Archives for February 2016

మంటల ఫౌంటెన్

 

-రామతీర్థ

~

 

మాధ్యమాలన్నీ చెప్పేస్తున్నాయి నువ్విక మా మధ్య లేవని. అందిన పుస్తకమ్మీద సమీక్ష రాద్దామనుకున్నాము, చదువుతూ నీ పోలవరం కవిత్వాన్ని, చట్టి గ్రామం వద్ద ఒదిశా, ఛత్తీస్ ఘర్ , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాలుగు రాష్ట్రాల మధ్య ఇరుక్కుపోయి ఇంకా బయటకు రాకుండా మేం ఉంటే, ఎలా సమయం వెదుక్కున్నావయ్యా నువ్వు నీ గుండెనాపేసుకోవడానికి.

బాగా చదువుకున్న వాడికి మంది బాగు కోరడానికీ,  ఎక్కువ తెలుసుకున్న వాడికి  ఎక్కువ కాలం బతికే అవకాశం ఉండడానికీ సంబంధం లేదేమో. కవిత్వం లోకి ఒక సమష్టి అశాంతి, కొంత వైయక్తిక అరాచకం ప్రవేశిస్తే, ఒకడు అలనాడు అల్లెన్ గిన్స్ బెర్గ్  అయ్యాడు. మాటలు వివాదాస్పదంగా విసిరి, సౌకర్యవంతంగా ఉండాలనుకునే భద్రలోగ్ సంఘానికి, ఆదిసూకర వేద వేద్యంగా, అడివి పందుల్లాంటి  గిరిజనులున్నారని, సిద్ధాంతాల వాగ్దాన భంగాలు జరిగి,  డబ్బు వేటాడుతున్న సమాజంలో, ఆధునిక, అత్యాధునిక ఆటవికులున్నారని చెప్పిన నీ వాక్యాలకు ఒక ప్రజాస్వామ్య ఉష్ణోగ్రత ఉంది.

ధన్య మనస్కంగా విభిన్న శృంగార హక్కుల పసి కేరింతలు, కసి  కసుర్లూ, అస్తిత్వ సంచార యాత్రలో, పోస్ట్ మాడర్న్ ఖెయాస్ లో మనిషికెవరూ దిక్కు లేరని చెప్పే వాతావరణ హెచ్చరికలూ, పలు జిహ్వల్లో నాగరికుల మిశ్రమ దుఖార్తి, నువ్వు రాస్తే, సంక్లిష్ట నిరసనయ్యింది.

రాయాల్సినంత రాశావా, చెప్పాల్సినంత చెప్పావా, లేక కొత్త ఉద్యోగాలయిన దృశ్య మాధ్యమాల్లో, నిన్ను నువ్వు ఖర్చు పెట్టేసుకున్నావా  ఎవరూ చెప్పరు. సాంకేతిక మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, యంత్ర భూతముల కోరలు తోమే,   ఇనుప అడుగుల నాగరికత, ఇసుక రేణు సూక్ష్మ ఫలకం, సిలికాన్ చిప్ లో దాచిన జ్ఞాన బీజం, స్వార్థ స్వర్గాలకే పయనిస్తుందా, ఒంటి కంటి సిద్ధాంతపు, ఒంటి స్తంభ సంస్కృతుల, ఒంటరి పట్టా పై, మోనో రైలు లా – – అడగాల్సిన ప్రశ్నలున్నాయి.

పాత జవాబులేవీ రాయకుండా పరీక్షలు రాయాల్సిన రోజులివి. మార్కుల పద్ధతిని దాటిన జవాబు పత్రం కావాలి ఇవాళ కవిత్వం. ఠావు  అంతా ఖాళీగా ఉంచి, మార్జిన్ లోనే ఉంచిన వారిని,  ఫుల్ స్కేప్ బతుకు లోకి తీసుకురావాలి. అలా జవాబులు రాయవలసిన కాలం ఇది. కోటానుకోట్ల బతుకు పేపర్లను ఇలానే దిద్దాలి అంటూ దిద్దుతున్న వారిని, జన జీవన విద్యలో జ్ఞాన  శూన్యులు  గా కోలహాల ప్రకటన చేయాల్సిన రోజులివి.

కొత్త సహస్రాబ్దికి, ఇంకా పదిహేనేళ్ళే, నీకా అర్థ శతాబ్దపు ఆయుష్షు  నిండ  లేదు. ఆయుధమై పదునెక్కి, సాయుధ పటాలాలు గా   అక్షరాలను నడపాల్సిన నిర్ణాయక దశలో, మరణ వాంగ్మూలాన్ని పౌర సరఫరా చేసి, బతుకు లగేజీలు వదిలేసి, మరణాన్నే ఒక్క మూట  కట్టుకుని , జల క్రోధం జన క్రోధంగా  మారే దారి లో మోసుకెళ్తున్నావు.

కనిపించని డబ్బు కరిగిపోయిందని  స్టాక్ మార్కెట్లు మోరలెత్తి ఏడుస్తున్నాయి. పని లేని ఆయుధ సంపత్తి ఎవరి సంపదో చెప్పలేక రాజకీయం నీళ్ళు నముల్తోంది. ఏర్పడని దేశాల కోసం, ప్రజలు పురిటి పడకల నుంచే ఉద్యమ ఉంగాలాపనలు చేస్తున్నారు.  నాగరికుడా – నువ్వు స్వైర సంగీత జీవ శక్తిని ఆటవికతలో విన్నావు, అమెరికాలో విన్నావు. ఆటవికుడా, నువ్వు కోయ వేషంలో కూచుని ఏదో ఆండ్రోమెడా  చానెల్లో, ఆక్స్ ఫర్డ్  ఇంగ్లీష్ లో, అడవి బిడ్డల హక్కుల గురించి, బతుకులు అడవులైపోయిన ఆధునిక దిశాహీనత గురించి, మాట్లాడుతూ, మాట్లాడిస్తున్నావనుకోనా?

పాంటూ, చొక్కా వేసుకు తిరిగిన కోయ రాజా – నీకు పెన్ను నిండా గోదారి.  కూనవరం రేవే దగ్గర ఒంటరి పడవలో నువ్వొదిలేసిన అక్షరాలు ఇప్పుడిక  ఈ తరాలు రాయాలి.

అల్విదా జెంటిల్ జ్వాలారుణ  సాగరుడా,  నిప్పు పెట్టెల్లోంచి  పేలాల్సిన ప్రజాగ్రహ గంధక ధూళి, నీకు ఎప్పటికైనా  నివాళి.

 

*

 

పుస్తక ప్రేమికులకు రోహిత్ కాన్క!

 

ఈ  వాలంటైన్ డే  రోహిత్  ఒక కొత్త ప్రేమ సందర్భాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఈ ప్రేమ పేరు: పుస్తక పఠనం!

పుస్తక ప్రేమికులకు అతను ఇస్తున్న కాన్క పేరు: అనతపురం పబ్లిక్ లైబ్రరీ!

“సమయమే లేదు..” అన్న  మాట  ఎక్కువగా వింటాం ఈ కాలంలో! కాలాన్ని డబ్బుతో లెక్కించే  ఇప్పటి పరిస్థితిలో  ఒక వ్యక్తి అదనంగా సమయాన్ని సృష్టించుకొని, ఒక పని మీద దాన్ని కేటాయించడం – ఆ వ్యక్తిలోని తపనకి సాక్ష్యం! ఎవరికి వాళ్ళం  పుస్తకాలు చదువుకోవడం, మన ఇండ్లలో దాచుకోవడం మంచి అలవాటే. కాని, చదివిన పుస్తకాన్ని నలుగురికీ అందించాలనుకుంటే అది తపన. చదువు అనే భావనకి  సార్ధకత సాధించాలనే అన్వేషణ.

అనంతపురంలాంటి చోట పుస్తకం దొరకడం కష్టం. అదీ ఇంగ్లీషు పుస్తకం ఇక చెప్పక్కర్లేదు. పుస్తకాల కోసం మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళే తపన వున్నవాళ్ళు ఈ జిల్లాలో వున్నారు. అలాంటి వారి కోసం కవి, అనువాదకుడు రోహిత్ ఒక సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు- తన సొంత డబ్బుతో , ఏర్పాట్లతో  లైబ్రరీ పెట్టడం!

సొంత లైబ్రరీలు వుండడం పెద్ద విశేషం కాదు. కాని, ఆ సొంతం అనే భావన వదులుకొని, దాన్ని పబ్లిక్ లైబ్రరీగా మార్చడం రోహిత్ లాంటి సాహసికులు మాత్రమే చేయగలరు. ఈ లైబ్రరీ ఈ 14 న ప్రారంభమవుతోంది. ఆంద్ర లో మొదటి సారిగా  ఈ ప్రయోగానికి నాంది పలికిన రోహిత్ తో ముఖాముఖి.

 

library2

రోహిత్,  లైబ్రరీ పెట్టాలని ఆలోచన ఎందుకొచ్చింది

గత ఇరవై-ముప్పయ్ సంవత్సరాలుగా పుస్తకాలు సేకరిస్తూ వచ్చాము. అత్యంత అరుదైన పుస్తకాలన్ని అతి కష్టం మీద సంపాదించాము. అలాంటి పుస్తకాలు అందరికీ అందుబాటులోకి రావాలంటే లైబ్రరీ అవసరమని భావించాము . ఉర్సుల లె గ్వయ్న్ అన్నట్టు పుస్తకాలు ఏ ఒక్కరి సొత్తూ కాదు. అవి అందరికీ అందుబాటులో ఉంచాలి (It(the joy of reading books) must not be “privatised,” made into another privilege for the privileged…. It must be available to all who need it.). ఈ ఆలోచనే మా లైబ్రరీ కి అంతరాత్మ.

ఇక్కడ మరొక ఆసక్తికరమైన సంఘటన చెప్పుకోవాలి. ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఓ ఆదివారం నాడు అనంతపురం లో మా నాన్న – పాత పుస్తకాలు అమ్మే చోట ఓ కుప్పగా (వంద పుస్తకాలు పైచిలుకు) పుస్తకాలు పడిఉండటం చూసాడు. అవన్నీ ఎంతో ఆసక్తికరమైన, అరుదైన రష్యన్ పుస్తకాలు. మార్క్స్ నుండి లెనిన్ దాక, డోస్టొవెస్కి నుండి మయకొవిస్కి దాక అనేక పుస్తకాలు ఉన్నాయట. వాటన్నిటినీ కొని ఇంటికి తెచ్చాడు. ఆ పుస్తకాలన్నిటికీ మొదటి పేజీ లో ‘భైరవప్ప’ అనే సంతకం ఉంది. అనంతపురం లాంటి చోట ఇలాంటి పుస్తకాలు కొన్న ఈ భైరవప్ప  ఎవరబ్బా అని కొంచం కుతూహలం మొదలయ్యిందట. తర్వాత్తర్వాత కొన్ని రోజులయ్యాక ‘విశాలాంధ్ర బుక్ హౌస్’ దగ్గర ఎవరో భైరవప్ప గురించి మాట్లడుతుండటం విని – ఇంతకూ ఎవరతను అని అడిగాడట. అప్పుడు తెలిసింది.

భైరవప్ప రెజిస్ట్రార్ ఆఫీసులో పని చేసే వాడట. ఆయనకు పుస్తకాలంటే పిచ్చి. జీవితాంతం పుస్తకాలు కొంటూనే ఉన్నాడు. ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఎప్పుడూ ఆయన విపరీతంగా పుస్తకాలు కొనేవాడని విసుక్కునేవారట. పుస్తకాలకు తన ఇంట్లో స్థలం సరిపోక ఇంకొక గదిని అద్దెకి తీసుకొని ఆ గదిలో కూడా పుస్తకాలని నింపేసాడు అట. చివరికి అందరి లాగనే ఆయన కూడా ఒక రోజు చనిపోయాడు. అప్పుడు  ఆయన భార్య ఒక్క సారి నిట్టూర్చి ఆ పుస్తకాలన్నీ గుజిరీకి వేసి అమ్మేసిందట.

భైరవప్ప లాంటి పుస్తకప్రేమికులెందరో జీవితాంతం ఇష్టం గా, ఆత్మీయంగా పుస్తకాలను సేకరించి ఉంటారు. అలాంటి పుస్తకాలన్ని చివరకు చేరటానికి అందరికీ అనువుగా, విశ్వజనీయంగా- ఉండే ఒక చోటు ఉంటె బాగుంటుందని- ఈ లైబ్రరీ ని ప్రారంభించదలిచాము.

rohit1

 

లైబ్రరీ కి అనంతపురం ఎందుకు సెంటర్

గత ముప్పయ్ సంవత్సరాలుగా అనంతపురంలో నే మేము నివాసమున్నాము. అనంతపురం లాంటి వెనకబడ్డ జిల్లాలో స్వేచ్చాయుతంగా ఆలోచనలు బయటపెట్టటానికి ఒక ప్రదేశం అవసరం ఎంతగానో ఉంది. సమాజం గ్లోబలైజేషన్ గొడవలో  కొట్టుకుపోతున్న తరుణంలో, కార్పొరేట్ సంస్థలు ప్రతీదానికీ ఓ విలువకట్టి అమ్మటానికి పొంచిచూస్తున్న సందర్భంలో – ఉచితంగా సమాచారం, జ్ఞానం అందరికి అందుబాటులొ ఉంచటం తక్షణం చేయవలిసిన కార్యం అని తలచాము.అందుకుగాను మాకు అనువుగా ఉన్న ఓ చిన్న స్థలం ఎంచుకొని, అక్కడ పుస్తకాలన్నీ సముపార్జించి తదనుగునంగా వేరు వేరు కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాము. ఈ ప్రయత్నం ద్వారా వివిధ రకాల భావాలున్నవారందరూ ఒక చోటికి చేరి పరస్పరం జ్ఞానాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాం.

 

పుస్తకాలు ఎలా సేకరించారు

మాకు వివిధ విషయాల్లో అభిరుచులు ఉండటం చేత ఆయా అంశాలకు సంబంధించి అనేక పుస్తకాలను పోగు చేయగలిగాము. ఇవే కాక బయట నుండి కుడా ఎవరైనా స్వచ్చందంగా పుస్తకాలు ఇవ్వటాన్ని ఆహ్వానించాము. ప్రపంచం నలుమూలల నుండీ మా లైబ్రరీ కి పుస్తకాలు పంపించటానికి ఇప్పటీకే  ఎందరో మమ్మల్ని కాంటేక్ట్ చేసారు. ముఖ్యంగా సాహిత్యం, చరిత్ర, తత్వ శాస్త్రం, జీవిత చరిత్రలు తదితర  విభాగాలకి సంబంధించి ఈ పాటికే  మా దగ్గర ఓ 2500-3000 పుస్తకాలు ఉంటాయి. పుస్తకాల పై మక్కువ ఉండి – ఒక పట్టున చదవాలి అనుకునే వాళ్ళకు ఈ లైబ్రరీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి

పాశ్చాత్య సాహిత్యం, సైన్స్ ఫిక్షన్, తెలుగు, ఇంగ్లీష్ నవలలు, క్లాసిక్స్, ఫిలాసఫీ, చరిత్ర, పిల్లల పుస్తలాలు, మార్క్సిస్టు సాహిత్యం, అర్థశాస్త్రం, కవిత్వం, జీవిత చరిత్రలు- మొదలగు అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి.

పుస్తకాలు మాత్రమేనా వేరే కార్యక్రమాలు కూడా చేస్తారా

నెలకొక సందర్భం పురస్కరించుకొని మిత్రులూ,పుస్తక ప్రియులూ కలిసేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేయదలిచాము.కవిత్వ పఠనం,పుస్తక సమీక్షలు,సాహిత్య సమాలోచనలు,సినిమా ప్రదర్శన మొదలగు ఎన్నో విధాలుగా అందరినీ కలపాలని మా ఆలోచన. ఫిబ్రవరీ 14 న లైబ్రరీ ప్రారంభం సందర్భంగా “కోర్ట్” అనే మరాఠీ సినిమా ప్రదర్శించదలిచాము.

ఈ లైబ్రరీ కార్యక్రమం వల్ల మీరు కవిత్వం రాయటం తగ్గిపోతుందనుకుంటున్నారా?

నేను అలా భావించను. లెనార్డ్ కోఎన్  అనే కవీ అన్నట్టు “కవిత్వం జీవితానికి రుజువు. జీవితం బాగ మండితే, దాని బూడిదే కవిత్వం అవుతుంది.” (Poetry is just the evidence of life. If your life is burning well, poetry is just the ash. -Leonard Cohen)  జీవితం ఎంత వైవిధ్య భరితంగా ఉంటే కవిత్వం అంత నూతనంగా, నవీనంగా ఉంటుంది. లైబ్రరీ కోసం పని చేసేటప్పుడు -పుస్తకాలు సద్దటం, పుస్తకాలని సరైన క్రమం లో అమర్చటం అన్న ప్రక్రియకీ , అక్షరాలనూ ఆలోచనలను సరైన క్రమంలో అమరుస్తూ కవిత్వం రాయటం అనే ప్రక్రియకీ ఎక్కడో పోలిక ఉన్నట్టు అనిపిస్తుంది.  “కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిబిళ్ళ” లో కూడా కవిత్వం ఉంటుంది అనుకున్నప్పుడు- లైబ్రరీలో కవిత్వం ఉండదంటారా?

*

ఒక్కడు కాదు  –  ఇద్దరు!

 

 

(మహా రచయిత, డాక్టర్ కేశవరెడ్డి చనిపోయి ఫిబ్రవరి 13 కి  సంవత్సరం కావస్తున్న తరుణంలో   కేశవరెడ్డి గారి మిత్రులు హైదరబాద్ స్టడీ సర్కిల్, దోమల్ గూడ, హైదరబాద్ లో ఆ రోజు  సాయంత్రం సమావేశమవుతున్నారు. ఈ సంధర్భంగా కేశవరెడ్డి లోని అన్ని కోణాలు తెల్సిన ఆయన ఆప్త మిత్రులు, అంబటి సురేంద్ర రాజు (అసుర)ని  ‘ఛాయ’ సంస్థ తరుఫున కృష్ణ మోహన్ బాబు పలకరించారు.  ఆ మాటల ముచ్చట్లు ఇవి.)

 

కేశవరెడ్డి గారి చాలా పుస్తకాలకి వెనుక మాటల్లో మీరు ఉన్నారు.  అసలు కేశవరెడ్డి గారికి, మీకు పరిచయం ఎలా జరిగింది? ఇన్ని సార్లు వెనుక మాటలు రాయడం ఎలా సాధ్యమయ్యింది?

కేశవ రెడ్డి  గారిని 1979 నుంచి నేనెరుగుదును.  ఎమ్మే ఫిలాసఫీ  చదువుతున్న రోజులలో నా రూమ్ మేట్ అతిధి గా ఆయన మా గదికి ఆ రాత్రి ఉండడానికి వచ్చారు.  అప్పటికి ఆయన, ‘ఇంక్రెడిబుల్ గాడెస్’ అచ్చయ్యింది.  చలం గారు, కృష్ణ శాస్త్రి, కుటుంబ రావు లాంటి పెద్దలు బతికున్న రోజులు.  ఆ రాత్రి తెల్లారే దాకా నాకు, కేశవరెడ్డి గార్కి మధ్య మాటల యుద్ధమే జరిగింది.  తక్షణ కారణం త్రిపుర నేని మధుసూధన రావు ‘ముందు మాట’ అంటూ రాసిన చెత్త చెదారం. కేశవరెడ్డి గార్కి ఆయన అంటే మహా ప్రీతి, భక్తి.  అందుకనే అడిగి మరీ రాయించుకున్నారు.  ఆనాడు నా బాధేంటంటే ముందు మాట రాసిన పెద్ద మనిషికి ‘అర్జున రెడ్డి’ పాత్ర అర్ధం కాకపోవటం.  ఆ పాత్ర అర్ధం కాకపోతే, కేశవ రెడ్డీ అర్ధం కాడు.  ఆ సహ అనుభూతి (empathy) లేనివాడు ముందు మాట రాయడమేంటి? అదే అడిగా కేశవరెడ్డి ని.  ఆ ముందు మాటలో నవల గురించి ఒక్క మాట కూడా లేకపోవటమే కాదు, అదే అదనుగా తన సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని వాంతి చేసుకున్నాడు.  నా మాటలు కేశవరెడ్డి గార్కి రుచించ లేదు.   ఆయన కోపంతో విశ్వ రూపం చూపించాడు.  ఆ రోజు మధుసూధన రావు, మార్క్సిజం, సిధ్ద్ధాంతమ్, ఆచరణ అన్ని అంశాలు మా మధ్య చోటు చేసుకున్నాయి.  తర్వాతి కాలంలో కేశవరెడ్డి గారితో మంచి స్నేహం ఏర్పడింది.  నాకు ఆయన రచనలంటే చాలా ఇష్టం.  అందుకే ఆ ముందు మాట మీద అంత ఘర్షణ జరిగింది.  ఆ సంఘటన తర్వాత ఎంత కలవాలనుకున్నా, 1996 దాకా ఆయన్ను మళ్ళీ కలవటం జరగ లేదు.  కారణం ఆయన హైదరబాదు రాడు, నా పాత్రికేయ వృత్తి పని ఒత్తిడి వల్ల నేను డిచ్ పల్లి వెళ్ళటం కుదరలేదు.  ఈ మధ్యలో ‘శ్మశానం దున్నేరు, అతను అడవిని జయించాడు, రాముడుండాడు-రాజ్యముండాది, సిటీ బ్యూటీఫుల్’ నవలలొచ్చాయి.  కాండ్రేగుల నాగేశ్వర్రావు గారు పాత పుస్తకాలను మళ్ళీ వేస్తూ, కొత్త పుస్తకాలు, ‘మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె’ లకి పరిచయాలు  రాయమన్నారు.  నా ఈ పరిచయాలు  చూశాక, తన నవల లన్నింటికి రాయమని కేశవరెడ్డి గారు కోరినా, కారణాంతాల వల్ల వీలు పడలేదు.  అలా కేశవరెడ్డి గారు నాకు మరింత దగ్గరయ్యారు.   మనల్ని విడిచి పోయే దాకా ఆయన నాతో మాట్లాడని రోజు లేదు.

మరైతే సంజీవ్ దేవ్ గారి ముందు మాట సరైనదేనా?

మధుసూధన రావుది ఎంత అసంబద్ధమో , ఇది కూడా అంతే అసంబద్ధం.   విషయం ఏం లేదు.

ఒక్క ‘సిటీ బ్యూటీఫుల్’ తప్ప మిగిలిన నవలలన్నిటి కథా కాలం 1900 – 45 మధ్యలో ఉంటుంది.  అది కూడా సూచనప్రాయంగా మాత్రమే తెలుస్తుంది.  దీనికేదైనా బలమైన కారణముందా? లేకపోతే ఆ తర్వాతి కాలంలో ఈ వాతావరణం అంతగా లేదనుకున్నారా?

వాతావరణం లేదని కాదు, వీటి మూలాలు ఆ కాలం లో ప్రస్ఫుటంగా ఉన్నాయని ఆయన ఉద్దేశ్యం.  1950 కి ముందు క్లాసికల్ ఫ్యూడలిజమ్ బలంగా ఉంది.  అదొక vantage పాయంట్ గా తీసుకుంటే వర్తమానాన్ని స్పష్టంగా చూసి అర్ధం చేసుకోవడం సాధ్యమవుతుంది. అలాగే మీరు ఇంకో విషయం గమనిస్తే, ఆయన రాసిన ఏ కథ అయినా తను పుట్టి, పెరిగిన చిత్తూరు జిల్లా ఎల్లలు దాటవు.  మిగతా చోట్ల అలాంటివి లేవని కాదు.  తను స్వయంగా చూసిన వాస్తవిక పరిస్థుల చిత్రణ అది.

asura

 ‘మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె, మునెమ్మ’ లలో అంటే, చివరి నవలల్లోనే మీరనే పొయిటిక్ జస్టిస్ ఉంటుంది.  అంతకు ముందు లేని ఈ ప్రక్రియ వీటిలోనే ఎందుకు ఉంది? దీనికి  ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?

వాస్తవికతకి, చారిత్రకంగా ఒక సామాజిక సంక్షోభ సందర్భాన్ని పొదివి పట్టుకొని, పరిశీలించి, పరిష్కరించే శక్తి యింకా సాధించలేదు. ఈ పరిస్థితులలో రచయిత మానవేతర శక్తులతో న్యాయాన్ని సాధించాలనే లక్ష్యంతో, కాల్పనీకతను జోడించి, పరిష్కారాన్ని సూత్రప్రాయంగా చెప్తాడు.  ఇంతా చేసి యిది పరిష్కారం కాదు, ప్రతి చర్యే.  ‘మూగవాని పిల్లనగ్రోవి’ నాటికి కేశవరెడ్డి గారి ఆలోచనల్లో మౌలికమైన మార్పు వచ్చింది.  అదే ఆయన రచనల్లో ప్రతిబింబించింది.  తొలి అయిదు  నవలలు రాసిన కేశవరెడ్డి, అమెరికన్ నవలా సాహిత్యంతో ప్రభావితమైతే,  ఆ తర్వాత వచ్చిన మూడు  నవలల్లో లాటిన్ అమెరికన్ సాహిత్య ప్రభావం స్పష్టంగా  చూడ చ్చు.  దీనితో కంటెంటు, ఫాము  అన్నీ  మారాయి.  ఈ పొయటిక్ జస్టిస్ కి కారణం అదే.   మరో విషయం గమనిస్తే 1986 నుంచి 1996 దాకా ఆయన రచనలు మనం చూడలేదు.  ఈ మధ్య కాలంలో ఆయన చేసిన లాటిన్ అమెరికన్ సాహిత్య సేవని ‘మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె’ ల్లో మనం చూస్తాం.   అలాగే 1997 నుంచి 2007 దాకా మౌనం.  ఆ తర్వాత వచ్చిన ‘మునెమ్మ’ మళ్లీ లాటిన్ అమెరికన్ ప్రభావంతో వచ్చింది.

ఆయన రచనల్లో  ‘సిటీ బ్యూటీఫుల్’ ఒక విభిన్నవైన నవల.  అదెలా కుదిరింది?

ఆ నవల పూర్తిగా ఆయన ఆత్మ కథే.  పాండిచ్చేరిలో ఆయన వైద్య విద్యార్ధిగా గడిపిన కాలాన్ని, అనుభవాన్ని విమర్శనాత్మకంగా చిత్రిస్తే వచ్చిందే ఆ నవల.  ఇదో విధంగా పీడకల లాంటి గతాన్ని రాసి వదిలించుకోవడమే.  ఉన్నత విద్యా విధానాన్ని, ముఖ్యంగా వైద్య విద్యా విధానం మీద ఉన్న అసహ్యాన్ని ఈ నవలలో ఎత్తి చూపాడు.  ఈ విధానం తెలివైన విద్యార్ధి కోసం కాదు.  మొక్కుబడిగా, వివేచన లేకుండా చదివేవాళ్ళ కోసం మాత్రమే.  ఇది ఈ రోజు సమస్త విద్యా వ్యవస్థ లకి వర్తిస్తుంది.

కేశవరెడ్డి గారిని అంత దగ్గరగా చూశారు కదా;  ఆయన గురించి మీకున్న బలమైన అభిప్రాయమేంటి? 

రచయితగానే కాకుండా మనిషిగా కూడా ఆయన ఉన్నతుడు, సర్వ స్వతంత్రుడు.  పుట్టుకతో వచ్చిన ప్రివిలేజ్ లన్నీ వదిలి పెట్టి, మధ్య తరగతి జీవితాన్ని తోసిపారేశాడు.  తమ సామాజిక వర్గపు విద్యాధిక యువతుల్ని కాదని అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తిని పెళ్ళి చేసుకున్నాడు.  తను డాక్టర్, ఆమె నర్స్.  డాక్టర్ గా కూడా ఆయన మధ్య తరగతికి దూరంగా ఉండి, సమాజం తిరస్కరించిన నిరుపేద కుష్టు రోగులకి బంధువుగా నిల్చి ఆచరణ లో జీసస్ అయ్యాడు.  సాహిత్య సంఘాల్ని, ముఠాలని విసర్జించాడు.  వేసిన పుస్తకాల మీద హైదరాబాద్ బుక్ ట్రస్ట్  అధిపతి, గీతా రామస్వామి చిల్లర పైసలని విదిల్చినా  పల్లెత్తు మాటనలేదు.   కేశవ రెడ్డి ఒక గొప్ప డాక్టర్.  అణగారిన జీవితాల్లో వెలుగు నింపిన దార్శనికుడు.  రచయితగా ఆయన ఒకే ఒక్కడు.  అందుకే నే నంటాను ఆయన ఒక్కడు కాదు – ఇద్దరు.

***

 

అడివిలోంచి దూసుకొచ్చిన అక్షరం..

 

-అరణ్య కృష్ణ

~

 

“అన్నా! నేనిప్పుడు బతుకుతున్నది నా బోనస్ లైఫ్.  నేనో మెడికల్ వండర్ని”..ఇదీ అరుణ్ సాగర్ కొన్నాళ్ళ క్రితం నాతో అన్న మాటలు.

తన సున్నితమైన గుండెకున్న ఒక్క ఊపిరితిత్తితోనే కవిత్వాన్ని, జీవితాన్ని శ్వాసించినవాడు అరుణ్.  పైకి హాండ్సం గా, హుషారుగా మాట్లాడే అరుణ్ లోపల కొన్ని ముఖ్యమైన అవయవాలు శిధిలమైపోయాయి.  గాజుబొమ్మలాంటి శరీరంతో తరుచూ అస్వస్థతకు గురౌతూ కూడా జీవితాన్ని అద్భుతంగా ప్రేమించినవాడు.  మృత్యువు గుమ్మం ముందు కూర్చొని వుంటే దాన్ని కన్నుగీటి తోసుకుంటూ వెళ్ళినవాడు.  2012 నుండి అదనపు జీవితాన్ని గడుపుతున్నానన్న సంబరంలోనే వుండేవాడు కానీ చావు తనచుట్టూ తారట్లాడుతుందనే భయంలో మాత్రం వుండేవాడు కాదు. ఆకర్షణీయంగా వుండటం, అంతే ఆకర్షణీయంగా రాయటం అరుణ్ వ్యక్తిత్వంలో భాగమే.  ఎంత విభిన్నంగా కనిపించేవాడు.  ఫార్మల్ గా డ్రెస్ చేసుకున్నా, లేదా క్యాజువల్గా జీన్స్ వేసుకున్నా అతని స్టైలిష్ యాటిట్యూడ్ కనిపిస్తుంది.   ఫ్రెంచ్ కట్ బియర్డ్ తో, కళ్ళజోడులోంచి చూస్తూ చేసే మందహాసం మనోహరంగా వుండేది.  విభిన్నంగా ఆలోచించటం,  కళనీ, కౌశలాన్ని ఒకే స్థాయిలో మిళితం చేసి వైవిధ్యంగా వ్యక్తీకరించటం అరుణ్ కే చెల్లింది.

ఒక కవిగా, కాలమిస్టుగా, పాత్రికేయుడిగా “బుల్స్ ఐ” లోకి గురిచూసి కొట్టే మాట అతనిది.  పాలకులు సామాన్య ప్రజలకు పెట్టే భ్రమల గుట్టు విప్పి చెప్పటంలో కానీ, అభివృద్ధి పేరుతో సిద్ధం చేస్తున్న విధ్వంస ప్రణాళికల్ని బట్టబయలు చేయటంలో కానీ తిరుగులేని నిబద్ధత చూపిన వ్యక్తి, శక్తి అరుణ్!  అతను స్పర్శించని అంశం ఏమిటి?  సినిమా, జెండర్, సామాజికాభివృద్ధి, మానవ వికాసం, కృంగిపోతున్న పల్లెలు, “అభివృద్ధి” చెందుతున్న నగరాలు, రాజకీయాలు, బాల్యం, ఆర్ధికాంశాలు, ప్రపంచపరిణామాలు, యుద్ధాలు…ఇలా అతను ముట్టుకోని అంశం ఏదీ లేదు.  సృజనాత్మక పద ప్రయోగంతో, లలితతమైన భాషద్వారా దారుణవాస్తవాల్ని వొక ప్రవాహవేగంతో సాగిపోయే అతని శైలీవిన్యాసం మనల్ని చకచ్చకితుల్ని చేస్తుంది.  దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.  జ్ఞానాన్నిస్తుంది. ఆలోచింపచేస్తుంది. ఉడుకెత్తిస్తుంది.  ప్రేరేపిస్తుంది.

“హైదరాబాద్ ని నేనే అభివృద్ధి చేసా” అని చంద్రబాబన్నప్పుడు ఆ అభివృద్ధి ధనవంతుల ఇళ్ళల్లో వాటర్ ఫౌంటేయిన్ల నుండి వారి ప్రహరీలు దాటి బైటకొచ్చే నీటి జల్లని తేల్చిపారేసాడు.  నగరాల స్త్రీల వెతల్ని మాత్రమే ఫోకస్ చేసే మీడియా టీ.ఆర్.పి. లేని కారణంగా నిర్లక్ష్యం చేస్తున్న గ్రామీణ స్త్రీల గురించి పట్టించుకోదని ఈసడించాడు.  స్మశానవాటికకు ఎదురుగా అందమైన అమ్మాయి హోర్డింగుని చూసి నవ్వుకున్నాడు.  బాహుబలి గురించి అంతర్జాతీయ స్థాయని తెగ ఊదరగొడుతుంటే “ఈ బూటకపు కబుర్లని కట్టిబెట్టండి, సీరియస్లీ” అని హెచ్చరించాడు.  “అవతార్” సినిమా పరమార్ధాన్ని అద్భుతంగా విశదీకరించాడు.  పురుషుడంటేనే దుర్మార్గుడని, నయవంచకుడన్న ముద్రని నిరసిస్తూ “మేల్ కొలుపు”, “మియర్ మేల్” సంకలనాలు రాసాడు.  అందరూ అమ్మని కీర్తిస్తారే కానీ నాన్న శ్రమని, బాధ్యతని గుర్తించరని ఎత్తిచూపాడు.  “ఓ తండ్రీ నిను దలంచి” అని నాన్నను స్మరించుకున్నాడు.  ఆధునిక సమాజంలో నాన్న పాత్రకున్న విలువని ఎలిగెత్తి చాటాడు.  దేని గురించి రాసినా, ఎలా రాసినా, వచనం రాసిన, కవిత్వం రాసినా అందులో తనదైన విశిష్ఠ వాక్యంతో  కవిత్వమే రాసేవాడు. ఇంగ్లీష్, తెలుగుల సమ్మేళనంతో అతని వాక్యం పరిమళించేది.

ఇంక అరుణ్ కవిత్వం గురించి కొత్తగా చెప్పేదేముంది?  అదో జీవధార.  సామాన్యుడి కడుపుమంట అది.  అతని తాజా సంకలనం “మ్యుజిక్ డైస్” అతను మనకిచ్చిన చివరి కానుక.  పోతూ పోతూ ఒక సాహిత్య ఉద్యమ బాధ్యతని మన చేతుల్లో పెట్టిపోయాడు.  ఇంకా ఆ పుస్తకం గురించి “అరుణ్ చాలా బాగా రాసావు. ధన్యవాదాలు భాయి” అని మనం చెప్పే లోపలే తన బోనస్ జీవితాన్ని కత్తిరించేసుకొని వెళ్ళిపోయాడు.  బహుశ “మ్యుజిక్ డైస్” గురించే జీవితాన్ని పొడిగించుకున్నాడేమో! ఇంకా కొన్నాళ్ళ తరువాత ఈ పుస్తకం తెచ్చుండాల్సింది అరుణ్, నువ్వింకా కొన్నాళ్ళుండేవాడివేమో!  “మ్యుజిక్ డైస్ అను ఒక మరణవాంగ్మూలము” అన్న ఈ సంకలనంలో పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నశించిపోనున్న ఆదివాసీలందరి తరుపున వాంగ్మూలం ఇచ్చి తను మరణించాడు అరుణ్.

జాతుల్ని, వాటి సంస్కృతుల్నే కాదు ప్రకృతిని, పర్యావరణాన్ని అభివృద్ధి పేరుతో ధ్వంసించే పాలకుల దళారీ చర్యల మీద ఏదో ఒక కవిత రాసి ఊరుకోలేదు.  ఒక కవితల సంకలనమే తెచ్చాడు అరుణ్.   ఇది అరుణ్ సాగర్ మాత్రమే చేయగల మహత్కార్యం. ఎంత ఆవేదన, జ్ఞానం, అవగాహన, నిబద్ధత, పోరాట పటిమ లేకపోతే ఇంత గొప్పపని చేయగలడు?  అమరవీరుల స్తూపం ముందు ఎగురుతున్న ఎర్రజెండాకి పిడికిలెత్తి లాల్ సలాం చెబుతూ సగర్వంగా ఫోటో వేసుకొని తన పుస్తకాన్ని “పోడు కోసం గూడు కోసం తునికాకు రేటుకోసం అటవీహక్కుల కోసం జెండాలై ఎగిరిన తల్లులకు తండ్రులకు అక్కలకు అన్నలకు” అంకితమిచ్చిన అరుణ్ ప్రాపంచిక దృక్పధం తేటతెల్లమే.

 

“చెట్టుపుట్టలు కూలుస్తున్న ఒక పొక్లయిన్

గుండె బరువెక్కి మొరాయించినది

కానీ ఒక్క మట్టిపెళ్ళా పెకిలించలేక కూలబడినది

కాంక్రీటు మర ఒకటి నిస్సహాయంగా  తిరుగుతూనే ఉన్నది

ఆ శబ్దము దుప్పిపిల్ల అరణ్య రోదనలాగున్నది

సాయిల్ టెస్ట్

మట్టినింపిన పరీక్ష నాళిక రక్తముతో చెమ్మగిల్లినది

 

నది దిగులుపడి లుంగలు చుట్టుకు పోతున్నది

అమ్మ ఒడిలో చేరి 

వాగులు వంకలు ఏరులు పారులు

భోరున సుడులు తిరిగి

దుఖపడి పెగిలిపోతున్నవి”...అంటూ అడవితల్లి తరపున, ఆ తల్లి బిడ్డలకోసం మరణశోకాన్ని ఆలపించినవాడు అరుణ్.  “అరణ్యాన్ని ఆవాసాన్ని ఆవరణాన్ని లేడిపిల్లల్ని అడవి బిడ్డల్ని రెవిన్యూ రికార్డుల్నుండి తొలగించే” పాలక ముష్కర చర్య గురించి మనల్ని హెచ్చరించాడు.

“కథలు కన్నీళ్ళు

కూలిపోతున్న ఇళ్ళు

ఇళ్ళ నిండా  నీళ్ళు

ఇళ్ళ కళ్ళ నిండా నీళ్ళు

లక్ష టియంసీల నీళ్ళు

వెల్లికిలా తేలియాడుతున్న

కోటానుకోట్ల కళ్ళు

ఇంతింత కళ్ళేసుకున్న ఈళ్ళు

కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న గాధలు

అన్నా…మన కథలు“…అంటూ బావురుమన్నవాడు మనవాడు అరుణ్!

నశించబోతున్న నది మెరిసేలా నవ్వే సీదర సెంద్రయ్య గురించి, ఒడ్డున బతుకుతున్న రావిచెట్టు గురించి, ఒక పోరగాడు విసిరిన గులకరాయి గురించి, ఒక పోరి చూసిన పచ్చని, వెచ్చని చూపు గురించి బెంగ పెట్టుకున్నాడు అరుణ్. భోరుమన్నాడు అరుణ్.  కోపగించాడు అరుణ్. మనల్ని రెచ్చగొడుతూ దుడుకుగా తనెళ్ళి పోయాడు అరుణ్.  ఎక్కడికెళ్ళాడు అరుణ్?  ఈ మనుషులు, నేల, దేశం, ఖండం, మొత్తం భూమి, ఈ సౌరకుటుంబం, ఈ పాలపుంత చాలక అంతరిక్షంలో మన పొరుగున వున్న గెలాక్సీ “ఆండ్రొమెడా”ని కూడా ప్రేమించిన అరుణ్ తన పుస్తకాలన్నీ “ఆండ్రొమెడా ప్రచురణలు” కింద ముద్రించి మురిసిపోయాడు. బహుశ అక్కడ సేద తీరుతున్నాడేమో!

సమాజానికి అతనో మేధావి, కవి, కాలమిస్ట్, జర్నలిస్ట్ కావొచ్చు.  అతని పరిచయస్థులకు మాత్రం అతనో గొప్ప మానవీయ వనరు.  అద్భుత స్నేహశీలి.  నిరాడంబరుడు.  అతనికి నేను గొప్ప ఆప్తుణ్ని కాను కానీ చాలా మంచి పరిచయం వుంది.  కవి శ్రీకాంత్ పెళ్ళిలో నాకు పరిచయం అయిన మొదటి సారి నుండి “అన్నా” అనే పిలిచే వాడు.  “మీ సంకలనం నాకెవరు ఇచ్చారో తెలుసా? త్రిపురనేని శ్రీనివాస్ ఇచ్చాడు. అది మీ కవిత్వమనే కాదు త్రిశ్రీ ఇచ్చినందుకు కూడా భద్రంగా ఉంచుకున్నాను” అంటూ చెప్పాడు.  ఆ రకంగా ఒక ఆపేక్ష బంధం ఏర్పడింది అతనితో.  మధ్యలో చాలా గ్యాప్ వచ్చినప్పటికీ ఈ మధ్యకాలంలో ఆవిష్కరణ సభలు, సాహిత్య సమావేశాల్లో తరుచూ కలిసాను.

చివరిసారిగా మొన్న జనవరి 24న తెలుగు యూనివర్శిటీలో కలిసాను.  అప్పుడే “అన్న అరణ్యకృష్ణకు” అంటూ రాసి “మ్యుజిక్ డైస్” ఇచ్చాడు.  అరుణ్ ఎప్పుడూ ఒంటరిగా ఉండడు.  చుట్టూ పెద్ద స్నేహబృందం ఉంటుంది.  ఒక టీవీ చానెల్కి సీయీవో స్థాయిలో వున్నా ఎక్కడా ఆ దర్పం కనిపించనిచ్చేవాడు కాదు. సాహిత్య సమావేశాల తర్వాత ప్రెస్ క్లబ్ కి తీసుకెళ్ళి అక్కడ ముచ్చట్లు పెట్టేవాడు.  అటువంటి ఆత్మీయ జ్ఞాపకాలు నాబోటి మిత్రులెందరికో పంచాడు.  వాళ్ళ ఆఫీసుకి రమ్మంటే ఒకసారి వెళ్ళాను.  నేనో మామూలు గుమస్తాని.  సాంఘికంగా నాకంటే ఎన్నో రెట్ల పరపతి ఉన్న పొజిషన్లో వున్నా ఎక్కడా అది కనిపించలేదు.  చాలా సహజంగా వుండేవాడు.  వాళ్ళాఫీసులో కాసేపు కూర్చొని తిరిగి వెళ్ళిపోతుంటే కింద దాకా వచ్చి సాగనంపాడు.  ఎంతమందికుంటుంది అంతటి డీక్లాసిఫైడ్ ప్రవర్తన, నిరాడంబరత?  అరుణ్, నువ్వు నీ సాహిత్యాన్నే కాదు ఒక ప్రవర్తనని కూడా ఇచ్చి వెళ్ళావు.

ఇంక ఆపేస్తున్నాను.  నీ కడపటి చూపు కోసం వెళ్తున్నాను. నిన్ను కడసారి చూసాక నేనీ నాలుగు ముక్కలు కూడా రాయలేనేమో! అందుకే ఇప్పుడే హడావిడి పడుతున్నాను. క్షమించు అరుణ్, ఇంతకు మించి ఏమీ చెప్పలేకపోతున్నందుకు.

“పుష్ప విలాపమో, బతుకు విషాదమో నీ జనమే పోరాడుతున్న చోటా కనీసం గొంతైనా కలపకపోవటం నేరం! కవిత ఆచరణకు సాటిరాదు.  అయితేగియితే ఒక సహానుభూతి. ఒక మద్దతు ప్రకటన. ఒక విధాన అనుసరణ.  ఒక ధైర్యవచనం.  ఒక నినాద రచన. ఇది మరణిస్తున్న పాటని చూసి వ్యధ లోతుల్లోకి కూరుకుపోతున్న హృదయం. ఇది మరణవాంగ్మూలం వినిపించడం మాత్రమే.  మిలార్డ్!  ఆపై రేలపాట ఫీనిక్స్ వలె ఆకాశం నుండి మళ్ళీ ధ్వనిస్తుంది. దిక్కులు పిక్కటిల్లి దేహాలు దద్దరిల్లి జలాశయం గజగజ వణుకుతుంది. ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధి నమూనా మిమ్మల్ని కూడా ముంచేస్తుంది. గోదాట్లో కలిసిపోతారొరేయ్. ఇది డెత్ సెంటెన్స్.” (అరుణ్ సాగర్ “మ్యుజిక్ డైస్” కి రాసుకున్న ముందుమాట నుండి)

*

 

మీడియాలో మేలుకొలుపు!

 

‘ఒకసారి కలుద్దాం…ఛానల్ కి రండి.’ అంటే వెళ్లాను. వెళ్లి ఎదురుగా కూర్చోగానే, substance లేని స్వీట్ నథింగ్స్, purpose లేని ఫార్మాలిటీలు లేకుండా, సూటిగా సుత్తిలేకుండా,”మీ రైటింగ్ లో జర్నలిస్టిక్ స్టైల్ ఉంది. ఫిల్మ్ అనాలిస్ లో డెప్త్ ఉంది. ఫుల్ టైమ్ జర్నలిజం కెరీర్ గురించి ఎందుకు ఆలోచించలేదు?” అని ఒక న్యూస్ చానల్ CEO అడిగితే ఎంచెప్పాలో తేలిక ఒక పిచినవ్వు నవ్వి ఒక పాజ్ తీసుకున్నాను.

అడిగింది అరుణ్ సాగర్. ఆ పిచ్చి నవ్వు నాదే.

కాస్సేపు ఆలోచించి చెప్పాను. ‘జర్నలిజంకన్నా ఫిక్షన్ నాకు ఇష్టం. అది pursue చేసే luxury కూడా లేకపోతే NGO సెక్టర్ లో ఇన్నాళ్లూ పనిచేసి ఇప్పుడే సినిమాల్లో ఫుల్ టైమ్ అనుకుని వచ్చాను. కాబట్టి కొన్నాళ్ళు ఈ ట్రయల్స్ లో ఉంటాను.” అని కాస్త confidant గా చెప్పేసాను. సరే…ఫేస్ బుక్ లో రాసే ఫిల్మ్ రివ్యూస్ మా ఛానెల్ లో చెప్పొచుగా అని డైరెక్ట్ ప్రశ్న సంధించారు. కాదనడానికి పెద్ద కారణం కనిపించలేదు. కాకపొతే, కుండ పగలగొట్టినట్టు చాలా సార్లు. చెంపపెట్టు లా మరికొన్ని సార్లు ఉండే నా రివ్యూల వల్ల చానల్ ఆదాయానికి గండిపడే అవకాశంతో పాటూ సినిమా పరిశ్రమతో అనవసరపు సమస్య ఛానెల్ కి వస్తుందేమో అనే డౌట్ వచ్చి అడిగేసాను. దానికి అరుణ్ సాగర్ చెప్పిన సమాధానం నాకు ఇప్పటికీ గురుతుంది.”అనుకున్నది చెప్పే సిన్సియారిటీ నీకు ఉంటే, దాన్ని అక్షరం పొల్లుపోకుండా ఎయిర్ చెయ్యగలిగే నిబద్దత నాకుంది. ఇష్టముంటే ఈవారం నుంచీ మొదలెట్టొచ్చు.”

mahesh

గుండెల మీద చెయ్యేసుకుని ఇలాంటి నిబద్దత గురించి మాట్లాడగలిగేవాళ్ళు మొత్తం పాత్రికేయరంగంలో ఎంత మంది ఉన్నారో లెక్కెంచితే పదివేళ్ళు దాటవు. అంత అరుదైన వ్యక్తి అరుణ్ సాగర్. మా పరిచయం పాతదే అయినా, స్నేహం మాత్రం ఫేస్ బుక్ లో నేను యాక్టివ్ అయ్యాక మాత్రమే అని చెప్పొచ్చు. 10Tv లో నా రివ్యూలు మొదలయ్యాక ఎన్ని ఒత్తిళ్ళు వచ్చాయో నాకు తెలుసు. అయినా, తను మారలేదు. మాటతప్పలేదు. ఆరంభంలో ఒకటన్నారు, నేషనల్ మీడియాలో రాజీవ్ మసంద్, నిరుపమ చోప్రా స్థాయిలో మంచి ఫిల్మ్ రివ్యూస్ చెప్పేవాళ్ళు తెలుగులో లేరు. ప్రింట్ మీడియాలో అక్కడక్కడా బాగారాసేవాళ్ళు ఉన్నా, టివిలో ఆ లోటు సుస్పష్టంగా తెలుస్తుంది.ఆ లోటు భర్తీ చెయ్యగలిగితే, నీకున్న సినిమా ప్రేమ రివ్యూలలోనూ కనిపిస్తే ష్యుర్ గా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అని. నేను ఏ సినిమా రివ్యూ చెప్పాలనుకున్నా, ఈ మాటలే గుర్తుపెట్టుకుంటాను.

మొదటిసారి రివ్యూ చెప్పడానికి టివి ముందుకు వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, అరుణ్ సాగర్ నాకు ధైర్యం ఇవ్వడానికి స్టుడియో ఫ్లోర్ కి వచ్చారు. నాపైన ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంటే, ఫ్లోర్ లో ఉన్నవాళ్ళకి బహుశా విచిత్రం అనిపించిందేమో. దానితోపాటూ నేనేవరో స్పెషల్ అనే ఫీలింగ్ వచ్చి గౌరవించడమూ మొదలెట్టారు. నాకు మోరల్ సపోర్టుతో పాటూ అన్యాపదేశంగా వాళ్ళ స్టాఫ్ కి నాపైన గౌరవం కలిగించడం కూడా ఒక మానవతావాది మ్యానేజ్మెంట్ టెక్నిక్ అనే అనుకోవాలి. ఆవిధంగా నన్నొక “ప్రముఖ ఫిల్మ్ రివ్యూయర్”ని చేసిన క్రెడిట్ అరుణ్ సాగర్ దే. కొత్త జర్నలిస్టుల అక్షరాలు దిద్దటం నుంచీ ఆలోచనల్ని సరిదిద్దడంవరకూ చెయ్యగలిగిన ాతికొద్దిమంది ఎడిటర్లలో అరుణ్ సాగర్ ఉన్నారు కాబట్టే సగానికి పైగా న్యూ-ఏజ్ జర్నలిస్టులు అతన్ని గురువుగా భావిస్తారు. అలాంటి గురువు నా హితుడు స్నేహితుడు టెలివిజన్ కెరీర్ కి బాటలు వేసిన సారధి అవ్వడం నా అదృష్టం.

అరుణ్ సాగర్ వచనం, కవిత్వం, శైలి, ఐడియాలజీ అన్నీ నాకిష్టం. వ్యక్తిగా తను చూపే స్నేహం, ప్రేమ అత్యంత ప్రీతిపాత్రం. కలిసి ఆలోచనల్ని పంచుకునే అవకాశం, కలిసి ప్రయాణాలు చెయ్యగలిగిన సహవాసం అన్నీ అద్భుతమైన అనుభవాలు.  ’మేల్ కొలుపు’ చదివాక నేను రాసిన సమీక్ష చదివి ఎంతో ఆనందంతో నన్ను దగ్గర తీసుకుని, ’ఒక కొత్త తరానికి మళ్ళీ నా పుస్తకాన్ని పరిచయం చేశారు’. అన్నదగ్గరనుంచీ, మొన్నటికి మొన్న ఖమ్మంలో తన పుస్తకం ‘మ్యూజిక్ డైస్’ ఆవిష్కరణకు నన్ను తనతో తీసుకెళ్ళినదగ్గరి వరకూ ఎన్నో మధురమైన, ఆలోచనాపూరితమైన, insightful క్షణాలు.

చనిపోయారనే వార్త తెలియగానే, అర్థమవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. ఇప్పటికీ ఇంకా ఆ నిజాన్ని నా మనసు జీర్ణించుకోలేదు. ఆ కఠోర సత్యాన్ని ఇప్పట్లో అంగీకరించలేను కూడా. అందుకే తన ఆత్మలేని శరీరాన్ని చూడటానికి నేను వెళ్ళలేదు. జ్ఙాపకాలలో మిగులున్న అరుణ్ సాగర్ మాత్రమే నాకు కావాలి. తను నిర్జీవంగా ఉన్న దృశ్యాలు నా కళ్ళ ముందు ఎప్పటికీ రాకూడదు. He will live on in my memory and thoughts.

‘అరుణ’గ్రస్త సాగరం

 

-సాయి పద్మ

~

 

వైజాగ్లో బీచ్ ని చూసినప్పుడు , చాలా సార్లు నాకు గుర్తొచ్చేది, పైడి తెరేష్ బాబు “హిందూ మహా సముద్రం’ అరుణ్ సాగర్ వాక్యం .. మొదటిది ఆవేదననీ, రెండోది ఊపిరాడని ఉత్తేజాన్నీ కలిగిస్తుంది.

అరుణ్ సాగర్ గారు నాకు తెలియదు, ఆయనకి ఉన్న భీకరమైన ఫాన్స్ తెలుసు. అక్షరాలద్వారా, ఉన్న పరిచయంతోనే వొక కవికి ఎక్కువ దగ్గరవుతాం, నేను కలుసుకోవద్దు అనుకున్న కవుల్లో కూడా ఆయనొకరు. అయినా ఇంక కలవలేం కదా అనుకుంటే ఎలా ఉందంటే …

“ వొక నిర్వాసిత ప్రదేశంలో, ఎటూ కాని మెలాంకలీ, ఇదీ అని చెప్పలేని వొక జీవిత వీరుణ్ణి మాటల్లో, వొక జీవితాన్ని గ్రాటిట్యూడ్ తో బ్రతికి, విలాసంగా మరణ వాంగ్మూలం మీద, తెలుగు వాక్యం మీద టోర్న్ జీన్స్ వేసుకొని సంతకం పెట్టిన ఒక నాన్నని మిస్ అయిన ఫీలింగ్..”

అందరు కవులూ జీవితాన్ని బ్రతికేస్తారు, తడిగా కొందరు, పొడి పొడి మాటల వొంటరితనాల్లో మరికొందరు. కానీ, వొకరో, ఇద్దరో.. జీవితాన్ని, సెలబ్రేట్ చేస్తారు.

ఊపిరాడని సంధ్యల్లో, ఎటూ కాని ఆరోగ్యంతో బ్రతకటం ఏమిటో నాకు తెలుసు, అరుణ్ గారు, మెడికల్ వండర్ గా బ్రతకటానికి కారణం ఆయనలో ఉన్న అర్బన్ disguise లో ఉన్న ట్రైబల్నెస్ అనుకుంటూ ఉంటాను.

మరో విచిత్రం ఏమిటంటే, ఆయన కవిత్వం ఆశువుగా చెప్పలేం .. కనీసం ఆయన వాక్యాలు కూడా..

కానీ.. తెలుగు కవిత్వం మీద ఆయన సంతకపు సిరా ..ఇంకా ఆరనిదే.. ఇప్పటికే కాదు ఎప్పటికీ

కవిగా కంటే , స్నేహశీలి గా బ్రతికి , నాన్నగా ఇంకా బ్రతికుంటే బాగుణ్ణు అని మీ హితుల్నీ, స్నేహితుల్నీ కరడుగట్టిన దుఖం లో ముంచి వెళ్ళిపోయారు అరుణ్ గారూ..

నిజానికి, నాకు బాధ కంటే , గర్వంగా ఉంది .. జీవితంతో, ఆరోగ్యంతో, కూడా .. దుష్ట రాజకీయాలపై పోరాడినంత ధైర్యంగా పోరాడి, నవ్వుతూ మ్యూజికల్గా మేజిక్ లా వెళ్ళిన వొక కవిని చూస్తే..

అయ్యా.. ప్రభూ.. మీ మ్యూజిక్ కి మరణం లేదండీ.. జీవన్మరణాల స్మరణ వదిలి.. heading towards a desired target of utopian humanity.. that lives and marches taking along vulnerable, sick, and underprevilaged along with it.. Its a song of life.. carefully orchestrated by your sentenses like musican arrows..!!

you are an inspiration Arun Ji.. a True Inspiration for mediocre human race drowning in life.. you are an achoring inspiration for all of us..!

తిరగరాస్తే..బతికే కథలు!

 

 

మీరో పేరాగ్రాఫ్ రాశారు. తర్వాత దాన్ని చదువుకున్నారు. అద్భుతంగా అనిపించింది. అంతకన్నా గొప్పగా మరెవరూ రాయలేరనిపించింది. అప్పుడు మీరేం చేయాలి?

ఆ పేరాగ్రాఫ్‌ని కొట్టిపారేసి మళ్లీ రాయటం మొదలుపెట్టాలి.

గొప్పగా రాయాలనుకునే వ్యక్తికి ఉండాల్సిన సుగుణం – తాను రాసిన వాక్యాలతో మొట్టమొదటిసారే ప్రేమలో పడకుండా ఉండగలిగే నిగ్రహం.

 

— —

‘ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే’ వంటి కళాఖండాల సృష్టికర్త ఆస్కార్ వైల్డ్‌ని ఓ రోజు మధ్యాహ్న భోజన సమయంలో పలకరించిన స్నేహితుడు “మిత్రమా, ఈ ఉదయమంతా ఏం చేశావు?” అన్నాడట.

“కష్టపడి పనిచేశాను,” అని బదులిచ్చాడు ఆస్కార్ వైల్డ్.

“అయితే చాలా పేజీలు రాసేసి ఉంటావేం?” స్నేహితుడి తిరుగు ప్రశ్న.

“లేదు,” అన్నాడు వైల్డ్. “కథ మధ్యలో ఓ చోట ఒక కామా పెట్టాను”

అదే సాయంత్రం డిన్నర్ సమయంలో ఆ స్నేహితుడు మళ్లీ తారసపడ్డాడు.

“ఏం మిత్రమా. మధ్యాహ్నమంతా ఏం చేశావేమిటి?”

“మరింత కష్టపడి పని చేశాను”

“అవునా. కథలో మరో కామా ఇరికించావా?,” స్నేహితుడి వ్యంగ్యం.

“లేదు. ఉదయం పెట్టిన కామా తొలగించాను”

 

——

పై పిట్టకథ అతిశయోక్తిలా అనిపించొచ్చు కానీ దాని వెనకో గొప్ప సాహితీ సత్యం ఉంది. చరిత్రలో ప్రసిద్ధి చెందిన రచయితలు చాలామందిలో ఉన్న సారూప్యత: తమ రచనల్ని  శ్రద్ధగా తీర్చిదిద్దటం. కొందరు దీన్నే ‘చెక్కటం’ అనీ అంటారు. అచ్చ టెల్గూలో చెప్పాలంటే ‘గివింగ్ ఫైన్ టచెస్’ అన్న మాట. సాహిత్యానికే కాదు – శిల్పాలకైనా, వర్ణచిత్రాలకైనా మరి ఏ ఇతర కళా రూపానికైనా ఈ చెక్కుడు ఎనలేని అందాన్నిస్తుంది. ఇది మీర్రాసే కథలకీ వర్తిస్తుంది. మీరు చేయాల్సిన పనల్లా మీ కథని కనీసం రెండు మూడు సార్లు తిరగరాయటం. కూరకి తిరగమోత ఎలాగో, కథకి తిరగరాయటం అలా.

అన్నట్లు – ‘చెక్కుడు’ అనే మాట వింటే కొందరు (తెలుగు) కథకులు, విమర్శకులు ఉలిక్కిపడటం నేను గమనించాను. చెక్కటం అంటే కథ ఆత్మని దెబ్బతీయటం అనీ, ఇంకోటనీ ఏవో వాదనలూ విన్నాను. వ్యక్తిగతంగా నేను ఇటువంటి వాదనల్ని కొట్టిపారేస్తాను. కథలోకి ఆత్మ ఎక్కడినుండో రెక్కలుకట్టుకుని ఎగురుకుంటూ వచ్చి తిష్టవేసుక్కూర్చోదు. అది కథకుడు పొదగాల్సిన పదార్ధం. చెక్కటం, సానబెట్టటం, మెరుగులు దిద్దటం – పేరేదైనా – ఆ ప్రక్రియ పొదిగే క్రమంలో ఓ భాగం. బహుశా చెక్కటం అంటే ‘నగిషీలు చెక్కటం’ అన్న అర్ధంలో తీసుకుని వాళ్లు పొరబడి ఉండొచ్చు. కథకి మెరుగులు దిద్దటం అంటే దానికి భాషాలంకారాలు జతచేయటమొక్కటే కాదు, అనవసరమైన చోట అలంకారాలు, పదాల పటాటోపాలు తొలగించటం, పునరుక్తులు పరిహరించటం, కథలోంచి  కొవ్వు కరిగించటం కూడా. ఇవన్నీ చేయాలంటే మీ కథని ఒకటికి రెండుసార్లు తిరగరాయటం తప్పనిసరి.

నా దృష్టిలో ఇదెంత ముఖ్యమైనదంటే – రచనకి సంబంధిన రహస్యాన్నొకదాన్ని చెప్పమంటే, నేనైతే “తిరగరాయటం” అనే చెబుతాను. కొందరు కథకులు “మేము మొదటిసారి ఏది రాస్తే అదే ఫైనల్” అని గొప్పగా చెబుతారు. వీరిలోంచి ఎన్నిసార్లు తిరగరాసినా మెరుగుపడని కథలు రాసేవారిని తీసేస్తే, మిగిలిన వారు చెప్పేదాంట్లో నిజానిజాలు వారికే ఎరుక. తిరగరాయటం అనేది తనకు అలవాటు లేని పనిగా షేక్‌స్పియర్ సైతం చెప్పుకునేవాడు. అందువల్లే ఆయన రచనల్లో చాలాచోట్ల ‘నస’ కనిపిస్తుందని బెన్ జాన్సన్ అనేవాడు. (బెన్ జాన్సన్ అంటే పరుగు వీరుడు కాదు. ఈ బెన్ జాన్సన్ వేరే. ఈయన షేక్‌స్పియర్ సమకాలీకుడు; ఆంగ్ల సాహిత్యానికి సంబంధించినంతవరకూ షేక్‌స్పియర్‌కి సరితూగే నాటక రచయిత, కవి, మరియు విమర్శకుడు).

నేను ‘కథాయణం’, ‘కథన కుతూహలం’ రెండు శీర్షికల్లోనూ కలిపి డజను దాకా అంశాలపై విపులంగా రాశాను. వాటన్నిట్లోనూ అతి తేలిగ్గా పాటించగలిగేది ఈ తిరగరాసే కార్యక్రమం. దీనికి కావలసిందల్లా కొంచెం సహనం, కాస్త సమయం. ఆ రెండిటికీ మించి, ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ అనే సామెత మీకు వర్తించకుండా ఉండటం. కథ రాసిన వెంటనే దాన్ని ఆవేశంగా ఏ పత్రిక్కో పంపించేయకుండా దాన్ని తిరగరాసి చూడండి. తేడా మీకే కనిపిస్తుంది. ఆ పని చేయటం ద్వారా, మీ కథ ప్రచురణకి ఎంపికయ్యే అవకాశాన్ని పెంచుకుని మీకు మీరే ఉపకారం చేసుకున్నవారవుతారు. అయితే తిరగరాయటం ఎంత ముఖ్యమో, మరీ ఎక్కువసార్లు తిరగరాయకుండా ఉండటమూ అంతే ముఖ్యం. మొదటి రెండు మూడు సార్లలో లేని మెరుగుదల ఆ తర్వాత వచ్చే అవకాశాలు దాదాపు శూన్యం. దాని వల్ల మీ సమయం వృధా కావటం తప్ప వచ్చేదేమీ లేదు.

చివరగా – ‘If you got it right the first time, then you are an anomaly’ అనేది సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రముఖ నానుడి. మీరు అలాంటి విపరీత మానవులైనా, లేక షేక్‌స్పియర్ అంతటి వారైనా మీ కథని తిరగరాయనవసరం లేదు. నాలాంటి మామూలు కథకుడైతే మాత్రం ఆ పని తప్పదు.

*

 

 

 

ఆ  పొలాల పచ్చని పిలుపు వినిపిస్తోందా?

 

~

 

శాఖా గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివేటపుడు వెనక చివరి పేజీ వరకూ పుస్తకం మిగిలి ఉందా లేదా చెక్ చేసుకుని చదవాలని చాలా పుస్తకాలు అసంపూర్ణంగా మిగిలి పోయినా నేను నేర్చుకోని పాఠం! అలా ఏళ్ల తరబడి అసంపూర్తి గా మిగిలి పోయిన వాటిలో ఈ “మరల సేద్యానికి” ఆ నవల కోసం చాలా ఏళ్ళు అన్వేషించినా ఫలితం లేక పోయింది. బెంగుళూరు లో ఒక స్నేహితుల ఇంట్లో “మరళి మణ్ణిగె” అని కన్నడ ఒరిజినల్ కనిపించింది. ఎదురుగా మంచి నీళ్ళున్నా దాహం తీరే వీలు లేదన్నమాట! కన్నడం రాదుగా! ఇంగ్లీష్ అనువాదం ఉందని తెల్సింది. చదవాలని పీకింది కానీ, తెలుగులోకి తిరుమల రామ చంద్ర అనువదించారు కాబట్టి, అది పూర్తిగా తెలుగులోనే చదవాలని కోరిక! ఇంగ్లీష్ వెర్షన్ తర్వాత ఆప్షన్ గా పెట్టుకున్నాను.

చివరికి హైద్రాబాద్ లోనే మిత్రుల సహాయంతో దొరికింది. అమ్మయ్య.. చదివేశాను వారం  రోజుల్లో! నిజానికి అది వారం లో  పూర్తయ్యే ఆషా మాషీ నవల కాదు. అది చదివేశాక, ఎన్నాళ్ల నుంచో ఉన్న ఖాళీ ఏదో పూడినట్లయి, వారం పది రోజుల పాటు ఎవ్వరినీ విసుక్కోకుండా సంతోషంగా ఉండాలనిపించింది.

నా ఇంటి లైబ్రరీ కోసం ఆ పుస్తకం కోసం ప్రయత్నిస్తుండగా, హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ ఆ పుస్తకాన్ని తిరిగి వేస్తూందని తెల్సి చాలా సంతోషం వేసింది.  పుస్తకం చేతికి వచ్చాక, వచ్చాక  “మూడు తరాల కథని, వందేళ్ల కథని, ఇన్ని పాత్రలతో, నిత్య జీవితంలోని ఏ ఒక్క సంఘటనీ  వదలకుండా ఇంత విస్తారంగా అల్లుకుంటూ పేనుకుంటూ ఎలా రాశాడీ కారంత్?” అని అబ్బురం కల్గింది.

శివరామ కారంత్ జ్ఞానపీఠ్ తో పాటు ఎన్నో అవార్డులు పొందిన రచయితగా కన్నడ సాహిత్య ప్రపంచంలో అగ్రస్థాయి రచయిత గా అందరికీ పరిచయమే!  1941 లో రాసిన  ఈ నవల పేరు కన్నడ లో “మరళి మణ్ణిగె” ! అంటే “తిరిగి మట్టికి” ( వ్యవసాయానికి) అని అర్థం. అయితే మట్టికి మరలడమనే మాట తెలుగులో అంత అర్థవంతంగా లేదు కాబట్టి  దాన్ని “మరల సేద్యానికి” అని అనువదించారు తిరుమల రామ చంద్ర! నవల రాసిన 36 ఏళ్ళ తర్వాత 1977 లో ఇది తెలుగులోకి అనువాదమైంది.

ఒక వందేళ్ళలో సాగిన మూడు తరాల కథ ఇది! ఈ మూడు తరాల జీవితాల్లోని ప్రతి సంఘటననీ, ప్రతి మలుపునీ, ఏ సూక్ష్మాంశాన్నీకూడా వదలక చిత్రీకరించిన  సుదీర్ఘమైన నవల! అయినా ఎంతో ఆసక్తితో చదివించే పుస్తకం కూడా!

marali mannige

దక్షిణ కర్ణాటక లో ఉడుపికి సమీపంలో, ఒక వైపు పడమటి కనుమలు, మరో వైపు సముద్రం పరచుకున్న చోట కోడి అనే చిన్న గ్రామం! అందరూ పేదవాళ్ళే! కొద్ది మంది బ్రాహ్మలూ, మిగతా కులాల వాళ్ళూ!కథా కాలం 1850 నుంచి మొదలవుతుంది. అంటే పూర్తిగా బ్రిటిష్ పాలన సమయం! ఐనా ఆ మారు మూల గ్రామం మీద దాని ప్రభావం ఏమీ కనిపించదు.రోజువారీ జీవితం లో శ్రమించడం, సముద్ర తీరంలో ఉన్న ఆ ఇసుక నేలల్లో వ్యవసాయం చేయడం, పక్క గ్రామాలకు నడిచి వెళ్ళడం, నది లో పడవైనా వాడక దాటి వెళ్ళడం ఇదే దినచర్య!

ఇది దాదాపు వందేళ్లలో నడిచిన ఒక మూడు తరాల కథ! మొదటి తరం వైదిక పురోహితుడు రామైతాళుడి తో మొదలవుతుంది. పౌరోహిత్యం చేస్తూనే తనకున్న పొలాన్ని భార్య పారోతి (పార్వతి) , వింతంతువై ఇల్లు చేరిన చెల్లెలు సరసోతి (సరస్వతి) తో కల్సి సాగు చేసి వ్యవసాయం కూడా ప్రధాన వృత్తిగా జీవిస్తుంటాడు. వరి, అనుములు, ఉలవలు ఇవే అక్కడ పండేవి. ఇసుక మేటలు వేసే ఆ పొలాన్ని బాగు చేయడం, చెరువు పూడిక మట్టి పొలాల్లోకి తెచ్చి నింపడం, చెరువు నీళ్ళు తోడి పొలాలకు పెట్టడం వంటి పనులన్నీ ఎక్కువగా సరసోతి, పారోతి వీళ్ళిద్దరే చేస్తుంటారు. పొదుపుకీ పిసినారి తనానికి మధ్యలో జీవించే రామైతాళుడు పొలాలు, తోటలు కొనడం, డబ్బు మూటలు గోడల్లో దాచడం లో తీరిక లేకుండా ఉంటాడు. ఎదురింటి మరో బ్రాహ్మడు శీనమయ్యరు , రామైతాళుడు ఒకరి ఎదుగుదల చూసి ఒకరు ఓర్చుకోలేరు.

ఐతాళుడు సంతానం కోసం రెండో పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి రోజు వచ్చేదాకా ఇంట్లో ఆడంగులకు కూడా చెప్పడు. కొడుకు లచ్చడు పుట్టాక వాడిని వైదిక విద్యకు పంపాలా వద్దా అనే ఆలోచన!! శీనమయ్యరు కొడుకులు బెంగుళూరు లో హోటళ్ళు పెట్టి రెండు చేతులా డబ్బు సంపాదిస్తుంటే మత్సరం పాలై, తన కొడుకుని వకీలు చేసి డబ్బు సంపాదించాలని నిశ్చయించుకుని వాడిని కుందాపురం ఉడిపి ల్లో ఇంగ్లీష్ విద్యకు పంపిస్తాడు. అది మొదలు తాను పోయే దాకా లచ్చడి గురించే బెంగ పెట్టుకుని ఆస్తి  లచ్చడి చేతిలో నిలబడదని గ్రహించి మొత్తం కోడలు నాగవేణి పేరున రాసి కాలం చేస్తాడు.

రెండో తరం లచ్చడిది. వాడు కోడి గ్రామం వదిలి స్కూలు విద్యకు కుందాపురం వెళ్ళగానే రెక్కులు విప్పుకున్న స్వేచ్చ వాడి సొంతమై పోతుంది. ఎన్నడూ చూడని అర్బన్ ప్రపంచం వాడి కట్లు తెంపేస్తుంది. ఇంట్లో చదువుకున్న వారెవరూ లేక పోవడం వల్ల  వాడి మీద అజమాయిషీ కూడా లేక పోవడం తో చదువుకుంటూనే మరో పక్క తోటి పిల్లలతో పాటు వ్యసనాలతోనూ స్నేహం కుదుర్చుకుని, హైస్కూలు దాటకుండానే స్త్రీ సాంగత్యం కూడా సంపాదిస్తాడు. జూదం, వ్యభిచారం ఈ రెండూ అలవాటై వాటికి కావలసిన డబ్బు కోసం అబద్ధాలు అలవాటు అనివార్యమవుతాయి.

IMG_2443

పెళ్ళి చేసుకున్న నాగవేణి మీద వాడికి ప్రత్యేకానురాగం ఏమీ ఉండదు. మంగుళూరులో మామగారింట్లో ఉండి చదువుకుంటూనే, తన వ్యాపకాల్లో తాను బిజీగా ఉంటాడు. తన సరసోల్లాస జీవితం తాలూకూ రోగ బంధాలు నాగవేణికి కూడా ప్రసాదించి, మామగారింట మర్యాద పోగొట్టుకుంటాడు. నాగవేణి కోడి గ్రామం చేరాక లచ్చడు కేవలం డబ్బు కావాల్సి వస్తే తప్ప కొంప మొహం చూడడు. తండ్రి పోయాక, నమ్మించి ఆస్తి మొత్తం నాగవేణి చేత రాయించుకుని దాన్ని అనతి కాలంలోనే స్వాహా చేస్తాడు.చిన్నప్పటి నుంచీ నిర్లక్ష్యం గానే పెరిగిన లచ్చడు కుందాపురం , ఉడిపి ల్లో విశ్వరూపం చూపిస్తాడు . పేకాట , హైస్కూలు దాటకుండానే స్త్రీలు , ఇతర వ్యసనాలు … ప్రతి దాన్నీ సహజంగా అనుసరించి ఇష్టం వచ్చిన లైఫ్ స్టైల్ ని స్వీకరిస్తాడు . ఈ క్రమం లో ఉచితానుచితాలు ఎలాగూ ఉండవు కాబట్టి , స్నేహితుడి భార్య  జలజతో సైతం సంబంధం నెరపడానికి వెనకాడడు  ! కొడుకన్నా వాడికి ప్రేమ లేదు.తండ్రి పోయినా తల్లి పోయినా, ఎలాటి బాధా ఉండదు. ఎక్కడెక్కడో తిరిగి డబ్బంతా పోయి, చివరకు తనతో పాటు శీనమయ్యరు కొడుకు ఒరటమయ్యర్ ని కూడా పతనం చేసి అనామకుడై పోతాడు. అయినా వాడిలో ఇసుమంతైనా పశ్చాత్తాపం ఉండదు. కారంత్ కి కూడా లచ్చడి మీద కోపమేమో,  మిగతా పాత్రలకు ఉన్న ప్రాధాన్యం  గానీ, వర్ణన గానీ, వాడి ఉత్థాన పతనాలు గానీ ఏవీ కారంత్ పట్టించుకోడు. వాడి ప్రస్తావన వచ్చినపుడల్లా క్లుప్తంగా ఇదీ సంగతి అన్నట్టు చిత్రిస్తాడు తప్ప వాడి వెర్షన్ గానీ, మనో భావాలు గానీ, పోనీ కుట్ర తాలూకు వాడి పథక రచన గానీ వేటినీ వివరంగా చెప్పడు.

డబ్బు, సెక్స్ ఇవే లచ్చడి గమ్యాలు! తన కొడుకు రాముడు పెద్దవాడై అతడిని చూడ్డానికి వెళ్తే “ఎందుకొచ్చాడటా?” అని పక్క వాడిని అడిగి రాముడి మనసులో రేకెత్త బోతున్న ప్రేమను నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తాడు. అంతటితో ఆగక ఆ ముసలి వయసులో కూడా రాముడి హోటల్లో స్నేహితులతో సహా వచ్చి పడి  తిని బిల్లు చెల్లించకుండా, నిర్లక్ష్యంగా ప్రవర్తించి కొడుకు మనసులో శాశ్వతం గా చోటు పోగొట్టుకుంటాడు . అందుకు సూచనగా అక్కడితో నవల్లో లచ్చడి ప్రస్తావన ముగిసి పోతుంది కూడా!

మూడో తరం ఐతాళుడు, తాత పేరు పెట్టుకున్న రాముడు ! వీడే కథను తీరం చేర్చే నాయకుడు. ఆధునిక భారత దేశం నిర్మితమవుతున్న వేళ , ఆత్మ విశ్వాసానికి, ఆదర్శ యువతకు ప్రతీక గా రాముడి పాత్ర సాగుతుంది.     పుట్టేనాటికే ఆస్తి మొత్తం పోయి దరిద్రం లో ఉన్న కుటుంబం, ఒక పూట తింటే రెండో పూట పస్తులు! తల్లి తప్ప ఎవరూ లేని జీవితంలో వాడికి తల్లే గొప్ప స్నేహితురాలు! చింకి బట్టలేసుకున్నా, అటుకులు నీళ్లతో కలిపి తిన్నా, సముద్రం ఒడ్డున ఆడుకున్నా తల్లే వాడికి తోడు. మేనమామల నిరాదరణ వాడికి అర్థం అవుతునే కోడి కి వచ్చేయడానికి సిద్ధమవుతాడు. తల్లికి ఏ మాత్రం కష్టం కలక్కూడదని పట్నంలో ట్యూషన్లు చెప్పి చదువుకుంటాడు. పినతల్లి ఇంట్లో కూడా ఉచితంగా తినడానికి ఒప్పని ఆత్మాభిమానం.

ఒకప్పుడు తనకు గొప్ప ఆస్తి  ఉండేదనీ, తండ్రి అది పాడు చెయ్యబట్టే తనీ దీన స్థితిలో ఉన్నాననే ఆలోచన ఒక్కసారైనా వాడి మనసులోకి రాదు . రేయింబవళ్ళు కష్టపడుతున్నా, చేతిలో పైసా లేక పోయినా ఉసూరుమనడు. ఆశను పోగొట్టుకోడు. వాడు ముంబాయి లో ఉద్యోగం కోసం పడే ఇబ్బందులు చదువుతుంటే భిభూతి భూషణ్ అపరాజితుడు గుర్తొస్తాడు. అలుపెరుగని యాత్రికుడు రాముడు.

వీటన్నిటి వెనుకా దాగి ఉండేది రాముడి కళా హృదయం! అంతకు మించి సముద్రం మీద ప్రేమ! పసి తనం నుంచే కోడి గ్రామపు సముద్రంతో వాడికి ప్రేమ! మంగుళూరులో సముద్రాన్ని చూసి “మన వూరి సముద్రం లా లేదేంటమ్మా” అని అసంతృప్తి పాలవుతాడు. చెన్నైలో సముద్రమూ వాడికి నచ్చదు. ఎలాటి హడావుడీ లేని ప్రశాంతమైన, ప్రకృతి నగ్న సౌందర్యాన్ని నిండా నింపుకున్న సముద్రం కావాలి వాడికి! వూరికి రాగానే బట్టలైనా మార్చుకోకుండా సముద్రం దగ్గరికి పరిగెట్టే పిచ్చి ప్రేమ! అందుకే వాడు చిత్రకారిణి  నోవాకి ప్రామిస్ చేసిన సముద్ర సౌందర్యాన్ని తన పెయింటింగ్ ద్వారా చూపించాలని నిశ్చయించుకున్నపుడు, కోడి సముద్ర తీరంలో మమేకమై గడుపుతాడు. ఎంత చూసినా తనివి తీరని ఆ అద్భుత సౌందర్యాన్ని  చిత్రించడం అసలు సాధ్యమేనా అని దిగులు పడతాడు. వాడి జీవితం పూర్తిగా అస్థిరమై, గతి లేని పరిస్థితుల్లో భోజన హోటల్లో పని చేయాల్సి వచ్చి, అమ్మను వూర్లో ఒంటరిగా వదిలి, స్థిరత్వం లేని పరిస్థితుల్లో సముద్రం సాన్నిహిత్యంలో సేద తీరగలుగుతాడు గానీ ఆ సౌందర్యాన్ని చిత్రించగలిగే హృదయం, శాంతి, మనస్థిమితం  లేక అశక్తుడై పోతాడు.

 

తిరుమల రామచంద్ర

తిరుమల రామచంద్ర

అమ్మ దగ్గరికి తిరిగి వచ్చేసి ఆ పల్లెలోనే ఉండాలని, వ్యవసాయాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న తర్వాత రాముడికి దక్కిన ప్రశాంతతను, శాంతిని వాడే స్వయంగా నిర్వచించుకోలేడు.  గమ్యం చేరిన స్థిర భావం, వాడిలో! ఎన్నడెరగని సంతోషం! కడుపు నిండా తిని కంటి నిద్ర చుట్టూ ఉన్నవాళ్లతో కల్సి తన సొంత పొలం లో తాను పంచుకున్న శ్రమ, తాను నీళ్ళు తోడిన పొగాకు తోట, తాను  పండించిన పంట, ఆ బెస్తవాళ్ళతో సాహచర్యం…రాముడి హృదయాన్ని నింపేస్తాయి. ఆ ప్రశాంతతలో ఆ నిండు తనంలో వాన కురిసి వెలసిన ఒక సాయంత్రం ఒక వైపు రౌద్రం, మరో వైపు ప్రశాంతత నిండిన తీరంలో ఆ కోడి సముద్రం అనంత సౌందర్యాన్ని వాడి కుంచె పట్టుకోగలుగుతుంది. అపూర్వమైన చిత్రాన్ని నోవాకి కానుక గా  పంపిస్తాడు.

పిల్లలందరికీ చదువు చెప్పాలనీ, బెస్త వాళ్లందరిలో తాగుడు మానిపించాలనీ, వరి, అపరాలు వంటివి కాక పొగాకు లాంటి వ్యాపార పంటలు వేసి సంప్రదాయం లోనే కొంత ఆర్థిక కోణాన్ని చూడాలని, గ్రామాలన్నీ వికాసం పొందాలని రాముడి అభిమతం! ఇవన్నీ ఆచరణ లో చూపిస్తాడు !

తండ్రి పోగొట్టిన బంధాలన్నీ తిరిగి సంపాదించి, బంధువులని సంపాదించుకోవాలని తాపత్రయ పడతాడు. సుబ్బత్త చెప్పిన సంబంధాన్ని చూడ్డాని వెళ్తాడు. తల్లి పెళ్ళి ప్రస్తావన తెస్తే “ఆ అమ్మాయి పొగాకు తోటలకు నీళ్ళు మోస్తుందటనా మరి?” అని తన శ్రమను పంచుకునే భాగస్వామి కావాలని సూచిస్తాడు. పెళ్ళి కూతుర్ని అలంకరించి చూపిస్తే “ఇందాక  ఆ డ్రెస్ లోనే (వాకిట్లో కళ్లాపి చల్లేటపుడే ) అందంగా ఉందే” అని చమత్కరిస్తాడు.

ప్రతి పాత్రనూ కారంత్ ఎంతో సవిస్తరంగా చిత్రించినా, మనసుకు హత్తుకు పోయి గౌరవాన్ని కల్గించేవి మాత్రం సరసోతి, నాగ వేణి, మూడో తరం రాముడి పాత్రలే!

ఈ నవల్లో స్త్రీ పాత్రల్లో రెండింటికి తప్ప మిగతా వాళ్ళకి పెద్ద ప్రాధాన్యం ఉండదు. ఆ ఇద్దరూ సరసోతి, నాగవేణి! 1950 ప్రాంతాల్లో సరసోతి లాటి స్త్రీ పాత్రని ఒక సంప్రదాయ కుటుంబంలో, అందులోనూ వింతంతువు విప్లవమే !! ! పుట్టింటితో బంధం పోకూడదని , అత్తగారింటి భరణం తో అన్న గారింట్లో ఉంటున్న సరసోతి ని రెబెల్ గా గుర్తించాల్సిందే! రెక్కులు ముక్కలయ్యేలా పొలం పని, చెట్లు కొట్టడం, మైళ్ల కొద్దీ దూరాలు నడిచి బరువులు మోసుకు రావడం వంటి బండ పన్లన్నీ సుకుమారాలు పోకుండా చేస్తుంది. న్యాయం అనుకున్న మాట మొహాన్నే కుండ బద్దలు కొడుతుంది. ముసుగేసుకుని తిరిగే ఆ ముప్పయ్యేళ్ల ధీర సరసోతి , అన్నిటికీ మించి అన్నగారి బుద్ధిని, కుటిలత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టి పారేస్తుంది. పండిన పంట నాలుగు మూటలు ఎక్కువ వస్తే తమకు చెప్పకుండా దాచిన రామైతాళుడిని ” ఏం? రెక్కలు ముక్కలు చేసుకోడానికి పనికొస్తాం గానీ, పంట ఎక్కువొచ్చిందని చెప్పడానికి ఆడ వాళ్ళం పనికి రామా?” అని నిలదీసినా , పొరుగింటి వాడి పంట వానకు మురిగి పోతే “రంకున పుట్టె, జగడాన చచ్చె అన్నట్టు, పోతే పోయింది లే వూరికే వచ్చిన డబ్బేగా?” అని మత్సరం చూపించే అన్నని “పరాయి వాడిని చూసి ఎందుకంత మత్సరం అన్నా నీకు? నీకు మాత్రం ఊరికే వచ్చింది కాదూ? దక్షిణలు కూడేస్తే వచ్చిన డబ్బేగా, నీకు ఎక్కువొస్తే గర్వమూ, ఎదుటివారికి పోయిందని  సంతోషమూనా” అని చీవాట్లు వేసినా సరసోతి కే చెల్లు!

Return to earth

తనకు పారోతికీ చెప్పకుండా సంబంధం కుదుర్చుకుని వచ్చిన అన్న మీద మండి పడుతుంది. “ఇంట్లో ఆడవాళ్ళకు చెప్పే పనే లేదా”  అని శీనమయ్యరు ముందే నిలదీస్తుంది. అప్పట్లో రెండో పెళ్ళి మామూలు విషయమే కాబట్టి దాన్ని అంగీకరిస్తూనే, పారోతి గౌరవానికి భంగం వహిస్తే సహించనని అన్నకు స్పష్టం చేస్తుంది. కొత్త పెళ్ళి కూతురికే కాదు, పారోతికి కూడా నగలు చేయించాల్సిందే అని పట్టుబడుతుంది.నిజానికి ఆ ఇంటికి ఒక ఒంటి స్థంభం లా చివరి వరకూ సరసోతి నిలబడుతుంది.  పారోతి మీద చివరి వరకూ శ్రద్ధ చూపేది సరసోతి ఒక్కతే ! నవల సాగుతూ పోతుంటే సరసోతి మీద అభిమానం పెరిగి పోతూ ఉంటుంది .

నాగవేణి నవల చివరి వరకూ ఉండే పాత్ర! కొడుకు కి గొప్ప స్నేహితురాలు. కష్టాలు చుట్టు ముట్టి, ఒంటరిదైనా ఫిడేలు సాయంతో ఊరట పొందుతూ, అన్నిటినీ ఆత్మ గౌరవంతో  అధిగమిస్తుంది.

ఈ మూడు తరాల కథను కారంత్ 30 అధ్యాయాల్లో అదీ 30 రోజుల్లో ముగించారట. అది ఆయనకు ఎలా సాధ్యమైందో గానీ ఈ నవలను వేగంగా చదవలేం ! నెమ్మదిగా, నవల లోని జీవన విధానానికి తగ్గట్టుగానే, ఎలాటి తొందరా లేకుండా తాపీగా నడుస్తూ పోతుంది ఈ కథ. పారోతి, సరసోతి ల దిన చర్య ను, సంఘటనల వారీ గా పూర్తిగా వివరిస్తాడు రచయిత. కట్టెలు ఎండబెట్టుకోడం, పొన్న కాయలను నూనె గానుగ కు పంపి దీపాలకు నూనె ఏర్పాట్లు చూడటం, వేసవి లో మైళ్ళ కొద్దీ నడిచి సరసోతి మామిడి కాయలు ఊరగాయ కోసం తీసుకు రావడం, కొద్దిలో జరిగే వంట, ఏ కాలక్షేపమూ లేని వాళ్ల జీవితాల్లో పని మాత్రమే కాల క్షేపంగా సమయం గడిచి పోవడం..ఇదంతా సవిస్తరంగా చిత్రిస్తాడు. ఎలాటి హడావుడి లేని ఆ రోజుల ప్రశాంత జీవితంలోని ప్రతి రోజుని, ప్రతి సంఘటననూ రచయిత వర్ణిస్తూ, వివరిస్తూ పోయినా ,అది ఎంత నెమ్మదిగా సాగినా పాఠకులకు ఆసక్తి కల్గిస్తూ పోతుందే తప్ప విసుగు పుట్టదు. అనుక్షణం వినిపిస్తూ ఉండే ఆ పడమటి సముద్రం హోరు, వదలని ముసురు వాన, ఇంటి ముందు చెరువు, సముద్రంలో కలిసే ఆ నది, కొబ్బరి, పనస, పొన్న చెట్లు ఇవన్నీ వాళ్ల జీవితం లో ఒక భాగంగా కల్సి పోయి నవల పొడుగునా పాఠకుడితో ప్రయాణిస్తుంటాయి. నవల లో కాలం  నడుస్తూ ముందుకు కదలడంతో పాటే కథలో , సమాజం లో వచ్చే మార్పులు అత్యంత సహజంగా కథతో పాటే జరిగి పోతాయి. కథే మారుతున్న సమాజాన్ని కళ్ళకు కడుతుంది.  సముద్ర తీరపు ఇసుక నేలల్లో వ్యవసాయం  ఎంత కష్టమైనా, అక్కడ ఏది పండించాలన్నా ఎలాటి ఆధునిక పని ముట్లూ లేని కాలం లో ఎంతటి శరీరక శ్రమతో కూడిన పనో అయినా ఎవ్వరూ వెనుకాడరు . పంట పొలాల్లో పేరుకున్న ఇసుక ఎత్తి పోయడం, చెరువు పూడిక మట్టిని తట్టలతో తెచ్చి పొలాల్లో నింపడం ,నీటి వసతి లేని ఆ పొలాలకు చెరువు నుంచి కడవలతో నీటిని తెచ్చి పోయడం  వీటన్నిటిలో రామైతాళుడి  కంటే ఆ ఇంటి ఇద్దరు స్త్రీలే ఎక్కువగా పాలు పంచుకుంటారు . వాళ్లతో పాటే వాళ్ళ పాలికాపు కుటుంబమూ  రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ నాలుగు గింజలు పండే పరిస్థితి ఉండదు . ఏవి వస్తువో,సేవో కొనుక్కున్నా వడ్లు కొలిచే రోజులు కావడం వల్ల పండించక తప్పదు!

ఈర్ష్యాసూయలు కాలాతీతాలు! అందుకే కులానికి ఒకటే అయినా శీనమయ్యరూ, రామైతాళులూ ఒకరి అభివృద్ధిని మరొకరు ఓర్వలేకపోతుంటారు. శీనమయ్యరు కొడుకులు బెంగుళూరు లో హోటళ్ళ వల్ల డబ్బు సంపాదిస్తున్నారని తెలిసి “అన్నం అమ్ముకుని బతికే గతి మనకేమి?” అని రామైతాళుడు ఎద్దేవా చేస్తే , లచ్చడిని వకీలు చేద్దామన్న రామైతాళుడి ప్రయత్నాల్ని శీనమయ్యరు నలుగురి ముందూ ఎగతాళి చేస్తుంటాడు.  ఉడుపి లో హోటల్ నడిపే బ్రాహ్మడు కిట్టు ఉపాధ్యాయ భార్య జలజ లచ్చడు, అతని స్నేహితులు మరి కొందరితోనూ శారీరక సంబంధాలు పెట్టుకుని నైతిక విలువల నిర్వచనం ఏ కాలం లో అయినా సాపేక్షం  మాత్రమే అని రుజువు చేస్తుంది.

ఎలాటి సద్దూ లేని ప్రశాంతమైన ఆ పల్లె నుంచి లచ్చడు కుందాపురం, ఉడిపి లకు చదువు కోసం చేరినపుడు అక్కడి వాతావరణం, స్నేహితులు, హాస్టలు వసతిలో ఉండటం ఇలాటివి నెమ్మది నెమ్మదిగా పల్లె పట్నం వైపు జరిగి పోవడాన్ని చిత్రిస్తూ పోతాయి. అందుకే లచ్చడు సెలవులకు ఇంటికి వచ్చినా వాడికి ఇల్లు నచ్చదు. ఈ విపరీత ధోరణి గమనించే సరసోతి అంటుంది “ఇంగ్లీషు చదివితే ఇంటివారే పరాయి వారవుతారు” అని!  నిజానికి సరసోతి అమాయకత్వం వల్ల ఇంగ్లీషు చదువుని ఆక్షేపించడమే గానీ, అది పట్న వాసపు పోకడలకు సంబంధించిన మాటే! నాగరీక జీవితం అనేది నాగరికంగా ఉంటుందో ఉండదో గానీ, స్వచ్చత మాత్రం లోపించే తీరుతుందని లచ్చడే రుజువు చేస్తాడు.

లచ్చడి నిర్వాకాల వల్ల ఆస్తి మొత్తం పోయిన తర్వాత అందర్నీ పోగొట్టుకున్న నాగవేణి కొడుకుతో మంగుళూరు చేరిన కాలానికే మనుషుల మధ్య బంధాల నిర్వచనాలు నెమ్మదిగా మారి పోతుంటాయి. చెల్లెలే  ప్రాణంగా మెలిగిన సదాశివుడు, అతడి తమ్ముడూ  కొంత ఉదాసీనంగా వ్యవహరించడం, ఖర్చుల విషయంలో కొంత నిక్కచ్చిగా ఉండటమూ, మేనల్లుడి చదువు ఖర్చు విషయమై ఇద్దరూ వంతు వేసుకున్నట్టు ప్రవర్తించడమూ జరుగుతుంది. తండ్రి పోయాక నాగవేణిని బాబాయి నారాయణయ్యరు తమ ఇంట్లో ఉండమంటే ఆయన కొడుకులు, ఒకప్పుడు నాగ వేణితో ఆడి పాడి ఒక కుటుంబంగా కల్సి ఉన్న వాళ్ళే, నాగవేణిని ఉండమని బలవంతం చేయొద్దని కరాకండీ గా చెప్పేస్తారు తండ్రికి! నగర జీవితపు పోకడలు బంధుత్వాలను తేలిక పరుస్తుంటాయి.

ఎప్పటికీ మారక విశ్వాసంగా ఉండేది ఐతాళుల ఇంటి ముంగిట ఉన్న పాలి కాపులే! చివరి వరకూ వాళ్ళే నాగ వేణికి, ఆమె కొడుక్కి కూడా అండగా నిలుస్తారు.

Sivarama karanthనవల మొత్తం మీద కథతో పాటే ప్రయాణిస్తూ ఉండేది మాత్రం సముద్రం! కోడి గ్రామంలో ఇంటికి వంద గజాల దూరంలోనే సముద్రం! కథంతా నిత్యం ఆ హోరులోనే, సముద్రం మీద నిండైన సూర్య చంద్రుల అందాలతో, పట్నం మాలిన్యం, కాలుష్యమూ అంటని స్వచ్చమైన సముద్రం, దగ్గర్లోని కొబ్బరి తోటల టప టపలతో హోరు మిళితమైన సుందర సంగీతం నేపథ్యంలో ఆ నిశ్శబ్ద గ్రామం సైతం కువ కువలాడేలా చేస్తుంది. మంగుళూర్లో సముద్రం, రాముడు మద్రాసు వెళ్తే అక్కడా వదలని దక్షిణ సముద్రం! అందుకే రాముడు తన పసి తనం లోనే సముద్రంతో ప్రేమలో పడతాడు.

నవలా కాలం 1850 నుంచి మొదలు కావడం వల్లనేమో ప్రాచీన  దక్షిణ కర్ణాటక సంస్కృతి, ఆచార వ్యవహారాలు విస్తృతంగా కనిపిస్తాయి! కన్నడ బ్రాహ్మల తిండి అలవాట్లు (మనకు పరిచయం లేక పోవడం వల్ల)కొంత వింతగానూ, మరి కొంత ఆసక్తి గానూ తోస్తాయి. ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్లతో పాటు బెల్లం ముక్క ఇవ్వడం, లేదా ఆకులో పెట్టిన వూరగాయ ముక్క తో మంచి నీళ్ళు ఇవ్వడం, నీళ్లలో నానేసిన అటుకులు తినడం, కాఫీకి బదులుగా పెసర గంజి ఇవ్వడం వంటివి! చిరుతిండి గా కోడి గ్రామంలో కేవలం అప్పడాలు వడియాలు మాత్రమే కనిపిస్తుంటాయి. పెళ్ళి చూపులకు వచ్చిన వాళ్లకు కూడా అవే!

అనేక చోట చామ కూర అట్లు, పనసకాయ, గెనుసు గడ్డ (చిలగడ దుంప) అప్పడాల ప్రస్తావన వస్తుంది. పనసకాయతో అప్పడాలు ఎలా చేస్తారో అర్థం కాలేదు గానీ, మొత్తానికి అవి నాకు కూర్గ్ లో ఒక స్నేహితుల ఇంట దొరికాయి.

అప్పటి ఆచార వ్యవహారాలు, పట్టింపులు అన్నీ నవల్లో సుస్పష్టం. లచ్చడు ఉడిపి లో హోటల్ లో తిన్నాడని తెల్సి “ఆ కామత్ ల హోటల్లో తిని ఆచారం మంట పెడతావా”అని సరసోతి మండి పడుతుంది.

అసలు మొత్తం మీద కర్నాటక బ్రాహ్మల్లో చాలా మందికి భోజన హోటల్ పెట్టడం ఒక రివాజైన కొలువుల్లో ఒకటి గా అర్థమవుతుంది. శీనమయ్యరు కొడుకులు బంధువుల హోటల్లో పని చేసి ఆ పైన సొంత హోటల్ పెడతారు. వేద పాఠశాల నడిపే సుబ్రాయ ఉపాధ్యాల కొడుకు కిట్టు ఉపాధ్యాయ కూడా  కుందాపురం లో చిన్న పాటి హోటల్ ప్రారంభిస్తాడు ! ఆస్తి మొత్తం తీసుకు పోయిన లచ్చడు కూడా హోటల్ పెట్టి నష్ట పోతాడు. ఒరటమయ్యరుదీ అదే దారి! చివరికి రాముడు కూడా హోటల్లో పని చేయక తప్పదు.

ఇంత పెద్ద నవలను  కారంత్ 30 రోజుల్లో రాయడం ఒక ఎత్తైతే, డాక్టర్ తిరుమల రామచంద్ర దాన్ని అంత అద్భుతంగానూ తెలుగులోకి అనువదించడం విశేషం! ఈ నవల్లోని దక్షిణ కర్నాటక మాండలికాలకు నిఘంటువుల్లో కూడా సరైన అర్థాలు దొరకని పరిస్థితిలో ఎంతో శ్రద్ధగా వాటి అర్థాలను అన్వేషించి కన్నడం నుంచి నేరుగా తెలుగులోకి అనువదించారు. ఇంగ్లీష్ లోకి ఈ నవల మొదట ఈ నవల వెలువడిన పధ్నాలుగేళ్ళకి ఏ. ఎన్ మూర్తీ  “Return to Earth ” పేరుతో అనువదించారు. అయితే అది కొంత సంక్షిప్త రూపంలో ఉండటం తో పద్మా రామ చంద్ర శర్మ  అనే ఇంగ్లీష్  టీచర్ (ఈమె ఆఫ్రికా దేశాల్లో కూడా పని చేశారు) తిరిగి ఆ నవలను ఆంగ్లం లోకి అనువదించారు

అంత విస్తారమైన నవలను సంక్షిప్త రూపంలో చిన్న పిల్లలకు కథ చెప్పినట్లు సరిపెడితే కుదరదంటారామె! అందుకే ఆ దక్షిణ కర్ణాటక మాండలికాల్ని వెదికి పట్టుకుని , రోజువారీ దినచర్య లోనీ ప్రతి ఘట్టాన్నీ వర్ణన అనే భావనకు అతీతంగా చిత్రిస్తూ పోయిన కారంత్ శిల్ప చాతుర్యాన్ని తానూ వీలైనంత సవిస్తరంగాగే అనువదిస్తూ, మూలం లోని flavor  పోకుండా చూడ్డానికే ప్రయత్నించానంటారు . అనువాదకుల సృజనాత్మకత అనువాదం లో కనిపించవచ్చని అంగీకరిస్తూనే “అనువాదకుడు గాలి పటం లాటి వాడు. ఎంత ఎత్తైనా స్వేచ్చగా ఎగరొచ్చు గానీ, అదుపులో మాత్రం ఉండాలి ” (మూలం నుంచి దూరంగా జరగ కూడదని)అని పద్మ అంటారు. ఆ పనిని తిరుమల రామ చంద్ర అక్షరాలా నెరవేర్చారు. కన్నడ సువాసనలు ఏ మాత్రం తగ్గకుండానే రామైతాళుడిని, నాగవేణి, సరసోతి, పారోతి, రాముడు, పాలి కాపు సూరడు, అతడి కోడలు బచ్చి.. అందర్నీ తెలుగు వాకిట్లోకి తెచ్చి మనతో చేతులు కలిపిస్తారు. సరసోతి ని అభినందిస్తూ, నాగవేణి తో సహనుభూతి పొందుతూ, రాముడితో పాటు ప్రయాణిస్తూ వాడి కష్టాలు చూసి చివుక్కుమన్నా, వాడు చేరుకున్న పచ్చని గమ్యం చూసి పాఠకుడు హాయిగా నిట్టూర్చేలా ,  నవలంతా తానై పరుచుకుని ఈ మూడు తరాల జీవన ప్రయాణానికి సాక్షిగా నిల్చిన కోడి గ్రామపు సముద్రానికి వీడ్కోలు చెప్పి పుస్తకం మూసేలా చేస్తారు.

వనవాసి నవల్లో భిభూతి భూషణ్ లాగే కారంత్ కూడా వ్యవసాయ వృత్తిని వదిలి పట్నం వైపు పరుగులు తీస్తున్న వారి గురించి ఏమీ గగ్గోలు పెట్టరు నవల్లో! పట్నం చేరి పతనమై పోతున్న లచ్చడిని,శీనమయ్యరు పిల్లల్ని చూస్తున్న పాఠకుడు “అయ్యయ్యో, వ్యవసాయం వదిలి, పల్లె వదిలి ఎంత పని చేశారు వీ”ళ్ళనే ఆందోళన చెందేలా చేస్తారు.

ప్రకృతికి శ్రమను ధార పోయడంలో రాముడు పొందిన సంతోషం, తృప్తి చూస్తున్నపుడు , వాడు తన తాతగారి జీవన శైలికి,వ్యవసాయానికి తిరిగి వచ్చినపుడు.. తెలీని రిలీఫ్ ని పాఠకుడు పొందుతాడు. వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే కాదు, ఆర్థిక స్వావలంబన కూడా అందులో ఒక అంశంగా ఉండాలంటాడు కారంత్! అందుకే రెండు తరాలకు కింద రెక్కలు ముక్కలు చేసుకుని ఆ ఇసుక నేలల్లో సరైన ఎరువులు కూడా లేకుండా వరి, ఉలవలు,మినుములు దోసకాయలు పండించిన రామైతాళుడి కుటుంబం లో రాముడి తరం పొగాకు పండిస్తుంది.

బెస్త వాళ్ళు పట్టిన చేపల్ని చూడ్డానికి సైతం “ఛీ “అనుకునే ఆ కుటుంబం లో రాముడు పొగాకు పంటకు “చేపల ఎరువు” వేస్తాడు. పని చేయడానికి మాత్రమే పాలికాపుని ఉపయోగించుకున్న రామైతాళుడి తరం వాళ్ళు అంతకు మించి సూరడి కుటుంబంతో పెద్దగా  మాటలు నెరపరు. “మీ శూద్రుల రాత అంతేరా ! బ్రాహ్మల ఇంటి  పాయసానికి నాలుకు పీక్కుంటారు గా ” అని మాట్లాడతాడు కూడా !! రాముడు ఇరవయ్యేళ్ళకే జీవితంలో ఎంతో చూసిన వాడు కాబట్టి , పట్న వాసం చేసి వచ్చిన వాడు కాబట్టి ఆ నాటి ఆచారాలను ఎంత వరకూ పాటించాలో, ఏది మూర్ఖత్వమో గ్రహించిన వాడూ కాబట్టి పాలి కాపుతో హాస్యాలు చమత్కారాలు ఆడుతూ వాళ్లతో కల్సి పని చేస్తాడు. బెస్తల కుటుంబాల తో కల్సి తిరిగి ఎర్ర సీసాలు (తాగుడు) మానమని ప్రోత్సహిస్తాడు

“నా కొడుక్కి రాసేది చదివేది నేర్పు దొరా! నాకు చూడు చదువు రాక ఎంత కష్ట పడుతున్నానో” అని బెస్తల చెన్నడు అంటే, “అది రాకుంటేనే నయం రా! మా నాన్నకు చదువు వచ్చే, ఆస్తి ఉడుపి కోమట్ల వశమైంది” అని హాస్యాలాడతాడు.

“నాకూ ఫిడేలు నేర్పుతారా” అని చెన్నడు అడిగితే “సరే, ముయ్యి కి ముయ్యి(చెల్లుకు చెల్లు), నీవు నాకు వలలు పన్నేది నేర్పు, నీకు నేను ఫిడేలు నేర్పుతా”నంటాడు.

రాముడి లా ఆలోచించి, వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలి పెట్టి పచ్చని ప్రకృతి వొడి వైపు పరుగులు తీసే యువత అక్కడక్కడా మనకి కనిపించక పోరు.ఫేస్బుక్ లో దీప్తి రెడ్డి వంగల అనే అమ్మాయి ని చూస్తుంటాను.ఎకరాల కొద్దీ సేంద్రియ (organic ) వ్యవసాయం అలవోక గా చేస్తూ, పంటల్ని బళ్ళకెత్తుతూ ఉంటుంది.  ఈనాడు నుంచి వుద్యోగం విరమించిన హేమ సుందర్ అనే పాత్రికేయుడు , వ్యవసాయం వైపు మరలి , డయాబెటిక్ బియ్యాన్ని పండిస్తున్నారు ! అమెరికా నుంచి తిరిగొచ్చిన మరో మహిళ శ్రీకాకుళం దగ్గర, ఇంజనీరింగ్ చదిన కుర్రాడొకడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి మరొకరు.. ఇలా వ్యవసాయం మీద ఆసక్తి చూపిస్తున్న వాళ్ల గురించి ఈ మధ్య ఒక టీవీ కార్య క్రమంలో చూసి ఎంతో సంతోషం వేసింది. ఈ క్రమంలో పట్నం నుంచి పల్లెలకు మళ్ళిన యువ రైతులెవరైనా ఇంకా ఉన్నారా అని “young farmers in AP and Telangana అని వెదికితే, లెక్కకు మించి యువరైతుల ఆత్మ హత్యల వార్తలు పేజీల కొద్దీ ప్రత్యక్షమై బెంబేలెత్తించాయి :-( ! కొత్తగా వ్యవసాయం మొదలు పెట్టినా పెట్టక పోయినా, వ్యవసాయం కుటుంబాల నుంచి వచ్చిన వారు సొంత గానో , కనీసం కౌలుకి ఇచ్చో వ్యవసాయాన్ని కూలి పోకుండా కాపాడితే ఎంత బావుంటుంది !! రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి పంట భూముల్ని ఇవ్వాలనే ఆలోచన ఎంత దుర్మార్గం ! భూమిని  నిలువునా హత్య చేయడం ఎంతటి నేరం !!

రాజధానుల పేరుతోనో , రియల్ ఎస్టేట్ పేరుతోనో ప్రపంచకీరణ వైపుగా పయనిస్తూ , వ్యవసాయ భూములన్నీ మాయమై కాంక్రీటు అడవుల్లా మారి పోతున్న కాలంలో, వ్యవసాయం చేయలేక పిట్టల్లా రాలి పోతున్న రైతుల ఆత్మ హత్యల కాలంలో.. చదువుకుని, పట్నంలోని శూన్యాన్ని , అనుభవంతో అవగతం చేసుకుని సేద్యానికి తిరిగి మరలిన రాముడే ఇప్పుడు కావలసిన మోడల్! వ్యవసాయాన్ని మర్చి పోయి నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరూ తిరిగి ఆ వైపుగా, సేద్యానికి మరలి వెళ్లాలన్నదే ఈ నవల ఇచ్చే పిలుపు! మనకిప్పుడు వందలమంది రాముళ్ళు కావాలి !!

___ 

 

ఇక్కడ…….. రాళ్లు కూడా మాట్లాడతాయి!

 

గూడెం పరిసరాలు అలవాటు అవుతున్నాయి . మొదట్లో కుతుహలంగా , ఆరాగా , సంశయంగా నన్ను , నారాకని వెంటాడే  చూపులు మెల్లి మెల్లిగా స్నేహంగా, ఎదురుచూస్తున్నట్లుగా ఉంటున్నాయి. నాకు కూడా ఇప్పుడు ఆ పరిసరాలు ఎంతో ఆత్మీయంగా అనిపిస్తున్నాయి . ఆ పిల్లలు చదువుకోవటం కోసం ఏదైనా చెయ్యాలని ఇష్టంగానే మొదలు పెట్టినా నా రాకని అక్కడ ఎంతవరకూ ఆహ్వానిస్తారో అన్న కొద్దిపాటి జంకు మాత్రం మొదట్లో ఉండేది .

ఇప్పుడైతే అది నా సామ్రాజ్యం అన్నంత ధీమా ! దారి పొడవునా పలకరింపులు కి సమాధానాలు చెబుతూ వెళ్లటం అలవాటైపోయింది .

‘ టీచరమ్మా, అప్పుడే వస్తున్నావూ? ఇంటికెళ్ళి కాస్త టీ నీళ్ళన్నా తాగొస్తున్నావా లేదా?’ చేటలో బియ్యం చెరుగుతూ ఆ పెద్దావిడ ఎప్పటిలాగే పలకరించింది. సమాధానంగా తలూపేను.

స్కూలు నుండి వస్తూనే పుస్తకాల సంచీలు గుమ్మాల్లోకి విసిరి, రోడ్డు మీద ఆటల్లో మునిగిపోయిన పిల్లలు మాత్రం ‘టీచర్, ఇప్పుడే వస్తాం ‘ అని ఓ కేక పెట్టేరు అయిష్టంగానే. తనకు తెలుసు వాళ్లకి ఆటలు ఎంత ఇష్టమో! అసలు ఆటలు వాళ్ల హక్కు కాదూ? కానీ… చదువుకోవద్దూ !

వీధి కుళాయిల దగ్గర స్కూలు యూని ఫారాల్లో ఉన్న ఏడెనిమిదిమంది ఆడపిల్లలు, ఒకరిద్దరు మగ పిల్లలు నీళ్లు పడుతూ ఇబ్బందిగానే  నవ్వు ముఖాలు పెట్టేరు .

ఆ రోజు కమల నాకు గూడెం పరిచయం చేస్తూ చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో స్పష్టంగా వినిపిస్తున్నాయి.’టీచరుగారు, ఇక్కడ ఆడవాళ్లు, మగవాళ్ళు పెద్దవాళ్లంతా రోజూవారి పనుల్లోకి వెళ్లిపోతారు. పిల్లలు స్కూలు నుండి వచ్చి ఇంటిపని, వంట పని చేసిన తర్వాతే క్లాసుకి రాగలుగుతారు.’

నిజమే, నేను వెళ్లిన కాస్సేపటికి ఒక్కొక్కరూ తమ పనులు ముగించుకుని పుస్తకాలతో వచ్చి కూర్చుంటారు. ఆ ముఖాల్లో అలసట చూస్తే మనసు చివుక్కు మంటుంది. ఆ అలసటని మాయంచేసే మంత్రదండమేదైనా నాచేతిలో ఉంటే ఎంత బావుణ్ణు !

వీళ్ళకి ఇంకో అరగంట పడుతుంది పనులు తెముల్చుకు వచ్చేందుకు. ఈలోగా చిన్న పిల్లల చేత అక్షరాలు దిద్దించి వాళ్లని పంపెయ్యాలి . క్లాసుకోసం కేటాయించిన వరండాలోకి చేరేను . నన్ను చూస్తూనే సుమజ పరుగెత్తుకెళ్లి కుర్చీ తెచ్చివేసింది . పాస్టర్ గారింట్లో దాచి పెట్టిన చాపలు తెచ్చి పరిచింది . మైఖేల్ పరుగెత్తుకుంటూ వెళ్లి బోర్డ్ తెచ్చి గోడకి తగిలించాడు.

ఎవరూ చెప్పకుండానే ఎంతో సహజంగా వాళ్లు అవన్నీ అమర్చేసేరు . ఈ పిల్లలు ఏదైనా సాయం చెయ్యాలంటే ఎవరికోసమైనా సరే ముందు ఉంటారు . బహుశా పెద్దలనుండి చూసి నేర్చుకుంటున్నారేమో ! సహజీవనం అనే మాటకి సరి అయిన అర్థం ఇస్తున్నాయి గూడెంలో నేను చూస్తున్న జీవితాలు. బయటి నాగరిక ప్రపంచం కంటే ఇక్కడ మనుషుల మనసులు విశాలమనిపిస్తూంది.

అరగంట గడిచి, మెల్లిగా పెద్ద పిల్లలు రావటం మొదలైంది . అటెండెన్స్ తీసుకుంటూంటే రాజు క్లాసులో లేకపోవటం గమనించేను . నిన్నా రాలేదు . ఏమైంది? అడుగుదామని తలెత్తితే వరండా ప్రక్కనుంచి సైకిల్ నడిపించుకుంటూ  వెళ్తున్నాడు .

‘ రాజూ, క్లాసుకి టైమైంది , పుస్తకాలు తెచ్చుకో’  క్రితం రోజు విషయం మాట్లాడకుండా పిలిచేను.

‘రేపొస్తాను టీచర్,  సెంటర్ దాకా వెళ్లాలి, సైకిల్ పంక్చర్ పడింది. ‘

‘క్లాసు అయ్యేక బాగు చేయించుకో . నిన్న కూడా నువ్వు రాలేదు’ సీరియస్ గానే చెప్పేను.

‘ఈ రోజు రాను టీచర్ ‘ అంటూనే వాడు సైకిల్ పట్టుకుని ముందుకెళ్లిపోతున్నాడు. క్లాసులో పిల్లలంతా పుస్తకాల్లోంచి తలలు పైకెత్తి చూస్తున్నారు . జాన్ చెబుతున్నాడు,

‘ టీచర్, నిన్న రాత్రి రాజుని వాళ్ల నాన్న బాగా కొట్టేడు సైకిల్ బాగు చేయించలేదని.’

పిల్లల్ని పిల్లల్లా చూడరే ఇక్కడ.  వాళ్లు కూడా పెద్దల్లాఉండాలి. ఇంటి జరుగుబాటులో పెద్దలతో సమంగా బాధ్యత తీసుకోవాలి. వాళ్లకి పిల్లలుగా హక్కులు ఏవీ లేవు. పుడుతూనే బాధ్యతలతో పుడతారు. పైగా ఇంటికి కనీసం ముగ్గురు లేదా నలుగురు పిల్లలు. ఆలోచనల్లోంచి ఉలిక్కిపడ్డాను……………………………..

వెనుక నుంచి పెద్ద కేక ! వెనకింటి వరండాలో ఉన్న ఒక వ్యక్తి బయటకొచ్చాడు,

‘ మేష్టరమ్మా, నువ్వు ఉండు. నేను చెబుతా వాడికి ‘ ,అంటూనే ‘అరేయ్, మేష్టరమ్మ పిలుస్తూంటే వినబడ్డంలా?’ అంటూనే వంగి నేల మీద దేనికోసమో వెదికేడు, మరు క్షణం అతని చేతిలో ఒక పెద్ద రాయి ! ఏం జరుగుతోందో నాకు అర్థం అయ్యేలోపు అతను ఆ రాయిని రాజు మీదకి విసిరి ముందుకు పరుగెత్తాడు. సైకిల్ ప్రక్కన పడేసి, నేల మీద మరో రాయి అందుకుని రాజు అంతే వేగంగా దాన్ని వెనక్కి విసరడం, వెంటనే పరుగున వీధి మలుపు తిరగడం జరిగిపోయేయి .

నేను ఏంచూసేను ?! క్షణ కాలం మనసు మొద్దుబారింది.

*

దేశభక్తి – మతరాజకీయాలు

 

 

-రమణ యడవల్లి

~

 

ramanaఉదయం తొమ్మిది గంటలు, హిందూ పేపర్ తిరగేస్తున్నాను. పఠాన్ కోట్ సంఘటనపై పాకిస్తాన్‌కి మరింత సాక్ష్యం కావాల్ట!

 “మిత్రమా! కాఫీ, అర్జంట్!” అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.
 “కూర్చో సుబ్బూ! ఈ పాకిస్తాన్‌ వెధవకి బుద్ధి లేదు, వొళ్ళు మండిపోతుంది!” అన్నాను.
 “మనకి పాకిస్తాన్ వార్తలెప్పుడూ అంతేలే!” అంటూ నవ్వాడు సుబ్బు.
 “అంటే పాకిస్తాన్ దేశం వొక శాంతికపోతం అంటావా?” చిరాగ్గా అన్నాను.
 “అని నేనన్నానా? మనం పాకిస్తాన్ గూర్చి ఎలా అనుకుంటామో, పాకిస్తాన్ ప్రజలు కూడా ఇండియాని అలాగే అనుకుంటారు. ఇలా ఇరువైపులా దుష్ప్రచారం జరగడం రాజ్యానికి చాలా అవసరం.” అన్నాడు సుబ్బు.

“కొంచెం వివరంగా చెప్పు.” అన్నాను.

“రాజ్యానికి అభివృద్ధి అనేది లక్ష్యంగా వుండాలి. ఇక్కడ అభివృద్ధి అంటే బులెట్ ట్రైన్లు, బిల్డింగులు కాదు. పేదరికాన్ని తగ్గించడం. విద్యా, ఆరోగ్య సౌకర్యాలని పెంచడం. సామాన్య ప్రజల్ని ఆర్ధికంగా పరిపుష్టం చేస్తూ, బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాల్ని సమర్ధవంతంగా అమలు చేస్తూ.. ” చెప్పసాగాడు సుబ్బు.

 “సుబ్బూ! నువ్వు మరీ అరటిపండు వొలవనక్కర్లేదు.” నవ్వుతూ కట్ చేశాను.
 “ఈ రకమైన ప్రజాభివృద్ధి ఎజెండా రాజ్యానికి వున్నట్లైతే అభ్యుదయ శాస్త్రీయ సిద్ధాంతం సరిపోతుంది. కానీ దోపిడీ వ్యవస్థల రాజ్యానికి ‘అందర్ కీ బాత్’ వేరే వుంటుంది. అది – పెట్టుబడిదారులకి కొమ్ము కాయడం, సామాన్యులని దోచుకోవడం! అందుకే  – నువ్వు వినేది నిజం కాదు, నువ్వు చూసేదీ నిజం కాదు!” అన్నాడు సుబ్బు.

“సుబ్బూ! కొంచెం అర్ధం అయ్యేట్లు చెప్పు.” మొహం చిట్లించాను.

ఇంతలో పొగలు గక్కుతూ ఫిల్టర్ కాఫీ వచ్చింది.

“సరే! నీకు అర్ధం కావడం కోసం ఒక ఉదాహరణ చెబుతాను. స్వతంత్రం వచ్చిన కొన్నాళ్ళకే పాకిస్తాన్‌లో రాజ్యం సమాజ అభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి ప్రజోపకరమైన కార్యక్రమాల్ని వదిలేసి, పెట్టుబడిదారు అనుకూల దోపిడీ ఎజెండా ఎంచుకుంది. సామాన్య ప్రజలు ఈ దోపిడీ సహించరు. అంచేత రాజ్యానికి మార్మికత అవసరం. ప్రజల దృష్టి మళ్ళించడానికి అక్కడ రాజ్యం ఎంచుకున్న మార్మికత – భారత్ వ్యతిరేకత. ఇందుకోసం ‘కాశ్మీర్’ వుండనే వుంది. అంచేత రాజ్యం ప్రజల మొహాన ‘ఇండియా వ్యతిరేకత’ అనే దేశభక్తి భావజాలాన్ని ఈజీగా రుద్దగలిగింది!” కాఫీ సిప్ చేస్తూ ఆగాడు సుబ్బు.

“ఇంటరెస్టింగ్, గో ఆన్!” అన్నాను.

“ఇండియాతో యుద్ధం ఓడిపోయ్యి బంగ్లాదేశ్ ఏర్పడ్డాక పాకిస్తాన్ ప్రజలకి ఇండియా వ్యతిరేకతలోని మార్మికత అర్ధమైంది. అప్పుడు వెంటనే రాజ్యం మతం ఎత్తుగడ వేసి పాకిస్తాన్‌ని ఇస్లామిక్ మత రాజ్యంగా మార్చేసింది. ఈ పని చేసింది జమాతే ఇస్లాం కాదు, సైన్యం ఆధ్వర్యంలో వున్న ప్రభుత్వం. ఇలా రాజ్యం తన ఎత్తుగడల్లో భాగంగా దేశభక్తి, మతభావనల్ని సమయానుకూలంగా తెరపైకి తెస్తుంటుంది.” అన్నాడు సుబ్బు.

“అవును కదా!” అన్నాను.

“హిట్లర్ వోటు ద్వారానే అధికారంలోకి వచ్చాడు. ఆ తరవాతే గోబెల్స్ సహాయంతో యూదు వ్యతిరేకత, కమ్యూనిస్టు వ్యతిరేకత అంటూ జాతీయ భావాల్ని రెచ్చగొట్టి ప్రపంచాన్ని చిందర వందర చేశాడు. సద్దామ్ హుస్సేన్ బాత్ పార్టీ మొదట్లో సెక్యులర్ పార్టీ. ఆ తరవాత యుద్దాల్ని జనాల మీదకి రుద్దడానికి బాత్ పార్టీ ఇస్లామిక్ పార్టీగా మారిపొయింది.” ఆలోచిస్తూ అన్నాడు సుబ్బు.

“మరి ఇండియా సంగతి?” అడిగాను.

“స్వతంత్రం వచ్చిన కొన్నేళ్ళదాకా రాజ్యం గాంధీయిజం, సోషలిజం సిద్ధాంతాల్ని వాడుకుంది. ఆ తరవాత అది సరిపోదని గ్రహించి – పాకిస్తాన్లో ఫలితం ఇచ్చిన మతవాదాన్ని తెరపైకి తెచ్చింది. టెస్ట్ డోసుగా అయోధ్య తలుపులు తెరిపించింది. ఎలాగూ మతవాదంతో రెడీమేడ్‌గా ఆరెస్సెస్ వుండనే వుంది. దాన్ని దుమ్ము దులిపి బయటకి లాగి – ‘రామజన్మ భూమి’ అంటూ అద్వానీ రథయాత్రతో ముందుకి నెట్టింది. అది గుజరాత్ హత్యాకాండతో మరింత స్థిరీకరించబడింది.” అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

“ఒప్పుకుంటున్నాను.” అన్నాను.

afsar2

“టీ కొట్టువాడు పాలు, డికాక్షన్లు దగ్గర ఉంచుకుని కస్టమర్ల టేస్టుకి తగ్గట్లు పాళ్ళు కలిపి ఇస్తుంటాడు. అలాగే రాజ్యం – దేశభక్తి, మతభావనలు అనే భావజాలాల డోసుని అవసరాన్ని బట్టి పెంచడం, తగ్గించడం చేస్తుంది. శ్రీలంకలో తమిళుల్ని ఊచకోత కొయ్యడానికి రాజ్యానికి దేశభక్తి డోసు పెంచాల్సి వచ్చింది. ఆ సమయంలో ‘అహింసాయుత’ బౌద్ధమతం తన మొహాన్ని ఇంకోవైపుకి తిప్పుకుంది.” అన్నాడు సుబ్బు.

“ఈ మధ్య మతాన్ని రాష్ట్రప్రభుత్వాలు కూడా మోస్తున్నాయి కదా!” అన్నాను.

“అవును, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశం లేని రాజ్యం పుష్కరాలు, యాగాలు అంటూ భక్తిభావాల్ని ప్రమోట్ చేస్తుంది. వాస్తవానికి ఈ భక్తి కార్యక్రమాల్ని నిర్వహించడానికి మత ధార్మిక సంస్థలున్నాయ్. కానీ ప్రజల దృష్టి మరల్చడానికి పనికొచ్చే యే అంశాన్నీ వదులుకోడం రాజ్యానికి ఇష్టం వుండదు.”

“కరెక్ట్.” అన్నాను.

“రాజ్యం అసలు ఎజెండా – సామ్రాజ్యవాదానికి దేశంలో ఒక మార్కెట్ దళారీ వ్యవస్థని ఏర్పాటు చెయ్యడం. కానీ ఈ విషయాన్ని దాచి, ఇంకోటి చెబుతుంటుంది. పాకిస్తాన్లో మసీదు మెట్ల మీద అడుక్కునేవాడు, ఇండియాలో గుడిమెట్ల మీద అడుక్కునేవాడు – తాము పరస్పర శత్రువులుగా భావించేందుకు అవసరమైన భావజాల సరంజామాని రాజ్యం నిత్యం సరఫరా చేస్తూ వుంటుంది. అదీ సంగతి!” అంటూ హడావుడిగా నిష్క్రమించాడు మా సుబ్బు.

(బాలగోపాల్ ‘హిందూమత రాజ్యం’ (1991) వ్యాసం ఆధారంగా) 

వేదనలోంచి మొలకెత్తిన కవిత

 

 

 

షాజహానా దర్దీ చదువుతున్నప్పుడు సమకాలీన సాహిత్య స్పృహతో మైనారిటీ వాదాన్ని మోస్తున్న బలమైన గొంతుక ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది.తన అస్తిత్వాన్ని ఆ గొంతుక ఎంతగా నొక్కి చెబుతుందో,అదే సమయంలో సమకాలీన సమాజంలోని ప్రధాన తాత్వికాంశను ఉమ్మడి చేతనలోకి తీసుకున్నారని అర్థమవుతుంది.దానికి కారణం బౌద్ధికంగా అనేక వాతావరణాలు నిండి ఉండడం.లేదా ఆ వాతావరణాల చైతన్యం ఉమ్మడిదవటం.

తెలుగులో అస్తిత్వ ఉద్యమాలు వచ్చాక సమాజాన్ని భిన్నకోణాలనుండి అంశాత్మకంగా పరిశీలించే అవకాశం కలిగింది.బహుశఃకాలిక స్పృహ వల్లనేమో..ఒక అనుశీలనలో ఈవాదాలు ధోరణులన్నీ ఉమ్మడినిర్మాణాన్ని వ్యష్టిగా కలిగి ఉన్నాయనిపిస్తుంది.ఒక ప్రాతిపదిక దశలో అన్నీ ఒక ఉమ్మడి చేతనకు లోబడడమే అందుకు కారణం.
షాజహానా కవిత్వం సుస్పష్టంగా ముస్లిం స్త్రీల వైపు నిలబడింది.అదే సమయంలో ఈ వాతావరణం చుట్టూ ఉన్న స్త్రీ వాద భూమికనూ అర్థం చేసుకోవాలి.-” చమ్కీ,అబ్‌నార్మల్ పెయిన్,జమానత్,దేశాంతర దుఃఖం”మొదలైనవన్నీ ముస్లిం స్త్రీ జీవితాన్ని మోసాయి. ఈ కవిత్వంలో వర్తమానమే అధికం.నిజానికి తెలుగులో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు గతితార్కిక సిద్ధాంతాలపై ఆధారపడ్డాయి. గతంలోని చారిత్రక అణచివేతను ప్రశ్నించాయి.చాలావరకు అస్తిత్వ వాద దార్శనికతను,ఒకింత వైప్లవిక భావనను మోస్తున్న కవిత్వాన్ని వస్తు సంబంధంగా మాత్రమే గుర్తించడం కనిపిస్తుంది.దానికి కారణం ప్రత్యేక రాజకీయ.సాంస్కృతిక,సామాజిక లక్ష్యాలుండటమే.షాజహానా స్వరం రీత్యా వర్తమానాన్ని,అస్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పటికీ,కవిత్వీకరణపై దృష్టిసారించారు.ఆమె కవితల్లో హృదయాన్ని కదిలించే బలమైన వ్యక్తీకరణలే అందుకు సాక్ష్యం.

1.ఉరుములు మెరుపులతో ఆకాశం / అచ్చం అమ్మలా బాధతో మెలితిరిగిపోతున్నప్పుడు/కుండపోతగా కన్నీరు కళ్లలోనూ పైనుంచి/గుడిసె చూరునుంచి/అబ్బా మనసునుంచి ఏకధాటిగా కన్నీళ్ళు“-(మాదిగ బుచ్చమ్మ-63పే.)

2.దుఃఖం గడ్దకట్టిన మంచు శిల్పం పై/చిక్కని చీకటి వంకర్లు తిరిగిన గిరిజాల జుట్టు“-(దేశాంతర దుఃఖం-57 పే.)
3.
కుబుసం విడవని పాముల్లా /సూర్య కాంతిలో లోహం ప్రవహిస్తున్నట్టు సన్నని గీతలుగా నదులు“-(ప్రాణవాయువు-56.పే.)
4.
రేగ్గంపలో చిక్కుకున్న ఓణీలా/ఎక్కడ తట్టుకుని ఉండిపోయాం“-(కఠ్ఠామిఠ్ఠా దోస్తానా-69)

 

 

పదిలంగా జీవన తాత్వికతను అన్వయిస్తూ,దృశ్యాలను కవిత్వం చేయడం కనిపిస్తుంది.సందర్భం,వ్యక్తి,ప్రకృతి,ఉనికి అనే అంశాలు ఈ వాక్యాల్లో కనిపిస్తాయి.మొదటిరెండువాక్యాల్లోని కళ,మూడవ వాక్యంలోని ప్రకృతి క్రియాశీలక సూత్రాన్ని కప్పేస్తున్నాయి.నాలుగవ వాక్యంలో ఈ క్రియాశీలత స్పష్టంగా ఉంది.కొన్ని పద సంయోజనాలనుంచి వేరుచేసి చూస్తే సాధారణ స్త్రీ కవితకూ ఇవి దూరం కాదు.ఆ పద సంయోజనాలే ఈ అస్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతాయి.

సాధారణంగా భాషకు రస భావ వ్యంజక శక్తి ఒకటుంటుంది.దీన్ని సాధించడానికి కవి భాషను అలంకారికంగా వాడుతాడు.ఐ.ఏ .రీచర్డ్స్(I.A.Richards)భాషకు నాలుగు వృత్తులుంటాయన్నాడు.1.అర్థం (Sence) 2.అనుభూతి(Feeling) 3.ధోరణి(Tone) ఉద్దేశ్యం(Intention) ఇంకాస్తా లోతుకు వెళితే ఉద్దేశ్యంలోనూ కొన్ని అంశాలను చూడవచ్చు.1.వస్తుగత ఉద్దేశ్యం  2.కళా సంబంధ ఉద్దేశ్యం.మొదటిదానిలో ఉద్దేశ్యం వస్తువుపై ఆధారపడితే,రెండవదాంట్లో కళ ఆధారపడుతుంది.షాజహానా వాక్యాల్లో వస్తుగతమైనవి,కళాగతమైఅనవి ఎక్కువ.సాధారణంగా అస్తిత్వ సాహిత్యంలో వస్తుగత సంబంధాలే ఎక్కువ.దళితవాదం కళా,సమాజ జ్ఞానంతో కొంత భాషను సృష్టించుకుంది.తన ఉనికిలోంచి ఉపయోగించుకుంది.ప్రాంతీయ చేతనతో వచ్చిన కవిత్వంకూడా తన ఉనికిలోని నిసర్గ సౌందర్యాన్ని ఆధారం చేసుకుంది.

షాజహానాలోనూ ముస్లిం మైనారిటీ ముద్ర కనిపించే భాషా సంయోజనం ఉంది.పదాల అర్థక్షేత్రం (Semitic field)వల్ల స్త్రీ కనిపిస్తుంది.వైఖరి పరంగా స్త్రీ,మిగతా అంశాలలో మైనారిటీ గొంతుక కనిపిస్తుంది.”దేశాంతర దుఃఖం” లాంటి కవితలను గమనిస్తే సాధారణ జీవితానికి,ముస్లీం మైనారిటీ జీవితానికి మధ్య ఉండే వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది.

 shajahana

కొన్ని సార్లు లక్ష్యాన్ని గురించి మాట్లాడుకుంటే ఇందులో కొంత మార్క్సిస్టు ఊహలు,వైప్లవికమైన ఉద్వేగాలు కనిపిస్తాయి.”జమానత్””బుషాడా గో బ్యాక్”లాంటి కవితలు ఆ ధోరణిలో కనిపిస్తాయి.ఈ కవితల్లో బలమైఅన రాజకీయ దృష్టి ఉంది.ఇందులోనూ వైఖరి సారవంత మైన జీవితాన్నే ఆవిష్కరిస్తుంది.

రాక్షస రెక్కలతో తల్లుల్నీ తండ్రుల్నీ
ఎత్తుకెళ్ళిన నరహంతకుడని తెలిసాక
చందమామ కథలెట్లా చెప్పుకుంటారు ?
తెగిన చేతుల్నే /ఆయుధాలుచెయ్యకుండా ఎలా ఉంటారు.”-(పే-77)

పాలస్తీనా ఆఫ్గన్ ఇరాక్ /వాడు ఒక్కొక్క దేశాన్నే/
మింగుతూ వస్తున్న అనకొండ“-(పే.77)
వాడొస్తున్నాడంటే/మాగంజి నీళ్ల మీద గద్ద తిరుగాడు తున్నట్లుంది“-(బుషాడా గో బ్యాక్పే.79)

ఊహ తెలిసాక మసీదు కూల్చబడింది/కులాలు మతాలు రాజకీయాలు /నా బాల్యం తెల్లటి మస్తిష్కపు తెరమీద బొమ్మలాడాయి/భూగోలం గుండ్రంగా పరచుకున్న చుట్టీస్ అండ్ లాడర్స్ పటం/యవ్వనం దూకింది మతం గోడలమీదుగా /డోక్కుపోయిన అనుభూతులు“-(జమానత్-37.పే.)

ఈ కవిత్వం చదివాక కొన్ని అంశాలను గమనించవచ్చు.పరికరాలు,లక్ష్యం మొదలైఅనవాటివిషయంలో షాజహానాకు ప్రత్యేకమైన అభిప్రాయాలున్నాయి.అనేక సార్లు స్త్రీల అణచివేతను గురించి మాట్లాడటం వల్ల స్త్రీగొంతుక,నిర్దిష్ట పాత్రలు,ప్రత్యేక వర్గ దృక్పథం వల్ల మైఅనారిటీ గొంతుక వినిపిస్తాయి. కార్ల్ గూస్టాఫ్ యూంగ్ ఉమ్మడి అచేతన(Collective unconsciousness)ను గురించి చెప్పాడు. జాతి అనుభవ జనితాలైన భావనలు ఉమ్మడి అచేతనలు.షాజహానా కవితలో స్త్రీ,ముసిలిం అనే భావనలు ఉమ్మడి అచేతన లోనివే.ఇందులోని పాత్రల్లోకూడ ఈ ఉమ్మడి ప్రతిమ(Collective image)కనిపిస్తుంది. ఆధునిక కవితా మాధ్యమంలో “బుష్”ఒక చారిత్రక పాత్రగా ఊహించడం,స్త్రీ దుఃఖాన్ని “దేశాంతర దుఃఖం ‘గా ఊహించడంలోనే ఈ ఉమ్మడి అచేతన కనిపిస్తుంది.ఇతిహాస చారిత్రక సామాజిక భావనలనుండి ప్రతిమను ఊహించడాన్ని (Collective imagination)అంటారు.ఇలాంటి మనోవైజ్ఞానిక లక్షనాలు కూదా ఈ కవిత్వంలో కనిపిస్తాయి.అనేక ఉమ్మడి భావనలకు లోనవుతూనే “దర్దీ”తనదైన సామాజిక,వర్గ సంఘర్షణను వెలిగక్కింది.

*

మళ్ళీ వినాలనుంది!

 

 

-సుపర్ణ మహి

~

mahy

 

 

 

 

 

ఇప్పుడెందుకో ఆ పాట మళ్ళీ వినాలనిపిస్తుంది…

అదే పాట.

 

అంతా తనది అన్నట్లు చుట్టూ గొణిగేస్తున్న లోకం మొహం మీదకి
ఓ దూరాన్ని ముసుగులా విసిరి,

కొసప్రాణం ఆర్తిగా దాహాన్ని తీర్చుకుంటున్నట్లు

ఇప్పుడాపాటని మళ్ళీ వినాల్నుంది.

 

శభ్దానికీ – శభ్దానికీ మధ్యలోంచి
నాలోకి తర్జుమా అవుతున్న నిశ్శబ్దం గొంతేదో
మరొక్కసారి మనసుపెట్టి
దీక్షక్కూచున్న సిద్ధునిలా శ్రద్ధగా వినాలనుంది.

 

చీకటి కెరటాల మధ్య చిక్కుకున్న వెన్నెల దీపాన్ని చూపేందుకు,
చిగురుటాకుల మధ్య నలుగుతున్న మౌనాన్ని
చూపులమధ్యలోంచి చూస్తూ
ఇప్పుడు ఒక్కణ్ణై వినాలనుంది.

 

వేయి రేకుల పద్మమేదో మస్తిష్కంలో వికసించి మురిపిస్తుంటే
నడిచిపోయే దారంతా తోడుంటుందని
మనసు దగ్గిర నేర్చుకున్న ఆ ‘పాట’
ఇప్పుడు మళ్ళీ నాలోంచి కనుగొని వినాలనుంది.

*

బాజీరావ్ మస్తానీ – గీత్ సుహానీ!

 

-ఫణీంద్ర 

~

phaniడబ్బింగ్ సినిమా పాటలనగానే, అదీ హిందీ నుంచి అయితే, తెలుగుభాషా చిత్రవధకి శ్రోతలు సిద్ధపడి ఉంటారు! డబ్బింగ్ పాటల్లో తెలుగు అంత కృతకంగా ఉండడానికి సంగీత దర్శకుడూ, దర్శకుడూ వగైరా వాళ్ళ పాత్ర అంతో ఇంతో ఉన్నా నింద మాత్రం ఎప్పుడూ పాటల రచయితకే వస్తుంది! కొన్నిసార్లు తెలుగు అనువాదం అస్సలు సరిగ్గా కుదరనప్పుడు, శ్రోతలు రచయితకి ఓ దండం పెట్టి తమిళంలోనో హిందీలోనో ఉన్న ఒరిజినల్‌ని వింటూ సంతృప్తిపడతారు. అయితే డబ్బింగ్ పాటలో కూడా తెలుగులా వినిపిస్తున్న తెలుగుని విని, ఎంతో అందంగా ఉన్న భావాలకి పరవశించి, అంత అద్భుతంగా రాసిన రచయితకి నిజమైన గౌరవవందనాలు సమర్పించే సందర్భాలు అరుదుగా వస్తూ ఉంటాయి! అలాంటి గౌరవాన్ని “బాజీరావ్ మస్తానీ” చిత్రానికి రాసిన పాటలద్వారా రామజోగయ్య శాస్త్రి గారు దక్కించుకున్నారు. ఆ చిత్రంలోని ఓ చక్కని ప్రేమగీతాన్ని ఈ వారం పలకరిద్దాం!
“బాజీరావ్ మస్తానీ” ఓ చారిత్రాత్మక కథకి చేసిన కల్పన. మరాఠా యోధుడు బాజీరావ్‌కి, మస్తానీకి మధ్య సినిమాలో చూపించిన ప్రేమకథ నిజంగా జరిగిందా లేదా అన్నది అంత ముఖ్యం కాదు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమని సినిమాలో ఎంత అందంగా, కళాత్మకంగా చూపించారో, ఈ పాటలో మస్తానీ తన హృదయాన్ని ఎంత ఆర్తిగా నివేదించుకుందో అన్నదే ముఖ్యమైన విషయం సాధారణ ప్రేక్షకుడికి. ఈ సినిమాకి ఎంతో ముఖ్యమైన ఇలాంటి పాటలో తన గీతరచనా ప్రతిభని సంపూర్ణంగా ప్రదర్శించి, ప్రేక్షకుడికి పూర్తి సంతృప్తి కలిగించిన ఘనత రామజోగయ్య శాస్త్రి గారికి దక్కుతుంది.
శాస్త్రిగారు ఈ సినిమాలోని అన్ని పాటలూ చాలా అందంగా రాసినా, ఈ పాటకంటే కవిత్వం ఎక్కువ ఉన్న పాటలు సినిమాలో ఉన్నా, ఈ పాటే ఆయనకి వన్నె తెచ్చేది. ఎందుకంటే ఈ పాట రాయడం అంత సులభమేమీ కాదు. ఒరిజినల్‌లో ముందు మరాఠీలో వచ్చే సాకీ, తర్వాత హిందీలో మధురంగా వినిపించే పల్లవీ చరణాలు, చివర్లో ఉర్దూలో వచ్చే ఖవ్వాలీ…ఇలా పాట నడకంతా విభిన్నంగా సాగుతుంది, ముగ్గురు గీతరచయితలు (హిందీ భాగాన్ని రాసిన జంటకవులు సిద్ధార్థ్ – గరిమలను ఒకరిగా పరిగణిస్తే) రాశారు ఆ పాటని. అలాంటి పాటని తానొక్కడే మొత్తం రాసి మెప్పించడం, క్లిష్టమైన మరాఠీ సాకీని కూడా తెలుగులో ఒప్పించేలా రాయగలగడం శాస్త్రి గారికే చెల్లింది!

పాట సాకీ అద్దాల మేడలోని కళామందిరానికి విచ్చేస్తున్న మస్తానీ అందాన్నీ, ఔన్నత్యాన్నీ కీర్తిస్తూ సాగుతుంది –

 

సాకీ:
దివినించి జారె జర జరా
కలికి అప్సర కలల తెమ్మెర!

 

కోరస్: జారే ఇలకు జారే దివినించి జారే

 

పగడాల సొగసు దొంతర
నచ్చిన కళ్ళలో విచ్చిన కెందామర!

 

కోరస్: జారే ఇలకు జారే

 

మరువాల పవనంలా
పరువాల దవనంలా

అరుదెంచెనీ వెన్నెల!

 

కోరస్: అరుదెంచే చూడు! అరుదెంచే చూడు! అరుదెంచే మహరాణీ!

 

Ramajogayya Sastry @ Rabhasa Movie Audio Launch Stills

ఆ అమ్మాయి అందంలో అప్సరసే! అయితే “కలికి” (చక్కనైన) అని శ్రేష్ఠమైన విశేషణాన్ని వాడి అందానికి హుందాతనాన్ని అద్దారు రచయిత. అటువంటి సుందరిని చూస్తే కలలు చల్లగాలిలా (తెమ్మెర) తాకవు మరి! సిగ్గెరుపో లేక మేనెరుపో మరి ఎర్రని పగడాల దొంతరలా ఉందట ఆమె సోయగం! ఎంత అందమైన ఊహ! ఆ అమ్మాయిపై మనసుపడ్డ వారి కళ్ళలో (నచ్చిన కళ్ళలో) ఆమెను చూసినప్పుడు ఎర్రకలువలు (కెందామరలు) విచ్చుకుంటాయట! ఆహా! ఆమె అందరికి కళ్ళకి అందే సోయగం కాదు, నచ్చిన, మనసిచ్చిన వారికే అందే అద్భుత దృశ్యం మరి! కేవలం కంటికే కాదు పంచేంద్రియాలకీ పులకింత ఆ సౌందర్యం! ఆమె వెంట మరువపు ఆకుల సుగంధం నడిచొస్తోంది. కాదు కాదు, పరువమే దవన పరిమళమై ఆమెను అంటిపెట్టుకుంటోంది (దవనము కూడా మరువము లానే సుగంధమూలిక). ఇలా పరువాల పున్నమిలా వచ్చి తన సోయగాల వెన్నెలని కురిపిస్తున్న ఆ సుందరి రాజసం చూస్తే మహరాణీ అని కీర్తించదూ జగమంతా?

మస్తానీ బాజీరావుకి ఆరాధనాపూర్వకంగా ఓ సైగచేసి పాట పాడడం మొదలుపెడుతుంది –
పల్లవి: (మస్తానీ)
కనులతో తీగలాగి పడేసావే మాయలో
వరంగా సోలిపోయా వలేసే హాయిలో!


బహుమానమై నీదానిగా తరించా ప్రేమలో
వద్దన్నా ప్రపంచం జన్మం నీకు సొంతం

 

అదో వెర్రి ప్రేమై నిన్నే చేరుకున్నా
కళ నీవే కాంతి నీవే మస్తానీ శ్వాసలో! 

 

ఈ ప్రేమ మాటగా వెలికిరానిది, మాటల్లో చెప్పలేనిది. అయితే అతని కళ్ళలో తనపై ఆరాధన కనిపిస్తూనే ఉంది. అతనిలో తన పిచ్చిప్రేమని చూసి నవ్వుకోకుండా అర్థం చేసుకునే ఓ హృదయాన్ని చూసింది. అందుకే అతనికి దాసోహమైంది. “నీ చూపులనే తీగలతో నన్ను మెల్లగా లాగి ఈ ప్రేమ మాయలో పడేశావు! నన్ను వలేసి మరీ లాగిన ఈ వరమైన హాయిలో ఉండిపోనీ” అంటోంది! ఈ భావం ట్యూన్‌లో ఎంతందంగా వినిపిస్తుందో (ముఖ్యంగా “వరంగా సోలిపోయా” అనే లైను)!

తన ప్రేమని లోకం ఒప్పుకోదని తెలుసు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసు. అయినా, “నీ ప్రేమే నాకు బహుమానం! ఈ జన్మ నీకు సొంతం, ఎవరిని ఎదిరించైనా సరే నిన్ను చేరుకుని నీ ప్రేమలో తరిస్తాను” అంటోంది. నిజమైన ప్రేమకి ఉండే ధైర్యం అది. గుండెల్లో ప్రేమరూపాన్నీ, ఊపిరిలో ధైర్యాన్నీ నింపుకున్నది ప్రేమవుతుంది కానీ కేవలం కనులలో కలలు ఒంపుకున్నది కాదు! “నా బ్రతుకులో (శ్వాసలో) కళా కాంతీ అన్నీ నీ వల్లే! కలగన్నా, మెలకువలో ఉన్నా ప్రతి తలపూ నీదే” అనేంతగా అతనికి తనని తాను అంకితం చేసుకున్న పిచ్చిప్రేమ ఇది.

చరణం (మస్తానీ)
ప్రియం తీయనైన అపాయం
కోరస్: ఎదంతా లిఖించావు గాయం కవ్వించే చూపుగా!


వలపై చేసినావే సహాయం
కోరస్: తపించే వయారం శమించే మలామూ నీవేగా


నిజమున్నది నీ కమ్మని కలలో (2)
జగాలే వినేలా సగంలా

కోరస్: నీ పేరే నాదిరా

ప్రేమ ఎప్పుడూ అపాయమే! తీయని అపాయం, ప్రియమైన అపాయం! మస్తానీ విషయంలో నిజమైన అపాయం కూడా. ఐనా అన్నిటికీ తెగించిన ప్రేమ ఇది. ఈ అపాయం వలన కలిగేది గాయం. కవ్వించే చూపులతో మనసుపై చేసిన గాయం! అది జన్మంతా మాననిది. ఓ తీయని బాధగా, ఆహ్లాదమైన ఆరాటంగా మిగిలేది. అయితే దానివల్ల ఓ సహాయమూ దొరికింది. అదేమిటంటే తపించే వయ్యారానికి ఊరటనిచ్చే లేపనం (మలాము) కూడా ఈ ప్రేమేనట! ఎంత చిత్రమో కదా! గాయమూ తనవల్లే, సహాయమూ తనవల్లే! ఏమిటో ఈ ప్రేమ!

కల నిజం కాదు ఎప్పుడూ. కానీ కొన్ని కలలే నిజంకన్నా గొప్పగా అనిపిస్తాయి. నిజమైన జీవితాన్ని కలగా మారుస్తాయి. కలలోని జీవితాన్ని నిజం చేసేలా ప్రేరేపిస్తాయి. ఆ స్ఫూర్తితోనే సాగుతోంది మస్తానీ. “జగం వినేలా చాటి చెప్పనీ! నువ్వు నావాడివి! నేను నీలో సగం అయ్యి తీరుతాను” అని నిశ్చయంగా చెబుతోంది. నీ ప్రియురాలిగా ఉంటూ తీపిని మాత్రమే పంచుకోవడం కాదు, నీ ధర్మపత్నిగా మారి జీవితంలో కష్టసుఖాలను పంచుకోవాలన్నదే నా ఉద్దేశ్యమని చాటిచెప్తోంది!

 

ఖవ్వాలీ (బాజీరావ్):
చెలి పాలపుంతలా మెరిసావే
బ్రతుకంత జిగేలై కలగలిసావే

పులకింత నింపి మనసు బంతినెగరేసావే


నా సిరి నీవే, మాధురి నీవే
నేలంతా గెలిచాననిపించే కేరింతయ్యావే

 

బాజీరావ్ ఇప్పటి వరకూ మౌనంగా ఉన్నాడు పాటలో! ఒక అపురూప సౌందర్య రాశి, ఒక అద్భుత మానధన రాశి కళ్ళముందు మెరిస్తే మాటలెలా వస్తాయి! కానీ అతని గుండె స్పందిస్తోంది, మౌనంగా పాట పాడుతోంది. తన చెంత మెరిసిన పాలపుంత, బ్రతుకంతా జిగేలనిపించే ప్రేమ పులకింత అని తెలుసు! ఆ పులకింత నిండిన మనసు ఉండబట్టలేక బంతిలా ఎగిరెగెరి పడుతోందట! ఇప్పటి వరకూ యుద్ధాలు గెలవడం, రాజ్యాలు ఏలడమే జీవితం అనుకున్నాడు కానీ కాదు. సిరి అంటే మస్తానీ, జీవితంలో మాధుర్యం అంటే మస్తానీ. తన ప్రేమ ఉంటే చాలు ప్రపంచాన్నంతా జయించినట్టే. నిజమే కదా, ప్రేమలో సమస్తం దొరుకుతుంది, ప్రేమలో విశ్వం తనని తాను చూసుకుంటుంది!

ప్రేమ మహిమ తాకిన రెండు హృదయాలని రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతంగా ఆవిష్కరించిన వైనాన్ని పాట వింటేనే కానీ పూర్తిగా తెలుసుకోలేం! “సంజయ్ లీలా బన్సాలీ” మధుర స్వరకల్పనలో, శ్రేయా ఘోషల్ మధురాతిమధురమైన గాత్రంలో ఈ పాటని ఇక్కడ విని కాసేపు ప్రేమ నీడలో సేద తీరండి!

*

 

ఒంటరి దీపం

 

హెచ్చార్కె

~

1

 

అద్దం ముందుకు వెళ్లొద్దెప్పుడూ

ఎదురెదురు అద్దాల ముందుకు

అసలే వెళ్లొద్దు

నీ వెనుక ఎవరో వున్నట్టుంటుంది

ఆ వెనుక ఇంకెవరెవరో వున్నారని

అద్దాలు పిచ్చి పిచ్చిగా అరుస్తాయి

ఎవరి వెనుక ఎవరూ వుండరు

ఒక్కరుగా వుండటం ఇష్టం లేక

ఊహల ఎముకలతో మనుషుల్ని

చేసి, కండరాలిచ్చి చర్మం తొడిగి

నెత్తుల్దువ్వి మూతుల్తుడ్చి బట్టలేసి

వాళ్లు నీతో వుండక తప్పదంటూ

అద్దాలబద్దాల కవిత్వం రాస్తుంటావు

ఏదో ఒక రోజు నీ ప్రతిబింబం నిన్ను

కాదనేస్తే అప్పుడు అపుడేం చేస్తావు

రోబో కి ప్రాణమొచ్చి నీ చేతి నుంచి

రిమోట్ లాగేసుకుంటే

మాంత్రికుడి  చేతిలో చేతబడి బొమ్మలా

నీ ఒక్కొక్క కీలూ విరిచేసి నిన్ను

పొయ్యి లోకి విసిరేస్తే ఏం చేస్తావు

అలా ఒక రోజు దగ్ధం కావడం  కన్న

కన్నా, ఒంటరిగా వుంటం మేలు కదా

దేర్ఫోర్ అన్నిటి కన్న ముందు నువ్వు

పగలగొట్టాల్సింది అద్దాల్నే, అబద్ధాల్నే

 

2

ఒంటరి తనం ఒక పొలం వంటిది

ఎవరో వచ్చి ఏవో కొన్ని విత్తనాలు

చల్లిపోతారు, దారిన పోయే మేఘం

నిలిచి లఘు శంక తీర్చుకుంటుంది

వానపాములు చేసిన సేద్యానికి

నిలువెల్ల పులకించి ఆర్గాస్మిక్

ఎక్స్టసీతో మొక్క

పైన పక్షుల పాటల్ని అందుకోవాలని

చేతులు సాచి, పక్షులకు బెయిట్గా

వ్రేళ్ల కొసలపై విత్తానాలు ధరిస్తుంది

 

3

నీ కోసం కాదు, పక్షుల కోసం

నువ్వు కేవలం ఇన్సిడెంటల్రా

బుజ్జిగా, ఒరే, నువ్వు

వస్తావు పోతావు

పక్షులుంటాయి

వృక్షాలుంటాయి

మేఘాలుంటాయి

వానపాములు కూడా వుంటాయి

ఆకాశం గగనం శూన్యం కాదు

నువ్వే, నువ్వొక సున్నా

నీ విలువ కోసం, పెంచుకోరా నయ్నా

నీ ఎడం పక్కన ఒకటి రెండు మూడు

వేలు లక్షలు కోట్లాది చెట్లనీ పిచికలని

 

*

 

 

ఎప్పుడూ వెంట వచ్చే వసంతం!

 

-కుప్పిలి పద్మ

~

 ప్రేమ!!! .

పసివసంతాల సంభ్రమాశ్చర్యాల యింద్రజాలం. గిలిగింతల మాఘపరాగ లేతచల్లదనం. పరవశించే ఫాల్గుణపూలతేనే గాలుల తీయదనం. రంగురంగుల పత్ర సోయగాల శిశిరపు వెచ్చదనం. తడి మెరిసే శ్రావణపు తేమదనం. ఆరు రుతువుల విలక్షణ  దివ్యానుభూతిరాగంతో  మదిచెవిలో మనసుచిలుకలు పాడే మృదుగీతం.

మన అనుభవంలోకి వచ్చే తొలి ప్రేమానుభవం కళ్ళు వీప్పి విప్పగానే అమ్మ స్పర్శా లాలిత్యం.  పలరింపుగా  చిటికలేస్తూ ప్రేమ స్వరాన్ని నాన్న పరిచయం చెయ్యటం తొలి సురాగానుభావం. బంధువులు ఆప్తులు తోడబుట్టిన వాళ్ళు యిరుగుపొరుగు వొక్కరేమిటి అంతా ముద్దల జాతరే … వావ్…  పసితనపు  యీ  జీవితోత్సాహపు  అసలు పేరు  ప్రేమ అని తెలుసుతుంది మనకి మెల్లమెల్లగా. మనం పెంచబడే కొద్దీ ప్రేమ వొక వ్యక్తిగత రాజకీయాల సాలెగూడని అనుభవపూర్వకంగా తెలుసుతుం టుంది. నిదానంగా మనలో దొంతరుదొంతర్లుగా యేర్పడే ఖాళీలు మనకి వొక essential being  తప్పనిసరి అన్వేషణైనప్పుడు మరి కొన్ని కొత్త  ప్రేమల వైపు మనసు మరలుతుంది.

ఆకుపచ్చని  ప్రేమలకి  ప్రాచీనారణ్యంలోకి వనవాసిలమై  – సుశాంతి ప్రేమలకి యుద్ధాలని దాటుకుంటూ నటాషాలమై – నిలకడైన ప్రేమలకై  సందిగ్ధ తెరలని  తొలగించుకొంటూ స్కార్లెటై  –   నవసమ జీవనపు ఆకాంక్షలకి నారుపోయాలని  అంటరాని వసంతాలని ప్రశ్నించే రూతులమై – ప్రేమంటే  గులకరాళ్ళ శబ్ధపు రియాలిటి షో కాదని  మంత్రనగరి సరిహద్దులలో నువ్వూ నేను మనమయ్యే వో సరికొత్త ప్రేమహృదయాన్ని రచిద్దాం.

యేక కాలంలో వంద తలలు నరికే మగధీరుని భుజశక్తీ – బాహ్యాకారపు బాహుబలుల బాహువులెంత  విశాలమైన వారి మనసులపై వాలడానికైనా  హత్తుకోడానికి కురచవే అని నిట్టూర్చ క్కరలేదు. ‘సడేలేని అలజడి యేదో యెలా మదికి వినిపిస్తుందో’ అని యవ్వనాశ్చర్యాలకి లోనవుతూ కంచెలని తొలగిద్దామనే  మనసులమై  నిర్భయంగా నిజాయితీగా చెంపల్లో సిగ్గుల ముద్దులవుదామా!

ప్రేమ జైంట్ వీలే కాని దానిని తిప్పే చేతికి  యెక్కడ ఆపాలో యెక్కడ జోరుగా తిప్పాలో యెక్కడ జర్క్ యివ్వాలొ సరిగ్గా  తెలిస్తే వొళ్ళంతా నిలువెల్లా తుళ్ళింతే. లంగరేసే ప్రేమ కథల ముచ్చట యెప్పుడు వొక్క లానే వుంటుంది. వాటిని వదిలేసి  ప్రయాణించే ప్రేమ కథలని కాసేపైన నెమరేసుకుందాం. మనకి తెలీయకుండానే మనందరం ప్రేమని వ్యక్త పరిచే సాధనం వొక్కటే.   ప్రేమని వ్యక్త పర్చటానికి  క్రియేటివిటి కావాలి. యెప్పటికప్పుడు కొత్త ఆనవాలు కావాలి. మనం హృదయం ప్రేమని  వ్యక్త పరిచడానికి సంసిద్ధ మైనప్పుడు మన కోసం వేచి వుండే వొక హృదయముంటే మన మనోసరోవరం చుట్టూ జీవన పువ్వులు సీతాకోక చిలుకలై తేనె జల్లులని కురిపించవా… మన యెద దోనెలో ముద్దులు చినుకులై కురిసి దేహాలు యేక ముత్యమై మృదువు గా  వికసించవా…

valentine

వొక్క ప్రేమ అనేక ముఖాలు. ప్రేమకి కులం వుంటుంది.  మతముంటుంది. వర్గముటుంది. ప్ర్రాంత ముంటుంది. సరిహద్దులుంటాయి. ఆయా ప్రాతిపదికలపై ప్రేమరంగులరాట్నం తిరుగుతుంటుంది. యివేవి లేని లేకుండా  స్వయంప్రకాశియై మెరిసే  ప్రేమ సుదూర స్వప్నం. రెప్పపాటులో వాస్తవమైతే మనశ్శరీరాలు కావా రంగురంగుమైదానావనాలు.

ప్రేమ !!!

వొక అనుమానాల చీమల పుట్ట. అవసరాల ఆయుధాగారం. ఆపదల వడగళ్ళ వాన. అసూయభరిత  పడగనీడ. పొగ చూరిన విలువల భాంఢాగారం. పగిలిన నత్తగుల్లజ్ఞాపకాల రణరణ ధ్వని. మనసులని కలుషితం చేసే విధ్వంస ఫీలింగ్.

ప్రేమ సాగరమై మనల్ని కమ్ముకోవటం వొక నిస్సహాయ అపచారం. ప్రేమ సుడిగుండంలో చిక్కుకోవటం పొరపాటు అంచన. ప్రేమ సునామియై మింగైటం కోరుకొని  భీభత్సం.  ప్రేమ వాయుగుండమై చుట్టుకోవటమొక అనుకోని వుపద్రవం. యీ ఆత్యాధునిక కాలంలో ప్రేమ యాసిడ్ మచ్చలై , పరువు వేటలై,  కత్తుల కాట్లై చెలరేగుతోంది. యీ భయకంపిత ప్రేమల కోసం యెవరు మనసులని తెరచి పెట్టుకోరు. కాని పెద్దపులి నోట్లో మనసు పెట్టి వేటాడే లేడి పిలైయింది ప్రేమ.  అలాంటి ప్రేమలని పెంచే అమానుషపు విషయాల రెక్కలని మనం అడ్డుకోవాలి యీ  ప్రపంచాన్ని ప్రేమించేవారిగా.

ప్రేమ కోసం కత్తి పట్టిన వీరులు – ప్రేమ కోసం సప్తసముద్రాలు దాటే  సాహసవంతులు పోయి   ప్రేమించమని మారణాయుధాలు చేత బూనినవారు సంచరించే యీ కాలంలో ‘నీ సుఖమే కోరుకుంటా’ అని పాడుకునే హృదయాలని ఆశించటం అత్యాశే మాత్రమే బరువు కూడ. ఆల్ యీస్ వెల్ – ఆల్ హాప్పీస్ అయితే మనసు సంతోషపడుతుంది. నిజానికి  ప్రేమేమి మరీ అరుదు కాదు. యెడారి వోయాసిసేం కాదు. Come… fall in Love’  అంటూ రైలు బండినెక్కించే ప్రేమ మనలని పచ్చగా మైమరిపిస్తూనే వుంది. ‘జొన్నకంకి ధూళి పడినట్టు కన్నులలో దూరి తొలచితివే’ అని మన హృదయం తీయని డిస్ట్రబెన్స్ ని హమ్ చేస్తూనే వుంటుంది.  కళ్ళతో మాటడే  ఓకే బంగారం  చాల యెక్కువ కదా  యీ గజిబిజి  మెట్రోలో.  అసలంటూ హృదయంలో ప్రేమనే జీవధార వుంటే జీవితపు అన్ని ప్రయాణాలని  అన్ని వేళలా పచ్చగా విరపూయిచగలం.

Diamonds are forever – అది వొక మిత్ అని తెలుసు. కాని ప్రతిదాన్ని జల్లెడేసి తూర్ర్పార పడితే అందమైన  భ్రమలు కూడ మిగలవ్. ప్రేమగా మరింత ప్రేమగా మనం మనసులని ప్రేమగా ముద్దు పెట్టుకుందాం.  Love forever మాత్రం మిత్ కాదని  మరలమరల హత్తుకోవలసిన అందించాల్సిన అందుకోవలసిన  ప్రాణవాయువని మనకి మనమే యెప్పటికప్పుడు  మన మనసులని తట్టి చెప్పు కోవాలి…

ప్రేమిద్దాం  రహస్యంగా నంగినంగి కాదు. వెలుగంత ప్రకాశవంతంగా…

*

షరా మామూలుగా తవ్వకాలు, తగవులాటలూ…

 

స్లీమన్ కథ-24

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

తీరా మైసీనియాలో తవ్వకాలు ప్రారంభించ బోయేసరికి ఎక్కడినుంచి, ఎలా మొదలెట్టాలో స్లీమన్ కు వెంటనే తోచలేదు. ఆ ప్రాంతానికి చెందిన ఏవో స్థలపురాణాలు, విశ్వాసాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో స్పష్టత ఉన్నవి తక్కువ. పైగా కొన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. అక్కడి వీరుల సమాధుల గురించిన ప్రామాణిక వివరణ పసన్నియస్ రాతల్లో లభిస్తోంది:

మైసీనియా శిథిలాల్లో ‘పెర్షా’ అనే ఒక జలయంత్రమూ; ఏట్రియస్ కు, అతని కొడుకులకు చెందిన భూగర్భ భవనాలూ ఉన్నాయి. వీటిలో నిధినిక్షేపాలను పాతిపెట్టారు.ఏట్రియస్ సమాధితోపాటు; ట్రాయ్ యుద్ధం నుంచి తిరిగొచ్చి, ఏగిస్త్వస్ ఇచ్చిన విందులో పాల్గొని, ఆ తర్వాత అతని చేతిలో హతులైన వాళ్ళ సమాధులూ ఉన్నాయి. అలాగే, అగమెమ్నన్, అతని రథసారథి ఎవ్రిమిడాన్, ఎలెక్త్రాల సమాధులూ; కవలపిల్లలైన తేలమస్, పెలోపస్ ల సమాధులూ ఉన్నాయి. కసండ్రా(ట్రాయ్ రాకుమారి, గొప్ప సౌందర్యవతి, ఒక కథనం ప్రకారం అగమెమ్నన్ ఉంపుడుగత్తె)కు పుట్టిన ఈ కవలలను పసితనంలోనే, తల్లిదండ్రులతోపాటు ఏగిస్త్వస్ హతమార్చాడని చెబుతారు. అగమెమ్నన్, తదితరుల సమాధులకు దగ్గరలో సమాధి చేయడానికి తగరన్న ఉద్దేశంతో క్లైటమెనెస్ట్రా, ఏగిస్త్వస్ లను ప్రాకారానికి ఒకింత అవతల సమాధి చేశారు.

మైసీనియాకు సంబంధించిన గ్రంథాలను, నాటకాలతో సహా, స్లీమన్ అధ్యయనం చేశాడు. వాటిని దాదాపు కంఠస్థం చేశాడు. వాటిలోని వర్ణనలను మననం చేసుకుంటూ వచ్చాడు. హోమర్ రచనలతో సమానంగా వాటిని కూడా ప్రామాణికంగా భావించి గౌరవించాడు. ట్రాయ్ పతనమైన 1300 ఏళ్ల తర్వాత పసన్నియస్ దాని గురించిన సమాచారాన్ని గ్రంథస్థం చేశాడు. కేవలం స్థలపురాణాలనే ఉన్నవున్నట్టు నమోదు చేశాడు. తను చిన్నప్పుడు హెన్నింగ్ వాన్ హోస్టీన్ కు చెందిన స్థానికగాథను నమ్మినట్టే స్లీమన్ వీటినీ నమ్మాడు. నిధినిక్షేపాలను పాతిపెట్టడం గురించిన కథలను మరింత నమ్మాడు.

పసన్నియస్ ఇచ్చిన సమాచారం గురించి ఆలోచిస్తున్నకొద్దీ తనకు ముందటి వ్యాఖ్యాతలు తప్పులో కాలేశారన్న అభిప్రాయం అతనిలో బలపడింది. వారి ప్రకారం, క్లైటమెనెస్ట్రా సమాధి నగరప్రాకారాలకు అవతల ఉంది. ఏట్రియస్, అగమెమ్నన్, అతనితోపాటు హతులైన వాళ్ళ సమాధులు ప్రాకారాలకు లోపల ఉన్నాయి. అయితే, పసన్నియస్ కాలానికే నగరప్రాకారాలు కుప్పకూలి కేవలం శిథిలాలు మిగిలాయి. అగమెమ్నన్ సమాధి నగరప్రాకారాల లోపల కాకుండా, గిరిదుర్గ ప్రాకారాల లోపల ఉందని చెప్పడం పసన్నియస్ ఉద్దేశమని స్లీమన్ భావించాడు. దాంతో, ట్రాయ్ లో సింహద్వారం దగ్గర నిక్షేపాలు లభించినట్టే, ఇక్కడా లభిస్తాయన్న నిర్ధారణకు వచ్చి సింహద్వారం దగ్గరే 1876 ఆగస్టులో తవ్వకాలు ప్రారంభించాడు. అరవైముగ్గురిని పనిలోకి తీసుకున్నాడు. ట్రాయ్ అనుభవంతో ముందే జాగ్రత్తపడిన ప్రభుత్వం, అతని కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచడానికి గ్రీకు పురావస్తు సంఘానికి చెందిన ముగ్గురు అధికారులను నియమించింది.

తనపై ఎవరు నిఘా పెట్టినా స్లీమన్ కు నచ్చదు. అందులోనూ అధికారులైతే కోపం నసాళానికి అంటుతుంది. సింహద్వారం అవతల రహదారిని మూసేస్తూ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. వాటిని తొలగించడానికి పనివాళ్ళను పురమాయించాడు. అధికారులు అభ్యంతరం చెప్పారు. నా ప్రణాళికకు అడ్డుతగులుతున్నారంటూ స్లీమన్ వాళ్లపై మండిపడ్డాడు. ఎప్పటిలా అధికారుల కళ్ళు కప్పడం కోసం పనివాళ్లను బృందాలుగా విడదీసి తలో చోటా పనిచేయించడం ప్రారంభించాడు. ఎండ విడుపులేకుండా దహిస్తోంది. దానికితోడు ఆ ప్రాంతమంతటా ధూళిమేఘాలు దట్టంగా కమ్మేశాయి. ఆ వాతావరణంతో పోటీపడి స్లీమన్ లో కోపతాపాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సందర్భాలలో అతనితో వాదనకు దిగడానికి ధైర్యం చాలని అధికారులు సోఫియాను కలసి ఫిర్యాదు చేయడం, ఆమె వీలైనంతవరకు వాళ్ళను శాంతింపచేయడానికి ప్రయత్నించడం, అది ఒక్కోసారి విఫలమవడం రివాజుగా మారింది.

పని వేగం పుంజుకుంటున్న కొద్దీ ఎక్కువమందిని పనిలోకి తీసుకున్నాడు. మరిన్ని గోడలను నేలమట్టం చేసేలా కనిపించాడు. ఈసారి అధికారులు మరింత గట్టిగా అభ్యంతరం చెప్పారు, గ్రీకు పురావస్తు సంఘం ముఖ్యప్రతినిధి స్టెమటేక్స్ ప్రభుత్వానికి ఇలా రాశాడు:

పురాతన కుడ్యాలను కూల్చడానికి గ్రీకు, రోమన్ తాలూకు పురావస్తువులనన్నింటినీ పగబట్టినట్టు ధ్వంసం చేసేస్తున్నాడు. గ్రీకు, రోమన్ కలశాలు కంటబడితే చీదరించుకుంటున్నాడు. వాటి తాలూకు ముక్కలను పారేస్తున్నాడు. నన్నో ఆటవికుడిగా చూస్తున్నాడు. నా విధినిర్వహణ మీకు సంతృప్తికరంగా లేకపోతే, దయచేసి నన్ను వెనక్కి పిలిపించండి. ఎందుకంటే, నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇక్కడ ఉంటున్నాను. రాత్రి తొమ్మిది వరకూ రోజంతా అతనితో కలసి తవ్వకాల దగ్గర గడుపుతున్నాను. ఆ తర్వాత, అర్థరాత్రి రెండువరకూ అతనితో కూర్చుని బయటపడిన పురావస్తువులను నమోదు చేస్తున్నాను. తను అధ్యయనానికి అవసరమంటే, కొన్ని వస్తువులను ఇంటికి పట్టుకెళ్లడానికీ అనుమతిస్తున్నాను.

దానిపై ప్రభుత్వం స్టెమటేక్స్ కు మరోసారి కచ్చితమైన ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం, ఏ గోడనూ కూల్చడానికి వీల్లేదు. తవ్వకాలు ఒకే సమయంలో అనేకచోట్ల జరగకూడదు. ఒక్కచోట మాత్రమే జరగాలి. పర్యవేక్షణకు వీలైన మేరకు పనివాళ్ళ సంఖ్యను పరిమితం చేయాలి. చివరగా, ఈ ఉత్తర్వుల ఉల్లంఘనే జరిగితే అందుకు స్టెమటేక్స్ బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.

నాఫ్లియో ముఖ్యాధికారిని వెంటబెట్టుకుని స్టెమటేక్స్ జంకుతూనే వెళ్లి స్లీమన్ ను కలిశాడు. వీలైనంత మృదువుగా, మర్యాదగా పై ఉత్తర్వుల గురించి చెప్పాడు. అయినాసరే, స్లీమన్ భగ్గుమన్నాడు. స్టెమటేక్స్ ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించమని నాఫ్లియో ముఖ్యాధికారితో అన్నాడు. ఇలాంటి వాళ్ళతో తను క్షణం కూడా పనిచేయలేయనన్నాడు. మీరు చట్టాలకూ, ఒప్పందాలకూ లోబడి పనిచేయాలని స్టెమటేక్స్ అన్నాడు. ఇది ఒప్పందాలను ముందుపెట్టుకుని చేసే పనికాదని స్లీమన్ విరుచుకుపడ్డాడు…

ఈ అధికారులు వట్టి మూర్ఖులు, వీళ్ళకు ఏమీతెలియదు, పుండు సలిపినట్టు తనను సలుపుతున్నారు. భూగర్భంలో లోతుగా సమాధైన ఒక పురాతన నాగరికతకు చెందిన ఆనవాళ్లను బయటపెట్టడానికి తను ప్రయత్నిస్తున్నాడు. ఎంత పవిత్రమైన విధిని తను తలకెత్తుకున్నాడో వీళ్ళకు అర్థం కాదు. ఆధునిక శాస్త్రవిజ్ఞానం అందించిన అన్ని పద్ధతులనూ వినియోగించి ఈ  పురాతన నాగరికతా చిహ్నాలను పరిరక్షించడానికి సైతం తను సిద్ధంగా ఉన్నాడు. తను ఏం చేయాలన్నా తగినంత స్వేచ్ఛ ఉండాలి. ఈ అధికారులనే వాళ్ళు తన జోలికి రాకూడదు!…ఇదీ ఎప్పటిలానే స్లీమన్ వాదం.

స్లీమన్ నిప్పులు చెరుగుతుంటే, సోఫియా తెరవెనుక నిశ్శబ్దంగా ఉండిపోయింది. నాఫ్లియో ముఖ్యాధికారి ఎథెన్స్ నుంచి తనకు అందిన ఉత్తర్వును చదివి వినిపించాడు. ఒక పక్క, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యతాయుతుడైన అధికారి! ఇంకోపక్క, కేవలం గతానికి మాత్రమే జవాబుదారీగా వ్యవహరించవలసిన పురావస్తునిపుణుడు! వాతావరణం చాలా వేడెక్కిపోయింది. కోపంతో స్లీమన్ ముఖం ఎర్రబడిపోయింది. పనివాళ్లు పని ఆపేశారు.

నాఫ్లియో ముఖ్యాధికారి ఉత్తర్వులను చదివి వినిపించడం పూర్తయింది. అధికారుల ఉనికినే పట్టించుకోనట్టుగా స్లీమన్ వెంటనే పనివాళ్లవైపు తిరిగి, మీ పని మీరు కానివ్వండని హూంకరించాడు. అతని కళ్ళల్లోని ఎరుపును చూసి పనివాళ్లు భయపడ్డారు. అయిష్టంగానే మందకొడిగా పని మొదలు పెట్టారు. అదే రోజు సాయంత్రం సంబంధిత మంత్రిత్వశాఖకు స్లీమన్ మరో సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు. తపాలాశాఖ మీద నమ్మకం లేక మరునాడు ఆ ఉత్తరం ఇచ్చి సోఫియాను ఎథెన్స్ కు పంపించాడు. సోఫియా ఆ ఉత్తరాన్ని స్వయంగా మంత్రికి ఇవ్వడమే కాదు, అప్పటికప్పుడు ఆయన చేత జవాబు రాయించి తీసుకురావాలి.

తవ్వకాలు కొనసాగాయి. స్లీమన్, స్టెమటేక్స్ ఒకరి పీకలు ఒకరు పట్టుకునే ఉన్నారు. ఆ కలహాల కాపురంలో మధ్య మధ్య రాజీలు, పరస్పర అభిమాన ప్రకటనలూ ఉన్నాయి. బెదిరింపులు, అనునయ వాక్యాలతో పై వాళ్ళకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూనే, తను అనుకున్న పద్ధతిలో పని చేసుకుంటూ పోయే కళలో స్లీమన్ ఇప్పటికే ఆరితేరాడు. మంత్రికి రాసిన ఉత్తరంలో గ్రీసు పట్ల తన అచంచలమైన ప్రేమను, పురావస్తు తవ్వకాల పట్ల నిబద్ధతను మరోసారి నొక్కి చెప్పాడు. నాఫ్లియో ముఖ్యాధికారికి పంపిన ఉత్తర్వులను ఏదో క్షణికావేశంతో పంపినవిగా తను భావిస్తున్నానన్నాడు. తననింత అవమానకరంగా చూస్తున్న దేశంలో తవ్వకాలు జరపాలన్న కోరిక కూడా నాలో చచ్చిపోతోందన్నాడు.

గ్రీకు, టర్కీ ప్రభుత్వాల దగ్గర ఇలాంటి ఉత్తరాలతో పెద్ద పెద్ద దస్త్రాలు తయారయ్యాయి. అతని ఎత్తుగడలను అవి ఇప్పటికే ఆకళించుకున్నాయి. కనుక పై ఉత్తరంలో రాసింది బూటకపు బెదిరింపని గ్రీసు ప్రభుత్వానికి తెలుసు. తవ్వకాలు విరమించి పోతానంటే ఆపకూడదని అనుకుంది. అయితే, గ్రీస్ ను విడిచిపెట్టి వెళ్ళే ఉద్దేశం సోఫియాకు లేదు. ఆమె కూడా నటనలో ఆరితేరినదే. భర్త పక్కన పెట్టని కోటలా నిలబడింది. ప్రతిపక్షులను చిత్తు చేయడంలో తన మెళకువలను అన్నిటినీ ప్రయోగించింది. స్లీమన్ వ్యూహాలను పక్కాగా అమలుచేయడంలో ఆమె పూర్తి భాగస్వామి  అనీ, అతని కన్నా కూడా అసలు కుట్రదారు ఆమే ననీ స్టెమటేక్స్ కు త్వరలోనే అర్థమైపోయింది. పెద్దమనిషి తరహా కలిగిన అతడు కూడా ఆంతరంగిక సంభాషణాల్లో ఆమెను “రాక్షసి’గా తిట్టిపోయడం ప్రారంభించాడు.

9f5321c5acc5ed373c5ef569c44a9f3b

తవ్వకాలు ఆపేసి అమెరికా వెళ్లిపోతానని స్లీమన్, రాజీనామా చేసి తప్పుకుంటానని స్టెమటేక్స్ అలా బెదిరిస్తూనే ఉండడం; వివాదం విషమించినప్పుడల్లా సోఫియా రంగప్రవేశం చేసి ఇరుపక్షాలనూ శాంతింపచేయడం ఒక తంతుగా మారిపోయింది. ఇతరుల ఘనతను గుర్తించే అలవాటు బొత్తిగా లేని స్లీమన్, సోఫియా చాకచక్యానికి మాత్రం ముగ్ధుడైపోయేవాడు. తను నక్కజిత్తుల ఒడీసియస్ అయితే, ఆమె పెనెలోపి అనుకునేవాడు.

తవ్వకాలలో చెప్పుకోదగినవేవీ బయటపడడం లేదు. ట్రాయ్ లో దొరికినట్టుగా  రోమన్, బైజాంటైన్ నాణేలు కూడా ఇక్కడ దొరకకపోవడం స్లీమన్ కు వింతగా అనిపించింది. శిథిలాల అడుగున, రేఖాగణిత నమూనా చిత్రణలు కలిగిన పురాతన కలశాలు; విచిత్రంగా, బొర్డో మద్య పాత్రలను తలపించే గుండ్రని మృణ్మయపాత్రలు దొరికాయి.  ఆపైన ట్రాయ్ లో లానే ఎరుపురంగు పులిమిన చిన్న చిన్న అమ్మవారి మట్టిబొమ్మలు, కత్తులు, బొత్తాలు, జంతువుల మట్టిబొమ్మలు, మోత్యా తవ్వకాల్లో దొరికిన లాంటి బాణపు మొనలు, చక్కని నీలిరాతితో చెక్కిన వందలాది బొంగరం ఆకృతులు, దువ్వెనలు, సూదులు, స్ఫటికపు ముక్కలు, తిరగళ్ళు, గొడ్డళ్ళు: మైసీనియా వాద్యపరికరాలలో భాగంగా స్లీమన్ భావించిన ఎముక ముక్కలు కనిపించాయి. చూడబోతే, ట్రాయ్ లో తనకు ఎదురైన అనుభవమే పునరావృత్తమవుతోందా అని అతనికి అనిపించింది. అక్కడిలానే అసంఖ్యాకమైన బొంగరం తరహా బొమ్మలు, లింగాకృతులు, అమ్మవారి మట్టిబొమ్మలు! అంతకు మించి విశేషమైనవేవీ లేవు.

ఎట్టకేలకు, నాలుగు లేదా అయిదో వారంలో సింహద్వారా(Lion Gate)నికి దక్షిణంగా జరుపుతున్న తవ్వకాలలో రెండు ఇసుకరాతి సమాధి రాళ్ళు బయటపడ్డాయి.  ఒక్కొక్కటి నాలుగు అడుగుల ఎత్తు ఉన్నాయి. వాటిపై ఆదిమకాలపు దారుచిత్రాల శైలిని పోలిన బొమ్మలు ఉన్నాయి. వాటిలో ఒక దానిలో ఒక వేటగాడు రథంమీద ప్రయాణిస్తూ జింకను వేటాడుతూ ఉంటాడు. రథం పక్కనే ఒక వేటకుక్క పరుగెడుతూ ఉంటుంది. ఇంకో బొమ్మలో ఒక నగ్నసైనికుడు ఒక పెద్ద కత్తి పుచ్చుకుని రథం మీద వెడుతుంటాడు. ఈ బొమ్మల శైలికి, సింహద్వారంపై ఉన్న బొమ్మల శైలికి పోలిక ఉన్నట్టు స్లీమన్ గమనించాడు. గుర్రాల తోకలు, కుక్క తోక మామూలుకు భిన్నంగా చాలా లావుగానూ, పొడవుగానూ ఉన్నాయి. రథాలను మాత్రం రేఖామాత్రంగా చెక్కారు. ఈ రథాలు అచ్చంగా ట్రోజన్ యుద్ధాలలో ఉపయోగించిన రథాలలానే ఉన్నాయని స్లీమన్ నిర్ధారించాడు.

ఆ తదుపరి రోజుల్లో జరిపిన తవ్వకాల్లో కూడా సమాధి రాళ్ళ శకలాలు దొరికాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక బంగారు బొత్తం కనిపించింది. అలా సమాధి రాళ్ళ దగ్గరే బంగారు బొత్తం కనిపించేసరికి సమీపంలోనే నిక్షేపాల వాసన ఏదో స్లీమన్ కు ఘాటుగా సోకింది.

ఆ సమాధిరాళ్ళు సింహద్వారానికి అవతల ఉన్న ఒక వలయాకార ప్రదేశంలో కనిపించడంతో అక్కడే తవ్వకాలు కొనసాగించాడు. అక్కడ బయటపడుతున్నవి మొదట అతనికి చిక్కుముడిగా కనిపించాయి. ఆ వలయాకారప్రదేశంలో చుట్టూ బల్లల రూపంలో రాతి పలకలను అమర్చారు. అధికారిక శాసనాలను చదివి వినిపించడానికి చాటింపు వేసి ప్రభువర్గాన్ని పిలిపించే బహిరంగ సమావేశస్థలిగా అది కనిపించింది. బహుశా అదొక నృత్యస్థలి, కవిసమ్మేళనస్థలీ కూడా కావచ్చు. అక్కడే గొప్ప గొప్ప వక్తల ప్రసంగాలు, బహుమతి ప్రదానాలూ జరుగుతూ ఉండివేమో. ఆయా సందర్భాలలో రాచరికానికి చెందిన పవిత్ర చిహ్నాలను అక్కడే ప్రజల సందర్శనకు ఉంచేవారేమో….

పవిత్రప్రదేశాలుగా పరిగణించే ఇటువంటి తావులు సాధారణంగా మృతవీరుల స్మారకనిర్మాణాలతో ముడిపడి ఉంటాయి. అక్కడి రాతి పలకల అడుగున రాజుల సమాధులు ఉండడమూ కద్దు. ఇలాంటి ప్రదేశాలను ‘ఆగొరా’(agora) అని పిలుస్తారు. ఇవి పవిత్రమైన తావులే అయినా విపణి ప్రదేశాలుగా కూడా వాడుకలో ఉండేవి. యురిపిడిస్ తన ‘ఎలెక్త్రా’ అనే రచనలో, బంగారు ఉన్ని కలిగిన గొర్రెపిల్లను దర్శించడానికి మైసీనియా ప్రజలను ఆగొరాకు ఆహ్వానించడం గురించి రాస్తాడు. బంగారు గొర్రెపిల్ల మైసీనియా రాచరికచిహ్నం. వీరుల సమాధులు ఆగొరా లోపలే ఉన్నాయని పసన్నియస్ రాశాడు. తెరా దీవిలోని ఆగొరాలో వీరులను సమాధి చేశారని పింధరోస్(ప్రాచీన గ్రీకు గేయకవి)రాశాడు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మైసీనియా వీరుల సమాధులు ఈ వలయాకారపు ఆగొరా లోనే ఉండి ఉంటాయని స్లీమన్ నిర్ణయానికి వచ్చాడు.

అయినా వెంటనే ఈ ప్రదేశంలో మరిన్ని తవ్వకాలు జరిపించకుండా, దానికి దక్షిణంగా కిటికీలు లేని ఏడు గదులతో ఉన్న ఒక రాతి కట్టడాన్ని రాజప్రాసాదంగా ఊహించుకుని మొదట అక్కడ తవ్వకాలు ప్రారంభించాడు. కానీ నిరాశే ఎదురైంది. ఎప్పటిలానే నీలిరంగు రాతితో మలచిన బొంగరం ఆకృతులు, గొడ్డళ్ళు, చిత్రిత మృణ్మయ కలశాల తాలూకు ముక్కలు కనిపించాయి. 12 అంగుళాల ఎత్తున్న ఒక కలశం మాత్రమే ఉన్నంతలో విలువైనదిగా కనిపించింది. దాని మీద యుద్ధానికి వెడుతున్న సైనికుల చిత్రం ఉంది. వారిని ముదురు ఎరుపు రంగులో చిత్రించారు. విశేషమేమిటంటే, ట్రాయ్ యుద్ధానికి ముందునాటి సైనికులను, వారి ఆయుధాలను ఈ చిత్రం ప్రదర్శిస్తోంది. వీటిలో మంచి జీవకళ ఉట్టిపడుతూ, ఆధునిక సరళిని తలపిస్తూ ఉండడం మరింత ఆసక్తికరం. అతి పురాతన గతానికి చెందిన ఈ సైనికులు సజీవంగా మన ముందుకొచ్చి నిలబడినట్టు ఉంటారు. అంతేకాదు, ఈ సైనికులు ధరించిన దుస్తుల లాంటివే హోమర్ చిత్రించిన వీరులు ధరించి ఉంటారని స్లీమన్ అనుకున్నాడు.

(సశేషం)

 

 

 

అక్షరమే అష్రఫ్ పోరాటం!

 

తెలుగు సేత : జగద్ధాత్రి

 

సమాన అవకాశాలు

ఒక కొడుకు , ఒక కూతురు

తల్లి కూతురికంటే కొడుకే కావాలని కోరుకుంది

జీవితపు ఒడిదుడుకులన్నింటా కొడుకు తల్లికి తోడుగా ఉంటాడు

కూతురు తనో కొడుకును కంటుంది తనకు దన్నుగా నిలబడేందుకు.

 

ఓ ప్రహేళిక

ప్రేమలో పడటం అంటే నువ్వు ప్రేమించిన ఒకడి చేతిలో పక్షిలా ఉండటం కాదు

పొదలో ఉన్న పది ఇంతకంటే పదిలం

పొదలో ఉన్న ఒక్క పక్షి, చేతిలో ఉన్న పది పక్షులకంటే మెరుగు

పక్షి దృష్టి కోణం నుండి

 

ముగింపులు

కొన్ని సార్లు ప్రేమ, ఉపవాసం ఉన్న వాడికి భోజనం లాంటిది

మరి కొన్ని మార్లు అంగవైకల్యం గల పిల్లవాడికి

సరి కొత్త జత బూట్స్ జత ఇవ్వడం లాంటిది

ప్రేమ, సాధారణంగా , పెద్ద మొత్తం లో

అన్ని వైపులా అందరికి నష్టం కలిగించే బేరం

 

తర్కం

ఆ పాత తలుపులు చప్పట్లు కొట్టాయి

చెట్లతో కలిసి గాలి ప్రదర్శించిన నృత్యానికి మెచ్చుకోలుగా

ఆ పాత తలుపులకి చేతులు లేవు

ఆ చెట్లు ఏ నర్తన శాలకూ వెళ్ళి ఉండలేదు

చెట్లతో కలిసి నృత్యం చేస్తున్నా సరే

అగుపించని జీవి గాలి

 

(అష్రఫ్ ఫయాధ్ సౌదీ అరేబియా లోని యువ కవి. మతానికి వ్యతిరేక కవిత్వం రాశాడన్న నేరం పై మరణ శిక్ష విధించబడిన వాడు. ఇప్పుడు మరణ శిక్షని తగ్గిస్తూ 8 సంవత్సరాలు జైలు శిక్ష , 800 కొరడా దెబ్బలు గా శిక్ష ఖరారు చేసేరు. మనం ఉన్నది మనుషుల లోకమేనా ఒక యువ మేధావికి, కవికి ఇలాంటి శిక్షా అని ప్రపంచం మొత్తం ఈ శిక్షని వ్యతిరేకిస్తోంది. )

నాలుగు చిన్న కవితలు అష్రఫ్ ఫయాధ్ వి: Equal opportunities , An aphorism, Conclusions, Logic   అరబిక్ నుండి ఆంగ్ల సేత జొనాథన్ రైట్

*

 

 

సగం చెక్కిన శిల్పం

 

 

చూరు మీంచి వర్షం ధారగా పడుతోంది. అక్కడే నిలబడి అరచేతులతో ఆ ధారని పైకి కొడుతూ ఆడుతున్నాడు మోహన్.

“వర్షంలో ఆడకు. లోపలికి రారా మోహన్.” అరిచింది తల్లి.

“నేను వర్షంతో ఆడుకుంటున్నా. వర్షంలో కాదు” అన్నాడు మోహన్.

“చెప్పిన మాట ఎప్పుడైనా విన్నావా” అంటూ రెక్క పట్టుకుని లోపలికి లాక్కొచ్చి కంచం ముందు కూర్చోబెట్టి “తిను ..” అంది. అప్పుడే మోహన్ తండ్రి ఇంటికి వస్తూ “ఏరా జేబులో ముప్పై రూపాయలు కనిపించడం లేదు తీసావా?” అనడిగాడు. అలానే తలొంచుకొని తింటున్నాడు ఏమి ఎరగనట్టు.

“నిన్నేరా అడుగుతోంది చెప్పు, తీసావా?” అనడిగింది తల్లి.

“నాకేం తెలియదు” అన్నాడు మోహన్.

“వాడిని అలా అడిగితే ఎందుకు చెప్తాడు.” అంటూ పైన షెడ్ రేకులో ఉన్న బెత్తాన్ని లాగాడు.

“నిజంగా నాకేం తెలియదు నాన్న” అన్నాడు భయంగా.

“తెలియదా?” కోపంగా చూస్తూ అడిగాడు తండ్రి. మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరినీ చూస్తున్న మోహన్ తల్లికి విషయం అర్ధమైంది. మోహన్ తల మీద ఒక మొట్టికాయ మొట్టి “ఏం చేసావ్ రా ముప్ప్పై రూపాయలు?” అనడిగింది మోహన్ని.

“వాడిని అలా అడిగితే ఎందుకు చెప్తాడే,,” అంటూ రెక్క పట్టుకుని పక్కకు లాగాడు. కాళ్ళ మీద బెత్తంతో కొడుతూ “బొమ్మలు చెక్కుతాడంత ఈడు. ఉలి కొన్నాడు. అది వంద రూపాయలు అయితే ముప్పై ఇచ్చి డెబ్బై అరువు పెట్టాడు. ఆ కొట్టు వాడు ఇంటికొస్తుంటే నన్ను అడిగాడు డెబ్బై ఇమ్మని. ఇచ్చాను. దొంగతనం చేయడం కూడా నేర్చుకున్నాడు ఈ ఎదవ ” అంటూ తట్టు తేలేలా కొట్టాడు.

“ఇంకెప్పుడు చేయను నాన్నా, కొట్టకు నాన్నా” అన్నాడు బతిమాలుతూ.

దూరంగా నెట్టేసి “ఇయాల ఈడికి అన్నం పెట్టకు. కడుపు మాడితే తెలుస్తాది ఎదవకి.” అని చెప్పి విరిగిన కర్రను విసిరేసి వెళ్ళిపోయాడు. అక్కడ కర్రతో పాటు మోహన్ మనసు కూడా విరిగిపోయింది.

 

*             *             *

ఉదయాన్నే మోహన్ అన్నయ్య మురారి వచ్చాడు. వస్తూనే “అమ్మా తమ్ముడేడి?” అడిగేడు బ్యాగ్ కింద దించుతూ. మంచి నీళ్ళు అందించి “వాడేం చేస్తున్నాడో ఏమి అర్ధం కావడం లేదురా మురారి” అంది తల్లి.

“ఏం చేసాడమ్మా?” అనడిగాడు మురారి.

“ఏం చేసాడా! దొంగతనం చేసాడు.” అన్నాడు తండ్రి టిఫిన్ తింటూ.

“ఎక్కడున్నాడు?”

“అదిగో పెరట్లో ఎక్కడో ఉంటాడు. ఏం తినడంట. కోపం వచ్చిందంట నిన్న అన్నం పెట్టకు అన్నాను. ఈరోజు ఎందుకు తెచ్చారు అని పొమ్మన్నాడు. పౌరుషానికేం తక్కువ లేదు ఎదవకి.” అన్నాడు తండ్రి టిఫిన్ తినేసి చేతులు కడుగుకుంటూ.

“ఎందుకు నాన్న వాడిని అలా చేస్తారు” అని తమ్ముడి కోసం పెరట్లోకి వెళ్ళాడు టిఫిన్ ప్లేట్ తీసుకుని.

నూతిలోకి చూస్తూ ఏడుస్తున్నాడు మోహన్. అతని కన్నీరు అందులో పడుతుంటే నీటిలో అలజడి అవుతుంటే చూస్తూ ఉన్నాడు.

“తమ్ముడూ..” పిలిచాడు. వెంటనే వెనక్కి చూసాడు. ఆనందంతో పరిగెత్తికెళ్ళి అన్నయ్యని పట్టుకుని ఏడ్చాడు. “అన్నయ్య నన్ను కొడుతున్నారన్నయ్యా.. చూడు నాన్న ఎలా కొట్టాడో అంటూ కాలు చూపించాడు. నేను ఇక్కడ ఉండను అన్నయ్య. నన్ను నీతో తీసుకెళ్ళిపో అన్నయ్యా , ప్లీజ్ అన్నయ్యా ” అని బతిమాలాడు మోహన్.

“సరే తీసుకెళ్ళిపోతాను. ముందు టిఫిన్ చేయి” అని టిఫిన్ ప్లేట్ ఇచ్చాడు. రాత్రి కూడా ఏమి తినలేదేమో ఆబగా అంతా ఆవురావురు మంటూ తినేసాడు.

కాసేపు అయ్యాక  “చెప్పు ఎందుకు తీసావ్ ముప్పై రూపాయలు?” అనడిగాడు మురారి.

“ఉలి కొన్నాను” అన్నాడు మోహన్ తలొంచుకుని.

“ఎందుకు?” అనడిగాడు మురారి చిరు నవ్వుతో.

“ఎందుకేంటి అన్నయ్యా, మొన్న మనూరి శివుడి గుడికెళ్ళాను. అక్కడ ఎవరో ఫారనర్స్ వచ్చి గుడి మీద చెక్కిన బొమ్మలు ఫొటోస్ తీసుకుంటున్నారు. మా సోషల్ సార్ కూడా వచ్చారులే అప్పుడు, ఆయన వాళ్ళకు మన దేశ శిల్ప కళ చాలా గొప్పదని చెప్తున్నారు.. అప్పుడు నేను సార్ ని అడిగాను. నాకేలాగో చెక్క మీద బొమ్మలు చేయడం వచ్చు కదా, అందుకని ఇలా రాళ్ళ మీద ఎలా చేస్తారు అని అడిగాను. ఉలితో అని చెప్పారు. ఉలి ఎలా ఉంటుంది అని అడిగాను. చెప్పారు. మన సాంబడి కొట్లో దొరుకుతుంది అన్నారు. వెంటనే కొనేయాలి అనిపించింది. నా దగ్గర డబ్బులెక్కడివి? అందుకే నాన్న జేబులో తీసాను. నాకేం తెలుసు మిగిలిన డబ్బులు వాడు నాన్నని అడుగుతాడని? నువ్వొచ్చాక నీ దగ్గర తీసుకుని ఇద్దాం అనుకున్నాను.” అని ముగించాడు.

“సరే, బాగుంది. కాని ఈసారి డబ్బులు కావాలంటే నన్ను అడుగు సరేనా. అంతేగాని ఇలా డబ్బులు తీసి తన్నులు తినకు. ” అని చెప్పాడు మురారి.

“సరే అన్నయ్యా” అని మాట ఇచ్చాడు. మురారి హైదరాబాద్ లో ఎం.బి.బి.యస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మోహన్ టెన్త్ పరీక్షలు రాసి రిసల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

నాలుగు రోజులు ఉండి వెళ్ళడానికి సిద్ధ పడ్డాడు మురారి. అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అంటే మోహన్ కి అప్పుడే బెంగ పట్టుకుంది. “ఇంకో రెండు రోజులు ఉండు అన్నయ్యా” అనడిగాడు మోహన్.

“నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయిరా. వచ్చేస్తాను. వచ్చేవారం నీ రిసల్ట్ రోజు ఇక్కడే ఉంటాను. ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయు సరేనా .” అని చెప్పి బయలుదేరాడు మురారి.

 

*             *             *

 

మురారి వెళ్ళినప్పటి నుండి మోహన్ అసలు ఇంట్లోనే ఉండేవాడు కాదు. పొద్దున్నే బయటకు పోయి రాత్రికి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు మోహన్ ఎక్కడున్నాడో చూడమని మోహన్ ఫ్రెండ్ రాంబాబుకి చెప్పింది మోహన్ తల్లి. మోహన్ ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఊరవతల కొండ మీద రాయి మీద ఏదో చెక్కుతూ కనిపించాడు మోహన్.

“ఇక్కడేం చేస్తున్నావ్ రా ?” అనడిగాడు రాంబాబు ఆయాస పడుతూ.

“చూడు,” అన్నాడు మోహన్  వెలిగిపోతున్న మొహంతో.

ఆ కొండ మీద ఉన్న ఒక పెద్ద రాయి మీద ఆ ఊరు ఎలా కనిపిస్తోందో చెక్కే పనిలో ఉన్నాడు. ముందుగా సుద్దతో దాని మీద బొమ్మ గీసుకుని చెక్కుతున్నాడు. ఆశ్చర్యంగా చూసాడు రాంబాబు. “ఓడియమ్మ, భలే చెక్కావ్ రా,” అన్నాడు రాంబాబు.

అప్పుడే అక్కడికి వచ్చిన మరో ఫ్రెండ్ గిరి “ఏం చేస్తున్నార్రా ఇక్కడ?” అనడిగాడు.

“చూడరా, మనోడు ఎలా చెక్కాడో.” అని చేయి పెట్టి చూపించాడు రాంబాబు.

“బానే ఉందిరా, రేపు మన రిసల్ట్స్, తేడా వస్తే వాడికి బడిత పూజే” అని అన్నాడు గిరి. మతాబులా వెలిగిపోతున్న మోహన్ ముఖం భయంగా మారిపోయింది.

Kadha-Saranga-2-300x268

 

*             *             *

హాస్టల్ లో మురారిని అతని ఫ్రెండ్ పలకరిస్తూ “రేపే కదా టెన్త్ రిసల్ట్? అన్నట్టు మీ తమ్ముడే టెన్త్ క్లాసే కదా” అనడిగాడు.

“అవును. వాడికి చదువు అంతగా అబ్బలేదు. కాని బొమ్మలు బాగా చెక్కుతాడు. మన ల్యాబ్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవకపోతే ఈరోజే వెళ్ళేవాడిని. కాని రేపు ఎగ్జామ్ అయ్యాక బయలుదేరుతాను. ఇదిగో చూడు వాడు చెక్కిన బొమ్మ” అని ఒక చెక్క బొమ్మను తీసి చూపించాడు మురారి.

“చాలా బాగా చెక్కాడు రా” అని మెచ్చుకున్నాడు అతని ఫ్రెండ్.

“ఓకే. ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తాను. ఎందుకైనా మంచిది, తమ్ముడిని కంగారు పడద్దని చెప్తాను.” అని చెప్పి కాల్ చేసాడు.

పెరట్లో ఉన్న మోహన్ ఫోన్ రింగ్ విని అన్నయ్యే అయి ఉంటాడని ఇంటిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంతలో తండ్రి ఫోన్ ఎత్తాడు. “హలో..”

“హలో నాన్నా , నేను మురారి. రేపు సాయంత్రం బయలుదేరి వస్తాను. అదే రేపు తమ్ముడి రిసల్ట్ కదా. వాడితో చెప్దామని చేసాను. తమ్ముడు ఉన్నాడా?” అనడిగాడు మురారి.

“లేడు, బయట ఆడుకుంటున్నాడు అనుకుంట!!” మోహన్ ని చూస్తూనే చెప్పాడు.

“సరే, నేను కాల్ చేసానని చెప్పండి. ఉంటాను .” అని ఫోన్ కట్ చేసాడు. మోహన్ ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉన్నాడు.

“ఏరా రేపు నీ రిసల్ట్ అంట, చెప్పలేదే? పాస్ అవకపోతే చచ్చావన్నమాటే ” అన్నాడు తండ్రి.

“అన్నయ్య ఫోన్ చేస్తే నాకు ఎందుకు ఇవ్వలేదు ” గట్టిగా అరిచాడు మోహన్ .

“ఆడేమైనా నీలా అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నాడా? లేక పిచ్చి బొమ్మలు చేసుకుంటున్నాడా? ఆడు డాక్టర్ ,, నా కొడకు,” గర్వంగా చెప్పుకున్నాడు తండ్రి.

“నేను నీ కొడుకునే ” రోషంగా అన్నాడు మోహన్.

“ఏంటిరా నోరు లెగుత్తాంది?” అనడిగాడు తండ్రి.

“మీరు మాట్లాడించకపోయినా పరవాలేదు. నా దగ్గర డబ్బులున్నాయి. నేనే అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడుతాను” అని చెప్పి ఇంట్లోంచి బయటకు పరిగెత్తాడు. తండ్రి వెనకాలే ఎంత అరిచినా పట్టించుకోకుండా గేటు దాటి వీధిలోకి దారి తీసాడు.

నాలుగు వీధుల తరువాత ఉన్న కాయిన్ బాక్స్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. కాసేపు అక్కడే ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. ఆయన అలానే మాట్లాడుతున్నాడు. షాప్ మూసేసే టైం అయిందని కొట్టు వాడు చెప్పాడు. అది విని ఆ మాట్లాడే ఆయన దగ్గరకు వెళ్లి  “సార్, ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. మా అన్నయ్యకు కాల్ చేసుకుంటాను. ఒక్క నిమిషం మాట్లాడి పెట్టేస్తాను” అని బతిమాలాడు. ఆయన మొహాన్ని పట్టించుకోలేదు. లాభం లేదు.. షాప్ వాడు వచ్చి ఫోన్ వైర్ పీకేసి ఆ పెద్దమనిషిని విసుక్కుంటూ ఫోన్ ని లోపలికి పట్టుకుపోయాడు. చేసేది లేక ఇంటికి పరిగెత్తాడు. ఇంటి దగ్గర తండ్రి “ఏరా ఎక్కడ తిరుగుతున్నావ్? వచ్చి తిను. మీ అన్నయ్య రేపు బయలుదేరి వస్తానని చెప్పమన్నాడు” అని చెప్పాడు. మోహన్ కి అన్నం తినాలనిపించలేదు. ఉదయం ఎలా అయినా అన్నయ్యతో మాట్లాడాలి అని అనుకుంటూ నిద్రపోయాడు. తొమ్మిదింటికి మెలకువ వచ్చింది. గబగబా ముఖం కడుగుకుని వీధిలోకి పరిగెత్తాడు.

 

అప్పటికే గిరి, రాంబాబులు ఇంటర్నెట్ సెంటర్ కి వచ్చేసారు. ఇంకో అరగంటలో మన జాతకాలురా అన్నాడు గిరి నవ్వుతూ. మోహన్ కి చాలా దడగా ఉంది. కంగారులో హాల్ టికెట్ నెంబర్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయాడు. ఒరేయ్ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంటికి పరిగెత్తాడు. తిరిగి వచ్చేసరికి గిరి, రాంబాబులు ఇద్దరి మొహాలు వెలిగిపోతున్నాయి. “ఒరేయ్ మేము పాస్ రా” అన్నాడు గిరి.

“నీ నెంబర్ ఎంతరా?” అనడిగాడు రాంబాబు. ముఖం మీద ఉన్న చెమటను తుడుచుకుని జేబులోంచి నలిగి ఉన్న హాల్ టికెట్ భయంగా అందించాడు మోహన్. లోపలికి వెళ్లి వచ్చి ఒరేయ్ పది రూపాయలు అడుగుతున్నాడురా ఇంటర్నెట్ వాడు అన్నాడు గిరి. లోపలే ఉన్న రాంబాబు నెంబర్ చెక్ చేసాడు. కనిపించలేదు. మోహన్  బయటే నిలబడే లోపల ఉన్న జనాల మధ్యలోంచి రాంబాబుని చూస్తున్నాడు. రాంబాబు మోహన్ ని చూసి పెదవి విరిచాడు ఫెయిల్ అయ్యావ్ అన్నట్టుగా. అందరు మోహన్ ని చూసారు. బయటకు వచ్చి “ఒరేయ్ మోహన్, నువ్వు  ఫెయిల్ అయ్యావు రా” అని చెప్పాడు గిరి.

మోహన్ బీతావహుడు అయిపోయాడు. అన్నయ్య గుర్తొచ్చాడు. ఫోన్ చేద్దాం అనుకున్నాడు కాని జేబులో ఉన్న డబ్బులు ఇంటర్నెట్ వాడికి ఇచ్చేసాడు. ఒరేయ్ డబ్బులున్నాయా మా అన్నయ్యకు ఫోన్ చేయాలి అని అడిగాడు మోహన్.

“లేవురా, ఉంటే ఇందాక నిన్ను ఎందుకు అడుగుతానురా, నేనే ఇచ్చేవాడిని కదా” అన్నాడు గిరి.

“నా దగ్గర కూడా లేవురా, ” అన్నాడు రాంబాబు.

“ఇప్పుడెలారా? మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా?” అన్నాడు గిరి మరింత భయపెడుతూ.

 

ఇంటర్నెట్ షాప్ లోకి పరిగెత్తి రెండు కాగితాలు తీసుకున్నాడు. అక్కడే ఉన్న పెన్ తీసుకుని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కొండ మీదకు చేరుకొని పెద్ద బండ రాయి నీడలో కూర్చుని ఏడ్చాడు. సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నాడు. పెన్ తీసుకుని కాగితం ఏదో రాసాడు. రాసిన దాన్నే మళ్ళి మరో పేపర్ లో ఎక్కించాడు. దాన్నే హాల్ టికెట్ వెనకాల ఎక్కించాడు. హాల్ టికెట్ ని చొక్కా జేబులో పెట్టుకున్నాడు. రెండు కాగితాలను ప్యాంటు జాబుల్లో కుక్కాడు. సూర్యాస్తమయానికి సమయం అయింది. అదే సమయంలో మురారి ఉరికి బయలుదేరాడు. బస్సు లో ఉండగా ఇంటికి ఫోన్ ట్రై చేసాడు కాని సిగ్నల్ కలవలేదు. ఉదయం చేరుకుంటాం కదా అని ఊరుకున్నాడు. “ఏంటే మోహన్ ఇంకా రాలేదు” అనడిగాడు అన్నం కలుపుతూ తండ్రి భార్యతో.

“ఏమో .. చెప్పి వెళ్తున్నాడా?” అందావిడ ఇంకొంచెం కూర వడ్డించి.

 

రాంబాబు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. రొప్పుతూ నిలబడ్డాడు. అంకుల్ … మన మోహన్ గాడు రైలుకి ఎదురెళ్ళిపోయాడంట!!” అని చెప్పాడు.గబుక్కున లేచాడు. కంచం కాలికి తగిలిందన్న స్పర్శ కూడా పరిగెత్తాడు. ఆ మాట వినగానే మోహన్ తల్లి శోష వచ్చి పడిపోయింది. రాంబాబుకి కంగారు అనిపించి అక్కడి నుండి పారిపోయాడు. “కుర్రాడు కావాలనే ఇలా చేసాడట. చూసినోళ్లు ఆపాలనుకున్నారు. కాని కుదరలేదట” అని చెప్పాడు ఊరిలో పెద్దమనిషి. విడివడిన భాగాలను అతికించినట్టుగా పెట్టారు. శవాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు.  సూర్యోదయం దాదాపుగా అయింది. మురారి ఊరిలో దిగాడు. ఇంటి ముందు అంత జనం ఉండటం కొంచెం కీడు శంకించింది. కాని మనిషి కీడు అంటే ఒప్పుకోడు. ఒప్పుకోలేడు. మురారి చేతిలో బ్యాగ్ వదిలేసి ఇంటిలోకి పరిగెత్తాడు. స్థాణువైపోయాడు. “తమ్ముడూ ,,, ” అని వెర్రిగా అరిచాడు. కళ్ళల్లో కన్నీటి కెరటాలు ఎగసి పడ్డాయి. “ఎందుకిలా చేసావురా? చెప్పా కదరా, అవసరమైతే నాకు ఫోన్ చేయి అని” అంటూ రోదించాడు. రోదిస్తూ తమ్ముడి మీద పడ్డాడు. అంతే ఒక్కసారిగా వెనక్కి జరిగిపోయాడు. భయంగా వెళ్లి కప్పి ఉన్న గుడ్డ ఎత్తి చూసాడు. ఇంకా గట్టిగా రోదిస్తూ అరిచాడు. ప్యాంటు జేబులో రక్తంతో తడిసిన కాగితం కనిపించింది. ఎదురుగా కూర్చుని ఒక్కొక్క మడత విప్పాడు. అంతా నిశబ్ధం ఆవహించింది. అందరు ఆ కాగితాన్ని చూడసాగారు. అందులో ఈ విధంగా రాసి ఉంది

 

అనయ్య,

నెను పదొతరాగతి ఫయిల్ అయాను. అమ్మ, నాన నను కోడతరాని బయంతో చచ్చిపోతన. నన్ను క్షమిచు. ఇంట్లో నను నన్నుగా ఎవరు చుడటం లెదు. ఎప్పడు కొడుతూనారు. చాల నెప్పిగా ఉంటొంది అనయ్య. నువ్ బాగ చదవటం నాకు కూడ గొప్పె కాని ఆ సదువు నకు సరీగా రాలెదు అనయ్య. దానికి నెను ఏమి చయను అనయ్య . నీ మీద కొపంతో కాదన్నయ చచ్చిపోతున్నాది , నా మీద కొపంతోనే..! నీకొసం ఒక డాటర్ బొమ్మ చేక్కాను, అది నా గూట్లో ఉంది , తీసుకో.. ఫయిల్ అయి ఇంటికి ఎల్తే నను ఎలాగో అమ్మ నాన చంపెతారు. అందుకే నేనే చచ్చిపోతున్న ,, మల్లి నీకు బాగ చదివే తమ్ముడిగా పుటాలని కోరుకుంటున్న అనయ్య. నన్ను క్షమిచు. నెతో మాట్లాడదాం అనుకున్న, న దగ్గారున్న పది రూపాయలు నెట్ సెంటర్ లో కర్చు అయిపొయాయ్. . – ని తమ్ముడు మోహాన్.

 

ఉత్తరం చదివాక ఇంటి లోపలికి పరిగెత్తాడు. గూట్లో ఉన్న డాక్టర్ బొమ్మని తీసుకున్నాడు. వాకిట్లోకి వచ్చాడు నిస్తేజంగా. తండ్రి దగ్గరకి వెళ్లి నిలబడ్డాడు. ఆయన కళ్ళు కూడా ఏడ్చి అలసిపోయాయి. తలెత్తి మురారి చేతిలో ఉన్న బోమ్మ మీదుగా అతన్ని చూసాడు.

“నాన్న, ఈ బొమ్మని తమ్ముడు చెక్కాడు. జీవం లేని బొమ్మకు రూపం ఇచ్చాడు. నువ్వు చెక్కగలవా?” ప్రశ్నించాడు. మౌనం వహించాడు. తల్లి వైపు చూసి “నన్నేదో డాక్టర్ ని చేస్తున్నావని సంబరపడిపోతున్నారు గాని మా డాక్టర్స్ పోతున్న ప్రాణాలను కాపాడగలరేమో కాని పోయిన ప్రాణాలను తేలేరమ్మా” అని గద్గదమైన గొంతుతో చెప్పాడు.

కాసేపాగి కోపంతో” మీరే వాడిని చంపేశారు” అని అరిచాడు. “అవును, మీ వల్లే తమ్ముడు చనిపోయాడు. కాదు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడికి చదువు అబ్బకపోతే ఏమైంది? మీరేం చదువుకున్నారు? నేనొక పోసిషన్ కి వచ్చాక మిమ్మల్ని కూడా మీరు వాడిని నిర్లక్ష్యం చేసినట్టే చేస్తే మీరేం అయిపోతారు? అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నలభైకి పైబడిన మీకే ఇంత భయమేస్తుంటే చిన్న పిల్లాడు అమ్మా వాడు. పరిక్ష పోతే మళ్ళి రాసుకోవచ్చు, ప్రాణం పోతే.? అసలు నా చదువే వాడికి శాపం అయింది అమ్మా. ఇంట్లో ఏ ఇద్దరు ఒక్కలా చదవాలని లేదు. వాడికి వాడంటే కోపం అంట అమ్మ, అందుకే చచ్చిపోతున్నాను అని రాసాడంటే ఎంత కృంగిపోయుంటాడో కదా నాన్న? వాడు రాసిన ఉత్తరంలో ప్రతి లైన్ లో రెండు మూడు తప్పులున్నాయి. కాని ప్రతి అక్షరంలో వాడు పడ్డ  బాధ, భయం ఉన్నాయి నాన్న. పుట్టగానే ఎవడు మేధావి అవడు నాన్నా, ఎవరి ప్రతిభ ఎవరి నైపుణ్యత వారిది. నాన్న, తమ్ముడికి చదువు రాకపోవచ్చు కాని దేవుడు వాడికి ఎవరికీ రాని బొమ్మలు చెక్కే కళ ఇచ్చాడు. వాడి ఇష్టాన్ని మెచ్చుకోలేదు. అసలు పిల్లల నుండి ఏదో ఒకటి ఆశించడం తప్పు నాన్నా.. ఆశించి కనడం అనవసరం.  ఎందుకంటే కన్నాక పుట్టిన వాడుమీ ఆశలకు దూరంగా బతుకుతుంటే మీరు జీర్ణించుకోలేరు. అతని ఆశయాలకు మీలాంటి తల్లిదండ్రుల ఆశలకు మధ్య నరకం అనుభవించాలి. ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు ఎంత ఏడ్చినా తమ్ముడు రాడు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద ఆలోచన వచ్చిందంటే ఎంత నలిగిపోయుంటాడో కదా నాన్నా? ప్రతి పిల్లవాడికి అమ్మంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అందులో చిన్న వాళ్ళకు మరీను, పాపం ఆ రైలు గుద్దినపుడు ఆ నొప్పితో వాడు అమ్మా..!! అని ఎంత గట్టిగా అరిచి ఉంటాడో కదా అమ్మ!?”  అని తమ్ముడి ముందు మోకాళ్ళపై పడి అతని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు.

 

పది రోజులు పోయాక రాంబాబు మురారిని కొండ మీదకి తీసుకెళ్ళాడు. అక్కడ రాయి మీద అత్యంత అద్భుతమైన ఊరుని చెక్కిన తీరు మురారికి కించిత్ ఆశ్చర్యం కలిగించింది  ఆ సగం చెక్కిన శిల్పాన్ని తడిమి చూసాడు. “వాడేం చేస్తాడు పాపం దేవుడు కూడా వాడిని సగమే చెక్కి పంపాడు.” అని అన్నాడు.

 

*                   *

 

 

నీ నిశ్శబ్దంలో నుండి…

 

 

-తిలక్

~

 

నీ నిశ్శబ్దంలో నుండి నేను  రావాలి
వొక రాత్రిలా వొక పగటిలా
నిన్ను నింపుకుంటూ
నన్ను చేర్చుకుంటూ
ప్రపంచమంతా వెలేసినా నువ్వు నన్ను
పొదువుకుంటావన్న ఆశే నన్ను బతికిస్తూ వుంది యింకా-
నేను నీకోసం యే మాటలూ రాయనవసరంలేదు
నువ్వు నాకోసం యే ప్రేమనూ చెప్పనవసరంలేదు
అలా మిగిలిపోతాం అంతే
నిలువెల్లా వొకరిలో మరొకరం తడుస్తూ
యెందుకంటే నాకు ప్రేమను వ్యక్తపరచడం అస్సలే రాదు
నీకు ప్రేమను అడగడం సంపూర్తిగా తెలియదు
కళ్ళు లెక్కలేసుకుంటాయి నీవీ నావీనూ
అవి యే కలల్నో యిలా పారబోసి వెళ్లుండకపోతే
నువ్వూ నేనూ యెలా కలిసే వాళ్ళం
సంద్రం చిమ్మిన ప్రతి కెరటంలో
అడవి కన్న ప్రతీ వర్షంలో మనం వున్నాం
అవును !
నువ్వో అడవి
నేనో శూన్యం
నన్ను నింపేసిన నిండుతనం కదూ నువ్వు
నన్ను నువ్వెప్పుడూ అడుగుతూనే వుంటావు
మట్టిలా మాట్లాడమని…
అవును అది నాకో ప్రశ్నార్థకమే  నాకు మాట్లాడ్డం రాక
కాని చాలానే రాస్తాను నీకోసం
నిద్రరాని  యే రాత్రో నిన్ను తలచుకుంటూ యెన్ని పద్యాలు రాస్తానో
నా కళ్ళపైకి నువ్వు వో మంచుతూనీగలా చేరతావు
నా రెప్పలు విరగొట్టి కొన్ని చిత్రాలనూ పోస్తావు
నీకెలా చెప్పడం ఆ వాన కళ్ళనూ
అవి నీతో చెప్పాలనుకున్న మాటలనూ
నాలో నేను నాతో నేను నిన్ను పోగేసుకుపోవడమే చేసేది.
*

 

 

 

పర్సనల్ లెటర్ టు…  

                                                                                            -బమ్మిడి జగదీశ్వరరావు

~

 

కమలనాథులారా! కలవర పడకండి..!

రాముడున్నాడు! రాజ్యమున్నాది! తొమ్మిది తలలు రాలాయి! యిప్పుడు పదో తల! యిది వొక్క హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయపు లెక్క! రాజ్యానికి యెదురు తిరిగితే తలలు తెగక తప్పదు పక్కా! హిందూత్వమే మన హుక్కా! తాగండి గుక్కా గుక్కా!

అయ్యో రామ.. అదరవద్దు.. బెదరవద్దు.. ఈ మాత్రము దానికే రాజ్యాన్ని కోల్పోతామా? రాజ్యం వీరభోజ్యమే కాదు.. రక్తభోజ్యం కూడా! మసీదుని కూలగొట్టినా మళ్ళీ అధికారంలోకి వచ్చిన వాళ్ళం.. స్టూడెంట్స్ యెంత? వారి బలమెంత? బలగమెంత? మన సైన్యమెంత? పోలీసులూ.. పారామిలటరీ బలగాలూ.. స్మోక్ ఫైర్లూ.. వాటర్ ఫైర్లూ.. గన్ ఫైర్లూ.. రబ్బర్ బుల్లెట్ ఫైర్లూ.. బార్బుడ్ వైర్లూ.. లాఠీచార్జీలూ.. హౌస్ అరెస్టులూ.. వన్ఫార్టీఫోర్ సెక్షన్లూ.. నిబంధనలూ.. నిషేధాజ్నలూ.. అత్యవసర పరిస్థితులూ.. అదుపు చేయుట అదెంత స్వల్ప పని? అల్ప పని? అణచివేతలతోనైనా రాజ్యాన్ని అదుపులో వుంచుకోవాలని మహానుభావుడు మాకీయవెల్లి చెప్పనే చెప్పాడు! అంచేత అదుపే మదుపు! మనశాంతీ మన భద్రతే.. దేశానికి శాంతి భద్రతలని యిచ్చును!

రాజ్యాంగము రాసిన అంబేద్కర్ దివంగతుడు గనుక మనము గౌరవించగలం గాని అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మి‘వున్న’ వాళ్ళను గౌరవించలేము. అటువంటి విద్యార్థులతో ఘర్షణ తప్పదు! ఘర్షణ కూడా అనేకవిధములు! అయితే సిద్ధాంత సంఘర్షణ ప్రజాస్వామికమైనదిగా గుర్తించాలి!

రోహిత్ వేముల ఆత్మహత్య అత్యంత విచారకరమే! కాని.. నిన్న పొతే రేపటికి మూడు రోజులు! మర్నాటికి.. నాలుగు రోజులకి జనం అంతా మర్చిపోతారు! ప్రజల జ్ఞాపకశక్తి మీద నాకు అపార నమ్మకమూ.. అపురూప విస్వాశామూనూ..

చచ్చిన వాడు వొచ్చి సాక్ష్యం చెపుతాడా? చెప్పినా యెవరికి చెప్పాలి? మనకే చెప్పాలి! వేదనలూ నివేదనలూ యెవరికి నివేదించాలి? మనకే నివేదించాలి! ఎంక్వయిరీలు చేసినా రిపోర్టులు యిచ్చినా యెవరికి యివ్వాలి? మనకే యివ్వాలి! ద్వి సభ్య కమిటీలయినా.. ఏక సభ్య కమిటీలయినా.. దాని సమగ్ర పరిశోధనలయినా యెవరికి సమర్పించాలి? మనకే సమర్పించాలి! విచారం వ్యక్తం చేసేదీ మనమే! విచారణ జరిపేదీ మనమే!

గీత యేమి చెప్పింది? ‘చేసేది నేనే.. చేయించేదీ నేనే.. అంతా నేనే!’ అని చెప్పిందా లేదా? నేనుకు బహువచనమే మనం! ఆవిధంగా హత్య చేసేది మనమే! శిక్షలు వేసేదీ మనమే! నేరము చేసేది మనమే! తీర్పులిచ్చేదీ మనమే! అన్యాయము చేసేది మనమే! న్యాయం చెప్పేదీ మనమే! సమస్య సృష్టించేది మనమే! సమస్య పరిష్కరించేదీ మనమే! పనీష్మెంట్ యిచ్చేది మనమే! కాంపన్సేషన్ యిచ్చేదీ మనమే!

మరి మేథావుల మాటంటారా? మనం గుర్తించిన వాళ్ళే మేథావులు! అందరినీ మేథావులుగా గుర్తించవలసిన పని యెంత మాత్రమూ లేదు! మన మేథావులను మనమే తయారు చేసుకొనవలెను! తర్ఫీదు యివ్వవలెను! మనమే సర్టిఫికేట్లు యిచ్చి గుర్తించవలెను! కొంత మందిని లోకం గుర్తిస్తుంది! వారికి కుడి చేతికి యెడమ చేతికి తేడా తెలియదు! అనివార్యమై మేథావులుగా గుర్తించిన వారి గురించి చింతించి ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు! అటువంటివారి చిన్న మెదడు యేనాడో చిదిగిపోయినది! మీడియాకు వారి మెదళ్ళు అనుసంధించబడినవి! వారి సంధింపులూ స్పందనలూ అన్నీ కూడా మీడియా ఆన్ చేస్తే ఆన్ అయి- ఆఫ్ చేస్తే ఆఫ్ అగును! మనము మీడియాను మేనేజు చేసిన చాలును.. నిప్పు కూడా నీరగును! నీరు గూడా ప్రవహింపక గడ్డకట్టును!

అసలు ఆంగ్ల మీడియా ఆగమాగమవబట్టి మన తెలుగు మీడియా తేరిపార వొకసారి చూసింది గాని లేకపోతే యెక్కడ యెలా ప్రవర్తించాలో దానికి మా బాగా తెలుసును!

మీడియాను పెట్టుబడిగా చూడుము. పెట్టుబడిని మార్కెట్ గా చూడుము. మార్కెట్టూ మతమూ వేరు వేరు కావు! వాటికి పేచీ లేదు. సర్దుబాటూ ప్రోత్సాహమూ తప్ప! నిజానికి మతమూ మార్కెట్టూ కవల పిల్లలవంటివి! ఒకదానినొకటి యిబ్బంది పెట్టుకోవు. మార్కెట్ మతాన్ని గౌరవిస్తుంది! మతం మార్కెట్టుని గౌరవిస్తుంది! మనము మతము పట్ల భక్తీ మార్కెట్ పట్ల గౌరవమూ కలిగి వుండాలి!

అందుకనే న్యూ ఎకనామిక్ ఎరలో తొంభైల తర్వాత అన్ని విద్యార్ధి సంఘాలూ తోకలు ముడిచి పారిపోయినవి! మతమూ మార్కెట్టూ కలిసివుండడం వల్ల అన్ని విద్యార్ధి సంఘాలూ దాదాపు అంతరార్ధమైనప్పటికీ ఏబీవీపీ వొక్కటే నిలిచి వెలుగుతోంది.. భారత ఖండం వెలిగినట్టు! ఇంతకు మునుపు మన అగ్రవర్ణ కులాలే మనల్ని యిబ్బంది పెట్టేవారు, విద్యార్థి సంఘాల్లో చేరి. ఎప్పుడైతే కెరియర్ వోరియంటేషన్ పెరిగిందో ఈ రాజకీయాల వైపు చూడడం మానేసి యెంచక్కా అమెరికా వైపు చూడడం మొదలుపెట్టారు! అలా వొచ్చిందే అమీర్ పేట టు అమెరికా థియరీ. సో యిప్పుడు ప్లెయిన్ గా వొపెన్ గా శత్రువు కనిపిస్తున్నాడు. మిలట్రీ థియరీ ప్రకారం పొదలు కొట్టేస్తే శత్రువు విజిబుల్ గా కనిపిస్తాడు.. కనిపిస్తున్నాడు! ఆలయాల్లోకి వొచ్చినట్టుగానే.. అంబేద్కర్ పేరు చెప్పి విశ్వవిద్యాలయాల్లోకి వొచ్చేసారు అలగా జనం. ఈ అలగా జనం తిరగబడతారు.  కాని వాళ్లకి శక్తి చాలదు! నిలబడడానికి నీడ లేదు! వెన్ను లేదు! దన్ను లేదు! సో.. వాళ్ళే యిలా వురిపోసుకుంటారు!

రోహిత్ వురి ఆది కాదు,  అంతమూ కాదు! మన పాలనకు ఆటంకమూ కాదు! అదొక సహజ అనివార్య పరిణామమే, కాని అందులోనూ మన హిందూ మతమ్మీద కుట్ర దాక్కొనివుంది! కుట్రలు వేయి విధములుగా యెటుల పనిచేయు చున్నవో రోహిత్ సంఘటన బయటపెట్టినది! జాగృతిగ మెలగమని మనకొక అవకాశం యిచ్చు చున్నది!

రాముడికే తప్పలేదు కష్టాలు! రామ రాజ్య స్థాపనలో కొన్ని కష్టాలు తప్పవు! నష్టమేమీ లేదు.. వున్నా పూడ్చుకుందాం! ఆపైన రాముడున్నాడు! రాజ్యమున్నాది!

యూనివర్సిటీలు మనకు పట్టు కొమ్మలు. ఆలోచనలకు ఆయువు పట్టులు. పాగా వెయ్యగలిగితేనే ప్రజల్లో వారి ఆలోచనల్లో భాగం కాగలం. భావాలు బహు ముఖ్యమైనవి! హిందూ మనో భావాలు మరీ ముఖ్యమైనవి! ఈ దేశమ్మీద.. దేవుడి మీద మనదే పేటెంటు! మనమే దేశ భక్తులం! ఇంకెవరునూ యెట్టి పరిస్థితుల్లోనూ దేశభక్తులు కాజాలరు గాక కాజాలరు!

ఏబీవీపీ మనది. మన యువతరానిది. మన విద్యార్థి నాయకుడు సుశీల్ మన బీజేవైఎం సభ్యుడైన విష్ణుదత్తు తమ్ముడు.  మన కేడరును మనం కాపాడుకొననిచో దేశాన్ని యెటుల కాపాడుకొనగలము? అందుకు మన ఎమ్మెల్సీ రాంచందర్ రావు పోలీసులకు రిపోర్టు చేసినా- యూనివర్సిటీ క్రమశిక్షణా సంఘం మీద వొత్తిడి తెచ్చినా యూనివర్సిటీలో బలప్రదర్శన చేసినా- కోర్టులకు తెలిపినా- ఫలితం వెంటనే లేకపోయింది. యూనివర్సిటీలో మన విద్యార్థి సంఘం గెలవక అధికారం కోల్పోయింది. ఏయస్ఏ వాళ్ళని అదుపుచేయుటకు తప్పలేదు. పైగా వారు తీవ్రవాదులు. ఉగ్రవాదులు. యాకూబ్ మెమన్ని వురి తీస్తే ఖండించారు. మెమన్ కు అనుకూలంగా మాట్లాడారు. అంచేత మన మంత్రి  మన దత్తాత్రేయగారు.. మన మానవ వనరుల మంత్రిత్వ శాఖా మంత్రి స్మృతి ఇరానికి లేఖల మీద లేఖలు దంచినారు. ప్రభుత్వ పనుల్లో అలసత్వము వుంటుంది గనుక ఒకటికి మరి నాలుగు రాయవలసి వొచ్చింది! మన స్మృతి ఇరానిగారు మన హెచ్సియ్యూ వీసీగారికి లేఖల మీద లేఖలు దంచినారు! మన వీసీ పొదిలి అప్పారావుగారు దళిత విద్యార్థుల్ని దబాయించి దంచినారు. వొక్క సెమిస్టరు కాలమే వేటు వేసి రూల్స్ కు అనుగుణంగానే సంఘ బహిష్కారము చేసినారు! తప్పంటూ వుంటే రూల్స్ పెట్టిన బ్రిటీష్ వాళ్ళది తప్పు కాని, ఎప్పటిలాగే అమలు చేసిన వారిది తప్పెలా అవుతుంది?

మన విద్యార్థి నాయకుడు సకాలంలో ఆస్పెట్లైజ్ కావడం బావుంది, మనం ఆరెస్సెస్ వీహెచ్పీ బీజేపీలుగా మనం బల ప్రదర్శన జరపడం బావుంది కాని పోలీసు అధికారి ఆనంద్ అందుకు విరుద్ధంగా దాడి జరగలేదనడం బాలేదు. తగు ముందు జాగ్రత్తలు తీసుకొనవలసింది. అయినప్పటికీ మన విద్యార్థి సంఘ మిత్రులు కోర్టులో వేయడం, సోషల్ మీడియాలో వీడియోను సగం రిలీజ్ చేయడం, అలాగే వురిశిక్షల్ని వ్యతిరేకిస్తే- మెమన్ ని సపోర్ట్ చేస్తున్నారని, వొక టెర్రరిస్టు మరణిస్తే వేయిమంది టెర్రరిస్టులు పుట్టుకు వస్తారని బహుబాగా ప్రచారం చేసి ఏయస్ఏ వాళ్ళని డైలమాలో పడేయడం మన విద్యార్థుల విజయంగా గుర్తించి అభినందించవలసి వున్నది!

రోహిత్ మృతదేహంతో బంద్ చెయ్యొచ్చు గాక.. పదమూడు విద్యార్థి సంఘాలు కలిసి జాక్ గా యేర్పడి బాధ్యులని శిక్షించమని డిమాండ్ చెయ్యొచ్చు గాక.. హంగర్ స్ట్రైక్ చెయ్యొచ్చు గాక.. మన పోలీసులు భారీగా మొహరించి బలవంతంగా భగ్నం చేస్తే- మళ్ళీ మళ్ళీ హంగర్ స్ట్రైక్ చెయ్యొచ్చు గాక.. అంతకుమించి యేo చేస్తారు? ఇలానే నాలుగు నెలలు పూణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్ట్యూట్ విద్యార్థులు గోల చేసి ధర్మరాజు ఈటె పీక్కోగలిగారా? మనం అనుకుంటే గిరీష్కర్నాడ్, ఆదూరి గోపాలక్రిష్ణన్, యూఆర్ అనంతమూర్తి, శ్యామ్ బెనగల్ పక్కన మన మేథావి గజేంద్ర చౌహాన్ని కూర్చోపెట్టగలం.. వాళ్ళు పీట లాగలేరు, పీఠం కదల్చలేరు! మద్రాస్ ఐఐటి డైరెక్టర్ని మర్చిపోయారా? ఢిల్లీ యూనివర్సిటీ మనకాదర్శం! రామ మందిర నిర్మాణానికి అరుంధతీ వాశిష్ట అనుసంధాన పీఠంతో రెండ్రోజుల సదస్సు జరిపారు మన విద్యార్థులు! అప్పుడూ గగ్గోలు పెట్టారు గాని ఆపగలిగారా? ఈ సమయంలో మన బలం గుర్తుచేసుకోవడం మరింత బలాన్ని యిస్తుంది..!

‘నేను రాజీనామా చేయను’ అని వీసి పొదిలి అప్పారావుగారు నిలబడ్డా తప్పని స్థితిలో తప్పించి ఆయనకు అసలు వారసుడు శ్రీవాస్తవని నియమించడంలో అప్పారావుగారిని అభినందించడం కనిపిస్తోంది. అయితే సమస్య తీవ్రత తగ్గించడానికి పెరియసామిని నియమించడాన్ని అర్థం చేసుకోవాలి! అలాగే ‘నేను లెటర్ రాయలేదు’ అని, ‘ఫార్వర్డ్ చేశా’నని, దత్తాత్రేయ మాట్లాడిన సందర్భంలో కాంగ్రేసు హనుమంతరావుగారు కూడా ముందే లెటర్లు రాసిన విషయం తగు సమయంలో బయటపెట్టి ‘యివన్నీ కామను’ అనుకొనేలా చేసిన పార్టీ శ్రేణులకు అభినందనాలు! ప్రతీ పదిహేను రోజులకు లెటర్లు రాయడం పనిలో భాగమని చెప్పి మన స్మృతి ఇరాని పనిమంతురాలని నిరూపించుకున్నారు! ఆమెకు ప్రత్యేక అభినందనాలు! రోహిత్ తల్లితో మాట్లాడడం ఇరానిగారి మాతృత్వపు మానవీయతకు పరాకాష్ట!

దేశంలో అసహనం పెచ్చరిల్లిపోతోంది. శవ రాజకీయాలకు మన ప్రధాని మోడీగారు స్పందించక పొతే కావాలని మౌనం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్కడితో ఆగక వారణాసి లఖ్ నవ్ లో ‘మోడీ ముర్దాబాద్.. మోడీ గోబ్యాక్..’ అని స్నాతకోత్సవాన్ని అడ్డుకున్నారు. సహనశీలి మోడీగారు యెంతో సహనంతో ‘కారణాలు వుండొచ్చు.. రాజకీయాలు వుండొచ్చు.. కాని భారతమాత బిడ్డను కోల్పోయింది.. తల్లి కడుపుకోతను అర్థం చేసుకోగలను..’ అన్నారు! ‘అంబేద్కర్ యెవరి మీదా ఆరోపణలు, పిర్యాదులు చెయ్యలేదు’ అని కూడా దేశానికి గుర్తు చేసారు. అంబేద్కర్ని మన మోడీగారు అర్థం చేసుకున్నట్టు మరెవరూ అర్థం చేసుకోలేదు! అంబేడ్కర్ని మన మోడీగారు సొంతం చేసుకున్నట్టు మరెవరూ సొంతం చేసుకోలేదు!

సంతాపము తెలిపి సహనం వహించవలసిన యీ సమయంలో యింత అసహనం వహించడం వెనుక రాజకీయ కుట్ర కలదు, ప్రతిపక్ష కాంగ్రేసు వామపక్ష నాయకులందరూ హెచ్సియ్యూ క్యూ కట్టుటలో వింత లేదు, విశేషము లేదు! అలా అయితే మునుపు తొమ్మిది మంది ప్రాణాలు తీసుకున్నప్పుడు యెందుకు రాలేదు? అని తిరిగి ప్రశ్నిచడంలో మనం కృతకృత్యులమయ్యాం! ‘రాహుల్ గో బ్యాక్’ ‘సేవ్ హెచ్సియ్యూ’ నినాదాలతో ప్రతిమండలంలో రాస్తారోకో జరపడం, దిష్టి బొమ్మలు దగ్ధం చెయ్యడం బహు ప్రశంసనీయం! ‘మీ ఎంపీ రాజయ్య దళితుడే, వాళ్ళింట్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాలేదేమి?’ లాజిక్కుల మేజిక్కులు అత్యంత ఆకర్షణీయం! మరోవేపు మన వెంకయ్య, నితిన్ గడ్కరీ, మహేశ్శర్మ, వీరేందర్ సింగ్ నోటికి వొచ్చింది మాట్లాడడం మరింత వుత్సాహాన్ని నింపుతున్నది!

దళితుల మీద దాడుల్ని తిప్పి కొట్టాం! ఎందుకంటే రోహిత్ దళితుడు కాదు! బీసీ వడ్డెర కులానికి చెందినవాడని నిరూపించాం! వాళ్ళ తండ్రి మణికుమార్ తో కూడా చెప్పించాం! తండ్రిని కన్న తల్లే చెప్పింది వడ్డెరని! తల్లి తను మాల కులస్తురాలినని చెప్తోంది, చెల్లదు. భర్త యింటి పేరే భార్య తన యింటి పేరుగా మార్చుకుంటుంది భారతీయ స్త్రీ! మరి తన కులాన్ని వొదిలి భర్త కులాన్ని స్వీకరించలేదా? విడిపోతే మాత్రం ఆమె బిడ్డలకి తండ్రి కాకుండా పోతాడా? రోహిత్ కులం గురించి జనంలోకి బాగానే తీసుకెళ్ళాం! భేష్!

రోహిత్ రెండుసార్లు జేఆర్ఎఫ్ పాసు అయ్యి ఫెలోషిప్ తెచ్చుకుంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లే నమ్మలే. ‘పేపర్ అంత యీజీగా వుందా?’ అని అడిగారు. రోహిత్ యిచ్చిన స్వీట్స్ కూడా తీసుకోలేదు. రాంక్ తెచ్చుకొని పీహెచ్డీ జాయినయినా అతను దళితుడను అని అంటున్నాడు కాబట్టి రిజర్వేషన్ మీద జాయిన్ అయ్యాడని జనం కూడా నమ్ముతున్నారు. అంచేత- తిన్నది అరక్క వొళ్ళు కొవ్వెక్కి సూసైడ్ చేసుకున్నాడని- సులువుగానే ప్రజలు అర్థం చేసుకోవడం మనకు కలిసొచ్చే విషయం! ప్రజలు చాలా గొప్పవాళ్ళు! మనం యెలా నేర్పితే అలానే ఆలోచిస్తారు!

అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్లో గొడవలవల్లే రోహిత్ చనిపోయాడని మన విద్యార్థులు మాట్లాడడం చూస్తుంటే భావి నాయకత్వ పటిమ అపురూపంగానూ అపూర్వంగానూ కనిపిస్తోంది! అలాగే పఠాన్ కోట్ ను ప్రస్తావించడం వల్ల ఏకకాలంలో మన దేశభక్తిని చెప్పడమేకాక మన ప్రత్యర్థుల నోళ్ళు మూయించగలిగాం!

సమయానికి మున్సిపల్ ఎన్నికలు తెరమీదికి రావడం.. ఫలితాలూ పట్టాభిషేకాలూ.. జంపు జిలానీలూ.. తెలంగాణలో తుడుచుపెట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ.. పిడకలవేటలా తుని బల ప్రదర్శనా.. కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షా.. రైలుకు పెట్టిన నిప్పూ.. నీరుగార్చి- పాత వార్తా పచ్చళ్ళు పక్కనపెట్టి – తాజావార్తలకు మీడియా తల తిప్పడంతో ‘రోహిత్ యెవరు?’ అనే పరిస్థితి రాముని దయవల్ల రానున్నది.. అందుకే అన్నది.. రాముడున్నాడు.. రాజ్యమున్నాది..!

విద్యార్థుల సస్పెన్షన్ భేషరతుగా కాకపోయినా కండిషనల్ గా యెత్తేసాం! యెనిమిది లక్షల ఎక్సుగ్రేషియా వద్దన్నా ప్రకటించేసాం! హాయిగా తిరిగి రమ్మని వీసీని సెలవులో పంపేసాం! కేంద్ర మంత్రుల ప్రమేయం లేదని తేల్చి చెప్పేసాం! రేపు ప్రభుత్వం వేసిన కమిటీలతో యివే రిపోర్టులు అధికారికంగా యిప్పించేస్తాం! ఫెలోషిప్ పెండింగ్ తో కలిపి మరీ యిచ్చేద్దాం! పుష్పగుచ్చాలు పంచేద్దాం! పావురాలను పట్టి యెగరేద్దాం! ఓం శాంతి శాంతి హి!

అంతే! ఖేల్ ఖతం! దుకాణం బంద్!

రాముడున్నాడు! రాజ్యమున్నాది!

వీర కమలనాథులకు

ప్రేమతో-

మీ

శూర కమలనాథుడు!

ఆయన ఇంకా పాడుతున్నారు!

             

     – పన్నాల సుబ్రహ్మణ్యభట్టు

~

 

రజనిగారిని చూస్తుంటే ఇన్ని పాటలు  రాసి స్వరపరచిన ఆయన భుజబలం  ఎంత గొప్పదో ఎన్ని కల్పనల  లేసులు  అల్లినదో అని ఆశ్చర్యం కలుగుతుంది.  ఆయన సృజన ఒక ప్రహేళిక వంటిది.  జటిలంగా పాట రాసి అంత జటిలంగానూ సంగీతం సమకూర్చడం ఎలా సాధ్యమయిందీ అని ప్రశ్న ఉదయిస్తుంది.  వింటున్న కొద్దీ వివేచన పెరుగుతుంది.  సరే సంగీతం వింటుంటే ఆలోచించడానికి వీలవుతుందా, వివేచనకి వీలు  అవుతుందా అనేది సెమినారు మడి సంభాషణ. అదో సరిపెట్టలేని తీర్మానం.

ఈ కాలానికి ఆయన రాసిన కొన్ని పాటలనీ, వరుసల్నీ తలచుకొని మురిసిపోవటమే సరైన పని.  అయినా అందర్నీ చకితుల్ని చేసే మాట ఒకటి నేను చాలాకాలంగా చెప్తున్నాను ‘త్యాగరాజు తర్వాత అంతటి వాగ్గేయకారుడు పాట, సంగీతం రెండూ సమకూర్చినవాడు రజనిగారు తప్ప వేరొక ప్రతిభావంతుడు లేడు ’ అని ఆ ప్రకటన సారాంశం.  ఒకసారి తెలివిమీరిన నేను ఆయనకి ఆమాటే చెప్పి ‘మీకు బాగా గాలిపెట్టానా’ అని నవ్వాను కుర్రతనంతో. ఆయన ‘ఎక్కువే’ అని నవ్వారు.

rajani2

కానీ, ఆ గాలి ఎక్కువ కాదనే తోస్తుంది నాకు ఇప్పటికీ.  త్యాగరాజుగారి లక్ష్యయాత్ర వేరు, కాని ఇద్దరి శోధననాళిక దారీ ఒక్కటే.  స్వామివారికి రాము వారి చరిత్రగానం లక్ష్యం.  అందుకు ఆయన తీసుకున్న రాగతాళాల ఎంపిక ఒక సంగీత విధాన నిరూపణ కోసం. మళ్ళీ ఆ రాగాల లోతుపాతుల అన్వేషణ కీర్తన తెచ్చే పదాల ముళ్ళను స్వరసంచారంతో పులమడంలో గల రక్తి ప్రసాదం ఆయన పని. అదొక మేథోపరమైన కృషి.  ఆ కాలపు వాగ్గేయకారులకు అదొక కాంట్రాక్టు.

రజనిగారి లక్ష్యం మాత్రం వేరు.  త్యాగయ్యగారి లాంటి ఏకముఖమైన నైవేద్యం, నివేదన కాదు ఈయన లక్ష్యం.  ఈయన రాసిన గీతాలు అనేక రసాల దృష్టినీ, సంఘటనలనీ, ఇతివృత్తాలనీ పోగులుగా ఎత్తే పూలసేవ ఇది.  సన్నివేశ కల్పనకీ, మానసికమైన వ్యవహారగతులకీ, కాల్పనికమైన లౌకికమైన దక్షతకీ రెక్కలు  కట్టే దృష్టి గల పాటలు  ఇవి.  ఆనాటి వాగ్గేయకారుల కీర్తనలవలె ` ఇవన్నీ భజన సంప్రదాయానికి లొంగవు.

bhattu

రజనితో భట్టు

అయినా ఇదొక రకంగా భజనే ` ప్రేమభజన, ప్రేయసికి లేఖ, ఆకాశంలో మేఘం నడిచిన రీతుల  వర్ణన, సూర్యుడి ప్రతాపం, నదీ ప్రవాహ ఝరి, ప్రకృతి ప్రకోపాలు, ఇలా ఇన్ని వర్ణించి, పాట చివరి తీగ లాగుతూ, సంగీతం డొంకమీదకి ఎక్కించాలి…  కష్టమైన ప్రొసీజర్‌, ఈ భజనల్ని శ్రోతలకు అందించటం ఎలా? త్యాగరాజుగారికి శిష్యులే శ్రోతలు, మూలవిరాట్టే వేరుగా ఉన్నారు.  కాని రజనిగారికి గల శిష్యులు, శ్రోతలు, తనపాట నచ్చే శ్రోతల్ని ఆయనే తెచ్చుకోవాలి.  అలా అక్కడే ఉంచుకోవాలి, వారికి అనేక పాటలనే వంటకాల్ని సంగీతంలో వేయించి ఊరిస్తూ ఉంచుకోవాలి.  ఇందుకు వేరే పల్లకీ ప్రబంధాలనీ, నౌకా యాత్రలనీ రచించాలి.  అంటే గేయనాటికలు, సంగీతరూపకాలు, స్వరసంకలనాలు  రచించి సంగీత వాక్యాలతో సిద్దపరచాలి.  రజనిగారిది భక్తి సామ్రాజ్య అనురక్తి కాదు. ప్రజాస్వామ్యంలో శ్రోతలనే ఓటర్ల సేవ.  అందులో సినిమా సంగీత కల్పనా  ఘట్టం కూడా తప్పదు.  పురాణ గాథ సందర్శన కూడా తప్పదు.  ఆకాశంకేసి చూసి విస్తుపోవటం భూమిలో చూసి కూరుకుపోవటము తప్పదు. రాములవారిని కాదంటే ఇంతలా జటిలమైపోయే దృశ్యం లలిత సంగీత రచనలో ఉంది.  ఈ రచనకి తనే పదకర్తయి పాటలుగా కూర్చడం గొప్పే.  నిజానికి రజనిగారికి పాట పుట్టడమే పేగు సంబంధంతో పుడుతుంది.  ఆ ముడిని ఆయన మోసినా శ్రోత మోసినా కత్తిరించలేరు.  ఆ పాట రచనలోని పరుసవేది సంగీతంతోనే ప్రకాశిస్తుంది.  ముచ్చట గొల్పుతుంది.  మురిపిస్తుంది.  విడదీసి చూస్తే ఇదొక పాట రచనా అని విసిగిపోతారు, విస్తుపోతారు.   వాటిలో తాళగతులకు ఇరికేలా రాదామనే సగటు పాట రచయిత తాపత్రయం కనబడదు.  గుర్తుకు తెచ్చుకోండి ` ఎలాగయినా, ఏ గీతశకమైనా, ఏ వరుస గుర్తుకున్నదైనా ! సంగీతాన్ని తోసుకుంటూ, పొదలోంచి పాములా, సంగీతం నాలుకలు  చాచే కనబడుతుంది కదా!

ఉదా : ‘తొంగలి రెప్ప చెంగల్వ పూవే…. తొంగి చూచెనదిగో కన్నావే!’

rajani3

ఆంద్ర విశ్వవిద్యాలయ విద్యార్థి గా – 1937-40

సంజెకెంజాయవీవనలు, క్రొంజిగువురు గుబురు జాలరులు,  తల్లీ, నీయడుగు

దామరులు!  అరుణ దరహాసమో, చందనమరున్ని శ్వాసమో’

ఇలా ఎన్నయినా గుర్తుకు తెచ్చుకోవచ్చు.  ఆ పదాల మేరకు ఊహించనివీ, ప్రకృతి రమణీయంగానో, పదగుంభనంగానో ఎవరూ దర్శించని నీతి, రచన, దృశ్య పేటికలు.  ఆ పదాలతో తెరవడం  రజనిగారి పాటల్లో ఒక మాట ‘క్రీడ’.  ఒక సంగీతపు ఊయల ఊపు.

పాట అనే ఫుట్‌బాల్‌ క్రీడలో బంతి అనే మాటను ఈ కోణంలో ఆటగాడు ఇలా నడిపిస్తాడు అని ఊహించేవారుంటారు కాని అందుకు భిన్నంగా రజనిగారు మాటని నడుపుతారు.  ‘మెస్సీ’ అనే విజేతలాగ. అంత చలన వేగంతో గోల్‌ కొట్టే శక్తి రజనిగారిది.  ఆయనకే తెలిసిన లయ విభ్రాంతితో ఆ పదాన్ని అలవోకగా అక్కడకు చేర్చడం ఆయన నేర్పు.  తెలుగు గేయ / గీత సాహిత్యంలో రజనిగారి లాంటి ఆటగాడు అవతరించలేదు.  కారణం సంగీతమనే ప్రేగుతో సహా పదం జనిస్తుంది.  లౌకిక భావకవితారక్తిమతో అలా పాట పొట్ట తట్టడం ఎవరికీ అబ్బలేదు.  త్యాగరాజు తర్వాత కొంతమందికి ప్రయత్నపూర్వకంగా సాహిత్య రచనలో ఈ విద్య అబ్బి ఉండవచ్చు.

rajani1

అలవాటులో లేని రాగాలలో పాటకి వరుస కూర్చడం ఎక్కడైనా ఉంటుంది అనుకున్న వరుసలో రాగాలలో పాటనప్పడం ఆనాటి వాగ్గేయకారుల నుండి ఈకాలపు సంగీత దర్శకులకీ అలవాటే.  పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్‌ అనే స్వామి వారి శిష్యుడి నుండి ఈనాటి ఆసామీ గాయకులకీ సాగే విద్యే వారికి తాళాలూ  మాటలూ  సర్దడం సమకూర్చుకుంటూ పోవటం శ్రమే.

కానీ లలిత సంగీతంలో పాట ముందు ఆముఖం వినిపించే పరిచయ ఆహార్యం, చరణాలకీ, చరణానికీ మధ్య పొడిగించే, నడిపించే సుఖనిద్ర కల్పించే, సకల భోగాలు వండటం అందరికీ అలవడే విద్యకాదు.  రజనిగారు అందులో స్పెషలిస్టు వరసిద్ధిపొందినవారు.  సంగీతంలో నుండే పాటను పుట్టించి తానే సంగీత చరణాల మధ్య అలంకరాలనూ, ఘోష చైతన్య స్ఫూర్తినీ స్వరబంధంగా మలచి ఒక సాకారమూర్తిని ప్రదర్శించటం రజనిగారి పాటలోని విశేషం.  ఆయనది అంతటి కల్పనా  ప్రకాశం.  ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు.  అటు పాటగానూ, సంగీతంగానూ ఆ పాట ఎంత ముద్ర వేయగలదో చూపవచ్చు.  లేకపోతే తుఫాను గురించి ‘నిష్పడన మంధానం’ అని కూర్చగలరు?  తుఫాను నాశనం చేసిందని ‘ధ్వంస విధి విధానము, నివాత శూన్య స్థంభం అని ఎత్తుగడను శూన్యంలోకి దించటం ఎంత రిస్కు.  ఇంకా గగుర్పాట్లు! అది ‘పరిభ్రామ్యమాణరోదసీ రాక్షసి నిటలాక్షం’ట.  పశుపక్షి మనుష్య సౌఖ్యహరణ జీవనాటంకం’  పాటకి ఇన్ని ఆటంకాలా అని మరొకరెవరైనా జారిపోయేటంత ప్రతిభ రజనిది.  ఇక ఆ పాట ఆముఖ సంగీతం వినవలసినదే.  ఇంకా ఆశ తీరక ‘పలువంకల స్వార్థ ప్రజపాపాల్‌ చిలికే కవ్వం’ అన్నారు.  అందుకే ఆయన సూటి సంగీత తంత్రవేత్త మాట మంత్రవేత్త దేశంలోని సమకాలీన లయకారులలోనే ఉండరు.  తెలుగు జాతి భాషలో మాత్రం త్రిమూర్తుల తర్వాత ఇలా సంగీత సాహిత్యాలని సాగు చేసినవాడు లేడు.  ఆయనా వారిలాగే, మనలాగే ఈ నేల మీద నడిచారనీ, ఇప్పటికీ 96 ఏళ్ళుపైనా బడినా నిజంగా నడుస్తున్నారని  ఒక ఆనందం.  ఇంత పులకింత.

*

మరో బిగ్ బాంగ్


మహమూద్
~
కడలిలో కలిసే నదిలా
నాలో ఇలా కలిసిపోతావని అనుకోలేదు
నాలోని కణకణం నీ సంతకమై ప్రజ్వలిస్తోంది
నా అణువణువూ నీవై రగిలిపోతున్న
ఈ సందర్భంపై తళతళలాడుతున్న పేరు నీదే
భిన్నశక్తుల కలయికకు కూడలౌతున్న
ఈ మలుపు నీ మేలుకొలుపే
ఎంతలా కలిసిపోయావు నీవు నాలో
నా అంగాంగాన్ని సానబెడుతూ
నన్ను సాయుధుణ్ణి చేస్తూ
ఎంతలా వ్యాపించావు నీవు నాలో
లోలోపల నీ పేరుమీద ఓ విశ్వమే విస్తరిస్తోంది
నా పక్కన నిలబడ్డవాళ్ళ చేతుల్లో కాగడాలు
గెలాక్సీలై పరిభ్రమిస్తున్న ఆ వెలుతురంతా నీ చిరునవ్వుదే
ఎంతలా కదిలించావు నీవందరినీ
అందరిలో రుధిరమై సుడులుతిరుగుతున్నది నీవే
అంబేద్కర్ ప్రతిమ అందరి చేతుల్లో నిండుజ్వాలై
ధగధగలాడుతున్నది నీవల్లే
నువ్వు కోరుకున్న మార్పు వాస్తవమై
వెలివాడ కొత్త దేశాన్ని చెక్కడానికి సమాయత్తమౌతున్న శిల్పిలా ఉంది
నీ నీడను మీదేసుకున్న ఆ పరిసరాలు
నీవిచ్చిన పోరాటనినాదాలను వల్లెవేస్తున్నాయి
ఇపుడు నాదీ నక్షత్రాల నడకే
నువ్వు రాల్చిన నక్షత్ర ధూళి నుంచి
కొత్త ఖగోళాలు పుడుతున్నాయి
ప్రతి ఖగోళపు తల మీద
నీ చిత్రపటమే కిరీటం
ఎన్ని వేల కలల్ని కుప్పగా పోసి వెళ్ళావు
ఒక కల దగ్ధమౌతున్న చోట
మరో కల.ఖచ్చితంగా మొలకెత్తుతుందని
నిరూపించావు
వెలివాడలో తలదాచుకుంటున్న
ప్రతికన్నూ ఓ కలల నిధి
ప్రతికలా ఓ తారకల వీధి
యాతనను చివరి యాత్ర చేసుకొని
నలుదిశలనూ ఏకం చేశావు
పలుశాఖలై విస్తరిస్తున్న ఈ భూకంపం
నువ్వొదిలిన చివరి నిట్టూర్పుదే
మూతపడిన రెప్పలమధ్య
నీ లక్య్షం గడ్డకట్టలేదు
అది విద్యుదయస్కాంతమై
పాలపుంతలను దివిపైకి దించుతున్నది
అది నవీన విశ్వ ఆవిర్భావానికి
మరో బిగ్ బాంగ్ ను సిధ్ధం చేస్తున్నది.
*

ఒక బాటసారి: కొన్ని మాటలూ…

 

 

– కృష్ణ మోహన్ బాబు

~

 

(ఛాయ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న సాయంత్రం 5:30కు హైదరాబాద్, దోమలగూడలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్లో రాజిరెడ్డి రచనల మీద కాకుమాని శ్రీనివాసరావు ‘ఒక బాటసారి బైరాగి పదాలు’ పేరిట ప్రసంగించనున్న సందర్భంగా…)

 

mohanbabu“అక్కడ చెట్లు, మనుషులు వేర్వేరుగా లేరు. మట్టి, మనిషి వేర్వేరుగా లేరు.  ఒక సంస్కృతిగా, జీవన విధానంగా వాళ్ళు కొబ్బరిచెట్లతో మమేకమయ్యారు.  బతుకులో భాగంగా, బతుక్కి ఆలంబనగా కొబ్బరి చెట్లు కనిపించాయి”. 

కోనసీమలో మొదటిసారిగా ఓ పెళ్ళి కోసం అడుగు పెట్టినపుడు, మనుషుల్లా పరుచుకున్న చెట్లు, చెట్లై నిలబడ్డ మనుషుల్ని చూసి, జర్నలిస్ట్, రచయిత, పూడూరి రాజిరెడ్డికి కలిగిన భావన ఇది.  మామూలు, అతి మామూలు విషయాల్ని మెత్తని పదాలతో, గడుసు వాక్యాలతో రంగు రంగుల చిత్రాలుగా మలచగలిగిన నేర్పు రాజిరెడ్డిది. అలాంటి అందమయిన భావ చిత్రాల పొందికే ‘పలక – పెన్సిల్. ఇది రాజిరెడ్డి రెండో పుస్తకం.

బాల్యం నుంచి కౌమారం మీదుగా యవ్వనంలోకి అడుగు పెడుతున్న కుర్రాడి గొంతులో, ఆలోచనల్లో వచ్చే మార్పులే బలపం – పెన్సిల్ – పెన్నుగా మారి ఈ పుస్తకంలో మన ముందుకొస్తాయి.  రచయిత జ్ఞాపకాలు, అనుభవాలు చదివితే తమ జీవితంలో కూడా యించుమించు అలాంటి అనుభవాలే ఉన్న స్పృహ పాఠకులకు కలుగుతుంది.  అందుకే రచయిత వాక్యాలు పాఠకుల ఆలోచనల్ని, జ్ఞాపకాల్ని మోసుకుంటూ వెళ్తాయి.

మొదటి అనుభవాలు రేకులు విప్పినా, ‘అంమ’ అంటూ ముద్దు ముద్దుగా తొలి పలుకు గుర్తు చేసుకున్నా, ఊరి ముచ్చట్లు పెట్టి సందడి చేసినా, సిన్మాల గురించి పిల్ల ఆలోచనల్ని నెమరేసినా, మనం కూడా అమాయకంగా జారి పోయిన క్షణాల్ని తడిమి తడిమి చూసుకుంటాం. ఆనందం లాంటి విచారంలో ములిగిపోతాం.  అంగీ విప్పి హీరోయిజానికి ప్రయత్నించటం, ఆడపిల్లతో కలంస్నేహం గురించి ఆరాటపడటం, వెలుగూ వెన్నెలా అంటూ ఆమెనే కలవరించటం, కౌమారపు పీల గొంతులో మొహమాట్లాడటం, పెదాలు విప్పని నవ్వులో జర జరా జారిపోయే జ్ఞాపకాలే.

‘జీవిత రైలు కొత్త ప్లాట్ ఫామ్ మీదకు రాబోతున్నది!’, ‘డైరీలో ఏం రాయాలి?’,  ‘భోగి మంటల్లో ఏం వేద్దాం?’,  ‘మనుషుల మ్యూజియం’ –  అంటూ గంభీరమైన గొంతుతో పలకరించినపుడు, అప్పుడప్పుడే స్థిరపడుతున్న ఆలోచనలతో కొంచెం తలెత్తుకుని చిరు పొగరుతో మాట్లాడిన కాలం మన ముందుంటుంది.  ‘ప్రేమ’, ‘మనసు కేరాఫ్’,  ‘క్షణికం’,  ‘మాయ’ – చదువుతున్నప్పుడు  అప్పుడే గీసుకున్న లేత గడ్డం తాలూకు సన్నని మంటలా, చేతివేళ్ళ కంటుకున్న సిరా మరకల్లా మన జ్ఞాపకాలు మనల్ని  ఒరుసుకుంటూ వెళ్ళటం చూడొచ్చు.  ఏ రచనైనా ఏదో రూపంలో మనల్ని తనలోకి లాక్కోవడం— అదో ఎక్స్పీరియన్స్.

కొన్ని కొన్ని సందర్భాలలో రచయిత తిరుగులేని స్టేట్మెంట్స్ మన ముందుంచుతాడు.  వాటి నుంచి మనం తప్పించుకోలేము.  ఎలా డీల్ చేయాలో తెలియక తికమక పడతాం.  ‘అల్లరి వీళ్ళ కవల పిల్ల’, అంటూ పిల్లల కోసం రాసిన రచనలో రచయిత ఏమంటున్నాడో చూడండి:

“యుధ్ధాలకు కారణం వాళ్ళు కాదు.  కరువుకు కారణం వాళ్ళు కాదు.  అవినీతికి, ఆర్ధిక మాంధ్యానికి వాళ్ళకు సంబంధం లేదు.  కులం, మతం, పేదరికం అనే శబ్దాలు విన్నప్పుడు వాళ్లెప్పుడూ చప్పట్లు కొట్టలేదు.  గ్లోబల్ వార్మింగ్ కు వాళ్ళే కారణం అని ఎక్కడా ఋజువు కాలేదు.  ఆకలి చావులు, శరణార్థి శిబిరాలు, బాంబు దాడులు… ఇవేవీ వాళ్ళు ఉపయోగించే పదబంధాలు కావు.  అయినా వీటన్నిటినీ వాళ్ళు ఎదుర్కోవాలి.  ఇన్ని సమస్యలు వాళ్ళ ముందుంచి, వాళ్ళకు మేమేం తక్కువ చేశామంటాం.  వాళ్ళు స్వేచ్ఛగా విహరించాలంటాం.  వాళ్ళు సదా సంతోషంగా ఉండాలంటాం.  ఎలా?  పిల్లలే గనక ఈ ప్రశ్న అడిగితే పెద్దల దగ్గర సమాధానం ఏమైనా ఉంటుందా?.”

ఇది చదివాక అనేక విషాద చిత్రాలు మన ముందు మెదుల్తాయి.  ఏమీ చేయలేక పోతున్నామనే నిస్సహాత ఆవరిస్తుంది.  తెలియని గిల్ట్ ఏదో మనల్ని బోనులో నిలబెడ్తుంది.  ఇలా తను చెప్పదల్చుకున్న విషయం పట్ల, మన ఆలోచనల్ని లాక్కెళ్ళగలగడం రచయిత సాధించిన విజయం.

రాజిరెడ్డి రచనలన్నీట్లో సాధారణంగా ఉండే ఒక మార్మిక గొంతు ఈ పుస్తకంలోనూ స్పష్టంగా కన్పిస్తుంది.  చాలా రచనలు ఓ బలమైన తాత్విక అంశంతో ముగియడం వల్ల ఆ రచన తాలూకు ఫీలింగ్స్ చాలా సేపటి వరకు మనల్ని వదలకుండా వెంటాడతాయి.  మచ్చుకు కొన్ని చూడండి:

“జీవితాన్ని పొడిగించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం… వీలైనన్ని ఎక్కువ జ్ఞాపకాలు పోగేసుకోవడమే.

“ఏ మార్మిక చిక్కుముడులు విప్పడానికి జీవితం యిలాంటి చిక్కు అలవాట్లను కల్పిస్తుందో!

“ఇల్లు మారినప్పుడు ఎలాగైతే పాత సామానులను వదిలేయక మోసుకెళ్తూ ఉంటామో, అలాగే భావాలను మోసుకెళ్తూ ఉంటాము.

“రోజూ సూర్యాస్తమయ సమయంలో ఆకాశం తగలబడి పోతూ ఉంటుంది.  బహుశా, అందువల్లేనేమో రాత్రి మరింత నిర్మలంగా కనబడుతుంది.

“నువ్వున్నావన్న ఒకే ఒక్క కారణంగా ఈ ప్రపంచాన్ని క్షమించేశాను.

“బతుకు ప్రవాహం స్థూలంగా అందరిదీ ఒకటే. సూక్ష్మంగా దేనికదే ప్రత్యేకం.”

 

ఇలాంటివి అనేకం, అనేకానేకం.

 

కొన్ని కొన్ని చోట్ల రచయిత ఏ అరమరికలు లేకుండా తన సర్వ గుణాలను మన ముందుంచుతాడు. ‘నేనేమిటి?’ అంటూ మొదలు పెట్టి ఒక్కొక్క పొర విప్పుతుంటే ఆ పదాల్లో మన ప్రతిబింబం కూడా కనబడి ఉలిక్కి పడతాం. పుస్తకం చదవటం పూర్తయ్యేసరికి మనం మండుటెండలో వేడి వేడి నీళ్ల స్నానం చేసి, ఏ.సి.లోకి వచ్చి సేద తీరుతున్న చిత్రమైన అనుభూతి పొందుతాం.

మిమ్మల్ని ఎప్పుడైనా చిన్న చిన్న చికాకులు చుట్టుముట్టినప్పుడు, ఏమిటో ఈ జీవితం అని నిర్లిప్తత ఆవరించినప్పుడు ఈ పుస్తకం చదవండి.  అప్పుడు, ఇప్పుడుగా ఎగిరి పోయిన ఆనందపు క్షణాలు పక్షులై మీ గుండె గోడల మీద వాల్తాయి.  మిమ్మల్ని మీరు సంబాళించుకునేలా చేస్తాయి. గ్యారంటీ.

 

 

*

 

 

కథలకు ఒక ఇల్లూ ఒక కుటుంబం!

katha3

 

– జగద్ధాత్రి

~

 

కథానిలయం గురించి అన్నీ  అందమైన జ్ఞాపకాలే!

అసలు కమ్మని జ్ఞాపకాలు కాక కథానిలయం గురించి ఏముంటాయి చెప్పండి. ఇది తెలుగు రచయితలను పాఠకులను కథా నిలయం ఎరిగిన ప్రతి వారూ రాయగలరు, ఎన్నెన్నో చెప్పగలరు. పద్ధెనిమిది  సంవత్సరాలనుండి ఫిబ్రవరి రెండవ శని ఆదివారాలలో కథా నిలయం శ్రీకాకుళo వెళ్ళడం ఒక ఆనవాయితీగా తెలుగు సాహిత్య ప్రేమికులందరికీ అలవాటే. నాకున్న అనుభూతులను కొన్ని మీతో ముచ్చటించుకుంటాను.

కథానిలయం వార్షికోత్సవం అంతే అందరూ కలుసుకునే ఒక పెద్ద పండుగ. అసలీ జ్ఞాపకాలను ఎక్కడనుండి మొదలుపెట్టను? కథా నిలయానికి ఎప్పుడు వెళ్లినా కొంగు నిండా బోలెడు అందమైన జ్ఞాపకాలను కట్టి తెచ్చుకుంటూనే ఉంటాను.

 

ముందు కథా నిలయం వార్షికోత్సవాలా జ్ఞాపకాల పూలు కాసిన్ని మీకోసం….

విరసం రచయిత అర్నాద్ కి “రావిశాస్త్రి” పురస్కారం ఇవ్వడం, ఆ వేడుక లో రచయితను గూర్చి ప్రసంగించడానికి రామతీర్థని ఆహ్వానించారు. ఇది 2004 అనుకుంటాను. ముందు రోజు మధ్యాహ్నం నుండి వచ్చిన వారందరివీ పరస్పర పరిచయాలు, కొన్ని ప్రసంగాలు అన్నీ అవుతాయి అని అందరికీ తెలిసిందే కదా. అబ్బా అందరినీ కలుసుకోవడం ఎంత సరదా , మా నాయుడు బావులందరూ, మా ఉత్తరాంధ్ర ‘బుదడు’ ఛాయారాజ్, కవన శర్మగారు, ఇలా ఎంతమందినో పేరు పేరునా చెప్పలేను కానీ ఎన్నెన్ని హాస్యాలు కబుర్లు. మరుసటి రోజు కార్యక్రమం అయ్యాక భోజనం . నీళ్ళు పేకెట్లు ఇచ్చారు. అప్పుడే గౌరునాయుడు బావు ‘నదిని దానం చేశాక’ కవితా సంపుటి ప్రచురించాడు. ‘ఏటి బావు నదిని దానం సెసీసినావనేటి నీళ్ళ పేకెట్టిచ్చినావు’ అని నేను అల్లరిగా అంటే అవును తల్లే మరి నదిని దానం సెసీసినామ్ కావా అని నవ్వుతూ గౌరునాయుడు బావు సమాధానం చెప్పడం. ఛాయారాజ్ గారు తో కాస్త పొగ బండిని తగ్గించండి సారూ అని ఆప్యాయంగా మందలింపుగా అంటే ‘అదే మరి కొంచం కష్టం అవుతోంది’ అని ఆయన సమాధానం.

బావూ తెల్ల మిరియం బావు(అది రామతీర్థ తొలి కవితా సంపుటి) ఇరగదీసీసినావు అంటూ హాస్యవల్లరి వెదజల్లిన మా చింతా అప్పల్నాయుడు బావు.

మరో ఏడాది నేను , రామ తీర్థ, స్వామి గారు వెళ్ళాం. ముందు రోజు కారా దంపతులకు అభినందన సత్కారం మాస్టారికి ముందు చెప్పకుండా ఏర్పాటు చేసేరు. అప్పుడే ఆయనకేదో పురస్కారం వచ్చింది. బహుశా తెలుగు విశ్వవిద్యాలయం వారిది అనుకుంటాను. నేను రామినాయుడు కలిసి మాస్టారికి అమ్మ కి పూల దండ వేయడం ఒక అందమైన జ్ఞాపకం. తన సాహితీ జీవనం సాఫల్యంగా సాగడానికి కారణం సంసారానికి తాను కెప్టెన్ గా తన గృహిణి నడపడమే అని అర్ధాంగిని గూర్చి ఆర్ద్రంగా చెప్పేరు మాస్టారు. ఆయనకి తనకు సాధ్యమైన సహాయం చేయడమే ఆయనని రాసుకోనివ్వడమే తప్ప తాను చేసినదింకేమీ లేదని వినమ్రంగా చెప్పిన ఆ సాహితీ మూర్తి అర్ధాంగి సీత మహాలక్ష్మి వినయానికి మేమందరము ఆశ్చర్యానందం చెందేము.

అప్పుడే రచన శాయి గారిని, రఘోత్తమరెడ్డి గారిని చూడటం జరిగింది. అక్షర వాచస్పతులందరి హాస్యాల విరి జల్లుల్లో తడుస్తూ మురుస్తూ ఎన్నెన్ని మాటలో!

katha1

2013 కథానిలయం స్వీట్ సిక్స్టీన్  వార్షికోత్సవం లో సాహితి మిత్రురాలు డాక్టర్ అయ్యగారి సీతారత్నం పుస్తకం “కూరాకుల మడి” ని వోల్గా అరవయ్యవ జన్మదినోత్సవానికి కానుకగా ఆమెకు అంకితమిస్తూ మాస్టారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని కథా నిలయం లో ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది. కథానిలయం లో ప్రేక్షకురాలిగా కాక ప్రసంగం చేసే అవకాశం అంది పుచ్చీసుకున్నాను ఆ రోజు.

ఆ రోజే ఎప్పుడూ కథల పుస్తకాలు తప్ప ఆవిష్కరించని కథానిలయం లో మాష్టారి చేతుల మీదుగా కుమార వర్మ కవితా సంపుటి ‘రెప్పల వంతెన’ ఆవిష్కరణ కూడా జరిగింది. ఆ రోజే మాస్టారి తమ్ముడు కీ.శే. కృష్ణా రావు గారి కవితా సంపుటిని కూడా ఆవిష్కరించారు. తన తమ్ముడే గనుక కుటుంబ బాధ్యతను స్వీకరించి తనకు స్వేచ్ఛనివ్వక పోతే తాను ఇంత రచన చేయగలిగేవాడిని కాను అని మాస్టారు ఎంతో ప్రేమగా తన జ్ఞాపకాలను మాతో పంచుకున్నారు. ఆయన కళ్లలోని తడిని చూసి మా అందరి గుండెలూ చెమ్మగిల్లాయి.  మరుసటి రోజు సతీష్ చందర్ , నండూరి రాజగోపాల్ అతిథులుగా వార్షికోత్సవ ప్రసంగాలు సాగాయి. ఇవి కొన్ని వార్షికోత్సవ ముచ్చట్లైతే ఇక మామూలుగా ఎన్నో సార్లు కథా నిలయం కి వెళ్ళడం , ఎవరైనా ఆత్మీయ మిత్రులు వచ్చినప్పుడు తీసుకెళ్ళడం పరిపాటి.

అలా ఈ మధ్య వచ్చిన ఖమ్మం మిత్రులు , మువ్వా శ్రీనివాసరావు, సీతారాం,ఆనందాచారి , కపిల రామ్ కుమార్ , ప్రసాద మూర్తి, అందరం కలిసి మాస్టారిని చూడటానికి వెళ్ళడం ఒక మరుపు రాని అనుభూతి. అక్కడ మా అప్పల్నాయుడు బావు , రామారావు నాయుడు గారు , అందరం కలుసుకుని మాస్టారికి నేను , సీతారాం, మువ్వ శ్రీనివాసరావు మా పుస్తకాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాం. అందరం కలిసి ఆ మధుర క్షణాలని మా కెమెరాల్లో బంధించి తెచ్చుకుని అపురూపంగా దాచుకున్నాం.

మాస్టారు భలే మాటన్నారు ఆరోజు. చెప్తా వినండి. మాస్టారు తొంభయ్యవ పుట్టినరోజు నాడే చెప్పేరు నన్ను ఇంకెక్కడికీ పిలవకండి శరీరం సహకరించడం లేదు రాలేను అని. అయినా పిలిస్తే  నాకెంత కష్టమవుతుందో మీకు తెలీదు. ఈసారి నన్ను బలవంత పెట్టారా మీ అందరికీ పూర్ణాయుష్షు దీవించేయ్గలను అని బెదిరించారు. అదేంటి మాస్టారు అంటే పూర్ణాయుష్షు అంటే 120 సంవత్సరాలు వృద్ధాప్యం లో ఎక్కడికైనా వెళ్లాలంటే ఎంత కష్టమో మీకు తెలిసొస్తుంది అప్పుడు అన్నారు. హాయిగా నవ్వేశాం అందరం.

ఈ మధ్యనే సాహితీ స్రవంతి వారి కార్యక్రమంలో మాస్టారిని మళ్ళీ దర్శించుకున్నాం. ఆయన ఆనంద భాష్పాలను చూసాము. శివారెడ్డి గారు, తెలకపల్లి రవి గారు అందరూ వేదిక మీద ఉండటం ఆరోజు విశేషం.

ఇక అన్నిటికంటే అపురూపమైన జ్ఞాపకం మీతో చెప్తాను ఇప్పుడు ఇది అందుకే చివరికి పెట్టాను.

2013 ‘తొంభాయిల్లోకి మన కారా’ ఒక పెద్ద సాహిత్య కార్యక్రమం తలపెట్టింది విశాఖలో మోజాయిక్. నవంబర్ 9 న మాస్టారు జన్మ దినోత్సవం నాడు చాలా మంది రచయితలతో , చాగంటి తులసి గారు మాస్టారు, ఏం ఎల్ సి శర్మ గారు ఇంకా అందరం ఒక వందమందిమీ కలిసి మా అందరి నడుమ గులాబీ దండతో కూర్చున్నతొంభై యేళ్ళ నవ యవ్వనుడు మాస్టారితో గ్రూప్ ఫోటో తీయించుకున్నాం. అది మా అందరికీ ఒక మధురస్మృతి.

సరే ఇంతకీ నే చెప్పొచ్చేది ఇది కూడా కాదు ఇంకా ఆనందమైన విషయమేమిటంటే ఆ కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు నేను రామతీర్థ మాస్టారిని కలుసుకుని ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి తీసుకుని కథా నిలయానికి వెళ్ళాం. మన తెలుగు వారి అదృష్టం కొద్దీ అప్పుడు మన శ్రీరామచంద్ర మూర్తి గారు హెచ్ ఏం టీవి లో ఉన్నారు. వారు వారి కెమెరా బృందాన్ని ఆ ఇంటర్వ్యూ మొత్తం చిత్రీకరించమని పంపించారు. ఇక ఆ రోజు చూడాలి మా ఆనందం. వెళ్ళేసరికి పదకొండున్నరైంది. మాస్టారు, వారి అబ్బాయి సుబ్బారావుగారు, వివిన మూర్తి గారు కూడా ఉన్నారు. ఆరోజు నిజంగా మా జీవితాల్లోనే కాదు తెలుగు సాహితీ చరిత్రలోనే మధురాతి మధురమైన స్మృతులుగా రాబోవు తరాలకు శాశ్వతీకరించగలిగే అదృష్టం మాకు కలిగింది. దాదాపు మూడు గంటల పాటు మాస్టారు మాతో మటాడేరు, భోజనానికి కూడా వెళ్లలేదు. మొత్తం ఇంటర్వ్యూ పూర్తయ్యే వరకు కదలలేదు.  ఆయన జీవిత, సాహిత్య విషయాలు ఎన్నెన్నో మాకు చెప్పేరు. రామతీర్థ నేను వేసిన ప్రశ్నలన్నిటికీ ఎంతో ఓపికగా హుషారుగా సమాధానాలు చెప్పేరు.

katha2మీ తొలి నాటి కథల్లో ‘రేవతి నుంచి’ అని ఉత్తరాల రూపం లో సీత అనే అమ్మాయికి రాసినట్టుగా కథలు ఉంటాయి కదా ఆ ఏడాదే మీ పెళ్లి సీతామహాలక్ష్మి గారితో అయింది కదా అయితే ఈ కథ అంతకు ముందే ప్రచురితమైంది అంటే మీకు అప్పటికే సీత గారు తెలుసా అన్న రామతీర్థ చిలిపి ప్రశ్నకు చూడాలి మాస్టారి మొహం లో నవ్వు. పేరు తెలుసు బాబు అప్పటికి అంటూ సమాధానం చెప్పేరు. రేవతి అన్నది తన జన్మ నక్షత్రమని ఆ పేరునే తన కలం పేరుగా వాడుదామా అని కూడా ఆలోచన ఉండేదని కూడా చెప్పేరు. ఈ ఇంటర్వ్యూని మొత్తం రామతీర్థ అక్షరీకరించి 2014 కారా తొంభయొకటవ జన్మదినాన సాక్షి లో ప్రచురించారు.   ఎప్పుడు సీతామహాలక్ష్మి గారి గురించి ప్రసక్తి వచ్చినా మా గృహిణి అనడమే తప్ప పేరు పెట్టి కూడా ప్రస్తావించని మహానుభావుడు.

తన జీవితం లోని చాలా ముఖ్యమైన సంగతులు , తన రచనా లోకం గురించి ఎన్నో మూచ్చట్లు చెప్పారు మాస్టారు. ఆ కార్యక్రమం నుండి కొంత ముఖ్యమైన భాగాన్ని “90 ఏళ్ల కుర్రాడు కారా’ పేరిట హెచ్ ఏం టి వి లో న్వంబర్ 9 నా కారా పుట్టినరోజు నాడు ప్రసారం చేసేరు. తాను రాసిన ఒక్కో కథకు గల నేపథ్యాన్ని రాయాలని ఉందని, దేహం సహకరించక రాయలేకపోతున్నాను అని చెప్పేరు. ఒక పెద్ద నవల రాయాలని ఉన్నదని కూడా చెప్పేరు. ఆత్మ కథ రాసే ఉద్దేశం ఉందా మాస్టారూ అని అడిగితే దానిలో ఏదైనా సమాజానికి ఉపయోగ పడేది ఉంటే తప్ప ఆత్మ కథ రాయాల్సిన అవసరం లేదు అన్నది తన నమ్మకం అని స్పష్టంగా చెప్పేరు. సాహిత్యం ముఖ్యంగా కథలు సమాజం లో చైతన్యాన్ని తీసుకొస్తాయని సంపూర్ణంగా నమ్ముతాను అని చెప్పేరు.  ప్రపంచం లో ఎక్కడా ఒక సాహిత్య ప్రక్రియ కు ఒక నిలయం అంటూ లేదు ఇప్పటివరకు అలాంటి గొప్పతనం మన కథా నిలయానికే ఉంది అనడానికి మన తెలుగు వారందరూ గర్వించాలి. తెలుగులో ప్రచురితమైన ప్రతి కథా కథానిలయం లో చోటు చేసుకుంటుంది.

తనకు నచ్చిన తాను గురువులుగా భావించే గురజాడ, కొడవటిగంటి కుటుంబరావు, రావి శాస్త్రి ల పెద్ద చిత్రపటాల సాక్షిగా కథానిలయం లో మాస్టారితో బాటు కూర్చుని ఆయన చెబుతున్న జీవిత సాహిత్య విశేషాలను తెలుసుకోవడం నా జీవితం లో సాటి లేని మధురానుభూతి. మన తెలుగు సాహిత్యం ఆంగ్లం లోకి తీసుకెళ్ళండి బాబు అందుకు కృషి చేయండి అని చెప్పేరు. తన రచనలను వ్యాసాలను ఏది సమాజానికి ఉపయోగిస్తుందో అవి అన్నీ అందరికీ ఇతర భాషల్లోకి, ముఖ్యంగా ఆంగ్లం లోకి వెళ్లాలని అది ఒక లక్ష్యంగా పెట్టుకుని మీరిద్దరు చేయాలని నాకు రామతీర్థ కి నవంబర్ 9, 2014 న చెప్పేరు. సాహిత్యమే లేకుంటే తన జీవితం శూన్యమని, ఎటువంటి కష్టాన్నైనా మరిపించగలది పుస్తకమేనని అందుకే ఒక కన్ను కనిపించక పోయినా ఇప్పటికీ రోజుకి ఐదారు గంటలు చదువుతానని చెప్పేరు కారా.

అంతటి సాహితీ మూర్తి తో శాశ్వతంగా ఒక చిత్రం లో ఉండగలగడం అదృష్టమన్న పదానికన్న మించినదేదో అయి ఉండాలి అన్నది నా భావన.

ఏదో అక్కడక్కడ దొరికినవి ఏరుకున్న నాలుగు పొగడ పూల లాంటి మాటలు చెప్పేనేమో ఇంకా చెప్పాలంటే బోలెడున్నాయి. ఎంత చెప్పినా తక్కువే. ఇలా నాకే కాదు అందరికీ ఉంటాయి అన్నది నిజం. ఇలా అందరం కలిసి రాసిన ఈ మధురానుభూతులన్నీ ఒక దరికి చేరిస్తే ఇదో పెద్ద పుస్తకమౌతుంది అనడం లో సందేహమే లేదు. కథా నిలయం వార్షికోత్సవం మళ్ళీ వచ్చింది పండుగ వచ్చిందోయ్ మాకు అన్నట్టు ఈ ఫిబ్రవరి లో కూడా ప్రతి ఏడు లాగే వార్షికోత్సవం జరుపుకుంటున్న కథా నిలయానికి , ఆ కథా నిలయ సంస్థాపకులు ఫీల్డ్ మార్షల్ కారా మాస్టారికి మనస్ఫూర్తిగా నమస్కారం!

*

 

 

ఆత్మ హత్యే ఆయుధమైన వాడు..

 

-ఎండ్లూరి సుధాకర్

~

 

అలంకారాలూ వద్దు

కళంక రాజకీయ రాద్ధాంతాలూ వద్దు

అనవసరమైన ప్రతీకలూ వద్దు

నిన్ను చంపిన హంతకులెవరు?

నీ నిండు ప్రాణాన్ని దోచిందెవరు?

దోషులెవరు? ద్రోహులెవరు?

నీ కోసం పరితపిస్తున్న

నీ దోస్తులెవరు?

శిబిరంలో అహోరాత్రాలు

శిలువెక్కిన ఆ క్రీస్తులెవరు?

వేద కాలం నుంచి

కేంద్రీయ వెలివాడ దాకా

ఎవరో ఒకరు మనల్ని మట్టు పెడుతూనే ఉన్నారు

ఉరి తీసి చెట్లకు వేలాడదీస్తున్నారు

కనబడని కత్తులతో నాల్కలు కోస్తున్నారు

కంటికి కనిపించకుండా

చెవుల్లో సల సల కాగే సీసం పోస్తున్నారు

నలందాలూ తక్షశిలలూ వారణాసులూ

మనకు నిషిద్ధ విశ్వవిద్యాలయాలు

అక్షరాలు రాకపోవడమే బావుండేదేమో

ఆ రోజుల్లో అంటరాని ప్రాణాలైనా దక్కాయి

ఆనాటి అమ్మలెంతో ధన్యులు

కనీసం పిల్లల్ని కళ్ళారా చూసుకున్నారు

ఈనాటి తల్లులెంతో వేదనా మూర్తులు

ఆధునిక వెలివాడల్లో

అక్షరాలా గర్భకోశాలు కోసుకున్నారు!

జింకల్ని లోపలేసి

పులుల్ని ఎగదోసి

శాంతి వచనాలు పలికే

ఏ రాజ్యమైనా క్షేమంగా ఉండదు

దోషులెంతటి దొరలైనా

ఏదో ఒక రోజు దొరకకపోరు

చరిత్ర పొడుగునా

అస్పృశ్య క్షతగాత్రుల ఆర్తనాదాలే

వేముల రోహితా!

వెంటాడిన మృత్యు మోహితా!

నీ బలిదానం

భారద్దేశాన్నే కాదు

ఈ ప్రపంచాన్నే విప్లవీకరించింది

నీ మరణం

అంబేద్కర్ నీలి విగ్రహాలకు

ఎరుపెక్కిన కొత్త ఊపిరి పోసింది

నీ ఉనికి

కునికే ఉద్యమాలకు

ఉరుకులెత్తే శక్తినిచ్చింది

ఇప్పుడు నీ తల్లి ఒంటరిది కాదు

కోట్లాదిమంది కొడుకులున్నారు

నీకోసం ఉద్యమించిన కూతుళ్ళున్నారు

పోరాట యోధుడా!

ఆత్మహత్య ఆయుధంతో

అంటరాని యుద్ధంలో

అమ్మ ముందే అమరుడవయ్యావు

మూలవాసుల ముద్దు బిడ్డా!

ఈ మనుచరిత్ర

నీ సమాధి ముందు

నిత్య దోషిలా తల వంచుకునే ఉంటుంది

రేపటి సూర్యుడు రోజులా కాకుండా

రోహిత్ లా ఉదయిస్తాడు!

 

*

 

కొమ్మ చాటు కోకిల ఎమిలీ డికిన్సన్

 

 

    – నాగరాజు రామస్వామి

~

ఏభై ఆరేళ్ల జీవిత కాలంలో 1800 లకు పైగా ఆణిముత్యాల లాంటి  కవితలు రాసి, కేవలం ఏడింటిని మాత్రమే ప్రచురించుకున్న 19 వ శతాబ్ది అమెరికన్ కవయిత్రి ఎమిలీ  డికిన్ సన్. తన యావజ్జీవితాన్ని నాలుగు గోడలకే పరిమితం చేసుకొని, కొమ్మల్లోంచి బయటకు రాని కోకిల ఎమిలీ. ఆమె మరణానంతరం ఆమె సోదరి లవీనియా కలుగజేసుకొని, చిత్తుకాగితాలలో దాగిన కవన స్వరాలను ఆవిష్కరించకుండా ఉంటే, బహుశ, ఆ అభినవ కోకిల గొంతు కొమ్మల్లోనే సద్దుమణగి పోయేదేమో.

ఎమిలీ – ఏమిలీ ఎలిజబెత్ డికిన్సన్ (1830 – 1886 ) – అమెరికా లోని ఆమర్స్ట్ (Amherst ) లోని క్రైస్తవ సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది. ఆమర్స్ట్ అకాడమీ లో తెలివైన విద్యార్థినిగా పేరు పోందింది. 17 ఏళ్లకే చదువు చాలించి, తండ్రి కట్టిన ఇల్లు హొమ్ స్టెడ్ లో  శేష జీవితాన్ని ఒంటరిగా గడిపింది. ఒకటి రెండు సార్లు వాషింగ్టన్ డి.సి, ఫిలడల్ఫియా, బోస్టన్ కు మాత్రమే వెళ్లింది. అడపాదడపా కలిసే ఒకరిద్దరు మిత్రులు తప్ప చెప్పుకోదగిన ఆత్మీయులు లేరు. పెళ్లిచేసుకోకుండా ఉండి కన్య గానే మరణించింది. ఎప్పుడో గాని చర్చికి వెళ్లేది కాదు. తెల్లని దుస్తులే ధరించేది. ఎవరితోనూ కలుపుగోలుగా ఉండక ఏకాకిగా బతికేది. కనుకనే ఆమెను మిథ్ (myth) అని అంటుండే వారు. రాసిన కవితలలో సింహభాగం మృత్యువు సంబంధమైనవే అయినందున ఆమెను మార్బిడ్ (Morbid) పోయెట్ అనేవాళ్లు. ఫోటో పంపమని అడిగిన సంపాదకులకు ‘I am small like the wren, and my hair is bold, like chestnut bar – and my eyes like the sherry in the glass, that the guest leaves ‘ అని చెప్పిందే కాని ఫోటో పంప లేదు. ఎక్కడో దొరికిన ఏదో ఒక Daguerreotype ముతక ఫోటోతో వాళ్లు సరిపుచ్చుకోక తప్పలేదు.

మానవ సంబంధాలకూ, ప్రపంచ రీతులకూ దూరంగా ఉన్న ఆ ఒంటరి జీవి అన్ని కవితలు ఎలా రాయగలిగిందో,  ‘ America’s true poetic genius ‘ గా ఎలా ఎదుగ గలిగిందో ఆలోచిస్తే వింతగా ఉంటుంది. ఆమెను అంటిపెట్టుకున్న పలు పుస్తకాలే అందుకు దోహదం చేసి ఉండవచ్చు. ఆమెను ప్రభావితం చేసిన కవులలో పోయెట్ ఎలిజబెత్ బార్రెట్ బ్రౌనింగ్, హాతోర్న్, థోరో, ఎమెర్సన్, లాంగ్ ఫెలో, షేక్స్ పియర్,జాన్ కీట్స్ , జార్జ్ ఇలియట్ ముఖ్యులు.
వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్, కీట్స్, బైరన్, షెల్లీ, బ్లేక్  ప్రభృతులతో  ప్రారంభమైన కాల్పనిక సాహిత్యోద్యమ కెరటం ( Romantic Movement ) పలు ప్రపంచ దేశాలను చుట్టి 19 వ శతాబ్దం నాటికి అమెరికా తీరాన్ని తాకింది. రష్యాలో Pushkin, స్పేన్ లో Jose de Espronceda, పోర్చ్ గల్ లో Almeida Garette, ఇటలీ లో Ugo Foscolo, అర్జెన్టీనా లో Esteban Echeverria, బ్రాజిల్ లో Jose de Alenar  వంటి వాళ్లను  ప్రభావితం చేసిన రొమాంటిక్ కవిత్వం అమెరికా లో  విలియమ్  బ్ర్యంట్, వాల్ట్ విట్మన్, ఎమిలీ డికిన్ సన్ లను సృష్టించింది. అమెరికా జాతీయ అధునిక సాహిత్య నుడికార  సృష్టి కర్తలుగా పరిగణించ బడుతున్న ఇద్దరి లో ఒకరు వాల్ట్ విట్మన్, మరొకరు కవయిత్రి  ఎమిలీ డికిన్ సన్. విట్మన్ ది బైబల్ సంబంధిత దీర్ఘ పంక్తుల కవిత్వ మైతే, డికిన్ సన్ ది ప్రొటెస్టంట్ భావ సాంద్ర మైన లఘు వాక్యాల కవిత్వం. విట్మన్ లో విస్పష్ట భావోద్వేగం పొంగి పొరలుతే, డికిన్ సన్ లో వికల భావ అస్పష్టత దోబూచులాడుతుంది. అమెరికా లో పరిఢవిల్లుతున్న నేటి ఆంగ్ల కవితా అధునిక చైతన్య ధారకు వీళ్లిద్దరు మూలభూతులు అనడంలో సందేహం లేదు.

ఆమె ఎన్నోమరపు రాని ప్రణయ కవితలను, వెంటాడే మత సంబంధిత గీతాలను, ‘Master Letters’ అని కొనియాడబడిన  ఉత్తరాలు రాసింది. డికిన్ సన్ జీవితం ఎంత చిత్రమైందో, ఆమె కవిత్వం అంత అసాధారణ మైంది. భాషను కొత్త పుంతలు తొక్కించే స్వేచ్ఛాధోరిణి. వ్యాకరణ సూత్రాలను లెక్కచేయని స్వైర  ప్రయోగాత్మకత. ఆమెది ఒకవిధంగా  capre diem poetry – శక్తివంతమైన వర్తమాన క్షణాలను పొదవి పట్టుకొని ‘Seize the day’, ‘ Live-in-the-moment’, ‘Dwell in the possibility’ అంటూనే లౌకిక సీమలను అధిగమించే ఆత్మ భావన. ‘Bring me the sunset into my cup’ – అన్న ఆమె కవితా పంక్తులు అధునికత గత శతాబ్దంలోనే కవిత్వ భూములలో అడుగిడిందనటానికి ఆనవాలు. ఆమె వాక్య నిర్మాణం నవీనం. వ్యాకరణం ఆమోదించని విరామ చిహ్నాలను, డాష్ లను ఇచ్ఛానుసారం వాడుతుంటుంది అనడానికి నా ఈ యథాతథ అనువాదాలు :
             నేను నివసించేది సంభవంలో —
వచనం కన్నా అందమైనది —
దానికి కిటికీలు అనేకం —
ద్వారాలు ఉత్కృష్టం —
గట్టి కర్ర తో కట్టినవి —
కనుచూపుకు గహనమైనవి —
శాశ్వతమైన పైకప్పు కోసం
ఆకాశపు వసారాలు వాల్చబడ్డవి —
సందర్శకులు — సజ్జనులు —
వాళ్లు ఉండేందుకు — ఇది–
స్వర్గాన్ని పోగుచేసుకునేందుకు
చాచిన నా బాహువులు —

ఆమె కవితలకు శీర్షిక లుండవు. రూపం ( Form ) లోనూ, ఉత్ప్రేక్షల వినియోగం లోనూ ఆమెది అసాంప్రదాయ కవిస్వేచ్ఛ ( Poetic license ) :
             మేధ — ఆకాశం కన్నా విశాలం —
పక్క పక్కన పెడితే —
దాంట్లో రెండోది అవలీలగా ఇముడుతుంది —
మరి నీకూ ఉంటుంది పక్కన చోటు —
మెదడు సముద్రం కన్నా లోతైంది —
నీలిమనూ నీలిమనూ —
పట్టుకొని చూడు —
అది రెండో దాన్ని ఇట్టే పీల్చేసుకుంటుంది–
స్పాంజ్ — బకెట్ లా–
మస్తిష్కం బరువు దేవుని అంత —
తూచి చూడు– పౌండు కు పౌండు —
భేదం అంటూ ఉంటే–
అది ఉచ్ఛారణకూ శబ్దానికి ఉన్నంత —

కవితకు సరిపడదేమో అన్నట్టుంటుండే ఆమె ఉన్న ఫళంగా వాడిన ఆరంభ వాక్యం ఊహకు పొసగదు. Humming Bird ను ఉద్దేశించిన కవిత తొలి పంక్తి  ‘మాయ మయ్యే మార్గం’ – ‘A route of Evanescence’. కాని, ఆ కిటుకు తెలిసాక, పాఠకుకునికి సంభ్రమాశ్చర్యం తప్పదు :
  చిటికెలో మాయమయ్యే మార్గంలో
గిర్రున తిరిగే చక్రం —
పచ్చలను అనునదించే కంపనం —
ఆరుద్ర అరుణిమల శీఘ్ర గమనం —
ఆ రంగుల ఉరవడికి
వాల్చిన తలను సవరించు కుంటుంది
పూలపొద మీది ప్రతి పుష్పం
ఆది
దూరదేశం నుండి దూసుకొచ్చిన జాబేమో,
కన్వేగు వేళ హాయిగొలిపే  కాలి నడకేమో —         

ఒక్కో చోట వ్యాకరణ విరుద్ధంగా  capital letter వాడుతుంది. ఇక్కడ పువ్వు – Flower ( F in upper case) ! పైగా ఆ పువ్వు సంతోషం గా ఉన్న పువ్వు !
           ఆటకోలు మంచు
యాదృశ్ఛికంగా
తన తలను ఖండించినా
సంతోషంగా ఉన్న ఏ పువ్వూ
ఆశ్చర్య పడినట్టు లేదు —
ఆ అందాల హంతకి
అలవోకగా కదలి పోతుంటుంది —
చలించని సూర్యుని దినచర్య
యథావిధి కొనసాగుతుంటుంది —
ఆమోదించే దేవుని కోసం .

వాక్యాల వింత విరుపులతో, భావావరణాల కుదింపులతో కూడిన అందమైన అస్పష్టత :
           ఘోర విషాదం పిదప
మామూలై పోయిన స్తబ్ద యాంత్రికత —
నరాలు ఆచార్య పీఠం వేసుకొని కూర్చుంటవి — సమాధుల్లా,
బిగుసుకు పోయిన హృదయం ప్రశ్నిస్తుంటుంది
అతడేనా భరించింది ?
మరి ఇది నిన్నమొన్ననాటిదా  లేక శతాబ్దాలకు ముందుదా?’ అని–
కలప బాట మీదో, గాలిమీదో, దేనిమీదో
కాళ్లు యాంత్రికంగా కదలాడుతుంటవి —
లోన ఏదీ పట్టని బండబారిన నిర్లక్ష్య స్ఫటిక  నిశ్చలత —
సీసంలా ఘనీభవించిన సమయం —
చలి బారికి బతికి బయట పడి గడ్డ కట్టినా
మంచునే స్మరించే మనుషులు —
మొదట చలి, పిదప దిగ్భ్రాంతి,
ఆపిదప వదలివేత — అనాసక్త స్వేచ్ఛ —

చిత్రమైన భ్రాంతి మెలకువల సందిగ్ధ భావ చిత్రం . మన ఊహకే వదిలివేయబడిన అర్ధాంతర ముగింపు :
         నా తలలో ఒక శవయాత్ర కదలిక ,
నా మెదడులో  ఒక అంతిమ క్రియాకాండ —
సంతాపకులు అదేపనిగా అటూ ఇటూ తిరుగుతూ,
నా ఆలోచనను ఆసాంతం అణగదొక్కుతూ —
సందడి.
ఆ తతంగం అంతా ఒక భరించరాని ఢంకా మ్రోతలా ఉన్నది
ఎడతెగని ఆ కఠోర ధ్వనికి నా తల దిమ్మెక్కేట్టున్నది.
వాళ్లు ఆ శవపేటికను ఎత్తేటప్పుడు
కీచు శబ్దమేదో నా గుండెల్లోంచి దూసుకు పోతున్నది,
వాళ్ల ఇనుప బూట్ల తొక్కిడికి లోని నేల కూలు తున్నది.
స్వర్గసీమలన్నీ కలసి  ఒక పెద్ద ఘంటగా మారినట్టు,
నా అస్తిత్వం అంతా వెరసి అది వినేందుకే ఉందన్నట్టు,
నేనూ నా నిశ్శబ్దం ఏదో వింత ఒరిపిడికి విరిగి ఒరిగినట్టు ,
ఇక్కడ నేను ఒంటరినై మిగిలి పోయినట్టు —  ఉన్నది.
నా కాలికింది కలప పగిలి నేను పడిపోతున్నాను —
కిందకు – మరింత కిందకు —
ఒక్కో పతనంలో ఒక్కో ప్రపంచపు తాకిడి,
ఒక్కో తాకిడితో ఒక్కో శిథిలమైన ఎరుక మరపు —
– – –
మరి ఆవెనుక – – – –

ఆమె ఒక విధంగా మత విశ్వాసాల కవయిత్రే. వ్యక్తిగత జూడీ-క్రిస్టియన్ నమ్మకాలకూ శుద్ధ భగవత్ తత్వ భావానికీ మధ్య నున్న లంకె కోసం ఆన్వేషించింది. ‘ Hope is the thing with feathers ”అనే కవితలో అమూర్త అంశాలకూ భౌతిక విషయాలకూ మధ్య నున్న సమగ్రతను పట్టుకోవడం కోసం పరితపించింది. ఆమె కవితా ప్రక్రియ ఎంత జటిలమైందో, ఆమె మత పరమైన భావధార కూడా అంత క్లిష్టమైంది. స్వీయాత్మ చింతనా నేపథ్యంలో, దేవున్ని కరుణ హీనునిగా చిత్రించింది.చర్చికి వెళ్లడం మానేసింది. ‘ Tell the Truth, but, tell it slant ‘లో పరోక్షంగా దూషించినా,’ My Life has stood — A loading gun ‘వంటి  కవితలలో నేరుగా దేవున్ని క్రూరునిగా దుయ్యబట్టింది. అయితే, ఆమెను నాస్తికురాలని అనలేము. ఆమెకు తనదైన స్వయంకపోలకల్పిత  దైవీయ భావన ఆమెకుంది – A home-spun theology of her own.
డికిన్సన్ ను విశిష్ట కవయిత్రిగా నిలిపింది మాత్రం ఆమె అసాంప్రదాయ అధునిక శైలీ శిల్పాలనే చెప్పాలి. భావ గాఢతను మించిన శైలీ విన్యాసం. Style is the poetry అన్నంతగా రచనలు చేసింది. పదాల పోహళింపును  (Syntax) తలకిందులు చేసి, అసంబద్ధ పదబంధాలను, విరోధాభాస (Paradox) పదాలను పక్క పక్కన పేర్చి    ( Parataxis technic  ), కామాలటో, డాష్ లతో, ఊహించని పునరుక్తులతో, అసదృశ Word Play తో తనదైన విశిష్ట వైయక్తిక శైలిని ( Ideosyncracy ) సంతరింప  జేసుకుంది కనుకనే అమెరికన్ అంగ్ల అధునిక సాహితీ వైతాళిక కవయిత్రిగా ఆమెకు స్థానం స్థిరపడింది. అయితే, ఆమె లోని ఈ వినూత్న విశిష్ట వైకృతులకు అనితర సాధ్యమైన అభివ్యక్తీకరణ సత్తా  ఉన్నందువల్లనే ఆమె నూత్న ప్రక్రియ అంతగా రాణించింది. డికిన్సన్ చూపిన అధునిక సృజన వైఖరి వల్ల అమెరికన్ ఆంగ్ల సాహిత్యం కొత్త మలుపులు తిరిగింది. ఆమె నవ్య ధోరిణికి ప్రభావితమైన వర్ధమాన కవితాలోకం నవనవంగా వర్ధిల్లింది. ‘డికిన్స్ ప్రభావిత కవిత’ పేర ప్రతి సంవత్సరం Poetry Society of America బహుమతి ప్రధానం చేస్తున్నది. అది ఆమెకు అమెరికా ఇస్తున్న సృజన నివాళి.

అక్రమ సంబంధాల విషాదస్థలి మైసీనియా

 

స్లీమన్ కథ-23

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మైసీనియాలో ఆ అయిదురోజుల తవ్వకాల్లో విలువైనవేవీ బయటపడకపోయినా, తప్పకుండా బయటపడతాయన్న నమ్మకంతో స్లీమన్ ఉన్నాడు. ఈ తవ్వకాల వివాదం సద్దుమణిగేదాకా రెండు మాసాలు ఓపికపట్టి ఆ తర్వాత గ్రీకు ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన దాఖలు చేసుకున్నాడు. మైసీనియాలో సొంత ఖర్చు మీద తవ్వకాలు జరుపుతాననీ, వాటిలో బయటపడే వాటినన్నిటినీ ప్రభుత్వానికి అప్పజెబుతాననీ, వాటి గురించి వెల్లడించే హక్కు మాత్రమే తనకు ఉంటుందనీ అందులో ప్రతిపాదించాడు. తనను ఇంతకుముందు దొంగగా, గ్రీసుకు శత్రువుగా చిత్రించిన మంత్రే దానిని ఆమోదిస్తూ సంతకం చేశాడు.

1874 ఏప్రిల్ 21 నుంచీ తవ్వకాలు ప్రారంభించాలని అతను నిర్ణయించుకున్నాడు. అందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, ట్రాయ్ నిక్షేపాలలో సగం తమకు అప్పజెప్పాలని కోరుతూ టర్కీ ప్రభుత్వం అతనిపై దావా వేసినట్టు సమాచారం వచ్చింది. కింది కోర్టులోనూ, పై కోర్టులోనూ దావా ఏడాదిపాటు సాగి అతని సహనాన్ని పరీక్షించింది.  అతను ఎథెన్స్ లోనే ఉండిపోవలసివచ్చింది. కోర్టు ఉత్తర్వుతో పోలీసులు వచ్చి అతని ఇంటిని సోదా చేశారు. నిక్షేపాలు కనిపించలేదు. వాటిని ఎక్కడ దాచాడో చెప్పడానికి స్లీమన్ నిరాకరించాడు. ప్రాసిక్యూషన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు సరికదా, ఎలాంటి పరిష్కారానికీ ఒప్పుకోలేదు.  పట్టుదలకుపోయి ప్రభుత్వంతో తుదికంటా పోరాడడానికే నిశ్చయించుకున్నాడు. అదే సమయంలో, తమ మధ్య ఎలాంటి వివాదం లేనట్టుగా, ట్రాయ్ లో తవ్వకాలను కొనసాగించే హక్కును కోరుతూ అదే ప్రభుత్వానికి అర్జీ మీద అర్జీ పెట్టుకుంటూవచ్చాడు.

ఆ ఏడాదంతా అతను పోలీసులతో, గ్రీకు ప్రభుత్వంతో, తన విమర్శకులతో; చివరికి సొంత న్యాయవాదులతో కూడా గొడవ పడుతూనే గడిపాడు. తన ఖర్చుతో ఒలింపియాలో తవ్వకాలు జరపడానికి ముందుకొచ్చినా; గ్రీకు ప్రభుత్వం అందుకు ప్రష్యన్ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంపై అతను మండిపడుతూ  ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. చివరికి ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ గ్రీసు రాజు జార్జికి కూడా రాశాడు. అయినా ఫలితం లేకపోవడంతో,  ఉత్తరాల వల్ల పని జరగదనీ, గ్రీకు ప్రభుత్వాన్నీ, ప్రజలనీ మెప్పించే పని ఏదైనా చేసి తనవైపు తిప్పుకోవాలనీ అనుకున్నాడు.

అతని దృష్టి అక్కడి గిరిదుర్గం మీద ఉన్న మధ్యయుగాలనాటి వెనీషియన్(ఇటలీలోని వెనిస్ కు చెందినవారు కట్టించిన) బురుజు మీద పడింది. ఆ బురుజు ఆ పరిసరాల అందాన్ని దెబ్బతీస్తోంది. దానిని తొలగిస్తే బాగుంటుందని అందరూ అనుకోవడమే కానీ, ఆ పని చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. 80 అడుగుల ఎత్తున పాలరాయి పలకలతో నిర్మించిన ఆ బురుజులో గుడ్లగూబలు గూళ్ళు పెడుతున్నాయి. దానిని తొలగించడానికి 465 పౌండ్లు ఖర్చవుతాయని స్లీమన్ అంచనా వేసి, ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచాడు. ప్రభుత్వం అంగీకరించింది. అతను వెంటనే రంగంలోకి దిగి ఆ బురుజును తొలగించే పనిని విజయవంతంగా పూర్తిచేశాడు.

కోర్టులకు వేసవి సెలవులు కావడంతో అతనికి తీరిక చిక్కి ఓసారి ఉత్తర గ్రీస్ లో మెరపు పర్యటన జరిపి అర్కోమెనోస్ (గ్రీస్ లో పురావస్తు ప్రాధాన్యం కలిగిన ఒక ప్రదేశం) ను సందర్శించాడు. చారిత్రకంగా అదెంతో ప్రాముఖ్యం కలిగిన ప్రదేశమన్న నిర్ధారణకు వచ్చి, అక్కడ తవ్వకాలను చేపడితే తను ఆర్థిక సాయం చేస్తానని గ్రీకు పురావస్తు సంఘానికి రాశాడు. ఆరేళ్ళ తర్వాత  తనే అక్కడ కొన్ని తవ్వకాలు జరిపించాడు.

టర్కీ ప్రభుత్వం వేసిన దావా ఎట్టకేలకు పరిష్కారానికి వచ్చింది. స్లీమన్ ఎంతో తెలివిగా పావులు కదిపాడు. గ్రీకు న్యాయమూర్తులు టర్కీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తూ; పరిహారంగా 50 వేల ఫ్రాంకులు చెల్లించవలసిందిగా స్లీమన్ ను ఆదేశించారు. తను చేజిక్కించుకున్న ప్రియామ్ నిక్షేపాల విలువను 10 లక్షల ఫ్రాంకులుగా అంచనా వేసిన స్లీమన్, ఓడినా గెలుపు తనదే ననుకున్నాడు. ఆ 50 వేల ఫ్రాంకుల పరిహారానికి అయిదురెట్ల మొత్తాన్ని కాన్ స్టాంట్ నోపిల్ లోని ఇంపీరియల్ మ్యూజియంకు స్నేహపూర్వకంగా బహూకరించి; దాంతోపాటు ఏడు భారీ కలశాలను, నాలుగు సంచుల నిండా రాతి పురావస్తువులను పంపించాడు.

అప్పటికే అతని కీర్తి పైపైకి ఎగబాకుతోంది. దానిని ఆనందించే తీరిక ఇప్పుడు ఒకింత చిక్కింది. బ్రిటిష్ ప్రధాని గ్లాడ్ స్టన్ ప్రశంసాపూర్వకమైన లేఖ రాశాడు. ఇంగ్లండ్ లో అతనికి అతి ప్రముఖ అభిమానిగా మారిపోయాడు. 1875లో సోఫియాను, కూతురు యండ్రోమకిని వెంటబెట్టుకుని ఇంగ్లండ్ కు బయలుదేరాడు. దారిలో పారిస్ లో ఆగి, జియోగ్రాఫికల్ సొసైటీలో ప్రసంగించాడు. అలవాటుగా అతిశయోక్తులు, ఆత్మస్తుతీ రంగరిస్తూ అతను చేసిన ప్రసంగానికి శ్రోతల్లో స్పందన లేదు. ఎవరూ అతన్ని అభినందించడానికి ముందుకు రాలేదు. ప్లేస్ స్ట్రీట్ మిషెల్ లోని అతని నివాసం దగ్గర సందర్శకులు బారులు తీరలేదు.

లండన్ లో మాత్రం అతన్ని ఆకాశానికి ఎత్తేశారు. గ్లాడ్ స్టన్ పొగడ్తలతో ముంచెత్తాడు. జూలై నెలంతా ప్రముఖులతో విందు వినోదాలలో గడిపాడు. సోఫియాను, కూతురినిని బ్రైటన్ లోనే ఉంచేశాడు. వారానికి ఒకటి రెండుసార్లైనా వెళ్ళి వాళ్ళను చూడడానికి వీలులేనంతగా తను లండన్ లో బిజీ అయిపోయానని చెప్పుకున్నాడు. ఫ్రెంచి జియోగ్రాఫికల్ సొసైటీ కార్యదర్శి గోచే కు లండన్ నుంచి ఉలా ఉత్తరం రాశాడు:

నేనిక్కడ ప్రసంగిస్తున్న పండిత సభలు శ్రోతలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ నా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. నేను మాట్లాడిన ప్రతిదీ పత్రికలు ప్రచురిస్తున్నాయి. రాజాస్థానాలనుంచి నాకు పిలుపులు అందుతున్నాయి. రాకుమారులు, రాకుమార్తెలు నన్ను ఆహ్వానించి నేను చెప్పేవి ఎంతో ఆసక్తిగా వింటున్నారు. హోమర్ ట్రాయ్ ని కనుగొన్న ఈ వ్యక్తి ఆటోగ్రాఫ్ తీసుకోడానికి అందరూ ఎగబడుతున్నారు. నన్ను స్వాగతసత్కారాలతో ముంచెత్తుతూ ఎంతో ఆదరిస్తున్న ఈ ముచ్చటైన లండన్ సమాజాన్ని విడిచిపెట్టి, నన్నో దేశద్రోహి అన్నట్టుగా చూసిన పారిస్ కు త్వరలోనే వస్తాను.

The Nine-Year Siege of Troy, after which King Agamemnon returns to his wife, Clytemnestra

అతను పారిస్ లో కొన్ని గంటలు మాత్రమే ఉన్నాడు. హాలెండ్ రాణి అతన్ని ది హేగ్ కు ఆహ్వానించింది. అక్కడ అతని గౌరవార్ధం జరిగిన విందు సమావేశానికి రాజ్యంలోని ప్రముఖులందరూ విచ్చేశారు. రాణి ప్రత్యేకంగా తనను సందర్శించే అవకాశమిచ్చి అతనితో ముచ్చటించింది. ఆమెతో కలసి లైడన్ మ్యూజియంలోని ఈజిప్టుకు చెందిన పురావస్తువులను చూస్తూ గంటల తరబడి గడిపాడు. రెండు కారణాలవల్ల స్లీమన్ కు ఆమె అమితంగా నచ్చింది. ఆమెకు పురాతత్వ శాస్త్రంపై మంచి ఆసక్తి ఉంది. ఆపైన ఏడు భాషల్ని అనర్గళంగా మాట్లాడుతుంది. లూవే మ్యూజియం కన్సర్వేటర్ రావెసొన్ కు ఇలా ఉత్తరం రాశాడు:

ఘనత వహించిన రాణి నన్ను తరచు అల్పాహారానికీ, మధ్యాహ్న, రాత్రి విందులకూ ఆహ్వానిస్తోంది. ఆమె బాగా చదువుకున్నది. అసాధారణమైన జ్ఞాపకశక్తి. ఆసియా మైనర్, గ్రీకు ద్వీపకల్పం, ఇటలీలో స్వయంగా కొన్ని తవ్వకాలను చేపట్టడానికి ఆమెను ఒప్పించగలనేమో ననిపిస్తోంది. నేను మాత్రం అందులోకి దిగకుండా సలహాదారు పాత్రకే పరిమితమవాలనుకుంటున్నాను.

అక్కడినుంచి అతను కోపెన్ హేగన్ వెళ్ళాడు. వారంరోజులపాటు అక్కడి మ్యూజియం లను సందర్శిస్తూ గడిపాడు. వాటిలో ప్రదర్శించిన కొన్ని శిలాయుగపు ఆయుధాలకూ, ట్రాయ్ లో కనుగొన్నవాటికీ మధ్య ఆసక్తికరమైన పోలికలు గమనించాడు. ఆ తర్వాత రోష్టాక్ వెళ్ళి తన ట్రాయ్ తవ్వకాలపై మరో ప్రసంగం చేశాడు. తిరుగు ప్రయాణంలో ఇటలీ అతన్ని ఆహ్వానించింది. తను నేపుల్స్ లోనే శేషజీవితాన్ని గడపదలచుకున్నానని అక్కడ ప్రకటించాడు. అల్బ లాంగో(ఇటలీలోని ఒక పురాతన ప్రదేశం)లో కొన్ని వారాలు గడిపాడు. అక్కడ ఇటీవలే కొన్ని అంత్యక్రియల కలశాలు బయటపడ్డాయి. మరిన్ని విశేషాలు వెల్లడవుతాయని అతనికి అనిపించలేదు. సీసీలీ పశ్చిమతీర సమీప ద్వీపమైన మోత్యాలో ఒకప్పుడు కార్తజీనియన్ (నేటి ట్యునీసియా రాజధాని ట్యూనిస్ శివార్లలో కార్తేజ్ అనే పురాతన నగరం ఉండేది. ఆ నగరానికి చెందినవారు కార్తజీనియన్లు) జనావాసం ఉండేది. అక్కడ చెప్పుకోదగిన పురాసంపద బయటపడే అవకాశముందని అనుకున్నాడు కానీ, తీరా చూశాక అలాంటి సూచనలేవీ కనిపించలేదు. ఇటలీలోని సెగ్వెంటే అనే పురాతన ప్రదేశంలో జరిపిన ప్రాథమిక తవ్వకాల్లో కూడా గొప్పవేవీ దొరకలేదు. అక్టోబర్ చివరినాటికి ఎటు అడుగువేయాలో తోచని స్థితిలో పడ్డాడు. ఉన్నపళంగా ట్రాయ్ వెళ్ళి తను చేయగలిగిందేమీ లేదు; గ్రీస్ కు తిరిగివెళ్ళడమంటే, అక్కడి ప్రభుత్వంతో ఎడతెగని ఘర్షణతో తలమునకలవడమే.

ఎంతైనా తనకు పేరు ప్రతిష్టలు తెచ్చింది ట్రాయే. డిసెంబర్ ప్రారంభంలో హఠాత్తుగా నేపుల్స్ విడిచిపెట్టి కాన్ స్టాంట్ నోపిల్ కు వెళ్లిపోయాడు. విద్యామంత్రి సఫ్వెట్ పాషాను కలసి కొత్త ఫర్మానా ఇప్పించమని కోరాడు. ఈసారి తవ్వకాల్లో బయటపడేవాటిని అన్నింటినీ నమ్మకంగా ఇంపీరియల్ మ్యూజియంకు అప్పగిస్తానంటే, ఫర్మానా ఇప్పించడానికి ప్రయత్నిస్తానని సఫ్వెట్ పాషా మాట ఇచ్చాడు.

1876 ఏప్రిల్ లో అతనికి ఫర్మానా అందింది. కానీ ఈలోపల, మైసీనియాలోని రాచ సమాధుల దగ్గర తవ్వకాలు జరపాలన్న ఆలోచనే అతని బుర్రను పూర్తిగా ఆక్రమించుకుంది. మైసీనియా గురించిన అధ్యయనంలో మునిగితేలుతున్న కొద్దీ అది సూదంటురాయిలా అతన్ని మరీ మరీ గుంజి లాగడం ప్రారంభించింది. తను ఎలాగూ ఒలింపియాలో తవ్వకాలు జరపలేడు, హిస్సాలిక్ లో దాదాపు తను ఆశించినవన్నీ కనుగొన్నాడు, ఇక మిగిలింది మైసీనియాయే. పౌరాణిక విశ్వాసం ప్రకారం దనాయ్, జియస్ ల కొడుకు పెర్సియస్ మైసీనియా రాజ్యాన్ని స్థాపించాడు. దనాయ్ కు అతను కనకవర్షం కురుస్తుండగా కనిపించాడు. మరోసారి తనకు స్వర్ణనిక్షేపాలు కనిపించడమంటూ జరిగితే అక్కడే నని స్లీమన్ నిశ్చయానికి వచ్చాడు.

***

స్లీమన్ రోజుల్లో మైసీనియా వెళ్ళే పర్యాటకు లెవరికైనా ఆర్గోస్ మైదానం దుబ్బులతోనూ, ధూళితోనూ నిండి పసుపు, తెలుపు రంగుల్లో కనిపించేది. 2,500 అడుగుల ఎత్తు ఉన్న రెండు పర్వతాల మధ్యనున్న బాటను కాపలా కాస్తున్నదా అన్నట్టుగా అక్కడ ఒకప్పుడు ఒక పెద్ద కోటనగరం ఉండేది. అక్కడిప్పుడు రాళ్ళగుట్ట తప్ప మరేమీ కనిపించదు. ఆ బృహత్ పర్వతాలు ఇప్పటికీ భయం గొలుపుతూ, వాటి పాదాల దగ్గర ఉన్న గుట్టల్లోంచి తోడేళ్ళ అరుపులు వినిపిస్తూనే ఉంటాయి కానీ; ఇటీవలి కాలంలో ఆ పరిసరాల్లో వచ్చిన మార్పూ కనిపిస్తుంది. ఇప్పుడా మైదానంలో మంచి వ్యవసాయం సాగుతోంది. చక్కని రోడ్లు పడ్డాయి. పొగాకు, పత్తి పొలాలమధ్య తోటల పెంపకం సాగుతోంది. పర్వతపాదాల దగ్గర బార్లీ పండిస్తున్నారు. అయినాసరే, ఆకూ అలమూ లేని ఆ నీలిరంగు బోసి పర్వతాల నేపథ్యంతో; అక్కడి అన్ని దారులపై ఆధిపత్యం చెలాయిస్తోందా అన్నట్టుగా మైసీనియా ఈరోజుకీ గుబులు రేపుతూనే ఉంటుంది.

ఆర్గోస్ మైదానం అంతటిపై పెత్తనం చేయడానికి అనువైన చోట మైసీనియా ఉంది. అక్కడికి దక్షిణంగా తొమ్మిది మైళ్ళ దూరంలో నాఫ్లియో దగ్గర పెట్టని కోటలా అఖాతం ఉంది. చరిత్రపూర్వకాలం నుంచీ ఈ ప్రాంతంలో జనాలు నివసించినట్టు ఆధారాలున్నాయి. క్రీ.పూ. 1700లో,  ప్రబలుడైన ఒక రాజు అప్పటికే ఇక్కడ ఉన్న కంచుయుగ ప్రారంభ కాలానికి చెందిన నగరం చుట్టూ బ్రహ్మాండమైన ప్రాకారాలను, కొత్తగా ఒక ప్రాసాదాన్ని నిర్మించాడు. అతని పేరేమిటో, ఎక్కడినుంచి వచ్చాడో తెలియదు. నగరంలోకి వెళ్లడానికి చప్టా చేసిన రహదారి, దానికి రెండుపక్కలా బురుజులూ ఉన్నాయి. ఈ బురుజుల లోతట్టున ఇప్పటికీ ఒక పెద్ద సింహద్వారం(Lion Gate)ఉంది.

mycenae-lion-gate-00ఒకప్పుడు దానిని రెండు చెక్క తలుపులతో మూసి ఉంచేవారు. ఆ తలుపుల మీద ఓ పెద్ద దూలం, దాని మీద ఒకదాని కొకటి అభిముఖంగా ఉన్న రెండు సివంగుల బొమ్మలూ ఉన్నాయి. ఆ సింహద్వారంలోంచి లోపలికి వెడితే, 16 అడుగుల మందం కలిగిన ప్రాకారాలకు అవతల ఒక వలయాకారపు చప్పరం(terrace) కనిపిస్తుంది. స్లీమన్ రోజుల్లో ఈ చప్పరం రాళ్ళగుట్టలతోనూ, ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన చెత్తతోనూ నిండి ఉండేది. దీనికి అవతల రాజప్రాసాదాలు, ఇళ్ల తాలూకు శిథిలాలు ఉన్నాయి. వాటిని నాచు, కలుపు కప్పేశాయి. కొండ వాలుల్లోనూ, చుట్టుపక్కల ఉన్న లోయలోనూ దిగువ నగరం తాలూకు శిథిలాలు ఉన్నాయి. ఓ అడవిలా భయం గొలిప ఈ కొండ పరిసరాల్లోకి ఎప్పుడైనా దొంగలు తప్పిస్తే ఇంకెవరూ వెళ్లరు. ఇన్ని శతాబ్దాలలో ఇక్కడ పెద్దగా వచ్చిన మార్పేమీలేదు.  క్రీ.శ. రెండవ శతాబ్దికి చెందిన గ్రీకు పర్యాటకుడు, భౌగోళికవేత్త పసన్నియాస్ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడూ దాదాపు ఇప్పుడున్నట్టే ఉంది.

ఒకప్పుడు ఇక్కడ విశాలమైన వీధులతో, రథమార్గాలతో, తళతళా మెరిసిపోయే బాటలతో ఒక పెద్ద సుసంపన్న నగరం ఉండేది. ఈ ప్రాంతాన్ని బలవత్తరుడైన ఒక రాజు పాలించేవాడు. ఇక్కడి సింహద్వారంలోంచి భారీ సైన్యాలు రాకపోకలు సాగిస్తూ ఉండేవి.  రాజు అధీనంలో పెద్ద పెద్ద స్వర్ణ కోశాగారాలు ఉండేవి.  మైసీనియాను స్వర్ణనగరంగా హోమర్, సొఫొక్లీస్ లు ఇద్దరూ అభివర్ణించారు. ఈ నగరరాజ్యాన్ని పెర్సియస్ స్థాపించాడనీ, ఈ ప్రదేశంలో తన కత్తి ఉంచుకునే ఒర తాలూకు పై తొడుగు(mykes)ను పోగొట్టుకోవడం వల్లనో, ఇక్కడ కనిపించిన పుట్టగొడుగు(mykes)ల వల్లనో మైసీనియా అని పేరుపెట్టాడనీ పసన్నియాస్ రాశాడు. ఆర్గోలిస్ మైదానం ఎడ్లకు ప్రసిద్ధి కనుక అవి వేసే రంకె(mykithmos)లను సూచించేలా ఆ పేరు వచ్చి ఉండచ్చని స్లీమన్ అనుకున్నాడు.

పెర్సియస్, అతని వారసుల పాలన ప్రశాంతంగా సాగిపోయింది. కానీ ఆ తర్వాత ఏట్రియస్ నెలకొల్పిన రాజవంశం విషాదగ్రస్తంగా మిగిలిపోయింది. తన భార్యను సోదరుడు థయస్టీస్ లోబరచుకున్నాడని తెలిసిన ఏట్రియస్ అతని కొడుకులిద్దరినీ చంపి వారి మాంసంతో థయస్టీస్ కు విందు ఇచ్చాడు. ఆ సంగతి తెలిసిన థయస్టీస్ తిన్నది వాంతి చేసుకుని, భోజనం బల్లను ఎత్తిపడేసి, ఏట్రియస్ వంశం సర్వనాశనమైపోతుందని శాపనార్థాలు పెడుతూ అక్కడినినుంచి పరుగెత్తాడు. ఆ తర్వాత ఏట్రియస్ పై ఎలా పగ తీర్చుకోవాలో చెప్పమని దేవదూతను కోరాడు. నీ కూతురు పెలోపియా ద్వారా నీకు కలిగే కొడుకు మాత్రమే ఏట్రియస్ పై పగ తీర్చుకోగలడని దేవదూత పలికింది. ఓ రోజు రాత్రి థయస్టీస్ బలి ఇస్తుండగా ఒక అమ్మాయి అతనిని సమీపించింది. తన కూతురని తెలియక థయస్టీస్ ఆ అమ్మాయిని లోబరచుకున్నాడు. ఆమెకు కొడుకు పుట్టాడు. అతను ఏగిస్త్వస్ అనే పేరుతో పెరిగిపెద్దవాడై ఏట్రియస్ ను హతమార్చాడు. ఆ తర్వాత థయస్టీస్ కొంతకాలం రాజ్యాన్ని పాలించాడు. అతని తర్వాత ఏట్రియస్ కొడుకు అగమెమ్నన్ రాజయ్యాడు.

థయస్టీస్ శాపం ఆ తర్వాత కూడా ప్రభావం చూపించింది. అగమెమ్నన్ ట్రాయ్ లో యుద్ధం చేస్తున్న సమయంలో అతని భార్య క్లైటెమెనెస్ట్రాతో ఏగిస్త్వస్ సంబంధం పెట్టుకున్నాడు. యుద్ధం నుంచి తిరిగి రాగానే అగమెమ్నన్ ను అంతమొందించాలని ఇద్దరూ పన్నాగం పన్నారు. ట్రాయ్ నుంచి యుద్ధఖైదీలతో ఓడలు తిరిగి వస్తున్న సంగతిని గమనించి తమకు చెప్పమని ఒక కావలివాడిని సముద్రతీరానికి పంపించారు. ఏమాత్రం అనుమానం కలగని అగమెమ్నన్, సేనలు వెంటరాగా రథం మీద మైదానం దాటి కోటకు చేరుకున్నాడు. అక్కడ తనకు ఏర్పాటు చేసిన  విందుకు వెళ్ళాడు. ఆ విందులోనో, లేదా సమీపంలోని స్నానశాలలోనో ఏగిస్త్వస్, క్లైటెమెనెస్ట్రా లు అతన్ని హత్యచేశారు. దానికి ప్రతీకారంగా ఆ తర్వాత అగమెమ్నన్ సంతానమైన ఒరెస్టీస్, ఎలెక్త్రాలు క్లైటెమెనెస్ట్రాను, ఏగిస్త్వస్ ను హతమార్చారు. ఒరెస్టస్ రాజయ్యాడు.

అగమెమ్నన్ హత్యను హోమర్, ఎస్క్యులస్(క్రీ.పూ. 525, గ్రీకు విషాదాంత నాటకకర్త), సొఫొక్లీస్, యురిపిడీస్(క్రీ.పూ. 480, గ్రీకు విషాదాంత నాటక కర్త)లు ముగ్గురూ విశేషంగా కథనం చేశారు. ట్రాయ్ పతనాన్నీ, ఏట్రియస్ కుటుంబంలో పుట్టిన ముసలాన్నీ వీరయుగపు విషాదాంత ఘటనలుగా గ్రీకులు భావిస్తారు. వాటిమీదే తమ భావజగత్తును నిర్మించుకుంటూ, స్ఫూర్తిని పుంజుకుంటూ వచ్చారు. ట్రాయ్, మైసీనియాలు రెండింటినీ మహావీరుల స్మృతులు వెంటాడే పవిత్రస్థలాలుగా వారు భావిస్తారు.

ట్రాయ్ విషయంలోలానే, మైసీనియా విషయంలో కూడా తనదైన సరళ తర్కాన్ని అనుసరించి ముందుకెళ్లాలని స్లీమన్ అనుకున్నాడు. ట్రాయ్ లో నగరానికి దారితీసే ప్రధానద్వారం దగ్గర తను స్వర్ణనిక్షేపాలను కనిపెట్టాడు. మైసీనియాలో కూడా ప్రధానద్వారం దగ్గరే నిక్షేపాలను కనిపెట్టగలననుకున్నాడు.

(సశేషం)

 

 

 

 

ఓడిపోని యుద్ధం గురించి నీతో…

-అరణ్య కృష్ణ
~
అవమాన గరళాన్ని దుఖపు బిరడాతో గొంతులోనే ఒత్తిపట్టిన నీలకంఠా!
నీలిజెండా రెక్కలతో ఎగురుకుంటూ ఎచటికి పోయావీ రాత్రి?
కులమతాల వైతరిణీలకు తావులేని
ఏ నక్షత్రాల వీధిలో రోదశీ మానవుడిగా విహరిస్తున్నావు రోహిత్?
నానా రకాల మృతపదార్ధాలతో కుళ్ళిపోయిన హృదయాల మధ్య
పుట్టుకే ఓ భయంకర ప్రమాదమైన వ్యవస్థలో
దేహానికి హృదయానికి మధ్య వైరుధ్యం  నీ ఒక్కడిదేనా?
అంతర్వీక్షణలో చీకటికోణాల మీద అబద్ధపు ముఖమల్ దుప్పట్లు కప్పి
రాక్షస ముఖాల వికృతత్వాన్ని మర్యాదల మేకప్లో దాచేసుకునే దుర్మార్గులమే కదా  మేమంతా!
చావు పుట్టుకలనే రెండు శిఖరాగ్రాల మధ్యలోని జీవితం లోయ మీద
అప్పుడే మొలిచిన రెక్కలను కూడతీసుకొన్న తూనీగలా
స్వేచ్చగా ఎగరాల్సిన నీ బాల్యం
వేల ఏళ్ళ సాలెగూడులో
నువ్వు పుట్టకముందే చిక్కుకుంది రోహిత్!
ఇల్లంటే మానవసంబంధాల వేదిక కాదని
ఇల్లంటే ప్రేమానురాగాల పండగ కాదని
ఇల్లంటే ఆత్మలు చచ్చిన మనుషులు సాగించే నిరంకుశ పాలనా వ్యవస్థ అని
నీకు తెలిసేటప్పటికే నీ శరీరమ్మీద బతుకు కొరడా మచ్చలు మిగిలాయి
నీ పసితనం నీకే
కరెంటు తీగలకు వేళ్ళాడే పక్షి కళేబరంలా కనిపించింది
వరసలు పెట్టుకొని పిలుచుకునే మానవసంబంధాల కర్కశత్వాలు
వేటకొడవళ్ళలా వెంటాడి వీపులొకి దిగినప్పుడు
ఆ నొప్పి నీకే తెలుస్తుంది నాన్నా!
మనిషిని మనిషి వాహనంగా చేసుకొని ఎక్కి ఊరేగే వ్యవస్థలో
ఇంటా బైటా వరసలన్నీ ఉరితాళ్ళే కదా!
*****
అవును ఈరోజు నీ చావుకి పేనిన ఉరితాడు
నువ్వు పుట్టినప్పుడు నీ బొడ్డుతాడుతోటే పుట్టింది
చెప్పులు చేతబట్టుకొని
మూతికి ముంత కట్టుకొని
బెదురు కళ్ళతో తడబడే అడుగులతో వెలివాడల్లోనే నేలరాలిన
నీ పూర్వీకుల రక్తమేదో ఇప్పుడు నీలో ఎలుగెత్తి అరిచింది
అందుకే
నీ అపరూప సృజనాత్మక హృదయం మీద
చతుష్పాద మనువు శూలాలతో దాడి చేసి చిల్లులు పొడిచాడు
నీ అద్భుత మేధో కౌశలాన్ని
రాతిరధాలనెక్కొచ్చిన శతృవులు క్రూరంగా తూట్లు పొడిచారు
ఆకాశం భూమి చెట్టూ చేమ మనుషులు…. అంతా
అనంత విశ్వంలో భాగమైన ఓ విజ్ఞాన పదార్ధంగా పరిమళించాల్సిన విద్యావనాలు
నెత్తిన కులం కొమ్ములతో నారింజ రంగు వృషభాల కారడివిగా మారిపోతే
మొసళ్ళు నిండిన ఏ దిగుడు బావిలోనో దిగుళ్ళతో చిక్కడిపోయినట్లే వుంటుంది
బహుశ అప్పుడు నీ కలలు కూడా నిన్ను వెక్కిరించే వుంటాయి
బతుకు పోరాటమైతే పర్లేదు కానీ
బతుకంటే ఓడిపొయే యుద్ధం చేయటమే అనిపిస్తే
మనుషులందరూ శూన్యపు గొట్టాలుగా తిరుగుతూ కనబడుతుంటారు
శూన్యం నుండి విస్ఫోటనతో సృష్ఠి ఏర్పడినట్లు
నీచుట్టూ ఆవరించిన శూన్యం నీలో మృత్యుకాంక్ష బద్దలుచేసిందా?
నిజానికి ఇంతటి మానవ మహా శూన్యపు ఎడారిలో
చర్మంలో నీళ్ళు దాచుకున్న నీబోటి ఒంటెల్లాంటి వాళ్ళు
నీకు అసలు కనిపించనే లేదా రోహిత్?
****
దేశపటాన్ని కసిగా కరిచిన
కండచీమ దేహాన్ని ఉరితీసి ఆనందించే రాజ్యం చర్యని తప్పుబట్టి
నువ్వో దేశద్రోహివయ్యావు
దేశమంటే చుట్టుకొలతల విస్తీర్ణమని
దేశభక్తి అంటే సరిహద్దుల ఆవల శత్రుత్వాన్ని ఆపాదిస్తూ
మనుషులకంటే దేశపటాల్ని, ప్రతీకల్ని ప్రేమించే వాళ్ళ దృష్ఠిలో
నువ్వో దేశద్రోహివయ్యావు
వాళ్ళకేం తెలుసు?
దేశాన్ని ప్రేమించటమంటే మనుషుల్ని ప్రేమించటమని!
వ్యవస్థని ద్వేషించకుండా మనుషుల్ని ప్రేమించలేమని!
మనుషుల్ని ప్రేమించటమంటే విభజన రేఖలతో యుద్ధం చేయటమని!
ఆయుధాలతో నిమిత్తం లేని ఆ యుద్ధంలో
నీ గుండె నెత్తురోడింది రోహిత్
ఇంత తొందరగా అలసిపోతావని నీక్కూడా తెలియదేమో
****
నీ తండ్రే కులంలో ఎవతెకి పుడితే ఏమిటి?
నువ్వే అమ్మకి పుట్టావన్నదే ముఖ్యం
ఆ అమ్మ ఏ మట్టి వేళ్ళతో
నిన్ను సాకిందనేదే ముఖ్యం
బీజవిసర్జనతో చేతులు దులుపుకునేవాడి గొప్పదనమేమున్నది?
ఐనా బీజాలది మాత్రమేమున్నది?
గాలికి ఎగిరి కొట్టుకుంటూ కూడా రాగలవు
క్షేత్రమే కదా పొదివి పట్టుకొని
గర్భంలోకి తీసుకొని ఊపిర్లూది
బొడ్డుతాడుతో అంటుకట్టుకొని
తన నెత్తురూ నీరూ పోసి ఉపరితలమ్మీదకి తెచ్చేది
తను తిన్న అన్నం ముద్దని
చనుబాలుగా మార్చి సహాజత ఉద్వేగంతో రొమ్ముకదుముకొని
నీ చిట్టినోటిగుండా ప్రాణప్రతిష్ఠ చేసే అమ్మకే కదా బిడ్డవి
అమ్మ ఇచ్చిన పుట్టుమచ్చలే కదా నీకో గుర్తింపునిచ్చేది
అమ్మ చెంగుని పట్టుకొని
అమ్మ భుజాల మీదుగా లోకాన్ని పరిచయం చేసుకుంటూ ఎదిగి ఎదిగి
లోకం మీదకి దండెత్తి, కలబడి, అలిగి
తీరా నువ్వెళ్ళిపోతే
నీ దేహం మీద పంచనామాలో
ఓ నమ్మకం లాంటి నాన్న వాంగ్మూలం ఏమిటి?
ఐనా అమ్మ ప్రేమని తెలిసిన వాడివి కదా
ఉరి బిగుసుకుంటున్నప్పుడు
అమ్మకి కలిగే నొప్పికి విలవిల్లాడక వుంటావా?
మట్టిపనిలో కమిలిన అమ్మ చేతులు
కుట్టుపనిలో పగిలిన ఆమె మోకాళ్ళు
నీకు గుర్తుకు రానంతగా ఎంతటి ఆగ్రహ ప్రకటన చేసావు రోహిత్?
స్వేచ్ఛా ప్రబోధం చేసిన వీరుడు
చౌరస్తాల్లో తర్జనితో తాను నడిచొచ్చిన దారిని చూపిస్తూ ధైర్యాన్నిచ్చే ఆ వీరుడు కూడా
నీకు నమ్మకం ఇవ్వలేదా రోహిత్?
****
నువ్వొక్కడివే హతుడివి
హంతకులు మాత్రం కోట్లాదిమంది
మా కళ్ళల్లో ఎంత దిగులుమేఘంగా నువ్వు తారట్లాడినప్పటికీ
మా కన్నీటి చుక్కల్లో కూడా అపరాధ భావముంది
అందుకేనేమో ఒక్కో కన్నీటి బొట్టు
ఒక్కో చెంపదెబ్బలా తగులుతున్నది !

మతం ఎప్పటికైనా ఒక అవశేషమే – 5

 

 

[పోయిన వ్యాసానికి కొనసాగింపు]

 

పురాణ ఇతిహాసాలు పుట్టడానికీ, అవి లిపిబద్ధం అవ్వడానికి (రాయబడటానికి) మధ్య సులభంగా కొన్ని వందల సంవత్సరాల దూరం ఉంది. లిపి బాగా వృద్ధి చెందాక నాగరికయుగం దిగువ దశలో ఎప్పుడో వాటిని లిపిబద్ధం చెయ్యడం ప్రారంభమయ్యింది. అప్పటిదాకా కొన్ని వర్గాల ప్రజలు వాటిని కంఠతా పట్టి ప్రచారం చేస్తూ చాలా తరాల పాటు కాపాడుకుంటూ వచ్చారు. ఇన్ని వందల సంవత్సరాల పాటు జనాల నోట్లో నానుతూ ఈ పురాణాలు సజీవంగా ఉన్నాయి. కాకపోతే ఈ క్రమంలో వాటిలో ఉన్న అసలు కథలు చాలా వరకు మారిపోయాయి. ఎన్నో పిట్ట కథలు, కట్టు కథలు వచ్చి చేరాయి. ఆ పురాణ కథలని లిపిబద్ధం చేసిన కవులు తాము రాస్తున్న కాలం లో ప్రచారంలో ఉన్న కథనే రాయడం జరిగింది.

మతం ఘనీభవించడంలో లిపి పాత్ర చాలా ముఖ్యమయినది. జనాల నోట్లో నానే కథలు మారినంత తేలికగా రాయబడి ఉన్న కథలు మారవు. వాటిని ఎవరైనా పనిగట్టుకుని మార్చినా అది బయటికి సులభంగా తెలిసిపోతుంది. ఒకసారి రాతప్రతులు తయారయ్యాక ఆ కథలని విస్తృతంగా ప్రచారం చెయ్యడం సాధ్యపడింది. మత ఆచారాలు, నియమాలు ఇంకా బలంగా ప్రజలలో అమలయ్యేలా చెయ్యడం సాధ్యపడింది. ఆ తరవాత వచ్చిన ఎన్నో తరాలకి ఈ కావ్యపుస్తకాలే ఒక reference లాగా ఉపయోగపడ్డాయి. ఏ మతపరమయిన విషయానికైనా ఈ పురాణ, ఇతిహాస, శాస్త్రాలనే refer చేస్తారు. ఆ కాలం నాటి మత అచారాలే అసలైన మత ఆచారాలుగా, అప్పటి “దేవుని రూపమే” అసలైన దేవుని రూపం అని నమ్ముతారు. అందుకనే ఇప్పటికీ కిరీటాలు, కత్తులు పట్టుకున్న దేవుళ్లే ప్రచారంలో ఉన్నారు. అలాంటి బొమ్మలూ, విగ్రహాలే మనకి కనిపిస్తాయి.

మతానికి ఉన్న ఇంకొక ప్రత్యేకమయిన లక్షణం “మౌఢ్యం”. అది మనుషులకి ప్రకృతి మీద ఉన్న అజ్ఞానం లోంచి పుట్టినది. మతం చెప్పే విషయాలకి “గుడ్డి విశ్వాసం” తప్ప ఇంకొక రుజువు ఉండదు. మనుషులు ఒకవైపు తమ స్వీయ అనుభవంతో ఎన్నో శాస్త్రాలు (Science) అభివృద్ధి చేసుకుని, ప్రకృతి విషయాలకి రుజువులు సాధించినప్పటికీ కూడా మతం వాటిని ఒప్పుకోదు.  ఆ అజ్ఞానం, ఈ గుడ్డి విశ్వాసం కలిసి మౌఢ్యంగా తయారవుతుంది.

ఉదాహరణకి, హిందూ మతవాదులు “మను ధర్మ శాస్త్రాన్ని” అసలైన ధర్మ శాస్త్రం అని అంటారు. తమ మతానికి అది ప్రామాణికం అనీ, అందులో ఉన్న ధర్మాలే ఎల్ల కాలాలపాటు అనుసరించాలి అని అంటారు. వారు గమనించని విషయం ఏమిటంటే ఆ మను ధర్మ శాస్త్రం కూడా మిగతా అన్ని పురాణాల లాగే ఎప్పుడో ఎక్కడో పుట్టి కాలంతో పాటు మారుతూ వచ్చి ఎవరిచేతనో ఒకానొక కాలంలో రాయబడింది. అది రాయబడే కాలం నాటికి రాచరిక వ్యవస్థ నడుస్తోంది. అందులో ఉన్న ధర్మాలు అన్నీ ఆ వ్యవస్థని ఉద్దేశించి రాసినవే. రాజులు ఎలా పరిపాలించాలి, ఏ తప్పుకు రాజు ఏ శిక్ష వెయ్యాలి. వర్ణ సంకరం జరగకుండా ఎలా చూసుకోవాలి. ఏ పనికి ఎన్ని బంగారు నాణేలు పన్నులు వెయ్యాలి – ఇలాంటి ధర్మాలు చాలానే ఉన్నాయి అందులో. మరి అవి నేటి ప్రజాస్వామిక వ్యవస్థకి ఎలా apply అవుతాయి? అసలు విషయం ఏమిటంటే, ఆ మను ధర్మ శాస్త్రం పుట్టిన కాలం నుంచి సమాజం చాలా దూరం ముందుకి వచ్చేసింది. ఎంతో ఎదిగింది కూడా. ఈ సమాజానికి అది ఏ రకంగానూ ఉపయోగకరం కాదు. కాస్త logical గా ఆలోచిస్తే ఆ విషయం ఎవరికయినా అర్థమవుతుంది. కాని మతంతో పాటే వచ్చే మౌఢ్యం మతవాదులని ఆలోచించనివ్వదు.

ఇక మన ప్రశ్నలోని రెండో భాగం “ఏ దేవుని బొమ్మ, కథ కూడా దేవుడు గన్ను, బాంబులు పట్టుకున్నట్టు చూపించదు ఎందుకని?” ఇప్పటిదాకా చర్చించుకున్న సమాజ పరిణామ క్రమం అర్థమయితే పాఠకులకి ఈ ప్రశ్నకి సమాధానం సులభంగా అర్థమవుతుంది.

గన్నులు కత్తులకన్నా చాలా అభివృద్ధి చెందిన ఆయుధాలు. మందుగుండు తయారు చెయ్యడానికి రసాయన శాస్త్రం మీద మంచి అవగాహన అవసరం. సల్ఫర్, పొటాషియం నైట్రేట్ లని తయారు చెయ్యాలి, సరైన పాళ్ళలో కలపాలి. ఈ పరిజ్ఞానం నాగరిక యుగం ఎగువ దశలో అభివృద్ధి చెందింది. గన్నులు తయారయ్యేదాకా (క్రీ.శ. 1600 దాకా) ప్రపంచమంతా కత్తులే రాజ్యం చేశాయి. క్రీ.శ. 18, 19 వ శతాబ్దాలు వచ్చేసరికి ఆయుధాలతో పాటు అనేక శాస్త్రాలలో మానవులు అద్వితీయమైన పురోగతి సాధించారు. ప్రకృతి శాస్త్రాలు (Biology, Environmental science etc.) వైద్య శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు అన్నిట్లో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు జరిగాయి.

Science అభివృద్ధి మనుషులలో క్రమంగా ప్రకృతి మీద, సమాజం మీద ఉన్న అపోహలని పోగొట్టడం మొదలుపెట్టింది. ఈ అపోహల మీదే పునాదులు వేసుకున్న “మతం” క్రమంగా తన పట్టు కోల్పోవడం మొదలయ్యింది. ప్రజల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగే కొద్దీ వారికి ఏవో “కట్టు కథలు” చెప్పి మభ్యపెట్టడం సాధ్యం కాకుండా పోతుంది. “పోసేడాన్ అనే దేవుడు సముద్రం లోపల కూచుని తన త్రిశూలం తిప్పి సముద్రంలో సుడిగుండాలు సృష్టిస్తాడు” అని గ్రీకులు ఒకప్పుడు నమ్మేవారు. ఇవ్వాళ ఆ విషయాన్ని గ్రీకు ప్రజలు కూడా నమ్మరు ! అలాగని త్రిశూలం తీసేసి గన్నులు పెట్టినా నమ్మరు ! ఎందుకంటే గన్నులు అనేవి దైవదత్తమైన వస్తువులు కావనీ, మనుషులు తమ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న వస్తువులు అనీ ఈనాటి మానవులకి తెలుసు. అందువల్ల ఇప్పుడు కొత్త దేవుళ్ళని సృష్టించడం గానీ, పాత దేవుళ్ళ చేతుల్లో కొత్త ఆయుధాలు పెట్టడం గానీ అంత సులభం కాదు.!

ఈ అనివార్య పరిస్థితులలో మతం తన పునాదులని ప్రజల ఆర్ధిక అవసరాల/ఇబ్బందుల మీదకి మరల్చుకోవడం మొదలు పెట్టింది. నేటి మతంలో భక్తులకి ఆధ్యాత్మిక చింతన కంటే వారి ఆర్ధిక ప్రయోజనాలే ఎక్కువ ముఖ్యం. మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు కూడా ఈ ఆర్ధిక అవసరాలనే target చేసుకుంటున్నారు. ఈ క్రమం సుమారు రెండు శతాబ్దాల క్రితం మొదలయ్యి ఇంకా కొనసాగుతోంది. ఇది అనివార్యంగా జరుగుతున్న మార్పు.

ఆటవిక యుగం మధ్య దశలో మనుషులకి ప్రకృతి శక్తుల మీద ఉన్న అవగాహనా లేమి లోంచి మతం పుట్టింది. “లక్ష” సంవత్సరాల పాటు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ, బలపడుతూ నాగరిక యుగ మధ్య దశకి వచ్చేసరికి మానవ సామాజిక జీవితంలో అత్యంత ముఖ్యమయిన అంశంగా అవతరించింది. కుటుంబ వ్యవస్థలు, పాలనా వ్యవస్థలు అన్ని మతం కనుసన్నల్లో నడిచే అంత స్థాయికి బలపడింది. నాగరిక యుగం ఎగువ దశలో సాంకేతిక, సామాజిక శాస్త్రాల అభివృద్ధి తరవాత “మతం” యొక్క పరిణామ క్రమంలో బలహీన పడే దశ మొదలయ్యింది. ఇంకొన్ని అభివృద్ధి దశలు గడిచేసరికి మతం సమాజంలో ఒక అవశేషంగా మిగిలిపోతుంది. మతంతో పాటే దేవుడు కూడా !

***

పావురం

 

ఇంగ్లీష్ మూలం: రస్కిన్ బాండ్ 

అనువాదం: శ్రీపతి పండితారాధ్యుల దత్తమాల 

~

         రస్కిన్ బాండ్  బ్ర్రిటీష్  సంతతికి  చెందిన భారతీయ రచయిత. 19 మే 1934 లో పంజాబ్ లోని  కౌశాలి లో  జన్మించాడు . ఇతను  ఏడు సంవత్సరాల  వయసున్నపుడు తల్లి  , తండ్ర్రి  నుంచి  విడిపోయి పంజాబ్ కు  చెందిన హరి  అనే అతన్నిపెళ్లి చేసుకుంది. చెప్పాలంటే  రస్కిన్  బాల్యంలోని   ఒంటరితనాన్ని  పోగొట్టుకోవడానికి కథలు  వ్రాయడం మొదలుపెట్టాడా   అనిపిస్తుంది. భారత  దేశం  మీద  ఉన్న మక్కువతో ముస్సోరీలో  ఉంటున్నాడు . అతని రచనల్లో బాల్యము, ఇంకా ఇతర దశలు , ముస్సోరిలో  గడిపిన  జీవితము  ప్రతిఫలిస్తాయి.”Our Trees still grow in Dehra” అనే  రచనకు 1992 లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. పద్మ శ్రీ ,పద్మ భూషణ్ అవార్డు లు కూడా ఇతన్ని వరించాయి . రస్కిన్  రాసిన కొన్ని  రచనలు చిన్న/పెద్ద తెర  మీద సీరియల్స్ ,సినిమాలుగా  వచ్చాయి .

“The Blue Umbrella”  అనే పిల్లల నవల  ని విశాల్ భరద్వాజ్ చిత్రంగా  తీసి , National Award for Best Children’s film ,దక్కించుకున్నారు . Alice in Wonderland లాంటి క్లాసిక్స్ అంటే తగని ప్ర్రీతి. పిల్లల కోసం 50 కంటే ఎక్కువ  రచనలే చేసాడు.దాంట్లో ప్రముఖంగా పెర్కొనాల్సింది చారిత్ర్రక నవల అయిన   “A Flight of Pigeons”. దీన్నితెలుగు వారైన, శ్యాం బెనెగల్   సినిమాకు  దర్శకత్వం వహిస్తే ,శశి కపూర్ నిర్మాత. ఇలా చెప్పుకుంటూ  పోతే  బావి  లోంచి నీరు తోడినట్టు వస్తూనే  ఉంటాయి. ఈ కథ ఆంగ్ల శీర్షిక “A Job Well Done”

~

ruskin

తోటమాలి దుకీపాడుబడిన బావి చుట్టూ దట్టంగా పెరిగిన కలుపును ఏరి పారేస్తున్నాడు. శరీరం బక్క చిక్కి , నడుం వంగి, పొడవైన, బలహీనమైన కాళ్ళతో  ఉన్న  వృద్దుడు దుకీ. ముందు  నుంచి  ఇలాగే ఉండేవాడు. కాని బలమంతా అతని చేతి మణికట్టు, పొడవైన తీగ లాగున్న వేళ్ళల్లో నిక్షిప్తమై ఉంది. పెటునియా మొక్కలా బలహీనంగా ఉన్నా,  సారాయి లోని పట్టు  ఉంది తనలో.

” బావిని మూసేస్తున్నావా ” దుకీని అడిగాను. అపుడు ఎనిమిదేళ్ళు నాకు. దుకీ  అంటే  ఇష్టం నాకు. నేను పుట్టక మునుపే  తోటమాలిగా చేరాడు. మా నాన్న చనిపోయేవరకు అతని కోసం పని చేసాడు. ఇప్పుడు మా అమ్మ కోసం,నా సవతి తండ్రి కోసం చేస్తున్నాడు.

“మూసేయ్యాలి…ఆనుకుంటా ” దుకీ సమాధానం. “బావిని మూసేయ్యడమే కదా మేజర్ సాహిబ్ కి కావాల్సింది. ఎప్పుడైనా తిరిగి రావచ్చు. వచ్చిన తర్వాత బావి మూసేయ్యలేదు  అని కనిపెట్టాడో, కల్లు తాగిన కోతే  అవుతాడు. నేను ఇంకో పని వెతుక్కోవాలి అప్పుడు ”

మేజర్ సాహిబ్  నా  సవతి తండ్రి.  పేరు మేజర్ సమ్మర్ స్కిల్ . పొడుగ్గా, ధృడంగా, డాంభికంతో ఉంటాడు. తనకి పోలో అన్నా, గుర్రం పై కూర్చొని చేతిలో ఈటె తో అడవి పందుల్ని వేటాడ్డం అన్నా తెగ పిచ్చి. పూర్తిగా మా నాన్న కు భిన్నం. మా నాన్న నాకెప్పుడు పుస్తకాలు ఇచ్చేవాడు చదవమని.

కాని ఎక్కువ చదివితే  నేనొక స్వాప్నికుడిని అవుతానని, నా పుస్తకాలు లాగేసుకున్నాడు మేజర్. ఇతనంటే నాకు  గిట్టదు, ఇతన్ని చేసుకున్న మా అమ్మ గురించి కూడా నేను పెద్దగా తలవను. మా అమ్మతో అనడం నేను చాల మెత్తన అని, నాకు గుర్రపు స్వారి నేర్పించే ఏర్పాటు చెయ్యాలని.

కాని నాకు ఆ ఏర్పాటు చేయ్యకమునుపే తనకి తన పై అధికారి నుంచి పిలుపు వచ్చింది. సరిహద్దు దగ్గర ఉన్న గిరిజనుల నుంచి ప్రమాదం ఏదో ఉందని పెషావర్ కు వెళ్ళమని. సుమారు రెండు నెలలు ఇంట్లో లేడు. పెషావర్ కు  వెళ్లేముందు దుకీని గట్టిగా హెచ్చరించాడు తను వచ్చేలోపు బావి మూసేసి ఉండాలని.

“తోట మధ్యలో ఇలా నుయ్యి  తెరిచి ఉండడం ఎప్పటికైనా  ప్రమాదమే. నేనోచ్చేలోపు బావిని పుడ్చెయ్యి ” దుకీ తో చెప్పడం విన్నాను.

కాని దుకీకి ఇష్టం లేదు బావిని పుడ్చేయ్యడం- ఈ ఇల్లు కట్టక ముందు నుంచి, అంటే యాభై సంవత్సరాల కంటే ముందు నుంచి ఉంది. ఎప్పటినుంచో ఆ  బావి గోడల మీద పావురాళ్ళు నివాసం ఉంటున్నాయి. వాటి  మృదు మధురమైన కలరవం  తోటంతా వ్యాపించేది. వేసవిలో ఎండలు మండిపోయేవి. కుళాయిలో నీళ్ళు వచ్చేవి కాదు. అప్పుడు ఈ బావే నీటికి ఆధారం.

అప్పుడు “భిస్తి” జన సమూహం మేకతోలు తో తయారు చేసిన సంచీలో చల్లటి నీరు నింపుకొని అందరికి సరఫరా చేసేవాళ్ళు. అదే  కదా వారి పని. ఇంటి చుట్టూ దుమ్ము లేవకుండ బావి నీటితో  చిలకరించేవారు.

పాపం దుకీ మా అమ్మను ఎంత బ్రతిమాలాడో బావిని పూడ్చనని, అలాగే వుండనివ్వని-

“పాపం పావురాళ్ళు ఎటు పోతాయి? ” అన్న దుకీ మాటలకు మా అమ్మ “అవి  ఇంకో నుయ్యిని చూసుకుంటాయిలే. ఎట్టి పరిస్థితిలో నువ్వు బావి  తెరచి ఉంచద్దు” అంది.  మా అమ్మను చూస్తేనే తెలుస్తుంది, మేజర్ అంటే  తనకి భయమని.

” ప్రేమించేవాళ్ళకు  భయపడ్డం ఏమిటి? ఆ ప్రశ్న నన్ను అప్పుడు తికమక  పెట్టింది. ఇప్పటికి పెడుతుంది. మేజర్ ఇంట్లో లేకపోవడంతో జీవితం మళ్ళీ ఆహ్లాదకరంగా మారింది. పుస్తకాలు మళ్ళీ నా చేతుల్లోకి వచ్చాయి. గంటలు గంటలు నాకిష్టమైన మర్రిచెట్టు నీడలో గడిపాను. బక్కెట్ల కొద్దీ మామిడి పళ్ళు తిన్నాను. దుకీతో కబుర్లు చెప్తూ  తోటలో కాలక్షేపం  చేసేవాడిని.

నేను, దుకీ మేజర్ కోసం  ఎదురు చూడ్డం లేదు.

మా అమ్మ రెండో పెళ్లి తర్వాత దుకీ ఇక్కడ నివాసం  మా అమ్మ మీద ఉన్న గౌరవంతో, నా మీదున్న ప్రేమతో.

నిజం చెప్పాలంటే అతను మా నాన్న మనిషి. కాని మా అమ్మ నటన ఎలా ఉండేదంటే  తను నిస్సహాయురాలినని ఎలాంటి సహాయం చేయలేని దానినని. మేజర్  సమ్మర్  స్కిల్ మనుషులు తనకు రక్షణగా ఉంటున్నారని అనుకుంటుంది. తన కోసం పని చేసేవారంటే  తనకు చాలా ఇష్టం.

” మీ నాన్న కు  ఈ బావి అంటే  చాలా  ఇష్టం.  సాయంత్రాలు ఇక్కడే కూర్చొని, పుస్తకంలో  పిట్టల్ని, పువ్వుల్ని, కీటకాలను  బొమ్మలుగా   వేసేవారు.” దుకీ అన్నాడు.

మా నాన్న గీసిన బొమ్మలు నాకింకా గుర్తున్నాయి. అలాగే ఈ మేజర్ సాహిబ్ ఈ ఇంట్లోకి వచ్చాక ఆ పేపర్లను గిరవాటు వెయ్యడం కూడా గుర్తుంది. దుకీకి కూడా అన్నీ తెలుసు. నేను ఏది దాచను.

“విచారంగా ఉంది ముయ్యాలంటే. ఎవరు  పడతారు దీంట్లో తెలివిలేనోళ్ళు, తాగుబోతులు తప్పితే.”

ఇష్టం లేకున్నా మూసేయ్యడానికి సిద్దమయ్యాడు . మద్ది చెట్ల దుంగలు ,ఇటుకలు ,సిమెంట్ అన్నిటిని పోగు చేసి పెట్టాడు నూతి  చుట్టూ.

“రేపు” అన్నాడు దుకీ “రేపు బావి మూసేస్తాను , ఈ  రోజు కాదు,  ఇంకో రోజు ఉండనీ పావురాలు .”

“బాబా , రేపు ప్రొద్దున  బావిలోంచి పక్షులను  తోలేప్పుడు నువ్వు నాకు సాయపడాలి ”

నా సవతి తండ్రి వచ్చే రోజు మా అమ్మ ఒక టాంగాను బాడుగకు మాట్లాడుకొని యేవో  కొనడానికి బజారుకు వెళ్ళింది. కొద్దిమందికే  ఉండేవి  కార్లు  ఆ రోజుల్లో. ‘కల్నల్ ” లు  కూడా  టాంగాలోనే వెళ్ళేవాళ్ళు. మరిప్పుడేమో  క్లర్క్ లు కూడా వాళ్ళ గౌరవానికి తక్కువని టాంగా లో  కూర్చోడానికి  వెనకాడుతున్నారు. మేజర్  ఎలాగూ సాయంత్రానికి ముందు రాడు కాబట్టి, ఈ  ఆఖరి ఉదయాన్ని సావకాశంగా వాడుకుంటాను.

నాకిష్టమైన  పుస్తకాలన్నీ అవుట్ హౌస్ లో దాచి ఉంచాను, ఎప్పటికప్పుడు తీసుకోవచ్చని.

జేబులు   మామిడిపండ్లతో నింపుకొని, మర్రి చెట్టెక్కాను. జూన్ నెల లో  ఉన్న పగటి ఎండ తాపాన్నుంచి  తప్పించుకోడానికి ఇంత కంటే ప్రశాంతమైన, చల్లనైన  స్థలం ఇంకోటి లేదు. నేను బయటకు కనపడకుండా తెరలా అడ్డున్న ఆకుల మాటు  నుంచి చూస్తుంటే, దుకీ బావి  దగ్గర తిరుగుతున్నాడు. బావిని మూసే పని అతనికి అస్సలు ఇష్టం లేదులా ఉంది.

“బాబా ” అంటూ చాలా సార్లు పిలిచాడు. కాని నాకు మర్రి  చెట్టు నుంచి కదిలే ఉద్దేశ్యం అస్సలు లేదు. దుకీ, పెద్ద చెక్క పలకతో   బావి ఒక చివర అంతా మూసేసాడు.  సుత్తి తో మేకులు బిగించే పని మొదలు పెట్టాడు. మర్రిచెట్టు పై నుంచి చూస్తుంటే, దుకీ  వంగిపోయి  మరీ ముదుసలిలా  అనిపిస్తున్నాడు.

గణ గణ గంటతో, చక్రాలు సమరు లేక  కీచుకీచుమనగా ఒక  టాంగా గేటు లోపలకు వచ్చింది.

బజారుకు వెళ్ళిన  అమ్మ అయితే ఇంత త్వరగా రాదు. జిగురుగా, మందంగా ఉన్న ఆకుల సందు నుంచి తొంగి చూస్తును కదా,  ఆశ్చర్యం! ,కొమ్మ మీంచి కింద పడ్డంత పనైంది.వచ్చింది మేజర్,  నా సవతి తండ్రి!.

రావాల్సిన టైం  కంటే ముందే వచ్చాడు. నేను చెట్టు దిగి కిందకు రాలేదు .మా అమ్మ వచ్చేవరకు ఆయనకు ఎదురుపడే ఉద్దేశ్యం నాకు లేదు. మేజర్ కిందకు  దిగి, టాంగావాడు  సామాను వరండా లోకి చేర వేస్తుంటే చూస్తున్నాడు .

మనిషిని  చూస్తుంటే చిరాగ్గా కనిపిస్తున్నాడు. అతని రొయ్య  మీసాలు Brilliantine రాయడం తో దళసరిగా ఉన్నాయి. దుకీ  అయిష్టంగానే దగ్గరికి వెళ్ళి సలాం  కొట్టాడు.

“ఓహ్! ఇక్కడున్నావా ముసలి నక్కా !” అదేదో జోక్ అయినట్టు, స్నేహితుడ్ని  అన్నట్టు  అన్నాడు.

“ఏంటో  ఇది  గార్డెన్  తక్కువ, అడవి ఎక్కువలా ఉంది .నీకు వయసయిపోయింది. పని నుంచి తప్పుకోవాలి. సరే  కాని మేమ్ సాబ్  ఎక్కడ?”

“బజారుకి వెళ్ళింది ” దుకీ  సమాధానం

“మరి పిల్లోడు?”

దుకీ  భుజాలెగరేస్తూ , “పిల్లోడా! కనిపించలేదు”

“డామిట్! ఇంటికొస్తే ఇలాగా  స్వాగతం చెప్పడం  నాకు- సరే వెళ్లి వంట చేసే పిల్లోడ్ని లేపి సోడాలు తెప్పించు”

“వాడు వెళ్లి పోయాడు సాహిబ్ ”

“డబల్ డామిట్ “అన్నాడు  మేజర్

టాంగా వెళ్ళిపోయింది .  మేజర్ గార్డెన్ ని ఆసాంతం పరిశీలించడం మొదలుపెట్టాడు. పూర్తికాని బావి పని మేజర్ కంట్లో పడనే పడింది. మేజర్  మొహం  నల్లబడింది. పెద్ద  పెద్ద  అంగలతో   బావి దగ్గరికి చేరుకున్నాడు.ఇంక మొదలుపెట్టాడు ముసలి  తోటమాలి మీద  తిట్ల  దండకం.

దుకీ  సాకులు చెప్పసాగేడు . ఇటుకలు సరిపోలేదని, మేనకోడలికి  ఆరోగ్యం బాలేదని, సిమెంట్  నాణ్యత  బాగాలేదని,  వాతావరణం అనుకూలంగా  లేదని, అనుకోని పనులు ఎదురయ్యాయని. పై సాకులేవి  పనిచెయ్యలేదు మేజర్  మీద. ఇక  చేసేదేమిలేక దుకీ  సణుగుతూ  “నీటి  అడుగు భాగం  నుంచి  ఏదో   బుడగల శబ్దం వినిపిస్తుంది” అంటూ బావి  లోపలికి  వేలు  సారించాడు. మేజర్  బావిని ఆనుకొని  కట్టిన  చిన్నగోడ  మీద  కాలు పెట్టి  బావి  లోపలికి  తొంగిచుస్తున్నాడు.

దుకీ  కిందకి చూపిస్తూనే ఉన్నాడు. మరి  కాస్త  వంగాడు మేజర్. అంతే దుకీ చేతులు వేగంగా  కదిలాయి, ఎలా అంటే ఇంద్ర్రజాలికుడు కదిల్చినట్టు.

నిజానికి దుకీ  తొయ్యలేదు మేజర్ని. ఊరికే అలా చేతితో తట్టాడు అంతే. నా కంటికి మేజర్ బూట్లు మట్టుకే కనిపించాయి  బావిలో పడుతూ.

Alice In wonderland ని  తలచుకోకుండా ఉండలేకపోయాను. అదే Alice కుందేలు కలుగులోకి  మాయమవడం. ఒక్కసారిగా  విపరీతమైన శబ్దం నీళ్ళు చెల్లాచెదురు అవడంతో. దానితో పావురాలన్నీ పైకి లేచాయి . బావి చుట్టూ మూడుసార్లు తిరిగి ఇంటి పైకప్పు మీద స్థిరపడ్డాయి.

భోజనం టైం కల్లా దుకీ  బావిని చెక్క పలకలతో కప్పేసాడు.

“మేజర్ చూసాడంటే చాలా సంతోషపడతాడు ” అంది మా  అమ్మ బజారు  నుంచి వస్తూనే.

“సాయంత్రం కల్లా మొత్తం పని అయిపోతుంది కదా దుకీ “?

మా అమ్మ అన్నట్టే  సాయంత్రం కల్లా ఇటుకలతో బావి మొత్తం కప్పేసాడు.

దుకీ ఇప్పటివరకు  అతి శీఘ్రముగా చేసిన  పని ఏది అంటే ఇదే .

కొద్ది వారాల్లో మా అమ్మ మేజర్ కోసం పడ్డ ఆదుర్దా …ఆందోళనగా,ఆందోళన కాస్తా విచారమై, విచారం కాస్త విడుపు లోకి వచ్చేసింది. నాకు కలిగిన సంతోష, ఉత్సాహాలతో  అమ్మను ఉల్లాసంగా ఉండేలా చూసాను.

అమ్మ రెజిమెంట్ కల్నల్ కి  ఉత్తరం రాసింది . కాని మేజర్ సెలవు మీద   పదిహేనురోజుల ముందే ఇంటికి బయలుదేరినట్టు తిరుగు టపాలో వార్త వచ్చింది.

ఈ విశాలమైన భారతదేశంలో పాపం మేజర్  ఎక్కడో అదృశ్యమయ్యాడు.

తప్పిపోయి తిరిగి ఎప్పటికి దొరక్కపోవడం సర్వ సాదారణమే  కదా!

నెలలు గడిచి పోయాయి మేజర్  లేకుండానే .

రెండు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి  మేజర్ అదృశ్యం వెనక..

ఒకటి రైలులో వస్తుంటే ఎవరైనా హత్య చేసి నదిలోకి విసిరేసి ఉండొచ్చు లేదా గిరిజనుల  పిల్లతో దేశం మారుమూల ప్రదేశానికి  పోయి బ్రతుకుతున్నాడో …

జీవితం కొన సాగింది మిగిలిన వాళ్లకు. వర్షాలు నిలిచి, జామకాయలు వచ్చే కాలం మొదలయ్యింది.

32 రెజిమెంట్ ఫూట్ నుంచి ఒక ఒక కల్నల్ రాకలు మొదలయ్యాయి మా ఇంటికి.

కొంచం వయసైపోయి, అందరితో కలివిడిగా ఉంటూ , ఇంకా  చెప్పాలంటే  పరధ్యానంగా, ఎవరి పనులకు అడ్డురాకుండా ఉన్నాడు. పలకలు పలకలు చాక్లేట్లు  ఇంట్లోవదిలేసేవాడు.

“మంచి సాహిబ్ “కితాబిచ్చాడు దుకీ.

కల్నల్ ఒక్కొక్క వరండా మెట్లు ఎక్కుతున్నపుడు  నేను , దుకీ బోగన్ విల్లా వెనక నిలబడి ఉండగా అన్నాడు

“చూడు…  ఎంత చక్కగా సోలా టోపి పెట్టుకున్నాడు ” అన్నాడు  దుకీ

“లోపలంతా బట్టతల” అన్నాన్నేను

“పర్లేదు , ఇతను సరైన వాడేమో అనుకుంటున్నాను ”

“ఒకవేళ కాకపోతే”? నా  సందేహం

” ఏముంది మళ్ళీ బావి తెరుద్దాం”

దుకీ గొట్టం పైప్ నాజిల్ తీసేయడం తో  నీళ్ళు ఒక్కసారిగా మా  కాళ్ళను తడిపాయి. వెంటనే సరిచేసి  దుకీ నా చెయ్యి పట్టుకొని పాత బావి దగ్గరికి తీసుకెళ్ళాడు.

బావి మీద సిమెంట్ తో  మూడంచెల  తిన్నె తయారు చేసాడు. అది చూడ్డానికి అచ్చు వెడ్డింగ్ కేక్ లా ఉంది .

“బాబా ,మనం ఈ పాత బావిని మర్చిపోవద్దు .దీన్ని పూలకుండిలతో అందంగా అలంకరిద్దాము”

ఇద్దరము కలిసి కుండీలు, వాటిలోకి సువాసన భరితమైన గెరానియం, అడవి మొక్కలతో బావి పై భాగం  అలంకరించాము..

పని చక్కగా చేసినందుకు అందరు అభినందించారు దుకీని .

పావురాలు  లేవనే బాధ తప్పిస్తే ఇంకే  విచారం లేదు నాకు.

sp dattamala

దత్తమాల

*