నన్ను వెతుక్కుంటూ వొచ్చింది కవిత్వం!

premio-nobel-de-literatura-chileno-pablo-neruda-2013-03-22-57728

 

“నెరుడా గురించి రాయమన్న వెంటనే నాలోపల ఏదో గాలి సందడి చేసింది.పగలబడినవ్వాలనిపించింది. సరే అని రాయటం మొదలుపెడితే కాగితాలు కాగితాలునిండిపొయ్యాయి. నేను రాయల్సింది కొద్దిగనే కదా అని గుర్తుకుతెచ్చుకోని, రాసినదంతా పడేసి ఏదో పది వాక్యాలు రాద్దాం అని కూర్చుంటే- అలా కవితలువస్తున్నాయ్. నెరుడాని అమితంగా ఇష్టపడే వాళ్లకు  నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది.

 

మా ఇంట్లోనే ఒక గోడౌన్  ఉండేది. అక్కడికి సామాన్యంగా ఎవ్వరూపోరు. ఒక్కతినే అక్కడికి వెళ్లి, అక్కడ వేలాడుతున్న చిన్న బల్బునువెలిగించి, అక్కడి నిశ్శబ్దానికి నెరుడా కవిత్వాన్ని వినిపించే వాడిని.  ఆనిశ్శబ్దంతో ఒక సంబంధం ఏర్పరుచుకున్నానో ఏమో, అక్కడికి వెళ్లి దొరికిన నెరుడాకవిత్వం అంతా చదవటం ఒక అలవాటు గా మారిపోయింది. ఇక్కడ నేను కవిత్వంరాయకుండా కేవలం వాస్తవాలను రాస్తూ నెరుడాని పరిచయం చేయటానికివిశ్వప్రయత్నం చేయదల్చాను.

 

నెరుడా చిలీకి చెందిన మహాకవి. నిజానికి నెరుడాని చిన్నవయస్సులో మరో గొప్ప కవయిత్రి గబ్రిఎల్ మిస్ట్రల్ చాలాప్రొత్సహించింది. నెరుడా కి తన సవతి తల్లి అంటే ఎంతో ఇష్టం. నెరుడా తన “మెమోఇర్స్” లో ఆమె పై తన ప్రేమను అత్యంత కవితాత్మకంగా చెప్తాడు. ఆమె “ఇంట్లోని చీకట్లనుండి బయటకి వొచ్చే నిశ్శబ్ద నీడ” అంటాడు.

 

నెరుడాతన తొలి పుస్తకం – “ఇరవై ప్రేమ కవితలు మరియూ ఒకవిషాద గీతం” – 1921 లో ప్రచురితమయ్యింది. అత్యంత చిన్న వయసుతోనే ఆ పుస్తకంద్వారా నెరుడా సాహిత్యలోకంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తనప్రేమ స్మృతులన్నీ – చిలీ దేశపు ప్రకృతి అందాలని కలగలిపి ఒక కవితాత్మక రూపంఇవ్వటంలో నెరుడాకు సాటి ఎవ్వరూ లేరు. గొప్పకవి అయిన లోర్కా నెరుడా కు మంచిస్నేహితుడు. లోర్కా నెరుడా గురించి యిలాచెప్తాడు “తనకు తత్వశాస్త్రం కంటేచావుతోనే ఎక్కువ సాన్నిహిత్యం, అంతర్గత ఆలోచనల కంటే బాధకి ఎక్కువ దెగ్గర-సిరా కంటే రక్తం గురించే ఎక్కువ తెలుసు. ఆ కవిలో ఎన్నో రహస్యమైన గొంతులువినిపిస్తూ ఉంటాయ్, అవేంటొ తనకే తెలియవు.”

 

రాజకీయంగా, నెరుడా కమ్యునిస్టు భావాలని నమ్మాడు. 1971 కాలం, నెరుడా రాజకీయ జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి చేరుకున్న సమయం.  చిలీకమ్యునిస్టు పార్టీ నెరుడా ని ప్రసిడెంట్-అభ్యర్థిగా గా ఎన్నుకున్నప్పుడుతను ఆ భాద్యతని సాల్వడార్ అలండేకి ఇచ్చాడు. ఆ కాలంలోనే తనకు నొబెల్పురస్కారం కూడా వొచ్చింది. కాని ఆరోగ్యం క్షీణించడం వల్ల 1973లోకన్నుమూసాడు.

 

‘కవిత్వం’ అనే ఈ కవితలో నెరుడా తనకు మొట్టమొదటి సారికవిత్వం తో ఎలా పరిచయం అయ్యిందో చెప్తాడు. ఎది నాకు ఎంత ప్రియతమైన కవితఅంటే దీన్ని ఇంట్లో నా గోడ పై రాసుకుని రోజు పొద్దుననే లేచి చదివే దాన్ని .

 

ఈ నెల కవి: పాబ్లో నెరుడా

 tumblr_lgmaonlhmf1qdy8lno1_500

కవిత్వం 

 

 

 

అప్పుడు, ఆ వయసులో నన్ను వెతుక్కుంటూ

వొచ్చింది కవిత్వం.

 

నాకు తెలీదు, 

అది ఏ శీతాకాలం నుండో, ఏ నది లోంచి పుట్టిందో

దాని గురించి ఏమీ తెలీదు.

 

 

ఎలా వొచ్చిందో, ఎప్పుడు వొచ్చిందో,

అది స్వరం కాదు,పదాలూ నిశ్శబ్దం కాదు.

 

అకస్మికంగా రాత్రి శాఖల ద్వారా

ఒక వీధి నన్ను రమ్మని పిల్చింది,

క్రూరమైన మంటల నుండో, ఒంటరిగా తిరిగి వెల్తున్నప్పుడో.

అక్కడ ఒక అనామకుడిగా నిల్చుండిపోయినప్పుడు 

 

కవిత్వం నన్ను తాకింది. 

 

నాకు ఏం చెప్పాలో తెలియదు, 

మాట్లాడటానికి దార్లన్నీ మూసుకుపొయ్యాయి,

నా చూపు గుడ్డిదయింది, 

లోపల ఏదొ మొదలయ్యింది, 

జ్వరమో, మరచిన రెక్కనో ,

ఆ జ్వాల అర్థాన్ని వెంటాడుతూ,

నా దారిన నేను వెళ్లిపోయాను,

 

అప్పుడు రాసాను

ఏమీ తెలియని వాడు రాసే స్వచ్చమైన జ్ఞానంతో

పదార్థం లేని, బలహీనమైన,

శ్రేష్టమైన, అర్థరహితమైన, 

మొదటి అస్పష్ట వాక్యం, 

 

అకస్మికంగా స్వర్గాలు విడుదలయ్యాయి, 

గ్రహాలు తెరుచుకున్నాయి, తోటలు జీవం పోసుకుని ఆడాయి, 

నీడలకు చిల్లులు పడ్డాయి, 

 

 

బాణాలు, మంటలు, పూలు, 

ముడుచుకుంటున్న రాత్రి, ఈ విశ్వం

అన్నీ పొడుపుకథలు అయ్యాయి. 

 

 

 

అక్కడ అత్యంత సూక్ష్మజీవిని అయిన నేను,

రహస్యం లాంటి ప్రతిమ కలిగిన

ఆ గొప్ప నక్షత్రాల శూన్యాన్ని తాగి

నాకు మాత్రమే తెలిసిన స్వచ్చమైన అగాధం లో

నక్షత్రాల చక్రాలను నడుపుతుంటే


హృదయం గాలులతో స్వేచ్చగా విహరించింది.

 

 

 పరిచయం

సిరా– This name is a pseudonym. Please represent me as a pseudonym. Hope you see that many poets in history had written with a pseudonym. I would like to use the photo of Pessoa who is the master of pseudonyms and here is how I would like to introduce myself-

కేవలం సాహిత్యం కోసమే ఒక జన్మ ఉంటే బాగుంటుంది.

ప్రపంచం లోని అన్నిరకాల విషయాలను మర్చిపొయ్యి కేవలం సాహిత్యానికే పరిమితమవ్వాలి అనే  ఒక ఆలోచన ఎంత బాగుంటుంది?

సాహిత్యాన్ని సమాజాన్ని వేరు చేసే ప్రయత్నం కాదు, కాని సమాజం లో ప్రతిమూలని కెకేవలం సాహిత్యంతో చూస్తే ఎలా ఉంటుంది?

అసలు సమాజం అంతా మారుతున్నప్పుడు సాహిత్యం స్ఠానం ఏమిటి? ఇలాంటి  ఆలోచనలనుండి పుట్టినది సిరా.

సిరా కి స్వచ్చంగా నవ్వటం తెలుసు. అన్యాయం జరుగుతుంటే ఖండించటం తెలుసు. మౌనంగా కుర్చోని రోజులు గడపటం తెలుసు. గొప్ప సాహిత్యం చదివాక దానితో ఎప్పటికీ వీడలేని బంధం ఏర్పరుచుకోవడం తెలుసు. కుదిరితే అప్పుడప్పుడు అనువాదం చేయటమో, కవిత్వం రాయటమో తెలుసు.
There is a surreal Pessoa’s photo representing his many faces. I hope, that suits as my picture.

pessoa_________-

 

Sudden Fiction లో ముగింపు చదువరిదే: బి. పి. కరుణాకర్

nadustunna katha

మే నెల కథల్లో ఉత్తమ కథ ‘ఇరుకు పదును’ రచయిత శ్రీ బి పి కరుణాకర్ తో ఇంటర్వ్యూ

B P Karunakar

మీ గురించీ, మీ రచనా వ్యాసంగం గురించి చెప్పండి

పుట్టింది పెరిగింది గుంటూరులో. ఖమ్మం జిల్లాలో, పూణేలో పని చేసి 1983లో సికింద్రాబాద్ BHEL చేరి అక్కడే పదవీవిరమణ చేశాను. భార్య హేమలత ఇప్పుడు లేదు. కూతుళ్ళు ఒకరు అమెరికాలో, మరొకరు సంగారెడ్డి లో స్థిరపడ్డారు. నేను ఒంటరిగా ఈ ఇంట్లో వుంటాను. ప్రస్తుతం నా వయస్సు 71 సంవత్సరాలు.

1962 చిత్రగుప్తలో మొదటి కథ అచ్చైంది. 96 దాకా రచనలు చేశాను. ఆ తరువాత కుటుంబ బాధ్యతల వల్ల పదకొండేళ్ళ విరామం తీసుకోని 2007 నుంచి రెండో అంకం మొదలుపెట్టాను. “అంబాలీస్”, “నిర్నిమిత్తం”, “రాజితం” ఇప్పటివరకు ప్రచురింపబడ్డ నా కథాసంపుటాలు. నాలుగో కథల సంపుటి సిద్ధం అవుతోంది. ఇప్పటివరకూ నా కథల మీద నాలుగు పరిశోధనలు జరిగాయి.

మీరు రాసిన కథలు రెండు మూడు పేజీలు దాటవు. ఇలా రాయాలని మీరే ఎంచుకున్నారా?

ఇలా రాయలని అనుకోని రాయలేదు. చిన్నప్పటినుంచి చదవటం అలవాటు. గైడిమపాస, మామ్, మార్క్ ట్వైన్, ఎమిలీజోలా, ఓ హెన్రీ ఇలాంటి రచయితల కథలు అనువాదాలై విరివిగా వస్తుండేవి. వాటితో పాటు చలం, ధనికొండ హనుమంతరావు వంటి రచయితలనీ చదివాను. వీరిలో బహుశా సోమర్ సెట్ మామ్ ప్రభావం కొంత వుందేమో. కానీ నేను రాస్తున్న పద్దతిని Sudden Fiction అంటారని ఆ తరువాత ఎప్పటికో కానీ తెలియలేదు.

Sudden Fiction గురించి ఇంకా వివరంగా చెప్పండి

మామ్ కథలు చూడండి. పూర్తిగా చెప్పాల్సిన పనిలేదు. ముగింపు పాఠకుడికే వదిలివేయటం. కథలలో దృశ్యస్ఫురణ జరగాలి. పూర్తిగా చెప్పనప్పుడు క్లుప్తత వస్తుంది. ముగింపు పాఠకుడికే వదిలేస్తే ఆ గాఢత చాలా కాలం వెంటాడే లక్షణం వస్తుంది. గోప్యత వస్తుంది. అదే సడన్ ఫిక్షన్ – ఓపెన్ ఎండెడ్. నిడివి తక్కువగా రాయడం ఈ పద్ధతిలో ముఖ్య వుద్దేశ్యం. ఈ విషయం తెలియకుండానే చాలా కాలం క్రితమే ఈ రకంగా రాశాను. నా కథలలో తొంభై శాతం ఇదే పద్ధతిలో వుంటాయి. ఇరుకుపదును కథ కూడా సడన్ ఫిక్షన్ కథే.

“ఇరుకు పదును” అన్న పేరే చిత్రంగా వుంది. అలా ఎందుకు పెట్టారు?

కథకు శీర్షిక చాలా ముఖ్యమైనది. నేను రాసే ప్రక్రియ (Sudden Fiction)లో పాఠకుడికి ముగింపు పూర్తిగా తెలియకుండా వదిలిపెట్టాలి. అక్కడక్కడ కథలో కొన్ని సూచనలు వుంటాయి. కానీ కథ శీర్షిక కథాసారాన్ని చెప్పేయకూడదు. ఇది నా పద్ధతి. అండుకే నా కథలకు పెట్టే పేర్లు అర్థం కావటంలేదని అంటారు. “కోచెరగు”, “ముమ్మూర్తి”, “తూనికనీళ్ళు”, “నిర్నిమిత్తం”, “నీటిబీట” ఇవన్నీ అలాంటి పేర్లే. ఈ కథ విషయానికి వస్తే సరస్వతి పాత్ర నన్ను (కథలో కథకుణ్ణి) పదునైన ప్రశ్నలతో ఇరుకున పెడుతోంది. అందుకే “ఇరుకు పదును” అన్నాను.

ఈ కథా నేపధ్యం ఏమిటి?

దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నిజంగా జరిగిన కథ ఇది. నేను నేనే ఈ కథలో. చాలా వరకు పాత్రల పేర్లతో సహా వాస్తవాలు. “నర్సింగరావు” నాకు మంచి స్నేహితుడు. ఎంత స్నేహితుడైనా ఇంటికి పిలిచేవాడు కాదు. ఉద్యోగరీత్యా కలుస్తుండేవాళ్ళం. ఇంట్లో నేను ఒక్కణ్ణే కాబట్టి తరచుగా వస్తుండేవాడు. సొంతింట్లో వున్నట్లే స్వతంత్రంగా వుండేవాడు. కానీ అతని ఇంటికి మాత్రం తీసుకెళ్ళేవాడు కాదు. అతను చనిపోయిన రోజునే నేను మొదటిసారి అతని భార్యని చూడటం. తరువాత ఆమె వుద్యోగంలో చేరటం, నన్ను కలవటం అన్నీ నిజంగానే జరిగాయి.

మేము ఈ కథలో చాలా కోణాలని చూసి మా వ్యాసంలో రాసాము. ఇవన్నీ ఓ సాధారణ పాఠకుడికి చేరుతాయని మీరు అనుకుంటున్నారా?

చేరకపోవచ్చు. అంతే కాదు ఇంకా కొన్ని వున్నాయి. అసలు సరస్వతి నర్సింగరావు తాలూకు గతం కూపీలాగటానికే ఉద్యోగంలో చేరింది. ఆమెకు భర్తమీద ముందు నుంచే అనుమానం వుంది. ఈ విషయం కథలో ఎక్కడా చెప్పలేదు. కానీ చేర్చేందుకు అవకాశం వుండింది. పాఠకులు కథ గురించి ఆలోచించి, కొత్త కోణాన్ని వెతుక్కోవటంలోనే కొత్త అనుభూతిని పొందుతారు. నా కథలలో మొదటి రెండు పేరాల వరకే నేను పాఠకుడి చెయ్యి పట్టుకోని తీసుకెళ్తాను. మూడో పేరా నుంచి పాఠకుడు కథలో లీనమైన తర్వాత నేను తప్పుకుంటాను. కథ పూర్తైన తరువాత పాఠకుడు ముగింపు అర్థం కాక నా కోసం చూస్తాడు, కానీ నేను కనిపించను. దాంతో పాఠకుడే సమాధానాలు వెతుక్కుంటాడు.

ఇది యధార్థంగా జరిగిన కథ అయినప్పుడు, చెప్పని వివరాలన్నీ చేర్చుకుంటూ పెద్ద కథ రాయచ్చు. ఉదాహరణకి సరస్వతికి మొదట్నుంచి అనుమానం వుంది అని ఇందాక చెప్పారు. ఈ కోణాన్ని కథలో ఎందుకు చెప్పలేదు?

ఎంతవరకు చెప్పాలి అన్నది తెలియాలి. ఇది చాలు అనుకుంటే అక్కడ ఆపేయచ్చు. నేను రాసిన కథలు చూడండి. ఒకే ఒక్క సంఘటనను తీసుకోని మొత్తం జీవితాన్ని చిత్రంచే ప్రయత్నం చేశాను- ఒక పెద్ద కాన్వాస్ తీసుకోని అందులో మూడు చుక్కలు పెట్టినట్టు. చెప్పవలసినదానికంటే ఎక్కువగా నేను చెప్పను. దానివల్ల ఏం ఉపయోగం వుండదు. ఇంకా నిర్మాణం దెబ్బతినే అవకాశం వుంది. కథలో కొన్ని విషయాలను దాచిపెడుతూ, కొద్దిగా చెబుతూ వస్తుంటే కథకి పరిపూర్ణత వస్తుందని నా అభిప్రాయం.

నిజంగా జరిగిన సంఘటనలను కథలుగా రాయడానికి ఊహని ఎంత పాళ్లలో కలుపుతారు?

నేను రాసిన కథలు దాదాపుగా అన్ని జరిగినవే. ఎక్కువశాతం నా అనుభవాలు. కథగా మార్చేటప్పుడు మూడొంతులు ఊహ కలపాల్సివస్తుంది. ఊహని జోడింఛకపోతే అది కథగా మారదు. కేవలం ఒక సంఘటనగానో, వార్తగానో మిగిలిపోతుంది.

ఇరుకు పదును గురించి పాఠకుల రెస్పాన్స్ ఎలా వుంది?

చాలా మంది అభినందించారు. రెండువందల యాభై దాకా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఓ డెబ్భై ఎనభై మెసేజులు వచ్చాయి. ఒక నలుగురు మాత్రం మాకు అర్థం కాలేదన్నారు. ఒకావిడ లోకల్ ఫోన్ నుంచి చేసింది. పేరు కళ అని చెప్పింది. నిజమో కాదో తెలియదు. ఈ కథలో మీరు ఫొటోలు ఎవరివో సరస్వతికి ఎందుకు చెప్పలేదు? అంటూ అడిగింది. దాని వల్ల సమస్యలు వస్తాయని చెప్పలేదు అన్నాను. మీకు కథలు రాయడం చాతకాదు అంది. వాదన తరువాత ఫోన్ పెట్టేసింది. బహుశా సరస్వతి వున్న స్థితిలోనే ఆమె కూడా వుందేమో అనుకున్నాను!

కథ బాగున్నది అన్నవాళ్ళందరికి కథ అర్థం అయ్యిందని అనుకోడానికి కూడా లేదు. వారిలో కొంతమందికి కథ పూర్తిగా అర్థం కాలేదు. అర్థం కానివాళ్ళు చాలా వరకు మెసేజిల ద్వారా అడిగారు. నేను వివరంగా చెప్తే ఇప్పుడు అర్థం అయ్యింది అన్నారు.

మీ కథలో చాలా పొరలూ, దానికి తోడు ఒక ఆకస్మిక (abrupt) ముగింపు ఉన్నాయి. ఇలాంటి కథని పాఠకుడు అర్థం చేసుకోలేకపోవచ్చు. లేని అర్థాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని కోణాలే తెలుసుకోని తృప్తిపడచ్చు. ఒక కథా రచయితగా ఈ ప్రక్రియలో ఉన్న లోపమేమో అనిపించడం లేదా?
లోపం అనుకోవడం లేదండీ. అయితే, అలా జరుగుతుందని ఒప్పుకుంటున్నాను. కానీ పాఠకుణ్ణి మన స్థాయికి తీసుకొచ్చే రచనలే చెయ్యాలి. మనం పాఠకుడి స్థాయికి వెళ్ళి రచనలు చెయ్యకూడదు. పాఠకుణ్ణి తయారు చేసుకోవాల్సిన బాధ్యత కూడా రచయితకు వుంది. పాఠకుణ్ణి పైకి లాగండి. ఇంకా చందమామ దగ్గరే వుంటే ఎట్లా?

ఇప్పటి కథలు, పాఠకుల గురింఛి మీ అభిప్రాయం ఏమిటి?

మునుపటి పాఠకులు వేరు. ఇప్పటి పాఠకులు వేరు. అప్పుడు వచ్చిన కథలు వేరు, ఇప్పుడు వస్తున్న కథలు వేరు. ఇప్పుడు వస్తున్న కథలు చాలా బాగుంటున్నాయి.

ఇప్పటి రచయితల గురించి –

ఒక సంవత్సరం పాటు అమెరికాలో వున్నాను. అక్కడ చాలా పుస్తకాలు చదివాను. ఇంగ్లీషుతో పాటు, చైనీస్, మెక్సికన్, ఇటాలియన్ ఇలా ఎన్నో భాషల కథలు చదివాను. చాలా సినిమాలు కూడా చూశాను. ఆ సంవత్సరం చాలా గొప్ప కథలు చదివాను. ఇప్పటికీ నేను మా అమ్మాయి దగ్గరకు వెళ్ళినప్పుడల్లా ఆమె లైబ్రరీ కార్డు వాడి డెభై అయిదు పుస్తకాలు తెచ్చుకుంటాను. అన్నీ కథల పుస్తకాలే. అవన్నీ చదవడం వల్ల ఆయా భాషల కథాసాహిత్యంలో వస్తున్న పోకడలు తెలుస్తాయి. ఇతర భాషల కథలను అర్థం చేసుకోగలిగితే రచయితలో పరిపక్వత వస్తుంది. ఇప్పుడు కొంత మంది రచయితలు పట్టుమని పది కథలు రాస్తే పట్టడానికి లేకుండా పోతున్నారు. ప్రపంచసాహిత్యాన్ని, మన పాతతరం సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. It is a must. ఇప్పుడు ఎవరైనా కుర్ర రచయితని “చాసో చదివావా” అంటే చాసో ఎవరు అంటున్నారు. బుచ్చిబాబు కథలు చదివావా? అంటే “ఆయన మైదానం చదివానండీ” అంటున్నారు. ఈ పద్దతి మారాలి. చదవాలి. చదివితే మనసు పదునెక్కుతుంది. రాయాలన్ని కుతూహలం కలుగుతుంది. మాలతీ చందూర్ ఏదో సందర్భంలో “వెయ్యి కథలు చదివినప్పుడు ఒక్క మంచి కథ రాయగలుగుతాను” అని చెప్పారు.

ప్రపంచకథలతో బేరీజు వేస్తే తెలుగు కథ ఎక్కడ వుందని మీకనిపిస్తోంది?

చాలా మంచి కథలు వస్తున్నాయి. కాకపోతే ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఇతర భాషల రచనలు అనువాదాలై అన్ని భాషల పాఠకుల దగ్గరకు చేరుతున్నాయి. తెలుగు కథలకు ఆ అవకాశం లేకుండాపోతోంది. అదే జరిగితే ఇప్పుడొస్తున్న తెలుగు కథలు ఏ ప్రపంచసాహిత్యానికి తీసిపోవు.
ధన్యవాదాలు, కరుణాకర్ గారూ! మీరు పరిపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని మంచి కథలు రాయాలని ‘సారంగ’ తరఫునా, మా పాఠకుల తరఫునా మీకు శుభాకాంక్షలు.

థాంక్ యూ..!

జీవించడం కోసం పరిమళించు!

Krish.psd

అశోకారోడ్ నుంచి ఫెరోజ్‌షా రోడ్‌లోకి ప్రవేశించి, మండీహౌజ్ వద్ద సాహిత్య అకాడమీ భవనం వద్ద దుమ్ముపట్టిన పుష్కిన్ విగ్రహం చూస్తూ సర్కిల్ తిరుగుతున్నప్పుడు గుర్తుకు వచ్చింది.. కేదార్ నాథ్ సింగ్‌కు జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించారని. ఒక కవికి ఏదో ఒక అవార్డు లభిస్తే కవిత్వం అంటే ప్రేమించే నాకెందుకు మనసులో ఏదో ఒక మూల కదలిక రావాలి? జర్నలిస్టుగా ఎన్నికల ముందంటే ఏదో ఒక బిజీ. ఎన్నికలై, కొత్త సర్కార్లు ఏర్పడ్డ తర్వాత కూడా పని ఒత్తిడి తగ్గిన తర్వాత కూడా మనసు విప్పి రాయాలంటే ఎందుకు మనస్కరించడం లేదు? ప్రపంచం ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదు. మనం అనుకున్నట్లు ఉండేందుకు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా లేవు. ప్రయత్నాలు, పోరాటాలు, ఉద్యమాలు చేసిన వారే ఏమీ సాధించినట్లు కనపడడం లేదు. అంతా మళ్లీ మొదలైనట్లు, ఏదీ ప్రారంభం కానట్లు అనిపిస్తోంది. మరి ఎందుకింత అసంతోషం? ఎందుకింత నిర్లిప్తత? ఏదో రాయాలనుకుని ఏదీ రాయలేని నిస్సహాయత ఎందుకు? ఎవరిమీద ఈ కోపం? ఎవరిమీద ఈ అసహనం? నీ స్తబ్ధతకు కారణమేమిటో ఎవరికీ ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? ఎందుకు కన్నీళ్లు ఘనీభవిస్తున్నాయి? ఎందుకు రక్తం నరనరాల్లో నిదానంగా చల్లగా ప్రవహిస్తోంది? పాదాలు ఎందుకు ప్రయాణించడానికి మొరాయిస్తున్నాయి? నేనే ఇలా ఉంటే ఉన్నచోటే ఉంటూ స్తంభించిపోయి, ఆకులు రాలుస్తూ, చిగురుస్తూ వసంతాలు, గ్రీష్మాలు అనుభవిస్తూ జనాల్ని నిర్లిప్తంగా చూసే ఈ చెట్లు ఏమి ఆలోచిస్తున్నాయో?

ఐటీఓ క్రాస్ రోడ్‌లో రెడ్‌లైట్ వద్ద మల్లెపూల వాసన గుప్పున చుట్టుముట్టింది. ఇద్దరో ముగ్గులో తమిళ మహిళలు కార్ల కిటీకీల వద్దకు పరుగిడితూ మల్లెపూల దండలు కొనమని బతిమిలాడుతున్నారు. ఫుట్‌పాత్‌పై మరికొందరు మాలలు కడుతున్నారు. ప్రక్కనే నేలపై కాళ్లూ చేతులూ ఊపుతున్న పాప నోట్లో పాలపీక. అప్పుడు మళ్లీ గుర్తొచ్చాడు కేదార్ నాథ్ సింగ్. ఒకటా, రెండా.. దాదాపు ఆరు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారాయన. ఎలా రాయగలుగుతున్నారాయన? ఎప్పుడూ ఆయన నాలా నిరాశలో , నిస్సహాయతలో కూరుకుపోలేదా? కవిత్వం రాసేందుకు ఆయన చేయి ఎప్పుడూ మొరాయించలేదా? ‘ఒక్క మల్లె దండ కొనండి సార్..’  అని చిన్న పిల్ల పదోసారి నన్ను బతిమిలాడింది. నాలాంటి దుర్భర జీవికి మల్లెపూలెందుకు? ఏం చేసుకుంటాను? అయినా.. ఆలోచనల్ని ప్రక్కన పెట్టి తల ఊపి జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చి ఒక మల్లెపూదండ కొని కారులో ఒక మూల పడేశాను.కారంతా పరిమళం అలుముకుంది. ఆ పిల్ల ముఖంలో ఏదో సాధించినట్లు పరిమళం లాంటి ద రహాసం. అప్పుడర్థమైంది కేదార్ నాథ్ ఇన్నేళ్లుగా కవిత్వం ఎలా రాస్తున్నారో.. అవును. జీవితం ఆయనతో కవిత్వం రాయిస్తోంది. 


1934లో ఉత్తరప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన కేదార్ నాథ్ సింగ్ వారణాసి,గోరఖ్‌పూర్, దేవరియా, పాడ్రానా లాంటి పలు ప్రాంతాల్లో అధ్యాపకుడుగా పనిచేస్తూ చివరకు ఢిల్లీలోని జెఎన్‌యులో ప్రొఫెసర్‌గా చేరి 23 ఏళ్ల బోధన తర్వాత 99లో పదవీవిరమణ చేశారు. దాదాపు 16 ఏళ్ల వయస్సులో ఆయన తొలి కవిత రాశారు. కాని 1954లో ఫ్రెంచ్ కవి పాల్ ఎలార్డ్ కవితను అనువదించడం కేదార్ జీవితంలో కేదారం సస్యశ్యామలమైనట్లనిపించింది. ఎలార్డ్ ఆయనకు కవిత్వంలోని జీవన్మరణ రహస్యాలను విప్పిచెప్పారు. అంతే కేదార్ కవిగా అవతరించారు. ప్రముఖ కవి ఆజ్ఞేయ తన సాహిత్య పత్రికలో కేదార్ కవితలనెన్నిటినో ప్రచురించారు. 1960లో కేదార్ తన తొలి కవితా సంకలనం ‘అభీ బిల్కుల్ అభీ’ ప్రచురించారు. 

విచిత్రమేమంటే ఆ తర్వాత 1980లో కాని కేదార్ రెండో సంకలనం ‘జమీన్ పఖ్ రహీహై’  రాలేదు. ఈ సుదీర్ఘ విరామానికి ఆయనే జవాబు చెప్పారు. ‘ఇది నన్ను నేను లోతుగా ఆత్మపరిశీలన చేసుకుంటున్న కాలం. పెద్దగా ధ్వనించకుండా నా ప్రతిఘటనను ఎలా చిత్రించాలో అన్వేషిస్తున్న సమయం అది..’ అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయన వెనక్కు తిరిగి చూడలేదు. వందలాది కవితలను పుంఖానుపుంఖాలుగా రాస్తూ పోయారు. ఏ అవార్డూ ఆయన దాహార్తిని తీర్చలేకపోయింది. 

కేదార్ నాథ్ కవితల్ని మనం బయటినుంచి అలవోకగా పేజీలు తిప్పుతూ అర్థం చేసుకోలేం. కవితల్లోకి మనం ప్రవేశించాలి. మనల్ని మనం ఆయన కవితల్లోకి ఒంపుకోవాలి. ఆయన నడిపించిన దారుల్లో నడవాలి. అదొక అద్భుత ప్రపంచం. పాడుపడిన కోట గోడల మధ్య, గంగానదీ ప్రవాహాల మధ్య, దట్టమైన అరణ్యాల మధ్య, నిశ్శబ్దనదిపై ప్రతిఫలిస్తున్న వెన్నెల కాంతి మధ్య, కడుపులో దహించుకుపోయే ఆకలి మధ్య, చితిమంటల మధ్య ఆయన మనను మెల్లగా నడిపించుకుని తీసుకువెళతారు. 

‘ఈ నగరంలో వసంతం ఉన్నట్లుండి వస్తుంది.’అని ఆయన వారణాసి గురించి రాసిన కవిత మనం ఆ నగరంలో నడిచినట్లే అనిపిస్తుంది. ‘సంతం ఖాళీ పాత్రల్లో దిగి రావడం నీవెప్పుడైనా గమనించావా? ఈ నగరంలో దుమ్ము మెల్లగా ఎగురుతుంది, జనం మెల్లగా నడుస్తారు, గుడిగంటలు మెల్లగా మోగుతాయి. పొద్దు వాలుతుంది మెల్లగా.. ఇదొక సామూహిక లయ. ఈ నగరంలో ఉదయమో, సాయంత్రమో ప్రవేశించు ప్రకటించకుండా.. హారతి వెలుగుల్లో అద్భుత నగరాన్ని చూడు. అది సగం నీళ్లల్లో, సగం మంత్రాల్లో, సగం పూలల్లో, సగం శవంలో, సగం నిద్రలో, సగం శ ంఖంలో.. జాగ్రత్తగా చూడు.. సగమే కనబడుతుంది. మిగతా సగం ఉండదు. కనపడిన సగానికే ఊతం అవసరం. మిగతా సగానికి అండ బూడిద, కాంతి, అగ్ని, నీరు, పొగ, పరిమళం, ఎత్తిన మాన హస్తాల స్తంభాలు..’ అంటారు కేదార్ నాథ్. 

‘నేను ఆమె చేయిని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ప్రపంచం ఆమె చేయిలా వెచ్చగా, అందంగా ఉండాల్సిందేననుకున్నా.’ అన్న ఒక చిన్న కవిత్వంలో ఒక ఆహ్లాదకరమైన అనుభవాన్ని వర్ణించగల కేదార్ ‘అక్షరాలు చలితో మరణించవు.. అవి ధైర్యం లేక మరణిస్తాయి.. ఉక్కబోసే వాతావరణంలోనే అక్షరాలు తరుచూ నశిస్తాయి… అని రాయగలరు. ‘నెత్తుటితో తడిసిన చిన్నారి అక్షరం తనను ఇంటికి తీసుకువెళతానని పిలుస్తోంది..’ అని రాస్తారాయన. 

‘ఖాళీ కాగితంపై ఉదయమూ ఉండదు, అస్తమయమూ ఉండదు.. అక్షరాలు మనకెప్పుడూ ఖాళీ కాగితాన్ని వదిలిపెడతాయి..’ అనే కేదార్ నాథ్ అక్షరాలతో అలవోకగా ఆడుకోగలరు. ‘సూ ర్యకాంతి, ఆకుల సంభాషణ మధ్య ఒక కవితా వాక్యం అణిచివేతకు గురైంది.. ఈ రోజుల్లో వీధుల్లో ఎవరూ మరొకరి సమకాలీనులు కాలేరు..’ అని ఆయన తప్ప ఎవరనగలరు? 

కవిత్వం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు కేదార్ నాథ్ చాలా సులభంగా సమాధానం చెబుతారు. ‘కవిత్వం అంటే ఏమిటి? ఒక చేయి మరో చేయిని అందుకోవడం. ఒక ఆత్మ దేహంవైపు మొగ్గడం. కళ్లు మృత్యు దిశగా చూడడం, కవిత్వం అంటే ఏమిటి? అదొక దాడి. దాడి తర్వాత నెత్తుటితో తడిసిన పాదరక్షలు తమను ధరించేందుకు పాదాలకోసం అన్వేషించడం. ఒక వీరుడి మౌనం.. ఒక విదూషకుడి ఆర్తనాదం..’

290025541_640
ఈ కవిత్వం చూడండి.. ‘కేదార్ నాథ్ సింగ్, నీకు నూర్ మియా గుర్తుండా? గోధుమ ముఖం నూర్ మియా, చిన్న నూర్ మియా.. రామ్‌ఘర్ బజార్ నుంచి సుర్మా అమ్మినవాడు..చివరగా తిరిగొచ్చిన వాడు,ఆ నూర్‌మియా గురించి ఏమైనా గుర్తుందా కేదార్ నాథ్‌సింగ్..ఆ స్కూలు గుర్తుందా..చింత చెట్టు, ఇమాంబరా,19వ ఎక్కంవరకూ మొదట్నుంచీ చెప్పగలవా,నీ మరిచిపోయిన పలకపై కూడికలు, లెక్కలు 
చేయగలవా..ఒకరోజు ఉన్నట్లుండి నూర్‌మియా మీ గల్లీని వదిలి వెళ్లిపోయాడో చెప్పగలవా, అతడెక్కడున్నాడు? ఢాకాలోనా, ముల్తాన్ లోనా.. పాకిస్తాన్‌లో ప్రతి ఏడాది ఎన్ని ఆకులు రాలుతాయో చెప్పగలవా..ఎందుకు మౌనంగా ఉన్నావ్?కేదార్ నాథ్ సింగ్, నీకు లెక్కలతో సమస్యేమైనా ఉందా చెప్పు? ‘ – ఈ కవిత శీర్షిక ‘1947ను గుర్తు చేసుకుంటూ..’

మరో కవిత- ‘హిమాలయం  ఎక్కడుంది? స్కూలు బయట గాలిపటం ఎగురవేస్తున్న ఆ బాలుడిని అడిగా. అదిగో.. అదిగో అక్కడుంది.. అని వాడు ఆ గాలిపటం ఎగురుతున్న వైపు చూపించాడు. ఒప్పుకున్నా. నాకు మొదటి సారి తెలిసింది. .హిమాలయం ఎక్కడుందో.. ‘


నల్ల నేల. అన్న కవితలో ఆయన నల్లదనం ఈ యుగం దృశ్యం అయిందని వాపోతారు. ‘నల్ల న్యాయం, నల్ల చర్చలు.. నల్ల అక్షరాలు. నల్ల రాత్రి.. నల్ల జనం.. నల్ల ఆగ్రహం..’అని రాస్తారు. 

కేదార్‌నాథ్ గురించి, ఆయన అక్షరాల గురించీ. ఆయన సాహిత్య విమర్శ గురించీ చెప్పాలంటే సుదీర్ఘం అవుతుంది. ‘మేరే సమయ్, మేరే శబ్ద్’ అన్న వ్యాస సంకలనంలో ఎజ్రాపౌండ్, రిల్కే, రెనె చార్ లాంటి కవుల గురించే కాక, భారతీయ కవులు, కవితోద్యమాల గురించి రాశారు. ఆయన ప్రజాస్వామిక ఆకాంక్షలను, సృజనాత్మకతను అర్థం చేసుకోవాలంటే ‘ఖబరిస్తాన్ మే పంచాయత్’అన్న సంకలనాన్ని చదవాల్సిందే. 

కేదార్‌నాథ్ ఎక్కడా వాస్తవిక రేఖల్ని దాటిపోలేదు. ‘ముక్తీకా జబ్ కోయా రాస్తా నహీ మిలా.. మై లిఖ్‌నా చాహుతాహు.. యహ్ జాన్‌తా హు కీ లిఖ్‌నే సే కుచ్ నహీ హోతా. మై లిఖ్‌నా చాహ్‌తా హూ.. (ముక్తి మార్గం ఎక్కడా దొరకకపోతే నేను రాయాలనుకుంటాను… రాయడం వల్ల ఏదీ జరగదని తెలిసి కూడా నేను రాయాలనుకుంటాను)..’ అని ఆయన ఒక కవితలో రాశారు. 

అవును. రాయడం వల్ల ఏదీ జరగదని తెలిసినా రాస్తూనే ఉండాలి. ఏదైనా జరిగేంతవరకూ రాయాలి.. జ్ఞానపీఠ్ అవార్డు నాకు కేదార్‌నాథ్, శివారెడ్డి లాంటి అక్షరాల్నే జీవితంగా మార్చుకున్న వారిని గుర్తుకు తెచ్చింది. క్రాస్ రోడ్ వద్ద మల్లెపూలు అమ్మిన తమిళ బాలిక నాకు జీవిత పరిమళాన్ని ఆఘ్రాణింపచేసింది. ఏది జరిగినా, ఏది జరగ కపోయినా శవం మాత్రం కాకూడదు. ఇదే తాజాగా నేను నేర్చుకున్న గుణపాఠం. 


కృష్ణుడు

మీడియా మాటున భేడియాలు

sangisetti- bharath bhushan photo
    తెలంగాణ ప్రజాప్రతినిధుల, వాళ్లను ఎన్నుకున్న ప్రజల గుండెల్ని కోసి కారంబెట్టి ఇప్పుడు ఉఫ్‌ ఉఫ్‌ అంటూ మంటల్ని సల్లార్పెతందుకు పక్షపాత మీడియా ‘సారీ’ చెబుతోంది. (ఉఫ్‌ ఉఫ్‌ అని ఊదుకుంటనే మంటను ఎక్కువ జేస్తుండ్రనే ప్రచారం కూడా ఉంది) హేయమైన తమ చర్యలను సమర్ధించుకోవడం కోసం వందిమాగధులైన జర్నలిస్టు, రాజకీయ నాయకుల మద్ధతు తీసుకుంటుండ్రు. ఫాసిస్టు చర్య, అప్రజాస్వామికం అంటూ తప్పుంటే చట్టప్రకారం చర్య తీసుకోండి అని నీతులు చెబుతున్నారు.

అయితే వాళ్లు తమ అప్రజస్వామికతను, వివక్షను, దురహంకారపు దాడిని తమ  అవసరానుగుణంగా మరిచి పోతున్నరు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే ప్రసారాలను ఆపేస్తారా? ‘ప్రజాస్వామ్య తెలంగాణ ఇదేనా?’ అంటూ ‘అక్షరాన్ని ఆయుధం’గా మార్చి కేసీఆర్‌పైకి, నవజాత శిశువు తెలంగాణపై సంధించిండ్రు. ‘మెరుగైన సమాజం’ నిర్మించే వాళ్లు ఇప్పుడు తమ తెలంగాణ ఉద్యోగుల్ని రాయబేరాలకు పంపుతున్నరు. మీడియా మాటున భేడియాలుగా (తోడేళ్ళు) ప్రవర్తిస్తుండ్రు. మీడియా ముసుగేసుకొని ఏం చేసినా, ఎట్ల చేసిన చెల్లుతుంది అనుకునే వారికి ఎమ్మెస్‌వోలు షాక్‌ ఇచ్చిండ్రు. నిజానికి ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కూడా!
టీవి9, ఎబిఎన్‌ల ప్రసారాలు ఆపింది ఎమ్మెస్‌వోలు. కానీ ‘కొత్తపలుకు’ ఆయన మాత్రం ఎమ్మెస్‌వోలకు ఆదేశం ఇచ్చిందెవరు? ఎవరి వ్యక్తిగత విద్వేషం ఇందుకు దారి తీసింది? ఆంధ్రజ్యోతి సంస్థలపై విషం చిమ్మిన కేసీఆర్‌! అని చులుకన పలుకులు చెబుతుండు. బట్టగాల్శి మీదేసుడంటే గిదే! వ్యక్తిత్వ హననం అంటే ఇదే! రైతుల రుణమాఫీపై గందరగోళాన్ని సృష్టించి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పడమే గాకుండా ‘ఏపీ నుంచా ఏసెయ్‌ పన్ను’ అని హెడ్డింగ్‌లు పెడ్తిరి. ‘మా అక్షరం మీ ఆయుధం’ అంటివి. కానీ ఈ ఆయుధాలన్నీ తెలంగాణ బిడ్డలపైనే ఎందుకు  ప్రయోగించబడుతున్నవో అర్థంగాదు. గాలి వార్తలు అచ్చేసి గాయి గాయి చేస్తూ ఇది అసమర్ధ ప్రభుత్వం అని ముద్రవేయాలని ప్రయత్నించిండ్రు.

ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని గగ్గోలు పెట్టే ఈ మీడియా నిండు అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏంజేసుకుంటరో చేస్కోండి అన్నప్పుడు అది అప్రజాస్వామికమని అనిపించలేదు. పత్రిక పేరే ‘‘ఆంధ్ర’జ్యోతి’. తెలంగాణకు చీకటి, ఆంధ్రకు వెలుగులు పంచే ఈ పత్రిక ‘మీడియా స్వేచ్ఛ’ పేరిట తాము ఏది చెప్పినా, రాసినా ఇన్నేండ్ల మాదిరిగానే ‘తెలంగాణ రాష్ట్రం’లో కూడా చెల్లాలని మొండిగా వాదిస్తోంది. తమ ఆధిపత్యాన్ని తెలంగాణలో అప్రతిహతంగా కొనసాగించడమే గాకుండా తమ సామాజిక వర్గం వారి నేతృత్వంలో సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వాన్ని హీరోగా నిలబెట్టడం దీని ఉద్దేశ్యం. తెలంగాణతో పోల్చి ‘ఆంధ్ర ప్రభుత్వమే బేషుగ్గా పనిచేస్తోంది’ అనే ఒక అభిప్రాయాన్ని కూడగట్టడానికి ‘స్టోరీ’లు రాసింది. దీంతో పత్రిక ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరిని అప్రతిష్టపాల్జేసేందుకు పనిజేస్తుందో తెలంగాణ ప్రజలు తెలుసుకున్నరు. అందుకే ‘వి రిపోర్ట్‌ యూ డిసైడ్‌’ అని మీరు చెప్పినట్లుగానే నిర్ణయం తీసుకుండ్రు. ఇప్పుడు ఎమ్మెస్‌వోలకు ప్రజలు బాసటగా నిలిచిండ్రు. ఒక సామాజిక వర్గం ఆధిపత్యాన్ని కూలగొట్టేందుకు సిద్ధమయ్యిండ్రు.
‘కులం అడ్డు గోడలు కూలగొట్టండి’ అని బాకాలూదే ఈ మీడియాకూ కులముంది. ప్రాంతము కూడా ఉంది. వీటన్నింటికి అతీతంగా, నిష్పక్షపాతంగా భిన్న ప్రజాభిప్రాయాల వేదికగా నిలువాల్సిన మీడియా ఇవ్వాళ ‘కమ్మోళ్ల’ ప్రయోజనాలు కాపాడే, పెంపొందించే వాహికగా మారింది. డెల్టాంధ్ర పెట్టుబడిదారుల కొమ్ముగాసే తాబేదారుగా రూపాంతరం చెందింది. అలా కానట్లయితే ‘నేను తెలంగాణలో పుట్టిన’ ‘నన్ను ఆంధ్రోడు’ అని అంటుండ్రు అంటూ వాపోయే వేమూరి రాధాకృష్ణ ఇక్కడి ప్రజల పక్షాన ఎన్నడైనా నిలబడ్డారా? ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలె. నల్లగొండ ఫ్లోరైడ్‌ బాధితులకోసం వీళ్లు ఏ నిధులు సేకరించలేదు. కనీసం తాను పుట్టాను అని చెప్పుకుంటున్న నిజామాబాద్‌ నుంచి గల్ఫ్‌కు వలసెల్లిన వారి కోసంగానీ, అక్కడి బీడీ కార్మికుల కోసం గానీ ఏ నిధిని, ట్రస్ట్‌ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బిడ్డల కుటుంబాలను ఆదుకుందామనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. ఇదీ ఆయన ప్రాంతీయ నిబద్ధత. అయితే ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని కోసం నిధులు సేకరించడానికి నడుం కట్టాడు. లైవ్‌షోలు పెట్టిండు. దీని వెనుక పూర్తిగా కులం, ప్రాంతము తప్ప మరేమి లేదు. రాజధాని అనే కన్నా దీన్ని ‘క్యాపిటల్‌’ అనడమే సబబు. కేవలం పెట్టుబడిదారులకు అండగా నిలబడేందుకే ఈ ‘రాజధాని విరాళాలు’. రాజధాని కృష్ణా`గుంటూరు మధ్యలో గాకుండా రెడ్ల ప్రాబల్యం ఉండే ప్రకాశం జిల్లాలో వస్తదంటే ఈ విరాళాల ప్రచారం చేపట్టేవారే కాదు. ఈ ‘క్యాపిటల్‌’ పెట్టుబడిదారులు అంతా కమ్మ సామాజిక వర్గం వారే కావడం యాధృచ్ఛికం గాదు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో కలిపి, ఎంత లిబరల్‌గా లెక్కేసినా ‘కమ్మోళ్ల’ జనాభా ఐదు శాతం మించదు. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వీరి జనాభా దాదాపు 20శాతం ఉంటది. అంతేగాదు ఆ రెండు జిల్లాల్లోని సాగునీటి వసతి ఉన్న సారవంతమైన వ్యవసాయ భూముల్లో 80శాతం ‘కమ్మోళ్ల’ చేతుల్లోనే ఉన్నయి. వీరి ప్రయోజనం కోసమే ‘క్యాపిటల్‌’ నిర్మాణానికి ఈయన ముగ్గు పోస్తుండు. ఇంకా చెప్పాలంటే వీరికి రాయలసీమ, ఉత్తరాంధ్ర రెండూ పరాయి ప్రాంతాలే!
మీడియాకు ముఖ్యంగా తెలుగు మీడియాకు కులముంది. మీడియాలో దృశ్యం, శ్రవణం, అక్షరం మూడూ వస్తాయి. సినిమాల్లో 95శాతం కమ్మసామాజిక వర్గమే రాజ్యమేలుతోంది. నిర్మాణం గానీ, థియేటర్లు గానీ, హీరోలు, డైరెక్టర్లు అంతా వాళ్లే. ఇక తెలుగులో దాదాపు ఒక వంద ఛానళ్ళు పనిజేస్తే అందులో 90 ఛానళ్ళ యాజమాన్యం కమ్మసామాజిక వర్గం వారిదే! న్యూస్‌ ఛానళ్లలో ఇదే పరిస్థితి. ఎఫ్‌ఎం రేడియోల పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. పత్రికలు కూడా దాదాపు అన్నీ వారివే! అందుకే వారు ఆడిరది ఆటగా పాడిరది పాటగా ఇన్నాళ్లు చలామణి అయింది. అహంకారానికి, అధికారం తోడు కావడంతో కనీస మీడియా విలువలు కూడా పాటించకుండా తమకు ఎదురులేదని విర్రవీగిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో దానికి గండి పడిరది. తెలంగాణపై వీరి దాడి ఇవ్వాళ కొత్తగా షురువయ్యింది కాదు. ఎనుకటి నుంచి ఇదే తంతు. ఇక్కడ కొంత చరిత్ర చెప్పుకోవాలె!
తెలంగాణలో మొట్టమొదటి ప్రాంతేతర పత్రిక ‘తెలుగుదేశం’. హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం 1949లో సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి (1914-2010) ఈ పత్రికను ప్రారంభించారు. బాపట్లకు చెందిన ఈమె ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికయింది. కమ్మసామాజిక వర్గం వారు తెలంగాణ పత్రికారంగంలో అలా అడుగు పెట్టిండ్రు. ఆ తరువాత రాజ్యలక్ష్మితో కలిసి వల్లూరి బసవరాజు తదితరులు ఆంధ్రజనత దిన పత్రికను 1955 ఆ ప్రాంతంలో ప్రారంభించారు. దీంతో ఆంధ్రప్రాంతం నుంచి జర్నలిస్టుల రాక ముమ్మరమైంది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అనంతరం ఆ ప్రభుత్వం పక్షపాత, కక్షపూరిత వైఖరి మూలంగా ‘గోలకొండ’ పత్రిక 1966లో మూతపడిరది. నలభై యేండ్లు తెలంగాణ సమాజానికి ఎనలేని సేవ చేసిన గోలకొండ పత్రికకు అడ్వర్టయిజ్‌మెంట్లు ఇవ్వడంలోనూ, న్యూస్‌ప్రింట్‌ కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. అలాగే 1938లో స్థాపించబడ్డ ‘దక్కన్‌ క్రానికల్‌’ పత్రికను 1976లో ‘తిక్కవరపు’ కుటుంబం కొనుగోలు చేసింది.

ఈ కుటుంబం వారు దాదాపు అదే కాలంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కాంట్రాక్టర్లుగా వుండ్రిండ్రు. దక్కన్‌ క్రానికల్‌ని తిక్కవరపు చంద్రశేఖరరెడ్డి కొనుగోలు చేసిన సమయంలోనే ఈనాడు పత్రికను రామోజీరావు విశాఖపట్నంలో ప్రారంభించారు. అది తర్వాతి కాలంలో హైదరాబాద్‌ ఎడిషన్‌ కూడా ప్రారంభించింది. అయితే కొద్ది కాలంలోనే యాజమాన్యం వైఖరికి నిరసనగా తెలంగాణ జర్నలిస్టులు పాశం యాదగిరి, రత్నమాల లాంటి వారు ఉద్యమాన్ని లేవదీసిండ్రు. ఉద్వాసనకు గురయ్యిండ్రు. తెలుగుదేశం పార్టీ అవతరణ సమయంలో ‘ఈనాడు’ దాని కరపత్రంగా పనిచేసింది. ఇదే సమయంలో దాసరి నారాయణరావు తెచ్చిన ‘ఉదయం’ పత్రిక మొదట్లో కొత్త వెలుగులు ప్రసరించినా అది కూడా నెల్లూరు రెడ్ల వశమయ్యింది. సినిమా ఇండస్ట్రీ చెన్నయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తే, అప్పటి వరకు విజయవాడ నుంచి ప్రచురితమైన పత్రికలు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి తమ కేంద్రాన్ని హైదరాబాద్‌కు మార్చుకుంది. ఈ రెండు మాధ్యమాలు తెలుగుదేశం పార్టీ అండతో తెలంగాణపై విషం గక్కాయి.

కారంచేడు లాంటి సంఘటనలను నిజాయితిగా, నిష్పక్షపాతంగా రిపోర్టు చేసే ధైర్యాన్ని కూడా ఈ పత్రికలు ప్రదర్శించలేక పోయాయి. అంతేగాదు వీటి ఎత్తుగడలకు, కుచ్చితాలకు 85యేండ్లు నిరంతరాయంగా నడిచిన ‘ఆంధ్రపత్రిక’ కూడా మూత పడిరది. తెలంగాణకు చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ ‘సత్య’ న్యూస్‌ ఛానల్‌ పెట్టడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆదిలోనే చిదిమేసిండ్రు. అలాగే నూకారపు సూర్యప్రకాశరావు ‘సూర్య’ పత్రిక తెచ్చే సమయంలో ఆయనపై ఈ మీడియా ఎంత దాడి చేసిందో కూడా అందరికి తెలుసు. తాము చేస్తే ప్రజాసేవ, వేరేవాళ్లు అదే పని చేస్తే ద్రోహం అన్న విధంగా ప్రచారం చేసిండ్రు. తప్పు ఎవరు చేసినా తప్పే అనే సోయి మాత్రం వీరికి లేదు. ఏమి చేసినా ఎట్లా చేసినా తమ సామాజిక వర్గమే చేయాలనే నిశ్చితాభిప్రాయంతో ఉన్న ఈ మీడియా వర్గం తమ స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారు. అలా దిగజారుడుకు పరాకాష్ఠ ‘మడిశి పెట్టుకోవడం’, ‘తొక్కు పచ్చడి’ ‘తాగుబోతోళ్లు, ‘శిలుం మొకం’ మాటలు.
తమని తీరొక్క తీరుగా తిట్టినా మళ్ళీ అదే మీడియాకు ప్రజాస్వామ్యం ముసుగేసి కొంతమంది బానిసలు బాసటగా నిలుస్తుండ్రు. మీడియా స్వేచ్ఛ ముసుగులో వాళ్లు ఎన్ని యవ్వారాలు చేసినా అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ‘మాకరీ’  చేస్తూ అంగట్ల సరుకులాగా అమ్మాలని చూస్తున్నా వీళ్ళు ఇంకా నిజం తెలుసుకోలేక పోతుండ్రు. బహుశా తెలిసినా తమ బానిస భావజాలాన్ని వదిలించుకోలేక పోతుండ్రు కావొచ్చు. గతంలో ఆంధ్రజ్యోతి అహంభావానికి వ్యతిరేకంగా పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే గాకుండా ధర్నాకు దిగిన వారు సైతం ఇవ్వాళ తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎమ్మెస్‌వోలను దుమ్మెత్తి పోస్తుండ్రు. ఊసరవెల్లుల మాదిరిగా రంగులు మార్చే రాజకీయ నాయకులు ఈ పనిచేస్తే అది సహజమే అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ జర్నలిస్టు సంఘాల నాయకులు సైతం అప్రజాస్వామికం, ఫాసిస్టు చర్య అంటూ గొంతులు చించుకుంటుండ్రు. మీడియా విలువల వలువలూడదీసే వారికి వీరు జేజేలు పలుకుతుండ్రు.
ఈ గొంతులు చించుకునే వాళ్లు ఒక్క విషయం అర్థం చేసుకోవాలె! వాళ్లకు తెలంగాణ అనేది ఒక అంగడి సరుకు కావచ్చు. కాని నాలుగు కోట్ల మంది ప్రజలకు అది ఒక ఆత్మగౌరవ నినాదం. స్వయంపాలన ఆకాంక్ష. తెలంగాణ చరిత్రను, సంస్క ృతిని, వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని పజీత పజీత చేస్తూ ఇజ్జత్‌ పుచ్చుకుంటుంటే ఇదేమని ఈ పదిహేనేండ్లల్ల ఎన్నడూ ఏ జర్నలిస్టు నాయకుడూ తప్పుపట్టలేదు. అంతెందుకు మొన్నటి సంఘటనను కూడా వాళ్లు బహిరంగంగా ఖండిరచలేదు. ‘టీ న్యూస్‌’ ఛానల్‌ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రసారం కాదు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేగాదు మిగతా తెలంగాణ యాజమాన్య ఛానళ్ళని ఆంధ్రలో ఎన్నడో బ్యాన్‌ చేసిండ్రు. అయినా ఈ విషయాల గురించి జర్నలిస్టు సంఘాల నాయకులు ఎన్నడూ స్పందించలేదు. నమస్తే తెలంగాణ ప్రతుల్ని విజయవాడ నడిబొడ్డున తగలబెడ్తుంటే ‘కోనాయి’ అన్నోడు లేడు. చంద్రబాబు ఒంటికంటి సిద్ధాంతానికి వీరి వైఖరికి పెద్దగా తేడా లేదు. మీడియా స్వేచ్ఛ ముసుగులో రెండు రాష్ట్రాల్లో తామే నాయకులుగా చలామణి కావాలనే యావ తప్ప వీరికి తెలంగాణ ఆత్మగౌరవం ప్రధానం కాదు.
ఇప్పటికే ఈటీవి`2, ఈటీవి తెలుగులో 49 శాతం వాటాను, మిగతా ఈటీవి చానళ్ళనన్నింటిని 2600ల కోట్లకు కొనుగోలు చేసిన రిలయన్స్‌ సంస్థ ఇప్పుడు సిఎన్‌ఎన్‌`ఐబిఎన్‌తో సహా అనేక ఛానళ్ళను సొంతం జేసుకుంది. పెట్టుబడిదారుల కింద పనిచేయడానికి నిరాకరించి రాజ్‌దీప్‌ సర్దేశాయి, ఆయన భార్య సాగరికా ఘోష్‌ సంస్థ నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఎంత చెడ్డా ఉత్తరాదిలో మీడియా విలువలను కొంతమేరకైనా పాటిస్తుంటే మన తెలుగువాళ్లు జర్నలిస్టు నాయకులతో సహా అందరూ యాజమాన్యాలకు గులామ్‌లుగా మారి ‘మీడియా స్వేచ్ఛ’ ముసుగులో తెలంగాణ తల్లి బొండిగె పిసికేందుకు సిద్ధమయిండ్రు.
మీడియా స్వేచ్ఛపట్ల వారికొక్కరికే పట్టింపు ఉన్నట్లుగా జర్నలిస్టులు, ఔట్‌డేటేడ్‌ రాజకీయ నాయకులు స్వీయ ప్రచారం కోసం ప్రకటనలు ఇస్తుండ్రు. ప్రజాస్వామ్యంలో ‘ఫోర్త్‌ ఎస్టేట్‌’కు గౌరవం, స్వేచ్ఛ రెండూ దక్కాల్సిందే! అయితే తప్పు చేసిన వారికి శిక్ష లేనట్లయితే తామే రాజ్యాంగ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. చట్టం తమ సుట్టంగా సూస్తరు. ఇప్పటికీ మించి పోయింది లేదు. ఇప్పుడు జర్నలిస్టు సంఘాల నాయకులు రోడ్డు మీదికొచ్చి నెత్తినోరు కొట్టుకోకుండా అటు ఎమ్మెస్‌వోలను, ఇటు ఛానళ్ళ యాజమాన్యాలను కూర్చుండబెట్టి ‘అంబుడ్స్‌మన్‌’ని మధ్యవర్తిగా పెట్టుకొని సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.

భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అనే భరోసాను ఎమ్మెస్‌వోలకు తద్వారా తెలంగాణ ప్రజలకు కల్పించినట్లయితే సమస్య ముమ్మాటికీ పరిష్కారమయ్యే అవకాశముంది. ఇందుకు తప్పుచేసిన వాళ్లు బేషరతుగా ముందుగా క్షమాపణ చెబుతూ, అవి పునరావృతం కావు అని లిఖిత పూర్వకంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి. పంతాలకు, పట్టింపులకు పోయి కేంద్రం నుంచి వత్తిడి తెప్పిద్దాం అనుకుంటే ఏకు మేకై అసలుకే ఎసరొచ్చే ప్రమాదముందని గుర్తించాలి.

                                  -సంగిశెట్టి శ్రీనివాస్‌

కలలూ కన్నీళ్ళూ కలిసే కూడలిలో..!

myspace

నా అమెరికా ప్రయాణాలు – 1

 

ప్రయాణాల అవసరం గురించి బహుశా రాహుల్ సాంకృత్యాయన్ అంత గొప్పగా ఎవరూ చెప్పివుండరు. “యువకుల్లారా, తిరగండి. ప్రపంచాన్ని చూడండి. మీ తల్లుల తిట్లూ, శాపనార్ధాలూ నాకు తగిలితే తగాలనివ్వండి, కానీ మీరు తిరగండి,” అని అన్నాడు. ప్రపంచ భాషల మూలాల్ని అర్ధం చేసుకున్నవాడు, కాసేపు అవతలి వాళ్ళు మాట్లాడింది విని వాళ్ళతో ఆ భాషలో మాట్లాడగలిగిన మేధావి.

ఉద్యోగంలో భాగంగా చాలసార్లు విదేశాలు తిరిగినా ఎప్పుడూ ట్రావెలాగ్ రాయలేదు. రాయాలనిపించలేదు కూడ. తిరగడం, చూడడం, ఆస్వాదించడం మనసుకు సంబంధించినవి అనుకుని కావచ్చు. లేకపోతే, ఎప్పుడో ఒకసారి చూసి ఓ దేశం గురించి, ప్రాంతం గురించి అక్కడి ప్రజల గురించి ఏం రాస్తాంలే అని కావచ్చు. అందుకే, ఏడేళ్లుగా తిరుగుతున్నా ఒక్కసారి కూడా ట్రావెలాగ్ రాయలేదు, ఆఫీసు అవసరాల మేరకు రాసిన ఒకటో రెండో ఫీచర్స్ తప్ప.

ఈ నెలలో ఆఫీసు పని మీద సియాటిల్ వెళ్ళేను. ఇది అమెరికా పశ్చిమ తీరంలో కెనడాకి దిగువున వున్న వాషింగ్టన్ రాష్ట్రంలో (అమెరికా రాజధాని వాషింగ్టన్ కాదు) వుంది. నా పని రెడ్ మండ్ లో. ఇది సియాటిల్ కి ఓ గంట దూరంలో వుంటుంది. బస బెల్ వ్యూ లో. సియాటిల్ కి, రెడ్ మండ్ కి మధ్యలో వుంటుంది. చక్కటి వాతావరణం వుంటుంది. ఎన్నడూ విపరీత వాతావరణం వుండదని టాక్సీ డ్రైవర్ చెప్పేడు. చెట్లమీద ఆకులు ఎంత ఆరోగ్యంగా వున్నాయంటే చిదిమితే నీళ్ళో, నూనో కారుతుందేమో అన్నంత! అయితే వానలు, లేకపోతే ఆహ్లాదకరమైన వాతావరణమని అక్కడి మిత్రుడొకరు అన్నారు.

అమెరికాలోని తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య ప్రాంతాల్లోని ఓ పది పెద్ద పట్టణాలు, మధ్య రాష్ట్రాల్లోని వ్యవసాయ ప్రాంతాలు చూశాను ఆరేళ్ళలో.

ఆర్ధికంగా, సాంకేతికంగా మనకన్నా కనీసం ఓ వందేళ్ల ముందున్న దేశం కాబట్టి సహజంగానే అన్ని చోట్లా మనకు భారీతనం, రిచ్ నెస్ కనిపిస్తుంది. ఓ పావు కిలోమీటర్ పొడవున్న, పూర్తి ఎయిర్-కండిషన్ చేసిన షాపింగ్ మాల్స్, విశాలమైన నీట్ గా వున్న రోడ్లు, పాదచారులు ఆపరేట్ చేసుకోగల ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు దాటే వాళ్ళకోసం తప్పని సరిగా ఆగే వాహనాలు, వినపడని కారు హార్న్స్ – ఒకటేమిటి మనకి కల్చరల్ షాక్ అనదగ్గ ఎన్నో విషయాలు మనకి చాలా కనిపిస్తాయి.

చరిత్ర సృష్టించిన సిటీ లైట్స్ పుస్తకాల షాపు

చరిత్ర సృష్టించిన సిటీ లైట్స్ పుస్తకాల షాపు

టూరిస్టుగా వెళ్ళినవాళ్ళకి, చుట్టపు చూపుగా వెళ్ళేవాళ్ళకి ఎలా కనిపిస్తుందో తెలీదుగాని, అమెరికా అంటే పుట్టు-వ్యతిరేకికి, ఓ జర్నలిస్టుకి ఎలా కనిపిస్తుంది అమెరికా అనే ఓ enigma? ఒకసారికి తెలీక పోవచ్చుగాని, నాలుగుసార్లో, పది సార్లో చూస్తే ఖచ్చితంగా మనకి ఓ pattern కనిపిస్తుంది. ప్రపంచంలోని సమస్త వనరుల్ని – మానవ వనరుల్ని – ఏ మొహమాటమూ లేకుండా వాడుకుంటున్న ఓ బ్రహ్మాండమైన యంత్రంలా కనిపిస్తుంది. డాలర్లు ఖర్చు పెట్టగలవారిని అక్కున చేర్చుకుని, మిగతా వాళ్ళని చెత్తడబ్బాల్లో చేతులు పెట్టి వెతుక్కునే వాళ్ళుగా వదిలేసే ఒక ruthless వ్యవస్థలా అనిపిస్తుంది. జుగుప్సాకరమైన, విచ్చలవిడి సంస్కృతి లాస్ వెగాస్ లాటి నగర వీధుల్లో ఊరేగుతుంది.

తాగే గ్లాసుల దగ్గరనుంచి, వాహనాల నుంచి, రోడ్లనుంచి, పెద్ద పెద్ద భవనాల వరకూ – ప్రతీ దాంట్లో మేమే మేటి అన్న ఒక అమెరికన్ దర్పం, అహం కనిపిస్తుంది. ప్రపంచానికి ఇంధన ఆదా గురించి, పర్యావరణ రక్షణగురించి ఉద్బోధ చేసే అమెరికా చేసే వనరుల దుర్వినియోగం బహుశా మిగతా ప్రపంచం మొత్తం కూడా చెయ్యదేమో. బాత్ రూముల్లో, వాష్ బేసిన్లదగ్గర దగ్గర, భోజనం టేబుళ్ల దగ్గర వాడే పేపర్ వల్ల రోజుకి ఎన్ని వేల ఎకరాల్లో చెట్లు కూలుతున్నాయో తెలీదు. భోజనాలదగ్గర చేసే దూబరాలకైతే లెక్కే లేదు.

నిన్ను ప్రతిక్షణం కనిపెట్టుకునే కన్ను ఒకటి వుంటుంది. నీకది ప్రత్యక్షంగా కనిపించకపోయినా దాని నీడ నీకు ఏళ్ల వేళలా తాకుతూ వుంటుంది. ఏదో ఓ కెమెరా, లేదా కెమెరాలు నిన్ను చూస్తుంటాయి. నువ్వెళ్లిన ప్రతీ చోటూ నువ్వో ఎలక్ట్రానిక్ పాదముద్రని వదిలేస్తుంటావు. లేదా, వదిలే వెళ్ళేలా చేస్తారు. జాక్ లండన్ వర్ణించిన వీధులు కదా అని ఓ సారి శాన్ ఫ్రాన్సిస్కో లోని మార్కెట్ స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళ్తూ వుంటే I was stalked. మనకి చాలా భయం వేస్తుంది కూడ. Vulgar richness ఓ వైపు, దుర్భరమైన పేదరికం ఓ వైపు. మనకి స్పష్టంగా కనిపిస్తూనే వుంటుంది వాళ్ళ కళ్లలోని contempt. మైకుల్లాంటి గొంతులతో ఏదో తిడుతూవుంటారు, పాడుతూ వుంటారు. పాత పైంట్ డబ్బాలపై దరువులు వేస్తూ గెంతుతూ అడుక్కుంటూ వుంటారు.

పిల్లలతో పాటు వలసొచ్చిన షూలు (ఎల్లిస్ ఐలాండ్)

పిల్లలతో పాటు వలసొచ్చిన షూలు (ఎల్లిస్ ఐలాండ్)

వెయ్యి ఎకరాలున్న రైతు అక్కడ పేద రైతుకింద లెక్క. ఆరుగాలం కుటుంబం మొత్తం (ఆ ఒక్క కుటుంబమే వెయ్యి ఎకరాల్నీసాగుచేస్తుంది) పనిచేస్తే ఎకరాకి గిట్టుబాటయ్యేది కేవలం వంద డాలర్లు మాత్రమే. ఇక్కడి లాగే అక్కడ కూడా చిన్న రైతుల్ని కబళించడానికి బహుళజాతి కంపెనీల, బడా వ్యవసాయదార్లు కాపు కాచుకు కూచున్నారని ఓ రైతు నాతో అన్నాడు. ఇక్కడి లాగే అక్కడ కూడా కొత్త తరం వాళ్ళు వ్యవసాయం చెయ్యడానికి సిద్ధంగా లేరు. ఇక్కడి లాగే, అక్కడ కూడా, చిన్న రైతులు అంతరించిపోతున్న జాతి

పౌరసత్వం కోసం ఏటా ఈ సాంస్కృతిక ఆందోళనలు...

పౌరసత్వం కోసం ఏటా ఈ సాంస్కృతిక ఆందోళనలు…

.

పైకి చూస్తే అంతా సవ్యంగా వున్నట్టే వుంటుంది. కానీ ఏదో ఉక్కపోత ఊపిరి ఆడనీయదు. లేదా, నీకలా అనిపిస్తుంది. ఎక్కడా, ఒక్క పోలీసు కూడా కనిపించడు. ట్రాఫిక్ ఎక్కువగా వున్న చోట్లలో కూడా ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. కానీ, ఏదైనా తప్పు జరిగిన మరుక్షణం ప్రత్యక్షమై పోతారు. చాలా కటువుగా వుండే నియమాల పట్ల భయంవల్లనో, నియమాలు పాటించాలన్న క్రమశిక్షణతోనో, అనాగరికులు అనుకుంటారన్న బెరుకుతోనో రోడ్డు మీద అంతా సాఫీగానే సాగిపోతుంటుంది.

అక్కడ వున్న వాళ్ళకు ఎలా వుంటుందో ఎవరినీ అడగలేదు. బహుశా, మొత్తం ప్రపంచంపైనే నిఘా పెట్టినవాడు కాబట్టి బయటినుంచి వెళ్ళిన వాళ్ళకు అలా అనిపిస్తుంది కావచ్చు.

 (ఇంకా వుంది)

  -కూర్మనాథ్

 

 

ఆమె అంతరంగం, అతని కథనం!

nadustunna katha

 మే నెల కథలు

మే నెలలో కథల సంఖ్య బాగా పెరిగింది.ఈ వ్యాసం రాస్తున్న ముగ్గురం కలిపి సుమారు 200 కథలు చదివాము. ఒక నెలలో ఇన్ని తెలుగు కథలు వస్తున్నాయా అన్న ఆశ్చర్యం, ఆనందం కథల నాణ్యత విషయంలో కలగటం లేదు. కొన్ని పత్రికలలో వార్తలు, వ్యాసాలు కథలుగా చలామణీ కాగలగడం సంపాదకుల అభిరుచిలేమిని సూచిస్తోందా లేక రచయితలలో అవగాహనాలేమిని సూచిస్తోందా అని బాధపడాల్సిన పరిస్థితి. మొత్తం మీద మొదటి వడపోతలో 26 కథలను ఎన్నుకోని, వాటి గురించి మేము ముగ్గురం కలిసి చర్చించాము. ఆ చర్చల పర్యవసానమే ఈ వ్యాసం. (మా దృష్టికి రాని మంచి కథ ఏదైనా వుంటే సూచించండి. ఈ నెల (జూన్) కథల గురించి మేము జరుపబోయే చర్చలో పాల్గొనాలనుకునేవారికి, సాదర ఆహ్వానం. ఫేస్ బుక్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి)

మే నెలలో కొన్ని చిత్రాలు జరిగాయి. కొంత మంది పురుష రచయితలు స్త్రీల సమస్యను కథాంశంగా ఎన్నుకోని కథలు రాశారు. కాండ్రేగుల శ్రీనివాసరావు “జీవన మాధుర్యం” అన్న కథలో వక్షోజాల కేన్సర్ గురించి రాస్తే, కె. వి. నరేందర్ “డబ్బుసంచీ” అన్న కథలో గర్భసంచి తొలగింపు గురించి రాశారు. “మరుగు” కథలో కూడా స్త్రీల సమస్యనే ప్రస్తావించారు వాణిశ్రీ. అలాగే డా. వి. ఆర్. రాసాని “తృతీయ వర్గం” గురించి కూడా రాయడం గమనింఛవచ్చు.

గత మాసం (ఏప్రిల్ 2014) ప్రముఖ రచయితలు పాత్రలుగా రెండు కథలు వచ్చిన సంగతి ప్రస్తావించాము. ఈ నెల కూడా అలాంటి కథ ఒకటి వచ్చింది. భగవంతం రాసిన “గోధుమరంగు ఆట” కథలో త్రిపుర ఒక కనిపించని పాత్రధారి.

ఇక ఈ నెల కథల్లోకి వెళ్దాం –

సాక్షి: శిరంశెట్టి కాంతారావు

టెక్నాలజీ పెరిగిపోతున్న కారణంగా, సాంప్రదాయక వృత్తుల వాళ్ళు పనులు కోల్పోవడం గత కొన్నేళ్లుగా జరుగుతూ వస్తోంది. అలా వృత్తిని కోల్పోయి, అప్పులు మాత్రం మిగుల్చుకున్న ఓ కాటికాపరి కథ ఇది. ఇలాంటి కథాంశాలపైన గతంలో ఎన్నో కథలు వచ్చినా ఇంతకు ముందూ ఏ రచయితా ఎన్నుకోని కులవృత్తిని ఎన్నుకోవటం వల్ల ఈ కథ కొంతవరకు ప్రత్యేకంగా మారింది. మంచి కథనం, ఇతివృత్తానికి అనుగుణమైన మాండలికం మరింత బలాన్ని ఇచ్చింది. అయితే అవసరాన్ని మించి నిడివి వున్నట్లనిపించింది.

 

మరుగు: వాణిశ్రీ

బలాత్కారం నుంచి తప్పించుకుందో అమ్మాయి. ఆ విషయం పంచాయితీకి వచ్చినప్పుడు అవతలి పక్షం రాజీ కోరారు. దెబ్బతిన్న ఆత్మగౌరవానికి వ్యక్తిగత స్థాయిలో వెల కట్టడం ఎలా? ఈ కథలో సీతారత్నం పాత్ర అలా వ్యక్తిస్థాయిలో ఆలోచించలేదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఆ కారణాల్లోకి వెళ్ళింది. వెళ్ళి, అందరికీ పనికివచ్చే పరిష్కారాల అమలు తనకు చెల్లించాల్సిన మూల్యం అని స్పష్టం చేస్తుంది. వ్యక్తిగత స్థాయిలో జరిగిన అన్యాయానికి సామాజిక స్థాయిలో పరిష్కారాన్ని కోరడమనే కొత్త పరిహారాన్ని చూపించిన కారణంగా, ఇది నలుగురూ చదవాల్సిన కథ అయ్యింది. మంచి ఎత్తుగడ, ముగింపు, సామాజిక స్పృహ, ఇతివృత్తంలో సమకాలీనత, క్లుప్తత. చదివించే కథనం. అందరూ చదవదగ్గ కథ.

 

జీవన మాధుర్యం: కాండ్రేగుల శ్రీనివాసరావు

బ్రెస్ట్ కాన్సర్ కారణంగా ఒక వక్షోజాన్ని తొలగించడంతో వకుళలో అంతర్మథనం మొదలౌతుంది. ఈ అసమగ్ర రూపంలో భర్త తనను ఎలా చూస్తాడు అన్నది ఆమెని వేధించే ప్రశ్న. అయితే, భార్య పోగొట్టుకున్న భౌతికమైన విషయాన్ని లెక్కచేయనంత విశాలహృదయం భర్తకి ఉంది కాబట్టి కథ సుఖాంతంగా ముగుస్తుంది. దానిలో సంభావ్యతే ప్రశ్నార్ధకం. కథలో చూపించినది ఆదర్శవంతమైన పరిష్కారమే అయినా, అలా కాకపోతే ఎమౌతుందీ అన్న కోణం ఎవరికి వారు ఆలోచించుకోవచ్చు. ఒక వినూత్నమైన అంశాన్ని, ఇంకో సున్నితమైన అసంతృప్తి కోణంతో ముడిపెట్టి రాసిన మంచి కథ. వాస్తవికతని కొంచెం హద్దులు దాటించి శృంగారపరమైన అంశాలు స్పృశించడంతో వస్తువులో ఉన్న గాంభీర్యం కొంత చెదిరిపోవడం ఈ కథలో మనం గమనించవచ్చు.

 

సంస్కృతం మాష్టారు ఇస్మాయిల్: సాయి బ్రహ్మానందం గొర్తి

భాషకీ మతానికీ సంబంధం లేదని ఒక వైపు చెపుతూనే – మతం శాశ్వత అనుబంధాల ఏర్పాటుకు ఎలా ఆటంకమవుతుందో చెప్పటానికి ప్రయత్నించిన కథ. ఇస్మాయిల్ అనే ముస్లిం కుర్రవాడు తెలుగుకంటే సంస్కృతమే నయమని విశ్వం మాస్టారి దగ్గర చేరి సంస్కృతం భాషాజ్ఞానమే కాకుండా ఆయన ప్రేమాభిమానాలనీ సంపాదించి చివరకు సంస్కృతంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తాడు. విశ్వం మాస్టారికి ఇస్మాయిల్ అంటే ఎంత అభిమానం అంటే, చివరికి తన మనవడికి ‘ఇస్మాయిల్’ అనే పేరు పెడతారు. అయితే ఈ మనవడు, ఇస్మాయిల్ కూతుర్ని ప్రేమించడంతో మాస్టారు ‘నానా యాగీ’ చేసి శిష్యుణ్ణి దూరం పెడతారు. ఇరుమతాల మధ్యన ప్రేమ, అభిమానాలు ఉండగలిగిన అవకాశాలు ఉన్నా, మతం అనే సరిహద్దు దగ్గర అవన్నీ కనుమరుగైపోతాయన్న కుదుపు లాంటి వాస్తవికతని కథ పాఠకుడికి స్ఫురింపజేస్తుంది. ఈ వాస్తవికతని పట్టుకురావడమే కథలోని మంచి విషయం అనుకుంటూ ఉండగా, కథ ఒక ‘కొసమెరుపు’ లాంటి ఒక అందమైన విషయంతో ముగుస్తుంది. వాస్తవికత వేరు, ప్రేమాభిమానాలు వేరు అని పాఠకుణ్ణి రెండోసారి కుదుపుతుంది. మంచి కథాంశం, వాస్తవిక కథనం. మొదలు ముగింపులలో రచయిత చాకచక్యం గమనించతగ్గవి..

 

డబ్బు సంచీ: కె వి నరేందర్        

కడుపునొప్పికి పరిష్కారంగా గర్భసంచీని తొలగించాలని డాక్టర్లు మాధవికి చెప్పారు. మిత్రురాలి సలహా మీద ఓ ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రదిస్తే, ముందు కొంత వైద్యం చేసి చూద్దాం అంటాడాయన. ఇలా వైద్యం చేద్దామన్న ధోరణి లేకపోగా, సమస్య ఉన్న ప్రతివాళ్ళకీ గర్భసంచీలు తొలగించడం వెనకాల కుట్ర ఏదైనా ఉందా? ఆరోగ్యశ్రీ పథకాలు ఇలా అమలవుతున్నాయా? మరికొంత సమాచారం తెలుసుకున్న మాధవి, దీన్ని రిపోర్ట్ చేసి దర్యాప్తు చేయించాలనుకుంటుంది. శరీరంలోని సమస్యలని వ్యవస్థలోని లొసుగులతో ముడిపెట్టి, సామాజికమైన పరిష్కారం వైపుగా మాధవి ఆలోచించడం బావుంది. కానీ, కథలో కొంత భాగం వ్యాస రూపం సంతరించుకుంది. ఒక వార్త ఆధారం చేసుకుని కొన్ని గణాంకాలను దృష్టిలో పెట్టుకుని రాయడం వల్ల ఈ కథ కొన్ని కథా లక్షణాలను కోల్పోనట్లైంది. ఆ గణాంకాలలో కూడా శస్త్రచికిత్సల సంఖ్యే చెప్పారు తప్ప అవసరం లేకుండా చేసినవెన్ని అనే ముఖ్యమైన విషయంపై దృష్టి పెట్టకపోవడం మరో లోపం.వస్తువు పరంగా ఆలోచింపజేసే కథ అయినా, రూపం విషయంలో మరింత శ్రద్ధ వహించి ఉంటే, కథ స్థాయి చాలా పెరిగి ఉండేది.

 

దో దివానే దో షెహర్ మే: పూర్ణిమ తమ్మిరెడ్డి

మధ్యతరగతి భారతీయుడి సొంతింటి కల! ఆ కల సాధారణ స్థాయిలో ఉన్నా, ఉన్నదానికీ కొనవలసినదానికీ ఉండే గాప్ ఉండనే ఉంటుంది. ఆ కల స్థాయి పెరిగే కొద్దీ ఈ గాప్ పెరుగుతూ ఉంటుంది. అలాంటి ఓ పెద్ద కల కన్న నేటి తరం భార్యాభర్తలు, పెళ్లి అయ్యీ అవగానే, లోన్ వాయిదాలు కట్టడానికి మరింత సంపాదన కావాలి కాబట్టి అలా సంపాదించడం కోసం చెరో దేశంలో ఉంటారు. ప్రేమించి పెళ్ళిచేసుకున్న ఆ జంట మధ్య దూరం తెచ్చిన వ్యధ, కన్నీళ్ళు మిగతా కథ. కథనం చాలా గొప్పగా ఉన్నా, భార్యాభర్తలు స్కైప్ ద్వారా మాట్లాడుకుంటున్నట్లు సృష్టించడం వల్ల, కథంతా ఆ మూసలో ఒదిగే క్రమంలో క్లుప్తత లోపించినట్లుగా అనిపిస్తుంది. కథాంశంలో ఉన్న సంక్లిష్టత స్థాయికి తగ్గట్టుగా కథ నిడివి కూడా వుండి వుండుంటే బాగుండేది.

 

అమ్మ కడుపు చల్లగా: విజయ కర్రా

ఈ కథ గురించి మాట్లేడే ముందు, ఈ కథ వెనుక కథని కూడా తెలుసుకోవడం అవసరం. ఒక రచయిత ఇచ్చిన ఆలోచన ఆధారంగా మరో రచయిత సృష్టించిన కథ ఇది. ప్రక్రియపరంగా కొత్తగానూ, క్లిష్టంగానూ వున్నా విజయ కర్రా ఈ కథని సమర్థవంతంగా చెప్పడమే కాకుండా, మరో రచయిత ఇచ్చిన సమస్యకి ఆశావహమైన, సార్వజనీయమైన పరిష్కారాన్ని ఇవ్వగలిగారు. ఈ ప్రక్రియ ఫేస్ బుక్ లోని “కథ” గ్రూప్ లో జరిగింది.

 

ఓ చిన్న సమస్య మనసులో దూరి, మనసుని తొలుస్తూ మెలిపెడుతూ – మానవత్వపు ప్రాథమిక విలువలని గురించి ప్రశ్నిస్తూ వేధిస్తుంటే? ఓ తాతకి రెండు రూపాయలు దానం చేయలేని రాజుకి పట్టుకున్న సమస్య ఇది. సమస్య పెరిగి పెద్దదైపోయి పెనుభూతమైపోయి, జ్వరం తెచ్చుకొని కలవరించేదాకా వస్తుంది పరిస్థితి. ఈ సమస్య గురించి భార్య తెలుసుకొని, దానికి పరిష్కారం చూపించడం కథాంశం. ఇవ్వకపోవడానికి లక్ష కారణాలుండవచ్చు గానీ, ఇవ్వదలచుకుంటే ఇవ్వాలనే ఒక్క కారణం చాలు అన్న అంశాన్ని చాలా సున్నితంగా చెప్పిన కథ ఇది. కథకి మూల కారణం వృద్ధుడు – కానీ రచయిత్రి అతడి గతం గురించి ఒక్క పేరా మాత్రమే రాస్తుంది. కారణం కథకి వృద్ధుడి వర్తమానం ముఖ్యం. గతం కాదు. అది రచయిత్రి గ్రహించటం, అంతవరకే రాసి వదిలేయటం ఆ పాత్ర చిత్రీకరణంలో ఆమె చూపించిన జాగ్రత్తకి నిదర్శనం. అదే జాగ్రత్త – చంద్రంలో జాలిగుణం, అతడిలో సంఘర్షణ, దాని పట్ల భార్య సహానుభూతి – ఒక పద్ధతి ప్రకారం మోతాదు మించకుండా చిత్రించటంలో కనపడుతుంది. ‘అత్తత్తత్తా అని పగలంతా (చిన్నపిల్లవాడి) ఒకటే పాట, రాత్రేమో తాత.. తాత.. అని నీ కలవరింతలు’ లాంటి సందర్భోచితమైన వాక్యాల కథనం కథకి సరీగ్గా జతపడింది. కథలో చూపించిన పరిష్కారం, జీవితాల్లో చాలా విషయాలకి అన్వయించుకోదగ్గది కావడం వల్ల మంచి కథలని గుర్తుపెట్టుకొనే వాళ్ళ మనసుల్లో కొన్నాళ్ళపాటు ఈ కథ నిలిచి ఉంటుంది.

 

ఇరుకు పదును: బి పి కరుణాకర్

మరణించిన స్నేహితుడి భార్య అంటే రచయితకి ఒక సాఫ్ట్ కార్నర్. కానీ ఆమెకి తన భర్త మీద సదభిప్రాయం ఉండదు. భర్త ప్రవర్తన మీద రకరకాల అనుమానాలతో, కొన్ని ఆధారాలు తెచ్చి భర్త వ్యక్తిత్వం గురించి రచయిత దగ్గర కూపీలు లాగటానికి ప్రయత్నిస్తుంది. తమ స్నేహం కారణంగానో, లేక స్నేహితుడితో సంబంధం వున్న మరో మనిషి పక్కనే వుండటం వల్లో రచయిత ఆ విషయాలు చెప్పడు. కానీ కథ జరుగుతూ ఉండగా స్నేహితుడి భార్య పట్ల రచయిత అభిప్రాయం మారటం చూచాయగా పాఠకుడికి తెలుస్తుంది. ఇన్ని రకాల మానసిక కోణాలకి కథనం తావు ఇచ్చినా ఒక్క కోణం కూడా రచయిత నేరుగా పాఠకుడికి చెప్పకపోవటం కథలో ప్రత్యేకత.

 

చిన్న కథలో రచయిత ప్రతిభావంతంగా చొప్పించిన ప్రశ్నలను గమనించిండి.

 

అత్యంత విషాదకరమైన సన్నివేశంలో ఓ వ్యక్తిని చూసి, మనస్సులో ఎక్కడో ఏర్పరచుకున్న సానుభూతి – ఆ తరువాత ఎప్పుడో ఆ మనిషితో సంభాషించే క్రమంలో ఆవిరైపోతూ ఉండటం ఎలా ఉంటుంది? చనిపోయిన మనిషి గురించి సాక్షాత్తూ ఆ వ్యక్తి భార్యే నిందిస్తూ మాట్లాడుతూ ఉంటే దాన్ని స్వీకరించడం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తితో సంబంధం ఉన్న మరో మహిళ ఇవన్నీ అక్కడే కూచుని వినడం ఎలా ఉంటుంది? అసలు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ చనిపోయిన వ్యక్తి నిజంగా చేసిన తప్పులేవిటి? ఇప్పుడు అన్నీ అయిపోయాక, ఏది తప్పు, ఏది ఒప్పు? మనుషుల్ని మనం చూసే దృష్టికోణాలు రియల్ టైమ్ లో డైనమిక్ గా మారిపోవడం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకీ; ముగింపు వ్యూహాత్మకంగా, పాఠకుడికి ఊహాత్మకంగా వదిలివేసినందువల్ల ఉత్పన్నమయ్యే మరిన్ని ప్రశ్నలకి ఈ కథలో పాఠకుడే జవాబులు వెతుక్కోవాలి. అది రచయిత, పాఠకుడి తెలివితేటల మీద ఉంచిన నమ్మకం!

 

ఇవి కాక వస్తుపరంగానో, శైలి పరంగానో ప్రస్తావించదగ్గవిగా మేము భావించిన కథలు కొన్ని –

 

24.05.14 త్రిపుర వర్ధంతి సందర్భంగా భగవంతం రాసిన కథ “గోధుమరంగు ఆట”. రచయిత పేరు త్రిపుర పాత్రల్లో ఒకటి కావటం – రచయిత పై త్రిపుర ప్రభావం ఎంతగా ఉందో చెప్పకనే చెపుతుంది. అది అబద్ధం కాదన్నట్లు ఈ కథ పోకడ రుజువు చేస్తుంది. గొప్ప కథనం. అందుకనే కథలో ఇతివృత్తం ఏంటో (అసలు ఉందా?) కథనం తెలియనివ్వదు. ఇది కథకి బలమా?కాదా? అన్న మీమాంస వదిలేస్తే మంచి అనుభూతిని కలగచేసిన ప్రయత్నం. త్రిపుర కథల స్ఫూర్తితో, ‘భగవంతం కోసం‘ కథ ధోరణిలో రాయబడ్డ కథ. త్రిపుర స్మృతికి అంకితం చేయబడ్డ కథ. “ఆకాశంలో నక్షత్రపు జల్లు. భగవంతం రాడు. అట్నుంచి ఏడో నంబర్లోనూ రాడు, ఇట్నుంచి పదమూడో నంబర్లోనూ రాడు. నా పిచ్చి గాని.” అన్న నిరాశతో ముగిసిన ఆనాటి కథ, ఇవాళ రూపాంతరం చెంది “.. కానీ బయట ఆకాశం కింద ఒక అనంతమైన కాల్పనిక వేడుక నాకోసం ఎదురుచూస్తూ ఉంటే – మాటల్తో కాలాన్నెందుకు వృధా చేయడం అనుకుని – హోటల్లోంచి బయటకొచ్చేశాను” అనే నవీన స్ఫూర్తితో ముగియడం ఒక విశేషం!

 

ఈ నెలలోనే వచ్చిన మరో రెండు కథలను కథాప్రేమికులు పరిశీలించాలి. ఈ రెండు కథలు ప్రతీకాత్మకంగా రాసినవి కావటం మాత్రమే ఈ రెండింటి మధ్య వున్న సామీప్యం. వివిన మూర్తి రాసిన “జ్ఞానం కనిపించటం లేదు” కథ సామాజిక పరిస్థితుల మీద చేసిన వ్యాఖ్య అయితే, పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన “ఏనాడు విడిపోని ముడివేసెనే” కథ భార్యాభర్తల మధ్య పల్చబడే అనుబంధం గురించి వివరిస్తుంది.

 

ప్రతీకలతో కథ నడపడం కత్తి మీద సాములాంటిదని ఈ రెండు కథలు చెప్పకనే చెబుతున్నాయి. కత్తి మీద సాము ఎందుకంటే – జటిలంగా ఉన్న ప్రతీకలు సంక్లిష్టమైన పజిల్ లా తయారై, కథ పాఠకుడికి దూరం అవుతుంది. సులభంగా ఊహించగల ప్రతీకలు కథ మీద పాఠకుడికి ఉన్న ఉత్సాహాన్ని నీరుకారుస్తాయి. ప్రతి అంశానికీ ఒక ప్రతీక చొప్పున వాడుకుంటూ పోవడం వల్ల మొత్తం ప్రక్రియ పలుచబారే ప్రమాదం ఉంది. ప్రతీకలతో వున్న మరో సమస్య ఆ ప్రతీకలకు లేని అర్థాన్ని ఆపాదించే ప్రయత్నం. చిత్రకళ నుంచి సాహిత్యంలోకి వచ్చిన ఈ ప్రక్రియలో కొన్ని కొన్ని విషయాలకు ప్రతీకలు దాదాపు నిర్థారితంగా వున్నాయి. వాటిని వేరే అర్థంలో వాడటం వల్ల తెలివిడి కలిగిన పాఠకులకు కూడా కథ కొరుకుడు పడకపోయే సమస్య వుంటుంది. శిల్పంలో విభిన్నమైన ప్రక్రియగా వీటిని వాడటం ముదావహమే గానీ, కథలని ఇంత అస్పష్టంగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్నది పెద్ద ప్రశ్న. (ఏది ఏమైనా ఈ కథలను పాఠకులు చదివి, వారికి స్ఫురించినంత మేర సారాన్ని గ్రహించే అవకాశం వుంది కాబట్టి ఈ కథలు చదివి/చదివిన వారు తమ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో చెప్పాలని మనవి)

 

ఈ నెల ఉత్తమ కథ

ఇద్దరి మనుషుల సంభాషణల్లో – వ్యక్తం అయ్యే అంశాలు, అవ్యక్తంగా ఉంచబడ్డ విషయాల మధ్య ఓ సున్నితమైన గాప్ వస్తుంది. ఈ గాప్ ఆ సన్నివేశంలో ఉన్న వ్యక్తులకి అవగాహనలోకి వస్తే, ఆ సంభాషణల్లో ఓ ఇబ్బంది వచ్చిచేరుతుంది. ఇదీ ఈ కథలోని ప్రాథమిక చిత్రం. ఆ సన్నివేశంలో ఇంకో వ్యక్తి కూడా ఉంటేనూ, మరో వ్యక్తి కనబడకుండా ఉంటేనూ ఆ ఇబ్బంది స్థాయి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ముఖ్యంగా – ఆ నలుగురు వ్యక్తుల మధ్యనా కొన్ని సంబంధాలో బాంధవ్యాలో మరోటో ఉన్నప్పుడు. ఇదొక సంక్లిష్టమైన చిత్రం. కథగా చెప్పడం కష్టం, చెప్పి ఒప్పించడం ఇంకా కష్టం. అలాంటి బాధ్యతని ప్రతిభావంతంగా నెరవేర్చారు బి పి కరుణాకర్ గారు ‘ఇరుకు పదును’ కథలో. ఎంతవరకూ చెప్పాలో దానికి కొంచెం తక్కువగానే చెప్పి, ఈ కథలో కరుణాకర్ గారు అటు క్లుప్తతనీ ఇటు అనుభూతి ఐక్యతనీ ఏకకాలంలో సాధించగలిగారు. అందువల్లా, పైన చెప్పిన ఇతర కారణాల వల్లా ఈ నెల వచ్చిన కథలలో “ఇరుకు పదును” ఉత్తమకథగా మేము భావించడం జరిగింది.

 

కథా రచయిత బి.పి. కరుణాకర్ గారికి అభినందనలు!! కరుణాకర్ గారితో “ఇరుకు పదును” గురించి సంభాషణ వచ్చేవారం.

 

ఈ వ్యాసంలో ప్రస్తావించిన కథలు:

సం. కథ రచయిత (త్రి) పత్రిక లింక్
1 అమ్మ కడుపు చల్లగా విజయ కర్రా ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 4 http://goo.gl/3oY7up
2 ఇరుకు పదును బి. పి. కరుణాకర్ ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 18 http://goo.gl/xxUKc5
3 ఏ నాడు విడిపోని ముడి వేసెనే పూర్ణిమ తమ్మిరెడ్డి ఈమాట – మే/జూన్ http://goo.gl/CPe5p6
4 గోధుమరంగు ఆట భగవంతం ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 25 http://goo.gl/Adb8oF
5 జీవన మాధుర్యం కాండ్రేగుల శ్రీనివాసరావు నవ్య, మే 14 http://goo.gl/ixJHPR
6 జ్ఞానం కనిపించటంలేదు వివినమూర్తి అరుణతార, మే
7 డబ్బు సంచి కె. వి. నరేందర్ నమస్తే తెలంగాణ, మే 4 http://goo.gl/nsCq6P
8 తృతీయ వర్గం డా. ఆర్. వి. రాసాని నవ్య, మే 21 http://goo.gl/ZZ2TfQ
9 దో దీవానే దో షహర్ మే పూర్ణిమ తమ్మిరెడ్డి కినిగే పత్రిక, మే http://goo.gl/XZ1EpG
10 మరుగు వాణిశ్రీ నవ్య, మే 7 http://goo.gl/LJHBxF
11 సంస్కృతం మాష్టారు ఇస్మాయిల్ సాయిబ్రహ్మానందం గొర్తి ఈమాట, మే/జూన్ http://goo.gl/E5AuQy
12 సాక్షి శిరంశెట్టి కాంతారావు కౌముది, మే http://goo.gl/xiLhrE

– అరిపిరాల సత్యప్రసాద్, ఎ.వి. రమణమూర్తి, టి. చంద్రశేఖర రెడ్డి

aripirala02. T Chandra Sekhara Reddy01. Ramana Murthy

లోపలిదేహం

 734305_498249500226884_2100290286_n

సుడులు తిరిగే తుపానులాగానో

వలయాల సునామీలాగానో

దు:ఖఖండికల్లోని పాదాల్లాగానో

సుఖసాగర అలల తరగలలాగానో

కదులుతూ గతస్మృతులేవో లోపలిదేహంలో!

కొన్నింటికి లేదు భాష్యం

భాష్యంకొన్నింటికిమూలాధారం

చీకటిగుహలూ

ఉషోసరస్సులక్కడ

ఎండాకాలపు సెగలూ

చిరుగాలుల చల్లటి నాట్యమక్కడ

ఎడారి ఏకాంతం

పూలపానుపుపై ప్రియురాలి విరహపు కదలికలక్కడ

స్నేహలతలకు అల్లుకున్న మల్లెపూలపరిమళాలక్కడ

శతృవైరుధ్యాల వేదికపై అగ్నిపూలయుద్ధాలక్కడ

దు:ఖ

ఆనందడోలికల్లోమోమునుముంచితీసేవాళ్ళూ

కష్టసుఖాలసమాంతరజాడలక్కడ

ఎవరివోభావాలుమనవై

మనభావాల విహంగాలెగురుతాయి పరాయి ఆకాశాలపై

ఒంటరితనంలో విరహం కోరుకునేతోడు

సమూహానందంలో నవ్వుకోరుకునే ఒంటరితనం

ఒకదాని తర్వాత ఇంకోటి

తపనల తీరని అన్వేషణలక్కడ

అన్వేషణల తండ్లాట లోపల మొదలై

బహిరంగ విన్యాసమయ్యే విశాలశాఖల చైతన్యం

స్మృతి అదృశ్యదేహం, దేహం లోపలిదేహం!

ఎన్ని స్మృతులు లోపలికింకితే నువ్వునువ్వు

ఎన్నిస్మృతులు కన్నీళ్ళ సముద్రాలైతే ఒక నీ నవ్వు

ఎన్నికాలగతాలూ, ఎన్నెన్ని స్వగతాలు నీలో అంతరంగమై నీవో నడిచేమనిషివి

అలుపెరగని, అలుపు తీరని సమరగీతాలవి

సజీవజీవనయానంలో నీకై పోరాడుతూ విడిచిన ప్రాణాలప్రతిమలవి

ప్రాణంలోనే పోరాటం నింపుకున్న ప్రజాసమూహాలవి

స్మృతులు ఎండిపోని రుధిరవనాలు

మరణంలేని మహాకావ్యాలు.

మహమూద్

 

సాహిత్యం- సాహిత్తెం

 

 

కలలు చమత్కారంగా ఉంటవి. దెయ్యాలూ భూతాలు కలలోకి వచ్చినా మర్నాడు లేచాక మనకి కనిపించవు కదా? మంచి కలలొస్తే మంచి జరుగుతుందనీ, పాడు కల వస్తే చెడు జరుగుతుందనీ ఎక్కడైనా ఉందా? కల వచ్చిన మర్నాడు పొద్దున్నే కొంత సుఖమో కష్టమో అనిపించవచ్చు గానీ తర్వాత రోజూ పనుల్లో పడి ఇవన్నీ మర్చిపోతూంటాము కదా? కానీ నా కొచ్చిన కల వింతగా ఉంది.

 

లేకపోతే ఇది చూడండి. రాత్రి పడుకున్నానన్న మాటే గానీ ఎప్పటికో గాని నిద్రలేదు. అప్పుడొచ్చిన కలలో నేనూ, బిల్ గేట్సూ, వంగూరి చిట్టెన్ రాజు గారూ కలిసి నడుస్తున్నాం. ఇప్పుడు మనమో విమానం ఎక్కాలి అన్నారు బిల్ గేట్స్. “ఎక్కడికండి మనం వెళ్ళేది? ఇండియాకేనా?” అని ఎంతో ఉత్సాహంగా అడిగేను. సమాధానం లేదు. నాకేమో ఒళ్ళు జలదరిస్తోంది వీళ్ళతో వెళ్ళడానికి. వాళ్ళేమో సమాధానం చెప్పరు. విమానం వచ్చింది. ఎక్కాక పైలట్ కూర్చుని ఏవో మీటలన్నీ నొక్కుతున్నాడు. “బోయ్” మని చప్పుడు. విమానం తూర్పు కేసి ఎగురుతోంది అని నేనంటే వీళ్ళు “ఇండియాకి కాదు వెళ్ళేది ఆఫ్రికాకి” అనడం.

 

గేట్స్ గారితో వెళ్ళడం అంటే ఏ ఫస్టు క్లాసులోనో వెళ్ళచ్చేమో, వైన్ అదీ తాగి, పీక దాకా తినేసి, సీటు నూట ఎనభై డిగ్రీలు వచ్చేదాకా కాళ్ళు తన్ని పడుకోవచ్చు అనుకున్నాను కానీ వీళ్ళు నన్ను ఎకానమీలో ఎక్కించారని ఎక్కేదాకా తెలీలేదు. తీరా ఎక్కిన తర్వాత దాహంతో నోరు పిడచగట్టుకుపోతూంటే, ఓ కోక్ ఇమ్మన్నా, కాసిని మంచినీళ్ళిమ్మన్నా గంటు మొహం పెట్టుకుని ఏదో ముష్టి పారేసినట్టు తెచ్చి మొహం మీద విసరడం.

 

ఇంక ఎలాగా తప్పదు కదా? వాళ్ళు పెట్టిన గడ్డీ గాదం (అవే లెండి, ఆంగ్లంలో సలాడ్లు అంటారు కదా) తిని ఓ కునుకు తీసి లేచేసరికి సీటు బెల్ట్ పెట్టుకోమని ఆర్డర్. అప్పటికే రాజు గారూ, గేట్స్ గారూ రడీగా ఉన్నారు. నేనే లేటుగా లేచింది. కిందకి దిగి “ఇది హైద్రాబాదులా లేదే, ఇదే ఊరండి రాజు గారు?” అనడిగాను. సమాధానం లేదు.

 

కాస్త ముందుకెళ్ళాం. ఇక్కడకెందుకొచ్చామో నాకర్ధం కాలేదు. చుట్టూ చూసాను. మమ్మల్ని దింపిన విమానం వెళ్ళిపోతోంది మళ్ళీ. కార్లూ అవీ ఉన్నట్టులేదు. ఇండియా అయితే ఎడ్లబండో, ఏనుగో కనపడాలి కదా విమానం దిగిన పదినిముషాల్లో? రాజుగారి కేసి ప్రశ్నార్ధకంగా చూస్తే ఆయనే చెప్పేరు ఈ సారి – “ఇది ఆఫ్రికా, మనం ఇక్కడ చూడాల్సినవి కొన్ని ఉన్నాయి.”

 

“మరి బిల్ గేట్స్ గారేరీ?” అన్నాను ఆయన మాతో లేకపోవడం గమనించి.

 

“ఆయనకి వేరే పనులున్నాయి, పోలియో, మలేరియా మందులు ఇప్పించడానికీ, దానికీను. ఆయనరారు మనకి తప్పదు.” చెప్పేరు రాజు గారు.

 

“మనకి ఎందుకు తప్పదు?”

 

“నేను కధలు రాస్తాను. నువ్వు నాకన్నా బాగా రాస్తావు; అందుకని” వెర్రి వెధవని కాకపోతే రాజుగారు నన్ను వెక్కిరిస్తున్నారని తెలియలేదు.

 

ఎదురుగా “విలియం ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ లైబ్రరీ” అని పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద భవనం కనిపించింది. “మనమే ఎం.బి.ఏ చేసుంటే నేను ఏ వాల్ స్ట్రీట్ లోనో లక్ష డాలర్లు సంపాదించేవాడిని, నువ్వు ఏ కోటి డాలర్లో తెచ్చేవాడివి గేట్స్ గారిలానే.” నేను ఆ బిల్డింగ్ బోర్డు చూసి నోరు వెళ్ళబెట్టగానే చెప్పేరు రాజుగారు.

 

ఏమైనా నేను కోటి డాలర్లు తెస్తున్నట్టే అనిపించింది. మీరు ఎందుకు ఎం. బి. ఏ చేయలేదని రాజుగార్ని అడుగుదామనుకున్నాను కానీ ఊరుకున్నాను.  జేబులన్నీ వెతికి తుపాకులూ అవీ ఉన్నాయా అనే చూసి, ఏమీలేవని నిర్ధారించుకున్నాక లైబ్రరీ లోపలకి వదిలేరు.

 

పుస్తకాలు కుప్పలకొద్దీ బీరువాల్లో దాచి ఉంచారు. చూస్తూ పోయేసరికి ఓ చోట తెలుగు సాహిత్యం అని ఉంది. కనుబొమ్మలు పైకెత్తి రాజు గారు కేసి చూసాను ఆశ్చర్యంతో.

 

“ఇప్పుడర్థం అయిందా?” అన్నట్టూ నవ్వుతున్నారు ఆయన. ఆయన పబ్లిష్ చేసిన పుస్తకాలూ, అందులో నేను అప్పుడప్పుడూ రాసిన కధలూ అన్నీ ఉన్నట్టున్నాయి.

 

“ఇక్కడకి తెలుగు సాహిత్యం ఎలా వచ్చిందో?” అని నేననుకునేలోపల రాజుగారే చెప్పారు, “తెలుగు వాడు లేని నేల ఎక్కడుందోయ్ ఈ భూమ్మీద?”

 

“ఇక్కడ ఆఫ్రికాలో ఎవరు చదువుతారండీ ఇవి?” అడిగేను ఆయన్ని.

 

“ఎవరో చదువుతారని కాదు, ప్రపంచం నాలుగు మూలలా మువ్వన్నెల తెలుగు సాహిత్య పతాకం ఎగరవల్సిందే,”

 

మళ్ళీ నడవడం మొదలు పెట్టాం. “ఇక్కడ్నుంచి, రచయితల సెక్షన్” అని రాసి ఉంది.

 

మొదటి చోట కొంతమంది తెలుగు వాళ్ళు కాయితాలు ముందేసుకుని ఏవో రాస్తున్నారు. మేము రావడం చూసారు కానీ ఏమీ పట్టించుకున్నట్టు లేదు. కాయితానికి రెండంటే రెండే లైన్లు రాసి పారేస్తున్నారు పక్కన. కాయితాలు ఖరాబు చేస్తున్నట్టు అనిపించి ఏదో అనబోయేను కానీ రాజు గారు నా నోటి మీద చెయ్యేసి నొక్కేసి అక్కడ్నుంచి దూరంగా తీసుకెళ్ళి చెప్పేరు, “వీళ్ళు రాసేవి నానీలు. నోరెత్తావా, పెన్నుతో పొడిచి చంపేస్తారు.”

 

ఒళ్ళు జలదరించింది.  కాస్త ముందుకెళ్తే కొంత మంది కాయితాల మీదే రాసుకుంటూ కనిపించేరు. దగ్గిరకెళ్ళి చూద్దుం కదా, వాళ్ళు రాసేవి సమస్యా పూరణాలు. ఓక్కో చోట ప్రాసకోసం “గూగిలించుచో” అనో, “యాహూలించుచో” అనో “బింగులించుచో” అని రాసేస్తున్నారు. “ఇదేమిటండీ రాజుగారు ఇవి అంతర్జాలంలో ఉండేవి కదా, అవి తెలుగు పదాలు ఎలా అవుతై?” అనడిగేను. రాజుగారు సమాధానం చెప్పేలోపుల అక్కడే ఉన్న ఒకాయన చెప్పేడు, “కొత్త కొత్త పదాలు మనం సృష్టించపోతే బాష ఎలా ఇంప్రూవ్ అవుద్దోయ్ చెవలాయ్?” మొహం గంటు పెట్టుకుని రాజు గారి కేసి  చూస్తే ఆయన “ఊరుకో, ఊరుకో తెలుగు పద్యాల్లో కాసినేనా తెలుగు పదాలున్నాయని సంతోషపడు” అని చెప్పి ముందుకి లాక్కేళ్ళేరు.

 

ఇంకాముందుకి వెళ్లేసరికి అక్కడంతా కలగా పులగంగా ఉంది వాదోపవాదనలతో. నేను అడిగేలోపులే రాజుగారు చెప్పేరు, “వీళ్ళందరూ ఎడిటర్లు, మనం రాసేది ఎలా తీసిపారేద్దామా అని చూస్తూ ఉంటారు. ఓ రకంగా డాక్టర్ల లాంటి వాళ్ళు, అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగమ్ము ఖంఢించి.. లాంటి వాళ్ళనుకో”.

 

“అదేమిటండోయ్, డాక్టర్లకీ ఎడిటర్లకీ పోలిక?” వెర్రిమొహం వేసి అడిగాను.

 

“అదంతే. ఎవడికి ఎప్పుడు రోగం వస్తుందా, ఎప్పుడు పేషంట్ మన దగ్గిరకి వస్తాడా అని డాక్టర్లు చూస్తూ ఉంటారు. అలాగే ఎవడు ఏమి రాసి రచయిత అవుదామా అని చూస్తూ ఎడిటర్లకి పంపిస్తే వాళ్ళు ఏ కారణం చూపించి రాసినది అవతల పారేద్దామా అని వీళ్ళు చూస్తూ ఉంటారు.” విడమర్చి చెప్పేరు రాజు గారు.

 

“ఛా, అలా అంటారేంటండీ? నాకు అలా అవలేదే? నేనేం రాసినా వేసుకుంటున్నారు ఎడిటర్లు.”

 

“చెప్పేనుగా నువ్వు నాకన్న మంచి కధలు రాస్తావని?” గుంభనంగా నవ్వుతున్నారు రాజు గారు. మట్టిబుర్ర కాకపోతే ఈ పాటికైనా రాజుగారు నన్ను వెక్కిరిస్తున్నారని తెలియలేదు.

 

మళ్ళీ ముందుకి నడిచాం.  అందరూ కంప్యూటర్లమీద చక చకా ఏదో టైప్ చేస్తున్నారు. కాయితం లేదు, కలం లేదు. ఏదో రాయడం, పబ్లిష్ చేయడం వెంట వెంటనే జరిగిపోతున్నాయి. ఆశ్చర్యంగా చూద్దును కదా, రాజుగారు నన్ను వెనక్కి లాగి చెప్పేరు, “వీళ్ళు బ్లాగు రైటర్లు. అలా చూడకూడదు, అవి పబ్లిష్ అయ్యేదాకా”.

 

“ఇక్కడ చూడకపోతే పబ్లిష్ అయ్యేక ఎలా చూస్తామండి?”

 

“అవి పబ్లిష్ అయ్యేక, మాలిక అనీ కూడలి అనీ బ్లాగుల సమాహారాల్లో వస్తాయి. అక్కడ్నుంచి చూసి కామెంట వచ్చు.”

 

“కామెంటడం అంటే?” కామెర్లు అంటే తెలుసు, కామేశ్వరీ తెలుసు. కామెంటడం అంటే తెలియక అడిగేను సిగ్గు పడుతూ.

 

“వాళ్ళు రాసి పారేసాక మన అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టడాన్ని కామెంటడం అన్నారు. అలాగే ధన్యవాదాలు చెప్పడాన్ని నెనర్లు అనీ, ఈకలనీ ఏవోవో పేర్లు. పక్కనున్న సెక్షన్లో ఇందాకే చెప్పేడు కదా ఒక మహామహుడు, కొత్త పదాలు సృష్టించకపోతే తెలుగు ఎలా నిలబడుద్దో చెవలాయ్ అనీ? అయినా ఇన్ని ప్రశ్నలు అడక్కూడదు.”

 

“రాసేసినవి ఎడిటర్లకి పంపొచ్చు కదా? బ్లాగులో రాసుకోడం ఎందుకో?” నా మనసులో సందేహం అనుకోకుండా నోట్లోంచి బయటకొచ్చేసింది.

 

“చెప్పాను కదా, పాతిక కధలు పంపిస్తే ఎడిటర్లు ఒకటో రెండో వేసుకుంటారు. మిగతావి చెత్తబుట్టలోకే. వాళ్ళు పబ్లిష్ చేయకపోతే నిరుత్సాహ పడిపోకుండా, ఈ బ్లాగుల్లో మనకి మనవే పబ్లిష్ చేసుకోవచ్చు. ఎడిటర్లు నీ రచన బావోలేదు అంటే, నీ సలహా ఎవడిక్కావాలోయ్ ఇదిగో నేనే పబ్లిష్ చేసుకోగలను అని వీళ్ళు ఇలా రాస్తారు.”

 

“అలా ఏది పడితే అది రాసేయొచ్చా బ్లాగులో?”

 

“ఆ, మన ఇష్టం. ఆ తర్వాత ఏదైనా తేడాలొస్తే దాంతో తంటాలు పడాల్సింది కూడా మనమే.”

 

కంప్యూటర్ల దగ్గిర కూచున్నవాళ్ళు మమ్మల్నీ, రాజు గారి చేతిలో ప్రింట్ పుస్తకాలనీ చూసి నవ్వడం. ఈ రోజుల్లో పుస్తకాలెవడు చదువుతాడోయ్ చెవలాయ్ అనడమూను. రాజు గారు పబ్లిషర్ అని చెప్తే ఇంకా నవ్వులు.

 

తెలుగు సాహిత్యం ఎంత పైపైకి పోతోందో, నేనెంత వెనకబడి ఉన్నానో ఇదంతా చూసేసరికి అర్ధమైంది. కళ్ళు తిరిగేయి గిర్రున.  రాజుగారు నా చేయి పట్టుకుని బయటకి నడిపించుకొచ్చేరు. దారిలో తత్త్వ బోధ చేస్తున్నట్టూ చెప్పేరు రాజుగారే, “చూసావా తెలుగు సాహిత్తెపు మువ్వెన్నల  జండా ఎంత గొప్పగా పైపైకి పోతోందో?”

 

“సాహిత్యం అనకుండా సాహిత్తెం అన్నారేమిటబ్బా?”

 

“మన కవులు రాసినదీ సాహిత్యం. ఇప్పుడొచ్చేది సాహిత్తెం. అంతే తేడా”

 

ఇంతట్లో మేడూరు వచ్చి ఉయ్యూరు మీద పడిందన్నట్టూ ఎవరికో నేను కధలు రాస్తానని తెల్సింది. నాకేసి వేలెత్తి చూపించి చెప్పేడు, “జాగ్రత్త, నువ్వు మా గురించి రాసావా, మరి చూస్కో!” అన్నాడు.

 

“ఏం చేస్తారేం?” అని ఇంకేదో అడగబోతుండగా రాజుగారు వారించి నన్ను బయటకి తీసుకొచ్చేరు. లోపలకి వెళ్ళిన దారి వేరూ, బయటకొచ్చిన దారి వేరూను. బయటకి రాగానే తలుపు దగ్గిరే జీరాఫీ, చిరుతపులీ కనిపించేయి.

 

ఇది ఇండియా అయితే జిరాఫీ ఉండదే, చిరుతపులి ఇండియాలో ఉంటే దాన్ని చంపేసి చర్మం అమ్ముకోరూ ఈపాటికి అనుకుంటూంటే వెనకనుంచి చింపాంజీ అరుపు వినిపించింది. భయపడి పక్కనే ఉన్న రాజు గారి చెయ్యి పట్టుకున్నాను.

 

“చూసావా, నేచెప్పలే? ఇది ఆఫ్రికా” అని మృదువుగా చేయి విడిపించుకుని భుజం తట్టేరు రాజు గారు. బుర్ర పక్కకి తిప్పిచూస్తే ఏదో జలపాతం. చల్లని నీళ్ళు మొహం మీద పడ్డాయి. చటుక్కున మెలుకువొచ్చింది.

 

పగటి కలలకి పాటి లేదు. అరచేతి మీద “శ్రీరామ” అని రాసి కళ్ళకద్దుకున్నాను. అంతే!

 

[ఉపసంహారపు చివరితోక:  తెలుగు వారి గోల్డ్ నిబ్బు, విశ్వనాథ గారి ‘జూ’ కధ గుర్తొచ్చిందా? అది చదివాక రాసినదే ఈ కధ. ఆయన కాలిగోరుక్కూడా పనికిరాని వాణ్ణి కనక ఇవే చిట్టెన్ రాజుగారికీ , విశ్వనాథగారికిచ్చే క్షమాపణలు]

 

– ఆర్. శర్మ దంతుర్తి

ఇంకేం చెప్పనూ!

bhuvanachandra (5)

షౌలింగర్ .. దాన్నే’ఘటికాచలం’ అని కూడా అంటారు. మద్రాసు నించి కార్లో ఓ మూడుగంటల ప్రయాణం.. ప్రస్తుత రద్దీలో. మధ్యలో ‘తిరువళ్లూరు’లో ఆగి వీరరాఘవస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. వీర రాఘవస్వామిని దర్శించడం ఓ అద్భుతమైన అనుభవం. ఆ ఆనందం అనుభవించాల్సిందే కానీ మాటలలో వివరించేది కాదు. పెళ్లికాని వాళ్లు మొక్కుకుంటే పెళ్లవుతుంది. అందుకే ఇక్కడ చిన్న ‘వరుడు’, ‘వధువు’ బొమ్మలు అమ్ముతారు.

షౌలింగర్ లేక షోలింగర్లో రెండు కొండలున్నై. ఒకటి నరసింహస్వామి గుడి, రెండోది ఆంజనేయస్వామిది. నరసింహస్వామిని దర్శించిన తరవాతే ఆంజనేయస్వామిని దర్శించాలి. కోతులకీ,కొండముచ్చులకీ లెక్కలేదు. ఆడవాళ్లు తలలో పువ్వులు పెట్టుకుంటే కోతులు ఆ పువ్వుల్ని లాగేస్తాయ్. అందుకే కొండ ఎక్కేప్పుడు ఓ కర్రని కూడా దుకాణదారులు ఇస్తారు.

నరసింహస్వామి గర్భగుడిలోకి వెళ్ళగానే బ్రాహ్మణులు ఓ పెద్ద ఉద్ధరిణతో మన మొహం మీద తటాల్న నీళ్లు కొడతారు. కొంతమంది భయపడితే కొంతమంది ఉలిక్కిపడతారు. ‘దృష్టిదోషం’ పోతుందిట. ఆ నీరు మన మీద పడితే.

ఇక్కడి ఆంజనేయస్వామికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఒకటి.. ఎక్కడా లేని విధంగా యీ ఆంజనేయస్వామికి నాలుగు చేతులు. రెండు అభయహస్తాలతో దీవిస్తుంటారు. ఇంకోటి సాలిగ్రామ మాల ధరించియోగముద్రలో ఉంటారు.

ఈ ఇద్దరు దేవుళ్ల ఫోటోలు ఎక్కడా దొరకవు. కేవలం దర్శించి తరించాల్సిందే . నృసింహస్వామి కొండ దూరం నించి చూస్తే సింహంలాగా కనిపిస్తుంది. ఇక్కడ 1400 మెట్లు. ఆంజనేయస్వామి గుడికి 400 మెట్లు. మెట్లు ఎక్కలేని వాళ్లకోసం ‘డోలీ’ ఏర్పాట్లు కూడ వున్నాయి. ఓ పాతికేళ్ల క్రితం వెళ్ళినప్పుడు ముందు ‘రిక్వెస్ట్’ చేస్తే గానీ ఉదయం ఇడ్లీ కూడా దొరికేది కాదు. ఇప్పుడు చాలా హోటళ్లు వెలిశాయి ( గుడి, కొండల దగ్గర.. ఊళ్ళో అంతకు ముందు హోటళ్లు వున్నై) ఆ రోజుల్లో ‘బస’ సత్రాల్లోనే. ఇపుడు ఏ.సి సౌకర్యాలతో సహా అన్ని హంగులతోనూ ఉండొచ్చు.

మానసిక జబ్బుల్తో బాధపడేవాళ్లని ఇక్కడికి తీసుకొచ్చి మూడు రాత్రులుంచితే ఖచ్చితంగా జబ్బు తగ్గుతుందని ఓ నమ్మకం. చాలా మందికి తగ్గిందని వాళ్ల నోటితోనే విన్నాను.

అక్కడి వాతావరణం చాలా హాయిగా వుంటుంది. శని,ఆదివారాలూ, మంగళవారమూ చాలా రద్దీగా ఉంటూంది. మిగతా రోజులు ప్రశాంతంగా వుంటుందక్కడ. దర్శనం ఉదయం తొమ్మిదింటినించి సాయంత్రం అయిదుగంటలవరకు మాత్రమే..

Image (9) - Copy

కొన్నేళ్ళ క్రితం ఆంజనేయస్వామి కొండ మొదట్లో వున్న ‘ఆర్య వైశ్య సత్రం’ దగ్గర ఓ చిన్న నిట్టాడి పాకలో ‘తాయమ్మ’ కు కనిపించాడంట. తాయి అంటే తమిళంలో ‘అమ్మ’ అని అర్ధం. మన తెలుగులో తాయమ్మ అంటే సుమారుగా అమ్మమ్మ అనుకోవచ్చేమో. మనిషి నలుపేగానీ అద్భుతమైన ‘కళ’. కళ్లు, పలువరుసా మెరుస్తూ మనల్ని ఇట్టే ఆకర్షిస్తాయి.. నవ్వు మొహం.

అప్పట్లో టిఫిన్ కావాలన్నా, ‘ఏర్పాటు’ చేసుకుంటే కానీ దొరికేది కాదని విన్నవించా. మేము అంటే నేనూ, శ్రీ గుత్తా రామ్ సురేష్‌గారి కుటుంబం షోలింగర్ చేరేసరికి చీకటి పడింది. ఆంజనేయస్వామి మెట్లదగ్గర వున్న ఓ చిన్న సత్రం (గుడికి సంబంధించిందే)లో రెండు గదులు తీసుకున్నాం. చాపలు వున్నై. దుప్పట్లూ అవీ మేము తీసికెళ్ళినవే. భోజనం కూడా మేం మద్రాసులోనే ‘పేక్’ చేసుకున్నాం. రాత్రిపూటకి.. చేరగానే ‘పెద్దమర్రి’ కింద వున్న ఓ చిన్న షాపులో ఇడ్లీలు రేపటికి ఏర్పాటు చేయగలవా’? అని ఓనర్ని అడిగితే చేస్తానన్నాడు.

పొద్దున్న లేవగానే నేను ఆ షాపుకి వచ్చాను. షాపు ఓనరు చెప్పాడు. “ఆ పాకలో వుండే ‘తాయమ్మ’ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా ఇడ్లీలు, చెట్నీ ఇస్తుంది. వెళ్లి నేను చెప్పానని చెప్పండి” అని.

అక్కడ వున్నది తాయమ్మ పేరు మీద చలామణీ అవుతున్న స్వర్ణకుమారి. నన్ను చూడగానే “రండి! ఇప్పుడు ఇడ్లీ వేసి ఇమ్మంటారా?” అన్నది నవ్వుతూ, అసలు స్వర్ణకుమారిగారు అక్కడుంటుందని నేను ఊహించలేదు. “మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. మీరు నన్ను గుర్తుపట్టారా?” అన్నాను. “మీతో పరిచయం చాలా తక్కువ. నిజం చెబితే ఒక్కసారే మీతో మాట్లాడింది. సురేష్‌గారు పరిచయమే.. వారి కుటుంబం కూడా తెల్సు. రామినీడుగారి సినిమాల్లో వేషం కూడా వేసానుగా!” నవ్వింది. ఆ నవ్వులో అదే ‘వెలుగు’.

“మీరు.”అడగబోయి ఆగిపోయా.

“ముందు కూర్చోండి..! చిన్న ప్లాస్టిక్ స్టూలు వేసింది. కూర్చున్నా. అయిదు నిముషాల్లో వొత్తుల స్టౌ(విక్ స్టౌ) మీద పాలు వేడి చేసి ‘ఫిల్టర్’ కాఫీ ఓ కప్పు నాకిచ్చి తనో కప్పు తీసుకుంది. ఆలోగా చుట్టూ చూశా. చిన్న పాక. పొందిగ్గా, పరిశుభ్రంగా వుంది. కాఫీ చాలా బాగుంది. ‘ఫిల్టర్’ కాఫీ రుచి చూడాలంటే మద్రాసులోనే… అది అలవాటు అయ్యాక మరే కాఫీ తాగలేము.

“నా గురించి మీకేం తెలుసూ?” నవ్వి అన్నది.

“సారంగపాణి స్ట్రీట్‌లో మిమ్మల్ని మీ ఇంటినీ చూడ్డమే తప్ప పెద్దగా ‘తరవాతి’ విషయాలు తెలీవు. మీరొక మంచి నటి అని తెలుసు. చాలా సినిమాలు చూశాను మీవి. తరవాత కృష్ణ గానసభలో మీరు శాస్త్రీయ సంగీతం పాడటం తెలుసు. ఇంతమంచి గాయని అయ్యుండీ సినిమాల్లో ఎందుకు పాడలేదా అని అనుకునే వాడిని” చెప్పాను.

“శాస్త్రీయ సంగీతం మా అమ్మ నేర్పితే, నృత్యం మా మేనత్త రాజరాజేశ్వరి నేర్పింది..!”

“రాజరాజేశ్వరి అంటే అలనాటి…?”

“అవును.. గొప్ప స్టేజ్ ఆర్టిస్టు. సినిమాలు కూడా చేశారు.”

“ఓహ్! యీ విషయం ఇప్పటిదాకా నాకు తెలీదు..”

“అన్ని విషయాలూ అందరికీ తెలీదుగా.. అయినా.. ఎవరి జీవితాల్లో వారు బిజీగా వుంటారు. ఇప్పుడు మరీ వేగం.. మీరందరూ మెట్ల దగ్గర దిగినప్పుడు చూశాను. రాత్రి మీరు టిఫిన్ గురించి అడిగారని షాపు శెట్టి చెప్పారు. సరేనన్నాను.” మళ్లీ నవ్వుల వెలుగు.

“ఇక్కడ మీరు..?”

“ఎందుకో అందరి మీదా అన్నిటి మీదా విరక్తి కలిగింది. నా కోసం “కొన్ని క్షణాలైనా” నేను మిగుల్చు కోవాలనిపించింది. అందుకే ఓ రోజు నా నగలు కొన్ని అమ్మేసి ఎవరికీ చెప్పకుండా మద్రాసు విడిచి పెట్టేశాను. చాలా వూళ్లు తిరిగాను. ఇక్కడ ఎందుకో బాగుందనిపించింది. యీ పాక ఉండే చోటులో ఓ ముసలమ్మ వుండేది. చాలా ఏళ్ళనించి ఇక్కడే ఉంటోంది గనక యీ స్థలాన్ని ఆమెకి ఇచ్చారు. నేను వచ్చినప్పుడు నాకు వండి పెట్టింది ఆవిడే. మిగిలినవాళ్లకి నన్ను చుట్టంగా పరిచయం చేసింది. దానితో ఆమె చనిపోయాక దేవుడి వారసత్వంగా యీ చోటు నాకు దక్కింది. (నవ్వు)..”

“మద్రాస్ టీ నగర్‌లో మీ ఇల్లూ, ఇంటిముందు గార్డెనూ ఇవన్నీ..?”

“వాటన్నిటికంటే ఇదే నాకు బాగుంది. విశాలమైన ఇల్లు అక్కర్లేదండీ. విశాలమైన మనసుండలి. నేనెవరో ఈ ఇంటి ముసలమ్మకి తెలీదు. కానీ, తన దగ్గర వుండమని నన్నడిగింది. సరే అన్నాను. నిజంగా నన్ను ఓ తల్లిలా ప్రేమించింది… చాలా ప్రశాంతంగా నా వొళ్ళోనే కళ్లు మూసింది…!” ఆగింది. ఆమె చూపులు కింద పెట్టిన కాఫీ కప్పు మీదున్నా.. మనసక్కడ లేదని క్షణంలో తెలిసిపోయింది. బహుశా మనోనయనాల్తో ఆ వృద్ధురాల్ని చూస్తూ వుండొచ్చు. ముఖంలో నిర్వికారం వున్నది. కొన్ని క్షణాలు గడిచాయి.

“సారీ! ఏవో జ్ఞాపకాల్లోకి జారిపోయాను. సరేలెండి.. ఇంతకీ మీరు టిఫెన్ సంగతి చెప్పలేదు కదూ. వాళ్లు ముగ్గురూ. మీరూ .. ఇంకా డ్రైవరూ.. అంతేగా..!”

“అవును. కానీ వాళ్లని కనుక్కోవాలి. టిఫిన్ దైవదర్శనానికి ముందా, తరవాతా అనే విషయం. ఇంకా టైముందిగా. వాళ్ల స్నానాలవీ కానిచ్చాకే నే స్నానిద్దామనుకుంటున్నాను. మీరు ఏమీ అనుకోకపోతే మరో కప్పు కాఫీ మీరిస్తే తాగాలని వుంది..” అన్నాను.

సమయం ఆరున్నర అంతే.. కొండమీద గనక కొంచం చలి ఉంది. ఆ చిరుచలిలో వేడివేడి ఫిల్టర్ కాఫీ తాగటం ఎంత హాయిగా ఉంటుందో..

“తప్పకుండా . ఇక్కడ దొరికినంత చిక్కని స్వచ్చమైన పాలు మద్రాసులో దొరకవు తెలుసా.. కారణం ఇక్కడి ఆవులు, గేదెలూ మేసేది సహజమైన కొండగడ్డిని. యీ కొండంతా ఔషధ మొక్కలమయం అంటారు. అందుకేనేమో పాల రుచి అద్భుతం..!” మాట్లాడుతూనే వేడిపాలని మళ్ళీ వేడి చేసింది.

“మద్రాసు యిల్లు?” అడిగాను.. “మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి సుమా..”

“చెప్తానుగానీ యీ విషయాలు మళ్లీ మీరు సురేష్‌గారికీ, వాళ్ల వాళ్లకీ చెప్పకూడదు..”

“టిఫిన్‌కి వచ్చినప్పుడు వాళ్లు వస్తారుగా.. గుర్తుపట్టి మిమ్మల్ని అడిగితే?”

“అసలు మీరు వొస్తారని నేను వూహించలా. ఊహిస్తే ఆ శేటుతో ముందే చెప్పేదాన్ని. అతన్నే వొచ్చి కాఫీ టిఫెన్లు పట్టికెళ్ళమని. మొత్తానికి మీరు వచ్చేసారు. సరే మాట్లాడుకుంటున్నాం. టిఫిన్ కాఫీలు వాళ్ల దగ్గర చేర్చడం ఇప్పుడు మీ బాధ్యత. మీరు తీసికెళ్ళొచ్చు లేదా శేటుతో చెబితే వాళ్ళబ్బాయికిచ్చి సత్రానికే పంపుతాడు..” నవ్వింది.

“సరేసరే.. ఎవరికీ చెప్పను..” కాఫీ కప్పు మళ్లీ అందుకుంటూ అన్నాను.

“మా అమ్మ ఏనాడూ ‘కులం’ గురించి ఎత్తేది కాదు గనక మాది ఏ కులమో నాకు తెలీదు. ఓ జమీందారుగారు తనని గాంధర్వ వివాహం చేసుకున్నారని ఆ ఇల్లు వారిదేనని మాత్రం చెప్పేది. ఆయన పేరు.. నాయుడుగారు. చాలా పెద్ద జమీందార్. ఆయనకి భార్యా పిల్లలూ వున్నారుట. మా తమ్ముడు పుట్టిన రెండేళ్ళకే ఆయన చనిపోయారు. ఆయన మొహం అంటే మా నాన్నగారి మొహం చాలా కొద్దిగా గుర్తుంది. ఆయన పోయిన తరవాత చాలా గొడవలు జరిగాయి. అవన్నీ అప్పుడు వివరంగా తెలీదు గానీ తరవాత తెలిసింది. మా నాన్నగారి మొదటి భార్యా పిల్లలూ మద్రాసులో ఇంటిని స్వాధీనపరుచుకోవడానికి వచ్చారుట. అప్పుడు రాజరాజేశ్వరిగారి భర్త చాలా సహాయం చేసారని మా అమ్మ చెప్పేది. చనిపోకముందే మద్రాసులో ఇల్లు మా నాన్నగారు అమ్మ పేరిట రాయించి రిజిస్టరు చేయించారట. దాంతో తలదాచుకోవడానికి ఇబ్బంది లేకుండా పోయింది. మా అమ్మ సంగీతం నేర్పుతూ నన్నూ తమ్ముడ్నీ చదివించింది”

“ఎంతవరకు చదివారూ?”

“నేను ఎనిమిదో తరగతిలో వుండగా ‘స్కూలు పిల్ల’లాగా వేయమని ఒక ఆఫరు వచ్చింది. రాజరాజేశ్వరిగారి భర్త మా అమ్మగార్ని ఒప్పించారు. ఆ సినిమాలో నా వేషానికి చాలా పేరొచ్చింది. అది తమిళ సినిమా. ఆ తరవాత వరసగా అలాంటి రోల్సే వచ్చాయి. ‘వద్దు’ అనే పరిస్థితి కాదు మాది. ఇల్లుంది. చాలా పెద్దది. కానీ దాన్ని మెయింటెన్ చెయ్యాలిగా? అదీగాక ఆరోజుల్లో సంగీతం నేర్పినా భోజనం వరకూ ఫరవాలేదుగానీ చదువులకి చాలదుగా..”

“అద్దెకివ్వొచ్చుగా?”

“వచ్చినవాళ్లు ఖాళీ చెయ్యం” అని ఆక్రమిస్తే? రాజరాజేశ్వరిగారి భర్త కుమరేశన్ గారే అద్దెకివ్వొద్దన్నారు. నాకు పద్నాలుగేళ్ళప్పుడు ఆయన రాజరాజేశ్వరిగార్ని పెళ్లి చేసుకుని మా ఇంట్లోనే ఒక పోర్షన్‌కి వచ్చేశారు. అప్పట్నించీ ఆవిడ్ని ‘అత్తా’ అనే పిలిచేదాన్ని. మేనత్తగానే భావించాను. కుమరేశన్‌ని దేవుడిచ్చిన అన్నగా అమ్మ అనుకునేది గనక ఆయన్ని ‘మామా’ అని పిల్చేదాన్ని.

“అలాగా! ఓహ్… తరవాత?”

“తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో సుమారు వంద సినిమాలు నటించా. రాజరాజేశ్వరి అదే అత్త మొదట్లో తెలుగు, తమిళ నాటకాల్లో నటించింది. నేను బిజీ అవడంతో ఆమె సినిమాలు మానేసి నన్ను చూసుకునేది. రోజులు చాలా బాగా నడిచేవి. సడన్‌గా అమ్మ చనిపోయింది. ‘హార్ట్ఎటాక్’ వల్ల అన్నారు. మొత్తం భారం అంతా ఇంటి ఖర్చూ, తమ్ముడి చదువు ఖర్చు నా మీద పడింది. అదృష్టం ఏమంటే నాకు మంచి మంచి వేషాలు.. అంటే ఎక్కువ సిస్టర్ కేరక్టర్లూ, సెకండ్ హీరోయిన్ కేరక్టర్లూ వరసగా వచ్చాయి. దాంతో తమ్ముడి చదువుకి ఇబ్బంది కలగలేదు… నా ఐరవై మూడో ఏట కొంచెం ప్రేమలో కూడా పడ్డాను. అదో మత్తు. అప్పటివరకూ చక్కగా నా పని నేను చూసుకునేదాన్ని కాస్తా ప్రేమలో పడగానే కళ్లు బైర్లు కమ్మాయి. ఇంట్లోంచి వెళ్లిపోయి ఓనాడు నేను ప్రేమించిన మళయాళ నటుడ్ని పెళ్ళాడేశాను గుళ్ళో…! ” మళ్లీ నవ్వు.. ఆ నవ్వులో ఏ భావమూ లేదు..

అన్ని రోడ్లూ రోముకే అన్నట్టు.. సినిమా హీరోయిన్ల ‘ప్రేమ’లన్నీ గుళ్ళో పెళ్ళిళ్ళకే.. కాంటాక్ట్ (లైసెన్స్డ్) పెళ్లిళ్లకే..

“ఆ తరవాత?”

“మీతో వచ్చినవాళ్లు స్నానాలూ అవీ అయిపోయి వుంటై గనక మీరు సత్రానికి పోవటం మంచిది. ఓ పాతిక ఇడ్లీలూ, చెట్నీ, కారప్పొడీ, నెయ్యి ఆ శేటు కొడుక్కిచ్చి పంపిస్తాను. హాయిగా తినేసి దర్శనాలయ్యి సాయంత్రం వరకూ యీ వూళ్లో వుండేటట్లయితే రండి. అప్పుడు చెప్పుకుందాం…”

“మరి.. టిఫిన్లకి..”

“ఓహ్.. డబ్బు సంగతా? నేను ఎవరైనా టిఫిన్లు కావాలని అడిగితే, వారికోసం తయారు చేసి పెట్టేదాన్నే కానీ.. హోటల్ పెట్టినదాన్ని కాదు.. నా దగ్గర ఇంకా కొంత సొమ్ముంది. అదీ అయిపోతే బహుశా హోటల్ పెట్టాల్సి వస్తుందేమో.. ప్రస్తుతానికి కాఫీ టిఫెన్ల వరకూ ఉచితమే…!” పకపకా నవ్వింది. సన్నటి బంగారు గొలుసు తప్ప వేరే ఆభరణాలు ఏమీ కనిపించలేదు. చీర కూడా ఖరీదైనది కాదు. చక్కగా ఉతికిన కాటన్ చీర. అగరువత్తులు వెలుగుతున్నాయి గనక నేను ఇక్కడికి రాకముందే అంటే.. తెల్లవారు ఝామునే స్నానం చేసి వుండాలి. నేను లేచాను. కానీ కథ మధ్యలో ఆగిందన్న చింత వుంది.

“అన్నట్టు రెండు గుళ్లల్లోనూ ప్రసాదాలు దండిగా వుంటాయి గనక దాన్నే మద్యాహ్న భోజనం అనుకోండి. రెండుసార్లు అడిగినా పెడతారు. లడ్డూలూ, అరిసెలూ కొనుక్కుని ఇంటికి తీసికెళ్లొచ్చు” చెప్పిందామె..

శేటుతో చెప్పి సత్రానికి వెళ్లాను. నిజమే.. వాళ్లంతా సిద్ధం. గబగబా స్నానం చేసి నృసింహస్వామిని చూసి, కిందకి దిగేసరికి ఒంటిగంట. కారణం సురేష్‌గారు ప్రత్యేకంగా ‘పూజలు’ చేయించడం.

ప్రసాదాలు గిన్నెల్లో పెట్టేసాం. కిందకి వచ్చి శేఠ్ దగ్గర ఆగాము. ఇడ్లీలు, చెట్నీ, నెయ్యీ, కారప్పొడి రెండు మూడు గిన్నెల కేరేజీల్లో వున్నాయి. ‘రుబ్బి’న పిండేమో.. టిఫిన్ అద్భుతంగా వుంది. వేడి లేకపోయినా..

“వేడివేడిగా పెట్టారండి ఆవిడ. ఎంత బాగున్నాయో.. పది ఇడ్లీలు తిన్నాను..” మాతో కొండపైకి రాని డ్రైవర్ సంబరంగా చెప్పాడు. మేము తింటూ వుంటే..

పాక తలుపు గొళ్ళెం పెట్టి వుంది. అంటే ఆవిడ లేదన్నమాట. ఆంజనేయస్వామి గుడి దర్శించుకుని కింద కొచ్చేసరికి నాలుగు. “ఇవాళ రాత్రి ఇక్కడే వుండిపోతే బాగుంటుంది కదూ..!” అన్నాను. “ఒక నిద్ర చేస్తే చాలు అండీ…” అయినా ప్రిపేర్డ్‌గా రాలేదుగా. మళ్లీ వచ్చే నెల్లో వద్దాం….!” సామాన్లు, అంటే మా దిళ్లూ, దుప్పట్లూ మడతపెడుతూ అన్నారు సురేష్‌గారు.

వాళ్లతో వచ్చినప్పుడు వారి ఇష్టప్రకారమే మనమూ నడుచుకోవాలి గదా.. కార్లో వచ్చేటప్పుడు చూసినా పాక తలుపు మూసే ఉంది.

మద్రాసు చేరేవరకు నా మనసు మనసులో లేదు. కథ మధ్యలో ఆగింది. ఆమెకి విరక్తి కలిగేంతగా అక్కడ ఏమి జరిగి వుండాలీ? మరుసటి రోజునే ఓ కారు మాట్లాడుకుని షోలింగర్ వెళ్లాలని స్థిరంగా నిర్ణయించుకున్నాను.

పొద్దున్నే ‘విజయబాపినీడు’గారింటినించి ఫోను. అర్జంటుగా వచ్చెయ్యమని. నాకు మొట్టమొదట అవకాశం ఇచ్చి ప్రోత్సహించింది శ్రీ విజయబాపినీడుగారే. ‘నాకూ పెళ్ళాం కావాలి” నా మొదటి సినిమా. నన్ను ఆయన దగ్గరకు తీసికెళ్లి పరిచయం చేసింది గుత్తా రామ్ సురేష్‌గారు. గుత్తా రామ్ సురేష్‌గారు నాకు ‘డాక్టరు’గారి దగ్గర పరిచయమయ్యారు. (‘డాక్టరు’గారి ‘కథ’ ఫోటొలతో సహా త్వరలో వ్రాయబోతున్నాను) V.B. దగ్గరకు వెళ్ళాకే తెలిసింది. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా సిట్టింగ్‌లో కూర్చోవాలని.

(పాటల రచయితకి స్టోరీ సిటింగ్స్‌తో పెద్దగా సంబంధం ఉండదు. పాట రాసేటప్పుడు పాట ఏ సందర్భంలో వస్తుందో అంతవరకే చెబుతారు. కానీ విజయబాపినీడుగారు ‘నన్ను స్టోరీ సిటింగ్స్‌లో కూడా కూర్చోబెట్టుకునేవారు. నాకు ఎక్కడ సందేహం వచ్చినా, సీను బాగా లేదని అనిపించినా నిర్మొహమాటంగా చెప్పేవాడ్ని. ఒకోసారి ఎలా యితే బాగుంటుందో కూడా నా ఆలోచన చెప్పేవాడ్ని. కఠంతా తెలియడం వల్ల పాటలు కథలో కలిసిపోయేట్టు వ్రాయడానికి వీలయ్యేది. మా యింటి మహారాజూ, ఖైదీ 786, గ్యాంగ్ లీడర్, దొంగ కోళ్లు. ఇంకా ‘బిగ్ బాస్’ , కొడుకులు, ఫ్యామిలీ సినిమా వరకూ అన్నీ కథాచర్చల్లో నేనూ పాల్గొన్నా)

ఆ సిటింగ్స్ జరుగుతూ వుండగానే మా అమ్మగారికి ‘సీరియస్’ అని టెలిగ్రాం వచ్చింది. విజయవాడ చేరేసరికి భయంకరమైన తుఫాను. మొత్తానికి ఎలాగోలా రాజమండ్రి (హాస్పిటల్‌కి) చేరడం, మళ్లీ మద్రాస్ వచ్చిన రోజుకే మా అమ్మగారు ‘పరమపదించడం’ జరగడంతో ‘స్వర్ణకుమారిగారి కథ’ మనసులోనే సమాధి అయిపోయింది. అంటే అసలు గుర్తు రాలేదు. దానికి తోడు గ్యాంగ్ లీడర్ తరవాత ‘బిజీయెస్ట్’ రైటర్నయ్యాను.

ఆ తరవాత ‘ఘరానా మొగుడు’తో రోజుకి పద్ధెనిమిది గంటలు పని చెయ్యాల్సి వచ్చేది. సరే అది వేరే కథ.

నాలుగైదేళ్ల తరవాత మళ్లీ షోలింగర్ వెళ్లాం. అప్పుడు గుర్తొచ్చింది స్వర్ణకుమారిగారు. తీరా వెడితే ఆ పాక స్థానంలో ‘రెస్టారెంట్’ కట్టబడి వుంది. శేట్‌ని అడిగితే ‘తాయమ్మ’ని ఖాళీ చేయించడంతో (ఇల్లు) ఆమె వూరు వదిలి వెళ్ళిపోయిందని చెప్పాడు. నా మనసులో ఒక శూన్యం.

చెన్నై తిరిగి వెళ్లాక సారంగపాణి స్ట్రీట్‌కి వెళ్లాను. నాకు బాగా పరిచయమూ, స్నేహమూ వున్న ఓ ప్రొడక్షన్ మేనేజర్‌తో స్వర్ణకుమారిగారి ఇల్లు ‘కుమరేశన్’గారు ఓ కన్నడ ప్రొడ్యూసర్‌గారికి అమ్మేశాడని తెలిసింది. నాకు షాక్. స్వర్ణకుమారి ఆస్థిని పోనీ స్వర్ణకుమారి వాళ్ల తమ్ముడి ఆస్థిని కుమరేశన్ ఎలా అమ్మాడూ?? అతనికి ఏం అధికారం వుందీ?

‘కుమరేశన్’గురించి ఎంక్వైరీ చేస్తే అతను కుంభకోణం దగ్గర వుండే వాళ్ల స్వంత వూరికి వెళ్లిపోయాడని అతి కష్టం మీద తెలిసింది. స్వర్ణకుమారి తమ్ముడేమయ్యాడో తెలీదు. కనీసం అతని పేరు కూడా నాకు తెలీదు. కనుక్కునేదెట్టా? కొన్నేళ్ళు గడిచాయి.

చాలా మార్పులు.. చలన చిత్ర పరిశ్రమ హైదరాబాదుకి తరలింది. నేను హైద్రాబాదు, చెన్నైల మధ్య తిరుగుతున్నాను. ఇ.వి.వి.గారి ‘కన్యాదానం’ సినిమాకి పాట వ్రాయడానికి హైద్రాబాద్ వెళ్లాల్సి వచ్చింది. బేగంపేట ఏర్‌పోర్ట్‌లో దిగాక నన్ను లోకేషన్‌కి తీసికెళ్లారు. అక్కడినించి నా ‘బస’కి చేరాను. అదో గెస్ట్ హౌసు. పాట ఫస్టు వెర్షను పూర్తి చేసి గేప్ ఇవ్వాలనుకుని కాసేపు బైటికొచ్చి తిరుగుతుంటే శ్రీమూర్తి కనిపించాడు. అతను నాకు చెన్నైలో పరిచయం. టి.నగర్‌లో వుండేవాడు.

“గురూగారూ… బాగున్నారా? హైద్రాబాదు షిఫ్ట్ కాకుండా మంచి పని చేశారండి..!” అన్నాడు. ఆ రోజుల్లో మద్రాసు నించి హైద్రాబాద్ పని మీద వెళ్లినవాళ్లలో అక్కడికి ఆల్రెడీ షిఫ్ట్ అయినవాళ్లు అలాగే అనేవాళ్ళూ.

“మీరేం చేస్తున్నారూ? ఎక్కడుంటున్నారూ?” అడిగాను.

“అక్కడయితే బాగా ‘కింగ్’లా వుండేవాడ్నండి. అదేనండి. స్వర్ణకుమారిగారి దగ్గర. ఇక్కడికొచ్చాక రోజుకి ఒకళ్ల దగ్గర..”నిట్టూర్చాడు.

“స్వర్ణకుమారిగారి దగ్గరా?”ఆశ్చర్యంగా అడిగాను. వాళింటి ముందునించి వెళ్తూ వుండటమేగానీ ఆ రోజుల్లో శ్రీమూర్తిని అక్కడ చూడలేదు.

“అవునండీ! ఆవిడ ఫీల్డులోకి వచ్చినప్పట్నించీ ‘టచప్’ (Touch-up)బాయ్‌గా మొదలెట్టి మేకప్‌మేన్‌గా ఆవిడ దగ్గర ఎదిగానండి. భద్రయ్యగారు నేర్పారండి..” గొప్పగా అన్నాడు. భద్రయ్యగారి శిష్యులకి ఆ గర్వం వుండటం అసహజమేమీ కాదు.

“అసలావిడ ఎక్కడికెళ్లారూ? ఎందుకెళ్లిపోయారూ?” అడిగాను. స్వర్ణకుమారిని చూసినట్టు చెప్పలేదు.

“అదో పెద్ద కథండి. కసాయివాడ్ని గొర్రె నమ్మినట్టు ఆ కుమరేశంగాడ్ని స్వర్ణకుమారి అమ్మగారు నమ్మారండి. కుమరేశన్, జమిందారుగారి దగ్గర మేనేజర్‌గా కాదు గానీ పనివాడుగా, అంటే చనువున్న పనివాడుగా వుండేవాడండి. నేనప్పుడు భద్రయ్యగారి ఇంటిదగ్గరే వుండేవాడ్నండి. జమిందారుగారు పోయాక, స్వర్ణమ్మగారి అమ్మగారికి సహాయం చేస్తున్నట్టుగా వుండేవాడండి. ఆవిడ ఉత్త వెర్రిబాగుల్దండి. ఆవిడా, ఆవిడ పిల్లలూ సంగీతమూ తప్ప ఏదీ పట్టించుకునేది గాదండి. ఆ పిల్ల చదువుకునేటప్పుడు తల్లి హార్ట్ ఎటాక్‌తో చచ్చిపోయిందన్నారండి. నాకైతే నమ్మకం లేదండి. కుమరేశన్ అంతకు రెండు మూడేళ్ళ ముందే రాజరాజేశ్వరి అనే ఆవిడ్ని పెళ్లి చేసుకుని, స్వర్ణమ్మగారింట్ళోనే ఓ పోర్షన్‌లోనే దిగాడండి. ఆ రాజమ్మగారూ మంచి మనిషేనండి. స్వర్ణమ్మగారు బిజీ అయ్యాక రాజమ్మగారు సినిమాలు మానేసి ఇంట్ళో వుండేదండి. స్వర్ణమ్మ దగ్గర నన్ను టచ్చప్‌గా పెట్టిందీ, మేకప్ మేన్నీ చేసిందీ భద్రయ్యగారేనండి..!”

“ఆ తరవాత?” అడిగాను.

“తమ్ముడు బియ్యే చదువైతుండగా, ఆ స్వర్ణమ్మగారు ప్రేమలో పడిందండీ. అయితే కుమరేశన్‌గారు చాలా తెలివిగా ‘వెళ్లిపో’ కానీ, నీ ఆస్తి మాత్రం మీ తమ్ముడి పేరు మీద రాసి వెళ్ళు.. ఎందుకంటే ఒకవేళ ఆ మళయాళంగాడు నిన్ను తన్ని తగలేసినా కనీసం మీ అమ్మ ఆస్తి నీకు బతకడానికి ఊపయోగపడుతుందీ అని చెప్పాడండి. ఆ రోజుల్లో మేమందరం కుమరేశన్ దేవుడిలాంటోడు అనుకునేవాళ్ళమండి. ఆయన చెప్పింది సబబుగానే అప్పుడూ అనిపించిందండి. స్వర్ణమ్మకూడ మాట్లాడకుండా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టిందండి. స్వర్ణమ్మగారి తమ్ముడి పేరు ‘ధనుంజయ’ అండీ. డిగ్రీ కాగానే పాపం ఆ పిల్లాడికి తన చుట్టాన్నే ఎక్కడ్నించో తీసుకొచ్చి పెళ్లి చేశాడండీ… కుమరేశన్..!” ఆగాడు శ్రీమూర్తి.

ఏవో మబ్బులు విడిపోయి మళ్ళీ ముసురుకుంటున్నట్లనిపించింది..

“స్వర్ణమ్మ వెనక్కి రాలేదా?”

” ఆ విషయం మాత్రం అసలు తెలీదండి. అది కుమరేశన్ గాడికే తెలియాలండి. పిల్లాడి పెళ్లయిన మూడ్నెల్లకే రాజేశ్వరమ్మకి ‘క్షయ’ జబ్బు వచ్చిందండి. ఆవిడ్ని రాయవెల్లూరులో చేర్చారండి…!!”

” ఊ తరవాత?”

“నిజం నాకు తెలీదండి. అబద్ధం చెబితే పాపం వస్తాదంటారు కదండీ…”

“నిజం చెప్పండి మూర్తీ..”

” ఆ కుర్రాడు ఎక్కడికెళ్లాడో ఎవరికీ తెలీదండి. ఆ పిల్లాడికిచ్చి చేసిన అమ్మాయికీ కుమరేశన్‌కీ సంబంధం వుండటం చూసి ఆ పిల్లాడు ఇల్లొదిలి పోయాడని పనిమనిషి ఓ రోజున నాతో అన్నదండీ..”

సైలెంటైపోయాను.

“మరి ఆస్తి?”

“స్వర్ణమ్మ చేతే నీతులు చెబుతూ నమ్మించి సంతకాలు పెట్టించిన వాడికి, ఆ కుర్రోడి చేత సంతకాలు పెట్టించుకోవడం ఎంతసేపండీ? వాడు ఆ యిల్లు ఓ కన్నడపు ఆయనకి అమ్మడం నాకు తెలుసండీ…!” వివరించాడు శ్రీమూర్తి.

” ఆ తరవాత?”

“నాకు ఏమె తెలీదండి. ఆ అమ్మాయి ఏమయిందో, ఆ బాబు ఏమైపోయాడో ఏమీ తెలీదు. కుమరేశన్‌గాడు మాత్రం లక్షలు దండుకున్నాడండీ ఆ ఇల్లు అమ్మి.. నాకు తెల్సింది అంతేనండి..!”

ఓ నిట్టూర్పు ఒకేసారి వెలువడింది. ఇద్దర్ని దగ్గర్నించీ..

డిసెంబరు (2013)లో విజయవాడలో రెండు రోజులు వున్నాను. శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర్రావు (నాకు 35 సంవత్సరాలనుంచి స్నేహితులు)గార్ని కలిసి, అక్కడే జలదం ప్రభాకర్ (నది .. ఎడిటర్)గార్ని కలిసి చాలా సేపు ఖబుర్లు చెప్పుకుని మళ్లీ నా హోటల్‌కి బయలుదేరుతూ మధ్యలో ఒక చోట ఆగాను… ఓ చిన్న పనుండి..

విజయవాడలో లెక్కకి మించిన స్నేహితులున్నారు. ఒకతనికి వొంట్లో కొంచెం సుస్తీగా వుందని తెలిసి చూడ్డానికి వెళ్ళానన్నమాట. చూసి వస్తుండగా పరిచయమైన ‘గొంతు’ వినిపించింది. ఆ గొంతే.. స్వర్ణకుమారిగారిది.

ఆ పాత పెంకుటింటి ముందు ఆగి.. “తాయమ్మా” అని పిలిచినాను. ఆమె బయటికొచ్చింది. వయసు తెచ్చిన చిన్న చిన్న మార్పులే తప్ప పెద్ద మార్పులేం లేవు. “ఆఖరికి వచ్చారన్నమాట…!” నవ్వింది. అదే నవ్వు… అంతే మధురంగా “గుర్తుపట్టారా?” అన్నాను.

“మిమ్మల్ని ఆ మధ్య లిటిల్ చాంప్స్. అదే జీ తెలుగు చానల్లో ప్రతీవారమూ చూశాను గనక గుర్తుపట్టకేం. అదీగాక మీది మరిచిపోయే పేరా?” మళ్లీ నవ్వింది.

‘నవ్వడం దేవుడు మనిషికి ఇచ్చిన వరం’ అని మరిచిపోయిన వాళ్లకి, స్వర్ణకుమారిని పరిచయం చెయ్యాలనిపించింది. లోకంలో కొందరు ‘నిరాశా అగరుబత్తీలు’ ఉంటారు. ఎప్పుడూ నిట్టూరుస్తూ ప్రపంచంలోని బాధలన్నింటినీ భరిస్తూ భారంగా జీవితాన్ని లాగుతూ వుంటారు. మనిషి కనపడంగానే వాళ్ల బాధని వెళ్లగక్కేస్తారు. చెప్పినవాడు బాగానే వుంటాడు గానీ, విన్నావాడికి ఉత్సాహం చచ్చిపోయి నిరాశలో మునిగిపోతాడు. కొందరు ఎంత బాధలో వున్నా సరే అది బయటపడనివ్వక ‘ఆశ’నీ, సంతోషాన్నీ పంచేవారైతే, కొందరు నిరంతరం నిరాశని మాత్రమే వెళ్లగక్కే జీవులు.

స్వర్ణకుమారి నిజంగా ‘ఆశా బ్రాండ్ అగర్‌బత్తీ’. ఆశల సువాసనని వెదజలుతూ వుండే నిజమైన మనిషి.

“లోపలికి రానివ్వరా?” నవ్వి అడిగాను.

“బాధపడతారు..!”

“పడను..!”

“అయితే రండి..!” పక్కకి తప్పుకుంది. లోపలికి అడుగుపెట్టాను. అంతా శుభ్రంగా వుంది. కానీ మంచం మీద ఒకామె శరీరం తొడిగిన అస్థిపంజరంలా వుంది.

“ఈమె రాజరాజేశ్వరి. నా మేనత్త. కొంచెం సుస్తీగా వుంది. త్వరలోనే కోలుకుంటుందని డాక్టర్సు అన్నారు. చంద్రగారూ, ఈమె నాకు నృత్యం నేర్పిన గురువు,.. మంచి నటి కూడా..!” పరిచయం చేసింది. కళ్లు చెమర్చాయి. ఆవిడ కష్టం మీద రెండు చేతులూ ఎత్తింది. నేనూ చేతులు జోడించాను.

“ఫిల్టర్ కాఫీ ఇద్దునుగానీ .. ఇది సమయం కాదు.. సరే.. కొంచెం బయటకు వెళ్లాల్సిన పని వుంది. కూడా వస్తారా..!! ” అంటూ బయటికొచ్చింది.

నేనూ మరోసారి రాజేశ్వరిగారికి నమస్కారం చేసి బయటికొచ్చాను.

“ఏమీ లేదు.. మీరేమో గతాన్ని గురించి ప్రశ్నిస్తే తను ‘భోరు’మంటుందని బయటికి లాక్కొచ్చాను.” అన్నది.

“ఏం చేస్తున్నారూ?”

“నేను టైలర్నయ్యానండోయ్.. అదీ సూపర్ టైలర్ని. జాకెట్టుకి నూటయాగ్భై తీసుకుంటున్నాను. షాపు కూడా పెట్టాలెండి..” పకపకా నవ్వింది.

“రాజరాజేశ్వరిగార్ని…”

“ప్రస్తుతం నేనే చూసుకుంటున్నాను. గతాన్ని నేను మర్చిపోయినా పాపం తను మర్చిపోలేకపోతోంది… సరే.. గతాన్ని భోంచెయ్యడం ఎందుకూ? ప్రస్తుతం ఆమె “షుగర్’తో నీరసించిపోయింది. బతుకుతుందనే నమ్మకం నాకు వుంది. మనిషి ఆశాజీవి కదా…! ఒకవేళ బతకలేదనుకోండి..”సరే ఆమెకి అన్ని బంధాలనించీ ‘విముక్తి’ లభిస్తుంది. ఏదైతేనేం..” నిశ్చలమైన మనస్సుతో అన్నది స్వర్ణకుమారి.

“మీరేమీ అనుకోకపోతే ఒక్క కాఫీ తాగుదామా!” అడిగాను.

“దానికేం భాగ్యం…!”

“రోడ్డుపక్కనే వున్న ఓ ఫాస్టు ఫుడ్ సెంటర్ దగ్గర ఆగి అక్కడున్న ప్లాస్టిక్ స్టూల్స్ మీద కూర్చుని కాఫీ తాగాము.

ఏ ప్రశ్నా అడగాలనిపించలేదు. ప్రశ్నలు లేవు. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది.

“చంద్రగారూ. మీరోసారి లిటిల్ చాంప్స్‌లో అన్నారు. “వై కలెక్ట్ వెన్ యూ కెనాట్ కేరీ” అని! నాకా మాట చాలా నచ్చింది. ఏం తీసుకుపోతామని పోగు చేసుకోవాలీ? ఆఖరికి అనుభవాలతో సహా…!” నా వంక చూస్తూ నవ్వింది.

ఇంకేం చెప్పనూ!

 

‘స్వర్ణకుమారి’ కథ రాస్తున్నంతసేపూ ఒళ్ళు పులకరిస్తూనే వుంది. లోకంలో జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పేవాళ్లూ ఉంటారని తెలీటం లేదూ…!

 

శుభాకాంక్షలతో

భువనచంద్ర

నాన్న అంటే…వొక ఆదర్శం, వొక వాస్తవం!

నాన్నగారి  నవల "విజయ" ఆవిష్కరణ సందర్భంగా....ఆయన ప్రాణ మిత్రుడు మహాలక్ష్మేశ్వర రావు గారితో...

నాన్నగారి నవల “విజయ” ఆవిష్కరణ సందర్భంగా….ఆయన ప్రాణ మిత్రుడు మహాలక్ష్మేశ్వర రావు గారితో…

1

ఇప్పుడెలా వుందో తెలియదు చింతకాని!

          ఖమ్మం పక్కన చిన్న వూరు చింతకాని. ఆ రోజుల్లో చింతకాని స్టేషనులో పాసింజరు రైలు దిగితే వూళ్ళో నడిచి వెళ్లడానికి అర గంట పట్టేది. ఆ స్టేషను నించి వూరి నడి బొడ్డు – పీర్ల చావిడి- దాకా వెళ్తే మధ్యలో వొక పల్లెటూరి బతుకు ఎట్లా వుంటుందో అది అంతా అద్దంలో కనిపించినట్టు కనిపించేది. ఆ ఎగుడు దిగుడు బాటలు, అక్కడక్కడా విసిరేసినట్టుండే ఇళ్ళు, అనేక ఏళ్ల చరిత్ర భారంతో వంగిపోయినట్టున్న పెద్ద పెద్ద చింత చెట్లు, రాగి చెట్లు, మధ్యలో రామయ్య బావి, సీతమ్మ దిబ్బ….అబ్బాని తలుచుకున్నప్పుడల్లా ఈ పొడుగాటి బాట గుర్తొస్తుంది. సాయంత్రం బడి నించి వచ్చాక, రోజూ ఆ స్టేషను దాకా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం, నేనూ అబ్బా.

స్టేషనుకి చేరాక అప్పటికే ప్లాట్ ఫారం బెంచీల మీద ఇంకో ముగ్గురు నలుగురు టీచర్లు ఆయన కోసం ఎదురుచూస్తూ వుండే వాళ్ళు. అక్కడ బెంచీల మీద కూర్చోనో, ప్లాట్ ఫారం మీద నడుస్తూనో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నేను స్టేషను ఆఫీసులో బెంజిమన్ మాస్టరు గారితో ఆయన యంత్ర సామగ్రితో ఆడుకుంటూ వుండే వాణ్ని. వొక గంటా, గంటన్నర తరవాత మేము ఇంటి ముఖం పట్టేవాళ్లం. ఈ మొత్తం దినచర్యలో నేను చాలా ప్రశ్నలు రువ్వుతూ వుండే వాణ్ని. కొన్ని మాటలు, కొంత మౌనం. కొన్ని ఆటలు, కొంత అల్లరి. కానీ, ఈ బాల్య అనుభవం వొక పునాది తరవాత నేను చేయబోయే రహస్య సాహిత్య ప్రయోగాలకు! అప్పటికే అబ్బా అనువాద నవల “కళంకిని” (1973) అచ్చయి, తెలుగు సాహిత్యలోకం ఆయన వైపు అబ్బురంగా చూడడం మొదలెట్టింది. వొక రచయిత విజయాన్ని కళ్ళారా చూడడం, చెవులారా వినడం అదే మొదలు నాకు.

చింతకాని స్కూల్లో అబ్బాజాన్ “మధురవాణి” అనే వొక గోడ పత్రిక నడిపే వాళ్ళు. అది రెండు నెలలకి వొక సారి దినపత్రిక సైజులో నాలుగు పుటలుగా స్కూలు లైబ్రరీలో అతి విశాలమయిన బోర్డు మీద అందమయిన ఆయన చేతిరాతతో దర్శనమిచ్చేది. టీచర్ అంటే పాఠాలు చెప్పడం మాత్రమే కాదనీ, విద్యార్థిలో సృజనాత్మకత పెంచే బాధ్యత అని ఆయన భావించే వారు. “సార్ క్లాసులో కూర్చుంటే చాలు, వొక్క సారి వింటే అదే మెదడులో నిలిచిపోతుంది,” అని విద్యార్థులు ఆయన గురించి గర్వంగా చెప్పేవాళ్ళు. కానీ, అక్కడితో ఆగకుండా ఆయన ఎంతో కొంత భాషా ప్రేమ, సాహిత్య సంస్కారం పెంచాలన్న దృష్టితో “మధురవాణి” మొదలు పెట్టారు. ఇందులో కేవలం విద్యార్థుల రచనలు మాత్రమే వేసే వాళ్ళు. వాటిని ఆయనే కొంత ఎడిట్ చేసి, ఆ దిన పత్రిక సైజు పోస్టర్ల మీద రాసే వారు. “సారు చేతిరాత కోసమే చదువుతున్నాం ఇది,” అని విద్యార్థులు అనే వాళ్ళు. ఆలోచనలు ఎంత ముఖ్యమో, చేతిరాత అంత ముఖ్యమని ఆయనకి పట్టింపు వుండేది. విద్యార్థులని దగ్గిర కూర్చొబెట్టుకుని, వాళ్ళ దస్తూరి దిద్దబెట్టే వారు ఆయన- ఈ “మధురవాణి” పత్రిక గోడమీద పెట్టే రోజుల్లో నేను అయిదో తరగతి. ఆ పత్రికలో నా రచన కనిపించాలని నా పట్టుదల. కానీ, అబ్బా వొక పట్టాన వాటిని వొప్పుకునే వారు కాదు. చాలా సార్లు తిరగరాయించేవారు. నిర్మొహమాటంగా నిరాకరించే వారు. అక్కడ వున్న కాలంలో “మధురవాణి”లో నేను అతికష్టమ్మీద వొక గేయం, వొక కథ మాత్రమే చూసుకోగలిగాను. కానీ, రచయితగా అది నాకొక ప్రయోగ శాల అయ్యింది, చాలా ప్రయోగాలు విఫలమయినా సరే!

నా చింతకాని బాల్యం గురించి అన్వర్ ఊహించిన చిత్రం

నా చింతకాని బాల్యం గురించి అన్వర్ ఊహించిన చిత్రం

ఇక ఇంటి విషయానికి వస్తే, పీర్ల చావిడి పక్కనే, మా ఇల్లు వుండేది. మా ఇల్లు అంటే కిలారు గోవింద రావు గారి ఇల్లు. ఆ రెండు గదుల ఇంట్లో తొమ్మిది మంది వుండే వాళ్ళం. దానికి తోడు, ఎప్పుడూ నాన్నగారి ఎవరో వొక సాహిత్య మిత్రుడు ఇంట్లో అతిధిగా వుండే వారు. వాళ్ళు మొదటి గదిని ఆక్రమించేస్తే, మేమంతా రెండో గదిలో ఇరుక్కుని వుండే వాళ్ళం. నేను మాత్రం మొదటి గదిలో ఆ సాహిత్య మిత్రుల సంభాషణలు వింటూ మూగిమొద్దులా కూర్చొని వుండే వాణ్ని. “ఒరే, నువ్వు కాస్త నోరు విప్పరా! నాకు భయమేస్తోంది నిన్ను చూస్తే!” అని వొక సారి దాశరథి గారు బయటికే అనేసి, నన్ను తన కుర్చీ పక్కన చేతుల్లోకి తీసుకుని, మాటల్లో దింపే ప్రయత్నం చేసే వారు. ఉర్దూ గజల్ వొకటి చెప్పి, దాన్ని నా చేత బట్టీ కొట్టించే వారు. అది నాకు ఎంతో వుత్సాహకరమయిన క్రీడ అయ్యింది. ఆ గజల్ రెండు పంక్తులూ నెమరేసుకుంటూ నేను, నా సొంత కవితలు కట్టే వాణ్ని. ముందు వాటిని పాడుకుంటూ తిరిగే వాణ్ని, నా స్నేహితులతో పాడించే వాణ్ని, ఆ తరవాత కాయితం మీద పెట్టే వాణ్ని. ఇదీ నా పాఠశాల!

ఈ మూడు భిన్న అనుభవాల కేంద్ర బిందువు అబ్బా. ఇక నిత్యనైమిత్తిక బతుక్కి వస్తే, ఆర్ధిక పరిస్తితులు బాగుండక, ఇంట్లో ఎప్పుడూ జొన్నన్నం, గోంగూర పచ్చడి మాత్రమే వుండేది. నెలకోసారి తెల్లన్నం, పావుకిలో మాంసం వండిన రోజు పండగలా వుండేది. కిలారు గోవిందరావు గారి ఇంటి నించి అప్పుడప్పుడూ కొంచెం ఎక్కువ పాలు, పెరుగు వచ్చిన రోజున అది మహాప్రసాదంలా వుండేది. కానీ, ఆర్థిక పరిస్తితులు బాగా లేవన్న బీద అరుపులు ఇంట్లో వినిపించేవి కావు. కొత్త పుస్తకాలు ఇంటికి వచ్చేవి, కొత్త కొత్త సాహిత్య మిత్రులు ఇంటికి వచ్చే వారు, చాలా కళకళలాడుతూ వుండేది ఇల్లు. “ఈ మాత్రం బర్కతు వుంది చాలు” అని తృప్తిపడేది అమ్మీ.

ఆ చిన్న వూళ్ళో మా చదువులు ఏమయిపోతాయో ఏమో అన్న బెంగతో కుటుంబాన్ని ఖమ్మం మార్చాలనుకున్నారు అబ్బా. చింతకాని, ఆ చుట్టుపక్కల వూళ్లలో ఈ విషయం తెలిసిపోయి, మా ఇల్లు వొక తీర్థ క్షేత్రమయ్యింది. ప్రతి వూరి నించీ విద్యార్థులు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో ఇరవైల, పాతిక సంఖ్యలో వచ్చి, అబ్బాకి నచ్చచెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వూళ్ళో పెద్ద పెద్ద రైతులు, నాయకులు ఖమ్మం జిల్లా పరిషత్తుకి వెళ్ళి అబ్బా బదిలీని ఆపడానికి ప్రయత్నించారు. కానీ, అబ్బా ఎవరి మాటా వినలేదు. చివరికి మాకు స్టేషనులో వీడ్కోలు ఇవ్వడానికి వూరంతా పెద్ద ఊరేగింపుగా స్టేషనుకు వచ్చింది, కళ్ల నీళ్ళు పెట్టుకొని!

2

“మీరు ఖిల్లాలోపల వుండాలి కౌముదీ సాబ్!”

అంటూ ఖమ్మం ముస్లిం మిత్రులు కొందరు ఖిల్లాలో చాలా చవకలో ఇల్లు చూపించారు. కానీ, అబ్బాకి అది ఇష్టం లేదు. “ఆ ఖిల్లా బంది ఖానా లా వుంది,” అనడం నాకు ఇప్పటికీ గుర్తు. కాంగ్రెస్ ఆఫీస్ వెనక ప్రసిద్ధ ఉర్దూ –తెలుగు రచయిత హీరాలాల్ మోరియా గారి ఇల్లు వుండేది. మళ్ళీ రెండు గదుల ఇల్లే, కానీ, చాలా పెద్ద ఆవరణ వుండేది. మోరియా గారు నామమాత్ర అద్దె మీద ఆ ఇల్లు మాకు ఇచ్చారు.

ఖమ్మం మా జీవితాల్లో పెద్ద కుదుపు. అబ్బా ఆలోచనల్లో కొత్త మలుపు. “సరిత” అనే టైటిల్ తో వొక సాహిత్య పత్రిక పెట్టాలని ఖమ్మంలో ఆయన “సాహితి ప్రెస్” పెట్టారు. ఖమ్మానికి ఆ ప్రెస్ అతి కొద్ది కాలంలోనే అదొక సాహిత్య కేంద్రంగా మారింది. కానీ, పత్రిక మొదటి సంచిక వచ్చే లోపలే, అబ్బా నష్టాల్లో కూరుకుపోయారు. ప్రెస్ నిండా మునిగింది, మేము అప్పుల్లో దిగడిపోయాం. ఆ తరవాత మా ఆర్థిక జీవనం మా చేతుల్లో లేకుండా పోయింది.

ఆ పరిస్థితుల్లో అబ్బా తెలుగు ప్రసంగాలు విన్న వొక క్రైస్తవ మిషనరీ ప్రచురణ సంస్థ ఆయన్ని వాళ్ళ తెలుగు విభాగం డైరెక్టరుగా ఆహ్వానించింది. మంచి జీతము, నాకు ఆస్ట్రేలియాలో కాలేజీ చదువుకి ఉపకారవేతనమూ ఆఫర్ చేసింది. “నా విశ్వాసాలకి దరిదాపుల్లో లేని ఏ పని నేను చేయలేను. పైగా, నా ఈమాన్ (faith) ని అమ్ముకోలేను,” అని అబ్బా ఖరాఖండిగా చెప్పడం నాకు గుర్తుంది. అబ్బా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఆయన చిత్తశుద్ధీ, సిద్ధాంత బలమూ కనిపించేవి. ఆయన అరబ్బీ, ఉర్దూ, ఫార్సీ బాగా చదువుకున్నారు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతంతో పాటు! ఇస్లాం, వేదాలూ, మార్క్సిజం కూడా బాగా చదువుకున్నారు, ప్రాచీన ఆధునిక సిద్ధాంతాలతో పాటు! కానీ, వీటిలో వేటికీ ఆయన పూర్తిగా తలవంచలేదు. “అవన్నీ కళ్ళు తెరిపించాలి కానీ, కళ్ళు మూయకూడదు, అవన్నీ తలలో వుండాలి, కానీ అవే తల చుట్టూ రోకలి కాకూడదు,” అనే వారు. అటు అమ్మీ తరఫునా, ఇటు అబ్బా తరఫునా మా కుటుంబానికి కమ్యూనిస్టు చరిత్ర వుంది. అట్లా అని, వీళ్ళెవ్వరూ ఇస్లాం కి దూరం కాలేదు, అవి వొకే వొరలో ఎట్లా ఇముడుతాయి అని కొందరికి ఆశ్చర్యం కలిగిస్తూ.

తాతయ్య గారు నిజాం కొలువులో పనిచేశారు. దానికి భిన్నంగా నిజాంకి వ్యతిరేకంగా ఆయుధాలు దూసిన కమ్యూనిస్టుల పక్షం వహించారు అటు అమ్మీ తరఫు వాళ్ళు, ఇటు అబ్బా తరఫు వాళ్లు కూడా! పార్టీ కోసం వున్నదంతా వూడ్చిపెట్టారు, బంగారం లాంటి ఇనామ్ భూముల్ని కూడా ఖాతర్ చెయ్యలేదు. తీవ్ర ఆర్థిక కష్టానష్టాల్లో వున్నప్పుడు, బాగా కోపం వచ్చినప్పుడు అమ్మి అప్పుడపుడూ అనేది, “భూములూ ఇళ్ళు వదిలేసి, మీ అబ్బా పుస్తకాల గోనె సంచి వీపునేసుకుని, బెజవాడ వెళ్ళిపోయారు, పార్టీ కోసం!” అని. ఇంతా చేస్తే, అమ్మి కుటుంబం కూడా పార్టీ కోసం చివరి బంగారపు తునక కూడా ఇచ్చేసిన వాళ్ళే! పార్టీ రెండుగా చీలిపోయాక తమ ఇల్లే వాటాలు పడి, చీలిపోయినంత క్షోభ పడ్డారు, ఆ క్షోభ అబ్బాని చివరి దాకా వెంటాడుతూనే వుండింది, ఇలా మిగలాలా అని!

3

394925_10101015978163497_1224429015_n

“షంషుద్దీన్, నువ్వు రచనని అంతగా పట్టించుకోవడం లేదు. నువ్వు చాలా రాయగలవు. రాయాలి,”

అని అబ్బా బాల్యమిత్రులు, ఆనక బంధువులూ అయిన హనీఫ్ పెద నాన్న గారు ఎప్పుడూ అబ్బాని కోప్పడుతూ వుండే వారు. రచయితగా ఆయన ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆయన మిత్రులు చాలా మంది ఇప్పటికీ అంటూ వుంటారు. ఆయన రచనలు ఇప్పుడు పెద్దగా అందుబాటులో లేకపోవడం మా దురదృష్టం. ఆయన 1960 నించి 1975 వరకూ విశాలాంధ్ర, యువజన, ప్రగతి, జనశక్తి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో విస్తృతంగా సమీక్షలూ, కవిత్వం, కథలూ రాశారు, అనువాదాలు చేశారు. అభ్యుదయ రచయితల సంఘం ప్రచురించిన ప్రతి ప్రత్యేక సంకలనంలోనూ ఆయన కవిత్వం కనిపిస్తూనే వుండేది. కానీ, ఇదంతా నాకు రచయితగా వూహ తెలియని వయసు ముందే ఎక్కువగా జరిగాయి. బడి పంతులు బదిలీల బతుకులో వొక వూరంటూ స్థిరం లేకపోవడంతో చాలా రచనలు పోయాయి, ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి చాలా రచనలు దగ్ధం అయ్యాయని పెద నాన్న గారు అంటూండే వారు. ఇప్పుడు మిగిలిన కొన్ని కవితలయినా పెద నాన్నగారు తన ఇంట్లో భద్రపరచిన నోట్ పుస్తకాల నించి తీసినవి కొన్ని, కవితలు. నేను అక్కడా, ఇక్కడా తీసి దాచిపెట్టినవీ ఇంకొన్ని, ఇప్పుడు ఖాదర్ బాబాయ్ కొత్తగా సేకరిస్తున్నవి కొన్ని.

1975 తరవాత రచనకి సంబంధించి అబ్బా దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. “నాకు ఎందుకో చదవడంలో వున్న ఆనందం, రాయడంలో దొరకడం లేదు,” అనే వారు చాలా సార్లు. “అది రాయకుండా వుండడానికి వొక మిష మాత్రమే!” అని నేనొకటి రెండు సార్లు అన్నాను కూడా! కానీ, పార్టీ చీలిక ఆయన మీద గాఢమయిన ప్రభావం వేసిందని నాకు గట్టిగా అనిపించేది. అట్లా అని, పార్టీ పట్ల ఆయన నిబద్ధత ఏమీ తగ్గలేదు. ఖమ్మం వచ్చాక ఆయన అరసం సాహిత్య సమావేశాల్లో, సభల్లో నిమగ్నం అయ్యారు. అరసం అధ్యక్షుడిగా ఆయన ఖమ్మం జిల్లాలో చేసిన కృషి చిన్నదేమీ కాదు. మారుమూల పల్లెలో ఎక్కడ ఏ కవి, ఏ రచయిత దాగి వున్నా, ఖమ్మం పట్టుకొచ్చి, వేదిక ఎక్కించి, వాళ్ళ రచనల్ని తానే పత్రికలకి కూడా పంపించి, అదొక ఉద్యమంగా చేశారు. బెజవాడ, హైదారాబాద్, వైజాగ్ లాంటి సాహిత్య కేంద్రాలతో ఖమ్మంని అనుసంధానించి, ఖమ్మం జిల్లా సాహిత్య ఆవరణని పెంచారు. ఆ తీవ్రత చూస్తూ, “నువు కావ్యకర్తవి కావాలి కానీ, కార్యకర్తగా మాత్రమే మిగలకూడదు,” అని హనీఫ్ గారు గట్టిగానే మందలించే వారు.

ప్రజా నాట్య మండలి, అరసం వారసత్వ ప్రభావం వల్ల తానే వొక ఉద్యమంగా వుండడం, నిరంతరం జనంలో పని చెయ్యడం ఆయనకిష్టమయ్యింది. అక్షరదీపం కార్యక్రమం మొదటి సారి ప్రవేశపెట్టినప్పుడు, ఖమ్మం జిల్లా మారుమూల పల్లెల్లోకి ఆయన ఆ దీపాన్ని పట్టుకుని నడిచారు. రోడ్లు దిగని సర్కారీ జీపులకి సైతం పల్లె బాట చూపించారు, జీపు వెళ్లని చోటికి కాలి నడకన వెళ్ళి, తరగతులు నిర్వహించారు. నిరక్షరాస్యుల కోసం కథలూ, పాటలు రాసి, రాయించి, వాటిని పల్లెల్లో మార్మోగేట్టు చేశారు, ఆ క్రమంలో ఆయన ఆరోగ్యం దెబ్బ తినడం మొదలయ్యింది. దీనికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు నానాటికీ దిగజారడం మొదలయ్యింది. నా చేతికి డిగ్రీ రాక ముందే, నేను వుద్యోగంలోకి వెళ్లాల్సి వచ్చింది. దిగువ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే కష్టాలన్నీ వొక్క పెట్టున దాడి చేశాయి.

పరిస్తితులు ఎటు తిరిగి ఎటు వచ్చినా, ఇంట్లో సాహిత్య వాతావరణం మాత్రం స్వచ్ఛంగా అలా మిగిలిపోయింది. అన్ని పని వొత్తిళ్ల మధ్యా, ఈతి బాధల మధ్య కూడా అబ్బా కనీసం అయిదారు గంటలు పుస్తక పఠనంలో గడిపే వారు. ముందు గదిలో పడక్కుర్చీలో అలా పుస్తకం ముందు విధేయంగా వుండే వారు. “నేను పాఠకుడిని మాత్రమే!” అని నిర్ద్వంద్వంగా చెప్పే వారు. “వొక గంట రాస్తే బాగుంటుంది” అనే వాణ్ని. కానీ, ఆయనలోని రచయితని ఉత్సాహ పరచడం అంత తేలిక కాదు. ఆయనలోని వొక పర్ఫెక్షనిస్ట్ ఎప్పుడూ ఆయనకి అడ్డంకి. “రాస్తే ఇట్లా రాయాలి,” అని కొన్ని ఉదాహరణలు చూపించేవారు. రచయితగా ఆయనకి అలాంటి ఆదర్శాలు కొన్ని వుండేవి, అవి ఎన్నడూ వాస్తవికతతో రాజీ పడేవి కాదు. ఆయన ఉదాహరించే రచయితలు అటు సంస్కృతం నించి ఇటు ఆంగ్లం వరకూ వాళ్లు తెలుగులో అనువాదాలకయినా లొంగని శక్తిమంతులే, కానీ – “నిజమే కావచ్చు, కానీ, వాళ్లెవ్వరూ మీరు మాత్రమే రాయాల్సింది రాయలేరు కదా?!” అనే వాణ్ని నేను. అదే దశలో ఆయన మళ్ళీ పత్రికా రచయితగా మారడం వల్ల రచనా వ్యాసంగం వేరే దారికి మళ్ళింది. తరవాత హిందీ ఉర్దూ నించి అనువాదాల కోసం ఎన్ని ప్రచురణ సంస్థలు అడిగినా, ఆయన వొప్పుకోలేదు. “అనువాదం అనేది వొక వ్యసనం. అలవాటు పడితే, అందులో కూరుకుపోతాం. రాయగలిగితే, ఎప్పటికయినా సొంత రచనే చెయ్యాలి. వొక బృహత్తరమయిన నవల రాయాలి,” అనే వారు. ఆ నవల రాసే రోజు రాలేదు, ఈలోపు ఆయన ఆరోగ్యం క్షీణించింది. కనీసం రెటైర్మెంట్ వయసు కూడా రాక ముందే, ఆయన కన్ను మూశారు.

ఆయన రచయితగా రాయాల్సినంత రాయలేదని మా అందరికీ అసంతృప్తి తప్ప, ఆయన మటుకు ఆయన సంతృప్తిగా జీవించారనే నాకు అనిపిస్తుంది. జీవితం మీద ఆయనకి ఫిర్యాదులు లేవు. అది తిరిగిన అన్ని మలుపులూ ఆయనకి తెలిసినవే, అవి ఆయనకి అపరిచితమయినవీ, ఆశ్చర్యకరమయినవీ కావు. అటు రచయితగా, ఇటు వ్యక్తిగా కూడా తన అర్ధాంతర నిష్క్రమణ అబ్బాకి ముందే తెలుసేమో అని చాలా సార్లు అనిపిస్తుంది నాకు. కనీసం అట్లా అనుకొని తృప్తి పడడం మినహా మేం చెయ్యగలిగిందేమీ లేక పోయింది!

*

బానిసల్లారా సోయి తెచ్చుకోండి!

sangisetti- bharath bhushan photo

1970ల కన్నా ముందు అధికారం కేంద్రీకృతమై ఉండిది. ఇది విశ్వవ్యాప్తమైన భావన. దాన్ని కూలదోస్తే సమసమాజం ఏర్పడుతుందనే అవగాహన ఉండిది. అయితే అధికారం వికేంద్రీకృతంగా ఉంటుందనే వాస్తవాన్ని అస్తిత్వ రాజకీయ ఉద్యమాలు ముందుకు తీసుకొచ్చాయి. అది ‘బ్లాక్స్‌’ పోరాటం కావొచ్చు, ఫెమినిజమ్‌ కావొచ్చు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమూ కావొచ్చు. అస్తిత్వ ఉద్యమాలకు ఒక ‘పరిధి’ ఉంటుంది. ఆధిపత్యాన్ని, అణచివేతను ధిక్కరించేందుకు పోరాటం జరిగింది. కళ్ళముందర కనబడే శత్రువుతో ఉద్యమం కొనసాగింది. ఈ అస్తిత్వ రాజకీయాల్లో సామూహికతకు స్థానం లేదు. కానీ ఇవ్వాళ కొంతమంది భాష పేరిట, జాతి పేరిట, సమాజం పేరిట ‘సామూహికత’ను తీసుకొస్తున్నారు. దీని వల్ల తెలంగాణ వాళ్లకే గాదు సీమ, డెల్టా, ఉత్తరాంధ్రవారి ఉనికికి కూడా ప్రమాదమేర్పడనుంది.

స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనుకునే వారెవ్వరూ పరాయి ఆధిపత్యాన్ని, అణచివేతను, నిరాకరణను సహించలేరు. అంతేగాదు దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. అయితే తెలంగాణ విషయంలో ‘పరాయి’ ఎవ్వరు అని తెలుసుకునే లోపలే జరగరాని నష్టమంతా జరిగిపోయింది. 1956 నుంచీ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లెక్కలేసుకొని చరిత్రలో రికార్డు చేయాల్సిన ప్రస్తుత తరుణంలో కొందరు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. అంతర్లీనంగా తమ కోస్తాంధ్ర బానిసభావజాలాన్ని ప్రదర్శిస్తున్నారు.
భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వాళ్లమంతా ఒక్కటే, తెలుగాజాతి అంతా ఒక్కటే, ఆధిపత్యాలు లేకుంటే అంతా మళ్ళీ కలిసిపోవొచ్చు, సాహిత్యం రెండుగా విడిపోవాలన్నా సాధ్యంకాదు, తెలుగు ప్రజల ఐక్యత కేవలం ఒక భావనగా కాకుండా భౌతిక వాస్తవికంగా మారాలని వ్యాఖ్యానిస్తూ, భవిష్యవాణి చెబుతూ, ఆకాంక్షిస్తున్న వాళ్లలో తెలంగాణ వాదులు, బుద్ధిజీవులు, సాహిత్యకారులు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెండు రాష్ట్రాల్లో తమ సంఘాలు, సంస్థలు, పార్టీలు ఉండీ, రెండు ప్రాంతాల్లో వాటి మనుగడ కోరుకునే వారు, రెండు రాష్ట్రాల్లోనూ తమకు ప్రచారం, ప్రాధాన్యత, గుర్తింపు లభించాలని  ఆశించే పచ్చి అవకాశవాదులు ఈ మాటలు మొదటి నుంచీ చెబుతుండ్రు, ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళు అవకాశవాదులు కాబట్టి పెద్దగా పట్టించుకోనవసరం లేదు.

ఈ అవకాశవాదుల్లోనే ఇంకొందరు పెండ్లినాడే సావుడప్పుకొట్టినట్లు అవసరమైతే ‘తెలుగువాళ్ళం మళ్ళీ కలువొచ్చు’ అంటుండ్రు. పేచీ అంతా తెలంగాణవాదుల ముసుగులో రంగంమీదికి వస్తున్న ఆధిపత్యాంధ్రుల బృందగానం ఆలపించే వంధిమాగదుల తోనే! తెలంగాణ సోయితో ఎన్నడూ మెలగని వాళ్ళు రాష్ట్రమొచ్చినాక ప్రత్యేక సంచికలు తీసుకొస్తూ తాము మాత్రమే ఉద్యమంలో ముందున్నట్టు, తమ కృషితో మాత్రమే తెలంగాణ సాధ్యమయింది అనే భావన కలిగిస్తుండ్రు. తెలంగాణ గురించి కూడా ఇందులో ఆంధ్రోళ్ల తోటి రాయిస్తుండ్రు. ఇలాంటి నయా సీమాంధ్ర బానిసలు రేపు తెలంగాణలో కోకొల్లలుగా పుట్టుకొచ్చి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని తాము అభిమానించే ఆంధ్రాధిపత్య సాహిత్యకారుల కాళ్ల దగ్గర కట్టిపడేస్తారు. ఎందుకంటే వీళ్ళెవరూ తెలంగాణ కోసం ఎన్నడూ ఒక్క మాట మాట్లాడిరది లేదు, రాసిందీ లేదు, కనీసం సంఫీుభావంగా ఒక్క సమావేశంలో పాల్గొన్నదీ లేదు. ఇప్పుడు వలస పాలన మాత్రమే పోయింది. ఈ వలసాధిపత్యులు స్థానిక బానిసలను ప్రోత్సహించి, మెచ్చి మెడల్స్‌ ఇప్పించి తమ పెత్తనాన్ని శాశ్వతంగా కొనసాగించే ప్రమాదముంది. అందుకే అటు రాజకీయాల్లో గానీ ఇటు సాహిత్య, సాంస్క ృతిక రంగంలో బానిసల పట్ల జాగరూకతతో మెలగాలి. నిజానికి వెన్నెముఖలేని సాహిత్యకారులు ఎంతటి తెలంగాణవాది అయినా సారాంశంలో సీమాంధ్ర ప్రయోజనాలు నెరవేర్చే పనిముట్టుగానే మిగిలిపోతాడు.
రెండు ప్రాంతాల్లోనూ తమ కులం వాళ్ళు ఉండడం, ఉమ్మడి రాష్ట్రంలో తమకు దక్కిన గౌరవానికి లోటు రాకుండా చూసుకోవడానికి, రాష్ట్ర, కేంద్ర అవార్డులు నిర్ణయించడంలో తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి తెలంగాణలోని ఆధిపత్యులు  సీమాంధ్రుల మనసెరిగి మసులుతుండ్రు. అనివార్యంగా తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధించిన వీళ్ళు తమకు అవసరమనిపిస్తే తిరుపతి ప్రపంచ సభలకు వెళ్ళినట్టే ఇక్కడి ప్రజలకూ పంగనామాలు పెట్టగల సమర్ధులు. భాషకు పట్టం కట్టే పేరుతో తిరుపతికి వెళ్ళినామనే వాళ్ళు రేపటి తెలంగాణలో అదే భాష పేరిట స్థానికుల ‘హిందూత్వ’ వైఖరి అవలంభించే ప్రమాదమూ ఉంది. ఎందుకంటే వీళ్లు ఇదివరకే ఉర్దూని ముస్లిముల భాషగా ముద్రేసిండ్రు.
తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచీ ఆంధ్రాధిపత్యులు, వారికి వంతపాడే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌ కేవలం తెలుగువారి రాష్ట్రంగానే పరిగణించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెలుగు మాట్లాడేవారే కాదు ఉర్దూ మాతృభాషగా మాట్లాడే వాళ్ళు దాదాపు 15శాతం మంది ఉన్నారనే సోయి బుద్ధిజీవులకు లేకుండా పోయింది. తెలంగాణలో ఉర్దూమాట్లాడే ముస్లిములే గాకుండా కాయస్థులు, హిందీ మాత్రమే మాట్లాడే లోధీలతోపాటు భిన్నమైన ఇతర భాషలు మాట్లాడే రంగ్రేజ్‌, ఆరెమరాఠీలు, లంబాడీ, కోయ, గోండు, చెంచులు కూడా తెలంగాణలో భాగమనే గ్రహింపు కూడా వీరికి లేదు. తెలుగువాళ్లంతా ఒక్కటే అని కూడా టీవి చర్చల్లో అటు ఆంధ్రవాండ్లు, ఇటు తెలంగాణ వాండ్లు కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు ఆంగ్ల విద్యార్జనతో ఒకవైపు, మరోవైపు ఆంగ్లేయుడు కట్టిన కాటన్‌ కట్టతో బాగుపడి భాష మీద అజమాయిషీ చలాయించారు. వీళ్ళే ‘రేట్‌’స్కూల్స్‌ ద్వారా పాఠశాలల్లో కొంతమేర తెలుగులో బోధన, మరికొంత పత్రికల ద్వారా తమ భాషకు ‘ప్రామాణికత’ సంపాదించిండ్రు.

సంపాదించిండ్రు అనేకన్నా ఆపాదించిండ్రు. ఇప్పటికీ అదే ప్రామాణిక తెలుగుభాషగా కొనసాగుతోంది. మిగతావన్నీ మాండలికాలు, యాసలుగానే ఉన్నాయి. భాషకు కూడా కులముంటదని బుద్ధిజీవులు గుర్తించరు. ముఖ్యంగా బీసీల్లోని దాదాపు ప్రతి కులానికి వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే భాష, అవసరాల రీత్యా మిగతా వారితో మాట్లాడుకునే భాష భిన్నంగా ఉంటుంది. స్వర్ణకారులకు వృత్తిపరంగాను, వ్యాపార పరంగానూ ప్రత్యేకమైన భాష ఉంది. అది తమ వారికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణది పంచభాషా సంస్క ృతి. మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రజలపై ఎక్కువగా కన్నడ, మరాఠీ భాషల ప్రభావం కూడా ఉంటుంది. ఆ భాషలు వారికి పరాయివి కావు. హైదరాబాద్‌లో ఇప్పటికీ పాతబస్తీకి వెళితే ఉర్దూ మాట్లాడే కాయస్థులు, తెలుగు మాట్లాడే కన్నడిగులు, కన్నడ మాట్లాడే మరాఠీల కనబడతారు. అందుకే నిజాం జమానాలో ప్రతి ఫర్మాన్‌ ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో వెలువడేది. ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ పత్రిక ‘హైదరాబాద్‌ సమాచారము’ ఈ అన్ని భాషల్లో ప్రచురితమయ్యేది. ఈ పంచభాష సంస్క ృతిని పక్కనబెట్టి కేవలం ఒక్క భాషనే అందరి భాషగా బలవంతంగా రుద్దడమంటే ఆ భాషలవారి హక్కుల్ని కాలరాయడమే. తమిళనాడు, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలలో తెలుగు భాషని కాపాడలనే వారెవ్వరూ హైదరాబాద్‌లో తెలంగాణలో ఉర్దూని కాపాడలనీ, కన్నడను కాపాడాలని ఎన్నడూ అడుగరు.
తెలంగాణలో పాఠ్యపుస్తకాల్లో ఒకరకమైన భాష ఉంటుంది. అది బోధించే ఉపాధ్యాయుడు తనదైన భాషలో చెబుతాడు. తనదైన భాష అన్నప్పుడు అతని కులం, పుట్టి పెరిగిన ప్రాంతం ప్రభావం వల్ల అబ్బిన భాష. చదువుకునే విద్యార్థికి ఇవి రెండూ కొత్తగానే ఉంటాయి. ఇవ్వాళ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుమీడియంలో చదువుకుంటున్నది బహుజనులు మాత్రమే. అదీ తమ తరంలో మొదటి వారు మాత్రమే! ఈ పాఠ్యపుస్తకాల్లో విషయం ఎట్లాగూ తెలంగాణకు సంబంధించినది ఉండదు. కనీసం వాటిని వ్యక్తికరీంచేందుకు తెలంగాణ నుడికారానికి కూడా చోటులేదు.

అందుకే రెండు ప్రాంతాల్లో ఉనికిలో ఉండే (అగ్ర)కులాల వాండ్లకు తప్ప తెలుగు వాళ్ళమంతా ఒక్కటే అనే భావన బహుజనుల్లో ముఖ్యంగా బీసీల్లో ఏర్పడలేదు. మెజారిటీగా 50శాతానికి పైగా ఉన్న బీసీలు (ఉర్దూ మాట్లాడే ముస్లిములను మినహాయిస్తే ఈ శాతం ఇంకా పెరుగుతది) తాము స్వతహాగా మాట్లాడుకునే భాష ఎక్కడా లేదు. తెలుగుభాషగా చలామణిలో ఉన్న భాషలో బహుజనుల నుడికారం, పదసంపద కానరాదు. అలాంటప్పుడు భాష కలిపి ఉంచే సూత్రం ఎంతమాత్రం కాదు. ఇది బలవంతంగా, కృత్రిమంగా కల్పించిన బంధం మాత్రమే. ఈ బలవంతపు బంధం విడిపోయిందంటే సంతోషపడాలి తప్ప బాధపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఈ భాష గురించి గుండెలు బాదుకుంటుంది కూడా అగ్రకులస్తులే అనే విషయాన్ని అవగాహనలో ఉంచుకోవాలి. బహుజనులు తెలుగుకన్నా ఇంగ్లీషుపై దృష్టి కేంద్రీకరించాలనేది నేటి డిమాండ్‌.
తెలుగుజాతి అంతా ఒక్కటే అనే సూత్రాన్ని కూడా ఇదివరకే కొందరు తెలంగాణవాదులు కొట్టిపారేసిండ్రు. అయినా తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి ఇరు ప్రాంతాల్లో తమ వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి కొందరు, తమ పార్టీ, సంఘం ప్రయోజనాలను కాపాడడానికి కొందరు, ఇంకా చెప్పాలంటే రెండు ప్రాంతాల్లోనూ తమ ఆధిపత్యం యథాతథంగా కొనసాగాలనుకునేవారు (వీళ్లు ఇరు ప్రాంతాల్లోనూ ఉన్నారు) ఈ తెలుగు జాతి సిద్ధాంతాన్ని వల్లె వేస్తున్నారు. ఒక జాతికి తనదైన ప్రత్యేక గుర్తింపు రావాలంటే ఒకే జాతీయ నాయకులను ఆరాధించడం, ఒకే భాష, ఒకే సంస్క ృతి, ఒకే చరిత్ర కలిగి ఉండడమే గాకుండా ‘అంతా ఒక్కటే’ అనే భావన కూడా ప్రజల్లో ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల వారికి లేదు.

ఆధునికతకి తొలి ఆనవాలు మహబూబ్ అలీ ఖాన్

ఆధునికతకి తొలి ఆనవాలు మహబూబ్ అలీ ఖాన్

తెలంగాణకు సంబంధించిన సర్వాయి పాపన్న, తుర్రెబాజ్‌ఖాన్‌, కుతుబ్‌షాహీలు, మహబూబ్‌అలీఖాన్‌, కొమురం భీమ్‌ ఎవ్వరూ కూడా ఆంధ్రప్రాంతంలో తెలిసిన వారు కాదు. వారి గురించి ఎన్నడూ వినలేదు. కనీసం పాఠ్యపుస్తకాల్లోనూ వారి గురించి పాఠాలు లేవు. ఆంధ్రప్రాంతానికి చెందిన పొట్టి శ్రీరాములు (ఈయన ఎక్కువ కాలం జీవించింది తమిళనాడులోనే) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడి ప్రాణాలు వొదిలిండు. ఈయనెవరికీ తెలంగాణలో తెలువదు. తెలంగాణవాళ్లు ఆయనతో మనకెలాంటి సంబంధం లేదు అనుకుంటారే తప్ప మనవాడు అనుకోరు. ఆయన్ని సమైక్యవాదిగా సీమాంధ్రులు ముందుకు తీసుకురావడం వల్ల కోమట్లు తమ వాడు అనే గౌరవంతో పల్లెల్లో నిలబెట్టిన ఆయన విగ్రహాలకు కష్టకాలం వచ్చి పడిరది. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి కూడా తెలంగాణ వాళ్ళకు (కొంతమంది రెడ్లు మినహాయింపు) అదే భావన ఉంది. ఈ ‘జాతి’ నాయకుల గురించి ఎన్నడూ ఎవ్వరూ అందరికీ పరిచయం చేయాలని ప్రయత్నించలేదు. రెండు ప్రాంతాల ప్రజల మధ్యన భావ సమైక్యత ఎన్నడూ కలుగలేదు. అంతెందుకు వల్లభ్‌భాయి పటేల్‌ సీమాంధ్రులకు జాతీయ నాయకుడు కావొచ్చు కానీ తెలంగాణ వాళ్ళకు ముఖ్యంగా ముస్లిములకు ఒక విలన్‌. పటేల్‌ అటు సాయుధ పోరాట యోధులను చంపించడమే గాకుండా పోలీస్‌ యాక్షన్‌ పేరిట వేలాది ముస్లిముల ప్రాణాలు తీసిండు.

అలాగే భాష ఒక్కటి కాదని పైన చర్చించుకున్నాము. ఇక సంస్క ృతి ఒక్కటి కాదనే విషయాన్ని 1969 నుంచి ఇప్పటి దాకా ప్రతి తెలంగాణ వాదీ రాసిండు.  మా పండుగలు వేరు, మా ఆచార వ్యవహారాలు ఆఖరికి మేము మొక్కే దేవతలు కూడా వేరు అని తెలంగాణ వాదులు తేల్చి చెప్పిండ్రు. నిరూపించిండు. అంతేగాదు తెలంగాణది హీన సంస్కతి అని కూడా ఆధిపత్యులు ప్రచారం చేసిండ్రు. మీరు కోడిపుంజుల కొట్లాట పెడితే మేం బతుకమ్మలు ఆడుతాం అని తెలంగాణ వాళ్ళంటే అది సంస్కతిలోని భిన్నత్వాన్ని పట్టిస్తుంది తప్ప కించపరచడం కాదని అర్థం చేసుకోవాలి. అలాగే ఆధిపత్య వాదులు తెలంగాణ సంస్క ృతిపై మరో నింద కూడా వేసిండ్రు. మీదంతా దొరలు, నవాబుల సంస్కృతి రాములమ్మ సినిమాలోని సంస్క ృతి అంటూ నిందించిండ్రు. రాములమ్మ సినిమాలోని సంఘటనలు వాస్తవ సంఘటనలు అని ప్రచారం చేసి, తెలంగాణ దొరలంతా స్త్రీలను చెరబట్టే వారిగా చూపించిండ్రు. ఇది వాస్తవం కాదు. (ఈ విషయం గురించి మరోసారి వివరంగా చర్చిద్దాం) ఇంత భిన్న సంస్క ృతి ఉన్న వాళ్ళమధ్య భావసారుప్యత రావడమనేది అసంభవం.

ఇక చరిత్ర విషయానికి వస్తే తెలంగాణ ఆధునిక చరిత్రకారుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంవత్సరాలను లెక్కేసి మరీ మీ చరిత్ర వేరు మా చరిత్ర వేరు అని తేల్చి చెప్పిండు. అన్ని విషయాలు భిన్నంగా ఉన్నప్పుడు జాతి ఒకటే అనే భావన ఎలా కలుగుతుంది. నిజానికి పురాణ కాలం నుండి తెలంగాణ జాతి భిన్నమైనదే! షోడశ జానపదాల్లో అశ్మక సామ్రాజ్యం ఒకటి. ఇందులో తెలంగాణ ప్రాంతాలే ఉన్నాయే తప్ప ఆంధ్రప్రాంతాలు లేవు. ఆంధ్ర అంటే నిఘంటువుల్లో అర్థాలు కూడా ఏమంత వీనుల విందుగా లేవు. అట్లాంటిది జాతి భావన పేరిట మళ్ళీ జత కట్టాలని ప్రయత్నించడమేంటే 60 యేండ్లుగా దేనికి వ్యతిరేకంగా తెలంగాణ భూమి పుత్రులు, కులాలు మతాలకు అతీతంగా కొట్లాడారో మళ్ళీ అదే పాలన, ఆధిపత్యాన్ని, ఆణచివేతను తీసుకొచ్చేందుకు చేసే కుట్రగానే భావించాలి.
ఇంకొందరు సాహిత్యకారులు ‘సాహిత్యం రెండుగా విడిపోవాలన్నా సాధ్యంకాదు’ అనే అసమంజసంగా మాట్లాడుతున్నారు. సాహిత్యం తెలంగాణ`సీమాంధ్ర మధ్యన ఎన్నడూ కలిసి లేదు. కలిసి ఉంటే అసలు తెలంగాణ అస్తిత్వ ఉద్యమమే వచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పది జిల్లాల నుంచి పదివేలకు పైగా కవిత్వ, వ్యాస, కథా, నవలా పుస్తకాలు, సంకలనాలు, సంపుటాలు, సీడీలు వెలువడ్డాయి. ఇందులో ఏవి కూడా సీమాంధ్రలోని పుస్తకాల షాపుల్లో ఎక్కడ కూడా అందుబాటులో లేవంటే ఆశ్చర్యం కలుగక మానదు. అంతెందుకు నమస్తే తెలంగాణ ప్రతుల్ని విజయవాడలో దగ్ధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే! తెలంగాణ సాహిత్యాన్ని ఆంధ్ర కొలమానాల్లో తూచి, శైలి, శిల్పం, వస్తువు, వ్యక్తీకరణ పేరిట కథల్ని, కవిత్వాన్ని అంచనా వేసి నాసిరకం అని తేల్చేస్తుండ్రు. తెలంగాణ భాషలో రాసిన కథలేవి మాకు పంపొద్దని పత్రికా సంపాదకులు నిర్ద్వందంగా తేల్చి చెబుతుండ్రు. మన ప్రతిభను అంచనాగట్టడానికి పరాయి వాళ్ళకు పెత్తనమిస్తే వాళ్లు నెత్తంతా కొరిగి పెట్టడమే తప్ప ఒరగబెట్టేదేమీ లేదు. అసలు తెలంగాణ ఉద్యమమే మాది వేరు మీది వేరు, వివక్ష, విస్మరణ, వక్రీకరణలకు వ్యతిరేకంగా జరిగింది. తెలంగాణ`సీమాంధ్ర సాహిత్యం నిట్టనిలువునా చీలి ఉన్న ప్రస్తుత సమయంలో సాహిత్యం విడిపోవాలన్నా విడిపోవడం సాధ్యంకాదు అనే తీర్పు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడమే!

పోరాట ప్రతీక కొమరం భీమ్

పోరాట ప్రతీక కొమరం భీమ్

ఆధిపత్యం లేకుంటే ఆంధ్రవాళ్ళతో కలిసిపోవచ్చు, తెలుగువారి ఐక్యత భౌతిక వాస్తవికం కావాలనడం కూడా అత్యాశే! అంతేకాదు అవాంఛనీయం కూడా! ఎవరికి వారు విడిపోయిన తర్వాత పోటీ తెలంగాణ సాహిత్యకారుల మధ్యన ఉండాలి కాని మళ్ళీ ఆంధ్రావాళ్ళతోటి, ఆంధ్రావారి సాహిత్యం తోటి పెట్టుకోవలనడం అసమంజసం. పోటీకి రూల్స్‌ని మనమే నిర్ణయిద్దాం. సీమాంధ్రుల స్థల, కాలాల కనుగుణంగా నిర్ణయించబడ్డ రూల్స్‌ని మనం పాటించాల్సిన అవసరం లేదు. ‘కలిసిపోవొచ్చు’ అనే భావన తెలంగాణవారి మనస్సులో లక్షలో ఒక వంతు కలిగిన దాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకొనేందుకు సీమాంధ్రులు సిద్ధంగా ఉంటారు. రేపు తెలుగుభాషకు సాహిత్యానికి జాతీయిస్థాయిలో దక్కే అవార్డుల కోసం, గౌరవం కోసం, పద్మఅవార్డుల కోసం ఇతర గుర్తింపుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగువారితో తెలంగాణ వాళ్ళు పోటీ పడాల్సి ఉంటది.

అలాంటప్పుడు నిర్ణేతలు ఆంధ్రప్రాంతానికి చెందిన వాళ్ళు లేదా సాంప్రదాయిక తెలంగాణవాళ్ళు ఉన్నట్లయితే అవి మళ్ళీ మళ్లీ ఆధిపత్య ఆంధ్రులకే దక్కే ప్రమాదముంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే మన సాహిత్యాన్ని అంచనాగట్టేందుకు మనమే కొత్తకొలమానాలను రూపొందించుకోవాలి. ఆధిపత్యుల చెర నుంచి తెలంగాణను రక్షించుకోవాలి. ఇక తెలుగువారి మధ్యన ఐక్యత భౌతిక వాస్తవికం కావాలనడం కన్నా భారతీయుల మధ్యన ఐక్యత కోరుకుంటే అంతా సమానమన్న భావన వస్తది. (అసలు సిద్ధాంతమయితే ప్రపంచ కార్మికులారా ఏకంకడి అనుకోండి) అయినా 60 యేండ్ల సంది తెలంగాణను నంజుకు తిన్నవారితోటి ఐక్యత ఎవరి అవసరం? కచ్చితంగా ఇది తెలంగాణ వారి మేలుని కోరేదయితే కాదు. అయితే చుండూరు బాధితుల తరపున, పోలేపల్లి నిర్వాసితుల తరపున ఇటు తెలంగాణవారు, అటు ఆంధ్రవారూ సమస్యల వారిగా సంఘటితంగా పోరాటం చేయవచ్చు.

అంతేగాని మొత్తంగా తెలుగువారి ఐక్యత అంటే మళ్ళీ ఆంధ్రాధిపత్యానికి ఇంకా చెప్పాలంటే ప్రాంతాలకతీతంగా అగ్రకులాధిపత్యానికి ఆహ్వానంగా భావించాలి. అయితే పోలవరం విషయానికొస్తే బుద్ధిజీవులు ఎవరి పక్షాన నిలబడుతారనేది వారి నిబద్ధతకు గీటురాయి. తమ సర్వస్వాన్ని సెజ్‌ల కోసం కోల్పోయే వారికి సంఫీుభావంగా ఉంటారా? సర్వం కొల్లగొట్టి తీరాంధ్రలోని బలహీనవర్గాల భుక్తిని కూడా కొల్లగొట్టే మూడోపంటకు నీరు కోరుకునే వారి పక్షాన నిలబడతారో తేల్చుకోవాలి.
కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ కలకాలం మనగలగాలి అంటే ఈ 60 యేండ్లలో ఈ ప్రాంతంలో జరిగిన దోపిడీ, దౌర్జన్యం, హింస, ఉక్కుపాదంతో అణచివేయబడ్డ ఉద్యమాలు, కబ్జాకు గురైన చెరువులు, భూములు, రాజ్యహింసకు గురైన ప్రతి ఒక్క మనిషి చరిత్రను సాలార్జంగ్‌ మ్యూజియం కన్నా పదింతల పెద్దదయిన ప్రదర్శనశాలలో పెట్టాలి. 1969 కాలంలోనే జరిగిన బంగ్లాదేశ్‌ యుద్ధానికి సంబంధించిన చిత్రాలను, చిన్నారులను చిత్రవధ చేయడం దగ్గరి నుంచి రక్తాలోడుతున్న చిత్రాలను అక్కడి ప్రభుత్వం జాతీయ మ్యూజియంలో నిక్షిప్తం చేసింది. పాకిస్తాన్‌ మిలిటరీ పాల్పడ్డ అకృత్యాలను సజీవంగా చిత్రిక గట్టింది. అందుకే ఆ మ్యూజియం సందర్శించిన వాళ్ళు పాకిస్తాన్‌పై మరింత కసిని పెంచుకొని బైటికి వస్తారు.

అలాగే ఇవ్వాళ తెలంగాణ తాను కోల్పోయిన సహజ వనరుల్ని, విధ్వంసానికి గురైన బతుకుల్ని, ఛిధ్రమైన వారసత్వ సంపదని, నెత్తురోడిన 1969 ఉద్యమ చిత్రాల్ని, వంచనకు, హేళనకు గురైన నిన్న మెన్నటి ఉద్యమ డాక్యుమెంటరీలను, సమైక్య రాష్ట్రంలో పద్మ అవార్డులకు దూరమైన వైతాళికుల్ని, అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికి వీలులేదు, ఒక్కపైసా ఇవ్వం ఏం జేసుకుంటారో చేసుకోండి అనే ప్రసంగ పాఠాల్ని, చిత్రాల్ని, తెలంగాణ ప్రజల్ని విలన్లుగా చూపించిన సినిమాలను ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా ప్రదర్శనకు పెట్టాల్సిన అవసరముంది. లేకుంటే రేపటి తరానికి నిన్నటి తరానికి జరిగిన అన్యాయంపై అవగాహన లేకుండా పోతుంది. ఇవ్వాళ అవగాహన రాహిత్యంతో బుద్ధిజీవులు చెబుతున్న తెలుగువాళ్ళమంతా ఒక్కటే అనే భావనలో మళ్ళీ తెలుగు వాళ్ళందరూ ఒక్కటే రాష్ట్రంగా ఏర్పడాలనే ఉద్యమం చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అందుకే జరిగిన అన్యాయాన్ని, దోపిడీని, దౌర్జన్యాన్ని, హింసను కచ్చితంగా రికార్డు చేసి పెట్టాలి.
ఇన్నేండ్లు తెలంగాణ విస్మరణ, వివక్షకు, వక్రీకరణకు గురయ్యిందని చెబుతూ వచ్చాం. దానికి సాక్ష్యాలను రికార్డులను ప్రదర్శనకు పెట్టనట్లయితే మళ్ళీ మనం మోసపోయే ప్రమాదముంది. సాహిత్యంగా కన్నా రాజకీయం ఈ అవసరం ఎక్కువగా ఉంది.  మన ప్రతీకల్ని మనం నిర్మించుకోకుండా ఆధిపత్య భావజాలం నుంచి బయటపడలేము. ట్యాంక్‌బండ్‌పై మన విగ్రహాలను కొలువు దీర్చకుండా భావజాలంలో మార్పు తీసుకురాలేము. తెలంగాణ వాండ్లు ఆత్మగౌరవంతో బతకాలంటే ఇక్కడి వైతాళికులని ఒక్కొక్కరిని లెక్కగట్టి స్మరించుకోవాలి. అది తెలుగు వాళ్ళమన్న భావనలో గాకుండా తెలంగాణవాళ్లమన్న సోయితోనే సాధ్యం.

                                                                                                                                                                  -సంగిశెట్టి శ్రీనివాస్‌

పాత బూతుల బూజు దులపాల్సిందే!

samvedana logo copy(1)
“పనిమనిషులు దొరకడం లేదండీ. అబ్బో, రోజొక గంట పనిచేయడానికి వేలు అడగుతున్నారు. ఇళ్లలోనే ఉండి పనిచేసే అమ్మాయిలు అయితే అసలే దొరకరు.” పట్నాల్లోమధ్యతరగతి బాధ ఇది. ఇంటి నిర్వహణ ప్రధానంగా ఆడవాళ్ల బాధ్యతే కాబట్టి వాళ్లే ఎక్కువగా బాధపడుతునట్టు కనిపించినా ఈ బాధకు జెండర్‌ అంటగట్టక్కర్లేదు.

“ప్లంబరండీ, ఇంటికొస్తే చిన్న ట్యాప్‌ బిగించడానికి కూడా మూడునాలుగొందలు పోయాల్సిందే. బట్టలు ఐరన్‌ చేసే దిక్కులేదు”. ఇలాంటి మాటలు కూడా ఎడా పెడా వినిపిస్తూ ఉంటాయి.

“కూలోళ్లు దొరడం లేదండీ, వ్యవసాయం సర్వనాశనం అయిపోయింది. ఈ గ్రామీణ ఉపాధి పథకం తెచ్చిఅందర్నీ సోమరులను చేసిపెట్టారు. మనకెందుకు పనిచేస్తారు”.ఇది పల్లెల్లో ఎక్కువగా వినిపించే మాట.

“డప్పు కొట్టే మాదిగ లేకపాయె, చాకలి, కమ్మరి, కుమ్మరి పనులు పాయె, గ్రామాలు పాడైపోయాయండి.” ఇది కూడా దాని పక్కనే వినిపించే మాట.

ఈ బాధలు ఎవరికైనా బాధలు కావచ్చు కానీ వర్కింగ్‌క్లాస్‌ తరపున మాట్లాడేవారికి  కావచ్చునా! శారీరక శ్రమకు డిమాండూ విలువా పెరగడం వర్కింగ్‌ క్లాస్‌ తరపున మాట్లాడేవారు సంతోషించాల్సిన విషయాలు. కానీ మనం చేసే మధ్యతరగతి ఉద్యోగాలకు మాత్రం వేతనాలు మెరుగ్గా ఉండాలని, మనకు సర్వీసెస్‌ అందించేవారు మాత్రం ఎప్పట్లాగే జోలె పట్టుకుని మనం ఇచ్చినంత తీసుకుని చిత్తం దొరా అనాలని చాలామంది కోరుకుంటున్నారు. గ్యాస్‌ బండమీద సబ్సిడీ తగ్గిస్తే గోలగోల చేసేసి గ్రామీణ ఉపాధి పథకాన్ని మాత్రం ఆడిపోసుకుంటుంది ఇలాంటి మధ్యతగరతి.

పేదలవైపున నిలవడమంటే పేదరికాన్ని ప్రేమించడంగా అర్థం చేసుకున్న మిత్రులు ఇంకో రకమైన ఏడుపును అవుట్‌ సోర్స్‌ చేస్తుంటారు. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి ఏమాయె, అంతా ఉంటేనే గదా ఊరు అని ఒకటే బాధ!  మనం కాలేజీలోనో, బ్యాంకులోనో, కోర్టులోనో, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోనో, పత్రికా కార్యాలయంలోనో  పనిచేయాల. స్థిరమైన వేతనం తీసుకుంటూ మధ్య మధ్యలో సాహిత్య సేవ చేస్తూ ఉండాల. కానీ ఊరిలో మాత్రం నాలుగు వీధులు, ఏ వీధిలో ఆ కులాలు, మధ్యలో రచ్చబండ, దాని మీద ఓ యాపచెట్టు ఉండాల.  బాడిస చప్పుడు, మగ్గం  చప్పుడు, కుమ్మరి సారె చప్పుడు వినిపిస్తూ ఉండాల. ఊరిని ఊరిలా ఉంచడానికి చాకళ్లు, మంగళ్లు, కుమ్మర్లు, కమ్మర్లు నానా చావు చస్తూ అలానే ఉండిపోవాల! లేకపోతే సర్వనాశినం అయిపోయినట్టే!

మనం పైన ట్యాంక్‌ కట్టుకుని ఎప్పుడంటే అప్పుడు నీళ్లు తిప్పుకుంటాం‌‌, కానీ కుండలు చేసేవాడు కావాల! మనం ఖాదీ వేయం‌. ఆధునిక పరిశ్రమ చేసిన బట్టలే వేస్తాం. కానీ సాలె బట్టలు నేయాల. ఇందులో ప్రాక్టికాలిటీ ఏమైనా ఉందా. జీవితమేమైనా కె విశ్వనాధ్‌ సినిమానా! వివేకానంద సూత్రం ప్రకారం అన్ని కులాలు గౌరవంగా తమపని తాము చేసుకుంటూ అంతిమంగా బ్రాహ్మణత్వాన్ని పొందడానికి! గతాన్ని నెమరేసుకోవడం తప్పుకాదు. గతం లేకుండా వర్తమానం ఎక్కడినుంచి వస్తుంది? అమ్మమ్మ ఒడిని, ఒడిలో విన్న కథలను, చీమచింతకాయ కోయబోయి కింద పడిన దెబ్బలను, ఊరిబావిలో కొట్టిన ఈతలను గుర్తు చేసుకోకుండా ఉండడం సాధ్యమా! కానీ జ్ఞాపకాలకు విలువలు అంటగట్టి ఎత్తుపీట వేసి కూర్చోబెట్ట కూడదు. మా కాలంలో స్కూలుకు ఆరేడు కిలోమీటర్లు నడిచిపోయేవాళ్లం. ఇపుడు ఎవరైనా నడుస్తున్నారా అసలు! కూలీలు పక్కూరి చేన్లో పనులకు పోవడానికి కూడా సెవన్‌ సీటర్లు ఎక్కుతా ఉంటే!  అని ఎవరైనా గతాన్ని తీపిగా గోక్కున్నారనుకోండి. మనమేం అనాల? పండితులారా! మన పూర్వీకులు కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనేవారు, యోజనాల దూరం నడిచేపోయేవారు, ఇవాళ మనం యాడికైనా అలావెళ్లి ఇలాగొచ్చేస్తున్నాం. మనం సోమరులైపోయామని మనం ఎన్నడూ అనుకోలేదు. మన తర్వాతి తరానికి మన కంటే కూడా శారీరక శ్రమ తగ్గింది. శారీరక శ్రమను తగ్గించుకుని సౌకర్యాలు పెంచుకునేందుకు మనిషి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అది తప్పు కాదు అనాలా! లేక భలే చెప్పావు బాస్‌ అని ఫ్యూడల్ భజన చేయాలా !

An-Indian-boy-breaks-coal-006

“మా కాలంలో మాదిరి కాదమ్మా, ఇపుడాడవాళ్లకు పనా పంగా, అన్నీ మెషీన్లే అయిపాయె” అని కోడళ్లను చూసి ఈర్ష్య పడే కొందరు పాతకాలపు అత్తల మాటలకు దీనికి తేడా ఏమైనా ఉందా! ఇదింకా చిన్నబూతే. ఆ మంగలేమాయె, చాకలేమాయె, ఊరేమైపాయె అనైదైతే బూతున్నర బూతు.
ఊరు ఊరిలాగా ఉంచడం కోసం చాకలి మన పిల్లల పీతిగుడ్డలు, ఆడవాళ్ల ముట్టుగుడ్డలు, మగవాళ్లు తాగి వాంతి చేసుకున్న గుడ్డలు ఉతుకుతూనే ఉండాలా?సాయంత్రం ఇంటిమందుకొచ్చి బిచ్చమెత్తుకున్నట్టు జోలెపట్టుకుని మనం వేసే అన్నం పచ్చడి తీసికెళ్లి తినాలా? నీ మాల్గుడి డేస్‌ ఆనందం కోసం ఈ అవమానాన్ని
భరిస్తూ మనకు వెట్టి చాకిరీ చేస్తూనే ఉండాలా? నువ్వు పిలిచినపుడల్లా మాదిగ తప్పెట తీసుకొచ్చి చాటింపు వేయాలా? నువ్వు చస్తే అతను చచ్చినట్టు వచ్చి డప్పేయాలా?
లేకపోతే పీనిగ లేవదా? కాలిస్తే కాలదా? పూడిస్తే పూడదా? పశువు చచ్చిపోతే అతనొచ్చి తీసేయాలా? లేకపోతే  ఊర్లు పాడైపోయినట్టా? ఏం నువ్వు తీయలేవా?
తిండికి లేక ఒకనాడు కళేబరాల మాంసం తిన్నందుకు అది పారంపర్యంగా అతని బాధ్యతే అవుతుందా? చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుడుతూ బట్టలు నేసేవాడు బట్టలు నేస్తూ
బట్టలుతికేవాడు బట్టలుతుకుతూ వ్యవసాయం చేసేవాడు వ్యయసాయం చేస్తూ పాలించేవాడు పాలిస్తూ అప్పులిచ్చేవాడు ఎప్పుడూ అప్పులిస్తూ అప్పలు తీసుకునే వాడు ఎప్పుడూ అప్పులు తీసుకుంటూ ఉంటేనే ఊరు పచ్చగా ఉన్నట్టా? ఇదేనా మనం కోరుకునే ప్రజాస్వామ్యం?

బహిష్టు కావడమంటే అదేదో నేరమైనట్టు మూలన కూర్చొని ఏ గుడ్డలు వాడాలో తెలీక అవే చింపిరిగుడ్డలను పదే పదే వాడుతూ చివరకు గోనెసంచులను చించి కూడా వాడుతూ రోగాలు, కాన్సర్లు తెచ్చుకుని ఆడోళ్లు నానా అవస్తలు పడే రోజులు ఎంత బాగుండేవని ఆ పాత రోజులను మధురంగా తల్చుకుందామా! బహిర్భూమికి వెడుతూ నానా రోగాలు తెచ్చుకుంటూ, తెస్తూ సహజమైన జీవన క్రియను కూడా అవమానంగా దొంగదొంగగా తీర్చుకునే రోజులు బాగున్నాయనుకుందామా! బిపినో షుగరో పెరిగిపోయి హఠాత్తుగా మనిషికి చెమట్లు పట్టి స్పృహతప్పి చచ్చిపోతే అదేం రోగమో తెలీక దయ్యం పట్టిందేమో భూతం పట్టిందేమో అనుకుని కాటికి మోసుకుపోయే అన్యాయపు రోజులను అందంగా గుర్తు చేసుకుందామా! ఎవరికో ఎక్కడో ఏదో అయితే  చేతబడి, బాణామతి, చిల్లంగి అని పిచ్చిమాటలు మాట్లాడతా మంత్రగాళ్ల పేరుతో మనుషుల పళ్లు ఊడగొట్టి జుట్టు రాలగొట్టి రాళ్లతో చంపేసే ఆ గుంపున్యాయపు క్రూరత్వాన్ని తన్మయంగా నెమరేసుకుందామా!

ఊరు ఊరంతా అరె ఒరె అంటుంటే అలాగే బాబయా అని అలవాటైన భయంతో కూడిన సిగ్గువల్ల వచ్చిన నవ్వుని అభినయిస్తూ పనిచేసుకుంటూ పోయే సర్వీస్‌ కులాలు లేకుండా పోయాయని బాధపడదామా! కులవృత్తులనుంచి బయటకొచ్చినవాళ్లంతా వేరే పనుల్లో కుదురుకుంటే బాధలేదు,  నలిగిపోతున్నారు, రాలిపోతున్నారు, వారి కోసం రాస్తున్నాము అని సమర్థించుకోవచ్చు. నిజమే, ఆ బాధలో న్యాయమున్నది. కానీ అప్పుడు దాని స్వరం వేరే ఉండాలి. బ్రాహ్మణ, వైశ్య, కుమ్మరి, కమ్మరి, చాకలి అని కులవృత్తుల సంగమస్థలిగా నాలుగు వీధుల్లో  నడిచే చతుష్పాద వ్యవస్థ పోయినందుకు బాధపడకూడదు.. చాకలి ఏమాయె, కుమ్మరి ఏమాయె అని పలవరించకూడదు.

మనుషులను ప్రేమించడానికి ఆ కులవృత్తుల బానిసత్వాన్ని ప్రేమించడానికి తేడా ఉంది. వాస్తవానికి వృత్తి పనిచేసేవారిలో ఆర్టిస్ట్‌ లక్షణం ఉంటుంది. తాము చేసే పని స్వతంత్రమైనదనే భావన చాలామందిలో ఉంటుంది. కూటికి పేదోళ్లమే కానీ కులానికి కాదనే వాసన కొన్ని కులాల్లో ఉంటుంది. ‘ఒకడి కిందకు పనికిపోవడమంటే పరువుపోగొట్టుకోవడం’ అనే న్యూనత ఉంటుంది. దీన్ని వదులుకోగలిగినవారు లేదా వదులుకోక తప్పనిసరైన వారు నెమ్మదిగా వేర్వేరు పనుల్లో కుదురుకుంటున్నారు. ఆ మధ్యలో కొంత ఘర్షణ ఉంటుంది. ఏ మార్పులో మాత్రం ఘర్షణ ఉండదు?
ఒక్క వృత్తి కులాలనే కాదు, ఏ రకమైన కాయకష్టం చేసేవారయినా దానికి తగిన ప్రతిఫలం రానప్పుడు అంతకంటే తక్కువ శ్రమతోనో అదే శ్రమతోనో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించడం సరైనదనే చేతన మనం కలిగించగలగాలి. అటువంటి ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఏది ఏమైనా తన పొలంలో తాను చావనైనా చస్తాడు గానీ…అన్నట్టు రాసే వాళ్లు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. “తన పొలంలో తాను రాజులాగా బతికినవాడు ఇపుడు పాపం గార్డుగా” .. చొచ్చొచ్చొ అంటూ ఫ్యూడల్‌ వాసనను ప్రేమించాలా లేక శ్రమసంస్కృతిని పెంపొందించాలా? ‘బతికి చెడడం’ మీద పురోగామి రచయితలక్కూడా ఇలాంటి భావనలుండవచ్చునా! వర్కింగ్‌ కల్చర్‌ అంటే అంత ఏహ్యభావం ఉండవచ్చునా ? నువ్వో పక్క ఇది నీచం అదితక్కువ అని ప్రచారం చేస్తూ ఉంటే మార్పుకు సిద్ధపడే వాడు కూడా అదేదో చేయకూడని పని అనుకుని దాని బదులు చావుకు సిద్ధపడతాడు. నువ్వు మేలు చేస్తున్నట్టా! కీడు చేస్తున్నట్టా! ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోబట్టే అందులో ఉన్నవారి గురించి వారి స్థితిగతుల గురించి బాధపడుతున్నాం అనొచ్చు. కానీ చేస్తున్న పని అదిస్తున్న బతుకు మిగిలిన శారీరక శ్రమల కంటే అన్యాయంగా ఉన్న విషయాన్ని గుర్తించాలా వద్దా, గుర్తింప జేయాలా వద్దా! అలవాటైన పని మిగిలిన శ్రమలకంటే మెరుగ్గా కనిపించే ధోరణి ఉంటుంది.

ఆ భావన నుంచి వారిని బయటపడేయాలంటే ఏదో ఒక వైపునుంచి ఇంటర్‌వెన్షన్‌ అవసరం. లేదంటే ఏదో ఒక టైంలో ఆకలి ఆ పని మరింత క్రూరంగా చేసి చూపిస్తుంది. ఇంటిల్లిపాదీ పనిచేసినా రోజుకు వంద రూపాయలు కూడా మజూరీ ఇవ్వని చోట మగ్గం పని గ్రామీణ ఉపాధి కూలీ కంటే ఏ రకంగా మెరుగు? మనుషులు దున్నపోతుల్లా కూర్చుని ఉంటే ఒక బక్కపల్చని మనిషి రెక్కలతో లాక్కుపోయే టాంగాను నువ్వెలా చూస్తావన్నదానిమీద నీ దృక్పథం ఆధారపడి ఉంటుంది. సాంకేతికత ఇంత పెరిగిన ఈ దశలో కూడా ఇది కొనసాగడం అమానవీయం, అన్యాయం అనే భావన నీకుంటే నీ భాష వేరే ఉంటుంది. లేకపోతే “పేదరికం, ఏం చేస్తారు” అని పరోక్షంగా సమర్థించే ప్రమాదం ఉంది. అవి ఉండడానికి వీల్లేదన్నవాళ్లంతా వాళ్లు ఆకలిచావులు చావాలని కోరుకుంటున్నవాళ్లేమీకాదు. ముందుగా అది అమానవీయం అని గుర్తిస్తే దాన్ని గట్టిగా ప్రకటిస్తే ఆ మేరకు వ్యవస్థ మీద ఒత్తిడి పెడితే ప్రత్యామ్నాయం ఏదో ఒకటి దొరుకుతుంది. ఎంతో చైతన్యవంతులం అనుకునే వారు కూడా గూడు రిక్షాలో బెజవాడలో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో అనేసుకున్నారనుకో!

ఇక అది అన్యాయమనే చైతన్యం సమాజానికి ఎక్కడినుంచి వస్తుంది? అలవాటైన మనిషి మార్పుకు సిద్ధపడే ఒత్తిడేదో ఉండాలి. చైతన్యవంతులైన వ్యక్తులు శక్తులు దానికి చోదకశక్తిలాగా పనిచేయాలి. వెనక్కు లాగ్గూడదు. ఒంటిని చర్నాకోలతో కొట్టుకుని, బిడ్డలను తాడుమీద నడిపించే అడక్కతినే విన్యాసాలను చూసి “ఆహా ఏమి ఆర్ట్‌” అనుకునే వారుంటారు. రచయితలైనా కాకపోయినా వీరిలో చాలామంది పురోగామి ముసుగులోనే ఉంటారు. వీరిలో కొందరు చివరకు కళావతులు, దేవదాసీ వృత్తులను కూడా ఆరాధిస్తారు. గొప్ప కళ అండీ అంటారు. వర్కింగ్‌క్లాస్‌ కల్చర్‌ ఉన్నోళ్లమయితే మనమేమని అడగాల? అంత మంచి ఆర్ట్‌ అయితే మీ బిడ్డలెందుకు తాడుమీద ఎక్కరు సార్‌! అంత గొప్ప ఆర్ట్‌ అయితే ఆ దేవదాసీల్లో మీ వాళ్లెందుకు కనిపించరు సార్‌! ఓ అని ఒకటే పొగిడే మీరు ఆ ఆర్ట్‌లను ఎందుకు ప్రాక్టీస్‌ చేయరు సార్‌,ఏదైనా నేర్చుకుంటే వస్తాది గదసార్‌! అని అడగాలా, వద్దా! అడక్కతినే స్థాయిలో ఉన్న అన్యాయమైన పనిని ఎవరైనా ఆర్ట్‌ పేరుతో పొగిడితే తప్పనిసరిగా కఠినంగా స్పందించాల్సిందే. కోపం రావాల్సిన చోట రాకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్టే లెక్క.

మార్పు అనివార్యమైనపుడు దానికి తగినట్టుగా సిద్ధం కావడం, సిద్ధం చేయడం మన బాధ్యత. ఈ మార్పులో సానుకూలమైనవేవో ప్రతికూలమైనవేవో బేరీజు వేసుకుని దానికి అనుగుణమైన చైతన్యాన్ని పెంపొందించుకోవడం మన బాధ్యత. కొత్త ఆర్థిక వ్యవస్థ మనల్ని వస్తువుల వెంట పరిగెట్టేట్టు చేస్తుంది. ఆ వస్తువుల ఉత్పత్తి నిరంతరం అవసరయయ్యేలా చేస్తుంది. భావజాల పరంగా ఆ అవసరాన్ని కూడా అది నిరంతరం సృష్టిస్తూనే ఉంటుంది. ఆ నిరంతర వినిమయం, ఉత్పత్తిలో భాగంగా ఉపాధి పెరుగుతుంది. ఆ పరుగు ఆగితే వ్యవస్థలో సంక్షోభం ఏర్పడుతుంది.  అదే సమయంలో ఆ పరుగుకు అడ్డు వచ్చే తాబేటి వ్యవస్థను దాని తాలూకు చిహ్నాలను మార్చుకుంటూ వెడుతుంది. కొన్నింటినైతే రద్దు చేస్తూ వెడుతుంది. అందులో ఇప్పటివరకూ అణచివేతకు వివక్షకు గురైన సమూహాలకు ఊరటనిచ్చే కొన్ని విషయాలుంటాయి.

ఇప్పటివరకూ కొన్ని పనులను నీచంగా విలువ తక్కవగా చూసిన వారు కూడా ఆ  పనులను చేయాల్సిన అవసరం కల్పిస్తుంది. ఆ పనికి అంతకుముందు లేని గౌరవాన్ని ఆపాదిస్తుంది. ఒక్క ముక్కలో ఆయా పనులను మార్కెట్‌ చేయడానికి అడ్డొచ్చే అనవసరమైన న్యూనతలను, అనవసరమైన గౌరవాలను రద్దుచేస్తుంది. కనీసం తగ్గిస్తుంది. కొత్త వ్యవస్థ కేవలం పట్నాలకే పరిమితం కాదు. టీవీ ఇంటర్‌నెట్‌ వంటి సాధనాలు, మెరుగుపడిన రవాణా సాధనాలు పల్లె-పట్నాల మధ్య తేడాను చెరిపేసుకుంటూ వస్తున్నాయి. ఈ చెరిపివేయడం వల్ల కొంతమందికి అలవాటైన సౌఖ్యాలు, గౌరవాలు, మర్యాదలు తగ్గిపోతాయి. అయ్యవారు అనో రెడ్డీ అనో రాజుగారు అనో దొరా అనో గౌరవ సంబోధనలను కోల్పోయిన వారికి ఉక్కపోత ఉంటుంది. ఆ ఉక్కబోతను అలాగే ప్రదర్శించుకుంటే దాని కథ వేరే!

అలా కాకుండా శ్రామిక కులాల పాత్రలను పెట్టి పెద్ద మెలోడ్రామాలను సృష్టించి ఇంకా అవసరమనుకుంటే పాత్రలను చంపేయడం లాంటి విన్యాసాలు చేసి నాలుగు పాదాల సంస్కృతి పోయినందుకు బాధపడితే మాత్రం బాధేస్తుంది! ప్రపంచీకరణ అనే భూతాన్ని పోటీగా నిలబెట్టినంత మాత్రాన అలాంటి వాదన న్యాయమైనదైపోదు! పీడిత కులాల నుంచి వచ్చినవారు, నిజంగా వర్కింగ్‌ క్లాస్‌వైపు నిలబడేవారు ఇక్కడ కన్ఫూజ్‌ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ మాయలో పడే ప్రమాదం ఉంది. అది సాహిత్యంలో చూచాయగా కనిపిస్తున్నది. కొత్త వ్యవస్థలో ఉన్న దుర్మార్గాలను ప్రశ్నించడమూ, అంత కంటే దుర్మార్గమైన పాత వ్యవస్థను ప్రేమించడమూ రెండూ ఒకటి కావు.

కొత్త ఆర్థిక వ్యవస్థ రెండు రకాల మార్పులు తెస్తుంది. ఒకటి- కులానికి వృత్తికి మధ్య ఉన్న బంధాన్ని తెంచేయడం, రెండు- సోషల్‌ మార్కర్స్‌ను మెటీరియల్‌ మార్కర్స్‌గా మార్చడం. పల్లెలో నీ ఉనికి నీ కులంతోనే ముడిపడి ఉంటుంది. ఏ ఊరిలో నైనా ఎవరిగురించైనా అడిగితే ఏంటోళ్లు అని ప్రశ్నిస్తారు. అదే పట్నంలో అయితే ఏం చేస్తారు అని అడుగుతారు. అక్కడ గుర్తింపు నీ కులం. ఇక్కడ గుర్తింపు నీ పని. నీ గుర్తింపు నీకు సంబంధం లేని పుట్టుకతో ముడిపడి ఉండడం కంటే నువ్వు చేసే పనితో ముడిపడి ఉండడం కచ్చితంగా మెరుగైన విషయం. కొత్త వ్యవస్థ  సంప్రదాయకంగా సాగుతున్న వృత్తి పనులను మార్కెట్‌ చేసి కొత్త విలువను ఇస్తుంది. అంతకు ముందు మార్కెట్‌ చేసుకోలేని విషయాలను బ్రాండ్‌గా మార్చివేసి కొత్త మేకప్‌ వేస్తుంది. ఆరోగ్యం కాస్తా ఫిట్‌నెస్‌ అనే మార్కెట్‌ పదంగా మారుతుంది.

సంప్రదాయ వ్యాయామశాలల స్థానంలో ఆధునికమైన జిమ్‌ మార్కెట్‌ ప్రవేశిస్తుంది. చిలకజోస్యాలు పిచ్చి లాజిక్కులతో న్యూమరాలజీ-వాస్తు రూపం తీసుకుంటాయి. బాత్‌రూమ్‌లు, లెట్రిన్‌లు క్లీన్‌ చేయడమనే పని మెయిన్‌టెయిన్స్‌ అనే రూపం తీసుకుని కొత్త డ్రస్ తొడుక్కుంటుంది. యూనిఫామ్‌, మెడలో ఐడెంటిటీ కార్డు లాంటివి కొత్త ఆత్మవిశ్వాసాన్ని, చైతన్యాన్ని ఇస్తాయి. కావాలంటే ఇళ్లలో పనిచేసే వారిని పరిశ్రమల్లో అదే పనిచేసేవారిని పోల్చిచూడండి. హౌస్‌ వైఫ్‌  అనే పదం దానికున్న న్యూనతను తొలగించుకుని హోమ్‌మేకర్‌ అనే ఆధునిక రూపం తీసుకుంటుంది. దర్జీపని  బాతిక్‌ రూపమెత్తుతుంది. చాకలి పని డ్రైక్లీనింగ్‌ రూపమెత్తి పరిశ్రమగా రూపుదాలుస్తుంది.  వంటపని కొత్త గౌరవాన్ని సంతరించుకుని గౌరవనీయమైన వృత్తిగా అవతరిస్తుంది. ఈ రంగంలో సూపర్‌ స్టార్‌ సంజీవ్ కపూర్‌ స్ర్తీ కాదు. వెంట్రుకలు కత్తిరించే పని ఇంతకుముందు లాగా అగౌరవంగా ఉండదు.

అందులో కులాన్ని తీసేసి కొత్త వర్గాల్ని ప్రవేశపెడుతుంది మార్కెట్‌. ఎదురుగా అద్దం తగిలించి కబుర్లు చెపుతూ బ్లేడుతో గడ్డం గీకడం ఒక వర్గం. కత్తెర చేత్తో పట్టుకుని ఏ స్టైల్‌చేయాలి సర్‌ అని అడిగేదొక వర్గం. పిలకజుట్టో పిల్లగడ్డమో పెట్టుకుని చొక్కా ఫ్యాంటు మీద అప్పటికప్పుడు ఒక బెల్టు లాంటిది తగిలించుకుని అందులోని ఆధునిక పొత్తి లోంచి కత్తెర్లు విలాసంగా ఎగరేసి తీస్తూ మీకు సెపరేషన్‌ కంటే సెపరేషన్‌లేకుంటేనే బాగుంటుంది సర్‌ అనేదొక వర్గం. పాత మంగలి పొత్తికి ఈ పొత్తికి మధ్య చాలా దూరం ఉంది. హబీబ్‌ ఇవ్వాల నేషనల్‌ స్టార్‌. ఆయన మంగలి కాదు. ఆయన శిష్యులు ప్రశిష్యులు వేలు లక్షలుగా మారి చిన్నచిన్న పట్నాల్లో కూడా సెలూన్లు తెరుస్తున్నారు. వాళ్లల్లో మంగళ్లు ఉన్నారో లేదో వెతుక్కోవాల్సిందే. మంగలిషాపు సెలూన్‌గా మారే ప్రక్రియ ప్రజాస్వామిక మైనది. ఇది వారి వృత్తిని దోచుకున్నదేమీ కాదు. ఎక్కువమంది ఆధారపడిన వృత్తి విషయంలో మార్పుసంక్లిష్టంగా ఉంటుందనేది వాస్తవం. కానీ ఆ సంక్లిష్టతలో మనం స్టేటస్‌ కోయిస్టుల పాత్ర పోషించరాదు.

పనికి పుట్టుకకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచడం వల్ల దానికి మార్కెట్‌ కల్పించడం వల్ల అన్ని కులాల వారు అన్ని పనులు చేయడంలో పోటీ పడే పరిస్తితి వస్తుంది. అత్యంత అమానవీయమైన వేశ్యావృత్తి కూడా రూపం మార్చుకుంది. ఇంతకుముందు కొన్ని కులాలకు పరిమితమైన వృత్తి ఇవాళ సెక్స్‌ వర్కర్స్‌ రూపమెత్తింది. అందులో వర్గాల వారిగా అన్ని కులాల వారు కనిపిస్తున్నారు. చివరకు ఆధ్యాత్మికత కూడా ఇండస్ర్టీగా మారిపోయి బోధకుల్లో గురువుల్లో బాబాల్లో బ్రాహ్మణేతర కులాల వాళ్లు చాలామంది రాణిస్తున్నారు. మంచి మాటకార్లకు బోలెడంత డిమాండ్ ఉంది. అమ్మోర్ల నుంచి బాబాల దాకా చాలా దూరమే ప్రయాణించాం. కాకపోతే సంప్రదాయకంగా మిగిలిపోయిన పూజారితనంలోకి శ్రామిక కులాలు రాకుండా ఆటకం ఉంది. డ్రైనేజీలో దిగి మురికిని బయటకు తోడివేసే పనిలోకి బ్రాహ్మణులు వస్తున్న పరిస్థితి లేదు.(ఇంత ఆధునిక యుగంలో కూడా ఇంకా మనుషులు డ్రైనేజీలోకి దిగాల్సి రావడం ఈ వ్యవస్థ శ్రామికుల పట్ల చూపిస్తున్న దుర్మార్గానికి దర్పణం) చేపలు పట్టే పనిలో  ఆధునికత తగినంత రాకపోవడం వల్ల అక్కడా లోటు కనిపిస్తున్నది. ఇలాంటి కొన్ని ఉదాహరణలు మినహాయిస్తే  మిగిలిన చాలా పనులతో కులబంధం బలహీన పడింది. ఇంతకుముందు చీప్‌గా చూసిన శ్రమలకు విలువ పెరుగుతున్నది.
ఆధునిక కత్తెర్ల పొత్తి మాదిరే మార్కెట్‌ వ్యవస్థ డబ్బు ఖర్చుపెట్టడంలో నీ శక్తి ఆధారంగా కొత్త రకమైన వర్గీకరణలను చేస్తుంది. మార్కెట్‌ కొత్త రకం కులాలను తయారుచేస్తుంది అని కూడా అనొచ్చు కానీ కులంలోఉండే పుట్టుక వ్యవహారం ఇక్కడ ఉండదని గుర్తించాలి. డబ్బు ఆర్జించడంలో నీకున్న శక్తి మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. పాతకాలపు స్టెనో గ్రాఫర్‌తో పోల్చదగిన మెడికల్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌, బిపివో, కాల్‌ సెంటర్‌ల పని కూడా ఇప్పుడు గొప్ప గ్లామర్‌ను సంతరించుకుంటుంది. డబ్బు మహిమ! సహింపరానంత అసమానతలు పెరిగిపోతూనే ఉంటాయి. నిరంతరం పోటీ పడుతూనే ఉంటావు కాబట్టి సరిపోని తనం అనేది నీకు గుదిబండలాగా కట్టేసే ఉంటుంది. లేనితనం ఒకటి అందని ద్రాక్షలాగా నిన్ను శాశ్వతంగా ఊరిస్తూనే ఉంటుంది. మార్కెట్‌- మీడియా ఈ లేనితనాన్ని సరిపోని తనాన్ని ఎప్పటికప్పుడు సృష్టిస్తూనే ఉంటాయి.

న్యూనత అసంతృప్తి అనేవి ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు చచ్చేదాకా ఊపిరాడకుండా నిలువనీయకుండా చేస్తూనే ఉంటాయి.  అది టాల్‌స్టాయ్‌  “హౌ మచ్‌ లాండ్‌ డస్‌ ఏ మ్యాన్‌ రిక్వైర్‌” కథలో పరుగులాంటిది . అలాంటి ఒత్తిడి నిరంతరం మనల్ని తరుముతూ ఉంటుంది.  కోతుల్ని చేసి ఆడిస్తుంది.  కొన్ని ఆలోచనలు,కొన్ని స్పందనలు ఉన్న మనిషిగా కంటే నిరంతరం వస్తువులు కొనే వినియోగదారునిగా మాత్రమే చూస్తుంది. నిలుచుని ఆలోచించే తీరిక లేకుండా చేస్తుంది. నీకు నిన్ను పరాయివాడిని చేస్తుంది. మాయా తెరలను సృష్టిస్తుంది. తెర సౌకర్యం స్థాయిని దాటిపోయి వ్యసనమై కూర్చుంటుంది. మనిషి తోటి మనిషితో కాకుండా తెరతో సంపర్కం చేసి మాయా సంతృప్తి పొందే తెరాధునికత లక్షణాన్ని మన జీవితంలోకి తెస్తుంది. ఇవన్నీ చర్చించాల్సినవే. కథనం చేయాల్సినవే. చాలామంది చేస్తున్నారు కూడా. కొందరే ఇంకా పాత మాయను మోసుకు తిరుగుతున్నారు. అది మాయ కదా, కొత్త జీవం కడుపులోంచి బయటపడ్డాక దానికి విలువ ఉండదు. ఆ తర్వాత కూడా మోసుకు తిరుగుదామంటే కంపు కొడుతుంది. ఆ కంపును వదులుకోవాల్సిందే. పుట్టుక ఆధారంగా నీ వృత్తిని దాని గౌరవాన్ని నిర్ణయించే నాలుగు పాదాల వ్యవస్థను ఏ సాకుతో కీర్తించినా అది అన్యాయం. శ్రామిక వ్యతిరేకం.

 

-జి ఎస్‌ రామ్మోహన్‌

ఇప్పుడైనా ఈ చరిత్ర మారుతుందా?!

venu1గతవర్తమానం 04

 

 

జూన్ 1 అర్ధరాత్రి, జూన్ 2 ఉదయించే వేళ. తన అరవై సంవత్సరాల స్వయంపాలనా ఆకాంక్ష నెరవేరిందని తెలంగాణ సమాజం సంబరాలు చేసుకుంటున్న వేళ, రెండు మూడు రోజుల ముందునుంచీ ఆ వర్తమాన సంతోష సందోహంలో భాగమవుతూనే నా మనసు మాత్రం సంక్లిష్ట సందేహ గతంలో తిరుగాడుతోంది. చరిత్రలో తెలంగాణ ఎన్నోసార్లు సంబురపడింది. తన తండ్లాట తీరిందనీ, తన కోరిక నెరవేరిందనీ అనుకుంది. కాని ఎక్కడి గొంగడి అక్కడ్నే అనే నుడికారం తిరిగితిరిగి నిజమయింది. ఈసారీ అంతేనా, ఏమన్నా మారుతుందా అని ప్రశ్నలే ప్రశ్నలు. చారిత్రక ఘటనల మధ్య సామ్యం ఎంత ఉంటుందో భేదమూ అంతే ఉంటుందన్నది నిజమే గాని తేదీలు దాదాపు కలిశాయి గనుక సరిగ్గా డెబ్బై సంవత్సరాల కిందటి ఇటువంటి సందర్భమే గుర్తుకొచ్చింది.

అది తెలంగాణ చరిత్ర ఒక గుణాత్మకమైన మలుపు తిరిగిన సందర్భం. సుప్రసిద్ధమైన పదకొండో ఆంధ్ర మహాసభ బోనగిరిలో 1944 మే 27, 28 ల్లో జరిగింది. అంతకు మూడు నాలుగు సంవత్సరాల ముందునుంచీ సాగుతున్న అభిప్రాయభేదాలు ఒక దశకు చేరి ఆ రోజున ఆంధ్ర మహాసభ చీలిపోయింది. అప్పటికి కనీసం ఆరు దశాబ్దాలుగా సాగుతున్న తెలంగాణ సమాజపు తండ్లాట ఆ రోజున ఒక పరిష్కార మార్గాన్ని చేపట్టింది. ఆ మార్గం మరిన్ని మలుపులు తిరిగి ఆ తండ్లాట యథావిధిగా మిగిలిపోవడమో, ఇంకా పెరగడమో వేరే కథ. కాని ఆ రోజునూ, ఆ రోజుకు అటూ ఇటూ సాగిన చరిత్ర పురిటి నొప్పులనూ ఇవాళ గుర్తు తెచ్చుకోవడం చాల అవసరం. తెలంగాణ తండ్లాట పరిష్కారమయిందనే అభిప్రాయం ఇవాళ మరొకసారి వ్యాపిస్తున్నప్పుడు, అప్పటి పరిష్కారాన్ని పునర్దర్శించడం చాల అవసరం. సరిగ్గా అప్పటిలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక శక్తులలో ఒక శక్తిది మాత్రమే పైచేయి అవుతున్నప్పుడు నాటి చరిత్రను మననం చేసుకోవడం అవసరం. గత వర్తమానాల మధ్య సంభాషణ ఇవాళ్టి అవసరం.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర మీద దాదాపు వంద పుస్తకాలు వెలువడినప్పటికీ, అది చరిత్ర, జీవిత చరిత్ర, ఆత్మకథ, వ్యాసం, కథ, నవల, కవిత్వం, నాటకం, విశ్లేషణ వంటి అన్ని ప్రక్రియలలోకీ వ్యాపించినప్పటికీ ఇంకా ఆ పోరాటాన్ని చారిత్రక, సామాజిక, స్థానిక నేపథ్యం నుంచి చూడవలసినంతగా, చూడవలసినట్టుగా చూడలేదనే అనిపిస్తుంది. దాన్ని కమ్యూనిస్టు పార్టీ నడిపిన రైతాంగ సాయుధ పోరాటంగా చూడడం ఎంత సముచితమో, తెలంగాణ సమాజం భారత కమ్యూనిస్టు పార్టీకి నేర్పిన రైతాంగ సాయుధ పోరాటంగా చూడడం కూడ అంతే సముచితం. నిజానికి 1938-39ల్లో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలో ప్రవేశించడానికి చాల ముందు నుంచే తెలంగాణ సమాజంలో ధిక్కార స్వభావం ఉన్నది. మెరుగైన, మంచి బతుకు కోసం తండ్లాట ఉన్నది. తెలంగాణ సమాజం సాగించిన ఆ తండ్లాటకు స్వయంనిర్ణయాధికారం, స్వావలంబన, స్వాభిమానం అనే మూడు ఆకాంక్షల ఆధార భూమికలున్నాయి. ఆ ఆకాంక్షలు అర్థవంతంగా, సుస్థిరంగా నెరవేరాలంటే విశాల ప్రజారాశుల భాగస్వామ్యంతో, శాస్త్రీయ దృక్పథంతో, సమగ్ర పోరాటం జరగాలనే అవగాహన బలపడిన సందర్భం బోనగిరి ఆంధ్ర మహాసభ.

హైదరాబాద్ లో తొలి స్వాతంత్ర సమర యోధుడు తుర్రే బాజ్ ఖాన్ స్మారక స్థూపం

హైదరాబాద్ లో తొలి స్వాతంత్ర సమర యోధుడు తుర్రే బాజ్ ఖాన్ స్మారక స్థూపం

తెలంగాణలో స్వయంనిర్ణయాధికార ఆకాంక్షను ఢిల్లీని ఎదిరించిన ప్రతాపరుద్రుడి నాటికీ, కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదిరించిన పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ ల దగ్గరికీ తీసుకుపోవచ్చు గాని, అంత వెనక్కి వెళ్లకుండా ఆధునిక యుగం నుంచే చూడవచ్చు. అది 1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వ్యక్తమయింది. ఆనాడు విదేశీ అధికారాన్ని ప్రశ్నిస్తూ దేశంలోని నాలుగు వర్గాల (సైనికులు, రైతాంగం, చేతివృత్తుల వారు, సంస్థానాధీశులు) మహత్తరమైన ఐక్యసంఘటన పోరాటాన్ని ప్రారంభించినప్పుడు, ఆ పోరాటం దేశవ్యాప్తంగా విస్తరించినప్పుడు, బ్రిటిషిండియాలో భాగం కాని హైదరాబాద్ రాజ్యానికి దానితో సంబంధం ఉండనవసరం లేదు. కాని సర్ సాలార్ జంగ్ (1829-1883) నాయకత్వాన అసఫ్ జాహి పాలకులు బ్రిటిష్ వారికి సహకరించడానికీ, పొరుగు ప్రాంతాల భారత స్వాతంత్ర్య సైనికులను అణచడానికీ కూడ ప్రయత్నించినప్పుడు, హైదరాబాద్ తిరుగబడి, తన స్వయం నిర్ణయాధికారాన్ని ప్రకటించింది. మరెక్కడా లేనివిధంగా ఒక స్వతంత్ర సంస్థానంలో తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లాఉద్దీన్ ల నాయకత్వాన బ్రిటిష్ వ్యతిరేక అసాధారణ పోరాటాన్ని నడిపినది తెలంగాణ సమాజం. హైదరాబాద్ నడిబొడ్డున బ్రిటిష్ రెసిడెంట్ బంగళాను దిగ్బంధనం చేసి తుపాకి కాల్పులతో గడగడలాడించినది తెలంగాణ సమాజం. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం దేశవ్యాప్తంగా అణచివేతకు గురైనా రెండు సంవత్సరాల దాకా ఆ జ్వాల ఆరిపోకుండా కాపాడిన మరాఠా వీరులకు ఆశ్రయం ఇచ్చినది తెలంగాణ.

 

అలాగే స్వావలంబన కోసం తపన కూడ మొత్తం భారత ఉపఖండంలోనే మొదటిసారిగా తెలంగాణలో వ్యక్తమయింది. ఆ వ్యక్తీకరణలో శాస్త్రీయ దృష్టి ఉందా, విశాల భాగస్వామ్యం ఉందా అని ఇవాళ ప్రశ్నించవచ్చుగాని, అసలు ఆనాటి సమాజంలో ఆ ప్రశ్న వెలువడడమే గణనీయమైన అంశం. ఒకవైపు బ్రిటిష్, ఫ్రెంచి ఆధునికతా పవనాలు రాజ్యంలో నింపుతున్న సాలార్ జంగ్ సంస్కరణలు అమలు జరుగుతుండగానే, స్థానిక మౌలిక సౌకర్యాల కోసం పరాయి దేశపు కంపెనీకి ఎర్ర తివాచీ పరవగూడదని నినదించింది తెలంగాణ, బహుశా దేశంలో బహుళజాతి సంస్థలకు తొట్టతొలి వ్యతిరేకతను ప్రకటించినది తెలంగాణ. సాలార్ జంగ్ మరణానికి ముందే ఆమోదించిన చాందా రైల్వే స్కీమ్ పట్ల, ముఖ్యంగా ఆ స్కీమ్ ను బ్రిటిష్ పెట్టుబడిదారీ సంస్థల లాభాల కోసం తయారు చేయడం పట్ల 1883లో వ్యతిరేక ఆందోళన ప్రారంభమయింది. వాడి నుంచి హైదరాబాదు దాకా ఉండిన రైల్వే లైనును చాందా దాకా విస్తరించడానికీ, ఆ విస్తరణ పనులను బ్రిటిష్ సంస్థలకు అప్పగించడానికీ, ఆ సంస్థల లాభాలకు హామీ ఇవ్వడానికీ నిర్దేశించినది ఈ స్కీము. అప్పటికే ఉండిన అంజుమన్-ఎ-ఇక్వాన్-ఉస్-సఫా నాయకత్వంలోనూ, కొత్తగా ఏర్పడిన చాందా రైల్వే స్కీం వ్యవహారాల కమిటీ నాయకత్వంలోనూ పోరాటం జరిగింది. ప్రభుత్వ పథకపు పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని ఈ సంస్థలు కోరాయి. రాచరిక ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ విధానాన్ని ప్రజలకు తెలియజెప్పాలని కోరడమంటే, అందులోనూ విదేశీ సంస్థల ప్రయోజనాన్ని వ్యతిరేకించడమంటే ఎంత ప్రగతిశీల ఆలోచనో చెప్పనక్కర లేదు.

అలాగే స్వాభిమానం కోసం తపన అప్పటి సామాజిక, రాజకీయ స్థితిలో మత, కుల, భాషా రూపాలలో వ్యక్తమై ఉండవచ్చు గాని అట్టడుగున ఉన్నది ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే ఆలోచనే. అందుకు, 1895లో మొదటి మరాఠీ గ్రంథాలయంగా భారత గుణవర్ధక సంస్థ, 1901లో మొదటి తెలుగు గ్రంథాలయంగా శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, 1906 జగన్ మిత్ర మండలి వంటి ఎన్నో వ్యక్తీకరణలను చూడవచ్చు. ఆ వరుసలోనిదే 1921లో ఏర్పడిన ఆంధ్ర జనసంఘం, 1923లో రూపొందిన ఆంధ్ర జన కేంద్ర సంఘం. న్యాయవాదులతో, విద్యావంతులతో ఏర్పడిన ఆ సంస్థే 1931 నాటికి విశాల ప్రజారాశుల ఆంధ్ర మహాసభగా మారింది. తమ భాషలో మాట్లాడి అవహేళనకు గురైన తెలుగువారి సంస్థగా సాంస్కృతిక మూలాల నుంచి ప్రారంభమైన ఆ సంస్థ, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని, భూమి-భుక్తి-విముక్తినీ కోరే సామాజిక, రాజకీయ సంస్థగా ఎదిగింది. భాష, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర వంటి అంశాల మీద పోరాటం, అంతిమంగా రాజకీయార్థిక మూలాలను ప్రశ్నించకుండా సార్థకమూ అర్థవంతమూ కాజాలదని గుర్తించింది. నాలుగు శాతం కన్న తక్కువ అక్షరాస్యత ఉన్న సమాజంలో గ్రంథాలయోద్యమం ఏమిటనే వైరుధ్యం నుంచి బుద్ధిజీవుల, విద్యావంతుల సామాజిక బాధ్యతా స్పృహ వెలికివచ్చింది. ఆ పరిణామక్రమంలోనే ఆంధ్ర మహాసభ మహాఘనతవహించిన నిజాము రాజుగారి దివ్యసమ్ముఖమునకు మహజర్లు, విన్నపాలు సమర్పించే స్థితి నుంచి వెట్టి చాకిరీలో మగ్గిపోతున్న అసంఖ్యాక నిరక్షరాస్య జనానికి చేరువయింది. భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి వేదిక అయింది. అక్షరోపజీవులు తమ సమస్య అనుకుని ప్రారంభించిన ఉద్యమానికి నిరక్షరాస్య బండి యాదగిరి పాట మార్గ నిర్దేశనం చేసింది. ఉపరితల భాషా సమస్య దగ్గర ప్రారంభమైన కదలిక పునాది భూమి సమస్యకు చేరింది. రంగస్థలం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం నుంచి కామారెడ్డిగూడానికీ, పాలకుర్తికీ, మొండ్రాయికీ, ధర్మాపురానికీ మారింది.

బోనగిరి ఆంధ్ర మహాసభను ఈ నేపథ్యంలో చూడవలసి ఉంది. ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతున్నందువల్ల, వారు గ్రామాలలో అశాంతికి కారకులవుతున్నందువల్ల తాము ఆంధ్రమహాసభ నుంచి తటస్థంగా ఉంటామని ‘జాతీయవాదుల’మని చెప్పుకునేవారు బోనగిరి సభలకు సహాయ నిరాకరణ ప్రారంభించారు. ఏ పక్షానికీ చెందనివారమని ప్రకటించుకున్న అప్పటి అధ్యక్షులు కొండా వెంకటరంగారెడ్డి, కార్యదర్శి మందుముల రామచంద్రరావు సభల్లో ప్రారంభోపన్యాసం చేసి, కవిలెకట్టలు అప్పగించి మిగిలిన సభలో కూడ పాల్గొనకుండా వెళ్లిపోయారు. ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రవేశమో, జోక్యమో, ప్రాబల్యమో ఉన్నాయా లేవా అనేది చర్చనీయాంశమే. కాని అంతకన్న ముఖ్యంగా, ఆనాటి తెలంగాణ సమాజంలో అతి పెద్ద ప్రజాసంస్థలో నిజమైన ప్రజాసమస్యల ప్రస్తావన ప్రారంభం కాగానే ఎవరెవరు తప్పుకోజూశారనేది, ఎవరెవరు నిలబడి పోరాడుతామన్నారనేది ప్రధానం. ప్రజాసమస్యలపై పోరాటానికి, పరిష్కారానికి తాను సిద్ధంగా లేనని ఒక వర్గం నాయకత్వం, ఆ తర్వాత మొత్తంగా కాంగ్రెస్ లో చేరిపోయిన నాయకత్వం ప్రకటించిందనేది వాస్తవం. అప్పుడు కమ్యూనిస్టులు మేమున్నామంటూ ముందుకొచ్చారు.

అప్పటి తెలంగాణ సమాజంలో అధికారాన్ని ధిక్కరించిన ఆర్యసమాజం మతంలో కూరుకుపోయింది. దానికి వ్యతిరేకంగా వచ్చిన ఇత్తెహాదుల్ ముసల్మీన్ అధికారంతో అంటకాగింది. ఈ రెండు సంస్థలతో పాటు మరొక అరడజను ఇటువంటి సంస్థలు 1938 నాటికే నిషేధానికి గురయ్యాయి. కుల సంఘాలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి గాని అవి అప్పటికింకా ప్రజల మౌలిక సమస్యలను ప్రస్తావించడం లేదు. భయ సంకోచాలతో పుట్టిన స్టేట్ కాంగ్రెస్ తాను తెలంగాణ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించనని స్పష్టంగానే చెప్పింది. ఆ నేపథ్యంలో జరిగినది బోనగిరి ఆంధ్ర మహాసభ. అక్కడ తాను ప్రజల పక్షం ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం నిర్మిస్తానని, నిర్మాణమవుతున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని కమ్యూనిస్టు పార్టీ మనసా వాచా కర్మణా ప్రకటించింది గనుకనే తెలంగాణ సమాజం కమ్యూనిస్టు పార్టీని తన గుండెలకు హత్తుకుంది. ఏడు దశాబ్దాల తర్వాత కూడ తెలంగాణ సమాజంలో కమ్యూనిస్టుల పట్ల ప్రేమ అందువల్లనే.

స్టేట్ కాంగ్రెస్ మీద 1938లో విధించిన నిషేధాన్ని 1946 వరకూ కూడ తొలగించనందువల్ల పైకి స్టేట్ కాంగ్రెస్ అని చెప్పుకోకపోయినా ఆ భావాలు గలవాళ్లు ఆంధ్ర మహాసభలో ‘జాతీయవాదులు’ పేరిట కొనసాగారు. 1942లో నిషేధం ఎత్తివేసినందువల్ల కమ్యూనిస్టులు బహిరంగంగా పనిచేసే అవకాశం వచ్చింది గాని వారు కూడ ఆంధ్ర మహాసభలోనే కొనసాగారు. ఈ రెండు ప్రత్యర్థి పక్షాలే కాక ఏ పక్షానికీ చెందని వారు కూడ ఆంధ్ర మహాసభలో పెద్ద సంఖ్య లోనే ఉన్నారు. ఆంధ్ర మహాసభ వివిధ వృత్తులవారితో, వివిధ రాజకీయ విశ్వాసాలు గలవారితో నిజంగా ఒక విశాలమైన ఐక్యసంఘటనగా కొనసాగింది. అప్పటికి పదిహేను సంవత్సరాలుగా ఇలా సాగుతున్న సమన్వయం భూపోరాటాలు ప్రారంభం కాగానే చెదిరిపోయింది. ఆ చీలిక బోనగిరిలో స్థిరపడింది. తర్వాత ఆంధ్ర మహాసభ ఎక్కువరోజులు పనిచేయలేకపోయింది గాని, దొడ్డి కొమరయ్య హత్యతో (1946 జూలై 4) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమయింది. ఐదు సంవత్సరాల పాటు సాగిన ఆ పోరాటం పదిలక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి, మూడు వేల గ్రామాలను విముక్తి చేసి అటు భూమి-భుక్తి-విముక్తి ఆకాంక్షలనూ, ఇటు స్వయం నిర్ణయాధికారం – స్వావలంబన – స్వాభిమాన ఆకాంక్షలనూ ఒక మేరకు సాధించింది. ఐదు సంవత్సరాల తర్వాత 1951 అక్టోబర్ 20న ఆ పోరాటం అర్ధాంతరంగా ఉపసంహరణ జరిగి ఉండకపోతే ఆ ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరేవే, సుస్థిరంగా ఉండేవా, తెలంగాణ తండ్లాటకు శాశ్వత పరిష్కారం దొరికి ఉండేదా…. ఇప్పుడన్నీ ఊహాత్మకమైన ప్రశ్నలే. కాని ఆ నాడు తెలంగాణ మట్టి మనిషి సంధించిన ప్రశ్నలూ ఆయుధాలూ ఇవాళ్టికీ ఆరని నిప్పుకణికల్లా రగులుతూనే ఉన్నాయి.

telangana 14

ఈ గతం వెలుగులో వర్తమానాన్ని చూస్తే, తెలంగాణ సమాజపు తండ్లాటకు ఇటీవలి వ్యక్తీకరణ ఆంధ్ర మహాసభ కన్న విస్తృతమైనది. వర్గం, బృందం, కులం, మతం, వయసు, స్త్రీపురుష భేదం వంటి అంతరాలన్నిటినీ పక్కనపెట్టి తెలంగాణ సమాజమంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది. రాష్ట్ర సాధనే తన తండ్లాటకు పరిష్కారమని భావించినట్టు అనిపించింది. రాష్ట్రం ఏర్పడింది గాని తండ్లాట పరిష్కారమవుతుందా అని అనుమానాలు అట్లాగే ఉన్నాయి. ఇన్ని శక్తులు ఐక్యంగా ఉద్యమించినప్పుడు విజయ ఫలాలు అన్ని శక్తులకూ వాటి భాగస్వామ్యం ప్రకారమైనా అందుతున్నాయా అని ప్రశ్న మిగిలే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్వయంనిర్ణయాధికారం సంపూర్ణంగా అందిందా, పరిమితంగా, పాక్షికంగా అందిందా? ప్రపంచీకరణ రాజకీయాల, కార్పొరేట్ పన్నాగాల యుగంలో స్వావలంబన ఏ మేరకైనా సాధ్యమా? సాధ్యమైన మేరకైనా తెలంగాణ పాలకవర్గాలు అమలుచేస్తాయా? బహుశా స్వాభిమానం, ఆత్మగౌరవం గత అరవై సంవత్సరాలలో అనుభవించినదానికన్న కాస్త ఎక్కువే అనుభవించే అవకాశం వస్తుందేమో.

బోనగిరిలో 1944 మే 27-28ల్లో సాధించిన విజయం, తెలంగాణ వ్యాప్తంగా 1951 అక్టోబర్ 20న చెదిరిపోయింది. ‘నడుమ తడబడి సడలి ముడుగక పడవ తీరం క్రమిస్తుందా’ అనే ఆందోళన నిరాశతో అంతమయింది. 2014 జూన్ 2 ఏమవుతుంది?

 

-ఎన్. వేణుగోపాల్

 

పెద్దాపురం అమ్మరసు పెళ్లి – మరికొన్ని విశేషాలూ

పెద్దాపురం అమ్మరసు, అక్క, సత్యవతి అత్తయ్య

పెద్దాపురం అమ్మరసు, అక్క, సత్యవతి అత్తయ్య

బాగా చిన్నప్పటి విషయాలలో నాకు బాగా గుర్తున్నది 1953 సెప్టెంబర్ లో జరిగిన మా పెద్దాపురం అమ్మరసు వదిన పెళ్లి. అంటే మా ఆఖరి మేనత్త (బాసు పిన్ని అని పిలిచే వాళ్ళం) రెండో కూతురన మాట. పెద్ద కూతురు జయ వదిన తరువాత అమ్మరసు వదిన, ఆ తరవాత అబ్బులు బావ (నా కంటే రెండేళ్ళు పెద్ద), ఆడపిల్లలు రత్నం, పద్మ….వీళ్ళందరూ కాకినాడ లో మా ఇంట్లో పుట్టిన వాళ్ళే. పెళ్లి కొడుకు పేరు వాడ్రేవు వెంకటేశ్వర రావు గారు…నాకు వరసకి అన్నయ్య. కిందటి సారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు “మా రాజా వచ్చాడు” అని అమ్మరుసు వదినా , అన్నయ్య గారూ నన్ను చూడడానికి మా అక్క ఇంటికి వచ్చారు.

పెద్దాపురం మామయ్య గారు

పెద్దాపురం మామయ్య గారు

ఆ నాటి ఆప్యాయతలు తలచుకుంటే నాకు భలే ఆనందంగా ఉంటుంది. వాళ్లిద్దరి పెళ్ళీ పెద్దాపురం లో కొక పెద్ద సత్రం లో జరిగింది. మా మామయ్య గారు పండ్రవాడ సుబ్బా రావు గారు పెద్దాపురం లో అడ్వకేట్. ఆయన ఎప్పుడూ నవ్వుతూ గల గల లాడుతూ మాట్లాడుతూ ఉండే వారు. మా అబ్బులు బావ కాకినాడ లో పాలిటెక్నిక్ చదువుకుంటున్నప్పుడు ..అంటే 1960 లలో గుండె పోటుతో…చిన్న వయసులోనే .. పోయారు. మా దగ్గర ఉన్న ఆయన ఒకే ఒక్క ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. మా పెద్దమ్మరసు, చిన్నమ్మరసు అనే మా అక్క, సత్యవతి అత్తయ్య ఉన్న ఆ నాటి ఫోటో కూడా ఇక్కడ జతపరుస్తున్నాను. ఇందులో సత్యవతి అత్తయ్య మా తాత గారి (సవితి) తమ్ముడు నారాయణ మూర్తి తాతయ్య గారి కూతురు. మా ఇంటి వెనకాల ఇంట్లో ఉండే వారు.

అంత బాగా జ్జాపకం లేక పోయినా నేను నా చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళలో నా దగ్గర ఉన్న సత్యవతి అత్తయ్య పెళ్లి ఫోటో, సుదర్శనం పిన్ని, భర్త సాంబశివ రావు బాబయ్య గారి ఫోటోలు కూడా ఇక్కడ జతపరుస్తున్నాను. సుదర్శనం పిన్ని మా బామ్మ గారి తమ్ముడు తాళ్లూరి లక్ష్మీపతి రావు తాత గారు, మహాలక్ష్మి బామ్మ (తణుకు) గారి కూతురు. ఆ కుటుంబం అంతా ….సుదర్శనం పిన్ని, సువర్చల, హనుమ…(మిగిలిన పేర్లు మర్చిపోయాను)   మేమంటే ఎంతో అభిమానంగా ఉండే వారు. ఎంత అభిమానం అంటే ..ఒక సారి కాకినాడ లో గోదావరి జిల్లాల ఫలపుష్ప ప్రదర్శన భారీ ఎత్తున జరిగింది. తణుకు లో ప్రపంచ ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త, కేంద్ర మంత్రి స్వర్గీయ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారికి కుడి భుజంలా ఉండే మా లక్ష్మీపతి తాతయ్య గారికి ఆవకాయలు పెట్టడం అంటే చాలా ఇష్టం. అందుచేత ఆ ఎక్సిబిషన్ లో ఆయన మా అక్క పేరిట సుమారు వంద రకాల ఆవకాయలు పెట్టి ..మొత్తం గోదావరి జిల్లాలు అంతటికీ మొదటి బహుమతి మా అక్కకి వచ్చేటట్టు చేశారు.

సత్యవతి అత్తయ్య పెళ్లి

సత్యవతి అత్తయ్య పెళ్లి

 

 

 

ఈ వ్యాసంలో జతపరిచిన ఫోటోలు వారి కుటుంబాల దగ్గర కూడా ఉంటాయి అని నేను అనుకోను. అవి కేవలం నా దగ్గర ఉండడం, ఇలా ప్రచురించుకోగలగడం నా అదృష్టం. ఈ గ్లోబల్ ప్రపంచంలో మరుగున పడిపోయి, ములిగిపోయిన ఆయా కుటుంబాల తాలూకు వారెవరికీ బహుశా నేను ఎవరో తెలియదు…

ఇంతకీ నాకు ఎనిమిదేళ్ళ వయసులో జరిగిన ఆ పెద్దాపురం పెళ్లి నాకు బాగా జ్జాపకం ఉండడానికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి. ఒకటేమో పెళ్లి ముందు రోజు రాత్రి చిట్టెమ్మ బామ్మ గారు అనే వితంతువు ఒక విడిది గదిలో మూల తెల్ల ముసుగు వేసుకుని ముడుచుకుని పడుకుంది. నేను ఏదో పని మీద ఆ గది లోకి వెళ్లి ఆవిడని చూసి, హడిలి చచ్చి పోయి “బాబోయ్ దెయ్యం” అని అరుచుకుంటూ బయటకి పారిపోయాను. ఎందుకంటే అంతకు ముందు వారం పది రోజుల ముందు ఏ చందమామ లోనో దెయ్యాలు తెల్ల ముసుగులు వేసుకుని, అరికాళ్ళు వెనక్కి తిప్పి ముడుచుకుని మూల దాక్కుంటాయి అని చదివాను. అదీ సంగతి. అసలు సంగతి తెలుసుకుని అందరూ నన్ను చూసి కోప్పడ లేదు కానీ అందరిలోనూ నవ్వుల పాలు కావడం నాకు బాగా గుర్తు. మరొక విశేషం ఏమిటంటే చిన్న అమ్మరసు ..అంటే మా అక్క ….అదే గదిలో రాత్రి పడుకుంటే ఎవరో జడ కొంచెం కత్తిరించి, మా అక్క పెట్టుకున్న బంగారం పాపిడి పిందెలు, చేమంతి పువ్వు దొంగతనం చేశారు. మర్నాడు పొద్దున్న మా అమ్మ మా అక్కకి జడ వేస్తూ చూసి అనుమానం వచ్చి అందరి పెట్టెలూ చూస్తుంటే ఈ చిట్టెమ్మ బామ్మ గారి కూతురి పెట్టె లోపల సగం, పైన వేళ్ళాడుతూ సగం కత్తిరించిన జుట్టు కనిపించింది. అప్పుడు మా చిట్టెన్ రాజు బాబయ్య, మా నాన్న గారు పంచాయితీ పెట్టి, ఆ పెట్టె తాళం తీయిస్తే ఆ దొంగతనం బయట పడింది. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళలో అందరూ నగలు పెట్టుకుని వెళ్ళడం, ఇలా దొంగతనాలు జరగడం పరిపాటే !

ఇక …ముఖ్యమైనది అని చెప్పను కానీ ….మూడో కారణం నా జన్మలో నేను చూసిన మొట్ట మొదటి భోగం మేళం పెద్దాపురం అమ్మరసు పెళ్లి లోనే! ఆ రోజుల్లో పెళ్లి అనగానే మొట్ట మొదట చూసేది ఏ ఊరి బేండ్ మేళం, ఏ ఊరి భోగం మేళం, ఏ ఊరి వంటవాళ్లు మొదలైన హంగులే. అందులో కాకినాడ లేదా రాజమండ్రి బేండ్ మేళం, కోనసీమ వంటవాళ్లు పేరున్న వాళ్ళు అయితే మా ప్రాంతాలలో పెద్దాపురం భోగం మేళం చాలా ప్రసిద్ధమైనది. పెళ్లి ముందు రోజు రాత్రి ఊరేగింపు లో పల్లకీ బోయీలు, బేండ్ మేళం లో ఉన్న మంగలి వారు చమ్కీ గుడ్డలు వేసుకుని హుషారైన పాటలు వాయిస్తూ ఉంటే పది, పది హేను మంది అమ్మాయిలు సినిమా పాటలకి డేన్స్ చేస్తూ పెళ్లి వారికి వినోదం కలిగించే వారు. ఇప్పుడు ఇదంతా ఏదో సినిమా సీను లా అనిపించ వచ్చు నేమో అది ఆ రోజుల్లో అక్షరాలా నిజంగా అలాగే జరిగేది.

ఇక పెళ్లి వారిలో వయసు లో ఉన్న యువకులు ఈ మేళం వాళ్ల లో బావున్న యువతుల చేత ప్రెవేటు గా రికార్డింగ్ డేన్సులు ..సినిమాల లో లాగా….చేయించుకునే వారుట…నేను అవేమీ చూడ లేదు కానీ, పెట్రోమేక్స్ లైట్ల వెలుగులో మేళం వాళ్ళ డేన్స్ లు అప్పుడే మొట్టమొదటి సారి చూశాను కానీ అంత కంటే ఎక్కువ విశేషాలేమీ ఇప్పుడు గుర్తు లేవు. ఆ పెళ్ళికి రెండేళ్ళ ముందు పోయిన మా తాత గారి కోరిక మీద మా పెద్దమ్మరసు పెళ్ళీ, మా మేనత్తల అందరి కూతుళ్ళ పెళ్ళిళ్లూ మా అమ్మా, నాన్న గారి చేతుల మీదుగానే జరిగాయి. పెళ్లి కి కావలసిన దినుసులన్నీ మా పొలంలో పండినవే! అన్నట్టు అప్పుడు ధాన్యం ధర “అక్కుళ్ళు” కుంచం ఒక రూపాయి.. బస్తాకి 16 రూపాయల 2 అణాలు. వెల్లుల్లి పాయలు 2 వేసెలకి 2 రూపాయల 10 అణాలు. తాపీ మేస్త్రీ కూలి రోజుకి 2 రూపాయలు. మా పెద్దన్నయ్య నాకూ, మా తమ్ముడికీ కొనిపెట్టిన 4వ క్లాసు ఎక్సెర్సైజ్ పుస్తకాలు – 100 పేజీలు  – 4 పుస్తకాలు కలిసి 2 రూపాయల 3 అణాలు. 50 తారాజువ్వలు 1 రూపాయి 8 అణాలు. తాటాకులు వందకి 1 రూపాయి 10 అణాలు. అదే పెళ్లి లో గాడి పొయ్యి లోంచి కొన్ని పెద్ద నిప్పు కణికెలు పైకి ఎగరగానే పై కప్పు అంటుకుంది అనీ, వెంటనే బిందెలతో నీళ్ళు జల్లి మంటలు ఆర్పేశారు అనీ కూడా చూచాయగా నాకు జ్జాపకం.

సుదర్శనం పిన్ని, సాంబశివ రావు

సుదర్శనం పిన్ని, సాంబశివ రావు

పెద్దాపురం అనగానే, ఇప్పుడు అప్రస్తుతమే కానీ ఇటీవల మరణించిన అంజలీ దేవి టెంకి జెల్ల విషయం జ్జాపకం వస్తోంది. అంజలీ దేవి ఇల్లు పెద్దాపురం లో మా మేనత్త గారి ఇంటి పక్కనే. నా చిన్నప్పుడు …నా వయసు పదకొండో, పన్నెండో….సువర్ణ సుందరి సినిమా తరువాత….నేను బహుశా వేసవి శలవులకో..మరెందుకో ….పెద్దాపురం మా మేనత్త గారి ఇంటికే వెళ్లాను. ఆ మర్నాడే అంజలీ దేవి తన ఇంటికి పెద్దాపురం వచ్చింది అని తెలిసింది. ఇక చూసుకోండి. నేను ఆ సాయంత్రం ఆ మేనత్త గారి మేడ మీదకి వెళ్లి పోయి, అంజలీ దేవి ఇంటి పెరడు కేసి చూస్తూ , పచార్లు చేస్తూ “పిలువకురా, అలుగకురా..” అనో గొంతెత్తి పాడేస్తూ ఎలాగో అలాగా ఆవిడ కనపడుతుందేమో అనో ఓవర్ ఏక్షన్ చేసేశాను. ఆ మర్నాడు అంజలీ దేవి మా మేనత్త గారి ఇంటికి వచ్చి, “నిన్న సాయంత్రం ఆ గొడవంతా నువ్వేనా?” అని నన్ను దగ్గరకి తీసుకుని ఒక మొట్టి కాయ వేసింది. అంజలీ దేవి చేత మొట్టి కాయ వేయించుకున్న అభిమానిని నేనొక్కణ్ణే అని నాకు భలే గర్వంగా ఉంటుంది…

సినిమాలు అనగానే నేను నా పదేళ్ళ వయస్సులో..అంటే ఏడాది అటూ, ఇటూ చూసిన సినిమాలు “వద్దంటే డబ్బు- భానుమతి, నాగేశ్వర రావు సినిమా”, టేక్సీ డ్రైవర్, “సంఘం (వైజయంతీ మాల), “అగ్గి రాముడు”, పరివర్తన, జాతక ఫలం, దో బీగా జమీన్, విప్రనారాయణ…మొదలైనవి.

ఒక తమాషా జ్జాపకం…..ఆ రోజులల్లో ఒక సారి మా నాన్న గారు కాకినాడ రామారావు పేటలో ఉండే సున్నపు గానుగు వాడి దగ్గర ఒక ఎద్దు కొని పొలం పంపించారు. దాన్ని బండి లాగడానికి కట్టగానే అది అలవాటు ప్రకారం బండి ని గుండ్రం గా తిప్పడం మొదలెట్టింది….ఆ అలవాటు మాన్పించి ఆ ఎద్దుని తిన్నగా నడిపించడానికి మా పాలికాపులు నానా అవస్తా పడుతుంటే మేము నవ్వు ఆపుకోలేక పోయేవాళ్ళం పది రోజుల పాటు…..

ఈ రోజులల్లో మన జీవితాలు కూడా చాలా మటుకు గానుగెద్దు జీవితాలలాంటివే కదా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు …….మరి మీకో?

-వంగూరి చిట్టెన్ రాజు

chitten raju

మన కథలలో రాశి తప్ప వాసి ఎక్కడ?

 

nadustunna katha

నడుస్తున్న కథ ఏప్రిల్ కథలు:

ఏప్రిల్ నెల కథల సమీక్ష మీరు ఇప్పుడు చదవబోతున్నారు. ప్రతి నెలా కథలను చదివి ఆ పై నెలలో ఆ కథల సమీక్ష రాయాలని మా సంకల్పం. అయితే కథల సంఖ్య పెరగటం; వ్యక్తిగత, ఉద్యోగ కారణాలవల్ల మా ముగ్గురికి ఏప్రిల్ కథల గురించి చర్చించే అవకాశం కుదరలేదు. ఏ నెలకానెల పాఠకుల పఠనానుభూతి జ్ఞాపకంలో వుండగానే వాటి సమీక్ష చదివితే వారి అనుభవాలనీ, అనుభూతులనీ మా అభిప్రాయాలతో పోల్చుకునే అవకాశం ఈ సందర్భంగా కోల్పోతున్నందుకు మాకూ బాధగానే వుంది. అందుకు పాఠకులకు క్షమాపణలు చెప్పుకుంటూ, రాబోయే వ్యాసాలు సకాలంలో అందించేందుకు కృషి చేస్తామని మనవి చేస్తున్నాము.

 

ఏప్రిల్ నెలలో వచ్చిన దాదాపు నూట డెబ్భై ఐదు కథలను పరిశీలిస్తే ఇప్పుడొస్తున్న తెలుగు కథలు రాశికే కానీ వాసి లెక్కకు రావన్న దిగులు మళ్ళీ కమ్ముకుంటోంది. నెల నెలా పది నుంచి పదిహేను కథలను మంచి కథలుగా పరిచయం చేస్తున్న మేము, ఈ నెల ఆ సంఖ్యను ఏడుకు మించి ఎంత ప్రయత్నించినా పెంచలేకపోవటం బాధాకరం. మా దృష్టిలోకి రాని మంచి కథలు ఒకటో రెండో వున్నా, మా అభిప్రాయాలతో విభేదించి మరో ఒకటి రెండు కథలను పాఠకులు సూచించినా, అవన్నీ కలుపుకుంటే కూడా మొత్తం కథలలో పది శాతం కూడా వుండదు కాబట్టి మేము పైన చెప్పిన వాక్యంలో ఏ మార్పు రాదు. ఇది తెలుగు కథకులు సమీక్షించుకోవాల్సిన విషయం.

 

ఈ నెల వచ్చిన కథలను పరిశీలించే ముందు ఏప్రిల్ నెలలో కొన్ని విశేషాలను గుర్తుచేసుకుందాం –

ఈ నెలలో గురజాడ ఒక పాత్రగా ఒక కథ (తనకు నచ్చిన కానుక: అనంత సురేష్, ఆదివారం ఆంధ్రజ్యోతి 4 ఏప్రిల్), శ్రీపాద ఒక పాత్రగా ఇంకో కథ (“మహావృక్షం”: సింహప్రసాద్, తెలుగువెలుగు) వచ్చాయి. అయితే, ఈ ప్రత్యేకత మినహా కథలు మాత్రం సాధారణంగానే వున్నాయి. అలాగే, ఒకే కథ ఇదే నెలలో రెండు ఇంటర్నెట్ పత్రికలలో రావటం కూడా గుర్తించవచ్చు.

 

ఇక మంచి కథల గురించి –

ఈ నెలలో వచ్చిన మంచి కథలలో వస్తుపరంగా వైవిధ్యం స్పష్టంగా కనపడుతోంది. “పరబ్రహ్మ”, “స్పార్క్” కథలు మంచి కథాంశాన్ని ఎన్నుకోని, ఆ నేపధ్యంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెబితే, “అస్తిత్వం”, “నేను నాన్న బిర్యాని”, “వెడ్డింగ్ ఇన్విటేషన్” వంటి కథలు అనుభూతి ప్రధానంగా నడిచాయి. ఈ కథలలో వున్న కథాంశం చాలా స్వల్పమైనదైనా కథని నడిపించిన విధానంలో ప్రతిభ వల్ల చదవతగ్గ కథలైనాయి. “పేరున్న రాజ్యం”, “తలుపులు” కథలువర్తమాన రాజకీయ పరిస్థితులమీద సంధించిన కథాస్త్రాలు. ఈ కథలన్నింటి గురించి స్థూలంగా పరిచయం చేసుకుందాం.

పరబ్రహ్మ: సింహప్రసాద్

గురువు నేర్పిన చదువుతో గురువునే మించి పోయాననుకునే శిష్యుడు మళ్ళీ గురువు గొప్పదనాన్ని తెలుసుకోవడం కథాంశం. స్వాతి కథల పోటీలో బహుమతి పొందిన ఈ కథని పరిశీలిస్తే కథాంశం పాతదైనా ఒక చెయ్యి తిరిగిన రచయిత చేతిలో ఎంత చక్కగా రూపుదిద్దుకోగలదో అర్థం అవుతుంది. ఇతివృత్తంలో నేటి గురువుల ట్రెండ్ ను ప్రస్తావించటం వల్ల సమకాలీన పరిస్థితులను సూచిస్తోంది. అయితే,కథ ప్రధమార్థంలో శిష్యుడికి గురువు లెక్కలు నేర్పే ప్రక్రియ అవసరాన్ని మించి జరిగిందేమో అనిపించింది.

 

అస్తిత్వం: శిరీష్ ఆదిత్య

ఢిల్లీ నగరంలో ఒంటరిగా వుంటున్న ఓ తెలుగు యువకుడు తెలుగు మాట్లాడే ఓ హోటల్ సర్వర్ తో పరిచయం పెంచుకుంటాడు. ఓనర్ కి తెలియకుండా అతనికి టిప్ ఇవ్వలేని చిన్న డైలమా. అది ఇవ్వకముందే సర్వర్ చనిపోవటం – ఇదీ కథాంశం. జీవితం తాలూకు అభద్రత, అజ్ఞానం, అనిశ్చితీ అసలే కుదిపేస్తున్న ఆ సమయంలో – వెంకటప్ప మరణం జీవితపు క్షణికత్వాన్ని కథకుడికి ఆవిష్కరింపజేసి, నాస్తికుడిగా ఉన్నవాడిని గుడి మెట్ల మీద నిలబెడుతుంది. ఈ కథ కూడా ముందే చెప్పినట్లు మంచి భాష, కథనం వల్ల చదివించేస్తుంది. చివర్లో యువకుడు వేసుకునే ప్రశ్నలు, మధ్యలో వెంకటప్ప వేసే ప్రశ్నలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. కథాంశంలో మరి కొంత కసరత్తు చేసివుంటే కథకు కండపుష్టి కలిగుండేది.

 

స్పార్క్ : విజయభాను కోటే

ఒక వైపు నుంచి చూస్తే బాల్యంలో లైంగిక దురాచారానికి బలైన అమ్మాయి ఆత్మస్థైర్యంతో నిలబడిన కథ. అలాంటి పరిస్థితులు ఆ అమ్మాయిల్లో ఎలాంటి నిర్వికారాన్నీ, వ్యధనీ కలగజేస్తాయో వాస్తవికంగా పట్టుకోవడానికి మంచి ప్రయత్నం చేసిన కథ. మరో వైపు నుంచి చూస్తే ఓ కుర్రాడి ఏక పక్ష ప్రేమ కథ. తాను ప్రేమించే అమ్మాయి తిరిగి ప్రేమించకపోతే కోపం తెచ్చుకోకుండా ఎందుకని ఆలోచించిన ప్రేమికుడి కథ. నిజమైన ప్రేమ అంటే అదే అని చాలామంది గ్రహించక పోయినా ఈ కథలో హీరో గ్రహించటం ఈ కథలో విశేషం. ముగింపును కూడా రచయిత్రి అటో ఇటో తొందరపడి తేల్చదు. ప్రయత్నం లేకుండా ఫలితం రాదు కదా అని ప్రశ్నార్ధకంతో వదిలేస్తాడు. అబ్రప్ట్ గా మొదలైన కథ ఇన్‌కంక్లూసివ్ గా ముగియటం కొంత వెలితి అనిపించినా – ‘సర్వ’పాత్ర మనస్తత్వం, జీవన నేపథ్యం దృష్టిలో పెట్టుకుంటే కథకు అంతకన్నా ఆచరణాత్మకమైన ముగింపు సాధ్యం కాదేమో అనిపిస్తుంది.

 

పేరున్న రాజ్యం: పాలపర్తి జ్యోతిష్మతి

సుస్థిర రాజ్యం ఏర్పరచుకున్న ప్రభువులు – అధికారమే పరమావధిగా ప్రజలని ఎలా మభ్యపెట్టి మోసం చేస్తూ ఉంటారనే విషయాన్ని ప్రతీకాత్మకంగా రాసిన కథ. చివరికి విసుగెత్తిన ప్రజలు ఏం చేస్తారన్నది ముగింపు. చాలా విచిత్రంగా, ఈ కథ వచ్చిన కొద్ది రోజులకే మన దేశపు రాజకీయాల్లో ఇలాంటి పరిణామం సంభవించడం కాకతాళీయమే అయినా, ఒక రచన చూడగల వాస్తవ దృష్టికోణాన్ని అది స్పష్టపరుస్తోంది. తను చెప్పదలుచుకున్నది సూచ్యంగా తప్ప వాచ్యంగా చెప్పకూడదనుకున్న రచయిత్రి తనమీద తాను విజయవంతంగా ప్రయోగించుకోగలిగిన నియతి. అంతర్లీనంగా దాగి ఉన్న దారపు పోగును పట్టుకోగలిగితేనే మంచికథ. లేకుంటే మామూలు కథగా అనిపించి బురిడీ కొట్టించగలిగిన కథ.

 

నేను, నాన్న, బిర్యానీ: ఇండ్ల చంద్ర శేఖర్

బిర్యానీ తినాలన్న బలమైన కోరికతో ఇస్మాయేల్ హోటల్ చేరిన ఓ మాష్టారుకి అక్కడ తండ్రి కనిపించడం, ఆయనకు ఆ రోజు ఉదయమే డబ్బులేదని చెప్పిన కారణంగా ఆయన్నుంచి తప్పించుకోవాల్సిన అవసరం. ఈ పరిస్థితిలో కొడుకు ఇంకా ఏమీ తినలేదని తెలుసుకున్న తండ్రి అతన్ని మరో హోటలుకి తీసుకెళ్ళి బిర్యానీ తినిపిస్తాడు. తండ్రి ప్రేమ కలిసిన ఈ బిర్యానీనే అద్భుతంగా అనిపిస్తుంది మేష్టారికి. ‘ఎదిగిన కొడుకు – నిర్లక్ష్యం చేయబడ్డ తండ్రి’ ఇతివృత్తంతో ఇపుడు తామర తంపరగా వస్తున్న కథల్లో ఒక కొత్త కోణం ఆవిష్కరించిన కథ. కొడుకు నిర్లక్ష్యం చేసినా తండ్రి ప్రేమ చెక్కు చెదరదని చెప్పిన కథ. క్లుప్తతతో కథకు ప్రాణం పోసిన రచయిత తాను చెప్పదలుచుకున్నదాన్ని సూచ్యంగా చెప్పటం కథలో విశేషం.

అయితే, మేష్టారు తన ఇన్నేళ్ళ జీవితంలో తండ్రి ప్రేమని ఎప్పుడూ తెలుసుకోలేదా? అలా స్వార్థపరుడిగా ఎందుకు ఉన్నాడు? లాంటి ప్రశ్నలకి ఎలాంటి కార్యకారణసంబంధమూ చూపించకుండా సన్నివేశాలని తనకు కన్వీనియెంట్ గా రచయిత మలచుకోవడం వల్ల కథ తాలూకు సంపూర్ణత్వం కొంత దెబ్బతింది. ఆ విషయాలనీ కథ పరిధిలోకి తీసుకొని వస్తే, అనుభూతిని ఇంకొంచెం ఎక్కువ పండించగలిగి ఉండేది.

 

వెడ్డింగ్ ఇన్విటేషన్: డా. వంశీధర్ రెడ్డి

కథకుడిలో కథని ప్రతిభావంతంగా చెప్పగలిగిన నేర్పు ఉంటే, దానికి ఎక్కడా తడుముకోవాల్సిన అవసరం లేని భాషమీద పట్టు తోడైతే సూది అంత ఇతివృత్తంతో గడ్డిమోపంత కథ ఎలా సృష్టించవచ్చు అనటానికి మంచి ఉదాహరణ. గొప్ప వైవిధ్యం ఉన్న వాతావారణం, దానికి అత్యంత సహజమైన కథన ధోరణీ, కథ చెప్పడంలో అనుసరించిన ఒక మోనోలాగ్ లాంటి ప్రక్రియా, అందులో చెణుకులూ మరికొన్ని మెరుపులూ – ఇవన్నీ కథని నిస్సందేహంగా ఒక గొప్ప కథగా మలిచాయి.

విమర్శకులలో, విశ్లేషకులలో తప్పకుండా చర్చ లేవనెత్తే కథ ఇది. కథలో సహజత్వాన్ని ఇంకొంచెం పొడిగించి వాడిన బూతులు కథకి అవసరమా కాదా అన్న అన్ని చర్చల్లోనూ ఈ కథని ఉదహరించుకుండా వుండలేము. సభ్యత ముసుగు వేసుకుని చూస్తే అభ్యంతరకరంగానూ, కథనంలో సహజత్వాన్ని కోరుకునే వారికి ఆశ్చర్యకరమైనంత సహజంగా కనిపించే కథ. డాక్టర్ వంశీధర్ రెడ్డిని కథారూపం పరంగా ప్రత్యేకంగా ప్రశంసించాల్సిన కథ.

ఇన్ని విశేషణాలున్న ఈ కథ, ఒక విధివిలాసపు కథ కాకుండా, ఒక నిర్దుష్టమైన ప్రయోజనాన్ని, జీవితానికి సంబంధించిన ఏదైనా విశేషాన్ని అందించగలిగిన ఉద్దేశాన్నీ కూడా కలగలపుకొని ఉన్నట్టయితే, ఇంకొంత మంచి కథ కచ్చితంగా అయి ఉండేది.

 

తలుపులు: పెద్దింటి అశోక్ కుమార్

తెలంగాణ ఉద్యమం విజయవంతమైన తరువాత జరిగిన ఎన్నికల నేపధ్యంలో రాయబడిన కథ. కథకు సహజమైన తెలంగాణ మాండలికంలో రాయబడింది. పేదరికంతో పాటుతుఫాను చలిగాలి కూడా కమ్ముకున్న ఒక కుటుంబం గురించిన కథ. ఆ చలినుంచి చెల్లెల్ని కాపాడటం కోసం ఒక ఫ్లెక్సీని దొంగతనంగా తీసుకొచ్చి, తలుపుల్లేని ఆ ఇంటికి కొంత రక్షణ కల్పించాలి అనే ఆలోచనలో ఉన్న ఒక అన్న కథ. తీరా దాన్ని తెంపుకొని వచ్చాక, సదరు రాజకీయ పార్టీ కార్యకర్తలు నానా యాగీ చేసి ఆ కుర్రాణ్ణి కొట్టి ఫ్లెక్సీ లాక్కెళ్తారు. మంచి ఎత్తుగడ, పాఠకుడి దృష్టిని పక్కకు పోనివ్వని ముగింపు. ఇతివృత్తంలో సమకాలీనత. దానికి అనుగుణమైన భాష, కొరడా కొసలా చెళ్లుమనే ముగింపు. మంచి కథకి ఉండాల్సిన లక్షణాలు అన్నీ పుణికిపుచ్చుకున్న కథ.

 

ఇవీ ఏప్రిల్ లో వచ్చిన కొన్ని మంచి కథలు. ఈ కథలలో ఉత్తమమైన కథ కోసం పరిశీలించినప్పుడు, ఈ వ్యాసకర్తలు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న కథ తలుపులు”.అశోక్ కుమార్ గారి రచన ఆ ఉద్యమస్ఫూర్తిని సజీవంగానే వుంచుతూ, ఉద్యమానంతర పరిస్థితిని ఎంతో బాధ్యతతో గుర్తు చేస్తుంది.

ఈ కథలో ఆయివు పట్టు ఆ ఫ్లెక్సీ మీద వున్న బొమ్మ. ఏ పసిపిల్లాడు చెల్లెలిని చలినుంచి కాచడానికి ఫ్లెక్సీ దొంగతనం చేశాడో ఆ పిల్లాడి తండ్రి బొమ్మే ఆ ఫ్లెక్సీ మీద వుంటుంది. ఆ కుటుంబం తెలంగాణా పోరాటంలో అమరుడైన ఓ వీరుడిది. ఈ విషయం ఎంత బలమైనదంటే కథని ఈ వాక్యంతో ముగించి ఒక ఆశ్చర్యాన్ని, రాజకీయనాయకుల పైన కసిని పాఠకుల మదిలో రగిలించి ముగించవచ్చు.

కానీ, అశోక్ కుమార్ గారు కథని అలాంటి ఒక టెక్నిక్ తో ముగించడానికి ప్రయత్నించలేదు. అదీ ఈ కథలోని నిజాయితీ! గొడవ చేసిన రాజకీయ పార్టీల వాళ్ళు వెళ్ళిపోయాక, తల్లి కొడుకు తల నిమురుతూ, “వీడి పోరాటం ఇంకా మిగిలే ఉంది” అనడంతో కథ ముగుస్తుంది. పోరాటాల వల్ల సాధించాల్సింది సాధించినా, పోరాటాల అనంతరం అందుకోవాల్సిన ఎత్తులు ఇంకా మిగిలే ఉంటాయన్న అన్యాపదేశం ఈ కథ సారాంశం. తెలంగాణా సాధనతో ఆగకుండా రాష్ట్ర నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకీ సమాయత్తమవమని స్ఫూర్తిని రగిలిస్తుంది. అందుకే ఈ కథ తెలంగాణ నేపధ్యంలో రాయబడ్డ కథే అయినా అన్ని ప్రాంతాల వారికీ అన్వయం అవుతుంది. ఆ సార్వజనీతే ఈ కథని ఉత్తమ కథగా నిలబెట్టింది.

పెద్దింటి అశోక్ కుమార్ గారికి మరోసారి అభినందనలు!!

 

ఇక చివరిగా – ఈ వ్యాసంలో చర్చించిన కథల లిస్టూ,వీలైనచోట లింకులూ:

తలుపులు: పెద్దింటి అశోక్ కుమార్ (నమస్తే తెలంగాణ బతుకమ్మ, 27 ఏప్రిల్)http://goo.gl/WvdUpt

 

వెడ్డింగ్ ఇన్విటేషన్: వంశీధర్ రెడ్డి (కినిగే పత్రిక, ఏప్రిల్)http://goo.gl/Ud2D9g

 

నేను నాన్న బిర్యాని: చంద్రశేఖర్ ఇండ్ల (సాక్షి ఫన్ డే, 13 ఏప్రిల్)http://goo.gl/uhHZnC

 

పేరున్న రాజ్యం: పాలపర్తి జ్యోతిష్మతి (చినుకు, ఏప్రిల్)

 

స్పార్క్: విజయభాను కోటే(సాహితీ ప్రస్థానం, ఏప్రిల్)http://goo.gl/G69HD8

 

అస్థిత్వం: శిరీష్ ఆదిత్య (కినిగే పత్రిక, ఏప్రిల్)http://goo.gl/k9NkHD

 

పరబ్రహ్మ: సింహప్రసాద్ (స్వాతి వారపత్రిక, 11 ఏప్రిల్)

 

తెలంగాణా కేవలం ఒక “ఫుట్ నోట్” కాదు!

sangisetti- bharath bhushan photo
60 యేండ్ల ఎడతెగని పోరాట ఫలితం ‘తెలంగాణ’. వలసాంధ్ర బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కోసం తెగించి కొట్లాడిన బిడ్డలందరికీ వందనాలు. తెలంగాణను దోసుకుందెవరో? దోపిడీ చేసిందెవరో? అభివృద్ధి నిరోధకులెవరో? అహంకారంతో మెలిగిందెవరో? ఆత్మగౌరవాన్ని దెబ్బతీసెందెవరో? అందరికీ తెలిసిన విషయమే!

ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన ప్రస్తుత సందర్భంలో భవిష్యత్తెలంగాణను ఎలా నిర్మించుకోవాలో? భౌగోళిక తెలంగాణను ‘బంగారు తెలంగాణ’గా  ఎలా మార్చుకుందాం  అనే అంశంపై దృష్టిని సారించాలి. ఇన్నేండ్లు, ఇన్నాళ్లు మనకు హక్కుగా దక్కాల్సిన వాటాను ఆధిపత్యవాదులు ఎలా కాజేసిండ్రో చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడది ముగిసిన అధ్యాయం. ప్రస్తుతం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలి. అందుకోసం పునాదుల నుంచి వినిర్మాణం జరగాలి. సకల ఆధిపత్యాలను ధిక్కరించే ‘తెలంగాణ’ను నిర్మించుకోవాలి. సాహిత్యంలో సైతం ఈ ఆధిపత్యాన్ని ధిక్కరిద్దాం. కొత్త ప్రతీకలను నిర్మించుకుందాం. విస్మరణకు, వివక్షకు, వక్రీకరణకు గురైన విషయాల్ని ఇకనైనా వెలుగులోకి తెద్దాం. వాటికి చిత్రిక గడుదాం. ఈ వెలుగులో తెలంగాణ సాహిత్య/సామాజిక/సాంస్కృతిక చరిత్రను తిరగ రాద్దాం. ఇన్ని సంవత్సరాలు ఉటంకింపులకు, పాదసూచికలు, బ్రాకెట్ల మధ్యలో నిలిచిన అంశాల్ని చర్చకు పెట్టాల్సిన అవసరముంది.
ఆధిపత్యాల నిర్మూలనలో (వినిర్మాణ) తెలంగాణలోని బుద్ధిజీవులందరూ తమ వంతు కృషి చేసిండ్రు. టాంక్‌బండ్‌పై తమవి కాని విగ్రహాలను తొలగించడంలోనూ అంతే
బాధ్యతతో తెలంగాణ బిడ్డలు పాలుపంచుకుండ్రు. కోడి పందాల స్థానంలో తెలంగాణ బతుకమ్మలను ఆడినం. తెలంగాణ వంటలు వండుకున్నం, ఆటలు ఆడుకున్నం, పాటలు
పాడుకున్నం, ధూంధాంలు ఆదినం. ఇదంతా ఉద్యమంలో భాగంగా, ఎవరికి తోచిన విధంగా వారు, సీమాంధ్ర ఆధిపత్యాలను కూల్చడానికి, స్వీయ అస్తిత్వాన్ని చాటడానికి
ఉద్యమకారులు చేసిన పోరాట రూపాలు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో పనిచేయడం కుదరదు. అందుకే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణవాదులు
చేసిన మంచిపనులన్నింటిని జూన్‌ రెండు నుంచి ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీలు, అకాడెమీలు, సంస్థలు,
గ్రూపులు, వ్యక్తులు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్ని చిరస్మరణీయంగా తీర్చి దిద్దాలి. చరిత్రలో నిలబెట్టాలి.

vaikuntam-16x12in
గత అరవైయేండ్లుగా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ‘పద్మ’ అవార్డులన్నీ సీమాంధ్ర వందిమాగధులకే ఎక్కువగా దక్కాయి. వారు మాత్రమే సాహిత్యకారులు,
వారు మాత్రమే సకల కళా పారంగతులుగా వెలిగి పోయారు. 60 యేండ్ల పాటు తెలంగాణ బతుకుల్ని చిత్రాలుగా మలిచిన సిద్దిపేట కాపు రాజయ్య, కొండపల్లి
శేషగిరిరావు, పి.టి.రెడ్డి, ప్రపంచం గొడవను ‘నా గొడవ’గా చేసిన కాళోజి నారాయణరావు, సంగీత, సాహిత్య రంగాల్లో తెలంగాణ ప్రజ్ఞను ప్రపంచ వ్యాప్తం
జేసిన సామల సదాశివ, పాండవ కళాకారిణి తీజ్‌రీ భాయికి ఏమాత్రం తీసిపోని చిందు ఎల్లమ్మ, తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ,
తెలంగాణ సిద్ధాంత కర్త కొత్తపల్లి జయశంకర్‌ సార్‌, తెలంగాణ భాషకు పట్టం కట్టిన పాకాల యశోదారెడ్డి, జానపదాల్ని జ్ఞానపదులకు తెలియజెప్పిన
బిరుదురాజు రామరాజు, బహుభాషా కోవిదుడు, రాజకీయ పండితుడు పి.వి.నరసింహారావు, తెలుగు`ఉర్దూ భాషల వారధి హీరాలాల్‌ మోరియా, తెలంగాణ
ప్రతిభను, సాహిత్యాన్ని, గౌరవాన్ని సమున్నత స్థాయిలో నిలిపిన పరిశోధకులు గడియారం రామకృష్ణశర్మ, బి.ఎన్‌.శాస్త్రి, 1969 ఉద్యమాన్ని చట్టసభల్లోనూ,
బహిరంగ సభల్లోనూ నడిపించిన ధీర వనితలు టి.ఎన్‌.సదాలక్ష్మి, ఈశ్వరీభాయి, సాయుధ పోరాటంలో సమరం జేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని
ధర్మభిక్షం, నల్లా నరసింహులు, సాయుధ పోరాట కాలం నుంచి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాలం వరకు నిరంతర ప్రతిపక్షంగా నిలిచిన బండ్రు నరసింహులు లాంటి
ఎందరో మహానుభావులకు న్యాయంగా దక్కాల్సిన గౌరవం దక్కలేదు.

తెలంగాణ ఉద్యమ కాలంలో చనిపోయిన వీరి కీర్తి, ఘనత అందరికీ తెలియలేదు. తెలంగాణ ఉద్యమ సందర్బంలో చనిపోయిన వారికే ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందంటే ఇక
అంతకుముందు చనిపోయిన వారికీ, ప్రస్తుతం బతికున్న వారికి కూడా ఎలాంటి గుర్తింపు దక్కలేదు. భారత ప్రభుత్వం తరపున ఇచ్చే పద్మ అవార్డుల్లో ఒక్క
కాళోజి నారాయణరావుని మినహాయిస్తే మిగతా ఎవరికీ దక్కలేదు. ఇక్కడ పేర్నొన్న అందరూ ‘పద్మ’అవార్డులకు అర్హులు. రేపటి తెలంగాణలో ఇలాంటి అన్యాయం
జరక్కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక్కడి భూమి పుత్రులకు న్యాయంగా దక్కాల్సిన గౌరవానికి ఎక్కడా భంగం కలుగకుండా చూడాలి.
1990లకు ముందే దాటుకున్న తరానికి కూడా భవిష్యత్తులో గౌరవం దక్కాలి. తెలంగాణ సాహిత్యంలో ‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి, ఉద్యమాలకు
ఊపిరులూదిన రావి నారాయణరెడ్డి, గ్రంథాలయోద్యమానికి పునాదులు వేసిన రాజా నాయని వెంకటరంగారావు, సురవరం ప్రతాపరెడ్డి, గుంటక నరసయ్య పంతులు, సంగెం
లక్ష్మీభాయి, బూర్గుల రామకృష్ణారావు, కవిరాజమూర్తి, కొండా వెంకటరంగారెడ్డి, అరిగె రామస్వామి, మాసుమా బేగం, మహేంద్రనాథ్‌, మర్రి
చెన్నారెడ్డి, మల్లికార్జున్‌, జయసూర్య, మెల్కోటే, కోదాటి రాజమల్లు, సుద్దాల హనుమంతు లాంటి సాహిత్య సామాజిక రంగాల్లో పనిచేసిన వేలాది మంది
ఇవ్వాళ ‘వాళ్లెవ్వరు?’ అనే ప్రశ్నను ఎదుర్కొంటున్నారు. వారు చేసిన పోరాటాల గురించి కూడా నేటి తరానికి తెలియకుండా పోయింది.

 

తెలంగాణపై పోలీస్‌యాక్షన్‌ నాటి గురించి చెప్పుకుంటేనే ఇంత చరిత్ర ఉంది. వీరి కన్నా ముందు సామాజికోద్యమాలు నడిపిన భాగ్యరెడ్డి వర్మతో పాటుగా మత
సహనానికి చిహ్నం మహబూబ్‌ అలీఖాన్‌, బందగీ, బండి యాదగిరి, షోయెబుల్లాఖాన్‌, తుర్రెబాజ్‌ఖాన్‌, యాదగిరి,  లాంటి ఎంతో మంది తెలంగాణ ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేసిండ్రు. వ్యక్తులుగా వీరికి విగ్రహాలు, భవనాలకు పేర్లు, పార్కులు, స్టేడియాలకు పేర్లు పెట్టినంత మాత్రాన పంచాయితీ వొడువదు.  ఇన్నేండ్లుగా ప్రజా
ఉద్యమాల్లో సేవ, త్యాగం లక్ష్యంతో సర్వం అర్పించి పోరాటం చేసిన భూమిపుత్రులను ప్రతి యేటా జయంతి, వర్ధంతుల్లో స్మరించుకోవాలి. త్యాగపురుషుల జీవితాలను తెలంగాణ పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలి. సమ్మక్క, సారలమ్మల పోరాటం, సర్వాయి పాపన్న విజయ బావుటా, తుర్రెబాజ్‌ఖాన్‌ తిరుగుబాటు, గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభ, పత్రికోద్యమాలు, సాయుధ పోరాటం, హైదరాబాద్‌పై పోలీసుచర్య, ఆంధ్రప్రదేశ్‌ పీడ, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నక్సలైట్‌ పోరు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచిన వైనం, మలిదశ ప్రత్యేక తెలంగాణ పోరాటం, టీఆర్‌ఎస్‌ ఉద్యమం అన్నీ రేపటి చరిత్ర పుస్తకాల్లో సముచిత రీతిలో రికార్డు కావాలి.
మనం బోనం, బొట్టు, బతుకమ్మ, దసర పండుగ, హోళి, నోములు, వ్రతాలు, పీర్ల పండుగ, సాంస్కృతిక పయనం అన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో చేసుకునే
పండుగలుగా ఆదరించబడాలి. సమ్మక్క సారలమ్మ జాతరలతో పాటు, నాగోబ జాతర, మహాంకాళి, మన్నెంకొండ, కురుమూర్తి, రంగాపూర్‌ ఉర్సు, కొమురెల్లి మల్లన్న,
ఏడుపాయల దుర్గమ్మ, బడాపహాడ్‌ ఉర్సు, లింగమంతుల, సిరసనగండ్ల జాతరలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన
చర్యలు. ఇన్నేండ్లు సీమాంధ్ర ఆధిపత్యం మూలంగా స్మరణకు, గౌరవానికి నోచుకోకుండా పోయిన ఉత్సవాల్ని మనమే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. గత 25
యేండ్లుగా తెలంగాణ వాదులు తమ ఉద్యమాలను ఎందుకోసం  చేశారో ఆ కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి.
ఇక విశ్వవిద్యాలయాల కొస్తే సాహిత్య, సామాజిక రంగాల్లో విస్తృతమైన పరిశోదనలు జరపాలి. మన ఔన్నత్యానికి చిత్రిక గట్టాలి. 1956కు ముందు వచ్చిన
ప్రతి రచనను అచ్చులోకి తీసుకు రావాలి. అకాడెమీలు ఈ రంగంలో ప్రధాన పాత్ర వహించాలి. అముద్రితంగా ఉన్న తాళపత్రాలను సేకరించి వాటిని ప్రచురించాలి.
గతంలో ప్రచురించబడ్డప్పటికీ ఇప్పుడు అందుబాటులో లేని రచనలను పునర్ముద్రించాలి. అలనాటి తెలంగాణ సాహితీవేత్తల జీవితం, సాహిత్యం రెండిరటిపై విశేషమైన పరిశోధనలు జరిపించాలి. వీటి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాలి. ఒక్కోకవి/రచయితకు సంబంధించిన రచనలన్నింటిని సమగ్ర సంకలనాలుగా వెలుగులోకి తేవాలి. రచయితలు, రాజకీయ నాయకులు, ప్రసిద్ధుల జీవిత చరిత్రలను/ ఆత్మకథలను కూడా అచ్చేయాలి. తెలంగాణ పెయింటర్ల జీవితాలు వారి పెయింటింగ్స్‌ రెండూ అచ్చవ్వాలి.
గుణాఢ్యుడు దగ్గరి నుంచి ఈనాటి వరకు తెలంగాణలో పుట్టిన ప్రతి ప్రసిద్ధ వ్యక్తి సమాచారాన్ని ‘జీవిత సర్వస్వం’ రూపంలో రికార్డు చేయాల్సిన అవసరముంది. ఇప్పటికే ఇంగ్లీషులో డిక్షనరీ ఆఫ్‌ నేషనల్‌ బయోగ్రఫీ అని ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తుల జీవిత  చరిత్రలను ప్రతి యేటా రికార్డు చేస్తున్నారు. ఆ మాదిరిలో తెలంగాణ వారి జీవిత చరిత్రలను కూడా చరిత్ర
పుటల్లోకి ఎక్కించాలి. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం వారికి పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో పది జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దాంతో మొత్తం జిల్లాల సంఖ్య 20 కానుంది. ఈ ఇరవై జిల్లాల గెజిటీర్లను/ జిల్లా సర్వస్వాలను కూడా ముద్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.
తెలంగాణలోని వ్యక్తుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విధంగా అవార్డులను ప్రముఖ తెలంగాణ వ్యక్తుల పేరిట నెలకొల్పాలి. లలితకళలు, ఫోటోగ్రఫీ, జానపదాలు, సాహిత్యం, సాంస్కృతికం ఇలా అన్ని రంగాల్లోని ప్రతిభావంతుల్ని గుర్తించి ప్రోత్సహించాలి. అవసరమైతే వారికి మెరుగైన శిక్షణ ఇప్పించాలి. నిజాం జమానాలో డాక్టర్‌ మల్లన్న, రూపాబాయి ఫర్దూంజీ లాంటి డాక్టర్లను విదేశాలకు పంపించి అక్కడ విద్యాభ్యాసం చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. డాక్టర్‌ మల్లన్న అనస్తీషీయాలో నోబుల్‌ ప్రయిజ్‌ గెలుచుకున్న జర్మన్‌ డాక్టర్‌ దగ్గర పనిచేశారు. ఆయనకు ఆ ప్రయిజ్‌లు రావడంలో ఈయన పాత్ర ప్రధానమైంది. భవిష్యత్‌లో కూడా ఈ పరంపర కొనసాగాలి. రేపటి బంగారు తెలంగాణలో ఇన్నేండ్లుగా విస్మరణకు గురైన శ్రేణులకు సరయిన గుర్తింపు దక్కాలి. వారి ప్రతిభకు ప్రోత్సాహమూ ఉండాలి.
ఎక్కడ కూడా ఆధిపత్య పోకడలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు / గౌరవం దక్కేలా ప్రభుత్వం వ్యవహరించాలి. ఇవన్నీ వాస్తవ రూపం దాల్చాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వ్యవహరించాలి.
తెలంగాణ కళలకు కాణాచి. నిన్నటి వరకు ‘ఎవరెస్టు’ అనే పేరు హైదరాబాద్‌తో సంబంధమున్న ఒక సర్వేయర్‌గానే తెలుసు. కాని ఇవ్వాళ తెలంగాణ పిల్లలు ఆ పేరిట ఉన్న శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ వ్యాప్తంగా మన్ననలందుకుంటున్నారు. భవిష్యత్‌లో సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ పేరు కూడా ‘ఎవరెస్టు’లా నిలిచేందుకు ఆ యా రంగాల్లో ప్రవేశం, తెలంగాణపై అమితమైన ప్రేమ ఉన్న కె.చంద్రశేఖరరావు పై కూడా ఇక్కడి ప్రజలకు అపరిమితమైన ఆకాంక్షలున్నాయి. వీటన్నింటిని కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుస్తాడనే విశ్వాసం కూడా ఉంది. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేలా, కేసీఆర్‌పై ఉన్న నమ్మకం ఇనుమడిరచేలా కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో
ముందడుగేయాలి.

– సంగిశెట్టి శ్రీనివాస్‌

ఆ ‘మాలపిల్ల’ మాదిరిగా మాటలు రాసేవారున్నారా ఇప్పుడు?

 

గుడిపాటి వెంకటాచలం తన రచనల ద్వారా సమాజంలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. స్త్రీలోకంలోనైతే ఆయన విప్లవమే తెచ్చారు.
ఆయన రచనల అండగా తెలుగు సమాజంలోని స్త్రీలు ప్రశ్నించడం నేర్చుకున్నారు. సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం పోరాడారు. విజయాలు సాధించారు. చలం ప్రభావం పాజిటివ్‌గానైనా, నెగటివ్‌గానైనా పడని రచయిత ఒకప్పుడు లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి చలానికి నాటకీయ సన్నివేశాలు, కృతక సంభాషణలతో నిండివుండే సినిమాలంటే ఏవగింపు. మరి అదే చలం సినిమాకి పని చేయాల్సి వస్తే ఏం చేస్తాడు? సంభాషణలు రాయాల్సి వస్తే ఎలా రాస్తాడు?
కథల్లో కానీ, నవలల్లో కానీ చలం సృష్టించిన పాత్రలను చూస్తే, అవి మాట్లాడుకోవడం చూస్తే – కృతకంగా కాక సహజంగా ఉన్నట్లు కనిపిస్తాయి. వ్యావహారంలో మనుషులు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటున్నట్లే అనిపిస్తాయి. రచనల్లో గ్రాంథిక భాష రాజ్యం చేస్తున్న కాలంలో చలం భాష, చలం శైలి ఆకర్షణలో, మాయలో కొట్టుకుపోయారు జనం. పదాలతో, శైలితో అంతటి గారడీ చేసిన చలం 1938లో వచ్చిన ‘మాలపిల్ల’ సినిమా కథనీ, సంభాషణల్నీ రాసిన తీరు అద్వితీయం!
స్వాతంత్ర్యానికి తొమ్మిదేళ్ల ముందు వచ్చిన ‘మాలపిల్ల’ సినిమా తెలుగునాట పెను సంచలనమే కలిగించింది. బ్రాహ్మణాధిపత్యం పూర్తిగా చలామణీ అవుతున్న కాలంలో, అంటరానితనం తీవ్రంగా ఉన్న కాలంలో బ్రాహ్మణాధిపత్య సమాజాన్ని సవాలు చేస్తూ, అస్పృశ్యతను ధిక్కరిస్తూ, అణగారిన కులాలకు అండగా నిలుస్తూ ‘మాలపిల్ల’ అనే పేరుతో ఒక సినిమా రావడమంటే మాటలా! దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం సంకల్ప బలానికి చలం సునిశిత కలం తోడైతే వచ్చే మహోన్నత ఫలం ‘మాలపిల్ల’ కాకుండా మరొకటి ఎలా అవుతుంది!!
https://www.youtube.com/watch?annotation_id=annotation_3277241873&feature=iv&src_vid=4h26GRojjfY&v=v_dz61Nz8_8
మనం ఇప్పుడు ‘మాలపిల్ల’ కథ గురించి కాక, అందులోని సంభాషణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోబోతున్నాం. ఆ సినిమాకి ముందు వచ్చిన సినిమాల్లోని సంభాషణలకూ, ‘మాలపిల్ల’ సంభాషణలకూ పొంతననేది కనిపించదు. టాకీ యుగం ప్రారంభమైన కాలంలో అప్పటి నాటకాల భాషలోనే సినిమాల సంభాషణలు నడిచాయి. ఆ భాషను ‘మాలపిల్ల’ భాష సమూలంగా మార్చేసింది. నిజానికి ‘మాలపిల్ల’ తర్వాత వచ్చిన కొన్ని సాంఘిక సినిమాల సంభాషణలు పాత వాసనలోనే నడిచాయి. ఐతే అతి త్వరలోనే ‘మాలపిల్ల’ సంభాషణలకు లభించిన ఆదరణను రచయితలు అందుకోక తప్పలేదు. పాత్రోచితంగా, సందర్భోచితంగా ఆ చిత్రంలోని సంభాషణలను చలం నడిపించిన తీరు అనన్య సామాన్యం.
‘మాలపిల్ల’లో నీళ్లకోసం చెరువు వద్దకు వచ్చిన మాలలను బ్రాహ్మణుల నాయకత్వంలోని అగ్ర కులాల వాళ్లు అడ్డుకుంటారు. నీళ్లు తీసుకెళ్లడానికి వీల్లేదని కట్టడి చేస్తారు. అదే సమయంలో పెద్ద వర్షం మొదలవుతుంది. మాలలు తడుస్తూ సుందరరామశాస్త్రి ఇంటి ముందుకు వస్తారు. వారిలో నాగాయ్ అనే యువకుడు “బాపనోళ్లది ఎప్పుడూ తిని కూర్చునే ఖర్మ. మాలోళ్లది ఎప్పుడూ బువ్వలేక మలమలమాడే ఖర్మ.. గుళ్లో కూర్చుని సుఖంగా ప్రసాదాలు మింగమరిగిన దేవుడు మురికి మాలపల్లిలోకి వచ్చి మా కష్టాలు తీరుస్తాడా?” అంటాడు. ‘మాటల తూటాలు’ అంటే ఇవే కదా. అగ్ర వర్ణాలు – నిమ్న వర్ణాల మధ్య, ఉన్నోళ్లు – లేనోళ్ల మధ్య తేడాని రెండంటే రెండు ముక్కల్లో ఎంత శక్తిమంతంగా చెప్పాడు చలం! ఈ విషయంలో దేవుడినీ వదల్లేదు. దేవుడు కూడా పెద్ద కులాలవైపే ఉన్నాడని సూటిగా ఆ పాత్రతో చెప్పించాడు.
index
‘నేనున్నంత కాలం గ్రామంలో కుల ధర్మాలకు ఏమాత్రం విఘాతం రానివ్వన’ని శాస్త్రి బీష్మించినప్పుడు మాలల నాయకుడు మునెయ్య అంటాడు – “మీరు చెరువు కట్టేశారు. దాన్ని విడవండి. ధర్మయుద్ధం చెయ్యండి. అంతేకానీ మాకు నీళ్లివ్వవద్దని ఏ ధర్మశాస్త్రం మీకు బోధించిందో మాకు తెలీదు. మా పిల్లల్నీ, ఆడాళ్లనీ మాడ్చారా, మీ పిల్లలూ, ఆడాళ్లూ క్షేమంగా ఉండరు. మమ్మల్ని మృగాల కింద నొక్కిపట్టారు. అవును. మృగాలమే. చేసి చూపిస్తాం. జాగర్త.” అని హెచ్చరిస్తాడు. తమకు నీళ్లివ్వకుండా చెరువు కట్టేసి అధర్మయుద్ధం చేస్తున్నారని తేల్చేసిన మునెయ్య, తమకు నీళ్లివ్వవద్దని ఏ ధర్మశాస్త్రం బోధించిందో చెప్పమని అడుగుతున్నాడు. అంతేనా, తమని మృగాలకింద తొక్కిపెడితే, నిజంగా మృగాలమవుతామని హెచ్చరిస్తున్నాడు. అంటే తిరగబడతామని చెబుతున్నాడు. అగ్ర వర్ణాల అకృత్యాల వల్ల, నిమ్న కులాలు ఎట్లా యాతనలు అనుభవిస్తున్నాయో ప్రత్యక్షంగా చూశాడు కాబట్టే మాలల తరపున ఉండి ఆ మాటలు పలికించాడు చలం.
‘మాలపిల్ల’ టైటిల్ రోల్ చేసింది – తెలుగు సినిమా తొలి స్టార్ హీరోయిన్ కాంచనమాల. ఆమె పాత్ర పేరు శంపాలత. ఆమె మునెయ్య కూతురు. సుందరరామశాస్త్రి కొడుకు నాగరాజు (వెంకటేశ్వరరావు)కూ, ఆమెకూ మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ మునెయ్యకి దొరికిపోతారు. “అయ్యా మీరు పెద్దలు. మీ కులంలో ఆడోళ్లు లేరా. మురికోళ్లు, అంటరానోళ్లు.. ఈ పిల్లలెందుకు కావాల్సొచ్చారు నాయనా. మేం అరమైలు దూరంలో ఉంటేనే మీరు మైలపడతారే. ఇలాంటి పనులకు అభ్యంతరాలు లేవు కావచ్చు. వీళ్లకి ఉన్నదల్లా ఒక్కటే. అది శీలం. దాన్నీ దోచుకోవాలా! ధనం, అధికారం, సుఖం చాలవేం? వెర్రిపిల్లల్ని చేసి ఒంటరిగా కలుసుకుని, మెరిపించి, మాయమాటలు చెప్పి నమ్మించాలని చూశారూ. శాస్త్రులవారి వంటి మహాత్ముల కుమారులు చెయ్యదగ్గ పనికాదు” అంటాడు మునెయ్య. తన కథల్లోని శైలి తరహాలోనే ఈ సినిమాలోని సంభాషణలనూ గొప్ప లయతో నడిపించాడు చలం. కేవలం మనం చలం సమ్మోహన శక్తిని శైలికే పరిమితం చెయ్యడం పొరపాటు. ఆయన సంభాషణా శిల్పం కూడా అసాధారణం. ఇన్ని దశాబ్దాల తర్వాత, ఇవాళ్టి సినిమాల్లో ఎంతమంది రచయితలు ఇలాంటి శైలితో, ఇలాంటి శిల్పంతో సంభాషణలు రాయగలుగుతున్నారు?
అప్పటికింకా నాగరాజుకు, శంపాలతకు తమ మధ్య ప్రేమ పెనవేసుకుంటున్నదనే సంగతి తెలీదు. స్నేహమైతే ఏర్పడింది. అంతలోనే మునెయ్యకు దొరికారు. నాగరాజును అపార్థం చేసుకున్న మునెయ్య.. చెడుబుద్ధితోనే అతను శంపకు చేరువవుతున్నాడని తలచాడు. ఒక పెళ్లికాని అమ్మాయి తండ్రి ఎలా స్పందించాలో అలాగే స్పందించాడు మునెయ్య. పైగా నాగరాజు సాక్షాత్తూ తమని మృగాల కింద భావించే శాస్త్రి కొడుకు. కరడుకట్టిన దురాచారవాది కొడుకు. తామా తక్కువ కులంవాళ్లు. దుర్బలులు. శంపని లోబరచుకోవడానికి మాయమాటలు చెప్పి దగ్గరవుతున్నాడని సంశయించాడు మునెయ్య. అలాంటి స్థితిలో అతని నోటినుంచి ఎలాంటి మాటలు వస్తాయి? ఎంత శక్తివంతంగా వస్తాయి? ఆ సందర్భానికి తగ్గట్లు మునెయ్య నోటినుంచి వచ్చిన మాటల్ని ఇంతకంటే శక్తివంతంగా, ఇంతకంటే సమర్థవంతంగా ఎవరు రాయగలరు?
‘మాలపిల్ల’లో మాలలకు దన్నుగా చౌదరి నాయకత్వంలోని ‘హరిజన సేవాసంఘం’ నిలుస్తుంది. మాలలను మృగాలుగా పెద్ద కులాలు చూస్తుంటే, కాదు, వాళ్లూ అందరిలాంటి మనుషులేనని సంఘం వాదిస్తుంటుంది. మాలల పక్షం వహిస్తే కమ్మ కులాన్నుంచి వెలేస్తామని ఒకతను చౌదరిని బెదిరిస్తాడు. దానికి చిన్నగా నవ్వి “కులం.. వెలి.. మా కులం హరిజన కులం. వాళ్లతో నీళ్లు త్రాగి, వాళ్లతో పరుండటమే మా నిత్య కృత్యం” అని చెప్పిన చౌదరి “రండి. మాలగూడేనికే పోదాం. మాలల్లో మాలలమై మాలలూ మనుషులేనని లోకానికి చాటుదాం” అంటూ సంఘ సభ్యులతో అక్కడికే వెళ్తాడు. ఆ పాత్రచేత అలా చెప్పించిన చలం నిజ జీవితంలో బ్రాహ్మణ సమాజం తనను వెలేస్తే, మాలపల్లెల్లోనే నివసించిన సంగతి గమనించదగ్గ విషయం.
Mala Pilla_C53242-83C451
ఈ కథలో శంపకు చేదోడు వాదోడుగా ఉండే పాత్ర అనసూయ. ఆమె శంప చెల్లెలే. చిన్నదైనా అక్కకి సలాహాలు, ధైర్యం ఇవ్వగల గడుగ్గాయి. తెలివైంది. శంపను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న నాగరాజు, ఆమెని వెతుక్కుంటూ బయలుదేరతాడు. మార్గంలో అనసూయ కనిపిస్తే శంప గురించి ఆమెని అడుగుతాడు. ఎందుకని ప్రశ్నిస్తుంది అనసూయ. “నేను శంపాలతను పెళ్లి చేసుకుంటాను” అంటాడు రాజు. అనసూయ పెద్దగా నవ్వుతుంది. ఆరిందాలా “పెళ్లి? పెళ్లి? మాలపిల్లని? మీకు మతిపోయినట్టుంది” అంటుంది. దాంతో “మీ చిన్నికృష్ణుని పాదాల సాక్షిగా పెళ్లి చేసుకుంటాను” అని చెబుతాడు రాజు (చిత్రంలో శంప, అనసూయ కృష్ణభక్తులు). అప్పుడు అనసూయ ఏమనాలి? ఏ ఇతర రచయితైనా అనసూయతో ఎలాంటి మాటలు పలికిస్తాడు? కచ్చితంగా చలం పలికించినట్లు “ఎక్కడి మాటలు లెండి. మీ నాన్నగారు గుండెపగిలి చావరూ? మిమ్మల్ని నరుకుతారు మీ బ్రాహ్మలు” అని పలికించలేడు. 76 సంవత్సరాల క్రితమే ఒక సినిమాలోని పాత్రల చేత ఇలాంటి సునిశితమైన, బాకుల్లాంటి మాటలు పలికించడం ఒక్క చలానికే సాధ్యం.
మాలలకు నీళ్లివ్వకుండా చేసి, వాళ్లు నీళ్ల కోసం అలమటించేలా చేస్తున్నందుకు నిరసనగా మాలలంతా చౌదరి నాయకత్వంలో అగ్ర కులాల వారి పొలం పనులకు, ఇతర పనులకు వెళ్లకుండా సమ్మెకట్టారు. ఆ పనులకు పొరుగూళ్లనుంచి మనుషులు రాకుండా చూశారు. దాంతో చౌదరి వాళ్లతో ఒకసారి మాట్లాడమని శాస్త్రికి చెబుతాడు ఆయనకు అనుయాయిగా ఉండే మల్లికార్జున శర్మ. శాస్త్రి కోపంతో ఊగిపొయ్యాడు. “పోండి. పోండి. అందరూ పోండి. నా కొడుకే నాకు ఎదురు తిరుగుతున్నాడు. నేనొక్కణ్ణే ఏకాకినై నిలుస్తాను. రానీ మాలల్ని. నా ఇంటిచుట్టూ మూగి నా అగ్నిహోత్రాల్ని మలినం చెయ్యనీ. నా వంటలో గోమాంసాదులు వెదజల్లనీ. పూర్వం రాక్షసులు  రుష్యాశ్రమాల్ని ధ్వంసం చెయ్యలా. నేనే నిలుస్తాను. ఆ శ్రీరామచంద్రుడే ఉంటే మళ్లా నా ఇంటికొచ్చి కావలి కాస్తాడు. నాకెవ్వరితోనూ నిమిత్తం లేదు నాయనా. పోండి” అంటాడు.
వర్ణ భేదాల్ని నిక్కచ్చిగా పాటిస్తూ, కరడుకట్టిన బ్రాహ్మణిజానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించే సుందరరామశాస్త్రి అవసరమైతే ప్రాణాలైనా వదులుకుంటాడు కానీ ఆచారాలనూ, కట్టుబాట్లనూ వదులుకుంటాడా? తమ అవసరం కోసం బెట్టుని వదిలి మెట్టు దిగుతాడా? మాలలతో రాజీకి వస్తాడా? అలాంటి స్థితిలో ఉన్న శాస్త్రి నోటివెంట ఇలాంటి మాటలు కాకుండా వేరేవి ఎలా వస్తాయి? ఆద్యంతం శాస్త్రి పాత్ర తీరుకు తగ్గట్లు (ఇదే మాట అన్ని పాత్రలకూ వర్తిస్తుంది) చలం రాసిన మాటలు ఆ పాత్రకి వన్నె తెచ్చాయి. చలం మాటల్ని శాస్త్రి పాత్రలో గోవిందరాజుల సుబ్బారావు పలికిన తీరు అసామాన్యం. డైలాగులు పలకడంలో, ఆ పలికేప్పుడు హావభావాలు ప్రదర్శించడంలో ఎస్వీ రంగారావుని మించిన నటుడు లేడని మనవాళ్లు అంటుంటారు. అయితే ఆయనకటే ముందు అలాంటి నటుడు ఒకరున్నారనీ, ఆయన గోవిందరాజుల సుబ్బారావనీ ఒప్పుకోక తప్పదు. ‘కన్యాశుల్కం’లో లుబ్దావధాన్లుగా ఆయన నటనని మరవగలమా? ఆయన ఎక్కువ సినిమాలు చేయలేదు కాబట్టి, తొలి తరం ప్రేక్షకులు ఇప్పుడంతగా లేరు కాబట్టి ఆయన గురించి చెప్పుకునేవార్లు లేకుండా పోయారు. అందుకే ఆయనకు రావలసినంత పేరు రాలేదు.
మాటల రచయిత చలం

మాటల రచయిత చలం

శంపాలతనూ, అనసూయనూ తీసుకుని కలకత్తా పారిపోయాడు నాగరాజు. దీంతో ఇటు శాస్త్రి కుటుంబం, అటు మునెయ్య కుటుంబం దిగాలుపడ్డాయి. శంపాలతను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నానని తండ్రికి ఉత్తరం రాశాడు రాజు. ఆగ్రహంతో ఊగిపోయిన శాస్త్రి తనకసలు కొడుకు పుట్టలేదని అనుకుంటాననీ, పుట్టినా చచ్చిపొయ్యాడనుకుంటాననీ చౌదరితో అన్నాడు. ఆవేశపడకుండా ఆలోచించమన్నాడు చౌదరి. మనుషుల్లో విభజన ఏ శాస్త్రంలో ఉందో చూపించమన్నాడు.
“మేనమామ కూతుర్ని వదిలి మాలపిల్లను వివాహం చేసుకున్నాడంటే దాన్ని తేలిగ్గా చూస్తున్నారు కానీ అది సామాన్యమైన పని కాదు. పెద్ద ఇంటి బిడ్డ, ఉదార స్వభావం కలవాడే ఆ పని చేయగలడు. ఏరి? ఎందరుంటారు అలాంటివాళ్లు? కామానికి లొంగేనండీ, ఎంగిలి బతుకులు బతుకుతూ ఎంతమంది లేరు ఈ దేశంలో. అమాయకురాళ్లను వలలో వేసుకున్నవాళ్లు ఎందరు లేరు? చేరదీసినదాన్ని పెండ్లి చేసుకుని తన పేరును, తన హోదాను దానికి కూడా ఇవ్వగలిగినవాళ్లు ఎందరు? వెయ్యిమందిలో ఒక్కడుంటాడో, ఉండడో. ఆ ఒక్కడే మనిషి. తక్కినవాళ్లంతా నీచులు. వారే సంఘద్రోహులు. నిజమైన అస్పృశ్యులు. అలాంటివాళ్లంతా మనలో ఉన్నారు. మనతో తిరుగుతున్నారు. మన మర్యాదలు పొందుతున్నారు. దానికి తప్పులేదు. మాలలనంటితేనే తప్పు. మీరేమన్నా అనండి. నాగరాజు ధన్యుడు. వారడ్రస్ తెలీదు కానీ అక్కడికి పోయి స్వయంగా ధన్యవాదాలు చెప్పేవాణ్ణి” అన్నాడు చౌదరి.
గూడవల్లి రామబ్రహ్మం

గూడవల్లి రామబ్రహ్మం

ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు చౌదరి చేత పలికించిన ఈ మాటల ద్వారా రెండు ప్రయోజనాలు సాధించాడు చలం. ఒకటి – ఒక ‘మాలపిల్ల’ను వివాహం చేసుకోవడం ద్వారా బ్రాహ్మణుడైన నాగరాజు చేసింది చాలా గొప్ప పని అని చెప్పడం, రెండు – సంఘంలో పైకి పెద్ద మనుషులుగా, మర్యాదస్తులుగా చలామణీ అవుతూ చాటుమాటుగా పరాయి స్త్రీలతో వ్యవహారాలు నడిపేవాళ్లను ఎండగట్టడం. ఈ రోజుల్లో కులాంతర, వర్ణాంతర, మతాంతర వివాహాలు సాధారణమయ్యాయి కానీ, ఆ రోజుల్లో అలాంటివి గొప్ప పనులే. తక్కువ కులం అమ్మాయిని ప్రేమించి ధైర్యంగా పెళ్లి చేసుకున్నవాడే మనిషనీ, అమాయకురాళ్లను వలలో వేసుకుని ఎంగిలి బతుకులు బతుకుతున్నవారంతా నీచులనీ, వారే సంఘద్రోహులనీ, నిజమైన అస్పృశ్యులనీ చౌదరిచేత చెప్పించాడు చలం. అలాంటి వాళ్లంతా మనతో తిరుగుతూ మర్యాదలు పొందుతున్నారని ఎండగట్టాడు. నిజానికి ఆ మాటలు పలికింది చౌదరి కాదు. చలమే. అవి అచ్చంగా చలం భావాలే.
ఇవాళ్టి సినిమాల్లోనూ ఈ తరహా డైలాగులు రాయగల రచయిత ఒక్కడైనా ఉన్నాడా? మరి దురాచారాలు, కట్టుబాట్లు అధికంగా రాజ్యం చేస్తున్న కాలంలో ‘మాలపిల్ల’ వంటి సినిమా రావడం పెద్ద సాహసం, గొప్ప విషయమైతే, అందులో బ్రాహ్మణాధిపత్య సమాజానికి సూటిగా, బాణాల్లా తగిలే పదునైన సంభాషణలు రాయడం ఇంకెంత సాహసం, ఇంకెంత గొప్ప విషయం! నేటి సినీ రచయితలు తప్పకుండా అధ్యయనం చెయ్యాల్సిన సినిమా ‘మాలపిల్ల’ అయితే, అందులోని సంభాషణలు వారికి మార్గదర్శకమయ్యే గొప్ప పాఠాలు!!
-బుద్ధి యజ్ఞ మూర్తి
261374_585952121417138_1370360100_n

చూస్తూ చూస్తూ వుండగానే, అతనొక జ్ఞాపకం!

Dsc_7391

ముఖపుస్తకాలు లేని వొక అనగా అనగా కాలంలో స్నేహితులు వొకరి ముఖాలు వొకళ్ళు ఎలా చూసుకునే వారు? పొద్దూ పొద్దున్నే వొక చాయ్ తాగేసి, ఏ పొద్దుటి రైలో, ఫస్ట్ బస్సో అందుకొని దగ్గిరే వున్న స్నేహితుడి ముందు వాలిపోయే వాళ్ళు.

అవును, శేఖర్ – మేం “కంభా” అని పిలిచేవాళ్ళం- అలాగే వాలిపోయే వాడు వో ఆదివారం పొద్దున్న ఖమ్మంలో!

ట్విటర్లూ గట్రా లేని ఆ కాలంలో స్నేహితులు ఎలా పక్షి ముక్కుల్తో పొడుచుకునే వాళ్ళు? బహుశా, ఎక్కడో వొక పబ్లిక్ ఫోన్ పట్టుకొని, వొక పలకరింతో, ఇంకో తిట్టో రాల్చి వెళ్ళిపోయే వాళ్ళు.

అవును, కంభా అలాగే వున్నట్టుండి ఏ నెంబరూ లేని వొక ఫోన్లోంచి కొన్ని మాటలు మెల్లిగా రాల్చి తన వూళ్ళో తన మూలలో ఎక్కడో వొదిగి వుండి పోయే వాడు.

నెట్లూ మొబైల్ సెట్లూ లేని ఆ అనగా అనగా కాలంలోనే బహుశా మనుషులు ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు. మాట కోసం ఎదురు చూస్తూ వుండే వాళ్ళు. మాట కోసం కలవరిస్తూ వుండే వాళ్ళు. నిద్రలో స్నేహితుల పేర్లు పలవరిస్తూ వుండే వాళ్ళు.

చాలా అమాయకంగా ముఖంమీద ఎలాంటి పేచీ లేని వొక విశాలమైన నవ్వుతో కంభా ఖమ్మంలో మా ఇంటికొచ్చే వాడు. “ఖంభా ఆయారే, బాబూ!” అంటూ మా అమ్మ నవ్వుకుంటూ లోపలికొచ్చి కబురు చెప్పేది. (ఆ రోజుల్లో నేను వంట గదిలో డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని రాసుకునే వాణ్ని, మధ్య మధ్యలో అమ్మతో కబుర్లు చెప్తూ) శేఖర్ ఇంటి పేరు అమ్మ దగ్గిరకి వచ్చేసరికి ఉర్దూ యాసలో “ఖంభా” – అంటే స్తంభం- అయిపోయేది.

javed

చిత్రం: జావేద్

2

అప్పుడు కార్టూన్ అంటే ఇంకా ఏమిటో కంభాకి పూర్తిగా తెలీదు. పుస్తకాలు విపరీతంగా చదివే వాడు. . కార్టూనిస్టులు ఆ కాలంలో సాహిత్యంతో సంబంధం లేని వేరే లోకంలో వుండే వాళ్ళు నిజానికి!

కాని, కార్టూనిస్టుల లోకంలో కూడా సాహిత్యమూ కవిత్వమూ వుంటాయని అప్పుడే నా మటుకు నాకు సురేంద్ర (ఇప్పుడు “హిందూ” సురేంద్ర) వల్ల అనుభవమైంది. అప్పుడే సురేంద్ర – తన పేరుని సురేన్ద్ర- అని రాయడం మొదలెట్టాడేమో! సురేంద్రలాగానే శేఖర్ కి కూడా సాహిత్యం వొక ప్రాణం! తన అసలు ప్రాణం కార్టూన్ లో వుందని కొంచెం ఆలశ్యంగా తెలిసి వచ్చింది శేఖర్ కి! కాని, ఆ ప్రాణం చిరునామా తెలిసాక వొక క్షణం వృధా చేయలేదు శేఖర్!

శేఖర్, శ్యాం మోహన్, సురేన్ద్ర…ఇలా ఇంకా ఈ తరం కార్టూనిస్టులు అక్షరంలోంచి కుంచెలోకి చేసిన ప్రయాణం చాలా విలువైనదని నాకు అనిపిస్తుంది. ఈ సాహిత్య సహవాసం వల్ల ముందు తరంలో ఏ కొద్ది మంది కార్టూనిస్టులకో పరిమితమైన కొత్త అందం వీళ్ళ కుంచెల్లోకి వచ్చి చేరింది.

శేఖర్ చివరి దాకా ఆ సాహిత్య సహవాసాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాడు. బాగా గుర్తు- మహాశ్వేతా దేవి నవలల్ని చదివిన తాజా ఉద్వేగంలోంచి నడిచి వచ్చి, ఖమ్మంలో వొక ఆదివారం పొద్దున్న శేఖర్ అన్న మాటలన్నీ! “జీవితంలోని ఆ చిన్ని డీటెయిల్స్ మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం?” అని ఆ రోజు అతను నన్ను అడిగాడు. శేఖర్ కి ఆ “చిన్ని డీటెయిల్స్” మీద విపరీతమైన పట్టింపు! సాహిత్య వ్యాసాల రచనతో మొదలైన శేఖర్ ప్రయాణం కార్టూన్ దగ్గిర స్థిర పడడంలోడీటైల్స్ మీది పట్టింపే కారణమని నాకు అనిపిస్తుంది. రోజువారీ జీవితాన్ని కార్టూనిస్టు చూసినంత దగ్గిరగా మరో కళాకారుడు చూడలేడు అని నేను ఖాయంగా చెప్పగలను. ఎందుకంటే, కార్టూనిస్టు daily basis మీద జీవితాన్ని బేరీజు వేసుకోవాలి. వాస్తవికతని చూస్తూనే దాన్ని ఆట పట్టించే క్రిటిక్ అతనిలో వుండాలి. అంత కంటే ఎక్కువగా ఆ వాస్తవికతని దాని అసలు రూపు చెడకుండా నవ్వు పుట్టించే కోణంలోంచి కూడా చూడాలి. కార్టూన్ వెనక వున్న ఈ ఫిలాసఫీ శేఖర్ కి అర్థమైంది. అందుకే, కార్టూన్ని వొక కళారూపంగా గుర్తించి తీరాలని మొండి పట్టుదల అతనికి!

ఇవాళ శేఖర్ మన ముందు లేని ఈ రోజున మీరు అతని కార్టూన్లన్నీ దగ్గిర పెట్టుకొని, వొక్కోటీ చూస్తూ వెళ్ళండి. ఈ కార్టూనిస్టు ఫిలాసఫీ గురించి నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది.

శేఖర్ చివరి గీత

శేఖర్ చివరి గీత

3

నిజమే, జీవితం చాలా వేగంగా దూసుకుపోతోంది. మన మధ్య ఎవరున్నారో ఎవరు లేరో కనుక్కునే వ్యవధి మనకెవ్వరికీ లేదు. చూస్తూ వుండగానే, మన కళ్ళ ముందు పెరిగి పెద్దదైన వొక కార్టూన్ గీత నిష్క్రమించింది. వొక చిర్నవ్వు నిశ్శబ్దంలోకి రాలిపోయింది. వొక స్నేహ హస్తం మన భుజమ్మీంచి బలహీనంగా కూలిపోయింది. బతికి వుండగా వొక మనిషి ఎన్ని పాత్రాలు పోషించ గలడో, ఆ పాత్రలన్నీ ధైర్యంగా వాటిల్లో ప్రాణం పొదివినంత పదిలంగా పోషించి వెళ్ళిపోయాడు శేఖర్!

“కలడు కలండు అను వాడు కలడో లేడో!” అన్న నిత్య సంశయంలోకి నేను వెళ్లదలచుకోలేదు కాని, వుంటే, ఇదిగో – ఖాలిద్ హుస్సేనీ నవల The Kite Runners లో వొక పాత్ర అడిగినట్టుగా ఇలా అడగాలని వుంది…

When you kill a man, you steal a life. You steal his wife’s right to a husband, rob his children of a father. When you tell a lie, you steal someone’s right to the truth. When you cheat, you steal the right to fairness. Do you see?

మన మధ్యలోంచి వెళ్ళిపోయింది కేవలం వొక వ్యక్తి మాత్రమే కాదు, వొక కుంచె మాత్రమే కాదు. వొక నిజాన్ని నిజాయితీగా పలికే స్వరం. నిజానికి వున్న అనేక రూపాల్లో వొక రూపం!!

 – అఫ్సర్

శేఖర్ ధైర్యం మనకో పాఠం!

 

myspace

 బహుశా మనిషికి ఉండాల్సిన అన్ని గుణాల్లోధైర్యమే గొప్పది. అది ఎన్నోసార్లు రుజువై ఉండవచ్చు. కానీ  నాకు మొన్న శేఖర్ని చూసేక అనిపించింది, ధైర్యమే వుంటే ఇంకేమీ అక్కర్లేదని జీవితంలో.

 Old Man and the Sea లో ముసలి వాడి ధైర్యమది. విప్లవం ఎట్లైనా విజయవంతమవుతుందని  నమ్మిన ‘అమ్మ’నవల్లో ముసలి తల్లి మొండి ధైర్యం అది. కొండల్ని పగల గొట్టినముసలి చైనా మూర్ఖుడికి వుండిన తెగువ అది. 

సాధారణంగా ఇలాటి పాత్రలు రచనల్లో కనిపిస్తాయి. అసలు రచయితలు ఇలాటి పాత్రల్ని ఎక్కడనుంచి సృష్టిస్తారు? చరిత్రలో ఇలాటివాళ్ళు ఎక్కడినుంచి పుట్టుకు వస్తారు? మొత్తం ప్రపంచం తమకి వ్యతిరేకమైనా, కష్టాలన్నీ ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడిచేసినా, జబ్బులేవో చావుని అనంతంగాశరీరంలోకి నింపుతున్నా, అంతులేని వనరులున్న శత్రువు నిరంతరం దాడిచేస్తున్నా — నిలువరించే వీళ్ళు ఎలాటి వారై వుంటారు? వాళ్ళు ఏయే ధాతువులతో తయారైవుంటారు?

వాళ్ళు ఏ శక్తుల్ని కూడదీసుకుని ధైర్యంగా నిలబడతారు? అత్యంత సామాన్యులైన వాళ్ళకు ఏ ఊహలు, ఏ హామీలు అంత ధైర్యాన్నిస్తాయి?

నేను చూడలేదు కానీ, చెరబండ రాజు గురించి చెప్తారు చూసిన వాళ్ళు. ఆయనతో గడిపిన వాళ్ళు మెదడుని మృత్యువుకబళిస్తున్నా కూడా, రాజ్యాన్ని ధిక్కరించే స్వరం కొంచెమైనా తగ్గలేదని, ‘ముంజేతిని ఖండించిన నా పిడికిట కత్తివదల’ అని అన్నాడని.

నేనెప్పుడూ కలవలేదుగానీ, అలిశెట్టి ప్రభాకర్ కూడా అలాగే ఉండేవాడని,మృత్యువుని పరిహసిస్తూ.

ఇక పతంజలి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకో నెల రోజుల్లోచనిపోతారనగా, మిత్రుల్ని, శిష్యుల్ని పిలిపించుకుని ఒక Last Supper చేసారు. అప్పటికే ఎన్నో రౌండ్ల కెమోతెరపీ సెషన్లతో శరీరం వడలు పోయింది. నాలుక, గొంతు అలవికాని మంటతో మండిపోయేది. కానీ, మిత్రులకు సామూహిక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎందుకు వ్యవస్థతో శాశ్వత పేచీ పెట్టుకోవాల్సి వచ్చిందో, తనని రచయితగా నిలబెట్టినదేమిటో as-a-matter-of-factగా చెప్పేరు.

బహుశా, తాము నమ్మిన, ప్రేమించిన, ఇష్టపడిన వ్యాసంగమేదో వాళ్ళని నిలబెట్టి వుండవచ్చు. ఇలాటి తెగువ చాలా మందిలో వుండొచ్చు. కానీ, ప్రజల పక్షాన వుంటూ, తిరుగులేని శక్తివున్న ప్రజా శత్రువులకి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళ వైపు వున్నవాళ్లు చూపించే తెగువ ఇంకా గొప్పది.

కార్టూనిస్ట్ శేఖర్ కి ఇష్టమైన వస్తువులు నాలుగు – సంఘ్ పరివార్, ప్రపంచ బాంక్-చంద్రబాబు, తెలంగాణ, ఇంకా కులమనే కేన్సర్. శేఖర్ మెదడును, హృదయాన్ని బాధపెడుతున్నది తనను కబళిస్తున్న కేన్సర్ కాదు. కులమనే కేన్సర్. అందుకే పెట్టుకున్నాడు ఒక ప్రోజెక్ట్ — Caste Cancer. ఆసుపత్రి బెడ్ మీదనే పనికి ఉపక్రమించి పూర్తి చేసేడు. “ఇంకా ఎక్కడుందండీ కులం,” అని అనేవాళ్ళకు ఈ బొమ్మలు చూపించాలి. ఒక్కొక్క కార్టూనూ ఒక్కొక్క కొరడా దెబ్బలా వుంటుంది.

10173554_844876798861497_2505974776557559890_n

రేపు పుస్తకం ఆవిష్కరణ వుందనగా, ఫోన్ చేసేడు. హిందూ లో తనపై వ్యాసం రాసినందుకు. “చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. చాలా సంతోషంగా వుంది. కానీ, రేపు పుస్తకం ఆవిష్కరణకు రాగలనో లేదోన”ని అన్నాడు. ఇక ఎక్కువ మాట్లాడకుండా రెస్ట్ తీసుకోమని ఫోన్ పెట్టేశాను.

ఇక తర్వాత రోజు సభలో గంటల పాటు ఓపిగ్గా కూచున్నాడు. అంతే కాదు, చివర్లో తన preamble చెప్పుకున్నాడు. జీవితం పట్ల తన దృక్పథం, తనిప్పుడు మరో ప్రాజెక్ట్ ని ఎందుకు చేపట్టబోతున్నాడు అన్నీ చెప్పేడు. ఇంకో ప్రాజెక్ట్ ఎందుకంటే, అది తనలోని కేన్సర్ తో పోరాటానికి ఉపయోగపడే ఒక మానసికమైన ఆయుధం. కానీ, అది మనకి శేఖర్ ఇచ్చే ఆయుధం కూడా.

ఒక కుల రోగ గ్రస్తమైన వ్యవస్థ చుండూర్ మారణకాండ నిందితుల్ని వదిలేస్తే, ఒక రోగంతో అద్వితీయమైన పోరాటం చేస్తున్న శేఖర్ మనకి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. అది కేవలం ఒకానొక పుస్తకంగానే కనిపించవచ్చు. కానీ, దాని వెనుక వున్న అతడి తెగువ దానికి తిరుగులేని శక్తిని ఇచ్చింది.

ఇప్పుడు ఆ శక్తితోనే మనం, ఇప్పుడు వేయి దెయ్యపు కన్నుల, కోరల, కొమ్ములతో దేశంపై తెగపడ్డ వింత, క్రూర జంతువుతో యుధ్ధం చెయ్యాలి. ఆ తెగువ, ధైర్యం కావాలిప్పుడు దేశానికి.

*

1901233_805223106160200_304354655_n

post script: 
   శేఖర్ ధైర్యం గురించి నేను రాసి, సారంగ సంపాదకులకు పంపి మూడు రోజులైంది. ఈ రోజు తెల్లవారు జామున శేఖర్ చనిపోయాడు. నిశ్చలంగా, పెట్టెలో ఉన్న శేఖర్ ముఖం ప్రశాంతంగా వున్నది. యుద్ధంలో గెలిచిన సంతృప్తి వుంది ఆ ముఖంలో. శరీరంలో శక్తి అయిపోయింది కాబట్టి కేన్సర్ పై పోరాటం ఆపేడు కాని, ఏమాత్రం శక్తి వున్నా ఇంకా పోరాడేవాడే.
పుస్తకం రిలీజ్ అయిన రోజు అడిగాడు, “మీకు చాలామంది డాక్టర్లు పరిచయం వుంటారు కదా. అడగండి వాళ్ళని శక్తి రావడానికి ఏం చెయ్యాలని. ఏం తాగితే ఇంకొంచెం వస్తుందో కనుక్కోండి,” అన్నాడు.
   ఆ బక్క శరీరంలో వున్న అణు మాత్రం శక్తినీ వాడుకొని బతికేడు. చనిపోయిన రోజు కూడా ఆంధ్రజ్యోతిలో కార్టూన్ వచ్చింది. ఎవరో అంటున్నారు, “రేపటికి కూడా పాకెట్ (కార్టూన్) పంపించాడు.” అని.
  సామాన్యుల అసమాన ధైర్యసాహసాలే మనకి ఊపిరి, ప్రేరణ. నిత్య జీవితంలో ఇంతే గొప్పగా పోరాటం చేస్తున్న వాళ్ళు చాలా మంది వున్నారు. దుస్సహమైన జీవితం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, శత్రువు వేయి పడగల నాగరాజై దాడిచేస్తున్నపుడు మనకి ఇలాటి ధైర్యవంతులే ప్రేరణ.
  శేఖర్ గుర్తుంటాడు ఎప్పటికీ.

నాకంటూ నేను ఏమీ లేనని…!

swathi

 

 

 

 

 

లేత వెలుగు కిరణం కూన ఒకటి తారట్లాడుతూ వచ్చి

కనురెప్పల తలుపులు నాజూకు ముని వేళ్ళతో తట్టి

కలల పుష్పకం నుండి సుతారంగా ఎప్పటి త్రిశ౦కులో

దింపుతుంది.

 

ఉందో లేదో తెలియని అస్తిత్వానికి కాస్త కాస్త వశమవుతూ

రాత్రి నిశ్శబ్దపు గాలివాన చీకటి హోరులో రాలి పడిపోయిన కలలు

ఒక్కొక్కటిగా ఏరుకుంటూ , ఎంచుకుంటూ

నలిగిన దారే అయినా కొత్త నడక ఆరంభమవుతు౦ది

 

గతకాలపు ఆనవాళ్ళు ఎదురు దెబ్బల మచ్చలూ

ముళ్ళ పొదల పలకరింపులూ వీపున వేసుకు

అడుగడుగునా ఒంగిలేస్తూ అనుభూతుల ఆయాసంలో

ఊపిరందక ఉక్కిరి బిక్కిరవుతూ

స్వంతం కాని ఉనికిని నాదని భ్రమపడుతూ

ఎవరో కళ్ళాలు అదలించే ప్రయాణానికి

నన్ను నేను శతవిధాల సమాయత్తం చేసుకుంటూ-

 

ఎవరో నాటి పోయిన చెట్లన్నీ నిటారుగా నిలువెత్తు సాక్షాలుగా

రెప్పవాల్చకుండా చూస్తున్నా కాసిన కాయలన్నీ నావే అనుకుంటాను

 

పిల్ల కాలువల్లా సాగి సాగి నదీమతల్లులై పరవళ్ళు తోక్కే నదులన్నీ

నా స్వంతమేనంటాను .

 

అంగుళం అంగుళం కోకొలుచుకుంటూ ఆక్రమించుకుంటూ

అధునిక వామనావతారంలోకి దూరతాను

 

అంతా ముగిసిన అసుర సంధ్య చూపు మసకేసాక

నాది కాని ప్రతి దానికోసం నాది కాని జీవితం వెచ్చించి భాగించి

వెయ్యి న్నొక్క సమస్యల్లో తబ్బిబ్బయాక

కరిగి కరిగి ఎక్కడో ఏ బీటలు వారిన హృదయాల్లోనో

అక్షరాలై ఇ౦కిపోయాక తెలిసింది

 

నాకంటూ నేను ఏమీ లేనని.

 

 – స్వాతీ శ్రీపాద

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అస్తిత్వానికి ఆనవాళ్ళు తొలి తెలంగాణ కథలు

సంగిశెట్టి శ్రీనివాస్‌

సంగిశెట్టి శ్రీనివాస్‌

నిజాం పాలనలో హైదరాబాద్‌ రాజ్యంలో ముఖ్యంగా హైదరాబాద్‌/సికింద్రాబాద్‌ నగరాల్లో కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వెల్లి విరిసింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారితో పాటు అటు ఇరాన్‌ నుంచి ఇటు ఫ్రాన్స్‌ ఇంకా అనేక దేశాల నుంచి వలస వచ్చిన వారు హైదరాబాద్‌ని తమ శాశ్వత ఆవాసంగా మార్చుకున్నారు. అంతకు ముందరి కుతుబ్‌షాహీల పాలన కూడా విదేశీ పర్యాటకుల పొగడ్తలతోపాటు, దేశీయుల మన్ననలందుకుంది.

ఇబ్రహీం కులీ కుతుబ్‌షాను కవులు మల్కిభరాముడు అని కొనియాడిండ్రు.  హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించిన మొహమ్మద్‌ కులీకుతుబ్‌షా చంచల్‌గూడా బిడ్డ భాగమతిని వివాహమాడిండు. భాగమతి ` కుతుబ్‌షాహీ ఖాందాన్‌లో వీరమాతగా, వీరపత్నిగా వెలుగొందారు. తారామతి, ప్రేమావతిలు గోల్కొండ కోటలో నృత్య ప్రతిభతో దేశదేశాల్లో పేరు పొందిండ్రు. అక్కన్న మాదన్నలు కుతుబ్‌షాహీల సేవలో తరించారు. ఉన్నత పదవుల్ని అధిష్టించారు.  ఖైరున్నీసా బేగమ్‌ని పెళ్ళి చేసుకొని బ్రిటీష్‌ రెసిడెంట్‌ కిర్క్‌ పాట్రిక్‌ చరిత్రలో నిలిచి పోయాడు. స్వాతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్‌లో చైనీస్‌ రెస్టారెంట్స్‌ ఉండేవి. కరాచీ బేకరీ ఇప్పటికీ ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన సైనిక యోధుడు రేమండ్‌ సమాధి హైదరాబాద్‌ ఆస్మాన్‌ఘడ్‌లో ఇప్పటికీ ఉంది. బ్రిటీష్‌ ప్రధాని చర్చిల్‌ తాను సైన్యంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్‌లో నివాసమున్నాడు.   ఆయన కూడా హైదరాబాద్‌లో సర్వేయర్‌గా పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాత కవి టేలర్‌ ఇక్కడుండి కవిత్వం రాసిండు. తెలుగులో నవలలు రాకముందే హైదరాబాద్‌ నగర జీవితం ఇంగ్లీషు నవలల్లో రికార్డయింది.

బ్రిటీష్‌ రెసిడెంట్‌ హాలండ్‌ బంధువు వాల్టర్‌ స్కాట్‌ ఈ నవల రాసిండు. ఇలా ఎంతో మంది హైదరాబాద్‌ ‘షాన్‌’, ‘నిషాన్‌’ని విశ్వవ్యాప్తం చేసిండ్రు. తమ స్వీయ ‘అస్తిత్వా’న్ని ‘పోలీస్‌ యాక్షన్‌’ వరకూ ఇక్కడి ప్రజలు కాపాడుకున్నారు. ఈ కాపాడుకున్న అస్తిత్వం కథా సాహిత్యంలో కూడా ప్రతిఫలించింది. మాజీ మంత్రి, 1969 ఉద్యమ నేత టి.ఎన్‌. సదాలక్ష్మి మామ నిజాం మిలిటరీలో పనిచేస్తూ మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్‌లో పర్యటించాడు. ఆఫ్రికన్‌ కావల్రీ గార్డ్స్‌లో పనిచేసేందుకు అఫ్ఘనిస్తాన్‌, ఈజిప్ట్‌, గల్ఫ్‌, ఇథియోపియాల నుంచి సిద్దీలు, పఠాన్‌లు ఇంకా ఎంతోమంది తమ జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిండ్రు. ఇలా వచ్చిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ట్రెంచ్‌, టస్కర్‌లతో పాటు అనేక మంది యూరోపియన్‌ అధికారులూ ఉన్నారు. అలాగే సరోజిని నాయుడు, డాక్టర్‌ మల్లన్న తదితరులు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ నుంచి యూరోప్‌కు వెళ్ళిండ్రు.

హైదరాబాద్‌ నుంచి చదువుకునేందుకు ఇంగ్లండ్‌ వెళ్ళిన సంస్కర్త రాయె బాలకిషన్‌ విదేశాల్లో గదర్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. కొన్ని వేల మంది హైదరాబాదీలు విదేశాల్లో చదువుకున్నారు. హైదరాబాద్‌ ఉప ప్రధాని పింగళి వెంకటరామారెడ్డి కుమారుడు యూరోప్‌లో జరిగిన బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల సందర్భంగానే దెబ్బలు తగలడంతో బాక్సింగ్‌ రింగ్‌లోనే ప్రాణాలు వదిలాడు. ఇదంతా హైదరాబాద్‌ ప్రజలకు ప్రపంచం చేరువైన తీరు. మిగతా తెలుగు వాళ్లందరికన్నా ముందుగానే బాహ్య ప్రపంచం పరిచయమైందనే వాస్తవాన్ని తెలియజేస్తుంది. ఈ పరిచయం, చైతన్యం, భాషా విశేషాలు, భావాల మేలు కలయిక, కోర్టుల్లో వాడే ఇంగ్లీషు, ఉర్దూ భాషలు అన్నీ కలగలిసి తెలుగులో ఆనాడు కథలు రాసిన వారిపై గాఢమైన ప్రభావాన్నే వేశాయి. అందుకే నందగిరి వెంకటరావు లాంటి వారు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో 1930కి ముందే కథలు రాసిండ్రు. భాస్కరభట్ల కృష్ణారావు ఆరేడు భాషల్లో నిష్ణాతుడు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు, ఉర్దూ, ఫార్సీల్లో సమాన ప్రతిభ కలవాడు. వీరందరూ ఆనాడు సాహితీ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకుండ్రు.

585_luther_1
హైదరాబాద్‌పై పోలీసుచర్యకు పూర్వం అంటే 1948 సెప్టెంబర్‌ 13 కన్నా ముందు రాసిన తెలంగాణ` తెలుగు కథల్లో ప్రముఖంగా చోటు చేసుకున్న అంశం ఇక్కడి తెహజీబ్‌. హిందూ`ముస్లిం సోదరుల్లా కలిసిపోయిన సంస్కృతి. దాదాపు ఆనాటి తెలంగాణ కథకులందరూ తెలుగు`ముస్లిం జీవితాలను తమ కథల్లో నిక్షిప్తం జేసిండ్రు. నందగిరి వెంకటరావు, సురవరం ప్రతాపరెడ్డి, భాస్కరభట్ల కృష్ణారావు, నెల్లూరి కేశవస్వామి, వట్టికోట ఆళ్వారుస్వామి, వెల్దుర్తి మాణిక్యరావు, కాంచనపల్లి చినవెంకటరామారావు, నందగిరి ఇందిరాదేవి ఇంకా చాలా మంది ఈ జీవితాలకు తమ కథల ద్వారా శాశ్వతత్వాన్ని కల్పించిండ్రు.

ముస్లింల అబ్బాయిలతో తెలుగమ్మాయిలు, తెలుగువారితో ముడిపడ్డ ముస్లిం అమ్మాయిల జీవితాలు, ఉద్యోగాలు, కలివిడితనం, విద్య, సంస్కరణ, ఆత్మగౌరవం ఇవన్నీ ఈ కథల్లో ప్రతిఫలించాయి. గంగా జమునా తెహజీబ్‌తో పాటు 1945 తర్వాత మూడేళ్ళ కాలంలో నిజాం ప్రభుత్వ అసహాయ వైఖరిని కూడా తమ కథల్లో ఎత్తి చూపిండ్రు. దొరలు, పాలకులు చేస్తున్న దగా, దోపిడీ,  మోసాలను నిలదీసిండ్రు. రైతుల దీనావస్థను కళ్ళకు కట్టిండ్రు. ఆంధ్రమహాసభ కార్యక్రమాలు తీసుకొచ్చిన చైతన్యంతో కొంతమంది కథకులు గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, పుస్తక పఠనం, వెట్టి చాకిరి, రాజకీయ చైతన్యాన్ని తమ కథల్లో వస్తువుగా తీసుకున్నారు. కనుమరుగౌతున్న భాష పట్ల అవగాహన కల్పించే విధంగా కథలల్లిండ్రు. ఈ దశలో తెలంగాణ కథల్లో అనివార్యంగా జైలుకు సంబంధించిన జీవితాలు, పోరాటాలు చోటు చేసుకున్నాయి. పొట్లపల్లి రామారావు ‘జైలు’. వట్టికోట ఆళ్వారుస్వామి’ ‘జైలు లోపల’తో పాటు కాంచనపల్లి వెంకటరామారావు, ఆవుల పిచ్చయ్య తదితరుల కథలే దానికి సాక్ష్యం.
తొలి తెలుగు కథ రాసిన భండారు అచ్చమాంబ మొదలు 1948లో కథలు రాసిన నందగిరి ఇందిరాదేవి వరకూ 25మందికి పైగా రచయితలు తమ కథల్లో తెలంగాణ/హైదరాబాద్‌ రాజ్య అస్తిత్వాన్ని రికార్డు చేసిండ్రు.   1899 నాటికే తెలుగులో తొలి కథలు రాసిన భండారు అచ్చమాంబ హైదరాబాద్‌లో అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ (ఆంధ్రలో) బతుకలేని పరిస్థితి వస్తే హైదరాబాద్‌కు వలస వెళ్ళయినా జీవితాన్ని వెళ్ళదీయొచ్చు అని ‘సతాప్రత్రదానము’ (1902) కథలో చెప్పారు. అచ్చమాంబ బాల్యము ఒకప్పటి మునగాల, దేవరకొండలో గడిచింది. వివాహానంతరం మహారాష్ట్రలో గడిపింది. అందుకే ‘ధనత్రయోదశి’ ‘బీద కుటుంబం’ కథలో బొంబాయి, మహారాష్ట్ర ప్రజల జీవితాన్ని రికార్డు చేసింది. ఆనాడు హైదరాబాద్‌ రాజ్యంలో మరాఠీలు కూడా భాగమే. హైదరాబాద్‌లో మెరుగైన జీవన స్థితిగతులు ఉన్నందువల్లనే ఆమె తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు, మునగాల జమిందార్‌ రాజా నాయని వెంకటరంగారావు హైదరాబాద్‌ ఆవాసంగా చేసుకొని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం (1901`హైదరాబాద్‌) తో పాటు అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వంహించారు.
అచ్చమాంబ తర్వాత తెలంగాణ జీవితాల్ని ప్రతిఫలించే విధంగా కథలు రాసింది మాడపాటి హనుమంతరావు. ఆయన ‘హృదయశల్యము’ కథలో కాకతీయుల చారిత్రక మహిళ ‘రుద్రమదేవి’ గురించి రాసిండు. ఈయన రాసిన ‘నేనే’ కథలో కృష్ణాథియేటర్‌కు రమ్మని హీరోయిన్‌ హైమవతి తానెవరో చెప్పకుండా న్యాయవాది గణపతిరావుకు లేఖ రాస్తుంది. షోకుగా తయారై వెళ్ళిన రావుకు అక్కడ తన భార్య కనబడడంతో తమాయించుకొని ‘ఈ కొంటె తనము చేసింది నువ్వేనా?’ అని అడుగుతాడు. దానికి ఆమె ‘నేనే’ అని జవాబు చెబుతుంది. ఆనాటికి ఈనాటికి కృష్ణా థియేటర్‌ చార్మినార్‌ దగ్గర చరిత్రకు సాక్ష్యంగా నిలబడి ఇంకా సజీవంగా ఉంది. ‘నేనే’ కథ పురుషుల బలహీనతల్ని చెబుతుంది. ఇది ఆనాటి సమాజంలో వ్యాప్తిలో ఉన్న విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఆ లౌల్యానికి సాహిత్యంలో స్థానం దక్కింది. ఇదే కాలంలో బడారు శ్రీనివాసరావు అనే మహబూబ్‌నగర్‌కు చెందిన జర్నలిస్టు, ఆయుర్వేద వైద్యుడు, నాటకకర్త తాను వెలువరించిన ‘హితబోధిని’ (1913`15) పత్రికలో కథలు వెలువరించాడు. రాజయ్య సోమయాజులు, విషాదము, మృత్యువు దాని జ్ఞాపకము అనే కథలు వెలువరించాడు. ఇందులో మృత్యువు దాని జ్ఞాపకము మ్యూజింగ్స్‌ మాదిరిగా ఉంటుంది. ఈ కథలో దొరతనము గురించీ, దానికి గ్రామంలోని కరణాలు, ఆయుర్వేద వైద్యులు తమ స్వలాభం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసే జీవితాల్ని, దాసిరాండ్రని వాడుకునే స్థితిని, ఆనాటి పాలమూరు జిల్లా సంఘటనల్ని రికార్డు చేసిండు.
1921లో ప్రారంభమైన నీలగిరి, తెనుగు పత్రికల్లో కథకుల పేర్లు లేకుండా తెలంగాణ జీవితాల్ని ప్రతిబింబించే విధంగా అనేక కథలు వెలువడ్డాయి. నీలగిరిలో నైజగుణము, సాతాని జియ్యర్‌, కాపు, దురాశ తదితర కథలు అచ్చయ్యాయి. ఇందులోని పాత్రలన్నీ హైదరాబాద్‌, వరంగల్‌, తెలంగాణ జీవితాలనే ప్రతిబింబించాయి. అలాగే తెనుగు పత్రికలో ఒద్దిరాజు సోదరులు తమ పేరు లేకుండానే స్థానిక అంశాలపై అన్యాపదేశంగా కథనాలు వెలువరించారు. ఇవి విషయాల్ని కథలుగా చెప్పాయి. ఇదే పత్రికలో ఇతరుల కథలు కూడా అచ్చయ్యాయి. 1927`30 మధ్యకాలంలో హైదరాబాద్‌ నుంచి సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడ్డ ‘సుజాత’ పత్రికలో వీరి రచనలు చాలా వెలువడ్డాయి.
భారతి పత్రికలో మొట్టమొదటిసారిగా ఒక తెలంగాణ వాడి కథలు అచ్చుకావడమనేది వాసుదేవరావుతో ప్రారంభమయింది. పక్కా హైదరాబాదీ అయిన వాసుదేవరావు తొలి కథ ఆగస్టు,1924 భారతి సంచికలో ‘నేను జొన్నరొట్టె’ శీర్షికన అచ్చయింది. 1924`33 మధ్య కాలంలో డజనుకు పైగా కథలు అచ్చయ్యాయి. ఇందులో ఒకటి రెండు కథలు ప్రేమ్‌చంద్‌ కథలకు అనుసరణలు కాగా మిగతావన్నీ పక్కా హైదరాబాద్‌ ఠీవిని, ఆహార్యాన్ని, ఆహారపు అలవాట్లని పట్టిచ్చాయి. ‘ఆలోచన’, ‘ప్రయాణం’, ‘వివాహం’ సీక్వెల్‌ కథలు.

మూడిరటిలోనూ పెళ్ళిచూపులు, పెళ్ళి ఇతివృత్తం. ఒక దాంట్లో పెళ్ళి చూపులకు ఆంధ్ర ప్రాంతంలోని తన మామయ్య ఇంటికి వెళ్ళాలని నిశ్చయం, రెండో దాంట్లో అందుకోసం చేసిన ప్రయాణంలో జరిగిన సంఘటనలని, మూడో దాంట్లో పెళ్ళికి సంబంధించిన విషయాల్ని రికార్డు చేసిండు. బి.ఎ. పూర్తి చేసిన కథానాయకుడు ఇంగ్లండ్‌ వెళ్ళి ఎం.ఎ. చదవాలనుకుంటాడు. అలాగే హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసెస్‌లో ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.
సూటూ, బూటు నీటుగా టై వేసుకోవడం, విదేశీ అధికారుల మాదిరిగా తయారు కావడం, ఆంగ్ల భాషాభిమానం, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ సంస్కరణపట్ల ఆసక్తి, వితంతువివాహాలు, రజస్వాలానంతర వివాహాలకు సంబంధించిన విషయాలు ఈ కథల్లో ప్రస్తావనకు వస్తాయి. హైదరాబాద్‌ అస్తిత్వాన్ని, సంస్కృతిని, మాట తీరుని, భాషని, వ్యంగ్యాన్ని చాలా హృద్యంగా వాసుదేవరావు ‘‘నేనా? నేనా? నేను హైదరాబాదు `దక్కనీ! నా హృదయం వేరే. వాళ్ళ హృదయం వేరే. నేనూ వాళ్ళవంటి వాణ్ణే అయితే అయిదు కాదు పదేను వేలిస్తే గాని పెళ్ళి చేసుకోనని పట్టుబట్టి కూర్చుందును. పెద్ద పెద్ద సభలలో వేదికల మీద నెక్కి సంఘసంస్కర్తలని పేరు పెట్టుకొని, సంస్కార విషయాలు పెద్ద పెద్ద లెక్చర్లిచ్చి (బహిరంగంగా) లోలోపల, వందలు వేలు కట్నాలు పుచ్చుకొనే ఆంధ్ర బ్రాహ్మణులెక్కడ? నేనెక్కడ ఈ వ్యత్యాసం నీకు కనబడలేదామ్మా?’’ అంటూ హైదరాబాద్‌(దీ) ఔన్నత్యాన్ని ‘ఆలోచన’ కథలో చాటి చెప్పిండు.

కథానాయకుడి డ్రెస్సింగ్‌ చూసి అతను యూరోపియనా? అనే అనుమానం కలిగిందంటే ఆనాటి హైదరాబాదీ ఆహార్యాన్ని అర్థం చేసుకోవచ్చు. బడాయి కూడా అలానే ఉండేదని తల్లి పాత్ర ద్వారా వాసుదేవరావు చెప్పిస్తాడు. ఇవి గాకుండా ‘నేను జొన్నరొట్టె’, ‘పిశాచం’, ‘ఇదియేనా పునర్వివాహం’, మాటీలు, సుప్రభాతము, ముద్దుటుంగరము, అనర్థం, సంశయం తదితర కథలు హైదరబాదీ హృదయంతో వెలువడ్డాయి. వాసుదేవరావు లాగానే పక్కా హైదరాబాదీ తర్వాతి కాలంలో జడ్జిగా పనిచేసిన నందగిరి వెంకటరావు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథానికలు రాసిండు.
నందగిరి వెంకటరావు (1909`1985)  తెలంగాణ తొలితరం కథకుల్లో అగ్రగణ్యుడు. 1926`35 సంవత్సరాల మధ్యకాలంలో 50కి పైగా కథలు రాసిన ఈయన రచనలేవి పుస్తక రూపంలో రాకపోవడంతో వాటికి తగిన గుర్తింపు దక్కలేదు. ‘గిరి’ అనే కలం పేరుతో భారతి, ఉదయిని, కృష్ణాపత్రిక, సమదర్శిని, సుజాత, గోలకొండ పత్రికల్లో ఈ కథలు అచ్చయ్యాయి. 1935లోనే ప్రథమ అఖిలాంధ్ర కథకుల సమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహించిన వెంకటరావు భార్య నందగిరి ఇందిరాదేవి కూడా చాలా కథలు రాసింది.

ఆంధ్రమహాసభ నాయకుడిగా, తెలంగాణ సాయుధ పోరాట కాలంలో జైలుకెళ్లిన స్వాతంత్య్ర యోధుడిగా, జడ్జిగా, గ్రంథాలయోద్యమ కార్యకర్తగా, స్త్రీవిద్య ప్రచారకుడిగా నందగిరి వెంకటరావు చేసిన కృషి చిరస్మరణీయమైనది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథా సాహిత్యాన్ని సృజించిన అరుదైన ప్రతిభాశాలి నందగిరి వెంకటరావు.
తెలుగు సాహిత్యం ముఖ్యంగా కథానికా సాహిత్యం దేదీప్యమానంగా వెలుగడానికి చమురునెంతో సరఫరా చేసిన వాడు నందగిరి. కథానికా సాహిత్యంలో తనకంటూ ఒక శైలిని ఏర్పర్చుకొని లో చూపుతో విశ్లేషించి, మానవ సంబంధాల్ని మానవీయ కోణంలో సున్నితంగా సృజించి జీవితాల్ని చిన్న కాన్వాస్‌పై ‘కథ’గా చిత్రీకరించిన అక్షర పెయింటర్‌ నందగిరి. హైదరాబాద్‌ హిందూ`ముస్లిం సంస్క ృతి, తెలంగాణ జీవితాల్ని కథలుగా మలిచిండు. 1935కు ముందే హైదరాబాద్‌ కేంద్రంగా జరిగే జాతీయ ఉద్యమాల్ని తన కథల ద్వారా అక్షర రూపమిచ్చిండు.
హైదరాబాద్‌ తెహజీబ్‌, హిందూ`ముస్లిం పండుగలు, సంస్కృతి, మతాలకతీతమైన రొమాన్స్‌, హిందూ`ముస్లిం ప్రజల సంబంధాల్ని, జీవన విధానాన్ని నందగిరి చిత్రికగట్టినంత సున్నితంగా ఇంకెవ్వరూ రాయలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతిఫలం, నూర్జహాన్‌, తప్పేమి, జరిగిన కథ మొదలైన కథల్లో హైదరాబాదీ ముస్లిం జీవితం, సంస్కృతి వ్యక్తమయ్యింది. నందగిరి అటు ఆంద్రమహాసభ ఉద్యమంలోనూ, గ్రంథాలయోద్యమంలోనూ, పత్రికోద్యమంలోనూ చురుగ్దా పాల్గొన్న వాడు కావడంతో ఆయన రచనలు అందరికన్నా ఒక అడుగు ముందున్నాయి. చలంతో పోటీపడి తెలంగాణ నుంచి కథలు రాసి యావత్తెలుగు ప్రజల్ని మెప్పించిన కథకుడు నందగిరి వెంకటరావు.
తెలంగాణ సాయుధపోరాటారంభానికి 15 యేండ్ల ముందే దొరల దౌర్జన్యాన్ని నిరసిస్తూ ‘పటేలుగారి ప్రతాపం’ పేరిట కథ రాసిండు. గ్రామ పటేలు తన మాట వినని రామయ్య అనే రైతును కొట్టడమే గాకుండా వితంతువైన ఆయన సోదరిని అల్లరి చేయడం. దీనికి పటేలు తల్లి కూడా మద్దతుగా ఉండి నీ తండ్రి కాలంలో  ఎదురు తిరిగి మాట్లాడిన వాడు లేడు అని కొడుకుని రెచ్చగొట్టడం, అడ్డు వచ్చిన వారిని బెదిరించడం జరిగింది. దాదాపు ఇలాంటి ఘటనే సాయుధ పోరాట కాలంలో జరిగింది. ఈ కాలంలో విసునూరి దొరలు ఇలాగే దౌష్ట్యానికి దిగారు. విసునూరి ‘బాబుదొర’ను ప్రజలు చంపేసినట్లుగానే ఈ కథలో కూడా ప్రజలు దొరను చంపేస్తారు. అయితే వాస్తవానికి జరిగిన సంఘటనకన్నా 15 యేండ్లకు ముందే నందగిరి వెంకటరావు పటేలుగారి ప్రతాపంలో ఇవే సంఘటలను చిత్రీకరిస్తూ ప్రజలు తిరుగుబాటు చేయాలని పరోక్షంగా చెప్పిండు. చిత్రచోరులు కథలో ఒక అంశాన్ని భిన్న కోణాల్లో చూసే తెలంగాణ`ఆంధ్రవారిని గురించి రాసిండు.
తెనుగు పత్రికలో డిటెక్టివ్‌ కథలు కూడా అచ్చయ్యాయి. హైదరాబాద్‌ అమ్మాయి సినిమాల పట్ల వ్యామోహంతో ఆనాడే బొంబాయికి వెళ్ళి ఆ మాయలో చిక్కుకు పోయిన విషాదాన్ని నందగిరి వెంకటరావు తన కథల్లో చెప్పిండు. ఇదే కాలంలో ఒద్దిరాజు సోదరులు వివిధ పత్రికల్లో తమ రచనలు వెలువరించారు. వీరి కథలు ఎక్కువగా వారు వెలువరించిన తెనుగు పత్రికతో పాటు ‘సుజాత’ పత్రికలో అచ్చయ్యాయి. ఒద్దిరాజు సీతారామచంద్రరావు తెలుగులో తొలిసారిగా వైజ్ఞానిక కథలు రాసిన వాడిగా ప్రసిద్ధుడు. దీనికి నిదర్శనం ‘అదృశ్యవ్యక్తి’ కథానిక. ‘నటి’ కథలో జమీందారి కుటుంబానికి చెందిన నళినీకాంతుడు నటి తారాదేవితో సాన్నిహిత్యంగా ఉంటాడు. నళినీకాంతుడి సోదరులు తారాదేవిని వదిలిపెట్టాలని వత్తిడి తీసుకొస్తారు. కొంతమంది యూరోపియన్‌ మిత్రులు పెళ్ళి చేసుకొమ్మని సలహా ఇస్తారు. దాంతో పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమవుతాడు, అయితే తార పశ్చాత్తాపంతో నళినీకాంతుడికి ఉత్తరం రాస్తుంది. ప్రేమానుభవం కంటే ప్రేమ స్మృతి గొప్పదని అదే అధిక మాధుర్యం కలదిగా తోస్తుందని, వివాహమాడి భార్యతో సుఖంగా ఉండమని రాస్తుంది. హితబోద చేసినట్టుగా కథ ముగుస్తుంది. ఈయన కథలపై బెంగాళీ రచనల ప్రభావముంది. ఇక సీతారామచంద్రరావు సోదరుడు రాఘవరంగారావు తెలంగాణలో దేశ్‌ముఖ్‌ల, జమీందారుల జీవితాల్ని కథల్లోకి తెచ్చిండు. ‘లండన్‌ విద్యార్థి’ కథలో దేశ్‌ముఖ్‌ల సోమరితనం, విలాసాలు, మరో వైపు ఇంగ్లండ్‌లో విద్యాభ్యాసంపై మోజుని చెప్పిండు.
భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాడు. అంబేద్కర్‌ కన్నా ముందు మొత్తం జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నాయకుడు. ఈయన హైదరాబాద్‌ నుంచి ‘భాగ్యనగర్‌’ అనే పత్రిక తీసుకొచ్చాడు. ఇందులో వెట్టిమాదిగ పేరిట ఆనాటి సమాజంలో ఉన్నటువంటి దళితుల దుర్భర జీవితాన్ని తెలియజెప్పిండు. రామిరెడ్డి దురహంకారానికి బలయిన వంతు మాదిగ మల్లయ్య గురించి ఇందులో వివరించిండు. దీనికి కొనసాగింపుగా సురవరం ప్రతాపరెడ్డి అనేక కథలు రాసిండు. ప్రతాపరెడ్డి కథలు ముఖ్యంగా ‘సంఘాల పంతులు’ కథలో పంతులు ఊరి మాదిగలను, కోమట్లను కూడగట్టి వెట్టిచాకిరి, సప్లయిలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాడు. సంఘం అంటే కమ్యూనిస్టు సంఘమనే భావనలోనే ఆ పదాన్ని సురవరం వాడారు. తెలంగాణ వాతావరణ నేపథ్యంతో పాటు, పదాలు, తెలంగాణ ఆత్మని పట్టిస్తాయి. ఈయన మొగలాయి కథలు కూడా ఆయన విశిష్టతను చాటి చెబుతాయి. కరీంనగర్‌ జిల్లా మంథనికి చెందిన వెంకట రాజన్న అవధాని ‘తిరుగుబాటు’ కథలో స్త్రీ విద్య, సంస్కరణ గురించి రాసిండు. ఖమ్మంకు చెందిన దాశరథి కవిత్వంతో పాటు కథలు కూడా రాసిండు.
వీరితో పాటు మాడపాటి రామచంద్రుడు, జి.రాములు, జమలాపురం వెంకటేశ్వర్లు, శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యులు, జమలాపురం వెంకటేశ్వర్లు, తదితరులు ఖమ్మం, కరీంనగర్‌, నల్లగొండ ప్రాంతాల్లోని జీవితాలను రికార్డు చేసిండ్రు. నల్లగొండకు చెందిన బోయనేపల్లి రంగారావు, గం. గోపాలరెడ్డి తదితరులు కూడా ఆనాడు తెలంగాణ తనాన్ని కథల్లో చిత్రించారు. వీరిలో కథకుడు జి.రాములు మాజీ జడ్జి జీవన్‌ రెడ్డి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, ఎన్నో వర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేసిన జి. రాంరెడ్డిలకు విద్యా గురువు. ఈయన పెరటి చెట్టు, బ్రహ్మపుత్ర భక్త సమాజం, ఆత్మఘోష, పిచ్చి శాయన్న, కొత్తదాసి కనకం తదితర కథలు బహుజన దృక్కోణం నుంచి తెలంగాణను ఆవిష్కరించాయి. పెరటిచెట్టు కథలో గౌడ కులస్థుల జీవన వ్యథల్ని చెప్పిండు. ఇందులో దున్నేవాడిదే భూమి అన్నట్టు గీసేవాడిదే చెట్టు అని సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
1943లో ఆంధ్రప్రాంతంలో ఆరంభమయిన అభ్యుదయ రచయితల సంఘం సమావేశాలకు తెలంగాణ నుంచి ఏకైక ప్రతినిధిగా వట్టికోట ఆళ్వారుస్వామి హజరయ్యిండు. ఆ తర్వాత ఆంధ్రలో జరిగిన ప్రతిసమావేశానికీ విధిగా ఆళ్వారుస్వామి హాజరయ్యిండు. 1944 నాటి భువనగిరి ఆంధ్రమహాసభల్లో కమ్యూనిస్టులు`కాగ్రెస్‌ వారికి సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు జేసిండు. కాంగ్రెస్‌లో కమ్యూనిస్టుగా, కమ్యూనిస్టుల్లో కాంగ్రెస్‌ ఆలోచనాపరుడిగా సంఘసంస్కరణకు పాటుపడే విమర్శకుడిగా, కార్యశీలిగా ఆళ్వారుస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రంథాలయోద్యమం, పత్రికోద్యమం, సత్యాగ్రహాల్లో విశిష్ట భూమిక పోషించిండు. పౌరహక్కుల కోసం పోరాడిరడు. జైల్లో దాశరథితోపాటు ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిండు.

తెలుగుతల్లి పత్రిక ప్రచురణ ద్వారా హైదరాబాద్‌లో అడివిబాపిరాజు, రాంభట్ల కృష్ణమూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు తదితరులతో కలిసి నగరంలో అభ్యుదయ రచయితల సంఘానికి ప్రాణం పోయడమే గాకుండా, ఆంధ్రప్రాంతంలో కూడా అరసంకు ఆసరాగా నిలిచిండు. ఈ సమయంలోనే వరంగల్‌లో జరిగిన మజ్లిస్‌ సభల్లో బహదూర్‌ యార్జంగ్‌ తన ఆవేశ పూరిత ప్రసంగంలో ‘‘హైదరాబాద్‌ రాజ్యం ఆలాహజ్రత్‌ సొంత జాగీరు కాదు. ఈ రాజ్యం ఏ ఒకరిదో అనుకుంటే అందుకు బలికావాడానికి నేను సిద్ధంగాలేను. ఇది ముస్లిం ప్రజలందరి ఆస్తి’’ అని చెప్పిండు. ఆ తరువాతి సంవత్సరం నిజాం ఇచ్చిన విందులో హుక్కా పీల్చి అనుమానాస్పద స్థితిలో చనిపోయిండు. అనంతరం మజ్లిస్‌ పగ్గాలు కాసీంరజ్వీ చేతుల్లోకి వెళ్ళాయి. ఆయనే రజాకార్ల ఉద్యమాన్ని లేవదీసిండు. మత పరమైన ఉద్రిక్తతలు ఒకవైపూ, అరసం కార్యకలాపాలు మరోవైపూ హైదరాబాద్‌లో కార్యక్రమాలు నిర్వహించాయి.
1946లో సాయుధ రూపం తీసుకున్న ‘రైతాంగ పోరాటం’, 1948లో ‘పోలీస్‌ యాక్షన్‌’, 1951లో పోరాట విరమణ, 1952లో మిలిటరీ పాలన, ఎన్నికలు, మిత్రుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పాలన, ముల్కీ ఉద్యమం, 1953లో ఆలంపూరులో అఖిలాంధ్ర సారస్వత సభ, 1955లో ఆంధ్రలో ఎన్నికలు, 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు 46 ఏండ్ల ఆళ్వారుస్వామి జీవితంపై ప్రభావం చూపిన అంశాలు. ఇవి ఎన్నో గుణపాఠాలు నేర్పాయి. అలాగే రెండు విడతలుగా జైలుశిక్ష, కమ్యూనిస్టుల ఏకపక్ష ధోరణి, బాధ్యతారాహిత్యం అన్నీ కలగలిసి ఆళ్వారుస్వామిని చివరి పదేళ్ళు పుస్తక ప్రచురణ, రచనా రంగానికే పరిమితం చేశాయి. ఈ కాలంలోనే ఆళ్వారుస్వామి తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రవేసే, ఉన్నత విలువల్ని ప్రతిష్టించే రచనలు చేసిండు.
‘తెలంగాణ మంటల్లో’ అనే కథా సంకలనాన్ని 1948లోనే వెలువరించిన అడ్లూరి అయోధ్యరామకవి స్వతహాగా కవి, గాయకుడు, జర్నలిస్టు. ‘నైజాం ప్రజావిజయం’ అనే బుర్రకథ, ఘంటారావంతో పాటు అనేక ఖండికలను రాసిన ఈయన బాంబుల భయం, కాలాన్ని తేవాలి, తల్లి ప్రేమ, చీకటి రాజ్యం, జనానా రజాకార్‌, అమరలోక యాత్రికులు అనే కథలు రాసిండు. ఇందులో ‘బాంబుల భయం’ కథలో సాయుధ పోరాట సమయంలో గ్రామ రక్షణ దళాలు సిరిపురం పై రజాకార్ల దాడిని అడ్డుకున్న అంశాన్ని చిత్రించాడు. సాయుధ పోరాట కాలంలో కాంగ్రెసు కార్యకర్తగా, దాశరథి కృష్ణమాచార్యతో కలిసి ప్రచారకుడిగా పనిచేసిన అడ్లూరి కథలన్నీ ఆనాటి పోరాటాన్ని చిత్రీకరించాయి.

కమ్యూనిస్టులు, ప్రజలు, కాంగ్రెస్‌, రజాకార్లు, దొరలు, గడీలు, సాయుధ పోరాటం, జైలు అన్నీ ఈయన కథాంశాలయ్యాయి. ఈయనతో పాటు కాళోజి నారాయణరావు కూడా సాయుధ పోరాట సమయంలో కథలు రాసిండు. కాళోజి రాసిన లంకాదహనం ఉద్యమానంతర పరిస్థితుల్ని రికార్డు చేశాయి. ఆశించిన ఫలితాలు అందకుండా పోయిన స్థితిని ఇందులో కాళోజి రికార్డు చేసిండు.
సాయుధ పోరాటం కన్నా ముందు నుంచే గోలకొండ పత్రికలో కథలు రాసిన వారిలో అగ్రగణ్యుడు భాస్కరభట్ల కృష్ణారావు. 1939 నుంచీ కథలు రాస్తూ వచ్చిన భాస్కరభట్ల మూడు కథా సంపుటాలు ప్రచురించాడు. మొదటి సంపుటం 1955లో ‘కృష్ణారావు కథలు’ పేరిట, తర్వాత ‘చంద్రలోకానికి ప్రయాణం’, ‘వెన్నెల రాత్రి’ పేరిట మిగతా రెండు సంపుటాలు ప్రచురితమయ్యాయి. ఈయన మొత్తం తెలంగాణ కథకుల్లో ముందు వరుసలో నిలబడాల్సిన వాడు. జన్మత: తెలంగాణ వాడు కావడంతో ఆయన కథల్లో తెలంగాణ మట్టి వాసన కనబడుతుంది. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, బాధలు, సంతోషాలు అందులో కనిపిస్తాయి.

భాస్కరభట్లకు బాగా పేరు తీసుకు వచ్చిన కథ ‘ఇజ్జత్‌’. ఇందులో కౌలుకు తీసుకున్న భూమిలో పంటలు సరిగా పండక పోవడంతో మల్లయ్య అనే రైతుల కౌలు చెల్లించ లేక పోతాడు. ఇందుకు అతనికి ‘శిక్ష’ వేస్తారు. ఆ అవమానాన్ని భరించలేక ఉరిబెట్టుకున్న రైతు కథను ఇందులో చిత్రీకరించాడు. భూసంస్కరణల అమలు చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో  పేద రైతు దీనస్థితిని ఈ కథలో భాస్కరభట్ల కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఈ కథ 1944లో మీజాన్‌ పత్రికలో అచ్చయ్యింది. మల్లయ్య అనే రౌతు రంగారావు పొలం కౌలుకి తీసుకొని క్రమం తప్పకుండా కౌలు గింజలు చెల్లిస్తూ ఉండేవాడు. అయితే కాలం సరిగా కాకపోవడంతో, కుంటకు గండిపడడం లాంటి ఇబ్బందులకు తోడుగా ఈ మధ్యనే కూతురు పెళ్ళి చేశాడు. దీంతో ఖర్చులో పడ్డాడు. అందువల్ల కౌలు గింజలు ఇవ్వలేక పోయాడు. గండి పూడ్చగల తాహతు మల్లయ్యకు లేదు. పైగా భూసంస్కరణల చట్టం ఒకటి వచ్చి పడుతోంది. ఈ పరిస్థితిలో తన కౌలుగింజల బకాయి రాబట్టుకోవడానికి రంగారావు గట్టి ప్రయత్నం చేస్తాడు. మల్లయ్య ఎంత ప్రాధేయపడినా ఫలితం లేక పోయింది. అతనికి శిక్ష వేస్తారు. వంగబెట్టి వీపుమీద బండ పెట్టించారు.

కొంత సేపటికి మల్లయ్య స్పృహ తప్పి పడిపోయాడు. సేదదీర్చి ఎవరో పుణ్యం గట్టుకున్నారు. అతని భార్య గొల్లున ఏడుస్తూ వస్తుంది. ఆమెతో ‘ఇజ్జత్‌’ పోయిందే పిల్లా అని చెబుతూ పరువు పోవడంతో బతకడం కష్టమని తలంచి ఇంట్లో దూలానికి ఉరివేసుకొని చనిపోతాడు. ఇందులో రైతుల కష్టపడే గుణాన్ని, కౌలుదారీ విధానం గురించి కథకుడు చెబుతాడు. ఆఖరికి ఆత్మాభిమానం మెండుగా గల రౌతు ఆత్మహత్య చేసుకోవడంతో కథ ముగుస్తుంది. ఇది 1944నాటి తెలంగాణ రైతుల స్థితిగతుల్ని లెక్కగడుతుంది.    మీజాన్‌ పత్రికలోనే 1945లో వెలువడ్డ మరో కథ ‘మార్పు’. ఇందులో దేవుడి మొక్కును వాయిదా వేసుకునేందుకు సాకులు వెతికే భర్త గురించి చెప్పాడు. చివరికి ఖైరతాబాద్‌లోని ఆంజనేయ గుడికి వచ్చి మొక్కు చెల్లించుకునేలా భర్తని మార్చిన భార్య గురించి చెప్పాడు. ఖైరతాబాద్‌లో ఆంజనేయ స్వామి గుడి ఇప్పటికీ ప్రతి శనివారం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది.

అలాగే మరో కథ ‘సానుభూతి’, ‘హృదయ పరివర్తనం’ కథల్లో మధ్యతరగతి ప్రజల్లోని అవకతవకలను ఎత్తి చూపిస్తూ వాటి నుంచి విముక్తులు కావాలని హెచ్చరిస్తాడు. ‘అవమానం’అనే కథలో స్వార్థపరుల నీచత్వాన్ని నగ్నంగా చూపించి, ఆత్మవంచన చేసుకునే వారికి గుణపాఠం చెప్పాడు.
హైదరాబాద్‌ నగర జీవన విధానం, రాజకీయ పరిస్థితులు, సామాజిక, సాంస్కృతికరంగాలు, హిందూ`ముస్లిం దోస్తానా దానితో పాటే మజ్లిస్‌ మతవిద్వేషం, జమీందార్లలో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయని భాస్కరభట్ల చెప్పిండు. ఆధునిక స్త్రీ స్వయం నిర్ణయాధికారం కోసం తండ్రిని సైతం ఎదిరించడం, విద్యా ప్రాధాన్యత ఈ నవలల్లో, కథల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయి. ‘యుగసంధి’ నవల్లో రుక్మిణి, రమణ, పద్మల పాత్రల ద్వారా ఆనాటి స్రీల ఆలోచనాసరళిని వారి తెగింపుని, కట్టుబాట్లకు లొంగని తిరుగుబాటు దోరణిని చదువుకున్న, ఆధునిక భావాలు గల స్త్రీల మనోభావాల్ని రికార్డు చేసి నవలకు సమగ్రత కల్పించిండు. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం కూడా ఇందులో అంతర్లీనంగా చోటు చేసుకున్నాయి. భాస్కరభట్ల  మీద ఉన్న ప్రేమతో నెల్లూరి కేశవస్వామి తన ‘పసిడి బొమ్మ’ కథా సంపుటిని అంకితమిచ్చాడు.
నెల్లూరి కేశవస్వామి కూడా పక్కా హైదరాబాదీ. ఈయన కథల్లో హిందూ`ముస్లింల మైత్రి, ప్రేమ, ఆచార వ్యవహారాలు, అంతర్లీనంగా నవాబుల పోకడలు అన్నీ ప్రతిఫలిస్తాయి. ‘పోలీసుచర్య’కు పూర్వం హైదరబాద్‌ నగరంలో ఉన్న జీవన స్థితిగతుల్ని ముఖ్యంగా ముస్లింల జీవితాలని నెల్లూరి కేశవస్వామి హృద్యంగా చిత్రీకరించాడు. ‘యుగాంతం’ అనే పెద్ద కథలో పోలీసుచర్య నాటి జీవన విధ్వంసాన్ని చిత్రించాడు. ‘చార్మినార్‌’, ‘పసిడి బొమ్మ’ పేరిట కథా సంపుటాలను వెలువరించాడు. సంపుటాల్లో చేరని కథలు ఇంకా చాలా ఉన్నాయి.
వీరితో బాటుగా వరంగల్‌కు చెందిన పెండ్యాల చినరాఘవరావు, ఖమ్మంకు చెందిన బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి, హీరాలాల్‌ మోరియా, ఊటుకూరి రంగారావు, కవిరాజమూర్తి, దాశరథి తదితరులు తెలంగాణ జీవితాల్ని తమ కథల్లో నిక్షిప్తం జేసిండ్రు. వీరందరూ ఉర్దూలో కూడా నిష్ణాతులే కావడం విశేషం. బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి స్వయంగా కథలు రాయడమే గాకుండా ఉర్దూ కథల్ని తెలుగులోకి అనువదించారు. హీరాలాల్‌ మోరియా ఎక్కువగా ఉర్దూలో కథలు రాసిండు. వీటిని ఊటుకూరి రంగారావు తెలుగులోకి అనువదించేవారు. ఈయన స్వయంగా కథకుడు కూడా. ఇక కవిరాజమూర్తి అయితే ఏకంగా ఉర్దూలో నవలలే రాసిండు. ఇవి కూడా ఉర్దూ నుంచి తెలుగులోకి తర్జుమా  చేయబడ్డాయి.
హైదరాబాద్‌లో మొదటి నుంచీ పంచభాషా సంస్కృతి ఉండేది. హైదరబాదీయులందరికీ గతంలో ఐదు భాషలు అవలీలగా వచ్చేవి. తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడం, ఇంగ్లీషు భాషలు హైదరాబాద్‌లో నివాసముండే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాట్లాడగలిగేవారు. నిజాం ప్రభుత్వం విధిగా తమ కార్యకలాపాలన్నింటినీ ఈ ఐదు భాషల్లో నిర్వహించేది. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నందగిరి వెంకటరావు, నెల్లూరి కేశవస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు, కాళోజి నారాయణరావు, పొట్లపల్లి రామారావు, బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి, కవిరాజమూర్తి, ఊటుకూరి రంగారావు, హీరాలాల్‌ మోరియా, బూర్గుల రంగనాథరావు, వట్టికోట ఆళ్వారుస్వామి,  కాంచనపల్లి చినవెంకటరామారావు ఇంకా అనేకమంది తెలుగుతో పాటుగా ఉర్దూలో కూడా రచనలు చేయదగ్గ సమర్ధులు. నందగిరి వెంకటరావు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కథలు రాసిండు. కవిరాజమూర్తి, పొట్లపల్లి రామారావులు తెలుగుకన్నా ఎక్కువగా ఉర్దూలో తమ రచనలు వెలువరించిండ్రు.

అయితే ఈ బహుభాషా సంస్కృతి హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం అంతరించి పోయింది. పోలీసుచర్య తర్వాత ఏర్పడ్డ పరాయి పాలన, వలసాంధ్రాధిపత్యం, హిందీ ప్రాభవం అన్నీ కలగలిసి పంచభాషా సంస్క ృతిని మట్టుబెట్టాయి. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు హైదరాబాద్‌ రాజ్యంలో అంతో ఇంతో ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీలకు ఆదరణ లభించినప్పటికీ తర్వాత కనుమరుగయ్యాయి.
1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డ తర్వాత తెలుగుని మాత్రమే ముందుకు తీసుకువచ్చి ఆ భాషలోనూ తెలంగాణేతరులు రాసిన రచనలే గొప్పగా ప్రచారం కావడంతో వాటికి మాత్రమే గౌరవం దక్కింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడం వల్ల తెలంగాణకు జరిగిన పెద్ద నష్టమిది. బహుభాషా సంస్కృతి, కాస్మోపాలిటన్‌ కల్చర్‌కి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గొడ్డలి పెట్టయ్యింది. 1956 కు ముందు ఇంకా చెప్పాలంటే 1948 సెప్టెంబర్‌కు ముందు హైదరాబాద్‌ రాజ్యం నుంచి తెలుగులో వెలువడ్డ కథ, నవల, కవిత్వానికి తర్వాతి కాలంలో సరైన ఆదరణ లభించలేదు. ఇప్పటికైనా ఆనాటి అమూల్యమైన రత్నాలను వెతికి వెలుగులోకి తీసుకొచ్చి మన సాహిత్య చరిత్రను పునర్నిర్మించుకోవాలి. తెగిన తల్లివేరు భాషను బతికించుకోవాలి. ఇవన్నీ ఆనాటి రచనలను ఒక్కొక్కటిగా సంకలనాలుగా వెలువరించడం ద్వారా సాధించవచ్చు.
ఆనాటి రచనలను పునర్ముద్రించుకోవడం ద్వారా కనుమరుగై, గౌరవానికి నోచుకోకుండా పోయినా తెలంగాణ అస్తిత్వానికి చిత్రిక గట్టవచ్చు. మనమూ చరిత్రకెక్కదగిన వారమే, ఎవరికీ ఎందులోనూ తీసిపోము, మీదు మిక్కిలి ఆగమైన మన ఘనమైన చరిత్రను చెక్కిలిపై రాపాడిరచుకోవడానికి, నెత్తిన పెట్టుకొని ఊరేగించడానికి  ఈ అస్తిత్వ కథలు సమగ్ర సంకలనాలుగా వెలువడాల్సిన అవసరముంది.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

కాళీయ మర్దనం అలా కాదు!

10327144_4265257486769_1693149695_n

– మృత్యుంజయ్

11937_578811308820340_1396284388_n

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా- 19

 

Ekkadi(1)
జీవితకాలమంతా పనిచేసి.. డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ప్రొఫెసర్లుగా, ఉపాధ్యాయులుగా, లాయర్లుగా.. రిటైరై.,
ఉద్యోగ విరమణ అనేది అకస్మాత్తుగా ఎదురై ముందునిలబడే ఒక వీధిమలుపు. నిన్నటిదాకా ఫలానా పనికి పనికొచ్చిన మనిషి ఒక ఈనాటినుండి పనికిరాడు అని నిర్దారించబడే వేళ. కాని చాలామందిలో ఇంకా జవసత్వాలుంటాయి. బతుకునంతా వడబోసి వడబోసి కూర్చుకున్న అనుభవసారం ఉంటుంది. జీవితాన్ని పూర్తి మానవతా దృష్టితో వీక్షించగలిగే పరిణతి ఉంటుంది. జీవిత సంధ్యాసమయానికి చేరువౌతున్నకొద్దీ సంయమనంతో కూడిన, మనిషిపట్ల సానుభూతితో స్పందించగలిగిన సంస్కారం అలవడ్తుంది. ఐతే ఈ అపూర్వమైన ఒక సంపదను సమాజం ఉపయోగించుకోవడంలేదు. అన్నింటినీమించి ఉద్యోగవిరమణ చేసినవాళ్లకు పెద్దగా ఆర్థికావసరాలుండవు. అయ్యో జీవితంలో అనుకున్న కొన్ని పనులు చేయలేకపోయామే..యిప్పుడవి చేస్తే బాగుండునన్న జ్వలన ఒకటుంటుంది. దాన్ని సామాజిక ఉన్నతికోసం ఉపయోగించుకోవాలనుకున్నారు రామం, క్యాథీ, గోపీనాథ్‌.. మూర్తి అందుకే రాష్ట్రంలోని ప్రధానమైన ఎనిమిది హైద్రాబాద్‌, వరంగల్లు కరీంనగర్‌, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో సామాజిక సేవా భావం కలిగి, ఐచ్ఛికంగా వాళ్ళంతట వాళ్ళు తమతమ నైపుణ్యాలను అందివ్వగలిగితే అటువంటివారి సేవలను ఉపయోగంచుకునేందుకు వాళ్ల వివరాలను సేకరించమని ‘జనసేన’ సేవా విభాగానికి అదేశాలొచ్చాయి. పదిహేను రోజుల క్రితం ‘జనసేన’ యువ కార్యకర్తలు రామదండులా కదిలి విస్తృతమైన సంపర్కం చేశారు. సీనియర్‌ సిటిజన్స్‌ వివరాలను సేకరించి వాళ్ళను కలిసి మాట్లాడారు. వాళ్ల సహకారాన్ని, ఆశీస్సులను, సేవలను అర్థించారు. వయోజనులు చిరునవ్వులు చిందించే ముఖాలతో స్నేహహస్తాన్నందించారు. ఒక్కో కేంద్రంలో వందలమంది వివిధ వృత్తి నిపుణుల సమాచారం, అంగీకారం ప్రోగైంది. వెంటనే ‘జనసేన’ కేంద్రంనుండి ప్రతి నగరంలోనూ విశాలమైన అన్ని వసతులున్న భవనాలను అద్దెపద్ధతిపై మొదట సమకూర్చమని ఆదేశాలొచ్చాయి. అదేరకంగా.. ఆ రోజు..ఎనిమది మహానగరాల్లో ఎనిమది ‘జనసేన’ ప్రజాసేవా కేందాలు అన్నిరకాల అత్యంతాధునిక పరికరాలు, ఫర్నీచర్‌, ఉపకరణాలు, ఇతరేతర సమస్త సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డాయి.
ఒక్కో ప్రజాసేవా కేంద్రంలో సీనియర్‌ డాక్టర్లతో ఉచిత వైద్య విభాగం, ఇంజినీరింగు నిపుణులతో ఏ నిర్మాణ కార్యకలాపాల్లోనైనా పనికొచ్చే సలహాసహకార విభాగం, రిటైర్డ్‌ లాయర్లతో న్యాయ సహాయ విభాగం, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లతో విద్యా విషయ సహకార విభాగం.. యువజనుల కోసం వ్యాయామ, క్రీడా, సేవా విభాగం ఇలా అనేకరంగాలతో ఒక విస్తృతమైన సామాజిక వేదిక.. కౌన్సిలింగు కేంద్రం.. ఒక్కోచోట వీటితో ఓ ప్రజాక్షేత్రం.
ఆ పరంపరలో.. వరంగల్లులోని కొత్తవాడలో .. ఒక పెద్ద ప్రైవేట్‌ భవనంలో.,
‘జనసేన’ సామాజిక సేవా కేంద్రం ప్రారంభం.
ఉదయం పదిగంటల ముప్పయి నిముషాలు.. భవనం బయట వేలమంది జనం. ప్రజల్లో ఉప్పెనై పెల్లుబుకుతున్న చైతన్యం. ఎక్కడో ఓ కిరణంలా ఆశ. ఈ చీకట్లోనుండి, బురదలోనుండి.. అందరి ఆత్మాభిమానాన్ని శూలంతో పొడిచి గాయపర్చి.. రక్తం చిందించి, ఛిన్నాభిన్నం చేసి.. వీడు మా ప్రజాప్రతినిధి..అని చెబుతే తలెత్తుకునేలా కాకుండా.. సిగ్గుపడేలా, తలదించుకుని లోపల ఎక్కడో దాచుకునేలా.. సరిగా చదువురాని వాడు, సంస్కారం లేనివాడు, తెలివి అస్సలే లేనివాడు..పశువకు మాటొస్తే వలె మాట్లాడువాడు.. పరమఛండాలుడు.. ఈ గుండెలను పిండే దుస్థితినుండి తప్పించి – ఏదో ఒక వెలుగు ద్వారాన్ని తెరుస్తున్న ‘జనసేన’.
‘భగవంతుడా.. ఈ జనసేనను కాపాడు తండ్రి” అని మొక్కుకుంటోంది ఓ ఎనభై ఐదేళ్ళ వృద్ధ మహిళ.. బయట పోచమ్మగుడి దగ్గర.
”ప్రియమైన మిత్రులారా.. మనం చేస్తున్న జైత్రయాత్రలో భాగంగా.. ఈ సామాజిక సేవా కేంద్రాల స్థాపన ఒక ప్రధాన ఘట్టం. ఎంతో అనుభవమున్న ఎందరో ప్రముఖ డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, విద్యావేత్తలు.. ఎందరో మీపై ప్రేమతో, వాత్సల్యంతో ఉచితంగా నిరంతరం సేవ చేయడానికి సంసిద్ధులై మీ ముందు యిక్కడ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. దయచేసి జనసేన సేవలను వినియోగించుకోండి. తెల్లకార్డులు, పచ్చకార్డులు.. పైరవీలు.. నూటా నాల్గు అన్ని మాయలు.. ఎండమావులు. మనం మననే నమ్ముకుందాం. ముందుక సాగుదాం.. జనసేన.. రేపు ఒక ‘ప్రభంజనం’ కార్యక్రమాన్ని చేపడ్తోంది. ‘సమాచార చట్టం ఆర్‌టిఐ ప్రకారం సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు జిల్లా కేంద్రాల్లో ఫస్ట్‌ మెజిస్ట్రేట్‌ కలెక్టర్లకు, ఎసిబి అధికారులకు, హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌కు మొత్తం నాల్గువేల ఆరువందల ముప్పయి రెండు కేసులను, అభియోగాలతో కూడిన కంప్లెయింట్స్‌ను, సమగ్ర విచారణను కోరుతూ అధికారికంగా విన్నపాలను సమర్పించబోతున్నాం. యిది ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద ప్రజాప్రతిఘటన. ఈ విన్నపాల ఆధారంగా ఎసిబి వాళ్ళు దాడులు చేయాలి. కోర్టులు విచారణను ప్రారంభించాలి. కలెక్టర్లు విచారణకు ఆదేశించాలి. లేకుంటే వాళ్ళ భరతంకూడా బజారుకెక్కుతుంది. నిజమైన అహింసాయుతమైన ప్రజాచైతన్య విజృంభణ రేపు మొదలుకాబోతుంది. సోదరులారా కదలిరండి..ఒక్కో లింక్‌ కలిస్తే చెయిన్‌ ఔతుంది.. చెయిన్‌ తయారై లాగితే జగన్నాధరథం కదుల్తుంది. హరోం హర హర.. హరోం హర హర..” శివ చెబ్తున్నాడు వేదికపై జ్వలిస్తున్న అగ్నిలా.
ప్రక్కన వేదికపై.. రామం.. క్యాథీ.. డాక్టర్‌ గోపీనాథ్‌.. మూర్తి.,

25
”ఇప్పుడు .. ఈ జనసేన సామాజిక కేంద్రాన్ని ప్రారంభించడానికి.. కొత్తవాడ నివాసి, బీడీ కార్మికురాలు.. ఆకుతోట లచ్చమ్మను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆమె ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తూండగా ప్రముఖ రిటైర్డ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అమర్‌సింగు ఆమెకు సహకరిస్తాడు. అమర్‌సింగు గారి నేతృత్వంలో ఈ కొత్తవాడ కేంద్రం ప్రజలకు ప్రక్కలో ఆపద్భంధువులా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. సెలవు..” శివ కూర్చున్నాడు.
వేదికపైకి.. బీడీ కార్మికురాలు వస్తూండగా జనసేన కార్యకర్తలు.. డాక్టర్‌ అమర్‌సింగు ఎదురేగి.. వెంట తోడ్కొని వచ్చి స్విచ్‌ ఆన్‌ చేయించి..
ఎదురుగా.. ఎల్‌సిడీ తెరపై.. ఒక దివిటీని ఎత్తిన స్త్రీ బొమ్మ ప్రత్యక్షమైంది.
వేలమంది హర్షాతిరేకాలతో చప్పట్లు. ఒక ఆనందోద్విగ్న సందోహ సముద్రం.. జన జాతర.
వేదికముందు పదులసంఖ్యలో మీడియా ప్రతినిధులు. టి.వి. కెమెరాలు.. పదుల సంఖ్యలో పాత్రికేయులు.
పులకించిపోతూ ఒక సీనియర్‌ పాత్రికేయుడు నరేందర్‌ తన ప్రక్కనున్న శ్రీనివాస్‌తో అంటున్నాడు.. ”చీమ తన శరీరంకన్నా ఎనిమిదిరెట్ల బరువుగల పదార్థాన్ని మోసుకుంటూ నిర్విరామంగా, అవిశ్రాంతంగా కదుల్తూ, ఒక రోజు దాదాపు పన్నెండు మైళ్ళు వెళ్తుందట.. ఈ రామం అనేవాడు ఒక చిన్న చీమలా ‘జనసేన’ కార్యక్రమాన్ని ప్రారంబించి మెలమెల్లగా చూశావా ఎలా ఓ ప్రభంజనమై, ఓ తుఫానై విజృంభిస్తున్నాడో. చావుకు భయపడనివాణ్ణి ఎవడూ చంపలేనట్టే..ఏ స్వార్థమూ లేక సర్వసంగపరిత్యాగియై ప్రజలకోసం ముందుకు సాగుతున్నవాణ్ణి ఎవరైనా ఏంజేయగలరు. వాడికి పదవీవద్దు. అధికారం వద్దు… గాంధీవలె.. గాంధీ ఎప్పుడూ ఏ పదవుల్నీ కావాలనలేదు కదా. వీడు అజేయుడు శ్రీనివాస్‌.. ఇంతపెద్ద ప్రజాస్పందనను ఎన్నడూ చూల్లేదు. అస్థిత్వ ఉద్యమాలు, తాత్కాలిక గర్జనలు, శంఖనాదాలు.. సమరశంఖాలు.. ప్రజలను కొనుక్కుని ఏవో ఒక్కరోజు నిర్వహిస్తే చూశాంగాని, ప్రజలు స్వచ్ఛందంగా ఇలా స్పందించడం అద్భుతమనిపిస్తోంది..” అంటున్నాడు.
సరిగ్గా అప్పటికి అదే అభిప్రాయంతో ఉన్న శ్రీనివాస్‌.. ”ఎందుకో ఇక ఈ సమాజం బాగుపడ్తుందని ఆశ కల్గుతోంది నరేందర్‌” అన్నాడు ఒకరకమైన ట్రాన్స్‌లోనుండి.
ఈలోగా ఆకుతోట లచ్చమ్మ సభను నిర్వహిస్తున్న శివ కోరికపై నాల్గుమాటలు మాట్లాడ్డానికి మైక్‌ ముందుకొచ్చింది.
”అందరికీ దండం.. నా వయస్సు డెబ్బయ్యేండ్లు. ఎనకట ఆరోక్లాస్‌ చదివిన.. నా ఒక్కగా ఒక్క కొడ్కు నక్సలైట్లల్లపోయి పోరాటం చేసి పోలీసుల చేతుల్ల చచ్చిండు. ఏం ఫికర్‌ లేదు. ఆర్మీల ఒక కాప్టెన్‌ చచ్చినంత గౌరవం.. నాకిప్పుడు గీ ‘జనసేన’ను సూత్తాంటే నా కొడ్కుకల నిజమైతాందనిపిస్తాంది. రామంను నా కొడ్కనుకుంటాన.. ఒక్కటే చెప్త.. ఒకసారి గీ గీసుకొండ మండలం గంగదేవిపల్లెకు పోయిన. ఆదర్శగ్రామం అది. ఊరిదంత ఒకతే కత్తు. ఒకటే కుటుంబం. గట్లనే మనది ఒక ఆదర్శ జిల్లా. ఒక ఆదర్శ రాష్ట్రం. ఒక ఆదర్శ దేశం కాదా.. ఐతది.. తప్పకుండ ఐతది.. మనం చేద్దాం.. మనమే చేద్దాం..”
అంతే.. ఉత్సాహం కట్టలు తెంచుకుంది. పిడికిళ్ళెత్తిన జనం.. ”జనసేన” అని గొంతెత్తి నినదిస్తే,
ఆకాశం ప్రతిధ్వనిస్తున్నట్టు ”వర్ధిల్లాలి” అని ప్రతినినాదం.
”జనసేన..”
”జిందాబాద్‌”
”జై జనసేన”
”జై జై జనసేన..” .. ఉద్యమాల పురిటిగడ్డ, విప్లవాల రక్తగర్భ ఓరుగల్లు మానవ మహోత్తేజంతో పొంగి ఉరకలేస్తోంది.
తర్వాత డాక్టర్‌ అమర్‌సింగు సామాజిక సేవా కేంద్రం ప్రజలకు ఉచితసేవలను అందించే విధానం క్లుప్తంగా వివరించారు.
శివ..తర్వాత మైక్‌ ముందుకొచ్చి.. జనసేనతో కలిసి పనిచేయడానికి, అవినీతి ప్రక్షాళనలో పాలుపంచుకోవడానికి, పరిశుద్ధ భావి భారత పునర్నిర్మాణంలో తామూ ఒక భాగం కావడానికి సంసిద్ధత వ్యక్త ంచేస్తున్న ప్రజా సంఘాల పేర్లను ప్రకటిస్తాననీ, ఆయా సంస్థల బాధ్యులు ఒకరొకరుగా వేదికపైకి వచ్చి ప్రజలకు పరిచయం కావాలనీ ప్రకటించి ఒక్కొక్క సంస్థ పేరును చదవడం ప్రారంభించాడు.
”జిల్లా జర్నలిస్ట్స్‌ యూనియన్‌.. రచయితల సంఘం.. మానవ బాధ్యతల సంఘం.. జిల్లా చర్మకార సంఘం..జిల్లా పద్మశాలి సంఘం.. జిల్లా యాదవ సంఘం.. జిల్లా ఎన్‌జివోల సంఘం.. విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం..” పట్టిక కొనసాగుతూనే ఉంది.
సరిగ్గా.. ఆక్షణంలో.. రాష్ట్రవ్యాప్తంగా ‘జనసేన’ నిర్వహిస్తున్న అన్ని ఎనిమిదికేంద్రాల్లో .. అన్ని వేదికలపై అటువంటి కార్యక్రమమే జరుగుతున్నట్టుగా వీడియో సంధానంలో ఉన్న క్యాథీ ఎదుటి లాప్‌టాప్‌ కంప్యూటర్‌ ద్వారా రామంకు తెలుస్తోంది.
ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి విజయాన్ని సాధించడానికి ”అత్యాధునిక సాంకేతికత వినియోగానికి ఎన్నటికీ మారని స్థిరమైన భారతీయ జీవన విలువలను జోడించి, పరిపుష్టం” చేసిన విధానాలను అనుసరించాలని రామం ఉద్ధేశ్యం.
అతనికి చాలా తృప్తిగా ఉంది.. ప్రణాళికలో అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతూ ముందుకు దూసుకుపోగల్గుతున్నందుకు. ఐతే తను ఊహించినదానికంటే దాదాపు నాల్గురెట్లు ప్రజల ప్రతిస్పందన రావడం, అదీ చిన్న, పెద్ద, క్రింది, పైది.. అన్న తేడాలేకుండా అన్నివర్గాలనుండి ప్రతిచర్య ఉవ్వెత్తున రావడం అతనికి పరమానందంగా ఉంది. ఆ పులకింతలోనుండే ప్రక్కనే ఉన్న క్యాథీతో అన్నాడు..”  ”ఫెర్మీ అణుకేంద్రక విచ్ఛిత్తి సిద్ధాంతం జ్ఞాపకమొస్తోందిక్యాథీ.. కేంద్రకాన్ని గనుక అద్భుతమైన శక్తినుపయోగించి విచ్చిన్నం చేయగలిగితే విడివడే శకలం మూడు ముక్కలై శక్తిని ఉద్గారించి.. మళ్ళీ ఒక్కో ముక్క మళ్ళీ మూడుముక్కలై.. మళ్ళీ శక్తిని ఉద్గారించి.. మళ్ళీ ఒక్కో ముక్క.. ఇలా క్షణాల్లో గుణశ్రేఢిలో, ఒక శృంఖలచర్యగా సాగే నిర్మాణాత్మక విచ్ఛిన్న క్రియ ఎంతో బహుళమైన శక్తిని అంతిమంగా అందిస్తుందో,  అదేవిధంగా అణుకేంద్రక సమ్మేళన కార్యక్రమంలోకూడా ఒక్కో అణుకేంద్రకం సంలీనమైపోతూ మళ్ళీ అఖండమైన శక్తిని.. సూర్యునినుండి వికరణజ్వాలలవలె వెలువరిస్తుందో.. జనసేనలోకి ఒక్కో మనిషి అణుకేంద్రకంలా ప్రవేశించి.. ఎంత వేగవంతంగా న్యూక్లియర్‌ రియాక్షన్‌వలె బలోపేతమై పోతోందో.. చాలా ఆనందంగా ఉంది క్యాథీ మనం చేపట్టిన ఈ ప్రక్షాళన చర్య..”
క్యాథీ మౌనంగా.. నిండుగా.. పరిపూర్ణంగా నవ్వుతూ రామంలోకి చూచింది.
ఇద్దరి కళ్ళలోనూ నక్షత్రాలు నిండుగా పూచిన ఆకాశంలో ఉండే పరిపూర్ణ వింతకాంతి.
అప్పుడే రామం రక్షణను పర్యవేక్షించే రఘు రామం వెనుకనుండి కొద్దిగా పైకివంగి.. ”సర్‌ మీరిప్పుడు రాష్ట్రస్థాయిలో కొందరు పత్రికా సంపాదకులతో టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొనే కార్యక్రమముంది సార్‌.. మన కేంద్రక కార్యాలయానికి బయలేర్దామా..” అన్నాడు గుసగుసగా.
”యస్‌.. గోపీనాథ్‌ సర్‌.. మీరు మిగతా విషయాలు చూడండి. మేం వెళ్ళిరామామరి ”అని ప్రక్కనున్న గోపీనాథ్‌ గారి అనుమతి తీసుకుని.. క్యాథీ కూడా లేచి రాగా.., సెంటరింగు చెక్కలతో చేసిన విశాలమైన వేదికపైనుండి టకటకా మెట్లపైనుండి దిగుతూండగా,
భూనభోంతరాలు దద్దరిల్లేట్టుగా ఓ బాంబు ప్రేలింది.
అంతా బీభత్సం.. మంటలు పొగ.. ధ్వంసం.. వేదిక చెక్కలు ఎగిరెగిరిపడ్తూ.. ప్రేలుడు.
పరగులు.. అరుపులు.. కకావికలు.. కేకలు.. విధ్వంసం.

సామూహిక జ్ఞాపకంతో సాహిత్యానికి కొత్త ఊపిరి!

venu

“సాంఘిక చరిత్ర వ్రాయుట కష్టము. దీని కాధారములు తక్కువ. తెనుగు సారస్వతము, శాసనములు, స్థానిక చరిత్రలు (కైఫీయత్తులు), విదేశీజనులు చూచి వ్రాసిన వ్రాతలు, శిల్పములు, చిత్తరువులు, నాణెములు, సామెతలు, ఇతర వాజ్ఞ్మయములలోని సూచనలు, దానపత్రములు, సుద్దులు, జంగము కథలు, పాటలు, చాటువులు, పురావస్తు సంచయములు – ఇవి సాంఘిక చరిత్రకు పనికి వచ్చు సాధనములు” అని సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ మధ్య సంబంధాన్ని సురవరం ప్రతాపరెడ్డి ఒక కోణం నుంచి చెప్పారు. ఆయన 1940ల చివర ప్రారంభించిన ఆ కృషి ఆ తర్వాత ఏడు దశాబ్దాలకైనా అవసరమైన స్థాయిలో, సమర్థంగా కొనసాగలేదని, కొనసాగడం లేదని గుర్తించక తప్పదు.

సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ మధ్య సంబంధం గురించి లోతుగా ఆలోచించినకొద్దీ ఆశ్చర్యకరమైన, అద్భుతమైన సంగతులెన్నో కనబడతాయి. ప్రతాపరెడ్డి చూసినట్టుగా గత సాంఘిక చరిత్ర గత సాహిత్యంలో ప్రతిఫలించిన తీరును మాత్రమే కాదు, గత సాంఘిక చరిత్ర వర్తమాన సాహిత్యంలోకి ప్రవహించగల అవకాశాన్ని, గతంలోనైనా, వర్తమానంలోనైనా ఇటునుంచి అటుగా సాహిత్యం సాంఘిక చరిత్ర మీద వేయగల ప్రభావాన్ని చూస్తే చరిత్రకూ సాహిత్యానికీ కూడ ఎన్నో కానుకలు దొరుకుతాయి, గతం, వర్తమానం, నిన్నటి సాహిత్యం, ఇవాళ్టి సాహిత్యం అనే ఈ నాలుగు భుజాల చతురస్రం లోపల ఎన్నెన్ని పరస్పర సంబంధాలకూ సమ్మేళనాలకూ వియోగాలకూ మార్పులకూ చిక్కుముడులకూ పరిష్కారాలకూ వికాసానికీ అవకాశం ఉందో ఊహిస్తే నిజంగా దిగ్భ్రాంతి కలుగుతుంది.

సాంఘిక చరిత్రకూ సాహిత్యానికీ పరస్పర అన్యోన్య సంబంధం ఉందని గుర్తించి దానితో సవ్యంగా వ్యవహరిస్తే అటు చరిత్ర రచనా ఇటు సాహిత్యమూ కూడ విస్తృతినీ లోతునూ సంతరించుకుంటాయి. సాహిత్యం నుంచి సాంఘిక చరిత్రను తవ్వితీయడానికి ప్రతాపరెడ్డి చేసిన ప్రయత్నం గురించీ, దాన్ని కొనసాగించవలసిన అవసరం గురించీ మరోసారి మాట్లాడుకుందాం గాని, ఇప్పుడు చరిత్రనుంచి సాహిత్యం ఏమి తీసుకోవచ్చునో, తీసుకుంటే ఎట్లా సంపన్నమవుతుందో, తీసుకుంటున్నదో లేదో కొన్ని ఆలోచనలు పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.

సాంఘిక చరిత్ర అంటే అక్షరాస్యులకు, విద్యావంతులకు ఒక ప్రచురిత పుస్తకం అనే పరిమిత అర్థమే స్ఫురించవచ్చు గాని, అక్షరాస్యులకూ, నిరక్షరాస్యులకూ, సమాజం మొత్తానికీ అది సామూహిక జ్ఞాపకంగా, తరతరాల వివేక సంచితంగా ఉంటుంది. నిజానికి సాంఘిక చరిత్రకు ప్రతాపరెడ్డి ప్రస్తావించిన పదిహేను ఆకరాలలో ఆరు మాత్రమే లిఖిత, అక్షర ప్రమాణాలు. మిగిలినవాటికి అక్షరాస్యతతో సంబంధం లేదు. ఆయన చెప్పినవాటికి గ్రామ గాథలు, జానపదగాథలు, వీరగాథలు, చిన్నపిల్లలకు చెప్పే కథలు, మాటలు, ఆచారాలు, ఊహల మీద, ప్రగల్భాల మీద నిర్మాణమై క్రమంగా వాస్తవమేమో అనిపించేలా పెరిగి మిగిలిపోయే భ్రమలు వంటి ఎన్నిటినో కూడ కలుపుకోవలసి ఉంది. అవి వస్తురూపంలో ఉన్నా, శబ్దరూపంలో ఉన్నా, అలవాటు రూపంలో ఉన్నా అటువంటి సాంఘిక చరిత్ర ఆకరాలన్నిటినీ గ్రహించడం, వాటిని విశ్వసనీయ, మానవీయ సన్నివేశాలలో అక్షరీకరించడం సాహిత్యానికి చాల ఉపయోగపడుతుంది. ఎందుకంటే అవన్నీ మానవ ఆలోచనా ప్రపంచంలో ఆయా సమాజాలలో సామూహిక జ్ఞాపకంగా నిలిచి ఉన్నాయి. ఒక రకంగా చూస్తే సామూహిక జ్ఞాపకం ఏ ఒక్క రచయితకూ ఆపాదించడానికి వీలులేని సామూహిక రచన అనుకోవచ్చు. సరిగ్గా సాహిత్యసృజనలో లాగనే సామూహిక జ్ఞాపకంలో కూడ జరిగినది జరిగినట్టుగా కాక, నివేదికగా కాక, వడకట్టిన, జల్లెడ పట్టిన, కాలక్రమంలో మార్పుచేర్పులకు గురైన జ్ఞాపకాల రాశిగా ఉంటుంది. దానిలో వాస్తవమూ ఉంటుంది, కల్పనా ఉంటుంది. విశ్వసనీయతా ఉంటుంది, ఐంద్రజాలికతా ఉంటుంది.

1891055_10202661894681481_1753979965_n

ప్రపంచంలో సుప్రసిద్ధమైన సాహిత్య రచనలు వేటిని పరిశీలించినా అవి ఈ సామూహిక జ్ఞాపకం మీద ఆధారపడ్డాయని అర్థమవుతుంది. నిజానికి మౌఖిక సాహిత్యం మొత్తానికీ దాదాపుగా సామూహిక జ్ఞాపకమే ఇతివృత్తం. ఆ సామూహిక జ్ఞాపకం మనిషిని ఎప్పుడైనా ఆకర్షిస్తుంది గనుకనే మౌఖిక సాహిత్యానికి ఆకర్షణ ఇప్పటికీ తగ్గలేదు. కాని రాజాస్థానాల సాహిత్యం, లిఖిత సాహిత్యం క్రమక్రమంగా ఈ సామూహిక జ్ఞాపకం నుంచి దూరమై వ్యక్తి ప్రధానంగా, వ్యక్తి జ్ఞాపకంగా పెరుగుతూ వచ్చాయి. ఇవాళ వ్యక్తి ప్రధానమైన ఆధునిక సమాజపు ప్రతిఫలనంగా ఆధునిక సాహిత్యం ఆ మేరకు సామూహికత నుంచి, ముఖ్యంగా ఇతివృత్తంలో సామూహిక జ్ఞాపకం నుంచి దూరమై మిగిలింది. సామూహిక జ్ఞాపకం ఇతివృత్తాన్ని స్వీకరించి దాని మీద అభివృద్ధి చేసే అవకాశం స్వాభావికంగానే కొన్ని ప్రక్రియలకు ఎక్కువా, కొన్ని ప్రక్రియలకు తక్కువా ఉన్నదనిపిస్తుంది. సామూహిక జ్ఞాపకాన్ని వినియోగించుకో గలిగిన శక్తి ఆధునిక ప్రక్రియలలో మిగిలిన ప్రక్రియల కన్న నవలకే ఎక్కువ ఉన్నదని అనిపిస్తుంది.

ఇలా ఆలోచించినప్పుడు తెలుగు నవల ఎదగకపోవడానికి సామూహిక జ్ఞాపకం నుంచి, సాంఘిక చరిత్ర నుంచి దూరం కావడమే, తీసుకోవలసినంత తీసుకోకపోవడమే ఒక కారణం కావచ్చునా అని అనుమానం కలుగుతుంది. నవల మొత్తంగా చారిత్రక నవల కానక్కరలేదు, అప్టన్ సింక్లెయిర్ ను ఉదాహరణగా పెట్టుకుని రాశానని మహీధర రామమోహనరావు స్వయంగా చెప్పుకున్న చారిత్రక నవలల పరంపర లాంటిది కూడ అవసరం లేదు. వ్యక్తి ప్రధానమైన, కొన్ని పాత్రలే ప్రధానమైన ఏ ఇతివృత్తపు నవల అయినా సామూహిక జ్ఞాపకం దానికి జవసత్వాలను ఇవ్వగలుగుతుందని నాకనిపిస్తుంది. పాఠకులకు ఆ సామూహిక జ్ఞాపకంతో సంబంధం ఉంటుంది గనుక నవల వికసించడానికి మాత్రమే కాదు, పాఠకులు దానితో తాదాత్మ్యం చెందడానికి కూడ అది దోహదం చేస్తుంది.

సామూహిక జ్ఞాపకంలో మరొక అంశం కూడ అంతర్గర్భితంగా ఉంటుంది. ఎన్నో ఘటనలు, క్రమాలు జరిగి, ఆ ఘటనలు, క్రమాలు చరిత్రకు ఎక్కకపోయినా, గుర్తు లేకపోయినా, ఎక్కడా మౌఖికంగా గాని, లిఖితంగా గాని నమోదు కాకపోయినా వాటి అంతిమ ఫలితమైన ఒక అవగాహన, ఒక స్వభావం, ఒక అమూర్త భావన ఆ సమూహపు జ్ఞాపకంగా మిగిలి ఉంటుంది. ఒక సాహిత్య రచన ఆ స్వభావానికి సరిపోయే సన్నివేశాన్ని చరిత్రనుంచి తీసుకుని మెరుగుపెట్టినప్పుడు, లేదా ఊహాశాలితతో సృష్టించగలిగినప్పుడు ఆ సన్నివేశం నిజమైనా కాకపోయినా, పూర్తిగా కల్పనే అయినా పాఠకులు దాన్ని తమ సామూహిక జ్ఞాపకానికి ఒక నిదర్శనంగా, వ్యక్తీకరణగా చూస్తారు. తద్వారా అది పూర్తి కల్పనే అయినా విశ్వసనీయతను సంతరించుకుంటుంది. బి. ట్రావెన్, గాబ్రియెల్ గార్షియా మార్కెజ్, ఎడువార్డో గలియనో, ఇసబెల్ అయెండి, మాన్లియో అర్గెటా, ఎరియెల్ డార్ఫ్ మన్, చినువా అచెబె, గూగీ వా థియోంగో, బుచి ఎమిచిటా వంటి లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ రచయితల శక్తి తమ సమాజాలలోని సామూహిక జ్ఞాపకాలకు కళారూపం ఇవ్వడంలో, లేదా తమ రచనలలో ఆ జ్ఞాపకాలను సమర్థంగా వినియోగించుకోవడంలో ఉందనుకుంటాను.

చరిత్రనుంచీ, జీవితచరిత్రల నుంచీ కొన్ని ఉదాహరణల ద్వారా తెలంగాణ జీవితంలోని అటువంటి సామూహిక జ్ఞాపకాలు సాహిత్యానికి ఎంత మేలు చేయగలవో చూపడానికి ప్రయత్నిస్తాను. ఆధిపత్యం పట్ల ధిక్కారం, పోరాటం తెలంగాణ సామూహిక జ్ఞాపకంలో భాగం. కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్రలో ఈ సామూహిక జ్ఞాపకాన్ని బలపరిచే నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, పాల్కురికి సోమన, పోతన, సర్వాయి పాపన్న, రాంజీ గోండు, తుర్రెబాజ్ ఖాన్, బందగీ, కొమురం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షోయెబుల్లా ఖాన్ వంటి అనేక చిహ్నాలు ఈ సామూహిక జ్ఞాపకాన్ని సృష్టించాయి, పునరుత్పత్తి చేశాయి. బలోపేతం చేశాయి. ప్రత్యక్షంగా ఈ ప్రతీకలను గాని, ఈ ప్రతీకల ద్వారా వ్యక్తమైన ధిక్కార భావనను గాని ఇతివృత్తంగా తీసుకునే సాహిత్యానికి తప్పనిసరిగా ఆదరణ ఎక్కువగా ఉంటుంది.

పైన చెప్పిన సామూహిక జ్ఞాపకపు ప్రతీకలన్నీ సుప్రసిద్ధమైనవే, ఇటీవలి కాలంలో మళ్లీ మళ్లీ స్మరణకు వచ్చినవే. కాని తెలంగాణ చరిత్ర సూక్ష్మంగా అధ్యయనం చేస్తున్నప్పుడు ఇటువంటి మరెన్నో ఘటనలు, పరిణామాలు, ప్రతీకలు ఉన్నాయని స్పష్టమయింది.

ఉదాహరణకు పాలకుర్తి గ్రామాన్ని తీసుకొండి. పాల్కురికి సోమన ఆ గ్రామం నుంచి వచ్చి శివకవిగా, ప్రచారకుడిగా, సామాజిక చింతకుడిగా తన కాలం కన్న చాల ముందుకు చూశాడు. మార్గ సంప్రదాయాన్ని ధిక్కరించి దేశి పద్ధతి చేపట్టాడు. ఉరుతర గద్య పద్యోక్తులను, సంస్కృత సమాస భూయిష్ట రచనను తిరస్కరించి జానుతెనుగులో, ద్విపదలో రచించాడు. అప్పటికి ఉన్న ఆనవాయితీని కాదని బసవపురాణం రాశాడు. జాతిభేదాన్ని, స్త్రీపురుష భేదాన్ని, కులగోత్రాలను, కలిమిలేములను గుర్తించని వీరశైవాన్ని అనుసరించాడు. ఆయన జీవితకాలంలో ఒక చాకలి స్త్రీకి శివదీక్ష ఇచ్చాడని ఆధారాలున్నాయి. అదే గ్రామంలో ఏడు వందల సంవత్సరాల తర్వాత ఒక చాకలి స్త్రీ దొరతనాన్ని ధిక్కరించడం సంబంధం లేనిదనీ, యాదృచ్ఛికమనీ అనిపించవచ్చు గాని నేను దాన్ని సామూహిక జ్ఞాపకపు పునరుత్పత్తి అనుకుంటాను. సోమన ధిక్కారం భాషలో, సాహిత్యంలో, సంస్కృతిలో, మతాచారాలలో జరిగితే, ఐలమ్మ ధిక్కారం భూమి మీద, శ్రమ ఫలితం మీద, అధికారం మీద, చట్టం మీద జరిగింది. ఈ రెండు ధిక్కారాలూ వేరువేరు అనుకునే దృక్పథం కూడ ఉంది గాని, నా ఉద్దేశంలో ఈ రెండూ పరస్పరాశ్రితాలు. సోమన ధిక్కారాన్ని బలోపేతం చేయగలిగిందీ, అర్థవంతం చేయగలిగిందీ, సుస్థిరం చేయగలిగిందీ ఐలమ్మ ధిక్కారమే. ఈ అన్యోన్య సంసర్గం, ఇంత సుదీర్ఘకాలపు కొనసాగింపు తప్పనిసరిగా సాహిత్యానికి అద్భుతమైన ముడిసరుకు అవుతుంది.

అలాగే కడివెండి గ్రామాన్ని చూడండి. విసునూరు రామచంద్రారెడ్డి అధీనంలోని గ్రామంగా, కర్కోటకురాలని పేరు తెచ్చుకున్న ఆయన తల్లి స్వయంగా పాలించిన గ్రామంగా ఆ ఊరు సహజమైన ప్రతిఘటనను ప్రకటించింది. ఆ ప్రతిఘటన క్రమంలో తగినంత మిగులులేని గ్రామ రైతుల దగ్గరినుంచి బలవంతంగా వసూలు చేస్తున్న యుద్ధపు లెవీ, గుమ్ములు పొర్లిపారుతున్న దొర గడీకి ఎందుకు వర్తించదని ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్న ఊరేగింపు రూపం ధరించింది. ఆ ఊరేగింపు మీద కాల్పులలో దొడ్డి కొమరయ్య మరణించాడు. ఆ తర్వాత ఆరు దశాబ్దాలకు అదే గ్రామానికి చెందిన పైళ్ల వెంకటరమణ గాని, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి గాని మరొక ఐదారుగురు గాని మరొక ప్రజావిముక్తి సమరంలో అటువంటి ప్రశ్నలే వేసి ప్రాణత్యాగాలు చేశారు. ధిక్కార, త్యాగ చరిత్ర ఆ గ్రామపు సామూహిక జ్ఞాపకంలో మాత్రమే కాదు, మొత్తంగానే ఈ ప్రాంతపు, తెలంగాణ సామూహిక జ్ఞాపకంలో, సాంఘిక చరిత్రలో భాగమైంది. ఇది సాహిత్యంలోకి అనువాదమైతే ఎంత రోమాంచకారి ప్రభావం కలగజేయగలుగుతుంది!

ఇలా వెతుకుతూ పోవాలే గాని, తెలంగాణ చరిత్ర నిండా, ఆమాటకొస్తే ఎక్కడైనా ప్రజల చరిత్ర నిండా ఎన్నెన్నో అద్భుతమైన ఘటనలు, పరిణామాలు దొరుకుతాయి. ఆ సామూహిక జ్ఞాపకాన్ని, సాంఘిక చరిత్రను తవ్వితీసి సాహిత్యరూపం ఇవ్వడం సాహిత్యకారుల బాధ్యతలలో ఒకటనుకుంటాను. ఈ తవ్వితీయడానికి గనులుగా ప్రతాపరెడ్డి చెప్పిన ఆకరాలు మాత్రమే కాదు, మరెన్నో ఆకరాలున్నాయి.

వరంగల్ లో భాగమైన వడ్డెపల్లి భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాగా ఎదిగిన పింగళి జగన్మోహన రెడ్డి తన ఆత్మకథలో ఒక ఉదంతం రాశారు. అది తన ముత్తాత కాలం నాటిదని, అందువల్ల దానిలో వాస్తవం ఎంతో చెప్పలేమని ఆయనే రాశారు. హనుమకొండలో ఇప్పటికీ రాగన్న దర్వాజ అనే పేరుతో ఒక ప్రాంతం ఉంది. ఆ రాగన్న జగన్మోహనరెడ్డికి పూర్వీకుడు. ఆ రాగన్నను హత్య చేసిన నేరం మీద ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారట. ఆ శిక్ష అమలు చేయబోయే సమయానికి ఆ వ్యక్తి తమ్ముడు వచ్చి, ‘మా అన్న భార్యాబిడ్డలు ఉన్నవాడు. మరణశిక్ష అమలుచేస్తే వాళ్లు దిక్కులేనివారైపోతారు. నాకు వెనుకాముందూ ఎవరూ లేరు. అందువల్ల మా అన్నకు వేసిన శిక్షను నాకు బదిలీ చేసి, నన్ను ఉరితీయండి’ అని కోరాడట. నిజంగానే ఆ తమ్ముడికే శిక్ష అమలు చేశారట. వాస్తవం కల్పన కన్న అద్భుతంగా ఉంటుందనడానికి ఇంతకన్న నిదర్శనం ఉంటుందా?

తెలంగాణ చరిత్రకు సంబంధించి ఇటువంటి ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఘటనల వనరులలో ‘హైదరాబాద్ అఫెయిర్స్’ ఒకటి. అసలు ఆ ‘హైదరాబాద్ అఫెయిర్స్’ కథే తెలుసుకోవలసిన కథ. హైదరాబాదు రాజ్యంలో పందొమ్మిదో శతాబ్దం చివరిలో జరిగిన విశేషాలగురించిఅప్పటి పత్రికలలో వచ్చిన వార్తలన్నిటినీ నిజాం ప్రభుత్వంలో ఆర్థిక కార్యదర్శిగా ఉండిన మౌల్వీ సయ్యద్ మహదీ అలీ ‘హైదరాబాద్ అఫెయిర్స్’ పేరుతో పన్నెండో, పదమూడో పెద్ద సంపుటాలుగా సంకలనం చేసి 1880లలో ప్రచురించాడు. అవి ఫూల్ స్కేప్ సైజులో ఒక్కొక్కటి మూడు వందల పేజీల నుంచి తొమ్మిది వందల పేజీల దాకా ఉంటాయి. ఆ సంపుటాలు చదువుతుంటే నూట యాభై సంవత్సరాల వెనుకటి హైదరాబాద్ రాజ్యం, సమాజం, పాలన, సంస్కృతి కళ్లముందర కదలాడుతాయి. (అయితే దురదృష్టమేమంటే అన్ని సంపుటాలూ ఒక్కచోట ఇంతవరకూ నేను చూడలేకపోయాను. బ్యూరో ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లోనూ, డిస్ట్రిక్ట్ గెజెటీర్స్ కార్యాలయంలోనూ చాల సంపుటాలు ఉండేవి. ఇప్పుడు మొదటి దాంట్లో అన్నీ లేవు, రెండో కార్యాలయమే లేదు. ఇక్కడ కనబడని సంపుటాలు కొన్ని నాకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ గ్రంథాలయంలో కనబడ్డాయి గాని అవి ఫొటోకాపీ చేయించుకోవడం కుదరలేదు. ఆ తర్వాత చార్మినార్ దగ్గర ఒక అద్భుతమైన పాత పుస్తకాల ఫోటోకాపీల అమ్మకందారు దగ్గర ఆరేడు సంపుటాలు సంపాదించాను గాని అన్నీ దొరకలేదనే లోటు అలాగే ఉంది.) ఆ సంపుటాలు తెలంగాణ సాంఘిక చరిత్ర గురించి ఎన్నో అరుదైన, ఆశ్చర్యకరమైన విషయాలను, సాహిత్యంలోకి పరావర్తనం చెందగల, ప్రతిఫలించడానికి అవకాశం ఉన్న విషయాలను ఇస్తాయి. అవన్నీ ఏదో ఒక స్థాయిలో మన సామూహిక జ్ఞాపకంలో భాగమయ్యాయనే అనుకుంటాను. ఇక్కడ మచ్చుకు ఒకటి చెపుతాను:

కలకత్తా నుంచి వెలువడుతుండిన ఇంగ్లిష్ మన్ పత్రికలో 1859లో వచ్చిన వార్త ప్రకారం హనుమకొండకు పన్నెండు కోసుల దూరంలో రూపా అనే ఒక లంబాడీ పెద్ద మరొక తండా పెద్దతో వచ్చిన ఘర్షణలో ఆయననూ, ఆయన కుటుంబ సభ్యులనూ మొత్తం ముప్పైతొమ్మిది మందిని నరికేశాడట. ఆ నేరానికి నిర్బంధించి న్యాయస్థానానికి తీసుకొచ్చినప్పుడు, “నాకూ మా అన్నకూ తగాదా వచ్చి నేను ఆయనను చంపేస్తే విచారించడానికి మధ్యలో ఈ అదాలత్ ఎవరు? శిక్ష విధించడానికి సర్కారు ఎవరు? నేనేమన్నా సర్కారు సొమ్ము తిన్నానా? దోపిడీ చేశానా” అని అడిగాడట.

ఇది చదివినప్పుడు నాకు సరిగ్గా ఇటువంటి జ్ఞాపకాలనే లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ సాహిత్యకారులు ఎలా కాల్పనీకరించి, అద్భుతమైన దృశ్యాలుగా, ఆలోచనాస్ఫోరకమైన సన్నివేశాలుగా మలిచారుగదా అనిపించింది.

చిట్టచివరిగా, ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రజల స్వాభిమానాన్ని వ్యక్తీకరించే సాహిత్య రూపాలు విరివిగా వెలువడుతున్నాయి. నిజానికి ప్రత్యేక రాష్ట్ర వాంఛ తెలంగాణ ప్రజల స్వాభిమాన కాంక్షకు ఒకానొక వ్యక్తీకరణ మాత్రమే. సాంఘిక చరిత్రలో కొంచెం వెనక్కి వెళితే, 1950లో రైతాంగ సాయుధ పోరాట ప్రాంతాలలో పర్యటించిన అమెరికన్ విలేఖరి తాయా జింకిన్ ఒక జీపు డ్రైవర్ మాటల్లో వెలువడిన ఆనాటి ఆకాంక్షను నమోదు చేసింది. నువ్వే ప్రభుత్వమైతే ఏం చేస్తావు అని ఆమె అడిగిన ప్రశ్నకు ఆ డ్రైవర్ “జనానికి బాగా అప్పులిస్తాను. బోలెడన్ని బళ్లూ ఆస్పత్రులూ కట్టిస్తాను. దున్నేవాడికే భూమి పంపిణీ చేస్తాను. ఉర్దూ రద్దు చేస్తాను. తెలుగువాళ్లను అధికారులుగా నియమిస్తాను. గ్రామాల రక్షణకు స్వచ్ఛంద సాయుధ దళాలను ఏర్పాటు చేస్తాను…” అన్నాడట. ఈ కోరికలలో రెండిటిని ఇప్పుడు సవరించుకోవలసిన అవసరం ఉందేమో గాని, మౌలికంగా మిగిలిన కోరికలకు కాలం చెల్లలేదు. ఆరున్నర దశాబ్దాల తర్వాత కూడ వాటిలో ఏ ఒక్కటీ తీరలేదు.

గతమూ వర్తమానమూ జ్ఞాపకమూ జీవితమూ కలగలిసిన సమాజం ఇది. ఈ చరిత్రనూ, సామూహిక జ్ఞాపకాన్నీ, ఊహనూ అద్భుతమైన సృజనగా రసాయనిక సంయోగం సాధించగల గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ వంటి సృజనకర్త కోసం ఈ నేల ఎదురుచూస్తున్నదనుకుంటాను.

-ఎన్. వేణుగోపాల్

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

బాగా చిన్నప్పుడు ..భలేగా ఉండేది కాబోలు!

నా చిన్నప్పటి ఫోటో

నా చిన్నప్పటి ఫోటో

వారం, పది రోజుల పాటు ఎంత బుర్ర గోక్కున్నా, గీక్కున్నా నాకు పదేళ్ళ వయస్సు దాకా జరిగిన సంఘటనలు గుర్తుకు రావడం అంత తేలిక కాదు అని తెలిసిపోయింది. ఇక మెదడులో సరుకుని పూర్తిగా నమ్ముకుంటే లాభం లేదు అనుకుని ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అని వెతికితే అలనాటి ఫోటోలు మూడంటే మూడే దొరికాయి. ఇందులో నా అత్యంత చిన్నప్పటి ఫోటో ఈ క్రిందన పొందుపరిచాను. ఇది ఖచ్చితంగా మా పెద్దన్నయ్యే తీసి ఉంటాడు. అప్పుడు నాకు రెండు, మూడు ఏళ్ళు ఉంటాయేమో….గుర్తు లేదు. కానీ ఫోటో చూడగానే “భలే క్యూట్ గా “ ఉన్నాను సుమా అని ఇప్పటి వాడుక మాటా”, “చంటి వెధవ ముద్దొస్తున్నాడు సుమా” అని ఆ రోజుల నాటి ప్రశంసా నాకు నేనే చెప్పుకున్నాను.

ఆ రోజుల్లో యావత్ కాకినాడ నగరం మొత్తానికి బహుశా పదో, పదిహేనో “డబ్బా” కెమెరాలు ఉండి ఉంటాయి. కలర్ ఫోటోలు, విడియోలు, టీవీలు, కంప్యూటర్లు వగైరా వస్తువులే కాదు, ఆ పదాలే ఆంద్రులకి, ఆ మాట కొస్తే భారతీయులకే తెలియవు. “అప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న కంప్యూటర్ పవర్ అంతా కలిపితే ఈ నాడు ఒక చిన్న పిల్లాడు ఆడుకునే బొమ్మ లో ఉంది” అని నేను పుట్టిన సంవత్సరం గురించి ఎక్కడో చదివి సిగ్గు పడ్డాను. నమ్మండి, నమ్మక పొండి, సరిగ్గా నేను పుట్టిన నాడే జపాన్ వాళ్ళు చేతులెత్తేసి, అమెరికాతో యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకాలు పెట్టేసి రెండవ ప్రపంచ యుద్ధం అంతం చేశారు. బహుశా ఈ “క్యూట్” ఫోటో తీసిన ఏడే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఎప్పటికీ నా వయస్సు పదహారే!

ఇది కాక మరొక ఫోటో కూడా ఉంది. అది కూడా ఇక్కడ జత పరుస్తున్నాను. కానీ ఇందులో ఉన్న పిల్లాడు నేనో, మా తమ్ముడో (ఆంజి అనబడే హనుమంత రావు, కేలిఫోర్నియా నివాసి) ఖచ్చితంగా తెలీదు. కవల పిల్లలం కాక పోయినా, అలాగే పెరిగాం కాబట్టి మా ఇద్దరిలో ఎవరైనా పరవా లేదు కానీ ఆ ఫోటో ఉన్నది నేనే అవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం రెండు ఫొటోలలోనూ ఆ మెడలో ఉన్న మూడు పేటల చంద్ర హారం. మా అమ్మ ఎప్పుడూ ఆ హారం వెయ్యకుండా నన్ను ఎక్కడికీ పంపించేది కాదుట. మరొక క్లూ ఏమిటంటే ఆ పక్కన నుల్చున్న అమ్మాయి మటుకు మా “దొంతమ్మూరు బేబీ” యే.

దొంతమ్మూరు బేబీతో

దొంతమ్మూరు బేబీతో

నా వయసుదే అయిన ఆ అమ్మాయి అసలు పేరు “వెంకట రత్నం” అని బహుశా తనకి కూడా గుర్తు ఉంది ఉండదు ఎందుకంటే ఇప్పటికీ తనని అందరూ “బేబీ” అనే పిలుస్తారు. ఈ బేబీ మా మూడో మేనత్త కుమార్తె బాసక్క (వరసకి వదిన కానీ బాసక్క అనే పిలిచే వాళ్ళం) పెద్ద కూతురు. పిఠాపురం లో రాయవరపు వారి దౌహిత్రురాలు అయినప్పటికీ బేబీ పుట్టుక, పెంపకం అన్నీ కాకినాడలో మా ఇంట్లోనే జరిగాయి. చిన్నప్పటి నుంచీ కలిసి మెలిసి పెరిగిన మేం ఇద్దరం ఐదో తరగతి దాకా ఒకటే క్లాసు లో చదువుకున్నాం. అందుచేత మా ఇద్దరికీ కలిపి ఒక ఫొటో మా పెద్దన్నయ్య తీసి ఉంటాడు. ఈ ఫోటోలో కూడా ‘చతికిల పడినా క్యూట్” గా ఉన్నాను అనే అనుకుంటున్నాను.

 

నా పుట్టువెంట్రుకలు

నా పుట్టువెంట్రుకలు

ఇక నాకు ఏ మాత్రం గుర్తు లేక పోయినా, నా చిన్నప్పటి ఫోటోలలో చాలా అపురూపమైనది నా పుట్టువెంట్రుకల నాటి ఫోటో. ఆ “పండగ” మా తాత గారు బతికుండగానే జరిగింది. అప్పుడు నా వయసు ఐదారేళ్ళు ఉండ వచ్చును. నా వెనకాల నుంచున్నది మా అక్క మాణిక్యాంబ. మా అక్కకి ఒక పక్కన ఉన్నది మా అమ్మమ్మ బాపనమ్మ, రెండో పక్కన మా రెండో మేనత్త హనుమాయమ్మ గారు. వారిద్దరి తోటీ నాకున్న ఏకైక ఫోటో ఇదే! ఇక నాకు “మొదటి క్షవరం “ చేస్తున్న వాడు మా ఆస్థాన మంగలి రాఘవులు. కాకినాడలో ఎవరికీ క్షవర కల్యాణం కావాసి వచ్చినా, పండగలూ, పబ్బాలకీ రాఘవులు దొంతమ్మూరు గ్రామం నుంచి రావలసినదే! బహుశా 1950-51 నాటి ఆ ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను. ఇలాంటిదే మరొక ఫోటో కూడా ఉండేది కానీ ఇప్పుడు కనపడడం లేదు. అందులో వెనకాల మా తాత గారు చుట్ట కాల్చుకుంటూ నా పుట్టు వెంట్రుకల పండగ చూస్తూ ఉంటారు.

ముందే మనవి చేసుకున్నట్టు, ఏవేవో పండగలు, పురుళ్ళు, వ్రతాలు, వచ్చే పోయే బంధువులతో ఇల్లంతా ఎప్పుడూ హడావుడిగా ఉండేది అని తప్ప నాకు పదేళ్ళ లోపు జ్జాపకాలు ఎక్కువ లేవు. అలా గుర్తు చేసే ఆధారాలూ ఎక్కువ లేవు. ఆఖరికి నాకు అక్షరాభ్యాసం జరిగిన సంగతి కూడా గుర్తు లేదు కానీ నేను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ చదువుకున్న “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు” వివరాలు బాగానే గుర్తున్నాయి. ఆ స్కూలు గాంధీ నగరం పార్కుకి నైరుతి వేపు ఎల్విన్ పేట లో ఉంది. మా ఇంటి నుంచి రోడ్డు మీద నడిచి వెడితే పదిహేను నిముషాలు పడుతుంది కానీ, మా చిన్నప్పుడు ఎదురుగుండా గిడ్డీ గారి సందు లో, మా భాస్కర నారాయణ మూర్తి తాతయ్య గారి ఖాళీ స్థలం (కపిలేశ్వరపురం జమీందారులు, రాజకీయ ప్రముఖులు ఎస్..పి.బి.పి పట్టాభి రామారావు & సత్యనారాయణ రావు ల ఇంటి వెనకాల) ,     ప్రహరీ గోడ మధ్య కన్నం లోంచి దూరి వెడితే ఐదు నిముషాలు మాత్రమే పట్టేది.

నేనూ, ఆంజీ, బేబీ ప్రతీ రోజూ, బిల బిల లాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ హాయిగా స్కూలికి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడూ “నేను వెళ్ళను” అని భీష్మించుకుని కూచున్నట్టు అంతగా జ్జాపకం లేక పోయినా, కొన్ని సందర్భాలలో మా “సున్నారాయణ” గాడు బలవంతాన భుజాల మీద మోసుకుని స్కూల్ లో నేల మీద కూచోబెట్టినట్టు లీలగా గుర్తు ఉంది ఇప్పటికీ. నా ఐదో ఏట 1950 లో ఆ “ఆనంద పురం పురపాలక ప్రాధమిక పాఠశాల లో ఒకటో తరగతిలో ప్రవేశించి, ఐదో తరగతి దాకా చదువుకున్నాను.

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్

అవును…..అప్పుడు ఆ స్కూల్ లో బెంచీలు లేవు. రెండు గదులు. రెండు వరండాలు. అంతే! వెనకాల అంతా ఇసక పర్ర. ఒకటి నుంచి ఐదో తరగతి దాకా అందరూ నేల మీదే కూచుని చదువుకోవల్సినదే! అత్యంత విచారకరం ఏమిటంటే, ఇప్పుడు పరిస్థితి అంత కంటే అన్యాయం గా ఉంది. ఇప్పటికీ అందరూ నేల మీద కూచునే చదువు కుంటున్నారు. అది తప్పు అని కాదు కానీ ఆ చిన్న భవనమూ, మొత్తం వాతావరణం ఇప్పుడు దయనీయంగా ఉంది అని ఇటీవల నేను కాకినాడ వెళ్లినప్పుడు గమనించిన విషయం. ఇటీవల నేను తీసుకున్న రెండు ఫోటోలు ఈ క్రింద పొందుపరిచాను. ఒకటి ఇప్పటి హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి గారూ, కొందరు పిల్లలతో. ఇంకొకటి నేను స్కూలు గుమ్మం దగ్గర భయం, భయం గా నుంచొని ఉన్న ఫోటో.

ఇప్పటి సంగతి నాకు తెలియదు కానీ, మా చిన్నప్పుడు ఆ ప్రాధమిక పాఠశాల లో టీచర్లు అందరూ క్రిస్టియనులే! దీనికి బహుశా ఎల్విన్ పేట లో ఒక చర్చి ఉండడం , ఆ పేటలో క్రైస్తవ జనాభా ఎక్కువ ఉండడం ప్రధాన కారణం. పైగా అందరూ ఆడవాళ్లే. అందరి పేర్లూ మేరీ, సుగుణ, కరుణ లాంటివే! మేం అందరం “జాని జోకర్ బజా, బజాతా, రీ,రీ, రీ,రీ సితార్ బజాతా”, “జాక్ అండ్ జిల్ వెంటప్ ది హిల్” లాంటి పాటలు ఎంతో హుషారుగా నేర్చుకునే వాళ్ళం. “వందే మాతరం” ఇంచు మించు జాతీయ గీతం స్థాయి పాటలా ప్రతీ రోజూ పాడే వాళ్ళం.

దసరా సమయంలో “పప్పు బెల్లాలకి” లోటుండేది కాదు. రిపబ్లిక్ డే కి, స్వాతంత్ర్య దినోత్సవానికి మ్యునిసిపల్ ఆఫీసు ప్రాంగణంలో జండా వందనం తరువాత బిళ్ళలకీ లోటు ఉండేది కాదు. “ఆ గిడ్డీ వెధవ” ని –అంటే కిరస్తానీ వాడిని అనమాట ….తోటలోకి తప్ప ఇంట్లోకి రానివ్వకండిరా అని ఎప్పుడైనా మా ఇంట్లో ఎవరైనా అరిచినా, ఎవ్వరూ లక్ష్యపెట్టే వారు కాదు. ఎటువంటి మత, కుల తారతమ్యాలూ అంటని ఆ వయసు అటువంటిది. మనిషి ఎదిగిన కొద్దీ కుల, మత కల్మషం పెరుగుతుందేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నమ్మండి, నమ్మక పొండి, నా మటుకు నాకు అమెరికా వచ్చే దాకా ఈ కులాల ప్రభావం, ప్రాంతాల ప్రాబల్యం మన వారిలో ఇంత ప్రస్ఫుటంగా జీర్ణించుకు పోయింది అని తెలియ లేదు. ఇప్పుడు తెలిసినా చెయ్యగలిగింది ఏమీ లేదు అని కూడా తెలిసింది.

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్ హెడ్  మాస్టర్ తో

ఆనందపురం ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ తో

ఆఖరి అంశంగా ….నాతో సహా, ఆ రోజు చూసిన వాళ్ళందరికీ ఇంకా కళ్ళకి కట్టినట్టు ఉన్నదీ, చూడని వాళ్ళకి కళ్ళకి కట్టినట్టు చూసిన వాళ్ళు వర్ణించి పదే, పదే చెప్పి నవ్వుకునేది నా బాగా చిన్నప్పుడు కేవలం ఐదు నిముషాలలో అయిపోయిన ఒక దీపావళి పండగ. అప్పుటికి మా తాత గారు, బామ్మ గారు బతికే ఉన్నారు. నాకు మహా అయితే ఆరేళ్ళు ఉంటాయి కానీ ఆ దీపావళి ఇంకా జ్జాపకమే! యధాప్రకారం మా అన్నయ్యలు, స్నేహితులు ఇంట్లోనే ఒక నెల పాటు చిచ్చుబుడ్లు, మతాబాలు, తారా జువ్వలు తయారు చేసే వారు. అవి తయారు చేసే పద్ధతీ, కావలసిన వస్తువులు అన్నీ మా తాత గారి స్వహస్తాలతో ఉన్న ఒక పెద్ద తెలుగు పుస్తకంలో ఉండేవి.

నేను పెద్దయ్యాక కూడా కొనసాగిన ఆ తయారీలో రసాయనాలు, వస్తువులలో నాకు బాగా గుర్తున్నవి భాస్వరం, పచ్చ గంధకం, బొగ్గు, సూర్యాకారం, అభ్రకం ముక్కలు, గన్ పౌడర్, ఎర్ర పువ్వులు రావడానికి రాగి రవ్వ, ఇనప రవ్వ, జిల్లేడు బొగ్గు, ఆముదం, జిగురులావాడే మెత్తటి అన్నం, చిన్న, చిన్న ముక్కలుగా చింపేసిన చెత్త కాగితాలు, న్యూస్ పేపర్లు మొదలైనవి. ఆ రోజు ఇంట్లో చేసినవి కాకుండా బజారు నుంచి ఇంట్లో చెయ్య లేని, చెయ్యనివ్వని టపాసులు, సిసింద్రీలు, కాకర పువ్వొత్తులు ఇంటి నిండా ఉన్న యాభై మంది చిన్నా, పెద్ద లకీ సరిపడా బాణ సంచా సామగ్రి కొనుక్కొచ్చారు. వీటిల్లో బాంబులు, తారాజువ్వల లాంటి యమా డేంజరస్ సామాగ్రి పిల్లలకి అందకుండా ఎక్కడో దూరంగా పెట్టి, మిగిలిన సరదా మందు గుండు సామాగ్రి అంతా మా తాత గారు కూచునే నవారు మంచం క్రింద జాగ్రత్తగా పేర్చి పెట్టారు. అక్కడికి దగ్గరగా పది, పదిహేను బిందెలలో నీళ్ళు తోడి రెడీగా ఉంచారు ప్రతీ దీపావళి కీ లాగానే!

ఇక పిల్లలు అందరూ వత్తులు కట్టిన గోంగూర కట్టలు తీసుకుని, వత్తులు వెలిగించి, “దిబ్బూ, దిబ్బూ, దీపావళీ” అని నేల కేసి మూడు సార్లు కొట్టి వత్తులు ఆర్పేసి మా తాత గారి దగ్గరకి పరిగెట్టగానే ఆయన ఒక మతాబా యో, కాకర పువ్వోత్తో వాళ్ళ సైజు ని బట్టి ఇచ్చే వారు. అందరిలోకీ అగ్ర తాంబూలం అప్పటికీ, ఇప్పటికీ మా అక్కదే. మా అక్కని “అమ్మరసు” అనీ “చిన్న అమ్మరసు” అనీ పిలిచే వారు. పదేళ్ళ మా అక్క వెళ్ళగానే మా తాత గారు ఒక మతాబా ఇచ్చారు. అది వెలిగించి మహోన్నతంగా, అత్యంత మనోహరంగా వెదజల్లుతున్న ఆ పువ్వుల మతాబాని మా అక్క అనుకోకుండా, ఏదో అంటూ మళ్ళీ మా తాత గారి మంచం దగ్గరకి వెళ్లింది…అంతే……ఆ నిప్పు రవ్వలు మంచం కింద పెట్టిన మొత్తం దీపావళి సామాగ్రి మీద పడి అన్నీ ఒకే సారి అంటుకుని మంటలు, పేలుళ్లు, సిసింద్రీలు పరిగెట్టడాలు… ఒకటేమిటి అన్ని రకాల వెలుగులూ, చప్పుళ్ళతో అంతా అరక్షణం పట్ట లేదు…దీపావళి హడావుడికి.

అప్పటికే ఎనభై ఐదేళ్ళ మా తాత గారు మంచంమీద నుంచి చెంగున గంతేసి ఆయన గది లోకి పరిగెట్టారు. మా చిట్టెన్ రాజు బాబయ్య, హనుమంత రావు బావ, మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య మిగిలిన పెద్ద వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిందె తీసుకుని మంచం క్రిందకి నీళ్ళు విసిరేసి మొత్తానికి మంటలు అదుపు లోకి తెచ్చారు. ఆ ఏడు మొత్తం దీపావళి పండుగ అంతా ఐదు నిముషాల లోపే అయిపోయింది. మా కుటుంబంలో ఎప్పుడైనా అందరం కలుసుకున్నప్పుడు దీపావళి టాపిక్ వస్తే ఈ అంశం అందరం తల్చుకుని నవ్వుకుంటూ ఉంటాం.

అన్నట్టు “అమ్మరసు” అనే ఆ తెలుగు పిలుపు, అందులోని ఆప్యాయత అంటే ఎంత ఇష్టమో. మా అక్క “చిన్న అమ్మరసు” ఎందుకు అయిందంటే .. …మా ఆఖరి మేనత్త రెండో కూతురుని “పెద్దాపురం అమ్మరసు” అనీ పెద్దమ్మరసు” అనీ పిలిచే వారు. అసలు పేరు నాకు తెలియదు కానీ నేను నా చిన్నప్పుడు ….నవంబర్ 19, 1953 నాడు “అమ్మరుసొదిన” పెళ్ళికి పెద్దాపురం వెళ్లాను. నాకు భలేగా గుర్తున్న ఆ పెళ్లి జ్జాపకాలూ, పెళ్లి మేళం (???) గురించీ మరో సారి వివరిస్తాను…..

– వంగూరి చిట్టెన్ రాజు

వెబ్‌ పత్రికలతో ఒక బెంగ తీరింది, కానీ…!

samvedana logo copy(1)

 

సీరియస్‌ సాహిత్యాన్ని ప్రచురించే పత్రికలు తగ్గిపోయాయి అనే మాట తరచుగా వినిపిస్తున్నది. కథలు రాస్తాం సరే, వేదిక ఏదీ అని ఆందోళన వ్యక్తమవుతున్నది. కథకుల సమావేశాల్లో ఈ సమస్య గురించి చర్చ జరుగుతున్నది. ఆ లోటు తీర్చడానికి వెబ్‌ మ్యాగజైన్లు వచ్చేశాయి. పత్రికల్లో వచ్చిందాంతో సమానం కాదు అనే మాట ఉండనే ఉంటుంది. అది వేరే సంగతి.

వెబ్‌ మ్యాగజైన్లు వస్తూ వస్తూ చాలామంది కొత్త రచయితలను వెంట తీసుకొచ్చాయి. కొన్ని పాత బెంగలను తీర్చేశాయి. తెలుగు చచ్చిపోతోందని కొందరు రచయితలు బోలెడంత ఆవేదన చెందేవాళ్లు. తమ బాధను ప్రపంచం బాధ చేయడానికి విశ్వప్రయత్నం చేసేవాళ్లు. కొత్త తరంలో సాహిత్యం రాసేవాళ్లే లేరని ‘మన’ తరంతోనే ఈ సాహిత్య వ్యాసంగం చచ్చిపోతుందేమో అని ఆందోళన వ్యక్తమయ్యేది. ముఖ్యంగా సింగమనేని నారాయణ లాంటి పెద్దమనుషులయితే రేపట్నించే తెలుగు మాయమైపోతుందేమో, మన గోడు పంచుకోవడానికి మనుషులను వెతుక్కోవాలేమో అన్నంత దిగులు అందరికీ పంచేవారు. ఆ బెంగను  వెబ్‌ మ్యాగజైన్లు తీర్చేశాయి.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల మీద బోలెడన్ని అపోహలుండేవి. ఐటి అనగానే తాగుడు, తినుడు, తిరుగుడు అని తా గుణింతం ఒకటి తెలుగులోకంలో ప్రచారంలో ఉండేది. వాళ్లు ఏమీ చదవరని, తమ తీపి బాధలు తప్ప ప్రపంచం బాధలు పట్టవని, వాళ్లవల్లే తెలుగునేల మీద తెలుగుదనం అంతరిస్తోందని ప్రచారం సాగుతుండేది. వెబ్‌ మ్యాగజైన్లు వచ్చాక ఈ అపోహను యథాతథంగా ప్రచారం చేసే అవకాశం పోయింది.

అంతకుముందు పత్రికల్లో కూడా అడపా దడపా సాఫ్ట్‌వేర్‌ రచయితలు కనిపించినా ఇపుడు కొత్త తరం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ వారితో పాటు చాలా రంగాల్లో పనిచేస్తున్న యువత సాహితీ ప్రపంచంలోకి దూసుకొస్తున్నది.

కాకపోతే ఏ మార్పు అయినా సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా రాదు. అతి విస్తరణ, ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టత లేకపోవడం అనే ముఖ్యమైన సమస్యలైతే ఉన్నాయి. రెండోది చాలా లోతైన వ్యవహారం.రచయితల ఎక్స్‌పోజర్‌ దగ్గర్నుంచి మన చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం దాకా చాలా అంశాలతో ముడిపడిన వ్యవహారం. సాహిత్యంపై లెఫ్ట్‌-లిబరల్‌ ప్రభావం పలుచబడడం స్పష్టంగా కనిపిస్తున్నది.

కేవలం సాహిత్యానికే పరిమితం కానటువంటి విస్తృతమైన రాజకీయార్థిక కోణాలున్నటువంటి ఆ సమస్యను పక్కనబెట్టి తొలి సమస్య వరకే పరిమితమవుదాం. స్థలానికి సంబంధించిన నియంత్రణ లేకపోవడం అనేది ఒక అర్థంలో రచనకు అవసరమే కావచ్చు. కథ ఇన్ని పేజీలే ఉండాలంటే ఎలా, సృజనకు హద్దులు గీస్తారా అనే హూంకారంలో కొంత న్యాయముండొచ్చు. ప్రశ్నలో న్యాయం కనిపించినంత మాత్రాన ప్రతి ప్రశ్న వెనుక న్యాయమైన ఉద్దేశ్యమే ఉన్నట్టు భావించనక్కర్లేదు.

ప్రశ్నించినవారందరూ కోరుకుంటున్న పరిష్కారం న్యాయమైనదే అయిఉండనక్కర్లేదు.  ఫలానా పార్టీ బిసిలకు తగినన్ని సీట్లు ఇవ్వడం లేదు అనే ప్రశ్న న్యాయంగానే కనిపించొచ్చు. కానీ దగ్గరగా పరిశీలిస్తే ఆ వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం వల్ల ఆతని వైయ్యక్తిక బాధకు సామాజిక కోణాన్ని ఆపాదించాడని అర్థమవుతుంది. ఫలానా సంకలనంలో నా కవిత, నా కథ ఎందుకు రాలేదు, ఫలానా అవార్డు నాకెందుకు రాలేదు అని ప్రశ్నించే బదులు  ఏదో ఒక సామాజిక వివక్షారూపాన్ని ఆపాదించేసుకుని దళితులకు అన్యాయం జరిగిందనో, స్ర్తీలకు అన్యాయం జరిగిందనో, మైనారిటీలకు అన్యాయం జరుగుతుందనో, తెలంగాణకు అన్యాయం జరిగిందనో చర్చను లేవదీసి అవతలివారిని బోనులో నిలబెట్టవచ్చును.

ఎందుకొచ్చిన గొడవ, ఇతని కథ అందులో పడేస్తే పోలా, ఒక అవార్డు ఇతని మొకాన కొడితే పోలా అనే స్థితిని కల్పించవచ్చును. వివక్షకు గురైన శ్రేణుల న్యాయమైన ప్రశ్నలు, ఆందోళనతో పాటే ఆ సమూహ శక్తిని వైయక్తికమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే శక్తులు ఎల్లప్పుడూ ఉంటాయి. అది కేవలం ఈ శ్రేణులకే పరిమితమైనది కాదు  కానీ వైయక్తికమైన ప్రయోజనాలు తీర్చుకోవడానికి న్యాయమైనదిగా కనిపించే సాధారణ అంశాల్ని ముందుపెట్టడమనే పెడధోరణి ఇటీవల పెరిగిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఆ ఊబిలోకి దిగితే బయటపడలేం. ఏదో రకమైన అధికారాన్ని ఆశించని, అధికారంలో ఆనందాన్ని వెతుక్కోని వ్యక్తుల సంఖ్య స్వల్పం. అధికారం లేని రాజకీయాలు ఆశావహంగా కనిపించనపుడు ఆ రాజకీయాలతో ముడిపడిన వారిలో సైతం మార్పు కనిపిస్తుంది.

Book and internet

అదెలాగూ సాధ్యం కాదు కాబట్టి ఉన్న రాజకీయాల్లో అధికారం కోసం పోటీపడదాం అనే ధోరణి తొంగి చూస్తుంది. అది కొన్ని సందర్భాల్లో పచ్చిగా కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో సోఫిస్టికేటెడ్‌గా కనిపిస్తుంది. మళ్లీ స్థల నియంత్రణ దగ్గరకు వద్దాం. నియంత్రణ అనేది  లేకపోతే ఏం జరుగుతుందో వెబ్‌మ్యాగజైన్లలో వచ్చే కొన్ని కథలను చూస్తే అర్థమవుతుంది. ఎటు తీసుకుపోతున్నారో తెలీని సుదీర్ఘప్రయాణాలు కనిపిస్తున్నాయి. చెలాన్ని ఇతరత్రా విషయాల్లో గుర్తుచేసుకుందాం కానీ ఇకానమీ ఆఫ్‌ వర్డ్స్‌ అండ్‌ థాట్స్ మాత్రం మర్చిపోదాం అనే వారు కనిపిస్తున్నారు.

వెబ్‌ అనేది బ్లాక్‌హోల్‌ అని తెలిశాక ఎంతైనా అందులో తోసెయ్యొచ్చు అనిపిస్తుంది. ఏం ఎడిట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. దానికితోడు సైబర్‌ ప్రపంచం లైకుల మీద కామెంట్లమీద నడుస్తుంది. సీరియస్‌ విమర్శకు అవకాశం తక్కువ. బాగుందండీ, చాలా బాగుందండీ దగ్గర్నుంచి అద్భుతమండీ వరకూ  భుజతాడనాలు ఎక్కువ. రచనకు అప్పటికప్పుడు స్పందన చూసుకొని ఆ చర్చలో భాగం పంచుకోవడమనే అవకాశము ఇందులోని సానుకూల కోణమైతే మన ఉనికి బయటపడకుండా కామెంట్‌ విసరగలిగే అవకాశం ఇందులోని లోపం. అజ్ఞాతంలో మనిషి స్వైరుడయ్యే అవకాశం ఎక్కువ. ఇది ఆరోగ్యకరమైన చర్చను పక్కదారిపట్టించే ప్రమాదం ఉంటుంది.
సాధారణంగా తాను రాసిన ప్రతివాక్యం సామాజిక శాసనం వంటి భావన కొందరు రచయితల్లో ఉంటుంది. పత్రికల్లో సాహిత్య పేజీల నిర్వాహకులు అపుడపుడు ఈ గాలిబుడగను సూదితో గుచ్చేవాళ్లు. వెబ్‌ మ్యాగజైన్ల నిర్వాహకులు తమ సాహిత్య సామాజిక ఆసక్తికొద్దీ శ్రమను వెచ్చించువారు. స్వయంగా సాహిత్యజీవులు. మార్పులు సూచించో, తిరస్కరించో రచయిత మోరల్‌ను దెబ్బతీయడమెందుకులే అనే సంశయం ఉండొచ్చు. అందులోనూ పత్రికల్లో అయితే స్థలాభావం పేరుతో అయినా ఎడిటింగ్‌ సూచించవచ్చు. కానీ ఇక్కడ స్థలాభావం అని చెప్సడానికి లేదు. ఫలితం, భుజబలం బుధ్దిబలాన్ని అధిగమించిన కథలు కనిపిస్తున్నాయి.

నిజమే, దిన పత్రికల సాహిత్యపేజీల నిర్వాహకుల్లో కొందరు దాన్ని బెత్తంగానో, కిరీటంగానో భావించి ఉండొచ్చు. ఏదో ఒక అధికార సాధనంగా మార్చుకుని ఉండొచ్చును. కానీ వ్యక్తులను పక్కనబెడితే స్థలనియంత్రణ అనేది రచయితలోని ఎడిటర్‌ను వెలికి తీసేందుకు ఉపయోగపడేది. సాంద్రతకు ఉపయోగపడేది. గాఢతకు ఉపయోగపడేది. స్వయం నియంత్రణ ఉన్న రచయిత కథ వేరు. ఖదీర్‌ తన కథను ఎన్నిసార్లు పునర్లిఖిస్తాడో ఎంతగా శ్రమిస్తాడో నాకు బాగా తెలుసు. తన శక్తి కథకు తప్ప మరోదానికి పెట్టాల్సిన అవసరం లేనంతగా పరిసరాలను ఏర్పరుచుకుంటాడు కూడా. అతన్ని దగ్గరగా చూసినందువల్ల సాధికారంగా ఉటంకిస్తున్నాను తప్పితే అతనొక్కడే అని కాదు. సీనియర్‌ కథకులు చాలామందిలో మనకు వారు పడిన శ్రమ అర్థమవుతుంది. ఆయా కథల మీద మనకు వేరే రకమైన విమర్శలు ఏవైనా ఉండొచ్చును కానీ వారు కథను బాధ్యతగా తీసుకుంటారు.  ఇపుడది కాస్తలోటుగా అనిపిస్తున్నది.  రాసిన ఇంకు ఆరకముందే అచ్చులో పడితే బాగుంటుందనే ఆత్రం పెరిగినట్టు అనిపిస్తోంది.
వెబ్‌ పత్రికలు చేసిన మరోమేలు భాషకు సంబంధించింది. ఆయా సందర్భాల్లో పాత్రలు పలికే సంభాషణల్ని కూడా యథాతథంగా రాయకుండా బూతుఫోబియా అడ్డుపడేది. మన సాహిత్య సంప్రదాయంలో ఇదొక అనవసరమైన అడ్డుగోడ. ఈ గోడను బద్దలు కొట్టిన రచనలు అరుదు. వసంతగీతం లాంటివి ఒకటో రెండో చెప్పుకోవచ్చు.పత్రికా మర్యాదలయితే చాలానే ఉండేవి. అతను ఆమెలోకి ప్రవేశించాడు అని మాగజైన్‌ మధ్యపేజీలో రాయొచ్చు. కానీ లంజె అని అతను తిట్టిన మాట మాత్రం వాడరాదు. బూతును భావనగా కాకుండా భాషకు పరిమితం చేసే వ్యవహారం మనకు ఎక్కువ.  ఎబికె లాంటివాడు దాన్ని బద్దలు చేసి పచ్చనాకు సాక్షిగా కొత్తగాలికి తెరలేపినా అది తెలుగు సమాజానికి నామిని అనే అద్భుతమైన రచయితను ఇచ్చింది కానీ పత్రికల్లో ఒక ధోరణిగా స్థిరపడలేదు.

గతంలో ఉమామహేశ్వరరావు ఆంధ్రజ్యోతి సండే ఇన్‌ చార్జిగా ఉన్నపుడు గాడిద ప్రస్తావనతో ఉన్న చిన్న కథను యథాతథంగా అచ్చేస్తే పత్రికలో పనిచేసే మర్యాదస్తులైన సీనియర్‌ ఉద్యోగులు ఎంత గొడవ చేశారో ఇంకా గుర్తుంది. నేను ఒక పద్యంలో కొన్ని హాండ్‌ షేకులను బురదమట్టలతోనూ, రత్యానంతర శిశ్నంతోనూ పోలిస్తే అదే సీనియర్లు ఎంత గొడవ చేశారో గుర్తుంది. ఇపుడు వెబ్‌ మ్యాగజైన్ల వల్ల ఆ మర్యాదలు తొలిగిపోయే అవకాశం వచ్చింది.

ఐరోపా, పశ్చిమదేశాల్లోని సీరియస్‌ రచయితలు సైతం ఫలానా ఫలానా వ్యక్తీకరణలను యధేచ్ఛగా వాడుతున్నారు. మనం ఎందుకు సంభాషణల్లో ఇంత మర్యాదగా అసహజంగా వ్యవహరిస్తున్నాం అనే వారు పెరిగారు.ఈ ఎరుక శుభసూచకం. అది మరీ ఫ్యాషన్‌గా మారిపోయి దానికదే ఒక విలువగా మారిపోతే ప్రమాదమనుకోండి. అది వేరే విషయం. సాధారణంగా సీరియస్‌ రచయితలు రచన తర్వాత వచ్చే స్పందన కంటే రచనను ఎక్కువ ప్రేమించారు  అనే వాస్తవాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే మనం ఒక పద్యమో, కథో అచ్చేశామనుకోండి. మనకు పరిచయమున్న వారు, లేనివారు  ఓ యాభై మంది లైక్‌ చేస్తారు.  బాగుందండీ అనేస్తారు. పత్రికలో ఫోన్‌ నెంబర్‌ ఇచ్చామనుకోండి. ఓ వందమంది ఫోన్‌ చేసి బ్రహ్మండమండీ అనేస్తారు. నెట్‌లో అయితే ప్రశంస ఒక క్లిక్‌ దూరం కాబట్టి చేసేస్తారు. అదే నిజమైన స్పందన అని తృప్తి పడితే బోల్తా పడే ప్రమాదం ఉంది. అక్కడే ఆగిపోయే ప్రమాదం ఉంది.

-జి ఎస్‌ రామ్మోహన్‌

ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ…ఈ కవిత!

varavara.psd-1

అవి నేను వరంగల్ లో బి.ఎ. చదువుతున్న రోజులు. హనుమకొండ చౌరస్తాలో అశోకా ట్రేడర్స్ ముందరి సందులో మా కాలేజి స్నేహితుడు కిషన్ వాళ్ల పెద్దమ్మ ఇల్లు ఉండేది. నేనెక్కువగా అక్కడే గడిపేవాణ్ని. రాత్రిళ్లు అక్కడే పడుకునేవాణ్ని. వాళ్లింట్లో ఒక కుక్కపిల్ల ఉండేది. వాడ కుక్కల్లోనే ఒక కుక్కను మచ్చిక చేసుకొని పెంచుకున్నారు. దానితో ఆడుకోవడం, దానికి బిస్కెట్లు పెట్టడం, అది మా రాక కోసం ఎదురుచూడడం.

అకస్మాత్తుగా ఒకరోజు ఆ కుక్కపిల్ల చచ్చిపోయింది. అంటే దాని చావును గానీ, చనిపోయిన ఆ కుక్కపిల్లను గానీ నేను చూడలేదు. ఆరోజు, ఆ తర్వాత ఆ ఇంట్లో అది కనిపించలేదు. పెద్దమ్మ కళ్లనీళ్లు పెట్టుకొని కుక్కపిల్ల చనిపోయిందని చెప్పింది.

ప్రాణస్నేహాన్ని పోగొట్టుకున్న బాధ. వెలితి. చేతులు ఏదో వెతుక్కున్నట్లు. వెతుకులాట మనసుకు. ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ కవిత ఆ వేదననుంచి వచ్చింది.

11hymrl01-RDF_G_HY_1235147e

అప్పటికే నాకు కవిగా కొంచెం గుర్తింపు వచ్చింది. 1950లలో ‘భారతి’లో కవిత్వం అచ్చయితే కవి. ‘తెలుగు స్వతంత్ర’లో అచ్చయితే ఆధునిక కవిగా గుర్తింపు వచ్చినట్లే. రష్యా రోదసిలోకి స్పుత్నిక్ లో లైకా అనే కుక్కపిల్లను పంపించినపుడు నేను రాసిన ‘సోషలిస్టు చంద్రుడు’ (1957) ‘తెలుగు స్వతంత్ర’లో అచ్చయింది. ఆ తర్వాత ‘భళ్లున తెల్లవారునింక భయం లేదు’, ‘శిశిరోషస్సు’. ‘హిమయవనిక’ అనే కవితలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన వచనకవిత్వ పోటీల్లో, ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో బహుమతులు వచ్చి సాహిత్య విద్యార్థులు మొదలు సి నారాయణరెడ్డి గారి దాకా అభిమానం చూరగొన్నవి.

varavara_rao.gif

‘భళ్లున తెల్లవారునింక భయం లేదు. కుళ్లు నల్లదని తెలుస్తుంది నయంగదా’, ‘ఇనుని అరుణ నయనాలు’ వంటి పాఠ్యపుస్తకాల ప్రభావం ఎక్కువే ఉన్నా, ‘వానిలో ఎన్నిపాళ్లు ఎర్రదనం, ఎన్నిపాళ్లు ఉడుకుదనం ఉందో రేపు కొలుస్తాను, రేపు మంచిరోజు ఎర్రని ఎండ కాస్తుంది, రేపు వసుధైక శాంతి ఎల్లెడల నిండుతుంది’ వంటి ఆశావహ ఆత్మవిశ్వాస ప్రకటనలతో నాకు ‘ఫ్రీవర్స్ కవులలో సామాజిక ప్రగతివాద’ ప్రతినిధిగా ఒక గుర్తింపు వచ్చింది.

శకటరేఫాలు మొదలు ప్రబంధ కవిత్వ భాష, వర్ణనలు, ఊహలు, ఉత్ప్రేక్షలు, ఇమేజరీ ఉన్నా ప్రగతివాద భావజాలానికి చెందిన కవిగా నాకొక ఇమేజ్ ఈ కవితలతో ఏర్పడింది. రాత్రి, మంచు వంటి సంకేతాలతో స్తబ్దతను, భయాందోళనలను, సూర్యుడు, ఉషస్సు వంటి సంకేతాలతో భవిష్యదాశావహ ఆకాంక్షను వ్యక్తం చేసే కాల్పనిక ఆశావాదం అట్లా మొదలై 1968 తర్వాత ఒక విస్పష్ట ప్రాపంచిక దృక్పథంగా స్థిరపడింది. అట్లా చూసినప్పుడు కవితాసామగ్రి, భాష, వ్యక్తీకరణలకు సంబంధించినంతవరకు ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ ఒక డిపార్చర్. ఒక ప్రయోగం. పై నాలుగు కవితల్లో ఊహ, బుద్ధి, రచనా శక్తిసామర్థ్యాల ప్రదర్శన ఉంటే ఇందులో ఫీలింగ్స్ సాధారణ వ్యక్తీకరణ ఉంటుంది.

‘నా రెక్కల్లో ఆడుకునే కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?’ మనుషులు వెళిపోతారంటే నమ్మగలను. వాళ్లకోసం, అందులోనూ మగవాళ్ల కోసం ఒక స్వర్గలోకం ఉంది. అందుకని వాళ్లు ఇహంలో అన్ని అనుబంధాలూ వదులుకొని వెళ్లగలరు. ‘కాని కుక్కపిల్ల వెళిపోవడమేమిటి?’‘అంత నమ్మకమైన జీవం ఎక్కడికని వెళ్లగలదు? ‘ఎవడో స్వార్థంకై, నేను లేనపుడు ఏమిటో దొంగిలించడానికి వస్తే మొరుగుతూ తరమడానికి వెళ్లి ఉంటుంది. ప్రలోభాలు నిండిన వాళ్లను ఆ లోకందాకా తరిమి తెలవారేవరకు తెప్పలా ఇలు వాకిట్లో వాలుతుంది.’

అయినా దానికా స్వర్గంలో ఏముంది గనుక

అక్కడుంటుంది?

స్వర్గంలోని వర్గకలహాలు

రేపు దాని కళ్లల్లో చదువుకుంటాను’.

నేను సికెఎం కాలేజిలో పనిచేస్తున్నపుడు 1969లో పి జి సెంటర్ లో ఇంగ్లిష్ ప్రొఫెసర్ గా ఉన్న మిత్రుడు పార్థసారథి ఈ కవితను హిందీలోకి అనువదించగా, జ్ఞానపీఠ్ సాహిత్య పత్రికలో అచ్చయింది. నండూరి రామమోహనరావుగారు ‘మహాసంకల్పం’ కవితాసంకలనం వేసినపుడు ఈ కవిత ఇవ్వమని కోరాడు. ఏ కవిత ఇవ్వాలో నేను నిర్ణయించుకోవాలి గానీ, మీరు నిర్ణయిస్తే ఎట్లా అని నిరాకరించాను. సంపాదకునికి, సాహిత్య విమర్శకునికి కవి కవితల్లో తనకు ఇష్టమైనవి ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆలస్యంగా గుర్తించి ఆయనకు క్షమాపణలు చెప్పుకుంటూ ఉత్తరం రాసాను. అట్లని నేను 1964లో నెహ్రూ మీద రాసిందో, 65లో పాకిస్తాన్ తో యుద్ధం గురించి రాసిందో ఇపుడు ఆ భావాల ప్రచారానికి ఎవరైనా వాడుకుంటే అది మిస్చిఫ్ అవుతుంది.

ఇప్పుడు అఫ్సర్ ‘సారంగ’లో నా కవితలను నేనే ఎంచుకుని పరిచయం చేయాలని కోరినపుడు నా ఇమేజ్ కు కొండగుర్తులుగా నిలిచిన కవితలు కాకుండా తాత్విక స్థాయిలో, కవి హృదయాన్ని పట్టి ఇవ్వగల కవితగా కూడ ‘కుక్కపిల్ల ఎక్కడికని వెళిపోతుంది?!’ నే ఎంచుకోవాలనిపించింది.

–          వరవరరావు

-ఏప్రిల్ 30, 2014

 

పరాశరుడు…మత్స్యగంధి… 2012, డిసెంబర్ 16

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

మనకు తెలుసు…పురావస్తు నిపుణులు చారిత్రకమైన ఆనవాళ్ళు దొరకవచ్చునని అనుమానించిన చోట తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఆ తవ్వకాలలో ఒక్కొక్కసారి భవనాలు, ఇళ్లేకాక కాక; నగరాలు, పట్టణాలు కూడా బయటపడుతూ ఉంటాయి. కాలగతిలో వాటిని భూమి కప్పేసిందన్నమాట. ఆ కప్పేసిన చోట మరో భవనం, లేదా మరో నగరం, లేదా మరో ఊరు ఏర్పడతాయి. దాని మీద మరొకటి ఏర్పడుతుంది. వాటిని పొరలు (layers) అంటారు. ఒక్కొక్క పొర ఎప్పుడు ఏర్పడిందో పురావస్తు నిపుణులు అంచనా వేస్తుంటారు. ఈవిధంగా అనేక చారిత్రక రహస్యాలను కాలగర్భంతోపాటు భూగర్భం కూడా మోస్తూ ఉంటుందన్న మాట.

ఇప్పుడు ఇదే ప్రక్రియను పురాణ, ఇతిహాసాలకు అన్వయించి చూద్దాం. ఇవి ఇప్పటిలా లిఖిత రూపానికి చెంది, స్థిరమైన ఆకృతిని పొందిన అచ్చుపుస్తకాల వంటివి కావు. మౌఖిక సంప్రదాయానికి చెందినవి. అసలు కథ బీజరూపంలో అట్టడుగున ఉంటుంది. అది ఒక పొర. మాంత్రికతను ఆపాదించే అత్యుత్సాహంతో ఆ కథ ఒక అద్భుతత్వాన్ని సంతరించుకుంటుంది. అది ఇంకొక పొర. ఆ కథ చిలవలు పలవలు తెచ్చుకుంటూ మరింత విస్తరిస్తుంది. ఒక్కొక్కసారి చిన్న కథ కాస్తా పెద్ద కథ, పెద్ద కావ్యం అవుతుంది. ఇదొక పొర. దానిమీద పండితుల భాష్యాలు, వ్యాఖ్యలూ,వివరణలూ మొదలవుతాయి. ఇది వేరొక పొర. కాలంలోనూ, సమాజంలోనూ, విలువల్లోనూ వస్తున్న మార్పులు కూడా ఈ ఒక్కొక్క పొరనే ప్రభావితం చేస్తూ, ఆ పొరలకు ఒక రూపం ఇస్తూ ఉంటాయి.

అయితే భూమిలో కప్పబడే పురానిర్మాణాలకు; పురాణ ఇతిహాసాలకు ఒక మౌలికమైన తేడా ఉంది. పురానిర్మాణాలు లేదా వస్తువులపై మన ప్రయత్నం లేకుండానే పొరలు ఏర్పడుతుంటాయి. పురాణ ఇతిహాసాలు మనిషి బుద్ధికీ, ఊహాశక్తికీ చెందినవి. కనుక వాటి పొరలకు రూపమివ్వడంలో మనిషి ప్రయత్నం ఉంటుంది. అతని ఇష్టాయిష్టాలు పనిచేస్తాయి. పురాణ ఇతిహాసాలు మనిషి విశ్వాసంలో లేదా మతంలో భాగమైనప్పుడు ఈ పొరలు మందంగా మారిపోతాయి. అప్పుడు పొరలు ఏర్పడడం అనే ప్రక్రియే ఆగిపోవచ్చు కూడా. ఏవైనా విశ్వాసంలో, మతంలో భాగమయ్యాయంటే, వాటితో కాలానికీ, సమాజానికీ ఉన్న ముడి తెగిపోతుంది. వాటికి ఒక స్వతంత్ర అస్తిత్వం ఏర్పడుతుంది. విశ్వాసమూ, మతమూ ఆమోదించిన మేరకే వాటి పొరల్లోకి తలదూర్చాలి తప్ప మన ఇష్టానుసారం తలదూర్చడానికి వీలులేదు. అడుగు పొరలనుంచి ఎంత దూరంగా వెడితే అంత క్షేమమన్న అప్రకటిత హెచ్చరిక అజ్ఞాతంగా ఉంటుంది. పొరల చుట్టూ మీద మౌనమనే ఉక్కుతెర వేలాడుతూ ఉంటుంది.

ఇప్పుడు మనం వ్యాసుని జన్మవృత్తాంతం చెప్పుకుని, ఈ పొరల సూత్రం దానికి ఏమైనా అన్వయిస్తోందేమో చూద్దాం.

***

Satyavati

తండ్రి దాశరాజు ఆదేశంతో మత్స్యగంధి యమునానదిలో పడవ నడుపుతుండగా, ఒక రోజున…

వశిష్టుని మనవడు, శక్తి కొడుకు అయిన పరాశరుడు అనే ముని ఆమెను చూశాడు. అప్పుడతను తీర్థయాత్రకు వెడుతున్నాడు. అతను మద మాత్సర్యాలు లేని సాధుస్వభావి. అతన్ని ముల్లోకాలూ పొగడుతుంటాయి. అతను గొప్ప బుద్ధి కలిగినవాడు, తపస్సపన్నుడు. వ్రతనిష్ఠ కలిగినవాడు.

ఏకవస్త్రంతో ఒంటరిగా ఉండి పడవ ఎక్కేవారికోసం ఎదురుచూస్తున్న మత్స్యగంధిని చూడగానే అతనికి ఆమెపై వాంఛ కలిగింది. తన దివ్యజ్ఞానంతో ఆమె ఎవరో తెలుసుకున్నాడు. పడవ ఎక్కాడు. పడవ ప్రయాణిస్తోంది. పరాశరుడు మత్స్యగంధినే చూస్తున్నాడు. ఆమెవి ఎంత అందమైన కళ్లో అనుకున్నాడు. ఆమె చనుదోయిని గిల్లాలని అతనికి అనిపిస్తోంది. ఆమె సన్నటి నడుము అతని మనసులో నిలిచిపోయింది. ఆమె కటి ప్రదేశాన్ని తదేకంగా చూస్తున్నాడు. ఆమె మీద తనకు కోరిక కలిగిందని సూచించే మాటలు ప్రారంభించాడు. ఆమె ఎలాంటి సమాధానం ఇస్తుందో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరాడు. తన మాటలకు సిగ్గుపడుతున్న ఆ కన్య మీద పడి సిగ్గును పోగొట్టడానికి ప్రయత్నించాడు.

ఎంత శాంతులైనా, ఎంత వాంఛను జయించినవారైనా ఆడది ఒంటరిగా కనిపిస్తే వాళ్ళ మనస్సు చెదురుతుంది. మన్మధుడి శక్తిని ఓర్చుకోవడం ఎవరి తరం?!

ఈవిధంగా సిగ్గు విడిచేసి పరాశరుడు తన కోరిక వెల్లడించేసరికి ఆ కన్య సందిగ్ధంలో పడింది. తను ఒప్పుకోకపోతే శాపమిస్తాడేమోనని భయపడింది…

‘నేను జాలరిదాన్ని. నా ఒళ్ళంతా చేపల కంపు కొడుతూ ఉంటుంది. అదీగాక నేను కన్యను. నా కన్యాత్వం అంతరిస్తే నా తండ్రి గడప ఎలా తొక్కగలను? కనుక దోషం అంటకుండా అనుగ్రహించు’ అంది.

మత్స్యగంధి మాటలకు పరాశరుడు సంతోషించాడు. ‘నా కోరిక తీర్చడంవల్ల నీ కన్యాత్వం చెడదు’ అని వర మిచ్చాడు. ‘నువ్వు వసురాజు వీర్యం వల్ల జన్మించినదానివి తప్ప, శూద్రకులంలో పుట్టినదానివి కావు’ అంటూ ఆమె పుట్టుక గురించి చెప్పాడు. చేపల కంపు పోయి ఆమె శరీరమంతా సుగంధాన్ని తెచ్చుకునేలానూ, యోజనం దూరంలో ఉన్నవారికి కూడా ఆ సుగంధం తెలిసేలానూ అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆమె ఒంటి మీద దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలూ వచ్చేలా చేశాడు. మత్స్యగంధి పడవను ఒక ద్వీపానికి చేర్చింది.

అయినా ఒక శంక ఆమెను పీడిస్తూనే ఉంది.

‘అందరూ చూసేలా ఇలా బట్ట బయలు మనం ఎలా కలుస్తాం?’ అంది. అప్పుడు పరాశరుడు తాము ఎవరి కంటా పడకుండా మంచు చీకట్లు కల్పించాడు.

ఉత్తమగుణాలే ఆభరణాలుగా, ఎలాంటి దోషమూ లేని మనోహరరూపంతో ఉన్న సత్యవతికి బ్రహ్మతో సమానుడైన పరాశరమహర్షి వల్ల అప్పటికప్పుడు, సూర్యుని తలపించేలా వేదమయుడు, ఆదిముని, పుట్టుజ్ఞాని అయిన వేదవ్యాసుడు జన్మించాడు.

పరాశరుడు సత్యవతికి కోరిన వరాలు ఇచ్చి తన దారిన తాను వెళ్లిపోయాడు. అప్పుడు కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు జింకచర్మాన్ని ధరించి, ఎర్రని జడలతో, దండకమండలాలతో తల్లి ముందర నిలిచి, ఆమెకు మొక్కి,‘మీకు నాతో పని కలిగితే నన్ను తలచుకోండి, వెంటనే వస్తాను’ అని చెప్పి తపోవనానికి వెళ్లిపోయాడు. మహాభయంకరమైన తపస్సు చేసి వేదాలను విభాగం చేసి, ఆ తర్వాత విశ్వశ్రేయస్సుకోసం పంచమవేదమైన ఈ భారతసంహితను చేశాడు.

***

ఈ కథను నేను ఇంతకుముందు ఒకసారి చదివాను. అది, 2012, డిసెంబర్ 16 కు ముందు! ఇప్పుడు 2014, ఏప్రిల్ లో ఈ వ్యాసంకోసం మరోసారి చదివాను. నిజం చెప్పాలంటే, ఈసారి ఈ కథ చదివిన తర్వాత నేను మరింత ‘డిస్టర్బ్’ అయ్యాను. దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఏ స్థాయిలో నంటే, ఈ వ్యాసాలకు నేను నిర్దేశించుకున్న పరిమితులనుంచి కొంచెం పక్కకు జరిగినట్టు అనిపించినా సరే, ఈ కథ నాలో కలిగించిన అలజడిని దాచుకోలేనంతగా!

2012, డిసెంబర్ 16 అని నేను ప్రత్యేకంగా ఒక తేదీని ఎందుకు ఇచ్చానో ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు. ఆ రోజున ఢిల్లీలో ‘నిర్భయ’గా అందరూ చెప్పుకుంటున్న ఒక అమ్మాయిని అత్యంత పైశాచికంగా చెరచి, హత్యచేసిన ఘటన జరిగింది. ఈ దేశంలో స్త్రీలపై లైంగిక అత్యాచారాలు ఎంతో కాలంగా జరుగుతున్నాయి. వాటిలో చాలా కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తూ పత్రికలలో లోపలి పేజీ వార్తలు మాత్రమే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన జనాగ్రహమూ, అనంతర చర్యలూ మానభంగాల చరిత్రను, కనీసం భావనలోనైనా కొత్త మలుపుతిప్పాయి.

నిర్భయ ఘటన జరిగిన తర్వాత కూడా దేశంలో మానభంగాలూ, హత్యలూ జరుగుతూనే ఉన్నాయి. అయితే, మానభంగాలపై ఇంతకు ముందు లేనంత ఎక్కువగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. మానభంగాలకు ఇప్పుడు పెద్ద శిక్ష పడుతుందన్న ఒక భావన అయితే ఏర్పడింది. మానభంగాలపై సమాజం స్పందనలో తీవ్రత పెరిగింది.

2009-09-30stolensistersupdatereport

అంతేనా? లైంగిక వేధింపులను, అత్యాచార ఘటనలను సాధారణంగా కప్పిపుచ్చడమే పరిపాటిగా ఉన్న సమాజంలో కొందరైనా ధైర్యం చేసి గతంలో లేదా వర్తమానంలో తమపై జరిగిన లైంగిక అత్యాచారాల గురించి చెప్పుకునే(పేరు బయటపెట్టకూడదన్న పరిమితికి లోబడి) అవకాశం కలిగింది. చివరికి లైంగిక వేధింపుల లేదా అత్యాచార నిందితులన్న ముద్రతో న్యాయమూర్తులను, పత్రికా సంపాదకులను కూడా బోనులో నిలబెట్టడం ఈ సరికొత్త స్పృహకు పరాకాష్ట. జస్టిస్ స్వతంత్ర కుమార్, జస్టిస్ ఎ. కె. గంగూలీ,‘తెహల్కా’ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ఉదంతాలు ఈ క్రమంలోనే ముందుకొచ్చాయి. జస్టిస్ ఎ. కె. గంగూలీ తన పదవులను కోల్పోగా, తరుణ్ తేజ్ పాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

***

 

ఇప్పుడు పరాశరుడు-మత్స్యగంధి ఉదంతాన్ని చూడండి. పరాశరుడు వశిష్టు డంతటి మహర్షికి మనవడు, వ్యాసునంతటి మహర్షికి తండ్రి అనే వివరాన్ని కాసేపు పక్కన పెడదాం…కాసేపే!…

పైన చెప్పిన న్యాయమూర్తులు, సంపాదకుని ప్రతిబింబం పరాశరునిలో అచ్చుగుద్దినట్టు కనిపించడం లేదా?!.

ఒక నిర్జన ప్రదేశంలో, ఒంటరిగా అతనికి మత్స్యగంధి కనిపించింది. ఆమెపై అతనికి కలిగిన లైంగిక వాంఛ ఎన్ని రూపాలలో బయటపడాలో అన్ని రూపాలలోనూ బయటపడింది. ఉదాహరణకు, ఆమె కళ్ల దగ్గరనుంచి జఘనప్రదేశంవరకూ కాముకత్వం ఉట్టిపడే చూపులతో అతను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. అది నేత్రపరమైన లైంగిక అత్యాచారం. ఆమె చనుదోయిని గిల్లాలనుకున్నాడు. అంటే, అతని కాముకత్వం క్రియారూపాన్ని ధరించడానికి సిద్ధంగా ఉందన్న మాట. ఆ తర్వాత నిస్సిగ్గుగా తన కోరికను వెల్లడించాడు. అది వాచికమైన లైంగిక అత్యాచారం. అంతేనా, సిగ్గుపడుతున్న ఆమె మీదపడి సిగ్గుపోగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇది కాయికమైన(శారీరకమైన) లైంగిక అత్యాచారం. స్త్రీపై జరిగే అత్యాచారంలో అది ఆఖరి మెట్టు.

పోనీ ఇది పరస్పరాంగీకారం ఉన్న లైంగిక సంబంధమా, కాదు. కాదంటే శపిస్తాడేమోనన్న భయంతోనే మత్స్యగంధి అతని కోరిక తీర్చడానికి అంగీకరించింది. న్యాయమూర్తులు తమ వద్ద శిక్షణలో ఉన్న న్యాయవాద యువతులతో లైంగికంగా చొరవ తీసుకున్నారన్న ఆరోపణను; సంపాదకుడు తన సంస్థలో పనిచేస్తున్న ఒక జర్నలిస్టుపై అత్యాచారం జరిపాడన్న ఆరోపణను గమనించండి…అక్కడ జరిగింది కూడా; తమ అధికారాన్ని, లేదా తమతో ఆ యువతులకు ఉన్న అవసరాన్ని అడ్డుపెట్టుకుని వారిని భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నమే. పరాశర-మత్స్యగంధుల ఉదంతం ఈ విషయంలో కూడా పై ఉదంతాలతో అతికినట్టు సరిపోతోంది.

***

మన పురాణ, ఇతిహాస కథలను ఎలా అర్థం చేసుకోవాలనే విషయంలో సాధారణంగా సంప్రదాయ పండితులనుంచి ఒక వాదం వినిపిస్తూ ఉంటుంది. వాటిలో పైకి కనిపించే అర్థం వేరు, అంతరార్థం వేరు అన్నదే ఆ వాదం. అంతరార్థం తెలుసు కోవడం కూడా అందరికీ సాధ్యం కాదు. అందులో తగినంత శిక్షణ ఉండాలి. పరిశ్రమ ఉండాలి. అది కూడా గురుముఖతా జరగాలి. ఆ తర్వాత కూడా అనుమానాలు మిగిలిపోవచ్చు. అప్పుడు గురువాక్యాన్ని, లేదా వేదాన్ని ప్రమాణంగా తీసుకుని అనుమానాలకు అడ్డుకట్ట వేసేయాలి.

ఇప్పుడు పరాశర-మత్స్యగంధుల ఉదంతానికి కూడా ఇదే సూత్రాన్ని అన్వయించే ప్రయత్నం ఎవరైనా చేస్తారేమో తెలియదు. అందులోని ఔచిత్య, అనౌచిత్యాలను ప్రశ్నించే ఆసక్తి కూడా నాకిప్పుడు లేదు. ఒకవేళ ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తే, నా ప్రశ్న ఒకటే: పురాణ ఇతిహాసాలు అందరికీ అందుబాటులో ఉండే ప్రజాక్షేత్రంలో ఈనాడు ఉన్నాయి. ఆ అందరిలో అన్ని వర్గాలవారూ, అన్ని వయసులవారూ ఉంటారు. వారందరికీ అంతరార్థాలు బోధపరచుకునే శిక్షణ ఉండకపోవచ్చు. లేదా అటువంటి అంతరార్థాల సిద్ధాంతాన్ని వాళ్ళందరూ ఒప్పుకోకపోవచ్చు. అటువంటి వారికి పరాశర-మత్స్యగంధుల ఉదంతం ఉన్నది ఉన్నట్టుగా ఇస్తున్న సందేశం ఏమిటి?

పోనీ దీని వెనుక ఏవో అంతరార్థాలు ఉంటాయని మనం మాటవరసకు ఒప్పుకున్నా, నేను పరిశీలించిన టీటీడీ వారి మహాభారత ప్రచురణలో వ్యాఖ్యాతలు ఈ ఉదంతం వెనుక ఏవో అంతరార్థాలు ఉన్నట్టు చెప్పలేదు. అందులోకి వెళ్ళేముందు, మొదటగా పేర్కొన్న పొరల సూత్రం ఈ ఉదంతానికి ఇలా అన్వయించుకుందాం:

పొర: 1

కథకు అట్టడుగున ఉన్న పొర ఇది. ఈ పొరలో జరిగింది ఒకటే. పరాశరుడు అనే పురుషుడికీ, మత్స్యగంధి అనే స్త్రీకీ లైంగిక సంబంధం ఏర్పడింది. వారికి వ్యాసుడు అనే కొడుకు పుట్టాడు. వారిద్దరి సామాజిక నేపథ్యం ఏదైనా కావచ్చు. అది పరస్పరాంగీకారం ఉన్న లైంగిక సంబంధం కావచ్చు, కాకపోవచ్చు. భిన్న సామాజిక నేపథ్యం ఉన్న స్త్రీపురుషుల మధ్య లైంగిక సంబంధం అప్పుడు సహజం కావచ్చు, కాకపోవచ్చును కూడా. అది స్త్రీ-పురుషుల మధ్య సమాన ప్రతిపత్తి గల లైంగిక సంబంధం కావచ్చు; లేదా పురుషుడిది పై చేయి, స్త్రీది కింది చేయిగా ఉన్న అసమ లైంగిక సంబంధం కావచ్చు. ఈ ఘట్టంలో, అది కావచ్చా, ఇది కావచ్చా అనే చర్చలోకే అసలు వెళ్లకుండా ఒక పురుషుడికీ, ఒక స్త్రీకీ మధ్య ఏర్పడిన లైంగిక సంబంధంగానే దీనిని చెప్పుకుందాం. అంటే దీనికి ఎటువంటి సామాజిక, కాలిక, విలువల కోణాన్నీ ఆపాదించకుండానన్న మాట. ఇలా చూసినప్పుడు పరాశరుడికి ఒక న్యాయం జరిగే అవకాశముంది. ఎలాగంటే, తన కులాన్ని, తనకు ఉన్నట్టు తోపించే శాపానుగ్రహశక్తినీ అడ్డుపెట్టుకుని మత్స్యగంధిని అతను భయపెట్టి లొంగదీసుకుని ఉండకపోవచ్చన్న సంశయలాభా(benefitofdoubt)న్ని అతనికి ఆపాదించవచ్చు.

పొర: 2

పొర: 2 దగ్గరికి వచ్చేసరికి కాలం మారింది. సమాజమూ, దాని తాలూకు విలువలూ కూడా మారాయి. అందుకు తగినట్టు మహాభారత కథ చెప్పే కథకుడూ మారాడు. అతని వ్యూహాలు, ప్రాధాన్యాలూ మారాయి. అంటే ఏమిటన్న మాట, మొదటి పొరలోని పరాశరుని, మత్స్యగంధినే తీసుకుని తన వ్యూహ, ప్రాధాన్యాలకు అనుగుణంగా వారిని మలచుకుంటున్నాడన్న మాట. ఆ విధంగా చూసినప్పుడు, దృష్టిపరంగా, వాచికంగా, కాయకంగా పరాశరునిలో చిత్రించిన లైంగిక అత్యాచార ప్రవృత్తి వాస్తవంగా అతనిది కాకపోవచ్చు, కథకుడు ఆపాదించినది కావచ్చు.

ఇక్కడ కథకుడు అన్నప్పుడు వ్యాసునో, నన్నయనో దృష్టిలో పెట్టుకుని అనడంలేదు. వందల సంవత్సరాలపాటు మౌఖిక రూపంలో ఉన్న కథకు ఎందరో కథకులు ఉంటారు. కనుక ఒక కథకుని నిర్దిష్టంగా గుర్తించడం కష్టం.

కథకుడు అలా ఎందుకు ఆపాదించాడన్న ప్రశ్న వేసుకుంటే, అతడు ఏ సామాజిక నేపథ్యం నుంచి ఆ కథ చెబుతున్నాడో ఆ సామాజిక నేపథ్యం అందుకు కారణమన్న సమాధానం వస్తుంది. మొదటి పొరలోని పరాశరుడు వాస్తవంగా ఎలాంటి వాడో, అతనికీ మత్స్యగంధికీ ఏర్పడిన లైంగిక సంబంధం ఎలాంటిదో మనకు స్పష్టంగా తెలియదు. కానీ రెండవ పొర దగ్గరికి వచ్చేసరికి పరాశరుడు ఒక బ్రాహ్మణుడు గానూ, అందులోనూ శాపనుగ్రహశక్తి గల మహర్షిగానూ రూపుగడుతున్నాడు. మరోవైపు మత్స్యగంధి చేపల కంపు కొట్టే ఒక జాలరి యువతి, జానపదస్త్రీ, బ్రాహ్మణుల దగ్గర, ఋషుల దగ్గర ఏవో మహిమలు ఉంటాయనీ, వారిని కాదంటే శపిస్తారని మాత్రమే ఆమె వింది. దాంతో పరాశరుని కోరికకు ఆమె లొంగిపోయింది. ఈ పొర దగ్గరికి వచ్చేసరికి ఇది ఈ విధంగా ఒక అసమ లైంగిక సంబంధమన్న స్పష్టత వచ్చింది.

పరాశరుని పాత్ర చిత్రణలోని వైరుధ్యం చూడండి: అతను మదమాత్సర్యాలు లేని సాధుస్వభావి, శాంతుడు. ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకునే వాడు, గొప్ప బుద్ధి కలిగినవాడు, వ్రతనిష్ఠ కలిగినవాడు, తపస్సంపన్నుడు. తను తలచుకుంటే అప్పటికప్పుడు మంచు చీకట్లు సృష్టించగలిగినవాడు. మత్స్యగంధి ఒంటికి ఉన్న చేపల కంపు పోగొట్టి యోజన దూరం వ్యాపించగల సుగంధాన్ని ఇవ్వగలిగినవాడు. ఆమె ఒంటి మీద దివ్యవస్త్రాలను, ఆభరణాలను తెప్పించగలిగినవాడు. పైగా అతను మత్స్యగంధిని ఎప్పుడు చూశాడు? తీర్థయాత్రకు వెడుతున్నప్పుడు!

ఇలా పరాశరుని శిఖరం మీద నిలబెట్టిన కథకుడే, మత్స్యగంధిని చూడగానే, నేటి భాషలో చెప్పుకునే ‘అత్యాచారా’న్ని తలపించేలా అతి కాముకత్వపు చీకటి లోయలోకి జారిపోయిన వాడిగా చూపిస్తాడు. పైగా ఎంత శాంతులైనా, ఎంత జితేంద్రియులైనా ఒంటరిగా ఆడది కనబడగానే చిత్త చాంచల్యానికి గురవుతారనీ, మన్మథుడి శక్తిని ఓర్చుకోవడం ఎవరి తరమనీ అంటాడు. ఈ మాటలోనే ఎంత వైరుధ్యమో చూడండి…ఒంటరి ఆడది కనబడగానే మనసు చెదిరేవారు కూడా ‘జితేంద్రియులు’ ఎలా అవుతారో తెలియదు.

తను ఎంత వైరుధ్యవంతంగా మాట్లాడినా చెల్లిపోతుందనీ, తన మాట ఎవరూ ప్రశ్నించడానికి వీలులేని శిలాక్షరమనే ఒక ఆధిపత్య ధోరణి కథకునిలో వ్యక్తమవుతోందా? లేక పరాశరునిలోని చీకటి, వెలుగుల కోణాలను రెండింటినీ ప్రదర్శించే సమబుద్ధిని చాటుతున్నాడా? రెండింటికీ కూడా అవకాశముంది. రెండింటికీ సంబంధం కూడా ఉండచ్చు.

మిగతా వచ్చే వారం….

-కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆలోచించేలా రాయగలిగితే చాలు : సోమశంకర్

2 (1)

మార్చి నెల వచ్చిన కథలని అన్ని రకాలుగా పరిశీలించిన తరువాత ప్రయోజనకరమైన కథాంశంతో, వస్తువు-శిల్పం-కథనాల మధ్య మంచి సమతుల్యతతో నడిచిన “ముసుగు వేయద్దు మనసు మీద” (కినిగె పత్రిక) కథను ఉత్తమ కథగా నిర్ణయించాము. ఆ కథారచయిత కొల్లూరి సోమశంకర్ గారితో ముఖాముఖీ ఈ వారం –

 

  • సోమశంకర్ గారూ! మార్చ్ నెలలో వచ్చిన అన్ని కథల పోటీనీ తట్టుకొని మీ కథ ‘ముసుగు వేయొద్దు మనసు మీద’ ఉత్తమ కథగా నిలబడ్డందుకు ముందుగా మా బృందం తరఫున అభినందనలు!

ధన్యవాదాలండీ.

  • మీ రచనా వ్యాసంగం గురించి కొంచెం వివరిస్తారా?

1998లో ఓ చిన్న వ్యాసాన్ని అనువదించడంతో ప్రారంభమైంది. కాకపోతే ఆ పత్రిక వారు అనువాదానికి అనుమతి నిరాకరిండంతో ఆ వ్యాసం తెలుగు వెర్షన్ వెలుగు చూడలేదు. చదివించేలా నేను రాయగలననే నమ్మకం కలిగించిందా అనువాదం.

ఆ తరువాత, “The Adventures of Pinocchio” అనే పిల్లల నవల చదవడం తటస్థించింది. ఆ ఇతివృత్తం, పాత్రల ప్రవర్తన ద్వారా పిల్లలకి మంచి చెప్పడానికి ప్రయత్నించడం నాకు బాగా నచ్చాయి. 1999 నాటికే ఆ పుస్తక అనువాదం పూర్తి చేసినా, 2012 జనవరికి కానీ ముద్రణకి నోచుకోలేదు. “కొంటెబొమ్మ సాహసాలు” పేరిట పీకాక్ క్లాసిక్స్ వారి అనుబంధ సంస్థ పీచిక్స్ ప్రచురించింది.

అనువాదాల కన్నా ముందుగా, Indian Express దిన పత్రిక లోని Career Express అనే పేజిలో “జనరల్ అవేర్‌నెస్” అనే శీర్షిక,ఆంధ్రజ్యోతి దిన పత్రిక యొక్క కెరీర్ గైడ్ పేజిలో “కరెంట్ అఫైర్స్” అనే శీర్షిక నిర్వహించాను. ఆంధ్రభూమి సాధన అనుబంధంలో “Arithmetic” అనే శీర్షికలో పోటీ పరీక్షల లెక్కలు సులువుగా ఎలా చేయవచ్చో తెలిపాను. తరువాత అదే అనుబంధంలో “అంతర్జాతీయ అంశాలు” అనే శీర్షిక నిర్వహించాను. ఇదే సమయంలో, బాలజ్యోతిలో పిల్లల కథలు రాసే అవకాశం వచ్చింది. 2000 సంవత్సరంలో బాలజ్యోతికి 9, ఆంధ్రభూమి వారపత్రికకి 2 పిల్లల కథలు రాసాను.

బాలజ్యోతి సంపాదకుల సూచన మేరకు, వివిధ మాసపత్రిక/వారపత్రికలకు కథలు వ్రాయడం మొదలుపెట్టాను. ఆగష్టు 2001 ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురితమైన “రూపాయల పుస్తకం” అనేది నా మొదటి కథ. 9 నవంబర్ 2002 నాటి ఆంధ్రప్రభ వారపత్రికలో “విశ్వకదంబం” శీర్షికన నా మొదటి అనువాద కథ “బాకీ” ప్రచురితమైంది.

నేను రాసిన “అతడు-ఆమె-ఇంటర్‌నెట్” అనే కథని “లడ్‌కా-లడ్‌కీ-ఇంటర్‌నెట్” అనే పేరుతో నేనే హిందీలోకి అనువదించాను. అలాగే, నేను ఆంగ్లం నుంచి అనువదించిన “బొమ్మ” అనే కథని హిందీలో “టెడీబేర్” అనే పేరుతో అనువదించాను. శ్రీ కె.వి. నరేందర్ రాసిన “చీపురు” కథను “ఝాడూ” పేరిట;శ్రీ మాన్యం రమేష్‌కుమార్ రాసిన “శబ్దం” కథని “శబ్ద్” పేరిట హిందీలోకి అనువదించాను.

నేను రాసిన “పాపులర్ సుబ్బారావ్” అనే కథ అదే పేరుతో కన్నడంలోకి అనువాదమైంది. నేను అనువదించిన “బొమ్మ” కథని తెలుగు అనువాదం ఆధారంగా, కన్నడంలోకి అనువదించారు శ్రీ. కె. కృష్ణమూర్తి.

ఇక ఎమెస్కో బుక్స్ కోసం 5 పుస్తకాలను అనువదించగా, “ఆనందం మీ సొంతం” అనే పుస్తకం ప్రచురితమైంది. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయి. ఇవి కాక, పూనెకి చెందిన డా. అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ “One Life to Ride” ను తెలుగులోకి అనువదించాను. ఇది ప్రస్తుతం ప్రీ-ప్రెస్ దశలో ఉంది. యు.కె.లో స్థిరపడిన వినయ్ జల్లా రాసిన ఆంగ్ల నవల “Warp and Weft” అనువాదం ఈ మధ్యే పూర్తి చేసాను.

ఇవి కాక పలు సంస్థల కోసం రకరకాల డాక్యుమెంట్లను తెలుగులోకి అనువదిస్తున్నాను.

SomaSankar2014

  • మీరు అభిమానించే తెలుగు రచయితలు..?

కొకు, కారా, రావి శాస్త్రి, అబ్బూరి ఛాయదేవి, డి. కామేశ్వరి, మల్లాది, యండమూరి, శ్రీ రమణ, సలీం, కె.వి. నరేందర్, వాలి హిరణ్మయి దేవి మొదలైన వారు.

  • ఇక “ముసుగు వేయద్దు మనసు మీద” కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ రాయడం వెనకాల ఉన్న నేపధ్యాన్ని వివరిస్తారా? ఈ కథాంశం ఆధారంగా మీకు కథ రాయాలనే ఊహ ఎలా వచ్చింది?

ఈ కథ చెప్పే కథకుడు నాకు పరిచయం. ఆయన నాకన్నా కనీసం ఏడెనిమిదేళ్ళు పెద్ద. ఓ కన్సల్టింగ్ సంస్థలో అడ్మిన్ అసిస్టెంట్/స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉండేది. హైదరాబాద్‌తో పాటు కొన్ని ప్రముఖ నగరాలలో బ్రాంచి ఆఫీసులు ఉండేవి. కొంత కాలం తర్వాత అనుకున్న ఆదాయం రాకపోవడంతో ఆఫీసు ఖర్చులను తగ్గించుకునే నిమిత్తం, కొన్ని బ్రాంచిలను మూసేయ్యాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. దశలవారీగా బ్రాంచీలను తొలగిస్తూ వచ్చింది. హైదరాబాద్ బ్రాంచిని ఎప్పుడు మూసేస్తారో తెలియక, ఈయన చాలా కంగారు పడేవాడు. ఎప్పుడూ దిగులుగా, నిరుత్సాహంగా ఉండేవాడు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా, ఉన్నదాన్నే ఎలాగొలా నిలుపుకోవాలని చూసేవాడు. అతని వ్యక్తిగత సమస్యలు నాకు పూర్తిగా తెలియకపోయినా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నయని మాత్రం తెలుసు. అతని భయాలు, సందేహాలు, బెంగ చాలా కాలం పాటు నాకు బాగా గుర్తుండిపోయాయి. ఆ ఆఫీసు మూసేసారని తెలిసింది, ఆయన ఏమయ్యారో మాత్రం తెలియలేదు. ఉద్యోగ నిమిత్తం నేను కొన్నాళ్ళపాటు హైదరాబాదుకి దూరంగా ఉండడంతో నాకు ఆయన సమాచారం తెలియలేదు. తర్వాత ఈ మధ్య ఇవే లక్షణాలు మా మిత్రుడి అన్నయ్యలో చూసాను. ఆయనదీ స్థిరమైన ఉద్యోగం కాదు. సంసార బాధ్యతలు ఎక్కువ. చేసే ఉద్యోగం నచ్చదు, మనసు పెట్టి పనిచేయలేడు. సో, ఎప్పుడూ డల్‌గా, frustrated stateలో ఉంటూంటాడు.

ఇక కథలోని వీరేశం పాత్రధారిని నేను ఓ బర్త్‌డే పార్టీలో చూసాను. ఆయన ముసలాయనే, కానీ బాగానే ఎగిరాడు. నేను అతనికి లిఫ్ట్ ఇచ్చాను. కథలో జరిగినంత సంభాషణ మా మధ్య జరగలేదు కానీ, టూకీగా ఆయన స్వభావం అదేనని గ్రహించాను.

ఓ రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ దగ్గర ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను. అక్కడున్న బట్టల కొట్ల వద్ద సింహం డ్రెస్ వేసుకుని జనాలని పిలుస్తున్న ఓ వ్యక్తి, ఒక్కసారిగా తల మీద ముసుగు బయటకి తీసి ఆ వేషం వేసుకోవాల్సి వచ్చినందుకు తనని తాను తిట్టుకుంటూ, తన పేదరికాన్ని, కొట్టు యజమానుల్ని దూషించాడు. చాల స్వల్ప సమయంలో జరిగిన ఘటన, కానీ నా మనసులో ముద్ర పడిపోయింది.

మనలో చాలామంది ఆనందంగా ఉండాలనుకుంటాం, కానీ ఉండలేం. ఆనందం/సంతోషం ఎక్కడో బయటి నుంచి రావాలని అనుకుంటూ, ఎప్పుడో వస్తుందని ఊహిస్తూ, ప్రస్తుతం నిరాశలో నిస్పృహల్లో బతుకుతాం. కానీ ఈ మూడు ఘటనలని మేళవిస్తే, ఈ కథకి నేపథ్యం అయింది!

MVMM

  • కేవలం మీరు చూసిన ఒక ఘటన వల్లే కథ ఏర్పడిందా లేక ఇలాంటి వ్యక్తుల్ని మీరు కలిసి, వాళ్ళ వృత్తిపరమైన సాధకబాధకాలు తెలుసుకున్నారా?

ఒకాయన్ని కలిసాను. కాస్త సంభాషణ జరిగింది. ఆయన క్లుప్తంగా చెప్పిన కొన్ని వివరాలతో నేను వీరేశం పాత్రని సృష్టించుకున్నాను. అంతేకాని, కథ రాద్దామనే ఉద్దేశంతో ఆయనతో సంభాషించలేదు. ఆయనని కలిసినప్పుడు కథ రాయాలన్న ఉద్దేశమే లేదు. తర్వాత ఎప్పుడో తట్టిన ఆలోచన ఈ కథ.

ఆ పాత్రకి ఎదురైన కొన్ని సంఘటనలు మా ఆఫీసు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేసి తరచూ మానేసే వ్యక్తులకి ఎదురైనవే. ఇంకా కొందరు వ్యక్తులకి ఎదురైన చిన్న చిన్న ఘటనలను ఈ కథలో ఒకే పాత్రకి ఎదురైనట్లుగా చూపాను.

  • మీ కథలో ప్రస్పుటంగా కనిపించిన మంచి లక్షణం క్లుప్తత. ఇది అంత తేలికైన విషయం కాదు. ఇది రావాలంటే కథని చాలా సార్లు ఎడిట్ అయినా చేసుకోవాలి, లేదా కథని రాసే ముందే కథ తాలూకు సంపూర్ణ స్వరూపం రచయిత మనసులో రూపు దిద్దుకోవాలి. ఈ రెండు విధానాల్లో మీరు ఏది ఆచరిస్తారు?

సాధారణంగా, ఒక ఇతివృత్తం/ఘటనని ఆధారం చేసుకుని కథ రాయాలని అనుకున్నప్పుడు మొదట కథా స్వరూపం అంతా, సంభాషణలతో సహా, మనసులోనే రూపొందుతుంది. నేను రాద్దామనుకున్న అంశానికి ఓ రూపు వచ్చింది అనుకున్నాకనే, అది కంప్యూటర్ తెర మీదకి వస్తుంది. మొదటినుంచి నాది ఇదే పద్ధతి. కథని టైప్ చేసుకున్నాక, అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులూ చేసుకుంటాను.

  • ఈ కథ రాయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది?

నేను సొంత కథలు చాలా తక్కువగా రాస్తాను. అనువాదాలు చేసినంత వేగంగా సొంత కథలు రాయలేను.

అది నా బలహీనత. ఈ కథ మనసులోంచి కంప్యూటర్ స్క్రీన్ మీదకి రావడానికి సుమారు పది రోజులు పట్టింది. కానీ ఒకసారి టైప్ చేసాక, రెండే మార్పులు చేసాను.

  • కొంత అనిశ్చితితోనూ, దాన్నుంచి ఉద్భవించే అశాంతితోనూ జీవించే మనుషుల మనసులని మీ కథ తాకడం, ఒక కొత్త ఉత్తేజాన్ని వాళ్ళలో నింపడం అనే ప్రయోజనాన్ని మీ కథ సాధించినట్టు మా బృందం అనుకోవడం జరిగింది. కథ అనేది ఒక కొత్త ఆలోచననో, కొత్త ఉత్తేజాన్నో, కొత్త స్ఫూర్తినో ఇవ్వాలని మీరు భావిస్తారా? లేక, కేవలం ఒక తాత్కాలికమైన అనుభూతినో అనుభవాన్నో కలగజేసే కథలని కూడా మీరు సమర్ధిస్తారా?

ప్రతి కథకీ వ్యక్తంగానో, అవ్యక్తంగానో ఓ లక్ష్యం ఉంటుంది, ఉద్దేశిత పాఠకులు ఉంటారు. కొన్ని కథలు వినోదాన్ని, హాస్యాన్ని పంచితే, మరికొన్ని ఆలోచనల్ని రేకిత్తించి, ఉత్తేజితులని చేస్తాయి. కొన్ని కథలు గతంలో జరిగిన దారుణాలను గుర్తు చేస్తే, మరికొన్ని సమాజిక సమస్యలని ప్రస్తావిస్తాయి. మీరన్నట్లుగా కొన్ని కథలు అనుభూతిని, అనుభవాన్ని కలిగిస్తాయి. అవీ అవసరమే. కొన్ని కాలక్షేపం కథలుంటాయి. దేని ప్రయోజనం దానిదే. సాహిత్యం నుంచి ప్రేరణ, స్ఫూర్తి పొందడం ఆయా పాఠకుల అభీష్టం. పుస్తకంలోని పేజీలను గబగబా తిప్పేయచ్చు, లేదా జీర్ణం చేసుకుని, తమకు అన్వయించుకుని ఆచరించనూవచ్చు. సమస్యలకి పరిష్కారం చెప్పడం రచయితల పని కాదు, సమస్యలని ఎదుర్కోడానికి, ప్రేరణనిచ్చి, ఆలోచన రేకిత్తంచగలిగితే చాలు! ఎందుకంటే కథాపరంగా రచయిత సూచించే పరిష్కార మార్గాలు నిజజీవితంలో వర్తించకపోవచ్చు… కానీ సమస్యలో ఉన్నవారికి కొత్తగా ఆలోచించడానికి అవకాశం మాత్రం తప్పకుండా కల్పిస్తాయని నా నమ్మకం.

  • మీరు రాసిన ఏదైనా ఒక కథని,‘మంచి కథ’ అనుకోవడానికి మీరు ఏ ఏ ప్రమాణాలు అవసరం అనుకుంటారు? లేదూ,‘మంచి కథ’ అంటే మీ దృష్టిలో ఏది?

2014 మార్చి నెల కథలను సమీక్షించే సందర్భంలో మీరే అన్నారు, మంచి కథని నిర్వచించడం కష్టమని.   నా దృష్టిలో నేను రాసే ప్రతీ కథా మంచికథే. ఉద్దేశపూర్వకంగా సమాజానికి చెడు చేయని రచన ఏదైనా మంచిదే. రాసేటప్పుడు ప్రతీ కథ మంచి కథ అనుకునే రాస్తాను. కాకపోతే, ప్రెజంటేషన్‌లో, ట్రీట్‌మెంట్‌లోనూ తేడాలు వస్తే అది పాఠకులకు నచ్చకపోవచ్చు. పాఠకులకు నచ్చిన కథలు విమర్శకులకి నచ్చకపోవచ్చు. కాబట్టి వాదప్రతివాదాలకు దూరంగా, రాయాలనుకున్నది రాసుకోడమే నా పద్ధతి. నేను రాసినవి కొందరికైనా నచ్చుతాయని నా నమ్మకం. నా మటుకు నాకు కథా వస్తువు బాగుండాలి, సన్నివేశాల కల్పన బాగుండాలి, సంభాషణలు బాగుండాలి. ఇవన్నీ కలిస్తే, అది తప్పకుండా మంచి కథే అవుతుందని నా అభిప్రాయం. పాఠకులని చదింవించేలా, చదివిన తర్వాత ఆలోచించేలా కథ రాయగలిగితే అది మంచి కథే అవుతుందని ఓ రచయితగా నా అనుభవం.

* అనువాదాలు చేయడం ఒక రచయితగా మీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది? ఒక రచయితగా మీరు స్వతంత్రంగా నిలబడడానికి ఈ అనువాదాల అనుభవం ప్రతిబంధకమయిందా, లేక సహాయపడిందా?

అనువాదాలు చేయడం, ఓ రచయితగా నా మీద తీవ్రమైన ప్రభావాన్నే చూపింది. రచయితగా స్వతంత్ర్యంగా నిలబడానికి ఓ రకంగా ప్రతిబంధకమైంది, మరో రకంగా సాయపడింది. అనువాదాల కంటే సొంత కథ రాయడమే కష్టం నాకు. అనువాదాలలో ఇతివృత్తం, సన్నివేశాల కల్పన, సంభాషణలు ఇవన్నీ రెడీమేడ్‌గా ఉంటాయి. కథలోని మూడ్‌ని పట్టుకుని, కథకుడి టోన్‌ని పట్టుకుంటే చాలు. తెలుగులో చక్కని కథ సిద్ధమవుతుంది. భావం చెడగొట్టకుండా, కథని మన భాషలో చెబితే చాలు. ఆల్రెడీ, ఒక చోట ప్రూవ్ అయిన కథ కాబట్టి, ఇక్కడా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సొంత కథల విషయంలో సంభారాలేవీ సిద్ధంగా ఉండవు, అన్నీ మనమే సమకూర్చుకోవాలి. పూర్తయ్యకా గాని, ఎలా ఉంటుందో తెలియదు. మధ్య మధ్యలో రుచి చూస్తూ, సవరించుకోవచ్చుగానీ, ఆలస్యం అయిపోతుంది. ఈ కారణం వల్లే నేను రాసిన సొంత కథల సంఖ్య, చేసిన అనువాదాల సంఖ్యలో సగం కూడా లేదు.

ఇక అనువాదాలు చేయడం వల్ల కల్గిన ఉపయోగాలు: కథని క్రిస్ప్‌గా చెప్పగలగడం; సంభాషణలను, క్లుప్తంగా, ఎఫెక్టివ్‌గా రాయగలగడం; కథనాన్ని కొత్త రీతిలో నడపడం వంటివి. అయినా రచయితగా/అనువాదకుడిగా నాది ఇంకా ఇవాల్వింగ్ స్టేజే, కథారచనలో నాకు పూర్తి నైపుణ్యం రాలేదని నా భావన. రాస్తూ వుంటే మెరుగవుతాము.

  • ఇప్పటి వరకు ఎన్ని కథలు రాశారు మీరు? మీ కథాసంపుటిని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

ఇప్పటి వరకు 29 సొంత కథలు (పిల్లలు కథలు కాకుండా), 95 అనువాద కథలు రాసాను.

నా సొంత కథల సంకలనం “దేవుడికి సాయం” త్వరలోనే వెలువడుతుంది. ముందుగా ఈ-బుక్, వీలుని బట్టి ప్రింట్ బుక్!

నా అనువాద కథలతో 2006లో “మనీప్లాంట్” అనే పుస్తకాన్ని ప్రచురించాను. ఆ తర్వాత, “నాన్నా, తొందరగా వచ్చేయ్” అనే అనువాద కథల ఈ-బుక్‌ని, “వెదురు వంతెన” అనే అనువాద కథల మరో ఈ-బుక్‌ని ప్రచురించాను.

  • మరోసారి అభినందనలు అందజేస్తూ, మీరు ఇలాంటి మరిన్ని మంచి కథలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు, సోమశంకర్ గారూ!

నా కథను ఉత్తమ కథగా గుర్తించినందుకు, ఈ ఇంటర్వ్యూ రూపంలో, నా గురించి పాఠకులకు తెలుపుతున్నందుకు మీకు, సారంగ పత్రికకి మరో సారి ధన్యవాదాలు. నమస్కారం.

(కథ చిత్రం: గురుచైతన్య, కినిగె పత్రిక సౌజన్యం)

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా…

Missamma

ఒకప్పటి సినిమాల్లో పాటలుండేవి. అంతే కాదు పాటకు సినిమా కథకి సినిమా మొత్తం నిర్మాణానికి ఒక అంగాంగి సంబంధం ఉండేది. సినిమా మొత్తాన్ని ఒక కావ్యంగా అంటే సుష్ఠు నిర్మితితో చేయాలని పాటల్ని దానిలో విడతీయలేని భాగం చేయాలనే తపన ఒకటి కూడా ఉండేది. తెలుగు సినిమాహాళ్ళల్లో పొగరాయుళ్ళు సినీమాలో పాట మొదలు కాగానే బయటికి పోయి ఆవురావురు మంటూ ఒక సిగరెట్ లాగించేసి తిరిగి పాట అయి పోయే సరికే లోనికి వస్తూ ఉండేవారు. ఇక్కడ తాత్పర్యం ఆ పాట వినకపోయినా చూడక పోయినా సినిమా అర్థం కాని పరిస్థితి కాని వచ్చే లోపం ఏమీ లేదని.

కాని ఒకప్పటి సినిమాల్లో పరిస్థితి ఇలా ఉండేది కాదు. సినిమాలో పాటకు సినిమా కథకు కథ నడిచే పద్ధతికి అంత విడదీయరాని సంబంధం ఉండేది. పందొమ్మిది వందలో ఏభై దశకంలో వచ్చిన సినిమాల్లో చాలా వాటిల్లో చందమామ పాటలు ఉండేవి. అంటే చందమామా అని వంత వచ్చే జానపద గీతాల గురించి కాదు చెప్పేది. ప్రణయ సందర్భంలో కాని విషాద సందర్భంలోగాని ఇంకో సందర్భంలో కాని నాయికా నాయకులు ఇతరులు కూడా చందమామని పాటలో పెట్టి లేదా అతన్ని ఉద్దేశించి పాటలు పాడేవారు. మనకి 1931లో మాట్లాడే సినిమా మొదటిది భక్త ప్రహ్లాద రాగా 1937 దాకా పౌరాణిక సినిమాలే వచ్చాయి. మొదటి సాంఘిక సినిమాగా మాలపిల్ల వచ్చింది అదే సంవత్సరంలో వచ్చింది దేవత సినిమా. ఇక అక్కడనుండి సాంఘిక సినిమాలు రావడం ఎక్కువైంది. ఈ సాంఘిక సినిమాల్లో పైన చెప్పినట్లుగా చందమామను తలచుకునే పాటలుండేవి. వీటిలో అద్భుతమైన సాహిత్యం ఉండేది. తొలినాటి నుండి ఇటీవలి సినిమాల దాకా చందమామ పాటలు చాలా వచ్చాయి. వాటిలో మంచి వాటిని తీసుకొని ఇక్కడ వివరించి చెప్పాలనే ఉద్దేశం ఈ వరుస వ్యాసాలు రాస్తున్నాను.

మిస్సమ్మ సినిమా 1955 లో వచ్చింది. అంటే ఇప్పటికి దాదాపు అరవై సంవత్సరాలు అయింది. కాని తెలుగు వారు ఈ తియ్యటి సినిమాని మర్చిపోలేదు. ఇప్పటికీ ఏ ఛానల్లో వచ్చినా దాన్ని నూరు శాతం ఆనందిస్తున్నారు. ఇందులోని ప్రతిపాట ఒక ఆనంద రసగుళిక. ఇందులో రెండు చందమామ పాటలున్నాయి. వీటినే నేను వెన్నెల పాటలు అని అంటాను. మిస్సమ్మలో లీల పాడిన రావోయి చందమామ మా వింత గాథ వినుమా అనే పాట ఇప్పటికీ ఎంత బహుళ వ్యాప్తంగా అందరికీ  ఆనందాన్ని కలిగిస్తుందో చెప్పవలసిన పనిలేదు. దానికన్నా నాకు నచ్చిన వెన్నెల పాట ఇంకొకటి ఉంది. దాన్ని కింద ఇస్తున్నాను. చదవండి వినండి తర్వాత దీన్ని చదివితే  మీ ఆనందం మిన్నుముట్టుతుంది.

 

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

వినుటయె కాని వెన్నెల మహిమలు

వినుటయె కాని వెన్నెల మహిమలు

అనుభవించి నేనెరుగనయా

అనుభవించి నేనెరుగనయా

నీలో వెలసిన కళలు కాంతులు

నీలో వెలసిన కళలు కాంతులు

లీలగ ఇపుడే కనిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

 

కనుల కలికమిడి నీకిరణములే

కనుల కలికమిడి నీకిరణములే

మనసును వెన్నగ చేసెనయా

మనసును వెన్నగ చేసెనయా

చెలిమికోరుతూ ఏవో పిలుపులు

నాలో నాకే వినిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

ఈ పాట వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

http://www.raaga.com/player4/?id=2159&mode=100&rand=0.2477618893608451

 

ఈ పాట మాధుర్యం వింటే బాగా తెలుస్తుంది. అంతే కాదు సినిమా చూస్తే ఈ పాటలోని గొప్పతనం తియ్యదనం ఏమిటో తెలుస్తుంది. ఇందులో నాయకుడు ఎన్టీఆర్, నాయిక సావిత్రి ఇద్దరూ 1950ల్లో బి.ఎ పాసయ్యారు. ఆనాటికి బి.ఎ పాసు కావడమంటే నేడు పి.హెచ్.డి చేసిన వారికున్నంత స్థాయితో లెక్కవేసేవారు. అయితే ఉద్యోగానికి వచ్చిన అడ్వర్టైజ్ మెంట్లో స్కూలు పంతులు గార్ల ఉద్యోగాలు పడ్డాయి. అందులో మెలికేమిటంటే ఒక ఆడ బి.ఎ ఒక మగ బి.ఎ కావాలని ఇద్దరూ భార్యాభర్తలు అయి ఉండాలని ప్రకటనలో ఉంది. సావిత్రి ఎన్టీఆర్ ఉద్యోగాలకోసం తిరిగి తిరిగి విసిగి పోయారు. దీన్ని చూచి పెళ్ళికాని వాళ్ళిద్దరూ మాకు పెళ్ళి అయిందని అబద్ధం ఆడి, రాసి ఉద్యోగంలో చేరారు. కథలో గమ్మత్తు ఏమిటంటే అప్పటిదాకా వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. పరిచయం అయిన రెండు మూడు రోజులకే ఈ ఉద్యోగానికి అప్లై చేశారు. ఆ అమ్మాయి క్రిస్టియన్ అతను హిందూ, ఇద్దరికీ పెళ్ళి కావడం అప్పటి పరిస్థితిలో సాధ్యం  అయ్యే పని కాదు. రెండు నెలలు పని చేసి గొంతు మీద ఉన్న బాకీ తీర్చుకొని పోదామని ఆమె చేరింది.

aVy3KQJ9_592

అబద్ధాలతో బతుకుతుంటారు. భార్యాభర్తలు గా నటించడానికి చాలా కష్టపడుతుంటారు. బయటివాళ్ళు వరుస పెట్టి పిలిస్తే ఆమెకు నచ్చదు. ఒకే ఇంటిలో ఇద్దరు వేరు వేరు గదుల్లో ఉంటారు. ఎవరి వంట వారే చేసుకుంటారు. వీరి రహస్యం వీళ్ళ నౌకరు దేవయ్యకే తెలుసు. వాళ్ళు పనిచేసే బడి యజమాని జమీందారు ఆయన భార్య వీరిద్దరినీ తమ కూతురు అల్లుడూ లాగా చూసుకుంటారు. అలాగే పిలుస్తుంటారు. అలా వరుసలు పెట్టి పిలవడం ఆమెకు ఇష్టం ఉండదు. జమిందారు కూతురు, జమున ఎన్టీఆర్ కి దగ్గర కావడం కూడా సావిత్రికి నచ్చదు. ఆమెకు ఎన్టీఆర్ పైన తనకే తెలియని ప్రేమ కలుగుతున్న కొద్దీ జమిందారు కూతురు జమున పైన అసూయ నానాటికి పెరుగుతుంటుంది. క్రమంగా ఎన్టీఆర్ (రాజారామ్ నాయుడు)ని గాఢంగా ప్రేమిస్తుంది. ఆ విషయాన్ని ఆమె కూడా సరిగ్గా గమనించదు. కాని ప్రవర్తనలో అది అడుగడుగునా అసూయ రూపంలో బయట పడుతుంది. ఈ అసూయతో ఎన్టీ ఆర్ పైన జమునపైన విపరీతమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తుంది.

ఈనాటి సినిమాల్లో ఐ లవ్ యూ చెప్పడం ఒక తప్పని సరి ఫార్ములాగా నిలిచింది. ఎన్నో సార్లు ఎంత మంది సమక్షంలోనో చెప్పాలి. ప్రేమ కోసం యుద్ధాలు చేయడాలు వగైరా ఫార్ములాల గురించి ఇక్కడ చెప్పవలసిన పని లేదు. కాని ఇక్కడ సావిత్రి పాత్రను తీర్చిదిద్దిన తీరు గురించి బాగా చెప్పాలి. ఒక కావ్యంలోనో నవలలోనో నాయిక పాత్రను ఒక మంచి నిపుణుడైన కవి ఎలా తీర్చి దిద్దుతాడో సినిమాలో ఈ పాత్రలను అలా తీర్చాడు దర్శకుడు ఎల్వీ ప్రసాద్. నాయిక సావిత్రి ఎన్టీఆర్ ని అంత గాఢంగా ప్రేమించినా అది ఆమె వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దడంలో సహజమైన ఒక పద్ధతిలో చూపుతాడు ఒక మానసిక స్థితిని ఒక నవలలో అద్భుతంగా వర్ణించిన పద్ధతిలో ఆ పాత్ర ప్రవర్తనని చూపుతాడు. కాని ఎక్కడా సావిత్రి నాయకుడిని ప్రేమిస్తున్నానని చెప్పదు. ప్రవర్తనలో కనిపిస్తుంది అదీ వ్యతిరేక రూపంలో. ఇలా సాగే క్రమంలో నాయికతో ఎలా గైనా కాలం గడపాలని కడుపుకోసం నానా కష్టాల పడుతుంటాడు ఎన్టీఆర్. ఈ కష్టం చివరి దశకు వచ్చింది. సావిత్రి గర్భవతిగా పొరపాటు పడి ఆమెకు సీమంతం చేస్తారు జమీందారు దంపతులు వాళ్ళింట్లోనే. అప్పటికే చాలా అసూయని ఆగ్రహాన్ని ఎన్టీఆర్ పైన చూపిస్తూ ఆయన చేస్తున్న తప్పులను తిడుతూ వచ్చిన సావిత్రికి తను అతనిపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నానని అనుకుంటూనే ఉంటున్నా అదే కొనసాగిస్తుంది. సీమంతం చేసిన తర్వాత ఆరాత్రి అక్కడే నిద్రపోవాలని వాళ్ళిద్దరినీ ఒక గదిలోనికి పంపిస్తారు. ముందుగా గదిలో ఉన్న నాయకుడు తర్వాత సావిత్రి లోనికి వచ్చి ఇదంతా అతని కుట్ర అని తనను ఇలా మోసం చేయడానీకే ఇదంతా చేస్తున్నారని తిడుతుందని నాయకుడు తెరచాటున దాక్కుంటాడు. తర్వాత సావిత్రి లోనికి వచ్చిన తర్వాత ఆమెను భయపెట్టి కిటికీలోనుండి బయటికి దూకి ఇంటికి పోతాడు ఆమెను ఇబ్బందికి గురిచేయడం ఇష్టం లేక.

images

సావిత్రి ఇంట్లో వాళ్ళని పిలిచి తనను తన ఇంటికి పంపించమంటుంది. ఆమె అలా ఇంటికి పోయేసరికే కిటికీ లోనుండి దూకి కాలు విరగ కొట్టుకొని (నాటకం) మంచంలో దీనంగా పడి ఉన్న నాయకుడు కనిపిస్తాడు. ఆమెకు అతనిపైని ప్రేమ అతని పట్ల సానుభూతి ఒక్కసారిగా పొంగాయి. అతన్ని మోసుకొని పోయి లోపలున్న తనుపడుకునే పందిరిమంచం మీద పడుకో బెడుతుంది. కాలి బాధతో నిద్రపోలేనంటాడు. తనకు తెలియకుండానే తనలో ఆతని పట్ల ఎంతో గాఢమైన ప్రేమ ఉందని ఆమె తెలుసుకుంటుంది. అతన్ని నిద్రపుచ్చడానికి పాట అందుకుంటుంది. ఇంత కథా సందర్భాన్ని గర్భీకరించుకొని వచ్చిన పాట పైన చెప్పిన వెన్నెల పాట. తన ప్రవృత్తిని తన మనఃస్థితిని ఈ పాటలో కవి వెల్లడిస్తాడు. సినిమా మొత్తానికి కథని మాటలని అందించిన కవి ఒక్కడే కావడం వల్ల కథా సందర్భాన్ని తెలుసుకొని దానికి ఇమిడేలా పాటనురాసాడు పింగళి నాగేంద్రరావు.

ఇప్పడు పాటని చూస్తే విషయం మనకు తెలుస్తుంది. తనలో కలిగిన ప్రేమను ఆ స్థితిని ఏమిటో ఈ మాయ అని అనుకుంటుంది గదిలోనుండి బయటికి వచ్చి బల్లమీద కూర్చుని నింగిలోని చందమామ వైపు చూస్తూ పాడుతుంది సావిత్రి ఈ పాటని. ముఖంమీద వెన్నెల పడే తీరును కెమేరా కళతో చిత్రించిన తీరు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయ అని చందమామతో చెప్పుకుంటుంది. ఈ స్థాయిలో కూడా నాయిక తన ప్రేమని నాయకుడి ఎదురుగా కూర్చుని చెప్పదు. కుస్తీపట్లుపట్టే లా ఉండే కొరియోగ్రఫీతో నాయికా నాయకులు ఒకరిమీద ఒకరు యుద్ధం చేస్తూ ఉండేలా ఉండే నేటి రోమాంటిక్ డ్యుయెట్లని తలచుకొని ఆ పాటల్ని చూస్తే ప్రేమని ఎంత సున్నితంగా నిజమైన శృంగరంగా చిత్రించారో తెలుస్తుంది.  వినుటయె కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా. అంటుంది. వెన్నెల మహిమ తనపైన ఎలాఉందో అర్థం అయింది. ఇక్కడ వెన్నెల తనలోని ప్రేమకి ప్రతీక చందమామ శైతల్యం ఇక్కడ ప్రణయానికి చిహ్నం. నాయికా నాయకులు కలిసి ఉన్నప్పుడు చందమామ చల్లని రాజు, అదే విరహంలో చందమామ చల్లని వెన్నెలే నాయికకు వేడి మంటలుగా తోస్తుంది. విప్రలంభ శృంగారంలో, విరహంలో  చంద్రుడిని తిట్టడం అప్పటి కావ్యాల నుండి ఇప్పటి దాకా వస్తూనే ఉంది. వెన్నెల మండెడిదీ అని ఒక పాటలో అన్నమయ్య కూడా రాసాడు. వెన్నెల మహిమ ఎలా ఉంటుందో ప్రణయంలో అది ఎంత చల్లాగ ఉంటుందో తనకు ఇప్పటి దాకా తెలియదని చెబుతూ తనకు నీపై ప్రేమ కలిగిందని నాయకుడికి నర్మగర్భంగా చెబుతుంది ఇక్కడి నాయిక సావిత్రి.

13909646434184550535-1

కనుల కలికమిడి నీకిరణములే మనసును వెన్నగ చేసెనయా అని అంటుంది. కనులకలికమిడి అని చెప్పడం అద్భుతమైన తెలుగు పలుకుబడి. తల నెప్పి కలిగినప్పుడు సొంటితో కలికం చేసి కంట్లో రాస్తారు. మొదట భగ్గున మండుతుంది. తర్వాత అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చి తలనొప్పిని పోగొడుతుంది. ఇక్కడ చందమామ కిరణాలే కంట్లో కలికం పెట్టినట్లుగా చేసి మనసును వెన్నెగ చేసాయట. ఇది కవి చేసిన అద్భుతమైన ఊహ. ఆమె మనస్సు వెన్నలా కరిగి ప్రియుడిపైన ప్రేమను వర్షించే స్థితికి చేరిందని చెబుతుంది ఆమె. ఇక చివరిగా చెలిమి కోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా అని అంటుంది. ఏమిటో  ఈ మాయ అని చివరిగా పాటని ముగిస్తుంది. తనలో అతనిపైని ప్రేమని పూర్తిగా తెలుసుకున్నానని నాయకుడికి చెప్పే తీరుని వర్ణించిన ఈ పాట ఒక మంచి శృంగార రసగుళిక. వెన్నెలని ప్రేమకి ప్రతీకగా చెప్పిన తీరు చాలా బాగుంది.

పింగళి నాగేంద్ర రావు రాసిన ఈ పాటకి సాలూరు రాజేశ్వరరావు కూర్చిన సంగీతం మరింత మాధుర్యాన్ని తెచ్చింది. అంతే కాదు సినీమా ఈ ఘట్టానికి వచ్చే సరికే ఈ పాటని చూసిన ప్రేక్షకులకి మనస్సంతా ఆనందం ప్రేమ నిండిపోతాయి. ప్రేక్షకులు పాత్రలతో తాదాత్మ్యం చెందుతారు. సింధుభైరవి రాగంలో వచ్చిన ఈ పాట మనస్సుకు హత్తుకునే తీరులో ఉంటుంది. ఈ రాగానికి కూడా ప్రణయాన్ని పలికించే గుణం ఉంటుంది.

ఇలాంటి అద్భుతమైన వెన్నెల పాటలు తెలుగు సినిమాల్లో ఆనాటి వాటిల్లో చాలా ఉన్నాయి. వరుసగా వాటి సాహిత్య ఔన్నత్యాన్ని పరిచయం చేస్తాను.

పులికొండ సుబ్బాచారి

subbanna