అందం, ప్రతిభా, వ్యక్తిత్వం = సుచిత్రా సేన్!

 suchitra-sen-best-bengali-bollywood-movies-list

మొన్న శుక్రవారము 17 జనవరి 2014 బెంగాలీ చిత్రతార ఒకటి అస్తమించినది.  82 ఏళ్లు నిండిన సుచిత్రా సేన్ ఇక లేరు. ఆమె నేటి బంగ్లాదేశ్‌లోని పాబ్నాలో 1931లో రొమా (రమ) దాస్‌గుప్తాగా జన్మించినది. ఎనిమిది పిల్లలలో (మూడు మగ, ఐదు ఆడ) ఆమె ఐదవది. ఆమె అసలు పేరు కృష్ణ, కాని బడిలో చేర్పించేటప్పుడు, వాళ్ల నాన్నగారు రమ అని పేరిచ్చారట. కొందరు ఆమె శాంతినికేతనములో విద్యాభ్యాసము చేసినదంటారు.

 

అతి రూపవతియైన ఆమెకు పదహారవ ఏడే పెళ్లయినది.  ఆమెకు సంగీతమంటే యిష్టము.  చలనచిత్రాలలో పాడాలని ఆమె కోరిక.  కాని ఆమె అదృష్టము మరొక విధముగా పరిణమించినది.  వెండి తెర మరుగున గాక, వెండితెర మీదనే ఆమెకు అవకాశము లభించినది. ఆమె మొదటి చిత్రము 1953లో విడుదల అయినది.  ఆమెకు దర్శకుడు నితీశ్ రాయ్ సుచిత్ర అని పేరు నిచ్చాడట. తరువాత ఆమె వెండితెరపైన సుచిత్రా అనే పేరుతో స్థిరపడినది. ఆమె తన నాన్నమ్మను నటనవిద్యలో గురువుగా భావించింది. ఆమె సుచిత్ర నటనను ప్రోత్సహించడము మాత్రమే కాక విమర్శించేది కూడ. ఆమెతో నాయకుడుగా ఉత్తం కుమార్ నటించాడు.  ఉత్తం, సుచిత్రాల జోడీ అలా 1953లో ఆరంభమైనది.  వాళ్లిద్దరు తరువాత ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు.  పెళ్లికి పిదప నటన ప్రారంభించి కొనసాగించిన నాయికలు అరుదు.  అట్టి అరుదైన నాయికలలో ఆమె ఒకతె, మరొకరు గడచిన వారము మరణించిన తెలుగు నటి అంజలీదేవి.

 

సుచిత్రా సేన్ బెంగాలీ చిత్రములో వహించిన పాత్రలను తెలుగులో సావిత్రి, హిందీలో వహీదా రహ్మాన్ పోషించారు. దీనిని బట్టి మనము బెంగాలీ చిత్రాలను చూడకపోయినా ఆమె నటనను గురించి ఊహించుకోవడానికి అవకాశము ఉంటుంది.  ఉత్తంకుమారుతో ఆమె జోడీ హిందీలో రాజ్‌కపూర్-నర్గీస్, తెలుగులో నాగేశ్వరరావు-సావిత్రి లాటిది. వారిరువురు నటించిన చిత్రాలను ప్రేక్షకులు అమితముగా ఆదరించారు.  ఏ కళాకారులకైనా ఆ కళను అనుభవించే రసికులు ఆదరిస్తే అంతకన్న కావలసినదేముంది?

 

ఆమె 52 బెంగాలి, ఏడు హిందీ చిత్రాలలో నటించింది. అందులో 30 చిత్రాలలో ఆమెతో కూడ ఉత్తంకుమార్ నటించాడు. అలా వారిరువురు నటించిన మొదటి చిత్రము సారే చూయతర్, చివరి చిత్రము ప్రియ బాంధవి.  ఆమె నటించిన కొన్ని గొప్ప చిత్రాలు – అగ్నిపరీక్ష (తెలుగులో మాంగల్యబలం), ఉత్తర్ ఫల్గుని (హిందీలో మమత), దీప్ జ్వేలే జాయ్ (హిందీలో ఖామోషీ, తెలుగులో చివరకు మిగిలేది), సాత్ పా కే బంధా, హిందీ చిత్రములు దేవదాస్, ఆంధీ. ఇందులో సాత్ పా కే బంధా చిత్రములోని నటనకు ఉత్తమ నటి పురస్కారము మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవములో దొరికింది.  అంతర్జాతీయ రంగములో అలాటి ఉత్తమ నటనా పురస్కారమును నర్గీస్ తరువాత అందుకొన్న భారతీయ మహిళ ఆమెయే.

 

ఆమె కుమార్తె మూన్ మూన్ సేన్, మనుమరాళ్లు రైమా, రియా. ఆమెకు పద్మశ్రీ, బంగభూషణ్ పురస్కారములు ఇవ్వబడినవి. చిత్రజగత్తునుండి విరమించిన పిదప హాలీవూడ్ నటి గ్రెటా గార్బోవలె ఆమె ఎవరి కళ్లకు కనబడక ఏ కొద్దిమందితో మాత్రమే సంబంధము నుంచుకొని రామకృష్ణ ఆశ్రమపు కార్యక్రమాలలో కాలము గడిపినది. బంగభూషణ్ బహుమతిని ఆమె తరఫున ఆమె కుమార్తె మూన్ మూన్ అందుకొన్నది.  ఢిల్లీలో బహుమతిని అందుకొనవలసి వస్తుందని భారత చిత్ర జగత్తులో అతి ప్రశస్తమయిన దాదాసాహేబ్ ఫాల్కే బహుమతిని కూడ నిరాకరించినదట.

 

ఆంగ్లేయ చిత్ర విమర్శకుడు Derek Malcolm అంటాడు – ” ఆమె నిజంగా చాల అందగత్తె, ఆమెలో ఒక స్థిర చిత్రములాటి భంగిమ ఉన్నది, ఆమె ఎక్కువగా నటించ నక్కర లేదు.”  సుచిత్రా సేన్‌ను ఒక గొప్ప “మహానాయిక”గా అందరు ఎందుకు పరిగణిస్తున్నారు?  దీనికి గల కొన్ని కారణములను మనము తెలిసికోవాలి.  ఆమె సౌందర్యవతి, అందులో సందేహము ఏమీ లేదు.  కానీ చలన చిత్ర నాయికలు చాల మంది అందగత్తెలే, కుందనపు బొమ్మలే. అందమొక్కటే చాలదు, నటనాకౌశల్యము కూడ కావాలి.  ఆ నటన సంభాషణలను హావభావములతో వల్లించుట మాత్రమే కాదు.  ఒక చూపుతో, ఒక శిరఃకంపనముతో, ఒక సైగతో, ఒక నిట్టూర్పుతో, ఒక చిన్న పెదవి విరుపుతో గుండె లోతులలో ఉండే అనుభూతులను బయటికి తేవాలి. రచయిత కల్పించిన పాత్రలో మమైకము కావాలి. దర్శకుని భావాలను అర్థము చేసికొని వాటికి తన ముఖమునే అద్దముగా పెట్టాలి.  సుచిత్ర గ్లిసరిన్ వాడదని చెబుతారు.  సెట్టుపైన వెళ్లినప్పుడు కన్నీళ్లు తనంతట వచ్చేవట.

ఆమెకు ఆత్మవిశ్వాసము ఎక్కువ.  అందుకే నాయకుల ఆధిక్యత ఉండే చిత్రరంగములో తన పేరును నాయకునికి సమానముగా ప్రదర్శించమని దర్శకులను, నిర్మాతలను అడిగి వారిని ఒప్పించినది.  అందుకే చిత్రములలో సుచిత్రా సేన్, ఉత్తం కుమార్ అని నాయకీనాయకుల పేరులను చూపేవారు, ఉత్తం కుమార్, సుచిత్రా సేన్‌లని కాదు. సత్యజిత్ రాయ్ ఆమెను తాను తీయాలనుకొన్న ఛౌధురాణి చిత్రములో నాయికగా ఎన్నుకొన్నాడు. కాని రాయ్ తన చిత్రములోతప్ప మిగిలిన వాటిలో ఆ చిత్రము పూర్తి అయ్యేవరకు నటించరాదన్నాడట. మిగిలిన దర్శకనిర్మాతల చిత్ర నిర్మాణమునకు అది అడ్డవుతుంది కనుక అందుకు సుచిత్ర ఒప్పుకోలేదు. ఒక వేళ అలా సత్యజిత్ రాయ్ చిత్రములో ఆమె నటించి ఉంటే అది ఎలా ఉండి ఉంటుందో అన్నది ఇప్పుడు ఊహాతీతమయినది. రాజ కపూర్ చిత్రములో నటించడానికి కూడ ఆమె నిరాకరించినదట.

Suchitra-sen6-400-x-300

ఆమె నటించిన కొన్ని చిత్రములను సంక్షిప్తముగా పరిశిలిస్తే ఆమెను ఎందుకు గొప్ప నటి అంటారో మనకు తెలుస్తుంది,  కథా పాత్రల వైవిధ్యమును మనము అర్థము చేసికొనవచ్చును. ఇందులో ఎన్నో చలన చిత్రాలు యూట్యూబులో చూచి ఆనందించవచ్చును.

 

అగ్నిపరీక్ష (1954) – మాంగల్యబలం తెలుగు చిత్రము చూసిన వారికి ఈ కథ విదితమే. చిన్నప్పుడు బొమ్మల పెళ్లిలా జరిగినదానిని తండ్రి నిరాకరించాడు.  పెద్దైన తరువాత ఒక యువకుడిని చూసి ప్రేమించింది తపసి.  అతనిని పెండ్లాడుట సరియా కాదా అనే సందిగ్ధములో నున్నప్పుడు, ఆమె నాన్నమ్మ ఆమెకు సీతలా నీవు కూడ నీ అగ్ని పరీక్షలో కృతార్థురాలవుతావు అని చెప్పింది. చిన్నప్పటి గ్రామానికి వెళ్లగా అక్కడ తన ప్రేమికుడినే చూసింది.

 

దేవదాస్ (1955) – దేవదాసు కథ అందరికీ తెలిసినదే. ఇందులో పార్వతి పాత్రకు జీవం పోసింది సుచిత్ర. ఆ పాత్రలోని గాంభీర్యము, ఔన్నత్యము, ప్రేమ, ఆవేదన చక్కగా తన నటనలో  ప్రతిబింబము చేసినది. నాయకుడు దిలీప్ కుమార్‌తో సరిసమానముగా నటించి అతని ప్రశంసలు మాత్రమే కాక దర్శకుడు బిమల్ రాయ్‌చేత కూడ మన్ననలను అందుకొన్నది. ఉత్తమ నటిగా ఆమెకు బహుమతి దొరికినది.  చంద్రముఖిగా నటించిన వైజయంతిమాలకు ఉత్తమ సహాయనటిగా బహుమతి లభించినా, ఆమె తనకు కూడ ఉత్తమ నటి బహుమతి ఇవ్వలేదని తన బహుమతిని నిరాకరించినది.

 

రాజలక్ష్మి శ్రీకాంత (1958) – దీని కథ శరత్ వ్రాసిన శ్రీకాంత్ నవలలోని ఒక భాగము.  ఈ శ్రీకాంత్ నవల కొందరు శరత్ ఆత్మకథపైన ఆధారపడినదని చెబుతారు.  శ్రీకాంత్ నవలను నాలుగు భాగములుగా విడదీయవచ్చును.  శ్రీకాంత్ నవల అందులోని కథానాయకుడు తన జీవితములో ఎదుర్కొన్న నాలుగు స్త్రీలను గురించిన కథ.  వాళ్లు – అన్నదా, రాజలక్ష్మి, అభయ, కమలలత.  ఇందులో రాజలక్ష్మిని గురించిన ఉదంతము ఈ చిత్రము. శ్రీకాంత్ ఒక చోట నిలకడగా ఉండడు, ఒక విధముగా దేశదిమ్మరి. అలా ప్రయాణం చేసేటప్పుడు ప్యారిబాయి రూపములో తన చిన్ననాటి స్నేహితురాలైన రాజలక్ష్మిని మళ్లీ చూస్తాడు. వారి రాగద్వేషాలు ఈ చిత్రపు కథ.  ఇందులో రాజలక్ష్మి తపన, ఆసక్తి, ప్రేమానురాగలను సుచిత్ర చాల చక్కగా తన నటనలో చూపినది.

 

దీప్ జ్వేలే జాయ్ (1959) – ఈ చిత్రము తెలుగులో చివరకు మిగిలేది, హిందీలో ఖామోషీ అనే పేరుతో విడుదల అయినది. మానసిక రోగముతో బాధపడే ఒక వ్యక్తిని కాపాడబోయి అతనికి ప్రేమికురాలుగా నటించి నిజముగా ప్రేమలో పడినది ఒక నర్సు.  అతడు చికిత్స పొంది వెళ్లిపోయిన తరువాత అలాగే ఇంకొక రోగితో నటించినప్పుడు మళ్లీ ప్రేమలో పడి తాను కూడ చిత్త భ్రమను పొందుతుంది.  ఖామోషిలో నటించిన వహీదా తన నటన సుచిత్రా సేన్ నటనకు సరి తూగదని తానే చెప్పినదంటే సుచిత్ర ఎంత గొప్పగా నటించినదో ఈ చిత్రములో!

 

ఉత్తర్ ఫల్గుని (1963), మమతా (1966) – ప్రేమికుడు విదేశాలకు వెళ్లగా, పరిస్థితులవల్ల తండ్రి మరొకనితో పెళ్లి జరుపుతాడు. ఆ భర్త త్రాగుబోతు, తన భార్యనే అమ్మడానికి సందేహించడు, వాడిని వదలి పారిపోయి పన్నాబాయిగా మారుతుంది. తన కూతురిని ఒక క్రైస్తవ మొనాస్టరీలో వదలి వెల్లిపోతుంది. విదేశాలకు వెళ్లిన ప్రేమికుడు ఆమెను ఒక రోజు చూస్తాడు.  ఆమెను తన యింటికి పిలిపించుకొని పాట పాడిస్తాడు, కాని తన ముఖము చూపడు. పారితోషికాన్ని అతని కార్యదర్శి ఇవ్వబోగా ముఖముచూపని వారిచే పారితోషికము గ్రహించనని చెప్పుతుంది. తరువాత అతడే ఆమె కూతురు సుపర్ణ బాధ్యతలు వహించి ఆమెను విదేశాలకు పంపుతాడు. ఆమె కూడ బారిస్టరుగా తిరిగి వస్తుంది. తన మాజీ త్రాగుబోతు భర్త బ్ల్యాక్మెయిల్ చేస్తుంటాడు, అప్పుడు తన కూతురి భవిష్యత్తు పాడవ కూడదని వాడిని హత్య చేస్తుంది. ఆమెను తప్పించడానికి ఆమె ప్రేమికుడే వాదిస్తాడు, అప్పుడు ఆమె కూతురు ఆమె అపరాధి ఆమె శిక్షార్హురాలు అని చెప్పగా, అతడు ముద్దాయి ఎవరోకాదు, సుపర్ణ తల్లి అని చెబుతాడు.  తల్లిగా, కూతురిగా రెండు పాత్రలను సుచిత్ర ఈ చిత్రములో పోషించింది. తల్లి పాత్రలోని ఆవేదన, కూతురి పాత్రలోని చలాకీదనము రెంటిని బింబప్రతిబింబాలుగా ప్రదర్శించింది ఇందులో.

 

ఉత్తమ్ కుమార్ తో సుచిత్ర

ఉత్తమ్ కుమార్ తో సుచిత్ర

సాత్‌పాకే బంధా (1963)  (హిందీలో కోరా కాగజ్) – పెళ్లి అనేది ఏడడుగుల బంధమే కదా? దానినిగురించిన కథ ఇది.  తండ్రి ఒక విద్యాధికారి, తల్లి మామూలు మనిషి, కూతురు అర్చనకు ఒక కళాశాల ప్రాధ్యాపకుడు సుఖేందుతో ప్రేమ. తండ్రి ఒప్పుకొంటాడు, తల్లికి ఇష్టము లేదు. పెళ్లి అవుతుంది. అర్చన తన భర్త సుఖేందును సంతృప్తిపరచడానికి ఎంతో కష్టపడుతుంది. కాని సుఖేందుకు భార్యను అర్థము చేసికోలేక పోయాడు.  వాళ్లిద్దరి మధ్య దూరము పెరుగుతుంది. తల్లి తన కూతురు ఒక పేద అధ్యాపకునితో కష్టపడుతుందని తాను వాళ్లిద్దరి మధ్య జోక్యము కలుగజేసికొంటుంది. చివరకు ఇద్దరు ఒకరినొకరు ఇంకా ప్రేమించుకొంటున్నా కూడ విడాకులు తీసికొంటారు. ఐనా సుఖేందు రాకకోసం అర్చన ఎదురుచూస్తూనే ఉంటుంది.

 

ఆంధీ (1975) – సుచిత్రా సేన్ ఆఖరి చిత్రాలలో ఇదొకటి. ఇందులో ఆమె పాత్రకు, ఇందిరా గాంధీ జీవితానికి లంకె ఉన్నదని ఒక ప్రచారము ఉండేది. ఇందులో ఆమె వస్త్రాలంకారము, కేశాలంకారము మున్నగునవి కూడ దీనిని బలపరిచింది. ఇరవై వారాల తరువాత ఈ చిత్ర ప్రదర్శనను ఆపారు. అవి ఎమర్జెన్సీ రోజులు, ఈ తరము వారికి ఆ విషయాలు తెలియవు. కొద్దిగా సందేహము కలిగినా ఇలాటివి సర్వసామాన్యము ఆ కాలములో. కిశోర్ కుమార్ కాంగ్రెస్ మహాసభలో పాడడానికి నిరాకరించాడని అతని పాటల ప్రసారమునే ఆకాశవాణిలో ఆపిన దినాలు అవి!  తనకు  ఆదర్శవంతురాలైన నాయకురాలు ఇందిరా గాంధి అని సుచిత్ర పాత్ర ఇందిరా గాంధి చిత్రపటము ముందు చెప్పిన మాటలను చిత్రముతో జత చేసిన తరువాత మళ్లీ చిత్రాన్ని విడుదల చేయుటకు అనుమతించారు. తన తండ్రిచే ప్రోత్సహించబడి రాజకీయాలలో చేరి ఎన్నికలలో పోటి చేస్తున్న ఒక రాజకీయవాదిగా సుచిత్ర ఇందులో నటించినది. విడాకులు పొందిన భర్తను మళ్లీ కలిసినప్పుడు పాత జ్ఞాపకాలు ప్రేమ మళ్లీ చిగిరింది. ఇందులోని ఆరతీదేవి పాత్ర నెరసిన వెండ్రుకలు, ఆమె కట్టుకొన్న చీరలు ఇందిరా గాంధీకి సరిపోయేటట్లు ఉండడము ఒక విశేషము.

 

ఆమె నటించిన చిత్రములలో నాకు నచ్చిన రెండు పాటలను మీకు జ్ఞాపకము చేస్తున్నాను –

 

(1) అగ్నిపరీక్ష చిత్రములోని కే తుమి ఆమారే డాకో అనే పాట ( – http://www.youtube.com/watch?v=xR6OllPrZ_U&list=PLE0072797BFB1F116 ). మాంగల్యబలములోలోని పెనుచీకటాయె లోకం పాట ఈపాటపై ఆధార పడినదే.

 

(2) మమత చిత్రములోని ఛుపాలో దిల్ మే యూఁ ప్యార్ మేరా (  http://www.youtube.com/watch?v=lZCHYFkED5M ). ఈ పాట పారసీక ఛందస్సు ముతకారిబ్ ముసమ్మన్ ముజాఫ్ మక్బూజ్ అస్లం ముజాయిఫ్ పైన ఆధారపడినది.  దీనిని గురించి అంతర్జాల పత్రికయైన మాలికలో నేను చర్చించియున్నాను.

 

ఒక తార భూమిపైన అస్తమయమై ఆకాశములో ఉదయించింది.  మరో ప్రపంచము అనేది ఉంటే అక్కడ దివంగతుడైన ఉత్తం కుమార్‌తో మళ్లీ నటించడానికి నాందీవాక్యమును సుచిత్రా సేన్ పలుకవచ్చును.

– జెజ్జాల కృష్ణ మోహన రావు

222121_10150170989267886_3694186_n

“నేను”తో వొక కొత్త విమర్శ ప్రయోగం!

 

(ప్రతిష్టాత్మకమయిన లోక్ నాయక్ సాహిత్య పురస్కారం ఈ ఏడాది ప్రసిద్ధ రచయిత్రి ఓల్గా కి దక్కింది. ఈ సందర్భంగా ఓల్గా సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి “సహిత” గురించి 2012 లో అఫ్సర్ రాసిన  వ్యాసం )

19BG_VOLGA_1336248e

నాకు చాలా ఇష్టమయిన పది పన్నెండు ప్రపంచ నవలల్లో వర్జీనియా వుల్ఫ్ రాసిన “టు ద లైట్ హౌస్” వొకటి. అది నేను నా తొలినాళ్లలో చదివిన నవల అవ్వడం వొక వ్యక్తిగత కారణం.   బీయ్యే ఇంగ్లీష్ చేసేటప్పుడు ఆధునిక ఇంగ్లీష్ నవల- సాహిత్య సిద్ధాంతాలు  స్పెషలైజేషన్ గా తీసుకుని, మొదట చదివి, విశ్లేషించిన పది ఆంగ్ల నవలల్లో ఇదీ వొకటి.  మిగిలిన ఆ తొమ్మిది నవలలు అంతగా మళ్ళీ మళ్ళీ చదివిందేమీ లేదు. కానీ  “టు ద లైట్ హౌస్”  నన్ను ఇప్పటికీ వెంటాడే నవల. నాలుగేళ్ళకోసారి నా చేతులు అప్రయత్నంగా ఆ నవలని తీసుకుంటాయి, ఆ చేతులు నొప్పెట్టినా సరే,  చివరి పేజీ దాకా చదవనిదే వదలనివ్వదు నవల .   

ఈ  నవలలో వొక స్త్రీ పాత్ర ఇంకో పురుష పాత్రని అడుగుతుంది,

“ఇంతకీ మీ నాన్నగారు రాసిన ఆ పుస్తకాలన్నీ దేన్ని గురించి?” అని-

అతను ఇంకే తడబాటూ లేక వెంటనే “subject, object and the nature of reality” అంటాడు.

“ఓర్నాయనో! ఏమిటదీ??” అని బిక్క మొహం వేస్తుంది ఆవిడ.

అప్పుడు పాపం, ఆమె  ఏ సాహిత్య కళా వాసనలూ లేని “వంటింటి కుందేలు” అన్న స్పృహ కలిగి,  ఆమెకి అర్థమయ్యే భాషలో చెప్పాలని అతను “ఈ కిచెన్ టేబులు గురించి ఆలోచించు, నువ్వు దాని దగ్గిర లేనప్పుడు!” అంటాడు, కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు అంత తీవ్ర స్థాయిలో కాకపోయినా, “ఆడముండల్తోనా ఆలోచనా?” లాంటి ఏదో వొక భావంతో!

ఆమెకి ఆ ముక్క  అర్ధమయ్యిందా కాలేదా అన్నది వేరే సంగతి. నాకు మాత్రం చాలా కాలం అర్థం కాలేదు, కానీ, చాలా సందిగ్ధంలో పడి, తరవాత తరవాత శోధిస్తే తేలిందేమిటంటే ఇది నా బాధ కాదు, ప్రపంచం బాధ అనీ!

పాశ్చాత్య సాహిత్య విమర్శలో తల పండిన సాహిత్య విమర్శకులూ, సామాజిక  సిద్ధాంతకర్తలూ  పదే పదే  ఈ సంభాషణని ప్రస్తావిస్తూ వచ్చారు.  వివిధ కాలాల్లో వచ్చిన వీళ్ళంతా  కూడా ఆయా కాలాల్లో ఆయా రకాలుగా దీన్ని అర్థమో, అపార్థమో చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ ప్రతి నాలుగేళ్ళకి వొక సారి ఈ నవల నేను చదువుతూనే వున్నా, చదివిన ప్రతి సారీ ఈ సంభాషణ నాకు  వొక్కో కాలంలో వొక్కో  రకంగా అర్ధమయ్యింది. ఒక అర్ధానికీ ఇంకో అర్ధానికీ పొంతన లేదు. అలా పొంతన లేకపోవడానికి కారణం నేను ఆ సంభాషణ గురించి ఆలోచించే స్థితిలో, ధోరణిలో మార్పు రావడమే!

కాలానుగుణంగా మారుతున్న ఆలోచనలలో  మారుతూ వున్న ‘నేను” ముఖ్యమయిన పాత్ర తీసుకుంటోంది. ఆ “నేను” చుట్టూ మారే స్థల కాలాలు అంతకంటే గట్టి పాత్ర తీసుకుంటున్నాయి.  అటు నించి నరుక్కురావాలంటే, ఇప్పుడు  ఆ మగవాడి మాట అతనికే అప్పజెప్పాలి  స్త్రీత్వపు వైయక్తిక స్వరంతో – ‘విషయం, విషయి, వాస్తవికత స్వభావం’ ఎప్పటికప్పుడు మారిపోతాయి.  అంతే కాదు, ఆ మాటలు ఎవరు అంటున్నారు, ఎవరు వింటున్నారు అన్న ప్రశ్నని బట్టి కూడా వాటి అర్ధాలు మారిపోతాయి. అంటే, పఠనం అనేది కేవలం వొకే వైపు దూసుకెళ్లే ట్రాఫిక్ కాదనీ, అది చదువరి/ శ్రోత/ రచనలోని సాంస్కృతికత/ చదువరి, పఠిత సాంస్కృతికత మొదలయిన అంశాలు పఠనాన్ని ఒక performance గా మారుస్తున్నాయి. ఎవరు ఎవరికోసం చదువుతున్నారన్నది performativity కోణం నించి అడిగే ప్రశ్న. ఎవరు ఎవరి కోసం అన్న ప్రశ్నలో సమాధానాలు  “నేను” లోనే వున్నాయి.  వొక్కో సారి విషయం (subject) మారకపోయినా, విషయి మారకపోయినా, ఈ “నేను’ దాన్ని చూసే “subjective” దృష్టి వల్ల మొత్తం వాస్తవికత స్వభావమే మారిపోవచ్చు.

ఓల్గా గారి “సహిత” వ్యాసాలు చదువుతునప్పుడు ఆ మార్పు ఎట్లా వుంటుందో కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది. “సహిత”లో వొక రచయిత తన పఠనానుభవంలోకి తీసుకువెళ్లడం వొక ప్రధాన ప్రక్రియ. అయితే, అదే సమయంలో ఆ పఠనానుభవంలో “తను” ఏమిటి? ఆ “తను” ఎవరికోసం గొంతు విప్పుతోంది? అన్న ప్రశ్నలు కూడా ముఖ్యమవుతున్నాయి.

స్త్రీ వాదం చర్చలోకి వచ్చేంతవరకూ చాలా మంది విమర్శకులు  ఆ సంభాషన్లో “అతను” చెప్పిన ఆ ముక్కకే పరిమితమయి మాట్లాడారు, స్త్రీ వాదులు ఆ విమర్శనంతా తుంగలో తొక్కి, అప్పటి వరకూ ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన  ఆవిడ పక్షం తీసుకొని, అసలక్కడ “కిచెన్ టేబులు ఎందుకు ఉదాహరణ కావాలి?” అన్న కొత్త  సాంస్కృతిక వాస్తవిక ప్రశ్న లేవనెత్తారు. అది ఎలాంటి ప్రశ్న అంటే, ఆ నవల రాసిన కాలంలో అంటే 1927లో అలాంటి వొక ప్రశ్నని వర్జీనియా వుల్ఫ్ కూడా వూహించి వుండదు. అదే విధంగా, ఓల్గా “సహిత”లో వివిధ వ్యాసాలలో లేవనెత్తిన సాంస్కృతిక ప్రశ్నలన్నీ సమకాలీన/ దృక్పథ-కేంద్రిత స్పృహలోంచి మొలకెత్తినవి. వొక విధంగా ఈ ప్రశ్నలు ఇప్పుడు మొలకలయిన భావనల అప్పటి అంకురాల అన్వేషణ “సహిత.”

వర్జీనియా వుల్ఫ్ నవలానంతర  ప్రశ్నల  నేపధ్యంలో తలెత్తిన చర్చల్లో ఇంకా వేరే అంశాలు చాలా వున్నాయి, ఒక సామాజిక సిద్ధాంత చర్చే వుంది.  కానీ, నేను ఇప్పుడు ఓల్గా సాహిత్య వ్యాసాల సంపుటి “సహిత” విశ్లేషణలో ఆ చర్చలోని రెండు అంశాలని మాత్రమే ప్రధానంగా తీసుకుంటున్నాను -అందులో మొదటిది  స్త్రీవాద వైయక్తికత (subjectivity), రెండోది: స్త్రీవాద సాహిత్య/సాంస్కృతిక చరిత్ర నిర్మాణం (feminist historiography). ఈ రెండు మౌలిక భావనలకీ వొక దాంతో ఇంకో దానికి సంబంధం వుంది, అలాగే, ఈ రెండూ  ఓల్గా సాహిత్య వ్యాసాల ‘సహిత’ కీ పునాది అని నా అభిప్రాయం. వర్జీనియా వుల్ఫ్ రాసిన “టు ద లైట్ హౌస్” నవలకీ, ఓల్గా తెలుగు సాహిత్య రంగంలో చేస్తున్న పనికీ కూడా కొన్ని పోలికలు వున్నాయి. అది ఇంకా లోతయిన తులనాత్మక విశ్లేషణ జరగాల్సిన విషయం కాబట్టి, ఇప్పటికిప్పుడు  ఆ విషయం జోలికి నేను  పోవడం లేదు.

ఇక ఈ వ్యాసం ముగిసే లోగా నేను చాలా గట్టిగా  వాదించదలచుకున్న అతి ముఖ్యమయిన విషయం ఇంకోటి  వుంది – ఈ  ‘సహిత’ వ్యాస సంపుటి కేవలం సాహిత్య వ్యాసాల సంపుటి కాదనీ, ఇది  ఓల్గా మేధోజీవన ఆత్మ కథ (intellectual autobiography) అని. ఈ వాదన కొంచెం సంక్లిష్టమయింది అని నాకు తెలుసు. కానీ, అది ఈ సందర్భంలో ముఖ్యమయ్యిందని నాకు కచ్చితంగా తెలుసు, ఈ వ్యాసం చదివాక అది  మీకు కూడా తెలుస్తుంది.

1

      వైయక్తికత అనే మాటని కాస్త తేలిక పద్ధతిలో, ఇప్పుడు మరీ ఎక్కువగా ప్రాచుర్యంలో వున్న  వ్యక్తిగతం(పర్శనల్)   అందాం. కానీ, ఈ ‘వ్యక్తి’కేవలం  ‘నేను’ పరిధికి  కుంచించుకు పోయే వ్యక్తి కాదని చెప్పడం కోసం, దాన్ని వొక భావనగా చర్చించే వుద్దేశంతో ‘వైయక్తికత’ అని కొంచెం భిన్నమయిన పదాన్ని వాడుతున్నాం. కానీ, అన్నీ విధాలుగా వ్యక్తిగతం అనే మాట కింద వచ్చే విషయాలే ఇందులో చర్చకి వస్తాయన్నది వాస్తవం. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలంటే, ఇప్పుడు అస్తిత్వం అనే భావనకి ఒక రూపాంతరం   వైయక్తికత.

తత్వశాస్త్ర చరిత్ర చాలా కాలం పాటు అస్తిత్వం అనే భావనకి సామూహికత పునాది అంటూ వచ్చింది. అనేక మతాల దర్శనాల్లో కూడా సామూహిక అస్తిత్వానికే పెద్ద పీట వేశారు. దాని ప్రకారం, సామూహికంగా వొప్పుదల అయిన కొన్ని భావనల సమాహారమే వైయక్తికత లేదా అస్తిత్వం. ఆ అస్తిత్వ చర్చలో వ్యక్తికి విడిగా వొక స్థానం అంటూ లేదు. కానీ, ఆధునికత అనే భావనలో  వైయక్తికతని అస్తిత్వానికి వొకానొక ముఖ్యమయిన లక్షణంగా గుర్తించడం మొదలయ్యింది. ఆశ్చర్యంగా ఈ పదాన్ని వొక భావనగా వుపయోగించిన మొదటి  తాత్వికుడు వొక కాల్పనిక కవి కొల్రిడ్జ్. 1821 లో కొల్రిడ్జ్ చెప్పిన అర్ధం– consciousness of one’s perceived states- చాలా కాలం పాటు  అదే ప్రామాణికంగా వుంది.

కానీ, ఈ వైయక్తికత అనేది కేవలం వొక వ్యక్తి అవగాహనా, అనవగాహన మీద ఆధారపడిన స్థితి కాదనీ, ఈ వ్యక్తి అస్తిత్వ భావన అనేక అంతర్ బాహ్య పరిస్తితుల మీద కూడా ఆధారపడి వుంటుందని అత్యాధునిక  సామాజిక శాస్త్రవేత్తలు చెప్పడం మొదలు పెట్టారు. ఈ కొత్త భావన ప్రకారం సమూహం ఎంత ముఖ్యమో, వ్యక్తీ అంతే ముఖ్యం. కానీ, ఆ వ్యక్తికి ఎన్ని కోణాలు వుంటాయన్నది ఇప్పుడు ముఖ్యమయిన ప్రశ్న.  2001 లో ఆంథోనీ ఎలియట్ ఏమంటున్నాడో చూడండి:

…..the self is also shaped and defined against the backdrop of…..political and public forces; yet the fabrication of the self, psychologically and emotionally, is rightly understood to involve something more subjectivity, particularly in the ways in which desire, emotion and feeling influence the conscious and unconscious experience of sexuality, gender, race and ethnicity.

కొల్రిడ్జ్ నుంచి ఇటీవలి ఎలియట్ దాకా వైయక్తిక అస్తిత్వం వొక భావనగా సాగించిన ప్రయాణంలో మనం చూడాల్సిన మార్పు ఏమిటంటే, వైయక్తిక అస్తిత్వం అనేది మనం అనుకుంటున్నంత వైయక్తికం కాదు. అందులో ఆ అస్తిత్వాన్ని సృష్టించే పబ్లిక్ శక్తుల ప్రమేయం తప్పక వుంటుంది. అత్యాధునిక వాదం పర్సనల్ కీ, పోలిటికల్ కీ మధ్య వుండే పరస్పర బంధాన్ని చెప్పే దాకా వెళ్తుంది ఆ పునాది మీదనే. విశ్వజనీనత అనే భ్రమ నుంచి బయట పడి, చాలా నిర్దిష్టంగా, స్థానికంగా  మాట్లాడడం మొదలెడితే తప్ప ఈ అస్తిత్వ కోణాల్ని సమగ్రంగా చూడలేమని నా వాదన.

గత పాతికేళ్లుగా తెలుగు సాహిత్య/సామాజిక చరిత్రని శాసించిన రెండు మౌలిక భావనలు – నిర్దిష్టత, స్థానికత. ఎన్ని వాదాలు వచ్చినా, ఎని వివాదాలు జరిగినా, ఈ రెండు మౌలిక భావనల్ని అవి తప్పించుకోలేవని నా అభిప్రాయం. తెలుగు సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం అంటూ జరిగితే, అది ఈ భావనల పునాదిగా జరగాల్సిందే. కానీ, భిన్న వైయక్తికతలు వుండే కాలంలో సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం ఎలా జరుగుతుందీ, దానికి తగిన వనరులు, ఆధారాలూ, పరికరాలూ మనకి వున్నాయా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వున్నాయని నా విశ్వాసం. అయితే, ఇప్పుడు వున్న సంకుచిత వైయక్తిక ధోరణుల నించి కాకుండా, వైయక్తికతని దాని నిజమయిన అర్ధంలో అర్ధం చేసుకుని, చర్చిస్తే, మన చుట్టూ వున్న రచయితలే సాంస్కృతిక చరిత్ర నిర్మాతలు అన్న విషయం కూడా మనకి అర్ధమవుతుంది. ఓల్గా సాహిత్య వ్యాసాల్ని ఆ దృష్టి కోణం నుంచి చదివినప్పుడు నేను ఇలాంటి కొన్ని సాంస్కృతిక తీగల్ని కలుపుకుంటూ వెళ్లగలిగాను. వాటన్నిటినీ కలిపి వొక చోటి నించి చూస్తే, సమకాలీన సాహిత్య సాంస్కృతిక చరిత్ర గురించి కొన్ని సాధారణ లక్షణాల్ని క్రోడీకరించే (classification), కోడీకరించే (codification)  అవకాశం కూడా వుంది. ఆ సాధారణ లక్షణాల సమ్మేళనమే కొత్త సాహిత్య చరిత్ర నిర్మాణానికి పునాది అని నేను వేరే చెప్పకర్లేదు కదా!

అంటే, ఈ వ్యాసాలలో చాలా బలమయిన అస్తిత్వ కోణాలు కనిపించినప్పటికీ, వాటి మూలాలు అన్నీ మొత్తం సాహిత్య చరిత్రలో వున్నాయి. అందుకే, ఈ వ్యాస సంపుటి గురజాడతో –  కాదు, కాదు, మధురవాణితో – మొదలవ్వడం కాకతాళీయం కాదనుకుంటా.  తెలుగు సాహిత్యంలో స్త్రీ చర్చకి మంచి ప్రారంభం వుంది కానీ, కొనసాగింపు లేదని నేను గతంలో ఒక సారి చెప్పాను. ఆ ప్రారంభం గురజాడతో జరిగింది. ఓల్గా సాహిత్య వ్యాసాలు ఇప్పుడు ఈ 2011 లో కూడా గురజాడతో ప్రారంభం అవ్వడం నాకు యాదృచ్ఛిక్కమూ అనిపించలేదు, ఆశ్చర్యమూ అనిపించలేదు, గురజాడ తీసుకువచ్చిన ఆధునికత లోతులు ఇంకా మనకు అంతు పట్టనే లేదు కనుక. వర్జీనియా వుల్ఫ్ నవలలో ఇటీవలి సాహిత్య సిద్ధాంత వేత్తలు ‘ఆమె’ పక్షం తీసుకోవడానికీ, ఓల్గా ఈ పుస్తకంలో మధురవాణి పక్షం తీసుకోవడానికీ ఆ సాహిత్య చరిత్రే కారణం. ఆ మాటకొస్తే, మధురవాణి గురించి ఇప్పటి వరకూ తెలుగు సాహిత్యకారులు మాట్లాడలేదా అంటే మాట్లాడారు.

మధురవాణిని తెలుగు సాహిత్యంలో ఇప్పటిదాకా బలంగా కాపాడుకుంటూ వస్తున్న లక్షణాలేమిటో ఇక్కడ ఏకరవు పెట్టక్కర్లేదు. కానీ, ఆమెని వాళ్ళు రొమాంటిసైజ్ కూడా చేశారన్నది నిజం. చాలా మందికి ఆమె అనేకానేక కాల్పనిక కావ్యకన్యల్లో వొకటిగా మిగిలిపోయింది తప్ప, ఆమె మాటల కింద ప్రవహిస్తున్న మూల భావనల జాడ వాళ్ళకి అంతుపట్టిందని అనుకోడానికి ఇప్పటివరకూ వున్న పురుష కేంద్రిత విమర్శ సాంప్రదాయంలో తగిన ఆధారాల్లేవు.  ఓల్గా ఇన్నేళ్ల తరవాత ఆమెని ఎందుకు భిన్నంగా చూడగలిగారు అన్న విషయం అర్ధం కావాలంటే నేను పైన ప్రస్తావించిన వైయక్తిక భావన చరిత్ర అర్ధం కావాలి. ఓల్గా చూసిన మధుర వాణికీ, గురజాడ ‘పాత్ర’కీ సంబంధం వుందా అంటే, ఆ విషయం ఇప్పటికిప్పుడు అప్రస్తుతమే అంటాను. ‘ప్రస్తుతం’లోకి  ఆ పాత్ర ఎట్లా అనువదించబడుతోందో అదే ముఖ్యమనీ అంటాను. ప్రతి రచనకీ, ప్రతి పాత్రకీ అనేక జన్మలు వుంటాయి. వొక్కో జన్మ ఆ కాలధర్మాన్ని బట్టి వుంటుంది. ‘ఒక్క నేనే నీకు, పెక్కు నీవులు నాకు” అని ఎంకి నాయుడు బావలు  ఎందుకనుకున్నారో  కచ్చితంగా అదే, వొక రచన విషయంలో కూడా జరుగుతుంది. ఒక్క రచనే, కానీ ‘పెక్కు నీవు’లుగా మారుతుంది. సాహిత్య చరిత్ర మూల మలుపుల్లో వున్నప్పుడు ఈ ‘పెక్కు నీవుల’ బహుళత్వం కొంత సంక్లిష్టంగా కూడా వుండవచ్చు.

మధురవాణి పాత్రని ఓల్గా కుటుంబ కేంద్రిత భావజాలంపై వొక ధిక్కార ప్రకటనగా చూశారు, ఇంటి శ్రమని గుర్తించిన గాఢమయిన వైయక్తికత వున్న ఆధునికవాదిగా విశ్లేషించారు. ఈ విధమయిన దృష్టి అంతకు ముందు లేదు. ఇంకో కోణం నించి అసిరిని విశ్లేషించడంలో ఈ కొత్త విమర్శనా పద్ధతికి విస్తృతి పెరిగింది.  నిజానికి మధురవాణి వ్యక్తిత్వానికి వ్యాఖ్యానం ఇవ్వగల పాత్ర ఆసిరి విశ్లేషణలో ఈ మొత్తం కుటుంబ, బ్రాహ్మణ కేంద్రిత మార్మికీకరణ రహస్యాలు బట్టబయలు చేస్తారు ఓల్గా. ఈ రెండు వ్యాసాలని వొక దాని వెంట వొకటి చదివితే, ఈ రెండీటీ విశ్లేషణకి ఓల్గా ఉపయోగించిన  లెన్స్ వొక్కటే అని అర్ధమవుతుంది. ఆ లెన్స్ ని నేను subjectivity అంటున్నాను.

2

       ఒక వ్యక్తి మనసూ, శరీరం చేసే వ్యాయామాల చరిత్ర ఆత్మకథ అయితే, ఆ వ్యక్తి మెదడు చేసే వ్యాయామాల చరిత్ర మేధో ఆత్మ కథ. అట్లా అని, శరీరానికీ, మెదడుకీ వైరుద్ధ్యం వుందని నేను అనడం లేదు. వాటి మేలు కలయికే మేధో ఆత్మకథ. ఈ వ్యాసం ప్రారంభంలో వర్జీనియా వుల్ఫ్ నవలలో స్త్రీ పాత్ర గురించి పురుషుడికి వున్న ‘సాంప్రదాయిక’ వంటింటికి పరిమితమయిన ఆలోచన ఎలాంటిదో తెలుస్తుంది. ఆ తరవాత ఆ ఆలోచనపై యుద్ధమే మిగతా నవల అంతా – ఒక వాస్తవికత ఎంత సంక్లిష్టంగా వుంటుందో, అది వొక వైయక్తిక కోణం (subjectivity)  వల్ల ఎంత భిన్నత్వాన్ని సంతరించుకుంటుందో చెప్పే ప్రయత్నమే నవల. నిజానికి, స్త్రీ ఆలోచనకి పురుషుడు ‘నిర్మించిన’ ఆ కిచెన్ టేబులు సాంస్కృతిక రాజకీయ వలయాన్ని ఛేదించడం అంతర్లీన ప్రయత్నంగా కనిపిస్తుంది. అయితే, ఈ నవలలో ఆత్మకథాత్మక లక్షణాలు కూడా అనేకం కనిపిస్తాయి.  ఏ రచయిత సృజనాత్మక రచనలో అయినా ఆత్మకథాత్మకత తప్పనిసరి లక్షణం. కానీ, సాహిత్య వ్యాసాలలోనో, సాహిత్యేతర వచనంలోనూ ఆత్మకథాత్మకత వుండే అవకాశం వుందా? అన్నది ప్రశ్న.

అలాంటి అవకాశం వుందనే “సహిత” నేపధ్యంగా మనకి అర్ధమవుతుంది. ఎందుకంటే, ఈ మొత్తం “సహిత” వ్యాసాలన్నీ ఆయా సాహిత్య సందర్భాలలోని ఆయా స్త్రీ పాత్రల వైయక్తిక అన్వేషణే కనుక. ఈ వైయక్తిక అన్వేషణ ముఖ్యంగా మూడు మార్గాలలో జరుగుతుంది. ఒకటి, ఆ రచయిత అధ్యయనం; రెండు, రచయితకి ఇతర రచయితలతో వుండే వ్యక్తిగత/ సైద్ధాంతిక అనుబంధం; మూడు, రచయిత వివిధ సాహిత్య సిద్ధాంతాల ద్వారానో, ఉద్యమాల ద్వారానో చేసే వ్యక్తిగత/ సైద్ధాంతిక ప్రయాణం. నిజానికి ఈ మూడు అంశాలు వొకదానితో వొకటి ముడిపడి వున్నవే. కానీ, వీటి పరిధుల్ని లోతుగా అర్ధం చేసుకోవడానికి వీలుగా వాటిని విడివిడిగా చూడడమూ అవసరమే. ఈ మూడింటి కలగలుపు  ప్రయాణమే ఒక రచయిత మేధోజీవన ఆత్మకథ అవుతుంది.

రచయిత అనుభవమూ అధ్యయనమూ ఎప్పుడూ కలగలిసి వుంటాయి. అనుభవాల్లో వైరుద్ధ్యమో,  సంఘర్షణో లేని రచయిత అధ్యయన పరిధి విస్తరించే అవకాశం తక్కువ. అయితే, అనుభవమనే కొలమానం తీసుకుంటే వైయక్తికతలో కొన్ని రాగద్వేషాలు కూడా బలంగానే వుండవచ్చు. అధ్యయనం వల్ల ఆ రాగద్వేషాల మధ్య కొంత సమతూకం సాధ్యపడవచ్చు. ఒక రచన చదువుతున్నప్పుడు రచయితకి  సామరస్యాల్ని బాగా చూసే అలవాటు అవుతుందని అందరం అనుకుంటాం. కానీ, సామరస్యం కంటే కూడా భిన్నత్వాన్ని చూసే అలవాటు బాగా పెరుగుతుంది. అలాంటి భిన్నత్వ దృష్టి ఆ రచయిత వైయక్తికతని బలంగా కుదుపుతుంది. ఓల్గా ఈ వ్యాసాలలో అలాంటి భిన్నత్వపు కుదుపులను చర్చకి తీసుకువస్తారు. అనుభవానికి వుండే  “తను” “ఇతర” అనే రెండు కోణాల నించి సాగే ఈ అధ్యయన ప్రయాణం ఈ వ్యాసాల్లో ప్రతి వాక్యంలోనూ కనిపించడం మొత్తంగా ఆమె ప్రతిపాదిస్తున్న/ సమర్ధిస్తున్న అస్తిత్వవాద రాజకీయాలకూ, వాటిని శరీర రాజకీయాల నించి చూసే తనదయిన ప్రత్యేకతకి సంకేతాలు. ఈ  అనుభవాన్ని చెప్పెటప్పుడు ఓల్గాలో మారుతున్న స్వరాన్ని గమనించినప్పుడు ఆ స్వరంలో ఉద్వేగం ఎంత వుందో, ఆ ఉద్వేగాన్ని ఆలోచనల భాషలోకి కుదించాలన్న తపన కూడా అంతే వుంది. తన వైయక్తికతని చెరుపుకోకుండా, తన స్వరాన్ని అణచుకోకుండా, తన తను ఇతరలోకి వొంపే సునిశితమయిన వొక సాంప్రదాయ విముక్త భాషని ఓల్గా ప్రతి వ్యాసంలోనూ ఉపయోగిస్తారు.

ఈ “ఇతర” ప్రపంచంలోకి ప్రయాణం ఆమెకి వున్న అనుభవ వైవిధ్యం వల్ల, బతుకు సంఘర్షణ వల్ల, వాటిని నడిపించే తాత్విక స్పష్టత వల్లా వివిధ రూపాలు తీసుకుంటుంది. ఒక రచనతో, ఆయా రచయితలతో తనకి ప్రత్యక్షంగా అనుబంధం వున్నప్పుడు – ఉదాహరణకి శ్రీశ్రీ, కొ.కు, చలం- లాంటి రచయితలని గురించి రాసిన వ్యాసాల్ని పఠిత రెండు సార్లు చదవాలి. మొదటి సారి  కేవలం ఆ రచయిత గురించి ఓల్గా ఏం అంటున్నారో వినడానికి చదవాలి. రెండోసారి, ఆ రచయిత లేదా రచనల వెలుగులో తన గురించి ఆమె ఏం అంటున్నారో వినడానికి చదవాలి. ఈ రెండు ప్రక్రియలూ వొకే మాదిరిగా అనిపిస్తాయి కానీ, నిజానికి కాదు. ముఖ్యంగా, శ్రీశ్రీ గురించి వ్యాసం చూడండి. మొదటి సారి చదివినప్పుడు శ్రీశ్రీ గురించి ఓల్గా కొత్తగా ఏం చెప్పారో నాకు అర్ధం కాలేదు. రెండో సారి చదువుతున్నప్పుడు శ్రీశ్రీ అనే కేంద్రాన్ని తొలగించుకొని, అక్కడ కాసేపు ఓల్గానో, నన్ను నేనో కేంద్రంగా తీసుకునో ఆ వ్యాసం చదివాను. అప్పుడు శ్రీశ్రీ గురించీ, అదే సమయంలో తన గురించీ, అదే అదే సమయంలో నా (నా అంటే నాలోని పఠిత) గురించీ ఓల్గా మాట్లాడుతున్నట్టు నాకు అర్ధమయ్యింది.

ఒక రచన గురించో, ఒక రచయిత గురించో మాట్లాడుతున్నప్పుడు – అది వ్యక్తిగత స్మృతి సందర్భం అయినప్పటికీ- మనం “తన” “ఇతర” మధ్య వొక వంతెన కట్టుకుంటాం. ఆ వంతెన మీద ఆ రచయితతో కలిసి కాసేపు జీవన “సంధ్యల” లోకి చూస్తాం (చలానికి కృతజ్నతలతో ఈ వాక్యం). అలా మనతో కలిసి ఎంతో సేపు సంభాషించలేని /వుండలేని రచయిత గానీ, రచన గానీ మన వైయక్తికతలో నించి అతి తేలికగా మనకి చెప్పా పెట్టకుండానే నిష్క్రమిస్తారు. ఆ తరవాత ఇక ఆ రచయిత గురించీ, ఆ రచన గురించీ మాట్లాడాల్సిందేమీ లేదనే అనుకుంటాను. (ఈ విధమయిన వైయక్తికతని reinforce చెయ్యడానికే చలం మ్యూజింగ్స్ రాసారేమో అనిపిస్తుంది ఈ మధ్య నాకు.) తన సంఘర్షణలో తనతో పాటు నిలిచిన రచయితలూ, రచనల ప్రస్తావన ద్వారా మనం నిజానికి మన లోపలి సంభాషణే వినిపిస్తాం. ఆ పని చలం గురించీ, కొ-కు గురించీ, శ్రీశ్రీ గురించీ రాసిన వ్యాసాలలో నైపుణ్యంతో చేశారు ఓల్గా.

ఈ లోపలి సంభాషణ ఏదయినా వొక విస్పష్టమయిన రూపం తీసుకోవాలంటే, తన బయటి లోకంతో  యుద్ధం కూడా వొక కొలిక్కి రావాలి రచయితకి- అది బయట వున్న ఉద్యమాల్ని ఆ రచయిత ఎంతగా internalize చేసుకోగలరన్న విషయం మీద ఆధారపడి వుంటుంది. ఈ దశలో రచయితలు  ఏ ఉద్యమాలతో, ఏ అస్తిత్వవాద చైతన్యంతో ఏ స్థాయిలో మమేకం అవుతున్నారన్న విషయం వాళ్ళ రచనల్లో బాహాటంగానే తెలుస్తుంది. అయితే, ఇదే సమయంలో ఆ రచయితలు ఆయా ఉద్యమాలతో, అస్తిత్వవాద చైతన్యాలతో ఎంత విమర్శ పెట్టగలరన్న విషయం కూడా ముఖ్యమే. ఓల్గా తన గురించి నేరుగా చెప్పుకున్న విషయాల్లోనూ, ఇతరులు వాహికగా తన గురించి పరోక్షంగా చెప్పిన విషయాల్లోనూ ఈ విమర్శనాత్మక ఆత్మశీలన (critical reflexivity) ని కొన్ని సార్లు ఎంత సున్నితంగా వ్యక్తం చేశారో, ఇంకా కొన్ని సార్లు అంతే ముక్కుసూటిగా నిక్కచ్చిగా critical distance గురించి కూడా  చెప్పారు. అంటే, వొక సైద్ధాంతిక క్రమశిక్షణ వున్న రచయితలు  తమ చుట్టూ వున్న ఉద్యమాల వాడినీ, వేడినీ ఎంత వేగంగా స్వీకరించగలరో, అంతే విమర్శనాత్మకంగా వొక ఆత్మీయమయిన “దూరాన్ని” కూడా స్వీకరించగలరు. అలా చెయ్యలేకపోతే, ఆ రచయితకి వున్న వైయక్తికత గాయపడుతుంది. అలా తన వైయక్తికత గాయపడిన సందర్భాల నించి ఓల్గా నేర్చుకున్న కొన్ని పాఠాలు “సహిత”లో వున్నాయి. ఆ పాఠాలు నిజానికి ఎవరికి వాళ్ళు తిరిగి అనుభవిస్తే తప్ప వాటి తీవ్రత తెలియదు, నిజమే, కానీ, ఆ పాఠాల నించి ఓల్గా తన ప్రయాణం నించి స్త్రీవాద చరిత్ర నిర్మాణ సాధనాల అన్వేషణకి బయలుదేరుతున్నారు, అడవిలో చిక్కుబడిన వొంటరి సీత తనలాంటి ఇతర సీతలతో కలిసి  ఇంకో కొత్త రామాయణం – కాదు సీతాయణం – తిరగరాస్తున్నట్టుగా.

3

       ఏక నలుపు అనే పదాన్ని “సహిత”లో ఓల్గా కొన్ని సందర్భాల్లో వాడడం చూస్తాం. అది ఇష్టంతో కాదు, అయిష్టంతో!

చరిత్ర అంటే ఏక నలుపో ఏక తెలుపో లేదా కేవలం తెలుపూ నలుపుల మిశ్రమం మాత్రమో కాదు. “ఆధునిక మహిళ చరిత్రని పునర్లిఖిస్తుంది” అన్న వాక్యం ఇటీవల చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ, ఈ పునర్లేఖన ప్రక్రియ ఎలా వుంటుందన్న అవగాహన కలగడానికీ, ఆ ప్రక్రియకి అవసరమయిన పనిముట్లని సాధించడానికి కొన్ని దశాబ్దాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది తెలుగు సాహిత్యం.  చరిత్రని వొక మూసలోంచి కాకుండా అనేకత్వంలోంచి చూడాలన్న స్పృహ ప్రధానంగా జాతీయవాద అనంతర/ మార్క్సిస్టు అనంతర ధోరణి. ఒకే ఒక్క ప్రధాన ఆధిపత్య చరిత్ర అంటూ ఏదీ వుండదనీ, ఏక సమయంలో అనేక చరిత్రలు సమాంతరంగా, ప్రత్యామ్నాయంగా, జమిలిగా  పనిచేస్తుంటాయన్న విమర్శనాత్మక చైతన్యం మార్క్సిస్టు, జాతీయవాద చరిత్రల మహా కథనాలని ప్రశ్నించడంతో మొదలయ్యింది. కానీ, ఈ ప్రశ్నించడం అనే ప్రక్రియ సఫలమవ్వడానికి కొన్ని సాధనాలు కావాలి, కొంత సాధనా కావాలి. అలాంటి సాధనాల సాధన మన:కార్మికశాల  “సహిత.”

స్త్రీవాద విమర్శ సాధనాలను ఇంకా సమర్ధంగా వాడుకోలేకపోయామన్న విమర్శ చాలా మటుకు నిజమే. కానీ, ఆ సాధనాలు ఏమిటన్న అవగాహన లేకపోవడం, దానికి సంబంధించిన వచనం తెలుగులో తగినంతగా రూపొందకపోవడం దీనికి  ఒక కారణం.  ఆ ఖాళీని భర్తీ చెయ్యడానికి అన్నట్టుగా, “సహిత”లో ఓల్గా అలాంటి కొన్ని సాధనాలను అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. అలా అందుబాటులోకి తీసుకువచ్చే ముందు ఆమెకి స్వయంగా వాటి వాటి అలభ్యత గురించి స్పష్టత వుంది. 1986లో ఓల్గా “మనకి తెలియని మన చరిత్ర” ని సమీక్షిస్తూ అంటారు, “ తెలుగులో స్త్రీవాద దృక్పథం నుంచి రాసిన చరిత్రలు లేవు. చరిత్ర పుస్తకాలే కాదు, మిగిలిన సాహిత్యంలో కూడా స్త్రీ దృక్పథంతో మాత్రమే వచ్చినవి లేవు” ఈ వాక్యం ఇప్పటికీ నిజమే. “మనకి తెలియని మన చరిత్ర” “మహిళావరణం” లాంటి రచనలు ఎన్నో  వచ్చే అవకాశాలూ, భిన్న సందర్భాలూ  తెలుగు సాహిత్య/ సాంస్కృతిక చరిత్ర నిండా వున్నాయి. వాటి పునర్నిర్మాణం అనేక సందర్భాల్లో అనేక వినిర్మాణాలతో ముడిపడి వున్న విషయం కాబట్టి, ఆ వినిర్మాణ/పునర్నిర్మాణ ప్రక్రియలో వుండే వేదనా, శ్రమా రెండీటీని ఎదుర్కొనే శక్తి మన రచయితలకీ, ముఖ్యంగా విమర్శకులకి చాలా తక్కువ. అప్పుడప్పుడూ అరకొరగా సాగుతున్న కృషి వున్నా, అది సరిపోదు.   చరిత్ర నిర్మాణం పట్ల మనలో వున్న అలాంటి అంధత్వాన్ని గుర్తించి, కనువిప్పు కలిగించే సాధనాలు కొన్ని అయినా అందుబాటులోకి తేవాలన్న ప్రయత్నం “సహిత” లో కనిపిస్తుంది.

అలా ఓల్గా అందుబాటులోకి తీసుకువచ్చిన , మొదటి సాధనం – ఒక వాచకాన్ని దగ్గిరగా, విమర్శనాత్మకంగా, అంతర్దృష్టితో చదవడం (close, critical and reflexive reading). “సహిత”లో మొదటి  నాలుగు వ్యాసాలు గురజాడ కన్యాశుల్కం ని నాలుగు భిన్నమయిన సాధనలతో విశ్లేషిస్తాయి. మొదటి వ్యాసం మధురవాణిని కుటుంబ-కేంద్రిత కోణం నించి చూస్తుంది. రెండో వ్యాసం ఒక పురుష పాత్ర నించి మధురవాణిని ఆవిష్కరించడం, అదే సమయంలో ఆధిపత్య ధోరణిని ప్రశ్నించే సాధనాన్ని (de-heirarchization) ఉపయోగించారు. ఈ సాధనాల వాడకం దృష్టి నించి చూస్తే, మూడో వ్యాసం చాలా చర్చించదగింది. ఈ వ్యాసం ఫెమినిస్టులు చట్టాన్ని ఎట్లాచూడాలో, దాన్ని తిరిగి సాహిత్య దర్పణంలోంచి ఎట్లా వీక్షించాలో ఓల్గా తగిన ఆధారాలతో చూపిస్తారు. ఇదే వ్యాసంలో ఇంకో ముఖ్యమయిన సాధనాన్ని కూడా ఆమె బాగా వాడుకున్నారు. అది వలసవాదానంతర ధోరణి నించి రచనని చూడడం. బ్రిటిష్ వలస పాలన అనుసరించిన వ్యూహాల వినిర్మాణ ధోరణి  కనిపిస్తుంది.  ఇక నాలుగో వ్యాసం – domestic labor కోణం నుంచి కన్యాశుల్కం విశ్లేషణ. ఈ వ్యాసం ఒక social postmodernist కోణం నించి కూడా అర్ధం చేసుకోవచ్చు.  స్త్రీవాద విమర్శకోణం నించి వొక రచనని ఎట్లా దగ్గిరగా, విమర్శనాత్మకంగా చదవవచ్చో కొన్ని నమూనాల్ని ఓల్గా ఈ వ్యాసాల్లో చూపిస్తారు.

రెండో సాధనం ప్రతిఘటన  రాజకీయాలకి సంబంధించింది.  వొక స్త్రీవాదిగా ఏ రచనని స్వీకరించాలి, ఏ రచనని నిరాకరించాలి అన్నది ఎట్లా తేల్చుకోవడం?! సాధారణ  రచయితల కంటే భిన్నంగా  స్త్రీవాద రచయిత గానీ, అస్తిత్వవాద రచయిత గానీ  మూడు  రకాల అణచివేతల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఒకటి: నిజంగా సంప్రదాయ సాహిత్యం నించి, రెండు: ఆధునికంగా కనిపించే అంతర్గత సంప్రదాయం నించి, మూడు: అస్తిత్వాన్ని నిరాకరించే ఆధునికత నించి. వీటన్నిటినీ దాటుకొని వచ్చి స్త్రీ తన స్వరాన్ని ఎట్లా వినిపించాలన్నది తీవ్ర అన్వేషణ. ఇదే క్రమంలో ఇంకొక ముఖ్యమయిన వెతుకులాట కూడా వుంటుంది. అది తనదయిన స్మృతిని/ అనుభవాన్ని తిరిగి రాబట్టుకోవడం(retrieval of the personal memory).  ఇతర అనేక అంశాల మాదిరిగానే ఈ మూడు కూడా పరస్పరాధారిత కోణాలు. ఇక్కడ ఈ “వ్యక్తిగతం” రాజకీయాలకీ, పబ్లిక్ కి అతీతం కాదు. వాటన్నిటి కలయికలోంచి పుట్టిన subjectivity.

“సహిత” వ్యాసాల సారాంశాన్ని వొక వాక్యంలో చెప్పాలంటే, అదంతా ఈ నిరాకరణ-స్వీకరణ రాజకీయాల నుంచి ఓల్గా తనదయిన అనుభవ స్వరాన్ని వెతుక్కునే దారి. కాల పరిమితుల దృష్ట్యా ఓల్గా ఈ వ్యాసాలలో సంప్రదాయ సాహిత్యం జోలికి పోలేదు కానీ, గురజాడ కన్యాశుల్కం విశ్లేషణలో కొంత మేరకు ఆ సాంప్రదాయ అణచివేత ని విమర్శిస్తారు. అది కాక, మిగిలిన రెండు కోణాలు – ఆధునికంగా కనిపించే అంతర్గత సాంప్రదాయం, అస్తిత్వాన్ని నిరాకరించే ఆధునికత- ‘సహిత”లో ప్రధానమయిన ఇతివృత్తాలు. వాటి చుట్టూ జరిగే చర్చ కొంత మేరకు సంప్రదాయాన్ని కూడా ప్రశ్నించినా, వాటి యుద్ధ భూమి మాత్రం తక్షణ వర్తమాన  కురుక్షేత్రమే. ఆ కారణంగానే “సహిత” ఈ కాలపు స్త్రీవాదుల ఆత్మచరిత్ర కూడా!

-అఫ్సర్

2012

 

మా వంగూరి హౌస్, రేడియో సావిడి, సమ్మర్ హౌస్!

chitten raju

పుట్టిన ఇంట్లోనే గిట్టే దాకా ఉండడం పల్లెటూళ్ళలో మామూలే. ఉద్యోగాలలో బదిలీల మీద వేరే నగరాలకి పోవడం, ఒకే ఇంట్లో కొన్నేళ్ళు అద్దెకున్నా అనేక కారణాలకి ఇల్లు మారడం, సొంత ఇల్లు ఉన్నా చదువులకి పై ఊళ్ళు వెళ్ళవలసి రావడం వగైరా అనేక కారణాల వలన దశాబ్దాల కొద్దీ ఒకే ఇంట్లో ఉండడం పట్నం వాసులకి అరుదే అని అందరికీ తెలిసినదే. కానీ నా విషయంలో పుట్టిన ఇంట్లోనే పెరిగి, ఇంజనీరింగు డిగ్రీ చదువు పూర్తయే దాకా ..అంటే 21 సంవత్సరాలు కాకినాడలో మా “వంగూరి హౌస్” లోనే గడపడం నా అదృష్టమే!

1925 లో ఆ ఇల్లు ఆ నాటి ఇళ్ళ నమునాని తలపిస్తూ ముందు ఒక వరండా, నాలుగు స్తంభాలు, లోపల వాస్తు ప్రకారం ఆగ్నేయం మూల వంట గది, మరొక పక్కన రోజుకి ఇరవై నాలుగు గంటలూ బొగ్గుల మీద వేడిగా కాగుతున్న యాభై గేలన్ల పాల కుండ,   పక్కనే పూజ గది, ఆనుకుని ఆవకాయలు పెట్టుకునే అటక తో సహా ఊరగాయల గది, ఏడాదికి సరిపడా ధాన్యం నిలవ చేసుకునే కొట్టాం తో సహా పప్పులూ, వంట దినుసులూ అమర్చుకునే ఒక పెద్ద స్టోర్ రూమూ, వెనకాల భోజనాల వరండా, నాలుగు పడక గదులు, ఈ రోజుల్లో లివింగ్ రూమ్ అన దగ్గ మధ్య గది,  నగలు, నట్రా, వెండి కంచాలు  దాచుకునే భోషాణం గదీ, ముందు వరండాకి పక్కన ఒక అతిథి గది , వెరసి పది గదులతో ఆ “చిన్న” పెంకుటిల్లు తాత్కాలికంగా ఒక ఔట్ హౌస్ లా కట్టారు మా తాత గారు. అంత విశాలమైన స్థలంలో పెద్ద ఇంట్లో పుట్టి, పెరిగిన నాకు ఈ రోజుల్లో అందరూ “మేము త్రీ బెడ్ రూమ్ – త్రీ బాత్” ఫ్లాట్  కొనుక్కున్నాం అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటే “అదోలా” ఉంటుంది. 1980 లలో తీసిన ఆ ఇంటి ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. ఎదురుగుండా పెద్ద గుండిగల వెనకాల కిటికీ మా గెస్ట్ బెడ్ రూమ్. ఆ గదిలోనే ఉండి మా బంధువులు (మా సూరీడు బాబయ్య గారు, చిట్టెన్ రాజు బాబయ్య, హనుమంత రావు బావ, అబ్బులు బావ..వగైరా) అనేక మంది చదువుకున్నారు. సరిగ్గా ఆ గదికి వరండా అవతలి వేపు ఉన్న గది మొదట్లో మా తాత గారి గది. ఆయన పోయాక అది “పురిటి గది” అయిపోయింది. మా అన్నదమ్ములు, అప్పచెల్లళ్లతో సహా  మా బంధువులలో కనీసం వంద మంది అయినా ఆ గదిలో పుట్టారు. ఈ ఫోటో లో అక్కడ గోడకి ఆనుకుని కూచున్నది మా అమ్మ.  ఇంటి ముందు ఠీవిగా ఉన్నది మా మామిడి చెట్టు అని వేరే చెప్పక్కర లేదు.

Kakinada Home

ఆ ఇల్లు కట్టిన ఏడాదికి మా నాన్న గారికి పెళ్లి అయింది. మరో నాలుగేళ్ళ తరువాత వరసగా పిల్లలు పుట్టుకు రావడంతో 3600 గజాల స్థలంలో ఉన్న ఆ పది గదుల ఇల్లు కూడా  సరిపోక పోవడంతో మా నాన్న గారు అదే ఔట్ హౌస్ పద్ధతి ని కొనసాగించి పురిటి గదికి అవతలి వేపు ఒక పెద్ద గది, దాని మీద పైన పెంకులని ఆనుకుని ఒక చిన్న డాబా వేయించారు. ఆ డాబా చిన్నదే కానీ సుమారు ఇరవై మంది పిల్లలం ఇరవై వేసవి కాలాలు ఆ డాబా మీద రొజాయిలు వేసుకుని, కబుర్లు చెప్పుకుంటూ, నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ గడించిన అనుభూతులు చాలా గొప్పవే! ఆ డాబా మీద పడుకునే నుంచే నేను ఒక నెల పాటు ఒక తోక చుక్క గమనాన్ని చూసాను.  ఇప్పటికీ, ఎప్పటికైనా అదృష్టవశాత్తూ చీకటి రాత్రి పూట ఆకాశం లోకి చూడగలిగితే  నక్షత్ర సమూహాల పేర్లు, కొన్ని గ్రహాలనీ గుర్తు పట్టగలను. ఆ డాబా మీదకి చొచ్చుకు వచ్చిన సీతా ఫలం చెట్ల నుంచి తాజాగా కోసుకున్న పళ్ళ రుచి నాకు యింకా జ్జాపకం వస్తూనే ఉంటుంది.  ఇక ఉన్న ఇంటికీ ఆనుకుని ప్రహరీ గోడ వెంబడి రెండు పడక గదులు, మధ్యలో హాలు కట్టించారు. ఇది ఎలాగా తాత్కాలికమే కదా, పెద్ద మేడ ఎలాగా కడతాం కదా అని పెంకుల బదులు ఈ నాలుగు గదులకీ పైన ఎస్బేస్టస్ రేకుల తో పై కప్పు వేయించారు. ఈ గదుల సమాహారానికి “రేడియో సావిడి” ని పేరు.

రేడియో సావిడిలో అక్క

రేడియో సావిడిలో అక్క

“రేడియో సావిడి” అనే పేరుకి కారణం స్పష్టంగానే తెలుస్తున్నా ఆ పేరు రావడానికి ఒక పిట్ట కథ ఏమిటంటే  నాకు సుమారు పదేళ్ళు వచ్చే దాకా మా జీవితం “అంధకారం” లోనే గడిచింది..అనగా మా పెద్ద చెల్లెలు భానుమతి పుట్టిన ఏడు మా ఇంటికి కరెంటు వచ్చింది. అంత వరకూ చీకటి పడేటప్పటికల్లా పదో, పదిహేనో కిరసనాయిలు లాంతర్లు, ఐదో, ఆరో పెట్రో మాక్స్ లైట్లూ ఆదరాబాదరాగా వెలిగించుకోవడం, వెలుగు ఉండగా చక్కబెట్టుకోవలసిన పనులు చేసేసుకోవడం మొదలైన హడావుడులు చాలానే ఉండేవి.  ఈ పెట్రోమాక్స్ లైట్లు టెక్నాలజీ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం గానే ఉంటుంది.  Max Gratetz అనే జర్మన్ మహానుభావుడు ఒక మేంటిల్ అనే దీపం వత్తిని కొంచెం వేడి చేసి, పెరాఫిన్ అనే పదార్ధాన్ని కొంచెం పెట్రోల్ తో బాగా ప్రెషర్ వచ్చేలా పంపు కొట్టి దాన్ని వాయువు గా చేసి ఆ దీపానికి పంపిస్తే అది భగ్గుమని అంటుకుని దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇందులో ఎంతో స్పీడుగా టక టక టకా ఆ పంపు కొట్టే డ్యూటీ అప్పుడప్పుడు నాకు పడేది. ఎవరింట్లో పెళ్లి అయినా పల్లకీలో ఊరేగింపుకీ, ముఖ్యంగా మేళం ఆడేటప్పుడు డజన్ల కొద్దీ పెట్రోమాక్స్ లైట్లతో పెళ్లి వారు మహానంద పడేవారేవారు.  ఆ చుట్టుపక్కల అటు రాజమండ్రి, సామర్లకోట లాటి  ఊళ్ళలో ఎన్ని మేళాలు ఉన్నా, పెద్దాపురం మేళానిదే అగ్రతాంబూలం. ఆ పెట్రోమాక్స్ లైట్లు లేకపొతే వాళ్ళ అందచందాలు ఆస్వాదించేదెలా?  తెలియని వారికి ఆ పెట్రోమాక్స్ లైట్ ఫోటో ఇక్కడ జతపరిచాను.

petromax1

మా ఇంటికి కరెంటు రాగానే మా నాన్న గారు చేసిన మొదటి పనులలో గిరి & కో కి వెళ్లి ‘నేషనల్ ఎక్కో” వారి రేడియో ఒకటీ, ఆ తరువాత ఒక “కుక్క”  గ్రామఫోనూ కొనుక్కొచ్చారు. మెయిన్ రోడ్ లో ఉండే ఈ గిరి & కొ కాకినాడ నగరానికి ఆ రోజుల్లో ఒక లాండ్ మార్క్ . నాకు తెలిసీ మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో రేడియోలు, గ్రామఫోనులు మొదలైన అత్యాధునిక శ్రవణ పరికరాలు  అక్కడే దొరికేవి. దాని యజమానులు శేషగిరి రావు గారు కూడా మా గాంధీ నగరం లోనే ఉండే వారు. మా కుటుంబానికి సన్నిహితులు. ఆయన కొడుకులు వేంకటేశ్వర రావు (స్మైల్స్ ఫోటో స్టూడియో అధినేత), బాబ్జీ, భగవాన్ మా అన్నదమ్ములూ మేము చాలా మంచి మిత్రులం. అందులో భగవాన్ (ఇప్పుడు హైదరాబాద్ లో ఆడిటర్)  మంచి క్రికెట్ ఆటగాడిగా పేరు తెచ్చుకుని రంజీ ట్రోఫీ లో కూడా ఆడాడు. బాబ్జీ గారిని ఇటీవల మా హైస్కూల్ రజతోత్సవ సందర్భంగా కలుసుకున్నాను.

ఆ రేడియో, గ్రామఫోనూ కొన్న దగ్గర నుంచీ ..అంటే సుమారు 1950 నుంచీ మరో పదిహేనేళ్ళ తరువాత నేను కాకినాడ వదిలి బొంబాయి వెళ్ళేదాకా మా జీవితం అంతా ఆ రేడియో సావిట్లో ఆ రెండు శబ్ద శ్రవణ యంత్రాల చుట్టూనే తిరిగింది. ఆ రోజులలో మా అక్క ఆ రేడియో పెడుతున్న ఫోటో ఒకటి ఇక్కడ జతపరుస్తున్నాను.  అప్పటికి  టెలివిజన్ అనే మాట కూడా మాకు తెలియదు. కేవలం రేడియో లో అనేక రకాల కార్యక్రమాలు విని, గ్రామఫోనులో ఘంటసాల గారిని విని నా జీవితాన్ని ధన్యం చేసుకున్నాను.  అంతెందుకు….అప్పటి దాకా మా ఇంటిల్లి పాదీ పొద్దున్నే మొహం కడుక్కోడానికి కచిక (కాల్చిన బొగ్గు నుసి) , వేప పుల్ల, “కోతి మార్కు” పళ్ళ పొడి, తాటాకు వగైరాలు వాడే వాళ్ళం. రేడియో సిలోన్ లో ప్రతీ అద్దివారం పొద్దున్న అమీన్ సాయాని పరమాద్భుతమైన గొంతుకలో “బినాకా గీత మాలా” అనే హిందీ సినిమా పాటల కార్యక్రమం వినడం మొదలుపెట్టగానే ఆ కచికల లాంటి సామగ్రి అంతా బయట పారేసి బినాకా టూత్ పేస్ట్ వాడడం మొదలుపెట్టి, “నాగరికులు” గా చెలామణీ అవడం మొదలుపెట్టాం.

బినాకా గీత మాలా అనగానే మరొక పిట్ట కథ గుర్తుకొస్తొంది. అదేమిటంటే ..ఆ రోజుల్లో రేడియో లాంటి ఆధునిక యంత్రం మా స్నేహితులు ఎవరి ఇంట్లోనూ ఉండేది కాదు. ఉన్నది  కేవలం మా ఇంట్లోనే.   అందు చేత మా స్నేహితులందరూ..అంటే మా అక్క,  సుబ్బన్నయ్య, న్నేను, మా తమ్ముడు ..ఇలా అందరి స్నేహితులూ ఆది వారం పొద్దున్న ఎనిమిది అయ్యే సరికి మా ఇంటికి వచ్చేసే వారు ఈ బినాకా గీత్ మాలా వినడానికి. అందులో గురు మూర్తి అనే ఒక స్నేహితుడు …మా అక్క ఫ్రెండో, సుబ్బు ఫ్రెండో గుర్తు లేదు ప్రతీ ఆదివారం పొద్దున్న ఎనిమిది నుంచి పన్నెండు గంటలకి ఆ కార్యక్రమం పూర్తి అయ్యేవరకు మా రేడియో సావిట్లోనే ఉండే వాడు. ఆ తరువాత ఆ పాటల గురించి చర్చలు కొనసాగేవి. అలా ఎవరైనా స్నేహితులు వచ్చినప్పుడు అమర్యాదగా ఉంటుంది అని మేము ఎవరమూ మా అమ్మ ఎంత పిలిచినా మధ్యాహ్నం భోజనాలకి వంటింట్లోకి  వెళ్ళే వాళ్ళం కాదు.  ప్రతీ పది నిముషాలకీ మా అమ్మ పాపం “ఎంతకీ భోజనాలకి రారు వీళ్ళు” అని బాధ పడుతూ “వాళ్ళని పిల్చుకు రావే” అని మా మెయిన్ హౌస్ నుంచి రేడియో సావిడికి మా రెండో చెల్లెలు అన్నపూర్ణ ని పంపించేది. ఒక సారి మా నాన్న గారు ఈ తతంగం అంతా గమనించి విసుక్కున్నారు. అది విని మా పూర్ణ రేడియో సావిట్లోకి వచ్చి “ఈ వెధవ ఫ్రెండ్స్ అంతా పొద్దున్నే వచ్చేసి సాయంత్రం దాకా ఇక్కడే తగలడతారు. చచ్చు వెధవలు. వాళ్ళు భోజనం చెయ్యరు. వీళ్ళని చెయ్యనివ్వరు” అని మా నాన్న గారు విసుక్కుంటున్నారు” అని సాక్షాత్తూ ఆ గురుమూర్తి తోటే చెప్పేసింది.  అంతే సంగతులు. అప్పటి నుంచే, ఇప్పటి దాకా ఆనాటి ఆప్త మిత్రుడు గురు మూర్తి ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో నాకు ఇప్పటికీ తెలియదు.

Summer Savidi

ఇక మా జనాభాకి రేడియో సావిడీ, మరొక మూడు గదులూ కూడా చాలక ఎదురుగుండా ఒక 20’ x 30’ అడుగుల ..అంటే సుమారు 600 చదరపు అడుగుల హాలు కట్టించారు. దీని పేరు “సమ్మర్ హౌస్”. దీని మీద ముందు తాటాకులూ, ఆ తరువాత మా పొలం లో ఉన్న చెరువులో కుప్పలు, తెప్పలుగా పెరిగే రెల్లు గడ్డి తో పై కప్పు వేయించారు.  నా చిన్నప్పటి జీవితం చాలా మటుకు ఈ సమ్మర్ హౌస్ లోనే గడిచింది. అందులో ఒక టేబుల్ టెన్నిస్ టేబులు, కేరమ్స్  టేబుళ్లు, చదరంగం, పేకాట బల్లలు ..ఒకటేమిటి నేను, మా అన్నయ్యలు, మా తమ్ముడు , అన్ని వయసులలో ఉన్న మా స్నేహితులకీ కావలసిన ఆట సామగ్రి అంతా ఆ సమ్మర్ హౌస్ లోనే ఉండేది. అక్కడే మేము గంధకం, బొగ్గు, భాస్వరం లాంటి ముడి సరుకులు కొనుక్కుని, వాటిని నూరి, సరి అయిన పాళ్ళలో కలిపి కూరి టపాకాయలు, చిచ్చు బుడ్లూ, కాకర పువ్వొత్తులూ, తార జువ్వలూ మొదలైన దీపావళి సామాగ్రి అంతా అక్కడే రెండు నెలల ముందు నుంచీ తయారు చేసుకునే వాళ్ళం. అక్కడే మాకు ప్రవేటు మేష్టార్లు పాఠాలు చెప్పే వారు. వేసవి కాలం వస్తే ఆ సావిడికి నాలుగు పక్కలా వట్టి వేళ్ళ తడకలు కట్టి, వాటి మీద గంట కొక సారి  పిచి కారీ తో నీళ్ళు కొట్టి ఆ సమ్మర్ హౌస్ ని చల్లబరిచే వాళ్ళం. మా తమ్ముడు బుజ్జి (రాజమండ్రి సూరీడు బాబయ్య గారి కొడుకు రమణ మూర్తి, ఇప్పుడు సుప్రసిద్ధ న్యాయవాది) కాలు విరిగినప్పుడు ఆ సమ్మర్ హౌస్ లోనే మూడు నెలలు మంచం మీద ఉన్నాడు. మా దొడ్డమ్మ (రెండో మేనత్త హనుమాయమ్మ) అక్కడే పోయింది. ఆశ్చర్యం ఏమిటంటే , మేము అన్నేళ్ళు  అనేక రకాలుగా వాడుకున్న ఆ సమ్మర్ హౌస్ కి ఒక్కటయినా సరి అయిన ఫోటో లేదు. కానీ మా పెద్దన్నయ్య అక్కడ తీయించుకున్న ఒకే ఒక్క ఫోటో ఇందుతో జత పరుస్తున్నాను.

ఇక మా వంటింటి వెనకాల ఉండే  చిన్న నూతి దగ్గర స్నానాలకి ఇబ్బందిగా ఉంది అని ఈ సమ్మర్ హౌస్ పక్కనే చుట్టూ ఐదు అడుగుల వెడల్పు ఉన్న సిమెంటు చపటాతో ఒక పెద్ద నుయ్యి తవ్వించారు మా నాన్న గారు.  ధాన్యం, నువ్వులు, కంది పప్పు, గొల్లప్రోలు మిరప కాయలు వగైరాలు దంచుకుని ఆరబెట్టుకోవడం, పాలికాపులకి భోజనాలు పెట్టడం, వేసవి కాలంలో మడత మంచాలు వేసుకుని పడుకోవడం మొదలైన రకరకాల ఉపయోగాలకి ఇంటి ముందు పది స్తంభాలతో, మామిడి చెట్టుని ఆనుకుని  ఒక సిమెంటు ప్లాట్ ఫారం కూడా ఉండేది. ఇప్పుడు ఎందుకు మాయం అయిపోయాయో తెలియదు కానీ, మా చిన్నప్పుడు గొల్లప్రోలు మిరప కాయలు, వాటి రంగు, రుచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవే.

నాకు ఊహ తెలిసే నాటికి ఆ ఇల్లు, మిగిలిన స్థలంలో మా తాత గారు కట్టదల్చుకున్న పెద్ద మేడకి ఐదు అడుగుల లోతుగా పెద్ద పెద్ద రాళ్ళతో భూమికి నాలుగు అడుగుల ఎత్తున పునాదులు ఉండేవి.  పైన చెప్పిన రేడియో సావిడి, సమ్మర్ హౌస్  తాత్కాలికంగానే కట్టినా, అవి పెర్మనెంట్ అయిపోయాక తరువాత మా నాన్న గారు ఆ పునాదులు తవ్వించేసి, మొత్తం స్థలం అంతా మొక్కలు, చెట్లతో నందన వనం లా తయారు చేశారు.

నా “జీవిత కాలమ్” లో ఇదంతా ఎందుకు వ్రాసుకుంటున్నాను అంటే…..నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా ఏదో రకంగా ప్రాధాన్యత  ఉన్న కొన్ని కట్టడాలని కానీ, ఇళ్ళు కానీ చూస్తూ ఉంటాను. ఉదాహరణకి ఇటీవల ఒక సారి విజయ నగరం వెళ్లి “గురజాడ” వారి ఇల్లు చూశాను. మాములుగా చూస్తే అది ఒక పాత కాలం నాటి ఇల్లే కదా! అదే సిమెంటు, అదే ఇటికెలే కదా! మరి అంత ప్రాధాన్యత ఎందుకూ? ఎందుకంటే….ఆ ఇంటి నేల, ఇటికెలు మాత్రమే గురజాడ వారి స్పర్శకి  నోచుకుని, ప్రాధాన్యత సంపాదించుకున్నాయి. అలాంటిదే నెల్లూరు వెళ్లినప్పుడు పెన్నా నది ఒడ్డున శిధిలావస్థలో ఉన్న చూసిన “మహాకవి తిక్కన మహాభారతము రచించిన మందిరము”.  ఇలాంటివి యావత్ తెలుగు జాతి చూసి తరించవలసిన ప్రదేశాలు అయితే నాకు వ్యక్తిగతంగా, కేవలం నాకు మాత్రమే నేను పుట్టిన ఇల్లు ఇప్పుడు లేక పోయినా, మా స్థలం ఉంది కదా…అక్కడ మా అన్నయ్యల ఇళ్ళు, మా తమ్ముడి ఇల్లు ఉన్నాయి కదా.  అందుచేత ఆ ఇంటిని, అప్పటి భౌతిక వాతావరణాన్నీ నెమరు వేసుకుంటున్నాను.  ఈ తరహాలో మిగిలినది “లోకారెడ్డి  వారి చెరువు ఇస్తువా పంపు” దాని గురించి తదుపరి వ్యాసం లో ప్రస్తావిస్తాను.

-వంగూరి చిట్టెన్ రాజు

పర్యావరణం తెల్లదుప్పటి కాదు!

ఎస్. నారాయణస్వామి

ఎస్. నారాయణస్వామి

అమెరికా వచ్చి నేను తెలుసుకున్న విషయాల్లో పర్యావరణ స్పృహ కూడా ఒకటి. ఎనభైలలో వరంగల్లో బి.టెక్ చదువుతున్న రోజుల్లో, అప్పటికే భారత్‌లో కూడా కొన్ని పర్యావరణ సంరక్షణ ఉద్యమాలు జరుగుతూ ఉన్నా, ర్యాడికల్ నక్సలిజం నా దృష్టిని ఆకట్టుకున్నంతగా పర్యావరణాన్ని గురించిన ఆలోచన ఆకట్టుకోలేదు. ఐనా మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన పుణ్యానికి, అందునా ఇంటర్నల్ కంబస్చన్ నా అభిమాన శాస్త్రం కావడం వల్లనూ, ఇంజన్లద్వారా జరిగే వాతావరణ కాలుష్యాన్ని గురించి కొంత అధ్యయనం చేస్తూ వచ్చాను. అమెరికా వచ్చిన కొత్తల్లో ఒక రోజు మా విశ్వవిద్యాలయం నడిబొడ్డున ఏదో నిరసన ప్రదర్శన జరుగుతున్నది. అప్పటికి ఎక్సాన్ వాల్డెజ్ దుర్ఘటన జరిగి ఒక యేడో, రెండేళ్ళో పూర్తయి (ఏనివర్సిరీ అనడానికి తెలుగులో వార్షికోత్సవం అని తప్ప ఇంకో మాట లేదా? దుర్ఘటనల ఏనివర్సరీలని ఏమనాలి? సాంప్రదాయకంగా తద్దినం అంటే పోతుందేమో?) ఆ సందర్భంగా ఎక్సాన్ కంపెనీని ఉద్దేశించి ఆ నిరసన ప్రదర్శన జరుగుతున్నది. పర్యావరణ సంరక్షణ ఉద్యమంతో అదే నాకు తొలి పరిచయం. ఆ తరవాత ఈ సంఘటనని తలుచుకుని నిరసన అనే పేరుతో నేనొక చిన్న సెటైరు రాసుకున్నాను.

అటుపైన పుస్తకాల ద్వారా, మిత్రులతో చర్చల ద్వారా, ఇంకా ఆ తరవాత ఇంటర్నెట్ ద్వారా చాలా ఉద్యమాలు పరిచయమయ్యాయి. కొన్నిటితో అనుబంధాలు పెరిగాయి, నేను కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే వరకూ. చాలా మట్టుకు పబ్లిగ్గా జరిగే ఈ నిరసన కార్యక్రమాలు ఏదో ఒక కంపెనీని వ్యతిరేకిస్తూ నడిచేవి. కంపెనీలకి ముఖ్య బలం వాటి లాభాలు కాబట్టి, దుష్టకంపెనీలకి బుద్ధి చెప్పాలంటే వాటి ఉత్పత్తులని కొనడం మానెయ్యాలనే సిద్ధాంతం ఒకటి అప్పుడే బయల్దేరింది. ఇది నిజమేనని నమ్మి (ఎంతైనా మొదట మార్క్సు శిష్యుణ్ణి కదా! సంబంధాలన్నీ ఆర్ధికమే!!) కొన్ని ఉత్పత్తులని బహిష్కరించాను ఆ రోజుల్లో. ఆయా కంపెనీలని తీవ్రంగా శిక్షిస్తున్నానని దృఢంగా నమ్మాని. అంతేకాక ఇదే సరైన మార్గమని మిత్రులతో చాలా తీవ్రంగా వాదిస్తుండేవాణ్ణి కూడాను. ఐతే, మెల్లమెల్లగా ఇంకొక స్పృహ మేలుకోవడం మొదలుపెట్టింది. ఇంధన జ్వలనం మీద రీసెర్చి చేసే పూరిండియన్ గ్రేడ్యువేట్ స్టూడెంటుగా నేను అందుకుంటున్న గొర్రెతోక ఉపకారవేతనం ఒక చమురు కంపెనీ చలవ. వారమంతా కోకు పెప్సీ ఉత్పత్తులేవీ ముట్టకుండా పవిత్రంగా గడిపి వారాంతానికి బీరు తాగబోతే ఆ బీరు తయారుచేసే కంపెనీ తాగునీటిని విపరీతంగా కలుషితం చేస్తోందని తెలియవచ్చింది. ఒక బయాలజీ మిత్రుడితో చర్చిస్తున్నప్పుడు, అప్పటి నా తీవ్రమైన నమ్మకాలకి వ్యతిరేకంగా, జన్యుమార్పిడి పంటలు మంచివేననీ, వాటివల్ల చాలా ఉపయోగాలున్నాయనీ నన్ను ఒప్పించాడు ఆ మిత్రుడు. ఇలా తగిలిన ఎదురు దెబ్బలతో పర్యావరణ సంరక్షణ అంతా తెలుపూ, కాలుష్యం నలుపూ కాదనీ, మధ్యలో ఓ యాభై రంగులు పట్టేటంత ‘గ్రే” ఉన్నదనీ తెలియవచ్చింది.

 

ఖాండవ దహనం అని ఒక కథ రాశాను 2005 లో. అప్పట్లో తానా సావనీరులో వచ్చిందది. ఆ కథ పర్యావరణ రక్షణ గురించి కాదుగానీ, నల్లమల అడవుల్లో చెంచు గూడేలలో నేను చూసిన కొన్ని విషయాలు అందులో చర్చకి వచ్చాయి. ఉదాహరణకి అడివంతా పర్యావరణ పరిరక్షణ అనీ, పులుల అభయారణ్యం అనీ చెంచువారి వేట మీద సవాలక్ష ఆంక్షలు విధించారు. దానికి పరిహారంగా చెట్లు నాటమనీ, గోతులు తవ్వమనీ, ఇంకా ఇలాంటివే ఏవో పది రకాల పనులు కల్పించి (ఇది ఉపాధి కల్పన అన్న మాట) ప్రతి ఫలంగా జొన్నలో సజ్జలో ఇప్పిస్తున్నారు. పర్యావరణ సంరక్షణ ఎప్పుడూ ఆ పర్యావరణానికి అతి చేరువులో ఉన్న మనిషి మనుగడని దెబ్బతీస్తూ వస్తున్నది. అంతే కాక, ఆ సంరకషణ కోసం చేపట్టే కార్యక్రమాలు ఎంత అనాలోచితంగా, ఎంత అశాస్త్రీయంగా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

images

నిజానికి తెలుగు సాహిత్యంలో పర్యావరణ స్పృహ కొంచెం తక్కువనే అనిపిస్తోంది. గట్టిగా చూస్తే చంద్రలతగారి దృశ్యాదృశ్యం నవల ఒకటి కనబడుతున్నది, భారీ ఆనకట్టలు అటు సహజ వనరులకీ, ఇటు ఆ ప్రాంత ప్రజల జీవనానికీ రెండిటికీ ముప్పు తెస్తాయనే అంశంతో. డా. చంద్రశేఖర్రావు గారి కథలు కొన్నిట్లో ఈ అంశాలు అక్కడక్కడా తొంగి చూస్తుంటాయి. దాదాహయత్ రాసిన మురళి ఊదే పాపడు కథ మనుషుల దురాశకి బలై పోతున్న సహజవనరుల్ని గురించి ఒక ఫేంటసీ ధోరణిలో ఆర్ద్రంగా చెప్పిన కథ. చంద్రలత గారే జన్యుమార్పిడి విత్తనాలను గురించీ, మరికొన్ని ఇతర పర్యావరణ సంబంధిత అంశాలను గురించీ ఇతర పుస్తకాలు కూడా రాశారు. కవిత్వంలోనైనా ఇటువంటి అంశాలు సూచనప్రాయంగా దర్శనమిచ్చాయే తప్ప, కేవలమూ పర్యావరణ స్పృహ సాహిత్యాన్ని డిక్టేట్ చేసిన సందర్భాలు తక్కువే.

 

ఉద్యమ కారణం ఏదైనా – అంతరించి పోతున్న పక్షి జంతు జాతులని రక్షించడం కావచ్చు, సహజ వనరుల సంరక్షణ కావచ్చు – అక్కడ రక్షించవలసిన అంశాన్ని బహు సున్నితమైనదిగా, నాజూకైనదిగా వర్ణించడం, ఆ రక్షణ ఉద్యమాన్ని ఒక యుద్ధంగా అభివర్ణించడం పరిపాటి అయింది. అంతే కాదు, రక్షణని సపోర్ట్ చెయ్యని సామాజిక శక్తి ఏదైనా (ప్రజలు, సంస్థలు, వ్యాపారాలు, ప్రభుత్వాలు) దాన్నొక కౄరమైన శత్రువుగా చిత్రించడం కూడా వారి వ్యూహంలో భాగమే. కానీ పర్యావరణ సంరక్షణ ఏ కొద్దిమంది జన్మహక్కో కాదు. నిజానికి ఇక్కడ గమనించాల్సిన ధర్మసూక్ష్మం ఒకటున్నది. మానవులు చేస్తూ ఉండిన అకృత్యాలవల్ల పర్యావరణానికీ, భూగోళానికీ వచ్చిన ముప్పు ఏమీ లేదు. వాటి బాగుకోసం అవసరమైన సవరణలు అవి చేసుకోగలవు. ఎటొచ్చీ అవి చేసే సవరణలు మానవజాతికి అంత సౌకర్యంగా ఉండవు. అంచేత పర్యావరణ సంరక్షణ, భూగోళ సంరక్షణ అంటూ జరిగే ప్రయత్నాల్లో ముఖ్యమైన ఉద్దేశం మానవజాతి తమని తాము రక్షించుకోవడమే. అంటే, ఈ ప్రయత్నం అంతా మొత్తం మానవజాతి మనుగడకి సంబంధించినది కాబట్టి ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉండాలి, అందరికీ బాధ్యత కూడ ఉండాలి. అంతేకాని, ఏ నూటికి ఒక్కరో మేమే హీరోలం, మేమే రక్షణ కార్యకర్తలం అని (వారికి వారు ఎంత ఫీలైపోయినా సరే) ఉప్పొంగిపోతే పెద్దగా ఉపయోగపడే పనేమీ అక్కడ జరగదు.
వెరసి ఈ యుద్ధ కథాకథనంలో పర్యావరణ కార్యకర్త ఒక ఉదాత్తుడైన హీరోగానూ, అంతర్జాతీయ వ్యాపారవేత్త ఒక భయంకరమైన విలన్ గానూ ముద్ర పడిపోతారు. ప్రజల ఊహల సంగతి యెందుకూ, ఆయా రక్షణ సంస్థలే తమ ప్రత్యర్ధులని ఎంత ఏహ్యభావంతో చూస్తాయంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళతో కలిసి మాట్లాడ్డానికి కానీ, కనీసం వాళ్ళతో ఒకే గదిలో కూర్చోవటానికి కూడా ఇష్టపడరు. తీవ్రవాద పద్ధతులలో పనిచేసే గ్రీన్ పీస్, ఎర్త్ ఫస్ట్ వంటి సంస్థలే కాక సంయమనంతో వ్యవహరిస్తాయని ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సంస్థలు, సాధారణ పౌరులవద్ద మంచి ఇమేజి ఉన్న సంస్థలు కూడా తమ సంరక్షణ కార్యకలాపాల దగ్గరికి వచ్చేసరికి ఇటువంటి మొండి వైఖరి అవలంబించడం స్పష్టంగా కనిపిస్తూన్నది, సంరక్షణ ఉద్యమాల చరిత్రని చూస్తే.

 

కానీ నిజంగా పనికొచ్చే పని జరగాలంటే, అందులో కౄర పరమ నీచనికృష్టులని పేరుబడిన వారు కూడా ఉండక తప్పదు. ఒకానొక కాలంలో ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఆహారం అంటే చిన్న విక్రేతల దగ్గర మాత్రమే దొరికేది ఇప్పుడు సర్వత్రా లభ్యమవుతున్నట్లే, పర్యావరణ సంరక్షణ మీద కూడా ఉద్యమకారుల మొనాపలీ వెనుకబడిందని చెప్పుకోవాలి గత పాతికేళ్ళలో. అనేక బహుళజాతి కంపెనీలు సహజ వనరుల నిలకడ గురించి, మారుతున్న వనరుల వాతావరణ పరిస్థితులలో తమ తమ కంపెనీల మనుగడని గురించీ తీవ్రంగా కృషిచేస్తున్నాయి. నేరుగా విద్యుత్, చమరు, బొగ్గు రంగాలలో ఉన్న కంపెనీల విషయంలో ఈ కృషి నేరుగా కనిపిస్తున్నది. ఉత్పత్తి రంగంలో – ఉదాహరణకి ఆటో, ఎలక్ట్రానిక్ రంగాలలో, ఉత్పత్తిదారులైన కంపెనీలు ఈ విషయమై చాలా పట్టుదలగా ఉన్నాయి. వనరుల నిలకడ విషయమే కాకుండా పెద్ద కంపెనీలన్నీ తమ తమ కార్బన్ ఫుట్ ప్రింట్ (ఒక సంస్థ కార్యకలాపాల వల్ల ఎంత కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో విడుదలవుతున్నది తెలిపే ఒక కొలమానం) గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నాయి. అంతేకాక ఏ జెనరల్ మోటర్స్ వంటి కంపెనీనో ఉదాహరణకి తీసుకుంటే .. ఎన్ని దేశాలలో ఎన్ని లక్షలమంది ఉద్యోగులతో, ఎంత భారీ యెత్తున వారి కార్యకలాపాలు సాగుతున్నాయి? వాళ్ళు తయారు చేసే కార్లు కాలుష్యాన్ని పెంచుతున్నాయి, వారి ఉత్పాదన పద్ధతులు బాగులేవు అని చెప్పి, అసలు వాళ్ళతో మాట్లాడం పొమ్మంటే ఎవరికి నష్టం?

ఇంకొక కీలకమైన విషయం, పర్యావరణం దగ్గరికొచ్చేసరికి అన్ని రకాల విషయాలూ కలగలిసి తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనికి సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానం కూడా ఎప్పటికప్పుడు మారుతున్నది, ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నది. ఇప్పుడున్న అవగాహన పదేళ్ళ కిందట లేదు. ఏ విషయాన్నీ, ఏ అంశాన్నీ వేరువేరుగా డిఎస్క్ట్ చేసి పరిశీలించడానికీ, అదుపు చెయ్యడానికీ వీలుపడదు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే కార్యాచరణ కావాలి. ఈ ప్రణాళిక ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలి. ఇదంతా సాధ్యపడాలంటే ఉద్యమకారులు మడికట్టుకుని కూర్చుంటే సరిపోదు. అటు వివిధ ప్రాంతాల ప్రభుత్వాలతోనూ, ఇటు వివిధ వాణిజ్య సంస్థలతోనూ చేతులు కలిపి పని చెయ్యాలి.

ఒకటి గుర్తుంచుకోవాలి. మనుషులు రాకముందూ భూమి ఉంది. మనుషులు పోయాకా ఉంటుంది. భూమికేం ఢోకాలేదు. వచ్చిన బాధల్లా మనుషుల మనుగడకే. ఇకనైనా మనం తెలివిన బడితే మంచిది.

 

References:

Exxon Valdez

http://en.wikipedia.org/wiki/Exxon_Valdez_oil_spill

My satire

http://eemaata.com/em/issues/199911/867.html

My Story

http://kinige.com/kbook.php?id=58

Works of Chandralatha

http://kinige.com/kbrowse.php?via=author&name=Chandra+Latha&id=19

 

ఇది ‘పెట్టుబడి’ చేసిన హత్య!

Uday-Kiran-Modeling-Pic‘‘ప్రముఖ సినీనటుడు ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య’’ అన్న వార్త టెలివిజన్‌ తెరమీద స్క్రోల్‌ రూపంలో చూసినపుడు నాకు పెద్దగా ఆశ్చర్యంకానీ, దు:ఖం కానీ కలగలేదు. వైయక్తిక దు:ఖానికి తప్పిస్తే, సామాజిక అవ్యవస్థకి మనం మనుషులుగా స్పందించడం మానేసి చాలాకాలమయింది కనుక…దు:ఖం స్థానంలో ఒక నిర్లిప్తత, ఒక ఉదాసీనత ఏదో కలిగింది. చిత్ర సీమకు ఇలాంటి రోజు ఏదో ఒక రోజు వస్తుంది అని తెలుస్తూనే వుంది కనుక ఆశ్చర్యం లాంటి భావమేదీ కలగలేదు.
ఆ ఏదో ఒక రోజు ఇంత త్వరగా రావడం మాత్రం ఖఛ్చితంగా విషాదమే!
సినిమా అవకాశాలు తగ్గిపోవడమూ, ఆర్ధిక ఇబ్బందులు, పరాయీకరణ లాంటి కారణాల వలన డిప్రెషన్‌కి గురి అయి ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించి ఇవ్వాళో, రేపో కేసు మూసివేయ వచ్చు. కానీ ‘‘హత్య’’కి ఆత్మహత్యకి మధ్య ఉన్న ఒక సన్నని రేఖను వాళ్ళెప్పుడూ, ఎప్పటికీ ఛేదించలేరు. అది వాళ్ళ తప్పు కూడా కాదు సమాజంలో కొండలా పేరుకుని పోయిన రుగ్మత, పోలీసులకి భౌతిక, ప్రాసంగిక సాక్ష్యాలు కావాలి. వాటి అవసరం లేకుండానే సమాజం, ఏది హత్యో, ఏది ఆత్మహత్యో నిర్ధారణ చేయవచ్చు కానీ మన సమాజం ఆ దిశగా ప్రయత్నించదు అది మన దురదృష్టం.
‘‘ఉదయ్‌ కిరణ్‌’’ హత్య, పోనీ ఆత్మహత్య వెనుక నాలుగు శక్తులు ప్రధానంగా పనిచేశాయి అని ఈ వ్యాసకర్త బలమయిన నమ్మకం. ఒకటి సినిమా, రెండు సమాజము, మూడు ప్రేమ రాహిత్యము చివరగా చెపుతున్న కారణం  అత్యంత బలమయినది. ఏ ఆత్మహత్య వెనుక అయినా, కొంచెం లోతుగా పరిశీలిస్తే ఈ నాలుగు అంశాలు తప్పిస్తే మరేమీ కన్పించవు.
ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య వార్త లోకానికి వెల్లడి కాగానే మొదటి చూపుడు వేలు సినిమా రంగం వైపే చూపించింది. అవునన్నా, కాదన్నా యివ్వాళ సినిమా రంగంలో  సామాన్యుడికి స్థానం లేదు.
ప్రపంచీకరణ విధానాలు ఆంధ్రదేశంలో అమలు కావడం మొదలయిన తర్వాత, ఆ విధానాలకు బలంగా ప్రభావితమయినది మాత్రం సినిమా రంగమే 1980 దశకం దాకా రాష్ట్రం ఎల్లలు దాటని సినిమా రంగం షూటింగ్‌లు, సినిమా వ్యాపారము 1990 తర్వాత మెల్ల మెల్లగానూ 2000 తర్వాత ఉధృతంగానూ విశ్వవ్యాప్తమయినాయి.

ప్రేమాభిషేకం లాంటి సినిమా ఇరవై, ముప్పై లక్షలులో తయారయిందంటే మనకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఇవ్వాళ ‘‘కోటి’’ రూపాయల బడ్జెట్‌ లేకపోతే ఎంత చిన్న సినిమా అయినా తయారుకాదు. ఒకప్పుడు ‘‘అడవిరాముడు’’ అనే సినిమా రాష్ట్రవ్యాప్తంగా 27 ధియేటర్లలో విడుదల అయితేనే ఒక రికార్డు. కానీ ఇవ్వాళ సినిమా రెండు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతుంది పెట్టుబడి వరదలాగా చిత్రసీమలోకి వచ్చి చేరుతున్నది ప్రభుత్వ రాయితీలూ యింతకు ముందు కంటే పదిరెట్లు పెరిగాయి. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పుడు చిత్రసీమ కళకళలాడుతూ ఉండాలికదా… అలా వుండలేదు ఎందుకని?
దీనికి ప్రధానమయిన కారణం కేంద్రీకరణ, పెట్టుబడి, అవకాశాలు, మార్కెటీకరణ లాంటి అన్ని అంశాలలో కేంద్రీకరణ కేవలం నాలుగయిదు కుటుంబాలకే పరిమితం కావడంతో ఈ దుస్థితి ఏర్పడిరది. ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య వార్త వినగానే ఏ రాజకీయాలూ తెలియని ఒక సినిమా ప్రేమికుడి ప్రతిస్పందన ‘‘తొక్కేశారు’’అని.
అక్కినేని కుటుంబం నుండి అయిదుగురు నటులు చిరంజీవి కుటుంబం నుండి ఐదుగురు నటులు, దగ్గుబాటి కుటుంబం నుండి ఇద్దరు నటులు, మంచు వంశం నుండి నలుగురు నటులు ఇవ్వాళ ఇండస్ట్రీలో ఉన్నారు. వీళ్ళ అధీనంలోనే రాష్ట్రంలో తొంభైశాతానికి పైగా ధియేటర్లు వున్నాయి, వీళ్ళ చేతుల్లోనే మీడియా వుంది. దర్శకులు, నిర్మాతలు కుటుంబాల వారీగా విడిపోయారు ఈ నటులు ఎవరిని చెపితే వారినే తీసుకునే స్థితిలో వున్నారు చిన్న సినిమాకు, చిన్న నటులకు అవకాశం ఎండమావి.
ఈ పెద్ద కుటుంబాలలోని హీరోలకి ఒక్క హిట్‌ వస్తే చాలు పది, పదిహేను మంది నిర్మాతలు క్యూ కడతారు. ఆ పదింటిలో మరొక్క హిట్‌ వస్తే మరొక పది, పదిహేను సినిమాలు చేతిలోకి వస్తాయి. ఈ హీరోల సినిమాలకి ఆయా సామాజిక వర్గాలకి చెందిన రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు వెన్నుదన్నుగా నిలుస్తాయి. లక్షలు వెచ్చించి కాంప్లిమెంటరీ టిక్కెట్లు కొంటాయి మీడియా సినిమా వసూళ్లు ఇన్ని కోట్లు దాటాయి అన్ని కోట్లు దాటాయి అని ప్రచారంతో హోరెత్తిస్తుంది. ఇన్ని సౌకర్యాలు చిన్న సినిమాకు ఏవి? చిన్న సినిమాకు ధియేటర్లు దొరకటమే కష్టం, దొరికినా ‘‘సినిమా బావుంది’’ అనే మౌత్‌ పబ్లిసిటీ వ్యాపించే లోగానే ధియేటర్ల నుండి ఆ సినిమాను ఎత్తేస్తారు అందుకేనేమో చిన్న సినిమాల వైపుకి వెళ్లకుండా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలసి ఒక పెద్ద హీరో సినిమాను ఇవ్వాళ తీస్తున్నారు. ఒక పెద్ద హీరో సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. ఇక నిర్మాతలు, దర్శకులు అయితే తమ సృజనాత్మకతను అంతా ఆ పెద్ద హీరోల ప్రాపకం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్‌లో ఒక నిర్మాత ‘‘నాన్నా దేవుడు ఎలా వుంటాడు?’’ అని మా అబ్బాయి అడిగితే గదిలోకి తీసుకెళ్లి ఫలానా హీరో ఫోటో చూపించాను అని చెప్పడం ఈ కేంద్రీకరణకి పరాకాష్ట.
నాగార్జున మొదటి సినిమా ‘విక్రమ్‌’ నాగేశ్వరరావుగారి అబ్బాయి ఎలా చేశాడో అన్న ఉత్సుకతతో జనం చూశారు. తరువాత కెప్టెన్‌ నాగార్జున, అరణ్యకాండ, మజ్నూ వరకు వరుస ఫ్లాప్‌లు. బాలకృష్ణకి సుల్తాన్‌, కృష్ణబాబు, రాణా సమయంలో వరుస అపజయాలు. చిరంజీవి ఏకంగా సంవత్సరంపాటు ముఖానికి రంగేసుకోలేదు, ఫెయిల్యూర్‌కి భయపడి అయినా వాళ్లంతా ఎలా నిలదొక్కుకున్నారు వారి వెనుక బలమయిన డబ్బువుంది. దాన్ని మించిన అక్కినేని ఫ్యామిలీ, నందమూరి వంశం చిరంజీవి మెగాస్టారిజం అనే దుర్బేధ్యమయిన గోడలు వున్నాయి. ‘‘మనవాడు పడిపోకూడదు’’ అని కాపు కాసిన కుల సంఘాలు ఉన్నాయి.  ఉదయ్‌ కిరణ్‌ వెనుక యివేమీ లేవు.
ఇవ్వాళ ఉదయ్‌ కిరణ్‌ అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకున్నాడు ఇంతకు ముందే ఒక నిర్మాత ఒక భారీ సినిమా నిర్మించి విడుదల చెయ్యలేక హుస్సేన్‌ సాగర్‌ లో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు మరో నిర్మాత బాగా నడుస్తున్న సినిమాను మరో పెద్ద హీరో సినిమా కోసం ధియేటర్‌ నుండి తీసివేస్తున్నారని ‘‘కూకట్‌ పల్లి’’ చౌరస్తాలో  ధర్నా చేసి పోలీస్‌ కేస్‌ పెట్టాడు.
ఇవన్నీ చదువుతుంటే మీకు ఏం అనిపిస్తోంది? కె.వి. రెడ్డి, బి.ఎన్‌. రెడ్డి తరంలో సినిమా ఒక కళ. అది ప్రజల ప్రయోజనాలని కలవరించింది, కాంక్షించింది.
బాపు, విశ్వనాధ్‌, దాసరినారాయణరావుల తరంలో ‘సినిమా’ కళాత్మక వ్యాపారం కళాత్మక విలువలు కాపాడుకుంటూనే వ్యాపార సూత్రాలను అందిపుచ్చుకుంది.
ఎస్‌.ఎస్‌ రాజమౌళి, వి.వి. వినాయక్‌ల తరంలో సినిమా కళకాదు, వ్యాపారమూ కాదు. డబ్బు తయారుచేసే యంత్రం. వ్యాపారంలో, యుద్ధంలో కొన్ని నైతిక సూత్రాలు, విలువలు వుంటాయి కానీ యంత్రానికి అదేమీ తెలియదు. మానవీయ స్పర్శ ఇప్పటి సినిమాకు లేదు.
విశ్వనాధ్‌ ప్రతి సినిమాకు ‘‘ఎస్‌’’ అనే అక్షరంతో మొదలయ్యే పేరు పెడతానో, మూడు అక్షరాల పేర్లు మహేష్‌ బాబుకి కలసి వస్తుందనో, వి.వి. వినాయక్‌ హీరోయిన్‌కి ‘నందిని’ అనే పేరు పెడితే హిట్‌ అవుతుందనో, కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్‌ ఎప్పుడూ ‘‘మహాలక్ష్మీ’’ అనో సినిమా పరిశ్రమకి సెంటిమెంట్లు ఎక్కువ అని మనం అనుకుంటాం కానీ… సెంటిమెంట్‌ లేనిదే సినిమా పరిశ్రమలో!
సెంటిమెంట్‌ అంటే ఒక మానవీయ స్పర్శ. సెంటిమెంట్‌ అంటే భావోద్వేగాల కలబోత. సెంటిమెంట్‌ అంటే మనిషి పట్ల ప్రేమ, సెంటిమెంట్‌ అంటే మనిషిని సొంతం చేసుకునే గుణం ఇవేవీ ఇవ్వాళ ఇండష్ట్రీకి లేవు.
అందుకే ఉదయ్‌కిరణ్‌ గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన సిన జీవుల ముఖాల మీద దు:ఖం సగం కరిగిన మేకప్‌ లాగా కనిపించింది.
ఇక రెండో చూపుడు వేలు సమాజం ఆంధ్రదేశంలో ఎన్నికలు ఏడో ఋతువు అన్నాడు నగ్నముని, ఎనిమిదో ఋతువు కూడా వుంది అది ఆత్మహత్య. ఉద్యమాల పేరుతో, వ్యవసాయ రంగం సంక్షోభం పేరుతో, మానసిక ఒత్తిడి పేరుతో ఈ పదిహేనేళ్ల కాలంలో ఆంధ్రదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య కనీసంలో కనీసం యాభైవేలు పదిహేనేళ్ల కాలంలో ఆత్మహత్యల్లో ఆంధ్రదేశ పోగ్రెస్‌ రిపోర్ట్‌ యాభైవేలు.
ఇది ఏ రకంగా చూసినా ఆందోళన కలిగించే విషయమే నిర్భయ ఉదంతం జరిగినప్పుడు ఒక టి.వి ఛానల్‌ ఢల్లీిలో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శన ‘‘లైవ్‌’’ లో చూపించింది. విరామ సమయంలో అది చూపించిన ప్రకటన గుర్తుందా? ‘‘అమ్మాయిలను పడగొట్టడం ఎలా?’’ అనే విరాట్‌ కోహ్లి ప్రకటన నిర్భయకి నివాళులు అర్పిస్తూనే ఈ ప్రకటనను చూసి మనం ఆనందించాం అంటే మన చైతన్యస్థాయి ఏ రకంగా వుందో తెలుస్తూనే వుంది.
ఇలాంటి సమాజం ‘‘ఆత్మహత్యలు’’ లాంటి మానసిక సంక్షోభాలను ఎలా దాటుతుంది? ఒక ఆత్మహత్య జరిగినప్పుడు కవులు ఒక కవిత రాసి, ఒక కవిత్వ సంకలనం వేసి తమ బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. సామాజిక అధ్యయన పరులు రెండురోజులు ఓపెన్‌ ఫోరంలలోనూ, బిగ్‌ డిబేట్లలోనూ చర్చోపచర్చలు చేసి తమ పని అయిపోయింది అనుకుంటారు. ఎవరికి వారు తమ తమ లోకంలోకి జారుకుంటారు ఒక సమగ్రమయిన కార్యచరణ తీసుకుని ముందుకి కదలరు ఎందుకని? ఇవ్వాళ ప్రతి మనిషీ ఒక ఒంటరి ద్వీపం భౌతికంగా అతడు సమాజంలో నివశిస్తున్నాడు తప్పిస్తే దానితో అతనికేమీ సంబంధం లేదు అతడొక ఒంటరి ద్వీపం అతడొక రహస్యగాయం అతడు ఏ పరమార్ధాన్ని కౌగిలించుకోలేని నిలువెత్తు స్వార్ధం. అతడొక కాగితం పువ్వు.
అందుకే ఈ సమాజంలో ఆత్మహత్యలు అనేవి ‘‘ఎనిమిదో’’ ఋతువు అనేది.
ఇక మూడవ చూపుడు వేలు ప్రేమరాహిత్యం. ఉదయ్‌కిరణ్‌ మృతశరీరాన్ని తీసుకోవడానికి తండ్రి నిరాకరించాడన్న వార్త కలచివేసింది తండ్రి వంద తప్పులు చేసి వుండ వచ్చు కొడుకూ వంద తప్పులు చేసి వుండవచ్చు ఆ తప్పులు తండ్రులవీ, కొడుకులవీ తప్పిస్తే తండ్రీకొడుకుల బంధానిది కాదుకదా!
‘‘అంగా దంగాత్సంభవతి నిజస్నేహజో దేహసౌర:
ప్రాదుర్భూయ స్థితి ఇవ బహిశ్చేతనా ధాతురేక:
సాంద్రానంద క్షుభిత హృదయ ప్రస్రవేణావస్తికం
గాఢాశ్లేషస్సహిమమ హిమశ్చ్యోత మాశంసతవ’’
అంటాడు ఉత్తరరామ చరిత్రలో భవభూతి. పుత్రుడి శరీరం తండ్రి ప్రతి అంగం నుండి ఉదయిస్తుందట అంటే తనే మరోసారి పుడతాడన్న మాట. అలాంటి పుత్రుడు విగతజీవిగా పడివున్నప్పుడు తండ్రి నిరాకరించాడంటే  ఆ బంధం ప్రేమాన్వితం అనాలా? ప్రేమరాహిత్యం అనాలా? ఈ ప్రేమరాహిత్య మూలం కూడా సామాజిక మూలంలోనే దాగి వుంది.

భార్య అంటే భర్తకి ప్రేమ వుండదు. భర్త అంటే భార్యకు ప్రేమ వుండదు తల్లి దండ్రులు పిల్లలని తమ కోరికలకి ప్రతిరూపం కావాలని అనుకుంటారు. కానీ వాళ్లకీ ఒక లోకం ఉందని గ్రహించరు మనుషుల మధ్య మిగిలీ మిగలని మానవ సంబంధాలని కలిపి విడదీస్తున్న ఊహా మేఘం డబ్బు. డబ్బులేని చోట ప్రేమ వుంటుందా? డబ్బుకొద్దీ ప్రేమ అని బాలచందర్‌ ఊరికే అన్నాడా…? ఇటీవలి సినీ నటి అంజలి ఎపిసోడ్‌ గుర్తుందా?

ఇక చివరి చూపుడు వేలు ఉదయ్‌ కిరణ్‌  చివరగా చెపుతున్నా మొదట చెప్పవలసింది ఉదయ్‌ కిరణ్‌ గురించి…!
అవును ఉదయ్‌ కిరణ్‌ హత్యకి అతడే కారణం మన పక్కంటి పిల్లాడిలాగా కనిపించే ఉదయ్‌ కిరణ్‌ మన పక్కింటి పిల్లాడి  లాగానే ఒత్తిడి తట్టుకోలేకపోయాడా? 2000 నుండి 2013 వరకు సినిమా రంగంలో వున్నాడు కదా…! ఆ మాయాజలతారు మృదుచేలాంచలములకొసగాలుల విసురు పట్టుకోలేక పోయాడా? ఆ పాకుడు రాళ్లమీద కాలు బలంగా నిలపలేక పోయాడా?

ఒక రంగంలో వైఫల్యం ఎదురయినప్పుడు మరోరంగాన్ని ఎంచుకోవాలనే ప్రాప్త కాలజ్ఞత ఎందుకు లోపించింది? జీవితాన్ని సున్నా నుండి ప్రారంభించి గెలవగలిగే ఆత్మస్థైర్యాన్ని ఎందుకు కోల్పోయాడు. జీవితాన్ని ఒంటరిగా గెలవాలనే విషయాన్ని ఎందుకు మర్చిపోయాడు తను పోషించిన పాత్రలను తనెందుకు మనసులోకి తీసుకోలేక పోయాడు? శిఖరం మీద ఎవరూ ఎల్లకాలం ఉండరనే విషయం త్వరగానే గ్రహింపుకి వచ్చివుండాలి కదా..

ఒక విజయం ఆత్మవిశ్వాస స్థాయిని పెంచుతుంది. ఒక అపజయం ఆత్మవిశ్వాస స్థాయిని పడవేస్తుంది నిజమే! ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసుకునే హక్కు మనకు ఉందా అనేదే అసలు ప్రశ్న…బ్రతకడానికి వందకారణాలు అవసరం లేదు ఒక్క కారణం చాలు ఎందుకంటే జీవితం ఒక్కటే కనుక. మరణానికే వంద కారణాలు కావాలి.

ఏదయితేనేం హృదయ కమలం వాడిపోయింది. ఉదయ్‌కిరణ్‌ ఇక లేడు. అతడి పందొమ్మిది సినిమాలు అతడి మరణాంతరం కూడా జీవిస్తాయి.
అతడి మరణం నుండి అయినా చిత్రసీమ పాఠం నేర్చుకుంటుందా? దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి పెద్దలు సీరియస్‌గా ఆలోచిస్తారా…. సగటు సినీ ప్రేమికుడిగా అడుగుతున్న ప్రశ్నలకు స్పందిస్తారా…. లేక ఇది ఒక కామా మాత్రమేనా…..?

 – వంశీ కృష్ణ

గతంలోకి ప్రయాణం

vekuvapoolu

‘‘గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్ళతో’’ అన్నాడు శ్రీశ్రీ. గతమంతా రణరక్త సిక్త ప్రవాహమేనా? ‘‘సదాస్మరించుకోవడానికి, తలుచుకుని పులకరించడానికే, లేశమాత్రమయిన మంచిలేదా?’’ అంటే మంచి కూడా వుంది. కానీ, ‘‘మంచి గతము కొంచేమేనోయ్‌’’ అన్నాడు గురజాడ. కవి నిరంకుశుడు గనుక దేన్నైనా ఎలాగయినా అనగలడు. కానీ మామూలు మనుషులుగా మనం అప్పుడప్పుడు గతంలోకి తొంగిచూడకపోతే, మన భవిష్యత్‌ ప్రస్థానానికి సరయిన ఆలంబన దొరకదు. గతంలో చేసిన తప్పు ఒప్పులే మన ప్రయాణానికి దారిదీపాలుగా వ్యవహరిస్తాయి.

నిద్రపట్టని ఒక అర్ధరాత్రి నా చూపుడు వేలు, నా పుస్తకాల ‘‘రాక్‌’’ లో వున్న ‘‘వేకువపూలు’’ అన్న నవలను బలంగా తాకింది. రెండు వందల పేజీల ఆ నవలను ఒక్కుదుటన తెల్లవారే వరకు చదివేసాను. ఎప్పుడో ఫిబ్రవరి 2000 సంవత్సరంలో చతుర మాస పత్రికలో సంక్షిప్తంగా ప్రచురించబడిన నవలకు విస్తృత రూపం నేను చదివిన ‘‘వేకువపూలు’’. కథాకాలం 1970 దశాబ్దం. అంటే 43 సంవత్సరాల పాత కథావస్తువు అన్నమాట. ఈ నవలను చదవడం అంటే ఇప్పటి గ్లోబల్‌ తరానికి ‘‘ఫేస్‌బుక్‌’’ లో ‘‘లైక్‌’’లు మాత్రమే పెట్టగల యువతరానికి, ‘‘టైమ్‌ మెషీన్‌’’లో గతంలోకి ప్రయాణం చెయ్యడం అన్నమాట. నిజంగా ఈ నవల చదవడం ఒక అనుభవం.

ఢిల్లీ లో నిర్భయ ఉదంతం జరిగిన తర్వాత ఒక్కుమ్మడిగా కొవ్వొత్తులతో పార్లమెంటును ముట్టడిరచిన యువతరంగానికి, అరవై ఏళ్ళ వృద్ధుడు ‘‘అన్నా హజారే’’ నాయకత్వం వహిస్తే వెనుక వుండి సంఫీుభావం ప్రకటించే దుస్థితిలో వున్న యువ గళానికి, ఒక తరం క్రితం తమ సహచరులు ఎలా వున్నారో, సమాజ చలన శీలతను తమ కార్యాచరణతో ఎలా ప్రభావితం చేశారో, ఆ సామాజిక గమనానికి చోదక శక్తులై ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాడో సోదాహరణంగా చెప్పగలదీ నవల. ఇప్పటి ‘‘యువతరం’’ నిస్తేజాన్ని నిర్వ్సాపారాన్ని, చైతన్యలేమిని ప్రశ్నిస్తుందీ నవల.

1947లో స్వతంత్య్రం రావడమూ, 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటమూ, స్వాతంత్య్రోద్యమ కాలంనాటి ఆదర్శాలన్నీ నీటి మీద రాతలయిన కరకు వాస్తవం తెలిసిన తర్వాత, 1969లో మొదటి దశ తెలంగాణా ఉద్యమం రావడమూ, అదీ అయిపోయాక శ్రీకాకుళంలో రాజుకున్న నిప్పురవ్వ, రాష్ట్రమంతటా వ్యాపించడం అనే అంశాలు నేపధ్యంగా ఈ నవలకి అమిరాయి.

నామ మాత్రపు రాజకీయ స్వాతంత్య్రం, స్వాతంత్య్రమే కాదని, ఆర్ధిక స్వావలంబన, స్వేచ్ఛ సమానత్వం, అన్ని రంగాలలో, అన్ని వర్గాల ప్రజలకి అందినప్పుడే నిజమయిన స్వాతంత్య్రమని నమ్మిన యువతీ యువకులు, తాము కలలు గన్న సమాజాన్ని సాధించాలి అనే ఆశయంతో ఒక విస్తృత విప్లపవోద్యమాన్ని నిర్మించే క్రమంలో పెద్దయెత్తున ఉద్యమాలలో భాగస్వాములు అయ్యారు. కాలేజి, సాహితీ, సాంస్కృతిక సంఘాలలో భాగస్వాములయ్యారు. చదువునీ, జీవితాన్ని త్యాగం చెయ్యడానికి ముందుకు వచ్చారు. ‘‘నెత్తురు మండే, శక్తులు నిండే’’ యువతరానికి ప్రతినిధులు వారు.

అప్పటి సాంస్కృతికోద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ‘‘జతిన్‌ కుమార్‌’’ ఈ నవల రాశారు. ఉద్యమానికి ‘‘ఇన్‌సైడర్‌’’ కావటం వలన ఉద్యమ ఎత్తు పల్లాలని ప్రతిభావంతంగా ఆవిష్కరించగలిగారు.

ఈ నవలలో ప్రధాన పాత్రలు మూడు. సమత, ఝాన్సీ, రాకేష్‌. సమత ఇంటర్‌మీడియట్‌లో కాలేజీలో ప్రవేశించడంతో మొదలయ్యే నవల, సమత డిగ్రీ, పి.జీ దాటుకుని, పి.హెచ్‌.డి లో చేరి అర్థాంతరంగా మానేసి విప్లవోద్యమంలో మమేకమయి జైలు జీవితం అనుభవించి విడుదలవ్వడంతో ముగుస్తుంది.
నిత్య చైతన్యశీలి అయిన ఒక యువతి జీవితంలోని పది సంవత్సరాలను ఈ నవల చిత్రించింది. ‘‘సమత’’ నెపంగా ఆ సమయంలో సమాజంలో జరిగిన ప్రతి సంచలనాన్నీ నమోదు చేసినది. నమోదు చేయడమే కాకుండా, ఎలా ప్రతిస్పందించాలో, రకరకాల అంశాలు ఒక విషయాన్ని కప్పివేసినప్పుడు, ఆ పొరలను తొలగించి సత్యశోధన ఎలా చెయ్యాలో ఈ నవల వివరిస్తుంది.

కామినేని వెంకటరామారావు ఉరఫ్‌ కె.వి.ఆర్‌. మాస్టారు అనే ఉపాధ్యాయుడికి ముగ్గురమ్మాయిలు. స్వరాజ్యం,ఝాన్సీ, సమత. స్వరాజ్యం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మామూలు, సాదాసీదా ఆడపిల్ల. పెళ్ళయినాక భర్త ఆధిపత్యం అనే ‘ఛాయ’ లోకి వెళ్ళిపోయి, ఎప్పుటికప్పుడు పుట్టింటి నుండి ఏదో ఒకటి ఆశించే సాధారణ ఆడపిల్ల.

ఝాన్సీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, తల్లిదండ్రులను పోషిస్తూ, చెల్లెలను చదివిస్తూ వుంటుంది. మిత భాషి, మరోమాటలో చెప్పాలంటే ఇంట్రావర్టు. అంతర్ముఖి. ఉద్యోగం చేస్తూనే ప్రయివేటుగా యం.కాం చదువుతుంది.

మూడో అమ్మాయి సమత. సమత అంటే ఒక చైతన్యం. ఒక పాట పాడినా, ఒక ఆట ఆడినా, గంభీరంగా ఏదయినా చర్చ సాగించినా ఆ యింట్లో మనుషులందర్నీ కలిపి వుంచే ఒక ‘‘హబ్‌’’ సమత. జీవితం పట్ల సమ్యక్‌ దృష్టి, జీవనంలో హుందాతనం, ప్రతి పని లోనూ ఆత్మ విశ్వాసం, ప్రతి మాటలోనూ ఆలోచన సమత వ్యక్తిత్వానికి వన్నె తెచ్చే అంశాలు.
ఝాన్సీసమత పాత్రలు, వాళ్ళ జీవితాలలో ఎదురయ్యే పురుషులు. వీళ్ళద్వారా స్త్రీ పురుష సంబంధాలని, కేవలం సంబంధాలుగా కాక చైతన్యశీలంగా ఎలా మార్చవచ్చో జతిన్‌కుమార్‌ బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఝాన్సీకి దత్తాత్రేయ శర్మ అనే సహోద్యోగితో పరిచయం అవుతుంది. మొదట్లో వున్న స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. తీరా పెళ్ళి యింకో రెండు మూడు రోజులు వుంది అనగా దత్తాత్రేయ శర్మ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. కానీ ఝాన్సీ అప్పటికే గర్భవతి.    ఈ స్థితిలో మామూలు ఆడపిల్ల ఏం చేస్తుంది? ఏం చేయాలని సమాజం ఆశిస్తుంది? గుట్టు, చప్పుడు కాకుండా ‘‘అబార్షన్‌’’ చేయించుకుని మరో పెళ్ళి చేసుకోమంటుంది సమాజం. అలా చేయమని తల్లిదండ్రులతో సహా మిగతా అందరూ ఒత్తిడి చేస్తారు. కానీ ఝాన్సీఅలా చెయ్యడానికి ఒప్పుకోలేదు. పెళ్ళి కాకుండానే తల్లి కావాలి అనుకుంది. ఆ నిర్ణయాన్ని తల్లి వ్యతిరేకిస్తుంది.

vekuva poolu-1

‘‘పెళ్ళి అని నలుగురికీ చెప్పుకుని చాటింపు వేయడం కాదమ్మా! ఏ స్త్రీ పురుషుల మనసులు యేకం అవుతాయో, వాళ్ళిద్దరూ కలసి వుండటమే దాని అంతరార్ధం. పెళ్ళి అనే తతంగం లేదు. కానీ నేను కోరుకున్న మగవాడి సంతానానికి తల్లిని అవుతున్నాను. ఇందులో తప్పు, అవినీతి ఏదీ లేదు’’.
‘‘పెళ్ళి తంతు జరగత ముందే అతను దూరం అయ్యాడు. నేను తల్లిని అవుతున్నాను. అతను దూరమయినంత మాత్రాన, మా మధ్య విరిసిన స్నేహం, ప్రేమ దాని మాధుర్యం’’ మరచిపోయి ఏమీ తెలియని దానిలా యింకో వ్యక్తికి భార్యను కాలేను.’’

అంతర్ముఖి. ఈ మాత్రం మాట్లాడడమే గొప్ప. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఆమె అలాగే వుంటుంది. బిడ్డను కంటుంది. వాడి పేరు సుధాంశు. ఝాన్సీ పెళ్ళి కాకుండా తల్లి అయి, సింగల్‌ పేరెంట్‌లా ఉండాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు సమత దాన్ని అర్ధంచేసుకోవడానికే ప్రయత్నంచేస్తుంది. ఇదే విషయాన్ని ‘‘రాకేష్‌’’తో ప్రస్తావిస్తుంది.

‘‘ఆ అమ్మాయి మనో ధైర్యాన్ని మెచ్చుకోవాలండి’’ సంఘంలోని కృత్రిమ విలువల మీద ఒక స్త్రీ తీస్తున్న దెబ్బగా దానిని గుర్తించాలి.
ఒక స్త్రీ పెళ్ళి చేసుకోవాలా లేదా? అనేది ఆమె వ్యక్తిగత ఈ నిర్ణయం. పెళ్ళికాకుండా, (ఇక్కడ అయ్యే అవకాశం లేదు కనుక) తల్లి అయి ఆ బిడ్డను పెంచడంలోనే ఆనందం వుంది అనుకుంటే అభ్యంతరం పెట్టవలసింది ఏం వుంది? అయితే ఇది ఆనందకరం కాదు అనే గుర్తింపు కలిగిన నాడు, ఇంకా ఏదో కావాలని కోరుకున్ననాడు ఇలాంటి అమ్మాయి సమాజం ఏమనుకుంటుందో అని వెనుకా, ముందూ చూడదు. తనకు కావలసింది అందిపుచ్చుకుంటుంది ధైర్యంగా’’ అంటాడు రాకేష్‌.
ఝాన్సీ మనస్తత్వానికి సరిగ్గా విరుద్ధంగా మరొక పాత్ర వుంది. పేరు వసంత.

‘‘పొందిన ఒక అనుభూతిని భద్రంగా దాచుకొని బతుకంతా మురిసిపోతాను’’ అంటుంది ఝాన్సీ.
‘‘అనుభూతుల వేటలో అందే ఆనందమంతా జుర్రుకుంటాను ఈ సమాజ నీతితో నాకు సంబంధం లేదు’’ అంటుంది వసంత. పెళ్ళికి సంబంధించినంత వరకూ వీళ్ళ ఆలోచనలు, అనుభవాలు వేరు… వేరు…

జీవిత కాలానికి మీల్స్‌ టిక్కెట్లు, కొంచెం రక్షణ తప్ప మరేది యివ్వదు కొందరికి పెళ్లి. ముసలితంలో, రోగంతో, రోష్టులో తోడుంటాడనే చిన్న ఆశ తప్ప మరేమీ యివ్వదు కొందరికి పెళ్ళి. నిజంగా పెళ్ళంటే ఏమిటి? ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ. ఈ వేద మంత్రాలకు అర్థం లేదా?
ఆ అర్థం ఏమిటో సమతా రాకేష్‌ కలసి జీవించి చూపిస్తారు.

సమత నిద్రలేచేసరికి అతను కాఫీ టిఫిన్‌ రెడీ చేస్తాడు. కూరగాయ ముక్కలు తరిగి అన్ని గిన్నెల్లో పెట్టి రెడీ చేస్తాడు. సమత లేచి కాఫీ తాగి గదులు క్లీన్‌ చేసి ఉప్పుకారం చూసి చెబితే కుక్కర్‌ పెట్టేస్తాడు తొమ్మిది గంటలకు ఇద్దరూ తయారయి బయటకి వెళ్ళిపోతారు.

సాయంత్రం పనులు సమత చేసుకుంటుంది. అతను ఎప్పుడో రాత్రి పదిగంటలకు వస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఈ పని నీది, ఈ పని నాది అనే విభజన లేదు. ఎవరికి వీలుగా వుంటే వాళ్ళు చెయ్యడమే.

సమత పెళ్ళయిన ఎనిమిది నెలలకు సమత తల్లి ఒకసారి సమతను చూడటానికి వస్తుంది.

సమత కాపురం చూస్తుంటే ఆవిడకు ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. వాళ్ళ పిలుపులు, పలకరింపులు, పనులు చేసుకునే పద్దతి ఆమెకు కొత్తగా కనిపిస్తున్నాయి. ‘‘నేను అదీ కూర్చుని మాట్లాడుతూనే వున్నాం. ఎప్పుడు వెళ్ళాడో నేను గమనించనేలేదు. చటుక్కున కాఫీ తెచ్చి యిచ్చాడు. తాగాలంటే నాకెంత సిగ్గేసిందో’’.

స్త్రీ పురుష సంబంధాలలోని అన్ని కోణాలను ఈ నవలలో ప్రతిభావంతంగా చిత్రీకరించారు జతిన్‌. అలాగే దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి, ఉన్నత తరగతి జీవితాలలోని సంబంధాలలోని విలోమత్వాన్ని గూడా చిత్రీకరించారు.

సమత రాకేష్‌లది ఆదర్శ దాంపత్యమయితే, రాయుడు చంద్రావతిలది ఒకటే మాట, ఒకటే బాణం లాంటి ఏకాభిప్రాయ దాంపత్యం. స్రవంతి పురుషుడిని సాధించే స్త్రీ. వసంత పురుషుడిని ఆటవస్తువుగా ఆడుకుంటూనే అతడి మానసిక వైకల్యానికి జాలిపడే పాత్ర. ఆత్మ నూన్యతతో బాధపడుతూ భార్య జీవితంలో, తద్వారా తన జీవితంలోనూ హింసను గుమ్మరించుకునే పాత్ర గోవర్థన్‌ది.

ఈ నవల చిత్రించిన జీవితం ఇప్పటి తరానికి పూర్తిగా అపరిచితమయినది. దేశం పట్ల, సమాజం పట్ల నలభైఏళ్ళ క్రితం యువతరం చూపించిన ప్రేమ, దేశంతోనూ, సమాజంతోనూ మమేకమయిన తీరు ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ, యువతలో వుండవలసిన సరి అయిన ధృక్పధం అదే.
సమతకు, రాకేష్‌కి పుట్టిన పాప పేరు ఉజ్జ్వల. ఉజ్జ్వలకి సమత, అందరు తల్లులలాగే పాఠాలు చెప్పింది. అందరు తల్లుల లాగా ‘ఎ’ ఫర్‌ యాపిల్‌, బి ఫర్‌ బాయ్‌, అని కాక ఎ ఫర్‌ ఎబిలిటీ, ‘బి’ ఫర్‌ బెటర్‌మెంట్‌, సి ఫర్‌ కమ్యూనిటీ ‘ఆర్‌’ ఫర్‌ రివల్యూషన్‌ అంటూ ఆంగ్ల అక్షరాలని పరిచయం చేసింది.

జీవితాలని వెలిగించే విప్లవం ఒక్క క్షణంలోనో, ఒక్క ప్రదర్శనతోనో రాదు. అది నిరంతరం సాధన చెయ్యాల్సిన అసిధారావ్రతం అసిధార అంచు మీద నిల్చిన తరం అది. విలువల కోసం పిడికిలి బిగించిన తరం అది.
ఇప్పుడా విలువలన్నీ మారిపోయి సమాజం కులం, మతం అంటూ భిన్న  భిన్న సమూహాలుగా మారిపోయింది. సామూహిక చైతన్యం స్థానంలో అస్తిత్వచైతన్యం వచ్చి చేరింది. కుల రహిత సమాజం కోసం పోరాటం జరిగిన ఈ నేల మీద ‘‘కుల’’ స్థిరీకరణ కోసం పోరాటాలు జరగడాన్ని మించిన విషాదం ఏం వుంది?

వర్గ చైతన్యాన్ని బోధించిన యూనివర్సిటీలు ఈనాడు కుల సంఘాలుగా మారిపోయినాయి. సమాజం నిరంతర చలనశీలి. సామాజికంగా వచ్చే ఏ మార్పు కార్యకారణ సంబంధం లేకుండా రాదు.
ఇప్పటి గ్లోబల్‌ తరం అనుభవిస్తున్న జీవితం. ఎప్పటిసామాజిక రుగ్మతల ప్రతిఫలనం..? వచ్చిన మార్పు మంచిదేనా..? ఈ మార్పు యిలా కొనసాగవలసిందేనా… ఇప్పటి తరం వేసుకోవలసిన ప్రశ్నలు. యివి

 ఈ ప్రశ్నలు వేసుకోవడానికి కావలసిన తాత్విక భూమికలు ఏవో ఈ నవలలో ఉన్నాయని నా కనిపిస్తోంది. నవల చదివితే మీరూ ఒప్పుకుంటారేమో.

— వంశీకృష్ణ

సూర్యస్నానం చేసిన సాగరోద్వేగాలూ…

srikantha sarma

దాట్ల దేవదానం రాజు, శ్రీకాంత శర్మ, జానకీ బాల

జ్ఞాపకపు పరిమళాలు, జీవన సౌరభాలతో పాటు వాస్తవపు వాసననీ వెదజిమ్మే పలువర్ణాల పూలసజ్జ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి “అనుభూతి గీతాలు” కవిత్వం. స్వప్నసేతువులాంటి ఏకాంతలో కలల్ని కవిత్వంగా మార్చుకున్న రసాత్మకత తొణికిసలాడుతుంది ఈ గీతాల్లో. పువ్వుల్లా పూసిన రోజులు రాలిపోయాక తొడిమల్లా మిగిలిన జ్ఞాపకాల్ని తడిమే స్పర్శతో, చురుక్కుమని తగిలినా పరిమళించే అగరువత్తి కొనల్లాంటి అక్షరాలతో అలరారుతుంది ఈ కవిత్వం. కొన్ని వర్ణనలు “ఆకుఆకునా బిందువులై ఊగే ఎండ/నీడల బీటల మధ్య పడియలై” సజీవ చిత్రాలుగా కనుపాపల కొక్కేలకి వేలాడతాయి. మరికొన్ని భావనలు “ఎన్ని కదలికల రంగులో తాకి తొణికి తడిసి మెరిసే గాజుకాగితం లాంటి నిదుర” ని సున్నితంగా చెదరగొడతాయి. “సూర్యస్నానం చేసిన సాగరోద్వేగాలూ/మంద్రపవన మలయవేణుస్పర్శలూ” కలిసినంత ఆహ్లాదంతో ఓలలాడించే అలాటి ఒక అందమైన కవిత ఇక్కడ:

 

40- సూర్యకిరణాల జీవధార

నిద్రపోయే నది గుండెను తట్టి

పడవను మేలుకొలుపుతుంది-

ఇంత వెలుగు- ఇంతగాలి-

పడవని ఊగించి లాలిస్తాయి-

లోతైన నదిగుండెలోకి

స్తిమితంగా మునకవేసిన వెదురుగడ

పడవచేతిలో తంబురా…

పడుకున్న పక్షిని

పాటలతో మేల్కొలుపుతుంది-

పక్షి పంజరం దాటుకుని

వెళ్ళిపోయిన శూన్యసమయం-

అలలమీద దర్భపుల్లలూ, నందివర్ధనంపూలూ…

మంత్రాలు గొణిగే బ్రాహ్మడూ

నిర్గమన సాక్షులుగా

మనిషి పేరిటి వేషం విప్పేసిన

నా తండ్రి సంస్కృతి నిమజ్జనమైన వేళ…

నది కాసేపు అరమోడ్పు కళ్ళతో నిలిచింది-

ఒడ్డున ఒంటరిగా నన్ను వదిలేసి

తంబురా మీటుకుంటూ

పక్షుల్ని మేలుకొలుపుకుంటూ

పడవ మాత్రం

మరో తీరం వైపు-


 

వ్యాఖ్యానం

ఒక నిశ్చల చిత్రంలో కదలిక కలిగి దాన్లోని రంగులకి గాలి అల తాకినట్టు కాస్త ఊగి మళ్ళీ ముందులానే సర్దుకున్నట్టు ఉంటాయి కొన్ని అనుభూతులు. “సూర్యకిరణాల జీవధార/నిద్రపోయే నది గుండెను” తాకడం కూడా అలాటి ఒక దృశ్యానుభూతి. మొట్ట మొదటి చైతన్య కిరణం తాకిన నీరు పడవలో కదలికగా పరావర్తనం చెందుతుంది. బహుశా పడవ కదలికే నదికి గుండె చప్పుడు కాబోలు. “ఇంత వెలుగు- ఇంతగాలి” చూపుగా, ఊపిరిగా నీటి ప్రాణాన్ని నిలబెడుతూ ఉండొచ్చు.

కొన్ని ప్రయాణాలకి సిద్ధమవ్వడం అంత సులువు కాదు. పైపైన కనపడే పనుల్ని తెముల్చుకోవడమే కాక లోతుల్లోకి మునకేసి అక్కడి ప్రవాహపు నిండుతనాన్ని చీల్చుకుపోవాల్సి రావచ్చు. తీరం మీదే వదిలేయాలని తెలిసీ తంబురాని శృతి చేసుకుంటూ “పడుకున్న పక్షిని పాటలతో“ మేల్కొలిపే సమయం దగ్గరైనప్పుడు బహుశా ఎగిరిపోవడానికి మాత్రమే నిద్ర లేస్తుంది పక్షి. పంజరానికి శూన్యాన్ని వదిలి పాటని మాత్రం తనతో తీసుకెళ్తుంది. అప్పుడు “అలలమీద దర్భపుల్లలూ, నందివర్ధనంపూలూ…మంత్రాలు గొణిగే బ్రాహ్మడూ నిర్గమన సాక్షులుగా” మిగుల్తారు. వెళ్తూ వెళ్తూ రెక్కల కింద వీచిన చల్లటి గాలి తెమ్మెరకి కృతజ్ఞతగా “నది కాసేపు అరమోడ్పు కళ్ళతో” మౌనంగా నిలుస్తుంది.

ఒక మనిషి దాటిపోవడం అంటే అతనికే చెందిన కొన్ని మాటలు, అలవాట్లు, వివరాలు, అనుభవాలూ అన్నీ కాలంలో కలిసిపోవడం. ఒకానొక తరానికి చెందిన సంస్కృతిలోని ఒక సూక్ష్మభాగం నీళ్లలో నిమజ్జనం అయిపోవడం. మనుగడ అనేది మనుషుల మధ్య ఆగకుండా కొత్త చరణాల్ని కలుపుకుంటూ వెళ్ళిపోయే ఒక పాట లాంటిది. ఇక నిష్క్రమించవలసిన చరణాల్ని మోసుకుంటూ పడవ కాలంలా, జీవితంలా నిరంతరాయంగా అనంతమైన ఆవలితీరం వైపు సాగిపోతూ ఉంటుంది ”తంబురా మీటుకుంటూ పక్షుల్ని మేలుకొలుపుకుంటూ…”

1swatikumari-226x300–బండ్లమూడి స్వాతి కుమారి

 

“ తోటలో నా ‘రాజు” – నిజంగానే, నేనే ?”

వంగూరి “జీవిత” కాలమ్ –  9

1952, డిశంబర్ చలి కాలంలో ఆ రోజు నాకు ఇప్పటికీ చాలా బాగా జ్జాపకం. ఎందుకంటే నా చిన్నప్పుడు అంత గా గోల పెట్టి ఏడ్చిన రోజు మరొకటి లేదు. ఆ రోజు మద్రాసులో పొట్టి శ్రీ రాములు గారు నిరాహార దీక్ష చేస్తూ  మరణించారు. ఆయన ఎవరో, ఎందుకు నిరాహార దీక్ష చేసారో ఆ వయసులో నాకు తెలియదు. నాకు తెలిసినందల్లా ఆ రోజు కాకినాడ అంతా భగ్గుమంది. మా “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు” అర్జంటుగా మూసేసి మమ్మల్ని ఇంటికి పంపించేసారు. అన్ని కాలేజీలూ, దుకాణాలూ మూత పడి మొత్తం నగరం అంతా స్తంభించి పోయింది.  కొన్ని వేల మంది విద్యార్ధులు సైకిళ్ళమీదా, కాలి నడకనా ఊరేగుతూ మా ఇంటి దగ్గర గాంధీ గారి విగ్రహానికి పూల మాల వేసి, పార్కు కేసి నినాదాలు చేస్తూ వెడుతుంటే, అసలు విషయం తెలిసిన మా నాన్న గారూ, మా అన్నయ్యలతో బాటు కుర్ర కుంకలం అందరం కూడా మా గుమ్మం దగ్గర నుంచుని ఆ “ఊరేగింపు” చూస్తున్నాం. ఇంతలో హఠాత్తుగా ఒక కాలేజీ స్టూడెంట్ నాకేసి దూసుకొచ్చి, సరదాగా ఒక టెంకి జెల్ల కొట్టి, చేతిలో ఉన్న పెద్ద బొగ్గు కణికెతో మా గోడ మీద ఒక వేపు  “CR చావాలి” “CR కి ఉరికంబం” అనీ, రెండో వేపు “నెహ్రూ డౌన్, డౌన్” అనీ పెద్ద అక్షరాలతో రాసేసి ఊరేగింపు లో కలిసి పోయాడు. రాబోయే సంక్రాంతి కి మా నాన్న గారికి చాలా ఇష్టమైన గోపీ చందనం రంగుతో అప్పుడే వెల్ల వేసి, ఎంతో అందంగా ఉన్న ఆ గోడ ని మసి పూసి మారేడు కాయ చేసెయ్య గానే వేల సంఖ్యలో ఆవేశంలో ఉన్న ఆ స్ట్యూడెంట్స్ ని ఏమీ అన లేక మా నాన్న గారు, మిగిలిన వారూ నిస్సహాయంగా ఉన్న సమయంలో నేను ఆ గోడ కేసి చూసి భోరు మని ఏడుపు లంకించుకున్నాను. నేను ఎవరు ఎంత చెప్పినా, ఆ గోడ మీద రాతల కేసి చూపిస్తూ ఏడుపు స్థాయి పెంచుతూ ఉండగా ఎవరో “ఎందుకురా అంత ఏడుస్తున్నావు. ఆ మాత్రం చిన్న జెల్ల కాయ కొట్టి నందుకే అనీ” “పరవా లేదు రా మళ్ళీ వెల్ల వేయిస్తాం” అనీ అనగానే “అందుకు కాదు నా ఏడుపు. అసలు నేను ఎందుకు చావాలి? నన్ను ఉరికంబం ఎందుకు ఎక్కించాలి?” అని గగ్గోలు పెట్టాను. అప్పుడు అందరికీ అర్ధం అయింది. “ఓరి వెర్రి వెధవా, అదా సంగతీ. వాళ్ళు ‘చావాలి’ అన్నది CR ..అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి….నిన్ను కాదు. ” అని నాకు చాక్లేట్లు పెట్టి నా ఏడుపు ఆపారు. ఈ చక్రవర్తుల రాజగోపాలాచారి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మా మిత్రులు కొంత మంది నన్ను “CR” అని పిలవడంతోటీ, మద్రాసులో ఉండే ఈ CR ఎవరో నాకు తెలియకా నా ఏడుపుకి కారణం. అదంతా తల్చుకుంటే నాకు అప్పటి ఏడుపు గురించి కాదు కానీ, ఇప్పడు నాకు మరో కారణానికి కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే రాష్ట్రం విషయంలో అసలు సమస్యలు పరిష్కరించుకోలేక ఏవేవో , కారాణాలు చెప్పుకుంటూ మళ్ళీ మనం మళ్ళీ వెనక్కి పోతున్నాం.  అన్నట్టు ఆ రాజగోపాలాచారి ప్రసంగం కొన్నేళ్ళ తరువాత కాకినాడలో ఒక పబ్లిక్ మీటింగ్ లో విన్నాను. ఆయనతో మాట్లాడాను కూడా.

ఇక ఆ వీధి గుమ్మం కాక ఆ గోడలోనే మా పొలం నుంచి వచ్చే బళ్ళు లోపలి రావడానికి మరొక పెద్ద రేకుల గుమ్మం, అక్కడే వాయవ్యం మూల మా పాడి పశువులు ఉండే పాక ఉండేది. అక్కడి నుంచీ మా 3600 గజాల స్థలంలో మా చిన్నపుడు ఉండే “తోట విహారం” మొదలు పెడితే వాయవ్యం నుంచి ఈశాన్యం మూల దాకా ఉండే ప్రహారీ గోడని ఆనుకుని నేను ఎప్పుడూ ఎక్కని పెద్ద ములగ చెట్టు, అప్పుడప్పుడు ఎక్కే చిన్న ఉసిరి, పెద్ద ఉసిరి చెట్లూ, జీడిమామిడి, చిన్న మామిడి పళ్ళ చెట్టు, పొడుగ్గా ఉండే యూకలిప్టస్ చెట్లు, తలగడాలలో కూరుకునే పెద్ద పత్తి కాయలు కాసే వంద అడుగులు ఎత్తు ఉండే చెట్లు ఉండేవి. ఏడాది పొడుగునా కింద రాలిపోయే ఈ పత్తి కాయలని పోగేసి ఒక గుట్టగా పడేసే వాళ్ళం.  ఆరు నెలలకో సారి మా దూదేకుల సాయబు వచ్చి, మా ఇంటి వరండాలో దుకాణం పెట్టి వారం రోజుల పాటు నానా కంగాళీ చేసి, పదో, పదిహేనో తలగడాలూ, రొజాయిలు అనే పరుపులూ చేసే వాడు. అతనున్న వారం రోజులు మా ముక్కుల్లోను, చెవుల్లోనూ, నోట్లోనూ, ఇల్లంతానూ. ఆఖరికి ఎంతో మడిగా ఎక్కడో మూలా ఉన్న వంటింట్లో చేసిన అన్ని వంటకాల్లోనూ సిల్కు లా ఉండే ఈ దూది పింజలే! ఇక యూకలిప్టస్ ఆకులు కొయ్యడానికి కష్టపడినా, నలిపి చూస్తే భలేగా ఖరీదైన సెంటు వాసన వచ్చేది. ఇక ఈ ఈశాన్యం మూల ఉండే  ఆకుపచ్చ సంపెంగ చెట్టు మా గాంధీ నగరం అంతటికీ సువాసనలు వెద జల్లేది. ఆ సంపెంగ పువ్వులు, ఆకుల్లో కలిసిపోయి ఎప్పుడైనా మా అక్కా వాళ్ళూ కోసుకోడానికి కంటికి కనపడేవి కావు.  అ సంపెంగ మొక్క ఉంటే పాములు వస్తాయని మేము ఎప్పుడూ చీకటి పడ్డాక అటు వేపు వెళ్ళడానికి హడిలిపోయే వాళ్ళం.  నిజంగానే అక్కడ ఒకటి, రెండు పాము పుట్టలు ఉండేవి. మా పేటలో నాగుల చవితి హడావుడి అంతా అక్కడే. అందరూ ఆ పుట్టలలోనే పాలు పోసే వారు.

తోటలో మా నాన్న గారు

తోటలో మా నాన్న గారు

ఇక ఈశాన్యం మూల నుంచి ఆగ్నేయం వేపు గోడ వారన నడుస్తూ ఉంటే ఓ ఉసిరి చెట్టు, కరివేపాకు మొక్కలూ, పులా మొక్కలు ఉన్నా, అన్నింటి కన్నా ప్రత్యేకమైన ఒక చిన్న, చిన్న పళ్ళు కాసే ఉసిరి చెట్టు లాంటి పెద్ద మొక్క ఉండేది. దాన్ని “పుల్ల, పుల్ల చెట్టు” అనే వాళ్ళం. అసలు పేరు ఎవరికీ తెలియదు. అది చిన్న ఉసిరి కాయల సైజులో పళ్ళు కాసినప్పుడు అవి తింటే విపరీతమైన పుల్లగా ఉండి అస్సలు తినలేక పోయే వాళ్ళం. కానీ అవి పండాక, వయొలెట్ రంగులో కి వచ్చాక అద్భుతమైన తీపి రుచి ఉండేవి. మా దురదృష్టవశాత్తూ, ఇరవై ఏళ్ల క్రితమో ఎప్పుడో, ఏదో తుఫానుకో , మరెందుకో మాయం అయిపోయింది. ఆ తరువాత ఆ మొక్క కోసం మా సుబ్బన్నయ్య చెయ్యని ప్రయత్నం లేదు. ఆఖరికి మొక్కలకి ప్రసిద్ధమైన కడియం గ్రామం లో ఉన్న అన్ని నర్సరీలో కూడా తను వాకబు చేసినా ఆ మొక్క ఏమిటో, ఎక్కడ దొరుకుతుందో ఎవరూ చెప్పలేక పోయారుట.  నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా ఆ మొక్క ఉండే చోటి దగ్గర నుంచుని ‘నివాళులు’ అర్పిస్తూ ఉంటాను.

ఇక మా స్థలం నైరుతి నుంచి ఆగ్నేయం వేపు ఉండే గోడని ఆనుకుని ఒక పెద్ద నేరేడు చెట్టూ, మా డాబా  మీదకి అందేలా పళ్ళు కాచే సీతా ఫలం చెట్టూ ఉండేవి. నాకు తెలియదు కానీ మా పెద్దన్నయ్య, ముఖ్యంగా చిన్నన్నయ్య కోపం వచ్చినా, ఏదైనా కావాల్సి వచ్చినా ఆ నేరేడు చెట్టు పై దాకా ఎక్కేసి దూకేస్తానని బెదిరించే వాడుట. పాపం మా బామ్మ గారు, తాత గారు వెళ్లి రక రకాల “లంచాలు” ఇచ్చి అతన్ని క్రిందకి దింపే వారుట. అప్పటికి నాకు ఐదేళ్ళు కూడా లేక పోయినా మా బామ్మ గారు మా చిన్నన్నయ్యకి ఇచ్చే లంచం పేరు “బంగారం పులుసు”. “ఒరేయ్, ఇవాళ నీ కోసం బంగారం పుసులు చేశాను రా. ఇంకెవరికీ అది పెట్టను. క్రిందకి దిగిరారా” అని ఆవిడ చేసిన గుమ్మడి కాయ పులుసు కి పెట్టిన స్పెషల్ పేరు ఆ బంగారం పులుసు. మా బామ్మ గారు ఎప్పుడూ వంద కాసుల పేరు పెట్టుకునే ఉండే వారు.  అవైనా ఇప్పటి లాగా చిన్న సైజువి కాదు. పూర్వకాలపు పెద్ద సైజు కాసులే!

ఇక మిగిలిన స్థలంలో అన్ని రకాల కూరగాయలు, పాదులూ ఒక ఎత్తయితే బొడ్డు మల్లి తొ సహా డజన్ల కొద్దీ పెద్ద మల్లె పొదలు, ఇంచు మించు అన్ని రంగుల మందారాలు, కనకాంబరాలు, డిశంబర్ పువ్వులు, దర్జాగా ఉండే ఒక పారిజాతం చెట్టు (ఆ పారిజాతానికి ఎప్పుడూ గొంగళీ పురుగులు అంటిపెట్టుకుని ఉండేవి) , ఐదారు నంది వర్ధనాలు, మొగలి రేకుల పొదలు రెండు,  నైట్ క్వీన్లూ, మెట్ట తామరా, రెండు బాదం చెట్లూ, ఒక పెద్ద సపోటా, ఒక చిన్న సపోటా, డజను పైగా కొబ్బరి చెట్లూ, దబ్బ చెట్టూ, రెండు నారింజలూ, నిమ్మ చెట్లూ,  ఒక దానిమ్మా,  నీరు బాగా పారే పెద్ద నూతి దగ్గరా, స్నానాల గదుల దగ్గరా అరటి చెట్లూ, ఒక పెద్ద జామ చెట్టు, ఒక చిన్న చిన్న తీపి కాయలు కాచే జామ చెట్టూ యింకా ఎన్నెన్నో మొక్కలతో మా తోట ఒక “ఆర్గనైజ్డ్ అరణ్యం” లా ఉండేది.

విశేషం ఏమిటంటే మా స్థలానికి సరిగ్గా మధ్యలో రెండు చాలా పొడుగైన తాటి చెట్లు ఉండేవి. ఇవి సాధారణంగా పొలం గట్ల మీదే ఉంటాయి కానీ ఇళ్ళ స్థలాలలో ఉండవు. ప్రతీ రోజూ సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆ తాటి చెట్ల మీద వాలి సేద దీర్చుకోడానికి  రెండు రాబందులు వచ్చి వాలేవి. మేము స్కూల్లో “జంతు శాస్త్రం” లో గెద్దలకీ, రాబందులకీ ఉండే తేడాలు చదువుకునే రోజుల్లో వాటిని చూస్తూ మేము చదివిన పుస్తకాలలో ఉండే ముక్కులలా వాటి ముక్కులు సూదిగా, వంకర గా ఉన్నాయా, లేవా అని చూసే వాళ్ళం. ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ ఏమిటంటే ఒక సారి మా నాన్న  గారూ, మేమూ వరండాలో కూచుని ఆ రాబందుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మా చెల్లెలు హఠాత్తుగా “బాబయ్య గారూ, రాబందులు కూడా కాకి రెట్టలు వేస్తాయా?” అడిగింది అమాయకంగా. “లేదమ్మా, రాబందులు రాబందు రెట్టలు వేస్తాయి. కాకి రెట్టలు అవి వెయ్య లేవు” అని మా నాన్న గారు ఒక నవ్వు నవ్వి సమాధానం చెప్పారు.

అన్నట్టు, మా వీధి గుమ్మం పక్కనే ఉన్న బొగడ చెట్టు గురించి చెప్పడం మర్చిపోయాను. మా చిన్న బొగడ పువ్వులూ, పళ్ళు కాసేది. మా చిన్నప్పుడు ఒక సారి ఏమయిందంటే, ఓ రోజు చీకటి పడ్డాక, ఎవరికీ కనపడకుండా నేనూ, ఇంకో ఇద్దరు, ముగ్గురు స్నేహితులూ కలిసి ఆ బొగడ చెట్టు పై దాకా ..అంటే కనీసం యాభై అడుగులు ఎక్కేసి, పండిన బొగడ పళ్ళు కోసేసుకుని బొక్కుతూ ఉంటే, మా నాన్న గారో, మా దొడ్డమ్మో , మరెవరో “ఎవరా అక్కడా?” అని అరిచారు. నేను హడిలి చచ్చి పోయి ధబీమని కిందకి దూకేయ్యగానే,  మిగిలిన వెధవలు కూడా హర్రీ, బుర్రీగా గా దూకేసి, ఇంకెక్కడా చోటులేనట్టు నా మీదే పడ్డారు. ఇంకే ముంది మొత్తం “బొగడ పళ్ళ దొంగలం” అందరం దొరికిపోయాం. “వెధవల్లారా, ఏవో కాస్తో కూస్తో కోసుకుని తినాలి కానే వందల కొద్దీ బొగడ పళ్ళు తింటే కడుపు నొప్పి తో చస్తారు, మమ్మల్ని చంపుతారు” అని మా పెద్దలు చీవాట్లు వేసి, ఏవేవో ద్రవ్యాలు కలిపి తాగించి, మమ్మల్ని బతికించారు.

ఇక మా ఇంటికి ఆగ్నేయం మూల వంటింటికి వెనకాల మరొక మామిడి చెట్టు కూడా ఏకాకి గా ఉండేది. ఈ చెట్టు మా వెనకాల వీధిని ఆనుకుని వేపు ఉండడంతో, అది కాయలు కాసే వేసవి కాలంలో ఆ వీధిలో కుర్ర కుంకలు రాళ్ళు విసిరి మామిడి కాయలు రాల గొట్టి, గోడ దూకేవారు. ప్రతీ ఏడూ ఎన్ని సార్లు వాళ్లకి వార్నింగ్ ఇచ్చినా ఆ కుర్రాళ్లు యింకా రెచ్చి పోయేవారు. ఒక ఏడు అలా ఒక రాయి మా అమ్మకి తగలబోయింది. అసలే కోపిష్టి మనస్తత్వం ఉన్న మా చిన్నన్నయ్య కి ఆవేశం కట్టలు తెంచుకుని వెనకాల గోడ దూకి దొరికిన ఒక కుర్రాణ్ణి నాలుగు వాయించి  వాడి అమ్మకి అన్వయించదగ్గ తిట్లు కూడా తిట్టాడు. దాంతో ఆ వీధిలో వాళ్ళంతా ఏకమై పోయి మా ఇంటి వీధి గుమ్మం వేపు వచ్చి నానా గొడవా చేశారు. పోలీసులని పిలిచే దాకా వచ్చింది ఆ తగాదా. అప్పుడు బాగా తన్నులు తిన్నది ఆ ఇంటి పని వాడు సూన్నారాయణే పాపం!

నేనూ, సూన్నారాయణా అక్టోబర్ 2013 లో

నేనూ, సూన్నారాయణా అక్టోబర్ 2013 లో

సుమారు నలభై ఏళ్ళు మా తోట అంతటినీ మానాన్న గారితో సమానంగా ఎంతో ఆప్యాయంగా చూసుకుని, రోజు నీళ్ళు పెట్టి, ఎరువులు వేసి అన్ని విధాలుగానూ మా కుటుంబానికి అన్ని విధాలుగానూ సేవ చేసిన ఆ సూన్నారాయణ ఎనభై ఏళ్ళు దాటినా రెండు నెలల క్రితం నేను కాకినాడ వెళ్ళినప్పుడు నన్ను చూడడానికి వచ్చి మళ్ళీ నన్ను ఎత్తుకోడానికి ముచ్చట పడ్డాడు కానీ పాపం ఒక కన్ను కనపడకా, నేను తీవ్రంగా వారించబట్టీ ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. అతణ్ణి తీసుకుని మిత్రుడు చంద్రశేఖర్ నిర్వహించే సంకురాత్రి ఫౌండేషన్ లో కంటికి ఆపరేషన్ చేయించాను. అంతకు ముందే మొదటి కంటికి మా సుబ్బన్నయ్య (డా. సుబ్రహ్మణ్యం) దగ్గరుండి ఆపరేషన్ చేయించాడు.  ఆ సూన్నారాయణ తో తాజాగా మా “ఇలవేల్పు”  మామిడి చెట్టు నీడలో తీయించుకున్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

మా నాన్న గారికి కూరగాయలు పండించడం చాలా ఇష్టం.  ఖాళీ స్థలం ఉన్న వారందరూ వేసుకునే వంగా, బెండ, బీర, గుమ్మడి, ఆనప, పొట్ల మొదలైనవే కాక కాలీ ఫ్లవర్, కేబేజీ లాంటి వి కూడా వేసే వారు. మొక్క జొన్న మొక్కలని మా వీధి గుమ్మం నుంచి ఇంటి దాకా..అంటే సుమారు వంద గజాలు దారికి రెండు వేపులా వేసి పొలంలోనో, బొటానికల్ గార్డెన్ లో నడుతున్న భావన ఇంటికొచ్చిన వాళ్లకి కలిగేలా  చేసే వారు. పైగా మా నాన్న గారికి గార్డెనింగ్ తో బాటు తేనెటీగలని పెంచి తేనె తయారు చెయ్యడం మంచి హాబీగా ఉండేది.  సామర్ల కోట లో ఉన్న అగ్రికల్చరల్ ఫారం నుంచి తేనెటీగలు పెరిగే బీ-హైవ్ తెప్పించుకుని, అందులో “రాణీ తేనెటీగ” ని పెట్టగానీ వందల కొద్దీ ఉన్న ఆ తేనెటీగల కుటుంబం అందులో బస చేసేది. మాకున్న తోటలో అన్ని రకాల పువ్వులూ ఉండేవి కాబట్టి ఆ తేనెటీగలకి పుప్పొడి కోసం వేరే తోటల్లోకి వెళ్ళే అవసరం ఉండేది కాదు. ఆశ్చర్యం ఏమిటంటేమ మా కుర్ర వెధవలం అక్కడే ఆడుకుంటున్నా విశ్వాసం గల ఆ తేనెటీగలు  మాలో ఎవరినీ ఎప్పుడూ కుట్టిన జ్జాపకం లేదు నాకు. మానాన్న గారు మా తోట మధ్యలో నుంచుని మా సూన్నారయణకి ఆదేశాలిస్తున్న ఒక అపురూపమైన ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. మా పెద్దన్నయ్య ఇది రహస్యంగా తీశాడు. ఈ ఫోటో తీస్తున్నట్టు అప్పుడు ఆయనకీ తెలియదు. తెలిసాక “వెధవల్లారా, నేను చొక్కా వేసుకోకుండా, కనీసం బనీను అయినా వేసుకోకుండా ఉన్న ఫోటో తీస్తారా, బుద్ది లేదూ” అని మమ్మల్ని చెడా, మడా తిట్టారు. ఆయన పోయి 30 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఆ ఫోటో పబ్లిక్ గా బయట పెడుతున్నాను.  మా తోటలో అన్ని రకాల మొక్కలు వెయ్యడానికీ, వాటిని మా కుర్ర కుంకలం తొక్కేసి తగలెయ్యకుండా ఆడ సింహం లా కాపలా కాసేది మా రెండో మేనత్త హనుమాయమ్మ గారు. మాతో సహా ఆవిడని అందరూ దొడ్డమ్మ అని పిలిచే వారు. ఆవిడకి పెళ్లి అయినా, పిల్లలు లేరు. భర్త తో సత్సంబంధాలు లేక నాకు తెలిసీ యాభై ఏళ్ళు ఆవిడ మా ఇంట్లోనే ఉండి, అక్కడే పోయారు. మంచి సంస్కృత పండితురాలు.  మొక్కల విషయంలో ఆవిడ అంటే మాకు సింహ స్వప్నమే!

హ్యూస్టన్ లో చంద్రకాంతం

హ్యూస్టన్ లో చంద్రకాంతం

ఒక విశేషం ఏమిటంటే అన్ని కూరగాయలలోనూ కాలీ ఫ్లవర్ పువ్వు పూయగానే  మొత్తం తోట అంతా  ఘాటుగా వాసన వేసేది. అదేమిటో తెలియదు కానీ నేను అమెరికాలో మా ఇంటి వెనకాల వేసినప్పుడు చూడడానికి షోకే కానీ కాలీ ఫ్లవరే కాదు, అస్సలు ఏ పువ్వుకీ ఎటువంటి వాసనా ఉండదు. కానీ ఎటువంటి సువాసనా లేకున్నా చాలా అందంగా ఉండే పువ్వు చంద్రకాంతం పువ్వు. పదేళ్ళ క్రితం నేను కాకినాడ  వెళ్ళినప్పుడు మా తోటలో మా చిన్నప్పటి నుంఛీ ఇప్పటి దాకా ఉన్నవి మా మామిడి చెట్టు, బొగడ చెట్టు, చంద్రకాంతం మొక్కలు మాత్రమే.  మా మామిడి చెట్టునీ, బొగడ చెట్టునీ అమెరికా తెచ్చుకోలేను కాబట్టి, ఆ చంద్రకాంతం విత్తనాలని ఆప్యాయంగా కోసుకుని హ్యూస్టన్ లో మా తోటలో వేసుకున్నాను.. ఆ మొక్కలు ఇప్పటికీ ప్రతీ ఏడూ ఎన్నెన్నో పూస్తున్నాయి. ఎప్పుడైనా మా చిన్నతనం గుర్తుకి వస్తే మా తోటలోకి వెళ్లి ఆ చంద్రకాంతాలని పలకరిస్తూ ఉంటాను.  హ్యూస్టన్ లో మా తోటలో ఉన్న ఆ చంద్రకాంతాల ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను. వాటి పూర్వీకులు నాలాగే కాకినాడ వారు. ఇప్పుడు మా నాన్న గారి గార్డెనింగ్ వారసత్వాన్ని,  నా పై వాడైన మా సుబ్బన్నయ్య పుణికి పుచ్చుకున్నాడు. అతను ఇటు కాకినాడలోనూ, అటు మా పొలంలోనూ అన్ని రకాల పూల మొక్కలు వేసి, కూరగాయలు పండిస్తున్నాడు. ఇటీవలే మేము కాకినాడ వెళ్ళినప్పుడు మా తమ్ముడు (లాస్ ఏంజెలెస్ నివాసి) మా మామిడి చెట్టుకి డ్రిప్ ఇరిగేషన్ పెట్టించి, మా స్థలాన్ని నందన వనం లా తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు.

..మా చిన్నప్పుడు నేను నిజంగానే “తోటలో నా రాజు” ని.. ఒకటేమిటి, మా తోటలో లేని పూల మొక్కలు కాని, పళ్ళ చెట్లు కాని, కూరగాయలు కానీ లేవన్నా, ఆ సకల సంపదల మధ్యా నా చిన్నతనం గడిచింది సుమా అని నాకు ఇప్పటికీ నమ్మ బుద్ది కావడం లేదు. ప్రపంచంలో అందరికీ ఇలాంటి “బాల్య సంపద” ఉంటుంది. దాన్ని నెమరు వేసుకునే యోగం కొందరికే ఉంటుంది ఆ రోజుల్లో అది గుర్తించే బుద్ది నాకు అప్పుడు లేకపోయినా, ఇప్పుడు గుర్తు చేసుకుని అక్షరబద్ధం చేసుకునే అదృష్టం నాకు కలిగింది.

chitten rajuవంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్

పిట్ట మనసులో ఏవుందీ ?

SAM_0344

“ఓరి నీ అఘాయిత్యం కూలా ….ఎంత తోస్తే అంతా చేసేయడవే ! ఆలోచనుండొద్దూ ?” అంటూ అబ్బులుగాడి మీద అంతెత్తున  విరుచుకు పడ్డారు  అత్తగారు .

మరి, అబ్బులు చేసుకొచ్చింది ఆషామాషీ ఆగడం కాదు . పొగాకు బేరన్ కి పుల్ల కోసం ట్రాక్టరు తోలుకుని మన్యం వెళ్ళినవాడు పుల్లతోపాటు పిల్లనీ దింపేడు మా వాకిట్లో .

” ఆయ్..ఈ పిల్లపేరు తలుపులమ్మండీ ” అంటూ కొంగు ముడేసి తీసుకొచ్చిన కొత్తపెళ్ళాన్ని  పరిచయం చేసినట్టూ  బోర విరుచుకుని గర్వంగా  చెప్పేసరికి ,  అత్తగారు  సందేహంగానూ, నేను ఆశ్చర్యంగానూ చూస్తూ నిలబడిపోయాం. ” అడ్డతీగలండీ…అమ్మాబాబూ లేరంటండీ పాపం . అడివిలో పురుగూ పుట్టా మధ్య  బతకటం సేనా కట్టంగా  వుందనీ, మనూర్లకేసి వచ్చేసి ఏదో పనిసేసుకు బతుకు దారని పాపం ఒకటే గోలండి. ఆడకూతుర్ని అడవిలో వదిలేలేక ఎమ్మట ఎట్టుకొచ్చేసేనండీ  ” అంటూ వట్రంగా ఒక్కోమూడీ విప్పేసరికి,  చెప్పొద్దూ..  మా అత్తగాకీ నాకూ ఫ్యూసులు ఎగిరిపోయాయి.

వెనకటికి ఇలాగే … మారేడుమిల్లి అడవుల్లో దొరికిందని  దెబ్బతిన్న నెమలి  పిల్లని  ఒకదాన్ని చంకన పెట్టుకొచ్చాడు . మురిసిపోయిన మాంగారు అబ్బులుగాడికి ఒకబుట్ట పుగాకు బహుమానంగా ఇచ్చేసి, దాని పెంపకం బాధ్యత కూడా వాడికే అప్పచెప్పారు . వాడేమో మిగతా పనులన్నీ వదిలేసి, దాన్నే  కనిపెట్టుకుని కూర్చునేవాడు  . అది మకాంలోని   గిన్నీకోళ్ళు, డింకీకోళ్ళు, టర్కీ కోళ్ళు వంటి , పెంపుడు జాతులతో కలవలేక పోయేసరికి  ఇంటిపెరట్లో   దాని పెంపకానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు . తనపెంపకంలో చక్కని ఈకలు తొడిగి దినదినప్రవర్ధమానమవుతున్న ఆ నెమలి ని చూసి తెగ పొంగిపోయేవాడు అబ్బులు .దాంతో ఉత్సాహం తీరక  నలుగురి కంటా పడకుండా మా ఇంటి ప్రహారీ మధ్య తన హయాంలో గుట్టుగా  పెరుగుతున్న ఆ నెమలి వయ్యారాలని ఊరందరికీ వర్ణించి చెప్పుకోవడం మొదలుపెట్టాడు . ఆ కబుర్లు ఆనోటా ఈనోటా పాక్కుంటూ ఎక్కడో టౌను  స్టేషన్ లో నిద్రపోతున్న ఎస్సై చెవుల్లో పడిపోయాయి .” కేసవుతుందండీ రాజుగారు ”   అని ఆ పోలీసు బాబు ఒళ్ళువిరుచుకుంటూ వచ్చి పడేసరికి   , “ అమ్మమ్మా..అంతపనిచెయ్యకండి  ఏదో తెలీక ..” అంటూ బాబుని బుజ్జగించి  అబ్బులు చేతుల్లో అల్లారుముద్దుగా  పెరుగుతున్న ఆ నెమలిని దాని  పుట్టింట్లో  వదిలిరావడానికి  అప్పటికప్పుడు చిన్నకారు కట్టించుకుని అడవులకి దౌడుతీయాల్సి వచ్చింది మాంగారు .

“ఏటేస్ … నాటుకోడిని నీటుగా  నవిలేత్తే  కేసవ్వదుకానీ, నెమలికోడిని గారంగా పెంచుకుంటుంటే కేసేసేత్తారా ” అంటూ ఓనాడెప్పుడో   లోగిట్లో కోడిపులావ్ లొట్టలేసుకుంటూ తినెళ్ళిన ఆ ఎస్సైమీదకి తూగుతూ తగూకి  కి వెళ్ళబోయిన  అబ్బుల్ని ”  ఓరిబాబూ ఊరుకోరా … గవర్నమెంటోడి రూలంటే రూలే ..ఆడికంటే మనకెక్కువ తెలుసేటీ  . అదీగాపోయినా నువ్వు ఎన్నముద్దలెట్టి ఎన్నాళ్ళు  పెంచినా అది ఏదో ఓనాడు   జతకోసం అడివిలోకి ఎల్లిపోయీదే . ఆ మాత్రం దానికి ఓ ఇదయిపోటవెందుకూ ”  అని నచ్చచెప్పటానికి నానా కష్టాలు పడ్డాడు చేలో మకాం ఉండే కన్నప్పడు .   తన గారాలపట్టి ని తలుచుకుని తలుచుకుని కొన్నాళ్ళు బెంగపడ్డ  అబ్బులు , ఎంత దూరాన్ని వదిలేసినా అది తనని వెతుక్కుంటూ ఎగిరొచ్చేస్తుంద న్న  భ్రమలో  మరి కొన్నాళ్ళు గడిపేసాడు.. అదెక్కడున్నా సుఖంగా ఉండాలని గాల్లో దణ్ణాలు పెడుతూ   చాన్నాళ్ళకి ఆ సoగతి మర్చిపోగలిగాడు .

పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యిందన్న సామెత అబ్బులు విషయంలో చాలా సార్లు రుజువయ్యింది. నేలన పోయేదాన్ని నెత్త్తికి రుద్దుకోవడంలో కూడా వీడు సిద్దహస్తుడు.

ఒకసారి మేం చూస్తుండగానే   ఇంటి చూరునించీ జారి నీళ్ళగోళెంలో పడిన ఎర్రతేలు మునగాలో తేలాలో తేల్చుకోలేక అవస్థ పడుతుంది  .   అత్తగారూ నేనూ గోళెం చూట్టూ  ప్రదక్షిణ చేస్తూ  ఎవడి చెప్పుకిందో పడి చావకుండా నీళ్ళలో ములిగి ఉత్తమ మరణం పొందబోతున్న ఆ పుణ్యాత్మురాలయిన తేలుకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని ప్రార్ధిస్తుంటే అటుగా వచ్చిన అబ్బులు ” అదేం పనండి అయ్యగారు ” అంటూ ఉత్తిపుణ్యానికే మమ్మల్ని  కోప్పడ్డాడు    . అక్కడికి  మేవేదో  దాని తోక పట్టుకుని నీళ్ళలో తోసేసినట్టు  .

“ అంతగా అయితే పైకి తీసి ఒక్కదెబ్బెయ్యాలిగానండీ  అలా పేణాలకోసం గిలగిలా కొట్టుకుంటుంటే సూత్తా ఊరుకో కూడదంటండీ…సేనా పాపవంట మా తాత సెప్పీవోడు”  అంటూ  తాతోపనిషత్ తిరగేసాడు. అక్కడే వున్న పుల్లని నీళ్ళలోకి జారవిడిచి వస్తాదులా నిలబడ్డాడు .” ఏడ్చావులే రా ! నీ దారిన నువ్వుఫో … దాని చావు అది చస్తుంది” అన్న అయ్యగారోపనిషత్  వాడి చెవికి చేరేలోగానే    , పుల్లమీంచీ మేం ఊహించని స్పీడులో పైకి  పాక్కుంటూ  వచ్చిన ఎర్రతేలు అదే స్పీడులో అబ్బులుగాడి చేతిమీదికి  చేరిపోయి  తన ప్రాణాలకు పుల్ల అడ్డేసిన  పెద్దమనిషన్న కనికరం అయినా లేకుండా తోకతో టపీ టపీమని కొట్టేసింది .  ఇంకేవుంది  .. చెయ్యి గాల్లో గింగిరాలు తిప్పేస్తూ  లబోదిబోమంటూ తేలుమంత్రం వేయించుకోడానికి   పరిగెత్తాడా    ఆపద్భాంధవుడు   .

ఆపదలోవున్నవారిని  అక్కున చేర్చుకోవాలని తహతహలాడిపోతుంటాడు పిచ్చి సన్నాసి   . అవతల ఉన్నది  మనిషయినా ,మానయినా –పురుగయినా, పిల్లయినా వాడికొక్కటే .

మరి అలాగే కదా , చెరుకు లోడుతో చెల్లూరు వెళ్ళినవాడు అక్కడా ఆపధ్భాంధవుడి అవతారం ఎత్తి అడకత్తెరలో పడ్డాడు . ఇప్పటికీ నలుగుతూనేవున్నాడు   .

అమ్మానాన్నా, అత్తామావా అందరూ  ఎంతగా  బతిమాలుతున్నా వినకుండా నక్కబావని నేను చేసుకోనంటే చేసుకోను అని మంకుపట్టుతో పంటకాలవలో దూకేసిన సత్యవతిని అటుగా వెళుతున్న అబ్బులు పైకి లాగి నీళ్ళు కక్కించాడట . కళ్ళుతెరిచిన ఆ పిల్ల  అబ్బులుని  పరీక్షగా చూసి , నా  వంటిమీద చెయ్యేసిన నువ్వే  నన్ను ఏలుకోవాల్సిన జగదేకవీరుడివి అంటూ వెంటపడిందట సతీ సత్యవతిలా  .    ‘ నాకు పెళ్ళయిపోయింది పిల్లో ‘ అని వాడు మొత్తుకుంటున్నా వినకుండా  వీడు చెరుకు లోడుతో వెళ్ళేసరికల్లా   షుగరు ఫేక్టరీ గేటు దగ్గరే ఎదుపడి వగలుపోయేదట    .  ఒకసారి,  శారదా వాణిశ్రీల మధ్య విలాసంగా నిలబడ్డ శోభన్ బాబు వాల్ పోస్టరు చూపించి , నువ్వాపాటి చెయ్యవా నీకేం తక్కువా అని ఎగేసిందట . అప్పటికీ వీడు చిక్కకపోయేసరికి ,   ఒక సుభలగ్నాన  వాళ్ళూరు పుంతరోడ్డులో సత్తెమ్మ తల్లి గుడిదగ్గర కాపుకాసి, ఈరోజుతో తాడో పేడో తేలిపోవాల్సిందే నుంచున్నపళంగా నా మెళ్ళో తాళికడతావా లేకపోతే , మా నక్కబావని  పెళ్ళిచేసుకుని ఈ రాత్రికే చచ్చిపోమంటావా అని నిలేసేసిందట , ఆపిల్ల మంకుపట్టుకి  అంతటి మొగోడు  కళ్ళనీళ్ళుపెట్టేసుకుని , ఏవయితే అదే అయిందని తలొంచుకుని సత్యవతి మెళ్ళో మూడుముళ్ళూ వేసేసాడట.

ఇంత జరిగాకా ఆ పిల్ల అమ్మానాన్నా  ఏడ్చి ఏడ్చి మొఖం కడుక్కుని  అబ్బులుని ఇంటికి పిలుచుకెళ్ళి ,   మా పిల్లనొదిలేసి మేం వుండలేం   మాకున్న అరెకరం పొలం, మేం వుంటున్న ఈ డాబా ఇల్లూ మా పిల్లవే అంటే ఇకనుంచీ  మీవే . మీ ఇబ్బంది మాకు తెలుసనుకోండి  అయినా   వీలు చిక్కినప్పుడలా  వచ్చిపోతుండండి అల్లుడుగారు అనేసారట .

అబ్బులు చేసిన ఈ ఘనకార్యం ముందు చెల్లూరులోనూ  ఆనక మా ఊర్లోనూ షికారు చేసి చివరికెప్పటికో అబ్బులు పెళ్ళానికి చేరింది . ముందు మొగుడనే  మమకారం లేకుండా  చితక్కొట్టేసినా  …ఆనక అరెకరం పొలం -డాబా ఇల్లు సంగతీ తెలిసి ” సర్లే ….ఏదో సామెత చెప్పినట్టూ పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యింది . ఆడది అంతకి తెగించాకా ఆయన మాత్రం ఏం చేత్తాడు . రాముడు దేవుడు కనకా  శూర్పణకకి చిక్కకుండా తప్పించుకోగలిగేడు . మా అబ్బులు మాయ పాపం అమాయకుడు దొరికిపోయేడు . ఇకనుంచీ నేనెంతో ఆవిడా అంతే  ” అని సర్దేసుకుందట.  అలా అని   మొగుణ్ని  ముక్క బద్దా కింద  పంచేసుకోలేరు కదా ! అందుకే ఇద్దరూ గొడవ పడకుండా ఒక పద్ధతి ప్రకారం పోతూ   అబ్బులుని ఇక్కడ ఈవిడ  ఉతికి  ఆరేస్తే , అక్కడ ఆవిడ మడతేసి ఇస్త్రీ చేస్తుందనీ  జనం నవ్వుకుంటారు .   అబ్బులు మాత్రం అసలేం జరగనట్టూ ఎక్కడవక్కడే మర్చిపోయి  తన మానాన తను న్యాయమనుకున్న పనులు  చేసుకుపోతుంటాడు .

ఇక ఈ పిట్టకథలు , పీత కథలు పక్కనపెట్టి అసలు కథకొస్తే   ….. అబ్బులు చేసుకొచ్చిన ఘనకార్యానికి అయోమయంలో పడిపోయిన అత్తగారు అప్పటినుంచీ అదే పాట పాడుతున్నారు. బాగాచెప్పారు అంటూ నేను అలవాటుగా అత్తగారి వెనక నిలబడి  తాళం వేస్తున్నాను.

” నీకు బుర్రా బుద్ధీ లేదటరా…. ఇదేం చోద్యం రా . అడవిలో దొరికిందని  లేడి పిల్లని తెచ్చినట్టూ  ఆడపిల్లని తీసుకొచ్చేస్తావా ! ఇదేం అఘాయిత్యపు పనిరా ….ఆలోచనుండొద్దూ  !!

” అదికాదండి అయ్యగారూ …” అని తలొంచుకుని నీళ్ళు నములుతూ అబ్బులు, ఆ పక్కనే అదురూ బెదురూ లేకుండా నిట్రాటలా నిలబడి పరిసరాలు పరిశీలిస్తూ ఆ పిల్ల .

ఏగేసి మోకాళ్ళ కిందికి కట్టిన  ముదురాకుపచ్చ రంగు చీరలో బోసిమెడతో ఉన్న తలుపులమ్మ అడ్డూ ఆపూ లేకుండా తన ఇష్టానికి పెరిగిన అడవిమల్లెతీగలా సన్నగా బలంగా  వుంది . మెడలో పసుపుతాడులాంటిదేదీ కనిపించక పోవడంతో మేం కొంచెం ఊపిరి పీల్చుకున్నాం .

” అదేపోన్లెండి  …మీకు నచ్చాపోతే  రేపొద్దుగాలే  ఆ అడివిలో దిగబెట్టేసొత్తాను . మాపిటికి ఇక్కడే మీ లోగిట్లోనే ఉండనీయండి . సాకిరీ సెయ్యలేక సీపురు పుల్లలా అయిపోయేరు గదా సిన్నయ్యగారు, చేతికింద సాయానికో మడిసుంటే ఆరికీ మీకూ కుంత కులాసాగా వుంటదని అలోచించేనండీ . మీరు వొద్దంటే ..నాకేం పట్టిందిలెండి “ అని   అబ్బులు నిష్టూరంగా అంటుంటే,  అన్నంత పనీ చేసేయడు కదా అన్నట్టు అబ్బులుకేసి దిగులు చూపులు చూస్తుంది తలుపులమ్మ . ‘ మా నాయనే ..నా కష్ట సుఖాల గురించి నీకెంత అక్కరరా ‘ అని  నా మనసు సంతోషంతో గంతులేసింది .

అత్తగారు మాత్రం అబ్బులు మాటకి “ హవ్వ… “ అంటూ బుగ్గలు నొక్కుకుంటూ  వాడ్ని పక్కకి పిలిచి, “  నీ తెలివి తెలారినట్టేవుంది . ఇలా ముక్కూ మొహం తెలీని వాళ్ళని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇంకేవన్నా ఉందట్రా   ! ఆ పిల్ల చూపూ వాలకం చూస్తే  పని తెలిసినదానిలా వుందా ? అసలే అడవుల్లోంచీ వచ్చింది అక్కడెవరితో ఏం సంబధాలున్నాయో ….ఈ సంగతి రాజుగారికి తెలిస్తే చీల్చి ఎండేస్తార్రోయ్  “ అంటూ  పళ్ళు నూరేసరికి   బెకబెకమంటూ నవ్వేసిన అబ్బులు , “ అబ్బే మీరూరికే అనుమానపడతనారండీ… ఆయమ్మి అలాటిది కాదండీ పాపం.  సేనా మంచిదండీ”  అంటూ వాదించబోయాడు . అప్పటికే విసిగిపోయి ఉన్న అత్తగారు ‘ ఠాట్ ‘ అంటూ కళ్ళెర్రజేసి గద్దించేసరికి కొంచెం బెదిరినట్టూ  వెనక్కి తగ్గి,  “ అయ్ బాబూ  అలాకోప్పడతారేటండీ…అలాగే అంపిచ్చేద్దారిలెండి “ అంటూ దారికొచ్చాడు .

ఆ మాటతో  సమాధానపడ్డ  అత్తగారు ” అలాగే  అఘోరించు . పొద్దున్నే రా ఫో “అ ని అబ్బుల్ని కేకలేసేసరికి వాడు కాల్లో ముల్లు  దిగబడ్డవాడిలా  బాధపడుతూ ఒక్కో అడుగూ అతికష్టం మీద వేసుకుంటూ వెనక్కి చూసుకుంటూ  వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ” పొద్దుగాలెప్పుడో తిన్నాది. పాపం ఆకలేత్తది కదండీ . మీరు తిన్నాకా కుంత ఒణ్ణం ఎట్టండి  ” అంటూ పరమాయించి పోయాడు.

తలుపులమ్మ  అన్నంతిని ఆకు పారేసొచ్చాకా  తుంగచాపా దుప్పటీ ఇచ్చి పడుకోటానికి చోటు చూపించారు అత్తగారు  .” ఈ రాత్రి మనకెలాగూ జాగారం తప్పదు అనుకుంటూ అత్తగారూ నేనూ  సావిట్లోనే  కూలబడ్డాం .  మేం నిద్రపోతే ఆ అపరిచితురాలు ఎక్కడ కొంప తవ్వుకుపోతుందో అన్నంత ఇదిగా రెప్పవేయకుండా జాగ్రత్తగా వుండాలనుకుంటూ ” ఇదిగో వెనకటిలాగే…” అని ఎక్కడెక్కడి పాత కథలో తవ్వుకుంటూనే  ఆవులింతలతో   ఒకరిమీద ఒకరు వాలిపోయాం .

ఎండ మొఖం మీద పడటంతో మెలకువొచ్చిన మాకు నారింజరంగు చీరలోకి మారిపోయిన తలుపులమ్మ గుమ్మంలో ముగ్గేస్తూ కనిపించింది . వాకిట్లో పొయ్యిమీద నీళ్ళు కాగుతున్నాయ్ .  నవ్వుతూ వచ్చిన తలుపులమ్మ  గోళేల్లోకి  నీళ్ళు తోడేసిన సంగతి,  మంచినీళ్ళబిందెలూ, పాలతెపాళాలూ తోమేసి బోర్లించిన  సంగతీ చెప్పి ఇంకేవన్నా పనుంటే చెప్పండి అనేసరికి మేం  తెల్లమొఖాలేసుకు  నిలబడిపోయాం .

పొద్దున్నే వస్తానన్న అబ్బులు  మధ్యాహ్నవయినా అజాపజాలేడు. చూసినవాళ్ళు ఎవరూ ఏవిటీ అని ఆరాలు తీస్తారనే భయంతో అత్తగారు తలుపులమ్మని పెరడు దాటి రావద్దని  ఆజ్ఞాపించేసారు  . మoచినీళ్ళు దగ్గరినుంచీ అన్నీ కాళ్ళదగ్గరికే అందిస్తూ మాంగారు, మా రాజుగారు కూడా సావిడి దాటి వంటింటివైపు రాకుండా చూసుకుంటున్నాం.

చూస్తుండగానే సాయంత్రవయిపోయింది . ఆ పనీ ఈపనీ అని లేకుండా అన్ని పనులూ మా చేతుల్లోంచి చనువుగా లాక్కుని మరీ చేసేస్తుంది తలుపులమ్మ.  మాంగారు రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు , అత్తగారు అబ్బులు గురించి ఆరా తీస్తే  ” మన్యం వెళ్ళొచ్చాడు కదా ! నీళ్ళు తేడా చేసాయేమో ..రెండు రోజులు రాలేనని కబురంపేడు “అన్నారట  . రెండ్రోజులే …..అని తలపట్టుకు కూర్చున్నారు అత్తగారు.

అంతోటి అత్తగారే అలా అయిపోయేసరికి ఏం చేయాలో తెలీక కంగారుపడిపోయాన్నేను . ఇదేం పట్టని తలుపులమ్మ  రాములవారి గుళ్ళోంచీ మైకులో వినిపిస్తున్న మూగమనసులు సినిమాలోని ”  గోదారి గట్టుందీ… ..” అన్న పాటని   తలాడిస్తూ వింటుంది .

ఆ మర్నాడు కూడా కోడికన్నా ముందులేచి అంతే హుషారుగా పనులన్నీ చేసేసి  అత్తగారిని ఆశ్చర్యపరిచేసింది తలుపులమ్మ.

ఎంత పెట్టినా ఎప్పుడూ మొఖం మొటమొటలాడించుకుని గిన్నెలూ గిరాటేసే  నరసమ్మకీ , చలాగ్గా చేతిలో పని అందుకుని చేసేస్తున్న ఈ మనిషికీ  నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది కదే అన్నారు అత్తగారు .

అవునంటూ తలాడించాను .

మెతుకు చూస్తే అన్నం పదును తెలిసిపోదూ , ఈ రెండ్రోల్లోనీ  పిల్ల పద్ధతి తెలిసిపోయింది కదా , మనకీ చేదోడుగా వుంటుంది పోనీ ఉండనిద్దామా అన్నారు . మనిషి మొరటే అనుకో అయినా  పోగా పోగా తీరిక అదేవస్తుందిలే అన్నారు మళ్ళీ ఆవిడే . అదీ నిజమేలెండి అన్నాను .

ఆ సాయంత్రం “ పెరట్లో ఆ మనిషెవరూ కొత్తగావుందీ ?” అనడిగిన మాంగారితో  .  ఇంటిపనిలో చేతిసాయానికి పెట్టుకున్నాం ఇక ఇక్కడే వుంటుంది అని డిక్లేర్ చేసేసారు అత్తగారు  . వీధిలో రాజకీయాలకే రోజు చాలటంలేదు పెరటి రాజకీయాలు మనకెందుకనుకున్నారో ఏమో  వివరాలజోలికి పోకుండా ” ఓహో ” అనేసి ఊరుకున్నారు మాంగారు .

మూడోనాడు పొద్దున్నే ఈనులాగేసిన కొబ్బరాకులా వాలిపోతూ వాకిట్లో నిలబడ్డ అబ్బులు “అయ్యగారూ  సత్తెపెమాణకంగా పేణం బాగోక రాలేకపోయేనండీ … నిజవండీ బాబూ , ఒట్టండీ బాబూ ”   అంటూ పెద్దయ్యగారిని  ప్రసన్నం చేసుకోటానికి  తలమీద చేతులేసుకుని  తెగ ప్రయాస పడి పోతున్నాడు .

చేటలో బియ్యం పోసుకొచ్చిన తలుపులమ్మని ” ఒలే…నీ సంచొట్టుకొచ్చీ . అయ్యగారొద్దన్నాకా నువ్వో చనం కూడా ఉండటానికి ఈల్లేదు ” అంటూ వాడు  తొందర చేస్తుంటే ….”అయిందేదో అయిందిలే , ఇక్కడే వుండనీ “ అని అత్తగారు ప్రసన్నవదనంతో అభయం ఇచ్చేసరికి అంత నీరసంలోనూ అబ్బులు ఆనందతాండవం చేయబోయాడు .

అత్తగారు వాడి ఆత్రానికి పగ్గాలు బిగిస్తూ ” ఇక తలుపులమ్మ ఆలనా పాలనా మేం చూసుకుంటాం కాబట్టి, నువ్వు దాని ఇరుపంచాలా  కనిపించకూడదు. మేం లేనప్పుడు నీళ్ళనీ, నిప్పులనీ పెరట్లోకి  వెళ్ళి పలకరించకూడదు  . పనున్నాసరే నువ్వుదాని దరిదాపుల్లో మసలకూడదు ..మళ్ళీ లేనిపోని తంటసా  అంటూ ముచ్చటగా  పెట్టిన మూడు షరతులకే  మూర్చొచ్చినంత  పనయింది అబ్బులుకి . అయినా తమాయించుకుని ఉస్సూరంటూ ఓ చూపు చూసి    ” అలాగేలెండి ఏదో మీనీడన   ఆయమ్మి సల్లగా వుంటే  నాకంతే సాలు “అంటూ  ప్రేమ కథల్లో  నాగేస్సర్రావులా భుజమ్మీద  తువ్వాలు  జారిపోతున్నా పట్టించుకోకుండా తూగుతూ వెళ్ళిపోయాడు.

అబ్బులు వెళ్ళాకా తలుపులన్నీ బిగించి,  ఆ అడవిమల్లికి  కొన్ని సుగంధాలు  అద్దే ప్రయత్నంలో పడ్డారు  అత్తగారు  .

ఆప్రకారం ….  అత్తగారి అనుమతిలేకుండా వీధి గుమ్మం దాటకూడదనీ,ఊరికే గోడలెక్కీ గుమ్మాలెక్కీ వీధిలోకి చూడకూడదనీ , ఏదయినా పనిమీద ఎవరింటికయినా పంపిస్తే ఆ పని  చప్పున చక్కబెట్టుకు వచ్చేయాలి కానీ    అక్కడే కబుర్లు చెపుతూ కూర్చోకూడదనీ, అలా చేస్తే అవతలివాళ్ళు మాటల్లో పెట్టేసి మన ఇంటిగుట్టంతా లాగేస్తారనీ , ఎవరిగగ్గరా ఏదీ ఊరికే పుచ్చుకోకూడదనీ, ఇంట్లో మగాళ్ళుండగా వంచిన తలెత్తకుండా పనులు చేసుకోవాలి తప్ప, వచ్చేదెవరూ పోయేదెవరూ అని ఊరికే ఆరాలు తీయకూడదనీ , ఇంకా అదనీ, ఇదనీ ….పెద్ద పురాణమే చదివేసారు .  అవన్నీ విన్న తలుపులమ్మ అర్ధం అయీ కానట్టు అయోమయంగా  తలాడించినా నాకు మాత్రం    చుట్టూ కారుచీకట్లు కమ్ముకున్నట్టూ అనిపించి పైకి చూస్తే ఆకాశంలో కూడా గోడలు కనిపించాయి . సరిగ్గా అప్పుడే మా పొట్టి బ్రహ్మం ” చీకటిలో కారుచీకటిలో….” అన్న విషాద గీతానికి తనపొట్టి సన్నాయిమీద ట్యూన్స్ కట్టుకుంటున్నాడు. పాపం వాడి పెళ్ళం మళ్ళీ వాడ్ని కొట్టేసి పుట్టింటికెళ్ళిపోయినట్టుంది అనుకొని కాస్త విషాదంగా నవ్వుకున్నాను .

వచ్చిన నెలలో ఉన్న హుషారు తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టి  వాడిన  సన్నజాజి తీగలా వేలాడుతూ  తిరుగుతుంది తలుపులమ్మ .  ఇంకో పదిరోజులు గడిచేసరికి వంకర ముగ్గులు వేస్తూ , నూతిలో బకెటుకి బదులు తాడు వదిలేస్తూ పరధ్యానంలో పడింది. అబ్బులు గోడమించీ అందించిన గోలీ షోడాలు దాచినంత సులభంగా వాడందించిన సంపెంగలు, మొగలిరేకులూ మా కంట పడకుండా దాచలేక అవస్థ  పడుతుంది  .  పక్కూళ్ళో తీర్థానికి వెళ్ళాలని ఉబలాటపడి అయ్యగారి పర్మిషన్ దొరకక ఢీలా పడింది.  గోరింటాకు కోసుకురావటానికి  కరణంగారి తోటవరకూ  వెళ్ళొచ్చినరోజు మాత్రం కాస్త హుషారుగా కనపడింది . అటకమీద ఆవకాయ జాడీలు దించడానికి , చెట్టుమీంచీ కొబ్బరి గెలలు దించడానికీ , అబ్బులుగాడు వచ్చిపోయినప్పుడు దిగులుగా వాడెళ్ళినవేపు చూస్తూ వుండిపోయింది .  చుట్టూవున్న నాలుగు గోడల్నీ చూసినట్టే , రోజూ  కనపడే మా నాలుగు ముఖాల్నీ ఏభావం లేకుండా చూస్తుంది . కొత్తమనుషులెవరన్నా వస్తే వదలకుండా వాళ్ళనే అంటిపెట్టుకు తిరుగుతుంది . బయటినుంచి వినిపించే ప్రతీ మాటనీ , మైకులో వినవచ్చే ప్రతీ పాటనీ ఒళ్ళంతా చెవులుచేసుకు వింటుంది .

ఒక మిట్ట  మద్యాహ్నం  మండువా గుమ్మంలో  తీరిగ్గా కూర్చునున్నప్పుడు  …..” తలుపులొచ్చి మూడ్నెలు అయింది కదే “ అన్నారు అత్తగారు .  పత్తిలో గింజలు తీస్తూ …

అయ్యేవుంటుందిలెండి అన్నాను  నేను ,   పంచదారతో వచ్చిన పొట్లాల కాగితం విప్పుతూ….

“ ఆ అడవిలో ఏం తినేదో ఏంటో….మనతోపాటు శుబ్రమయిన తిండి తింటుందికదా  మనిషి  ఒల్లుచేసింది.  కానీ , మొఖంలో కళపోయి పాండురోగం వచ్చినదాన్లా రోజురోజుకీ అలా  అయిపోతుందేంటో !“ అన్నారు అత్తగారు .

అలా అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు …వాళ్ళూరు మీద బెంగ పెట్టుకుందేమో అని అప్పటికి తోచిందేదో చెప్పేసాను

ఇంకా నయం అక్కడెవరూ లేరనేగా ఇక్కడికొచ్చింది . అయినా మనం బానే చూస్తున్నాం కదా !   బట్ల భాస్కర్రావు దగ్గర దానికి నచ్చిన రంగు చీర తీయించి ఇచ్చామా . మనముందు బోడి బొంగరంలా తిరుగుతుంటే చూళ్ళేక రామిండ్రీనించీ గాజులూ పూసలూ తెప్పించి వేసామా . నెలక్రితం ద్వాదసి దీపాలు  వదలడానికెళుతూ మనతో పాటూ దాన్నీ  పుష్కరాలరేవుకు  తీసుకెళ్ళాం కదా ….అంటూ  చిన్న స్వరంతో చిట్టా విప్పుతున్న అత్తగారు

దూరంగా వాకిట్లో పందిరి రాటకు ఆనుకుని  ఆకాశంలోకి చూస్తూన్న తలుపులమ్మని  చూపించి  …దీని వాలకం చూస్తుంటే నాకు భయంగా వుందేవ్ ” వెర్రి మాలోకంలా అలా శూన్యంలోకి చూస్తుందేవిటే ”  అని గాభరాగా అంటూ గింజలు పళ్ళెంలోనూ, పత్తి నేలమీదికీ గిరాటేస్తున్నారు  .

ఇవతలున్న సగం జోకూ చదివేసి, నవ్వురాక పొట్లంలో చిక్కుకున్న పూర్తి జోకు చదవాలనే  కుతూహలంతో   కాగితం మడతల్ని జాగ్రత్తగా విప్పుకుంటున్నదాన్నల్లా  “ ఆకాశంలో అడ్డు  గోడలుండవుకదండీ  ! అందుకే  అందినంతమేరా అలా చూస్తూ పోతుందేమో !” అనేద్దామనుకుని  …..అసలే అత్తగారు ఒకింత గాభరాగా వున్నారుకదా  ఇంకా కంగారుపెట్టడం భావ్యం కాదనిపించి  , నా కవి హృదయాన్ని తొక్కిపట్టి   ” ఏమోనండీ నాకెలాతెలుస్తుందీ  ”  అని అప్పటికి తప్పించుకున్నాను .

పండుగ నెల . సీతాకాలం పొద్దు ,  భోగి పిడకలకి ఆవుపేడ తెస్తానని మధ్యాహ్నం వెళ్ళిన తలుపులమ్మ   దీపాలవేళయినా  ఇల్లుచేరలేదేవిటని అత్తగారు హైరానా పడుతున్నారు . “అదేం చిన్నపిల్లా తప్పిపోటానికీ …రావాలంటే  తనే వస్తుంది . ఓ..ఇదయిపోతారెందుకూ” అని మాంగారు కేకలేస్తున్నారు .  అంతలో,  ఆ మధ్య ఇంటికి సున్నాలేయటానికొచ్చిన జట్టులో సూరిబాబనే వోడు , పడుతూ లేస్తూ  వచ్చి ఈ కబురు చెప్పేడు  .

మధాహ్నమే  తలుపులమ్మ  గోకారం రోడ్డులో ఉల్లిపాయల సూరిబాబు ఒంటెద్దుబండిమీద వెళ్ళటం చూసేనని .  ఎక్కడికని అడిగితే కోపంగా చూసిందట   . మళ్ళీ ఎప్పుడొస్తావ్ అంటే  ” మళ్ళీనా ! సత్తేరాను …ఆ కొంపలో నాకు గాలాడతాలేదు ” అందట . “ఎందుకన్నా మంచిది ఓపాలి సూసుకోండి రాజుగారూ ఏవన్నా అట్టుకుపోయిందేమో”  అని మాకంటే ఎక్కువ కంగారు పడిపోయాడు  .

ఇలా తెల్లారిందో లేదో అలా ఊళ్ళో జనం ఒకళ్ళనొకళ్ళు తొక్కుకుంటూ తోసుకుంటూ పరామర్శకి వచ్చేసారు .

అమ్మో  అలా జరిగిందా అని ఆశ్చర్యపోయారు  . నమ్మి ఇన్నాళ్ళూ ఇంట్లో పెట్టుకుంటే ఒక్క మాటన్నా చెప్పకుండా చెక్కేసిందంటే ఎంత గుండెలు తీసిన బంటో చూడండి  అంటూ  ఆడిపోసుకున్నారు .   ఏవేం పట్టుకు పోయిందీ అని ఆరాలకి దిగారు .

ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది …పాపం ! పూచికపుల్లకూడా పట్టుకెళలేదు అని మేం చెపుతుంటే వినరే . అలా ఎలా జరుగుతుందీ  ఏ చెంబో గిన్నో అయినా ఎత్తేసుంటుంది సరిగా చూసుకోండి అంటూ  మాకు ఊపిరాడకుండా చేసేస్తుంటే , విసిగిపోయిన మేం ” ఏమో బాబూ  ఇక్కడయితే ఏం పోలేదు . అక్కడినుంచేవయినా కొల్లగొట్టుకుపోయిందేమో ఆరా తీయండి  “ అంటూ  మల్లెపందిరి  కింద చతికిలపడి విచారవదనంతో  గాల్లో దణ్ణాలు పెడుతున్న అబ్బులు మీదికి తోలేసాం . వాడ్ని పట్టుకుని  కావల్సిన కథలేవో వాళ్ళే దులుపుకుంటారని .

తలుపులమ్మ తలపుల్లోంచీ అబ్బులు తొందరగానే బయటపడ్డా “  ఆ కొంపలో గాలడతాలేదు ” అని  ఆ అడవిమల్లి అనేసి పోయిన మాటని మాత్రం అత్తగారు మర్చిపోలేక పోతున్నారు .

“ అంత మాటందా ! మరీ విడ్డూరం కాకపొతే . ఇవే కొంపల్లో మనం తరాల తరబడి బ్రతికేయడంలేదూ”  అన్నారు   అమాయకంగా .

“ దట్టమయిన అడవుల్లో మొలిచే కొన్ని మొక్కలు ఎండని వెతుక్కుంటూ పెరుగుతూ పోతాయట .  మరికొన్ని   మొక్కలకి ఆట్టే గాలీ వెలుతురూ అక్కరలేదట . వాటిని ఇళ్ళలో ఉంచేసినా  కిటికీలోంచి పడే చిన్నపాటి ఎండతోనే అవి చక్కగా జీవించడానికి అలవాటు పడిపోతాయట   . వాటినే ఇండోర్ ప్లాంట్స్ అంటారట”  . అని నేను అన్నదాతలో వచ్చిన వ్యాసాన్ని పైకి చదివి వినిపించబోతే , నే అడిగేదానికీ నువ్వు చెప్పేదానికీ ఏవన్నా సంబంధం వుందా  …” అయ్యోరాత  ! ఇంత  అయోమయం ఏవిటే !” అని విసుక్కుంటున్న అత్తగారికి విడమర్చి చెప్పటం నావల్లకాదు బాబు .

–దాట్ల లలిత

మిథునం గురించి మరో సారి

midhunam3

‘‘తెలుగు సినిమాకు మడికట్టిన మిథునం’’ పేరుతో ‘‘సారంగ’’ లో జి.ఎస్‌. రామ్మోహన్‌ రాసిన వ్యాసం చదివాక మిధునం గురించి మరోసారి రెండు ముక్కలు రాయాలనిపించింది.
‘‘పాలపిట్ట’’ పత్రికలో మిథునం సినిమాను సమీక్షించింది నేనే! స్త్రీ, పురుష సంబంధాలలో వుండే అద్వైత తత్వాన్ని, అర్థనారీశ్వరత్వాన్ని మిథునం కథా నెపంగా చెప్పడానికి తనికెళ్ళ భరణి ప్రయత్నం చేశాడని అందులో నేను చెప్పాను. ఆ పత్రిక సంపాదకులు ఒక పేజీ మొత్తం ఎడిట్‌ చేయడం వలన అది పూర్తిగా వ్యక్తం కాలేదు. ఆ వ్యాసం ఇలా ముగుస్తుంది.
‘‘మిథునం సినిమా చూశారా? ఎలా వుంది?’’ అని ఒక సాహితీ మిత్రుడుని అడిగాను. అందుకు ఆయన సినిమా బావుంది కానీ కాస్త బ్రాహ్మణ వాసన వేస్తుంది?’’ అన్నారు. ‘‘అయ్యా! యిదీ మన సంస్కారం’’ అంటూ వ్యాసం ముగించాను. ‘‘అయ్యా ఇదీ మన సంస్కారం’’ అన్న వాక్యం పట్ల చాలా మంది అభ్యంతరం వ్యక్తంచేశారు. అభిప్రాయం చెపితే సంస్కారం లేదని అంటే ఎలా! అని ఫోన్‌ చేసి మరీ మందలింపు ధోరణిలో కూడా మాట్లాడారు.
ఏదయినా ఒక వాక్యం రాసి అచ్చయ్యేంత వరకే రచయిత స్వంతం. ఒక సారి అచ్చులో వచ్చాక అది ప్రపంచానిదై పోతుంది. ఎవరికి నచ్చిన రీతిలో వారు దానికి వ్యాఖ్యానం చేస్తారు. ప్రతి వ్యాఖ్య రచయిత ఉద్దేశించిన రీతిలోనే వుండాలని లేదు.
‘‘అయ్యా! ఇదీ మన సంస్కారం’’ అన్న వాక్యం రాయడం వెనుక నేను ఆశించిన ధ్వని వేరు. సాహితీ మిత్రుడు, కవి, బుద్ధిజీవి ఏదయితేనేం… సమాజానికి కాస్త భిన్నంగా ఆలోచించి, దిశా నిర్దేశం చేయవలసిన బుద్దిజీవులం మనం కూడా ‘‘ఎబౌ ది క్యాస్ట్‌’’ ఆలోచించకపోతే ఎలా? అనే నిరాశ, నిస్పృహ, నైరాశ్యం, నేనాశించిన ధ్వని.
జి.ఎస్‌. రామ్మోహన్‌కి కూడా అది ‘‘తిట్టి పోయడం’’గా అర్థం అయింది. మన సంస్కారం ఉండవలసిన రీతిలోలేదు అన్నది నా బాధ. వ్యక్తులనయినా, విషయాలనయినా పరుషంగా వ్యాఖ్యానించడం నా పద్థతి కాదు.
జి.ఎస్‌. రామ్మోహన్‌ తన వ్యాసంలో మిథునం సినిమా పట్ల అభ్యంతరం వ్యక్తంచేసిన విషయాలు ఇవి.
1) ఇది తెలుగు సంస్కృతికాదు ఇది కేవలం 5% మైనారిటీ వ్యవహారమే.
2) మిథునంలో జంటకి సామాజిక జీవనం లేదు.
3) బ్రాహ్మణులు ఏదో ఒక రకంగా కోల్పోయిన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి ప్రధానమయినవి.
తెలుగు సినిమా ‘‘కులం’’ను కౌగిలించుకుని చాలా కాలమే అయ్యింది. ఎప్పుడో 1950లలో వచ్చిన ‘‘గుండమ్మ కథ’’లోనే ఎస్వీరంగారావు ‘‘మేము పెద కాపులం’’ అంటాడు. పదేళ్ళ క్రితం వచ్చిన ఒక సినిమాలో ‘‘మేము నాయుళ్లం, మీరేమిటి? అని చక్రవర్తి. హీరో శ్రీకాంత్‌ను అడుగుతాడు. చాలా సినిమాలలోహీరోలు ఇంటి పేర్లతోసహా తమ, తమ వంశ, కుల చరిత్రలు చెప్పుకుంటున్నారు. సూర్యదేవర వీర రాఘవయ్య, పర్వతనేని తులసీరామ్‌ ప్రసాద్‌… ఇలా…
ఈ కుల వాసన మనకు అభ్యంతరకరం కానప్పుడు బ్రాహ్మణ కుల వాసన మాత్రం ఎందుకు అభ్యంతరకరం అవుతున్నది? ఒక యువ నటుడు మీసం మెలేసి, తొడ చరిచి వంశం పేరు చెప్పి, అదంతా తెలుగు వారి ఆత్మగౌరవం అని… పెడ బొబ్బలు పెడితే మనం ఎందుకు మౌనంగా వుండిపోయాం…
మిథునం కథరాసిన శ్రీరమణ కానీ, దర్శకత్వం వహించిన తనికెళ్ళ భరణి కానీ ‘‘ఇదే తెలుగు సంస్కృతి’’ అని ఎక్కడా ‘‘క్లెయిమ్‌’’ చేసుకోలేదు. ఇదీ తెలుగు సంస్కృతి అని ఎవరయినా క్లెయిమ్‌ చేసుకున్నా యివాళ్ళ తెలుగు సమాజం ఆమోదించే స్థితిలో వున్నదా…?
తెలుగు అంటే ఏ తెలుగు అని అడిగే అస్తిత్వ సందర్భంలో వున్నాం మనం. తెలంగాణా తెలుగా…? ఉత్తరాంధ్ర తెలుగా..? రాయలసీమ తెలుగా..? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే తెలుగు సంస్కృతి అంటే ‘‘ఏ తెలుగు సంస్కృతి’’ అని ప్రశ్నించడంలో తప్పులేదు.
విశాలమయిన జన సమూహాన్ని కలిపి వుంచే, అందరికీ ఆమోదయోగ్యమయిన సంస్కృతి ఎక్కడ వుంటుంది! సమాజం మొత్తం చిన్న చిన్న సమూహాలుగా, వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విడిపోయినప్పుడు అన్ని రకాల సంస్కృతులు, ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు అస్తిత్వంలో వుంటాయి. అన్నీ కలగలసిపోవడమే భిన్నత్వంలో ఏకత్వం. భారతీయ సంస్కృతికి మూలం అదే. ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఇతర అస్తిత్వాలతో ఘర్షణ లేకుండా, సామరస్యంగా, సౌభ్రాతృత్వ పూర్వకంగా కలసి జీవించడాన్ని ఆధునిక సమాజాలు కోరుకుంటున్నాయి.
ఒక విశాలమయిన వృత్తం మధ్య కేంధ్రం ఎంత బలంగా వుండాలో, ఆ వృత్తంలో వున్న యితరేతర కేంద్రాలూ అంతే బలంగా వుండాలి. అది సమాజం కూడా ఈ విశాల తెలుగు సమాజానికి, బ్రాహ్మణ సంస్కృతి కూడా ఒక పార్శ్వంగా నిలుస్తుంది. దానినే భరణి, శ్రీరమణ చూపించాలి అనుకుంటే ఎవరయినా ఎందుకు తప్పుపట్టాలి? సోమయాజి, సోమిదేవమ్మ, ‘‘లచ్చుమ్మమ్మ’’ని విమర్శిస్తేనో, తృణీకరిస్తేనో, అగౌరవపరిస్తేనో ఖచ్చితంగా అభ్యంతరం పెట్టవలసిందే. సోమిదేవమ్మ కథలోకి లచ్చుమమ్మ రానంతవరకూ, లచ్చుమమ్మ కథలోకి సోమిదేవమ్మ రానంతవరకూ… ఎవరికయినా ఎందుకు అభ్యతరం వుండాలి..? సూర్యదేవర వీరరాఘవయ్యను యాక్సెప్ట్‌ చేసినట్లే బుచ్చిలక్ష్మీనీ అప్పదాసునూ యాక్సెప్ట్‌ చేయాలికదా…?
ఆయన ఉయ్యాల బల్లమీద శ్రీ మహావిష్ణువులాగా ఊగుతుంటే గడప మీద తలపెట్టుకుని ఆవిడ పడుకోవడం గురించి మనకెందుకు? బ్రాహ్మణ సంస్కృతిలో అమానవీయ అంశాలు వుంటే వాళ్ళే పరిష్కరించుకోవాలి. అది వాళ్ళ సమస్య.
గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కందుకూరి వీరంతా బ్రాహ్మణేయ సంస్కృతిలోని లోలోపలి చీకటి అంశాలను తూర్పారా పట్టిన వారే? అది 5% మైనారిటీల సంస్కృతి అయినా సరే.. దానికొక అవిచ్ఛిన్నత వుంటుంది. కాలం గడుస్తున్న కొద్ది అది అవలక్షణాలు పరిహరించుకుంటూ సాఫ్టెన్‌ అవుతుంది.
మిథునం సినిమాలో జంటకి సామాజిక జీవనం లేదు? వాళ్ళు ఎవరితోనూ కలవరు? అన్నది మరో విమర్శ. నిజమే వాళ్ళు ఎవ్వరితోనూ కలవరు (సినిమాలో). నిజానికి ఒంటరితనం వేరు. సామాజిక జీవనం లేకపోవడం వేరు. రెండిరటికీ చాలా తేడా వుంది.

mithunam
శ్రీరమణ కథలో అప్పదాసు బావమరిది పాత్ర ఒకటి వుంటుంది. అది సినిమా రూపంలోకి వచ్చేసరికి భరణి ఎందుకో తీసివేసాడు.
2012 కేన్స్‌ ఫిలమ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డు పొందిన ‘అమోర్‌’’ అనే సినిమాకు, మన మిథునం సినిమాకు చాలా పోలికలున్నాయి. ఇది వృద్ధ దంపతుల కథ. అదీ వృద్ధ దంపతుల కథే. ఆ సినిమాలోను వృద్ధ జంట బయటివారిని ఎవరినీ తమ యిటికి రానివ్వరు. తాము ఎక్కడికీ వెళ్ళరు భార్యకు పక్షవాతం వస్తే చూదామని కూతురు వస్తే, కూతురును చూడటానికి కూడా వాళ్ళు యిష్టబడరు. వాళ్ళిద్దరే ఒక లోకంగా వుంటారు.
2010 అక్టోబర్‌లోవచ్చిన సుప్రసిద్ధ రచయిత వి. చంద్రశేఖర్‌రావుగారి ‘‘ఆదివారం’’ కథ గుర్తుందా? హైద్రాబాద్‌లాంటి మహానగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా వుండే ఇద్దరు వృద్ధ దంపతుల కథ అది. ఉదయం నుండి సాయంత్రం వరకూ వాళ్ళిద్దరూ తలుపులు మూసుకొనే వుంటారు. ఉదయం లేచిన దగ్గర్నుండీ రాత్రి నిద్రపోయే వరకు. కాఫీ చేసుకుని తాగుతారు. వంట వండుకుంటారు. టి.వి. చూస్తారు. విశ్రాంతి తీసుకుంటారు. కబుర్లు చెప్పుకుంటారు. ప్రొద్దున్నే ఎవరో తలుపు తట్టిన చప్పుడయితే తలుపు తీద్దాము అనుకుని తీయరు. ఆ తలుపు అలా మధ్యాహ్నం దాకా మోగుతూనే వుంటుంది. అయినా వాళ్ళు తీయరు సాయంత్రం ఎవరిదో అంతిమ యాత్రకి సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిసినా తలుపు తీయరు. కథ అయిపోతుంది.
మిధునం, అమోర్‌, ఆదివారం ఈ మూడు కథలలోనూ వృద్ధ జంటల ప్రవర్తన ఒకే రకంగా వుంటుంది. మిథునం తెలుగు సినిమా, అమోర్‌ ఫ్రెంచి సినిమా. భాషలు, ప్రాంతాలు సరిహద్దులు లేకుండా వృద్ధ జంటల ప్రవర్తన ఒకేలా ఎందుకు వుంది?
ఒంటరిగా వుండాలని కోరుకోవడం అంటే సామాజిక జీవనం లేకపోవడమా? ఈ మూడు జంటలూ సమాజంతో నిరంతరం సంభాషిస్తూనే వుంటారు. సమాజంలో జరుగుతున్న అల్లకల్లోలాలు అన్నింటినీ గమనిస్తూ వుంటారు. ఆ సామాజిక సంఘర్షణలు ఏవీ తమ జీవితాలను ప్రభావితం చెయ్యకుండా జాగ్రత్త పడుతూవుంటారు. మరో మాటలోచెప్పాలంటే సమాజంలో చురుకయిన పాత్ర పోషించడానికి (యాక్టివ్‌ పార్టిసిపేషన్‌) ఇష్టపడరు. వాళ్ళది పాసివ్‌ రోల్‌. వృద్ధులకు ఈ తరహా ప్రవర్తన ఎందుకు వస్తుంది? అందుకు కారణం ఎవరు?
ఈ సమస్యలోతులలోకి వెళితే తప్పు మనదే అని మనం గుర్తించాల్సివస్తుంది. మనమెప్పుడూ వృద్ధులని మనుషులుగా గుర్తించం. వాళ్ళ పెద్దరికాన్ని గౌరవించం. వాళ్ళ సలహాలు పాటిస్తామా లేదా! అనే విషయం పక్కన పెడదాం? అసలు వాళ్ళ మాటలు కూడా వినడానికి యిష్టపడం. చొరవ తీసుకొని ఏదయినా చెప్పపోతే అంతా చాదస్తంగా కొట్టిపడవేస్తాం.
అలాంటప్పుడు వృద్థులు ఏం చేస్తారు? తమలోకి తాము ముడుచుకుంటారు. సాధ్యమయినంత వరకు మన కంటపడకుండా ఒంటరిగా దాక్కుంటారు. మన అమ్మా నాన్నాలతో కలసి మనం ఎప్పుడయినా భోజనం చేస్తామా? వాళ్లకోసం పదినిమిషాలు కేటాయిస్తామా? మన ఉరుకుల పరుగుల జీవితం మనది. సమాజం అంటే మనమేకదా? మనం వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు మనల నుండి దూరం జరుగుతారు. వాళ్ళకి సమాజ జీవనం ఉన్నాట్టా? లేనట్టా?
సామాజికి జీవితం అంటే నిత్యం సమాజంలో సంభాషించడమే కదా! ఈ వృద్ద జంటలు నిత్యం సమాజంతో మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే వాళ్ళ మాధ్యమం వేరు. మన మీడియం వేరు.
అమోర్‌లో భార్యకి పక్షవాతం వస్తే హాస్పిటల్‌కి తీసుకుని వెళతాడు భర్త. భార్య బట్టలు వుతికాడని ఆకతాయి పిల్లలు అల్లరి చేస్తే కర్ర పట్టుకుని అప్పదాసు వెంటపడతాడు. టి.వి. చూస్తూ రాజకీయాలు చర్చిస్తారు. ఆదివారం దంపతులు. ఇదంతా ప్రతి స్పందనే కదా… మరి సామాజికి జీవితం లేనిది ఎక్కడ.?
నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ ప్రభావాలు, ఎదిగి వచ్చిన ఒక కొత్తతరం జరుగుతున్న అస్తిత్వ ఉద్యమాలు, బ్రాహ్మణులలో కూడా ఒక నూతన చైతన్యం తీసుకుని వచ్చాయి. వాళ్ళని వాళ్ళు అసెర్ట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవ్వాళ బ్రాహ్మణులు ఎంత మాత్రమూ అగ్రవర్ణం కాదు. ఉగ్రవర్ణమూ కాదు. ఎప్పుడో జరిగిన తప్పులకి మేము ఎందుకు శిక్ష అనుభవించాలని అడుగుతున్నారు. ఇది వస్తున్న మార్పు.
1980 లలో వచ్చిన దేవత సినిమా సమయానికి 2012లో వచ్చిన దేనికైనా రెడీ సినిమా సమయానికి బ్రాహ్మణులలో వచ్చిన మార్పు గుణాత్మకమయినదే.
దేవత సినిమాలో ప్రాత: సంధ్యవేళ నదీతీరంలో సంధ్యావందనం చేసుకునే ఒక బ్రాహ్మణుడిని మోహన్‌బాబు కాలెత్తి నడుంమీద తంతే బ్రాహ్మణులు కూడా హాస్యంగా సరిపెట్టుకున్నారు. కానీ దేనికైనా రెడీ సినిమా సమయానికి వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేశారు. రాస్తారోకోలు చేశారు. బంద్‌లు చేశారు. 1980లలో మొలకు చుట్టిన యజ్ఞోపవీతాన్ని 2012లో మామూలుగా ధరించారు. ఇదంతా అస్తిత్వ ఉద్యమాల పుణ్యమే! ఇతర అస్తిత్వ ఉద్యమాలని చూసినట్లే దీనిని కూడా చూడాలి. తప్పదు.
ఇవ్వాళ సమాజంలో బ్రాహ్మణుల ఆధితప్యం లేదు. ఆర్ధికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ వాళ్ళ చుట్టూ ఏ పరిభ్రమణనూ జరగడం లేదు. ఆధిపత్య వర్గాలు ఏవో అందరికీ తెలుసు. అటువంటప్పుడు బ్రాహ్మణులు మిధునం లాంటి సినిమాల ద్వారా కోల్పోయిన ఆధిపత్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారని అనుకోలేము. ఒక వేళ వాళ్ళు అలాంటి ప్రయత్నం చేసినా అది వ్యర్ధ ప్రయత్నమే అవుతుంది.
నాగప్పగారి సుందర రాజు కథను సినిమా తీసినా, వేముల ఎల్లయ్య కక్కను సినిమా తీసినా తెలుగు సమాజం మిథునం సినిమాను చూసినట్టే చూస్తారు. సాహిత్య రూపాలుగా వాటి పేరు ప్రఖ్యాతులను ఎవరయినా అడ్డుకున్నారా? వాటికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎవరయినా కబ్జా చేశారా… లేదే!
సినిమా తీయడానికి అతి ముఖ్యమయిన నిర్మాత ఎవరయినా వుంటే వాటిని సినిమాలుగా తీయవచ్చు. అవార్డులు కూడా పొందవచ్చు. చోమనుడి డప్పును, కన్నడ ప్రేక్షకులు అదరించినట్లే కక్కనూ, అంటరాని వసంతాన్ని తెలుగు ప్రేక్షకులూ ఆదరిస్తారు.
ఈ వ్యాసంలో జి.ఎస్‌. రామ్మోహన్‌ ఒక మాట అన్నారు. తెలుగుదేశం నుండి అమెరికా లేదా మరే ఇతర దేశాలకయినా వలస వెళ్ళిన ప్రజలను నోస్టాల్జియా పట్టి పీడిస్తూ వుంటుంది. తెలుగు సంస్కృతికీ, సంప్రదాయానికి దూరం అయిపోయామనే బెంగ ఎక్కువగా వుంటుంది. ఆ బెంగలో నుండి సత్యనారాయణ వ్రతాలు, బతకమ్మా పండగలూ జరుపుకుంటారు. పూజలు, పున:స్కారాలు చేస్తారు. అంతవరకు మనం ఆమోదించవచ్చు. కానీ వాళ్ళు తెలుగు సంస్కృతి గురించి, చరిత్ర గురించీ ఉపన్యాసాలు, యివ్వడమో, పరిరక్షకులుగా ఫోజులెట్టడమో చేస్తేనే అసలు సమస్య.
అంటే ఏ విషయాన్ని అయిన ఆమోదించడానికి ఒక స్థాయి వుంటుందన్నమాట. ఆ స్థాయి దాటితే అది ఆమోదనీయం కాదు. యాక్సెప్టబుల్‌ స్టేజ్‌. ఆమోదనీయ స్థాయి, వ్యక్తులకీ సమాజాలకీ వేర్వేరు స్థాయిలలో వుంటుంది. స్త్రీ పురుషులు మధ్య ప్రేమ కూడా ఈ స్థాయి దాటితే బానిసత్వంగా మారుతుంది.
అప్పదాసు, బుచ్చిలక్ష్మీల మధ్య వున్న సంబంధాలను చేస్‌గా చేసుకుని స్త్రీ పురుషుల మధ్య వుండే అసమా సంబంధాలను ప్రస్తావిస్తూ ఈ సినిమా పాత విలువలని స్థిరీకరించడానికి ప్రయత్నం చేసిందంటారు రామ్మోహన్‌.
అప్పదాసు ఉయ్యాల బల్లమీద ఊగడమూ, బుచ్చిలక్ష్మీ గడప మీద తలపెట్టుకుని పడుకోవడమూ, అనే అసమం సబంధాలను అప్పదాసు బుచ్చిలక్ష్మీ బ్టటలు ఒక సారి ఉతకడం ద్వారా సరికావని, కానీ అలా చూఏపిండం ద్వారా భరణి షుగర్‌ కోటెడ్‌ ఫిల్‌ అందించి పాత విలువలను స్థిరీకరించడానికి ప్రయత్నం చేశాడు అని రామ్మోహన్‌ వ్యాఖ్య.
స్త్రీ పురుష సంబంధాలలో ఆమోదనీయ స్థాయి ఒక్కొక్కళ్లకి ఒక్కొక్క రకంగా వుంటుంది. బుచ్చిలక్ష్మీ ఆమోదనీయ స్థాయి మనకు తెలియదు. కనుక ఒక పెద్ద వ్యాఖ్య చేయడానికి ఒక చిన్న రిఫరెన్స్‌ చాలదేమో!
ప్రవాసాంధ్రులు సత్యనారాయణ వ్రతాలు జరుపుకోవడము. బతకమ్మలాడటం వరకు సంస్కృతి పరిరక్షకులుగా రామ్మోహన్‌కి పనికి వస్తారు. అది తన ఆమోదనీయ స్థాయి దాన్ని దాటితే రామ్మోహన్‌కి నచ్చదు. అలాగే తన ఆమోదనీయ స్థాయి దాటితే అప్పదాసుకూడా బుచ్చిలక్ష్మీకి నచ్చడు.
అందరూ ఆమోదించే స్థాయి స్త్రీ పురుష సంబంధాలలో వుండవు. కనుక ప్రేమ రూపంలో హింస కొనసాగుతూనే వుంటుంది. స్త్రీ పురుష సంబంధాలు స్టేటిక్‌ కాదు. డైనమిక్‌. కనుక మన యిష్టాయిష్టాలతో సంబంధం లేకండా మారుతూ వుంటాయి. వాటిని ఎవరూ పనికట్టుకుని స్థిరీకరించనవసరం లేదు. ఇది రామ్మోహన్‌కి కూడా తెలుసు.
జి.ఎస్‌. రామ్మోహన్‌ వ్యాసాలంటే నా కిష్టం. మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో రాసిన ‘‘వై దిస్‌ కోల వెర్రి’’ అంటే మరీ ఇష్టం.
మిథునం లాంటి బలహీనమయిన సినిమా గురించి బలమయిన వ్యాసం రాసిన రామ్మోహన్‌కి అభినందనలు.

వంశీకృష్ణ

జ్ఞాపకాల నీడలో వసుంధర

bhuvanachandra (5)“తాగి తాగి చచ్చింది. చచ్చి బతికిపోయింది..!” నిట్టూర్చి అన్నాడు శీను. ‘శీను’ అనే పేరు సినిమా పరిశ్రమలో చాలామందికి ఉంది. ప్రొడక్షన్ వాళ్లలో ‘శీను’లే ఎక్కువ. అలాగే ప్రసాద్‌లు. ఈ ‘శీను’ మాత్రం కాస్ట్యూమర్. వయసు అరవైకి  పైమాటే.

“అదేంటి మావా అలా అంటావూ? ఆవిడకేం మూడిళ్ళు. లెక్కలేనంత ఆస్థి, మొగుడు, పిల్లలు. ఇంకేం కావాలి?” ఆశ్చర్యంగా అన్నాడు సూరిబాబు.

“అందుకే మరి జనాలు నిన్ను వెర్రివెలక్కాయనేది. ఒరే సూరి! ఏది ఎంతున్నా, మనశ్శాంతి లేని బతుకు బతుకవుతాదిట్రా? గంజినీళ్లు తాగినా మనశ్శాంతి వుంటే ఆరోగ్యం ఉంటాది. ఆరోగ్యం వుంటే ఆనందం వుంటాది. ఏవుందా అమ్మకి? ఒరే! గొప్ప గొప్ప హీరోయిన్ల దగ్గర్ పన్జేశా. అందరి ‘కొలత’లూ నాకు తెల్సురొరే! కొలతలంటే జాకెట్టు కొలతలూ, బాడీ కొలతలు కాదు. ఆళ్ల మనసు లోతులూ అన్నీ తెలుసు. కానీ వసుంధరమ్మంత పిచ్చి ముండ ఇంకోతి వుండదు” చెబుతూ చెబుతూ సైలెంటైపోయాడు శీను.

‘ఫ్లాష్‌బాక్, ఫ్లాష్ ఫార్వార్డ్ ల్ని సినిమాల్లో చూపిస్తారు. ‘అదెలా?’ అని అనుకుంటామేగానీ, ప్రతీ మనిషీ రోజుకి కనీసం వందసార్లయినా ‘గతం’లోకి వెళతాడని గ్రహించలేం. ఏం.. మీగురించే మీరు ఆలోచించుకోండీ. రోజుకి ఎన్నిసార్లు గతంలోకి పయనిస్తున్నామో మీకే తెలుస్తుంది.

శీను కూడా గతంలోకి పోయుండాలి. అతనికా హక్కూ, అవకాశం రెండూ వున్నాయి. ఎందుకంటే సగానికి పైగా అతని జీవితం వసుంధరకి పర్సనల్ కాస్ట్యూమర్‌గానే గడించింది. ఆ అమ్మాయి పదహారేళ్లప్పుడు మొదటిసారి బాబూరావు (ఈ మధ్యే చనిపోయారు.  ఓ రెండేళ్ళవుతుంది) దగ్గర పనిచేసేవాడు. బాబూరావు చాలా పనిమంతుడు. టాప్ హీరోయిన్లు అతన్ని పర్సనల్ కాస్ట్యూమర్‌గా కోరుకునేవారు. ఆయన కింద కనీసం ఓ ఇరవైమంది టైలర్లుండేవారు. పగలూ రాత్రి అదే పని. బాబూరావులో వుండే ఒకే ఒక డిఫెక్టు అతని చిరాకు. నిద్రలేవడం దగ్గర్నించీ, నిద్రపోయేదాకా పచ్చి బూతులే. సాయంత్రం కాగానే ‘మందు’ తప్పనిసరి. ఆ  టైంలో ఎవడ్నో ఓకడిని నానా తిట్లూ తిట్టి హేళన చేస్తే గానీ అతని మనసు శాంతించేది కాదు. అయితే అదృష్టవశాత్తు ఓ రోజున ఓ మహానుభావుడు అతని చేత ‘మందు’ మాన్పించాడు. దాంతో శాడిజమూ తగ్గింది.

సినిమా పరిశ్రమలో ‘గురువు’ ఎప్పుడూ గురువే. ఎంత తిట్టినా, కొట్టినా, నోటికి తొంభైమంది ‘గురువు’ని ఏనాడూ తప్పుబట్టరు. తూలనాడరు. శీనుకీ, బాబూరావంటే గౌరవం అందుకే మిగిలుంది. మనిషి ఎలాంటివాడైనా ‘పని’లో మాత్రం కింగ్. అందుకే బాబూరావు శిష్యులు సరదాగా ఇప్పటికీ అంటారు.. “మా గురువారికి ‘టేపు’ అక్కర్లేదండి.. చూపుల్తోనే కొలతలు తీస్తాడు!” అని.

వసుంధరకి పదహారూ, శీనుకి  ఇరవై రెండూ. వసుంధర తల్లి  బ్రాహ్మణ స్త్రీ. తండ్రి అరవచెట్టియార్. వసుంధరకాక ఇంకో మగపిల్లాడు. సెయింట్ జాన్స్‌లో చదువుతుండగా వసుంధరకి హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.

“నేను స్కూల్ డ్రామాలో యాక్ట్ చేస్తుండగా డైరెక్టర్ బాలకిషన్ అంకుల్ చూసి ‘హీరోయిన్’గా చేస్తావా అమ్మా అనడిగారు” అని వసుంధర తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేది. నిజం మాత్రం అది కాదు. వసుంధర తల్లి ‘బాలకిషన్’ని చాలా నెలలు ‘అలరించాకే’ వసుంధరకి హీరోయిన్ చాన్స్ వచ్చిందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.

“నీకు సినిమాల్లో ‘కేరక్టర్’ కావాలా? అయితే నీ ‘కేరెక్టర్’ నా దగ్గర వొదిలేసెయ్!” అని పరిశ్రమ అంటుందిట. ఇదో జోక్ గాని జోక్.

వసుంధర నిజంగా అందగత్తె. పాలల్లో మంచి పసుపూ, గులాబి రంగూ కలిసిన దేహచ్చాయ. ముత్యాల్లాంటి పలువరుస. అయిదడుగుల నాలుగంగుళాల ఎత్తు. చక్కని బిగువైన ఒళ్ళు. చూడగానే పిచ్చెక్కించే చిరునవ్వు. ఇంకేం కావాలి? ‘గ్లామర్ డాల్’ అన్నారు.

“ఏంది మావా ఆలోచనా?” అడిగాడు సూరిబాబు.

“నావల్ల కావటంలేదురా…!” కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నాడు శీను.

“పోనీ వెళ్ళి చూసొద్దాం పద!” లేచాడు సూరిబాబు.

“ఊహూ! చూళ్ళేను. చూస్తే గుండె పగిలి పోతుంది…!”

రెండు చేతుల్తో మొహం కప్పుకున్నాడు శీను. మళ్లీ ఏవో జ్ఞాపకాలు.

 

***********

 

కొత్తగా వచ్చిన హీరోయిన్ ‘కొలత’ ఎంత ‘సినిమాటిక్‌’గా కొలవాలో అంత ఘోరంగానూ తీశాడు బాబూరావు.. చూస్తూ ‘గురువు’గారు చెప్పిన కొలతల్ని నోట్ చేస్తున్న శీనుకే కంపరం పుట్టింది. వసుంధర సిగ్గుతో చచ్చిపోతోంది.

“అదేంటమ్మాయ్! సిగ్గుపడితే ఎలా? కెమెరామన్ దగ్గరా, కాస్ట్యూమర్ దగ్గరా ‘వొళ్ళు’ దాచుకోకూడదు. దాచుకుంటే తెరమీద ‘గ్లామర్’ కనిపించదు. ఇంకో రెండు సినిమాలయ్యాక నువ్వే చెబుతావు మాకు. ఎక్కడ ఎత్తులూ, ఎక్కడ వొంపులూ పెట్టి కుట్టాలో…!” ఫకాల్న నవ్వి వసుంధర ‘సీటు’ మీద చరిచి అన్నాడు బాబూరావు.

కళ్ళనీళ్ల పర్యంతమైన  వసుంధరని చూడగానే తన చిన్న చెల్లెలు జ్ఞాపకం వచ్చింది శీనుకి. మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్టు. అయితే వసుంధర ‘బిడియాన్ని’ చిదిమేసి ‘కసి’ని పెంచింది మాత్రం బాబూరావులాంటి ధీరులే. రెండో సినిమాని వెంటనే వొప్పుకోలేదు వసుంధర తల్లి. టాప్ రెమ్యూనరేషన్ ఆఫరయ్యేదాకా ఆగింది. సినిమా సంతకం చెయ్యగానే వసుంధర  డైరెక్టుగా ప్రొడ్యూసర్‌తో అన్నది. “సార్.. నాకు కాస్ట్యూమర్‌గా బాబూరావు వొద్దు. అతని అసిస్టెంట్ శీను కావాలి. యీ సినిమా నించి అతనే నా పర్సనల్ కాస్ట్యూమర్” అని .. అంతే శీను దశ తిరిగింది.

వసుంధర  బాబూరావుని వొద్దన్న సంగతి జనాలకు తెలిసింది. ఒక్కొక్క సినిమాలో వసుంధర  పైకి వెళ్తున్న కొద్దీ, బాబూరావు కిందకి దిగిపోవాల్సి వచ్చింది. టాప్ హీరోయిన్  ‘వద్దన్న’వాడిని పనిలో  పెట్టుకోవడానికి గుండా చెరువా?

రెండే రెండేళ్ళలో బాబూరావు దగ్గరి అసిస్టెంట్లందరూ శీను దగ్గర చేరిపోయారు. బాబూరావ్ ‘సినీ’ టైలర్స్ కాస్తా బోర్డు తిప్పి కోడంబాకంలో మామూలు టైలర్‌గా మిగిలిపోయాడు. బాబూరావే కాదు, మొదటి సినిమా కెమెరామాన్ వైద్యలింగాన్ని, నానా తాగుడూ తాగి చిత్రహింసలు పెట్టిన  డైరెక్టర్ బాలకిషన్‌ని కూడా నిర్ధాక్షిణ్యంగా ‘తొక్కేసింది’. వసుంధర. ప్రొడ్యూసర్ మంచివాడు గనక బతికిపోయాడు. మేకప్ సుబ్బరామన్ అప్పటికే వయసుమీరినవాడు. అయితే గొప్ప పనిమంతుడు. ఆ సుబ్బరామన్ రిటైరయ్యాక కూడా నెలకి కొంత డబ్బులు పంపి ఆదుకుంది వసుంధర. హాస్పిటల్ ఖర్చులూ ఆమే భరించేది. దాంతో వసుంధరకి ‘గొప్ప మానవతావాది’ అన్నపేరు వొచ్చింది. ‘కరోడా’ అన్న పేరు ఎలాగూ వచ్చిందనుకోండి..

***

 

“శీనూ… నువ్వూ మన మేకప్‌మేన్ నరసింహులూ నా తరఫున సాక్షి సంతకాలు పెట్టాలి” ఇరవై ఆరో ఏట శీనుని తనున్న హోటల్ రూంలోకి పీల్చి చెప్పింది వసుంధర. అప్పటికామె నందకుమార్ (హీరో) ప్రేమలో పూర్తిగా మునిగిపోయిందని పరిశ్రమలో అందరికీ తెల్సు.. “అదికాదమ్మా.. నందకుమార్‌గారికి ఆల్రెడీ పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూదా. ఇప్పుడు…”చెప్పబోయాడు శీను.

“నాకు తెలుసు శీను! ఇప్పటివరకూ సంపాదించింది మొత్తం మా అమ్మా, తమ్ముడు వాళ్ల పేరు మీద దాచేసుకున్నారు. ఇప్పటికైనా ఆ వూబిలోంచి బయటపడకపోతే జన్మలో ఎప్పటికీ బయటపడలేను. నందకుమార్ ఎలాంటివాడైనా నిజంగా నేనంటే ప్రేమ వున్నవాడు. ఇంకొకటి ఏమంటే అతను భార్యని ఒప్పించాడు. ఆమె అనుమతితోటే మా పెళ్ళి జరుగుతోంది. అతన్ని కాదనుకున్నా రేపు ఇంకొకడెవడో  వచ్చి ఏం వొరగబెడతాడూ?” మనసులోని మాట శీనుకి చెప్పింది వసుంధర. అప్పటితో ‘ఆపటం’తనకీ మంచిదని మౌనం వహించాడు శీను.

***

‘ఆరువళ్లూరు’ వీరరాఘవస్వామి గుళ్ళో గుట్టుగా  పెళ్లి జరిగింది. విషయం తెలిసిన వసుంధర తల్లి లబోదిబోమన్నది. శీనునీ, మేకప్‌మేన్ నరసింహుల్నీ నానాబూతులు తిట్టింది. పరిశ్రమలో పెద్దల దగ్గరకు వెళ్లి మొత్తుకుందిగానీ వాళ్ళేం చెయ్యగలరు?

నెలరోజులు ‘హనీమూన్’ ట్రిప్ కానిచ్చాక మళ్ళీ బిజీ అయింది వసుంధర. వసుంధర అదృష్టమేమోగానీ ‘మంచి’ సినిమాలు పడ్డాయి. అన్నీ ‘హీరోయిన్’ ఓరియంటెడ్ సినిమాలే. పెళ్ళయ్యాక గ్లామర్ డాల్ కాస్తా ‘అభినయ సరస్వతి’గా పేరు తెచ్చుకుంది. కుప్పతెప్పలుగా డబ్బు. నందకుమార్ ఎప్పుడూ ఏవరేజ్ హీరోనే. ఈ దెబ్బకి అతను వసుంధర పేరున మూడు బంగళాలూ, తన పేరున మూడు బంగళాలూ కొనడమేగాక చెన్నై చుట్టూపక్కల వందల ఎకరాలు స్థిరాస్థి కొనేశాడు. కాలక్రమేణా వసుంధరకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. మొత్తం కుటుంబం అంతా కలిసే వుండేవారు. నందకుమార్ భార్యా వసుంధర అడుగులకి మడుగులొత్తేది. వసుంధరా అంతే ప్రేమగా ఆవిడ్ని చూసేది. తను ఏ నగలసెట్టు కొనుక్కున్నా ఆవిడకీ కొనాల్సిందే. తన పిల్లలకి ఏది కొన్నా ఆవిడ పిల్లలకీ కొనాల్సిందే.

కాలగర్భంలో ఓ దశాబ్దం కలిసిపోయింది. కొత్త నీరు వచ్చింది. పాతనీరు కొట్టుకుపోయింది. ఇవ్వాళ వచ్చిన హీరోయిన్ రేపు టాపు. ఎల్లుండి ఫ్లాపు. కేరళ నించీ, ముంబై నించీ, డిల్లీ, గుజరాత్‌ల నించీ హీరోయిన్ల దిగుమతి పెరిగింది. ఆల్ హేపీ. సినిమా రంగానికి కావాల్సిన ‘పట్లు’ పూర్తిగా నేర్చుకుని ముంబై నించి వస్తున్నారు గనక హీరో ఖుష్… డైరెక్టర్ ఖుష్.. ప్రొడ్యూసర్, మేకప్‌మేన్, డిస్ట్రిబ్యూటర్ అందరూ ఖుష్. బయ్యర్లతో సహా. ‘కేరక్టర్’ వదులుకోవడమంటే షేక్‌హాండ్ ఇచ్చినంత తేలిక. ఉన్నంతలో ఇల్లు చక్కబెట్టుకో. కమర్షియల్స్ అయినా, అయిటం సాంగ్ అయినా ఏదైనా ఒకటే.. హార్డ్ కేష్.. అంతే!

చప్పట్లకీ, పచ్చనోటు రెపరెపలకీ అలవాటు పడ్డ హీరోయిన్లు రిటైరై ఇంట్లో కూర్చోలేరు. అలాగని తల్లి వేషాలు వెయ్యలేరు. కానీ వసుంధర అన్నింటికీ సిద్ధపడింది. కూతుళ్లు ‘వయసు’కి వచ్చారు. వాళ్లని కథానాయికలుగా చెయ్యాలంటే డబ్బు కావాలి. ఆ మాటే నందకుమార్‌తో అన్నది. నందకుమార్ తన స్వంత కూతురి పెళ్లి చేసేశాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో. వసుంధర డబ్బుతో కొడుకుని (స్వంత కొడుకుని) హీరోగా పెట్టి సినిమా తీశాడు. అది బిగ్గెస్టు ఫ్లాపు. సినిమాకి చూపినవన్నీ దొంగలెక్కలే. మూడొంతులు వసుంధర ఆస్థిని నందకుమార్ ‘నొక్కేశాడు’, ఆ విషయం మొదట గ్రహించింది శ్రీను.

“అమ్మా .. జాగ్రత్తపడండి. సినిమాని ‘చుట్టేసారు’ ఖర్చులు మాత్రం చూపించారంట. మీ మధ్య గొడవలు పెడదమన్న ఉద్ధేశ్యంతో కాదు. మీ  ఉప్పు తిన్న విశ్వాసంతో చెబుతున్నా.!” చాలా కష్టం మీద వసుంధరని వొంటరిగా కలిసి చెప్పాడు శీను.

నందకుమార్ హయాంలోనే శీనుకు ఉద్వాసన పలికాడు. శీనుకి అప్పటికే మంచి పేరుంది గనక త్వరలోనే వేరో ఒక అప్‌కమింగ్ హీరోయిన్‌కి పర్సనల్ కాస్ట్యూమర్‌గా వెళ్ళిపోయాడు. బాగా సంపాదించాడు కూడా. ఒక విషయం నిజం. వసుంధర శీనుని సొంతమనిషిలానే చూసింది. శీను పెళ్లికి కూడా బోలేడంత డబ్బు ఖర్చు పెట్టింది. “నాకు తెలుసు శీను.. ఇప్పుడు ఏమీ చెయ్యలేను. ఆస్థి ఆయన చేతుల్లో ఉంది. కానీసం ‘మల్లిక’ అయినా హీరోయిన్‌గా నిలదొక్కుకుంటే…” నిట్టూర్చింది వసుంధర. అప్పుడు సమయం ఉదయం పది. అప్పటికే వసుంధర ‘తీర్థం’ సేవించి మత్తులో ఉంది.

మాట్లాడకుండా బయటికొచ్చాడు సీను. “అన్నా.. ఆ అరవ ముండాకొడుకు వసుంధరమ్మని తాగుడికి అలవాటు చేశాడు. తెల్లార్లూ మందే…!”శీనుతో గుసగుసగా అన్నది ముత్తులక్ష్మి. ముత్తులక్ష్మి మొదట్నించీ వసుంధరకి ‘టచప్ వుమన్’ వసుంధరతోటే వుంటుంది. నిట్టూర్చాడు శీను.

“అంతేకాదు శీనయ్యా.. హీరో అయ్యుండీ అమ్మాయిల్ని తెచ్చి వ్యాపారం చేయిస్తున్నాడు. నేనూ రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాను.”చెప్పింది ముత్తులక్ష్మి. ఆ విషయం పరిశ్రమలో అందరికీ తెలుసిందే. ‘మాజీలు’ కొందరు  యీ వ్యాపారం మీదే జీవనం సాగిస్తుంటారు. అదే తప్పుగా అనిపించకపోవటమే విచిత్రం. కుటుంబంలో మగపిల్లలకి కూడా ఇదంతా మామూలుగా అనిపించడం మరో విచిత్రం. అక్కో, చెల్లెలో వ్యభిచారం నేరం మీద పట్టుబడ్డా ఆ మగధీరులు మాత్రం మామూలుగానే తిరగేస్తుంటారు. అక్కచెల్లెళ్ల మీదే బతికేస్తూ వుంటారు.

వసుంధరకీ, నందకుమార్‌కీ జరిగిన ‘డిస్కషన్స్’ చెప్పాలంటే ఓ పెద్ద నవల అవుతంది. ఎందుకంటే నందకుమార్ గోతికాడ నక్క. అతని మొదటి పెళ్ళాం ‘బాగా’ తెలివైంది. ‘కాదు’ అని బయటపడకుండా ‘అవును’ అని అన్నీ దక్కించుకుంది.

ఏ రేంజికంటే తరవాత్తరవాత వసుంధర ‘కూతుళ్ల’ మీద సంపాదించేంత. తన కూతురు, కొడుకూ మాత్రం సేఫ్. సవతి కూతుళ్లనీ బిజినెస్’లోకి దించి, సవతి కొడుకుని ‘వెధవ’ని చేసింది. తనకి పుట్టినవాళ్లనే ‘బిజినెస్’లోకి దించిన ఘనత ది గ్రేట్ కేరక్టర్ ఆర్టిస్ట్ నందకుమార్‌ది.

నేలమీదనించి ఓ కొండ శిఖరానికి ఓ ‘రాయి’ని చేర్చాలంటే చాలా కష్టం. అక్కడ్నించి ఆ రాయిని కిందకి తోసెయ్యాలంటే క్షణం పట్టదు.

వసుంధర పతనమూ అలాగే అయింది. సంస్కారం వున్న వసుంధర జరుగుతున్న దాన్ని చూస్తూ సహించలేకపోయింది. అలాగని పిల్లల్ని తండ్రికి దూరమూ చెయ్యలేకపోయింది. అందరూ చేసే పనే తనూ చేసింది. అన్నీ మర్చిపోవడానికి అది దగ్గరి మార్గం ‘తాగుడు’. ఆ తాగుడికి బానిసైంది. లేవగానే మందు.. ఇంకా ‘కిక్కు’ కోసం మందుతోపాటు గుట్కా. ముత్యాల్లాంటి పలువరస పుచ్చిపోయింది. వొళ్లు ఏభయేళ్ళకే బండగా తయారైంది. కూతుళ్లు సినిమాల్లో  రాణీంచలేకపోయారు. ఒకతి మాత్రం ఓ మళయాళం వాడిని దొంగతనంగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రెండోది ఎప్పుడు ఎవరితో ఉంటుందో దానికే తెలీదు. కొడుక్కి చదువబ్బలా. తండ్రి కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తాగి తాగి చివరకు చచ్చిపోయిన వసుంధర. మంచం మీదనించి కిందపడి చనిపోయిందని ఒకరంటే, గుండె ఆగి చచ్చిపోయిందని మరొకరు అన్నారు. ఏమైతేనేం మరో దుఃఖజీవికి ‘విముక్తి’ లభించింది. సర్వాంతర్యామి వున్నది అందుకేగా..

 

***

 

వసుంధర ‘పెద్ద కర్మ’ చాలా అట్టహాసంగా జరిగింది. నిలువెత్తు ఫ్లెక్సీలు, అన్ని పేపర్లలోనూ శ్రద్ధాంజలి. అన్ని చానల్సులోనూ ఆవిడ గురించిన వార్తలూ, కటింగ్సే. నందకుమార్ నటనకి జోహార్లు..  గ్లిజరిన్ లేకుండా టీవీ కెమెరాల ముందు ‘భార్యపోయిన దుఃఖాన్ని’ రక్తి కట్టించాడు. చూస్తున్న ప్రేక్షకులు అతని ప్రేమకి చలించిపోయారు. నందకుమార్ భార్య ఇంకా అద్భుతమైన నటనని ప్రదర్శించింది. ‘వసుంధర నాకు దేముడిచ్చిన చెల్లి, నా ప్రాణంలో ప్రాణం” అంటూ వలవలా ఏడ్చింది. వసుంధర కూతుళ్లూ, కొడుకు మాత్రం నిర్వికారంగా నిలబడ్డారు.

“నేను బ్రతికుండీ ఆమెకి ఏమీ చెయ్యలేకపోయాను గురువుగారూ.. చెయ్యగలిగిందింతే!” కళ్లనీళ్లతో అన్నాడు శీను. డాబా హోటల్లో ఓ చిన్న సంతాప సభ జరిగింది. మేం మొత్తం పదిమందిమి. ఏర్పాటు చేసింది కాస్ట్యూమర్ శీను. (DATA UDIPI HOTEL). ఓ రెండు నిమిషాలు మౌనం పాటించాం. (దానివల్ల ఎవరికి ఉపయోగం? అడక్కంది. అదో వెర్రి సంప్రదాయం).

“వసుంధర పిల్లల పరిస్థితి ఏమిటి?” ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న. స్వంత తండ్రి వున్నాడు. కానీ ఆ తండ్రే కూతుళ్లని (అంటే వసుంధర కూతుళ్లని మాత్రమే) బిజినెస్‌లోకి దించి ‘కొడుకు’ని డ్రైవరుగా వాడుకుంటున్నాడు. ఆయన అసలు కొడుకూ, కూతురూ చాలా చాలా గొప్ప స్థితిలో వున్నాడు. మరి వీళ్లు పిల్లలు కారా? ఇంత పక్షపాతం ఎందుకూ? అదీ వసుంధర సర్వస్వాన్నీ కొల్లగొట్టాక కూడా”

జావాబు దొరకని ప్రశ్నల్లో ఇదొకటి. వసుంధరని తల్చుకుంటే నాకో పాట గుర్తొస్తుంది.. “తేరి దునియాసే దూర్ చలేఁ హోకె మజ్‌బూర్ హమే యాద్ రఖ్‌నా…” అన్నది

జ్ఞాపకాలు తప్ప వసుంధర గురించి ఇంకేం మిగిలాయి..

 

భువనచంద్ర..

 

 

తెలుగు సినిమాకు మడి కట్టిన మిథునం

midhunam3

ఇంత ఆలస్యంగా ఇపుడెందుకు అనేది ముందుగా మాట్లాడుకోవాలి. మిధునం తెరపై చేసిన హడావుడి కంటే తెరవెనుక చేస్తున్న హడావుడి ఎక్కువ. అదిప్పటికీ తెగట్లేదు. ఇంకా  తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి లోపం గురించి బాధపడుతున్నవారూ, ఇంతటి సంస్కారవంతమైన సినిమాను ఆదరించలేని మన దౌర్భాగ్యం గురించి వగచుతున్న వారూ   ఇంటర్‌నెట్లో కనిపిస్తూనే ఉన్నారు. కాస్తో కూస్తో ఆరోగ్యంగా ఆలోచిస్తారని భావించేవారు కూడా ఈ శోకగీతంలో తమవంతుగా గొంతు కలుపుతున్నారు. మిధునం గురించి ఎవరో ఏదో  విమర్శనాత్మకంగా మాట్లాడారని తెలిసి ఇంత మంచి సినిమాను మెచ్చుకోవడానికి సంస్కారం ఉండాలి అని ఒక్కవాక్యంలో తిట్టిపోశారు ఒక కవిమిత్రుడు. ఆ మధ్య పాలపిట్ట అనే  మ్యాగజైన్‌లో ఇంకొక వ్యాఖ్య చేసి ఉన్నారు. ఇంత గొప్ప సినిమాను విమర్శించడానికి అసలు ఎవరికైనా నోరెలా వస్తుంది అన్నది సారాంశం. అభిరుచి కలిగిన మరికొందరు సాహితీ  మిత్రుల ధోరణి కూడా అలాగే ఉంది. ఒక సినిమా గురించి ఇన్ని తప్పుడు అభిప్రాయాలు అచ్చోసి వదిలేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవడం సామాజికుల పని కాదు. బెటర్‌ లేట్‌ దెన్‌ నెవర్‌.

మిధునం గురించి తరచుగా వినపడే మాటలేమిటి? అది సంస్కారవంతమైన సినిమా.  మానవసంబంధాలను ఉన్నతీకరించిన సినిమా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య  అనుబంధాన్ని అపురూపంగా చిత్రించిన సినిమా. నగరజీవనంలో మృగ్యమైపోతున్న సున్నితమైన అంశాలను ఎత్తిపట్టిన సినిమా. ఎక్కడికి పరిగెడుతున్నామో ఎందుకు  పరిగెడుతున్నామో తెలీని మ్యాడ్‌ రష్‌లోంచి బయటకు వచ్చి మనలోపలికి మనం తరచి చూసుకునేలా చేసిన సినిమా. కొంచెం అటూ ఇటూగా ఇలాంటివే. సంస్కారం అనే పదం  వినిపించినంతగా సెన్సిబిల్‌ సినిమా అని వినపడదు. సెన్సిబిల్ అనేది సాధారణంగా విలువలకు సంబంధించిన పదంగా వాడుతున్నాం. అస్తిత్వ్‌ సెన్సిబిల్‌ సినిమా, షిప్‌ ఆఫ్‌ థీసెస్‌  సెన్సిబిల్‌ సినిమా అంటాం. కానీ సంస్కారం కథ వేరు. ఎలాగైనా వాడుకోదగిన ఎలాస్టిసిటీ ఉన్న పదం.  సంస్కారం, సంప్రదాయం, ధర్మం స్టేటస్‌ కోయిస్టులకు ఇష్టమైన పదాలు. అవి  వ్యవస్థీకృత విలువలకు సాంస్కృతికపరమైన ఔన్నత్యాన్ని కట్టబెట్టే పదాలు. అందరూ కావాలని అదే అర్థంతో వాడతారని కాదు. కానీ వాడుకలో స్థిరపడిన రూఢి అర్థమైతే అదే.

ఇంతకూ ఏమిటీ సినిమా? శ్రీరమణ గారి మిధునం కథకు  తెరనుకరణ. ఒక పల్లెటూరులో విశాలమైన  పెరడు, చేద బావి, లతలు, తీగలు, చెట్లు చేమలు, గొడ్డూ గోదాతో  పెనవేసుకున్న ఆలుమగల అనుబంధం. సంప్రదాయంగా వస్తున్న ప్రచారానికి అనుగుణంగా కనిపించే స్టీరియోటైప్‌ తిండిపోతు అప్పదాసు, బుచ్చిలక్ష్మి దంపతుల కథ.  సోమయాజి,  సోమిదేవమ్మలకు ఆధునిక రూపమన్నమాట. ముగ్గులు వేయడాలు, ఇల్లు అలకడాలు, నోములు, పూజలు, ఆలుమగల మధ్య అలకలు, చిలిపి సరదాలు, అప్పలస్వామి  తిండియావకు సంబంధించిన రుచులూ, సంప్రదాయ జీవనవిధానానికి సంబంధించిన అభిరుచులూ అన్నీ కలగలిపి కట్టిన ఇంగువ మూట ఈ సినిమా. ఇద్దరే పాత్రలు. లంకంత కొంప.  అందులో చెప్పన్నారు తీగలు, చెట్లు. అన్నీ నేరుగా కోసుకుని తినేయడమే. అప్పదాసు తన పనులన్నీ చేసుకోవడమేకాదు, ఇతరులు చేసే పనులను కూడా నశ్యం పీల్చినంత వీజీగా  చేసేస్తూ ఉంటాడు. దూది ఏకుతాడు. కుండలు చేస్తాడు. బంగారం పని చేస్తాడు. చెప్పులూ కుడతాడు. సినిమాలో విశ్వనాధ్‌ ఎక్కువగానే కనిపిస్తారు. బాపు అపుడపుడు కనిపిస్తారు.  సంప్రదాయ జీవనవిధానాన్ని ఆకాశానికెత్తుతూనే ఆధునికతతో భాగంగా వచ్చిన పర్యావరణ స్పృహను, ప్రైవసీ భావనను కలిపి కొట్టడం తెలివైన ఎత్తుగడ.

timthumb.php

60దాటిన అమ్మానాన్నల ప్రేమ కథ అని ఒకట్యాగ్ లైన్‌ ప్రచారం చేశారు. ఈ అమ్మ “కాలుమోపితే ఎండిపోయిన కందిచేను పూత పెట్టే లచ్చుమమ్మ” కాదు. “ఎద్దోలె ఎనుకాకు  ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసే లచ్చుమమ్మ” కాదు.   ఎకరాలకెకరాల చెట్లను, గొడ్డుగోదలను చిరునవ్వు తొణక్కుండా పోషించే సూపర్‌మామ్‌ బుచ్చిలక్ష్మి. ఆ నాన్న కూడా “శిలువ  మోస్తున్న ఏసుక్రీస్తులా నాగలి భుజాన వేసుకున్న” రైతో మరొకరో  కాదు. శిష్ట జీవనం సాగిస్తూనే సహస్రవృత్తుల సమస్త చిహ్నాలను తనలోనే ప్రదర్శించే సూపర్‌మాన్‌ అప్పదాసు.   శ్రమైక జీవన సౌందర్యం అని శ్రీశ్రీ అన్నాడు కదాని శ్రమను మరీ ఇంత అందంగా చూపిద్దామంటే ఎలాగండీ భరణి గారూ! శారీరక శ్రమ మరీ అంత గ్లామరస్‌గా ఏమీ ఉండదండి! అది  కష్టజీవులకందరికీ తెలుసండీ. శ్రమను గౌరవించడమంటే దాన్ని గ్లామరైజ్‌ చేసిచూపడం కాదండీ! ఆధునిక పరిశ్రమ వృత్తులు అనే బానిసత్వంలో మగ్గిపోయిన మనుషులకు కొత్త  వెలుగు చూపించింది. శ్రమచేసే కులాలకు వెసులుబాటునిచ్చింది. “వేల సంవత్సరాలుగా చలనం లేకుండా పడి ఉన్న” భారతీయ సామాజక వ్యవస్థలో ఆధునిక పరిశ్రమ కుదుపు  తెచ్చింది. రైళ్ల ప్రవేశంతో ఏమేం జరుగుతాయని విశ్వనాధ సత్యనారాయణ బెంగటిల్లాడో అవన్నీ ఇపుడు జరుగుతున్నాయి. చెప్పుల గూటాల నుంచి, మగ్గం గుంతల నుంచి కొలిమి  మంటలనుంచి బయటపడడం వల్లే ఇవాళ అలాంటి కులాల పిల్లలు చాలా మంది అంతకుముందెన్నడూ చూడని రీతిలో డాక్టర్లు, లాయర్లు, కంప్యూటర్‌ ఇంజనీర్లు అయి సామాజిక  సంపదలో తమవంతు వాటా అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతకు ముందు తమను చిన్నచూపు చూసినవారి సరసన కూర్చోగలుగుతున్నారు.  మళ్లీ ఇపుడు వృత్తులను  ఆరాధించే పద్ధతిలో  వాటి చిహ్నాలను చూపిస్తే  అబ్బో, మమ్మల్ని గౌరవించాడు అని ఎగబడి చూడాలా! ఏమియా ఇది! ఏమి మాయయా ఇది!

 

అప్పదాసు స్వర్గానికి సెంటీమీటర్‌ దూరంలో అని వర్ణించే రుచులు తెలుగునాట కేవలం ఐదు శాతం లోపువారి రుచులు. ఆ వ్రతాలు, నోములు, వగైరా కూడా మైనార్టీ వ్యవహారమే.  అయినా సరే, ఇది తెలుగువారు సగర్వంగా ఎగరేసిన పతాకం, తెలుగుదనానికి అచ్చమైన చిరునామా, తెలుగోడి సత్తా లాంటి మాటలు బోలెడన్ని వినిపించాయి. వినిపిస్తూనే  ఉన్నాయి. కేవలం ఐదు శాతం లోపు ఉన్నవారిలోని సంప్రదాయవాదుల ఆచార వ్యవహారాలు, వారి గోములు, అలకలు, చిలిపితనాలు మొత్తం తెలుగుదనానికి పర్యాయపదంగా  చాటగలిగిన ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? ఆ ప్రచారాన్ని నోరుమూసుకుని చూసే దశకు  మనం ఎందుకు చేరుకున్నాం? ఒక కులం చిహ్నాలు కనిపించినంత మాత్రాన దాన్ని  వ్యతిరేకించాలా, అందరికీ వర్తించే కొన్ని అనుభూతులుంటాయి కదా అనే ప్రశ్నలు తలెత్తొచ్చు. అంతవరకే ఉంటే సమస్య లేదు. సినిమాను సినిమాగా చూసి మంచిచెడ్డల గురించి  మాట్లాడొచ్చు. కానీ ఇది తెలుగు సంస్కృతి,సంస్కారం అనడంలోనే అసలు సంగతి దాగిఉంది. కొలకలూరి ఇనాక్‌ కథనో, నాగప్పగారి సుందర్రాజు కథనో, వేముల ఎల్లయ్య కక్కనో ఇలాగే  సినిమా తీసి ఇది తెలుగు సంస్కృతి అంటే ఇలాగే ఆమోదించి ఉండేవారా? గ్రామీణజీవితాన్ని నిజాయితీగా చిత్రించిన నామిని, బండినారాయణస్వామి కథలను సినిమాలుగా తీస్తే  ఇలాగే తెలుగు సంస్కృతి అని నెత్తిన పెట్టుకునే వారా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోకపోవడంలోనే బానిసత్వం ఉంది. సమాజంలో ఆధిపత్యంలో ఉన్నవారి సంస్కృతే మొత్తం సమాజపు  సంస్కృతిగా ప్రచారంలో ఉంటుంది. ఇతరులది ఇతరంగానే ఉంటుంది. పట్టణీకరణతో ఆధిపత్య ప్రదర్శనకు అవకాశం లేకుండా పోయిన కులాలు ఏదో రూపంలో తిరిగి తలెగరేయడానికి  ప్రయత్నిస్తా ఉన్నాయి. తెలుగు సమాజంలో ఆర్థిక రాజకీయ ఆధిపత్యం కోల్పోయి చాలాకాలమే అయినా సంస్కృతి విషయంలో పట్టు నిలుపుకోవడానికి బ్రాహ్మణవాదులు  పెనుగులాడుతూ ఉన్నారు. ఇదే సమయంలో కొంతమంది ఇతర అగ్రవర్ణ లిబరల్స్‌లో కూడా నగరీకరణ మీద విసుగు కనిపిస్తోంది. నగరజీవితపు పరుగుపందెంపై నిరసనా,  పల్లెజీవితంతో పాటు కోల్పోయిన ఆనందాలపై వలపోత ఇతరత్రా సమూహాలకు పాకుతున్నది. ముఖ్యంగా పట్టణీకరణవల్ల ప్రయోజనాలు పొందడంలో ముందున్న సమూహాల్లో.  ఆయా కుటుంబాల్లో రెండో అర్బన్‌తరం కూడా వచ్చేసి ఉంటుంది. ఇతరత్రా ఆధిపత్యాన్ని సవాల్ చేయలేనపుడు ఈ రకంగా ఆమోదనీయమైన మార్గంలో ముందుకు రావాలని ఆ  సమూహం ప్రయత్నిస్తోంది. భాష పేరుతో సంస్కృతి పేరుతో ముందుకొస్తున్న బృందాలను, వారి భాషను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇరవై యేళ్ల క్రితం హైదరాబాద్‌  శంకర్‌మఠ్‌, విద్యానగర్‌ లకు చెందిన వృద్ధులు సాయంత్రాల్లో ఆర్ట్స్‌ కాలేజీ రైల్వేస్టేషన్‌ బెంచీలమీద సాయంత్రం కూర్చుని అమెరికాలోని సంతానం గురించి బెంగగా గోముగా చిరుకోపంగా  మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. ఇపుడు అలాంటి వృద్ధులు అన్ని ప్రాంతాల్లో అన్ని కులాల్లో పెరిగిపోయారు.

వాళ్లు పిల్లలను అడగాల్సిన అవసరం లేకుండా ఖర్చు చేసుకునే స్వ్చేఛ్చ ఉండాలనుకుంటారు. పట్నవాసపు ఉద్యోగ జీవితాలు, నెలవారీ పెన్షన్లు, అద్దెలు మధ్యతరగతి వృద్ధులకు  అలాంటి అవకాశాన్ని కల్పించాయి. అలాగే ఆధునికతతో పాటు వచ్చిన ప్రైవసీ అనే భావన పల్లెటూరి వృద్ధులకు లేని ఒక అదనపు సౌకర్యాన్ని వారికి కల్పించింది.  అదే సమయంలో  పల్లెటూరి మాదిరి(ఇది కూడా భ్రమే) కొడుకు కోడళ్లపై కొంతైనా పెద్దరికం చెలాయిద్దామని ఉంటుంది.  మనమడు, మనుమరాలు కంప్యూటర్లతోనో ఫ్రెండ్స్‌ తోనో కాకుండా తమ ఒడిలో  కబుర్లు చెప్పుకుంటూ, కొడుకు కోడళ్లు అన్ని విషయాల్లో సలహాలడుగుతూ ఉంటే బాగుండునని కూడా ఉంటుంది. వృద్ధులనే కాదు, పల్లె, పట్టణ జీవితం రెండూ తెలిసిన తరంలో  చాలామందికి రెంటిలోని సానుకూలమైన అంశాలను అందుకోవాలని ఉంటుంది.  రెండు జీవన విధానాలకు మధ్య వైరుధ్యం ఉన్నదని తెలిసినప్పటికీ ఒకదాన్ని వదులుకోవడానికి  మనసు అంగీకరించదు. ఆచరణలోనేమో ఆర్థికాభివృద్ధికి అవసరమైన వలసబాటలో పయనిస్తారు.  గ్రామీణ జీవనంలో కోల్పోయిన ‘ఆనందాల’ కోసం గొణుగుతూ ఉంటారు. ఎన్‌ఆర్‌ఐల్లో  ఈ వలపోత మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆకలి తీరిన మనిషి ఆనక తనదైన సొంత అస్తిత్వం కోసం ఆరాటపడతాడు. అక్కడ సొంత అస్తిత్వాన్ని  విజువల్‌గా చూపించుకోవడానికి భరతనాట్యాలు, బతుకమ్మలు ఆడుతుంటారు. పర్వాలేదు. మనకు తెలుగు భాషా సంస్కృతుల రక్షణ గురించి ఉపన్యాసాలు ఇవ్వనంత వరకూ అది  అర్థం చేసుకోదగిన ఆరాటమే.. పల్లెటూరి జీవన విధానం పట్ల ఉన్న గ్లామర్‌ను, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ప్రైవసీ అనే కాన్సెప్ట్‌ని కలిపి వడ్డించింది ఈ సినిమా. రెండూ అతకని  విషయాలు. అందుకే ఈ సినిమా శిల్పారామంలో ప్రదర్శించే పల్లెలూరి ఇల్లులాగా ఉంది తప్పితే సహజంగా లేదు. పట్టణీకరణ ఆరంభదశలో అంటే 60, 70ల కాలంలో తెలుగుసినిమా  “రెక్కలు వచ్చి పిల్లలు వెళ్లారు, రెక్కలు అలిసి మీరున్నారు, పండుటాకులమై మిగిలేము” అని పాడుకుంది. పట్నపు కోడలనగానే మిడ్డీనో గౌనో వేసి నోట్లో సిగరెట్‌ పెట్టి నానా యాగీ  చేసింది. నాటి పల్లె నేటి పట్నమయ్యింది. నాటి పట్నం ఇపుడు అమెరికా అయ్యింది.  కాకపోతే పల్లె పట్టణాన్నిఆడిపోసుకున్నంత ఈజీగా ఆడిపోసుకోవడం కష్టం. సంపదను  చాలామందే అనుభవిస్తున్నారు. దగ్గరి బంధువో, స్నేహితుడో ఎవరో ఒకరు అమెరికాలో లేని మధ్యతరగతి ఇల్లు ఒక్కటి కూడా కానరాని స్థితి.  అందువల్ల ఆ భాష వదిలేసి దాని  బదులు ఉమ్మడి మిత్రుడు గ్రామం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.  ప్రాక్టికల్‌గా మనం వెళ్లకపోయినా అలా అనుకుంటూ ఉండొచ్చు. అదొక అందమైన కలగా చూసుకుంటూ  ఉండొచ్చు. ఈ దశకు చాలామందే చేరుకున్నారు. ఈ పరిణామమే ఈ సినిమాకు ప్రేరణ.

ఇందులో సోమయాజుల వారు భార్య చీర ఉతకడం, ఆ సందర్భంగా ఏమిటండీ ఇది అని ఆమె కంగారుపడిపోతే ఆయనగారు రోమాంటిక్‌ డైలాగులు కొట్టడం లాంటి లిబరల్‌ షో  చేశారు. కానీ సోమయాజివారు తూగుటుయ్యాలలో పవ్వలిస్తుంటే సోమిదేవమ్మ గడపమీద కొంగుపర్చుకుని తలవాల్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఎవరెక్కడుండాలో అక్కడే  ఉండాలమ్మా! సరదాగా ఒక పూట రోల్‌ ఛేంజ్‌ చేసుకుంటాం కానీ పూర్తిస్థాయిలో మార్చుతామంటే ఊరుకోము! అంతేనా భరణిగారూ! “వంటావార్పూ, పిండిరుబ్బడం, బట్టలుతకడం,  ముగ్గువేయడం లాంటివన్నీ చేస్తా ఉంటే జబ్బులెందుకొస్తాయి” అని సోమయాజి ఉరఫ్‌ అప్పదాసు ఉరఫ్‌ భరణి గారు ఒక ఉపన్యాసమిస్తారు. ఈ పనులన్నీ ఎవరు చేసేవి? ఈ  ఉపదేశం ఎవరికిస్తున్నట్టు? ఒకసారి కాళ్లు పట్టిచ్చి, మరోసారి జడవేసి నాలుగు రొమాంటిక్‌ డైలాగులు చిలకరించినంత మాత్రాన సారం మారుతుందా!   ఏ సంప్రదాయ  జీవనవిధానమైనా స్ర్తీలను అణచివుంచేదే. ఆడవాళ్లను ఆడిపోసుకోవడమొక్కటే కాదు. ఇందులో మూఢనమ్మకపు ప్రచారమూ దాగి ఉంది. మనం కెమికల్స్‌ కూడు తిని అనారోగ్యంగా  తయారయ్యామని, గ్రామాల్లో  రోగాలు రొస్టులు లేకుండా ఇంతకంటే ఆరోగ్యంగా జీవిస్తారని  మేధావులకునేవారు కూడా నమ్మేస్తూ ఉంటారు. ఇది కూడా పల్లెజీవితం తెలీని గ్లామర్‌  వ్యవహారమే. పల్లెల్లో కనీసం రోగం పేరుకూడా తెలీకుండా రాలిపోతూ ఉంటారు. అది కేన్సర్‌ అని గుండెపోటు అని తెలీకుండా హఠాత్తుగా పోతే కాటికి మోసుకుపోతా ఉంటారు. చివరికి  మలేరియాతో కూడా చచ్చిపోవడమే. అక్కడ అరవై దాటితే కృష్ణా రామా అని మూలన కూర్చోవాల్సిన వయసుకు చేరుకున్నట్టే. వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఈ వయసు కొంచెం  అటూ ఇటూగా ఉంటుంది. పెరిగిన ఆరోగ్యస్పృహతో మెరుగైన వైద్యసౌకర్యాలతో హెల్త్‌ చెకింగులతో, ఇన్సూరెన్స్‌లతో మనం వారికంటే మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాం.  70ల్లో కూడా  టింగురంగా అంటూ టీషర్ట్‌, నిక్కరూ వేసుకుని తిరుగుతూ పల్లెలు మనకంటే ఆరోగ్యంగా ఉండేవని ఆడిపోసుకోవడం లేదా చొంగకార్చడం ‘అత్యాధునిక’ మాయ.

mithunam2

ఇదంతా రాజకీయమండీ, సినిమా గురించి మాట్లాడతారనుకుంటే ఇవన్నీ చెబితే ఎలాగండీ అనబోదురేమో! ఏది రాజకీయం కాదండీ!  మేమొక సినిమా తీశాం, మంచి సినిమా  తీశాం, అందమైన సినిమా తీశాం అని చెప్పుకోవచ్చు. ఎవరిది వారికి ఇంపుగానే ఉంటుంది కాబట్టి చెప్పుకోవడం వరకూ తప్పులేదు. చాలామంది చెపుతూనే ఉంటారు. కానీ తెలుగు,  సంస్కృతి, సంప్రదాయం వగైరా మాటలేటండీ! అది రాజకీయం కాదా అండీ!  అందులో సున్నితమైన అనుభూతులున్నాయి కదా వాటిమాటేమిటి, ఆ వరకు తీసుకుని సినిమాను  ప్రశంసించవచ్చుకదా అందురేమో! ఆ అనుభూతులను చూపించడంలో  నిజాయితీ కావాలి. ఈ సినిమాలో ఏ మాత్రం అలసట లేకుండా ఇద్దరు వృద్ధులు ఆ లంకంత కొంపను అన్ని  చెట్లను మెయిన్‌టెయిన్‌ చేస్తా ఉంటారు. చెప్పనలవి కానన్ని వంటలు చేసుకుంటా  ఉంటారు. ఆవులను గేదెలను పోషిస్తా ఉంటారు. మూడో మనిషి కనిపించడు. సాధ్యమా  ఇది?మామూలు మసాలా సినిమాలో ఒక హీరో వందమందిని కొట్టేయడానికి దీనికి తేడా ఏమైనా ఉందా! అంతేనా! ఆ ముసలాళ్లిద్దరూ ఉష్ర్టపక్షుల్లా మరో మనిషి అంటూ సొంటూ  లేకుండా జీవిస్తా ఉంటారు. ఇది ఏమి సామాజికత స్వామీ! ప్రైవసీ పేరుతో సాటి మనుషులకు దూరంగా బతికేయడం గొప్ప సంస్కృతా! వృద్ధులకు ఇతరుల మాదిరే ప్రైవసీ కచ్చితంగా  అవసరం. కానీ ఇలానా! అసలు మనిషి అనేవాడు(రు) ఇంత అన్‌సోషల్‌గా జీవించగలడా(రా)! చేదబావిని చూపించి నీళ్లు తోడుకోవడం అనేది ఆరోగ్యానికి అవసరమైన శ్రమ అని డైలాగ్‌  కొట్టించితిరి కదా, మరి గ్యాస్‌ స్టవ్‌ ఎందుకు వాడితిరి? అక్కడ కూడా నిప్పుల కుంపటి పెట్టి ఊదుతూ ఉంటే ఊపిరితిత్తులకు ఎక్సర్‌సైజ్‌ అని చెప్పించకపోయారా! అక్కడ కంఫర్ట్‌  కావాల్సివచ్చింది. అంటే దర్శకుడు చూపించదల్చుకున్న సింబాలిజమ్‌ మేరకు సంప్రదాయాన్ని, ఆధునికతను, సౌకర్యాలను టైలరింగ్‌ చేసుకున్నారని అర్థమవుతుంది. చేదబావి,  బాదం చెట్టు లాంటివి శిష్ట సంప్రదాయ జీవులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే సింబల్స్‌. వాటిని డిస్ట్రబ్‌ చేయడం డైరక్టర్‌కు ఇష్టం లేదు. పైకి అభిరుచిప్రధానమైనదిగా  కనిపించినప్పటికీ సారాంశంలో ఈ సినిమా అందించేంది వేరు. ఇది పర్ణశాలలో విహరిస్తున్న జింకకాదు. మాయారూపంలోని మారీచుడు.

” రిటైర్‌మెంట్‌ తర్వాత ఊర్లో ఒక రిసార్టు లాంటిది కట్టుకుని అక్కడికి వెళ్లిపోవాలని చాలామందికి ఉంటుంది. వెళ్లరు. కానీ అలాంటి కల అయితే ఉంటుంది. వెళ్లినా వెళ్లకపోయినా  ఈ సినిమా ద్వారా అలాంటి వారికి ఆ అనుభూతిని క్రియేట్‌ చేసి పెట్టాం” అని భరణి ఒక ఇంటర్య్వూలో చెప్పారు. కరెక్ట్‌గా చెప్పారు. ఇది వారి సినిమానే. ఆచరణతో సంబంధం లేని  సంపన్న కోరికలు కాబట్టే ఇది హాలీవుడ్‌ ఏలియన్స్‌ సినిమాల మాదిరి ఉంటుంది. కాకపోతే అందులో అన్నీ అంతరిక్షపు హైటెక్‌ సామాగ్రి, ఇందులో ముగ్గులూ దప్పళాలున్నూ!

జి ఎస్‌ రామ్మోహన్‌

 

అక్షరాల పలకకి అర్ధాల పగుళ్ళు!

1swatikumari-226x300 

నువ్వు మనసులోపల కొన్ని పదాలతో ఏదో చెప్పుకుంటున్నట్టు ఏడ్చినపుడు, ఆ మాటల చుట్టూ అర్ధాలు తూనీగల్లా ముసురుకుంటాయి. బయటికి పలకబోతుంటే మాటలన్నీ ఆకుపచ్చ ముళ్ళై తడిగా గుచ్చుకుంటాయి.  లేతరావాకంతటి కేక పిట్టగొంతులోంచి  పెగిలినప్పుడు ఆ వినికిడిని ఇంద్రియానుభవంనుండి భాషానుభూతిలోకి మళ్ళించడానికి ఎంత ప్రయత్నించీ ఒక నమ్మదగిన వాక్యం రాయలేననే బాధ కనపడుతుంది ఎమ్మెస్ నాయుడు గారి “ఒక వెళ్ళిపోతాను” కవితాసంపుటిలో. గాలిలా ఎంత దూరం ప్రయాణించి చూసుకున్నా చివరికి కాలం గదిలోనే ఉండిపోయానని తెలుసుకుని తారీఖులు ఉండని తాళాల్ని వేసి ఒక వెళ్ళిపోతాం  అని కాలంతో పాటు భాషపైనా తిరగబడ్డాడు ఈ కవి.

naidu

సంభాషణలేని వాక్యాల కోసం అందరి పెదాల వంక చూసి  విసుగెత్తి  మంచి నిశ్శబ్ధం ఎవరిదగ్గరా లేదనిపిస్తుంది.  పిల్లిలా దుఃఖం మనసుని గీరుతున్నప్పుడు- ఈ రాత్రిని గోడకి తగిలించాను/రేపు బయట పారేస్తాను అనుకుని పడుకోక తప్పదు. నిద్రంటే నిర్విచార స్థితి కాదని, మెలకువలోని స్పృహలు కొన్ని అన్ని వేళలా లోలోపల మేలుకునే ఉంటాయనీ గమనిస్తాడు ఈ కవి. ఎదుటి మనిషి తనని బతికిలేనట్టుగా చూడటం తెలిసినప్పుడు కూడా శత్రుత్వం లేక ’విడిపోవడంలా విడిపోదాం నిష్ఫలితాల్ని ఆశించి’ అని ఒప్పందం చేసుకుంటాడు. ఆ మాటల్లోని పెద్దరికాన్ని తలచుకుని ఎప్పుడైనా అతను బాల్యాన్ని పోగొట్టుకున్నవాడిలా ఏడుస్తుంటాడు. ఏడవకు, అందరం ఉగ్గుగిన్నెంత నవ్వుతో బతకాల్సిన వాళ్లమే అని ఎవరైనా ఓదార్చబోతే ’ముట్టుకోకండి, నేనింకా తడిచిన కాగితాన్నే’ అని తన అంతరంగపు అస్పష్టలోకాల్లోకి అదృశ్యమౌతాడు.

అటువంటి స్పష్టాస్పష్టమైన అధివాస్తవిక కవిత్వంలోకి కాసేపు శబ్ధాల్ని అక్షరాల్లో చూడగల కళ్ళతో వెళదాం…

 

అస్థికలలు

 

అన్నీ గుర్తే

అయినాసరే మర్చిపోయినట్టు గుర్తుంటాయి

 

నీకు నాకు

కదలటానికి జ్ఞాపకాలే రహదార్లు

 

సీతాకోకచిలుక నీడ

ఎగిరిపోతుంది పట్టుకుంటుంటే

 

సముద్రం నీడలో నిద్రపోతున్నాను

తెగిన చెట్టునీడలా నా వాక్యం ఉండొచ్చు

విరమించుకున్న కెరటంలా నా వాక్యం ఉండకపోవచ్చు

 

అనుభవాల్నుంచి అధిగమించామనుకుంటాం

చివరికి వాటి అనువాదాల్లోకే లొంగిపోతాం

 

నాస్తికాస్తిక కలలు రావు

మన అస్థికలే కలలు

 

కొన్నే కన్నీళ్ళు మిగులుతున్నాయి

నీ కివ్వను

—-***——

వ్యాఖ్యానం

 

ఏమిటీ అనుకుంటున్నాను? ఇందాకేదో అనుకున్నానని కదూ! ఏమనుకున్నానో, అది మాత్రం గుర్తుండదు. కొన్నేళ్ల క్రితం ఇక్కడే ఎక్కడో ఎవర్నో వెదుతుకుతూ తిరిగినట్టు, చిన్నప్పుడు ఆ చెట్టు కింద ఏవో ఆటలాడినట్టు “అన్నీ గుర్తే అయినాసరే మర్చిపోయినట్టు గుర్తుంటాయి.”

 

జ్ఞాపకాలన్నీ నీడలే. రంగూ రూపమూ ఉన్న నీడలు. కొన్ని నీడలు దొరక్కుండా సీతాకోకలై ఎగురుతుంటాయి. మరికొన్ని సముద్రపు ఒడ్డులా తేమగాలిని వీచి నిద్రపుచ్చుతాయి. అసలు జ్ఞాపకాలేగా బాటలో అణిగిఉన్న ధూళిలా, రాలిపడ్ద నిన్నటి ఆకుల్లా, కురిసి వెలిసిన వానతడిలా దారి పొడవునా వాతావరణమై, నేపథ్య సంగీతమై, బాటసారి పాటల మధ్య విరామమై నీ నడకకి రహదార్లుగా మారుతుంటాయి.

 

మరి వాక్యాలు, వ్యాఖ్యానాలు? బహుశా కొన్ని వాక్యాలు నిజంగానే బావుండకపోవచ్చు. భావం అనే కుదురునుండి విడిగా తెగిపడి మూలానికి బొత్తిగా అతకని చెట్టులా నిర్జీవంగా ఉండొచ్చు. వాటి అర్ధాల్ని వివరించబోయి పైకెగసి అర్ధాంతరంగా విరమించుకున్న కెరటాల్లా, మళ్ళీ మళ్ళీ అదే ప్రయత్నాన్ని చెయ్యబోయే అలల నురగలా వాటి వ్యాఖ్యానాలు ఉండవచ్చు.

 

ఒక సంఘటన- పరిమళాన్ని పూస్తుందో, గాయాన్ని చేస్తుందో! సుఖమో, వేదనో ఆ సమయానికి అనుభవించాక మిగిలేది అత్తరు మరకలూ, గాయపు మచ్చలేనా? అనుభూతి క్షణికం, దాని తాలూకూ గుర్తులు భౌతికం అనే అనుకుంటాము. ఇగిరిపోయేవీ, మాసిపోవేయీ, మానిపోయేవి కాక ప్రతీ అనుభవం తర్వాత శాశ్వతంగా మిగిలిపోయేది ఒకటుంటుంది. ఈరోజు కనపడే నువ్వు- ఇన్నేళ్ళ నీ అనుభవాల్లోంచి లోపలికి ఇంకిపోయిన అనంతమైన వ్యక్తిత్వ శకలాల సముదాయం. అందుకే “అనుభవాల్నుంచి అధిగమించామనుకుంటాం చివరికి వాటి అనువాదాల్లోకే లొంగిపోతాం”.

 

చుట్టూ అంతా ఉన్నప్పుడు “లేకపోవడమెలా ఉంటుందో” అని ఊహించవచ్చేమో. కానీ ఏమీలేనితనంలో, లేదన్న నమ్మకంలో ఏదైనా ఎప్పుడైనా ఉండటాన్ని ఊహించడం. అసలా ఊహించడమన్న భావనే ఊహాతీతం. అందుకే నాస్తికాస్తిక కలలు రావు.

 

అస్తమానం అవసరపడతాయి. పెద్దరికం తెచ్చుకున్న కొద్దీ పిడికెడైనా దొరక్క ఇంకిపోతాయి. నిస్సహాయతలో, ఒంటరితనంలో ఒకటో అరో సాయమొచ్చి ఆదుకుంటాయి. ఇన్నేళ్ళ నడకలో రాళ్లలో, ముళ్లలో ఎంతో ఖర్చయిపోయాయి. అందుకే “కొన్నే కన్నీళ్ళు మిగులుతున్నాయి నీ కివ్వను.”

—***—-

 

చేత వెన్న ముద్ద

                                  Abhowthika_swaram

కొన్ని పుస్తకాలను ఏమని పిలవాలో తెలియదు కవిత, కథ, నవల, వ్యాసం లాంటి సాంప్రదాయక ప్రక్రియా రూపాలన్ని వాటి ముందు వెలతెలా పోతాయి. హృదయాన్ని అనుభూతి సంద్రంలో ముంచి తేల్చే కవిత్వం ఉంటుంది కానీ కవిత కాదు. కధనం వుంటుంది కానీ కధ కాదు. ఆలోచనా స్పోరకమయిన వ్యాఖ్యలు వుంటాయి కానీ వ్యాఖ్యా విన్యాసం కాదు. జీవిత చిత్రణలు వుంటాయి కానీ జీవిత చిత్రాలు కాదు. ఏ ప్రక్రియా రూపంలోనూ ఒదగని ఈ రచనలను ఏమని పిలవాలి?

ఉదాహరణకు పూడూరి రాజిరెడ్డి ‘‘మధుపం’’ ఇటివలి ‘‘పలక ` పెన్సిల్‌’’ తీసుకోండి. పైకి NON – SERIOUS  వ్యవహారంగా కనిపించినా చాలా సీరియస్‌ అంశాలనే ఆ పుస్తకాలు చర్చించాయి. ‘‘మధుపం’’ ఒక మగవాడి ఫీలింగ్స్‌ అంటూ ఆమధ్య తెలుగు పాఠక ప్రపంచంలో సంచలనం సృష్ఠించిన ఈ పుస్తకం కేవలం వైయక్తిక అనుభూతినో, లేదూ సామూహిక అవ్యవస్ధనో చిత్రికపట్టలేదు. అంతకు మించింది ఈ పుస్తకంలో ఏదో వుంది.

ఒక మగవాడి ఆలోచనలు అంటూ ఇటీవల వచ్చిన పలక`పెన్సిల్‌ లో కూడా… తత్వశాస్త్ర పరిభాషలో అతి ముఖ్యమయిన ‘‘నేను’’ అనే బ్రహ్మపదార్ధాన్ని అలవోకగా చర్చించింది. ఈ పలక-పెన్సిల్‌ గురించి మరొకసారి మాట్లాడుకుందాము. కానీ ప్రస్తుత పుస్తక సందర్భం ‘‘మాధవ్‌ శింగరాజు’’ కలం నుండి వెలువడిన ‘‘అభౌతిక స్వరం’’ ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ ‘‘దీనిని ఏమని పిలవాలి?’’ అనే సందేహమే నన్ను పట్టి పీడించింది.

‘‘అభౌతిక స్వరం’’ అంటే ‘‘మంద్ర స్వరం’’ అని అర్ధం. ‘‘నేను’’ అనే శీర్షికన రెండు సంవత్సరాలపాటు ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకున్న యాభైమంది ప్రసిద్ధుల జీవితాలను కొల్లేజ్‌ చేసి చూపిన అక్షర సంచయం ఈ పుస్తకం.

సాప్రదాయిక పరిచయ వ్యాసాల లాగా వాళ్ల వాళ్ల జీవితాలలోని ప్రముఖ ఘట్టాలతో ఈ రచన నిండిపోలేదు వాళ్లు జీవితాంతం ఏ తాత్త్విక భూమిక ఆధారంగా పనిచేసి జీవితాన్ని కరిగించుకున్నారో ఆ భూమికలను పట్టుకుని వాళ్లలోకి పరకాయ ప్రవేశంచేసి, వాళ్ల స్వరంతో  పాఠకుడితో ముచ్చటలాడినట్లుగా, సంభాషించినట్టుగా మెల్ల మెల్లని మంద్ర స్వరంతో చేసిన రచన యిది. ‘‘నేను ’’ అనే శీర్షికన వెలువడిన రచనలు కనుక ఏది రచయిత స్వరమో….. ఏది అభౌతిక స్వరమో తేడా తెలియనంతగా వాళ్లతో రచయిత సంలీనం అయిపోతాడు.

ఇంట్లో మధురమయిన పాయసాన్ని అమ్మ వండి, పైపైన జీడిపప్పు, కిస్‌మిస్‌ లతో ‘‘గార్నిష్‌’’ చేసినట్లుగా ఈ రచనలు అన్నీ వుంటాయి. అందుకేనేమో ‘‘మాధవ్‌ శింగరాజు’’ వీటిని ‘‘Auto biographical vignettes of Great men and women” అన్నాడు. vignettes అంటే నిఘంటు అర్ధం ఇలా వుంటుంది. ‘‘Decoration Design or Small illustration used on the title page of  a Book or at the beginning or at the end of the chapter.”

పుస్తక సారాంశం మొత్తాన్ని ఒక వ్యాఖ్యలోనో లేక నాలుగయిదు అలతి, అలతి పదాలలోనో గుది గుచ్చి చేసే అందమయిన వ్యాఖ్య యిది. మరొక మాటలో చెప్పాలంటే అనంతమయిన సముద్రాన్ని గుప్పిటలో పట్టడం అన్నమాట.

బిజినెస్‌ గురు, మేనేజ్‌మెంట్‌ గురు, ఆధ్యాత్మిక గురు లాంటి చాలా మంది గురువుల గురించి మనం విని వుంటాము కానీ ‘‘ నో స్మోకింగ్‌ గురు ’’ అంటూ ఒకరు వున్నారు అన్న విషయాన్ని కూడా ఊహించి వుండము. అలాంటి నో స్మోకింగ్‌ గురు అలెన్‌ కరీతో మొదలు పెట్టి యూరీ గగారిన్‌ వరకు మొత్తం యాభై మంది ఒక విద్యుల్లతలాగా  ఈ పుస్తకంలో మెరిసి మనలని మైమరపిస్తారు.

మన మౌనరుషి భగవాన్‌ రమణమహర్షి, గాంధీజీ, జగదీశ్‌ చంద్రబోస్‌, జ్యోతిబసు, జ్యోతి బాపూలే, కల్పనా చావ్లా, ఎం.ఎఫ్‌ హుస్సేన్‌, ఎం.జి. రామచంద్రన్‌, ఓషో, ఆర్కే లక్ష్మణ్‌, సలీమ్‌ ఆలీ, సత్యజిత్‌ రే, సూర్యసేన్‌, రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ లాంటి భారతీయులు ఈ పుస్తకంలో మనకు కొత్త రూపంలో దర్శనమిస్తారు.

కొత్తగా దర్శనమిస్తారు అని ఎందుకు అంటున్నాను అంటే ‘‘సలీమ్‌ ఆలీ’’ లాంటి పక్షి శాస్త్రవేత్తలో అంతర్గతంగా దాగివున్న ఒక గొప్ప తత్వవేత్తను ఈ పుస్తకం పట్టి చూపుతుంది. ఆర్నిథాలజిస్టు, ఫిలాసఫర్‌ ఈ రెండిరటికి సామ్యం ఎక్కడ!

‘‘పక్షులనుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందనిపిస్తోంది. వాటికి భయం వుండదు. ఏ క్షణానికి ఆ క్షణం జీవిస్తాయి. మనషులు కూడా అలానే ఉండాలంటాను. స్వేచ్ఛలోనే క్రమబద్ధమయిన జీవితం వాటిది. వేకువతో లేస్తాయి. పరిమితంగా తింటాయి, చీకటి పడగానే గూళ్ళకు చేరుకుంటాయి. మనకెందుకు అలా సాధ్యం కాదు? అరాచకంగా, అస్తవ్యస్తంగా వుంటామెందుకు? అరుదయిన పక్షిజాతులు అంతరించి పోతున్నట్లే మనిషిలోని ఆరోగ్యకరమయిన అలవాట్లు కూడా క్రమంగా హరించుకుపోతున్నాయా?’’.

ఈ ఉటంకింపు చదివాక ఎవరికయినా ఏం అనిపిస్తుంది? THE FALL OF A SPARROW  అన్న సలీం అలీ జీవిత చరిత్ర మొత్తం చదివినా సలీం ఆలీ లోని ఈ ‘‘ఫిలాసఫర్‌’’ ను పట్టుకోవడం కష్టమేనేమో! ఈ తాత్త్విక భూమికను మాధవ్‌ శింగరాజు పట్టుకున్నాడు. రచనను గార్నిష్‌ చెయ్యడం అంటే ఇదే కదూ!.

భారతదేశపు దారిద్య్రాన్ని గ్లోరిఫై చేసి అంతర్జాతీయ అవార్డులు తీసుకున్నాడని సత్యజిత్‌ రే మీద ఒక విమర్శ వుంది చారులత లాంటి సినిమాలలో ‘‘దాంపత్య ద్రోహాలని’’ సింపుల్‌ గా తేల్చేశాడనే అపవాదు కూడా వుంది ఈ రెండు విమర్శలు సత్యజిత్‌ రే ను జీవితాంతం వెంటాడాయి. ‘‘ఎవ్రిబడి లవ్స్‌ ఎ గుడ్‌ డ్రౌట్‌’’ అని పాలగుమ్మి సాయినాధ్‌ ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యాన్ని ఎత్తి చూపుతూ మరొకచోట అంటాడు. కానీ సత్యజిత్‌ రే…..

‘‘కరువును కరువుగా తీయలేకే ‘‘డిస్టింట్‌ థండర్‌ ’’ కోసం పన్నెండేళ్ళు ఆగాను. కరువంటే చనిపోవడం కాదు. బతికించడం. కరువు రోజుల్లో ఏ పల్లెకయినా వెళ్లండి లేదనకుండా యింత ముద్ద పెడతారు. గడపగడపలో కడుపునింపే మానవత్వం కనిపిస్తుంది. వాళ్లు తినడానికే వుండదు. పస్తులుండి, పచ్చి మంచినీళ్ళు త్రాగి తమకోసం వుంచుకున్నది పెడతారు.  ‘‘ లేక పోవడం’’ లో కరువు ఉనికి లేదు. లేకున్నా పెట్టగలిగే ఔదార్యంలో వుంది. ‘‘డిస్టింట్‌ థండర్‌’’ లో వున్న పేరడాక్సికల్‌ యాంగిల్‌ యిదే! స్వార్ధాన్ని, అహంకారాన్ని, ఆధిక్య భావనను, అంటరానితనాన్ని కాల్చి బూడిదగా చేసి మనిషిని కొత్తగా మొలకెత్తిస్తుంది కరువు.

‘‘సత్యజిత్‌ రే’’ అనే సృజనకారుడి అంతరంగాన్ని అర్ధం చేసుకోవడంలో మనం పొరపాటు పడ్డామా……?

‘‘మనమెంతో వివేకులమని పాశ్చాత్యదేశాల నమ్మకం మీరే మా చిట్టచివరి ఆశ’’ అని వారు అంటున్నప్పుడు నా తల కొట్టేసినట్టు వుంటుంది. నిజంగా మనకు అంత వివేకం వుందా? ఉంటే పాశ్చాత్య విధానాలకు ప్రభావితమై ప్రకృతికి వ్యతిరేకంగా మనపై మనం ఎందుకు ప్రయోగాలు చేసుకుంటాం?.

తన జీవితం మొత్తం ఈ ప్రశ్నకు జవాబు వెతకడానికే వెచ్చించాడు సుందర్‌లాల్‌ బహుగుణ. బహుగుణ జీవన సారాన్ని ఈ నాలుగు వాక్యాలలో సరళంగా, సూటిగా చెప్పడమే ఈ పుస్తకం సాధించిన విజయం. సుందర్‌లాల్‌ బహుగుణ  ఇంకోమాట కూడా అన్నాడు.

‘‘గ్రామ స్వరాజ్యం అంటే స్వరాజ్యం వచ్చి, గ్రామం పోవడం కాదు, గ్రామం గ్రామంలాగా మిగలాలి గ్రామం వాకిట స్వరాజ్యం కాపలాగా పడి ఉండాలి’’

ఇప్పుడు జరుగుతున్నదేమిటి? గ్రామాలు పట్టణాలకి కాలనీలుగా మారిపోతున్న చారిత్రక విషాద దృశ్యాన్ని మనం చూస్తూనే వున్నాం కదా: సంపాదించిన దాన్ని నిలుపుకోవడం సంపాదించడం కన్నా కష్టం. ఎంత కష్టమయినా మనగ్రామాన్ని మనం నిలుపుకోగలగాలి అప్పుడే మన స్వాతంత్య్రానికి అర్ధం వుంటుంది.

ప్రపంచం మనలని మనం సాధించిన విజయాల ద్వారా, చేసిన ప్రయత్నాల ద్వారా మాత్రమే అంచనా వేస్తుంది.

వాటి ఆధారంగానే మన స్ధానాన్ని నిర్ణయిస్తుంది. మన నిర్ణయాల వెనుక వున్న కార్యకారణాలతో కానీ, అంతర్గత భావ సంఘర్షణలతో కానీ దానికి పనికిలేదు. అది వేసే ముద్రలన్నీ, ఉపరితల అంశాల ఆధారంగానే వుంటాయి.

ఒకప్పటి జన చైనా నాయకుడు ‘‘మావో’’ పైన చివరి దశలో వచ్చిన ఆరోపణలు అన్నీ యిన్నీ కావు. మావో నియంతగా మారిపోయాడన్నారు. పార్టీలో ప్రబలిన ఉదారవాద బూర్జువాలను బలహీనపర్చడానికి ‘‘గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌’’, (ఒక పెద్ద ముందడుగు) తప్పిదాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి సాంస్కృతిక విప్లవాన్ని అడ్డుపెట్టుకున్నాడనీ అన్నారు. విప్లవం వల్ల ఇంత హింస ఎందుకు జరుగుతుందని ప్రశ్నించినవారూ వున్నారు.

మావో సాంస్కృతిక విప్లవాన్ని ఆలింగనం చేసుకోవడానికి కారణం ఏమిటి? చైనాలో మగవాళ్ళు మూడు ఆధిక్యతలకు  లోబడి జీవిస్తూ వుంటారు. రాజకీయం, కుటుంబం, మతం. ఈ మూడు మగవాడి పక్కలో పడుకుని వాడిని ఎటూ కదలనివ్వక మీద కాళ్ళేస్తాయి. రాజకీయ నిర్ణయాలు అతడి జుట్టును పట్టుకుంటాయి. కుటుంబ బాధ్యతలు అతడిని చుట్టుముడతాయి. మతం అతడిపై కుండల కొద్దీ సంప్రోక్షణ జలాన్ని కుమ్మరిస్తూవుంటుంది. స్త్రీలయితే, ఈ మూడు ఆధిక్యతలతో పాటు, పురుషుడి దురహంకారాన్ని కూడా భరించాలి.

సాంస్కృతిక విప్లవంతో తప్ప దేశం లోపల, బయట వున్న ఆధిక్యతల నిర్మూలన జరగదని మావో బలంగా విశ్వసించాడు.

విప్లవం డిన్నర్‌ పార్టీకాదు. తీరిగ్గా చదువుకునే స్పూర్తిదాయక వ్యాసం కాదు. చక్కటి పెయింటింగ్‌ కాదు. ఒక విప్లవం తరువాత మరొక విప్లవం రావాలి. విప్లమం నిరంతరం పురోగమించాలి.

ఇది మావో అంతరంగం. ఈ అంతరంగాన్ని ఎంత మంది పట్టుకోగలిగారు. అందుకే ప్రపంచం ఉపరితల అంశాల మీద ఆధారపడి బ్రాండీ ఇమేజ్‌ కల్పిస్తుందనేది. మాధవ్‌ శింగరాజు ఈ అంతరంగాన్ని పట్టుకోగలిగాడు.

ఇలాంటి పుస్తకాలు రాయడం ఒక అసిధారవ్రతం. ఏమాత్రం అటూ ఇటూ అయినా రసాబాస తప్పదు. వారం, వారం ఒక స్ఫూర్తి దాయక జీవిత చిత్రణ చేయడం మాటలు కాదు. మనం మామూలుగా ఒక పుస్తకాన్ని చదివి బావుంది/ బావోలేదు అంటూ తేలికగా ఒక మాటలో తేల్చేస్తాం. కాని ఒక వాక్యం రాయడానికి ఎంత కష్టపడాలి ఎన్ని వాక్యాలని డిలీట్‌ చేయాలి ఒక్క స్ఫూర్తివంతమైన, ఒక అర్ధవంతమైన, ఒక అజరామరమైన వాక్యం రాయడం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులను ఆలోచనలతో వెలిగించాలి.

అందుకేనేమో ‘‘ గీసుకున్న బొమ్మలని కసాబిసా చెరిపేయడం చూసి నన్ను సృజనాత్మక నిస్పృహ పీక్కునితింటున్నదని, దానిని తప్పించుకోవడానికి కాసేపు నేను విశ్రాంతిని కోరుకుంటున్నానని మీకు అనిపించవచ్చు. బొమ్మగీయడం, దాన్ని చెరిపేయడం రెండూ ఒక్కటేనాకు. నిర్మూలన కూడా నిర్మాణంలో భాగమే అయినప్పుడు నాకు వేరే ‘‘కప్‌ ఆఫ్‌ టీ’’ అవసరమౌతుందా’’ అంటాడు మన మగ్బూల్‌ ఫిదా హుస్సేన్‌.

అలవోకగా చేసినట్టుండే వ్యాఖ్యలలోనే ఎంత లోతు వుంటుందో ఈ పుస్తకంలో అడుగడుగునా తగిలే వ్యాఖ్యలు చెప్తాయి.

‘‘మేరీ క్యూరీ’’ని గురించి రాస్తూ ‘‘జీవితం చేసే సహాయ నిరాకరణ, ఎంత అమానుషంగా వుంటుందో’’ అని నిట్టూరుస్తాడు.  యం.జి రామచంద్రన్‌, కరుణా నిధుల స్నేహం గురించి రాస్తూ నేను సాధించిన దాని గురించే నా ప్రాణ మిత్రుడు మాట్లాడుతున్నాడు. నేను పోగొట్టుకున్న అతడి పూర్వపు స్నేహాన్ని పుష్పగుచ్ఛంతో తిరిగి యివ్వగలడా? అని నేను ఆలోచిస్తున్నాను’’. అంటూ ఎం.జి.ఆర్‌. ఆవేదనను అక్షర బద్దం చేస్తాడు.

‘‘మట్టిలో వున్న దేశభక్తిని ఏ సామ్రాజ్యవాది వచ్చి పూడ్చిపెట్టగలడు’’ అని ప్రశ్నిస్తాడు సూర్యసేన్‌ గురించి రాస్తూ మంద్రంగా వున్నా సరే..  గ్రీష్మ పరితప్త జ్వాలానల మేదిని శీతల పవనం సేద దీర్చినట్లుగా మరేదీ సేద దీర్చదు.

ఈ అభౌతిక స్వరం కూడా అంతే! మెల్లమెల్లగా మనలోకి చొచ్చుకుని పోయి మనల్ని వెంటాడుతూ వుంటుంది.

ముఖేష్‌ గొంతులోని జీరలాగా… అప్పటి దాకా వానలో తడిసివచ్చి దుస్తులు పిండుకుంటూ మాట్లాడుతున్నప్పుడు గొంతులోంచి పలికే చలి వణుకులాగా!

                                                                                               —వంశీకృష్ణ

పారా హుషార్

datla lalitha
 ‘ అకూ-వక్కలా అత్తా కొడళ్ళిద్దరూ కల్సి రావాల్సిందే ‘  అని పిలుపుల కొచ్చినపుడు మరీ మరీ చెప్పివెళ్ళారు మా అత్తగారి  ఆఖరి మేనల్లుడు .ఆ మాట విసుగు-విరామం లేకుండా చెప్పినవాళ్ళకే మళ్ళీ మళ్ళీ చెప్పి మురిసిపొయారు మా అత్తగారు . అటు అన్న తమ్ముల ఇళ్ళల్లోనే కాక ఇటు మేనల్లుళ్ళ ఇళ్ళల్లోనూ ఆది ఆడపడుచుగా తనకే అగ్ర తాంబూలమని ఆవిడ బడాయి పోతుంటే ” అబ్బో అదృష్టవంతులు మీకలా చెల్లిపోతుంది మరి”  అని దీర్ఘాలు తీస్తుంటారు అత్తగారి వ్యవహారం తెలిసినవారు .“ ఏ శుభకార్యానికయినా అయినవాళ్ళంతా తలోపనీ అందుకుని చేసుకుంటే ఆ అందమే వేరు .  తోసుకుంటూ వెళ్ళామా- చేయి తొలుపుకు వచ్చేసామా అన్నట్టుంటే నాకు మా చెడ్డ చిరాకేవ్.  మనం మాత్రం గుమ్మానికి మావిడాకులు కట్టకమునుపే అక్కడుండాలి”  అంటూ పిలుపందిన మరుక్షణమే ప్రయాణానికి ముహుర్తం పెట్టేయడమే కాకుండా ఆ రోజునుంచే మూటలు కట్టే పనిలో పడిపోయారు .‘ అత్తయ్యా అంటూ అంతా ఎదురొస్తారు  మరీ ఉత్తచేతుల్తో ఏలా వెళతాం’  అంటూ వాడికి అదిష్టం,  దీనికి ఇదిష్టం అని మేనల్లుళ్ళనీ, మేనకోడళ్ళనీ అందరినీ పేరుపేరునా తలుచుకుని సున్నుండల నుండి సున్నిపిండి వరకూ   మా అత్తగారు చేర్చి కూర్చిన సరంజామా ఒక గూడ్స్ బొగీకి సరిపడేంత .  ఆ మూటలు చూసిన మా మగమహారాజులు మాకు అర్జెంటు పనులున్నాయ్ మేం మీతో రామురాకరాము   అంటూ  మారాం చేసారు .

” అమ్మో …అవతల చేను కోతకొచ్చేసింది . ఇప్పుడెలా వదిలేసి పోతాం “ అని హైరానా పడిపొయారు  అబ్బాయిగారు

” అదేవిట్రా నాట్లేసి నెలన్నా కాలేదు కదా అపుడే కోతకొచ్చేసిందా!”   అని అత్తగారు  ఆశ్చర్యం  వ్యక్తం చేస్తే  ,“అదంతేనండీ…హైబ్రీడ్ రకం . అదునూ పదునూ చూడదు దానిష్టం వచ్చినపుడు అదొచ్చేస్తుంది మనం    కొడవళ్ళు పట్టుకుని సిద్ధంగా వుండాలి  అంటూ అడ్డంగా కోతలకి  దిగిపోయారు .

“ ఏవిటో అంతా పిదపకాలం !” అంటూ విసుక్కున్నారు అత్తగారు  .

మూటలు మోసేవాళ్ళు తగ్గారు కాబట్టి మూటలు కూడా  తగ్గాల్సిందే  అని  నేను ప్రయాణానికి ముందు పట్టు పట్టడంతో అయిష్టంగానే కొంత సరుకు దించడానికి సిద్ధపడ్డారు అత్తగారు . ఉట్టిలో  పెట్టడానికని ఎంచిన బూడిద గుమ్మడికాయ, దప్పళంలోకని దాచిన సూరేగుమ్మడికాయలు   , పులిహోరకని తెప్పించిన  గజనిమ్మకాయలు, పులావుకి  పనసకాయలు ,   మనకి కాస్తుండగా మళ్ళీ కొనుక్కోటం ఎందుకూ దండగా అంటూ దండిగా పేర్చిన  కొబ్బరికాయలు వంటి భారీ సరుకులు దించేద్దాం అంటే ససేమిరా అనేసారు అత్తగారు . వాటికి బదులుగా మద్రాసు మేనకోడలికోసం మనిషిన పంపించి మరీ సామర్లకోటనుంచీ తెప్పించిన రొట్టెమూకుడూ, అట్లపెనం , బూందీ చట్రాలు , పెద్దన్నగారి చిన్నకోడలు అడిగిన ఇత్తడి అమాన్ దస్తా , ఇంకెవరికో ముచ్చటపడ్డారని కొనిదాచిన రాగి పళ్ళెం , ఇత్తడికుంచం  వంటి అత్యవసరం కాని , ఆలశ్యం అయినా పాడవని వస్తువుల్ని ” పోనీ ….ఆనక పంపిద్దాంలే “ అని పక్కకు నెట్టేసి , మిగిలినవన్నీ మళ్ళీ మూటలు కట్టించారు  .

ఒకటి,రెండు మూడు నాలుగు అంటూ తెల్లవార్లూ వాటిచుట్టూ తిరుగుతూ లెక్కపెట్టిన అత్తగారు …..” నాతో కలిపి మొత్తం పదమూడు సాల్తీలేవ్ …..జాగ్రత్త “ అంటు బస్సెక్కేముందు మరోసారి నా భుజం గిల్లి మరీ గుర్తుచేసారు.

ముందెక్కిన మూటల్ని మొఖం చిట్లించి చూసిన కండక్టరు ‘ వెనక్కిపొండి ‘ అనేసాడు విసుగ్గా .

మమ్మల్ని తేరిపార చూసుంటే మర్యాదగా ముందు సీట్లో కూర్చోపెట్టేవాడని మా అత్తగారి అభిప్రాయం .  “ వాడేవిటే అలా కసురుతాడు బొత్తిగా పెద్దంతరం చిన్నంతరం లేకుండా “ అంటూ అత్తగారు అక్కడే అడ్డంగా నిలబడి విస్తుపోతుంటే , బాగానేవుంది …అక్కడికి  మీరేవన్నా  క్వీన్ విక్టోరియానా ప్రపంచమంతా  తల కెత్తుకోటానికి , మనూర్లోనే మనం గోప్ప పొలిమేర దాటితే గుంపులో గోవిందమ్మలవేకదా ! అని స్వగతంగా అనుకుంటూ  ” అబ్బా…. అసలింత లగేజీతో మనల్ని టాపుమీద పడేయకుండా బస్సులోకి ఎక్కనివ్వడమే గొప్ప . ముందు వెనక్కి నడవండి  ఆ తర్వాత తీరిగ్గా  చింతిచవచ్చు ” అంటూ మా అత్తగార్నీ ముందుకి  నెట్టేసరికి , “ హా..అంతేనంటావా !” అంటూ ఓసారి గాజులూ గొలుసులూ సర్దుకుని   కదిలారు  .

మేం ఆ సీట్ల మధ్యనుంచీ లగేజీలన్నీ వెనక్కి మోయలేక నానా అవస్థా పడుతున్నాం. ఇంతలో వెనకనుంచీ ఎడం పక్క  మూడో సీట్లో కూర్చున్న నిలువు నామాల కోరమీసం  వాడు   మాకు  ఎదురొచ్చేసి మా చేతుల్లో బేగ్గులు లాగేసుకుని బస్సులో ఖాళీ వున్నచోటల్లా సర్దేసి ,  కుడిపక్కనున్న  సీటు చూపించాడు  ఒంకరగా నవ్వుతూ  .

అప్పటికే   ఆసీటు  మధ్యలో మట్లపాలెం మహాలక్ష్మి లా  మఠం వేసుకుని స్తిమితంగా కూర్చున్న ఎర్రచీర గళ్ళరవిక   తన  కాటుక కళ్ళను చికిలించి చిరగ్గా చూసింది మమ్మల్ని . అక్కడికి మేవేదో ఆవిడ సొంత ఆస్తిలో వాటాకొచ్చినట్టు .  అత్తగారు గుళ్ళపేరు పైకి కనిపించేలా సర్దుకుని, ” అలా జరుగమ్మాయ్ ” అన్నారు అజమాయిషీగా.  దానికా ఎర్రమందారం    “ ఏటి ! నా నెత్తి నెక్కుతారేటి ! అల్లదంతా సీటుకాదేటి …..అలాకూకోమీ “  అంటూ   హుంకరించేసరికి  నేనూ మా అత్తగారూ మిగిలిన ఆ కాసింత చోటులోనూ గబుక్కున   కూలబడి ఒకరి మొఖం ఒకరం చూసుకున్నాం బెరుగ్గా.

అత్తగారు  ఎవరూ చూళ్ళేదుకదా అని చుట్టూచూసుకుని అందరూ చూసేసారని నిర్ధారణగా తెలిసిపోవటంతో  హవ్వ అని బుగ్గలునొక్కుకుని    ”  మరిడమ్మలా  అలా మీద పడిపోతుందేవిటే మనం ఏవన్నామనీ ….”   అంటూ ఏదో అనబోతుంటే ” అబ్బా..మీరు ఊరుకుందురూ  అనువుగానిచోట అధికులమనరాదు- కొంచముండుటెల్ల కొదువకాదు – అనుకొని ఇప్పటికి దొరికినదాంట్లోనే సర్ధుకుందాం “ అంటూ అత్తగారిని శాంత పరిచే ప్రయత్నంలో ఉండగా     ” ఏవమ్మో ….సీటు మొత్తం నువ్వే  ఆక్రమించేత్తే మిగిలినోళ్ళు ఏవయిపోవాల   …..కుంత అసింటా జరుగూ ” అంటూ ఇందాకటి కోరమీసం నిలువు నామాలు  తన సీట్లోంచి లేచి మరీ మాకు వత్తాసుపలికాడు. దాంతో ఆవిడ కళ్ళెర్రజేసి పళ్ళునూరి జరిగీ జరగనట్టుగా కదిలీ కదలట్టుగా అటూ ఇటూ ఊగింది .   దాంతో సగం సీటు మా ఆక్రమణలోకి వచ్చింది.

“ ఎవరిక్కడ టికెట్ “ అంటూ ఆర్టీసీ భాషలో అరుచుకుంటూ వచ్చాడు  కండక్టర్ .

“అడ్డరోడ్డు రెండూ “అన్నారు అత్తగారు .

“అక్కడాగదు- అనకాపల్లి కొట్టిచ్చుకోండి “అన్నాడు కండక్టర్ .

ఒక్క క్షణం తెల్లమొఖం వేసిన అత్తగారు మరు క్షణంలో తేరుకుని “ అబ్బే..అనకాపల్లి దాకా ఎందుకూ  పైవచ్చే నెలలో మా పెద్దాడపడుచుగారి మనవడి   అన్నప్రాశన  పెట్టుకుంటాం అన్నారు అప్పుడెలాగూ వెళ్ళాలి ..ఇదిగో ఇప్పుడు గుమ్ములూర్లో మా మేనల్లుడి గృహప్రవేశం అడ్డరోడ్డులో దిగిపోయి అక్కడినుంచి ఏ రిక్షానో జట్కానో పెట్టుకు వెళిపోతాం….  అంటూ హరికథ మొదలుపెట్టేసరికి , ఆవుదం తాగినట్టు మొఖం పెట్టిన కండక్టరు  ఎక్స్ ప్రెస్ బండిలో ఎక్కడబడితే అక్కడికి టికెట్టు కొట్టరు – ఓ మూటలేసుకుని కనపడ్డ బస్సెక్కేడవే …. చూసుకో  అక్కరలేదా ! బోర్డు  చదువుకో  అక్కరలేదా !  ఓల్డాన్ ఓల్డాన్ …అంటూ   చిందులెయటం మొదలుపెట్టాడు.   మా అత్తగారు కంగారుగా  గాజులూ గొలుసులూ  సవరించారు . కనీసం వాటికైనా గౌరవం ఇవ్వకపోతాడా అని.  ఆ చిన్నెలు చూసి కండక్టరు మరింత చిర్రెత్తిపోయాడు కొత్తగా కమ్యూనిష్టు పార్టీలో చేరినవాడిలా మాకు అస్సలు అర్ధంకాని భాషలో మమ్మల్ని నిందించాడు . ఆ ధాటికి మేం బిక్క చచ్చిపోయి కూర్చుంటే కిటికీలో తలపెట్టేసి కిలకిల్లాడింది ఎర్రమందారం . ఆ నవ్వులో ‘భలేగయ్యిందా’  అన్న భావం కనపడింది .

“పోన్లెండి బాబూ…ఆడలేడీసు . ఆళ్ళ  కంగారు ఆళ్ళదీ ….  పాపం ఇంత లగేజీతో దిగి  మళ్ళీ ఇంకో బస్సట్టుకోవాలంటే  సేనా ట్రబులయిపోతారు” అని  కండక్టరుని  బుజ్జగిస్తూ , పోని ఓ పనిసెయ్యండి పెద్దమ్మగారూ అనకాపల్లికి టికెట్టు కొట్టిచ్చుకుని అడ్డరోడ్డు లో దిగిపోండి. డబ్బులు పోతే పోయినియ్యి …మరింకేం సేత్తారు”  అంటూ      అందరికీ ఆమోదయోగ్యమయిన ఉపాయం  చెప్పి ఆదుకున్నాడు నిలువు నామాలవాడు.

అడక్కుండానే అడగడుక్కీ సాయపడుతున్న ఆ ఆపద్భాంధవుడిని  ప్రశంశా పూర్వకంగా  చూసి,   “అన్నట్టు ……. అతనెవరే మీ ఊరివాడా ….మీకేవన్నా చుట్టాలా!   నిన్నుచూసి నవ్వాడు కూడానూ!  ”  ఆరాగా అడిగారు అత్తగారు.

అయ్యోరామ…ఇదెక్కడి గొడవా!  అనుకున్న నేను అత్తగార్ని చాటు చేసుకుని ఆ నిలువు నామాల వాడ్ని  నఖశిఖ పర్యంతం పరీక్షించి చూసినా ఆ సదరు సాల్తీ ఎవరో ఆనవాలు దొరకలేదు. నున్నని గుండు- నుదుటన నామం -కోరమీసం –వంకరనవ్వు- పచ్చచొక్కా -తెల్లపేంటూ – కాలరుకింద గళ్ళ జేబురుమాలు  -మణికట్టుకి కాశీ తాడు ” అబ్బో చూడానికి రంగూన్ రౌడీలా వున్నాడు మాకు చుట్టం ఎలా అవుతాడు  …అంత చనువుగా చేతిలో బేగ్గులు లాగేసుకుంటుంటే  మీ కలిదిండివారేమో అనుకున్నాను. ఎందుకన్నా మంచిది ఓసారి  పరీక్షగా చూసి జ్ఞాపకం తెచ్చుకోండి అన్నా. ” కళ్ళజోడు కొనల్లోంచీ పక్కసీటుకేసి అదేపనిగా చూసిన అత్తగారు ” అబ్బే” అంటూ పెదవి విరిచేసారు . మావాళ్ళెవరికీ అంత నాసిరకం ముక్కులు వుండవేవ్ ….అయితే గియితే మీ  మావగారి తరపువాళ్ళెవరన్నా అయ్యుండాలి  అంటూ ఆలోచనలో పడ్డారు . మాటి మాటికీ మొఖంకేసి చూసి ఎంతో పరిచయం వున్నవాడిలా నవ్వుతున్న ఆ కోరమీసం ఎవరయి వుండొచ్చూ అని మా అత్తగారూ నేనూ తర్జన బర్జన పడుతుంటే , అది కిట్టకో ఏమో ఒళ్ళో సంచి సర్దుకునే వొంకతో మాటిమాటికీ  మోచేత్తో నా డొక్కలో  పొడిచేస్తుంది  ఎర్రమందారం . పగపట్టిన పడుచులా -పక్కలో బల్లెంలా ఇదెక్కడ దాపురించిదిరా భగవంతుడా నా ప్రాణానికి అని  నిశ్శబ్ధంగా  నిట్టూర్చి, ఇటు తిరిగేసరికి నామాలవాడు నవ్వుతూ చూస్తున్నాడు నామొఖంలో కోతులాడుతున్నట్టు .

అపరిచితుడ్ని చూసి అదేపనిగా పళ్ళికిలించడానికి  నేనేం  పిచ్చిమాలోకాన్నా అని   కోపంతో కళ్ళెర్రచేయబోయి అంతలోనే అతను చేసిన సాయాలు గుర్తొచ్చి పోన్లే పాపం అని చిన్న మోతాదులో ఒక చిరునవ్వు విసిరేసి , ” ఆ నున్నగుండు- నిలువు నామాలు నాకేదో తేడాగా అనిపిస్తున్నాడు.మీరు వాడివంక చూడకండి . నేను నిద్రపోయినా మీరు మెలకువగా వుండండి . లగేజీ జాగ్రత్త…. మీతో కలిసి పదమూడు సాల్తీలు “ అంటూ అత్తగారి చెవిలో గుసగుసలాడాను . అత్తగారు  అర్ధంకానట్టూ  చూసి , “ఇందాకటినుంచీ గమనిస్తున్నాను ఆ మరిడమ్మ మాటిమాటికీ నీ మెడకేసి చూస్తుంది. ముందు నువ్వు  జాగ్రత్తగా వుండు ”  అంటూ నా చివికి చెయ్యడ్డుపెట్టి చెప్పేస్తుంటే నేను ఢంగైపోయి తలతిప్పి చూసేసరికి ఎర్రమందారం ఆవేశంగా ముక్కుపుటాలెగరేస్తూ మోచేత్తో ఒక్కపోటు పొడిచింది .  అత్తగారి అతిరహస్యం  గాలివాటుకు అటు కొట్టుకుపోయి ఆ చెవిలో పడిపోలేదుకదా అన్న అనుమానం రావటంతోటే  భయంతొ  ఆంజనేయ దండకం చదువుకుంటూ అత్తగారికీ ఎర్రమందారానికీ మధ్య కూరుకుపోయి గట్టిగా కళ్ళు మూసేసుకున్నాను .

‘ బొయ్యి…..’మని మోగిన హారను గోలకి  మెలకువొచ్చి చూద్దునుకదా ఎర్రమందారం నా భుజం మీద పడి నిద్రపోతుంది. కదిలితే కొడుతుందేమో అన్న భయంతో అలాగే బిగుసుకుపోయి కూర్చొని మెల్లగా తలతిప్పి చూస్తే   చరిత్రలో  గుప్తుల స్వర్ణయుగం గురించి , శ్రీకృష్ణ దేవరాయల పాలన గురించి మొదటిసారి తెలుసుకుంటున్నట్టూ    అత్తగారు చెపుతున్న మాటల్ని అమితాశక్తితో వింటున్నాడు కోరమీసం వాడు . మధ్యలో ప్రశ్నలేస్తున్నాడు …సందేహాలు తీర్చుకుంటున్నాడు. నాకు తెలిసినంతవరకూ అత్తగారికి పాకశాస్త్రంలో తప్ప చరిత్ర పురాణేతిహాసాలలో ప్రావీణ్యం మాట దేవుడెరుగు కనీసం ప్రవేశం కూడా లేదుకదా …మరేవిటి ఈవిడ ఇంత ఉత్సాహంగా  చెప్పేస్తుందీ వాడు అంత  ఆసక్తిగా వినేస్తుందీ అని సందేహిస్తూ    నేను నా చెవులని వీలయినంత సాగదీసాను.  చంటినాన్నగారి కోళ్ళపెంపకం చాప్టరులో ఉన్నారు అత్తగారు .

“ఏటి నిజవే ….కోడి పుంజుకి జీడిపప్పు మేపుతారాండీ ?” కళ్ళుపెద్దవి చేసి అడుగాడు కోరమీసం.

“ అయ్యో ….ఒట్టి జీడిపప్పేం ఖర్మ వాటికోసం గుండెకోసి పెట్టేస్తాడు మా తమ్ముడు . అంత పిచ్చి వాడికి ఆ కోడిపుంజులంటే . వాడిమకాంలో పెంచేలాంటి  మేలుజాతి పుంజులు ఏడేడు జిల్లాల్లో ఇంకెక్కడా వుండవట   ….ఇందాకా చెప్పాను చూసావూ జగన్నాధపురం  చిట్టిబాబుగారనీ, ఇంటికి చుట్టం చూపుగా వచ్చినవాళ్ళకి భోజనంతోపాటు బట్టలుకూడా పెట్టిపంపిస్తాడనీ,  ఆ…ఆయనా ఈయనా వరసకి బావా బావమరుదులవుతారు. ఈ చంటిబాబుగారు  మా చినబావజ్జీ కి దత్తుడన్నమాట . అలా నాకు తమ్ముడు వరస ”  అంటూ ఆయాసం తీర్చుకోడానికన్నట్టు ఆగారు .

వింటున్న నేను ఉలిక్కిపడ్డాను . అసలు మొఖం వంకే చూడొద్ద్దని హెచ్చరిస్తే ఈవిడ మొత్తం హిస్టరీ చెప్పేసుకొచ్చారా ! నేను నిద్రలో వుండంగా ఇంకా ఏవేవి చెప్పేసారో ఏంటో అని కంగారుగా దిక్కులు చూస్తుంటే …నిద్రా భంగమయిన ఎర్రమందారం  నాకేసి అనుమానంగా చూస్తూ ఒళ్ళో సంచీ తెగ వెతికేసుకుంటుంది. ఖర్మరా భగవంతుడా అనుకొని …  అత్తగారి వీపు గోకాను హెచ్చరికగా . ” లేచావా అంటూ ఇటు తిరిగిన అత్తగారు …..నేనూ నిద్రపోతే లగేజీలన్నీ ఎవడన్నా దింపుకుపోతాడంటివి కదా అందుకే ఈ అబ్బాయితో మాటల్లో పడ్డాను.  పాపం ఎంత మంచోడో …..చిన తిరపతిలో మొక్కు తీర్చుకు వస్తున్నాడట . ప్రసాదంకూడా ఇచ్చాడు అంటూ చేతిలో లడ్డూ చూపించారు. నేను ఓరగా చూస్తే  నామాలవాడు మళ్ళీ అదే వంకరనవ్వుతో దర్శనం ఇచ్చాడు.

అన్నవరం దాటిందోలేదో “ అడ్డరోడ్డు టికెట్లు ముందుకు రావాలి “ అని అక్కడినుంచే అరిచేస్తున్నాడు ఆర్టీసీవాడు   .” ఆడలాగే అరుత్తాడు ఇంకా సేనా దూరంవుందండి పెద్దమ్మగారు మీరు కూకోండి . నేను దింపుతానుకదా ” అంటున్న నున్నగుండుని అభిమానంగా చూసారు అత్తగారు .

అయితే …. కాలవకింద  తవరికెవరూ సుట్టాల్లేరేమోనండి అంటూ ….అత్తగార్ని మళ్ళీ మాటల్లో దింపేసాడు  తెలివిగా .

“అయ్యో లేకపోవటవేవిటీ …..” అంటూ అత్తగారు ఇంజనుబోటులా యమా స్పీడుగా కాలవకింద ఊర్లన్నీ చుట్టబెట్టేసారు. ఏ ఊర్లో ఎందరున్నారు , ఎందరుపోయారు . ఆ పోయినవాళ్ళకీ ఈ వున్నవాళ్ళకీ మధ్య ఏ సంబంధాలున్నాయి, అందులో ఎన్ని నిలిచేలా వున్నాయి ఎన్ని తెగేలా వున్నాయి  అన్నవిషయాలు కొన్ని టూకీగానూ, కొన్ని వివరంగానూ తన ఆసక్తి మేర చెప్పుకొచ్చారు. మధ్యలో మూడుసార్లు నేను భుజం గిల్లి వారించబోతే ” అబ్బా వుండవే…..” అంటూ కళెర్రజేసి నన్ను విసుక్కున్నారు కూడా .

“అల్లదుగో ఆ వొచ్చీదే అడ్డరోడ్డు పదండి  పెద్దమ్మగారు” అంటూ మాకంటే ముందే హడావిడిపడిపోయి , ఎక్కడెక్కడో ఉన్న మా బేగ్గులూ, మూటా ముల్లే అన్ని డోరు దగ్గర చేర్చి,  ఓల్డాన్ ఓల్డాన్ అంటూ అరిచి సరిగ్గా అడరోడ్డు సెంటర్లో బస్సాపించి మమ్మల్నీ లగేజీని  రోడ్డున పడేయడంలో నామాలవాడి కృషి నిజంగా ప్రశంసనీయం .

“ఎంతసాయంచేసాడో అనవసరంగా అనుమానించేవ్ పాపం  “అంటూ అత్తగారూ నామీద చిరుకోపం ప్రదర్శిస్తూ ఒకట్రెండు మూడు అంటూ లగేజీ లెక్కిస్తుండగా సెంటరునించీ అంతదూరం వెళ్ళి  కీచుమంటూ ఆగిన బస్సులోంచీ ఉరికిన నామాలవాడు చేతిలో సంచితో పరిగెత్తుకుంటూ వచ్చి”మీదేగావోలండి …నా సీటుకింద వుండిపోయింది సూసుకోలేదు ” అని చిన్న గుడ్డసంచీ మా అత్తగారి చెతికిచ్చేసి మళ్ళీ  స్పీడుగా పరిగెత్తి  స్లోగా వెళుతున్న బస్సెక్కేసాడు. ఆ సంచిలో ఉన్నవి అన్నగారికోసం మా అత్తగారు ఎంతో ప్రేమగా పట్టుకొచ్చిన అటుకులు .

అవి చూస్తూనే అత్తగారు ఆనందభాష్పాలు కారుస్తూ ….ఇలాంటి మంచోళ్ళు ఇంకా ఉన్నారుకాబట్టే లోకం ఇంత సుభిక్షంగా వుందన్న అర్ధం వచ్చేలా ఒక చిన్న ఉపన్యాసం ఇస్తుంటే…  సర్లెండి నాదే తప్పు  అని చెంపలు వాయించుకున్నాను….లోపలమాత్రం ఆ పంగనామాలకీ …..సారీ, ఆ దొంగనామాలకీ….మళ్ళీ సారీ , ఆ నిలువు నామాలకీ ఆ ఒంకరనవ్వుకీ  ఎక్కడా నప్పలేదు …ఏదో తేడహై అని అనుకోకుండా వుండలేకపోయాను .

           ***

మేం ఊరినించీ వచ్చిన రెండో రోజు  మూడు ఉత్తరాలు ఇచ్చివెళ్ళాడు పోస్ట్ మేన్  సత్తినాణ  . అందులో ఒకటి చివర్ల నల్లరంగు రాసిన పోస్టుకార్డు . దాన్ని చదవగానే చించి అవతల పడేసిన అత్తగారు ” మీ మావయ్య భోజనం అయ్యేవరకూ ఈ కబురు తెలీనీకు …ఎంత  మనకి పడని వాళ్ళయినా పోయారని తెలిస్తే బాధేకదా ” అంటూ నిట్టూర్చారు .  రెండో కార్డు  మా మాంగారికి ఒంగోలునుంచీ పుగాకు రైతులు రాసింది. ‘ఈ ఏడు పొగనారు తగ్గించిపోయండి .ఇక్కడి రైతులు ఇతరపంటలవైపు మొగ్గేట్టువున్నారు . మేం నారుకోసం ఫలానా అప్పుడు వస్తాం పాతబాకీ తీర్చేస్తాం ‘ అన్నది సారాంశం .మూడోది ఇన్ లాండ్ కవరు జగన్నాధపురం చిట్టిబాబుగారి  దగ్గరనుంచి వచ్చింది.  ఉభయకుశలోపరి – ఇంతేసంగతులుకి మధ్య మేటర్ – ‘ మీ ఊరినించీ పనిమీద మా ఊరు వచ్చిన వ్యక్తి రెండు రోజులు మా ఇంట్లో మకాం చేసి ఈ పూటే బయలుదేరాడు. నేను అలవాటుగా బట్టలు పెడుతుంటే తీసుకోలేదు. మరీ మొహమాటస్తుడిలా వున్నాడు . అందుకే అతనిచేతికే కొంత రొక్కం ఇచ్చి పంపుతున్నాను.వాటితో  అతనికి నచ్చిన బట్టలు అక్కడే కొనివ్వండి. మీరు మా ఇంటికి వెళ్ళమని మరీ మరీ చెప్పారట . మామీద మీకు గల అభిమానానికి ధన్యుడిని – మా మర్యాదల్లో ఏవన్నా లోపం వుంటే క్షమించగలరు  ‘ అంటూ సాగిన ఆ ఉత్తరం మాంగారు చదివి  “నేనెవరిని పంపినట్టూ  !” అని  ఆలోచనలోపడ్డారు .

ఆ తరువాత  ఒకవారం వ్యవధిలో అలాంటివే మరో రెండు ఉత్తరాలు అందుకున్నాం. మీ మనిషికి సరుకిచ్చి పంపాం. చేరాకా ఉత్తరం రాయటం మర్చిపోకండి అని ఒకటి,   మీపేరు చెప్పి బ్రతిమాలడంతో డబ్బివ్వక తప్పలేదు …ఇంకోసారి ఇలాంటివాళ్ళని మా ఇంటికి పంపకండి అని ఒకటి ….అవి చదివి తలపట్టుకున్నారు మాంగారు .

అప్పుడే డెంకాడ పెళ్ళినించీ దిగిన మా రాజుగారు కాళ్ళయినా కడుక్కోకుండానే  పందిట్లో విన్న కథొకటి చెప్పుకొచ్చారు.  చంటినాన్న  గారి  మకాం దగ్గరికి ఎక్కడినుంచో ఒకడొచ్చి , ఆ కోళ్ళపెంపకం అదీ చూసి ఆశ్చర్యపోయి  మీగురించి ప్రపంచమంతా తెలియాల్సిందేనండీ అని ఉబ్బేసి ,మీకోళ్ళపెంపకం గురించి ప్రజలంతా కథలుగా చెప్పుకోవాలండి ….ఇంత అల్లారుముద్దుగా పెరుగుతున్న ఈ కోడిపుంజు గురించి పేపర్లో రాయించాలండి అంటూ కహానీలు చెప్పి , టౌనుకి తీసుకెళ్ళి స్టూడియోలో  ఫొటో తీయించి పంపిస్తానని తెగ బ్రతిమాలి , పుంజుని చంకన పెట్టుకెళ్ళినవాడు వెంట కాపలాగా పంపిన పాలేరుని బురిడీ కొట్టించేసి మాయమయిపోయాడట. పోలీసు కంప్లైంటు ఇచ్చినా మనుషుల్ని పెట్టి వెతికించినా ఫలితం లేకపోవటంతో  బెంగపడిపోయిన చంటినాన్న “కాస్త వెతికి పెట్టండ్రా ..” అని కనపడినవాడినల్లా బ్రతిమాలుతూ తిండీ తిప్పలూ లేకుండా తిరుగుతున్నారట  .

“మా దగ్గర మంచి జాతిపెట్టలున్నాయ్  ఒక పట్టు దింపుకునిస్తాను పుంజుని పంపవయ్యా అంటే ….తిండి కుదరక పుంజు పాడయిపోతుంది బావా అని తెగ గింజుకున్నాడు . మాబాగా  రోగం కుదిరింది సన్నాసికి …..ఇంకెక్కడి పుంజూ ఈపాటికి పులావయిపోయుంటుంది” అని నవ్వేసారు మాంగారు .

అంతావిన్న అత్తగారు ” అయ్యోరాత …. తలతాకట్టు పెట్టి మరీ వాటిని మేపుతున్నాడు  . వీడికయినా తెలివుండక్కర్లా .  అయినా ముక్కూ మొఖం తెలీనివాడిని అలాఎలా నమ్మేసాడ్రా!! ” అంటూ  ముక్కునవేలేసుకున్నారు  .

“సిం హాచలం నుంచొస్తున్నాని గుండు చూపించి ప్రసాదం ఇచ్చాడట మరి . నామాలు చూపించి పంగనామాలు పెట్టేసాడని అందరూ నవ్వుకుంటున్నారు “ అంటూ అబ్బాయిగారు చెపుతుంటే అత్తగారికి ఒక్కసారిగా  పొలమారిపోయింది .  అత్తగారి అవస్థకి నాకు నవ్వొచ్చింది .

ఆ సాయంత్రం పాతిక పోస్టు కార్డులు తెప్పించి , ఇలా నున్నని గుండు -నిలువు నామం తో ఉన్నవాడొస్తే నమ్మొద్దు అని ఎడ్రసులు ఉన్నవాళ్ళందరికీ వివరంగా ఉత్తరాలు రాయమన్నారు . ఇంకా నయం పచ్చచొక్కా తెల్లపేంటులో ఉన్నవాడిని నమ్మొద్దని చెప్పేరు కాదు అనుకొని, ‘ ఒంకరనవ్వులు ఒలికిస్తూ ఒకడొచ్చేనమ్మా ….పారా హుషార్ ‘  అని  నాలుగు ముక్కలు రాసి నాలుగు దిక్కులకీ టెలిగ్రాం లో పంపించాం  .

–లలిత దాట్ల

“ అప్పుడు చుట్టుపక్కల అంతా ఆత్మీయులే!” –మరిప్పుడో ?”

వంగూరి “జీవిత” కాలమ్ –  8

Fountain(1)

నాకు తెలిసీ భారత దేశంలో ఉన్న అన్ని నగరాలలోను ఒక గాంధీ నగరం ఉండి తీరుతుంది.  ఇక అన్ని గ్రామాలలోను, నగరాలలోను ఆయన విగ్రహం కనీసం ఒక్కటైనా కూడా ఉండి తీరుతుంది. ఆ మహానుభావుణ్ణి ఎంత మర్చిపోయామో గుర్తు చేసుకోడానికే ఇప్పుడు ఈ విగ్రహాలు ఉపయోగపడుతున్నాయి. ఈ రోజుల్లో ఎవరిదైనా సరే విగ్రహం పెట్టించడం నాయకత్వ లక్షణం గా పరిగణించబడుతోంది కదా! ఇది ఖచ్చితంగా నా అప్రస్తుత ప్రసంగమే కానీ  ఆఖరికి మా హ్యూస్టన్ లో కూడా కొందరు గాంధీ గారి విగ్రహం పెట్టించి “స్వయం ప్రకటిత సంఘ నాయకులు” గా పేరు తెచ్చుకున్నారు.

కానీ మా కాకినాడలో మా ఇంటికి వంద గజాలు అటూ, ఇటూ కూడా ఉన్న గాంధీ గారి విగ్రహాలు ప్రతిష్టాపించడానికి ఒక చారిత్రక నేపధ్యం ఉంది. కాకినాడలో 1923 లో 38వ కాంగ్రెస్ మహా సభలు ముగిశాక సుమారు మూడు ఎకరాల ఆ ప్రధాన వేదిక ప్రాంగణాన్ని అత్యంత సుందరమైన పార్కుగా తీర్చి దిద్దారు. ఆ మహా సభలలో మహాత్మా గాంధీ పాల్గొన్న కారణంగా అక్కడికి వంద గజాల దూరంలో కాకినాడలో ఉన్న ఏకైక “ఐదు రోడ్ల కూడలి” లో గాంధీ గారి విగ్రహం పెట్టారు. మా పేట పేరు కూడా గాంధీ నగరం గా మార్చారు. చుట్టుపక్కల పేటలు రామారావు పేట, సూర్యారావు పేట, ఎల్విన్ పేట మొదలైనవి.  ఇవన్నీ కళా, సాంస్కృతిక రంగాలకి పట్టుగొమ్మలు. అసలు కాకినాడ అంటేనే భాష, సాహిత్యం, సంగీతం, కళ, నృత్యం, విద్యాలయాలు, ఒకే వీధిలో అన్ని సినిమా హాళ్లు వగైరాలతో ఒక తెలుగు సాంస్కృతిక నగరం అనే ఇప్పటికీ పేరు.  మా చిన్నప్పుడు మా పేటలో నివసిస్తున్న సాధారణులైనా అత్యంత అసాధారణ సహృదయులు చాలా మంది నాకు యింకా బాగా జ్జాపకం ఉన్నా,  ఎంతో గొప్పవారైన హేమా హేమీల గురించి ఏదో యాదాలాపంగానే తప్ప ఎక్కువగా తెలియదు.  అంతటి మహానుభావులకి సన్నిహితంగా ఉన్నా, ఆ అమూల్యమైన అవకాశాలని అప్పుడు గుర్తించ లేక పోవడం ఇప్పుడు తలచుకుంటే సిగ్గేస్త్తుంది.

మా ఇల్లు సరిగ్గా పార్కుకీ, గాంధీ బొమ్మకీ మధ్యలో ఉంటుంది. మా చిన్నప్పుడు ఆ పార్కుకి సరిగ్గా మధ్యలో బంగారం చేపలు ఆనందంగా, హడావుడిగా ఈదుతూ ఉండే  ఒక అద్భుతమైన వాటర్ ఫౌంటెన్ (దీనికి తెలుగు మాట నాకు గుర్తుకు రావడం లేదు…నీళ్ళు చిమ్మే యంత్రం?????), దానికి అనుబంధంగా పార్కు నాలుగు మూలలా చిన్న ఫౌంటెన్లూ ఉండేవి. రామారావు పేటలో ఉండి, మా చుట్టు పక్కల కొన్ని వేల ఇళ్ళకి నీటి సదుపాయం చేసే “కుళాయి చెరువు” నుంచి సాయంత్రం ఆరు గంటల సమయం సూచిస్తూ ఫేక్టరీ సైరన్ మోగేది.  వెనువెంటనే వందలాది ఆ పార్కుకి చేరుకునే వారు. ఎందుకంటే, ఆ వాటర్ ఫౌంటెన్ మధ్యలో 50 అడుగుల “ఏక స్తంభం”  మీద నాలుగు స్పీకర్లతో ప్రతీ రోజూ మ్యునిసిపాలిటీ వారు నిర్ణీత సమయాలలో రేడియో కార్యక్రమాలు ప్రసారం చేసే వారు. ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఇళ్ళల్లోనే రేడియోలు ఉండేవి. ట్రాన్సిస్టర్ రేడియోలు 1960 ప్రాంతాలలో వచ్చినా, టీవీ అనే మాటే డిక్షనరీ లో లేదు.   ఆ రేడియో ప్రసారాలలో ముఖ్యంగా సాయంత్రం ఏడు గంటలకి “ఆకాశ వాణి, వార్తలు చదువుతున్నది పన్యాల రంగనాథ రావ్ “ అనే ఖంగు మనే గొంతు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చే వారు. గంభీరమైన ఆ గొంతు, చదివే విధానం తల్చుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆఫ్ కోర్స్ , ఈ రోజుల్లోనూ టీవీలో వార్తలు చూస్తుంటే ఇతర కారణాలకి ఒళ్ళు “గిగుర్పొడుస్తుంది”…అంటే చికాకుతో ఒళ్ళు  “గోకేసుకునే” భావన కలుగుతుంది.  అయ్యో అని జాలి కూడా వేస్తుంది ! ఉదాహరణకి ఇటీవల మాలతీ చందూర్ గారు పోయినప్పుడు వార్తలు “చదువుతున్న” ఒక ఏంకరమ్మాయి “మాలతీ చందూర్ గారి ‘ప్రమాద వనం’  చాలా పాప్యులర్ అని ప్రవచించింది. “ప్రమదా వనం” కి వచ్చిన ప్రమాదం అది!

నమ్మండి, నమ్మక పొండి. 1957 లో రష్యా వాళ్ళు మొట్టమొదటి స్పుట్నిక్ ఉపగ్ర్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన వార్త రేడియోలో పన్యాల రంగనాథ రావ్ గారు చదవగా విని కొంత అర్ధం అయీ, కొంత అర్ధం అవకా గంగవెర్రులెత్తిపోయి ఈ స్పుట్నిక్ ఎక్కడ కనపడుతుందా, ఎంత జోరుగా ఆకాశంలో ఇటునుంచి ఘుం ఘుం అను దూసుకు పోతుందా అని ఆ రాత్రి అంతా మా డాబా మీద కళ్ళలో వత్తులు పెట్టుకుని ఎదురు చూశాను. ఆ రోజుల్లో ఆకాశంలో రాత్రి పూట అరుదుగా వెలుగుతూ, ఆరిపోతూ కనపడే విమానం లైటు చూసి, అదే రష్యా వారి స్పుట్నిక్ అనుకుని ఎగిరి గంతులు వేసాను. కేవలం రేడియో వార్తలు విని తలక్రిందులు అయిపోయిన ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పగలను.

కేవలం వార్తలే కాకుండా ప్రయాగ నరసింహ శాస్త్రి గారి బుర్ర కథలు, “ఏమండోయ్ బావ గారూ” అనే రాజకీయ విశ్లేషణ కార్యక్రమం, సీత-అనసూయ జానపద గేయాలు ఒకటేమిటి అనేక జీవిత కాలాలకి సరిపడా అద్భుతమైన రేడియో కార్యక్రమాలు వినే అదృష్టం నాకు కలిగింది.  నా  బాగా చిన్నప్పుడు..అంటే ఆటస్థలం కావాల్సిన క్రికెట్, ఫుట్ బాల్  వగైరాలు ఆడుకునే వయస్సుకి ఎదగని వయస్సులో ఆ పార్కులో ఆడుకోవడమే మా జీవిత ధ్యేయం. అక్కడ సిమెంటు జారుడు బల్ల మీద పోటీ లు పడి జారి, నెలకి అర డజను చెడ్డీలకి చిరుగులు పెట్టుకుని మా ఇంట్లో తిట్లు తినే వాడిని.  ఇప్పుడు ఎక్కడా చెడ్డీ చించుకుని ఆనందించే ఆటలే లేవు!  ఇటీవల నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఎవరూ చూడకుండా మా పార్కుకి వెళ్లి, అదే జారుడు బల్ల మీద చెడ్డీ చిరక్కుండా ఒక్క సారే పై నుంచి కిందకి జారి, ఆనందించి వచ్చేశాను. ఆ రోజు అక్కడ నేనొక్కణ్ణే కుర్రాణ్ణి. మిగిలిన పిల్లలు బహుశా ఇళ్ళలో కంప్యూటర్లలో తుపాకీ ఆటలు ఆడుకుంటున్నారు.

సుమారు పదిహేనేళ్ళ క్రితం ఆ వాటర్  ఫౌంటెన్, రేడియో స్తంభం తీసి పారేసి యాభై అడుగుల గాంధీ గారి విగ్రహం పెట్టారు. ఇందుతో ఆనాటి ఫౌంటెనూ, ఈ నాటి గాంధీ గారి విగ్రహం ఫోటో జతపరుస్తున్నాను. ఆ పార్కులో ఇప్పటికీ ఉన్న కొన్ని వందల మొక్కలూ చెట్లలోకీ నాకు బాగా నచ్చేదీ, ప్రపంచంలో ఇంకెక్కడా నేను చూడనిదీ బాడ్మింటన్ బంతి చెట్టు. ఇది పార్క్ లో ఒక మూల (ఇప్పుటికీ స్టేట్ బేంక్ కి ఎదురుగుండా ఉంటుంది) వంద అడుగుల ఎత్తున ఉండి అచ్చు పసుపు రంగులో ఉండే బాడ్మింటన్ బంతి సైజు లో పువ్వులు పూస్తుంది. అవి ముట్టుకుంటే ఆ బంతి లాగే చాలా సున్నితంగా పట్టు తివాసీ నిమిరినట్టుగా ఉంటుంది.

554_Voleti  Parvateesam

ముందుగా నాకు జ్జాపకం ఉన్న కొందరి గురించి చెప్పుకోవాలంటే … మా చిన్నపుడు మా ఇంటికి వీధి వేపు కాక. మిగిలిన మూడు పక్కల ఇళ్ళకీ మాకూ మధ్య గోడలు ఉండేవి కాదు.   ఒక పక్కన వేంకటపార్వతీశ్వర కవులలో ఒకరైన ఓలేటి పార్వతీశం గారి ఇల్లు. ఆయన పెద్ద కొడుకు అచ్యుత రామ చంద్రమూర్తి గారి భార్య భాస్కరం పిన్నీ , మా అమ్మా ఒకే సారి కాపరానికి వచ్చారు. దాన్ని “కీర్తి” వారి ఇల్లు అనే వాళ్ళం. వారి కుటుంబమూ, మేమూ ఎప్పుడూ కలిసే ఉండే వాళ్ళం. మా మామిడి చెట్టు మీద వాళ్ళ పిల్లలూ (లేట్ నారాయణ, పార్వతీశం, లేట్ భాస్కరరావు ఎట్సేటారా), వాళ్ల నూతి దగ్గర జామచెట్టు మీద మేమూ ఎక్కి ఘంటసాల  పుష్ప విలాపం పాడుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటే “వెధవల్లారా, నూతిలో పడి మమ్మల్ని చపకండి రా” అని మా నలుగురు పక్కింటి వాళ్ళూ అరుస్తూ మమ్మల్ని తిడుతూ ఉంటే “వాళ్ల కోరిక ప్రకారం వాళ్ళని చంపకుండా”, “మేము చావకుండా”  మా చిన్నతనం హాయిగా గడిపాం. విశేషం ఏమిటంటే ఆనాటి  ఓలేటి పార్వతీశం అనే గొప్ప కవి గారి గురించి నాకు అప్పుడు తెలియదు కానీ మా ఇంటి ఎదురుగుండా గిడ్డీ గారి సందులో ఉండే ఆయన రెండో కొడుకు శశాంక చాలా మంచి కవి అని ఖచ్చితంగా తెలుసును. ఎప్పుడూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వేషధారణలో ఉండే ఆయనా, ఆయన భార్యా (కందుకూరి వారి ఆడబడుచు. పన్యాల వారి తరువాత న్యూస్ రీడర్ గా మంచి  పేరు తెచ్చుకున్న కందుకూరి సూర్యనారాయణ గారి సహోదరి. ఆవిడ తమ్ముడు నటరాజ్ నాకు బొంబాయి లో సహాధ్యాయి) చాలా అందమైన జంట. వారి కొడుకే ఈ నాడు హైదరాబాద్ లో దూర్ దర్శన్ లో పెద్ద ఉద్యోగంలో ఉన్న ఓలేటి పార్వతీశం. (ఈయనని రెండేళ్ళ క్రితం మొదటి సారిగా విజయనగరం లో చాసో గారి స్పూర్తి సభలో కలిశాను.) భావ కవిగా ఎంతో పైకి వస్తున్న రోజులలో చిన్న వయసులో హఠాత్తుగా శశాంక పోయిన రోజులు నాకు యింకా బాగా గుర్తు. ఇక పార్కుకి ఒక మూలగా అప్పటి జిల్లా పరిషత్ సెక్రటరీ పుల్లెల రమణయ్య గారు (ఆయన సతీమణి అద్వితీయమైన సంగీత విద్వాంసురాలు.) ఉండేవారు.

Gandhi_Nagar_Park,Kakinada(1)

ఇక మా ఇంటి వెనకాల మా బంధువులైన తాళ్లూరి సుబ్బారావు గారు , అతని బామ్మ గారు, మా నారాయణ తాతయ్య గారు (మా బామ్మ గారి తమ్ముడు), మరొక పక్క రాచకొండ వారు, గిడ్డీ గారి సందులో టేకుమళ్ళ దుర్గా ప్రసాదరావు గారు (షావుకారు జానకి, కృష్ణకుమారికి పిన తండ్రి వరస అని గుర్తు), అప్పలాచార్య గారు, ఎదురు గుండా ఇంట్లో విఠాల సుబ్రమణ్యం గారు, పక్కనే చీమలకొండ వారు ఉండే వారు. ఆ రోజుల్లో మా వీధి కల్లా పెద్ద జోకు విఠాల సుబ్రమణ్యం గారు రాత్రి భోజనం అయ్యాక తేన్చే  తేనుపు తాలూకు శబ్దానికి అక్కడికి వంద గజాల దూరంలో పార్కులో మధ్యలో ఉన్న వాటర్ ఫౌంటెన్ లో బంగారం చేపలు ఉలిక్కిపడి ఈదడం మానేసి బయటకి గెంతేస్తాయిట! ఇక కాస్త దూరం వెడితే, పార్కుకి ఒక పక్క సినీ నటి జమున భర్త రమణారావు కుటుంబం ఉండే వారు. జమున తమ్ముడు గిరిధర్ , అతని పిల్లలు మాకు ఆత్మీయులే.  పార్కుకి వెనకాల వేపు నేను చదువుకున్న ప్రాధమిక పాఠశాల అనే “దుంపల బడి”, పురపాలకోన్నత పాఠశాల, అటుపక్క ఒంటి మామిడి జంక్షన్ దగ్గర ఈ నాటి వైఎస్సార్ పార్టీ నాయకుడు , సినీ నటుడు విజయ చందర్ కుటుంబం ఉండేది. అతను ఎప్పుడూ మా ఇంటికి వచ్చి, మా చెల్లెళ్ళని పార్కుకి తీసుకెళ్ళే వాడు, ఆడించడానికీ, రేడియో వినడానికీ. ఇక  ఆ ప్రాంతాలలోనే  అలనాటి స్వాతంత్య సమరయోధులు, పార్లమెంట్ మెంబర్ మరియు గవర్నర్ గా చేసిన మొసలికంటి తిరుమల రావు గారు ఉండేవారు. ఆ వీధిలో శంకరం గారు, టీకాల ఇన్ స్పెక్టర్ గారు (ఏడిద వారు), కరణం వారూ, దిగుమర్తి గోపాల స్వామి గారూ మొదలైన వారు ఉండే వారు. ఇందులో శంకరం గారు “సకల విద్యా పారంగతులు” ..అనగా ఆయనే మా హోమియోపతీ వైద్యులు, ఇన్సూరెన్స్ ఏజెంటు, మా వార్డు కి మ్యునిసిపాల్ కౌన్సిలరు, జైలు కెళ్ళిన గాంధేయ వాది….నిరంతరం తెల్ల ఖద్దరు వస్త్రదారి. ఇక సుప్రసిద్ద రాజకీయ నాయకులూ, మా కుటుంబానికి బాగా సన్నిహితులూ, కపిలేశ్వరపురం జమీందారులు, అయిన స్వర్గీయులు ఎస్.పి.బీ.కె. సత్యనారాయణ రావు గారు (కేంద్ర మంత్రి), ఎస్. పి. బి. కె. పట్టాభి రామారావు గారు (రాష్ట్ర మంత్రి) వారి నివాసం సరిగ్గా మా ఇంటికి ఎదురుగానే.  అందులో పట్టాభి రామారావు గారి ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నికలకి మా చిన్నన్నయ్య ఎలెక్షన్ ఏజెంట్ గా వ్యవహరించి నప్పుడు ఆయన నెగ్గగానే, మా అన్నయ్యని హెలికాప్టర్ లో  తిరుపతి తీసుకెళ్ళి ఎంతో గౌరవం చేశారు. మా నాన్న గారికి ఎంతో సన్నిహితులైన సత్యనారాయణ రావు గారు నా పెళ్లి విందుకి వచ్చి నన్నూ, మా ఆవిడనీ ఆశీర్వదించారు.  ఆ ఇద్దరు జమీందారులూ, మా నాన్న గారూ, మా చిన్నన్నయ్యా కూడా స్వర్గస్తులే అయినా కులాలకతీతంగా ఉన్న ఉన్న ఆ అనుబంధాల గురించి నాకు ఉన్న కొన్ని జ్జాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి. అలాగే అప్పటి ఎమ్మెల్యే ఎం.వీ. శాస్త్రి గారి కుటుంబం మాకు ఎంతో ఆప్తులు. వీళ్ళలో నేను చెప్పనిది కాకినాడలో మొట్టమొదటి సినిమా హాళ్ళు (పేలస్ టాకీస్, క్రౌన్ టాకీస్) కట్టిన గొలగాబత్తుల రాఘవుల గారి రెండో కొడుకు, మాకు అత్యంత సన్నిహితుడూ అయిన స్వామి నాయుడి గురించి. అతని గురించి ఎప్ప్పుడో చెప్పితీరతాను.  అసలు మా చిన్నప్పడు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ల గురించి ఎందుకు చెప్తున్నాను అంటే..ఇప్పుడు అక్కడ కాకినాడ లోనూ, ఇక్కడ హ్యూస్టన్ లోనూ మా నైబర్స్ ఎవరో నాకు చూచాయగానే  తెలుసును. ఇప్పుడు ఇక్కడా కూడా అన్ని ఇళ్ళలోనూ ఎప్పుడూ తలుపులు మూసుకునే ఉంటాయి. అంతా గూఢుపుఠాణీయే. ఎక్కడి దొంగలు అక్కడే గుప్ చిప్!

ఇక అవకాశాలు ఉన్నా, అదృష్టానికి నోచుకోక నేను ఎప్పుడూ చూడని దేవులపల్లి కృష్ణశాస్త్రి, నటి సూర్యాకాంతం, పాలగుమ్మి పద్మరాజు, దుర్గాబాయమ్మ గారు, నేను చూసిన వారూ,  పెద్దయ్యాక బాగా పరిచయం ఉన్నవారిలో కొందరైన ఈమని శంకర శాస్త్రి , చిట్టి బాబు, పాలగుమ్మి విశ్వనాథం, బులుసు వేంకటేశ్వర్లు సోదరులు, హాస్య నటుడు నల్ల రామ్మూర్తి, ఎస్. వి. రంగారావు, మొదలైన లబ్ధ ప్రతిష్టులు మా ప్రాంతాలలోనే ఉండే వారు.  అన్నట్టు నటి సూర్యాకాంతానికీ, మా కుటుంబానికీ ఉన్న పెద్ద కనెక్షన్ ఆడారివాడిలా నడిచే తమ్మయ్య లింగం అనే టైలర్. తాను ఎప్పుడు తమ్మయ్య లింగం చేత గౌను కుట్టించుకున్నా  “సరిగ్గా కుట్టాడా, చూసి చెప్పండి” అని రింగు, రింగులుగా తిరుగుతూ సూర్యాకాంతం మా ఇంటికి వచ్చి మా అమ్మని సలహా అడిగేదిట!

ఇక బులుసు సోదరులు సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో పండితులు. కానీ వారి వేషదారణని బట్టి  వారిద్దరినీ “దలైలామా- పంచెన్ లామా” అనీ, “పెద్ద బులుసూ-చిన్న బులుసూ” అని కుర్రాళ్ళు పిలిచేవారు.  అందులో పెద్ద  బులుసు గారు రామారావు పేటలో మా సెకండరీ స్కూల్ కి, ఈశ్వర పుస్తక భాండాగారానికీ ఎదురుగుండానూ మేడలో ఉండే వారు. తన “వ్యాస పీఠం” మీద ఆయన నేల మీద కూచుని చదువుకుంటూనో, వ్రాసుకుంటూనో ఉండే ఆయన్ని ప్రతీ రోజూ చూసే వాడిని కానీ తొలికేంద్ర సాహిత్య గ్రహీతలలో ఒకరు అయిన ఆయన గురించి నా చిన్నప్పుడు నాకు తెలిస్తే ప్రతీ రోజూ ఆయనకీ శిరస్సు వంచి పాదాభివందనం చేసే వాణ్ణి.  ఇక ఆ వీధిలో మరొక నాలుగు అడుగులు వేస్తే , వీణ చిట్టి బాబు-ఈమని-పాలగుమ్మి వారి ఇళ్ళు. రోజూ అలాగే వెళ్ళినా ఒక్క రోజు కూడా అక్కడ ఆగి  నమస్కారం పెట్టుకునే “బుద్ది” నాకు ఆ చిన్నతనంలో లేదు.  అయితే నేను “పెద్దయ్యాక” వీణ చిట్టి బాబు గారు ఇండియాలోనూ,  అమెరికా వచ్చినప్పుడూ బాగా పరిచయం అయ్యారు.

వీరందరిలో ఇప్పటికీ తలచుకుంటే నాకు “భయం” వేసేది మహా నటుడు ఎస్వీ రంగారావే. ఆయన్ని చూసింది కూడా అరగంటే! ఆయన మా ఇంటి దగ్గరే ఉండే కోకా నరసింహా రావు గారు అనే ఎముకల డాక్టర్ గారికి బంధువు. ఒక సారి రంగారావు గారు వారింటికి వచ్చినప్పుడు కాకినాడ దగ్గర చింతపల్లి అడవులలో వేటకి వెళ్లి, ఒక పెద్ద పులిని చంపి, పెద్ద లారీలో దాన్ని తీసుకొచ్చి మా గాంధీ బొమ్మ దగ్గర ప్రదర్సనకి పెట్టి ఆర్భాటం చేసారు. అది చూడడానికి నేను వెళ్లినప్పుడు రంగారావు గారు పెద్ద తుపాకీతో ఆ పులి తలదగ్గర నుంచుని ఫోటో తీయించుకుంటున్నారు. చుట్టూ ముగిన జనం మోకాళ్ళ మధ్య లోంచి ముందుకు వెళ్లి ఆయన్నీ, తుపాకీనీ, చచ్చిపడున్న ఆ పది అడుగుల పెద్ద పులినీ చూసి  హడిలి చచ్చిపోయాను. ఇప్పటికీ ఆ సీను తలచుకుంటే ..వావ్! ఇదంతా “పాతాళ భైరవి” సినిమా తరువాత అని వేరే చెప్పక్కర లేదు.

_2008_Bulusu_Sambamurty

ఆఖరి అంశంగా … నాకు పదమూడు ఏళ్ల వయస్సులో .. ఒక రోజు కాకినాడ నగరం అంతా “విషాదం” లో ములిగి పోయింది. ఆ రోజు “మహర్షి” బులుసు సాంబమూర్తి గారు కేవలం 72 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో, ఏకాకిగా, దరిద్ర నారాయణుడిగా “జీవించ” లేక మరణించారు. ఆ రోజు “ఎవరో పెద్దాయన పోయారు” అని మా స్కూల్ కి శలవు ఇవ్వగానే క్రికెట్ ఆడుకోడానికి వెళ్ళిపోయిన “చిన్నతనానికి” ఇప్పటికీ నాకు ఇప్పటికీ సిగ్గేస్తుంది. ఎందుకంటే టంగుటూరి ప్రకాశం గారి తో సమాన స్థాయిలో క్రిమినల్ లాయర్ గా ఆ రోజుల్లోనే లక్షాధికారి అయిన సాంబమూర్తి గారు అన్నీ త్యాగం చేసి , గాంధీ గారి కంటే ముందే కొల్లాయి కట్టిన దేశభక్తులు.  1923 లో కాకినాడ లో కాంగ్రెస్ సభలు జరగడానికి ప్రధాన కారకులు, నిర్వాహకులు ఆయనే. నేను చిన్నప్పుడు విన్న విషయం ఏమిటంటే ఆయన ఆ కాంగ్రెస్ సభలో ప్రసంగం మొదలు పెట్టగానే ఎవరో ఒక చిన్న చీటీ ఆయన చేతిలో పెట్టారుట. అది చదివి, మడిచి జేబులో పెట్టుకుని సాంబమూర్తి గారు తన ప్రసంగం పూర్తి చేసి సభాస్థలాన్ని విడిచి మర్నాడు తిరిగి వచ్చారుట. “మీ కొడుకు అరగంట క్రితం మరణించాడు. మీరు వెంటనే ఇంటికి వెళ్ళాలి” అన్నదే ఆ చీటీలో ఉన్న వాక్యం. ఒక కర్మయోగిగా “మహర్షి” అనే పేరుతో సాంబమూర్తి గారు అప్పటినుంచీ లబ్ధప్రతిష్టులయ్యారు.  ఆ తరువాత  ఆయన 1926 లో దేశం లో తొలి సారిగా “మనకి డొమినియన్ స్టేటస్ కాదు. “పూర్ణ స్వరాజ్యం” కావాలి అని ప్రతిపాదించిన మహానుభావుడు కూడా ఆయనే. మద్రాసులోని సాంబమూర్తి గారి గృహంలోనే మరొక మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం అవతరణకి ప్రాణత్యాగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం, స్వరాష్ట్రం కోసం ఆ ఇద్దరూ చేసిన త్యాగాలు ఈ నాడు “దౌర్భాగ్యుల” సంక్షేమం కోసమేనేమో అని నాకు అనిపిస్తోంది.

ఇందులో “నీతి” ఏమిటంటే చిన్నప్పుడు తెలియక నా చుట్టుపక్కల ఉన్న “అదృష్టాలని” గుర్తించలేక పొరపాట్లు చేసినా, “ఇప్పటికైనా మించిపోలేదు సుమా, అసలు జీవితం ఇపుడే కదా మొదలయ్యిందీ: అని నాకు నేనే  అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఉంటాను….నా అదృష్టాలని వెతుక్కుంటూ…ఆనందపడుతూ!

…..వంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్

తమవి కాకుండా పోయిన శరీరాలు,మనసులు చెప్పిన కథ ఇది!

ప్రఖ్యాత తమిళ రచయిత్రి సల్మా వ్రాసిన ఒక అద్భుతమైన నవల చదివానీ మధ్య.

ఆ నవల చదివిన అనుభవం ఎవరితోనూ పంచుకోకుండా వుండడం అసాధ్యమనిపించింది. కుటుంబాలలో స్త్రీల ఆశ నిరాశలు అనుభవాలు ఆనందాలు దుఃఖాలు కళ్ళముందు పరిచే అచ్చమైన  స్త్రీల నవల ఇది . సల్మా ఎక్కువగా కవిత్వమే వ్రాసింది. స్త్రీల లైంగికత్వం గురించీ వారి శరీరాల గురించీ నిస్సంకోచంగా వ్రాసింది.ఆమెవి అశ్లీల రచనలన్న ఆరోపణలనీ బెదిరింపుల్నీధైర్యంగా ఎదుర్కుంది  .  “అర్థరాత్రి కథలు” అని అర్థం వచ్చే ఈ తమిళ నవల ను “అవర్ పాస్ట్ మిడ్ నైట్” పేరుతో లక్ష్మీ హామ్ స్ట్రామ్ ఇంగ్లిష్  లోకి అనువదించగా జుబాన్  సంస్థ ప్రచురించింది. 478 పేజీల పెద్ద నవల ..

salma-hindu

“స్త్రీల అసమానత్వం చర్చనీయంగా వున్న ఈ పరిస్థితిలో, స్త్రీ శరీరంలో జీవిస్తూ స్త్రీవాదిగా ఆలోచించకుండా ఎట్లా?” అంటుంది మీనా అలెక్జాండర్ అనే స్త్రీవాద కవి. అట్లాగే సల్మా కూడా పనిగట్టుకుని స్త్రీవాద కవిత్వమూ నవలా వ్రాయకపోయినా ఆమె రచనల్లో తప్పనిసరిగా స్త్రీవాదమే వుంటుంది.

ఒక తమిళ గ్రామంలో కొన్ని ముస్లిమ్ కుటుంబాలలోని స్త్రీల కథ ఇది..ఇందులోని అయిదారు కుటుంబాలకూ దగ్గర బంధుత్వం వుంది.స్త్రీల మధ్య స్నేహం వుంది.ఒకరి జీవితాలనుగురించి వారి వ్యక్తిగత వివరాల గురించీ తెలుసుకోవాలన్న కుతూహలం మరొకరికి వుంది .ఒకరిపట్ల ఒకరికి ప్రేమ వుంది ,అసూయ వుంది. సానుభూతికూడా వుంది.

ఏడో తరగతి చదివే రబియా పాత్రతో ఈ నవల  ప్రారంభం అవుతుంది.ప్రపంచంపట్ల ప్రేమతో రెక్కలు విప్పుకుంటున్న ఊహలతో,సున్నిత మనస్కురాలైన చిన్నారి రబియా!!  .ఆమె స్నేహితురాలు.మదీనా!.ఇద్దరిమద్యా రహస్యాలు లేవు .ఒకరికోసం ఒకరు అన్నట్లుంటారు.అహమ్మద్ కూడా వాళ్ళ జట్టే. ఒకరోజు స్నేహితులతో కలిసి సినిమా చూసొచ్చి తల్లి చేతిలో బాగా దెబ్బలు తింటుంది రబియా. తల్లి జోహ్రా రబియాను మంచి ఆడపిల్లగా తీర్చిదిద్దే క్రమంలో వుంటుంది. రబియా తండ్రి కరీం, పెత్తండ్రి ఖాదర్ లది ఉమ్మడి కుటుంబం .అన్నతమ్ములు తోడికోడళ్ళు ఒకరంటే ఒకరు ప్రేమగా వుంటారు.రబియా పెద్దమ్మ రహీమా సంప్రదాయాలపట్ల కాస్త సడలింపు చూపించి తన కూతుర్ని పట్నంలోతన తండ్రి దగ్గర వుంచి హైస్కూల్ చదువు పూర్తి చేయిస్తుంది గ్రామంలో అది సాధ్యం కాదు.ఎందుకంటే ఈడొచ్చిన ఆడపిల్లలు ఇల్లుదాటరాదు.పరాయి పురుషుల కళ్ళపడరాదు.స్నానం చేసేటప్పుడు కూడా తమశరీరాలను తాము నగ్నంగా చూసుకోరాదు.సెక్స్ గురించి మాట్లాడరాదుఇటువంటి ఆంక్షలన్నీ ఆ గ్రామంలో వున్నాయి.

హైస్కూల్ చదువు పూర్తి చేసుకుని వచ్చిన వహీదాకు వివాహం తలపెట్టాడు తండ్రి.ఆమె ఇంకా చిన్నపిల్ల అప్పుడే పెళ్ళి వద్దని తల్లి చెప్పినా వినడు.వహీదాకు తనకు కాబోయే భర్త గురించి కొన్ని కోరికలున్నాయి.అతను సినిమాల్లో హీరోలా తన మీద ప్రేమ చూపించాలని తనను అభిమానించాలని అట్లా చిన్న చిన్న కోరికలున్నాయి. ఎప్పుడూ సినిమాపాటలు కూనిరాగాలు తీస్తూ వుంటుంది. వహీదా  హైస్కూల్ల్లో చదివినా మంచి కట్టడిలో పెరిగింది మతాచారాలు సంప్రదాయాలు శుచీ శుభ్రాలు అన్నీ తల్లి ఆమెకు తెలియచెప్పింది . రబియా తండ్రి కరీంకి భార్య జోహ్రా అంటే లెక్కలేదు. భోజనం చేసేటప్పుడు కూడా అతను ఏం లోపం వచ్చినా గట్టిగా అరుస్తాడు ఆమెను గడగడలాడిస్తాడు. అతనికి  వాళ్ల ఎస్టేట్ లో పనిచేసే మరుయాయి అనే ఆవిడతో సంబంధంవుంది.ఆ విషయం ఇంట్లోవాళ్ళకే కాక వూరందరికీ కూడా తెలుసు.మగవాళ్లకి అట్లా సంబంధాలుండడం సహజం అనుకుంటారు. మరుయాయి ఇంట్లోనూ తోటలోనూ కష్టపడి పనిచేస్తూ కరీం నే తన భర్తగా భావిస్తూ విశ్వాసంగా వుంటుంది.తను హిందూ అయినా బొట్టు పెట్టుకోదు.ముస్లిమ్ లా వుంటుంది. ఆమెకు సంతానం కలగకుండా ఆపరేషన్ చేయిస్తాడు కరీం. కరీంభార్య జోహ్రా ఆమెను పనిమనిషిగా సహిస్తూ వుంటుంది. కరీం అన్న ఖాదర్ కి భార్య రహీమా అంటే అభిమానం .ఆమె మాటకు విలువ ఇస్తాడు.కానీ కూతురు పెళ్ళి విషయంలో మాత్రం ఏకపక్షనిర్ణయం తీసుకుంటాడు. తన తల్లికిచ్చిన మాట ప్రకారం తన సోదరి కొడుకు సికందర్ తో వివాహం ఖాయం చేస్తాడు.అతడు వహీదా కన్న పదిహేనేళ్ళు పెడ్దవాడు. ఖాదర్ కరీం సోదరులకు పచారీ కొట్టు వుంది.భూములూ తోటలూ వున్నాయి. కారుకూడావుంది.

వీళ్ళుకాక వీళ్ళ బంధువుల కుటుంబాలు మరి మూడు వున్నాయి ఆ వూళ్ళో. రబియా స్నేహితురాలు మదీనా కుటుంబం.మదీనా తండ్రి సింగపూర్ లో  వ్యాపారం చేస్తూ చనిపోయాడు. ఆమె తల్లి  సైనా, ,అక్క ఫరీదాకాక మరొ ఇద్దరు మానసిక వైకల్యంతోపుట్టిన అక్కలు వుంటారు అన్న సులేమాన్ సింగపూర్ లో వుంటాడు.వదిన ముంతాజ్ ఇక్కడే వుంటుంది.

మరోకుటుంబం సారా ది.ఆవిడ  భర్త కూడా సింగపూర్ లో వుంటాడు. వృద్ధుడైనా,జబ్బు చేసినా స్వదేశానికి రమ్మంటే తిరిగిరాడు.ఆమె కూతురు షరీఫా భర్త పెళ్లయిన కొత్తలోనే దుబాయ్ లో ప్రమాదంలో చనిపోయాడు,అప్పుడు గర్భవతిగా వున్న షరీఫా భర్త తమ్ముడిని పెళ్ళి చేసుకోడానికి నిరాకరిస్తుంది.కూతుర్ని చూసుకుంటూ బ్రతుకుతానంటుంది.ఆమెకొక అక్క వుంటుంది.ఆమెకు శారీరక పెరుగుదల లేదు,పెద్దమనిషి కాలేదు.మరో తమ్ముడు కూడా వుంటాడు చిన్నవాడు.

మరొక కుటుంబం నఫీజాది.ఆమెకు ఇద్దరు మగపిల్లలు.అందులో అహమ్మద్ అనే పిల్లవాడు రబియాకు స్నేహితుడు.అతనంటే రబియాకు ప్రేమ .పెద్దైనాక అతన్ని పెళ్ళిచేసుకోవాలనుకుంటుంది. నఫీజాకూ ఆమె భర్తకూ వయస్సులో చాలా తేడావుంది. తమ సమవయస్కుడైనా అజీజ్ తో ఆమెకు స్నేహం వుంది.అది చాలామందికి తెలుసు.

ఈ కుటుంబాలలో మగవాళ్ళు డబ్బు సంపాదనకోసం విదేశాలు వెళ్ళారు.కుటుంబాలు మాత్రం ఇక్కడే వున్నాయి.వివాహం చేసుకున్న యువకులు కూడా ఒంటరిగానే దుబాయ్ సింగపూర్ సిలోన్ వెడతారు .ఏడాదికో రెండేళ్ళకో ఇంటికి వస్తారు. అప్పుడు భార్యలు గర్భం దాల్చి వంశాన్ని వృద్ధిచెయ్యాలని ఆ కుటుంభాలు ఆశిస్తాయి.అంతవరకూ వాళ్ళ భార్యలు అత్తింట్లో వుంటారు. అత్త మామల అదుపాజ్ఞలలో వుంటారు.

ఈ కుటుంబాల మధ్య చుట్టరికం వుంది. ఒకరింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న కుతూహలం ఇంకొకకరికి వుంది.జోహ్రా రహీమాలకు తప్ప మిగతా స్త్రీలందరికీ  ఊసుపోక కబుర్లెక్కువ.ఇందులో ఎవరి బాధలు వారికున్నాయి.అయినా ఇతరుల  వ్యక్తిగత విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ.  అందులో నఫీజా ,ముంతాజ్ లకు మరీ ఎక్కువ. వాళ్ళిద్దరూ అన్ని విషయాల గురించి సంకోచమనేది లేకుండా మాట్లాడతారు.బార్యా భర్తల అంతరంగిక విషయాలను గురించి కూడా బాహాటంగా చర్చిస్తారు.

hourpastmidnight

తన ఆడబడుచు సబియా సంగతి రహీమాకు తెలుసు.కూతురు అక్కడ సుఖపడదని కూడా తెలుసు.కానీ భర్త ఆమె ను సంప్రదించకుండానే నిఖా నిర్ణయించేశాడు.. రహీమా ముందు బాధ పడినా సర్దుకుంటుంది. సింగపూర్ లో సికందర్ కి ఆడవాళ్లతో సంబంధాలున్నాయని కూడా కొందరు చెప్పారు. “అయినా మగవాడన్నాక ఇన్నేళ్ళు పెళ్ళికాకుండా వుంటే సంబంధాలుండడం ఒక వింతా ఏం?” అంటాడు కరీం. ఒక పక్క రంజాన్ పండగ సన్నాహాలు మరొక పక్క వహీదా పెళ్ళి సన్నాహాలు జరుగుతూ వుంటాయి. వహీదాకి సికిందర్ మేనత్త కొడుకే అయినప్పటికీ అతనినెప్పుడూ ఆమె చూడలేదు ,మాట్లాడలేదు. ఎటువంటి మనస్తత్వమో తెలియదు. పెళ్ళి అట్టహాసంగా జరిగిపోయింది. సబియా.నోరు మంచిది కాదు.కొడుకు పెళ్ళికి తమ్ముళ్ళు ఎంత ముట్టచెప్పినా అసంతృప్తే .ఇంకా ఇంకా లాంఛనాలు తేలేదని కోడల్ని దెప్పుతూ వుంటుంది.వహీదా మామ సయ్యద్ కొడుకు పెళ్లికోసం సిలోన్ నించీ వచ్చాడు.అక్కడ జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి రేడియోలో విని మళ్ళీ వెళ్ళడమా మానడమా అని ఆలోచిస్తున్నాడు.

వహీదా అత్త సబియా వుండే వూళ్ళోనే జోహ్రా తల్లి అమీనా వుంటుంది. జోహ్రా చెల్లెలు ఫిర్ దౌస్ పెళ్ళయిన వెంటనే భర్తని వదిలేసి వచ్చింది. ఆ పిన్ని అంటే రబియాకు చాలా ఇష్టం కానీ ఆమె సంగతి ఇంట్లో ఎత్తవద్దంటుంది జోహ్రా.ఫిర్ దౌస్ కి వయసులో పెద్దవాడైన ,డబ్బున్న  ఒక అనాకారితో   పెళ్ళి కుదిర్చినది కరీం. ఎందుకంటే మామ చనిపోయాక అత్త అమీనా దగ్గర కట్నకానుకలు భారీగా ఇచ్చే టంత డబ్బులేదు. ఆ కుటుంబానికి మగదిక్కు తనాన్ని భుజాన వేసుకుని తన మీద భారం పడకుండా ఆ సంబంధం కుదిర్చాడు. భర్త ఎట్లా వున్నా సర్దుకుని కాపురం చేసుకోవలసిన ధర్మం స్త్రీలది అని అతనే కాదు మొత్తం సమాజం అంతా అంటుంది.ఆఖరికి అక్క జోహ్రా తల్లి అమీనా కూడా!!..కానీ ఫీర్దౌస్ అతన్ని మొదటి సారి చూసిన క్షణాన్నే అసహ్యించుకుంటుంది .అతనితో కాపురం తన వల్ల కాదని పుట్టింటికి తిరిగి వచ్చింది.అదొక మచ్చ ఆ కుటుంబానికి.ఎప్పుడైతే అత్తవారింటినుంచీ వచ్చిందో ఇంక ఆమె గుమ్మం దాటకూడదు.అలంకరించుకోకూడదు. ఆ పిల్ల ఏతప్పూ చెయ్యకుండా చూడాల్సిన గురుతరభాధ్యత తల్లి మీద వుంటుంది. అయితే ఆ సమాజంలో స్త్రీలకు మళ్ళీ పెళ్ళి చేసుకునే హక్కు వున్నది కనుక ఏదోఒక సంబంధం తెచ్చి పెళ్ళిచేసి భారం తీర్చుకోవాలని చూస్తూవుంటుంది అమీనా.రెండో పెళ్ళివాళ్లని పిల్లలున్న వాళ్లని ఫిర్దౌస్ తిరస్కరిస్తూ వుంటుంది.ఆమె అందగత్తె.వయస్సు తెచ్చే కోరికలున్నాయి.కానీ సమాజందృష్టిలో కుటుంబానికి మచ్చ తెచ్చింది. చెల్లెలికి ఇలాంటి స్థితి రావడానికి తన భర్తే కారణం అని తెలిసీ ఏమీ అనలేని అశక్తురాలు జోహ్రా. అమీనా వుంటున్న ఇల్లు పెద్దది.ఆ ఇల్లు ఆమె భర్త ఇస్మాయిల్ మనసు పడి కట్టుకున్నది.ఊళ్ళో ఎవరిల్లూ లేనంత అందంగా కట్టుకున్నది.ఇప్పుడతను చనిపోయాక రెండో కూతురు తిరిగి వచ్చాక అమీనా ఇంట్లో ఒక భాగం శివ అనే టీచర్ కి అద్దెకిచ్చింది.అతను ఫిర్ దౌస్ కి రోజూ కనపడుతూ వుంటాడు. ఆమె అతని మీద మనసు పడుతుంది. ఇద్దరూ దగ్గరౌతారు. అది తప్పని ఫిర్ దౌస్ కి తెలుసు.కానీ ఆమె ఆ అనుభవాన్ని ప్రేమించింది.ఆనందించింది. అమీనా ఇల్లు సబియా ఇంటికి ఎదురే ..

వహీదా పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వచ్చింది. మొదటిరాత్రే అతని స్వభావం అర్థమైంది ఆమెకి. పెళ్ళయే వరకూ సెక్స్ గురించి మాట్లాడనివ్వకుండా . తమశరీరాలను గురించి తెలుసుకోనివ్వకుండా నాలుగు గోడలమధ్య బందీలుగా వున్న ఆడపిల్లలకు, పెళ్ళయిన మొదటి రాత్రే బంధువులంతా చేరి భర్తకి సహకరించమని హితబోధ చేస్తారు. పదిహేను పదహారేళ్లకే పెళ్ళళ్ళవుతాయి.చిన్న పిల్ల అనికూడా చూడకుండా సికందర్ జరిపిన మోటు శృంగారానికి .పొత్తికడుపులో నొప్పితో లుంగలు చుట్టుకు పోతుంది వహీదా.. మొదట్లో అంతే అని ఆమె మామగారు వెకిలిగా మట్లాడతాడు.అత్త పెడసరం మాటలు, మామగారి ఆకలిచూపులు వెకిలి మాటలు భార్యంటే సెక్స్ అని తప్ప ఇంకే మృదువైన భావమూ లేని సికందర్  వహీదా కి నాలుగురోజుల్లోనే నరకం చూపిస్తారు.అసలు సికందర్  కి కూడా వహీదాని చేసుకోడం ఇష్టంలేదు.చిన్నపిల్ల అని.అతనికి ఎదురింటి ఫిర్ దౌస్ మీద ఇష్టం.కానీ అమీనాదగ్గర డబ్బు లేదని అల్లుడికి కట్నకానుకలు భారీగా ఇవ్వలేదనీ సబియా ఒప్పుకోదు. మళ్ళి ఇప్పుడు ఫిర్దౌస్ భర్తని వదిలి వచ్చాక కూడా ఆమెని పెళ్లిచేసుకుంటానంటాడు.కానీ తల్లి అసలు ఒప్పుకోదు. అతనికి కూడా ఇది బలవంతపు పెళ్ళే!

ఒక రోజు రాత్రి ఎంతకీ నిద్ర పట్టక బాల్కనీలో నిలబడుతుంది వహీదా. ఆ అమ్మాయి చిన్నప్పటినించీ సమాజం చెప్పే  మంచిచెడులను వింటూ పెరిగింది.తప్పొప్పులను గురించీ సమాజం చేసే వ్యాఖ్యానాలు వింటూ పెరిగింది. బాల్కనీలో నిలబడ్డ వహీదాకి అప్పుడే ఎదురింట్లో నుంచీ ఫిర్ దౌస్ శివ ఇంటి వైపు వెడుతూ కనపడుతుంది. కోపంతో మండిపడుతూ మెట్లుదిగి ఎదురింటికి వెళ్ళి ఫిర్ దౌస్ నీ శివనీ “తప్పుచేస్తూండ”గా పట్టుకుని దులిపేస్తుంది,.అపుడే ఫిర్ దౌస్ సహనం కోల్పోయి వహీదా  తల్లి నీ పిన తండ్రినీ గురించీ ఒక మాట అంటుంది. వహీదా వెనక్కి వచ్చేస్తుంది.కానీ ఆమె చేసిన తొందరపాటు పని ఎంతకి దారితీస్తుందో ఊహించలేదు. వహీదాకీ ఫిర్ దౌస్ కీ జరిగిన సంభాషణంతా విన్న అమీనా కూతురు చేసిన పనిని క్షమించదు.ఎలుకలమందు తెచ్చి “మనిద్దర్లో ఎవరో ఒకరం చనిపోవాలి.చెప్పు,నువ్వా ,నేనా?” అంటుంది. జీవన కాంక్ష తో తల్లి పాదాలు పట్టుకుని వేడుకుంటుంది ఫిర్దౌస్ తనకు బ్రతకాలని వుందని. కానీ ఆమే చనిపోక తప్పలేదు.

ఆచారం ప్రకారం అత్తవారింటికి వచ్చిన నలభై రోజుల తరువాత పుట్టింటికి వెళ్ళి ఒడినింపుకు రావాలి.ఆడపిల్లలు పుట్టింటికి బయలు దేరిన వహీదా తన నగలన్నీ సర్దుకుని ఇంక జన్మలో అత్తగారింటికి రావొద్దనుకుంటుంది. సబియా శుభ్రంలేనితనం .మామగారు సయ్యద్ వెకిలి మాటలు ఆకలి చూపులు సికందర్ నిర్లక్ష్యం ఆమెకక్కడ నరకాన్ని చూపించాయి. ఫిర్దౌస్ మరణం అమీనాని అపరాధభావంతో కృంగదీసి ఆరోగ్యం మీద దెబ్బతీసింది,తల్లిని చూసుకోడానికి వచ్చిన జోహ్రాకు ఫిర్దౌస్ మరణానికి కారణాలు ,వహీదా మాటలు అన్నీ తెలిసాయి. గతంలో ఎప్పుడో తన భర్త రహీమాతో చేసిన తప్పు గురించి తెలిసింది.ఆమె రహీమాని ద్వేషించడం ప్రారంభించింది.ఉమ్మడి కుటుంబం వేరుపడాల్సిందే నని పట్టుపట్టింది.అ ఇంటిని విభజిస్తూ గోడ కట్టడం మొదలౌతుంది.

మదీనా అన్న సులేమాన్ సింగపూర్ నుంచీ వచ్చాడు.చెల్లెలు ఫరీదాకు పెళ్ళి చెయ్యాలి. భార్య ముంతాజ్ ను గర్భవతిని చెయ్యాలి అని రెండు ముఖ్యమైన పనులు పెట్ట్టుకుని వచ్చాడు. మదీనా ఇల్లు రబియా ఇంటికి ఎదురే .వాళ్ళ వాకిట్లో కారు ఆగినపుడల్లా డ్రయివర్ ముత్తు ను చూసి నవ్వుతూ వుంటుంది ఫరీదా. ఆ సంగతి ఆమె వదిన ముంతాజ్ కి తెలుసు.సులేమాన్ స్వభావం ఎరిగిన ముంతాజ్ అతనికి చెప్పదు.తప్పొప్పుల విషయంలో మతాచారాల విషయంలో చాలా కఠినంగా వుంటాడు సులేమాన్. కరీం ఇంట్లో పని చేసే ఫాతిమా ఒక హిందువుతో వెళ్ళిపోయిందని మసీదులో పెద్ద చర్చ లేవదీసి ఫాతిమా తల్లిని వెలివేయిస్తాడు. ఆ వూళ్ళో ముస్లిమ్ స్తీలెవరూ సినిమాకి వెళ్ళకూడదని ఆంక్ష పెట్టిస్తాడు. ఇంకా పెద్ద మనిషి కాకపోయిన మదీనాని బయట తిరగనివ్వడు. కరీం డ్రయివర్ ముత్తును ఉద్యోగంలోనుంచీ తీయించేస్తాడు..అతని స్నేహితుడు అరవై ఏళ్ళ అబ్దుల్ల స్వదేశానికొచ్చినప్పుడల్లా ఒక చిన్న పిల్లని పెళ్ళి చేసుకోడాన్ని ఊరంతా తప్పు పడితే అతను మాత్రం షారియత్ ప్రకారం మగవాళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని సమర్థిస్తాడు. ఒక “కాఫిర్” తో వెళ్ళిపోయిన ఫాతిమా లారీ కిందపడి చనిపోయిందని వార్త తెలిసి అందరికీ చాలా సంతోషంగా చెబుతాడు.తగిన శిక్ష పడిందని ఆనందిస్తాడు.తనకి గర్బం రాకపోతే అతను మళ్ళీ పెళ్ళిచేసుకుంటాడని ముంతాజ్ దిగులు పడుతుంది.ఆమె అనుకున్నది నిజంఅవుతుంది. డాక్టర్ ఆమెకు పిల్లలు పుట్టరని చెప్పడంతో ఆమె పట్ల సులేమాన్ ప్రవర్తనలో మార్పు వస్తుంది.ముంతాజ్ ప్రవర్తన కూడా   వింతగా మారుతుంది.ఆమెను ఫిర్దౌస్ దెయ్యమై ఆవహించిందని చెప్పి పుట్టింటికి పంపేస్తారు.సారా కూతురు షరీఫాతో సులేమాన్ కి పెళ్ళి నిశ్చయం చేస్తుంది సైనా. షరీఫాకి పెళ్ళి ఇష్టంలేదు,చనిపోయిన భర్త ని తలుచుకుంటూ కూతుర్ని పెంచుకుంటూ వుండాలని అనుకుంటూంది కానీ తల్లి షరీఫా పెళ్ళికి ఒప్పుకోకపోతే చనిపోతానని బెదిరించి ఒప్పిస్తుంది.ఫాతిమా లారీకింద పడిందని సంతోషంగా చెప్పిన సులేమాన్ ని ఎలా పెళ్ళి చేసుకోవాలి? కానీ తప్పదు.పనిలో పనిగా తన చెల్లెలు ఫరీదా పెళ్ళి అజీజ్ తో నిశ్చయిస్తాడు. బీదవాడైన అజీజ్ ను తనతో వెంట సింగపూర్ తీసుకుపోయి అక్కడ కుదురకునేల చేస్తాడు.ఫరీదాకూ గానీ షరీఫాకు గానీ పెళ్ళయినా ఒకటే! కాకపోయినా ఒకటే .కానీ భర్త వున్న స్త్రీలకుండే గౌరవం వేరు. అజీజ్ వెళ్ళిపోతున్నందుకు నఫీజా బాధపడుతుంది

వహీదా పుట్టింటికి వచ్చినప్పటినుంచీ ఆమెకి నెలసరి వచ్చిందా లేదా అనేదే అక్కడిఆడవాళ్ల చర్చ. వహీదాకి పెళ్ళికాగానే గర్భం వస్తే ఇంక సికందర్ ని నిశ్చింతగా సింగపూర్ పంపేస్తుంది సబియా. ఇంటివాళ్లకీ బయటివాళ్లకీ అందరికీ వహీదా నెలసరి పైనే ఆసక్తి.కానీ వహీదాకి మాత్రం గర్భం రాకూడదని గట్టి కోరిక.తను ఇంక అత్తవారింటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాక సికందర్ గర్భాన్ని ఎందుకు మొయ్యాలి?అనుకుంటుంది.

మదీనా పెద్దమనిషి అయింది.ఆపిల్ల రబియా అంత అమాయకురాలు కాదు. లోకంపోకడ తెలుసు.తల్లి ఆమెను స్కూల్ మాన్పించినా బాధ పడదు. అదంతా సహజం అనుకుంటుంది. మదీనా తో పాటే రబియానుకూడా స్కూల్ మాన్పిస్తుంది జోహ్రా.ఇంకా పెద్దది కాకపోయినా! .ఆమెతోపాటు స్కూల్ కు జతగా నడిచి వెళ్ళే ముస్లిమ్ పిల్లలు లేరనీ ఒంటరిగా పంపననీ చెప్పేస్తుంది. రబియా స్నేహితుడు అహమ్మద్ మేనమామ దగ్గరుండి చదువుకోడానికి వేరే వూరు వెళ్ళిపోతాడు. అక్క వహీదా దగ్గరకు కూడా ఎక్కువ పోనివ్వదు తల్లి రబియాని. ఒంటరిగా గదిలో ముడుచుకుని పడుకుంటుంది రబియా.. అన్నతమ్ముల ఇళ్ళ మధ్య గోడ పూర్తవుతుంది.  వహీదా నెల తప్పానని తెలుసుకుని కుప్పకూలిపోతుంది.తనింక అత్తవారింటికి పోక తప్పదు.ఆమెభవిష్యత్తు తేలిపోయింది.

రంజాన్ నెలలోఅరిసెల పిండి కొట్టుకోడం, గోరింటాకు పెట్టుకోడం, ఉపవాసాలుండడం, వహీదా పెళ్ళికి నగలూ బట్టలూ కొనడం వంటి వేడుకలతో మొదలైన ఈ నవల ముగిసేసరికి పాఠకుల మనసు నిండా విషాదం ముసురుకుంటుంది.

ఇందులో నలుగురు యువతులు; .తనను ఎంతో ప్రేమించిన భర్తతో కొద్దిరోజులే కలిసి వున్న షరీఫా భర్త దుబాయ లో ప్రమాదంలో మరణించడంతో. అతని గుర్తుగా వున్న కూతురికోసం మళ్ళీ  పెళ్ళి వద్దనుకుంటే తల్లి ఆమెను బెదిరించి బలవంతంగా ఇష్టంలేని వ్యక్తితో పెళ్ళికి వొప్పిస్తుంది .భర్త విదేశాలలో వుంటే ఒంటరిగా సంసారం ఈదుకొస్తోంది ఆ తల్లి. ఆమెకు శారీరక పెరుగుదల లేని మరొక కూతురు.చిన్నవాడైన కొడుకు.  ఒకవేళ విదేశంలోనే భర్త మరణిస్తే ఇంటిని ఆదుకునే మగదిక్కు కావాలి..సులేమాన్ ఎవరో కాదు తన అన్నకొడుకే! అందుకే షరీఫాను బలవంత పెట్టి సులేమాన్ తో పెళ్ళికి ఒప్పిస్తుంది.మొన్నటివరకూ తమతో కలిసి మెలిసి వుండిన ముంతాజ్ కి అది ద్రోహం అయినా కూడా.

మరొక యువతి ఫరీదా.మదీనా అక్క…సులేమాన్ చెల్లెలు. వయస్సొచ్చిన పిల్ల తల్లి గుండెలమీద కుంపటే కాక. అన్. ఆమెకి సరయిన సంబంధాలు రావడం లేదు .అందుకే  ఆర్థికంగా తక్కువ స్థాయిలో వున్న అజీజ్ తో పెళ్ళి కుదిర్చేసి తనతో సింగపూర్ తీసుకెళ్లడానికి నిర్ణయించాడు. పెళ్ళి ఒకమొక్కుబడి. ఒక భద్రత తరువాత మళ్ళీ ఎప్పుడో అతనొచ్చేదాకా ఒంటరి జీవితమే, ఫరీదాకైనా, షరీఫాకైనా ,వహీదాకైనా.. !

సులేమాన్ భార్య ముంతాజ్.పిల్లలు పుట్టని నేరానికి,దయ్యం పట్టిందదన్న ఆరోపణమీద  పుట్టింటికి తరిమివేయబడింది.పుట్టింట్లో మళ్ళీ ఆమెకు నాలుగుగోడలే..మళ్ళీ పెళ్ళి చేసుకుంటే తప్ప!

వహీదా ధనవంతుడైన తండ్రికి .చదువూ తెలివీ అందం పొందికా అన్నీ వున్న ఒక్కగానొక్క కూతురు.అయినా ఆమె జీవితంపై ఆమెకెలాంటి హక్కూ లేదు. ఆమె శరీరంపైనా ఆమె ఆకాంక్షలపైన ..హక్కులేదు.

కరీం ఇంట్లో పనిచేసే ఫాతిమా! పెళ్లయిన కొద్దిరోజులే ఆమె భర్త ఆమె దగ్గర వున్నాడు.తరువాత మాయమైపోయాడు.ఎక్కడో ఎవరితోనో వుంటున్నాడని ఫాతిమాకు తెలిసింది.ఆమె అతనికోసం వెళ్లలేదు .కొడుకుని పెంచుకుంటూ తల్లి దగ్గరే వుండిపోయింది. ఒకరోజు కొడుకుని కూడా వదిలేసి తను కావాలునుకున్న వాడితో వెళ్ళిపోయింది.ఆమె చేసిన పనిని సమాజమంతా గర్హించింది.  ఆమె చేసిన పని వల్ల ఊళ్ళో స్త్రీలెవరూ సినిమాకు పోగూడదని శాసించింది మసీదు. ఆమె తల్లిని వెలిపెట్టింది.ఆ తల్లి మంచం పట్టింది ఫాతిమా.కొడుకుని రహీమా చేరదీసింది.ఫాతిమా లారీ ప్రమాదంలో చనిపోయినప్పుడు ఒక కాఫిర్ తో వెళ్ళిపోయినందుకు తగిన శాస్తి అయిందని సులేమాన్ లాంటివాళ్ళు సంతోషించారు.కానీ ఊరి స్త్రీలే ఆమె కోసం ప్రార్థించారు .

పెళ్ళిళ్లు కుదర్చడంలో బంధుత్వాలు ఆస్తిపాస్తులు,కుటుంబ పరువు మర్యాదలు. లెక్కలోకి వస్తాయి.కానీ ఈడూ జోడూ ఆడపిల్ల మనసూ శరీరం లెక్కలోకి రావు మూగ జీవుల  నిశ్శబ్ద రోదన లోలోపల అణగారిపోతూనే వుంటుంది.  పదమూడేళ్ళకే నాలుగుగోడల మధ్య బందీ అయిన రబియా జీవితం ఎట్లా వుండబోతుందో? ఆ పిల్లనలా ఇంటికి పరిమితం చేసి బుద్ధిమంతురాలైన ఆడపిల్లగా తయారుచేయడానికి జోహ్రా కారణాలు జోహ్రాకున్నాయి. జోహ్రాపిన్ని మైమూన్ పెళ్ళి అయిన కొద్దిరోజులకే భర్తని విడిచిపెట్టి వచ్చింది. ఆమెకు మళ్ళీ పెళ్ళి చెయ్యాలనుకుంటూ వుండగానే ఆమె గర్బవతి అని తెలిసింది.తల్లీ అక్కా కలిసి ఒక నాటుమంత్రసానిచేత గర్భంతీయించగా ,మైమూన్ చనిపోయింది.భర్తని విడిచిపెట్టి వచ్చి కుటుంబానికి మచ్చతెచ్చినజోహ్రా చెల్లెలు ఫిర్దౌస్  బలవంతంగా చనిపోయింది.జనాలు తమ కుటుంబం గురించి చెప్పుకుంటున్నారు.మరి రబియా ఎలా తయారవుతుందో అని జోహ్రాభయం .అందుకని అంతులేని కట్టడి ఆ పిల్లకి.

ముక్కుపచ్చలారని పిల్లలకి పెద్దమనుషులు అయీ కాగానే వయో బేధాలు అందచందాలు మనస్తత్వాలు ఏమీ చూడకుందా పెళ్ళిళ్ళు కుదురుస్తారు. మొగుడు ఎలాటివాడైనా తట్టుకుని బ్రతకమని శాసిస్తారు. భర్తని వదిలి వచ్చిన స్త్రీ కానీ ,వితంతువైన స్త్రీ కానీ ఎన్నో ఆంక్షలకు లోబడి బ్రతుకు సాగించాలి.గుమ్మందాటి బయటకు రాకూడదు.అలంకరించుకోకూడదు.వాళ్లమీద నిత్యమూ కాపలాయే. .మతాచారాలూ ఆ పేరుమీద పురుషుల అదుపాజ్ఞలూ భరిస్తూ బ్రతుకుతున్న  స్త్రీలు కూడా మళ్ళీ తాము ఆ అవధులు మీరకుండా బ్రతుకున్నామా లేదా అని వార్ని వాళ్ళు సరిచూసుకుంటూ కాపలా కాచుకుంటూ వుంటారు. స్త్రీల జీవన పరమావధి వివాహం. ఆ వివాహ నిర్ణయంలో వాళ్ల ప్రమేయం ఏమీ లేదు.వాళ్ల శరీరాల మీద కోరికలమీద వాళ్లకి అధికారం లేదు .ఇది ఏ ఒక్క సమాజపు స్త్రీల కథ మాత్రమే కాదు,అన్ని సమాజాలలోనూ జరుగుతూన్న కథే కొంత ప్రత్యక్షంగా,కొంత కనిపించకుండా.

ఈ నవలలో ఆ సమాజంలో పండగలు ఆచారాలు చావులూ పెళ్ళీళ్ళు అన్నీ ఎంతో విశదంగా వర్ణించింది సల్మా.తానొక ప్రేక్షకురాలిగా వుంటుందేకానీ వ్యాఖ్యానాలు చెయ్యదు .

ఈ రోజు సల్మా ఒక ప్రఖ్యాత రచయిత్రి కావడం,  అంతర్జాతీయ కీర్తి పొందడం, విదేశాల్లో సెమినార్లకి హాజరవడం, ఆమెపై ఒక బ్రిటిష్ డాక్యుమెంటరీ నిర్మాత సినిమా తియ్యడం ఇవన్నీ చాలా సులభంగా జరిగిన విషయాలేమీ కావు.

“నా కప్పుడు పన్నెండేళ్ళు.తొమ్మిదో క్లాసు చదువుతున్నాను.ఆరోజు శనివారం మాకు స్కూల్ లేదు.మేం నలుగురు స్నేహితురాళ్లం లైబ్రరీలో కూచుని చదువుకుంటున్నాం.దగ్గర్లోనే వున్న ఒక సినిమాహాల్లో మాటినీ ఆడుతోండి.ఇంట్లో అడిగితే సినిమాకి పంపించడం జరిగేపని కాదు.పైగా మా గ్రామంలో ఎప్పుడో కానీ మాటనీలు వెయ్యరు .రాత్రిపూట సినిమాకి వెళ్లడం అసంభవం. చీకటిపడ్డాక ఆడపిల్లలు బయటికి పోకూడదు.మేం ఇంట్లో చెప్పకుండా సినిమాకి పోవాలనుకున్నాం…మేంలైబ్రరీలో వున్నాం అని ఇంట్లో అనుకుంటారు అని బయల్దేరాం అసలు ఆ హాల్లో ఆడే సినిమా ఏమిటో కూడా మాకుతెలియదు.ఆత్రంకొద్దీ వెళ్ళి హాల్లో కూచున్నాక అది శృంగార భరితమైన మలయాళీ సినిమా అని తేలింది.బయటికి వచ్చేద్దామా అంటే తలుపులు మూసేసారు.కొన్ని దృశ్యాలు వచ్చినప్పుడల్లా మేం చేతుల్లో మొహం దాచుకుని ఎట్లాగో బయటపడ్డాం.ఇంటికి వెళ్ళేసరికి అదే హాల్లో సినిమాకి వచ్చిన మా అన్న మా అమ్మకి చెప్పేశాడు. ఆవిడ నన్ను బాగా కొట్టి స్కూల్ మాన్పించేసింది.అప్పటినించీ  పెళ్ళయేవరకూ తొమ్మిదేళ్ళు నాలుగుగోడల మధ్య బందీ అయిపోయాను.జీవితంలో అతి ముఖ్యమైన ఆ వయసులో ఒంటరిగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా స్నేహితులు లేకుండా గడపడం ఎంత దుర్భరమో కదా?” ఇది సల్మా స్వీయానుభవం.

ఆ తరువాత చాలా ఏళ్ళు ఇటు పుట్టింట్లో అటు భర్త ఇంట్లో ఆమె నాలుగుగోడలమధ్య బందీ . స్త్రీలకి తెలివి తేటలుండకూడదు.వాళ్ళు ప్రశ్నించరాదు.కానీ వీటన్నిటినీ సల్మా ప్రశ్నించింది.అమ్మ ఇంట్లో బంధిస్తే స్కూల్ మాన్పిస్తే ఆమె ఊర్కే కూర్చోలేదు. బాగా పుస్తకాలు చదివింది.కవితలు వ్రాసి రహస్యంగా పత్రికలకు పంపించింది. తనలోని కోపాన్నీ ఆవేశాన్నీ బహిర్గతం చెయ్యడానికి ఒక వాహిక దొరికింది. ఆమె చదువుకోవాలనుకున్నది, బుర్ఖా వేసుకోవద్దనుకున్నది .తన అసలు పేరు రుఖయ్యా.సల్మా కలం పేరు.రజతి అనే పేరుతో కూడా వ్రాసింది.తను వ్రాస్తున్నట్లు తెలియకూడదు, నిశితమైన పదునైన ఆమె కవితలు పత్రికలలో వచ్చాయి.వివాహమయ్యాక ఆమె రచనల్ని భర్త ఏమాత్రమూ ప్రోత్సహించలేదు.అయితే సల్మా తల్లే సల్మా రచనల్ని పత్రికలకి పంపేది.రహస్యంగా పుస్తకావిష్కరణకూడా ఏర్పాటు చేసింది, తరువాత ఆమె తమ ఊరి పంచాయతీ బోర్డు అధ్యక్షురాలైంది స్త్రీలకు రిజర్వ్ అయిన ఆ వూరి పంచాయితీకి ఈమెను నిలబెట్టింది ఆమె భర్తే .2006 లో డిఎంకె తరఫున శాసనసభకు పోటీ చేసి ఓడిపోయింది.తరువాతి సంవత్సరం తమిళనాడు సోషల్ వెల్ఫేర్ బోర్డ్ కి అధ్యక్షురాలైంది.

ఈ నవలలో చిన్నారి రబియా కూడా సల్మాలా పోరాడి గెలవాలని కోరుకున్నాను.

                 sathyavati   -పి.సత్యవతి

 

 

‘ఖేల్’ … ఒక ‘యోగిని’ విషాదం ..

ఒక ఫాల్గుణ మాసపు మధ్యాన్నం ..  విశాఖపట్నం దగ్గర..  ఆకుపచ్చని కొండని మేలిముసుగులా ధరించినట్టున్న తలుపులమ్మ లోవ గుడిలో,  పూజారితో “ఈ దేవతకు పులిహోర, రవ్వ లడ్డూ మాత్రమె నైవేద్యం పెడుతున్నారా లేక మాంసం కూడానా?” అని అడిగాను. “తల్లికి మాంసం నైవేద్యవెడతానండి. అమ్మకేది కావాలో అదే పెట్టాలి కదా! బ్రాహ్మణ పూజారిని గవర్నమెంటు పెట్టింది కానండి, ఆయన పూజలు ఆయనవి” అన్నాడాయన.

తిరుపతి  పెద గంగమ్మ గుడిలో పూజారిణి, తరాలుగా దేవతను పూజిస్తున్న తనను ఆ పదవినుంచి తప్పించి, మగ పూజారిని పెట్టటానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరిస్తుంది.

ఆదిలాబాద్ దగ్గరలోని ఒక గోండు గ్రామం వెలుపల, చెట్ల మధ్య చిన్న చిన్న హిందూ దేవతల విగ్రహాలను పెట్టారు. “గోండు దేవతల రాజ్యంలో వీళ్ళు ఎక్కడినుంచి వచ్చారా?” అనుకున్నాను.

పాత దేవుళ్ళ ప్రభ తగ్గుతూ, కొత్త దేవుళ్ళు వెలుస్తూ, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకం పూజలూ, పద్ధతులది పైచేయి అవుతుండటం ముక్కోటి దేవుళ్ళూ, ఎంతో వైవిధ్యమూ ఉన్న హిందూ మతంలో సాధారణమే కానీ….

కొన్ని రకాల పూజా పద్ధతులూ, ఆచారాలూ … ముఖ్యంగా స్త్రీ దేవతల విషయంలో చాలా మార్పులు చెందిపోతూ వస్తున్నాయి.  ఏ సమాజంలో స్త్రీ ఎలా ఉండాలని అనుకుంటారో అదే పద్ధతిలో దేవతల మూసలూ తయారు చేసుకుంటుందా ఆ సమాజం?  ఎప్పుడైనా ఒక వింత ఆకర్షణతోనూ, భయంతోనూ,  అడ్డూ అదుపూ లేని స్త్రీ శక్తిని పూజించే రోజులు కొంతకాలంపాటు వచ్చినా, మళ్ళీ వెంటనే తేరుకుని దేవతను అదుపు చేస్తుందా పురుష స్వామ్యం?

*****

*

సబా దివాన్                                             రాహుల్ రాయ్

స్త్రీ శక్తి , పురుష దేవతల ఛాయగా ఎలా మారిపోయిందో, అదే ప్రక్రియ సమాజంలోనూ ఎలా కనిపిస్తోందో వివరించే ఒక డాక్యుమెంటరీ చిత్రం ‘ఖేల్’  ……

 సబా దివాన్, రాహుల్ రాయ్ అనే డాక్యుమెంటరీ చిత్ర దర్శకులు 1994 లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

బ్రాహ్మణ వాద మూసలోని స్త్రీత్వం కంటే భిన్నమైన స్త్రీ తత్వాన్ని వెదికే ఒక అన్వేషణగా ఈ చిత్రం మొదలవుతుంది. స్త్రీ శక్తి ఏ అడ్డంకులూ లేకుండా ప్రవహించే ఒక చోటు కోసం వెదుకులాట.  అచ్చంగా ఆడదానికి మాత్రమే పరిమితమైన ఆది భౌతికత కోసం చూడటం…

మహా యోగినిగా స్త్రీని చూడటం కోసం వారు బుందేల్ ఖండ్ తిరిగి, యోగిని గుడుల గురించి ఆరా తీసారు. బాందా జిల్లా లోని లోఖ్డీ గ్రామం దగ్గర ఒక కొండ మీద ఏ పూజలూ లేని గుడి వారికి కనిపించింది.  పెద్ద వృత్తాకారంలో కనిపించే స్థలంలో ఎటు చూసినా విరిగిపడిన స్త్రీ విగ్రహాలే. వృత్తం.. ఒక సామాన్యత లో ఒక పరిపూర్ణత.  ఆ పరిపూర్ణతను మేము  ఒప్పుకోమంటూ చేసిన విధ్వంసం భీభత్సంగా కనిపిస్తుంది. విరిగిన విగ్రహాల దగ్గర ఇప్పుడు భైరవుడు ఉన్నాడు. చాలా విగ్రహాలను దొంగలు పట్టుకు పోయారు.   అటువంటి వృత్తం మరోచోట కూడా వీరికి శిధిలావస్థలో కనిపించింది. ఆ స్థలంలో ఇంతకుముందు  ఏముండేదని వీరు అడిగితే,   స్థానికులు ఒక అఖాడా (వ్యాయామశాల) అని  చెప్తారు.

(తాంత్రిక విద్యల్లో ఆరితేరిన స్త్రీలు ఒకప్పుడు  ఉండేవారు. హఠయోగాన్ని నేర్చుకున్న వీరిని, యోగినులు అనేవారు. ఇవి రహస్య విద్యలవటం వల్ల, ఆ సమూహంలో ఉండేవారికి తప్ప, బయటి సమాజానికి వారిగురించి పెద్దగా తెలియదు. విచిత్రంగా, అన్నిటా మగవారి పెత్తనమే ఉండే కాలంలో… ఎనిమిది నుంఛీ  పదకొండో శతాబ్దం వరకూ ఉత్తర భారత దేశంలో యోగిని గుడుల నిర్మాణం జరిగింది. పురాణాలలో సప్త మాతృకలు అని చెప్పబడేవారు (బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి) (చండిక,మహాలక్ష్మి లతో కలిపి వీరిని నవ మాతృకలు అని కూడా అంటారు) దుర్గాదేవి శరీరం నుంచి పుట్టి, దుష్ట శక్తులతో ఆమె చేసిన యుద్ధంలో ఆమెకు సహాయం చేసిన సైన్యం.  ప్రతి మాతృకా ఒక యోగిని. వీరికి మళ్ళీ కొంతమంది యోగినులు అనుయాయులు.  మొత్తంగా వీరి సంఖ్య మాతృకలతో కలిసి, 64, లేదా 81 ఉంటుంది. ఇప్పటికీ ఈ యోగిని గుడులు ఒడిషాలో రెండు, మధ్య ప్రదేశ్ లో రెండు ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల వారికే సరిగ్గా తెలియదు.)

విరిగిన విగ్రహాల మధ్య ఒక యోగిని. (లోఖ్డీ వద్ద).

ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ లోకి వెళ్తే..  ఇంకా అక్కడి అడవి ప్రాంతాల అన్వేషణలో చిత్ర దర్శకులకు  అరుదైన ‘జోగినుల’ గురించి తెలిసింది.. ఇక ఎన్ని కథలో. ‘కోల్’ తెగవారు నివసించే బుందేల్ ఖండ్ అడవుల్లో ఈ ‘జోగిని’ ఒక గొప్ప కల్పన,. మాయ. అద్భుతం.. నిజం..

పుల్లలూ, ఆకులూ ఏరుకుంటూ ఈ అడవుల్లో ఎక్కువగా తిరిగే ‘కోల్’ స్త్రీలకు జోగినులు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారట. సంస్కత కావ్య వర్ణనలలో యోగినిగా మారిన మహారాణి,  ఒక రాజకుమారుడిని చిలుకగా మార్చి, తనకు కావలసినప్పుడు అతన్ని మనిషి రూపం లోకి తెచ్చి ప్రేమించే యోగిని… వంటివి ఉంటే, అడవుల్లో చిన్న అందమైన బాలునిగా కనిపించి, చేతుల్లోకి తీసుకోగానే మాయమయ్యే జోగిని, చిన్ని బాలుని రూపంలో కనిపించి, చూస్తుండగానే పెద్ద మగవానిలా మారే మాయా జోగిని… ‘కోల్’ స్త్రీల సామూహిక అంతచ్చేతనలో సజీవంగా ఉన్నారు. మండు వేసవి మధ్యాన్నాల్లో జోగినులు పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ తమకు కనిపిస్తారని, పక్కింటివాళ్ళ గురించి చెప్పినంత సులువుగా వీరు చెప్తారు ఈ చిత్రంలో.  ఒక మగవాడు నది ఒడ్డున జోగిని మాయలో పడి, తోటివారు పిలుస్తున్నా పట్టించుకోకుండా నిలబడిపోతే, తమ కులదేవత వచ్చి చెంపదెబ్బ కొట్టి, అతన్ని రక్షించిందట.  స్త్రీల మాయాశక్తి గురించిన ఇలాంటి కథలు మనమంతా ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం కదా!

సబా దివాన్ ఈ  ‘కోల్’ స్త్రీలను యోగినుల గురించి అడిగితే తమకు అదేమీ తెలియదని చెప్తారు. వారికి తెలిసిన జోగిని అడవినేలుతుంది.  క్రూర మృగాలను అదుపులో పెడుతుంది.   కలల్లో కనిపిస్తుంది. ఆవహిస్తుంది.

.

 

ఉత్తరప్రదేశ్ లో మాయమై, ఈ మధ్యనే ఫ్రాన్స్ నుంచి మన దేశానికి తిరిగి వచ్చిన పదవ శతాబ్దపు యోగిని విగ్రహం.

వృత్తాకారపు యోగిని గుడుల్లోని మాయ, అడవుల్లో తిరిగే ఈ జోగినీ మాయ ఒకటేనా? తాంత్రిక యోగిని, అడవి తెగల్లోని జోగిని ఒకటే ఎందుకు కాకూడదు? సప్త మాతృకల వలె జోగినులనూ ఏడుగురు అక్క చెల్లెళ్లుగా చెప్తున్నారు.

కాళిదాసు, భవభూతి వర్ణించిన  మహా యోగినుల జాడలు ఎక్కడ? ఈ అడవుల్లోనా? స్థల, కాల, సంస్కృతులనూ, కులాన్నీ, వర్గాన్నీ అధిగమించిన సామూహిక జ్ఞాపకాలు ఇవేనా? … ఇదీ సబా దివాన్ ఆలోచన.

‘ఖేల్’ లో ….

రామ్ కలీ, శివ కుమారి ..  అనే ఇద్దరు స్త్రీలు.

రామ్ కలీ .. దేవతకు అంకితమైన స్త్రీ.  పొయ్యి మంట వెలుగులో అలసిన మొహం, చెదిరిన జుట్టుతో నెమ్మదిగా ఎన్నో మాట్లాడుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు భూస్వామి తనను చెరచబోతే, అతన్ని చంపేసి పోలీస్ స్టేషన్ లో నింపాదిగా ఆ విషయం తెలియచేసిన చరిత్ర ఈమెకు ఉందట.  పుట్టిన మూడు రోజులకే ఈమెను దేవత ఎత్తుకుపోయిందని చెపుతుంది. ఎంత వెదికినా పిల్ల దొరకక, ఆమె తండ్రి అమ్మవారి గుడికి వెళ్లి అడిగితే, దేవత కనిపించి, తాను కాళి నని, ఏడుగురు అక్కచెల్లెళ్ళలో మొదటిదానిననీ చెప్పి, తనకు గుడి కట్టిస్తే ఈ పిల్లను తిరిగి ఇస్తానని చెప్పిందట.  పన్నెండేళ్ళ పాటు ఈ పిల్ల పెళ్ళీ, సంసారం లేకుండా తనకు సేవ చెయ్యాలని చెప్పిందట. ఆ మాట పట్టించుకోకుండా తండ్రి తనకు పెళ్లి చేస్తే,  దేవత అక్కడికి వచ్చి తన అత్తవారింట్లో అందరినీ నాశనం చేసిందని చెప్తుంది. ఊరంతా భయపడే ఒక పురుష శక్తి అడవిలో ఆకులు ఏరుకునేటప్పుడు తనను భయపెట్టాలని చూస్తే, తను ఏ మాత్రం భయపడక అతడిని తన మంత్రాలతో కట్టేసి ఊరికి తెచ్చానని చెప్తుంది.  కష్టపడి వంటలు చేసి, ఇదంతా దేవతకు పెట్టాలనీ, ఆమె సేవ చెయ్యకపోతే తను జబ్బు పడిపోతాననీ అంటుంది.

శివకుమారి .. అడవిలో కట్టెలు కొడుతూ, బక్క పల్చని శరీరంతో, విచారమూ, బతుకు భారమూ కలగలిసి ముఖాన్ని అద్దుకున్నట్టు కనిపిస్తుంది. దేవత ఆవహించి మూడు నెలల పాటు అడవిలోనే ఉండిపోయాననీ, పిల్లలని కూడా తన తోనే ఉంచుకుంటే, దేవత వారికి పళ్ళు సమకూర్చి వారి ఆకలి తీర్చిందనీ చెప్తుంది. దేవత ఆవహించినప్పుడు నెలల తరబడి తిండీ, నీరూ లేకుండా, ముళ్ళూ, రాళ్ళలో తిరిగానని చెప్తుంది. అదంతా ఒక నరకం లాగా ఉండేదని చెప్తుంది. సిగ్గూ, లజ్జా పోయాయంటుంది. ఇప్పుడు దేవత తనను వదలకుండా, తన సేవ కోసమే నువ్వు పుట్టావని అంటుందని చెప్తుంది.

వీళ్ళిద్దరూ దేవి ఆవహించినప్పుడు  జబ్బులు బాగుచేస్తామని చెప్తారు.

రామ్ కలీ, శివకుమారి .. వీరిద్దరూ కలుసుకునే సందర్భం కూడా ఈ చిత్రంలో ఒక చోట వస్తుంది. ఇద్దరు శక్తిమంతులైన స్త్రీలు.. ఇద్దరు న్యురోటిక్ స్త్రీలు.. సమాజపు అడుగుపొర లో బ్రతికే వీళ్ళు .. దేవత సాయంతో మగవారిని ధిక్కరించి, ఆజ్ఞాపించే వీళ్ళు.. కలిసిన సందర్భం అపురూపం. శివకుమారి వణికే చేతిని తన చేతిలోకి తీసుకుని, ఆమె బేలతనాన్నీ, న్యురోసిస్ నంతా పోగొట్టేలా మెత్తగా మాట్లాడుతూ, ఒక తల్లి తన బిడ్డను లాలించినట్టు దగ్గరికి తీసుకుంటుంది రామ్ కలీ.

శివకుమారి                        శివకుమారి, రామ్ కలీ

శాంతి

ఈ చిత్ర దర్శకులతో మాట్లాడటానికే ఇష్టపడని స్త్రీ .. శాంతి. ఒకసారి మాట్లాడటం మొదలు పెట్టాక, ప్రవాహంలా చెప్పుకు పోతుంది.  కొండమీద ఉన్న గుడిలో పూజలూ, గుడి గంటల ధ్వనుల మధ్య ఆమె బాల్యం. ఎప్పుడూ దైవ సన్నిధానమే. పెరిగి పెద్దదౌతున్న కొద్దీ ఆంక్షలు. గుడికి వెళ్ళకుండా ఉండలేని ఆమె యాతన. తనకు బలవంతాన పెళ్లి చేసినా, తను మాత్రం   ఎనిమిదేళ్ళ పాటు  భర్త  నీడ కూడా తనమీద పడనివ్వలేదంటుంది.

 ఇక్కడ కథ మనల్ని బేడా ఘాట్ (మధ్యప్రదేశ్, జబల్పూరు దగ్గర) యోగిని గుడికి తీసుకుపోతుంది.  పూర్ణ వృత్తాన్ని  ఎనభై ఒక్క భాగాలుగా చేసి, విగ్రహాలను ప్రతిష్టించిన యోగిని గుడి.. కొన్ని విగ్రహాలకు మృగాల తలలూ, స్త్రీ శరీరాలూ ఉంటాయి. ఆది శక్తి వివిధ రూపాల్లో యధేచ్చగా ప్రవహించిన చోటు.. నేలంతా చదునుగా పరచిన నాప రాళ్ళు. చుట్టూ వేప చెట్లు.  గాలీ, వెలుతురూ నిండి ప్రకాశించే చోటు. యోగిని గుడులను అప్పటి మిగతా గుడుల వాస్తు సంప్రదాయానికి విరుద్ధంగా నిర్మించారు. చుట్టూ వలయంగా విగ్రహాలు. మధ్యలో ఖాళీ స్థలం. ఇదీ యోగిని ఆలయ నిర్మాణ శైలి. తాంత్రిక ఆరాధనా వ్యవస్థకు గొప్ప చిహ్నం.

బేడా ఘాట్

మహా భాగవత పురాణంలోని అంతగా ప్రాచుర్యం లేని ఒక శాక్తేయ వర్ణన ప్రకారం సతి, కాళి నీడగా మారి మంటలు రేపి, తన యోగిని అనుయాయులతో కలిసి, దక్ష యజ్ఞాన్ని భగ్నం చేస్తుందట.  తనను దక్ష యజ్ఞానికి వెళ్ళవద్దని చెప్పిన శంకరునిపై అలిగిన సతి, జుట్టు విరబోసుకుని, దిగంబరురాలై, నాలుక వేలాడేసుకుని, చెమటలతో తడిసి, ప్రచండంగా తన తల్లిని చేరుకుంటుంది. తల్లి ప్రసూతి ఈ దాక్షాయణిని దగ్గరకు తీసుకుని, చెంగుతో ముఖాన్ని తుదిచి, గుండెలకు హత్తుకుంటుంది.  దక్షుడు సతిని నిందిస్తాడు. అప్పుడామె భీభత్సంగా మారి, యోగినులతో కలిసి మదిరా పాన మత్తురాలై నాట్యంచేసి, యజ్ఞాన్ని భంగం చేస్తుంది. శంకరుడు వచ్చాక, ఆ చితి మంటలు మళ్ళీ రగిలి అతడు తన వంతు పూర్తి చేస్తాడట.  బేడా ఘాట్ యోగిని విగ్రహాలను చిత్రిస్తూ, స్తోత్రం వినిపిస్తూ, మధ్యలో ఈ కథను చెప్తుంది సబా దివాన్.

బేడా ఘాట్ గుడిలో చాలా విగ్రహాలు అంగాలు విరిగి కనిపిస్తాయి.  ఈ ఫిల్మ్ లో, ఆ విగ్రహాలతో అత్తవారింటిలో శాంతి పడిన అవస్తనూ, హింసనూ పోల్చి చూపిస్తుంటే, ఆ అణచివేత మనల్ని ఒక తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తుంది. తన వంటిలో ఏ భాగాన్నీ వదలకుండా ఎలా కొట్టి హింసించారో ఆమె చెప్తుంటే, చేతులూ, కాళ్ళూ, స్తనాలూ విరిగిన విగ్రహాలు కనిపిస్తూ ఎంతో బాధిస్తాయి.  యుగాలుగా స్త్రీ శక్తిని, మార్మికతనూ చూసి ఆకర్షితులౌతూనే, భయంతో మళ్ళీ దాన్ని అదుపులో పెట్టాలని ప్రయత్నించే పురుషస్వామ్యపు  విశ్వరూపం కళ్ళకు కడుతుంది.

చాలా సేపు బేడా ఘాట్ విగ్రహాలను అర్ధ వృత్తంగానే చిత్రీకరించి, మనల్ని మరో లోకం లోకి తీసుకెళ్తూ, ఒక్క సారిగా ఆ వృత్తపు మధ్య భాగాన్ని చూపిస్తారు.  ఒక షాక్.  ఆ మధ్యలో ఒక శివాలయం. దీన్ని తరువాతి కాలంలో ఎప్పుడు కట్టేసారో !  నిరాఘాటంగా స్త్రీ శక్తి ప్రవహించే చోటుని, ఆ మండలాన్ని ఛేదిస్తూ, సాంప్రదాయక శివాలయం…  ఇక్కడ పార్వతి శివుడి పక్కన అనుయాయి.  ఈ శివాలయ నిర్మాణంతో శక్తి మండలాన్ని విచ్చిన్నం చేసారంటుంది సబా దివాన్.  అలాగే మధ్య ప్రదేశ్ లోని మతౌళి దగ్గర ఇంకో వృత్తాకారపు గుడినీ చిత్రీకరించారు. అక్కడ స్త్రీ విగ్రహాలని తొలగించి, శివ లింగాలను ప్రతిష్టించారు. తాంత్రిక యోగినీ వ్యవస్థ గురించి మనకు తెలియకుండా చేసే ఈ ప్రయత్నాలూ, శాంతి వంటి స్త్రీల స్వేచ్చకు వేసే సంకెళ్ళూ ఒకలాంటివే

.

బేడా ఘాట్ యోగిని విగ్రహం       యోగిని స్థానం లో శివలింగం (మతౌళి)     వృత్తం మధ్య శివుని మంటపం (మతౌళి)

‘కోల్’ తెగ వారు జరుపుకునే నవరాత్రి పండుగలో ఒక రోజు దాక్షాయణి (సతి) తన తల్లిని కలుసుకొనే పండుగ జరుగుతుంది. కానీ ఈ ఉత్సవాల్లో స్త్రీలంతా ముసుగులు వేసుకుని కూర్చుంటే, మగవాళ్ళదే ‘ఖేల్’ అంతా! దేవత  భక్తురాలు శివకుమారి కూడా నిర్వికారంగా చూస్తూ కూర్చుంటుంది.

 

చివరిగా, శాంతి ఇంట్లో ఆమె కూతురు కేశ్ కలీ కనిపిస్తుంది.  అత్తవారింటి నుంచి వచ్చేసింది ఈమె.  వాళ్ళింట్లో అత్త తనను సరిగా పని చేయటం లేదని తిడుతూ, కొడుతూ ఉంటుందట. ఇక తను తల్లి దగ్గరే ఉంటానంటుంది.  ‘ఈ పిల్లను అత్త ఇంటికి పంపవా?’ అని శాంతిని అడిగితే, ‘తనకు ఇష్టమైతే వెళుతుంది. లేదా ఇక్కడే ఉంటుంది’ అని చెప్తుంది. తాను అనుభవించిన బాధ తన బిడ్డకు వద్దనుకొనే తల్లి మనసు శాంతిది. ఈ ‘సతి’ తన తల్లి దగ్గర ఊరట పొందుతోంది.

సతీ దేవి తన తల్లి దగ్గర చేరటం, శివకుమారి రామ్ కలీ దగ్గర ఊరట పొందటం, కేశ్ కలీ  తన తల్లి శాంతి దగ్గర ఉండిపోవటం… ఆడదాన్ని ఆడదే అర్ధం చేసుకోగలదనే భావాన్నీ, బిడ్డలను లాలించే దేవత కారుణ్యాన్నీ  సూచిస్తుంది. కథా చిత్రం కాకుండా ఒక డాక్యుమెంటరీ చిత్రంలో ఇంత హృద్యంగా ఇది చెప్పటానికి కుదరటం అనేది ఈ చిత్ర దర్శకులకు దొరికిన అరుదైన అవకాశం.

శుభా ముద్గల్ సంగీతం, గానం..  ముఖ్యంగా అడవుల్లో జోగినుల మార్మికతను మనమూ అనుభూతి చెందేలా తీసిన కొన్ని షాట్లు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. యోగిని గుడుల చిత్రీకరణ సరేసరి.

మనకు కలిగే  బాధ,  యుగాలుగా   స్త్రీలందరికీ

కేవలం యోగిని ఆరాధనా వ్యవస్థ గురించే అయివుంటే ఈ ఫిల్మ్ ఒక సంస్కృతిని మాత్రమె వివరించే డాక్యుమెంటరీ అయివుండేది. ఇది కల్పిత సినిమా కథా కాదు. ఇందులోని స్త్రీలు పాత్రలూ కావు.  ఒక anthropological/ ethnographic  డాక్యుమెంటరీలో రక్త మాంసాలతో అదే ప్రదేశంలో తిరుగాడే ఒక తెగ స్త్రీలూ, వారి భిన్నత్వం, తెగువ, మార్మికత, పేదరికం, బాధలు.. అన్నీ కలిపి చూస్తున్నప్పుడు

చెందిన సామూహిక అస్తిత్వ వేదన.

 

****

హిందూ సమాజంలో, పంటలనూ, బిడ్డలనూ కాపాడుతూ వుండే గ్రామదేవతలకున్న ఒక ప్రత్యేక స్థానం కొన్నాళ్ళకు అంతరించిపోతుందేమో అని అనుమానం వచ్చేంతగా బ్రాహ్మణీకరణ జరుగుతోంది. జాతరలు చేసి, బలులు ఇచ్చి, ఊరంతా సంబరాలు జరుపుకోవటం అనేది, సామూహికంగా స్త్రీ శక్తిని ఆరాధించే ఒక తంతు.  ఆదిమ పురుషుడికి స్త్రీత్వం, మాతృత్వం,  అద్భుతాల్లా కనిపించేయి. వ్యావసాయిక సమాజాల్లో పంటలనిచ్చే భూములనూ, పిల్లలనిచ్చే తల్లులనూ పోల్చి చూసుకుని, స్త్రీని దేవత రూపంలో కొలిచారు. పంటలూ, పిల్లలూ పదిలంగా ఉండాలంటే అమ్మ శక్తిని సంతృప్తి పరచాలని భావించారు. వీరిని పూజించటం లో భయం, భక్తీ .. రెండిటినీ ప్రదర్శించారు.  సాలగ్రామ పూజలు చేసే బ్రాహ్మణులూ కూడా గ్రామ దేవత పూజల్లో పాల్గొనటానికి మినహాయింపు కాదు.  బ్రాహ్మణ స్త్రీలు గ్రామ దేవతకు పెరుగన్నంతో చల్లని నైవేద్యం పెడతారు.  పసుపూ, కుంకం, చీరలూ సమర్పించుకుంటారు. మరి ఇప్పుడు గ్రామాలను మొత్తంగా పట్టణాలకు తరలించే పని పెట్టుకున్న ప్రభుత్వాలు మనవి. అదే అభివృద్ధి అంటున్నారు. ఈ వెల్లువలో కొట్టుకుపోతున్నవి ఊళ్ళలోని వృత్తులూ, వ్యవసాయమే కాదు. ఒక సంస్కృతి కూడా.

స్త్రీల శరీరాలే కాదు వారి గర్భాశయాలు కూడా అంగట్లో అద్దెకు దొరుకుతున్న ఈ రోజుల్లో స్త్రీ శక్తికి విలువేముంది? ఉగ్ర రూప గ్రామ దేవతలు కూడా సాత్విక వైష్ణవ అమ్మవార్లయిపోతున్నారు.  అన్ని రకాల దేవతల వైవిధ్యం నశించి, వారంతా సంస్కృత మంత్రాలూ, రాముడూ, సీతా, ఆంజనేయుడూ… వీటిలో హింద్వైక్యం చెందుతున్నారు. ఉగ్ర, ధైర్య, స్థైర్య, కారుణ్య రూపాలలో ఊరినీ, బిడ్డలనూ, పంటలనూ కాపాడే అమ్మ శక్తిని రాను రానూ సాత్వికతకు మాత్రమే ప్రతీకగా ఉండే ఒక నమూనాగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  కొన్నాళ్ళకు కలకత్తా కాళి కూడా రూపం మారి, సీత లాగా ముసుగు వేసుకుంటుందేమో!

ఒకపక్క స్త్రీలను పూజిస్తామంటూనే మరో పక్క మానభంగాలూ, ఆడ పిండాల హత్యలూ జరిగి పోతున్న సమాజాల్లో స్త్రీ దేవతల సాత్విక పరిణామం కూడా ఒక ‘ఖేల్’.

lalitha parnandi—  ల.లి.త.

“బాగున్నవా తమ్మి?” ఇక వినిపించదు ఆ పలకరింపు!

Sri hari - EPS

రియల్ స్టార్ శ్రీహరి నిజంగానే రియల్ స్టార్ .  అయన లేకపోయారు అంటే నమ్మలేక పోతున్నా ఇంకా ..   ఎప్పుడు ఫోన్ చేసినా అరె తమ్ముడు ఎట్లున్నావు అని ఆప్యాయంగా పిలిచే శ్రీహరి ఇంకా లేరు అంటే ఎలా నమ్మేది ?
శ్రీహరి గారిని మొదట చూసింది పరశురాం షూటింగ్ లో .

అప్పట్లో చిరంజీవి అంజి సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో ఒక ఫ్లోర్ లో రెగ్యులర్ గా జరుగుతూ ఉండేది .  (అది దాదాపు గా ఆరేళ్ళు తీసారు ) నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ శ్యాం గారి ని కలవడానికి అన్నపూర్ణ కి వెళ్తూ ఉండేవాడిని .

అలా ఒక రోజు వెళుతూ ఉంటె , అన్నపూర్ణ స్టూడియో పక్కన ఉన్న భవంతి దగ్గర గోల గోల గా ఉండి చాల మంది గుమిగూడి ఉండటం చూసి బండి పక్కన పెట్టి చూడటానికి వెళ్తే , అక్కడ కనిపించారు శ్రీహరి .

అలా  చూస్తూ ఉండగానే చక చక ఆ భవంతి పైకి ఎక్కి రెండు గొడుగులు పట్టుకుని అకస్మాత్తుగా కిందకి దూకారు, ఒక్క క్షణం అంతటా నిశ్శబ్దం , ఆ తరవాత చప్పట్లతో మారు మోగిపోయింది ఆ ప్రదేశం .

నాకు ఆయనతో పరిచయం లేకపోవడం వల్ల నేను కూడా అందరితో పాటు చప్పట్లు కొట్టి అక్కడ నుంచి వచ్చేసాను .
తరవాత కొన్ని రోజులకి రచయితా / దర్శకుడు / నిర్మాత / నటుడు   పోసాని కృష్ణ మురళి గారిని ఒక స్నేహితుడి ఇంట్లో కలిసినప్పుడు ఆయన చెప్పారు శ్రీహరి గారు ఆయనా ఒకే అపార్ట్ మెంట్ బిల్డింగ్ లో ఉంటున్నారు అని.  నేను కృష్ణమురళి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అయన నన్ను శ్రీహరి గారి ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేసారు . అలా శ్రీహరి గారిని మొదటి సరి కలవడం జరిగింది .  కాని అప్పుడు ఇంటర్వ్యూ లాంటిది ఏమి చెయ్యలేదు ఇద్దరికీ సమయం సరిగ్గా కుదరక .
ఆ తరవాత నేను అమెరికా వచ్చాక అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవాళ్ళం . మహానంది సినిమా విడుదల కి ముందు ఆయన్ని ఇంటర్వ్యూ చేసాను .  తరవాత అక్షర (శ్రీహరి గారి అమ్మాయి బాగా చిన్న వయసు లో పోయింది ) పేరు మీద తను గ్రామాన్ని దత్తత చేసుకున్నపుడు అభినందించడానికి ఫోన్ చేశాను .  ఆ తరవాత అంతగా ఫోన్ చెయ్యలెదు. ఈరోజు పొద్దున్నే ఫోన్ తో మెలకువ వచ్చి మెసేజ్ చూస్తె శ్రీహరి గారు లేరు అని వార్త .  కొంచం సేపు ఇది నిజం కాకపోతే ఎంత బాగుండును అన్న భావన .. అసలు నిజమే కాదేమో అన్న ఫీలింగ్ … ఈ లోపల ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ న్యూస్.
ఎప్పుడు ఫోన్ చేసినా బాగున్నావా తమ్మి అని పిలిచే ఆ గొంతు మూగ పోయింది అంటే ఎలా నమ్మేది . ఒక భద్రాచలం, ఒక షేర్ ఖాన్ (మగధీర) , ఒక ప్రతినాయకుడు, ఒక రియల్ ఫైటర్ , ఒక మంచి మనిషి , ఒక మంచి స్నేహితుడు , వివాదాలు లేని వ్యక్తీ ,  అన్నిటికి మంచి ఒక మంచి మానవతావాది శ్రీహరి గారు . వారి ఆత్మకు శాంతి కలగాలని , వారి కుటుంబానికి ఈ తీర్చలేని లోటు నుండి తట్టుకునే ఆత్మ స్తైర్న్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్దిస్తూ .

– శ్రీ అట్లూరి

జీవిత నాటక రంగం పై “ఆమె” !

bhuvanachandra

Untold Stories – 7

 

“మొదట్లో మా అమ్మంటే  నాకు అసహ్యం..!” నవ్వింది సుచరిత.

“నిజమా?” అడిగాను. నా గొంతులో ఆశ్చర్యం లేదని నాకు తెలుసు.

“నా నాలుగో ఏట నన్ను వదిలేసి, మా నాన్న పరువు తీసి ఇల్లొదిలి పెట్టి వెళ్ళిపోయింది. సంఘంలో నేను చిన్ననాటి నుంచి పడ్డ అవమానాలు నన్నో ‘ఇంట్రావర్ట్’ గా మార్చాయి. దేముడూ, పూజలూ అంటూ పవిత్రంగా ఉండే మా నాన్న మా అమ్మ కొట్టిన దెబ్బకు ‘దేవదాసై’ కొంపని పట్టించుకోవడం మానేశాడు. ఇహ మా బామ్మా, మా తాతయ్య అయితే, నేనో దురదృష్టవతురాల్ననీ, నా దురదృష్టమే కొంపని నాశనం చేసిందనీ, నా చదువు పూర్తయ్యేదాకా సాధిస్తూనే ఉన్నారు. అట్లాంటి పరిస్ధితుల్లో పెరిగిన నాకు, అమ్మంటే అసహ్యం కాక అభిమానమూ, అనురాగమూ పుడతయ్యా?” సుచరిత నవ్వుతూనే చెప్పినా కళ్లల్లో మాత్రం ‘కసి’ నివురు గప్పిన నిప్పులా కనిపిస్తూనే ఉంది.

“అయితే ‘మొదట్లో.  మా ‘అమ్మంటే నాకు అసహ్యం’ అని మీరిచ్చిన ‘స్టేట్మెంట్’ రాంగ్ కదూ. ఎందుకంటే మీ కళ్ళల్లో ఇంకా ‘కసి’ ఉంది” నేను నవ్వుతూనే అన్నాను. ఆ మాత్రం చనువు సుచరితతో నాకు ఉంది. “ఇప్పటికీ అసహ్యం అవునా?” కళ్ళలోకి చూస్తూ అన్నాను.

సుచరిత వాళ్లది తెనాలి. తెనాలి అంటేనే గొప్ప కళాకారులు జన్మించిన ఆంధ్రా పేరిస్. భానుమతిగారూ, రామకృష్ణగారూ, శారదగారూ, ముక్కామలగారూ ఇలా చెప్పుకొస్తే తెనాలి కళాకారులూ, నిర్మాతలూ, దర్శకుల సంఖ్య అనంతం. నాకు డబ్బింగ్ మెళకువలు నేర్పిన అన్నగారు శ్రీ రామకృష్ణగారిదీ తెనాలే.

సుచరిత వాళ్లమ్మ కల్పన.(అసలు పేరు కళ్యాణి) . కల్పనగారు సినిమాల్లో ఎంటరై రెండో సినిమాకే కళాశ్రీ అని పేరు మార్చుకుంది. (ఇది నేను పెట్టిన పేరు. ఆమె కోరికతో అసలు పేరు దాస్తున్నాను). ఇరవై రెండేళ్ళకే ముగ్గురు పిల్లల తల్లై కుటుంబాన్ని వదిలేసుకుని మద్రాసు పారిపోయి వచ్చేసింది. పెద్దకొడుకు, చిన్నకొడుకు అమ్మమ్మగారింట్లో  పెరిగితే కూతురు సుచరిత బామ్మగారింట పెరిగింది. కళాశ్రీగా పేరు మార్చుకున్న తరుణంలో పెద్దాడికి ఏడేళ్లూ, రెండో వాడికి ఆరేళ్ళు, సుచరిత నాలుగేళ్ళు. యీ వివరాలు సుచరితని కలవకముందే నాకు తెలుసు. కళాశ్రీ కూడా ‘అంబిక’ అనే కలం పేరుతో కథలు రాస్తూ ఉంటుంది. అది నాకు తెలుసు.

నిజం చెబితే అంతే కవిగారు. ‘కసి’ ఉందీ…. లేదూ… ఒకటి నిజం. అప్పుడు ఆమె అంటే అంతులేని అసహ్యం. ఇపుడు జాలీ, కసీ ఇంకా ఏదో తెలీని మమకారం కూడా ఉందని అనుకుంటున్నాను. “సూటిగా నా కళ్లలోకి చూస్తూ అంది సుచరిత.

“ఒకే వరలో మూడు కత్తులా?” నవ్వాను.

“జాలీ మమకరం కూడా కత్తులేనా?” కళ్లు పెద్దవి చేసి ఆశ్చర్యం నటిస్తూ అన్నది సుచరిత.

“ఈ  ‘అసహ్యం, కసి’ అనబడే కత్తులకంటే వెయ్యిరెట్లు పదునైన కత్తులు ‘జాలీ, మమకారం’ . ఆ విషయం ఇరవై రెండేళ్ళ వయసులో ఉన్న  నీకు ప్రస్తుతం అర్ధం కాదేమోగానీ, జీవితాన్ని ‘మనసుతో’ గమనించిన వాళ్లకి ఖచ్చితంగా అర్ధమౌతుంది.” నేనూ తన కళ్లలోకి చూస్తూనే అన్నాను.

“ఓహో అవిడా రచయిత్రేగా! అందుకే మీరు కాస్త అటుపక్క మొగ్గు చూపుతున్నారన్నమాట!” మాటల్లో తీవ్రత ఉన్నదని చెప్పక తప్పదు.

“కావచ్చు. కానీ సుచీ, ఒక్క విషయం చెప్పు. అప్పటి ‘కాలా’నికీ, ఇప్పటి ‘కాలా’నికీ, అప్పటి సామాజిక పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకి ఉన్న తేడాని బేరీజు వేశావా ఏనాడైనా? మీ అమ్మ ‘లేచి’పోయిందని జనాలు నీతో నీ చిన్నతనాన అన్న మాటలే నీలో పాతుకుపోయాయిగానీ, ఆమె నిజమైన పరిస్థితినీ, బాధనీ ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించావా? కనీసం ఊహించావా?” సిన్సియర్‌గా అడిగాను.

“ఊ!” ఏ కాలమైనా ‘తల్లి’ తల్లేనండీ. తను నవమాసాలూ మోసి చావుకి తెగించి కన్న బిడ్డలని, తనే వదిలిపోయిందంటే, ఆమె తల్లి అవుతుందా? సరే.. తన పరిస్థితి భరించలేనంత దుర్భరంగా వుంటే బిడ్డల్ని కూడా తీసుకుపోవచ్చుగా తనతో? పోనీ తను కొద్దో గొప్పో సెటిల్ అయ్యాకైనా తన బిడ్డల్ని తన దగ్గరికి పిలిపించుకోవచ్చుగా?” కచ్చగా అన్నది సుచరిత.

“నీకు క్రికెట్ అంటే ఇష్టం కదూ? ప్రేక్షకురాలిగా బోలేడన్ని కామెంట్స్ ఎవరైనా ఇవ్వొచ్చు. కానీ, పిచ్‌లో నిలబడి ఆడుతున్నవాళ్లకి కదా కష్టం తెలిసేది.? కాదంటావా?”

“ఓహో … మీరు తర్కం వుపయోగిస్తున్నారన్నమాట. అయ్యా… తర్కంలో కూడా నాలుగు విభాగాలున్నాయని నాకూ తెలుసు. ఇక్కడ కావల్సింది గెలుపోటముల వ్యవహారం కాదు. మానవత్వం” సుచరిత గొంతులో కాస్త అవహేళన ఉంది.

“ప్రస్తుతం మీ నాన్నగారు మంచాన పడి వున్నారని నాకు తెలిసింది. మానవత్వం గురించి చర్చించేటప్పుడు మరి ఆయన హాస్పిటల్ ఖర్చులన్నా నువ్వు భరించాలిగా. భరించే స్థోమత నీకుండీ ఎందుకు మీ నాన్నని దూరంగా పెట్టావు?” బిలో ద బెల్ట్ ఏనాడూ దెబ్బ కొట్టకూడదని తెలిసీ కావాలనే దెబ్బ కొట్టాను.

“ఉక్రోషం ఎంత అసహ్యంగానైనా మాట్లాడిస్తుందనటానికి మీరన్న మీ మాటలే ఉదాహరణ మాస్టారూ.. నిజమే స్థోమత ఉంది. కానీ ఆయన చేసిన అన్యాయం? ఎనిమిదేళ్ళ కూతుర్నీ, అదీ తల్లి ప్రేమకి నోచుకోని దాన్ని పట్టించుకోకుండా, ఇంటీ పనిమనిషిని ఉంచుకుని, దాన్నే పెళ్ళి చేసుకుని, దాన్నే అమ్మ అని పిలవమని నా వీపు మీద వాతలు పెట్టాడన్న విషయం మీకు తెలీదు. వదిలెయ్యండి కవిగారూ.. నా గతాన్ని తలుచుకున్న కొద్దీ పగిలేవి అగ్నిపర్వతాలే!” బొటబొటా కన్నీరు కార్చింది సుచరిత.

“గుడ్! నీ కష్టాలు  నువ్వు తల్చుకోగానే పగిలేవి అగ్నిపర్వతాలు. కానీ, మీ అమ్మ కష్టాలు మాత్రం నీ దృష్టికి శీతలపవనాలుగా అనిపించి ‘కసి రేగుతుంది’ కదూ! ఇదేం న్యాయం?” నా గొంతులో మోతాదుకి మించిన వ్యంగ్యాన్ని వొలికించాను.

“అంటే మీరనేది మా అమ్మ చేసింది రైట్ అనా? “కోపంగా అన్నది.

“తల్లిదండ్రుల విషయంలో తప్పొప్పులు  ఎంచే హక్కు పిల్లలకి లేదు. ఎందుకంటే నీ పుట్టుకకు కారకులు వాళ్లు. తల్లి అండాన్ని దానం చేస్తే, తండ్రి బీజాన్ని దానం చేస్తాడు. అండము, బీజము కలిసి పిండమైతేనే నువ్వు లోకానికొచ్చింది. అయినా, నీ తండ్రికి చెయ్యగలిగీ నువ్వెందుకు సహాయం చెయ్యట్లేదో నీ నిర్ణయం. నీ తండ్రి నీకు చేసిన అపకారాన్నీ, నిన్ను పెట్టిన బాధల్నీ నువ్వు క్షమించలేవు . కానీ నీ తల్లి,  నీ తండ్రి పెట్టిన బాధల్ని మాత్రం క్షమించి ఆ నరకంలోనే ఉండుంటే నీకు చాలా తృప్తి కలిగి, మా ‘అమ్మ దేవత’ అనుండేదానివి కదూ?

అయితే అదే ప్రశ్న మళ్లీ అడగక తప్పదు. ‘ నా కూతురు దేవత’ అని ఇప్పుడు మీ నాన్నతో అనిపించుకోగలిగిన స్థితిలో ఉండీ, ఎందుకు అనిపించుకోలేకపోతున్నావు?” యీసారి నేను నవ్విన నవ్వులోనూ వ్యంగ్యం ఉందని నాకు తెలుసు.

“శబాష్ కవిగారూ! అటు ఆవిడా ఇంకోడ్ని పెళ్ళి చేసుకుంది. ఇటు ఈయనా ఇంకోదాన్ని పెళ్ళి చేసుకున్నాడు. వాళ్లు పరిస్ధితులతో ఏనాడూ రాజీపడలేదు? వాళ్ల బుద్ధికీ, వాళ్ళ మనసుకి తోచింది చాల నిర్భయంగా నిస్సిగ్గుగా చెసేయ్యొచ్చు .  కానీ మేం మాత్రం చాలా విశాల హృదయంతో అర్ధం చేసుకుని, వాళ్ల అవసరాల్ని గమనించాలన్నామట! ఎంత ధృతరాష్ట్ర నిర్ణయం మీదీ?” వ్యంగ్యంగా నవ్వుతూ చప్పట్లు చరిచింది సుచరిత.

“ఓకే సుచీ..  నాది ధృతరాష్ట్ర నిర్ణయమే అనుకో. కాదనను. పోనీ నువ్వన్న మాటనే కాస్త వివరిస్తావా?”

“ఏ మాట?”

“మొదట్లో అసహ్యం ఉండేది. ఇప్పుడు జాలీ, కసీ కొంచెం మమకారం కూడా ఉన్నాయి. అన్న మాటని!”

“దీన్నేనా కాలుకేస్తే వేలికీ, వేలికేస్తే తలకి వెయ్యటం అంటే?  సరే.. జాలి ఎందుకంటే, ఇరవై రెండేళ్ళకే ముగ్గురు పిల్లల్ని వొదిలేసి, వేటూరిగారన్నట్టు యీ దుర్యోధన దుశ్శాసన దుర్మదాంధ ప్రపంచంలోకి ఒంటరిగా ప్రవేశించి నానా అగచాట్లు  పడినందుకు. కసి ఎందుకంటే, కేవలం స్వసుఖం, స్వార్ధం కోసం కన్నబిడ్డల్నీ, ఇంటి పరువు పతిష్టల్నీ నడిరోడ్డున వొదిలి తనతోవ తాను చూసుకొన్నందుకు. మమకారం ఎందుకంటే, నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి గనక. ఆ రాస్కెల్ అదే నా తల్లి గొప్ప నటీమణి. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో వొదిగిపోతుంది. ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన నటీమణుల్లో ప్రధమురాలని అననుగానీ,  ప్రముఖురాలు. ఆవిడ్ని తెరమీద చూసినప్పుడల్లా ‘యీవిడా నా తల్లి!” అని ఆశ్చర్యంతో మైమరచిపోతా. హాల్లోంచి బయటికి రాగానే… “వాహ్.. అంతా నటనే!” అని జ్వలించిపోతా.  ‘తల్లిమనసు’ చిత్రంలో కూతురికి పోలియో అని తెలిశాక ఏడిస్తూ ఆవిడ నటించిన సీను చూస్తే ‘తల్లంటే అదిరా’ అని ఎవడైనా అనుకుంటాడు. అలాంటి అమ్మ ఉండాలని ప్రతివాడు ఊహించుకుంటాడు…. నేను తప్ప!! ఎందుకంటే ఆ ఏడుపు ఆ ఎక్స్‌ప్రెషన్సూ అన్నీ క్షణికాలే.. అంతా నటనే…!”కసితో పాటు అసహ్యమూ ధ్వనించింది. “అయినా .. ఇంత గొప్ప నటీమణి నా తల్లి అన్న గర్వం, మమకారం మనసులో మెదులుతాయి” అన్నది.

నేను సైలెంటైపోయాను. సుచరిత మనసులో కలిగే భావాలు నాకు తెలీకపోలేదు. కానీ నా ప్రయత్నం నేను చెయ్యక తప్పదు.

“నిజంగా సుచీ. నీ హృదయం చాలా గొప్పది. నిష్పక్షపాతం గా  మీ అమ్మగార్ని మెచ్చుకోవడం నీ నిజాయితీకీ, సంస్కారానికీ నిదర్శనం. బహుశా మీ అమ్మ నీకు ఏమిచ్చినా, ఏమివ్వకపోయినా నీకు తన రక్తాన్నేగా ‘నటన’నీ వారసత్వంగా  ఇచ్చిందని చెప్పక తప్పదు. ‘రాలిన చివురాకు’ లోనీ నటనకి అవార్డు రావడమే నీలోని నటి ‘ప్రజ్ఞ’కి నిదర్శనం.”నిజంగానే మెచ్చుకున్నాను.

“అవును గురూజీ! ఇంతకీ నన్ను ములగచెట్టు ఎందుకెక్కిస్తున్నారు?” పరిహాసంగా అన్నది సుచరిత.

“ఒక గొప్ప నటికి మరో మహానటి మనసు అర్ధం కాదా? మీ అమ్మ ఏనాడూ గ్లిజరిన్ వాడదని అందరికీ తెలుసు. సన్నివేశంలో దిగ్గానే కన్నీళ్లు వాటంతట అవే వర్షంలా కురుస్తాయని అంటారు. నువ్వూ ‘రాలిన చివురాకు’ సినిమాలో గ్లిజరిన్ వాడలేదని నాకు తెల్సు. ఆనాడు నీ కళ్లలోంచి వచ్చినవి వెచ్చని స్వచ్ఛమైన కల్తీలేని కన్నీళ్ళే. కళ్లలోంచి నీళ్లు కురవాలంటే మనసు కరగాలి. ఆ మనసు కరగాలంటే  అది పాషాణం కాకూడదు.  చిన్న చిరుగాలికైనా స్పందించి, అటూ ఇటూ ఊగే చిగురాకు  కావాలి.  అలా చూస్తే మీరిద్దరిదీ చివురాకులాంటి స్పందించే మనసులే. పాషాణాలు కావు.” మధ్యలో మాటల్ని ఆపేశాను.

“ఎందుకు మళ్లీ  మేము తల్లీకూతుళ్లమని జ్ఞాపకం చేస్తారూ? మా ఏడుపులూ మా నవ్వులూ ఒకలాగే ఉండొచ్చు. కానీ మా అదృష్టాలూ, దురదృష్టాలూ ఒకటి కాదుగా? ఆవిడకేం? మొగుడున్నాడు. ఒకరో ఇద్దరో మాలాగా కాకుండా, ‘ప్రియమైన’  పిల్లలున్నారు.  ఆస్తి వుంది… అంతస్థూ వుంది…’  నటిగా బోలెడు మందాన పేరుంది. ఇంకేం కావాలీ        “మా గోల మాది. నా ఇద్దరు అన్నలూ ఎందుకూ  పనికిరానివాళ్లయిపోయారు. చిన్నతనం నించీ వాళ్లు పడ్డ అవమానాలు వాళ్లని గొంగళి పురుగుల్లా మార్చినై. ఎక్కడా ఉండలేరు. కనీసం ‘ఇది’ కావాలని అడగలేరు. మమ్మల్ని ఒదిలి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఒకడు ఆర్మీలో ఎక్కడో బోర్డర్లో వుంటే ఇంకోడు రైల్వే కేటరింగ్ సర్వీసులో గంటకో వూరి గాలి పీలుస్తున్నాడు. మరి మీరు మాత్రం మా అమ్మగారిని మాకేదో దగ్గర చెయ్యలనే ప్రయత్నం మాత్రం మానటంలేదు. మమ్మల్ని కలిపితే మీకొచ్చే లాభం ఏమీ లేదని నాకు తెలుసు. కానీ ఆవిడ ‘ఈగో’ సాటిస్‌ఫై అవుతుంది. ఏవో కాకమ్మ కబుర్లు చెప్పి,  నన్ను దగ్గరికి తీసుకుని,” నా తప్పేమీ లేదు బుజ్జీ, ఇది కేవలం విధి లిఖితం. లేకపోతే నీ ‘దృష్టిలోపం’ అని తనని తాను విముక్తురాలిగా చేసుకుంటుంది. మాస్టారూ, అది నాకు ఇష్టం లేదు. ఇన్నేళ్ళ తరవాత ఆమె ప్రేమ ఒద్దు. అసలావిడ ప్రసక్తే మళ్ళీ తీసుకురావొద్దు” ఖచ్చితంగా అన్నది సుచరిత.

నేను నవ్వాను.

“మీరు ఇదంతా ఊహించే వచ్చారనీ, మీరు ఊహించిన మాటల్నే నేను మాట్లాడుతున్నాననీ నవ్వొచ్చిందా మాస్టారూ? నవ్వండి. ఎందుకంటే పులి ఆకలి లేడికి నరకం. మీ రచయితలు బహుశా పులులకంటే క్రూరమైన లక్షణాలతో పుడతారేమో! మీ మీద నాకున్న గౌరవాన్ని దయచేసి అలాగే వుండనివ్వండి.  మా అమ్మకారణంగా దాన్ని మట్టిపాలు చెయ్యకండి.మరి…! “ఆగింది సుచరిత.

“సెలవు తీసుకోమంటావు అంతేగా సుచీ! సరే వెళ్ళొస్తాను. కానీ ఒక్కమాట… తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం న్యాయమే. కాదన్ను. కానీ వాళ్లు తమ తప్పుని సరిదిద్దుకోవటానికి ఓ అవకాశం ఇవ్వడం కూడా అన్యాయం కాదేమో?” ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాను.

“వాళ్లు తప్పు దిద్దుకోవడానికి అవకాశమా? ఇస్తాను. మరి నా బాల్యం వాళ్లు నాకు ఇవ్వగలరా? చెప్పండి… ఇవ్వగలిగితే యీ క్షణమే మా నాన్న కుటుంబాన్ని మద్రాసు తీసుకొచ్చి నేను పోషిస్తా. ఇవ్వగలిగితే యీ క్షణమే మా అమ్మని కల్సి, ఆవిడ పిల్లల్ని నా తోబుట్టువులుగానూ, ‘ఆయన్ని’ తండ్రిగానూ  స్వీకరిస్తా. .. ఏం? నా బాల్యాన్ని మళ్ళీ వాళ్ల చేత నాకు ఇప్పిస్తారా?”

ఇసుకలో ఇంకిన నీటినీ, ‘గతపు’ నీడల్లో ఒదిగిన కాలాన్ని మళ్లీ ఎవరు వెనక్కి తేగలరు?”

“వస్తాను సుచీ.. తప్పో రైటో నాకు తెలీదుగానీ మీ అమ్మ బాధ చూడలేక వచ్చాను. కావాలనే కొన్నిసార్లు నిన్ను బాధపెట్టే మాటలూ, ఇబ్బంది పెట్టే మాటలూ అన్నాను. ఒకటి మాత్రం నిజం…! కొన్ని చెయ్యి జారిపోకముందే జాగ్రత్తపడాలి. కొందరి విషయంలో కాలాతీతం కాకముందే కనికరం చూపించాలి. సారీ.. అది నీ ఇష్టం..” నేను లేచి వచ్చేశాను.

కళాశ్రీ ఇంటికి వెళ్లలేకపోయాను. వెడితే, సుచరిత ఏమన్నదో ఆవిడకి చెప్పాలి. సుచరిత అడిగిన ప్రశ్నలకి ఖచ్చితంగా కళాశ్రీ అనబడే కళ్యాణి దగ్గర జవాబులు లేవు. అంతేగాదు, ఇప్పుడు నేను వెళ్లి సుచరిత అడిగిన ప్రశ్నల గురించి చెప్పినా, సుచరిత తల్లిని యీ జన్మలో చూడటానికి ఇష్టపడటం లేదు అని చెప్పినా, కళ్యాణిని ఇంకా బాధపెట్టిన వాడినవుతాను.

‘మౌనం’ చాలా ఇబ్బందుల్ని తొలగిస్తుంది. నేను అదే పాటిస్తున్నా. నెలన్నర గడిచిందేమో. ‘రాఘవ’ కనిపించాడు. రాఘవ అంటే కళ్యాణి రెండో భర్త. తెలుగువాడే అయినా ‘రాఘవన్’ అని పరిచయం చేసుకోవడమేగాక, కావాలని తమిళ యాసలో తెలుగు మాట్లాడతాడు. “హలో సార్.. ఎట్టా వుండారూ?” తమిళ యాసతోనే అడిగాడు రాఘవ.

“బాగున్నానండీ. ఏంటి విశేషాలు.?” మామూలుగా అడిగాను. ఆయన పరిచయం వున్నా లేనట్టే లెక్క. ఒకందుకు మెచ్చుకోవాలి. కళ్యాణి నాతో మాట్లాడేటప్పుడు మధ్యలోకొచ్చేవాడు కాదు. తను నాతో కూడా ఫ్రెండ్లీగానే అన్నట్టు ‘ఉండేవాడు.’

“ఏం చెబుతాం సార్. అంతా బాగానే ఉంది. ఏదో..!” నవ్వాడు.

ఇంతకీ మేం కలిసింది పాండీ బజార్లో ‘వుడ్‌లాండ్స్’ హోటల్లో.

ఒకప్పుడు (నేను మద్రాసుకి వచ్చిన కొత్తలోకూడా) వుడ్‌లాండ్స్ కాఫీకి గొప్ప పేరు. రచయితలూ, హీరోలూ తరచుగా ఆ రోజుల్లో విజిట్ చేసే హోటళ్ళు నారాయణ కేఫూ… వుడ్‌లాండ్సూ.. ‘దాస్‌ప్రకాష్’ మరో గొప్ప హోటల్. మద్రాసు వచ్చినవాళ్లు దాస్‌ప్రకాష్‌లో తినకుండా వెళ్ళేవాళ్లు కారు. అదో ‘సింబల్’ అలాగే  బుహారీ హోటల్. అఫ్‌కోర్స్ అది మాంసాహార  ప్రియులకి.  నాలాంటి గ్రాస్‌యీటర్స్(వెజిటేరియన్స్)కి కాదు.

నేను ‘రవ్వ దోసె’ తింటుంటే ఆయన ‘మసాలా దోసె’ తింటున్నారు. కాఫీ తాగాక బయటికొచ్చాం. ఆయన ‘కారు’ ఎక్కి వెళ్లిపోయేదాకా ఉండి నేను పానగల్ పార్కులో ‘ఘంటసాల’గారి బెంచీ మీద సెటిలయ్యాను.

పాండీ బజార్ పానగల్ పార్కుకీ, తెలుగువారికీ ఎంత అవినాభావ సంబంధమో.. ఘంటసాల, సముద్రాల, మల్లాదిగారు, కృష్ణశాస్త్రిగారు, ఆరుద్ర, ఇంకా పింగళి నాగేంద్రరావుగారు వీరంతా పానగల్ పార్కులో కూర్చొని మాటలకీ, పాటకీ ‘సొబగులు’ దిద్దినవారే. అద్దినవారే.. సరే.. మరోసారి విపులంగా చెప్పుకుందాం.

బెంచి మీద కూర్చొని  ‘పోయిన మంచోళ్ల’ నీ తల్చుకుంటున్నా. “గురూగారు, రాఘవ మీకు బాగా తెలుసా?” కొంచెం అనవసరపు కుతూహలం   ప్రకటిస్తూ  అడిగాడు ‘చతుర్ బాబు’. అతనో ఘోస్టు రైటరు. అంతే కాదు చిన్న చిన్న వేషాలు కూడా వేసేవాడు. ఎక్కువగా ‘డైలాగ్’లేని శివుడి వేషాలకి ఆయన్ని పిల్చేవాళ్లు.

“తెలుసు” ముక్తసరిగా అన్నాను.

“మహాగట్టోడు” పకపకా నవ్వాడు చతుర్‌బాబు. పేరులో ‘బాబు’ అని గానీ, వయసు ఏభై దాటి వుంటూంది. నేను మాట్లాడలా.

“ఎందుకని అడగరేం? ఆయనది మా ప్రకాశం జిల్లానే. ఊళ్ళో పెళ్లాం పిల్లలూ వున్నారు. వాళ్లని పోషించాలంటే అక్కడ బేలన్స్ నిల్లు. మొత్తానికి కళ్యాణిని  పట్టి పబ్బం గడుపుకుంటున్నాడు. వాళ్లమ్మాయి పెళ్ళి జరిగింది ఆర్నెల్ల క్రితమే కదా..  పైకేమో విడాకులు. మరి పెళ్లిలో ‘కన్యాదానం’ ఎట్టా చేశాడూ?” లాపాయింటు లాగాడు చతుర్.

ఈ చలన చిత్ర పరిశ్రమలో ఎవరైతో ఏం మాట్లాడినా కష్టమే. వచ్చేది మాత్రం మీరు మాట్లాడని విషయమే. నా అదృష్టం బాగుండి ఆ రోజున నా ఫ్రెండ్ శ్రీవిలాస్ నావైపుకి వస్తూ కనిపించారు. ఆయన సూరి భగవంతంగారికి అతి దగ్గరి చుట్టమేగాక మంచి స్నెహితుడు. దాంతో చతుర్‌బాబుగారి ‘సంభాషణకి’ బ్రేక్ పడింది. అయితే రాఘవ కూతురి పెళ్లి  జరగటం, ఆ పిల్లకి రాఘవ కన్యాదానం చెయ్యడం నాకు కొత్తగా తెలిసింది.

ఎందుకో ‘సుచరిత’ గుర్తుకొచ్చి అప్రయత్నంగా (అనొచ్చా) ఓ నిట్టూర్పు వెలువడింది. ప్రస్తుతం సుచరిత అప్‌కమింగ్ నటి. నిజం చెబితే చాలా ‘మంచి’ నటి. మరి ఆమె పెళ్ళికి ఎవరు కన్యాదానానికి కూర్చుంటారు? ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న.

సమాధానం తేలిగ్గానే దొరికింది. రెండు నెలల తర్వాత. ‘సుచరిత’కి కాన్సర్‌ట. డ్రైవర్ కొసం వెయిట్ చెయ్యకుండా ప్రొ.. CMK రెడ్డి FRCS FRST (etc etc etc) గారి  వోల్‌స్టెడ్ సర్జికల్ హాస్పిటల్‌కి డ్రైవ్ చేస్తూ వెళ్లాను. సుచరిత జుట్టు పూర్తిగా ఊడిపోయింది. ఓ.. గాడ్…!!

“ఎంతో కాలం బతకనని నాకు తెలుసు అంకుల్.. అయినా అమ్మని రమ్మని పిలవలేను. ఎందుకంటే నన్నిలా చూస్తే తన గుండె పగులుతుందేమో! వద్దు. ఒక్క విషయం నిజం అంకుల్.. ఐ లవ్ హర్.. ఐ హేట్ హర్ (I love her.. I hate her) ఒక్క రిక్వెస్టు..  నేను చనిపోతే మాత్రం మా ఇద్దరన్నలకి ‘మాత్రమే’ ఇన్ఫామ్  చెయ్యండి. వాళ్లు రాకపోతే…..” సైలెంటైపోయింది.

భగవంతుడా… అసలెందుకీ అన్‌టోల్డ్ స్టోరీస్ రాస్తున్నాను..

 

మీ భువనచంద్ర

 

“మో” రికామీ చరణాల మననం…

 

వేగుంట మోహన ప్రసాద్

వేగుంట మోహన ప్రసాద్

“అట్లా అని పెద్ద బాధా ఉండదు” అవే అవే పాదాల్ని పదే పదే బెంగగా కలగలిపి పాడుకునే మెలాంకలీ లోని నిరీహ తప్ప ఎక్కువగా చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. బహుశా అది “కేవలం దుఃఖానుభూతినైనా పొందలేని డెస్పరేటశక్తత“ కూడా కావచ్చు. మండే వెల్తురు తప్ప కప్పుకోని పూలనీ, అనాచ్ఛాదిత స్వేచ్ఛతో అహరహం చిగుర్లెత్తే సమస్త ప్రకృతిలోని జీవాన్నీ తనలో నింపుకోలేక ఆర్తిచెందిన కవి విషాదం కావచ్చు. “విషాదంలోంచి దుఃఖంలోకి/దుఃఖం లోంచి శోకంలోకి” ఆరోహించే లక్ష సారంగీల వేదనారాగాలు కావచ్చు.

 

“చితి-చింత” సంపుటిలోని “మో” కవితల్లో వికసించిన మందారాల్లా, “ఈ దుఃఖానికి మరికొంచెం వెలకట్టండని దీనంగా ఏడుస్తూ” మందారాలమ్ముకునే వాడి విఫల కాంక్షల గుర్తుల్లా, “ఎగరబోతూ ఎగరబోతూ నేల కూలిన గాలిపటం” పైని రికామీగాలి మోసుకొచ్చిన పాటల్లా, అట్టడుగున జివ్వున సెల ఊరుతున్న చెలమల్లా, పొడవూ వెడల్పుల కొలతలన్నిటినీ లోతులుగా మార్చుకున్న అభివ్యక్తులు కొన్ని బృందగానం చేస్తుంటాయి. “ఎంతో ఎత్తు మీంచి నీచంగా కిందికి చూచే ఆత్మ, ఏ దుఃఖాన్నైనా విదుల్చుకోగలదా? ” అని ప్రశ్నిస్తూ “చెప్పుల్లేక వేయించిన ఇసుక మీద పరపరా నడిచెళ్ళే” మో కవితా భావాల బహుముఖ రూపాల్లోని ఒక ముఖాన్ని ఇక్కడ కాసేపు చూసిపోదాం.
 

త్రికాల బాధితం

 

మనసు నుంచి బయటకు తప్పుకోవాలి

నేను

ఇంటిముంగిట నాల్క చాచి పడుకుని రొప్పే

కుక్క

లాగా కడకొక ఎంగిలి విస్తరాకేనా ఎవరేనా విసిరేస్తారని

చూస్తూ ఉండాలి కడు జాగరూకతతో

నిశ్చేష్టిత నిర్భాషిణి నిత్యం కుంగుతూండే సరస్సు మనసు

చూస్తూ ఉండాలి ఏ కమలం ఉబుకుతుందో పైకి.

ఒంటి మీద ఒక ఈగేనా వాలినా గుండ్రంగ గంతులు వేయాలి.

పైన బస్సు

కింద రైలు

మధ్య వంతెన

ఈ రెండూ

ఇహ పరాలు కోసుకున్న క్లారినెట్ స్పీడ్

రైలు నెత్తిమీద వొంతెన విరిగిపడిన జ్ఞాపకం.

ఇహం పొట్టి

పరం దూరం

వేగం ఒకటే

టైమ్ వేరు

టెన్స్ వేరు

ట్రైన్ పొడుగు

టెన్స్ పొట్టి

టైమ్ పొడుగ్గా పర్చుకున్న వెడల్పు.

వర్తమానపు విత్తు భవిష్యద్వృక్షం.

కొన్నాళ్లకా మర్రిచెట్టు భూతం.

ఆ మర్రి, రావి, జువ్విచెట్ల జుత్తు ఆకాశంలోకి

మనకిప్పటి భూతం భూమిలో వేళ్ళు.

భావం మారదు స్వభావం మారదు

పదం మార్తుంది క్రియాపదం మార్తుంది.

ఉదాహరణని క్షమించాలి

ఉదాసీనం పనికిరాదీ విషయాల్లో.

If you wrote to me tomorrow morning

I would kiss you in the evening.

వాన కురిస్తే మాత్రం వీలుండదు.

వీలు కుదరలేదూ అంటే వాన కురిసిందీ అని అర్ధం.

నీ ఉత్తరం, వర్తమానం లేదో

ఇట్లా వర్తమానం లేని నాలాటివాడు

గతంలోకీ భవిష్యత్తులోకీ, ఇంట్లోంచి బయటికీ

తిరుగుతూ నాల్క చాచుకుని కాపలాకాస్తుంటాడు

ఇహానికీ పరానికీ చెడుతూ.

 

 

వ్యాఖ్యానం:

మనసు- అత్యాశలు పోయి ఆకాశాల్లో తిరుగుతుంది. నిండుపచ్చటి ఆకులపైని ఎండమబ్బుల మిలమిలల్ని మేసి మనసు నింపుకుంటానంటుంది. సాధ్యాసాధ్యాలు, అవసరపు ఆకలీ, పగిలే దేహమూ, పోయే ప్రాణమూ లెక్ఖలేదు. మరి ఏదోలా బతకాలంటే, లేకలేక ఉన్న ప్రాణాన్ని నిలబెట్టుకోవాలంటే బయటపడక తప్పదు మనసునుండి. ఊహల మత్తులో మూసుకుపోతున్న కనురెప్పల్ని నిలిపి- ఇటు చూడు దారిదే అని ఉసిగొల్పి చూపుల్ని తిప్పి “కడకొక ఎంగిలి విస్తరాకేనా ఎవరేనా విసిరేస్తారని చూస్తూ ఉండాలి కడు జాగరూకతతో.”

 

కుంగిపోతుంది మనస్సు అట్టడుక్కో లోలోతుల్లోకో, మరింత కిందకు కుదించుకుని ఏ పాతాళగంగలోనో మునగొచ్చనే ఆశతో లోపలికి అలలెత్తే సరస్సు లాగా. ఉపరితలం మీద మాత్రం “నిశ్చేష్టిత నిర్భాషిణి” లా నిశ్చలమై కనపడుతుంది. “ఏ కమలం ఉబుకుతుందో పైకి” అనే ఎదురుచూపుకి ఆయువు అనంతం కాబట్టి దొరికే ప్రతీ గడ్డిపువ్వునీ పోగు చేసుకుని, తాకే ప్రతీ మాములు గాలిని లోపలికి నింపుకుని, చివరికి “ఒంటి మీద ఒక ఈగేనా వాలినా గుండ్రంగ గంతులు వేయాలి” అని సమాధానపడుతుంది.

 

రెండు వేగాల మధ్య తేడాని సమన్వయం చేస్తూ ఒరుసుకుపోనివ్వకుండా మధ్యలో అడ్డుపడి నడిపే వంతెనలాంటి ఆధారమొకటి కూలిపోతే- సుఖానికి దుఃఖానికీ, ఉండటానికి లేకపోవడానికి మధ్య దూరం ఒక్క ప్రమాదమే కావచ్చు. కాలం నుంచి కాలానికి దూరం నుంచి దూరానికి చేరుకుని అక్కడ నిన్నని ఇక్కడి రేపటిగా మార్చే రైలు పొడుగు ముందు “టెన్స్” ఎలానూ పొట్టిగా కుచించుకు పోతుంది.

 

ఒకనాడెవరో నాటిన విత్తొకటి చరిత్రలోతుల్లోకి విశాలంగా వేళ్ళూని నేడొక మహావృక్షపు గతాన్ని సగర్వంగా కొమ్మకొమ్మకూ చాటుతుంది. కానీ ఏమో! మరెవరికో ఏ దారితప్పిన అర్ధరాత్రో ఆ గతం(భూతం) వికృతాకారమై “ఆ మర్రి, రావి, జువ్విచెట్ల జుత్తు ఆకాశంలోకి“ విరబోసుకుని భూతమై భయపెడుతుందేమో! కేవలం కాలం గడవడం వల్ల, పాతబడ్దం వల్ల, అలవాటు పడ్డం వల్ల, వస్తువులో లేని కొత్త భావమేదో కల్పించుకోదలచుకోవడం వల్ల- మూల స్వభావంలో లేని మార్పుని ఉందని నిర్వచించడానికి “పదం మార్తుంది, క్రియాపదం మార్తుంది.”

 

నమ్మకం ఉంటే ఎదురుచూడగలవు. ఏదురుచూస్తేనేగా నమ్మడానికి ఏదైనా ఆధారం దొరికేది? ఇప్పుడు తాకి నిద్రలేపితే రేపు నువ్వు రాగలవు. రాకుండానే ఎలా తాకేది? సమాంతర సమీకరణాలే అన్నీ.  అందుకే అర్ధం చేసుకుంటావని ముందే చెబుతున్నాడు “వాన కురిస్తే మాత్రం వీలుండదు. వీలు కుదరలేదూ అంటే వాన కురిసిందీ అని అర్ధం.” చివరికి మిగిలే విలువేదో తెలిస్తే సమీకరణాల్లో అక్షరాలు ఇట్టే కనిపెట్టొచ్చు. కానీ తోచిన అక్షరాలు రాసుకుంటూ పోతే కానీ ఒక విలువకి చేరుకోలేము. తీరా ఆఖరు అంకె సరిగ్గా వచ్చేశాక అక్షరాలన్నీ తప్పంటారు మీరు. అందుకే నేనారోజే చెప్పానుగా అనే గొడవ ఈరోజు లేకుండా ఆ కబురేదో అందిస్తావని- అత్తరు చల్లిన ఉత్తరంలో గులాబి రేకలు మడిచి పంపకున్నా పెనుగాలికి గింగిరాలెత్తే ఏ ఎంగిలాకు తోనో పరాగ్గా విసిరేస్తావని “గతంలోకీ భవిష్యత్తులోకీ, ఇంట్లోంచి బయటికీ/ తిరుగుతూ నాల్క చాచుకుని కాపలాకాస్తుంటాడు/ ఇహానికీ పరానికీ చెడుతూ.”

– స్వాతి కుమారి

swatikumari

ఎంత నేర్చినా…?

SAM_0344

ఆవేళ బుధవారం -పాత బట్టల మూట ముందేసుకుని కూర్చున్నారు అత్తగారు .

అప్పటికి అయిదారుసార్లు తిరగేసి మరగేసి చూసారు అందులో చీరల్ని . ఒక్కోటీ విప్పతీసి చూడటం మళ్ళీ మడతేసి పెట్టడం .ఎప్పటికో రెండు చీరలు తీసి ఒళ్ళో వేసుకున్నారు . అదా ఇదా అని కాసేపు ఆలోచించి చివరికి ఎటూ తేల్చుకోలేక రెండిటినీ మూటలో వేసేసి తలపట్టుకు కూర్చున్నారు . మా అత్తగారి అవస్థ చూసి నేను గట్టిగా నిట్టూర్చాను ఎప్పట్లానే .

“కొత్త చీరలు కొనుక్కునేప్పుడు ఆలోచించాం – హైరానా పడ్డాం అంటే అర్ధం వుంది కానీ , మాయదారి పాత చీరల సెలక్షనుకి కూడా ఇన్ని పుర్రాకులు పడాలా . కళ్ళుమూసుకుని మూటమొత్తంగా తీసుకెళ్ళి పారేస్తే పోయేదానికి” అన్నాను అత్తగారితో . అంతటితో ఊరుకున్నానా …..”దానధర్మాలు చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలటండీ దేవుడు మనకా అవకాశం ఇచ్చాడు కాబట్టి ఉదారంగా ఇచ్చిపారేయడమే . మన ఇంట్లోంచీ ఒక రూపాయి దానంగా వెళితే రెండు రూపాయలు మనింట్లోకొచ్చే దారి చూపెడతాడటండీ ఆ భగవంతుడు . అంటే ….ఇప్పుడు మనం ఒక పాత చీర ఇస్తే రెండు కొత్త చీరలు కొనుక్కునే అవకాశం మనకి దొరుకుతుందన్నమాట” అని ఎక్కడో విన్నవి టీకా తాత్పర్య సహితంగా అనుమానం లేకుండా అప్పచెప్పేసాను.

అయిందా ఉపన్యాసం అన్నట్టు ఆవిడ నాకేసి శాంతంగా చూసి, “ఇలావచ్చి కూచోవే …నీకో కథ చెపుతాను” అనేసరికి గానీ నే చేసిన తప్పు బోధ పడలేదు . దాన ధర్మాల గురించి నేనిలా తేలిగ్గా మాట్లాడినప్పుడల్లా ఆవిడ ఒకానొక బరువయిన కథ చెప్పటం , నేను కళ్ళొత్తుకుంటూ ఆ కథ వినేయడం పరిపాటయిపోయింది .

“వరాల్రాజుగారి కథేనా …..తెలుసుగా “ అన్నాను నింపాదిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ.

“ ఊరికే తలాడిస్తూ వినేస్తే సరిపోయిందా దేన్నుంచయినా నేర్చుకోవాల్సింది నేర్చుకోవద్దూ . అత్తయినా చెప్పిందికాదమ్మా అని అందరూ నన్నంటారు ఇలా వచ్చి కూచొని మళ్ళీ ఒక్కసారి చెప్పించుకోవే “ అని బ్రతిమాలేస్తుంటే ….బ్రోచేవారెవరురా అని నేను దిక్కులు చూడ్డం మొదలుపెట్టాను.

వాకిట్లోంచీ ” అయ్యగారండో ….అయ్యగారండమ్మా …” అన్న పిలుపు వినపడగానే …. బ్రతికానురా భగవంతుడా అనుకొని ఒక్క ఉరుకులో అక్కడినుంచీ బయటపడ్డాను .

చాకలి పోలమ్మ . పాపం పెద్దయ్యగారు ఇస్తానని ఆశపెట్టిన పాత చీరకోసం కాళ్ళరిగిపోయేలా తిరుగుతుంది . మంగళవారం పొద్దొచ్చేసిందనీ, శుక్రవారం పొద్దు ఇంకా దాటలేదనీ , ఈవాళ ఇంట్లో చుట్టాలున్నారనీ, రేపు మాకు పనుందనీ, ఇంకా అదనీ ఇదనీ ఎన్నాళ్ళబట్టి తిప్పుతున్నారో దాన్ని . ఈవాళయినా దాని ఆశ తీరుతుందో లేదో….ఏ చీరను వదిలించుకోవాలి అనే విషయం మీద అత్తగారు ఇంకా ఒక నిర్ణయానికొచ్చినట్టులేదు .

మా అత్తగారి పద్ధతేవిటో నాకు అర్ధం కావటంలేదు . తనంత తాను ఇవ్వాల్సివస్తే ఒకటికి రెండిస్తారు . అడిగింది ఇవ్వడానికి మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు . ఎంత వీలయితే అంత వెనక్కి తీస్తారు . ఆ అడిగినవాడు ఎందుకడిగాన్రా బాబోయ్ అని ఏడ్చేంతగా తిప్పిస్తారు . ప్రతీ ఏటా దీపావళికి ప్రమిదలు తీసుకొచ్చి ఇచ్చే కుమ్మరోళ్ళ పిల్లకి పురుడొచ్చిందని తెలిసి , మెత్తని నూలు చీరలన్నీ ఏరేరి మరీ పంపించారు అబ్బులుగాడితో . ఏనాడో మా ఇంట్లో పనిచేసిన నాగలక్ష్మి నడుం వంగి పనిలోకి వెళ్ళలేకపోతుందని విని బియ్యం బస్తా పడేయించారు దాని పాకలో . “అయ్యగారూ మంచి జరీ ఉన్న పాత కోక ఇప్పించండి బాబూ తవరి పేరు సెప్పుకుని కట్టుకుంటాను ” అని ఆ మధ్య ఎప్పుడో నోరు తెరిచి అడిగింది పాపం పోలమ్మ . ఇదిగో ఇప్పటిదాకా తిప్పుతున్నారు. హేవిటో ఈవిడ వరస అంతా తికమక- మకతిక అనుకుంటుండగా వచ్చారు అత్తగారు .

“ఊ..ఇదిగోనే పోలమ్మా . ….చీర చీరని చంపుతున్నావని ఇస్తున్నా అంచయినా మాయలేదు. జాగ్రత్తగా కట్టుకుంటే పదేళ్ళయినా మన్నుతుంది “ అంటూ ఆవిడ పోలమ్మ చేతుల్లో పడేసిన పాత చీర చూసి నోరెళ్ళబెట్టిన పోలమ్మని చూస్తే నాకు నవ్వాగలేదు . ఆ చీరకసలు అంచేలేదు. రంగయినా ఇదని చెప్పటానికి వీల్లేనిది . విప్పతీస్తే ఇంకా లోపల ఏవేం విచిత్రాలు దర్శనమిస్తాయో .

ఆవుదం తాగినట్టూ మొహం పెట్టి అంతలోనే సర్దుకుంది పోలమ్మ . “సూసేరాండీ సిన్నయ్యగారూ మీ అత్తయ్యగారి పరాచికాలు ” అంటూ నవ్వేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటే….మా అత్తగారు బుగ్గలు నొక్కుకుని ” ఇందులో పరాచికమేవుందేవ్ ! నువ్వడిగింది పాత చీరేగా” అనేసారు తేలిగ్గా.

“ ఆ…..మీరు భలేవోరు అయ్యగారు . పాతకోకని అడగాపోతే తవరు కట్టుకునీ పట్టుకోకలిమ్మని అడుగుతావాండీ … మారాజులు మీరే అర్దం సేసుకోవాల . తవరిచ్చిన కోక కట్టుకుని మా మెండపేట తమ్ముడింటిని ఎలదారనీ , మా అయ్యగారు ఎంత నాణవయిన కోకలు కడతారో అక్కడ మాఓల్లందరికీ సూపిద్దారనీ ఎంత సంబరపడ్డానో తెలుసాండీ” అంటూ….చూసుకోండి మరి ఈ చీర కట్టుకెళితే పోయేది మీ పరువే అన్న అర్ధం ద్వనించేలా కళ్ళూ ఒళ్ళూ విచిత్రంగా తిప్పేసింది పోలమ్మ .

పోలమ్మ వంటిమీద జీరాడుతున్న నిమ్మపండు రంగు గద్వాల చీరను పరీక్షగా చూస్తూ “చాల్లే వే చెప్పొచ్చేవ్ …..నీ సంగతి నాకు తెలీకనా !! నీకు చీరలకి కరువేంటే , రేవులో పడ్డ జరీ చీరలన్నీ ఓ తిప్పు తిప్పికానీ ఇళ్ళకు చేర్చవు కదా . ఇక మాలాంటివాళ్ళిచ్చిన పాత కోకలు చుట్టుకుని చుట్టాలింటికి వెళాల్సిన ఖర్మం నీకేవిటీ” అని అత్తగారు సుతారంగా అంటించేసరికి , ఉడుక్కున్నట్టూ మొఖం ముడుచుకుంది . “మనసులో ఏదో పెట్టుకుని మాట్టాడతన్నారు పెద్దయ్యగారు “అంటూ గారం పోయింది .
దాన్నలా చూస్తే నాకు జాలేసిపోయింది. నిజం చెప్పాలంటే కొంచెం భయం కూడా వేసింది. ఇస్త్రీ కోసం ఇచ్చిన నా పెళ్ళి పట్టు చీర దాని దగ్గరేవుంది. కోపంలో కాల్చి పారేస్తేనో ? మంగలి కత్తి మెడమీద పెట్టినపుడు – చాకలింట మన కొత్తకోక ఉన్నప్పుడు ఎవరయినా ఎంత జాగ్రత్తగా వాళ్ళపట్ల ఎంత మర్యాదగా వుండాలి . అయినా అత్తగారూ …. ఇదేం అమాయకత్వం అని నేను గొణుగుతూనే వున్నాను .

అదేం పట్టించుకోకుండా ఆవిడ అతి సీరియస్ గా మొఖం పెట్టి “ పోయిన పండక్కి పాలేర్లందరితోపాటూ నీకూ కొత్త బట్టలు పెట్టానా ….మా కోడలు తొలిమాటు సారెతో ఇంటి చాకలని నీకో కొత్త చీర తెచ్చిందా …..అవి కాక మా పెద్దొదినగారు దీపావళికి పంపించిన మూరతక్కువ చీర నీకు పనికట్టుకుని కబురంపి మరీ ఇచ్చానా ….అవన్నీ ఏం చేసావ్ …పోనీ ఒక్కమాటు సరదాగా కట్టుకొనొచ్చి అయ్యగారికి కనపడదాం అననుకున్నావా …పైగా రంగు నప్పలేదు, బట్ట బాగోలేదు అని నీ అరుగుమీద కూర్చుని వచ్చేపోయేవాళ్ళకి పేరంటం పెడతావా !….మళ్ళీ ఇప్పుడు ఏం ఎరగనట్టూ అయ్యగారూ పాతకోక అంటూ వచ్చి నిలబడితే నాకేం తెలీదనుకున్నావా …..పోన్లేపాపం ఇంట్లో కట్టుకుంటావని నేనో పాత చీర పడేస్తే అది ఇంటింటికీ కట్టుకెళ్ళి మరీ చూపించొస్తావా ..హమ్మా!! “ అంటూ పాయింటు మీద పాయింటు లాగుతూ చింత నిప్పులా చిటపటలాడిపోతున్న అత్తగార్ని చూస్తూ గాభరాగా గుటకలు మింగుతూ నిలబడిపోయింది పోలమ్మ . నేను మాత్రం గబగబా వంటింట్లోకి పరిగెత్తి గ్లాసు నీళ్ళు తాగొచ్చాను .

అంతటితో వదలకుండా దాన్ని ఎప్పటినుంచో అడగాలనుకున్న నాలుగు ప్రశ్నలూ అడిగేసి, కడిగేసి శాంతించిన అత్తగారు అరుగు చివర కాలుమీద కాలేసుకుని, మూతిమీద వేలుంచుకుని అలిగినట్టూ ఎటో చూస్తూ కూర్చున్నారు.

ఇటువంటి సీరియస్ సీనుల్లో ఎటువంటి డైలాగులుంటాయో తెలీక పాఠం మర్చిపోయిన స్టుడెంట్ లా చేతులు నలుపుకుంటూ పోలమ్మనీ అత్తగార్నీ మార్చి మార్చి చూస్తూ ఉండిపోయాను .

ముందుగా తేరుకున్న పోలమ్మ చెంగున అరుగు మీదికెక్కి చూర్లో దోపిన విసనకర్ర అందుకుని ఆవిడ ఎటు తిరిగితే అటు తిరిగి అత్తగారికి గాట్టిగా విసరరటం మొదలుపెట్టింది.

“అమ్మ…దీని తెలివో !? “ అని ఆశ్చర్యపోయాను .

అదే స్పీడులో నావైపు తిరిగి “అలా సూత్తనిలబడిపోయారేంటండీ …ఎల్లి అత్తయ్యగారికి సల్లగా మజ్జిగిదాహం అట్టుకు రండీ “ అని ఆర్డరేసి పారేసింది .అమ్మమ్మో…ఏం లౌక్యం !!! అని ఈసారి ఇంకాస్త ఎక్కువ ఆశ్చర్యపోతూ లోపలికి పరిగెత్తాను .

అత్తగారు అస్తమానూ చెప్పే వరాల్రాజు అనబడే ఆ వరహాల్రాజు గారి కథ ఆ సమయంలో వద్దన్నా గుర్తొచ్చేసింది .

అనగనగా ఓ వరాల్రాజుగారట . ఆయనదసలు మాఊరు కాదట భీవారం సైడునించీ వచ్చేరట . మా ఊర్లో పాతికెకరాలు కౌలుకి తీసుకుని పొగాకు వ్యవసాయం మొదలు పెట్టారట.అంతకుముందు చేపల చెరువులు, రొయ్యల చెరువులూ చేసి లాసయిపోయేరట .రొయ్యలు పండించిన చేతుల్తో బియ్యం పండించలేక ఇటుసైడు వచ్చేసేరట .”ఊరుకోండి మీరు మరీ సెపుతారు…ఊ కులాసాలకి పోకుండా కుదురుంగా యవసాయం సేసుకుంటే లాసెందుకవుతారు . పావలా పెట్టేకాడ రూపాయెడితే ఇలాగే మిగులుతారు” అని ఆయన్ని గతంలో ఎరిగున్నవాళ్ళు అనేవారట. అయినా అయన అదేం పట్టించుకోకుండా తన కులాసాలు దర్జాలు భేషుగ్గా కొనసాగిస్తూ వచ్చారట .
శ్రీరామనవమి చందాలని వెళితే ఊర్లో అందరూ ఇచ్చినదానిమీద ఓ రూపాయి ఎక్కువ రాసుకోండి అనేవారట . ఆవునో దూడనో కొనాల్సి వచ్చినపుడు అమ్మే ఆసామీ చెప్పిన రేటుకి ఒక రూపాయి ఎక్కువే తీసుకో అనేవారట.

పెళ్ళికీ పేరంటానికీ వెళితే చదివింపుల్లోకూడా తనదే పైచేయి అనిపించుకునేవాడట . దాంతో ఎక్కడెక్కడివారూ ఆయన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఆహ్వానాలు అందించి , ఆయనందిచిన చందనతాంబూలాది సత్కారాలు పొంది వెళ్ళేవారట. ఆస్తి ఉన్నవాడు అందరికీ బంధువే అన్నట్టు మాఊర్లోనేకాక చుట్టుపక్కల ఊర్లలో కూడా అట్టహాసంగా జరిగే ప్రతీ కార్యక్రమానికీ ఆయన్నే ముఖ్య అతిధిగానూ, గౌరవాధ్యక్షుడిగానూ నిలబెట్టి కూర్చోబెట్టేవారట. అడగటవే ఆలశ్యం అన్నట్టుండేదట ఆయనతో పని . మనూర్లోనూ ఉన్నారు రాజులు ఎందుకూ ఊ..మీసాలు తిప్పుకుంటూ తిరగడానికీ మనమీద రంకెలెయ్యడానికీ తప్ప రాజంటే వరాల్రాజు గారే అని మిగతా రాజుల్ని పబ్లిక్ గానే ఆక్షేపించేస్తున్నారట తినమరిగిన జనం .

ముచ్చటగా మూడేళ్ళు గడిచేసరికి ‘మీ చందా ఇంతా’ అని ఎవరన్నాసరే దబాయించి తీసుకునేంత అలుసయిపోయేరట వరాల్రాజుగారు .ఊళ్ళో తీర్థాలకి లైటింగు ఖర్చయినా , శివరాత్రి సంబరాల్లో సినిమా ఖర్చయినా ఆయన ఖాతాకే వెళ్ళిపోయేదట . వరాల్రాజుగారి అయ్యగారు ఊర్లో దిగేప్పుడు పెట్టుకొచ్చిన మొహరీల మొలతాడు కానీ, రూపులపేరు కానీ అయిదేళ్ళ తరవాత ఆవిడ వంటిమీద కనపడలేదట . ఊర్లో దిగిన కొత్తలోనే ఆయన బుల్లెట్టు నడపటానికో మనిషిని పెట్టుకున్నారట .వాడి జీతం కూడా ఊర్లో పాలేర్లందరికంటే ఓ రూపాయెక్కువే అని మాట్లాడుకున్నారట . కొన్నేళ్ళకి ఆ బండిమీద వాడొక్కడే సొంతదారులాగా దర్జాగా తిరుగుతూ కనిపించేవాడు వెనక వరాల్రాజుగారు లేకుండా.

ఆయేడు శ్రీరామ నవమికి చందాలిచ్చినవారి పేర్లు మైకులో చదువుతూ చివరాకర్లో వరాల్రాజు గారి పేరు కూడా ఒక్కరూపాయెక్కువేసి చదివేసి, మర్నాడు పొద్దున్నే ఆయనింటికెళ్ళి చూస్తే తాళం పెట్టుందట . గడపమీద ఆయేటి చందా వందలకట్టతో పాటు ఓ రూపాయి బిళ్ళ ఒత్తెట్టి కనిపించిందట . కొన్నాళ్ళకి రామిండ్రీ నుంచీ , అనపర్తినుంచీ అప్పులోళ్ళొచ్చి తాళం పగలకొట్టి విలువయినవి అనుకున్న సామానులన్నీ పంచుకు పోయారట. అప్పటివరకూ ఆహా అన్నవాళ్ళే అంతా స్వయంకృతం తేల్చేసారట . మాటలేవన్నా కొనితేవాలా? నాలుక మడతేసి ఎటు కావాలంటే అటు ఆడించడమేకదా !రాజంటే వరాల్రాజే అన్నవాళ్ళెవరూ ఆయన గురించి బెంగిల్లిపోలేదు , మనకింత చేసిన మారాజు ఏవయిపోయేడో అని ఆరా తీయలేదు. ఎందరో వరాల్రాజుల్నీ బంగార్రాజుల్నీ మర్చిపోయినట్టే మర్చిపోయి ఊరుకున్నారట . అంతెందుకూ …వరాల్రాజుగారు చేయించి వేసిన ముత్యాల హారాలు, వెండి కిరీటాలు ధరించిన సీతారాములే ప్రతిఏటా ఆ పాడుబడ్డ ఇంటిముందునించీ ఏవీ తెలీనట్టు చిరునవ్వుతో ఊరేగుతూ వెళ్ళిపోతుంటే ఇంక మనుషుల్ని అనుకోటానికేవుందని అత్తగారు తరచూ బాధ పడేవారు .

ఈ కథ ఇంతవరకే ఊళ్ళోవాళ్ళకి తెలుసట .

కొన్నేళ్ళ క్రితం తిరపతి బస్టాండులో ” టికెట్టుకి డబ్బులు తక్కువయ్యాయి ఒక్క రూపాయిప్పించండమ్మా ” అని చేయి చాచిన వ్యక్తిని పరీక్షగా చూస్తుంటే , అనుమానంతో కళ్ళు చిట్లించిన అతను, గబుక్కున చేయి వెనక్కి లాక్కొని మరు నిమిషంలో మాయమయిపోయాడట.

“ఆయన మనూర్నించీ వెళ్ళిపోయిన వరాల్రాజు గారిలా ఉన్నారండీ “ అని అత్తగారు కళ్ళనీళ్ళు తిప్పుకుని మా మాంగారితో అంటే “ చ.చ…అయ్యుండదు” అనేసారట మాంగారు మొఖంలో బాధని దాచేస్తూ .

ఏట్లో పోసినా ఎంచిపోయాలి అనీ , అపాత్ర దానం కూడదనీ, ఇంకా ఎన్నెన్నో సామెతలతో ఈ కథ మా అత్తగారు నాకు మొదటిసారి చెప్పినప్పుడు మనసుకదోలా అయిపోయి కళ్ళనీళ్ళు తిరిగిపోయాయంటే నమ్మండి .

నేను మజ్జిగ దాహంతో తిరిగొచ్చేసరికి పోలమ్మ చెపుతున్న కబుర్లు వింటూ ప్రసన్న వదనంతో కనిపించారు అత్తగారు. ఇంతలో ఏం మాయ చేసేసిందబ్బా అని నేను ఆశ్చర్యపోతుంటే…. “ ఏమేవ్ ….ఆ గుడ్డలమూటిలా పట్రా . పోలమ్మకి నచ్చిన చీరలు తీసుకుంటుంది . అలాగే మొన్న చేసిన మురిపీలు రెండు పుంజీలు పొట్లం కట్టి పట్టుకురా పిల్లలకి పట్టుకెళుతుంది ” అని నాకు పురమాయించి, “ కోళ్ళ గూడు కింద బొగ్గుల మూటుంది వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళవే పోలమ్మా “ అంటూ దర్జాగా వరాలొకపోస్తున్న అత్తగారిని పక్కకి పిల్చి వరాల్రాజుగారి కథ నాకు చెప్పీ చెప్పీ మీరేం నేర్చుకోలేదా ? అని అడిగేద్దామనిపించింది. పొగడ్త పన్నీరు వంటిది పీల్చి వదిలేయాలి కానీ తాగి పడిపోకూడదు అని క్లాసు చెప్పేద్దామా అనికూడా అనిపించింది .

ఏవిటో….!! అనుకుంటా కానండీ …ఒకరి అనుభవం మరొకరికి గుణపాఠం అవుతుందా చెప్పండి ?

–లలిత దాట్ల

హిందూ-ముస్లిం ఉమ్మడి వారసత్వ సంపద ఉర్దూ

సంగిశెట్టి శ్రీనివాస్‌

సంగిశెట్టి శ్రీనివాస్‌

 సీమాంధ్ర ఆధిపత్యవాదులు, వారి తాబేదార్లు కొందరు తమ రచనల్లో కొత్తగా ఇటీవల ‘తెలంగాణాంధ్ర’ అనే పదాన్ని విరివిగా వాడుతున్నారు. ఇది పూర్తిగా తెలంగాణ తెహజీబ్‌కు వ్యతిరేకమైన పదం. తెలంగాణ ప్రాంతాన్ని సంబోధించడానికి ‘తెలంగాణాంధ్ర’ అనే పదాన్ని వాడినట్లయితే ఉర్దూ మాతృభాషగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న 60లక్షల మందికి పైగా ముస్లింలను అవమానించడమే! వారిని తెలంగాణ నుంచి వేరు చేసి చూడడమే!

కాస్మోపాలిటన్‌ కల్చర్‌తో పారిస్‌, లండన్‌, ఇస్తాంబుల్‌లతో సమానస్థాయిలో విలసిల్లిన హైదరాబాద్‌ ఆత్మను అగౌరవ పరచడమే! నిజానికి హైదరాబాద్‌ సంస్కృతిలో ఎన్నడూ పరాయివారిని, పరాయివారి భాషను కించపరచాలనే భావన ఏ కోశానా ఉండదు. మంచి ఎవరు చెప్పినా ఆచరించడం, అభినందించడం ఆనవాయితీ. కాని ఇప్పటి టీవీల్లో, పత్రికల్లో, సినిమాల్లో వాడే ‘తెలుగు’ భాష కచ్చితంగా తెలంగాణ తనాన్ని కించపరిచేదే! ఛానళ్లలో అలవోకగా ఆరి ‘భడవా’ మాదిరిగా వందలాది పదాలు ఎలాంటి జంకు గొంకు లేకుండా వాడుతున్నారు. ‘భడవా’ అంటే తెలుగులో ‘తార్పుడుగాడు’ అని అర్థం. ఇలా భాష తెలియకుండానే దాని అర్థం తెలియకుండానే సీమాంధ్ర ‘మేధావులు’ వాడేస్తున్నారు.

 

హైదరాబాద్‌ రాజ్య అస్తిత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మింగేయడం మూలంగా తెలంగాణ తెలుగుకు ముఖ్యంగా హిందూ`ముస్లిం ఉమ్మడి సంస్కృతి, వారసత్వానికి ప్రతీక అయిన ఉర్దూకు జరిగిన నష్టం ఎన్నటికీ పూడ్చలేనిది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనీసం కొంతలో కొంతమేరకైనా దీనికి అడ్డుకట్ట పడుతుంది. తెలంగాణ తెలుగు, ఉర్దూ రెండిరటిని సమాధి చేసిన సమైక్య రాష్ట్రంలో ఈనాటికీ అబద్దాలే రాజ్యం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశాడనీ, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని చెబుతున్నారు. నిజానికి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టింది ఆంధ్ర రాష్ట్రం కోసం ఇంకా కచ్చితంగా చెప్పాలంటే మద్రాసు నగరం కోసం. రెండోది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం 1935లో ఏర్పడ్డ ఒరిస్సా. ఇవన్నీ మరిచి అబద్ధాలనే ఆధిపత్యాంధ్రులు ప్రచారంలో పెడుతున్నారు.
1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడంతో తెలంగాణ ప్రజల బహుభాషా ప్రావీణ్యానికి గండి పడిరది. ఉర్దూ, తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని అదే హైదరాబాదియత్‌ని కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని ముక్కలు చేయడం ద్వారా సమున్నతమైన సహజీవనానికి తెరపడిరది. భాషోన్మాదం మూలంగా హైదరాబాద్‌ రాజ్యంలోని తెలుగు ప్రజలు కేవలం తెలుగు భాషకు అదీ తమది కాని భాషలో విద్యాభ్యాసం చేయాల్సి వచ్చింది. విద్యార్థులు ఇంట్లో మాట్లాడే భాష ఒకటి, పాఠశాలల్లో పంతుళ్లు బోధించే భాష మరో యాసలో, చివరికి విద్యార్థి అర్థం చేసుకొని రాసిన భాష, జవాబు పత్రాన్ని దిద్దేవారికి అర్థంగాని గందరగోళ పరిస్థితి. వెరసి తెలంగాణ విద్యార్థికి జీవితకాల నష్టం.
1950కి ముందు హైదరాబాద్‌ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కచ్చితంగా మూడిరటికన్నా ఎక్కువ భాషలు మాట్లాడేవారు. చదువకుకున్న వారయితే వాటికి అదనంగా ఇంగ్లీషు, ఫారసీ, అరబ్బీ కూడా తోడయ్యేది. దైరతుల్‌ మారిఫ్‌ లాంటి హైదరాబాద్‌లోని తర్జుమా సంస్థ మొత్తం ప్రపంచంలోని ఏ భాషలో ప్రచురితమైన సాంకేతిక పరిజ్ఞానం సహా సమాచారమంతా ఉర్దూ మాధ్యమంలోకి అనువదించేది. అయితే హైదరాబాద్‌పై పోలీసు చర్య తర్వాత క్రమంగా మార్పు వచ్చింది. పోలీసు చర్యతో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సైనికాధికారులు ఇంగ్లీషు భాషతో మమేకమయ్యారు. వారి అధికారిక భాష కూడా ఆంగ్లమే. వీరికి సహాయకులుగా పనిచేయడానికి మదరాసు రాష్ట్రం నుంచి తెలుగు అధికారులు వచ్చారు.

urdu1

మొదట వచ్చిన వెల్లోడి ప్రజాస్వామిక భారతదేశంలో హైదరాబాద్‌ రాజ్య తొలి ముఖ్యమంత్రి. ఈయన తన పరిపాలనా సౌలభ్యం కోసం ఇంగ్లీషుని పాలన భాషగా ఏర్పాటు చేసుకొన్నారు. ఇంగ్లీషు భాష తెలిసిన వారు తెలంగాణలో చాలా మంది ఉన్నప్పటికీ వారిని ఉన్నత స్థానల్లో కొనసాగించినట్లయితే హైదరాబాద్‌ రాజ్యంలో వేర్పాటువాదానికి ఊతం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో ఇంగ్లీషు తెలిసిన ప్రాంతేతరులకు ఉద్యోగలిచ్చారు. ఇలా ఉద్యోగం పొందిన వారు ఎక్కువ శాతం మంది ఆంధ్రులే కావడం విశేషం. వీళ్ళు స్థానికభాషలో ప్రజలకు అర్థమయ్యే భాషలో పాలన పేరిట తెలుగుని పరిపాలనలో అమల్లోకి తెచ్చారు. ఇలా తెలుగుని అధికారిక భాషగా చేయడంతో అప్పటి వరకూ అసఫ్‌జాహీ ప్రభుత్వ బోధనా భాషగా కొనసాగిన ఉర్దూని బలవంతంగా తొలిగించారు. ఇలా ఉర్దూని తొలగిండమంటే ఉర్దూ తెలిసిన ఉద్యోగుల్ని తొలగించడమే! ఇలా తొలగించబడిన వారిలో అత్యధికులు ముస్లింలు ఉన్నప్పటికీ ఉర్దూ మాత్రమే తెలిసిన హిందువులు కూడా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారి స్థానంలో ప్రాంతేతరులైన తెలుగువారికి ఉద్యోగాలు దక్కాయి. స్థానికంగా ఉన్నత ఉద్యోగాల్లో తిష్ట వేసిన ఆంధ్రప్రాంత అధికారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ముల్కీ సర్టిఫికెట్లు జారీ చేసి గైర్‌ముల్కీలకు ఉద్యోగాలిచ్చారు.
1952 నాటికి హైదరాబాద్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. ఈయన స్వతహాగా సాహిత్య జీవి. ఉర్దూ, పారసీ భాషపై మంచి పట్టున్న వాడు. ఆ భాషా చరిత్రలను తెలుగు పాఠకులకు అందించాడు. అలాంటి వ్యక్తి మాతృభాషలో విద్యా బోధన పేరిట పాఠశాలల్లో తెలుగులో బోధన చేయించాలని ఉత్తర్వులు జారీచేసిండు. అప్పటి వరకూ ఉర్దూ మాధ్యమంలో టీచర్‌ ట్రెయినీలను తయారు చేసిన హైదరాబాద్‌ ఇన్సిట్యూషన్స్‌, సంస్థలు తెలుగు మాధ్యమంలో బోధించే టీచర్లకు శిక్షణా సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి. హైదరాబాద్‌ ప్రభుత్వం తెలుగులో బోధన తప్పనిసరి జేయడంతో ఆ మాధ్యమంలో బోధించే టీచర్ల కొరత ఏర్పడిరది. అదే ఆంధ్రప్రాంతంలో చాలామంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. ఆంధ్రాప్రాంతం వారికోసమే ఉద్యోగలన్నట్లుగా తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో లెక్కకు మించి, ముల్కీ నిబంధనలకు తిలోదకాలిచ్చి కొన్ని వేలమంది ఆంధ్రప్రాంత టీచర్లకు తెలంగాణలో ఉద్యోగాలిచ్చారు.

ఇలా ఉద్యోగాలు పొందిన వారు మీకు చదువు రాదు కాబట్టి మేం చదువు నేర్పించడానికి వచ్చాం. మీరు నేర్చుకునే వాళ్ళు, మేం చెప్పే వాళ్ళం’ అని అహంభావంతో వ్యవహరించేవారు. ఈ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ 1952 ఆగస్టులో ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయమేంటంటే బహుబాషా ప్రవీణులైన హైదరాబాదీయులని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కేవలం ఏకభాషీయులుగా కుదించింది. తమది కాని భాషని బలవంతంగా నేర్చుకునేలా తప్పనిసరి స్థితిని కల్పించింది.

నిజానికి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 14 భాషల్లో ప్రజ్ఞకలవాడు. బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజి, బిరుదురాజు రామరాజు ఇలా కొన్ని వందల మంది రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు ఈ బహుభాషా సంస్కృతికి అద్దం. హైదరాబాద్‌  రాజ్య ప్రజల ఉమ్మడి భాష అయిన ఉర్దూని క్రమంగా తొలగించడమనేది కేవలం ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చే గైర్‌ ముల్కీలకు మేలు చేకూర్చేందుకు చేసిన పనిగానే భావించాలి. అనుసంధాన భాషగా రాజ్యాంగంలో ఎక్కడా జాతీయ భాష హోదాలేని హిందీని అంగీకరించారు. కానీ రోజు స్థానికంగా మాట్లాడ్డమే గాకుండా విశ్వవ్యాప్తమైన స్థానిక భాష ఉర్దూని తెలంగాణ ప్రజలకు దూరం చేసిండ్రు.
నిజాం ప్రభుత్వంలో ఉద్యోగం చేయడానికి హైదరాబాద్‌ వచ్చిన బ్రిటీష్‌ రచయిత విలియమ్‌ పిక్తాల్‌ ముస్లిం ప్రజల పవిత్ర గ్రంథం ఖురాన్‌ని ఇంగ్లీషులోకి అనువదించడమే గాకుండా మతం మార్చుకొని మహమ్మద్‌ పిక్తాల్‌గా మారిండు. బ్రిటీష్‌ రెసిడెంట్‌ కోఠీలో రెసిడెన్సీని కట్టించిన కిర్క్‌పాట్రిక్‌ హైదరాబాద్‌ వనిత ఖైరున్నీసాను ప్రేమించి పెండ్లాడి హైదరాబాదీలకు ప్రేమాస్పదుడయ్యాడు. ఇలా హైదరాబాద్‌ ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన వారిని ఆదరించింది. వారి నుంచి ఎంతో నేర్చుకున్నది. అంతకన్నా ఎక్కువగా నేర్పించింది.
అయితంరాజు కొండలరావు, బిరుదురాజు రామరాజు, కె.గోపాలకృష్ణారావు తదితరులు తెలుగు`ఉర్దూ నిఘంటువులు తయారు చేసి రెండు భాషల్ని సుసంపన్నం జేసిండ్రు. అలాగే కొన్ని వందల మంది ముస్లిమేతర హైదరాబాదీలు ఉర్దూ మాధ్యమంలో చదువుకోవడమే గాకుండా ఆ భాషలో రచనలు చేసిండ్రు. రాఘవేంద్రరావు జజ్బ్‌, రాజ నర్సింగరాజ్‌ సక్సేనా, కిషన్‌పర్‌షాద్‌, కాళోజి రామేశ్వరరావు ఇట్లా కొన్ని వందలమంది ఉర్దూలో చిరస్థాయిగా నిలిచిపోయే సాహిత్యాన్ని సృజించారు. ఖమ్మం జిల్లా గురించి రాస్తూ ఆకాశం ఆంధ్ర నేల తెలంగాణ అని సెటైర్లు వేస్తుంటారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి నవలాకారుడు కవిరాజమూర్తి, కథలు, కవిత్వం ఇబ్బడి ముబ్బడిగా రాసిన హీరాలాల్‌ మోరియాలు పుట్టుకొచ్చారు. వీరిద్దరూ ఉర్దూలో అత్యున్నత స్థాయి రచనలు చేసిండ్రు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి లాంటి వాండ్లు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నారు. ఇలాంటి వారందరికీ దక్కిన ఉర్దూ నేర్చుకునే భాగ్యం నేటి తరానికి దూరమయింది.
20 మార్కులకే పాస్‌ చేసే హిందీ స్థానంలో ఉర్దూని బోధించనట్లయితే తెలంగాణ ప్రజలందరికీ ఉపయోగకారిగా ఉండేది. ఉర్దూని పాఠశాల స్థాయి నుంచి బోధించక పోవడం మూలంగా గత 60యేండ్లుగా తెలంగాణ తరాలకు జరిగిన అన్యాయం వెలగట్టలేనిది. ఉర్దూ భాష తెలియడం వల్ల మత సామరస్యం పెరగడమే గాకుండా గంగా`జమునా తెహజీబ్‌ పరిఢవిల్లుతుంది.
sky1 ఈ గంగా జమున తెహజీబ్‌ ఇటీవల హైదరాబాద్‌లో మళ్ళీ మొగ్గ తొడిగింది. గతంలో కొత్త వంతెన పేరిట కొంత కవిత్వాన్ని తెలుగు`ఉర్దూ భాషల్లో ఒకే పుస్తకంగా అచ్చేయడం జరిగింది. అలాంటి ప్రయత్నమే మిత్రుడు స్కైబాబ, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వున్న మరో కవి ఖుతుబ్‌ సర్‌షార్‌తో కలిసి ‘రజ్మియా’ పేరిట తెలంగాణ ముస్లింల కవితా సంకలనాన్ని తెలుగు`ఉర్దూ భాషలో తీసుకొస్తున్నారు. తురుకోళ్లు, తెలుగోళ్లు కలిసి వేదికలు నిర్మించుకునే, కవిత్వం చదువుకునే రోజులు హైదరాబాద్‌ రాష్ట్రం ఉన్నంత వరకూ కొనసాగాయి.
హైదరాబాద్‌ రాష్ట్రం అంటేనే దేశవ్యాప్తంగా ఉర్దూ పోషణకు ప్రసిద్ధి. ఉత్తర భారతం నుంచి అనేక మంది సృజనకారులు మహబూబ్‌ అలీఖాన్‌, ఉస్మానలీఖాన్‌ దగ్గర కొలువులు పొందిండ్రు. తమ ప్రతిభ ద్వారా హైదరాబాద్‌కూ గుర్తింపు తెచ్చిండ్రు. అలాగే తెలంగాణ సంస్థానాల పాలకులు సీమాంధ్ర ప్రాంతంలోని పండితులను పోషించారు. ఘనంగా సత్కరించారు. వారి ప్రతిభకు పట్టం గట్టిండ్రు. 1952లో దాశరథి కృష్ణమాచార్యులు అధ్యక్షులుగా ఉన్నటువంటి ‘తెలంగాణ రచయితల సంఘం’ హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారు ఝాము నాలుగ్గంటల వరకూ ముషాయిరా, కవి సమ్మేళనాన్ని నిర్వహించింది. ఇలాంటి ప్రయత్నమే ‘సింగిడి’ తెలంగాణ రచయితల పూనిక మేరకు ఇటీవల హైదరాబాద్‌లోని ఆంధ్రసారస్వత పరిషత్తు హాలులో ఒక రోజంతా జరిగింది. ఈ సమావేశంలో ఉర్దూ కవి సమ్మేళనాన్ని ప్రత్యేకంగా నిర్వహించి, తెలంగాణ ఉద్యమానికి తమ వంతు తోడ్పాటు నందించారు. ఈ పరంపర భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ….

-సంగిశెట్టి శ్రీనివాస్‌

జీవితాన్ని ఒడ్డున కూర్చుని చూడాలా?

‘‘జీవితానికి అర్ధం ఏమిటి? పరమార్ధం ఏమిటి?’’
ఈ ప్రశ్న ప్రతి మనిషి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవక మానదు. ఒక సారి ఈ ప్రశ్న ఎదురయినాక మనిషి మనిషి గా మామూలుగా ఉండడు, ఉండలేడు. తనను తాను శోధించుకోవడం మొదలు పెడతాడు. అప్పటి వరకూ తనకు ఎదురయిన అనుభవాలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా తను పాల్గొన్న సందర్భాలు, తాను నడచివచ్చిన దారులు, తాను విడిచి వెళ్ళిన పాదముద్రలు, తనకు ఎదురయిన వ్యక్తులు, తను చదువుకున్న పుస్తకాలు, తాను నివసించిన భిన్న ప్రపంచాలు, వాటి ప్రభావాలు, ప్రమేయాలు, పరిధులు, పరిమితులు ఆధారంగా తనకు నచ్చిన జవాబు ఏదో వెతుక్కుని సంతృప్తి పడతాడు. అదే జీవితానికి అర్ధమూ, పరమార్ధమూ అని సమాధాన పడిపోతాడు.
కానీ, కొన్ని ప్రశ్నలు ఒకే సమాధానాన్ని ఎల్లకాలమూ అంగీకరించవు. జీవితాంతం ఒకే జవాబును మోస్తూ తిరగవు. స్థలాన్ని అనుసరించీ, కాలాన్ని అనుసరించీ జవాబులు మారుతూ వుంటాయి. ప్రశ్నలకు సార్వ కాలీనత, విశ్వ జనీనత వుంటాయి. కానీ…..జవాబులకి సర్వకాలీన సర్వామోదము వుండదు. అందుకే అవే ప్రశ్నలు మళ్ళీ, మళ్ళీ, పుడుతూ కొత్త కొత్త సమాధానాలు అన్వేషిస్తూ వుంటాయి. అందుకే ఒకసారి జీవితానికి ఇదే అర్ధము, పరమార్ధము అని నిర్ణయించుకుని సమాధానపడినా మరుక్షణంలో ఆ సమాధానం అర్ధరహితం అయ్యే ప్రమాదం వుంది. జీవితం లోతూ, విస్తృతి అర్ధం అవుతున్న కొద్దీ, దాని పట్ల క్షణక్షణం మనం నిర్మించుకొనే నిర్వచనాలు మారిపోతూ జీవితం ఒక ప్రహేళికగా, నిండీనిండని గడులతో విస్మయ పరుస్తూ వుటుంది.

‘‘జీవితానికి అర్ధం ఏమిటి?’’ అని చివరకు మిగిలేది నవలలో దయానిధి తన చిన్నప్పుడు వైకుంఠ మాస్టారుని అంతు లేని అసహనంతో అడుగుతాడు. ఆ ప్రశ్నకు వైకుంఠం మాస్టారు తన జీవిత చరమాంకంలో ఒక సీల్డు కవరు ద్వారా దయానిధికి జవాబు చెపుతాడు. కవరు విప్పి చూసిన దయానిధికి అందులో స్వచ్ఛ సుందర శుభ్రస్ఫటికం లాంటి తెల్ల కాయితం కనిపిస్తుంది. కాయితం తెల్లగా వుంది కనుక, జీవితానికి అర్ధం శూన్యం అనుకుని, జీవితానికి అర్ధమే లేదనుకుని సమాధాన పడతాడు దయానిధి.
నిజానికి చివరకు మిగిలేది నవల మొత్తం ‘‘మనుషులు ఎందుకు ద్వేషిస్తారు?’’ అనే ప్రశ్న చుట్టూ, దయానిధి చేసుకున్న ఆత్మావిష్కరణ. సంఘ ద్వేషానికీ, తల్లి కారణంగా తనలో ఏర్పడిన అపరాధ భావానికీ, ఆకుపచ్చని పాపికొండలని, అపరిమితమయిన అనుకంపతోనూ, దయతోనూ ఆప్యాయంగా చుట్టేసిన ప్రసన్న గోదావరిలాంటి ‘‘అమృతం’’ అవ్యాజమయిన అనురాగానికీ, ఒక తుఫానులాగా, ఒక ఉప్పెనలాగా, ఒక సునామిలాగా ఉధృతంగా, ఉద్వేగంగా కల్లోల పరిచే ‘‘కోమలి’’ ప్రేమకీ నడుమ తూగుటుయ్యాల ఊగిన దయానిధి. జీవితం అనే నాణేనికి రెండు ముఖాలుగా వున్న ప్రేమనీ, ద్వేషాన్ని విస్మరించి జీవితానికి అర్ధమే లేదు అనుకునే భావనలోకి వలస వెళ్ళడం ఆశ్చర్యకరమే అయినా కఠిన కరకు వాస్తవం కూడా !

buchibabu
నది ఒడ్డున కూర్చుని నదిలో గిరికీలు కొడుతున్న చేప పిల్లను చూసినట్లుగా జీవితం ఒడ్డున కూర్చుని జీవితం అనే చేప పిల్ల గిరికీలను గమనించండి. జీవితానికి అర్ధమూ, పరమార్ధమూ అర్ధం అవుతాయి అంటాడు జిడ్డు కృష్ణమూర్తి.
‘‘మనసు ఎప్పుడూ జీవితానికి ప్రయోజనం, పరమార్ధం కోసం వెతుకుతూ వుంటుంది. ఎందుకంటే మనుషులు జీవితాన్ని గాఢంగా పూర్తిగా అనుభవించలేరు కాబట్టి. మీరు జీవితాన్ని అనుభవించే తీరు గాఢమయినది అయితే, మీ లోంచి ఈ ప్రశ్న పూర్తిగా పోతుంది. జీవన ప్రక్రియ సంపూర్ణంగా సంతోషకరమైనది అయితే ఇక జీవితానికి ప్రయోజనం, పరమార్ధం అవసరం లేదు. ఉదాహరణకు మీరు  పనిచేస్తున్నారు అనుకుందాం. మీ ఉద్దేశ్యం డబ్బు సంపాదనో, బాధ్యతా నిర్వహణో అయి వుంటుంది. కానీ ఒక విందుకు వెళితే అక్కడ ఉద్దేశ్య మేమి వుంటుంది? ఏ లక్ష్యమూ వుండదు, కేవలం విందులో పాల్గొంటారు అంతే! జీవితం మీకు ఒక పెద్ద విందులాగా, పెద్ద ఉత్సవంలాగా మారిపోతే దాని పరమార్ధం ఏమిటని మీరు అన్వేషించరు. కేవలం అందులో పాల్గొంటారు అంతే! మీరు అక్కడ ఉండటానికి ఇష్టపడతారు అంతే! ఈ జీవితం ఎలా తయారుచేయబడిరది అంటే దానికి ఒక పరమార్ధమే అవసరం లేదు. దానికి అదే ఒక పరమార్ధం. అదే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. సంపూర్ణ స్ధాయిలో సజీవంగా వుంటే చాలు. ఎక్కడికో చేరుకోవాలన్న పరమార్ధం జీవితానికి అవసరం లేదు. అదే సృష్టి అందం’’.
ఈ మాటలు నావి కావు. దేశానికి చాలా కాలంగా ప్రేమ తత్వాన్ని బోధిస్తూ వస్తున్న సద్గురు జగ్గీ వాసుదేవ్‌ వి.
‘‘ఏ నిర్ణయం తీసుకోకపోవడమే ఒక నిర్ణయం’’ అని దేశానికి రాజకీయ చాణక్యం అందించిన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు లాగా ‘‘ఏ అర్ధము లేకపోవడమే జీవితానికి అసలయిన అర్ధం’’ అని జగ్గీ వాసుదేవ్‌ గందర గోళ పరుస్తున్నట్లుగా అనిపించవచ్చుకానీ, ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు.
‘‘ఒకసారి పరమార్ధం అవసరంలేదని మీరు గ్రహించగలిగితే కేవలం సజీవంగా వుండటమే గొప్పగా అనిపిస్తుంది’’.
ఆధ్యాత్మిక తత్వ వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ చెప్పినదానికీ, బుచ్చిబాబు కల్పిత పాత్ర వైకుంఠం మాస్టారు చెప్పిన దానికీ పెద్ద తేడా ఏమీ లేదు.
ఒక మునిగోరింట పువ్వు అందమయిన స్త్రీ జడలో అందంగా ఇమిడిపోతుందా…..? అంతకంటే అందమయిన దేవుడి పాదాల చెంత వినమ్రంగా వాలి పోతుందా? అన్న దానితో సంబంధం లేకుండా పూచినప్పటినుండి రాలిపోయేదాకా తన సౌరభంతో ఈ సృష్టిని పరిమళ భరితం చేస్తుంది.
ఒక మలయానిలం అల్లనల్లన ప్రయాణిస్తూ జలభారంతో నిండు గర్భిణిలాగా వున్న మేఘాన్ని తాకి గ్రీష్మానల తప్త మేదినికి స్వాంతన చేకూరుస్తుందా? చండ ప్రచండ రaంరaా మారుతమయి అగ్ని రగిలిస్తుందా? అనే దానితో సంబంధం లేకుండా తనను తాను విస్తరించు కుంటూ వెళ్ళిపోతుంది.
ఈ చరాచర సృష్టిలో ఏదీ తన సహజ లక్షణాలను కోల్పోదు. ఒక్క మనిషి తప్ప. మనిషి మనిషిలాగా సంపూర్ణంగా జీవించడమే జీవితానికి అర్ధమూ పరమార్ధమూ….
వంశీ ఏమిటి? ఈ నెల అర్ధమూ, పరమార్ధమూ అనే విచికిత్స నడుమ, సత్‌సంశయముతో కొట్టుకుపోతున్నాడు అనుకుంటున్నారా? అదేమీ లేదు…

Gollapudi-Maruti-Rao-Nagireddy-Memorial-Awards
ఇటీవల సుప్రసిద్ధ రచయిత, నటుడు, ప్రయోక్త, కాలమిస్ట్‌ గొల్లపూడి మారుతీరావు గారి పన్నెండేళ్ళ పాత నవల ‘‘సాయంకాలమయ్యింది’’ ని సరికొత్తగా చదువుతున్నప్పుడు నాలో కలిగిన భావ పరంపర ఇది.
ఈ నవలలో ‘‘బత్తిన రేచకుడు’’ పేరుతో ఒక పాత్రని సృష్టించారు మారుతీరావుగారు. ఆ బత్తిన రేచకుడు ఈ ఉపోద్ఘాత మంతటికీ కారణం.
ఆంధ్రదేశం నుండి అమెరికా వెళ్ళిన తొలి తెలుగు వాడి కథ ఇది. ఇప్పుడు గాఢంగా పెనవేసుకున్న అనుబంధానికి రేఖా మాత్రంగా పరిచయం ఏర్పడిన నాటి తొలి ప్రాక్‌ పశ్చిమ సంఘర్షణ ఈ కధా సారాంశం. ‘‘ఒక సాంప్రదాయక శ్రీ వైష్ణవ కుటుంబం’’ అనే వాక్యంలోని సాంప్రదాయమూ, కుటుంబమూ ఎలా సాయంకాలంవైపు నడచి సహజ మరణం పొందాయో చెప్పడం ఈ నవలలోని విషయం. ఈ నవలలో ప్రధాన కథలో ఎక్కడా సంలీనం కానటువంటి పాత్ర ఒకటి వుంది, అదే బత్తిన రేచకుడు. ఈ నవలలోని 23వ అధ్యాయంలో ఈ పాత్ర వస్తుంది. నవల మొత్తం చదవక పోయినా, కేవలం ఆ 23వ అధ్యాయం మాత్రమే చదివినా అర్ధం అయ్యే పాత్ర ఇది. నిజానికి ఇది కేవలం ఒక రచయిత సృష్టించిన పాత్ర మాత్రమే కాదు. ఇంతకు ముందు చెప్పుకున్న అర్ధము, పరమార్ధము లాంటి తత్వ విషయాలు, ఒక భారతీయ పరిపక్వ మనస్తత్వంలో ఎలా అందంగా అర్ధవంతంగా ఇమిడిపోతాయో దృశ్యమానం చేసిన పాత్ర. భారత సమాజం, మరీ ముఖ్యంగా హిందూ సాంప్రదాయక సమాజ జ్ఞానం నుండి పాశ్చాత్య సమాజం ఏం నేర్చుకోవాలో అన్యాపదేశంగా నయినా బలంగా చెప్పిన పాత్ర డెట్రాయిట్‌ లో పనిచేసే తిరుమల భారతదేశం వచ్చాక, తన మిత్రుడు విష్ణుమూర్తి తల్లితండ్రులను చూడటానికి శ్రీకాకుళం దగ్గర వున్న ‘‘గిర్‌గాం’’ అనే పల్లెకు బయలుదేరుతాడు. విష్ణుమూర్తి తండ్రే మన బత్తిన రేచకుడు.

saayamkaalamaindi
విష్ణుమూర్తి తన తల్లి కోసం కొని యిచ్చిన అత్యాధునిక గ్రైండర్‌, తండ్రి కీళ్ళ నొప్పుల కోసం రబ్బరు కణుపులున్న రెండు జతల చెప్పులు తీసుకుని రేచకుడి దగ్గరకు బయలుదేరుతాడు తిరుమల.
బత్తిన రేచకుడు ఒంటరివాడు, వృధ్ధాప్యంలో వుండి చివరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నవాడు. ఇమాంపసందు మామిడి పండ్లంటే అతడికి మహాయిష్టం, ఒంట్లో షుగరు వున్నా పండు మీద మమకారం చంపుకోలేక పండ్లు విపరీతంగా తిని ఒక కాలుని మోకాలు వరకు పోగొట్టుకున్నాడు.
‘‘అసలు కాలు ఎలా పోయింది?’’ అని తిరుమల అడిగిన ప్రశ్నకి రేచకుడు ఏం చెప్పాడో చూడండి
‘‘మనకి ఒంటినిండా సెక్కెరే బాబు తీపి తినక్కరలేదు. సిన్నప్పటి నుండి నేను ఇమాంపసందు అంటే పీక్కోసుకుంటాను. కనిపించే మేరలో అయిదెకరాల మామిడితోపు నాదే, ఆరు వేల పళ్ళు దింపుతాను. ఎండలు ముదిరి తొలకరి దాకా ఎంత లేదన్నా రెండొందల పళ్ళు తింటాను. నీ యవ్వ……పోతే దొర బిడ్డలాగా పోవాలి. కానీ ఏడుత్తూ బతికితే ఏం లాభం….? మా డాట్టరు పద్మనాభయ్య ‘‘ఒరే రేసు నా కొడకా! తింటే సత్తావురా!’’ అన్నాడు. నేను నవ్వి ‘‘అయితే తినే సత్తాను’’ అన్నాను. రెండ్రోజులు పనికట్టుకు తిన్నాను, పండొదిలితే ఒట్టు’’
‘‘మరి విష్ణుకి తెలియజేయలేదేం?’’
‘‘తెలిత్తే ఆడేటి సేత్తాడయ్యా: అన్నీ తెలిసిన మూర్కుణ్ణి నేను’’ ఇప్పుడు ఒక్క పండు కూడా తినలేను’’
కాలు పోయేదాకా మామిడి పండ్లు తిన్న రేచకుడు, తన మనసుకు పసందైన ఇమాం పసందును ఎందుకు మానాడు…………?
భార్యకు ఇచ్చిన మాటకోసం!
కానీ భార్య ` కొడుకు కోసం బెంగ పెట్టుకునీ, పెట్టుకునీ మంచం పాలయితే వంట చేసి పెట్టాడు. మల మూత్రాలు తీశాడు.
నీళ్ళుపోసి చీర కట్టాడు. చివరకు తల కొరివి కూడా పెట్టాడు. తప్పిస్తే భార్య చనిపోయిందన్న విషయం కొడుకు కి కనీసం చెప్పను కూడా చెప్పలేదు. ఎందుకని…….?
‘‘ఇక్కడ జరిగేదేదీ ఆడిని బాధ పెట్టకూడదు. ఆడి సుకాన్ని పాడు చెయ్యకూడదు. అందుకే ఆళ్లమ్మ బతికున్నట్టు దొంగ ఉత్తరాలని పూర్ణయ్య పంతులు రాస్తాడు. సంవత్సరం పొడవునా ఆరికి పది బస్తాల ధాన్యం, అపరాలు, మామిడీ అన్నీ నేను పంపుతాను’’ ఇదీ రేచకుడి సమాధానం.
వృధ్ధాప్యంలో చూడవలసిన కొడుకు ఎక్కడో దూరాన అమెరికాలో వున్నాడు. భార్యలేదు, ఒంటరివాడు పైగా వికలాంగుడు
‘‘మీ సంగతి ఎవరు చూస్తారు?’’ అని అడిగితే………..
‘‘మన సంగతి మరోడు చూసేదేంటయ్యా! రోడ్డు మీద కుక్కపిల్ల సంగతి ఎవరుసూత్తున్నారు, సెరువులో సేపపిల్ల సంగతులెవరు సూత్తారు? నీకు ఓపిక వుందా…….. వండుకు తిను. లేదా నాలుగుపళ్ళు తిను, ఇంకా సేత కాదా సచ్చిపో……..’’
రేచకుడి లో ఎక్కడా పశ్చాత్తాపం లేదు. వేదనలేదు. ప్రతి కష్టాన్ని తృప్తిగా మల్చుకునే అద్భుతమైన సంకల్ప బలం ఏదో వుంది.
‘‘తల్లి చావునే కొడుకు నుంచి దాచి మోసం చేస్తున్న మీరు మీ ఆవిడకు ఇచ్చిన మాట తప్ప లేరా…..? అంటే రేచకుడు………..
‘‘కొడుకుని మోసం చేసేది ఆడిని బాధ పెట్టే హక్కు నాకు లేదని, నా పెళ్ళాన్ని మోసం సెయ్యనిదీ దాన్ని సుఖపెట్టే అవకాశం ఇంక రాదని’’ అంటాడు.
మనిషి స్థితప్రజ్ఞుడు కావడానికి చదువుసంధ్యలతో సంబంధం లేని సంస్కార మేదో కావాలి. దాన్ని రేచకుడు సాధించాడు.
‘‘మీ అబ్బాయికి ఏమయినా  చెప్పమంటారా!’’ అని తిరుమల అడిగితే …..
ఒంటి కాలితో గెతుతూ వచ్చి ‘‘నువ్వు యిక్కడ విన్నది, సూసిందీ ఏమీ చెప్పకు. తల్లికుక్క పిల్లపుట్టగానే దాన్ని తినేత్తాది కారణం తెలుసా? తన ప్రేమ  నుండి ఆ పిల్ల దూరమయి పోతుందేమో అన్న భయం సేత. నా భయానికి ఆడి పీక కొరికీ కొరకకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడుతున్నాను. రెక్కలొచ్చాక పిల్లగూడులోంచి ఎగిరిపోకపోతే తప్పు తల్లిదే కానీ పిల్లది కాదయ్యా! పెపంచకాన్ని అలవాటుచేసి గూడులోంచి తోసెయ్యాల నేనా పనే సేత్తున్నాను’’
రేచకుడు ఒక్క కాలికే వంగి నమస్కారం చేస్తాడు తిరుమల. ఈ పాత్రని తరచి చూస్తే…ఎన్నో విషయాలు బయటపడతాయి!

‘‘పిల్లలు మనలోంచే వస్తారు కానీ, మన ఆశలకీ, ఆశయాలకు వాళ్ళు వారసులు కారు. వాళ్ళదొక ప్రత్యేకమయిన లోకం’’ అనే ఖలీల్‌ జిబ్రాన్‌ గుర్తుకు రాడా……….?
‘‘జీవితాన్ని ఒడ్డున కూర్చుని చూడాలి’’ అన్న కృష్ణమూర్తి గుర్తుకురాడా..? ‘‘జీవితాన్ని తెల్లకాయితంతో పోల్చి చూపి ప్రేమలేఖో, మరణశాసనమో ఏదో అద్భుతంగా నువ్వే రాసుకో’’ అన్న వైకుంఠం మాస్టారి తత్వబోధ యిదే కదా…..!
‘‘మనసు ప్రతిదాన్నీ భాగాలుగానే గ్రహించగలదు. ఈ చిన్ని చిన్ని ముక్కలుని మీరు కలిపితే అది మొత్తంగా మారదు. మీ వద్ద కేవలం ముక్కలు మాత్రమే వుంటాయి. మీరు ఎంత ఎక్కువగా సేకరిస్తే మీరు అన్ని ముక్కలుగా తయారవుతారు. మీరు ఎన్ని ముక్కలు సేకరించినా అవి ఎప్పటికీ మొత్తంగా మారవు. శివుడికి ముక్కంటి అని పేరు. మూడోకన్ను తెరుచుకోవడం అంటే భౌతిక మయిన కళ్ళకి అతీతమయిన జ్ఞానచక్షువు తెరచుకుని, ఇంద్రియాతీతమైన సంపూర్ణత్వాన్నీ, మొత్తాన్నీ చూడగలగడం. జీవితాన్ని పూర్తి లోతుతో, పూర్తి ప్రమాణంతో అర్ధం చేసుకోవడమే…..అదే జీవిత పరమార్ధం’’ అంటున్నాడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌.
రేచకుడు మూడో కన్ను తెరిచాడు కదూ……!
ఆ జ్ఞాన చక్షువే ఈ జీవితానికి అర్ధమూ…….పరమార్ధమూ……!’

-వంశీకృష్ణ

మా వంగూరి హౌస్ – మా మామిడి చెట్టూ…

 

chitten rajuమా తాత గారు తన స్వార్జితంతో మొదటి ఆస్తిగా ఫిబ్రవరి  2, 1921 లో కాకినాడలో అప్పడు రామారావు పేట అని పిలవబడే ప్రాంతంలో (పిఠాపురం రాజా వారి పేరిట) ఒక్కొక్కటీ 1800  గజాలు ఉండే పక్క పక్కనే ఉండే రెండు ఇళ్ళ స్థలాలు – వెరసి 3600  గజాల స్థలం కొన్నారు. అప్పటి నుంచి, ఇప్పటి దాకా ఆ స్థలం మా అధీనంలోనే ఉంది. కాకినాడ మొత్తం మీద సుమారు తొంభై సంవత్సరాలకి పైగా ఒకే కుటుంబం అధీనంలో ఉన్న అతి కొద్ది గృహాలలో మాది ఒకటి అని నేను అప్పుడప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను.

మా తాత గారు ఆ స్థలం కొన్నాక అక్కడ ఒక పెద్ద మేడ కట్టుకోడానికి ప్రణాళిక వేసుకుంటూ ఉండగా  1923 లో 38 వ కాంగ్రెస్ మహా సభలు జరిగాయి. ఆ మహా సభల ఆహ్వాన సంఘం కార్యదర్శి, స్వాతంత్ర్య సమార యోధుడు, మా తాత గారి తోటి లాయర్ అయిన మహర్షి బులుసు సాంబ మూర్తి (పొట్టి శ్రీ రాములు గారు మద్రాసు లో ఆయన ఇంట్లోనే నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు.—పాపం.) గారి అభ్యర్ధన మీద మా ఇంటి స్థలం అంతా పెద్ద పందిళ్ళు వేసి ఆ కాంగ్రెస్ సభలకి భోజన శాలగా మార్చారు. అక్కడికి వంద గజాల దూరం లోనే ప్రధాన వేదిక. ఆ వేదిక మీద నుంచి మహాత్మా గాంధీ గారు డిశంబర్ 24, 1923 నాడు ప్రసంగించారు.  . ఆ మహా సభల తరవాత ఆ పేట  పేరు గాంధీ నగరం గా మార్చారు. ఇప్పటికీ అది గాంధీ నగరమే! ఆ కాంగ్రెస్ సభలలోనే  జవాహర్లాల్ నెహ్రూ అనే 35 సంవత్సరాల యువకుడు మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గా ఎన్నిక అయ్యాడు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన మహమ్మద్ ఆలీ పేరే ఇప్పటికీ మా రోడ్డు పేరు. మా రోడ్డు పేరు “వంగూరి వారి వీధి” అని మారుస్తామని మ్యునిసిపాలిటీ వారు కొన్ని సార్లు అడిగినా ఒక అలనాటి ముస్లిం నాయకుడి పేరు తీసేసి మా పేరు పెట్టడం సమంజసం అనిపించక మేమే వద్దన్నాం.  అతిశయోక్తి అయినా ఇప్పటి మా ఇంటి ప్రాంగణం అప్పటి భోజన ప్రాంగణం కాబట్టి గాంధీ గారు, నెహ్రూ గారు మా “ఇంటి” కి భోజనానికి వచ్చారు అని నేను చెప్పుకోవడం నాకు సరదా.

ఇక్కడ నేను విన్న ఒక చిన్న పిట్ట కథ ఏమిటంటే ఆ ప్రధాన ప్రాంగణం లోపలికి వెళ్ళడానికి సరి అయిన బేడ్జ్ పెట్టుకోవాలి. నెహ్రూ గారు అది మర్చి పోయి హడావుడి గా లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు 13 ఏళ్ల వాలంటీర్ గా ఉన్న దుర్గాబాయమ్మ గారు ఆయన్ని అడ్డగించి ఆయన ఎంత చెప్పినా, ఆఖరికి సాంబ మూర్తి గారు స్వయంగా వచ్చి చెప్పేదాకా లోపలికికి వెళ్ళనియ్యకుండా అడ్డుకున్నారట.  ఆ విధంగా వారిద్దరికీ పరిచయం అయి జీవిత కాలం నిలిచింది.

నెహ్రూ గారి మంత్రివర్గంలో దుర్గాబాయమ్మ గారి భర్త దేశ్ ముఖ్ గారు ఆర్ధిక మంత్రిగా పని చేశారు. వారు జీవించినంత కాలం మా బావ గారు నండూరి వెంకట సూర్య నారాయణ మూర్తి గారు (హై కోర్ట్ సీనియర్ అడ్వోకేట్)  ఎంతో ఆత్మీయులుగా ఉండి,  లీగల్ సలహా దారుగా వ్యవహరించే వారు. అన్నట్టు, మా అక్కా, బావ గారూ ఉండేది హైదరాబాద్ లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ కాలనీ లోనే!

నేను పుట్టిన ఇల్లూ- మమ్మల్ని చూసుకున్న సూన్నారాయణా

నేను పుట్టిన ఇల్లూ- మమ్మల్ని చూసుకున్న సూన్నారాయణా

 

ఆ కాంగ్రెస్ మహా సభల హడావుడి అంతా అయ్యాక మా తాత గారు మేడ కట్టడం ఆలస్యం అవుతోంది అనుకుని 1925 లో స్థలానికి ఆగ్నేయం మూల ఐదు గదులతో తాత్కాలింగా ఒక ఔట్ హౌస్ కట్టి, గృహ ప్రవేశం చేసారు. అది ఏ ముహూర్తాన చేసారో కానీ ఆ ఇల్లే మూడు తరాలకీ సొంత ఇల్లు అయిపోయింది.  అంత పెద్ద స్థలంలో పెద్ద మేడ కట్టుకుందామనుకున్న మా తాత గారి ఆశ నెరవేర లేదు. ఆయన పోయిన ఏడాది తరువాత 1952 లో మా పెద్దన్నయ్య ఆ మేడ నమూనా ని అగ్గిపెట్టెలతో తయారు చేసి ప్రతీ బొమ్మల కొలువు లోనూ పెట్టేవాడు. ఆ మేడ నమూనా ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను.  నాకు పదిహేనేళ్ళు వచ్చే దాకా కూడా పకడ్బందీగా కొండ రాళ్లతో వేసిన  ఆ మేడ పునాదులు స్థలం మధ్యలో ఉండేవి. మా నాన్న గారు కూడా ఆ మేడ ఇక కట్టలేం అని నిర్ణయించుకుని ఆ పునాదులు తీసేయించి ,  మొత్తం 3600 గజాల స్థలాన్నీ పూల మొక్కలతో, చెట్లతో నందన వనంగా మార్చారు.

1925  లో మా తాత గారూ, బామ్మ గారూ గృహ ప్రవేశం చేసిన కొన్ని రోజులలో ఒక విచిత్రం జరిగింది. ఒక మండు వేసవి నాటి మధ్యాహ్నం ఒక ముసలాయన లోపలి వచ్చి “అమ్మా, దాహంగా ఉంది. కాస్త మంచి నీళ్ళు ఇప్పించండి” అని అడిగాడు. మా బామ్మ గారు ఆయన్ని చూడగానే “అయ్యో పాపం ఈయన భోజం కూడా చెయ్య లేదేమో” అని అడిగి అరిటాకు వేసి కడుపు నిండా భోజనం పెట్టారు. ఆయన సంతృప్తిగా భోజనం చేసి, కాస్సేపు విశ్రమించి లేచి వెళ్తూ తన చేతి సంచీ లోంచి ఒక్కటంటే ఒక్క మామిడి పండు తీసి “అమ్మా, ఈ పండు తిని, ఆ టెంక ఎక్కడైనా పాతండి. అది చెట్టుగా ఎదిగి, దాని పళ్ళు మీ మనవలు, ముని మనవలూ కూడా తింటారు” అని మనసారా ఆశీర్వదించి, ఆ మామిడ పండు ఆవిడ చేతిలో పెట్టి మాయమై పోయారు. అంటే మళ్ళీ ఎప్పుడూ కనపడ లేదు.

మా తాత గారు, బామ్మ గార్లలో ఆ పండు ఎవరు తిన్నారో లేక అప్పటికి చిన్న పిల్లలయిన మా నాన్న గారు, ముగ్గురు మేనత్తలలో ఎవరు ఆ పండు ముక్కలు ఉప్పు, కారం వేసుకుని తినేసి ఆ టెంక ఇంటి ముందు విసిరేసారో తెలియదు కానీ….అ బంగిన పల్లి మామిడి టెంక వేళ్ళూనుకుని, చెట్టుగా ఎదిగి ఇప్పటికీ గత 88 సంవత్సరాలగా అద్భుతమైన పళ్ళు కాస్తూ, వంద మంది పైగా ఉన్న మా బృహత్ కుటుంబం అస్తిత్వానికి నీడ పడుతూ వయోభారంతో కుంగినా గంభీరంగా, దర్జాగా, నిరంతరం కూసే మూడు తరాల కోయిల వంశానికి పట్టుగొమ్మగా నిలుస్తూ, ఇది వ్రాస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

ఆ మామిడి చెట్టు కిందే నా ఇరవై ఏళ్ల చిన్న తనం అంతా గడిచింది. నాదే ఏమిటి, మా అన్నదమ్ములు, అప్ప చెల్లెళ్ళు, మా ఇంట్లో ఉండి చదువుకున్న నాలుగు తరాల బంధువులు అందరికీ ఆ మామిడి చెట్టే ఆయువు పట్టు. కేరమ్స్, చెస్,  పేకాట ఏ ఆట, ఆడుకున్నా ఆ చెట్టు నీడనే. రాత్రి టీ తాగుతూ గుడి దీపాల వెలుగులో పరీక్షలకి చదువుకున్నా ఆ చెట్టు కిందే! అది చిన్న చిన్న పిందెలు వేసి ఆ మాత్రం బరువుకే కిందకి వాలగానే కుర్చీ పీట వేసుకుని పెన్నుతో ఆ పిందెల మీద మా పేర్లు రాసేసుకుని , అవి పెద్దయ్యే దాకా రోజూ, కొలుచుకుంటూ అంటే ఆరాధించడమే కాదు, ఎవరి పిందె ఎంత పెరిగిందీ అని సైజు కూడా కొలుచుకుంటూ, మొత్తం వేసవి శలవులకి మరే వ్యాపకాలు పెట్టుకోకుండా ఉన్నా అదంతా  ఆ చెట్టు మహిమే! ఆ చెట్టు కొమ్మలోంచి తెల్లవారు ఘాము నుంచీ మధ్యాహ్నం దాకా ఎడతెరిపి లేకుండా వినపడే కోకిలారావానికి మేము తిరిగి “కోయ్, కుహూ” అని అరవ గానే ఆ కోకిల రెచ్చి పోయి యింకా గట్టిగా సమాధానంగా చెప్పడం, “ఏమిట్రా ఈ వెధవ కాకి గోల”  అని మా పెద్ద వాళ్ళు కోప్పడడం ఎంత హాయిగా ఉండేదో! ఆ చెట్టు కిందే నా మొట్ట మొదటి ఇంగ్లీషు నవల (పెర్రీ మేసన్) చదివాను. చేతికందిన ప్రతీ వార, దిన పత్రికలూ పెద్ద వాళ్ళు కోప్పడుతున్నా డిటెక్టివ్  నవలలూ అక్కడే చదివాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను సాహిత్యంలో సేద తీరింది ఆమామిడి చెట్టు నీడ లోనే!

మా తాత గారూ, మా నాన్న గారూ కట్టుకుమ్దామనుకునా మేడ నమునా

మా తాత గారూ, మా నాన్న గారూ కట్టుకుమ్దామనుకునా మేడ నమునా

సుమారు ముఫై ఏళ్ల క్రితం కాకినాడ లో వచ్చిన పెను తుఫానులో మా మామిడి చెట్టు మా ఇంటి మీద పడి కూల్చి పారెయ్యకుండా, నిట్ట నులువుగా గంభీరంగా ఉండేదల్లా, సొగసుగా మరొక పక్కకి వాలి మా మీద యింకా ఎంతో దయ, ప్రేమ కురిపిస్తూనే ఉంది. రెండు, మూడేళ్ళ కొకసారి కాయలు కాస్తూనే ఉంది. నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా ఆ మూడో తరం కోకిలారావం రోజుకి ఐదారు గంటలు వింటూనే ఉంటాను. నన్నూ, నా చాదస్తాన్నీ చూసి మా వాళ్ళు అందరూ చాటుగా నవ్వుకుంటూ ఉంటూనే ఉంటారు. అందుకే అంటారు ఎవరి పిచ్చి వారికి ఆనందం అని.

మా చిన్నన్నయ్యకి పెళ్ళయి ఐదుగురు పిల్లలు పుట్టాక, ఇల్లు చాలక అప్పటికి వేరే ఇల్లు కట్టుకున్నాడు. దానికి అమెరికా లో ఉన్న మా తమ్ముడూ, నేనూ ప్రత్యక్షంగానూ, పరోక్షం గానూ చేసిన సహాయం గురించి తెలిసిన మిత్రులు, కాకినాడ బార్ రూమ్ (కోర్ట్ ప్రాంగణంలో లాయర్ల విశ్రాంతి గది) సహాధ్యాయులు దాన్ని డాలర్ హౌస్ అని వేళాకోళం చేసే వారు. ఆ తరవాత నా పై వాడు సుబ్బన్నయ్య మణిపాల్ లో ఎం.. బీ. బీ. యస్ తరువాత  ప్రతిష్టాత్మకమైన పాండిచ్చేరి జిప్మెర్ లో మాస్టర్ ఆఫ్ సర్జరీ చేసి కాకినాడ రంగరాయ  మెడికల్ కాలేజీ లో ప్రొఫెసర్ గా చేరి, ఇంటి తో బాటు అతని భార్య (మా వదిన ) డా. శేషమాంబ గారి కోసం గైనకాలజీ క్లినిక్ కూడా కట్టుకున్నాడు. సుమారు పదేళ్ళ క్రితం 80 ఏళ్ల ‘వయస్సు” వచ్చి మా పెద్దన్నయ్య ఉంటున్న మా ఇంటికి చిన్నా, పెద్దా రిపేర్లు రావడం మొదలుపెట్టాయి. అప్పుడు మా తమ్ముడు  (వాడు యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, బెర్క్ లీ లో మాస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ చెయ్యడానికి 1970 లో అమెరికా వచ్చాడు) వాడి వాటా స్థలంలో మేడ కట్టుకున్నాడు.

ఆ తరువాత బాగా పాత పడిపోయి అవసాన దశలో ఉన్న మా ఇంటిని మనసు దిటవు చేసుకుని, నిర్దాక్షిణ్యంగా నేల కూల్చి చదును చేసేశాం. మా ఇల్లు పడగొట్టి ‘స్మశానానికి’ తరలించడానికి వారం ముందు తీసిన ఫోటో ఇందుతో జత పరుస్తున్నాను. ఆ ముందు నుల్చుని ఆ ఇంటికి ‘ఆఖరి చూపులు’ చూడడానికి వచ్చిన వాడు తన పదో ఏట మా ఇంట్లో పని వాడి గా ప్రవేశించి, అరవై ఏళ్ళకి పైగా మాతోనే ఉండి, మమ్మల్ని ఎత్తుకుని మోసిన ‘సూన్నారాయణ’.  వాడి ఎడం పక్కన ఉన్న రెండు కిటికీల గది  మా ఇంట్లో శాశ్వతంగా ఉన్న “పురిటి గది”. ఆ గదిలోనే నేను పుట్టాను. మొక్కై వంగక పోయినా, తుఫాను ధాటికి మానై వంగిపోయిన మా మామిడి చెట్టు ఇంకా ఇంటి ముందు గంభీరంగానే ఉంది.  అదృష్టమో, దురదృష్టమో చెప్ప లేను కానీ నేను ఆ ఇంటి ఆఖరి చూపులకి నోచు కోలేదు. ఆ మాట కొస్తే 1983 లో మా నాన్న గారు పోయినప్పుడు కానీ, 1999 లో మా అమ్మ పోయినప్పుడూ నేను వారి ఆఖరి చూపులకి నోచుకో లేదు. అది నాకు “అమెరికా వలస” ప్రసాదించిన విమోచన లేని శాపం.

మా ఇంటి సంగతులు ఇంకా చాలా ఉన్నాయి…

త్రిపుర గారూ !మీరు ఎక్కడికీ వెళ్ళ లేదనే నా నమ్మకం…

త్రిపుర గారూ !

మీకు ఉత్తరం రాసి ఎన్నాళ్ళయిందో. అప్పుడెపుడో చాలా ఏళ్ళ కిందట మీరు అగర్తలా అంచుల్లో ఉన్నపుడు  పెద్ద ఉత్తరం రాసాను. దానికి మీరు రెండు చిన్న వాక్యాల జవాబిచ్చారు. నేను చిన్నబుచ్చుకొని పెద్ద కాగితం మీద తిరిగి నేను కూడా ఒకే వాక్యం రాసి పంపాను. “నీ ఒక్క వాక్యం వెనుక వున్నఖాళీకాయితం నాకు ఎన్నో చెప్పిందంటూ” అప్పుడు మీరు నాకు పేద్ద ఉత్తరం రాసారు. అప్పుడే మీరంటే ఏమిటో తెలిసింది. త్రిపురకి ఎక్కువ మాటలు, పెద్ద ఉత్తరాలు అక్కర్లేదు. లౌడ్ వాయిస్ పనికిరాదు.  అంతే కదూ  !

అందుకే పెద్ద ఉత్తరం రాయను. కానీ ఎన్నో జ్ఞాపకం వస్తున్నాయి. కన్నీళ్ళు అనకూడదేమో అలాంటివే  ఏవో….. వాటి మధ్య నుంచే . రెవెన్యూ గెస్ట్ హౌసులో దిగారు మీరు  84 డిసెంబర్ అని గుర్తు. అనాబ్ షాహి ద్రాక్షపళ్ళ మీది పలచని పొర వొలిచి మీ చేతులో పెడుతుంటే అవి తింటూ చిన్నగా కబుర్లు చెబుతూ ఇంక చాలు ఇరవై మూడు తిన్నానన్నారు. అదీ త్రిపుర. లెక్క తప్పకుండా జీవితాన్ని  ఆస్వాదించటం అంటే అదే కదా  –

అప్పట్లో మా తమ్ముడు చెప్పినట్లు మీ ప్రేమ పొందాలని మేమందరం పోటీ పడ్డాం. కానీ మీరు భక్తసులభులు. మేం కోరిన దాని కన్నా ఎక్కువ ప్రేమించారు మమ్మల్నందరిని.

తొంభై ఎనిమిదిలో అనుకుంటాను కాఫ్కా కవితలు పుస్తకం శాఫాలిక డాబా మీద ఆవిష్కరించాము. ఆ రోజు భోగి పండుగ. మద్యాహ్నం మూడు దాటాక కాఫ్కా వాసన కొట్టే కొత్త పుస్తకాలు పట్టుకొని విజయవాడ నుంచి విశ్వేశ్వర రావు, వి. చంద్రశేఖరరావు గార్లు  దిగారు. “నాకు క్రౌడ్ పనికి రాదు.  చిన్న గేథరింగ్ చాలు” అన్నారు మీరు . మీ  అక్కయ్య, లక్ష్మి తల్లి గారు , సంధ్య, మేమూ అంతే. మీరు అలా కలల్లోంచి ఊహలలోకి జారుతూ పుస్తకావిష్కరణ చేయించుకున్నారు.

 

ఆ మర్నాటి ఉదయం నా చెయ్యి పట్టుకుని “పాపా! నా డ్రీమ్ నిజం చేసావు” అన్నారు. మీకు అప్పుడు చెప్ప లేదు కానీ ఈ జన్మను సార్ధకం చెయ్యడానికి ఈ ఒక్క మాటా చాలదా ? అనుకున్నాను.

 tripura

ఆ సాయంత్రం ఇస్మాయిల్ గారూ మీరూ మళ్ళీ శేఫాలిక పెరట్లో నేరేడు చెట్టు కింద గాజు గ్లాసులు కాకుండా స్టీలు గ్లాసుల్లో కబుర్లు తాగారు, ఎవరికీ తెలియకుండా. చివర్లో ఎమ్మెస్ సూర్యనారాయణ వచ్చి,కనిపెట్టేసి, మీ ఇద్దరినీ చంటి పిల్లలుగా మార్చేస్తే, వాడిని నాలుగు తిట్టి, నేనూ లక్ష్మి గారూ మిమ్మల్ని నిద్రపుచ్చి తెల్లవారే సరికి మళ్ళీ పెద్దవాడ్ని చేసేసాం కదా! అప్పుడు సామర్లకోట స్టేషన్ లో మిమ్మల్ని రైలెక్కించి ఇంటికి వచ్చాక నేననుకున్నట్టే మీరూ ఉత్తరంలో రాసారు. ” రైలు దిగి మళ్ళీ కాకినాడరైలెక్కి వెనక్కి వచ్చేయ్యాలనిపించింది” అని.

 

ఆ నాలుగు రోజులూ మీరూ, లక్ష్మి గారూ నా దగ్గర మా అమ్మా, నాన్నల్లా ఉన్నారు.  సరిగ్గానే రాస్తున్నాను.  మీరూ అమ్మలాగ ఆమె నాన్నలాగ.  అదే సమయంలో నా కడుపున పుట్టిన పిల్లల్లాగా కూడా ఉన్నారు.  భోజనం టైములో ప్లేట్ పట్టుకుని “అమ్మా అన్నం పెట్టు తల్లీ ” అని సరదాగా గోల  చేస్తూ.

 

ఆ  మర్నాడు ఉదయాన్నే రెడీ అయి బయటికి తీసికెళ్ళి” మీరిద్దరూ ఇప్పుడు మంచి చీరలు కొనుక్కోవాలి, నేను కొని పెడతాను” అని సంధ్యకీ నాకు ఎంతో అందమైన చీరలు సెలక్టు చేసి కొనిపెట్టారు.  అలాంటప్పుడు ఈయనా ? చీకటి గదులు రాసిన త్రిపుర ? అద్దంలోని శేషా చలపతిరావ్ చేత” గొప్ప మజా ! స్కాండ్రల్ !” అనిపించిన త్రిపురా? అని మాటి మాటికీ ఆశ్చర్య పోయేదాన్ని.

 

అవును మీ కథల పుస్తకాలు నా దగ్గర రెండు ఉండేవి.  ఒకటి ఇంటి దగ్గర చదవడానికి, మరోటి ప్రయాణాల్లోకి.  ఎన్ని సార్లు చదివేనూ ఆ కథలు.  ప్రతి సారీ శరీరంలోకి నెత్తురు ఎక్కిస్తున్నట్టుఉంటుంది .ఆ తర్వాతే కదా మిమ్మల్ని చూసాను.  అస్సలు పోలిక లేదు.  ఆ కథలకీ మీకూ సమన్వయం కుదర్చడం ఏళ్లు గడిచినా సాధ్యం కాలేదు.

 

మీరు చాలా సింపుల్.  మీ ప్రేమ పొందడం చాలా సులువు.  మీతో సంభాషణ మరెంతో సరళంగా హాయిగా ఉంటుంది.  కానీ మీ కథలు ఒక పట్టాన కాదు బహు పట్టాన కూడా అంతు బట్టవు.  కానీ వాటిని చదువుతూ ద్వారాలు తెరుచుకుంటూ లోపలికి ప్రవేశిస్తూ ఉంటే ఏదో మైకం ఎక్కి అందులోంచి మెదడు లోపలి పొరలు ఒక్కక్కటిగా తొలగి మెలకువ లోకి ఒత్తిగిలినట్టవుతుంది.

 

మీ లోపలి ప్రపంచానికీ, బయటి ప్రపంచానికీ మధ్య ఇంత దృఢమైన ఉక్కు వంతెన ఎలా కట్టగలిగారు ? వంతెన ఇవతలినుంచి చూస్తే అవతలి మీరు కనపడడం లేదు మా లాంటి వాళ్లకి.  మీరు జర్కన్.  వీరా స్వామిని జర్కన్ అన్నారు మీరు.  కానీ మీరే జర్కన్.  అలా జీవించగలగడం ఒక మోహం లాగ నన్ను చాలా కాలంగా పట్టుకుని పీడిస్తోంది.  సరళ జీవనం అనే మోహం అది. కానీ అది ఎంతటి దుస్సాధ్యమో మొదలు పెడితేనే గానీ  అర్థం కాదు.

 

ఇంత సులువుగా బతుకుతూన్నమీరు  ఎక్కడికో వెళ్ళేరని అందరూ అంటున్నారు .  మా అమ్మ, నాన్నల్లాగా, ఇస్మాయిల్ గారి లాగ మీరూ ఎక్కడికీ వెళ్ళ లేదనే నా నమ్మకం.

600277_473103009426641_557986530_n

విశాఖ సముద్ర తీరంలోని ఒక అందమైన పాత కాలపు ఇంట్లో మనం రాత్రి ఎంతో సేపు చెప్పుకున్న కబుర్లు, రామలక్ష్మి అపార్మెంట్ లో మీ ఇద్దరితో కలిసి నేను నాలుగు రోజులు గడిపినప్పుడు ఉదయాన్నే మనిద్దరం కాఫీ తాగుతూ చెప్పుకున్న సంగతులు అన్నీ అలాగే ఉన్నాయి.  కొంచెం కూడా రంగు తగ్గలేదు.  మీ కథల్లో మీరు  సకృత్తుగా- కానీ  -ఎంతో అవసరంగా వాడిన సంస్కృత పదాలు ఏరి నేను చెప్తుంటే మేఘాలయ హోటల్లో మీరూ, అమ్మా దోసెలు తినడం మానేసిమరీ కుతూహలంగా వినడం ఇప్పుడే జరుగుతోన్నట్టుంది.

 

మీలోని భాస్కర్ శేషాని క్షమిస్తాడు.  దయతో ఆదరిస్తాడు.  ఘోరంగా మోసపోయినా, దిగమింగుకుని ,సహించుకుని శేషియోతాలూకు  వెనక జీవితం గురించి యోచించమంటాడు.  లోకంలో మూడు వంతులు ఉప్పునీరున్నట్లు శేషియోలే  ఉంటారు.  వాళ్ళను సహిస్తూ జీవితాన్ని హుందాగా జీవించడం ఎలాగో చెప్పడం కోసమే ఇంతటి పనితనంతో కథలు చెక్కుతూ జీవించిన త్రిపురగారూ !అవనీ మీ జీవన సాధన లో భాగమైన ఆత్మకథ లే అని కదా మీరు అంటారు .అసలు ఆత్మకథలు అలాగే వుండాలని చెప్తూ కన్ఫెషనల్ గా వుండాలన్నారు ఆత్మకథ గా రాయడం లో సెల్ఫ్ డిసీవింగ్ఎలిమెంట్ ఉంటుందని మీరే పసిగట్టగలరు .

మా లాంటి వాళ్ళం ఉన్నత కాలం మీ కథలు మా దాహాలకు జలాశయాలవుతాయి.  మీ జ్ఞాపకాలు ఇంకెన్నో ఉన్నాయి  అవి నేను ఉన్నంత కాలం నాతోనే ఉంటాయి కదా!అంత కాలమూమీరు ఈ లోకంలో మాతో ఉన్నట్టే .
త్రిపురా త్రిపురా అని తల్లడిల్లిపోతున్న రామయ్య గారికి చెప్పండి నేను ఆయన బాధ చూడలేకుండా ఉన్నాను.

 

“గాలివాన చెట్లను ఊపినట్లు ఊపిన” మీ కథల పుస్తకంలోంచి అమాంతం లేచి వచ్చి “పాపా ఇస్మాయిల్ గారికి నేనిచ్చిన  టీ షర్ట్ సరిపోయిందా,ఆయనకు నచ్చిందా” అని పలకరిస్తూనే ఉన్నారు మీరు.  రామయ్య గారితో కూడా ఒక్కసారి చెప్పండి ”కాకినాడ నుంచి వచ్చిన పాపకీ వాళ్ళ స్నేహితులకీ నీ గురించి గంట సేపు చెప్పాను” అని.

 

కాసేపు విశ్రాంతి తీసుకుంటారా! మళ్ళీ మాట్లాడుకుందాం.  ఈ లోగా లక్ష్మి అమ్మతో కబుర్లు చెప్పి వస్తాను. ఉండనా కాసేపు

 

వెండి వుంగరం తో  దృఢంగా వుండే

మీ చెయ్యి తాకి  కాసేపు వీడ్కోలు తీసుకోనా?

– వాడ్రేవు వీరలక్ష్మి దేవి

————————————————–

‘లేఖా సాహితి’ మీ శీర్షిక

వేగం పెరిగిన ఇప్పటి జీవితాల్లోంచి కనుమరుగై పోతున్న ఒక అందమయిన ప్రక్రియ: లేఖ.

కాని, లేఖ రాయాలి అనిపించే బలమయిన అనుభూతి ఇంకా మిగిలి వుందనే మా ఆశ.

మీరొక లేఖ రాయండి ఈ శీర్షిక కోసం…మీ మనసు లోపల దాచి పెట్టుకుంటున్న మాటలకు ఒక రూపాన్నివ్వండి. ఒక రచన చదివాకో, ఒక రచయితని కలిసాకో, ఒక సాహిత్య సమావేశం తరవాతనో, ఒక అందమయిన సంభాషణ జరిగాకో…ఆ కబుర్లన్నీ కలబోసుకునే లేఖ రాయండి. ఎవరినో ఒకరిని ఉద్దేశించే మీరు రాయక్కర్లేదు. కాని, మీరు రాయాలనుకున్నదే రాయండి. ‘సారంగ’ ద్వారా మీ ఆత్మీయ సాహిత్య ప్రపంచంతో పంచుకోండి.

మీ లేఖని పంపాల్సిన ఈ-చిరునామా: editor@saarangabooks.com

—————————

‘ఆర్గానిక్’ కూడా ఒక మార్కెట్ మాయ!

ఎస్. నారాయణస్వామి

ఎస్. నారాయణస్వామి

 

సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథల్లో భోజనచక్రవర్తి అని ఒక కథ ఉన్నది. అప్పంభొట్లు అసామాన్యమైన తిండిపుష్టి కలవాడు. ఒకసారి పోటీమీద రెండు గంగాళాల ఆవడలు పెరుగుతోసహా జుర్రిపారేసి ఊరి ప్రజలందరినీ దిగ్భ్రాంతుల్ని చేసిన మూర్తీభవించిన జఠరాగ్ని అతను. ఇంకో కథలో బావగాడు అనబడే కనకారావు కార్తీకసమారాధన వనభోజనాలలో రకరకాల తెలుగు వంటల్ని, కాయల సెలెక్షన్ దగ్గర్నించీ, ఏ కూర ఎలా వండాలో, ఏ రుచి ఎలా ఉండాలో దగ్గరుండి వండించి, స్వహస్తాలతో అందరికీ వడ్డించి పరవశించినవాడు. 

రెండు మూడు తరాల కిందట గోదావరి జిల్లాల సంపన్న బ్రాహ్మణ కుటుంబాల్లో పంక్తిభోజనాల పద్ధతుల్నీ మర్యాదలనీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అనేక రచనల్లో చాలా విపులంగా వర్ణించారు. అడివి బాపిరాజు గారి నారాయణరావు నవల్లో ఆంగ్లో ఇండియన్ వారి దగ్గర్నుండీ వివిధరకాల ప్రజల ఆహారపు పద్ధతుల్ని వర్ణించారు. అంతదాకా ఎందుకు, ఈ మధ్యకాలంలో సినిమా ద్వారా కూడా తెలుగువారికి బాగా దగ్గరైన కథ ‘మిథునం’ (శ్రీరమణ)లో అప్పాదాసు మొదణ్ణించీ చివరిదాకా వంటకి సంబంధించిన ఏదో ఒక విషయం మీద భార్యతో గొడవపడుతూనే ఉంటాడు. 

timthumb.php

ఇదంతా చెప్పుకు రావడం ఎందుకంటే ఒక జాతి సాంస్కృతిక అస్తిత్వంలో భోజనానికీ, భోజన పద్ధతులకీ చాలా ముఖ్యమైన భూమిక ఉన్నది అని చెప్పడానికి. మా అమ్మానాన్నల పెళ్ళైన కొత్తలో అప్పుడు బాగా కరువురోజులు. మా నాన్నగారు అత్తారింటికి వెళ్ళిన సందర్భంలో భోజనంలోకి నెయ్యి లేకపోయేటప్పటికి – ఇంటికొచ్చిన కొత్తల్లుడికి నెయ్యి లేకుండా భోజనం పెట్టాల్సొచ్చిందని మా అమ్మమ్మా తాతయ్యా మహా గుంజాటన పడిపోయారుట. కేవలం ఒక్క తరం కిందట నెయ్యి లేకుండా భోజనం చెయ్యడం, పెట్టడం అమర్యాదయే కాదు, అనాగరికం కూడా అనిపించుకునేది. అదే ఇవ్వాళ్టి రోజున – విందుభోజనాల సంగతి పక్కన పెట్టండి – ఆంధ్రదేశంలోనే ఎవరైనా బంధుమిత్రుల ఇంటికి భోజనానికి వెళ్తే, నెయ్యి వడ్డించడం సంగతి దేవుడెరుగు, అసలు ఇంట్లో నెయ్యి ఉన్నదో లేదో అనుమానించవలసిన పరిస్థితి. అలాగే ఆచారాల ప్రకారం మన వంటల్లో విరివిగా వాడుతూ ఉండిన కొబ్బరి, నువ్వులు, బెల్లం, ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి – ఏవిటయ్యా అంటే, ప్రతీ వాళ్ళకీ షుగరు, బీపీ, కోలెస్టరాలు భయం.
తమాషాగా, మెక్డొనాల్డ్స్, పిజ్జా హట్, కెంటకీ ఫ్రైడ్ చికెన్ వంటి మెగా ఆహార వ్యాపారాలకి పుట్టినిల్లైన అమెరికాలోనూ గత ఇరవయ్యేళ్ళగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని గురించి అవగాహన పెరుగుతూ వచ్చింది. ఆ అవగాహన అందోళనగా పరిణమించి, కొండకచో ఉద్యమంగా ఎదిగి ఇంతింతై అన్నట్టు అదొక విశ్వరూపాన్ని దాల్చిందిప్పుడు. ఈ విశ్వరూపానికి బహుముఖాలున్నాయి. స్థానికంగా పెంచిన ముడిపదార్ధాలని వాడడం, ఆర్గానిక్ గా పెంచిన ముడిపదార్ధాలని వాడడం, తినుబండారాల ఉత్పత్తిలో భారీ యంత్రాలని ఉపయోగించకపోవడం, అన్నీ “సహజమైన” ముడిపదార్ధాలని వాడడం .. ఈ ముఖాలలో కొన్ని. అమెరికా ఎప్పుడూ Meat and Potatoes దేశమే. తరతరాలుగా తక్కువ ఖరీదుకి బర్గర్లు, పిజ్జాలవంటి జంకు ఫుడ్డు తినడం మరిగి, వొళ్ళు కొవ్వు పట్టి ఉన్న అమెరికను ప్రజానీకానికి ఒక్కసారిగా జ్ఞానోదయమైనట్టు, దేశం మొత్తం ఒక్క మనిషిలాగా ఈ ఆరోగ్యకరమైన ఆహార విశ్వరూపాన్ని ఆహ్వానించింది. ఎటొచ్చీ ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నా దేశపు ఆరోగ్యం మెరుగుపడ్డం లేదట.
జంకు ఫుడ్డు వొంటికి మంచిది కాదు అని ప్రత్యేకంగా పనిగట్టుకుని చెప్పక్కర్లేదు – విపరీతమైన కొవ్వు, ఉప్పు, చక్కెరతో నిండి ఉన్న ఈ తిండి సంగతి స్పష్టంగా తెలుస్తూ ఉన్నదే. పైగా అవన్నీ ఎక్కడో ఫేక్టరీలో తయారై, ఎన్నెన్నో రోజులు ఫ్రీజర్లలో నిలవచెయ్యబడి, అప్పటికప్పుడు వేడిచేసి వడ్డిస్తున్న వ్యవహారం. దీనికి పూర్తి వ్యతిరేకంగా స్థానికంగా పండించిన కూరగాయలు, పండ్లు, ఇతర ముడి పదార్ధాలు, సహజ ఉత్పత్తులు, .. ఆహా ఎంత స్వఛ్ఛంగా, ఆరోగ్యంగా ఉంటుందో ఆ వంట! అనిపించక మానదుగదా! అసలే కేలిఫోర్నియాలో ఆ ఆరోగ్యం పిచ్చ బాగా ఎక్కువ. హాలీవుడ్ ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన స్వఛ్ఛమైన భోజనానికి బాగా పేరుపడ్డ రెండు రెస్టారెంట్లలో బాగా జనాదరణ పొందిన కొన్ని వంటకాలని ప్రయోగశాలల్లో విశ్లేషించినప్పుడు కొన్ని ఆసక్తి కరమైన సత్యాలు బయటపడ్డాయి. వొళ్ళు పెరగడానికి బాగా దోహదం చేసే కొవ్వూ, పిండిపదార్ధాలూ ఈ వంటకాల్లో చాలా హెచ్చుగా ఉన్నాయి. ఇందులో వాడిన ముడి సరుకు స్థానికమైనదీ, తాజాదీ అయితే అయుండవచ్చునుగానీ, శరీరానికి కొవ్వు పట్టకుండా ఉంచడానికి మాత్రం ఎటువంటి సహాయమూ చెయ్యదు ఇటువంటి ఆహారం.
images12
ఇదే కాదు, మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం అని విపరీతంగా ప్రకటనలు గుప్పించే అనేక సూపర్ మార్కెట్లలో షెల్ఫుల మీదున్న ఉత్పత్తులని చూసినా మనకి ఈ విషయం తెలుస్తూనే ఉన్నది. ఈ మాత్రానికి ఏ లేబరేటరీకో వెళ్ళనక్కర్లేదు – రకరకాల పొటేటో లేక వెజెటబుల్ చిప్సు, రకరకాల తీపి వంటకాలు, చాక్లెట్లు, మరెన్నో రకాల పాస్తా వంటి పిండిపదార్ధాలు – వాటి మీద “సహజం, ఆర్గానిక్, ఫలానా ఆరోగ్యకరమైన అంశాలతో  వృద్ధి చెందినది” ఇత్యాది పదజాలంతో మన కళ్ళనూ మనసునూ మాయజేసే వర్ణప్రపంచం కనిపిస్తుంది, కానీ లేబుల్ ని కాస్త విశదంగా పరీక్షిస్తే – ఔన్సుకి ఔన్సు, కేలరీకి కేలరీ – ఇవన్నీ మెక్డనాల్డ్సు వాడు అమ్మే బర్గరు + ఫ్రెంచి ఫ్రై భోజనానికి తీసిపోకుండా ఉన్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే, కొన్ని సందర్భాల్లో జంకు ఫుడ్డే మెరుగ్గా ఉన్నదేమో కూడాను. మొత్తానికి తెలుస్తున్నదేవిటంటే – వొళ్ళు పెరగడానికి ముఖ్య కారణం భోజనంలో ఉండే కొవ్వు, పిండిపదార్ధాలూ కాగా, ఇప్పుడు మంచి ఆహారం పేరిట చెలామణి అవుతున్నదానిలో చాలా భాగం ఆ విషయంలో తినేవారి ఆరోగ్యానికి దోహదం చేసేలా లేదు.
సహజమైన ఆహారంకూడా జంకు ఫుడ్డు లాగానే వ్యాపార సంస్థల వ్యాపార సూత్రం మాత్రమే అయుంటే అదొక తీరుగా ఉండును. కానీ, ఈ విషయం, ఈ సూత్రం వ్యాపారాన్ని మించి – వ్యాసం మొదట్లో చెప్పినట్టు – ఒక ఉద్యమంగా, ఇంచుమించు ఒక సరికొత్త మతంగా పరిణమించింది. కొందరు పేరు పొందిన పాత్రికేయులు (E.g. Michael Pollan) ఈ మతానికి ప్రధాన మతాచార్యులు. టీవీలోనూ పత్రికల్లోనూ తారలుగా వెలుగుతున్న వంటవారు (Chefs, e.g. Mark Bittman) ప్రధాన అర్చకులు. పుస్తకాల ద్వారా, పత్రికల ద్వారా, టీవీలో, విడియోల్లో వీరందరూ కలిసి చేస్తున్న ప్రబోధాలు మధ్యతరగతి అమెరికన్ల మనసుల్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా వారి అలవాట్లని ఎంత ప్రభావితం చేశాయో తెలియదు గానీ వారి కొనుగోళ్ళని మాత్రం చాలా మార్చివేశాయి.
గత ఇరవయ్యేళ్ళలో ఈ “సహజ ఆహారం” ఒక స్వతంత్రమైన ఇండస్ట్రీగా ఎదిగింది. వచ్చిన తంటా ఏవిటంటే ఈ ప్రవచనాలు చెప్పే మహానుభావులెవ్వరూ వైద్యంలో కానీ, శరీరతత్వ శాస్త్రంలో కానీ, ఆహార శాస్త్రం (Nutritional science)లో కానీ పట్టభద్రులు కారు. ఆహారపు అలవాట్లు, శరీరతత్వం మీదనూ, ఆరోగ్యం మీదనూ వాటి ప్రభావాన్ని గురించి కొన్ని పరిశోధనలు జరిగాయి కానీ శాస్త్రీయమైన గమనికలు గానీ, ఇతర నిర్ణయాలు కానీ బయటికి రాలేదు. ప్రజల జీవితాలని ప్రభావితం చేసే అనేక సమస్యలకి శాస్త్రీయంగా జవాబులను వెతెకడానికి ఇష్టపడే అమెరికను సమాజం, ఆధునిక టెక్నాలజీలని ఒక ముఖ్యమైన సాధనంగా వాడుకునే అమెరికన్ సమాజం ఇలా ఆహారం విషయంలో మాత్రం ఎక్కడో వెనకబడిన ప్రాంతాల్లో మూఢనమ్మకాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆదిమ సమాజం మాదిరిగా ఈ ఆరోగ్య ఆహార మతాన్ని నమ్ముకుంటున్నది, తన అమిత బరువు సమస్యని పరిష్కరించడానికి.
స్వఛ్ఛమైన, సహజమైన ముడి సరుకు మంచిదే – కాదనడం లేదు. జంకు ఫుడ్డు చెడ్డదే – అదీ కాదనడం లేదు. కానీ శరీరపు బరువుని గురించీ, ఆరోగ్యాన్ని గురించీ సైన్సు చెబుతున్న మౌలికమైన విషయాలను పట్టించుకోకుండా సహజమైనది కదా అని ఏది పడితే అది, ఎంత పడితే అంత తింటూ పోతే వచ్చేది ఆరోగ్యం కాదు, అకాల మృత్యువే. మా మిత్రుడు ఒకడు అంటూ ఉంటాడు –  పాము విషంకూడా సహజమైనదే, ఆర్గానిక్‌గా, ఎక్కడా ప్రాసెస్ చెయ్యకుండా ఉత్పత్తి అయినదే – అలాగని, విషం తింటామా? అది విషమే అయినప్పుడు, అది ఆర్గానిక్ అయితేనేమి, ఏదో యంత్రాల్లో తయారైనది అయితేనేమి ప్రాణం తియ్యడానికి.

organic garden

మన ఇంటి వెనకాల పెరడులో పెద్దగా ఎరువులూ, క్రిమిసంహారకాలూ అవీ వాడకుండా మనం పెంచుకున్న కూరగాయల్ని మన చేత్తో కోసుకొచ్చి వండుకుని (అదీ ఎక్కువ ఉప్పూ, నూనెలూ లేకుండా) తింటే – అది కచ్చితంగా జంకుఫుడ్డు కంటే ఆరోగ్యంగా ఉంటుందని ఒప్పుకోవచ్చు. అంతేగానీ “సహజ సూపర్ మార్కెట్”లో షెల్ఫుల మీద అమ్మబడుతున్న సహజ పాస్తాలు, సహజ చిప్సు, సహజ ఐస్ క్రీములు తింటూ ఉండడం ఆరోగ్యం కాదు. అది మన మనసును .. కాదు కాదు – శరీరాన్ని – మనమే వంచన చేసుకోవడం.
References:

“The cure for Obesity”, David H. Freedman, The Atlantic (monthly) July 2013

 

– ఎస్. నారాయణ స్వామి

ఏక్ ఫిలిం కా సుల్తాన్ (హీరో)

bhuvanachandra

Untold Stories 

ఈ టైటిల్ నేను అతనికి పెట్టలేదు.. అతనికి అతనే పెట్టుకోవడమేగాక, ‘ఆధ్యాత్మికంగా’ నవ్వి నాతో చెప్పాడు. “అదేమిటి?” అన్నాను. అతన్ని కలిసింది మౌంట్‌రోడ్డులో. ఒకప్పుడు ‘స్పెన్సర్శ్  ఉండే చోటికి దగ్గర్లో, సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా. “సార్.. సిగ్నల్ దాటాక ఓ క్షణం ఆపుతారా?” పేవ్‌మెంట్ మీదనించి తెలుగులో అరిచాడు. ఆయన్ని చూస్తే చాలా వృద్ధుడు. ముఖంలో కొద్దోగొప్పో ‘అలిసిపోయిన వర్ఛస్సు’ మిగిలుంది.

సిగ్నల్స్ క్రాస్ చేశాక ఆపాను.

“థాంక్స్ సార్..” మిమ్మల్నేదీ  యాచించటానికి రాలేదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. నా వయసులో ఉన్నవాడూ, ఇలా మురికి బట్టలు వేసుకున్నవాడూ ఎవరు కారుని ఆపినా, అడుక్కోవటానికే అనుకుంటారు…” చిన్నగా నవ్వి అన్నాడు.

“చెప్పండి.” అన్నాను.  ఇంకేమనాలో తెలియక.

“మీరు నాకు తెలుసు. చాలా సినిమాల్లో ‘గుంపులో గోవిందం’ వేషాలు వేశాను. అయితే ఓ విషయం చెప్పుకోవాలి. నేను ఏక్ ఫిలిం హీరోని. ఏక్ దిన్ కా సుల్తాన్‌లాగా..! మళ్లీ మందహాసం.

“చెప్పండి..!” అన్నాను.

మద్రాసు ఎండలకి ప్రసిద్ధి. అయితే ఆ ఎండ మంచిదే. చెమట పడుతుంది. స్నానం చేశాక వొళ్లు హాయిగా తేలిగ్గా వుంటుంది. సాయంత్రం నాలుక్కల్లా సముద్రపు గాలి వీస్తుంది. కొంచెం జిడ్డుగా. కొంచెం చల్లగా. ఏమైనా మద్రాసు ప్రత్యేకత మద్రాసుదే.

“రామకృష్ణగారు (త్వరలో ఆయన ఫోటో, సెల్ నంబర్‌తో సహా పరిచయం చెయ్యబోతున్నాను.) మీ గురించి చెప్పారు. నెలనెలా మీరు రాస్తున్న ‘అన్‌టోల్డ్ స్టోరీస్’ గురించి కూడా చెప్పారు. నాకో చిన్న ఆశ. నా కథ కూడా మీరు రాస్తారని. ఎందుకంటే…” సందేహించాడు.

“సందేహం వద్దు. ఎందుకూ?” అన్నాను.

“అమెరికాలో వున్న నా పిల్లలెవరన్నా చదివి మళ్లీ నన్ను కలిసే ప్రయత్నం చేస్తారని..” కొంచెం సిగ్గుపడుతూ అన్నాడు”

“రేపు మీరు మా యింటికి రాగలరా?” నా ‘కార్డ్’ ఇస్తూ అన్నాను.

“తప్పకుండా. అంతకంటేనా..” ఆనందంగా అన్నాడూ.

ఓ పది నిమిషాల తరవాత జ్ఞాపకం వచ్చింది. ఆయన తన పేరు చెప్పలేదనీ… నేను అడగలేదనీ..

 

***

 

“నా అసలు పేరు ‘ఫలానా’. అయి తే దయచేసి నా కథని పేరు మార్చి రాయండి. ఆ పేరు కూడా నేనే చెబుతాను.. ‘యాదయ్య’. ” అన్నాడు. “అసలు పేరు రాయకపోతే మీ పిల్లలు ఎలా గుర్తుపడతారూ? అయినా మీ పిల్లలు ‘సారంగ’ పత్రికని చదువుతారని గ్యారంటీ లేదుగా. ఒక పని చెయ్యండి. మీ పిల్లల పేర్లు. వాళ్లు ఏం చేస్తున్నారో  చెబితే అమెరికాలో వున్న నా ఫ్రెండ్స్‌కి చెబుతా. తోటకూర ప్రసాద్‌గారికీ, వంగూరి చిట్టెన్ రాజుగారికీ, కిరణ్ ప్రభ గారికీ, కల్పన, అఫ్సర్‌గార్లకీ చెబితే కొంత ప్రయోజనం ఉంటుంది..” అన్నాను.

అతను గాఢంగా నిట్టూర్చాడు. “వాళ్లకి నేనంటే అసహ్యం. అలా నన్ను అసహ్యించుకోవడానికి వాళ్ల కారణాలు వాళ్ళకున్నాయి. వాళ్లకి తెలీంది ఒకటే. నా జీవితం గురించి. అది చదివితే కొంత అర్ధం  చేసుకుంటారని నా ఆశ…”

“సరే. మీరన్నట్టుగానే చేద్దాం. చెప్పండి.” అన్నాను.

“మాది విజయవాడ దగ్గర ఓ పల్లెటూరు. ఆ వూరికంతటికీ సంపన్న కుటుంబం మాదే. నేను చదివింది గుంటూరు AC కాలేజీలో . మా వూల్లో  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. మావాళ్లకి నేనంటే ప్రాణం. ఎంత అడిగితే అంతా ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో “గోల్డ్ ఫ్లేకు టీన్ను”లు కొని స్టైల్ మెయిన్‌టైన్ చేసినవాన్ని నేనే. ఇంకో విషయం.. కొంగర జగ్గయ్యగారూ, గుమ్మడిగారూ, వాళ్లంతా నాకు అప్పట్నించే  పరిచయం..” నిట్టూర్చాడు.

కష్టపడి పైకొచ్చినవాళ్లకి తన మీద తనకి విపరీతమైన నమ్మకమూ, ధైర్యమూ వుంటాయి. పైనించి కిందకి దిగినవాడికి ‘ఆత్మన్యూనత, తన మీద తనకి జాలి ‘డెవలప్’ అవుతాయి.  “తర్వాత?”

“ఇప్పుడిలా వున్నాగానీ నేను చాలా అందంగా  వుండేవాన్ని. దాంతో సహజంగానే సినిమా ఫీల్డువైపు అడుగులు   పడ్డాయి. “కళ్లు మెరుస్తుండగా” అన్నాడు.

“ఊ !”

“మైలాపూర్‌లో ఓ పెద్ద ఇల్లు అద్దెకి తీసుకున్నాను. మాక్జిమమ్ ఫర్నీచర్, అలంకార సామగ్రి, అంతా స్పెన్సర్స్ నించే. అప్పట్లోనే “బ్యూక్” కారు కొన్నాను. పాండీ బజార్లో కారు పార్కు చేసి అటుపక్కన CSRగారు నిలబడి వుంటే, ఇటు పక్క నా బ్యూక్‌ని పార్క్ చేసి నేను నిలబడి వుండేవాడిని. అయ్యా.. ఆ రోజులు వేరు,  నిర్మాతలూ, దర్శకులూ బాగా చదువుకున్నవారూ, “సినిమా” మీద ప్రేమతో వచ్చినవారు. ప్రొడ్యూసరు  కృష్ణాజిల్లావాడే.  మాకు తెలిసినవాడే.  కాస్త దూరపు బంధువు కూడానూ..” మళ్లీ నిట్టూర్చాడు.

కన్నీళ్లు ఆవిరైనప్పుడు  వచ్చేవే ‘నిట్టూర్పులు’. కళ్లల్లో ఇంకా కన్నీరు మిగల్లేదన్నమాట. గుండెల్లో  ఉండే బాధే..  ‘నిట్టూర్పుల సెగల’ రూపంలో బయటికొస్తుందేమో!

“తర్వాత?” అడిగాను.

“పిక్చర్ మొదలైంది. హీరోయిన్ తమిళమ్మాయి. చాలా అందగత్తె. ఓ వారం షూటింగ్ జరిగాక మా నాన్నగారు సీరియస్ అని నాకు ‘టెలిగ్రాం’ వచ్చింది. రాత్రికి రాత్రే కార్లో బయలుదేరాను. ‘తడ’ దాటాక యాక్సిడెంటైంది. డ్రైవర్‌కి బాగా దెబ్బలు తగిలాయి. నా కాలు విరిగింది. స్పృహ వచ్చి మళ్లీ ఊరికి బయలుదేరడానికి రెండు రోజులు పట్టింది. కాలికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అన్నారు. సిమెంటు కట్టు కట్టారు. ఇంటికి వెళ్ళేసరికి నాన్న పరిస్థితి క్షీణించింది. “బాబూ .. చచ్చి మళ్ళీ నీ కడుపున పుట్టాలనుంది. పెళ్లి చేసుకోవా?” అని బ్రతిమిలాడాడు. బంధువులు కూడా తండ్రి కోర్కె తీర్చమని పట్టు బట్టారు. మూడు రోజుల్లో ముహూర్తం చూశారు. సిమెంటు కట్టుతోనే పెళ్లి పీటలమీద కూర్చున్నాను. ఆయన కళ్లు ఎటో చూస్తున్నాయి శూన్యంగా. బహుశా ‘మాసిపోయిన’ గతంలోకి చూస్తూ వుండొచ్చు.

“ఆ రోజుల్లో ఫలానా పిల్ల అని చెప్పడానికే కాని, పెళ్లి చూపులూ, ఫోటోలు ఉండేవి కావు. నా విషయంలో నేను అదృష్టవంతుడ్నే. పిల్ల నాకు తెలిసిన పిల్లే. ఆ రోజుల్లోనే సెకెండ్ ఫాం చదివింది. ఆడపిల్లలకది గొప్ప చదువే. అదీ వ్యవసాయదారుల కుటుంబాల్లో…!”

“ఊ..!”

“వాళ్ళు   పెద్దగా ‘వున్నవాళ్లు’ కాదు గానీ, మంచి కుటుంబం. పెళ్లి అయినాక నెలన్నర మా వూళ్ళోనే వుండాల్సొచ్చింది.  మద్రాసు వచ్చి నా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదుగా. యవ్వనం ఎలాంటిదంటే సిమెంటు కట్టు కాపురానికి అంతగా అడ్డురాలేదు. ఆ తర్వాత డాక్టర్‌కి చూపిస్తే మరో నెలన్నర రెస్టు తీసుకుని తీరాలన్నాడు. నా కథని చెబుతూ విసిగిస్తున్నానేమో” అడిగాడు.

నిజమే,  ప్రతీ వ్యక్తికీ తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన చాలా ముఖ్యమైనదిగా, చాలా విలువైనదిగా అనిపిస్తుంది. ఇతరుల జీవితాల్లోనూ అలాంటివే ఉంటాయనీ, వాటిని ‘అంతగా’ వివరించక్కర్లేదని అనుకోరు.

వయసైన వాళ్లైతే మరీనూ, అందుకే ఇంట్లో వున్న వయసైన వాళ్లని పిల్లలు విసుక్కునేది. క్లుప్తంగా, చెప్పాల్సినంత వరకూ చెబితే గొడవుండదుగా.

అయితే నా పాత్ర వేరూ. ‘కొంచెం’ ‘క్లుప్తంగా’ ‘చెప్పండి’ అనడానికి వీల్లేదు. అలా అంటే ఆయన చిన్నబుచ్చుకుని చెప్పాల్సిన ముఖ్యమైన విషయాల్ని చెప్పలేకపోవచ్చు.

“లేదు లేదు.. చాలా ఇంట్రెస్టింగా ఉంది. చెప్పండి..!” అన్నాను.

“ఏతావాతా మూడు నెలలు మావూళ్లోనే వున్నాను. దాంతో నా భార్య సరోజకి నెల కూడా తప్పింది. మళ్లీ మద్రాసొచ్చాను. అందరూ మహదానందంగా ఆహ్వానించారు. షూటింగ్ మొదలైన వారం రోజుల తరవాత మా నాన్న పోయారని ‘తెలిగ్రాం వచ్చింది”

మరో నిట్టూర్పు. ఇది ‘జ్ఞాపకాల సమాధి’ ని తవ్వి తీస్తున్న నిట్టూర్పు.

మళ్ళీ వూరెళ్ళాను. దినకర్మలు పూర్తిచేసి తిరిగి వచ్చేసరికి పదిహేను రోజులైంది. మళ్ళీ షూటింగ్ మొదలైన రెండు రోజులకి నిర్మాత బాత్‌రూంలో కాలుజారి పడ్డాడు. కాలు బెణికిందిగానీ ‘తుంటి’ భాగం బాగా రప్చరైంది. మద్రాసు సెంట్రల్ దగ్గరున్న G.H. (జనరల్ హాస్పిటల్) డాక్టర్లు   కనీసం మూడు నెలల రెస్ట్ ఇవ్వమన్నారు. మళ్లీ షూటింగ్ ఆగింది..!”

“ఊ”

“ఇన్నిసార్లు షూటింగ్ ఆగటంతో నాకు ‘అన్‌లక్కీ’ అన్న పేరొచ్చింది. పేరొచ్చింది అనడం కంటే అలా కొంతమంది నన్ను ప్రొజక్ట్ చేశారనడం సబబు. సంసారం ‘రుచి’ మరిగినవాడ్ని. హీరోయిన్ కూడా క్లోజ్‌గా మూవ్ కావడంతో ‘కాస్త’ దారి తప్పాను. నాకేం తెలుసు, నటీమణుల(కొందరి) కళ్లు మనమీద కన్నా మన పర్సు మీదే వుంటాయనీ. వ్యవసాయం మూలబడటంతో ( మా నాన్న మృతివల్ల) నాకు ఇంటినుంచి వచ్చే రాబడి తగ్గింది. నెలకీ, రెణ్నెల్లకీ ఊరు పోవడం ఎకరమో, రెండెకరాలో అమ్మడం మామూలైంది. నా భార్య అడ్డుపడ్డా లాభం లేకపోయింది. ఆ నటీమణి మత్తులో నేను పూర్తిగా కూరుకుపోయానని అప్పుడు నాకే తెలీదు. నా పిక్చర్ రిలీజైతే నంబర్ వన్ నేనే అవుతాననీ, కుప్పలు తెప్పలుగా డబ్బు సంపాదిస్తానని నా నమ్మకం.: మళ్లీ మరో నిట్టూర్పు.

“మరి…”అడగాల్సింది అడగలేక ఊరుకున్నాను.

“మీరు అడగబోయి ఆగిన ప్రశ్న నాకు అర్ధమైంది.. ఎవరూ’సుద్దులు’ చెప్పలేదా? అని కదూ? చెప్పారు.. జగ్గయ్యగారు చెప్పారు. యీ సినీ పరిశ్రమలో సత్‌ప్రవర్తన ముఖ్యమనీ, దానికి చాలా విలువుందనీ.. వింటేనా? మూడు నెలలు గడిచాక డైరెక్టర్ భార్య చనిపోయింది. దాంతో మళ్లీ కొన్ని రోజులు షూటింగ్ ఆగింది. నా ఫేట్ ఏమోగానీ మళ్లీ షూటింగ్ మొదలు కాకముందే ప్రొడ్యూసర్ ‘హరీ’ అన్నాడు. దాంతో నాది ‘ఇనపపాదం’ అన్నారు. పిక్చర్ ఆగిపోయింది. ఓ ఆవేశం, పట్టుదలతో నేనే మిగిలిన పరికరాల్నీ కారు చౌకగా అమ్మి సినిమా పూర్తి చేద్దామనుకున్నా. నాకూ, మా అవిడకీ గొడవలు జరిగాయి. అయినా ఆస్తి అమ్మి మద్రాసు వచ్చి షూటింగ్ మొదలెట్టించా. చనిపోయిన ప్రొడ్యూసర్ కొడుక్కి అప్పటిదాకా అయిన ఖర్చుని ముట్టజెప్పి సినిమాకి నేనే ప్రొడ్యూసర్‌నయ్యా.  డైరెక్టర్ నాకు సినిమా నిర్మాణం గురించి ఏమీ తెలియదని తెలుసుకుని సినిమాని చుట్టేశాడు గానీ, ఖర్చుల చిట్టా మాత్రం భారీగా నాకు చూపించాడు. సినిమా రిలీజ్ కాలేదు. రిలీజ్ చెయ్యడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఒకరు ‘పైసా’ ఇవ్వకుండా రిలీజ్ చెయ్యడానికి ఒప్పుకున్నారు. మొదటి షో, అంటే మార్నింగ్ ‘షో’లోనే అది ఫ్లాప్ సినిమాగా పేరు తెచ్చుకుంది కానీ, నా అందం మాత్రం ప్రజల్ని ఆకర్షించిందనే చెప్పాలి.” మరో నిట్టూర్పు.

మొహంజొదారో, హరప్పాల్ని తవ్వినప్పుడు ఏం బయట పడ్డాయి? కుండపెంకులు, ఇటికలూ, ఎముకలూ, పుర్రెలూ అంతేనా?

అతని నిట్టూర్పుల్లో నాకు కనిపించినవీ అంతే.. జ్ఞాపకాల రూపంలో..

“సినీపరిశ్రమ ఓ గొప్ప ఊబి. ఇందులో దిగకూడదు. దిగాక బయటికి రావడం బ్రహ్మతరం కాదు. నా ఫెయిల్యూర్‌ని జీర్ణించుకోలేకపోయాను. అప్పటివరకు నా గోల్డ్ ఫ్లేక్ టిన్నుల్లోంచి చనువుగా సిగరెట్లు తీసుకుని తాగినవాళ్లు, నేను వాళ్ల ‘స్నేహితుడ’నని గొప్పగా చెప్పుకున్నవాళ్లు మొహం చాటేశారు. ఆస్తి పోయిందని (ఖర్చయిందని) తెలిశాక నా ‘హీరోయిన్’ ఇంట్లో వుండి కూడా ‘లేనని’ చెప్పించింది. తరవాత మరో ‘అప్‌కమింగ్’ హీరోకి ‘భార్య’గా సెటిల్ అయింది”అక్కడి దాకా చెప్పి ఆగాడు.

“నేను మళ్లీ పంతంతో మరో పిక్చర్‌లో నా ‘వర్త్‌’ ని నిరూపించుకోవాలనుకున్నాను. నా భార్యా, వాళ్ల తల్లిదండ్రులకి ఏకైక సంతానం. ఓ ఏడాది అత్తారింట్లోనే ఉండి, వాళ్లకి బాగా ‘నూరి పోసి’ అస్తిని అమ్మించి సినిమా మొదలెట్టాను. నా భార్య మొదటి కాన్పులో మగపిల్లాడ్ని, రెండో కాంపులో ఆడపిల్లని ప్రసవించింది గానీ నేను మాత్రం ‘సక్సెస్’ని సాధించలేకపోయాను. నానా కారణాల వల్ల నేను మొదలెట్టిన సినిమా ఆగిపోయింది. మూడేళ్లు గడిచాయి. నాకు మరో కొడుకు పుట్టాడు. ఓ నిజం చెప్పాలి. నేను నా భార్య దగ్గరికి వెళ్లానే గానీ ఏనాడూ నా భార్యని మద్రాస్‌కి తీసుకురాలేదు. జనందృష్టి లో నేను బ్రహ్మచారినే. పెళ్ళాయినవాడంటే ‘గ్లామర్’ పోతుందని పెళ్ళయిన విషయం ‘లీక్’ కానివ్వలా!” మరో దీర్ఘ  నిట్టూర్పు .

జ్ఞాపకాల శవాలు కాలిన వాసనుంది అందులో.

నేను ఏమీ మాట్లాడలా. గుర్తు తెచ్చుకుంటాడని మౌనంగా ఉండలేదు. మర్చిపోలేరుగా మనుషులు అడగటాన్ని.

“అప్పులు పెరిగినై. ఊళ్ళో ఇల్లూ అమ్మేశా. అప్పుడు నా భార్య ఆన్నది. నీకోసం నీ బిడ్డల్ని నాశనం చెయ్యలేనని”..దాంతో నాకు కోపం వచ్చింది. పొమ్మన్నా. వెళ్ళిపోయింది. చాలాసార్లు కలుద్దామనిపించేది. బిడ్డల్ని చూసుకోవాలనిపించేది. కానీ ఆమె అడ్డువచ్చేది!” ఈ నిట్టూర్పులో మమకారం తప్ప అహంకారం కనపడలేదు.

నా భార్య వాళ్ల మేనమామల దగ్గరకి (బోంబే) వెళ్లిపోయింది. రెండుసార్లు నా పిల్లల గురించి ఎంక్వైర్ చేశా. వాళ్లకి ఏం చెప్పారో ఏమో నా పేరు వినగానే, ‘డోంట్ టాక్ అబౌట్ హిం’ అన్నారుట.” మరో నిట్టూర్పు.

ప్రతి వ్యక్తి తన ‘తప్పుని’ సమర్ధించుకుంటాడు. యీయన ఆ ప్రిన్సిపుల్‌కి అతీతుడు కాడనిపించింది. “కేవలం ఆస్తి పాడు చేసినందువల్లే మీ పిల్లలు మీకు దూరమయ్యారా?” అని అడిగాను.

మా ఇద్దరి మధ్యా ‘నిశ్శబ్దం’ చాలా సేపు రాజ్యమేలింది. “నేను మరో తప్పు చేశా. అది ‘తాగుడు.’ నా పరాజయాన్ని జీర్ణించుకోలేక తాగుడు  మొదలెట్టా.. బానిసనయ్యాను. రెండో సినిమా కోసం బంగళా అమ్మేశా. టి.నగర్ రైల్వే ట్రాక్ పక్కనున్న గుడిసెల్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడే నా భార్యతో పోట్లాట జరగటం. ఆ కచ్చలో మరో ఎక్‌స్ట్రా నటిని దగ్గరికి తీయడం జరిగింది” తలొంచుకున్నాడు.

“మీరు గ్రాడ్యుయేట్ కదా.. కనీసం ఉద్యోగం కోసం ప్రయత్నించలేదా?” అడిగాను.

“యీ ఫీల్డు సంగతి మీకు తెలీనిది ఏముందీ? మీరు మెకానికల్ ఇంజనీరని నాకు తెల్సు. ఇపుడు మీరీ ప్రొఫెషన్ని వదిలి మళ్లీ స్పేనర్ పట్టుకోగలరా?” ఆయన మాటల్లో కొంచెం కోపం. నాకు నవ్వొచ్చింది.

“అయ్యా,  అదృష్టవశాత్తు నేను నిలదొక్కుకున్నా గనక యీ ఫీల్డులోనే వున్నాను. మీరనుకున్నట్టు నాకు ఇంకా పేరు రావాలనీ, ఇంకా డబ్బు సంపాదించి అస్తులు కూడబెట్టాలనీ ఏనాడూ లేదు. అందుకే పరిశ్రమ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయినా నేను ఇక్కడే ఉండిపోయా. నాకొచ్చే పాటలు చాలు. తీసికెళ్లలేనివి పోగు చెయ్యటం ఎందుకు?When  you can’t carry .. why should you collect?”  ఇదే నా ప్రిన్స్‌పుల్. మా నాన్నగారు నాకు నేర్పింది ఇదే.. యీ క్షణంలో కూడా ‘రెంచి్’ పట్టుకోవడానికి నేను సిద్ధమే?” అన్నాను.

“అది మీ స్వభావం. చిన్నతనం నించీ స్వేచ్చగా  పెరగటం వల్ల ఎవరి కిందో పని చెయ్యడం నామొషీ అనిపించి ఉద్యోగ ప్రయత్నం చెయ్యలేదు” నిర్లిప్తంగా అన్నాడు.

“సరే.. తరవాత ఏమైంది?”

“ఎక్‌స్ట్రాగా మిగిలా. తాగుడువల్ల అందం పోయింది. ఆరోగ్యం పాడు అయింది. నిజం చెప్పాలంటే ఏ ఎక్‌స్ట్రా నటిని దగ్గరికి తీశానో ఆవిడే మూడునెళ్ల క్రితం వరకూ నన్ను పోషించింది. మూణ్నెల్లక్రితం చచ్చిపోయింది..” మరో సుదీర్ఘ నిట్టూర్పు.

“యాదయ్య అనే పేరు పెట్టమన్నారు. ఆ పేరు మీ వాళ్లకి తెలుసా?”

“పిల్లలు చిన్నప్పుడు నన్ను యాదూ, యాదయ్యా, యాదీ అంటూ  పిలిచేవారు. అందుకే ఆ పేరు పెట్టమన్నాను.”

“సరే. నిజం చెబితే ఇది పత్రికకి ఎక్కాల్సిన కథ కానే కాదు. కానీ పంపుతా. దేనికంటే కొందరైనా మీలాగా కాకుండా ‘బాధ్యతల్ని’ తెలుసుకొంటారని. అయ్యా.. మీరేమీ అనుకోకండి. మీలో నాకు కనిపిస్తున్నది పచ్చి స్వార్ధం. దానితో మీ పెద్దల ప్రేమని గానీ, మీ భార్యాపిల్లల బాగోగులు గానీ, వృద్ధులైన మీ అత్తామామల మంచి చెడ్డల్ని గానీ చూడకుండా మీ కీర్తి కండూతి కోసం సర్వాన్ని నాశనం చేశారు.  మిమ్మల్ని విమర్శించే హక్కు నాకు లేదు. కనీసం అంత చదువు చదివి ఓ చిన్న ఉద్యోగం చేసినా ఎంతో బాగుండేది. అల్లా చెయ్యకపోగా మళ్లీ ఓ స్త్రీ మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు కూడా మీ ప్రయత్నం  పిల్లల్ని మంచి చేసుకుని వారి మీద ఆధారపడాలనే గానీ వారి మీద ప్రేమవల్ల కాదు. అవునా?” సూటిగా అడిగాను.

మామూలుగా అయితే అతనెవరో ? నేనెవరో? కానీ అతనడిగింది ఆయన కథ వ్రాయమని. అందువల్లే అలా మాట్లాడాను.

విన్నాక నాకు అనిపించింది ఒకటే. మనిషి ‘ఇంత’ స్వార్ధపరుడుగా కూడా ఉంటాడా అని. కళ్లెదురుగానే ఉన్నాడుగా.

“నే తెలిసి ఏ తప్పూ చేయ్యలేదు. పరిస్థితులవల్లే ఇలా అయ్యాను” రోషంగా అని లేచాడు.

“తప్పుని పక్కవాళ్ల మీద తొయ్యడమో, పరిస్థితులను అడ్డుపెట్టుకోవడమో మీ అంత చదువుకున్నవాళ్లు చెయ్యాల్సిన పని కాదు. నా మాటలు మీకు బాధ కలిగిస్తే క్షమించండి. అయితే మీ కథని మాత్రం రాసి పంపుతాను. మీ పిల్లలు దాన్ని చదివి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అది మీ అదృష్టం.” నేనూ లేచాను.

అయ్యా.. ఇదీ సంగతి. ఇతని జీవితంలోంచి నేర్చుకోవల్సింది చాలా వుంది. కనీసం మనిషి ‘ఎలా వుండకూడదో’ తెలుస్తుందిగా. ‘బాధ్యతా రాహిత్యానికి’ ఇతనో లైవ్ ఎగ్జాంపుల్. నేను చెప్పగలిగింది ఇంతే..

 

మళ్లీ కలుద్దాం.

నమస్సులతో

భువనచంద్ర

ఒక నడి వయసు ప్రేమ కథ: లిజన్.. అమాయా!

జ్ఞాపకాలే జీవితం కాదు.. జీవితంలో ఒక భాగం మాత్రమే జ్ఞాపకాలు… ఎంత సత్యం! ఇట్స్ ఎ ప్రాక్టికల్ ట్రూత్! ఆ విషయాన్నే చెపుతుంది లిజన్.. అమాయా!

జిందగీ న మిలేగీ దొబారా…ఎవరన్నారు బాస్? జిందగీ మిలేగీ దొబారా! జీవితం మొదలుపెట్టిన కొన్నాళ్లకే జీరోకి చేరితే.. అంతా అయిపోదు. మళ్లీ ఒకటి, రెండు, మూడు అంకెలుంటాయి! పాత జ్ఞాపకాలను, అనుభవాలను ఓ భాగం చేసుకుంటూ కొత్తగా మొదలుపెట్టొచ్చు! దాన్నే చూపిస్తుంది లిజన్.. అమాయా! అమాయా.. అంటే రాత్రికల! బతుకు రాత్రి కలలాగే మిగిలిపోకూడదు!  జీవితం ఇలాగే ఉండాలనే ఫ్రేమ్‌లో మనసున్న వాళ్లెవరూ ఇమడలేరు! ఈ ప్రయాణంలో అనుభవమయ్యే ప్రతిమలుపునూ స్వీకరించడం..ఆస్వాదించడమే! విధివింతల్లో భాగస్వామ్యులవడమే!

ఇవన్నీ స్త్రీ, పురుషులిద్దరికీ సమానమే అయినా  స్త్రీ విషయానికొచ్చేసరికే ఎక్కడలేని సంఘర్షణ! ప్రేమ, సహచర్యం విషయంలో మరీ! ఆమెకు జిందగీ నమిలేగి దొబారా! ఒకవేళ కోల్పోయిన జీవితాన్ని మళ్లీ పొందాలనే ఆశపుడితే కట్టుబాట్ల నుంచి కన్న పిల్లల దాకా అందరికీ శత్రువు అవుతుంది!  కట్టుబాట్లనెదిరించే ధైర్యం చూపినా పిల్లలను కన్విన్స్‌చేసే సాహసం చేయలేదు ! అసలు ఆమెకు ప్రేమించే హక్కేలేనప్పుడు జీవితంలో మలిప్రేమ ఊపిరిగురించి ఊసా? అదీ మధ్యవయసులో! ఆ చర్చనే తల్లీకూతుళ్ల మధ్య సున్నితంగా లేవనెత్తుతుంది లిజన్ అమాయా..!

రమా సరస్వతి

రమా సరస్వతి

చలం రాజేశ్వరి చేసిన ధైర్యం లిజన్ అమాయాలో లీలా చేస్తుందా? రాజేశ్వరికి లోకం ప్రేమ మయం! పిల్లల బంధాలు, బంధనాలు లేవ్! కాని  లీల అలాకాదు! షి ఈజ్ ఎ అర్బన్ లేడి! మెచ్యూర్డ్ అండ్ మోడర్న్‌డాటర్‌కి సింగిల్ పేరెంట్! భర్త చనిపోతే అన్నీ తానై, తనకు కూతురే లోకమై బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. సినిమా కథలో మనకు కనిపించే లీల..ఢిల్లీలో బుక్ ఎ కాఫీ పేరుతో కెఫ్తీరియా నడుపుకొంటూ జీవిస్తున్న మిడిల్‌ఏజ్డ్ ఉమన్! ఆ కెఫ్తీరియాలోనే పరిచయం అవుతాడు ఫోటో జర్నలిస్ట్ జయంత్! అతని భార్యా, పాప ఓ కార్ యాక్సిడెంట్‌లో చనిపోతారు. నడివయసు దాకా ఒంటరిగానే ఈదాడు! లీలతో పరిచయం స్నేహంగా మారుతుంది! ఎంతలా అంటే కెఫ్తీరియాకి వచ్చిన అపరిచితులు జయంత్, లీలను భార్యాభర్తలు అనుకునేంతగా!
లీల కూతురు అమాయా.. ఔత్సాహిక రచయిత! జయంత్‌తో చాలా చనువుగా ఉంటుంది. తన కెరీర్‌కి సంబంధించి ఎన్నో సలహాలు తీసుకుంటుంది. ఆయన్ని ఓ ఫ్రెండ్‌లా, గైడ్‌లా భావిస్తుంది!
లీలా  వయసొచ్చిన తన బిడ్డను ఓ స్నేహితురాలిలా చూస్తుంది. అన్నీ పంచుకుంటుంది. కూతురూ తనతో అన్నీ పంచుకునే స్వేచ్ఛనిస్తుంది. తామిద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం అనే భావనలో ఉంటుంది లీల. కాని తర్వాత తెలస్తుంది తనది వట్టి భ్రమేనని!

1005330_10200530760220688_1798645539_n
రాఘవ.. అమాయా ఫ్రెండ్! ఆత్మవిశ్వాసం అమాయా రూపు తొడుక్కుందా అన్నట్టున్న ఆ పిల్లను చూసి ప్రేమలో పడ్తాడు. ఆమె మనసు గెలుచుకోవడానికి నానా తంటాలు పడ్తుంటాడు. అందులో భాగమే కెఫ్తీరియాలో లీలకు సహాయం చేస్తుండడం! ఓపెన్ మైండ్.. మోడర్న్ థింకింగ్ ఉన్నట్టు కనిపించే అమాయాతో సహచర్యం చేయాలని తపిస్తుంటాడు!
కాని తనపట్ల తల్లికి, రాఘవకున్న అభిప్రాయలు అబద్ధాలని తేల్చేస్తుంది అమాయా ..ఈ వయసులో తోడు కావాలనుకుంటున్నావ్ ఆఫ్టర్‌ ఆల్ ఫర్ సెక్స్? అన్న ఒకేఒక మాటతో!
ఖంగుతింటుంది లీల! మనిద్దరం ఒకరికొకరం చాలా అర్థమయ్యాం అనుకునేదాన్ని. కాని అపరిచితులం అని ఇప్పుడు అర్థమైంది అని బాధపడ్తుంది లీల. నా కూతురైతే చెంప చెళ్లుమనిపించే వాడిని అంటాడు జయంత్! ఓపెన్‌మైండ్ అండ్ మోడర్న్ గర్ల్‌గా ఉన్నట్టు నటిస్తావ్.. ఇదేనా నీ ఓపెన్‌నెస్? మీ అమ్మ విషయంలో నీ మాటతో నన్ను చాలా డిస్‌అప్పాయింట్ చేశావ్ అమాయా.. అంటాడు రాఘవ!
అమాయా కరుకు ప్రవర్తనకు, ఘర్షణకు కారణం.. వాళ్లమ్మ జయంత్‌తో ప్రేమలో పడడం. ఆ ఇద్దరు ఆ వయసులో పెళ్లితో ఒకటికావాలనుకోవడమే! ఆ నిర్ణయంతో అమాయా ప్రవర్తనలో మార్పువస్తుంది. తండ్రి అంటే అమాయాకు వల్లమాలిన ప్రేమ! తండ్రిపోయినా ఆ జ్ఞాపకాల్తో తను బతుకుతున్నట్లే తల్లీ బతకాలనుకుంటుంది. తన తండ్రి స్థానంలో ఇంకో పురుషుడిని తల్లి పక్కన ఊహించలేదు! ఆ సంఘర్షణతో మానసికంగా తల్లికి దూరమవుతూ ఉంటుంది. విచక్షణ కోల్పోతుంది. తండ్రి స్థానం ఆక్రమించుకుంటున్నట్టుగా ఊహించుకొని జయంత్‌నూ శత్రువుగా చూస్తుంది.
నిజానికి జయంత్ అమాయా అభిప్రాయాలను చాలా గౌరవిస్తుంటాడు. ఆమె తండ్రి స్థానాన్ని అతను కోరుకోడు. లీలను తనకు తోడుగా, తను ఆమెకు తోడుగా మాత్రమే కోరుకుంటాడు. తమ ఇద్దరి అనుబంధం గురించి అమాయాతో మాట్లాడమని లీల అడిగినా.. ఆమే అర్థంచేసుకోవాలికాని మనం కన్విన్స్‌చేసి ఒప్పించాల్సిన విషయంకాదంటాడు జయంత్!
అన్నట్టుగానే బోలెడంత మానసిక వేదన తర్వాత తల్లికోణంలోంచి ఆలోచించడం మొదలుపెడుతుంది అమాయా. నెమ్మదిగా లీల, జయంత్‌ల మధ్య ఉన్న ప్రేమను అర్థంచేసుకుంటుంది.
ఆధునికత అంటే మారిన టెక్నాలజీని మాత్రమే అడాప్ట్ చేసుకోవడం కాదు స్త్రీ, పురుష సంబంధాలను అవగతం చేసుకోవడం… ప్రేమ విషయంలో స్త్రీ స్వేచ్ఛను అంగీకరించడం… ఆమె మనసును అర్థంచేసుకోవడం.. ఆమె అవసరాన్నీ గుర్తించడం అని రుజువు చేస్తుంది లిజన్.. అమాయా!
నడివయసు.. ప్రేమలు అసహజం కావు! ఆ మాటకొస్తే తోడు కావాలనిపించేది ఆ వయసులోనే కదా. అయితే అమాయా అపోహ పడ్డట్టు నాట్ ఫర్ సెక్స్! మనిషి తాలూకు జ్ఞాపకాలు మనసు నిస్తేజం కాకుండా చూస్తాయేమో కాని జీవితాన్ని నడిపించలేవ్! పాత బంధాలను కలిపి ఉంచేది కచ్చితంగా పిల్లలే కాదనడంలేదు! అంతమాత్రాన ఒంటరైన తల్లో, తండ్రో ఇంకో తోడు కోరుకుంటే ముందు బంధానికి వచ్చిన ముప్పూలేదు! అసలామాటొకొస్తే ఈ రెండిటినీ పోల్చాల్సిన అవసరమూ లేదు! ప్రాక్టికల్‌గా అసాధ్యం కూడా! అవి వర్ణించుకోవడానికి బాగుంటాయంతే! పురుషుడు ఇంకో తోడు కావాలంటే సమాజం ఇలాంటివన్నీ కన్వీనియెంట్‌గా పక్కనపెట్టడంలేదా? ఆ స్వేచ్ఛ స్త్రీకి ఎందుకు లేదు? ఈ చర్చలన్నిటికీ లిజన్.. అమాయా మంచి డయాస్!

1360787547-listen_amaya_20130211
ప్రకతిలో ఇన్ని రంగులున్నా జీవితంలో రెండే రంగులు..బ్లాక్ అండ్ వైట్! ఇది ఈ సినిమాలో మాటే! ఈ నిజాన్ని గ్రహిస్తే మానవసంబంధాల్లోని మంచి, చెడులు కాదు సుఖదుఃఖాలు మాత్రమే తెలుస్తాయి! స్త్రీ ప్రేమించే హక్కుకు పూసిన నలుపు తెలుపుగా కనపడుతుంది! ప్రేమ అనంతం… ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాగైనా పుట్టొచ్చు..దాన్ని అంగీకరించడం, వ్యతిరేకించడం కేవలం వ్యక్తిగతం! ఇది అర్థమైతే చాలు దాన్ని మోయాల్సిన బరువును సమాజం తప్పించుకున్నట్టే!
you dont always have to be  right.. you have to be happy అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన లిజన్.. అమాయా సున్నితంగా మనసును తట్టి.. కళ్లను తడిచేసే అద్భుతప్రయోగం! ఈ చిన్న సినిమాను చూశాక పెద్ద ఆలోచన చేయకపోరు!
తన మొదటి సినిమానే ఓ ప్రయోగంగా మలచుకున్న దర్శకుడు అవినాశ్‌కుమార్ సింగ్ సాహసానికి హ్యాట్సాఫ్! అతని ఎక్స్‌పరిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్! గీతాసింగ్ కథకు మంచి న్యాయమే జరిగింది. అయితే అవినాశ్ క్రెడిట్‌లో సింహభాగం  సీనియర్ యాక్టర్స్ దీప్తినావల్, ఫరూఖ్ షేక్‌లదే! వాళ్లు నటించలేదు ఆ పాత్రల్లో బతికారు! అమాయాగా స్వరాభాస్కర్ సింప్లీ సూపర్బ్!

మొన్న ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో కనిపించే అవకాశంలేదు! కాబట్టి డివీడీ దొరికితే డోంట్ మిస్సిట్! బాలీవుడ్‌లో కనిపించే ఇలాంటి ప్రయత్నాలు తెలుగుకి రావడానికి ఇంకో తరమైనా పట్టొచ్చు! అప్పటిదాకా కనీసం రచయితలైనా ఇలాంటి అంశాల మీద కథలు, నవలలు రాస్తే చర్చకు ఆస్కారం ఉంటుంది!

– సరస్వతి

పిలవని పేరంటం

” ఏం చేస్తున్నావే ” అంటూ స్వతంత్రంగా  గది తలుపు తోసుకొచ్చారు  అత్తగారు .  ఆకాశం లోని ఇంద్రధనుస్సును ఒక్కలాగు లాగి భుజాలమీద వేసుకొచ్చేసినట్టూ ఆవిడ భుజాలనిండుగా రంగురంగుల చీరలు .

“తులసిదళం చదువుతున్నానండీ” . అంటూ చేతిలో పుస్తకం మడిచి కిందపెట్టి లేచి నుంచున్నాను .  “అయ్యో… అదేవిటే ! అంత పవిత్రమయిన పుస్తకాన్ని అలా కింద పెట్టేస్తావూ ! “ అంటూ …అదాట్న భుజమ్మీద  ఇంద్ర ధనుస్సును  మంచమీదికి గిరాటేసి , యండమూరి తులసిదళాన్ని వంగి తీసుకుని భక్తిగా కళ్ళకద్దుకుని , నా కళ్ళచుట్టూ కూడా ఓ తిప్పు తిప్పి పైనపెట్టారు. నాకు నవ్వొచ్చింది కానీ  దాచేసుకున్నాను .

మా అత్తగారు తెచ్చిన చీరల్ని వరసగా మంచం మీద పేర్చి, కాస్త వెనక్కి జరిగి గడ్డం మీద వేలుంచుకుని వాటినే తదేకంగా చూస్తూ దీర్ఘంగా ఓ శ్వాస తీసి వదిలారు .

” ఈ ఎర్రంచు వెంకటగిరి చీర క్రితంసారి ఎప్పుడు కట్టుకున్నానో నీకేవన్నా గుర్తుందటే…ఎంత ఆలోచించినా నాకు జ్ఞాపకం రావటంలేదు ” అన్నారు . నేను అలవాటయిన అయోమయాన్ని ప్రదర్శిస్తూ తల అడ్డంగా ఊపాను .

పోనీ ఈ నేరేడుపండు రంగు చీర ? అన్నారు ఆ చీర ఎత్తి పట్టుకుని నా కళ్ళముందు  ఆడిస్తూ . నేను తల అటూ ఇటూఆడిస్తూ ఊ..హు అనేసాను  .

ఈ గంధం రంగు గద్వాలు చీర బ్రేమ్మలింట్లో పేరంటానికి  కట్టుకున్నానంటావా ? అన్నారు నన్నే గుచ్చి గుచ్చి చూస్తూ . అప్పటివరకూ,  ఆ ..ఏదయితే ఏంటిలే అని , అలా అలా… తలాడించేస్తున్న నాకు ఇక ఆలోచించక తప్పలేదు .

ఓసారి ఎడంచేత్తో కుడి చెవి నలుపుకుని , వేళ్ళు విరుచుకుని , నుదురు చిట్లించి తల పంకించాను ( అలా చేస్తే నేను నిజంగానే ఆలోచిస్తున్నట్టు ఆనవాలు మా అత్తగారికి ) . రెండు నిమిషాల నిశ్శబ్దం తరువాత ” ఆ…కట్టుకున్నారండోయ్”  అనేశాను నమ్మకంగా. నా  అదృష్టం పండి పక్వానికి రావటం వల్ల , ఎప్పుడూ? ఏ పేరంటానికి? ఆ వేళ తిధీ నక్షంత్రం ఏవిటీ ? వంటి అనుబంధ ప్రశ్నలు   రాల్చకుండా ఊరుకున్నారు అత్తగారు .

ఎంత కాలక్షేపం కాకపోతేమటుకు వేళకాని వేళలో ఈ చీరల సంత ఏవిటీ ? అని అడిగేద్దామా అనుకుంటుంటే అందుకున్నారు అత్తగారు . ” అదికాదే……కరణంగారి తల్లిగారిని తేలు కుట్టిందని తెలిసి పెద్దత్తయ్యా  , నేనూ వెళ్ళి చూసొస్తే బావుంటుందనుకున్నాం కదా   . అక్కడికి కట్టుకెళ్ళటానికి చీర తీసి పెట్టుకోవద్దూ . తీరామోసి, ఇదివరకూ కట్టుకెళ్ళిన చీరే కట్టుకెళ్ళిపోతానేమో అని ….నాకసలే మతిమరుపూ “అంటూ నుదురుకొట్టుకున్నారు  అక్కడికి అదేదో మహా అపరాధం అన్నట్టు .

“నాకు జ్ఞాపకం వున్నంతవరకూ ఇదుగోండి… ఈ  చందనం రంగు చీర  మీరింతవరకూ ఊర్లో ఎవరింటికీ కట్టుకెళ్ళలేదు “. అని మామిడిపిందెల బుటా  ఉన్న ఉప్పాడ చీర తీసి అత్తగారికి అందించాను . ఆవిడ దాన్ని భూజం మీద అటూ ఇటూ వేలాడేసి చూసుకుని సంతృప్తిగా తలాడించేరు. నిజమేనేవ్….ఇది మొన్న దీపావళికి మా రెండో అన్నయ్య పెట్టిన చీర కదా ! ఇదే కట్టుకెళతాను . పైగా చీర ఎక్కడ కొన్నారు అని అడిగినవాళ్ళందరికీ మా పుట్టింటివాళ్ళు పెట్టారని చెప్పకనే చెప్పొచ్చు అని మురిసిపోతూ కదిలారు.

వెళుతూ వెళుతూ ఏదో గుర్తొచ్చినట్టూ గిరుక్కున వెనక్కి తిరిగి,” ఆ తులసిదళం చదివేస్తే నా గదిలో బల్లమీద కుమారీశతకం , రుక్మిణీ కళ్యాణం ఉన్నాయి అవి తీసుకో , ఇంకా కాలక్షేపం కాకపోతే గోడబీరువాలో మీ ఆయన చిన్నప్పుడు కొన్న పెదబాలశిక్ష వుంది అది తెచ్చి చదువుకో . నే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను”  అంటూ హుషారుగా నిష్క్రమించారు .

కుమారీ శతకం చదువుకోవాలా … ఇంకా నయం!? వ్యవసాయ పంచాంగం చదువుకోమన్నారు కాదు. అది తప్పు కుమారీ -ఇటు కూడదు కుమారీ  అని ఇన్నాళ్ళూ వేపుకు తిన్నారు మావాళ్ళు. ఏదో శ్రీమతినయి బ్రతికిపోయానని నేను సంబరపడుతుంటే ,  ఇంకా శతకాలు చదవమంటారేవిటీ !   అని నాతో నేనే సంభాషించుకుని, అప్పటికే ముప్పై ఆరుసార్లు చదివిన ఆ సస్పెన్స్ నవలని ముప్పై ఏడోసారి ఆశక్తిగా చదవటానికి  ప్రయత్నించాను .

మనసు పుస్తకం మీదికి పోనని మొరాయించింది . అత్తగారి వెంట కొత్తకోక కట్టుకుని షికారుకి  పోదాం  అని సరదాపడింది. ఈ మూల గదిలో కూర్చొని ‘ఈగంట గడిస్తే చాలు’ , ‘దుపట్లో మిన్నాగు’ , ‘ఒంటరి పక్షి’  వంటి నవల్లు నమిలే బదులు ఎంచక్కా అలా నాలుగిళ్ళు తిరిగొస్తే నలుగురి కష్ట సుఖాలూ తెలుస్తాయి కదుటే ! అంటూ ఉత్సాహపరిచింది .  నిజమేనేవ్…..! కానీ అత్తగారేవంటారో ! అని సందేహిస్తూ …’పద పద ఒక ప్రయత్నం కావించి చూద్దాం  అనుకొని అత్తగారిని  వెతుక్కుంటూ బయలుదేరాను.

అంతలోనే చక్కగా  ముస్తాబయిపోయిన అత్తగారు వీధిగుమ్మంలో చందనం బొమ్మలా నిటారుగా నిలబడి ఎవరికోసమో ఎదురుచూస్తున్నారు .  నన్ను చూస్తూనే   ”   ఎప్పటికి వస్తుందో మీ పెద్దత్తగారు  ”  అంటూ ఒకటే హైరానా పడిపోతూంటే , వీధిలో పెద్ద గేటు తోసుకొచ్చాడు అందరూ నత్తగాడని పిలిచే సత్తిగాడు ( మా పెదమాంగారి పాలేరు) .  వాడికి నాలుగు క్షణాలు మనకి నాలుగు కాలాలు, వాడికి నాలుగు కాలాలు మనకి నాలుగు యుగాలు అదీ లెక్క .

నత్తలా నడిచొస్తున్న వాడిని చూస్తూ చింతకాయ తిన్నట్టూ మొఖం చిట్లించి వాకిట్లోకి ఎదురెళ్ళిపోయారు అత్తగారు . ” మజ్జేనం-  మూడు -గంటల -కల్లా-రెడీ- గ- వుండ -మని –సెప్ప- మన్నా -రండి -మా అయ్యగారు ” అంటూ తెచ్చిన కబురు తాపీగా ఒక్కో మాటా విడదీసి అందించాడు . ఇంకా ఏవిటి విషేషాలు !? అన్నట్టూ  అలాగే ఆశక్తిగా వాడికేసి చూస్తున్న అత్తగారితో ” అంతేనండీ -ఇంకేలేదండి” అని టూ.కీ గా  అనేసి తల బకురుకుని  నేలచూపులుచూస్తూ  నిలబడిపోయాడు .

అత్తగారు మిరియం గింజ నమిలినట్టూ మొఖం కారంగాపెట్టి , “అసలేవిట్రా మీ అయ్యగారి పద్ధతి . తీర్చి తివాటించుకుని మూడు గంటలకి ఇళ్ళ దగ్గర బయలుదేరితే తిరిగి దీపాలవేళకి ఇల్లు చేరొద్దూ. మీ రాజుగారింట్లో టౌను అలవాట్లు మరిగేరు . ఎనిమిదయ్యేవరకూ భోజనాలకి కూర్చోరు. మా ఇంట్లో ఆరు దాటితే ఆకలికి ఆగలేరు .  పైగా బయటికెళ్ళిన మగాళ్ళు ఇల్లుచేరేసరికి ఎదురుగా కనిపించకపోతే కొంపలంటుకుపోవూ  .ఆవిడకేం ….ఒకరికి  ఇద్దరు కోడళ్ళున్నారు . ఇద్దరూ చెరో పనీ చేసేసి, అత్తగారొచ్చేసరికి అన్నీ అమర్చి ఉంచుతారు . అందరికీ ఆ అదృష్టం వుండద్దూ “ అని ఒక గాట్ఠి నిట్టూర్పు విడిచారు  . హమ్మ..! ఇదేవిటి ఉరుము వురిమి మంగళం మీద పడ్డట్టు!  అటుతిప్పీ ఇటుతిప్పీ నన్నే పొడుస్తారు  అనుకొని నేనూ నిష్టూరంగా  ఒక నిట్టూర్పు విడిచాను  .

ఒకసారి ఊపిరితీసుకుని మళ్ళీ అందుకున్నారు అత్తగారు  “ఇదిగో వస్తుందీ అదిగో వస్తుందీ అని ఎదురుచూస్తూ ఇక్కడ నేను గంట నించీ గబ్బిలంలా వేలాడుతుoటే …తీరామోసి ఇప్పటికి ఈ కబురు తెస్తావా ! తగలేసినట్టేవుంది”  అంటూ వాడిమీద గయ్యిమనేసరికి , వాడు అవన్నీ తనకి కాదన్నట్టూ నింపాదిగా ఓ చూపు చూసి, “అలా -సెప్పమంటారాండీ -అయితే ?” అంటూ మళ్ళీ తల బకురుకున్నాడు .  దాంతో అత్తగారు కంగారుగా నాలుక కరుచుకుని,  “ ఏడ్చావులే “  అని వాడినో కసురు కసిరి,  ” మూడుగంటలకి వెళితే ఆలశ్యం అయిపోతుందటండీ… ఠంచనుగా పావు తక్కువ మూడు గంటలకన్నా బయలుదేరితే బావుంటుందన్నారని  చెప్పుఫో” … అని  ఆజ్ఞాపించినట్టుగా అనేసి మరో మాటకు తావులేకుండా వచ్చి అరుగు చివర కూర్చుండిపోయారు ఆయాసపడుతూ.( అత్తగారు అంత ఆయాసపడిందీ పావుగంట ముందువెనకలకోసం  కోసం కాదనీ , ఇందులో ఇంకేదో  రాజకీయం వుందని తలున్నవాడికెవరికన్నా తెలుస్తుంది . ఒక్క కబురు మోసుకుపోతున్న నత్తగాడికి సారీ…సత్తిగాడికి తప్ప)

ఉమ్మట్లో ఉన్నన్నాళ్ళూ నన్ను వేపుకు తినేసింది చాలదులావుంది …నాకు కోడలొచ్చినా నాకీ తోటికోడలి  అజమాయిషీ తప్పదులావుంది,  అయ్యో…రాత ! ఎప్పుడూ ఆవిడ చెప్పటం నేను వినడమేనా  అంటూ తనలో తనే గొణుక్కుంటున్నారు.

అగ్గిమీద గుగ్గిలంలా చిటపటలాడుతున్న అత్తగారి దగ్గర ఆ సమయంలో ‘అత్తా -నేనూ వత్తా ‘ అని గారాలుపోవటం అంత మంచిదికాదని ఎంచి , గడపవెనకే నిశ్శబ్ధంగా నిలబడిపోయాను. వంటింట్లోకి వెళ్ళి ఒక చెంబు నీళ్ళు తాగొచ్చిన అత్తగారు కాస్త చల్లబడి మళ్ళీ వీధి అరుగు మీదికి చేరి ఎదురుచూపుల పర్వం కొనసాగిస్తున్నారు . ఇక పనయ్యేట్టులేదని   ‘మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే’  అని నా బుజ్జి మనసుకి నచ్చచెప్పుకుని, తులసిదళ పారాయణంలో పడ్డాను .

ఇందాకా ఇక్కడి కబురు మోసుకు వెళ్ళిన నత్తగాడు తిరిగొచ్చి వీధి గేటు దగ్గర బాగా  వంగి నిలబడ్డాడు. ( అంత బరువయిన కబురేమో మరి ) . అత్తగారు పెద్దరుగుమీంచీ చిన్నరుగు మీదికి ఒక్క గెంతు గెంతి , నాలుగు అంగల్లో వాడిని చేరి తలెగరేసారు . ఏవిటో చెప్పమన్నట్టూ !?

వాడు ఒకడుగు గేటు బయటా ఇంకో అడుగు లోపలా పెట్టి , “మూడుగంటలకి ఒక్క నిమసం అటూ ఇటూ అయినా మా అయ్యగారు రాటానికి ఈలుపడదంటండి . అంత కంగారుగా వుంటే తవరినే ఎల్లి రమ్మనీ సెప్పమన్నారండి ” అని వాడికి చేతనయినంత కుదురుగా  కబురు చెప్పేసి రెండో అడుగు కూడా అవతల పెట్టేసి నెమ్మదిగా నడివీధిలో  కలిసిపోయాడు  “ఒరేయ్….” అని అత్తగారు వెనకనించీ అరుస్తున్నా లెక్కచేయకుండా .

సెగలు కక్కుకుంటూ వచ్చి పడ్డారు అత్తగారు .”చూసావంటే ఆ నిర్లక్ష్యం . వాడిని కాదు అనాల్సింది….ఆ తలబిరుసూ, ఆ లెక్కలేనితనం అంతా అయ్యగారి చలవే అంటూ …..అటూ ఇటూ చూసి గొంతు తగ్గించి ” అసలు ఆ తూర్పోళ్ళ పద్ధతే అంత . అందులోనూ తునోళ్ళ సంగతి చెప్పాలా అమ్మో.. పెద్ద పిటింగు మేస్టర్లు కదూ! . అంటూ తోటికోడలిమీద అక్కసుని అక్కడే కక్కేసారు.

ఏవిటో ఈ తోటికోడళ్ళ తిక్కబాగోతం . ఎదురుగా వుంటే ఒకరి  మాట ఒకరు జవదాటనట్టూ ‘అవునా అంటే -అవునేవ్ ‘ అనుకొంటూ సరీగా సమయం వచ్చినపుడు మాత్రం ‘ఎడ్డెం అంటే తెడ్డెం’  అంటూ చెలరేగిపోతారు అని మనసులో ఓ మూలుగు మూలిగి , పైకిమాత్రం ‘  ఆహా….అలాగా ! ‘ అని తలాడించాను . “ఎప్పటికెయ్యది ప్రస్తుతమో….”  అని పెద్దలే చెప్పారు కదా !

ఇంతకీ ప్రయాణం వున్నట్టో లేనట్టో తేలక మా అత్తగారు గడియారం వంకా గేటువంకా చూస్తూ కూర్చున్నారు. నేను ‘ఈ గంట గడిస్తే చాలు’ చదువుదామా లేక  ‘ ఒంటరి పోరాటం’ లో మునుగుదామా అన్నది తేల్చుకోలేక సతమతమయిపోతున్నాను .

అంతలో హటాత్తుగా ” నువ్వు కరణంగారి ఇల్లు చూళ్ళేదు కదూ ” అన్నారు అత్తగారు . అడుగంటిన ఆశలు చిగురిస్తుండగా ” అబ్బే లేదండీ అత్తయ్యా ….కరణంగారి ఇల్లూ చూళ్ళేదు , కరణంగారి తల్లిగారినీ చూళ్ళేదు . ఆమాటకొస్తే  అసలు తేలు కుట్టిన మనిషినే ఎప్పుడూ  చూళ్ళేదు ” అని  గొంతులో పట్టినంత నిరాశని నింపుకుని జవాబిచ్చాను.  నా నోటినించి అరుదుగా వినవచ్చే “అత్తయ్యా”  అన్న పిలుపుకి ఆవిడ  వెన్నముద్ద మింగినట్టూ మొఖం పెట్టి, “అదేం భాగ్యం !పద నే తీసుకెళతాను. ఇద్దరం వెళ్ళి వచ్చేద్దాం. ఎవరిగొడవో మనకెందుకూ”   అని మెత్తగా అనేసరికి , రొట్టెవిరిగి నేతిలో పడ్డం అని దీన్నే అంటారేమో అనుకుంటూ ….హుషారుగా లేచి నుంచున్నాను .

ఎవరొచ్చినా రాకపోయినా మనం మాత్రం పావుతక్కువ మూడుకల్లా ఠంచనుగా బయల్దేరిపోవాల్సిందే కాబట్టి

నువ్వు అయిదంటే అయిదు నిమిషాల్లో తెమిలిపోవాలి అన్న అత్తగారు మూడున్నర నిమిషాల్లో ముస్తాబు పూర్తిచేసుకొచ్చిన నన్ను చూసి అవాక్కయిపోయారు. అంతలోనే తేరుకుని, నే కట్టుకున్న నల్లంచు తెల్లచీర ని ఎగాదిగాచూసి, “అబ్బా…ఏం బావుందే ఈ చీర , ఇక చీరలే లేనట్టూ …..!  నీ పుట్టినరోజునాడు కట్టుకున్నావ్ చూడు   చిట్టిచామంతి రంగుచీర  అది కట్టుకురా ఫో”  అంటూ ఆర్డరేసారు (నేకట్టిన నల్లంచు తెల్లచీర మా అమ్మాగారు పెట్టిందయితే  చిట్టిచామంతుల  చీర అత్తింటివారు పెట్టిందీ – అయ్యా అదీ సంగతి – అదేకదా అసలు సంగతి  )

నేను ఉస్సూరంటూ వెళ్ళి చీర మార్చుకొచ్చేసరికి మా అత్తగారు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకు వాకిట్లో నిలబడిపోయారు . అప్పటికి గడియారంలో సమయం సరీగా రెండు గంటలా నలభై అయిదు నిమిషాలు .

మాంగారు, మా రాజుగారు చుట్టాలింట్లో ఊపనయానికి వెళ్ళటంతో  ‘వెళ్ళమంటారా  ’  అంటూ అర్జీ పెట్టుక్కునే అవసరం లేకపోయింది .

పెద్ద గదులు రెండింటికీ తాళాలు వేసి, మిగతా వసారాలు, వంటిల్లు ఎవడు ఎత్తుకుపోతాడులే అని  గెడలుమాత్రం తగిలించి   ఇద్దరం మా రాజమార్గం అయిన పెరటిగుమ్మoలోకొచ్చాం. అక్కడ నీడన గోళీలాడుకుంటున్న అప్పలమ్మ మనవడ్ని పిలిచి, తిరిగొచ్చాకా బెల్లం మిఠాయి పెడతాను . అందాకా ఇక్కడే అడుకోరా అని వాడిని కాపలాగా వుంచి , మా పెరట్లోని రెండడుగుల పాటిమట్టిగోడ అదాట్న దిగేసి అవతల పిల్లెంక మామ్మగారి దొడ్లోకి ఎంటరయిపోయాం .

మధ్యాహ్నం ఉక్కపోతకి నిద్రపట్టక అట్టముక్కతో ఉస్సురు ఉస్సురని విసురుకుంటూ అవస్థ పడుతున్న పిల్లెంక మామ్మయ్య మమ్మల్ని చూస్తూనే ” ఏవర్రా ….కరణంగారి ఇంటికేనా నేనూ వస్తా  ఆగండి అంటూ అలా మాయమయి ఇలా ప్రత్యక్షమయిపోయారు తెల్లని గ్లాస్కో చీర లో ఉమ్మెత్తపువ్వులా .

తోటికోడలిమీద పంతానికి ప్రయాణమయితే అయ్యారు కానీ  లోలోలపల  అత్తగారికి కొంచెం బెదురుగానే వుంది . ఇద్దరం ఎలాగూ వెళ్ళటం అని. ఎందుకంటే,  నాలుగు దిక్కులా నలుగురయినా లేకపోతే అత్తగారికి అడుగు పడదు. ఊర్లో రోడ్డుమీద నడవాల్సివచ్చిన ప్రతిసారీ  కొత్తగా ఓణీవేసిన పడుచుపిల్ల పదిమందిలో మసలాల్సివచ్చినప్పుడు  ఎంత తత్తరపడుతుందో  అంతకంటే ఓ మోతాదు ఎక్కువే కంగారుపడతారు . అందుకే ఆవిడ వస్తాననగానే “ అంతకంటేనా పిన్నమ్మా . అసలు నేనే మీకు కబురుపెడదామనుకున్నాను” అనేసారు .

మేం  ముగ్గురం మామ్మయ్యగారి దడి కంతల్లోంచీ అవతల పక్కనున్న వర్మగారి వాకిట్లోకి, అక్కడినుంచీ సందులా వున్న సన్నని మట్టి రోడ్డుని గబుక్కున దాటేసి, మందపాటోరి పెరట్లోకి వెళ్ళాం .

మమ్మల్ని చూస్తూనే మందపాటివారి చిన్నకోడలు చేస్తున్న పని వదిలేసి , మొహం చాటంత చేసుకుని ఎదురొచ్చేసారు . రండి రండి ….ఇప్పుడే అనుకుంటున్నాం ఏం తోచటంలేదు ఎవరన్నా వస్తే బావుండూ అని ” అంటూ మా చేతులు పట్టుకుని సావిట్లోకి లాక్కుపోయి చాపమీద కూర్చునేదాకా వదల్లేదు.

హుం…పాపం!  మనుషులకి మొఖం వాసిపోయి వున్నట్టున్నారు అనుకున్నాను. ఎకరం స్థలంలో చుట్టూ కోటగోడలాంటి ప్రహారీ మధ్యన ఎక్కడో లోతుగా వున్నట్టుందా ఇల్లు. కావాలని వారి  వాకిట్లోకి వచ్చివాలిన జీవులు తప్ప ఇతరాలేవీ వారి కళ్ళపడవు .  ఆ లంకoత కొంపలో వుండే మనుషులు ముచ్చటగా ముగ్గురే  .

మనం వెళ్ళవలసింది కరణంగారి ఇంటికి కదా మధ్యలో ఈ మజిలీలేవిటీ అని మా అత్తగారి చెవి కొరికాను . ఆవిడ ఏం చెప్పకుండా  మొఖం అంతా నవ్వు పులుముకుని, ” కరణంగారి ఇంటికి వెళుతూ మిమ్మల్నీ చూసిపోదామని వచ్చాం….ఇంతకీ మీ అత్తగారెక్కడా …. పడుకున్నారా ? అని ఆ ఇంటావిడని ఆరాగా అడగుతుంటే ….”ఓసోస్ ….మీరటే  ఎన్నాళ్ళయింది చూసి, అందరూ బావున్నారా “ అని బోసి నవ్వులు  చిందిస్తూ వచ్చారు మందపాటి మామ్మగారు .

మిలట్రీ సెల్యూట్ లా  మర్యాదకోసం ఓ సారి లేచి నుంచొని మళ్ళీ కూర్చున్నాం అందరం .

“మాకేం నిక్షేపంలావున్నాం. మీ ఆరోగ్యం ఎలావుందీ ? “ ఆరాగా అడిగారు అత్తగారు.

“పళ్ళసెట్టేనా ? బీరువాలో వుందమ్మా . ఎమేవ్….తీసి చూపించు”  అని కోడలికి సైగ  చేసారు.

మేం అందరం గుడ్లుతేలేసి, ఒకరి మొఖాలు ఒకరం చూసుకున్నాం .

ముందుగా తేరుకున్న పిల్లెంక మామ్మయ్య….” పెద్దకొడుకు ఇంటినుంచీ ఎప్పుడొచ్చారు?”  అనడిగారు కాస్త స్వరంపెంచి .

“మరే ….బాగా చెప్పారు వదినియ్యా.  పెద్దాడు కట్టించిన పళ్ళు చిన్నాడింట్లో అరగ్గొట్టుకుంటే బావుంటుందా . అందుకే ఇక్కడికి రాగానే తీసి బీరువాలో పెట్టించాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాకా  తగిలించుకుంటాను ” అంటూ ఒక బోసినవ్వు మాకు వరంగా ప్రసాదించారు. వెనకే నిలబడి తలకొట్టుకుంటున్న కోడలిని ” తీసి చూపించవే ” అంటూ గద్దించేసరికి ఇక తప్పదనుకొన్న ఆవిడ, గోడబీరువా తీసి , అందులోంచీ ఒక ప్లాస్టిక్ డబ్బా తెచ్చి మా ముందుపెట్ట్టారు .

నీళ్ళలో తేలుతున్న కట్టుడుపళ్ళు  ఊరేసిన ఉసిరికాయల్లా బాగానే వున్నాయి .

ఏంచెప్పమంటారు పెద్దావిడ చాదస్తం . మేం కొన్న కాలిజోడు మా గుమ్మం దాటాకా విప్పేస్తారు . కూతురు వేయించిన కళ్ళజోడుతో కూతురు కాపురమే చూస్తారట . ఇదిగో ఇప్పుడిలా ….అంటూ ఆ కోడలు చెప్పుకుంటున్న కష్ట సుఖాలని వింటూ ఆవిడ పెట్టిన కారప్పూస -కోవాబిళ్ళ కాదనకుండా తినేసి , చల్లని మంచినీళ్ళు తాగి ఇక వెళతాం – మళ్ళీ ఎపుడయినా తీరిగ్గా వున్నప్పుడు తప్పక వస్తాం అంటూ లేచాం .

అక్కడినుంచీ మరో నాలుగిళ్ళు చుట్టి, నలుగురి యోగక్షేమాలూ విచారించాం .

ప్రమీల అత్తయ్య స్పెషల్ గా ఆర్డరిచ్చి నేయించుకున్న బండారులoక చీరలు  లాగీ-పీకీ చూసి,  ఆహా- ఓహో అనేసి అక్కడే కాసిన్ని జంతికముక్కలూ ఇంకాసింత టీ నీళ్ళు కడుపులో పోసుకున్నాం. పెనుమత్స వారి రెండు మండువాల లోగిలి లో ఉన్న ఆరువాటాలవారినీ ఒకసారి పలకరించి, వాళ్ళు కొత్తగా కొనుక్కున్న స్టీలు కేనులూ, ఇత్తడి పళ్ళాలు వంటివాటి నాణ్యతా ప్రమాణాలమీద కాసేపు చర్చించుకొన్నకా చిమ్మిలుండలూ, కరకజ్జం , మజ్జిగదాహం వంటివి వద్దు వద్దంటూనే పట్టించేశాం .

అలాగే , పనిలో పనిగా… కూరలు కోస్తూ  వేలుకోసుకుని,  రక్తంకంటే ఎక్కువ కన్నీరు కార్చేసిన సుబ్బరాజుగారి పట్నం కోడలి కళ్ళుతుడిచి (  వాళ్ళమ్మగారిది  హైడ్రాబేడ్ లెండి ) ఏం పర్లేదు అదే అలవాటవుతుందిలే అని ధైర్యం చెప్పి, ఈ మధ్యే కిడ్నీలో నాలుగు రాళ్ళు పోగేసుకున్న భాస్కరం గారిని ” ఇప్పుడెలావుందండీ- పాపం అంత బరువెలామోస్తున్నారో ” అని  తలుపుచాటునుంచే పరామర్శ కావించీ , అమెరికాలో ఉంటున్న అచ్చిగారు అక్కడ మంచులో కాలు జారి పడబోయారుటకదా  అందదూరం వెళ్ళి ఎలాగూ విచారించలేం  అని, ఇక్కడే వుంటున్న అచ్చిగారి తాలూకా వాళ్ళని వివరాలు అడిగి -మాకు తోచిన జాగ్రత్తలు చెప్పి  జనాభాలెక్కల కోసం ఇల్లిల్లూ తిరిగేవాళ్ళలాగా ఒక్క ఇల్లూ వదిలిపెట్టకుండా  ఆ వరసలోఉన్న అన్నిళ్ళూ చుట్టేసాం. మళ్ళీ ఎప్పటికి ఇంట్లోంచి బయటికొస్తామో ఏవిటో అనుకుంటూ . (అవతలి వరసలోకి కూడా వెళ్ళేవాళ్ళమే కానీ ఆ వరసలోనే మా అత్తగారి తోటికోడలుండేది)
అప్పటికే  మేం బయలుదేరి చాలా సేపయింది .

ఇదే ఈ వీధిలో చివరిల్లేమో ! ఇక నయినా కరణంగారింటికెళదామా ….లేకపోతే ఇక్కడినుంచే వెనక్కి మళ్ళేద్దామా అనడిగాను అత్తగారి వీపుగోకుతూ రహస్యంగా. మా అత్తగారు నాకేసి గుర్రుగా చూసి, అటువైపు కూర్చున్న పిల్లెంక మామ్మ తో సంప్రదించి, దారిలో చిట్టిపంతులుగారి కొత్తకోడలిని చూసి, చివరాకర్లో ఆ పక్కనే వున్న కరణంగారింటికి వెళితే యాత్రా పరిసమాప్తమయినట్టే అని తీర్మానించేరు .

పంతులుగారి ఇల్లు  హైస్కూల్ వెనక వుందట  . దాంతో ఇక రాజుల వీధి వదిలి రోడ్డెక్కక తప్పలేదు . దొడ్డిగుమ్మాలూ, మొండిగోడలూ మీదుగా చేసే చాటుమాటు ప్రయాణం ఇక తప్పింది కదా  దర్జాగా నడివీధిలో నడిచిపోవచ్చు అని సంబరపడుతున్న నన్ను వెనక్కి గుంజి “ఇదిగోవిను ”  అంటూ కొన్ని మార్గదర్శక సూత్రాలు జారీ చేశారు అత్తగారు . వాటిలో ఒకటీరెండు – తలొంచుకుని రోడ్డు చూస్తూ నడవాలి తప్ప తలెత్తి పరిసరాల పర్యవేక్షణ చేయకూడదనీ , ఎవరన్నా ఎదురుపడి మాట్లాడిస్తే ఓ చిరునవ్వు నవ్వు నవ్వితే చాలనీ, అదేపనిగా నోరంతా తెలిచి మాట్లాడక్కరలేదనీ . నేను ఆ ప్రకారముగా వాటినే నెమరేసుకుంటూ … ఏవిటో ! ఎంచక్కా దర్జాగా తలెత్తుకు తిరగాల్సినచోట, దొంగల్లాగా ఈ దొడ్డిదారి ప్రయాణాలేంటో. పోనీ ఇప్పటికన్నా వీధిన పడ్డాం అని సంతోషించడానికి లేకుండా మళ్ళీ ఈ చాటుమాటులెందుకో   అర్ధరాత్రి స్వతంత్రం గురించి గాంధీగారు ఆలోచించేశారు కాబట్టి, మాఊర్లో మేం పట్టపగలు నడివీధిలో నిటారుగా నడిచి పోయే రోజు కోసం నేను పోరాటం చెయ్యాలో ఏమో అని కుంచెం సీరియస్గా ఆలోచిస్తూ తలొంచుకుని మా అత్తగారి కొంగు ఆనవాలుగా ముందుకి కదిలాను .

మా అత్తగారు వినయవిధేయతలు ప్రదర్శిస్తూ భుజాలు మెడా కాస్త వంచి “పిన్నమ్మా మీరు ముందు నడుద్దురూ….” అంటూ మమ్మయ్యని ముందుకు తోసి ఆవిడ వెనకాల నక్కి నక్కి నడుస్తున్నారు . హతవిధీ…అనుకుంటూ నేను అత్తగారిని అనుసరిస్తున్నాను. చింత చచ్చినా పులుపు చావలేదనీ, ఇంకా ఈ ఘోషాలూ, భేషజాలూ ఎందుకండీ. మా ఊర్లో మేం ఎంచక్కా అవతల వీధికీ ఇవతలవీధికీ మా ఇష్టం వచ్చినట్టూ తిరుగుతాం మమ్మెల్నెవరూ ఏవీ అనరు తెలుసా ! అని ఒకసారెప్పుడో అత్తగారితో వాదనకు దిగాను.

“  ఏవిటా వితండవాదం….మీ ఊళ్ళోవాళ్ళకి పద్ధతులూ పాడూ తెలీవు  . ఈ ఊళ్ళో ఇదే పద్ధతి ఇలానే వుండాలి లేకపోతే ఆక్షేపిస్తారు. పూర్వంలా మీనాలూ, పల్లకీలూ లేకపోయినా మా అత్తగారి కాలం వరకూ తెరలుకట్టిన  సవారీ బండ్లలో వెళ్ళేవారు . రానురానూ రెండెడ్లబండి ఎక్కడం అంటే చిన్నతనం అయిపోయింది. అందుకే ఇలా రెండు కాళ్ళకీ పనిచెప్పాల్సి వస్తుంది అంటూ  చెరిగిపారేసారు . రెంటికీ చెడ్డ రేవడులాగా అటు సవారీబళ్ళూ లేవు, ఇటు ఘోషాలూ తప్పటంలేదు   . హుమ్మ్…ఏం చేస్తాం రోమ్మ్ లో ఉన్నప్పుడు రోమన్ లా వుండమన్నారు  అనుకుంటూ అత్తగారిని ఫాలో  అయిపోతున్నాను .

అలా రైలుబండి లాగా  ఒకరి వెనక ఒకరం నాలుగు గజాలదూరం నడిచి చిన్న మలుపు తిరగ్గానే  టక్కున సడెన్ బ్రేక్ వేసినట్టూ నిలబడిపోయారు అత్తగారు . ఏవిటా!  అని తలెత్తిచూద్దును కదా  రోడ్డుపక్కగా ఎవరి వాకిట్లోనో దడివారగా నిండా పూలతో కళకల్లాడుతున్న ముద్దబంతి చెట్టును చూస్తూ   నిలబడిపోయారు పిల్లెంక మామ్మయ్య . ఇంజనులాంటి ఆవిడ అలా ఆగిపోతే బోగీలం మేం ముదుకెళ్ళాలేం కదా ! మా అత్తగారు …అయ్యో రాత అనుకుంటూ “రండి పిన్నమ్మా ఎవరన్నా చూస్తే బాగోదు”  అని ఆవిడ బుజం పట్టుకు లాగుతున్నారు . ఆవిడ అదేం పట్టించుకోకుండా “అబ్బ..! ఎంతపెద్ద పువ్వులో చూడవే  నాలుగు పువ్వులు కోద్దామంటే విత్తనాలు కట్టుకోవచ్చు”. అని అదేపనిగా మురిసిపోతున్నారు . ఇంతలో చూరుకిందనించీ తొంగిచూసిన ఆ ఇంటావిడ  బయటికొచ్చి, “అయ్యగారూ  తవరా… “ అని అమితానందంతో పులకించిపోతూ” ఎండగావుంది కున్ని మంచినీళ్ళు ఉచ్చుకుంటారా…పోనీ మజ్జిగదాహం కలపమంటారా “ అంటూ వాకిట్లో నులకమంచ వాల్చి అతిధి మర్యాదలకు దిగింది . ఆ సమయంలో మా అత్తగారి ముఖంలో మారిన రంగులు చూసితీరాల్సిందే. ”  చాల్లే వే … మేవేవన్నా కాశీ రామేశ్వరం పోతూ మార్గమధ్యంలో మీ ఇంట్లో విడిది చేశామా ! అని  వెట ’ కారం‘ గా అనేసి  , ఇంకా అక్కడే నిలబడ్డ మామ్మయ్యని ఒక్క గుంజు గుంజి రోడ్డెక్కించారు.

“ కోడలుగారు గావాలసండి …… ముద్దబంతిపువ్వులా ఇంచక్కున్నారు “ అని  ఆ ఇల్లాలు వెనకనించీ అనడం నాకు వినిపిస్తూనేవుంది. ఇలాంటిచోట ఇంకాసేపుంటే ఇంకెన్ని ‘ఎంచక్కని’  మాటలు వినచ్చో కదా ! ఏవిటో అత్తగారి  పద్ధతి.  ఇలాంటి మాటలు అస్సలు చెవికెక్కించుకోరు.  ఆమధ్య మా ఇంటికి సారె పంచడానికొచ్చిన బొండాం షావుకారు భార్య ” కోడలుగారు పటికీబెల్లం ముక్కలా మిలమిల్లాడిపోతన్నారండి ” అంది ఆ మాట కూడా మా అత్తగారు విననట్టే ప్రవర్తించారు . హుం…అదేవిటో ! అని మనసులో అనుకుంటూ అయిష్టంగానే అత్తగారిని అనుసరించాను .

మరో రెండు నిమిషాలు తలొంచుకు నడిచి, చివరికి పంతులుగారి  ఇల్లు చేరాం. మార్గమధ్యంలో మాకు ఎదురయిన  కొన్ని సైకిళ్ళూ, గడ్డిమోపులూ, నీళ్ళకావిళ్ళూ వాటంతట అవే పక్కకి  తప్పుకుంటే ఒకటో రెండో మమ్మల్ని ఖాతరుచేయకుండా అదే స్పీడులో ముందుకెళ్ళిపోయాయి. అలా వెళ్ళినవాటిని ‘ ఫలానా కదూ ‘ అని మా అత్తగారు వివరాలతో సహా గుర్తుపెట్టుకున్నారు .

వాకిట్లో  పడక్కుర్చీలో విశ్రాంతిగా పడుకున్న  చిట్టిపంతులుగారి అబ్బాయి , మా అత్తగారిని చూస్తూనే  హెడ్మాస్టర్ని ఇంటిదగ్గర చూసిన స్కూలు పిల్లాడిలా తడబడిపోయి , బాగోదన్నట్టుగా ఒక బలవంతపు నవ్వి, పలకరించే అవకాశం లేకుండా పెద్దపెద్ద అంగలేసుకుంటూ రోడ్డుమీదికి పారిపోయారు ( ఎందుకూ? ఏవిటీ? అనేది ఇంకోసారి చెప్పుకుందాం)

”  మీరా ….రండి రండి . ఏవిటో విశేషం ! ఇలా చెప్పాపెట్టకుండా వచ్చేసారూ ….అందరూ కులాశానా ” అంటూ  మందారమొగ్గలు కోసుకుంటున్న పంతులుగారి భార్య ఆశ్చర్యపోతూ ఎదురొచ్చారు

అన్ని ఇళ్ళలోనూ చెప్పుకొచ్చినట్టే” ఇలా కరణంగారింటికెళుతూ…..అంటూ కాశీ మజిలీకథంతా  చెప్పుకొచ్చారు అత్తగారు.  “అలాగా”  అంటూ ఆవిడ నా దగ్గరగావచ్చి “కోడలుగారూ విశేషాలేం లేవా ” అనేసరికి నేను కాసిన్ని సిగ్గులు ఒలకపొయ్యాల్సివచ్చింది. అలా నాలుగు కబుర్లయ్యేసరికి,  ప్రత్యక్షమయింది పంతులుగారి కొత్త కోడలు పచ్చనిపాదాలతో , పాపిట్లో కుంకుమా కంఠానికి గంధం, తలలో చామంతిచెండు తో . “అచ్చం పార్వతీదేవిలా లేదూ” అన్నారు మా అత్తగారు నా చెవిలో . అవున్నిజమేనండోయ్…పార్వతీదేవి చేతిలో అరటిపళ్ళ అత్తం కూడా వుంది అన్నాను ఆమెనే ముచ్చటగాచూస్తూ .  ప్లేట్లో చలివిడీ  , అప్పాలు పెట్టుకొచ్చారు కామాక్షమ్మగారు .

అప్పటికే బిగ్గా పట్టించేసిన మేం అబ్బెబ్బెబ్బే…..అని ఎంత తోస్తున్నా వదలకుండా  తలోరెండూ తినిపించేసారు. తింటున్నంతసేపూ …పంతులుగారి కోడలి గుణగణాల గానం చేస్తూనేవున్నారు మా అత్తగారు . ఆహా..ఏం వినయం, ఏం వందనం, ఏం మర్యాద, ఏం అభిమానం…ఏం అదీ..ఏం ఇదీ…. ఆ రంగూ, ఆ రూపూ ,ఆ స్వరం  అంటూ ,  ఆ గానం అలా ఎందాకా సాగేదోకానీ,

” అయ్యగారండోయ్…మీరిక్కడ కూకొని కథలు సెప్పుకుంటన్నారా …..మీకోసం ఊరంతా తిరిగితిరిగి వత్తన్నాను . రాజుగారు ఊర్నించీ వచ్చేసేరండి. కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళిచ్చేవోళ్ళు లేరని నిప్పులు కక్కేత్తన్నారండి బాబూ….” అంటూ  ఫైరింజన్  సైరన్లా  వీధిలోంచే అరిచేస్తున్నాడు అబ్బులు .  ఆ హడావిడికి   తింటున్న చలివిడి అంగిట్లో అంటుకుపోయి ఊపిరాడక కళ్ళుతేలేసారు అత్తగారు. పార్వతీదేవి లాంటి పంతులగారికోడలు నిమ్మళంగా నీళ్ళుతాగించి, వెన్ను పామేసరికి తేరుకుని తెరిపినపడ్డారు  .

“ఇక వెళతాం”  అని చెప్పేసి అర్జెంటుగా గుమ్మందిగేసిన అత్తగారితో ” అయ్యో ఇంతాచేసి కరణంగారి ఇంటికి వెళ్ళొద్దూ….తేలు కుట్టినావిడని చూడొద్దూ ??” అంటుంటే  ” అబ్బా ఇంకోసారి వద్దాంలేవే ” అని నన్ను తోసుకొచ్చేసారు అత్తగారు. ఇంకోసారంటే మళ్ళీ  తేలుకుట్టినప్పుడా అని అడగాలనుకున్నాను కానీ , అప్పటికే మా అత్తగారు  ” ఒరేయ్…నువ్వెళ్ళి ఇద్దరికీ వేణ్ణీళ్ళు కాచిపొయ్యి  అంతలోపల మేం వచ్చేస్తాం “ అని అబ్బులిని ఆజ్ఞాపిస్తూ వెనకాముందూ చూసుకోకుండా  రోడ్డెక్కేసి , వాడికంటే ముందు నడిచి చిరుచీకట్లో కలిసిపోయారు   కంగారులో ఘోషా మాట మర్చిపోయిన కలిదిండి మహరాణిగారు .

–దాట్ల లలిత