గమనమే గమ్యం-9

olga title

గాంధీగారు ఒస్తున్నారన్న వార్తతో మద్రాసు నగరమంతా ఉప్పొంగిపోతోంది. శారద సంగతి చెప్పనక్కరలేదు. ఆమె ఇంతవరకూ గాంధిని ప్రత్యక్షంగా చూడలేదు. అన్నపూర్ణ, దుర్గాబాయికు ఆ అదృష్టం పట్టింది. దుర్గాబాయి ఒట్టిగా చూడటం కాదు గాంధీకి ప్రీతిపాత్రురాలయింది. ఒకోసారి శారదకు అన్నీ ఒదిలి గాంధీ ఆశ్రమానికి వెళ్ళిపోవాలన్నంత ఆవేశం ఒచ్చేది. మళ్ళీ చదువు, తండ్రికిచ్చిన మాట, తల్లి తనమీద పెట్టుకున్న ఆశలు  ఇవన్నీ వెనక్కు లాగేవి.

‘‘గాంధీలో ఉన్న ఈ మాయ ఏమిటి? ఎందుకిలా నాలాంటి వారందరినీ ఆకర్షించి దేశం గురించిన ఆలోచనలను మరెవ్వరూ కలిగించలేనంతగా కలిగిస్తున్నాడు.’’

ఆ రోజు సాయంత్రం విద్యార్థి మిత్రులందరితో గాంధీ సభలో తామేం చెయ్యాలనే విషయమే శారద ప్రకాశం గారింటికి వెళ్ళి సభలో కార్యకర్తలుగా తమకు పనులివ్వమని అడిగింది. ఆయన మీరేం చేస్తారంటూనే శారదకు చాలా బాధ్యతలు  అప్పజెప్పాడు. శారద పరమానందంగా ఆ పనులు  చేయటానికి మిత్రులు  అందరితో కలిసి చక్కని ప్రణాళిక వేసుకుంది.

స్నేహితులంతా కలిసి మద్రాసు నాలుగు పక్కలా  తిరిగారు. గాంధీ గురించి, ఖద్దరు ధరించటం గురించి శారద ఆవేశంగా మాట్లాడుతుంటే ప్రజలు  శ్రద్ధగా విన్నారు. శారదకు  తన ఉత్సాహాన్ని అందరికీ అంటించటంలో ఎంతో ప్రతిభ ఉంది. ఆమె చురుకుతనం, కలుపుకుపోయేతత్త్వం, నవ్వు, ఠీవిగా నడిచే తీరూ అన్నీ ప్రత్యేకమే.

గాంధీగారు వచ్చిన రోజు మద్రాసు సముద్రం జన సముద్రం ముందు చిన్నదైపోయింది. అందరూ ఒకే ఒక ఆవేశంలో అలలు అలలుగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు. లక్షలాది మంది ఒకే ఒక ఆదర్శంతో, అనుభూతితో ఐక్యమైతే అంతకంటే అందమైన దృశ్యం మరొకటి ఉండదు. ఐతే ఆరోజు సభలో శారద ముందు ఎవరూ ఆగలేకపోయారు. ఎవరో ఎందుకు గాంధీగారే నిలవలేకపోయారు. సభంతా తానై కలియ దిరిగింది. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా ‘శారదా’‘శారదా’ అనే పిలుపులే. గాంధీ గారి కంటే శారద ఆకర్షణ పెరుగుతోంది. ఆ హడావుడిలో, ఆ సంరంభంలో మూర్తి శారదను కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆ రోజు మూర్తి గాంధీగారేం చెబుతున్నారో వినలేదు. గాంధీగారిని ఎక్కువసేపు చూడలేదు. ‘శారదా’ ‘శారదా’ అంటూ ఆ పేరు జపిస్తూ శారద వెళ్ళిన వైపు కళ్ళను మళ్ళిస్తూ కూచున్నాడు.

సభ ముగిసి అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయాక  చివరి పనులు  చేయిస్తూ అక్కడే ఉన్న శారద దగ్గరకు వెళ్ళి ‘‘శారదా’’ అని పిలిచాడు. శారద ఉలిక్కిపడి చూసింది. వెంటనే మామూలై గలగలా నవ్వింది.

‘‘మీరూ వచ్చారా? గాంధీగారి మాట అంతరార్థం గ్రహించారా? త్వరలో ఏదో జరుగుతుంది. ప్రజలంతా ఒక్కసారి తిరగబడే ఘట్టం సమీపంలోనే ఉంది. నాకది అర్థమైంది. నిజమే కదూ?’’

‘‘నేను గాంధీగారి మాటలు  వినలేదు శారదా’’

‘‘వినలేదా? మరెందుకొచ్చారిక్కడికి ` ఇక్కడ గాడిదలన్నా లేవే కాయటానికి’’ అంటూ గలగలా నవ్వింది మళ్ళీ.

‘‘వినలేదు. నా కళ్ళు మాత్రమే పని చేశాయివాళ. వాటితో మిమ్మల్నే చూస్తూ ఉండిపోయాను. నాకిక్కడ జరిగిందేమీ తెలియదు’’.

శారదకు చాలా చికాకుగా, కోపంగా అనిపించింది.

‘‘మూర్తిగారూ ` ఇక ఆ ధోరణి ఆపండి. మనం యువతీయువకులం. కొంత ఆకర్షణకు సహజంగానే లోనయి ఉంటాం. దానిని పక్కనపెట్టి ముందుకు వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. ఇక్కడే కాదు. నా చదువు, దేశ స్వతంత్రం ` వాటికి తప్ప మరి దేనికీ నా దగ్గర సమయం లేదు. నమస్కారం’’.

వెలవెలబోయిన మూర్తి ముఖాన్ని చూడకుండానే శారద అక్కడినుంచి వెళ్ళిపోయింది.

శారదకు గాంధీగారు అంటించిన ఉత్సాహం మనసు నిండా నిండిపోయింది.

రామకృష్ణ ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండేవాడు.

ఏదో జరగాలి. ఇది కాదు మార్గం. ఇలా దేశం స్వతంత్య్రం కాదు అని తపన పడుతుండేవాడు.

శారదకా నిరుత్సాహం నచ్చేది కాదు.

మార్గం ఇది కాదనుకుంటే ఇంకోమార్గం వెతుకు. ఇలా నిరుత్యాహపడకు. భగత్‌సింగ్‌ వేసిన మార్గం ఒకటుంది గదా ` నువ్వు కావాంటే మరో దారి వెతుకు. ఏ దారి అయినా గమ్యం స్వతంత్రమే గదా’’.

‘‘ఇంకో దారి వెతకగలనంటావా?’’ సందేహపడేవాడు రామకృష్ణ.

‘‘ఆ నిరాశ, సందేహాలే ఒద్దంటున్నాను. నువ్వు చాలా సమర్థుడివి. దేశం తప్ప, త్యాగం తప్ప మరింకేమీ తెలియదు నీకు. నువ్వు తప్పకుండా సాధిస్తావు. నీకు తగిన మార్గాన్ని, దేశానికి మేలు  చేసే దారిని వెతుకుతావు. కనిపెడతావు. నా మాట నమ్ము.’’

రామకృష్ణని ఉత్సాహపరిచేది శారద.

‘‘నీ మాటలే నేను నిరాశాసముద్రంలో మునిగిపోకుండా కాపాడుతున్నాయక్కా’’

‘‘ఔను గదా ` మరి నా మాటలే వింటూ నేను చెప్పినట్టు చెయ్యి. సరిపోతుంది’’ నవ్వేది శారద.

‘‘సరే గాని ` రష్యా విప్లవం గురించి కొత్త పుస్తకం సంపాదించాలన్నావు దొరికిందా?’’

‘‘లేదక్కా  ’’

‘‘నువ్వు చదవగానే అది నాకు ఇస్తావుగా’’

తప్పకుండా ` నాకు రష్యా విప్లవం గురించి చాలా తెలుసుసుకోవాలని ఉంది’’.

‘‘ఔను ` లెనిన్‌ గురించి కూడా.  నాయకుడంటే ఆయనే అనిపిస్తుంది.’’

‘‘ఔనక్కా .  నాకు గాంధీ కంటే లెనిన్‌ ఆలోచనలు, ఆచరణ ఉత్తమమైనవేమో అనిపిస్తోంది. ఆయన నిరూపించుకున్నాడు కూడా. రష్యాని నిరంకుశత్వాన్నించి విడిపించాడు. గాంధీగారు ఆ పని చెయ్యాలి’’.

‘‘చేస్తారు. నాకా నమ్మకం ఉంది తమ్ముడూ’’ రామకృష్ణ భుజం మీద ధైర్యం చెబుతున్నట్లుగా చెయ్యి వేసి తట్టింది.

‘‘అక్కా మనం ఎంతసేపూ లెనిన్‌, గాంధీ అంటూ నాయకుల మీద నమ్మకం పెంచుకుంటున్నాం. ప్రజల గురించి ఆలోచించటం లేదా? వారి మీద నమ్మకం లేదా మనకు? అదే లేకపోతే ఇక మన ఆలోచనలూ  కార్యక్రమాలూ  ఎందుకు? ఎవరికోసం.’’

‘‘పిచ్చివాడా ప్రజలే లేకపోతే వారిమీద నమ్మకమే లేకపోతే ఈ నాయకులెక్కడుంటారు?

‘‘ఔనుగాని అక్కా ` నమ్మకం ముఖ్యమా? కార్యకారణ విచక్షణ ముఖ్యమా?’’

‘‘విచక్షణతో కూడిన నమ్మకం’’.

Image (5)‘‘నువ్వింత బాగా చెప్తావు. నువ్వు లేకపోతే నేనిలా ఉండేవాడిని కాదు.’’

 

రామకృష్ణ శారదకంటే ఐదేళ్ళు చిన్నవాడు. కానీ అతని ఆలోచనలు  లోతైనవి. దేశం కోసం, ప్రజల కోసం అనుక్షణం ఆరాటపడుతుంటాడు. ఏ దారిన వెళ్ళాలో తెలియని నిరాశలో శారదను ఆశ్రయించి ఉత్సాహాన్ని పొందుతుంటాడు. ఆ

ఉత్సాహం మళ్లీ అతన్ని వెతుకులాటకు ప్రేరేపిస్తుంది. స్వంత అక్కాతమ్ముళ్ళ కంటే అపురూపమైన బంధం వారిద్దరిది ` వారి స్నేహబృందానికి వారిద్దరూ ఆదర్శం. అందరికీ శారద అక్కే . వాళ్ళంతా శారద అభిమానంతో, సుబ్బమ్మగారి ఆప్యాయతతో తడిసి ముద్దవుతుంటారు.

చివరికి అందరి ఆశలూ  చిగురిస్తాయనిపించే రోజులు  వస్తున్నట్లు వార్తలొచ్చాయి. గాంధీగారు మళ్ళీ సత్యాగ్రహం మొదలు  పెడతారట. ఈసారి ఉప్పుమీద పన్ను తొలగించాని డిమాండ్‌ చేస్తారట అనే వార్త శారదకు ఆమె స్నేహితులకూ చేరింది. కొందరు పెదవి విరిచారు.

‘‘ఉప్పేమిటి? మాకు స్వతంత్రం కావాలి ఇస్తారా చస్తారా అని అడగకుండా ఉప్పుమీద పన్ను తీస్తారా? తియ్యరా అని అడగటంలో ఏమన్నా అర్థం ఉందా?’’

‘‘సరే పన్ను తీసేస్తాం అంటారు. అప్పుడేం చేస్తారు? వైస్రాయి గారికి జై అని’’ జై కొడతారా?’’

‘‘ఏదో జరుగుతుందని ఇన్నాళ్ళూ ఖద్దరు ఒడుకుతూ, అమ్ముతూ కూచుంది ఇందుకా’’.

ఆవేశపరులైన యువకులు  ఉక్రోషంగా అరిచారు.

శారద వాళ్ళందరినీ శాంతపరిచేందుకు సిద్ధపడింది.

‘‘స్వతంత్రం ఇస్తారా? ఇవ్వరా? అని అడిగి వాళ్ళిస్తే హాయిగా తీసుకుని భుజాన వేసుకోటానికి అదేమన్నా కండువా అనుకున్నావా? ప్రజల్ని ఒక్కసారే చివరి గమ్యానికి సన్నద్ధం చెయ్యగలమా? ఉప్పుమీద పన్ను తీసేస్తారే అనుకుందాం. అది ఒక విజయం గదా. గాంధీ మీదా, కాంగ్రెస్‌ మీదా ప్రజలకు నమ్మకం కలుగుతుంది గదా ` శత విధాలుగా ప్రభుత్వం ఉప్పుమీద పన్ను తియ్యదు. మనల్ని ఉప్పు చెయ్యనివ్వదు. అప్పుడు ఆ అన్యాయాన్ని ఎత్తిచూపుతూ ప్రజలను బ్రిటీష్‌వాళ్ళకు వ్యతిరేకంగా సమాయత్తం చెయ్యొచ్చు. ప్రజల కోపం పెరిగితే అది దేశానికి మంచిదే కదా ` ’’

శారద మాటతో అందరూ చల్లబడ్డా రామకృష్ణ చల్లబడదల్చుకోలేదు.

‘‘ప్రజల కోపం పెరుగుతుంది. ఉద్యమంలోకి వస్తారు. సత్యాగ్రహం చేస్తారు. మంచి సమయం చూసి గాంధీగారు చల్లగా ఉద్యమం ఆపెయ్యమంటారు. ఈయనతో ఒక చావు కాదు గదా’’  అందరూ నవ్వారు. మొత్తానికి కాస్త నిరసన ఉన్నప్పటికీ అందరిలో ఉత్సాహం నిండుతోంది. శారద ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేయాని కంకణం కట్టుకున్నదానిలా మాట్లాడింది. అర్థరాత్రి దాటే వరకూ చర్చలు సాగుతూనే ఉన్నాయి. మర్నాడు ఆదివారం కావటంతో ఎవరికీ నిద్రపోవాలనే ఆలోచనే రాలేదు.

శారద ఆదివారం ఉదయం ఆలస్యంగా  నిద్రలేచినా బీచ్‌కి వెళ్దామనుకుంది. సత్యాగ్రహం మొదలైతే ప్రజల్ని ఉత్తేజపరుస్తూ ఉపన్యాసాలివ్వాలి. శారద ఉపన్యాసాలు  అభ్యాసం చేసి చాలా రోజులయింది. ఆ మూర్తి నా కార్యక్రమమంతా పాడుచేశాడు అని విసుక్కుని ఆలస్యమైనా ఫరవాలేదనుకుంటూ వెళ్ళింది. సముద్రాన్ని చూస్తూ దాని మీద నుంచి వస్తున్న తేమ గాల్లోని ఉప్పు వాసన తగిలితే శారదకు ఒళ్ళు పులకరిస్తుంది.

ఆనందంగా, ఉత్సాహంగా సత్యాగ్రహం చేయాల్సిన అవసరాన్ని కర్తవ్యాన్ని గురించి గొంతెత్తి సముద్ర తరంగాలతో మాట్లాడింది. ఉపన్యాసం ఆపి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటుంటే వెనక నుంచి చప్పట్లు వినిపించాయి. శారద వెనక్కు తిరిగి చూసింది.

మూర్తి నవ్వుతూ చప్పట్లు కొడుతూ నుంచుని ఉన్నాడు.

‘‘చాలా బాగా మాట్లాడారు. మీ గొంతు కూడా బలంగా  పలికింది. ఉత్సాహం సముద్రంలా ఉప్పొంగింది. కానీ అసలు  విషయమే రాలేదు’’.

శారద అసలు  విషయమేమిటన్నట్లు చూసింది.

‘‘ఇప్పుడు గాంధీగారు ఉప్పుని కదా గుప్పెట్లోకి తీసుకున్నారు. దాని సంగతేం రాలేదు’’.

‘‘నాకు దాని గురించి తెలిసిందంతా చెప్పాను’’.

‘‘తెలుసుకోవసింది చాలా ఉంది.’’

‘‘తెలుసుకుంటాను’’.

‘‘తెలిసినవాడిని నేనున్నానుగా , చెప్పనా?’’

శారద మౌనంగా మెల్లిగా బీచీ ఒడ్డున నడుస్తోంది. పక్కనే మూర్తి నడుస్తూ చెబుతున్నాడు.

‘‘మన దేశంలో కావసినంత ఉప్పు తయారవుతూనే ఉంది. కానీ బ్రిటీష్‌ ప్రభుత్వం లివర్‌పూల్‌ నుంచి, చెషైర్‌ నుంచి ఉప్పు మనకు దిగుమతి చేస్తోంది. ఎందుకు? ఇండియా నుంచి ఇంగ్లండ్‌కు బోలెడు సరుకులు  ఎగుమతి అవుతున్నాయి. ఎగుమతి ఏ నౌకలో అవుతున్నాయో, అవి మళ్ళీ ఇండియాకి తిరిగి రావాలిగా .  వాటిలో ఏదో ఒకటి నింపి పంపాలిగా. ఏం పంపుతారు? మట్టి! మీకు తెలుసా? కొన్నాళ్ళు నిజంగానే మట్టి నింపుకుని అక్కడ హుగ్లీనుంచి ఉన్న పెద్ద కావలో ఆ మట్టి పోసి ఆ కావ పూడ్చేశారు. ఇంగ్లీషు వాళ్ళంత మూర్ఖులు  వాళ్ళే! ఇంక అట్లా పూడవటానికి కావ కూడా లేవు. దాంతో మట్టి బదులు ఏం పంపాలా అని ఒక పార్లమెంటు కమిటీ కూచుని రోజుల  తరబడి ఆలోచించి ఉప్పు పంపాలని నిర్ణయించింది. ఉప్పు వాళ్ళు ఎగుమతి చేసినా ఇక్కడ ఎవరు కొంటారు? మనకంతా సముద్ర తీరమే కదా. కాసేపు ఇక్కడ నడిచి ఇంటికెళ్ళి దులుపుకున్న ఉప్పుతో వంట చేసుకోవచ్చు.

శారద గలగలా నవ్వింది.

‘‘మీ నవ్వెంత బాగుంటుందో ! ’’

‘‘చెప్పండి. చెప్పండి’’ గంభీరత్వం తెచ్చిపెట్టుకుంది శారద.

‘‘ఇక్కడ వాళ్ళ ఉప్పెవరు కొంటారు? అందుకని మనవాళ్ళు తయారుచేసే ఉప్పు మీద మణుగుకు మూడున్నర రూపాయలు  పన్ను వేశారు. దాంతో బెస్తవాళ్ళకు ఎంతో నష్టం. వాళ్ళు ఉప్పు చేస్తారు. ఉప్పు చేపు చేస్తారు. బెస్తస్త్రీకది జీవనాధారం.

వాళ్ళు ఉప్పుకి పన్ను కట్టలేరు. తామే తయారుచేసుకుందామంటే ఎవరంటే వాళ్ళు ఉప్పు తయారుచేయకుండా నిషేధం పెట్టారు బ్రిటీష్‌వాళ్ళు. ఆఖరికి సముద్రంలో దొరకే నాచుతో తీగతో ఎలాగో తంటాలు  పడి ఉప్పు చేసుకుంటుంటే వాళ్ళకు జైలు  శిక్ష వేశారు. ఇక ఉప్పు తయారీని పెద్దపరిశ్రమ చేసి ధనిలకుకు అప్పగించారు. వాళ్ళకు లాభాలు  కావాలి. గాలీ, నీరూలా దాదాపు ఊరికే దొరికే ఉప్పు పండించే  నేలలో కొన్ని సంవత్సరాలు  దానిని పండిస్తే అవి పంట పొలాలవుతాయి. తెలుసా?

‘తెలియదు’

‘‘తెలుసుకో’’ హుందాగా అన్న మూర్తిని చూస్తే శారదకు ముచ్చటేసింది.

‘‘ఆ రకంగా ఎన్నో పొలాలు చవిటి పర్రుగా మిగిలిపోయాయి. జనం ఉప్పు వాడటం తగ్గించారు. దానివల్ల  ఆరోగ్య సమస్యలు … ఒకటి కాదు ఉప్పు కథ ఎంతో ఉంది. మొత్తం ఉప్పు వ్యాపారాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని జనం నోళ్ళలో దుమ్ముకొట్టింది.’’

మూర్తి మాట్లాడటమూ నడవటమూ ఆపి

‘‘ఇది చాలనుకుంటాను. గణాంకాలను ప్రజలంతగా పట్టించుకోరు’’

శారద నవ్వుతూ మూర్తి వైపు చూసి ‘‘మీరు పుస్తకాలు  బాగా చదువుతారనుకుంటాను’’.

‘‘ఊ’’ పుస్తకాలు  చదువుతాను. సంగీతం పాడతాను. ఫోటో తీస్తాను. బొమ్ము వేస్తాను. పొట్టకూటి కోసం కోర్టులో వాదిస్తాను. ఎన్నో పనులు  చేశాను ఇంతవరకూ ,  ఒక్క పని తప్పా.’’

‘‘ఏంటది?’’

‘‘ప్రేమించటం. ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు. ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను’’ మూర్తి సూటిగా చెప్పిన ఆ మాటకు శారదాంబ చంపులు  ఎర్రబడ్డాయి. మూర్తి మీద కోపం రాకపోగా మనసులో సంతోషం కలుగుతోంది. అది కలగకూడదని లోపలినుండి హెచ్చరికలూ  వినబడుతున్నాయి.

‘‘శారదా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక నా వశంలో లేదు. నిన్ను చూడకుండా ఉండలేను. ఈ పరిస్థితికి నాకూ కంగారుగానే ఉంది. కానీ నా చేతుల్లో ఏమీ లేనట్లుగా ఉంది.’’

‘‘నా చదువు నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంకోవైపు నేను దృష్టి మళ్ళించలేను.’’

‘‘నీ చదువు నాకూ ముఖ్యమే. నువ్వు నీ చదువు వల్లే, ఆ చదువు వల్ల నీలో ప్రకాశించే జ్ఞానం వల్లే నన్ను ఆకర్షించావు. నీ శరీరాన్ని కాదు నేను ప్రేమించేది. నీ మేధస్సుని, తెలివిని, నీలోని ఆధునికతను. ఇవన్నీ కలిసిన నిన్ను . నీ ప్రేమ నీ చదువుకి ఆటంకం కాదు. నాకేమీ అక్కర్లేదు. రోజూ నిన్ను చూసి నీతో మాట్లాడితే చాలు.’’

‘‘మా ఇంటికి మీరు నిరభ్యంతరంగా రావొచ్చు. నాకు చాలామంది స్నేహితులున్నారు. అన్నదమ్ములున్నారు. వాళ్ళందరితో పాటు మీరు రావొచ్చు.’’

‘‘వాళ్ళందరితో పాటు నేను కాదు. నాకేదో ప్రత్యేకం కావాలి’’.

‘‘ప్రత్యేకం’’ నవ్వింది శారద.

‘‘సరే. ప్రత్యేకమే. ఒకసారి రండి. వచ్చి మా స్నేహ బృందాన్ని చూడండి’’.

మూర్తి శారద స్నేహబృందానికి పరిచయమయ్యాడు. వాళ్ళలో అతనొకడయ్యాడు గానీ మిగిలినవాళ్ళందరికీ అతను ఏదో ప్రత్యేకంగానే కనిపించేవాడు. శారద మీద తనకేదో అధికారం ఉన్నట్టు, చనువు ఉన్నట్లు మాట్లాడేవాడు. శారద దానిని పట్టించుకోనట్లు కనిపించినా లోలోపల దానిని ఇష్టపడేది. అందువల్ల ఎవరి అధికారాన్ని సహించని శారద, మూర్తి ధోరణిని వారించేది కాదు. దానికి తోడు శారద, మూర్తి చాలాసార్లు ఉదయపు వేళల్లో సముద్ర తీరాన కలుస్తున్నారనే విషయం కూడా మిగిలిన మిత్రులకు తెలిసింది.

రామకృష్ణ మిగిలిన వారిలా మౌనంగా ఊరుకోలేకపోయాడు.

‘‘అక్కా ! మూర్తిగారి పద్ధతి ఏదో భిన్నంగా ఉన్నది. మిగిలిన విషయాలు  ఎలా ఉన్నా నీ మీద ఏదో అధికారం ఉన్నట్లు ప్రవర్తిస్తాడెందుకు? దానిని నువ్వు సహిస్తున్నావెందుకు? ఆ చనువు, ఆ పరిహాస ధోరణి నువ్వెందుకు భరిస్తున్నావు?’’

రామకృష్ణ నుంచి ఈ ప్రశ్న వస్తుందని శారద అనుకుంటూనే ఉంది. రామకృష్ణ కంటే తనకు మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి, సజ్జనుడు ఎవరూ ఉండరని శారదకు తెలుసు. అతని దగ్గర విషయం దాడచంలో అర్థం లేదనీ, ఉన్న విషయం చెప్పేద్దామనీ అనుకుంది.

‘‘మూర్తి నన్ను ప్రేమిస్తున్నాడు రామూ. అందుకే ఆయనకా అధికారం’’.

‘‘నిన్ను ప్రేమిస్తున్నాడా? ఆయనకు పెళ్ళయింది కదక్కా’’. రామకృష్ణయ్య ఆందోళనగా అడిగాడు.

శారద ముఖం పాలిపోయింది. గుండె దడదడా కొట్టుకుంది. శరీరమంతా నిస్సత్తువగా అయిపోయింది. కాళ్ళు తేలిపోతున్నట్లయి దగ్గరున్న బెంచీమీద కూలబడింది.

‘‘ఆ సంగతి చెప్పలేదా? అది దాచి ప్రేమిస్తునన్నాడా?’’ రామకృష్ణ కోపంగా అంటున్న మాటలు  కూడా శారదకు వినిపించలేదు. అసలు  ఈ లోకం, ఎదురుగా ఉన్న రామకృష్ణ అంతా అదృశ్యమై పోయినట్లయింది. ఏమీ కనిపించటంలేదు. వినిపించటం లేదు. చీకట్లు కమ్మినట్లయింది.

రామకృష్ణ ‘‘అక్కా! అక్కా’’ అంటూ కుదిపాడు.

‘‘మూర్తికి పెళ్ళయిందా? నీకు తెలుసా?’’ చాలాసేపటికి అడిగింది శారద.

‘‘తెలుసు. నాకే కాదు. అందరికీ తెలుసు. ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. నీ దగ్గర దాచాడా ఇదంతా’’ రామకృష్ణ కళ్ళెర్రబడ్డాయి.

‘‘నేను అడగలేదు’’

‘‘నువ్వడగటం అలా ఉంచు. ప్రేమిస్తున్నానని చెప్పినవాడు తన పెళ్ళి విషయం చెప్పకపోతే ఏమిటర్థం?’’

‘‘పెళ్ళి గురించిన మాటే మా మధ్య రాలేదు రామూ. అతను నన్ను పెళ్ళాడతాననలేదు. ప్రేమిస్తున్నారా ఐతే పెళ్ళి చేసుకుందామని నేనూ అనలేదు. రామూ ` ఈ విషయం ఇంతటిలో ఆపేద్దాం. దీని గురించి వివేకంతో ఆలోచించగల సమర్థురాలిననే నమ్మకం నామీద ఉంచు. నువ్వు దీని గురించి ఆందోళన పడకు. ఇదంతా నేను తేల్చుకోవాల్సిన విషయం. నువ్వు ఏ విధంగానూ జోక్యం చేసుకోవద్దు. నేను తేల్చుకుంటా ` ’’ శారద అక్కడినుంచి వెళ్ళిపోయింది. దు:ఖం కట్టలు  తెంచుకు దూకింది. అడ్డు లేకుండా ప్రవహించింది. అదంతా అయిపోయాక శారద లేచి ముఖం కడుక్కుని కాశీనాథుని నాగేశ్వరరావు గారింటికి వెళ్ళింది.

శారద వెళ్ళేసరికి దుర్గాబాయి ఆసుపత్రినుంచి భర్తను తీసుకుని వచ్చింది. శారదను చూస్తూనే ఆమె ఉత్సాహంగా మాట్లాడటం మొదలుపెట్టింది.

‘‘చూశావా. వస్తుందనుకున్న సమయం వచ్చేసింది. ఇంక మనదే ఆలస్యం. అందరం దూకాల్సిందే. శారదా ఎప్పుడెప్పుడు సత్యాగ్రహం చేద్దామా అని  మనసు ఆగటం లేదు.’’

ఆమె భర్త సుబ్బారావు ఏదో ఆయాసపడ్డాడు. దుర్గాబాయి ఆయనకు మంచినీళ్ళిచ్చి, మందు తాగించి విశ్రాంతిగా పడుకునే ఏర్పాటు చేసి వచ్చింది. ప్రతిపనీ ఎంతో శ్రద్ధగా చేస్తుంది దుర్గ.

పనిలో అందం, శ్రద్ధ రెండూ కనిపిస్తాయి.

భర్తపై ఇంత శ్రద్ధ. గృహిణిగా కర్తవ్య ధర్మం. ఎట్లా సత్యాగ్రహంలో కలుస్తుంది? అదే అడిగింది శారద.

‘‘శారదా ` దేశం పిలిస్తే, బాపూ ఆజ్ఞ వేస్తే ఇక నన్ను నేను నిలవరించుకోలేను. సర్వ ధర్మాలు  పక్కన పెడతాను. నా ఆత్మ బోధించే ధర్మం ఒక్కటే. నా దేశం’’.

‘‘మరి నీ భర్త?’’

‘నా భర్తను చూసుకునేవాళ్ళు ఉన్నారు. ఉంటారు. ఆయన నన్ను ఆపరు’. దుర్గ ముఖంలో ఆవేశం. ఆనందం. ఉత్సాహం.

‘‘భార్యాభర్తల సంబంధం ఎలాంటిది దుర్గా?’’

దుర్గ నవ్వింది.

‘‘నీకు తెలియదా? పెళ్ళి కాలేదనుకో ` ఐనా నీకు తెలియదంటే నేను నమ్మను.’’

‘‘భార్యాభర్తలందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారా?’’

‘‘నీకు ప్రేమ సమస్య వచ్చిందా? ప్రేమించుకుంటారు. ప్రేమించుకోరు. రెండూ ఉంటాయి. భార్య భర్తని సేవించాలి. అతనే లోకంగా ఉండాలి అంటారు ` నాకలా ఎప్పుడూ లేదు. పాపం ఆయనకు తనతోడిదే లోకంగా ఉండాలని ఉందేమో. నేనెప్పుడూ అలా లేను.’’

‘‘కానీ నువ్వు చేస్తున్న సేవ చూస్తుంటే…’’

‘‘నేనెవరికైనా అలాగే చేస్తాను. భర్త కాబట్టి మరింత బాధ్యతగా ఉంటాను. కానీ ఈ బాధ్యత ఇంక మొయ్యలేను. దేశం కోసం దీనిని అవతల పెట్టెయ్యగను’’.

‘‘కానీ స్త్రీంతా నీలా ఉండగలరా?’’

‘‘ఉండలేరు. వాళ్ళకా దృష్టి లేదు. ఎంతసేపూ ఇల్లూ , భర్తా, పిల్లలూ  ఇదే లోకం.

అబ్బా ` నాకా గుణం రాలేదు. వచ్చుంటే ఇక అక్కడే తెల్లార్చుకునేదాన్ని నా జీవితాన్ని.’’

‘‘భర్తను ప్రేమించకుండా దేశాన్ని ప్రేమించటం సరే ,  మరొక పురుషుడిని ప్రేమించటం సాధ్యమా?’’

‘‘ఆ విషయం నాకేం తెలియదు. ఆ ప్రేమ గురించి నేనెన్నడూ ఆలోచించలేదు’’

దుర్గ వెళ్ళి భర్తకు అంతా అనుకూలంగా ఉందా అని చూసి కాళ్ళ దగ్గర తొలగిన దుప్పటి సరిచేసి వచ్చింది.

‘‘నువ్వు నీ భర్తకంటే దేశాన్ని ప్రేమిస్తున్నావు. ఆ మాట ఆయనతోనే చెప్తున్నావు. నీ భర్త నీకంటే ఎక్కువగా ఇంకొకరిని ప్రేమిస్తున్నానని చెబితే ` ’’

‘‘అబ్బా ` అంతకంటే శుభవార్త ఉంటుందా? ఆ ఇంకెవరికో ఈయన బాధ్యత అప్పగించి నేను స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో పడి పరిగెత్తుతా’’ దుర్గ ఆ మాటన్న తీరుకి శారద నవ్వింది.

‘‘కానీ మామూలు  స్త్రీలు ఏడుస్తారు కదూ ` భర్త తనను కాదని ఇంకొకరిని ప్రేమిస్తున్నాడంటే ` ’’

‘‘ఏమో ` కొందరు ఏడవవచ్చు. కొందరు సంతోషపడవచ్చు. మరి కొందరు ప్రాణత్యాగం చేయవచ్చు. కానీ ఎక్కువమంది లోలోప సంతోషిస్తారేమో’’.

‘‘ఎందుకు?’’ ఆశ్చర్యంగా అడిగింది శారద.

‘‘ఈ భారం నుంచి విముక్తి లభించినందుకు. బతికినంతకాం ఒకే మనిషికి బాధ్యత వహించటం తప్ప మరింక జీవితంలో ఏ పనీ లేకుండా ఉండటం. ఆమనిషి ఎటువంటివాడైనా సేవించవలసి రావటం, స్వేచ్ఛ అన్నది లేకపోవటం , ఎటు చూసినా ఆజ్ఞలే , ఆదేశాలే. ఏమో నాకైతే ఈ వివాహబంధాన్ని మించి ఆనందం దేశ సేవలోనే ఉంది. కొందరికి మరింక దేన్లోనైనా దొరకొచ్చు. కానీ శారదా ,  ఆలోచించే అవకాశమే లేదుగా స్త్రీకు. ఎక్కడ నాకు ఆనందమని. ఊహ తెలిసిన దగ్గరినుంచి ఇదే నీ ఆనందం ముక్తి , మోక్షం అని చెప్తుంటారు. ఏమో ?ఆడవాళ్ళు ఈ బంధం నుంచి బైటపడి స్వతంత్రంగా వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు వెతుక్కుంటే నయమనిపిస్తుంది నాకు.’’

‘‘స్వతంత్రం మనకీ కావాలిగా దుర్గా దేశానికి లాగే ! మనల్ని మనం పరిపాలించుకోవాలనిపించదు?’’

‘‘ఎందుకనిపించదు? కానీ దానికి ఎంతో శక్తి కావాలి. ముందు చదువు కావాలి. నువ్వు డాక్టర్‌వి అవుతావు. ఎంతమంచి సంగతి అది. నాకూ చదవాలని ఉంది. లాయర్‌ని కావాని ఉంది. దేశ స్వతంత్ర విషయాల్లో ఎన్నో తొసుకోవాలి. చదువు లేకపోతే మళ్ళీ ఆ చదువుకున్న మగవాళ్ళ మాటకు తలూపటం తప్ప మరేం చెయ్యలేం. చదువుకోవాలి శారదా ఆడవాళ్ళంతా చదువుకోవాలి. ఇంగ్లీషు చదువు  ’’ దుర్గ ముఖం వెలిగిపోతోంది జ్ఞానకాంక్షతో.

వాళ్ళ మాటల్లో చాలా సమయం గడిచింది.

శారద అడగాలనుకున్నది అడగలేదు. చెప్పాలనుకున్నది చెప్పలేదు. ఎలా వెళ్ళిందో అలాగే తిరిగొచ్చింది. గుండెమీద బరువు ఏ మాత్రం తగ్గలేదు.

***

మీ మాటలు

*