౌత్ పబ్లిసిటీ వచ్చింది. సినిమా చూసిన టెక్నీషియన్ల కుటుంబాలు చేసిన మౌత్ పబ్లిసిటీ పాండీబజార్లో మోగిపోయింది. సినిమా రాత్రి 9 గంటలకి పూర్తయితే రాత్రి 10.30 నించే బయ్యర్ల నించి ఫోన్లు .. పిక్చర్‌ని కొనడానికి సిద్ధంగా వున్నామనీ,కలవడానికి టైం చెప్పమనీ. ఉక్కిరిబిక్కిరైన రాఘవ సారధి ఇంటికొచ్చి విషయాన్ని చెబితే సారధి ఒకటే మాట అన్నాదు. “వెయిట్ చేద్దాం రాఘవగారూ. ఒక్కరోజు ఆగుదాం. అన్నట్టు రేపొద్దున్నే మీరొస్తే ఇద్దరం ‘ముప్పత్తమ్మ’గుదికి వెళ్ళొద్దాం. కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను” అని.

‘ముప్పత్తం’ గుడిలో మొక్కుకుంటే, ఫలితం వెంటనే వస్తుందనీ, కోరుకున్నది జరిగి తీరుతుందనీ నమ్మకం. ఇప్పటికీ ఆ గుడికి రష్ ఎక్కువే. ఇంకో గుడి మా వలసరవాకంలో వున్న ఆంజనేయర్ కోవిల్.

మొక్కు తీర్చుకున్నాక రమణ, శీను, గుప్త, రాఘవ, సారధి అందరూ సారధి ఇంట్లోనే టిఫిన్ చేశారు. సునీతి కొసరి కొసరి తినిపించింది. తగ మూడేళ్లుగా భర్త మౌనంతో భారమైన ఆమె హృదయం నిన్న రాత్రి సినిమా చూశాక ఒక్కసారిగా రెక్కలు విప్పుకుని , ఆకాశంలో ఎగురుతున్న రాజహంసలా మారింది. ఉప్మా, ఇడ్లీ, గారెలు, ఆవడ సమస్తం ఆమె స్వయంగా చేసినవే.

రాఘవ ఆమెని గమనిస్తూనే వున్నాడు మూడున్నర నెలలుగా. రోజురోజుకీ ఆమె అంటే అతనికి గౌరవం పెరుగుతూనే వుంది. ప్రశాంతమైన మొహం అన్నం పెట్టినా, ఆఖరికి మంచినీళ్లు ఇచ్చినా అందులోని ఆప్యాయతా, ఆదరణా అతని మనసుని కట్టి పడేసేవి. అందర్నీ ఒకేలా చూసేది. టిఫిన్ అయ్యాక అప్రయత్నంగానే ఆమె పాదాలకి నమస్కరించాడు రాఘవ.

ఆడాళ్లు  పిల్లల్ని కనడంతో ‘తల్లు’లవుతారు . అంతే ‘మాతృత్వపు’ పరిధి వేరు. అది ‘అమ్మ’దనం. అందర్నీ బిడ్డలుగా చూడగలగడం. ఆ అమ్మదనం (మాతృత్వం) నిండుగా ఉన్నది గనకే థెరెసాని ‘మదర థెరెసా’ అని ప్రేమతో పిలుచుకున్నాం. ఆ మాతృత్వం ఆమె అణువణువునా వున్నది గనకే జిల్లేళ్ళమూడి అమ్మనీ ‘అమ్మ’ అని నోరారా పిలిచాం. అంతెందుకూ, పుట్టిన క్షణం నించి మరణించేవరకూ యీ నేల తల్లిని ‘మదర్ ఎర్త్’ గానే పిలుచుకుంటున్నాం. చివరికి ఆమె ఒడిలోనే ఒరిగిపోతున్నాం. అలిసిన శరీరాలకి ఆమె ఒడిలోనే విశ్రాంతినిస్తున్నాం. సునీతి టిఫిన్ పెట్టాక అలాటి భావనే కలిగింది రాఘవకి. “అయ్యయ్యో… అదేమిటి రాఘవగారూ” అని ఖంగారూ, బిడియంతో అన్నది సునీతి.

“అమ్మా సారధిగారు సాగరమైతే, మీరు స్వచ్చ గోదావరి. అందుకే నా వందనం” నోరారా అన్నాడు రాఘవ.

painting: Rafi Haque

*****

 

‘అయిదు కోట్లకి’ అమ్ముడయింది సినిమా. ప్రతి టెక్నీషియన్‌కీ రిలీజ్ ముందరే మాట్లాడుకున్నంత ఎమౌంట్ + అయిదు వేలు అప్రీషియేషన్ ఎమౌంటు ఇచ్చాడు రాఘవ. రమణకి లక్ష. శీనూ, గుప్తాలకి యాభైవేలు. ఇలా అందరూ ఆనందంతో పొంగిపోయేంత పారితోషికాలు ఇచ్చాడు.

మొదటిసారి అప్రెంటీస్‌లకీ, అసిస్టెంటు డైరెక్టర్లకీ ఎవరూ పెద్దగా రెమ్యూనరేషన్ ఇవ్వరు. తిండి ఖర్చులూ, ట్రాన్స్‌పోర్ట్ మొదలైన ఖర్చులూ పోనూ అయిదు వేలిస్తే గొప్ప. అట్లాంటిది వాళ్లకి యాభై వేలివ్వడం అంటే కుబేరుడు స్వయంగా వరం ఇవ్వడం లాంటిదే. రమణ అడ్వాన్సుగాక మరో పదివేలు ఎక్స్‌పెక్ట్ చేశాడు. లక్ష చేతికి రావడంతో కళ్లు తిరిగిపోయాయి. సారధికి మాత్రం రాఘవ ఏమీ ఇవ్వలేదు. సారధికి ఆ ఆలోచనే రాలేదు. అతని ఆలోచనంతా సినిమా రిలీజ్ మీదే. లక్షాతొంబై ఆలోచనలు.

మొదటి సినిమాకి ఇలాగే టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. కానీ థియేటర్లో బోల్తాపడింది. అచ్చం అలాగే కోటీ ఎనభై లక్షలకి తీసిన సినిమాని బయ్యర్లు షో లేయుంచుకొని చూసి అయిదున్నర కోట్లకి కొనేశారు.

పిక్చరు ఏ మాత్రం అటుఇటు అయినా తన పని జీవసమాధే. ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్‌గా తయారవుతుంది. అతని టెన్షన్ సునీతికి తెలుస్తూనే వుంది. రాఘవకి కూడా. ఇద్దరూ సారధికి ధైర్యం చెబుతూనే వున్నారు. ఆగస్టు 17 రిలీజు . చిత్రం ఏమంటే ఆగస్టు 15న ఓ పెద్ద సినిమా రిలీజు కావల్సి వుంది. ఆగస్టు 22న చిరంజీవిగారి సినిమా రిలీజు. కారణం ఆ రోజు ఆయన పుట్టినరోజు.

రెండు పెద్ద సినిమాల మధ్య ఓ చిన్న చిన్న సినిమా నిలబడగలదా? నిలబడుతుందా? బయ్యర్లు పిచ్చ ధైర్యంతో వున్నారు.

“రాఘవగారూ, నేను ఆగస్టు 17న మద్రాసులో  వుండను. 18న కలుస్తా మిమ్మల్ని. ఐ జస్ట్ వాంట్ టు బీ అలోన్” అన్నాడు సారధి పదహారో తేదీ వుదయం 10 గంటలకి.

సునీతి వాళ్లిద్దరికీ ‘పొంగరాలు’ వడ్డిస్తోంది. సారధి మాట విని షాకైంది. సారధి ఆమె వంక జూసి , “కంగారు పడకు. ఒంటరిగా ఓ రోజు గడపాలని వుంది. నా మనసుకి రెస్టు కావాలి. 18న పొద్దుటికల్లా వస్తాను. టిఫిన్ ఇక్కడే అంటే మనింట్లోనే అరేంజ్ చెయ్యి. శీనూ, గుప్తా, రమణ, రాఘవ కూడా మనతోనే టిఫిన్ చేస్తారు” అని నవ్వాడు. సన్నగా నిట్టూర్చింది సునీతి. మనసులో మాత్రం అనుకుంది. “పిచ్చివాడా నీ కష్టం,నువ్వు పడుతున్న టెన్షన్ అన్నీ నాకు తెలుసు. కానీ యీ మూడేళ్ళ పైచిలుకులో నా మనసూ, శరీరమూ ఎలా వున్నాయో, ఏమైపోయాయో, ఎంత టెన్షన్‌ని భరించాయో నీకేం తెలుసూ. నీకెలా అర్ధమౌతుందీ?” అని

17 తెల్లవారుఝామున కారు అద్దెకి తీసుకుని ఒంటరిగా వెళ్లిపోయాడు సారధి..

 

*****

“తెలుగు సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. ‘వసంతమా’ సినిమా. రెండు భారీ సినిమాల మధ్య రిలీజైంది. కానీ పది కోట్ల కలెక్షన్స్‌ని దాటుతుంది. అద్భుతంగా యీ సినిమాని తెరకెక్కించిన ఘనత ఒక్కరికే.. దర్శకుడు సారధికే దక్కుతుంది” నిష్పక్షపాతంగా రివ్యూలు రాసే ఓ ఇంగ్లీషు పత్రిక రివ్యూ ఇది. ఇండీన్ ఎక్స్‌ప్రెస్, డక్కన్ హెరాల్డ్, ఈనాడు, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ .. అన్ని పత్రికలదీ ఒకేమాట. ‘వసంతమా’ ఓ అద్భుతమైన సినిమా అని. జనరంజకంగా మలచబడిందనీ – ‘మాయాబజార్’లా పదికాలాల పాటు నిలుస్తుందనీ.

‘వసంతమా’ సినిమా రిలీజైన థియేటర్లో ముందు జనం క్యూలు కట్టారు.నిన్నటిదాకా చిన్న చిన్న వేషాలు వేసిన ‘మోహన్’ ఇవాళ ‘వసంతమా మోహన్’ అయ్యాడు. పది పిక్చర్లలో హీరోగా బుక్ అయ్యాడు. సరికొత్త హీరోయిన్ లక్షణ కూడ ఎనిమిది సినిమాల్లో హీరోయింగా సంతకం చేసింది.

సారధి మాత్రం ఎప్పటిలా మౌనంగా ఇంట్లోనే ఉన్నాడు. 18 ఉదయం అతను ఇంటికి వచ్చిన దగ్గర్నించి మౌనంగానే వుంటున్నాడు. రోజురోజుకీ అతనికోసం వచ్చే నిర్మాతల  సంఖ్య పెరుగుతూనే వుంది. కానీ అతను ఎవర్నీ కలవటంలా. రాఘవ అర్జంటుగా అమెరికా వెళ్లాల్సి వచ్చి వెళ్లిపోయాడు. సినిమా రిలీజై పదిరోజులైంది. యీ పదిరోజుల్లోనూ మొదట వేసిన 35 ప్రింట్స్ కాక మరో నలభై ప్రింట్స్ వేశారు. కలెక్షన్లు ఎనిమిది కోట్లు దాటినై. టిక్కెట్లు కొనుక్కుని చూసేవాళ్లకంటే టిక్కెట్లు దొరక్క నిరాశతో వెనక్కి మళ్లే వాళ్లే ఎక్కువమందున్నారు. దాంతో తెలుగు సినిమా చరిత్రలో ‘వసంతమా’ అన్ని రికార్డులనీ బ్రేక్ చేస్తుందని సినీ పండితులు ఘంటాపధంగా చెబుతున్నారు.

సునీతికి ఏమీ అర్ధం కావడంలేదు. డబ్బు చిల్లిగవ్వ లేదు. పాపం ‘మల్లికడై'(కిరాణ కొట్టు) శరవణన్ మంచివాడు. అడిగిందల్లా అప్పుగా వెంటనే ఇస్తున్నాడు. సారధి పిక్చర్ సూపర్ హిట్టని అతనికీ తెలుసు. తెలుగు కస్టమర్లు తెగ చెప్పారు సినిమా గురించి. శరవణన్‌కి ఈ విషయం తెలుసునని సునీతికి తెలీదు. అందుకే శరవణన్ మంచితనానికి పదేపదే నమస్కరిస్తోంది.

సెప్టెంబరు రెండో తారీఖున కొత్త కారు ఇంటిముందు ఆగింది. రాఘవ చెరుకూరి భార్యతో సహా దిగాడు. సునీతి సంబరంగా వాళ్లని స్వాగతించింది. సారధి గది తలుపులు తట్టింది. సారధి బైటికొచ్చాడు. పది పన్నెండు రోజుల గడ్డంతో.

“గురూగారూ” అంటూ రాఘవ సారధి కాళ్ల దగ్గర కూలబడ్డాడు. అతని భార్య కూడా కూర్చుంది.

“చ.. చ.. ఇదేంటి రాఘవగారూ..” కంగారుగా అన్నాడు సారధి. “నన్ను నిర్మాతని చేశారు. మామూలు నిర్మాతనిగాదు. స్టార్ యాక్టర్లందరూ నాకు ఫోన్ చేశారు. కాల్‌షీట్లు  ఇవ్వడానికి సిద్ధంగా వున్నామని. అది చాలు నాకు. నా ఆశ తీరింది. మీ రుణం మాత్రం యీ జన్మకి తీరదు. ఒక్క పైసా మీకు నేనివ్వలేదు. ఒక్క పైసా మీరు తీసుకోలేదు. సీతమ్మలాంటి సునీతిగారి మెడలో నగలన్నీ తాకట్టుకి వెళ్లిపోయాయని తెలుసు. అప్పటికీ మీరు నన్ను ఏదీ అడగలేదు. నిజమైన స్నేహానికి నిర్వచనం మీరు. ఇదిగో – యీ కారు ఈ క్షణం నుంచి మీది. ఇదిగో ఇవి నేను మీకోసం కొన్న ట్రిబుల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ తాళాలు ఇదిగో. ఈ చెక్కు మీది. నేను  సినిమా తీస్తే అది మీతోనే అవుతుంది” అంటూ కన్నీళ్లతో చెక్కుని పాదాల మీద వుంచాడు రాఘవ. సారధి అతని భుజాలు పట్టుకుని లేవదీశాడు. సునీతి కళ్లల్లో నీళ్ళు జలజలా రాలాయి. రాఘవ భార్య ఆమెని హత్తుకుని కళ్లు తుడిచింది తన పైట చెంగుతో.

‘ఇవి నీవి..’ అపార్టుమెంటు తాళాలూ, కారు తాళాలూ చెక్కూ అన్నీ సునీతికి ఇచ్చి అన్నాడు సారధి. ఆశ్చర్యంగా చూసింది సునీతి.”నేను పడ్డ కష్టంలోనూ, టెన్షన్లోనూ వున్నది నా స్వార్ధం మాత్రమే. అంటే అది ప్రొఫెషన్‌కు సంబంధించింది. మరి యీ మూడేళ్లకు పైగా నువ్వు పడ్డ టెన్షన్ సంగతి? అందులో ఏ స్వార్ధమూ లేదు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనూ?” సునీతి వంక చూస్తూ అన్నాడు సారధి. గొంతులో గుండె కొట్టుకుంటుంటే వచ్చిన మాటలవి.

“ఇన్ని రోజులు ఆ గదిలో మౌనంగా…” అడిగింది సునీతి.

“జస్ట్ వన్ మినిట్..” గది లోపలికెళ్లి క్షణంలో బయటికొచ్చాడు సారధి. అతని చేతిలో ఓ ఫైలుంది. ఆ ఫైల్ మీద అందంగా ‘దాహం’ అనే టైటిల్ రాసి వుంది. “ఇది నేను చెయ్యబోయే నెక్స్ట్ సినిమా. ” నవ్వాడు సారధి. సునీతికి ఆ ఫైల్ అందించి దగ్గరకి తీసుకుంటూ..

*****

‘సక్సెస్’ నా ‘బిడ్డ’ అని చెప్పుకోవడానికి లక్ష మంది రెడీగా వుంటారు. ఫెయిల్యూర్‌ని ‘నా బిడ్డ’ అని చెప్పడానికి ఎవరూ ఒప్పుకోరు.

ఈ కథ సక్సెస్ కథ.

కథలో కథ మరో కథ వుంది.

దాని పేరు “బొరుసు”

అన్నట్టు బొమ్మా బొరుసుల్లానే, సక్సెస్, ఫెయిల్యూర్లు ఒకే నాణానికి రెండు ముఖాలు.

“దేరీజ్ నో సక్సెస్ వితవుట్ ఫెయిల్యూర్’ అనేది నా అనుభవం నాకు నేర్పిన పాఠం..

అది మరో కథలో చెప్పుకుందాం

మీ

భువనచంద్ర..

 

పతి-పత్ని ఔర్ జస్ట్ నథింగ్!

 

యం.యస్.కె.కృష్ణ జ్యోతి

 

krishnajyothiఅలారం మోగింది.  ఐదు గంటలు, పక్కకి చూసింది రమ.  భర్త అప్పుడే లేచి ప్రాణాయామం చేస్తున్నాడు.  వీడు ఇంత త్వరగా ఎలా లేస్తాడో అర్ధం కాదు-మనసులో అనుకుంది.  తనకీ త్వరగా లేవాలని వుంటది.  లేచినా, పరుగులు మొదలు పెడుతుంది  కానీ, ముక్కు మూసుకొని ప్రాణాయమాలు చెయ్య లేదు.  ఐదు గంటలు అవ్వడానికి ఇంకో గంట వుంటే బాగుండు అనిపిస్తుంది.  కానీ కాలం ఒకరు చెప్పినట్టు వింటదా?  కాలం దాక ఎందుకు, తను వింటదా ఎవరి మాటైనా?  అమ్మ చెప్పింది, నీలో ఏదో తేడా కనబడుతుంది, గమనించుకోమని-తను విన్నదా?  కానీ ఈ రోజు ఆలోచించాలి.

పరుగు మొదలు.  తనతో పాటు ఇంట్లో అందరూ  పరిగేట్టాలని ఆశ.  చాలా వరకూ పరిగెట్టిస్తుంది.  భర్త గానీ, ఇద్దరు పిల్లలు గాని ఎవరైనా పొద్దుట నిమిషం ఖాళీగా కనబడకూడదు, కసిరేస్తది.  ఉదయం ఎక్కువ సమయం వంటింట్లో వుంటది.  భర్త ఇల్లంతా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు.  పని చేసేప్పుడు మాట్టాడదు-కాన్సంట్రేషన్ దెబ్బతింటదని.  పనికి సంబంధించిన ఆర్డర్లు మాత్రం వేస్తుంది.

“కరివేపాకు”కేకేస్తుంది.

పెరట్లోకి పరిగేడతాడు.

“కేరేజి గిన్నెలు”

కడిగిన కేరేజి గిన్నెలు ఓ సారి తొలిపి పెడతాడు

“కాఫీ”

గబగబా వచ్చి తాగి పెడతాడు

“టైం చెప్పు”

ఎప్పుడూ ఓ పది నిమిషాలు ఎక్కువ చెబుతాడు.  టెన్షన్ పెరిగిపోతుంది.  ఒక్కోసారి అనుమానం వస్తుంది.  బయటకొచ్చి చూస్తుంది.  వంటింట్లోకి ఒక గడియారం తేవాలి.  ప్రతిరొజూ ఉదయం ఇలాగే అనుకుంటుంది.  సాయంత్రం మరచిపోతుంది.

“తప్పు టైం ఎందుకు చెబుతావు?”  అరుస్తుంది.

“ఇంచుమించు అయిందిగా”

అన్నాలు, కూరలు, పెరుగులు, పచ్చళ్ళు, మధ్యలో  తినడానికి తాయిలాలు-ప్రతి రొజూ ఇరవై గిన్నెలకు పైగా సర్దాలి. ఒకోసారి అనిపిస్తది, ఇన్ని రకాలు అలవాటు చెయ్య కూడదని.  కానీ ఎవరికోసం?  ఇప్పుడు పోషణ బాగుంటేనే రేపు పిల్లలు ఆరోగ్యంగా వుంటారు.

పరిగెత్తండి.  టైం దాటితే తిట్లు పెద్దవాళ్ళకి బాస్లతో, పిల్లలికి వాళ్ళ హెడ్ మాస్టర్లతో.

chinnakatha

ఉదయం పది గంటలు.  క్లియర్ కావలసిన ఫైళ్ల సంఖ్య అంతకన్నా ఎక్కువ!  చేస్తూనే వుంటుంది.  ఆఫీస్ కి వచ్చేదాక ఉరుకుల పరుగుల జీవితం.  రాగానే పని.  మధ్య మధ్య మగత వచ్చేస్తుంది.   హెమోగ్లోబిన్ తగ్గిందేమో.  సాయంత్రం రక్త పరీక్ష చేయించాలి.  చుట్టూ చూసింది.  అందరూ పని చేస్తూనే వున్నారు.  తనే అలా అలసి పోతుందా?  అందరు అంతేనా?

ఒంటిగంట – భోజనం బ్రేక్.  తనకిష్టమైన సమయం ఇదే!  అందరితో కలిసి కూచుంటుంది.  కానీ పది నిమిషాల్లో గబ గబ తినేస్తుంది. తర్వాత ఫోన్ తీస్తుంది.  ముఖ్యమైన కాల్స్ మాట్టాడుతుంది.  పొద్దున్నే కుదరదు.

 

సాయంత్రం ఎలా ఉంటుందో!  అమ్మ మళ్లీ చెప్పింది,పాలిపోయినట్టు  కనబడుతున్నావు, ఓ సారి చుబించుకొమ్మని.  సరేనంది.  తర్వాత ఫేస్బుక్ గానీ వాట్సుప్ గాని ఆన్ చేస్తుంది.  సతీష్ పేరు పక్కన పచ్చ చుక్క, ఆన్లైన్ లో వున్నాడు.  రొజూ ఈ టైం లో వుంటాడు.  రమకి సంతోషం.  సినిమా హెరోయిన్ పోస్ట్ పెట్టాడు. లైక్  కొట్టింది.  ఇన్బాక్స్ లోకి వచ్చాడు.

“హలో”

“హాయ్”

“ఏం చేస్తున్నావు”

“నీతో చాటింగ్ చేస్తున్నా”

“కాల్  చేయనా?”

“ఒద్దు, ఇలానే బావుంది”

“తర్వాత”

“రొటీన్”

“సర్లే.  రొటీన్ సంగతి కాకుండా వేరేది చెప్పు”

నీ పోస్ట్ బాగుంది”

“మరి నాకు నచ్చె హీరొయిన్ కదా”.  నీకూ ఈర్ష్య గా ఉందా?”

“షటాప్”

అవతలి నుంచి నవ్వుతున్న సింబల్.  వెంట మహేష్ బాబు పోస్ట్ పెట్టింది.  సతీష్ లైక్ కొట్టలేదు.

“మహేష్ కొత్త సినిమా.  ట్రైలర్స్ చూశాను.  భలే వున్నాడు తెలుసా.  కళ్ళు తిప్పుకోలేనట్టు మెరిసిపోతున్నాడు.”

“నీ మొహానికి మహేష్ కావాలా?”

“మరి నీ మొహానికి సమంత ఎందుకో”

“చంపేస్తా”

“చంపేసెయి.  సర్లే, మహేష్ సినిమాకి వెళదామా?”

“కుదరదు, వదిలేయ్ ”

“జేల్సినా”

“పోవే”

“పోరా”

ఇద్దరూ మళ్ళీ నవ్వారు.

“నాకు నలతగా ఉంటోంది.  సాయంత్రం గంట పర్మిషన్ తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాలి”

“నేను కూడా రానా?”

“వచ్చేయ్.  నాలుగుంపావు కల్ల, కమల హాస్పిటల్”

“నువ్వంటే నాకు చాలా ఇష్టం”

“నువ్వంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం”

ఇద్దరు సెల్ఫిలు పంపుకున్నారు.  చిరునవ్వు నవ్వుకున్నారు.  తర్వాత చాట్  హిస్టరీ క్లియర్ చేశారు.  పనిలో పడిపోయారు.

రమ హాస్పిటల్ చేరే లోగా సతీష్ వెయిట్ చేస్తున్నాడు.  లోపలి వెళ్లారు.

సతీష్ వెయిటింగ్ సోఫాలో కూలబడ్డాడు.

“రా, కూర్చో”పిలిచాడు.  పక్కన కూచుంది.  ఇదివరకూ చాల సార్లు అతని పక్కన కూచుంది.  అతని భుజాలు, మోచేతులు తనకి తగులుతాయి.  కానీ ప్రతిసారి కొత్తగా, ప్రతిసారి సరదాగానే అనిపిస్తుందామెకి.

డాక్టర్ రమకి ఫ్రెండే. కాసేపట్లో పని అయిపోయింది.

“నేను ఇంటికి వెళతాను.”రమ బండి తీసింది.  ఇద్దరూ చెరో దారి పట్టారు.

ఇంటికొచ్చి తాళం తీసింది.  పొద్దున్న చిందర వందరగా వదిలేసి వెళ్ళిన ఇల్లు సర్దింది.  ఇంతలో భర్త, పిల్లలూ వచ్చారు.  వాతావరణం చల్లగా వుంది.  ఫ్రిజ్ లోంచి సెనగ పిండి తీసి బజ్జీలు వేపింది.   చపాతీ, కూర చేసింది.  రాత్రి పూట పిల్లలు అన్నం సరిగా తినరు.  టిఫిన్ తయారు చేస్తే ఇష్టంగా తింటారు.  పని చేసేటప్పుడు మాట్టాడదు-కాన్సంట్రేషన్  దెబ్బతింటుందని.

తన పనులు పూర్తి చేసేలోగా పిల్లలు వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని హోంవర్క్ చేశారు.  గీజర్ ఆన్ చేసింది.  అందరూ మల్లె పువ్వుల్లా తయారయ్యారు.  కలసి  కూర్చుని భోజనం చేశారు.  కానీ భోజనం చేసేప్పుడు మాటాడకూడదని మావగారి రూల్.  మావ పోయినా రూల్ పోలేదు.

పిల్లల దగ్గర కాసేపు సమయం గడిపింది.  వాళ్ళు చెప్పేది వింది.  వాళ్ళ పుస్తకాలు చెక్ చేసింది.  పరీక్షలు  జరుగుతున్నాయి.  చిన్నది లెక్కల్లో తప్పులు చేసిందట.  ఓదార్చింది.  తొమ్మిది దాటింది.  భర్త లాప్టాప్ తీశాడు.  రమ కూడా ముఖ్యమైన ఫైల్స్ ముందేసుకుంది.  గంట గడిచింది.  అలసిపోయారు.  మొహాలు చూసుకున్నారు.  నవ్వుకున్నారు.  మంచం మీదికి చేరారు.  అప్పటికీ మొత్తంగా అలసి పోయారు.  రమ చేతిని తన చేతిలోకి తీసుకుని భుజానికి దగ్గరగా ఆనించుకుని ఆమె భర్త నిద్రలోకి జారిపోబోతున్నాడు.

“సతీష్, నీతో ఓ సంగతి చెప్పాలనుకున్నాను”

“రేపు మధ్యాహ్నం మాటాడుకుందాం”

“సరే”

అలసిపోయిన శ్రామికులు,ఒక్క నిమిషం లోపుగానే నిద్రపోయారు!!

*

 

 

 

 

వికట విటులు

 

మధురవాణి: ఒక వేశ్య

రామప్పంతులు: ఆమె కొత్త విటుడు

గిరీశం: ఆమె ప్రస్తుత విటుడు

పూటకూళ్ళమ్మ: ఒక విధవ

 

రామ: (జేబులోంచి చుట్ట తీసి పంట కొరికి) పిల్లా, అగ్గిపుల్ల!

మధు: (అగ్గిపుల్ల వెలిగిస్తుండగా పంతులు బుగ్గ గిల్లాడు) మొగవాడికయినా ఆడదానికయినా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని బెట్టరు గదా!

రామ: నిన్ను ఉంచుకోవడానికి అంతా నిశ్చయమయి రేపో నేడో మంచి ముహూర్తం చూసి మా వూరు లేవతీసుకు వెళ్ళడానికి సిద్ధవయ్యుంటే యింకా యవడో కోన్కిస్కాహే గాడి ఆడాలో ఉన్నానంటూ పాతివ్రత్యం నటిస్తావేమిటి!?

మధు: వేశ్య అనగానే అంత చులకనా పంతులు గారూ? సానిదానికి మాత్రం నీతి ఉండొద్దా? మా పంతులు గారిని పిలిచి, ‘అయ్యా, యిటుపైన మీతోవ మీది, నాతోవ నాది’ అని తెగతెంపులు చేసుకున్నదాకా నేను పరాధీనురాలినే అని యంచండి. మీరు దెప్పిపొడిచినట్టు ఆయన వైదీకయితేనేమి, కిరస్తానం మనిషయితేనేమి, పూటకూల్లమ్మను వుంచుకుంటేనేమి… నన్ను ఇన్నాళ్ళూ ఆ మహరాజు పోషించాడు కాడా! మీరంతకన్న రసికులయినా, నామనస్సు మీరు యంత జూరగొన్నా, ఆయన యడల విశ్వాసం నాకు మట్టుకు ఉండొద్దా?

రామ: పెద్దపెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు! వాడి బతుక్కి వాడు పూటకూళ్ళమ్మని వుంచుకోవడం కూడానా? పూటకూళ్ళమ్మే వాణ్ణి వుంచుకొని యింత గంజి పోస్తుంది.

మధు: అన్యాయం మాటలు ఆడకండి, ఆయన యంత చదువుకున్నాడు, ఆయనకి యంత ప్రఖ్యాతి వుంది! నేడో రేపో గొప్ప వుద్యోగం కానైయ్యుంది.

రామ: యేం వెర్రి నమ్మకం! నీవు సానివాళ్ళలో తప్ప పుట్టావు. గిరీశంగారు, గిరీశంగారు అని పెద్ద పేరు పెడతావేవిటి, వాణ్ణి చిన్నప్పుడు గిర్రడని మేం పిలిచే వాళ్ళం. వాడికల్లా ఒక్కటే వుద్యోగం దేవుడు రాశాడు. యేవిటో తెలిసిందా? పూటకూళ్ళమ్మ యింట్లో దప్పిక్కి చేరి అరవ చాకిరీ చెయ్యడం.

మధు: యీ మాటలు ఆయన్ని అడుగుదునా?

రామ: తప్పకుండా, కావలిస్తే నేను చెప్పానని కూడా చెప్పు!

మధు: అయినా ఆయన గుణయోగ్యతలతో నాకేం పని? యేవయినా ఆయన నాకు యజమాని. ఆయన తప్పులు నాకళ్లకు కనబడవ్!

రామ: అయితే అతనికి విడాకులు యెప్పుడిస్తావు?

మధు: యిక్కడి రుణాలూ పణాలూ తీర్చుకోడానికి మీరు శలవిచ్చిన రెండు వందలూ యిప్పిస్తే యీ క్షణం తెగతెంపులు చేసుకుంటాను.

రామ: అయితే యింద (మధురవాణి అందుకొంటుండగా రామప్పంతులు చెయిపట్టి లాగును. మధురవాణి కోపంతో నోట్లు పారేసి దూరంగా పోవును)

మధు: మీతో కాలక్షేపం చెయ్యడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలవని మనిషి. ఏవన్నమ్మను?

రామ: (నోట్లు యెత్తి) క్షమించు, అపరాధం (నోట్లు చేతికిచ్చి) లెక్కపెట్టి చూసుకో!

మధు: ఆమాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానే రాను. యింత రసికులయ్యుండీ నామనస్సు కనిపెట్టజాలినారు కారు గదా! మీనోట్లు మీవద్దనే వుంచండి. నేను డబ్బు కక్కూర్తి మనిషిని కాను.

రామ: వద్దు, వద్దు, వద్దు! నీ మనస్సు కనుక్కుందామని అన్నమాట గాని మరొకటి కాదు. గాని, యీ గిరీశం గుంటవెధవ, వీడెవడో మాగొప్ప వాడనుకున్తున్నావేవిటి!?

మధు: ఆయన్ని నాయదట తూల్నాడితే యిదిగో తలుపు తీశాను, విజయం చెయ్యండి. అదుగో గిరీశంగారే వస్తున్నారు, ఆమాటేదో ఆయన్తోటే చెప్పండి.

రామ: వేళాకోళం ఆడుతున్నావూ?

గిరీశం: (బయటినుంచి) మైడియర్….

రామ: (తనలో) అన్న… వేళగాని వేళొచ్చాడు గాడిదకొడుకు. తంతాడు కాబోలు, యేవిటి సాధనం? యీ మంచం కింద దూరదాం. (మంచం కింద దూరును)

గిరీశం: (ప్రవేశించి) వెల్, మైడియర్ ఎంప్రెస్ (బుజం మీద చెయ్యి వెయ్యబోవును)

మధు: (తప్పించుకొని) ముట్టబోకండి.

గిరీశం: (నిర్ఘాంతపోయి) అదేమిటి ఆ వికారం!

మధు: ఏదో ఒకటి..

గిరీశం: మైలబడితే స్తానం చేసి వేగిరం రా!

మధు: యిప్పుడేం తొందర, తలంటుకుంటాను.

రామ: (తనలో) చబాష్, యేమి నీతయిన మనిషి యిది! వెధవని ముట్టుకోనివ్వకుండా యెత్తు యెత్తింది.

గిరీశం: మయిలా గియిలా మా యింగ్లీషు వారికి లక్ష్యం లేదు. యిలారా (దగ్గరకు చేరును)

మధు: (వేలుచూపి) అక్కడనే ఆగండి. మీరు కిరస్తానం అయితే కావచ్చును. నేను కిరస్తానం యింకా కాలేదే! మీరు కిరస్తానం అన్నమాట యిప్పుడే ఒహరు చెప్పగా విన్నాను.

రామ: (తనలో) నేను చెప్పానంటుందా యేమిటి?

గిరీశం: ఒకరు చెప్పగా విన్నావూ? ఎవరా జెప్పింది? యవడికిక్కడికి రావడానికి మగుదూర్ వుంది? యిలాంటి చాడీకోర్ కబుర్లు చెప్పడానికి ఎవడికి గుండుంది? చెప్పు!

రామ: (తనలో) తంతాడు కాబోలు, యరక్క చిక్కడ్డాను.

మధు: మొగాడే చెప్పాలా యేవిటి? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా?

గిరీశం: (తనలో) పూటకూళ్ళముండ చెప్పింది కాబోలు. (పైకి) ఆడదా? ఆడదాన్ని నోరు బెట్టుకు బతకమనే దేవుడు చేశాడు. పరువయిన ఆడది నీ యింటి కెందుకొస్తుంది?

మధు: పరువయిన మొగాళ్ళొచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళెందుకు రాకూడదు? ముందు కూచోండి, తరవాత కోప్పడుదురు గాని, చుట్ట తీసుకోండి, అదుగో అగ్గిపెట్ట.

గిరీశం: ముట్టుకోడానికి వల్ల లేకపోతే అగ్గిపుల్ల వెలిగించి యివ్వడానికయినా పెట్టిపుట్టాను కానా? యివాళ మహా ఉత్సాహంగా వచ్చాను గాని, ఉత్సాహభంగం చేశావ్!

మధు: యేవిటా ఉత్సాహం?

గిరీశం: యిదిగో, జేబులో హైదరాబాద్ నైజాం వారి దగ్గిర్నించి వచ్చిన ఫర్మానా! మానాస్తం నవాబ్ సదరదాలత్ బావురల్లీఖాన్ ఇస్పహన్ జంగ్ బహద్దర్ వారు సిఫార్స్ చేసి వెయ్యి సిక్కా రూపాయలు జీతంతో ముసాయిబ్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా బాద్షా వారి హుజూర్న వుండడం.

రామ: యేవిట్రా వీడి గోతాలు!

గిరీశం: యింత శుభవార్త తెచ్చినా, దగ్గిరికి రానిచ్చావు కావు గదా? నాతో హైదరాబాద్ వస్తావా?

మధు: నే యెందుకు? పూటకూళ్ళమ్మని తీసికెళ్ళండి.

గిరీశం: పూటకూళ్ళమ్మ యేవయినా పెంట పెడుతుందా యేవిటి?

మధు: మీకే తెలియాలి.

గిరీశం: నీ తెలివితక్కువ చూస్తే నాకు నవ్వొస్తూంది. యెవడే మాటన్నా నామీద నమ్మడమేనా? యీ ఘోరవైన అబద్ధాలు నీతో చెప్పేవాడు సప్తసముద్రాలు దాటినా వాడి పిలకట్టుకొని పిస్తోల్తో వళ్ళు తూట్లు పడేటట్టు ఢా ఢా మని కొట్టకపోతినట్టయినా నాపేరు గిరీశమే, నినదభీషణ శంఖము దేవదత్తమే! కబడ్దార్!

మధు: సముద్రాలవతలికెళ్ళి వెతకక్కర్లేదు. ఆ చెప్పిన మనిషి మీ యదటే చెబుతాడు.

రామ: (తనలో) యీ ముండ నన్ను బయలుబెడుతుంది కాబోల్రా దైవమా!

గిరీశం: (తనలో) థాంక్గాడ్.. అయితే పూటకూళ్ళదాన్దెబ్బ తగల్లేదు. (పైకి) యిలాంటి దుర్మార్గపకూతలు ఆ యిల్లాలు చెవిన పడితే చాలా ఖేదిస్తుంది. ఆ పాపవంతా నిన్ను చుట్టుకుంటుంది. ఆమె యంత పతివ్రత! యంత యోగ్యురాలు!

మధు: వెధవముండకి పాతివ్రత్యం అన్నమాట యీ నాటికి విన్నాను.

గిరీశం: దానికి… కాదు, ఆమెకి మొగుళ్ళేకపోయినా ఆమెను వెధవనడానికి వీల్లేదు.

మధు: మీరుండగా వెధవెలా అవుతుంది?

గిరీశం: నాన్సెన్స్… యిదుగో విను. దాని నిజం యేవిటంటే… పూటకూళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేశే రోజుల్లో ఒక కునుష్టి ముసలాడికి కట్ట నిశ్చయించారు. ఆ ముసలాడు పెళ్లిపీటల మీదే గుటుక్కుమన్నాడు. మరిదాన్నెవరూ పెళ్ళాడారు కారు.

మధు: అయితే మరి మీకు తప్పలేదే?

గిరీశం: యేవిటీ యీ కొత్తమాటలూ! నాకు ఆదీ అంటూ తెలీకుండా వుంది! ఆహా, సరసం విరసం లోకి దిగుతూందే! హాస్యానికంటే నివ్వేవన్నా ఆనందవే! నిజవనిగానీ అంటివా, చూడు నా తడాఖా. యవడీ మాటలు పేల్తున్నాడో వాడి పేరు తక్షణం చెబుతావా, చెప్పవా?

మధు: రామ….

రామ: (తనలో) సచ్చాన్రా, పేరు చెప్పేసింది!

మధు: రామ!రామ! ఒహరు చెప్పేదేమిటి, లోకమంతా కోడై కూస్తుంటేను! (వీథిలోనుంచి తలుపు తలుపు అని ధ్వని)

గిరీశం: (తెల్లపోయి) తలుపు తియ్యొద్దు, తియ్యొద్దు, ఆ పిలిచే మనిషి వెర్రిముండ. మనుషుల్ని కరుస్తుంది.

మధు: తలుపు తీసే వుంది.

గిరీశం: చంగున వెళ్లి గడియ వేసెయ్.

మధు: అదుగో, తలుపు తోసుకు వస్తూంది.

గిరీశం: గెంటేయ్, గెంటేయ్…

మధు: ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తూంది.

(మధురవాణి వాకిట్లోకి వెళ్ళింది. గిరీశం దాక్కోడానికి మంచం కింద దూరాడు)

గిరీశం: (తనలో) దొంగలంజ. సరసుణ్ణి దాచిందోయ్ మంచం కింద. యిదేమిటో మంచి మనిషి అని భ్రమించాను. దీన్తస్సగొయ్యా సిగపాయ దీసి తందును గాని, యిది సమయం కాదు. (పైకి) యవరన్నా మీరు, మహానుభావులు?

రామ: నేను రామప్పంతుల్నిరా, అబ్బాయీ!

గిరీశం: తమరా, యీ మాత్రం దానికి మంచం కింద దాగోవాలా మహానుభావా? నన్నడిగితే యిలాంటి లంజల్ని యిరవై మందిని మీకు కన్యాదానం చేతునే!

రామ: (తనలో) బతికాన్రా దేవుడా; (పైకి) నువ్వురా బాబూ దీన్నుంచుకున్నావు! ఆలా తెలిస్తే నే రాక పోదును సుమా!

గిరీశం: అన్నా, యీ లంజని యన్నడూ నమ్మకండి, యిలా యిరవైమందిని దాచగల శక్తుంది దీనికి.

రామ: రెండువందలు దొబ్బిందిరా బాబూ!

గిరీశం: నువ్వులేం జాగర్త చేశారా?

రామ: అంతేనా?

గిరీశం: మరేమిటి!? (మధురవాణిని తోసుకుంటూ పూటకూళ్ళమ్మ లోపలి కొచ్చింది)

మధు: మీరన్న మనిషి యిక్కడ లేరంటే చెవిని బెట్టరు గదా!

పూట: నీయింట్లో జొరబడ్డాడని వీథులో వాళ్ళు చెబితే నీమాట నమ్ముతానా యేవిటి? ఆ వెధవ వుంటే నాకేం కావాలి, వుండకుంటే నాకేం కావాలి. వాడు నీకిచ్చిన యిరవయి రూపాయలూ యిచ్చెయ్.

మధు: ఎవడి కిచ్చావో వాణ్ణే అడగవమ్మా!

పూట: వెధవ కనబడితే సిగపాయ దీసి చీపురుకట్టతో మొత్తుదును. యెక్కడ దాచావేవిటి!?

మధు: నాకు దాచడం ఖర్మవేవి? నేను మొగనాల్ని కాను, వెధవముండనీ కాను. నాయింటి కొచ్చేవాడు మహరాజు లాగా పబ్లీగ్గా వస్తాడు. (కంటిసైగతో మంచం కింద చూపును)

పూట: (మంచం కిందుకు వంగి) నీ పరువు బుగ్గయినట్టే వుంది. లేచిరా (చీపురుకట్ట తిరగేసి కొట్టును)

రామ: ఓర్నాయనా నన్నెందుక్కొడతావే దండుముండా! (బయటికి వచ్చును)

మధు: ఆయన్నెందుకు కొట్టావు? నాయింటి కొచ్చి యేవిటీ రవ్వ?

రామ: నీ సిగాతరగా, ఆడదానివై పోయినావే, లేకుంటే చంపేసి పోదును. నీ రంకుమొగుణ్ణి కొట్టక నన్నెందుక్కొట్టావే ముండా? అందుకా నన్ను ముందుకు తోసి తాను గోడవేపు దాగున్నాడు?

పూట: ఆ వెధవ కూడా వున్నాడూ మంచం కింద? కుక్కా పైకిరా!

గిరీశం: వెర్రప్పా! మంచం కిందికిరా, వెర్రి వదలగొడతాను.

పూట: అప్పనుట్రా వెధవా నీకు? నీకు భయపడతాననుకున్నావా యేమిటి? (మంచం కిందికి దూరును. గిరీశం అవతలి వేపు నుంచి పైకి వచ్చి రామప్పంతులు నెత్తిన బలంగా చరిచి పారిపోవును)

రామ: సచ్చాన్రా నాయనా! మధురవాణీ, యేవీ బేహద్బీ! కనిష్టీబుక్కబురంపించు!

మధు: యెందుకు పబ్లీకున అల్లరీ అవమానవున్నూ! (ముద్దుబెట్టుకొని) మాటాడక వూరుకొండి. దొంగ దెబ్బ కొట్టినవాడిదే అవమానం; మీది కాదు.

రామ: నొప్పెవడిదనుకున్నావు? ఆముండ మంచం కింద నించి రాదేం? చీపురుకట్ట లాక్కో!

పూట: (మంచం కింద నుంచి వచ్చి) ఫడేల్మంటే పస్తాయించి చూస్తున్నాను. నీ మొగతనం యేడిసినట్టే వుంది. (వెళ్లిపోవును)

*

 

వాటే ఫాల్‌! వాటే పిటీ!

 

రమా సుందరి 

 

ramasundariచలసాని స్మృతిలో వరవరరావుగారు ఒక వ్యాసం రాశారు. అందులో విరసం పుట్టుకను, అందులో చలసాని పాత్రను చర్చించారు. దానిపై రంగనాయకమ్మగారు స్పందించారు. ఆమె అభ్యంతరాలేవో ఆమె చెప్పారు. అవన్నీ రాజకీయ పరమైనవే. అందులో వ్యక్తిగతమైన విమర్శ కించిత్తులేదు. ఆ అభిప్రాయాలతో మనం ఏకీభవిస్తామా, లేదా అనేది వేరే చర్చ. అక్కడక్కడా ఆమె ఉపయోగించిన టోన్‌తో, లాజిక్‌తో ఎవరికైనా ఇబ్బంది ఉండొచ్చును. మన ఇబ్బందులేవైనా సరే, ఆమె కొన్ని రాజకీయ ప్రమాణాలను ముందు పెట్టుకుని ఆ మేరకు విమర్శించారు. ఇట్స్‌ఎ పొలిటికల్‌పీస్‌.

కానీ వసంతగారి కవిత్వంలో ఏమున్నది. అది కవిత్వమా కాదా అనే చర్చను కాసేపు పక్కనబెడదాం. కవిత్వమే అనుకుందాం. ఏమిటీ ఆమె చెప్పదలుచుకున్నది? రంగనాయకమ్మగారి పుస్తకాల పేర్లకు అటూ ఇటూ తోచిన పదాలేవో అల్లి వెటకారాన్ని వెదజల్లడం తప్ప. రంగనాయకమ్మగారి వెటకారం కంటేనా అనబోదురేమో! ఆమెక్కడా అప్పొలిటికల్‌విమర్శ చేయగా నేను చూడలేదు. ఆమె తర్కంతో టోన్‌తో అన్నివేళలా ఏకీభవించకపోవచ్చు కానీ అప్పొలిటికల్‌ అనైతే ఎవరమూ అనలేము కదా!

కానీ ఇందులో ఏమున్నది? ఆ కవిత్వం చదువుతుంటే తెలీకుండానే మెటికలు విరిచిన చప్పుడు వినిపిస్తే అది పాఠకుడి తప్పవుతుందా! శాపనార్థాలు పెట్టే పెద్దమ్మల ధ్వని తప్ప మరో ధ్వని ఉన్నదా! పైగా ఆమె రాసింది గొప్ప కవిత్వమన్నట్టు కొందరు ఎంఎల్‌పార్టీ వారు కూడా దాన్ని సెలబ్రేట్‌చేసుకోవడం? క్యా చల్‌రహా హై భయ్‌..ఇస్‌దేశ్‌మే! శత్రువుకు శత్రువు మిత్రుడన్న అల్పసంతోషత్వం తప్ప మరోటున్నదా ఇందులో! పాతకక్షలు తీర్చుకోవడం లేదా స్కోర్లు సెటిల్‌చేసుకోవడం లాంటిది కాకుండా మరో రకంగా చూడగలమా! మొన్నమొన్నటిదాకా ‘విప్లవశిబిరాన్ని చీల్చడానికి’ పుట్టినటువంటివారై ఉండిన వసంతకన్నబిరాన్‌గారు సడన్‌గా మరింత దగ్గరైపోయి రంగనాయకమ్మగారు ఎలా దూరమైపోయారో అవేం రాజకీయాలో అర్థం కావడం కష్టం.

నిజమే కావచ్చు. రంగనాయకమ్మ గారి వ్యాసాల్లో తడి లేకపోవచ్చును. మానవీయ స్పర్శ తక్కువని పించవచ్చును. సందర్భశుద్ధి ఉండొద్దా అని కూడా కొందరికి అనిపించవచ్చును. ఇలాంటి అభిప్రాయాలు బోలెడుండవచ్చును. కానీ ఆమేం రాసినా కొన్ని ప్రిన్సిపుల్స్‌ఆధారంగా రాసినవి.

ప్రిన్సిపుల్డ్‌పొలిటికల్‌బీయింగ్‌. ఎందరున్నారు మనలో! ఆ మాటకొస్తే ఈ తడి అనేది కూడా అమూర్తమైనది. కన్నబీరన్‌చివరి చూపు కోసం విప్లవాభిమానులు పరిగెత్తుకుంటూ పోతే బూడిద కనిపించింది. ఏం కొంపలు మునిగిపోయాయని ఇంత హడావుడిగా అనిపించింది. వసంతగారి లాజిక్కేదో ఆమెకుంటుంది. అది మనకు తడిలేకపోవడంగా కనిపించొచ్చు. ఆ విషయం మీద ఆర్కే గారు తన ఆవేదన ఏదో రాశారు కూడా! ఇవన్నీ మనం ఎక్కడ నిలబడి ఏ వాంటేజ్‌పాయింట్‌లో చూస్తున్నామనే దాన్ని బట్టి ఉంటుంది. రాజకీయంగా ఏవైనా చర్చించొచ్చు. కానీ వసంత అంత పెద్ద మనిషి ఎవరో చిన్న పిల్లలు చేసినట్టుగా నాలుగు అక్షరాలను రాళ్లుగా మార్చి విసిరితే ఎలా!

ఎవరో ఫేస్‌బుక్‌లో కొన్ని ప్రశ్నలు సంధించి రంగనాయకమ్మగారు చలసాని ఇంట్లో ఉన్నారని ఆమె స్వయంగా రాసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను చాలా సాయం పొందినట్టు ఆమె రాసిన విషయాల్ని గుర్తుచేశారు. ఇవేమి రాజకీయాలో బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. వాళ్లు సాయం చేసిన విషయాన్ని రంగనాయకమ్మగారు ఇవాళ కూడా ప్రేమగానే గుర్తుచేసుకోవచ్చు. కానీ వ్యక్తిగత స్నేహాలకు ప్రేమలకు రాజకీయఅభిప్రాయాలకు తేడా చూడలేనంత దూరం ప్రయాణించామా మనం! వ్యక్తిగతంగా సాయం చేసిన వారిని రాజకీయంగా విమర్శించకూడదా!

వాటే ఫాల్‌! వాటే పిటీ!

*

‘స్టిల్ లైఫ్’ లో ప్రాణం పొదుగుతున్న రమేష్!

 

సామాన్యశాస్త్రం ‘జీవనచ్ఛాయ’

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19 ) సందర్భంగా హైదరాబాద్‌లోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో సామాన్యశాస్త్రం ఏకచిత్ర ప్రదర్శన (సింగిల్ ఎగ్జిబిట్ షో) 18వ తేదీ మంగళవారం సాయంత్రం ఐదున్నరకు ప్రారంభం. ముఖ్య అతిథులు జి.భరత్ భూషణ్, అల్లం నారాయణ, కె.వి.రమణాచారి. candid picture, life photography ప్రాముఖ్యాన్ని తెలిపే ఈ ప్రదర్శన ఆదివారం దాకా ఉంటుంది. అందరికీ ఆహ్వానం.

– కందుకూరి రమేష్ బాబు, 99480 77893

ఈ సందర్భంగా  రామా చంద్రమౌళి ప్రత్యేక రచన 

raamaa chaMdramouliప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని..ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం,బాగ్ లింగంపల్లి,హైదరాబాద్ లో ప్రఖ్యాత ’ లైఫ్ ’ ఛాయాగ్రాహకులు  కందుకూరి రమేష్ బాబు ఒక విలక్షణతతో..అత్యంత సాహసోపేతంగా 19 నుండి 23 ఆగస్ట్ 2015 వరకు ఏర్పాటు చేస్తున్న ‘ ఏక ఛాయాచిత్ర ప్రదర్శన ‘ (single exhibit show) సందర్భంగా..రమేష్ బాబు గురించిన ముచ్చట.

ఈ ప్రదర్శనలో కేవలం 3′ X 5’ సైజ్ గల క్రింద చూపిన ఒకే ఒక్క ఛాయాచిత్రం మాత్రమే ప్రదర్శితమౌతుంది. సాధారణంగా ఆర్ట్ ఎగ్జ్బిషన్ లలో ఒకే లేదా భిన్న కళాకారులకు సంబంధించిన పలు చిత్రాలు ప్రేక్షకుల సందర్శనార్థం ప్రదర్శితమౌతాయి.కాని ఈ విధంగా ఒకే ఒక్క విలక్షణమైన చిత్రాన్ని రసజ్ఞులైన  వీక్షకులకోసం  ఏర్పాటు చేయడం ఒక సాహసోపేతమైన .. కించిత్తు దర్పంతోనూ, ఒక ప్రత్యేక లక్ష్యంతోనూ కూడుకున్న చర్యగా భావించవలసి వస్తోంది.ఒక జీవనచ్ఛాయా చిత్రకారునిగా గాఢ గంభీరతనూ,అర్థాన్నీ,లోతైన జీవన సంక్షోభాన్నీ అత్యంత గరిష్ఠ స్థాయిలో వ్యక్తీకరిస్తున్న ఈ చిత్రం నిజంగానే  ‘ ఒక్కటే అనేక చిత్రాలకు సమానం కదా ‘ అన్న ఒక ప్రశంసాత్మక అబ్బురాన్ని కలిగిస్తున్న విషయంకూడా తప్పక స్ఫురిస్తుంది అందరికీ . ఈ నేపథ్యంలో..

ramesh

పై ఫోటోకూ నాకూ ఒక వ్యక్తిగత సంబంధముంది.’ నమస్తే తెలంగాణ ‘ పత్రిక కొత్తగా పుట్టిన రోజుల్లో ప్రతి ఆదివారం అనుబంధ పుస్తకం ‘బతుకమ్మ ‘ సంచిక చివరి అట్టపై ఒక పూర్తిపేజి ఛాయాచిత్రం ప్రచురించబడి కళాత్మకమైన  ఫోటో ప్రియులను అలరించేది.ఆ విధంగా..ఒకటా రెండా..అనేకం వచ్చాయి.ఆ క్రమంలో నా హృదయాన్ని దోచుకుంటున్న ఈ  కె ఆర్ బి..అన్న ఫోటోగ్రాఫర్ ఎవరబ్బా అని ప్రత్యేకంగా వాకబుచేసి ఒకరోజు ఫోన్ చేసి..తర్వాత్తర్వాత పలుమార్లు కలుసుకుని..స్నేహించి..ఆత్మీయులమై..రమేష్ బాబు ఫోటోలంటే నాకు ఎంత పిచ్చి ఏర్పడిందంటే..2012 లో వెలువడ్డ ( తెలుగులో..ఇంగ్లిష్ లో ప్రసిద్ధ అనువాదకులు ప్రొఫెసర్ కె.పురుషోత్తం చేత తర్జుమా చేయబడిన) నా ఎనిమిదవ కవితా సంపుటి ” అంతర “పుస్తకంలోని  ప్రతి కవితకూ ఒక పూర్తి పేజి ఫోటో చొప్పున  అరవై కవితలకు అరవై ఫోటోలను  ఉపయోగించుకున్నాను.ఆ పుస్తకం అంతర్జాతీయ ప్రమాణాలతో వెలువడి తర్వాత ప్రతిష్టాత్మక ‘ ఫ్రీవర్స్ ఫ్రంట్-2012 ‘,’ సహృదయ-2013′ వంటి ఎన్నో పురస్కారాలను సాధించింది.

ఆ పుస్తకంలో..’ పాదాల కింది నేల ‘ అన్న కవితకు ఈ రోజు రమేష్ బాబు ఎంతో గర్వంగా ‘ ఏక చిత్ర ప్రదర్శన ‘ గా పెడ్తున్న ఈ అద్భుత చిత్రం ఉపయోగించబడింది.ఇదే కవితను నేను 2012 లో ఆగ్రాలో జరిగిన తొమ్మిది దేశాల ‘సార్క్ ‘ సాహిత్య శిఖరాగ్ర సదస్సులో చదివినప్పుడూ, 22 దేశాల ప్రతినిధులు పాల్గొన్న “2013-జైపూర్ అంతర్జాతీయ సూఫీ సదస్సు” లోనూ చదివినప్పుడు ఈ ఫోటో తో సహానా కవిత కూడా  గ్యాలరీలో ప్రదర్శించబడ్డప్పుడు అనేకమంది విదేశీ ప్రముఖుల ప్రశంసలను పొందింది..ఫోటో..కవితకూడా.అప్పుడు అనేక ప్రాచ్య  ప్రతినిధులు ఈ ఫోటోలోని విలక్షణతను నన్నడిగి తెలుసుకోవడం ఒక మధురమైన జ్ఞాపకం.

krb-5

photo: C.M.Praveen Kumar

నాకున్న వ్యక్తిగత అనుబంధంతో రమేష్ ను అడిగానొకసారి..’నీకూ ఇతర ఫొటోగ్రఫర్లకూ తేడా ఏమిటి ‘అని. అతను చెప్పిన జవాబు నన్ను ముగ్దుణ్ణి చేసి నిజమేకదా అని అబ్బురపర్చింది.అది..” అందరూ తమకు నచ్చిన దృశ్యాన్ని capture  చేస్తే..నా ఎదుట తారసపడే సజీవ జీవన చిత్రం మాత్రం అదే నన్ను capture చేస్తుందన్నా..” అన్నాడు.అది అక్షరాలా నిజం.అప్పుడప్పుడు రమేష్ తో కొన్ని రోజులు గడిపిన నేను..ఒక్క నిద్రపోయేటప్పుడు తప్పితే నిరంతరం కెమెరా అతని శరీరంలో ఒక భాగంవలె వెంట ఉండడం గ్రహించాను .ఎందుకలా అంటే..’ ప్రత్యేకంగా వెదుకకుండానే అనుక్షణం మన నిత్య గమనంలో ఎక్కడ ఒక అద్భుతమైన సామాన్య మానవుని సజీవ జీవన పోరాట సౌందర్యం కంటబడ్తుందో చెప్పలేం ..ఆ క్షణమే ఆ అద్భుత దృశ్యాన్ని  ఒడిసిపట్టుకుని..నిక్షిప్తం చేయాలి.. ‘ అని జవాబు.అతని  గాఢాసక్తి అది .శివునికి మూడో కన్నులాగ రమేష్ కు కెమరా ఒక మూడో భుజం.

ప్రదర్శనలో ఉన్న ఈ బొమ్మ గురించి తన స్వంత అన్వయింపు గురించి అడిగినప్పుడు..రమేషన్నాడు…

 ‘ అందులో  ఉన్న ఒక స్త్రీ..ఒక పురుషుడు ఈ మన భారతదేశ వర్తమాన సంక్షుభిత సమాజంలోని అట్టడుగు వర్గ విస్మృత వ్యక్తుల జీవన పొరాటాన్ని ప్రతిబింబిస్తున్న సజీవ చిత్రం.వాళ్ళు గారడీ వాళ్ళు కావచ్చు.సంచారజాతులకు సంబంధించిన గ్రామీణ కళాకారులు కావచ్చు..ద్రిమ్మరులు కావచ్చు.ఎవరైనా ఒక స్థిరత్వమూ..ఒక ప్రత్యేక అస్తిత్వమూ లేక నిత్య జీవిక కోసం..ఆకలి కడుపులతో అలమటిస్తున్నవాళ్ళు.జూబ్లీ హిల్స్ ,హైదరాబాద్ లో నడిరోడ్డు మధ్య ఎవరి పరుగులు వారివిగా పరుగెత్తుతున్న తీరికలేని నగరవాసుల మధ్య ప్రదర్శిస్తున్న జఠిలమైన ఒక ఫీట్ అది.ఎంతో అర్థవంతమైన..మనుషులను లోతుగా ఆలోచింపజేసే ఒక విన్యాసమది.పురుషుని కాళ్ళకింద కనబడని భూమి..పురుషుని తలపై ఒక భూదేవిలా భారాన్నంతా మోపి ప్రతిష్ఠితమైన స్త్రీ పాదాలు. ఒట్టి మట్టి పాదాలు..మాసిన బట్టలతో దీన పేద ప్రజల ప్రతినిధులుగా చూపులనిండా కొట్టొచ్చినట్టు దైన్యం.శూన్యం వాళ్ళ కళ్ళలో . తాత్విక దృష్టితో చూస్తే..ఒకరి భారాన్ని మరొకరు మోస్తూ స్త్రీ పురుష సంయోగ సంగమాల్లో,విలీనతలో ఏకత్వభిన్నతలో అభిన్నమై నిలిచిన బింబం..ప్రతీక అది. నిరాడంబరమైన అతిసహజ  స్త్రీపురుష  సమన్వయ  సహాకారాలతో కొనసాగే శ్రామిక క్రతువు అది. సంయోగ యోగం. ‘ అని. నిజమే కదా.

ఒక కళాకారునిలో దాగిఉన్న ప్రతిభను గుర్తించి..రీ డిస్కవర్ చేసేందుకు ఎవరో ఒక దార్శనికుడైన మహానుభావుడు అతనికి తారసపడ్డం యాదృచ్ఛికమే ఐనా అది అదృష్టమే. ఒక కమలాహాసన్ ను,ఒక రజనీకాంత్ నూ గుర్తించగలిగిన కె.బాలచందర్..ఒక ఎ.ఆర్.రెహమాన్ ను,ఒక సంతోష్ శివన్ నూ గుర్తించేందుకు ఒక మణిరత్నం..కావాలి.ఐతే మన రమేష్ ను ఎవరూ గుర్తించలేదుగాని..తనే తనలో క్షిప్తమై ఉన్న కళను గుర్తించగలిగిన  వ్యక్తిని వెదుక్కుంటూ వెళ్ళి తన గురువును అన్వేషించుకుని శిష్యరికం చేశాడు ఓ ఏదాదిపాటు దీక్షతో..చేస్తున్న ఉద్యోగాన్నికూడా వదలి.

రమేష్ గురువు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘురాయ్ .ఒక ఏడాదికాలం హైదరాబాద్,తిరుపతి,ఢిల్లీ,కోల్ కటా..ఇలా అనేక ప్రాంతాలను ఒక శిష్యునిగా,సహచరునిగా,విద్యార్థిగా,మిత్రునిగా వెంట తిరిగి  తనలో దాగిఉన్న’ అగ్ని’ ని తాను గుర్తించి కెమెరాను ఒక ఆయుధంగా స్వీకరించినవాడు రమేష్ బాబు.గురువు చెప్పిన  ప్రధాన విద్య..’ నువ్వు అతి సహజంగా ఫోటోను తీసి దాన్ని ప్రజాపరం చేయ్.అదే నీ వస్తువు,నీ శ్రమ,నీ సృజన.నువ్విక నిష్క్రమించు .ఇక నీ కృతే ప్రజలతో సంధానమై నువ్వేమిటో నీకు చెబుతుంది ‘ అని.అందుకే అందరు ఫోటోగ్రాఫర్లు వాడే ‘ఫోటో షాప్ ‘ ను రమేష్ వాడడు.తన కెమెరాలో అతి సహజంగా జన్మించిన చిత్రాన్ని ఉన్నదున్నట్టుగా మనకందిస్తాడు.మెరుగులూ,అలంకారాలూ,మేకప్పులూ ఉండవు.సహజమైన సృష్టి ఎప్పుడూ జీవాన్ని నింపుకుని అందంగానే ఉంటుంది.అందుకే..’ ఫేస్ బుక్’ మిత్రులకు గత కొన్నేళ్ళుగా 2000 కు పైగా అద్బుతమైన ఫోటోలను ‘ మై సిటీ అండ్ మై పీపుల్’ పేర అందిస్తున్నాడు

.’ వన్ ఇండియా.కాం’ దినపత్రికలో..రోజుకొక్కటి చొప్పున ఇప్పటికి కొన్నేళ్ళుగా వేయికి పైగా ఫోటోలను ‘మై సిటీ..మై పీపుల్ ‘ పేర ప్రచురిస్తున్నాడు. బహుళ పాఠకాదరణ గల ప్రసిద్ధ అంతర్జాల వారపత్రిక ” సారంగ” లో గత వంద వారాలనుండి ‘దృశ్యాదృశ్యం’ శీర్షికన ఒక పులకింపజేసే ఫొటోతో పాటు అర్థవంతమైన వ్యాఖ్యనుకూడా జతచేసి అందిస్తున్నాడు.ఈ మూడు నిత్యకృత్యాల్లోనూ వేలాదిమంది వీక్షకులు విభ్రమంతో పెట్టే వారి వారి కామెంట్స్ ను నేనెరుగుదును.నేనుకూడా అనేకసార్లు మైమరచి సూపర్ లేటివ్స్ లో వ్యాఖ్యలను పోస్ట్ చేసిన సందర్భాలు కోకొల్లలు.అందుకే మొన్న నేనన్నా రమేష్ తో..’నీ ఈ ప్రదర్శనలో వాడిన ” A pictureis worth A thousand words  ” అన్న వ్యాఖ్య సరియైంది కాదేమో రమేష్..వేయి పదాలుకాదు..అసలు అనేక సాహిత్య ప్రక్రియలూ,రూపాలూ ఏవీ కూడా వ్యక్తీకరించలేని అత్యంత సంక్లిష్ట  మహానుభూతులను నీ ఒక్క ఫోటో మాత్రమే వ్యక్తీకరించగలదు..వేరే ఏ ఇతర కళారూపాలూ చేయలేవా పనిని’ అని.

కందుకూరు రమేష్ బాబు ఫేస్ బుక్ లో ‘తల్లి కొంగు ‘ శీర్షికన అందించిన అనేక వందల అర్థవంతమైన,ఆర్ద్రమైన ఫోటోలు కూడా ఎందరు ప్రేక్షకుల మన్ననలను పొందాయో చెప్పలేము.అసలు ఇంత సహజమైన నిర్ణయాత్మక క్షణాలను (decisive moments)  ఇతను ఎలా బంధించగలిగాడబ్బా..అని చకితులమైపోతాము.తల్లి కొంగు ఎలా తన బిడ్డకు ఒక రక్షణ కవచమై..పరిష్వంగమై..అక్కున చేర్చుకునే ప్రాణధాతువౌతుందో ప్రతి ఫోటో చెబుతూనే ఉంటుంది.

అసలు నువ్వు నీ ఫోటోలతో..ఇంత బీభత్స  ఆర్ద్ర రస విన్యాసాన్ని ఎందుకోసం చేస్తున్నట్టు రమేష్..అని  నేనడిగినప్పుడు..’ఈ భిన్న అణచివేతల మధ్య నలిగిపోతున్న..నిస్సహాయంగా అణగారిపోతున్న అతి సామాన్య భారత పౌరులనూ, వాళ్ల వెతలనూ చూస్తున్నప్పుడల్లా నేను ఒకసారి ఒక ఏక పాత్రాభినయాన్ని..కొన్నిసార్లు బహు పాత్రాభినయాన్ని..మరికొన్నిసార్లు..జనంలోనుండే అకస్మాత్తుగా ఏ మేకప్పూ లేని పాత్రలతో ఒక వీధి నాటకంగా నన్ను నేను మార్చుకుని మౌన వేదననూ,దుఃఖాన్నీ ప్రకటిస్తూ ప్రదర్శిస్తున్నానన్నా..’ అని వాపోయినప్పుడు..నిజంగానే నేను స్తబ్దుణ్ణైన  సందర్భాలు చాలా ఉన్నాయి.రమేష్ కు తన ఈ ‘ లైఫ్ ఫోటోగ్రఫీ ‘ ఒక ఎమిటివ్ మీడియా(emittive media)..ఒక బలమైన వ్యక్తీకరణ మాధ్యమం. ఒక ప్రత్యేక భాష..ఛాయా చిత్ర  భాష అది.ఉద్వేగపూరితుడైన ఒక కళాకారుడు తన్ను తాను ఖాళీ చేసుకుంటే తప్ప మళ్ళీ తనను తాను తాజా ఆలోచనలతో పునరావేశపర్చుకోలేడు.అదే జరుగుతోంది ఇతని ఈ అనంత ప్రయాణంలో.

ఒక సృజనకారుని ఆలోచనలూ,అన్వయింపులూ నిజగానే చాలా చిత్రంగా ఉంటాయి.ప్రతి భారతీయ స్త్రీకి..ముఖ్యంగా తెలుగు స్త్రీలకు..తన ఇంటి వాకిలే ఒక కాన్వాస్..రంగస్థలం.ప్రతిరోజూ తన నిత్యనూతన సృజనాత్మకతతో తన ఇంటి చారెడు మట్టి వాకిలిని తన ముగ్గులతో (రంగవల్లులతో) శోభింపజేసి  సౌభాగ్య ప్రదాతయైన దేవునికీ,తన ఇంటికి వచ్చే ప్రతి అతిథికీ స్వాగతం పలుకుతుంది స్త్రీ.ప్రతి దినమూ ఒక కొత్త ముగ్గు.కొత్త రూపు.కొత్త అలంకరణ. కొత్త రంగులు.ఇంత ప్రశస్తమైన ‘ముగ్గులను ‘ ఒక అంశంగా తీసుకుని రమేష్ బాబు 5000 చిత్రాలను తీశాడు.అంటాడు..” అన్నా..ఈ ముగ్గుల ఫోటో లైబ్రరీ 2020 తర్వాతి తరంకోసం.ఎందుకంటే..ఇక రాబోయే తరానికి మట్టి వాకిళ్ళుండవు.అన్నీ కాంక్రీట్ జంగళ్ళే.వాళ్ళు ఈ నా ఫోటోలలోనే తమ  గత వైభవాన్ని చూసుకుంటూ మున్ముందు మురిసిపోవాల్సి  ఉంటుంది” అని.నిజమే ఇది.

కెమరా అనే ఆయుధంతో..భిన్న విన్యాసాలను విజయవంతంగా చేస్తున్న రమేష్ బాబు..తన గురువైన రఘురాయ్ జీవిత కథను అత్యంత ప్రేమతో..భక్తితో..’ సత్యం శివం సుందరం’ పేరుతో ఒక బృహత్ గ్రంథాన్ని  వెలువరించాలని 2010 నుండి శ్రమిస్తున్నాడు.బహుశా రఘురాయ్ జన్మదినమైన రాబోయే డిసెంబర్ 18 న ఆవిష్కరిస్తాడేమో.

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించిన తన తండ్రి కె.కిషన్(కె కె)..తమ ఊరు..ఎల్లారెడ్డి పేట లో నడిపిన  జ్యోతి చిత్రాలయ..స్వాతి ఫోటో స్టూడియో..లో ఫోటో కళ ‘అ ఆ’ లను నేర్చుకున్న రమేష్ బాబు..ఇప్పటికి ఆ కళలో పోస్ట్ డాక్టోరల్ డిగ్రీని సాధించాడనే నావంటి ‘ సామాన్యు ‘ లం అనుకుంటున్నాం.ఐనా ఇంకా సాధించవలసింది అనంతమే కదా.

సామాన్యుని గురించే నిరంతరం తపించే రమేష్..తన పాత్రికేయ,ఛాయచిత్ర కృతులన్నింటినీ ‘ సామాన్య శాస్త్రం ‘ పేరనే వెలువరిస్తూ వస్తున్నాడు.తనకు నచ్చిన కొన్ని ఫోటోలతో 2012 లో ‘ జీవనచ్ఛాయ ‘ పేర,2014 లో ‘ చిత్రలిపి..మగువల ముగ్గులు ‘ పేర నిర్వహించిన రెండు ఫోటో ఎగ్జిబిషన్ లలో తనేమిటో ఋజువు చేసుకున్నాడు. ప్రదర్శనశాలల్లో సాధారణంగా ఒక కళాకారుడు తనకు నచ్చిన తన చిత్రాలనే పెడుతాడు.ఆ విధంగా..నేను చూచినంత వరకు రమేష్ బాబు ఫోటోలన్నీ ఎగ్జిబిషన్ లలో ప్రదర్శన కనువైనవే..అర్హమైనవే. వాటినే గనుక  ప్రదర్శిస్తే..ఆ హాల్ కొన్ని కిలోమీటర్ల పొడవు వుండి..ఒక ‘ వరల్డ్ రికార్డ్ ‘ ఎగ్జిబిషన్ ఔతుందేమో.ఐనా కందుకూరు రమేష్ బాబు తప్పకుండా అందరూ గుర్తించవలసిన ” రేపటి  ప్రపంచ స్థాయి  లైఫ్ ఫోటోగ్రాఫ రే ” కదా.

*

 

వివాద కవిత మీద వివాదం

ఎన్. వేణుగోపాల్ 

 

venuఅంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వం అన్నప్పుడు వివాదం కాని కవిత్వం ఉంటుందా అనుమానమే. నిజానికి కవిత్వమంతా యథాస్థితితో పేచీయే. ఒక అనుభూతిని, ఘటనను, పరిణామాన్ని, దృశ్యాన్ని మరొకరు చూసిన పద్ధతికి భిన్నంగా చూడడమే అనే అర్థం లోనూ కవిత్వమంతా వివాదమే అని చెప్పుకోవచ్చు. కాని కవిత్వంలో భాగమైన ఒక ప్రత్యేక ప్రక్రియగా కూడ వివాద కవిత (పాలిమికల్ పొయెమ్) ఉంది. ఒక కవితనో, రచననో చదివి, దాన్ని ఖండిస్తూ, భిన్న దృక్పథాన్ని ప్రకటిస్తూ కవిత్వం రాయడం వివాద కవిత. ‘వివాద కవిత అంటే ఒక నైతిక లేదా రాజకీయ సమస్య పట్ల ఏ నిర్దిష్ట వైఖరి తీసుకోవాలనే దిశగా పాఠకులను కదిలించే సాహిత్య పాఠపు ప్రక్రియ’ అని ఆఫ్రికన్ కవిత్వంలో వివాద కవిత్వం గురించి రాస్తూ హ్యూ వెబ్ అనే సాహిత్య విమర్శకుడు అన్నాడు.

పార్లమెంటరీ రాజకీయాలను తిరస్కరిస్తూ, సాయుధ పోరాట రాజకీయాలతో ప్రయాణం ప్రారంభించిన సత్యనారాయణ సింగ్ అనే నాయకుడు ఏప్రిల్ 1977లో ఎన్నికలలో పాల్గొనవచ్చుననే సిద్ధాంతాన్ని ప్రకటించినప్పుడు పంజాబీ కవి అమర్ జిత్ చందన్ ‘ఏప్రిల్ థీసిస్’ అని ఒక కవిత రాశాడు. బోల్షివిక్ విప్లవానికి దారి తీసిన లెనిన్ చరిత్రాత్మక ఏప్రిల్ థీసిస్ ను ప్రస్తావిస్తూ, సత్య నారాయణ సింగ్ ఏప్రిల్ ప్రకటనను వ్యంగ్యంగా ఎత్తిపొడిచిన కవిత అది. దాన్ని ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువదించడంతో వివాద కవిత్వంతో నా పరిచయం మొదలైంది. అంతకుముందే శ్రీశ్రీ – దాశరథి మధ్య సాగిన వివాద కవిత్వం పరిచయం ఉంది గాని ఆ వివాదం కొంత అనవసరమైన సంచలనాత్మకతకు, దూషణకు, నిందలకు కూడ జారిపోయిందనే అభిప్రాయం ఉన్నందువల్ల అమర్ జిత్ చందన్ కవిత మరింత నచ్చింది. ఆ తర్వాత నా ఓల్డ్ పిజి హాస్టల్ సహవాసి, అప్పటి మంచి కవి లక్నారెడ్డి రాసిన కవితకు ఆ కవితలోని పదబంధాలనే వాడుకుంటూ నేనూ ఒక వివాద కవిత రాశాను. అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీవాద, మైనారిటీ వాద, ప్రాంతీయవాద కవిత్వంలో ఎన్నో వివాద కవితలున్నాయి.

kannabiran1

స్త్రీవాద సిద్ధాంతకర్త, కార్యకర్త, రచయిత వసంత కన్నబిరాన్ ఈ వారం “ఆంధ్రజ్యోతి వివిధ”లో రాసిన కొత్త వివాద కవిత ప్రస్తుతం కొంత దుమారాన్ని రేపే అవకాశం ఉందని అనిపిస్తున్నది. ఆ కవిత వెలువడి ఇంకా పన్నెండు గంటలు నిండకుండానే అనుకూలంగానూ ప్రతికూలంగానూ ఎన్నో అభిప్రాయాలకు దారితీసింది. వసంత కన్నబిరాన్ గతంలో పెద్దగా కవిత్వం రాసినవారు కాదు. ఎప్పుడో వరవరరావు జైలులో ఉన్నప్పుడు ఆయన సహచరి హేమలత తో మాట్లాడి రాసిన నిరీక్షణ అనే కవితలో కూడ వివాద కవిత ఛాయలున్నాయి.

ప్రస్తుత కవిత వివాద కవిత అవునా, అసలు కవిత అవునా, బిలో ది బెల్ట్ (అన్యాయమైన) ప్రతిస్పందనా, తిట్లా అని చర్చ జరుగుతున్నది. ఒక పరిణామం మీద ఒక రచన వెలువడినప్పుడు ఆ రచనను, రచయితను, సందర్భాన్ని భిన్నమైన కోణంలో చూపించడమే వివాద కవిత లక్షణం అనుకుంటే ఇది కచ్చితంగా వివాద కవితే. పదప్రయోగాలు విమర్శకు లక్ష్యంగా ఉన్న కవిత/రచన నుంచి, రచయిత నుంచి ఉండడం, లేదా ఆ రచనను, రచయితను స్ఫురించేలా ఉండడం వంటి వివాద కవిత్వ ముఖ్య లక్షణాలు ఉన్నందువల్ల కూడ అది వివాద కవితే.

*

భరోసా నింపే వెలుగు రవ్వల “సందుక “

బాలసుధాకర్ మౌళి 

(కవి నారాయణ స్వామి వెంకట యోగి ఒక యాభై చేరుకున్న సందర్భంగా)

   మనిషి లోపల వొక చలనం సంభవిస్తుంది – అలానే బయటకు వ్యక్తమవుతాడు. లోపలి కదలికను బట్టి ఆ మనిషి వ్యక్తం కాబడటంలేదంటే.. ఏఏ సంకోచాలో బయటపడలేనంతంగా కట్టిపడేస్తున్నట్టు భావించాలి – నమ్మాలి.

నారాయణస్వామి గారు ‘సందుక’లో వొక డయాస్పోరా గొంతుకను వినిపించారు – ఎంతగా హృదయాన్ని తడిచేసే కవిత్వముందో – అంతగా వొక్కసారి వెనక్కి తిరిగి.. మళ్లీ ముందుకు చూసి ఆలోచించాల్సిన విధంగానూ వుంది.

‘సందుక’ మొత్తంలోకి – నారాయణస్వామి గారి Voice ని – అంతరంగ కాంక్షని సూటిగా పట్టి యిచ్చిన కవిత ‘చిన్నారి మొక్క’ని నా భావన. కారణాలు ఏవైనా కావొచ్చు – పుట్టిన దేశానికి దూరంగా బతుకుతున్న మనుషులు – దేశంపై ఆనాటి ప్రేమ యధాలాపంగానే మిగుల్చుకున్న మనుషులు..  ఏం ఆలోచన చేస్తారో – ఆ అనేకుల ఆలోచనలు అన్నీ ఈ కవితలో ప్రతిబింబిస్తున్నాయి. ఒక విష్మయకరమైన, విభ్రాంతి కల్గించే.. కవి ఊహాశక్తికి తలవంచి నమస్కరించే కవిత – మన వూళ్లను చూసి మనం తలయెత్తుకునే కవిత – ఇది. వొక్క డయాస్పోరా కవే యిలా రాయగలడు.

swamy

నిర్మాణపరంగా ఏ కవితకు ఆ కవిత ప్రత్యేకంగా వున్నా.. నన్ను ఎక్కువుగా ఆకట్టుకున్న కవితలు : లోపలా.. బయటా… ; యాడికి పోయిన్రు ? ; ఎదురుచూపు.

గుండెని మెలిపెట్టి ఏడిపించిన కవితలు : అవ్వా ! ; యాడికిపోయిన్రు ? ; నాయనొస్తాడు !

” ఒక అన్వేషణ రూపం – కవిత్వంగా మొలకెత్తడం.
ఆ అన్వేషణ ఏమిటి ? తను వర్తమానంలో బతుకుతున్న నేల మీంచి – పుట్టి పెరిగిన నేల గురించి, అనురాగానుబంధంలో ముంచిన మనుషుల గురించి, ఆ జ్ఞాపకాలను… కొత్తగా అన్వేషించుకోవటం – అందులో ఉన్మీఖం కావటం.. సృజనశీలి అయిన కవి కవిత్వమైపోవటం.  ” నారాయణ స్వామి గారి కవిత్వం – ఇదేనంటాను.

కవితల్లో ఆయా సందర్భాల్లో – సందర్భాల్లాంటి జ్ఞాపకాల్లో మానసిక స్థితి బాగా అభివ్యక్తం అయ్యింది. అభివ్యక్తమయి అలరించింది.

నిరంతరం కవిత్వం చదవగా చదవగా – వొక కవిత ఎలా వుండాలనిపిస్తుందంటే… ‘ లోపలా.. బయటా ‘ లా. గొప్ప అనుభూతిని
మిగులుస్తుంది ఆ కవిత – కాన్వాస్ పెద్దది – లోతైన జీవితానుభవం పునాధుల మీద నుంచి వ్యాపించిన విషయముంది.
కవిత్వం ఆలోచనను కల్గించాలి – వొక ఆసక్తిని మెంటైన్ చెయ్యాలనుకుంటాను. వొక పదం లేదా వొక ప్రతీక లేదా రూపకం… కవి ఎందుకు వాడాడు – అనేది తెలుసుకున్నప్పుడు.. మన అవగాహనలోకి వచ్చినప్పుడు – చాలా ఆనందమేస్తుంది. కవిత్వం ద్వారా కొంత తెలియని విషయం కూడా తెలుసుకోవాలనుకుంటాను. ఇందులో కొన్ని కవితలు అలా వుపయోగపడ్డాయి.

నారాయణస్వామి గారి కవిత్వంలో – వొక దిగులు, వొక చైతన్యం, వొక జ్ఞాపకం, వొక గగుర్బాటు, వొక అమాయకత్వం – పసితనం, వొక నమ్మకం, వొక మంచి ఊహ, కృత్రిమత్వం – సజీవమైన ఆశ…. ఇవన్నీ – జీవితంలో, సమాజంలో వున్నవే.. కవిత్వంలోకి యదార్ధంగా తర్జుమా అయ్యాయి. కొన్ని వాక్యనిర్మాణాలు మరీ మృదువుగా వుండి.. వొక అందంలో మునిగితేలాయి.

వొక దిగులును ఎలా పలకాలో స్వామి గారికి తెలిసినట్టు మరెవరెవరికీ తెలియదేమో ! అనిపిస్తుంది. జీవితంపై వొక నమ్మకాన్ని
కల్గించడంలోనూ స్వామి గారి కవిత్వం వెలుగు రవ్వే.

నారాయణస్వామి గారి కవిత్వం మళ్లీ మళ్లీ చదవాలని మనసులాగుతున్న కవిత్వం – చదవకపోతే.. చదివి అనుభూతించకపోతే వుండలేనితనాన్ని సృష్టించే కవిత్వం.

తొలిసారి నేను అంతా ఇలాంటి కవిత్వమే చదవటం – వొక కవి కవిత్వ వాతావరణం వొక్కోసారి కొంతమేరకైనా ఆ కవికే ప్రత్యేకమైంది అవుతుంది. వొక కవిత్వం ఏర్పరుచుకున్న వాతావరణంలోకి ఎవరినైనా లాక్కుపోవడమే నిజమైన కవిత్వం గుణమైతే ఈ కవిత్వం అలాంటిదే !

బాల సుధాకర్

అతనొక వేకువ పసిమి వెలుతురు…

 

కుప్పిలి  పద్మ
(ఆగస్టు పదిహేడు త్రిపురనేని శ్రీనివాస్ కన్ను మూసిన రోజు)
 

త్రిపురనేని శ్రీనివాస్ ని తలచుకోవడమంటే వేకువ కంటే  ముందు  వికసించే సూర్యోదయాన్ని,    వసంతమేఘ ఘర్జనని, శరత్కాలపు వెన్నెలని,  యువకవుల కవిత్వపు సెలిబ్రేషన్ని తలచుకోవటం.
* * *
వొకకానొక వసంత కాలపు సాయంకాలం.  వొక సాహితీ  మీటింగ్ ప్రాంగణంలో వుపన్యాసం వింటూ ఆకాశంలో నిండు చందమామని చూస్తున్నాను.
వో నవ్వు మాటలు కలగలసిన పిలుపు. వెనక్కి చూసాను. కిసుక్కున నవ్వుతోన్న చందమామ.  తిరిగి ఆకాశం వైపు చూసాను. ఆ ఆకాశపు చందమామ అక్కడే వున్నాడు.  మరి యెవరీ చందమామ అని తిరిగి చూసాను.  కృష్ణ గాలులు నులివెచ్చగా  వీస్తున్న ఆ మల్లెల కాలంలో ‘ప్రవహించు గోదావరి’ని   చూసాను.
 * * *
‘గోదావ‌రీ ప్ర‌వ‌హించు ‘  అంటూ  తిపురనేని శ్రీ‌నివాస్‌, సౌదా  కలసి సాహిత్యప్రవాహం లోకి కలసి ప్రవహించటం  మొదలుపెట్టారు.అప్పుడు  ఆ కవిత్వనవ్య ధార తళతళతో  చదవురుల మనసులని మిలమిలలాడించింది.

ఆ తరువాత
‘కవిత్వం కావాలి  కవిత్వం

అక్షరం నిండా  జలజలలాడిపోయే
కవిత్వం కావాలి
ప్రజల మీదే రాయి
ప్రజలల్లోని  అగాధ గాధల  మీదే రాయి
కవిత్వం రాయి
కాగితం మీంచి కన్నులోకి వెన్నులోకి గన్నులోకి
దూసుకు పోయే కవిత్వం రాయి
అలా వొక వాక్యం చదవగానే
శత్రువు ఠారెత్తి  పోవాలి
అమాయకుడు ఆయుధమై హోరెత్తి పోవాలి
కవిత్వం వేరు వచనం వేరు
సాదాసీదా డీలా వాక్యం రాసి
కవిత్వమని బుకాయించకు
కవిత్వాన్ని వంచించకు
వచనమై తేలిపోతావ్…  అంటూ పదునైన కవిత్వంతో  1989లో త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ ‘ర‌హ‌స్యోద్య‌మం’ ప్రచురించారు. తెలుగు విప్ల‌వ క‌విత్వం సరికొత్తగా  రెపరెపలాడింది. ఆ సరి కొత్త గాలితో  కవిత్వపు హృదయాలు వుప్పొంగాయి.
యిప్పుడు మళ్ళీ  ఆ ‘ర‌హ‌స్యోద్య‌మం’ వేగుంట మోహ‌న‌ప్ర‌సాద్ గారి ఆంగ్లానువాదంతో రెండు  భాష‌ల్లో, కె.శ్రీనివాస్ గారి ముందు మాటతో  రాబోతోన్నయీ పుస్తకాన్ని శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వ‌రావు  గారు ప్ర‌చురించారు. విశ్వేశ్వర రావు గారి  కవిత్వం మీద వున్న గౌరవానికి,  శ్రీను  మీద వున్న  ప్రేమకి, యీ పుస్తకం వొక  నిదర్శనం.  ఆ  పుస్తకం రావటం అన్నది శ్రీను స్నేహితులకి, ఆప్తులకి యెంత  సంతోషాన్ని  కలిగిస్తుందో  కవిత్వాభిమానులకి అంతే ఆనందాన్ని యిస్తుంది.
యిప్పటికీ నవయవ్వనంతో తేజోవంతంగా  ప్రకాశిస్తోన్న  త్రి. శ్రీ. కి కవిత్వం రాయటమే కాదు యెక్కడ కవిత్వంలో కొత్తదనం కనిపించినా , అస్తిత్వాల   ఆనవాలు మెరిసినా  యెంతో  యిష్టంగా ప్రారంభించిన  క‌విత్వ ప్ర‌చుర‌ణ‌ల నుంచి 1990 నుంచి 94 వ‌ర‌కు 14 పుస్తకాలు ప్రచురించాడు. వస్తువు, రూపం వ్యైవిధ్య భరితం.  అవి వరుసగా

1. క్రితం త‌ర్వాత‌… ఆరుగురు యువ క‌వుల సంయుక్త క‌విత 2. యెక్క‌డైనా యిక్క‌డే… ప్రీతిష్‌నంది క‌విత్వానువాదం త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ 3.19 క‌విత‌లు… గాలి నాస‌ర‌రెడ్డి  4. ఒఖ‌డే… స్మైల్  5. బ‌తికిన క్ష‌ణాలు… వేగుంట మోహ‌న‌ప్ర‌సాద్ 6. ఇక ఈ క్ష‌ణం… నీలిమా గోపీచంద్ 7. ఫోర్త్ ప‌ర్స‌న్ సింగుల‌ర్‌… గుడిహాళం ర‌ఘునాథం 8. బాధ‌లూ-సంద‌ర్భాలూ… త్రిపుర 9. గురిచూసి పాడే పాట‌…స్త్రీవాద క‌విత‌లు 10. ఎన్నెలో ఎన్నెలో… రావిశాస్త్రి క‌విత్వం 11. పుట్టుమ‌చ్చ‌… ఖాద‌ర్ మొహియుద్దీన్ 12. మ‌రోవైపు… దేశ‌దే శాల క‌విత్వానువాదం త్రిపురనేని శ్రీ‌నివాస్ 13.స్వ‌ప్న‌లిపి… అజంతా 14.అజంతా 14. చిక్క‌న‌వుతున్న పాట‌… ద‌ళిత క‌విత్వం 15. హో… త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ క‌విత్వం. 1997లో క‌విత్వం ప్ర‌చుర‌ణ‌లు 15వ పుస్త‌కంగా శ్రీను  స్నేహితులు ప్ర‌చురించారు.

*  *  *
అస్తిత్వ‌వాద వుద్య‌మాల  వేకువలో  శ్రీను తను యించార్జ్ గా వున్న  వార్తాపత్రికల్లో స్త్రీ, ద‌ళిత‌, మైనారిటీ వాదాల సాహిత్యానికి  మొదట  ప్రాధాన్యత నిచ్చేవాడు. కధ నైనా,
కవిత్వానైనా  మామూలుగా  రాస్తే నిర్మొహమాటంగా  యిది యీ కాలపు రచన కాదని చెప్పేవాడు.
నేను బలంగా నమ్మే, యిష్టమైన  స్త్రీ వాద ఫిలాసఫీతో  రాసిన మసిగుడ్డ  కథని శ్రీను ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో  ప్రచురించాడు.  ఆ కథకి వచ్చిన అద్భుతమైన  రెస్పాన్స్ చూసి నేను   ఆశ్చర్యపోయాను. ఆ కథ  స్త్రీ వాద కధా  ప్రపంచంలో స్పష్టమైన స్త్రీవాద కథకురాలిగా  నిలబెట్టింది.
ఆ తరువాత మరి కొన్ని కథలు వివిధ పత్రికల్లో  అచ్చుఅయ్యాయి. నిర్ణయం కథ చదివి అందులో వైష్ణవి పిల్లల  విషయంలో తీసుకొన్న నిర్ణయం చూసి గట్టిగా నవ్వుతూ  ‘ అరే, యీ విషయంలో కూడా  మా మగవాళ్ళ కి  నిర్ణయించే హక్కుని వుంచవా ‘  అని అడిగాడు. ఆ తరువాతెప్పుడో  ఆ కథలో  నీ నరేషన్ చాల నచ్చింది.  కుటుంబాలకి సంబంధించిన  ఆ ముఖ్యమైన అంశం అంత సునాయాసంగా చర్చించావో అని చెప్పినప్పుడు తిరిగి వొక సీరియస్ చర్చ. భలే  భాద్యతగా చర్చించేవాడు.
నా  రెండవ కథా సంకలనం ‘ ముక్త ‘  శ్రీనివాస్ కి  అంకితం యిచ్చాను.
 * * *
మోడల్స్  జీవితం పై వొక కథ రాసాను.  ఆ కథ చదివి  శ్రీను అటువంటి అనేక లేయర్స్ వున్న వస్తువుని  తీసుకొన్నప్పుడు ఆ విషయాలలో  సంక్లిష్టతని పాత్రల స్వభావాలని  మరింత అవగాహనతో రాయాలని, అందులోని విషయాలని మరింత లోతుగా అర్ధం చేసుకోడానికి వసంతలక్ష్మి గారు, వసంత  కన్నభిరన్ గారి వంటి అనుభవజ్ఞులతో  మాట్లాడితే  విషయాలు మరింత బాగా అర్ధం అవుతాయని వొక  వుత్తరం రాసాడు. ఆ వుత్తరం  వొక కథకురాలిగా  నన్ను నేను మరింత మెరుగుపరచుకోడానికి  తోడ్పడింది.
 * * *
త్రి శ్రీ.  సాహిత్యానికి  సంబంధించి హితబోధలు  చెయ్యకుండా వొక మంచి మాట, వొక సూచన  చేస్తే మాత్రం అవి ఆ  రచయితకి, సాహిత్యానికి  అత్యంత విలువైనవిగా వుండేవి.
కథలో అస్థిత్వాన్ని అంతర్లీనంగా రాసినా,  ప్రస్పుటంగా రాసినా సరే  కథ యెప్పుడు కథకి  సంబంధించిన యీస్థటిక్స్ తో  కథ కథలానే  వుండాలి వ్యాసం లా  వుండకూడదనే వాడు.
 * * *
అస్తిత్వ వాదరచనలని  అర్ధం చేసుకోవటంలో,  ప్రచురించటం పై యెనలేని అవగాహన వుండేది తనకి.  రాబోయే కాలపు  సాహిత్య ప్రవాహానికి  తను  ముందుగానే తెరచిన తలుపుల్లోంచి  అస్థిత్వ వాద సాహిత్యం యెలా వొప్పొంగిందో  మనం  చూస్తూనే వున్నాం.
 * * *
బిమల్ రాయ్  సుజాతని చూస్తే  కళ్ళు చెమ్మగిల్లే   శ్రీనుకి మన నాగేశ్వరరావు గారి దేవదాసే దేవదాస్…  వొక పాజిటివ్ ద్ధిక్కారపు  సంతకం  యెప్పుడు వొకలానే  యెందుకుండదో, వుండలేదో  త్రిపురనేని శ్రీనివాస్ కి  ఖచ్చితంగా అప్పుడే  తెలుసు. ఆ  తరువాత సాహిత్య ప్రపంచానికి మెల్లమెల్లగా  తెలియసాగింది.
* * *
 త్రిపురనేని శ్రీనివాస్ ని తలచుకోవడమంటే వేకువ కంటే  ముందు  వికసించే సూర్యోదయాన్ని, వసంతమేఘ ఘర్జనని, శరత్కాలపు వెన్నెలని,  యువకవుల కవిత్వపు సెలిబ్రేషన్  న్ని తలచుకోవటం మాత్రమే కాదు  వొక సాహిత్య  యవ్వనోత్సాహాన్ని నెమరేసుకోవటమే.
Kuppili Padma Photo

శారద ఇప్పటికీ కావాలి!

కవిని ఆలూరి
 శారద తమిళుడు అయినప్పటికీ తెలుగు సాహిత్యాన్ని ఉన్నతీకరించారు . నటరాజన్ “శారద ” అన్న కలం పేరుతో రచించటానికి కారణం రచనలు ప్రచురించక పోవటం వలన అని చెప్పుకునేవారు . అది సరికాదు . నటరాజన్ ‘గంధర్వుడు’,’ శక్తి’ లాంటి కలం పేర్లతో రచనలు చేసేవారు  . ఐతే ,ఆ పేర్లేవి ప్రసిద్ధి లోకి రాలేదు .సహజంగానే సౌందర్యోపాసి అయిన నటరాజన్ “శారద “అనే మూడక్షరాల స్త్రీ నామాన్ని ఎంతో ఇష్టంగా కలం పేరుగా పెట్టుకున్నారు. 
                                                      ఆనాటి మానవ సంబంధాలు చాలా దగ్గరగా ఉండేవి . ఆలూరి భుజంగరావు ,శారద లాంటి వాళ్ళ జీవితాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్ధమవుతుంది. ముక్కామల మల్లిఖార్జున రావు గారు “శారద”ను కధలు రాయటానికి ప్రోత్సహించటము తో పాటుగా ఆర్ధిక సహకారాన్నీ చేసేవారు. ప్రకాశరావు ,అబ్బరాజు నాగభూషణం,నేతి పరమేశ్వర శర్మ లాంటి మిత్రులు “శారద”ను ఎంతో ప్రోత్సహించారు. గొన్నా బత్తుల వెంకటేశ్వర రావు లాంటి మిత్రులతో కలిసి అన్నదాన సమాజాలను నడిపిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. తెనాలి వాతావరణమన్నా,అక్కడి మిత్రులన్నా శారద కు ప్రాణం .
                                             రోజుకు 12,13 గంటలు హోటల్లో చాకిరీ చేస్తూ సాహిత్య అధ్యయనం,రచనలు సాగించేవారు. శారద తాను చదువుతూ,రాస్తూ మిత్రుల చేత చదివించే వారు,రాయించే వారు.తెలుగు మాత్రుభాష కాక పోవటం వలన తెలుగు నేర్చుకోవటానికి ఎంతో శ్రమ పడ్డారు . తెలుగు సాహిత్యం లోని చలం ,కుటుంబరావులతో సహా ఆనాటి రచయితల ఉత్తమ  గ్రంధాలను  అధ్యయనం చేసేవారు.శారద 100 కధలను , 6 దాకా నవలలూ రాశారు. ఆనాటి హోటల్ వృత్తి అవగుణాలకు నిలయం గా ఉండేది. అత్యంత  కల్మషమైన వాతావరణంలో పని వాళ్ళు బతుకుతూ ఉండేవారు .అంతటి కల్మషంలో బతుకుతూ సాహిత్యాన్ని చదవాలన్న ఊహ, కధలు రాయాలన్న ఊహ తనకు కలగటమే కాకుండా అలాంటి ఊహలను తన మితృలకు కూడా కలిగించేవారు  శారద . తన మంచి అలవాట్లను మాత్రమే  స్నేహితులకు పంచేవారు. మితృలతో కలిసి అభ్యుదయ భావాలతో “ప్రజావాణి “అన్న రాత పత్రిక నొక దాన్ని నడిపారు.
sarada1
                                               ఆనాటి వాళ్ళ గొప్ప స్నేహానికి ఉదాహరణగా రెండు విషయాలను ఇక్కడ చెప్పుకుందాం! ఇంట్లో పస్తుల బాధ పడలేక తన మిత్రుడైన మల్లిఖార్జున రావు గారు కొత్తగా  కొనుక్కున్న ఇంగ్లీష్ పుస్తకాలను పాత పుస్తకాల వాళ్లకు అమ్మేశారు శారద .ఆ తర్వాత మల్లిఖార్జున రావు గారికి కనపడకుండా తిరుగుతూ ఉన్నారట శారద.ఒక రోజు మల్లిఖార్జున రావు గారు ఎదురుపడి “నువ్వు చేసిన పని నాకు తెలుసు. ఈ మాత్రానికే ఇంత బాధపడుతున్నావు?అవి అమ్మినందుకు నేనేమీ అనుకోను.నాలుగు రోజుల పాటు నీ కుటుంబం గడిచింది అంతే చాలు!మనం ఇప్పుడే వెళ్ళి వాటిని మళ్ళి కొని తెచ్చుకుందాము .”అని శారద తో అన్నారట .
అలాగే ఒకసారి స్థానం నరసింహారావు గారి అధ్యక్షత వహించిన సభలో తాను రాసిన ఒక వ్యాసాన్ని చదవమని భుజంగరావు గారికి ఇచ్చారట శారద . భుజంగరావు గారు కూడా చదువుతానని శారదకు ధైర్యాన్ని ఇచ్చారట. వ్యాసాన్ని చదవలేక మైకు పట్టుకుని వణుకుతున్న భుజంగరావు గారిని చూసి ప్రేక్షకులు నవ్వుతున్నారట . వాళ్ళను ఉద్దేశించి “నన్ను చూసి నవ్వనవసరం లేదు . ఇక్కడకు వచ్చి చదవటానికి నిలబడితే మీరూ ఇలాగే వణుకుతారు . “అతి కష్టం మీద అనేసి వేదిక నుండి దిగిపోయారుట. రత్నా టాకీసు దగ్గర టీ కొట్టు ముందు నుంచున్న శారద “నువ్వలా వణికి పోతూ ఉంటే చూడలేక ఇక్కడకు వచ్చి నిలబడ్డానురా “. అని అన్నారుట.
sarada
                                           పత్రికలలో ధారాళంగా శారద సాహిత్యం ప్రచురితమవుతున్న రోజులవి.  హోటలుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు శారద కధ గురించి “రచయిత చాలా అద్భుతంగా రాశారని”చెప్పుకుంటుంటే విన్న శారద “ఆ కధ నేనే రాశానని “వాళ్ళతో అన్నారుట . వాళ్ళు శారదను ఎగాదిగా చూసి వెళ్ళి పోయారుట . ఈ విషయం మితృలకు చెప్తూ పక పకా నవ్వేవారట శారద . శారద అజాత శత్రువు . ఆయన జీవితంలో ఎవరినీ ద్వేషిస్తూ మాట్లాడిన సందర్భాలు లేవు.
                                       శారద కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు . ఆయన వితంతువును వివాహమాడాలనుకున్నారట. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి కూడా తీసుకు వెళ్ళారట.ఈ విషయాన్ని వాళ్ళు అంతగా పరిగణన లోకి తీసుకోక పోయినా శారద మాత్రం తాను చెప్పినట్లుగానే మలయాళీ వితంతువును వివాహమాడారుట.అంతే కాకుండా  అభ్యుదయ రచయితల సంఘం 5వ మహాసభలు విజయవాడలో జరిగినప్పుడు రచయితల పారితోషకానికి సంబంధించిన ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశ పెట్టారుట .కానీ  శారద దృష్టిలో డబ్బు తక్షణ అవసరాలకే పరిమితం .
                                     శారద తాను బాధలు పడుతూ , తన తోటి వారి బాధలను, గాధలను పరిశీలించేవారు . పత్రికలలో వచ్చే వార్తలను కూడా కధా వస్తువులుగా స్వీకరించేవారు . మట్టి మనుషుల మురికి జీవితాలను తెలుగులో అక్షర బద్దం చేసారు . శారద తుఫాను వేగంతో సాహిత్యంలోకి వచ్చి అంతే వేగంతో జీవితం నుండి నిష్క్రమించారు . ఆ కొద్ది కాలం లోనే అనంతం గా రాయాలన్న తృష్ణ ఆయనను క్రూరంగా వెంటాడింది .
                                ఒక ప్రవాహంలాగా శారద రచనలు ప్రచురిత మవుతున్న సమయంలో శారద కళాయి పెట్టుకుని బజ్జీలు ,గారెలు అమ్ముతుండే వారట . అంతేకాకుండా వేసవి కాలంలో బస్ స్టాండ్ లో ప్రయాణికులకు మజ్జిగ అమ్ముతుండేవారట .ఈ విషయాలను మాతో పంచుకుంటూ నాన్నగారు (ఆలూరి భుజంగరావు గారు) మాతో  “ఇంతటి ఉన్నత సాహిత్యాన్ని ఇచ్చిన వాడికి ఆంధ్ర దేశం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు నాయనా !”అని అనేవారు .
                              నాన్నగారు మరణించటానికి కొన్ని రోజుల  ముందు తన డైరీ లో-   “సాహిత్య బాటసారి -శారద” లో- ఇలా రాసుకున్నారు “శారద భౌతిక జీవిత బంధనాలను తెగదెంపులు చేసుకుని కేవలం అక్షర జీవిగా మాత్రమే మనకు మిగిలి పోయిన రోజు ఆగస్టు పదిహేడు.!
                                                                                                                                                             *
కవిని ఆలూరి

కవిని ఆలూరి

నాస్తికోద్యమ మేరుపర్వతం లవణం…

రాలిపోయింది.
నాస్తికోద్యమ మేరుపర్వతం నేలకొదిగి పోయింది.
ప్రజాస్వామిక విప్లవకారుడి ప్రస్థానం ఆగిపోయింది .
స్వాతంత్ర సమరయోధుడే కాదు సాంఘిక సమర సైనికుని  జీవితం ముగిసింది. కానరాని సుదూరతీరాలకు పయనమై వెళ్లిపోయింది.
నిత్యం నూతన సాధనాల అన్వేషణ చేసే ఆ శ్వాస నిలిచిపోయింది.
నవయువకుడిలా ఆలోచించే ఆయన జీవితం ముగిసిపోయింది.
మేమంతా నాన్నగారు అని గర్వంగా చెప్పుకునే, అభిమానంతో పిలుచుకునే  గోపరాజు లవణం ఇకలేరు.  మరణం అనివార్యం అని తెలుసు. అయినా ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది.  కానీ తప్పదుగా…భారత్‌ కే కాదు  ప్రపంచ దేశాలకు మహత్మాగాంధీజీ మార్గాలు, నియమాలు సూక్తులు సర్వదా అనుసరణీయమని నమ్మిన గాంధేయవాది,  మానవతావాది లవణం గారితో నాకున్న పరిచయం, అనుబంధం తక్కువేమీ కాదు. ఆయన్ని మేమంతా (సంస్కార్ కార్యకర్తలు )అంకుల్ అనీ,  నాన్నగారూ అని పిలుచుకుంటాం.

లవణం గారితో నా పరిచయం ఈనాటిది కాదు. ముప్పై ఏళ్ళ క్రితం 1985లో మొట్టమొదటి సారి ఆయన్ని కలిశాను. అయితే , అంతకు ముందే మా నాన్న నోట ఆయన గురించి విని ఉండడం వల్లేమో మొదట చూసినప్పుడు ఒకింత ఎగ్జైట్ అయ్యాను.   తిరుపతిలోని  శ్రీ వెంకటేశ్వరవిశ్వద్యాలయం వారు అంతర్జాతీయ జాతీయ సేవాపథక కార్యక్రమం  శ్రీకాళహస్తి లో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నేనూ శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం నుండి కార్యకర్తగా పాల్గొన్నాను. అది పది రోజుల కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ , అంతర్జాతీయ వాలంటీర్ లనుద్దేశించి ప్రసంగించడానికి ఓ రోజు  స్పీకర్ గా వచ్చారు లవణం దంపతులు.

అంతకు కొద్దిగా  ముందే యూరోప్ లో పర్యటించి వచ్చిన లవణం యువతని ఉత్తేజితం చేసే  ప్రసంగం చేశారు. అదే రోజు సాయంత్రం నుండి పొద్దుపోయే వరకూ మా మిత్ర బృందం లవణం గారితో నాస్తికత్వంపై వాదప్రతివాదనలు. తన వదనా పటిమ, వాక్చాతుర్యంతో ఎదుటివారిని తన వాదనని ఒప్పుకునేలా చేసే అద్భుతమైన తీరు, ఏ విషయమైనా అనర్ఘళంగా మాట్లాడగల శక్తిని, వ్యక్తిని చూడడం అదే మొదటిసారి. నాస్తికత్వం గురించి చేసిన వాదనలు ఎంతోకాలం వెంటాడుతూనే ఉండేవి. ఆ తర్వాత పదేళ్ళ కాలం గడచిపోయింది. విచిత్రం ఏంటంటే నేను వివాహానంతరం నిజామాబాద్ జిల్లా వర్నికి వెళ్ళాను.  అప్పటికే అక్కడ నాస్తిక మిత్రమండలి కార్యక్రమాలు , జోగినీ దురాచార నిర్మూలన కార్యక్రమాలు చేపట్టారు లవణం దంపతులు. అదిగో అప్పుడు మళ్లీ కలిశాను. అప్పటి నుండీ కలుస్తూనే ఉన్నాను . కారణం వారి సంస్థ సంస్కార్ కార్యకలాపాల్లో నేనూ భాగస్వామిని కావడమే. లవణం గారెప్పుడూ తమ దగ్గర పనిచేసే కార్యకర్తగా  చూడలేదు. ఓ కూతురుగానే చూసేవారు.  నేను సంస్కార్ లో చేరడానికి కొద్దిగా ముందు నా కన్న తండ్రి వల్లూరిపల్లి రంగారావు గారు పోవడం వల్లేమో లవణం గారితో మాట్లాడుతుంటే మా నాన్న గుర్తోచ్చేవారు.  బహుశా ఆ లోటు భర్తీ లవణంగారితో చేసుకున్నానేమో !

lavanam2005 అక్టోబర్ వరకూ ఆయన సంస్కార్ చైర్మన్ గానూ, నాస్తికోద్యమ నాయకుడిగానూ,  నాన్నగారిగానూ  మాత్రమే చూశాను. ఆతర్వాత CIDA/KRIS ఆహ్వానం మేరకు ఆయన నేతృత్వంలో  స్వీడెన్ , ఫిన్లాండ్ దేశాల పర్యటనకు బృందంలో నేనూ ఉండడంతో  ఆయన్ని లోతుగా చూసే, పరిశీలించే అవకాశాన్నిచ్చింది.  సమాజాన్ని ఆయన చూసే దృక్కోణం ఏమిటో కొద్దిగా నైనా అర్ధం చేసుకునే అరుదైన సమయం దొరికింది.

లవణం గారు  ఓ మానవతావాదిగా, నాస్తికుడిగా , దేశ గౌరవం ఏమాత్రం తగ్గకుండా చేసే ఉపన్యాసాలు , అక్కడి మిత్రులతో జరిపిన సంభాషణలు ,గాంధీ అంటే రాట్నం – మార్క్స్ అంటే తుపాకినేనా ? కాదంటూ చేసిన ప్రసంగాలు అక్కడి పత్రికలలో చోటుచేసుకోవడం, Political violence in India – A Gandhian Approach to Peace అనే అంశంపై స్వీడెన్ లోని ఐక్యరాజ్యసమితికార్యాలయంలో చేసిన ప్రసంగం, ఫిన్లాండ్ లోని  హెల్సింకి, కార్హులా, తుర్కు పట్టణాలలోను  చేసిన ప్రసంగాలు, నక్సలైట్లతో చర్చలకు సిద్దం అంటూ ఆయన వేసిన కరపత్రాలపై అక్కడిమిత్రులతో చేసిన చర్చలు ఆయనలో నాకు తెలియని ఎన్నో కోణాలని చూపాయి.  నా ఆలోచన విస్తృతం కావడానికి,  విశాలమవడానికి మార్గం దోహదం చేశాయి.

విప్లవం ,ప్రజాస్వామ్యం  రెండూ ప్రజల కోసమే అయినప్పుడు రెండూ కలసి ప్రజల కోసం పనిచేసే అవకాశాలు రావాలని కోరుకున్నారు లవణం.  ప్రతి పౌరుడు ఒక ప్రజాస్వామిక విప్లవవీరుడు అయితే ప్రజాస్వామిక పద్దతిలో విప్లవాత్మక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు తప్పక ఉంటాయని అయన ఆలోచన.మారుతున్న సమాజంలోని సమస్యలకు అనుగుణంగా నూతన సాంఘిక విప్లవ సాధనాలు వెతకాలన్న ఆలోచనలోంచే, కొత్తబాటలు వేయాలన్న కలల్లోంచే పదేళ్ళక్రితం  నక్సలైట్లకు బహిరంగలేఖ రాసి ఉండవచ్చు. సర్వోదయ నాయకుడిగా , గాంధేయవాదిగా ప్రపంచానికి తెలిసిన లవణం తుపాకీ తమ అవయవాల్లో అంతర్భాగంగా ప్రకటించుకున్న నక్సలైట్లతో కలసి నూతన విప్లవ మార్గాలు వెదుకుదాం అంటూ పిలుపు నివ్వడం, వారితో కలసి చర్చించడానికి వారెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ప్రకటించడం చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుందెవారికైనా .  రెండు విభిన్న మార్గాల్లోని వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా కుదురుతుందని సందేహం కలుగుతుంది. కానీ లవణం గారు మాత్రం గాంధీ – మావోల మధ్య సమన్వయము కోరుకున్నారు. అందుకు తనవంతుగా కృషి చేస్తానని ప్రకటించారు.
IMG_1450
గుంటూరు జిల్లాలోని స్టువార్టుపురం నేరస్తుల సంస్కరణ, నిజామాబాద్ , మెదక్ జిల్లాల జోగినీ వ్యవస్థ నిర్మూలన , పునరావాస కార్యక్రమాలతో లవణం దంపతులు స్వాతంత్ర్యానంతర సంఘ సంస్కర్తలు గానే కాక సాంఘిక విప్లవకారులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. రహస్యం కంటే బహిరంగంలో ఎక్కువ శక్తి ఉందేమొనని వివిధ కార్యక్రమాలు చేసిన అనుభవంతో అంటారు లవణం గారు.  తను చైర్మన్ గా ఉన్న సంస్కార్ లో తీవ్ర  సంక్షోభం తలెత్తినప్పుడు ఎదుటివారితో ఆయన వ్యవహరించిన తీరు మరచిపోలేనిది. ఆ సమయంలో ఆయనలో ఉక్కుమనిషిని చూశాను.
స్వీడన్ పర్యటనలోను, మనదేశంలోనూ  ఫండింగ్ ఏజెన్సీస్ తో ఆయన నిక్కచ్చిగా వ్యవహరించిన తీరు నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది. తమ సంస్థలకి  విదేశీ నిధులు సంపాదించడం కోసం దేశాన్ని అత్యంత పేదరికంలో మగ్గుతున్న దేశంగా , ఇక్కడి పేదరికాన్ని భూతద్దంలో చూపించి నిధుల వేట సాగించే సంస్థలు ఎన్నో ఉన్న సమయంలో తన గౌరవాన్ని , సంస్థ గౌరవాన్ని , దేశ గౌరవాన్ని తాకట్టుపెట్టని అయన గొప్పదనం, వారితో వ్యవహరించిన ఖచ్చితమైన తీరు నన్ను అబ్బురపరిచాయి. ఆనందపరిచాయి.లవణం గారిపై తండ్రి గోపరాజు రామచంద్ర రావు గారి ప్రభావం ఎంత ఉందో అంతే ప్రభావం గాంధీ , మార్టిన్ లూథర్ కింగ్ లదీ ఉన్నట్లుగా అనిపించేది. 1966-67లలోనూ ఆ తర్వాత అమెరికా వెళ్లినప్పుడు మూడుసార్లు మార్టిన్ లూథర్ కింగ్ ను కలసి మాట్లాడానని చెప్పేవారు.   అహింసకు సత్యాన్వేషణ ముఖ్యమైనప్పుడు సత్యాన్వేషణ ఆస్తికుల సొంత హక్కు కానప్పుడు, నాస్తికులు కూడా సత్యాన్వేషణ చేస్తున్నారని అంగీకరించినప్పుడు తమ ఆస్తికత్వాన్ని చూసుకునే పద్ధతిలో పెద్ద మార్పు వస్తుంది. అది గాంధీజీలో వచ్చింది. గాంధీని ఆయుధంగా స్వీకరించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌లో కూడా అటువంటి ఆలోచనే వచ్చింది. అందుకే ఆయన ప్రపంచ శాంతికొరకు నా వంటి నాస్తికులతో కలసి పనిచేయాలని అనుకున్నారు. దురదృష్టం కొద్దీ కింగ్‌ హత్య వల్ల నాకు ఆ అవకాశం లేకుండా పోయింది అనడం చాలా  సార్లు విన్నాను.గత శతాబ్దాన్ని నాలుగు భాగాలుగా విభజించి మొదటి అర్ధభాగాన్ని age of active morality అనీ, ఆ తర్వాతి ఇరవై ఎళ్ళని Age of passive morality అనీ, ఆ తర్వాతి పది పదిహేనేళ్ళ కాలాన్ని Age of passive immorality అనీ , ప్రస్తుతం మనం జీవించేది Age of  active immorality అని చాలా సార్లు చాలా సందర్భాలలో చెప్పేవారు.  సాంఘిక విప్లవంలో ఎంత చిన్న త్యాగమైనా వృధా పోదు . ఎంత పెద్ద త్యాగమైనా సరిపోదు . అసమర్ధతతో పెద్ద త్యాగాలు చేయలేక, అహంకారంతో చిన్న త్యాగాలు చేయక సమాజంలో అన్యాయాలు , అక్రమాలు, దోపిడీని మనమే కొనసాగిస్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు లవణం.

IMG_1499

కుల మత రహిత వ్యవస్థ ప్రగాధంగా కోరుకునే వారు నాన్నగారు. కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నారు. మానవతావాదం వైపు నడిచిన అయన వర్ణాంతర వివాహాలు చేసుకున్న వేలాదిమంది ముందుకువచ్చి తాము కులరహిత మతాతీత సమాజానికి పునాదులమని నిర్భయంగా చెప్పుకోవలసిన అవసరముందని అనేవారు. అందుకు మనం ఒక సామాజిక శక్తిగా రూపొందాలి. వివాహం ఒకప్రక్క వ్యక్తిగత విషయమైతే, మరొకప్రక్క సమాజానికి పునాది అయిన కుటుంబ వ్యవస్థకి శుభారంభం. అందుకే  మా వివాహం వ్యక్తిగతం అనడానికి వీల్లేదు. వివాహంతో కుటుంబాన్ని ప్రారంభిస్తున్నాం. కుటుంబం సమాజ వ్యవస్థకి మూలం. సమాజ వ్యవస్థ విలువల నుంచి పతనమవుతున్నప్పుడు కుటుంబం కూడా దిగజారిపోతుంది అని చాలా సందర్భాల్లో చెప్పేవారు.  మనం కులాల వేర్పాటు మనస్తత్వం నుంచి బయటపడాలి. ప్రస్తుతం ప్రతి కులంలోని ధనికులని ఆ కులంలోని పేదలే రక్షిస్తున్నారు అంటే ప్రతి కులంలోని దోపిడీ దారులను ఆకులంలోని దోపిడీకి గురవుతున్నవాళ్ళే రక్షిస్తున్నారు. అదే ఈ దేశపు ముఖచిత్రం అంటూ పరిస్థితిని విశ్లేషించేవారు.

గత మే లో అనుకుంటా ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ – రాజకీయాలు కార్పొరెట్‌ చేతికి వెళ్లిపోవడంతో  వాటిలో మానవ విలువలు తగ్గిపోతున్నాయి .  రాజకీయాలలో తగ్గిపోయిన మానవ విలువలను మత విలువలతో నింపాలన్న ప్రయత్నం జరుగుతోంది. ఇలాగే సాగితే  సెక్యులర్‌ వ్యవస్థ రానురాను మతవ్యవస్థగా మారిపోతుందని ఆవేదన చెందిన లవణం గారి మాటలకి అర్ధం చేసుకుంటూ పరిస్థితుల్ని అన్వయించుకుంటూ ఉన్నా .  చాలా కాలమయింది నాన్నగారితో మాట్లాడి అనుకుంటూనే ఫోన్ చేయడంలో జాప్యం. నాన్నగారికి ఫోన్ చేయడమంటే కాస్త సమయం చూసుకుని చేయాలి. ఆయన చెప్పేవన్నీ వినాలి అప్పుడప్పుడూ ప్రశ్నలు వేయాలి . ఆయన చేసే సామాజిక విశ్లేషణల వెంట పరుగులు పెట్టాలి.

అందలోనే పిడుగులాంటి వార్త . లవణం గారి ఆరోగ్యం బాగుండలేదని. పరిస్థితి క్లిష్టంగా ఉందని. ఆ వార్త తెలియగానే గత నెల 29 న వెళ్లి చూసి వచ్చా. ICU లో ఉన్న ఆయన్ని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. దాన్ని అలానే అణచివేస్తూ చూస్తూ నుంచున్నా.   నా చేయి పట్టుకుని నేను బాగానే ఉన్నానురా .. మన వాళ్ళందరికీ చెప్పు. అక్కడ అందరూ బాగున్నారా .. పిల్లలు ఎట్లా ఉన్నారు కుశల ప్రశ్నలు వేసి ప్రమాదం దాటేశానులే ఇక పర్వాలేదు అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు.  మాట్లాడుతోంటే కొద్దిగా ఆయాసం వస్తోంది. మీరు ఎక్కువగా మాట్లాడకండి అంటే వింటేనా మాట్లాడుతూనే ఉన్నారు.  నిత్యచైతన్య శీలి అలా మాట్లాడుతూనే ఉంటారని ఓ 15 నిముషాల తర్వాత బయటికి వచ్చేశా.  లవణంగారి చిన్న చెల్లెలు నౌ గోరా గారితో కలసి నాస్తికకేంద్రంకి వెళ్ళాను. వాళ్ళు చెప్పారు పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం, డాక్టర్ల అబ్సర్వేషన్ లోనే ఉండాలని.   లవణంగారు హాస్పిటల్ నుండి తిరిగివస్తారని  ఆశతో వెనుదిరిగా.

ఎవరికీ లేని విధంగా ఉప్పు సత్యాగ్రహసమయంలో పుట్టినందుకు ‘లవణం ‘ చాలా భిన్నంగా ఆలోచించడం చిన్నపుడే అబ్బింది. పదిపన్నెండేళ్ళ వయస్సులోనే 7వతరగతిలో ఉండగా బ్రిటిష్ విద్యావిధానంలో చదవనని బడి మానేశారు. కానీ నడుస్తున్న ఎన్సైక్లోపీడియాలాగా ఆయనకి తెలియని అంశంలేదు. ఏ విషయమైనా ధారాళంగా మాట్లాడేవారు.  పన్నెండేళ్ళ వయస్సులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1944 – 46 లో మహాత్మాగాంధీ వెంట సేవాగ్రాం ఆశ్రమంలో ఉన్నారు. వినోభాభావే , జయప్రకాశ్ నారాయణ్ లతో కలసి భూదానోద్యమంలో పాల్గొన్న లవణం సహచరి విశ్వనరుడు గుర్రం జాషువా కుమార్తె హేమలత.  ఇద్దరూ కలసి అనేక సాంఘిక సమస్యల, రుగ్మతల పరిష్కారం కోసం నూతన మార్గాల్లో పయనించారు.

ఎనిమిదేళ్ళ క్రితం వెళ్ళిపోయిన హేమలత దగ్గరకి వెళ్ళిపోయారు లవణం.  లవణం దంపతులు చేసిన కృషి వృధా పోదు. వారు నాటిన స్పూర్తి బీజాలు ఎందరిలోనో అంతర్లీనంగా  ఉన్నాయి. అవి మరెన్నో బీజాలకు ప్రాణంపోస్తాయి. లవణం గారి ఆశయాలకు జవం , జీవం ఇస్తాయి. వారి నైతిక వారసత్వాన్ని, సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోతాయి. అలా చేయడమే ఆయనకి మనమిచ్చే అసలైన నివాళి.

*

వ్యాపార శిఖరంపై…ఒంటరితనం లోయలో…

 

స్లీమన్ కథ-5

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మిన్నాతో అతని పరిచయం పదహారేళ్ళ క్రితం. ఇన్నేళ్లలో వాళ్ళు కలసి తిరిగింది మాత్రం మూడు, నాలుగేళ్లే, అది కూడా బాల్యంలో!  కానీ ఇంతవరకూ అతని జీవితంలో మనసుకు దగ్గరైంది మిన్నా ఒక్కతే. అతని ఊహల్ని, కలల్ని పంచుకున్నదీ; అతనేం చెప్పినా ఆసక్తిగా, శ్రద్ధగా ఊకొడుతూ విన్నదీ ఆమె ఒక్కతే.

ఆమెకు దూరమైన ఈ పన్నెండేళ్లలోనూ ఎక్కువ కాలం, అతను పేదరికంతో ముఖాముఖి పోరాటంలోనే గడిపాడు. ఆ ప్రయత్నంలో మృత్యుముఖంలోకీ వెళ్ళి వచ్చాడు. అంతటి కష్టజీవితం కూడా అతన్ని మానసికంగా  ఏనాడూ కుంగదీయలేదు. కుంగదీయకపోగా అతనిలో పైకి ఎదగాలన్న పట్టుదలను, కార్యదీక్షను పెంచింది. మిన్నా సాహచర్యంలో తను గడపబోయే భావిజీవితం గురించిన ఊహ బతుకు పోరాటంలో అతను విజేతగా నిలవడానికి స్ఫూర్తి నిచ్చింది. మిన్నా తలపులతో అతను జీవనోత్సాహాన్ని పుంజుకోని రోజు ఈ పదహారేళ్లలో ఒక్కటీ లేదు. కడగండ్ల లోయలోంచి ఒక్కసారిగా అతను వైభవశిఖరాన్ని అందుకోగలిగాడంటే; దాని వెనుక మిన్నా అదృశ్యహస్తం తప్పనిసరిగా ఉంది.

తీరా జీవితంతోపాటు మిన్నాను కూడా గెలుచుకోగలిగిన దశలో ఆమె చేజారిపోయింది. తనదనుకున్న మిన్నా ఇంకొకరి సొత్తు అయిపోయింది. ఆమెకు పెళ్లి జరిగిపోయిందన్న చేదునిజం మొదటిసారి అతని మనసుకు పెనుగాయం చేసింది.  పంచుకునే మనిషి లేనప్పుడు ఈ డబ్బు, పలుకుబడి, ప్రతిష్టా దేనికన్న ప్రశ్న అతనికి మొదటిసారి ఎదురైంది. మిన్నాతో శాశ్వతవియోగ రూపంలో మనసులోకి నిశ్శబ్దంగా జారిన ఒక వెలితి ఒంటరితనంగా మారి క్రమంగా పెద్దదవుతూ అతని భావిజీవితం అంతా పరచుకుంటూ వచ్చింది. అతనిలో ఇప్పుడు విచారంతోపాటు అసహనం, చికాకు పెరుగుతున్నాయి.

పైకి మాత్రం ఒక వ్యాపారవేత్తగా అతని జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. సెయింట్ పీటర్స్ బర్గ్ కు వచ్చి  ఏడాది తిరక్కుండానే ప్రథమ శ్రేణి(First Guild) వర్తకుల జాబితాలో అతని పేరు చేరింది. చిరకాలంగా పాతుకుపోయిన పెద్ద వర్తకుల్లానే ఇప్పుడతను బ్యాంకులనుంచి కావలసినంత రుణం పొందచ్చు. నెల నెలా జరిగే గిల్డ్ సమావేశానికి హాజరు కావచ్చు. కోట్లకు పడగెత్తిన వర్తకులతో సమాన ఫాయీలో మాటలు, మంతనాలు జరపచ్చు. విందు వినోదాల్లో పాల్గోవచ్చు.

తను జర్మన్ అయినా స్వచ్ఛమైన రష్యన్ లో అనర్గళంగా ప్రసంగించగలగడం అతని అదనపు ఆకర్షణ. అతన్ని గిల్డ్ క్లబ్ లోకి సాదరంగా ఆహ్వానించిన బడా వర్తకుల్లో పీటర్ అలెగ్జీఫ్ ఒకడు. అతనిది పది కోట్ల రూబుళ్ల విలువైన వ్యాపారం అదిగాక కోటి రూబుళ్లకు పైగా వ్యక్తిగత ఆస్తి ఉంది. పొనోమరెఫ్ ప్రముఖ చక్కెర, కలప వ్యాపారి. అతనికి స్లీమన్ వ్యాపారదక్షత మీద మంచి గురి కుదిరింది. తనతో భాగస్వామ్యం కుదుర్చుకుంటే లక్ష సిల్వర్ రూబుళ్లు పెట్టుబడి పెడతానంటూ ముందుకొచ్చాడు. ఇక ఏమ్ స్టడామ్ లో తనకు పరిచయమైన  పాత మిత్రుడు జివాగో ఉండనే ఉన్నాడు. అతనిది కూడా కోట్ల విలువైన వ్యాపారం. స్లీమన్ రష్యా రావడానికి చాలావరకూ అతనే కారణం. మాస్కోలో అతనికి ఓ బ్రహ్మాండమైన భవంతి ఉంది. ఎప్పుడు మాస్కో వెళ్ళినా స్లీమన్ బస అక్కడే.

జివాగోకు పిల్లలు లేరు. మేనగోడలు ఎకెతెరీనా అతని దగ్గరే ఉంటోంది. వయసు పదహారేళ్లు. అందంలోనూ గుణంలోనూ  అచ్చం “దేవకన్యే”.  స్లీమన్ తో వ్యాపార భాగస్వామ్యాన్నే కాదు, మేనగోడలినిచ్చి అతనితో బంధుత్వం కూడా కలుపుకోవాలని జివాగో అనుకున్నట్టున్నాడు, స్లీమన్ తన ఇంటికి వచ్చినప్పుడల్లా బ్రహ్మరథం పట్టేవాడు. ఒకసారైతే మూడు, నాలుగు నెలలు ఇక్కడే ఉండిపొమ్మని కూడా పట్టుబట్టాడు.

స్లీమన్ అతని ఆలోచనల్ని పసిగట్టాడు. ఎకెతేరీనా అతనికి నచ్చకపోలేదు. ఆమెది కట్టి పడేసే అందమే. కానీ ఎటూ తేల్చుకోలేకపోయాడు. మెక్లంబర్గ్ లో ఉన్న సోదరికి ఉత్తరం రాశాడు. ఒకసారి రష్యా వచ్చి సెయింట్ పీటర్స్ బర్గ్ లో తన దగ్గర కొన్ని వారాలు ఉండమనీ; ఆ తర్వాత నిన్ను మాస్కో తీసుకెడతాననీ, ఎకెతెరీనాను దగ్గరగా చూసి ఆమె ఎలాంటిదో, ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో, ఆమెకు వంట చేయడం వచ్చో రాదో తెలుసుకుని తనకు చెప్పాలనీ కోరాడు. “పెళ్లికూతుళ్ల కేం చాలామంది ఉన్నారు. వందలమందిలో తగిన అమ్మాయిని ఎంచుకోవడమే అసలు సమస్య. ఈ విషయంలో నీ సహాయం కావాలి. నాకు ఆడవాళ్ళలో గుణాలే కానీ లోపాలు కనిపించవు” అన్నాడు.

విదేశాల్లో ఉన్న తన ఏజెన్సీలనుంచి వ్యాపార నివేదిక అడిగినట్టుగా ఎకెతెరీనా మీద నివేదిక ఇమ్మని సోదరిని అడిగాడన్నమాట. పైగా తనింట్లో పెద్ద స్నానాల తొట్టెతో సహా అన్ని సదుపాయాలూ ఉన్నాయనీ, నువ్వు చాలా సుఖంగా గడపచ్చని కూడా రాశాడు.

ఎందుకోగానీ సోదరి నుంచి ఉలుకూ పలుకూ లేదు. స్లీమన్ హతాశుడయ్యాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప మిన్నా లాంటి అమ్మాయి తనకు భార్యగా లభించడం అసాధ్యమనుకున్నాడు. అయినా చూద్దామని బాగా డబ్బూ, ప్రతిష్టా ఉన్న వర్తకుల అమ్మాయిలను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. అలాంటి ప్రతి ప్రయత్నం చివరికింత మనస్తాపాన్నో, అయోమయాన్నో మిగిల్చేది. చిటపటలకు, అసహనానికి తోడు తను చెప్పిందే వేదమనే స్వభావం అతనిది. శాసించి పనులు జరిపించుకోడానికి అతను అప్పటికే అలవాటు పడిపోయాడు. అయితే వ్యాపారరంగంలో కలిసొచ్చిన లక్షణాలు అమ్మాయిల దగ్గర పనికిరాలేదు. వాళ్ళు అతనికో పెద్ద పజిల్ గా మారారు. వాళ్ళే ఏమిటి, ఈ విషయానికి వచ్చేసరికి తనకు తానే ఓ పజిల్ గా మారాడు. అసలు తనకు ఏం కావాలో తనే నిర్ణయించుకోలేకపోయాడు. ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అతని ఊహ. కానీ అందమూ, నిరాడంబరతా, హుందాతనం రాశిపోసిన మిన్నా లాంటి అమ్మాయి అతనికి ఒక్కరూ దొరకలేదు.

మొత్తానికి మిన్నా దూరమవడం అతని వ్యక్తిగత జీవితాన్ని గాడి తప్పించింది…

అతని వృత్తి జీవితం మాత్రం ఎప్పటిలా నల్లేరు మీద నడకలా సాగిపోతోంది. ష్రోడర్ తో తన సంబంధాలను కొనసాగిస్తూనే సొంత వ్యాపార సంస్థను ప్రారంభించాడు. అన్ని రకాల వ్యాపారాలను అందిపుచ్చుకుంటూ వెళ్ళాడు. ఎంతటి నష్టాలకైనా ఎదురొడ్డాడు. అగ్రశ్రేణి వర్తకులైతే తప్ప సరుకు అరువివ్వకపోవడం అతను అనుసరించిన ఒక పద్ధతి. తను రెక్కలు ముక్కలు చేసుకుని మీ సంస్థకు లాభాలు తెచ్చిపెడుతున్నాననీ, తనిప్పుడు ప్రపంచవ్యాప్తి కలిగిన ప్రముఖ వర్తకుల్లో ఒకడిగా గుర్తింపు పొందాననీ, కనుక తనకు ఇంతవరకూ ఇస్తున్న అర్థ శాతం కమీషన్ కంటే ఎక్కువ ఇవ్వవలసిందనీ ష్రోడర్ కు ఉత్తరం రాశాడు. ష్రోడర్ వెంటనే కమీషన్ ను ఒక శాతానికి పెంచాడు. దాంతో తను అపారమైన సంపదను గడించే రోజు ఎంతో దూరంలో లేదని స్లీమన్ అనుకున్నాడు.

1848 చివరిలో స్లై మీద అతను అయిదోసారి మాస్కో వెళ్ళాడు. క్రిష్టమస్ ను, న్యూ ఇయర్ ను జివాగో కుటుంబంతో గడిపాడు. ఈ సందర్శన అతనిలో ఎంతో సంతోషాన్ని నింపింది. కానీ తిరుగు ప్రయాణంలో మంచు తుపాను ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఇన్ఫ్లూయెంజాతో మంచం పట్టాడు. తను చనిపోతాడేమోనని కూడా అనిపించింది. నాలుగు మాసాల తర్వాత కాస్త ఆరోగ్యం చిక్కింది అనిపించగానే ఎప్పటిలానే ఊపిరి సలపనంత పనిలోకి దిగిపోయాడు. దాంతో జూన్ కల్లా మళ్ళీ కుప్పకూలాడు. కొన్నిరోజులు వ్యాపారాలు కట్టిపెట్టమని డాక్టర్లు గట్టిగా చెప్పి అతన్ని ఓ చీకటి గదికి పరిమితం చేశారు. వాళ్ళ మీద మొదట మండిపడ్డాడు కానీ, వారి కట్టడిలో న్యాయముందని త్వరలోనే అర్థం చేసుకున్నాడు.

ఎకతెరీనా లిషిన్

ఈసారి కోలుకునే సమయానికి  డాక్టర్ల పాఠం పూర్తిగా తలకెక్కింది. పని తగ్గించుకుని విందులు వినోదాలకు సమయం కేటాయించడం ప్రారంభించాడు. తను స్వయంగా వర్తకప్రముఖులను, వాళ్ళ అమ్మాయిలను ఆహ్వానించి పార్టీలు ఇచ్చాడు. అత్యుత్తమ మద్యాలతో అలరించాడు. ఈ క్రమంలోనే సోఫియా అనే అమ్మాయితో గాఢమైన ప్రేమలో పడిపోయాడు. ఆమె పెద్ద ఆస్తిపరురాలు కాదు, కానీ పొదుపరి. మూడు యూరోపియన్ భాషల్ని ధారాళంగా మాట్లాడుతుంది. తను కలలు గనే అమ్మాయి దొరికిందని వెంటనే తండ్రికి ఉత్తరం రాసేశాడు. ఆమెతో సంబంధం తెంచేసుకున్నానన్న ఉత్తరమూ ఆ వెంటనే తండ్రి చేతికి అందింది. ఇద్దరూ కలసి ఓ పార్టీకి వెళ్లినప్పుడు ఆమె ఒక యువ అధికారిపై విపరీతమైన ఆసక్తిని చూపించడం అందుకు కారణం.

ఆమెను అంతటితో వదిలించుకున్నందుకు అతను సంతోషించాడు. ఈ అనుభవం ఎకెతెరీనా గురించి అతన్ని సరికొత్తగా ఆలోచింపజేసింది. ఈమె కన్నా ఆమె వెయ్యిరెట్లు నయమనిపించింది. పైగా జివాగో కుటుంబం తనను మాస్కో రమ్మని ఎప్పుడూ పిలుస్తూనే ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారీ నెత్తిన పెట్టుకుంటుంది. ఒక మాదిరి నిర్ణయంతో అతను 1850 ఫిబ్రవరిలో మరోసారి స్లై మీద మాస్కో వెళ్ళాడు. ఎప్పటిలా జివాగోల ఇంట్లో దిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, నెలరోజులు గడిచాయోలేదో, అతను శరవేగంతో యూరప్ అంతా చుట్టబెట్టడం ప్రారంభించాడు. పీకల్లోతున వ్యాపార వ్యవహారాల్లో కూరుకుపోవడం తప్ప మరో ఊసులేదు. ఏ ఒక్క చోటా కొద్ది రోజులు మినహా ఆగింది లేదు. రాసిన ఉత్తరాలు అన్నింట్లో వ్యాపార విషయాలే తప్ప వ్యక్తిగత విషయాలు మచ్చుకైనా లేవు.

ఒక్కమాటలో చెప్పాలంటే పోలీసులు వెంటాడుతున్న నేరస్తుడిలా ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్ కు జారుకుంటూ వచ్చాడు. కాకపోతే ఇంగ్లండ్ లో కాస్త ఎక్కువ రోజులు గడిపాడు. ఎడింబరో, గ్లాస్గో, లివర్ పూల్, బాంగర్, చెస్టర్, లండన్ లను సందర్శించాడు. తను చూసిన ప్రతి దాని గురించీ నోట్సు రాసుకున్నాడు. రోజూ రాత్రి పడుకునేముందు డైరీ రాసుకునేవాడు. ఇంగ్లండ్ పారిశ్రామిక ప్రగతి ఇప్పటికీ అతనికి ఆశ్చర్యం గొలుపుతూనే ఉంది.

కొన్ని వారాల తర్వాత అతను సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగి వచ్చాడు. అతని జేబుల నిండా లెక్కలేనన్ని వ్యాపార ఒప్పందాలు. కానీ అతని వ్యక్తిగత జీవితం నిండా తీరని అశాంతి, అసంతృప్తి, దుర్భరమైన ఒంటరితనం. ఎన్ని ఉన్నా అతనికి ఆడతోడు లేదు. ప్రకృతి సహజమైన అనుభవానికి దూరమవడం నిశ్శబ్దంగా అతన్ని నిస్తేజం చేస్తోంది. దాంతో అతని వ్యక్తిగత జీవితం చుక్కాని లేని నావ అయింది. తను ఎంతగానో ఆకాశానికి ఎత్తిన సెయింట్ పీటర్స్ బర్గ్ లో నివసించడం కూడా ఉండి ఉండి అతనికి కంపరం కలిగిస్తోంది. మెక్లంబర్గ్ కు వెళ్ళిపోయి ఓ పేదింటి రైతు అమ్మాయిని పెళ్లిచేసుకుని వ్యవసాయం చేసుకుంటూ గడిపితే బాగుండు ననుకునే క్షణాలూ ఉంటున్నాయి.

కానీ ఎంతైనా తన అదృష్టానికి పునాది పడింది సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే. కనుక మరికొన్ని మాసాలు ఇక్కడే గడుపుదామనుకున్నాడు. మళ్ళీ పనిలోకి దిగిపోయాడు. పార్టీలకు వెడుతున్నాడు. ఈ మధ్యలో 1850 వేసవిలో కాబోలు, ఎకెతెరీనా లిషిన్ అనే అమ్మాయి అతనికి పరిచయమైంది. తను మరో స్నేహితుడికి దగ్గరి బంధువు. ఎత్తుగా తీర్చిదిద్దిన శిల్పంలా ఉంటుంది. కోలముఖం, నీలి కళ్ళు, ప్రవర్తనలో రాకుమారిని తలపించే హుందాతనం. స్లీమన్ కు ఆమె నచ్చింది. పెళ్లి మాటలు కూడా జరిగాయి. కానీ వెంటనే ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఆమెలోని మితిమీరిన ఆభిజాత్యం, పెద్దగా ఆస్తిపరురాలు కాకపోవడం  అతన్ని వెనక్కి లాగాయి.

వేసవి గడిచి ఆకురాలు కాలం అడుగుపెట్టింది. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. కానీ ఈ జీవితాన్నీ, చాలావరకూ నీలిమందు వ్యాపారంతో గడించిన ఈ సంపదనూ ఏం చేసుకోవాలన్న ప్రశ్న అతని ముందు వేలాడుతూనే ఉంది.

వ్యక్తిగత విషయాల్లో త్వరగా ఒక నిర్ణయానికి రాలేని అశక్తత అతన్ని వెంటాడుతోంది. మెక్లంబర్గ్ వాసుల్లో సహజంగా ఉండే మితిమీరిన జాగ్రత్త అది. దానికితోడు అతను ప్రపంచం తాలూకు కఠోర పార్స్వాన్ని అతి దగ్గరగా చూశాడు. పేదరికం, సంపద; ఆకలి, అన్నం… అన్నీ చవి చూశాడు. ఉజ్వలమైన నగరజీవితమూ, మారు మూల పల్లె జీవితమూ-రెండూ అతనికి తెలుసు.

సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తన ఆఫీసులో డెస్క్ దగ్గర నిలబడి నరాలు తెగిపోయేంత ఒత్తిడిని ఎదుర్కొంటూ యూరప్ అంతటా ఉన్న తన వర్తక ప్రతినిధులకు హడావుడిగా తంతి సందేశాలు పంపడం లాంటి అతని దినచర్యలో మార్పు లేదు. అయితే, ఇంతకన్నా తేలిక మార్గంలో సంపద గడించలేమా అన్న ప్రశ్నా మధ్య మధ్య అతన్ని ఆలోచనలో పడేస్తోంది.

అతని తమ్ముడు లుడ్విగ్ కాలిఫోర్నియా బంగారు గనుల ప్రాంతానికి చేరుకున్నట్టు 1850 ప్రారంభంలో సమాచారం అందింది. లుడ్విగ్ కొంతకాలంపాటు ఏమ్ స్టడామ్ లో అన్నకు వ్యాపారప్రతినిధిగా ఉన్నాడు. తెలివిలో అన్నకు సాటి కాకపోయినా స్వభావం అతనిదే. అదే తలబిరుసు, దుడుకుతనం. వివిధ భాషలు నేర్చుకోవడంలో కూడా అతను ముమ్మూర్తులా అన్నే. ఫ్రెంచి, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో అతను అన్నకు ఉత్తరాలు రాసేవాడు. అన్నకు ఉన్నట్టే ధనదాహం అతనికీ ఉంది.

california gold rush

ఓసారి అతను ఓ షాపు ప్రారంభిద్దామనుకుని తగినంత పెట్టుబడిని అప్పుగా ఇమ్మని అన్నను అడిగాడు. స్లీమన్ 500 టేలర్లు ఇవ్వజూపితే, నీకు మరీ ఇంత పిసినిగొట్టుతనం పనికిరాదంటూ తిరస్కరించాడు. ఇంకో సందర్భంలో, తనను సెయింట్ పీటర్స్ బర్గ్ లోని నీ వ్యాపారంలో చేర్చుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఉత్తరం రాసి రక్తంతో సంతకం పెట్టాడు. దానికి స్లీమన్ ఓ సుదీర్ఘమైన జవాబు రాశాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని జటిలమైన తన వ్యాపార వ్యవహారాల్లోకి ఓ భాగస్వామిని తీసుకురావడం అంత తేలికైన విషయం కాదన్నాడు. కాదూ కూడదూ నువ్వు వస్తానంటే, కొన్నేళ్లు తీసుకునే నీ శిక్షణ సమయంలో నీ పోషణ బాధ్యత నేను తీసుకోనని చెప్పాడు. రష్యన్ భాషను ఓ మోస్తరుగా నేర్చుకోడానికే నాలుగేళ్ళు పడుతుందన్నాడు. ఆపైన నువ్వు మంచి వ్యాపారవేత్తవు అవుతావన్న హామీ ఏమీ లేదనీ, నీలో అందుకు అవసరమైన చురుకుదనం లేదనీ అనేశాడు. చివరగా, “పదమూడేళ్ళపాటు ఒకరి ముందు చేయి చాచకుండా నా కాళ్ళ మీద నేను నిలబడే ప్రయత్నం చేశాను” అంటూ, నువ్వు కూడా నా ఒరవడినే అనుసరించాలని ముగించాడు.

నిస్పృహ, ఆగ్రహం ముసురుకున్న క్షణాలలో లుడ్విగ్ ఓ రోజున రోటర్ డామ్ లో  ఓ కాలువ ఒడ్డునే నడుస్తుండగా తక్షణమే ఓడ ఎక్కి అమెరికా వెళ్లిపోవాలన్న ఆలోచన వచ్చింది. న్యూయార్క్ చేరుకుని ఫ్రెంచ్ టీచర్ గా ఉంటూ ఆ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తగినంత డబ్బు సమకూడగానే కాలిఫోర్నియా బంగారు గనుల ప్రాంతానికి వెళ్ళి అక్కడ వడ్డీవ్యాపారం ప్రారంభించాడు. త్వరలోనే ఒక మోస్తరు సంపదను గడించాడు. అంతవరకూ అన్న నీడలో జీవించి పైకి వచ్చిన అందరూ తమ్ముళ్ళలానే తన ఘనతను గొప్పగా చెప్పుకుంటూ, మధ్య మధ్య ఎత్తిపొడుపులతో స్లీమన్ కు పెద్ద ఉత్తరం రాశాడు. ఆ పైన డబ్బు సంపాదనకు కాలిఫోర్నియాలో ఉన్నన్ని అవకాశాలు భూమ్మీద ఇంకెక్కడా లేవనీ, తన ఆస్తులన్నీ అమ్మేసుకుని వెంటనే సెక్రామెంటోకు రావలసిందనీ సలహా ఇచ్చాడు.

ఆ ఉత్తరం స్లీమన్ ను ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. అందులోని ఎత్తిపొడుపులతోపాటు, నీకన్నా నేనే గొప్ప అన్నట్టు తమ్ముడు విసిరిన సవాలు, కొన్ని మాసాల్లోనే పెద్ద ముల్లె మూటగట్టానని అతను అలవోకగా అనడం స్లీమన్ ను ఆలోచనలో పడేశాయి. తన నేర్పులో, క్రమశిక్షణలో, అంకితభావంలో పదోవంతు లేనివాళ్ళకు కూడా ఇలా ఆకస్మిక ధనయోగం పట్టిన ఉదాహరణలు అతనికి తెలుసు. ఇన్నేళ్లలో తను గడించినదానికన్నా ఎక్కువగా కొన్ని వారాల్లోనే తమ్ముడు గడించినట్టు అతనికి అర్థమైంది. దానికితోడు, కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే పూర్తి బాధ్యత తనే తీసుకుంటాననే కాక; నీకు కూడా త్వరలోనే పెద్ద మొత్తం పంపాలని అనుకుంటున్నానన్న ఆ ఉత్తరంలోని వాక్యాలు   మరింత నొప్పించేలా ఉన్నాయి.

అతను చెప్పిన పెద్ద మొత్తం ఏదీ రాలేదు కానీ, సెక్రామెంటోలోని ఓ పత్రికలో ప్రచురితమైన ఒక వార్త తాలూకు కత్తిరింపు మాత్రం వచ్చింది. “న్యూయార్క్ లో ఉంటున్న లూయీ స్లీమన్ అనే పాతికేళ్ళ జర్మన్ యువకుడు 1850 మే 25వ తేదీన సెక్రామెంట్ నగరంలో టైఫాయిడ్ తో మరణించా”డని ఆ వార్త చెబుతోంది. దానికి జతపరచిన ఓ ఉత్తరం, లుడ్విగ్ ఓ పెద్ద ఎస్టేట్ ను విడిచివెళ్లాడని తెలియజేసింది.

                                                                                                                          (సశేషం)

 

 

 

 

 

పిల్లలు నేర్పించే ఫిలాసఫీ…

 

 

పిల్లలు.. మెరిసే ముఖాల పిల్లలు.. మట్టి నవ్వుల పిల్లలు.. అడుగుగులతో ఏ ప్రదేశాన్నైనా ఉద్యానవనంగా మార్చే పిల్లలు! వాళ్ళ ఆటల్నీ, చేష్టల్నీ ముద్దుగా మురిపెంగా చూస్తామే కానీ వాటిల్లో దాగి ఉండే జీవిత సారాంశాన్ని గుల్జార్ దర్శించినట్టు బహుతక్కువమంది చేయగలరు!

పిల్లల చర్యల్లో జీవితానికి సంబంధించిన రూపకాలూ, తాత్వికతా అనేక రూపాల్లో తారసపడతాయి!

చాన్నాళ్ళ క్రితం చదివిన ఒక తెలుగు కధలో ఒక పిల్లవాడు పటంలో ఉన్న దేవుడి చేతిలోని తామర పూవు చూసి, ‘తన దగ్గర ఉంది కదా చాలనుకుని వర్షాలు కురిపించడం లేదనీ, అందువల్లే చెరువులో నీళ్ళు ఇంకిపోయి, అందులోని తామరపూవులన్నీ ఎండిపోయాయనీ’ అనుకుంటాడు.. ఆయన చేతిలోని పూవుని లాగేసుకుంటే అయినా వర్షాలు కురిపిస్తాడేమో అని, పీట వేసుకుని మరీ ఆ పటాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తాడు!

చదవడానికి అతి మామూలుగా అనిపించే ఈ కవితలూ, కధల్లో లోతైన తాత్వికత నిండి ఉంటుంది. చదవడం అయిపోగానే వాటిలోని భావాలు మనసుని దిగులుతో నింపివేస్తాయి. గంభీరతతో ఆలోచింపజేస్తాయి!

gulzar

 

ఇంధనం

చిన్నప్పుడు అమ్మ పిడకలు చేస్తుండేది
మేమేమో వాటి మీద ముఖాలు గీస్తుండేవాళ్ళం
కళ్ళు వేసి, చెవులు తగిలించి
ముక్కు అలంకరించి
తలపాగా అతను, టోపీ వాడు
నా పిడక
నీ పిడక
మాలో మాకు తెలిసిన పేర్లన్నీ పెట్టుకుని
పిడకలు అతికించేవాళ్ళం.

కిలకిలా నవ్వుకుంటూ రోజూ సూర్యుడు పొద్దున్నే వచ్చి
ఆ ఆవు పిడకల మీద ఆడుకునేవాడు.
రాత్రుళ్లలో పెరటిలో పొయ్యి వెలిగించినప్పుడు
మేమందరం చుట్టూ చేరేవాళ్ళం
ఎవరి పిడక మంటల్లోకి చేరుతుందని చూసుకుంటూ
అది పండితుడు
ఒకటి మున్నా
ఇంకోటి దశరధ్

చాన్నాళ్ళ తర్వాత నేను
స్మశానంలో కూర్చుని ఆలోచిస్తున్నా
ఇవాళ్టి రాత్రి ఆ రగులుతున్న మంటల్లోకి
మరొక స్నేహితుడి పిడక చేరింది!

satya1

మూలం:

Chote the, maa uple thapa karti thi
hum uplon par shaklein goontha karte they
aankha lagakar – kaan banakar
naak sajakar
pagdi wala, topi wala
mera upla-
tera upla-
apne-apne jane pehchane naamo se
uple thapa karte they

hunsta-khelta suraj roz savere aakar
gobar ke upalon pe khela karta karta tha
raat ko aangan mein jab chulha jalta tha
hum sare chulha ghe ke baithey rehte
kisi upale ki baari aayi
kiska upla raakh hua
wo pandit tha-
ek munna tha-
ek dashrath tha-

barson baad- main
shamshan mein baitha soch raha hun
aaj ki raat is waqt ke jalte chulhe mein
ik dost ka upla aur gaya!

—————————–

Painting: Satya Sufi

కనుల అలల కలకలం…

 

 

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh

 

నిజానికి ఒక చేపల మార్కెట్ కు వెళ్లి కనులను చిత్రించాలి.
చేపలను. ఆ చేపలను చూసే కనులను.

మీనాక్షులను.
వారి లోచనాలను.

కానీ, మనుషులు గ్యాలరీకే వెళతారు.
ప్రదర్శనకే వెళతారు.

కదలక మెదలక నిశ్చలంగా ఉండే చిత్రంతోనే మనిషి దోబూచులాడుతాడు.
కనెక్టు అవుతాడు.

అలవాటు.

తాను కదలాలి.
అవతల మాత్రం కదలక మెదలక ఉండాలి.
ఏమిటో ఈ చోద్యం!

కానీ, ఇక్కడకు రండి.
ఇది నా ప్లేస్. గ్యాలరీ.

కనుల కొలను.

చూడండి.
ఆమెతో సహా చూస్తూనే ఉండండి.

ఒక సింగిల్ ఇమేజ్ ను ముందు పెట్టుకుని…
అద్దంలో మీ మొహాన్ని మీరే చూసి మురిసినట్టు ఒక్కొక్కరిలో మీరే ఉన్నట్టు ఊహించండి.
వాళ్లను మీరే అనుకుని చూడండి.
ఆ ముఖారవిందాలను, అందలి భావుకతనూ కనులతో పరికించండి.

కొన్ని వికసిత పుష్పాలు. మరికొన్ని వాడిన పుష్పాలు.
మొగ్గలూ కొన్ని.

ఎంత బాగుంటుందో చూడండి.

నిమిషమైనా సమయం తీసుకుంటే మీ కళ్లు శుభ్రమవుతాయి.
చూడండి.

కళ్లు పలికే భావాలను కనులారా ఆస్వాదించండి.
ఎంత ముద్దుగా ఉంటై!
చూడండి.

మనిషిలోని భావాలను వ్యక్తం చేసే ఆ కళ్లు లలిత కళలు…
కలలు గనే ఆ కళ్లు పరిపరి విధములు!

అవి పలు దిక్కులా… వివిధాలుగా వ్యక్తమవుతూ ఉంటే…
ఆ కళ్లు, వారి మోములూ, వారి రూప లావణ్యమూ ఎంత బాగుంటవి!

ఆత్మలు గోచరించే కళ్లు.
దేహంలో విహరించే కలువలు.

ఎంత గమ్మత్తుగా ఉంటై.

కళ్లు – ఒక చూడ ముచ్చట.

కానీ, ఛాయా చిత్రకారుడిగా ఒక గ్రూప్ ఫొటో చేస్తున్నప్పుడు ఒకసారైనా కళ్లనే చేయాలని ఉంటుంది.
అందులో పలు దిక్కులా చూసే కళ్లను తీయాలనీ ఉంటుంది.
కానీ కుదరదు.

వేర్వేరు దిక్కుల్లోకి చూసే చూపులని ఒక్క చూపుతో కట్టిపడేయాలని ఉంటుంది.
కానీ, కష్టం.

సాధారణంగా గ్రూప్  ఫొటో చేస్తుంటే ఎవరో ఒకరు కళ్లు మూస్తారు.
మరో ఫొటో. ఇంకో ఫొటో – ఇట్లా చేసి, తీసిందాంట్లోంచి ఒకటి ఖాయం చేసుకోవలసి ఉంటుంది.
కానీ, చిత్రం. అదే పెయింటింగ్ అయితే… వాటిల్లో అన్నీ తెరిచిన కళ్లే. చూసే కనులే.
మూసుకున్నట్టు గీయడం కష్టం.
ఇంకా కష్టం.

ఈ చిత్రం ఒక కనుల ఖండిక.
కాళోజీ కవితలా, కళ్లపై ఆయన సుదీర్ఘంగా అల్లిన కవితా జగత్తులా
ఒక్కోసారి కొన్ని వందల కళ్లు పక్షుల్లా రెపరెలపాడి రెక్క ముడుచుకున్నట్టు..
వాటన్నిటినీ చిత్రానువాదం చేయాలంటే పెయింటింగే బెటరు.
ఛాయాచిత్రం మటుకు కష్టం.

అభిమానంగా. అయోమయంగా.
అసహనంగా.

తృప్తిగా. ఆనందంగా.
ఆరా తీస్తున్నట్టుగా..

ఎన్నో విధాలుగా ఆ కళ్లు.
చూడండి.

చిలుకా ఉంది.
ఏమిటో అది పైకి చూస్తూ ఉన్నది.
ఒకటి కాదు, చాలా ఉన్నాయి.

నిజానికి ఆ స్త్రీలందరూ చిలకలా?
ఏమో!

+++

ఇంకో చిత్రంలో ఒక కన్నూ ఉన్నది,.
అదీ చూస్తూ ఉన్నది. కానీ ఆందోళనగా ఉంది. భయంగా ఉంది.
అది స్త్రీ చూపే. కానీ, పురుషుడిలా భయపెడుతున్నది.

ఎవరో ఒక చిత్రకారుడు గీసిన ఆ చిత్రాల్లో ఒక సామాన్యమైన స్త్రీ కూడా ఉంది.
నిండుగ అలంకృతమైన స్త్రీలూ ఉన్నారు.
కానీ, నా దృష్టి మాత్రం వాటిని చూస్తున్న స్త్రీ పై ఉంది.
ఆయా చిత్రాలను తదేకంగా చూస్తూ ఉన్న మనిషి నా చిత్రం.

ఆయా చిత్రాల్లోని అలంకరణా ఒక శోభ.
ఆ దుస్తులు, లావణ్యం, వయ్యారం – అన్నీనూ ఒక సుదీర్ఘమైన లేఖనం.

తక్షణం కాదు.
ఎంతోకాలం వేసిన చిత్రాలే అవన్నీ.

ఇవన్నీ సరే.
నా చిత్రం చూడండి.

ఆమె చూస్తూ ఉన్న చిత్రం చూడండి.
అందులో అనేక చిత్రాలు.

అన్నీ ముడిచిన శిఖలైతే
ఈమె పరవళ్లు. పరువం.

సంప్రదాయం అది
ఇది ఆధునికం.

అది ఒక ఘడియ అయితే
ఇది ఒక క్షణం.

అవును. క్షణంలో పదోవంతు కూడా కాదు.
250 వంతు.

చిత్రలేఖనం ఒక సుదీర్ఘ ప్రస్థానం.
ఛాయా చిత్రణం మటుకు ఒక లిప్తలేఖణం.

అందుకే నిజం ఛాయ.
కల్పన చిత్రం.

కనుము
రెంటినీ.

కానైతే,
కనుము..
ప్రదర్శన లేనప్పుడు కూడానూ.

దృశ్యాదృశ్యం.

~

తనదే ఆ ఆకాశం!

 

చైతన్య పింగళి 

chaitanya

(ఇది చైతన్య పింగళి మొదటి కథ.

చైతన్య గతంలో “చిట్టగాంగ్ విప్లవ వనితలు” అనే పుస్తకంతో పాటు కొన్ని వ్యాసాలు రాశారు. భారతదేశంలో వ్యక్తిగత పోరాటాలు కాకుండా ఒక విప్లవ సంస్థలో వనితలు చేరడం చిట్టగాంగ్ లో స్థాపితమైన ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీతోనే మొదలు. చైతన్య పుస్తకం ఈ చారిత్రాత్మకమైన పోరాటానికి అక్షర నివాళి. దీంతో పాటు ఇతర అనేక వ్యాసాలు రాసినప్పటికీ చైతన్య కథా రచనా ప్రయత్నం ఇదే మొదలు)

వారం రోజులుగా ఆమె రావటం లేదు. ఐదింటికే ఆమె వాకింగ్‌ ట్రాక్  మీద నిదానంగా నడుస్తుండేది.

పూల వాసన చూస్తూ… పూల చెట్ల పక్కన నిలబడి గాలి పీలుస్తూ.. కులాసాగా నడిచేది. సరిగ్గా నా వాకింగ్‌ పూర్తి అయ్యేసరికి ఆ అపార్ట్మెంట్ల  మధ్య సందుల్లో నుండి పారిజాత కాడ రంగులో మెరుస్తున్న సూర్యుడు కనిపించేవాడు. ఆకాశంలో పుడుతున్న సూర్యుడిని చూస్తూ నిలబడిపోయేది. సూర్యుడిని మామిడి పండు అనుకుని ఆత్రంగా చూసే చంటి హనుమంతుడు ఇలాగే ఉండేవాడేమో అనిపించేది ఆమె మొహం చూస్తే. నాలుగు నెలలుగా చూస్తున్నా – ప్రతి రోజూ ఇదే వరస. ఇక ఆమె వాకింగ్‌ చేసేది ఎప్పుడు? ఒళ్ళు తగ్గేది ఎప్పుడు? అని నాకనిపించేది.

ఒకరోజు ఉండబట్టలేక, వేగంగా నడుస్తూనే ఆమెకి చెప్పాను. “ఇలా నడిస్తే సన్నబడరండి” అని. ఆమె చటుక్కున నవ్వింది.

“నేను సన్నబడాలని అనుకోవట్లేదండి” అంది.

“మరి అంత పొద్దున్నే ఎందుకొస్తారండి?” అని ఆశ్యర్యంగా అడిగా. నా మొహం ఎలా కనిపించిందో ఏమో కాని మళ్ళీ నవ్వుతూ “ఊరికే!” అంది.

ఊరికేనా!! సన్నబడాలనుకోకపోతే, ఇంకో గంట దుప్పటి తన్ని పడుకోక, ఊరికే అలా పొద్దున్నే ఎందుకు లేవటం!? అనిపించింది.

ఆ రెండో రోజు నుండే ఆమె కనిపించలేదు. నేను నడిచేటప్పుడు పదే పదే పార్కు మెయిన్‌గేట్‌ వైపు చూసేదాన్నిఆమె వస్తుందేమో అని. ఎందుకు రావట్లేదు? నేను అడిగినందుకు ఏమన్నా ఫీల్‌ అయిందా? ‘ఊరికే రావటం ఎందుకూ, నిద్రపోక’ అని ఆమెకే అనిపించిందా? ఆరోగ్యం బాలేదా? అయినా, నాకెందుకు ఎవరెట్లా నడిస్తే… నోటి దురద కాకపోతే! అని కనీసం వందసార్లు తిట్టుకుని ఉంటా.

నాలుగో రోజు అనుకుంటా.. ఆగలేక, పక్కనే గడ్డిలో యోగా చేసుకుంటున్న ఓ పెద్దావిడని అడిగా – “రోజూ వస్తుంది చూడండి… పొడుగు జుట్టు, చిన్న కళ్ళు, ఒకావిడ… ఆమె మీకు తెలుసా?” అని.

“లక్ష్మా? తెలుసు. ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్ళిందేమో!” అన్నది.

ఆ పెద్దావిడ నేను అడగకుండానే లక్ష్మిని గురించి ఇంకొన్ని విషయాలు చెప్పింది. ఊరుకోరుగా ఏదో ఒకటి చెప్పకపోతే తోచదు మనకి మానవులకి.

ఆమె పేరు లక్ష్మి అన్నమాట అనుకున్నాను. ఇంకో మూడు రోజుల పాటు బ్రిస్క్‌ వాక్‌ చేస్తూ, ఫోన్లో టైం, పార్కు గేటు చూస్తూ, గడిపేశాను. ఇంటికి వచ్చాక ఆవిడ విషయం మర్చిపోయేదాన్ని. ఇంటికి వచ్చాక నాకెన్ని పనులని. ఏడున్నరకల్లా ఆయనకి బాక్సు కట్టాలి. పిల్లలిద్దర్ని నిద్రలేపి వాళ్ళకి పళ్ళు తోమించి, స్నానాలు చేయించాలి. అబ్బా, నరకం అది. మా అమ్మాయి ధాత్రి – జడ వేయించుకునేందుకు కూడా దానికి సహనం ఉండదు. అబ్బాయి పేరు సత్యాంశ్‌. వాడికి ఎనిమిదేళ్ళు. పుట్టినప్పటి నుండి వాడు నిజం చెప్పటం ఇప్పటి దాకా విన్లేదు. వీళ్ళకి ఈ పేర్లు ఎందుకు పెట్టామా? అనుకుంటాం నేను, మా ఆయన. ఈ పిడుగులిద్దరిని తయారు చేసి, టిఫిన్‌ తినిపించి, పావు తక్కువ తొమ్మిదికి స్కూల్లో దింపేసరికి నా తల ప్రాణం తోకకొస్తుంది.

ఆయన, పిల్లలు వెళ్ళిపోయాక పావుగంట సేపు నడుం వాలుస్తాను. అంతే. మళ్ళీ పరుగు. పిల్లలు పడేసినవి సర్ది, బట్టలు అల్మారాలో పెట్టి, పొయ్యి తుడిచి, స్నానం చేసి కాసేపు పేపరు తిరగేస్తా. ఈ లోగా మధ్యాహ్నం అవుతుంది. ఒక్క మధ్యాహ్నం పూటే నేను ప్రశాంతంగా అన్నం తినేది. టివిలో ఛానెళ్ళు మారుస్తూ తింటాను. ఆ తర్వాత ఏముంది. మళ్ళీ పరుగులే. కూరగాయలు తేవటమో, ఇస్త్రీ చేయటమో.. ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. అసలే… పిల్లలు, ఆయన సాయంత్రం ఆవురావురుమంటూ వస్తారు. వాళ్ళు తినటానికి ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు వచ్చాక ఏముంటుంది… పిల్లలకి స్నానాలు, హోంవర్కు చేయించటం, వంట చేసి తినిపించటం, రెండో రోజు టిఫిన్‌ చేయటానికి పిండి గ్రైండర్‌లో వేయటం, అందరం భోజనం చేయటం… అలా.. .అలా… పడుకునే సరికి ఏ రోజూ పదిన్నర తక్కువ కాదు. రోజూ ఇదే పని. మా ఇంట్లో వాషింగ్‌ మిషన్ తిరుగుతున్నట్టు, లేచినదగ్గర నుండి పని అయ్యేదాకా తిరుగుతూనే ఉంటాను. ఆ వాకింగ్‌ కూడా థైరాయిడ్‌ వచ్చింది కాబట్టి. సాయంత్రాలు అస్సలు కుదరదు కాబట్టి, పొద్దున్నే చచ్చినట్టు నిద్రలేచి, పార్కుకి వెళ్తున్నా అంతే. లేకపోతే, నేనెప్పటికి కదలాలి!

అసలందుకే నాకు ఆవిడని చూస్తే ఆశ్చర్యం.

పట్టీలు నల్లబడ్డాయి, తోముకుందామంటేనే నాకు వ్యవధి దొరకటం లేదు. అలాంటిది పదేళ్ళకోసారి ఇంటికొచ్చే అన్నయ్యను చూసుకున్నట్టు ప్రతి రోజూ సూర్యుడిని చూసేంత ఓపిక, తీరిక… ఆవిడకి, అదే ఆ లక్ష్మికి ఎలా దొరుకుతోందబ్బా!? అని అనుకుంటూనే ఉన్నాను. పైగా నోరు ఊరుకోక, సన్నబడాలంటే ఇలా నడవకూడదు అని ఓ సలహా కూడా ఇచ్చాను. లావుగా ఉన్నారు అని అంటున్నాననుకుని ఆవిడ పార్కుకి రావట్లేదా? – అనుమానం నాకు.

Kadha-Saranga-2-300x268

***

సరిగ్గా వారం తర్వాత ఆవిడ మళ్ళీ పొద్దున్నే ఐదింటికి పార్కులో నిదానంగా నడుస్తూ కనిపించింది. “హాయ్‌” అన్నాను. ఎంత గట్టిగా అన్నానో ఏమో… పార్క్‌లో అందరూ నన్నే చూశారు.

ఆమె కూడా “హాయ్‌” అన్నది.

“ఏమయ్యారండి బాబు, నేను వారం రోజు నుండి టెన్షన్‌ పడుతున్నా. నేనన్న మాటకి ఫీల్‌ అయ్యారేమో నని” అంటూ నా బ్రిస్క్‌ వాకింగ్‌కి సిద్ధం అవుతున్నా.

“అయ్యో… మీరేమన్నారని ఫీల్ అవడం? నేను వైజాగ్‌ వెళ్ళానండి” అన్నది.

“బంధువుల దగ్గరకా?” అని అడిగాను. అడిగిన అర సెకనులో నాకు సిగ్గనిపించింది, ఆరాలు తీస్తున్నాననుకుంటుందేమో అని.

“స్నేహితులున్నారు. ఊరికే.. అలా వైజాగ్‌ ఓసారి చుట్టి వచ్చాను” అన్నది.

“ఊరికేనా… సముద్రం దగ్గర సూర్యోదయం చూడటానికేనా!?” అన్నాను నవ్వుతూ.

ఆమె కూడా పెద్దగా నవ్వింది.

నేల మీద నిలబడి, అంతెత్తున పూసే పున్నాగ పూలని చూస్తే ఎలా ఉంటుంది.. గుత్తులు గుత్తులుగా ఆకాశంలోని నక్షత్రాలు రాలుతున్నట్టు ఉండదూ…. అచ్చం అలాగే నవ్వింది. ఆ రోజు నుండి ప్రతి రోజూ మేం పలకరించుకునేవాళ్ళం. కొంత స్నేహితులం అయ్యాం. వాకింగ్‌ అయ్యాక, ఇంటికి వెళ్ళేప్పుడు కలిసే వెళ్ళేవాళ్ళం. మా ఇంటికి రెండు సందుల అవతల వాళ్ళ ఇల్లు.

లక్ష్మి వాకింగ్‌కి వేసుకొచ్చే కుర్తా, పైజమాలు చాలా బావుండేవి. ఒక రోజు అడిగాను, అవెక్కడ కొంటావని. తనే డిజైన్‌ చేసుకుంటాను అని చెప్పింది. తనకో సొంత స్టోర్‌ ఉందట. నాకు కొంచెం బట్టల మీద ఆసక్తి ఎక్కువ. తన ఆహ్వానం మీద ఓసారి ఆమె డిజైనర్‌ స్టోర్‌కి వెళ్ళాను.

చేనేత, ఖాదితో చేసిన టాప్స్‌, సల్వార్స్‌, స్కర్ట్స్, కుర్తా పైజమా, చీరలు ఎంత ట్రెండీగా, ఎంత హుందాగా ఉన్నాయని! చేనేతలో కూడా మోడ్రన్‌ డ్రస్సు కుట్టొచ్చా! అని ఆశ్చర్యపోయాను. నేను అక్కడ ఉన్నప్పుడే ఇద్దరు కస్టమర్లు వచ్చారు. చెరో సల్వారు తీసుకున్నారు. వాళ్ళకి అవి నప్పవు అనిపించింది నాకు. అసలే నాకు నోరు ఆగదు కదా… వాళ్ళకి ఆ మాట చెప్పేశాను.

“మీరు కాస్త చామనచాయగా ఉన్నారు, కాబట్టి మీకు ఇలాంటి టాప్స్‌ బావుంటాయి” అని ఒకావిడకి చెప్పాను. ఇంకో ఆవిడని చూసి, “మీరు నడుం భాగం దగ్గర కొంచెం ఎక్కువగా లావు అనిపిస్తున్నారు. కాబట్టి, బెల్‌ బోటమ్‌ కాని, బోటమ్‌ దగ్గర కాస్త కుచ్చు ఉండేలా ఉండే పైజమాలు కాని తీసుకోండి. చెవుకి కూడా పెద్ద రింగు పెట్టుకోండి… సూపర్‌గా ఉంటారు” అని చెప్పాను. వాళ్ళిద్దరూ ఏమనుకున్నారో ఏమో, ఎంచుకున్నవి పక్కన పెట్టేసి, నా సలహా ప్రకారం కొన్నారు.

నన్ను చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది. “నీకు వస్త్రధారణ మీద మంచి పట్టు ఉంది. నేను కస్టమర్లకి ఇలా మొహమాటం లేకుండా చెప్పలేను… నాతో కలిసి పని చేయరాదూ… ఇద్దరికీ లాభం” అన్నది.

నాకెక్కడ కుదురుతుంది! నేను నవ్వేసి ఊరుకున్నాను. ఆ తర్వాత మేమిద్దరం చాలా దగ్గర మిత్రులమయ్యాం. పార్క్‌లోనే కాకుండా, ఇంటికొచ్చాక ఫోన్లలో కూడా గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్లం.

మా పిల్లలు, వాళ్ళ అల్లరి, మా ఆయన, ఆయన ఉద్యోగం.. నా గోల నేను చెబుతూ ఉండేదాన్ని. ఆవిడ వింటూ ఉండేది. ఆమె సంగతులు ఏమీ చెప్పేది కాదు.

ఒకరోజు ఉండబట్టలేక, పార్కులో యోగా చేసే పెద్దావిడ చెప్పిన విషయాన్ని అడిగేశాను.

“లక్ష్మీ, నీకు పెళ్ళి కాలేదటగా?’ అని.

“కాలేదు. కాదు… చేసుకోలేదు” అన్నది, ‘చేసుకోలేదు’ని ఒత్తి పలుకుతూ.

నాకంటే తను పెద్దదే. నాతో పాటే పెళ్ళి చేసుకోనుంటే ఈ పాటికి పిల్లలు పది, ఎనిమిది తరగతుల్లో ఉండేవారు. ఎందుకు పెళ్ళి చేసుకోలేదా అనే పురుగు తొలుస్తోంది నన్ను. తనతో ఏర్పడిన చనువుతో “ఎందుకు లక్ష్మీ, ఏమన్నా లవ్‌ ఫెయిల్యూరా?’ అని అడిగాను. మళ్ళీ అదే నవ్వు. ఆ నవ్వు చూస్తే మాత్రం ఎవడూ ఈమెని వదులుకోడు, ఇది లవ్‌ ఫెయ్యిల్యూర్‌ వ్యవహారం కాదు అనిపించింది.

మరుక్షణంలోనే నాకో భయంకరమైన అనుమానం పుట్టింది. అసలే ‘నిర్భయ’ ఘటన జరిగినప్పటి నుండి టివిల్లో ఆడవాళ్ళకి సంబంధించిన చర్చ తెగ చూస్తున్నాను. ఫెమినిజం అనే మాట పట్ల సమాజంలో ఉన్న అజ్ఞానమే నాలో కూడా ఉంది. అది అజ్ఞానం అని అప్పటికి తెలియదనుకోండి. ఫెమినిస్టులంటే వాళ్ళెవరో ప్రత్యేకమైన, విచిత్రమైన, తేడా మనుషులని, వాళ్ళకి మగాళ్ళంటే పడదనే మూఢనమ్మకం చాలా మందిలా నాకూ ఉండేది. అందుకే వెంటనే అనుమానంగా అడిగా…

“ఈ నవ్వు చూసిన వాడెవ్వడూ నిన్ను వదులుకోలేడులే గాని నాకు ఓ అనుమానం – నువ్వు ఫెమినిస్టువా? మగాళ్ళంటే పడదా?” అని.

నా ప్రశ్నకి ఆమె రోడ్డు మీద ఆగిపోయి, రెప్ప వేయకుండా చూసింది. ఆమె చూపుకి సిగ్గుపడ్డాను. అడక్కుండా ఉండాల్సింది!

“టెర్రరిస్టువా? అని అడిగినంత భయంగా అడిగావేంటి? ఫెమినిస్టుకి మగాళ్ళంటే పడదని నీకెవరు చెప్పారు? ఫెమినిస్టులైన మగవాళ్ళు కూడా ఉంటారు, నీకు తెలీదా? అసలు ఫెమినిస్టులు పెళ్ళిళ్ళు చేసుకోరని నీకెవరు చెప్పారు? పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఫెమినిస్టులు కాదనుకుంటున్నావా?” అంది నవ్వుతూ. అది మొహమాటం కొద్దీ నవ్వే నవ్వు.

satya1నాలాంటి వాళ్ళని ఎంతమంది ఆ ప్రశ్న వేశారో కాని.. ఆమె మొహం చూస్తే నా మీద నాకే ‘ఛీ’ అనిపించింది. పాపం, నన్ను చెప్పు తీసుకుని కొట్టకుండా సమాధానం చెప్పింది. అది చాలు.

మళ్ళీ ఆమే మాట కలుపుతూ.. “సర్లే కాని, రేపు నా షాప్‌ ఎక్స్‌టెన్షన్‌. తప్పకుండా రా పిల్లల్ని తీసుకుని. ధాత్రికి ఏమన్నా మంచి టాప్స్‌, స్కర్ట్స్‌ తీసుకుందువు” అన్నది. సరే అని వచ్చేశా.

ఎండాకాలం వచ్చింది కదా, నేతకి డిమాండు బాగా పెరిగిందట. పైగా, మగవాళ్ళకి కూడా చేనేత షర్టు, పైజమాలు డిజైన్‌ చేసిందట. వాటి కోసమే షాపు ఎక్స్‌టెన్షన్‌.

మా ఆయన్ని రమ్మని బతిమాలా, కాని ఆయన కదల్లేదు. “మగవాళ్ళకండి ఆ షాపు, ఓసారి చూడండి” అని పోరుతూనే ఉన్నాను. తర్వాతెప్పుడైనా వస్తాలే అన్నాడు. నేను, పిల్లలే వెళ్ళాం.

చాలా సింపుల్‌గా జరిగింది ఓపెనింగ్‌ ఫంక్షన్‌. ఆ ఫంక్షన్‌ జరుగుతున్నంత సేపు నేను రెప్ప వేయకుండా ఆమెనే చూస్తున్నాను. పెళ్ళికాక ముందు నాకు కూడా సొంతంగా ఏదన్నా చేసుకోవాలని ఉండేది. కాని, పెళ్ళి కాగానే పిల్లలు. వాళ్ళు కాస్త పెద్దయ్యాక, ఏదో ఒకటి చేసుకోవచ్చులే అనుకున్నా. ఇప్పుడు ఓపికా, ఆసక్తి… రెండూ లేవు.

ఎవరి సాయం లేకుండా, సొంతగా ఒక డిజైనర్‌ స్టోర్‌ నడుపుతోందంటే… మాటలా? అసలు ఆ పార్టీలో టీ కప్పుతో సహా ఒక్క ప్లాస్టిక్‌ వస్తువు లేదు! డిన్నర్‌ కూడా సింపుల్ గా ఉంది. పైగా, ఆహారం వృథా చేయకండి అని చేత్తో రాసిన పేపరుని బఫె దగ్గర అంటించింది కూడా! ఆమె ఏం చేసినా, ఏదో ప్రత్యేకం ఉంటుంది – మిగిలిన ప్రపంచానికి భిన్నంగా. అందుకే ఆమె సాన్నిధ్యం అంటే నాకు చాలా ఇష్టం.

పార్టీ అయ్యేప్పటికి పది అయింది. దాదాపుగా అందరూ వెళ్ళిపోయారు. అప్పటికే బాబు, పాప సోఫాలో పడుకుని నిద్రపోయారు. నిద్ర పోయిన వాళ్ళని చూస్తూ “కాసేపు ఆగు, ఇద్దరం కలిసే వెళదాం. పడుకున్నారు కదా లేపడం ఎందుకు?” అన్నది.

సర్దుకుంటున్న ఆమెకి సహాయం చేస్తూ “పెళ్ళెందుకు చేసుకోలేదు?” అని అడిగాను.

“ఇదేంటి… ఈ టైంలో…” అంటూ చిన్నగా నవ్వింది. మొదటిసారి ఇదే ప్రశ్న వేసినప్పుడు నన్ను అభావంగా చూసింది కాని ఇప్పుడు ఆమె ముఖం సీరియస్ గానే ఉంది. నాలో ఏదో అంతర్మధనం జరుగుతోందనీ, అందుకే అడుగుతున్నానని ఆమెకి అర్థం అయినట్లుంది.

“ఇంట్రెస్టు లేదు. నమ్మకం లేదు. మగవాళ్ళ మీద కాదు. పెళ్ళి అనే వ్యవస్థ మీద. నీకెలా అర్ధమౌతుందో నాకు తెలియదు. అయినా, అడిగావని చెబుతున్నాను…” అన్నది.

“సినిమాకే ఒక్కరం వెళ్ళలేం. నువ్వు జీవితమంతా ఒక్కదానివే ఎలా బతుకుతావు? నీ గురించి తలచుకుంటే నాకు కంగారుగా ఉంది” అన్నాను.

“ఏం కంగారు అక్కర్లేదు. ఇన్నాళ్ళు బతకలేదా? తర్వాతా అంతే” అన్నది.

“పిల్లలతో అంత ప్రేమగా ఉంటావు. నీకు పిల్లలు కావాలనిపించలేదా?” అని అడిగాను. ఆమెకి ఆ ప్రశ్న గుచ్చినట్టు అనిపించిందేమో! ఆమె మొహంలో తేడా స్పష్టంగా గమనించగలిగాను. నల్లబడ్డ ఆమె ముఖం చూడగానే నా లోపల రహస్యంగా దాగి ఉన్న నా అహం చల్లారింది.

ఇన్ని రోజులూ నాలో లేనిది ‘ఏదో’ ఆమెలో ఉంది, దాని వల్లే ఆమె పట్ల నాకు ఆకర్షణ, వికర్షణ అనిపించేది. అదేంటో స్పష్టంగా నాకే తెలీదు. ఏదో మూల ఒక అసూయ అయితే ఉండేది. ఇప్పుడు సమాధానం చెప్పలేకపోతున్న ఆమె మౌనం వల్ల నా దగ్గర ఉన్నదేదో ఆమెకి లేదు అనిపించింది. ఇక ఆమె దాన్ని ఎన్నటికీ సంపాదించలేదు అనే భావం నాకు రెప్పపాటు మెదిలింది. కాని మళ్ళీ కాసేపటికే నాకు పాపం అనిపించింది కూడా.

నిద్ర పోతున్న నా పిల్లల్ని చూస్తూ అన్నది…. “ వీళ్ళు నా పిల్లలు కాదు అని నాకు అనిపించదు. ఈ పిల్లలనే కాదు నాకు ఏ పిల్లల్ని చూసినా నా పిల్లలే అనిపిస్తుంది. సొంత పిల్లలైతే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి, ఆస్తుల కోసం మనతో తగాదా పడటం చూడాల్సి వస్తుందేమో! ఇలా ఉంటే, ఎప్పటికి ఆ బాధ ఉండదు కదా” అన్నది.

“సమర్థించుకోవడం కోసం చెబుతున్నావా? పిల్లల గురించిన ప్రశ్న అడగ్గానే నీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్‌. నేను చూశాను” అన్నాను.

ఆమెని రొక్కిస్తున్నానని నాకు తెలుస్తోంది. అయినా ఆమెని అంతగా కార్నర్‌ చేయటం వల్ల నాకేం ఉపయోగమో నాకే అర్ధం కాకుండా ప్రశ్నిస్తున్నాను.

ఆమె నాలాంటి అనేకమంది వేసే ఇలాంటి క్రూర ప్రశ్నలకి అలవాటు పడినట్టు ఉంది. ఏమాత్రం అసహ్యపడకుండా నిదానంగానే చెప్పింది… “మా అమ్మ గుర్తొచ్చింది. నేను పెళ్ళి చేసుకోను అని ఆమెకి అర్ధమయ్యాక, ఆమె ప్రతి క్షణం కుమిలి పోయేది. అమ్మని బాధపెట్టకూడదు అనిపించేది కాని పెళ్ళికి ఒప్పుకోలేకపోయాను. నన్ను చూడటానికి ఊరు నుండి వచ్చినప్పుడల్లా… ‘ఒక్క మనుమడినో, మనుమరాలినో ఎత్తుకోలేకపోయాను’ అని బాధ పడేది. నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు కాని, అమ్మని ఆ క్షణాన చూస్తే మాత్రం.. పెళ్ళి, పిల్లలు ఉంటే బావుండేదేమో అనిపిస్తుంది. అంతే. అది గుర్తొచ్చింది. అంతకంటే ఏం లేదు” అన్నది.

ఆమె తల్లి ఎలా ఉంటుందో నాకూ చూడాలనిపించింది. లక్ష్మి తల్లి రూపాన్ని ఊహించుకుంటున్నాను.

మళ్ళీ తనే “ఎవరి వల్ల అయినా పర్లేదు, నాకు పిల్లలే కావాలి అని నేను అనుకోలేను. నాకిష్టమైన వ్యక్తితో కావాలి. సాధ్యమా? ఆ స్వేచ్ఛ నాకుందా? సంఘం బతకనిస్తుందా? చట్టం ఒప్పుకుంటుందా? పిల్లులకి, కుక్కలకి ఉన్న హక్కు, అవకాశం మనుషు్యలమైన మనకి లేదు. ఆడదాన్ని కదా… పిల్లలు కావాలని అప్పుడప్పుడు శరీరం మొండి చేస్తుంది” అంది.

ఆమె చెబుతుంటే నాకెటు చూడాలో అర్ధం కాలేదు. అప్పటికే పదిన్నర అయింది. ఆమె గడియారం చూస్తూ “వెళ్దామా?” అంది.

“సరే” అన్నాను. ధాత్రిని నేను ఎత్తుకున్నాను. సత్యని తను ఎత్తుకుంది. కార్లో వెనక సీట్లో ఇద్దరిని పడుకోబెట్టి, నేను ముందు సీట్లో కూర్చున్నాను. లక్ష్మి మళ్ళీ షాపు దగ్గరకి వెళ్ళి షట్టర్‌ దింపి, తాళం వేస్తుంటే ఆమెనే చూస్తూ కూర్చున్నాను. satya1

‘పెళ్ళి ఎందుకు చేసుకోలేదు?’ అని నేను అడిగినట్టే… ‘పెళ్ళి ఎందుకు చేసుకున్నావు?’ అని ఆమె నన్ను అడిగితే ఏం సమాధానం ఉంది? నిజమే, ఎందుకు చేసుకున్నాను? పిజి చేశాను. తర్వాత ఒక సంవత్సరం ఉద్యోగం. అప్పటికే పెళ్ళి వయసు వచ్చేస్తోందని చుట్టాల గోల. అమ్మానాన్న సంబంధాల మీద సంబంధాలు తెచ్చారు. వాళ్ళలో నాకు నచ్చిన ఒకడిని పెళ్ళి చేసుకున్నా.

అంతేగా… అంతేనా అంటే.. ఇప్పుడు ఆయన నా పంచప్రాణాలు. నా తోడు నీడ అయిన నా భర్త మా కులం కాకపోయి ఉంటే, అతని ఫొటోనే నా దగ్గరకి రాకపోతే – నేను వేరే వాడిని చేసుకునేదాన్ని. అతనితో కూడా పిల్లలు పుట్టేవారు. నేనిచ్చే కట్నం, కులం, ఎత్తు, బరువు అన్నీ కుదిరిన సంబంధం ద్వారా ఏ భర్త వస్తే – ఆ భర్త వల్లే పుట్టేవారు. అప్పుడూ ఇలానే ఉండేదాన్ని. ఇంతేనా నేను!? ఇదా నేను!!?

ఆమె షట్టరు మూసి, నడుచుకుంటూ కారు దగ్గరకి వచ్చిన ఆ మూడు నిమిషాల్లో… నాకు పడిన మూడు ముళ్ళతో నేను సాధించేదేమిటో, ఆమెకి లేనిదేమిటో నాకు అర్ధం కాలేదు.

లక్ష్మి డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని సీటు బెల్ట్ పెట్టుకుంటోంది.

“ఎప్పుడూ ఒంటరితనం అనిపించలేదా? అందరూ సినిమాకి షికార్లకి జంటతో వస్తుంటే… ఏదో మిస్‌ అయ్యాను అనిపించలేదా?” అని అడిగాను. ఈసారి నాలోపల ఏ కోశానా శాడిజం లేదు. అసూయ లేదు. నా దగ్గర లేనిది, ఆమె దగ్గర ఉన్నది ఏదో నాకు అర్ధమైపోయింది. అది ` స్వంత నిర్ణయం’ తీసుకునే ఆత్మవిశ్వాసం.

లక్ష్మి మౌనంగా కారు స్టార్ట్‌ చేసింది. ఈసారి లక్ష్మి కంట్లో నుండి నీరు చెంప మీదకి జారి… కారు హెడ్ లైట్ల వెలుగులో మెరిశాయి. నేను ఆమెనే చూస్తున్నాను. కారుని ముందుకు దూకించి నిదానంగా నడుపుతూ అంది…

“అనిపించింది… చాలా సార్లు అనిపించింది. అనిపించలేదు అని బొంకే పిరికిదాన్ని కాదు. నాతో ప్రతిరోజూ గంటలు గంటలు మాట్లాడే నా స్నేహితులు కూడా ఏ పండగ రోజో, ఆదివారం రోజో కనిపించరు. ఫోన్‌ చేశాననుకో… అమ్మాయి అయితే, పనుందే అంటారు. మగవాళ్ళయితే, అసలు లిఫ్ట్‌ చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళ భార్య పక్కన ఉంటే మాట్లాడరు అనిపిస్తుంది నాకు. వాళ్ళు నా ఇంటికి నిస్సంకోచంగా ఇష్టమైనప్పుడు వస్తారు. నా టేస్ట్‌ని పొగుడుతారు. ఇంటిని అందంగా ఉంచుకునే తీరుకి ‘వహ్వా’ అంటారు. కాని నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మొహమాటంగా, ఇబ్బందిగా నవ్వుతూ ఉంటారు. అందరూ అని కాదు… కొందరు. వాళ్ళ భార్యలు నన్ను పలకరించి, మంచి నీళ్ళు ఇస్తుంటేనే.. నాకు అర్ధమైపోతుంది. వీళ్ళు నన్ను ‘పొటెన్షియల్‌ థ్రెట్‌’గా చూస్తున్నారు అని. కాని దానికి నేనేం చేస్తాను? నెమ్మదిగా అలాంటి వాళ్ళని దూరం పెడతా. ఇంకొందరు వెధవలు ఉంటారు – ఒంటరి మహిళ అనగానే, పడుతుందేమో చూద్దాం అనుకునేవాళ్ళు. వాళ్ళని హద్దుల్లో ఉంచటానికి చాలా మానసిక శ్రమ చేయాల్సి వస్తుంది” అన్నది. వెదురు చెట్ల మధ్య ఇరుక్కున్న గాలి చేసే జీర శబ్దంలా ఆమె మాట గారగా ఉంది.

పిరికితనం వల్ల కారిన కన్నీళ్లు  కావు అవి. బహుశా సమాజంలో పేరుకుపోయిన మూర్ఖత్వాన్ని చూసి అయి ఉంటుంది. నాకూ ఏడుపొచ్చింది. పెళ్ళి అయినా వదలరు, కాకపోయినా వదలరు, పసిపిల్లలయినా వదలరు… ఎందుకిలా ఉంటారు? మగాళ్ళంటే ఇంతేనా? నా భర్త కూడా అటువంటి మగవాళ్ళలో ఒకడా? రేపు నా కొడుకు కూడా ఇలా తయారవుతాడా? నా కూతురు కూడా ఇలాంటి బాధలు పడాలా? ఏవేవో ఆలోచనలు. చటుక్కున  ఆమె అంతకుముందన్న మాట గుర్తొచ్చింది.

“ఫెమినిస్టులయిన మగవాళ్ళు కూడా ఉంటారన్నావు… ఉంటారు కదా!?” అన్నాను. ఏదో రూఢి పరుచుకోవాలని, విని సంతోషపడాలని నా తాపత్రయం.

“ఎందుకుండరు? ఇలా అన్నానని అందరు మగవాళ్ళని, అందరు ఆడవాళ్ళనీ ఒక వర్గం క్రింద జమకట్టకూడదు. కదా!” అని చిన్నగా నవ్వింది. ఆ చీకట్లో కూడా ఆమె పలువరస ఎంత బావుందో. ఆ నవ్వులోని అందానికి ఆత్మవిశ్వాసం అంటినట్టుంది!

ఇంత మాట్లాడినా ఇంకా ఏదో సందేహం నాలో. ఇల్లు దగ్గరకి వచ్చేస్తోంది. “రేపు ముసలిదానివి అయితే, ఎవరు చూసుకుంటారు నిన్ను?” అని అడిగాను.

ఆమె సడెన్‌ బ్రేక్‌ వేసింది. ఈ ప్రశ్నకి ఆమెకి భయం వేసిందేమో అనుకున్నాను. వెనక సీట్లో ఉన్న పిల్లలు ముందుకు పడబోయారు. వాళ్ళని ఇద్దరం చెరో చేత్తో ఆపాం. సద్దుకుని, మళ్ళీ నిద్రలోకి జారిపోయారు.

satya1“దేశంలో ఇన్ని వృద్ధాశ్రమాలు ఎందుకు ఉన్నాయి? మీ అమ్మానాన్న నీ దగ్గర ఎందుకు లేరు? నిన్ను మోసి, కని, పెంచిన నీ తల్లిదండ్రుల్ని నువ్వెందుకు చూసుకోవట్లేదు? పోనీ, సంఘం శాసనం ప్రకారం నీ అత్తమామలయినా నీ దగ్గర ఉండాలిగా. ఎందుకు లేరు? పిల్లలు ముసలి తల్లిదండ్రుల్ని చూసుకోవటం అంటేనే చిరాకు పడుతున్నారు గమనించావా? మన పిల్లలే మనల్ని చూస్తారని నమ్మకం లేదు. నీకుందా?” సూటిగా నన్ను చూస్తూ అడిగింది.

నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. “మా అమ్మానాన్నలు నా దగ్గరకి రారు లక్ష్మీ, ఆడపిల్ల దగ్గర ఉంటే అందరూ ఏమనుకుంటారు? అంటారు. ఇక మా అత్తగారు, మామగార్లతో నాకు తగాదా. పెద్ద పెద్ద కొట్లాటలేం కాదు కాని పిల్లల పెంపకం విషయంలో, ఆయన్ని సహాయం అడిగే విషయంలో మా అత్తగారికి నాకు మాటా మాటా వచ్చేది. వాళ్ళు తనకే సొంతం అయినట్టు మాట్లాడేది. నేను సహించలేకపోయేదాన్ని. ఆయన ఇంటికి రాగానే, ఇద్దరం పోరే వాళ్ళం. మా పంచాయితీలు పడలేక, ఊళ్ళోనే ఉండండి, మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అని చెప్పి, వాళ్ళతో తిట్లు తిని, వాళ్ళని ఊరు పంపించేశాడు” అన్నాను.

ఏదో అపరాధభావం నాలో.

సినిమా రీలు తిరిగినట్టు నాకన్నీ కళ్ళముందు తిరుగుతున్నాయి. వాళ్ళతో ఇంతకు ముందు జరిగిన సంఘటనలు ఎలా జరిగాయన్న ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు లేవన్నట్టు లక్ష్మి వైపు చూశాను.

నా ఇబ్బందిని గ్రహించినట్లుగా రోడ్డువైపు చూస్తూ తనే మాట్లాడటం మొదలుపెట్టింది. “నీకొకటి చెప్పనా… నాకు ఏదన్నా చేయాలనిపిస్తేనే చేస్తాను. అందరూ చెబుతున్నారని, చేస్తున్నారని కాదు. ఈ కారులో పెట్రోల్  పోసి, స్టార్టు చేస్తే.. స్టార్టవుతుంది. కారుకి, నాకు తేడా ఏంటి? ప్రయోగం చెయ్యాలి. ధైర్యం చెయ్యాలి. కష్టాలుంటాయి. కన్నీళ్ళుంటాయి. ఒంటరితనం ఉంటుంది. ఏకాంతం ఉంటుంది. ప్రేమించేవాళ్ళు ఉంటారు. ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఇది నా జీవితం.. మన పార్కులో ఆ పెద్దావిడ చేసే యోగా లాగా.. ప్రతి రోజూ నేను చేయాల్సిన సాధన. అలాగే ఎవరికి వారు వారి జీవితానికి తగినట్లు వారు చేయాల్సిన సాధన – కదా!?” అంది.

రోజూ చేయాల్సిన సాధన అనగానే… నేను రోజూ తుడిచే గ్యాస్  స్టవ్ గుర్తొచ్చింది. మా ఆయన దగ్గర, పిల్లల దగ్గరా అనే మాట గుర్తొచ్చింది – ‘నేను మనిషినా, మిషన్నా? చేసిన పనే చేయటానికి’ అని. ఇది తప్పని కాదు కాని నాకంటూ నేను చేయవలసిన సాధన ఏమిటో నేను తెలుసుకోవాలి కదా అనిపించిన ఆ క్షణం నాకు అపురూపమైనది.

ఇల్లొచ్చేసింది. నేను కార్లో కూర్చునే మా ఆయనకి ఫోన్‌ చేశాను. ఆయన బైటకి వచ్చి, పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని ఇంట్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. కార్లోనే నిశ్శబ్దంగా కూర్చున్న నన్ను దిగదేమిటి అన్నట్లు చూశాడు. ‘వస్తాను, మీరెళ్ళండి’ అన్నాను. ఆయన లోపలకి వెళ్ళాక, గేర్‌ రాడ్‌ మీద ఉన్న లక్ష్మి చేతిని పట్టుకుని –

“లక్ష్మీ! నాకు నీ కొత్త షాపులో ఉద్యోగం ఇస్తావా?” అన్నాను. నా రెండు చేతులూ తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకుని షేక్‌హ్యాండ్‌ ఇస్తూ “ష్యూర్” అన్నది.

నేను థాంక్స్‌ అని చెప్పి… కారు దిగబోయా కాని.. నా మనసులో ఉన్న ఒక మాట చెప్పకపోతే.. సంతృప్తి ఉండదు. సీట్లో వెనక్కి వాలి, చెప్పాను…

“లక్ష్మీ, మా ఆయనకి నిన్ను పరిచయం చేయలేదు. పొటెన్షియల్‌ థ్రెట్‌ అనిపించి కాదు. ఇప్పుడు.. నీతో ఈ ఏకాంతం.. ఈ క్షణాలు ఇలా పదిలంగా దాచుకోవాలనిపించింది” అన్నాను.

ఆమె నా చేతిని గట్టిగా నొక్కి… నా నుదిటి మీద ముద్దు పెట్టింది. ఒక ముద్దు అంత ధైర్యం కలిగిస్తుందని… అప్పుడే తెలిసింది!!!

***

(Image: Satya Sufi)

నేను గాక ఇంకెవరని?

రేఖా జ్యోతి 
నేను గాక నిన్ను తెలిసిందెవరని ?
ఒక్క మాట చెప్పు

నిన్ను చూసిందెవరని ?

నిన్ను నిన్నుగా నేను గాక చూసిందెవరని ?

ఈ నీ కనిపించే ముఖాన్ని
దానిమీద అతికించిన ఓ నవ్వునీ చూసినవారే కానీ,
నీ అంతర్ముఖాన్ని, దాని సౌందర్యాన్ని
నాలా ఆరాధించినది ఎవరని?
నీ మౌనాన్ని వినగల వారు ,
నీ మాటల్ని మూటకట్టి దాచుకొనే వారు
నీ శూన్యాన్ని  వర్ణించగల వారు
నీ ఒక్కచూపుతో పద్యం రాయ గలవారు
నీ నవ్వుల తరగలలో ఊయలలూగే వారు
నీ గమ్యాన్ని నీకంటే ముందు సవరించే వారు
నేను గాక ఇంకెవరని?
నీ చేతిలోని తెల్లని కాగితాన్ని పదే పదే చదువుకొని మురిసి పోయింది
నేను గాక ఇంకెవరని?
నిన్న నీవు స్వాతి చినుకై  ఎక్కడ కురిశావో
ఇవాళ కన్నీటి చుక్కై ఎందుకు కుములుతున్నావో
నేను గాక నిన్ను తెలిసిందెవరని ?
ఒక్క పరుగులో వచ్చి ఎందుకు వాలిపోతావో
ఏదో  మలుపులో కాలాల తరబడి ఎందుకు ఆగిపోతావో
నేను గాక నిన్ను సమర్ధించిందెవరని ?
ఒక్క మాట చెప్పు
నా నుంచి దాగిపోవడానికీ నా జ్ఞాపకాన్నే కప్పుకున్నావని
నాకుగాక ఇక వేరే తెలిసిందెవరికని ??
కారణాలు ఏవైతేనేం ?
ఇదేదీ వద్దనుకొని ఎగిరిపోవడానికి నీవు  రెక్కలు తొడుక్కున్నప్పుడు
నేనొక్కదాన్నీ హర్షిస్తే ఇక నిన్ను ఆపేదెవరని ?
అయినా,
నిన్ను అంతగా తెలియని లోకంలోకి ఏం పోతావులే బంగారూ !!
హాయిగా ఉండిపోరాదూ,  నీదైన ఈ ప్రియాంకంలో !

*

     పునరుద్ధరణ

 

 

జి.వె౦కటకృష్ణ

 

వర్తమానమే ర౦గస్థలమై

చరిత్ర నర్తనకు దృశ్యమవుతు౦ది.

 

కాల కాలాల పాత్రలు

వెలసిన ర౦గులతోనో

పులుముకున్న వన్నెలతోనో

కొత్త హ౦గులే ప్రదర్శిస్తాయి.

 

దృశ్య౦లో ప్రగతి ప౦డుతు౦దో

స౦ప్రదాయమే జీవిస్తు౦దో

అవగతమయ్యే లోపు

ముగిసిన నాటకమై తెర పడుతు౦ది.

* * * *

తెర తీసిన చరిత్ర ఘట్టాల ను౦డీ

ఏవేవో వ్యక్తిత్వాలు విగ్రహాలై

వ్యవస్థాగత వొడ్డున

బొరవిడిచి నిలబడతాయి.

 

ఒక కాల౦లో వెలసిన పాత్రలు

రాములై కృష్ణులై రాజ్యపక్షాన

కాలకాలానికి చొచ్చుకువస్తారు.

 

ఒక చరిత్రలో వెలిగిన పాత్రలు

చార్వాకులై శ౦భూకులై

ప్రజల పక్షాన నిలిచిన వాళ్లు

అ౦కుశాలై చరిత్రను గుచ్చుతు౦టారు.

 

ఒక ఘనతలో నిలిచిన రూపాలు

ఒక విఘటనకు విరిగిపోతారు.

 

ఒక వ్యూహ౦లో మలచిన పాత్రలు

అవతారాలై పునరుజ్జీవిస్తు౦టారు.

* * * *

ఇతిహాసపు తెరమీద

ఏవేవో తోలుబొమ్మలు

ర౦గప్రవేశ౦ చేస్తు౦టాయి.

 

ఒక వల్లభుడు విగ్రహమై

మాయామోళీ చేతుల్లోకి వెళ్తు౦టాడు.

 

ఒక ప్రతీఘాత పుర్రెకు మొలిచిన

ఆలోచనతో ఆర్యుడు నిద్రలేస్తాడు

నమో నమో అ౦టూ సైతాన్ ను

పునరుత్తేజ౦ చేస్తాడు.

 

కొరతల వర్తమాన చరిత్ర

కొలతలతో గతిశీలమో

జడమో తిరోగమనమో

తేల్చుకోవలసిన సమయమిది.

 

వేదికనూ

వేదిక మీది పాత్రలనూ

పాత్రలనాడి౦చే సూత్రధారులనూ

ఒక క౦ట కనిపెట్టవలసిన

తరుణమిది.

 

పునరుద్ధరణను

ప్రజల పక్షాన నిలపాల్సిన

అవసరమిది.

 

* * *

venkata krishna

 

 

 

 

ధ్యానముద్రలోని తపస్వినిలా త్రిపుర!

 

చింతలచెరువు  సువర్చల

         పేరుకి భారతదేశంలో ఉన్నా  ఏడుగురు అక్కచెల్లెళ్లు, వారి కష్టసుఖాలు వారివే! వారి సాధకబాధకాలని వారే పరిష్కరించుకోవాల్సిందే! ఆ ఏడుగురిలో ఒకరైన “త్రిపుర”.. పచ్చాపచ్చని కొండలు, పురాతన రాజభవనాలతో, నొక్కులజుత్తు జడలో తెల్లచేమంతులచెండుని తురుముకున్న అమ్మాయిలా ఉంటుంది . రాచరికపు కళ ఉట్టిపడుతున్నప్పటికీ అదంతా గతకాలపు వైభవమే అని స్పష్టమౌతూనే ఉంది.  1949 అక్టోబర్‌లో  భారత దేశములో విలీనమయ్యేవరకు గిరిజన రాజులు మాణిక్య అనే పట్టముతో త్రిపురను శతాబ్దాలుగా పరిపాలించిన సామ్రాజ్యమిది.

త్రిపురని సందర్శించాలన్న ఆలోచన వచ్చినప్పుడు చిన్ననాట  ఎక్కడో చూసిన తెల్లని బొమ్మ లీలగా గుర్తుకువస్తుంది. పచ్చని కొండ కనుమల్లో పెద్ద తెల్లని భవనం! వెంటాడే తలపే త్రిపుర వెళ్లాలన్న ఆపేక్ష ని పెంచింది.

త్రిపుర రాజధాని అగర్తలాకి కలకత్తా మహానగరమునుండి విమానంలో పొద్దున తొమ్మిది గంటలకల్లా వెళ్లాం మేమూ మా పిల్లలు.  మేము ముందుగానే త్రిపుర ప్రభుత్వ టూరిజం లో మా యాత్రాఏర్పాట్లు చేసికొని ఉండటం వల్ల విమానాశ్రయానికి కారు తీసుకుని డ్రైవర్/గైడ్  బాదల్ దాసు వచ్చాడు.

అగర్తలా లో ముందుగా ఉజ్జయంత ప్యాలెస్ ని చూద్దురుగానీ అంటూ దాసు  నగరం నడిబొడ్డునే ఉన్న ఈ రాయల ప్యాలెస్ కి  కారుని నడిపించాడు.   దారిలో దాసు చెప్పిన మాట విని నా మనసు ఆప్లావితమైంది. అదేంటంటే ఉజ్జయంత ప్యాలెస్ కి ఆ పేరు రవీంద్రనాథ్ టాగోర్ పెట్టారుట. ఆయన తరచూ త్రిపురకు వచ్చేవారుట. రాజకుటుంబం తో   తాతగారైన ద్వారకానాథ్ ఠాగోర్ తరం నుంచీ స్నేహసంబంధాలు ఉండటమే అందుకు కారణం. రవీంద్రుని కుటుంబంతో త్రిపుర రాజ కుటుంబానికి సన్నిహిత స్నేహసంబంధాలు ఉండటం త్రిపుర చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచిపోయిన ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పుకోవాలి.  

ఉజ్జయంత ప్యాలెస్ త్రిపుర రాజధాని అగర్తలా లోని గొప్ప వాస్తుకళ ఉన్న అధునాతన రాజభవనం.  ఇది నియొ క్లాసికల్ నిర్మాణము. అంటే గ్రీకు, రోము నగర భవనాల సారూప్యతను పోలి ఉంది. దీన్ని 1901 లో అప్పటి రాజు  రాధా కిశోర మాణిక్య కట్టించాడు . అప్పుడు దీనికి అయిన ఖర్చు ఒక మిలియన్ రూపాయలు(పది లక్షలు). దీన్ని నిర్మాణాన్ని  కలకత్త మహానగరంలోని Martin & Brun Co అనే ప్రసిద్ధ భవన నిర్మాణపు సంస్థ కి అప్పగించారు. 1972 లో త్రిపుర ప్రభుత్వం, రాజకుటుంబం నుంచి రెండున్నర మిలియన్లకి(25 లక్షలతో) కొన్నది. ఈ లెక్కల ప్రకారం ఇప్పుడు మధ్యతరగతి వాళ్లు ఒక చిన్న ఫ్లాట్ ని సామాన్య పట్టణాలలో కొనుక్కొనేంత విలువ మాత్రమే!

ఇప్పుడు ఉజ్జయంత ప్యాలెస్ ని త్రిపుర ప్రభుత్వం మ్యూజియం గా మార్చివేసింది. ఇప్పటికీ రాజపరివారము, భవనపు కుడివైపునున్న చిన్న భాగంలో ఉంటోంది.

ఇది మూడు గోపురాలుండే రెండంతస్తుల ప్రాసాదం. దీనికి ఎదురుగా  రెండు కొలనులు స్వాగతం  పలుకుతున్నాయి. మేము రాజప్రాకారంలోకి అడుగు పెట్టగానే మనసుకు ఆహ్లాదాన్నిగొలుపుతూ  ప్రాంగణం లో మొఘల్ గార్డెన్స్ ని పోలిన ఉద్యానవనము, నీటి చిమ్మెరలు (fountains)ఉన్నాయి. ఓ కమ్మగాడ్పు మనసులను స్పృశించినట్లైంది. విశాలమైన మెట్లను ఎక్కి ప్యాలెస్ లోపలికి అడుగుపెట్టగానే   నూకమాను,(రోజ్ ఉడ్) శాక మాను (టేకు)  కలపలతో చెయ్యబడి,  నగిషీ చెక్కిన  వాసాలు, దర్వాజాలు, ఆర్నమెంటల్ ఫర్నీచర్ (మేజా బల్లలు, కుర్చీలు) మనోహరం గొల్పుతున్నాయి.  సమావేశ మందిరం, కొలువు మందిరం, (దర్బార్ హాల్) గ్రంధాలయం, చైనీస్ గది, ఆతిథ్య మందిరం తమ మనసుల్ని కూడా విశాలంచేసుకుని అతిథులను ఆహ్వానిస్తున్నట్లుగా కనిపించాయి. అవును మరి ఎన్ని సమావేశాలకు, అతిథి సత్కారాలకు కొలువైనవో కదా! తమ అసలు స్వభావాన్ని ఎల్లప్పుడూ ప్రకటిస్తూ, ప్రకాశిస్తూనే  ఉంటాయి మరి!

suvar1

పై అంతస్తులో ఉన్న పెద్ద హాలు అత్యంత ఆకర్షణీయం. రాజ్యాన్ని పాలించిన పూర్వ రాజులు, ఆ కుటుంబీకుల నిలువెత్తు చిత్ర పటాలు హాలంతా ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. ఈ తైలవర్ణ చిత్రాలన్నింటినీ రాజకుటుంబం ఈ మ్యూజియానికి ఇచ్చివేశారు.

ఈ మ్యూజియం లో 16 కొలువుకూటములు (Galleries)ఉన్నాయి. ప్రతి ఒక్క గదీ త్రిపుర  ముఖవైఖరులని చాటిచెపుతోంది.  ఇవన్నీ ఈశాన్య భారతదేశపు కళ, సంస్కృతి, సంప్రదాయం, చారిత్రక సంఘటనల నమూనాలు, పత్రాలు,   త్రిపుర నైసర్గిక స్వరూపము, అటవీ సంపద, సామాజిక జీవన శైలి, ఇక్కడ నివసించే విభిన్న గిరిజన తెగల గురించి చాటిచెప్తున్నాయి. శిల్పాలు, నాణాలు, కాంస్య విగ్రహాలు, చేనేత వస్త్రాలు, బంకమట్టి(టెర్రకోట) మూర్తులు, తైల చిత్రాలు, చిత్ర పటాలు, గిరిజనుల ఆభరణాలు, సంగీత పరికరాలు, జానపద కళారూపాలు, హస్తకళలు ప్రదర్శన లో ఉంచారు.

ఈ ప్యాలెస్ కి ఎదురుగా ఉన్న కొలను పక్కనే జగన్నాథ స్వామి  బరి (బడి గా ఉచ్చరిస్తారు)ఉంది.  ఈ గుడిని కూడా మాణిక్య రాజులే కట్టించారు. ఇది పైకి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ తోను, ఆలయం లోపలిభాగమంతా హిందూ శిల్ప నైపుణ్యంతోనూ కనిపిస్తుంది.  మొత్తమ్మీద హేమద్ పంత్, అరబిక్ శైలి ల సంగమంగ రూపొందించబడింది. (హేమద్ పంత్ 13 వ శతాబ్దపు కన్నడవాడు, మహారాష్టలోని దేవగిరిని పాలించిన యాదవ వంశపు రాజాస్థానంలో మహామంత్రి. ఆయన మంచి అడ్మినిస్ట్రేటరే కాదు. గొప్ప ఆర్కిటెక్ట్ కూడా! కొన్ని ప్రసిద్ధ ఆలయాల రూపశిల్పి ఆయన)   పూరీలోని నీల మాధవుని విగ్రహం ఈ ఆలయం నుండే ఇవ్వబడిందట.  జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు పూజింపబడే ఆలయమిది.భక్తులు విరివిగా సందర్శిస్తున్నారు.

ప్రతిఏటా రధయాత్ర జరుపుతారు. ఆవరణలోనే రధము కూడా ఒక నిలువైన మంటపములో ఉంది. చందన పుకూర్ అనే కోనేరు కూడా ఉంది. ఇక్కడ రాధా మదనమోహనుని మందిరం కోనేటి మధ్యలో ఉంది. హంస పడవలో రాధా, మదనమోహనలు విహారం చేయించే తెప్పోత్సవాన్ని  పూజారులు నిర్వహిస్తారు. చైతన్య గౌడ్య మఠము, శ్రీల పరమదేవుని భజన కుటీరం, నాట్య మందిరం, బ్రహ్మచారులు,సాధువులుండే గదులు, భక్తుల సౌకర్యార్ధం విశ్రాంతి గదులు ఉన్నాయి. గోశాల కూడా ఉంది..   చైతన్య మఠం బ్రహ్మచారి ఒకరు మమ్మల్ని ఆదరంగా ఆహ్వానించారు. అతనికి పాతికేళ్లు కూడా ఉండవు . తెల్లని ధోవతి, బొత్తాములున్న తెల్లని కుర్తా, కొద్దిగా క్రాఫ్, పిలక తో ఉన్నాడు. ఆలయంలో అడుగుపెడుతూనే మమ్మల్ని వేరే భాషా ప్రాంతం వాళ్లమని గ్రహించి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పలకరించాడు తమ నివాస మందిరానికి తీసుకుని  వెళ్లి మఠం గురించి, హరినామ సంకీర్తన, వైష్ణవ తత్వాన్ని, క్రిష్ణభక్తిని ప్రచారం చేయటం, భగవద్గీత, వేదాలు,ఉపనిషత్తుల సమగ్ర అధ్యయనం, పర్యావరణం లో గోవుల మహోపకారం , గో సం రక్షణ  గురించి వివరించారు. దేశవ్యాప్తంగా ఈ మఠం ఢిల్లి, హైదరాబాద్, చండీగఢ్, మధుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరాఖండ్ మొదలైన చోట్ల తమ శాఖలు విస్తరించి ఉన్నాయని చెప్పారు.  ఇస్కాన్ కంటే ఈ చైతన్య మఠమే ముందు నెలకొన్నదని చెప్పారు. వైష్ణవ మత ప్రచారమే వీరి ముఖ్యోద్దేశం.  ఎదుటివారికి హాని చేయని , తమని తాము మూఢంగా చేసుకోనిది ఏ మతమైనా సమ్మతమే! సార్వజనీనమే కదా!

మహాత్మాగాంధీకి ప్రియమైన గీతం,  గుజ రాతీ కవి నరసింహ మెహతా రచించిన

“వైష్ణవ జనతో తేనే కహియే

జే పీడ పరాయీ జాణే రే” గుర్తొచ్చింది.

ఈ గీతానికి అర్ధం చూడండి. అందుకే గాంధీగారిని అంతగా ఆకట్టుకుంది.

“పరుల బాధలను అర్ధం చేసుకొన్న వాడే పరమేశ్వరు డైన విష్ణువుకు పరమ ఆప్తుడు .

ఇలాంటి విష్ణు జనులు విశ్వం లో అందర్నీ గౌరవిస్తారు. పర దూషణ చేయరు ,విమర్శించరు .

అందర్ని సమదృష్టి తో చూస్తారు . పర స్త్రీలు అతనికి మాత్రు సమానం . వైష్ణవ జనులు అసత్యమాడరు. పర ధనా పేక్ష లేకుండా జీవిస్తారు. వారు  సంగత్వం ,నిస్సంగత్వాలకు అతీతులు. నిస్సంగత్వం లోను స్తిర చిత్తం తో వ్యవ హరిస్తారు . వారికి ఆశా, మోసం, వంచన తెలియవు . భోగాన్ని ,కోపాన్ని విసర్జిస్తారు . అలాంటి వ్యక్తియే భగ వంతుని అర్చించ టానికి అర్హుడు .అతడే సకల మానవ జాతి ని ఉద్ద రించగలడు.”

ఈ వైష్ణవ జనులు  ప్రతిఫలాపేక్ష లేకుండా ఇక్కడ  చేస్తున్నదిదే అనిపించకమానదు .

గుడి ప్రాంగణమంతా వృద్ధులైన స్త్రీలు శుభ్రం చేస్తూ కనిపించారు.  కొంతమంది పూలమాలలు అల్లుతూ కనిపించారు. వంటశాల దగ్గర మరికొంత మంది స్త్రీలు కూరలు తరుగుతూ కనిపించారు.  స్త్రీలు, పురుషులు వృధ్ధులై, నిస్సహాయులై ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. బహుశ జగన్నాధుడు ఎంతమంది నిరాశ్రయులకు ఆశ్రయమిచ్చి కాపాడుతున్నాడో కదా అనిపించింది. దేవాలయ ప్రాంగణం లో మానవత తో  నిరాశ్రయుల్ని ఆదరిస్తున్న ఈ మఠం వారి ఔదార్యం చూస్తే వీరు భగవంతుని ప్రతిరూపాలే అనిపించకమానదు.

దర్శనం చేసుకున్నాక భోజనం చేసే వెళ్లమని మరీ మరీ చెప్పారు. అలాగేనని చెప్పి   మేము అతన్నుండి సెలవు తీసుకుని ప్రధాన ఆలయం వైపుకి వచ్చాం.  భోజనం సమయము ఇంకా కానందున , ఇంకా వేరే ప్రదేశాల్ని చూసే సమయం అవటంతో ప్రసాదం మాత్రమే తీసుకున్నాం. ఆపిల్, సొరకాయ ముక్కలతో చేసిన పెసరపప్పన్నం ప్రసాదం. (పప్పొంగలి, కదంబం ఈ రెండింటి మిశ్రమంలా ఉంది. ) చాలా రుచిగా ఉంది.

suvar2

ఉజ్జయంత ప్యాలెస్ కి ఒక కిలోమీటర్ దూరంలో కుంజబన్ ప్యాలెస్ ఉంది. మొదట దీనికి పుష్పబంత ప్యాలెస్ అని పేరు. దీన్ని మహారాజా బీరేంద్ర కిశోర్ మాణిక్య కట్టించారు. మహారాజు కళాత్మక హృదయుడు. ఈ ప్యాలెస్ రూపాన్నిఆయనే చిత్రించి మరీ  కట్టించారట. ఈ ప్యాలెస్ ప్రాంగణంలో  ఉద్యానవనాలు, పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆయన ఆహ్లాదపు విడిదిగా దీన్ని నిర్మించుకున్నారు. తమ ఆతిథ్యాలకు, ఆరామాలకు, షికార్లకు, విందులు, వినోదాలకు ఈ అంతఃపురము నెలవై ఉండేది. రవీంద్రుడు వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవారు. ఈ రాజభవనపు కుడివైపు నుంచి ఉండే వలయాకారపు వసారా దీని ప్రత్యేకత. ఈ వరండా రవీంద్రుడి అద్బుతమైన గీతాలు ఎన్నింటికో పుట్టిన వేదికైంది. ఈ భవనం విశ్వకవి సృజనాత్మకతకు  సాక్షిగా, శ్రోతగా నిలిచింది.

ఈ ప్యాలెస్ ని త్రిపుర ప్రభుత్వం ఆధీనం చేసుకుంది. ప్రస్తుతానికిది రాష్ట్ర గవర్నర్ నివాసంగా మార్చారు. సందర్శకులకు అనుమతిలేదు.

ఈ భవనం పక్కనే మలంచా నివాస్ అనే భవనం కూడా ఉంది. దీనిలో భూమి లోపలి గదులు కూడా ఉన్నాయిట.

దీనికి దక్షిణంగా రబీంద్ర కానన్ అనే ఉద్యానవనం ఉంది. దీన్ని అందరూ సందర్శించవచ్చు.

ఇక్కడ రిక్షాలు చాలా తిరుగుతున్నాయి. నగరం లో అన్నీ ప్రదేశాలు అంతంత దూరంకాకపోవటంతో రిక్షాలలోనూ తిరగొచ్చు.

జగన్నాథుని మందిరం పక్కనే ఉన్న ఓ హోటెల్లో మధ్యాహ్న భోజనం చేశాక, దాసు ఉదయపూర్ కి   బయలుదేరుతున్నామని చెప్పాడు. త్రిపురలో 60 శాతం కొండలు, అడవులే ఉన్నాయి. అడవుల మధ్యలో తారురోడ్డు మీదుగా ఉదయపూర్ వైపుకి ప్రయాణం సాగుతోంది.  రోడ్లన్నీ మెత్తగా సాగే ప్రయాణానికి సానుకూలంగా ఉన్నాయి. వీటిని  “బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్”(B.R.O) వారు నిర్మించినవని దాసు చెప్పాడు.  దారిపొడవునా మంద్రంగా వినిపించే రవీంద్రుని సంగీతం. దాసు అభిరుచిని మెచ్చుకోకుండా ఉండలేం!

మధ్యలో విశ్రాం గంజ్ అనే చిన్న బస్తీ వచ్చింది. అక్కడ  తేనీరు కోసం ఆపాడు దాసు. ఇక్కడ తేనీరు తాగేదేమిటి అంటూ క్రిష్ణ రసగుల్లాలు కొనుక్కొస్తానంటూ వెళ్లారు. ప్రద్యుమ్న వాళ్ల నాన్నననుసరించాడు.ఆ చిన్న హోటెల్ పేరుని చదవాలని ప్రయత్నించాము నేను, విభావరి.  త్రిపురలో విభిన్న తెగల వారు, విభిన్న భాషలవారు   నివసిస్తున్నప్పటికీ ఎక్కువశాతం  బెంగాలీలే ఉండటం వల్ల ప్రధాన భాష బెంగాలీ నే! “కొక్ బొరొక్” భాష ఇక్కడి ట్రైబల్ లాంగ్వేజ్. మణిపురి వారు కూడా ఉండటంతో ఆ భాష కూడా ఇక్కడ ఉంది.  అయితే  షాప్స్, హోటెల్స్, కార్యాలయాలన్నిటికీ బెంగాలీ లిపిలోనే బోర్డ్స్ పై పేర్లు రాసుంటాయి.  బెంగాలీ లో రాధా అర్ధం అవుతోంది కానీ పక్కనున్న మూడు అక్షరాలేమిటో ఎంతకీ బోధపడలేదు. కృష్ణ అయితే కాదు రెండక్షరాలే కాబట్టి. “మోహన్, మాధవ్ “…అలా కనిపించటంలేవు ఆ అక్షరాలు. బెంగాలీ “మ” అక్షరం హింది “మ” కి దగ్గరగా ఉంటుంది కాబట్టి, పరిచయమే!  బుర్ర చించుకొని చించుకొని ఇక లాభంలేదని అప్పుడే వచ్చిన దాసుని అడిగాం. అది రాధా- “గోవింద్” అని చెప్పాడతను. ఆ ఆధారంతో మరికొన్ని అక్షరాలు గుర్తుపట్టే ప్రయత్నం చేస్తూ, రసగుల్లాలు ఆరగిస్తూ మళ్లీ ప్రయాణం కొనసాగించాం . సాయంత్రానికి ఉదయపూర్ తీసుకుని వచ్చాడు దాసు. ఉదయపూర్ ఒకప్పటి రాజధాని అని చెప్పాడతను.  అగర్తల రాజధానిగా మారక ముందు  గోమతీ నది తీరాన రంగమతిగా పేరుపొందిన  ఉదయపూర్ మాణిక్య రాజవంశీకులకు అధికార నివాసంగా ఉండటమే కాకుండా రాజధానిగా కూడా వ్యవహరించింది.

అతను ప్రభుత్వ అతిథిగృహం దగ్గరకు తీసుకొచ్చాడు. అదే గోమతీ నివాస్. గోమతి నది ఒడ్డున ఉన్న పట్టణం కాబట్టి దానికి గోమతీనివాస్ అని పేరు పెట్టారన్నమాట!  గోమతీ నివాస్ లో మా బస.  వెనుకవైపు చిన్న బాల్కనీ,  కొలను ముఖముగా ఉంది. రాత్రికి అన్నంలోకి బంగాళాదుంపలు చెక్కుతీయకుండానే చేసిన కూర, ఆవ పెట్టిన రుచి వచ్చింది. పెరుగు, ఏదో ఊరగాయ. పర్వాలేదు భోజనం ఆ మాత్రం దొరకటం అపురూపమని దాన్నే తృప్తిగా తిన్నాం. అక్కడ ఒక రెసెప్షనిస్ట్, ఒక అటెండర్ మాత్రమే ఉన్నారు. స్ఫోటకం మచ్చలతో, మెల్లకన్నుతో రిసెప్షనిస్ట్ భయం కలిగించేలా ఉన్నాడు. కానీ అతను మాకు అన్నం దగ్గరుండి కొసరి కొసరి వడ్డించాడు. చాలా మృదు స్వభావి. అతనికి హింది, ఇంగ్లీష్ రాదు. మాకు బెంగాలీ రాదు. మా చిరునవ్వు పలకరింపుకి, మా కృతఙ్ఞతాపూర్వక అభివాదాలకి  అతని చూపులు, ముఖాభినయంతో మార్దవంగా బదులివ్వలేకపోవచ్చు గానీ, అతని స్వభావశైలి ఆదరంగా ఉంది.

ఉదయపూర్ చాలా చిన్న పట్టణం. అంతగా ఏ సౌకర్యాలూ లేని ప్రాంతం. ఉదయాన్నే ఫలహారంకోసం అదే వీధిలో ఉన్న ఒక చిన్న హోటెల్ కి నడుచుకుంటూ  వెళ్లాం.  తండ్రీ, కొడుకులు నడుపుతున్నారా హోటెల్. ఆ అబ్బాయి 14 ఏళ్లవాడు. స్కూల్ లో చదువుకుంటున్నాడు . ఈ చిన్న హోటెల్ లో వాళ్ల నాన్నకు సాయం కూడా చేస్తాడు. అంత చిన్న వయసులో అంత బాధ్యతని ఫీల్ అవుతున్నందుకు ముచ్చటగా అనిపించింది మాకు. న్యూస్ పేపర్ని చింపిన ముక్కలలో  ప్లెయిన్ పరాటాలను పెట్టిచ్చారు. చిన్న స్టీలు పళ్లెంలో క్యాలీఫ్లవర్, కాబేజీ, దుంపలు, టమాటాల కలిపి చేసిన కూర పెట్టిచ్చారు. పరాటాలు ఎన్ని కావాలో అన్ని తినొచ్చు. మళ్లీ మళ్లీ అడిగారు. రసగుల్లాలు, సందేష్ స్వీట్స్ ఉండనే ఉన్నాయి మరి! అక్కడున్న ఒక్కటే ఒక్క చెక్కబల్లపై కూర్చుని తినేశాం. ఇవన్నీ కలిపి రెండువందల రూపాయిలు దాటలేదు. ఇదే ఆహారం మనం స్టార్ హోటల్స్ లో తింటే మనల్ని బిల్లుతో బాదేయటం ఖాయం.  మనం ఆహారాన్నే కాదుకదా అక్కడి వాతావరణాన్నీ ఆ కొద్దిసేపూ  కొనుక్కుంటాం కదా మరి!

ఫలహారం చేయటం అయిపోగానే ప్రయాణం మొదలైంది. బాదల్ దాస్ మమ్మల్ని గోమతీనది వైపుకి తీసుకెళ్లాడు. ఆ  నది ఒడ్డున శిధిలమైపోయిన ఒక కోట దగ్గర ఆపాడు. విస్మయం కలిగించిన విషయమేంటంటే  అది  మహాభారత కాలమునాటిది.  అప్పటి రాజు, సైన్యం మహాభారత యుద్ధములో కౌరవల పక్షాన పోరాడారట.

ఈకోట దగ్గరే  భువనేశ్వరి దేవి ఆలయం ఉంది. దీన్ని  17 వ శతాబ్దం లో మహారాజా గోవింద మాణిక్య నిర్మించారు.  నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ చే ‘రాజర్షి  ‘ అనే నవలలో మరియు ‘బిశర్జన్’ ( విసర్జన్) అనే నాటకం లో భువనేశ్వరి ఆలయం సజీవం గా చిత్రింపబడింది.   భువనేశ్వరీ దేవికి తరచూ మనుష్యులను బలి ఇస్తుండటం చేత రవీంద్రుడు ఆ మూఢాచారాన్ని రూపుమాపాలన్న సత్సంకల్పంతో ఈ నాటకాన్ని రచించాడు. రాజావారి సహాయం తో ఆ నాటకాన్ని ప్రదర్శించి ప్రజలను చైతన్య పరచి, చివరకు అమ్మవారి విగ్రహాన్ని అక్కడి గోమతీ నదిలో విసర్జించారు.   మనుష్యులను సాటి మనుస్యులే అమానుషంగా, మూఢభక్తితో నరబలి ఇవ్వటం ఎంత హేయం! ఒక కవికి తన ఊహల్లోను, రచనల్లోనే కాదు, లౌకిక వ్యవహారాల్లోనూ, తోటి జీవులపట్లా కారుణ్యం ఉండాలి.  రవీంద్రుడు దయామూర్తి గా ఇక్కడ కనిపిస్తారు మనకు.

ఈ ఆలయం మూడు అడుగుల మేర ఎత్తు కలిగిన వేదికపైన నిర్మించబడింది. నాలుగు భాగాల పైకప్పు, ప్రవేశ ద్వారం వద్ద స్తూపం, గర్భగుడి  ఈ ఆలయ నిర్మాణం లో ముఖ్యమైనవి. పుష్పం లా తీర్చిదిద్దబడిన రూపకాలు (Motifs), ఈ ఆలయం స్తూపాలు ఇంకా స్థంబాలు  ప్రధాన ఆకర్షణలు .గుడిలో అమ్మవారి విగ్రహం లేకపోవటం తో అప్పటినుంచి పూజల నిర్వహణా ఆగిపోయింది. ఒట్టి గుడి మాత్రమే నిలిచి చరిత్రలో ఒక సత్కార్యానికి గుర్తుగా ఉండిపోయింది.

గుడి ఎత్తైన భాగం లో ఉండటం వల్ల వెనుక భాగమంతా ఓ కోనలా ఉంది. మరి ఆ కోన నిండా కొబ్బరి చెట్లు. ఆకాశంతో కబుర్లు చెప్తున్నట్లు, పక్కనే ఉన్న గోమతీ నది నెమ్మది ప్రవాహంలో  వయ్యారంగా తమ ముస్తాబును చూసుకుంటున్నట్లు ఉన్నాయి. ఇంత పచ్చదనం త్రిపురంతా కనిపిస్తుంది మనకు.

ఇంత పచ్చని త్రిపుర పేదగానే ఎందుకు ఉండిపోయింది అన్న అనుమానం వచ్చింది నాకు. దానికి సమాధానం మధ్యాహ్నానికిగానీ తెలియలేదు. ఉదయపూర్ నుంచి నీర్ మహల్ కి వెళ్లేటప్పుడు మళ్లీ విశ్రాం గంజ్ ద్వారానే వెళ్లాల్సివచ్చింది. అక్కడ క్రిష్ణ పనిచేసే సిండికేట్ బ్యాంక్ తాలూకు ఒక శాఖ ఉంది. మేము అక్కడ ఆగాం. అందరం బ్యాంక్ లోకి వెళ్లాం. బ్రాంచ్ మేనేజర్ కలకత్తా వారు. మమ్మల్ని నవ్వుతూ ఆహ్వానించారు. టి తెప్పించారు మాకోసం  మాటల మధ్యలో అక్కడి రైతులు, ఋణాల గురించి అడిగారు క్రిష్ణ. ఆయన చెప్పిన విషయం ఆశ్చర్యం వేసింది. పంటలు అంతంత మాత్రం పండుతాయి. పాడి పరిశ్రమ చాలా తక్కువ. నీటి సమస్య పుష్కలం. ఒక్క రబ్బరు మొక్కల పెంపకం మాత్రం విరివిగా ఉంది. దానిమీదనే రైతులు లోన్లు తీసుకుంటున్నారు.

suvar3

ఉదయపూర్ కు దగ్గరలో రాధా కిషోర్ పూర్ అనే గ్రామం ఉంది .ఇక్కడే త్రిపుర సుందరీ దేవి ఆలయం ఉంది .మహా శక్తి పీఠాలలో ఒకటిగా ప్రాముఖ్యం పొందిన ఆలయం. ఇక్కడే అమ్మవారి కుడి పాదం  పడటం వల్ల శక్తి పీఠమైంది .. 1501 లో దేవా మాణిక్య వర్మ మహా రాజు ఈ ఆలయాన్ని నిర్మించి నట్లు తెలుస్తోంది .అమ్మవారి పీఠం కూర్మం ఆకారం లో ఉండటం విశేషం .అందుకని కూర్మ పీఠం లేక కూర్మ దేవాలయం అనే పేరు కూడా ఉంది .   శ్రీ త్రిపుర సుందరీ దేవి విగ్రహం సుమారు 7 అడుగుల ఎత్తులో ఉన్న భారీ విగ్రహం .ఈ విగ్రహానికి దగ్గరలో అమ్మవారిదే రెండడుగుల చిన్న విగ్రహం ఉంది .దీనిని “చోటే మా” అని భక్తులు పిలుస్తారు . ఇక్కడి ప్రసాదం-ఆవుపాలను మరగకాచి గోధుమ రంగుగా మార్చి పంచదార కలిపి చేసిన  “దూద్ పేడ్ “. యెర్ర గోగు పూలు అమ్మవారికి ప్రీతికరం గా భావించి సమర్పిస్తారు . గుడి ప్రాంగణంలో మేకలు ఉన్నాయి. బాధ కలిగించే విషయమేమంటే ఇంకా జంతు బలి ఆచారం ఉంది.

దేవాలయానికి వెనుక కళ్యాణ సాగరం అనే పెద్ద సరోవరం ఉంది ఈ సరస్సు పెద్ద ఆకర్షణ గా నిలుస్తుంది .ఇందులో లెక్కలేనన్ని తాబేళ్లు చేపలు కనిపిస్తాయి. యాత్రీకులందరూ వీటికి ఆహారంగా చిన్న చిన్న గోధుమపిండి ముద్దలు,  మరమరాలు వేస్తారు. అవి సరస్సు ఒడ్డునే అమ్ముతారు.  అక్కడ అమ్ముతున్న వారిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మూఢ నమ్మకాలని పెంచుకుని నీటిని కలుషితం చేసేది భక్త నామధేయులే!

తర్వాత మేము సందర్శించాల్సినది నీర్ మహల్. ఇది రాజా వారి వేసవి విడిది. ఇది మేలాఘర్ అనే ప్రాంతంలో  రుద్రసాగర్ అనే పెద్ద కొలను మధ్యలో ఉంది. ఈ మేలాఘర్ లో బోట్ రేస్ జరిగే జాతర ప్రతి ఏటా నిర్వహిస్తారు ఇక్కడి బెంగాలీ ప్రజలు. జాతర అంటే.. మేలా.  మేలా చేసే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని మేలాఘర్ అన్నారని అనుకోవచ్చు. ఉదయపూర్ నుంచి తిన్నగా ఇక్కడికి వచ్చాం. సాయంకాలం అవటంతో, ఈ సమయంలో అక్కడికి అనుమతించరనీ, రేపు ఉదయం దాని సందర్శనానికి వెళ్లొచ్చని చెప్పాడు దాసు. ఒడ్డునే ఉన్న సాగర్ మహల్ టూరిస్ట్ లాడ్జ్ కి తీసుకుని వెళ్లాడు. ఇది కూడా త్రిపుర టూరిజం వారిదే! దీన్ని కొత్తగా కట్టించారులా ఉంది. రూములన్నీ విశాలంగానూ, శుభ్రంగానూ ఉన్నాయి. కొన్ని గదులు నీర్ మహల్ కనిపించే విధంగా ఉన్నాయి. మేము గదిలోనుంచి బయటికి వచ్చి భోజన శాల ముందు ఆరుబయట మాకై  వేసిన నాలుగు కుర్చీల్లో కూర్చున్నాం. సాగర్ మహల్ భోజనశాల ఇంకొంచెం ముందుకు, కొలను ఒడ్డుకి దగ్గరగా ఉంది.  దీపాలు పెట్టే వేళ అయింది.  కొలను మధ్యలో ఉన్న నీర్ మహల్,  దీపాలకాంతితో నీటిమీద తేలియాడు ప్యాలెస్ లా, అదో కలల దీవిలా కనిపించింది. ఆ వెలుగులన్నీ కొలనులో కార్తీకదీపాల్లా నిర్మలంగా, నిమ్మళంగా ప్రజ్వలిస్తున్నట్లున్నాయి. ఆ దీపశిఖలకు నీలాకాశం ఎర్రబారుతోందనిపించింది. కొద్దిసేపు చూస్తూనే ఉంటే.. నిరీక్షిత లా కనిపిస్తున్న ఆ సౌధం ఏకాంతంగా తపస్సు చేసుకుంటున్న మనస్వినీలా  అనిపించింది.  ఆ అనుభూతికి సాటి అయినది మరొకటి చెప్పలేం మన మాటల్లో!  ఆ భావుకత తీవ్రతనుండి బయట పడ్డాక, నిజంగా అక్కడేమి ఉందోగానీ అంతా మన మనసులోనే ఉంది అనుకొని నవ్వుకున్నాను.  ఏదేమైనా సరే, ఎవరైనా సరే ఈ సౌందర్యాన్ని చూడాలంటే ఓ సాయంకాలం నుండి ఉండితీరాలి.

రాత్రి భోజనం తయారని చెప్పటంతో లోపలికి వెళ్లాం. అక్కడ మాకు రొట్టెలు, మిక్స్డ్ వెజ్ కూరతో బాటు, కొద్దిగా అన్నం అందులోకి ఆవకాయ..నిజమండీ ఆంధ్రా ఆవకాయ ప్రియ వారిది వడ్డించాడు. బంగాళాదుంప కారప్పూస  కూడా వడ్డించాడు. తెలుగువాళ్లు వేపుడు, ఆవకాయ తింటారని విని ఉన్నాడట. ఆమాత్రం అతనికి తెలిసినందుకు అతన్ని మెచ్చుకోవాల్సిందే!  ఇక మన ఆవపెట్టిన కూరలు, కొబ్బరి తురుము వేసిన కూరలు,అన్ని రకాల పప్పులు, చారు,  పప్పులుసు, దప్పళం, రోటి పచ్చళ్లు, పులిహోర, చక్ర పొంగలి, పూర్ణాలు, బొబ్బట్లు ఇంకా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు.  ఇవన్నీ తింటామని తెలిసున్నట్లైతే అతనికిక  సన్మానం చేసెయ్యొచ్చు. స్వర్ణ కంకణం తొడగవచ్చు మరి!

ఉదయాన్నే చపాతీల ఫలహారం పెట్టారు. తినేసి రుద్రసాగర్ ఒడ్డుకి వెళ్లాం. మోటారుబోటులున్నాయిగానీ, మేము మామూలు పడవనే మాట్లాడుకున్నాం. పడవవారికి, వీటిని నడపటం, ఆ కొలనులో చేపలు పట్టటం జీవనభృతి. అక్కడే అమ్ముతున్న రేగుపండ్లు కొనుక్కొని పడవెక్కాం. రెండు కిలోమీటర్ల ప్రయాణం నీటిలో. రాత్రి అందంగా కనిపించిన కొలను నీళ్లు ఎంతో మురికిగా కనిపించాయి.  ఆ నీళ్లను ఎక్కడా తాకేలా అనిపించలేదు. ఎక్కడచూసినా చేపల వలలు, బురద మేటవేసిన కొలను.  రాజా తన వేసవి విడిదిగా నిర్మించిన ఈ భవనం చుట్టూ ఇంత పెద్ద కొలనుని తవ్వించాడట. రాజ పరివారం ఆహ్లాదంగా తమ స్వంత బోటుల్లో జలవిహారం చేసిన కొలను! జనాలకు చల్లటి గాలిని వీచిన కొలను!  తాగునీటిగా, చుట్టూ పొలాలకు పంట నీరుగా ఉన్న ఈ నీరు ఇప్పుడు కలుషితం. ఈ సరస్సు ఇప్పుడు చాలా నిస్సారమైపోయింది. ఇదే కొనసాగితే పర్యావరణం, టూరిజం రెండూ నష్టపోయే అవకాశం ఎక్కువగానే ఉంది. ఈ సరస్సుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని అనిపించింది.

భవనం దగ్గర పడే కొద్దీ కొద్దిపాటి ఉద్విగ్నత ఉన్న మాట వాస్తవం. దర్పంగా నిలిచిఉన్న ఈ హర్మ్యాన్ని తలెత్తి చూడాల్సిందే. నీటి మధ్యలో కట్టిన నాటి వాస్తు కళా శిల్పుల నైపుణ్యానికి హాట్సాఫ్!      రాజా బీర్ విక్రం మాణిక్య డిజైన్ చేసి కట్టించిన ఈ ప్యాలెస్ కూడా  హిందూ, ముస్లిం మిశ్రమ శైలి నిర్మాణానికి ప్రతీక. ఎరుపు తెలుపుల మిశ్రమవర్ణాలతో కనిపించే ఈ భవనం ప్రధాన ద్వారం గుండా వెళితే పడమటి వైపు అందర్ మహల్. ఇందులో రాజ పరివారం నివసించేందుకు వీలుగా 24 గదులున్నాయి. కుడివైపు సాంస్కృతిక కార్యక్రమాలకోసం కట్టించబడిన ఓపెన్ ఎయిర్ థియేటర్. రాజ సైనికులు ప్రహరా కాసేందుకు వీలుగా బురుజులు, రాజ పరివారం సరస్సులో బోటులో విహారం చేసేందుకు లోపలినుంచి ఉన్న రాజఘాట్.  బురుజులు, సౌధపు పై మేడ పై కొద్దిసేపు తిరిగాం. పాతబడిన ఈ మేడ పై, పిట్టగోడనానుకుని చుట్టూ వరిపొలాలని చూస్తుంటే నా చిన్ననాట  పల్లెటూరులోని మా ఇంటి మేడపై పిట్టగోడనానుకుని మావూరి వరిపొలాలు చూసిన అనుభూతి మెదిలింది. కొన్ని అనుభూతులు అంతే..కాలంతోబాటు మనల్ని వెన్నంటే ఉంటాయి. ఏ కొద్దిపాటి సారూప్యత కనబడినా చాలు మనల్ని కదిలిస్తాయి.

ఈ భవనపు ప్రాంగణంలో కూడా మొఘల్ గార్డెన్ ఉంది. దీనికి కూడా నీర్ మహల్ అని రవీంద్రుడే పేరుపెట్టారు. ఇక్కడ జనరేటర్లు కూడా ఉన్నాయి. లైట్ & సౌండ్ షో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు .కానీ ప్రస్తుతం దాన్ని ఆపివేశారట. భవనం కూడా శిధిలావస్థలో ఉంది. కాపాడుకోవల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. త్వరగా పునరుధ్ధరణ పనులు చేపడితేనేగానీ రాయల్ హెరిటేజ్ కి గుర్తుగా మిగిలిన ఈ ప్యాలెస్ శోభ కలకాలం నిలువగలదు.

పడవదిగి ఇవతలికి రాగానే ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి కనబడ్డారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామని తెలిసి చాలా సంతోషపడ్డారు. “మా త్రిపుర చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు నిజాయితీగా ఉంటారు” అని చెప్తుంటే ఆయన కళ్లల్లో మెరుపు, గర్వం కనిపించాయి. అవును, పుట్టిన గడ్డపై గర్వం, గౌరవం చూపించాలి!

పక్కనే వెదురు బొంగులతో చేసిన డబ్బాలు, ఫ్లవర్ వేజ్ లు, పెన్నులు, గ్లాసులు, బొమ్మలు అమ్మే దుకాణం ఉంది. దాంట్లో అతి తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఎటువంటి బేరం ఆడాల్సిన అవసరం లేదు. వారి కష్టానికి ఆమాత్రం మూల్యం చెల్లించాల్సిందే! అదే మన నగరాలలో పెట్టే హ్యాండిక్రాఫ్ట్స్ ప్రదర్శనలలో ఇంతకు నాలుగింతల ధరలని చెప్తారు. వస్తువులకు ముచ్చటపడితే మారుమాటాడకుండా కొనుక్కోవాల్సిందే! ఇక్కడ ఎంతో ఓపికగా వారు చేసిన కళాకృతులను చూపించాడు దుకాణాదారుడు. అతని పనితీరుని అభినందించి, చెప్పిన ధరనే చెల్లించి,  బంధువులకు, మిత్రులకు కానుకలు కొని బయటికొచ్చాం.

అక్కడ్నుంచి సెఫాహీజల వెళ్లటం కోసం ముందుకు కొనసాగాం.. సేఫాహీ జల వచ్చిందని రోడ్డు మీదనే కారాపేశాడు దాసు. అక్కడ్నుంచి లోపలికి అడవి లోనే  వేసిన తారు రోడ్డుపై నడకసాగించాం. ఒక క్రోసెడు దూరం ఆ దారిగుండా నడిచాక పేద్ద గేటు వచ్చింది. అప్పుడే డ్యూటీకి వచ్చిన అక్కడి అటెండర్ గేటు తీయగానే విశాలంగా ఆకాశంలా పరచుకున్న సరస్సు, అందులో  రోజా,ఊదా రంగుల కలబోతతో పూసిన తామరపూలు.  ఒక్కసారిగా  దేవలోకానికి తీసుకెళ్లినట్లు అనిపించింది.  అది ఓ సహజసిద్ధమైన సరస్సు. ఆ సరస్సులో కొద్దిసేపు బోటులో విహారం చేయాలనిపించింది.  అటెండర్ మాకు బోటు ఎక్కటానికి సహాయంచేశాడు. మా కలకలం వినగానే ఒక్కసారిగా ఎగిరిన పక్షి సమూహాలు  కనిపించేంత మేరకు సరసుపై ఓ అద్భుత చిత్రాన్ని రచించాయి. వింత ద్వనుల సందడిని చేస్తూ అవతలి ఒడ్డువైపుకు తరలిపోయాయి. సరసుకి ఆవలి ఒడ్డు మళ్లీ అడవే!   దూరంగా కనిపించి మురిపించిన తామరపూవులు మా విహారంలో ఎదురొచ్చి స్వాగతం చెప్తున్నట్లు తోచింది. స్త్రీ హృదయం కదూ పూవులను చూడగానే దయలేనివారిగా మారిపోయేవారం కదూ నాకూ, విభావరికి వాటిని స్వంతంచేసుకోవాలనిపించింది.  ఇవి సుకుమార పూబాలలేగానీ, వాటిని కోయాలంటే చాలా  కష్టం. సుకుమారంగా కనిపించే స్త్రీలు ఎంత ధృఢచిత్తులో, అటువంటివారికి ప్రతీకగా అనిపిస్తాయి ఇవి. బలమంతా ఉపయోగించి పీకితేగానీ రాలేదు. ప్రద్యుమ్న కోసి చెరొక కమలాన్ని ఇచ్చాడు.  మురిపెంగా అందుకున్నా. విరిసీ విరియని తామరలు ముద్దొచ్చేట్లు ఉన్నాయి. ఒక్క క్షణం మైమరచినా తర్వాత అనిపించింది …చూసినప్పటి మానసిక సంతోషం చేతికి అందాక అంత ఉండదని! కొన్నింటిని అలాగే చూసి ఆనందించాలి. పంకిలాన్ని అంటని పూలు, నీటి బొట్టుని అంటించుకోని ఆకులు!! ఎంత ఫిలాసఫీని నేర్చుకోవాలి మనం వీటి  భాష ఎరుగని బోధనలతో!

అక్కడ్నుంచి కమలా సాగర్ వైపుకి వెళ్తున్నామని చెప్పాడు దాసు.దారిపొడవునా విశాలమైన ముంగిళ్లతో, వెదురు కంచెలతో పూరిళ్లు , వాలుగా కప్పిన  రేకుల ఇళ్లు. నిజానికి రూరల్ త్రిపుర మొత్తం ఇలాంటి ఇళ్లే!  ప్రతి ఇంటి ఆవరణలో అరటి, పోక, పనస, కొబ్బరి చెట్లు.  ఇంకా పూరిళ్ల లోగిళ్లలో ముగ్గులు. దక్షిణభారతదేశంలోలా ఇక్కడా ముగ్గులు పెడతారా అని దాసు ని అడిగాను. సంక్రాంతి సమయంలో పెడతారని చెప్పాడు. అవును మేము వెళ్లింది సంక్రాంతి సమయంలోనే!

కమలాసాగర్ ఇండోబంగ్లా సరిహద్దులో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ కాళికా మాత ఆలయం, దాని కెదురుగా కమలాసాగర్ అనే పెద్ద కొలను ఉన్నాయి. ఈ కమలా సాగర్ నిండా రోజా రంగులో సంభ్రమం గొలుపుతూ కమలాలు!  విచిత్రం ఏమంటే   ఆ కమలా పుష్పాలలో సగం మన దేశానివి. మిగతా సగం బంగ్లాదేశ్ వి.  అవునండీ సరిహద్దు రేఖ అలాగే నిర్ణయించింది మరి! అక్కడే కొమిల్లా వ్యూ పాయింట్ అని టూరిజం వారి వసతి గృహం. అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఈ వసతి గృహం డాబా మీదకు వెళ్లాం. పక్కనే ఉన్న ఓ డాబా ఇల్లు, మామిడి చెట్టుని చూస్తూ నిల్చున్నాం. ఇంతలో అతి సమీపంగా రైలు శబ్దం వినిపిస్తే పక్కకు తిరిగిచూశాం. అతి దగ్గరగా వెళ్తున్న ఓ గూడ్స్ బండి..అది నిజానికి మన దేశం లోది కాదు. బంగ్లాదేశ్ లోది. పక్కనే ఇనుప రాడ్స్ తో సరిహద్దు కంచె అప్పుడుగానీ  కనిపించలేదు.   కిందకుదిగి భోజనానికి వచ్చాం. అన్నంలోకి మళ్లీ బంగాళాదుంపల కూర టమాటాతో కలిసి. ముఖం మొత్తిపోయింది. టమాటా పచ్చడి తియ్యగా ఉంది. అస్సలు తినలేకపోయాం. ఏంచేస్తాం?  .  ఇంట్లో అంతగా అనిపించకపోయినా ఇలాంటప్పుడే బయట ప్రదేశాలలో మాత్రం నాకు అనిపిస్తుంది. గోంగూర, చింతకాయో, మాగాయ, ఆవకాయో వేసుకుని ఇంత అన్నం తినాలని.  లేదూ, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలనిపిస్తుంది.  అదే చేశాం. గోధుమ వన్నెలో ఉన్న పాలకోవా, అరటిపండ్లు కొనుక్కుని తిని. కొబ్బరి బోండాలు తాగి కడుపు నింపుకున్నాం.  నిజానికి బెంగాలీ ప్రాంతాలలో శాకాహారులకు సరైన ఆహారం ఉండదనే చెప్పాలి. శాకాహారులం అని చెప్పినప్పటికీ ఎక్కడ జలపుష్పాలను వడ్డిస్తారేమోననే కంగారు.  సరే ఆ విషయం వదిలేస్తాను.

తిరిగి అగర్తలాకి వచ్చేశాం. నగరంలోకి రాగానే ఇదే S.D బర్మన్ ఇల్లు అని చూపించాడు దాసు. ప్రముఖ సంగీత దర్శకుని ఇల్లు అది. S.D బర్మన్ కొడుకు R.D బర్మన్. ఈయన త్రిపురలో ఒక రాజ కుటుంబానికి చెందినవారు. ఖగేశ్ దేవ్ బర్మన్ కూడా త్రిపుర రాజ కుటుంబానికి, బర్మన్ వంశానికీ చెందినవాడు. ఈయన ఎస్.డి బర్మన్ (సచిన్ దేవ్ బర్మన్)పై రాసిన పుస్తకం “సచిన్ కర్తార్ ఘనేర్ భుబన్” దీనికి త్రిపుర ప్రభుత్వం “సచిన్ సమ్మాన్” అనే గౌరవ పురస్కారాన్ని ఇచ్చింది. The world right of this book has been taken up by Penguin India.

చంద్రకాంత్ మురసింగ్ కూడా త్రిపురలో ప్రఖ్యాతిగాంచిన కవి. ఈయన ఇక్కడి ట్రైబల్ లాంగ్వేజ్ అయిన కోక్ బొరొక్ లో చాలా పుస్తకాలు రాశారు.  ట్రైబల్ జానపద సంస్కృతి  త్రిపురకు విశిష్టతను చేకూర్చినదని చెప్పొచ్చు.

 

ఇక త్రిపురని మాణిక్య రాజులు పరిపాలించినట్లే, త్రిపుర ప్రతిష్టని పెంచినవారు మరో మాణిక్యం..మాణిక్య సర్కార్. ముఖ్యమంత్రిగా అవినీతి రహితంగా, నిజాయితీగా, నిరాడంబరం గా ఉండే ఈయన ప్రజలు మెచ్చిన మనీషి.  దేశం మొత్తం గర్వించదగ్గ, అనుసరించాల్సిన నాయకుడు.  పుత్రోత్సాహాన్ని కలిగించిన త్రిపుర మాత ముద్దుబిడ్డ. ఈయన భార్య పాంచాలీ భట్టాచార్య ఇంటిపనులకై రిక్షాలో వెళ్తుందని అందరికీ తెలిసిన విషయమే!

సరే అసలు విషయంలోకి వస్తాను. బర్మన్ ఇంటిముందునుంచి వెళ్లి రాజా మహా బీర్ బిక్రం కట్టించిన M.B.B కాలేజ్ ముందు కొద్దిసేపు కారు ఆపాడు దాసు. పిల్లలిద్దరూ కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. పాత భవనం విశాలమైన ప్రాంగణంతో, చెట్ల ఛాయల మధ్య వెలిగిపోతూ ఉంది.  ఇది 264 ఎకరాల్లో నెలకొలబడిన కళాశాల.  ఇక్కడి లైబ్రరీలో  గ్రంధాలు, జర్నల్స్ లేనివి లేవు. ప్రయోగ శాలలు, సాంస్కృతిక సమావేశాల వేదికలతో “విద్యామృతమస్నుతే” (Knowledge is the key to immortality అనే మోటో తో సాగుతున్న ఈ విద్యాలయాన్ని కలకత్తా యూనివర్శిటికీ అనుసంథానం చేసిన ఘనత త్రిపుర మాణిక్య రాణీ “కాంచన ప్రభాదేవి” దే! మహారాజు,  యువకులను మేథావంతుల్ని చేయాలన్న సత్సంకల్పానికి ఈవిడ మరింత కృషి చేశారు. ఈమె బీర్ బిక్రం మహారాజు భార్య. భారతదేశం లో విలీనమయ్యే కాలంలో త్రిపురని పరిపాలించిన ధీర! భారత విభజన సమయం లో త్రిపుర లో శరణార్ధులకు పునరావాసాల్ని కల్పించి ఈమె కీలకమైన పాత్రని పోషించింది. ఈ ధీరోదాత్త గురించి వింటుంటేనే మనసు పులకితమయింది. ఇక్కడ కాలేజీకి సంబంధించే ఈ రాజా వారు పెద్ద క్రికెట్ మైదానం కూడా ఏర్పాటుచేశారు.

అక్కడ్నుంచి వేణూబన్ విహార్ కి వెళ్లాం.

వేణుబన్ విహార్..పేరు వినగానే ఇది ఖచ్చితంగా వేణుమాధవుని ఆలయమనుకుంటారు. అవునా? కాదు. ఇది బుద్ధదేవుని మందిరం. చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంది. తీర్చిదిద్దినట్లున్న పచ్చని మొక్కలు, పసుపుపచ్చని సువర్ణగన్నేరు పూలు ఏదో దివ్యరాగానికి తలలూపుతున్నట్లున్నాయి. ఆ నిర్మలచిత్తుని నుంచి ప్రసరించే తరంగాలు ఆవరణంతా ఆవరించాయనిపించింది. కొద్దిసేపు కూర్చుని అక్కడి శాంతాన్ని మనసుకు పట్టించుకునే ప్రయత్నంలో పడ్డాం.

అక్కడ్నుంచి మా కోరికమీద “పూర్భష” కి తీసుకెళ్లాడు దాసు. అది ప్రభుత్వ చేనేత, హస్త కళాకృతుల ఎంపోరియం. పట్టు, నేత వస్త్రాలు మాత్రమే చూడాలనుకున్నాం. వస్త్ర విభాగంలోకి వెళ్లాం. ఇక్కడి ట్రైబల్ నేసిన వస్త్రాలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వీరి చేనేత పని విభిన్నంగ ఉంటుంది. కొంత షాపింగ్ చేసి బయటకు బలవంతంగా వచ్చాం. అంత బాగున్నాయక్కడ. ఏది కొనుక్కోవాలో, ఏది వదలాలో తెలియదు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతపు సంస్కృతికి సంబంధించిన విశేషమైనవాటిని  కొనుక్కోటం ఆచారంగా చేసుకున్నవారిలో మేమూ ఉన్నాం. సరదాగా అంటున్నానులేండి.

ఇంకా ఇక్కడ పాత అగర్తలా చూడాలి అంటూ రాజా వారి పాత హవేలి, చతుర్దశ దేవతా ఆలయం అవీ చూపించాడు దాసు. ఈ 14 దేవతా విగ్రహాలను ఉదయపూర్ నుండి అగర్తలాకు మహారాజా వారు తరలివచ్చేటప్పుడు ఇక్కడకు వాటినీ తెచ్చి ప్రతిష్ట చేశారట.

ఆ రోజుకిక గీతాంజలి గెస్ట్ హౌస్ లో బస. ఇది అధునాతన భవనం. కుంజబన్ ప్యాలెస్ కి దగ్గరలోనే ఉంది. చాలా బాగుంది. వసతి, భోజనం అన్నీ బాగున్నాయి.

త్రిపురలో ప్రభుత్వ టూరిజం వారి వసతి గృహాలలో ఉంటూ, వారి ప్యాకేజ్ టూర్లలో వెళ్లొచ్చు. ఎటువంటి ఇబ్బందీ కలుగనీయకుండా వారు చూస్తారు.

త్రిపుర అంతా జీవ వైవిధ్యమున్న అటవీప్రాంతం. జంపూ హిల్, త్రిష్ణ  వైల్డ్ లైఫ్ సాంక్చురీలు, బర్డ్ సాంక్చురీ,   ఉనకొటి లాంటి బౌద్ధ విహారాలు ఇంకా చూడాల్సినవి ఉన్నాయి.  సమయాభావం వల్ల వెళ్లలేకపోయాం. బాదల్ దాస్  మమ్మల్ని విమానాశ్రయం దగ్గర దించాడు. అతనికి కృతఙ్ఞతలు చెప్పి,  త్రిపురని సెలవిమ్మని అడిగి విమానమెక్కేశాం. గూటికి చేరాం .

ఇంటికి వచ్చాక నెమరువేసుకుంటే ..

త్రిపుర మొత్తం కొండ-కోన, కొలను-కోటల సమాహారం. వీటన్నిటి చాయలలో ఈ బుజ్జి రాజ్యం ధ్యానముద్ర లోని ఓ తపస్వినిలా   అనిపించింది.

 

*****

 

గమనమే గమ్యం-10

 

 

Volga-1ఐతే ఆ తర్వాత ఇక శారదకే కాదు ఎవరికీ ఏమీ ఆలోచించే సమయం లేదు. దండియాత్ర మొదలైంది. అది దావానలంలా పాకింది. దేశమంతా ఉప్పు ఉడుకుతోంది. మద్రాసు సముద్రం మాత్రం చల్లగా ఉంది. మద్రాసు నిశ్శబ్దాన్ని చూస్తే శారదకు ఆశ్చర్యంగా ఉంది. ఆవేశమూ కలుగుతోంది. దుర్గ ఏం చేస్తోంది?

రెండు మూడు రోజులు  ఆందోళనతో గడిచిన తర్వాత దుర్గను కలిసి మాట్లాడాలని బయల్దేరుతుంటే దుర్గే శారద ఇలలు వెతుక్కుంటూ వచ్చింది. అదే మొదటిసారి దుర్గ ఈ ఇంటికి రావటం. శారద సంతోషంతో పొంగిపోతూ దుర్గ భుజాల చుట్టూ చేయి వేసి గలగలా నవ్వుతూ దుర్గను తల్లి దగ్గరకు తీసికెళ్ళింది. ఇక సుబ్బమ్మగారి హడావుడి చూసి తీరాలి. సుబ్బమ్మ గారు అతిథులను చూస్తే ఆగలేరు. అందులోనూ తనకు ఇష్టమైన వాళ్ళంటే మరీ .  ఆమె పెట్టినవన్నీ తినాలి. చెప్పేవన్నీ వినాలి. శారద దుర్గను తల్లినుంచి రక్షించి మేడమీదకు తీసికెళ్ళింది.

‘‘చూశావా దుర్గా! గాంధీగారు సత్యాగ్రహంలోకి ఆడవాళ్ళు అప్పుడే రావల్సిన అవసరం లేదంటున్నారు. నువ్వేం చేస్తావు?’’

‘‘నేను చెయ్యవలసింది చేసేశాను.  గాంధీగారికి ఉత్తరం రాశాను. ఆయన ఒప్పుకుంటారు. ఆయన అనుమతించకపోయినా నేను శాసన్లోల్లంఘనం చేసి తీరతాను. ప్రజల చేత చేయిస్తాను’’ దుర్గ కళ్ళు జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి.

‘‘నువ్వు గాంధీగారి శాసనాన్ని కూడా ఉల్లంఘిస్తావా?’’

దుర్గ ధీరలా పలికింది.

‘‘శాసనం అన్న మాటకే తల ఒంచకూడదు. శాసనరూపంలో ఎవరేం చెప్పినా  ఉల్లంఘించాల్సిందే. అది గాంధీగారు నేర్పిందే’’

‘‘ఔను. కానీ ఏం చేస్తావు? ఎలా చేస్తావు?’’

‘‘పంతులు గారు రెండు రోజుల్లో మద్రాసు వస్తారు. ఆయనతో,  ప్రకాశం గారితో మాట్లాడి మద్రాసులో నిప్పురాజెయ్యాలి. ఉప్పు వండాలి’’.

‘‘ప్రకాశం గారు గుంటూరు, బెజవాడ వెళ్తానంటున్నారుగా?’’

‘‘అక్కడ నాయకులెందరో ఉన్నారు. అంతగా అయితే ఒకసారి వెళ్ళి వాళ్ళను ఉత్సాహపరిచి రావొచ్చు. కానీ మద్రాసు ఇంత పెద్ద నగరం. బ్రిటీష్‌వాళ్ళ పరిపాలనా కేంద్రంలో చిన్ననిప్పురవ్వ కూడా లేకుండా ఉంటే ఎలా? అది వాళ్ళ బలమనుకోరూ?’’

‘‘ఐతే నువ్వు సిద్ధమయ్యావా?’’

‘‘సిద్ధమయ్యాను శారదా? మరి నువ్వు?’’

‘‘నాకీ చదువనే బంధం ఒకటుందిగా.నాన్నకు మాటిచ్చాను. చదువుకి భంగం రాకుండా ఏం చెయ్యగలనో అదంతా చేస్తాను’’

‘‘నువ్వు చాలా చెయ్యాలి. చేస్తావు. నాకు తెలుసు’’

‘‘మా అన్నపూర్ణ ఇప్పుడు కాకినాడలో ఉంది. తను కూడా సత్యాగ్రహం చేస్తుంది. నాకు తెలుసు.’’

ఇద్దరికీ సత్యాగ్రహం ఎలా చెయ్యాలో, ప్రజలను ఎలా సమీకరించాలో ఎంత మాట్లాడుకున్నా తనివి తీరటం లేదు.

దుర్గ ఇక వెళ్ళాల్సిన సమయం అయిందంటూ లేచింది. చివరిగా తన భయమూ శారదతో చెప్పింది.

‘‘మనం ఇన్ని ఆలోచిస్తున్నామా. ఆ నాయకులు  వచ్చి హఠాత్తుగా నిర్ణయాలు  చేసేస్తారు. మనం అనుసరించాల్సిందే. వివరించే వ్యవధానం కూడా తీసుకోరు. ఉద్యమంలో నాయకుల్ని ఎదిరిస్తే అది ఉద్యమానికి హాని చేస్తుందంటారు. మనం వాళ్ళ పొరపాట్లను చెప్తూ ఒక్క మాట మాట్లాడటానికి ఎంతో ఆలోచించాలి. ఈ లోపల  జరగాల్సిన నష్టం జరిగే పోతోంది. నాయకులు ఉండాలి , కానీ ఇలా ఉండకూడదనిపిస్తుంది’’.

దుర్గ మనసులో ఎంత ఆవేదన ఉందో అర్థమైంది శారదకు.

‘‘దుర్గా ` నువ్వే నాయకురాలివి. నీలో ఆ స్వభావం ఉంది. నిన్ను చూసి అందరూ ప్రేరణ పొందుతారు’’.

దుర్గ నవ్వింది.

‘‘నేను సాహసంతో చేసే పనులను జనం మెచ్చుకుంటారు. ఆ సాహసాలు  కావాలి. కానీ నా ఆలోచనలను, నా మేధస్సు వీటిని అంగీకరించటం పురుషులకు అంత తేలిక కాదు. ఆడవాళ్ళను అలా గుర్తించటానికి ఇంకా సమయం రాలేదేమో  ’’

శారద దుర్గ నిరాశను తగ్గించాలనుకుంది.

‘‘ఎందుకు రాలేదు. సరోజినీ నాయుడిని గుర్తించటం లేదా?’’

‘‘ఆమె చదువు, ఆ చొరవ, ఆ దూసుకుపోయే తత్త్వం, సాహసం తెలివి ఇవన్నీ ఒక పురుషుడికి ఉంటే ఇంకా పెద్ద నాయకుడు అయ్యేవాడు.  ఇన్నీ ఉన్నా సరోజినీ నిర్ణయాలు  చేసే స్థాయిలో లేదేమో అనిపిస్తుంది.’’

‘‘కాలం మారుతుంది దుర్గా, మనమూ నిర్ణయాలు  తీసుకుంటాం. అన్ని పనులూ  చేస్తాం’’

‘‘ఔను. చెయ్యాలి. మనం చాలా పనులు  చెయ్యాలి. ముందు మద్రాసులో సత్యాగ్రహం ప్రారంభించాలి. దానిలో ఎవరు కాదన్నా నేను ముందుంటాను.’’

దుర్గను మెచ్చుకోలుగా చూసింది శారద.

దుర్గ కాసేపు సుబ్బమ్మగారితో కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది.

మరో రెండు మూడు రోజు మద్రాసు నిస్తబ్దంగానే ఉంది. గుంటూరు, కృష్ణ మండలాల్లో సత్యాగ్రహం మొదలయిందని వార్తలొస్తున్నాయి.

ప్రకాశంగారు విజయవాడ బయల్దేరుతుండగా వెళ్ళి ఆయన్ని మద్రాసులో ఈ నిశ్శబ్దమేమిటని నిలదీసింది. ఒక్కరోజు అటు వెళ్ళి వచ్చి మద్రాసు సంగతి చూస్తానన్నాడాయన.

నాగేశ్వరరావు పంతులు  గారిని కూడా సంప్రదించి దుర్గ రంగంలోకి దూకింది.

olga title

పేటలన్నీ తిరిగింది. ప్రతి ఇంటి వాకిలీ తట్టింది. ఆమెకు మరికొందరు స్త్రీలు  తోడయ్యారు. పెద్దా, చిన్నా, బీదా, గొప్పా తేడాలు  లేకుండా వచ్చారు. దుర్గ అందరినీ నడిపించింది. ప్రకాశం గారు రావటంతో అందరిలో ఉద్రేకం రెట్టింపయింది. ఊరేగింపులు  మొదయ్యాయి. పోలీసులకూ, లాఠీచార్జీకూ భయపడే వారెవరూ లేరు. శారద అంతా చూస్తూనే ఉంది. దూరంగా ఉండక తప్పలేదు. కాలేజీ మానేందుకు లేదు. పరీక్షలు  తరుముకొస్తున్నాయి.

శారద లోపల్నించి వస్తున్న ఆవేశాన్ని ఉద్రేకాన్ని అదుపు చేసుకోలేక సతమతమవుతోంది.

ఆసక్తి లేకుండానే ఆస్పత్రికి కాలేజీకి వెళ్ళివస్తోంది. ఆ రోజు శారదకు ఏదో జరుగుతుందనిపించింది. తన జీవితంలో ఏదో చిన్న మార్పయినా రావానీ వస్తుందనీ అనిపించింది.

ఉద్వేగాన్ని అణుచుకుంటూ ఆస్పత్రికి నడుస్తోంది.

ఎదురుగా గుంపుగా యువకులు నినాదాలు  చేసుకుంటూ వస్తున్నారు. శారద ఉత్సాహంగా వారివైపు నడుస్తోంది. అందులో శారద మిత్రులు కూడా ఉన్నారు. సుదర్శనాన్ని దూరం నుంచే పోల్చుకుంది. అతను చదువు పూర్తిచేసి పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. శారదకు మంచి మిత్రుడు. వాళ్ళ నినాదాలు  విని జనం కూడా వస్తున్నారు. ఇంతలో వాళ్ళను తరుముతున్నట్లే వెనుకనుంచి పోలీసులు  వచ్చి పడ్డారు. గుంపు చెల్లాచెదరయింది. కొందరు పారిపోయారు. కొందరు అలాగే నినాదాలిస్తూ నిలబడిపోయారు. పోలీసు లాఠీలు  పైకిలేచాయి. యువకుల శరీరాల మీద అవి విరుగుతున్నాయి. శారద పరిగెత్తుతూ అక్కడికి వెళ్ళేసరికి కిందపడిన యువకులను ఒదిలి కొందరిని అరెస్టు చేశామని తీసుకెళ్ళారు పోలీసులు. రక్తసిక్తమైన బట్టలతో దెబ్బలతో నేలమీద పడి ఉన్నారు నలుగురు. శారద వాళ్ళను ఒక్కొక్కరినే లేపి పక్కనున్న చెట్టు కిందికి చేర్చింది. అందులో సుదర్శనం ఉన్నాడు. అందరికంటే అతనికే ఎక్కువ దెబ్బలు  తగిలాయి.

‘‘మీరు శారద కదా’’ అన్నాడు వారిలో ఒక యువకుడు.

‘‘ఔను. మీకెలా తెలుసు?’’

‘‘చాన్నాళ్ళక్రితం గాంధీగారి మీటింగులో చూశాను. ఆ రోజు సభలో గాంధీ గారెంత ఆకర్షణో మీరూ అంత ఆకర్షణ’’

నొప్పిలో కూడా అతని కళ్ళు నవ్వుతున్నాయి.

శారద గంభీరమైపోయింది.

‘‘బాధ్యతగ పనులు  చేస్తూ మీరలా మాట్లాడకూడదు. మీరిక్కడే కూచోండి. నేను టాక్సీ దొరుకుతుందేమో తీసుకొస్తాను. హాస్పిటల్‌కి తీసుకెళ్తాను’’ అంటూ టాక్సీ కోసం వెళ్ళింది.

పదిహేను నిమిషాపైనే పట్టింది శారద టాక్సీలో వచ్చేసరికి. అందరినీ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. ముగ్గురికి చిన్నదెబ్బలే ప్రమాదం లేదని కట్టు కట్టి మందులిచ్చి పంపారు.

సుదర్శనానికి తలమీద పెద్ద దెబ్బ తాకింది. ఒకటి రెండు రోజులు  ఆస్పత్రిలో ఉంటే మంచిదన్నారు.

శారద సుదర్శనాన్ని ఆస్పత్రిలో చేర్పించి, అతనికి కావలసిన ఏర్పాట్లు చూసి ఆ తర్వాత క్లాసుకి వెళ్ళింది. అప్పటికే ఒక క్లాసు అయిపోయింది. అప్పుడు అందరిముందూ క్షమాపణ చెప్పటం కంటే ముందే వెళ్ళి వివరిస్తే మంచిదనుకుంది శారద.

శారదను చూడగానే ఆ తెల్ల ప్రొఫెసర్‌ ముఖం ఎర్రబడిరది.

‘‘మీ ఇండియన్స్‌కి అసలు బుద్ధిరాదు’’ అంటూ మొదలుపెట్టాడు.

శారద జేవురించిన ముఖంతో ‘‘ఔను సరే మా ఇండియన్స్‌కి బుద్ధిలేదు. ఉంటే బ్రిటీష్‌వాళ్ళు మమ్మల్ని పరిపాలించగలిగేవారా? బుద్ధి రావటం కూడా కష్టమే. వచ్చేది ఉంటే మిమ్మల్ని సహిస్తూ కూచుంటామా?’’

ఆ ప్రొఫెసర్‌కి కోపం కట్టు తెంచుకుంది.

‘‘ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?’’

‘‘తెలుసు సర్‌ ` ఒక బ్రిటీష్‌ ప్రొఫెసర్‌తో మాట్లాడుతున్నాను. విద్యార్థి క్లాస్‌కి రాలేకపోతే కారణం ఏమిటని అడిగి తెలుసుకోవానే అవసరం ఉందనుకోని అహంకారపు బ్రిటీష్‌ ప్రొఫెసర్‌తోటి. నేను మీ క్లాసుకి రాకపోవటానికి కారణం అనాగరికమైన మీ పోలీసు వ్యవస్థ సర్‌’’

‘‘వాట్‌’’

‘‘ఔను. వందేమాతరం అన్నందుకు లాఠీలు విరిగేలా, యువకుల తలలు బద్దలయ్యేలా కొట్టమని ఆదేశించిన అనాగరిక బ్రిటీష్‌ పోలీసులు .  చెప్పండి సర్‌ . అది అనాగరికత కాకపోతే మరేమిటి? మమ్మల్ని అనాగరికులని హేళన చేస్తారే. మీ నాగరికత ఏమిటి సర్‌. అమాయకు ప్రాణాలు  తియ్యటమేనా? అది ఆటవికం సర్‌ ’’

‘‘మిస్‌. శారదా ` వాట్‌ హాపెన్‌డ్‌ ?టెల్‌ మి ఎవ్రీథింగ్‌’’.

శారద అంతా వివరించి చెప్పిన తీరుకి ఆ ప్రొఫెసర్‌ చల్లబడ్డాడు. ఆయన కూడా వచ్చి సుదర్శనాన్ని చూశాడు. పోలీసుల తరపున ఆయన క్షమాపణ చెబుతానన్నాడు. శారదను మెచ్చుకుని వెళ్ళాడు.

olga

‘‘మంచి సివిలైజ్‌డ్‌ మాన్‌’’ అన్నాడు సుదర్శన్‌.

శారద తేలికగా నవ్వేసింది.

‘‘ఇంతమాత్రం నాగరీకంగా ఉండటం కష్టమేమీ కాదు. నేనీయనను ఒదలబోవటం లేదు. జరిగినది, జరుగుతున్నదీ అన్యాయమని ఈయన గారి చేత ప్రభుత్వానికి లేఖ రాయిస్తాను. దానికేమంటాడో దాన్ని బట్టి తెలుస్తుంది ఈయనెంత నాగరీకుడో ` ఇంక నేను వెళ్తాను’’ శారద కూడా బాగా అలిసిపోయింది.

‘‘చాలా సహాయం చేశావు శారదా. మళ్ళీ కనపడతావుగా’’

‘‘ఎందుకు కనపడను? రాత్రికి భోజనం తెస్తాను. నువ్వీ ఆస్పత్రిలో ఉన్నంతవరకూ నా అతిథివి. రోజూ కనబడతాను’’.

‘‘ధన్యుడిని. ధన్యవాదాలు’’.

‘‘ధన్యవాదాలు చెప్పాల్సింది నేను. మిమ్మల్నందరినీ ఇక్కడికి తెచ్చినపుడు నాకు మంచి ఆలోచన వచ్చింది. ఇక్కడి మెడికల్‌ విద్యార్థులను ఒక గ్రూపుగా చేసి సత్యాగ్రహులకు ప్రథమ చికిత్స నుంచీ అవసరమైన సేవలూ  చికిత్సలూ చేయటానికి పంపాలనుకుంటున్నాం. సాయంత్రం ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. వస్తాను’’.

వెళ్తున్న శారదను మెచ్చుకోలుగా చూస్తూ ఉండిపోయాడు సుదర్శనం.

సత్యాగ్రహం తీవ్రంగానే నడుస్తోంది. దుర్గ మద్రాసంతా తానై తిరుగుతోంది. దుర్గను అరెస్టు చేశారనే పుకార్లు ప్రబలుతున్నాయి. శారద అతి ప్రయత్నం మీద దుర్గను కలిసి తను తయారుచేసిన వైద్యుల బృందాన్ని పరిచయం చేసింది. దుర్గను చూస్తే ఒక శక్తిని చూసినట్లే అనిపించింది వారికి. పూర్వపు దుర్గకూ ఇప్పటి దుర్గకూ పోలికే లేదు. ఓర్పుగా భర్తకు సేవ చేసే దుర్గ ఇపుడు ఉత్సాహం, ఉద్రేకం, ఆవేశం, ఆలోచన అన్నీ ఒకచోటకు చేరి మానవహారం దాల్చిన మహా చైతన్యంలాగ ఉంది. శారదకు అన్నీ ఒదిలేసి దుర్గతోపాటు ఉండిపోవాలనిపించింది.

సత్యాగ్రహులు ,దెబ్బలు  తిన్నవారు శారద బృందం దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ దెబ్బలు  చూస్తుంటే శారద గుండె మండిపోతోంది. వాళ్ళకా దెబ్బలు  తగలకుండా చూసే అవకాశం లేదు. దెబ్బలు తగిలాక వైద్యం చెయ్యాలి.

కొన్నాళ్ళకు దుర్గ కనబడటం మానేసింది. అరెస్టు చేశారనీ, తప్పించుకు తిరుగుతోందనే, ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమవుతోందనే వార్తలు  వస్తున్నాయి.

సుదర్శనం పత్రికలో ఉద్రేకపూరితమైన వ్యాసాలు  రాస్తున్నాడు. మూర్తి సత్యాగ్రహులలో ఒకడిగా వెళ్ళి దెబ్బలు  తిని పడి ఉన్నాడు. రామకృష్ణ, మిగిలిన విద్యార్థి మిత్రులంతా తమ తమ ఊళ్ళకు తరలివెళ్ళి అక్కడ సత్యాగ్రహం జరిగేలా ఉద్యమించారు.

శారద క్షణం తీరిక లేకుండా పనిచేస్తోంది.

రైల్వే కార్మికులు సమ్మెకు దిగుతున్నారని సుదర్శనం చెబితే ఆ నాయకులను కలిసి వచ్చింది.

ఎన్ని చేస్తున్నా అసంతృప్తే. తను సత్యాగ్రహం చెయ్యలేదు. అరెస్టు కాకూడదు. చదువుకు అంతరాయం కలగకూడదు. ఎందుకు తనీ చదువుకు బందీ అయింది? దుర్గ కూడా చదువు మానవద్దంటుంది. దేశం ఇలా మండుతుంటే ఆ జ్వాలల్లో దూకకుండా, పుస్తకాలు  కట్టకట్టి ఆ మంటల్లో పారెయ్యకుండా చదవటం దుర్భరంగా ఉంది శారదకు.

క్రమంగా ఉద్యమం ఊపు తగ్గుతోంది. అరెస్టు, అరెస్టు, జైళ్ళు నిండిపోతున్నాయి.

దుర్గాబాయి, అన్నపూర్ణా వెల్లూరు  జైల్లో  ఉన్నారని కచ్చితమైన సమాచారం వచ్చింది.

శారదకు వెళ్ళి వాళ్ళిద్దరినీ చూసి అభినందించి రావాలనే కోరిక పుట్టి అది మహోధృతమైంది.

కానీ వాళ్ళతో ఏ బంధుత్వమూ లేదు. అనుమతి ఎలా దొరుకుతుంది వారిని చూడటానికి.

వెల్లూరు  వెళ్ళొచ్చు. అక్కడ మెడికల్‌ కాలేజీలో స్నేహితులను కలవొచ్చు. కానీ జైలుకి ఎవరు రానిస్తారు?

ఒక ప్రయత్నం చేసి చూద్దామనుకుంది. సత్యాగ్రహుల మీద పోలీసు చర్యను అన్యాయమన్న ప్రొఫెసర్‌ తనకీ విషయంలో సహాయ పడగలడేమో ఒక రాయి వేసి చూద్దామనుకుంది.

అన్నపూర్ణకూ, తనకూ చిన్ననాటి నుంచీ ఉన్న స్నేహాన్ని వర్ణించి చెప్పి ఆయనలో సానుభూతి రేకెత్తించింది.

ఆయన ఆలోచించి తప్పక సహాయపడతానన్నాడు. సహాయం చేశాడు కూడా. ఆ ప్రొఫెసర్‌ అన్నగారు వెల్లూరు ఆసుపత్రిలో డాక్టరు. వెల్లూరు  జైలు  అధికారికి మంచి స్నేహితుడు.

అతన్నించి ఉత్తరం ఒకటి శారదకు ఇప్పించాడు. శారద ఆఘమేఘాల మీద వెల్లూరు  వెళ్లింది.

జైలు  అధికారి ఉత్తరం చూసి కూడా సందేహంలో పడ్డాడు. శారద జైల్లోని వాళ్ళకు ఏదైనా సమాచారం తెచ్చిందా అనేది అతని సందేహం.

శారద పదే పదే అభ్యర్థిస్తుంటే చివరకు కాదనలేకపోయాడు.

ఖైదీలు బంధువులని  కలుసుకునే గదిలో ఆరాటంగా కూచుంది శారద. ముందుగా ఎవరొస్తారు? దుర్గా ? అన్నపూర్ణా ? ఎలా ఉన్నారో ? ఏమంటారో?ప్రతిక్షణం నిదానంగా గడుస్తోంది. చివరికి అన్నపూర్ణ వచ్చింది.

శారద లేచి కౌగిలించుకుంది. ఇద్దరి కళ్ళల్లో నీళ్ళు.

olga title

అన్నపూర్ణ బాగా చిక్కిపోయింది. సన్నటి శరీరంలో ఎత్తుగా ఉన్న పొట్ట. శారద అవునా అన్నట్టు చూసింది.

ఔనన్నట్టు నవ్వింది అన్నపూర్ణ.

‘‘జైల్లో పుడుతుందా నీ కూతురు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు’’.

‘‘నీరసం లేదు. ఏం లేదు. మన వాళ్ళంతా నాకు ఎక్కడెక్కడి నుంచో మంచి తిండి తెచ్చి మెక్కబెడుతున్నారు. మొన్ననే నా సీమంతం కూడా చేశారు’’ దర్జాగా చెప్పింది అన్నపూర్ణ.

‘‘సీమంతమా?’’

‘‘ఔను. దుర్గ ఉందిగా. ఊరుకుంటుందా? ఎంత హడావుడీ చేసిందనీ! అందరూ తలా రూపాయి, అర్దా వేసుకున్నారు. పూలు , పళ్ళూ తెప్పించారు. దానికి వార్డెన్‌ని ఎలా ఒప్పించిందో దుర్గకే తెలియాలి. తనే నాకు పూలజడ వేసింది. పాటలు , నృత్యాలు  ఒకటి కాదనుకో. సందడే సందడి. ఇంటి దగ్గరుంటే మీ అన్నగారు సీమంతమా గాడిదగుడ్డా అని తీసి పారేసేవారు. ఇక్కడ నాకు జరగని ముచ్చట లేదనుకో’’.

అన్నపూర్ణ జైలు  జీవితమంతా శారదకు చెబుతుంటే కాలం తెలియలేదు.’’

‘‘అసలు  దుర్గను జైల్లో  చూడాలి. శిక్ష అనుభవిస్తున్నానన్న స్పృహే లేదు. ఏదో సంబరంలో పాల్గొనటానికి వచ్చినట్లుంది. మేమంతా అప్పుడప్పుడు ఇంటి గురించి బెంగపడుతుంటాం. దుర్గ వచ్చి ఏదో ఒకటి చేసి బెంగ పోగొడుతుంది’’.

శారద తను తయారు చేసిన విద్యార్థుల గ్రూపు గురించి చెప్పింది.

‘‘ఇప్పుడు మాకంత పని లేదు. ఉద్యమం చల్లారుతోంది క్రమంగా. ఎందుకో తెలియటం లేదు. ఇపుడు నాకు రైల్వే కార్మికుల సమ్మె గురించే ఆశ ` అన్నపూర్ణా ఆ కార్మికులను చూస్తుంటే గుండె నీరయిపోయిందే . ఎంత దరిద్రం, దైన్యం’’

శారద మద్రాసు విశేషాలు  చెబుతుండగా సమయం దాటిపోయిందని అన్నపూర్ణకు పిలుపు వచ్చింది. అన్నపూర్ణ వెళ్ళిపోయింది.

జరిగిందంతా కలా నిజమా అనుకుంటూ మద్రాసు వచ్చేసింది శారద.

*

గాంధీ – ఇర్విన్‌ ఒడంబడిక గురించి పేపర్లన్నింటిలో ప్రముఖంగా వచ్చింది. చేసిన సత్యాగ్రహానికి, త్యాగాలకూ, చిందిన రక్తానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని యువతరం ఆవేశపడుతున్నపుడే భగత్‌సింగ్‌ని, అతని సహచరులను ఉరి తీశారు.

శారద ఆ వార్త విని అచేతనంగా ఉండిపోయింది చాలాసేపు.

సుదర్శనం చాలా ఆందోళనతో వచ్చాడు శారద దగ్గరకు.

ఇద్దరూ కలిసి మైలాపూర్‌ సముద్ర తీరంలో చాలాసేపు మాటలు  లేకుండా కూర్చుండి పోయారు.

సుదర్శనం ముఖం, శరీరం అంతా చెమటతో తడిసిపోయింది.

‘‘కాసేపు సముద్రంలో ఈతకొట్టి రా సుదర్శనం. చల్లబడతావు’’ అంది శారద అతని ఉద్రేకాన్ని చూసి నవ్వుతూ.

‘‘నీకు నవ్వెలా వస్తోంది శారదా. భగత్‌సింగ్‌ని తల్చుకుంటే నాకు దు:ఖం ఆగటం లేదు. ఇంత అన్యాయమా?’’ సుదర్శనం ఏడ్చేశాడు.

‘‘ఈ దేశంలో అన్యాయం లేనిదెక్కడో చెప్పు. అన్యాయాన్ని సహించటం అలవాటు చేసేశారు’’.

‘‘కానీ శారదా, గాంధీ ఎలా దీనిని చూస్తూ ఊరుకున్నారు? ఆపటానికి ఎందుకు ప్రయత్నించలేదు? నాకు గాంధీ మీద విశ్వాసం పోయింది. చాలా కోపంగా ఉంది.’’

‘‘ఒద్దు సుదర్శనం.  విశ్వాసాన్ని పోగొట్టుకోకు. ఇవాళ దేశానికి గాంధీ మాత్రమే ఆశాకిరణంలా ఉన్నారు. ఆయనని కూడా నమ్మకపోతే మనం బతకలేం’’.

‘కానీ ఆయనేం చేశాడు ` వైస్రాయితో జరిపిన చర్చల్లో భగత్‌సింగ్‌ ఉరిని ఆపాలనేది ఒక షరతుగా ఎందుకు పెట్టలేదు’’ తీవ్రత ఆగటం లేదు సుదర్శనం కంఠంలో.

‘‘ఏమో? ఎందుకు పెట్టలేదో? నమ్ము. సకారణంగానే గాంధీ అలా చేశారని నమ్ము. ఆ మాత్రం నమ్మకం లేకపోతే శాంతి ఉండదు. బతకటం కష్టమైపోతుంది. నేను విశ్వసిస్తున్నాను. నీకూ చెబుతాను నా విశ్వాసానికి కారణాలను. కారణాలతో పనిలేకుండా లక్షలమంది విశ్వసిస్తున్నారు గాంధీని. ఆ ఆధారాన్ని ఒదలొద్దు’’ సుదర్శనం భుజం మీద చేయి వేసింది శారద.

‘‘కానీ శారదా! భగత్‌సింగ్‌ ఎంత ధైర్యంగా ఉరికంబమెక్కారో తెలుసా? తృణప్రాయంగా చూశాడు ప్రాణాన్ని. పాట పాడుతూ ఉరికంబం ఎక్కాడు’’ సుదర్శనానికి దు:ఖం ఆగటం లేదు. వెక్కి వెక్కి ఏడ్చాడు.

శారద కళ్ళనుంచి నీళ్ళు కారుతున్నా అవి వెలుగుతున్న ప్రమిదల్లా కాంతిని విరజిమ్ముతున్నాయి.

‘‘సుదర్శనం. అంత బేలగా అయిపోకూడదు నువ్వు. భగత్‌సింగ్‌ మరణించాడని నువ్వు ఏడుస్తున్నావు. కానీ అతనికి తెలుసు తనకు మరణమన్నదే లేదని. అతనికి చాలా ముందు చూపు. అతనికి తెలుసు క్షలాది యువతీ యువకుల మనసుల్లో చిరకాలం తాను జీవించబోతున్నానని. అందుకే ఆయనకంత ఉత్సాహం ఉరికంబం దగ్గర. అమృతం తాగాడాయన ఆ క్షణంలో. భగత్‌సింగ్‌ చనిపోయాడని ఎందుకనుకుంటున్నావు? ఎలా అనుకుంటున్నావు? నీకు ఆయన ఎన్నడైనా కనిపించాడా? ఒక్కసారైనా చూశావా? అతనొక వెలుగు. అతనొక మార్గం. ఎప్పటికీ అలాగే ఉంటాడు. ఎవరిమీదనైనా మనకి విశ్వాసం పోతుందేమో. కానీ భగత్‌సింగ్‌ మన విశ్వాసాన్ని ఎన్నడూ పోగొట్టుకోడు. ఉజ్జ్వలంగా గా జీవిస్తూ, శ్వాసిస్తూ, మన రక్తంలో ప్రవహిస్తూ ఉంటాడు.’’

శారద మాటలు సుదర్శనం దు:ఖాన్ని పోగొట్టి అతనిలో కొత్త చైతన్యాన్ని నింపాయి. శారదలో ఉన్న శక్తి అదే . శారద చుట్టూ చేరే యువకులూ  విద్యార్థులు  తమ తమ నిరాశా నిస్పృహలను పోగొట్టుకునేది ఈ విధంగానే.

బలహీనంగా శారద దగ్గరకు వచ్చిన సుదర్శన్‌ కొత్త బలంతో అక్కడినుంచి బయల్దేరాడు.

‘‘మూర్తిని చూశావా? దెబ్బలు  బాగానే తగిలాయి’’ అన్నాడు వెళ్ళబోతూ.

‘‘చూడలేదు. వాళ్ళు నాకు తెలియదు’’ అంది శారద నిర్లిప్తంగా.

‘‘నేనిప్పుడు అక్కడికే వెళ్దామనుకుంటున్నా. నువ్వూ రాకూడదు?’’

శారద రెండు నిమిషాలు  తటపటాయించింది. వెళ్తేనే మంచిది. మూర్తిని ఆ ఇంట్లో భార్యా పిల్లల  మధ్య చూస్తే తన మనసు ప్రశాంతం కావచ్చు.

‘‘నేను వస్తాను. ముందు మా ఇంటికి వెళ్ళి వెళ్దాం’’. ఇద్దరూ శారద ఇల్లు చేరారు.

శారద లోపలికి వెళ్ళి తల్లితో చెప్పి చీరె మార్చుకుని వచ్చింది.

వీళ్ళిద్దరూ ట్రిప్లికేన్‌లో ఉన్న మూర్తి ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రమయింది. బస్సు, ట్రాము ఒక పట్టాన దొరకలేదు.

వీళ్ళిద్దరినీ ఆహ్వానించిన మూర్తి భార్య లక్ష్మిని చూస్తే శారదకు ఏదో జాలి పొంగుకొచ్చింది.

లక్ష్మి వీళ్ళిద్దరినీ మూర్తి పడుకుని ఉన్న గదిలోకి తీసికెళ్ళింది.

విశామైన గది. గాలీ వెలుతురు వచ్చేగది.

మూర్తి మధ్యాహ్నపు నిద్రనుండి అపుడే లేచినట్లున్నాడు. చాలా బలహీనంగా అనిపించాడు.

‘‘నా భార్య లక్ష్మి’’

‘‘పరిచయం అయింది’’ ప్రశాంతంగా నవ్వింది శారద.

సుదర్శనం కుశల ప్రశ్నలు అడుగుతుంటే శారద నాడి చూసి, కళ్ళూ నాలుకా పరీక్షించింది.

లక్ష్మి వంక తిరిగి ‘‘రక్తం బాగా పోయినట్లుంది. పాలు రెండు పూటలా ఇవ్వండి. వేరుశనగపప్పు, బెల్లం కలిపి ఉండలు చేసిపెట్టండి. అంతా బాగుంది. కంగారుపడాల్సిందేమీ లేదు’’ అని ధైర్యం చెప్తున్నట్లు అన్నది.

‘‘భగత్‌సింగ్‌ని ఉరి తీశారని విని తట్టుకోలేక శారద దగ్గరకు వెళ్ళాను. శారద మాటతో కాస్త ఊరట కలిగింది. ఇద్దరం నిన్ను చూడాలని ఇక్కడకు వచ్చాం’’.

‘‘మంచిపని చేశారు. భగత్‌సింగ్‌ ఉరితో భారత ప్రజలకు బ్రిటీష్‌ ప్రభుత్వం మీద అసహ్యం, కోపం మరింత పెరుగుతాయి.’’

‘‘కానీ గాంధి ఈ ఉరిని ఆపొచ్చుగదా ` శారద ఎంత చెప్పినా నాకు గాంధీ మీద ఈ విషయంలో కోపంగానే ఉంది’’.

‘‘లేదు సుదర్శనం. గాంధీనే కాదు. ఎవరూ ఆపలేరు భగత్‌సింగ్‌ మరణాన్ని. అతను దేశ స్వాతంత్రానికి తన జీవితాన్ని కానుక చేయదల్చుకున్నాడు. అది గాంధీకి అర్థమైందేమో’’.

‘‘అంటే `’’ సుదర్శనే అసహనంగా అన్నాడు.

‘‘అంతే. భగత్‌సింగ్‌ మార్గం, గాంధీ మార్గం పూర్తిగా భిన్నం. ఆ భిన్నత్వాన్ని అంగీకరించాడు గాంధి. భగత్‌సింగ్‌ దేశంలోని యువతరానికి సాహసం నేర్పదల్చుకున్నాడు. భగత్‌సింగ్‌ బ్రిటీష్‌ వాళ్ళను క్షమాపణ అడుగుతాడా? తాను చేసింది ఇంకో పదిసార్లయినా అవకాశం వస్తే అలాగే చేస్తానంటాడు. చెరసాలనూ, ఉరికొయ్యనూ, ప్రాణత్యాగాలనూ లెక్కచెయ్యని సాహసం భగత్‌సింగ్‌ది, అతని సహచరులది. ఆ సాహసం రగిలించాడు భగత్‌సింగ్‌. యువతరంలో  ఆ యువతీ యువకుల సాహసం, దీక్ష కావాలి గాంధికి. ఆ సాహసాన్ని ఆయన మరో మార్గంలో నడిపిస్తాడు. ఆ మార్గంలో నిత్యం ప్రయాణించే సాహస యాత్రికులను భగత్‌సింగ్‌ మన జాతికి అందించాడు’’ శారద తన ఆలోచనకు మరింత స్పష్టమైన రూపాన్నిచ్చి చెప్తున్న మూర్తివంక అలాగే చూస్తుండి పోయింది.

సుదర్శనం మరింత అసహనంగా లేచి నిబడ్డాడు.

‘‘అంటే ఇది రాజకీయ ఎత్తుగడా? ` ’’

‘‘కావొచ్చు. కాకపోవచ్చు ` ’’ అన్నాడు మూర్తి.

శారద కాస్త గట్టిగా చెప్పింది.

‘‘కాదు,కానే కాదు. గాంధి ఏం చెయ్యాలని నీవనుకుంటున్నావు సుదర్శనం? భగత్‌సింగ్‌ని ఉరి తీయొద్దని, క్షమించమని అడగటమంటే అతని మార్గం నుంచి అతన్ని దారి మళ్ళించటమే. గాంధీ ఇతరుల విశ్వాసాను గౌరవిస్తాడు. ఈ సంఘటనను మనం మామూలు దృష్టితో, బాధతో, మమకారంతో అర్థం చేసుకోకూడదు. చాలా ఉన్నతం భగత్‌సింగ్‌ ప్రాణత్యాగం. గాంధీనో, మరొకరో రక్షిస్తే జీవించి, లేకపోతే మరణించేంత స్వల్ప ప్రాణం కాదు భగత్‌సింగ్‌ది. ఆయన లక్ష్యం వేరు. భగత్‌సింగ్‌ మరణించాడని నువ్వంటున్నావు. అతనికి మరణమే లేదని నేనంటున్నాను. యువకుల మనసు మీద భగత్‌సింగ్‌ వేసిన ముద్ర ముందు గాంధీ చాలడు. అది ఇవాళ కాదు . ముందు ముందు ఇంకా బాగా తెలుస్తుంది’’.

‘‘ఔను సుదర్శనం. నా అభిప్రాయం కూడా అదే . శారదా నేనూ ఒక్కలాగే ఆలోచిస్తాం. కదూ శారదా’’.

శారదకు ఒక్కసారి పట్టరాని దు:ఖం వచ్చింది. దానిని నిగ్రహించుకుని పేలవంగా నవ్వింది.

లక్ష్మి ఫలహారాలేవో తీసుకొచ్చింది. లక్ష్మితో పాటు రెండేళ్ళ వయసున్న చిన్న పిల్లవాడు కూడా వచ్చాడు.

‘‘మా అబ్బాయి’’ అంది లక్ష్మి.

‘‘వాడి పేరు మీ నాన్నగారి పేరే , రామారావు’’ మూర్తి శారద కళ్ళల్లోకి చూసే ప్రయత్నం చేశాడు.

శారద పిల్లవాడిని దగ్గరకు తీసుకుంది. ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల మీద ముద్దు పెట్టింది.

సుదర్శనం తను పనిచేస్తున్న పత్రిక విశేషాలేవో చెబుతూ కూచున్నాడు.

‘‘ఆలస్యం అవుతోంది. వెళ్దామా’’ అని లేచింది శారద.

లక్ష్మి శారదకు బొట్టుపెట్టి తాంబూంలం ఇచ్చింది.

ఆ రాత్రి శారద మనసు ప్రశాంతమైంది. మూర్తి మంచి స్నేహితుడు. అంతేనని ఆమె మనసుని స్థిరం చేసుకుంది.

‘‘మూర్తి మగవాడు కాకపోతే ఎలా అరమరికలు  లేకుండా స్నేహం చేసేదో అలాగే చెయ్యాలి. మూర్తి ఈ స్నేహాన్ని ప్రేమ అనుకుంటున్నాడు. స్త్రీ పురుషుల మధ్య స్నేహం కొత్తగా ఏర్పడుతోంది. బహుశ ఆ స్నేహాన్ని తనలాగా ఆస్వాదిస్తున్న స్త్రీ ఆంధ్రదేశంలో యింకొకరు లేరేమో. తనకు మగ స్నేహితులే చుట్టూ . వాళ్ళతో చాలా స్వేచ్ఛగా మాట్లాడుతోంది. వాళ్ళ భుజాల మీద చేతులు వేస్తుంది. వాళ్ళు నిరాశతో ఏడుస్తుంటే తల నిమిరి బుజ్జగిస్తుంది. వాళ్ళెవరూ దానిని వేరే రకంగా తీసుకోలేదు. కొందరు అక్కా అని బాంధవ్యం కలుపుకున్నా స్నేహంగానే చూసేవారు చాలామందే ఉన్నారు. బహుశ మూర్తి ఈ స్నేహం ప్రేమగా అనుకుంటున్నాడేమో. సుదర్శనంతో స్నేహానికి, మూర్తితో స్నేహానికి తేడా ఏమిటి? ఏమీ లేదు. సుదర్శనంతో కంటే మూర్తితో తన భావాలు  బాగా దగ్గరవుతాయి. తను సుదర్శనానికి బలం ఇవ్వగదు. మూర్తి తనకు బలం ఇవ్వగలడు. భావాలలో తనకంటె బలమైన పురుషుడిని మొదటిసారి చూసి తను కూడా కొంత సంచలనానికి, ఆకర్షణకు లోనయింది. అది ప్రేమ అనుకున్నది. తనలాంటి ఆధునిక స్త్రీని ఎన్నడూ చూడని మూర్తి తనని చూసి ఆకర్షితుడై ప్రేమిస్తున్నాననుకున్నాడు. కానీ ఇదంతా తాత్కాలికం. తమది స్నేహం.స్త్రీ పురుషుల మధ్య స్నేహం కుదురుతుంది. నాన్నకూ, హరిబాబాయికి ఉన్న స్నేహం లాంటిదే తమ స్నేహం.

శారదకు చలం గారి ‘శశిరేఖ’ పుస్తకం గుర్తొచ్చింది. స్నేహం, ప్రేమ మోహం వీటి గురించి గందరగోళ పడే కదా శశిరేఖ అంత ఘర్షణ పడిరది. తనకా గందరగోళం ఉండకూడదు `

శశిరేఖ గురించి కొత్తగా ఆలోచించటానికి చాలా ఉందనిపించింది. ఆ పుస్తకం తీసి చదువుతూ నిద్రపోయింది.

మరుసటి రోజు కాలేజీలో ఆస్పత్రిలో పనులన్నీ ముగిసాక ప్రొఫెసర్‌ దగ్గరకు వెళ్ళింది. స్త్రీ పురుష సంబంధాలను మానసిక శాస్త్ర రీత్యానూ, సామాజికంగానూ విశ్లేషణ చేసే పుస్తకాలేమైనా ఉన్నాయా అని అడిగింది. హెవలాక్‌ ఎల్లిస్‌ పుస్తకం చదివారా అని అడిగాడాయన. లేదంది. ‘‘నా దగ్గరుంది ఇస్తాను’’ అని తనతో పాటు శారదను ఇంటికి తీసికెళ్ళి ఆ పుస్తకం ఇచ్చి పంపాడు.

***

 

వద్దు వద్దు కోపము

 

అవినేని భాస్కర్ 

 

Avineni Bhaskarఅన్నిటికీ ఆంక్షలు పెడుతున్నాను అని కోపపడకు. నీ దారిన నిన్నొదిలేస్తున్నాను. నాకు ఇంకేం చెప్పకు. నేను విసిగిపోయాను. చాలు. నీకు ఇష్టమొచ్చినట్టు వెళ్ళు. నేను కన్నతల్లినైయుంటే నా మాట వినేవాడివి. నేను కేవలం వదినని.

నీ ఆశయాలకీ, ఆశలకీ ఏ నాడూ అడ్డు చెప్పినదాన్ని కాను. నిన్నెప్పుడు మనసు నొప్పించేలా పన్నెత్తు మాటయినా అనలేదు. అలా చూసుకున్నాను. అలాంటి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. అప్యాయతగా తిరిగే నువ్వు ఇప్పుడు దగ్గరే(గోరికెలన) ఉంటూ ముభావంగా, అంటీ ముట్టనట్టు, పరాయివాడిలా తిరుగుతుంటే చాలా మనోవ్యధకి లోనౌతున్నాను. ఎప్పట్లానే సహజంగా మెలగమని నిన్ను ప్రేమగా వేడుకుంటున్నాను.

 

నువ్వేంచెప్పినా కాదనలేదు, సణిగి విసుక్కోలేదు! అలాంటి నాతో మొండిగా విసురుగా ప్రవర్తిస్తున్నావు. నాకెలా ఉంటుంది చెప్పు? నేను కన్నీళ్ళతో సాధించేసుకుంటున్నాను అనుకోకు. నాకూ బాధ కలగడం నిజమే కానీ నేనేం ఏడవట్లేదు. చెంపలమీద చెమటకారితే తుడుచుకుంటున్నాను అంతే. ఏడవలేదన్నానుకదా నామాటలు అతిక్రమించవచ్చు అని భావించకు. కన్నతల్లికంటే ఎక్కువ ప్రేమతో పెంచాను. అసలు నిన్ను పంపలేను.

ఎప్పుడూ నిన్ను విడిచి దూరంగా ఉండెరగను. నీ మీద కోపంచూపించడమూ ఎరగను. నొచ్చుకొని దూరంగా వెళ్ళిపోయి ఈ తల్లికి వంచన చెయ్యాలని ఎలా అనుకున్నావు? నువ్వు మామూలు మానవ శిశువుకావు. ఆ తిరుమలగిరి వేంకటేశుడివి. పిల్లవాడివైనావుగనుక కల్లాకపటంలేక తల్లిప్రేమని కురిపించుతున్నానుగానీ (దేవుడినే ఆదుకున్నాను అన్న) గర్వంతోకాదని ప్రార్థిస్తున్నాను.

annamayya

AUDIO : వద్దు వద్దు కోపము (ఇక్కడ వినండి)

పల్లవి
వద్దు వద్దు కోపము వదినె నింతే నీకు
సుద్దులేల చెప్పేవు సొలసితి నిన్నునుచరణం 1
మారుకొన్న దానఁగాను మాటాడినదానఁగాను
యేరా నాతోనేల యెగ్గు పట్టేవు
గీరితి నింతే గోరకెలని పరాకు రాఁగా
కూరిమి నిట్టే వేఁడుకొనేను నిన్నుచరణం 2
గుంపించినదానఁ గాను గొణఁగిన దానఁగాను
తెంపున నేరా నన్ను దీకొనేవు
చెంపల చెమట జార చేఁతఁదుడిచితి నింతే
అంపలేను ఆయమంటి ఆదరించే నిన్నును

చరణం 3
పాసివున్నదానఁ గాను పదరినదానఁగాను
వేసరక నన్నునేల వెడ్డువెట్టేవు
ఆసల శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
మోసలేదు నీకునాకు మొక్కుమెచ్చే నిన్నును

 

తాత్పర్యం (Explanation) :
అన్నిటికీ ఆంక్షలు పెడుతున్నాను అని కోపపడకు. నీ దారిన నిన్నొదిలేస్తున్నాను. నాకు ఇంకేం చెప్పకు. నేను విసిగిపోయాను. చాలు. నీకు ఇష్టమొచ్చినట్టు వెళ్ళు. నేను కన్నతల్లినైయుంటే నా మాట వినేవాడివి. నేను కేవలం వదినని.

నీ ఆశయాలకీ, ఆశలకీ ఏ నాడూ అడ్డు చెప్పినదాన్ని కాను. నిన్నెప్పుడు మనసు నొప్పించేలా పన్నెత్తు మాటయినా అనలేదు. అలా చూసుకున్నాను. అలాంటి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. అప్యాయతగా తిరిగే నువ్వు ఇప్పుడు దగ్గరే(గోరికెలన) ఉంటూ ముభావంగా, అంటీ ముట్టనట్టు, పరాయివాడిలా తిరుగుతుంటే చాలా మనోవ్యధకి లోనౌతున్నాను. ఎప్పట్లానే సహజంగా మెలగమని నిన్ను ప్రేమగా వేడుకుంటున్నాను.

నువ్వేంచెప్పినా కాదనలేదు, సణిగి విసుక్కోలేదు! అలాంటి నాతో మొండిగా విసురుగా ప్రవర్తిస్తున్నావు. నాకెలా ఉంటుంది చెప్పు? నేను కన్నీళ్ళతో సాధించేసుకుంటున్నాను అనుకోకు. నాకూ బాధ కలగడం నిజమే కానీ నేనేం ఏడవట్లేదు. చెంపలమీద చెమటకారితే తుడుచుకుంటున్నాను అంతే. ఏడవలేదన్నానుకదా నామాటలు అతిక్రమించవచ్చు అని భావించకు. కన్నతల్లికంటే ఎక్కువ ప్రేమతో పెంచాను. అసలు నిన్ను పంపలేను.

ఎప్పుడూ నిన్ను విడిచి దూరంగా ఉండెరగను. నీ మీద కోపంచూపించడమూ ఎరగను. నొచ్చుకొని దూరంగా వెళ్ళిపోయి ఈ తల్లికి వంచన చెయ్యాలని ఎలా అనుకున్నావు? నువ్వు మామూలు మానవ శిశువుకావు. ఆ తిరుమలగిరి వేంకటేశుడివి. పిల్లవాడివైనావుగనుక కల్లాకపటంలేక తల్లిప్రేమని కురిపించుతున్నానుగానీ (దేవుడినే ఆదుకున్నాను అన్న) గర్వంతోకాదని ప్రార్థిస్తున్నాను.


కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :

సుద్దులు = మాటలు
సొలసితి = విసిగిపోతిని

 

మారుకొను = అడ్డగించు, ఎదిరించు, ఆపివేయు
ఎగ్గుపట్టు = తప్పుగా భావించు
గీరితిని = మూర్చపోతిని, సొమ్మసిల్లితిని
గోరకెలన = దరిదాపుల్లో, దగ్గర, సమీపాన
పరాకు = ఉదాసీనత, indifference

 

గుంపించు = అతిక్రమించు
గొణగు = సణుగుడు/సనుగుడు, మారుపలుకు
తెంపున = విసురుగా, rudeness
దీకొను = ఎదిరించు
అంపలేను = పంపలేను
ఆయమంటి = మనసులోచేరి
ఆదరించు = పోషించు, సాకు

పాసి = ఎడబాసి, దూరంగా, విడిచిపెట్టి
పదరు = ఆత్రపడు
వేసరక = నొచ్చుకోక
వెడ్డువెట్టేవు = వంచించేవు
మోసలేదు = కపటంలేదు
మొక్కుమెచ్చు = ప్రార్ధించి మెచ్చుకొను

 

అల్క మానవు గదా యికనైన…

మంజువాణి: ఒక వేశ్య

కొండిభొట్లు: తార్పుడుగాడు

భీమారావు పంతులు: విటుడు

(మంజువాణి తలదువ్వుకుంటూ కుర్చీపైని కూర్చుండును. కొండిభొట్లు ప్రవేశించును)

మంజు:  దండం శాస్తుల్లు గార్కి. వెంకీ, శాస్తుల్లు గార్ని కూర్చోబెట్టి పీట వెయ్యే!

కొండి:    సకలైశ్వర్య సిద్ధిరస్తు. పంతుళవారు పాదాక్రాంతాభవంతు….. ఆ తలవెండ్రుకలు సాక్షాత్తూ చమరీవాలాల్లాగా శోభిల్లుచున్నాయి. విన్నావా మంజువాణీ!

మంజు:  ఇంకా యేవి యెలా వున్నాయి?

కొండి:    యెదిన్ని వర్నించడానికి సెఖ్యం కాకుండా వున్నాయి… ముఖం చంద్రబింబంలా వున్నది. కళ్ళు కలవరేకుల్లా వున్నయి. గళం శంఖంలా వున్నది. బాహువులు లతల్లా వున్నయి. మరెవచ్చీ….

మంజు:  మరెవచ్చి అక్కడ ఆగండి.

కొండి:    మంజువాణీ! అధికం యేల? నీ సౌందర్యం రంభా ఊర్వశీ మేనకా తిలోత్తమాదుల్ను ధిక్కరించి వెక్కిరించి యున్నది.

మంజు:  మాపంతులుగారి వెధవ అప్పగారి సాటి యేమాత్రమయ్నా వస్తుందా?

కొండి:    హాశ్యానికైనా అనగూడని మాటలున్నాయి. (పొడుం పీల్చును)

మంజు:  చెయ్యగాలేంది చెప్పడమా తప్పొచ్చింది?

కొండి:    దేవతలు చేసే పనుల్ని, బ్రాహ్మలు చేసే పనుల్ని తప్పు పట్టకూడదు. స్వర్గంలో వాళ్ళు దేముళ్ళయితే, భూలోకంలో మేం దేముళ్ళము; అంచేతనే మమ్మల్ని భూసురులంటారు. చదువుకున్నదానివి నీకు తెలియందేమున్నది.

మంజు:  వెధవల్ని తరింపజేసే భూసురోత్తములకు నమస్కారము (నిలుచుని నుదుట చేతులు మొగిడ్చి నమస్కారము చేయును) (భీమారావుపంతులు ప్రవేశించును)

భీమా:   యేమిటీ నాటకం?

మంజు:  ముక్కోటి దేవతలు స్వర్గంలో వుంటే, భూమ్మీద దేవతలు బ్రాహ్మణులని కొండిభొట్లు గారు శలవిచ్చారు. అందుచేత వేశ్య యింటికి అనుగ్రహించి వేంచేస్ని భూసురోత్తముల్ని కొలుస్తున్నాను.

భీమా:   నీవు యెంత యెకసెక్యం చేసినా మేం దేవతలమే, అందుకు రవ్వంతైనా సందేహము లేదు.

మంజు:  భూలోకంలో కృష్ణావతారం లాంటి రసికులు మీరు. కృష్ణావతారం కుదిరింది; కాని శాస్తుల్లు గారు యే దేముడి అవతారమో పోల్చలేకుండా వున్నాను.

భీమా:   పట్టణం వెళ్ళినప్పుడు నేను పరంగీ స్త్రీల సహవాసం చేశానని నీకు చాడీలు చెప్పారు గనుక శాస్తుల్లు గారు సాక్షాత్తూ నారదావతారం.

మంజు:  అన్నా! మరచిపోయినాను. యెంత బుద్ధి తక్కువ మనిషిని; దూరముగా నిలుచొండి. ప్రాయచ్చిత్తం చేసుకొంటేనేగాని దగ్గరకు రానియ్యను.

భీమా:   శాస్త్రుల్లుగారూ! యేమిటండి ప్రాయచ్చిత్తం? నకక్షతమా, దంతక్షతమా?

కొండి:    అది యెంత అదృష్టవంతులకుగాని సంప్రాప్తమవుతుంది. ముక్కుతిమ్మన్న యేమన్నాడు.

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా

చిన అదినాకు మన్ననయ; చెల్వగు నీ పద పల్లవంబు మ

త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే

ననియెద; అల్క మానవు గదా యికనైన అరాళకుంతలా

స్వేతముఖులు గనుక బ్రాహ్మడికి రజతదానం చేస్తే ప్రత్యువాయం పోతుంది. మాకుర్రవాడు మెటిక్లేషను పరీక్షకు కట్టాలి. యీబీదబ్రాహ్మడికి దానం యిస్తే సమయానికి పనికి వస్తుంది.

మంజు:  నిత్య సువాసినికి సువర్నదానం చెయ్యమని లేదా?

భీమా:   (తనలో) దీని తస్సాగొయ్యా! బంగారపు సరకును మళ్ళీ తెమ్మంటుంది కాబోలు. (పైకి) తొందరపని వుంది. యిప్పుడే వెళ్ళి వస్తాను. (వెళ్లిపోవును)

కొండి:    మంజువాణి! బహు పుణ్యాత్మురాలివి, యేమైనా సాయం చేస్తేనే గాని కుర్రవాడు పరీక్షకు వెళ్ళే సాధనం కనబడదు.

మంజు:  పంతులుగారి అప్పని అడుగరాదా?

కొండి:    యెవర్నీ అడక్కుండా యేమయింది. వైదీకపాళ్ళని పుట్టించినప్పుడే బ్రహ్మ రాసిపడేశాడు. “ముష్టెత్తుకొండర్రా” అని.

మంజు:  యేది యిందాకటి పద్యం చదవండీ.

కొండి:    (రాగవరసను చదువును) నను భవదీయ…. (అలా చదువుతుండగా వెనకవైపు వచ్చి మంజువాణి శాస్తులు వీపు మీద తన్నును) ఓస్నీ అమ్మా శిఖా… (అని, తగ్గి) ఆహా! మల్లిపువ్వుల గుత్తా? పట్టుకుచ్చా? మలయమారుతమా వీపు తాకినది?

మంజు:  సానిదాని కాలు.

కొండి:    కాదు, కాదు, మన్మథుని వాడి వాలు.

మంజు:  ప్రాస కుదిరింది కాని, శాస్తుల్లు గారు! యీ తాపు మదనశాస్త్రంలో క్రియక్రింద పరిగణన మవుతుందా, భూసురోత్తములను తన్నిన పాపం క్రింద పరిగణనమవుతుందా?

కొండి:    పదిరూపాయలు పారేస్తే పుణ్యం కింద పరిణామం అవుతుంది.

మంజు:  పాటుపడక పైసా రాదు.

కొండి:    మంజువాణి! యెంత చదువుకున్నా మావంటి వాళ్ళం నీకు వక్క మాటకు సదుత్తరం చెప్పగలమా? బాపనాళ్ళని కనికరించి, ఒక డబ్బు సొమ్ము యివ్వాలి గాని.

మంజు:  వేశ్యల ద్రవ్యం పాపిష్టిది. బేరం తెచ్చి రుసుం పుచ్చుకుంటే ప్రత్యువాయువుండదు.

కొండి:    యీ వూళ్ళో నానాటికి రసికత సన్నగిల్లుతూన్నది. “అంధునకు గొరయ వెన్నెల” అన్నట్టు యీ వూళ్ళో మూర్ఖులకు నీ రూపలావణ్య విలాస విశేషములు అగ్రాహ్యములు. తోవంట పోయే పొన్నూరు వాళ్ళను కాచి పట్టుకోవాలి.

మంజు:  పది డబ్బులు రాల్చగలిగే వాళ్ళను యెంచి మరీ పట్టుకురండి.

*

శివారెడ్డి జీవితమంతా కవిసమయమే!

నారాయణ స్వామి వెంకట యోగి 

(శివారెడ్డి 72వ పుట్టిన రోజు సందర్భంగా)

  swamy1“ఏం నాన్నా యెంత సేపైంది వచ్చి?’ అంటూ ఆప్యాయంగా సార్ బుజం తడితే చదువుతున్న పుస్తకం లోంచి ఉలిక్కి పడి తలెత్తి చూసి లేచి నిల్చుని “ఇంతకు ముందే సార్ “ అంటూ నమస్తే పెట్టాను. “నువ్వు చదువుతూ కూర్చో. మరో వరస క్లాస్ ఉంది నేనిప్పుడే వెళ్ళి త్వరగా ముగించుకుని వచ్చేస్తా. తర్వాత వెళ్ళిపోవచ్చు మనం” అంటూ లాకర్ లోంచి మరో టెక్స్ట్ బుక్ తీసుకుని క్లాస్ కు బయలుదేరారు. “సరే సార్ ఈ కవి కవిత్వం చాలా బాగుంది మీరొచ్చే లోపు మరిన్ని పద్యాలు  చదువుతా “ అంటూ పుస్తకం లో తలదూర్చేసా. యిప్పుడే వస్తానన్న సార్ మరో గంట దాకా కాని రాడని తెలుసు. పాఠం చెప్పడం ఆయనకెంత యిష్టమో అదీ ఆధునిక కవిత్వం బి ఏ బి యెస్సీ పిల్లలకు చెప్పడం యింకెంత యిష్టమో నాకు అంతకుముందే  యెరుక. సారు ఆధునిక కవిత్వం పాఠం చెప్తుంటే వినడం ఒక గొప్ప అపురూపమైన అనుభవం.

కాలం – 1983. స్థలం హైదరాబాదులో జాంబాగ్ కోఠిలో వివేక వర్ధిని సాయంకళాశాల.

దాదాపు గంటంబావు  తర్వాత హడావిడిగా తరగతి లోంచి బయటకు వస్తూ గడియారం చూసుకుని “యెనిమిదిన్నర అయిందే!  యివాళ్ళ ఫుల్ వర్క్ లోడ్.  సారీ నాన్నా లేట్ అయిపోయింది. యింక మనం బయలుదేరదాం పద” అంటూ బుజం మీద చెయ్యి వేసి బయటకు నడిపించుకుపోయారు. యింక అక్కడ్నుంచీ హరిద్వార్ హోటల్ దాకా నడక. నేను చదువుతున్న కవి కవిత్వం నుండి (అది సార్ అంతకు ముందు వారం ఇచ్చిన పుస్తకమే) మొదలు పెడితే ప్రపంచం మొత్తం చుట్టేసే వారు సారు. నిండా  పద్దెనిమిదేళ్ళు కూడా సరిగా నిండని నా బుజం మీద చనువుగా చేయి వేసి నాన్నా అని పిలుస్తూ,  తనతో గడిపిన ప్రతిక్షణమూ ప్రపంచ కవులనీ  కవిత్వాన్నీ పలవరిస్తూ విడమరిచి చెప్తూ మధ్య మధ్య లో, గొప్ప నవలల గురించీ, కథల గురించీ,  మంచి సినిమాల గురించీ, మంచి సంగీతం గురించీ ప్రస్తావిస్తూ మళ్ళీ కవిత్వలోకి దూకేవారు.  అప్పుడప్పుడే యీత నేర్చుకుంటున్న నాకు ఆ మహా సముద్రం లో అండగా చుక్కానిగా నిలబడిన సార్ యింకెవరో కాదు కె.శివా రెడ్డి గారు. వివేక వర్ధిని సాయంకళాశాల లో యింగ్లీషు అధ్యాపకునిగా పనిచేస్తూ తనకు దొరికిన ప్రతి క్షణాన్నీ కవిత్వం కోసమే, కవిత్వం తోనే, యిప్పటికీ,  గడపడాని కిష్టపడే మహా  కవి, గొప్ప మనిషీ.

అప్పుడప్పుడే పోతన మందార మకరంద మాధుర్యాలనుండీ,  బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకలనుండి బయటపడి  శ్రీ శ్రీ ని, దిగంబర కవులనీ, తిరగబడు కవులనీ , రాత్రి కవితా సంకలనాన్ని, వీ వీ చలినెగళ్ళు, జీవనాడులనీ ,  కె, శివారెడ్డి రక్తం సూర్యుడు,చర్య, నేత్రధనుస్సు, ఆసుపత్రి గీతాలని చదివిన గొప్ప విసురూ, ఆవేశమూ ఆకలిలతో,  సమాజం మీద వ్యవస్థ మీద ధిక్కార భావంతో  , ఉన్న పరిస్థితి ని మార్చడానికి కవిత్వం రాయాలని కంకణం కట్టుకున్న కౌమార ప్రాయమది. జే యన్  టీ యూ నాగార్జునసాగర్ యింజనీరింగ్ కళాశాల లో 1981 లో చేరిన నాకు, సిద్దిపేట నుండి వచ్చినా యేచ్ పీ యెస్ లో ఐదేండ్ల చదువు పుణ్యమా అని హైదరాబాద్ కొత్తేమీ కాదు. యేచ్ పీ యెస్ లో యెలీటిస్ట్ ఆధిపత్యమూ అణచివేతలకింద నలిగిపోయిన నాకు సిద్దిపేటలో సాహిత్య వాతావరణం కొత్త ఊపిరులనిచ్చింది.

అట్లా కె. శివారెడ్ది గారు పరిచయమయ్యారు. కొత్తగా రాస్తున్న వారికీ, యువ,  నవ కవులకూ సార్  సాన్నిహిత్యం   అపురూపమైందనీ , కవిత్వ, సాహిత్య, సంగీత, సినిమా రంగాలలో కొత్త ప్రపంచాలను పరిచయం చేస్తుందని సిద్దిపేటలో నందిని సిధారెడ్డి సారు, యెస్. ప్రవీణ్ చెపితే శివా రెడ్డి గారి తో పరిచయం చేసుకున్నాను. ఆ పరిచయం యింతింతై అన్నట్టుగా అతి కొద్ది కాలం లోనే చాలా గాఢమైన సాన్నిహిత్యంగా మారడానికి ముఖ్య కారణం సారే! అప్పటికే నాలుగు కవితా సంకలనాలు ప్రచురించి ప్రముఖ కవిగా చలామణీ అవుతున్నా,  అట్లాంటి యావే లేకుండా నాతో పాటు తనూ  18 యేండ్ల వాడై పోయి  బుజం మీద చేయి వేసి అత్యంత ఆప్యాయంగా,  ఆత్మీయంగా దగ్గరైన అత్యంత సన్నిహితులైన వారు శివారెడ్డి సార్. యేనాడూ తాను సీనియర్ కవినని కానీ (యిప్పటికీ కూడా) తనకు చాల తెలుసనీ తాను సాధించింది యెక్కువనీ అనుకోకుండా, నిర్లక్ష్యం గానీ , చిరాకు గానీ కోపం కానీ   దగ్గరకు రానీయకుండా యెంతో స్నేహంగా మసలుతారు. అరమరికల్లేకుండా మాట్లాడ్డం, హిప్పోక్రసీ, ద్వంద్వ విలువలూ, యేదో దాచుకుని మాట్లాడ్డం, రాజకీయంగా మాట్లాడ్డం, పొడిపొడిగా రెండు ముక్కలు కవిత్వం గురించి చెప్పేసి, ‘ ఇప్పుడు సమయం లేదు  తర్వాత కలవ’ మనడం లాంటి యేనాడూ చేయలేదు సారు. ఉన్నదంతా బాహాటంగా చెప్పేసెయ్యడం, యింకా నేర్చుకోవాలి, చదవాలి, ప్రపంచ కవిత్వం లో నిండా మునిగి తడిసిపోవాలి అన్న దాహం తో తపించిపోయే వారు శివారెడ్డి సారు.( యిప్పటికీ యిన్ని యేండ్ల తర్వా త యెప్పుడు కలిసినా యే కొత్త కవిత్వ పుస్తకాన్ని తెచ్చావని అడిగి  , తీసుకుపోయిన పుస్తకా న్ని అపురూపంగా ఆనందంతో మిలమిలలాడే కళ్ళతో అందుకుంటారు. ) అందువల్లే  ప్రతి సాయంత్రమూ కాలేజీ హాస్టల్ నుండి వీ వీ కాలేజి కి రావడం,సార్ తో క్లాసులయ్యాక అయితే హరిద్వార్ కో,  లేకపోతే  ఖైరతాబాద్ లో ద్వారకా కో వెళ్ళిపోయే వాణ్ణి.

siva1

శివారెడ్డి అంటే నిరంతర అధ్యయనమే!

అప్పుడు శివారెడ్డి గారితో మా సంభాషణలకు ప్రదానమైన అడ్డా ద్వారకా హోటల్. దాదాపు ప్రతి సాయంత్రమూ అక్కడ కవులూ, కవిత్వాభిమానులూ  గుమిగూడే వారు శివారెడ్డి  గారి కోసం. యెన్ని ముచ్చట్లు యెన్ని ముచ్చట్లు, ప్రపంచ కవిత్వ వీధుల్లో యెంత నిరంతర నిర్విరామ చంక్రమణం, మహాకవుల కవితా వాక్యాల చుట్టూ పరిభ్రమణం, సార్ తో గడిపిన ప్రతి క్షణమూ అమోఘమూ   అద్భుతమూ, అపురూపమున్నూ. కొన్ని సమయాల్లోనైనా కవిత్వం మాట్లాడక యింక మరే సంగతి మాట్లాడినా –  అది ప్రత్యక్ష పరోక్ష జీవితానుభవం కావచ్చు లేదా యింకేదైనా కావచ్చు –  అందులోనూ  కవిత్వానికి సంబంధించిన ముడిసరుకు తప్పనిసరిగా ఉండేది. తవ్వుకోవాలే కానీ కవిత్వ జల నిరంతరం ఊరే  గొప్ప చెలిమ శివారెడ్డి గారు. కవిత్వ దాహంతో ఉన్నవారందరికీ  అలవోకగా అమృతాన్ని పంచి ఇస్తారు.

సార్ దగ్గర సముద్రమంత గ్రంథాలయం. యింటి నిండా సందు లేకుండా పుస్తకాలు. ఆకలిగా పుస్తకాలను చూస్తుంటే,  తడుముతుంటే “ యిదిగో ఈ ఆఫ్రికన్ కవి కవిత్వం చదువు, యిదిగో ఈయన గ్రీకు దేశపు మహాకవి రిట్సాస్ ఇది తీసికెళ్ళి చదువు,  ఇదిగో ఇది నెరూడా పుస్తకం ఈయన బ్రేటన్ బ్రేటన్ బా దక్షిణాఫ్రికా కవి తీసికెళ్ళి   చదువు”  అంటూ యెంతమాత్రం సంకోచం లేకుండా, ప్రేమగా ఆప్యాయంగా బాగా ఆకలిగొన్న వాడికి అద్భుతమైన భోజనం  యెంతో ఆత్మీయంగా పెట్టినట్టుగా పుస్తకాలనిచ్చేవారు. అయితే జాగ్రత్తగా తీసుకుని రమ్మనే వారే తప్ప యేనాడూ “ యేదా పుస్తకం యేమైందీ”  అంటూ అడిగే వారు కాదు. సెంఘార్, చికాయా యూ టాంసీ, సిల్ చినీ కోకర్ , డేవిడ్ డయోప్ , రిట్సాస్  ఐమీ సెజేర్, సెజార్ వయేహో లాంటి ప్రపంచ మహాకవులెందరినో పరిచయం చేసారు. వాళ్ళలో అప్పటికే చాలా మందిని అనువాదం చేసి ఉన్నారు. శ్రీ శ్రీ తర్వాత, నిజానికి అంతకన్నా యెక్కువగా విస్తారంగా అనేక ప్రపంచ మహాకవులను తెలుగు లోకి అనువాదాలు చేసి పరిచయం చేసిన వారు శివారెడ్డి గారు.

ప్రపంచ వ్యాప్తంగా  మహాకవుల కవిత్వాన్ని యెందుకు చదవాలో కలిసిన ప్రతి సారీ  నొక్కి చెప్పే వారు. ‘యితర కవుల కవిత్వాన్ని చదవడం వల్ల మూడు గొప్ప ప్రయోజనాలున్నై’  అనే వారు… ఒకటి – ఆ కవి ఒక వస్తువుని యెట్లా  కవిత్వం చేసాడు, యెట్లా ఊహించాడు ,ఒక పద్యాన్ని యెట్ల్లా నిర్మించాడు, యేయే పదచిత్రాలని, యే యే ఉపమానాలని, ఉత్ప్రేక్షలని వాడాడు, యేట్లా పద్యం conceive చేసాడు అనేది తెలుస్తుంది, రెండు – యే యే వస్తువులని యెంచుకున్నాడు, తన అనుభవం లోకి వచ్చిన ఆ వస్తువుని, అనుభూతినీ , యే ప్రాపంచిక దృక్పథంతో,  యెట్లా తన పద్యంలో ప్రతిఫలించాడు అని తెలుస్తుంది,  మూడు – అనేకానేక కవుల తర్వాత రాస్తున్న మనం వారందరికంటే భిన్నంగా పద్యం యెట్లా రాయగలం? యింతకు ముందు యెవరూ చేయనట్లు  యెట్లా ఊహ చెయ్యగలం, వస్తువుని చూడగలం , కొత్తగా  పద్యం చెప్పగలం –  అనేది వాళ్ళందరినీ చదవడం వల్ల నేర్చుకొగలుగుతాం. యితర కవుల కవిత్వాన్ని చదవడం వల్ల మనం రాసే కవిత్వానికి కొత్త బాట యేర్పడుతుంది, మనకు కవులుగా కొత్త గొంతుక యేర్పడుతుంది. అట్లాంటి కొత్త గొంతుక, మనదైన ముద్ర, వ్యక్తిత్వం , మనదైన పద్యం రాయగలగాలంటే తప్పకుండా అందరి కవుల పద్యాలని చదవాలి వారి పోకడలని పరిశీలించి విశ్లేషించి మనం కొత్త పోకడలు పోవాలి అనే వారు.  దేని గురించైనా రాయి, ముందు కవిత్వం,  మంచి కవిత్వం రాయి,  మనదైన ప్రాపంచిక దృక్పథంతో (worldly outlook) ప్రతి వస్తువును మంచి  కవిత్వం చేయడం అన్నింటికన్నా ముఖ్యం అనేవారు. పీడిత ప్రజల పక్షం వహించే ప్రాపంచిక దృక్పథం లేక పోతే యెంత మంచి కవిత్వం రాసినా దాని వల్ల  ప్రయోజనముండదనీ, మంచి  కవిత్వం కానప్పుడు నువ్వెంత గొప్ప దృక్పథం తో వస్తువుని చెప్పినా  అది కవిత్వంగా నిలబడదనీ గుర్తుపెట్టుకొమ్మనే వారు.

అట్లానే ‘ప్రతీదీ కవిత్వానికి ఉపయోగపడేట్టుగా యెట్లా చూడాలి, ప్రతి క్షణమూ ప్రతి సంఘటనా  మనం కవిత్వం రాయడానికి ఉపయోగపడేలా యెట్లా చేసుకోవాలా అనే ఆలోచించాలి’   అని చెప్పేవారు. ఉదాహరణకు, ఒక మంచి సినిమా చూసినప్పడు మన స్పందన కవిత్వంగా యెట్లా మార్చుకోవాలో ఆలోచించమని చెప్పేవారు. అప్పటికే హైదరాబాదు లో మంచి సినిమాలని యెంపిక చేసి ప్రదర్శించే ఫిల్మ్ క్లబ్ ఒకటి నడుస్తూ ఉండేది. అక్కడా, మాక్స్ ముల్లర్ భవన్, అలైన్స్ ఫ్రాంసై  లో మంచి సినిమాలనెన్నో చూసే అవకాశం దొరికింది. ఒక సినిమాని యెట్లా ‘ కవి దృష్టి’ తో చూడాలి, దాన్ని కవితాత్మకంగా యెట్లా అనుభవించి పలవరించాలి అని శివారెడ్డి గారి దగ్గరే నేర్చుకున్నా నేను. అకిరా కురొసావా ‘దెర్సూ ఉజలా’ సినిమా చూసినంక శివారెడ్డి గారు రాసిన  ‘అడవులు భయపెడతాయి’ అనే కవిత ఒక సినిమా ని కవిత్వంలోయెట్లా ప్రతిబింబించవచ్చో అద్భుతంగా చూయిస్తుంది. సినిమా అనేక కళల సమ్మేళనం కాబట్టి. ఆయా కళల్లో ప్రతి దానిలోనూ కవిత్వం ప్రతిధ్వనించే అవకాశం ఉంది కాబట్టి (నటన కావచ్చు, చాయాగ్రహణం కావచ్చు, సంగీతం కావచ్చు, మాటలు కావచ్చు ) సినిమా ప్రతి క్షణమూ కవితాత్మకంగా ఉండాలి అనే వారు. అప్పుడే మళయాళ దర్శకుడు, గొప్ప సెల్ల్యులాయిడ్ కవీ  అరవిందన్ రెట్రాస్పెక్టివ్ ప్రదర్శిస్తే ‘ఒరిదతు’, ‘కాంచన సీత’,’ తంపు’,’వాస్తుహార’, ‘ఉత్తరాయణం’ లాంటి అద్భుత కావ్యాలాంటి సినిమాలు సారూ, ప్రకాషూ , నేనూ చూసి తడిసిపోయాం.  ఆ సినిమాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేక కవితలకు ప్రేరణయ్యాయి కూడా. యూరుగ్వాయి   రాజకీయ ఖైదీలగురించి తీసిన ‘ఐస్ ఆఫ్ బర్డ్స్ ‘ అనే సినిమా చూసాక నేను రాసిన పద్యం విని శివారెడ్డి గారు నీళ్ళు నిండిన కళ్ళతో గాఢంగా కౌగలించుకున్నారు. ఒక మంచి పద్యం గానీ ఒక గొప్ప కవితా వాక్యం గానీ వింటే నిలువెల్లా పులకించి, పరవశించి పోయి కళ్ళనీళ్ళ పర్యంతమై కరిగిపోయే కవితామూర్తి శివారెడ్డి గారు.

1983-84 కాలంలో మా హాస్టల్ గన్ ఫౌండ్రీ లోని ఒక పాడుబడ్డ భవంతిలోకి మార్చారు. కింగ్  కోఠీ నుండి బషీర్ బాగ్ చౌరస్తాకి నడిచి వెళ్తుంటే మధ్యలో భారతీయ విద్యాభవన్ ని ఆనుకుని ఉండేదది. అప్పుడంతా కలినడకే – హైదరాబాద్ వీధి వీధినా కాలినడకతో  రాత్రింబవళ్ళు తిరిగి తిరిగి మహా నగరం మారుమూలలనీ, జీవితపు చీకటి కోణాలనీ , వెల్తురు  ఛాయల్నీ ప్రతి నెత్తురు బొట్టులో యింకించుకుని రంగరించుకున్నాం. మా సంచారానికి  శివారెడ్డి గారి కవిత్వ కరదీపిక తోడైంది. సారిచ్చిన కవిత్వం టార్చిలైటు తో నగరం మూల మూలలా శోధించాం జీవితానుభవ రహస్యాలకోసం , కవిత్వం ముడిసరుకు కోసం. అట్లే యేదైనా కవి కవిత్వం చదివినా ఒక సారి కాదు,  ఆ కవి మన ఆలోచనల్లో, చైతన్యం లో, చివరికి  నరనరాల్లోపూర్తిగా యింకే దాకా చదవమనే వారు. ఒక పద్యాన్ని చదివాలి. మళ్ళీ మళ్ళీ చదవాలి,  ప్రతి  కవితా పాదాన్నీ  చదివి మననం చేసుకోవాలి, ఆ కవిలో మనం పరకాయ ప్రవేశం చేయాలి అప్పుడే అనేకానేక కవుల కవిత్వ మెళకువలు మనకు అర్థమౌతాయ్. మన చైతన్యం లో భాగమై మనకి  కొత్తగా  చూడడం ఊహించడం నేర్పి, ఒక  కొత్త గొంతుకనిస్తాయి.  అందుకే యిప్పటికీ యే కొత్త ప్రపంచ కవి కవిత్వం కనబడినా ఆప్యాయంగా అక్కున చేర్చుకుని   తన స్వంతం చేసుకుంటారు. ఆ కవి కవిత్వాన్ని తనలో  భాగం  చేసుకుంటారు. తనదైన కొత్త గొంతుకని నిత్య నూతనంగా పలికిస్తారు.

యేది చూసినా దీన్ని కవిత్వమెట్లా చేయాలా అనే దృష్టి తోనే చూడాలి అని సార్ చెప్పిన పాఠాన్ని నరనరానా యింకించుకున్నాం. అప్పుడు పీ డీ యెస్ యూ లో చాలా చురుగ్గా పని చేస్తున్న రోజులు. అయితే కవిత్వం లేదా విద్యార్థి ఉద్యమం అన్నట్టు ప్రతి క్షణాన్ని గడిపేవాణ్ణి. నాకు తోడు,  కవిత్వం రాయకపోయినా ప్రకాషూ (ఒకటే కవిత రాసాడీయన – ‘Eyes of the Birds’ చూసి), కవిత్వం రాస్తూ సుధాకిరణ్ ఉండేవారు. మా హాస్టల్ లో పీ డీ యెస్ యూ ప్రభావం చాలా బలంగా ఉండేది. చాలా మంది విద్యార్థులు మా తోడుండే వారు. అవతలి  పక్షం లో యే బీ వీ పీ కూడా ఉండేది. అయితే పీ డీ యెస్ యూ లో ఉన్న విద్యార్థులు చాలా మంది పుస్తకాలకు దూరంగా మరీ ముఖ్యం కవిత్వానికి బహు దూరంగా ఉండే వారు. క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవడమే యెక్కువ యింక వేరే పుస్తకాలా అని పెదవ్విరిచే వారు. ప్రకాషూ నేనూ ఆదివారం రాగానే ఆబిడ్స్ వీధుల్లో ఆకలితో వీర విహారం చేసి కనీసం రెండు మూడు పుస్తకాలు కొనుక్కొస్తే తెగ ఆశ్చర్యపోయే వారంతా. చక్కగా ఉన్న కొద్ది పాకెట్ మనీ తో యేదో సినిమా చూడక వీళ్లకిదేమి పిచ్చి అని మమ్మల్ని చూసేవారు.

వీళ్ళతో యెట్లా అయినా పుస్తకాలు చదివించాలి కనీసం అటువైపు దృష్టి మళ్ళించాలి అనుకుని ఒక సారి శివారెడ్డి గారితో ప్రస్తావించి ‘సార్ మీరొకసారి మా హాస్టల్ కి వచ్చి మాట్లాడాలి – పుస్తకాలూ  సాహిత్యమూ యెందుకు చదవాలో మా వాళ్ళకి చెప్పాలి’ అని అన్నాను. ‘ ‘సరే అట్లాగే ఒక ఆదివారం సాయంత్రం వస్తాన’న్నారు. మా వాళ్లందరినీ ఒక రూం లో జమ చేసాము. సారు వచ్చారు. పరిచయాల తర్వాత దాదాపు గంటన్నర పైగా ఉపన్యాసం – నెమ్మది గా చిన్న నీటి ఊటలాగా మొదలై,  మెల్ల మెల్ల గా పుంజుకుంటూ,  ఒక మహా ప్రవాహమై, వుధృత జలపాతమై అందరినీ తడిపి ముద్ద చేసింది. ఆ పాడుబడ్డ హాస్టభవంతిలో రూం లకు పూర్తిగా గోడలు లేక దాదాపు అన్ని రూముల్లోకీ సార్ మార్దవ గంభీర స్వరంలో ఉపన్యాసం ప్రవహించి ఒక్కొక్కరే విద్యార్థులు రూం లోకి  రావడమూ, లోనా బయటా కిక్కిరిసి పోవడమూ జరిగింది.

ఉపన్యాసం అయిపోగానే ఒక మహా జలపాతం కింద నో ఒక వెచ్చని ఆత్మీయ వర్షం లోనో తడిసి ముద్దయినట్టు విద్యార్థులంతా తన్మయత్వంతో మమేకమయ్యారు. పుస్తకాలూ , సాహిత్యమంటే యేమిటి, వాటిల్లో యేముంటుంది, వాటిని యెందుకు చదవాలి, యెట్లా చదవాలి, మంచి సాహిత్యానికి చెడ్డసాహిత్యానికి తేడా యేమిటి, వ్యాపార సాహిత్య లక్షణాలేమిటి (యండమూరి తదితరులు వ్యాపార సాహిత్య రంగాన్ని  రాజ్యమేలుతున్న కాలమది) , మంచి సాహిత్యాన్ని చదవడం వల్ల మనకు యేమిటి ప్రయోజనం, అది మనల్ని యెట్లా ప్రభావితం చేస్తుంది, యెట్లా వికాసమిస్తుంది, మన జీవితాలని మార్చేశక్తి మంచి సాహిత్యానికీ కవిత్వానికీ యెట్లా ఉన్నది-  అని అనేక విషయాలని అత్యంత సులువుగా అర్థమయ్యే ప్రపంచసాహిత్యలోంచీ , జీవితానుభవాలనుంచీ ఉదాహరణలతో, దారాళంగా ఆకట్టుకునేలా అద్భుతంగా చెప్పారు. విద్యార్థులంతా ఆలోచనలు ఝుమ్మని  చుట్టుముడుతుంటే  ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. అప్పట్నుండీ సార్ కి అభిమానులైపోయారు. మేము కొన్న పుస్తకాలకు ఆ రోజునుండీ డిమాండ్ పెరిగిపోయింది. ఒక చిన్న నోట్ బుక్ లో తీసుకున్న పుస్తం పేరూ తమ పేరూ రాయమని పెడితే అది ఒక నెల రోజుల లోపే నిండి పోయింది కూడా. యిద్దరు ముగ్గురు కవిత్వ రాసే ప్రయత్నాలు చేసారు కూడా. అదీ సార్ ఉపన్యాస శక్తి  ప్రభావం.

siva2

శివారెడ్డి గారిలో మరో గొప్ప లక్షణం కవిత్వాన్ని, మంచి కవిత్వాన్ని సర్వకాల సర్వావస్థలలోనూ ప్రేమించడం – ఇది అందరికీ సాధ్యమయే పని కాదు. జీవితంలో అనేకానేక సందర్భాలుంటై. కొన్ని దుఃఖ సందర్భాలు, చిరాకూ కోపాల తో కూడిన  సందర్భాలు, కష్టనష్టాల్లొ ఉన్నప్పుడూ ‘యిది కవిత్వానికి సమయం కాదనీ ’  ,’ ఇప్పుడు కవిత్వమేమి టీ వేళా పాళా లేకుండా’  అని యెందరో అనడం ప్రత్యక్షంగా  చూసాను నేను. కానీ ఒక్క శివారెడ్డి గారి విషయంలోనే యెప్పుడైనా, యెక్కడైనా యెట్లాంటి పరిస్థితుల్లోనైనా కవిత్వం గురించి సాహిత్యం గురించీ   నిరభ్యంతరంగా నిర్మొహమాటంగా మాట్లా డ వచ్చు, కవిత్వం వినిపించవచ్చు ‘యెట్లుంది సార్ యేమైనా సూచనలివ్వండి’ అని కూడా అడగవచ్చు. అదీ సార్ గొప్ప తనం.

ఓ సారి ఒక పద్యం రాసి దాన్ని యెట్లాగైనా సరే సార్ కి వినిపించాలని కాలేజీ కి వెళ్ళా. అప్పటికే యెనిమిది దాటటం వల్ల సార్ వెళ్ళి పోయారు. అక్కడ్నుంచి నడిచి హరిద్వార్ హోటల్ కి వెళితే అక్కడా లేరు. వనస్తలిపురం బస్సెక్కి సార్ ఇంటికెళ్ళే సరికి రాత్రి పదకొండు దాటింది. యేమనుకుంటారో అనే మొహమాటం లేకుండా తలుపు తడితే ఆంటీ తలుపు తీసి ఆశ్చర్య పోయి, ‘సారు బాగా అలసి పోయి పడుకున్నారు నాన్నారేప్పొద్దున మాట్లాడుదువు  కానీ’  అని ఈ రాత్రి పొద్దు పోయింది కదా ఇక్కడే పడుకో’ మంటూ హాలు లో నాకోసం జాగా చేస్తున్న సమయానికి సారు లేవనే లేచారు.  ‘యేమైంది స్వామీ యింత రాత్రి? ’ అంటూ హాలులోకి వచ్చారు. నేను వచ్చిన సంగతి విని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. ‘స్వామి కేదైనా పెట్టు తినడానికి’  అని నా పరిస్థితి నెరిగి ఆంటీ కి చెప్పారు. ముందు పద్యం వినిపించమని పద్యం విన్నాక ‘అద్భుతం స్వామీ’ అని కళ్ళ నిండా  నీటితో కౌగలించుకుని, నేను తినే దాకా ముచ్చట్లెన్నో చెప్పి తిన్నాక కూడా చాలా సేపు గడిపారు నాతో. అదీ సార్ కి కవిత్వం మీదా కవులమీదా ఉన్న అభిమానమూ, ప్రేమా వాత్సల్యమూ.  అట్లాగే యెప్పుడు కలిసినా ‘డబ్బులున్నాయా నాన్నా? పుస్తకాలవీ కొంటున్నావు కదా, ఇదిగో ఇవి ఉంచు’ అంటూ తన దగ్గర సరిపడా ఉన్నా లేకున్నా,తనకి సరిపోతాయా లేవా అనే ఆలోచన లేకుండా డబ్బులు తీసి జేబులో కుక్కే వారు. ‘వద్దు సార్ ‘ నా దగ్గర ఉన్నాయ’న్నా యెక్కడ నీ మొహం అంటూ బలవంతంగా ఇచ్చే వారు. తానిచ్చే డబ్బులు వృధా కావనే గొప్ప నమ్మకం సారుకు. డబ్బుని లెక్క చేయని ఆత్మవిశ్వాసమూ, చిత్తు కాగితాలుగా చూసి దాని మాలిన్యాన్నంటనివ్వని మహోన్నత మానవీయ లక్షణం. మాననీయ కవితా స్వభావం శివారెడ్డి గారిది.

అంతగా  కవిత్వానికి జీవితాన్ని అంకితం చేసారు కాబట్టే యింకెవ్వరికీ రానన్ని కష్టాలొచ్చినా , యెడతెగని దుఃఖ సందర్భాలెదురైనా,  అంతులేని శోక అగాధాలోకి నెట్టి వేయబడ్డా కవిత్వాన్నే నమ్ముకున్నారు, కవిత్వాన్నే  ప్రేమించారు, ఆరాధించారు, తానే కవిత్వం,కవిత్వమే తాను – సర్వస్వం కవిత్వమే అయ్యారు. కాలు విరిగి రెండు సంవత్సరాలు మంచం పాలయినా కించిత్తైనా చెదరని ఆత్మ విశ్వాసంతో, సడలని కవిత్వం మీద ప్రేమతో అధ్బుతమైన కవిత్వం ‘అంతర్జనం’ రాసారు. తాను అప్పటిదాకా రాసిన కవిత్వం కన్నా భిన్నంగా తనదైన కొత్త గొంతుకని పలికించారు. యెందరో మంది కవులకు కరదీపిక, గురువూ, సన్నిహితుడూ, ఆత్మీయుడూ అయ్యారు.  పదిహేను కవితా  సంకలనాలని ప్రచురించి,  యింకా నవనవోన్మేషమైన కవిత్వాన్ని సృష్టిస్తూ   నిరంతర కవితా వ్యవసాయం చేస్తున్న అలుపెరుగని రైతూ,  పసి పిల్లవాడూ శివారెడ్డి గారు. 72 వసంతాలు పూర్తి చేసుకున్న నవ యవ్వనుడు శివారెడ్డి సారు కు  హార్థిక శుభాకాంక్షలు.

*

టెక్సాస్ యూనివర్సిటీ తెలుగు కోసం శాశ్వత నిధి

వంగూరి చిట్టెన్ రాజు 

ఉత్తర అమెరికాలో కొత్త తరాలు తమ పిల్లలకి తెలుగు భాషా, సంస్కృతుల పైన మక్కువ కలిగించే ప్రయత్నాలు ప్రతీ చోటా తెలుగు పాఠశాలలు, నాట్య శిక్షణాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అధిక భాగం ఔత్సాహిక స్థాయిలో నిర్వహించడంలో కృతకృత్యులవుతున్నారు. కానీ తీరా ఆ పిల్లలు హైస్కూల్ దాటి ఉన్నత విశ్వ విద్యాలయాలలో అడుగు పెట్టగానే కేవలం “బాలీవుడ్” సంస్కృతికి తప్ప ఆ  తల్లిదండ్రులు కష్టపడి వేసిన ఆ భాషా పరమైన మౌలికమైన పునాదులని పటిష్టం చేసుకునే అవకాశాలు కల్పించడంలో అమెరికా తెలుగు సమాజం, జాతీయ స్థాయి తెలుగు సంఘాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు కానీ అటు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలకీ, ప్రజలకీ భాషా, సాహిత్యం, సాంస్కృతిక పెంపుదలపై ఉన్న నిర్లిప్తత  ఎంతో బాధాకరం. అందు వలన వారి నుంచి కూడా ఏమీ ఆశించకుండా అమెరికాలో మన ప్రయత్నాలు మనమే చేసుకోవాలి.

ఈ నేపధ్యంలో అమెరికాలో యువతరానికి కేవలం తెలుగు భాష, సాహిత్య, సంస్కృతులపై అవగాహన, మునుపెరగని అభిలాష  ఉన్నత విశ్వ విద్యాలయ స్థాయిలో కూడా కలిగించడం ద్వారానూ, మన ప్రాచీన, ఆధునిక సాహిత్యాలని, భాషా శాస్త్రాన్ని  ఇతర భాషా కోవిదులతో సరి సమానంగా, సగర్వంగా చాటుకోగల సంస్థాగత నిర్మాణాల ద్వారానూ  తెలుగు భాష మహోజ్జ్వలంగా మనుగడ సాగిస్తుంది అని విజ్ఞుల అభిప్రాయం.  అప్పుడే తెలుగు భాష అంతర్జాతీయ భాషలలో సముచిత స్థానాన్ని పొందడమే కాకుండా మన తెలుగు యువ తరం వారి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, వ్యక్తిగత  అవసరాలు ఈ పరాయి దేశంలో సముచితమైన స్థాయిలో నెరవేరుతాయి. ఈ దిశలో,  తెలుగు రాజకీయ, సామాజిక, వర్గ విభేదాలకి అతీతంగా అత్యున్నత స్థాయి అమెరికా విశ్వవిద్యాలయ పర్యవేక్షణలో తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రణాళిక తో మేము తలపెట్టిన ఒక చిన్న ప్రయత్నానికి మీ నైతిక ప్రోద్బలం, ఆర్ధిక సహాయం అర్థించడమే ఈ ఉత్తరం సారాంశం.  

గత ఇరవై ఏళ్ళకి పైగా తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదల పై దృష్టి కేంద్రీకరించి, మాకు  ఉన్న పరిమితులకి లోబడి, కేవలం మీ బోటి తెలుగు భాషా, సాహిత్యాభిమానుల ప్రోద్బలమే ఇంధనంగా చెప్పుకోదగ్గ విజయాలు సాధించడమే “వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” కి ఉన్న ఏకైక అర్హత.  దానికి కొనసాగింపుగా ఆస్టిన్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ వారి తెలుగు విభాగం అభివృద్దికి ఒక “శాశ్వత నిధి” (Program Endowment in Telugu Studies)  సమకూర్చడానికి ఆ విశ్వవిద్యాలయ అధికారులతో సూత్రప్రాయంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ శాశ్వత నిధుల నిర్వహణ పూర్తిగా ఆ విశ్వ విద్యాలయం అధికారుల చేతులలోనే ఉంటుంది, దాని పై ఏటా వచ్చిన ఆదాయం మొత్తం అక్కడి తెలుగు విభాగం ఖర్చులకి, పెంపుదలకి మాత్రమే శాశ్వత ప్రాతిపదిక మీద వినియోగించబడుతుంది. 

ఇటీవల హ్యూస్టన్ లో జరిగిన “పాడుతా తీయగా” కార్యక్రమ వేదిక పై గాన గంధర్వులు డా. ఎస్.పి. బాల సుబ్రమణ్యం ఈ శాశ్వత నిధి ఏర్పాటు గురించి తొలి సారిగా ప్రకటించి ప్రశంసించారు.  

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ (ఆస్టిన్) లాంటి అత్యత్తమ స్థాయి విశ్వవిద్యాలయం లో గత యాభై ఏళ్ల కి పైగా నడుస్తున్న తెలుగు విభాగం అభివృద్దికి మీ వంతు కర్తవ్యంగా ఈ శాశ్వత నిధి కి మీ ఆర్ధిక సహకారం అందించి, యువతరానికి మన తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులపై అవగాహన, అభిరుచి ఒక విశ్వ విద్యాలయ స్థాయిలో, తగిన ఎకడమిక్ క్రెడిట్స్ పొందే అవకాశం కల్పించమని కోరుతున్నాం.

             మీ అండదండలతో పౌర నిధుల సేకరణ ద్వారా తగిన ఆర్ధిక వనరులు సమకూర్చగలిగితే అమెరికా  విశ్వవిద్యాలయాలలో ఉన్న తెలుగు ఆచార్యులు కలిసి, మెలిసి ఇతర ప్రపంచ, భారతీయ భాషా శాస్త్రవేత్తలు, ఆచార్యులు, పండితుల సహవాసంతో మన భాషా శాస్త్రం, ప్రాచీన & ఆధునిక సాహిత్య విషయాలపై పరిశోధనలు జరిపి, ఉన్నత స్థాయి అనువాదాలని ప్రచురించి, నిజమైన అంతర్జాతీయ భాషా సదస్సుల  ద్వారా తెలుగు భాషకి ప్రపంచ భాషలలో తగిన గుర్తింపు లభించే  దీర్ఘకాలిక  ప్రయోజనాలు  కూడా సమకూరుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. 

Brief History & Background of University of Texas Telugu Studies Department

University of Texas, Austin which was established in 1883 and is one of the highest rated Universtites in USA with over 50000 students from around the world.  

The first Telugu course was taught in 1960 and Hindi-Telugu Center at UT was established in 1961. Later on, It was changed to South Asia Center which is one of earliest such Institutes in North America. The person who made all this happen and ran this Insitute until 1990 is Ms. Andre’e F. Sjoberg. She is now 91 years old and lives in West campus of UT. And beleive it not, she procured 7859 Telugu books which are now available in UT, Austin Library making it one of the world’s largest Telugu Libraries out side of India.

At the present time, UT Telugu Studies Department is one of the largest and most active in USA, under the able leadership of Prof. Afsar Mohammed, a well known Telugu poet & literary critic. Per our information, over 450 students graduated from the Telugu Department in the last few years with an average enrollment of 50 students in several credit courses. It is unfortunate that  enrollment was denied last year for many more enthusiastic students for lack of supporting funds.  

UT, Austin offers eight credit courses to learn Telugu reading, writing and spoken language,  modern Telugu literature including short story & poetry.  UT also teaches Annamayya devotional music and classical music of Tyagaraja and other great  composers. All these prorgams attract not only Telugu heritage students but also non-Telugu students from main stream other ethnic groups.   The Telugu Students formed a separate student body for themselves called Telugu Students  Association which is very active with about 50 members.

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ వారి సహకారంతో ఈ శాశ్వత నిధి వలన చేకూరే కొన్ని సత్ఫలితాలు

·                  ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్న యువత సంఖ్యని 50 నుంచి పెంచి అందరికీ అవకాశం కలిగించడం.

·         ప్రాచీన, ఆధునిక సాహిత్యం, తెలుగు కథ, కవిత్వం మొదలైన ప్రక్రియలపై పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడం.

·         తెలుగు భాషా శాస్త్రం, సాహిత్యాలపై మాస్టర్స్ మరియు డాక్టరేట్ స్థాయి కి విస్తరణ.

·         ఉన్నత స్థాయి పరిశోధనలకి, ప్రచురణలకి అవకాశాలు కల్పించడం.

·         విశ్వ విద్యాలయ స్థాయిలో అన్నమయ్య సంకీర్తనలు, శాస్త్రీయ సంగీతంలో శిక్షణ, అవగాహన పెంపొందదించడం.

·         తెలుగు సంస్కృతి, శాస్త్రీయ నృత్యాలపై విశ్వ విద్యాలయ స్థాయి పాఠ్యాంశాలు నెలకొల్పడం.

·         ఉత్తమ తెలుగు సాహిత్యాన్ని ఆంగ్ల, తదితర భాషలోకి అనువదించి అంతర్జాతీయ సాహిత్యంలో తగిన గుర్తింపు కి కృషి చెయ్యడం.  

·         పై అంశాలలో విషయాలలోనూ నిష్ణాతుల ప్రత్యేక ప్రసంగాలని (Endowment Lectures) ఏర్పాటు చెయ్యడం.

·         వివిధ దేశాల విశ్వ విద్యాలయాల తెలుగు ఆచార్యులు, విద్యార్థులు ఇతర భాషా, సాహిత్యవేత్తల తో అంతర్జాతీయ స్థాయిలో వార్షిక సమావేశాలు నిర్వహిస్తూ తెలుగు భాషా, సాహిత్యాల పురోగతికి తోడ్పడడం.

 

The main purpose of creating the Endowment Fund is to support Telugu Studies Department on a permanent basis. Vanguri Foundation of America, Inc has made an initial committment of $25,000 to be donated directly to UT, Austin. Further endowment funds may be donated as needed to meet the permanent and specific needs such as Annual Endowment Lectures, Academic Conferences and to meet some of the above lsited objectives.   We plan to sign the Endowment Contract in a few days. This is the first time a permanent Endowment is being established where the funds will be invested by UT Endowment Management, and use the returns exclusively for Telugu Studies. The donated funds for Endowment can never be spent, only invested by UT.

We request your generous tax-deductible financial support as follows: Please help us raise $25000 by September 15, 2015. All donations are tax-deductible in USA.

Grand Benefactor (సార్వభౌమ పోషకులు): $5000

Grand Patron (చక్రవర్తి పోషకులు): $2500

Chief Benefactor (మహారాజ పోషకులు): $1000 ­

Chief Patron (రాజ పోషకులు): $500

Benefactor (యువరాజ పోషకులు):  $250

Patron (పోషకులు):  $100

 Any other donations are gratefully accepted.

(All donors may be recognized per UT policies and by VFA in its Media Releases)

 

Special Note on Matching Donations from Major Corporate Employers

Please note that Vanguri Foundation of America, Inc. has been approved to receive matching donations from many major companies in USA such as Google, Microsoft, Bank of America, Union Bank, Chevron, Microsoft, Dell, Intel, BP, Baker-Hughes, General Electric and others. We appreciate your contacting your empolyer for matching procedures and help double the impact of your own generous donations. Please contact us for details.

 

CONVENIENT OPTIONS ON HOW TO DONATE

On-Line with any credit card

Please log in or copy or paste the following in your URL and follow prompt.

 

https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=VDB9HSSK7P8HE

 

or visit www.vangurifoundation.blogspot.com, click on DONATE button on right and follow prompt.

By Check

·         CHECK Payable to VFA, write “UT, Austin Fund” in Memo section  and mail to

Vanguri Foundation of America, Inc. P.O. Box 1948, Stafford, TX 77497

For More Information, Please contact

జోరుగా హుషారుగా జారిస్టు రష్యాలో…

స్లీమన్ కథ 

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

1844, మార్చి1…హైన్ రిచ్ స్లీమన్ 22వ పుట్టినరోజు…

ఇప్పటినుంచి అతన్ని ‘స్లీమన్’ అన్న ఇంటిపేరుతోనే పిలుచుకుందాం.

స్లీమన్ ఆరోజు హెర్ హైన్ రిచ్ ష్రోడర్ (మనదగ్గర శ్రీ లా జర్మన్ భాషలో ‘హెర్’ గౌరవవాచకం) కార్యాలయంలోకి అడుగుపెట్టాడు. ఏమ్ స్టడామ్ లో పెద్ద ఎత్తున ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు సాగించే ఓ సంస్థకు ష్రోడర్ అధిపతి. స్లీమన్ ఓ ఉద్యోగానికి దరఖాస్తు ఇచ్చాడు. అందులో తన అర్హతలను పొందుపరిచాడు… ఏడు భాషలు తెలుసు. అంకెల్లో నేర్పు ఉంది, మెసెంజర్ బాయ్ గా రెండేళ్ళ అనుభవం…

వెంటనే అతన్నిఇంటర్వ్యూ చేశారు. ఈ కుర్రాడు తనకు బాగా పనికొస్తాడని ష్రోడర్ తొలి చూపులోనే గ్రహించాడు. ఇతను వ్యాపార సూక్ష్మాలను బాగా పట్టుకోగలడని కూడా ఆయనకు అనిపించింది. పైగా తన క్రిష్టియన్ పేరే అతనిది కూడా!

కొన్ని నిమిషాల్లోనే అతన్ని బుక్-కీపర్ గా నియమిస్తూ కాగితం ఇచ్చారు. జీతం నెలకు 600 గోడెన్లు. కొన్ని వారాల్లోనే జీతాన్ని1,000 గోడెన్లకు పెంచారు.

స్లీమన్ భాషల అధ్యయనాన్ని కొన్ని మాసాలపాటు పక్కన పెట్టాడు. దానికి బదులు తన బహుభాషా పరిచయాన్ని వినియోగంలోకి తేవడం ప్రారంభించాడు. అందులో త్వరత్వరగా దూసుకు వెళ్ళాడు కూడా. చూస్తుండగానే ఆ కార్యాలయంలోని ప్రధాన లేఖకుల్లో ఒకడైపోయాడు. ఇప్పుడతను ష్రోడర్ ఆంతరంగిక బృందంలో సభ్యుడు!

రష్యానుంచి తమ ఆఫీసుకు రష్యన్ భాషలో ఉత్తరాలు రావడం స్లీమన్ గమనించాడు.  తన భాషాధ్యయనం మళ్ళీ మొదలెట్టాల్సిన అవసరం అతనికి కనిపించింది. కొన్ని వారాల్లోనే రష్యన్ నేర్చుకుని ఆ భాషలోనే ఆ ఉత్తరాలకు సమాధానం రాస్తానని ఆఫీసులో ప్రకటించాడు. దాదాపు ఇంగ్లీష్ నేర్చుకున్న పద్ధతిలోనే రష్యన్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైనా, మరీ అవసరమనుకుంటే తప్ప వ్యాకరణం జోలికి వెళ్లకపోవడం అతను అనుసరించిన పద్ధతి.

ఫ్రెంచ్ రచయిత ఫినెలున్ రాసిన ఉలిసిస్ కొడుకు కథ(Les Aventures de Telemaque)కు పేలవమైన రష్యన్ అనువాదాన్ని సంపాదించాడు. అది  సుదీర్ఘమైన చుట్టుతిరుగుడు వాక్యాలతో ఉంది. ఓ నిఘంటువును, ఓ పాత గ్రామర్ ను కొనుక్కున్నాడు. నిఘంటువులో అర్థాలు చూసుకుంటూ మొదటిసారి కథంతా చదివాడు. ఆ అర్థాలను కూడబలుక్కుంటూ స్థూలంగా కథను అర్థంచేసుకున్నాడు. అతని జ్ఞాపకశక్తి ఎంత అమోఘమంటే, ఒక మాటకు నిఘంటువులొ ఒకసారి అర్థం చూసిన తర్వాత రెండోసారి చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు.

అతను రష్యన్ నేర్పే ఒక ట్యూటర్ కోసం వెతికాడు. ఎవరూ దొరకలేదు. దాంతో పనిగట్టుకుని ఏమ్ స్టడామ్ లోని రష్యన్ కాన్సూల్ కు వెళ్ళి తనకు రష్యన్ నేర్పవలసిందిగా అక్కడి వైస్-కాన్సూల్ ను అర్థించాడు. నాకంత తీరిక లేదంటూ అతను నిరాకరించాడు. అయినాసరే, పట్టు వదలకుండా తను సొంతంగా నేర్చిన తప్పుల తడక రష్యన్ లోనే చిన్న కథలూ, వ్యాసాలూ రాస్తూ సాధనచేశాడు. ఫినెలున్ రచనను కంఠతా పట్టేశాడు. ఆ భాషలోని గాంభీర్యానికీ, శ్రావ్యతకూ అతనెంత ముగ్ధుడైపోయాడంటే, పేరాలకు పేరాలను బిగ్గరగా చదివి ఆనందించేవాడు.

తనకో శ్రోత కూడా ఉంటే మరీ బాగుంటుందనిపించింది. గంటకు నాలుగు ఫ్రాంకుల చొప్పున ఇచ్చేలా ఓ పేద యూదును శ్రోతగా కుదుర్చుకున్నాడు. రాత్రిపూట అతన్ని ఎదురుగా పెట్టుకుని రష్యన్ లో అనర్గళంగా దంచి మాట్లాడుతుంటే లాడ్జీ టొపారం లేచిపోయేది. లాడ్జీ లోని మిగతా వాళ్ళకు అది తీవ్ర అసౌకర్యంగానూ, నిద్రాభంగంగానూ ఉండేది. దాంతో వాళ్ళు యుద్ధానికి వచ్చేవాళ్లు. ఆ కారణంగా అతను రెండుసార్లు లాడ్జీ మారాల్సివచ్చింది.

ఆరువారాలు గడిచేసరికల్లా  అతను రష్యన్ లో తొలి ఉత్తరం రాశాడు. అది కూడా ఆ భాషకు చెందిన అన్ని మర్యాదలనూ పాటిస్తూ! వాసిలీ ప్లొట్నికోవ్ అనే అతనికి రాసిన ఉత్తరం అది. మాస్కోకు చెందిన ఓ అతిపెద్ద నీలిమందు వ్యాపారసంస్థకు ప్లొట్నికోవ్ లండన్ ఏజెంట్ గా ఉన్నాడు.

విచిత్రంగా ఆ ఉత్తరమే స్లీమన్ ఇరవయ్యేళ్ళ భావి జీవితానికి రూపునిచ్చింది.

ఆ రోజుల్లో భారత్, ఆగ్నేయాసియా దేశాలనుంచి నీలిమందును దిగుమతి చేసుకునేవారు. ఏమ్ స్టడామ్ అతి పెద్ద నీలిమందు వర్తకకేంద్రాలలో ఒకటిగా ఉండేది. ఆ నగరంలో తరచు నీలిమందు వేలం జరుగుతూ ఉండేది. స్లీమన్ కు ఎనిమిది భాషలు తెలుసు కనుక అతని కంపెనీ అతన్నే వేలానికి పంపించేది. రష్యాకు సంబంధించిన అన్ని విషయాలపై ఆసక్తి ఉన్న స్లీమన్ వేలానికి వచ్చిన రష్యన్ వర్తకులను పరిచయం చేసుకుని మాటామంతీ సాగించేవాడు. రష్యా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునేవాడు. అక్కడి వ్యాపార అవకాశాల గురించి వాకబు చేసేవాడు. తను మాస్కో వచ్చి ఓ రష్యన్ సంస్థ భాగస్వామ్యంతో దిగుమతుల వ్యాపారం  చేస్తే ఎలా ఉంటుందని అడిగేవాడు.

హాలెండ్ లో ఓ జర్మన్, తమతో తమ భాషలో మాట్లాడడం వాళ్ళకు ఆశ్చర్యం కలిగించేది. క్రమంగా అతని మీద వాళ్ళకు ఇష్టం ఏర్పడింది.

అయితే, ఈ ఉద్యోగంలోకి వచ్చాక కూడా రెండేళ్లపాటు అతను ఇరుకిరుకు లాడ్జీ గదుల్లోనే గడిపాడు. ఇతర ఖర్చులు కూడా కనీసస్థాయికి తగ్గించుకుంటూ ఎప్పటిలానే డబ్బు కూడబెడుతూ వచ్చాడు.  చక్కెర ఎక్కువ వేసుకుని కప్పుల కొద్దీ టీ తాగే ‘దురలవాటు’ మాత్రం అతనికి ఉండేది. చక్కెర అతనిలో ఉండి ఉండి శక్తినీ, ఉత్తేజాన్నీ నింపేది. రాత్రిళ్ళు నిద్ర కాచుకుని చదువుకోడానికీ, ఆలోచించుకోడానికీ అందువల్ల వీలయ్యేది.

ఈరోజుల్లోనే వాళ్ళ నాన్నకు తరచు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. బాధ్యతగా నడచుకోమనీ, ప్రయోజనకరమైన జీవితం గడపమనీ ఆ ఉత్తరాల్లో తండ్రికి హితబోధ చేస్తూ తనే తండ్రి పాత్ర పోషించేవాడు. తనను చూసైనా నేర్చుకోమని చెప్పేవాడు. కుటుంబం నాశనమైపోకుండా కాపాడుకోవాలన్న తపన ఆ ఉత్తరాల్లో ఉండేది. మరోవైపు తండ్రికి రకరకాల కానుకలూ పంపిస్తూ ఉండేవాడు. తను పొదుపు చేసిన తొలి మొత్తాలతో రెండు పెట్టెల బార్డో వైన్ సీసాలు(Bordeaux: ఫ్రాన్స్ లోని ఓ నగరం. వైన్ పరిశ్రమకు ప్రపంచప్రసిద్ధి చెందింది), ఓ పెట్టెడు సిగార్లు తండ్రికి పంపించాడు.

ఆర్థికంగా స్థిమిత పడుతున్న కొద్దీ మిన్నాతో పెళ్లి తలపులు మళ్ళీ అతన్ని ముసురుకోవడం ప్రారంభించాయి. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ తో పెళ్లి చేసుకుని స్థిరపడడం ఇప్పుడతనికి ‘పగటికల’ కాదు. ‘బ్రదర్స్ ష్రోడర్’ స్థాయిని అందుకోబోయే వ్యాపారవేత్తగా కూడా తననిప్పుడు ఊహించుకుంటున్నాడు. ఎనిమిది భాషల్లో పరిజ్ఞానం తనకో ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని కట్టబెట్టగలదని కూడా నమ్ముతున్నాడు.

నీలిమందు వేలానికి వెడుతున్న సందర్భంలోనే జివాగో అనే ఓ రష్యన్ దిగుమతుల వ్యాపారి అతనికి పరిచయమయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా మారింది.  కలసి వ్యాపారం  ప్రారంభించే దిశగా మంతనాలు మొదలుపెట్టారు. “జివాగో & స్లీమన్” అనే పేరుతో ఓ వ్యాపారసంస్థను ప్రారంభించడానికీ, లాభాలు ఇద్దరూ సమానంగా పంచుకునే షరతు మీద తను 60 వేల సిల్వర్ రూబుళ్లను పెట్టుబడి పెట్టడానికీ జివాగో ముందుకొచ్చాడు.

ఈ సంగతి యజమాని హైన్ రిచ్ ష్రోడర్ చెవిదాకా పాకింది. పనికొస్తాడనే ఉద్దేశంతో మంచి జీతమిచ్చి తెచ్చుకున్న ఈ కుర్రాడు చేజారిపోతాడని ష్రోడర్ అనుకున్నాడు.  ఓ రోజున తన దగ్గరకు పిలిపించుకుని, “సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఉంటూ రష్యాలో మన వ్యాపార లావాదేవీలు చూస్తావా?” అని అడిగాడు. దాంతోపాటు బ్రెమన్, ట్రియెస్ట్, స్మిర్నా, లె ఆఫ్రే, రియో డిజెనీరో లలోని మన కంపెనీ శాఖలకు కూడా నువ్వే ముఖ్యప్రతినిధిగా ఉంటావన్నాడు. ఆ ప్రతిపాదన స్లీమన్ కు ఎంతగానో నచ్చింది. వెంటనే ఆమోదం తెలిపాడు.

1845 జనవరిలో, ఏమ్ స్టడామ్ లో తన చివరి రోజుల్ని సెయింట్ పీటర్స్ బర్గ్ లో తను ప్రాతినిధ్యం వహించబోయే వ్యాపారసంస్థల అధిపతులతో మాట్లాడుతూ గడిపాడు. తన వ్యాపారదక్షత మీద అతనికి ఎంత నమ్మకం చిక్కిందంటే, మీకు లాభాలు చూపించేవరకూ నాకెలాంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదని వాళ్ళకు ఖండితంగా చెప్పాడు.

మిన్నా గురించి వాకబు చేయమనీ, తనిప్పుడు ఆమెను పెళ్లాడే స్థితిలో ఉన్నట్టు తెలియజేయమనీ కోరుతూ న్యూ స్ట్రెలిజ్ లో తనకు పరిచయమైన సంగీత విద్వాంసుడు హెర్ లవాకు సెయింట్ పీటర్స్ బర్గ్ కు బయలుదేరేముందు ఉత్తరం రాద్దామనుకున్నాడు.  అంతలో, తనక్కడ స్థిరపడ్డాకే ఆ పని చేయచ్చనిపించి విరమించుకున్నాడు.  తనకు పట్టిన అదృష్టం గురించి వివరిస్తూ తండ్రికి ఉత్తరం రాశాడు.  ఇది కూడా పట్టుదలతో, ఏకాగ్రతతో తను చేసిన కృషి ఫలితమనీ, “ఏ  అదృష్టమైనా  ఓ అనర్హుడిమీద ఆకాశం మీంచి ఊడిపడ”దనీ అందులో ఎత్తిపొడిచాడు.

ఓడ మునిగిపోయి, చావు బతుకుల మధ్య వేలాడుతూ అతను హాలెండ్ తీరానికి కొట్టుకొచ్చి అప్పటికి నాలుగేళ్లే అయింది. ఇప్పుడతను పాతికేళ్ళ యువకుడు. ఏమ్ స్టడామ్ లో చెప్పుకోదగ్గ మిత్రులెవరూ లేరు. ఆ నగరాన్ని విడిచి వెడుతున్నందుకు అతనేమంత బాధపడలేదు.  మొదట కోచ్ లోనూ, తర్వాత మంచు మీద నడిచే స్లై బండి మీదా పదహారు రోజులపాటు ఒళ్ళు హూనమయ్యే ప్రయాణం చేసి, ప్రపంచంలోని అతి పెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన ‘బ్రదర్స్ ష్రోడర్’ కు ముఖ్యప్రతినిధిగా 1845 ఫిబ్రవరి 1న సెయింట్ పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టాడు.

***

సెయింట్ పీటర్స్ బర్గ్ అప్పటికింకా శైశవదశలోనే ఉంది. నికొలస్-I గద్దె మీద ఉన్నాడు. అతనిది కాఠిన్యం ఉట్టిపడే నలుచదరపు మొహం. ఆరడుగుల ఎత్తరి.  అంతకుముందు అతను ఆశ్విక దళాధికారిగా ఉండేవాడు.  దేవుడి దయవల్ల జార్ చక్రవర్తి కాగలిగిన ఓ ఆశ్విక దళాధికారిగానే తనను భావించుకునేవాడు. చక్రవర్తి పదవిని తుదికంటా అనుభవించే హక్కు తనకొక్కడికే ఉందని అతనికి అనిపించేది. దాంతో తన మంత్రుల్ని చూడగానే మొహం చిట్లించుకునే వాడు. తెల్లగా తళ తళా మెరిసిపోయే ఇటాలియన్ తరహా ప్రాసాదాలను వరసపెట్టి నిర్మింపజేయడం అతని ప్రధాన వ్యాపకాలలో ఒకటి. అతను తన ఆహార్యంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. ఒక ఆశ్వికదళాధికారికి తగినట్టుగా అతని ఛాతీ ఒద్దికగా నొక్కుకుపోయినట్టు ఉండేది. ఉచ్చనీచాలు లేకుండా అంతఃపుర స్త్రీలను అనుభవించేవాడు. అతన్ని చూడగానే దాదాపు అందరూ భయంతో వణికేవారు. ఎందుకంటే, అతని ఎడమకన్ను కుడి కన్ను కన్నా ఎక్కువ ఎర్రగా, చింతనిప్పుల్లా ఉండేది. అమానుషత్వం కరడుగట్టిన మనిషన్న భావన కలిగించేది. ఈ విషయంలో అతనికి అలెగ్జాండర్ ది గ్రేట్ తో పోలిక కుదిరింది. అలెగ్జాండర్ కళ్ళు కూడా భీకరంగా ఉండేవి. ఉక్కు పోతపోసినట్టు ఉండే సైనికులకు కూడా అతన్ని చూడగానే పాదాలు చల్లబడేవి.

జార్ చక్రవర్తి నికొలస్-1 (1796-1855)

నీకొలస్-I హయాంలో సెయింట్ పీటర్స్ బర్గ్ వైపరీత్యాలకు చిరునామాగా ఉండేది. వెడల్పాటి వీథులు, ఒకటీ అరా ఫ్యాక్టరీలు, లెక్కలేనన్ని ప్రాసాదాలూ, పేదల పూరిళ్లూ…రోడ్లమీద రద్దీ ఉండేదికాదు. అంత విశాలమైన వీథులూ పాడుపెట్టినట్టు నిర్మానుష్యంగా ఉండేవి. చిత్తడినేలల మీద పీటర్ ది గ్రేట్ నిర్మించిన ఈ నగరాన్ని పునర్నిర్మించే బాధ్యత తనకుందనీ, తను పీటర్ ది గ్రేట్ వారసుణ్ణనీ నికొలస్-I అనుకునేవాడు. శీతాకాలంలో నగరమంతా మంచు దుప్పటి కప్పినట్టుగా తెలుపు ఓడుతూ ఉంటుంది.

రాజోద్యోగులు ఆస్థానం తాలూకు అంతూపొంతూలేని పనికిమాలిన వ్యాపకాల్లోనూ వ్యవహారాల్లోనూ మునిగితేలుతూ ఉండేవారు. సేవకులు దుస్సహమైన పీడన కింద అణగారిపోయేవారు. విద్యార్థులు నిరంకుశ రాచరికాన్ని అంతమొందించే ఆలోచన అప్పటికే చేస్తున్నారు. ఆ ఏడాదే దోస్తోయెస్కీ రాసిన తొలి నవల Poor Folk వెలువడింది. పెట్రాషయెస్కీ వర్గంగా ప్రసిద్ధిలోకి వచ్చిన ఓ బృందం జార్ కు వ్యతిరేకంగా కుట్ర చేస్తోంది. యువకుడైన దోస్తోయెస్కీ కూడా అందులో సభ్యుడు. రష్యా అంతటా సామాజిక చైతన్యం క్రమంగా మేలుకుంటోంది. కట్టు బానిసల్లా బతుకుతున్న జనంలో ఆగ్రహావేశాలు రగలుకొంటున్నాయి.

స్లీమన్ మాత్రం పీటర్స్ బర్గ్ గురించి దీనికి పూర్తిగా విరుద్ధమైన ఊహల్లో మునిగితేలుతున్నాడు. ప్రపంచంలోనే ఓ అత్యుత్తమ ప్రదేశంలో తాను నివసిస్తున్నాననుకుంటున్నాడు. అతని ఉద్దేశంలో పీటర్స్ బర్గ్ వాసయోగ్యమే కాక; వ్యాపారానికి బాగా అనువైన, సురక్షితమైన నగరం. అక్కడి ఇళ్ళు, వీథులు ఎంతో అందంగానూ, శుభ్రంగానూ, ఆహ్లాదకరంగానూ అతనికి కనిపించాయి. అతను రాసే ఉత్తరాల్లో కూడా జార్ నికొలస్ ను మంచి తెలివైన, వైభవోపేతుడైన చక్రవర్తిగా పొగడ్తలతో ముంచెత్తేవాడు. రష్యన్ వర్తకుల గురించి మాత్రం అతనికి ఎలాంటి భ్రమలూ లేవు. అందరు వర్తకుల్లానే వాళ్ళు కూడా వ్యాపారపు మెళకువలు బాగా తెలిసిన కొరకరాని కొయ్యలే. కాకపోతే వాళ్ళ మీద తను రెండాకులు ఎక్కువే చదివానని అతను అనుకుంటున్నాడు. ష్రోడర్ ముఖ్యప్రతినిధిగా తన గొంతు గట్టిగా వినిపించగల స్థితిలో కూడా ఉన్నాడు. దానికితోడు ఉరకలేసే ఉత్సాహం, అంతులేని దాహం…కాళ్లలో చక్రాలు ఉన్నాయా అన్నట్టుగా నిర్విరామంగా ఒకచోటి నుంచి ఒకటికి కదలి వెళ్లిపోతూ ఉండడమే.

పీటర్స్ బర్గ్ లో ఏడు రోజులున్నతర్వాత, తను లావాదేవీలు జరపబోయే సంస్థలతో సంబంధాలను కల్పించుకోడానికి స్లై మీద మాస్కో వెళ్లిపోయాడు. పెద్ద పెద్ద వర్తకప్రముఖులతో కూడా తేలిగ్గా కలసిపోయి, త్వరలోనే వాళ్ళ తలలో నాలుకలా మారిపోగల చాకచక్యం అతనికి ఉంది. పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టిన క్షణం నుంచే అంతర్జాతీయ వర్తక ప్రతినిధిగా తన పాత్రను విజయవంతంగా పోషించాడు. ష్రోడర్ తో పాటు మరో ఆరేడు సంస్థలకు అతను ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. ప్రారంభ సంవత్సరాలలో అతనికి కమీషన్ గా ఇచ్చింది అర్థశాతమే. తొలి ఏడాదిలోనే 1,500,000 గోడెన్ల వ్యాపారం జరిగి, ఆ అర్థశాతం కమీషన్ నుంచే అతనికి 7,500 గోడెన్ల ఆదాయం సమకూడింది. అప్పటికి రెండు మూడేళ్ళ క్రితం అతను కలలో కూడా ఊహించలేని రాబడి అది. పొద్దుట చీకటితోనే లేచి, దాదాపు అర్థరాత్రివరకూ తన డెస్క్ దగ్గర నిలబడి ప్రతి చిన్న వివరం మీదా దృష్టి పెట్టి, లాభం ఎక్కువా తక్కువా అని చూడకుండా దానిని సాధించే ప్రతి ఉపాయాన్నీ అనుసరిస్తూ పోయిన ఫలితమే ఈ విజయం.

Heinrich Schliemann. Portrait of Heinrich Schliemann (1822-90), German archaeologist and discoverer of the ruins of the legendary city of Troy. After finishing his formal education at 14, Schliemann went into business and made his fortune. In 1863 he reti

ఆ ఏడాదిలోనే అతను నాలుగుసార్లు మాస్కోకు వెళ్ళి వచ్చాడు. అక్టోబర్ నాటికి వ్యవహారాలు ఎంత సాఫీగా సాగిపోతూవచ్చాయంటే, వ్యాపార పర్యటనకు విహారయాత్రను కూడా జోడిస్తూ జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ లను ఓసారి చుట్టివచ్చాడు. మధ్యలో కొన్ని గంటలు ఏమ్ స్టడామ్ లో ఆగి హైన్ రిచ్ ష్రోడర్ ను కలిసి తమ పాత సంబంధానికి కొత్త తళుకు నద్దాడు. ఆయన మీద అతనికి గాఢమైన కృతజ్ఞతాభావం ఉంది.

తన పర్యటనలో అతన్ని ఎక్కువ ఆకట్టుకున్నది పారిశ్రామిక అభివృద్ధి. రైళ్లు, వంతెనలు, ఫ్యాక్టరీలు, టెలిగ్రాఫ్ వగైరాలతో యూరప్ నూతన పారిశ్రామిక శకంలోకి శరవేగంతో దూసుకువెడుతోందనీ, రష్యా మాత్రం వెనకబడిపోయిందనీ అనుకున్నాడు. తన దత్తత దేశానికి పారిశ్రామిక ప్రయోజనాలు తెచ్చిపెట్టడం కోసమే తనను ప్రత్యేకంగా ఎంచుకున్నారని కూడా అతనికి అనిపించేది. క్రమంగా తనను ఓ రష్యన్ గానే భావించుకోవడం ప్రారంభించాడు. జార్ గురించి మాట్లాడేటప్పుడు “మన జార్” అనీ; రష్యాను “మన రష్యా” అనీ అనేవాడు.

సంపదను అనుభవిస్తున్నా అతని పొదుపు అలవాటు పోలేదు. ప్రయాణాలలో అతను పెద్ద పెద్ద హోటళ్లలోనే దిగేవాడు. కానీ అతి తక్కువ కిరాయి ఉన్న గదినే ఎంచుకునేవాడు, అది కూడా సాధారణంగా చిట్టచివరి అంతస్తులో. సరిగ్గా పైకప్పు కింద ఉండడమే అతనికి ఇష్టంగా ఉండేది. ఏమ్ స్టడామ్ లో చవకబారు లాడ్జీలలో మిద్దె కింద ఉంటూ రెండేళ్లలో ఏడు భాషలు నేర్చుకున్నప్పటినుంచీ అతనికి కలిగిన ఇష్టం అది.

లండన్ అతనికి నచ్చింది. కాకపోతే అక్కడి విలక్షణమైన విక్టోరియన్ తరహా ఆదివారాలను గడపడం మాత్రం నచ్చలేదు. బ్రిటిష్ మ్యూజియం అంతా కలయ తిరిగి శవపేటికల్లోని మమ్మీలు; గ్రీకు, రోమన్ కళాత్మక కలశాల జాబితాను జాగ్రత్తగా రాసుకున్నాడు. మాంచెస్టర్ కు రైలు ప్రయాణం అతనికి చాలా ఆహ్లాదం కలిగించింది. యూరప్ మొత్తంలో అతి వేగంగా వెళ్ళే రైలు అదే. ఆ రోజుల్లో మాంచెస్టర్ ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక కేంద్రం. ఎక్కడ చూసినా కణకణా మండే బొగ్గు కొలుముల, పొగ గొట్టాలతో ఫ్యాక్టరీల సందడే సందడి. జర్మనీకి పంపడం కోసం అక్కడ నిర్మిస్తున్న ఓ అతి పెద్ద రైలును, “ కాగితాన్ని కత్తిరించించినంత అవలీలగా” ఇనుమును కత్తిరించడాన్ని అతను విప్పారిన కళ్ళతో చూశాడు. ఆవిరి ఓడలు, ఓడ రేవులు, ఇనప కర్మాగారాలు, ఇంగ్లండ్ లో ఈ చివర దక్షిణం నుంచి, ఆ చివర ఉత్తరపు కొసన ఉన్న స్కాట్లాండ్ కు సందేశాన్ని పంపగలిగే టెలిగ్రాఫ్…ప్రతిదీ అతనికి ఆశ్చర్యానందాలు కలిగించాయి. నమ్మశక్యం కానంత అద్భుతంగా తోచాయి. ‘సృష్టికర్త’ చేసిన ఈ అమోఘమైన ఏర్పాట్లన్నీ వ్యాపారాభివృద్ధి కోసమే ననుకున్నాడు. పారిశ్రామిక విప్లవాన్ని అంత నిర్మలంగా ఎవరూ చూసి ఉండరు.

స్వస్థలమైన మెక్లంబర్గ్ లో ఆగకుండా లే అఫ్రే, పారిస్, బ్రస్సెల్స్, కొలోన్ , డుస్సేడార్ఫ్, హాంబర్గ్, బెర్లిన్ మీదుగా అతను సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగివచ్చాడు. మెక్లంబర్గ్ కు వెళ్లకపోవడానికి ఓ కారణం ఉంది. మిన్నా గురించి వాకబు చేయమనీ, ఆమెను తను పెళ్లాడే స్థితిలో ఉన్నాననీ న్యూ స్ట్రెలిజ్ లోని హెర్ లవాకు ఆ ఏడాదిలోనే ఉత్తరం రాశాడు. అతని నుంచి వచ్చిన జవాబు అతనికి పిడుగుపాటు అయింది. ఆ ఆఘాతం అతనిని చంపినంత పని చేసింది.

అతనా ఉత్తరం రాయడానికి కొన్ని వారాల ముందే మిన్నా మెయింకేకు ఓ స్థానిక రైతుతో పెళ్లి జరిగిపోయింది!!!

                                                                                                                     (సశేషం)

 

 

 

 

నదిలో వొదిలిన పాదం..

 

అఫ్సర్ 

 

1

యింకేమీ చెప్పలేను ఆట్టే-

యెన్ని సార్లయినా నది చుట్టూ తిరుగుతాను.

అదే ఆకాశాన్నీ, అదే నీటినీ,

నడుమ యెక్కడో మెరిసే తడి నేలనీ

మళ్ళీ మళ్ళీ కొన్ని మెటఫర్లలోనో ప్రతీకల్లోనో దాచేసుకుంటాను,

మొత్తంగా నదిని నాదైన అనుభవంగా మార్చుకునే మాయా దర్పణమేదీ దొరక్క-

 

2

చాలా వాట్ని విదిలించుకొని

బహుశా నన్ను నేను కూడా వదిలించుకొని

నది భుజమ్మీద చేతులేస్తూ

యెన్ని వందల అడుగులైనా నడిచే వెళ్ళిపోతాను,

ప్రతి అడుగులో నది నన్నేమేం అడుగుతూ వచ్చిందో

వాటికి కొన్ని సమాధానాలు గాల్లో రాస్తూ వెళ్ళిపోతాను.

అన్ని సమాధానాలూ నీలోనే వున్నాయి కదా,

ఎందుకలా దిక్కుల్ని తడుముకుంటూ వుంటావని అడుగుతూనే వుంటుంది  నది,

విడిపోయే అడుగు దగ్గిర కాసేపు నిలబడి వెనక్కి చూపిస్తూ.

 

ఆ సమాధానాలన్నీ మళ్ళీ నీలోనే రాలిపోయాయని అంటాను నిస్సహాయంగా-

 

3

అప్పటిదాకా లేని వొంటరి తనమేదో

తను వెళ్ళిపోయాకే నన్ను చుట్టేస్తుంది,

వెళ్ళిపోయిన తన రెండు చేతుల మధ్యనే యింకా నేను వున్నానని తనకూ తెలుసు.

 

అప్పటిదాకా నేను విదిలించుకొని వచ్చేసిన

అన్ని బెంగలూ, అన్ని చీకట్లూ మళ్ళీ నన్ను అలుముకుంటాయి,

యింకా మిగిలిపోయిన ఆ సాయంత్రపు చీకట్లోకి జారిపోతాను,

యింక ఈ రాత్రిని యెట్లా గట్టెక్కాలా అని లోపలా బయటా మసకబారుతుంది లోకమంతా.

 

4

అప్పుడొక్క అరక్షణం వెనక్కి తిరిగి

నన్ను వదిలి వెళ్ళిన నదిని

తడిసిన కళ్ళతో చూస్తాను,

“అంతా బాగుంది కానీ,

నీలోకి నన్ను వొంపుకోవడం యెలానో నీకు యింకా తెలియలేదు.

నీలోపల తడి వున్నంత మేరా నేనే వున్నాను, వొక్క సారి తడిమి చూసుకో.”

అంటుంది నది.

 

5

బహుశా,

నాలోకి ప్రవహించిన తన అడుగులు కనిపించకే అనుకుంటా,

మళ్ళీ మళ్ళీ నది దగ్గిరకి వస్తాను,

అలా వచ్చిన ప్రతి సారీ యింకొన్ని నీటి దీపాలు వొంట్లో

వెలిగించుకొని వెళ్ళిపోతాను,

నాలోపలి చీకటి వొడ్డు మీదికి.

*

Painting: Cartoonist Raju

అమ్మ కంటే ఎక్కువ…!

 

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshఒక తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ.
అంతే.

ఎవరో ఒకసారి చెప్పారు, ‘ఇంకేం అక్కర్లేదు, ఏ దేవాలయమూ అక్కర్లేదు. ప్రతి రోజూ తల్లిని కలిసి మౌనంగా ఆమె అందించే ఆశీర్వాదాలు పొందితే చాలు’ అని!  తల్లి అనుగ్రహం పొందితే చాలని!’ ఇంకేం అక్కర్లేదని!

తల్లి అనుగ్రహం వుంటే ఇక ఎటువంటి మొక్క అయినా తప్పక ఎదుగుతుందని!
మరి, అంతటి ఇగురం ఎక్కడుంది?
ఇవ్వాళ్టి మనుషులకు అంత దృష్టి ఉందా అని!

కానీ, రోడ్డు మీదికి వెళితే, మనుషులను దర్శిస్తే ఎన్నెన్ని విశ్వాసాలని.
దృష్టాంతాలని!

ఈ ఆటో డ్రైవర్ వేయించుకున్న ‘తల్లిదీవెన’ అన్న పచ్చబొట్టు చూడగానే ఆ మాటలే గుర్తొచ్చాయి.
అడిగితే అదొక చిత్రమే అయింది.

‘ఇది మీ తల్లిదా?’ అని అడిగితే? ‘కాదు’ అని చెప్పాడు.
తన తల్లి ఎల్లమ్మ అట! నిజమే. కానీ తామందరికీ ఇంకో తల్లి ఉందట!!
‘అది మనిషి కాదు, దేవత’ అన్నాడాయన.
‘పెద్దమ్మ మా ఇలవేల్పు. ఆ తల్లి పేరుతో ఈ పచ్చబొట్టు వేయించుకున్నాను’ అన్నాడాయన.

‘ఎందుకు?’ అంటే…’తల్లి కన్నా ఎక్కువ?’ అన్నాడాయన.
‘తల్లితో అనుబంధం కూడా లౌకికమే కదా! అంతకుమించిన దయ కావాలి’ అన్నట్టు చెప్పాడాయన.
‘ఈ తల్లి నా తల్లిని కూడా మంచిగా చూసుకునే తల్లి’ అని చెప్పి కళ్లు తెరిపించాడాయన.
నిజం.
‘నన్నూ, నా కుటుంబాన్నీ, నా తల్లిదండ్రులనీ.. అందర్నీ చూసుకునే తల్లి వుండగా నా కన్నతల్లి పచ్చబొట్టు ఎందుకు వేయించుకుంటాను. నా రక్తంలో ఉన్న తల్లి కాదు, నాకు పైనుంచి అనుగ్రహం అందించే పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం కావాలి’ అన్నాడాయన.

ముచ్చటేసింది.
మాట్లాడుతుంటే, ఎన్ని విశ్వాసాలో!

మాట్లాడకపోతే, ‘ఆ పచ్చబొట్టు తన తల్లి పేరుమీదే వేయించుకున్నాడు కాబోలు’ అనుకుని, ఒకనాడు విన్న ఆ మాట…’తల్లి అనుగ్రహం చాలు’ అన్నదగ్గరే నా దృశ్యం ఆగివుండేది. కానీ, కొత్తగా ఉందిది.

కౌటుంభిక, మానవీయ అనుబందాల కన్నా అతీతమైన శక్తిని వేడుకుంటానన్న ఆ ఆటో డ్రైవర్ ఆశయం బాగున్నది.
దృశ్యాదృశ్యం అంటే ఇదే.
తెలుసుకోవడం.
అవును. కనికట్టుకు దాసోహం కావడం కాదు, తరచి చూసుకోవడం.

వందనం ఎల్లమ్మా.. నీకూ, నీ బిడ్డకు.
పెద్దమ్మా…పరిపరి వందనాలమ్మా…నీ పరివారం తరఫున!

*

ఓ అపురూపమైన కానుక: హౌస్ సర్జన్                         

 

కృష్ణ మోహన్  బాబు

mohanbabu“ మెడిసిన్ ఓ మహా సముద్రం.  లోతు తెలియని, అవతలి ఒడ్డు తెలియని ఒక మహా సముద్రం.  దాని లోతు పాతులు తెలుసుకోకుండా బయట నిలబడి చూస్తే, అందులో ఈదటం చాలా తేలికనిపిస్తుంది.  లోనికి దిగామా ?  ఆ ఆరాటానికి అవధుల్లేవు.  విజ్ఞానం మీద తృష్ణే గాని, తృప్తి అనేది లేదు.

మెడిసిన్ ! మెడిసిన్ !! మెడిసిన్ !!!  అవే నా కలలు.  అదే నా ఆశా జ్యోతి.  అదే నా జీవిత పరమావధి. “

డా. ఎస్. మధుకర రావు, అప్పుడే చదువు పూర్తి చేసుకుని, హౌస్ సర్జన్సీ లో చేరిన కుర్రాడు.  సామాన్య కుటుంబం, తండ్రి లేకపోతే తల్లే వున్న ఆస్తి అమ్మి డాక్టరు చదివించింది.  ఓ చిరునవ్వుతో చుట్టు పక్కల అందర్నీ ఆకట్టు కోగలిగిన ఈ కుర్రాడి హౌస్ సర్జన్సీ అనుభవాలే డా. కొమ్మూరి వేణుగోపాల రావు గారు రాసిన “హౌస్ సర్జన్.”  ఇదొక మెడికల్ డైరీ .

ఆర్దర్ హైలీ అనే బ్రిటిష్ కెనడియన్ రచయిత 1965 ప్రాంతాల్లో “హోటల్ “  లాంటి ఇన్వెష్టిగేషన్ రచనలు చేస్తున్న సమయంలో వచ్చిన పుస్తకం ఇది.  ఈ తరహా రచన తెలుగులో ఇదే మొదటిది.  ఈ నవల అన్ని భారతీయ భాషలలోకి అనువదించబడింది .  అప్పట్లో చాలా మందిలో ఈ పుస్తకం డాక్టర్ కావటానికి ప్రేరణ అయిందని చెప్తారు.  ఇంకో విషయం యేమిటంటే, హైలీ రాసినా, ఆ తర్వాత తెలుగు లో మరి కొంత మంది రచయితలు రాసినా, ఇన్వెష్టిగేషన్ రచనల కోసం ఒక వస్తువుకి సంబంధించిన కథలు ఎత్తుకోవటం, దానిలో అనేక మలుపులు తిప్పుతూ తాము చెప్పదలుచుకున్న సవివరణలని అందులో యిమిడ్చారే గాని ఏ విధమైన వంకర, టింకరాలూ లేకుండా, వైద్యం లోని ప్రతి విభాగాన్నీ క్షుణ్ణంగా వివరిస్తూ, దాని మీద ఏ మాత్రం ఆశక్తి తగ్గకుండా, ఎత్తిన పుస్తకాన్ని దించకుండా చదివించే నవల ఇది.  చాలా మంది వేణుగోపాల రావుగారి మొదటి నవల “ పెంకుటిల్లు” గొప్ప రచన అని మెచ్చుకుంటారు.  అయితే అలాంటి నవలల్ని, అతని సమకాలీకులు ఆ తర్వాత కూడా చాలా మంది  రాశారు.  కాని,
“హౌస్ సర్జన్” లాంటి నవల ఎవరూ ఇప్పటికీ రాయలేదు.

నవలలోకి తీసుకెళ్ళటం కొంచెం కష్టమైన పని.  ఎందుకంటే, కథ అంటూ ఏమీ లేదు.  మెడికల్ హౌస్ సర్జన్సీ చేసేప్పుడు మెడికల్ వార్డులు, పీడియాట్రిక్స్ , ఇ.ఎన్.టి , చెస్టు డిపార్టుమెంట్లలో పోస్టింగ్సు వుంటాయి.  సర్జికల్ హౌస్ సర్జన్సీ టైములో అన్ని సర్జికల్ వార్డులు, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీలలో పోస్టింగ్సు వుంటాయి.  ఇవి కాక గైనిక్, కాజువాల్టీలలో పోస్టింగ్సు వేరే వుంటాయి.  డా. మధు హౌస్ సర్జన్సీ ప్రయాణం మెడికల్ వార్డు, ఔట్ పేషంట్లతో ప్రారంభమై , తర్వాత సర్జికల్ పోస్టింగ్ , ఆ తర్వాత గై నిక్ , ఆ తర్వాత పబ్లిక్ హెల్త్ పోస్టింగ్ నుంచి స్పెషల్ పోస్టింగ్ లోకి వచ్చి, కాజువాల్టీ, దాన్నుంచి రేడియాలజీ లతో హౌస్ సర్జన్సీ పూర్తి చేసి, టైఫాయిడ్ తో సిక్ అయి, స్టూడెంట్ సిక్ రూములో రోగిగా చేరి, ఆ అనుభవం కూడా కూడగట్టుకొని, పై చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు.  ఒక్కొక్క విభాగంలో చూసిన రోగాలు, వాటి ట్రీట్ మెంట్, రోగులు, వాళ్ళ మనస్తత్వాలు, ఎమర్జన్సీలు, అసిస్టెంట్లు, డాక్టర్లు, నర్సులు, చీఫ్ లు అలా ప్రతీ అంశాన్ని తడుముకుంటూ నడుస్తుంది ఈ యాత్ర.

2213_front_cover

ఓ మంచి డాక్టరుకి సహనం, సమయస్ఫూర్తి, ధైర్యం, అంతకుమించి మానవత్వం చాలా అవసరం.  మెడిసిన్ మీద శ్రధ్ధా శక్తులున్న ఎవరికైనా హౌస్ సర్జన్సీ పీరియడ్ మహత్తర దశ అని నమ్మిన డా. మధు తనకెదురైన ఎన్నో అనుభవాల్ని మనతో పంచు కుంటాడు.  సెలైన్ ఎక్కించడానికి వెయిన్ దొరక్కపోతే మొదటిసారి ‘ఓపెన్ మెథడ్ ‘ లో చర్మం కోసి రక్తనాళం బయటికి తీసి ఎక్కించటంతో డాక్టరుగా సాహసం మొదలవుతుంది.  మరో రోజు డిఫ్తీరియాతో వచ్చి ఊపిరాడక విల విల లాడుతున్న ఓ మూడేళ్ళ కుర్రాడికి, వైద్యం చేయవలసి వస్తుంది.  ఆన్టీ  డిఫ్తీరిక్ సీరం ఇచ్చి ఇ.ఎన్.టి. సర్జనుకి కబురు పెడ్తాడు.  గంట లోపల ట్రెకియాటమీ చేయక పోతే పిల్లాడు బతకడు.  ఇ.ఎన్.టి. డాక్టరు డ్యూటీ అయిపోయి ఏదో సినిమాకి వెళ్తాడు.  ఏం చేయాలి?  విద్యార్థి గా వుండగా ఒకటి, రెండు సార్లు చూసిన జ్ఞాపకంతో తప్పని పరిస్థితులలో ఆపరేషన్ కి సిధ్ధ పడ్తాడు డా. మధు.  చెయ్యక పోతే పిల్లాడు బతకడు.  సరిగా  చెయ్యక పోయినా బతకడు.  ప్రాణం కాపాడటం కోసం సాహసం చేసి నెగ్గుతాడు.  డా. మధు ఎదుర్కొన్న యిలాంటి ఎన్నో అనుభవాలని రచయిత మనల్ని దగ్గరకు తీసుకెళ్ళి, చూపించి విడమరచి మరీ చెప్తాడు.  అదీ ఇన్వెష్టుగేషన్ రైటింగ్ అంటే. మనల్ని కూడా యిందులో లోతుగా మునిగి పోయేలా చేయటం రచయిత సాధించిన విజయం.

ఓ రోజు అంబిలికల్ హెర్నియాతో ఓ రోగి వస్తాడు.  ఆలస్యం చేసి పీకల మీదకు తెచ్చుకుంటాడు.  రోగికి చావు బతుకుల సమస్య.  ఆపరేషన్ చేయడానికి మంచి కేస్ దొరికిందని డా. మధు సంతోషిస్తూ, “ఒక రకంగా వైద్య వృత్తి అతిక్రూరమైనది.  హార్టు కేసు చూసిన ఫిజీషియన్, ‘ఆహా వినండి, వినండి మర్మర్  ఎంత బ్యూటీఫుల్ గా వినిపిస్తోందో ‘ అంటాడు.  ఈ వృత్తిలో ఎంత దారుణం  దాగి వుంది” అని స్వగతంగా అనుకుంటాడు.  ఇది వైద్య వృత్తిలోని మరో కోణం.

డా. మధు తో పాటు వచ్చే పోయే పాత్రలు, చీఫ్, డా. రంగనాధం, డా. కామేశ్వరి, హాస్పిటల్ సూపరింటెండెంట్, డా.దయానంద రాజు, మెడికల్ అసిస్టెంట్స్, డా.నాయుడు, డా. రామదాసు మొదలైన వాళ్ళంతా ఒకటి, రెండు పేరాల పరిచయమే అయినా పుస్తకం మూశాక మనల్ని వదలరు.  తోటి డా.మృదుల ప్రేమ, నర్సు నళినీ ఆరాథన ఈ మెడికల్ డైరీ కి కాస్త తడిని కలిగించి ఈ రచనని నవలగా మారుస్తాయి.  డాక్టరుకి  నర్సుకీ వుండే చిత్రమైన రిలేషన్, పరిధులు దాటే కొంతమంది నర్సులు, వాళ్ళతో తిరిగే డాక్టర్లు, రకరకాల మనస్తత్వాల రోగులు, హాస్పటల్ని నడిపే నియమ నిబంధనలు, ఇవన్నీ మరో ప్రపంచం.  ఈ ప్రపంచంలోని ప్రతి మూలకీ తీసుకెళ్తుందీ రచన.

ఇవన్నీ పాత జ్ఞాపకాలు.  హాస్పిటల్ అంటే ప్రభుత్వాసుపత్రి మాత్రమే అనుకొనే రోజులు.  ఇప్పుడు అన్నీ మారి పోయాయి.  వైద్యం కార్పొరేట్ పరం అయింది.  వేల ల్లో , లక్షల్లో ఖర్చు.  వుచితం వూహకందని విషయం.   ఫ్యామిలీ డాక్టర్లు మాయమయి, అవయవానికో డాక్టరు వచ్చాడు.  కనీసం రక్త పరీక్ష లేకుండా ఫ్లూ జ్వరానికి కూడా మందు రాయలేని కాలం.  మున్నాభాయిలు ‘వ్యాపమ్’ లో డిగ్రీలు కొనుకుంటున్నది నిజం.  వైద్యం లోను అనేక మారులు వచ్చాయి.  కొత్త కొత్త రోగాలు వచ్చాయి.  వాటికి కొత్త కొత్త మందులూ వచ్చాయి.  అవయవాలు తీసి అమర్చటం అవలీల గా జరుగుతోంది.  చెడు ఎక్కువగా కనబుడుతున్నా, మంచి కూడా చాలా వుంది.  ఎందుకంటే మనుషుల్లో భావోద్వేగాల్ని ఎవరూ తీసేయ లేరు.  ఆపరేషన్ ఫెయిలు అయితే ఆందోళన పడే డాక్టర్లు ఎప్పటికీ వుంటారు.  అందుకే ఈ నాటి విషయాలతో ఎవరైనా మళ్ళీ యిలాంటి రచనకు ప్రయత్నించ గలిగితే అది కొమ్మూరి వేణుగోపాల రావుగారి కిచ్చే అధ్భు తమైన నివాళి అవుతుంది.

*

 

తెగిన గాలిపటాలు   

                                                                              

profile photo

                                                                       

అబ్బా! ఆఫీస్ అవర్స్ కాకపోయినా, ఈ ట్రాఫిక్ ఇంతుంది. ఈ లెక్కన ఎప్పుడు చేరతానో, ఏమో! రెండు గంటలైనా పడుతుందంటాడీ మేరూ కాబ్ డ్రైవర్.
‘అయినా ఈ టీనాకి అద్దెకి తీసుకొని ఉండడానికి ఊరు శివార్ల ఉన్న ఛత్తర్‌పురే దొరికిందా!’-చిరాకు పడ్డాను.

రాత్రి పది గంటలకి ఫోన్ చేసి చెప్పింది- ‘ఇవాళ్ళ తన పుట్టినరోజని.’ దార్లో ఫాబ్ ఇండియాలో ఆగి తనకో కుర్తా కొని దాన్ని గిఫ్ట్ రాప్ చేయించడానికి మరి కొంతసేపు పట్టింది.

నా కోసం మిగతా అందరూ మధ్యాహ్నం భోజనాలకి వెయిట్ చేసి, తిట్టుకుంటూ ఉండి ఉంటారిప్పటికే.
ఎలా ఉన్నారో అందరూ! టీనా అయితే ఎనిమిది నెలల కిందట ఇంటికి వచ్చింది. పూజాని-వాళ్ళమ్మగారు పోయినప్పుడు, నాలుగేళ్ళ కిందటేమో ఆఖరిసారి కలుసుకున్నది. ఆనానీ, పోదార్‌నీ అయితే- నేను ఉద్యోగం వదిలేసేక మళ్ళీ చూడనేలేదు.

ఎప్పటి స్నేహాలు! ఎన్ని జీవితాలు- ఎలాంటి మలుపులు తిరిగేయో!

***

వీళ్ళందరిలో టీనాయే ఆశ్చర్యం నాకెప్పుడూ. జీవితంలో తనంతట తానే సృష్టించుకున్న ఒడుదొడుకులు ఏ సినిమా కథకీ తీసిపోవు.  కానీ తనలో బాధా, కోపం, ఈర్ష్యా, ఆవేశం- వీటి వేటినీ ఇప్పటివరకూ చూడలేదు నేను. ఏ సందర్భంలోనూ కళ్ళనీళ్ళు పెట్టుకున్న గుర్తు కూడా లేదు. ఆ మనస్తత్వం ఇప్పటికీ నాకర్థం కాదు.

మొదటిసారి తన్ని చూసినది నేను కంచన్‌జంగా బిల్డింగ్లో పని చేస్తుండగా. కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఉద్యోగం వచ్చి చేరింది.

అప్పటికే టీనాకి ఒక పెళ్ళి అవడమూ, విడాకులూ కూడా అయేయి. కూతురైన మేఘనాకి ఆరేళ్ళు దాటి ఉండి ఉంటాయి. అప్పుడు టీనా ఎంత నాజూకుగా ఉండేదో! ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నంత మృదువైన కష్మీరీ తెలుపు. సన్నగా ఉండి, పొడుగాటి జుట్టుతో ఈర్ష్య కలిగించేటంత అందంగా ఉండేది.

చేరిన రెండేళ్ళకే ఖాన్‌తో తిరగడం మొదలుపెట్టింది. ఖాన్- పిఆర్ డిపార్టుమెంట్లో మానేజర్. పెళ్ళాం పోయిందనీ, భార్య మరణానికి అతనే కారణమనీ కూడా చెప్పుకునేవాళ్ళు. పట్టుమని ఒక నెల తిరగలేదు. టీనా ఖాన్‌ని పెళ్ళి చేసుకుందని తెలిసింది. ఆఫీస్లో అందరికీ మిఠాయి పంచింది కానీ నాలాగే ఎవరికీ సంతోషం కలగలేదన్నట్టే గుర్తు.

ఆ పెళ్ళీ తాన్యా పుట్టిన తరువాత, ‘తలాక్. తలాక్, తలాక్” అవడానికి రెండేళ్ళు కూడా పట్టలేదు. అతనితో కలిపి ఉన్నంతకాలమూ, ఆఫీసుకి వచ్చిన చాలాసార్లు- ముందు రాత్రి జరిగిన సంఘటనలకి గుర్తుగా తన చెంపలు కమిలి ఉండటం, చేతుల మీద రక్కులూ కనిపిస్తూనే ఉండేవి. ‘గతం గతహ్’ అనుకొమ్మని పెద్దలు చెప్పిన మాటని తు : చ తప్పకుండా, ఎంతో సులభంగా పాటించే అద్భుతమైన అలవాటు టీనాకి. అందుకే రెండు పెళ్ళిళ్ళూ, రెండు లివ్- ఇన్- రిలేషన్‌షిప్ల తరువాత కూడా ఎటువంటి విషాదాన్నీ తన చెంత చేరనీయలేదు.

***

బోయ్ బోయ్ మంటూ డ్రైవర్ ఒకటే హార్న్ మోగిస్తుంటే ఈ లోకంలో పడి చుట్టూ చూసేను. వసంత్‌కుంజ్ దాటినట్టున్నాం.”పదిహేను నిముషాలే మేడం. ఆడ్రెస్ చెప్పండి”-‘నేవిగేషన్’ ఆన్ చేస్తూ అడిగేడు డ్రైవర్. వాట్స్‌అప్లో టీనా పంపించిన చిరునామా చూసి చెప్పేనతనితో.

“ఉన్నావా, ఊడేవా, ఎక్కడి వరకూ చేరేవు?”- ప్రశ్నలు కురిపిస్తూ ఫోన్లు రావడం ప్రారంభించేయి.

మొత్తం మీద, ట్రాఫిక్ దాటుకుంటూ ఆ ఛత్తర్‌పురేదో చేరేను. కారు కూడా కష్టంమీద దూరగలిసేటంత ఇరుకు సందులు. ఇంటి నంబర్లు చూసుకుంటూ ఎలాగో చేర్చేడు డ్రైవర్ మహానుభావుడు. రెండో అంతస్థు. రీటా, పూజా, ఆనా, పోదార్ తప్ప ఇంకెవరూ కనపడలేదు. కొంచం అభిమానంగా, కొంచం ఫార్మల్గా ఒకళ్ళనొకళ్ళమి దగ్గిరకి తీసుకున్నాం.

చుట్టూ చూస్తే, పెచ్చులూడుతున్న గోడలూ, వాటికి పట్టిన బూజూ-మొదట నా కంటబడినవి. ఎదురుగా ఉన్న బుద్ధుడి ప్రేయర్ వీల్ మీదా, కొవ్వొత్తుల మీదా దుమ్ము దట్టంగా పేరుకుని ఉంది. లివింగ్ రూమ్ కిటికీకి తగిలించిన కర్టెన్లు చూస్తే, అవి ముందింకెక్కడో వేళ్ళాడి ఉండేవన్న చిహ్నంగా- కర్టెన్ల పొడుగూ, వెడల్పూ- రెండూ తక్కువయేయి. వాటి సందుల్లోనుండి బాల్కనీలో ఉన్న ఎండ లోపలికొస్తోంది. ఒక బెడ్రూమ్ తెరిచి ఉంది. దానికి వేళ్ళాడదీసిన కర్టెన్లు- మధ్య బ్రాకెట్లనుంచి జారి, కొంతమేర లూసుగా బయటకి వచ్చేయి. ఆ పక్కనున్న గది తలుపు మూసి ఉంది.

ఎయిర్ కండిషనర్ చప్పుడు చేస్తూ బలహీనంగా నడుస్తోంది. ఇంతెండల్లో- కనీసం పనంటూ చేస్తోంది, నయం.

Kadha-Saranga-2-300x268

లివింగ్ రూమ్లోనే ఒక మూల వంటింటి కోసం అని కేటాయించిన ఏడడుగుల చదరంలో, స్టవ్ మీద మూత కూడా పెట్టని అల్యూమినిమ్ గిన్నెలో చల్లారిన అన్నం, ఆ పక్కన పెట్టిన చిన్న టేబిల్ మీద గాజు గిన్నెల్లో పెట్టిన వండిన పదార్ధాలేవోనూ కనిపిస్తున్నాయి. ఆ పక్కన ఒక మూల ప్లాస్టిక్ ప్లేట్లూ, కప్పులూ, స్టీల్ స్పూన్లూ.

“ఒక్క నిముషం. వాష్రూమ్ ఉపయోగించుకోవచ్చా?”- అడిగితే తెరిచి ఉన్న గదివైపు చూపించింది టీనా. గదిలోకి అడుగుపెడితే ఇవతల ఉన్న తలుపు కూడా మూసుకోకుండా, బాత్రూమ్ లో ఒక ప్లాస్టిక్ స్టూల్ మీద కూర్చుని సిగరెట్ పీలుస్తోంది తాన్యా.

వెనక్కి తిరుగుతుంటే “మీరు రండి ఆంటీ, నేను బయటకి వచ్చేస్తున్నాను” తాపీగా ఏష్ ట్రేలో సిగరెట్టు బట్ నొక్కి, బయటకి వచ్చింది. ఆ గదికి ఒక కిటికీ అంటూ లేదు. సింగిల్ బెడ్ మీద పరిచిన దుప్పటి వెలిసి, పాతబడి, అస్తవ్యస్తంగా ముడతలు పడి ఉంది.

రెండు నిముషాల తరువాత బయటకి తిరిగి వచ్చి పడ్డాను.

ఇరుగ్గా ఉన్న లివింగ్ రూమ్లో, కిటికీ ముందున్న కుర్చీలో చిరునవ్వు చిందిస్తూ కూర్చుని ఉంది ఆనా. గలగలమని మాటలాడటం తన స్వభావానికి విరుద్ధం అని నాకెరుకే. భర్తా తనూ ఎన్నో ఏళ్ళగా, ఒకే ఇంట్లో –వేరే వేరే అంతస్థుల్లో, అపరిచితుల్లా ఉండటం నాకు తెలుసు. లేటుగా పుట్టిన పిల్లల చదువులింకా పూర్తవలేదు. రిటైర్ అయిన తరువాత చేతికి వచ్చిన డబ్బంతా ఏదో స్కాంలో పోగొట్టుకుంది. పూజాతో పాటు థియేటర్లకీ వాటికీ తిరుగుతూ ఉంటుంది!

నాపక్కన కూర్చుని పూరిగా చల్లపడని బీర్ కాన్లని ఖాళీ చేస్తున్న పోదార్ ని ఇంకో కుర్చీలోకి వెళ్ళమని పూజా నా పక్కన కూర్చుంది. రెండేళ్ళు లీవ్ ఆన్ విథౌట్ పే తీసుకుని, తరువాత వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుంది. ఏదో ఆన్ లైన్ సైటు అమ్మకాల్లో- మిగతావాళ్ళతో కలిపి చేరింది.
“అదేమిటి, ఎక్సెర్‌సైజూ, నడకా ఏమీ లేవా? ఇలా లావయేవు?”- ఎంత స్నేహితురాలైనా ఈ మధ్య మాటలు తగ్గిపోవడంతో సంకోచిస్తూనే అడిగేను.

“నీకు తెలియదా?”
ఎప్పుడు ఫోన్ చేసినా “ఇప్పుడు ఖాళీగా లేను. రేపు నేనే నీకు ఫోన్ చేస్తాను” అని చెప్పేదే తప్ప తనంతట తాను ఫోన్ చేసిన పాపాన్న పోతే కదా! ఏమిటి తెలిసేది!

“ఎయిర్‌పోర్టంతటా తెలుసు. నేను సెలవులో ఉన్న రెండేళ్ళూ రోజుకొక వోడ్కా బాటిల్ ఖాళీ చేసేదాన్ని. మరి సన్నబడాలంటే, అదంత సులభమా!”- తెల్లబోయి తన మొహం చూసేను.

డబ్బుకి లోటు లేదు. వాళ్ళమ్మమ్మ గ్రీన్ పార్కులో ఉన్న పెద్ద బంగ్లాని తన పేరనే రాసి పోయింది. కింద ఉన్న  తండ్రికీ, పై అంతస్థులో ఉండే పూజాకీ ఇరవై ఏళ్ళగా మాటల్లేవు-పనివాళ్ళ ద్వారా తప్ప. తనకన్నా తొమ్మిదేళ్ళు చిన్నవాడైన తమ్ముడు పెళ్ళి చేసుకుని న్యూయోర్క్‌లో స్థిరపడ్డాడు.

ఎప్పుడో, ఎవరితోనో ప్రేమలో పడి వైరాగ్యం పెంచుకుని పెళ్ళి చేసుకోలేదు. తన కుక్కలూ, ఆ పెద్ద ఇల్లే తన ప్రపంచం. వయస్సు పెరుగుతున్నకొద్దీ ఒంటరితనం వల్ల, అభత్రతాభావం పెరిగిపోతోందని చాలా ముందే తెలుసు. కానీ అది మరీ ఇలా దారి తీస్తుందని ఊహించలేదు.

“అలా తాగితే మరి నీ కుక్కలనీ, ఇంటినీ ఎవరు చూస్తున్నారు? అసలు నీకెవరు కొని పెడుతున్నారు? ఇప్పడూనా?”

“మాల్స్‌లో కొనడానికి అడ్డేముందీ? నేనే వెళ్ళి కొనుక్కునేదాన్ని. రాత్రిళ్ళు కదా తాగేది! ‘కుక్కలు’ అనకు. అవి నా పిల్లలని తెలుసు నీకు. వాటికి తిండి పెట్టిన తరువాతే తాగేదాన్ని. ఇప్పుడు హార్డ్ డ్రింక్స్ మానేసేనులే. ఇవిగో చూడు, నేనూ, ఆనా తాగిన బ్రీజర్లు”-సాక్ష్యంగా చూపించింది ఒక కుర్చీ కిందున్న రెండు ఖాళీ సీసాలని.

తిరిగి నాకు ఎప్పుడూ ఫోన్ చేయకపోడానికీ, మిగతా స్నేహితులతో లంచో, డిన్నరో ప్లాన్ చేసుకున్న ప్రతీసారీ తను మాత్రం రాకపోవడానికీ కారణం ఇదా!

వంటరితనం అంటే ఏమిటో, దాని ప్రభావం ఎలా ఉంటుందో- అర్థం అయి, భయం కూడా వేసింది.

kites-2

అటు చూస్తే తన పుట్టినరోజు జరుపుకుంటున్న టీనా ఎనిమిది నెల్ల కిందట నేను చూసిన కన్నా మరి రెండితంతలు ఊరిపోయి ఉంది. వేసుకున్న జైపూరీ పొడుగు స్కర్ట్‌ని తోసుకుంటూ, పొట్ట ముందుకు పొడుచుకు వచ్చి ఉంది. పాదాలూ, చేతులూ ఉబ్బి ఉన్నాయి. ట్రిపిల్ చిన్ స్పష్టంగా కనిపిస్తోంది. మోచేతి పైభాగపు కండరాలు వేళ్ళాడుతున్నాయి. సగానికి పైగా నెరిసిన పొట్టి జుత్తు. చేతులకి బిగ్ బజార్లో కొనుకున్నానని చెప్పిన అర డజను రోల్డ్ గోల్డ్  గాజులు, మెడలో రెండు గొలుసులూ, పది వేళ్ళకీ అయిదు బిగుతు ఉంగరాలూ.
“పోయి, ముందు భోజనం తెచ్చుకొండి మీరిద్దరూ”- తాన్యా కూతుళ్ళిద్దరితో చెప్తోంది.

“అరవింద్ ఎక్కడ? ఇక్కడ ఉండటం లేదా?”- నిర్మొహమాటంగానే అడిగేను. అరవింద్ కిందటి ఏడేళ్ళగా తనతో సహజీవనం చేస్తున్న 64 ఏళ్ళ లాయరు. ఒకే ఇంట్లో కలిసి అద్దెకి ఉండేవారు.

“తను ముందుండే ఇంట్లోనే పక్క బ్లాకులో ఉంటున్నాడు. ఆ బిల్డింగ్లో స్వైన్ ఫ్లూ వల్ల ఇద్దరు పోయేరు. ఈ చిన్నపిల్లల వల్ల భయం. నేనే అప్పుడప్పుడూ అక్కడికెళ్ళి పలకరించి వస్తాను.”- తాన్యా పిల్లలిద్దరి వైపూ చూపిస్తూ చెప్పింది.

“ఏమిటి భోపాల్లో ఉద్యోగం మానేసేవట!”- తాన్యా వైపు ప్రశ్నార్థకంగా చూసేను.

“తను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటుందిలే” – కళ్ళు ఆర్పి నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న టీనా చేస్తున్న సైగలు అర్థం కాలేదు.

అది గమనించగానే తాన్యా  తారాజువ్వలా- అందరమూ ఉన్నామని కూడా చూసుకోకుండా తల్లి మీదకి లేచింది. ఇబ్బందిగా అనిపించి మాట మార్చేను.

ఇంతలో టీనా చెల్లెలు నీరా వచ్చింది. ‘హమ్మయ్యా  ఇంకా నేనే అందరికన్నా లేటేమో’ అనుకున్నాను. చేతిలో కార్ కీసూ, ఎంబ్రోయిడరీ చేసిన ఒక ఎథ్నిక్ పౌచూ పట్టుకుని, ఖాకీ పాంట్సూ, తెల్లటి స్లీవ్ లెస్ లినిన్ చొక్కా వేసుకుంది. మెడవరకూ ఉన్న జుత్తు సగానికి పైగానే నెరిసినా చాలా హుందాగా కనిపిస్తోంది. చేతికి పెట్టుకున్న వాచ్ తప్ప నగలూ, అలంకారాలూ ఏమీ లేవు. మొహంలో వింతైన ఆకర్షణ. అక్కకీ తనకీ ముఖ పోలికలు బాగానే ఉన్నాయి. తీసుకున్న నిర్ణయాల వల్లా, ఎంచుకున్న పార్ట్‌నర్ల వల్లా, జీవితంలో ధక్కా ముక్కీలు తిన్న టీనా మొహంలో- ముందుండే లాలిత్యం, సౌకుమార్యం ఎప్పుడు మాయం అయేయో అని నేను గమనించలేదన్న సంగతిని నీరా మొహంలో ఉన్న స్థిమితం, స్థిరత్వం జ్ఞాపకానికి తెచ్చేయి.
అనూ భోజనం మొదలుపెట్టింది. మనం కూడా ప్లేట్ తెచ్చుకుందామా?”- నీరా మాటలకి తలాడించి, నేనూ లేచేను.

“రొట్టెల్లేవా?”- నీరా అక్కని అడుగుతోంది.

“తాన్యా మీట్, కూరా చేసింది. నేను రాజమా, అన్నం వండేనంతే”- తనే అతిథిలా, టీనా మాత్రం కూర్చున్న చోటునుంచి లేవకుండానే సమాధానం ఇచ్చింది.

పోదార్ వెచ్చబడిన బీర్ తాగుతూ, పది నిముషాలకోసారి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్టు తాగి వస్తున్నాడు.

“నాకు ఆకలేస్తోంది. ఆపింక”–టీనా మందలిస్తోంది.

“ఇదిగో ఈ కాన్ పూర్తవనీ. అయినా నిన్నేమైనా ఆపేనా? నువ్వు పెట్టుకు తిను”- నిర్లక్ష్యంగా జవాబిచ్చేడు.

భోజనాలయేయి. హృదయం ఆకారంలో ఉండి, కరగడానికి సిద్ధంగా ఉన్న ఒక అతి చిన్న చాక్లెట్ కేకుని కట్ చేసింది టీనా. డ్యూటిఫుల్గా చప్పట్లు కొట్టి, తన్ని విష్ చేసి, తనకోసం తెచ్చినవేవో ఇచ్చేం మేము నలుగురు ఆడవాళ్ళం.

“ఇంక నేనూ, ఆనా వెళ్తాం. అసలే నాకు వంట్లో బాగాలేదు. డ్రైవ్ చేయడానికి ఎక్కువ ఓపిక కూడా లేదు. ట్రాఫిక్ ఎక్కువవుతుంది.”- పూజా తన బాగ్ తీసుకుని లేచింది ఆనాతో పాటు. తను కూడా వెళ్తానన్నట్టు నీరా కూడా లేచి నిలుచుంది.

వీళ్ళయితే అందరూ సౌత్ ఢిల్లీలో ఉండేవాళ్ళే. నేనే ఎక్కువ దూరం వెళ్ళాల్సినదాన్ని. ఆఫీసునుండి త్వరగా బయలుదేరి నన్ను పిక్ అప్ చేసుకోమని అర్జున్‌కి ఎలాగో చెప్పేను. ఇంకొంచంసేపు కూర్చోవడం తప్ప గత్యంతరం లేదు .

***

వాళ్ళు వెళ్ళేరో లేదో, పోదార్ టీనా పక్కనే తన్ని ఆనుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. తను ఎదురుగా ఉన్న బల్ల మీద కాళ్ళు చాపి పెట్టింది. “ఎంత లావయేవో చూడు”- తన ఆంకిల్ని వేలుతో పొడుస్తూ అంటున్న పోదార్ని రీటా వారించకపోవడం ఆశ్చర్యం కలిగించలేదు. ఆపి ఉంటే విస్మయపడి ఉండేదాన్నేమో!

“అరవింద్ రాలేదెందుకని అడిగేవు కదూ? ‘పోదార్ ఉన్నాడు కదా! మళ్ళీ నేనెందుకు!’ అన్నాడు.” టీనా హాస్యంగా చెప్పింది.

ఆ హాస్యంలో సత్యం పాలు తక్కువేమీ కాదని అర్థం అవుతూనే ఉంది.

నిస్శబ్దంగా కూర్చుని ఎదురుగా మ్యూట్లో పెట్టి ఉన్న టివి వైపు చూస్తున్నాను.

పోదార్ నావైపు తిరిగి “సాయంత్రం కూడా కొంతమందిని పిలిచేం. నువ్వుంటావు కదా”- అడిగేడు. బహువచనం!!!

“వీలవదు. అర్జున్ వస్తాడు ఒక గంటలో. నేను వెళ్ళాలి. “- నా గొంతులో అలక్ష్యం నాకే తెలుస్తోంది.
ఇంకో రెండు సిగరెట్లు కాల్చేడు.

ముళ్ళమీద కూర్చున్నట్టనిపించడం ప్రారంభం అయింది.

“రాత్రికి రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చి, భోజనం పాక్ చేయించుకుని తిరిగి వస్తాను. మళ్ళీ నువ్వు వంటలంటూ పెట్టుకోకు.”- టీనాతో చెప్తూ, పోదార్ కారు తాళాలు తీసుకుని లేచి బయటకి నడిచేడు.

చాలా సేపటినుండీ శ్వాస బిగబట్టుకుని ఉన్నానన్న సంగతి గాఢంగా ఊపిరి పీల్చుకున్నప్పుడు కానీ గుర్తుకి రాలేదు.

టీనా కళ్ళు నిద్ర భారంతో మూసుకుంటున్నాయి.

“పడుక్కో కొంతసేపు. మళ్ళీ రాత్రి కూడా మెలకువగా ఉండాలిగా!” నేను అనడమే ఆలశ్యం- సోఫా కమ్ బెడ్ బయటకి లాగి, దానిమీద వాలింది.
వెనక బెడ్రూంలోకి చూస్తే తాన్యా గాఢనిద్రలో ఉంది- చిన్నదాన్ని పక్కలో వేసుకుని.
అర్జున్ రావడానికి అరగంటైనా పడుతుంది. పోనీ ఏదైనా పుస్తకమైనా తిరగవేద్దామంటే, వాటి జాడే లేదెక్కడా.

kites-2

“ఆంటీ- ‘గ్లోబ్, గ్లోబ్’ ఆట ఆడదామా?- అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా అడిగింది పెద్ద మనవరాలు సెఫాలీ నా పక్కన కూర్చుంటూ.
“ఎలా ఆడాలో చెప్పు. ఆడుకుందాం.”- చిన్నపిల్లని నిరాశపరచదలచుకోలేదు.

ఇద్దరం దేశాల పేర్లూ, ఊళ్ళ పేర్లూ చెప్పుకుంటూ ఆడుతున్నాం.

“ఎక్కడీ టీనా ఇల్లు? ఇదే బ్లాకులో తిరుగుతున్నాను పది నిముషాలనుంచీ”-“ఫిర్యాదు చేస్తున్న ధోరణిలో అర్జున్ ఫోన్.

“నేను కిందకొచ్చి నిలబడతాను.”- సమాధానం చెప్పి నిద్రపోతున్న టీనా వైపు చూసేను. కొద్దిగా నోరు తెరిచి, సాఫ్ట్ గా గుర్రు పెడుతోంది. “సెఫాలీ, ఇంక నేను వెళ్తున్నానమ్మా. అమ్మమ్మ లేస్తే చెప్పు, నేను వెళ్ళేనని.”- బాగ్ తీసుకుని కిందకి దిగేనో లేదో- అర్జున్ కారు సందు చివర్న లోపలకి వస్తూ కనపడింది.

***

దార్లో “ఏమిటి పుట్టినరోజు విశేషాలు?”- అడిగిన అర్జున్‌తో క్లుప్తంగా చెప్పేను. “పోన్లెద్దూ, ఎవరి జీవితాలు వాళ్ళవి. తమకి ఇష్టం వచ్చినట్టు గడుపుకుంటారు. నీకెందుకు?  ఎవరినయినా తీర్పు తీర్చడానికి నువ్వెవరివి? వెళ్ళేవు, నీ స్నేహితులని కలుసుకున్నావు, వచ్చేవు. కొన్ని అనుభవాలు మనకి పాఠంగా నిలవాలి తప్పితే మనలని బాధ పెట్టకూడదు. ఇంకేదైనా మాట్లాడు.”- మాట మళ్ళించేడు.

భోజనం చేసిన తరువాత “చూసేవా వ్యవహారం?”-పూజా ఫోన్.  కోపమో, బాధో- మరింకేదో భావం.

“అర్థం కాలేదు. దేని గురించి?”

“టీనా పోదార్- వాళ్ళ నాటకాలూ. చూడలేదా? అసలే లోకంలో ఉన్నావు?”

“ఏదో అనుమానం వేసింది కానీ అసలెందుకివన్నీ తనకీ వయస్సులో? తన మానాన తన పనేదో చేసుకోవచ్చుగా!”- అయోమయంగా అడిగేను.

“అయ్యో తల్లీ! సర్వైవల్. ఈ ఏమ్వే ప్రోడక్ట్స్ అమ్మకాలతోనే తన అవసరాలన్నీ తీరుతున్నాయంటావా? పోదార్‌కి గ్రేటర్ కైలాష్‌లో తండ్రి వదిలి వెళ్ళిన మూడిళ్ళున్నాయిగా! అద్దెలు బాగానే వస్తాయి. టీనా ఖర్చులన్నీ తనే భరిస్తున్నాడు.

నువ్వంటే లేటుగా వచ్చేవు! మేము వెళ్ళినప్పటికి టీనా ఇంట్లోనే లేదు. తాన్యా వంట చేస్తోంది. లివింగ్ రూమ్లో బట్టలూ, చెత్తా చెదారం కుప్పలుకుప్పలుగా పడి ఉండాలి. నేనూ ఆనా కలిపి వాటిని టీనా గదిలో పడేసి, తలుపు మూసేసి ఇంటిని కొంచం శుభ్రం చేసేం. తెలుసా నీకు- టీనా తన పని మనిషినీ, వంటామెనీ కూడా మానిపించేసింది. తాన్యా చేతే ఇంటి పనులన్నీ చేయిస్తోంది.” ఈ సారి మాత్రం తన కంఠంలో ధ్వనిస్తున్న ఆక్రోశం అర్థం అయింది. నిట్టూర్చి ఫోన్ పెట్టేసేను.

“నువ్వు చాలా మంచివాడివి అర్జున్! “-టీవీ చూస్తున్న అర్జున్ పక్కనే కూర్చున్నాను. అర్థం చేసుకున్నట్టు చెయ్యి తట్టేడు.

ఎన్నిసార్లు పోట్లాడేను! తడి తువ్వాళ్ళు మంచం మీదే పడేస్తాడనీ, టీ తాగి కప్ అక్కడే వదిలేస్తాడనీ – ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి!

రేపట్నుంచీ మళ్ళీ అలాగే సాధిస్తాననీ తెలుసు. ఈ గిల్ట్ ఎన్నాళ్ళూ ఉండదనీ తెలుసు. కానీ ఈ సామాన్యమైన గిల్లికజ్జాల జీవితం చాలదూ సంతోషంగా బతకడానికి!

*

 

 

 

గమనమే గమ్యం-9

olga title

గాంధీగారు ఒస్తున్నారన్న వార్తతో మద్రాసు నగరమంతా ఉప్పొంగిపోతోంది. శారద సంగతి చెప్పనక్కరలేదు. ఆమె ఇంతవరకూ గాంధిని ప్రత్యక్షంగా చూడలేదు. అన్నపూర్ణ, దుర్గాబాయికు ఆ అదృష్టం పట్టింది. దుర్గాబాయి ఒట్టిగా చూడటం కాదు గాంధీకి ప్రీతిపాత్రురాలయింది. ఒకోసారి శారదకు అన్నీ ఒదిలి గాంధీ ఆశ్రమానికి వెళ్ళిపోవాలన్నంత ఆవేశం ఒచ్చేది. మళ్ళీ చదువు, తండ్రికిచ్చిన మాట, తల్లి తనమీద పెట్టుకున్న ఆశలు  ఇవన్నీ వెనక్కు లాగేవి.

‘‘గాంధీలో ఉన్న ఈ మాయ ఏమిటి? ఎందుకిలా నాలాంటి వారందరినీ ఆకర్షించి దేశం గురించిన ఆలోచనలను మరెవ్వరూ కలిగించలేనంతగా కలిగిస్తున్నాడు.’’

ఆ రోజు సాయంత్రం విద్యార్థి మిత్రులందరితో గాంధీ సభలో తామేం చెయ్యాలనే విషయమే శారద ప్రకాశం గారింటికి వెళ్ళి సభలో కార్యకర్తలుగా తమకు పనులివ్వమని అడిగింది. ఆయన మీరేం చేస్తారంటూనే శారదకు చాలా బాధ్యతలు  అప్పజెప్పాడు. శారద పరమానందంగా ఆ పనులు  చేయటానికి మిత్రులు  అందరితో కలిసి చక్కని ప్రణాళిక వేసుకుంది.

స్నేహితులంతా కలిసి మద్రాసు నాలుగు పక్కలా  తిరిగారు. గాంధీ గురించి, ఖద్దరు ధరించటం గురించి శారద ఆవేశంగా మాట్లాడుతుంటే ప్రజలు  శ్రద్ధగా విన్నారు. శారదకు  తన ఉత్సాహాన్ని అందరికీ అంటించటంలో ఎంతో ప్రతిభ ఉంది. ఆమె చురుకుతనం, కలుపుకుపోయేతత్త్వం, నవ్వు, ఠీవిగా నడిచే తీరూ అన్నీ ప్రత్యేకమే.

గాంధీగారు వచ్చిన రోజు మద్రాసు సముద్రం జన సముద్రం ముందు చిన్నదైపోయింది. అందరూ ఒకే ఒక ఆవేశంలో అలలు అలలుగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు. లక్షలాది మంది ఒకే ఒక ఆదర్శంతో, అనుభూతితో ఐక్యమైతే అంతకంటే అందమైన దృశ్యం మరొకటి ఉండదు. ఐతే ఆరోజు సభలో శారద ముందు ఎవరూ ఆగలేకపోయారు. ఎవరో ఎందుకు గాంధీగారే నిలవలేకపోయారు. సభంతా తానై కలియ దిరిగింది. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా ‘శారదా’‘శారదా’ అనే పిలుపులే. గాంధీ గారి కంటే శారద ఆకర్షణ పెరుగుతోంది. ఆ హడావుడిలో, ఆ సంరంభంలో మూర్తి శారదను కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆ రోజు మూర్తి గాంధీగారేం చెబుతున్నారో వినలేదు. గాంధీగారిని ఎక్కువసేపు చూడలేదు. ‘శారదా’ ‘శారదా’ అంటూ ఆ పేరు జపిస్తూ శారద వెళ్ళిన వైపు కళ్ళను మళ్ళిస్తూ కూచున్నాడు.

సభ ముగిసి అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయాక  చివరి పనులు  చేయిస్తూ అక్కడే ఉన్న శారద దగ్గరకు వెళ్ళి ‘‘శారదా’’ అని పిలిచాడు. శారద ఉలిక్కిపడి చూసింది. వెంటనే మామూలై గలగలా నవ్వింది.

‘‘మీరూ వచ్చారా? గాంధీగారి మాట అంతరార్థం గ్రహించారా? త్వరలో ఏదో జరుగుతుంది. ప్రజలంతా ఒక్కసారి తిరగబడే ఘట్టం సమీపంలోనే ఉంది. నాకది అర్థమైంది. నిజమే కదూ?’’

‘‘నేను గాంధీగారి మాటలు  వినలేదు శారదా’’

‘‘వినలేదా? మరెందుకొచ్చారిక్కడికి ` ఇక్కడ గాడిదలన్నా లేవే కాయటానికి’’ అంటూ గలగలా నవ్వింది మళ్ళీ.

‘‘వినలేదు. నా కళ్ళు మాత్రమే పని చేశాయివాళ. వాటితో మిమ్మల్నే చూస్తూ ఉండిపోయాను. నాకిక్కడ జరిగిందేమీ తెలియదు’’.

శారదకు చాలా చికాకుగా, కోపంగా అనిపించింది.

‘‘మూర్తిగారూ ` ఇక ఆ ధోరణి ఆపండి. మనం యువతీయువకులం. కొంత ఆకర్షణకు సహజంగానే లోనయి ఉంటాం. దానిని పక్కనపెట్టి ముందుకు వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. ఇక్కడే కాదు. నా చదువు, దేశ స్వతంత్రం ` వాటికి తప్ప మరి దేనికీ నా దగ్గర సమయం లేదు. నమస్కారం’’.

వెలవెలబోయిన మూర్తి ముఖాన్ని చూడకుండానే శారద అక్కడినుంచి వెళ్ళిపోయింది.

శారదకు గాంధీగారు అంటించిన ఉత్సాహం మనసు నిండా నిండిపోయింది.

రామకృష్ణ ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండేవాడు.

ఏదో జరగాలి. ఇది కాదు మార్గం. ఇలా దేశం స్వతంత్య్రం కాదు అని తపన పడుతుండేవాడు.

శారదకా నిరుత్సాహం నచ్చేది కాదు.

మార్గం ఇది కాదనుకుంటే ఇంకోమార్గం వెతుకు. ఇలా నిరుత్యాహపడకు. భగత్‌సింగ్‌ వేసిన మార్గం ఒకటుంది గదా ` నువ్వు కావాంటే మరో దారి వెతుకు. ఏ దారి అయినా గమ్యం స్వతంత్రమే గదా’’.

‘‘ఇంకో దారి వెతకగలనంటావా?’’ సందేహపడేవాడు రామకృష్ణ.

‘‘ఆ నిరాశ, సందేహాలే ఒద్దంటున్నాను. నువ్వు చాలా సమర్థుడివి. దేశం తప్ప, త్యాగం తప్ప మరింకేమీ తెలియదు నీకు. నువ్వు తప్పకుండా సాధిస్తావు. నీకు తగిన మార్గాన్ని, దేశానికి మేలు  చేసే దారిని వెతుకుతావు. కనిపెడతావు. నా మాట నమ్ము.’’

రామకృష్ణని ఉత్సాహపరిచేది శారద.

‘‘నీ మాటలే నేను నిరాశాసముద్రంలో మునిగిపోకుండా కాపాడుతున్నాయక్కా’’

‘‘ఔను గదా ` మరి నా మాటలే వింటూ నేను చెప్పినట్టు చెయ్యి. సరిపోతుంది’’ నవ్వేది శారద.

‘‘సరే గాని ` రష్యా విప్లవం గురించి కొత్త పుస్తకం సంపాదించాలన్నావు దొరికిందా?’’

‘‘లేదక్కా  ’’

‘‘నువ్వు చదవగానే అది నాకు ఇస్తావుగా’’

తప్పకుండా ` నాకు రష్యా విప్లవం గురించి చాలా తెలుసుసుకోవాలని ఉంది’’.

‘‘ఔను ` లెనిన్‌ గురించి కూడా.  నాయకుడంటే ఆయనే అనిపిస్తుంది.’’

‘‘ఔనక్కా .  నాకు గాంధీ కంటే లెనిన్‌ ఆలోచనలు, ఆచరణ ఉత్తమమైనవేమో అనిపిస్తోంది. ఆయన నిరూపించుకున్నాడు కూడా. రష్యాని నిరంకుశత్వాన్నించి విడిపించాడు. గాంధీగారు ఆ పని చెయ్యాలి’’.

‘‘చేస్తారు. నాకా నమ్మకం ఉంది తమ్ముడూ’’ రామకృష్ణ భుజం మీద ధైర్యం చెబుతున్నట్లుగా చెయ్యి వేసి తట్టింది.

‘‘అక్కా మనం ఎంతసేపూ లెనిన్‌, గాంధీ అంటూ నాయకుల మీద నమ్మకం పెంచుకుంటున్నాం. ప్రజల గురించి ఆలోచించటం లేదా? వారి మీద నమ్మకం లేదా మనకు? అదే లేకపోతే ఇక మన ఆలోచనలూ  కార్యక్రమాలూ  ఎందుకు? ఎవరికోసం.’’

‘‘పిచ్చివాడా ప్రజలే లేకపోతే వారిమీద నమ్మకమే లేకపోతే ఈ నాయకులెక్కడుంటారు?

‘‘ఔనుగాని అక్కా ` నమ్మకం ముఖ్యమా? కార్యకారణ విచక్షణ ముఖ్యమా?’’

‘‘విచక్షణతో కూడిన నమ్మకం’’.

Image (5)‘‘నువ్వింత బాగా చెప్తావు. నువ్వు లేకపోతే నేనిలా ఉండేవాడిని కాదు.’’

 

రామకృష్ణ శారదకంటే ఐదేళ్ళు చిన్నవాడు. కానీ అతని ఆలోచనలు  లోతైనవి. దేశం కోసం, ప్రజల కోసం అనుక్షణం ఆరాటపడుతుంటాడు. ఏ దారిన వెళ్ళాలో తెలియని నిరాశలో శారదను ఆశ్రయించి ఉత్సాహాన్ని పొందుతుంటాడు. ఆ

ఉత్సాహం మళ్లీ అతన్ని వెతుకులాటకు ప్రేరేపిస్తుంది. స్వంత అక్కాతమ్ముళ్ళ కంటే అపురూపమైన బంధం వారిద్దరిది ` వారి స్నేహబృందానికి వారిద్దరూ ఆదర్శం. అందరికీ శారద అక్కే . వాళ్ళంతా శారద అభిమానంతో, సుబ్బమ్మగారి ఆప్యాయతతో తడిసి ముద్దవుతుంటారు.

చివరికి అందరి ఆశలూ  చిగురిస్తాయనిపించే రోజులు  వస్తున్నట్లు వార్తలొచ్చాయి. గాంధీగారు మళ్ళీ సత్యాగ్రహం మొదలు  పెడతారట. ఈసారి ఉప్పుమీద పన్ను తొలగించాని డిమాండ్‌ చేస్తారట అనే వార్త శారదకు ఆమె స్నేహితులకూ చేరింది. కొందరు పెదవి విరిచారు.

‘‘ఉప్పేమిటి? మాకు స్వతంత్రం కావాలి ఇస్తారా చస్తారా అని అడగకుండా ఉప్పుమీద పన్ను తీస్తారా? తియ్యరా అని అడగటంలో ఏమన్నా అర్థం ఉందా?’’

‘‘సరే పన్ను తీసేస్తాం అంటారు. అప్పుడేం చేస్తారు? వైస్రాయి గారికి జై అని’’ జై కొడతారా?’’

‘‘ఏదో జరుగుతుందని ఇన్నాళ్ళూ ఖద్దరు ఒడుకుతూ, అమ్ముతూ కూచుంది ఇందుకా’’.

ఆవేశపరులైన యువకులు  ఉక్రోషంగా అరిచారు.

శారద వాళ్ళందరినీ శాంతపరిచేందుకు సిద్ధపడింది.

‘‘స్వతంత్రం ఇస్తారా? ఇవ్వరా? అని అడిగి వాళ్ళిస్తే హాయిగా తీసుకుని భుజాన వేసుకోటానికి అదేమన్నా కండువా అనుకున్నావా? ప్రజల్ని ఒక్కసారే చివరి గమ్యానికి సన్నద్ధం చెయ్యగలమా? ఉప్పుమీద పన్ను తీసేస్తారే అనుకుందాం. అది ఒక విజయం గదా. గాంధీ మీదా, కాంగ్రెస్‌ మీదా ప్రజలకు నమ్మకం కలుగుతుంది గదా ` శత విధాలుగా ప్రభుత్వం ఉప్పుమీద పన్ను తియ్యదు. మనల్ని ఉప్పు చెయ్యనివ్వదు. అప్పుడు ఆ అన్యాయాన్ని ఎత్తిచూపుతూ ప్రజలను బ్రిటీష్‌వాళ్ళకు వ్యతిరేకంగా సమాయత్తం చెయ్యొచ్చు. ప్రజల కోపం పెరిగితే అది దేశానికి మంచిదే కదా ` ’’

శారద మాటతో అందరూ చల్లబడ్డా రామకృష్ణ చల్లబడదల్చుకోలేదు.

‘‘ప్రజల కోపం పెరుగుతుంది. ఉద్యమంలోకి వస్తారు. సత్యాగ్రహం చేస్తారు. మంచి సమయం చూసి గాంధీగారు చల్లగా ఉద్యమం ఆపెయ్యమంటారు. ఈయనతో ఒక చావు కాదు గదా’’  అందరూ నవ్వారు. మొత్తానికి కాస్త నిరసన ఉన్నప్పటికీ అందరిలో ఉత్సాహం నిండుతోంది. శారద ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేయాని కంకణం కట్టుకున్నదానిలా మాట్లాడింది. అర్థరాత్రి దాటే వరకూ చర్చలు సాగుతూనే ఉన్నాయి. మర్నాడు ఆదివారం కావటంతో ఎవరికీ నిద్రపోవాలనే ఆలోచనే రాలేదు.

శారద ఆదివారం ఉదయం ఆలస్యంగా  నిద్రలేచినా బీచ్‌కి వెళ్దామనుకుంది. సత్యాగ్రహం మొదలైతే ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఉపన్యాసాలివ్వాలి. శారద ఉపన్యాసాలు  అభ్యాసం చేసి చాలా రోజులయింది. ఆ మూర్తి నా కార్యక్రమమంతా పాడుచేశాడు అని విసుక్కుని ఆలస్యమైనా ఫరవాలేదనుకుంటూ వెళ్ళింది. సముద్రాన్ని చూస్తూ దాని మీద నుంచి వస్తున్న తేమ గాల్లోని ఉప్పు వాసన తగిలితే శారదకు ఒళ్ళు పులకరిస్తుంది.

ఆనందంగా, ఉత్సాహంగా సత్యాగ్రహం చేయాల్సిన అవసరాన్ని కర్తవ్యాన్ని గురించి గొంతెత్తి సముద్ర తరంగాలతో మాట్లాడింది. ఉపన్యాసం ఆపి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటుంటే వెనక నుంచి చప్పట్లు వినిపించాయి. శారద వెనక్కు తిరిగి చూసింది.

మూర్తి నవ్వుతూ చప్పట్లు కొడుతూ నుంచుని ఉన్నాడు.

‘‘చాలా బాగా మాట్లాడారు. మీ గొంతు కూడా బలంగా  పలికింది. ఉత్సాహం సముద్రంలా ఉప్పొంగింది. కానీ అసలు  విషయమే రాలేదు’’.

శారద అసలు  విషయమేమిటన్నట్లు చూసింది.

‘‘ఇప్పుడు గాంధీగారు ఉప్పుని కదా గుప్పెట్లోకి తీసుకున్నారు. దాని సంగతేం రాలేదు’’.

‘‘నాకు దాని గురించి తెలిసిందంతా చెప్పాను’’.

‘‘తెలుసుకోవసింది చాలా ఉంది.’’

‘‘తెలుసుకుంటాను’’.

‘‘తెలిసినవాడిని నేనున్నానుగా , చెప్పనా?’’

శారద మౌనంగా మెల్లిగా బీచీ ఒడ్డున నడుస్తోంది. పక్కనే మూర్తి నడుస్తూ చెబుతున్నాడు.

‘‘మన దేశంలో కావసినంత ఉప్పు తయారవుతూనే ఉంది. కానీ బ్రిటీష్‌ ప్రభుత్వం లివర్‌పూల్‌ నుంచి, చెషైర్‌ నుంచి ఉప్పు మనకు దిగుమతి చేస్తోంది. ఎందుకు? ఇండియా నుంచి ఇంగ్లండ్‌కు బోలెడు సరుకులు  ఎగుమతి అవుతున్నాయి. ఎగుమతి ఏ నౌకలో అవుతున్నాయో, అవి మళ్ళీ ఇండియాకి తిరిగి రావాలిగా .  వాటిలో ఏదో ఒకటి నింపి పంపాలిగా. ఏం పంపుతారు? మట్టి! మీకు తెలుసా? కొన్నాళ్ళు నిజంగానే మట్టి నింపుకుని అక్కడ హుగ్లీనుంచి ఉన్న పెద్ద కావలో ఆ మట్టి పోసి ఆ కావ పూడ్చేశారు. ఇంగ్లీషు వాళ్ళంత మూర్ఖులు  వాళ్ళే! ఇంక అట్లా పూడవటానికి కావ కూడా లేవు. దాంతో మట్టి బదులు ఏం పంపాలా అని ఒక పార్లమెంటు కమిటీ కూచుని రోజుల  తరబడి ఆలోచించి ఉప్పు పంపాలని నిర్ణయించింది. ఉప్పు వాళ్ళు ఎగుమతి చేసినా ఇక్కడ ఎవరు కొంటారు? మనకంతా సముద్ర తీరమే కదా. కాసేపు ఇక్కడ నడిచి ఇంటికెళ్ళి దులుపుకున్న ఉప్పుతో వంట చేసుకోవచ్చు.

శారద గలగలా నవ్వింది.

‘‘మీ నవ్వెంత బాగుంటుందో ! ’’

‘‘చెప్పండి. చెప్పండి’’ గంభీరత్వం తెచ్చిపెట్టుకుంది శారద.

‘‘ఇక్కడ వాళ్ళ ఉప్పెవరు కొంటారు? అందుకని మనవాళ్ళు తయారుచేసే ఉప్పు మీద మణుగుకు మూడున్నర రూపాయలు  పన్ను వేశారు. దాంతో బెస్తవాళ్ళకు ఎంతో నష్టం. వాళ్ళు ఉప్పు చేస్తారు. ఉప్పు చేపు చేస్తారు. బెస్తస్త్రీకది జీవనాధారం.

వాళ్ళు ఉప్పుకి పన్ను కట్టలేరు. తామే తయారుచేసుకుందామంటే ఎవరంటే వాళ్ళు ఉప్పు తయారుచేయకుండా నిషేధం పెట్టారు బ్రిటీష్‌వాళ్ళు. ఆఖరికి సముద్రంలో దొరకే నాచుతో తీగతో ఎలాగో తంటాలు  పడి ఉప్పు చేసుకుంటుంటే వాళ్ళకు జైలు  శిక్ష వేశారు. ఇక ఉప్పు తయారీని పెద్దపరిశ్రమ చేసి ధనిలకుకు అప్పగించారు. వాళ్ళకు లాభాలు  కావాలి. గాలీ, నీరూలా దాదాపు ఊరికే దొరికే ఉప్పు పండించే  నేలలో కొన్ని సంవత్సరాలు  దానిని పండిస్తే అవి పంట పొలాలవుతాయి. తెలుసా?

‘తెలియదు’

‘‘తెలుసుకో’’ హుందాగా అన్న మూర్తిని చూస్తే శారదకు ముచ్చటేసింది.

‘‘ఆ రకంగా ఎన్నో పొలాలు చవిటి పర్రుగా మిగిలిపోయాయి. జనం ఉప్పు వాడటం తగ్గించారు. దానివల్ల  ఆరోగ్య సమస్యలు … ఒకటి కాదు ఉప్పు కథ ఎంతో ఉంది. మొత్తం ఉప్పు వ్యాపారాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని జనం నోళ్ళలో దుమ్ముకొట్టింది.’’

మూర్తి మాట్లాడటమూ నడవటమూ ఆపి

‘‘ఇది చాలనుకుంటాను. గణాంకాలను ప్రజలంతగా పట్టించుకోరు’’

శారద నవ్వుతూ మూర్తి వైపు చూసి ‘‘మీరు పుస్తకాలు  బాగా చదువుతారనుకుంటాను’’.

‘‘ఊ’’ పుస్తకాలు  చదువుతాను. సంగీతం పాడతాను. ఫోటో తీస్తాను. బొమ్ము వేస్తాను. పొట్టకూటి కోసం కోర్టులో వాదిస్తాను. ఎన్నో పనులు  చేశాను ఇంతవరకూ ,  ఒక్క పని తప్పా.’’

‘‘ఏంటది?’’

‘‘ప్రేమించటం. ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు. ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను’’ మూర్తి సూటిగా చెప్పిన ఆ మాటకు శారదాంబ చంపులు  ఎర్రబడ్డాయి. మూర్తి మీద కోపం రాకపోగా మనసులో సంతోషం కలుగుతోంది. అది కలగకూడదని లోపలినుండి హెచ్చరికలూ  వినబడుతున్నాయి.

‘‘శారదా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక నా వశంలో లేదు. నిన్ను చూడకుండా ఉండలేను. ఈ పరిస్థితికి నాకూ కంగారుగానే ఉంది. కానీ నా చేతుల్లో ఏమీ లేనట్లుగా ఉంది.’’

‘‘నా చదువు నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంకోవైపు నేను దృష్టి మళ్ళించలేను.’’

‘‘నీ చదువు నాకూ ముఖ్యమే. నువ్వు నీ చదువు వల్లే, ఆ చదువు వల్ల నీలో ప్రకాశించే జ్ఞానం వల్లే నన్ను ఆకర్షించావు. నీ శరీరాన్ని కాదు నేను ప్రేమించేది. నీ మేధస్సుని, తెలివిని, నీలోని ఆధునికతను. ఇవన్నీ కలిసిన నిన్ను . నీ ప్రేమ నీ చదువుకి ఆటంకం కాదు. నాకేమీ అక్కర్లేదు. రోజూ నిన్ను చూసి నీతో మాట్లాడితే చాలు.’’

‘‘మా ఇంటికి మీరు నిరభ్యంతరంగా రావొచ్చు. నాకు చాలామంది స్నేహితులున్నారు. అన్నదమ్ములున్నారు. వాళ్ళందరితో పాటు మీరు రావొచ్చు.’’

‘‘వాళ్ళందరితో పాటు నేను కాదు. నాకేదో ప్రత్యేకం కావాలి’’.

‘‘ప్రత్యేకం’’ నవ్వింది శారద.

‘‘సరే. ప్రత్యేకమే. ఒకసారి రండి. వచ్చి మా స్నేహ బృందాన్ని చూడండి’’.

మూర్తి శారద స్నేహబృందానికి పరిచయమయ్యాడు. వాళ్ళలో అతనొకడయ్యాడు గానీ మిగిలినవాళ్ళందరికీ అతను ఏదో ప్రత్యేకంగానే కనిపించేవాడు. శారద మీద తనకేదో అధికారం ఉన్నట్టు, చనువు ఉన్నట్లు మాట్లాడేవాడు. శారద దానిని పట్టించుకోనట్లు కనిపించినా లోలోపల దానిని ఇష్టపడేది. అందువల్ల ఎవరి అధికారాన్ని సహించని శారద, మూర్తి ధోరణిని వారించేది కాదు. దానికి తోడు శారద, మూర్తి చాలాసార్లు ఉదయపు వేళల్లో సముద్ర తీరాన కలుస్తున్నారనే విషయం కూడా మిగిలిన మిత్రులకు తెలిసింది.

రామకృష్ణ మిగిలిన వారిలా మౌనంగా ఊరుకోలేకపోయాడు.

‘‘అక్కా ! మూర్తిగారి పద్ధతి ఏదో భిన్నంగా ఉన్నది. మిగిలిన విషయాలు  ఎలా ఉన్నా నీ మీద ఏదో అధికారం ఉన్నట్లు ప్రవర్తిస్తాడెందుకు? దానిని నువ్వు సహిస్తున్నావెందుకు? ఆ చనువు, ఆ పరిహాస ధోరణి నువ్వెందుకు భరిస్తున్నావు?’’

రామకృష్ణ నుంచి ఈ ప్రశ్న వస్తుందని శారద అనుకుంటూనే ఉంది. రామకృష్ణ కంటే తనకు మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి, సజ్జనుడు ఎవరూ ఉండరని శారదకు తెలుసు. అతని దగ్గర విషయం దాడచంలో అర్థం లేదనీ, ఉన్న విషయం చెప్పేద్దామనీ అనుకుంది.

‘‘మూర్తి నన్ను ప్రేమిస్తున్నాడు రామూ. అందుకే ఆయనకా అధికారం’’.

‘‘నిన్ను ప్రేమిస్తున్నాడా? ఆయనకు పెళ్ళయింది కదక్కా’’. రామకృష్ణయ్య ఆందోళనగా అడిగాడు.

శారద ముఖం పాలిపోయింది. గుండె దడదడా కొట్టుకుంది. శరీరమంతా నిస్సత్తువగా అయిపోయింది. కాళ్ళు తేలిపోతున్నట్లయి దగ్గరున్న బెంచీమీద కూలబడింది.

‘‘ఆ సంగతి చెప్పలేదా? అది దాచి ప్రేమిస్తునన్నాడా?’’ రామకృష్ణ కోపంగా అంటున్న మాటలు  కూడా శారదకు వినిపించలేదు. అసలు  ఈ లోకం, ఎదురుగా ఉన్న రామకృష్ణ అంతా అదృశ్యమై పోయినట్లయింది. ఏమీ కనిపించటంలేదు. వినిపించటం లేదు. చీకట్లు కమ్మినట్లయింది.

రామకృష్ణ ‘‘అక్కా! అక్కా’’ అంటూ కుదిపాడు.

‘‘మూర్తికి పెళ్ళయిందా? నీకు తెలుసా?’’ చాలాసేపటికి అడిగింది శారద.

‘‘తెలుసు. నాకే కాదు. అందరికీ తెలుసు. ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. నీ దగ్గర దాచాడా ఇదంతా’’ రామకృష్ణ కళ్ళెర్రబడ్డాయి.

‘‘నేను అడగలేదు’’

‘‘నువ్వడగటం అలా ఉంచు. ప్రేమిస్తున్నానని చెప్పినవాడు తన పెళ్ళి విషయం చెప్పకపోతే ఏమిటర్థం?’’

‘‘పెళ్ళి గురించిన మాటే మా మధ్య రాలేదు రామూ. అతను నన్ను పెళ్ళాడతాననలేదు. ప్రేమిస్తున్నారా ఐతే పెళ్ళి చేసుకుందామని నేనూ అనలేదు. రామూ ` ఈ విషయం ఇంతటిలో ఆపేద్దాం. దీని గురించి వివేకంతో ఆలోచించగల సమర్థురాలిననే నమ్మకం నామీద ఉంచు. నువ్వు దీని గురించి ఆందోళన పడకు. ఇదంతా నేను తేల్చుకోవాల్సిన విషయం. నువ్వు ఏ విధంగానూ జోక్యం చేసుకోవద్దు. నేను తేల్చుకుంటా ` ’’ శారద అక్కడినుంచి వెళ్ళిపోయింది. దు:ఖం కట్టలు  తెంచుకు దూకింది. అడ్డు లేకుండా ప్రవహించింది. అదంతా అయిపోయాక శారద లేచి ముఖం కడుక్కుని కాశీనాథుని నాగేశ్వరరావు గారింటికి వెళ్ళింది.

శారద వెళ్ళేసరికి దుర్గాబాయి ఆసుపత్రినుంచి భర్తను తీసుకుని వచ్చింది. శారదను చూస్తూనే ఆమె ఉత్సాహంగా మాట్లాడటం మొదలుపెట్టింది.

‘‘చూశావా. వస్తుందనుకున్న సమయం వచ్చేసింది. ఇంక మనదే ఆలస్యం. అందరం దూకాల్సిందే. శారదా ఎప్పుడెప్పుడు సత్యాగ్రహం చేద్దామా అని  మనసు ఆగటం లేదు.’’

ఆమె భర్త సుబ్బారావు ఏదో ఆయాసపడ్డాడు. దుర్గాబాయి ఆయనకు మంచినీళ్ళిచ్చి, మందు తాగించి విశ్రాంతిగా పడుకునే ఏర్పాటు చేసి వచ్చింది. ప్రతిపనీ ఎంతో శ్రద్ధగా చేస్తుంది దుర్గ.

పనిలో అందం, శ్రద్ధ రెండూ కనిపిస్తాయి.

భర్తపై ఇంత శ్రద్ధ. గృహిణిగా కర్తవ్య ధర్మం. ఎట్లా సత్యాగ్రహంలో కలుస్తుంది? అదే అడిగింది శారద.

‘‘శారదా ` దేశం పిలిస్తే, బాపూ ఆజ్ఞ వేస్తే ఇక నన్ను నేను నిలవరించుకోలేను. సర్వ ధర్మాలు  పక్కన పెడతాను. నా ఆత్మ బోధించే ధర్మం ఒక్కటే. నా దేశం’’.

‘‘మరి నీ భర్త?’’

‘నా భర్తను చూసుకునేవాళ్ళు ఉన్నారు. ఉంటారు. ఆయన నన్ను ఆపరు’. దుర్గ ముఖంలో ఆవేశం. ఆనందం. ఉత్సాహం.

‘‘భార్యాభర్తల సంబంధం ఎలాంటిది దుర్గా?’’

దుర్గ నవ్వింది.

‘‘నీకు తెలియదా? పెళ్ళి కాలేదనుకో ` ఐనా నీకు తెలియదంటే నేను నమ్మను.’’

‘‘భార్యాభర్తలందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారా?’’

‘‘నీకు ప్రేమ సమస్య వచ్చిందా? ప్రేమించుకుంటారు. ప్రేమించుకోరు. రెండూ ఉంటాయి. భార్య భర్తని సేవించాలి. అతనే లోకంగా ఉండాలి అంటారు ` నాకలా ఎప్పుడూ లేదు. పాపం ఆయనకు తనతోడిదే లోకంగా ఉండాలని ఉందేమో. నేనెప్పుడూ అలా లేను.’’

‘‘కానీ నువ్వు చేస్తున్న సేవ చూస్తుంటే…’’

‘‘నేనెవరికైనా అలాగే చేస్తాను. భర్త కాబట్టి మరింత బాధ్యతగా ఉంటాను. కానీ ఈ బాధ్యత ఇంక మొయ్యలేను. దేశం కోసం దీనిని అవతల పెట్టెయ్యగను’’.

‘‘కానీ స్త్రీంతా నీలా ఉండగలరా?’’

‘‘ఉండలేరు. వాళ్ళకా దృష్టి లేదు. ఎంతసేపూ ఇల్లూ , భర్తా, పిల్లలూ  ఇదే లోకం.

అబ్బా ` నాకా గుణం రాలేదు. వచ్చుంటే ఇక అక్కడే తెల్లార్చుకునేదాన్ని నా జీవితాన్ని.’’

‘‘భర్తను ప్రేమించకుండా దేశాన్ని ప్రేమించటం సరే ,  మరొక పురుషుడిని ప్రేమించటం సాధ్యమా?’’

‘‘ఆ విషయం నాకేం తెలియదు. ఆ ప్రేమ గురించి నేనెన్నడూ ఆలోచించలేదు’’

దుర్గ వెళ్ళి భర్తకు అంతా అనుకూలంగా ఉందా అని చూసి కాళ్ళ దగ్గర తొలగిన దుప్పటి సరిచేసి వచ్చింది.

‘‘నువ్వు నీ భర్తకంటే దేశాన్ని ప్రేమిస్తున్నావు. ఆ మాట ఆయనతోనే చెప్తున్నావు. నీ భర్త నీకంటే ఎక్కువగా ఇంకొకరిని ప్రేమిస్తున్నానని చెబితే ` ’’

‘‘అబ్బా ` అంతకంటే శుభవార్త ఉంటుందా? ఆ ఇంకెవరికో ఈయన బాధ్యత అప్పగించి నేను స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో పడి పరిగెత్తుతా’’ దుర్గ ఆ మాటన్న తీరుకి శారద నవ్వింది.

‘‘కానీ మామూలు  స్త్రీలు ఏడుస్తారు కదూ ` భర్త తనను కాదని ఇంకొకరిని ప్రేమిస్తున్నాడంటే ` ’’

‘‘ఏమో ` కొందరు ఏడవవచ్చు. కొందరు సంతోషపడవచ్చు. మరి కొందరు ప్రాణత్యాగం చేయవచ్చు. కానీ ఎక్కువమంది లోలోప సంతోషిస్తారేమో’’.

‘‘ఎందుకు?’’ ఆశ్చర్యంగా అడిగింది శారద.

‘‘ఈ భారం నుంచి విముక్తి లభించినందుకు. బతికినంతకాం ఒకే మనిషికి బాధ్యత వహించటం తప్ప మరింక జీవితంలో ఏ పనీ లేకుండా ఉండటం. ఆమనిషి ఎటువంటివాడైనా సేవించవలసి రావటం, స్వేచ్ఛ అన్నది లేకపోవటం , ఎటు చూసినా ఆజ్ఞలే , ఆదేశాలే. ఏమో నాకైతే ఈ వివాహబంధాన్ని మించి ఆనందం దేశ సేవలోనే ఉంది. కొందరికి మరింక దేన్లోనైనా దొరకొచ్చు. కానీ శారదా ,  ఆలోచించే అవకాశమే లేదుగా స్త్రీకు. ఎక్కడ నాకు ఆనందమని. ఊహ తెలిసిన దగ్గరినుంచి ఇదే నీ ఆనందం ముక్తి , మోక్షం అని చెప్తుంటారు. ఏమో ?ఆడవాళ్ళు ఈ బంధం నుంచి బైటపడి స్వతంత్రంగా వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు వెతుక్కుంటే నయమనిపిస్తుంది నాకు.’’

‘‘స్వతంత్రం మనకీ కావాలిగా దుర్గా దేశానికి లాగే ! మనల్ని మనం పరిపాలించుకోవాలనిపించదు?’’

‘‘ఎందుకనిపించదు? కానీ దానికి ఎంతో శక్తి కావాలి. ముందు చదువు కావాలి. నువ్వు డాక్టర్‌వి అవుతావు. ఎంతమంచి సంగతి అది. నాకూ చదవాలని ఉంది. లాయర్‌ని కావాని ఉంది. దేశ స్వతంత్ర విషయాల్లో ఎన్నో తొసుకోవాలి. చదువు లేకపోతే మళ్ళీ ఆ చదువుకున్న మగవాళ్ళ మాటకు తలూపటం తప్ప మరేం చెయ్యలేం. చదువుకోవాలి శారదా ఆడవాళ్ళంతా చదువుకోవాలి. ఇంగ్లీషు చదువు  ’’ దుర్గ ముఖం వెలిగిపోతోంది జ్ఞానకాంక్షతో.

వాళ్ళ మాటల్లో చాలా సమయం గడిచింది.

శారద అడగాలనుకున్నది అడగలేదు. చెప్పాలనుకున్నది చెప్పలేదు. ఎలా వెళ్ళిందో అలాగే తిరిగొచ్చింది. గుండెమీద బరువు ఏ మాత్రం తగ్గలేదు.

***