పర్సనల్ లెటర్ టు…  

                                                                                            -బమ్మిడి జగదీశ్వరరావు

~

 

కమలనాథులారా! కలవర పడకండి..!

రాముడున్నాడు! రాజ్యమున్నాది! తొమ్మిది తలలు రాలాయి! యిప్పుడు పదో తల! యిది వొక్క హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయపు లెక్క! రాజ్యానికి యెదురు తిరిగితే తలలు తెగక తప్పదు పక్కా! హిందూత్వమే మన హుక్కా! తాగండి గుక్కా గుక్కా!

అయ్యో రామ.. అదరవద్దు.. బెదరవద్దు.. ఈ మాత్రము దానికే రాజ్యాన్ని కోల్పోతామా? రాజ్యం వీరభోజ్యమే కాదు.. రక్తభోజ్యం కూడా! మసీదుని కూలగొట్టినా మళ్ళీ అధికారంలోకి వచ్చిన వాళ్ళం.. స్టూడెంట్స్ యెంత? వారి బలమెంత? బలగమెంత? మన సైన్యమెంత? పోలీసులూ.. పారామిలటరీ బలగాలూ.. స్మోక్ ఫైర్లూ.. వాటర్ ఫైర్లూ.. గన్ ఫైర్లూ.. రబ్బర్ బుల్లెట్ ఫైర్లూ.. బార్బుడ్ వైర్లూ.. లాఠీచార్జీలూ.. హౌస్ అరెస్టులూ.. వన్ఫార్టీఫోర్ సెక్షన్లూ.. నిబంధనలూ.. నిషేధాజ్నలూ.. అత్యవసర పరిస్థితులూ.. అదుపు చేయుట అదెంత స్వల్ప పని? అల్ప పని? అణచివేతలతోనైనా రాజ్యాన్ని అదుపులో వుంచుకోవాలని మహానుభావుడు మాకీయవెల్లి చెప్పనే చెప్పాడు! అంచేత అదుపే మదుపు! మనశాంతీ మన భద్రతే.. దేశానికి శాంతి భద్రతలని యిచ్చును!

రాజ్యాంగము రాసిన అంబేద్కర్ దివంగతుడు గనుక మనము గౌరవించగలం గాని అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మి‘వున్న’ వాళ్ళను గౌరవించలేము. అటువంటి విద్యార్థులతో ఘర్షణ తప్పదు! ఘర్షణ కూడా అనేకవిధములు! అయితే సిద్ధాంత సంఘర్షణ ప్రజాస్వామికమైనదిగా గుర్తించాలి!

రోహిత్ వేముల ఆత్మహత్య అత్యంత విచారకరమే! కాని.. నిన్న పొతే రేపటికి మూడు రోజులు! మర్నాటికి.. నాలుగు రోజులకి జనం అంతా మర్చిపోతారు! ప్రజల జ్ఞాపకశక్తి మీద నాకు అపార నమ్మకమూ.. అపురూప విస్వాశామూనూ..

చచ్చిన వాడు వొచ్చి సాక్ష్యం చెపుతాడా? చెప్పినా యెవరికి చెప్పాలి? మనకే చెప్పాలి! వేదనలూ నివేదనలూ యెవరికి నివేదించాలి? మనకే నివేదించాలి! ఎంక్వయిరీలు చేసినా రిపోర్టులు యిచ్చినా యెవరికి యివ్వాలి? మనకే యివ్వాలి! ద్వి సభ్య కమిటీలయినా.. ఏక సభ్య కమిటీలయినా.. దాని సమగ్ర పరిశోధనలయినా యెవరికి సమర్పించాలి? మనకే సమర్పించాలి! విచారం వ్యక్తం చేసేదీ మనమే! విచారణ జరిపేదీ మనమే!

గీత యేమి చెప్పింది? ‘చేసేది నేనే.. చేయించేదీ నేనే.. అంతా నేనే!’ అని చెప్పిందా లేదా? నేనుకు బహువచనమే మనం! ఆవిధంగా హత్య చేసేది మనమే! శిక్షలు వేసేదీ మనమే! నేరము చేసేది మనమే! తీర్పులిచ్చేదీ మనమే! అన్యాయము చేసేది మనమే! న్యాయం చెప్పేదీ మనమే! సమస్య సృష్టించేది మనమే! సమస్య పరిష్కరించేదీ మనమే! పనీష్మెంట్ యిచ్చేది మనమే! కాంపన్సేషన్ యిచ్చేదీ మనమే!

మరి మేథావుల మాటంటారా? మనం గుర్తించిన వాళ్ళే మేథావులు! అందరినీ మేథావులుగా గుర్తించవలసిన పని యెంత మాత్రమూ లేదు! మన మేథావులను మనమే తయారు చేసుకొనవలెను! తర్ఫీదు యివ్వవలెను! మనమే సర్టిఫికేట్లు యిచ్చి గుర్తించవలెను! కొంత మందిని లోకం గుర్తిస్తుంది! వారికి కుడి చేతికి యెడమ చేతికి తేడా తెలియదు! అనివార్యమై మేథావులుగా గుర్తించిన వారి గురించి చింతించి ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు! అటువంటివారి చిన్న మెదడు యేనాడో చిదిగిపోయినది! మీడియాకు వారి మెదళ్ళు అనుసంధించబడినవి! వారి సంధింపులూ స్పందనలూ అన్నీ కూడా మీడియా ఆన్ చేస్తే ఆన్ అయి- ఆఫ్ చేస్తే ఆఫ్ అగును! మనము మీడియాను మేనేజు చేసిన చాలును.. నిప్పు కూడా నీరగును! నీరు గూడా ప్రవహింపక గడ్డకట్టును!

అసలు ఆంగ్ల మీడియా ఆగమాగమవబట్టి మన తెలుగు మీడియా తేరిపార వొకసారి చూసింది గాని లేకపోతే యెక్కడ యెలా ప్రవర్తించాలో దానికి మా బాగా తెలుసును!

మీడియాను పెట్టుబడిగా చూడుము. పెట్టుబడిని మార్కెట్ గా చూడుము. మార్కెట్టూ మతమూ వేరు వేరు కావు! వాటికి పేచీ లేదు. సర్దుబాటూ ప్రోత్సాహమూ తప్ప! నిజానికి మతమూ మార్కెట్టూ కవల పిల్లలవంటివి! ఒకదానినొకటి యిబ్బంది పెట్టుకోవు. మార్కెట్ మతాన్ని గౌరవిస్తుంది! మతం మార్కెట్టుని గౌరవిస్తుంది! మనము మతము పట్ల భక్తీ మార్కెట్ పట్ల గౌరవమూ కలిగి వుండాలి!

అందుకనే న్యూ ఎకనామిక్ ఎరలో తొంభైల తర్వాత అన్ని విద్యార్ధి సంఘాలూ తోకలు ముడిచి పారిపోయినవి! మతమూ మార్కెట్టూ కలిసివుండడం వల్ల అన్ని విద్యార్ధి సంఘాలూ దాదాపు అంతరార్ధమైనప్పటికీ ఏబీవీపీ వొక్కటే నిలిచి వెలుగుతోంది.. భారత ఖండం వెలిగినట్టు! ఇంతకు మునుపు మన అగ్రవర్ణ కులాలే మనల్ని యిబ్బంది పెట్టేవారు, విద్యార్థి సంఘాల్లో చేరి. ఎప్పుడైతే కెరియర్ వోరియంటేషన్ పెరిగిందో ఈ రాజకీయాల వైపు చూడడం మానేసి యెంచక్కా అమెరికా వైపు చూడడం మొదలుపెట్టారు! అలా వొచ్చిందే అమీర్ పేట టు అమెరికా థియరీ. సో యిప్పుడు ప్లెయిన్ గా వొపెన్ గా శత్రువు కనిపిస్తున్నాడు. మిలట్రీ థియరీ ప్రకారం పొదలు కొట్టేస్తే శత్రువు విజిబుల్ గా కనిపిస్తాడు.. కనిపిస్తున్నాడు! ఆలయాల్లోకి వొచ్చినట్టుగానే.. అంబేద్కర్ పేరు చెప్పి విశ్వవిద్యాలయాల్లోకి వొచ్చేసారు అలగా జనం. ఈ అలగా జనం తిరగబడతారు.  కాని వాళ్లకి శక్తి చాలదు! నిలబడడానికి నీడ లేదు! వెన్ను లేదు! దన్ను లేదు! సో.. వాళ్ళే యిలా వురిపోసుకుంటారు!

రోహిత్ వురి ఆది కాదు,  అంతమూ కాదు! మన పాలనకు ఆటంకమూ కాదు! అదొక సహజ అనివార్య పరిణామమే, కాని అందులోనూ మన హిందూ మతమ్మీద కుట్ర దాక్కొనివుంది! కుట్రలు వేయి విధములుగా యెటుల పనిచేయు చున్నవో రోహిత్ సంఘటన బయటపెట్టినది! జాగృతిగ మెలగమని మనకొక అవకాశం యిచ్చు చున్నది!

రాముడికే తప్పలేదు కష్టాలు! రామ రాజ్య స్థాపనలో కొన్ని కష్టాలు తప్పవు! నష్టమేమీ లేదు.. వున్నా పూడ్చుకుందాం! ఆపైన రాముడున్నాడు! రాజ్యమున్నాది!

యూనివర్సిటీలు మనకు పట్టు కొమ్మలు. ఆలోచనలకు ఆయువు పట్టులు. పాగా వెయ్యగలిగితేనే ప్రజల్లో వారి ఆలోచనల్లో భాగం కాగలం. భావాలు బహు ముఖ్యమైనవి! హిందూ మనో భావాలు మరీ ముఖ్యమైనవి! ఈ దేశమ్మీద.. దేవుడి మీద మనదే పేటెంటు! మనమే దేశ భక్తులం! ఇంకెవరునూ యెట్టి పరిస్థితుల్లోనూ దేశభక్తులు కాజాలరు గాక కాజాలరు!

ఏబీవీపీ మనది. మన యువతరానిది. మన విద్యార్థి నాయకుడు సుశీల్ మన బీజేవైఎం సభ్యుడైన విష్ణుదత్తు తమ్ముడు.  మన కేడరును మనం కాపాడుకొననిచో దేశాన్ని యెటుల కాపాడుకొనగలము? అందుకు మన ఎమ్మెల్సీ రాంచందర్ రావు పోలీసులకు రిపోర్టు చేసినా- యూనివర్సిటీ క్రమశిక్షణా సంఘం మీద వొత్తిడి తెచ్చినా యూనివర్సిటీలో బలప్రదర్శన చేసినా- కోర్టులకు తెలిపినా- ఫలితం వెంటనే లేకపోయింది. యూనివర్సిటీలో మన విద్యార్థి సంఘం గెలవక అధికారం కోల్పోయింది. ఏయస్ఏ వాళ్ళని అదుపుచేయుటకు తప్పలేదు. పైగా వారు తీవ్రవాదులు. ఉగ్రవాదులు. యాకూబ్ మెమన్ని వురి తీస్తే ఖండించారు. మెమన్ కు అనుకూలంగా మాట్లాడారు. అంచేత మన మంత్రి  మన దత్తాత్రేయగారు.. మన మానవ వనరుల మంత్రిత్వ శాఖా మంత్రి స్మృతి ఇరానికి లేఖల మీద లేఖలు దంచినారు. ప్రభుత్వ పనుల్లో అలసత్వము వుంటుంది గనుక ఒకటికి మరి నాలుగు రాయవలసి వొచ్చింది! మన స్మృతి ఇరానిగారు మన హెచ్సియ్యూ వీసీగారికి లేఖల మీద లేఖలు దంచినారు! మన వీసీ పొదిలి అప్పారావుగారు దళిత విద్యార్థుల్ని దబాయించి దంచినారు. వొక్క సెమిస్టరు కాలమే వేటు వేసి రూల్స్ కు అనుగుణంగానే సంఘ బహిష్కారము చేసినారు! తప్పంటూ వుంటే రూల్స్ పెట్టిన బ్రిటీష్ వాళ్ళది తప్పు కాని, ఎప్పటిలాగే అమలు చేసిన వారిది తప్పెలా అవుతుంది?

మన విద్యార్థి నాయకుడు సకాలంలో ఆస్పెట్లైజ్ కావడం బావుంది, మనం ఆరెస్సెస్ వీహెచ్పీ బీజేపీలుగా మనం బల ప్రదర్శన జరపడం బావుంది కాని పోలీసు అధికారి ఆనంద్ అందుకు విరుద్ధంగా దాడి జరగలేదనడం బాలేదు. తగు ముందు జాగ్రత్తలు తీసుకొనవలసింది. అయినప్పటికీ మన విద్యార్థి సంఘ మిత్రులు కోర్టులో వేయడం, సోషల్ మీడియాలో వీడియోను సగం రిలీజ్ చేయడం, అలాగే వురిశిక్షల్ని వ్యతిరేకిస్తే- మెమన్ ని సపోర్ట్ చేస్తున్నారని, వొక టెర్రరిస్టు మరణిస్తే వేయిమంది టెర్రరిస్టులు పుట్టుకు వస్తారని బహుబాగా ప్రచారం చేసి ఏయస్ఏ వాళ్ళని డైలమాలో పడేయడం మన విద్యార్థుల విజయంగా గుర్తించి అభినందించవలసి వున్నది!

రోహిత్ మృతదేహంతో బంద్ చెయ్యొచ్చు గాక.. పదమూడు విద్యార్థి సంఘాలు కలిసి జాక్ గా యేర్పడి బాధ్యులని శిక్షించమని డిమాండ్ చెయ్యొచ్చు గాక.. హంగర్ స్ట్రైక్ చెయ్యొచ్చు గాక.. మన పోలీసులు భారీగా మొహరించి బలవంతంగా భగ్నం చేస్తే- మళ్ళీ మళ్ళీ హంగర్ స్ట్రైక్ చెయ్యొచ్చు గాక.. అంతకుమించి యేo చేస్తారు? ఇలానే నాలుగు నెలలు పూణే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్ట్యూట్ విద్యార్థులు గోల చేసి ధర్మరాజు ఈటె పీక్కోగలిగారా? మనం అనుకుంటే గిరీష్కర్నాడ్, ఆదూరి గోపాలక్రిష్ణన్, యూఆర్ అనంతమూర్తి, శ్యామ్ బెనగల్ పక్కన మన మేథావి గజేంద్ర చౌహాన్ని కూర్చోపెట్టగలం.. వాళ్ళు పీట లాగలేరు, పీఠం కదల్చలేరు! మద్రాస్ ఐఐటి డైరెక్టర్ని మర్చిపోయారా? ఢిల్లీ యూనివర్సిటీ మనకాదర్శం! రామ మందిర నిర్మాణానికి అరుంధతీ వాశిష్ట అనుసంధాన పీఠంతో రెండ్రోజుల సదస్సు జరిపారు మన విద్యార్థులు! అప్పుడూ గగ్గోలు పెట్టారు గాని ఆపగలిగారా? ఈ సమయంలో మన బలం గుర్తుచేసుకోవడం మరింత బలాన్ని యిస్తుంది..!

‘నేను రాజీనామా చేయను’ అని వీసి పొదిలి అప్పారావుగారు నిలబడ్డా తప్పని స్థితిలో తప్పించి ఆయనకు అసలు వారసుడు శ్రీవాస్తవని నియమించడంలో అప్పారావుగారిని అభినందించడం కనిపిస్తోంది. అయితే సమస్య తీవ్రత తగ్గించడానికి పెరియసామిని నియమించడాన్ని అర్థం చేసుకోవాలి! అలాగే ‘నేను లెటర్ రాయలేదు’ అని, ‘ఫార్వర్డ్ చేశా’నని, దత్తాత్రేయ మాట్లాడిన సందర్భంలో కాంగ్రేసు హనుమంతరావుగారు కూడా ముందే లెటర్లు రాసిన విషయం తగు సమయంలో బయటపెట్టి ‘యివన్నీ కామను’ అనుకొనేలా చేసిన పార్టీ శ్రేణులకు అభినందనాలు! ప్రతీ పదిహేను రోజులకు లెటర్లు రాయడం పనిలో భాగమని చెప్పి మన స్మృతి ఇరాని పనిమంతురాలని నిరూపించుకున్నారు! ఆమెకు ప్రత్యేక అభినందనాలు! రోహిత్ తల్లితో మాట్లాడడం ఇరానిగారి మాతృత్వపు మానవీయతకు పరాకాష్ట!

దేశంలో అసహనం పెచ్చరిల్లిపోతోంది. శవ రాజకీయాలకు మన ప్రధాని మోడీగారు స్పందించక పొతే కావాలని మౌనం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్కడితో ఆగక వారణాసి లఖ్ నవ్ లో ‘మోడీ ముర్దాబాద్.. మోడీ గోబ్యాక్..’ అని స్నాతకోత్సవాన్ని అడ్డుకున్నారు. సహనశీలి మోడీగారు యెంతో సహనంతో ‘కారణాలు వుండొచ్చు.. రాజకీయాలు వుండొచ్చు.. కాని భారతమాత బిడ్డను కోల్పోయింది.. తల్లి కడుపుకోతను అర్థం చేసుకోగలను..’ అన్నారు! ‘అంబేద్కర్ యెవరి మీదా ఆరోపణలు, పిర్యాదులు చెయ్యలేదు’ అని కూడా దేశానికి గుర్తు చేసారు. అంబేద్కర్ని మన మోడీగారు అర్థం చేసుకున్నట్టు మరెవరూ అర్థం చేసుకోలేదు! అంబేడ్కర్ని మన మోడీగారు సొంతం చేసుకున్నట్టు మరెవరూ సొంతం చేసుకోలేదు!

సంతాపము తెలిపి సహనం వహించవలసిన యీ సమయంలో యింత అసహనం వహించడం వెనుక రాజకీయ కుట్ర కలదు, ప్రతిపక్ష కాంగ్రేసు వామపక్ష నాయకులందరూ హెచ్సియ్యూ క్యూ కట్టుటలో వింత లేదు, విశేషము లేదు! అలా అయితే మునుపు తొమ్మిది మంది ప్రాణాలు తీసుకున్నప్పుడు యెందుకు రాలేదు? అని తిరిగి ప్రశ్నిచడంలో మనం కృతకృత్యులమయ్యాం! ‘రాహుల్ గో బ్యాక్’ ‘సేవ్ హెచ్సియ్యూ’ నినాదాలతో ప్రతిమండలంలో రాస్తారోకో జరపడం, దిష్టి బొమ్మలు దగ్ధం చెయ్యడం బహు ప్రశంసనీయం! ‘మీ ఎంపీ రాజయ్య దళితుడే, వాళ్ళింట్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాలేదేమి?’ లాజిక్కుల మేజిక్కులు అత్యంత ఆకర్షణీయం! మరోవేపు మన వెంకయ్య, నితిన్ గడ్కరీ, మహేశ్శర్మ, వీరేందర్ సింగ్ నోటికి వొచ్చింది మాట్లాడడం మరింత వుత్సాహాన్ని నింపుతున్నది!

దళితుల మీద దాడుల్ని తిప్పి కొట్టాం! ఎందుకంటే రోహిత్ దళితుడు కాదు! బీసీ వడ్డెర కులానికి చెందినవాడని నిరూపించాం! వాళ్ళ తండ్రి మణికుమార్ తో కూడా చెప్పించాం! తండ్రిని కన్న తల్లే చెప్పింది వడ్డెరని! తల్లి తను మాల కులస్తురాలినని చెప్తోంది, చెల్లదు. భర్త యింటి పేరే భార్య తన యింటి పేరుగా మార్చుకుంటుంది భారతీయ స్త్రీ! మరి తన కులాన్ని వొదిలి భర్త కులాన్ని స్వీకరించలేదా? విడిపోతే మాత్రం ఆమె బిడ్డలకి తండ్రి కాకుండా పోతాడా? రోహిత్ కులం గురించి జనంలోకి బాగానే తీసుకెళ్ళాం! భేష్!

రోహిత్ రెండుసార్లు జేఆర్ఎఫ్ పాసు అయ్యి ఫెలోషిప్ తెచ్చుకుంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లే నమ్మలే. ‘పేపర్ అంత యీజీగా వుందా?’ అని అడిగారు. రోహిత్ యిచ్చిన స్వీట్స్ కూడా తీసుకోలేదు. రాంక్ తెచ్చుకొని పీహెచ్డీ జాయినయినా అతను దళితుడను అని అంటున్నాడు కాబట్టి రిజర్వేషన్ మీద జాయిన్ అయ్యాడని జనం కూడా నమ్ముతున్నారు. అంచేత- తిన్నది అరక్క వొళ్ళు కొవ్వెక్కి సూసైడ్ చేసుకున్నాడని- సులువుగానే ప్రజలు అర్థం చేసుకోవడం మనకు కలిసొచ్చే విషయం! ప్రజలు చాలా గొప్పవాళ్ళు! మనం యెలా నేర్పితే అలానే ఆలోచిస్తారు!

అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్లో గొడవలవల్లే రోహిత్ చనిపోయాడని మన విద్యార్థులు మాట్లాడడం చూస్తుంటే భావి నాయకత్వ పటిమ అపురూపంగానూ అపూర్వంగానూ కనిపిస్తోంది! అలాగే పఠాన్ కోట్ ను ప్రస్తావించడం వల్ల ఏకకాలంలో మన దేశభక్తిని చెప్పడమేకాక మన ప్రత్యర్థుల నోళ్ళు మూయించగలిగాం!

సమయానికి మున్సిపల్ ఎన్నికలు తెరమీదికి రావడం.. ఫలితాలూ పట్టాభిషేకాలూ.. జంపు జిలానీలూ.. తెలంగాణలో తుడుచుపెట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ.. పిడకలవేటలా తుని బల ప్రదర్శనా.. కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షా.. రైలుకు పెట్టిన నిప్పూ.. నీరుగార్చి- పాత వార్తా పచ్చళ్ళు పక్కనపెట్టి – తాజావార్తలకు మీడియా తల తిప్పడంతో ‘రోహిత్ యెవరు?’ అనే పరిస్థితి రాముని దయవల్ల రానున్నది.. అందుకే అన్నది.. రాముడున్నాడు.. రాజ్యమున్నాది..!

విద్యార్థుల సస్పెన్షన్ భేషరతుగా కాకపోయినా కండిషనల్ గా యెత్తేసాం! యెనిమిది లక్షల ఎక్సుగ్రేషియా వద్దన్నా ప్రకటించేసాం! హాయిగా తిరిగి రమ్మని వీసీని సెలవులో పంపేసాం! కేంద్ర మంత్రుల ప్రమేయం లేదని తేల్చి చెప్పేసాం! రేపు ప్రభుత్వం వేసిన కమిటీలతో యివే రిపోర్టులు అధికారికంగా యిప్పించేస్తాం! ఫెలోషిప్ పెండింగ్ తో కలిపి మరీ యిచ్చేద్దాం! పుష్పగుచ్చాలు పంచేద్దాం! పావురాలను పట్టి యెగరేద్దాం! ఓం శాంతి శాంతి హి!

అంతే! ఖేల్ ఖతం! దుకాణం బంద్!

రాముడున్నాడు! రాజ్యమున్నాది!

వీర కమలనాథులకు

ప్రేమతో-

మీ

శూర కమలనాథుడు!

మీ మాటలు

  1. బమ్మిడీ.. నీదైన నిప్పురవ్వ శైలిలో రోహిత్ ఇష్యూపై ఆధిపత్య వర్గాలు, మీడియా ప్రవర్తిస్తున్న తీరును ఎంత వ్యంగ్యంగా, ఎంత బలంగా చెప్పావ్! అవును ‘రాముడున్నాడు.. రాజ్యమున్నాది’. రోహిత్ ఎవరని ఇప్పటికే అడుగుతున్నారు జనం. సాహిత్యంతో సంబంధంలేని ఓ బీసీ స్నేహితుడు, సాహిత్యంపై అభిరుచి ఉన్న ఓ బీసీ స్నేహితురాలు రోహిత్ వ్యవహారంలో అతనికి వ్యతిరేకంగా నాతో మాట్లాడటం చూశాక మన సమాజ నిజ స్థితి తెలిసి కించిత్ బాధ కలుగుతోంది.

  2. చందు తులసి says:

    రాముడున్నంత వరకూ….రాజ్యముంటాది. మరేం భయం లేదు. బమ్మిడి గారూ…సూపరండీ

  3. మీ కడుపు మంటని బాగానే వెళ్ళ గక్కేరు !

  4. A great satirical analysis.

మీ మాటలు

*