కథలకు ఒక ఇల్లూ ఒక కుటుంబం!

katha3

 

– జగద్ధాత్రి

~

 

కథానిలయం గురించి అన్నీ  అందమైన జ్ఞాపకాలే!

అసలు కమ్మని జ్ఞాపకాలు కాక కథానిలయం గురించి ఏముంటాయి చెప్పండి. ఇది తెలుగు రచయితలను పాఠకులను కథా నిలయం ఎరిగిన ప్రతి వారూ రాయగలరు, ఎన్నెన్నో చెప్పగలరు. పద్ధెనిమిది  సంవత్సరాలనుండి ఫిబ్రవరి రెండవ శని ఆదివారాలలో కథా నిలయం శ్రీకాకుళo వెళ్ళడం ఒక ఆనవాయితీగా తెలుగు సాహిత్య ప్రేమికులందరికీ అలవాటే. నాకున్న అనుభూతులను కొన్ని మీతో ముచ్చటించుకుంటాను.

కథానిలయం వార్షికోత్సవం అంతే అందరూ కలుసుకునే ఒక పెద్ద పండుగ. అసలీ జ్ఞాపకాలను ఎక్కడనుండి మొదలుపెట్టను? కథా నిలయానికి ఎప్పుడు వెళ్లినా కొంగు నిండా బోలెడు అందమైన జ్ఞాపకాలను కట్టి తెచ్చుకుంటూనే ఉంటాను.

 

ముందు కథా నిలయం వార్షికోత్సవాలా జ్ఞాపకాల పూలు కాసిన్ని మీకోసం….

విరసం రచయిత అర్నాద్ కి “రావిశాస్త్రి” పురస్కారం ఇవ్వడం, ఆ వేడుక లో రచయితను గూర్చి ప్రసంగించడానికి రామతీర్థని ఆహ్వానించారు. ఇది 2004 అనుకుంటాను. ముందు రోజు మధ్యాహ్నం నుండి వచ్చిన వారందరివీ పరస్పర పరిచయాలు, కొన్ని ప్రసంగాలు అన్నీ అవుతాయి అని అందరికీ తెలిసిందే కదా. అబ్బా అందరినీ కలుసుకోవడం ఎంత సరదా , మా నాయుడు బావులందరూ, మా ఉత్తరాంధ్ర ‘బుదడు’ ఛాయారాజ్, కవన శర్మగారు, ఇలా ఎంతమందినో పేరు పేరునా చెప్పలేను కానీ ఎన్నెన్ని హాస్యాలు కబుర్లు. మరుసటి రోజు కార్యక్రమం అయ్యాక భోజనం . నీళ్ళు పేకెట్లు ఇచ్చారు. అప్పుడే గౌరునాయుడు బావు ‘నదిని దానం చేశాక’ కవితా సంపుటి ప్రచురించాడు. ‘ఏటి బావు నదిని దానం సెసీసినావనేటి నీళ్ళ పేకెట్టిచ్చినావు’ అని నేను అల్లరిగా అంటే అవును తల్లే మరి నదిని దానం సెసీసినామ్ కావా అని నవ్వుతూ గౌరునాయుడు బావు సమాధానం చెప్పడం. ఛాయారాజ్ గారు తో కాస్త పొగ బండిని తగ్గించండి సారూ అని ఆప్యాయంగా మందలింపుగా అంటే ‘అదే మరి కొంచం కష్టం అవుతోంది’ అని ఆయన సమాధానం.

బావూ తెల్ల మిరియం బావు(అది రామతీర్థ తొలి కవితా సంపుటి) ఇరగదీసీసినావు అంటూ హాస్యవల్లరి వెదజల్లిన మా చింతా అప్పల్నాయుడు బావు.

మరో ఏడాది నేను , రామ తీర్థ, స్వామి గారు వెళ్ళాం. ముందు రోజు కారా దంపతులకు అభినందన సత్కారం మాస్టారికి ముందు చెప్పకుండా ఏర్పాటు చేసేరు. అప్పుడే ఆయనకేదో పురస్కారం వచ్చింది. బహుశా తెలుగు విశ్వవిద్యాలయం వారిది అనుకుంటాను. నేను రామినాయుడు కలిసి మాస్టారికి అమ్మ కి పూల దండ వేయడం ఒక అందమైన జ్ఞాపకం. తన సాహితీ జీవనం సాఫల్యంగా సాగడానికి కారణం సంసారానికి తాను కెప్టెన్ గా తన గృహిణి నడపడమే అని అర్ధాంగిని గూర్చి ఆర్ద్రంగా చెప్పేరు మాస్టారు. ఆయనకి తనకు సాధ్యమైన సహాయం చేయడమే ఆయనని రాసుకోనివ్వడమే తప్ప తాను చేసినదింకేమీ లేదని వినమ్రంగా చెప్పిన ఆ సాహితీ మూర్తి అర్ధాంగి సీత మహాలక్ష్మి వినయానికి మేమందరము ఆశ్చర్యానందం చెందేము.

అప్పుడే రచన శాయి గారిని, రఘోత్తమరెడ్డి గారిని చూడటం జరిగింది. అక్షర వాచస్పతులందరి హాస్యాల విరి జల్లుల్లో తడుస్తూ మురుస్తూ ఎన్నెన్ని మాటలో!

katha1

2013 కథానిలయం స్వీట్ సిక్స్టీన్  వార్షికోత్సవం లో సాహితి మిత్రురాలు డాక్టర్ అయ్యగారి సీతారత్నం పుస్తకం “కూరాకుల మడి” ని వోల్గా అరవయ్యవ జన్మదినోత్సవానికి కానుకగా ఆమెకు అంకితమిస్తూ మాస్టారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని కథా నిలయం లో ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది. కథానిలయం లో ప్రేక్షకురాలిగా కాక ప్రసంగం చేసే అవకాశం అంది పుచ్చీసుకున్నాను ఆ రోజు.

ఆ రోజే ఎప్పుడూ కథల పుస్తకాలు తప్ప ఆవిష్కరించని కథానిలయం లో మాష్టారి చేతుల మీదుగా కుమార వర్మ కవితా సంపుటి ‘రెప్పల వంతెన’ ఆవిష్కరణ కూడా జరిగింది. ఆ రోజే మాస్టారి తమ్ముడు కీ.శే. కృష్ణా రావు గారి కవితా సంపుటిని కూడా ఆవిష్కరించారు. తన తమ్ముడే గనుక కుటుంబ బాధ్యతను స్వీకరించి తనకు స్వేచ్ఛనివ్వక పోతే తాను ఇంత రచన చేయగలిగేవాడిని కాను అని మాస్టారు ఎంతో ప్రేమగా తన జ్ఞాపకాలను మాతో పంచుకున్నారు. ఆయన కళ్లలోని తడిని చూసి మా అందరి గుండెలూ చెమ్మగిల్లాయి.  మరుసటి రోజు సతీష్ చందర్ , నండూరి రాజగోపాల్ అతిథులుగా వార్షికోత్సవ ప్రసంగాలు సాగాయి. ఇవి కొన్ని వార్షికోత్సవ ముచ్చట్లైతే ఇక మామూలుగా ఎన్నో సార్లు కథా నిలయం కి వెళ్ళడం , ఎవరైనా ఆత్మీయ మిత్రులు వచ్చినప్పుడు తీసుకెళ్ళడం పరిపాటి.

అలా ఈ మధ్య వచ్చిన ఖమ్మం మిత్రులు , మువ్వా శ్రీనివాసరావు, సీతారాం,ఆనందాచారి , కపిల రామ్ కుమార్ , ప్రసాద మూర్తి, అందరం కలిసి మాస్టారిని చూడటానికి వెళ్ళడం ఒక మరుపు రాని అనుభూతి. అక్కడ మా అప్పల్నాయుడు బావు , రామారావు నాయుడు గారు , అందరం కలుసుకుని మాస్టారికి నేను , సీతారాం, మువ్వ శ్రీనివాసరావు మా పుస్తకాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాం. అందరం కలిసి ఆ మధుర క్షణాలని మా కెమెరాల్లో బంధించి తెచ్చుకుని అపురూపంగా దాచుకున్నాం.

మాస్టారు భలే మాటన్నారు ఆరోజు. చెప్తా వినండి. మాస్టారు తొంభయ్యవ పుట్టినరోజు నాడే చెప్పేరు నన్ను ఇంకెక్కడికీ పిలవకండి శరీరం సహకరించడం లేదు రాలేను అని. అయినా పిలిస్తే  నాకెంత కష్టమవుతుందో మీకు తెలీదు. ఈసారి నన్ను బలవంత పెట్టారా మీ అందరికీ పూర్ణాయుష్షు దీవించేయ్గలను అని బెదిరించారు. అదేంటి మాస్టారు అంటే పూర్ణాయుష్షు అంటే 120 సంవత్సరాలు వృద్ధాప్యం లో ఎక్కడికైనా వెళ్లాలంటే ఎంత కష్టమో మీకు తెలిసొస్తుంది అప్పుడు అన్నారు. హాయిగా నవ్వేశాం అందరం.

ఈ మధ్యనే సాహితీ స్రవంతి వారి కార్యక్రమంలో మాస్టారిని మళ్ళీ దర్శించుకున్నాం. ఆయన ఆనంద భాష్పాలను చూసాము. శివారెడ్డి గారు, తెలకపల్లి రవి గారు అందరూ వేదిక మీద ఉండటం ఆరోజు విశేషం.

ఇక అన్నిటికంటే అపురూపమైన జ్ఞాపకం మీతో చెప్తాను ఇప్పుడు ఇది అందుకే చివరికి పెట్టాను.

2013 ‘తొంభాయిల్లోకి మన కారా’ ఒక పెద్ద సాహిత్య కార్యక్రమం తలపెట్టింది విశాఖలో మోజాయిక్. నవంబర్ 9 న మాస్టారు జన్మ దినోత్సవం నాడు చాలా మంది రచయితలతో , చాగంటి తులసి గారు మాస్టారు, ఏం ఎల్ సి శర్మ గారు ఇంకా అందరం ఒక వందమందిమీ కలిసి మా అందరి నడుమ గులాబీ దండతో కూర్చున్నతొంభై యేళ్ళ నవ యవ్వనుడు మాస్టారితో గ్రూప్ ఫోటో తీయించుకున్నాం. అది మా అందరికీ ఒక మధురస్మృతి.

సరే ఇంతకీ నే చెప్పొచ్చేది ఇది కూడా కాదు ఇంకా ఆనందమైన విషయమేమిటంటే ఆ కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు నేను రామతీర్థ మాస్టారిని కలుసుకుని ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి తీసుకుని కథా నిలయానికి వెళ్ళాం. మన తెలుగు వారి అదృష్టం కొద్దీ అప్పుడు మన శ్రీరామచంద్ర మూర్తి గారు హెచ్ ఏం టీవి లో ఉన్నారు. వారు వారి కెమెరా బృందాన్ని ఆ ఇంటర్వ్యూ మొత్తం చిత్రీకరించమని పంపించారు. ఇక ఆ రోజు చూడాలి మా ఆనందం. వెళ్ళేసరికి పదకొండున్నరైంది. మాస్టారు, వారి అబ్బాయి సుబ్బారావుగారు, వివిన మూర్తి గారు కూడా ఉన్నారు. ఆరోజు నిజంగా మా జీవితాల్లోనే కాదు తెలుగు సాహితీ చరిత్రలోనే మధురాతి మధురమైన స్మృతులుగా రాబోవు తరాలకు శాశ్వతీకరించగలిగే అదృష్టం మాకు కలిగింది. దాదాపు మూడు గంటల పాటు మాస్టారు మాతో మటాడేరు, భోజనానికి కూడా వెళ్లలేదు. మొత్తం ఇంటర్వ్యూ పూర్తయ్యే వరకు కదలలేదు.  ఆయన జీవిత, సాహిత్య విషయాలు ఎన్నెన్నో మాకు చెప్పేరు. రామతీర్థ నేను వేసిన ప్రశ్నలన్నిటికీ ఎంతో ఓపికగా హుషారుగా సమాధానాలు చెప్పేరు.

katha2మీ తొలి నాటి కథల్లో ‘రేవతి నుంచి’ అని ఉత్తరాల రూపం లో సీత అనే అమ్మాయికి రాసినట్టుగా కథలు ఉంటాయి కదా ఆ ఏడాదే మీ పెళ్లి సీతామహాలక్ష్మి గారితో అయింది కదా అయితే ఈ కథ అంతకు ముందే ప్రచురితమైంది అంటే మీకు అప్పటికే సీత గారు తెలుసా అన్న రామతీర్థ చిలిపి ప్రశ్నకు చూడాలి మాస్టారి మొహం లో నవ్వు. పేరు తెలుసు బాబు అప్పటికి అంటూ సమాధానం చెప్పేరు. రేవతి అన్నది తన జన్మ నక్షత్రమని ఆ పేరునే తన కలం పేరుగా వాడుదామా అని కూడా ఆలోచన ఉండేదని కూడా చెప్పేరు. ఈ ఇంటర్వ్యూని మొత్తం రామతీర్థ అక్షరీకరించి 2014 కారా తొంభయొకటవ జన్మదినాన సాక్షి లో ప్రచురించారు.   ఎప్పుడు సీతామహాలక్ష్మి గారి గురించి ప్రసక్తి వచ్చినా మా గృహిణి అనడమే తప్ప పేరు పెట్టి కూడా ప్రస్తావించని మహానుభావుడు.

తన జీవితం లోని చాలా ముఖ్యమైన సంగతులు , తన రచనా లోకం గురించి ఎన్నో మూచ్చట్లు చెప్పారు మాస్టారు. ఆ కార్యక్రమం నుండి కొంత ముఖ్యమైన భాగాన్ని “90 ఏళ్ల కుర్రాడు కారా’ పేరిట హెచ్ ఏం టి వి లో న్వంబర్ 9 నా కారా పుట్టినరోజు నాడు ప్రసారం చేసేరు. తాను రాసిన ఒక్కో కథకు గల నేపథ్యాన్ని రాయాలని ఉందని, దేహం సహకరించక రాయలేకపోతున్నాను అని చెప్పేరు. ఒక పెద్ద నవల రాయాలని ఉన్నదని కూడా చెప్పేరు. ఆత్మ కథ రాసే ఉద్దేశం ఉందా మాస్టారూ అని అడిగితే దానిలో ఏదైనా సమాజానికి ఉపయోగ పడేది ఉంటే తప్ప ఆత్మ కథ రాయాల్సిన అవసరం లేదు అన్నది తన నమ్మకం అని స్పష్టంగా చెప్పేరు. సాహిత్యం ముఖ్యంగా కథలు సమాజం లో చైతన్యాన్ని తీసుకొస్తాయని సంపూర్ణంగా నమ్ముతాను అని చెప్పేరు.  ప్రపంచం లో ఎక్కడా ఒక సాహిత్య ప్రక్రియ కు ఒక నిలయం అంటూ లేదు ఇప్పటివరకు అలాంటి గొప్పతనం మన కథా నిలయానికే ఉంది అనడానికి మన తెలుగు వారందరూ గర్వించాలి. తెలుగులో ప్రచురితమైన ప్రతి కథా కథానిలయం లో చోటు చేసుకుంటుంది.

తనకు నచ్చిన తాను గురువులుగా భావించే గురజాడ, కొడవటిగంటి కుటుంబరావు, రావి శాస్త్రి ల పెద్ద చిత్రపటాల సాక్షిగా కథానిలయం లో మాస్టారితో బాటు కూర్చుని ఆయన చెబుతున్న జీవిత సాహిత్య విశేషాలను తెలుసుకోవడం నా జీవితం లో సాటి లేని మధురానుభూతి. మన తెలుగు సాహిత్యం ఆంగ్లం లోకి తీసుకెళ్ళండి బాబు అందుకు కృషి చేయండి అని చెప్పేరు. తన రచనలను వ్యాసాలను ఏది సమాజానికి ఉపయోగిస్తుందో అవి అన్నీ అందరికీ ఇతర భాషల్లోకి, ముఖ్యంగా ఆంగ్లం లోకి వెళ్లాలని అది ఒక లక్ష్యంగా పెట్టుకుని మీరిద్దరు చేయాలని నాకు రామతీర్థ కి నవంబర్ 9, 2014 న చెప్పేరు. సాహిత్యమే లేకుంటే తన జీవితం శూన్యమని, ఎటువంటి కష్టాన్నైనా మరిపించగలది పుస్తకమేనని అందుకే ఒక కన్ను కనిపించక పోయినా ఇప్పటికీ రోజుకి ఐదారు గంటలు చదువుతానని చెప్పేరు కారా.

అంతటి సాహితీ మూర్తి తో శాశ్వతంగా ఒక చిత్రం లో ఉండగలగడం అదృష్టమన్న పదానికన్న మించినదేదో అయి ఉండాలి అన్నది నా భావన.

ఏదో అక్కడక్కడ దొరికినవి ఏరుకున్న నాలుగు పొగడ పూల లాంటి మాటలు చెప్పేనేమో ఇంకా చెప్పాలంటే బోలెడున్నాయి. ఎంత చెప్పినా తక్కువే. ఇలా నాకే కాదు అందరికీ ఉంటాయి అన్నది నిజం. ఇలా అందరం కలిసి రాసిన ఈ మధురానుభూతులన్నీ ఒక దరికి చేరిస్తే ఇదో పెద్ద పుస్తకమౌతుంది అనడం లో సందేహమే లేదు. కథా నిలయం వార్షికోత్సవం మళ్ళీ వచ్చింది పండుగ వచ్చిందోయ్ మాకు అన్నట్టు ఈ ఫిబ్రవరి లో కూడా ప్రతి ఏడు లాగే వార్షికోత్సవం జరుపుకుంటున్న కథా నిలయానికి , ఆ కథా నిలయ సంస్థాపకులు ఫీల్డ్ మార్షల్ కారా మాస్టారికి మనస్ఫూర్తిగా నమస్కారం!

*

 

 

మీ మాటలు

  1. Soma Sekhara Rao Markonda says:

    రచన పత్రికలో కధ నిలయం గురించి చదివి, చదివి…. కారా మాస్టారు గారి గురించి తెలుసుకుని, ఎప్పటి నుండో చూడాలని అనుకుంటున్న కారా మాస్టారు గారిని, కధానిలయంని, కధానిలయం వార్షికోత్సవం రోజే చూడటం జరిగింది . కధ కు మాస్టారు గారు చేస్తున్న సేవ ఎనలేనిది.

మీ మాటలు

*