కలలు కావాలి జీవితం దున్నడానికి…!

“కళ్ళు తుడుస్తాయి కమలాలు వికసిస్తాయి మెదిలితే చాలు నీ నామాక్షరాలు పెదవులమీద భ్రమరాల్లా”- కవిత్వాన్ని ఒక ఉత్సవంగా పాడుకునే గజల్ సంస్కృతిని అమితంగా ఆరాధించే గుంటూరు శేషేంద్ర శర్మ గారి వాక్యాల్లో ఆ సౌకుమార్యం, అత్తరు సౌరభాల సంగీతం గుభాళిస్తూ ఉంటాయి. వసంతం వాసనేస్తే ఉండబట్టలేని నవకోకిలలా జీవన తరుశాఖల్లో తియ్యని రాగాల్ని ఒలకడమే ఈయన కవిత్వ లక్షణంగా కనపడుతుంది. పువ్వునీ శిల్పాన్నీ దారంతో కలిపి ఇల్లు అల్లుకునే సాలెపురుగు లోని ప్రజ్ఞ ఈయన కవితా వైవిధ్యంలో గోచరిస్తుంది.

నిశ్శబ్ధమైన తోట మానసిక ఆవరణంగా, అక్కడి కొమ్మలపైని పక్షి పాడుకునే పాటలు భావోద్వేగాలకు ప్రతీకలుగా, పక్షి ఉత్సాహ ,విశ్రాంత, విషాద అనుభూతులకు సంకేతంగా- ఇవే చిహ్నాలు ఎన్నో సందర్భాల్లోని సంఘటనలకు రూపాంతరాలుగా మారి అంతస్సూత్రంగా కనిపిస్తుంటాయి శేషేంద్ర కవితా ఇతివృత్తాల్లో. మరికొన్ని చోట్ల అదే తోట స్థబ్ధమయ్యి, నిర్లిప్తమయి “గాలితో కుట్ర చేసి ఒక్కో పరిమళం/ ఒక్కో గడిచిపోయిన దూరదూర జీవితదృశ్యాన్ని” ఆవిష్కరిస్తుంటే “గుండెనరాల్ని తెంపే/ఆ క్రూరమైన పక్షుల గానస్వరాలకు” తట్టుకోలేక తల్లడిల్లే స్వాప్నికుడు ఎదురవుతాడు. అటువంటి కలవరపాటు కవి సమయాల్లో వెలువడ్ద ఒక కవితలోని పంక్తులు ఇవి;

 

గడియారంలో కాలం

                                        -గుంటూరు శేషేంద్ర శర్మ

అందరూ నిద్రపోయారు

గడియారాన్ని ఒంటరిగా విడిచిపెట్టి…

భయంతో కొట్టుకుంటోంది దాని గుండె-

మొరుగుతూ ఉంది ఒక కుక్కలా దూరాన

దిగంత రేఖ

ప్రార్ధిస్తోంది రాత్రి మైదానాల్లో మోకరించి

 

భూదృశ్యాలూ సముద్రదృశ్యాలూ

తపస్సులు చేస్తున్నాయి,

ఒక్క పాటకోసం బతుకు బతుకంతా సమర్పించిన

వాడెక్కడని

వాటికి గొంతులు ఇచ్చేవాడు వస్తాడనీ

మాటల దేశాల్లో వాటికి దేవాలయాలు కడతాడనీ

నిరీక్షిస్తున్నాయి.

 

తిరుగుబాట్లు లేస్తున్నాయి మనోమయలోకాల్లో

నిశ్శబ్ధాల గనుల్లో నా ఆత్మ సొరంగాలు తవ్వుతూ ఉంది

విలువైన రాళ్ళకోసం అన్వేషిస్తూ-

ఆకాశాన్ని చూస్తుంది రెక్కలు విప్పి

నా కిటికీ…

 

వలలు కావాలి సముద్రం దున్నడానికి

పడవ భుజాన వేసుకున్నవాడికి

కలలు కావాలి జీవితం దున్నడానికి

గొడవలు భుజాన వేసుకున్నవాడికి

విలవిల కొట్టుకుంటున్నాను నీళ్ళు కోల్పోయిన చేపలా

కలలు కోల్పోయిన నేను-

—-

87648618-seshendrasharma-the

జీవన సంరంభానికి కాసేపు విరామమిచ్చి లోకమంతా చీకటి పక్కపై ఒత్తిగిల్లింది.  అరక్షణమైనా ఆగడానికి వీల్లేని కాలం మాత్రం వేకువ కోసం ఎదురు చూస్తూ రాత్రంతా ఒంటరితనపు భయాన్ని పోగొట్టుకునేందుకు గుసగుసగా లోపలెక్కడో చెప్పుకునే మాటల శబ్ధంలా- గడియారపు ముళ్ళు నిద్రల్లో, నిశీధిలో నిర్విరామంగా కాలం గుండెచప్పుడులా మోగుతూ ఉన్న సమయం. దిక్కులన్నీ భూమికి అవతల కాంతి వలయాల్లో కలుసుకునే చోట- ఎత్తునుంచీ, దూరాన్నుంచీ వేర్వేరు రూపాలుగా కనపడుతున్న భూభాగాలని చూసి వాటికన్నిటికీ కలిపి ఒకే అర్ధం ఇవ్వలేక, ఒక వృత్తంలో చుట్టెయ్యలేక నిరాశ పడుతుంది దిగంతరేఖ.

  సడి లేని వేళ అనువు చుసుకుని తపస్సుకి సిద్ధమౌతాయి మైదానాలు, సముద్రాలు, పర్వతాలు అన్నీ ఒక రససిద్ధి కోసం. దృశ్యాలుగా వాటికో సవర్ణమైన ప్రతిబింబాన్నిచ్చే కుంచెకోసమో, మాటలుగా పాడే కవి కోసమో. జీవితాన్ని త్యజించి రాత్రులని ఒత్తులుగా చేసి కలలని వెలిగించుకున్న సాహసి కోసమో, “ఒక్క పాటకోసంబతుకు బతుకంతా సమర్పించిన” స్వాప్నికుడి కోసం రాత్రులు మైదానాల్లో సాష్టాంగపడి ప్రార్ధిస్తూ ఉంటాయి.

నడక విసుగెత్తిన కాళ్ళు మజిలీ కోసం మొరాయిస్తే అలసట లేని ప్రయాణదాహం రెక్కల మొలిపించుకొమ్మంటుంది. కిటికీ రెక్కలు తెరుచుకుని పక్షిలా ఎప్పుడూ ఒకేదూరం నుండి ఆకాశాన్ని చూస్తూ ఏమని ఆశపడుతుందో తెలీదు. ఈ వేగం చాలదని, ఈ దారి మార్చమనీ, అమూల్యమైనవి సాధించుకోవడం కోసం గొంతు పెకల్చుకొమ్మని, నీ ఆశల్ని చెప్పెయ్యగల ఒకే ఒక్క మాటను సంపాదించుకొమ్మనీ మనసు తిరుగుబాటు మొదలు పెట్టింది. ఏకాంతం కుదిరిన కొన్ని అరుదైన క్షణాల్లోనే వెతుక్కోవలసిన లోపలి నిధులకోసం నిశ్శబ్ధాన్ని పొరలుగా పెకలించుకుంటూ మూలాలకి చేరుకున్నప్పుడు దొరకబోయే రాళ్లలో రత్నాలెన్నో అన్న ఆరాటంతో “ఆత్మ సొరంగాలు తవ్వుతూ ఉంది.”

అలలపైన తేలడమే బతుకైన వాడికి పడవ మోస్తున్న తన బరువుని బాధ్యత రూపంలో పడవతో పాటుగా తిరిగి తన భుజాలపైకి ఎత్తుకోక తప్పదు. ఉప్పునీటిని వడకట్టేసి  సముద్రసంపదని వెలికి తీసుకొచ్చే వలల్లాగే గొడవల్ని, అసంతృప్తుల్నీ అసాధ్యాల్నీ నీళ్లలా జార్చేసి సౌందర్యాన్ని, సంతోషాన్నీ మాత్రమే మిగిల్చి చూపించగల కలలూ అవసరమే “జీవితం దున్నడానికి గొడవలు భుజాన వేసుకున్నవాడికి”. గడియారంలోని కాలంలా వాస్తవాల్లో బందీ అయి అదే వృత్తంలో తిరగడం తప్పనిసరి అయినప్పుడు, ఒక లిప్తపాటు ఆ భ్రమణం నుంచి తప్పించుకుని కలల ఆకాశాల్లో ఎగిరిపోవాలనే కవి తపన ఈ కవితలో వ్యక్తమౌతుంది.

 

                                                                                                       —–**—-                                                    1swatikumari-226x300—స్వాతి కుమారి

 

ఒక తెలుగమ్మాయి ఇంగ్లీష్ నవల

sathyavati

ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా వున్నాయని పత్రికల్లో చదువుతాం. పత్రికల్లో వచ్చే అనేకానేక భీతావహమైన వార్తల్ని కూడా కాఫీతో పాటు సేవించే స్థితప్రజ్ఞత(జడత్వం?) అలవాటైంది కనుక, ఖాళీ కప్పుతోపాటు పత్రికని కూడా పక్కన పెట్టేసి పనుల్లో మునిగిపోగలం . అయితే మరొక వార్త  దాని పక్కనే ఉంటుంది. రైతుల కుటుంబాలకి ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించిందని!,. ప్రకటించడానికీ .ఇవ్వడానికీ మధ్య ఉన్న అంతరం తెలీని సామాన్యులం, “గుడ్డిలో మెల్ల” అనుకుంటాం.

ఈ అంతరాన్ని గురించే కోట నీలిమ “షూజ్ ఆఫ్ ది డెడ్” అనే ఒక ఆలోచనాత్మకమైన నవల వ్రాసింది. ఇక ఇప్పుడు “మెల్ల” ఏంలేదు అంతా అంధకారమే అనిపిస్తుంది ఈ నవల చదువుతుంటే .అయితే కోట నీలిమ ఈ నవలని ఒక ఆశావహ దృక్పథంతో ముగించింది. దాన్ని మనం “విష్ ఫుల్ థింకింగ్” అనుకున్నాకూడా!! విదర్భలోని పత్తి రైతుల ఆత్మహత్యలు ఈ నవలకి మూలం అని ఆమే చెప్పుకున్నది.విదర్భలో విస్తృతంగా పర్యటించి అనేకమందితో సంభాషించి వ్రాసానని చెప్పింది. రైతుల ఆత్మహత్యలు,డిల్లీ రాజకీయాలు, జర్నలిజంలో నిబద్ధత ముప్పేట అల్లికగా సాగిన ఈ నవల , కథ క్లుప్తంగా…

అసలు రైతుల ఆత్మ హత్యలకి నిజమైన కారణాలు శోధించడం ఎక్కడ నుంచీ మొదలు పెట్టాలి? ఆహార పంటలకి అనువైన పొలాల్లో వ్యాపార పంటలు వెయ్యడం మొదలుపెట్టినప్పటినించా? రైతులు తమ విత్తనాలు తాము తయారుచేసుకోకుండా మేలిమి విత్తనాలని నమ్మచెప్పే కంపెనీల విత్తనాలు కొనుక్కోడం మొదలుపెట్టినప్పటినుంచా? అధిక దిగుబడి ఇస్తాయని చెప్పి కృత్రిమ ఎరువులు, జన్యుమార్పిడి విత్తనాలూ వాటికి అనువుకాని నేలల్లో వెయ్యడాన్ని ఎవరూ నిరుత్సాహపరచకపోవడం మొదలు పెట్టినప్పటినుంచా? తమ ఆరోగ్యాలనుకూడా లెక్కచెయ్యకుండా సంప్రదాయ కీటక నాశనుల బదులు ఘాటైన పురుగుమందులు చల్లడం మొదలుపెట్టినప్పటినుంచా? అధిక దిగుబడి మీద రైతుకు  ఆశ కలుగచేసిన మార్కెట్ సంస్కృతా? చాపకిందనీరులా పాక్కుంటూ వచ్చిన ఈ క్రమాన్నిఇప్పటికైనా గుర్తిస్తున్నామా? మరి ఇప్పటికిప్పుడు వాటినిఆపడం ఎట్లా? రైతుల్ని బ్రతికించుకోడం ఎట్లా? అని సామాన్యులం ఆలోచిస్తాం. .కానీ “మాన్యుల” ఆలోచనలు మరొక విధంగా కూడా వుంటాయి..అంటే ఇలా:

రైతుల ఆకస్మిక మరణాలన్నీనిజంగా ఆత్మహత్యలేనా? పోనీ ఆత్మహత్యలే అనుకుందాం, అవి వానలు కురవక పంటలు పండక, విత్తనాలకీ ఎరువులకీ పురుగుమందులకి చేసిన అప్పులు తీర్చలేక అప్పిచ్చిన వారి వత్తిడి భరించలేక చేసుకున్న ఆత్మహత్యలా? విలాసాలకీ  తాగుడికీ అలవాటుపడి అప్పులుచేసి తీర్చలేక చేసుకున్న ఆత్మహత్యలా?  టీ వీ, సినిమాల ద్వారా పల్లెటూళ్ళకి పాకిన వినిమయ సంస్కృతా? లేక చావుద్వారా తమ కుటుంబానికి నష్టపరిహారం రూపంలో డబ్బు రావాలని చేసుకున్నవా? ఒకే ప్రదేశంలో కొద్దిరోజుల్లోనే ఇన్ని ఆత్మ హత్యలు ఎందుకు సంభవిస్తున్నాయి?అందుమూలంగా ఆ ప్రదేశానికి చెందిన ప్రజాప్రతినిధికి తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని పట్టించుకోడంలేదని  చెడ్డపేరు రాదా?!!  పార్టీలో అతనికున్న పలుకుబడికి  ఎంత విఘాతం? పార్టీకి కంచుకోటలా వున్న ఆ నియోజకవర్గంలో రైతులు నిస్సహాయులైపోయి, ఆత్మహత్యలనే తుది పరిష్కారాలనుకోడం , ఎంత అపఖ్యాతి? ఇవి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లొ మళ్ళీ ఆ పార్టీని. ఆ ప్రతినిధిని ప్రజలు ఎన్నుకుంటారా? కాబట్టి ఈ సమస్యను ఎట్లాపరిష్కరించాలి.?  వాటి సంఖ్యని తగ్గించి చూపించా? ప్రమాదాల స్థాయిని తగ్గించి చూపడం ప్రభుత్వాలకి అలవాటే కదా!!

వారసత్వ రాజకీయ పదవీ సంపద అనే వెండి చెంచాతో పుట్టిన ఒక యువప్రజాప్రతినిథికి  వచ్చిపడిన సమస్య ఇది అతడు“రాజకీయాలలోకి వచ్చాక మొహానికి  మాస్క్ వేసుకోనవసరం లేకుండా మాస్క్ తోనే పుట్టాడ”ట .పదవీ, అధికారం తనకు పుట్టుకతోనే వచ్చాయనీ ,తను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాననీ అతని నమ్మకం,అభిజాత్యం  కూడా ఎందుకంటే,అతని తండ్రి ప్రస్తుతం అధికారంలో వున్న మిశ్రమ ప్రభుత్వంలో మెజారిటీ పార్టీ అయిన డెమొక్రటిక్ పార్టీ ముఖ్య కార్యదర్శుల్లో ఒకరు .ఆయన మంత్రిగా వున్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో కలిగిన జన నష్టానికి నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామాచేసి పార్టీకే అంకితమైన నిజాయతీపరుడుగా ప్రఖ్యాతిపొందాడు. అటువంటి మహనీయునికి  కొడుకుని పార్లమెంట్ కి గెలిపించడం పెద్ద కష్టమేమీ కాదు కదా! పైగా అనేక మంది వృద్ధ నేతల్లాగే దీపం వుండగానే రాజకీయాల్లోకి వారసులను ప్రవేశపెట్టాలనే కోరికకు అతీతుడేమీ కాదు !అందుకని  కొడుకుని జాగ్రత్తగా తీర్చి దిద్దుకుంటూ వస్తున్నాడాయన. అట్లా ఆరునెలలక్రిందట పార్లమెంట్ లో అడుగుపెట్టిన  ఈ యువ ప్రతినిథి పేరు కేయూర్ కాశీనాథ్ ,ఆ తండ్రిపేరు వైష్ణవ్ కాశీనాథ్.. అతని నియోజకవర్గం అయిన మిత్యాలలో , గడచిన నలభై రోజుల్లో ఇరవై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం కేయూర్ ను  కలవర పెడుతున్న సందర్భంలో :

shoes

ఈ సమస్యను చర్చించడానికి కొంతమంది ప్రముఖులతో ఒక నాటి సాయంత్రం  ఒక అంతరంగిక సమావేశాన్ని కొత్త డిల్లీ లోని తన బంగళా వెనక తోటలో  ఏర్పాటుచేశాడు. ఈ అంతరంగిక సమావేశానికి కొంతమంది పత్రికా ప్రతినిథులు, ఒక పరిశోధన సంస్థ దైరెక్టర్,అసిస్టెంట్ డైరెక్టర్  ,ఒక మహా సర్పంఛ్ హాజరయ్యారు..మహా సర్పంచ్ అంటే  జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచ్ లు కలిసి  ఇద్దరు మహా సర్పంచుల్ని ఎన్నుకుంటారు అలా ఎన్నుకున్న ఈ పెద్దమనిషి, డబ్బూ పలుకుబడీ, ప్రాబల్యం కలవాడు.ఇటువంటి మహాసర్పంచ్ లు జిల్లాకి ఇద్దరుంటారు. ఈ సమావేశానికి వచ్చిన మహాసర్పంచ్ పేరు లంబోదర్. అతన్ని వాళ్ళ జిల్లాలో “అపాత్ర”లంబోదర్ అంటారు. “అపాత్ర” అతని ఇంటిపేరేంకాదు . ఆత్మ హత్యలు చేసుకున్న రైతులు పరిహారానికి పాత్రులా, అపాత్రులా అని నిర్ణయించడానికి  జిల్లా కమిటీ ఒకటి వుంటుంది.ఆ కమిటీ వేసే ఓటు ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబానికి  నష్ట పరిహారం,మంజూరు చేస్తారు.ఆ కమిటీ సభ్యుడైన లంబోదర్ ఎప్పుడూ ఎవరికీ “పాత్రత” ఓటు వెయ్యడు.అందరూ ఆయన ఉద్దేశంలో అపాత్రులే .అంచేత ఆయన్ని “అపాత్ర లంబోదర్” అని పిలుస్తారు.  ఆత్మహత్యలు చేసుకోడం ప్రభుత్వాన్ని అవమానించడమని ఆయన ఉద్దేశం .

ప్రజాప్రతినిథి అయిన కేయూర్ తన నియోజక వర్గంలొ ఆత్మహత్యల్ని అరికట్టడానికి ఏం చెయ్యాలో సూచించమని  ఈ సమావేశానికి హాజరయిన వారిని అడిగాడు. ఈ అంశం మీద పరిశోధన చేసి నివేదిక తయారుచేసుకొచ్చిన పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ దయ, తమ సిఫార్సులను చదివి వినిపించమని అతని అసిస్టెంట్ వైదేహికి చెబుతాడు. ఆ నివేదిక ప్రకారం రైతులు అధిక పంటలకోసం ఎక్కువ ఎరువులు ఎక్కువ పురుగుమందులు వాడుతున్నారు. నేలలో ఎక్కువ బోర్ లు వేసి నీటి సారాన్ని పీల్చేస్తున్నారు. వీటికోసం అప్పులు చేస్తున్నారు అవితీర్చలేకపోతున్నారు .అంతే కాదు ఇప్పుడు పెరిగిన రవాణా సౌకర్యాలు పట్నాలనీ పల్లెల్నీ దగ్గర చేసి గ్రామాలలోకూడా వినిమయ సంస్కృతి పెరిగింది..టీవీలూ సినిమాలూ ఆ సంస్కృతిని పెంచిపోషిస్తున్నాయి. భూమి చిన్న చిన్న శకలాలుగా విడిపోయినందువల్ల అందులో ఎక్కువ బోర్లు వేసినందువల్ల భూమిలోని నీరంతా పీల్చేస్తున్నారు.ఊట తగ్గిపోతోంది.కనుక రైతులకి ఎరువుల మీదా విద్యుత్తుమీదా ఇచ్చే రాయితీలు రద్దు చేస్తే వాళ్ళు వ్యవసాయం మానుకుని ఇతర పనుల్లోకి పోతారు ఆ భూమి ఇతరత్రా ఉపయోగపడుతుంది. రైతులు ఆత్మ హత్యలకు పూనుకోకుండా వాళ్లకి ఆధ్యాత్మికమైన కౌన్సిలింగ్ ఇప్పించాలి. అంతేకాక పట్నవాసపు పోకడలను గ్రామీణ యువకులు అనుకరిస్తున్నారు కనుక కొంతమంది పట్నవాసపు యువకులను గ్రామాలకు రప్పించి పట్నవాసాన్ని గురించిన మిధ్యాభావాలను తొలిగించాలి” ఆ నివేదికలోని సిఫార్సులలో కొన్ని ఇవి.

ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను చెప్పే క్రమంలో  ఆ నియోజక వర్గంలో ఆత్మ హత్యల సంఖ్య పెరగడానికి గల కారణాన్ని లంబోదర్ ఇట్లా చెప్పాడు. అతనుండే గోపూర్ గ్రామంలో వ్యవసాయానికి చేసిన అప్పుతీర్చలేక సుధాకర్ భద్ర అనే యువకుడు కొంతకాలం కిందట ఆత్మ హత్య చేసుకున్నాడు.అతనికి వివాహం అయింది ఇద్దరు పిల్లలు కూడా. చదువుకుని పట్నంలో టీచర్ ఉద్యోగం చేస్తున్న అతని తమ్ముడు గంగిరి భద్ర, అన్న మరణ వార్త వినగానే వచ్చాడు. అన్న ఆత్మ హత్య కు ఇచ్చే నష్టపరిహారంతో అప్పులుతీర్చి వదినెనూ పిల్లల్నీ తనతో తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాడు.కానీ సుధాకర్ భద్రది వ్యవసాయానికి సంబంధించిన అప్పులు తీర్చలేక చేసుకున్న ఆత్మహత్య కానే కాదనీ అతను తాగుడు అలవాటుచేసుకుని అప్పులు చేశాడనీ, అతనికి వ్యవసాయం మీద అసలు శ్రద్ధ లేదనీ కమిటీ అతనికి నష్ట పరిహారం తిరస్కరించింది.. తన అన్నకుటుంబానికి నష్టపరిహారం ఇవ్వలేదనే కసితో, గంగిరిభద్ర తన ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామంలో స్థిరపడ్డాడు. అతను జిల్లా కలెక్టర్ ను ఒప్పించి  ఆత్మహత్యల నిర్థారణ కమిటీలో సభ్యుడయ్యాడు . అప్పటినుంచీ  అతను తక్కిన సభ్యుల్ని కూడా ఏదో విధంగా ప్రభావితంచేసి .అన్ని రకాల మరణాలనీ ఆత్మహత్యలుగా నిరూపిస్తున్నాడు.అన్నీ వ్యవసాయ సంక్షోభ సంబంధిత ఆత్మహత్యలు గా తేలుతున్నాయి.అతన్ని కమిటీ లోనుంచీ తప్పిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. అతన్ని తప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు కలెక్టరు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు” అని చెప్పాడు.ఈ సమావేశం కోసం దక్షిణ మధ్య భారతం నించీ వందల మైళ్ళు ప్రయాణం చేసి రాజధానికి వచ్చిన లంబోదర్ మహాసర్పంచ్.

“మరి  ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?” అని చర్చ జరిగింది

“పరిష్కారం గంగిరి భద్రే ..మహా సర్పంచ్ బదులు అతన్నే ఈ సమావేశానికి పిలువవలసింది” అంటాడు  ఒక పత్రికా ప్రతినిధిగా వచ్చిన నాజర్ ప్రభాకర్.

“పరిశోధన కేంద్రం వారి సిఫార్సులు ఒట్టి కంటితుడుపు” అనే అతని వ్యాఖ్యలు, అతను గంగిరిని సమర్థించడం అక్కడ చాలామందికి నచ్చవు’ ఆసమావేశాన్ని గురించీ అక్కడ మాట్లాడిన మాటల గురించీ ఎవరూ పత్రికల్లో వ్రాయవద్దని కేయూర్ అభ్యర్థించాడు.కానీ నాజర్ ప్రభాకర్ అప్పటికప్పుడే  కేయూర్ నియోజకవర్గమైన మిత్యాలలో లెక్కకు మిక్కిలిగా సంభవిస్తున్న ఆత్మహత్యల్ని గురించి తన పత్రికలో వ్రాశాడు. నాజర్ పత్రికా రచనను సీరియస్ గా తీసుకునే వ్యక్తి.తన అభిప్రాయాలను మార్చుకోవలసిన వత్తిడి వచ్చినప్పుడు ఉగ్యోగానికి రాజీనామా చేస్తాడేగానీ ఎవరికీ తలవంచడు.రైతుల ఆత్మహత్యలు అతన్ని నిజంగానే కలవరపెట్టాయి.తను వ్రాసే వార్తలవలన ఏదైనా ఒక క్రియ జరగాలని ఆశపడతాడు.మిత్యాల దరిదాపుల్లోని మూడు జిల్లాల్లో 99 శాతం పొలాల్లో పత్తి పండిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఒక అన్ననో తండ్రినో  భర్తనో పోగొట్టుకోని స్త్రీలు లేరు.

“పూర్వం అక్కడ ఇళ్ళకి తలుపులు వుండేవి కాదు.ఎందుకంటే అక్కడందరి ఇళ్ళూ సమృద్ధిగావుండి ఎవరికీ దొంగతనం చేయాల్సిన అవసరం వుండేది కాదు.ఇప్పుడూ తలుపులు లేవు.ఎందుకంటే దోచుకోడానికి ఏ ఇంట్లోనూ ఏమీలేదు” అని ముగిసింది అతని రిపోర్ట్.

మిత్యాల జిల్లా ఆత్మహత్యల నిర్థారణ కమిటీలో కలెక్టర్ తో సహా పదిమంది సభ్యులున్నారు. అందులో ముఖ్యులు మహా సర్పంచ్ లంబోదర్ ,వడ్డీవ్యాపారి దుర్గాదాస్ మహాజన్ .మిగతా అందరూ వీళ్ళు చెప్పినట్లు వినాల్సిందే. లంబోదర్ కి రాజకీయ ప్రయోజనాలున్నాయి.తన కొడుకుని తనతరువాత అక్కడ ప్రతిష్టించాలనే గాఢమైన కోరిక వుంది వచ్చే ఎన్నికల్లో కేయూర్ స్థానంలో పార్లమెంట్ కి నిలబట్టాలని కూడా వుంది. అతను పోయిన ఎన్నికల్లో కేయూర్ గెలవడానికి చాలా డబ్బు ఖర్చుపెట్టాడు.అందుకు బదులుగా ఒక వందఎకరాల స్థలంలో తన కొడుకు చేత ఏదో పరిశ్రమ పెట్టించాలని అందుకు కేయూర్ తండ్రి సాయంచేయాలనీ ఆశిస్తున్నాడు. ఈ ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమ ప్రణాళిక కేయూర్  కి నచ్చక  పోయినా అతను తండ్రిని ఎదిరించలేడు. అందుచేత కేయూర్ లంబోదర్ కి వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేడు.

ఇక మరొక ముఖ్య  సభ్యుడు .దుర్గాదాస్ మహాజన్  వడ్డీ వ్యాపారి. ఇతను కూడా కేయూర్ గెలవడానికి ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టాడు .అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న ప్రతిరైతుకీ అతని దగ్గర అప్పుంది. వాళ్ళ పొలాలు తాకట్లున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల తన కెంత లాభమో ఆలోచిస్తాడు. నష్టపరిహారం రాకపోతే ఆ పొలం అతను చవుకగా కొనేసుకుంటాడు. అప్పు తక్కువున్నప్పుడు ఒక వేళ పరిహారం అంటూ వస్తే దాన్ని అప్పుకింద తనే జమ కట్టుకుంటాడు .కానీ పరిహారం రాకపోతేనే అతనికి లాభం. గంగిరి అన్న సుధాకర్ పొలంకూడా అట్లాగే కొనుక్కోవాలని అతను ఆశపడ్డాడు. అంతకు ముందు గంగిరి తండ్రి సగం  పొలం అప్పు కింద దుర్గా దాస్ కే అమ్మి వున్నాడు .గంగిరి చదువుకున్నవాడు.ఇంగ్లిష్ మాట్లాడగలడు.దేనిగురించి మాట్లాడాలన్నా ఆ విషయం గురించి కూలంకషంగా తెలుసుకుని వస్తాడు. ఆత్మహత్యలు అంతకుముందూ వున్నాయి ఆ జిల్లాలో….అయితే అవన్నీ సహజ మరణాలుగా చిత్రింపబడి ఆ సంఖ్య ఇంతగా పత్రికలకెక్కలేదు.

గంగిరి  కమిటిలో సభ్యుడైనాక మిగతా సభ్యులందర్నీ కలిసి  మృతులకుటుంబాలకు న్యాయంజరిగేలా వోటు వెయ్యమని నయానో భయానో చాకచక్యంగా ఒప్పించాడు .అంచేత మెజారిటీ ఓట్లతో చాలా కేసుల్లో న్యాయం జరుగుతోంది  అందుకే ఆత్మహత్యల సంఖ్య అంత ప్రస్పుటంగా కనిపిస్తోంది.ఇది కంటకప్రాయం అయింది లంబోదర్ , దుర్గాదాస్ లకి .ఈ సంగతులన్నీ ఆ సమావేశంలో లంబోదర్ కేయూర్ కి చెప్పాడు. వాళ్ళిద్దరూ కలిసి ఎట్లా అయినా గంగిరిని దెబ్బకొట్టాలని నిశ్చయించారు. అప్పుడక్కడికి వేరే పనిమీద వచ్చిన పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్  వైదేహి కి ఆమాటలు వినపడ్డాయి.ఆమె ఆ సంగతి నాజర్ కి చెప్పి గంగిరి ప్రమాదంలో పడ్డాడనీ ఒక ఫోన్ చేసి అతన్ని హెచ్చరించమనీ కోరుతుంది.గోపూర్ దగ్గర ఉన్న తమ సిమెంట్ ఫాక్టరీ ఉద్యోగి ద్వారా గంగిరికి ఒక సెల్ ఫోన్ పంపిస్తుంది. తనమీద దాడి జరగబోతోందనె విషయాన్ని మొదట గంగిరి నమ్మడు తరువాత నమ్మక తప్పలేదు అయినా.అతని మీద దాడి జరిగింది గూండాలు అతన్ని కొట్టారు బలవంతంగా ఆత్మహత్యల నిర్థారణ కమిటీనుంచీ రాజీనామా చేస్తున్నట్టు సంతకం పెట్టించారు ఇల్లూ వూరూ వదిలి పొమ్మన్నారు.కానీ గంగిరి అట్లా చెయ్యలేదు.   “వ్యూహం లేని నిజాయతీ వ్యర్థం”అన్న నాజర్ మాటలు అతనికి నచ్చాయి . అతను ఆవిషయాన్ని కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు.మళ్ళీ మామూలుగానే కమిటీ సమావేశాలకి హాజరయ్యాడు.కలెక్టర్ అతని రక్షణ భారాన్ని లంబోదర్ దుర్గాదాస్ లకే అప్పచెప్పి గంగిరికి ఏం జరిగినా వాళ్లదే బాధ్యత అన్నాడు.తన మీద దాడిచేయించింది కేయూరేనని గంగిరికి కలెక్టర్ కీ కూడా అర్థం అయింది.

కేవలం తన అన్న కుటుంబానికి పరిహారం ఇవ్వలేదనే కోపంతో కాదు గంగిరి గ్రామంలో స్థిరపడింది. సుధాకర్ విషయంలో కమిటీ సభ్యుల ప్రవర్తన అతన్ని చాలా నొప్పించింది. సుధాకర్  తాగుడుకి అప్పచేసాడని దుర్గాదాస్,లంబోదర్ వాదించారు.” నా భర్తకి తాగుడు అలవాటులేదు.తినడానికే డబ్బు లేకపోతే తాగుడికి ఎక్కడ్నించీ వస్తుంది? అని సుధాకర్ భార్య పద్మా, గంగిరీ వాదిస్తే వాళ్ళవన్నీ అబద్ధాలని కొట్టిపడేశారు. మిగిలిన పొలం కొనుక్కోడానికే దుర్గాదాస్ ఇట్లా మాట్లాడుతున్నాడని అర్థం అయింది గంగిరికి. అప్పుడే అతనొక నిశ్చయానికి వచ్చాడు . ఇంక ఎవరూ ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోకూడదు .ఒక వేళ అలాజరిగినా  ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు న్యాయం చేయ్యాలి.ఈ సంకల్పంతో.  పట్నంలో సుఖమైన జీవితాన్నీ,మంచి జీతాన్నీ వదులుకుని వచ్చాడు గంగిరి. పట్నంలో అతను గుంపులో ఒకడు…కానీ ఇక్కడ తను చెయ్యవలసిన పని ఉన్నది.అతనికి  ఊళ్ళో రాజకీయాలు అర్థం అవుతున్నాయి . అతని దగ్గరవున్న డబ్బు ఉద్యోగ విరమణ సందర్భంగా వచ్చిన పాత బకాయి మాత్రమే .దాన్ని అన్ని ఖర్చులకీ జాగ్రత్తగా వాడాలి. అది ఇంట్లో అందరికీ రెండు పూటలా భోజనానికి చాలదు. పిల్లలు దేవాలయంలో రోజూ సాయంత్రం పెట్టే ప్రసాదంతో ఒకపూట పొట్టనింపుకోవాల్సి వస్తోంది. అతని ఎదుట రెండు ఎంపికలున్నాయి.ఒకటి ,ఇల్లూ పొలమూ వచ్చిన కాడికి అమ్మేసి పట్నంలో ఉద్యోగంచూసుకుని వదినెనూ పిల్లల్నూ తీసుకుని వెళ్ళిపోవడం,.లేదా ఇట్లా వాళ్లని పస్తులు పడుకోబెట్టి ఊరికోసం పనిచెయ్యడం.గంగిరి రెండవ దాన్నే ఎంచుకున్నాడు. తన ఆదర్శంకోసం వాళ్ళను బలిచేస్తున్నానని తెలుసు!

గంగిరిమీద త్వరపడి అట్లా దాడి చేయించి వుందకూడదని  కేయూర్ ని అతని తండ్రి  మందలిస్తాడు,ఈ లోగా మిత్యాల నియోజక వర్గపు రైతుల ఆత్మహత్యల్ని గురించి నాజర్ ప్రభాకర్ వ్రాసే రిపోర్ట్ లు వరుసగా పత్రికలో  వస్తున్నాయి. గంగిరి మీద జరిగిన దాడి గురించీ ,అతన్ని కమిటీ నుంచీ తప్పుకుని ఊరువిడిచి పొమ్మని బెదిరించడం గురించీ కూడా వ్రాసాడు. పార్టీ కేయూర్ ని  ప్రెస్ మీట్ పెట్టమని ఆదేశించింది.  ప్రెస్ మీట్ లో సంయమనం కోల్ఫోయాడు కేయూర్.  ఆ ప్రెస్ మీట్ ఘోరంగా విఫలమయినాక కేయూర్ స్వయంగా నియోజకవర్గంలో పర్యటనకి బయలు దేరాడు. అప్పుడుకూడా అతను గంగిరికి ఆ వూరి విడిచిపొమ్మని మర్యాదగానే చెప్పాడు, కానీ గంగిరి వెళ్లనంటాడు.అపాత్ర మని కొట్టిపడేసిన ఆత్మహత్యల కేసుల్ని తిరగదోడి చాలామందికి పరిహారం వచ్చేలా చేస్తాడు కేయూర్..దాన్ని మెచ్చుకుంటాడేగానీ తను వెళ్లనంటాడు గంగిరి ఈ లోగా లంబోదర్ ప్రణాలికలను అర్థం చేసుకుంటాడు కేయూర్.

గంగిరికి సంకల్పబలం వుంది.ఆదర్శం వుంది.ఆత్మగౌరవం వుంది.కానీ దానితోపాటే పేదరికం వుంది. అన్న చేసిన అప్పువుంది .తను పొలంలో పంట వేయడానికి చేసిన అప్పు వుంది. అతనిమీద గౌరవంతో నాజర్ ప్రభాకర్ గానీ డాక్టర్ గానీ డబ్బు అప్పు ఇస్తామంటే తీసుకోడు.అది అభిజాత్యం కాదు. తనలాగా పరిచయాలు లేని సామాన్యులకు దక్కని సహాయం తనకొక్కడికే ఎందుకు? అనుకుంటాడు.దానిఫలితం తిండిలోపంవల్ల అన్న కొడుకు ఆరేళ్ళ బాలు క్షయవ్యాధి బారిన పడతాడు. వాడి వైద్యం కోసం గంగిరి,అందరు రైతుల్లాగే  దుర్గా దాస్ దగ్గరికే వెళ్ళి అప్పు అడుగుతాడు. దుర్గాదాస్ అతన్ని హీనాతిహీనమైన మాటలతో అవమానిస్తాడు.కోపంతో అతని గొంతు పట్టుకుంటాడు గంగిరి.దుర్గాదాస్ అనుచరులు గంగిరిని కింద పడేసి కొడతారు.కలెక్టర్ కి ఆవిషయం తెలిసి దుర్గాదాస్ ని పిలిపించి అతని వ్యాపారానికి లైసెన్స్ రద్దు చేస్తానంటాడు కానీ గంగిరి తనమీద దుర్గాదాస్ అనుచరులు దాడి చెయ్యలేదని ఆ దెబ్బలు మరెక్కడో తగిలాయనీ చెప్పి దుర్గాదాస్ లో పరివర్తన తెస్తాడు.ఈ లోగా ఆరేళ్ళ బాలు మరణిస్తాడు.

ఆ పిల్ల వాడి మృతికి తనే కారణం అన్న అపరాథబావం తట్టుకోలేని  గంగిరి ఆత్మహత్య చేసుకుంటాడు. అతను చేస్తున్న పనినీ అతని సభ్యత్వాన్నీ తన మిత్రుడు వడ్రంగికి అప్పజెబుతాడు.వడ్రంగి తండ్రి కూడా అప్పులు తీర్చలేక ఆత్మహత్యకి పాల్పడ్డవాడే.అతనికి కూడా పరిహారం నిరాకరించబడింది.చివరికి గంగిరి ఆత్మహత్యకు పరిహారం అతని వదినెకు ఇస్తారు.కేయూర్ కాశీనాథ్ పదవికి రాజీనామా చేసి నియోజకవర్గంలో పని చెయ్యడానికి డిల్లీ వదిలిపెట్టి వస్తాడు .ఈ నవలలో  నిబద్ధత కల రాజకీయ నాయకుడు శ్రీనివాస మూర్తి, జర్నలిస్ట్ నాజర్ ప్రభాకర్ మనకి భవిషత్తుమీద ఆశ కలిగించే వ్యక్తులు.

అప్పులు తీర్చలేకపోవడం ఒకటైతే అప్పిచ్చిన వడ్డీ వ్యాపారులు రైతుల్ని చేసే అవమానాలు చాలా ఘోరంగా వుంటాయి. రైతుల్ని బంధించడం ,స్త్రీలని బజార్లో అవమానించడం, పిల్లల్ని పాఠశాలలకు వెళ్ళనీయకపోవడం వంటివి.ఒకరైతుని కాలువలోకి నెట్టి  చాలాసేపు బయటకు రానివ్వకుండా చేస్తే అతను చనిపోతాడు. కనుక ఆత్మహత్యలకు అవమానాలు చాలావరకూ కారణం.అందుకే ఆత్మహత్యల నివారణకు గంగిరి కొన్ని మార్గాలు సూచించాడు.పదెకరాల లోపు వున్న రైతులకి అప్పు తీర్చడానికి ఒక సంవత్సరం గడువువ్వాలి.అందువల్ల తాజా అప్పులు తీసుకునేందుకు అభ్యంతర పెట్టకూడదు..బ్యాంకుల నుంచీ గాని వడ్డ వ్యాపారుల నుంచీ గానీ అప్పుతీసుకుని తీర్చలేకపోయిన వారి జాబితా తయారు చెయ్యాలి.ఈ జాబితాలో రెండేళ్ళపాటు కానీ అంతకన్న ఎక్కువ గానీ ఉన్న వారకి ఏవైనా సంక్షేమ పథకాల ద్వారా సాయం చెయ్యాలి. విత్తనాలు గానీ ఎరువులుగానీ పురుగులు మందులు గానీ అమ్మే వారి రైతులకి అవి నకిలీవి కాదని భరోసా ఇవ్వాలి. తరువాత అప్పులు వసూలు చేసేటప్పుడు బ్యాంక్ లుగానీ వడ్డీ వ్యాపారులు గానీ. పంచాయితీనుంచీ అనుమతి తీసుకోవాలి. వసూలుకు వచ్చేవారితోపాటు కొందరు సాక్షులు వుండాలి.

నవలంతా చదివాక పాఠకులకు వచ్చేసందేహాలు కొన్ని: తన కెంత ఆత్మగౌరవం వుండనీపో ,అన్నకొడుకు కళ్ళ ఎదుట చనిపోతుంటే చూస్తూ వుండడ మేమిటి? ఎవరైనా అప్పు ఇస్తానన్నప్పుడు  తీసుకుని తరవాత ఎందుకు తీర్చరాదు? దుర్గాదాస్.వంటి కరడుగట్టిన వడ్డీ వ్యాపారులు ,కేయూర్ వంటి రాజకీయనాయకులు అంత త్వరగా పరివర్తన చెందుతారా?   తను చేసేయుద్ధం తన సమ ఉజ్జీలతో కాదనీ తనకన్న అధికులతో ననీ తెలిసిన అతనికి  కేవలం ముక్కు సూటిగా పోవడం కాక దానికో వ్యూహం (strategy) వుండాలని  తెలియదా? ఇట్లాంటి ప్రశ్నలు పక్కన పెడితే ఈ నవలలో కోట నీలిమ చిన్న రైతులు చేసే వ్యవసాయం కత్తిమీద సాములాంటిదని చాలా వివరంగా చెప్పింది. ఒక గంగిరిభద్ర ఆత్మ త్యాగం చెయ్యకపోతే  తప్ప రాజకీయ నాయకులు కళ్ళకు కట్టుకున్న గంతలు కాసేపైనా విప్పరు. ఒక నాజర్ ప్రభాకర్  రిపోర్ట్ ల మీద రిపోర్ట్ లు వ్రాస్తే తప్ప తమ నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలుసుకోరు. కనీసం ఎవరి ఓట్లతో అయితే గెలిచారో ఆ జనాన్ని గెలిచిన తరువాత ఒక్కసారైనా కలవరు. ఇంకా గ్రామాల్లో భూస్వాములూ వడ్డీ వ్యాపారులూ రాజ్యమేలడం, బ్యాంక్ అధికారులూ ప్రభుత్వ డాక్టర్లూ కూడా వాళ్ళకు దాసోహమనడం జరుగుతూనే వుంది. రాజకీయ నాయకులకూ   భూస్వాములకూ మధ్య “క్విడ్ ప్రో కో” లు నడుస్తూనే వున్నాయి. ఎకరాల భూమి చేతులు మారుతూ వందలాది మంది పేదలు నిర్వాసితులౌతునేవున్నారు. ఇదంతా ఎలా జరుగుతుందీ నీలిమ కళ్ళకు కట్టిస్తుంది. నీలిమ శైలి నవలను ఒక్క బిగిని చదివిస్తుంది,వాక్యాలు పదునైన కత్తుల్లా వుంటాయి. వ్యంగ్యం ఆమె కు సహజం.

కోటనీలిమ  ఢిల్లీ నుంచీ వెలువడే “సండే గార్డియన్” పత్రికలో పొలిటికల్ ఎడిటర్ గా పనిచేస్తారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలోని ద పాల్ హెచ్ నీచే స్కూల్ ఆఫ్ అడ్వాన్సుడ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో సౌత్ ఏషియన్ స్టడీస్ లో రీసెర్చ్ ఫెలో గా వున్నారు. ఆమె ఢిల్లీలోనూ వాషింగ్టన్ లోనూ వుంటూ వుంటారు, ఈ నవలకు ముందు “రివర్ స్టోన్స్” “దడెత్ ఆఫ్ అ మనీలెండర్”అనే నవలలు వ్రాసారు.ఈ నవలను రూపా ప్రచురించింది( 2013).ఈ నవల మీద నాకు ఆసక్తి కల్గడానికి పాలగుమ్మి సాయినాథ్ హిందూ లో వ్రాసిన వ్యాసాలూ ఆయన పుస్తకం “ఎవిరిబడీ లవ్స్  ఎ గుడ్ డ్రాట్” కారణం.

 – పి. సత్యవతి

 

 

“పోయినోళ్ళు అందరూ…..అవును చాలా, చాలా మంచోళ్ళు….

మా తాత గారి, బామ్మ  గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, మా అమ్మ, మా బాబయ్య గారు (అంటే మా నాన్న గారు) అంతకు రెట్టింపు ఆప్యాయత, బాధ్యతలతో పంచిపెట్టిన “బంధు ప్రేమ” అనే అపురూపమైన అనుబంధాన్ని తనివి తీరా అనుభవించిన తరం మాది. ముఖ్యంగా నా చిన్నప్పుడు ..అంటే 1950-60 దశకాలలో బంధువుల రాకపోకలతో, వాళ్ళు రాగానే సినిమా ప్రోగ్రాములతో, అడ్డాట, ఇస్పేటు మదాం లాంటి అచ్చ తెలుగు పేకాటలతో, కేరమ్స్, చదరంగాలతో, తెల్లారాదేకా అస్సలు ఏం మాట్లాడుకున్నామో ఎవరికీ ఏ మాత్రం జ్జాపకం లేక పోయినా చిన్నా, పెద్ద కలిసీ, ఎవరి వయస్సు  గ్రూప్ వారూ రాత్రి తెల్ల వార్లూ డాబా మీద పడుకుని కబుర్లు చెప్పేసుకుకోవడం మొదలైన వ్యాపకాలతో మా తరం వారి అందరి జీవితాలూ సరదాగా గడిచి పోయేవి. ఇక పెళ్ళిళ్ళ సీజన్ అయితే మరీనూ.

“ఆ పోదురూ, మీరు మరీనూ….మీ తరువాత “ఎర్ర త్రికోణం” రోజులు వచ్చేసి, చుట్టాల సంఖ్య కూడా తగ్గిపోయింది. తరవాత్తరవాత కంప్యూటర్లూ, గ్లోబలైజేషన్లూ వచ్చేసి ఎవరి కుటుంబం చుట్టూ వాళ్ళు  చుట్టూ గీతలు గీసేసుకున్నారు. “ అని చాలా మంది  అంటుంటారు. నా పాయింటు కూడా సరిగ్గా అదే. మా చిన్నతనం గడిచినంత ఆనందంగా ఈ తరం వారి చిన్నతనం లేదు అని మా బోటి వాళ్ళం అనుకుంటూ ఉంటాం. తమాషా ఏమిటంటే ఇప్పటి తరం వాళ్ళు పెద్ద వాళ్ళయి వారి ఆత్మ కథ వ్రాసుకున్నప్పుడు వారు కూడా సరిగా అలాగే అనుకుంటారు!

అన్నట్టు మా బంధువుల గురించి నేను చెప్పుకునేటప్పుడు మా ఇంట్లో ఉండే ఒక తమాషా అలవాటు గురించి ముందే చెప్పుకోవాలి. అదేమిటంటే అసలు బంధుత్వం ఏదైనా ఒక వ్యక్తిని పిల్లలందరరం ఒకే రకం గా పిలిచే వాళ్ళం. ఉదాహరణకి మా నాలుగో మేనత్త కొంత మందికి అక్క, మాకు మేనత్త, మరో కొంత మందికి పిన్నీ అయినా మా బంధువులకీ, స్నేహితులకీ ప్రపంచంలో  అందరికీ ఆవిడ  రంగక్కే.  ఈ వ్యాసం లో కూడా ఆ పద్ధతే పాటించాను. లేక పొతే ఎవరి గురించి వ్రాస్తున్నానో తెలియక గందర గోళం పడిపోతాను. “పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు కనక వారి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తాను.

జయ వదిన, చిట్టెన్ రాజు బాబయ్య

జయ వదిన, చిట్టెన్ రాజు బాబయ్య

నా జీవితం  మీద  సాహిత్య పరంగా కాకపోయినా,  వ్యక్తిత్వ పరంగా చెరగని ముద్ర వేసి ఆత్మీయత విలువని చెప్పకనే చెప్పిన వారిలో మా చిట్టెన్ రాజు బాబయ్య & జయ వదిన లని మొట్టమొదటగా చెప్పుకోవాలి. వరసకి మేనరికం అయిన ఆ దంపతులు అన్ని శుభ కార్యాలకీ పది హీను రోజులు ముందే వచ్చి, అవాంతరాలకి తక్షణమే వాలి పోయి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని మూడు-నాలుగు తరాల అన్ని కుటుంబాలకీ “మూల స్తంభం” లా నిలిచారు. వారికి పిల్లలు లేరు కానీ డజన్ల కొద్దీ బంధువుల పిల్లలందరినీ సొంత పిల్లల లాగానే చూసుకునే వారు. మా ఆఖరి మేనత్త సూర్య భాస్కరం (బాసు పిన్ని అని పిలిచే వాళ్ళం), & పండ్రవాడ సుబ్బారావు (పెద్దాపురం మామయ్య గారు)  దంపతుల పెద్ద కూతురు మా జయ వదిన. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుంది. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా జయ వదినని చూడకుండా ఉండను. మా చిట్టెన్ రాజు బాబయ్య మా నాన్న గారికి వరసకి పెద్ద తమ్ముడు. అంటే…మా తాత గారి సవితి తమ్ముడి పెద్ద కొడుకు. కాకినాడలోనే పుట్టి, అక్కడే చదువుకుని , చాలా సంవత్సరాలు మిలిటరీ లో పని చేసి కో- ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ గా రిటైర్ అయాడు.  వైజాగ్ లో చదువుకునప్పుడు (1961-62)  మా బాబయ్య పనిచేసిన కశింకోట, విజయ నగరం, శృంగవరపు కోట మొదలైన అన్ని ఊళ్ళూ వెళ్ళి, అక్కడ కూడా వారు స్థానికంగా అందరికీ తలమానికంగా ఉండడం నేను స్వయంగా చూసాను.  ఒక సారి  తనే స్వయంగా అంధ్ర విశ్వవిద్యాలయం లో మా హాస్టల్ కి వచ్చి, భోజనం చేసి “రాజా గాడి హాస్టల్ భోజనం బాగా ఉంది. మీరేమీ బెంగ పెట్టుకోకండి” అని కాకినాడ మా అమ్మకి ఒక కార్డు రాసాడు.  ఆత్మీయతకి, అభిమానానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి?

1951 లో మా తాత గారు, బామ్మ గారు ఒకే రోజున పోయినప్పుడు, మా నాన్న గారు, అమ్మా పోయినప్పుడూ వారిద్దరే దగ్గరుండి కర్మకాండలు నిర్వహించడంలో సహాయం చేశారు. మా ఇంట్లో అందరి పెళ్లిళ్ల నిర్వహణ, మా తమ్ముడి పెళ్లి కుదర్చడం మొదలైన శుభ కార్యాలకి వారే సూత్రధారులు. మా బాబయ్య ఆదేశాలతో పది రోజులకి సరిపడా కూర గాయలు కొనడానికి నేను కూడా మా బాబయ్యతో ఎడ్ల బండ్ల మీద కాకినాడ సంత చెరువు దగ్గర పెద్ద మార్కెట్ కి వెళ్ళే వాడిని. రాత్రి పడుకోడానికి మా మామిడి చెట్టు కింద మడత మంచం నేనే వేసే వాడిని. కొంచెం పెద్ద వాడిని అయ్యాక , ఆయనతో పేకాట కూడా ఆడే వాడిని.  నాకు చిన్నప్పటి నుంచీ ఇప్పడూ కూడా గోళ్ళు కొరుక్కునే అలవాటు ఉంది. అది ఎప్పుడు చూసినా ఠకీమని తన వేళ్ళు నా నోటి దగ్గర పెట్టి “నా గోళ్ళు కొరకరా. యింకా రుచిగా ఉంటాయి రా” అని ఆ అలవాటు మాన్పించడానికి సరదాగా ప్రయత్నాలు చేసే వాడు.  మా చిట్టెన్ రాజు బాబయ్య పోయి పదేళ్ళు దాటింది. ఇందుతో మా చిట్టెన్ రాజు బాబయ్య & జయ వదిన ఫోటో జతపరుస్తున్నాను. అలాగే ఆయన తమ్ముళ్లు శంకరం బాబయ్య, రామం బాబయ్య కూడా మేమంటే ఎంతో అభిమానంగా ఉండే వారు. వారిద్దరూ కూడా దివంగతులే.

నాకు ఐదుగురు మేనత్తలు. ముగ్గురు మేన బావలు- అంటే మా మేనత్తల కొడుకులు. వాళ్ళని అమలాపురం బావ, దొంతమ్మూరు బావ, పెద్దాపురం బావ అనే వాళ్ళం అప్పుడప్పుడు. అందులో అమలాపురం బావ ..పెద్ద బావ..మా పెద్ద మేనత్త (ఆవిడని నేను చూడ లేదు)- పెద్ద మామయ్య గారి (గిడుగు వెంకట రత్నం గారు) కొడుకు. పేరు సూర్య ప్రకాస రావు..అంటే మా తాత గారి పేరే. అతను చామన చాయలో పొడుగ్గా భలే తమాషాగా ఉండే వాడు. ఆయన భార్య సుందరక్క , ఆరుగురు ఆడ పిల్లలు (నా మేనగోడళ్ళు) చాలా అందమైన వారు. వృత్తి రీత్యా అడ్వొకేట్ అయిన మా పెద్ద బావ ఎప్పుడు వచ్చినా మాట్లాడడం తక్కువ కానీ ప్రతీ మాటా, చేతా సరదాగానే ఉండేవి.

ఆ తరువాత రెండో మేనత్త (ఆవిడని కూడా నేను చూడ లేదు)  ని  తనని పెంచి పెద్ద చేసిన మేనమామ గారి కొడుకు కుంటముక్కుల కామేశ్వర రావు గారికి ఇచ్చి పెళ్లి చేసారు మా తాత గారు. మా బాసక్క (వరసకి వదిన), హనుమంత రావు బావ వారి పిల్లలే. ఆ మేనత్త పోయిన తరువాత ఆవిడ చెల్లెలు, మా నాలుగో మేనత్త అయిన రంగనాయకమ్మని (ఆవిడ నే రంగక్క అని పిలిచే వాళ్ళం) ఇచ్చి ద్వితీయ వివాహం చేసారు.  హనుమంత రావు బావ మా పెద్దన్నయ్య కంటే చిన్న, మా చిన్నన్నయ్య కంటే పెద్ద. వీళ్లు ముగ్గురూ ఎప్పుడూ కలిసే ఉండే వారు. కలిసే అల్లరి చేసే వారు. కాకినాడలో మా ఇంట్లోనే చదువుకుని నగరంలో సోషల్ సర్కిల్ లో బాగా తిరిగే వాడు. అలనాటి సినీ నటుడు రామశర్మ కి మంచి మిత్రుడు . అతనితో సినిమా తియ్యడానికి ప్రయత్నం చేసాడు కానీ మా నాన్న గారు ఒప్పుకో లేదు. మా కామేశ్వర రావు మామయ్య గారు  హఠాత్తుగా గుండె పోటు తో పోయినప్పుడు మా బావ చిన్న వాడు కాబట్టి మా నాన్న గారు వారి 400  ఎకరాల మిరాసీ పొలాన్ని ని తనే స్వయంగా వ్యవసాయం చేసి తరువాత మా చిట్టెన్ రాజు బాబయ్య మధ్యవర్తిగా మొత్తం ఆస్తి మా బావకి అప్పజెప్పారు.

ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ…మా గాంధీ నగరం పార్కుకి మా హనుమంత రావు బావ ట్రస్టీ గా ఉండే వాడు. ఒక సారి నేను, కొంత మంది కోతి మూకతో కలిసి రాత్రి చీకటి పడ్డాక మట్టి తవ్వేసి పార్కులో ప్రతీ మూలా కలువ పువ్వులతో కళకళ లాడుతూ ఉండే చెరువు కప్పెట్టేసే ప్రయత్నంలో ఉండగా పెద్దులు అనే తోటమాలికి దొరికి పోయాను. ఆ పెద్దులు గాడు మా ఇంట్లో పాలు పితికే గొల్ల వాడే అయినా, చీకట్లో గుర్తు పట్టక నన్నూ, మిగిలిన కుర్రాళ్ళనీ  తాళ్ళతో కట్టేసి అక్కడే లైబ్రరీ లో ట్రస్టీ మీటింగ్ అవుతుంటే అక్కడికి లాక్కుని పోయి నిలబెట్టి “ఈ రౌడీ కుర్ర నాయాళ్ళు సెరువు కప్పెట్టేసి సింద్ర వందర సేసారండి. తవరు ఊ అంటే సంపేత్తానండి, ఆయ్య..” అనేసి పెర్మిషన్ కోసం చూస్తూ ఆ వెలుగులో నా మొహం చూసాడు. ఆ తరువాత మా బావ మొహం చూశాడు. అంతే సంగతులు. నేను చావు తప్పించుకుని మా బావ ధర్మమా అని బయట పడ్డాను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ అరవై ఏళ్ళ  పాటు ఏ చెరువూ, ఆఖరికి అతి చిన్న గుంట కూడా కప్పెట్టే ప్రయత్నం చెయ్య లేదు. చేసినా పెద్దులు గాడి మొహము, మా బావ మొహమూ గుర్తుకు వస్తాయి. మా హనుమంత రావు బావ ఏకైక కుమార్తె లక్ష్మి కి పెళ్లి చేసిన  16  రోజుల పండగ నాడు ఊరేగింపులో గుండె పోటుతో మరణించాడు. మేనల్లుడి మరణాన్ని తట్టుకో లేక కాబోలు మరాక రెండు నెలలలో మా నాన్న గారు ఆ కూడా పోయారు. అప్పుడు నేను అమెరికాలో ఇరుక్కుపోయాను. మా హనుమంత రావు బావ ఎప్పుడూ తన సంగతి చూసుకోకుండా అందరికీ ఎంతో మంచి చేసే వాడు. అలా ఆయన దగ్గర సహాయం పొందిన ఒకాయన ఎవరో పిఠాపురం “హనుమంతరాయ కళాశాల” అని ఒక కాలేజ్ కి అతని పేరు పెట్టి ఆ ఋణం తీర్చుకున్నారు.

ఇక మా పెద్దాపురం  అబ్బులు బావ (ఆఖరి మేనత్త కొడుకు, జయ వదిన తమ్ముడు ) నా కంటే రెండేళ్ళు పై వాడయిన మా సుబ్బన్నయ్య వయసు వాడు. అతని పేరు కూడా (సత్య) సూర్య ప్రకాశ రావే. అబ్బు-సుబ్బు అని వాళ్ళిద్దరూ, రాజా-అంజి అని నేను, మా తమ్ముడూ కవల పిల్లల లాగే  పెరిగాం. అతను కూడా కాకినాడలో మా ఇంట్లోనే ఉండి పాలిటెక్నిక్ చదువుకున్నాడు. మా గేంగ్ అందరం పొద్దుట మా పెద్ద నూతి దగ్గర పంపు తో ఆదరా బాదరాగా నీళ్ళు కొట్టుకుని..అవును చన్నీళ్ళే…. స్నానాలు చేసేసి, తరవాణీయో మరోటో తినేసి ఎవరి స్కూళ్ళకో, కాలేజీలకో వెళ్లి పోయి, సాయంత్రం క్రికెట్ ఆడేసుకుని, శివాలయానికి వెళ్లి పురాణాలో, హరికథలో వినేసి జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించే వాళ్ళం. నేను ఇంజనీరింగ్ లో ప్రవేశించే దాకా మా అబ్బులు బావ టీ=స్క్వేర్ మరియు , స్లైడ్ రూల్ అనే ఇంజనీరింగ్ పరికరాలు భుజాన్న వేసుకుని సైకిల్ మీద వెడుతూ అందరిలోకీ హీరోలా కనపడే వాడు. ఆ పరికరాలు ఇప్పుడు ఎక్కడైనా మ్యూజియంలలో ఉంటాయేమో! అబ్బులు బావ ఎప్పుడూ గలగలా నిష్కల్మషంగా నవ్వే వాడు. పేకాట లో అయినా, కేరమ్స్ లో అయినా ఏ ఆటలో అయినా మా అబ్బులు బావ ఉంటేనే ఆటలు రక్తి కట్టేవి. అతను మా కుటుంబం మీదా, మా నాన్న గారి మీద అభిమానంతో వైజాగ్ లో రామలింగేశ్వర స్వామి దేవాలయం (మా నాన్న గారి పేరు) కట్టించడంలో ఎంతో సహాయం చేసాడు. అమెరికా ఎప్పుడు వచ్చినా హ్యూస్టన్ వచ్చి మా ఇంట్లో నాలుగు రోజులు ఉండే మా అబ్బులు బావని విధి నిర్దయగా రెండేళ్ళ క్రితం పొట్టన పెట్టుకుంది. ఇందుతో చిన్నప్పుటి (బహుశా 1955) మా అబ్బులు బావ, మా హనుమంత రావు బావ, మా పెద్దన్నయ్య (ముగ్గురూ దివంగతులే) ఏడిద కామేశ్వర రావు, మరొక మిత్రుడితో ఉన్న ఫోటో జతపరుస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికీ ఎంత మంది మేన బావలు ఉన్నా, మా అబ్బులు బావదే అగ్ర తాంబూలం.

అబ్బులు బావ, పెదన్నయ్య, హనుమంత రావు బావ

అబ్బులు బావ, పెదన్నయ్య, హనుమంత రావు బావ

ఇక మా నాన్న గారి తరంలో అతిముఖ్యమైన, అతి దగ్గర అయిన బంధువులలో మా సూరీడు బాబయ్య గారే  (రాజమండ్రి) మొదటి వారు. ఆయన మా నాన్న గారి పిన తల్లి (చెల్లంబామ్మ గారు) ఏకైక కుమారులు. ఆయనా, మా నాన్న గారూ చిన్నప్పటి నుంచీ  ఇద్దరూ న్యాయవాదులయ్యే దాకా కలిసే చదువుకున్నారు. ఇద్దరూ మద్రాసు లా కాలేజ్ లో చేరినా, మా నాన్న గారు త్రివేడ్రం లో డిగ్రీ పూర్తీ చేస్తే , మా సూరీడు బాబయ్య గారు మొత్తం మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికే  మొదటి వాడి గా నిలిచి మద్రాసు లా కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. నేను యింకా చూడ లేదు కానీ ఆయన పేరు ఇప్పటికీ ఆ కాలేజ్ లాబీ లో చెక్కబడి ఉంటుందిట. ఆయన పూర్తీ పేరు అయినంపూడి సూర్యనారాయణ మూర్తి గారు ఆయన ప్రాక్టీస్ రాజమండ్రిలోనే కానీ దక్షిణ భార దేశం లో ఆయన అతి పెద్ద సివిల్ లాయర్ ఐఎనెన్ మూర్తి గా నాలుగైదు దశాబ్దాలు పేరు పొంది నేను అమెరిక రాక ముందే చనిపోయారు. మా చిన్నన్నయ్య ఆయన దగ్గరే జూనియర్ లాయర్ గా తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నా వయసు వాడే అయిన అయన కొడుకు (రమణ మూర్తి తమ్ముడు)  ఇప్పుడు ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. సూరీడు బాబయ్య గారి భార్య (స్వర్హీయ మాణిక్యం అక్కయ్య)  మా  అమలాపురం బావకీ తోబుట్టువే!

ఇక్కడ మరొక పిట్ట కథ…..మా సూరీడు బాబయ్య గారికి నేనంటే ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే నా పదేళ్ళప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన. అప్పుడు వాళ్ళబ్బాయి అంటే ..మా రమణ మూర్తి తమ్ముడు కింద పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. నేనూ, మా నాన్న గారు వాణ్ణి చూడడానికి రాజమండ్రి వెళ్లాం బస్సులో. నాకు తెలిసీ నేనూ, మా నాన్న గారూ మాత్రమే కలిసి చేసిన ఒకే ఒక్క బస్సు ప్రయాణం అదే! అప్పుడు నేను ఒక్కడినీ ఇంట్లో ఉండగా ఎవరో ఒక పెద్దాయన కూడా మా తమ్ముణ్ణి చూడడానికే ఇన్నీసు పేటలో మా సూరీడు బాబయ్య గారి ఇంటికి వచ్చాడు. అందరూ హాస్పిటల్ కి వెళ్ళారు అని నేను చెప్పగానీ “నీకు ఆసుపత్రికి దారి తెలుసా?” అని అడిగారు. “మాది కాకినాడ సార్, రాజమండ్రి నాకు తెలీదు” అని వెర్రి మొహం వేసాను. ఆయన చతికిల పడి పోయి “ఓరి నాయనోయ్ ఇప్పుడు ఎలాగా?” అని బెంగ పడిపోతూ ఉంటే నా బుర్రలో ఒక వెలుగు వెలిగి “రిక్షా వాడిని పిలిచి జనరల్ హాస్పిటల్ కి పోనీ అంటే వాడే తీసుకేడతాడు గదా” అన్నాను ఆయనతో. ఆయన “అవును” సుమా…హాస్పత్రి దారి నాకెందుకూ తెలియడం. రిక్షా వెధవకి తెలిస్తే చాలుగా “ అని ఆశ్చర్య పడిపోయి ఆ నాటి నా “తెలివి తేటలని” ఊరంతా టాం టాం చేసి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాడు. అదిగో అప్పటి నుంచీ మా సూరీడు బాబయ్య గారికీ మా కుటుంబంలో మిగిలిన వారికీ నేను తెలివైన వాడి కింద లెక్క. నాకైతే ఆ మాట మీద అంత నమ్మకం లేదు.

ఇలా మా చిన్నతనంలో నన్ను ప్రభావితంచేసిన బంధు కోటిలో మా అమ్మ వేపు వారైన  మా సుబ్బారావు  రావు నాన్న, లక్ష్ముడక్కయ్య, సీతక్క, జనార్దనం బావ, సీతారమణ మావయ్య,  సుబ్బారావు తాతయ్య గారు,  అటు తణుకు నుంచి తాళ్లూరి లక్ష్మీపతి తాతయ్య గారు మొదలైన వారందరూ దివంగతులే. వీలున్నప్పుడు వారి గురించి ప్రస్తావించి  వారి ఋణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను.

ఇప్పుడు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తున్న బంధువులు చాలా మంది ఉన్నా, ఇప్పుడు “ఉన్నోళ్ళందరూ తీపి గుర్తులే” అయినా  అప్పటికీ, ఇప్పటికీ “బందు ప్రేమ” డిపార్ట్మెంట్ లో చాలా తేడా ఉంది అని నాకు అనిపిస్తుంది. మా చిన్నప్పుడు ముందుగానీ “కాల్చేసి” , ఉత్తరం “తగలేసి” అప్పుడు రావడాలు ఎక్కువ అలవాటు లేదు. ఏకంగా పెట్టె, బేడాతో ఎప్పుడు పడితే అప్పుడు దిగిపోవడమే! ఇప్పుడు నేను తాత, మామయ్య, బాబయ్య, బావ మొదలైన ఏ హోదాలోనైనా సరే  “కాల్” చేసి మా బంధువుల ఇంటికి “ఎప్పాయింట్ మెంట్” తీసుకుని వెడితే ముందు పది నిముషాలు అందరూ చుట్టూ కూచుని పలకరిస్తారు. “ఎప్పుడొచ్చావు?, ఏ హోటల్ లో ఉన్నావు? ” అనే ప్రశ్న లోనే “ఎప్పుడు వెళ్తున్నావు?” అనే ధ్వని వినపడుతుంది. అరగంట తరవాత మెల్ల, మెల్లగా కొందరు ఎవరి గదులలోకి వారో, బయటకో జారుకుంటారు ”సీ యు లేటర్” అనుకుంటూ.  ఇక కూచోక తప్పని వారు వాచీలు చూసుకోవడం, టీవీ ఆన్ చెయ్యడం లాంటి చేష్టలు చేస్తారు. ఇక పెళ్ళిళ్ళు మొదలైన వాటిల్లో మండపాల్లోనే అన్ని మంతనాలూనూ.  అమెరికాలో బంధువులు అయితే ఆరు నెలలకో ఏడాదికో ఫోన్ లోనే మాటా, మంతీనూ. ఏం చేస్తాం. అమెరికా ఫ్రీ కంట్రీ కాబట్టి మనం ఎవరి ఇంటికీ వెళ్ళక్కర లేదు, వాళ్ళు రావక్కర లేదు. ఖర్చు తగ్గింది కదా అని ఆనందిస్తాం అందరూ “అమెరికూపస్థ మండూకాలే”.

chitten raju— వంగూరి చిట్టెన్ రాజు

రాలిపోయిన వొక వాక్యం గురించి రెండు మాటలు …!

 

హార్వర్డ్ లో కవిత్వ పాఠాలు చెప్తున్న కాలంలో....

హార్వర్డ్ లో కవిత్వ పాఠాలు చెప్తున్న కాలంలో….

ఆగస్టు 30 పొద్దున్న.

వొక కవి చనిపోయిన రోజు మనసెలా  వుంటుంది?

ఇప్పుడు నేను మాత్రం వాన నీళ్ళు భారంగా దేహంలోకి ఇంకుతున్న పొడి నేలలాగా వున్నాను. కొన్ని నల్ల మబ్బులు తిరుగుతున్న బరువయిన గాలిలాగా వున్నాను.

ఆ కవి నాకేమీ బంధువు కాదు. స్నేహితుడూ కాదు. నన్ను రోజూ పలకరించే నా సహోద్యోగి కూడా కాదు. అసలు నాదీ అతనిది వొక భాష కూడా కాదు. వొక దేశం అసలే కాదు.

కాని, వొక కవి! పాతికేళ్ళుగా అక్షరాలా పలకరిస్తున్న కవి. పలవరిస్తున్న కవి – సీమస్ హీని ఇక లేడు! ఇవాళ పొద్దున్న ఆఫీసుకి వెళ్లి కూర్చోగానే ఈ-లేఖలో చిరకాల మిత్రుడు, అమెరికన్ కవి  మాథ్యూ గిన్నెట్ పలకరింత. “విన్నావా? సీమస్ హీని ఇక లేడు! ఇవాళ నువ్వూ నేనూ కలిసి మనిద్దరికీ ఇష్టమైన అతని కవిత ‘The Republic of Conscience’ చదువుకుందామా?”

అప్పటికప్పుడు నాకు చాల ఇష్టమయిన సీమస్ కవిత్వ సంపుటి OPENED GROUND తీసి, ఆ కవితలోంచి వొక్కో కవితా చదువుతున్నప్పుడు కంటి రెప్పలు తడుస్తో పోతున్నాయి.  కొంత దూరం చదివేసరికి అక్షరాలూ అల్లుకుపోయాయి  తడి పొరల కింద. నాకు తెలుసు- ఏడేళ్ళుగా అతని గుండె ఇక పని చేయను అని బలహీనంగా సడి  చేస్తూనే వుంది.

ఇక చదవలేక ఆఫీసులోంచి బయటికి వచ్చి అక్కడే వున్న Turtle pond అనే చిన్న కొలను పక్కన కూర్చొని, అక్కడి నీళ్ళనీ, అందులోని రాళ్ళ మీదికి మెత్తగా పాకుతున్న తాబేళ్లనీ చూస్తూ కూర్చున్నాను. సీమస్ హీని లేడు…అన్న రెండు పదాలు మెదడులోపల మోగుతున్నాయి. శరీరం చాలా అసౌకర్యంగా వుంది. మనసు లోపల్లోపల వెక్కిళ్ళు పెట్టుకుంటోంది.

ఎందుకీ కవి ఇంతగా నాలోపల మిగిలిపోయాడు? డెబ్బై నాలుగేళ్ల అతని దేహ నిష్క్రమణని ఎందుకు వొప్పుకోలేకపోతున్నాను?

కొంత కాలంగా వొక విధమయిన వ్యక్తిగత వైరాగ్యమూ, వైముఖ్యమూ, నా మీద నాకే కోపమూ  లోపల్లోపల పేరుకుపోయి, “ఇంక నేనేమీ రాయను, రాయలేను!” అని మనసూ, చేయీ రాయి చేసుకొని, రాయాల్సిన వాక్యాలన్నీ మనసులోనే భ్రూణ హత్య అయిపోతున్న సమయంలో సీమస్ నా చేత ఈ రెండు మాటలూ  రాయిస్తున్నాడు.

Seamus-Heaney-006

1

సీమస్ హీని నాకు తండ్రి లాంటి వాడు. మా నాన్నగారూ, అతనూ వొకే ఏడాది – అంటే 1939- లోనే పుట్టారు. ఇవాళ పత్రికలో సీమస్ చివరి ఫోటోలో అతని ముగ్గుబుట్టవంటి తలని చూస్తున్నప్పుడు మళ్ళీ నాన్నగారు గుర్తొచ్చారు. బహుశా, ఈ రెండు మరణాల స్మృతి భారం నన్ను మరింత దిగుల్లోకి నెట్టి వుంటుంది. తండ్రిలాంటి స్మృతి…కాని, సీమస్ వాక్యాలు ఎప్పుడూ వొక స్నేహ పరిమళం వీస్తున్నట్టు వుంటాయి.

ఎమ్మే ఇంగ్లీష్  చదువుతున్న సమయంలో నాగార్జున యూనివర్సిటీ కాంపస్ లో మొదటి సారి మా ప్రొఫెసర్ రంగన్ గారు నాకు ఈ ఐర్లాండ్ కవి వాక్యాలు చెప్పారు. అప్పటి నించీ సీమస్ ని వెతికి పట్టుకోవడం నాకొక వ్యాపకంగా మారింది. బెజవాడ గాంధీనగర్ లో ప్రబోధ బుక్ హౌస్ నించి మా ఆస్టిన్ లైబ్రరీ దాకా దొరికిన చోటల్లా సీమస్ కవిత్వం, వచనమూ వొకటికి రెండు సార్లు చదవడం, మననం చేసుకోవడం — ఈ పాతికేళ్ళుగా అతని కవిత్వం చదువుతున్నప్పుడు ఏనాడూ అతని వయసు అడ్డంకి కాలేదు నాకు. అతని భాష అతని దేశమూ పరాయీ అనిపించలేదు. అతని వదల్లేక వదిలిన వూరు నాదే, అతని చనిపోయిన క్రిస్ అన్నయ్య నా అన్నయే! అతను పాఠాలు చెప్పిన ఎలిమెంటరీ స్కూలు కూడా నాదే! అతన్ని మెప్పించిన ఈట్స్, ఇలియట్, థామస్ హార్డీ, టెడ్ హ్యూ నన్నూ మెప్పించారు. చాలా తక్కువ మంది కవులు ఇలా వుంటారు, మనల్ని తమలోకి ఇంకించుకునే వాళ్ళు! తలుపులు బార్లా తెరిచిన మనసుతో వాక్యాల వెంట తోడు తీసుకు వెళ్ళే వాళ్ళు!

భుజమ్మీద చేయి వేసి, ధైర్యం చెప్తూ కాసేపు, నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని అనునయిస్తూ కాసేపు, నా కళ్ళలోకి చూస్తూ ‘జీవితాన్ని కాస్త ప్రేమించవూ’ అని బతిమాలుతూ కాసేపు–వొక కవి కేవలం కొన్ని వాక్యాల ఆసరాతో ఇన్ని రకాల role-plays చేయగలడా అని విస్మయానికి లోను చేస్తూ–గత పాతికేళ్ళుగా సీమస్ అక్షరాలా తోడుగా వున్నాడు. ఇవాళ అలాంటిదేదో వొక తోడు తెగిపోయింది. లోపల మిగిలివున్న ఆ ధైర్యపు మాట ఏదో పుటుక్కున  దారం తెగిన దండలాగా రాలిపోయింది. వొక నిస్త్రాణ – శరీరంలో, మెదడులో!

ఆ కొలనులో నీటి గలగలల మధ్య అతను లేనితనంలోంచి అతని మాటల్ని వెతుక్కుంటూ కూర్చున్నాను. ‘కవిత్వం ఏమిటీ’ అన్న నా ప్రశ్నకి లోపల్నించి సీమస్ ఇలా సమాధానమిస్తున్నాడు: “నేను పుట్టిందీ పెరిగిందీ పొలాల మధ్య..పొలం పనుల మధ్య! అదీ నా వాస్తవ ప్రపంచం. ఆ పనుల మధ్య కొంచెం అలసట తీర్చుకోడానికి నేను ఆడుకోడానికి వెళ్ళే వాణ్ని. ఆ ఆటలో నన్ను నేను, నా వాస్తవ ప్రపంచాన్ని మరచిపోయే వాణ్ని. అంటే, ఆటస్థలం నా ఊహా ప్రపంచం. ఆ రెండీటి మధ్య వున్న ప్రపంచమే కవిత్వం నాకు!”

ఇంకా కొంచెం ముందుకు వెళ్లి మాట్లాడుకుంటే, జీవనోపాధి వల్ల తను పుట్టిన వూరికి దూరంగా వెళ్ళిపోవడం సీమస్ ని ఎప్పుడూ బాధించేది. వొక చిన్న వూళ్ళో బడిలో పాఠాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ చివరికి హార్వర్డ్ దాకా చేరుకున్నాడు సీమస్. ఈ సుదూర ప్రయాణంలో ఎంత ఆనందం వుందో, అంత బాధా వుంది అతనికి!

వొక కవితలో ఆ బాధని ఇలా చెప్పుకున్నాడు:

ఎక్కడెక్కడికో ఎగిరిపోతుంది గాలిపటం.

దాని దారం నీ చేతుల్లో

నీ గుండెని హత్తుకొని ఎలా వుంటుందో చూసావా?

నిజానికి  దారమొక్కటే నీ చేతుల్లో వుంది.

నీ గాలిపటం అందాలన్నీ

ఎక్కడో ఏ శూన్యాన్నో  అలంకరిస్తున్నాయి.

సీమస్ కవిత్వ రహస్యం అంతా ఆ దూరంలోని బాధ చెప్పడమే! ఎక్కడో వొక వూళ్ళో పుడతాం, కొన్నాళ్ళకి ఆ వూరు విడిచి వెళ్ళిపోతాం. వొక్క రోజు కూడా విడిపోతే వుండలేమనట్టుగా తల్లి కొంగు పట్టుకు తిరుగుతాం. ఆ కొంగుని వదిలేసి ఏడు సముద్రాలూ దాటి వెళ్ళిపోతాం. నాన్న భుజాల మీద ఆడుకోలేని రోజులు అర్థరహితంగా అనిపిస్తాయి. చివరికి అలాంటి అర్థరహితమయిన రోజులే జీవితంలో పెరిగిపోతుంటాయి. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి తిరిగిన చెలకలూ, తవ్వి తీసిన చెలమలూ, హోలీ రంగుల కోసం కోసుకొచ్చిన పూలూ, అల్లరి చేస్తూ గడిపిన పండగ రోజులూ ఇవి లేని బతుకు ఏనాడూ వద్దనుకుంటాం.

కాని, అవన్నీ చూస్తూ చూస్తూ ఉండగానే గతస్మృతులు అయిపోతాయి. ఇప్పటి దూరపు బతుకు వొక్కటే మనకి మిగిలి వుంటుంది. సీమస్ కవిత్వమంతా ఆ ఇంటి పలవరింత, ఆ బంధాల పలకరింత. దూరమయిపోయే దగ్గరితనాల తలపోత. అందుకే, సీమస్ వాక్యాలు చదువుతున్నప్పుడు నా మటుకు నాకు అతని అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నట్టు వుంటుంది. నా కాళ్ళని వెనక్కి నడిపించి గతంలోకి తోసుకుంటూ వెళ్ళే బాల్యమిత్రుడు సీమస్.

ఈ ఐరిష్ నేలా, గాలీ, చేలూ...అతని కవిత్వానికి ఊపిరి

ఈ ఐరిష్ నేలా, గాలీ, చేలూ…అతని కవిత్వానికి ఊపిరి

2

నాకు తెలిసీ, నాకు వున్న పరిమితమయిన అనుభవంలోంచి చెప్పాల్సి వస్తే,   కవిత్వం రాయడమే కష్టం. కోరి కోరి మనసుని నొప్పించుకోవడం! వొక్కో వాక్యం వొక్కో  రకం  నొప్పి. కాని, రాయకుండా వుండడం ఇంకా నొప్పిగా వుంటుంది. ఆ రాయలేని నొప్పి కన్నా రాస్తూ పడే నొప్పి సహించడం తేలిక. అందుకే, బాధపడుతూనే రాస్తాం. సీమస్ అంటున్నాడు:

I am tired of speculations about the relation of the poet’s work to the workings of the world he inhabits, and finally I disagree that ‘poetry makes nothing happen.’ It can eventually make new feelings, or feelings about feelings happen, and anybody can see that in this country for a long time to come a refinement of feelings will be more urgent that a reframing of policies or of constitutions.

ఎన్ని వాదాలు చేసినా, వివాదాలు పడినా కవిత్వం వొక అనుభూతి. రాయడం వొక అనుభూతి, చదవడం వొక అనుభూతి, నలుగురితోనూ కవిత్వం గురించి మాట్లాడుకోవడం వొక అనుభూతి. ఎవరైనా నాలుగు కవిత్వ వాక్యాలు వాళ్ళ గొంతులోంచి పలుకుతూ వుంటే వినడం వొక అనుభూతి.

అందుకే, సీమస్ ఎప్పుడూ అంటాడు: “The main thing is to write/ for the joy of it … It’s time to swim/ out on your own and fill the element/ with signatures on your own frequency.”

సీమస్ చివరిదాకా ఆ ‘రాయడం’ అనే ప్రక్రియలోని  అనుభూతిని కాపాడుకున్నాడు, అది ఎంత నొప్పెట్టినా సరే!

తోపుకాడ (In a Grove)

akira-kurosava_500x330

పరిచయం: రషోమన్ సినిమా గురించి  పాఠకులకు పరిచయం అవసరం లేదనుకుంటా. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి యాభై ఏళ్ళు దాటినప్పటికీ నేటికీ ప్రపంచ సినీ ప్రేమకులు ఈ సినిమా చూసి విశ్లేషిస్తూనే వుంటారు. ఈ సినిమా Ryūnosuke Akutagawa రచించిన రెండు లఘు కథల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మొదటి కథ పేరు రషోమన్. ఈ కథ లోని అంశాన్ని దాదాపు పూర్తిగా వదిలేసి కేవలం సెట్టింగ్ మాత్రమే ఉపయోగించుకున్నారు కురొసావా. ఇక రెండొ కథ ‘In a Grove’. రషోమన్ సినిమా మొత్తం దాదాపుగా ఈ కథ ఆధారంగానే నడుస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం పది పేజీల కథను పూర్తి నిడివి చిత్రంగా మలిచిన కురొసావా ప్రతిభ అపూర్వం. ఇక ’నిజం’ అనే అంశాన్ని ’In a Grove’ లఘు కథలో అకుతగవా ప్రస్తావించిన తీరు అమోఘం. రషోమన్ సినిమాకి ఆధారమైన ’In a Grove’ కథకు తెలుగు అనువాదం ఇది.

******

న్యాయాధికారి ఎదుట కట్టెలుగొట్టువాని దృష్టాంతము

అవునయ్యా! ఆ శవం కనుక్కొంది ఖచ్చితంగా నేనే.

పొద్దుకాల, ఎప్పట్లాగే, కట్టెలు కొట్టుకొద్దామని అడవిలోకి పోయినా. అడివిలోకి కొంచెం దూరం పోంగానే పొదల్లో కనిపించింది సారూ శవం.

ఏడంటారా?

యమషినా రోడ్డుకి వంద గజాల దూరంలో వుందయ్యా ఆ చోటు. ఎదురు మొక్కలు, దేవదారు చెట్లతో నిండిపోయుంటాది ఆ చుట్టూతా.

నేను చూసే పాటికి శవం ఎల్లికల పడుందయ్యా. బులుగు రంగు సిలుకు బట్ట్టలు యేసుకుని వున్నాడా చచ్చిపోయినాయన! గుండెల్ని చీల్చిన కగ్గం గాయం వుండాది శవం పైన. చుట్టూ ఎదురు మొక్కల్నుండి రాలిన ఆకులు రకతం మరకలతో పడుండాయి.

లేదయ్యా నేను చూసేపాటికి రకతం కారటంలేదయ్యా!గాయం ఎండిపోయినాదనుకుంటా.

….ఆ అన్నట్టు మరిచిపోయినా, నేనొచ్చినాననిగూడా లెక్కచేయకుండా ఒక జోరీగ ఆడనే తిరుగుతావుండాది.

కగ్గం గానీ అట్లాంటి ఆయిధాలేమైనా ఆడసూసానా అని అడుగుతున్నారా అయ్యా?

లేదయ్యా.అట్టాంటిదేది లేదు. ఒక తాడు మాత్రం సెట్టుకిందపడివుండాది. ఆ….ఆ తాడు పక్కనే ఒక దువ్వెన కూడా పడివుండాది. అంతే, అయ్యి తప్ప నాకింకేమీ కనబడలే. సూస్తుంటే ఆయన సచ్చిపోయేముందుపెద్ద యుద్ధమే చేసినట్టున్నాడు. ఎందుకంటే అక్కడ గడ్డీ ఆకులు చెల్లాచెదరుగా పడివుండాయి.

గుర్రమా?

లేదయ్యా, ఆ పొదల్లోకి మనుషులు పోవడమే బహుకష్టం. ఇంక గుర్రమెట్టాపోద్ది?

న్యాయాధికారి ఎదుట బౌద్ధసన్యాసి దృష్టాంతము.

సమయమా?

ఖచ్చితంగా మిట్టమధ్యాహ్నం వేళ అయ్యుండవచ్చును. ఆ దురదృష్టవంతుడు సెకియామా నుండి యమషినా వెళ్ళేరోడ్డులో పయనిస్తున్నాడు. గుర్రంపై ఒక యువతిని కూర్చుండబెట్టి ఆయన సెకియామా వైపుగా నడకసాగించడం చూశాను. పరదా కప్పబడివుండడంచే ఆ యువతి మోమునైతే చూడలేకపోతిని గానీ ఆమె ధరించిన బట్టలు మాత్రం ఊదా రంగులో వుండడం గమనించితిని. ఆమె స్వారీ చేస్తున్న గుర్రం మాత్రం అతి సుందర కీసరము తో మేలైన జాతికి చెందినదైనట్టుగా వున్నది.

ఆ యువతి ఒడ్డుపొడుగులా?

నాలుగడుగులు దాటి ఐదంగుళాలుండొచ్చు. బౌద్ధసన్యాసిని కావడంచే ఆమెను అంతగా గమనించియుండలేదు. కానీ, అతను మాత్రం ఒక ఖడ్గం తో పాటు విల్లుబాణాలనూ ధరించివున్నాడు. పొదిలో ఇరవైదాకా బాణాలు కూడా వుండడం నాకు గుర్తుంది.

ఆ వ్యక్తికి ఇటువంటి దుర్గతి పడుతుందని అనుకోలేదు. వేకువవేళ మంచు బిందువులా, తలుక్కున మెరిసి మాయమయ్యే మెరుపులా మానవుని జీవితం కూడా అశాశ్వతమే. ఆతనిపై నా సానుభూతి చూపించుటకు నాకు నోటమాట వచ్చుటయే కష్టముగానున్నది.

*****

images

న్యాయాధికారి ఎదుట పోలీసువాని దృష్టాంతము.

నేను బంధించినవాడా?

వాడు తజొమరు అనబడే ఒక గజదొంగ. నేను బంధించేసమయానికి వాడు గుర్రముపైనుండి కిందపడి అవతగుచి వంతెన వద్ద మూలుగుతూ వున్నాడు.

సమయమా?

పోయిన రాత్రి వేకువజాము అయ్యుండొచ్చు. వీడిని గతంలో కూడా ఒక సారి బంధించే ప్రయత్నం చేసాను. కానీ తప్పించుకున్నాడు. నేను బంధించే సమయానికి బులుగు రంగు బట్టలు ధరించి వున్నాడు. ఇక వీడి దగ్గర వున్న విల్లు బాణాలు మీరు చూసేవున్నారు.

ఈ విల్లు బాణాలు ఆ మరణించిన వ్యక్తివి వలే వున్నాయని మీకూ అనిపించిందా?

అయితే ఖచ్చితంగా హంతకుడు వీడే!

ఇతని దగ్గర దొరికిన – తోలు తో చుట్టబడిన విల్లు, నల్లటి లక్కతో చేయబడిన పొది మరియు డేగ ఈకలతో చేయబడిన పదిహేడు బాణాలు – ఆ మరణించిన వ్యక్తివే అయ్యుంటాయని నా నమ్మకం.

గుర్రం గురించి మీరన్నది నిజమే!

అది జేగురు రంగులో మేలైన కీసరం తో ఉన్నది. పగ్గాలతో కట్టివేయబడని ఆ గుర్రం రాతి వంతెనకు కొంచెం దూరంలోనే గడ్డి మేస్తూ నాకు కనిపించింది. ఆ గుర్రం పై నుండి వీడు కిందపడి నా కంట బడడం తప్పకుండా విధి విధానమే!

ఈ క్యోటో ప్రాంతంలో ఎంతో మంది దొంగలు తిరుగుతున్నారు కానీ ఈ తజొమరు లాగా ఎవరూ మహిళలను వేదనకు గురి చేయటం లేదు. పోయిన ఏడాది పిండోరా పర్వత ప్రాంతంలో వున్న తొరిబె దేవాలయం సందర్శించడానికి వచ్చిన ఒక మహిళ, ఆవిడతో పాటే వున్న ఒక చిన్న పిల్ల హత్యకు గురికాబడ్డారు. ఆ హత్యల వెనుక కూడా తజొమరు హస్తం వుందని భోగట్టా!

మగవాడినే హత్య చేసిన వీడు ఆయన భార్యను ఏం చేసివుంటాడో అర్థం కావటం లేదు. దయచేసి ఆ విషయం గురించి కూడా మీరు విచారణ జరపాలని కొరుకుంటున్నాను.

******

న్యాయాధికారి ఎదుట వృద్ధురాలి దృష్టాంతము.

అవునయ్యా, ఆ శవం నా కూతుర్ని పెళ్ళాడిన వాడిదే.

ఆయన ఈ క్యోటో ప్రాంతానికి చెందిన వాడు కాదు. వకాసా రాజ్యంలోని కొకుఫూ పట్టణంలో సమురాయ్ గా వుండేవాడు. ఆయన పేరు కనాజవా నో టకెహికో,వయసు ఇరవై ఆరు. ఆయన చాలా నెమ్మదస్థుడు, ఇతరులకు కోపం తెప్పించేలా ప్రవర్తించి వుండడని నాకు గట్టి నమ్మకం.

నా కూతురా?

ఆమె పేరు మసాగో, వయసు పంతొమ్మిది. అదో చిలిపి చిచ్చుబుడ్డే కానీ టకెహికోని తప్పితే పరాయి పురుషులతో పరిచయమే లేదామెకి. దానిది చిన్నటి గుండ్రటి మొహం. ఎడమ కన్ను చివర్లో ఒక పుట్టుమచ్చ కూడా వుంటుంది.

నిన్న నా కూతురితో కలిసి వకాసాకి బయల్దేరాడు టకెహికో. ఇంతలోనే వారినిలా దురదృష్టం వెంటాడింది.

నా కూతురు ఏమయిందని అడుగుతున్నారా?

నా అల్లుడు చనిపోయాడని ఒప్పుకోక తప్పకపోయినా నా కూతురు ఎక్కడుందో ఎలా వుందో తలుచుకుంటేనే బాధేస్తుంది. ఆమె ఏమైపోయిందో ఎలానైనా తెలుసుకోండి. ఈ గజదొంగ తజోమరు పేరు తలవడానికే అసహ్యంగా వుంది. నా అల్లుడినే కాదు, కూతురిని కూడా వీడేమైనా…….(ఆపై ఆమెకు మాటలు పెగలక భోరున ఏడ్చేసింది).

******

images1

తజోమరు ఒప్పుకోలు

అతన్ని నేనే చంపాను; కానీ ఆమెను నేను చంపలేదు.

ఆమెక్కడికెళ్ళిందా?

ఏమో నాకు తెలియదు.

అయ్యో, ఒక్క నిమిషం ఆగండి.

నన్నెంత చిత్ర హింసకు గురిచేసినా నాకు తెలియని విషయం గురించి నన్నొప్పించలేరు. అయినా విషయం ఇంతవరకూ వచ్చింది కాబట్టి, అంతా ఉన్నదున్నట్టే చెప్పేస్తాను.

నిన్న మధ్యాహ్నం పూట వాళ్లని నేను మొదటి సారి చూసాను. అప్పుడే వీచిన చిరుగాలికి ఆమె మేలిముసుగు కొద్దిగా తప్పుకోవడంతో ఆమె మొహం ఒక క్షణం పాటు నా కంటపడి ఇంతలోనే ముసుగులోకి మాయమయింది. అందుకేనేమో ఆ క్షణంలో నాకామె బోధిసత్వునిలా అనిపించింది. ఆమెతో వున్న ఆ వ్యక్తిని చంపైనా సరే ఆమెను చెరబట్టాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను.

ఎందుకా?

మీరనుకుంటున్నట్టు చంపడం అనేది నాకు గొప్ప పరిణామమేమీ కాదు.

ఒక యువతిని చెరబట్టాల్సివచ్చిననప్పుడు ఆమె తో వున్న మగవాడిని ఎలాగూ చంపాల్సిందే. ఇదిగో నాతో పాటు ఎప్పుడూ వుండే ఈ కత్తితోనే నేను హత్యలు చేసేది.

అయినా ప్రజలని చంపేది నెనొక్కడినేనా?

మీరు మీ కత్తులు ఉపయోగించి చంపకపోవచ్చు. మీ అధికారంతో ప్రజల్ని చంపుతారు. మీ డబ్బుతో ప్రజల్ని చంపుతారు. ఒక్కోసారి వారికి మంచి చేస్తున్నామనే సాకుతో వారిని చంపుతారు. నిజమే మీ హత్యల్లో రక్తపాతముండకపోవచ్చు. మీరు చంపిన వాళ్ళు కనబడడానికి బాగానే ఆరోగ్యంగానే వుంటారు కానీ శవాలైపోయాక ఏం లాభం. మనిద్దరిలో పెద్ద హంతకుడు ఎవరో తేల్చడం కష్టమే .(హేళనగా నవ్వుతూ)

కానీ మగవాడిని చంపకుండానే అతని ఆడదాన్ని చెరబట్టగలిగితే బాగానే వుంటుంది. అందుకే అతన్ని చంపకుండానే ఆమెను నా దాన్ని చేసుకుందామనే నేను నిర్ణయించుకున్నాను. కానీ అలా చేయడం యమషినా రోడ్డులో సాధ్యం కాదు. అందుకే ఆ జంటను కొండల్లోకి పయనించేలా ప్రలోభపెట్టదలచాను.

అది చాలా సులభంగా జరిగిపోయింది.

కొండల్లో ఒక తోపు దగ్గర ఖడ్గాలు, దర్పణాలతో కూడిన ఒక నిధి గురించి వాళ్ళకి చెప్పాను. నాతో పాటే వచ్చిన వారికి అతి కొద్ది సొమ్ముకే ఆ నిధిని అమ్ముతానని నమ్మబలికాను.

మరి….మీరే చెప్పండి, ఆశకు హద్దుంటుందా?

నేను చెప్పడం ముగించేలోపే అతను నా మాటలను నమ్మేశాడు. నేను వాళ్ళను కలిసిన అరగంట లోపే గుర్రంపై నాతో పాటే కొండల్లోకి ప్రయాణం సాగించారు.

కాసేపట్లోనే నేను చెప్పిన వెదురు తోపు దగ్గరకు చేరుకున్నాము.

నాతో పాటే వచ్చి ఆ నిధిని చూడమన్నాను. అత్యాశతో కళ్ళు మూసుకుపోయిన ఆ వ్యక్తి సరే అని ముందుకు కదిలాడు. కానీ ఆ యువతి మాత్రం గుర్రం తో పాటు అక్కడే ఎదురుచూస్తానంది.

అక్కడ పొదలు పొదలుగా ఎదిగిన వెదురు తోపుని చూసి భయపడి ఆమె అలా అనడం సహజమే అనిపించింది.

నిజానికి, అప్పటివరకూ నేను పన్నిన పథకం సజావుగానే సాగింది.

ఆమెనక్కడే వదిలేసి మేమిద్దరం ముందుకు సాగాం. వెదురు పొదలతో కప్పబడిన త్రోవలో కొంచెం సేపు ముందుకు నడిచాక చుట్టూ దేవదారు వృక్షాలతో కూడిన ఒక చదునైన ప్రదేశం చేరుకున్నాము. నా పథకం అమలు పరచడానికి అదే అనువైన ప్రదేశం అని నిర్థారించుకుని, నేను చెప్పిన నిథి ఆ చెట్లకింద పొదల్లో పాతిపెట్టివుందని అబద్ధం చెప్పాను. నా మాట వినగానే నన్ను తోసుకుంటూ ఆక్కడికి పరిగెట్టాడా వ్యక్తి. అతనక్కడికి చేరుకోగానే వెనకమాలుగా అతన్ని బంధించాను. అతను బలిష్టుడు, కత్తి పట్టిన వీరుడూ కావడంతో కొంచెం కష్టపడాల్సి వచ్చింది. నేను చేసిన పనికి అతను డంగైపోయాడు. వెంటనే నేనతన్ని ఒక దేవదారు వృక్షానికి కట్టిపడేసాను.

నా దగ్గర సమయంలో తాడెక్కడిదనా మీ అనుమానం?

దేవుడి దయవల్ల దొంగని కావడంతో ఏ సమయంలో ఏ గోడ దూకాల్సి వస్తుందోనని ఒక తాడు నాదగ్గర ఎప్పుడూ వుంటుంది. అలాగే అరిచి కేకలు పెట్టకుండా అక్కడున్న ఎండుటాకులతో అతని నోరు మూసేశాను.

అతన్నక్కడే వదిలేసి ఆమె వున్న ప్రదేశానికి చేరుకున్నాను. ఆమె భర్త అకస్మాత్తుగా ఏదో రోగాన పడ్డాడని అబద్ధం చెప్పి ఆమెను నాతో రమ్మన్నాను.

ఈ పథకం కూడా పారిందని మరోసారి చెప్పక్కర్లేదనుకుంటా.

ఆ యువతి తన మేలి ముసుగు తొలిగించి నా వెంట నడిచింది.

ఆమె చెయ్యిపట్టి నేను పొదల్లోకి దారితీశాను. కట్టివేయబడ్డ తన భర్తను చూడగానే ఆమె తన వద్ద వున్న బాకుతో నాపై తిరగబడింది. అంతటి తీవ్ర ఆగ్రహం కలిగిన ఆడదాన్ని నేను జీవితంలో చూడలేదు. నేను అప్రమత్తంగా వున్నాను కాబట్టి సరిపోయింది కానీ లేదంటే నా డొక్కలో పొడిచివుండేది. నేను తప్పించుకుంటూనే వున్నా, ఆమె మాత్రం నాపై దాడి చేస్తూనే వుంది. ఇంకొకరైతే ఆమె చేతిలో చావడమో లేదా తీవ్రంగా గాయపడడమో జరిగి వుండేది.

కానీ నేను తజోమరుని!

నా ఖడ్గం దుయ్యకుండానే ఆమె బాకుని నేలరాల్చాను. ఎంతటి ధైర్యవంతురాలయిన మహిళ అయినా, ఆయుధం లేకపోవడంతో డీలాపడిపోయింది. మొత్తానికి ఆమె భర్తను చంపకుండానే అమె పై నా వాంఛను తీర్చుకొన్నాను.

అవును….అతన్ని చంపకుండానే!

అతన్ని చంపాలనే కోరిక నాకస్సలు లేదు.

దు:ఖసాగరంలో మునిగివున్న ఆమెనక్కడ వదిలి, నేను తోపుదగ్గర్నుంచి పారిపోవాలనుకుంటుండగా, అమె పిచ్చిపట్టిన దానివలే నా చేతులు గట్టిగా పట్టుకుంది. తడబడే మాటలతో తన భర్తో లేదా నేనో ఎవరో ఒకరు చచ్చిపోవాలంది. ఇద్దరి లో ఎవరు బతికుంటారో వాళ్ళకే తను భార్యగా మిగుల్తానని ఒగర్చింది. దాంతో అతన్ని చంపాలనుకునే ఆవేశం నన్నావరించింది. (విషాదంతో కూడిన ఉద్వేగం)

ఇలా చెప్పడం వల్ల, మీకంటే నేనే క్రూరమైన వాడినని మీకనిపించడంలో అనుమానం లేదు.

కానీ ఆ సమయంలో మీరామె కళ్ళు చూసుండాల్సింది.

ముఖ్యంగా ఆ క్షణంలో జ్వలించే ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నా పై పిడుగుపడ్డా సరే, ఆమెను నా భార్యను చేసుకోవాలనుకొని నిర్ణయించుకున్నాను. ’ఎలా అయినా అమెను నా భార్యను చేసుకోవాలి’…….ఆ కోరిక నా మదిని ఆవరించింది.

అది కేవలం కామం అని మీరనుకోవచ్చు. ఆ సమయంలో నాకు కామం తప్ప మరో ఆపేక్ష లేనట్టయితే, అమెనక్కడే తోసేసి పారిపోయేవాడిని. అప్పుడు నా కరవాలానికి రక్తపు మరకలంటి వుండేవి కావు. కానీ ఆ తోపు దగ్గర మసక వెలుతురులో ఆమె మొహం చూసిన క్షణమే, అతన్ని చంపకుండా అక్కడ్నుంచి కదలకూడదని, నిర్ణయించుకున్నాను.

కానీ అన్యాయంగా అతన్ని చంపడానికి నేను పాల్పడలేదు.అతని కట్లు విప్పి నాతో కత్తి దూయమని చెప్పాను.(అప్పుడు నేనక్కడ పడేసినదే దేవదారు చెట్టు కింద దొరికిన తాడు)

కోపంతో మండిపడి అతను తన ఖడ్గాన్ని బయటకి తీశాడు. ఒక్క మాటైనా మాట్లాడకుండా, అలోచనకంటే వేగంగా, నన్ను పొడవడానికొచ్చాడు.

మా ఇద్దరి మధ్య జరిగిన పోరాటం యొక్క పరిణామం మీకు చెప్పక్కర్లేదనుకుంటా!

ఇరవై మూడవ వేటు!

దయచేసి గుర్తుంచుకోండి.

ఈ విషయం నన్నిప్పటికీ నిర్ఘాంతపరుస్తుంది. ఈ భూమ్మీద ఇరవై మూడు సార్లు నా మీద కత్తి దూసిన వారెవ్వరూ లేరు.(హుషారు గా నవ్వుతూ)

అతను నేల రాలాక, రక్తం అంటిన నా ఖడ్గాన్ని నేలకు దించి, ఆమె వైపు తిరిగాను.కానీ ఆమెక్కడ లేకపోవడం చూసి విస్తుపోయాను.ఆమె ఎక్కడికి వెళ్ళిందో అని ఆశ్చర్యపోయాను. అక్కడున్న పొదల్లో ఆమె కోసం వెతికి చూశాను. ఎక్కడైనా అలికిడవుతుందేమోనని నిక్కబొడిచి విన్నాను;చావుబతుకుల్లో ఉన్న ఆ వ్యక్తి మూలుగులు తప్ప మరే శబ్దమూ వినరాలేదు.

మేము కత్తులు దూసినప్పుడే, సహాయం కూడగట్టడంకోసం ఆమె తోపులోపడి పారిపోయుండొచ్చు.

అలా ఆలోచించగానే అది నా చావు బతుకుల సమస్యగా నిర్ణయించుకుని, అతని ఖడ్గం తో పాటు విల్లు బాణాలూ అపహరించి కొండమార్గం గుండా కిందికి చేరుకున్నాను.

అక్కడే ప్రశాంతంగా గడ్డి మేస్తున్న వారి గుర్రం కనిపించింది.

ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడం అనవసర శ్రమ అనుకుంటా!

కానీ నగరంలోకి ప్రవేశించకముందే అతని ఖడ్గాన్ని వదిలించుకున్నాను.

ఇదే నా ఒప్పుకోలు!

నా తలను ఎలాగూ ఇనుప గొలుసుకెక్కిస్తారని తెలిసే చెప్తున్నాను, నన్ను కఠినంగా శిక్షించండి!(అవిధేయమైన దృక్పథం తో)

*****

rashomon3

షిమిజూ దేవాలయాన్ని సందర్శిచవచ్చిన ఒక యువతి ఒప్పుకోలు

నీలం రంగు కిమోనో ధరించిన ఆ వ్యక్తి, నన్ను తన వశం కమ్మని బలవంతం చేస్తూ, అక్కడ కట్టివేయబడిన నా భర్త వైపు చూస్తూ వెకిలిగా నవ్వసాగాడు. నా భర్త ఎంతటి దిగ్భ్రమకు గురైవుంటాడో! బలం పెట్టి కట్లు తెంపుకోడానికి ఎంత యాతనపడ్డా కూడా తాడు ఆయన్ని మరింత బిగువుగా కట్టేసింది. నా గురించి మర్చిపోయి నా భర్త వైపుకు పరిగెట్టాను. లేదా పరిగెడ్దామని ప్రయత్నించాను, కానీ ఆ వ్యక్తి నేనక్కడకు చేరకముందే నన్ను కిందపడేశాడు.సరిగ్గా అప్పుడే నా భర్త కళ్ళల్లో వర్ణించనలివి గాని వెలుగును చూశాను. అది మాటల్లో వ్యక్తీకరించలేనిది….అతని కళ్ళు ఇప్పుడు తలుచుకున్నా నా ఒళ్ళు జలదరిస్తుంది. ఆ క్షణంలో నా భర్త విసిరిన చూపుతో, ఒక్క మాటయినా మాట్లాడకుండానే, అతని హృదయాన్ని నాముందుంచాడు. ఆయన కళ్ళల్లోని ఆ వెలుగు – అటు కోపమూ కాదు, ఇటు బాధా కాదు – ఒక విచిత్రమైన వెలుగు; రోతతో నిండిన ఒక చూపు! ఆ దొంగ చేసిన ఘాతుకం కంటే నా భర్త చూపు చేసిన విఘాతం తట్టుకోలేక గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోయాను.

నాకు మెలుకువ వచ్చేసరికి నీలం రంగు బట్టలు ధరించిన వ్యక్తి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నా భర్త మాత్రం ఇంకా దేవాదరు వృక్షానికి కట్టివేయబడివుండడం చూశాను. వెదురు ఆకులను తొలగించుకుంటూ ఎలాగో కష్టపడిలేచి నా భర్త మొహంలోకి చూశాను;కానీ ఆయన కళ్ళల్లో ఇదివరకటి భావమే తొణికిసలాడింది.

అవజ్ఞత నిండిన ఆయన కళ్ళ వెనుక విపరీతమైన ఏవగింపు నిండివుంది.లజ్జ, అంతర్వేదన, కోపం….అప్పుడు నేననుభవించినది ఇప్పుడు వర్ణించలేకపోతున్నాను. తడబడుతున్న అడుగులతో, నా భర్తను చేరుకున్నాను.

టకెజిరో! విషయం ఇంతవరకూ వచ్చాక ఇక నేను నీతో బతకలేను.నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను…కానీ నువ్వు కూడా చనిపోవాలి. నువ్వు నా అధోముఖాన్ని చూశావు. నువ్వున్న పరిస్థితుల్లో నీవు బతికుండడం భరించలేను” అన్నాను.

అంతకంటే మరోమాట మాట్లాడలేకపోయాను. అప్పటికీ ఏవగింపు మరియు జుగుప్స నిండిన కళ్ళతో ఆయన నన్ను చూడసాగాడు. ముక్కలయిన హృదయంతో, ఆయన ఖడ్గం కోసం వెతికాను. అది ఆ దొంగ తీసుకెళ్ళుండవచ్చు. ఆయన ఖడ్గం కానీ, విల్లుబాణాలు కానీ ఆ తోపు పరిసరాల్లో కనిపించలేదు. కానీ అదృష్టం కొద్దీ నా బాకు నా కాళ్ళ దగ్గరే పడివుంది. దానిని తల వద్దకు ఎత్తిపెట్టి “మీ ప్రాణాలు నాకర్పించండి. తక్షణమే నేనూ మీ వెంటనే నడుస్తాను” అన్నాను.

ఈ మాటలు వినగానే ఆయన అతికష్టం మీద పెదవులు కదిపాడు. ఆకులతో కుక్కబడిన ఆయన నోటివెంట వెలువడ్డ మాటలు సరిగ్గా వినబడలేదు కానీ ఆయన మాటలు నాకు వెను వెంటనే అర్థమయ్యాయి.ఏవగింపు నిండిన అతని కళ్ళు “నన్ను చంపెయ్” మన్నట్టుగా చూశాయి. స్పృహలోనూ లేక ఆదమరచీ ఉండని ఒక స్థితిలో, నా బాకును ఊదారంగు కిమోనో ధరించిన ఆయన గుండెల్లో దింపాను.

ఈ సమయంలో నేను తిరిగి స్పృహ కోల్పోయివుండొచ్చు.

తిరిగి నేను కళ్ళు తెరిచే సరికి, తాడుతో బంధింపబడివుండగానే-ఆయన తన చివరి శ్వాస వదిలిపోయాడు. దట్టమయిన దేవదారు మరియు వెదురు ఆకుల సందుల్లోంచి వస్తున్న ఒక సూర్య కిరణం వివర్ణమయినా ఆయన మొహం పై పడి మెరిసింది. పెల్లుబుకుతున్న దు:ఖాన్ని దిగమింగుకుని ఆయన శవాన్ని చుట్టివున్న ఆ తాడు ఊడదీశాను.

ఆ తర్వాత….ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పే శక్తి నాలో ఇంకా మిగిలిలేదు.

నాకు చనిపోయే శక్తి కూడా మిగల్లేదని మాత్రం చెప్పగలను. నా దగ్గరున్న బాకుతో గొంతు కోసుకున్నాను, అక్కడే వున్న సరస్సులో దూకాను, ఇంకా చాలా విధాలా ప్రయత్నించాను.నా జీవితం ముగించలేక అప్రతిష్టతో ఇలా జీవితం కొనసాగిస్తున్నాను. (వివిక్తంగా నవ్వుతూ) అత్యంత దయార్ద్ర అవలోకితేశ్వరులు కూడా దయచూపించలేని అప్రాచ్యురాలినై వుంటాను.

నా భర్తను నా చేతులారా చంపాను. ఆ దోపిడి దొంగ చే చెరచబడ్డాను. ఇప్పుడు నేనింకేం చెయ్యగలను? ఇంక నేనేం…నేను….(వెక్కి వెక్కి ఏడవసాగింది.)

*****

సోదిగత్తె ద్వారా హత్యగావించబడ్డ వ్యక్తి చెప్పిన కథనం

నా భార్యను చెరిచిన తర్వాత ఆ దోపిడీదారు అక్కడే కూర్చుని ఆమెతో ఓదార్పు మాటలు మొదలుపెట్టాడు. నేను ఒక్కమాటైనా మాట్లాడలేకపోయాను. నేను దేవదారు వృక్షానికి గట్టిగా కట్టివేయబడి వున్నాను. అప్పటికీ ఆమెకేసి చూస్తూ “ఆ దగాకోరు మాటలు నమ్మొద్దు” అని కనుసైగల ద్వారా తెలియచేసే ప్రయత్నం చేశాను. అలా ఎన్నో సార్లు ఆమెకు ఈ విషయం తెలియచెప్పాలని చూశాను. కానీ అప్రసన్నురాలై వెదురు ఆకులపై కూర్చున్న నా భార్య వంచిన తలయెత్తకుండా, చూపులు ఒడిలోనే కేంద్రీకరించింది. ఆమె వాలకం చూస్తే, అతని మాటలు వింటున్నట్టే అనిపించింది. అసూయతో కలతచెందాను. ఈ లోగా ఆ దగాకోరు తెలివిగా ఆ మాటా ఈ మాటా ప్రస్తావిస్తూ వచ్చాడు. చివరికి ఆ దోపిడిదారు తెగించి “ఒకసారి నీ శీలానికి కలంకం కలిగాక, నీ భర్తతో ఎలాగూ సరిగ్గా మెలగలేవు. అందుకే నా భార్యవు కారాదూ? నేనీ అఘాయిత్యానికి తలపడడానికి కారణం నీమీద నాకున్న ప్రేమే”, అని సిగ్గువిడిచి అడిగేశాడు.

ఆ పాతకుడలా చెప్తుండగా, వివశత్వంతో తలెత్తింది. ఆ క్షణంలో కనిపించినంత అందంగా ఆమె మరెప్పుడూ కనిపించలేదు. నేనక్కడ చెట్టుకు కట్టివేయబడివుండగా అందగత్తె అయిన నా భార్య వాడికేమని సమాధానం చెప్పిందో? నేనిప్పుడు ఈ శూన్యంలో కలిసిపోయుండవచ్చు, కానీ ఇప్పటికీ ఆమె సమాధానం తలచుకుంటే కోపం అసూయలతో నిండా రగిలిపోతుంటాను. “నువ్వెక్కెడికెళ్తే నన్నూ నీ వెంట తీసుకెళ్ళ” మని ఆమె చెప్పింది.

ఆమె పాపం ఇది మాత్రమే కాదు.అది మాత్రమే అయ్యుంటే ఈ చీకటిలో నేనింత బాధింపబడివుండేవాడిని కాదు. ఆ రోజు కలలోలాగా వాడితో చేతిలో చెయ్యేసుకుని తోపు లోనుంచి నడిచివెళ్తూన్న ఆమె మొహం ఒక్కసారిగా వివర్ణమయింది. నా వైపు చూపించి “వాడ్ని చంపు.వాడు బతికున్నంతవరకూ నేను నిన్ని పెళ్ళి చేసుకోలేను” అని అంది. “వాడ్ని చంపు”, అంటూ పిచ్చెక్కిన దాని వలె అరిచింది. ఇప్పటికీ ఆ అరుపులు నా చెవులో మ్రోగి నన్ను అధ:పాతాళానికి చేరుస్తాయి. ఇంతకంటే ఏహ్యమైన మాటలు మరే మానవమాత్రుల నోటి నుంచైనా గతంలో వెలువడివుంటాయా? ఇంతకుమించిన శాపనార్థాలు మరే మానవమాత్రుడైనా వినివుంటాడా? ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి…..(జుగుప్సతో నిండిన కేక పెడ్తూ.) అప్పుడామెన్న మాటలకు ఆ బందిపోటు కూడా వివర్ణుడైనాడు. అతని చేతులు పట్టుకుని “వాడ్ని చంపెయ్” అంటూ ఏడ్చింది. ఆమె వైపు కఠినంగా చూస్తూ అతను కాదనలేదు, అవుననలేదు….ఏం చెప్తాడా అని ఆలోచన కూడా నాలో మొదలవ్వకముందే ఆమెను వెదురు కొమ్మలపైకి నెట్టాడు.(మరో సారి జుగుప్సతో నిండిన కేక పెడ్తూ.) మౌనంగా చేతులు కట్టుకొని అతడు నా వైపు చూసి “మీరయితే ఆమెనేం చేసుండేవారు? చంపడమా వదిలేయడమా? మీరు తలూపండి చాలు. ఆమెను చంపెయ్యనా?” అనడిగాడు. కేవలం ఈ మాటల కోసమే నేనతని నేరాన్ని క్షమించగలను.

నేనేం చెప్పాలో తడబడుతుండగా, ఆమె కెవ్వుమని అరుస్తూ తోపు లోకి పారిపోయింది. ఆమెను ఒడిసి పట్టుకోడానికి ఆ దొంగ ప్రయత్నించాడు కానీ అప్పటికే ఆమె అతని చేజారిపోయింది.

ఆమె పారిపోయాక అతను నా ఖడ్గం తో పాటు నా విల్లు బాణాలు తస్కరించి ఒక్క వేటుతో నన్ను బంధించిన తాడు కట్లు తెంపుతూ, “ఇప్పుడు ఇక నా రాత ఎలా రాసుందో” అని గొణుక్కుంటూ అక్కడ్నుంచి మాయమయ్యాడు. ఆ తర్వాత అక్కడంతా నిశ్శబ్దం. లేదు, ఎవరిదో ఏడుపు వినిపించింది. మిగిలివున్న నా కట్లు విప్పుకుంటూ చెవులు రిక్కించి విన్నాను. ఆ ఏడుపు నాలోనుంచే వస్తుందని గ్రహించాను. (చాలా సేపు మౌనం.)

అలసిపోయిన నా శరీరాన్ని దేవదారు వృక్షపు మొదలు నుంచి లేవదీసాను.నా ఎదురుగా నా భార్య వదిలి వెళ్ళిన ఆమె బాకు మెరుస్తూ కనిపించింది. అది తీసుకొని నా రొమ్ములో పొడుచుకొన్నాను. ఒక రక్తపు ముద్ద నా గొంతులోనుంచి ఎగబాకినా కూడా నాకు నొప్పి తెలియలేదు.కాసేపటికి నా రొమ్ము చల్లబడ్డాక అక్కడ శ్మశాన నిశ్శబ్దం నెలకొంది.  పర్వతాల నడుమ ఉన్న ఈ సమాధి పై ఎగురుతూన్న ఒక చిన్న పక్షి అరుపు కూడా లేక అక్కడ గాఢమైన నిశ్శబ్దం తాండవించింది. కేవలం ఒక ఒంటరి కిరణం దేవదారు వృక్షాలపై మెరుస్తూ కొండలపై చేరింది. క్రమంగా ఆ వెలుగు మాయమవ్వసాగింది; దాంతోపాటే దేవదారు మరియు వెదురు వృక్షాలు నా చూపునుంచి దూరమయ్యాయి. నేనక్కడ పడుకొని వుండగా నిశ్శబ్దం దుప్పటిలా నన్నావరించింది.

ఇంతలో ఎవరో నాపైకి ఎగబ్రాకారు. ఎవరో చూద్దామని ప్రయత్నించాను. కానీ అప్పటికే చీకటి నన్ను చుట్టుముట్టేసింది. ఆ వచ్చిన వారెవరో….ఎవరో కానీ నా రొమ్మున గుచ్చుకొన్న బాకును నెమ్మదిగా అక్కడనుంచి తొలగించారు.అప్పుడు మరోసారి రక్తం నా నోట్లోకి ఎగబాకింది. అప్పుడు నేను శాశ్వతాంధకారంలో మునిగిపోయాను.

-అయిపోయింది-

                                                                                                                అనువాదం: వెంకట్ శిద్దారెడ్డి

వెంకట్ శిద్దారెడ్డి

వెంకట్ శిద్దారెడ్డి

 

ప్రేమ ఒక బ్లాక్‌ హోల్‌!

ప్రేమ, పరాధీనత, బానిసత్వం ఈ మూడు పైకి వేరు, వేరు, భిన్నమయిన అంశాలుగా కనిపిస్తున్నప్పటికీ ఈ మూడింటి  అంతఃస్సారం ఒకటే!

ప్రేమ పరాధీనతలోకి, పరాధీనత బానిసత్వంలోకి దారితీస్తుంది. మరో మాటలో చెప్పాలి అంటే ప్రేమ కు మరో పేరు బానిసత్వం. ఇది అతార్కిక ముగింపు అనిపిస్తుందేమో కానీ కొన్ని కొన్ని విషయాలు చదువుతున్నపుడు  కొంత మంది వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నపుడు ‘‘ఇది నిజమే కదా’’! అని కూడా అనిపిస్తుంది. బానిసత్వంలో ‘‘నేను బానిసను, నాకు స్వేచ్ఛ లేదు, నేను పీడింపబడుతున్నాను’’ అన్న ఎరుక, సంవేదన ఉంటాయి.  ప్రేమలోఅదేమీ వుండదు.  

‘‘మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే స్వర్గము’’ అనే ఆత్మార్పణ భావన ప్రేమలోవుంటుంది.  ఈ అర్పించుకోవటం అనే ప్రక్రియ, లేదూ తనని తాను త్యాగం  చేసుకోవడం అనే భావన ప్రేమ కల్పించే అనేకానేక మాయాజాలాలలో ఒకటి. సముద్రం తన మెత్తని హస్తాలతో మన అరికాళ్ళకింద గిలిగింతలు పెట్టినట్లుగా అనుభూతిని కలిగించి పూర్తిగా తనలోకి లాగేసుకుని మనలని శూన్యం చేసినట్లుగానే ప్రేమ కూడా ప్రేమలో వున్న వాళ్ళని ఖాళీమనుషులను చేస్తుంది. ప్రేమ ఒక బ్లాక్‌ హోల్‌.

ఒక రాత్రివేళ నిద్రపట్టక తెలుగు యూనివర్సిటీ వారు ప్రచురించిన సామల సదాశివ ‘‘మలయ మారుతాలు’’ వ్యాస సంపుటిలోని ‘‘ఇస్మత్‌ చుగ్తాయ్‌’’ పరిచయ వ్యాసం చదువుతున్నపుడు నాలో కలిగిన భావ సంచయం ఇది.

ఇస్మత్‌ చుగ్తాయ్‌ మాత్రమే కాదు. బేగం అఖ్తర్‌, మన రావు బాలసరస్వతీదేవి లాంటి ఉదహరించదగిన వ్యక్తుల జీవితాలలో ప్రేమ ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలుసుకుంటే ఆసక్తికరంగా వుంటుంది.

ఇస్మత్‌ చుగ్తాయ్‌ ప్రముఖ ఉర్దూ రచయిత్రి. జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత. ఇప్పటికీ సమాజం ఆమోదించని, చర్చిండానికి యిష్టపడని ఎన్నో విషయాలను నలభై, యాభై సంవత్సరాల క్రితమే తన రచనల ద్వారా ప్రకటించి, చర్చనీయాంశం చేసి సంచలనం సృష్టించిన రచయిత్రి ఇంకా…..

231856

రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కి చెందిన ఇస్మత్‌ చుగ్తాయ్‌ సంపన్న కుటుంబంలో పుట్టింది. తండ్రి కలెక్టర్‌. ఆమె పెద్దన్న అజీం బేగ్‌ చొగ్తాయ్‌, ఇస్మత్‌కి ఊహ తెలిసేవరకే పెద్ద రచయిత. ఇస్మత్‌ మనసు రచన వైపు మరలటానికి ఆమె అన్నే కారణం. మధ్య తరగతి ముస్లిం జీవితాలలోని సామాజిక, నైతిక, ఆర్ధిక, చీకటి కోణాలను వెలికి తీస్తూ ఆమె శర పరంపరగా కథలు రాసింది. లైంగిక విషయాలను కూడా ఎక్కడా అసభ్యతకు తావు ఇవ్వకుండా చర్చకు పెట్టింది. ఇస్మత్‌ మీద పెట్టిన కేసులు ఎన్నో… ఒక్కటీ నిలవలేదు.

ఆమెకు, బొంబాయి మహానగర పాఠశాలల విద్యాధికారిగా పని చేస్తున్నపుడు షాహీద్‌ లతీఫ్‌ అనే యువకుడితో పరిచయం అయింది. అతడు కూడా ఒక చిన్న సైజు రచయిత. సినిమాలకు స్క్రిప్టులు రాసేవాడు. ఇస్మత్‌తో పరిచయం అయ్యాక, ఆమె దగ్గర శిష్యరికం చేశాడు. తన రచనలను ఆమె చేత సరిచేయించుకున్నాడు. సలహాలు తీసుకున్నాడు.

ఒకనాడు ఉన్నట్టుండి. సాహీద్‌ లతీఫ్‌, ఇస్మత్‌తో ‘‘మనిద్దరం పెళ్ళిచేసుకుందామా?’’ అని అడిగాడు. ఆమె విస్తుపోయింది. ఆమె గెజిటెడ్‌ ఆఫీసర్‌. పెద్ద పేరున్న రచయిత్రి. ఖ్యాతినీ, ప్రఖ్యాతినీ సమాన స్థాయిలో మూటకట్టుకున్న ఐకాన్‌.

‘‘మనిద్దరికీ ఎలా కుదురుతుంది’’? అన్నది ఆమె. ‘‘ఎందుకు కుదరదు’’? అన్నాడు అతను. ‘‘నేను నీకు తగిన భార్యను కాను. పురుషాధిక్యతను నేను అస్సలు సహించను. నీకు సేవలు చేయను. నేను మొండిదానిని. అనుకున్న పని చేసేదాకా పట్టు సడలించని దానిని. ఎవరు ఏమి అనుకున్నా నాకు పట్టింపు లేదు. ఇంత ఎందుకు? సంప్రదాయక గృహిణి లక్షణాలు నాలో ఒక్కటీ లేవు. అలాంటి నన్ను చేసుకుని నువ్వేం సుఖపడతావు?’’ అన్నదామె.

లతీఫ్‌ పట్టు విడువలేదు. కోపంతో లతీఫ్‌తో మాట్లాడటం మానేసింది ఇస్మత్‌. అయినా అతడు ఆమె దగ్గరకు వెళ్ళడం మానలేదు. ఇస్మత్‌ అన్న అజీంబేగ్‌ ఎందరు, ఎన్ని రకాలుగా చెప్పినా లతీఫ్‌ తన మొండిపట్టు వీడలేదు.

చివరకు వాళ్ళిద్దరి పెళ్ళి జరిగింది. ఆమె గెజిటెడ్‌ ఆఫీసర్‌. అతడు చిన్న చిన్నస్క్రిప్టులు రాసుకునే మినీ రచయిత. ‘‘గతిలేని వాడికి గెజిటెడ్‌ ఆఫీసరా…? అని అతడి మిత్రులు హేళన చేస్తారని ఉద్యోగానికి రాజీనామా చేసింది. అప్పటికీ ఎంతో పేరు ప్రఖ్యాతులు వున్నా ఆమె, తన కీర్తి ప్రతిష్టలు అతడిని ఆత్మన్యూనతకి గురిచేస్తాయోమోనే ఉద్దేశ్యంతో రచనలు చేయడం మానేసింది. వాళ్ళిద్దరూ వీధిలో నడిచివెళుతున్నపుడు ‘‘ఇద్దరి ఎత్తూ సమానమే’’ అని ఎవరో అన్నారని ‘‘హై హీల్స్‌’’ వేసుకోవడం మానేసింది.

అంతేనా…?

ప్రొడ్యూసర్ల చుట్టూ చక్కర్లు కొట్టి, వెయ్యికీ, రెండు వేలకూ స్క్రిప్టులు రాసే అతడిని నిర్మాతను చేసింది. తను రాసిన నవల ‘‘జిద్ది’’ను సినిమాగా నిర్మించి అతడిని ప్రొడ్యూసర్‌ని చేసింది.

దిలీప్‌ కుమార్‌, కామినీ కౌశల్‌ లాంటి పెద్ద పెద్ద తారలు వాళ్ళ సినిమాలలో నటించారు. సినిమాలు విజయవంతం అయినాయి. సినిమాలకు రాసినా, కథలకీ, స్క్రిప్టులకీ తన పేరు వేసుకోకుండా లతీఫ్‌ పేరునే ప్రకటించేది. ఆ రకంగా అతడిని గొప్ప రచయితను చేసింది.

ఇద్దరమ్మాయిలు కలిగిన తరువాత లతీఫ్‌ మరణించాడు. అతడి అకాల మరణం ఆమెను కుంగదీసింది. కానీ పెరిగిన బాధ్యతలు ఆమెను మళ్ళీ మునుపటి ఇస్మత్‌గా మార్చాయి. తరువాత ఆమె జ్ఞానపీఠ్‌ అవార్డును కూడా పొందింది.

మరణానికి ముందు లతీఫ్‌ తన డైరీలో ఇలా రాసుకున్నాడట. ‘‘నన్ను పెళ్ళిచేసుకుంటే నువ్వు జీవితాంతం బాధపడతావని ఇస్మత్‌ అన్నది. కానీ నాకు తను ఆ అవకాశాన్నే యివ్వలేదు. ఇలాంటి అదృష్టం ఎంత మందికి దొరుకుతుంది?’’

నిజమే. లతీఫ్‌ అదృష్టవంతుడే…

ఇస్మత్‌ కోసం అతడేం చేశాడు. అతడి కోసం ఆమె, ఉద్యోగాన్ని, రచననీ, అన్నింటినీ వదులుకుంది. తను నీడలాగా వెనుక వుండి అతడిని వెలుగులోకి తీసుకుని వచ్చింది. సతీ సావిత్రిని కాను అన్న ఆమె,  సతీ సావిత్రి కంటే తక్కువేమీ కాదు అనిపించుకుంది.

ఇదంతా ప్రేమ కోసమేనా…?

***

LF14_BEGUM2_1296636f

‘‘దీవానా బనానా హైతో బనాదే’’ అనే గజల్‌ ద్వారా ఎంతో మందిని పిచ్చివాళ్ళను చేసిన బేగం అఖ్తర్‌ది మరొక కథ.

అఖ్తర్‌ బాయి ఫైజాబాదీ లక్నోలోమంచి ప్రాక్టీసు గల బారిస్టరు ఇస్తెయాఖ్‌ అబ్బాసీతో  వివాహం జరిగిన తరువాత బేగం అఖ్తర్‌గా మారింది.

సాంప్రదాయిక ముస్లిం కుటుంబంలో పుట్టిన అఖ్తర్‌ బేగం సంగీతం పట్ల ఆసక్తి పెంచుకుని కొన్నాళ్ళు పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్‌ అతా అహ్మద్‌ ఖాన్‌ దగ్గర, మరి కొన్నాళ్ళు ఉస్తాద్‌ అబ్దల్‌ వహీద్‌ ఖాన్‌ దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది.

అఖ్తర్‌ బాయిగా గొప్ప పేరునూ, డబ్బునూ సంపాదించుకుంది. బారిస్టర్‌ అబ్బాసీకి భార్య అయిన తరువాత బేగం అఖ్తర్‌గా మారిన తరువాత కొన్ని సామాజిక కట్టుబాట్లకి లొంగిపోవలసివచ్చింది. బురఖా మాటున ఆమె స్వరం మూగవోయింది. అచ్చం మన రావు బాలసరస్వతిదేవి నూజివీడు జమిందారుల అంత:పురంలో మూగవోయినట్లుగా.

ఆమె సాటి గాయని గాయకులు ఎవరయినా ఇంటికి వస్తే ఆమె అసహాయంగా బేల చూపులు చూసేది. ఎవరి పాటలు విన్నా ఆమెకు ఏడుపు వచ్చేది. ఆ నరకం నుండి ఆమెకు బయట పడాలని వుండేది. కానీ భర్త బారిష్టరు అబ్బాసి పట్ల ఆమెకు వున్న ప్రేమ, భర్త గౌరవం కాపాడాలన్న తాపత్రయం ఆమెను బయటకు రానిచ్చేవి కావు.

ఆ రోజుల్లోనే లక్నో రేడియో స్టేషన్‌కు ప్రొగ్రాం ప్రొడ్యూసర్‌గా వచ్చిన సునీల్‌ బోస్‌కి లక్నో రావడానికి ముందే బేగం అఖ్తర్‌తో పరిచయం ఉంది. ఆవిడ పాడటం మానేయడం పట్ల బాధపడిన సునీల్‌ బోస్‌ ఆమెను ఎలాగయినా పాడిరచాలి అనుకున్నాడు. జస్టిస్‌ మల్హోర్‌ తో కలసి బారిష్టర్‌ అబ్బాసీని ఒప్పించి బేగం సాహెబాని లక్నో రేడియో స్టేషన్‌కి తీసుకురాగలిగాడు.

దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత లక్నో రేడియో స్టేషన్‌ ప్రసారం చేసిన బేగం అఖ్తర్‌ గజళ్ళని విని అసంఖ్యాకులయిన ఆమె అభిమానులు ఆనందపడిపోయారు.

అబ్బాసీ కూడా ఆమె పాటను కట్టడిచేయడం అన్యాయమని, అపచారమని అనుకుని ఆమెకు పాడుకునే స్వేచ్ఛను యిచ్చాడు. అప్పటినుండీ ఆవిడ తన స్వర మాధుర్యంతో ఎందరెందరు సంగీత ప్రియులను తన్మయులను చేసిందో!

***

rbs

అలాగే మన రావు బాలసరస్వతిదేవి. నూజివీడు జమిందారును పెళ్లిచేసుకునేటప్పటికీ గొప్ప గాయని. ఎస్‌. రాజేశ్వరరావుగారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడిరది. నూజివీడు దివాణంలోకి అడుగుపెట్టిన తరువాత ఆవిడ మళ్ళీ బయటి ప్రపంచాన్ని చూడలేదు. స్వరాన్ని సవరించలేదు. రాజ సాంప్రదాయాల కోసం, రాజా వారి మీద వున్న ప్రేమ కోసం, బాల సరస్వతీదేవి స్వరాన్ని త్యాగం చేసింది.

పాట పట్ల ప్రేమ వుండీ, పాటే జీవితం అనుకునీ, పాడగలిగే శక్తివుండీ పాటకు దూరం కావడం అంటే పువ్వునుండి పరమళం దూరం కావడమే. మర్యాద కాదని బాలసరస్వతీదేవి బయటకు చెప్పకపోవచ్చు కానీ, పాటకు దూరమయి ఆవిడ ఎంత నరకాన్ని అనుభవించి వుంటుందో…

రాజావారు దివంగతులయిన తరువాత మళ్ళీ బాలసరస్వతీదేవి పాడటం మొదలుపెట్టారు. కానీ సమయం మించిపోయింది కదా…

ఇస్మత్‌ చుగ్తాయ్‌`

బేగం అఖ్తర్‌`

రావు బాల సరస్వతీదేవి`

వీళ్ళంతా లోకజ్ఞానం లేని మామూలు మనుషులుకారు. కానీ ప్రేమ కోసం కరిగిపోయిన కొవ్వొత్తులు. పెళ్లికి ముందు వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు, పెళ్ళయిన తరువాత వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు. సతీ సావిత్రిని కాను అని మరీ చెప్పిన ఇస్మత్‌ చుగ్తాయ్‌ సతీ సావిత్రిలాగే ప్రవర్తించింది. ఎందుకనీ… లతీఫ్‌ పట్ల ప్రేమకోసం…

హైద్రాబాద్‌ నిజాం రెండవ కుమారుడు ప్రిన్స్‌ మొఖరం జానే ఆత్మాభిమానం కోసం తృణీకరించి వచ్చిన బేగం అఖ్తర్‌ బారిష్టర్‌ అబ్బాసీని పన్నెత్తి ఒక్క మాట కూడా అనలేక, మౌనంగా వుండి పోయింది ఎందుకని… ప్రేమ కోసం.

నూజివీడు రాజావారు బ్రతికి వున్నంతకాలం రావు బాల సరస్వతీదేవి కోట గుమ్మం దాటి బయటకు రాలేదు ఎందుకని…ప్రేమకోసం

ప్రేమ కోసం వాళ్ళు పరాధీనత లోకి వెళ్లిపోయారు. బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ వాళ్ళ సహజ లక్షణాలని స్వయంగా తృణీకరించారు. పురుషుడికి నీడలాగా మారిపోయారు. అది బానిసత్వమన్న ఎరుక కూడా వాళ్లకు లేదు. అదంతా ప్రేమే అని అనుకున్నారు. నిజంగా అది ప్రేమేనా…?

ప్రేమంటే ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించి పంచుకోవాలి కదా! ఇద్దరూ ఒకే స్థాయిలో స్పందించాలి కదా! ఒకే శృతిలో ఒకే స్వరంలా కలసిపోవాలి కదా! ఒకే నాణేనికి రెండు వైపుల్లా నిల్చిపోవాలి కదా…

కానీ అలా జరగడం లేదు!

ఈ ఆధిపత్య భావజాలాన్నీ, దీన్ని అంగీకరించడాన్నీ, అంగీకరించినట్లుగా కూడా తెలుసుకోలేని అజ్ఞానాన్ని… దీన్నంతటినీ ప్రేమే…. అందామా!

 -వంశీకృష్ణ 

 

 

ప్రపంచాన్ని చదివించిన ఆమె..!

Malathi-candoor-Banner

చాలా సార్లు మనం పెద్దగా ఆలోచించం కాని, ఇది చాలా ముఖ్యమయిన ప్రశ్న!

వొక రచన మన జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది? లేదా వొక రచయితో, కవో మన అనుభవంలోకి ఎలా అడుగులు వేసుకుంటూ వస్తారు?

 చెప్పడం కష్టమే!

కాని, మన చదువు అనుభవాలను నెమరేసుకుంటూ ఓ పది నిమిషాలు సాలోచనగా కూర్చున్నప్పుడు వొక్కో రచయితా వొక్కో రచనా వొక్కో మజిలీలా కనిపిస్తాయి. కొన్ని మజిలీలు మనల్ని విస్మయంలో పడేస్తే, ఇంకా కొన్ని మజిలీలు ప్రశ్నలవుతాయి. ఇంకా కొన్ని జవాబులవుతాయి. మాలతి చందూర్ ఏదీ కాదు! అసలు ఆమె రచనలు నేనెప్పుడూ సీరియస్ గా చదవలేదు. ఆమెని నేను సీరియస్ రచయిత్రిగా ఎప్పుడయినా తీసుకున్నానో లేదో తెలీదు. దానికి బలమయిన కారణం వొక్కటే: అసలు సాహిత్యాన్ని వొక సీరియస్ వ్యాపకంగా తీసుకోని కాలం నించీ నేను ఆమె రచనలు చదువుతూ ఉండడమే!

కాని, ఆశ్చర్యం ఏమిటంటే, జీవితంలోని ప్రతి దశలోనూ ఆమె రచనలు ఎదో వొకటి చదువుతూనే వున్నా. వొక రచయితని ఇన్ని దశల్లో ఇన్ని వయసుల్లో చదువుతూ రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

2

నేను మిడిల్ స్కూల్ లో – అంటే ఆరో తరగతి-  చదువుతున్న రోజుల్లో మా అమ్మ గారు రంగనాయకమ్మగారికి వీరాభిమాని. రంగనాయకమ్మ రచనలన్నీ ఆమె మళ్ళీ మళ్ళీ చదివేది. ‘ఆ పుస్తకంలో ఏముంది రెండో సారి చదవడానికి ?’ అని నేను అడిగినప్పుడల్లా నాకు అర్థమయ్యే భాషలో కథలాంటిది ఎదో చెప్పేది. కాని, వాటి మీద నాకు ఆసక్తి వుండేది కాదు. నాకు నాటికల పిచ్చి వుండడం వల్ల కేవలం నాటికల పుస్తకాలే చదివే వాణ్ని ఆ రోజుల్లో!  అవి చదవడానికి బాగుండేవి. పైగా, ఆ డైలాగులు కొట్టుకుంటూ తిరిగే వాణ్ని.

ఇంకో వేపు మా అమ్మగారు మంచి వంటలు చేసేది కాబట్టి, ఎక్కువ సమయం నేనూ అమ్మా వంట గదిలో గడిపే వాళ్ళం. అలా వంటల మీద ఆసక్తి పెంచుకుంటున్న రోజుల్లో ఉన్నట్టుండి వొక రోజు మా ఇంట్లో-వంట గదిలో-   ‘వంటలు- పిండివంటలు’ పుస్తకం ప్రత్యక్షమయింది. మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా ఆసక్తిగా చదివిన తొలి పుస్తకాల్లో ఇదీ వొకటి అని ఖాయంగా చెప్పగలను. ఈ పుస్తకం ఎంత ఉపయోగంలో పెట్టానంటే, ఏడాది తిరిగే సరికి నూనె, కూరలూ, పసుపు మరకలతో ఈ పుస్తకం ఇక చదవడానికి వీల్లేకుండా పోయింది. నాన్నగారు బెజవాడ వెళ్తున్నప్పుడు పనిమాలా చెప్పే వాణ్ని “ మాలతి చందూర్ పుస్తకం ఇంకో కాపీ తీసుకు వస్తారా?” అని!

అలా ప్రతి ఏడాది ‘వంటలు-పిండి వంటలు’ పుస్తకం కొత్త ఎడిషన్ మా ఇంట్లో చేరేది. అది చదవడం వల్ల నాకు జరిగిన లాభం ఏమిటంటే, రెండు వందల పేజీల పుస్తకం ఏదన్నా అలవోకగా ధీమాగా  చదివేయడం! అది ‘చందమామ’ చదివే అనుభవం కన్నా భిన్నమయింది నాకు – మెల్లిగా నా చేతులు మా అమ్మగారి పుస్తకాల మీదకి మళ్ళాయి. నాటికలే కాకుండా, కథలూ నవలలూ చదవడం మొదలెట్టాను. అవి చదవడం మొదలెట్టాక మాలతి చందూర్ ‘వంటలు- పిండివంటలు’నా పుస్తక  ప్రపంచంలోంచి నిష్క్రమించింది.

ఏడో తరగతిలో మేం పట్నం- అంటే ఖమ్మం- చేరాం. కాన్వెంటు చదువు నాకు పెద్ద కల్చర్ షాక్. మిగతా పిల్లలు వాళ్ళ ఇంగ్లీషు పలుకులు వింటున్నప్పుడల్లా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్! అసలు నాకేమీ తెలియదు, ఎలాగయినా సరే ఈ లోకాన్ని ఉన్నపళాన అర్థం చేసేసుకోవాలి అని ఆబ. తెల్లారేసరికి మంచి ఇంగ్లీషు మాట్లాడేయాలి, క్లాస్ మేట్ల మైండ్ బ్లాంక్ అయిపోవాలి అని తీర్మానించుకున్న రోజుల్లో  కనిపించిన ఇంగ్లీషు పుస్తకమల్లా చదివేయడం! పిచ్చి పట్టినట్టు రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకాన్ని మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా చదివేయడం…శంకరనారాయణ నిఘంటువులో రోజూ కొన్ని పేజీలు  బట్టీ కొట్టడం!

నా అవస్థలు చూసి నాకే అవస్థగా వుండేది. అప్పుడు దొరికింది స్వాతి మాసపత్రిక! అందులో మాలతి గారి కెరటాల్లోకి దూకేసాను. మొదటి సారి చదివిన ఇంగ్లీష్ నవల ‘ of human bondage.’ ఆ నవల చదవడానికి ముందు మాలతి గారి వ్యాసం చదివి, అందులో events అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకొని, ఆ పాత్రల పేర్లు కాగితం మీద తెలుగులో రాసుకొని, ఇంగ్లీషు నవల చదవడం! ఇదీ సాధన! అలా మాలతి గారి సపోర్టుతో  ప్రతి నెలా వొక ఇంగ్లీషు నవల చదవడం, ఆ నవల గురించి ఇంగ్లీషులో సమ్మరీ రాసుకొని, కొన్ని సార్లు మాలతి గారి కెరటాల వ్యాసాన్ని నా బ్రోకెన్ ఇంగ్లీషు  అనువాదం చేసుకోవడం ….అలా, ఏడాది తిరిగే సరికి మాలతి గారు నా చేత పన్నెండు నవలలు చదివించారు. డికెన్స్, థామస్ హార్డీ, జేన్ ఆస్టిన్, వర్జీనియా వూల్ఫ్….ఇలా నా బుర్ర నిండా ఇంగ్లీషు పేర్లు!

ఈ క్రమంలో మాలతి గారు నాకు నేర్పిన పాఠం: జ్ఞానానికి భాష అడ్డంకి కాదు- అని! ఆమె ఎంత కష్టమయిన నవల అయినా సరే, అతి తేలికయిన భాషలో చెప్పేస్తుంటే, అంత లావు లావు నవలలు కూడా ‘వీజీ’ అయిపోయేవి. పైగా, ఆ పిచ్చి అవేశాల ఉద్వేగాల టీనేజ్ లో ఆ చిన్ని వ్యాసాల  గడ్డిపోచ పట్టుకొని ఎంత పొగరుమోత్తనంతో ఎంత గోదారి ఈదానో!

 

4

ఆ తరవాత మాలతి చందూర్ సొంత రచనలు ఏం చదివానో పెద్దగా గుర్తుండని స్థితి కూడా వొకటి వచ్చేసింది. పైగా, ఆమె ‘ప్రశ్నలూ జవాబుల’ శీర్షిక ఆవిడ పట్ల నా గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చింది కూడా!  ఇంత చదువుకొని ఈవిడ ఎందుకిలా మరీ నాసిగా రాస్తారా అనుకునే రోజులు కూడా వచ్చేసాయి. సొంతంగా రాయడం ఎంత కష్టమో కదా అని అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని స్థితి! ఆవిడే పరిచయం చేసిన ప్రపంచ సాహిత్యం అంతా చదివాక, ఆవిడ సొంత రచనలు మరీ అన్యాయంగా అనిపించడం మొదలయింది. చూస్తూ చూస్తూ ఉండగానే, నా చదువు పటంలోంచి  మాలతిగారు నిష్క్రమించేసారు.

కాని, ఆమె ‘కెరటాలే’ తోడు లేకపోతే, నాకు ఈ మాత్రం ఇంగ్లీషు వచ్చేది కాదు. ప్రపంచ సాహిత్యం చదవాలన్న తపన నాలో పుట్టేది కాదు. కాని, నా ముందు పరచుకున్న ప్రపంచంలో మాలతి గారిని ఎక్కడ locate చేసుకోవాలో ఇప్పటికీ నాకు తెలియదు.

afsar— అఫ్సర్

 

 

 

 

కల తెగిపోతే…అల ఆగిపోతే..అది సాహిర్ పాట!

sahir11

“కహా హైన్? కహా హైన్? ముహాఫిజ్ ఖుదీకే….జిన్హే నాజ్ హై హింద్ పర్ ఓ కహా హైన్?”

“తూ హిందు బనేగా న ముస్సల్మాన్ బనేగా..ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా!”

“దేఖ్ తేరే భగవాన్ కి హాలత్ క్యా హోగయా ఇన్సాన్…కిత్నా బదల్ గయా భగవాన్!”

ఇవి సాహిర్ లుధియాన్వి కలంలోంచి ఆవేదన తో మిళితమైన ఆవేశంతో తన్నుకు వచ్చిన కొన్ని కవిత్వపు తునకలు. మనలో నిస్తేజంగా పడిఉన్న అంతరంగాన్ని కొట్టి లేపే కొన్ని పదునైన పదశరాలు. తెలుగు వారికి పెద్దగా పరిచితమైన పేరు కాదు కనక సాహిర్ గారి గురించి క్లుప్తంగా చెప్పుకొని ముందుకు సాగుదాం. అబ్దుల్ హాయి గా లుధియానా (పంజాబ్) లో 1921 లో ఒక జమీందారి వంశంలో జన్మించిన సాహిర్, తన చిన్నతనంలోనే తల్లి తండ్రులు విడిపోయి, తన తల్లితో పెరగడం వల్ల, కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు. లాహోర్ లో కొద్ది కాలం ఒక పత్రిక నడిపి, అతని రాతల కారణంగా అరెస్టు వారెంట్ జారీ అవ్వటంతో, బొంబాయి చేరుకొన్నాడు. తరవాత ముఫ్ఫై సంవత్సరాల పాటు, ఏడు వందల పై చిలుకు సినిమా పాటలు, ఉర్దూ కవితా సంపుటాలు వ్రాసుకుంటూ, హిందీ సినిమా పాటలకి ఉచ్ఛస్థాయి కవిత్వస్థానం కలగజేస్తూ, సాటి లేని కవిగా తన పేరుని ఎవ్వరూ చెరపలేని విధంగా ముద్రించుకొని  1980లో మనలోకం వదిలేశారు.

నిజానికి సాహిర్ లుధియాన్వి వ్రాసిన పాటలు చిన్నపడినుంచి వింటూ పెరిగినా, ఒక కవిగా ఆయన పట్ల ఆసక్తి,  ఆయన శైలి పట్ల అభిమానం పెరగటం మాత్రం కొద్ది కాలం క్రితం జరిగిన విశేషమే!  షుమారు ఒక పదిహేనేళ్ళ క్రితం నేనూ, మా ఆవిడ కలిసి చికాగో నుంచి కాలిఫోర్నియాకి వెకేషన్ మీద వెళ్ళినప్పుడు రూట్ 1 లో  శాన్ఫ్రాన్సిస్కో  నుంచి లాస్ ఏంజిలీస్ వరకూ డ్రైవ్ చేసుకెల్దామని డిసైడ్ అయ్యాం. ఈ రోడ్డు పసిఫిక్ కోస్టంబడి ఒక వైపు ఎత్తైన కొండలతో, మరొక వైపు అందమైన సముద్రపు అలల మధ్యన సాగుతూ, అమెరికా లోని టాప్ త్రీ సీనిక్ డ్రైవుల్లో ఒకటిగా పేరు తెచ్చుకొంది. నా మిత్రుడు దారిలో వినటానికని “The Genius of Sahir Ludhianvi” అని ఒక సి.డి ఇచ్చాడు.

“జాయే తో జాయే కహా..”, “వో సుబహ కభీ తో ఆయేగీ”, “యే దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హైన్?”, “ప్యార్ పర్ బస్ తో నహీ హై మేరా లేకిన్ ఫిర్ భీ”, “ఔరత్ నే జనమ్ దియా మర్దోంకో…ఔర్ మర్దోంనె ఉసె బాజార్ దియా!” అంటూ ఒకదాని తరువాత మరొక “ఏడుపుగొట్టు పాటలు” కారంతా వ్యాపించాయి. ఒక పక్కనేమో కళ్ళు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యం, అటూ ఇటూ చూస్తూ డ్రైవ్ చేస్తున్నందుకు నాకు సన్నగా మందలింపు, మధ్యలో ఈ పాటలు! వాల్యూం తక్కువ చేసి, మా ఫ్రెండుని తిట్టుకుంటూ కొంత దూరం ప్రయాణం చేశాం.  ఇంతకు ముందు ఎప్పుడూ వినని గొంతుతో ఒక పాట మొదలయ్యింది.

“తు ముఝే భూల్ భి జావో తో యే హక్ హై తుమకో…మేరీ బాత్ ఔర్ హై మైనే తో ముహౌబ్బత్ కీ హై!” విన్నది నిజమా కాదా అని నిర్ధారించుకోటానికి వాల్యూం పెంచాను. అనుమానం లేదు, విన్నది కరక్టే! ప్రతిపదానువాదంలో (కవితానువాదం చేసే సాహసం చెయ్యలేను) ఇది, “నన్ను మర్చిపోటానికి నీకు హక్కుంది…నా విషయం వేరు, నేను ప్రేమించాను కదా(నిన్ను)!” ఆ లాజిక్ చాలా ఆసక్తి కరంగా అనిపించింది.

http://www.youtube.com/watch?v=dJAIEEwHTqU

“మేరె దిల్ కి మేరె జస్బాత్ కి కీమత్ క్యా హై (నా హృదయానికీ, భావావేశానికీ, విలువేముంది?)
ఉల్ఝి ఉల్ఝి సి ఖయాలత్ కి కీమత్ క్యా హై (నా క్లిష్ఠమైన ఆలోచనలకి విలువేముంది?)
మైనే క్యోం ప్యార్ కియా..తుమ్ నే న క్యోం ప్యార్ కియా (నేనెందుకు ప్రేమించాను..నువ్వెందుకు ప్రేమించలేదు?)
ఇన్ పరేషాన్ సవాలాత్ కి కీమత్ క్యా హైన్? (ఇలాంటి ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు విలువేముంది?)
….
మై తుమ్హారీ హు..యాహి మేరె లియే క్యా కమ్ హై? (నేను నీదానాను…ఇది చాలదా నాకు?)

తుమ్ మేరే హో కే రహో..యే మేరి కిస్మత్ న సహి” (నువ్వు నావాడుగా ఉండటం…నా తలరాతలో లేనప్పటికీ)

ఈ పాట ప్రేయసీ ప్రియుల మధ్య ఒక సంభాషణ లాగా సాగుతుంది. ఒక రోమాన్స్ డ్యూయెట్ లో ఇంత వింత లాజిక్ కనిపించటం మొదటిసారి అవ్వటం వల్లనేమో, ఆ తరవాత వచ్చే ప్రతి పాట లిరిక్స్ నూ చెవులు రిక్కించి వినటం ప్రారంభించాం. ఆ పైన రూట్ 1 సౌందర్యం కూడా మా ధ్యానాన్ని ఆ పాటల పైనుంచి మరల్చలేకపోయింధి. వెకేషన్ అయిపోయిన తరువాత సాహిర్ పైన రిసెర్చ్ చేసి ఆయన పాటలన్నీ జాగర్తగా పరిశీలించటం ప్రారంభించాను. ఒక సముద్రం లోకి దూకాననిపించింది, అదీ ఈత రాకుండా! ఆయన పాటలలో ఉర్దూ పదాలు చాలా విరివిగా దొర్లుతాయి. ఎదో సందర్భానుసారం అర్థం అయినట్లనిపించినా, ఆ భాషలో పట్టు లేకపోవటం వల్ల, శబ్దసౌందర్యాన్ని ఆస్వాదించటమే ఎక్కువగా ఉండేది. ఆన్లైన్ ఉర్దూ నిఘంటువుల పుణ్యమా అని తరవాత రోజుల్లో ఆ బాధ తొలగిపోయింది. కవి ఎవరో తెలియకపోయినా, ఇంతకు ముందు నాకు నచ్చిన, నా నోట్లో నానుతూ ఉన్న అనేక పాత హిందీ పాటలు కూడా ఆయన కలాన్నే చీల్చుకు పుట్టాయన్నవి కూడా నాకా సమయం లోనే తెలిసింది.

ఆయన పాటలు వింటున్నప్పుడు చాలా సార్లు నాకు, జీవితం పట్ల ఆయనకున్న ఫిలాసఫీ, ఆయనలోని రొమాంటిక్ ఇంటెన్సిటీ, ఆయన సొంత కథ, భావాలనే, ఆయన పాటలలో ప్రతిబింబించేవాడనిపించేది, అది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసుండకపోయినా.

సాహిర్ స్వయంగా చిన్నతనంలో ఎన్నో కష్టాలని అనుభవించి ఒక గొప్ప కవిగా పేరునేర్పర్చుకున్న నేపథ్యంలో “హమ్ దోనోం” సినిమాలోని పాట ఇది.

“మై జిందగీ కా సాథ్ నిభాతా చలాగయా.. (నేను జీవితానితో వెన్నంటి సాగుతున్నా)

హర్ ఫిక్ర్కో ధువే మే ఉడాతా చాలాగయా.. (అన్ని దిగుళ్ళనూ పొగలాగా ఊదేసుకుంటూ సాగుతున్నా)

బర్బాదియోంకా శోక్ మనానా ఫిజూల్ థా… ( వినాశనాల (ఓటముల) గురించి విచారం వ్యర్థం)

బర్బాదియోంకా జష్న్ మనాతా చాలా గయా.. (వాటినే పండగ చేసుకొని సాగుతున్నా)

గమ్ ఔర్ ఖుషీ మె ఫర్క్ న మెహసూస్ హో జహా.. (దుఖానికీ సుఖానికీ మధ్య వ్యత్యాసం ఎక్కడైతే ఉండదో)
మై దిల్ కో అస్ మకామ్ పె లాతా చాలా గయా..” (ఆ స్థానానికి నా హృదయాన్ని తీసుకెళ్తూ సాగుతున్నాను)

http://www.youtube.com/watch?v=IzC0_XVE3Vk

గురుదత్ సినిమా ప్యాసా గురించి, దానిలోని పాటల గురించి, కొన్ని Ph.D వ్యాసాలు వ్రాయచ్చు. హీరో ఒక గుర్తింపు లేని కవి. అతడు చనిపోయాడనుకున్న తరవాత, అతడి కవితలు వెలుగులోకొచ్చి, గొప్ప కవిగా గుర్తింపబడతాడు. “నేను బ్రతికేఉన్నాను” అని ఎంత మొత్తుకున్నా వినకుండా పిచ్చోడికింద జమకట్టిన సమాజాన్ని, ఆ కవి  వెలివేసి వెళ్ళిపోవటంతో కథ ముగుస్తుంది. ఒక ఫలించని ప్రేమ కథ, మంచి మనసున్న ఒక వేశ్యతో మరో ప్రేమ కథ, సబ్ ప్లాట్స్ గా ఉంటాయి. ఒక కవికి ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందా? సాహిర్ ఈ సినిమా పాటల్లో తమ విశ్వరూపాన్ని ఆవిష్కరించారు. ఎంతగా అంటే, ఆ సినిమా పాటలకి చక్కని బాణీలు కట్టిన యస్.డి.బర్మన్ కి కూడా లభించనంత గుర్తింపు సాహిర్ సాహెబ్ కు దక్కేంతలా.

సాహిర్ తన నిజజీవితంలో కూడా రెండు సార్లు విఫలప్రేమాబాధితుడై ఆజన్మ బ్రహ్మచారి గానే మిగిలిపోయాడు. తన భవిష్యత్తుని ముందుగానే గుర్తించి ఈ పాట వ్రాశారా?
“జానే వో కైసే లోగ్ థే జిన్కే ప్యార్ కో ప్యార్ మిలా..” పాట నుంచి.
“బిఛడ్ గయా హర్ సాథీ దేకర్ పల్ దో పల్ కా సాథ్.. (అందరూ దూరమయ్యారు ఒకటి రెండు క్షణాల సాహచర్యం తరవాత)

కిస్కో ఫుర్సత్ హై జొ థామే దీవానోంకా హాథ్.. (ఎవరికి ఓపిక ఒక పిచ్చివాడి చెయ్యి పట్టుకోవటానికి)

హమ్కో అప్నా సాయా తక్ అక్సర్ బేజార్ మిలా..”(చివరికి నా నీడకు కూడా నేనంటే అలసటొచ్చింది)

http://www.youtube.com/watch?v=cmWZHQAKMEk

 

సాహిర్ షాయారీలో స్త్రీల పట్ల, సమాజంలో వారి అణచివేతపట్ల కూడా తీవ్రమైన ఆవేదన కనపడుతుంది. ఆయన దానిని వ్యక్తపరచటంలో ఎక్కడా “రొమాంటిసైజ్” చెయ్యకుండా సూటిగా శులాల్లాంటి మాటల ప్రయోగంతో శ్రోతలను కలవరపెట్టేవారు. ఆ మాటల తీవ్రత ఒక్కోసారి మనని ఎంత బాధ పెడుతుందంటే, అసలు ఆ పాటే వినటం ఆపేద్దాం అనేంత! 1958 లో విడుదలైన “సాధనా” చిత్రం లోని “ఔరత్ నే జనమ్ దియా మర్దోంకో .. మర్దోంనే ఉసే బాజార్ దియా” అనే పాట లోని కొన్ని వాక్యాలు ఇవి.

“జిన్ హోటోన్ నె ఇన్కో ప్యార్ కియా..ఉన్ హోటోన్ కా వ్యాపార్ కియా (ఏ పెదవులైతే ప్రేమనందించాయో, వాటితోనే వ్యాపారం చేసాడు (మగవాడు))

జిస్ కోఖ్ మె ఉస్కా జిస్మ్ ఢలా..ఉస్ కోఖ్ కా కారోబార్ కియా (ఏ గర్భంలో అయితే జన్మించాడో…దానితోనే వ్యాపారం చేశాడు) ……

యే వో బద్కిస్మత్ మా హైన్ జో…బేటోంకి సేజ్ పే లేటీ హై” (ఈమె ఎంత దురదృష్టవంతురాలు అంటే….తన బిడ్డల పరుపుల మీద పడుకుని ఉంది)

http://www.youtube.com/watch?v=dRnHoAI2Pm4

యాభై, అరవై దశాకాలలోనే, సమాజంలో పేరుకుపోతున్న ధనదాహానికీ, నీతిమాలినతనానికీ, అణచివేతకూ, కులమత వివక్షకూ అద్దం పట్టేలా ఎన్నో పాటలు సాహిర్ కలంనుంచి పెల్లుబికాయి.

ప్యాసా లోని “యే దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హై?” కవిత (పాట) బహుళ ప్రాచుర్యం పొందింది.

“జలాదో ఇసే ఫూంక్ డాలో యే దునియా..జలాదో జలాదో జలాదో..

మేరే సామ్నేసే హటాలో యే దునియా

తుమ్హారీ హై తుమ్హీ సంభాలో యే దునియా”

“సమాజాన్ని తగల పెట్టెయ్యండి,  నా ముందరి నుంచి తీసెయ్యండి, మీదైన సమాజాన్ని మీరే ఉంచుకోండి” అన్న వీరావేశం ఈ పాటలో చూపిస్తే, అదే సమాజం పై ఆవేదన వ్యక్తపరుస్తూనే, ఒక మంచి ఉదయం మనకు రాబోతోంది అన్న ఆశాభావం “వో సుబహ కభీ తో ఆయేగీ…” అన్న పాటలో మనకి కనబడుతుంది.

“మానా కే అభీ తేరే మేరే అర్మానోంకి కీమత్ కుచ్ భీ నహీ  (సరే, మన ఆశలకెలాంటి విలువా లేదు)

మిట్టీ క భీ హై కుచ్ మోల్ మగర్, ఇన్సానోంకి కీమత్ కుచ్ భీ నహీ  (మట్టికైనా  కొంత విలువుంది కానీ, మనుషులకు ఏ మాత్రం లేదు)

ఇన్సానోంకీ ఇజ్జత్ జబ్ ఝూటే సిక్కోం మె న తోలీ జాయేగీ (ఏ రోజైతే మనుషుల ఆత్మగౌరవాన్ని డబ్బులతో తూయరో)

వో సుబహ కభీ తో ఆయేగీ” (ఆ ఉదయం ఎపుడో వస్తుంది)

http://www.youtube.com/watch?v=hQYQUo5X6F0

ముస్లిం కుటుంబంలో పుట్టిన సాహిర్, ఒక నాస్తికుడు. ఆ నాస్తికత్వం ఆయన కొన్ని పాటలలో కనపడుతూనే ఉంటుంది. 1954 లో “నాస్తిక్” అనే సినిమాకి కవి ప్రదీప్ “దేఖ్ తేరే ఇన్సాన్ కి హాలత్ క్యా హోగయి భగవాన్..కిత్నా బదల్ గయా ఇన్సాన్” (దేవుడా, చూడు మానవుడి పరిస్థితి – ఎంత మారిపోయాడో మానవుడు) అనే పాట వ్రాసి తానే పాడారు. దానికి జవాబుగా సాహిర్ 1955 లో “రైల్వే ప్లాట్ఫారం” అనే సినిమాకి పాట రాస్తూ ఇలా జవాబు ఇచ్చారు. “దేఖ్ తేరే భగవాన్ కి హాలత్ క్యా హో గయి ఇన్సాన్…కిత్నా బదల్ గయా భగవాన్!” (ఓ మనిషీ చూడు దేవుడెలా మారిపోయాడో!) ఈ పాటలో దైవదూషణ కంటే కూడా, సమాజంలో అవినీతిపరుల ఇంటే లక్ష్మీదేవి ఇంకా ఎక్కువ కొలువుంటోందన్న వాపోతే ఎక్కువగా కనపడుతుంది. ఈ రెండు పాటల బాణీ కూడా ఒకటే!

భగవాన్, ఇన్సాన్ బదల్ గయా: http://www.youtube.com/watch?v=1_5LLtxAB4I

ఇన్సాన్, భగవాన్ బదల్ గయా: http://www.youtube.com/watch?v=geBkwLHtJA8

అలాంటి నాస్తికుడైన సాహిర్ హిందీలో కలకాలం గుర్తుండి పోయే భజన్ కూడా వ్రాసారంటే అది వెంటనే నమ్మబుద్ది కాదు. “హమ్ దోనోం” సినిమాలో, లతాజీ అత్యంత మృదుమధురంగా పాడిన “అల్లా తేరో నామ్..ఈశ్వర్ తేరో నామ్” మరి ఈయన కలంనుండి వచ్చినదే!

సాహిర్ మతం మానవత్వం. ప్రేమే అతని దైవం. ఈ భావం స్ఫురించేటట్లు వ్రాసిన పాటలనేకం. కొన్ని పాటలు టైంలెస్. “తూ హిందూ బనేగా న ముసల్మాన్ బనేగా…ఇన్సాన్ కి ఔలాద్ తు ఇన్సాన్ బనేగా!” ఈ పాట ఎన్నో తరాల అంతరాత్మలను తొలుస్తూనే వస్తోంది. ఈ పాటలో ఒక వ్యక్తి ఒక అనాథ బాలుడిని సాకుతూ, నువ్వు హిందువువీ అవ్వవూ లేక ముస్లిమ్ వీ అవ్వవూ, ఒక మనిషికి పుట్టావు కనక, తప్పక ఒక మనిషివే అవుతావు అని ముచ్చట పడుతూ ఉంటాడు. యష్ చోప్రా దర్శకుడిగా రంగ ప్రవేశం చేసిన “ధూల్ కా ఫూల్” సినిమా లోని పాట ఇది.

“అఛ్ఛా హై అభీ తక్ తేరా కుఛ్ నామ్ నహీ హై (మంచిదయ్యింది, నీకు ఇంకా నామకరణం కాలేదు)

తుమ్కో కిసీ మజహబ్ సే కోయీ కామ్ నహీ హై (నీకు ఏ మతంతోను ఇక పని లేదు)

జిస్ ఇల్మ్ నే ఇన్సానోంకో తక్సీమ్ కియా హై (ఏ జ్ఞానము అయితే మనుషులను విభజించిందో)

ఉస్ ఇల్మ్ కా తుమ్ పర్ కోయీ ఇల్జామ్ నహీ హై” (ఆ జ్ఞానము యొక్క అపవాదు నీ మీద లేదు)

http://www.youtube.com/watch?v=jqcyUkUFzrc

 

సాహిర్ లుధియాన్వి కి మరికొన్ని విశిష్టతలు కూడా ఉన్నాయి. మ్యూజిక్ కంపెనీల నించి రాయల్టీలు రాబట్టిన మొట్టమొదటి గేయరచయిత ఈయన! అలాగే అప్పట్లో చాలా మందికి కొరుకుడు పడని భావాలూ, ప్రవర్తన కూడా ఆయన సొంతం. లతా మంగేష్కర్ ఒక తిరుగులేని గాయనిగా రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో ఆమెకు సంగీత దర్శకుడి తరువాత, అత్యంత ఎక్కువ పారితోషికం ఇచ్చేవారు. గేయరచయితకు ఆమెతో పోలిస్తే తక్కువగా ఇచ్చేవారు. అలాంటిది, సాహిర్ మటుకు, లత కంటే ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించనిదే పాట రాయనని ఘోషణ చెయ్యటంతో, ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితే ఏర్పడింది వారిద్దరి మధ్య. అందుకేనోమో, ఆషా భోంస్లే నే సాహిర్ పాటలు అందరి గాయనీ గాయకుల కంటే ఎక్కువ పాడారు. అయినా సరే ఆయనతోనే ఆయన జీవితాంతం పాటలు వ్రాయించుకున్న దర్శక దిగ్గజాలు ఉన్నారు. దాదాపు ముఫ్ఫై సంవత్సరాల పాటు వీరి సినిమాలన్నిటికీ, సాహిర్ ఒక్కరే గేయరచయిత. వారెవరో కాదు, బి.ఆర్.చోప్రా, యష్ చోప్రా సోదర ద్వయం.

వీరి సినిమాల్లో పాటలన్నీ బహుళ ప్రాచుర్యం పొందినవే. ఒకటా, రెండా, డజన్ల కొద్దీ సూపర్ హిట్ పాటలు! వీళ్ళు వేర్వేరు సంగీత దర్శకులను, గాయనీ గాయకులను వాడుకున్నారు కానీ, గేయ రచయితను మాత్రం మార్చలేదు. అదీ సాహిర్ గొప్పతనం!

సాహిర్ కవిత్వంలోని ఉర్దూ పదాల వాడుక గురించి ముందర చెప్పుకున్నాం. 1964లో విడుదలైన “చిత్రలేఖ” అనే సినిమా నేపథ్యం చంద్రగుప్త మౌర్య కాలం నాటిది. ఉర్దూ పదాలకు ఆస్కారం లేదు. నిజానికి శైలేంద్ర, ప్రదీప్ లాంటి గేయరచయితలు ఇటువంటి సంస్కృత భాషా ప్రాధాన్యం కావాల్సిన పాటలకి పెట్టింది పేరు. సంగీత దర్శకుడు రోషన్ మటుకు సాహిర్ మాత్రమే రాయాలని పట్టుబట్టారుట. అది ఒక సవాలు గా తీసుకొని, తన ప్రకృతికి విరుద్ధంగా సాహిర్ ఎంతో కష్టపడి వ్రాసిన పాట ఇది. ఈ పాట ఒక మూడేళ్ళ క్రితం ఔట్లుక్ వారు జరిపిన పోల్ లో, అత్యంత ఉత్తమమైన పాటగా గుర్తించబడటం కూడా ఒక విశేషమే. ఈ పాటకు మాత్రం సాహిర్ తో సమానమైన ప్రశంశ పాట పాడిన రఫీకీ, బాణీ కట్టిన రోషన్ కీ చెందాల్సిందే!

“మన్ రే తు కాహే న ధీర్ ధరే? (ఓ మనసా ఎందుకు సంయమం వహించలేకపోతున్నావు?)

వో నిర్మోహీ, మోహ న జానే.. జిన్కా మోహ కరే! (ఎవరినైతే నువ్వు మోహించావో…వారు మోహం తెలియని నిర్మోహి)

ఉత్నాహీ ఉప్కార్ సమఝ్ కోయీ..జిత్నా సాథ్ నిభాయే (అంత వరకూ చేసింది ఉపకారమనుకో..ఎంతవరకైతే నీ తోడు నిలిచారో)

జనమ్ మరణ్ కా మేల్ హై సప్నా, యే సప్నా బిస్రా దే (జనన మరణ చక్రం ఒక స్వప్నం..ఈ స్వప్నాని వదలివేయి)

కోయీ న సంగ్ మరే…” (ఎవ్వరూ చావులో నీ తోడు రారు)

http://www.youtube.com/watch?v=uA2FhgF6VY4

రోహన్, సాహిర్ కాంబినేషన్ లో వచ్చిన తాజ్మహల్ సినిమా లోని పాటలు కుడా అజరామరం. “జో వాదా కియా వో నిభానాపడేగా, రోకే జమానా చాహే, రోకే ఖుదాయీ తుమ్కో ఆనా పడేగా” పాట ఈ సినిమాలోదే.

గుమ్రాహ్ చిత్రం లోని “చలో ఎక్ బార్ ఫిర్ సే..అజ్నబీ బాన్ జాయే హమ్ దోనోం”, సాహిర్ వ్రాసిన టాప్ 10 పాటలలో ఒకటిగా నిలచిపోయే పాట. ముఖ్యంగా దానిలోని ఆఖరి చరణం ఆవేదనకీ మరెంతో ఆలోచనకీ గురిచెయ్యక మానదు. విడిపోయిన ప్రేయసీ ప్రియులు మళ్ళీ ఎదురుపడిన నేపథ్యంలో “పద మళ్ళీ ఒక సారి అపరిచుతులుగా మారిపోదాం  మనిద్దరం” అంటూ సాగే ఈ పాట లోని ఆఖరి చరణం ఇది.

“తార్రుఫ్ రోగ్ హో జాయే..తొ ఉస్కో భూల్నా బెహతర్ (ఎప్పుడైతే ఒక పరిచయం, రుగ్మతగా మారుతుందో, దాన్ని మరువటమే మంచిది)

తాల్లుక్ బోఝ్ బన్ జాయే..తొ ఉస్కో తోడ్నా అఛ్ఛా (ఎప్పుడైతే ఒక సంబంధం, బరువు లాగా అనిపిస్తుందో, దాన్ని తెంచుకోవటమే మంచిది)

వో అఫ్సానా జిసే అంజామ్ తక్ లానా న హో మున్కిన్ (ఎప్పుడైతే ఒక కథని దాని యొక్కసరైన ముగింపుకి చేర్చలేకపోతామో)

ఉసే ఎక్ ఖూబ్సూరత్ మోడ్ దేకర్ ఛోడనా అఛ్ఛా” (దానికి ఒక అందమైన మలుపునిచ్చి వదిలేసి ముందుకు సాగటమే మంచిది)

http://www.youtube.com/watch?v=y8GnY2eddzM

సాహిర్ అన్నీ ఇలాంటి గంభీరమైన పాటలూ, వేదాంతం లేక ఘాటైన రోమాన్స్ పాటలు మాత్రమే వ్రాశారేమో అనుకునేరు! అనేక సరదా డ్యూయెట్లు, మరెన్నో హాస్య పాటలూ కూడా రచించారు. అన్నిటి గురించీ చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకమే అయిపోతుంది కనక, నాకు నచ్చిన పాటలన్నీ క్లుప్తంగా ప్రస్తావిస్తా. ఆసక్తి కలవారు వీటిలోని పద, భావ చమత్కారాలను నింపాదిగా తరవాత చదువుకొని సాహిర్ కవిత్వాన్ని మరింత ఆస్వాదించచ్చు.

“మాంగ్ కే సాథ్ తుమ్హారా .. మైనే మాంగ్ లియా సంసార్”  (నయా దౌర్)

“ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరీ..కువారియోం కా దిల్ ధడ్కే” (నయా దౌర్)

“సర్ జొ తేరా చక్రాయే…యా దిల్ డూబా జాయే” (ప్యాసా)

“తేరా ముజ్హ్సే హై పెహ్లే కా నాతా కోయీ…జానే తూ యా జానే నా” (ఆ గలే లగ్ జా)

“మేరే దిల్ మె ఆజ్ క్యా హై..తు కహే తో మై బతాదూ” (దాగ్)

“గాపుచీ గాపుచీ గమ్ గమ్…కిషీకి కిషీకి కమ్ కమ్” (త్రిశూల్)

“యూ తో హమ్నే లాఖ్ హసీ దేఖే హై..తుమ్సా నహి దేఖా” (తుమ్సా నహి దేఖా)

“ఏ మేరె జోహ్రజబీ తుఝే మాలూమ్ నహీ” (వక్త్)

1976 లో యశ్ చోప్రా నిర్మించిన కభీ కభీ లో ప్యాసా తరవాత మళ్ళీ హీరో ఒక కవి, ఒక భగ్న ప్రేమికుడు. అందులోని హీరో పాత్ర సాహిర్ లుధియాన్వి ప్రేరణతోనే రూపుదిద్దుకున్నదేమో అన్న అనుమానం రాక తప్పదు. హిందీ పాటలతో పరిచయం ఉండి ఈ సినిమా టైటిల్ సాంగ్ తెలియని వారు ఉన్నారంటే నమ్మలేని విషయం; అంత ప్రాచుర్యం పొందింది ఆ పాట! సాధారణంగా తన రచనా శక్తి పట్ల అపరిమితమైన నమ్మకం ఉన్న సాహిర్ ఎదో “ఇంట్రాస్పెక్టివ్ మూడ్” లో జారిపోయి ఈ కవిత వ్రాసినట్లున్నారు. ఈ కవిత నాకు ఎంత నచ్చినా, దీనిలో ఆయన చెప్పిన విషయం, ఆయన పట్ల నాకున్న అవధుల్లేని అభిమానం వల్ల అనుకుంటా,  నా జీవితకాలంలో జరగదేమోనని అనిపిస్తూ ఉంటుంది! నా కాలమ్ ముగింపు కి ఇంత కంటే ఉచితమైన పాట కూడా ఇంకొకటిలేదేమో!

“కల ఔర్ ఆయేంగే నగ్మోంకే ఖిల్తీ కలియా చున్నేవాలే  (రేపు మరిన్ని కవితాపుష్పాలు వస్తాయి, ఏరుకోటానికి)

ముజ్హ్సే బెహ్తార్ కెహ్నే వాలే..తుమ్సే బెహ్తార్ సున్నేవాలే (నా కన్నా బాగా చెప్పకలిగే కవులొస్తారు..మీ కంటే మంచి శ్రోతలోస్తారు)

కల్ కోయీ ముజ్హ్కో యాద్ కరే..క్యోం కోయీ ముజ్హ్కో యాద్ కరే (రేపు నన్ను ఎవరైనా గుర్తుకుతెచ్చుకుంటారు.. అసలు నన్నెందుకు గుర్తుకుతెచ్చుకోవాలి?)

మస్రూఫ్ జమానా మేరె లియే..క్యోం వక్త్ అప్నా బర్బాద్ కరే? (ఈ తీరుబడి లేని ప్రపంచం…నా కోసం ఎందుకు తమ సమయం వ్యర్థం చేసుకోవాలి?)

మై పల్ దో పల్ కా షాయర్ హూ.. పల్ దో పల్ మేరీ కహానీ హై!” (నేను ఒకటి రెండు క్షణాల కవిని..ఒకటి రెండు క్షణాలదే నా కథ!)

http://www.youtube.com/watch?v=bI10wgbeXgc

Siva_3–   యాజి

 

 

 

 

“ సబర్మతి “

 Untold Stories  – 5

నా పై దుష్ప్రచారం చేస్తున్నారు : కనక

దేవదాస్ నా అస్తిని అపహరించాలని చూస్తున్నాడు.

తమిళసినిమా, న్యూస్‌లైన్: నటి కనక గురించి రెండు మూడు రోజులుగా రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆమె కాన్సర్ వ్యాధితో అనాధలా కేరళలోని అలంపుళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఒక ప్రముఖ నిర్మాత ఆమెని గుర్తించి మెరుగైన వైద్యం చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ నటి కనక మంగళవారం చెన్నై ఆళ్వార్‌పెటలోని  తన స్వగృహం లో విలేకరులతో మాట్లాడారు. తాను కేరళ ఆలంపుళలోని ఆస్పత్రిలో క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా వదంతి అని స్పష్టం చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఇలాంటి దుష్ప్రచారాలను తన తండ్రిగా చెప్పుకునే దేవదాస్ చేస్తున్నారని ఆరోపించారు. తన ఆస్తిని అపహరించడానికి అతను కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు. తాను అతన్ని ఎట్టి పరిస్థితులలోను తన ఇంటికి రానీయనని స్పష్టం చేసారు. దేవదాస్ తన తల్లికి మంచి భర్తగా ప్రవర్తించలేదని, తనకు ఏనాడూ మంచి తండ్రిగా నడుచుకోలేదని దుయ్యబట్టారు. అతను ధనాశపరుడని పేర్కొన్నారు. అతని ప్రవర్తన కారణంగానే మగాళ్లంటే తనకు ద్వేషం కలిగిందని, అందువలనే వివాహం కూడా చేసుకోకుండా ఒంటరిగా నివసిస్తున్నట్లు వెల్లడించారు. దేవదాస్ తన తల్లికి చేసిన ద్రోహాన్ని తాను మరచిపోలేనని అన్నారు. కాగా నటి కనక కన్నుమూసినట్లు మంగళవారం కొన్ని టీవీ చానళ్లు, వెబ్‌సైట్‌లలో వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో ఆమెకు పలువురు ఫోన్ చేసి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారట. వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నట్టు కనక పేర్కొన్నారు.

 

bhuvanachandraమొన్నటి పేపర్లో అలనాటి నటీమణి ‘దేవిక’ కుమార్తె ‘కనక’ కేరళలోని ఒక హాస్పిటల్ వరండాలో దిక్కులేకుండా పడి వుంటే ఓ చిత్రప్రముఖుడు చూసి గుర్తించాడనీ, ఆమెకి మెరుగైన ‘వైద్యం’ ఇప్పించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడనీ వార్త చదివాను. ఆమెకి ‘కేన్సర్’ అని రాసారు. ఆ వార్త చదవగానే మనసంతా మూగబోయింది.

కనకతో నాకు పెద్దగా పరిచయం లేకపోయినా అమె  తెలుగులో మొదటిసారి నటించిన ‘వాలుజడ – తోలుబెల్టు’ సినిమాకి అన్ని పాటలు నేనే రాసాను. చక్కని తెలుగు మాట్లాడుతుంది. హాయిగా నవ్వుతుంది. చిన్నతనంలో ‘దేవిక’ సినిమాలో చూసి వదిన అంటే ఇలా  ఉండాలని తీర్మానించుకున్న వాళ్లల్లో నేనూ ఒకడ్ని. ఆ వార్త చదవగానే అర్జంటుగా కనక గురించిన వివరాలు సేకరించి వెళ్లి చూడాలని అనిపించింది..  చేతనైనది ఎలాగూ చేస్తా గదా.

ఇవ్వాళ మరో వార్త. కనకే ప్రెస్ స్టేట్‌మెంట్ ఇచ్చింది అవన్నీ వొట్టి పుకార్లనీ, తాను మద్రాసులో క్షేమంగా వున్నాననీ, తన తండ్రి ఆస్థి కోసం ఆడుతున్న డ్రామాలో ఆ పుకార్లు ఒక భాగమనీ చెప్పింది. మనసు కుదుటపడినా బాధ తగ్గలేదు.

అలనాటి అందాలనటి కాంచనా అంతే. కన్నవాళ్ల దురన్యాయానికి బలైంది. చివరికి ఆస్థి దక్కినా, ఆ ఆస్థి మొత్తాన్నీ (కోట్లలోనే) తిరుపతి వేంకటేశ్వరస్వామికి అర్పించి, ఓ  ఆలయంలో నిర్మలంగా, ప్రశాంతంగా ప్రస్తుతం కాలం గడుపుతోంది.

అసలు ‘సినిమా’ వాళ్లకెందుకీ సమస్యలూ? ఇతర్లకి రావా అంటే వస్తాయి. కానీ సినిమా వాళ్లకి ఎక్కువ. శరీరంలో శక్తి ఉన్నంత కాలం, డబ్బు సంపాయించినంత కాలం, జనాలూ, బంధువులూ, స్నేహితులూ చుట్టూ ఉంటారు. అదో ‘రక్షణ’ కవచం అన్నట్టు భావింపజేస్తారు. ఎప్పుడైతే శక్తి ‘ఉడిగి’ పోతుందో ఆ క్షణమే యీ రక్షణ కవచం కాయితం మేడలా కుప్పకూలిపోతుంది. నిజం చెబితే కాయితాలు గాలికి ఎగిరిపోయినట్టు చుట్టాలూ, పక్కాలూ, స్నేహితులూ అందరూ క్షణాల్లో ఎగిరిపోతారు. మిగిలేది మనిషి – మనసూ – ఒంటరితనం.

“లెక్కకు మించి దానం చెయ్యకు. అపాత్ర దానం అసలే చెయ్యకు. అన్ని ధర్మాల కంటే గొప్పదీ ‘స్వధర్మం’.  కలిమిలో నీ తోడుండేవాడు ఎవడూ కష్టాల్లో నీ తోడుండడు …” ఈ మాటలు చెప్పింది సాక్షాత్తు పద్మశ్రీ చిత్తూరు నాగయ్యగారు. అంత ఘోరంగా ఆయన చివరి రోజులు గడిచాయి. మన మహానటులు అయిదువందల రూపాయలు పారితోషికం తీసుకునే రోజుల్లో ఆయన సినిమాకి ‘లక్ష’ తీసుకున్నారు. గజారోహణాలు, కనకాభిషేకాలూ లాంటి సత్కారాలు ఎన్నో అందుకున్నారు. చివరికి ‘గుంపులో గోవింద’లాగా ఒక్క డైలాగ్ కూడా లేని వేషాలు వేయ్యాల్సొచ్చింది. ‘ఇచ్చింది’ మాట్లాడకుండా పుచ్చుకోవాల్సి వచ్చింది. అందుకే దీన్ని ‘చిత్ర పరిశ్రమ’ అంటారేమో! ఓ కస్తూరి శివరావు… మహానటి కన్నాంబ… ఎంత మంది.. ఎంత మంది నటీనటులు ‘విరాళాలతో, చందాలతో’ మహాప్రస్థానానికి పయనం సాగించారు. సావిత్రిని మించిన నటి వున్నదా? గిరిజ.. ఒద్దు మహాప్రభో.. వద్దు. అంతులేని ఆస్థిపాస్తులతో, అభిమానులతో కళకళలాడిన జీవితాలు నూనెలేని దీపంలా కొడిగట్టి పోయినప్పుడు  చూసే దుస్థితి ఎటువంటిదో, అనుభవిస్తేగానీ అర్ధం కాదు.

మొన్న పొద్దున వాకింగ్‌లో “మన ‘సబర్మతి’ హాస్పిటల్లో ఉందిట..!” కబురు తెచ్చాడు సుబ్బారావు. సుబ్బారావు ప్రొడక్షన్ మేనేజరుగా యీ మధ్యే  ప్రమోట్ అయ్యాడు. మరో సుబ్బారావు గారు ఉన్నారు. చాలా సీనియర్ ప్రొడక్షన్ మేనేజరుగారు. చాలా నిజాయితీ వున్నవాడూ. నిక్కచ్చి మనిషి. పిల్లాపాపల్తో  హాయిగా  మా వలసరవాక్కం ‘లోనే రిటర్డ్ లైఫ్‌ని ఆనందంగా అనుభవిస్తున్నారు.

“ఏమైందిట?” అడిగాను.

“ఏముంది గురూగారూ. కొడుకూ, కోడలూ ఆవిడ్ని హాస్పిటల్ వరండాలో పడేసి చాలా తెలివిగా ఏ వూరో చెక్కేసారు. వెళ్ళి చూస్తే ఇంటికి తాళం వేసి వుంది. అర్జంటుగా ఓ పదివేలు పోగు చేసి ‘సురేష్’ డాక్టరుకి వొప్ప చెప్పి వచ్చాను” అన్నాడు.

మరో ‘సినీజీవి’ అయితే ‘సబర్మతీ’ గురించి ఏ  ఛానల్   మాట్లాడరు. ఏ పేపర్లోనూ వార్తలు రావు. ఎందుకంటే సబర్మతీ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అంట్లు తోమే ఆడది. యూనియన్ కార్డు ఉండి ఉండోచ్చు. కానీ జాగ్రత్తలు తీసుకునేదెవరూ?

ఆరోజుల్లో ‘భగవతి’ హోటల్ ముందు పొద్దున్నే ఓ పదైనా ప్రొడక్షన్ వేన్‌లు ఆగేవి .. టిఫిన్ల కోసం. అంట్లు తోమడానికీ, సర్దడానికీ తీసుకు వెళ్టారనే ఆశతో చాలామంది ఆడవాళ్లు అక్కడే ఎదురు చూసేవాళ్లు. వాళ్లకో యూనియన్ ఉందనీ, వాళ్లు యూనియన్ మెంబర్సేననీ, కాని వాళ్లకి ఆ చాన్స్ దక్కదనీ తెలీడానికి నాకు చాలా రోజులు పట్టింది.

ప్రతి ప్రొడక్షన్ మేనేజర్‌కీ ఓ ‘బేచ్’ వుంటుంది. సబర్మతి కూడా నారాయణరావు బేచ్‌తో వచ్చేది. చాలా కళగల మొహం. చక్కని మాటతీరు. మనిషి కూడా తీర్చిదిద్దినట్టుండేది.  ఈ మాట ఓసారి నాతోటి రచయితతోటి అంటే “గురూ.. నాతో అన్నారుగానీ ఎవరితో అనకు.. నీ టేస్టు చాలా ‘చవకబారు’దంటారు.” అన్నాడు. నాకు నవ్వాలో, ఏడ్వాలో తెలీలేదు. ఒక వ్యక్తిని మెచ్చుకోవడానికి కూడా  ‘ఇన్నియాంగిల్స్’ లో ఆలోచించాలని నాకు నిజంగా తెలీదు. అసలు మనిషిని మనిషిగా ఎందుకు గుర్తించం? నిన్నటిదాకా మా కళ్లముందు పాండీబజార్లో తిరిగినవాడు ఓ సినిమాలో హీరో కాగానే అందరూ “హీరోగారొచ్చారు..” అని నానా హంగామా చేస్తారో?, సదరు కుర్రాడు కూడా కంటికి నల్ల కళ్లద్దాలతో చేతిలో ఫైవ్ ఫైవ్ ఫైవ్ సిగరెట్టు పేకెట్టుతో ఆకాశం నుంచి  అప్పుడే  ఊడిపడినట్టు ఎందుకు పోజు కొడతాడో తెలీదు. నాకు అర్ధం కారు. “మంత్రిగారొచ్చారు”… “ప్రొడ్యూసర్ గారొచ్చారు” “డైరెక్టర్ గారొచ్చారు” “హీరోయిన్‌గారు ఆలస్యంగా వస్తారట” “కవిగారికి కడుపు నొప్పిట!” ప్రొద్దున్నే లేవగానే వినపడే మాటలు ఇవే. మనిషి పేరు మరుగయి.. వృత్తి పేరే ప్రముఖమవుతుంది. సరే…!

నేను ‘కారం’ ఎక్కువ ఇష్టపడతాను. కారంగా ఉంటే చెట్నీలని ఇంకొంచెం వేసుకుంటా. ఎలా కనిపెట్టిందో ఏమోగానీ, నేను పని చేసే షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా ‘కారం’గా ఉండేవాటినే పొందిగ్గా వడ్డించేది. ఆ విషయం నేను గమనించడానికి కొంత కాలం పట్టిందనుకోండి. అది వేరే సంగతి.

టి.నగర్‌లో “ముప్పత్తమ్మ గుడి” సినిమా వాళ్లకి బాగా అలవాటైన గుడి. ఆ దేవత చాలా నిఖార్సైన దేవత. నూటికి నూరుపాళ్లు మొక్కుకున్న మొక్కుల్ని తీరుస్తుందని మావాళ్ల నమ్మకమేగాదు నిజం కూడా..

నాలుగేళ్ల క్రితం ఓ డబ్బింగ్ సినిమా ‘స్క్రిప్ట్’ పూజ కోసం మా ప్రొడ్యూసర్ ఆ గుడికి తీసికెళ్లాడు. అంతకుముందు చాలాసార్లు వెళ్లాను. ఆ రోజునే సబర్మతినీ, సబర్మతి ఇరవైయ్యేళ్ల కొడుకునీ చూడటం జరిగింది. పిల్లాడు అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. వాళిద్దరూ పక్కపక్కనే వుంటే అక్కాతమ్ముడిలాగా వున్నారుగానీ తల్లీకొడుకుల్లా లేరు. మాకు నమస్కరించి

కొడుకుని పరిచయం చేసింది. కుర్రాడు స్కాలర్‌షిప్‌తో ఇంజనీరింగ్ చదువుతున్నాట్ట. మనసులోనే సబర్మతికి సెల్యూట్ కొట్టాను.

నాకు తెలిసి ఒకాయన అనేవాడు. ” మనం లోకానికి వచ్చాం. పోతాం. అది ముఖ్యం కాదు. లోకానికి ఏమిచ్చాం అనేది ముఖ్యం…” అని.

సబర్మతి అంట్లు తోమింది. అది నిజం.. కానీ, లోకానికి ఓ ఇంజనీర్‌ని ఇచ్చింది. అది గ్రేట్.

రెండేళ్ల క్రితం కుర్రాడి పెళ్లి అనీ, వాడు TVSలో పని చేస్తున్నాడనీ, గొప్ప జీతమనీ, పిల్ల కూడా బాగా చదువుకుందనీ, ఉద్యోగం చేస్తానంటోందనీ చెప్పి, అందమైన వెడ్డింగ్ కార్డుని చేతికిచ్చింది. కార్డులో ఆవిడ పేరు లేదు. శ్రీమతి & శ్రీ వీరభద్ర చౌదరి అని వుంది.

“ఎవరు ఆ చౌదరిగారూ?” అనడిగా.

“బాబు చదువుకి సహాయం చేసినవారండి. నాకు తల్లిదండ్రుల్లాంటివారు కాదు.. దైవాలు…!” అన్నది.

చేసిన సహాయాన్ని క్షణంలో మరిచిపోయే యీ రోజుల్లో సబర్మతి తన కృతజ్ఞతని ప్రకటించుకున్న విధానం నా కళ్ళు చెమర్చేట్టు చేసింది.

పెళ్ళికి వెళ్లాను. చాలా చక్కగా పొందిగ్గా ఏ మాత్రం ఆర్భాటం లేకుండా చాలా చాలా ఆత్మీయంగా పెళ్లి జరిపించింది. వివాహ మండపం చిన్నదే. కాని ఆహుతులందరూ హాయిగా స్వంత  ఇంట్లో వున్నట్టు ఫీలయ్యారు. వచ్చిన ‘పరిశ్రమ’ వాళ్లు కూడా ‘ప్లాస్టిక్’ నటనలు మాని హాయిగా సంతోషంగా వివాహాన్ని చూశారు. ‘అఫ్‌కోర్స్ పెద్దవాళ్లు’  ఎవరూ రాలేదనుకోండి. రాకపోవడమే మంచిదైంది. వస్తే వాతావరణం మరోలా ఉండేది. ఆ విషయమే సబర్మతితో అంటే “నేనసలు పెద్దపెద్దవాళ్లని పిలువలేదండి. వారు నాకు తెలిసినా నేను వాళ్లకి తెలీదు కదా. ఒకవేళ వాళ్లు పెద్ద మనసుతో వచ్చినా, వారికి తగ్గట్టు మర్యాద చేసే ‘తాహతు’ నాకు లేదు కదా!” అన్నది.

అంత ఆరోగ్యంగా ఉండే, ఆరోగ్యంగా ఆలోచించే సబర్మతి ఇలా దిక్కులేనిదాని లాగా అవడమేమిటి? కొడుకూ కోడలూ ఆవిడ్ని ‘వదిలించు’ కోవటం ఏమిటి? నాకు తెలిసి సబర్మతి ఎవర్నీ నొప్పించే మనిషి కాదు. అసలు కారణం ఏమిటి?

సుబ్బారావు నేనూ కలిసి సురేష్ హాస్పిటల్‌కి వెళ్లాం. మనిషి బాగా చిక్కింది ఆమెకి శారీరక అనారోగ్యం కంటే మానసిక వ్యధ ఎక్కువగా  ఉన్నదనిపించింది. నన్ను లోపల వదిలి సుబ్బారావు బయటకు వెళ్లాడు.

“ఏం జరిగింది?” అడిగాను అనునయంగా. ఆ పలకరింపుకే సబర్మతి కళ్లలోంచి కన్నీళ్లు వానలా కురిశాయి. సన్నగా రోదించడం మొదలెట్టింది. నేనూ ఆపలా. నవ్వడం ఒక గొప వరం అయితే ‘ఏడవగలగటం’ చాలా చాలా గొప్పవరం. బాధ గుండెల్లో ఘనీభవించిన వాళ్లకి మాత్రమే ఏడుపులోని ‘సుఖం’ అర్ధమౌతుంది.

చివరికి ఆమె మాటల సారాంశం చెప్పి వదిలేస్తాను. కొడుకు ఆఫీసువాళ్లు పార్టీ ఇమ్మని అడిగారంట. కోడలికి కూడా ఉద్యోగం వచ్చిన సందర్భం కావటంతో అట్టహాసంగా ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశారట. అదీ సబర్మతి ఊళ్ళో లేని రోజున. రెండు రోజుల తర్వాత రావల్సిన సబర్మతి ఆ మధ్యాహ్నమే ఇంటికొచ్చేసరికి అట్టహాసంగా ‘పార్టీ’ జరుగుతోంది. ‘ఎవరు ఆమె’ అని అడిగిన అతిథులకి, ‘మా ఇంట్లో  పనిమనిషి.. ఊరినుండి ఇప్పుడే వచ్చింది.’ అని కొడుకూ, కోడలూ చెప్పడం తన చెవులతో స్వయంగా సబర్మతి విన్నదట. తనే బయటికి వచ్చేసిందట.

ఇంకేం చెప్పక్కర్లేదుగా.. చాలా ఏళ్ల క్రితం ఓ హిందీ హీరో, స్కూలు టీచరైన తన తండ్రిని ఇలాగే ‘మా పొలంలో పని చేసే రైతు’ అని ఇంగ్లీషులో ఎవరితోనో  చెబుతుంటే (తండ్రి ఎలిమెంటరీ స్కూలు టీచరు గనక  అంత ఇంగ్లీషు రాదనుకుని) ఆ తండ్రి ఆ రోజే హార్డ్ ఎటాక్‌తో మరణించాడని విన్నాను.

కన్నతల్లిని హిపోక్రసీతో ‘పనిమనిషి’ అని అంటే ఏం జరిగిందో ఇవ్వాళ  కళ్లారా చూస్తున్నాను. సబర్మతి బతుకుతుంది. బతికి తీరుతుంది కానీ కొడుకు అద్దెకి తీసుకున్న ఆ ‘భవనం’లో కాదు. ఆ విషయం సబర్మతి, ఆత్మాభిమానం గురించి తెలిసిన వారందరికీ తెలుసు.

మళ్లీ ‘భగవతి హోటల్’ ముందు కొన్నాళ్ల తర్వాత నేనామెను చూడగలను. తన కాళ్ల మీద తను నిలబడ్డానన్న ఆత్మాభిమానంతో ‘ నా పనే నాకు దైవం’ అన్న గర్వంతో.

స్వశక్తితో ఓ ‘ఇంజనీర్’ని తయారుచేసిన మనిషి పగిలిపోయిన తన గుండెని మళ్లీ మరమత్తు చేసుకోలేదూ?

 

మళ్లీ కలుద్దాం

—భువనచంద్ర

***

 

 

 

పెళ్ళా? చేసుకుందాం, ఎప్పుడో .. ఏం తొందర?

పేరున్న సీనియర్ రచయిత్రి పి. సత్యవతిగారు 90లలో పెళ్ళి ప్రయాణం అని ఒక గొప్ప కథ రాశారు. రకరకాల మధ్య తరగతి మనస్తత్వాలని అద్భుతంగా ఆవిష్కరించారు ఆ కథలో. నాకు బాగా గుర్తున్న ఒక దృశ్యం – ఇద్దరు విద్యావతులైన అమ్మాయిలు, వరసకి అక్క చెల్లెళ్ళు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. ఒకామె పోస్టు గ్రాడ్యుయేటు. లెక్చరరుగా ఉద్యోగం చేస్తోంది. మంచి జీతం తెచ్చుకుంటోంది. అయినా పెళ్లి చూపులు అనేటప్పటికి అమ్మ చెప్పినట్టల్లా అలంకరించుకుని ఆ చూడ్డానికి వచ్చిన వాళ్ళ ముందు తలదించుకుని కూర్చోవడానికి సిద్ధపడుతూనే ఉంది. వయసు మీరిపోకపోయినా, మీరి పోతోందేమో అనే భయం తల్లి దండ్రుల్లోనూ, కొద్దికొద్దిగా ఆమెలోనూ ప్రవేశిస్తూన్న తరుణం. కథ చెబుతున్న చిన్న చెల్లెలు అకస్మాత్తుగా అడుగుతుంది ఆమెను – నీకన్న కాస్త చిన్నవాణ్ణో, పోనీ నీకన్న తక్కువ జీతం తెచ్చుకునే వాణ్ణో – నీ మనసుకి నచ్చిన వాడైతే – చేసుకోవచ్చుగా? అని. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ పెద్దక్కయ్య, “అలా ఏం బావుంటుందోయ్?” అనేస్తుంది, తేలిగ్గా తీసి పారేస్తూ.

ఇప్పుడు అమెరికాలో పెళ్ళి విషయంలో సరిగ్గా అదే పరిస్థితి. ఈ పరిణామం కొన్నేళ్ళుగా జరుగుతూ ఉన్నా, 2008 ఆర్ధిక సంక్షోభంలో, తద్వారా ఉద్యోగాలు హుష్ కాకీ అయిపోయి, నిరుద్యోగ నిష్పత్తి మింటి కెగరడంతోనూ అమ్మాయిలకి ఈ పెళ్ళి సమస్య స్పష్టమైన భీకర రూపంతో ప్రత్యక్షమై భయపెడుతున్నది.

కనీసం గత వంద, నూటయాభయ్యేళ్ళుగా స్త్రీలు సామాజిక జీవితంలో ఎటువంటి ప్రతిపత్తి సాధించాలన్నా సరైన మగవానితో – అంటె అన్ని విధాలా తనకంటే హెచ్చు స్థాయిలో ఉన్న పురుషునితో – పెళ్ళి ఒక్కటే మార్గంగా ఉంటూ ఉన్నది. అరవైలలో పెరిగిన హిప్పీతరంవారు కూడా, కొందరు ఆ సమయంలో ఏదో కొంత స్వేచ్ఛాగీతాలు ఆలపించినా, మొత్తమ్మీద పెళ్ళిళ్ళు చేసుకుని, పిల్లల్ని కని, ఉద్యోగాలు చేసి, అమెరికను సామాజిక జీవనస్రవంతిలో పాయగానే ఉన్నారు తప్ప వేరు పడినది లేదు.  స్త్రీ విమోచనము, స్వేచ్ఛ, సమానత్వమూ అని ఎంత మొత్తుకున్నా, ఆ తరంవరకూ దంపతులైనవారిని పరికిస్తే, విద్యలో, ఉద్యోగంలో, ఆదాయంలో భర్తదే పైచెయ్యిగా ఉంటూ వచ్చింది. స్త్రీలు ఎక్కువగా “నర్చరింగ్” ఉద్యోగాలైన నర్స్, టీచర్ వంటి ఉద్యోగాలకు గానీ, లేక సెక్రటరీ, ఆఫీస్ మేనేజర్ వంటి సహాయక ఉద్యోగాలకు గానీ పరిమితమయ్యారు. లేదా, కాలేజి చదువులు చదివి కూడా ఇల్లు చూసుకుంటూ గృహిణిగా ఉండిపోయారు. ఆ కాలంలో టీవీలో బాగా ప్రసిద్ధికెక్కిన సీరియళ్ళలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. Leave it to Beaver, All in the family వంటి సీరియళ్లలో ఈ స్థితిగతులని చిత్రించారు. అక్కడక్కడా కొన్ని ఉదాహరణలు దీనికి భిన్నంగా ఉండొచ్చును గానీ సగటున అర్బన్ మధ్యతరగతి అమెరికాలో ఉంటూ ఉన్న పరిస్థితి ఇది.

స్త్రీలు పెద్ద చదువులు చదవడము, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్నతస్థాయి మేనేజిమెంటు ఉద్యోగాలలో స్థిరపడడము, లేదా స్వంత వ్యాపారాలు మొదలు పెట్టడమూ మొదలై వృద్ధి చెందుతూ వస్తున్నది. ఈ పరిణామాలు జరగడానికి అనేక రాజకీయ, సామాజిక, ఆర్ధిక కారణాలు ఉన్నాయి. అలాగే అంతకు ముందే జరిగిన ఉద్యమాలు, మేలుకున్న చైతన్యాలు కూడా. ఏదేమైనా, 80లలో పెరిగిన జెనరేషన్ ఎక్స్ (Generation X) కాలేజికి వెళ్ళేసరికి, ఆ తరం స్త్రీలలో పెళ్ళి చేసుకోవడం అనే ఆలోచన బాగా వెనకబడిపోయింది. భవిష్యత్తుని గురించిన వారి ఊహల్లో పెళ్ళి ఎక్కడా కనుచూపు మేరలో లేదు. అలాగని అస్సలు పెళ్ళి చేసుకోరనీ కాదు, పెళ్ళంటే విముఖత లేదు. కానీ ముందు కాలేజి చదువు, తరవాత తమ మనసుకి నచ్చిన ఉన్నత విద్య, ఏతన్మధ్య తనని తాను అర్ధం చేసుకోవడం (అంటే ఆసియాకో దక్షిణ అమెరికాకో ఒక విహార యాత్ర, అధమాధమం యూరపు యాత్ర), అటుపైన మంచి జీతం, అధికారం, తృప్తినిచ్చే ఉద్యోగంలో చేరడం, ఊరికినే ఉద్యోగంలో చేరి ఊరుకోవడమే గాక ఉద్యోగసోపానంలో తన శక్తియుక్తులని వృద్ధి చేసుకుంటూ పైకెదగడం – ఇవన్నీ వాళ్ళ ఊహల్లో ప్రతిఫలించిన స్పష్టంగా పెళ్ళి, వైవాహిక కుటుంబ జీవనము కనబళ్ళేదు. పెళ్ళా? చేసుకుందాం, ఎప్పుడో .. ఏం తొందర? ఇంకా చాలా టైముందిగా!
జరిగింది ఏవిటంటే, వీళ్ళు ఈ జీవిత ప్రయాణంలో సోలోగా జాలీగా ప్రయాణిస్తూ ఉండగా, వారికి ఈడైన వయసువారు, వారి విద్యా ఉద్యోగ ఉన్నతికి సరిదూగగలవారు అయిన పురుషుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఆ స్థాయిలో ఉన్న మగవారు అప్పటికే పెళ్ళిళ్ళై ఉన్నవారు. అలాగ పెళ్ళంటూ చేసుకోవాలని తోచే సమయానికి తమకన్న చిన్నవయసువాడిని చేసుకోవడమో, లేక ఉద్యోగ ఆర్ధిక స్థాయిలో తక్కువగా ఉన్నవాడిని చేసుకోవడమో ఈ స్త్రీలకి మిగులుతున్నది. అంతే కాక గత రెండు దశాబ్దాలుగా వస్తు ఉత్పత్తి తయారీలకి సంబంధించిన అనేక ఉద్యోగాలు అమెరికానించి తరలిపోవడంతో, అమెరికను మధ్యతరగతికి జీవగర్రగా ఉన్న మగవారి ఉద్యోగాలు మాయమైపోతూ వచ్చాయి. కేవలం హైస్కూలు డిప్లొమాతో, లేక ఎసోసియేట్ డిగ్రీతో మంచి జీతం పొందగలిగే ఉపాధులు, ముఖ్యంగా మగవారికి, కనుమరుగైపోయాయి.
జెనరేషన్ ఎక్స్ స్త్రీ పురుషుల వివాహ విముఖత, కొంత విశృంఖలమైన శృంగార జీవితమూ సినిమాల్లో సాహిత్యంలో చిత్రించబడినంతగా పైన చెప్పిన ఆర్ధిక సామాజిక పరిణామాలు చిత్రించబడలేదు. సైన్ ఫెల్డ్, ఫ్రెండ్స్ వంటి టీవీ సీరియళ్ళు, వెన్ హేరీ మెట్ శాలీ వంటి సినిమాలు ఈ మనస్తత్వ చిత్రణకి అద్దం పడుతూ వచ్చాయి, కానీ అక్కడ వినోదమే ముఖ్యం కావడంతో, ఈ ఫలితాలకి పునాదిగా ఉన్న పరిణామాల చర్చ ఎక్కడా కనబడదు. సాహిత్యం కూడా ఈ తరాన్ని నిర్లక్ష్యం చేసిందనే చెప్పుకోవాలి. ఐతే, సమాజాన్ని గమనిస్తూ, అధ్యయనం చేస్తూ ఉండే కొందరు సామాజిక శాస్త్ర పరిశోధకుల, జర్నలిస్టుల దృష్టి ఈ పరిణామాలని గమనించింది. తద్వారా non-fiction పుస్తకాలలోనూ, కొన్ని పత్రికల వ్యాసాలలోనూ ఈ విషయాలు చర్చకి వచ్చాయి.
ఉదాహరణకి న్యూయార్కు విశ్వవిద్యాలయంలో సోషియాలజీ ప్రొఫెసరు, ఎరిక్ క్లైనెన్బర్గు (Eric Klinenberg) ఒంటరిగా జీవించడం అనే జీవన విధానాన్ని పరిశోధిస్తూ, ఒంటరి జీవితం గడపటానికీ, స్త్రీ పురుషుల వైవాహిక వాంఛకీ మధ్య ఉన్న పరస్పర ప్రభావాన్ని కొంత లోతుగానే పరిశోధించారు. ఆయన పరిశోధనలో ఒంటరిగా ఉండడం అంటే తన నివాస స్థానంలో నిజంగా ఒంటరిగా ఉండడం – ఇతరంగా రూమ్మేట్లు కానీ, లేక ఇతర కుటుంబ సభ్యులు కానీ లేకుండా. మొదటగా అతను గమనించిన విషయం ఒక మనిషి ఒంటరిగా జీవించడమనేది ఖర్చుతో కూడుకున్న పని. ఉదాహరణకి కలిసి ఉన్న ఒక జంట (పెళ్ళయ్యో, కాకుండానో) విడిపోయారు అనుకుందాం. వెంటనే, ఉండడానికి ఇల్లో, అపార్టుమెంటో ఒక నివాస స్థానం దగ్గర్నించి, పడక, వొండుకోడానికి, తినడానికి అవసరమైన పాత్రలు, తప్పేళాలు, అన్నీ రెండేసి సెట్లు అవసరమవుతాయి. అంచేత, దారిద్ర్య రేఖకి దగ్గర్లో ఉన్నవాళ్ళు ఈ సాహసం చెయ్యలేరు. అతను గమనించిన ఇంకొక విషయం ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని పొందిన స్త్రీలు తమ స్వంత నివాసాలని కొనుక్కోవడం.
ఇదివరకల్లా ఇల్లు కొనుక్కోవడం అంటే, అది జంటగా కలిసి చేసే పని అనే దృక్పథం ఉండేది. గత పది పన్నెండేళ్ళలోనూ ఇల్లు కొనుక్కోవడాన్ని ప్రభుత్వమూ, బేంకులూ బాగా ఆకర్షణీయంగా చెయ్యడం వల్లనూ, మంచి కెరీర్‌లో ఉన్న యువతులు ముప్ఫై వయసుకొచ్చే లోపలే అవసరమైనంత తొలి పెట్టుబడి సంపాదించుకోవడం వల్లనూ తమ స్వంత ఇల్లు కొనేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ వచ్చారు. ఎప్పటికి వస్తాడో, అసలు వస్తాడో రాడో తెలియని మొగుడి గురించి తన జీవితాన్ని “పాజ్” లో ఉంచడానికి ఇష్టపడ్డం లేదు ఈ నాటి యువతి. అదలా ఉండగా, స్త్రీని కలిసే సమయానికే ఆమె ఒక ఇంటి యజమానురాలై ఉండడం పురుషుడికి ఒక పక్కన సహజంగా భీతి కలిగించే లక్షణం, మరొక పక్క ఆత్మ న్యూనత ప్రశ్న. ఇలా ఒకదాన్నొకటి ప్రభావితం చేస్తున్నాయి ఈ ఆర్ధిక సామాజిక అంశాలు.
ఐతే, తన నివాస స్థలంలో ఒంటరిగా ఉన్నంత మాత్రాన, జీవితంలో ఒంటరిగా లేరు ఈ స్త్రీలు (ఆ మాటకొస్తే పురుషులు కూడా). కాలమిస్టు కేట్ బాలిక్ (Kate Bolick) ఒక పత్రిక వ్యాసంలో రాసినట్టు వీళ్ళు ఎప్పటికంటే బలమైన స్నేహ బంధాల్ని ఏర్పరుచుకుంటున్నారు. ఇదివరకటి తరానికి చెందిన సాహిత్యంలోనూ, సినిమాల్లోనూ తన తోటి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని సెటిలైపోతుంటే తానొక్కతే ఒంటరిగా మిగిలిపోతున్నానే అనే మనోదౌర్బల్యాన్ని, దుఃఖాన్ని ఒంటరి స్త్రీపాత్రల మీద మోపుతుండేవారు. అలాంటిది, మందిలోనే ఉంది శక్తి అన్నట్టు, సింగిల్ గా ఉన్న స్త్రీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏ స్త్రీకయినా తోటి సింగిల్ స్నేహితురాళ్ళు తగినంత మంది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటోంది. చిన్నప్పటి స్నేహాలే కాక, ఇప్పుడు కొంత వయసూ అనుభవమూ ఏర్పడినాక చేసుకుంటున్న, బలపడుతున్న ఈ స్నేహాల్లో మరింత తృప్తిని పొందుతున్నామని యువతులు భావిస్తున్నారు. ఇటువంటి జీవితానుభవాలు, ఆలోచనా దృక్పథమూ ఇటీవలి సినిమాల్లో – ఉదాహరణకి, బ్రైడ్స్‌మెయిడ్స్, ఫైవ్ యేర్ ఎంగేజిమెంట్, యాయా సిస్టర్హుడ్ వంటి సినిమాలు – బలంగా కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, అంధ్రాలో మధ్యతరగతి అబ్బాయిలకి పెళ్ళి చేద్దామంటే పిల్లే దొరకడం లేదట! ఆ ముచ్చటేవిటో మరోమాటు చూద్దాం.

–ఎస్.నారాయణస్వామి

‘మాట’ కోసం దేశం దాటిన తస్లీమా!

Innaiah discussing with Taslima

2006 ఫిబ్రవరి 24న తస్లీమా  ఇంటివద్ద ఆమెతో చర్చిస్తున్న ఇన్నయ్య

శటానిక్ వర్సెస్ రచయిత సల్మాన్ రష్డీ ఫత్వాలకు గురయి న్యూయార్క్ లో స్వేచ్ఛగా వుంటున్నారు.  ఆయనే మహిళా సల్మాన్ రష్డీ అని తస్లీమాను సగర్వంగా పిలిచారు.

సుప్రసిద్ధ మానవవాది, ఇస్లాంలో  మూఢ నమ్మకాలకు వ్యతిరేకిగా ప్రసిద్ధి చెందిన తస్లీమా నస్రీన్ ను మొట్టమొదటిసారి  1994లో అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సిటీలో నేను, నాతోపాటు నా భార్య కోమల, కుమార్తె డా.నవీన కలిశాము. యూనివర్సిటీలో ఇరాన్ విద్యార్థుల సెక్యులర్ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో తస్లీమా  తన కవితలు చదివి వినిపించింది. ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఆమె ఇంగ్లీషులో నెమ్మదిగా మాట్లాడింది. రాతలో ఉన్న బలం మాటలలో కనిపించలేదు.

సమావేశానంతరం ఆమెను కలిసి, మాట్లాడి ఫొటోలు తీయించుకుని యింటికి ఆహ్వానించాము. అప్పటికే ఆమెపై ఛాందస ముస్లిములు ఫత్వా జారీ చేయటం, ఆమె తన స్వదేశమైన బంగ్లాదేశ్ వదలి స్వీడన్ ఆశ్రయం పొందటం ఒక చరిత్ర. తస్లీమా తన జీవితాన్ని కవితా రచనలతో ప్రారంభించి వచన రచనలకు విస్తరించింది. ‘ది గేమ్ ఇన్ రివర్స్’ అనే కవితల సంపుటితో ఆరంభించింది.

1996లో రెండవసారి న్యూయార్క్ లో వారెన్ ఎలెన్ స్మిత్ (‘హూ ఈజ్ హూ ఇన్ హెల్’ ఫేమ్) తో కలిసి చేసిన విందులో తస్లీమా నస్రీన్ తో చాలాసేపు కాలక్షేపం చేశాం. అప్పట్లో తస్లీమా విపరీతంగా సిగరెట్లు తాగేది. నేను చనువుగా అది మానేయమని సలహా ఇచ్చాను. నా సలహా వలన కాకపోయినా ఉత్తరోత్తరా మానేసింది. అప్పటినుండీ వారెన్ ఆమెకు సంరక్షకుడుగా ఉంటూ, ఆమె వెబ్ సైట్ ఏర్పాటు చేసి, ఎన్నో విధాల తోడ్పడ్డాడు.

తస్లీమా కవితలు అనేకం వెలువడ్డాయి. ఆమె అనుమతితో వాటిలో కొన్నిటిని నా భార్య కోమల తెలుగులోకి అనువదించింది. హేతువాది ఇసనాక మురళీధర్, కొన్ని గేయాలు తెలిగించారు. తస్లీమా బెంగాలీలో ప్రధానంగా రచనలు చేస్తుంది. వాటిని వివిధ భాషలలోకి అనువదించారు.

తస్లీమా విదేశాలలో పర్యటించటం, ఐక్యరాజ్య సమితి బహుమతులందుకోవడం, సెక్యులర్ హ్యూమనిస్టులు ఆమెకు మద్దతుగా నిలవడం, క్రమేణా ఆమె కీర్తి ప్రతిష్ఠలు  ఇనుమడించడం జరిగింది. మరోవైపు ఆమె రచనలను ఖండిస్తూ, ఇస్లాం పైన దాడి చేసినదని కనుక ఆమెను చంపేయాలని ముస్లిం సనాతనులు పిలుపు ఇచ్చారు. అందువలన భారత దేశంలో కూడా ఆమె రహస్యంగానే బతకవలసి వచ్చింది.

ఢిల్లీలో పునర్వికాస సంస్థ (రినైజాన్స్) వారు ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించింది. నేను సభలో పాల్గొన్నాను. ఇది 2002లో జరిగిన విషయం. గాంధీ పీస్ ఫౌండేషన్ లో ఆమెకు వసతి కల్పిస్తే బొత్తిగా సౌకర్యాలు లేవని బాధపడింది.అక్కడ కేవలం శాకాహరమే ఉన్నది. ఆమెను ఢిల్లీలో కానాట్ సర్కస్ లో హోటలుకు తీసుకువెళ్లి భోజనాలు చేశాం. ఢిలీ్లో చాలామంది  ముస్లింలు ఉన్నప్పటికీ తస్లీమాకు ఎలాంటి ఇబ్బందీ కలుగలేదు.

తరువాత 2006లో నేను, ఇసనాక మురళీధర్ కలకత్తాలో ఆమె నివాసానికి వెళ్ళాము. అప్పట్లో ఆమె రౌడెన్ వీధిలో వుండేది. ఆమె స్వయంగా వంట చేసి వడ్డించింది. తన పెయింటింగులు చూపింది. ఎన్నో విశేషాలు మాట్లాడుకున్నాం. కలకత్తాలో సమావేశాలకు వెడుతూ వుండేది. శిబ్ నారాయణ్ రే మాట్లాడుతున్న సమావేశానికి వచ్చింది. అది కలకత్తా మధ్యలో రినైజాన్స్ సంస్థలో ఉన్నది.  అయినప్పటికీ ఆమెకు ఇబ్బంది కలుగలేదు. కానీ, రెండవ అంతస్తులో ఉన్న సమావేశానికి రావడానికి మెట్లు ఎక్కలేక కిందనే వుండిపోయింది. మేము కిందకు వెళ్ళి కాసేపు మాట్లాడి పంపించేశాము. కలకత్తాలో ఆమెకు శిబ్ నారాయణ్ రే పెద్ద అండగా వుండేవాడు. ప్రభుత్వం ఆమెకి సెక్యూరిటీ ఇచ్చింది.

బెంగాలీ రచయితలను కలుసుకోవటం చర్చించడం ఆమెకు ఇష్టం. బెంగాలీ సంస్కృతిలో పెరిగిన తస్లీమా ఆ వాతావరణంలోనే వుండడానికి ఇష్టపడింది. కానీ, ఆమె భావాల వలన ముస్లింలు ఆమెను ఉండనివ్వలేదు.

తస్లీమా ‘లజ్జ’ అనే పుస్తకంలో బంగ్లాదేశ్ లో హిందువులపై ముస్లిములు జరిపిన అత్యాచారాలను ఏకరువు పెట్టి తీవ్ర నిరసన తెలిపింది. అంతటితో ముస్లిములు విచక్షణ విస్మరించి ఆమెపై విరుచుకు పడ్డారు. తస్లీమాకు డాక్టరుగా ప్రాక్టీసు ఉండేది. అది వదిలేసి పారిపోవలసి వచ్చింది. మళ్లీ తల్లి చనిపోయినప్పుడు రహస్యంగా వెళ్లి చూచి ఏదో ఒక విధంగా బయటపడింది. ఆమె విస్తృతంగా తన జీవిత చరిత్రను రాసి ముస్లిం సమాజాన్ని స్త్రీలపట్ల వారి అమానుషత్వాన్ని, చిన్నతనం నుండీ ఇస్లామును నూరిపోసి, పురుషులలో నిరంకుశత్వాన్ని ప్రబలింప చేయడాన్నితీవ్రంగా విమర్శించింది. ఆమె గ్రంథాలన్నీ బంగ్లాదేశ్ లో నిషేధించారు. చివరకు చాలా అభ్యుదయ వాదులమని చెప్పుకునే కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్ లో పరిపాలిస్తూ కూడా ఆమె రచనలు నిషేధించటం సిగ్గు చేటు. కలకత్తా హైకోర్టు ఆ నిషేధాన్ని తొలగించింది.

protecting Taslima

2008లో ప్రెస్ క్లబ్ హైదరాబాదులో ముస్లింలు దాడిచేసినప్పుడు తస్లీమా రక్షణకు ప్రయత్నిస్తున్న ఇన్నయ్య

‘షోద్’ అనే తస్లీమా రచనను ‘చెల్లుకు చెల్లు’ అనే పేరిట తెలుగులో కోమల అనువదించింది. దాని ఆవిష్కరణకు తస్లీమా 2007 ఆగస్టు 9న హైదరాబాదు వచ్చింది. హైదరాబాదు బేగం పేట ఎయిర్ పోర్టులో ఆమెకు స్వాగతం పలికి ఈనాడుకు ఎదురుగా ఉన్న ప్రెస్ క్లబ్ కు తీసుకువచ్చాము. ఆమె రాక గురించి పబ్లిసిటీ ఇవ్వలేదు. భద్రతా దృష్ట్యా పరిమితంగానే విలేఖర్లను, కొందరు మిత్రులను ఆహ్వానించాము. ఆనాడు వేదిక మీద ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపాల్ ఎమ్. నాగేశ్వరరావు, సుప్రసిద్ధ రచయిత్రి ఓల్గా, కోమల, నవీన ఉన్నారు. తస్లీమా చాలా మృదువుగా తన తీవ్రభావాలను వెల్లడించి, షోద్ నవల గురించి సంక్షిప్తంగా చెప్పింది. ఆ నవలలో ఇస్లాం ప్రస్తావన లేదు. మతపరమైన వాదోపవాదాలు లేవు. ఆమెపై ఉన్న ఫత్వా కారణంగా ఛాందస ముస్లింలు వెంటపడ్డారు.

కోమల అనువదించిన యంగ్ చాంగ్ పుస్తకం ‘అడవి గాచిన వెన్నెల’ (చైనాలో దీనిని నిషేధించారు.)ను ఆగస్ట్ 9, 2007 న తస్లీమా, ‘చెల్లుకు చెల్లు’ తోపాటు విడుదల చేశారు. రంగనాయకమ్మ దీనిపై 100 పేజీల సమీక్ష రాసి కోమల అనువాదాన్ని మెచ్చుకుంటూ అందరూ చదవాలన్నారు.

ప్రెస్ క్లబ్బులో కార్యక్రమమంతా ముగిసిన తరువాత ముగ్గురు మజ్లీస్ శాసన సభ్యులు తమ అనుచరులను వెంట బెట్టుకుని తస్లీమాపై అమానుషంగా దాడి చేశారు. పోలీస్ సహాయంతో ఆమె కలకత్తా వెళ్లినా ముస్లిం సంఘాలు వెంటబడ్డాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ ఆమెకు అండగా నిలవలేదు. దేశంలో ఉండనిస్తామంటూ జైలులో పెట్టినట్లు ఆంక్షలు విధించారు. దేశం వదిలి వెళ్ళిపోయి కొన్నాళ్ళకు తిరిగి వచ్చినా పరిస్థితి మారలేదు. సెక్యులర్ ప్రభుత్వమని చెప్పుకునే వారు ఇలాంటి ధోరణి అవలంబించటంతో తస్లీమా వెళ్లిపోవలసి వచ్చింది. కలకత్తాలో ఉంటే బెంగాలీ మాట్లాడుకోవచ్చని, తను పుట్టి పెరిగిన సంస్కృతికి చేరువగా ఉంటానని ఆమె ఆశించింది. చివరకు సాల్మన్ రష్డీ, అయన్ హర్షీ అలీ విదేశాలలో ఉండవలసి వచ్చింది.

తస్లీమా బంగ్లాదేశ్ కు పనికిరాకపోయినా ప్రపంచానికి, ప్రజాస్వామ్యవాదులకు హీరోయిన్. ఎన్నో దేశాలు ఆమెను ఆహ్వానించి ఘనంగా సత్కరిస్తున్నాయి. అనేక రచనలు వెలువరిస్తూనే వుంది. ప్రస్తుతం కొన్ని నిబంధనలకు లోబడి ఢిల్లీలో వుండనిచ్చారు. బయటి ప్రపంచం మాత్రం ఆమెను స్వేచ్ఛగా పర్యటించడానికి, అభిప్రాయాలు వెల్లడించడానికి పిలుస్తున్నది. ఆమెతో స్నేహంగా వుండగలగడం నాకు ప్రత్యేక విశేషం. అనేక నాస్తిక, మానవవాద, హేతువాద సభలలో నిరంతరం పాల్గొంటున్నది. ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు అందుకుంటున్నది. బాల్య, యౌవన దశలో బంగ్లాదేశ్ లో మతపరమైన చిత్రహింసలు అనుభవించినా స్వేచ్ఛా లోకంలో మాత్రం స్త్రీలకు ఆమె ఆదర్శప్రాయంగా నిలిచింది. వేబ్ సైట్ లో ట్విట్టర్లో ధైర్యంగా, శాస్త్రీయంగా ఆలోచనలను అందిస్తున్నది. అక్కడక్కడా కొంతమంది ముస్లింలు భావ బంధాలు తెంచుకుని స్వేచ్ఛగా రచనలు సాగిస్తున్నారు.

Taslima,me, prof Amlan Datta

ఇన్నయ్య, తస్లీమా, ప్రొఫెసర్ అమ్లాన్ దత్

వారితో కూడా ఆమెకు పరిచయాలున్నాయి. ‘నేనెందుకు ముస్లింను కాదు’ అనే పేరిట ఇబన్ వారక్ రాసిన సుప్రసిద్ధ రచన కూడా బహుళ ప్రచారంలోకి వచ్చింది. ఇరాన్, సోమాలియా తదితర దేశాలలో రచయిత్రులు బయటకు వచ్చి స్త్రీలకు స్వేచ్ఛ కావాలని రచనలు చేస్తున్నారు. అయన్ హర్షీ అలీ అలాంటివారిలో ప్రముఖులు. ఆమె రచనలు కూడా కొన్ని కోమల తెలుగులోకి అనువదించింది. తస్లీమా చరిత్రలో నిలుస్తుంది. ఆమెతో స్నేహంగా వుండగలగడం మానవ వాదిగా నాకు గర్వకారణం.

తస్లీమా ప్రధానంగా బెంగాలీలో రాస్తుంది. ఇంగ్లీషులో వ్యాసాలు, కొన్ని కవితలు రాసింది. ఆమె ఉపన్యాసాలన్నీ రాసి, చదువుతుంది. అవి చాలా ఆలోచనతో ఉద్వేగంతో  జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకిస్తూ, సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం ఆక్రందించేవిగా వుంటాయి. ప్రపంచంలో ఆమె ఉపన్యాసాలు చాలా ఆకట్టుకున్నాయి. బెంగాలీ రచనలలో ముఖ్యంగా ఆమె జీవిత చరిత్ర ‘లజ్జ’ వంటి నవల, బంగ్లాదేశ్ లో నిషేధించారు. జీవితచరిత్ర ఏడు భాగాలుగా ప్రచురితమైంది.

అందులో ఇంకా కొన్ని ఇంగ్లీషులోకి రావలసినవి ఉన్నాయి. ‘ఫ్రెంచి లవర్’ అనే నవల చాలా గొప్పగా వుంటుంది. అందులో ఆమె స్వీయగాథ కూడా తొంగి చూస్తుంది. ఆమె రచనలు స్పానిష్, జర్మన్, ఫ్రెంచి భాషలలోనికి అనువాదమయ్యాయి. భారతదేశంలో హిందీ, మరాఠీ, తెలుగుతో సహా వివిధ భాషలలోకి కొన్ని పుస్తకాలు వ్యాసాలు వచ్చాయి. ఆమె వెబ్ సైట్ (taslimanasrin.com) నిర్వహిస్తున్నది.

– నరిసెట్టి ఇన్నయ్య

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“చదువుకున్న మూర్ఖుడు” – ఇంకెవరూ? ….

నా సాహిత్య” ప్రస్థానంలో” మా అన్నదమ్ములకీ, అప్పచెల్లెళ్ళకీ ఏ మాత్రం ప్రమేయం లేదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను కానీ అది ఒక విధంగా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే, ముందుగానే చెప్పుకునేది నాది పెద్ద “ప్రస్త్హానం” కానే కాదు. ఏదో మామూలు జనతా క్లాసు ప్రయాణమే అయినా ప్రస్థానం లాంటి పెద్ద, పెద్ద మాటలు వాడితే  నా భుజాలు నేనే తట్టుకోడానికి బావుంటుంది కదా అని తంటాలు పడుతున్నాను. ఇక ఎవరయినా ఒక రచయిత అవడానికి వారసత్వం కారణం కానక్కర లేదు. ఆ మాట కొస్తే నాకు తెలిసీ చాలా మంది సాహితీవేత్తలు తమ పిల్లలని . “మా లాగా కథలు, కవిత్వాలు రాసుకుంటూ అవస్థ పడకుండా హాయిగా చదువుకుని ”పైకి” రమ్మని ప్రోత్సహించిన వారే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ “పైకి” రావడం అంటే డబ్బు సంపాదించుకోవడం అని అర్ధం. అందుకే సుప్రసిద్ధ సాహితీవేత్తల సంతానం చాలా మంది అమెరికాలో పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకో తెలియదు కానీ  వాళ్ళల్లో చాలా మంది గోప్యంగానే ఉంటారు. నా విషయంలో మా బంధువులకి  “రాజా గాడు చదువుకున్నాడు కానీ కథలూ, కమామీషులలో పడిపోయి  పైకి రాలేక పోయాడు” అనేదే చాలా మందికి ఉన్న బాధ. నాకు తెలిసీ  నా ముగ్గురు అన్నయ్యలకీ, తమ్ముడికీ, అక్కకీ, ముగ్గురు చెల్లెళ్మా అన్నదమ్ముల, అప్పచెల్లెళ్ళ లలో ఎవరికీ రచనావ్యాసంగం లేదు.

కానీ మా పెద్దన్నయ్య అందరి లాగా కాదు. కొంతమంది పెద్దన్నయ్యలు నిజంగానే పెద్దన్నయ్యలాగా ఉంటారు. నాకే కాదు….మా చుట్టాల్లో కూడా వరసకి ఏమైనా కానీ, అందరికీ మా పెద్దన్నయ్య పెద్దన్నయ్యే! అందరూ ఉహించినట్టుగానే  అతని పేరు మా తాత గారి పేరే….సూర్య ప్రకాశ రావు. మా కుటుంబంలో ‘కలాపోసన కీ కళాకౌశల్యానికీ కూడా ఆయనే పెద్దాయన. ఉదాహరణకి, మా చిన్నప్పుడు, ముఖ్యంగా మా అక్క పెళ్లి కాక ముందు, ప్రతీ ఏడూ సంక్రాంతి, దసరా మాకే కాక కాకినాడ మొత్తానికే పెద్ద పండుగలు. అందుకు ప్రధాన కారణం, ఆ పెద్దన్నయ్య వారాల తరబడి అతి జాగ్రత్తగా అధ్బుతమైన ఊహాశక్తితో మా అక్క పేరిట ఒక సినిమా సెట్టింగ్ లా నిర్మింఛే బొమ్మల కొలువులే!

rajuఇందుతో జతపరిచిన ఫోటో ఒక్కటే మా దగ్గర ఆ నాటి పండుగ రోజులకి గుర్తుగా మిగిలింది. ఈ ఫోటో అస్పష్టంగా ఉన్నా, అందులో ప్రతీ అంగుళమూ నాకు గుర్తే! చుట్టూ రెండు లెవెల్స్ లో ఆర్చీలు మా అన్నయ్య డిజైన్ చేసేవాడు. అంటే అంగుళం వెడల్పు, మిల్లిమీటర్ మందం ఉండే పొడుగాటి ఇనప బద్దీలని గుండ్రంగా, పలకలగా, త్రికోణాలుగా వంచి బొమ్మల కొలువు మందిరం చుట్టూ జాగ్రత్తగా, పడిపోకుండా పెట్టేవాడు. వాత్తికి సరిగ్గా రంగు రంగుల ఉలిపిరి కాగితాలు, ముచ్చి రేకులూ కత్తిరించి జిగురుతో అతికించి సినిమాలో గుమ్మాలకి తోరణాలలా ధగ ధగ మెరిసేలా అతికించేవాడు. అన్నం ఉడకేసి, గంజి వార్చేసి మెత్తటి ఆ జిగురు తయారు చేసి, సుతిమెత్తగా ఉండే ఆ కాగితాలు ముడుచుకుపోకుండా  జాగ్రత్తగా పులిమి, మా పెద్దన్నయ్య పీట మీదో, నిచ్చెన మీదో నుంచుని రెడీగా ఉన్నప్పుడు అందించే అతి ముఖ్యమైన పని  రాజా-అంజీ లు చేసే వారు. అందులో రాజా అంటే నేను. ఆంజి అంటే  నా తమ్ముడు హనుమంత రావు. మేమిద్దరం ఆ పేర్లతో కావాలా పిల్లలలా పెరిగాం. అమెరికాలో కూడా ఇంకా అలాగే ఉన్నాం. ఇక అసలు బొమ్మలకి ముందు ముఫై, నలభై చతురపు అడుగుల వైశాల్యంలో నేల మీద ఒక పువ్వుల తోటా, పర్వతాలు, జలపాతాలు, మధ్యలో మా అగ్గిపెట్టెలతో తనే తయారు చేసిన మా దొంతమ్మూరు లో  మా తాత గారు పెరిగిన మేడ నమూనా వగైరాలు ఉండేవి. అంతా అయ్యాక  బొమ్మల కొలువు అంతా దేదీప్యమానంగా నూనె దీపాలు,  క్రిస్మస్ లైట్ల తో కళ్ళు జిగేలుమనేట్టు ఉండేది. అంతే కాదు, దీపావళి సమయంలో అయితే, మా స్థలం వీధి గుమ్మం నుంచీ ఇంటి ముందు వరండా దాకా సుమారు రెండు వందల అడుగుల దూరం అటూ, ఇటూ స్తంభాలు పాతి, వాటి మీద దీపాలు పెట్టి మంచి రహదారి ఏర్పాటు చేసే వాడు మా పెద్దన్నయ్య. ఈ వింతలన్నీ చూడడానికి కాకినాడలో అందరే కాక, చుట్టూ పక్కల గ్రామాల నుంచి ఎద్దు బళ్ళు కట్టుకుని వచ్చే వారు.  మా రోడ్డు మీద ఆ నాటి ఎద్దు బళ్ల పార్కింగ్ లా ఇక్కడ అమెరికాలో చేస్తే, నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు.  మా పెద్దన్నయ్య ఎంత సరదా మనిషి అంటే మా చిన్నప్పుడు నాకు ఎప్పుడు ఉత్తరం వ్రాసినా “ఒరేయ్ తుమ్మ జిగురూ” అనే సంబోదించే వాడు. ఎందుకంటే మా స్కూలు ప్రాజెక్ట్స్ అన్నింటికీ మా పొలం గట్ల మీద ఉండే తుమ్మ చెట్లకి గాట్లు పెట్టి, జిగురు ఊరాక దాన్ని సీసాలో పెట్టి నాకు తనే పంపించే వాడు. నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా, ఏ సాహిత్య సభ లో పాల్గొన్నా,  వీలైనంత వరకూ  అన్ని సభలకీ వచ్చి మొదటి వరస లో ఆనందిస్తూ, నన్ను ఆశీర్వదిస్తూ కూచునే మా పెద్దన్నయ్య గత ఏడాది (అక్టోబర్ , 2012) లో తన 80 వ ఏట సహజ మరణం పొందాడు.

raju1

2001  లో, కాకినాడలో మాలో చాలా మంది పుట్టిన ఇంటి ముందు తీసిన ఈ ఫోటోలో మా అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళు, వారి కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు  వెరసి మా  సన్నిహిత  కుటుంబం.

ఇక మా చిన్నన్నయ్య ప్రభాకర ముర్తిరాజు గారు మద్రాసులో తను ప్రెసిడెన్సీ కాలేజీ లోను, లా కాలేజ్ లోను చదువుకునేటప్పుడు  మరో విధంగా “కలాపోసన” రంగంలో ఒక వెలుగు వెలిగాడు. అప్పటి ప్రపంచ సుందరి టంగుటూరి సూర్య కుమారి నాయిక పాత్ర ధరించిన నౌకా చరిత్ర దృశ్య నాటకానికి సుప్రసిద్ధ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు రచన, దర్శకత్వం వహిస్తే, మా అన్నయ్య సహకార దర్శకుడిగా వ్యవహరించాడు.  టంగుటూరి సూర్య కుమారి లండన్ వెళ్ళక ముందు మద్రాసులో ఉండే ఆ రోజుల్లో ఆమెకి మా చిన్నన్నయ్య అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే వారు.  పైగా మా ఉరి వారే అయిన నటులు విజయ చందర్,  రామ శర్మ,  ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ (విక్టోరియా హాస్టల్ లో తన సహవాసి)  మొదలైన వారితో సాంగత్యం వలన మా చిన్నన్నయ్య ఆ సంగతులన్నీ అత్యంత రమణీయంగా, స్వతస్సిద్దమైన మాటకారితనంతో మద్రాసు నుంచి  కాకినాడ వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటే రాత్రి తెల్ల వార్లూ వినేవాళ్ళం. పైగా కాకినాడ ప్రాంతాల నుండి ఆ రోజులలో ఎంతో అరుదైన విమానం పైలట్ గా శిక్షణ పొందిన వారిలో బహుశా మా చిన్నన్నయ్యే మొదటి వాడు.  నేను ఇటీవల హైదరాబాద్ వెళ్ళినప్పుడు అనుకోకుండా సింగీతం గారిని కలుసుకున్నప్పుడు ఆయన మా చిన్నన్నయ్యనీ, అలనాటి సంగతులనీ గుర్తుకు తెచ్చుకుని  నాతో పంచుకున్నారు. కానీ మా చిన్నన్నయ్య మద్రాసునీ, అక్కడి జీవితాన్నీ వదులుకుని తను కూడా కాకినాడ తిరిగి వచ్చేసి లాయర్ గా పేరు ప్రఖ్యాతులు పొందాడు. రెండేళ్ళ క్రితం అమెరికాలో ఉన్న తన కొడుకులనీ, నన్ను, మా తమ్ముణ్ణీ చూడడానికి ఇక్కడికి వచ్చి, లాస్ ఏంజేలేస్ లో హఠాత్తుగా గుండె పోటుతో  పోయాడు. మా అమ్మా, నాన్నల తరువాత మా తొమ్మండుగురు సన్నిహిత కుటుంబంలోనూ మా చిన్నన్నయ్యదే మొదటి మరణం.  ఆ తరువాత గత అక్టోబర్,  2012 లో మా పెద్దన్నయ్య కూడా పోయాడు.

ఇందుతో బాటు ముచ్చటగా మా కుటుంబం ఫోటోలు  జతపరుస్తున్నాను. మొదటిది 1955  లో తీసినది. అప్పడు మా ఆఖరి చెల్లెలు ఉషా రేవతి యింకా మా అమ్మ కడుపులోనే ఉంది. ఆ ఫోటోలో నేల మీద ఎడం పక్కన బుద్దిగా కూచున్నది నేనే అని సగర్వంగా చెప్పుకుంటున్నాను. రెండోది  పన్నెండేళ్ల క్రితం కాలానుగతిని వచ్చిన మార్పులతో….అంటే వయస్సు మీరిన తరువాత … మా అన్నదమ్ములం, అప్పచెల్లెళ్ళమూ ఉన్న తీసిన మరొక ఫోటో.

raju3.png

1955  లో మా ఆస్తాన ఫోటో గ్రాఫర్ అయ్యగారి సూర్య నారాయణ గారు తీసిన మా అన్నదమ్ముల, అప్పచెల్లెళ్ళ  ఫోటో.  .

 

 

మా చిన్నప్పుడు మా అక్క కి సంగీతము, డాన్సు నేర్పించే వారు. “ఆ అదంతా పెళ్లి సంగీతము, డాన్సు” అని అందరు అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆలోచిస్తే వాటి ధర్మమా అని నాకు కూడా వాటిల్లో కాస్త ఆసక్తి కలిగింది అనుకుంటాను. మా అక్కకి సంగీతం నేర్పే మేష్టారు భలే తమాషాగా ఉండే వారు. ఒక వేపు ఆ సంగీతం ప్రాక్టీసు జరుగుతూ ఉంటే మరొక పక్క నేను కూడా “మంధర ధారే, మోక్షము రారె..” అనుకుంటూ పాడేసుకునే వాణ్ణీ. అలాగే మా మూడో మేనత్త (దొడ్డమ్మ అనే వాళ్ళం) “ఆకడ, దూకాడ, దూకుడు కృష్ణా రారా..” అనుకుంటూ చాలా పాటలు పాడుకుంటూ ఉండేది.  ఆ పాటకి నాకు ఇప్పటికీ అర్ధం తెలియక పోయినా నా నాటకాల్లో కొన్నింటిలో దాన్ని వాడుకున్నాను. అలాగే  మా అక్క నేర్చుకున్న  పిళ్ళారి గీతాలు , మంధర దారే  వగైరాలు ఇప్పటికీ పాడుకుంటూ నే ఉంటాను…ఏకాంతంగా ఉన్నప్పుడు. నేను పాడుతుండగా ఎవరైనా వింటే కొంప ములిగి పోదూ?

టూకీగా.. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండీ లేనట్టు ఉన్న “కలా పోసన” విత్తనాలు…. నాకు గుర్తున్నంత వరకు… ముందే మనవి చేసినట్టుగా నా చిన్నప్పుడు సాహిత్య పరంగా ఏ విధమైన వారసత్వాలు, ప్రగాఢమైన కుటుంబ వాతావరణమూ లేనే లేవు. అందుకే నేను “ఇలా ఎందుకు తయారయ్యానో”  అని మా వాళ్ళు కొందరు ఆశ్చర్య పడుతూ ఉంటారు.  అంటే మా కుటుంబంలో నేను “చదువుకున్న మూర్ఖుణ్ణి.”

ఒక స్నేహ దీపం ఆరిపోయింది!

ప్రముఖ కథా రచయిత, గేయ రచయిత, సంగీతజ్ఞుడు గిడుగు రాజేశ్వర రావు గారు (1932-2013) హఠాత్తుగా కన్ను మూయడం ఆయన అభిమానులనందరినీ దిగ్భ్రాంతుల్ని చేసింది. చివరి దాకా ఆయన పూర్తి ఆరోగ్యంగా, తాజాగా,ప్రసన్నంగా వున్నారు.  ముఖంలోని చిరునవ్వుగానీ, ఆరోగ్యసూచకమైన వెలుగుగానీ ఏమాత్రం చెదరలేదు.ఆయన దినచర్యలో ఏమీ మార్పు రాలేదు. చదవడం, రాయడం, షికారుకు వెళ్ళడం, సాహిత్యకార్యక్రామాల్లో పాల్గొనడం అన్నీ మామూలుగానే చేసేవారు. యింకా 10 యేడ్లు యేమీ ఢోకా లేదనిపించేవారు, యితరులకు కూడా అలా ఉండాలనే ప్రేరణ కలిగించేవారు. ఒక వారం క్రిందట నేను ఉదయం నుండి సాయంత్రం దాకా ఆయన వద్దనే ఉన్నాను. అదే నేనాయనతో గడిపిన ఆఖరు రోజు.
ఆ రోజు ఆయన కొంత కాలంగా రాయడం మొదలుపెట్టిన  నవల లోని రెండు అధ్యాయాలు చదవమని నాకిచ్చారు. కొంత ఆత్మకథ కలగలసిన ఆ నవల అంశాలు చదివి  వినిపించాను. దాన్ని గురించి కొంత చర్చించుకున్నాము కూడా.యిక తన కాలాన్నంతా నవలకే కేటాయిస్తున్నట్లు, అహమదాబాదులోని ఒక సంస్థ ఆయనను ఆగస్టునెలలో సత్కరిస్తున్నట్లు, ఆ సంర్భంగా అక్క్కడికి ఎళ్తున్నట్లు చెప్పారు. అంతే కాక నేను అంతకు మునుపు మా సాహితీ మిత్ర మండలిలో చదివిన జైనేంద్ర కుమార్ హిందీ కథ–తాత్వికతతో కూడిన కథ— ’తత్సత్’ బాగా నచ్చినందువల్ల దాన్ని తెలుగు లోకి అనువదించాలనే కోరిక ఆయనకున్నందువల్ల ఆ కథ సాంతం మళ్ళీ వినిపించి అర్థాలు చెప్పాను. ఆయన అర్థాలన్నీ నోట్ చేసుకున్నారు.
మరుసటి రోజు అనువాదం పూర్తి అయిందని చెప్పడానికి ఫోను కూడా చేశారు.అంత దీక్షతో పనిచేసేవారు. ఇంతకు మునుపు  కూడా ఆయన ఈ విధంగానే మా మిత్రమండలిలో నేను చదివిన కొన్ని హిందీ కథలను అనువదించి ప్రచురించారు కూడా. ఉదాహరణకు యశపాల్ కథ ’కర్వా వ్రతం’(కర్వా కా వ్రత్) భీష్మ్ సాహనీ కథ ’సర్దార్నీ’. ఇలాగే మరికొన్ని కథలు కూడా అనువదించాలనే కోరిక ఆయనకు ఉండేది. ఈ అనువాదాల్ల్లో ఆయనకు సహకరించడం నాకు చాలా ఆనందం కలిగించేది. ఈ పనిగా ఆయన వద్దకు వెళ్ళి నప్పుడంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయనతో గడిపే అవకాశం నాకు లభించేది. కొన్ని సందర్భాల్లో  నేను హిందీ నుంచి తెలుగులోకి చేసిన అనువాదాలు  ఆయనకు చూపించేవాణ్ణి. ఆయన శ్రద్ధగా చదివి అవసరమైన మార్పులు సూచించేవారు. ఈ విధంగా మా సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఆయన హఠాన్మరణం గురించి తెలియగానే ఈ ప్రసిద్ద్ద శ్లోకం మనసుకు వచ్చింది:
అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం,
దేహాంతే తవ సాయుజ్యం, దేహి మే పార్వతీ పతే
(దేవా! పార్వతీ వల్లభా! బ్రతికినన్నాళ్లు దైన్యములేని జీవితమును, కాలము తీరినపుడు అనాయాస మరణమును, దేహమును  వదలినపిమ్మట నీలో కలియుటను ఈ మూడింటిని నాకు అనుగ్రహింపుము).ఇలాంటి కోరిక తీరిన వ్యక్తిలాగానే ఆయన వెళ్లి పోయారు. స్విచ్ ఆఫ్ చేసినట్లు. తానూ ఆయస పడలేదు, ఇతరులనెవ్వరినే ఆయాస పెట్టలేదు.  సార్థకము, సఫలము అయిన   జీవితం జీవించి, పలువురిని మన్ననలందుకొని   వెళ్లిపోయారు.
     భగవద్గీతలోని కర్మయోగి ఆయన. చివరి క్షణం వరకు క్రియాశీలుడుగానే ఉన్నాడు.  గొప్ప  యోగులు,సాధకులు యోగంద్వారా తనువు చాలిస్తారని అంటారు. రాజేశ్వర రావుగారు కూడా అలానే చేశారనిపిస్తుంది.
    నా ఒకనితోనే కాదు, డిల్లీ లోని మా సాహితీ మిత్రమండలిలోని ప్రతి ఒక్కరికి ఆయన సన్నిహితుడైపోయాడు. గత పది-పడ్రెండేళ్లలో– మధ్యలో కొంత కాలం తప్ప— డిల్లీలో  మా అందరికీ ఆత్మబంధువుగా, పెద్దదిక్కుగా,  ప్రేరక శక్తిగా ఉంటూ వచ్చారు . ఆయన సౌజన్యం మమ్మలనందరినీ కట్టి పడేసేది. అందరితో ఆప్యాయంగా మాట్లాడేవారు.  శ్రమపడి ఎంతో దూరం నుంచి  మా సమావేశాలకు వచ్చేవారు. వాటిలో తన రచనలు చదివి వినిపించేవారు, యిక్కడి రచయితల రచనల పైన తన అభిప్రాయం వెలిబుచ్చేవారు.
    సంగీతంలో ఆయనకున్న ఆసక్తిని గురించి, అభినివేశాన్ని గురించి, ఆయన చేసిన కృషి గురించి చాలా కాలం దాకా మాకు తెలియదు. తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం. ఉత్తరాది, దక్షిణాది సంగీతాలను, జానపద సాహిత్యాన్ని తనివితీరా ఆస్వాదించిన రాజేశ్వర రావు గారు సందర్భం వచ్చినప్పుడంతా ఆ పాటల చరణాలను  లీనమై పాడేవారు.  హిందీ పెద్దగా రాకపోవడం ఆయన సంగీత సాధనకు అడ్డంకిగా ఉన్నట్లు  నాకు తోచలేదు. యెన్నో పాత హిందీ-తెలుగు పాటలు ఆయన జిహ్వాగ్రం పైన ఉండేవి. ఆయనకు సంగీతం అంటే ఎక్కువ ఇష్టమా, లెక సాహిత్యమంటేనా అనేది చెప్పడం కష్టమనిపించేది. సంగీతం బాగా తెలిసి ఉండడం ఆయన రాసిన గీతాలకు బాగా తోడ్పడిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. రేడియోలో, టీవీలో ప్రసారం పొందిన ఆయన అనేక గేయాలు శ్రోతలకు చిరపరిచితమే. శ్రీమతి రాజేశ్వర రావు గారు, ఆయన కుమార్తె స్నేహలతగారు కూడా సంగీతం బాగా తెలిసినవారే.
    రాజేశ్వర రావు గారు  ప్రధానంగా మానవీయ విలువలను, ఆదర్శ మానవ జీవితాన్ని  చిత్రించిన రచయిత.  మొత్తం ఆయన సాహిత్యంలోని భావాల్లో, ఆలోచనల్లో  యీ విలువల గురించిన చింతే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజుల్ల్లో మనుషుల్లో  సాధారణంగా కనిపించే స్వార్థపరత్వాన్నీ, అవినీతిని, విచ్చలవిడితనాన్ని, విలువలు లేకపోవడాన్నీ చూసి ఆయన తీవ్రమైన ఆవేదన చెందేవాడు. తన జీవితం ద్వారా, సాహిత్యం ద్వారా ఆ విలువలకు బలం చేకూర్చడం  కోసమే ఆయన తాపత్రయపడ్డారు, శ్రమించారు,. తన కల్పనలో ఉన్న గంభీరమైన మానవ జీవితాన్ని. బలమైన నైతిక భావాల్ని, సౌహార్ద్రం నిండిన మానవ సంబధాలను  చిత్రించారు. ఆయనలో కళా దృష్టి కంటే ప్రయోజనపరమైన దృష్టే ఎక్కువగా ఉంటుంది.  అయితే  భావాల్ల్లో తీవ్రత, ఉధృతి  ఉండవు.  సున్నితంగా, మృదువుగా. హితవు చెప్పినట్లుగా చెప్పడం ఆయనకు ఇష్టం.  ఆయన స్వయంగా కూడా సౌజన్యశీలి, మితభాషి, మృదుస్వభావి. ఉదాత్త వ్యక్తిత్వం కలవాడాయన.. తీవ్ర భావాభివ్యక్తి ఆయన ప్రవృత్తికి సరిపడదు. ఆ గుణమే ఆయన సాహిత్యంలో కూడా ప్రతిఫలించి అందులో సారళ్యం, మాధుర్యం చోటు చేసుకున్నాయి..  మానవుని జీవితాన్ని సృష్టి లయతో మేళవించడానికి, సృష్టితో దానికి సామరస్యం స్థాపించడానికి ఆయన తన సాహిత్యం ద్వారా కృషి చేశాడు. చెప్పదలచుకున్నది సూటిగా చెబుతారు. అందువల్లే ఆయన సాహిత్యంలో ఎలాంటి వాద వివాదాలకు చోటు లేకుండా పోయింది.
    ఆయన తత్వమేమిటో ఆయన మాటల్లోనే ఇలా చెప్పుకున్నాడు ” నిరంతరం తిరిగే సృష్టిచక్రానికి కందెన ప్రేమతత్వమే  కానీ పగ, ద్వేషం కాదు. మానవూడు ప్రకృతికి దూరంగా  జరిగిపోతున్నాడని వందేళ్ల క్రితం  డేవీస్  విచారించాడు.  కానీ ఇటీవలి పరిణామాలు చూస్తే చెప్పలేనంత దూరమే మళ్లిపోతున్నాడు.
    “ఈ సృష్టిని  వినయంతో ఆరాధించి, భావి తరాల  పట్ల శ్రద్ధ వహించడంలో తేనెటీగలు, వానపాములు వంటి అల్పజీవులు చూపిన పాటి దీక్ష, సహజీవన కాంక్ష బుద్ధిజీవులని విర్రవీగే  నరజాతి చూపకపోవడానికి కారణం ఒకటే.  ప్రేమ జీవితానికి అత్యవసరమన్న సత్యాన్ని గుర్తించక పోవడమే. విధ్వంసకారకాలైన పగ, ద్వేషం, జనాన్ని, ముఖ్యంగా యువతని తమవేపుకు లాక్కుంటున్నాయి…..ప్రకృతి దృశ్యాల వెనక అంతర్లీనంగా ఉన్న ప్రేమతత్వం, రానున్న తరాల పట్ల శ్రద్ధ, గమనించినప్పుడు  మానవ హృదయంలో కాసింత పరివర్తన, మృదుత్వం చోటు చేసుకుంటుంది.  విధ్వంసకోన్మాదమే సామాజిక సమస్యల పరిష్కారానికి ఒక మార్గం అన్న అభిప్రాయం తగ్గుముఖం పడుతుంది– అని నమ్ముతున్నాను. ప్రకృతిని ప్రేమించి ఆరాధించే సాధనకు మించిన భక్తి ఏమతంలోనైనా వేరే ఏముంటుంది? “
    గిడుగు రాజేశ్వర రావు గారు మొత్తం పధ్నాలుగు రచనలు ప్రచురించారు. (1)గిడుగు రాజేశ్వర రావు కథలు (2) రాగవీచికలు (లలిత గేయాలు) ఇది గరికపాటి సాహిత్య పురస్కారం పొందింది (1993) (3) కాళిందిలో వెన్నెల (కథల సంపుటి) (4)పూలతేరు (కథల సంపుటి)  (5) భావ వీచికలు ( ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాల్లో ప్రసారమైన లలిత గేయాలు)  (6)మల్లె పందిరి ( ఆంధ్ర సారస్వత సమితి, మచిలీపట్నం వారి ’ముదిగొండ సాహిత్య పురస్కారం-2003 పొందిన బాలల గేయాల సంపుటి) (7) మా ’కంద’ స్పందనలు (కంద పద్య శతకం)  (8) శబ్ద చిత్రాలు (రేడియో నాటికలు)  (9) ఉదాత్త చరితుడు గిడుగు ( రామమూర్తి పంతులు గారి  జీవిత చరిత్ర)  (10) అమూల్యక్షణాలు (కథల సంపుటి) (11) పిల్లలకు పిట్టకథలు  (12)రాజమకుటాలు  (వ్యంగ్య  పద్యరచన) (13) కవన కదంబం (కవితలు) (14) సృష్టిలో మధురిమలు ((సచిత్ర  పద్య రచన)
     రాజేశ్వర రావు గారి కథలు జీవితంలోని అతి సున్నితమైన అంశాలను స్పృశిస్తాయి, ఏ అలంకారాలూ లేకుండా, నిరాడంబరంగా,  నిసర్గ సుందరంగా ఉంటూ తమ లక్ష్య శుద్ధి తో, నిజాయితీతో,  ఆర్ద్రతతో పాఠకుణ్ణి ఆకట్టుకుంటాయి,ఆలొచింపచేస్తాయి. సరళమైన భాష, కథను నడిపించడంలో మంచి నేర్పు, అందులోని సందేశం ఆయన కథల్లోని మరి కొన్ని విశేషతలు.  ఈయన అనేక కథలు  పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి.   వీరి  బాలల గేయాలు, లలిత గేయాలు  ఉదాత్తమైన భావాలతో నిండి, రాగ-తాళయుక్తంగా పాడడానికి అనువుగా ఉంటూ,పాడేవారికి, వినేవారికి, చదివేవారికి. అందరికి రసానుభూతిని కలగజేస్తాయనడంలో సందేహం లేదు.
  ఎంతో శ్రమపడీ సేకరించిన సమాచారంతో   తన తాత గిడుగు రామమూర్తి పంతులు గారి జీవిత విశేషాలను పొందుపరచి రాసిన ’ఉదాత్త చరితుడు’ ఒక విశిష్ట రచన . మునుపెన్నడు వెలుగులోకి రాని విశేషాలెన్నో ఇందులో ఉన్నాయి.
   రాజేశ్వర రావు గారి చివరి ప్రచురిత రచన ’సృష్టిలో మధురిమలు’  మరో విశిష్ట రచన. తాను తీసిన ఫోటోల్లోని, సేకరించిన ఫోటోల్లోని  ప్రకృతి  దృశ్యాలకు తగినట్లుగా  తానే రాసిన గీతాలను చేర్చి ప్రచురించిన  పలు రంగుల చిత్రాలతో కూడిన  రచన ఇది.  దాన్ని ఆయన ’సప్తవర్ణ దృశ్యకావ్య ప్రయోగం” అని అన్నారు.  ఈ రచన  రాజేశ్వర రావు గారు  ప్రకృతితో  ఎంత తాదాత్మ్యం చెంది ఉండేవారో,  ఎంత సూక్ష్మ పరిశీలన చేసేవారో స్పష్టంగా తెలుపుతుంది.
 “నిండు దోసిట పట్టిన నీరు కూడ
వేలి సందులలో జారి నేల రాలు,
మధురమైన క్షణాలను మరచి పోక 
భద్రపరచు ప్రయత్నమీ పద్య రచన!”
అని ఆరంభించిన ఈ  రచనలోపశు -పక్షులనుంచి, క్రిమికీటకాలనుంచి, ప్రకృతి నుంచి మానవుడు  తన మనుగడకు, తన ఉన్నతికి  నేర్చుకోవలసిన అనేక పాఠాలను దర్శింపచేసే చిత్రాలు, వాటిని హృద్యంగా వర్ణించిన  గేయాలు ఉన్నాయి.   సారిసారికీ  చూస్తూ, చదువుతూ ఉండడానికి  ప్రక్కనే ఉంచుకోదగ్గ పుస్తకం.
     తన ఆలోచనలను. ఆదర్శాలను, చింతలను వెలిబుచ్చే రెండు కథలు ఆయన ఈ మధ్యనే ప్రచురించారు. ఒకటి వన మహోత్సవం, రెండోది ధర్మసందేహం.
జె. ఎల్. రెడ్డి
Dr. J.L Reddy

‘ తంతే బూరెల బుట్టలో ……’

నోములూ వ్రతాలూ, పెళ్ళిళ్ళూ పేరంటాలు లేకుండా   పొదుగుడు కోడిపెట్టల్లాగా  ఎవరింట్లో వాళ్ళు పడుండే  ఆషాఢ  మాసం అంటే అత్తగారికి అంత అభిమానం లేదు. అలా అని అలక్ష్యమూ లేదు . ” ఆషాఢం ఇంకా ఎన్నాళ్ళుంటుందే  ” అని అక్కరకురాని చుట్టాన్ని తప్పక  భరిస్తున్నట్టూ రోజూ  కేలండర్ చూస్తూనే వుంటారు .  ఎక్కడో మూడు వారాల అవతల వున్న శ్రావణాన్ని  మాత్రం  “అదిగో వచ్చేస్తుంది ….ఇంకెంత ”  అంటూ  అంత మొహం చేసుకుని ఆహ్వానించేస్తూ వుంటారు .

అయినా  దేని దారి దానిదే అన్నట్టూ  ఆషాఢానికి జరగాల్సిన లాంచనాలన్నీ తు. చ తప్పక జరిపిస్తారు .ఆ ప్రకారం  ఆషాఢం  లో తప్పక తినాలని చెప్పే మునగాకు కోసం దొడ్లో మునగ చెట్టుని ఆకు లేకుండా దూసేశాం . నల్లేరు పచ్చడి, బలుసాకు పులుసు ,వాక్కాయ్ -పప్పూ  అంటూ నాలుక పసరెక్కేలా  కంచెలన్నీ మేసేశాం  . రంగు మాయకుండా డిజైను మారకుండా ( ఇంకేవిటీ చందమామ చుక్కలూను )  మళ్ళీ మళ్ళీ చేతులకి గోరింట పూయించేశాం .

తొలేకాశి వెళ్ళేనాటికి   లాంచనాలన్నీ యధావిధిగా పూర్తిచేసి పప్పులో ఉండ్రాళ్ళు కూడా వండుకు తినేసి   , ఈ ఆషాఢం ఇంకెన్నాళ్ళుందో అని  రోజులు   లెక్కపెట్టుకుంటుంటే ….హటాత్తుగా   అత్తగారికి గుర్తొచ్చింది తాటిపండు లాంచనం  ఒకటి . “ఈకాలంలో తాటి బూరెలు వండుకోవటం కూడా ఆచారమేమేనేవ్ . కానీ …,” అంటూ  కామాలో  ఇరుక్కుపోయారు .

అప్పటివరకూ అత్తగారి ఆకుపసరు  ఆచారాలకి నాలుక పీక్కున్న నేను ఈ పండాచారానికి  లొట్టలేసాను. చిన్నప్పుడెప్పుడో తిన్న తాటిరొట్టె, తాటిబూరెలు, అప్పాల రుచులు  గుర్తొచ్చి గుటకలు మింగాను .

“కానీ లేదు అర్ధణా లేదు కానిచ్చేద్దాం ..కానిచ్చేద్దాం” అని  తొందరపడ్డాను .

నా తొందరకాళ్ళకి బంధం వేస్తూ అత్తగారు ”  ఎప్పుడో నాలుగు తరాలకి ముందే మనింట తాటిపండుకి  తిలోదకాలు ఇచ్చేసారట  . ఎవరయినా పెడితే తినచ్చుకానీ  మనింట్లో వండుకోటం ఆనవాయితీలేదు . మనకి  అచ్చిరాదు  అని మా అత్తగారు మాకు మరీ మరీ చెప్పేవారు  అన్నారు . ” ఒకసారెప్పుడో మందపాటోరి ఇంటినుంచీ వచ్చాయి …..నిరుడు పెనుమత్సోరి చిన్నకోడలు వాళ్ళ పుట్టింట్లో  వండి తెచ్చి అందరికీ పంపింది . అలా తినడమే తప్ప మనింట్లో ఎప్పుడూ వండలేదుమరి. అయినా …..ఆనవాయితీ లేని పని అగచాట్ల పాలుచేస్తుందనీ ఎందుకొచ్చిన సంత ఊరుకుంటేపోయేదానికి అని నాలుక చప్పరించేసారు .

అప్పటికే తాటిబురెల మీద మనసుపడిపోయిన నాకు  అత్తగారి మాటలు ఏమాత్రం రుచించలేదు . పైగా అప్పుడెప్పుడో ఆవిడ అత్తగారు చెప్పిన మాట ఈనాటికీ పాటించడం అనేది అసలు  బుర్రకెక్కలేదు . ” ఊరుకుందురూ …మీరు మరీ చెపుతారు . ఒకరికి ఆచారం ఇంకొకరికి అనాచారం ఎలా అవుతుంది . అయినా ‘ పప్పులో ఉప్పెయ్యడానికీ, నిప్పుమీద నీళ్ళొయ్యడానికీ’  కూడా ఆనవాయితీలు చూసుకుంటామా . అలాంటివన్నీ నేను నమ్మనుబాబూ ” అనేసాను తేలిగ్గా  . “అంతేనంటావా !?”   అన్నట్టూ అనుమానంగా చూసేరు  అత్తగారు. అంతేకదామరి ! ఒకరికి మంచి ఇంకొకరికి చెడెందుకవుతుంది . చెట్టునించీ రాలిన పండు ఏ దేశంలో అయినా కిందికే పడుతుంది . ఎండలో నుంచుంటే ఎవరి నెత్తయినా మాడుతుంది . కాలమేదయినా  మబ్బుంలోంచే కదా  వాన పడుతుంది . అంటూ సినిమాల్లో లాయర్ లా  అటూ ఇటూ తిరుగుతూ అడ్డదిడ్డంగా వాదించేసాను  . దాంతో  కన్ ఫ్యూస్ అయిపోయిన అత్తగారు    “అంతేనంటావా ” అంటూ గుడ్లు తేలేసారు  .

అనుమానంలేకుండా అంతేమరి . ఈ ఆచారాలనేవి ఏనాడో ఏర్పడ్డాయి …ఇలా  నచ్చలేదనీ , అచ్చిరాలేదనీ ఎవరికి వారు మధ్యలో  వదిలెయ్యడం ఏం బావుంటుందీ అంటూ ,ఆచారాలు – సాంప్రదాయాలు , బూరెలు- గారెలు, పరమాన్నాలూ- పట్టుకొమ్మలు  అంటూ అప్పటికప్పుడు ఒక ఉపన్యాసం  అల్లి  అత్తగారి మీదికి  విసిరాను

ఎంతోకాలంగా వస్తున్న ఈ  ఆచారాలను   మనం ముందు తరాలకు  ముక్కుపిండయినా సరే నేర్పించి తీరాలన్నాను  . భూమ్మీద తాటి చెట్టనేది ఉన్నంతవరకూ ఆషాఢంలో  తాటిబూరెలు- అప్పాలు ఒండుకు తినడం అనే ఈ ఆనవాయితీని మనం  పాటించి తీరవలసిందే అన్నాను.  అసలా మాటకొస్తే ప్రతీ ఇంటిలోనూ కొబ్బరి మొక్కలు, అరటి పిలకలు నాటినట్టే ఒకటో రెండో  తాడి చెట్లు కూడా పెంచి వాటిని వారసత్వ ఆస్తిగా పిల్లలకు  రాసిచ్చే ఒక కొత్త ఆచారానికి మనమే నాంది పలకితే ఎలా వుంటుందో ఆలోచించండన్నాను .

అసలు సంగతి గ్రహింపుకి రాని అత్తగారు నా ఆరాటానికి  మురిసిపోయి , ఆచారాల మీద నాకు గల మక్కువకు మిక్కిలి సంతసించి  ” సర్లే  నువ్వంత సరదా పడుతుంటే నేనెందుకు కాదనాలీ  .అయినా …..అప్పాలొండటం అదెంతపనీ ” అంటూ చెంగున లేచి కూర్చున్నారు . లేడికి లేచిందే పరుగన్నట్టూ ఉన్నపళంగా బియ్యం నీళ్ళలో పోసేసి , అవతల దొడ్లో ట్రాక్టరుకి దమ్ము చక్రాలు బిగిస్తున్న అబ్బులు ని ఒక్క కేకేసి , ” ఒరేయ్ ఆ పనులు తరవాత …ముందెళ్ళి కట్టవలోంచీ మాంచి తాటిపళ్ళు నాలుగు ఏరుకురా ఫో” అని ఆర్డరేసారు.

ఆకారానికే కాక బుద్ధికీ ‘బండోడు’ అయిన  అబ్బులుగాడు ఓ బండినిండా తాటిపళ్ళు తోలుకొచ్చి వాకిట్లో  ఒంపేసేడు  . పైగా” కొనాలా పెట్టాలా ఉత్తినే వొచ్చినియ్యేకదండీ …మిగిలితే  తంపటేసుకుందారి ” అని అలవాటుగా  అక్కరలేని సలహా ఒకటి ఫ్రీగా పడేసాడు. ముందు ‘ ఇన్నేం  చేసుకుంటావ్ ‘   అని చిరాకు పడ్డా “ ఒండిపెడితే తినేవాళ్ళకి కరువా . మనవాళ్ళందరికీ తలో నాలుగూ పెట్టుకోవచ్చు  ” అని మరిన్ని బియ్యం నీళ్ళలో పోసేసారు అత్తగారు .

ఆ సీనంతా నడుస్తున్నప్పుడే  మొదటి ప్రమాదపు హెచ్చరికగా నా ఎడం కన్ను అదరడం మొదలుపెట్టింది. కానీ బూరెలు తినాలన్న బులబాటంలో  నేను దాన్ని ఖాతరు చెయ్యలేదు . అటకమీదనించీ పెద్దం బెల్లం దిమ్మ తీయించి దాన్ని మెత్తగా తరిగేయాలన్నారు. నీళ్ళు వాడేసి బియ్యం పిండి చేసి  , జల్లించేస్తే సగం పనయిపోయినట్టే అన్నారు. ఆ తరవాత బాగా మాగిన తాటిపళ్ళు  మదాయించి మెత్తగా గొజ్జు తీసుకుంటే ముప్పావువంతు వంటకం     తయారయిపోయినట్టే , ఇంకేవుందీ ఆ పిండీ బెల్లం తాటిపేశం ( గుజ్జు) కలిపి మనకి కావల్సిన బూరెలు, అప్పాలు నూనెలో వేయించి తీసేయడమే అన్నారు.  రోట్లో తలపెడుతున్నాని తెలీని నాకు నోట్లో నీళ్ళూరిపోయాయి .

బూరెలొండే బృహత్తర కార్యక్రమం లో భాగంగా పెందలాడే భోజనం చేసేసి , ఆ కార్యక్రమానికి అవసరమయిన రోలూ రోకలి, జల్లెడా, మూకుడూ వంటి సరంజామా అంతా సిద్ధం చేసేసి కూర్చున్నారు అత్తగారు . సరిగ్గా అదేసమయంలో రెండో ప్రమాద హెచ్చరికగా  చెవుల్లో చిన్నగా సైరన్ మోగింది కానీ  నేను దాన్ని వినిపించుకోలేదు.

”  కరెంటు మిల్లులో వేసిన పిండి తింటే వేడి చేస్తుందట . అయినా అదేవంతపనీ . నాలుగు దెబ్బలు పడితే నలిగి కూచుంటుంది  ”  అంటూ రోకలి నా చేతికిచ్చేసరికి గానీ నాకు బల్బు వెలగలేదు . ఓర్నాయనోయ్ …పిండి పోటెయ్యడమా ఎప్పుడూ కోలాటం  ఆడిన చేతులు కూడా కావే ఇవి ….రోకలి ఎత్తెత్తి దంచాలా ” అని లోపల్లోపల కుమిలిపో తూ   ”  అమ్మో…!నాకు చాతకాదండీ ” అనేసరికి   , “నేర్చుకుంటే సరి  అదేవంత  బ్రహ్మవిద్య! ఊ… కానియ్”  అని,  నేను ‘ ఊహు’  అంటున్నా వినిపించుకోకుండా  అప్పటికే ” ఆహూo…” అంటూ దంచుడు మొదలెట్టేసారు అత్తగారు.

అత్తగారికి ఎదురాడ్డం నేర్చుకోని ఆ రోజుల్లో ఇక చేసేదేముంది . ‘ దంచూ దంచూ…బాగా దంచూ’  అని పాడుకోటం దంచుకోటం తప్ప.

అలవాటులేని ఆచమనం లాగా  సాగుతుంది పని . పడాల్సినచోట తప్ప అంతటా పడుతుంది రోకలి . అంత పొడవున్నరోకలిని   ముందుకీ వెనక్కీ పడిపోకుండా   బేలన్స్ చేయలేక నానా హైరాన పడ్డాను . ఒక చేత్తో గాల్లోకి లేపిన రోకలిని   ఇంకో చేతిలోకి మార్చుకుంటుంటే  చెయ్యి జారి అత్తగారి నెత్తిన పడతానని బెదిరించింది. ‘ హవ్వ పరువు తియ్యకే ‘ అని బ్రతిమాలి బామాలి ఎలాగో దార్లోకి  తెచ్చుకునేసరికి  తలప్రాణం తోక్కొచ్చింది.   కత్తికట్టిన కాలం గురించి తెలుసుకానీ,  రోకలెత్తిన కాలం కూడా ఒకటుంటుందని  అది నాకే ఎదురవుతుందనీ   కలలోనైనా కలగనలేదు.

అదేం చిత్రమో ఎంత దంచినా బియ్యం తరుగుతున్నట్టు అనిపించడంలేదు . విఠలాచార్య సినిమాలోలాగా ‘ డొయ్యి…..’ మని అడుగునించీ   ఊరిపోతున్నాయేమో అని   అనుమానం వచ్చింది. ” హే ప్రభూ ఏవిటి ఈ పరీక్ష !? కాలాన్ని బట్టి     ఇష్టాలు మారుతున్నట్టే కష్టాలూ  మారాలికదా . సతీ సక్కుబాయికీ నాకూ ఒకేటైపు కష్టాలు పెట్టి , చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూడాలని సరదాపడుతున్నావే నీకిది న్యాయమా !? నోటికి కాస్త రుచిగా తినాలని కోరుకోవడమే  పాపమా ? ఆ కోరికని దాచుకోకుండా అత్తగారిముందు ప్రకటించడమే  నేరమా ? ఎందుకు స్వామీ ఈ పిండి పరీక్ష ? అని  అలవాటుగా కలవరిస్తు  ఏ మూలనుంచయినా ఆ దేవదేవుడు డింగ్మంటూ ప్రత్యక్షమయి నా కష్టాన్ని తీర్చకపోతాడా అని దిక్కులు చూసాను.

మా అత్తగారు వాయ వాయకీ ” అబ్బో…భలే దంచేస్తున్నావే ” అంటూ నన్ను భుజం తట్టి ముందుకు తోస్తుంటే నేను నిజమే కాబోలని మురిసిపోయి మరిoత ఎగిరెగిరి దంచడం మొదలుపెట్టాను . అలా ఒక పూటంతా దంచగా దంచగా పని ఒక కొలిక్కివచ్చింది . కానీ అప్పటికి ఒంట్లో ఓపికే కాదు బూరెలు తినాలన్న కోరికా కొడిగట్టిపోయింది . ఆ మాటే అత్తగారితో చెప్పేసాను.

”   నాకు బూరెలు తినాలని లేదు  మొర్రో  ” అని  ఏడుపు మొహం పెట్టుకున్నాను. ” ఓసి పిచ్చిదానా …..అలా ఢీలా పడిపోతే పనులవుతాయా . సగం పని అయ్యేపోయింది . ఇంకెంత  తాటిపళ్ళు గుజ్జుచేసి కలిపేసి ఒండేసుకోవడమే ” అనేసారు ఎంతో తేలిగ్గా . దాంతో నేనూ పారిపోయిన ఉత్సహాన్ని తిరిగితెచ్చుకుని ‘ఓస్  అంతేనటే పిచ్చి మొహమా’  నాకు నేను నచ్చచెప్పుకుని…. నడుం  బిగించి కూర్చున్నాను.    తీరా కూర్చున్నాకా తెలిసింది  అదంత ఆషామాషీ వ్యవహారం కాదనీ. తాటి పళ్ళు గుజ్జుతీయటం అరటి పండు తొక్క తీయటం ఒకటికాదని  .  పండులో ఉండే చిక్కని పీచునుంచీ మెత్తని గొజ్జుని వేరు చేయటానికి  చాలా భుజబలం అవసరమని .

మా అత్తగారు చేతులకి మట్టి అంటకుండా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించే మంత్రిగారిలా  తాటిపండు నుంచి మెత్తని గొజ్జును సేకరించడం ఎలా ? అనేదాన్ని ఎంతో చాకచక్యంగా పైనుంచీ  చక్కని అభినయంతో ప్రదర్శించి చూపించి  , “అదిగో అవతల ఎవరో పిలుస్తున్నారు . నే చూసొస్తాను నువ్వు కానీయ్” అని   చక్కగా  చేతులు దులుపుకు చెక్కేసారు.

నేను మళ్ళీ ‘ అలో లక్ష్మణా ….!’అంటూ నా ప్రారబ్ధానికి మిక్కిలి వగచుచూ పనిలో పడ్డాను . చేతులు విరిగేలా, భుజాలు వాచేలా నాకు చాతనయినంతగా కష్టపడుతూ ‘ ఆచారాలు-  అగచాట్లు  ‘ అనే విషయం మీద మనసులోనే ఒక దీర్ఘ కవిత   రాసేసుకున్నాను ( కంగారుపడకండి ఇప్పుడది వినిపించను ) .

‘ఇదిగో వస్తా ‘ అన్నావిడ ఎంతకీ రారేవిటీ ? పనంతా నా నెత్తిన పడేసి ఎక్కడికి మాయమయిపోయారు ! ఇదేం పద్ధతి ?.అని నేను అలోచిస్తుంటే , ఆకుపచ్చ అంచున్న ఎర్ర చీరలో ఆకుల మధ్య మందారంలా మెరిసిపోతూ ప్రత్యక్షమయ్యారు అత్తగారు . మొహానికి పౌడరు రాసుకుని తల నున్నగా దువ్వుకున్నట్టున్నారు . మెడలో మేచింగు   పగడాల దండ ధరించారు. బూరెలొండటానికి ఇంత ముస్తాబెందుకబ్బా అని ఆశ్చర్యపోతూనే  ‘ ఒకవేళ ఇదీ ఆచారం కాబోలు  బాగానేవుంది !’ అనుకున్నాను .

‘చీర కుచ్చెళ్ళు సర్దుకుంటూ  పని ఏ మాత్రం అయిందీ అని ఆరాగా అడిగి ” అబ్బో…భలే తీసేశావే !” అంటూ  అలవాటయిన  లౌక్యాన్ని తిరిగి ప్రదర్శించారు అత్తగారు  . ఈసారి నేను ఆనందపడలేదు సరికదా ” ఆహా ఏమి  రచనా చమత్కృతి ” అని హాశ్చర్యపడ్డాను.  అత్తగారు కాస్త దూరంగా  ఎత్తుపీటమీద కూర్చుని , నే తీసిన తాటిపండు గొజ్జుకు సరిపడా పిండీ బెల్లం నాతోనే కలిపించి, ” ఇంకేవుందీ అయ్యేపోయింది” అన్న దంపుడు డైలాగుని మళ్ళీ కొట్టి , పొయ్యిమీద నూనె మూకుడు పెట్టించారు .

ఇందాకటి అభినయం తిరిగి కొనసాగిస్తూ ” నూనెలో పిండిని గుండ్రంగా వదిలితే బూరెలు,  పలచగా వేస్తే అప్పాలు అయిపోతాయి  అంతే ” అన్నారు .  మొదటివాయ వేయించి తీసాకా   వినాయకుడికీ, గ్రామదేవతకీ, ఇష్ట దైవాలకీ అంటూ పొయ్యి చుట్టూ నైవేద్యాలు పెట్టించారు ….”  రెండో వాయ , మూడో వాయ కూడా దగ్గిరుండి నాతో వేయించి ” వంద వాయలయినా ఇదే పద్ధతి . ఇలా వేసి అలా తియ్యడమే “  . నువ్వు కానీయ్ …నేనలా శాంత అత్తయ్యగారి ఇంటివరకూ వెళ్ళొస్తాను .  వాళ్ళింట్లో మూణ్ణాళ్ళ క్రితం కోడి పట్టు పెట్టిందట . ఆ మాయదారి పెట్ట ఒక్క గంటన్నా పట్టుమీదలేకుండా షికార్లు పోతుందట. అలా అయితే పిల్లలెలాదిగుతాయ్ . అదేవిటో  వాళ్ళకి కోడి పట్టు అచ్చిరాదు .ఎప్పుడూ  ముచ్చటగా మూడు పిల్లలయినా దిగవు .  పాపం ఏం చేయాలో తోచక నాకు కబురంపింది . అన్నారు . వెళ్ళటానికి తొందరపడుతూ .

“మనకు బాగా అచ్చొచ్చిందని మీరు కానీ పొదుగుతూ కూర్చుంటారా పట్టుమీద “ అనబోయి మర్యాదకాదని మాటలు మింగేసి ఒట్టి క్వశ్చన్ మార్కు మాత్రం మొఖానికి తగిలించి చూసాను . ఆన్సరుగా అత్తగారు  పెంకి పెట్టలని దార్లోకి తెచ్చే మంత్రం ఒకటి ఉందనీ ,  అది కోడి చెవిలో మూడుసార్లు చెప్పి ,  దాన్ని బుట్టచుట్టూ తిప్పి పట్టుమీద వదిలేస్తే నిక్షేపంలా పడుంటుందనీ మేతకి కూడా లేవదనీ  ఉత్సాహంగా  చెపుతుంటే నేను ఆశ్చర్యంలో పడిపోయాను .

నే తేరుకునేలోగా   శాంత అత్తయ్యగారి పనమ్మాయ్ సూర్యావతి వెనకే పెళ్ళినడక నడుచుకుంటూ దొడ్డి గుమ్మం దాటేయబోయిన అత్తగారు  అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టూ  స్పీడుగా వెనక్కి నడిచొచ్చి ” నేనలా వెళ్ళగానే నోట్లో వేసుకుంటావేమో….  వేడిగాతింటే వెర్రెక్కుతుందoటారు జాగ్రత్తేవ్ ….. అసలే ఆనవాయి లేని పనొకటి  “ అనేసి మళ్ళీ ఓసారి  కుచ్చిళ్ళు సర్దుకుని ,పెళ్ళినడక నడుచుకుంటూ వెళ్ళిపోయారు  . నా గుండెల్లో  రాయి పడింది .

ఎప్పుడో కానీ గుమ్మం దాటే అవకాశం రాని అత్తగారు ఇలావెళ్ళి అలా రావటం అన్నాది ఒట్టిమాటే . ఆ వరసలో ఉన్న పది గుమ్మాలయినా ఎక్కి దిగకుండా వెనక్కి మళ్ళరు .  జరుగుతున్నదంతా పెద్ద కుట్రలా అనిపించింది . తన హెచ్చరికలని ఖాతరు చేయని నన్ను నీ చావు నువ్వు చావని వదిలేసి పోయింది నా సిక్త్ సెన్స్ .

నాకు మమ్మీ…..అని గట్టిగా ఏడవాలనిపించింది . కానీ నా ఏడుపు వినిపించేంత దూరంలో మమ్మీ లేదని గుర్తొచ్చింది . నాకు అత్తగారిని నిందించాలో …నా ప్రారబ్ధానికి  చింతించాలో అర్ధం కాలేదు. ఇక చేసేదేవీలేక ”  అయితే అరిసెలపాకం- కాకపోతే కాణిపాకం “ అని ఒక కొత్తసామెత చెప్పుకుని ”   నాముందున్న పెద్ద బేసినుడు పిండినీ  బూరెలు , అప్పాలేకాక  చేగోడీలు, చక్కిడాలు వంటి ఆకారాల్లో మలుస్తూ కొత్త పిండి వంటలకు ప్రాణం పోసే ప్రయత్నం చేసాను .

ఊరినించీ దిగిన రాజుగారు పొయ్యిదగ్గిర మసిపట్టిన  నా ఏబ్రాసి మొహాన్ని  చూసి గతుక్కుమని  నాలుగడుగులు వెనక్కీ  ఒక్కడుగు ముందుకీ వేసి  ”  చందమామ కథల్లో రాక్షసి  బొమ్మలా అలా అయిపోయావు ఏవిటోయ్. ఏ మాంత్రికుడు నిన్ను ఇలా మార్చేసాడు  . చెప్పు  వాడ్ని  తక్షణమే బంధించేస్తాను ”  అన్నారు  మీసాలు  మెలేసి వెటకారంగా నవ్వుతూ .

పూర్వ వృత్తాంతమతా తెలిపి బావురుమన్నాను   . చలించిపోయిన రాజుగారు  ” అకటా!!” అని అదేపనిగా బాధపడి “ఏవయినా సాయం చేద్దామంటే ఇది వంటింటి  వ్యవహారం అయిపోయింది . మగాళ్ళు పొయ్యికి పదడగుల దూరంలో ఉండటం మా ఇంటాచారం .  నేను కొంచెం మాడ్రన్ భావాలు కలవాడిని కాబట్టి ఇలా మూడడుగుల దూరం వరకూ వచ్చేసాను .  అని చుట్టూ పరికించి  , ఎవరూ తనని చూడ్డంలేదని నిర్ధారించుకుని  ,  ఒకడుగు ముందుకేసి  “ఓ నా ముద్దమందారం కావాలంటే   నీకు కష్టం తెలీకుండా  ఉండటానికో కథ చెపుతాను  . అది  వింటే నువ్వు వద్దన్నా నవ్వేస్తావు తెలుసా అన్నారు  ” భుజాలు కుదుపుకుంటూ కితకితల నవ్వొకటి  ఒంపేసి .

‘ ఆకలేస్తే రోకలిమింగు అరగకపోతే తిరగలి మింగు’  అన్నాట్ట వెనకటికొకడు .  ఈ కష్టమేమిటిరా పరమాత్మా అని నేనేడుస్తుంటే … కథలూ కాకరకాయలూ అంటారేం   ! నా వల్ల కాదు పొమ్మన్నాను  .  అయినాసరే అదేం  పట్టనట్టూ  ” దేవీ కష్టములెట్లున్నానూ …. నా కథ విని తీరవలె ” అంటూ అంగడి పాలైన హరిశ్చంద్రుడి పోజులో  చెప్పుకుపోయారు . ఆ కథేవిటంటే ……

అనగనగా ఆయన చిన్నప్ప్పుడు   ‘నచ్చిన పండుగ ‘   వ్యాసం రాసుకురండి అని తెలుగు మాస్టారు చెపితే ,     నాకు నచ్చిన పండుగ మా తాతయ్య తద్దినం అని రాసుకెళ్ళారట . ఆ ఒక్క లైనూ చదివి తరువాతి విషయం చూడకుండానే తెలుగు మాస్టారు ” బుద్ధిలేదటరా ” అని బడిత పూజ చేసేసి అంతటితో వదలక ఆ వ్యాసం ఇంటికి పంపించారు. ఇంట్లో ఉన్న పెద్దలందరూ తలో రెండూ వాయించి , ఆ వ్యాసాన్ని వీధిలోకి వదిలారట. ఇక అంతే ఆ వీధిలో వుండే  ఇరవై ఆరు కొంపల వాళ్ళూ తలో మొట్టికాయ వేస్తే అంత సాహసం చేయలేని ఇతరులు కనపడచోటల్లా కాలర్ పుచ్చుకుని ” తప్పుకదండీ బాబుగారు” అని అక్షింతలు వేసేసారట. పాయసం, గారెలూ వండుకుతింటాం  కాబట్టి  అదీ ఒక పండగే అనుకున్నానని చెప్పినా ఒక్కరూ  నమ్మలేదట.  దాంతో ఆయనకి బాగా కోపం వచ్చేసి , తనని ఇంత అవమానపరిచిన పాయసం -గారెలూ జన్మలో తినకూడదని నిర్ణయించేసుకుని , ఒక కాగితం మీద గారెలు, పాయసం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి , కాశీ వెళుతున్న చిన్న తాతయ్య కి ఇచ్చి వీటిని తనపేరు చెప్పి కాశీలో వదిలేసి రమ్మన్నారట ( వాళ్ళ నానమ్మ గుమ్మడికాయ తినమoటే కాశీలో వదిలేసాను  ఇక తినను అని చెప్పటం  విన్నారట )  .  అది చూసినవాళ్ళంతా ” తెలివి తెల్లారినట్టేవుంది ” అంటూ మళ్ళీ ఒకరౌండువేసి, బలవంతంగా పాయసం గారెలూ నోట్లో కుక్కి వ్రతభంగం కావించారట  .  అక్కడితో వదిలిపెట్టకుండా ఏటా వినాయక చవితికి క్రమం తప్పక కథ చదువుకుని అక్షింతలు జల్లుకున్నట్టూ , ప్రతీ తాతయ్య తద్దినం లోనూ  ఈ అజ్ఞానపు కథని  చెప్పుకుని అబ్బాయి నెత్తిన అక్షింతలు వేయటం ఆచారంగా వస్తుందట .

కథంతా అయ్యాకా “నవ్వవోయ్ “ అంటూ దోసిలి పట్టుకు కూర్చున్నారు  .  అడిగిన వెంటనే నవ్వేస్తే లోకువైపోతావని  “ఇప్పుడు వీలుపడదు  తరవాతెపుడయినా సావకాశంగా వున్నప్పుడు నవ్వుతా “పొమ్మన్నాను .

   ***

” ఇందుకే ఆనవాయితీ లేని పనులు చేయకూడదు అనేది “.

” మా కాలంలో వద్దంటే ఊరుకునేవాళ్ళం.  ఇలాంటి వితండ వాదనలు మేం ఎరగవమ్మా ”

ముందు రోజు పడ్డ శ్రమ ఫలితంగా జొరం తెచ్చుకుని  మూలుగుతూ పడున్న నన్ను చూసిపోటానికొచ్చిన  మా పిన్నత్తగార్లూ , పెద్దత్తగార్లూ, వాళ్ళ కోడళ్ళూ , ఇంకా వరసకి  పిన్నమ్మలూ, కన్నమ్మలూ అంతా చాప చుట్టూ కూర్చుని మధ్యలో పళ్ళెం నిండా ఉన్న బూర్లెలు అప్పాలు తింటూ పై విధంగా చింతిస్తున్నారు .

” ఏవిటో…  అచ్చిరాదని వదిలేశాం వద్దంటే విన్నదికాదు” .  అంటున్నారు అత్తగారు తింటున్నవాళ్ళకి మంచినీళ్ళు అందిస్తూ .

” అనుభవం అయింది కదా ఈసారి వింటుందిలే…..ఇకనైనా ఇలాంటి ఆనవాయితీ లేని పనులు చేయ్యకండి” అని అక్కడ ఉన్న కోడళ్ళందరికీ ఏకమొత్తమ్మీద వార్నింగ్ ఇచ్చేసిన మా పెద్దత్తగారు ” నువ్వేవన్నా వంటకంలో  చేయిపెట్టావా ?” అనడిగారు మా అత్తగారిని .

“అయ్యో…. లేదు అప్పయ్యా నేనసలు వేలుకూడా పెట్టందే … పెద్దావిడ మాటే పదే పదే గుర్తొస్తుంటే ఎందుకన్నా మంచిదని  దూరంగానే వున్నా .  తాటిపండుని చేత్తో తాకనన్నా తాకలేదు”  అన్నారు .

” అలా అయితే నువ్వు ఈ బూరెలు నిక్షేపంగా తినొచ్చు . వండినవాళ్ళు తినడమే మనకి ఆనవాయిలేదు ”  అంటూ అత్తగారికి బూరెల పళ్ళెం  అందించి నాకేసి  అదోలా  చూసేరు మా పెద్దత్తగారు  .  ఆ చూపులో అయ్యిందా నీపని అన్న అర్ధం ద్వనించింది .

మా అత్తగారు నాకేసి జాలిగా చూసి , తోటికోడలి కోసం తప్పక తింటున్నట్టూ  ” ఆ…ఏదో ఆచారం అన్నారని తినడం తప్పిస్తే …….పూర్ణం బూరెల రుచి వీటికెక్కడొస్తుందీ ”  అంటూ బురె తీసి బుగ్గన పెట్టుకున్నారు .

నేను నీరసంగా నిట్టూర్చి ” దాల్ మే కాలా హై , కుచు కుచ్ హోతాహై ” అని  హిందీలో చింతించడం మొదలు పెట్టాను అక్కడున్నవాళ్ళకెవరికీ అర్ధం కాకుండా .

అత్తగారికి తెలిసింది కోడి మంత్రం ఒకటేనా …..అన్న అనుమానం మీక్కూడా వచ్చిందా ! తప్పు లెంపలేసుకోండి . ఇప్పుడు చెప్పండి ’ తంతే బూరెల బుట్టలో పడ్డట్టా …. పడనట్టా  !?’

–దాట్ల లలిత

 

కళింగాంధ్ర వారసుడు

daalappa1

రెండు జీవిత దృశ్యాల మధ్య పోలిక చూడటం కవిత్వమైతే, వైరుధ్యాన్ని చూడటం కథగా రూపొందుతుంది. కొన్నిసార్లు దు:ఖమయంగానూ, కొన్నిసార్లు హాస్యాస్పదంగానూ ఉండే ఈ వైరుధ్యాల్ని చూసి మౌనంగా ఉండటం కష్టం. అనాదికాలం నుంచీ కథనకుతూహలానికి  ప్రేరణ మొదలయ్యేదిక్కణ్ణుంచే..

ఈ జీవిత వైరుధ్యాలు బహుశా కళిగాంధ్రలో మరీ స్పష్టంగా కనబడతాయేమో. లేదా కళింగాంధ్ర దృక్పథంలోనే ఈ వైరుధ్యాల్ని పసిగట్టే స్వభావం అంతర్లీనంగా ఉందో తెలియదు గానీ, అక్కడ పుట్టిన కథలు కంచికి వెళ్లవు. అవి అక్కడే తచ్చాడుతూ ఉంటాయి. కన్యాశుల్కం చూడండి . సమాజాన్ని కాపాడవలసిన పోలీసు కానిస్టేబుల్ లోకంపోకడ అర్థం కాక తెల్లమొహం వేస్తాడు. లోకం దృష్టిలో ఏగాణీ విలువ చెయ్యని అసిరిగాడు అగ్రవర్ణ సమాజపు టక్కుటమారాలన్నీ అపోశన పట్టినట్టు కనిపిస్తాడు. కనకనే లోకంలో అన్ని చోట్లా కథలు పుడుతూనే వుంటాయి గానీ, ఒక చాసో, ఒక రావిశాస్త్రి, ఒక పతంజలి కళింగాంధ్రలో మాత్రమే పుడతారు. ఇదిగో ఇప్పుడీ కథలది కూడా అదే దారి. చింతకింది  శ్రీనివాసరావు చెబుతున్న ఈ కథలు చోడవరానికి నెల్లిమర్లకీ మధ్యలో కళింగాంధ్ర నడ బొడ్డులో జనం చెప్పుకుంటూ వస్తున్న కథలు. ఈ కథలకి కులం, మతం, వర్గం, వర్ణం లేవు. ఇందులో వాస్తు సిద్ధాంతి పిడపర్తి విశ్వేశ్వర సోమయాజులు మొదలుకొని పాయఖానాలు శుభ్రం చేసే పెంటపాలెం దాలప్ప దాకా అందరూ ఉన్నారు. ఈ కథల్లో కనిపించే జీవితం ఎవరో ఒక సోషియాలజీకి తలుపులు తెరుస్తుంది. మేమంతా గురూజీ అని పిల్చుకునే రవీంద్ర కుమారశర్మ, అదిలాబాద్‌లో చేతివృత్తుల వాళ్ల కోసం అహర్నిశలూ తపించే కళాకారుడు, సంస్కర్త. ఒకసారి నాతో ఒక మాట అన్నారు. ‘మన సమాజంలో రెండు రకాల వ్యవస్థలున్నాయి. ఒకటి కలెక్టర్ల వ్యవస్థ. మరొకటి ప్రజలు తమకోసం తాము స్వయంగా ఖాయం చేసుకుని నడిపే వ్యవస్థ. మొదటిది చూడండి . దానికో బడ్జెట్‌ ఉంటుంది. మందీమార్బలం ఉంటారు. అయినా అది ఏ ఒక్క పని కూడా సక్రమంగా చెయ్యలేదు. ఆ వ్యవస్థకెప్పుడూ మీటింగులతోనే సరిపోతుంది. కాని ప్రజలు నడుపుకునే వ్యవస్థ చూడండి . పండుగల్లో, పురస్కారాల్లో కొన్ని లక్షల మంది జమవుతారు. కొన్ని కోట్ల లావాదేవీలు జరుగుతాయి. కాని ప్రజలు ఏ మీటింగులు పెట్టుకుంటారు? ఏం రూల్స్‌ రాసుకుంటారు? అయినా ఆ సంతలూ, జాతరలూ ఎంత బాగా జరుగుతాయో చూడండి అని ఆయనే ఇంకో మాట కూడా అన్నారు. అలాంటి జాతరల్లో కూడా ఒకటీ రెండు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎందుకో తెలుసా? ప్రజల వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకోకుండా కలెక్టర్ల వ్యవస్థ అడ్డుపడటం వల్ల!

dalapppa

ఈ కథల్లో కనిపించే జీవిత దృశ్యాలు మనకు చెప్తున్నదిదే. బస్టాండులో సీట్లు రిజర్వు చేసే  తాతయ్యలు, ఊళ్లో పసిపిల్లలకు పాలుకుడిపే పాలమ్మలూ చూపించిన మానత్వం పాఠశాలల్లో చదివింది కాదు. చట్టసభల్లో చేర్చించి ఆమోదించిందీ కాదు. కాని జీవితానికి పనికివచ్చే చదువుకి, అనుశాసనానికీ వాళ్లదే ఒరవడి  అవుతుంది. జీవిత వైరుధ్యాల్ని పట్టుకోవడం తోటే ఒక మనిషి కథకుడుగా మారినా, అతడి ప్రయాణం అక్కడతో ఆగిపోదు. వైరుధ్యాల్ని దాటిన ఒక సుందర దృశ్యాన్ని మనతో పంచుకోవాలన్న కవి కూడా ప్రతి కథకుడిలోనూ దాగి ఉండదు. దీనికి కూడా గురజాడదే అడుగుజాడ. చాసో ‘మాత ధర్మం’ కథ చూడండి. అది ఒక అపురూప కావ్య గీతిక. రావిశాస్త్రి కథలన్నిటా ఒక ఆకుపచ్చని పార్శ్వం కనిపిస్తూనే ఉంటుంది. కార్నర్‌ సీటు, మామిడి  చెట్టు. ఎన్ని కథలయినా గుర్తు చేసుకోవచ్చు. చింతకింది శ్రీనివాసరావు కథల్లో కూడా ఆ అమాయకమైన కవిత స్వప్నం కనిపిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.

 

వాడ్రేవు చినవీరభద్రుడు

ఆలోచన లోపించిన ప్రతిమ కథ “కంకాళం”

2004 డిసెంబర్ “అరుణతార”లో వి.ప్రతిమ “కంకాళం” అనే కథ రాశారు. ఇది వుత్తమకథగా కూడా ఎన్నికైంది.

మహిళలు రాస్తున్న కథలు అత్తగారి పెత్తనాల్తో, నడుము చూసి సొల్లు కార్చే మగాళ్లతో, పురుషాధిక్యత లాంటి బరువైన పదాల్తో నిండిపోతున్న సందర్భంలో, ఒక మహిళ ఆర్ధిక, రాజకీయ విషయాలపై కథ రాయడం అభినందనీయం. పంచరంగుల ముద్రణామోహానికీ, లక్షల పాఠకులనే గ్లామర్‌కి లోనవ్వకుండా ‘అరుణతార’ లాంటి పత్రికని ఎన్నుకోవడం మరింత మంచి విషయం.

కథ “పో” చెప్పినట్టు అనుభూతి, ఐక్యత పద్ధతిలోనే సాగుతుంది. ఇక్కడ అనుభూతి రాఘవయ్య మరణం పట్ల సానుభూతి. రాఘవయ్య మరణాన్ని నాటకీయం చెయ్యలేదు. కథ కలిగించే అనుభూతిని “మామ్” చెప్పిన నాటకీయ అనుభూతి అనలేం. కథ మొత్తం చెప్పి మీ సమయం వృధా చెయ్యకుండా అవసరం అయిన మేరకే చూద్దాం.

కథలో సంఘటన రాఘవయ్య మరణం. రాఘవయ్య రైతు. పదెకరాల రైతు. మరణానికి కారణం ఏమిటన్న ఆలోచన చేస్తే చెరుకు ఫాక్టరీ మూతపడిపోవడం. రాఘవయ్య డబ్బులు రాకపోవడం.. దానికి కథలో చాలా కారణాలు చెప్తారు.

చంద్రశేఖర్ అనే పాత్ర ఫ్యాక్టరీలో ఒక కెమిస్టు, మాటల్లోంచి చూస్తే పాఠకులకి నిజము అనిపిస్తుంది. బ్రెజిల్ అనే దేశంలో పెట్రోల్‌లో పావలా వాటా “ఇథనాల్” కలుపుతారనీ, ఆ ఇథనాల్ చెరుకునుంచి తీస్తారనీ, అందువల్ల చెరుకు రైతులూ, ఫ్యాక్టరీలూ, పర్యావరణం, దేశమూ అన్నీ బావున్నాయనే అనిపిస్తుంది. అదొక ఆదర్శంగా, ఆచరణీయంగా అనిపిస్తుంది. మన దేశం అలా చెయ్యకుండా మేధావుల్ని బయటిదేశాలకి తోలేస్తోందనీ, చంద్రశేఖర్ ఇచ్చిన ఎన్నో విలువైన సూచనల్ని బుట్టదాఖలు చేశారని చదివి ధర్మాగ్రహము వస్తుంది. మనం కూడా బ్రెజిల్ లాగా రైతుల, రాఘవయ్యల మరణాల్ని ఆపుకోవాలనీ, ఫ్యాక్టరీల్నీ, దానిలోని వుద్యోగుల్నీ కాపాడుకోవాలన్న ఆవేశమూ కలుగుతుంది. కథ ముగుస్తుంది. అక్కడ ఆగి మనం కొంచెం ఆలోచిస్తే..

బ్రెజిల్‌లో భూమి చాలా సారవంతమైనది. అపారమైన నీటి వనరులూ, అమెజాన్ అడవులతో వుండేది. కేవలం చెరుకు కాదు. కాఫీకి ఎప్పటినుందో ప్రసిద్ధం. సోయా, పాలు, మాంసం ఇలా వ్యవసాయాధారిత పరిశ్రమలే ఆ దేశం వెన్నెముక. అయితే ఆ సౌభాగ్యం ప్రజలకి లేదు. అక్కడ భూమి రైతుల చెతుల్లో లేదు. ఎస్టేట్లుగా వున్నది. పెద్ద పెద్ద కంపెనీల చేతుల్లో వున్నది. బిగ్‌లాండ్ బ్రెజిల్ లాంటి ఎన్నో కంపెనీలు అక్కడి భూమిని ఆక్రమించి వున్నాయి. పల్లెల్లోని భూముల్లో 47 శాతం భూములు ఒకే ఒక్క శాతం హౌస్ హోల్డ్స్(House Holds) చేతుల్లో వున్నాయి. సుమారు కోటీ, ఇరవై లక్షల ఇళ్లకి సెంటు భూమి లేదు. ఎనభై శాతం చిన్న రైతుల చేతుల్లో కేవలం 18శాతం భూమి వున్నది. పెద్ద పెద్ద ఎస్టేట్లలో 166 మిలియన్ హెక్టార్ల భూమి వాడకంలో లేకుందా వున్నది. చెరుకు పండించదగ్గ భూమి 320 మిలియన్ హెక్టార్లుంటే అందులో కేవలం 5శాతం మాత్రమే వుపయోగించబడున్నదని నిపుణులు అంచణా వేస్తున్నారు. కారణం   చట్టాలు. ప్రజల వద్ద పెట్టుబడి లేకపోవడం.

ఈ కారణాల వల్ల అసమానతలు తీవ్రంగా పెరిగాయి. ప్రజల్లోని అసమానతల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో వున్న దేశం బ్రెజిల్. దేశంలోని ధనికులు, జనాభాలో కేవలం పది  శాతం మంది. దేశ సంవత్సరాదాయంలో 48 శాతం తీసుకొంటున్నారు. అట్టడుగువాళ్లు జనాభాలో 20 శాతం మందికి దేశ సంవత్సరాదాయంలో రెండు శాతం మాత్రమే దక్కుతోంది. రెండున్నర కోట్లమంది దారిద్ర్యపు రేఖకంటే ఎంతో అట్టడుగున బతుకుతూ వుంటే ఐదుకోట్లమంది ఒక్క పూటే తిని బతుకుతున్నారు. చెరుకుతోటల్లో కూలీలు కేవలం రెండు డాలర్ల రోజు కూలీ కోసం 15-16 గంటలు పని చేస్తున్నారు. ఇంత సారవంతమైన భూమిలోణూ పండించేది కేవలం వ్యాపార పంటలే. 1990లో బ్రెజిల్ 1 బిలియన్ డాలర్ల విలువైన ఆహార ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటే 2002 నాటికి అది 10 బిలియన్ల డాలర్లకు ఎగబాకింది. ప్రపంచంలోనే పంచదార వుత్పత్తిలో మొదటి స్థానంలో వున్న బ్రెజిల్‌లో పంచదార వుత్పత్తి చేసేది సహకార మిల్లులూ కాదు. రైతుసంఘాలూ కాదు. కోసాన్(Cosan loD) అనే కంపెనీ “VHP రకం పంచదారని కనిపెట్టింది. ఆ కంపెనీ 12 మిల్లుల్తో, 30 రిఫైనరీల్తో అతి పెద్ద కంపెనీ.  ఇంకా సావో మార్టినో, ఆక్వార్ గునానీలాంటి ఎన్నో కంపెనీలున్నాయి. ఈ ఫాక్టరీల్లో కూలీలకిచ్చే జీతాలు ఒక్క పూట తిండికి చాలవు.

ఇథనాల్ వుత్పత్తిలో అమెరికా తర్వాతి స్థానంలో వున్న బ్రెజిల్‌లో కొయిమెక్స్ అనేది అతి పెద్ద కంపెనీ. ఈ కంపెనీల టర్నోవర్లూ, లాభాలూ చూస్తే మనకి కళ్లు తిరుగుతాయి. ఈ కంపెనీల పుట్టుకా, పెరుగుదలా క్రమంలో వేలాది రాఘవయ్యలు పోయేరు. కోట్లాది మంది రోడ్డున పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల్ని బానిసలుగా మార్చి వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఈ బానిసత్వాన్ని కనిపెట్టి వదిలించడానికి ఒక రకం పోలీసుశాఖ అక్కడ పని చేస్తోంది. ఎన్నో స్వచ్చంద సంస్థలు పని చేస్తున్నాయి. ఆందోళనలు రేగుతూనే వున్నాయి.

బ్రెజిల్  ఒక నూతన సామ్రాజ్యవాద దేశంగా మారిపోయిందనీ, చైనా, ఇండియాల సరసన చేరిందనీ ఎన్వర్  హోక్సా లాంటి వాళ్ల సాక్ష్యాధారాలతో నిరూపిస్తూ పుస్తకాలు రాశారు. బ్రిక్(BRIC) సంఘణ కాకతాళీయం కాదు. బొలీవియా, మొజాంబిక్, ఇథోపియా దురాశగా నాశనం చేస్తున్నారని శాస్త్రజ్ఞులూ, ఆలోచనాపరులూ గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడి అంటేనే విధ్వంసం, విద్రోహం. ప్రకృతినీ, మానవ శ్రమనీ నిర్లజ్జగా, క్రూరంగా, దురాశగా దోచుకోకుండా పెట్టుబడి ఎలా పెరుగుతుంది? ఇక్కడ ఆగుదాం.

కథలో రెండో కారణం పంచదారని మనం దిగుమతి చేసుకోవడం. పంచదారని మనం OGL కింద దిగుమతి చేసుకుంటున్నాం. వ్యవసాయం మీద ఆధారపడ్డ వుత్పత్తులు ఒక పరస్పరాంగీకారం లేకపోతే, ఇక్కడ మనకి పంట పోయి అవసరం అయినపుడు అడ్డగోలు ధర పెట్టవలసి రావచ్చు. ప్రపంచంలోనే పంచదార వినియోగంలో మనది మొదటి స్థానం. 1995 – 96 నుంచి 2010 – 11 వరకు పదిహేనేళ్ళ కాలంలో 2004 – 05లో (800MT) 2009 – 10 లో (2500MT) రెండేళ్ళు మాత్రమే మనం దిగుమతి చేసుకున్నాం. ఈ కాలంలో మన  దిగుమతులకంటే ఎగుమతులు చాలా చాలా ఎక్కువ. సరే అంకెలు వదిలేస్తే ఈ డిమాండు ఎవరిది? ఎవరికోసం?ఈ కోరిక, పంచదార దిగుమతి చేసుకోకూడదన్నది.  పంచదార మిల్లుల యజమాన్లది. NFCSF అధ్యక్షుడు కల్లప్ప అవడే పంచదారపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 30 శాతం వరకూ పెంచాలంటున్నాడు. దాని కార్యదర్శి వినయ్ కుమార్ మనం పంచదార  దిగుమతి ఆపాలన్నాడు.

ISMAకి చెందిన అవినాష్ వర్మ పంచదార కంట్రోల్ అంటే లెవీ ఎత్తేయమన్నాడు. పంచదార పరిశ్రమ మనదేశ రాజకీయాల్ని శాసించగలంత శక్తిమంతం. శరద్ పవార్ చిన్నకొండ గుర్తే. మొత్తానికి వీళ్లు లెవీ తీయించేసుకోగలిగారు. దిగుమతి కూడా ఆపేస్తే ఇక ఇంత పెద్ద మార్కెట్లో ధరల ఇష్టారాజ్యం చలాయించవచ్చన్న దురాశ వీళ్లది. తమ కష్టాలకి కారణం కూలీవాడని చూపించి చెరుకు నరికే యంత్రాన్ని పట్టుకొచ్చేరు. ఒక్కొక్కటే కోటి రూపాయలు చేసే మిషన్లు. 2011 -12లో 87 వాడారనీ వాటి కొనుగోలు కోసం ప్రభుత్వం ఏభై కోట్లు సబ్సిడీ ఇచ్చిందనీ, గతేడాది మొత్తం చెరుకులో 8 శాతం నరికిన యంత్రాలపై ఈసారి 25 శాతం నరకాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ కూలీలు రోడ్డున పడుతున్నారనీ నందా కసబే రాశాడు. నిజమే. కూలీవాళ్లనీ, వుద్యోగస్థుల్నీ తీసి పారెయ్యడానికి ఎంత ఖర్చైనా పెడుతుంది ప్రభుత్వం ఇంతకీ ఫాక్టరీ వాళ్లు రాఘవయ్యకు డబ్బులు ఎందుకివ్వలేదు.? చక్కెర కర్మాగారాలు రైతులకీ, కూలీలకీ ఇవ్వవలసిన డబ్బులు వాయిదా వెయ్యడం, ఎగ్గొట్టడం సర్వసామాన్యం. చెరుకే కాదు. వ్యాపారం మీద ఆధారపడ్డ ఏ వ్యవసాయ వుత్పత్తికైనా అదే పరిస్థితి. వరి కావచ్చు. శనగ కావచ్చు. గోగు కావచ్చు. మొక్కజొన్న కావచ్చు. గ్రామాల్లో షావుకార్లూ, రైస్ మిల్లర్లూ వగైరాలూ ఇలాగే పెరిగారు.

పంటల్లో మిగులు ప్రారంభం అయిననాడే పెట్టుబడికి విత్తనాలు పడతాయన్నది ప్రాధమిక సూత్రం. మిగులున్న రైతులు షావుకార్లకి అరువులిస్తారు. అప్పులిస్తారు. ఆ డబ్బుతో సరుకు కొని, దాచి బాకీలు వాయిదా వేసి, ఎగ్గొట్టి, సరుకు ధర పెరిగినప్పుడు లేదా కృత్రిమంగా పెంచి సరుకు అమ్మి లాభాలు తీస్తారు షావుకార్లు. దీన్నే స్పెక్యులేషన్ అని అంటాం. భారతీయ పారిశ్రామిక పెట్టుబడికి మూలం  ఈ స్పెక్యులేషన్ లాభాలే. బొంబాయి, కలకత్తాల్లోణి మార్వారీ, పార్సీ పెట్టుబడిదార్ల చరిత్ర చదివితే స్పెక్యులేషనూ, నల్లమందు వ్యాపారము, వడ్డీ వ్యాపారమూ వాళ్ల మూలాలని తెలుస్తుంది. జె.డి.బిర్లా చరిత్ర దొరుకుతుంది షాపుల్లో.

ఈ విషయం కథలో స్పష్టంగా చెప్పకుండా పంట తగ్గడం, ధర లేకపోవడం, సరుకు పేరుకు పోవడం, ఎం.డీ మారిపోవడం అని ఏవేవో సంబంధం లేని కారణాలు చూపించడం పెట్టుబడిని వెనకేసుకురావడమే.  అర్ధసత్య, అసత్య ప్రకటనే. ఫ్యాక్టరీ దివాళా తీయడానికి కారణం పర్చేసింగ్ ఆఫీసర్లు, మేనేజరూ చేసిన అవినీతి అని చెప్పడం మరో పెట్టుబడిదారీ వ్యూహం.. అమిత ధనార్జన, అత్యంత లాభాలు మాత్రమే ఏకైక నీతిగా, ఆదర్శంగా బతికే పెట్టుబడి అందరికంటే ఎక్కువగా అవినీతి గురించి మాట్లాడుతుంది. అవినీతి ఫలితాలను చిలువలు వలువలుగా  వర్ణిస్తుంది కానీ వాటికి కారకులుగా గుమస్తాలనీ, కానిస్టేబుల్నీ, అర్ధరూపాయి లంచం అడిగిన బంట్రోతునీ చూపించి లైసెన్సు రాజ్యం పోవాలని కేకలు పెడుతుంది. అమెరికా ఎంతో ఎక్కువగా మానవ హక్కులు గురించి మాట్లాడ్డం చూస్తున్నాం. వరి వేసినప్పుడు బావున్నాయనీ, పెళ్ళిళ్ళు, చదువులు చేసాడనీ, శనగ, చెరకు వేసి చెడిపోయాడని రాయడం నిర్ధిష్టంగా కొంత సరైందేమో కానీ సాధారణంగా పూర్తిగా తప్పు. వరి రైతులు కుదేలైపోవడం కొన్ని వేల రచయితలు కథలు కథలుగా రాశారు. వ్యాపారంలోకి వెళ్లాక ఆహారం అని లేదు. వినిమయాన్ని మించిన మిగులుకి వ్యాపార సూత్రాలు వర్తిస్తాయి.

ఇథనాల్ వుత్పత్తి చేస్తే ఫాక్టరీలు బావుంటాయనీ, రైతులకు డబ్బులిచ్చేస్తాయనీ, కొత్త ఇథనాల్ మిల్లులొస్తాయనీ. గ్రామాలు  జవజవాలడతాయనీ రాయడం కేవలం పెట్టుబడికి పనికొచ్చే ప్రచారమే అవుతుంది. నా అంచనాకి కథలోనే దాఖలాలున్నాయి. కథ ప్రారంభంలోనే కర్మాగారం. గత వైభవాన్నీ, వర్తమాన దైన్యాన్నీ ఎంతో మమకారంతో వల్లిస్తారు. బోర్డులో అక్షరాలు రాలిపోవడాన్ని సహానుభూతితో రాస్తూ ఫాక్టరీ మీద జాలి పుట్టించే ప్రయత్నం చేస్తారు. లక్షా ఎనభై వేల టన్నులు గానుగాడిందనీ,  ప్రభుత్వ అవార్డు పొందిందనీ ఫాక్టరీని కీర్తిస్తారు. వుత్పత్తినీ, వుత్పత్తి సాధనాల్నీ ప్రేమించడం, కీర్తించడం పెట్టుబడిదారీ దృక్పథంలో భాగం. పాడైపోయిన రోడ్లనీ, పెరుగుతున్న పిచ్చి మొక్కల్నీ, పాకుతున్న పాముల్నీ వర్ణించిన రచయిత కూలీల, రైతుకూలీల జీవితాల్లోకి తొంగి చూడకపోవడం దృక్పధంలో భాగమే.

వ్యాపారం  లేకపోతే, దెబ్బతింటే వ్యవసాయం చచ్చిపోతుందని చెప్తూ, ఇథనాల్ వ్యాపారం కూడా చెయ్యాలని చెప్పడం, పరాకాష్టగా శీధిల వ్యాపారం స్థావరంలోనే వ్యవసాయాన్ని (రాఘవయ్యని) చంపడం దృక్పధానికి చెందినదే. అయ్యో! ఫాక్టరీ బావుంటే రాఘవయ్య బతుకునే అన్పించేలా కథ రాయడం పెట్టుబడికి ఎత్తిన హారతే.

రాఘవయ్య పదెకరాల (ధనిక) రైతు కావడం యాదృచ్చికం కాదు. ధనిక రైతులు పెటి బూర్జువా దృక్పధంతోనే వుంటారు. పెట్టుబడి తన విశాల ప్రాంగణంలోకి రైతుల్నీ, పెట్టి బూర్జువాల్ని రానిస్తుందని చెప్పొచ్చు. వారి ప్రయోజనాలు, మనుగడా పరస్పరాశ్రితాలు. కానీ కూలీవాణ్ని, మానవశ్రమని తమ పొలిమేరల్లోకి రానియ్యకుండానే గేటు ముందు సాయుధ రక్షకుల్ని కాపలా వుంచుతుంది. అదో అనివార్య, నిరంతర ఘర్షణ.

ప్రభుత్వం చేతకానిదనీ, సీరియస్‌గా లేదనీ రాయడం కూడ ఆ దృక్పధంలోంచి పుట్టిందే. చేతకాని ప్రభుత్వాలు వుండవు. ప్రభుత్వం అంటేనే రాజ్యం. రాజీ పడలేని వర్గ(దోచేవాళ్లూ, దోచబడేవాళ్లూ) వైరుధ్యాల ఫలితంగానే రాజ్యం వుంటుందని ఎంగెల్స్ తన రచనల్లో ఓపికగా స్పష్టం చేశాడు. వర్గసమాజంలో రాజ్యాన్నీ, ప్రభుత్వ రంగ వ్యాపారాన్నీ (సహకార మిల్లులు) గొప్పగా, మంచివిగా చూడ్డం అంతిమంగా పెట్టుబడిదారీకే లాభం. “వర్గ వైరుధ్యాలను అదుపులో వుంచవలసిన అవసరం నుండి రాజ్యం పుట్టింది. రెండు వర్గాల ఘర్షణలోంచి పుట్టింది కాబట్టి అది అప్పటికి ఆర్ధికంగా శక్తివంతమైన వర్గం యొక్క పరికరంగా వుంటుంది” అని ఎంగెల్స్ రాశాడు. చరిత్ర రోజుకొక్కసారి ఈ వాక్యాన్ని రుజువు చేస్తున్నది. దీన్నిగురించి పాఠకుల్లో స్పృహ కలిగించకుండా, సీడీసీ చైర్మన్ రఘునాధరెడ్డి మంచివాడని రాయడం, చక్కెర ఫాక్టరీ ప్రస్తుతం ఎండీ మారిపోతే అంతా బావుంటుంది అని రాయడం . వాళ్ల దోపిడీ, ఆ దోఫిడీ సూత్రాల పట్ల ఎరుక కలిగించే ప్రయత్నం చెయ్యకుండా, మేనేజరు ఆస్తులు పెరిగిపోవడాన్నీ, వాళ్ల అవినీతిని రాయడం కూడా దృక్పధానికి సంబంధించిన విషయమే. అవినీతి విషయమే. కానీ దోపిడీ ఇంకా పెద్ద, ప్రధాన, అసలు విషయం. దృక్పధం ప్రయోజనాన్నీ, ప్రయోజనం వస్తువునే నిర్ణయిస్తుందన్నట్లు ఈ దృక్పధంలోంచి పుట్టిన కథకి సహజంగానే బ్రెజిల్ ఒక వుదాహరణ, ఆదర్శం అయ్యింది. ఇందాక “పో’ గురించి అన్నాను. “పో” అమెరికన్. అమెరికన్ పుట్టుకే పెట్టుబడిలో జరిగింది. వస్తువు శిల్పాన్ని ఎన్నుకుంటుందంటే అదే. దృక్పధానికీ, వస్తువుకీ, శిల్పానికీ సహజ ఐక్యత కథలో కుదిరింది.

దృక్పధం రచయిత వ్యక్తిగత రుగ్మత కాదు. ఏ వ్యవస్థలోని వ్యక్తులూ ఆ దృక్పధంలోనే వుండడం సహజం. ట్రాట్‌స్కీ అన్నట్లు సమాజ స్వభావం రచయిత వర్గ స్వభావాన్ని నిర్దేశిస్తుంది. కొంచెం అధ్యయనం, కొంచెం పరిశీలన, కొంచెం ఆలోచన రచయితల్ని సరైన మార్గంలో పెడతాయి.

నేను చెప్పినవన్నీ మామూలు విషయాలు. పేపర్లో విషయాలు. నాది ప్రాధమిక జ్ఞానం. నాది వానాకాలం చదువు. కానీ కనీసం ఈ చిన్న విషయాలు సంపాదకులు రచయితతో చర్చించి వుంటే పాఠకులకి ఒక మంచి కథ దొరికి వుండేది.

 

 

 

 

 

ఛానెల్ 24/7- 16 వ భాగం

sujatha photo

(కిందటి వారం తరువాయి)

 

ఆయనకు దక్షిణామూర్తిని చూడాలనిపించింది. అతన్ని భరించాలనిపించింది. ఆయన తప్పకుండా ఏదో ఒకటి అంటాడు. తన జీవితాన్ని విమర్శిస్తాడు. ఇది కూడదంటాడు. తను ఇంకెలాగో ఉండాలంటాడు. ఆయన తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. తన స్నేహితుడు. ఆయన ఇంకోలా ఎలా వుంటాడు.

బాయ్‌ని పిలిచి దక్షిణామూర్తిగారిని లోపలికి తీసుకు రమ్మన్నాడు. తను గబగబ వచ్చేశాడు. ఆయన అందరినీ పలకరిస్తూ స్టూడియో బయటే నిలబడ్డాడు. ఆయనకొసం తను ఆగలేదు. ఇప్పుడాయన చెప్పేవన్నీ తన మనసు తనకు చెబుతున్న విషయాలు. తన గురించి తనకు తెలిసినవీ, తన విజ్ఞత తనను మనిషిగా  ఉండమని హెచ్చ్చరిస్తున్నవే. ఇప్పుడు దక్షిణామూర్తి వస్తాడు అనుకొన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

***

 

“ఇప్పుడు అడుగుతున్నా మేడం.. మీ పర్సనల్ లైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేసుకున్నారో చెప్పండి..”

“నయనా.. నువ్వు ప్రశ్న సరిగ్గా అడుగు. నేను తిన్నగా చెబుతాను. నీ ఆలోచనలోంచి నన్ను చూస్తున్నావు. నా జీవితంలో డిస్ట్రబెన్స్ లేదు. నేనో మార్గం ఎంచుకొని అటు తిన్నగా నడుస్తూ వచ్చాను. ఒక వ్యాపారి తన వ్యాపారం అభివృద్ధి చేసుకొన్నట్లు నాయర్‌తో విడిపోయేసరికి నేను ఎడిటర్‌గా వున్నానని చెప్పానుగా. ఒక పత్రికా నిర్వహణ నా పర్సనల్ లైఫ్‌కి ఎక్కడా టైం కేటాయించనివ్వలేదు. ప్రపంచంకంటే కొన్ని గంటలు ముందుగా నిద్రలేవలసిన ఒక జర్నలిస్ట్ తనని తాను ఎంతగా అప్‌డేట్ చేసుకోవాలో అంతా చేశాను. ఇతర పత్రికలతో పోటీ, నా పత్రిక నిరంతరం సర్కులేషన్ పెంచుకోవటం కోసం నే పడ్డ తపన, నా కేంప్‌లో నేను కలుసుకొనే మనుష్యులు,నా జీవితానికి కేంద్ర బిందువు నా కెరీర్, నేను ఉమెన్ ఎడిటర్‌ని, టాప్‌మోస్ట్ జర్నలిస్ట్‌ని, ఎడిటర్స్ గిల్డ్ మెంబర్‌ని. నా ఎడిటోరియల్స్ గురించి నిరంతరం చదువు విశ్రాంతి లేని నా జీవితంలో నాయర్ ఎక్కడో మాయం అయ్యాడు”

“అంటే  కెరీర్, పర్సనల్ లైఫ్‌కి విలువివ్వదా..?”

“మనం ఒక ప్రవాహంలో వున్నాం. ఉదయం నిద్రలేవటం దగ్గరనుంచి ఆఫీస్ ఫోన్స్, బయటనుంచి కలుసుకోవలసిన వీఇపిలు.  పర్సనల్ లైఫ్‌కి ఒక గీత చెరిగిపోయింది. నాయర్‌తో విడిపోయాక నాకింకో పర్సనల్ జీవితం ఏముంది. పాపాయి చదువుకొంటుంది. బాబాయి కుటుంబంతో వుంది. నాకు ఆమె బాధ్యత లేదు. నేను, నాకోసం చరిత్రలో ఒక పేజీ సంపాదించుకోవాలనుకొన్నాను. అది నా లక్ష్యం.”

“వైఫల్యాలు, నష్టాలు. ఏవీ లేవా…?”

“ఓ గాడ్ నీకింకా అర్ధం కావటం లేదు. నాకోసంగా పిల్లలు లేరు. స్నేహితులు, బంధువులు, విహారయాత్రలు ఏవీ లేవు. తెలుసు కదా. మన పత్రిక పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. చానల్ లాంచ్ చేశాం. పొలిటికల్ ఎడిటర్‌ని. నేనెక్కిన మెట్లు ఏవీ మిగల్లేదు. కానీ నాకోసం వెనక్కి తిరిగి చూస్తె ఈ కెరీర్ వదిలేస్తే నేనేం చేయాలో నాకు తెలియదు. వృత్తి తప్ప నాకేం లేదు.”

“ఇందుకు బాధపడుతున్నారా? ఏమైనా నష్టపోయారా..?”

“బాధపడటం లేదు. నన్నెవరన్నా ఇలా వుండాల్సిందే అని నిర్భంధించారా.. లేదే.. నాకై నేను ఎంచుకొని కోరి వరించిన జీవితం. అటు నష్టపోయానో లేదో అర్ధం కాని జీవితం. నన్ను ఓ మీటింగ్‌లో నా జీవితంలో జరిగిన  యదార్ధ హాస్య సంఘటన, మీరు అందరితో కలిసి నవ్వుకొన్న్న సంఘటన గురించి చెప్పమని అడిగారు. హాస్య సంఘటన అలాంటిదేమీ లేదు. మరపురాని సంఘటనలంటే అవార్దులు తీసుకొనే అవకాశాలు తప్ప ఇంకేం లేదు. దాన్ని నేను నిర్వచించలేక పోతున్నాననుకొంటా..”

“అంటే కుటుంబ జీవితం పాపాయితో గడపటం మిస్ అయ్యారా…?”

“ఏమో,  కుటుంబ జీవితం నాకు ప్రత్యేకంగా అందించిన ప్రత్యేకమైన అనుభవాలు  ఏవీ లేవు. అటు నాన్నగారి సమయబద్ధమైన పొలిటికల్ జీవితం. అందులో ఆయన కుటుంబం కోసం కేటాయించినది ఏదీ లేదు. ఇటు నాయర్ కోరుకొన్న జీవితంలో నేను ఎల్లాగూ లేను. ఆయంతో కలసి ఉన్నంతకాలం ఆయన రాజకీయాలకు చెందిన మనిషే. ఆయనకు పర్సనల్ జీవితం ఉంటే ఆయన సొంత బతుకే. తను గొప్ప వ్యక్తిగా ఎదగటం. మరి ఈ మనుష్యులు నాకు నేర్పింది ఇదేనేమో ”

“కెరీరే లక్ష్యం అయితే ఇంకేముండదా మేడం..”

“ఇంకా అంటే బహుశా లేదేమో.. నీకు ఉద్యోగం లక్ష్యం. ఉదయం లేచి తయారై ఆఫెస్‌కు వస్తావు. సాయంత్రం వరకూ గంటకోసారి న్యూస్‌లో కనిపించాలి. ఇప్పుడే శ్రీధర్ అన్నాడు. ఐదవుతూనే నువ్వు ఇంకో ప్రీ రికార్డెడ్ ప్రోగ్రాంకు అటెండ్ అవ్వాలని. ప్రోగ్రాం కాన్సెప్ట్‌ని బట్టి ఏం కట్టుకోవాలో, ఏ నగలో, ఏ డ్రస్‌లో ఆలోచిస్తావు. నీకు పాప వుంటే దాన్ని గురించి ఉదయం నుంచి ఎన్నిసార్లు ఆలోచించగలిగేదానివి”

నయన ఆలోచిస్తుంది.

స్వాతి ఆమెను చూస్తోంది.

“నయనా.. ఎప్పటి సంగతో చెబుతున్నా. మా పాపకి పన్నేండేళ్లు వచ్చాయి. మొదట్లో నేను గమనించలేదు కానీ, ప్రతిరోజూ నేను ఇంటికి వచ్చేవరకు మేలుకొని వుండేది. ఒక్కోసారి ఆఫీస్‌కు వచ్చేది. చాంబర్‌లోకి రాకుండా బయటనే కూర్చునేది. రిపోర్టర్స్ రూంలో కూర్చుని వాళ్లతో మాట్లాడేది. నేను నా పనులయ్యాక కలిసేదాని. ఇద్దరం కలిసి కారెక్కేవాళ్లం. దాన్ని దగ్గరకు తీసుకొన్నా నాకు ఏదో ఫోన్, నేనేదో ఆఫీస్‌లో ఎవరితోనో ఏదో చెప్పాల్సిన అవసరం, థర్డ్ ఎడిషన్‌లోనో, లాస్ట్ ఎడిషన్‌లోనో చేయాల్సిన మార్పులు, లాస్ట్ మినిట్స్‌లో వచ్చిన ఫ్లాష్ న్యూస్ ఏదో ఒకటి నా మనసంతా. పోనీ ఏ మీటింగ్‌కో కలిసి వెళ్ళేవాళ్లం. ఆ మీటింగ్‌లో నేను మొత్తంగా వుండగలను. కానీ పాపాయి పాత్ర ఎంతవరకూ. మొదటిసారి అందరూ పలకరిస్తారు. ఇంకా దగ్గరివాళ్లయితే దగ్గర కూర్చోమంటారు అంటే. నేను తనని ఎంత ఎంగేజ్ చేయగలను” అంది.

“నెమ్మదిగా తర్వాత మానుకొందనుకొంటా” స్వాతి ఆలోచిస్తూ ఊరుకొంది.

తలెత్తి చినంగా నవ్వింది

“ఆమె పెళ్ళి కోసం ముందుగా వారం రోజులున్నాను. ఇంట్లో పెళ్ళయ్యాక తను అమెరికా వెళ్ళే ఏర్పాట్లలో వుంది. తను వెళ్ళేందుకు రెండు నెలలు పట్టింది. ఆ రెండు నెలల్లో రెండు సార్లు తన కోసం వెళ్ళేను. మొత్తం పాపాయి కోసం నేను సంవత్సరంలో నాలుగైదు రోజులు కేటాయించానేమో. ఇంట్లోనే వున్నా పెద్దగా కలిసి లేము. నా పనుల్లో నేను, పాపాయికి నేనేం ఇచ్చాను. తనను కనటం తప్ప”

“ఇప్పుడు అమ్మలా ఆలోచించారు” నవ్వింది నయన.

“అంటే నయనా. మన సొసైటీలో స్త్రీలకు ప్రత్యేకమైన ఫార్మేట్ వుంది. ఆమె ఎలా వుండాలో ఎవరో ఆలోచించి డిజైన్ చేసి ఇచ్చిన ఫార్మెట్. దాన్ని సొసైటీ ఆమోదించింది. ఆమె ఇలా ప్రేమించాలి. ఇలా పెళ్ళాడాలి పిల్లల్ని కనాలి. కుటుంబానికి ఇలా సేవ చేయాలి. ఆమె మనసులో ఈ స్థాయిలో మెల్టింగ్ పాయింట్ వుండాలి. మరి నేను అలా కాకుండా ఇంకోలా వుంటానంటే అతిగా లేదూ. ఈ స్వేచ్చని ఎవరు ఎలా ఆమోదిస్తారు. ఇటు నాయర్‌ కోసం విచారించకా, అటు పాపాయిని సరిగ్గా తల్లి పాత్రలో వుండి చేరదీయకా, స్వాతిలాగా కెరీరిస్ట్‌గా నిలబడ్డానంటే నాకేం విశేషణాలుంటాయి చెప్పు”

నయన తడబడింది. నిజం మాట్లాడితే ఏం బావుంటుంది. తన ఉద్ధేశ్యంలో తన దృష్టిలో ఈవిడ చాలా స్ట్రిక్ట్. ఎండితో కలిసి ప్లాన్ వేస్తే అవతలవాడు మటాష్, తను ఏదైనా కావాలనుకొంటే ఎలాగైనా సాధిస్తుంది. దయాదాక్షిణ్యాలు లేవు. ఇంకా అబ్బో.. ఎవర్నీ ప్రేమించదు. శిఖండి. ఏం మనిషిరా బాబూ అనేవాళ్ళే ఎక్కువమంది. ఎంతదాకా ఎందుకు. తనకే పదిసార్లు హెచ్చరికలు చేసింది. గ్రూప్‌లు కట్టకూడదంటుంది. అతి చనువు కూడదంటుంది. అనవసరమైన రిలేషన్స్ పెంచుకోవద్దంటుంది. బహుశా కళ్లెత్తి చూస్తే ఆవులిస్తే పేగులు లెక్కపెడుతుంది. నయననే చూస్తున్న స్వాతి నవ్వింది.

“నేను నీ ఆఖరి ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. ” అన్నది.

నయన కంగారుగా చూసింది.

“ఇంకేం లేదు మేడం” అన్నది.

“ఇంకేమున్నాయో ఆలోచించుకో. నీకు ఇరవై నిముషాలే టైం” అన్నది కుర్చీలో హాయిగా రిలాక్సయిపోతూ.

***

దక్షిణామూర్తిగారు డోర్ తెరుచుకుని లోపలికి వచ్చారు. ఫోన్‌లో మాట్లాడూతున్న ఎస్ఆర్‌నాయుడు లేచి ఆయన్ను కూర్చోమన్నట్టు తన ఎదురుగ్గా వున్న చూపించి మర్యాద చేశాడు. ఆఫీస్ మొత్తం బాంబే నుంచి వచ్చిన ఇంటీరియర్ డెకొరేషన్ ఎక్స్‌పర్ట్ డిజైన్ చేశాడు. చాలా అందమైన ఆఫీస్. దక్షిణామూర్తి తన కాబిన్‌ను ఆశ్చర్యంగా చూస్తున్నాడా లేదా ఆయన మొహం వంక చూస్తున్నాడు ఎస్ఆర్‌నాయుడు. కూర్చుంటూ పై కండువాతో ముఖం తుడుచుకొంటూ ఎదురుగ్గా రాక్స్‌లో వున్న పుస్తకాల వంక చూస్తున్నాడు.

“భోజనం చేద్దాం దక్షిణామూర్తిగారూ” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

దక్షిణామూర్తి తల వూపాడు.

“ఫ్రెష్ అవుతారా?” అన్నాదు ఎస్ఆర్‌నాయుడు.

“వస్తూ బాత్‌రూంకు వెళ్ళివచ్చా” అన్నాడాయన.

ఆయన ఖద్దరు షర్ట్, జీన్స్ పాంట్ తమాషాగా వుంటుంది. ఆ కాంబినేషన్ పైన ఖద్దరు తువ్వాలు వంటిది మెడచుట్టూ వేసుకొంటాడు. ఎస్ఆర్‌నాయుడు చాలా స్టయిల్‌గా వుంటాడు. చక్కని మడత నలగని షర్టు నలుపు తెలుపులుగా వున్న ఉంగరాల జుట్టు చక్కగా దువ్వుకొని  ఎప్పుడు పడితే అప్పుడు లైవ్‌లో కనిపించటానికి వీలుగా రెడీగా వుంటాడు.

భోజనం వచ్చింది. ట్రేలో వున్న డిష్‌లన్నీ ఒక్కోటి తీసి చూస్తున్నాడు దక్షిణామూర్తి. నాకు సాంబార్ చాలోయ్ అన్నాడు బాయ్‌తో. బటర్ నాన్, పుల్కా కూడా ఉన్నాయి సార్ అన్నాడు బాయ్. వద్దులేవయ్యా రైస్ తింటాను అన్నాడాయన.

“ఎలా వుంది చానల్” అన్నాడు ఎస్ఆర్‌నాయుడుతో.

“చూస్తున్నారుగా సెకండ్ ప్లేస్‌లో. అటూ ఇటూ ఫస్ట ప్లేస్ కూడా”

“అవును చాలా సెన్సేషనల్ చేసావు” అన్నాడు దక్షిణామూర్తి.

తింటున్నది గొంతులో పడ్డట్టు అయింది. సెన్సేషనల్ అంటే ఈయన వెక్కిరింతా పొగడ్తా.

“మొన్న మీ చైర్మన్‌గారు ఎయిర్‌పోర్టులో కలిశారు.  చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయనకు పవర్ ప్రాజెక్ట్ వచ్చిందంటగా. మీ కృషి చాలా వుందన్నాడు.

తింటున్న భోజనం కమ్మగా లేదనిపించింది ఎస్ఆర్‌నాయుడుకు.

చైర్మన్ ఆదికేశవులుకి ఎన్నో బిజినెస్‌లు వున్నాయి. ఎన్నో సంస్థల్లో పెట్టుబడులున్నాయి. ఈ చానల్‌లో ఆయనకూ షేర్స్ ఉన్నాయి. నేనూ స్వాతీ డైరెక్టర్స్ . తెలుసు కదా..”

“ఆయన తమ్ముడు శ్రీరంగనాయకులు నేనూ క్లాస్‌మేట్స్”

ఈసారి దగ్గొచ్చింది ఎస్ఆర్‌నాయుడుకు. ఇది తనకు తెలియదు.

“అయితే పెద్దయ్యాక ఎప్పుడూ రిలేషన్స్‌లో లేము. మొన్నమాటల్లో చెప్పుకొన్నాము. శ్రీరంగనాయకులు మినిష్టర్ అయ్యాక నేను కలుసుకొన్నది లేదు. ఇష్యూ బయటికి వచ్చాక నీతో మాట్లాడాలనుకొన్నా.”

ఎస్ఆర్‌నాయుడుకు ఏం మాట్లాడాలో తోచటం లేదు. ఆదికేశవులు కాలేజ్ సంగతి ఎక్కడా బయటకు రాకుండా తనే చూశాడు. గవర్నమెంట్ లాండ్ అది. లీజ్‌కు తీసుకొన్నారు. పర్మిషన్స్ తెచ్చుకోవచ్చునని బిల్డింగ్స్ కట్టేశారు. ఆ స్థలం లీజుకు ఇచ్చినందుకు అప్పటి కమీషనర్‌ను కోటీశ్వరుణ్ణి చేశాడు ఆదికేశవులు. ఆయన ఆస్తులు సగం తన పేరుపైనే ఉన్నాయి. ఈ చానల్‌లో తను పెట్టిన షేర్లు అతను ఇచ్చినవే. వాళ్ల కోసం తను ఏం చేస్తే సరిపోతుంది..?”

“నువ్వు చాలా రిస్క్ తీసుకొంటున్నావు. నీతో మాట్లాడాలనే వచ్చా. ఓన్లీ ఫ్రెండ్లీగా. నువ్వు స్వాతి కలిసి డెయిలీని ఎన్నో ఎడిషన్లు చేశారు. ఆ పెట్టుబడి ఎక్కడిదో నాకు తెలుసు. ఈ చానల్ పెట్టుబడీ నాకు తెలుసు. స్వాతి నాన్నగారు బతికుంటే ఇదంతా జరిగేది కాదు. ఒకప్పుడు ఆ పత్రికకు ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఉండేది. అవ్వాళ్టి పార్టీ లీడర్స్‌కి పదవులు లేవు. ప్రజాసేవ తప్ప. ఆదికేశవులు దాన్ని టేకోవర్ చేశాడని అందరికీ తెలుసు. బయట నువ్వు చాలా బద్నామ్ అవుతున్నావు”

ఇంత చెబుతూ తాపీగా అన్నం తింటున్న మనిషి వైపు తెల్లబోయి చూస్తున్నాదు ఎస్ఆర్‌నాయుడు.

“పత్రిక, చానల్ అడ్డంపెట్టి ఎన్నింటికి పర్మిషన్ తెచ్చుకొన్నాడో నువ్వెలా డిల్లీ చుట్టూ తిరుగుతున్నావో నీ తోటివాళ్లు ఎంతలా గమనిస్తున్నారో తెలుసా నీకు”

దక్షిణామూర్తి ఏనాడో పాతికేళ్ల గతంలోంచి లేచొచ్చి కూర్చున్నట్టు వుంది ఎస్ఆర్‌నాయుడుకి.

ఇద్దరూ ఎడిటోరియల్‌లో షిఫ్ట్ ఇన్‌చార్జ్‌లుగా పనిచేసేవాళ్లు. ఎడిటోరియల్ రాయటంలో పోటి, రిపోర్టింగ్‌లో పోటీ. కొత్త కొత్త విషయాలు రాయటంలో పోటీ. ఆరోగ్యకరమైన పోటీలో ఇద్దరూ వెలిగిపోతుండేవాళ్లు.

“నాతో శ్రీరంగనాయకులు చెప్పారు. ఒక్క రూపాయి చేతిలోంచి పెట్టకుండా ఎలా సంపాదించారో ఆదికేశవులు చెప్పుకొచ్చాడు. తను మినిష్టరుగా అడ్డమైన లాబీయింగ్‌లతో ఎన్ని కాంట్రాక్టులు, ఎన్నో పర్మిషన్లు ఇప్పిస్తూ వాళ్లందరిచేత ఈ చానల్‌లో పెట్టుబడులు పెట్టించాడో, మొత్తం చానల్స్‌లో టాప్‌లో ఎలా ఉందో చెప్పాడు నాకు. నువ్వు స్వాతి ఎవరెవరికి కొమ్ము కాస్తున్నారో, ఏం స్టోరీలు చేస్తున్నారో, ఎవరిని ఎలా బెదిరిస్తున్నారో, ఇవన్నీ నీకు వాళ్లు తెలిసే చేస్తున్నావా? ఆదికేశవులు బావున్నాడు. వాళ్ల తమ్ముడూ బావున్నాడు. వాళ్ల ఆస్తులు , పిల్లలు అంతా బావున్నారు. మరి నువ్వెలా వున్నావు? ఇదంతా నీకెందుకు నీ అంత మంచి రైటర్ ఎవరున్నారు? నీ పిల్లలు బుద్ధిమంతులు. చక్కగా చదువుకొన్నారు. నీకు కోట్ల ఆస్తులు లేకపోతే ఏం.. ఎందుకిదంతా. ఆదికేశవుల్ని ఎదిరించాడని. ఆ కల్నల్ పర్సనల్ లైఫ్ చానల్‌లోకి లాగి నవ్వుల పాలు చేశావు. ఆయన ఎవరిని చేరదీస్తే నీకెందుకు. ఎదుటివాళ్ల బెడ్‌రూమ్స్‌లోకి తొంగిచూడాలా నువ్వు”

తినటం ఆపి దక్షిణామూర్తి వైపు చూస్తున్నాడు నాయుడు. ఆయనకు ఊహించని దెబ్బ ఇది. దక్షిణామూర్తిని ఎలా తొక్కేయాలా అని ఉదయం నుంచి ఆలోచిస్తున్నాడు తను. ఉద్యోగం సద్యోగం లేక దిక్కులేక ఉన్నాడనుకొన్నాదు. ఈయన తనకే పాఠాలు చెబుతున్నాడు.

“నీకు నేను చెప్పటం ఏమిటి అని ఆలోచించాను. నేను పత్రిక వదిలేశాక నీకు తెలుసుగా పుస్తకాల ట్రాన్స్‌లేషన్ పెట్టుకొన్నాను. మానవ చరిత్ర పన్నెండు వాల్యూమ్స్ అయ్యాయి. తెలుగు మాండలికాలు తయారయ్యాయి. పిల్లల పుస్తకాలు చాలా చేసాను. ఒక రకంగా ఇదివరకటి కంటే తీరిక లేకుండా వున్నా. మనం చేయవలసిన పనులు ఎన్నో వున్నాయి. అవన్నీ వదిలేసి ఇప్పుడిలా.. ఇదంతా ఎందుకు? నాకు తోచింది చెప్పాను. వినటం, వినకపోవటం నీ ఇష్టం.” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు వంక చూసి.

ఎస్ఆర్‌నాయుడుకి నోటమాట రాలేదు. పాతికేళ్ళ గతంలోకి నడిచిపోయి దక్షిణామూర్తితో కలిసి రాత్రివేళ లాంగ్ డ్రైవ్ చేయాలనిపించింది. పత్రిక వృద్ధిలోకి రావటం కోసం కొత్త కొత్త ప్రయోగాల కోసం రాత్రిళ్ళు నిద్రపోక  మేలుకొని చేసిన చర్చలు గుర్తొస్తున్నాయి. ఎక్కడో తమ స్నేహం, జీవిత మాధుర్యం చేజారాయి. తను తుఫానులో కొట్టుకుపోయాడు.

“తినలేను” అన్నాడు నీరసంగా తింటున్న ప్లేటు వదిలేసి.

“తిను తిను.. నేను కంపెనీ ఇస్తా. ఇంకా ఫ్రూట్ సలాడ్ వుంది చూశావా?”అన్నాను దక్షిణామూర్తి కప్పు చేతిలోకి తీసుకొని.

ఎందుకో దక్షిణామూర్తిపైన కోపం రాలేదు. తన హోదా తన చానల్. తన గొప్పతనం ఏవీ గుర్తు రాలేదు. తనను నిలదీసే ధైర్యం ఎవ్వరికుంటుంది. తను ఎవ్వరికైనా సమాధానం చెప్పుకోవాలా అంటే తన మనస్సుకే అనుకొన్నాడు. శాంతిగా అనిపించింది. తీరిగ్గా భోజనానికి ఉపక్రమించాడు. రూం చల్లగా వుంది.

 

దక్షిణామూర్తి తాపీగా ఫ్రూట్ సలాడ్ తింటూనే వున్నాడు. చుట్టూ నిశ్శబ్దం కానీ, రూమ్ నిండా గడ్డకట్టుకుపోయిన మాటలున్నాయి.

***

“లాస్ట్ క్వశ్చన్.. ఉద్యోగం ఎందుకు వదిలేస్తున్నారు?”

నవ్వింది స్వతి.

“ఎప్పుడో ఒకప్పుడు దాన్ని వదిలేయాలి. ఇంకా పదేళ్ల తర్వాత వదిలేస్తే మిగతా జీవితం కోసం ఏదైనా ప్రిపేర్ అయ్యే టైం వుండదు. ఇప్పటికే చాలా లేట్”

“ఇప్పుడేం చేయాలి మీరు”

“ఇప్పటిదాకా చేయకుండా వదిలేసినవి, చేత్తో పట్టుకోవాలి. నయనా నేను వారం రోజుల క్రింతం మన ఓల్డేజ్ హోంకి వెళ్లాను. ఈ మధ్య ఆరునెలలుగా అటువైపు వెళ్లలేదు. నాన్న ఉద్యోగం వదిలేక దాదాపు ఎనిమిదేళ్లు.. ఆయన పోయేదాకా అందులోనే వున్నారు. అఫ్‌కోర్స్ల్ దాన్ని, హోంని ఆయనే డెవలప్ చేశారనుకో.. మంచి పుస్తకాల లైబ్రరీ, కామన్ హాలు.. చక్కటి తోటలు.. ఎంత బావుందో తోట  ఇప్పుడు. ఇవన్నీ ఆయన తను ఉండబోతున్నాననే ఇష్టంతో తనకంటే  పెద్దవాళ్ల కోసం, తన తొటివాళ్ల కోసం ప్రేమగా ప్రతి రాయిని చూశారు. నిజంగా హోం ఆయన కొలీగ్స్‌తో నిండివుంది. ఆ వృద్ధాప్యంలో శరీరం ఆయన స్వాధీనంలోంచి పోతున్న సమయంలో కూడా ఎలాంటి జీవితం గడిపారో తెలుసా? అదో మాటల పూలదోట. ఎంతోమంది మేధావులు, చదువుకొన్నవాళ్లు, రచయితలు, పొలిటిషన్స్ అందరూ వృద్ధులే. ఒక తెలివైన వాతావరణం, బాధని నవ్వుకొనే ధైర్యం, మృత్యువుని ఎదుర్కొనే నిర్లిప్తత. నొప్పిని పంచుకొనె ప్రేమ, ఒకళ్ల కోసం ఒకళ్ళున్నామనే ఓదార్పు.. ఓ గాడ్ ఎలా వుండేదో హోం. నేను నాన్న వున్నంతకాలం దాన్నలా ఫీలవలేదు. ఎంతో నిర్లిప్తంగా అదే నా  ఉద్యోగంలా ఎవరెవరు ఏం కావాలని చెప్తారో అవన్నీ కొనుక్కుని, డాక్టర్ విజిట్స్ అటెండవుతూ అందరి ఆరోగ్యం విచారిస్తూ అదొక పని, అందులో నా ఆనందం, హృదయం పెట్టలేదు. ప్రతివాళ్లు ఏదో ఒకటి ఎలాంటి కోరికలు కోరేవాళ్లూ. పేపర్లు, రంగులు. ఒకాయనకి సంగీతం నేర్చుకోవాలనిపించి సంగీతం మేష్టారు, ఒకాయనకి మంత్రాలకు అర్ధం తెలుసుకోవాలని సంస్కృతం వచ్చినాయన సాయం. ఇలాంటివి. ఎవరేనా ముసలాళ్ళు ఇలాంటి కోరికలు కోరతారా? వీళ్లు స్వీట్ సిక్స్‌టీస్ వాళ్లు, నిత్యయవ్వనంతో ఉండేవాళ్లు. ఇది ఇప్పుడు చెబుతున్నా. కానీ అవ్వాళ అది నాకు అంతులేని చాకిరి. వాళ్లందరూ అడిగినవన్నీ నేను నా ట్రెయినీలు, మేనేజర్లు పోయి కొనుక్కురావటం అందరికీ అందాయా లేదా టిక్ పెట్టుకోవటం అదే తెలుసు. కానీ నేను వారం క్రితం  వెళ్లానా? అక్కడ మా చిన్నప్పుడు మాకు వంట చేసి పెట్టిన మా పెంపుడు తల్లి తొంభై ఏళ్ళ ముసలామె నన్ను చూడాలని కోరింది. ఆవిడకు జ్ఞాపకశక్తి పోయింది. నన్ను, నా భర్తని, నా పాపని  చూడాలని అడుగుతోంది. నాకింకా పాతికేళ్ళే అనుకొంటోంది. తీరిగ్గా కూర్చోబెట్టుకొని నా దగ్గర చివరి రోజులు గడపాలని ఉందన్నది. వంటరిగా వుండలేను, పాపా నీతో వచ్చేస్తా. నీ మొగుడు, పిల్లలు వాళ్లతో వుంటానే. అందరూ వెళ్ళిపోయారమ్మా. ఇంతమందిని పెంచాక అందరూ వెళ్లారే. నన్ను ఇలా వదిలేసి వెళ్లిపోతే ఎలా? నన్ను ఇంటికి తీసుకుపో అంటుంది. అందరినీ పిలు  నేను చూస్తాను అంటోంది. ఎవర్ని పిలవాలి? నాతోపాటు ఒకేచోట  ఒకే వంటగదిలో అన్నాలు తిన్న నా స్నేహితులెక్కడ? ఎవరి తల్లిదండ్రులు వాళ్లని పిల్లల్నీ వాళ్లే పెంచలేదు. ప్రజలకోసం పార్టీ కోసం ఎక్కడెక్కడో వాళ్లు వుంటే మేం ద్రాక్ష గుత్తిలో పండుల్లా ఒక్కళ్ళతో ఒక్కళ్ళు ఉన్నాం. ఇప్పుడు పెద్దయ్యాక ఎప్పుడో, ఎక్కడో ఏ పార్టీలోనో, ఏ ఫ్లయిట్‌లోనో కలుస్తుంటారు. ఏరి నా స్నేహితులు? నా పరివారం? నాకేం కావాలో నేనేం చేయాలో నాకు అర్ధం అయింది. నా పెంపుడు తల్లిని నాతో తేలేను. నేనే అక్కడికి వెళ్లిపోతా. నా పాత స్నేహితులను పిలుచుకొంటా. అందరం కలసి మేమంతా కలసి ఈ వయసులొ ఇంకో ప్రపంచం ఏదయినా నిర్మిస్తామేమో చూడాలి. అందరం కెరీర్ కోసం పరుగులు తీశాం. ఇప్పుడెవరు ఎలా వున్నారో, వాళ్లకు కావలసింది దొరికాక వాళ్ల మనసు నిండుగా వుండలేదా.. ఒక్కళ్ళకొకళ్ళం మళ్లీ ఏం కావాలో తేల్చుకోవాలి. నేను ఒక పెద్ద పరయాణం పెట్టుకొన్నాను” అన్నది స్వతి.

మాటల్లో నయన ఎప్పుడో లేచి వచ్చింది. స్వాతి వడిలో తల పెట్టుకొంది. ఆమె చుట్టూ అంతులేని ఎదారి ఉన్నట్లు. ఆమెకు అంతులేని దాహంగా వున్నట్లు, ఆమెకు రెండూ చేతుల నిండా ప్రేమను ఎత్తి ఇవ్వాలన్నట్లు అనిపించింది నయనకు.

స్వాతికి అర్ధం అయింది. నయన జుట్టు సవరిస్తూ..

“కదా నయన.. నాకు చాలా కావాలి. ఎంతో ప్రేమ కావాలి. చాలా పొసెసివ్‌గా ఉండలానిపిస్తోంది నయనా. నా ప్రయాణం కరక్టేనా?” అంది స్వాతి.

“హండ్రెడ్ పర్సంట్ మేడం. మీకోసం ఉద్యానవనాలున్నాయి మేడం. ఎందరమో మీ ఫాన్స్ మీలాగా ఉండాలనుకొన్నాం. మీరే మా అందరి రోల్ మోడల్. మీరంటే మాకెంతో ఇష్టం” అన్నది నయన.

 

***

 

స్వాతి, నయన.. ఎండి చాంబర్‌లోకి వచ్చారు. ఎస్.ఆర్.నాయుడు దీక్షగా ప్రివ్యూ చూస్తున్నాడు. సాయంత్రం టెలికాస్ట్ కాబోతున్న ప్రోగ్రామ్ కం ప్రోమో. శ్రీధర్ నిలబడి చూస్తున్నాడు. హేమమాలిని డాన్స్ బైట్ అప్పటివరకూ చూస్తున్నాడు. కళ్లు మూసుకొని శివార్చనతో వున్న అమె శివుడి గొంతు విని భుజాలు ఒక్కసారి విదిల్చి కళ్లు తెరిచింది. చాలా అందంగా వుంది ఆ బైట్. ఇంకో ప్రఖ్యాత కూచిపూడి నర్తకి స్క్రీన్ పైకి వచ్చారు. ప్రోమో కోసం ఇంట్లో షూట్ చేసినట్లున్నారు. ఆవిడ పాదం కదలికలో ఏదో బరువు తెలుస్తోంది. విశ్వవిఖ్యాత కళకారిణి ఆమె. వయసు దాటాక వచ్చిన చిన్న వణుకు అది పాదాల్లో కూడా తెలుస్తోంది.

“శ్రీధర్ ఈ బైట్ తీసేయ్. ఆవిడ డాన్స్ ప్రోగ్రామ్స్ మాస్టర్ క్యాసెట్స్ మన దగ్గర ఎన్నో వున్నాయి కదా. దాన్లోంచి ఒక చిన్న డాన్స్ తీసుకో. ఆవిడ ఇలా డాన్స్ చేయలేకపోవటం చూపించటం నాకు బాగాలేదు.” అన్నాడు.

“టైం తీసుకొంటుందా?” అన్నాడు మళ్లీ.

“లేదు సర్. ఫైవ్ మినిట్స్ పని. ఇంకా ట్రిమ్మింగ్ చేస్తూనే వున్నారు” అన్నాడు శ్రీధర్.

“ఇప్పుడు ప్రోమో ఇచ్చేద్దాం. తొమ్మిది గంటలకు ప్రోగ్రాం మొదలయ్యే లోపల ప్రతి పది నిమిషాలకు ప్రోమో రన్ చేద్దాం” అన్నాడు మళ్లీ.

తల వూపాడు ఎస్.ఆర్.నాయుడు. ఆయన కళ్లన్నీ హేమమాలిని పైనే వున్నాయి. తన వయసె. ఎంత సిస్టమాటిక్‌గా ఎంత అందంగా ఎలా వుంది ఆమె నృత్యం. కళని ఆరాధిస్తే వచ్చే అవుట్‌పుట్ అది. జీవితం మొత్తంగా నృత్యమే. తనూ జీవితం మొత్తం చేసింది జర్నలిజమే. జర్నలిజమే అంటే విపరీతమైన కాంక్ష. తన ఆలోచన రక్తంలో ఆ కోరిక కలగలసి పోతే ఈ అక్షరాలన్నీ కౌగలించుకోవాలని ఎంత ఆశ. ఆ ఆశకు ఇవ్వాళ్తి రూపం. ఒకప్పుడు తన మనసులో మోగిన పదాలు ఎలాంటివి.. ఎవ్వరివి.. తనలా  ఉండటం కరక్టేనా?

సమ్మెకట్టిన కూలీలు

సమ్మెకట్టిన కూలీ భార్యల బిడ్డల ఆకలి చీకటి చిచ్చుల

హాహాకారం! ఆర్తారావం

ఒక లక్ష నక్షత్రాల మాటలు

ఒక కోటి జలపాతాల పాటలు.

ఇలాంటి అపురూపమైన పదాలు తన మనసుని మోహపరిచేవి. నిద్ర రాకుండా చేసేవి. ఇవే తన జీవితాన్ని వెలిగించాయి. ఈ వృత్తి లేకుండా తను లేదు. ఇవ్వాళ ఆయన మనసు అల్లకల్లోలంగా వుంది.

“ఏంటి సర్ ఆలోచిస్తున్నారు” అన్నది నయన.

ఆయన కళ్లెత్తి చూశాడు. ఎదురుగ్గా స్వాతి. పక్కనే నిలబడింది నయన.

“నువ్వు వెళ్లిపోవాలా స్వాతి?” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

నయన మొహం వికసించింది.

“అదే సర్.. అదే సర్..” అన్నది గొంతులో ఇంకో మాట పెగలక.

స్వాతి ఆయన వైపు నిదానంగా చూసింది.

“ఎన్నాళ్లు పని చేసినా ఇంతే కదా. ఎప్పుడో ఒకప్పుడు సెలవిక అనాలి కదా” అన్నది.

“ఒన్ మినిట్ సర్.. శైలేంద్ర కాల్ చేస్తున్నారు. రికార్డింగ్ ఒకటి మిగిలి వుంది సర్. రవళిగారు వెయిటింగ్..” అంటూనే ఫోన్ తీసి శైలేంద్రగారూ వస్తున్నా అంటూ డోర్ తీసుకొని వెళ్లిపోయింది నయన.

“నా పైన కూడా కోపం వచ్చింది కదూ స్వాతి” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

“మీపైన అని ప్రత్యేకం ఎందుకు. నేను చెయనిది మీరు చేశారా? మనం తప్పించుకోగలిగమా, ఈ ప్రవాహానికి ఎదురీదటం ఎవరివల్ల అవుతుంది” అంది నిర్లిప్తంగ అస్వతి.

“ఎదురీడటం స్వార్ధం అయితే ఉండిపోతావా?” అన్నాడాయన.

స్వాతి ఏదో అనబోయింది.

ఫోన్ మోగింది. స్పీకర్ ఆన్ చేసాడు ఎస్.ఆర్.నాయుడు.

“సర్ వైజాగ్ నుంచి రిపోర్టర్ రాజు సర్” అంది పి.ఏ.

“ఏమయ్యా” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు.

“స్కూప్ సర్” అన్నాడు రాజు.

స్వాతి నవ్వింది.

“ఏమిటి?”

“సర్ ప్లీజ్ మీరు మరో విధంగా భావించకపోతే చెబుతాను. ఇది ఆఫ్ ది రికార్డ్ అనుకోండి సర్” సందేహిస్తున్నాడు రాజు.

ఆయన మొహంలో నవ్వు మాయం అయింది.

“ఏమయింది రాజూ?”

సర్. ఆదికేశవులుగారి రియల్ ఎస్టేట్ కంపెనీ సీఇఓతో పాటు ఇద్దరు బిజినెస్ మేనేజర్స్ ఇక్కడ గెస్ట్ హౌస్ రెయిడ్‌లో దొరికారు సర్” అన్నాడు.

“వాట్” అన్నాడు ఎస్.ఆర్.నాయుడు ఉలిక్కిపడి.

“సిఇఒ దొరకటం ఏమిటయ్యా . ఆర్ యూ ష్యూర్?”

“సర్ ప్లీజ్. ఒక్క నిముషం ముందే సర్.. ఇవన్నీ చాలా కాలం నుంచి జరుగుతున్నవే సర్. కాకపోతే ఇవ్వాళ్టి రెయిడ్‌లో పట్టుకొన్నారు. ఆయన రిసార్ట్స్‌లో రాత్రి ఏజంట్ల మీట్ జరిగింది సర్. చాల మంది రియల్ ఎస్టెట్ వాళ్లంతా ఇంతే సర్. కొందరు మార్కెటింగ్ మేనేజర్స్ అసిస్టెంట్లుగా అమ్మాయిలు ఉంటారు సర్. కస్టమర్స్‌తో అమ్మాయిలే డీల్ చేస్తారు కదా. లోకేషన్‌కి తీసుకుపోవటం ఆ తర్వాత చాలా వ్యవహారాలు జరుగుతాయి. కస్టమర్స్‌ని ఎట్రాక్ట్ చేయటానికి…” రాజు చెపుతూనే వున్నాడు.

ఎస్.ఆర్.నాయుడుకి చెమటలు పట్టాయి.

తలెత్తి స్వాతి వైపు చూశాడు.

ఆమె  చిరునవ్వు నవ్వింది.

ఒక్కనిముషం తటపటాయించాడు ఎస్.ఆర్.నాయుడు.

“ఫ్లాష్ న్యూస్ ఇచ్చేద్దాం” అన్నాడు స్వాతితో.

“ఆదికేశవులుగారి మెయిన్ బిజినెస్సే ఇది. ఆయన ఒకేసారి ఇద్దరి గొంతు పట్టుకొంటాడు” అన్నది నవ్వుతూ స్వాతి.

“రాజు అంతటా ఇదే జరుగుతుందా?” అన్నాడు ఆసక్తిగా రాజుతో.

“సర్. ఇది ఆస్తులు కొనిపించటం సర్. మంచి యాడ్స్ చూస్తున్నారు కదా సరి. ఒక్కో వెంచర్ ఓపెనింగ్‌కి ఎన్ని లక్షలు ఖర్చుపెడతారు పబ్లిసిటీకి. ఇందులో బంపర్ డ్రాలు, కిలో బంగారాలు, కార్లు ఎలా వస్తున్నాయి సర్. ఇవన్నీ రిసార్ట్స్‌లో జరిగే మెయిన్ బిజినెస్‌లు ఏమిటి సర్. మీరు ఎరగని విషయాలేమీ లేవు సర్. నాచేత చెప్పిస్తున్నారు సర్ మీరు. మనం స్టార్ హోటల్లో రైడింగ్స్ గురించి ఇచ్చినప్పుడు..” రాజు పాత పురాణాలు మొదలుపెట్టాడు.

“సరే.. నువ్వు శ్రీధర్‌తో మాట్లాడు. ఫ్లాష్ ఇచ్చేద్దాం” అన్నాడు.

“సార్..” అన్నాడు అవతలనుంచి రాజు, అతని గొంతులో ఆశ్చర్యం కళ్లకు కట్టినట్టు వినిపిస్తోంది.

టీవీలో పెద్ద స్క్రీన్‌పైన ప్రోమో వస్తోంది. తొమ్మిదిగంటలకు  ఫుల్ ఫుల్ మూన్.. భూమికి దగ్గరలో చంద్రుడు.

ఎస్.ఆర్.నాయుడు చిరరగ్గా ఫోన్ చేశాడు.

“శ్రీధర్ ఫుల్ ఫుల్ మూన్ ఏంటోయ్.. చక్కని తెలుగు పదమే లేదా.. నాన్సెన్స్…”

స్వాతి నవ్వింది.

“తెలుగులోనే మాట్లాడండి” అన్నది.

ఏ భాషలో మాట్లాడినా రేపు మనిద్దరం ఈ చానల్‌లో వుంటామా…” లేకపోతే ఆదికేశవులు డ్రాప్ అవుతాడా…” భుజాలు ఎగరేసింది స్వాతి.

“నేనయితె హోమ్ కే” అన్నది నవ్వుతూ..

***

 

శ్రీకాంత్ అద్దాల్లోంచి క్రిందకు చూస్తున్నాడు. స్ట్రీట్ చివరదాకా వరసగా వేసిన చెట్లనుంచి పసుపు పచ్చని పూలు ఒక్కటొక్కటీ రాలుతున్నాయి. అద్దాల్లోంచి చూస్తుంటే రోడ్డంటా పసుపు పచ్చని తివాసీలా ఉన్నది. అప్పుడే వచ్చిన ఉత్తరం జేబులోంచి తీశాడు. ఇంతకు ముందు చదివిందే. అక్షరం అక్షరానికి గుండె కొట్టుకుంటూనే వుంది.

శ్రీకాంత్ నువ్వంటే నాకెంతో గౌరవం. నీవంటే నమ్మకం. నాకే కాదు ఈ ప్రపంచంలో అందరికీ నమ్మకం. అవ్వాళ నేనొచ్చినప్పుడు మీరు ఓ ప్రోగ్రాం చేస్తున్నారు. క్రేన్ కెమేరాపైన కూర్చున్నతను మిమ్మల్నెందుకో పైకి వచ్చి ఆ లోకేషన్‌లో ఏదో అబ్జర్వ్ చేయమంటునారు. అతను కిందకు దిగాడు. నువ్వు క్రేన్ పైన ఎక్కావు. క్రేన్ మిమ్మల్ని పైకి తీసుకుపోయింది. చుట్టూ నిలబడ్డ అందరిలో మీ పట్ల ఎంతో ఆరాధన. ఆ రోజు స్ట్రీట్ ప్లే రికార్డ్ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో అసమానతలు పోవాలనీ, ప్రపంచం శాంతినే కోరుకుంటుందని, అసలు పిల్లలు ఎపుడూ ఎలాంటి యుద్ధాలని చివరకు అమ్మానాన్న పోట్లాడుకోవటం కూడా వాళ్ల మనసుని గాయపరుస్తుందనే అర్ధం వచ్చేలా మీరు యాంకర్‌కి బిట్ బిట్ ఇంట్రడక్షన్ చెబుతున్నారు. కెమేరా ముందుకు ఒక్కో అడుగు వేస్తూ యాంకర్ డైలాగ్ చెబుతోంది. అప్పుడు మీ మొహం చూశాను.  ఏముందా మొహంలో? .. జుట్టు చెదిరిపోయి గడ్డం పెరిగి అతి మామూలు పాంటూ షర్ట్. కానీ మీ మొహంలో నాకు కనిపించింది ఈ ప్రపంచాన్ని మొత్తం ప్రేమించే కరుణ, మనుష్యులంటే ఇష్టం, దయ, చుట్టూ వున్న వాస్తవాల్ని అర్ధం చేసుకొనే తెలివి. అందరూ శాంతిగా వుండాలంటే నేను సాయం చేస్తానన్న ఆతృత. ఇదంతా చూశాక మీలో .. ఓకే.. మా నాన్న అర్ధం చేసుకొన్నారు. కానీ మా అమ్మకి, అన్నయ్యకి ఎంతో ఆశ్చర్యం. మీ ఉద్యోగంతో నేనేం సుఖపడతాను అంటారు. నాన్న నాకోసం ఎంతో గొప్ప చదువుకొన్న సంబంధం చూశారు. నేను యు.ఎస్‌లో స్థిర పడవచ్చు. కానీ డియర్ శ్రీకాంత్ . మీతో జీవితంలో నాకు శాంతి ఉంటుంది. మీ తెలివితేటలు నాకు సొంతంగా కావాలి. జీవితంలో దేన్నయినా ఇతరులకోసం తృణప్రాయంగా త్యాగం చేయగల మీ మనస్సు, సాహచర్యం నాకు కావాలి. ఎదుటి మనిషి గౌరవం కోసం మీ తాపత్రయం, ఎవరు నొచ్చుకొన్నా మీకొచ్చే కోపం ఇదంతా నాకు ఎంతో ఇష్టం. చాలా త్వరలో నాన్న మీ దగ్గరకు వస్తారు. ఈ సమ్మర్లోనే మన పెళ్లి. పెళ్ళీకి కూడా  ప్రోగ్రామ్స్ అడ్డం వస్తున్నాయంటే మాత్రం నేనూరుకోను.

శ్రీకాంత్ నవ్వుమొహంతో లెటర్ జేబులో పెట్టుకొన్నాడు.

“ఏమిటి అంటోంది” అంటూ వచ్చాడు శ్రీధర్.

“ఏముంది సమ్మర్‌లో పెళ్ళి.. మనం అంటే మేడంకు గ్లామర్..”

శ్రీధర్ నవ్వాడు.

” ఆ గ్లామర్.. పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఏ పూటా వేళకి ఇంటికి రాకుండా ఏ నిముషం మన చేతిలో లేకుండా, పండగా, సరదాలు, పెళ్ళి  పేరంటం దేనికైనా సరే ఉద్యోగం చైనా గోడలా అడ్డంగా నిలబడుతుందని తెలియక పిచ్చిది సరదా పడుతోంది.ఔ

“మా దేవత చూడరాదూ. ఆవిడకి నాతో పోట్లాడటానికి ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్‌లు దొరుకుతాయి. చాలా కొత్త తిట్లు నేర్చుకొంది. ఒకే ఒక్క కోరికరా బాబూ వేళకి ఇంటికి రమ్మని. ఆ ఒక్కటీ అడగొద్దంటాను.”

“పెళ్లయితే మనం బుక్కయిపోతామా” అన్నాడు భయంగా శ్రీకాంత్.

“ఇంకో రకంగా నరుక్కొద్దాం బ్రదర్.. ప్రెస్.. ఈ ఐదక్షరాలకే ఈ దేశంలో కాస్త గ్లామరుందా? పోలీసులు ఆపరా, సినిమా టిక్కెట్లు, దేవుడి దర్శనాలు, గెస్ట్‌హౌస్ బుకింగ్‌లు, అడపాదడపా నమస్కారాలు, సెలబ్రిటీల ఫంక్షన్లు, ఫుల్ జోష్ భయ్యా.. నువ్వేం గాబరా అవకు. నే మంత్రం చెబుతాగా?” అన్నాడు శ్రీధర్.

“శ్రీధర్‌గారూ ఎక్కడున్నారు. వైజాగ్ రాజు ఫ్లాష్ ఇస్తున్నాడు ఇటు రండి సర్..” పిసీఅర్ నుంచి ఫోన్‌లో మొత్తుకొన్నాడు కంప్యూటర్ ఆపరేటర్.

“నిజంగా చావొచ్చినా ఆ యముణ్ణి ఫైవ్ మినిట్స్ ఆగమనాలిరా మగడా.. వస్తున్నా..” క్రిందకు పరుగెత్తాడు శ్రీధర్.

జేబులోంచి మళ్లీ ఉత్తరం తీసి పట్టుకొన్నాడు శ్రీకాంత్.

డియర్ శ్రీకాంత్…

 

 

– సమాప్తం –

అగరుపొగల వెచ్చలి

 

గుండెపొదిలోని శీతాంశుశరాలని చూసి జ్ఞాపకాల పక్షులు బెదురుతూ వచ్చి ఓ వరసలో కూర్చున్నప్పుడు-   చీలిన చంద్రబింబాల్లాంటి తన అక్షరాల అరచేతుల్లోని మబ్బు పింజలతో వాటికి నుదురు తుడుస్తాడు కవి.

అన్నిటికన్నా భాషే ఎక్కువగా బాధించిందని అశ్రురహిత దుఃఖంతో లోలోకాలుగా ఊగిపోతుంటాడు. “నీతో ప్రత్యేకంగా మాట్లాడటం నీకే కాదు నాకు కూడా శిక్షే, ఐనా నాలో ఎవరు ఆమెకు దాసోహమయ్యారో తేల్చుకోవాలి, గులాబియానంలో వెళ్ళిపోతున్న హేమంతానికి పుప్పొడి దప్పిక తీర్చిమరీ పంపాలి” అంటూ కొలనుకీ, ఏరుకీ నచ్చజెప్పి, జలజలా అవి దారికడ్డు తప్పుకున్నాక “రెప్పలకింద దాచుకున్న రెండు పావురాల్నుండీ ఇక రహదారులేవీ తప్పించుకోలేవు, అందుకేగా ఒక్క కళ్ల కోసం ఈ సమస్త దేహాన్నీ మోస్తూ తిరుగుతున్నది.” అనుకుంటూ వివశత్వాన్ని నిభాయించుకుంటాడు.

పసునూరు  శ్రీధర్ గారిలోని కవి “కొలనులోకి చేతులు జొనపకు పొద్దున్నే/అద్దం ముక్కలు గుచ్చుకుంటాయి” అని ఎవరో చెప్పగా విని మరో దారి లేక తన చుట్టూరా గాలిని వృత్తంగా తెగ్గోసి ఇక స్పృశించడానికేం లేదు అంతా స్పర్శాలోలత్వమే అనే నమ్మకం కుదిరాక, గిరులమీంచి దూకే భీకర ప్రవాహంలా కాక మోహపు పెదాల్ని తడిపే నాలుగైదు వానచినుకులుగా కవిత్వాన్ని చిలకరిస్తారు. ఆ వానలో కురిసిన అనేకవచనాల్లోని ఒక కవిత్వపు చినుకుని ఇక్కడ కొనగోటితో మీటుకుందాం!

 

మాయాదర్పణం

కన్రెమ్మల మీద వాలి

వడ్రంగిపిట్ట కోనేట్లో నీటిని చిలకరిస్తూ ఉంటుంది

ద్రవ వృత్తాలు ఒక కేంద్రం నుండి

వీడ్కోలు తీసుకున్నట్టుగా మభ్యపెడతాయి-

చీకటి కొమ్మకు వేలాడిన

దేహపంజరంలోకి

పొగవెన్నెలలా చొరబడిన పక్షి

తెరుచుకునే ఉన్న గవాక్షాల వంక కన్నెత్తైనా చూడదు!

వాక్య సర్ప పరిష్వంగంలో

చేతులు రెండూ వెనక్కి చుట్టుకుపోతాయి

రాత్రిని రెండు ముక్కలు చేసిన

దుప్పటి కిందే విశ్వమంత రాత్రి-

బయట చిన్ని శకలమొక్కటే

కాలిన కాగితంలా మబ్బుల మీంచి

దొర్లుతూ పోతుందనుకుంటా!

రావిచెట్టు గాలొక్కతే తురాయి శిరస్సును

జోకొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది-

ఒక తులాదండ భారంతో

భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే ఉంటుంది

మాయాదర్పణమై కోనేరు

మాంత్రికుడినే పాత్రను చేస్తుంది!

వెలుగురేకలు వెదజల్లబడిందాకా

స్వీయబంధనంలో పక్షి

తలమునకలవుతూనే ఉంటుంది-

***

 

వర్షధారకీ కోనేటి అలకీ మధ్య చినుకుల కప్పగంతులు, పిట్ట ముక్కుకీ చెట్టు బెరడుకీ మధ్య పుట్టే టకటక శబ్దం, గులకరాయి కదలికకీ నీటి నిద్రకీ మధ్య కలల్లాగా వలయాలు- మాయేనా?

దృశ్యాలపై మెత్తగా మూత పెట్టే పూరెమ్మల్లాంటి కనురెప్పలూ, చిప్పిల్లిన తుంపరని పైన చల్లుకునీ తడవని తామరాకులు, ఆకుకదలికల సడిలో రాలిపడే పక్షి ఈకలూ- దర్పణాలా?

ఆలోచనలు ఒక మూలం దగ్గర మొదలై వేటికవి సుడులుగా తిరిగి, కన్నీళ్ళూ వేదనా ఒక ఘటనలోంచి ఊరి బయటపడక లోలోపల ఆర్తితో లుంగలు చుట్టుకుంటూ “ద్రవ వృత్తాలు ఒక కేంద్రం నుండి వీడ్కోలు తీసుకున్నట్టుగా మభ్యపెడతాయి.” లాంతరు చిమ్నీ లోపలివైపు మంచు ఆవిరి తుడిచి ఒత్తి అంటించిన కాసేపటికి మెల్లగా వెలుతురూ, సెగ పరచుకునే వ్యవధిలో చల్లటి స్తబ్ధత కరిగిపోయి, చేతన మిణుకుమనే రెక్కలను పంజరపు గదినిండా చాపుకుని వ్యాపించి “తెరుచుకునే ఉన్న గవాక్షాల వంక కన్నెత్తైనా చూడదు”.

 sridhar

పెగలని పదాలు లోలోపల ఒకదానికొకటి అల్లుకుని చిక్కుపడిపోగా, తెమిలిన వాక్యాలు, అనేసిన మాటలు, చెప్పేసిన పంక్తులు బయటికొచ్చెయ్యడం వల్ల పరిపూర్ణమయిన బలంతో వక్తను పెడరెక్కలు విరిచి కట్టి పెనవేస్తాయి.  చేతుల ప్రమేయం లేక, చేతలుడిగి  మాట్లాడ్దం తప్ప మరేం చెయ్యలేని నిస్సహాయత ఆ బంధనం పొడుగునా పామై జలదరింపజేస్తుంది. ఆ స్థితినే కాబోలు “వాక్య సర్ప పరిష్వంగం” గా భావించి అప్రమత్తుడవుతాడు కవి.

రాత్రివేళ లోకంలోని చీకటంతా దుప్పటి కిందా, కళ్ల వెనకా చిక్కనై మిగిలిపోయిన ఏ కాస్త ముక్కో పల్చగా గది బయటి వెన్నెలకింద గాఢత కోల్పోయి లేతరంగుగా “కాలిన కాగితంలా మబ్బుల మీంచి” తేలుతూ ఉన్న సమయం. ఊరంతా సద్దుమణిగి జోగుతున్నప్పుడు కాపలాగా ఒక్క రావిచెట్టు ఆకుచప్పుళ్ల అడుగులతో పహారా కాస్తూ  నిద్రపట్టని ఏ ఒంటరి పిట్ట తలనో గాలి వేళ్లతో మెత్తగా నిమురుతుంది.

త్రాసులో పైకి లేచిన వైపుని విశ్వాన్ని ఆవరించుకున్న శూన్యానికి వదిలేసి, బరువెక్కిన వైపు మాత్రం తనవంతుగా తీసుకున్న భూమి కుంగిపోకుండా తులాదండ న్యాయం కోసం తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ అద్దంలా ప్రతిబింబాల్ని చూపే కోనేటికి నీడల్ని మోసి విసుగొచ్చిందేమో!  ఒక మాయగా, అనూహ్యంగా తానొక నీటిబొట్టుగా మారిపోయి ఒడ్డుపై నడుస్తున్న మనిషి కంటిపాపల్లో దాక్కుంటుంది. అలాంటప్పుడు “మాయాదర్పణమై కోనేరు మాంత్రికుడినే పాత్రను చేస్తుంది!” అని ఊహించడం ఒట్టి ప్రేలాపన కాదు.

“చీకటి కొమ్మకు వేలాడిన దేహపంజరంలోకి పొగవెన్నెలలా చొరబడిన పక్షి” తిరిగి తెల్లవారు ఝామున వెలుతురు కిరణాలుగా, రెమ్మలుగా, గింజలుగా అన్ని దిక్కుల నుండీ వెదజల్లబడటం చూసి తన రెక్కల దుప్పటిలో చుట్టేసుకున్న దేహాన్ని బంధవిముక్తం చేసి బయటికి ఎగరవేస్తుంది.

1swatikumari-226x300—బండ్లమూడి స్వాతికుమారి

*

 

 

భద్రలోకపు అడ్డుగోడలు కూల్చేసిన గొరుసు!

ఒక కొత్త కథను చదవడమంటే, ఒక కొత్త వ్యక్తితో పరిచయం చేసుకోవడమే అంటారు కొడవటిగంటి కుటుంబరావుగారు ఒకచోట. ఒక మనిషిని చూసీ చూడగానే మనకంటూ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అది సానుకూలమయినా కావచ్చు, ప్రతికూలమయినా కావచ్చు. కానీ ఆ మనిషిలో మన పరిచయం పెరుగుతున్న కొద్దీ అతని పట్ల మన అభిప్రాయాలు మారడమో, మరింత బలపడటమో జరుగుతుంది. నిజానికి ఒక మనిషిని అర్థం చేసుకోవడం అనేది ఒక లిప్తలో పూర్తయ్యే క్రియ కాదు. అది జీవితకాలం కొనసాగవలసిన ప్రక్రియ.

ఇలాంటి జీవిత కాలపు ప్రయత్నం కొన్ని కథల విషయంలో కూడా కొనసాగాలి. ఎందుకంటే ఆ కథలు చదివిన ప్రతిసారీ కొత్త అర్థాన్ని ఇస్తాయి. కొత్త కొత్త విషయాలను అవగతం చేస్తాయి. బాహ్య అంతర్లోకాల రహస్యాలను కొత్తకొత్తగా విప్పుతాయి. అందుకే అలాంటి కథలను మళ్లీ మళ్లీ చదవాలి.

ఈ సంవత్సర కాలంలో నేను మళ్లీ మళ్లీ చదివిన కథలు మూడు. ఒకటి దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ‘నల్లజర్ల రోడ్డు’, రెండు తల్లావజ్ఝల ‘వడ్ల చిలకలు’, మూడు గొరుసు జగదీశ్వర రెడ్డి ‘చీడ’. ఈ మూడు కథలకి రూపంలో, సారంలో, శైలిలో, శిల్పంలో ఎలాంటి సారూప్యములూ లేవు. వేటికవే ప్రత్యేకమయినవి.

gajaeetaraalu

‘వలసపక్షులు’ కథతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న కథకుడు గొరుసు జగదీశ్వర రెడ్డి. అతడి పాత కథల సంపుటి ‘గజ ఈతరాలు’ కొత్తగా చదవడం ఒక తాజా అనుభవం. ఆంధ్రదేశానికి ఆ మూలన ఉన్న విశాఖపట్నం, ఈ మూలన ఉన్న మహబూబ్‌నగర్‌, ఒక ఆంధ్ర, ఒక తెలంగాణ ప్రాంత జీవితంలోని చీకటి కోణాలని, ఆ చీకటి కోణాలు ఏర్పడటానికి ఉన్న సామాజిక ఆర్థిక కారణాలను, వాటి కార్యకారణ సంబంధాలను, సునిశిత దృష్టితో, సున్నితంగా వెలికి తీసిన కథా సంపుటి ఇది.

”జీవితం కొందరి పట్ల పరమ దయా పూరితంగా ఉంటుంది. మరికొందరి పట్ల కర్కశంగా ఉంటుంది. దాని ఆగ్రహమూ, అనుగ్రహమూ అకారణమే” అంటారు బుచ్చిబాబు ఒకచోట. ”వలస పక్షులు’ కథ చదువుతున్నంతసేపూ నాకు ఎందుకో కానీ ఈ మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి. ఈ కథలో విశాఖ మాండలికాన్ని, మహబూబ్‌నగర్‌ పలుకుబడిని ప్రతిభావంతంగా ఉపయోగించాడు జగదీశ్వరరెడ్డి.

‘విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు’ అన్న రాజకీయ నినాదం కొంతమందికి రాజకీయంగా పునర్జన్మ. మరికొంతమందికి అందలాలను ప్రసాదించింది. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రాణాలు కోల్పోయిన కొన్ని గ్రామాలు, అంతకు రెట్టింపు ప్రాణాలు ఇవాళ చరిత్రలో ఎక్కడా కానరావు. వాళ్ల పట్ల చూపించవలసిన కనీస గౌరవం కూడా సమాజం చూపదు. కాంట్రాక్టర్ల దోపిడీకి, దౌర్జన్యానికి బలైపోయిన రాములమ్మ కొడుకు. మరొక పేద తల్లి సహాయంతో పెరిగి పెద్దవాడై, అదే స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగం సంపాదించుకుంటాడు. ముప్పై ఏళ్ల క్రితం కాంట్రాక్టర్ల రూపంలో మొదలైన దోపిడే, ఔట్‌సోర్సింగ్‌ రూపంలో మళ్లీ కొత్తగా ఎలా రూపు మార్చుకున్నదో తెలిశాక, తన గత జీవితాన్ని సకారణంగా పునశ్చరణ చేసుకోవడం ఇందులో ఇతివృత్తం.

డబ్బుకి ఉన్న విలువకి తప్పిస్తే మరే విలువకీ కట్టుబడని ఆధునిక సమాజపు నగ్న స్వరూపాన్ని ఉత్తమ పురుషలో చెప్పిన కథ మనలను మంత్రముగ్థులని చేస్తుంది. రాములమ్మ మాటలు చదువుతున్నప్పుడు ఎంత నిరాశ నిస్పృహ కలుగుతాయో, ముత్యాలమ్మ మాటలు వింటుంటే జీవితం పట్ల అంత ప్రేమ, భరోసా కలుగుతాయి. జీవిత రథపు చక్రాల కింద పడి తనువు చాలించినది ఒకరయితే, దాన్ని సుదర్శన చక్రంలా వినియోగించుకుని కష్టాలను కడతేర్చినవారు మరొకరు. నిజానికి ఈ రెండు కేవలం పాత్రలు మాత్రమే కాదు, మనిషి మనసులో గారడి చేసే రెండు మార్మిక శక్తులు. ఒక దుఃఖం, ఒక సుఖం. ఈ రెండింటి మధ్యా దోబూచులాడటమే జీవితం అని ఈ కథ చెపుతుంది.

16(1)

అమెరికా సబ్‌ప్రైమ్‌ సంక్షోభానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయినట్లుగానే, ఎక్కడో ఒక చిన్న దురాశ, దురూహ, ఏ మాత్రం సంబంధం లేని ఎందరి జీవితాలనో దుర్మరణం పాలు చెయ్యడం ఒక వైచిత్రి. సునామీ వచ్చి వెళ్లాక కన్పించే విధ్వంసక దృశ్యాలు సునామీ వచ్చిందని బాధితులకు తెలియచెప్పినట్లుగానే, జీవితాలు సమూలంగా మారిపోయాక, జీవ విషం చేదు ఫలం అని అర్థం కావడమూ అంత విషాదం.

ఈ సంపుటిలో ‘చీడ’ కథ చదివాక గుండె బరువెక్కుతుంది. ఆల్విన్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవితం ఒక ‘సంతోష చంద్రశాల’ అనుకుంటూ భద్ర జీవనం గడిపే ఒక కుటుంబం, ఆ ఆర్థిక ఆసరా తమ ప్రమేయం లేకుండా చెయ్యిజారి పోతుందో, ఎలాంటి ఉత్పాతానికి గురి అవుతుందో సున్నితంగా చెప్పిన కథ ఇది.

ఉద్యోగం కోల్పోయి హఠాత్తుగా వీధిలో పడిన తరువాత కట్టవలసిన అప్పులు, నెరవేర్చవలసిన బాధ్యతలు కొండలా భయపెడుతుంటే, మామూలుగా స్థిర చిత్తులు అనుకునే పెద్ద పెద్ద వాళ్ళే సంయమనం కోల్పోయి జీవితాన్ని దుఃఖభాజనం చేసుకుంటుంటే, పసిపిల్లల సంగతి చెప్పేదేముంది?

మనుషుల మధ్యన ప్రేమ డబ్బుకొద్దీ పరిపుష్టమవుతుందా? మనుషుల మధ్యన సంబంధాలను కలుపుతూ, విడదీసి, విడదీస్తూ కలిపే ఊహా మేఘం ‘డబ్బు’ పాత్రను జీవితాలలో శూన్య స్థాయిని తీసుకుని రాలేమా? డబ్బు లేకపోతే మనుషుల మధ్య ప్రేమ మరీ అంత బలహీనంగా ఉండాలా? లాంటి ప్రశ్నలు ‘చీడ’ కథ చదువుతుంటే కలుగుతాయి.

ఈ కథలో అరవింద్‌, సుజాత ఇద్దరూ చదువుకున్న వారే! జీవన గమనం పట్ల అవగాహన ఉన్నవారే. వారే జీవితంలో వచ్చిన పెనుమార్పుకు తల్లడిల్లి చిగురుటాకుల్లా కంపించి పోతే, చిన్న పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది.

ఉద్యోగం ఉన్నప్పుడు అప్పుచేసి మరీ కట్టుకున్న ఇల్లు – పడకగది కిటికీని అల్లుకున్న ‘రేరాణి’, కాంపౌండ్‌ ముందున్న సంపెంగను ప్రధాన పాత్రలుగా చేసి చిట్టితల్లి అంతరంగ ఆవిష్కరణను, లలిత లలితంగా చేసిన కథ, చివరలో చిట్టితల్లి కోరికను తెలుసుకుని పాఠకుడు కళ్ల నీళ్ల పర్యంతం అవుతాడు.

ప్రపంచీకరణ విధానాలనే లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ విధానాలని ప్రపంచీకరణ విధ్వంసం గురించి తెలిసిన వాళ్లు ముద్దుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ప్రపంచీకరణకు మకర ముఖమే కానీ, మానవీయ ముఖం లేదని, లాటిన్‌ అమెరికా, అర్జెంటీనా అనుభవాలు చెప్పకనే చెపుతున్నాయి. అయినా వాటిపట్ల మక్కువ పెంచుకున్న రాజకీయ ఆర్థిక అధికారులకు, చిట్టితల్లి జీవితంలో ఎదురయిన సంక్షోభం గురించి ఎప్పటికయినా అర్థం అవుతుందా?

తల్లిదండ్రుల మధ్య సరైన సంబంధాలు లేకపోతే పిల్లలు ప్రేమరాహిత్యానికి గురి అవుతారు. ప్రేమరాహిత్యంలో పెరిగిన పిల్లలు ఎలాంటి భవిష్యత్‌ సమాజానికి సృష్టికర్తలు అవుతారు? ఈ ప్రశ్నను బలంగా వినిపించిన కథ ‘చీడ’.

పిల్లల ప్రపంచంలో లేనిదేమిటో ఎవరికయినా తెలుసా? కోపం, ద్వేషం, అసూయ. మరి పిల్లల ప్రపంచాన్ని వెలిగించేదేమిటి? ప్రేమ. పిల్లల లోకంలో కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. మనం పిల్లలకి ఎంత ప్రేమను యిస్తే వాళ్లు మనకు రెట్టింపు ప్రేమను యిస్తారు. ఒక మనిషిని ద్వేషించడానికి సవాలక్ష కారణాలు ఉండవచ్చు. అందులో పట్టుదల అనే రీజన్‌ కూడా ఉండవచ్చు కానీ ప్రేమించలేకపోవడానికి ఏ కారణమూ ఉండదు. జీవితంలో అసలయిన విషాదం ప్రేమించలేకపోవడమే.

ఈ విషయాన్ని బలంగా చెపుతుంది ‘వాచ్‌మాన్‌’ కథ? ‘గూర్ఖా’ పేరుతో ఎండ్లూరి సుధాకర్‌ ఒక మంచి కవిత రాశారు. అది ఎంతో మంది ప్రశంసలు పొందింది. ఆ తరువాత ఆ స్థాయిలో అనుభూతిని యిచ్చిన కథ ‘వాచ్‌మాన్‌.’ తమ అపార్ట్‌మెంట్‌కు అనునిత్యం కాపలా కాస్తూ, తమకు తలలో నాలుకలా ఉంటూ, తమ పనులన్నీ ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిపెట్టే వాచ్‌మాన్‌ అకస్మాత్తుగా చనిపోతే, అతని చివరి  సంస్కారం గురించి కులం, మతం, సంప్రదాయం అంటూ సాకులు వెతికిన పెద్దల చిన్న బుద్ధులను, వాళ్ల పిల్లలే అసహ్యించుకుని, తమ స్వచ్ఛ సుందర శుభ్రస్ఫటికం లాంటి మనసులకు మాలిన్యం అంటదని చెప్పిన కథే యిది.

పుత్రుడి గురించి చెప్పేటప్పుడు మన వేదాలు ‘అంగా అంగాత్‌ సంభ వసి’ అని ‘ఆత్మా వై పుత్ర నామాసి’ అని వ్యాఖ్యానించాయి. తల్లిదండ్రుల ప్రతి అంగంలో నుండి పిల్లల అవయవాలు రూపుదిద్దుకుంటాయని భావం. అలాంటప్పుడు పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమను ఏ ప్రేమమాపకంతో కొలవగలం. లోకంలో చెడ్డ కొడుకులు, చెడ్డ భర్తలు ఉండవచ్చు కానీ, చెడ్డ తల్లి మాత్రం ఉండదని అంటారు. ఈ మాటలకి, ప్రత్యక్ష ప్రతీకలుగా రెండు కథలు నిలుస్తాయి.

Gorusu(1)

ఒకటి ‘వాల్తేరత్త’, రెండు ‘గజ ఈతరాలు’.

చెడు వ్యసనాలకి బానిసయిన భర్తతో లాభం లేదనుకొని కొడుకు ఉన్నత భవిష్యత్తు కోసం తనకు తెలిసిన వడ్డీల వ్యాపారం చేస్తూ జీవితాన్ని కరిగించుకున్న వరాలమ్మ, కొడుకుకి సర్కారీ నౌకరు రావాలని జీవితాంతం కష్టపడి, ఆ ఉద్యోగం సంపాదించాక, తదనంతర పరిణామాల నేపథ్యంలో కొడుకుకి భారం కాకూడదనుకున్న పూర్ణమ్మ, రెండు ప్రత్యేక పౌనః పున్యాలలో తల్లి ప్రేమను విశదీకరిస్తారు.

”నానెంత వడ్డీ యాపారం సేసినా నానూ మడిసి జలమే ఎత్తాను. ఆడపుట్టకే పుట్టి పాలిచ్చే పెంచాను. నా పేగు తీపి వొవులికి అరదమవుతాది బాబూ! నా సిమ్మాసెలం ఒచ్చేత్తాడొచ్చేత్తాడని నా మనసంతాది బాబూ! ఆడెక్కడున్నాడో కానీ… ఆడి పేగోసన అప్పుడప్పుడూ నా ముక్కుకి తగలతాది బాబూ” అంటుంది వాల్తేరత్తలో వరాలమ్మ.

సింహాచలం ఆమెను దగా చేసి వెళ్లిపోయాడు. అయినా వాడెప్పుడో వస్తాడని ఆమె ఎదురుచూపు, పేగు కదలిన చప్పుడు వినడం ఏ చర్మ చక్షువుకు సాధ్యపడుతుంది.

కొడుకు పెద్దవాడయ్యాడు. తన రెక్కల కష్టం కొడుకు గవర్నమెంటు ఉద్యోగస్తుడు కావాలన్న తన కోరికను తీర్చింది. చివరి క్షణాలు కొడుకు దగ్గర ఆనందంగా గడుస్తున్నాయి కూడా. కానీ పులిమీద పుట్రలాగా కంపెనీ మూతపడింది. నూతన ఆర్థిక విధానాల ఫలితంగా పనిచేసే కంపెనీ ప్రయివేట్‌ పరం అయింది. లిబరలైజేషన్‌, ప్రవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌ కాస్తా లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌గా మారి కొడుకు జీవితాన్ని బుగ్గిపాలు చేశాయి. దానికితోడు తనకు వచ్చిన జబ్బుకి కావలసిన మందులు కొడుకుకు అదనపు భారం కాకూడదు అనుకున్నది.

”ఊర్లందరికీ ఈత నేర్పి, ఈదరాకుండా రెండు కాళ్లకు బండరాళ్లను కట్టుకున్నది…. బలిమిసావు సచ్చె కొడుకా…” ఈద గలిగి ఉండీ బలవంతంగా ప్రాణం తీసుకోవడం వెనక ఉన్న విషాదం ఏ ప్రపంచ బ్యాంకు ప్రాయోజిత ప్రపంచీకరణ కథ సారథులకు అందుతుంది?

వాల్లేరత్తలో వరాలమ్మ, గజ ఈతరాలులో పూర్ణమ్మ. వీళ్ళిద్దరి ప్రేమ ఏ నిర్వచనానికి అందుతుంది? తమ కొడుకులు సుఖంగా ఉంటే తాము సుఖంగా ఉన్నట్లే అన్న వాళ్ల తాత్వికత, అందుకోసం తమ జీవితాలని త్యాగం చెయ్యడం ‘అంగారంగాత్‌ సంభ వైసి’ అన్న వాక్యానికి నిలువెత్తు దర్పణంలాగా లేదూ? ‘ఆత్మా వై పుత్ర నామసి’ అంటే ఇదే కదా!

ఇలా ఈ సంపుటిలోని ప్రతి కథ గురించీ వివరంగా రాయొచ్చు. మొత్తంగా ఈ కథలు-

1. ప్రపంచీకరణ మధ్య తరగతి జీవితాలలో సృష్టించిన విధ్వంసాన్ని దృశ్యమానం చేస్తాయి. డబ్బు లేనప్పుడు కూడా మనుషుల మధ్య ప్రేమానుబంధాలు ఉంటాయి కానీ… అవి గుర్తించలేనంత బలహీనంగా ఉంటాయి అన్న విషయాన్ని తేటతెల్లం చేస్తాయి.

2. జీవితం ఏ నిర్వచనాలకీ లొంగదని, నాటకీయత లేదా ఐరనీ దాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటాయని చెప్పకనే చెపుతాయి.

3. అపార్ట్‌మెంట్‌ పిల్లల రూపంలో జీవితం పట్ల ప్రేమనీ, బ్రతుకు భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని కలిగిస్తాయి.

4. సున్నితత్వం లోపల ఉంటే గోరంత వెలుగే కొండంత దీపమై దారి చూపిస్తుందని అనుభవంలోకి తెస్తాయి. ఒక సందిగ్ధ కాలంలో రాష్ట్రంలోని రెండు విభిన్న ప్రాంతాల, ప్రజల అంతరంగ కల్లోలాన్ని సున్నితంగా స్థానిక స్పహతో అక్షరబద్ధం చేసిన కథలు ఇవి.

  – వంశీకృష్ణ

———————————————————————————————–

చీడ

-గొరుసు జగదీశ్వర్ రెడ్డి

 

 

నా పేరు సంపంగి. ఎనిమిదేళ్ళ క్రితం సింహాచలం నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అడుగు ఎత్తులో మొక్కగా ఉండేదాన్ని. పదహారడుగుల మానుగా పెరిగాను. ఇప్పుడు నా పూలని కోయాలంటే వంకీ కత్తి కట్టిన పెద్ద వెదురు బొంగు అవసరం మీకు. అదే నా చిట్టి తల్లి వచ్చి, నా కింద నిల్చుని దోసిలి పట్టిందంటే జలజలమని పూలవర్షం కురిపిస్తాను. ఎందుకంటే చిట్టితల్లి మాకందరికీ ప్రాణం.

నేను వచ్చిన కొత్తలో ఈ తోటంతా పచ్చగా కలకలలాడేది. నాతోపాటు ఎన్నోరకాల పూలమొక్కలు, పండ్ల చెట్లు ఉండేవి.

ఇంటి ముందు నుండి ఎవరు వెళ్ళినా, మా సౌరభాలకు మత్తెక్కినట్లు ఒక నిముషంపాటు నిల్చొని శ్వాస ఎగబీల్చి వెళ్ళేవారు. విషాదమేమంటే అలా ఆస్వాదించిన వాళ్ళే రెండేళ్ళుగా ఏదో కాలిన వాసన వేస్తున్నట్లు ముక్కుకు అడ్డుగా చేతిరుమాలు పెట్టుకొని గబగబ వెళ్ళిపోతున్నారు.

ఇప్పుడు నన్నల్లుకున్న మాధవీలత, కిటికీ దగ్గరున్న రేరాణి, నా మొదలు దగ్గరున్న డిసెంబరం పొద, రెండు మూడు రకాల తెగులుపట్టిన పండ్ల చెట్లు తప్పించి… తోటంతా బోసిపోయింది.

*

గాలికి అటూ, ఇటూ ఊగుతున్న నేను గేటు చప్పుడుకి అటుకేసి చూసేను. లోపల్నుండి వేసిన గడియని అందుకోవాలని మునివేళ్ళపై నిల్చుని తీసే ప్రయత్నంలో ఉంది చిట్టితల్లి.

భుజాలపై వేలాడే పది కేజీల పైనే బరువున్న పుస్తకాల సంచీని, చేతిలోని కేరేజ్‌ బుట్టనీ దభీమని వరండా అరుగుపైన విసిరేసింది.

ఇంటికి తాళం వేసి ఉంది. అక్కడే పడున్న షూ జతల్లో తాళం చెవికోసం వెతికింది. దొరికినట్టు లేదు. గబగబ గేటుదాకా వచ్చి అన్నయ్య కోసం కాబోలు అటూ, ఇటూ చూసింది. వాడి అలికిడి ఎక్కడా ఉన్నట్లు లేదు.

విసురుగా వెనక్కి వచ్చి వరండా మెట్లపైన కూర్చొని, మోకాళ్ళ మధ్యకి తలను వాల్చేసి ఉబికి వచ్చే దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది.

అరగంట ముందే వచ్చిన శ్రావణ్‌ స్కూల్‌ బేగ్‌ని ఇంట్లో పడేసి, బేట్‌ పట్టుకొని క్రికెట్‌ ఆటకోసం పరిగెట్టడం చూసేను. ఇంటికి ఎవరు తాళం వేసినా చెవిని తలుపు పక్కనున్న చెప్పుల అరలోని ఏదో ఒక షూలో రహస్యంగా దాచి వెళ్ళడం అలవాటు.

చిట్టితల్లి కన్నా శ్రావణ్‌ మూడుళ్ళు పెద్ద.

చిట్టితల్లి ఆరున్నొక్కరాగానికి నా గుండె కరిగిపోతోంది.

ఎంత మారిపోయిందీ పిల్ల! స్కూలు నుండి రావడంతోనే మమ్మల్ని పలకరించి, ముద్దాడి కబుర్లు చెప్పిగానీ వరండా మెట్లెక్కేది కాదు. అలాంటిది, మా ఉనికే తెలీనట్లు ప్రవర్తిస్తోంది. ఎప్పుడూ గలగల మాట్లాడ్తూ, కిలకిల నవ్వుతూ గెంతులేసే మా చిట్టితల్లేనా! ఏదో గాలిసోకినట్లు రోజురోజుకీ ఎలా క్షీణించిపోతోందీ…

నే వచ్చేసరికి చిట్టితల్లి మూడేళ్ళ పిల్ల. తేనె కళ్ళు, గులాబీ బుగ్గలు, బీరపువ్వులా పసుపు ఛాయతో బొద్దుగా ఉండి, గునగున నడిచేది.

ఇప్పుడు చిట్టితల్లికి పదో ఏడు.

ఛాయ తగ్గి, సన్నబడి, ఒంటరితనంతో దిగులుగా ఉంటోంది.

ఆ ఏడుపు నాకు రంపపుకోతలా ఉంది. నా తల్లిని పట్టించుకునే వాళ్ళేరీ? ఏం చేయాలో పాలుపోవడం లేదు.

”అయ్యో, అలా ఏడవకమ్మా, నా బంగారుతల్లివి కదూ, ఇలారా, నే తొడిగిన మొగ్గలు చూడు. రేపు పూస్తాగా, నే పూచేది నీ కోసమేరా…”   బతిమాలుతూ పిలవాలని పించింది.

ఎదురింటావిడ వచ్చి పిల్చింది. అన్నయ్య వచ్చేదాకా వాళ్ళింట్లోనే ఉండమంది.

”ఆకలేస్తోంది మమ్మీ, డాడీ రాత్రి ఎప్పుడొస్తారో తెలీదు. అన్నయ్య ‘కీ’ తీసుకెళ్ళాడు. బోల్డంత హోంవర్క్‌ చేసుకోవాలి” ఆమె మాటకి వెక్కిళ్ళ మధ్యే ఆగి ఆగి సమాధానం ఇస్తోంది.

మెల్లగా తన కాళ్ళకున్న షూ విప్పి, ఆపైన మేజోళ్ళు తీసి వాటిలోనే ఉంచి పక్కకు గిరాటేసింది.

కళ్ళు తుడుచుకుంటూ లేచి నిల్చుంది.

మళ్ళీ ఒకసారి గేటువైపు నడిచింది. కాస్సేపు అక్కడే ఉండి, వీధిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూసి, ఆ తర్వాత నా దగ్గరగా వచ్చి నిల్చుంది.

”నన్ను మర్చిపోయావు కదూ” నా మాట అర్థమయినట్టు జవాబుగా తన రెండు చేతుల్తో నన్ను చుడ్తూ తన గుండెలకేసి హత్తుకుంది. ఆ స్పర్శకు ఒళ్ళంతా పులకరించింది. ఒక్కసారిగా ఏడ్చేశాను. ఇద్దరం ఆత్మీయంగా గొప్ప అనుభూతితో చాలాసేపు మౌనంగా ఉన్నాం. ముందుగా నేనే తెప్పరిల్లి-

”చూడు నా తోటి మొక్కలన్నీ ఎలా ఎండిపోతున్నాయో! చిగుళ్ళు ఎలా వాడిపోతున్నాయో! మా గురించి ఎవరూ పట్టించుకోరు. చివరకు నీవు కూడానూ, నీ చేతుల్తో నీళ్ళు పోసి ఎంత కాలమయిందీ, నేనింకా ఎవరికోసం బతుకుతున్నానో తెలీదూ? చేమంతులూ, విరజాజీ, పారిజాతం.. వాటిలాగే చివరకు నేనూ నీకు దూరం అవుతాను. అదిగో మీ కిటికీ దగ్గరున్న రేరాణి ఎలా కొన ఊపిరితో ఉందో!  నీవు స్కూల్లో నుండి రాగానే నీకు పండ్లను అందించే జామకు తెగులుపట్టి ఎన్నాళ్ళయ్యిందో…” నా ఆత్మఘోషను నా చిట్టితల్లికి ఎలా చెప్పను?

చిట్టితల్లి వంక పరిశీలనగా చూసేను. కళ్ళల్లో తెలియని భయం, ఎండుతున్న పెదాలు దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు, మొద్దుబారుతున్న శరీరం.

”చర్మం చూడు, ఎలా పగిలిపోయి ఉందో, వెన్న రాయమని మమ్మీతో చెప్పమ్మా” నా మనసు చదివినట్టు పగిలిన చర్మంకేసి దిగులుగా చూసుకుంది.

తన ఆరోగ్యం గురించి పట్టించుకునే వాళ్ళేరీ!

మెల్లగా నిల్చొని, మళ్ళీ వరండా మెట్లపైన కూర్చోడానికి వెళ్ళింది.

చూస్తుండగానే ఆవలిస్తూ, అలాగే వెనక్కి వాలి ఒరిగి కళ్ళు మూసుకుని పడుకొంది. ధనుర్మాసపు చలికి వణుకుతున్నట్లు ముడుచుకుపోతోంది చిట్టితల్లి. చెల్లాచెదురైన చెప్పులు, బాగ్‌లోంచి వీడిన పుస్తకాలు, కేరేజీ ఎంగిలి గిన్నెలు – మధ్యలో నా చిన్నారి, అయ్యయ్యో! దోమలు స్వైరవిహారం చేస్తూ, రక్తం పీల్చేస్తున్నాయి కదా… దోమల్ని పారదోలమని గాలిని బతిమాలుకున్నాను.

శ్రావణ్‌ త్వరగా వస్తే బావుణ్ణు.

రాత్రి అయినట్లు తెలుస్తోంది. వీధిలోని ట్యూబ్‌లైట్‌ కాంతి ఇంటి గోడపైన పడుతోంది. ఆడుకొంటోన్న పిల్లల్ని ‘ఇక ఆటలు చాలించి, చదివి చావండి’ అంటూ తల్లుల గర్జనలు విన్పిస్తున్నాయి. అడపాదడపా ఏవో వాహనాలు వెళ్తున్న శబ్దం.

తూర్పున చంద్రోదయం అయినట్లు నాకు కొద్దిదూరంలో ఉన్న మామిడి చెట్టు ఆకుల్లోంచి వెన్నెల చిట్టితల్లి మొహంపైన ఊగుతోంది.

ఎంత సందడిగా ఉండే ఇల్లు… ఎట్లా మారిపోయింది!

మళ్ళీ ఆ రోజులు వస్తాయా?

*

నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు… అంతా కొత్తగా, దిగులుగా ఉండేది. కానీ మేము పూచే పూలలాంటి చిట్టితల్లి ఈ ఇంట్లో ఉందని తెలిసి సంతోషం వేసింది. నాతోపాటే గులాబీ, పారిజాతం వచ్చాయి.

మేం వచ్చేసరికి మామిడి, జామ, సపోట, దానిమ్మ ఆరునెలల వయసువి, తొలకరిలో వచ్చాం. తీరా కార్తీకానికి మల్లి, చేమంతి, రేరాణి, నూరు వరహాలు వచ్చాయి.

అరవింద్‌, సుజాత ఇద్దరూ గునపంతో గుంతలు తవ్వడం, మమ్మల్ని నాటడం, శ్రావణ్‌, చిట్టితల్లి బకెట్లతో నీళ్ళు తెచ్చి, చిట్టిచిట్టి చేతులతో మాకు పోయడం… ఎంత సుకుమారంగా పెంచారనీ మమ్మల్ని.

మా గురించి అందరూ శ్రద్ద తీసుకునేవాళ్ళే. మేం పూచే పువ్వుల్ని ఫొటోలు తీసి, ‘ఎంత అందంగా వచ్చాయో’ అంటూ ఇంటికి వచ్చిన మిత్రులకు చూపిస్తూ పొంగిపోయే అరవింద్‌ ఇంత నిర్దయగా ఎలా మారిపోయాడు!

అరవింద్‌ ఉద్యోగం చేస్తున్న కంపెనీ సొసైటీ తరపు నుండి కొత్తగా కట్టుకున్న ఇల్లు. ఎల్‌.ఐ.సి లోనుతో ఆ కాలనీలో దాదాపు వెయ్యి ఇండ్లదాకా కట్టారు. ఎవరెవరి స్తోమతని బట్టి వాళ్ళు ఇంటిని రకరకాలుగా తీర్చిదిద్దుకుంటున్నారట.

నన్ను ఇంటికి తీసుకొస్తున్నప్పుడు గమనించాను. వీధులకు అటు ఇటుగా పూచి ఉన్న తురాయిలూ, దిరిసెనలూ కాలనీకి ఎంత అందంగా ఉన్నాయో!

నేను వచ్చేసరికి ప్రహరీగోడ పూర్తి కావస్తోంది. మేం రాకముందే పది ట్రాక్టర్ల ఎర్రమట్టిని, రెండు ట్రాక్టర్ల పశువుల ఎరువుని పోయించి చదును చేయించాట్ట. అరవింద్‌కి మొక్కలంటే ప్రాణం. తలపాగా చుట్టి అచ్చం రైతులా పార, గునపం, కత్తెర్లతో పెరట్లోకి వచ్చేవాడు. మాకు కుదుర్లు కడుతూ, గొప్పులు తవ్వుతూ, అడ్డుగా పెరిగే మమ్మల్ని అందంగా కట్‌ చేస్తుండగా లోపల్నుండి కాఫీ కప్పుతో వచ్చేది సుజాత. తనూ పనిలో పాలు పంచుకోబోయేది.

”గార్డెన్‌ వర్కంతా నాదే, కిచెన్‌ వరకే నీ పరిధి” అంటూ సుజాతని పని చేయనిచ్చే వాడు కాదు. కాస్సేపు ఇద్దరూ సరదాగా ఒకర్నొకరు గిల్లికజ్జాలు పెట్టుకునేవారు. పెరట్లో వాళ్ళిద్దరూ అలా చిలకా గోరింకల్లా తిరుగుతూంటే తోటంతా కళకళలాడేది. అంతలో స్కూల్‌ నుండి శ్రావణ్‌, చిట్టితల్లి వచ్చేసి మాకు నీళ్ళు పోయడానికి తయారయ్యేవాళ్ళు.

ఒక్కోసారి పైపుని కొళాయికి తగిలించి, మాకు స్నానం చేయించేది చిట్టితల్లి… మేం ఆ నీటి వేగానికి ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయి, ఉక్కిరిబిక్కిరై అటూ, ఇటూ ఊగుతుంటే కిలకిలమంటూ పడీపడీ నవ్వేది.

నేను వచ్చిన ఏడాదికే పెరడంతా పచ్చగా మెరిసిపోయింది.

రాత్రనక, పగలనక మేం పూచే పూలవంక మురిపెంగా చూస్తూ, పండుటాకుల్ని  ఏరిపారేస్తూ కబుర్లు చెప్పేది చిట్టితల్లి. ‘పురుగూ, పుట్రా ఉంటాయి. పెరట్లోకి వెళ్ళొద్ద’ని మందలించే సుజాత మాటల్ని అంతగా పట్టించుకునేది కాదు.

సాయంకాలం నీరెండలో అరవింద్‌ చిట్టితల్లితో కలిసి ఆడుకుంటున్నప్పుడు… ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగిరే కొంగల్ని చూపిస్తూ, అవి ఎక్కడికి వెళ్తున్నాయనీ, చీకటి రాత్రుళ్ళలో తళతళ మెరిసే నక్షత్రాల్ని చూపిస్తూ అవి ఎందుకలా మెరుస్తున్నాయని లక్ష ప్రశ్నలు వేసేది.

ధృవుడు, గొరుకొయ్యలు, పిల్లలకోడి, మంచంకోళ్ళు… ఒక్కో నక్షత్రం చూపించి, వాటి గురించి చెబుతూ ఉండేవాడు. సప్తరుషి మండలంలోని అరుంధతీ నక్షత్రాన్ని చూపించి ఆమె కథ గురించి చెప్పాడు.

”అది మా స్కూల్‌ మేడమ్‌ పేరు కదా, ఆ స్టారుకు అరుంధతి అని పేరు ఎవరు పెట్టారు?” అంటూ ప్రశ్నించేది.

స్కూల్‌కి వెళ్ళే ముందు వాళ్ల క్లాస్‌ టీచర్ల కోసం ఎక్కువగా గులాబీలు కోసుకెళ్ళేది. నేనప్పటికి ఇంకా మొగ్గలు తొడగలేదు.

ఒకరోజు స్కూల్‌ నుండి రాగానే, డ్రస్‌ తీసి, గౌను వేసుకొని, టవల్‌ని చుట్టుకొని కుడివైపు పైటేసుకుంది. లోపల్నుండి కుర్చీ ఒకటి తెచ్చి మా మధ్యలో వేసింది. గేటు బయటకి వెళ్ళి రోడ్డు పక్కనున్న కానుగ కొమ్మ విరిచి బెత్తంలా తయారుచేసింది.

నిశ్శబ్దంగా చిట్టితల్లి చేష్టలని గమనిస్తున్నాం. గాలి కుదుపులకు మేమంతా ఒక్కసారిగా అటూ, ఇటూ ఊగేసరికి ”సైలెన్స్‌, సైలెన్స్‌” అంటూ చేతిలోని బెత్తాన్ని ఊపింది. అచ్చంగా వాళ్ళ టీచర్‌ మల్లే, తెచ్చిపెట్టుకున్న గంభీరంతో. ‘నేలకు జానెడుంది. పొట్టి బుడెంకాయ టీచరమ్మ మాకొద్దు.’ చిట్టితల్లి బెత్తం దెబ్బకు తమ రెమ్మలు గాల్లోకి ఎగిరాయన్న కోపంతో చిందులు తొక్కాయి దవనం, మరువం.

”ష్‌… తప్పర్రా. ఇదంతా ఉత్తుత్తినేరా” ఇద్దర్నీ బుజ్జగించాను.

”ఆఁ, ఎవరెవరు హోంవర్క్‌ చేయలేదో చేతులెత్తండి”

”హోంవర్క్‌ అంటే” నావైపు వంగి అడగబోయింది మందారం.

”ష్‌… సైలెన్స్‌”

”ఇదిగో పారిజాతం, నిన్న ఇచ్చిన లెక్కల హోంవర్క్‌ చేసావా?”

”చేమంతీ, నీ సైన్స్‌ హోంవర్క్‌ ఏదీ?”

”మందారం నీకసలు బుద్ధిలేదు. ఆ బొండుమల్లితో మాటలేమిటీ”

”డిసెంబరం నిన్నటి ఇంగ్లీషు గ్రామర్‌ కంప్లీట్‌ చేసావా?” తన చేతిలోని బెత్తంతో సన్నగా చరిచేది.

కాస్త నెప్పిగానే ఉన్నా చిట్టితల్లి ఆరిందాతనానికి ముచ్చటేసేది. అది మొదలు రోజూ స్కూల్‌ నుండి రాగానే మాకందరికీ పాఠాల్తోపాటే రయిమ్స్‌ పాడించడం, డాన్స్‌లు చేయించడం… ప్రతిరోజూ చిట్టితల్లితో ఆటల్లో పండగే.

పెరట్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకున్న బంతులు, లిల్లీలు మా ఆటలు గమనిస్తూ గాలికి లయగా తమ సన్నని నడుములు వయ్యారంగా ఊపుతూ ఆనందంగా డాన్స్‌లు చేసేవి.

శ్రావణ్‌ ఒక్కోసారి గేటు బార్లా తీసి వెళ్ళేవాడు. వీధిలోని పిల్లలంతా బిలబిలమంటూ వచ్చేసేవారు. గడుగ్గాయిలు. తిన్నగా ఉంటారా! మమ్మల్ని నలిపి, గిల్లి చిగుళ్ళు తుంచి నానా రభస. ఇంతలో సుజాత వచ్చి అరిస్తే మమ్మల్ని వదిలి పరిగెత్తేవాళ్ళు.

నా గుబుర్లలో ఓ బంగారు పిచిక నారతో గూడు అల్లటం నేను మరవలేదు. ఆవగింజంత మెదడైనా ఉందో లేదో గాని, దాని తెలివేం తెలివనీ! రెండు ఆకుల్ని కలుపుతూ తెల్లని జిగురు పామింది. ఆ ఆకుల మధ్యనుండే నారను తాడులా పేనుతూ, చిన్న వెలక్కాయంత సైజులో గూడు అల్లి రెండు గుడ్లు పెట్టింది. అవి పిల్లలు అయ్యాక చూడాలి నా అవస్థ. ‘కిచకిచకిచకిచ’ క్షణం నిద్రపోనిచ్చేవి కాదు కదా! అప్పుడు నా ఎత్తు మూడు అడుగులే. చిట్టితల్లికి నేను బాగా అందేదాన్ని.

చిట్టితల్లి తడతడవకీ రావడం, నా గుబుర్లు విడదీసి, పిచిక పిల్లల్ని మురిపంగా చూస్తూ ముద్దాడటం… తొండలు, పిల్లులూ వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడేదాన్నో. గూడు మూడో కంటికి తెలీకుండా కొమ్మల్తో కప్పేసేదాన్ని.

రాత్రుళ్ళు మాపైన రాలిన మంచు బిందువుల్ని ముక్కుల్తో పొడిచి నీరు తాగేవి. అప్పుడు మాత్రం భలే కితకితలుగా ఉండేది.

మా పూలలోని మకరందం తాగి తాగి మత్తెక్కిన సీతాకోకచిలుకలు, తుమ్మెదలు కదల్లేక కదల్లేక గాల్లో పల్టీలు కొడ్తూ ఎగిరేవి. మా పూలపుప్పొడి రజన తాపడంతో వాటి శరీరాలు ధగధగ మెరుస్తూ కాంతులీనేవి.

ఒకరోజు హఠాత్తుగా పిల్లల్ని తీసుకొని బంగారుపిచుక ఎగిరిపోయింది. చిట్టితల్లి పిచికలు కావాలని పేచీ పెట్టింది.

”వాటికి రెక్కలొచ్చాయి కదా. ఎన్నాళ్ళని తల్లి తెచ్చి పెడుతుంది. తిండి ఎలా సంపాదించాలో నేర్పించడానికి పిల్లల్ని తీసుకెళ్ళింది. మళ్ళీ వచ్చేస్తాయిగా” అంటూ అరవింద్‌ ఊరడించాడు. కానీ ఎన్నాళ్ళయినా పిచికలు రానేలేదు.

తెలతెలవారుతుండగా జాంపళ్ళు కోసం వచ్చే చిలుకల్ని చూపించాడు చిట్టితల్లికి. వాటిని చూస్తూ నెమ్మదిగా బంగారు పిచికల్ని మరిచింది. తూనీగల గాజురెక్కల రెపరెపల్ని చూస్తూ మురిసిపోయేది చిట్టితల్లి.

మేం ఎందరం ఉన్నా మేడ మీదకి పాకించిన రాధామనోహరాలంటే చాలా ఇష్టం తనకి. పొడవైన కాడల్తో, ఎరుపు, తెలుపు రంగుల్లో గుత్తులుగా పూసే ఆ పూలని అందుకోవాలని ప్రయత్నించేది. గాలికి రాలిన వాటి కాడల్తో జడలల్లేది.

ఉడతలు మా పొదల్లో దాగుడుమూతలాడుతూ చిట్టితల్లి రాగానే మామిడిచెట్టు ఎక్కేసేవి. ఇంటికి నైరుతివైపు అరటి చెట్లు ఉండేవి. అవి గెలలు తొడిగినప్పుడు, అరటిపూలలోని తేనె కోసం గబ్బిలాలు గుంపుగా వచ్చేవి. వాటిని చూస్తూనే చిట్టితల్లి హడలిపోయి, ఇంట్లోకి పారిపోయి దాక్కునేది.

‘అరటిపూలల్లో అమృతం దాచుకున్నట్లు మాయదారి గబ్బిలాలు, దిక్కుమాలిన గబ్బిలాలు, చిట్టితల్లిని జడిపిస్తున్నాయి కదా.’ కాయలు పెరిగి, పూత రాలేకొద్దీ…రావడం తగ్గించేశాయి.

చిట్టితల్లిని నేనెంత ప్రేమించేదాన్నో- అంతకన్నా ఎక్కువగా ప్రాణం వదిలేది మేమంటే… ఆరోజు సుజాత, అరవింద్‌ పిల్లల్తో కలిసి తోటలో  దాగుడుమూతలు ఆడుతున్నారు. ఈసారి సుజాత వంతు వచ్చింది. కళ్ళకు గంతలు కట్టారు. సుజాత దొంగ అనగానే అరవింద్‌ కేరింతలు కొట్టాడు. సరదాగా గిల్లి ఏడిపించవచ్చని. వాళ్ళిద్దరి సరాగాలు చూస్తే మాకెంతో ముచ్చటేసింది. ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమని… అరవింద్‌, పిల్లలిద్దరూ దొరక్కుండా చప్పట్లు చరస్తూ పరుగులు తీస్తున్నారు. అంతలో పక్కనే ఉన్న డిసెంబరంపై కాలు వేసింది సుజాత. అది గమనించిన చిట్టితల్లి –

”మమ్మీ, నా డిసెంబరాన్ని తొక్కేశావు. చూడు ఎలా విరిగిపోయిందో” గట్టిగా అరుస్తూ పైకి లేపింది.

”సారీ డిసెంబరం” కళ్ళకు గంతలు విప్పుతూ అంది సుజాత.

తల్లి వైపు కోపంగా చూస్తూ శ్రావణ్‌తో గుడ్డ తెప్పించి, తడిపి, విరిగిన కొమ్మ వద్ద కట్టు కట్టింది. చిట్టితల్లి ప్రేమకు మేమంతా కరిగిపోయాం.

ఇంట్లోని విషయాలు, అరవింద్‌, సుజాతల మధ్య జరిగే సంభాషణలు ఎక్కువగా రేరాణి ద్వారా తెలిసిపోయేవి. రేరాణి వాళ్ళ పడగ్గదిని ఆనుకునే ఉండేది కదా… చెవులు రిక్కరించి మరీ విని, గాలితో కబుర్లు పంపేది.

చిట్టితల్లి రోజూ వాళ్ళ మమ్మీ డాడీలపైన చేతులు వేసి, అరవింద్‌తో కథలు చెప్పించుకొని గానీ పడుకోదట. ఏరోజు ఏ కథ చెప్తాడో రేరాణి మళ్ళీ ఆ కథ నాకు విన్పించేది.

నా చిట్టితల్లి పుట్టినరోజు వచ్చిందంటే ఎంత సందడనీ, ఆకాశంలోని నక్షత్రాలన్నీ నేలకు దిగివచ్చినట్లు మమ్మల్ని చిన్నచిన్న లైటు బల్బులతో అలంకరించి అరవింద్‌ ఎంత హడావుడి చేసేవాడో! మా మధ్య రౌండు టేబుల్‌ వేసి, అందమైన ముఖమల్‌ గుడ్డ కప్పి, ఆ పైన పెద్ద కేక్‌ కట్‌ చేయించేవాడు.

వీధిలోని పిల్లలు, కంపెనీలో కొలీగ్స్‌ అంతా వచ్చేవారు. వాళ్ళు తెచ్చిన బహుమతుల్ని ఎంతో మురిపెంగా మాకు చూపించేది చిట్టితల్లి.

చూస్తుండగానే నేను ఇంట్లోకి వచ్చి రెండేళ్ళు దాటింది. నేను చిట్టితల్లికి అందనంతగా ఎదుగుతున్నాను. మాధవీలతను నా కొమ్మలకు పాకించారు.

మామిడి, దానిమ్మలు అప్పుడప్పుడే పిందెలు వేస్తున్నాయి.

ఈమధ్య అరవింద్‌ డ్యూటీ అవగానే ఇంటికి రావడంలేదు. ఎక్కడెక్కడో తిరిగి రాత్రి ఏ పన్నెండుకో వస్తున్నాడు.

మనిషి చాలా అసహనంతో ఉన్నట్లు అనిపించింది. పిల్లలిద్దరూ పడుకున్న తర్వాత అరవింద్‌, సుజాత మాకు దగ్గర్లోనే కుర్చీలు వేసుకొని చాలా రాత్రి వరకు మాట్లాడుకునే వాళ్లు. అవన్నీ కంపెనీకి, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు.

పసుపు కనకాంబరం హఠాత్తుగా ఎండిపోయి చనిపోయిందో రోజు. ఏం జరిగిందో తెలీలేదు. మా రెమ్మలు విరిగితేనే తల్లడిల్లే అరవింద్‌ కనకాంబరం గురించి పట్టించు కోలేదు. చిట్టితల్లి మాత్రం ఏడ్చింది.

ఆవేళ రాత్రి ఎనిమిది గంటలప్పుడు అరవిందుతో పాటే కంపెనీలో పనిచేసే కొందరు మిత్రులు వచ్చారు. వాళ్ళంతా మామిడిచెట్టు కిందున్న పచ్చికలో కూర్చున్నారు. వరండా లోని ట్యూబ్‌లైట్‌ కింద చిట్టితల్లి హోంవర్క్‌ చేసుకుంటోంది. లోపల్నుండి అందరికీ ఏ నిమ్మకాయరసమో తెచ్చినట్టుంది సుజాత.

”అరవింద్‌ రేపు నీవు డైరెక్ట్‌గా మన యూనియన్‌ లీడర్‌ని తీసుకొని సెక్రటేరియట్‌ దగ్గరికి వచ్చేయ్‌. మేం కంపెనీ దగ్గర్నుండే ర్యాలీ తీస్తాం. చూద్దాం. అన్ని యూనియన్‌ వాళ్ళూ ఒక్కటయితేనే గానీ లాభం లేదు. ఆ మధ్య ప్రైవేట్‌కి అప్పగిద్దాం అనుకున్నారా, కానీ నిన్న జరిగిన యూనియన్‌, మేనేజ్‌మెంట్‌ మీటింగ్‌లో ఏకంగా లాకౌట్‌ చేసే ఉద్దేశ్యం ఉందట గవర్నమెంట్‌కి…” వాళ్ల మాటల్లో చిట్టితల్లి వచ్చింది.

మధ్యలోకి ఎందుకొచ్చావని చిరాకుతో కసిరేడు అరవింద్‌. చిన్నబుచ్చుకున్న చిట్టితల్లి నా వద్దకు వచ్చి నిల్చుంది.

రాత్రి ఏ ఒంటిగంట వరకో వాళ్ళ చర్చలు సాగినట్లున్నాయి. ఆకాశంలో గొరుకొయ్యలు నడినెత్తికి వస్తుండగా నిద్రలోకి జారుకున్నాను.

ఆ తర్వాత చాలా రోజులు ర్యాలీలనీ, ధర్నాలనీ తిరిగేడు అరవింద్‌. వాటిల్లో తిరుగుతున్నప్పుడు పోలీసుల లాఠాఛార్జీలో దెబ్బలు తగిలి, రెండ్రోజులు హాస్పిటల్‌లో ఉండి వచ్చాడు.

సుజాత కూడా ఏదో లోకంలో ఉన్నట్లు ఉంటోంది. శ్రావణ్‌ ఎక్కువగా క్రికెట్‌ పిచ్చితో బయటే ఉండేవాడు. పాపం! చిట్టితల్లి ఒక్కర్తీ దిగులుగా బిక్కచచ్చినట్లు మా మధ్య తిరిగేది.

క్రమేపి ఇంట్లోని వాతావరణంలో ఏదో మార్పు చోటు చేసుకుంది. మరికొంత కాలం ఇలాగే మందకొడిలా సాగింది.

ఏమయ్యిందో తెలీదు. ఈ మధ్య చాలా రోజుల్నుండి అరవింద్‌ ఇంట్లోనే ఉంటున్నాడు. పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటాడా… మాకు గొప్పులు తవ్వడం, ఎరువులు వేయడం… కనీసం పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోవట్లేదు.

ఈ మధ్య సుజాత ఏదో కాస్మోటిక్స్‌ ఏజన్సీ తీసుకొని మెంబరయ్యింది. సుజాతకు చేదోడుగా ఉంటుందని అప్పుడప్పుడు పిల్లలకు వంటచేసి, హోంవర్కులు చేయించేవాడు అరవింద్‌. అదీ కొంతకాలమే. ఇంటి పనులు తనవల్ల కావట్లేదని చేతులెత్తేసేవాడు.

మరో ఆర్నెల్లలో అరవింద్‌కు ప్రైవేట్‌లో చిన్న ఉద్యోగం దొరికింది. ఇక అప్పట్నుండీ మొదలయ్యాయి చిట్టితల్లికి కష్టాలు.

సాయంకాలం స్కూలు నుండి వచ్చేసరికి ఇంటికి తాళం ఉండేది. మొదట్లో ఎదురింట్లో వాళ్ళకి తాళం చెవి ఇచ్చేవారు. బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఒక్కతే ఉండేది. శ్రావణ్‌కు ఎప్పుడూ ఆటపిచ్చే.

పెరట్లో నేల బీడుపడిపోతోంది. మా మొదళ్ళు నేలలో బిగుసుకుపోయాయి. గాలి అందదు, నీళ్ళు పోసే దిక్కులేదు.

చిట్టితల్లి కూడా ఏదో పోగొట్టుకొన్నదానిలా మా అవసరాల్ని మరిచిపోసాగింది. చూస్తూ చూస్తూ ఉండగానే మందారం, చేమంతులు, విరజాజీ, పారిజాతం… ఒక్కొక్కటీ నన్నొదిలేసి వెళ్ళిపోతున్నాయి.

అయ్యో! ఇవన్నీ చూసేందుకే ఇంకా ఉన్నానా… నేనూ వెళ్ళిపోతే నా చిట్టితల్లిని ఊరడించే వాళ్ళెవరూ!

ఏదో విధంగా తేమని పీల్చుకుంటూ జీవిస్తున్నాను.

అప్పుడప్పుడు సుజాత రాత్రి పది దాటేక వచ్చేది. వాళ్ళ ఆఫీసు మేనేజరు ఒక్కోసారి కారులో డ్రాప్‌ చేసి వెళ్ళేవాడు.

అరవింద్‌ మొదట్లో కొంత భరించినా, రానురానూ సుజాతని క్షమించలేకపోయేవాడు. ఇద్దరి మధ్యా రభస మొదలయ్యేది. సుజాతని సాయంత్రం ఆరులోపుగా ఆఫీసు వదిలి రమ్మనేవాడు.

”నేను చేసేది ఏజన్సీ కంపెనీ. చాలామంది ఏజంట్లని కుదర్చాలి. ఎక్కడెక్కడికో తిరగాల్సి ఉంటుంది. రాత్రి చాలా పొద్దుపోతే మా బాస్‌ మనింటిదాకా డ్రాప్‌ చేయడం తప్పా… నీ ఇన్ఫీరియారిటీ వల్ల నీకంతా తప్పుగా తోస్తుంది.”

సుజాత చాలా ఎత్తిపొడుపుగా జవాబు ఇచ్చేది. ఆ మాటలకి అరవింద్‌లో అహం దెబ్బతినేది.

కోపంతో ఊగిపోయేవాడు. చేతికందిన వస్తువు బద్దలయిపోవడం ఆ సమయంలో అతి మామూలయిపోయింది.

అరవింద్‌కు ఇప్పుడు తెలుస్తోంది ఇంటిపనుల్లోని నరకం.

పాపం సుజాత! ఎంత కష్టపడేది! తెల్లవారింది మొదలు… మేం రాత్రంతా రాల్చిన పండుటాకుల్ని ఊడ్చి ఎత్తడం, గదులన్నీ చిమ్మటం, కల్లాపీ, ముగ్గులు, ఉదయం టిఫిన్లు, ముగ్గురికీ కేరేజీలు కట్టడం, గిన్నెలు తోమటం, బట్టలుతకడం, పిల్లలకు స్నానాలు, స్కూల్లో దిగబెట్టడాలు… మళ్ళీ సాయంకాలం టిఫిన్లు, హోంవర్కు చేయించడం, రాత్రి వంట, పడుకునేవరకు వంచిన నడుం ఎత్తకుండా ఎంత పనిచేసేది!

సుజాత ఎంత పనిచేసినా అలిసినట్లు అనిపించేది కాదు. ఇంటి పనంటే తనకెంతో ఇష్టంలా చేసేది.

తనిప్పుడు తీసుకున్న ఏజన్సీకి సంబంధించి కాస్మోటిక్స్‌ని అమ్మటం, వాటి తాలూకు పాలసీల కోసం తిరిగి తిరిగి వాడిన తోటకూర కాడల్లే రావడం… మళ్ళీ బండెడు చాకిరీ గుర్తుకు రాగానే సన్నని వణుకు ప్రారంభమయ్యేది ఆమెలో.

ఇద్దరి మధ్యా అప్పుడు మొదలయ్యేది సన్నని సెగ. చిలికి చిలికి గాలివాన తుఫానుగా మారిన తీరల్లే… పిల్లల ముందే మాటా మాటా అనుకుంటూ తమ వివేకాన్ని పూర్తిగా కోల్పేయేవారు.

అరవింద్‌ అమ్మ, నాన్నలు వచ్చారొకసారి. ఇద్దరూ ముసలివాళ్ళు. కాస్త జబ్బులో ఉన్నట్టనిపించింది. చిట్టితల్లికి కాస్త ఊరటగా ఉంటుందనుకున్నాను. తాత, నాన్నమ్మలతో బాగానే కలిసిపోయి కబుర్లు చెబుతోంది.

వాళ్ళ నాన్నమ్మని తోటంతా తిప్పుతూ మమ్మల్ని పేరుపేరునా పరిచయం చేసింది.

”నాన్నమ్మా, ఈ నీలిగోరింట పువ్వుల్లాంటి జూకాలు చేయిస్తావా?”

”అలాగే తల్లీ”

”నాన్నమ్మా. మా క్లాస్‌లో అర్చిత తన బర్త్‌డేకి మొగలిపూల జడ వేసుకొచ్చింది. మనం కూడా మొగలిచెట్లు వేసుకుందామా?”

”మొగలిచెట్లు ఇంట్లో పెంచుకోరాదమ్మా, పాములొస్తాయి”

”అమ్మో! నాకు పాములంటే భయంగా”

”నాన్నమ్మా! చంద్రకాంతల్ని అల్లి నా సిగచుట్టూ ముడివేస్తావా, మా జానకి టీచర్‌ అలాగే పెట్టుకొని వస్తుంది”

”చంద్రకాంతలేఁ ఖర్మ తల్లీ, మన తోటంతా కనకాంబరాలు, డిసెంబరాలు ఉంటేనూ, ఎంచక్కా వాటిని అల్లిపెడ్తానేఁ”

చిట్టితల్లి కోసం మామిడిచెట్టుకు కొబ్బరితాళ్ళతో ఊయల కట్టేడు తాతయ్య. తాళ్ళు గుచ్చుకోకుండా పాత దుప్పటి మడతపెట్టి వేసింది నాన్నమ్మ.

చిట్టితల్లిని ఊయలలో ఊపడం తనకొచ్చిన పాటలు పాడి కథలు చెప్పడం నాన్నమ్మ పని.

చిట్టితల్లికి మంచి స్నేహితులే దొరికారు కాలక్షేపానికి. మళ్ళీ కొద్దికొద్దిగా చిట్టితల్లి ముఖంలో కళ రావడం చూస్తుంటే తృప్తిగా ఉంది.

అప్పుడప్పుడు డ్యూటీకి సెలవు పెట్టి వాళ్ళను హాస్పిటల్‌కి తీసుకెళ్ళేవాడు అరవింద్‌.

ఆరోజు బెడ్‌రూమ్‌లో తెల్లవార్లూ లైట్‌ వెలుగుతూనే ఉంది. అరవింద్‌ సుజాతల మధ్య ఏదో వాగ్వివాదం నడుస్తోందని అనిపించింది. రేరాణితో విషయం తెలుసుకొని బాధపడ్డాను.

”మీ అమ్మానాన్నలు ఇక్కడే ఉండిపోదామని అనుకుంటున్నారల్లే ఉంది. ఇల్లు ఎంత ఇరుగ్గా ఉందో మీకు తెలీదా! మరో గది కట్టాలంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. మీకు వి.ఆర్‌.ఎస్‌. కింద వచ్చిన లక్షా ఈ ఆరునెలల్లో ఎలా మాయం అయ్యాయో తెలీదు. ఇప్పుడు మీరు డ్యూటీకి లీవులు పెట్టి వీళ్ళను హాస్పిటల్‌ చుట్టూ తిప్పితే జీతం ఎంత తగ్గుతుందో ఆలోచించారా”

”నేను సరదాగా తీసుకెళుతున్నానా, నిన్ను తీసుకెళ్ళమని చెప్పలేదే”

”ఎంతకూ మీ ధోరణి మీదేనా. హాస్పిటల్‌ ఫీజులు, మందుల ఖర్చు ఎంతవుతుందో తెలీదా”

”వాళ్ళకు వచ్చే పెన్షన్‌లోంచే ఖర్చు పెడుతున్నాను. నీవు సంపాదించేది అడిగితే అప్పుడు అడుగు.”

”వాళ్ళ ఫించనీ ఎంతనీ, రెండురోజులు హాస్పిటల్‌ ఫీజు, మందులకే సరి. రోజు రోజుకూ ధరలు ఎలా మండిపోతున్నాయని ఇద్దరం ఉద్యోగం చేస్తున్నామన్నమాటే గాని, రాబడి ఎంత తక్కువగా వస్తుందో తెలియదా? ఇద్దరు మనుషుల భోజనం కనీసం రెండువేలయినా నెలకు అదనపు ఖర్చు. మనకు జరుగుబాటుగా ఉంటే ఇలా అంటానా. పైగా ఇద్దరూ అనారోగ్యంతో ఉన్నారు. వీళ్ళను కనిపెట్టుకుని ఇంట్లో ఎవరుంటారు? నిన్ను ఒక్కడ్నే కన్నారా? మీ అన్నయ్య ఉన్నారు కదా… అక్కడికి వెళ్ళమనండి.”

”నీకసలు మతుండే మాట్లాడుతున్నావా”

తెల్లవార్లూ ఇద్దరి మధ్యా చాలా రభస జరిగిందని చెప్పింది.

”నాన్నమ్మ, తాత అచ్చంగా ఇక్కడే ఉండిపోతారంట తెలుసా” ఎంతో సంతోషంతో చిట్టితల్లి వాళ్ళ స్నేహితులతో చెప్పడం విన్నాను. కానీ… ఆ సంతోషం ఎన్నాళ్ళో నిలవకుండానే ఆ ముసలి దంపతులిద్దరూ కళ్ళు తుడుచుకుంటూ, తమ సామానుతో వెళ్ళి పోవడం చూసిన నేను ”అయ్యో ఎందుకెళ్తున్నారమ్మా. నా చిట్టితల్లి కోసం ఇక్కడే ఉండిపోకూడదు” బాధతో తల్లడిల్లాను.

వాళ్ళు వెళ్ళిన రోజు అరవింద్‌, సుజాతల మధ్య చిన్న యుద్దమే జరిగింది. వాళ్ళ వాదులాటల్లో పిల్లలిద్దరూ చెరో మూలకీ నక్కి బెదిరిపోయి చూస్తారట.

ఇప్పుడు చిట్టితల్లి మళ్ళీ ఒంటరిదయిపోయింది.

కథలూ, కబుర్లూ చెప్పేవారు ఎవరూ లేరు. మంచానికి ఆ చివర్నొకరు, ఈ చివర్నొకరు పడుకోవడంతో వారిద్దరి మధ్యలో పడుకునే చిట్టితల్లికి చేతులు వేద్దామనుకుంటే ఎవరూ అందటంలేదు. పలకరిస్తే కసురుతున్నారు. ఒక్కోసారి చేయి చేసుకుంటున్నారు. ఆ దృశ్యం చూళ్ళేకపోతున్నానని దుఃఖిస్తూ గాలితో చెప్పి పంపింది రేరాణి.

ఓసారి మార్కులు తక్కువగా వచ్చాయని పిల్లల్ని గొడ్డును బాదినట్లు బాదింది సుజాత. ఆవేళ ఎంత కన్నీరు మున్నీరయ్యానో… ఏం మనుషులు! లోపలి అసహనాల్ని పిల్లల మీదా చూపించడం.

పిల్లలు రోజూ సాయంత్రం స్కూల్‌ నుండి రాగానే వారికిష్టమైన టిఫిన్‌ చేసిపెట్టి తరువాత వరండాలో కూర్చోబెట్టి చదువు గురించి శ్రద్ధతో కనీసం గంటకు పైగా సమయాన్ని కేటాయించేది సుజాత.

మరిప్పుడు- అసలు వారి చదువుల్లో తలదూర్చక ఎన్నాళ్ళయిందీ?

అరవిందు అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ పట్టించుకోవడం చూడనేలేదు! మార్కులు తక్కువ వచ్చాయని వాతలొచ్చేలా చితకబాదితే వచ్చేది చదువా! ముందే పిల్లలిద్దరూ వాళ్ళకే తెలియని ఒంటరితనంతో విలవిల్లాడిపోతున్నారని వీళ్ళకి ఏ భాషలో చెప్పేది?

ఆవేళ సుజాతపైన నిజంగానే కోపం వచ్చింది నాకు.

చిట్టితల్లిని ఊరడిద్దాం అని ఎంతగా ప్రాణం కొట్టుమిట్టాడిందో… కానీ చిట్టితల్లి సుజాత భయానికి ఇంట్లోంచి కదల్లేదు, పుస్తకాన్ని వదల్లేదు.

అప్పుడప్పుడు సుజాత ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేది. అరవింద్‌ పడుకున్న తర్వాత ఒక్కర్తీ మేల్కొని నిద్రపోతున్న పిల్లల్ని స్పృశిస్తూ మౌనంగా కన్నీరు పెట్టేది. ఆమెలో ఏదో చెప్పుకోలేని అలజడి కనిపించేది.

పిల్లల్ని కొట్టినరోజు రాత్రి ఆరుబయటకు వచ్చి మామధ్య కూర్చుని వినీవినబడనట్లుగా దుఃఖిస్తూ తన తలరాతని తిట్టుకుంటూ తనలో తాను గొణుక్కోవడం చూసి, ఆమెపై ఆ క్షణంలో చాలా జాలి కలిగింది.

స్కూల్‌ నుండి వచ్చిన పిల్లలకు సేమియా పాయసం మొదలుకొని, మెత్తని పకోడీల వరకు వాళ్ళ కిష్టమైన పిండివంటలు చేసిపెట్టేది. తోటలోని పండ్లేకాక, బయట నుండి తెచ్చినవీ తినిపిస్తూ, పోషక విలువలతో పిల్లల్ని పెంచాలని పరితపించే సుజాత .తనిప్పుడు పిల్లలకి ఏమీ పెట్టలేకపోతున్నానని బాధపడేది చాలసార్లు.

తన జీతంలోంచి చిట్స్‌ వేస్తానంటోంది సుజాత. ”ఇద్దరి జీతం ఇంటిఖర్చులకే సరిపోతే మరి భవిష్యత్‌లో పిల్లలకు కూడబెట్టేదెప్పుడూ కాలేజి చదువులప్పుడు డొనేషన్స్‌ కట్టేదేలా?”

”వాటర్‌, కరెంట్‌, టెలిఫోన్‌ బిల్‌, స్కూల్‌ ఫీజ్‌..వీటితో నాకు సంబంధం లేదు. అవన్నీ నీ జీతంలోంచే…” అరవింద్‌.

”ఇంటికి ఎల్‌.ఐ.సి ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకపోతే వడ్డీ పెరిగిపోతుంది ముందుగా అది కట్టాకే మిగతా ఖర్చులు” సుజాత.

ఒకటి, ఒకటీ…మాటా మాటా.. పంతాలు, వాదనలు, తర్కాలు… అలకలు, అరుపులు… ఇద్దరి మధ్య అన్యోన్యత అంతరించి అనురాగం సన్నగిల్లి, అవగాహనా రాహిత్యం బలపడుతోంది. ఒక్కరోజా, రెండ్రోజులా… ఇదేమి సంసారం? ఇంకా ఎంత కాలమో? మధ్యలో బిక్కచచ్చే చిట్టితల్లి బాధ చూడలేకున్నాను…ఎడమొహం పెడ మొహాలతో ఉంటే నా సౌరభాన్ని ఆస్వాదించేదెవరూ? నాకు తేమ అందటం లేదు. జీవ పదార్థం నాలోనూ ఎండిపోతుంది…రేరాణి ఏడుస్తూ మొరపెట్టుకుంది.

మామిడి, జామ మిగతావి అందనంత ఎత్తుకు వెళ్ళాయి.

జామకు పట్టిన తెల్లదోమ గాల్లో చెల్లాచెదురై చిరాకు తెప్పిస్తోంది.

నాకు తెలిసీ వాళ్ళిద్దరి మధ్య మాటలు ఆగిపోయి రెండు సంవత్సరాలు కావస్తోంది. కొన్ని విషయాల్లో పిల్లలు మధ్యవర్తులు. మొదట్లో పిల్లలకు  కొత్తగా ఉండేది. ”మీ ఇద్దరికీ మాటలువచ్చు కదా, మధ్యలో మేమెందుకు” ఒకసారి శ్రావణ్‌ అనుమానం ప్రకటించాడు. తర్వాత్తర్వాత పిల్లలకు వాళ్ళమధ్య దూరం కొలవడం అలవాటైపోయింది.

చూస్తుండగానే టెలిఫోన్‌ కనెక్షన్‌ కట్‌ అయిపోయింది. ఫ్రిజ్‌ ఉన్నా వాడకంలో లేదు. కార్టూన్‌ సినిమాలు చూస్తూ సరదాపడే పిల్లలు కేబుల్‌ కనెక్షన్‌ తీయించేస్తున్నప్పుడు ఎంత విలవిల్లాడారనీ.

ఎంతో ఆదర్శంగా ప్రేమించి పెళ్ళీ చేసుకున్న జంటనీ, పైగా కులాంతరమనీ ఇంటికి వచ్చిన మిత్రులు అప్పుడప్పుడు పొగడ్డం విన్పించేది. నాకు ఈ ప్రేమలకు, ఆదర్శాలకు లొంగని అతీతమైన శక్తి ఏదో పట్టి పీడిస్తోందని అనుమానం.

ఇప్పుడు ఇంటికి ఎవరూ రావడంలేదు. అరవింద్‌ అమ్మానాన్నలు ఇప్పుడెక్కడున్నారో ఎలా ఉన్నారో వాళ్ళ వివరాలేవీ తెలియవు. ఒకవేళ అరవింద్‌ కు తెలిసినా వాళ్ళ ప్రసక్తి ఇంట్లో పిల్లల ముందు కూడా తేవడం లేదు.

మళ్ళీ ఈ మధ్య ఏవో అసహనాలు రేగుతున్నాయి. ఒకరి పొడ మరొకరికి గిట్టనంతగా దూరం అవుతున్నారనిపించింది. వాళ్ళ మాటల్లో విడిపోవడాలు, విడాకులు, ఒకర్ని మరొకరు దగా చేసారని దెప్పుకోవడాలు.. రేరాణి పంపే పిడుగుల్లాంటి వార్తలు నాలో ఫిరంగులు పేలుస్తున్నాయి. మనసంతా అతలాకుతలం అయిపోతుంది.

దేశాల మధ్యే కాదు యుధ్ధాలు సంసారాలలోను జరుగుతాయనిపించింది. ప్రాణాలు కోల్పోయేదెప్పుడూ అమాయక జీవులే. ఈ ఇంట్లో జరిగిన యుద్ధంలో అన్నీ అలా అంతరించిపోగా దిక్కుతోచని స్థితిలో క్షతగాత్రులమై మిగిలిఉన్నాము. మాతోపాటు శ్రావణ్‌, చిట్టితల్లీనూ…

ఎక్కడో సింహాచలంలో పుట్టి ఇలా వీళ్ళమధ్యకు రావడం ఏమిటి? చిట్టితల్లి మా అందరికీ నేస్తం కావటం నవ్వుల పువ్వులతో కళకళలాడిన సంసారం రానురాను ఏదో గ్రహణం పట్టినట్లు క్షీణించిపోతుంది.

ఈ క్రమం ఇలా సాగాల్సిందేనా! తడారిపోతున్న జీవ పదార్థంతో కన్నీరు కూడా రాల్చలేని పరిస్థితి నాది.

*

గేటు చప్పుడవుతోంది. శ్రావణ్‌ వచ్చినట్టున్నాడు. వరండాలో పడుకున్న చిట్టితల్లిని బేట్‌తో పొడుస్తూ నిద్రలేపాడు.  నిద్రమత్తులో ఊగుతూ లోపలికి వెళ్ళింది.

రాత్రి ఎనిమిది దాటే వుంటుంది. అరవింద్‌, సుజాతలు ఇంకా రాలేదు. ”చిట్టితల్లి అప్పుడే ఆకలని ఏడ్చింది. నిద్రలో ఆకలి మర్చిందేమో.., సన్నని బాధ సుళ్ళు తిరుగుతూనే వుంది. చిట్టితల్లి ఆలోచనల్లోనే చిన్నగా కునుకుపట్టింది.

ఎల్‌.ఐ.సి లోను కట్టడం చేతగావట్లేదని చేతులెత్తేసాడు. అరవింద్‌. ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఎవరో ఇల్లు చూసేందుకు వచ్చారు. మొక్కలన్నీ  నరికేసి అపార్ట్‌మెంట్‌ కట్టాలని ఆలోచనట.

ఆ మాట వినగానే నాతోపాటు మిగతా చెట్లన్నీ గజగజ వణికిపోయాయి. ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు నన్ను వదల్లేక చిట్టితల్లీ  ఒకటే ఏడుపు. సుజాత చిట్టితల్లి చేయి పుచ్చుకొని బరబర ఈడ్చుకుపోతుంది.

చిట్టితల్లి రోదన రంపపుకోతలా విన్పిస్తోంది. గుండె తరుక్కుపోతుంది. చిట్టితల్లిని వదిలేసి నేను బతకగలనా?

ఎక్కడో బాంబులు పేలినట్లు నేల అదురుకు ఒక్కసారిగా కంపిస్తూ కళ్ళు తెరిచాను

పీడకల… ఒళ్ళంతా చెమటలు.

ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి…. వస్తువులేవో ఎగిరిపడుతున్న శబ్దాలు.

రాత్రి పన్నెండు దాటిందేమో

ఉండుండి అరవింద్‌, సుజాతలు అరుపులు, పిల్లల ఏడుపులు విన్పిస్తున్నాయి.

ఇంటికి ఏ శని పట్టిందో తెలీదు. లేకపోతే అర్థరాత్రివేళ…. ఇదేం ప్రళయం!

పెద్దగా ఏడుస్తూ, ఇంట్లోంచి దూసుకువచ్చింది చిట్టితల్లి.

ఏం జరిగిందో అడిగేలోగా వచ్చి నన్ను చుట్టేసింది.

గౌను మడతల్లో దాచిన వస్తువేదో నా మొదలు దగ్గరున్న డిసెంబరం కొమ్మల్ని పాయలుగా తీసి గుబుర్లలో  దాచింది.

వెక్కివెక్కి ఏడుస్తున్న పిల్లను ఎలా ఊరడించను?

”ఏం జరిగిందమ్మా’ అంటూ రేరాణిని అడిగాను.

రేరాణి చెప్పింది విని అవాక్కయిపోయాను. వీరి మధ్య శతృత్వం చాపకింద నీరులా పాకుతోందని తెలుసుకాని, పరాకాష్టకి చేరిందని ఇప్పుడే తెలిసింది. ఒకరికొకరు ప్రేమగా ఉన్నప్పుడు ఇచ్చి పుచ్చుకున్న కానుకల్ని, కలిసి తీయించుకున్న ఫొటోల్ని చింపేస్తూ, కాల్చేస్తున్నారట.

ఇద్దరికీ పిచ్చిగానీ పట్టలేదు కదా!

వాళ్ళ ప్రవర్తన గుర్తొచ్చినప్పుడల్లా వణికిపోతూ వెక్కిళ్ళతో బెక్కుతూనే ఉంది. చిట్టితల్లి.

ఒకప్పుడు తమ పిల్లలతోపాటే మమ్మల్ని, వెన్నెలనీ అపారంగా ప్రేమించిన వీళ్ళ మధ్య అంతర్యుద్ధం ఎలా మొదలయిందని మూలాలు వెతకసాగేను.

తెగులు పట్టిందని చెట్టు మొదలు నరుక్కుంటారా!

మూలం ఏదైనా కానీ…

మీ ఇద్దరి మధ్యా పిల్లలు నలిగిపోతున్నారనీ, మీరు పంచే ప్రేమ కోసం పరితపిస్తున్నారనీ మీ వల్ల పూరేకుల్లాంటి బాల్యం పసివాడుతోందని… ఎలా గొంతెత్తి చెప్పను?

భగవాన్‌! దిక్కులు పిక్కటిల్లేలా నా బాధను అరిచి చెప్పడానికి నా స్వరాన్ని పలికించు.

దుఃఖంతో గొంతు పూడుకుపోయింది నాకు.

చాలాసేపు తరువాత సుజాత వచ్చింది. నన్ను కావలించుకున్న చిట్టితల్లిని నా నుండి విడదీసి, ఇంట్లోకి తీసుకెళ్ళింది.

అప్పుడు గుర్తొచ్చి చూసేను. డిసెంబరం గుబుర్లలో చిట్టితల్లి దాచిందేమిటని? వెన్నెలకాంతిలో కన్పించింది. మూడెళ్ళ క్రితం మా అందరి మధ్య తీయించుకున్న ఫొటో అది.

మమ్మీ డాడీల భుజాలపై కూర్చొని వాళ్ళ మెడచుట్టూ చేతులు బిగించి, నవ్వులు చిందిస్తూ శ్రావణ్‌, చిట్టితల్లి.

చిట్టితల్లి కోరుకుంటున్నదేమిటో అర్థమై గుండె బరువెక్కింది.

 

                   ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక

26 సెప్టెంబరు 2003

 

కథా నేపథ్యం

1992-93 ప్రాంతంలో ఆల్విన్‌ కంపెనీలో పనిచేసే కార్మికుల కోసం ఓ గూడంటూ ఉండాలనే ఆలోచన వచ్చింది అప్పటి మా యూనియన్‌ ప్రెసిడెంట్‌ శ్రీ దయాకర్‌ రెడ్డి గారికి. వారు దీన్ని బలోపేతం చేసి, కూకట్‌పల్లికి దగ్గరలో స్థలాల్ని వెతికి, అంతవరకూ మేం దాచుకున్న పి.ఎఫ్‌.తో ప్లాట్స్‌ అలాట్‌ చేశారు. తర్వాత ఎల్‌.ఐ.సి.లోన్‌తో మాకు ఇండ్లను కట్టించి ఇచ్చారు. 1994లో ఆ ఇండ్లలోకి వచ్చాం. ఇంటికి కాంపౌండ్‌ కట్టుకుని, రకరకాల మొక్కల్ని నాటుకున్నాం.

మా పాప రోహిత ఎప్పుడూ చెట్ల మధ్యనే ఉండేది. వాటితో మమేకమయ్యేది. వాటితో మనసువిప్పి మాట్లాడేది. ఇక మా బాబు తేజ. వాడి ఆటల ప్రపంచం వాడిదే. సొంత ఇల్లు, చక్కని సంసారం … మనిషికి ఇంతకంటే ఏం కావాలీ?

హైదరాబాద్‌లో మాకంటూ సొంత ఇల్లుంది అని సంతోషించేంతలో ఆల్విన్‌ మూత పడింది. అప్పుడు మొదలయ్యాయి కష్టాలు.

సాఫీగా సాగుతున్న జీవితాలకు అదొక పెద్ద కుదుపు. ఉద్యోగాల వేటలో ఊరిమీద పడ్డాం. అంతవరకు ఆర్థిక సూత్రంపై నిలబడ్డ పచ్చటి సంసారాలు తలకిందులు కాసాగాయి.

విధి వక్రించింది. అన్నిటికీ మూలం డబ్బే అయ్యింది. నాతో పాటు తను కూడా చిన్న ఉద్యోగం చూసుకుంది. ఇద్దరం ఏ రాత్రికో ఇల్లు చేరేవాళ్లం.  సాయంత్రం స్కూల్‌ నుండి అలసిపోయి వచ్చిన పిల్లలు ఈసురోమని ఒంటరిగా ఉండేవాళ్ళు.

అంతవరకు చెట్ల ఆలనా పాలన చూసిన వాళ్ళం, ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాం. ఒక రకంగా చెప్పాలంటే చాలా మొక్కల్ని హత్య చేసినవాళ్ళం అయ్యాం.

పని ఒత్తిడి, చాలీచాలని జీతాలు, తప్పనిసరిగా కట్టాల్సిన ఎల్‌ ఐ సి ఇన్‌స్టాల్‌మెంట్‌, పెరిగే ఖర్చులు వెరసి మా ఇద్దరిలో చిరాకు, అసహనం, అవగాహనారాహిత్యం పెరగసాగాయి. ఒకపక్క పిల్లల్ని సరిగా చూళ్ళేకపోతున్నామనేది తెలుస్తూనే ఉంది.

తల్లిదండ్రుల మధ్య సరయిన సంబంధాలు లేకపోతే పిల్లలను లాలించలేరు, ప్రేమించ లేరు. వీరిద్దరి కోపాగ్నిలో ఆ పసికూనలు సమిధలవుతారు. వారి అందమైన బాల్యంపై అదొక వేటు.

ప్రశాంతమైన కొలనులోకి ఎవరో రాయి విసిరి అల్లకల్లోలం సృష్టించినట్టయింది. మా జీవితాల్లో కొట్టొచ్చినట్టు కన్పించే ఈ మార్పుకు కారణం మా కంపెనీ మూసివేతా? అందుకు పరోక్షంగా దోహదపడిన ప్రపంచీకరణా?

ఈ నేపథ్యంలో రాసిన కథే చీడ.

సంపెంగ చెట్టు, కథని చెప్పినట్టుగా రాయాలనుకున్నాను. ఐతే ఆ చెట్టుకి ఇంట్లోని విషయాలు, జరిగే సంఘటనలు తెలియవు. అంచేత కిటికీ దగ్గరున్న నైట్‌క్వీన్‌తో గాలి ద్వారా సంభాషణని జరిపించి కథనం నడిపించాల్సి వచ్చింది.

-గొరుసు జగదీశ్వర రెడ్డి

*

 

 

 

‘ మరో వైపు’ చూద్దామా !

Fall-Leaves

మరో వైపు’ చూపిస్తున్న వంశీకృష్ణ…వచ్చే వారం నుంచి..!

ఇటీవల వచ్చిన ఒక తెలుగు సినిమా లో  ‘చూడు ఒక వైపే చూడు’ అంటూ నందమూరి బాల కృష్ణ తన శత్రువును కండిషన్ చేస్తాడు. ఇవ్వాళ మన తెలుగు సమాజం కూడా అలాగే కండిషన్  అయింది. తన సహజమైన లక్షణాలనీ కోల్పోయి ఒక మూసలో కూరుకు పొతున్నది. సాహిత్యము, సంగీతము ఇతరేతర సృజన  రంగాలన్నీ ఇందుకు మినహాయింపు కాకపోవడము ఒక విషాదం. సామాజిక వర్గాలు,మతాలూ, ప్రాంతాలు, పేరున ఈ కండిషనింగ్ కొనసాగుతూ వస్తున్నది.

ప్రతి అంశానికి సెకండ్, థర్డ్, డైమన్షన్ ఉంటుందనే విషయాలను కూడా మనం కన్వీనియంట్ గా మరచి పోయాము. ఒక కథ చదివినప్పుడో, ఒక కవితను అనుభూతించినప్పుడో మనఃస్పూర్తి గా మెచ్చుకోవడానికి కూడా రకరకాల న్యూనతలు మనలని అడ్డుకుంటున్నాయి. ఈ విష వలయం నుండి మనం ఎంత త్వరగా బయట పడితే మన సామాజిక ఆరోగ్యానికి అంత మంచిది. మరీ ముఖ్యంగా మన సాహిత్యానికి!

ఈ నేపధ్యం లోనే ‘సారంగ’ సాహిత్య వార పత్రిక లో ‘మరోవైపు‘ శీర్షిక మొదలవుతున్నది. ఈ కాలం లో సాహిత్యం, సినిమా, ప్రభావశీలురు ఐన వ్యక్తుల, సంస్థల ప్రతిభాన్విత సంఘటనలని వాటి వాటి నియమిత అర్ధం లో కాకుండా రెండో వైపు చూసే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. ఒక కధ చదివినప్పుడు అది కలిగించే వాచ్యార్ధాన్ని మాత్రమె కాకుండా మరో అంతర్గత అర్ధాన్ని అంటే లో నారసి చూసే ప్రయత్నం అన్న మాట.
సాహిత్య పత్రికలలో / సాహిత్య పుటలలో ఒక సృజనని సమీక్షించేటప్పుడు సృజన కారుడి వైయక్తిక అంశాలను, బలహీనతలను పక్కన పెట్టి, లేక పట్టించుకోకుండానూ, కేవలం రచన కు మాత్రమే పరిమితమై దాని సారాన్ని, సారాంశాన్ని మాత్రమే  పట్టించుకునే పద్ధతి ఇది. నిజానికి ఇది కొత్త విధానమేమీ కాదు. . పూర్తిగా పాతదే. మళ్లీ కొత్త గా మొదలు పెట్టడం అన్న మాట! అలా అని కళ కోసం కళ అనే పూర్తి సాంప్రదాయక వ్యవహారం కూడా కాదు.  సాహిత్య రాజకీయాలను, సాహిత్య చొరబాట్లను వదిలి స్వచ్చ శుభ్ర సాహిత్య అనుభూతిని పొందటం కోసం  చేసే ప్రయత్నం ఇది.

వంశీకృష్ణ

మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన ‘మల్లెల తీరం’!

చలం రచించిన ‘సావిత్రి’ లో సావిత్రి, సత్యవంతుడిని చూసి “మనస్సులు ఎప్పుడో కలిసాయి, మరణం ఒక్కటే మిగిలివుంది” అని అంటుంది. ఈ మాటల స్ఫూర్తితోనేismail“మల్లెలతీరంలో సిరిమల్లెపూవు” అనే సినిమా తీసాను అని ఒక ఇంటర్వ్యూలో అంటాడు ఈ చిత్ర దర్శకుడు జి.వి.రామరాజు.  చాలా కాలం నుంచీ ఫేస్ బుక్ లో ఈ సినిమా గురించి కొంతమంది నోట వింటూ వస్తున్నాను. దాదాపు అందరూ ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసే విధంగా మాట్లాడుతూ ఉంటే ఈ సినిమా అంత బాగుందా అనుకొనేవాణ్ణి. ఈ మధ్యన డాలస్ వెళ్లినప్పుడు పనికట్టుకొని మరీ చూసి వచ్చానీ చిత్రాన్ని. మొదట ఈ సినిమా పేరు “మల్లెలతీరం” మాత్రమే, కానీ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా వచ్చాక పేరు మార్పుకు గురైంది. అలా అన్నా ఈ సినిమా పేరు కొద్దిగా ప్రజల నోళ్లలో నాని, సినిమా చూసేందుకు వస్తారని చిత్ర యూనిట్ ఊహ కాబోలు. కానీ నా వరకైతే ఈ సినిమా టైటిల్ “మల్లెలతీరమే” బాగుంది.
ఇక సినిమా కథ విషయానికి  వస్తే, “ఓ అందమైన అమ్మాయి, అంతకన్నా అందమైన మనస్సున్న అబ్బాయి, డబ్బే ప్రాధాన్యం అనుకొనే ఆ అమ్మాయి భర్త వీరి ముగ్గురి నడుమ జరిగిన కథే ఈ చిత్ర కథ.” ప్రతి అమ్మాయికి ఉన్నట్లే కలల రాకుమారుడు ఈ అమ్మాయికీ ఉన్నాడు. కానీ ప్రతీ కల నిజం కాదు. జీవితం ఎన్నెన్నో సర్దుబాట్లు నేర్పుతుంది. కానీ అందగాడు, తెలివైన వాడు, డబ్బు బాగా సంపాదించేవాడు అయిన భర్త దొరికితే ఏ ఆడపిల్లయినా సంతోషంతో పొంగిపోతుంది. ఇది మన సమాజం గిరిగీసి పెట్టుకొన్న నియమాల్లో ఒకటి. మరి ఇవన్నీ ఉన్నా తనకు కావాల్సినది లేని పెళ్లిలో ఆ అమ్మాయి ఎలా సర్దుకుపోవాలి? లేదా తన వ్యక్తిగత స్వేచ్చకు ప్రాధాన్యం ఇవ్వాలా? ఇలాంటి ప్రశ్నలకు జవాబివ్వాలనే ప్రయత్నమే ఈ సినిమా. అలా అని ఇదే సరైన సమాధానం అని ఎవరూ అనుకోక్కర్లేదు. కథ కన్నా కథనం, అంతకన్నా తాత్విక దృష్టి కలిగిన సంభాషణలు, మృదువైన సంగీతం, అందులో పాలు నీళ్లులా కలసిపోయిన సాహిత్యం, వీటన్నిటినీ ఓ దృశ్యకావ్యంలా తీసిన ఛాయాగ్రహణం…ఈ సినిమాని ఓ కళాఖండంగా నిలబెట్టాయి.
సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఈ సినిమా చూస్తే చాలా నిదానంగా, ఏ మాత్రం వినోదం లేకుండా, ట్విస్టులు-బ్యాంగులు-ఐటం సాంగులు లేని చప్పిడి కూడులా అనిపించవచ్చు. కొద్దో గొప్పో ఈ తరహా సినిమాలు ఇష్టపడే  ప్రేక్షకులు కూడా కథనం సాగదీసినట్లు ఉందని కొన్ని కొన్ని సన్నివేశాల్లో అనుకొనే ప్రమాదమూ ఉంది. కానీ నావరకు ఈ సినిమాలో నన్ను కట్టిపడేసిన అంశాల్లో మొదటిది అమ్మాయి అందం కన్నా, తన ఆహార్యం. తను కట్టుకొన్న చీరలు, ఆ-కట్టుకొన్న విధానం, పొందిగ్గా ఉన్న జడ, సింపుల్గా ఓ జత గాజులూ, మెడలో ఓ నల్లపూసల గొలుసూ అంతకన్నా ముఖాన తాండవించే అందమైన నవ్వు, సమ్మోహనపరిచే మార్దవమైన మాటలు…ఏ కృష్ణశాస్త్రి పుస్తకంలో నుంచో నడచివచ్చిన కావ్యకన్యకలా ఉంది శ్రీదివ్య.
భర్తగా నటించిన జార్జి తన పాత్రకు తగ్గట్టు నటించాడు. లేనితనంలో అనుభవించిన కష్టాల వల్లో, మనకు తెలియని (ఈ సినిమా కథానాయిక పరంగానే సాగుతుంది) అనుభవాల వల్లో తనకు సంబంధించి రెండే ముఖ్య విషయాలు 1.నేను 2. డబ్బు. తను బాగుండాలి, సాధ్యమైనంత డబ్బు సంపాదించాలి. కట్టుకొన్న భార్య ఈ ఈక్వేషన్లో లేకపోవడం తనకు మైనస్సో, ప్లస్సో తేలీనంత బిజీలో జీవితం గడుపుతుంటాడు. అతన్ని ఇచ్చి పెళ్ళి చేసిన అమ్మాయి తండ్రి దృష్టిలోనూ, సమాజం దృష్టిలోనూ అతను ఆదర్శ భర్తే కానీ కాపురం చేయాల్సిన భార్య దృష్టిలో కాదు.
ఇక ఓ పాటల రచయితగా, భావుకత్వం నిండిన ఓ యువకుడిగా క్రాంతి చాలా చక్కగా నటించాడు. కానీ తను ఎక్కువ సేపు ఆ అమ్మాయి ఏం చెప్పితే దానికి తలూపే వ్యక్తిగానే ఈ సినిమాలో కనబడతాడు. (ఇది కథలో నాకు నచ్చని అతికొద్ది విషయాల్లో ఒకటి. మనలోమన మాట, అమ్మాయి ఏం చెబితే దానికి తలూపే అబ్బాయి ఉంటే ఏ అమ్మాయికి మాత్రం నచ్చడేంటీ;-)  ఈ అబ్బాయి ఆ అమ్మాయి స్నేహితురాలింట పరిచయమౌతాడు. ఆ స్నేహం ఒకరితో ఒకరు గంటల తరబడి మాట్లాడుకొనే దాకా వస్తుంది. సినిమా మొత్తం మీద ఇద్దరు ఎన్ని సార్లు ఒంటరిగా కలుసుకొన్నా ఎవరి హద్దుల్లో వారుంటారు.
ఇద్దరి భావాలు ఒక్కటే అవడంతో పుస్తకాలు ఇచ్చిపుచ్చుకోవడం, నచ్చిన పాటలు పాడుకోవడం, ఒకరి విషయాలు మరొకరితో పంచుకోవడం ఇలా సాగిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు స్నేహం నుంచీ ప్రేమగా మారిందో ఇద్దరికీ తెలియకుండానే అందులో మునిగిపోతారు. ఇందులో అమ్మాయి ఓసారి తన స్నేహితురాలితో అంటుంది “నేను ఏ అందమైన మనిషిని కలిసినా నాకు తోడుగా ఓ పాటుంటుంది, కానీ తనని చూసినప్పుడల్లా ప్రపంచమే పాటగా అనిపిస్తుంది.” మళ్లీ ఒకసారి ఆ అబ్బాయితో అంటుంది,”నిన్ను కలసినప్పుడు నాకు ఏ పాటా గుర్తుకు రాలేదు” అని. “అలా ఏం?” అని ఆ అబ్బాయి అడిగితే “నేనే నువ్వైనప్పుడు నాకు పాటెలా గుర్తొస్తుంది” అని అంటుంది. ఇలా వారిద్దరి మధ్య ప్రేమను అద్వైతంలా చిత్రీకరిస్తాడు దర్శకుడు.
ఇంట్లో భర్తతో సంసారబంధం లేకపోగా, (నీకు నచ్చకపోతే నిన్ను తాకనైనా తాకను అనే మంచి విలన్(?) ఆమె భర్త) ఫారిన్ ట్రిప్పులు, కొత్త వ్యాపారావకాశాలతో వీరిద్దరి మధ్య ఉన్న అగాధం మరింత పెరుగుతుంది. అది ఆమె విడాకులు కోరేవరకు వెళుతుంది. అప్పుడు ఆ భర్త తీసుకొనే నిర్ణయం ఏంటి? ఆమె ఆ నిర్ణయానికి ఒప్పుకొందా? వారిద్దరి ప్రేమ ఎలా ముగిసింది? ఇవన్నీ తెలియాలంటే మిగతా కథ మీరు తెరపై చూడాలి.
mallela
ఇందులోని కొన్ని ఆలోచింపచేసే మాటలు:
‘నాకు తెలిసి ఈ ప్రపంచంలో మనసు కన్నా అందమైనది ఏదీ లేదు. ఆ మనసుని వెతుక్కుంటూ వెళ్తే ఎన్నో తీరాలు కనిపిస్తాయి. వాటిల్లో మల్లెల తీరం ఒకటి” (హీరోయిన్‌తో క్రాంతి)
‘ప్రేమ, మనసు, ఆకాశం -వీటిని నచ్చిన విధంగా వర్ణించుకోవచ్చు కానీ, హద్దులు గీయలేం’(హీరోయిన్‌తో క్రాంతి)
‘సంపాదించు…కానీ లైఫ్‌ను బిజినెస్‌చేయకు’ (భర్తతో కథానాయిక)
‘భార్యగా అవడం వేరు. భార్యగా బతకడం వేరు’’ (కథానాయిక)
‘కోపం కూడా ఒక ఫీలింగే.. నాకు తన మీద అది కూడా లేదు’’ (భర్త గురించి నాయిక)
‘మానవ సంబంధాలు గ్యారంటీలతో రావు, మనమే పోషించుకోవాలి’’ (హీరోయిన్‌తో క్రాంతి)
ఇక పాటల వరకూ ఎంతో ఆహ్లాదమైన సంగీతం, సున్నితమైన సాహిత్యం బంగారానికి తావి అబ్బినట్లు అమిరాయి.
1. నీ నీడనా.. ఇలా నడవనా…
2. మబ్బులు కురిసే..మొగ్గలు విరిసే…
3. అలా చందమామనై..ఇలా చేతికందనా…
4. మాటకందని పాటలా మనమిద్దరూ కలిశాముగా…
5. పిల్లగాలుల పల్లకిలో..మల్లె వధువై నీలో చేరి…
మొత్తానికి ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగినా, ఈ సినిమా కథ కొని ప్రశ్నలను మిగిలిస్తుంది. ఒక సమీక్షకుడన్నట్లు -“పురుషుడు ఏ స్వేచ్ఛనైతే తన హక్కుగా భావిస్తాడో, ఆ స్వేచ్ఛను స్త్రీకి ఇస్తే చాలు. అంతకు మించి స్త్రీ ఏమీ ఆశించదు’ అన్నది ఈ చిత్ర ఇతివృత్తం. ఆ అంశాన్ని తన ఈ తొలి చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నారు దర్శకుడు రామరాజు.”- కానీ ఇదే కథ కొద్దిగా మార్చి భర్త భావుకుడిగా, భార్య ఇవన్నీ పట్టించుకోని ప్రాక్టికల్ మనిషిగా ఉంటే, ఆ భర్తకే తన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే అమ్మాయి పరిచయమైతే …???
mallela teeram(1)
అలాగే ఈ సినిమాపై ఎన్ని సమీక్షలు వచ్చినా, కొన్ని అర్థవంతమైన ప్రశ్నలు మితృడు, ఛాయాగ్రాహకుడు అయిన ‘చక్రధరరావు’ లేవనెత్తారు-
“ప్రేమించే మనిషి దొరికేవరకూ పెళ్ళి చేసుకోవద్దా? 
లేక పెళ్ళి చేసుకొని బతికేస్తూ ప్రేమించేమనిషి తారసపడితే పెళ్ళిని వదిలిపోవాలా?? 
లేక పెళ్లిలో ఉంటూనే ప్రేమని కొనసాగించాలా? 
ప్రేమించిన మనిషిని తప్పక పెళ్ళి చేసుకొని తీరాలా ?? 
అసలు ఫలాన వ్యక్తి తప్ప ప్రపంచంలో నాకేమీ వద్దు అనే మానసికస్థాయి అదే సినిమాలో చెప్పిన అద్వైత స్థితి మనుషులకెప్పుడయినా కలుగుతుందా ?
అది కలగాలంటే ఎలా ప్రాక్టీసు చేయాలి ? 
పోనీ ఫలానా వ్యక్తిని ప్రేమించామే అనుకో.. వాళ్ళూ మనని ప్రేమించాలిగా ?
లేకుంటే అలా రెసొనెన్స్ కలిగేవరకూ వెతుక్కుంటూ పోవాలా , ఈ లోపు పుణ్యకాలం గడిస్తే ?? 
ఒకసారి ఆ ‘అద్వైత స్థితి’ కలిగితే అది ఎల్ల కాలం అలాగే ఉంటుందా ! అంటే ఒకసారి ఒకరి మీద ప్రేమ కలిగాక అది ఎప్పుడూ అలాగే ఉంటుందా వాళ్ల తదుపరి ప్రవర్తన వల్ల తరుగుదల/ఎదుగుదల ఉండదా ? ఉంటుందా?”
వీటికి సమాధానాలు ఎవరికి వారే వెతుక్కోవాలి!

కొసమెరుపు:

 

ఈ సినిమాలో సాహిత్యం, సంగీతం, భావుకతతో పాటు ఎక్కువైంది ఇంకొకటుంది…అది కెఫైన్…ఇద్దరి మధ్య మాటలు, పాటలుతో పాటు కాఫీ కూడా వరదలై పొంగుతుంది.
ఈ సినిమా ముందూ వెనకా:
 శ్రీదివ్య,డా.క్రాంతి, జార్జి, రావు రమేశ్ ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: పవన్‌కుమార్, ఛాయాగ్రహణం: బాలరెడ్డి, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, సహ నిర్మాత: సూర్యనారాయణ ఆకుండి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జి.వి. రామరాజు.

త్రిపుర traits:ఒక జ్ఞాపకపు ఛాయ!

tripura_336x190_scaled_cropp

ఎవరైనా సమకాలీన రచయిత గొప్ప అక్షరంగా పరిచయమయ్యాక, నన్ను తరచి తవ్విపోశాక, చెప్పరాని చనువై మనసయ్యాక, ఆ రచయితని వ్యక్తిగతంగా కలవడానికి ఆరాటపడను. తీరా కలిస్తే- సిరా మరకలు కూడా అంటని కుదురైన జమాబందీలానో, మహా పోతరం కమ్మిన ఆరోగ్య సూత్రంలానో, అతి భద్రమైన జీవిత బీమాలానో, ఫక్తు డీఏ ఎరియర్‌లానో, జున్ను ముక్కల్ని దాష్టికంగా కప్పెట్టిన మిరియాల పొడిలానో ఎదురవుతాడేమోనన్న జంకు వల్ల కావచ్చు; లేదా దురద పుడితే నాలానే గోక్కుంటున్నాడేమిటన్న లౌకిక విస్మయాలతో సదరు రచయిత (కవి) చవకవుతాడేమోనన్న నా వెరపు వల్ల కావచ్చు- నాలోకి తెగబడిన రచయితని బయట కలవాలని ఎగబడను.

కానీ త్రిపురని కలుసుకోవాలని ఆత్రపడకపోవడానికి పై శంకలేవీ కారణాలు కాదు; వస్తు-రూప ద్వంద్వానికి అంతు చిక్కని, నెపం వంటి కేవల రూపాన్ని మించి ప్రచ్ఛన్నంగా పరుచుకొని సారమై నిలిచిన త్రిపుర రాతల లోంచి ఆయన మూర్తిమత్వాన్ని ఊహిస్తూ… గుట్టలుగా పోగుపడ్డ నా appraisals  వల్లనే ఆయనని కలవాలని వెంపర్లాడలేదు. ‘త్రిపుర ఎలా ఉంటారు?’ అన్న ప్రశ్న త్రిపురని కలవడం కంటే మనోహరంగా ఉండేది.

“మెత్తగా నల్లగా చుంచులాంటి ముఖాలు. రహస్యంగా నక్కలాంటి ముఖాలు. అప్పుడే చంపిన గేదెని చీరుతున్న పులి ముఖాలు. దుమ్మలగొండి ముఖాలు. బెదిరిన కుందేలు ముఖాలు. సన్నగా పగగా పాము ముఖాలు. మార్కోవిచ్ సిగరెట్ ప్యాకెట్ మీద ముఖం లాంటి ముఖాలు. డిటెక్టివ్ ముఖాలు. దొంగ ముఖాలు.”

బింబం మాటున సత్యాన్ని అద్దం వెనక వార్నిష్‌ని గోకి తెలుసుకోవాలన్న ఆయన ఉత్సుకతకి అక్షరాలై బద్దలైన అద్దంలో మన ఇన్నిన్ని ముఖాలు చూపెట్టిన త్రిపుర ముఖం ఎలా ఉండి ఉండొచ్చు?

-బిత్తరపడి చేజారిన బాల్యంలోంచి చేజేతులా చేసుకున్న యవ్వనానికి పారిపోయిన కాలనాగు శేషాచలపతి. ‘మృదువైన కాంతిలో పడగెత్తి నాట్యం చేసే’ నాగుబాము శేషు convulsive స్ఫురద్రూపంతో వణికిస్తుందా?

-గదుల్లో ఇమడని ధ్యానం, చింతన చినబోయిన మౌనం, దారులు ఒగర్చే యానం- భాస్కరం. అనుభవాలు అంటని, రంగులు ముంచని, మనసు మళ్లిన ‘ఓల్డ్ టెస్ట్‌మెంట్ ప్రొఫెట్’ భాస్కరం ఒంటరితనంలా వణికిస్తుందా?

-పోటీ… పొగరు… పంతం… పరుగు… పాముల నిచ్చెన్ల బండ బతుకు కొత్త altruistic  గమ్యాల దిశగా తీసుకున్న యూ టర్న్- వీరాస్వామి. ‘పసుపు కాని, ఆకుపచ్చ కాని, మిరమిట్లు గొలపని, నాలుగు ముఖాల అందం’- జర్కన్ వంటి వీరాస్వామిలా విలువ, ఖరీదు అర్థం కానట్టుంటుందా?

-‘కనిపించని ద్వారం’మీద దిష్టిచుక్క కాదు, నిన్నలోకి నెర్రెలిచ్చిన తలపోతల అద్దంలో ‘పాపిటి దగ్గర గరుకు నల్లటి పుట్టుమచ్చ’ మాత్రమే కాదు, కొంకర్లుబోయిన ముఖంలో కవళికలు మారినా కాంతి తరగని కళ్ల కింది నల్లని వలయం- నారాయణ. కెరటాల హోరులో బదుళ్ల నిశ్శబ్దాన్ని భరించలేకి ఆ ప్రళయ తరంగ తాండవంలోకి జారిన నారాయణ ఒకానొక బుడగై చిట్లినట్టుంటుందా?

-‘పిలకలు, కిర్రుచెప్పులు, చెవులకి కుండలాలు, ఆరవేసిన అంగవస్ర్తాలతో’ భగవంతం సనాతనత్వంలా ఉంటుందా?

కళ్లు ‘బోధిసత్వ అవలోకితేశ్వరుడివిగా, ఒళ్లు హెర్క్యులస్‌ది’గా గొప్ప విరోధాభాసలా ఉంటుందా? పోనీ ఇవేమీ కాకుండా, ఇన్ని అక్షర అతిశయోక్తుల్ని కలగన్న సుబ్బారాయుడిలా next door సుబ్బారావులా సాదాసీదాగా ఉంటుందా? సీజరు కాని, జుడాస్ కాలేని, ఎటుకీ చెందని ఆ ముఖాన్ని ఏమరుపాటుగా ఉన్నప్పుడు పొంచి చూసేయాలి. నా ఎడతెగని ఎక్స్‌పెక్టేషన్ల కుంచెలతో గీసుకున్న ముఖాలతో పోల్చి చూసుకోవాలి.

కనక, త్రిపురను చూడటం కంటే, తొంగి చూడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాను. అందుకే ఆయనను కలిసిన దాని కంటే పొంచి చూసిన సందర్భాలే ఎక్కువ. వైజాగ్‌లో నేనున్నప్పుడు రామలక్ష్మీ ఎస్టేట్స్‌కి అలా ఉట్టినే వచ్చి వెళ్లిపోతుండటం చూసి లక్ష్మి గారి కళ్లలో ‘మిలియన్ డాలర్ల ఆశ్చర్యం.’  ‘బెంగాలీ కథల మీ అనువాదం అద్భుతమ’ని (నిజమే కావచ్చు) ఎన్నిసార్లు చెప్పగలను?

ముఖాముఖినో, పొంచి ఉండో చూడడానికి త్రిపుర ఇప్పుడు లేరన్న ఆలోచ తెరలుతెరలుగా సంవేదనై కమ్ముతుంటే అనిపిస్తోంది – ఆయనతో ఇంత ముడివడిపోయానా అని.

నన్ను అనుక్షణం అంటిపెట్టుకుని ఉండే కవులు, రచయితలు… అన్నమయ్య, కృష్ణశాస్త్రి, బాదెలేర్, చలం, బుచ్చిబాబు, ఫ్లెబర్, మొపాసా. వీరందరూ నేను పుట్టకముందే నన్ను దొంగిలించిన తీవ్ర నేరం వల్ల నా వాళ్లయ్యారు. అటువంటి సారూప్యాలేవీ లేని కాఫ్కా, త్రిపుర, మో… వంటివారు కూడా నా వాళ్లు కావడం నాకెప్పుడూ ఆశ్చర్యమే.

వాళ్ల ప్రపంచాలు ఆత్మాశ్రయాలనే ఆరోపణల మాటున అత్యంత విశాలమైనవి. వారి రచనల ద్వారా వారు చేసిన అన్వేషణ అనంతమైనది. ఆధునికత అనే ఔషధం వికటించి కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ వీరిని బాధించినంతగా నన్ను ఇబ్బంది పెట్టలేదు. త్రిపుర విషయానికొస్తే,  ‘భౌతికంగానూ, మానసికంగానూ ఈ కథల పరిధి చాలా పెద్దది’(పాలగుమ్మి వారి మాటల్లో). ఆయన పాత్రలు చాలా elitist, ఐతే ఆర్థికంగా, లేదా తాత్వికంగా. శేషు లాంటి దాష్టికరాయుళ్లకి బెలూచిస్థాన్, జర్మనీలు స్పిరుచ్యువల్ హోమ్స్, భాస్కరం వంటి ఏక్ నిరంజన్‌లకి ‘తెల్లగా నిర్మానుష్యంగా ఉందనిపించే సైబీరియా’ స్పిరిచ్యువల్ హోమ్. రాణీవాసపు చెర వైభవాల లలితాదేవి, విమల ప్రభాదేవీలు, ఇన్‌గ్రెడ్ బెర్గ్‌మెన్‌లా ఉండే జాహ్నవులు, Monty Clift లా ఉండే శివరామన్‌లు… అవే కావు, మురికివాడలు, గల్లీలు, పేదరికం, నక్సలిజం… కూడా ఉన్న ప్రపంచం త్రిపురది. అందులో ‘గొలుసులు-చాపం-విడుదల భావం’ ఒక్కటే నాది. మా హోమియో డాక్టర్ (నా గురువుగారు కూడా) ఎన్‌వీ బ్రహ్మం గారు- నేను Argentum nitricum కేసు అనేవారు.

‘ఎందులోనూ ఏ చెయ్యీ బాగా ఎట్టకుండానే ఎళ్దామనుకుంటాను, మన దారిని మనం. అయితే అన్నిట్నీ గుద్దేస్తూ.

…ఎందుకు అన్నిట్నీ గుద్దేస్తుంటారూ? కళ్లకి చూపు తక్కువా, వొళ్లు ఊపు ఎక్కువా? మతిమరుపా, కండ కావరమా, మదవా రోగమా? అసలు తత్వమే అంతా? నడుస్తూ యింట్లోనే అందర్నీ అలా గుద్దేయడమేమిటి? బుర్ర దువ్వుకుంటూ అద్దాన్నే గుద్దేయడం… అలా గుద్దుకుంటూ నడిస్తే గాని…’- ఇవే లక్షణాలు!

‘మెదడులోని మతడల్ని చూశావా ఎప్పుడేనా, తమ్ముడూ, మెదడులోని మెకానిజం? ఆలోచింపజేస్తుందే ఆ మెకానిజం? చూళ్ళేదూ, అవును నీకెందుకూ అలాటివి. పోయి, వీధుల్లో ఆడపిల్లల్ని చూస్తానంటావ్ కాబట్టి నీకేం తెలీదు, వెళ్ళి చూడు…’

– వాళ్లన్నయ్య ఆ కథా నాయకుడితో అన్నాడా, త్రిపుర నాతో అన్నారా?

(పై కథని మినహాయిస్తే) త్రిపుర కేవలం శైలీగత కారణాలతోనే నాకు దగ్గరయ్యారా? నాకూ సరైన స్పష్టత లేని ఈ ప్రశ్నే బహుశా ఆయనని, ఆయన రచనల్ని కొన్నిసార్లు scepticalగా చూసేలా చేసిందేమో.

ఉపరితలంలో చూస్తే ఆయన కథలు రాసిన కాలం 1963- 73 (ఆ తరవాత నాదీ అని పైన చెప్పుకున్న కథ 1981లో, 1987లో మరొకటి). అంటే 1928లో పుట్టిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర్రావ్ అనే త్రిపుర తన 35-45 ఏళ్ల మధ్య ఓ 13 కథలు రాశారు. సాధారణంగా రచయితలు తమ యవ్వన ప్రాదుర్భావ వేళ కవిత్వం రాస్తారు. జలపాతం ఉధృతిని మైదానం నెమ్మదించాక వచనం వైపు మళ్లుతారు. కానీ త్రిపుర విషయంలో ఇది తిరగబడింది. ఆయన 50 ఏళ్లు పైబడ్డాక కవిత్వం మొదలెట్టారు (తన 47వ పుట్టినరోజు నాడు 1975లో రాసిన సెగ్మెంట్స్ ఇంగ్లీష్ దీర్ఘ కవిత సెమీ ఆటోబయోగ్రాఫికల్). ఇంకా కచ్చితంగా చెప్పాలంటే తన 70వ పడిలో రాశారు కవిత్వం. ఇటువంటి విలోమ ప్రయాణం గురజాడలో మాత్రమే ఉంది. అయితే, గురజాడ సీరియస్ సాహిత్యవేత్త. అంటే త్రిపుర నాన్ సీరియస్ అని కాదు. సవాలక్ష వ్యాపకాల వల్ల తాను రాయాలనుకున్న, ‘రాయవల్సిన’ దాంట్లో పదో వంతు మాత్రమే రాసినా (యుగకర్త, మహా కవి వంటి విశేషణాలు తీసేసి చూసినా), గురజాడ ఓ సాహిత్య ఉద్యమకారుడు.

ఈ విధంగా చూస్తే, త్రిపుర సాహిత్యం తెలుగు పాఠక లోకానికి ఏమవుతుందో గానీ, త్రిపురకి మాత్రం తన సాహిత్యం ఓ passing cloud, ఆ మబ్బు రాల్చే సాంత్వన జల్లు అయితే కావచ్చు. అసలు తానొక రచయితగా కూడా claim చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు (తనమీద, తన రచనల మీద రచయిత చేసుకునే ఏ తెలుపు నలుపు క్లెయిమ్స్ అయినా పట్టించుకోవాల్సిన అవసరం పాఠకుడికి లేదనుకోండీ). ఆయనకి తన రాతలంటే ఖాతరు లేదు గానీ సాహిత్యం, ముఖ్యంగా ఇంగ్లీషు సాహిత్యంతో జన్మాంతర బంధం, ఆత్మగత సంబంధం. గురజాడని ఆధునికతకి ఒక కొండ గుర్తుగా తీసుకుంటే ఆయన మొదలు, స్వాతంత్ర్యానికి ముందటి వరకూ పుట్టిన కవులూ రచయితలు (ముఖ్యంగా బ్రిటిషిండియాలో ఉన్న కోస్తాంధ్ర రచయితలు) అందరూ ఇంగ్లీష్ సాహిత్య ప్రేమికులే. అందులోనూ వ్యాహాళికి నాయుడుపేట నుండి మద్రాసు వెళ్లి ఆల్బర్ట్ కామూ, సార్ర్త్‌లతో తిరిగి రాగలిగిన వెసులుబాటున్న పెద డాక్టరు గారబ్బాయి త్రిపుర పేరు ప్రత్యేకంగా ప్రస్తావించవలసిందేముంది? ఎమ్మే ఇంగ్లీష్ చేసిన కలోనియల్ బుర్రలు రెండాకులు ఎక్కువ చదవడంలో విడ్డూరమేముంది? ఉంది! ఆ విషయంలో త్రిపుర మహా తేడా. బెనారస్ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ ఎమ్మెస్సీ అర్ధాంతరంగా ఆపేసేనాటికి కూడా ఆయనకి వ్యవసాయంలో ఓనమాలు తెలియవు; ఫీల్డ్ ఫిజియాలజీ చేయవలసి వచ్చిన నాటికి అసలు వరి కంకే తెలియదు. పాత గురువు గారి సలహా మీద ఎమ్మే ఇంగ్లీష్ ఆనర్స్‌లో చేరడం-ఎకడమిక్ ఎదుర్రాయి కొట్టుకోవడం కాదు.

అలాగని అది తోవ చూపించిన వేలు కూడా కాదు. రెక్కమాను శిథిలమైన కూడలిలోకి ఆయనని నడిపించిన చేయి. ఏ తోవ ఎటు పోతుందో వెదుక్కోవడమే ఆయన చదువు.

అధ్యయన విషయంలో కూడా త్రిపుర గొప్ప తేడా మనిషి. ఆయన ఏ పుస్తకాన్నీ ఏకబిగిన చదవగలిగేవారు కూడా కాదు (ముఖ్యంగా తనని డిస్కవర్ చేసి సారూప్యాల్ని ఘనంగా ఎత్తిచూపిన బెకెట్, కాఫ్కా, కామూ వంటి రచయితల్ని). కొన్ని పుస్తకాలు ఏళ్లు గడిచినా పేజీలుగా ముందుకు నడవని సందర్భాలు కోకొల్లలు. తెల్లని కాగితాల మీద కథలని చీమలబారుల్లా ఎడమ నుంచి కుడికి పరుచుకున్న అక్షరాల్ని వాటి నిజ రూపాలతో దర్శించడమనే శాపాన్ని ఆయన జన్మతః పొందారు.  Genuine poetry can communicate before it is understood అన్న టీఎస్ ఎలియట్ రివలేషన్‌కి మరికొంత పొడిగింపు త్రిపుర అభిశప్తానుభవం: ‘పూర్తి’గా చదవకముందే ఎన్నో గ్రంథాల ఆత్మదర్శనం కావడం.

‘ఆలోచన’కి ‘తెలుసుకోవడాని’కి మధ్య అఖాతాన్ని గెంతి, దుమికి ‘సీసాలో బాతు పైకి వచ్చేసింది’ అని మాండో రూపంలో చెప్పే జవాబులు సృజన సాహిత్యంలోనో, తాత్విక వాఙ్మయంలోనో కుదురుతుందేమో కానీ ఇలా ఒకానొక పచ్చి వచన వ్యాసంలో ప్రతిపాదించడం ‘గేమ్ రూల్’ కాదని, అబ్సర్డ్ అని ఇంగిత జ్ఞానం నాకు లేకపోలేదు. అయితే త్రిపుర విషయంలో ఆయన సాహచర్యం వల్ల, అంతకుమించి, ఆయనను పొంచి చేసిన అపరాధ పరిశోధన తరహా పరిశీలన వల్ల నేను గ్రహించిన సత్యమది.

గ్రంథ సారాన్ని దివ్య చక్షువులతో గ్రహిస్తారన్న మిత్‌ను గానీ, ’రాబో’ సినిమాలో యంత్రుడిలా అలా అలవోకగా పుస్తకాలని స్కాన్ చేసిపారేస్తారన్న సోషియో ఫాంటసీనో ఏకరువు పెట్టడం లేదు నేను. ప్రభావాలకి గురికావడంలో కూడా తన, తన ముందు తరం రచయితల (ఒక్క తెలుగులోనే కాదు)కి కూడా త్రిపుర పూర్తిగా భిన్నమైన వారని గ్రహించినట్లు విన్నవించుకోడమే నా అభిమతం. శామ్యూల్ బెకెట్ ‘వెయిటింగ్ ఫర్ గోడో’ ప్రభావంగా చెప్పుకునే ‘భగవంతం కోసం’ రాసేనాటికి ఆ నాటకాన్ని త్రిపుర చదవలేదు. దానిమీద వచ్చిన సమీక్ష (కూడా) చదవలేదు, చూశారంతే. విశాఖపట్నం ఏవీఎన్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఓ మలయాళీ కాకా హోటల్లో కూర్చుని కబుర్లాడుకునేటప్పుడే – భగవంతం పదమూడో నంబర్ బస్సులోనో, ఇటు ఏడో నంబర్ బస్సులోనో వస్తాడని త్రిపుర ఎదురు చూశారు. నాటి ఎదురుచూపు కథగా ఆకారం తీసుకోవడానికి ‘వెయిటింగ్ ఫర్ గోడో’ అన్న శీర్షిక ఒక ప్రేరణ వంటి నెపం. అలానే, ఆయనకి కాఫ్కా రచనల కంటే Kafkaesque తనమే ఎక్కువ చేరువని ఆయన కాఫ్కా థీమ్ కవితా సంకలనం (త్రిపుర కాఫ్కా కవితలు) చెప్పకనే చెబుతుంది.

తన సృజనాత్మక రచన విషయంలోనే కాదు, ఆయన ప్రసంగాలలో కూడా ఇదే ఒరిజినాలిటీ కనబడుతుంది. ఓసారి విజయవాడలో యూజిన్ అయొనెస్కో మీద ప్రధాన ప్రసంగానికి ‘మో ఆయనను ఆహ్వానించారు. మూడు గంటలు పైగా సాగిన నాటి ప్రసంగంలో ది న్యూ టెనెంట్, ది చైర్స్, ది లెసన్, అమెడీ వంటి అయొనెస్కో నాటకాల ప్రస్తావనైతే ఉంది గానీ, స్థూలంగా ఆ ప్రసంగమంతా అయొనెస్కో ఆత్మతో (అప్పటికి అయొనెస్కో చనిపోయాడు) త్రిపుర చేసిన సంభాషణ; ఏ అకడమిక్ పుస్తకాల్లో కనిపించని వ్యాఖ్యానం, ప్రకాశంగా చేసిన స్వగతం. ఈ సమావేశానికి హాజరు కూడా కాని విలేకరులు తమ సాహితీ ‘source’ల ద్వారా కనుక్కుని రాసిన వార్త శీర్షిక ఇది: అబ్సర్డ్ నాటకకర్త అయొనెస్కోపై మరో ప్రముఖ అబ్సర్డ్ రచయిత త్రిపుర ప్రసంగం!

 

**      **      **      **

సౌరభమ్ములేల చిమ్ము పుష్పవ్రజంబు, చంద్రికలనేల వెదజల్లు చందమామ, గాడ్పేల విసురు, ఏల సలిలమ్ము పారు… అన్న కవిత గుర్తుకు తెస్తూ, రచన కూడా ఒకానొక ప్రాకృతిక ధర్మమేమో అన్పించేలా సృజన చేసిన త్రిపుర స్వయంప్రకాశకత్వాన్ని సూక్ష్మంగానైనా గ్రహించాను. నాకు తెలిసిన అక్షర ప్రపంచంలో మహా కవుల్ని, గొప్ప రచయితల్ని కలిశాను గానీ, నేను దర్శించిన తొలి ‘ఒరిజినల్’ రచయిత త్రిపురే. ఆ రెవలేషన్ తాలూకు ఉద్వేగం జ్వరంలా నిలువెల్లా కమ్మిన ఓ సందర్భంలో ఒక catharsis ఉపశమనం లాంటి సాష్టాంగ దండప్రమాణం చేశానాయనకి.  ‘a’uthor గా కూడా గుర్తింపుకి ఇష్టపడని తనని ‘A’uthor గా డాబు చేసిన నా సాష్టాంగ నమస్కారం ఆయనని చాలా గాయపరిచింది. ఆ భంగపాటుని ఎంతమాత్రం దాయనితనం ఆయన కళ్లలో ప్రస్ఫుటంగా కన్పించి మళ్లీ కలవడానికి కొంతకాలం ముఖం చెల్లలేదు.

పాద నమస్కారాల కాలం పరిఢవిల్లుతున్నందువల్ల ఆయన నన్నప్పుడు ఆశీర్వదించి తన అనుంగు శిష్యుడిగా స్వీకరించి అక్కున చేర్చుకున్నా అంతకంటే ఎక్కువ సిగ్గుపడేవాడ్నే. అంటే, ఆ క్షణం ఒక్కటే ఒక స్థితి; ముందు వెనకలు పొడిగింపులు లేని స్థితి, ఆయనకైనా, నాకైనా. రచయితగా ఆయన విస్తృతిని నేను దర్శించిన ఆ క్షణంలోనే, రచయితగా తన పరిధిని ఆయన ప్రదర్శించారు. అటువంటి అపురూపమైన క్షణం వెలిగించగలగడం ఒక్క త్రిపురకు తప్ప తెలుగుదేశంలో మరొకరికి సాధ్యమవుతుందని అనుకోను. జీవితాన్ని గాఢంగా తరచి, మథించి, శోధించి, అనుభవించి, అంతలోనే తామరాకు మీద నీటిబీట్టులా తటస్థమవడమే సాహితీ తత్వవేత్త త్రిపురలోని వెలుగునీడలు. కాలక్రమణికతో గణాంకాల బట్టీ త్రిపురని చూస్తే చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. 85 ఏళ్ల నిండైన జీవితంలో (63 ఏళ్లు సాహిత్యంతో, తత్వ శాస్త్రంతో మమేకమై ఉండి కూడా) ఆయన పట్టుమని పదిహేను కథలకి మించి ఎందుకు రాయలేదు, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన బెనారస్ హిందూ వర్సిటీలో వామపక్ష రాజకీయాల్లో ఉండి, ఆ తరవాత ఉద్యోగరీత్యా దేశదేశాలూ తిరిగి, అగర్తలాలో నక్సల్స్‌తోనూ సంబంధాలు పెట్టుకొని, ఒకపక్క మార్క్స్‌నీ మరోపక్క బుద్ధుడ్నీ మధ్యలో స్పినోజా, షొపన్ హావర్‌లనీ చదువుకున్న త్రిపుర తన 35 వ ఏట (1963) వరకూ రాయాలని అనిపించకపోవడమేమిటి? 45వ ఏడు వచ్చేసరికి, అంటే పదేళ్లలో 13 కథలు రాసేసి, ఇహ కలం మూసేయడమేమిటి? లెడ్జర్ బుక్కు జీవితంలో లౌకిక, సాంసారిక బ్యాలెన్స్ షీటు తయారు చేసుకునే భద్రమైన జీవితాన్ని ప్రేమించేవాడైతే తనని తాను Segments గా నిర్దాక్షిణ్యంగా కోసుకుని చూసుకునేవారా?

సెగ్మెంట్స్ ఒక సెమీ ఆటోబయాగ్రఫికల్ కవిత. 1975లో తన 47వ పుట్టినరోజు సందర్భంగా ఈ దీర్ఘ కవిత రాశారు త్రిపుర. ప్రపంచ ప్రఖ్యాత పెరూ మహాకవి César Vallejo కవిత  »El alma que sufrió de ser su cuerpo’  శీర్షికే ఎపిగ్రాఫ్‌గా మొదలవుతుంది దీర్ఘ కవిత. 46 ఏళ్లు మాత్రమే బతికిన  వల్లెజో  (1892`1938) తన జీవిత కాలంలో వెలువరిచినవి కేవలం మూడు సంపుటాలే (అందులో ఒకటి ఆయన మరణానంతరం విడుదలైంది). కానీ ఆధునిక కవుల్లో ప్రపంచవ్యాప్తంగా అంతటివాడు లేడన్న పేరు. మౌలికంగా ఆయన విప్లవ కవి, స్వయంగా స్పెయిన్ అంతర్యుద్ధంలో కమ్యూనిస్టుల తరఫున పోరాడిన యోధుడు. చే గువేరాని అత్యంత ప్రభావితం చేసిన కవి  వల్లెజో. అమెరికా చే గువేరాని మట్టుపెట్టాక, చేగువేరా సంచీలో దొరికిన పుస్తకంలో తన స్వదస్తూరీలో రాసుకున్న  వల్లె, నెరూడా వంటి అతి కొద్దిమంది కవితలు బయటపడ్డాయి. మన మహాకవి శ్రీశ్రీ కూడా  వల్లెజో కవిత్వాన్ని అనువాదం చేశారు. అయితే, త్రిపుర ఎంచుకున్న  వల్లె కవిత పూర్తిగా భిన్నమైంది, తాత్వికంగా చాలా గాఢమైనది,  వల్లె దాదాపు మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు రాసినది. ఆ కవితా శీర్షికకి అర్థం ‘దేహమై క్షోభ పడ్డ ఆత్మ’. అంతుచిక్కని రుగ్మతతో అర్ధాంతరంగా కన్నుమూసిన  వల్లెజో దేహాత్మల ద్వంద్వాన్ని ప్రదర్శిస్తూ, అంతలోనే ఆ ద్వైతాన్ని రద్దు చేయడమే ఆ కవిత.

సెగ్మెంట్స్ కవిత రాసేటప్పటికి త్రిపుర మనఃస్థితి కూడా అంతటి సంక్షోభమయమే, సంవేదనాత్మకమే.

1950 ప్రథమార్ధం నాటికే బెనారస్‌లో చదువు, ఉద్యోగం, విరమణ కూడా అయిపోయాయి. 1954`57 వరకు మాండలే (బర్మా)లో ఉద్యోగం;  1957`59 మధ్య మదనపల్లి, విశాఖల్లో చిన్న మజిలీల తరవాత ఆయన అగర్తలా (త్రిపుర)లోని మహారాజా బీర్‌బిక్రమ్ కాలేజీలో చేరారు. ఆయనకి నక్సల్స్‌తో సంబంధాలుండేవి, వారికి సాయం చేయడానికి బ్యూరోక్రసీతో సన్నిహితంగా మెలిగారు కూడా. ఆయనలో ‘జుడాస్’ ఎలిమెంట్ లేకపోవడం వల్ల తమ రహస్య బృందంలో ‘జుడాస్’ని కనిపెట్టలేక, ఆ ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించి, మతి చెడి పిచ్చాస్పత్రి పాలయ్యారు. ఇదంతా ఆయన వెదుకులాట. తోవలు వెదుక్కున్నారు, కనుక ఎదురు దెబ్బలూ తిన్నారు, అసలు తోవంటూ ఏదీ లేదన్న తాత్విక స్థితికి చేరుకున్నారు 1963`73 మధ్య రాసిన 13 కథల్లో, ఆ కథల్లో కదలాడిన భాస్కరం, శేషు, వీరాస్వామి, రాజు, మున్నీ, ముక్తాదేవి, కల్యాణి… అనేక పాత్రలతో ఆయన చెప్పాలని ప్రయత్నించిన వాక్యం

‘చచ్చిపోలేదు గానీ, జీవితంలో మిగిలి ఉంది ఏమీ లేదు’.

ఆ ప్రకారం చూస్తే కథలకి కలం మూసేసిన రెండేళ్లకి రాసిన Segments ఆయన అర్ధాంతర సాహిత్య ప్రస్థానానికి ఒక ముగింపు; ఆత్మకథలో ఆఖరి అంకం. ఏదో తనకి సానుకూలమైన సమాధానం చెప్పుకుని తప్పుకోవడమో, సౌలభ్యం చూసుకుని తప్పించుకోవడమో కాదు, దారి లేదని తెలుసుకోవడం. తనకు తాను కూడా మిగలని స్థితిలో శాంతి లేదు, సుఖం అంతకంటే లేదు. వెయ్యి యుద్ధాలతో తలపడే తెగువును మించినదేదో ఉండాలి, ఆ లోన పెనుగులాటని తట్టుకోవడానికి.

సోదరుడు Abel ని హత్య చేసి కూడా, »…am I my brother’s keeper? అంటూ దేవుడ్నే బుకాయిస్తాడు Cain. »…am I my brother’s keeper?? అన్న వాక్యాన్నొక allusion లా వాడతారు త్రిపుర తన  Segmentsలో. ప్రలోభాలకి లొంగి  ద్రోహం చేసి తమ్ముడి దుర్మణానికి కారణమవడమే కాకుండా, తన మతిస్థిమితం కోల్పోవడానికి కూడా కారణమైన ‘జుడాస్’ ల ప్రస్తావన ఉండే గానీ, వారి మీద నింద లేదు; స్వీయనింద ఉంది.

Couldn’t you too have died you’re your brother did,/ or at least bled… (నువ్వూనూ నీ తమ్ముళ్లానే/ చావలేకపోయావా?/ కనీసం గాయపడనైనా లేకపోయావా? ..అనువాదం ‘మో’)

YOUR WERE CLEVER / you did not spill a single/ drop of your brother’s / blood coarsing in your arteries..  అంటూ తనని తాను నిర్దాక్షిణ్యంగా చీల్చుకుంటారు. ఓ నిరపాయకర ప్రేక్షకుడిగా కేవల సానుభూతిపరుడిగా రణక్షేతాన్ని చూడడం, తమ్ముళ్ల త్యాగాన్ని భద్రంగా కీర్తించడం ఆయనను ఆత్మనిందకు పురిగొల్పుతాయి. కానీ కన్ఫెషన్‌తో కుమిలిపోతున్న ఈ కవి స్వాభావికంగా ఏకాకి.

..the skeletal arms of giant trees/ bend close from either side darkly to embrace me/ into/ their land of ‘No’/ which’s but/ a heartbeat away/ gurgling its marshy messages:/ soft black whispers./ “vanish into Zero the Perfect State”

సంపూర్ణమైన సున్నాలోకి అదృశ్యమవ్వాలనే వాంఛ మరో పక్క. ఇదీ ఆయన పెనుగులాట. సామాజికతకి, ఆత్మాశ్రయతకి మధ్య ఆయన నలిగిపోయారు. I see now CLEARLY/ my mirror reflects my terrible shame…..  అని కుంగిపోతారు తన నలభయ్యేడు సాయంతనాల సాంధ్యధూళిలో.

‘చచ్చిపోలేదు గానీ, జీవితంలో మిగిలి ఉంది ఏమీ లేద’న్న దిగులే ఆయన చేత సెగ్మెంట్స్ అనే ఎపిలోగ్ రాయించింది. ఆ తరవాత రాసిన కథలు (గొలుసులు-చాపం-విడుదల భావం  1981;  వలస పక్షుల గానం  1987), కవిత్వం (బాధలూ సందర్భాలూ 1990; త్రిపుర కాఫ్కా కవితలు  2001) ఆయన తనని ఏకాంతపరచుకునేందుకు మీటుకున్న ఏక్‌తార సాంత్వన సంగీతం మాత్రమే.

**      **      **      **

పట్టుమని పదమూడు కూడా లేని ఆయన కథల్ని text కి సంబంధం లేకుండా context పరంగా చూస్తే మరొకటి స్ఫురిస్తుంటుంది. అదేమిటో చెప్పాలంటే, ముందు ప్రదీప్ చౌధురి గురించి, ఆయనకి త్రిపురతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకోవాలి. పశ్చిమబెంగాల్ సాహిత్య ప్రపంచంలో 1961`65 మధ్య వచ్చిన ఉప్పెన- హంగ్రీ జనరేషన్. మన దిగంబర కవులకు మల్లే హంగ్రీ జనరేషన్ కవులు మలయ్‌రాయ్ చౌధురి, అతని సోదరుడు సమీర్‌రాయ్ చౌధురి, శక్తి చటోపాధ్యాయ, దేవీరాయ్ (హరధోన్ ధార) కూడా అమెరికా ‘బీట్ జనరేషన్’తో ప్రేరణ పొందారు. అయితే బీట్ కవుల్లో ‘పేరుమోసిన’  ఎలెన్ గిన్స్‌బర్గ్ మన కాశీఘట్టాలు, కలకత్తా వీధుల్లో తిరిగి, మన అఘోరాలతో, బూడిద స్వాములతో చెట్టపట్టాలేసుకుని బతికినప్పటి (1963) వరకూ బీట్ కవిత్వాన్ని హంగ్రీ జనరేషన్ కవులు చూడనేలేదని కొందరు సాహిత్య చరిత్రకారులు వాదిస్తారు. ఈ వివాదాలు సాహిత్య పరిశోధకులకే వదిలేసి స్థూలంగా చెప్పుకుంటే, పశ్చిమబెంగాల్ హంగ్రీ జనరేషన్, మన దిగంబర కవులూ, కొలంబియా Papelipolas, స్పానిష్ Generation µ68 వంటి కవి బృందాల ఆక్రోశం, ఆగ్రహాల్లో సారూప్యాలున్నాయి.

Statusquoని నడ్డి విరిచి, ధ్వంసం చేసి కొత్త దారి వేయాలన్న వారి ఉద్రేకాల్లో పోలికలున్నాయి. అటువంటి హంగ్రీ జనరేషన్ కవులలో ప్రదీప్ చౌధురి ఒకడు. మాతృభాష బంగ్లాతో పాటు ఇంగ్లీషు, ఫ్రెంచిలలో కూడా అదే స్థాయి అభివ్యక్తి ఉన్నవాడు.అందరిలోనూ బహుశా చిన్నవాడైనందు వల్లనేమో కొంచెం దుందుడుకువాడు కూడా. 13,14 ఏళ్లకే కవిత్వం మొదలెట్టి ‘చెడి’పోయాడు. నలభయేడేళ్లకే చనిపోయిన బీట్ కవి, రచయిత Jack Kerouac తో మమేకమైనవాడు (Kerouac స్మరణలో శుద్ధ కవిత్వమై, పచ్చి వచనమై కూడా తేలిపోయినవాడు). తండ్రి ఉద్యోగరీత్యా కలకత్తా వదిలి ఢిల్లీ, అగర్తలాల్లో చదువుకున్న ప్రదీప్‌కి పాఠాలు చెప్పినందుకే కాదు, ప్రేరణ అయినందువల్ల కూడా త్రిపుర గురువు అయ్యారు, మిత్రుడయ్యారు, తరవాత సహోద్యోగి కూడా అయ్యారు (ప్రదీప్ కొంతకాలం జూనియర్ లెక్చరర్‌గా మహారాజా బీర్‌బిక్రమ్ కళాశాలలో పని చేశారు). ఈ గురుశిష్యుల మైత్రి ఆనాటి నుంచీ కొనసాగింది. త్రిపుర Segments(1975)ని ప్రదీప్ తాను నడిపే త్రిభాషాపత్రిక ‘స్వకాల్’ లో 1979లో ప్రచురించారు కూడా.

ప్రదీప్ గురించి త్రిపుర నాకు చెప్పిన అనేక సంగతుల్లో ఒకానొక అప్రధానమైన సంఘటన:

పేరున్న ఓ కళాశాల వారు విశ్వకవి రవీంద జయంతి సందర్భంగా అట్టహాసంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ప్రదీప్‌ని ముఖ్య అతిథిగా రవీంద్రుడి మీద ప్రధాన ప్రసంగానికి ఆహ్వానించారు. ఆర్భాటమైన ఆవరణ, మంద్రంగా రవీంద్ర సంగీతం, రంగులన్నీ అక్కడే పుట్టాయా అన్నట్టున్న శోభాయమానమైన ఆ ప్రాంగణం చుట్టూ ఒక చెయ్యి త్రిపుర భుజం మీద వేసి, మరో చేత్తో నాటు సారా ప్యాకెట్లు తాగుతూ కలియదిరుగుతున్నాడు ప్రదీప్. అప్పటికే నిలదొక్కుకోలేని స్థితిలో తప్పతాగి ఉన్న ప్రదీప్, త్రిపుర ఎంత వారించినా వినకుండా జేబులోంచి ప్యాకెట్ల మీద ప్యాకెట్లు తీస్తూ తాగుతూనే ఉన్నాడు. సభ ఆరంభమై ముఖ్య అతిథి ప్రదీప్‌ను వేదిక మీదకి ఆహ్వానించారు నిర్వాహకులు. అతికష్టంమీద వేదిక మీద మైకు దగ్గరకు వెళ్లిన ప్రదీప్, భళ్లున పెద్ద వాంతి చేసుకుని,  ‘రవీంద్రుడు బెంగాలీ సాహిత్యానికి, ప్రపంచ సాహిత్యానికి చేసిన కాంట్రిబ్యూషన్ పట్ల నా అభిప్రాయం ఇదే’ అన్నాడు(ట).

త్రిపుర కథలని contextual గా చూస్తే- తెలుగు కథ స్తబ్ధత మీద, వస్తు-రూపాల మొనాటనీ మీద నిరసనగా భళ్లున కక్కిన వాంతి అని అనిపిస్తోంది. తెలుగు కథకి గురజాడ కంటే ముందు ఓ సాంఖ్యాయన శర్మ, లేదా మరో భండారు అచ్చమాంబ కథలు రాశారంటూ సాహితీ పరిశోధకులు నిగ్గుతేల్చుతున్నారు గానీ, ఆ తొలినాటి కథకుల ఔత్సాహిక తప్పటడుగుల్ని పక్కన పెట్టి, సీరియస్ కథకి pioneer గా గురజాడని తీసుకుంటే 20వ శతాబ్దపు తొలి దశకంలో ప్రారంభమై, రెండు, మూడు, నాలుగో దశకాల్లో ఉచ్ఛ దశకు చేరుకున్న తెలుగు కథ, 1950ల్లో నెమ్మదించి, ఆ దశకం చివరి నాటికి క్షీణ దశకి చేరుకుంది. ఆధునికతకి ముందటి కంటే ఆధునిక యుగంలో కాలం నడకలో వడి హెచ్చింది. అంతకుముందు పరిణామాలన్నీ ఒకెత్తు, ఒక్క 20వ శతాబ్దపు మార్పులన్నీ ఒకెత్తుగా దూకిన కాలంలో పుట్టి, కలం పట్టిన వారిలో కూడా అదే దూకుడు ఉండాలి. దశాబ్దంలోపే దూసుకొస్తున్న కొత్త తరం వెనకటి తరం కంటే ఎక్కువ సౌకర్యాలు పొందే సుఖానికే కాదు, మరింత చిక్కని సంక్లిష్టతలు ఎదుర్కోవాల్సిన కష్టానికీ సిద్ధం అవాల్సి వచ్చింది. వెనకటి తరం వేసిన దారిలో కొంత అనాయాసమైన ప్రయాణం చేస్తూనే, ఆ దారిని మరింత వెడల్పు చేయాల్సిన తరాలు, అలా చేయకపోగా దానిని ఒక ఇరుకు డొంక చేసేశాయి. కథంటే ప్రాపగాండా, ముందే సిద్ధం చేసుకున్న ఒక ప్రతిపాదన, ఎత్తులు నిర్ణయమైపోయిన శకుని పాచిక. పాత్రలు తాను ఆడించినట్లు ఆడే తోలు బొమ్మలు, తానొక సృష్టికర్త. కథ చెప్పే గొంతుకలో గొప్ప గోరోజనం. ఆ కనిపించని కన్ను, తెర వెనక మూకీకి తెలియని సంగతులే లేవు, చూడని లోతులూ లేవు, ఆడా మగా తేడాల్లేకుండా పాత్రల అంతరంగాల అల్లకల్లోలాల్ని అక్షరాల్లోకి అలవోకగా ఆవిష్కరిస్తుంది.

Leo Tolstoy ‘వార్ అండ్ పీస్’ కథానాయిక నటాషా పాత్రకి పూర్తి ప్రేరణగా పరిశోధకులు నిర్ధారించిన ఆయన చిన్న మరదలు  Tanya Behrs ఆయననొక ఉత్తరంలో నిలదీస్తుంది-  ‘సైనికాధిపతుల్ని, యోధుల్ని, భూస్వాముల్ని పాత్రలుగా మలచటంలో ఎంతో నేర్పు ఉండొచ్చు. కానీ ప్రేమలో మునిగి ఉన్న ఒక స్త్రీ మనసులోకి మీరెలా తొంగిచూడగలరు?’ అంటే ఆధునిక సాహిత్యం అనుభవాత్మకమే కానీ, ఊహాత్మకం, వ్యూహాత్మకం కాదని, కాకూడదన్నదే టాన్యా నిలదీత అంతరార్థం. రాయడానికి ముందు తన పాత్రలు చెప్పేది శ్రద్ధగా వింటానని Charles Dickens అంతటి మహా రచయిత వినయంగా ప్రకటించిన చోటే author- authority కి పర్యాయపదమైపోయాడని,  ‘కొత్తా దేవుడి’ అవతారమెత్తాడని  Roland Barthes (Death of the author)  వంటి విమర్శకులు గోలపెట్టారు. రచయిత అంటే author కాదని, అతనొక

scripter మాత్రమేనని అన్నారు. రచనతో పాటు పుట్టాడే తప్ప సర్వాంతర్యామిలా సకలం తెలిసిన మిడిసిపాటుతో ‘వివరించటం’, ‘ప్రబోధించటం’ కూడదని గగ్గోలుపెట్టారు.

గొప్ప రచనలు ఏవైనా ఏ కాలంలోనైనా సిద్ధాంతాలకి precursors లాంటివే గానీ, సైద్ధాంతిక దిశానిర్దేశం నుంచి పుట్టనే పుట్టవు. 1960 దశకం చివరి దశలో పుట్టి, మరో దశాబ్దం ఆలస్యంగా భారతదేశంలో ప్రవేశించిన రోలాండ్ బార్త్ వంటి కొత్త తరం విమర్శకుల స్ఫూర్తి 1963 నాటికే త్రిపుర రాసిన కథలలో between the lines తొణికిసలాడటం ఓ అద్భుతం.

రచనతో పాటే పుట్టటం అన్న స్ఫూర్తిని మరో రకంగా అన్వయించుకుని,  ‘నేను’ కేంద్రకంగా, డాబుసరిగా ఒక సొంత డప్పులా, అద్దం ముందూ ఆత్మవంచనలా ‘ఉత్తమ పురుష’ కథల శైలి కూడా కదం తొక్కింది (తొక్కుతోంది) తెలుగు సాహిత్య సీమలో.

“మీలో ఒక గొప్ప గుణముంది. ఏ అనుభవాన్నీ కాదనరు. కానీ వాటిని మీ రక్తంలోకి అరబడనీయరు. అవునా?’ అన్నాడు, మళ్లీ రాత్రి అనుభవం నా కళ్లలో ఇంకా మిగిలి ఉందేమో అని పరీక్షగా చూస్తూ.

అవునో కాదో అప్పుడు చెప్పలేకపోయాను. జవాబు ఇదీ అని ఊహించుకుని మాటల్లో చెప్పదలచుకుంటే, చెప్పడానికి ప్రయత్నిస్తే ఒఖ్ఖసారిగా గర్వం,  ‘అహం’ తెలియకుండా వెనకపాటుగా ముట్టడి చేసి… మాటల్లో విపరీతమైన ‘ట్విస్ట్’, అసత్యం… బంగారు పూత… వెలిగే అసత్యం. ‘నిజం’ యొక్క కఠోరత్వాన్ని కప్పి పుచ్చే అసత్యపు ఆకర్షణ… ఇవీ, నిజం యొక్క అసలు వెలుగును చూడలేక బెదరడం, భయం; మనసుతో ‘తెలుసు’కోగలిగినా,  ‘తెలుసుకోవడం’ నా శిక్షణలో ఒక భాగమైనా, ’నేను’ అన్న మాటలలో ఖంగుఖంగుమని సత్యం ఎప్పుడూ మోగదని, ఏది నిప్పులాగ నిజమో, ఏది వేషధారణో చెప్పలేననీ…”

 

ఇది జర్కన్ కథలో వీరాస్వామి, కథకుడు భాస్కరం మధ్య సంభాషణ, స్వగతం. ఇదే సాహిత్యంలో ఉండాలని త్రిపుర పదేపదే ప్రస్తావించే కన్ఫెషనల్ ఎలిమెంట్. ‘నేను’ని నిర్దయగా చీల్చి చూసుకోవడం. స్వోత్కర్ష గొప్ప సుఖమే గానీ, ఈ నేరాంగీకారం ఎంతమాత్రం సులువు కాదు.

‘యవ్వన ప్రౌఢ దశల్లో నేను తిరిగిన ప్రదేశాలు, పడ్డ మధనలు కథల్లో ప్రాణం పోసుకున్నాయి. ముఖ్యంగా నేను విద్యార్థిగా బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న రోజులు, ఆ రోజుల్లో నాకు బాగా చనువైపోయిన నగువా, యూనివర్సిటీ గేట్, యూనివర్సిటీ ఘాట్, బిర్లా, బ్రోచా హాస్టల్సు, దశాశ్వమేథ్ ఘాట్, గల్లీలు, గంగ, ఆనాటి కొత్త ప్రభావాలు, ఊహల్లో నమ్మకాల్లో ఉప్పెనగా వచ్చిన పరిణామాలు, మానసిక సంఘర్షణలు, ఎన్నో- వాటిని గురించి నేను రాయలేకపోయాను. ఈ కథకుడు రాయగలిగాడు. నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా. అంచేత కథల్లో సన్నివేశాలకు, పాత్రలకు రవంత దూరంగా వుండడానికి ప్రయత్నించేవాణ్ణి, వాటితో నాకెంత గాఢమైన బంధం వున్నా. ఈ కథకుడు ఆ బంధాన్ని స్పష్టంగా బయటపెట్టడానికి సిగ్గుపడలేదు, సంకోచించలేదు. అందుకు నా జోహారులు’ అన్నారు పాలగుమ్మి, త్రిపుర కథలకు రాసిన ముందుమాటలో. స్వాభావికమైన వినయం, విస్తృతమైన అధ్యయనం వల్ల అబ్బిన జ్ఞానం వల్ల సర్వశక్తిమంతులమని, అపరబ్రహ్మలమని పాలగుమ్మి వంటి మహా రచయితలు అహంకరించలేదు గానీ వారు కూడా రచనల్లో తమని దాచుకోవడానికే ప్రయత్నించారు. గొప్ప సాహితీవేత్త కావడమే కాకుండా, బెనారస్ నేపథ్యముండటం వల్ల కూడా పాలగుమ్మిని ‘త్రిపుర కథల’ ముందుమాటకు ఎంచుకున్నారేమో అత్తలూరి నరసింహారావు.

నిజానికి బెనారస్ విశ్వవిద్యాలయం పాలగుమ్మి జీవితంలో ఓ మజిలీ కాదు, అతి ముఖ్యమైన మలుపు. బెనారస్‌కి ముందు పాలగుమ్మి మీద సంప్రదాయ సాహిత్య ప్రభావం ఎక్కువ. సంస్కృత వాఙ్మయం కూడా కరతలామలకం. ఆయన అప్పటికే అష్టావధానాలూ చేసేవారు. బెనారస్ విశ్వవిద్యాలయం ఆయన ఆలోచనల్ని ఆధునికత వైపు మళ్లించింది. ఈ మార్పు పాలగుమ్మి సాహిత్య జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవ్వాలే గానీ ప్రత్యక్షంగా ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు, త్రిపుర కథలకి రాసిన ముందుమాటలో తప్ప (‘ఆనాటి కొత్త ప్రభావాలు, ఊహల్లో నమ్మకాల్లో ఉప్పెనగా వచ్చిన పరిణామాలు, మానసిక సంఘర్షణలు, ఎన్నో- వాటిని గురించి నేను రాయలేకపోయాను’). ఆ విధంగా ‘త్రిపుర కథలు’ ఆయన నాస్టాల్జియాని కెరలించాయి. ‘నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా’ అన్నారాయన. నిన్నామొన్నటి వరకంటే ఎప్పటివరకు? 1980లో ఈ పరిచయ వాక్యాలు రాయకముందటి వరకు; ఇంకొంచెం hypothetical గా చెప్పుకుంటే ‘త్రిపుర కథలు’ తనని పట్టి కుదపక ముందువరకూ అనుకోవచ్చేమో. ఎందుకంటే, ఆ ‘నిన్నామొన్నటి’ తరవాత కలిగిన కొత్త ఎరుకతో పాలగుమ్మి ఏ రచనా చేయలేదు. కనుక ఎంత కాదన్నా పాత నమ్మకాలు, అలవాట్లు ఓ పట్టాన పోవు కాబట్టి ‘ఇటువంటి కథలు నేను రాయగలనా’ అని నిట్టూర్పు వంటి ప్రశంసతో ముగించారు పాలగుమ్మి.

చైతన్యవంతమైన 1980ల నాటికే అలా ఉంటే, అప్పటికి 20 ఏళ్ల క్రితం, ఆధునిక కథాసాహిత్యం నిలవ నీరైపోయిన 1960లలో ఎంత స్తబ్ధత, మొఖం మొత్తే మొనాటనీ ఉండి ఉండొచ్చు? గబ్బిలాలై వేలాడే నిన్నటి నమ్మకాలు, పాత హాంగోవర్లు, మార్పు పట్ల ససేమిరాలు, ముఖం తిప్పేసుకోవడాల మీద ప్రదీప్ కక్కిన నిరసన వంటివే త్రిపుర కథలు కూడా. ‘అబ్సర్డ్ నాటకకర్త అయొనెస్కోపై మరో ప్రముఖ అబ్సర్డ్ రచయిత త్రిపుర ప్రసంగం’ అంటూ రాసేసిన విలేఖరుల మిడిమిడి జ్ఞానాన్ని పోలిన అజ్ఞానంతోనే- ఆయనని ప్రముఖ అబ్సర్డ్ రచయితగా చేసి, తనకి సంబంధం లేని విశేషణాల భుజకీర్తులు తగిలించిన తెలుగు సాహితీ ప్రపంచం పట్ల ఏవగింపు కూడానేమో.

అయితే, ఊసిన కారాకిళ్లీ మరకలో ఎరుపు మెరుపులు చూసినట్టు, ఆ కథల టెక్స్ట్‌లోని వచన కవిత్వాల జమిలీకి వ్యామోహపడి, తన నిగూఢ తాత్విక శైలీ విన్యాసానికి వ్యసనపడింది తెలుగు సాహిత్యం. పాపులర్ అయ్యే ప్రమాదం తప్పింది గానీ, context  అర్థం కాని సాహిత్యలోకానికి ఓ cult figure గా మిగిలారు త్రిపుర.

నరేష్ నున్నా

 

కవితాత్విక కథ ‘వాంగ్మూలం’

rm umamaheswararao

ఉమా మహేశ్వరరావు

నా స్నేహితురాలు ఒకరు ఒక సంఘటన గురించి చెప్పిన మాటలు తరచూ గుర్తుకొస్తూ ఉంటాయి. ఆమె, ఆమె స్నేహితుడూ సముద్రంలో మునుగుతున్నారంట. ఆనందమూ అలలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న వేళ, హఠాత్తుగా విరుచుకుపడ్డ ఒక అల ఆ ఇద్దర్నీ లోపలికి గుంజేసుకుంది. ఇక అంతా ముగిసింది అని అర్ధమయిపోయింది వాళ్ళిద్దరికీ. అప్పుడొక అల ఎదురొచ్చి, ఈడ్చి విసిరేసిందంట ఇద్దర్నీ గట్టు మీదకి. చావుకీ బతుక్కీ మధ్యన ఉండే సున్నితపు రేఖను చూసిన ఆ ఇద్దరూ తడి ఇసుక మీద కూలబడి వెక్కి వెక్కి ఏడ్చిన ఆ క్షణాల గురించి ఆమె ఇట్లా చెప్పింది.. ‘ఇంకొన్ని క్షణాలు..కొన్నే..అంతా అయిపోయి ఉండేది కదా, హాయిగా , ప్రశాంతంగా అని ఏడుపు తన్నుకొచ్చింది నాకు. అప్పుడే అతనూ ఏడుస్తున్నాడు, అయ్యో..అన్యాయంగా ముగిసిపోయి ఉండేదే అని.’

– విన్నపుడు విడ్డూరంగానే అనిపించినా, ఈ మాటల లోతు అర్ధమయ్యేకొద్దీ ఇవి మరింతగా నన్ను వెంటాడడం మొదలుపెట్టాయి. ఎన్నో సందర్భాలను కొత్తగా గుర్తు చేస్తునేవున్నాయి.

నాలుగేళ్ళ కిందట.. పడవ అంచున నిలబడి నయాగరా కిందకి ఇంకా ఇంకా దగ్గరవుతూ, ఆ జడిలో, ఆ జలపాతపు హోరులో ముద్ద ముద్దయిపోతూ, ఆ మహా సౌందర్యం ముందు మోకరిల్లి, ‘ఇక చాలు’ అనిపించిన క్షణం గుర్తుకొచ్చింది.

పాతికేళ్ళకి ముందు.. తిరుమల కొండకు తొలి నడకలో, వాన వెలిసిన సాయంత్రం అవ్వాచారి కోన బండ అంచున నిలబడి, దిగజూసినపుడు, ఓహ్..మసక కమ్మిన లోయలోపలి మరో లోకపు వింత శబ్ద సంగీతంలో మైమరచి దూకేద్దామనిపించిన క్షణం గర్తుకొచ్చింది.

ఇంకా ఎంతో ముందు.. పిర్రల మీద చినిగిన నిక్కర్లేసుకుని ఎర్రమట్టి లారీలెక్కి ప్రళయకావేరిని చీల్చుకుంటూ సముద్రం ముందుకు చేరి, మునిగి, తేలి, ఆడి, నురగలెత్తే ఆ గాఢ నీలిమ, అమ్మలా చేతులు సాచి పిలుస్తున్నట్టు బ్రమసిన క్షణం గుర్తుకొచ్చింది.

అసహ్యం, వికృతం, క్రూర బీభత్సంగా కనిపించే మరణం ఒక మోసకారి, మాయావి, ఒక రహస్య ప్రేయసి. ఒక్కోసారి మరణం మీద మనకున్నది ద్వేషమో, మోహమో అర్ధం కాదు. ఇట్లాంటి మరణం మీద కథ రాసింది స్వాతి బండ్లమూడి. కొత్త పేరు. భలే రాసిందే అని ముచ్చటపడి, కథ అచ్చేసిన వసంత(ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రిక ఎడిటర్ )గారికి ఫోన్ చేస్తే కొన్ని వివరాలు చెప్పారు. చిన్న పిల్లే. గట్టి గడుగ్గాయి.  వాక్యంలో, కథనంలో, కథలో ఎంత ఆరిందాతనం!

కథ పేరు వాంగ్మూలం.

ఏభై ఏళ్ల ఒంటరి రచయిత. తాగుబోతు. రాతలో, బతుకులో పండిపోయినవాడు.

ఒక్కటే కథ  అచ్చయిన మరో కుర్ర రచయిత. తెలివి, బిడియం, మొండితనం, పట్టుదలాగల పిల్లవాడు.

ఈ ఇద్దరికీ స్నేహం. ప్రేమ, వాత్సల్యం అతడంటే సీనియర్ రచయితకి. ఆ పిలగాడు ఒక అద్దం అతనికి. తననే చూసుకుంటూ ఉంటాడు పిలగాడిలో. అద్దంలోని తనతో తాను మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుతూ ఉంటాడు కథంతా. వాంగ్మూలం కథ నడక శైలి ఇది. అతను ఎవరితో మాట్లాడుతున్నాడు? పిలగాడితోనా, పాఠకులతోనా, కథ నడుపుతున్న రచయితతోనా, తనతోనేనా? ఏక కాలంలో అందరినీ కలగలిపి తనలో లీనంచేసుకుని మాట్లాడుతూ ఉంటాడు అతను.

ఏం మాట్లాడుతాడు..

పిలగాడి తెలివికీ, వయసులో ఉండే పట్టుదలకీ, మొండితనానికీ మురిసిపోతూ మాట్లాడుతూ ఉంటాడు. తొలి కలయికలో, తాగుడు బల్ల ముందు కూర్చున్న పిలగాడిని, ‘అలాగ ఫోటోలో దేవుడిలా కూచుంటావేం? నిజంగానే తాగవా?’అని అడిగినపుడు అతనికి శివాని గుర్తుకొచ్చింది. శివాని అతని సహచరి. శివాని గురించి పిలగాడికి ఎలా చెబుతున్నాడో చూడండి, ‘సృష్టిలో ఎక్కువైపోయి ప్రతిదాన్నీ లయం చెయ్యడానికి, శిమెత్తినప్పుడు లయతో తాండవమాడ్డానికి తోడుండే శక్తి తన అస్తిత్వాన్నంతా ఆక్రమించకుండా శివుడు ఎలాగాపాడో సగం శరీరం దగ్గరే! ఎలాగో నిభాయించాడు. తట్టుకు నిలబడ్డాడు.’ అట్టాంటి శివాని, మూడేళ్ళ కొడుకుపోయాక ఎన్ని నెలలకీ మనిషి కాలేక తనూ వెళ్ళిపోయింది. శివాని పోయిన రెండు పుష్కరాల తర్వాత అతని జీవితంలోకి వచ్చాడు ఈ పిలగాడు. ‘ ఎప్పటికీ చేతికి తగలని పచ్చగడ్డి పరక కోసం బీడునేలమీద తడుములాడినట్టు తనక్కావల్సిన దేనికోసమో చాన్నాళ్ళు’అతని దగ్గర శివాని వెతుకులాడినట్టుగానే, ఇప్పడు పిలగాడి దగ్గర అతనూ వెతుకులాడుతున్నాడు. ‘పిచ్చిలో ఉన్న ఆనందం పిచ్చోడికి తప్ప తెలీదు’అని తెలిసిన వాడు అతను. కథలు..కబుర్లు..తాగి తూలే మాటలు.. వాటిల్లోనే ఎన్నో తాత్విక సత్యాలు. నిండా పాతికేళ్లు లేని ఆ పిలగాడు అతనితో అంటాడు గదా, ‘ ఐనా పెద్దాయనా! మనమీ కాలంలో పుట్టి ఈ చట్టాలు, ఇప్పుడున్న సమాజమే ప్రామాణికం అనేసుకుని ఏదో రాసేస్తాం కానీ: ఈ స్థలం, కాలం, ఇప్పటి నైతికత ఇవన్నీ అబద్దం, అసంబద్ధం అయి మరో చోట, నక్షత్రాల ధూళి రాలిపడే అనంతమైన శూన్యంలో, ఉల్కాపాతాల మౌనంలో కాంతియుగాలకవతలకి మేధస్సుని పంపి రాయగలిగితేనే సృజనకి అర్ధం’. పాతికేళ్ళ కిందటి ఆవేశమూ, ఇప్పటికీ ఆగని అన్వేషణా గుర్తుచేసాయి అతనికి పిలగాడి మాటలు. తిరిగిన స్థలాలు, బతికిన కాలాలు జ్ఙప్తికొచ్చాయి. అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి ఏ రైలో ఎక్కి ఎక్కడో దిగి పల్లెటూరి హోటల్లో టీకప్పులు కడిగి, గోవా బీచ్ లో టాయలెట్ల సఫాయీలో పనిచేసి, అజంతా గుహల్లో గైడుతనం వెలగబెట్టి..ఎన్నెన్నో అనుభవాలు..?! గాలివాటుకి ఎగిరిపోయి పతనమైన పతంగులు. ‘యుగాల తరబడి ఇందరు వెతుకుతున్న ఈశ్వర ప్రేమ హౌరానదికి అవతల ఎక్కడో ఏ ఇరుకు సందుల్లోనో దొరికినప్పుడు’ ఆ  ప్రేమనిచ్చిన బసంతిని గుర్తుచేసుకున్నాడతను. పాతికేళ్ళు నిండని పిలగాడితో, ఆ పిలగాడిలోని తనతో అన్నీ చెప్పేసుకున్నాడతను, ఆర్తిగా, ఆత్రంగా.

ఎందుకు? ఎందుకా పిలగాడి ముందు జీవితాన్ని విప్పి పరిచాడు అతను? ఎందుకంటే, ‘తను ఆగిపోయిన చోటు నుంచి ముందుకు కాకుండా పైపైకి వెళ్ళి, నక్షత్రాల మధ్య ఖాళీలో గడ్డ కట్టిన ఇంకు పెన్నుని గట్టిగా విదిలించికొట్టే దమ్ము’ ఆ పిలగాడికి ఉందనే నమ్మకం కలిగింది కాబట్టి. ఆ నమ్మకం ఆశగా మారుతున్న వేళ పిలగాడు అతనికి రాధ గురించి చెప్పాడు మురిసిపోతూ. కొద్ది నెలలకే పిలగాడి మురిపెపు గొంతులో నిరాశ. వైఫల్యపు ధ్వని. ‘దాని దుంప తెగ, ఎంత దౌర్భాగ్యపు జీవితమండీ’అని ఆ పిలగాడు అన్న మాటతో, అతను, తెగిన పతంగి.. తన దారాన్ని తనే మళ్ళీ ముడేసుకుని, ఈ టైంలో బస్సులుంటాయా అనే ఆలోచన అయినా లేకుండా కొరియర్ కవర్ మీది అడ్రస్ పట్టుకుని పరుగు తీశాడు పిలగాడిని వెతుక్కుంటూ. గది తలుపు తోసుకుని, ‘నేనెవరో చెప్పుకోరా ఇడియట్’ అంటూ అడుగుపెడితే, నేలంతా పరచుకున్న పుస్తకాలు, ఒలికిపోయిన ఇంకు మరకలు, ఒంటిమీద స్పృహ లేకుండా పడివున్న పిలగాడు. డస్ట్ బిన్ లో చింపి పారేసిన డైరీ కాగితాల మధ్యలో రెస్టిల్ షీట్లు.

‘గుండె పగిలిపోతోందిరా చిన్నోడా’ అంటూ అప్పుడంటాడు కదా అతను, ‘నిద్ర మాత్రలేసుకునే ముందు చిన్న చీటీ ముక్క రాయాలనీ, రాసేముందు ఇంటి గోడలకి బీటలేస్తూ మొండిగా బతికే ఏ పిచ్చి పూల చెట్టునో గుర్తు తెచ్చుకుని బతకాలనీ, నీ ప్రాణమ్మీద నీకథికారం లేదనీ, నీ నిరాశకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ బతుక్కి లేదనీ, రెండు మైలు రాళ్ళ మధ్య నిశ్శబ్దంలో అలసట తీర్చుకోవాలే కానీ అర్ధంతరంగా ఆగిపోకూడదనీ, ఇలా చేసిన నీ తలపొగరుకి శిక్షగా ‘లవ్యూ రా బంగారు కొండా’ అని ఇక నేనెప్పుడూ చెప్పబోననీ’అతను మందలిస్తూ దుఖిస్తూ..

ఇదీ కథ..

తాగుబోతు రచయిత వదరు మాటల్లా మొదలై లెక్కాపక్కా లేనితనంలోంచి  మూడేళ్ళ బిడ్డనీ, శివానినీ పోగొట్టుకున్న పశ్చాత్తాపపు దుఖంలోంచి, మొండితనపు తెలివి తేటల పిలగాడి ప్రేమలో పడి, కొండల్లోంచి దూకే జలపాతం నదిలా పారినంత నిమ్మళంగా మారి, పిలగాడిలోని తనను  తాను చూసుకుంటూ దిద్దుకుంటూ, తుఫానుకి పెకలించుకుని బయటపడిన వేళ్ళను మళ్ళీ మట్టిలోకి పాదుకుంటూ అతను అతనుగా మారి నిలబడ్డమే కథ. కథలో పిలగాడు ఒక ప్రతిబింబం.  బింబ ప్రతిబింబాల మధ్య స్వగతంలా సాగే  సంభాషణ.  గాఢమైన కవితాత్మక వాక్యాలు, తాత్విక మాటల పోగులు. చిక్కటి కవిత్వం రాసే స్వాతి కథ రాసినా కవిత్వమే పొంగుతుంది. ఒక చోట.. ‘ తనలోని సుఖాన్ని తనకే తిరిగి ఇచ్చే మరో సాధనం కోసం వెర్రెక్కిన శరీరపు కేకలు, ఏ అస్థిపంజరాల్ని కప్పిన అవసరాల్నో చేరిన చోట- ఎవరివో స్త్రీ దేహాలు, స్నేహాలు, దాహాలు, మోహాలు. మొహం మొత్తుళ్ళు, విదిలింపులు, వదిలింపులు, డబ్బుల ఎరలు, ఏ చెట్టువో రాలి నీటివాలుకి కొట్టుకొచ్చిన అడివిపూలు- ఎటర్నల్ స్ట్రగుల్ ఆఫ్ ది యానిమల్ ఇన్ స్టింక్ట్’

ఇంకో చోట- ‘ నీడ నుంచి నిజాన్ని విడదీసి చూపడానికి విషపుటాలోచనలు చేస్తున్న మోసపు ఉదయాన్న: నిశ్చింతగా పడుకున్న రాత్రినెవరో రాక్షసంగా నేల అడుక్కి తొక్కేస్తుంటే, ఆ ఊపుకి రోడ్డు మీద తూలిపడుతున్న ప్రతీదాన్నీ కేర్లెస్ గా చూసుకుంటూ..’

-ఈ చిన్న కథ నిండా ఇట్లాంటివే ఎన్నో.

కథ ముగింపు చదివాక, ఎందుకో వజీర్ రహ్మాన్ ‘చివరికి’ కవిత గుర్తొచ్చింది.

చివరికేం మిగలదు!

చావుని పల్కిన భయానక సర్పం కూడా

నీటిమీద గీతమల్లే చెరిగిపోతుంది

దేహసారాన్ని పీల్చుకుని

సమాధిని చీల్చుకుని

ఏ పిచ్చి మొక్కో మత్తుగా తలెత్తి మాయమౌతుంది

ఏ పుర్రె యెమికో మిగుల్తుంది

ఎండలో దుమ్ములో దొర్లుతో,

నక్కలు కూడా కాదని వొదిలే చిన్న మురికి బొమికె

ఇంతే- చివరికేం మిగలదు!

దేహమోహ సీమని

మైక సంగీత మయం చేసిన

యవ్వన మృదు పుష్పం సైతం మన్నులో మన్నై మలినమై

ఎమికపై నూగారు గర్తు కూడా!’ అంటూ స్మశాన వైరాగ్యపు నిరాశతో మొదలు పెట్టి, చివరికేం మిగలదా? అనే ప్రశ్న వేసి, సౌందర్యభరిత జీవితాన్ని పటంగట్టి ముందుంచి ఆశను నింపుతాడు ఇలా గుండె నిండుక్కీ..

‘చివరికి మళ్ళీ

ఎక్కడో ఏ కొండ పంచనో

గడ్డిపూల గుంపులో నించుని

సృష్టి వైచిత్రికి తలలూపుతో మిగులుతాం-

ఏ చీమల బారులోనో

హడావుడిగ నడిచి వెడుతో

నరజీవుల వికృత చేతలకి నివ్వెరపోతో మిగులుతాం-’

మనసు నిండా తెలియని చీకటి కమ్ముకున్నపుడంతా ‘సాహసి’లోని ఈ కవితను నేను చదువుకుంటూ ఉంటాను. కొండ పంచన గడ్డిపూల గుంపు పరిమళాన్ని గుండెల నిండా నింపుకోవడానికి. నైరాశ్యపు అంచులమీద, మన అడుగులో అడుగు వేసి నడుస్తూ, మాయ చేసి మనల్ని మంచి గడ్డిబాట మీదకు మళ్ళించి, మనలో   జీవితేచ్ఛను రగిలించే కవిత ఇది.   ‘వాంగ్మూలం’ కథలో కూడా నాకు ఈ మాయ లక్షణమే కనిపించింది. రాయలసీమ బైరాగులు పాడే తత్వాలు చెప్పే సత్యాలకు అక్షర రూపాలే కదా వజీర్ రహ్మాన్ ‘చివరికి’, స్వాతి బండ్లమూడి ‘వాంగ్మూలం’ అనిపించింది. ఈమె రాసిన మొదటి కథేనా ఇది? ఇంతకు ముందూ, తర్వాతా ఇంకేమైనా కథలు రాశారా? నాకయితే ఎక్కడా తారసపడలేదు. అయినా, ఈ కథ చదివినపుడు మాత్రం   తెలుగు కథకు కొత్త భరోసా స్వాతి బండ్లమూడి అనే నమ్మకం కలిగింది.

***

వాంగ్మూలం బొమ్మ

వాంగ్మూలంswatikumari

గుండె పగిలిపోతోందిరా చిన్నోడా..

యాభయ్యేళ్ల ఒంటరోడిని, తాగుబోతు నా కొడుకుని, అర్ధరాత్తుళ్ళు ఫోన్‌ చేసి “లవ్  యూ రా  బంగారుకొండా” అంటే సంస్కారపుజబ్బు ముదిరినోడివి కాబట్టి నా మత్తు సంగతి కనిపెట్టి నీ నిద్రమత్తుని దాచిపెట్టి “ఇవ్వాళ కూడా డోసెక్కువైందా?” అని విసుక్కోకుండా అడిగినప్పుడు ఎంత ముచ్చటేసేదిరా!

సఫరింగ్, సఫరింగ్, సఫ – రింగ్, టేబిల్ మీద ఖాళీగా గ్లాసుల అడుగుజాడల రింగులు. వలయాలు, వేదనా వలయాలు, శోధనా వలయాలు. కళ్ళు తిరిగి వళ్ళు తిరిగి… ర్రేయ్, ఇంతకుముందు ఇక్కడో నయాగరా ఉండాలి, సింకులో నీళ్లాపేసిన బాస్టర్డ్ ఎవడ్రా?  కాగితాలున్నయ్ కాబట్టి సరిపోయింది మాటలు కక్కడానికి.

పత్రికలో పడిన నీ ఒకేఒక్క కథ, ఆపైన నీ ఉత్తరాలు చూసి మొదటిసారి నిన్ను కలిసినప్పుడు నేను ఊహించినట్టే ఉన్నావ్. ఐనా ఏం ఊహించాను నేను? తెలివి, మొండితనం, వయసులో ఉండే పట్టుదలా, అదే నాకు తెలిసిన నువ్వు, నాకెప్పటికీ దొరకని నాలాంటి నువ్వు, ఆ సాయంత్రం అంతసేపూ తాగుడూ వాగుడూ నాదే అయాక “అలాగ ఫోటోలో దేవుడిలా కూచుంటావేం? నిజంగానే తాగవా!” అని నేను దేవుణ్ణీ, నిన్నూ ఒకేసారి అనుమానిస్తే “తాగినవాళ్లని ఇంతదగ్గరగా కూడా ఎప్పుడూ చూళ్ళేదు మాస్టారూ!” అన్చెప్పి “కేవలం మీ కోసమే ఇంతసేపూ…” అన్న ముక్కని చెప్పకుండా అభిమానంగా నవ్వినప్పుడు; అప్పుడు గ్లాసు దించి మరోసారి నీ మొహంలోకి చూస్తే, ఎందుకో…

ఎందుకో! శివాని గుర్తొచ్చింది –

పెళ్లాం, బెటరాఫ్- ఇలా ఎలా రిఫర్ చేసినా చిరాకు పడేది శివాని, ఆ పేరు చూసే ప్రేమించుంటాను. సృష్టిలో ఎక్కువైపోయిన  ప్రతిదాన్నీ లయం చెయ్యడానికి, శివమెత్తినప్పుడు లయతో తాండవమాడ్డానికి తోడుండే శక్తి తన అస్తిత్వాన్నంతా ఆక్రమించకుండా ఎలాగాపాడో సగం శరీరం దగ్గరే! నిభాయించాడు, తట్టుకు నిలబడ్డాడు. మరి మాటలా! నాలాంటోడివల్ల కాలేదు. ఇందాకన్నాగా  ‘మా ఆవిడ’ అని తన గురించెవరికైనా చెబ్తే- ‘నేను నువ్వే అవుతాను కానీ, నీకు మరేదో ఎలా అవుతాను?’ అని పెళ్లిలో చదవని మంత్రాల్నేవో కొత్తగా నేర్పలేక మళ్ళీ వెంటనే మూగగా అయిపోయేది.

మూడేళ్ల కొడుకుపోయి ఎన్ని నెల్లకీ మనిషి కాలేదు. శరీరంకోసం తప్ప ఓదార్చడానికి ముట్టుకోడం రాని మగాణ్ణే అప్పటికి. తన ఏడుపు నన్ను అస్తమానమూ డిఫెన్స్ లో ఎందుకు పడేసేదో ఎప్పుడాలోచించినా అర్థం కాదు. సొంతసొత్తులా తప్ప సాటిమనిషిలా చూడలేనని తెలిశాక కూడా, ఎప్పటికీ చేతికి తగలని పచ్చగడ్డి పరకకోసం బీడునేలమీద తడుములాడినట్టు తనక్కావల్సిన దేనికోసమో చాన్నాళ్లు  నాదగ్గర వెతుకుతూనే ఉండేది. ఇప్పుడు నాకు పగులుతున్నట్టుగానే తనకీ గుండె ఎన్నిసార్లు పగిలి ఉంటుందో! ఒకరోజు నిజంగానే నా శక్తినంతా లాక్కుని జీవితాన్ని, మనుషుల్ని దేబిరించకుండా హుందాగా తనకి నప్పుతుందేమో అన్న ఆశతో మరే లోకానికో వెళ్లిపోయాక, వెళ్ళిపోయి రెండు పుష్కరాలు దాటాకా నువ్వు…

ఇప్పుడిదో కొత్త పిచ్చి – ’పిచ్చిలో ఉన్న ఆనందం పిచ్చోడికి తప్ప తెలీదు’ అని నేనంటే “నెరుడాని మీవాదం కోసం వాడేసుకుంటారు – స్పానిష్ మీ బలహీనత” అని నువ్వు ఎడ్మైరింగ్ గా నవ్వేవాడివి, “నువ్వు గత జన్మలో రష్యా వోడివిరా” అని నేనన్నప్పుడు కృతజ్ఞతతో నవ్వినట్టు…

“కథొకటుంది మాస్టారూ- మూడు ముక్కల్లో చెప్పొచ్చు. పెళ్ళాన్ని దారుణంగా చంపేసి రేప్పొద్దున ఉరికంబం ఎక్కబోతున్న హంతకుడి గురించి ఇద్దరు సెంట్రీలు మాట్లాడుకుని, నైట్ డ్యూటీలని బూతులు తిట్టుకుని ఒక దమ్ములాగి సెల్స్ లో రౌండులకెళ్ళటం మొదటి భాగం. చనిపోయిన భార్య ప్రియుడు, ఈ గొడవల్లో తను ఏ రకంగానూ ఇరుక్కోకుండా ఇన్‌ఫ్లుయెన్స్ తో ఎలా నెట్టుకొచ్చాడో; చిత్తుగా తాగి బార్లో ఫ్రెండ్స్ దగ్గర కోతలు కొయ్యడం రెండోది. ఖైదీ కొడుకు అనాథాశ్రమంలో భయంగా ముడుచుకుపడుకుని తను స్కూలుకెళ్ళి వచ్చేలోపు అమ్మా నాన్నా ఇద్దరూ కనపడకుండా పోవడమేంటో అర్థంకాక ఎక్కిళ్ళు బయటికి వినపడకుండా నోరుమూసుకుని, కాసేపటికి కళ్ళు తుడుచుకోకుండానే నిద్రపోవడం- ముగింపు ; అంతే కథ. మొత్తం కథలో ఆ హంతకుడిని నేరుగా చూపించకుండా పొగమంచు కప్పెయ్యాలన్నమాట, రాయొచ్చంటారా?” అని మొహమాటంగా సలహా అడిగినప్పుడు-

“నా అనుభవంలోంచి చూస్తే అంత గొప్పకథ కాదుకానీ, నీ వయసుకి గ్రాండ్ గానే ఉంటుందిలే, కానియ్”  అని ఉడికిస్తే “ఒక్కసారైనా అన్‌కండీషనల్‍గా మెచ్చుకోరుగా మీరు” అంటూ నువ్వు ఉక్రోషపడితే ’నాకేవఁవుతాడ్రావీడు? నిండా పాతికేళ్ళు లేవు, నాకొడుకే బతికుంటే వీడంతై, ఇలా లోలోపల దావానలంతో దహించుకుంటూ ఉండేవాడా?’ అనొక విపరీతపు ఆలోచన సెంటిమెంట్ తో సతమతం చేస్తుండేది.

“ఐనా పెద్దాయనా! మనమీకాలంలో పుట్టి ఈ చట్టాలు, ఇప్పుడున్న సమాజమే ప్రామాణికం అనేసుకుని ఏదో రాసేస్తాం కానీ; ఈ స్థలం, కాలం, ఇప్పటి నైతికత ఇవన్నీ అబద్ధం, అసంబద్ధం అయిన మరోచోట, నక్షత్రాల ధూళి రాలిపడే అనంతమైన శూన్యంలో, ఉల్కాపాతాల మౌనంలో కాంతియుగాలకవతలకి మేధస్సుని పంపి రాయగలిగితేనే సృజనకి అర్ధం” అని నువ్వూగిపోతుంటే పాతికేళ్ల క్రితపు నా ఆవేశమూ, దాన్లోంచి పుట్టి ఇప్పటికీ ఆగని నా అన్వేషణా గుర్తొచ్చేవి.

“ఏమన్నావు? స్థలం, కాలం – ఎన్ని స్థలాల్లో తిరిగాను, ఏ కాలాల్లో బతికాను. పిచ్చి పట్టినవాడిలా ఏ రైల్లో ఎక్కడ ఎక్కానో, అదెక్కడికెళ్తుందో తెలీకుండానే. నిద్ర లేచినప్పుడే స్టేషనొస్తే అదే నాఊరు. పడమటి కనుమల్లో ఏదో పల్లెటూరి హోటల్లో  టీకప్పులు కడగటంలో మొదటిసారి మెడిటేషన్‌ దొరికినప్పుడు, గోవాబీచ్ లగ్జరీ రిసార్ట్లో టాయిలెట్ల సఫాయీలో నాలుగు డబ్బులు పోగవగానే సింబాలిజం, ఫ్యూచరిజం, ఫిలాసఫీ అని ఇష్టమొచ్చిన పుస్తకాల కోసం ఖర్చు పెట్టేసినప్పుడు; నేనొదిలేసొచ్చిన ఎకౌంట్స్ మేనేజర్ పోస్ట్ లో గోతికాడ నక్కలా దూరి వారానికార్రోజులు సగం టీలు, సగం గాసిపింగూతో గడిపేసే శివప్రసాద్ కి ఫోన్‌చేసి ‘నిజంగానే నేను గొప్పగా బతుకుతున్నాన్రా ఫూల్’ అని పగలబడి నవ్వాలనిపించేది.

అజంతా గుహల్లో గైడుగా వెలగబెట్టినప్పుడు చరిత్రని పొయెటిగ్గా చెబుతుంటే ఆ కాసేపట్లోనే శిల్పి హృదయ రహస్యాల్ని కళ్లతో కొనేసుకోవాలని తపించి, కళలోని అందాన్ని తప్ప ఆత్మని పట్టుకోలేక అల్లాడే యాత్రీకుల అలసటని, ఫోటోల్ని తప్ప   జ్ఞాపకాల్ని దాచుకోలేని యాంత్రికతనీ చూసి జాలిగా ఓదార్చాలనిపించేది.

ఇంకా ఎన్నెన్ని స్థలాలు, ఎలాంటి అనుభవాలు!

దారంతెగి గాలివాటుకి ఎగిరిపోయి పతనమైన పతంగులు, వివస్త్రంగా ఉబ్బి వరదల్లో కొట్టుకోచ్చే దిక్కులేని శవాలు, ఇసుక తుఫానులు చెరిపేసిన ఎడారిఒంటెల ప్రయాణపు గుర్తులు, అసంతృప్త  ఆగ్రహాలు నిండిన సముద్రపు సుడుల్లో అలవాటుపడ్డ మొండి ధైర్యంతో సాగిపోయే ఓడలు చేరని తీరాలు.

ఏ స్థలాల్లోవి, ఏ కాలానివి ఈ జ్ఞాపకాలన్నీ?

తనలోని సుఖాన్ని తనకే తిరిగి ఇచ్చే మరో సాధనం కోసం వెర్రెక్కిన శరీరపు కేకలు, ఏ అస్థిపంజరాల్ని కప్పిన అవసరాల్నో చేరిన చోట- ఎవరివో స్త్రీ దేహాలు, స్నేహాలు, దాహాలు, మోహాలు. మొహంమొత్తుళ్ళు, విదిలింపులు, వదిలింపులు, డబ్బుల ఎరలు, ఏ చెట్టువో రాలి నీటివాలుకి కొట్టుకొచ్చిన అడివి పూలు – ఎటర్నల్ స్ట్రగుల్ ఆఫ్ ది యానిమల్ ఇన్‌స్టింక్ట్స్…

యుగాల తరబడి ఇందరు వెతుకుతున్న ఈశ్వరప్రేమ హౌరా నదికి అవతల ఎక్కడో ఏ ఇరుకు సందుల్లోనో దొరికినప్పుడు; బసంతీ! నా చెవిలో ఏదో అన్నావ్? ఆర్ట్ సినిమాలో నటన మర్చిపోయిన హీరోయిన్లాగా. మనసుతో శరీరాన్ని కోరుకోవడం మర్చిపోయిన చాలా ఏళ్లకి, పరిచయం పాతబడి వెళ్ళిపోతుంటే- నేనిచ్చిన డబ్బులు చనువుగా నా జేబులో తిరిగి పెట్టేస్తూ ఏమిటి బసంతీ అన్నావ్ నాకెప్పుడూ అర్థంకాని మరోలోకపు భాషలో!! ఎప్పుడో శివాని కోసం పిచ్చెక్కిపోయిన మొదట్లో భావుకత్వమంతా కళ్లల్లో వెలిగించుకుని నుదుటిమీద ఆర్తితో పెట్టిన ముద్దు, కామంతో కాదు, రిచువల్ గా, అలవాటుగా కాదు.. ‘ఐ కేర్ ఫర్ యూ’ ఆని అంత సున్నితంగా చెప్పడం మళ్ళీ నీదగ్గరే. ఒకసారెళ్ళిన చోటకీ, వదిలేసొచ్చిన మనుషుల దరిదాపుకీ వెళ్ళే అలవాటు లేదు నాకు. ఎక్కడున్నావో, ఎప్పుడైనా తలచుకున్నావో లేదో, అప్పటికి కష్టంగా అనిపించినా తప్పలేదు. నాకు తెలుసు నీతో నేనుండలేను, అసలెవరితోనూ, ఎక్కడా  ఉండిపోలేను శాశ్వతంగా, పదిహేనేళ్లవదూ? ’బై బై బసంతీ’ అనికూడా చెప్పకుండా వెనక్కి తిరిగి చూడకుండా లేటైపోతున్న ఏ రైలు కోసమో అన్నట్టు త్వరత్వరగా నడుచుకుని వచ్చేసి…”

ఎక్కడి చట్టం, సమాజం, నైతికత, నైతికాతీతత! నిజంగానే నువ్వు రాయగలవురా చిన్నోడా; నేనాగిపోయిన చోటునుంచీ ముందుకు కాకుండా పైపైకి వెళ్ళి,  నక్షత్రాల మధ్య ఖాళీలో గడ్డకట్టిన ఇంక్ పెన్నుని గట్టిగా విదిలించి కొట్టి… నీకా దమ్ముంది.

“ప్రయోగాల మీద అంత తపన ఉన్నవాడివి, ఈ మూడుముక్కల కథలెందుకు నీకు?” అనడిగితే “లేద్సార్, ఈ ఒక్కసారికీ రాధికకి మాటిచ్చాను. తను పనిచేసే వీక్లీలో స్టోరీసెక్షన్‌కి మారింది. మీకెప్పుడూ చెప్పలేదుకదా తను చాలా ఇంటెలిజెంట్ అండ్ సెన్సిబుల్ గా అనిపిస్తుంది” అని మురిసిపోయినోడివి – ఇన్ని నెల్ల తర్వాత మళ్ళీ మొన్ననగా ఫోన్‌ చేసి “మనకి నచ్చేది లోకంలో నిజంగా ఉందని తెలిసీ, అందుబాటులో ఉండీ, మనది కానప్పుడు, ఎలాగండీ తట్టుకునేది?” అని ఏదో గొప్ప ఆశాభంగాన్ని మగాడివి కాబట్టి ఏడవకుండా మానిప్యులేట్ చేస్తుంటే- ఏంట్రా ఇంత ముదురుగా మాట్లాడావ్! ఒకవేళ తాగి ఉన్నావా అని అనుమానమేసి పట్టరాని కోపమొచ్చింది.

————————

అప్పటిదాకా ఎక్కింది దిగితూ, అప్పుడే లోపలికి దిగింది నరాల్లోకి ఎక్కుతున్న మైకంతో, తడిపిన కొద్దీ ఎండిపోతున్న గొంతుతో- ఎక్కినమెట్లు దిగుతున్నానో, దిగవల్సిన మెట్లు ఎక్కుతున్నానో మెట్లకే తెలియాలి. నీడనుంచి నిజాన్ని విడదీసి చూపడానికి విషపుటాలోచనలు చేస్తున్న మోసపు ఉదయాన్న; నిశ్చింతగా పడుకున్న రాత్రినెవరో రాక్షసంగా నేల అడుక్కి తొక్కేస్తుంటే, ఆ ఊపుకి రోడ్డుమీద తూలిపడుతున్న ప్రతీదాన్ని కేర్లెస్ గా చూసుకుంటూ..

అదే మొదటిసారి పనిగట్టుకుని ఫలానా చోటకని అనుకుని ఎవర్నైనా చూడ్డానికి రావడం.

“మీ పుస్తకాన్ని ప్రచురిస్తాం” అని ఎవరైనా అడిగితే “చేసుకోండి, నాకెందుకు చెప్పడం?”

“మరి రాయల్టీలు?”

“ఊళ్ళో నా తమ్ముడున్నాడు, వాడికిచ్చెయ్యండి. నా తాగుడుకి డబ్బులు చాలక ఉత్తరం రాస్తే వాడే పంపుతాడు.”

అంత నిర్లక్ష్యం, అంత పొగరుబోతు దిలాసా! అలాంటిది నిన్న రాత్రి నువ్వు ఫోన్లో “దాందుంపా తెగ, దౌర్భాగ్యపు జీవితమండీ!” అనగానే ఈ టైంలో బస్సులుంటాయా అనే ఆలోచన లేకుండా నువ్వు పుస్తకాలు కొరియర్ పంపిన కవరు వెనక అడ్రెస్ పట్టుకుని, ఇందాకా వస్తే…

గది తలుపు తోసుకుని “నేనెవరో చెప్పుకోరా ఇడియట్?” అని నీ ఆశ్చర్యం చూద్దామనుకుంటే…

నీలాగే నీగది కూడా నేనకున్నట్టే ఉంది. నేలంతా పరుచుకున్న పుస్తకాలు, టేబుల్ మీద ఒలికిపోయిన ఇంకు మరకలు,  కానీ వంటి మీద స్పృహేదీ? పక్కన సూసైడ్ నోటేదీ? డస్ట్ బిన్‌ లో చింపిపారేసిన డైరీ కాయితాల మధ్యలో రెస్టిల్ షీట్లు ఏ వివరాలూ చెప్పవు. అసలెవరైనా ‘నా చావుకెవరూ కారణం కాదు ‘ అని రాశారంటే అ కారణమైన వాళ్లని కాపాడ్దానికే అని అర్థం. మరి అసలేమీ రాయకుండా ఇలాటి పని ఏ చివరి జ్ఞాపకాన్ని కాపాడ్డానికి?

పెద్ద పనిమంతుడిలా కథల్రాయడమే కానీ నిద్రమాత్రలేసుకునే ముందు చిన్న చీటీ ముక్క రాయాలనీ, ఆ రాసేముందు ఇంటిగోడలకి బీటలేస్తూ మొండిగా బతికే ఏ పిచ్చిపూలచెట్టునో గుర్తుతెచ్చుకుని బతకాలనీ, నీ ప్రాణమ్మీద నీకధికారం లేదనీ, నీ నిరాశకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ బతుక్కి లేదనీ, రెండు మైలురాళ్ల మధ్య నిశ్శబ్దంలో అలసట తీర్చుకోవాలే కానీ అర్ధాంతరంగా ఆగిపోకూడదనీ, ఇలాచేసిన నీ తలపొగరుకి శిక్షగా ’లవ్ యూ రా బంగారుకొండా’ అని ఇక నేనెప్పుడూ చెప్పబోననీ,

ఈమాత్రం ఊహించలేనివాడివా నువ్వు అని తలచుకున్నకొద్దీ…

గుండె పగిలిపోతోందిరా చిన్నోడా!

————*****————-

-స్వాతికుమారి బండ్లమూడి

అందరి కుటుంబాలనీ ఆదుకోవడమే ఆయన జీవితాదర్శం….

మా అమ్మ, నాన్న గారు

1940 దశకంలో దొంతమ్మూరు గ్రామంలో (తూ.గో. జిల్లా కిర్లంపూడి దగ్గర గ్రామం) మా కామేశ్వర రావు మామయ్య గారు హఠాత్తుగా పోయారు. దానితో సుమారు 400 ఎకరాల మిరాశీ అనే పొలం వ్యవహారాలూ కూడా మా నాన్న గారే తన భుజాలకి ఎత్తుకున్నారు. ఆ తరువాత మరొక ముఫై ఏళ్ళు మా బంధువులందరి కుటుంబ బాధ్యతలనీ ఆయనే తన సర్వశక్తులూ ఓడి, ఎక్కడా ఓడకుండా నిండు కుండలా అందరినీ గట్టెక్కించి, అందరికీ జీవితంలో మంచి బాటలు వేసి నడిపించి, ఆఖరి రోజులలో మా కళ్ళ ముందే అలసి పోయి సొలిసి…పోయారు మా నాన్న గారు. మా పెద్దమ్మాయి పుట్టిన కబురు తెలిసాక, అమెరికాలో పుట్టిన మొట్టమొదటి మనవరాలు ఎలా ఉంటుందో అనే కోరిక తీరకుండానే 1983 లో ఆయన పోయారు. అప్పుడు ఆయన వయస్సు 76 ఏళ్ళు. ఆయనే మా “బాబయ్య గారు”. మా కుటుంబంలో నాన్న గారిని బాబయ్య గారు…(బాబయ్యారు) అని పిలవడం అప్పుడు అలవాటు. మా నాన్న గారు మా పిల్లలు ముగ్గురిలోనూ ఎవరినీ చూడ లేదు. కన్న తండ్రికి కన్న పిల్లలని కూడా చూపించ లేక, ఆఖరి క్షణాలలో ఆయన్ని చూడలేని ఈ “త్రిశంకు స్వర్గం” లో నా పరిస్థితిని తల్చుకున్నప్పుడల్లా “ఈ అమెరికా ఎందుకు వచ్చాం రా” అని మధన పడుతూనే ఉంటాను.

మా తాత గారు సంపాదించిన ఆస్తిపాస్తులు, చేసిన దాన ధర్మాల వాగ్దానాలు అన్నీ ఏకైక కుమారుడిగా ఆయనకి వారసత్వ బాధ్యతలుగా రావడం, వాటిని ఆయన మన:స్ఫూర్తిగా స్వీకరించి సంపూర్తిగా నిర్వహించడమే మా నాన్న గారి జీవితానికి నిర్వచనం. ఆయన చెయ్య లేని పని ఒకే ఒక్కటి. ఆ ప్రస్తావన తరువాత తెస్తాను. మా తాత గారు సూర్య ప్రకాశ రావు గారు పుట్టినప్ప్పుడే తల్లిని పోగొట్టుకుని, బీదరికం అనుభవిస్తూ, మేనమామ కుంటముక్కల హనుమయ్య గారి ప్రాపకం, పిఠాపురం రాజా వారి ఆర్ధిక వేతనాలతో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల, తరువాత మద్రాసు లా కాలేజీ లో చదువుకునే రోజులలోనే మా బామ్మ గారు (కాట్రావులపల్లి) ఆది లక్ష్మి మాణిక్యంబ గారిని పెళ్ళి చేసుకున్నారు.

మా అమ్మ,, నాన్న గారి పెళ్లి సుభ లేఖ

1900  లో ఆయన కాకినాడ లో కృతివెంటి పేర్రాజు పంతులు గారి దగ్గర జూనియర్ లాయర్ గా చేరారు. ఆలస్యంగా చదువు మొదలుపెట్టడం వలన అప్పటికే ఆయన వయస్సు ముఫై దాటింది. తన స్వార్జితంతో మొదటి ఆస్తిగా ఫిబ్రవరి  2, 1921 లో ఆయన కాకినాడలో ఇప్పటి గాంధీ నగరంలో (అప్పటికి అది పిఠాపురం రాజా వారి పేరిట వెలిసిన రామారావు పేట.) ఒక్కొక్కటే 1800  గజాలు ఉండే పక్క పక్కనే ఉండే రెండు ఇళ్ళ స్థలాలు – వెరసి 3600  గజాల స్థలం కొన్నారు.  ఆ తరువాత ద్రాక్షారామం దగ్గర ఇంజరం గ్రామంలో 40 ఎకరాలు పొలం కొని దగ్గర బంధువు ఒకాయనకి (పండ్రవాడ గవర్రాజు) యాజమాన్యం ఇచ్చారు. కానీ, మా తాత గారికి స్వగ్రామమైన దొంతమ్మూరు గ్రామం మీద ఉన్న అభిమానంతో అక్కడ 350 ఎకరాలు ఒక్క సారిగా అమ్మకానికి రావడంతో, పైగా అది హనుమయ్య గారి మిరాసీ పక్కనే ఉన్న భూమి కావడంతో మా తాత గారు ఆ పొలం కూడా మార్చ్ 30, 1922 నాడు కొన్నారు.   బొబ్బిలి సంస్థానానికి చెందిన ఎస్టేట్ లో ఒక భాగమైన ఈ పొలానికి వారి బంధువులైన చెలికాని ధర్మారాయణం గారి దగ్గర ఈ పొలం కొన్న దగ్గర నుండీ మా తాత గారికి లాయర్ వృత్తి మీద శ్రద్ధ తగ్గి వ్యవసాయం మీద ఆసక్తి పెరిగింది.

ఆ ఆసక్తితో బొబ్బిలి రాజా గారి దగ్గర మామిడి తోటలు వెయ్యడానికి మరొక 1000  ఎకరాల బంజరు భూములకి పట్టా మా తాత గారు కౌలుకి తీసుకున్నారు.  కేవలం మూడు, నాలుగేళ్ల సమయంలో అత్యధికంగా ఆర్ధిక పెట్టుబడి పెట్టి, వ్యవసాయం లో అనుభవం లేని మా తాత గారు ఆ సమయంలో దురదృష్టశాత్తు  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆర్ధిక మాంద్యంలో—ది గ్రేట్ డిప్రెషన్ – లో తను కూడా కూరుకుపోయారు.  సుమారు 1923 మా బాబయ్య గారు నుంచి  1940  దాకా మా తాత గారు విపరీతమైన ఆర్ధికపరమైన కష్టాలు పడ్డారు.

కానీ మొండి పట్టుదలతో, అకుంఠితమైన దీక్షతో, అన్ని ఆర్ధిక లావా దేవీలనీ అధిగమించారు. కుటుంబ బాధ్యతలను అన్నింటినీ పరిపూర్తిగా నిర్వహించారు. అందులో ఏకైక కుమారుడిగా మా నాన్న గారి సహకారమూ, సమర్ధవంతమైన నిర్వహణా లేక పోతే ఈ నాడు ఆ కుటుంబాలన్నీ ఎలా ఉండేవో నేను ఉహించనే లేను.

1907 లో కాకినాడలో పుట్టిన మా నాన్న గారు అక్కడే చదువుకున్నారు.  మా తాత గారు 1921 లో కొన్న నాలుగేళ్ళకి  1925 లో స్థలంలో ముందుగా ఆగ్నేయం మూల ఒక ఐదు గదుల చిన్న ఔట్ హౌస్ కట్టుకుని ఆ ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. 1926 లో పెళ్లి అయ్యాక,  మా అమ్మ ఆ ఇంటికే  1930 ప్రాంతాలలో కాపరానికి వచ్చింది. వారి పెళ్లి శుభ లేఖ ఇందుతో జతపరుస్తున్నాను. మా నాన్న గారు, చదువుకొంటున్నా, మా తాత గారికి నిలదొక్కుకొనడంలోనే సహాయం పడడంలోనే ఎక్కువ సమయం గడిపే వారు. కాకినాడ తరవాత, మద్రాసు, త్రివేండ్రం లలో చదువుకుని 1937 లో మా నాన్న గారు లా డిగ్రీ పూర్తి చేసి మా తాత గారికి చేదోడు వాదోడుగా ఉండడానికి కాకినాడలో ప్రాక్టీస్ పెట్టారు. ప్రాక్టీస్ పెట్టారన్న మాటే కానీ. ఆయన జీవితానికి ఏకైక  ధ్యేయం మా తాత గారిని అన్ని కష్టాల నుంచీ గట్టేక్కించడమే.  అందుకు అన్ని కోర్టు తగాదాలు పరిష్కరించడం, ఆస్తి పాస్తులు నిలబెట్టుకోవడం, , మా తాత గారు బంధువులకి చేసిన వాగ్దానాలని నెరవేర్చడం , అంతే గాక, మమ్మల్ని..అంటే తన సొంత తొమ్మండుగురు పిల్లలనీ పెంచి, పెద్ద చేసి చదివించడం, పెళ్ళిళ్ళు చెయ్యడం…వీటన్నింటి తోనే ఆయన జీవితం అంతా గడిచిపోయింది. అటు మా అమ్మ కూడా మా అమ్ముమ్మకీ, మూర్తి రాజు తాత గారికీ ఏకైక సంతానం కావడంతో మా అమ్మ కి సంక్రమించిన సారవంతమైన జేగురు పాడు పొలాలు కూడా మా నాన్న గారే చూడ వలసి వచ్చేది. అలాగే 1940 దశకంలో దొంతమ్మూరు గ్రామంలో మా కామేశ్వర రావు మామయ్య గారు హఠాత్తుగా పోయినప్పుడు సుమారు 400 ఎకరాల మిరాశీ అనే పొలం వ్యవహారాలూ కూడా మా నాన్న గారే తన భుజాలకి ఎత్తుకున్నారు. టూకీగా చెప్పాలంటే మా నాన్న గారు ఒంటి చేత్తో, మూడు దూర గ్రామాలలో (గొల్లప్రోలు దగ్గర దొంతమ్మూరు పొలాలు, ద్రాక్షారం దగ్గర ఇంజరం, రాజమండ్రి దగ్గర జేగురు పాడు) విసిరేసినట్టు ఉన్న 2000  ఎకరాల వ్యవసాయం, చేసి, అప్పులు తీర్చడానికి దూరంగా ఉన్నవి అమ్మేసి, మా తాత గారి కోరిక ప్రకారం తన ఐదుగురు అప్పచెల్లెళ్ళ కుటుంబాలని, ఇతర బంధువులకీ తానే పెద్ద దిక్కుగా ఆదుకోవడం, వారి పిల్లలని చదివించడం, అన్నింటినీ మించి మా తొమ్మండుగురినీ పెంచి పెద్ద చేసి, మా కాళ్ళ మీద మేము నిలబడేలా తీర్చి దిద్దిన మా నాన్న గారికి ఎన్ని జీవన సాఫల్య పురస్కారాలు ఇస్తే సరిపోతుంది?  ఎన్ని నోబుల్ బహుమతులు, ఆస్కార్ లు ఇస్తే ఆయన అప్రకటిత విజయాలకి సరితూగుతాయి?

నాకు తెలిసీ మా నాన్న గారు ఎప్పుడూ ఎక్కడికీ “వెకేషన్ ‘ కి వెళ్ళ లేదు. పొలాలు చూసుకోడానికి గుర్రం మీదో, గుర్రబ్బండి మీదో వెళ్ళే వారు. రోజుల తరబడి చెట్ల కిందనే కేరేజ్ లో వచ్చిన అన్నం తిని, నిద్ర పోయే వారు. కనీసం ఒక సారి ఆయన గుర్రం మీద నుంచి కింద పడి చెయ్యి విరగ్గొట్టుకున్నారు. నా చిన్నప్పుడు ఆ గురబ్బండి అవశేషాలు మా తోటలో ఉండేవి. మా తాత గారివీ, బామ్మ గారివీ అస్తికలు కలపడానికి కాశీ వెళ్ళారు కానీ, మా నాన్న గారు తన కర్తవ్యాలని విస్మరించి పుణ్యం కోసం పాకులాడడానికి సకల తీర్దాలు సేవించ లేదు. ఇంట్లో కూడా వినాయక చవితి లాంటి పండగలే తప్ప చీటికీ, మాటికీ వ్రతాలు చేసేసి దేవుణ్ణి ఎప్పుడూ ఇబ్బంది పెట్ట లేదు. కథలు, కవిత్వాలు వ్రాయ లేదు.

ఒక ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే కాంగ్రెస్ మహా సభలు జరిగినప్పుడు గాంధీ గారు  1923  లో కాకినాడ వచ్చినప్పుడు, మా నాన్న గారు తన మిల్లు బట్టలన్నింటినీ నిప్పుల్లో వేసేసి, అప్పటి నుంచీ జీవితాంతం ఆయన ఖద్దరు బట్టలే కట్టారు. ఆఖరికి కోర్ట్ కి వేసుకునే నల్ల కోటు, గౌను, బౌ, పూజా, పునస్కారాలకీ, ఒకటేమిటీ, అన్నీ ఖద్దరే. ఆయన కట్టుకున్న పంచెలు, కండువాలు కొన్ని నా దగ్గరే హ్యూస్టన్ లో ఉన్నాయి.

ఆడ పిల్లలలకి ఆస్తిలో వాటాలు ఇచ్చే సాంప్రదాయం కానీ, చట్టరీత్యా కానీ లేని ఆ రోజులలో, మా నాన్న గారు తన ముగ్గురు అక్కలకీ, ఇద్దరు చెల్లెళ్ళకీ తగిన వాటాలు ఇచ్చి మా తాత గారి, బామ్మ గారి కోరిక నిలబెట్టారు. అంతే గాక వారందరినీ, వారి పిల్లలనీ మా ఇంట్లోనే ఉంచుకుని చదివించారు. అందులో మా అమ్మ సహకారం నూటికి నూట యాభై  శాతం అని వేరే చెప్పక్కర లేదు. అలాగే మా బామ్మ గారి చెల్లెలు (మా చెల్లంబామ్మ గారు, రాజమండ్రి) కుమారుడు మా నాన్న గారికి వరస కి తమ్ముడుయిన మా సూరీడు బాబయ్య గారినీ, మా చిట్టెన్ రాజు బాబయ్య తో సహా మా తాత గారి సవితి తమ్ముళ్ళ పిల్లలందరినీ మా నాన్న గారే చదివించి, పెళ్ళిళ్ళు చేసారు.

వ్యక్తిగతంగా, మా నాన్న గారికి కొన్ని మంచి, తమాషా అలవాట్లు ఉండేవి. ఉదాహరణకి ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందు  ఆ రోజు డబ్బు లెక్కలు ఆదాయం, వ్యయం అణా పైసలతో సహా చిన్న  2 “ x 3 “  కాగితాల మీద ఖచ్చితంగా రాసి చూసుకునే వారు. తేడా వచ్చిందో అయిందే అందరి పనీ! మాకు ఆయన్ని చిల్లర ఖర్చులకి డబ్బు అడగడానికి ఎప్పుడూ  భయమే! ఇప్పటి లాగా వారానికింత “అలవెన్స్” అంటూ ఉండేది కాదు. యాభై మంది పిల్లలు ఇంట్లో ఉంటే ఎలవెన్సా , పాడా? మేము ఎప్పుడైనా పరీక్షలు పాస్ అయి పోయాక స్నేహితులతో సరదాగా సోడాలు తాగడానికి బేడా, పావలా కావలసి వచ్చినప్పుడు ముందు మా అమ్మ చేతో, మా చిట్టెన్ రాజు బాబయ్య చేతో అడిగించే వాళ్ళం. అత్యవసర పరిస్తితులలో ఆయన అలా తోట లోకి వెళ్ల గానే ఆయన డబ్బు పెట్టుకునే పెట్టె తీసి ఆ బేడా, పావలా తీసుకుని పారిపోయే వాళ్ళం. ఇక ఆ రాత్రి ఆయనకి  లెక్క తేలక అందరినీ అడిగి, ఆఖరికి మా దగ్గర నిజం రాబట్టి “అడిగితే ఇవ్వనా?” అని కోప్పడే వారు. అడిగితే ఇస్తారు అని తెలుసు కానీ , అడగడానికే భయం! ఆ రోజుల్లో మా చిన్న పిల్లల మనస్తత్వాలు, పెద్ద వాళ్ళంటే ఉండే భయభక్తుల గురించి మా అమెరికా పిల్లలకి నేను ఎన్ని విధాలుగా చెప్పినా వాళ్లకి అర్ధం కాదు.

ఇక మా తాత గారు చుట్ట కాల్చే వారు కానీ మా నాన్న గారికి ఆ అలవాటు కూడా లేదు. ఆయనకున్న ఒకే అలవాటు పనులన్నీ ఆఖరి క్షణం దాకా వాయిదా వేసి వారు. నాకు కూడా అదే ‘అలవాటు’ వచ్చింది. ఆఖరికి కోర్ట్ లో వెయ్య వలసిన దావాలు, ప్రతి వాదాలు, అర్జీలు అన్నీ కూడా రేపు “కాల దోషం” పట్టిపోతుంది అనే దాకా ఆలోచిస్తూనే ఉండే వారు. ఆ ముందు రోజు రాత్రి దస్తావేజు రాసే వారు. ఇది నాకు ఖచ్చితంగా ఎందుకు తెలుసు అంటే ..నాకు వయసు వచ్చాక అర్ధరాత్రి దాకా నేను కూడా ఆయన  గదిలోనే కూచుని ఆయన వ్రాసిన దస్తావేజులు చదివి ..తప్పులు దిద్దేవాడిని. …ఎందుకంటే “రాజా గాడికి తెలుగు, ఇంగ్లీషూ రెండూ బాగా వచ్చును.” అనే వారు మా నాన్న గారు. అప్పుడప్పుడు ఆయన వాడి, నేను ప్రతివాదిగా రిహార్సల్స్ కూడా చేయించే వారు. అవన్నీ నా జన్మలో మర్చిపోలేని జ్జాపకాలు.

మా నాన్న గారికి మరొక తమాషా అయిన అలవాటు ఉండేది. అదేమిటంటే ఎప్పుడైనా ఏ బజారుకో ఇంకెక్కడికైనా వెళ్ళవలసి వస్తే, ఖద్దరు పంచ, కండువా వేసుకుని శుభ్రంగా తయారు అయి వీధి గుమ్మం దగ్గర నుంచునే వారు. ఆయన్ని చూడగానే మా పేటకి కొత్తగా వచ్చిన ఓ రిక్షా వాడు బేరం కోసం ఆగే వాడు. “బజారుకి ఎంత?” అని వాణ్ణి అడిగి, “లేదులే, నేను ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఉత్తినే అడిగాను “ అని పంపించేసే వారు. వాడు బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయే వాడు. అలా ఆయన వీధి గుమ్మం దగ్గర కనీసం గంట నుంచుని వచ్చే, పోయే ట్రాఫిక్ నీ, జనాల్నీ చూస్తూ, ఆ తరువాత ఏ ఖాళీ రిక్షా వచ్చినా ఎక్కేసే వారు. మా గాంధీ బొమ్మ దగ్గర ఎప్పుడు ఉండే రిక్షా వాళ్లకి ఈయన అలవాటు తెలుసు కాబట్టి, ఆయన వీధి గుమ్మంలోకి వచ్చి నుంచున్న గంట దాకా దగ్గరకి వచ్చే వారు కాదు. “ఒక్క వెధవా రాడేం” అని ఆయన విసుక్కునే వారు. మా నాన్న గారు చాలా అరుదుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జరిగే ఈ తతంగం చాటు మాటు నుంచి చూసి మేము నవ్వుకునే వాళ్లం.

అలాంటి అలవాటే ఇంకోటి ఉండేది మా నాన్న గారికి. అదేమిటంటే పని వాళ్లకి జీతాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు “పెద్దబ్బాయ్ యింకా పొలం నుంచి రాలేదు. వాడు వచ్చాక కనపడు” అనే వారు. పెద్దబ్బాయ్..అంటే మా పెద్దన్నయ్య మా నాన్న గారి దగ్గర వ్యవసాయం చెయ్యడం మొత్తం నేర్చుకున్నాక, మా నాన్న గారు రిటైర్ అయ్యారు. మా పెద్దన్నయ్యే పంటలు అమ్మాక మా నాన్న గారికి సొమ్ము అప్పజేప్పే వాడు. అన్నింటినీ పోస్ట్ పోన్ చేసే అలవాటు ఉన్న మా నాన్న గారు ఇలాంటి చిన్న చిన్న ఖర్చులకి కూడా మా పెద్దన్నయ్య పొలం నుంచి రాలేదు అని వంక పెట్టె వారు. ఇది అందరికీ సరదాగానే ఉండేది. కానీ, మా పొలాలన్నీ వర్షాధారం పొలాలు కాబట్టి ఒక ఏదు పంటలు పండీ, రెండేళ్ళు పండకా వాటి మీద నుంచి వచ్చే ఆదాయం నిలకడగా ఉండేది కాదు. అమెరికా నుంచి నేనూ, మా తమ్ముడూ ఆర్ధికంగా ఎంత సహాయం చేసినా మా నాన్న గారికి వేరే ఆదాయం లేదు కాబట్టి తన ఆఖరి రోజులలో మానసికంగా ఇబ్బంది పడ్డారు అని నా అనుమానం.

మరొక ఆశ్చర్య కరమైన విశేషం ఏమిటంటే, మా నాన్న గారు తన మొత్తం జీవితంలో మహా అయితే ఐదారు సినిమాలు చూసి ఉంటారు. అందులో ఝనక్ ఝనక్ పాయల్ బాజే ఒకటే ఆయన చూసిన హిందీ సినిమా.  మా చిన్నప్పుడు ఏ కళని ఉన్నారో ఒక రోజు నన్ను, మా తమ్ముడినీ “ఒరేయ్ ఇవాళ అదేదో రోజులు మారాయ్ అనే వ్యవసాయం సినిమా వచ్చిందిట. చూద్దాం “ అన్నారు. అది వినగానే మేమిద్దరం ఆఘమేఘాల మీద తయారు అయిపోయాం. నేను ఆ రోజు స్పెషల్ కాబట్టి పొట్టి లాగు బదులు పైజామా వేసుకున్నాను. “రిక్షా కుదుర్చుకోడానికి మీకు ఎలాగా గంట పడుతుంది. మీరు వెళ్ళి వీధి గుమ్మంలో నుంచోండి. ఈ లోగా నేను తయారయి వస్తాను అంది మా అమ్మ. మొత్తానికి అందరం రిక్షా ఎక్కాం. మా అమ్మా, నాన్న గారు, మా తమ్ముడూ సీటులో కూచున్నారు. ఇంక చోటు లేక నేను రిక్షాలోనే ముందు ఉన్న ఇనప రాడ్ పట్టుకుని నుంచుని నెహ్రూ గారి లాగ ఫీలయిపోతూ క్రౌన్ టాకీస్ కి వెళ్ళాం. అక్కడ తెలిసింది . రోజులు మారాయ్ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుని అంతకు ముందు వారమే అది వెళ్ళిపోయి “అక్కా చెల్లెళ్ళు” అనే మరొక సినిమా ఆడుతోంది అని. ఇక తప్పక మేము ఆ సినిమా చూసాం. నేను మా నాన్న గారితో చూసిన ఒకే ఒక్క సినిమా అదే! ఆ సినిమాలో రమణా రెడ్డి చేసిన మేజిక్కులు మా నాన్న గారికి నచ్చాయి.

మా బాబయ్య గారు పోయి ముఫై ఏళ్లయినా, కుటుంబ సంక్షేమం, బంధువుల బాగోగులే తన జీవితంగా మలచుకున్న మా నాన్న గారి నుంచి నేర్చుకోవలసినది యింకా చాలా ఉంది. నేను అమెరికా రావడం వలన ఆయనకి ఎక్కువ సేవ చెయ్యగలిగానా, లేక అక్కడే ఇండియాలోనే ఉండిపోయి ఉంటే ఆయన్ని యింకా బాగా చూసుకునే వాడినా అనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది.

“అలసిన వేళనే చూడాలీ….”

 

అలా నా జీవితం నువ్వుపప్పు జీడిలా తియ్యగా కమ్మగా సా…….గుతూ వుండగా ,  ఒక వెచ్చని సాయంత్రం  ……

‘ సోగ్గాడిపెళ్ళం’ అనే పతిభక్త సినిమానుంచీ ” కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్యపైన ….రాయల్లెవున్న ఆ రామయ్యపైన ” అన్న ఏసుదాసు కీర్తనని భక్తితో ఆలకిస్తూ బిందె, చెంబూ బరబరా తోమి పడేసాను. ఉప్పూ చింతపండూ కలిపి తోమితే ఇత్తడి పుత్తడిలా మెరుస్తుందని ఆ మధ్యన మా అత్తగారు ఎవరికో చెపుతుంటే  పరధ్యానంగా  విన్నానేమో ….ఆ పాఠం అవసరానికి పనికొచ్చింది. (అదేవిటో నేను స్కూలుకెళ్ళి  శ్రద్ధగా నేర్చుకున్న పాఠాల కంటే , ఇలా అశ్రద్ధగా విన్న అత్తగారి పాఠాలే జీవితంలో ఎక్కువగా అక్కరకొస్తుంటాయి)

నే తోమి బోర్లించిన బుడ్డి చెంబు బాల భానుడిలా ప్రకాశిస్తుంటే , చెప్పొద్దూ ….నా తోముడు కళాప్రావీణ్యానికి నాకే తెగ ముచ్చటేసింది   . నా చేతిలో పడితే రాయైనా రత్నమై మెరుస్తుందేమో అన్న అనుమానం తన్నుకొచ్చింది. . “నువ్వు సూపరే పిల్లా” అని ఆయన అస్తమానూ  అనేది ఇందుకే కదా అని తలుచుకుంటే సిగ్గు ముంచుకొచ్చింది .  ఆ సిగ్గుతోనే  వంచిన నడుం ఎత్తకుండా రెండెకరాల   వాకిలీ గాలివాలుకు గబా గబా తుడిచేసి , ఓ  రెండు గాబుల నీళ్ళు తోడి కళ్ళాపు చల్లేసి , ఈ చివర్నించీ ఆ చివరికి  నాకొచ్చిన చుక్కలముగ్గులూ, చిక్కులముగ్గులూ అన్నీ పెట్టుకుంటూ కూర్చునేసరికి  సూరిబాబు మొఖం  వేళ్ళాడేసుకుని చెట్లవెనక్కి జారిపోయేడు .

అమ్మో…! అపుడే వంట వేళయిందా .  పొద్దున్నేకదా వండి పడేసాం!’ అని విసుక్కోకుండా మళ్ళీ హుషారుగా వండేసి- మళ్ళీతినేసి, మళ్ళీతోమేసి – మళ్ళీతుడిచేసి…..చీ…చీ…ఇంతేనా వెధవ జీవితం అన్న పాడుఆలోచన  అణుమాత్రమయినా  రానీయకుండా ……’పతియే ప్రత్యక్ష దైవమూ …నా అత్తారిల్లే స్వర్గమూ’ అని  పతిభక్తి పాటలు పాడుకుంటూ ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు కిందా మీదా పడుతూ ఈ పాచి పనులన్నీ చేసేసుకుందామా అని కలలు కంటూ పడుకోటం  ‘ఆహా …. జీవితమే సఫలమూ ‘అని అరమోడ్పు కన్నులతో నేను తన్మయం చెందుతుంటే ….

కత్తిపీటా కూరలబుట్టా పట్టుకుని అటుగా వచ్చిన అత్తగారు నీరసంగా అరుగు చివర కూలబబడ్డారు. “ పంచాయితీ ఆఫీసులో ఎమ్మారావో ఎవడో  వచ్చి కూచున్నాడట  .  భోజనం ఏర్పాట్లు చూడమని మీ మావయ్య కబురంపేరు ” అంటూ ఉల్లిపాయలు ఒలవటం మొదలుపెట్టారు.  నాకళ్ళల్లో నీళ్ళొచ్చాయి అత్తగారి అవస్థ తలుచుకుని  ( సందేహం అక్కరలేదు నిజంగా అందుకే )

“ అప్పుడప్పుడూ కసురుకున్నా,  విసురుకున్నా నరసమ్మ చేసిన చాకిరీ తక్కువేం కాదేవ్. పాపం బండ గొడ్డులాగా రోజల్లా ఎంత పని చేసేది “అన్నారు అత్తగారు ఉల్లిపాయ తరుగుతూ  .  ” బాగా చెప్పారు ” అన్నాను    కళ్ళొత్తుకుంటూ . ఇంటిపనితో నాకూ వంట పనితో అత్తగారికి ఒళ్ళుపులిసిపోతుంటే మా జీవితాల్లో నరసమ్మలేని లోటు బాగా తెలిసొస్తుంది.

“ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభంలెండి  ! చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అన్నారు. నరసమ్మని వదిలించుకున్నాం అనుకున్నాం కానీ, అదే  మనల్ని  విదిలించుకుని వెళ్ళిపోయిందని అది వెళ్ళాకే తెలిసింది” అన్నాను నరసమ్మ దివ్యమంగళ రూపాన్ని ఓసారి  స్మరించుకుని.

“ మీ కొంపలో కాపీ గిన్ని తోమలేక సచ్చిపోతన్నాను  తల్లో- అని పాపం ఎంత మొత్తుకునేది . కనపడ్డవాడినల్లా కాఫీకి పిలుకొచ్చే  ఈ మగ మహారాజులకేం తెలుసు గిన్నెలు తోమలేక ,కూరలు తరగలేక ఆడవాళ్ళు పడే అవస్థలు ” అంటూ  ఆవేశ పడ్డారు అత్తగారు .

నరసమ్మకీ మాకూ మధ్య  ఋణానుబంధం   తెగిపోయి చాన్నాళ్ళయింది  . మరో నరుసు కోసం మేం తీవ్రంగా  ప్రయత్నించాం కానీ ఇంతవరకూ  మాకాభాగ్యం కలగలేదు.

“ఇక్కడపుల్ల  అక్కడ పెట్టక్కరలేదని  పెళ్ళికి ముందు పలికితిరే ! అంతా  ఉత్తుత్తేనా  . మల్లెపువ్వులాంటి  ఇల్లాలిని  మసిగుడ్డ వలె  మార్చితిరి కదా  ప్రభూ తమకిది  తగునా  .  అని వీలుచిక్కినప్పుడల్లా దెప్పిపొడుస్తూ “ బ్రోచేవారెవరురా….. ! “   అని ముక్కుచీది  రాగంతీస్తే  ,” పొలం  పనులు బిగ్గా  దొరుకుతుంటే ఇంటిపనికెవరొస్తారు . ఒకవేళ వచ్చినా మీరు నిలబడనిస్తారా . అయినా ఎవరింటి పని వాళ్ళు చేసుకోటం కూడా బరువే !    జోడెద్దుల్లా ఇద్దరున్నారుగా ఎంచక్కా ఆడుతూ పాడుతూ దున్నేసుకోండి “  అంటూ కాడి మా భుజాన పడేసి చల్లగా గట్టెక్కిపోయేరు . (అకటా!  ఎంత దయలేనివాడు ఈ గండరగండడు)

” ఇందుకే బాబూ….ఈ పల్లెటూర్లంటే నాకు చిరాకు.  ఇదే   మా సిటీలో అయితేనా ఓ…అంటే వందమంది   …” అంటూ పుండుమీద కారం చల్లేసి వెళ్ళింది మా చెల్లాయమ్మ  .

” మీ కొంపలో పని చేయలేనని వెళ్ళిపోయిందటగా నరసమ్మ….ఇంకా ఎవరూ కుదరలేదా ? ఎలా చేసుకుంటున్నారో పాపం”  అని సానుభూతి చూపించడానికీ, కోడలుతో అత్తగారు చేయిస్తుందా లేక కోడలే అత్తగారికి పని పురమాయిస్తుందా అని  కనిపెట్టిపోడానికి    వంతులవారీగా వచ్చివెళుతున్నారు అమ్మలక్కలు .

అక్కడికీ ఒకరోజు “అయిందేదో అయింది…ఏరు మీద కోపగించి నీరు తాగడం మానేస్తే ఎండిపోయేది మనగొంతే కదా! అబ్బులు ద్వారా నరసమ్మకి రాయబారం పంపిద్దాం.   సంధి ప్రయత్నాలు కావిద్దాం  . ఏవంటారూ ?” అని  అలిసిన ఒళ్ళు  నొక్కుకుంటూ ఆశగా అడిగాను  .   “అప్రదిష్ట  “  అంటూ ఒక్క ముక్కలో తేల్చేసారు  అత్తగారు .

ప్రత్యక్ష దైవాలకి మా మీద కనికరం ఎలానూలేదు . కనీసం మీరయినా మా ప్రార్ధన ఆలకించండి  అంటూ పటాల్లో దేవుళ్ళకి మొక్కుకున్నాం. శుక్రవారంలోగా పనిమనిషి దొరికితే పాయసం వండి నైవేద్యం పెడతానని లచ్చిందేవికి మా అత్తగారు ఆశపెడితే ,   ఆలస్యం అయినా పర్లేదు ఆదివారం నాటికయినా పనయ్యేటట్టుచూడు స్వామీ  అంటూ నేను ఆంజనేయుడికి అప్పాలదండ మొక్కేసాను .  శుక్రవారాలూ ఆదివారాలూ  క్రమం తప్పక   వస్తూనేవున్నాయి .  పాయసం అప్పాలతో మాకు మొహం మొత్తిపోయాకా ….గ్రామ దేవతకి కోళ్ళూ కొబ్బరికాయలూ కూడా మొక్కేశాం. మా ఇంటికో పనిమనిషి వచ్చేవరకూ పండుగలూ , బంధువులూ రాకూడదనీ…..పంచాయతీ అఫీసులన్నీ మూతపడిపోవాలనీ కోరుకున్నాం.

అలా నే  కోరుకున్నవన్నీ జరిగిపోతే మూడు మూళ్ళు పదహారయ్యేది ,నా జడ రెండు బారలయ్యేది, మా తోడికోడలు ముక్కు తప్పడయ్యేది

మా అత్తగారు   ఉల్లిపాయలు తరిగిన పళ్ళెం నా చేతికిచ్చి  …నీరసంగా గోడకి ఘటం జారేసారు  . కాళ్ళు సాగదీసి మెల్లగా ఓ మూలుగు మూలిగి” ఏమేవ్…ఆ  జీడిపిక్కల కత్తిపీట ఇలా తగలెయ్ ….. గుప్పెడు జీడిపప్పు కొట్టి కోడిగుడ్డు  కూరలో వేద్దాం  . కాసేపట్లో సంతలోంచీ చేపలూ  రొయ్యలూ వచ్చిపడతాయ్ . ఉల్లిపాయ నూరి ఉంచితే  పలావూ , పులుసూ   చేసి తగలెయ్యొచ్చు. ( మా అత్తగారికి కోపం వస్తే అన్నిటినీ తగలేస్తానంటారు – అపార్ధం చేసుకోకూడదు మనం … అదొక ఊత పదం అంతే )  . నిచ్చెనేసుకుని అటకమీంచీ పలావుడేగీశా దించి, తోమి తగలెయ్ . అలాగే మూడు సేర్లుడికే తెపాళా తీసి ఎసరు పడెయ్. అంటానికి ఒక్కడే అంటారు కానీ , తినేటప్పుడు  నలుగుర్ని వెంటేసుకొస్తారు .   ఒక్కడికీ పెట్టి మిగిలినవాళ్ళని  మీ ఇంటికెళ్ళి తినండి అంటామా….హవ్వ…అప్రదిష్ట అంటూ పనిలో పడ్డారు.

నేను దేబ్యం మొహం పెట్టుకుని  కాకినాడలో కాపురం పెట్టిన మా పద్దూని  తల్చుకున్నాను. చీకటి పడుతందనగా రెండు గుప్పెళ్ళు బియ్యం కుక్కర్లో పోసి, ఒక అరటికాయో రెండు బంగాళాదుంపలో అలా అలా వేయించేసి, ఎంచక్కా చిలకలా ముస్తాబయ్యి  సన్నజాజులు మాల కట్టుకుంటూ  ” నీవులేక వీణా  …… “ లాంటి  ఎదురుచూపుల పాటలు పాడుకోవటం, వంట చెయ్యడం విసుగనిపిస్తే సుబ్బయ్య హొటల్నుంచీ  బోయినం పార్సిల్  తెచ్చుకోవటం, బోరు కొట్టినపుడల్లా సినిమాకో వాకలపూడి బీచ్ కో జంట గా వెళ్ళిరావటం ,  అహ ఏమి హాయిలే హలా ….అంటూ మధురస్వప్నాలు చూపించి  నన్ను పెళ్ళికి ఉసిగొలిపింది పాపాత్మురాలు కనిపిస్తే పీక పిసికేద్దును.

సంతలో దొరికిన జల చరాలు చాలవన్నట్టూ  , చేలోంచీ ‘గిన్నికోడి ‘ అనబడే  భూచరాన్నొకదాన్ని  భుజాన్నేసుకుని  ఒగుర్చుకుంటూ  వచ్చిపడిపోయాడు  అప్పడు .(  ఊర్లో ఉన్న నూటొక్క మంది అప్పయ్యలకు లేని భాగ్యం వీడికి ఉండటం మూలాన అందరూ వాడిని మెల్లకన్నప్పడు అంటారు . చేలో కోళ్ళనీ దూళ్ళనీ మేపుతుంటాడు . వాడి మకాం కూడా చేలోనే . ఇంటిమీద కాకి అరిచినా  రోడ్డుమీదకి గవర్నమెంటు జీపొచ్చినా  ఉరుకులు పరుగులమీద ఊళ్ళోకొచ్చి పడిపోతాడు )

” మళ్ళీ  ఇదెందుకురా   ఏ అరటికాయో ,ఆకాకరకాయో  వండుదాంలే ? ” అన్నారు అత్తగారు విసుగ్గా .

దానికి వాడు గిలగిచ్చకాయలా ఒళ్ళంతా  ఊగిపోయేలా నవ్వేసి “బలేవోరే అయ్యాగారూ….. ఎమ్మారావుగారికి  కాయా కసరా  ఏసి పత్తిం బోయినం ఎడతారా ! కక్కా ముక్కా ఒండి పులావు కబాబూ  సేయ్యాలండి   . ఆనక ఆరు ఒణ్ణం తిని సెయ్యి కడుక్కున్నప్పుడల్లా మన లోగిట్లో తిన్న బోయినo గేపకం  వచ్చీయాలండి. అసలుండీ …ఆరు బోయినానికుంటారని కబురు తెలుసుంటే , ఏజెన్సీనించీ ఏట మాసం అట్టుకొచ్చీద్దునండి. ఇలా ఉన్నపళంగా బోయినం అంటే ఉన్న దాంతోనే సర్దుకోవాలండి మరి “ అని కొంచెం నిట్టూర్చేసి,     తలకున్న తువ్వాలు  విప్పి దులిపి నడుముకి  ముడేసాడు.   “సిన్నయ్యగారూ  పెద్ద కత్తిపీట, మాసం కత్తీ   ఇలాగడెయ్యండి చనంలో ఈటిని వొంటకి రెడీ సేసేత్తాను అని   కదనోత్సాహంతో  కదులుతున్నవాడు నా కళ్ళకి కూర్మావతారంలా  కనిపించాడు.  “పోన్లేరాబాబు సగం భారం తగ్గించావు “అని మనసులోనే  ఒక నమస్కారం చేసుకుని వాడడిగిన   సరoజామా అందించాను  .   ఉత్తప్పుడు  మెట్ట తాబేలులా ముక్కుతూ మూల్గుతూ తిరుగుతాడా  ఇంటికెవరన్నా చుట్టాలో పక్కాలో వచ్చారని తెలిస్తేమాత్రం  పీత పరుగే …. పట్టపగ్గాలుండవు  .  ఊళ్ళోకి అప్పుల వసూళ్ళకి వచ్చే బేంకోళ్ళు, తగువులు తీర్చడానికొచ్చే పోలీసోళ్ళు, సీజన్లో వచ్చే పొగాకు బోర్డోళ్ళు పంచాయతీ మీటింగులకి హాజరయ్యే ఆఫీసర్లూ అంటే వాడికి  అదోరకమైన గౌరవం ఎందుకోమరి . ఇక ఎలక్షన్ల  ప్రచారంకోసం  పిడత మొహం పెట్టుకొచ్చే ప్రతి రాజకీయనాయకుడూ వాడికి  పవర్ స్టారే   .  పార్టీలతో సంబంధంలేకుండా అందర్నీ ఆదరించేయాలని తహతహలాడిపోతాడు .

గుమ్మంలోఅడుగుపెట్టినవాళ్ళకి   కాళ్ళు తొలుపుకోటానికి  చెంబుతో  నీళ్ళందించడం  దగ్గరనుంచీ  భోజనం పూర్తయ్యాకా చేతులుమీద నీళ్ళు పొయ్యటం వరకూ అన్నీ తానే  చేసేయలన్నట్టూ  తెగ  తారట్లాడిపోతాడు. ఆఖర్న చేతులు తుడుచుకోటానికి తువ్వాలు అందిస్తూ ” బోయినం ఎలావుందండీ ” అనడుగుతాడు మహా భక్తిగా . తిన్నవాడు  తనముందు  బ్రేవ్ మని ఒక్కసారయినా త్రేంచకపోతే……” సగం సగవే తిన్నట్టున్నారు  ఒంటకాలు బాగా కుదరలేదంటారా?” అని మామీదే అనుమానపడతాడు.  మనుషుల్ని మేపటమంటే మహా సరదా వాడికి రాజుగారి మల్లేనే.

తెచ్చినవాటికి తోళ్ళూ కీళ్ళూ పీకే పనిలో అప్పడు ,  తాలింపు చూడ్డంలో అత్తగారూ  వాళ్ళిద్దరికీ  అసిస్టెంటులాగా అవీ ఇవీ అందిస్తూ నేనూ ఫుల్ల్ బిజీగా వుండగానే …  పంచాయతీలో కూర్చుని ప్రైవేటు తగూలు తీర్చే పాత ప్రసిడెంటు సుబ్బరాజు గారి పాలేరు చందర్రావు    చేతులు నలుపుకుంటూ వచ్చి నిలబడ్డాడు . ”  సుబ్బరాజుగారు  …పది టీలట్టుకురమ్మన్నారండి   ” అంటూ .

అత్తగారు  పళ్ళు పటపటలాడించేరు  పైకి వినిపించకుండా . నేను తలబాదుకున్నాను  మా అత్తగారు చూడకుండా( ఏ నోముఫలమో…ఏ జన్మ వరమో అని తలపోస్తూ)   .

“బుల్లిరెడ్డిగారింట్లో అన్నదమ్ములిద్దరి మద్దినా తగువయ్యింది కదండీ . ఏడాదిబట్టి పీక్కున్నా ఎటూ  తెగలేదండి  . ఆ తగువు తెగ్గొడ్డటానికి   అనపర్తినుంచీ రెడ్లొచ్చేరండి.   సిన్నకోడలు గారిది  ఆవూరే  గావాలండి   . ఈళ్ళూ ఆళ్ళూ  మాటమీద మాట పెంచేసుకుంటన్నారండి. తగువు కోసం కూకున్నోళ్ళందరి బుర్రలు వీటెక్కిపోనియ్యండి. ఇయ్యాల ఎలా అన్నా ఈ తగూ అటో ఇటో తేలిపోవాలని  మా రాజుగారి పంతం అండి. ఎంకన్నా ఎల్లి టీలట్టుకురా తాగేసి తగూ తీర్చేద్దారి అని  నన్ను  పురమాయించేరండి ” అంటూ ….అన్నదమ్ములిద్దరి మధ్యనా అగ్గెలా పుట్టిందో అదెలా రాజుకుని మంటయ్యిందో దాంతో ఎవరికి ఎంత కాలిందో ….ఆ మంట ఇప్పుడెక్కడకొచ్చి ఆగిందో అన్ని గుక్క తిప్పుకోకుండా  సినిమా రిలీజు రోజున మొదటి ఆట చూసొచ్చినోడిలా చెప్పేసుకు పోతున్నాడు  మహోత్సాహంగా .

అదేం పట్టించుకునే స్థితిలో లేని అత్తగారు “  తగలేసినట్టేవుంది…అలాయితే తగువెట్టుకున్న బుల్లిరెడ్డి ఇంటికో , తగువు తీర్చేయాలని సరదా పడుతున్న  మర్యాదరామన్న  (సుబ్బరాజు గారన్నమాట) ఇంటికో వెళ్ళకుండా  మా ఇంటికొచ్చి టీ పెట్టమంటావేం రా ….అంత లోకువగా కనిపిస్తున్నామా ఊరుమ్మడి చాకిరీలు చేయడానికి “ అంటూ  వేడిపెనం మీద  నీళ్ళు చల్లినట్టూ  చిటపటలాడిపోయేరు .

” అయ్యబాబో. ..అలా కోప్పడకండి అయ్యగారు . బుల్లిరెడ్డిగారి ఇల్లు ఆ సివరెక్కడో ఉందండి. అక్కడనించీ అట్టుకొచ్చీసరికి టీలు సల్లారిపోవాండీ (  తగువు కూడా సల్లారిపోవచ్చు)…..ఇంక సుబ్బరాజుగారి అయ్యగారి సంగతి తవరికి తెల్దేటండీ.  అయినా మీకూ ఆరికీ పోలికేటండీ అయ్యగారూ ….. ఎన్నేళ్ళబట్టీ సూత్తనానండీ మిమ్మల్నీ …  మీ సేతికి ఎముకలేదండి మీ నోట్లో నాలుక లేదండి . మీకసలు ఇసుక్కోటమే తెలదండీ ….మీ అసుంటోరిని  నేనీ సుట్టుపక్కల మూడు  జిల్లాల్లో సూళ్ళేదండి అని అప్పటికప్పుడు  అలవాటయిన అస్టోత్తరం చదివేసి , చివరికి  గోడమీదఉన్న కాశీ అన్నపూర్ణమ్మని,   గరిటపట్టుకు కూర్చున్న మా అత్తగార్నీ మార్చి మార్చి చూసి “ఎన్నాళ్ళబట్టో అడుగుదారనుకుంటన్నానండి అయ్యగారూ ఆరు మీకేవవుతారండి “అనేసాడు  . అప్పటిదాకా గుంభనంగా కూర్చుని లోపల్లోపల మురిసిపోతున్న అత్తగారు ఈ అధిక మోతాదుకి  అవస్థపడ్డి  చాల్లేరా ఇక ఆపు  అని చిరుకోపం ప్రదర్శించారు  .    “ఫలానా ఊరెళ్ళాం పచ్చి మంచినీళ్ళు పుట్టలేదు అని చెప్పుకుంటే  మనకేసిగ్గుచేటు  . అయినా వాళ్ళకేం లేక వస్తారా …ఏదో పాపం పనిమీదొచ్చేరు . అంటూ యాలక్కాయలేసి డికాషన్ లేకుండా చిక్కగా టీ పెట్టిమ్మని నాకు  పురమాయించి  , “ఇంటికెళ్ళేటపుడు ఓసారి కనపడరా ….. పులావు  పెడతానూ “ అనేసరికి ఆ  బట్రాజు మొహం చేటంత చేసుకున్నాడు .

ఏవిటో  ఈ మాత్రం పొగడ్తలకోసం ఒళ్ళు హూనం చేసుకుని  పడీ పడీ చాకిరీ చెయ్యటం అబ్బే…. అత్తగారూ ఈ వరస నాకేం నచ్చలేదండి. అంతగా కావాలంటే చివర్లో ఎప్పుడో ‘మహా సాధ్వి  మా అత్తగారు’  అంటూ మీపేరుతో  ఒక వ్రత కథ, రెండు భజన కీర్తనలూ నేనే రాసి పెడతానుకదా   అని చింతిస్తూ   అత్తగారి ఆజ్ఞ శిరసా వహించాను చేసేదేంలేక.

వాడలా ట్రే పట్టుకుని గుమ్మం దాటాడోలేదో…..”చిన్నరాజుగారు గానుగ సెట్టుకాడ కూకున్నారండి . అయిసు     నీళ్ళట్టుకు రమ్మన్నారండి “అంటూ ఓ  పిల్లోడు పరిగెత్తుకొచ్చి నిల్చున్నాడు .   ఇదిగో ఇందుకే నాకు మండిపోయేది. వీధిలో కూర్చుని అదీ ఈదీ అని ప్రాణాలు తోడేస్తారు. పనులు తెమలనివ్వరు.

వంటింట్లో  పొయ్యిముందు బాసీపట్టం వేసికూర్చున్న అత్తగారు  గిన్నియ్యి, గరిటియ్యి, చింతపండు నానబెట్టు,  మసాలా నూరిపెట్టు అనీ……దొడ్లోంచీ ఆ కన్నప్ప గాడేమో  కత్తిపీటమీద నీళ్ళొయ్యండి, సేపలు తోమడానికి బూడిదియ్యండి , రొయ్యలమీదికి ఏణ్ణీళ్ళు  కాయండి  అనీ  నన్ను ఒక్క క్షణం కుదురుండనీయకుండా బొంగరంలా తిప్పేస్తున్నారు.   ఆ తిరుగుడు చాలదన్నట్టూ టీలనీ, మజ్జిగలనీ, మంచినీళ్ళనీ, వీధిలోంచీ వచ్చిపడే అబ్బాయిగారి ఆర్డర్లు  . కాళ్ళకి చక్రాలు కట్టుకుని  అందరికీ అన్నీ అవిర్చి నేనూ బోల్డంత కష్టపడినా చివరాకరికి నే చేసిన పని లెక్కలోకి రాదు . వంటెవరు చేసారు అంటే అన్నివేళ్ళూ అత్తగారివైపే చూపిస్తాయి  అన్ని నోళ్ళూ అత్తగారినే పొగుడుతాయి అదేవిటో !

ఏమాటకామాటే  మా అత్తగారు   ప్రారంభంలో విసుక్కున్నా  పనిలో పడ్డాకా మాత్రం   శ్రద్దగా దీక్షగా మనసంతా లగ్నం చేసేస్తారు .  శంకరశాస్త్రి సంగీతం పాడినట్టూ, ఆయనెవరో డోలు వాయించినట్టూ, మా పొట్టి బ్రహ్మం సన్నాయి మోగించినట్టూ ….ఆయాసపడయినా సరే  అంతుచూస్తారు .అబ్బా అదేనండీ…. అనుకున్న రిజల్ట్  రాబడతారూ అని.

రామాలయంలో భజన సంఘం తమ గొంతులు సవరించుకుంటూ  మైక్ టెస్టింగ్ చేసుకుంటున్న వేళకి  ఒక మహా యజ్ఞం పూర్తయినట్టూ అందరం హమ్మయ్యా అనుకుంటూ అరుగుమీద  చతికిలపడేసరికి  వీధి గేటు తీసుకుని ముందుగా పెద్దరాజుగారూ ఆయన  బృందంతోనూ , ఆ వెనకే చిన్న రాజుగారు మరో బృందంతోనూ వచ్చేసారు.   అత్తగారు ” నే చెప్పలేదూ…ఇద్దరూ చెరో బేచీని తీసుకొచ్చేసారు చూసేవా !”అన్నట్టూ కళ్ళెగరేసి  వడ్డన్లు చేయడానికి ఉపక్రమించారు. ఆ వెంటనే అప్పడు  వాకిట్లోకి ఒక్క గెంతు గెంతి మడతమంచాలూ , ఫ్రేము కుర్చీలూ సర్దేసి వచ్చినోళ్ళని కూర్చోబెట్టేసాడు.   మారాజుగారు బిత్తిరి చూపుచూసుకుంటూ వచ్చి…. “అమెరికాలో ఉంటున్న అచ్చిగాడి మావిడితోట కౌలు విషయం మాట్లాడ్డానికొచ్చేరోయ్ .   ఎలాగూ భోజనాల వేళయింది కదా అని   ఇంటికి తీసుకొచ్చేసాను . అందులో ఒకడు మనకి బాగా అలవాటయినోడే బాగోదుకదా మరి  “  అని కామెడీ హీరోలా భుజాలెగరేసుకుంటూ వెళ్ళిపోయేరు .

నాకు తిక్కరేగిపోయింది మా రాజుగారి ఘనకార్యానికి . మాంగారు కనీసం కబురయినా చెప్పేరు . ఏ కబురూ లేకుండా   వెంటేసుకొచ్చేస్తే వెంటనే   ఆకేసి అన్నం పెట్టేయడానికి ఇదేవన్నా చందావాళ్ళ సత్రమా . “అబ్బే….నాకు మీ వరసేం నచ్చలేదు . అయినా ఇదేం పద్ధతీ ..టాఠ్ “ అని ప్రైవేటు చెప్పేయాలనిపించింది . పొద్దుటినుంచీ పాడుకున్న పతిభక్తి పాటలు గొంతుకడ్డం పడ్డాయి కానీ లేపోతేనా ….పిక్కపాశం పెట్టి గోడకుర్చీ వేయించేయొద్దూ.

ఉత్తరంవైపు సావిట్లో  భోజనాల బల్లమీద మంచినీళ్ళతో సహా అన్నీ అమర్చేసి,  విస్తళ్ళలో  పచ్చళ్ళూ కూరలూ ఒక వరుసలో సర్ధి ,మధ్యలో  పులావు పెట్టి, నేతిగిన్నే …అన్నం పళ్ళెం, పెరుగు కేనూ ఇంకో బల్లమీద విడిగా వుంచి  అన్నిటినీ ఒక్కసారి పరకాయించి చూసి ” వడ్డనలయ్యాయని చెప్పరా ” అంటూ అప్పడికి   పురమాయించి, ఘోషా పాటిస్తూ  వంటింట్లోకి వచ్చేసారు అత్తగారు .

ఓ చేత్తో నీళ్ళ బకేట్టూ , ఇంకో చేత్తో ఇస్త్రీ తువ్వాలుతో  అరుగు చివర నుంచున్నాడు  అప్పడు. “కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చోండి” అంటూ మాంగారు అతిధుల్ని ఆహ్వానిస్తే , అబ్బాయిగారు  ఫేనేసి కుర్చీలు జరిపేరు  .  మా భక్త కన్నప్ప    సావిడి గుమ్మానికి  అతుక్కుపోయి  తొండలా మాటిమాటికీ మెడసాగదీసి చూస్తున్నాడు  అన్నీ సరిగా  జరుగుతాయో లేదో అని ఊరికే టెన్షన్ పడిపోతూ   .  ఓసారొచ్చి,” అయ్యగారో…బలేవోరే నిమ్మకాయ సెక్కలు  మర్సిపోయేరు …ఏటండీ బాబూ మీరు” అని   విసుక్కుని వెళ్ళాడు . ఇంకోసారొచ్చి నెయ్యి ఏడిసేసేరా ఎక్కడా కమ్మని వోసనొత్తాలేదు” అని అనుమానపడ్డాడు .

వంటలన్నీ సరిగా కుదిరాయో లేదో, వడ్డనలు సరిగా జరుగుతున్నాయో లేదో అని అత్తగారు తెగ ఇదయిపోతూ వంటిల్లంతా  కలియ తిరిగేస్తున్నారు . కాసేపటికి    “చ…చ…చా…”అని చేతులు నలుపుకుంటూ తల బకురుకుంటూ  యమ యాతన  పడిపోతూ వచ్చాడు అప్పడు .

వాడి వాలకం చూసి కంగారు పడ్డ అత్తగారు ” ఏవిట్రా ?” అంటూ గుడ్లు తేలేసారు .   తెగబాధ పడిపోతూ  వాడు చెప్పుకొచ్చిన  చేట భారతాన్ని సంక్షిప్తం చేస్తే….

అనుమానిస్తూనే అందరితోపాటు భోజనానికి కూర్చున్న ఎమ్మారావు గారు , విస్తట్లో చెయ్యి పెట్టగానే  గండు చీమ కుట్టినోడిలా ఎగిరి పడీ  ముక్కూ కళ్ళూ చిట్లించి  ” రాజుగారూ …ఈవన్నీ  నాకు పరిచయంలేని పదార్ధాలండీ  అని మొహమాటపడి , అప్పటికీ అర్ధం కాక గుచ్చి గుచ్చి చూస్తున్నవాళ్ళతో ” మేం బ్రాహ్మలం అండీ ”  అనేసరికి మాంగారు “అచ్చొచ్చో….”అని నొచ్చుకుని , గిన్నెలన్నీ మూతలు తీసి చూస్తే ఒక్కదాంట్లోనూ ఎమ్మారావు గారు గుర్తుపట్టి తినగల  పదార్ధమొక్కటీ కనపడక పోయేసరికి , కంగారు పడిపోయి  “మీ పేరు చూసి పొరపాటుపడ్డాను చూశారా…అహ ఏం అనుకోకండి .   నిమషంలో వంట చేయిస్తాను కాసేపు  ఇలా వచ్చి కూర్చోండి “అన్నారట. దానికి ఆ ఎమ్మారావుగారు ఇంకా కంగారుపడిపోయి ….”అయ్యయ్యో …ఇప్పుడవన్నీ ఏం వద్దండీ “ అనేసి   మా అత్తగారు ఆచారంకొద్దీ దూరంగా పెట్టిన అన్నం లో పెరుగు  కలుపుకొని భోజనం అయిందనిపించేరట.  బంతిలో కూర్చున్న మిగతా అతిధులు   ముందు బాగా కంగారుపడి, ఆనక కొంచెం మొహమాటపడి , చివరికి తిండిలో పడ్డారట సుబ్బరంగా .

“అంతటి ఎమ్మారావు బాబుగారు అలా అసంటా కూకొని, పెరుగన్నంలో పచ్చడి నంజుకు తింటంటే నా పేణం ఉసూరుమనేసింది అయ్యగారో “ అని కన్నప్ప  అదే పనిగా బాధ పడిపోయాడు.

” అదేవిట్రా క్రితం సారొచ్చినపుడు ఎంచక్కా తిన్నాడు కదా . ఇంతట్లోనే  బ్రాహ్మెడెలా అయిపోయాడు ” అని అత్తగారు ఆశ్చర్యపోయారు.

అప్పటికీ అనుమానం తీరక …..ఒరేయ్….వచ్చినాయనకి బట్టతలుందా . చూడ్డానికి హైబ్రీడ్ బొబ్బాసి చెట్టులా బరువుగా భూమికి జానెడున్నాడా  ? అనడిగారు. ఇంకా ఏదో గుర్తుచేసుకోటానికి ప్రయత్నిస్తూ ….

” అచ్చిచ్చీ…..మట్టలు చెక్కేసిన తాటిసెట్టులా నిటారుగా అంతపొడుగుంటేనీ ……పైగా గిరజాల జుట్టండీ ఆరికి అన్నాడు ”

గిరజాల జుట్టు బట్టతలవ్వడానికి చాన్సుంది కానీ…..అటు సూర్యుడు ఇటు పొడిచినా బట్టతలమీద గిరజాలు మొలవటం అసంభవం కదా అని అర్ధం చేసుకున్న అత్తగారు…..” అయితే వచ్చింది  వేరే ఎమ్మారావా అని సాలోచనగా అనుకుంటూ ….

” అసలెంత మంది ఎమ్మారావులుంటారే……?”   అన్నారు నన్ను పట్టి కుదుపుతూ .

అసలే ఆకలికి సగం మతి పోయున్నానేమో ……ఒక వెర్రినవ్వునవ్వి సినిమాల్లో రామారావు నాగీస్ రావు లాగా   ఒక్కడే ఎమ్మారావు ఉంటాడనుకున్నారా ! ఎంతమందుంటారో సరిగ్గా లెక్క తెలీదు కానీ మొత్తానికి   ఎక్కువే వుంటారు … ఉన్నవాళ్ళు కుదురుగా ఉండకుండా అక్కడోళ్ళు ఇక్కడికీ ఇక్కడోళ్ళు అక్కడికీ మారుతుంటారు . అంటూ వెర్రి సమాధానం చెప్పేసాను .( అది ఆకలివేళ కాకపోతే ప్రభుత్వ శాఖలు  పరిపాలనా తీరుతెన్నులు వంటి మరిన్ని విషయాలు విశదీకరించేదాన్ని )

” ఏడ్చినట్టుంది . అంతమందిని పెట్టుకోటం ఎందుకూ ,అటూ ఇటూ  అలా పరుగులెత్తిచ్చడం ఎందుకూ  బుద్ధి  లేని గవర్మెంటు ” అనేసారు అత్తగారు .

” బాగాచెప్పారు …అయినా మావయ్య ముందే కనుక్కోవలిసింది కదా ” అని అనుకోకుండా అమోఘమయిన పాయింటందించేసాను  అత్తగారికి.

ఆ పాయింటుమీద జువ్వలా లేచిన అత్తగారు  ” అదీ….చూసావా  మీ మావయ్య నిర్వాకం .  అంతా  పుల్లయ్య యవ్వారం. బొత్తిగా వ్యవహారం తెలీని మనిషి అంటూ  నిప్పులు కక్కుతుంటే……    మొహం జేవురించుకుని       మాకేసి వస్తూ తూర్పు గుమ్మం దాటబోయిన మాంగారు ”  సడెన్ బ్రేకేసినట్టూ  అక్కడే ఆగిపోయి ” ఆ …ఆ….వస్తున్నా ” అని ఎవరో పిలుస్తున్నట్టూ పంచె సర్దుకుంటూ వేగంగా వెనక్కిమళ్ళేసేరు .

” ఏటండయ్యగారూ….ఆకురున కుంత పప్పుసారన్నా  కాసేరుగాదు ” అని  పెద్ద ఆరిందాలా అనేసాడు అప్పడు మా అత్తగారికేసి చూస్తూ ….( నన్నే అనాట్టా ….ఏమో?)

ఒళ్ళు చీరేస్తాను గాడిదా. వెధవ సన్నాసి సలహా ఒకటి పడేసి, ఇప్పుడేమో తప్పంతా మా మీదికి తోసేస్తావా అని ఒక్క టెంకి జెల్ల కొట్టాలనిపించింది నాకు.

“అందరూ సుబ్బరంగా తిన్నారు ఆ బాబొక్కడే అర్ధాకలితో చెయ్యి కడుక్కున్నారు “ అని తువ్వాలు నోట్లో కుక్కుకుని అదే పనిగా బాధ పడిపోతున్న భక్త కన్నప్పడిని ఓదారుస్తూ  “ సర్లేరా అయిందేదో అయింది ఎవరికెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది . ఇలా జరగాలని రాసుంది.   …  తప్పించడం మన వశమా అని ,  ఆకేసి అన్నం పెట్టేరు అత్తగారు.  వాడు “ఇలా జరిగిపోయిందేటీ”  అని ముద్ద ముద్దకీ బాధపడుతూనే వున్నాడు  . ముద్ద  గొంతు కడ్డం పడి పొలమారిన ప్రతిసారీ మా అత్తగారు కొంచెం కొంచెంగా  గీతా మకరందం దానితో పాటూ  కాస్త కర్మ సిద్ధాంతం లాంటిదేదో  వడ్డిస్తూ వచ్చారు.

మొత్తానికి ఆద్యంతం బాధపడుతూనే  అప్పడు సుష్టుగా భోంచేసి ,మకాంలో ఉన్న  వాళ్ళావిడకీ, అమ్మకీ కూడా కేరేజీలు సర్దుకుని  ” ఇలా జరిగిందేటండీ అయ్యగారూ ” అని  తీవ్రంగా బాధ పడిపోతూ వెళ్ళిపోయాడు .

“హమ్మయ్యా…అందరి భోజనాలు అయిపోయినట్టేకదా .   రండి  మనంకూడా  మనకి ప్రాప్తమున్న పలావు మెతుకులు తినేసి త్వరగా బజ్జుందాం “ అని నేను అత్తగారిని కంగారు పెడుతుంటే ఆవిడ ,  తెల్లారితే శుక్రవారం వంటింట్లో అంటు ఉండటానికి వీల్లేదు  అన్నీ కడుక్కున్నాకే పడుకోటం అంటుంటే ……ఇంకేం చెప్పను హతవిధీ నా పై ప్రాణాలు పైకే పోయాయి

ముక్తాయింపు –  తాలింపు  :)

ఏది ఏవైనా  పతివ్రతా ధర్మాలంటూ కొన్ని ఉన్నాయికదా . ఒకటీ రెండూ పాటించాం కదా అని మూడూ నాలుగూ  అశ్రద్ధ  చేసి  ‘ సపతివ్రత ‘ అనిపించుకోటం  దేనికీ అనిచెప్పి,  విష్ణుమూర్తిలా ఒక పక్కకి తిరిగి హాయిగా నిద్రపోతున్న శ్రీవారి పాద పద్మములను చిన్నగా గిల్లి……కిటికీ దగ్గర చేరి పాత సినిమా హీరోయిన్లా ఒంటికాలిమీద వయ్యారంగా ఊగుతూ ”  రావోయి చందమామా…..  ” అని మంద్రస్థాయిలో  మొదలుపెట్టేసరికి   మబ్బులమాటునున్న  చంద్రుడు , మంచం మీదనున్న చంద్రుడు ఒకేసారి నాముందు ప్రత్యక్షమయ్యారు.

“చంద్రుడు వెండి కంచంలా లేడూ”  అన్నారు   ఆకాశంలోకి చూస్తూ.

నేను “ఊహు…” అని తల అడ్డంగా ఊపేను.

“పోనీ… వెన్నముద్దలా  ఉన్నాడా”అన్నారు.

నేను వూహుహు…అని తల అడ్డడ్డంగా ఊపేను.

పోనీ నువ్వే చెప్పవోయ్ అన్నారు  గారంగా.

నేను రెప్పవాల్చక చందమామని చూస్తూ,” మధ్యలో ఆ మసేవిటండీ మాడిపోయిన అన్నం తెపాళాలా  చిరాగ్గా . ఏవండీ ఓసారి చందమామను కిందికి దించండి సుబ్బరంగా తోమి బోర్లించేస్తాను “ అని  చూద్దునుకదా మబ్బు మాటున ఆ చందమామ , ముసుగు చాటున నా చందమామ భయం భయంగా నన్నే చూస్తూ ….

అయ్యో… ఏవయిందండీ …..ఎందుకలా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు.

“రసికరాజ తగువారము కామా ….ఆఅ.ఆ..అ.ఆ.ఆఆ…………..….” అంటూ కిచకిచలాడేను వసంతకోకిల సినిమాలో శ్రీదేవిని తల్చుకుని .

సీమాంధ్ర కత్తికి ఇంకెన్నాళ్లు ధారపడదాం ?

sangisetti- bharath bhushan photo

సీమాంధ్ర కవులు అభ్యుదయం, ప్రగతి, విప్లవం, వామపక్షం, ఇంకా పైకి కనపడని అనేక రూపాల్లో, హిడెన్‌ ఎజెండాలతో తెలంగాణపై తమ ఆధిపత్యాన్ని ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. ఇలా చలామణిలో పెట్టిన భావజాలం కారణంగానే నేటికీ తెలంగాణ సాహిత్యకారులు తమకు జరిగిన అన్యాయాన్ని, అభ్యుదయం ముసుగులో నొక్కేసిన/ నొక్కేస్తున్న సొంత గొంతుని పసిగట్టలేక పోతున్నారు. గొంతుని నొక్కుతున్నవారినే ఇంకా ఆరాధిస్తున్నారు. అందలాలెక్కిస్తున్నారు. తమ ఆత్మగౌరవాన్ని భంగ పరిచిన వారినే బానిస మనస్తత్వంతో భళిరా అని పొగుడుతున్నారు.1956 నుంచీ వారి మెప్పుకోసం, ఆమోద ముద్రకోసం తహతహలాడుతున్న తెలంగాణవాదులు చాలామందే ఉన్నారు. వీరంతా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమిది. సాయుధ పోరాట కాలంలో ఏమి వ్రాయని శ్రీ.శ్రీ 1969లో మాత్రం ‘విడిపోవడమంటే చెడిపోవడం’ అని శాపనార్థాలు పెట్టిండు. అయినా శ్రీశ్రీని ఆరాధించే వీర తెలంగాణవాదులకు కొదువలేదు. ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పీడితుల పక్షాన గాకుండా దోపిడి పాలక వర్గాల పక్షాన నిలబడ్డ శ్రీశ్రీది ముమ్మాటికీ అభ్యుదయం ముసుగులో ఆధిపత్యమే! ఇట్లాంటి వారు చరిత్రలో ఇంకా చాలా మంది ఉన్నారు.

ఆస్థానాల శృంఖలాలు తెంపుకొని ఆవిర్భవించిన అభ్యుదయ కవిత్వం ఆచరణలో మాత్రం సీమాంధ్ర ఆధిపత్యాన్నే కొనసాగించింది. ఒకవైపు ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే తమ దబాయింపుని చలాయిస్తూనే తెలంగాణలో తమకు ఆమోదనీయతను సాధించుకున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తూ కూడా జేజేలు అందుకోవడం వీరికి మాత్రమే సాధ్యమయింది. పీడితుల పక్షాన నిలబడాల్సిన వారు అందుకు విరుద్ధంగా గుడ్డిగా పెట్టుబడిదారులు, దోపిడిదార్లతో అంటకాగుతూ అభ్యుదయవాదుల ముసుగులో అభినందనలు అందుకున్నారు. తాము తెలంగాణలో అడుగుపెట్టడానికి అనుకూలంగా ఉన్న సాయుధపోరాటాన్ని సమర్ధిస్తూ కవిత్వమల్లిన కవులు, అదే 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మీద దుమ్మెత్తి పోసిండ్రు. ఇట్లా ద్వంద్వ వైఖరులతో, విరోధబాసతో, పీడితులకు కాకుండా తమకు మాత్రమే మేలు జరిగే విధంగా తెలంగాణ కవులపై ‘థాట్‌పోలిసింగ్‌’కు దిగిండ్రు. ప్రస్తుత ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో గత చరిత్రను పునరావలోకనం చేసుకోవాలి. సీమాంధ్ర అభ్యుదయ వాదులు చారిత్రక క్రమంలో ఎలా వ్యవహరించారు. నిర్ణాయక సమయంలో ఎటువైపు మొగ్గారో నిగ్గు తేల్చాల్సిన సందర్భమిది. గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్‌ తెలంగాణ సాధనకు మార్గాలు వేసుకోవాల్సిన చారిత్రక తరుణమిది. ఈ అభ్యుదయవాద కవిత్వం చారిత్రక క్రమంలో నిజంగా అభ్యుదయవాదం పక్షాన్నే నిలబడిరదా? లేదా అభ్యుదయం ముసుగులో వామపక్ష భావజాలం పేరుమీద ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నారా? పీడిత, తాడిత ప్రజల పక్షాన నిలబడి ఉన్నారా? అని నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో జవాబులు దొరికే వరకూ పదే పదే వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఎవరెవరు? యే యే ముసుగులేసుకొని తెలంగాణను అడ్డుకున్నారో తెలుసుకున్నట్లయితే ఆ ప్రమాదాల నుంచి బయటపడడానికి మార్గాలేర్పడతాయి. ఆ దారి వెతుక్కునేందుకు ఇదో చిన్న ప్రయత్నం.
1990వ దశకం ఆరంభంలో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమం నేడు ఉచ్ఛదశలో ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్ప దేనికీ అంగీకరించేది లేదని తెగేసి తెలంగాణ సమాజం చెబుతుంది. ఇదే విషయాన్ని తెలంగాణ కవులు తమ రచనల ద్వారా తేటతెల్లం జేసిండ్రు. పొక్కిలి, మత్తడి, 1969`73 తెలంగాణ ఉద్యమ కవిత్వం, జాగో జగావో, ఊపిరి, దిమ్మిస, క్విట్‌ తెలంగాణ, మునుం, జిగర్‌ ఇలా వందల సంఖ్యలో వెలువడ్డ తెలంగాణ ఉద్యమ సంకలనాలు, అంతకు పదింతలు ఎక్కువగా ప్రతి జిల్లా నుంచి తెలంగాణ కవితా సంపుటాలు, వేల సంఖ్యలో పాటలు గత దశాబ్ద కాలంగా వెలువడుతూ వచ్చాయి. తెలంగాణ పేరు లేకుండా ఈనాడు ఏ సాహిత్య పత్రిక, సాహిత్యపేజీ అచ్చుకావడానికి వీలులేని పరిస్థితి ఉద్యమం కల్పించింది. వీటికి జోడిరపుగా, ఉద్యమానికి సంఫీుభావంగా సీమాంధ్ర కవులు ‘కావడి కుండలు’ వెలువరించారు. ప్రత్యేక తెలంగాణ న్యాయమైన, ప్రజాస్వామికమైన డిమాండ్‌ కావడంతో న్యాయం పక్షాన నిలబడుతూ, అన్యాయాన్ని ఎదిరించే ప్రతి ఒక్కరూ ఇందుకు మద్దతుగా నిలిచారు. కవిత్వంలో ప్రజల కష్టసుఖాలు ప్రతిఫలిస్తాయి. కవిత్వం భవిష్యత్తరాలకు చరిత్రను చెబుతాయి.
సమాజపు హృదయ స్పందనను రికార్డు చేస్తాయి. అయితే ఈ రికార్డు చేయడంలో ‘ప్రఖ్యాత’ ఆంధ్ర కవులు 1969 నుంచీ పక్షపాతంతోనే వ్యవహరించారు. ఉద్యమ ఉధృతిని పూర్తిగా విస్మరించారు. నిజానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఎంత న్యాయమైన డిమాండో 2009లోనూ ఈనాడు కూడా అంతే న్యాయమైన డిమాండ్‌. సాయుధ పోరాట సమయంలో ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వేచ్ఛకోసం, దోపిడి, పీడనలపై తమ కలాన్ని రaులిపించారు. తర్వాతి కాలములో ఈ కవులే తెలంగాణ వందకు వంద శాతం న్యాయమైన, ప్రజాస్వామిక ఉద్యమం అయినప్పటికీ రెండు చేతులా దుమ్మెత్తి పోసిండ్రు. దునుమాడిరడ్రు. ద్వంద్వ వైఖరి అవలంభించే  ఇలాంటి వారిని ‘స్పేర్‌’ చేసినట్లయితే భవిష్యత్‌ తెలంగాణ నేటి ఉద్యమకారుల్ని ఎంతమాత్రం క్షమించబోదు. అయితే ఈ మలిదశ ఉద్యమంలో సీమాంధ్ర బహుజన కవులు తెలంగాణ ఉద్యమానికి సంఫీుభావంగా ‘కావడి కుండలు’ తీసుకొచ్చిండ్రు. అయినా కూడా ఇప్పటికీ కొంత మంది సీమాంధ్ర కవులు మౌనంగానే ఉన్నరు. మౌనం కోర్టు భాషలో అర్ధాంగీకారం కాగలదేమో కాని సాహిత్య భాషలో వ్యతిరేకమన్నట్లే. బహిరంగంగా వ్యతిరేకించే వారితో ఎలాంటి పేచీలేదు. వారు ప్రజాస్వామిక డిమాండ్‌కు వ్యతిరేకమని తేల్చి చెప్పవచ్చు. అయితే ఎటూ తేల్చి చెప్పకుండా నంగి నంగి మాటలతో నాన్చుడు ధోరణితో సందర్భానుసారంగా వైఖరిని మార్చుకుంటూ ప్రజల ఆకాంక్షలపై పూర్తి గౌరవాన్ని ప్రకటిస్తూ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారితో నేడు తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాలి.
అభ్యుదయం మాటున ఆంధ్రాధిపత్యం!
1969లో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా శ్రీరంగం శ్రీనివాసరావు, ఆరుద్ర, కె.వి.రమణారెడ్డి, కె. శివారెడ్డి, జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇంకా అనేక మంది ఆంధ్ర కవులు కవిత్వాన్ని రాసిండ్రు. ఒక వైపు విప్లవ రచయితల సంఘం సూత్రప్రాయంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్ధతు నిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదిస్తే దానికి అధ్యక్షుడిగా ఉన్న శ్రీ.శ్రీ అందుకు వ్యతిరేకిస్తూ ఉద్యమానికి మద్ధతు ఇస్తే తాను రాజీనామాను ప్రకటిస్తానని హెచ్చరించాడు. సంఘాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసిండు. ఇదే శ్రీశ్రీ మరో వైపు అంతకుముందు ఆంధ్రరాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ తెలుగుతల్లి పేరిట కవితలల్లిండు. అంధ్రులు యేయే కారణాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్‌ చేసిండ్రో అవే కారణాలతో 1956 నుంచి ఈనాటి వరకూ తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీశ్రీకి ఆంధ్ర రాష్ట్రం న్యాయమైన డిమాండ్‌, తెలంగాణ ‘వేర్పాటువాదం’. ఇక్కడే ఆయన ద్వంద్వ నీతి తెలుస్తుంది. తెలంగాణ డిమాండ్‌ని వ్యతిరేకిస్తూ 1969లో శ్రీ.శ్రీ. ఇలా రాసిండు.
srisri
మర్కటాల కర్కటాల
సర్కస్‌ ఫీట్ల, పందెపు
కుక్కుటాల పోట్లాటలు
…..
విచిత్రమేమంటే మన
విశాలాంధ్ర గృహమందే
వేరు వేరు వంట గదులు
కోరి పోరు ధోరణులు
తిరుగుబాటు పేరిట ది
మ్మరులు చేయు హంగామా
చీలిక వాదుల సంఘపు
సెక్రటరీ చిరునామా
(సామ్యవాది మానిఫెస్టో)
విడిపోవడం అంటే చెడిపోవడం అని
వీళ్ళకెలా నచ్చచెప్పడం
చించడం సులభమే కాని అతికించడమే కష్టం
నిర్మూలనం కంటే నిర్మాణమే నయం
అలనాడు దేశాన్ని మూడుముక్కలు చేస్తూంటే
చూస్తూ ఉరుకున్నాడు గాంధీజీ
కొయ్యనీ, శస్త్ర వైద్యం చెయ్యనీ అని సలహా
యిచ్చాడు వియ్యంకుడు
డబ్బు సంచుల్తో అమ్మని కొనలేరు
అభిమానాన్ని కొనలేరు
ఆత్మల్ని కొనలేరు
పాపం అమాయకుడు తెలుగువాడు
మద్రాసు నుంచి పొమ్మంటే కర్నూలుకి వెళ్ళాడు
కర్నూలు కాదనుకొని హైద్రాబాదు కొచ్చాడు
ఇక్కణ్ణుంచి పొమ్మనడం ఏ భాషలోనూ సాధ్యంకాదు’ అన్నాడు.
నిజానికి పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందేవరకు మద్రాసు నుంచి పొమ్మని ఏ తమిళుడు కోరలేదు. అక్కడ కూడా వీళ్లు అత్యాశకు పోయి మద్రాసు నగరం కావాలని అప్పటి ముఖ్యమంత్రి రాజాజి  చేత ‘క్విట్‌ ద డాగ్స్‌’ అని తిట్టించుకొని కర్నూలు చేరారు. కావాలనే పొట్టి శ్రీరాముల్ని పొట్టన బెట్టుకున్నరు. మరుగు దొడ్లు లేని ప్రాంతానికి గవర్నర్‌ రావటానికి నిరాకరించడంతో తెలంగాణాపై వీళ్ల కళ్లు పడ్డాయి. అప్పటికే అన్ని హంగులతో మిగులు బడ్జెట్‌తో ఉన్న హైదరాబాద్‌లో తిష్ట వేయడం కోసం కుతంత్రాలు చేసారు. ఇది చేసింది ‘ఏదో అమాయకమైన తెలుగువాడు’ కాదు. అప్పటికే బ్రిటిష్‌ పాలనలో ఉన్న వీళ్లు, విభజించు పాలించు పద్ధతినవలంభించారు. రాష్ట్రావతరణ నాడే ఉపముఖ్యమంత్రి ‘ఆరోవేలు’ అంటూ  ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచిండ్రు. మోసం, వంచనతో తెలంగాణను నిలువుదోపిడి చేసిండ్రు. ఇప్పడా వంచన పరకాల ప్రభాకర్‌ ‘నూటొక్క అబద్దాల’ ‘టక్కరి’ ఆంధ్రుడిగా రూపాంతరం చెందింది. ప్రత్యేకాంధ్ర మేధావి రూపంలో తెలంగాణపై విషంగక్కే చలసాని శ్రీనివాస్‌ రూపంలో టీవీల్లో చర్చలు చేస్తోంది. ఒక వైపు హైదరాబాద్‌ని దోపిడి చేసి ఉన్నకాడికి స్వాహా చేసి తామేదో త్యాగం చేసినట్టు ఫోజు పెట్టడమంటేనే వలసవాదుల దురహంకారపు ఆధిపత్యం అర్థమవుతుంది. ఉన్న జుట్టంతా ఊడబీకి ఫ్రీగా ‘గుండు చేస్తే’ ఎందుకేడుస్తవ్‌ అన్నట్టుగుంది ఆంధ్రకవుల దబాయింపు.
…..
ఐకమత్యంగా ఉంటే
యావద్భారతంలోనూ రాణించగలం
పిండికేతిగాళ్ళ తోలుబొమ్మలాటలు కట్టించగలం
కామ రాజకీయాలకు విడాకు లిప్పించగలం
    (జన్మ దినోత్సవం)
శ్రీశ్రీ ఉద్యమకారుల్ని పిండికేతిగాళ్ళతోటి పోల్చిండు. ఉద్యమాన్ని కామ రాజకీయాలని తూలనాడిరడు. కర్నూలు కాదనుకొని హైద్రాబాద్‌ కొచ్చినామని అంగలార్చిండు. అసలు వాళ్ళని రమ్మని బతిలాడిరదెవరు? ఆనాడే భార్గవ కమిటీ, లలిత్‌ కమిటీలు లెక్కగట్టి మరీ తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కోట్ల రూపాయల సొమ్ముని సీమాంధ్రలో ఖర్చు పెట్టారని తేల్చి చెప్పిండ్రు. తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలని ప్రాంతేతరులు దోచుకు పోయారని లెక్కలేసి మరీ తేల్చిండ్రు. ఇంత అన్యాయం జరిగినా ఆయన తెలంగాణ ప్రజల ఆకాంక్షల వైపు గాకుండా దోపిడిదారుల, పీడకుల పక్షాన నిలబడిరడు. శ్రీశ్రీ వేసిన బాటలోనే సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో తెలంగాణను అనుబంధాలకు, ఉపశీర్షికలకు పరిమితం చేసిన ఆరుద్ర కూడా దోపిడిదారుల, పీడకుల తరపున వకాల్తా పుచ్చుకుండు.
Arudra
అన్న తమ్ముని యింట పగవాడా?
ఉన్న వూరును విడిచి పోవాలా?
కంట నెత్తుటి కణము కరుణ నోచని జనము
కాందీశీకుల బాట పట్టిందా?
స్వార్థ దేవత కచ్చ కట్టిందా
స్పర్ధానలము మిన్ను ముట్టిందా?
శ్రీలు పొంగిన గడ్డ పాలువారే గడ్డ
సిద్ధాన్నమే కుక్క ముట్టిందా?
రౌడీలకు సజ్జనులు జడవాలా?
రగడ చేస్తే అణిగి నడవాలా?
రక్షణే కరువాయె భక్షణే తిరమాయె
రాచరికమే కంపు గొట్టిందా?
ఒక్కతల్లికి మనము పుట్టాము
ఒక్క రక్తము పంచుకొన్నాము
ఒక్క దేహము నేడు ముక్కలుగునా మూడు
అక్కటా! శని మనకు పట్టిందా?
(అన్న తమ్ముని ఇంట పగవాడా?)
అన్న తమ్ముని ఇంట పగవాడా అని అమాయకంగా అడుగుతున్న ఆరుద్ర నాలుగువేల ఆరువందల మంది నాన్‌ముల్కీలు తెలంగాణలో పనిచేస్తున్నారని, న్యాయంగానైతే ఆ ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు దక్కాలని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశంలోనే చెప్పిండు. ఈ విషయాల్ని ఎక్కడ లెక్క చెప్పకుండా తెలంగాణ ఉద్యమాన్ని తప్పుబట్టిండు.  ఆరుద్రనే కాదు కె.వి.రమణారెడ్డి కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిరశిస్తూ కవిత్వాన్ని అల్లిండు. ‘జాతి వైర దుష్టజ్వాల’ అంటూ ఉద్యమాన్ని ఆడిపోసుకుండు. దీనికి మహబూబ్‌నగర్‌కు చెందిన ముకురాల రామారెడ్డి కవిత్వంలోనే అన్నన్నా రవణన్నా నీ ఆటలింక సాగవంటూ కవిత్వంలోనే జవాబిచ్చిండు.
‘‘..కుడిచేతిని ఎడమచేయి
పడగొట్టగ జూచినపుడు
కవి ప్రేక్షకుడై చూచే
కనికట్టు గారడీ గమ్మత్తు కాదిది
ఆ యింటివాని చేతులూ
ఈ యింటివాని చేతులూ
కలియబడుతున్న
‘జాతివైర దుష్టజ్వాల’ ఇది.
అవునా భువనఘోషనా ఇది.
అలనాడు సవరింపబడిన
‘తెలంగాణ కోటి రత్నాల వీణ’
తీగలను తెంపేసి
అతక నేర్చుకుంటున్నదా? నెరజాణ
‘‘వీర తెలంగాణానికి
వైరుల ఏకోదరులా?’’ అంటూ ముకురాల రామారెడ్డి జవాబిచ్చిండు.
ఇక ఫక్తు ఆరెస్సెస్‌ భావజాలం గల జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినట్లయితే అది దక్షిణ పాకిస్తాన్‌ అవుతుందని రాసిండు. తెలంగాణ ప్రజలు మాట్లాడేది ‘తౌరక్యాంధ్రమని’ ఎగతాళి చేసిండు.ఈ విషయాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారు రికార్డు కూడా చేసిండు. ‘‘ 1968`69లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు ఒక అనుభవం ఎదురైంది. ఆ రోజుల్లో జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒక గేయంలో , ఒక వేళ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే, అది దక్షిణ పాకిస్తానం అవుతుందని రాశాడు. అది అర్థం కాక నేను ఇంకో మిత్రుడు ఆయన దగ్గరికి వెళ్ళి ‘శాస్త్రి గారూ, మీ బాధేమిటని’ అడిగాము. దానికి ఆయన సమాధానమిస్తూ ప్రత్యేక తెలంగాణలో తెలుగంతా భ్రష్టుపట్టిపోయి, అది పూర్తిగా తౌరక్యాంధ్రం అవుతుందని అన్నాడు.’’ (సింగిడి` తెలంగాణ ముస్లిం ప్రత్యేక సంచిక, ఉర్దూ ఉసురు తీసిన ఆంద్రులు` జయశంకర్‌)
తెలుగుతల్లి, విశాలాంధ్ర పేరిట కవితలల్లిన పాపయ్యశాస్త్రి ఒక్కసారి కూడా న్యాయంగా ఆలోచించలేదు. కనీసం అవతలి పక్షంవారు ఏమడుగుతున్నారు? అని కూడా ప్రశ్నించుకోలేదు. ‘విజయీభవ’ పేరిట
‘పెద్ద తలలు గద్దెలకై
గుద్దులాడు కొంటున్నై
వద్దనవోయ్‌ స్వార్థబుద్ధి
కద్దనవోయ్‌ కార్య సిద్ధి’ అంటూ తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం గుద్దులాటగా వర్ణించిండు. బట్టకాల్చి మీదేసినట్లయితే అది ఆరిపేసుకునే పనిలోనే తెలంగాణ వాడుంటే ఈలోపు తమ దోపిడీని సులువు చేసుకోవచ్చనేది నాటికీ నేటికీ సీమాంధ్ర ఆధిపత్యవాదులు ఆచరిస్తున్న నీతి.
‘ తెలుగుతల్లి కన్నుల్లో
వెలుగుతుంది మన భాగ్యం
భాగ్యనగర వీధుల్లో
పండును మన సౌభాగ్యం’ అంటూ హైదరాబాద్‌లో సీమాంధ్రుల సంపదను ఆనాడే లెక్కేసిండు. విశాలాంధ్ర పేరిట
‘ఆ సీమని ఈ సీమని
ఆగం చేస్తారెందుకు
అంతా రాయలసీమే
అంతా మన తెలంగాణె’ అంటూ ప్రత్యేక తెలంగాణ వాదుల్ని జోకొట్టే ప్రయత్నం చేసిండు. ఆధిపత్య శక్తుల కొమ్ముకాసే వీరి పక్షపాత వైఖరి కారణంగా ఈనాడు తెలంగాణ ప్రజల్లో, మేధావుల్లో సీమాంధ్ర సాహితీవేత్తలు ఎంతటి ప్రతిభావంతులైనా వారి పట్ల గౌరవభావం ఏర్పడడంలేదు.
అలాగే అప్పటికి అంతగా పేరు పొందని చిన్నా చితక ఆంధ్ర కవులు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై దుమ్మెత్తి పోసిండ్రు. ఇందులో వక్కలంక లక్ష్మీపతిరావు ఇలా రాసిండు.
అన్నాదమ్ములు కలబడి దేశం
ఛిన్నా భిన్నం చేస్తారా?
పచ్చని యింటికి చిచ్చులు రగిల్చి
పరమానందము చూస్తారా?
అంటే అన్న ఎంత దోసుకుంటున్నా తమ్ముడు మాత్రం సడి సప్పుడు చెయ్యకుండా ఉంటే అది ఐకమత్యము. అన్యాయాన్ని నిలదిస్తే అది చిచ్చులాగా వారికి కనబడిరది. మరో కవి ఎం.కె. సుగమ్‌బాబు తెలంగాణ ఉద్యమాన్ని సంకుచితమని తేల్చిసిండు.
ఆంధ్ర యేమిటి?
తెలంగాణా యేమిటి?
కులమేమిటి?
మతమేమిటి?
భాషేమిటి?
మనిషి యింతగా యెదిగినా
సంకుచితంగా ప్రాంతమ్మేమిటి?
ఇది నాచేయి
ఇది నాకాలు అని
కన్నతల్లిని కోతపాలు చేసే మూర్ఖతేమిటి
కసాయితన మేమిటి?
ఇంకెలా నిలుస్తుంది దేశం
ఏమైపోతుంది మృతవీరుల త్యాగం, సందేశం’
న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన వాటా అడగడం ఆంద్రోళ్ళకు మూర్ఖత్వంగా, కసాయితనంగా కనిపించింది. ఇదే అంశాన్ని కొంచెం సున్నితంగా సంగిరెడ్డి వెంకటరంగారెడ్డి అనే కవి ఇలా చెప్పిండు.
ఒకే ఇంటివాళ్ళు
అన్నదమ్ములు
అన్నా తమ్ముడి పైసలు వాడుకున్నాడు
అన్న తమ్ముడికి అన్యాయం చేశాడు
తమ్ముడు కోపంతో కల్లెర్ర చేశాడు
తమ్ముడు అన్న చేసిన తప్పులను చూపాడు
తప్పులను సరిదిద్దుకొందాం అన్నాడు అన్నయ్య
తమ్ముడు సంతోషంతో ‘సరే’ అన్నాడు
అన్యాయం చేసినంతమాత్రాన విడిపోతామా అన్నాడు తమ్ముడు
కలతలున్నంత మాత్రాన బంధాన్ని తెంపుతామా అన్నాడు అన్నయ్య”తప్పులను సరిదిద్దుకోవాలని వెంకటరెడ్డి చెప్పిండ్రు.
ఈ తప్పులు సరిదిద్దుకోక పోగా అంతకు వేల రెట్లు అధికంగా చేసి వాటినే ఒప్పుల కుప్పలుగా చూపెట్టే ప్రయత్నం జేసిండ్రు సీమాంధ్ర పక్షపాత అధికారులు, వారికి వత్తాసుగా వలసాధిపత్య ప్రభుత్వం నిలిచింది. గిర్‌గ్లానీ కమిటీ ఎన్ని సార్లు నిబంధనలు ఉల్లంఘించారో తనకు ఇచ్చిన అరకొర సమాచారంతోనే లెక్కగట్టిండు. 1984 డిసెంబర్‌లో ఇచ్చిన 610 జీవో 29 యేండ్లయినా ఇంకా అమలుకు నోచుకోలేదంటే ఇంకెంత సహనం కావాలి. తరాలకు తరాలు ఓపిక పట్టాలంటే అయ్యే ముచ్చటేనా?
యూ టూ శివారెడ్డి!
హైదరాబాద్‌ని అమితంగా ప్రేమిస్తానంటూనే దానిపై అభ్యంతరకరమైన కవిత్వమల్లి తెలంగాణవాదుల మనోభావాల్ని గాయపరిచిన కవి శివారెడ్డి. తాను ఏ శిబిరంలో ఉన్నా అభ్యుదయవాదిగా ఆమోదముంటుంది. వీర తెలంగాణ వాదులకు సైతం ఆయన ఆరాధ్యనీయుడవుతాడు. ప్రస్తుత సందర్భంలో నర్మగర్భంగా తెలంగాణకు వ్యతిరేకంగా కవిత్వమల్లే ఈయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు వ్యతిరేకేసిస్తూ ఏకంగా ‘తెలుగు బావుటా’ (సమైక్యతా సూచికా గేయకావ్యం) పుస్తకాన్ని ప్రచురించాడు.
కుడి చేయి ఎడమ కంట్లో
వేలుబెట్టి పొడిచింది
ఎడమ చేయి కుడికంట్లో
జిల్లేడు పాలు కొట్టింది-
రెండు కళ్ళు
భోరున ఏడుస్తున్నాయి
ఈ దేహం ఒకటే
ఆ కళ్ళు, చేతులు
ఈ దేహానికి చెందినవే
సరిగ్గా ఇలానే వుంది
తెలుగు గడ్డ పరిస్థితి
….
మనుషుల మనసుల్లో
కీనీడల జాడల హెచ్చింది
మమత పెల్లుబికిన ఇంట్లో
మచ్చరం పెను త్రాచులా
బుసలు కొడుతుంది
నిన్నటి మిత్రులు
నేడు శత్రువులు
అన్నదమ్ములిరువురు
పందెంలో కోడి పుంజుల తీరు
ఈ స్వార్థం తిని బలిసిన
రాకాసి పురికొల్పిందిలా?
అర్థమేమున్నది ` ఆ వేటలో
నీది ఆంధ్ర, నాది తెలంగాణా
తెలంగాణాణా`ఆంద్ర
పర్యాయ పదాలు కావా!
నిన్న మొన్న పురుడు బోసుకున్న
తెలుగు తల్లి గుండెల్లో బల్లెపు పోటా!
సిగ్గు విడచి చెప్పులు జత పట్టుకున్నాయి కదూ’
. అంటూ ఆనాడు అందరం ఒక్కటిగా ఉండాలని పిలుపు నిచ్చాడు.
అయితే అప్పటికే హైదరాబాద్‌లో శివారెడ్డి ఉద్యోగం చేయడమంటేనే ఒక స్థానికుడి అవకాశం గల్లంతు కావడం. తెలంగాణ ఫ్యామిలీకి దక్కాల్సిన చదువులూ, స్థానిక రిజర్వేషన్లు ఇట్లా వచ్చిన అనేకమంది తెలంగాణ బిడ్డలకు దక్కకుండా చేసిండ్రు. అట్లా ఒక్క శివారెడ్డే కాదు అంతకు ముందు 1944 నుంచీ తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమం ఊపందుకున్నాక ఆంధ్ర ప్రాంతం వారి రాక పెరిగి పోయింది. అడివి బాపిరాజు, విద్వాన్‌ విశ్వం, కొడవటిగంటి కుటుంబరావు, తల్లావరa్జల శివశంకర శాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, కురుగంటి సీతారామభట్టాచార్య, పిల్లలమర్రి వేంకట హనుమంతరావు ఇలా అనేక మంది తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్‌ని కేంద్రంగా చేసుకొని ఉద్యోగాలు చేసుకున్నారు.  ఇదే విషయాన్ని”నల్లవలుస”లో “శిరసులు ఇలా చెప్పిండ్రు.
‘‘గురజాడ ‘ఒఖడే’
అడుగు జాడల్లో వలసవచ్చినవారు
వేయిన్నొఖడు
నయాదళారుల వలసే
మహా ప్రస్థానం
త్వమేవాహమ్‌
త్వమ్‌ శూన్యమ్‌ అహమ్‌ సర్వమ్‌
ఆర్యా` స్వాహా సర్వమ్‌
దళ నిర్మూళనమే
మరో` మహాప్రస్థానం?

ఉద్యమం మీద
తేలుతూ వచ్చావ్‌
ఆంధ్రప్రస్థ నిర్మాణంలో
మయుడివి కావు
మనిషిని వస్తువుగా,
మా భూమిని
ముక్కలుగా విక్రయించావ్‌
నీ గణాంకాల
గారడీలో
నేనొక్క
గుండుసున్నానిమ మాత్రమే!
ముల్కీ పత్రం
ఒక మురికి పత్రమే
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దాదాపు అందరు సీమాంధ్ర కవులు ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా వ్యవహరించినప్పటికీ వారిని అందలం ఎక్కించే ఉద్దేశ్యంతో సాయుధ పోరాట సాహిత్యాన్ని దానికి వారు అందించిన తోడ్పాటును అటు అభ్యుదయవాదులు, విప్లవవాదులు ప్రచారంలో పెడుతుంటారు. నిజానికి 1946`51 నాటి ‘సాయుధ పోరాటం’ గురించి చాలామంది రచనలు చేసిండ్రు.
అయితే శ్రీ.శ్రీ ఒక్క కవిత కూడా రాయక పోవడానికి కూడా కారణముంది. ఆరుద్ర ‘త్వమేవాహా’నికి ఆపేరు సూచించిన శ్రీ.శ్రీ స్వయంగా నిజాం ప్రభుత్వం కొలువులో ఉన్నాడు. ప్రభుత్వ కొలువులో ఉంటూ దానికి వ్యతిరేకంగా రాస్తే ఉద్యోగం ఊడుతుందనే ఉద్దేశ్యంతో ఒక్క కవిత కూడా రాయలేదు. అలాగే తిన్న ఉప్పుకు ద్రోహం తలపెట్టొద్దు అనే ఉద్దేశ్యంతోనో ఏమో ఆ తర్వాత కూడా ఏమీ రాయలేదు. ఒక వైపు తాము నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన పేద రైతులు, ఉద్యమకారులు సాయుధ పోరాటం చేస్తూ ఉన్నారు. రోజూ  పోలీసుల చేతిలో కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు చనిపోయారు. చనిపోయిన వారిలో రజాకార్లు కూడా ఉన్నారు. బండి యాదగిరి లాంటి పాటగాడు, రేణికుంట రామిరెడ్డి లాంటి యోధుడు, అనభేరి ప్రభాకర్‌ లాంటి పోరాట నాయకులు అనేక వందల మంది 1946`48 మధ్య కాలంలో ఉద్యమంలో తమ ప్రాణాలర్పించారు. అయితే శ్రీ.శ్రీ నిజాం ప్రభుత్వ పోలీసు శాఖలో పౌరసంబంధాల విభాగంలో ఉంటూ ప్రభుత్వ ఎన్‌కౌంటర్ల గురించి, ఉద్యమ కారుల మరణాల గురించీ ఆంగ్లంలో ఇచ్చే వివరణలను తెలుగులో తర్జుమా చేసేవాడు. ఎంత మనసు చంపుకున్నా బూటకపు ఎన్‌కౌంటర్లనీ తెలుస్తూనే ఉన్నా శ్రీ.శ్రీ వాటిని ఎదురుకాల్పులుగా మార్చి రాసే పనిలో ఉన్నాడనే విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఒక్క శ్రీ.శ్రీయే కాదు పైన పేర్కొన్న ఏ ఒక్క ఆంధ్రప్రాంత సాహితీ వేత్త ఆనాడు ప్రభుత్వ దమన కాండను నిలదీయలేదు.
 సాయుధ పోరాటంపై రాయకపోయినప్పటికీ ‘మహాప్రస్థానం’ పాడెను ఇప్పటికీ తెలంగాణ వాదులుమోస్తున్నారు. ఆరుద్ర తెలంగాణను చూడకుండానే ‘త్వమేవాహా’న్ని రాసిండు. కె.వి.ఆర్‌. భువనఘోష వినిపించిండు. అట్లాగే విరసం తరపున సాయుధపోరాట సాహిత్య చరిత్రను రికార్డు చేసిండు. తెలంగాణ మీద ఇంత ప్రేమ ఉన్న వీళ్ళు ప్రత్యేక తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి నిర్ద్వందంగా వ్యతిరేకించిండ్రు. తమ ఆంధ్రాధిపత్యాన్ని ప్రదర్శించారు. తాము చెప్పిందే న్యాయం, తాము రాసిందే వేదం అన్నట్టుగా వ్యవహరించిండ్రు.
1969లో ప్రత్యేక తెలంగాణ నినాదం ఉధృతంగా రావడంతో దాన్ని అధిగమించడానికి కమ్యూనిస్టు పార్టీలు, ఆ భావజాలం ఉన్న రచయితలు తిరిగి సాయుధ పోరాటాన్నే తెలంగాణపై ఆయుధంగా మలిచారు. సాయుధ పోరాటాన్ని తామే నడిపించామన్న తీరుతో ‘చరిత్ర’ రచనలు చేసిండ్రు. 1972 నాటికి ‘సాయుద పోరాట’ ఉద్యమానికి రజతోత్సవాలు జరిపి తమ అనుభవాల్ని అక్షరీకరించి ‘విశాలాంధ్ర’ కోసమే సాయుధ పోరాటం జరిగిందని తీర్పులిచ్చారు. సాయుధ ఉద్యమానికి 60 యేండ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పనిని ఇప్పటికీ సిపిఎం పార్టీ బాహాటంగా చేస్తూనే ఉంది. అందుకే ఆంధ్రప్రాంతం వారి రచనల్లో స్వప్రయోజనాలున్నాయి. హిడెన్‌ ఎజెండాలున్నాయి.
సీమాంద్ర ఆధిపత్య శక్తుల రహస్య ఎజెండాలను పసిగట్టి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతూ దోపిడిదార్లను నిలదీయడమే నేటి తెలంగాణ కవుల కర్తవ్యం. ఎవరు ఏ రూపంలో వచ్చినా ఎన్ని మోసపు మాటలు చెప్పినా కరిగి పోవొద్దు. ఎబికె ప్రసాద్‌ లాంటి వాళ్ళు తెలంగాణమే ఆంధ్రప్రదేశ్‌ అని చెబుతూ ఎన్ని దోబుచులాటలాడిన మొక్కవోని ధైర్యంతో ఎదుర్కోవాలి. కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ప్రయోజనాల్ని పణంగా బెట్టి స్వీయప్రయోజనాల్ని నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. మనల్ని నరికే “గొడ్డలి కామాలు కావొద్దని కోరుకుంటున్నా!
జర్నలిస్టులుగా, సాహిత్యకారులుగా, మేధావులుగా, విశ్లేషకులుగా, ప్రొఫెసర్‌లుగా, విద్యార్థి నాయకులుగా, రాజకీయ దళారులుగా, దోపిడీదార్లుగా, కబ్జాదార్లుగా, పెట్టుబడిదార్లుగా ఇలా అనేక రూపాల్లో తెలంగాణ ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తున్న వారిని ఎదుర్కోవాలి.
అనేక రూపాల్లో, వివిధ మార్గాల్లో తాము తెలంగాణ శ్రేయోభిలాషులం అని చెబుతూనే ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సాహిత్యకారుల గొంతును నొక్కేస్తూ కూడా వీళ్ళు గౌరవింపబడుతున్నారు. మీ కవిత్వంలో ఇమేజ్‌లు లేవు, మీ కథల్లో శిల్పం, శైలి లేదు, భాష ఇబ్బంది కరంగా ఉంది అంటూ తెలంగాణవాళ్ళను తొక్కేస్తున్నారు. ఈ ఆధిపత్యవాదులు వామపక్ష భావజాలం ముసుగులో ఎన్ని అడ్డంకులు కలిగించినా నిలదీయడానికి తెలంగాణ సాహిత్యసమాజం సిద్ధంగా లేదు. ఈ ఆధిపత్యాన్ని మౌనంగా అయినా సరే ఇంకా భరించినట్లయితే భవిష్యత్తెలంగాణ సమాజం క్షమించదు. అందుకే నిజంగా తెలంగాణకు మద్ధతిచ్చే వారెవరో, మద్ధతు ముసుగులో మనల్ని మంటగలిపేందుకు ప్రయత్నిస్తున్నదెవరో తెలుసుకొని మసులుకోవాలి. ప్రజాస్వామిక, న్యాయమైన ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసే కవులను మొహమాటాలు, భేషజాలను పక్కన బెట్టి సాహిత్య సమాజంలో దోషులుగా నిలబెట్టాలి. ఈ పని ఎంత తొందరగా చేస్తే తెలంగాణకు అంత మేలు జరుగుతుంది. వీరు గుర్తించ నిరాకరించిన, నిరాదరణ చేసిన తెలంగాణ సాహితీ ప్రతిభ గుర్తింపుకు ఇది పునాది అవుతుంది.
–సంగిశెట్టి శ్రీనివాస్

 

అంత నిజాన్నీ ఇవ్వకు

swatikumari

 నేనడిగే ప్రశ్నలన్నిటినీ వినకు. అనుమానాల వంకతో బుకాయించే వీల్లేకుండా చేసే సమాధానాలు నీకు తెలిసినా చెప్పకు. ’నేనంటే నీకు అయిష్టం కదా? లోకంతో మననిలా కట్టిపడిసేది ఇంకా మిగిలున్న మన పాత్రల నటన మాత్రమే కదా?’  అని మాట తూలిన ఆ ఉన్మాద సమయాల్లో; ఇన్ని యుగాల బట్టీ ఎవరెవరో ఎవరెవర్నో అడక్కుండానే వదిలేసి వెళ్ళిపోయిన ప్రశ్నలన్నిట్నీ, ఒకవేళ అడిగానే అనుకో! విననట్టు ఉండిపో, ’అవున’ని నీకు ఎంత నిక్కచ్చిగా తెలిసినా సరే చెప్పావంటే నామీద ఒట్టే!

అవును భయమే, అడక్కముందే అన్ని నిజాల్నీ ఇచ్చేసేవాళ్లంటే! కాస్త వెలుతురు కావాలంటే ఆకాశాన్ని ఉదారంగా మన దోసిట్లోకి విసిరేసేవాళ్లంటే. అందుకే కాబోలు “నేను పక్షి కోసం ఎదురు చూస్తున్న పంజరాన్ని” అన్న కాఫ్కా గొంతుక వినబడుతూనే ’నాకిదంతా ఇవ్వొద్ద’నే పెనుగులాట త్రిపుర కవిత్వంలో మెలితిరిగింది. “అతను మిగతా అందరివాళ్లలాగే ఉంటాడు/కాకపోతే అతని కళ్ళు ఒక రకంగా చూస్తుంటాయ్/అంతకంటే మరేం లేదు.” అని సర్ది చెప్పుకోడానికి చేసిన ప్రయత్నంలా ఉంటాయి త్రిపుర కాఫ్కా కవితలు. “నీకో నిర్ణీతమైన వస్తువు కావాలనుకుంటే నువ్వో ఖచ్చితమైన మనిషివవ్వాలి. నువ్వా మనిషిగా తయారయ్యాక  నీకా వస్తువెలానూ అవసరం ఉండదు.” అన్న జెన్ తాత్వికతలోని శున్యార్ధపు నిశ్శబ్ధమూ; ఆలోచిస్తుండటమూ, ఆలోచిస్తున్నట్టూ నటించడమూ ఒకటేననే కవి ఆరితేరినతనమూ ఉన్న కవితొకటి ఇక్కడ;

ఓ కాఫ్కా బర్నింగ్ థీం

 

పళ్లమధ్య ఓ సిగరెట్టుంచుకుని

ఓ మోస్తరుగా అలసిన నీ మనస్సు తలుపుల్ని అరమూసి

నాలుగు గోడల్నీ ఓసారి ఖాళీ కళ్లతో చూసి

నీ దహన సంస్కారాన్ని ఇప్పుడు జాగ్రత్తగా చూస్తున్నావ్

 

చుట్టూ లోపలా చేరిన తొక్కూ తొటారం అంతటికీ

నిప్పంటించి మంటపెట్టి

ఖాళీ గదిలో వున్న నువ్వు

ఒక విసుగు అంచు నవ్వు సగం నవ్వి

ఏకాంతపు కారణం స్పష్టంగా తెలియని నిరాశని

ఒక పొగ వలయంగా గాలిలోకి వదిలేశావ్

 

ఆ మంటలో కాలుతూ అంతా నువ్వే

పొగలోంచి సగం మాడిన ఎగిరే కాగితపు ముక్కల్లాగా

నీ అస్థిరత్వపు తునకల్లాగా

ఓ సీతాకోక చిలుక హఠాత్ చపలత్వపు ఎగురుళ్ళులా

 

కాని నువ్వు వాటికి నిజంగా నువ్వు కాని లాగా

నువ్వు అందరికీనూ ఎవరికేనానూ అనేలాగా

 

చచ్చిపోయిన కాఫ్కా అద్దెగది లోని

యిటుకల్ని వీధిలోకి

ఒకటీ ఒకటీ విసిరి

వేలం వేసి అమ్మినట్లుగా

అంతా అస్థిరంగా ఖాళీగా వేడిగా

దిశలేని ఎగురుడుగా

ఒక మంటగా.

—–**——

tripura

వ్యాఖ్యానం

శ్రద్ధగా చదువుతున్న పుస్తకాన్ని అకారణంగా పక్కన పెట్టేసి అన్నాళ్ళూ కుర్చీలకి పట్టిన దుమ్మునంతా దులిపేసి, అద్దాలమీది మరకలు తుడిచేశాక ఇక పుస్తకమూ, ఆలోచనా అనవసరం అనిపించే సందర్భాలుంటాయి. ఇక చెయ్యవలసింది దులపడమూ, శుభ్రం చెయ్యడమూ, సిద్ధం చేసుకోవడమూ తప్ప చదవడానికేం లేదని అప్పటికప్పుడే తేలిపోయే సమయాలొస్తాయి. అప్పుడు మనసు తలుపుల్ని సగం తెరిచేసరికి ముంచుకొచ్చిన అలసటో, మిగతా సగాన్ని తెరవనియ్యకుండా ఆజన్మాంతమూ పడ్డ అవస్థో తేలకుండానే, అప్పటిదాకా ఉంటున్న దేహపుగదిలోని “నాలుగు గోడల్నీ ఓసారి ఖాళీ కళ్లతో చూసి” ఒక నిష్క్రమణకు సన్నాహం మొదలౌతుంది.

కూడబెట్టటమూ, పోగుచెయ్యడమూ తలచుకుని అప్పటిదాకా గర్వంతో నవ్వుకున్న నవ్వు కాస్తా విసుగు స్వరంలో అంతమౌతుంది. తెలుసుకున్నవీ, నేర్చుకున్నట్టు నటించినవీ అన్నీ పేరుకుపోయి అస్తిత్వ రాహిత్యాన్ని దాదాపు అసాధ్యం చేస్తుంటాయి. తేలిగ్గా నవ్వుతూ, నడుస్తూ ఖాళీ చేతులూపుకుంటూ వెళ్ళిపోవాలంటే ఇన్నాళ్ళూ అవిరామంగా మేట వేసుకున్నదాన్నంతా, వెలుగుతున్న సిగరెట్టు మొనతో నిర్మోహంగా అంటించేసి “ఏకాంతపు కారణం స్పష్టంగా తెలియని నిరాశని/ఒక పొగ వలయంగా గాలిలోకి”  వదిలేయక తప్పదప్పుడు.

నిలకడలేనిదీ, నిలవలేనిదీ అంతా కరిగిపోయాక, బరువులేనివన్నీ గాలివాటున తేలిపోయాక, ఉలిపిరి కాగితాల్ని ఊదారంగు మంట మసిచేసి వదిలాక మిగిలిపోయే అక్షరాలు, ఊహలు ఎవెర్నుండి ఎవరిపైకో “ఓ సీతాకోక చిలుక హఠాత్ చపలత్వపు ఎగురుళ్ళులా” వెళ్ళి వాలిపోతాయి. ఆ ముగిసిపోయిన అస్థిరత్వం ముక్కలుగా, నీలోపల గతించిన  నీలాటి మరికొందరుగా, మరికొందరిలో ఇంకా మిగిలిపోయిన నీ ఆనవాళ్ళుగా, నువ్వొకప్పుడు ఉండి వదిలిపోయిన మరకగా, ఎప్పటికీ లోకంనుండి తుడిచెయ్యలేని చరిత్ర గుర్తుగా మిగలక తప్పదు.

వీలునామాల్లో చేరని విలువలేని వస్తువులు, ప్రచురించడానికి ఇష్టపడని డైరీలూ మాత్రమే వదిలేసి, మౌనంగా రాసుకోవడం తప్ప మరేం చేతగానితనానికి క్షమాపణలు కూడా చెప్పకుండా, నిర్లక్ష్యంగా తెల్లవారు ఝాము నిద్రలోంచి నడుచుకుంటూ నిశ్శబ్ధంగా వెళ్ళిపోతాడు రచయిత. రేపటి తరాల్లో ఎవరికో ఇతను వదిలెళ్ళిన తలరాతలు ఆ ఖాళీ గదిలో అదృశ్యంగా “దిశలేని ఎగురుడుగా/ఒక మంటగా” కదులుతుంటాయి.

——*—–

 

చిత్రం: అన్వర్

‘జ్ఞాపకాలే మైమరుపు’

  హైదరాబాద్ లామకాన్ లో శుక్రవారం సాయంత్రం   ముళ్ళపూడి వెంకట రమణ 82 వ పుట్టిన రోజు Kinige , కథ గ్రూప్ ల సంయుక్త నిర్వహణలో జరుగుతోంది. ఈ సందర్భంగా రమణగారి స్మరణ వ్యాసాలు ఈ వారం ప్రత్యేకం . 

ఎవరైనా శాస్త్రీయ సంగీతంలో కృషి చేస్తూ వుంటే, బాలమురళి కృష్ణలాగా పాడాలనుకుంటారు. దాదాపు ప్రతి కార్టూనిస్టు బాపూగారిలా బొమ్మలు వేద్దామనుకుంటాడు. క్రికెట్ ఆడే ప్రతి కుర్రాడూ తను కూడా తెండూల్కర్ లాగా అడాలనుకుంటాడు. అదేరకంగా కథలు వ్రాసే నాబోటి వాళ్ళు రమణగారిలా వ్రాయలనుకుంటారు. ముఖ్యంగా హాస్య కథలు వ్రాసేవాళ్ళు. కనీసం ఒక్క కథయినా ఆయన బాణిలో వ్రాస్తే, వ్రాశారని ఎవరైనా అంటే, ఇక వారి జన్మ తరించినట్టే!        

నేనూ చేశాను ఆ పని. గోపాలం, భామ అనే పేర్లు పెట్టి భార్యాభర్తల మధ్య జరిగే తీయటి చేదు నిజాల్ని హాస్యం రంగరించి మూడు కథలు వ్రాశాను. శయనేషు రంభ, కార్యేషు దాసి, కరణేషు మంత్రి అని. ఆంధ్రభూమి వారపత్రికలో ఆ కథలు ప్రచురింపబడ్డాయి. కొంతమంది పాఠకులు రమణగారి శైలిలో వున్నాయి అంటే, ఎవరూ చూడకుండా ఎగిరి గంతేసినట్టు కూడా గుర్తు. ఈ మధ్యనే యువ జంట సీత, సీతాపతిలతో భోజ్యేషు మాత కూడా వ్రాస్తే స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. ఇదెందుకు వ్రాశానంటే కథా రచయితల మీద రమణగారి ప్రభావం ఎంత వుందో చెబుదామని. మరి అది ప్రభావమా, కాపీనా అనే వాళ్ళు కూడా వున్నారు. ఇక్కడ నేను కానీ, ఇంకొకరు కానీ అయన కథలని కాపీ కొట్టటం లేదు. ఆయన రచనా శైలిని మాత్రమే. ఇలా భుజాలు తడుముకునే నాలాటి వాళ్ళ గురించి కూడా రమణగారు అన్నారు, కాపీ రైటు అంటే కాపీ కొట్టటం రైటు అని!

రమణగారి రచనల గురించి ఇక్కడ చెప్పటం, హనుమంతుడి ముందు గుప్పికంతులు వేసినట్టే! అందుకే ఆయన రచనల మధుర స్మృతులు మీకే వదిలేస్తున్నాను.

పంథొమ్మిది వందల అరవై – డెభైలలో అనుకుంటాను, రమణగారు గవర్నమెంటాలిటీ అనే కథ వ్రాశారు. ఆయన వ్రాసిన కథలు, పుస్తకాలూ అప్పటికే జీర్ణించుకుని ఆయనకి వీరాభిమానిగా మారిపోయిన నాకు, ఆ కథ ఎంతో నచ్చింది. అదీకాక ఆంధ్రప్రదేశపు ప్రభుత్వంలో రెండేళ్లు ఉద్యోగం వెలగబెట్టి, ఇక బెట్ట లేక, ఆ లంచాల అరాచకాన్ని భరించలేక, తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేరాను. అమెరికా వచ్చాక ఆ ఆంధ్రప్రదేశ ప్రభుత్వంలోని నా చేదు  అనుభవాల్ని కాస్త హాస్యం, వ్యంగ్యం రంగరించి, గవర్నమెంటాలిటీ కథలు అని పధ్నాలుగు కథలు వ్రాస్తే, రచన మాసపత్రికలో శాయిగారు శీర్షికగా ఒక సంవత్సరం పైన ప్రచురించారు. ఎంతో మంది మిత్రులూ అభిమానులూ ఆ కథలు నచ్చాయనీ, పుస్తక రూపంలో తెమ్మని అడిగారు. రమణగారి చేత  ముందు మాట వ్రాయించుకొని, ఆ పుస్తకాన్ని ప్రచురించాలని ఆశ పడ్డాను. ఆయనకి వ్రాతప్రతి పంపించి, ముందు మాట వ్రాయగలరా అని అడిగితే, గలను అన్నారు, టీవీ భాగవతం సీరియల్ వ్రాస్తూ ఎంతో బిజీగా వుంటూ కూడాను. మళ్ళీ ఇంకోసారి సంతోషంతో ఎగిరి గంతులు వేయాల్సి వచ్చింది.

అంత బిజీగా వున్నా రమణగారు ముందుమాట అద్భుతంగా వ్రాశారు. నా కథలు పధ్నాలుగూ త్రాసులో ఒక పక్కన పెట్టి, ఆయన వ్రాసిన రెండు పేజీలు ఇంకో పక్కన పెడితే, తులసిదళంలా అదే బరువు తూగుతుంది.

“అసలు ఈ గవర్నమెంటాలిటీలూ, ఈ అవినీతి భాగోతాలూ మన వేదాలలోనే వున్నాయిష. వేదాలేమిటి, వాటిని పల్కించిన పురుషోత్తముడు సాక్షాత్ శ్రీమహావిష్ణువువారి వైకుంఠద్వారంలోనే ఆరంభామయాయిష! కలియుగంలో ఇదేమీ గొప్పకాదు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత బాలరూప ఋషులను, ద్వార పాలకులు జయవిజయులు గడప దగ్గరే, మద అహంకారాల కొద్దీ పో పొమ్మని అవమానించారు. దానితో వాళ్ళు కోపగించి, మామూళ్ళు ఇచ్చే బదులు, వాళ్లకి మామూలయిన శాపం ఇచ్చారు. విష్ణుమూర్తి పరుగున వచ్చి, తప్పు తన సేవకులదయినా వైకేరియన్ లయబిలిటీ సూత్రం ప్రకారం, బాధ్యత యజమానిగా తనదేనని చెప్పి, ఋషులని సముదాయించాడు. ఆయన ఆశ్రిత పక్షపాతం అంతటిది. దరిమిలాను ఏడు జన్మల కాలం భక్తులుగా, మంచివాళ్ళుగా బ్రతుకుతూ స్వామికి దూరంగా వుండలేమనీ, రాక్షసులుగా పాపాలూ పాడు పనులూ చేసి మూడు జన్మల్లోనే వెనక్కొచ్చేస్తామనీ వాళ్ళు వేడుకుంటే, వాళ్ళ ‘ఇది’కి పొంగిపోయిన స్వామివారు ‘సరే! అలాగే కానీయండి’ అన్నారు. దానివల్ల ఆ సేవకులు రాక్షసులై పుట్టి ముల్లోకాలనూ నానా హింసా పెట్టారు. సేవకులపై స్వామి కరుణ అమాయకులపై హింసకు అలా దారి తీసింది. తప్పు చేసినా తన వాళ్ళని కాపాడటం అనే గవర్నమెంటాలిటీ కూడా ఆ కాలంలోనే వుండేదష మరి!”

“మొత్తం మీద ఒక్క నిజాన్ని అందరూ గుర్తించటం శ్రేయస్కరమని తోస్తుంది. లంచం తీసుకునేవాడిది తప్పు అయితే, ఇచ్చేవాడిది తప్పుముప్పావు.. నిజానికి వీళ్ళందరూ కలిసి నడిస్తే, లంచం తీసుకునే వాళ్లందరూ చితికిపోతారు. కానీ వీళ్ళు, మనవాళ్ళు – కలవరు కదా! ఐకమత్యం లేదు గదా! అది లేకనే కదా గవర్నమెంటు. దానివల్లనే కదా గవర్నమెంటాలిటీ!” అన్నారాయన.

 satyam1

తర్వాత చాల రోజులకి ఇండియా వెళ్లాను. బెంగుళూరులో పని పూర్తిచేసుకుని, మద్రాసు మీదుగా గుంటూరుకి బయల్దేరాను. కాస్తో కూస్తో ముఖాముఖి పరిచయం వుంది కనుకా, వారి భక్తుడిని కనుకా, కొంచెం చనువు తీసుకుని ముందుగానే బాపు-రమణగార్లకు ఫోన్ చేశాను. వీలయితే మద్రాసులో దిగి ఒక మధ్యాహ్నం మీతో గడపాలని వుంది, మీకు ఫరవాలేదా అని అడిగాను. ఫరవా లేదంటే లేదన్నారు బాపుగారు. అయ్యో తప్పకుండా రండి అన్నారు రమణగారు. మా ఇల్లు ఎక్కడ అంటే ఆటో అతనికి తెలీదు, మాముట్టి ఇంటికి ఎదురుగా అని చెప్పండి ఏ ఇబ్బందీ లేకుండా తీసుకువస్తాడు అన్నారు బాపుగారు.

ఆయన చెప్పినట్టుగానే, మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగగానే ఆటో ఎక్కి మాముట్టి ఇంటికి పోనిమ్మన్నాను. ఆటో అంకుల్ (ఇప్పుడు ఇండియాలో ఆటోవాడు అనకూడదు) నావేపు ఒక మలయాళం చూపు విసిరి, మెరీనా బీచ్ మీదుగా మాముట్టి ఇంటికి తీసుకు వెళ్లాడు. అప్పుడు మధ్యాహ్నం దాదాపు పన్నెండు గంటలయింది. ఆ ఎండలో, తెల్లటి చొక్కా లుంగీ వేసుకుని, ఇంటి ముందర ఎండలో నుంచొని వున్నారు రమణగారు. నన్ను చూడగానే, నవ్వుతూ “అమ్మయ్య! వచ్చేశారా, రండి” అంటూ ఆహ్వానించారు.

నేనూ చేతులు జోడించి “నమస్కారం, గురువుగారు. ఎండలో నుంచున్నారేమిటి సార్!” అన్నాను.

“ఏం లేదు. మీకు ఈ రోడ్లు కొత్త కదా.. కనుక్కోవటం కష్టమేమోనని.. “ అన్నారాయన.

“అదేమిటి సార్! అమెరికానించీ ఇక్కడికి వచ్చినవాడిని, స్టేషన్నించి మీ ఇంటికి రాలేనా.. పెద్దవారు ఎండలో నిలబడ్డారు..” అన్నాను నొచ్చుకుంటూ.

ఆయన నవ్వి, భుజం మీద చేయి వేసి “పదండి!” అని ఇంట్లోకి తీసుకు వెళ్లారు.

బాపూగారికి కూడా నమస్కారం చేశాను. రమణగారు బాసింపట్టు వేసుకుని కుర్చీలో కూర్చుంటే, బాపుగారు బాసింపట్టు వేసుకుని నేలమీద కూర్చున్నారు. నేనూ బాపుగారికి ఎదురుగా బాసింపట్టు వేసుకోకుండా, వజ్రాసనం వేసుకుని నేల మీదే కూర్చున్నాను.

ఆ మధ్యాహ్నం నేను ఏనాటికీ మరువలేని రోజు. సాహిత్యం, సంగీతం, సినిమాలు… ఎన్నో విషయాలు.  బాపు-రమణగార్లతో మాట్లాడటమే ఒక పెద్ద ఎడ్యుకేషన్. నేనూ ఎన్నో పుస్తకాలు చదివాను కనుక, తెలుగు సాహిత్యం అంటే  నాకు ప్రాణం కనుక, ప్రతి నిమిషం ఒక అనుభూతిని మిగిల్చింది. మందహాసాల నించీ అట్టహాసాల దాకా పడీ పడీ నవ్వించిన రోజు. భలే మంచి రోజు! పసందైన రోజు!!

“గోదావరి కథలు చదివారా?” అని అడిగారు రమణగారు. లేదన్నాను.

“అదేమిటి. మీరు తప్పకుండా చదవాలి. ఉండండి నా కాపీ ఇస్తాను” అని అది తెచ్చి ఇచ్చారు.

“అయ్యో! ఇది మీ పుస్తకం. మీరు వుంచుకోండి. నేను విశాలాంధ్రలో కొనుక్కుంటాను” అన్నాను.

“ఏం ఫరవాలేదు. తీసుకోండి” అన్నారాయన.

“పోనీ, చదివి పోస్టులో తిరిగి పంపిస్తాను” అన్నాను.

“లేదు, అచ్చంగా వుంచుకోండి” అన్నారు నవ్వుతూ.

అంతేకాదు, ఆయనకి నా గవర్నమెంటాలిటీ కథలు బాగా గుర్తున్నాయి.

“అందులోని మీ సరస్వతీ నమస్తూభ్యం కథ నాకు బాగా నచ్చింది. అలాటి విషయం మీదే నామిని సుబ్రహ్మణ్యం నాయుడుగారు చదువులా చావులా అని ఒక పుస్తకం వ్రాశారు. మీకు బాగా  నచ్చుతుంది. నా దగ్గర ఒక కాపీ వుంది. తీసుకోండి” అని, వద్దన్నా వినకుండా అది కూడా తెచ్చి ఇచ్చారు.

తర్వాత వారితోపాటే అక్కడ భోజనాలు. భాగ్యవతిగారు, శ్రీదేవిగారు దగ్గర వుండి ఎంతో అప్యాయంగా,

ఆత్మీయంగా అన్నీ అడిగి, అడిగి వడ్డించారు.

భోజనాలయాక మళ్ళీ రమణగారు కుర్చీలో, బాపుగారు నేల మీదా బాసింపట్టు వేసుకుని కూర్చున్నారు. “ఇక వెడతాను సార్! ట్రైనుకి సమయమయింది. వెళ్ళేముందు మీ పాదాలకి దణ్ణం పెట్టి వెడతాను. కాళ్ళు

చాపండి” అన్నాను, ఆ బాసింపట్టు లోపల భద్రంగా దాచుకున్న పాదాలను  చూస్తూ.

“మీరు అమెరికా వాళ్ళు, షేక్ హ్యాండ్ ఇవ్వండి చాలు” అన్నారు రమణగారు.

“నేను అమెరికాలో వుంటున్నా, భారతీయుడినే సార్! కాళ్ళు చాపరూ..” అన్నాను.

ఆయన కాళ్ళు క్రిందికి దించారు. పాదాభివందనం చేశాను.

“బాపుగారూ, మీరూ కాళ్ళు చాపండి” అడిగాను.

“నేను నా కాళ్ళు ఇవ్వనుగాక ఇవ్వనుగాక ఇవ్వను” అన్నారు బాపుగారు కాళ్ళు ఇంకా ముడుచుకుంటూ.

“అదేమిటి సార్! నాకు తృప్తిగా వుంటుంది.. మీరు కాళ్ళు చాపేదాకా నేను వెళ్ళను. తూర్పు వెళ్ళే రైలు తప్పిపోతుంది. ప్లీజ్..” అన్నాను.

ఆయన పాదాలు ముందుకి పెట్టారు. నేను పాదాలకి నమస్కరించాను.

రమణగారు చెప్పులు వేసుకుంటూ, “రండి మా కారులో వెడదాం” అన్నారు.

“వద్దండీ ఈ ఎండలో మీరెందుకు.. నేను ఆటో తీసుకు వెడతాను” అన్నాను.

“ఏం ఫరవాలేదు.. పదండి” అన్నారు రమణగారు.

వాద ప్రతివాదాలయాక, న్యాయవాది బాపుగారు “పోనీ వెంకట్రావ్ రాడులెండి. మా డ్రైవర్ మిమ్మల్ని దించి వస్తాడు” అన్నారు జడ్జిమెంట్ ఇస్తూ.

కారులో స్టేషనుకి వెడుతుంటే, నా కెందుకో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బాపు రమణలు వారివారి రంగాల్లో ఎంతో గొప్పవాళ్ళు. చిత్రకళారంగంలోనూ, సినిమారంగంలోనూ, సాహిత్యంలోనూ తిరుగులేని మనుష్యులు. ప్రప్రంచ ప్రఖ్యాత ప్రముఖులు. వయసులో నాకన్నా ఎంతో పెద్దవారు. మరి నేనో.. రమణగారి బుడుగు భాషలో చిన్నవాడిని, ఎంతో చితకవాడిని. అసలు నేను వాళ్లకి ఏమవుతాను? స్వంత ఇంటి మనిషిలా నా మీద ఇంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎందుకు చూపించాలి? రమణగారు మిట్ట మధాహ్నం మండుటెండలో అలా నుంచొని ఎదురు చూస్తున్నారే, ఎందుకు? దానికి ఒక్క మాటలో ఒక్కటే సమాధానం. అది వారి సంస్కారం. అక్కడ నేను.. నేను కాకుండా ఇంకెవరైనా వున్నప్పుడు కూడా, బాపు రమణగార్లు అలాగే గౌరవమిస్తారు. ఆ గౌరవం నాకు దక్కింది కానీ, వాళ్ళు ఇచ్చిన గౌరవం నిజంగా వారి సంస్కారానికి! వారి సహ్రుదయతకి!

తర్వాత ఏడేళ్ళకి, 2007లో హైదరాబాదులో వంగూరి ఫౌండేషన్ వారి ప్రప్రధమ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు జరిగింది. అక్కడ బాపు రమణల స్నేహానికి షష్ఠిపూర్తి ఘనంగా జరిపారు మిత్రులు వంగూరి చిట్టెన్ రాజు. బాపు రమణగార్లని పరిచయం చేస్తూ, ఒక వ్యాసం వ్రాసి చదవమంటే, వెంటనే ఒప్పేసుకుని నా ప్రాణం పెట్టి చక్కటి వ్యాసం వ్రాసి, వారిని పరిచయం చేశాను. ఆ రోజే నా ఎన్నారై కబుర్లు ఒకటి, మరోటి పుస్తకాలు బాపు రమణగార్లు ఆవిష్కరించారు.

అంతకన్నా నాకు జీవితంలో కావలసిందేముంది!

రమణగారి రచనల్లో నన్ను బాగా ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. సరదాగా వ్రాస్తూనే, హఠాత్తుగా సాంఘిక, రాజకీయ, మానవతావాదంతో చెంప చెళ్లుమనేలా కొట్టి మరిచిపోకుండా చేసే రచనా చాతుర్యం.

మచ్చుకి కొన్ని: (అంటే అరడజను)

“నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు, ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో”

“సిఫార్సులతో కాపురాలు చక్కబడవు”

“సత్యాన్వేషికి సమాధానమేమిటని ఒక గణిత శాస్త్రజ్ఞుడిని అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అంటాడు”

“పగటి కల అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. మనసులో పేరుకుపోయిన దురాశలనీ నిరాశలనీ, అందీ అందని ఆశలుగా పరిమార్సివేసే మందు. మితంగా సేవిస్తే, గుండెకూ, కండకూ పుష్టినిచ్చే దివ్యౌషధం”

“టైము అనగా కాలము. చాల విలువైనది. బజార్లో మనం మిరపకాయలు కొనగలం. చింతపండు కొనగలం. ఇడ్లీలు, కిడ్నీలు కొనగలం. గొడుగులు, గోంగూర కొనగలం. బాల్చీలు, లాల్చీలు కొనగలం. కానీ కాలాన్ని మాత్రం కొనలేం. కాలాన్ని వృధా చేయటం క్షమించరాని నేరం”

“వారానికి అర్ధ రూపాయి ఇస్తే, రోజూ హోటల్ భోజనపు ఎంగిలాకులన్నీ నువ్వొచ్చే వరకు వుంచి, నువ్వు రాగానే పడేస్తా!”

ఇలాటివి చదువుతుంటే, శ్రీశ్రీలా ఆకలేసి కేకలే వెయ్యఖ్కర్లేదు, రమణగారిలా ఆకలేసినప్పుడు జోకులేసి కూడా చెప్పొచ్చు అనిపిస్తుంది.

దటీజ్ రమణ!

వెంకట రమణ!!

ముళ్ళపూడి వెంకట రమణ!!!

మీరు ఎక్కడికీ వెళ్ళలేదు సార్!

ఇక్కడే సజీవంగా వున్నారు!

మీ రచనల్లో!

తెలుగు సాహిత్యంలో!

మా హృదయాల్లో!

0                           0                           0

 

సంజీవదేవ్ జీవితమే ఒక కళ!

san2

అమెరికా సందర్శించే యాత్రికులెవరైనా న్యూయార్క్ నగరంలో అప్ టౌన్ లో 107 వ వీధిలోకి వెడితే నికొలస్ రోరిక్ మ్యూజియం కనిపిస్తుంది. అందులో సంజీవదేవ్ కు రష్యన్ చిత్రకారుడు రోరిక్ కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు భద్రపరిచారు. లోగడ ఈ మ్యూజియంను సందర్శించినవారిలో మిత్రుడు చలసాని ప్రసాద్ ఉన్నారు. ఆయన ఆసక్తిని వెతుక్కుంటూ వచ్చిన ధోరణిని గమనించిన మ్యూజియం డైరెక్టర్ ఆయనకు ప్రత్యేకంగా ‘ఆర్ట్ పిక్చర్స్’ పుస్తకాన్ని బహూకరించారు. సంజీవదేవ్ చివరి రోజులలో ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను మ్యూజియంకు బహూకరించమని నేను కోరాను. ఆయన ఒక పట్టాన ఒప్పుకోలేదు. నేను పట్టు వదలక నేడు ‘మిసిమి’ సంపాదకుడుగా ఉన్న వల్లభనేని అశ్వనీకుమార్ ను తుమ్మపూడి పంపించాను. అమెరికా నుండి సంజీవదేవ్ కు ఫోన్ చేసి ఆ ఉత్తరాలు నికొలస్ రోరిక్ మ్యూజియంలో ఉంటే వాటికి భవిష్యత్తు ఉంటుందని, సరైన చోటికి చేరినట్లుంటుందని నచ్చచెప్పాను. ఆయన ఆ ఉత్తరాలను కుమార్ కు అప్పగించగా అవి భద్రంగా మ్యూజియంకు చేర్చారు. ఎంతో సంతోషించాను.

జీవిత చివరి దశలో కులు వాలీలో స్థిరపడిన నికొలస్ రోరిక్ ను కలిసి కొన్నాళ్ళు ఆయనతో గడిపిన సంజీవదేవ్ ప్రకృతిని ఆయనతో కలిసి ఆస్వాదించి, కబుర్లు చెప్పుకుని పరస్పరం చిత్రాలు వేసుకున్నారు. కళాకారుడుగా సంజీవదేవ్ కు అది గొప్ప అనుభూతి.

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా తుమ్మపూడి గ్రామంలో పుట్టి, చిన్నతనంలో కొన్నాళ్ళు కృష్ణాజిల్లాలో బంధువుల దగ్గర పెరిగిన సంజీవదేవ్ చదువులో స్కూలు దాటి పోలేదు. పిన్న వయసులోనే ఉత్తరాది సాహస పర్యటన చేసి అనేక అనుభవాలతో తిరిగి వచ్చారు. ఆయనలోని ప్రతిభను పసిగట్టిన నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్ర ప్రభ సంపాదకుడుగా సంజీవదేవ్ రచనలను, జీవితాన్ని దినపత్రికలో ప్రచురించి ప్రజలకు అందించారు. అంచెలంచెలుగా జీవిత అనుభవాలను రాసిన సంజీవదేవ్ ‘గతంలోకి’, ‘స్మృతిబింబాలు’, ‘తెగిన జ్ఞాపకాలు’ అంటూ గ్రంథస్తం చేశారు. బెంగాలీ ప్రభావం మరికొంత హిందీ ప్రభావం ఆయనపై ఉన్నా, రచనలలో కొత్తరకమైన తెలుగుదనాన్ని చూపారు. వాక్య నిర్మాణం, పదప్రయోగాలలో వినూత్నత కనిపిస్తుంది.

సంజీవదేవ్ కు విస్తృత పరిచయాలున్నాయి. రాహుల్ సాంకృత్యాయన్, అసిత్ కుమార్ హల్దార్, భగవాన్ దాస్ (లెన్స్ లైన్ పత్రిక సంపాదకుడు), దేవులపల్లి కృష్ణశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, ఆచంట జానకిరామ్, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య వంటివారి పరిచయాలతో చాంతాడంత జాబితా తయారవుతుంది.  ఆయన లేఖారాక్షసుడు. ఎవరిదగ్గర నుంచైనా ఉత్తరం వచ్చిందే తడవుగా సమాధానాలు రాసి పోస్టు చేసేవారు. కొందరికి తాను గీసిన బొమ్మలు కూడా జతపరిచేవారు. ఆ లేఖలన్నీ చాలావరకూ గ్రంథాలలో తొంగిచూశాయి. సంజీవదేవ్ చేత పీఠికలు రాయించుకున్నవారు చలం దగ్గర నుండి తపస్వి వరకు ఎందరో ఉన్నారు. సంజీవదేవ్ మాత్రం తుమ్మపూడి గ్రామం వదలలేదు. పెద్దా చిన్నా అందరూ ఆయన దగ్గరకే వచ్చేవారు. కొందరు రోజుల తరబడి ఆయన భార్య సులోచన ఆతిథ్యం స్వీకరిస్తూ ఇంట్లోనే ఆయన చెప్పేవి వింటూ ఆనందించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఒక దశలో డాక్టరేట్ డిగ్రీ ఇవ్వబోగా సంజీవదేవ్ నిరాకరించారు. అప్పుడు డిలిట్ డిగ్రీ ఇవ్వగా ఆయన స్వీకరించారు.

san1

సంజీవదేవ్ తో నా సన్నిహిత పరిచయ వయస్సు 35 ఏళ్ళు. కొన్నిసార్లు  ఆయన మా ఇంటికి రావడం మా పిల్లలకు బొమ్మలు గీసి ఇవ్వటం, మరికొన్నిసార్లు నేను కోమలతో సహా తుమ్మపూడి వెళ్ళి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి, బోలెడు కబుర్లు చెప్పుకోవడం మంచి మధురానుభూతి. 1970 ప్రాంతాలలో నేను, చీమకుర్తి భాస్కరరావు, వెనిగళ్ళ వెంకటరత్నం, శ్రీరమణగా మారిన రాధాకృష్ణ కలసి సంజీవదేవ్ పుస్తకాలు ప్రచురణకు పూనుకున్నాం. ఇంగ్లీషులో రెండు, తెలుగులో రెండు స్టేట్ బుక్ క్లబ్ పేరిట ప్రచురించాము. అంతటితో ఆ ప్రయత్నం ఆగిపోయింది.

సంజీవదేవ్ తో నేను కొన్ని విశిష్టమైన వ్యాసాలు రాయించాను. తెనాలిలో మిత్రులు సూర్యదేవర హనుమంతరావుతో కలసి తుమ్మపూడి వెళ్ళి, ఆచార్య నరేంద్రదేవ్ రాసిన ‘బౌద్ధధర్మదర్శన్’ గ్రంథాన్ని ఇచ్చి, దాని ఆధారంగా వ్యాసం రాయమన్నాను. ఆయన నిర్దుష్టమైన వ్యాసం రాసి, ‘ప్రసారిత’ సామాజిక త్రైమాస పత్రికకు అందించారు. ఆ పత్రికను నేను, పోలు సత్యనారాయణ సంపాదకులుగా హైదరాబాదు నుండి కొన్నేళ్ళు నడిపాము. సంజీవదేవ్ కు ఎవరైనా కోరితే రాసే అలవాటు ఉంది. చాలా పత్రికల వాళ్ళు అలాగే రాయించుకునేవాళ్ళు. అందులో చిన్నా పెద్దా అనే తారతమ్యం చూసేవారు కాదు. అదీ ఆయన గొప్పతనం.

సంజీవదేవ్ హైదరాబాదు వచ్చినప్పుడల్లా తెలుగు యూనివర్సిటీలో గాని, అకాడమీలో గాని చిన్న సమావేశం ఏర్పాటు చేసేవారు. సంజీవదేవ్ రంజింపజేసే ఉపన్యాసకుడు కాదు. విషయ పరిజ్ఞానం ఉంటుంది కానీ, ఆకర్షణ కనిపించదు.

ఇంగ్లీషులో కొన్ని రచనలు, కవితలు, రాసిన సంజీవదేవ్ ఒక విధంగా పరోక్ష జీవిత చరిత్రను – హర్ లైఫ్ – అనే రచనలో ప్రతిబింబించారు. నేను అది చదివి అందులోని హీరోయిన్ మానస నీ జీవితాన్ని అద్దం పడుతున్నట్లున్నదే అన్నాను. కాదనలేదు గాని సమాధానంగా నవ్వి ఊరుకున్నారు.

san3

సంజీవదేవ్ కు నాకూ కామన్ గా అనేక మంది మిత్రులున్నారు. అందులో కొందరితో కలిసి మేము తుమ్మపూడి వెళ్ళి వస్తుండేవాళ్ళం. ‘రేపు’ పత్రిక సంపాదకుడు సి. నరసింహారావు, తుమ్మల గోపాలరావు, మండవ శ్రీరామమూర్తి ఉన్నారు. నేనూ, కోమల వెళ్ళినప్పుడు  కలసి భోజనం చేస్తుండగా ఆయన ఆవకాయ పచ్చడితో అన్నం కలిపి ఎర్రని రంగును సూర్యోదయం వలె ఉన్నది కదూ అంటూ భుజించేవారు. నాకు మాత్రం చూస్తుంటేనే కళ్లలోకి నీళ్ళొస్తున్నాయి, తింటే ఎలా వుంటుందో అనే వాణ్ణి. జీవితంలో కళాత్మకంగా గడవడం సంజీవదేవ్ ఆర్ట్. హైదరాబాదు వచ్చి, నార్ల వెంకటేశ్వర రావు ఇంట్లో ఉన్నప్పుడు నార్ల ‘గ్రంథాలయంలో ఉంటున్నాడు ఇంట్లో కాదు’ అనేవారు. నార్ల ఇల్లంతా పుస్తకాల మయం కావటమే అందుకు కారణం. జగదీష్ మిట్టల్, పి.వి.రెడ్డి వంటి కళాకారులతో సంప్రదిస్తుండేవారు. తెలుగు అకాడమీ సంజీవదేవ్ ను ఆహ్వానించి, ఆయన చేత రచనలు చేయించుకున్నది. అప్పుడే శ్రీధర్ (ఆర్టిస్ట్)  వంటివారు ఆయనకు తోడ్పడ్డారు. ఒకేఒకసారి అమెరికా వచ్చి తానాలో కూడా పాల్గొన్నారు.

మేమిద్దరం కలిసి కొన్ని సందర్బాలలో ఆలపాటి రవీంద్రనాథ్ (జ్యోతి, మిసిమి పత్రికల సంపాదకులు) ఇంట్లో ఇష్టాగోష్ఠిగా కాలక్షేపం చేసేవాళ్ళం. తనకెలాంటి నియమాలూ పట్టింపులూ లేవని సంజీవదేవ్ అన్నారు. లోగడ ఆయన ఆవుల గోపాలకృష్ణమూర్తిని ఒక విందులో సరదాగా ఏడిపించారు. అది శాకాహార, మాంసాహార విషయాలలోనూ, సిగరెట్టు పీల్చే విషయంలోనూ వచ్చింది. అది గుర్తుంచుకొని ఆయనకు చిన్న పరీక్ష పెట్టాము. భోజనానికి ముందు వేదోక్తంగా కొంచెం ఔపోసన పడదాం అన్నాము. మన రుషుల సంప్రదాయంలో మనం కూడా సోమపానం సేవిద్దాం అన్నాము. మా ముందు విదేశీ విస్కీ ఉన్నది. గ్లాసులలో పోసి ఇవ్వగా, అన్నమాట తిప్పుకోలేక ఆయన కొంచెం చప్పరించక తప్పలేదు. ఈ విషయం తెలిసిన ఆయన శిష్యపరమాణువులు కొందరు గురువుగారి చేత విస్కీ సేవింపచేసిన మీ సాహసం చాలా గొప్పదని అన్నారు. మేము కేవలం చమత్కారంగా చేసిన పని అది.

సంజీవదేవ్ పై అనేక వ్యాసాలు కవికుమార్ సేకరించగా, నేను ఎడిట్ చేసిన ‘సంజీవదేవ్ రచనల సమీక్ష, విశ్లేషణ’గా వెలువరించాము.

సంజీవదేవ్ చనిపోతున్న రోజులలో నేను అమెరికాలో ఉన్నాను. ఆ తరువాత మిత్రులు భాస్కరరావు వెబ్ సైట్ (www.sanjeevadev.tripod.com) ఏర్పరచగా అందుకు నేను పూర్తిగా సహకరించాను.

Photograph (197)

ఒక సభలో ఇన్నయ్య, సినారె, సంజీవ దేవ్

సంజీవదేవ్ తన అవగాహనలోకొచ్చిన ఏ విషయాన్నయినా తెలుగులో గాని, ఇంగ్లీషులో గాని అవలీలగా రాయగలరు. ఆయన రచనలు ఇంచుమించు అన్నీ వెలుగు చూశాయి. వాటిలో కొన్ని పునర్ముద్రణ కావలసి ఉన్నది. చలం ‘గీతాంజలి’కి సజీవదేవ్ రాసిన సుదీర్ఘ పీఠికను ఉత్తరోత్తర వచ్చిన ప్రతులను ఎందుకోగాని తొలగించారు. జెన్ బౌద్ధంపై ఎంతో బాగా రాశారు. వీటన్నింటికి మించి, సుప్రసిద్ధ చిత్రాలెన్నో వేయగా ఎస్వీ రామారావు మొదలైన చిత్రకారులు ఆశ్చర్యపడ్డారు కూడా.

జుట్టుతో ఉన్న సంజీవదేవ్ ను ఎవరైనా చూశారా అని, కనీసం ఫోటోలైనా ఉన్నాయా అని నేను అడుగుతుండేవాడిని. చూశామన్నవారు నాకు కనిపించలేదు. సంజీవదేవ్ పెళ్ళి ఫోటోను సి. భాస్కరరావు సేకరించి వెబ్ సైట్లో పెట్టినట్లు గుర్తు. ఏమైనా ఒక అరుదైన విశిష్ఠ మానవుడు సంజీవదేవ్. తన తత్వాన్ని లోతుపాతులతో కూడిన ఆలోచనలను Bio symphony  అనే ఇంగ్లీషు రచనలో ఆయన స్పష్టీకరించారు.

బాలబంధు బి.వి.నరసింహారావు అత్యద్భుతంగా రాసిన పాలపిట్టలు గేయాలను సంజీవదేవ్ ఇంగ్లీషులోకి అనువదించారు. అది పునర్ముద్రణ కావలసిన అంశం. సంజీవదేవ్ కు మూఢనమ్మకాలు, మతఛాందసాలు, బాబాలకి ప్రదక్షిణలు లేవు. ఆయన స్వేచ్ఛా ప్రియుడైన కళాజీవి.

 

ఒక విలయం తరువాత…

3Son: Do we eat humans, when we starve?

Father: We are already starving?

Son: We shouldn’t eat humans, even though we die with starvation.

Father: No, we don’t, my son.

 

మృత్యు శీతలత.

అగాధమైన ఒంటరితనం.

ఎడతెగని భయం.

……………………

ఒక విలయం తరువాత…4

వర్ణాలు, ధ్వనులు, నామాలు, సూర్యరశ్మి, వెచ్చదనం, సంతోషం, ఆశ…అన్నీ తుడిచిపెట్టుకుపోయిన భూమిపై ఒక తండ్రి(45), ఒక కొడుకు (9) మెల్లగా, విచారభరితంగా పయనిస్తున్నారు. తీరప్రాంతానికి వెళ్లాలని వారి ప్రయత్నం. అక్కడ పరిస్థితులు కాస్తంత మెరుగుగా ఉంటాయని ఆశ. కాని అక్కడ ఏముందో ఎవరికి తెలుసు? నిజంగా వారక్కడికి చేరగలరా?

“ప్రతి దినం మునుపటి రోజుకంటే నల్లనిది. ప్రపంచం మెల్లగా మరణిస్తోంది. ప్రాణులన్నీనశించాయి. పంటలు పండే అవకాశం ఇక లేదు. నేలంతా బూడిదమయం అయింది. వృక్షాలన్నీ కూలిపోయాయి. రోడ్లు సాయుధులైన మూకలతో నిండిపోయాయి. ఇంధనం, ఆహారం కోసం వేట.  శిఖరాల మీద మంటలు ఎగసాయి. కానిబాలిజం (cannibalism) విస్తరించింది. కానిబాలిజం… అది వెన్నులో వణుకుపుట్టిస్తుంది. నేను ఆహారం కోసం ఆందోళన పడుతున్నాను. అవును, ఎక్కువగా ఆహారం కోసమే, ఇంకా ఈ చలి గురించి, మా బూట్ల గురించి…” తండ్రి తనలో తాను మధనపడ్డాడు.

అంతులేకుండా బూడిద ఆకాశంలో ఎగసిపడుతోంది. నగరాలు శిథిలమై నిర్మానుష్యంగా మిగిలాయి. ఎక్కడా ఆహారం లేదు. మొక్కలు పెరుగుతాయనే ఆశాలేదు. కొద్దిమంది మనుషులు మాత్రమే భూమిపై మిగిలిఉన్న చివరి జీవులు. కాని వారిప్పుడు ఎంతమాత్రం మనుషులు కారు. ఎందుకంటే వారి primitive instincts పూర్తిగా బయటపడే సమయమిది.  మనుషుల యదార్థ స్వభావాలు వెల్లడి అయ్యే సమయమిది. మనుషుల ముసుగులు తొలగే అత్యంత సంక్లిష్ట సమయమిది. మనుషులు తోడేళ్ళుగా మారే వేళ ఇది.

ఆ తండ్రి దగ్గర ఒక రివాల్వర్, రెండు బుల్లెట్స్ ఉన్నాయి. అందులో ఒకటి కొడుకుని రక్షించేందుకు వినియోగించేసాడు. మిగిలిన ఒక బులెట్ ని అత్యంత ప్రమాదకర పరిస్థితులు సంభవించినప్పుడు, కొడుకుకి తనని తాను అంతం చేసుకోమని ఇచ్చాడు. కొడుకుని బాధాకరమైన మరణం నుండి ఆ బులెట్ రక్షిస్తుందని అతని ఆశ. వారి ప్రయాణంలో సంభవించిన సంఘటనలు, ఆ ఘటనలకు వారు స్పందించిన తీరు మన హృదయాలలో లోతైన తాత్వికతను ఆవిష్కరిస్తుంది. భయం ఒక్కొక్కసారి మానవత్వాన్ని అణచివేస్తుంది. మరొకసారి మానవత్వం భయాన్ని జయిస్తుంది.

“ది రోడ్” చిత్రాన్నిచూసినప్పుడు భయం యొక్క విస్తృతి, లోతు మనకి అనుభూతమవుతాయి. మానవ స్వభావంలోని వైరుధ్యాలు మనలో వణుకు పుట్టిస్తాయి. భయకరమైన నైరాశ్యం. గూడు కట్టిన భయం. అరుదైన, విలక్షణమైన తాత్వికత జీవితం యొక్క నిష్ఫలతను, అదే సమయంలో జీవన సౌందర్యాన్ని ఏకకాలంలో హృదయంలో ఆవిష్కరిస్తుంది. మానవ స్వభావంలోని ఔన్నత్యం, మృగత్వం రెండూ వ్యక్తమవుతాయి. ఒక గంభీరమైన అనుభవం మన చేతనను ఆసాంతం ఆక్రమించుకుంటుంది. రోజుల తరబడి గాఢమైన విషాదం, అనూహ్యమైన వేదన మన హృదయాలను వెంటాడుతాయి.

మహా కళాకారుడైన ఆస్ట్రేలియన్ దర్శకుడు జాన్ హిల్కోట్ తన చిత్రాలలో అత్యంత లోతైన తాత్వికతను ఆవిష్కరిస్తాడు. ఆయన ప్రతి చిత్రం ఒక అలౌకిక అనుభవం. మహా నటుడు విగ్గో మార్టెన్ సెన్ తండ్రి పాత్రలో పలికించిన భావాలు మన హృదయాన్ని దిగులుతో నింపేస్తాయి. అతని దిగులు, స్వార్థం, త్యాగం, కొడుకు యొక్క మానవీయమైన ఆధిక్యతకి అతని అతడు చిన్నబోవడం_ ఇలా ప్రతి భావం ఆయన వదనంలో పలికించిన తీరు అసాధారణం. నిక్ కేవ్, వారెన్ ఎల్లెస్ ల అత్యంత సున్నితమైన సంగీతం హృదయం లోతుల్లోకి చొచ్చుకుపోతుంది. వివరించలేని తాత్వికతని హృదయంలో ఆవిష్కరిస్తుంది.

ఈ చిత్రం జీవితాంతం వెంటాడే ఒక నాణ్యమైన కవితాత్మక అనుభవాన్ని ఇస్తుంది. మానవ జీవితం పై ఒక కాంతిని ప్రసరిస్తుంది.5

_______________________

Film: The Road (2009)

Country : USA

Language:  English

Run time : 111 min

Director: John Hillcoat

Actors : Viggo Mortensen , Kodi Smit-McPhee, charlize theron, Robert Duvall  Robert Duvall

Music : nick cave and warren ellisSriram-Photograph