గమనమే గమ్యం-28

 

 

volga‘‘శారదాంబకు ఈ ఉత్తరం ఇచ్చి రావమ్మా’’ అంటూ పార్టీ ఆఫీసుకి వచ్చిన కార్యకర్త ఒకాయన సత్యవతి చేతిలో ఒక కాగితం కట్టపెట్టాడు. ‘‘ఇది ఉత్తరమా’’ అనుకుని నవ్వుకుంటూ హుషారుగా బయల్దేరింది సత్యవతి. శారదాంబ ఇంటికి వెళ్ళటం అంటే సత్యవతికి చాలా ఇష్టం. శారదాంబ కనపడనంత సేపూ నవ్వుతూ మాట్లాడుతుంది. ఆ కాసేపట్లోనే మనకు అండగా డాక్టరు గారున్నరనే భావాన్ని కలిగిస్తుంది. సుబ్బమ్మ గారు తినటానికి ఏదో ఒకటి పెడతారు. సుబ్బమ్మ మేనగోడలు పద్మ సరదాగా మాట్లాడుతుంది. మహిళా సంఘం ముచ్చట్లు చెప్పుకుంటారు. ఆ సంతోషం తొందర పెడుతుంటే వేగంగా నడుస్తూ వచ్చిన సత్యవతి ఇంటి ముందు ఆవరణలోనే ఆగిపోయింది. సెప్టెంబర్‌ నెలలో గులాబీలు ఇంత విరగబూస్తాయా అనుకుని కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది. ఇంటి ముందు తోటంత ఎర్రని, తెల్లని గులాబీ పంట పండినట్లుంది. గాలికి తలలు ఊపుతూ మనోహరంగా ఉన్నాయి. సత్యవతికి ఆ పూలన్నింటికీ అరచేయి వెడల్పులో, ఎర్రని ఎరుపు రంగులో ఉన్న రెండు గులాబీలను చూస్తె మనసాగలేదు. చేయి ఊరుకోలేదు. గబగబా వెళ్ళి వాటిని కోసింది. మహా అమూల్యమైన కానుక తీసుకెళ్తున్న భక్తురాలిలా లోపలికి వెళ్ళింది. శారద హాస్పిటల్‌కి వెళ్ళటానికి తయారై బయటకు వస్తూ సత్యవతిని చూస్తూ ‘‘ఏంటోయ్‌ ` పొద్దున్నే ఇలా వచ్చావు’’ అంటూ నవ్వుతూ భుజం మీద చేయి వేసి తట్టింది. సత్యవతి భగవంతుడికి సమర్పిస్తున్నట్లుగా ఆ గులాబీలను శారదాంబ కళ్ళముందుంచింది గర్వంగా. శారదాంబ ముఖంలో నవ్వు పోయి గంభీరమై ‘‘ఎక్కడవివి?’’ అంది. ‘‘మీ తోటలోవే’’ పెద్ద రహస్యం కనుక్కున్నట్లు చెప్పింది.
‘‘ఎందుకు కోశావు?’’
‘‘మీ కోసమే’’ ప్రేమగా చెప్పింది. ‘‘తల్లో పెట్టుకుంటే అందంగా ఉంటుందని’’ .
శారద కోపాన్ని కంట్రోలు చేసుకుంటూ ‘‘నా తల్లో ఎన్నడైన ఈ పూలు చూశావా? నేను పూు పెట్టుకోవటం చూశావా ? హాయిగా అందంగా చెట్టుమీద ఉండే పూలని కోసెయ్యటానికి నీకు మనసెట్లా ఒప్పింది? కొంచెం ఆలోచిస్తే తెలిసేదే `-చెట్టున ఉంటే నాలుగు రోజులు అందరి కళ్ళకూ పండగలాగా ఉంటుంది. నా తల్లో నీ తల్లో సాయంత్రానికి వడలి పోతాయి. ఇంకెప్పుడూ గులాబీలు కొయ్యవద్దు’’ ఎంత పొరపాటు చేసిన నవ్వుతూ నవ్వుతూ సరిదిద్దే డాక్టర్‌ గారికి ఇంత కోపం వచ్చిందంటే అది చెయ్యకూడని పనే అని సత్యవతికి రూఢీ అయింది.
‘‘ఇలా తిరుగు’’ అని సత్యవతిని వెనక్కి తిప్పి ఒక పువ్వు ఆమె జడలో పెట్టి ` ‘‘ఇది మా అమ్మకివ్వు. చిన్న గిన్నెలో నీళ్ళు పోసి పెడుతుంది. రెండు రోజులు ఇలాగే ఉంటుంది. ఇంతకూ నువ్వు వచ్చిన పనేంటి?’’ శారద చేతిలో తను తెచ్చిన కాగితాల కట్ట పెట్టింది సత్యవతి. అది తీసుకుని బైటికి వెళ్తున్న శారదకు ఇద్దరు కార్యకర్తు ఎదురొచ్చారు. సత్యవతి వాళ్ళనెప్పుడూ చూడలేదు. ఖద్దరు పంచలు కట్టుకుని, అరచేతుల చొక్కాతో నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇద్దరి చేతుల్లో పచ్చని విచ్చీ విచ్చని పత్తి కాయలున్నాయి.
శారదాంబ కళ్లు వాటిమీద పడ్డాయి. వాటినీ వాళ్ళ ముఖాలనూ మార్చి మార్చి చూస్తున్న శారదను చూస్తుంటే సత్యవతికి ఏదో అర్థమైంది. ఇప్పుడేం జరగుతుందో చూద్దాం అనే కుతుహలంతో నాలుగడుగులు బైటికి వేసింది.
‘‘ఏంటా కాయలు ?’’ అనుమానంగా అడిగింది శారద.
‘‘పత్తి కాయలు డాక్టరు గారూ. పత్తి చేలకడ్డంబడి వచ్చాము లెండి . ఈ సంవత్సరం పత్తి బాగా అవుతుంది. చెట్టునిండా కాయలే `’’
‘‘ఏం లాభం రైతుకి రూపాయిండదుదు’’ శారద కఠినంగా అంది.
‘‘ఏం? ఏం? ఎందుకుండదు ?’’ ఆశ్చర్యంగా తమ చేతుల్లో బలంగా ఆరోగ్యంగా ఉన్న పత్తి కాయలను మార్చిమార్చి చూశారిద్దరూ.
‘‘పత్తి చేల మీద మీదుగా వచ్చిన ప్రతివాడ చేతులు దురద పెట్టి ఒక్కోడూ ఐదారు కాయలు కొస్తే ఇంకా పగిలి పత్తి ఇవ్వటానికి కాయలెక్కడుంటాయి. అమ్ముకోటానికి రైతుకి పత్తెక్కడుంటుంది? ఆ కాయలు ఎందుకైన పనికొస్తాయా? మీరు సరదాగా పట్టుకోటానికి తప్ప. కనీసం బాగా పగిలి పత్తి వస్తున్న కాయను కోసినా మీ ఇంట్లో వాళ్ళు ఆ పత్తిని దేనికైన ఉపయోగించుకుందురు. ఈ కాయలు ఎందుకు కోసినట్టూ’’
పాలిపోతున్న ఆ ఇద్దరు యువకుల ముఖాలు చూసి సత్యవతి ముఖంలో ‘‘బాగా అయ్యింది’’ అన్న తృప్తి, చిన్ననవ్వు, తన బాధ మర్చిపోయి ఎగురుతున్నట్టే లోపలికి పోయింది.
***
రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లరు ఓడిపోవటం వల్ల బ్రిటీష్‌ వాళ్ళకు కలిగింది తాత్కాలిక ఉపశమనమే అయింది. యుద్ధం పేరుతో ఏదో ఒక రకంగా వలస దేశాల్లో ఉద్యమాల ఉద్రుతిని ఆపుకొంటూ వస్తున్న సామ్రాజ్యానికి అది ఇక కుదరని పని అయింది. ముఖ్యంగా భారతదేశంలో వారి పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తోంది. తిరగబడని వర్గమంటూ ఏదీ మిగలలేదు. దేశంలో ఎక్కడ చూసినా కార్మికులు , ప్రభుత్వోద్యోగులూ తిరగబడుతున్నారు. సమ్మెలు ముమ్మరమయ్యాయి.
సైనికులు , నావికులు కూడా తిరగబడితే ఏ సామ్రాజ్యం తట్టుకునిలబడ గలుగుతుంది?
కానీ చివరి క్షణం దాకా సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలి, భారతదేశాన్ని సర్వ నాశనం చేసి గాని ఒదలకూడదనే పట్టుదలతో బ్రిటీష్‌ ప్రభుత్వం అన్ని రకాల ఉపాయాలను, వ్యూహాలను ఆశ్రయించి రోజులు పొడిగించుకోవాలని చూస్తున్నది.
ఆ వ్యూహాలలో ఒక భాగంగా ఎన్నికలను ప్రకటించింది. దేశం ఒదిలి వెళ్ళక ఎన్నికలు మీరు పెట్టేదేమిటని భారతీయులు అడగరనీ, కొత్తగా నేర్చుకున్న ఈ ఎన్నికల ప్రక్రియ మీద వారికి వల్లమాలిన మోజనీ ప్రభుత్వానీ తెలుసు. ప్రొవెన్షియల్‌ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి.
బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా జరగాల్సిన సభలలో, స్వాతంత్ర్యానంతరం దేశ పునర్నిర్మాణం కోసం భిన్న రాజకీయాలలో ఉన్నవారి మధ్య జరగాల్సిన సభలలో కొన్నిటినైనా భారతీయులు తమకు తామే వ్యతిరేకంగా మాట్లాడుకోటానికీ, కొట్లాడుకోటానికీ మళ్ళించటం ప్రభుత్వ ఉద్దేశమైతే అది నెరవేరింది. అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. కమ్యూనిస్టు పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. పూనా ఒడంబడిక ప్రకారం హరిజన అభ్యర్థులకు ముందు ప్యానల్‌ ఎన్నికలు జరిగాయి. రామకృష్ణయ్య, శారద, ఈశ్వరరావు వంటి అగ్రశ్రేణి నాయకులు పని చేసి లక్షమందితో బహిరంగ సభ జరిపారు. ప్యానల్‌ ఎన్నికలలో గెలుస్తామనే గట్టి ఆశ కృష్ణాజిల్లా రిజర్వుడు స్థానం మీద, క్రైస్తవ రిజర్వుడు స్థానంలోనూ కమ్యూనిస్టులకు ఉంది. అలాంటి ఆశతోనే ఏలూరు నియోజకవర్గంలో శారదాంబను నిలబెట్టాని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా , గోదావరి జిల్లాలలో శారదంటే ప్రజలలో అభిమానం ఉంది. సమర్థురాలు. తప్పక గెలుస్తుందని అందరికి నమ్మకం ఉంది.
అందరూ ఉత్సాహం గా శారదను అభినందిస్తుంటే మూర్తి ముఖమే కొంచెం కళాహీనమైంది.
శారద అది గమనించింది.
‘‘మూర్తీ! నువ్వు ఎన్నికల్లో పోటీ చెయ్యాలనుకుంటే నాకు సీటు వచ్చినట్టుందిగదోయ్‌’’ అంది నవ్వుతూనే.
‘‘నాకెందుకు సీటిస్తారు శారదా. నేనెవరిని? శారద భర్తను. ఆ కారణంగానే బెజవాడ వచ్చాను. వచ్చినవాడిని ఊరికే కూచోబెట్టటమెందుకని బాధ్యతప్పగించారు. అంతేగాని ఎన్నికల్లో సీటెందుకిస్తారు?’’ అన్నాడు పరిహాసంగానే ` నవ్వుతూనే.
‘‘నవ్వుతూ అంటున్నావా? నిజంగా నీ మనసులో ఏముంది మూర్తీ’’ శారదకు మనసులో ఏదో శంక మొదలైంది.
‘‘నా మనసులో ఏముందో గ్రహించలేనంతగా నాకు దూరమయ్యావా?’’ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మూర్తి.
శారదకు మూర్తి భావం అర్థం కాలేదు. అపార్థం చేసుకోబుద్ధి కాలేదు.
మూర్తిది అంత చిన్న మనసు అనుకోవటం అసాధ్యంగా ఉంది. కానీ కామేశ్వరరావుని ఇంట్లో ఉంచినపుడు అతని మానసిక స్థితి, అతను చేసిన పని గుర్తొస్తే – ఇప్పుడు కూడా అతన్ని పురుషాహంకారం వేధిస్తున్నదా అనే అనుమానమూ కలుగుతోంది. అహంకారం తలెత్తితే అంకురంలోనే తుంచివేయటం తప్ప మార్గం లేదు. తలెత్తకుండా ఉండేంతటి మహాత్ముడు కాదు మూర్తి. మగవాళ్ళను మహాత్ములుగా కాదు ముందు మగబుద్ధి ఒదిలించి మనుషులుగా మార్చుకోవాల్సిన పని కూడా ఆడవాళ్ళదే ` అబ్బా –ఆలోచిస్తేనే విసుగ్గా, అలసటగా ఉంది. కానీ తప్పదు – ఇది ముఖ్యమైన పని అనుకుంది శారద. ఆ పనికంటే ముందు ఎన్నికల పనులు వచ్చి మీద పడ్డాయి. మరి దేని గురించీ ఆలోచించే, పని చేసే వ్యవధానం లేదు.
***
ఎన్నికలంటే కోలాహలమే. ఏలూరు ఎన్నికలలో నిలబడుతున్నది ఇద్దరూ స్త్రీలే అవటం వల్ల మహిళా సంఘం అంత ఏలూరికి వచ్చేసింది. రెండు పెద్ద ఇళ్ళల్లో అందరికీ వసతి, భోజనం ఏర్పాట్లు చేయటంతో ప్రచార కార్యక్రమంలో అందరూ తలమునకలుగా ఉన్నారు. ఇంటింటికి తిరిగి ప్రచారం. పేటల్లో మీటింగు. పదిరోజులకోసారి చొప్పున నెల రోజుల్లో మూడు బహిరంగ సభలు. శారదాంబ బృందమే పకడ్బందీగా ఎన్నికల ప్రచారం జరిగే పద్ధతంత ప్లాను చేసుకున్నారు. శారద అంటే మహిళా సంఘం వాళ్ళందరికీ గౌరవం. ప్రేమ. అందరినీ ‘ఏమోయ్‌’ అంటూ చనువుగా కలుపుకుపోయే శారదలో నాయకురాలు , స్నేహితురాలూ కూడా వాళ్ళకు కనిపించి ఆమెకు అతుక్కుపోయారు. పాటలు , నినాదాలు తయారై పోతున్నాయి అప్పటికప్పుడు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి మహిళా సంఘం అంటూ ప్రత్యేకంగా లేదు. పెద్ద నాయకులు , మగవాళ్ళే ప్రచారంలో కనిపిస్తున్నారు. ఆడవాళ్ళు చనువుగా ఇళ్ళల్లోకి వెళ్ళటం, మంచీ చెడ్డా మాట్లాడటం, పోషకాహారం గురించి చెప్పటం, శారద వెళ్ళిన చోట తల్లీ పిల్లా ఆరోగ్యం గురించి విచారించి సూచనలివ్వటం వీటన్నిటితో శారద గేకుపు ఖాయమని అందరికీ అనిపించింది. మొదట్నించీ కమ్యూనిస్టులంటే పడని ‘ముకో’ పత్రికకు ఇది కంటగింపయింది. వెంటనే ‘శారదాంబ కాంట్రాక్టు పెళ్ళి’ అంటూ ప్రత్యేక కథనమొకటి ప్రచురించింది. కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళు దానిని కరపత్రాలుగా మార్చి ఇంటింటికీ పంచి పెట్టారు.
రాజమ్మ, , రాజేశ్వరి, ఉమ, విమల మరో ఆరుగురూ కలిసి ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఒక ఇంట్లో వాళ్ళు ఈ కరపత్రాలు చూపించి దీని సంగతేమిటి అనడిగేసరికి రెండు నిమిషాలు అందరూ నిశ్శబ్దమై పోయారు. ఉమ వెంటనే తేరుకుని ‘‘ఇట్లాంటి రాతలు డాక్టరు గారి గురించి రాసిన వాళ్ళకు మీరు ఓట్లెయ్యాలనుకుంటే వెయ్యండి . స్త్రీలను గౌరవించటం తెలియని పార్టీని ఎన్నుకోవాలంటే ఎన్నుకోండి . పుకార్లను నమ్మొద్ద’’ని చెబుతుంటే ఆ ఇంటావిడ ఉమను ఆపేసింది.
‘‘అదంతా తరవాత సంగతమ్మాయ్‌. పుకార్లని మీరంటున్నారు. నిజాలని కాంగ్రెస్‌ వాళ్ళు ఈ కరపత్రాలు పంచిపెట్టి వెళ్ళారు. నాకొక్కటే సమాధానం సూటిగా చెప్పండి . డాక్టరమ్మగారి భర్తకు అంతకు ముందే పెళ్ళయిందా లేదా? పిల్లలున్నారా లేదా?’’
నలుగురూ ముఖాముఖాలు చూసుకున్నారు.
రాజమ్మ ధైర్యంగా ఉన్న విషయం చెబుదామని నిర్ణయించుకుంది.
‘‘అంతవరకూ నిజమేనండి. డాక్టరు గారి భర్తకు అంతకు ముందే పెళ్ళయింది. అది చిన్నతనంలో జరిగిన పెళ్ళి ` ’’
రాజమ్మ మాటల్ని మధ్యలో ఆపేస్తూ ఇంటి యజమాని కాబోలు అడ్డు వచ్చాడు.
‘‘మేమందరం చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళమే. ఇప్పుడు నదురుగా ఇంకో మనిషి కనిపిస్తే పెళ్ళి చేసుకుంటే ఇదిగో ఈవిడేమైపోతుంది? అదట్లా ఉంచండి -కొందరు మగవాళ్ళు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎవర్నయిన ఉంచుకుంటారు. అది వాళ్ళిష్టం. మీ డాక్టరమ్మ ఆ ప్లీడరు గారిని సంప్రదాయ ప్రకారం సప్తపది మంగళసూత్రధారణతో వివాహం చేసుకుందా? అట్లా జరిగి ఉంటే అందులో విడ్డూరం లేదనుకునేవాళ్ళం. ఈ కాంట్రాక్టు పెళ్ళేమిటి? కాగితాలు రాసుకుంటే సరిపోతుందా? అది మాకు అర్థం కావటం లేదు. అంతకంటే డాక్టరమ్మ గారిని మద్రాసు ప్లీడరొకాయన ఉంచుకున్నాడంటే బాగా అర్థమవుతుంది ` ’’
మహిళా సంఘం వాళ్ళ రక్తం ఉడికి పోయింది. ఉమ తన చేతిలో ఉన్న కాగితాల కట్టతో ఆ మగమనిషి భుజం మీద ఒక్కటి వేసి ‘‘రండే పోదాం – వీళ్ళతో మనకు మాటలేంటి’’ అని గిరుక్కున వెనక్కు తిరిగింది. మిగిలిన వాళ్ళూ ‘‘ఛీ! ఛీ! ఏం మనుషులు ’’ అంటూ బైటికి నడిచారు.
‘‘మీ అఘాయిత్యం గూలా! ఆడవాళ్ళేన మీరు. చెట్టంత మగాడి మీద చెయ్యి చేసుకుంటారా ’’ అంటూ ఇంట్లో వాళ్ళు చేస్తున్న గోల వెనక నుంచీ వినపడుతూనే ఉంది.
***

మీ మాటలు

*