ఇది తెలిసి శారద ఆలోచనలో పడింది. . ఇంటింటికీ వెళ్ళి ఈ ప్రచారం నీచమైనదని చెప్పటం వల్ల సమయం వృధా తప్ప ప్రయోజనం ఉండదు. అందరికీ ఒకేసారి సమాధానం ఇవ్వాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలకు. ఎలా? ఎక్కడ? ఎప్పుడు. శారద ఆలోచన తీవ్రత గుర్తించినట్లు ఆ సమయం రానే వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు బహిరంగ సభ పెట్టారు. పెద్దా, చిన్నా నాయకులంతా వేదిక ఎక్కుతారని వాళ్ళు వేసిన కరపత్రం చూస్తూ తెలిసింది. శారదకు తన కర్తవ్యమేమిటో కూడా అర్థమైంది. హుషారుగా లేచింది. నవ్వుతూ వస్తున్న శారదను చూసి ప్రచారం చేయటానికి బయల్దేరుతున్న ఆడవాళ్ళంత ఆమె చుట్టూ చేరారు.
‘‘ఇవాళ సాయంత్రం మనం ఇంటింటి ప్రచారానికి వెళ్ళటం లేదోయ్. ప్రోగ్రాం మారింది’’.
‘‘ఎందుకు? ఏం మారింది? ఎక్కడ కి వెళ్తాం? ఏం చేద్దాం?’’ అందరూ కుతూహలంగా ఆత్రంగా అడిగారు.
‘‘కాంగ్రెస్ మీటింగుకోయ్’’ శారద ఉత్సాహంగా చెప్పిన మాటకు అందరూ విస్తుపోయారు.
‘‘కాంగ్రెస్ మీటింగ్కా? మనమా?’’
‘‘ఔను. మనమే. వెళ్దాం. చూద్దాం ఏం జరుగుతుందో. మీరేం కంగారు పడకండి . అంతా నే చూసుకుంటాను. మీరు సభకు వస్తే చాలు “ శారద ఏదో మంచి ఆలోచనే చేసి ఉంటుందని అందరూ నమ్మారు. ధీమాగా తమ పనులకు తాము వెళ్ళిపోయారు. సాయంత్రం ఎంత తొందరగా వెళ్దామన్నా అందరూ తెమిలే సరికి ఆలస్యం అవనే అయింది.
‘‘అవతల మీటింగు మొదలయిందోయ్ రండి’’ అంటూ శారద ముందు నడిస్తే వెనకా అందరూ గుంపుగా నడిచారు. వీళ్ళు వెళ్ళేసరికి కాంగ్రెస్ నాయకుడొకడు గొంతు చించుకుంటున్నాడు.
‘‘ఆ శారదాంబ డాక్టరు కావచ్చు. కానీ ఆమె చేసిన పనేమిటి? కాంట్రాక్టు పెళ్ళి చేసుకుంది. మనం ఎప్పుడైన విన్నామా? మన సంప్రదాయమేనా ? అసలామెకు ఏ పెళ్ళయినా ఎందుకు? బెజవాడలో ఆవిడ ఇంటికి రాణి మొగాడున్నాడా వాళ్ళ పార్టీలో? అది ఇల్లా? సానికొంపా? బెజవాడలో ఎవరినైన అడగండి చెబుతారు. బెజవాడ ఒదిలి ఇపుడు ఏలూరుని ఉద్ధరిస్తానంటుంది. ఏలూరులో కూడా ఒక సానికొంప నడపాలనుకుంటుందా?’’
వింటున్న మహిళా సంఘం వాళ్ళ రక్తాలు మరిగిపోయాయి. శారద వాళ్ళను ఒట్టి చేతుతో రావాలని ఆజ్ఞాపించింది. లేకపోతే చేతిలో కర్రలుంటే వాళ్ళు ఆ కాంగ్రెస్ నాయకుడి తల పగలగొట్టే వారే. శారద వాళ్ళ ఆగ్రహాన్ని గ్రహించినట్టు వెనక్కు తిరిగి నవ్వుతూ ‘‘వాళ్ళ మాటలకు కోపం తెచ్చుకుంటే వాళ్ళ బలం పెరుగుతుంది. నవ్వుతూ నవ్వుతూ సమాధానం చెప్పాలి. ఆ పని నే చేస్తాను. చూస్తూ ఉండండి ’’.
అంటూ వడి వడి గా నడుస్తూ వేదిక మీదికి ఎక్కేసింది. వేదిక మీది వాళ్ళంత విస్తుపోయి, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళేకే తెలియనితనంలో అందరూ లేచి నిలబడ్డారు. సభలో జనమూ నివ్వెరపోయి ఎక్కడ వాళ్ళక్కడ నిశ్శబ్దమైపోయారు.
శారద వేదిక మీది వాళ్ళను ఆజ్ఞాపిస్తున్నట్లు ‘‘కూచోండి ’’ అంది గర్జించినట్లే.
అందరూ టక్కున కుర్చీల్లో కూర్చున్నారు ఆ ఆజ్ఞకోసమే ఎదురు చూస్తున్న వాళ్ళలా.
మైకు దగ్గరి నాయకుడి ముఖంలో నెత్తురుచుక్క లేదు.
‘‘జరగండి – వెళ్ళి మీరూ కూచోండి ’’ ఆజ్ఞాపించింది శారద.
ఆయన అమ్మయ్య అనుకున్నట్లు పరుగు పరుగున వేదిక చివరనున్న తన కుర్చీలో పోయి పడ్డాడు.
‘‘కాంగ్రెస్ నాయకులను నేనొకటే ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఎన్నికల ప్రచారం కోసం సభ పెట్టారా ? శారదాంబ జీవితాన్ని గురించి ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేయటానికి సభ పెట్టాం ? మనవి వేరు వేరు పార్టీలు . వేరు వేరు ప్రణాళికలు. ఎన్నికలలో గెలిచి మనం ప్రజలకు ఏం చేస్తామో చెప్పటానికి సభలు పెట్టుకోవాలి. ప్రజల సమస్యలేమిటి, మన రాజకీయాలేమిటి అన్నది ప్రజకు వివరించాలి. కమ్యూనిస్టులతో మీకు విభేదాలెక్కడ ఉన్నాయో చెప్పండి . మీకు తప్పనిపించిన విధానాలను ఎంతైన విమర్శించండి . ఎన్నికల ప్రచారమంటే అది. ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా మీరు రేపు ప్రజలకు ఏం చేస్తారు? ఎవరెవరి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయో చూసి ప్రజలకు చెప్పుకుంటూ పోతారు? ఒక స్త్రీని గౌరవించే సంస్కారం లేదు మీకు. రాజకీయాలలోకి వచ్చిన స్త్రీలను గురించి ఇట్లా మాట్లాడి వాళ్ళను వెనక్కు నెట్టడమా మీ ఉద్దేశం. మీ పార్టీ తరపున ఒక స్త్రీ పోటీ చేస్తోంది. ఆవిడంటే గిట్టనివారు నా ఎదురుగా ఆమెను కించపరిచేమాట ఒక్కటి మాట్లాడిన నేను సహించను. వాళ్ళ నోరు మూయిస్తాను. ఆమెను నా సోదరిగా ఆలింగనం చేసుకుంటాను. కర్ణుడిని సూతపుత్రుడని అవమానించినట్లు నన్ను నా ‘‘పెళ్ళి’’ పేరుతో అవమానించదల్చుకున్న వాళ్ళకు నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను . కొత్తగా ఆవిర్భవిస్తున్న భారతదేశంలో కులాన్ని అణగదొక్కుతాం. శీలం, నీతి, అవినీతి, పెళ్ళి అయింది, కాలేదు అంటూ స్త్రీలను అవమానించేవారిని ఇంకెంతమాత్రం సహించం. మీ పాత నీతులు పనికిరావు. స్త్రీలు తమ గురించి, దేశం గురించి బాధ్యత తీసుకుంటారు. బెజవాడలో మా ఇల్లు ఆపదలో ఉన్నవారికి ఆశ్రయమిచ్చేచోటు. అది నా ఇల్లు కాదు. మీ అందరిదీ. మీరందరూ రావచ్చు. మా అమ్మ అన్నం పెడుతుంది. బెజవాడలో నా ఇల్లంటున్నారే ఆ ఇంట్లోనే కాదు. మద్రాసులో మా నాన్న రామారావు గారిల్లు ఉండేది. భారతదేశంలో పండితుందరూ వచ్చి మా అమ్మ చేతి భోజనం చేసి మా నాన్నతో సంప్రదించి వెళ్ళేవారు. వీరేశలింగం గారు మా ఇంట్లో ఉండేవారు. ఔను – జీవితాన్నంత సమాజం కోసం ధారపోసిన ఆయననూ అవినీతిపరుడన్నారు. వయసు మీదబడి భార్యా వియోగంతో కుంగిపోతున్న ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసింది మీ వాళ్ళే ` మీ టంగుటూరి ప్రకాశం గారే ప్లీడరుగా తన చమత్కారమంతా చూపించి ఆయనను ముద్దాయిగా నిలబెట్టి దోషిగా నిరూపించాడు. మీరు ఆ సంస్కారాన్ని వదలండి .
స్త్రీలను గౌరవించటమంటే ఏంటో నేర్చుకోండి . ఆధునిక స్త్రీ, ఆధునిక మహిళ మీ కళ్ళు మిరుమిట్లు గొలిపి, మీరు కన్నెత్తి చూడలేనంతగా ఎదుగుతోంది. చరిత్ర నిర్మిస్తుంది. చరిత్ర తిరగరాస్తుంది. సిద్ధంగా ఉండండ ఆమెతో తలపడటానికి. ఎన్నికల్లో ఎవరైన గెలవొచ్చు. కానీ నైతికంగా ఇవాళ మీరు ఘోరంగా ఓడిపోయారు. చరిత్రలో తల ఎత్తుకోలేనంత ఘోరంగా ఓడిపోయారు. నేను ఘన విజయం సాధించాను.
ప్రజలారా – నేను నైతికంగా గెలిచి మీ ముందు ధీమాగా నిలబడ్డాను. వేదిక మీది ఈ పెద్దలు ఓడిపోయి తలలు దించుకున్నారు. నమస్కారం. శలవు’’
ఒక నిర్మల గంభీర ప్రవాహంలా సాగిన శారద ఉపన్యాసం తర్వాత అంత నిశ్శబ్దమై పోయింది. శారద వేదిక దిగి జనం మధ్యలో నుండి నడుచుకుంటూ వచ్చింది. జనం గౌరవంగా ఆమెకు దారి ఇచ్చారు . ఆ రోజుకి ఇక సభ జరిపే ధైర్యం కాంగ్రెస్ నాయకులకూ, వినే మానసిక స్థితి ప్రజలకూ లేదు.
***
ఎన్నికలు దగ్గరబడుతున్న కొద్దీ మహిళా సంఘ ప్రచారానికి ప్రజలు ఆకర్షితువుతున్నారు. అది అవతలి పక్షం వారిని చాలా కలవరపెడుతోంది. ఏమైనా సరే ఇక్కడ కమ్యూనిస్టులను గెలవనివ్వకూడదనే పంతం పెరిగి అది వారి విచక్షణా జ్ఞానాన్ని తినేసింది. మహిళా సంఘం వారిని భయపెట్టి ఏలూరు నుంచి తరిమేస్తే సగం పీడా ఒదులుతుందన్నారెవరో –
‘‘ఎట్లా? వాళ్ళు రాక్షసులు . వాళ్ళను భయపెట్టటం కల్లో మాట. మనల్ని భయపెడతాయి ఆ దెయ్యాలు ’’ కసి తప్ప మరొకటి లేదా మాటల్లో. చివరకి మతిలేని, గతిలేని వీధి రౌడీలను ఆశ్రయించటం తప్ప మరో మార్గం కనిపించలేదు స్థానిక పెద్దలకు. వారికి కాస్త నోరూ, చేతులూ తడిపి మహిళా సంఘం వాళ్ళు బస చేసిన ఇళ్ళ మీదకు దాడి చేయమని అర్థరాత్రిపూట పంపారు.
వీధి రౌడీలు ఆడవాళ్ళని అల్లరిపెట్టి బెదిరించి యాగీ చేసి వద్దామని హంగామాతో బయల్దేరారు.
ముందు ఇళ్ళమీద రాళ్ళు వేశారు. పగలంత తిరిగీ తిరిగీ వచ్చి ఇంత తిని పడుకున్న ఆడవాళ్ళు అలజడి గా మేలుకున్నారు . వాళ్ళకు అర్థమైంది. ఒకరివంక ఒకరు అర్థవంతంగా చూసుకున్నారు. చీరలు బిగించి కట్టారు. కొంగు నడుముల్లో దోపుకున్నారు. తలుపులు దబదబ బాదగానే అవి తెరుచుకుని తమ నెత్తిన కర్రలు విరుచుకుపడతాయని తెలియని రౌడీలు లబోదిబోమన్నారు. తామూ నిలబడి కర్రలు తిప్పారు. అరగంట పాటు ఆ స్త్రీల కర్రసాము చూస్తూ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు సబ్తులై నిలబడిపోయారు. రౌడీలు ఎటు పోయారో కూడా చూసే అవకాశం లేకుండా పారిపోయారు. ఫాసిస్టు వ్యతిరేక దళాలుగా ఏర్పడినప్పుడు నేర్చుకున్న కర్రసాము ఇప్పటికి సార్థకమయిందని సంతోషపడుతూ ఆ రాత్రి మరి నిద్రపోలేదు ఆ స్త్రీలు . జోరుగా పాటలు ఆటలతో సందడి చేశారు.
శారద మర్నాడు బెజవాడ నుండి వచ్చేసరికి అందరూ ఒకేసారి మాట్లాడి రాత్రి జరిగిన యుద్ధాన్ని సచిత్ర ప్రదర్శనలాగా చెప్పారు. తనను ఓడించటానికి కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి పనికైన తెగబడతారని అర్థమైంది శారదకు. అందరూ కలిసి ఒకటి లేదా రెండు జట్లుగా తిరగాలనీ, ఒకరిద్దరుగా ఎవరూ ఎక్కడకీ వెళ్ళొద్దని గట్టిగా చెప్పింది. ప్రచారాన్ని ఎంత పద్ధతిగా సాగించాలో వారందరినీ కూర్చోబెట్టి వివరించింది. ఎన్నికల ప్రణాళిక అందరికీ కరతలామకమే. ఐతే ప్రతిచోటా శారదాంబ గారిది కాంట్రాక్టు పెళ్ళట – అదేంటి అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంది.
చైతన్యంతో సమాధానం చెప్పగలిగిన వాళ్ళు అవతలి వాళ్ళకు అర్థమయ్యేలా చెబుతున్నారు. కానీ మహిళా సంఘంలోకి అపుడపుడే వచ్చినవాళ్ళు, రాజకీయ ప్రచారం సంగతి తెలియని వాళ్ళూ ఇచ్చే సమాధానాలు సంజాయిషీలాగా
ఉండేవి. ‘డాక్టరు గారు చాలా గొప్ప మనిషి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అదంతా పట్టించుకోవాల్సింది కాదు.’ ఇట్లా మాట్లాడేవాళ్ళను ఉమ, రాజమ్మ రాత్రిపూట సరిదిద్దేవారు. అదంతా శారద చెవిన పడుతూనే ఉండేది.
సంజాయిషీల్లాంటి ఆ వివరణలు విన్న శారదకు నవ్వాలో, ఏడవాలో తెలిసేది కాదు. జీవితమంత ఇలాంటి సంజాయిషీలు తనో, తన తరపున మాట్లాడేవాళ్ళో ఇవ్వాల్సిందేనా ?
ఇవ్వాల్సిందే. సమాజంలో ఉన్న భావాలు వేరు. ప్రేమ గురించి చం గారు ఎంత రాసిన , ప్రేమకు సంఘనీతి అడ్డం వస్తుందన్నా సంఘనీతి మనుధర్మాల మీద ఆధారపడ స్త్రీలకు తీరని అపకారం చేసేదనీ, దానిని కూకటివేళ్ళతో పెళ్ళగించి కొత్త పద్ధతులను జీవితంలోకి తెచ్చుకోవాలని ఎంత చెప్పినా దానిని అర్థం చేసుకోవటం కష్టం. చాలా సంవత్సరాలే పట్టవచ్చు ఆడవాళ్ళ ప్రేమను నీతి -అవినీతి అనే చట్రం నుంచి విడదీసి చూడటానికి.
ఆడవాళ్ళు చిన్న గీటు దాటినా దానిని సమాజం సహించలేదు. ప్రేమ అనేది తెలియక ముందే పెళ్ళిళ్ళయ్యే పరిస్థితి. తర్వాత ప్రేమవిలువ తెలిసి కావానుకుంటే తెంచుకోలేని బంధాలు . సరైన విడాకుల చట్టం లేనపుడు, పెళ్ళయిన వ్యక్తికి ప్రేమించే హక్కు లేదు. హక్కు కోసం సమాజానికి విరుద్ధంగా పోయే వ్యక్తులున్నపుడే హక్కు అవసరం సమాజానికి అర్థమవుతుంది.
రావు కమిటి హిందూ కోడ్ బిల్లు తయారు చేస్తోంది గానీ దానిలో ప్రేమకు ఏం చోటుంటుంది?
విడిపోవటానికి ప్రేమ లేకపోవటం అనే కారణం కాకుండా పరమ నికృష్టమైన కారణాలు ఉంటాయి. ఆస్తి, భరణం, వారసత్వం ఇవి ప్రధానమవుతాయి. కానీ ఆడవాళ్ళకు అది కూడా చాలా అవసరం. అంతకు మించి ఇప్పుడే ఎక్కువ ఆశించలేం.
భార్య మీద ప్రేమ లేదు విడాకులివ్వండి అంటే ఎవరికీ అర్థం కాదు. నా భార్య రోగిష్టిది. సంసార జీవితానికి పనికిరాదు అంటే విడాకులు ఇవ్వమని అడగొచ్చని, పొందవచ్చని రావు కమిటి చెబుతుంది. జబ్బు పడిన భార్యను ప్రేమగా చూసుకునే భర్తులుంటారు. రోజూ భార్య నుండి సంసార సుఖం పొందుతూనే వాళ్ళను ద్వేషించే భర్తులుంటారు. ఈ ప్రేమ, ద్వేషాలు భార్యాభర్తల సంబంధాలో ఎట్లా ఉంటాయో, ఎట్లా పని చేస్తాయో ఆలోచించే చట్టాలు రావటం అసాధ్యం.
ప్రేమ పేరుతో మగవాళ్ళు మోసం చేసే స్థితిలో ఉండటం – నిస్సహాయ స్థితిలో ఆడవాళ్ళుండటం వాళ్ళకి హక్కుల్ని లేకుండా చేస్తోంది. వాళ్ళకు, మనుషులు గా స్వతంత్ర వ్యక్తులు గా పనికొచ్చే హక్కు కాకుండా పరాధీనులుగా, బానిసలుగా, బాధితులుగా చూసే హక్కు అడగగలిగిన పరిస్థితులే ఉన్నాయి. ముందు ఆడవాళ్ళ స్థాయి మారి సమానత్వం వస్తే తప్ప ‘ ప్రేమ’ ను అర్థం చేసుకోలేం. అపుడు పెళ్ళి ఉండదు. ప్రేమే ఉంటుంది. ఎంగిల్స్ కుటుంబం వ్యక్తిగత ఆస్తిలో శారదకు చాలా ఇష్టమయిన వాక్యాలు మనసులో మెదిలాయి.
ఎన్నికలు ముగిసేనాటికి శారదకు ఫలితం ఏమిటో అర్థమైంది. ‘‘ఒక తరం మగవాళ్ళు తమ జీవిత కాంలో గానీ, ధనంతో గానీ, సామాజికాధికారంతో గానీ స్త్రీని లోబర్చుకునే సందర్భం ఎదురుకానపుడు, అదే విధంగా నిజమైన ప్రేమతో తప్ప మరే కారణంతోనైన ఒక స్త్రీ మగవాని చెంత చేరవసిన అవసరం లేనపుడు, ఆర్థికపరమైన భయం చేత ప్రేమికులు కలియలేని పరిస్థితులు తొలిగినపుడు, దానికి సమాధానం దొరుకుతుంది. ఆ మాదిరి జనం పుట్టాక, వారి ప్రవర్తన గురించి ఈనాడు మనం చెప్పే సలహాలకు వారు చిల్లిగవ్వవిలువ కూడా ఇవ్వరు. తమ పద్ధతును తామే నిర్ణయించుకుంటారు. వ్యక్తుల ఆచరణకు అనుకూలంగా జనాభిప్రాయాన్ని సృష్టించుకుంటారు’’.
ఇది ఎప్పుడు జరుగుతుంది? బహుశ తన జీవితకాంలోనే జరుగుతుందేమో `- వ్యక్తుల ఆచరణకు అనుకూలంగా జనా భిప్రాయం సృష్టించుకోవటం మానేసి పాతబడిన జనాభిప్రాయాల ప్రకారం వ్యక్తులను నడవమనే ధోరణే ఇంకా కమ్యూనిస్టు పార్టీలోనూ నడుస్తోంది. ఇది మారెదెప్పుడు. మార్చాలి . ఎన్నికల కంటే అది ముఖ్యం. తను ఓడి పోతుంది. కాంగ్రెస్ ఎన్నిక నిబంధనలన్నీ ఉల్లంఘిస్తోంది. తన ఓటు వేసి బెజవాడ వచ్చి ఆ ఎన్నిక గురించి మర్చిపోదామనీ, కూతురితో ఆడుకుంటూ ఒక రోజన్నా గడుపుదామనీ అనుకుంది. నటాషాకు నాలుగేళ్ళు నిండలేదింకా – మంది చేతుల మీద పెరుగుతోంది. ఐన అమ్మను చూస్తే అతుక్కు పోతుంది. చిన్నతనం నుంచీ శారద నవ్వు అందరినీ ఆకర్షించి సమ్మోహితుల్ని చేసేది. చిన్న నటాషాకి కూడా అమ్మ నవ్వంటే ఎంతో ఇష్టం. హాయిగా, మనసారా , నిష్కల్మషంగా నవ్వే తల్లిని కళ్ళార్పకుండా చూసి ఆ బొమ్మను కళ్ళగుండా మెదడులో గట్టిగా ముద్రించు కుంటున్నట్టు చూసేది. నటాషాను గుండెకు హత్తుకుని ‘‘తొలి నే చేసిన పూజా ఫలమా’’ అంటూ త్యాగరాజ కీర్తన అందుకునేది. తల్లి పాట వింటూ నటాషా నిద్రపోతుంటే శారద ఆ పాపని, తన పేర్మ ఫలాన్ని తనివిదీరా చూసుకునేది. అట్లాంటి రోజు ఆ తల్లీ కూతుళ్ళకు అరుదే గానీ వాటిని శారద ఎంత అపురూపంగా చూసుకునేదో, ఎంత పరవశంతో అనుభూతి చెందేదో, ఎలాపులకించి పోయేదో శారదకే తెలుసు. నటాషాకి కూడా తెలియదు.
రాత్రి నటాషా పెందలాడే నిద్రపోయింది. మూర్తి ఇంకా ఎన్నిక గొడవల్లోంచి బైటపడలేదు. బహుశ ఫలితాలొచ్చే వరకూ ఏదో ఒక పని ఉంటుంది. శారద చాలా రోజుల తర్వాత సుబ్బమ్మతో కలిసి భోజనం చేసింది. సుబ్బమ్మ చాలా తక్కువ తింటోందనో, చిక్కిపోయిందనో అనిపించింది.
‘‘అమ్మా – నీ గురించి పట్టించుకోవటం లేదు. ఇంత చిక్కిపోయావేమిటి? అంత తక్కువ తింటున్నావేంటి? కొంచెం వడ్డిస్తానుండు’’ అంటూ హడావుడి చేసింది.
‘‘నువ్వు నన్ను పట్టించుకునేదేంటి? ఆ పని నాది. నువ్వేమో నా చేతికి చిక్కకుండా తిరుగుతున్నావు. . నాకు వయసు మీద పడటం లేదా? తిండీ, నిద్రా తగ్గుతాయి. ఒళ్ళు తగ్గితే మంచిదే’’ సుబ్బమ్మ నవ్వుతూ తీసిపారేసింది శారద మాటల్ని.
‘‘మాట్లాడకుండా రేపు నాతో ఆస్పత్రికి రా . అన్ని పరీక్షలూ చేస్తాను’’ గట్టిగా అంది శారద.
‘‘అలాగే. రానంటే ఊరుకుంటావా ? కాళ్ళూ చేతులూ కట్టి పడేసైనా లాక్కుపోత వు. అలాగే చెయ్యి నీ పరిక్షలు .’’
భోజనాలు ముగించి ముంగిట్లో కాసేపు చల్ల గాలికి కూచుందామని వచ్చేసరికి గేటు తీసుకుని ఎవరో వస్తున్నారు.
***
తాజా కామెంట్లు