Archives for December 2015

ఓ సామాన్యుడి సాహసయాత్ర

kolluri

-మధు చిత్తర్వు 

~

ప్రయాణాలంటే చాలామందికి ఇష్టం. అయితే మనం సౌకర్యవంతంగా రైలులోనో విమానంలోనే ఆ ఊరు చేరుకుని స్థానికంగా దొరికే టాక్సీ మాట్లాడుకుని చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రాంతాలు చూడడం, ఫోటోలు తీసుకోవడం చేసి సావనీర్‌లు కొనుక్కుని తిరిగి వస్తాం. ఇది చాలా మాములుగ చేసే యాత్ర. మహా అయితే ఒక పోస్ట్ కార్డ్ కొంటాం. లేదా బ్లాగ్‌లోనో ఫేస్‌బుక్ లోనో ఓ పోస్ట్ పెడతాం.

అయితే గమ్యం కంటే గమనమే ముఖ్యం, ప్రయాణానికే జీవితం, సాహసమే ఊపిరి అనుకునే వాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు.

ఈ పుస్తకం రాసిన అజిత్ హరిసింఘాని అలాంటివాడే. పూనెలో స్పీచ్ థెరపిస్ట్‌గా పనిచేసే ఇతనికి, పక్షవాతం వచ్చి మాట పడిపోయిన “డీకోస్టా” గారికి చికిత్స చేయడమనేది ఒక గొప్ప స్ఫూర్తి అయింది. డీకోస్టా జె.ఆర్.డి. టాటాకి వీరాభిమాని. ఆయనకి బి.ఎం.డబ్ల్యూ కారంటే ఇష్టం. అజిత్‌కి మోటార్ సైకిల్ ఇష్టం.  జె.ఆర్.డి. టాటా రాసిన “కీ నోట్” అనే పుస్తకంలో గుర్తు పెట్టుకున్న వాక్యం…

“…జీవితాన్ని కాస్త ప్రమాదకరంగా గడిపితే… ఆనందం, ఆత్మఫలసిద్ధి…” అనే వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ “ఎప్పుడైనా నా కోసం… సాహసం… మోటార్ సైకిల్… ” అని అడుగుతారు డీకోస్టా.

అదే ఈ యాత్రకి నాంది. ఈ అజిత్ హరిసింఘాని యాభై నాలుగేళ్ళ వయస్సు.. నెరసిన జుట్టుతో అసలు హీరోలానే లేడు. కానీ ఈ పుస్తకం ముగిసే సరికి అతన్ని ఆరాధించడం మొదలుపెడతాం. అతనితో పాటు మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తాం.

ప్రమాదం అంచుకి రమ్మని పిలిస్తే భయపడతాం. పడిపోతామని భయపడతాం. చివరికి కొండ మీద నుంచి తోస్తే ఆకాశానికి ఉజ్వలంగా ఎగిరి పోతాం.

పూనె నుంచి జమ్ము దాకా కేవలం మోటార్ సైకిల్ మీద ప్రయాణించాడు అజిత్ – చాలా తక్కువ బడ్జెట్‌తో. దారిలో అతని అనుభవాలు భారతదేశపు అసలైన ఆత్మని చూపిస్తాయి. అహ్మదాబాదు, మౌంట్ అబూ, ఆజ్మీర్, పుష్కర్ లాంటి ఎడారి ప్రాంతాల నుంచి సాధారణ వ్యక్తుల ఆతిథ్యం తీసుకుంటూ మనం కూడా ప్రయాణిస్తాం. రోడ్డు పక్కన సూఫీ బాబా సైకిల్ మీద మక్కా బయల్దేరానని చెబితే అతని కథ వింటాం. “భగవంతుడిచ్చిన రాజప్రాసాదంలాంటి భూమి మీద పడుకోడానికి రెండు గజాల స్థలం ఎక్కడైనా దొరుకుతుంది” అంటాడు సూఫీ బాబా. అతను చెప్పిన కథలో అమాయకుడైన యువభిక్షువు.. “ఒక్కరోజుకి ఆహారం చాలు. రేపటి గురించి భగవంతుడు చూసుకుంటాడ”ని ఎందుకు నమ్ముతాడో గ్రహిస్తాం. గురుద్వారాలో ఉచితంగా మకాం వేస్తాం. ఇనుప వంతెనని దాటుతుంటే పిట్టల గుంపులు తల మీదుగా ధ్వనులు చేసుకుంటూ వెళ్తాయి. అస్తమిస్తున్న సూర్యుడి బంగారు రంగు కాంతిలో గురుద్వారాలో కీర్తనలు వింటాం.

ఆ తర్వాత రోహతాంగ్ కనుమ దాటి నీలాకాశంలో ఎగిరే గద్దలను చూస్తాం. అజిత్‌తో రోడ్లు మాట్లాడుతాయి, వంపులు తిరిగే రోడ్డు మీద ఉన్నత పర్వత మార్గాలు దాటి ఎముకలు ఒణికించే రక్తం గడ్డకట్టే చలిలో ప్రయాణిస్తాం. “వెండి అనకొండ”లాంటి నదులనీ, ఆకాశంలో చందమామని చూస్తూ రాత్రుళ్ళు గడుపుతాం.

లేహ్ అంటే.. లడాఖ్ రాజధానిలో 3520 మీటర్ల ఎత్తులో బౌద్ధ మతస్థుల పండగలు, ఆరామాలను దర్శిస్తాం. విదేశీ యాత్రికులతో పరిచయాలు చేసుకుంటాం. టైగర్ హిల్ దగ్గర ద్రాస్ లోయ చూస్తాం. ఇంటి బెంగతో ఉన్న సైనికులతో స్నేహం చేస్తాం.

ఇంతెందుకు, ఈ అద్భుతమైన అనుభవాలు అన్నీ మాటల్లో చెప్పలేనివి. ఈ పుస్తకాన్ని చక్కగా అనువదించిన కొల్లూరి సోమ శంకర్ తన అద్భుతమైన భావుకతతో కథనాన్ని మరింత రక్తి కట్టించారు.

అజిత్ హరిసింఘాని గారు జమ్మూ దాకా విజయవంతంగా యాత్ర చేసి తిరిగి ఇంటికి రైల్లో వస్తుంటే.. మనకీ అదే సాహసం చేసి తిరిగి వచ్చిన “హమ్మయ్య” అనే అనుభూతి కలుగుతుంది.

జోరుగా ప్రవహించే పార్వతి నది గలగలలు, మనాలి లోని దేవదారు అడవులలోంచి వీచే చిరుగాలులు, బౌద్ధారామాలలోని గంటల చప్పుడు, మంచులో కూరుకుపోతే వచ్చే ప్రాణభయం, ప్రపంచంలో కెల్లా ఎత్తైన రహదారిలో వెచ్చగా పలకరించే సూర్యకిరణాలని అనుభవించాలంటే ఈ పుస్తకం చదవండి.  ఎందుకంటే ఇది కథ కాదు, కల్పితం కాదు. ఒక సామాన్యుడు చేసిన సాహసయాత్ర. నిజంగా నిజం.

 

***

“ప్రయాణానికే జీవితం” పుస్తకం హైదరాబాద్‌లో నవోదయ బుక్ హౌస్‌లోనూ, విజయవాడలో నవోదయ పబ్లిషర్స్ వద్ద దొరుకుతుంది. షాపులకి వెళ్ళలేని వాళ్ళు కినిగె ద్వారా పుస్తకాన్ని ఇంటికే తెప్పించుకోవచ్చు. కినిగెలో ఈబుక్ (http://kinige.com/book/Prayananike+Jeevitam) కూడా లభిస్తుంది. 176 పేజీల ఈ పుస్తకం వెల రూ. 120/-

 

 

తుమ్మపూడి కంటి వెలుగు చంద్రమౌళి

 

                                                                                

-సి.బి. రావు

~

సజ్జనుడు, సాహితీ ప్రియుడైన  చంద్రమౌళి గారు నవంబరు 28, 2015 న మరణించారన్న వార్త  మనసును విచారంతో నింపింది. సంజీవదేవ్ రచనలతో కూడిన కొన్ని చిన్న పుస్తకాలు మిత్రుడు సురేష్ తెనాలి నుంచి తీసుకొచ్చి నా కిచ్చినప్పుడే మొదటగా చంద్రమౌళి గారి పేరు నేను విన్నాను. చంద్రమౌళి గారి ఆర్థిక సహాయంతో  ఆ పుస్తకాలను ప్రచురించారు. సంజీవదేవ్ కుమారుడు  మహేంద్రదేవ్ హైదరాబాదు లోని  Centre for Economic and Social Studies, (CESS), Hyderabad, India, లో 1999 నుంచి మే  2008 వరకు Director గా పనిచేశారు. CESS నుంచి కొత్త ఢిల్లీ కు Chairman, Commission for Agricultural Costs and Prices, Ministry of Agriculture గా బదిలి అయిన సందర్భంలో అమీర్‌పేటలోని CESS కార్యాలయంలో జరిగిన వీడ్కోలు సభలో నేను చంద్రమౌళిగారిని చూడటం, పరస్పర పరిచయం జరిగాయి. అప్పటినుంచి వారు నా మిత్రులయ్యారు.

చంద్రమౌళి గారు Chief Engineer R & B గా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్నారప్పుడు. టెలిఫోన్లో సంజీవదేవ్, సాహిత్య విషయాలు గురించి మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళం. కొన్నిసార్లు వారిని, వారింట చూశాను. పాతతరం రచయితలంటే ఆయనకు మిక్కిలి ప్రేమ ఉండేది. సంజీవదేవ్ రచనలంటే ప్రాణం పెట్టేవారు. వారితో తనకు వ్యక్తిగత పరిచయం లేదని, అంతటి మహావ్యక్తిని తాను కలుసుకోనందుకు మిక్కిలి బాధపడేవారు. సంజీవదేవ్ వియ్యంకుడు ఈయన సహొద్యోగి అయ్యుండీ, సంజీవదేవ్‌ను తన సహొద్యోగి, సంజీవదేవ్ కుమారుడి వివాహం జరిగిన సందర్భంలో పరిచయంచెయ్యలేదని బాధపడుతూ చెప్పేవారు.  

Chandramouligaru rs

చిత్రం: దామరాజు నాగలక్ష్మి గారి సౌజన్యంతో

   సంజీవదేవ్ రచనలు ఎక్కడా లభ్యం కాకపోవటం వీరిని బాధించింది. తనే దేవ్ రచనలు కొన్ని, చిన్ని పొత్తాలుగా ముద్రింపించారు. సంజీవదేవ్ జీవిత చరిత్ర అసలు ప్రతి దొరకక  జీరాక్స్ ప్రతి తెప్పించుకుని చదివి ప్రభావితమయ్యారు. జుజ్జవరపు చంద్రమౌళి గారు  సంజీవదేవ్ స్వీయవాణిని జనం చేత చదివించాలన్నదే తమ అభిమతమని చెప్పి, సంజీవ్‌దేవ్ రచించిన ‘తెగిన జ్ఞాపకాలు’, ‘స్మృతిబింబాలు’, ‘గతంలోకి’ పుస్తకాలను  రాజాచంద్ర ఫౌండేషన్ పేరిట ‘తుమ్మపూడి’  అనే సంకలనంగా తీసుకొచ్చారు. సంజీవదేవ్ స్వీయచరిత్ర అయిన ఈ మూడుభాగాల సంకలనానికి ఆయన స్వస్థలమైన దుగ్గిరాల మండల గ్రామమైన తుమ్మపూడి పేరిట నామకరణం చేశారు. ఏప్రిల్ 4, 2011 న సంజీవదేవ్ నివాసం ‘రసరేఖ’లో సంజీవదేవ్ సతీమణి సులోచన పుస్తకావిష్కరణ చేశారు.

tummapudi_rs (1)

రాజాచంద్ర ఫౌండేషన్ అధ్యక్షుడిగా చంద్రమౌళిగారు తుమ్మపూడి (సంజీవదేవ్), నా స్మృతిపథంలో.. సాగుతున్న యాత్ర (ఆచంట జానకిరాం), రమణీయ భాగవత కథలు (ముళ్ళపూడి వెంకట రమణ), సురపురం (మెడోస్ టైలర్ ఆత్మ కథ), జానకితో జనాంతికం (దువ్వూరి వేంకట రమణ శాస్త్రి), డాక్టర్ యెల్లాప్రగడ సుబ్బారావు (అబ్బూరి ఛాయాదేవి), సంజీవదేవ్ లేఖలు (శ్రీనివాసాచార్య దర్భాశయనం కు వ్రాసినవి), అమ్మకు జేజే నాన్నకు జేజే గురువుకి జేజే, వగైరా పుస్తకాలు ప్రచురించారు.

చంద్రమౌళిగారికి సాహిత్యాభిలాష మెండు. వారి ఇంటిముందు వసారాలో కూర్చుని తనకిష్టమైన పుస్తకాలు చదువుతూ వాటిగురించి మిత్రులతో చర్చించే వారు. అముద్రిత వ్యాసాలను లేక ఆసక్తికరమైన వ్యాసాలను జీరాక్స్ తీసి మిత్రులకు పంపేదాకా ఆయనకు నిద్రపట్టేది కాదు. తనకిష్టమైన పుస్తకాలను రచయితలవద్దనుంచి టోకుగా కొని మిత్రులకు పంచేవారు. ఒకసారి సోమరాజు సుశీలగారి పుస్తకం, మరికొన్ని పుస్తకాలు  నాకు ఇచ్చారు. వారికి కోపం ఎక్కువ. ఒకసారి ఎందుకో నా పై కోపం ప్రదర్శిస్తే కొన్నాళ్ళు వారింటికి నే వెళ్ళలేదు. తనకోపం వలన, నాకు మనస్తాపం కలిగితే, అందుకు విచారం వ్యక్తం చేస్తూ,, పెద్దమనసుతో తనను క్షమించాలని కోరుతూ జాబు వ్రాసారు. ఇది ఆయన సహృదయతకు తార్కాణమై నిలుస్తుంది. కాలపాలన విషయంలో క్రమశిక్షణతో ఉండటం ఆయనకు ఇష్టం. ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకునేవారు.

  నా వియ్యంకుడు సత్యనారాయణగారు (Retired Chief Engineer, R & D) ఆయనకు Junior. వారు నాతో   మాట్లాడుతూ “చంద్రమౌళి గారు చాలా నిష్కర్షగా, నిష్కాపట్యముగా, అవినీతికి దూరంగా ఉండేవారు. అందరికీ సహాయకారిగా ఉండే వారు. ఆయన Senior కావటంతో, కార్యాలయంలో ఎక్కువ మందితో పరిచయాలుండేవి. ఎవరైనా చనిపోతే తనే అందరికీ ఫోన్ చేసి సమాచారం అందించేవారు. పుస్తకాలు బాగా చదువుతుండేవారు.” అన్నారు.

మరణాంతరం జరిగే కర్మకాండలపై చంద్రమౌళిగారికి విశ్వాసం లేదు. తన తదనంతరం తన శరీరం వృధా పోవటమూ వారికిష్టం లేదు. వారి కోరిక మెరకు వారి కుటుంబ సభ్యులు, వారి పార్థివ దేహాన్ని ఉస్మానియా వైద్య కళాశాలకు అందచేశారు. ఎలాంటి కర్మకాండలు జరపటం లేదని వారి కుటుంబ సభ్యులు తెలియచేశారు. రాజాచంద్ర ఫౌండేషన్ అధ్యక్షులైన చంద్రమౌళిగారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ, ఎప్పటివలెనే రాజాచంద్ర ఫౌండేషన్, ఉత్తమ సాహిత్యం, తెలుగు ప్రజలకు అందిస్తుందని ఆశిద్దాం. ఆ పుస్తకాలు  చదివి ఆనందిస్తే, అదే  సాహితీబంధు చంద్రమౌళి గారికి మనమిచ్చే  నిజమైన నివాళి.

*