ఆ  పొలాల పచ్చని పిలుపు వినిపిస్తోందా?

 

~

 

శాఖా గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివేటపుడు వెనక చివరి పేజీ వరకూ పుస్తకం మిగిలి ఉందా లేదా చెక్ చేసుకుని చదవాలని చాలా పుస్తకాలు అసంపూర్ణంగా మిగిలి పోయినా నేను నేర్చుకోని పాఠం! అలా ఏళ్ల తరబడి అసంపూర్తి గా మిగిలి పోయిన వాటిలో ఈ “మరల సేద్యానికి” ఆ నవల కోసం చాలా ఏళ్ళు అన్వేషించినా ఫలితం లేక పోయింది. బెంగుళూరు లో ఒక స్నేహితుల ఇంట్లో “మరళి మణ్ణిగె” అని కన్నడ ఒరిజినల్ కనిపించింది. ఎదురుగా మంచి నీళ్ళున్నా దాహం తీరే వీలు లేదన్నమాట! కన్నడం రాదుగా! ఇంగ్లీష్ అనువాదం ఉందని తెల్సింది. చదవాలని పీకింది కానీ, తెలుగులోకి తిరుమల రామ చంద్ర అనువదించారు కాబట్టి, అది పూర్తిగా తెలుగులోనే చదవాలని కోరిక! ఇంగ్లీష్ వెర్షన్ తర్వాత ఆప్షన్ గా పెట్టుకున్నాను.

చివరికి హైద్రాబాద్ లోనే మిత్రుల సహాయంతో దొరికింది. అమ్మయ్య.. చదివేశాను వారం  రోజుల్లో! నిజానికి అది వారం లో  పూర్తయ్యే ఆషా మాషీ నవల కాదు. అది చదివేశాక, ఎన్నాళ్ల నుంచో ఉన్న ఖాళీ ఏదో పూడినట్లయి, వారం పది రోజుల పాటు ఎవ్వరినీ విసుక్కోకుండా సంతోషంగా ఉండాలనిపించింది.

నా ఇంటి లైబ్రరీ కోసం ఆ పుస్తకం కోసం ప్రయత్నిస్తుండగా, హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ ఆ పుస్తకాన్ని తిరిగి వేస్తూందని తెల్సి చాలా సంతోషం వేసింది.  పుస్తకం చేతికి వచ్చాక, వచ్చాక  “మూడు తరాల కథని, వందేళ్ల కథని, ఇన్ని పాత్రలతో, నిత్య జీవితంలోని ఏ ఒక్క సంఘటనీ  వదలకుండా ఇంత విస్తారంగా అల్లుకుంటూ పేనుకుంటూ ఎలా రాశాడీ కారంత్?” అని అబ్బురం కల్గింది.

శివరామ కారంత్ జ్ఞానపీఠ్ తో పాటు ఎన్నో అవార్డులు పొందిన రచయితగా కన్నడ సాహిత్య ప్రపంచంలో అగ్రస్థాయి రచయిత గా అందరికీ పరిచయమే!  1941 లో రాసిన  ఈ నవల పేరు కన్నడ లో “మరళి మణ్ణిగె” ! అంటే “తిరిగి మట్టికి” ( వ్యవసాయానికి) అని అర్థం. అయితే మట్టికి మరలడమనే మాట తెలుగులో అంత అర్థవంతంగా లేదు కాబట్టి  దాన్ని “మరల సేద్యానికి” అని అనువదించారు తిరుమల రామ చంద్ర! నవల రాసిన 36 ఏళ్ళ తర్వాత 1977 లో ఇది తెలుగులోకి అనువాదమైంది.

ఒక వందేళ్ళలో సాగిన మూడు తరాల కథ ఇది! ఈ మూడు తరాల జీవితాల్లోని ప్రతి సంఘటననీ, ప్రతి మలుపునీ, ఏ సూక్ష్మాంశాన్నీకూడా వదలక చిత్రీకరించిన  సుదీర్ఘమైన నవల! అయినా ఎంతో ఆసక్తితో చదివించే పుస్తకం కూడా!

marali mannige

దక్షిణ కర్ణాటక లో ఉడుపికి సమీపంలో, ఒక వైపు పడమటి కనుమలు, మరో వైపు సముద్రం పరచుకున్న చోట కోడి అనే చిన్న గ్రామం! అందరూ పేదవాళ్ళే! కొద్ది మంది బ్రాహ్మలూ, మిగతా కులాల వాళ్ళూ!కథా కాలం 1850 నుంచి మొదలవుతుంది. అంటే పూర్తిగా బ్రిటిష్ పాలన సమయం! ఐనా ఆ మారు మూల గ్రామం మీద దాని ప్రభావం ఏమీ కనిపించదు.రోజువారీ జీవితం లో శ్రమించడం, సముద్ర తీరంలో ఉన్న ఆ ఇసుక నేలల్లో వ్యవసాయం చేయడం, పక్క గ్రామాలకు నడిచి వెళ్ళడం, నది లో పడవైనా వాడక దాటి వెళ్ళడం ఇదే దినచర్య!

ఇది దాదాపు వందేళ్లలో నడిచిన ఒక మూడు తరాల కథ! మొదటి తరం వైదిక పురోహితుడు రామైతాళుడి తో మొదలవుతుంది. పౌరోహిత్యం చేస్తూనే తనకున్న పొలాన్ని భార్య పారోతి (పార్వతి) , వింతంతువై ఇల్లు చేరిన చెల్లెలు సరసోతి (సరస్వతి) తో కల్సి సాగు చేసి వ్యవసాయం కూడా ప్రధాన వృత్తిగా జీవిస్తుంటాడు. వరి, అనుములు, ఉలవలు ఇవే అక్కడ పండేవి. ఇసుక మేటలు వేసే ఆ పొలాన్ని బాగు చేయడం, చెరువు పూడిక మట్టి పొలాల్లోకి తెచ్చి నింపడం, చెరువు నీళ్ళు తోడి పొలాలకు పెట్టడం వంటి పనులన్నీ ఎక్కువగా సరసోతి, పారోతి వీళ్ళిద్దరే చేస్తుంటారు. పొదుపుకీ పిసినారి తనానికి మధ్యలో జీవించే రామైతాళుడు పొలాలు, తోటలు కొనడం, డబ్బు మూటలు గోడల్లో దాచడం లో తీరిక లేకుండా ఉంటాడు. ఎదురింటి మరో బ్రాహ్మడు శీనమయ్యరు , రామైతాళుడు ఒకరి ఎదుగుదల చూసి ఒకరు ఓర్చుకోలేరు.

ఐతాళుడు సంతానం కోసం రెండో పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి రోజు వచ్చేదాకా ఇంట్లో ఆడంగులకు కూడా చెప్పడు. కొడుకు లచ్చడు పుట్టాక వాడిని వైదిక విద్యకు పంపాలా వద్దా అనే ఆలోచన!! శీనమయ్యరు కొడుకులు బెంగుళూరు లో హోటళ్ళు పెట్టి రెండు చేతులా డబ్బు సంపాదిస్తుంటే మత్సరం పాలై, తన కొడుకుని వకీలు చేసి డబ్బు సంపాదించాలని నిశ్చయించుకుని వాడిని కుందాపురం ఉడిపి ల్లో ఇంగ్లీష్ విద్యకు పంపిస్తాడు. అది మొదలు తాను పోయే దాకా లచ్చడి గురించే బెంగ పెట్టుకుని ఆస్తి  లచ్చడి చేతిలో నిలబడదని గ్రహించి మొత్తం కోడలు నాగవేణి పేరున రాసి కాలం చేస్తాడు.

రెండో తరం లచ్చడిది. వాడు కోడి గ్రామం వదిలి స్కూలు విద్యకు కుందాపురం వెళ్ళగానే రెక్కులు విప్పుకున్న స్వేచ్చ వాడి సొంతమై పోతుంది. ఎన్నడూ చూడని అర్బన్ ప్రపంచం వాడి కట్లు తెంపేస్తుంది. ఇంట్లో చదువుకున్న వారెవరూ లేక పోవడం వల్ల  వాడి మీద అజమాయిషీ కూడా లేక పోవడం తో చదువుకుంటూనే మరో పక్క తోటి పిల్లలతో పాటు వ్యసనాలతోనూ స్నేహం కుదుర్చుకుని, హైస్కూలు దాటకుండానే స్త్రీ సాంగత్యం కూడా సంపాదిస్తాడు. జూదం, వ్యభిచారం ఈ రెండూ అలవాటై వాటికి కావలసిన డబ్బు కోసం అబద్ధాలు అలవాటు అనివార్యమవుతాయి.

IMG_2443

పెళ్ళి చేసుకున్న నాగవేణి మీద వాడికి ప్రత్యేకానురాగం ఏమీ ఉండదు. మంగుళూరులో మామగారింట్లో ఉండి చదువుకుంటూనే, తన వ్యాపకాల్లో తాను బిజీగా ఉంటాడు. తన సరసోల్లాస జీవితం తాలూకూ రోగ బంధాలు నాగవేణికి కూడా ప్రసాదించి, మామగారింట మర్యాద పోగొట్టుకుంటాడు. నాగవేణి కోడి గ్రామం చేరాక లచ్చడు కేవలం డబ్బు కావాల్సి వస్తే తప్ప కొంప మొహం చూడడు. తండ్రి పోయాక, నమ్మించి ఆస్తి మొత్తం నాగవేణి చేత రాయించుకుని దాన్ని అనతి కాలంలోనే స్వాహా చేస్తాడు.చిన్నప్పటి నుంచీ నిర్లక్ష్యం గానే పెరిగిన లచ్చడు కుందాపురం , ఉడిపి ల్లో విశ్వరూపం చూపిస్తాడు . పేకాట , హైస్కూలు దాటకుండానే స్త్రీలు , ఇతర వ్యసనాలు … ప్రతి దాన్నీ సహజంగా అనుసరించి ఇష్టం వచ్చిన లైఫ్ స్టైల్ ని స్వీకరిస్తాడు . ఈ క్రమం లో ఉచితానుచితాలు ఎలాగూ ఉండవు కాబట్టి , స్నేహితుడి భార్య  జలజతో సైతం సంబంధం నెరపడానికి వెనకాడడు  ! కొడుకన్నా వాడికి ప్రేమ లేదు.తండ్రి పోయినా తల్లి పోయినా, ఎలాటి బాధా ఉండదు. ఎక్కడెక్కడో తిరిగి డబ్బంతా పోయి, చివరకు తనతో పాటు శీనమయ్యరు కొడుకు ఒరటమయ్యర్ ని కూడా పతనం చేసి అనామకుడై పోతాడు. అయినా వాడిలో ఇసుమంతైనా పశ్చాత్తాపం ఉండదు. కారంత్ కి కూడా లచ్చడి మీద కోపమేమో,  మిగతా పాత్రలకు ఉన్న ప్రాధాన్యం  గానీ, వర్ణన గానీ, వాడి ఉత్థాన పతనాలు గానీ ఏవీ కారంత్ పట్టించుకోడు. వాడి ప్రస్తావన వచ్చినపుడల్లా క్లుప్తంగా ఇదీ సంగతి అన్నట్టు చిత్రిస్తాడు తప్ప వాడి వెర్షన్ గానీ, మనో భావాలు గానీ, పోనీ కుట్ర తాలూకు వాడి పథక రచన గానీ వేటినీ వివరంగా చెప్పడు.

డబ్బు, సెక్స్ ఇవే లచ్చడి గమ్యాలు! తన కొడుకు రాముడు పెద్దవాడై అతడిని చూడ్డానికి వెళ్తే “ఎందుకొచ్చాడటా?” అని పక్క వాడిని అడిగి రాముడి మనసులో రేకెత్త బోతున్న ప్రేమను నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తాడు. అంతటితో ఆగక ఆ ముసలి వయసులో కూడా రాముడి హోటల్లో స్నేహితులతో సహా వచ్చి పడి  తిని బిల్లు చెల్లించకుండా, నిర్లక్ష్యంగా ప్రవర్తించి కొడుకు మనసులో శాశ్వతం గా చోటు పోగొట్టుకుంటాడు . అందుకు సూచనగా అక్కడితో నవల్లో లచ్చడి ప్రస్తావన ముగిసి పోతుంది కూడా!

మూడో తరం ఐతాళుడు, తాత పేరు పెట్టుకున్న రాముడు ! వీడే కథను తీరం చేర్చే నాయకుడు. ఆధునిక భారత దేశం నిర్మితమవుతున్న వేళ , ఆత్మ విశ్వాసానికి, ఆదర్శ యువతకు ప్రతీక గా రాముడి పాత్ర సాగుతుంది.     పుట్టేనాటికే ఆస్తి మొత్తం పోయి దరిద్రం లో ఉన్న కుటుంబం, ఒక పూట తింటే రెండో పూట పస్తులు! తల్లి తప్ప ఎవరూ లేని జీవితంలో వాడికి తల్లే గొప్ప స్నేహితురాలు! చింకి బట్టలేసుకున్నా, అటుకులు నీళ్లతో కలిపి తిన్నా, సముద్రం ఒడ్డున ఆడుకున్నా తల్లే వాడికి తోడు. మేనమామల నిరాదరణ వాడికి అర్థం అవుతునే కోడి కి వచ్చేయడానికి సిద్ధమవుతాడు. తల్లికి ఏ మాత్రం కష్టం కలక్కూడదని పట్నంలో ట్యూషన్లు చెప్పి చదువుకుంటాడు. పినతల్లి ఇంట్లో కూడా ఉచితంగా తినడానికి ఒప్పని ఆత్మాభిమానం.

ఒకప్పుడు తనకు గొప్ప ఆస్తి  ఉండేదనీ, తండ్రి అది పాడు చెయ్యబట్టే తనీ దీన స్థితిలో ఉన్నాననే ఆలోచన ఒక్కసారైనా వాడి మనసులోకి రాదు . రేయింబవళ్ళు కష్టపడుతున్నా, చేతిలో పైసా లేక పోయినా ఉసూరుమనడు. ఆశను పోగొట్టుకోడు. వాడు ముంబాయి లో ఉద్యోగం కోసం పడే ఇబ్బందులు చదువుతుంటే భిభూతి భూషణ్ అపరాజితుడు గుర్తొస్తాడు. అలుపెరుగని యాత్రికుడు రాముడు.

వీటన్నిటి వెనుకా దాగి ఉండేది రాముడి కళా హృదయం! అంతకు మించి సముద్రం మీద ప్రేమ! పసి తనం నుంచే కోడి గ్రామపు సముద్రంతో వాడికి ప్రేమ! మంగుళూరులో సముద్రాన్ని చూసి “మన వూరి సముద్రం లా లేదేంటమ్మా” అని అసంతృప్తి పాలవుతాడు. చెన్నైలో సముద్రమూ వాడికి నచ్చదు. ఎలాటి హడావుడీ లేని ప్రశాంతమైన, ప్రకృతి నగ్న సౌందర్యాన్ని నిండా నింపుకున్న సముద్రం కావాలి వాడికి! వూరికి రాగానే బట్టలైనా మార్చుకోకుండా సముద్రం దగ్గరికి పరిగెట్టే పిచ్చి ప్రేమ! అందుకే వాడు చిత్రకారిణి  నోవాకి ప్రామిస్ చేసిన సముద్ర సౌందర్యాన్ని తన పెయింటింగ్ ద్వారా చూపించాలని నిశ్చయించుకున్నపుడు, కోడి సముద్ర తీరంలో మమేకమై గడుపుతాడు. ఎంత చూసినా తనివి తీరని ఆ అద్భుత సౌందర్యాన్ని  చిత్రించడం అసలు సాధ్యమేనా అని దిగులు పడతాడు. వాడి జీవితం పూర్తిగా అస్థిరమై, గతి లేని పరిస్థితుల్లో భోజన హోటల్లో పని చేయాల్సి వచ్చి, అమ్మను వూర్లో ఒంటరిగా వదిలి, స్థిరత్వం లేని పరిస్థితుల్లో సముద్రం సాన్నిహిత్యంలో సేద తీరగలుగుతాడు గానీ ఆ సౌందర్యాన్ని చిత్రించగలిగే హృదయం, శాంతి, మనస్థిమితం  లేక అశక్తుడై పోతాడు.

 

తిరుమల రామచంద్ర

తిరుమల రామచంద్ర

అమ్మ దగ్గరికి తిరిగి వచ్చేసి ఆ పల్లెలోనే ఉండాలని, వ్యవసాయాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న తర్వాత రాముడికి దక్కిన ప్రశాంతతను, శాంతిని వాడే స్వయంగా నిర్వచించుకోలేడు.  గమ్యం చేరిన స్థిర భావం, వాడిలో! ఎన్నడెరగని సంతోషం! కడుపు నిండా తిని కంటి నిద్ర చుట్టూ ఉన్నవాళ్లతో కల్సి తన సొంత పొలం లో తాను పంచుకున్న శ్రమ, తాను నీళ్ళు తోడిన పొగాకు తోట, తాను  పండించిన పంట, ఆ బెస్తవాళ్ళతో సాహచర్యం…రాముడి హృదయాన్ని నింపేస్తాయి. ఆ ప్రశాంతతలో ఆ నిండు తనంలో వాన కురిసి వెలసిన ఒక సాయంత్రం ఒక వైపు రౌద్రం, మరో వైపు ప్రశాంతత నిండిన తీరంలో ఆ కోడి సముద్రం అనంత సౌందర్యాన్ని వాడి కుంచె పట్టుకోగలుగుతుంది. అపూర్వమైన చిత్రాన్ని నోవాకి కానుక గా  పంపిస్తాడు.

పిల్లలందరికీ చదువు చెప్పాలనీ, బెస్త వాళ్లందరిలో తాగుడు మానిపించాలనీ, వరి, అపరాలు వంటివి కాక పొగాకు లాంటి వ్యాపార పంటలు వేసి సంప్రదాయం లోనే కొంత ఆర్థిక కోణాన్ని చూడాలని, గ్రామాలన్నీ వికాసం పొందాలని రాముడి అభిమతం! ఇవన్నీ ఆచరణ లో చూపిస్తాడు !

తండ్రి పోగొట్టిన బంధాలన్నీ తిరిగి సంపాదించి, బంధువులని సంపాదించుకోవాలని తాపత్రయ పడతాడు. సుబ్బత్త చెప్పిన సంబంధాన్ని చూడ్డాని వెళ్తాడు. తల్లి పెళ్ళి ప్రస్తావన తెస్తే “ఆ అమ్మాయి పొగాకు తోటలకు నీళ్ళు మోస్తుందటనా మరి?” అని తన శ్రమను పంచుకునే భాగస్వామి కావాలని సూచిస్తాడు. పెళ్ళి కూతుర్ని అలంకరించి చూపిస్తే “ఇందాక  ఆ డ్రెస్ లోనే (వాకిట్లో కళ్లాపి చల్లేటపుడే ) అందంగా ఉందే” అని చమత్కరిస్తాడు.

ప్రతి పాత్రనూ కారంత్ ఎంతో సవిస్తరంగా చిత్రించినా, మనసుకు హత్తుకు పోయి గౌరవాన్ని కల్గించేవి మాత్రం సరసోతి, నాగ వేణి, మూడో తరం రాముడి పాత్రలే!

ఈ నవల్లో స్త్రీ పాత్రల్లో రెండింటికి తప్ప మిగతా వాళ్ళకి పెద్ద ప్రాధాన్యం ఉండదు. ఆ ఇద్దరూ సరసోతి, నాగవేణి! 1950 ప్రాంతాల్లో సరసోతి లాటి స్త్రీ పాత్రని ఒక సంప్రదాయ కుటుంబంలో, అందులోనూ వింతంతువు విప్లవమే !! ! పుట్టింటితో బంధం పోకూడదని , అత్తగారింటి భరణం తో అన్న గారింట్లో ఉంటున్న సరసోతి ని రెబెల్ గా గుర్తించాల్సిందే! రెక్కులు ముక్కలయ్యేలా పొలం పని, చెట్లు కొట్టడం, మైళ్ల కొద్దీ దూరాలు నడిచి బరువులు మోసుకు రావడం వంటి బండ పన్లన్నీ సుకుమారాలు పోకుండా చేస్తుంది. న్యాయం అనుకున్న మాట మొహాన్నే కుండ బద్దలు కొడుతుంది. ముసుగేసుకుని తిరిగే ఆ ముప్పయ్యేళ్ల ధీర సరసోతి , అన్నిటికీ మించి అన్నగారి బుద్ధిని, కుటిలత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టి పారేస్తుంది. పండిన పంట నాలుగు మూటలు ఎక్కువ వస్తే తమకు చెప్పకుండా దాచిన రామైతాళుడిని ” ఏం? రెక్కలు ముక్కలు చేసుకోడానికి పనికొస్తాం గానీ, పంట ఎక్కువొచ్చిందని చెప్పడానికి ఆడ వాళ్ళం పనికి రామా?” అని నిలదీసినా , పొరుగింటి వాడి పంట వానకు మురిగి పోతే “రంకున పుట్టె, జగడాన చచ్చె అన్నట్టు, పోతే పోయింది లే వూరికే వచ్చిన డబ్బేగా?” అని మత్సరం చూపించే అన్నని “పరాయి వాడిని చూసి ఎందుకంత మత్సరం అన్నా నీకు? నీకు మాత్రం ఊరికే వచ్చింది కాదూ? దక్షిణలు కూడేస్తే వచ్చిన డబ్బేగా, నీకు ఎక్కువొస్తే గర్వమూ, ఎదుటివారికి పోయిందని  సంతోషమూనా” అని చీవాట్లు వేసినా సరసోతి కే చెల్లు!

Return to earth

తనకు పారోతికీ చెప్పకుండా సంబంధం కుదుర్చుకుని వచ్చిన అన్న మీద మండి పడుతుంది. “ఇంట్లో ఆడవాళ్ళకు చెప్పే పనే లేదా”  అని శీనమయ్యరు ముందే నిలదీస్తుంది. అప్పట్లో రెండో పెళ్ళి మామూలు విషయమే కాబట్టి దాన్ని అంగీకరిస్తూనే, పారోతి గౌరవానికి భంగం వహిస్తే సహించనని అన్నకు స్పష్టం చేస్తుంది. కొత్త పెళ్ళి కూతురికే కాదు, పారోతికి కూడా నగలు చేయించాల్సిందే అని పట్టుబడుతుంది.నిజానికి ఆ ఇంటికి ఒక ఒంటి స్థంభం లా చివరి వరకూ సరసోతి నిలబడుతుంది.  పారోతి మీద చివరి వరకూ శ్రద్ధ చూపేది సరసోతి ఒక్కతే ! నవల సాగుతూ పోతుంటే సరసోతి మీద అభిమానం పెరిగి పోతూ ఉంటుంది .

నాగవేణి నవల చివరి వరకూ ఉండే పాత్ర! కొడుకు కి గొప్ప స్నేహితురాలు. కష్టాలు చుట్టు ముట్టి, ఒంటరిదైనా ఫిడేలు సాయంతో ఊరట పొందుతూ, అన్నిటినీ ఆత్మ గౌరవంతో  అధిగమిస్తుంది.

ఈ మూడు తరాల కథను కారంత్ 30 అధ్యాయాల్లో అదీ 30 రోజుల్లో ముగించారట. అది ఆయనకు ఎలా సాధ్యమైందో గానీ ఈ నవలను వేగంగా చదవలేం ! నెమ్మదిగా, నవల లోని జీవన విధానానికి తగ్గట్టుగానే, ఎలాటి తొందరా లేకుండా తాపీగా నడుస్తూ పోతుంది ఈ కథ. పారోతి, సరసోతి ల దిన చర్య ను, సంఘటనల వారీ గా పూర్తిగా వివరిస్తాడు రచయిత. కట్టెలు ఎండబెట్టుకోడం, పొన్న కాయలను నూనె గానుగ కు పంపి దీపాలకు నూనె ఏర్పాట్లు చూడటం, వేసవి లో మైళ్ళ కొద్దీ నడిచి సరసోతి మామిడి కాయలు ఊరగాయ కోసం తీసుకు రావడం, కొద్దిలో జరిగే వంట, ఏ కాలక్షేపమూ లేని వాళ్ల జీవితాల్లో పని మాత్రమే కాల క్షేపంగా సమయం గడిచి పోవడం..ఇదంతా సవిస్తరంగా చిత్రిస్తాడు. ఎలాటి హడావుడి లేని ఆ రోజుల ప్రశాంత జీవితంలోని ప్రతి రోజుని, ప్రతి సంఘటననూ రచయిత వర్ణిస్తూ, వివరిస్తూ పోయినా ,అది ఎంత నెమ్మదిగా సాగినా పాఠకులకు ఆసక్తి కల్గిస్తూ పోతుందే తప్ప విసుగు పుట్టదు. అనుక్షణం వినిపిస్తూ ఉండే ఆ పడమటి సముద్రం హోరు, వదలని ముసురు వాన, ఇంటి ముందు చెరువు, సముద్రంలో కలిసే ఆ నది, కొబ్బరి, పనస, పొన్న చెట్లు ఇవన్నీ వాళ్ల జీవితం లో ఒక భాగంగా కల్సి పోయి నవల పొడుగునా పాఠకుడితో ప్రయాణిస్తుంటాయి. నవల లో కాలం  నడుస్తూ ముందుకు కదలడంతో పాటే కథలో , సమాజం లో వచ్చే మార్పులు అత్యంత సహజంగా కథతో పాటే జరిగి పోతాయి. కథే మారుతున్న సమాజాన్ని కళ్ళకు కడుతుంది.  సముద్ర తీరపు ఇసుక నేలల్లో వ్యవసాయం  ఎంత కష్టమైనా, అక్కడ ఏది పండించాలన్నా ఎలాటి ఆధునిక పని ముట్లూ లేని కాలం లో ఎంతటి శరీరక శ్రమతో కూడిన పనో అయినా ఎవ్వరూ వెనుకాడరు . పంట పొలాల్లో పేరుకున్న ఇసుక ఎత్తి పోయడం, చెరువు పూడిక మట్టిని తట్టలతో తెచ్చి పొలాల్లో నింపడం ,నీటి వసతి లేని ఆ పొలాలకు చెరువు నుంచి కడవలతో నీటిని తెచ్చి పోయడం  వీటన్నిటిలో రామైతాళుడి  కంటే ఆ ఇంటి ఇద్దరు స్త్రీలే ఎక్కువగా పాలు పంచుకుంటారు . వాళ్లతో పాటే వాళ్ళ పాలికాపు కుటుంబమూ  రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ నాలుగు గింజలు పండే పరిస్థితి ఉండదు . ఏవి వస్తువో,సేవో కొనుక్కున్నా వడ్లు కొలిచే రోజులు కావడం వల్ల పండించక తప్పదు!

ఈర్ష్యాసూయలు కాలాతీతాలు! అందుకే కులానికి ఒకటే అయినా శీనమయ్యరూ, రామైతాళులూ ఒకరి అభివృద్ధిని మరొకరు ఓర్వలేకపోతుంటారు. శీనమయ్యరు కొడుకులు బెంగుళూరు లో హోటళ్ళ వల్ల డబ్బు సంపాదిస్తున్నారని తెలిసి “అన్నం అమ్ముకుని బతికే గతి మనకేమి?” అని రామైతాళుడు ఎద్దేవా చేస్తే , లచ్చడిని వకీలు చేద్దామన్న రామైతాళుడి ప్రయత్నాల్ని శీనమయ్యరు నలుగురి ముందూ ఎగతాళి చేస్తుంటాడు.  ఉడుపి లో హోటల్ నడిపే బ్రాహ్మడు కిట్టు ఉపాధ్యాయ భార్య జలజ లచ్చడు, అతని స్నేహితులు మరి కొందరితోనూ శారీరక సంబంధాలు పెట్టుకుని నైతిక విలువల నిర్వచనం ఏ కాలం లో అయినా సాపేక్షం  మాత్రమే అని రుజువు చేస్తుంది.

ఎలాటి సద్దూ లేని ప్రశాంతమైన ఆ పల్లె నుంచి లచ్చడు కుందాపురం, ఉడిపి లకు చదువు కోసం చేరినపుడు అక్కడి వాతావరణం, స్నేహితులు, హాస్టలు వసతిలో ఉండటం ఇలాటివి నెమ్మది నెమ్మదిగా పల్లె పట్నం వైపు జరిగి పోవడాన్ని చిత్రిస్తూ పోతాయి. అందుకే లచ్చడు సెలవులకు ఇంటికి వచ్చినా వాడికి ఇల్లు నచ్చదు. ఈ విపరీత ధోరణి గమనించే సరసోతి అంటుంది “ఇంగ్లీషు చదివితే ఇంటివారే పరాయి వారవుతారు” అని!  నిజానికి సరసోతి అమాయకత్వం వల్ల ఇంగ్లీషు చదువుని ఆక్షేపించడమే గానీ, అది పట్న వాసపు పోకడలకు సంబంధించిన మాటే! నాగరీక జీవితం అనేది నాగరికంగా ఉంటుందో ఉండదో గానీ, స్వచ్చత మాత్రం లోపించే తీరుతుందని లచ్చడే రుజువు చేస్తాడు.

లచ్చడి నిర్వాకాల వల్ల ఆస్తి మొత్తం పోయిన తర్వాత అందర్నీ పోగొట్టుకున్న నాగవేణి కొడుకుతో మంగుళూరు చేరిన కాలానికే మనుషుల మధ్య బంధాల నిర్వచనాలు నెమ్మదిగా మారి పోతుంటాయి. చెల్లెలే  ప్రాణంగా మెలిగిన సదాశివుడు, అతడి తమ్ముడూ  కొంత ఉదాసీనంగా వ్యవహరించడం, ఖర్చుల విషయంలో కొంత నిక్కచ్చిగా ఉండటమూ, మేనల్లుడి చదువు ఖర్చు విషయమై ఇద్దరూ వంతు వేసుకున్నట్టు ప్రవర్తించడమూ జరుగుతుంది. తండ్రి పోయాక నాగవేణిని బాబాయి నారాయణయ్యరు తమ ఇంట్లో ఉండమంటే ఆయన కొడుకులు, ఒకప్పుడు నాగ వేణితో ఆడి పాడి ఒక కుటుంబంగా కల్సి ఉన్న వాళ్ళే, నాగవేణిని ఉండమని బలవంతం చేయొద్దని కరాకండీ గా చెప్పేస్తారు తండ్రికి! నగర జీవితపు పోకడలు బంధుత్వాలను తేలిక పరుస్తుంటాయి.

ఎప్పటికీ మారక విశ్వాసంగా ఉండేది ఐతాళుల ఇంటి ముంగిట ఉన్న పాలి కాపులే! చివరి వరకూ వాళ్ళే నాగ వేణికి, ఆమె కొడుక్కి కూడా అండగా నిలుస్తారు.

Sivarama karanthనవల మొత్తం మీద కథతో పాటే ప్రయాణిస్తూ ఉండేది మాత్రం సముద్రం! కోడి గ్రామంలో ఇంటికి వంద గజాల దూరంలోనే సముద్రం! కథంతా నిత్యం ఆ హోరులోనే, సముద్రం మీద నిండైన సూర్య చంద్రుల అందాలతో, పట్నం మాలిన్యం, కాలుష్యమూ అంటని స్వచ్చమైన సముద్రం, దగ్గర్లోని కొబ్బరి తోటల టప టపలతో హోరు మిళితమైన సుందర సంగీతం నేపథ్యంలో ఆ నిశ్శబ్ద గ్రామం సైతం కువ కువలాడేలా చేస్తుంది. మంగుళూర్లో సముద్రం, రాముడు మద్రాసు వెళ్తే అక్కడా వదలని దక్షిణ సముద్రం! అందుకే రాముడు తన పసి తనం లోనే సముద్రంతో ప్రేమలో పడతాడు.

నవలా కాలం 1850 నుంచి మొదలు కావడం వల్లనేమో ప్రాచీన  దక్షిణ కర్ణాటక సంస్కృతి, ఆచార వ్యవహారాలు విస్తృతంగా కనిపిస్తాయి! కన్నడ బ్రాహ్మల తిండి అలవాట్లు (మనకు పరిచయం లేక పోవడం వల్ల)కొంత వింతగానూ, మరి కొంత ఆసక్తి గానూ తోస్తాయి. ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్లతో పాటు బెల్లం ముక్క ఇవ్వడం, లేదా ఆకులో పెట్టిన వూరగాయ ముక్క తో మంచి నీళ్ళు ఇవ్వడం, నీళ్లలో నానేసిన అటుకులు తినడం, కాఫీకి బదులుగా పెసర గంజి ఇవ్వడం వంటివి! చిరుతిండి గా కోడి గ్రామంలో కేవలం అప్పడాలు వడియాలు మాత్రమే కనిపిస్తుంటాయి. పెళ్ళి చూపులకు వచ్చిన వాళ్లకు కూడా అవే!

అనేక చోట చామ కూర అట్లు, పనసకాయ, గెనుసు గడ్డ (చిలగడ దుంప) అప్పడాల ప్రస్తావన వస్తుంది. పనసకాయతో అప్పడాలు ఎలా చేస్తారో అర్థం కాలేదు గానీ, మొత్తానికి అవి నాకు కూర్గ్ లో ఒక స్నేహితుల ఇంట దొరికాయి.

అప్పటి ఆచార వ్యవహారాలు, పట్టింపులు అన్నీ నవల్లో సుస్పష్టం. లచ్చడు ఉడిపి లో హోటల్ లో తిన్నాడని తెల్సి “ఆ కామత్ ల హోటల్లో తిని ఆచారం మంట పెడతావా”అని సరసోతి మండి పడుతుంది.

అసలు మొత్తం మీద కర్నాటక బ్రాహ్మల్లో చాలా మందికి భోజన హోటల్ పెట్టడం ఒక రివాజైన కొలువుల్లో ఒకటి గా అర్థమవుతుంది. శీనమయ్యరు కొడుకులు బంధువుల హోటల్లో పని చేసి ఆ పైన సొంత హోటల్ పెడతారు. వేద పాఠశాల నడిపే సుబ్రాయ ఉపాధ్యాల కొడుకు కిట్టు ఉపాధ్యాయ కూడా  కుందాపురం లో చిన్న పాటి హోటల్ ప్రారంభిస్తాడు ! ఆస్తి మొత్తం తీసుకు పోయిన లచ్చడు కూడా హోటల్ పెట్టి నష్ట పోతాడు. ఒరటమయ్యరుదీ అదే దారి! చివరికి రాముడు కూడా హోటల్లో పని చేయక తప్పదు.

ఇంత పెద్ద నవలను  కారంత్ 30 రోజుల్లో రాయడం ఒక ఎత్తైతే, డాక్టర్ తిరుమల రామచంద్ర దాన్ని అంత అద్భుతంగానూ తెలుగులోకి అనువదించడం విశేషం! ఈ నవల్లోని దక్షిణ కర్నాటక మాండలికాలకు నిఘంటువుల్లో కూడా సరైన అర్థాలు దొరకని పరిస్థితిలో ఎంతో శ్రద్ధగా వాటి అర్థాలను అన్వేషించి కన్నడం నుంచి నేరుగా తెలుగులోకి అనువదించారు. ఇంగ్లీష్ లోకి ఈ నవల మొదట ఈ నవల వెలువడిన పధ్నాలుగేళ్ళకి ఏ. ఎన్ మూర్తీ  “Return to Earth ” పేరుతో అనువదించారు. అయితే అది కొంత సంక్షిప్త రూపంలో ఉండటం తో పద్మా రామ చంద్ర శర్మ  అనే ఇంగ్లీష్  టీచర్ (ఈమె ఆఫ్రికా దేశాల్లో కూడా పని చేశారు) తిరిగి ఆ నవలను ఆంగ్లం లోకి అనువదించారు

అంత విస్తారమైన నవలను సంక్షిప్త రూపంలో చిన్న పిల్లలకు కథ చెప్పినట్లు సరిపెడితే కుదరదంటారామె! అందుకే ఆ దక్షిణ కర్ణాటక మాండలికాల్ని వెదికి పట్టుకుని , రోజువారీ దినచర్య లోనీ ప్రతి ఘట్టాన్నీ వర్ణన అనే భావనకు అతీతంగా చిత్రిస్తూ పోయిన కారంత్ శిల్ప చాతుర్యాన్ని తానూ వీలైనంత సవిస్తరంగాగే అనువదిస్తూ, మూలం లోని flavor  పోకుండా చూడ్డానికే ప్రయత్నించానంటారు . అనువాదకుల సృజనాత్మకత అనువాదం లో కనిపించవచ్చని అంగీకరిస్తూనే “అనువాదకుడు గాలి పటం లాటి వాడు. ఎంత ఎత్తైనా స్వేచ్చగా ఎగరొచ్చు గానీ, అదుపులో మాత్రం ఉండాలి ” (మూలం నుంచి దూరంగా జరగ కూడదని)అని పద్మ అంటారు. ఆ పనిని తిరుమల రామ చంద్ర అక్షరాలా నెరవేర్చారు. కన్నడ సువాసనలు ఏ మాత్రం తగ్గకుండానే రామైతాళుడిని, నాగవేణి, సరసోతి, పారోతి, రాముడు, పాలి కాపు సూరడు, అతడి కోడలు బచ్చి.. అందర్నీ తెలుగు వాకిట్లోకి తెచ్చి మనతో చేతులు కలిపిస్తారు. సరసోతి ని అభినందిస్తూ, నాగవేణి తో సహనుభూతి పొందుతూ, రాముడితో పాటు ప్రయాణిస్తూ వాడి కష్టాలు చూసి చివుక్కుమన్నా, వాడు చేరుకున్న పచ్చని గమ్యం చూసి పాఠకుడు హాయిగా నిట్టూర్చేలా ,  నవలంతా తానై పరుచుకుని ఈ మూడు తరాల జీవన ప్రయాణానికి సాక్షిగా నిల్చిన కోడి గ్రామపు సముద్రానికి వీడ్కోలు చెప్పి పుస్తకం మూసేలా చేస్తారు.

వనవాసి నవల్లో భిభూతి భూషణ్ లాగే కారంత్ కూడా వ్యవసాయ వృత్తిని వదిలి పట్నం వైపు పరుగులు తీస్తున్న వారి గురించి ఏమీ గగ్గోలు పెట్టరు నవల్లో! పట్నం చేరి పతనమై పోతున్న లచ్చడిని,శీనమయ్యరు పిల్లల్ని చూస్తున్న పాఠకుడు “అయ్యయ్యో, వ్యవసాయం వదిలి, పల్లె వదిలి ఎంత పని చేశారు వీ”ళ్ళనే ఆందోళన చెందేలా చేస్తారు.

ప్రకృతికి శ్రమను ధార పోయడంలో రాముడు పొందిన సంతోషం, తృప్తి చూస్తున్నపుడు , వాడు తన తాతగారి జీవన శైలికి,వ్యవసాయానికి తిరిగి వచ్చినపుడు.. తెలీని రిలీఫ్ ని పాఠకుడు పొందుతాడు. వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే కాదు, ఆర్థిక స్వావలంబన కూడా అందులో ఒక అంశంగా ఉండాలంటాడు కారంత్! అందుకే రెండు తరాలకు కింద రెక్కలు ముక్కలు చేసుకుని ఆ ఇసుక నేలల్లో సరైన ఎరువులు కూడా లేకుండా వరి, ఉలవలు,మినుములు దోసకాయలు పండించిన రామైతాళుడి కుటుంబం లో రాముడి తరం పొగాకు పండిస్తుంది.

బెస్త వాళ్ళు పట్టిన చేపల్ని చూడ్డానికి సైతం “ఛీ “అనుకునే ఆ కుటుంబం లో రాముడు పొగాకు పంటకు “చేపల ఎరువు” వేస్తాడు. పని చేయడానికి మాత్రమే పాలికాపుని ఉపయోగించుకున్న రామైతాళుడి తరం వాళ్ళు అంతకు మించి సూరడి కుటుంబంతో పెద్దగా  మాటలు నెరపరు. “మీ శూద్రుల రాత అంతేరా ! బ్రాహ్మల ఇంటి  పాయసానికి నాలుకు పీక్కుంటారు గా ” అని మాట్లాడతాడు కూడా !! రాముడు ఇరవయ్యేళ్ళకే జీవితంలో ఎంతో చూసిన వాడు కాబట్టి , పట్న వాసం చేసి వచ్చిన వాడు కాబట్టి ఆ నాటి ఆచారాలను ఎంత వరకూ పాటించాలో, ఏది మూర్ఖత్వమో గ్రహించిన వాడూ కాబట్టి పాలి కాపుతో హాస్యాలు చమత్కారాలు ఆడుతూ వాళ్లతో కల్సి పని చేస్తాడు. బెస్తల కుటుంబాల తో కల్సి తిరిగి ఎర్ర సీసాలు (తాగుడు) మానమని ప్రోత్సహిస్తాడు

“నా కొడుక్కి రాసేది చదివేది నేర్పు దొరా! నాకు చూడు చదువు రాక ఎంత కష్ట పడుతున్నానో” అని బెస్తల చెన్నడు అంటే, “అది రాకుంటేనే నయం రా! మా నాన్నకు చదువు వచ్చే, ఆస్తి ఉడుపి కోమట్ల వశమైంది” అని హాస్యాలాడతాడు.

“నాకూ ఫిడేలు నేర్పుతారా” అని చెన్నడు అడిగితే “సరే, ముయ్యి కి ముయ్యి(చెల్లుకు చెల్లు), నీవు నాకు వలలు పన్నేది నేర్పు, నీకు నేను ఫిడేలు నేర్పుతా”నంటాడు.

రాముడి లా ఆలోచించి, వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలి పెట్టి పచ్చని ప్రకృతి వొడి వైపు పరుగులు తీసే యువత అక్కడక్కడా మనకి కనిపించక పోరు.ఫేస్బుక్ లో దీప్తి రెడ్డి వంగల అనే అమ్మాయి ని చూస్తుంటాను.ఎకరాల కొద్దీ సేంద్రియ (organic ) వ్యవసాయం అలవోక గా చేస్తూ, పంటల్ని బళ్ళకెత్తుతూ ఉంటుంది.  ఈనాడు నుంచి వుద్యోగం విరమించిన హేమ సుందర్ అనే పాత్రికేయుడు , వ్యవసాయం వైపు మరలి , డయాబెటిక్ బియ్యాన్ని పండిస్తున్నారు ! అమెరికా నుంచి తిరిగొచ్చిన మరో మహిళ శ్రీకాకుళం దగ్గర, ఇంజనీరింగ్ చదిన కుర్రాడొకడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి మరొకరు.. ఇలా వ్యవసాయం మీద ఆసక్తి చూపిస్తున్న వాళ్ల గురించి ఈ మధ్య ఒక టీవీ కార్య క్రమంలో చూసి ఎంతో సంతోషం వేసింది. ఈ క్రమంలో పట్నం నుంచి పల్లెలకు మళ్ళిన యువ రైతులెవరైనా ఇంకా ఉన్నారా అని “young farmers in AP and Telangana అని వెదికితే, లెక్కకు మించి యువరైతుల ఆత్మ హత్యల వార్తలు పేజీల కొద్దీ ప్రత్యక్షమై బెంబేలెత్తించాయి :-( ! కొత్తగా వ్యవసాయం మొదలు పెట్టినా పెట్టక పోయినా, వ్యవసాయం కుటుంబాల నుంచి వచ్చిన వారు సొంత గానో , కనీసం కౌలుకి ఇచ్చో వ్యవసాయాన్ని కూలి పోకుండా కాపాడితే ఎంత బావుంటుంది !! రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి పంట భూముల్ని ఇవ్వాలనే ఆలోచన ఎంత దుర్మార్గం ! భూమిని  నిలువునా హత్య చేయడం ఎంతటి నేరం !!

రాజధానుల పేరుతోనో , రియల్ ఎస్టేట్ పేరుతోనో ప్రపంచకీరణ వైపుగా పయనిస్తూ , వ్యవసాయ భూములన్నీ మాయమై కాంక్రీటు అడవుల్లా మారి పోతున్న కాలంలో, వ్యవసాయం చేయలేక పిట్టల్లా రాలి పోతున్న రైతుల ఆత్మ హత్యల కాలంలో.. చదువుకుని, పట్నంలోని శూన్యాన్ని , అనుభవంతో అవగతం చేసుకుని సేద్యానికి తిరిగి మరలిన రాముడే ఇప్పుడు కావలసిన మోడల్! వ్యవసాయాన్ని మర్చి పోయి నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరూ తిరిగి ఆ వైపుగా, సేద్యానికి మరలి వెళ్లాలన్నదే ఈ నవల ఇచ్చే పిలుపు! మనకిప్పుడు వందలమంది రాముళ్ళు కావాలి !!

___ 

 

మీ మాటలు

  1. devulapalli durgaprasad says:

    అద్భుతం ఈ సమీక్ష. చాలా రోజుల తర్వాత పచ్చి గాలి పరవశం పలకరించి నట్లుంది. నేల తల్లి వొడి లో సేదతీరినట్లుంది. ఇంత గొప్ప పుస్తకాన్ని ఎంతో ఆసక్తి తో మాకు పరిచయం చేయడం సతతా ముదావహం. ధన్యవాదాలు. ఏదైన పుస్తక సమీక్ష చదువరుల మనసు గెల్చిందంటే దానికి తార్కాణం వెంటనే ఆ పుస్తకాన్ని కొని చదవాలని పించడమే. అది ఈ పుస్తక సమీక్ష విషయం లో నిజమైనది.

  2. lasya priya says:

    అద్భుతంగా ఉంది సమీక్ష …. మంచి పుస్తకాన్ని పరిచయించారు

  3. కొంచెం ఆలస్యమైనా సరే నవలను చదివితీరాల్సిందే అనేలా స్పష్టంగా, నవల్లోని పాత్రలను వాటి స్వభావాలను పరిచయం చేశారు మేడమ్…మీరు నవల గురించి చెప్పిన విధానం చాలా ఆశ్చర్యం నాకు, ఎందుకంటే ఇంత పొడుగు వ్యాసం స్క్రీన్ మీద ఓపిగ్గా నేను చదవడం తక్కువ(వాస్తవం ఒప్పుకోవాలి కదానీ చెప్పా !). వ్యక్తిత్వాలను, మారుతున్న సమాజాన్ని గమనించాలనుకునే వారికి, చరిత్ర తెలుసుకోవాల్సిన ప్రస్తుత తరం ఖచ్చితంగా చదవాల్సిన నవలను ఎంతో గొప్పగా పరిచయ చేసినందుకు ధన్యవాదాలు.

  4. ఎంతో మంచి పుస్తకాన్ని చక్కని విశ్లేషణతో పరిచయం చేసారు . ధన్యవాదాలు

  5. అద్భుతమైన పరిచయం…తప్పక చదవాలనిపించేలా…అభినందనలు.

  6. మంచి పరిచయం. మీ శైలి ఆపకుండా చదివిస్తుంది. థాంక్యూ

  7. మరలా సేద్యానికి నవలా రచయిత శివరాం కారంత్ ను కన్నడిగులు ఎలా గౌరవించారు ?
    కారంతజ్జ (కారంత్ తాతయ్య) గా !

    ఆ పేరుతో ఆయన బాలల ప్రశ్నలకు ఒక కన్నడ పత్రికలో సమాధానాలు ఇచ్చేవారు .
    ఆ శీర్షికను కొన్నాళ్ళు చదివే అదృష్టం కలిగింది.

    ఒక సమాజానికి :
    నిన్నటి నేటి రేపటి సమాజానికి
    రచయితా మాత్రమె తాతయ్య కాగలుగుతారు.

    తెలుగులో అటువంటి తాతయ్య ఎవరో !
    తాతయ్య పుట్టాలని మనుమలు ఎదురు చూస్తున్నారు !
    సుజాత గారికి పరిమళాలు

  8. Prof P C Narasimha Reddy Ph D says:

    Narrative is almost like an abridged edition of the novel ‘Return to Earth’ by Shivarama Karanth.Novels in all Indian languages depicting the last quarter of 19th and first quarter of 20th century were composed in epic proportions and they give detailed authentic account of rural life.younger generation should get the taste these novel
    – Prof P C Narasimha Reddy

  9. బాగుందండీ నవల. తప్పక చదవాలి.

  10. కినిగెలో ఇక్కడ లభ్యం.
    http://kinige.com/book/Marala+Sedyaniki

  11. నవల విషయము ప్రక్కన పెడితే– మీ నవలా పరిచయము చాలా–అభినందనీయము–నవలే చదివినట్లుగా వుందండి—–నేను చదివా– మనకు తెలియని పరిసరాలు వ్యవహారాలు—

  12. తహిరో says:

    అద్భుతం అనే మాటకి పర్యాయ పదం “మరల సేద్యానికి ” . ఈ మధ్యనే చదివాను. ఇప్పడికీ మానసికంగా అరేబియా సముద్ర తీరం లోని కోడి లోనే సంచరిస్తూ ఉన్నాను చంద్రోదయ వేళలో తల్లి ఒడిలో చేరబడి వాయులీనం లో లీనమయిన నూనూగు యవ్వన బాలుడే నా కళ్ళలో …
    – అభినందనలు సుజాత గారు.

  13. మంచి శీర్షిక.. సుజాతగారికి అభినందనలు.. మీరు ఇంకా ఎన్నో గొప్ప రచనలని పరిచయం చేయాలని కోరిక..

  14. సుజాత says:

    నవల, పరిచయం నచ్చిన అందరికీ థాంక్స్

  15. కె.కె. రామయ్య says:

    కన్నడ సాహిత్య అగ్రస్థాయి రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శివరామ కారంత్ గారి కన్నడ నవల “మరళి మణ్ణిగె” (1941) “మరల సేద్యానికి ” అద్భుతం సమీక్ష చేసిన సుజాతగారికి గారికి ధన్యవాదాలు. మీరు ఇంకా ఎన్నో గొప్ప రచనలని పరిచయం చేయాలని విన్నపం.

    కారంత్ గారిదే మరో ప్రసిద్ధ నవల ‘చోమన దుడి’ ( Choma’s Drum. For Choma, the untouchable, the only way to express his inner most feelings, anguish, anger, joy or sadness is through his drum. The drum represents his vocal output, which is curbed by his social stature being an untouchable. )

    లోకాన్ని విడిచి వెళ్ళేలోగా ఈ లోకాన్ని ఎంతో కొంత సుందరంగా మార్చాలన్నది నా ఉద్దేశ్యం అన్నారు శివరామ కారంత్.

    ప్రతి మనిషి తన జీవిత ప్రయాణంలో ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకుని, బ్రతుకు లెక్కాచారాన్ని సరిజూసుకో. నీ జీవితంలో ఈ సమాజాన్నుంచి, నీ తోటి వారినుంచి నువ్వు తీసుకున్నదెంత? నువ్వు వారికి ఇచ్చింది ఎంత? అని సరి చూసుకోమన్నారు శివరామ కారంత్.

మీ మాటలు

*