Archives for June 2016

వెలుతురు పూవుల జాలు 

 

 

ఆమె కల్లోలం లో పుట్టి పెరిగారు , అందుకని దాన్ని తిరిగి సృష్టించాలని అనుకోలేదు.

యూదు జాతి తలిదండ్రులకి , 1925 లో , ఆస్ట్రియాలోని వియన్నా లో జన్మించి – నాజీ ల విద్వేషం తో ఎంత పడాలో అంతా పడ్డారు.

బ్రిటన్ లో ఆశ్రయం పొంది తన జీవితాన్ని తిరిగి మొదలుపెట్టుకున్నారు కనుక , ఆ ఆశను రాసినదానిలో నింపి ఇచ్చారు, మరింకే నిరాశ లోనైనా చదివితే పనికి వచ్చేందుకు.

చిన్న వయసు లోనే అమ్మా నాన్నా విడిపోయారు – ఇద్దరి మధ్యనా తిరిగే నిలకడ లేని బాల్యం. అయితేనేం  , అమ్మమ్మ , ఆంట్ లూ ఉన్నారు కదా, లంగరు గా. విడాకులు తీసుకున్న తలిదండ్రులకి పుట్టిన పిల్లల వివాహాలూ నిలబడవనే పరిశీలనని అబద్ధం చేసి ,  ప్రేమించి పెళ్ళాడిన భర్త తో-   ఆయన వెళ్ళిపోయేదాకా ,  యాభై ఒక్కేళ్ళ పాటు ప్రేమించే ఇల్లాలి గానే బ్రతికారు.

పిల్లల కోసం రాసిన రచయిత్రులు వాళ్ళ పిల్లలతో సరిగ్గా లేరని – మనకి అక్కర్లేని కొన్ని నిజాలని A.S.Byatt – వంటి వారు చెప్పుకొచ్చారు[ The Children’s  Book] . ఈవిడ దానికీ మినహాయింపే – ముగ్గురు కొడుకులూ ఒక్క కూతురు …అందరినీ గారాబంగా , ఇష్టం గా పెంచుకున్నారు .

ఇలా కూడా జీవించవచ్చుననే విశ్వాసాన్ని , నిన్న మొన్నటి వరకూ ఇస్తూనే ఉన్నారు నా వంటి వారికి.

రాసినవాటి లో ఎక్కువ ప్రఖ్యాతి వచ్చింది చిన్న పిల్లల పుస్తకాలకే. The Great Ghost Rescue తో 1975 లో మొదలు పెట్టి 2010 వరకూ దాదాపు 15 నవలలు. పిల్లల తోబాటు వాటిలో దయ్యాలు – మనసులున్న దయ్యాలు, మంచి దయ్యాలు, నవ్వించే దయ్యాలు , ఇక్కట్లు పడే దయ్యాలు …అబ్బే , భయపెట్టవు ఏమాత్రం, మనుషులని పట్టవు కూడానూ. తొమ్మిది నుంచి పన్నెండేళ్ళ పిల్లలకి తెలియవలసినన్ని నిజాలు, ఇవ్వవలసినంత వినోదం , చెప్పీ చెప్పకుండా నేర్పగలిగినంత జ్ఞానం.  కళ్ళు మూసుకుని recommend  చేయచ్చు అన్నిటినీ.

Dated 02-08-2004 Childrens author Eva Ibbotson at her writing desk at home in Newcastle upon Tyne. FAO: Kate - Daily Telegraph

Eva Ibbotson 

వాటిలో ఒకటైన  Secret  of Platform 13  అనే పుస్తకం లోంచి ఒక విషయాన్ని J.K.Rowling  తన  Harry Porter లో వాడుకున్నారని అందరికీ తెలుసు.

[ ఆ మాటకొస్తే J.K.Rowling   రాసినదానిలో పాత రచనల నుంచి తీసుకున్నది ఎక్కువే ఉంటుంది. ఆమె కి ముందరా ఆంగ్ల సాహిత్యం లో పిల్లల కోసం  గొప్పfantasy  లు రాసిన ఉద్దండులు –Lloyd Alexander , Diana Winnie Jones  ,Madeleine L ‘Engle  , Ursula Le guin , Susan Cooper –  ఇంకా చాలా మంది ఉన్నారు .  వారెవరికీ రాని ప్రసిద్ధి J.K.Rowling కి వచ్చినప్పుడు సహజం గానే వారిలో కొందరు  చిరాకు పడ్డారు. సీరియస్ young adult fantasy చదువరులకి Harry Potter series   మీడియోకర్ పుస్తకాల నే అనిపిస్తాయి. ]

ఆ మాట అడిగితే ఈ పెద్దావిడ అంటారూ – ” Ms. Rowling తో నేను కరచాలనం చేస్తాను. మేమంతా రచయితలం   కదా- ఒకరి నుంచి మరొకరు అరువు తెచ్చుకోకుండా ఎలా కుదురుతుంది ? ” అని. వ్యంగ్యం గా కాదు, మనస్ఫూర్తిగా. ఆమె అలాంటివారు.

చిన్నప్పటి విధ్వంసాల గురించి పారిపోవాలనుకోలేదు –  ఆ వెళ్ళగొట్టబడటం, ఎవరికీ చెందక పోవటం – అవన్నీ కొన్ని నవలలలో అతి విపులంగా , కానీ సున్నితంగా కనిపిస్తాయి. ఆ పాత్రలు కష్టాలు పడుతూన్నా చిన్న చిన్న ఆనందాలకి అంధులు కారు. చుట్టూ ఉండేవారిలో ముళ్ళ కంచెలూ ఫలవృక్షాలూ పూల తీగ లూ – అన్ని రకాల మనుషులూ ఉంటారు. ప్రవాసం ఆమె చెప్పిన కథలలో ప్రధానమే , కాని ముఖ్యంగా ప్రతిపాదించినది అమాయకత్వాన్ని , అందులోంచి వచ్చే ఆహ్లాదాన్ని.

నా వరకు ఆమె రచనల లో మాణిక్యం అనదగిన Star Of Kazan లో – అప్పటి ఆస్ట్రియా వాతావరణమంతా అతి సాధికారం గా ఉంటుంది …అక్కడి అతి ప్రత్యేకమైన కేక్ ల, పేస్ట్రీ ల సువాసన ఉంటుంది ఆ పుటలకి. తర్వాత – సంగీతం. ఓపెరాల ఒద్దికలు, నాటకశాలలు , ఆ శాంతి మీద పడిన నాజీ పిడుగులు…

ఆమె రొమాన్స్ లు గా ఉద్దేశించి రాసిన నవలలు – 2000 సంవత్సరం తర్వాత , సహజం గానే , young adult సాహిత్యం గా ముద్రించబడుతున్నాయి. The Countess Below Stairs, The Secret Countess అని రెండు పేర్లున్న నవల ఎంత బావుంటుందో చెప్పలేను. రష్యన్ విప్లవం తర్వాత , ఇంగ్లండ్ కి పారిపోయివచ్చిన ఒక జమిందారీ కుటుంబం.  సేవికా వృత్తి ని అవలంబించిన ఒక ముగ్ధ అయిన అమ్మాయి. చివరలో ఆమె మళ్ళీ జమిందారిణి అయిపోవటమేమీ ఉండదు కనుక మనకి అభ్యంతరం ఉండక్కర్లేదు – హాయిగా చదువుకోవచ్చు. నిజానికి ఆమె కులీనత ని గొప్ప చేసిన వారూ కారు. 1998 లో భర్త మరణించాక , కాస్త గంభీరం గా రాసిన నవల Journey To River Sea  లో ఒక పెద్ద జమిందారీ కి హక్కుదారుడైన కుర్రాడు  తన స్థానం లో ఇంకొక అబ్బాయి  ని పంపించేసి తను దేశ దిమ్మరి గా ఉండిపోతాడు. ఆ రెండో పిల్లాడికి అది ఇష్టమే కూడానూ- తెరప !

ఒక ముఖాముఖి లో తనను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి ప్రశ్నిస్తే Frances Hodgson Burnett  రాసిన అన్ని పుస్తకాలు , ముఖ్యం గా The Secret Garden  ;  L.M.Montgomery రాసిన Anne Of Green Gables అని చెప్పారు. ఉల్లాసం , చిన్న గర్వం – నాకు, జాడలు తీయగలిగినందుకు.

జంతువులు , వాటి పట్ల మన విధులైన వాత్సల్యం, స్నేహం ,  బాధ్యత – అతి సుందరం గా చాలా పుస్తకాలలో ఉంటాయి. The Beasts Of Clawstone Castle లో ఆ జంతువులు గోవులు – వాటిని పూజించే సంస్కృతి గురించిన ప్రస్తావన. [ఆమె ఫిజియాలజీ లో పట్టా పుచ్చుకున్నారు గాని అందులో ముందుకి వెళ్ళాలనుకోలేదు – ఆ పరిశోధనలలో ప్రాణులని బాధ పేట్టాల్సి వస్తోందని.]

కొన్ని కోట్స్ ని ఇక్కడ అనువదిస్తున్నాను – ఆమె ఏమిటో మచ్చు చూపేందుకు.

” మంచి సంగతులని మటుకే గుర్తుంచుకుంటే ఎలా ” – ఆమె అంది – ” చెడ్డవాటిని కూడా గుర్తుంచుకోవాలి, లేదంటే అదంతా నిజమేననిపించదు కదా ”

*****

eva1

” బాధ్యత అనేది ఉంది, అది వాస్తవం. మనం పొందిన కానుకనో మనకి ఉన్న సామర్థ్యాన్నో అక్కర ఉన్న వారితో

పంచుకోవలసిందే. అది నిర్భయత్వం, స్వార్థం లేకపోవటం – మనని మనం తెరిచి ఉంచుకోవటం ”

*****

 

” ఆ రోజుల్లో  ప్రపంచం ఎంత అందమో తెలుసా , అన్నికా ! పువ్వులు, సంగీతం, పైన్ చెట్ల సుగంధాలు… ‘  ఇప్పుడూ ఉంది అలాగే ‘ – అన్నిక అంది – ‘ నిజంగానే ఉంది ‘ ”

*****

 

” ‘ అయితే,  దేని గురించి భయం నీకు ? ‘- అతను అడిగాడు.

ఆమె ఆలోచించింది. ఆ అలోచన మొహం లో ఎంత కనిపిస్తుందో చేతుల్లోనూ అంతే – అతనికి తెలుసు. తన ఆలోచనలని అరచేతుల్లో నింపుకునేలాగా దోసిలి పడుతుంది.

‘ చూడలేకపోవటం- దాని గురించీ భయం నాకు ‘

‘ అంటే , గుడ్డితనమా ? ‘

‘ ఉహూ. కాదు. అది చాలా కష్టమే గాని, హోమర్ ఉండగలిగారు గా అలాగ. మా పియానో టీచర్ మాత్రం..ఎంత ప్రశాంతం గా ఉంటారని ! నేననేది – ఒక గొప్ప మోహం కప్పేసి తక్కిన ప్రపంచాన్ని మూసివేయటం గురించి. వ్యామోహమో , వ్యసనమో – మరింకేదో – ఆ భీషణమైన ప్రేమ …ఆకులూ పక్షులూ చెర్రీ పూగుత్తులూ – వేటినీ కనిపించనీని ప్రేమ – కేవలం,  అవేవీ అతని ముఖం కాదు గనుక… ‘ ”

*****

 

ఆమె  చెప్పిన ఒక నిజమైన  ఉదంతాన్నీ అనువదిస్తున్నాను ఇక్కడ – పంచుకోక ఉండలేక .

‘’ బ్రిటన్ కి శరణార్థిగా వచ్చినప్పుడు నాకు ఎనిమిదేళ్ళుంటాయి. అంత ఉత్సాహం గా ఉన్నానని చెప్పలేను . వియన్నా లో మా స్కూల్ లో ప్రతి ఏడూ క్రిస్మస్ ముందు క్రీస్తు జననం నాటిక[nativity scene ]  ఉంటుంది  కదా- అంతకు ముందంతా ఆవు వేషమో గొర్రె వేషమో వేస్తుండేదాన్ని …ఆ యేడు ,  ఎట్టకేలకి  నాకు కన్య మేరీ వేషం ఇచ్చారు .

ఆలోపే ,  అప్పుడు –  హిట్లర్ వచ్చాడు.

చిర్రుబుర్రులాడే అమ్మమ్మ, అయోమయపు పిన్ని, ఎక్కడో ఆలోచిస్తుండే కవయిత్రి  అమ్మ – మా అడ్డదిడ్డపు గుంపు అంతా 1934 లో లండన్ చేరాము. బెల్ సైజ్ పార్క్ కి అప్పట్లో ఏమంత మంచి పేరుండేది కాదు, అక్కడి ఇళ్ళూ బాగుండేవి కావు – ఇంచుమించు కూలిపోబోతున్న ఒక మూడంతస్తుల మిద్దె  ఇంట్లో అద్దెకి దిగాము. మాతోబాటు అందులో ఇంకా చాలా మంది కాందిశీకులు – అందరూ చేతిలో డబ్బు ఆడనివారే. వాళ్ళలో లాయర్ లు, డాక్టర్ లు, పరధ్యానపు ప్రొఫెసర్ లు – ఎవరికీ జర్మన్ తప్పించి మరే భాషా రాదు. నాకు స్నేహితులెవరూ లేరు, బళ్ళోకి వెళ్ళటం లేదు, ఆడుకుందుకు చోటు లేదు.

అప్పుడొక రోజు- అమ్మమ్మ ఏవో సరుకులు పట్టుకు రమ్మంటే , హాంప్ స్టెడ్ వైపు వెళ్ళాను. ఒక గుట్ట మీద , తెరిచి ఉన్న తలుపులతో- పెద్ద భవనం. లోపలికి అడుగు పెట్టాను. అంతా నిశ్శబ్దం గా ఉంది. బోలెడన్ని పుస్తకాలు ! తేలిక రంగు జుట్టున్న ఒకావిడ బల్ల ముందు కూర్చుని ఉన్నారు .  నన్ను వెళ్ళిపొమ్మంటారనుకున్నాను – కాని ఆమె చిరునవ్వు తో , ” లైబ్రరీ లో చేరతావా ? ” అని అడిగారు.

నాకు ఇంగ్లీష్ బాగా రాదు గానీ ఆ మాటలు అర్థమైనాయి. ‘ చేరటం ‘ అనే మాట ఎంతో అందం గా వినిపించింది. నా దగ్గర డబ్బులు లేవన్నాను. ఆవిడ – మిస్ పోల్ – చెప్పారు – ” ఊరికే చేరచ్చు. డబ్బు కట్టక్కర్లేదు గా ” అని.

చేరాను. చేరి అక్కడ ఉండిపోయాను. జర్మన్ చదివినంత బాగా ఇంగ్లీష్ చదవటం ఎప్పుడు మొదలు పెట్టానో సరిగా గుర్తు లేదు గానీ ఎక్కువ రోజులైతే పట్టలేదు. కొద్ది వారాలు గడిచేసరికి వాడుక గా వచ్చేవారంతా తెలిసిపోయారు – ఒకాయన న్యూస్ పేపర్ లో రేసు ల వార్తలు చదువుతుండేవారు  .  ఆయన బూట్లకి చిల్లులుండేవి – వెచ్చదనం కోసం కూడా వచ్చేవారనుకుంటాను. మరొకావిడ , ఇంట్లో అత్తగారి పోరు పడలేక కాస్త గాలి పీల్చుకుందుకు వచ్చేవారు. ప్రత్యేకించి – నాకు మంచి స్నేహితులైన హెర్ డాక్టర్ హెలర్. నా లాగే ఆయనా శరణార్థే – కాకపోతే బెర్లిన్ నుంచి వచ్చారు.

డా. హెలర్ , లైబ్రరీ కి బాగా పొద్దుటే వచ్చేసేవారు, చాలా రాత్రయే దాకా ఉండిపోయేవారు. ఆయన ముందు గుట్టలు గుట్టలు గా మెడికల్ పుస్తకాలు  – మోకాళ్ళ వ్యాధులు, లింఫ్ గ్రంథుల అస్తవ్యస్తాలు … ఇంకా చాలా. అవన్నీ ఇంగ్లీష్ లో ఉండేవి. జర్మనీ లో ప్రసిద్ధికెక్కిన ప్రసూతి వైద్యశాల లో Head of the department  అయిన ఆయన, ఆ గొప్ప స్త్రీ వైద్య నిపుణుడు –  ఇంగ్లీష్ లో మళ్ళీ పరీక్షలకి కూర్చుని పాసయితే గాని ఇక్కడ ప్రాక్టీస్ చేసేందుకు లేదు.

eva2

అప్పటికి ఆయన వయసు ముప్ఫై అయిదూ నలభై మధ్య ఉండేదనుకుంటాను. ఒక భాష నుంచి మరొకదానికి అవలీల గా మారిపోవటం ఆ వయసు లో కష్టం – చిన్నపిల్లలకైతే సులువు గాని. ఆయన చాలా సార్లు నిట్టూర్చటం చూశాను . కొన్నిసార్లు – నిస్పృహ తో కళ్ళు తుడుచుకోవటమూ గమనించి – మిస్ పోల్ , నేనూ ఒకరి మొహాలొకరు  చూసుకునేవాళ్ళం. ఆవిడ కి ఆయన పట్ల చాలా అక్కర ఉండేది – ఆయన వచ్చీ రాగానే లావుపాటి జర్మన్- ఇంగ్లీష్ dictionary ని తెచ్చి అక్కడ పెట్టేసేవారు. తరచూ ఆయన కోసమని లైబ్రరీ ని ఇంకొంత ఎక్కువ సేపు తెరిచి ఉంచేవారు. డాక్టర్ గారు ఉండేది చిన్న ఇరుకు గదిలో, దాన్ని వెచ్చగా ఉంచుకుందుకు ఆయన దగ్గర డబ్బు లేదు –  అందుకని చదివేదేదో లైబ్రరీ లోనే కానివ్వాలి.

వేరే బాధ లూ ఉండేవి ఆయనకి. ఆయన భార్య ‘ ఆర్యన్ ‘ జాతికి చెందినదట- అందుకని ఆమె జర్మనీ లోనే ఉండిపోయింది , ఈయన వెంట రానందట. ఎప్పుడో పదిహేనేళ్ళ కిందట  చదివి మర్చిపోయిన పాఠాలన్నింటినీ , ఇప్పుడొక పరాయి భాషలో – గొప్ప సహనం తో చదువుకుంటుండేవారు.

అంతలో – అనుకోకుండా , నాకొక బోర్డింగ్ స్కూల్ లో సీట్ వచ్చింది. ఒక దూరపు  పల్లెటూళ్ళో Quaker  మతస్తులు నడిపే బడి అది. అందరం లండన్ వదిలేసి వెళ్ళిపోయాము. మా లైబ్రరీ ని మూసేసి వేరే ఇంకొక పెద్ద లైబ్రరీ లో కలిపేశారు.

అప్పుడు యుద్ధం మొదలైంది.  మిస్ పోల్ సహాయకదళం లో చేరారని తెలిసింది. ఆశ్రయం కోసం వచ్చిన శత్రు దేశాల మనుషులకి ప్రత్యేక శిక్షణ లు ఇచ్చే కార్యక్రమాలని బ్రిటిష్ ప్రభుత్వం మొదలుపెట్టింది.

నా జీవితమైతే తర్వాత సజావు గానే నడిచింది. స్కూల్ లో చదువు అయాక యూనివర్సిటీ లో చేరాను. ఆఖరి సంవత్సరం లో ఉండగా – అప్పుడే బర్మా లో పనిచేసి విరమించి వచ్చిన ఒకరిని కలుసుకుని , ఆ తర్వాత పెళ్ళి చేసుకున్నాను. మరుసటి ఏడు – ప్రసవం కోసం క్వీన్ ఆలిస్ ప్రసూతి వైద్యశాల లో చేరాను. ఆ హాస్పిటల్ చాలా పేరుమోసినది, కేవలం అదృష్టం కొద్దీ నే నాకు అక్కడ ప్రవేశం దొరికింది.

మా పాప పుట్టాక ఆ మర్నాటి ఉదయం హాస్పిటల్ అంతా పెద్ద హడావిడి. నర్స్ లు యూనిఫారాలు సర్దుకుంటున్నారు, పేషెంట్ లని శుభ్రంగా తయారు చేస్తున్నారు, పక్క బట్టలు సవరిస్తున్నారు, వార్డ్ లన్నిటినీ అద్దాల్లాగా తుడుస్తున్నారు…మాట్రన్ కుర్చీ లోంచి లేచి నిలబడే ఉన్నారు.  అప్పుడొచ్చింది ఊరేగింపు. ఆ గొప్ప మనిషి, సీనియర్ నిపుణులు – మందీ మార్బలం తో  – morning rounds కి వచ్చారు. ఒక పక్కన registrar , ఈ పక్కన house surgeon  , ఇద్దరు వైద్య విద్యార్థులు – ఆయన నోట్లోంచి రాగల ప్రతి మాటకోసమూ ఆత్రంగా వేచి చూస్తూ.

మెల్లగా ఆయన పేషెంట్ ల మంచాల మధ్య నడుస్తున్నారు.  పలకరించే సాహసం చేయాలనుకోలేదు కాని, నా మంచం దగ్గరికి వచ్చినప్పుడు బాగా తేరిపార చూడకుండా ఉండలేకపోయాను – గుర్తు పడతారేమోనని ఆశ. గుర్తు పట్టారు. ఒక్క క్షణం నుదురు చిట్లించి వెంటనే నవ్వేశారు. ” నా చిన్నారి లైబ్రరీ నేస్తం !!! ” అని సంతోషంగా  ప్రకటించుకుని, తన పరివారానికి నా గురించి చాలా చెప్పారు. నేను ఆయనకి సాయం చేశాననీ ప్రోత్సహించాననీ ఎంతో ధైర్యం ఇచ్చాననీ …అవునా ? ఇచ్చానా ? ఇచ్చాను కాబోలు !!!

ఇంకొక్క మాట మిగిలింది , అదీ చెప్పాలి. డిస్చార్జ్ అయాక పాప తోబాటు వాళ్ళింటికి వెళ్ళాను. ఆ చక్కని డ్రాయింగ్ రూం లో టీ పాట్ వెనక…ఆమె ఎవరు ? ఓహ్ ! మిస్ పోల్ …ఆయన ఆమెని పెళ్ళాడారు ! ఎంత బావుంది….ఎంత బావుంది ! ”

https://en.wikipedia.org/wiki/Eva_Ibbotson

http://www.amazon.in/s/ref=nb_sb_ss_i_1_12?url=search-alias%3Dstripbooks&field-keywords=eva+ibbotson&sprefix=Eva+Ibbotson%2Caps%2C316

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇతివృత్తాలూ….లక్ష్మణ రేఖలూ…

 

-చందు తులసి

~

తెలుగు కథల్లో సామాజిక అంశాలు మరీ పెరిగిపోతున్నాయి! వస్తువుకు మితిమీరిన ప్రాధాన్యం ఇస్తున్నారు!!
కొన్ని రకాల ఇతివృత్తాలతో రాస్తేనే మంచి కథ అనుకుంటున్నారు!!! ఫలితంగా మూసలో తెలుగు కథ చిక్కుకుపోయింది!
ఫలితంగా కథకు నష్టం జరుగుతోంది.  కథకుండే కళాత్మకత దెబ్బతింటోంది! ప్రమాణాలు పడిపోతున్నాయి. పాఠకులు తగ్గిపోతున్నారు!
ఈ మధ్య తెలుగు కథ గురించి వినిపిస్తున్న వాదనలు, ఆరోపణలివి….

సామాజిక అంశాలు పెరగడం వల్ల కథకు నష్టం జరుగుతుందా…?
వొక అంశం వల్ల  పాఠకులు దూరమో, దగ్గర అవుతారా…?
ఈ విషయం గురించి ఎవరేమనుకుంటున్నారు.? ఈ అభిప్రాయాలు మీ చర్చ కోసం

peepal-leaves-2013

కథకు, రచయితకు తను ఉద్దేశించిన పాఠకుల వర్గం వుంటుంది.  ఎవరి కోసం రాస్తున్నామో అనేది కూడా ముఖ్యం కదా. అలాంటపుడు చెప్పే తీరులో తేడా రావచ్చు. అలాగే సామాజిక ఇతివృత్తాలతో కథలు రాసేవారు కూడా కేవలం సమస్యను చెప్పడం దగ్గరే ఆగిపోకుండా…సమస్య లోతుల్లోకి వెళ్లి చర్చించాలి.  అపుడు
ఇటువంటి విమర్శకు అవకాశం వుండదు.  ఐతే విమర్శకులు కూడా గమనించాల్సింది రాసేవాళ్లని రాయనీయండి. మీ విమర్శ కూడా కథకుల్లో అధ్యయనం పెంచేలాగా ఉండాలి. నిర్మాణాత్మక సూచనలు చేయాలి. రచయిత తన కథను మెరుగుపెట్టుకునేలా వుండాలి.

– ఓల్గా

_________________________________________________________________________________________________

రాజకీయం వద్దనడమే పెద్ద రాజకీయం. కేవలం కళాత్మకంగా లేదనే పేరుతో సామాజిక ఇతివృత్తాలపై వచ్చే కథలని తక్కువ చేయలేం. సామాజిక ఇతివృత్తాలు రాయకూడదనుకుంటే ఎవరి జీవిత చరిత్రలు వారే రాసుకోవాల్సి వస్తుంది.  కళ ప్రజల కోసం, సామాజిక ప్రయోజనం కోసమే సాహిత్యం అనే వాదనను…తక్కువ చేయడం కోసమే వస్తున్న వాదన ఇది. ఉద్యమ సాహిత్యం కొంత తగ్గుముఖం పట్టినపుడు ఇటువంటి వాదనలు తలెత్తుతాయి. గురజాడ,  వీరేశలింగం కాలం నుంచి ఇప్పటి దాకా ..అనేక సార్లు ఈ వాదన వచ్చినా… ఎన్నడూ ఈ వాదన నెగ్గింది లేదు.  సామాజిక సాహిత్యం కోసం ఆలోచిస్తున్నవారు …ఇటువంటి వాదనలు వచ్చినపుడు మరింత అప్రమత్తంగా వుండాలి.  సాహిత్య కృషి మరింత పెరగాలి. రచయితలు ఆ దిశగా మరింత కృషి చేయాలి.

-ఎన్. వేణుగోపాల్

_________________________________________________________________________________________________

అసలు సమస్య …..సామాజిక ఇతివృత్తాలు పెరగడం, తగ్గడం కాదు.  కేవలం సామాజిక ఇతివృత్తాలతో కథలు రాసినా అది వ్యక్తిగతంగా రచయితకే తప్ప కథా సాహిత్యానికి జరిగే నష్టం ఏమీ లేదు. పైగా ఓ రచయిత రాసిన వొకటి రెండు కథలతో …అతని దృక్పథం అంచనా వేయలేము.  వెబ్ మ్యాగజైన్లు వచ్చిన తర్వాత….కొత్త తరహా పాఠకులు వస్తున్నారు. రచయితకు, పాఠకులకు మధ్య చర్చకు అవకాశం పెరిగిపోతోంది.  కాబట్టి సంప్రదాయ రీతిలో ఆలోచించి ….కొత్త తరం సాహిత్యానికి విలువలు ఆలోచించలేము.  అసలు ఇపుడు చర్చించాల్సిన విషయాలు వేరే వున్నాయి. కొత్త తరం రచయితల్లో చాలామంది….విషయాన్ని, సమస్యను లోతుగా అధ్యయనం చేయకుండానే కథలు రాస్తున్నారు.  రచనను సీరియస్ గా తీసుకుంటున్న వారూ తగ్గిపోతున్నారు. ఇవాళ మనం దృష్టి సారించాల్సిన అంశం
ఇది తప్ప…సామాజిక సమస్యలు పెరగడమే, తగ్గడమో కాదు.

-జీఎస్ రామ్మోహన్

_________________________________________________________________________________________________

సామాజిక స్పృహ అనేది రచయితకు వుండడం, తన రచనల ద్వారా వ్యక్తి తనలోనికి తను చూసుకునే విధానాన్నో, వ్యక్తి సమాజాన్ని చూసే చూపునో మార్చాలనుకోవడం తప్పు కాదు. బాధ్యత ఉన్న ఏ రచయిత ఐనా అదే పని చేస్తాడు. రచనకు అవసరమైన విషయం, అసలైన ప్రయోజనం కూడా అదే. ఐతే రచయిత తన బాధ్యత ఎంత ప్రతిభావంతంగా నెరవేరుస్తున్నాడనేది కథ ప్రమాణాలను నిర్ణయిస్తుంది. విమర్శకులు చేయాల్సింది అలాంటి గుణాత్మకమైన విశ్లేషణ.

ఇక మంచీ చెడు అన్ని కాలాల్లోనూ వుంటాయి. ప్రమాణాలు లేని రచనలూ ఎల్లపుడూ వుంటాయి. ఆ మంచి చెడ్డల నిష్పత్తి కొంచెం అటు ఇటుగా మారుతుండవచ్చు అంతే. పాతకాలం నాటి సాహిత్యం ప్రమాణాలతో ఇప్పటి సాహిత్యం పోల్చి గతమే మంచి అనుకోవడం మాత్రం పొరపాటు. ఈ రోజుకీ సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తించే రచయితలు వున్నారు. అందులో కొంతమందైనా మంచి కథలు రాస్తూనే ఉన్నారు.

-రమణమూర్తి

_________________________________________________________________________________________________

రచయితలతో పాటూ, పాఠకులు కూడా రకరకాల స్థాయిల్లో వుంటారు. ఆ క్రమంలో నువ్వెక్కడ వున్నావు అనే ప్రశ్న వుంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరికిన రచయితలు ప్రకటించుకుంటారు. దొరకని వారు వెతుక్కుంటారు. ఆ అవసరమే లేదనే వారికి కూడా నిర్వచించలేని పరిధి ఏదో వుండి వుంటుంది. సమాజంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక పరిణామాలు ఏదో మేరకు సాహిత్యాన్ని కూడా
ప్రభావితం చేస్తాయి కనుక…లాభం, నష్టం కేవలం కథవి మాత్రమే కాదు. ఇవాళ తెలుగు కథలో బహుళ తాత్వికతల సమన్వయం జరుగుతోంది. మార్క్సిజం-అంబేడ్కరిజం, మార్క్సిజం-స్త్రీవాదం…వంటి కాంబినేషన్స్ ను రచయితలు స్వీకరిస్తున్నారు. ఇవి తక్షణ ప్రయోజనాలా, దీర్ఘ కాలిక ప్రయోజనాలా అన్నది వేరే చర్చ. నలుగురి మేలు కోరే ..భావాల్ని పంచుకోవాలనుకోవడం ప్రధానం. అది ఎంత గాఢంగా, కళాత్మకంగా ఉంటే అంతగా సాహిత్యం ఉత్తమ స్థితిలోకి వెళ్తున్నట్లు.

-కె.ఎన్ మల్లీశ్వరి.

_________________________________________________________________________________________________

కథకులు ఎంచుకునే అంశాల వల్ల కథకు నష్టాలుండవు, లాభాలూ ఉండవు. మంచి కథని ఎంచేటప్పుడు అందులో అంశం సామాజికమా, సాంస్కృతికమా, శాస్త్రీయమా అన్నది లెక్కలోకి రాదు. అంశమేదైనా, దాన్ని కథగా ఎలా మలిచారనేది ముఖ్యం. ఆ పని సవ్యంగా చేసినప్పుడు – ఇతివృత్తం ఏమిటనేదానితో సంబంధం లేకుండా అది కథకి మంచే చేస్తుంది. అయితే మంచి కథ రాయటం చాలా కష్టమైన విషయం.

మరి అంత కష్టపడటం ఇష్టం లేనివాళ్లు కథలు రాయాలంటే ఎలా? దానికో దగ్గరి దారుంది. అదే సీజనల్ సాహిత్యం. ఏదేని విషయంపై దేశంలో సంచలనం చెలరేగుతున్న తరుణంలో ఆ ఇతివృత్తంతో వచ్చే కథలకి ఎంతో కొంత డిమాండ్ ఉంటుంది. చిక్కటి కథనం, బలమైన పాత్రలు, పదునైన సంభాషణలు, ఇలాంటివేమీ లేకపోయినా కేవలం ఆ ఇతివృత్తానికి ఆ సమయంలో ఉన్న ‘గ్రావిటీ’ ఇలాంటి కథలకి లేని బరువు సమకూరుస్తుంది. తెలుగులో ఈ తరహా కథలు రాన్రానూ పెరిగిపోతున్నాయి. దారుణ సంఘటనల దరిమిలా జనాల్లో నెలకొనే తాత్కాలిక ఉద్వేగాలు, ఉద్రేకాలే ఇంధనంగా బండి నడిపించే ప్రయత్నాలివి. ఈ కథల్లో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. వీటిలో చాలావరకు ఉదాత్తమైన వస్తువే తప్ప మంచి కథకుండాల్సిన లక్షణాలేవీ ఉండటం లేదు. ఆ విషయం ఎత్తిచూపిన వాళ్లని – ఆ కథలోని ప్రధానాంశాన్ని బట్టి – దురహంకారులనో, ప్రగతి నిరోధకులనో, మైనారిటీ వ్యతిరేకులనో, ఇంకోటనో ముద్రలేసే పరిస్థితి! దాంతో నికార్సైన విమర్శకులు నోళ్లు మూసుక్కూర్చుంటున్నారు. కథ ఎలా ఉన్నా చప్పట్లే రాలుతుంటే, అది చూసి, కథంటే ఇలాగే ఉండాలి కాబోలనుకుని యువకథకులూ అదే దారి పడుతున్నారు. హారర్, సస్పెన్స్, డిటెక్టివ్, క్రైమ్, హాస్యం – మొదలైన విభాగాల్లో మంచి తెలుగు కథొకటి చదివి ఎన్నేళ్లయిందో గుర్తు తెచ్చుకోండి. వెల్లువలా వచ్చి పడుతున్న ‘సందేశాత్మక’ కథల దెబ్బకి ఇతర తరహా కథలిష్టపడే పాఠకులు పారిపోయారు. ఫలితం? ప్రస్తుతం తెలుగులో పాఠకులకన్నా కథకుల సంఖ్య అధికం!

కాబట్టి నష్టం కలిగేది కథాంశం వల్ల కాదు. వస్తువుకి మితి మీరిన ప్రాధాన్యత ఇవ్వటం వల్ల; కొన్ని రకాల అంశాలని కళ్లకద్దుకుని కొలిచే ధోరణి వల్ల.

– అనిల్ -ఎస్-రాయల్

_________________________________________________________________________________________________

తెలుగు సాహిత్యం వికాసం. అభివృద్ధి, మొదటి నుంచీ వివిధ సంఘటనలతోనే ముడిపడి వుంది. మొదటి సంస్కరణ వాద కథల నుంచీ, అటు తర్వాత వామపక్ష ఉద్యమ ప్రభావం నుంచీ…ఇవాళ్టిదాకా అది విడదీయలేనంతగా కొనసాగుతూనే వుంది.

భవిష్యత్ లోనూ కొనసాగుతుంది. ఐతే  వ్యక్తి ప్రయోజనాలకే పెద్ద పీట వేసే పశ్చిమ దేశాల సాహిత్యం ప్రభావంతో మన దగ్గర కొందరు ఇటువంటి వాదన చేస్తున్నారు.  వర్తమానంతో సంబంధం లేని సాహిత్యం వుండదు.  కథలో కానీ, సాహిత్య రూపాల్లో కానీ వ్యక్తికి, అతని భావాలకు తప్పక ప్రాధాన్యం వుంటుంది. వుండి తీరాలి.  కానీ సమాజంలో కొన్ని సంఘటనలు జరిగినపుడు వ్యక్తి తప్పక ప్రభావితం అవుతాడు. అది కథగా మలిచినపుడు చెప్పిన తీరులో కొంత హెచ్చు తగ్గులుండవచ్చు. ఆ చెప్పిన తీరుపైన చర్చ చేయవచ్చు కానీ అసలు సామాజిక అంశాలే కథల్లోకి రాకూడదు అనడం అవగాహనా రాహిత్యమే.

-కరుణాకర్ ఎనికపాటి

_________________________________________________________________________________________________

ఫలానా అంశాల వల్ల కథకు నష్టం జరుగుతోందనే వాదన నేను విశ్వసించను. వొక రచయిత కథ చెప్పిన తీరులో తేడాలుండవచ్చు. వొక సారి ఉత్తమ స్థాయిలో చెప్పవచ్చు. కొన్ని సార్లు యథాతథంగా రచయిత చూసింది… జరిగింది రాయొచ్చు. ప్రతీ అంశాన్ని కళాత్మకంగా చెప్పే వెసులుబాటు రచయితకు ఉండకపోవచ్చు. చెప్పిన తీరుపైన చర్చ చేయవచ్చునేమో కానీ….ఫలానా అంశం చెప్పకూడదని అనలేం
కదా.

-పింగళి చైతన్య

_________________________________________________________________________________________________

మొత్తంగా ఈ అంశం సున్నితమైనదే కాదు… విస్తృతమైనది కూడా. కనుక ఈ అంశంపైన సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరముంది.
కథను సీరియస్ తీసుకున్న కొత్త తరం రచయితలకు, కథకు ఎంతో కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశమే ఈ చర్చలోని అసలు ఉద్దేశం. ఈ దిశగా మీ ఆలోచనలు, భావాలను పంచుకోవాలని కోరుతున్నాం.

సఫర్

 

may1

 

– రాధ మండువ

దృశ్యం: ప్రవీణ కొల్లి 

~

 

ఏదో పోయిందట నాలో.

పోయిన మనిషిని వెనక్కి తెచ్చుకుందామని ఇవాళ “గంట ముష్టి” (ఆంగ్లంలో అవర్లీ రేట్ ) తో ఉద్యోగం చేయించుకునే వాళ్ళకి ఓకె చెప్పేశాను.

“వెల్ కమ్ ఆన్ ది బోర్డ్ మిష్టర్ శ్రీరామ్” ఆత్మ లేని ఆత్మీయ గొంతు.

“ఇహిహి” అంటూ లేచి షేక్ హాండిచ్చి ఇంటికి బయల్దేరాను.

“మరీ ముద్దపప్పులా ఉండకుండా అవర్లీ రేట్ ఎక్కువ అడగండి. సాయంత్రం మీరొచ్చేటప్పటికి నేను ఉండను. నాలుగుకే బయల్దేరతా” పొద్దున నేను బయటికి వచ్చేముందు మెత్తని దిండు మీద తల పెట్టి మత్తు కళ్ళతో చూస్తూ సుజాత అన్న మాటలు గుర్తొచ్చాయి.

ఇంటికి వెళ్ళబుద్ధి పుట్టడం లేదు. వెగటు, ఏదో నొప్పి, కడుపులో దేవుతున్నట్లు.

ఎందుకు మనస్ఫూర్తిగా ఈ పని చేయలేను? నా కోసం నేను నిమగ్నమవగలిగిన విషయాలు కాకుండా ఇంకా ఇంకా సంపాదించాలన్న యావ కోసం లేదా స్టేటస్ కోసం ఎలా పనిచేయడం? దాని వల్ల లోకంలో కేయాస్ మరింత ఎక్కువవడం తప్ప ఏం ఒరుగుతుంది?

తెలీని ద్వేషం, కసి, బిడియం – సమాజం మీద, పెద్దవాళ్ళ మీద, ఇప్పుడు ఈమెకున్న కోరికల మీద.

“ఏమోయ్, మళ్ళీ ఉద్యోగంలో చేరావటగా మీ ఆవిడ చెప్పింది” గేటు తీస్తున్న నా భుజం మీద చరుస్తూ ప్రక్కింటి అంకుల్.

చిన్నగా తల తిప్పి తదేకంగా చూశాను అతని వైపు.

“ఏమిటీ ముఖం అలా ఉంది ఆరోగ్యం బాగాలేదా? అసలే బయట చలి జ్వరాలు” అన్నాడు తపతపలాడుతూ.

“చలి వల్ల కాదు. ఒళ్ళంతా కల్మషం పేరుకుని ఉంది. కడుక్కోవాలి” అన్నాను. నా మాటలు అర్థం కాక – అర్థం కావని తెలుసు ముసలాయనకి – ముఖం వేళ్ళాడేశాడు.

తాళం తీసి లోపలకెళ్ళి తలుపేసుకున్నాను.

 

***

ముష్టి ఎంతేస్తావు? ఎన్ని గంటలు అడుక్కోవాలి లాంటి మాటల వల్ల చేదయిన నోరుని శుభ్రం చేసుకోవాలనిపిస్తోంది. బ్రష్ చేసుకోవడానికి బాత్ రూమ్ లోకి దూరాను.

ఇలాంటి వ్యవహారాల్లో తపన పడటం, వీళ్ళందరికీ ఆలోచించి అవసరానికి తగ్గట్లుగా ఉత్తరాలు రాయడం, అఫిషియల్ గా సమాధానాలు చెప్పడం – ఇంతకు ముందు ఇవన్నీ చేసినవే అయినా ఇప్పుడు ఇలా మనీ మేటర్స్ డీల్ చేయడం బాధగా ఉంది… మరి ముందు ముందు ఎన్ని పాట్లు పడాలో?

అసలు దేని కోసం ఇప్పుడు మళ్ళీ ఈ పని? ఇన్నాళ్ళు చేశాను. ఉన్నది చాలదా? హాయిగా తిని ఇలా రాసుకుంటే ఏమవుతుంది?

“ఎక్కువ వత్తిడిలేని ఉద్యోగం తీసుకుంటాను అని చెప్పి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఆర్నెల్లు అవుతోంది. ఎప్పుడు చూసినా ఆ టేబుల్ ముందు కూర్చోని ఏంటి మీరు రాసేది… పైసాకి పనికి రాని పన్లు” ఆమె గొంతు కర్కశంగా…

మనిషి పక్కన లేకపోయినా కంఠం ఇంత ధాటీగా వినపడుతుందెక్కడనుండో…

సెల్ మోగుతోంది. “డాడ్, హౌ ఆర్యు?”

“యెస్ తల్లీ”

“డాడ్ మమ్ సెల్ అవుటాఫ్ కవరేజ్, అమ్మమ్మోళ్ళూర్లో సిగ్నల్స్ ఉండవేమిటో, సర్లే టెల్ హర్ ప్లీజ్ ఆమెకి కావలసిన డైమండ్ నెక్లెస్ సెట్ ఇక్కడ ఓక్ ట్రీ రోడ్ లో దొరికిందని”

“ఊఁ”

నా మూలుగు వినిందో లేదో ఫోన్ కట్ చేసేసింది.

ఇప్పుడవసరమా ఈమెకి డైమండ్స్? అడిగితే జరిగేదేమిటో కళ్ళ ముందు కదిలి వెళ్ళింది.

ప్రతి విషయంలోనూ వచ్చిన అశాంతి, అసంతృప్తి ప్రక్క వాళ్ళ మీదికి ప్రవహించి అట్నించి జలపాతం లా పెద్ద శబ్దంతో కాలాన్ని భళ్ళుమనిపించింది. మాటలు రాక మా్రన్పడిపోతే అటూ ఇటూ దుమికి నన్ను ఖండఖండాలుగా నరికి తిట్ల రూపంలో పారుతోంది.

బెడ్ చీదరగా ఉంది. ఉదయం లేచి దుప్పటి మడత కూడా పెట్టకుండా వెళ్ళిపోయిందనమాట. అసహ్యంతో దాన్ని విసిరి కొట్టాను. ఉన్న ఒక్కగానొక్క కూతురు తన కాపురం తను చేసుకుంటోంది. మా మీద ఆధారపడినవాళ్ళెవరూ లేరు. అయినా ఈమెకెందుకింత కాంక్ష?

గోడ మీదున్న రమణమహర్షి ఫోటో – కళ్ళల్లో స్వచ్ఛమైన ‘ఆత్మ’ ని దాచుకుని చూస్తున్నాడు నా వైపు. ఆ కళ్ళల్లో ఏదో శాంతి.

లేచి దుప్పటి తెచ్చి మడతపెట్టాను.

నాకేం కావాలో తెలీక, ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడం నేర్చుకోక, పెట్టుకున్నా సరిగ్గా లేక కుళ్ళుతూ ఏడుస్తూ రేపేదో ఇది వదిలిపోతుందని ఎదురుచూస్తూ ఆ ‘రేపు’ రాగానే మళ్ళీ ఇంకో ‘రేపు’ ని కల్పించుకుంటూ చచ్చేంతవరకూ సాగాలా ఈ జంఝాటం?

చెవులు మూసేసుకుని కళ్ళ మీదికి దిండును లాక్కున్నాను.

 

***

 

సముద్రం తనలో తాను ఆలోచించుకుంటుందేమో నిశ్చలంగా ఒంటరిగా ఉంది నాలా.

నెల పైగా అయింది ఆమె ఊరికి వెళ్ళడంతో ఒంటరి జీవితం మొదలుపెట్టి. అమితమయిన బాధ, సంతోషం, ఫ్రస్టేషన్ అన్నీ కలగలిసి ఉన్నాయి సరే – కానీ ఏదో సమ్ థింగ్ స్పెషల్ ఈ ఒంటరితనంలో. ఇష్టం వచ్చిన సమయంలో తోచిన భావ వ్యక్తీకరణ, జంకూ గొంకూ లేని స్వేచ్ఛాపూర్ణ సమయం.

ఇంకొక ముఖ్యమైన ఉపయోగం – చిన్నగా నిదానంగా వండుకుంటూ, వండిన వాటిని ఆస్వాదిస్తూ తింటూ ఉండటం.

విరగబడి, ఒరుసుకుంటూ, రొప్పుకుంటూ పనిపిల్ల చేత పని చేయించే ఆమె గుర్తుకొస్తోంది. దేనికంతగా రాపిడి? ప్రశాంతంగా కూడా చేసుకోవచ్చు అని మొదటి నుండే చెప్పి ఉంటే అలా విపరీతంగా ఉద్రేకించకుండా ఉండేదేమో!

ద్వేషం ఇద్దరి మధ్యా ఊడల్లా దిగాక ఇప్పుడనుకుని ఏం ప్రయోజనం?

గట్టిగా ప్రక్కవాళ్ళ మీద దాష్ఠీకం చేయడం, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నా ప్లాన్స్ తో కన్ఫర్మ్ చెయ్యడం – అలా జరగనప్పుడు తిట్లతో సత్కరించడం – ఇదంతా నా ‘నేను’ కి ఉన్న సహజమైన టె్రయిట్ అండ్ పవర్.

ఈ ‘నేను’ కి ఉన్న శక్తి అంతా ఇలా నిదానంగా రాసుకుంటుంటే బాగా తగ్గడమో, మాయమవడమో జరిగి అమితమైన ప్రశాంతతగా ఉంది. నా పని విలువ నిరూపణ అయిందన్న తృప్తేమో మరి తెలీదు. ఇదంతా ఇప్పుడు నాలో వచ్చిన మార్పు.

అంతకు ముందు ఆఫీస్ నుండొచ్చి ఇంట్లో ఆమె మీద మరింత ఎగరడం, అశాంతి ఉండేవి – ఇంత గొప్పవాడిని నేను, నన్ను సేవించుకుని నాకు బానిసలాగా ఉండాలి కదా! అన్నట్లుగా.

మనసులో ఉన్న చెడ్డ అంతా కరిగిపోతోంది జరిగిపోయిన జీవితాన్ని తలుచుకుంటున్నకొద్దీ.

ఇకనైనా మనసు ముడులు విప్పుకుందామన్న ప్రయత్నం.

ఇంత ఎక్కువ డబ్బు ఇచ్చే ఈ ఉద్యోగం కూడా పోతే ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉంది. అయితే అసలు బేసిక్ కోర్ లెవెల్ లో ఈ పని కూడా చేయాలని లేదనీ, ఉద్యోగం వదలడం వల్ల పెద్ద తేడా రాదనీ తెలుసు. బయటి ప్రపంచం వల్ల ఏర్పరుచుకున్న ఇమేజెస్ కారణంగా ఈ అవర్లీ రేట్ ఉద్యోగపు ముసుగు పడింది కానీ నాకు కావాల్సింది మినిమమ్ కంఫర్ట్స్.

అసహ్యమైన చూపుల బాకులు వెన్నులో గుచ్చుకుంటున్నాయి. నీలిగాలి వీపంతా పరుచుకుని ఊపిరాడనివ్వడం లేదు.

చిన్నప్పుడు ఎన్నో సార్లు నిజంగా ఆసక్తి ఉన్న విషయాల గురించి మాట్లాడటానికీ, చేయడానికీ ప్రయత్నించాను. అది వెంటనే ‘పనికి మాలినదిగా’, ‘సమాజంలో దేన్నీ సంపాదించి పెట్టలేనిదిగా’ చూడబడి వెలివేయబడింది – ఇమ్మీడియట్లీ డిస్ కార్టెడ్.

ఒక రకంగా నాకున్న ఆర్థిక స్థితి, నాకున్న అధికారం లేదా నాకున్న ఇతర నైపుణ్యాలు – వీటి వల్లనే మిగతా మోరల్స్ కీ, నైసిటీస్ కీ విలువ వస్తోందని ఒక నమ్మకం. ఇంకా సులభమైన మాటల్లో చెప్పాలంటే నువ్వో గొప్ప అధికారివైతే నువ్వు పాడే పాటలకీ, పద్యాలకీ విలువ – ఇదీ చిన్నప్పటి నుండీ పెద్దవాళ్ళు, పంతుళ్ళు మెదడులో సృష్టించిన చిత్రం. వీటికి లోబడిపోయి తమనీ, తమ ఇష్టాలనీ చంపుకునే వాళ్ళే తొంభై తొమ్మిది శాతం మంది నాలాగా.

వద్దు అక్కర్లేదు ఇష్టం లేని పని వదిలెయ్, ఏమవుతుందో చూసుకో….

చూసుకోవడానికే మెయిల్ పంపాను ఆమెకి…

 

టింగ్ అంటూ సెల్ లో ఆమె రాసిన మెసేజ్. అది చూసే ముందు నేను ఆమెకి రాసిన లెటర్ చదివాను –

సుజ్జీ,

నాకు నలభై దాటి ఐదారేళ్ళవుతోంది. ఇక రాసుకోవడం తప్ప నేను మరో పని చేయలేనని కన్ఫర్మ్ చేసుకున్నాను.

నాకు కావలసినదేమిటో స్పష్టంగా నీకు చెప్పాలని ఎన్నో సార్లు ప్రయత్నించాను. కాని నువ్వు వినవు.

మనకి ఒకరంటే ఒకరికి ఉన్న అసంతృప్తితో ఎన్నాళ్ళని జీవించడం? వద్దు సుజ్జీ, ఇది మనిద్దరికీ మంచిది కాదు. ఇక నీకు నచ్చే విధంగా నేనుండలేను – నాకు నచ్చే విధంగా నేను జీవించాలనుకుంటున్నాను కనుక. మనకున్న దాంతో తృపి్తగా నాతో జీవించగలిగితేనే నువ్వు రా. నచ్చని పని చేయకూడదనుకునే నేను నిన్ను నచ్చని పని చేయమని అననని నీకు తెలుసు కదా!

ఉంటాను

రామ్

 

‘మీకు తమాషాగా ఉందా? మళ్ళీ రిజైన్ చేయడం ఎందుకు?’ నవ్వొచ్చింది – ఆమె మెసేజ్ చూడగానే.

అవును తమాషాగా ఉంది. భలే అర్థం చేసుకుందే ఇన్నాళ్ళకి. ఆహా! ఇద్దరి దారులు కలవడం మొదలవుతోందనమాట వ్యతిరేకంగా అయినా…

 

***

 

ఫరవాలేదు. ఇది కలవడానికి నాంది.

 

******

 

 

ఆ జోలెలో మిగిలింది రక్తమేనా?!

 

– నిశీధి

~

నీ వారని పరాయని లేకుండా అందరి మాట  మన్నించే దేవ దేవా

ఇదుగో ఈ క్షణం గుమ్మంలో జోలె పట్టుకు నిలబడ్డాను

నీ వాకిలి ముందు నిలబడ్డ ప్రపంచానికి ఏమేమి దొరకలేదని ,

ఇహనిప్పుడు దురదృశ్టాలని అదృష్టంగా మార్చే వరకు

ఖాళీ చేతులతో వెనక్కి మరిలే పరిస్థితే లేదు , నా జోలె నింపి పంపు ప్రభూ

 

ప్రతి కవ్వాలిలో బహుశ  అమ్జాద్ ఫరీద్ సబ్రీ మనస్పూర్తిగా తలవంచి తను నమ్ముకున్న చిష్తి సూఫిజాన్ని గుండెలు  నింపుకొని  ఇదేగా పాడింది!! ఈతి బాధల నుండి రక్షించే మరణమే అల్టిమేట్ డెస్టినీ కాబట్టి సబ్రీ జోలె తాను కోరుకున్న కోరికలతో నిండిందని ఈ రోజు మనం అంతా  సంతోషించాలా  లేక తనకి అడ్డొచ్చే  ప్రతిప్రాణిని , తనని కాదన్న  ప్రతి ఆత్మని మూలంతో సహా నలిపేస్తూ రక్తాన్వేషిలా   ముందుకు వెళుతున్న మతమారణహోమాలని చూసి వణికిపోవాలా ?

జీవుల్లో అతి తెలివయిన జంతువుగా  మనిషి మారిపోయాక,  ఆ తెలివయిన  జంతువుకి ఒక  సంఘ జీవనం,  ఆ సంఘానికి ఒక కట్టుబాటు ఏర్పరచడానికి , ఒక ఆరోగ్యకరమయిన క్రమశిక్షణ అందించే క్రమంలో  మతం ఒక పదునయిన  ఆయుధంగా వాడబడటం , భూమి మీద హ్యూమన్  ఎవల్యూషన్ మొదలయిన ప్రతి చోట దాదాపు అలాంటివే ఒకేరకమయిన బీజాక్షరాలు,  మతం ఏదయినా  అయి ఉండొచ్చు  కాని అది మానవ మనుగడకి సపోర్టింగ్  సిస్టంగానే మొదలయింది అన్న  విషయాన్ని ఎవరం మర్చిపోలేం.  అలాగే ఎవల్యూషన్లో భాగంగా ఎదిగిపోయిన మనిషి మెదడులో మతాలూ సంఘాలు లాంటి ఎలాంటి నియంత్రణకి లోబడని క్రియేటివ్ ఆర్టిస్టిక్ భాగమూ అతి ముఖ్యమైనదేనని  బేసిక్ సైన్స్  చదువుకున్న అందరికి  తెలుసు. అయితే ఇపుడు ఇక్కడ సమస్య ఏమిటంటే కాలంతో పాటు ప్రాపంచిక విషయాలన్నింటినీ తనదిగా చేసుకుంటూ ఏక ఆధిపత్య ధృవంగా మారిపోతున్న మతం,  మతం తాలూకు  భయం , నెమ్మదిగా క్రియేటివిటీని కూడా మింగేస్తూ , తనని హైలైట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడే ఒక పక్క వాద్యంగా కళలనన్నింటిని వాడుకోవడమే  కాకుండా తనకి సపోర్ట్గా రాని ప్రతి కళని కళాకారులని మింగేస్తూ పోతుంటే చివరికి మిగిలే మరుభూమిలో సంఘాలు రాజ్యాలుగా , రాజ్యాలు  అధికారికంగానో అనధికారికంగానో మత రాజ్యాలుగా రూపాంతరీకరణ చెందుతున్న కాలంలో జనప్రియత కోరుకొనే కళ ఎక్కడ నిలబడాలి ? అటు కళ ఇటు మతం  రెండు మనసుని హాయిపరిచేందుకో లేక కొంత ఓదార్పుకోసమే అయితే రెండిటి అంతిమ లక్ష్యం  ఒకటే అయినపుడు ఒక వ్యవస్థ పూర్తిగా  ఇంకో వ్యవస్థని  తినేయడం  వలన జరిగే నష్టం నుండి మానవుడు   తేరుకోగలడా? లేదా ఇప్పటికే  తన నడవడి తో పాటు తన ఆలోచనలని నియంత్రిస్తున్న మతం  గుప్పిట్లో మరింతగా ఇరుక్కుపోయి ఇంకొంత  కుదించుకుపోతాడా ? కుదించుకుపోవడం అంటే తానూ మాత్రమే లేదు తానూ నమ్ముకున్న తనని కమ్ముకున్న మతం మాత్రమే  మిగలడం అంటే ఇహ సంఘ జీవనం కి , సహజీవనంకి అర్ధం ఏముంది ?

 

చరిత్ర సాక్ష్యం , పదకొండో  శతాబ్దం  అంతంలో బాగ్దాద్  మీద మంగోలియన్ దాడి జరిగినప్పుడు ముందు టైగ్రీస్ నది అక్కడి మనుష్యుల రక్తంతో ఎర్రబారింది ఆ తరువాత విలువైన అక్షరాల సిరానలుపు తో నల్లబడింది అని . మనుష్యులని మాత్రమే కాదు  సమూలంగా ఆ జాతి తెలివితేటలని  , భవిష్యత్తుని కూడా నాశనం  చేయడం మధ్య యుగంలో  యుద్ధాలకే కాదు ప్రస్తుతం సాగుతున్న  మత యుద్ధాలు , మతం పేరుతో మానవాళి పై ఏక జాతి చేయాలనుకొనే దాష్టికాలు ఇంకా  నడుస్తూనే  ఉన్నాయి అనిపిస్తుంది . ఒక జాతి లేదా  ఒక మత యుద్ధం మొదలయింది  అంటే ముందు స్త్రీలు పిల్లలు తరవాత ఆ జాతి రత్నాలయిన  కళాకారులు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతకాల్సిన  పరిస్థితులు రాతి యుగం నుండి ఈ కాలం వరకు సాగడం అసహ్యకరమయిన  తప్పని పరిస్తితిలా మారిపోయింది .

 

రాజ్యానికి మతానికి  అతీతంగా కళని ఆస్వాదించలేని  కుత్సితంలోకి  మనిషి , మనిషి పెంచుకున్న  వ్యవస్థలు లోబడిపోతున్నప్పుడు  సౌదీ  మరణ శిక్ష నుండి ఆఖరి నిముషంలో ప్రాణం నిలుపుకున్న  ఆశ్రాఫ్ ఫాయద్ లు , తమ నేలని  వదిలిపెట్టి పరాయి దేశాల్లో బ్రతకాల్సి వచ్చే తస్లీమా లు , సల్మాన్  రష్దీలు , MF హుస్సేన్లు ఒక పక్క ఆత్మని  అమ్ముకోకుండా  రాజ్యానికి మతానికి ఎదురునిలబడే క్రమంలో తమని తాముకోల్పోవడం చూస్తూ  ఉండగానే మరో పక్క  ఒక చార్లీ హెబ్డో , ఒక కల్బుర్గి , ఒక సబ్రీ , ఒక వాంగో ( 2004లో కాల్చి చంపబడిన  హలాండ్ ఫిలిం మేకర్ ),  ఒక Pippa Bacca ( 2008 లో చంపబడిన ఇటాలియన్  పర్ఫార్మెన్స్  ఆర్టిస్ట్ ) దాదాపు ప్రతి నేల మీద మత వ్యతిరేఖ ప్రతీకార చావులలో అస్థిత్వాన్నే  కోల్పోవడం సామాన్యంగా  మారిపోయింది  .

End of the day art is the only noblest form of human evolution అని నిజంగానే  మనం అందరం నమ్మినట్లయితే  ,ప్రపంచవ్యాప్తంగా సో కాల్డ్ ఒక మతపు జీహాదీలు , పేరు లేకుండా చాప కింద నీరులా కళలని కళాకారులని మట్టి చేస్తున్న ఇతరమతాల మూర్ఖత్వాలకి  వ్యతిరేఖంగా విశ్వవ్యాప్తంగా అందరు ఆర్టిస్ట్లు  ఆ కళలని  అభిమానిస్తున్న సామాన్య జనం మతరహిత మానవీయ దిశలో కళలనే కాదు  కళాకారులని  కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ప్రస్తుతం   కనిపిస్తుంది .

 

ముఖ్యంగా  చరిత్ర  మొదటి నుండి   ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు  ఎన్నిసార్లు రెక్కలు  తెంచినా   తిరిగిలేచే ఫీనిక్స్ పక్షిలా  కొత్త ఊపిర్లు పోసుకుంటున్న మితవాద సూఫీఇజం ఇప్పటికయిన కనిపించని దేవుడి ముందు జోలెలు పట్టుకు తిరిగే ఆశల్ని పక్కనపెట్టి కనిపిస్తున్న ఇస్లామిక్ టెర్రరిజపు మత మూర్ఖత్వాన్ని  ఇస్లాం నుండి పూర్తిగా  బహిష్కరించి ఒంటరిని చేసే దారులు ఆవిష్కరించడం తక్షణ కర్తవ్యం  . పై వాక్యం అన్ని మతాలకి ముఖ్యంగా  హైందవం భారత సంస్కృతని ఒకప్పుడు వైష్ణ శైవుల మధ్య పరస్పర హత్యలు . తరువాత కాలంలో చదువుకున్న , క్రియేటివిటీ  ఉన్నప్రతి దళితుడ్ని  ఎదో విధంగా అడ్డుకొని  ఇపుడు మళ్ళీ  మనదేశంలో    కొత్తగా  పేట్రేగుతున్న మతోద్దారుకులని వెనకేసుకొచ్చే  ఉదారవాద మత విశ్వాసులు కూడా అర్ధం చేసుకోవడం  ముందు ముందు  రాబోయే నష్టాన్ని అంచనా వేసుకొని గంజాయి మొక్కలు ఎదగక ముందే జాగ్రత్త పడటం చాలా అవసరం. లేదంటే  తొందరలో మనం కూడా మన తోటి దేశపు  మత విద్వేషపు విషాలలో మనదయిన హవిస్సులు నమామి  అనిపించడం  ఖాయం .

  • భర్ దో జోలీ యా  మొహమ్మద్ అంటూ సూఫీఇజపు తాత్విక పరిమళాలకి తనదయిన గంభీరత వదిలివెళ్ళిన అంజాద్ సబ్రీ పాటల  జ్ఞాపకంలో .

 

 

.

 

అంగా దంగా త్సంభవసి

 

 

 

– కల్లూరి భాస్కరం

~

రాత్రి పదవుతోంది. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి, మొహం కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చున్నాను. ఇంటికొచ్చేసరికి రోజూ ఆ వేళ అవుతుంది.

అంతలో వీధి తలుపు తోసుకుని ఏదో సినిమాపాట కూనిరాగం తీస్తూ మా రెండోవాడు హడావుడిగా లోపలికి రాబోయి నన్ను చూసి తగ్గాడు. నా మీద ఓ ముసినవ్వు పారేశాడు. నేను ఏమైనా అంటానేమోనని ముందుగానే నా మీద జల్లే మత్తుమందు ఆ ముసినవ్వు. తలుపు వెనకనుంచి మూడు తలకాయలు తొంగి చూసి, నేను కనబడగానే వాడితో ఏదో గుసగుసగా అనేసి మాయమయ్యాయి. వాడు తలుపు వేసేసి ఓసారి లోపలికి వెళ్ళి వచ్చి,

“నాన్నా! రేపు ఆఫీసునుంచి త్వరగా వచ్చెయ్యి. సెకండ్ షో సినిమా కెళ్దాం” అన్నాడు. ఆ మాటకు నా గుండెల్లో రాయి పడింది. నోట్లోకి ముద్ద దిగడం కష్టమైంది.

వాడు ముందురోజే ఓసారి అన్నాడు, “నాన్నా, రజనీకాంత్ సినిమా… చాలా బాగుంది. రేపు సెకండ్ షో కి వెళ్దాం” అని. వెళ్లినప్పుడు కదా, ఈలోపల వాడే మరచిపోతాడులే అనుకుని, “సరేరా” అన్నాను. కానీ వాడు మరచిపోలేదు. ఇప్పుడు మరింత కచ్చితంగా అన్నాడు. దాంతో నేనో బలిపశువులా సెకండ్ షో సినిమాకు వెడుతున్నట్టూ, థియేటర్ లో ఆ చీకటి నరకంలో కూర్చుని, బంగారం లాంటి నిద్రను బలిపెట్టి మూడు గంటల చిత్రహింసను భరిస్తున్నట్టూ ఊహించుకుంటూ ఉండిపోయాను. ఇప్పటినుంచే నా మొహంలో దైన్యం తాండవించింది.

“అమ్మా, నువ్వు కూడా రావాలి” అన్నాడు తల్లితో, శాసిస్తున్నట్టుగా.

నాకు మజ్జిగ వడ్డిస్తున్న మా ఆవిడ, “నాకు సినిమా వద్దూ, ఏమీ వద్దు. నేను రాను” అని అంతే కచ్చితంగా చెప్పేసింది. దాంతో వాడు మరింత ఫోర్సుతో, “నాన్నా, నువ్వు మాత్రం రావలసిందే” నని ఉత్తర్వు జారీ చేసేసి  లోపలికి వెళ్లి దుస్తులు మార్చుకుని వచ్చాడు.

నేనోసారి మా ఆవిణ్ణి చూశాను. అసూయ కలిగింది. ప్రశాంతంగా తన పని చేసుకుపోతోంది.  వాడు అడిగాడు,  రానని చెప్పేసింది…అంతే, ఆ విషయం ఇక తన బుర్రను తొలిచే అవకాశమే లేదు. బ్రహ్మరుద్రాదులు కూడా తనను సినిమాకు తీసుకెళ్లలేరని తనకు ఎంత తెలిసో మాకూ అంతే తెలుసని తనకు తెలుసు. కానీ నాకు ఆ లగ్జరీ లేదు. నా మీద మావాడిది ఉడుముపట్టు. కనీసం నిద్రనైనా కాపాడుకుందామనుకుని, “ఆదివారం ఫస్ట్ షో కు వెడదాం లేరా” అన్నాను.

“లేదు, టిక్కెట్లు దొరకవు” అన్నాడు.

ఆ తర్వాత కాస్త ఆగి, నామీద మరో ముసినవ్వు పారేస్తూ, “ మా ఫ్రెండ్ కార్లో తీసుకెడతాను. సెకండ్ షో అయితే రోడ్డు మీద ట్రాఫిక్ ఉండదు” అన్నాడు.

“కొంపదీసి నువ్వే డ్రైవ్ చేస్తావా?” అన్నాను సందేహంగా.

“అవును, ఈ మూడురోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నాను. నువ్వు, అన్నయ్య, నేనూ, మా ఫ్రెండూ…రేపు ఎనిమిదికల్లా ఆఫీసునుంచి వచ్చేయి” అన్నాడు భోజనానికి కూర్చుంటూ. నా గుండెల్లో రెండో రాయి పడింది…సినిమాకు వెళ్ళడం, అందులోనూ వాడు డ్రైవ్ చేస్తుంటే కారులో వెళ్ళడం!!

మొత్తానికి పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడు. తలవంచడం తప్ప నేను చేయగలిగింది కనిపించలేదు.

***

Kadha-Saranga-2-300x268

చిన్నప్పటినుంచీ వాడు నన్ను ఆదేశించడమే. అప్పుడు మా తండ్రీ-కొడుకుల పాత్రలు తారుమారైపోతాయి.  వాడి నోట ఆదేశం వచ్చిందంటే నాకు పెద్ద టెన్షన్. కాళ్ళూ చేతులూ ఆడవు. భోజనం దగ్గర ముద్ద దిగదు. వాడి మాట నెగ్గేవరకూ నేను ఓ పెద్ద గాలివానలో చిక్కుకుపోయినట్టు అనిపిస్తుంది. సరే నన్నతర్వాత కూడా బయటికి వాన వెలిసినట్టుంటుంది కానీ,  నా లోపల మాత్రం అస్థిమితం రేగుతూనే ఉంటుంది.

చిన్నప్పుడు లూనా మీద ఎక్కించుకుని వాణ్ణి ఎక్కడికో తీసుకెళ్లాను. వెళ్ళేటప్పుడు బుద్ధిగానే ఉన్నాడు. వచ్చేటప్పుడు, మెయిను రోడ్డు మీంచి ఇంటికెళ్లే రోడ్డు ఎక్కిన తర్వాత, తను డ్రైవ్ చేస్తానన్నాడు. నేను వద్దన్నాను, బతిమాలాను, బెదిరించాను. వాడు ససేమిరా అన్నాడు. నేను ధైర్యం చేయలేక మొండికేశాను. “అయితే, నేను నీతో రాను” అని దిగిపోయాడు. రోడ్డు మీద పెద్ద సీను. నడుచుకుంటూ వాడు… వాడి వెనక లూనా నడిపించుకుంటూ నేను…

వాడు ఎనిమిదో తరగతిలోకి వచ్చాడు. ఓ ఆదివారం రోజున అందరం కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నాం. ఉన్నట్టుండి వాడు, “నాన్నా, ట్యూషన్ కు వెళ్లడానికి నాకు సైకిలు కావాలి” అన్నాడు. అలా సన్నగా చినుకు మొదలైందనీ, కాసేపట్లో అది గాలివాన అవుతుందని నాకు తెలియదు. “సరేరా, కొంటానులే” అన్నాను యధాలాపంగా.  “ఎప్పుడు కొంటావు?” అన్నాడు. “ఓ వారం రోజులు ఆగు” అన్నాను. అంతలో పెద్దాడు అందుకుని “నాకు కూడా సైకిలు కొనిపెట్టలేదు” అంటూ సన్నగా అంటించాడు. “లేదు, ఇవాళే కొనాలి” అన్నాడు చిన్నాడు. అన్నం తినడం ఆపేశాడు. చినుకు జడివానగా మారుతున్న సూచన కనిపించింది. “ఇవాళ ఆదివారం రా. షాపులుండవు” అన్నాను. “మరెప్పుడు కొంటావు?” అన్నాడు. “రేపో, ఎల్లుండో చూద్దాంలే” అన్నాను. “లేదు. ఇవాళే కోనాలి. ఆబిడ్స్ లో ఆదివారం కూడా షాపులుంటాయి” అన్నాడు. “నీకేమైనా పిచ్చా, వెర్రా, ఆదివారం షాపులుండవురా” అన్నాను. “లేదు, ఉంటాయి” అన్నాడు. నేను కేకలేశాను, తిట్టాను, బతిమాలాను. వాడు వినలేదు. జడివాన గాలివానగా మారిపోయింది. భోజనాల దగ్గర కబుర్ల మూడు కాస్తా పోయి కర్ఫ్యూ వాతావరణం ఏర్పడిపోయింది. ఎవరి కంచంలోనూ పదార్థాలు కదలడం లేదు.

“సరే, సాయంత్రం ఆబిడ్స్ వెడదాంలే” అన్నాను. ఆ క్షణానికి వాన వెలిసింది.

సాయంత్రం నేనూ, పెద్దాడూ, వాడూ కలసి ఆబిడ్స్ వెళ్ళాం. ఒక్క షాపు కూడా లేదు. “చూశావా, చెబితే విన్నావా?” అన్నాను. “సరే, రేపు కొనాల్సిందే” అన్నాడు. ఆ రేపు తప్పించుకోలేనిదని నాకు తెలుసు.

తీరా సైకిల్ కొన్నాక నెలరోజులు కూడా తొక్కాడో లేదో, ఓ రోజు ట్యూషన్ కు వెళ్ళి సైకిల్ రోడ్డు మీద పెట్టి తాళం వేయడం మరచిపోయాడు. తిరిగి వచ్చేటప్పటికి సైకిల్ లేదు. రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇదీ కబురు. నేను వాడివైపు చూశాను. వాడు మాట్లాడకుండా ఓ ముసినవ్వు పారేసి మొహం పక్కకు తిప్పేసుకున్నాడు.  సైకిల్ పోయిన రోజున వాడంతట వాడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఓ పది రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. అందులో ఓ చిన్న లాకప్ ఉంది. అందులో ఉన్న ఓ నేరస్తుడికి వీడి మీద జాలేసింది. “ఎందుకా పిలగాణ్ణి అన్నిసార్లు తిప్పుతారు? మీ దగ్గరున్న ఓ సైకిల్ ఇస్తే పోలా?”అన్నాడు పోలీస్ పెద్దతో. ఎంత నేరస్తుడి సలహా అయితేనేం, అవును కదా అని పోలీస్ పెద్దకు అనిపించినట్టుంది. ఓ కానిస్టేబుల్ ను కేకేసి, సైకిలేదైనా ఉందేమో చూడమన్నాడు. అతను చూసొచ్చి, ఓ పాతసైకిలుందని చెప్పాడు. “అబ్బాయి, ఆ సైకిలు తీసుకుపో, నీ సైకిలు దొరగ్గానే ఫోన్ చేస్తాను. నెంబర్ ఇవ్వు” అన్నాడు. మా వాడు సరే నని ఆ సైకిల్ తీసుకొని ఇంటికొచ్చాడు. కానీ దాని మీద ట్యూషన్ కు వెళ్ళడం వాడికి నామోషి అనిపించింది. దానినో మూల పారేసి నడిచే వెళ్ళొస్తున్నాడు. పాపం, ఎంతో పట్టుబట్టి కొనిపించుకున్నాడు, వాడి ఉబలాటం తీరకుండానే కొత్త సైకిల్ పోయిందనుకుని జాలిపడ్డాను. “ఇంకో సైకిల్ కొంటాలేరా” అన్నాను. వద్దన్నాడు.

వాడు ఏదైనా కొనమంటే కొనకపోవడం ఎంత కష్టమో, వద్దంటే కొనడం కూడా అంతే కష్టం.

ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మిషిన్, కెమెరా, కంప్యూటర్, చివరికి వాక్యూమ్ క్లీనర్ తో సహా ప్రతిదీ వాడు ఇలాగే పట్టుబట్టి, పెద్ద టెన్షన్ సృష్టించి కొనిపించినవే. చిన్నాడితో కలసి వీటికి ప్లాను చేయడంలో, వాడికి పురెక్కించి నా మీద ప్రయోగించడంలో  పెద్దాడి తెరచాటు పాత్ర ఉంటుందని నాకు తెలుసు. ఇద్దరికీ నాలుగేళ్ల ఎడముంది. పెద్దాడికి నా దగ్గర కాస్త బెరుకు. బహుశా పెద్దాళ్ళు అందరూ అంతేనేమో!

ఖరీదైన వస్తువు కొనాల్సిన ప్రతిసారీ పర్సు బరువు తూచుకుని ముందు వెనకలవడం మామూలే. కానీ ఆ వస్తువు ఇంటికి వచ్చాక వాళ్ళ కళ్ళల్లోని ఉత్సుకత మెరుపులు చూస్తున్నప్పుడు, ఆ మెరుపుల అమూల్యత  ముందు ఆ వస్తువు వెల ఎంతో అల్పమనిపించేది.

***

రోజూ రాత్రి పదిలోపల ఇంటికొచ్చి, కాసేపు టీవీ చూసి, ఆ తర్వాత ఏదో పుస్తకం చదువుకుంటూ నిద్రకు ఉపక్రమించడం అప్పటికి కొన్నేళ్లుగా నాకైన అలవాటు. ఈరోజు ఆ అలవాటు తప్పుతున్నందుకు దిగులేసింది. చిన్నాడు ఆదేశించినట్టు ఉసూరుమంటూ ఎనిమిదికే ఇంటికొచ్చాను. పెద్దాడు ఇంట్లో ఉన్నాడు,   చిన్నాడు కనిపించలేదు.  ప్రోగ్రామ్ మారిందేమో నన్న చిన్నపాటి ఆశ తళుక్కుమంది. అంతలో ఎప్పటిలా హడావుడిగా చిన్నాడు తలుపు తోసుకొచ్చి, నన్ను చూసి తృప్తిగా ఓ ముసినవ్వు పారేసి, “మా ఫ్రెండ్ బయలుదేరాడు. ఈలోపల భోజనం చేసేసి రెడీ అవుదా” మని, వాళ్ళ అమ్మను తొందరపెట్టాడు.

యాంత్రికంగా భోజనం ముగించి, కాసేపట్లో ఎదుర్కొబోయే రెండు శిక్షల గురించి తలపోస్తూ కూర్చున్నాను. సెకండ్ షో సినిమాకు వెళ్ళి నిద్ర కాచుకోవడం ఒక శిక్ష. అసలు సినిమాకు వెళ్ళడం అంతకంటే పెద్ద శిక్ష. సినిమాకు వెళ్ళడాన్ని శిక్షగా నేను ఊహించుకోవడం నాకే ఆశ్చర్యంగానూ, వింతగానూ అనిపించింది. నేను అప్పటికి ఓ పదిహేనేళ్ళ క్రితంవరకూ విపరీతంగా సినిమాలు చూసేవాణ్ణి. అందులోనూ విజయవాడలో పెరిగానేమో, చిన్నప్పటినుంచీ సినిమా పిచ్చి ఎక్కువుండేది. విజయవాడ నా దృష్టిలో సినిమా పిచ్చోళ్ళ నగరం. ఆమాటకొస్తే, సినిమా వచ్చాక ప్రపంచమంతటా అనేక తరాలు సినిమాలు, సినిమాల ఊహల మధ్య పెరుగుతూ వచ్చారనీ; సినిమా నిత్యావసరాలలో ఒకటిగా, జీవితంలో ఒక భాగంగా మారిపోయిందనీ అనిపిస్తుంది. ప్రేయసీప్రియులు చాలా అరుదుగా దొరికే ఏకాంతపు చీకటిలో గుసగుసలు పంచుకునే తన్మయ క్షణాలు, కొత్త జంట తమ మధ్య సరికొత్త సాన్నిహిత్యాన్ని అల్లుకునే అపురూప ఘడియలు, పుట్టినరోజు పండుగ, పరీక్షఫలితాలు వచ్చిన ఆనందం, ఉద్యోగంలో తొలి జీతం అందుకున్న సందర్భం… ఇలా ఎన్నింటినో తెర మీది సినిమా మన జ్ఞాపకాల యవనిక మీద మధురంగా ముద్రిస్తుంది.

దుర్గాకళామందిరం, అలంకార్, వినోదా, లక్ష్మీ టాకీస్, విజయా టాకీస్, జైహింద్, ఈశ్వర్ మహల్…ఇలా విజయవాడలోని థియేటర్ల పేర్లతో పెనవేసుకుపోయిన నా సినీ బాల్యస్మృతులు ఇప్పటికీ నాలో ఏదో తెలియని తీపిని నింపుతాయి. సినిమా నాలో ఎంత మోహం పుట్టించేదంటే, ఇంట్లో తెలియకుండా ఒకే రోజు రెండు సినిమాలు చూసిన సందర్భాలూ, మరునాడు పరీక్ష ఉన్నాసరే, కోరికను చంపుకోలేక సినిమాకు వెళ్ళిన సందర్భాలూ ఉన్నాయి. నచ్చిన ఒకే సినిమాను పాతిక, ముప్పై సార్లు చూడడమూ ఉంది. అంతేకాదు, నచ్చిన సినిమాకు మిత్రులతో కలసివెళ్లి చూడడం, ఆ సినిమా గురించి చర్చించుకోవడం మరింత రంజుగా ఉండేది.

కానీ  నాకూ, సినిమాకూ ఉన్న ముడి ఎప్పుడో, ఎక్కడో తెగింది. క్రమంగా సినీ వైరాగ్యం ఏర్పడింది. బహుశా బాల్యకౌమారాలు గడిచి, యవ్వనయానంలో ముందుకు వెడుతున్నకొద్దీ నా సినిమా అభిరుచి మరింత నైశిత్యాన్ని తెచ్చుకుంటూ ఉండడం, దాంతో నన్ను తృప్తిపరిచే సినిమాల సంఖ్య నానాటికీ తగ్గిపోవడం, నేను మరీ ‘చూజీ’గా మారుతుండడం ఒక కారణం కావచ్చు. ఏమో, నాతోపాటు సినిమా ఎదగలేదేమో! సమయాభావం ఇంకో కారణం. ఎదిగిన సినిమాను గాలించి పట్టుకోడానికి కొంత అదనపు సమయం కేటాయించాలి. కానీ నా ఉద్యోగ స్వభావరీత్యా, థియేటర్ కి వెళ్ళి సినిమా చూసే సమయం కాదు సరికదా, మంచి సినిమాను వెతికి పట్టుకునే అదనపు సమయం కూడా దొరకదు. ఒక్క సెలవు రోజున తప్ప బయట సాయంత్రాలు గడిపే అవకాశం ఉండదు. చాలా అపురూపంగా దొరికే సెలవు రోజును ఇంటిదగ్గర విశ్రాంతిగా గడపాలనిపిస్తుంది. ఈ మధ్యలో మిత్రులతో సినిమాకు వెళ్ళి, సినిమా నచ్చక మధ్యలోనే వచ్చేసి వాళ్ళకు కోపం తెప్పించిన సంఘటనలూ ఉన్నాయి.

మా ఆవిడకు అసలు సినిమా ఆసక్తే లేకపోవడం నా సినిమావైరాగ్యానికి కలిసొచ్చిన ఒక సుగుణం.

సినిమాలు చూడడమే మానేశానని కాదు. టీవీ వచ్చాక మనం వద్దనుకున్నా సినిమాలు కంటబడుతూనే ఉంటాయి. నచ్చకపోతే రిమోట్ ప్రయోగించి పీక నోక్కే అదనపు సౌలభ్యం ఉంది. నచ్చితే చివరివరకూ చూడడమూ ఉంది. అయితే థియేటర్ కు వెళ్ళి సినిమా చూసే అలవాటు పూర్తిగా పోయింది. అందులోనూ ఒంటరిగా వెళ్ళి చూసే అలవాటు ఇంకా ముందే పోయింది. మొత్తానికి నాకూ,సినిమాకూ మధ్య దూరం చాలా పెరిగిపోయింది. అందుకు నేనే కారణం తప్ప సినిమా కాదు.

***

ఫ్రెండు కారు తెచ్చాడు. నేనూ, పెద్దాడూ వెనక సీట్లో, ఫ్రెండు ముందు సీట్లో కూర్చున్నాం. చిన్నాడు కారు స్టార్ట్ చేస్తూ ఒకసారి నావైపు చూసి ఓ ముసినవ్వు పారేసి, “నాన్నా, కంఫర్ట్ గా కూర్చో” అన్నాడు. లోపల బితుకు బితుకు మంటూనే ఉంది. అయినా వాడు ప్రమాదం చేయడన్న ధీమా కూడా ఏమూలో ఉంది.

థియేటర్ కి చేరుకున్నాం. నన్నోచోట నిలబెట్టి ముగ్గురూ టిక్కెట్లు తేవడానికి వెళ్లారు.

ఎన్నేళ్లయిందో థియేటర్ కి వెళ్ళి! నేను దిక్కులు చూస్తూ నిలబడ్డాను. నేనేదో అపరిచితప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తోంది. వర్షించే దీపకాంతుల మధ్య ఆ పరిసరాలు కొత్తగానూ, అయినా అందంగానూ కనిపించాయి. ఉత్సాహపు తుళ్ళింతలతో చిరునవ్వులు పోటీ పడుతుంటే ఎవరెవరో జంటలు కళ్ల ముందు మెరుపుతీగల్లా కదలి వెడుతున్నారు.

పిల్లలు టిక్కెట్లు తెచ్చారు.

సినిమా  మొదలైపోయిందేమో, టిక్కెట్లు దొరకుతాయో, దొరకవో అన్న భయంతో పరుగుపరుగున థియేటర్ కు వెళ్ళడం, అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర వెలుగుతున్న దీపాన్ని, ఆ దీపం కింద మనిషిని చూసి పెద్ద రిలీఫ్ పొందడం, టిక్కెట్లు తీసుకోవడం, వాటిని గేటుకీపరుకు ఇచ్చి, అతను చింపి ఇచ్చిన టిక్కెట్ ముక్కలు తీసుకోవడం, లోపలికెళ్లి చీకట్లో సీటు కోసం తడుముకోవడం, సీట్లో కూర్చోడం…ఇవన్నీ సినీ సమ్మోహనం కలిగించే పారవశ్యాన్ని క్రమగతిలో అంచులు తాకించే ఘట్టాలుగానే నా స్మృతులలో ఉండిపోయాయి. పిల్లల వెనక థియేటర్ లోకి వెడుతుంటే ఆ స్మృతులు ఒక్కొక్కటే నా మనోఫలకంపై తళుక్కుమంటూ నన్ను వెనకటి రోజుల్లోకి తీసుకెళ్ళడం ప్రారంభించాయి. అలా చుక్క చుక్కలుగా మనసులోకి జారడం మొదలైన నా బాల్య కౌమారయవ్వనకాలపు సినీ దర్శనోల్లాసం, టార్చిలైటు వెలుగులో సీట్లు వెతుక్కుని వెళ్ళి కూర్చునే సమయానికి మడుగులు కట్టసాగింది. ఆ ఉల్లాసం ఉరవడిస్తున్నకొద్దీ నాలోని సినీవైరాగ్యం ఎటో కొట్టుకుపోసాగింది. నేను తిరిగి నా బాల్యకౌమారయవ్వన సినీఅనుభూతిని పునర్జీవించడం ప్రారంభించాను. నా కళ్ళనిండా అప్పటి ఉత్సుకత మెరుపులు కమ్ముకుంటున్నాయి.

నాకు అంతా ఆశ్చర్యంగానూ, వింతగానూ ఉంది.

నాకు ఒక పక్క చిన్నాడు, ఇంకో పక్క పెద్దాడు. నా కళ్ళల్లోని ఆ మెరుపులే వాళ్ళ కళ్ళల్లో కూడా కదలాడుతున్నట్టు ఆ చీకట్లో సైతం పోల్చుకున్నాను. నా మెరుపుల అసలు రహస్యం అర్థమైనట్టు తోచింది. వాళ్ళ కళ్ళలోంచే అవి నా కళ్ళల్లోకి ప్రవహిస్తున్నాయి. కాంతిహీనమవుతున్న నా కళ్ళకు ఆ కళ్ళు తమ మెరుపుల్ని ఎరువిస్తున్నాయి. ఇప్పుడు మూడు జతల కళ్ళతో సినిమా చూస్తున్నాను. నేనే ముగ్గురిగా విభజితమైపోయాను. వాళ్ళిద్దరూ తమ కళ్ల  మెరుపుల్నే కాదు, తమ యవ్వనోత్సాహాన్ని నాలోకి ప్రవహింపజేస్తున్నారు. తమ యవ్వనాన్నే నాకు ఎరువిస్తున్నారు. అటూ ఇటూ కూర్చున్న ఆ ఇద్దరూ నా శిథిలయవ్వనాన్ని లేవదీసి నిలబెట్టే ఊతకర్ర లనిపించారు.

ఆ వెంటనే ఈ ఊహ సరికాదేమో ననిపించింది. నిజానికి నాకు రెండువైపులా ఉన్న నా కంటి మెరుపుల్నే నా కళ్ళల్లోకి తోడుకుంటున్నాను. నాకు రెండువైపులా ఉన్న నా యవ్వనాన్నే నాలోకి ప్రవహింపచేసుకుంటున్నాను. నాలోంచి ఉద్భవిల్లిన నా యవ్వనమే నాకు అటూ ఇటూ రెండు ఊతకర్రలుగా మారి నా శిథిలయవ్వనాన్ని నిలబెడుతోంది.

యయాతి కథ గుర్తొచ్చింది. యయాతి తన వార్ధక్యాన్ని మీలో ఎవరైనా తీసుకుని మీ యవ్వనాన్ని నాకు ఎరువివ్వండని కొడుకుల్ని అడుగుతాడు. చిన్నకొడుకు పూరుడు ముందుకొచ్చి తన యవ్వనాన్ని తండ్రికిచ్చి అతని వార్ధక్యాన్ని తను తీసుకుంటాడు. వార్ధక్యాన్ని తీసుకోవడం అలా ఉంచితే, పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి ఎరువివ్వడంలోని అసలు రహస్యం ఇప్పుడు బోధపడినట్టు అనిపిస్తోంది. తండ్రి కొడుకు రూపంలో తన బాల్య, కౌమార, యవ్వనాలను పునర్జీవిస్తాడు. తండ్రే కొడుకవుతాడు. శకుంతల దుష్యంతునితో అంటుంది…”అంగా దంగాత్సంభవసి” అని వేదవచనం. భార్య గర్భంలో ప్రవేశించి భర్తే కొడుకుగా పుడతాడు. తండ్రికీ కొడుకికీ తేడా లేదు.

సినిమా అయిపోయింది. నా కొడుకుల రూపంలోని యవ్వనంతో కలసి బయటికి ఉత్సాహంగా అడుగులు వేశాను.  నాలో వెనకటి నిర్వేదం, నిరాసక్తి లేవు. కారు స్టార్ట్ చేస్తూ చిన్నాడు వెనక్కి తిరిగి యధాప్రకారం నామీద ఓ ముసినవ్వు పారేసి, “ఎలా ఉంది నాన్నా?” అని అడిగాడు. “చాలా బాగుందిరా” అన్నాను మనసునిండా, తృప్తిగా.

మళ్ళీ సినిమా కెళ్లాలన్న వాంఛ నాలో రహస్యంగా రగిలింది!

***

ఇప్పుడు మంచి సినిమాల సమాచారం కోసం నా చూపులు ఆబగా గాలించడం ప్రారంభించాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బాగున్నాయని టాక్ వచ్చిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాల వాల్ పోస్టర్లు ఊరిస్తున్నాయి. థియేటర్లు తమవైపు గుంజుతున్నాయి. కానీ ప్రతిసారీ సినిమా కెళ్లాలన్న రుచికరమైన ఊహ ఊహగానే అణిగిపోతోంది. కారణం…పిల్లలు దగ్గర లేరు. నాలోంచే ఉద్భవించి, నాకు అటూ ఇటూ ఉండి సినిమాకు నడిపించిన ఆ రెండు ఆ కౌమార,యవ్వనోత్సాహపు శక్తి కేంద్రాలు ఇప్పుడు నా పక్కన లేవు. ఒకప్పటి నా కళ్లలోని ఔత్సుక్యపు మెరుపుల్ని తమ కళ్ళల్లోకి ఒడిసిపట్టి వాటితో నా కళ్ళను రీచార్జి చేసిన ఆ రెండు జతల కళ్ళు ఇప్పుడు  చదువులు, ఉద్యోగాలు, కెరీర్ వేటలో దూర తీరాలకు సాగాయి. మోహకత్వం, అద్భుతత్వం, ఉత్సుకత నిండిన అందమైన ప్రపంచంలోంచి;  భయభీతులు, బేలతనం నింపే కఠోర వాస్తవాల జీవన పోరాటక్షేత్రంలోకి అడుగుపెట్టి నలుగుళ్లు పడుతున్నాయి.

ఎప్పుడైనా  ఇంటికొచ్చి నాలుగురోజులు గడిపినా ఏదో చికాకు, ఏదో టెన్షన్, ఏదో తొందర…ప్రపంచాన్ని ఒక ఆశ్చర్యంగా, నిత్యనూతనంగా దర్శించే ఆ చూపుల్లోని కుతూహలపు తళకులు మసగబారుతున్నాయి. వాళ్ళ జీవనప్రాధాన్యాలలో సినిమా క్రమంగా అట్టడుగుకు జారిపోతున్నట్టుంది. ఆ నోట సినీ కూనిరాగాలు అంతగా వినిపించడం లేదు. వాళ్ళు క్రమంగా నాలానే సినిమాకు దూరమవుతున్నారు.

నేనే అవుతున్నారు!

నాలో కొత్తగా జ్వలించిన సినీ సందర్శనేచ్ఛ నిశ్శబ్దంగా నాలోనే అణగారిపోసాగింది.

జీవన పోరాటపు అలసట ఒక అలవాటుగా మారి అందులోనే స్థిమితాన్ని వెతుక్కునే యాంత్రికతకు మళ్లిన తర్వాత, ఎప్పుడో ఏ దశలోనో నాలానే వాళ్ళు కూడా తమ పిల్లల బుజాల మీద చేతులు వేసి సినిమాకు వెడతారు. వాళ్ళల్లోంచి తమ బాల్యకౌమారయవ్వనోత్సాహాన్నీ, ఔత్సుక్యపు మెరుపుల్నీ తోడుకుంటూ సినిమా చూస్తారు. అంతసేపూ వాళ్ళు తమ బాల్యకౌమార యవ్వనాలను పునర్జీవిస్తారు.

ఆ తర్వాత వాళ్లలానే వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల పిల్లలు, ఆ పిల్లల పిల్లల పిల్లలూ…

సృష్టి తెర మీద జీవిత చలనచిత్రం నిర్విరామంగా ఆడుతూనే ఉంటుంది.

 

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఓ చిన్న చిరునవ్వు

-గోరంట్ల సాహెబ్ పీరా సాయి 
~
ఓ చిన్న చిరునవ్వు
అసంకల్పితంగా నిన్ను గుర్తు చేస్తుంటుంది.
ఓ విశ్రాంత సాయంకాలం పూట..
పదే పదే గిరికీలు కోడుతున్న నైటింగేల్ గొంతు లా
నీ జ్ఞాపకం తాకుతూ వెలుతుంటుంది…
అప్రస్తుతమైన ప్రసంగపాఠం
బలవంతంగా నాలోకి చోరబడాలని
విశ్వ ప్రయత్నం చేస్తుంటుంది
కనురెప్పలపై పేరుకున్న
ధూళి మేఘాల్లోంచి ఏవో చిరు చినుకులుగా మారి
నను తడపాలని ప్రయత్నిస్తుంటాయి.
ఔను
ఇంతకూ నేనెవర్నని
తడిమిచూసుకున్నాక
నేనెక్కడో స్థిమితంగా వుంటాననుకుంటూ
ఓ దీర్ఘ శ్వాసతో విశ్రాంతికి
బయలు దేరుతుంటాను
దేహంలోంచి
కొత్త లోకంలోకి..

బువ్వకుండ-ఒకానొక పురావర్తమాన గాథ

 

 

నూతన పారిశ్రామికవిధానాల తరువాత భారతదేశంలో కులవృత్తులుక్షీణించడం కనిపించినప్పటికి ఈ గుర్తింపు ప్రపంచీకరణ నాటికి ప్రధానంగాకనిపిస్తుంది.తెలుగుకవిత్వంలో దళితకవిత్వం వచ్చిననాటినుండే బహుజన,ముస్లిం మైనారిటీ స్పృహలున్నాయి.ఒక కాలంలో ఇవన్నీ మూకుమ్మడిచైతన్యాన్ని ఆసరా చేసుకుని నడిచాయి.ఇప్పటికి భావజాలంలో అంతగా వైరుధ్యాలు లేవనే అనాలి.జూలూరి గౌరీశంకర్”వెంటాడే కలాలు”,జ్వలితా దెంచనాల మిత్రులు తెచ్చిన “రుంజ”లాంటివి బహుజన స్పృహను సాహిత్యంలో పదిలం చేసాయి.ఇతరంగా కొందరు కవులు రాసిన కవితలు,సంపుటాలు,సంకలానాలుకూడా ఈ మార్గానికి ప్రాతినిధ్యం వహిస్తాయి.

అన్నవరం దేవేందర్ “బువ్వకుండ” దీర్ఘ కవిత ఇలాంటి బహుజన తాత్వికతను ముడివేసుకుని వచ్చిన కవిత.ప్రధానంగా కుండయొక్క పురా చరిత్రను దృష్టిలో పెట్టుకుని వచ్చినప్పటికీ,ఈ కవితలో ప్రపంచీకరణ,కులవృత్తుల విధ్వంసం,కుండ సాంస్కృతికంగా జీవితంలో నిలైపోయిన తీరు మొదలైన అంశాలను చిత్రించారు.మానవ నాగరికతలోనే కుండ తయారీకి ఒక ప్రధానమైన చారిత్రక భూమిక ఉంది.చరిత్రకు మానవశాస్త్రానికి ఉండే భూమిక గొప్పది.చరిత్రకారులు ఆసియా ప్రాంతపునవీన శిలాయుగాన్ని(Neo-Lithical period in Asia)మూడు సాంస్కృతిక దశలుగా చెప్పారు.1.ఆరంభ నవీన శిలాయుగం,2.కుమ్మరిపని తెలియని నవీన శిలాయుగం(Pre -Pottery Neo lithic).3.కుమ్మరిపని తెలిసిన నవీన శిలాయుగం(Pottery Neo lithic) ఈ కాలంలో కుమ్మరిపని తెయటమే ప్రధానం అందువల్ల కేవలం సంస్కృతిలోనే కాకుండా నాగరికతలోనే ఇది ప్రధానకేంద్ర బిందువుగా కనిపిస్తుంది. ఈ కాలం కూడా సుమారు క్రీ.పూ.9000 నుండి 2000 గా చెబుతారు.”కెన్యా”లాంటిప్రాంతాలలో ప్రాచిన శిలాయుగానికి చెందిన కుండ పెంకులు కనిపించినా నవీన శిలాయుగంలోనే వీటి వాడకం ఎక్కువ.

అన్నవరం కవితలో ఏడు భాగాలున్నాయి.నాలుగైదుభాగాల్లో కుమ్మరి వృత్తికారుల పరిస్థితి,చివరిభాగాల్లో ప్రపంచీకరణ పరినామాలు వివిధకులవృత్తుల గురించి చిత్రించారు.కుమ్మరి వృత్తికి,కుండకు చారిత్రక భూమిక ఉన్నా అన్నవరం కవితలో వర్తమాన చారిత్రక,సాంస్కృతిక భాగాలున్నాయి.ఒకటి రెండుచోట్ల చారిత్రక,సాస్త్రీయ అంసాలు చిత్రించడం కనిపిస్తుంది.

 

మూడువేల సంవత్సరాలకింద/సింధూమేపొటేమియా సందుల/నేల తవ్వకాల కిందనే/ఈ కుండ ఆనవాలు దొరికింది”-(3.పే)

‘ పచ్చికుండను వాముల కాల్చి/బువ్వకుండను చేసిన శాస్త్రజ్ఞుడే/కుమ్మరి బ్రహ్మ”-(పే.3)

సారెచక్రం యంత్ర సాంకేతికతకు కేంద్రం/ప్రపంచగమనాన్ని,పనితనాన్ని/వేగిర పరచిన మహా సాధనం”-(7.పే)

మొదటివాక్యం చారిత్రకాంశాన్ని,రెండవది వైజ్ఞానికాంశాలను ప్రకటిస్తాయి.మట్టిని పామిన బుట్ట అనుకోకుందా కాలినప్పుడు కుండకు సంబంధించిన తయారీకి ఆలోచనలు వచ్చాయని శాస్త్రవేత్తల అంచనా.రెండవ వాక్యం కుండల తయారీలోని రెండవ దశను చిత్రించడం కనిపిస్తుంది.కుండల తయారీ వైజ్ఞానిక శాస్త్ర ఆరంభానికి ఉపయోగ పడిందన్న శాస్త్రవేత్తలు అందులోని రసాయనిక చర్యను  విశ్లేషించారు.తయారీకి ఊప్యోగించే మట్టిలో ఉన్న “హైడ్రేటెడ్ సిలికేట్ అఫ్ అల్యూమీనియం”(నిజానికి పలు చర్యల ద్వార మట్టిలో దీన్ని తయారుచేయడం కూడా కుమ్మరుల పనే)ను వేడిచేయడం ద్వారా నీటిని తొలగించడమే.చివరి వాక్యంలో సారె చక్రాన్ని(Potter wheel)గురించిన ప్రస్తావన ఉంది.కాల క్రమంలో బండి చక్రం అంతగా ఉందికాని,ప్రారంభదశలో దీని పరిమాణం చిన్నది.

 

అన్నవరం కవితలో ప్రధానంగా సంస్కృతి,ఆధునిక దశలు కనిపిస్తాయి.

 

1.”అన్నం వండే బువ్వ కుండ/అందరికీ తల్లి కూర అటికనే ఆది శక్తి”

2.”గరిగ బుడ్ది అయిరేండ్లు కూరాడి కుండలు/లగ్గం నాగెల్లి ఇండ్లల్ల దీవెనార్తుల ఆనవాళ్లు”-(పే.19)

3.”గాజుబొత్తలు దీపంతలు గోలాలు/లొట్లు బింకులు పూలకుండీలు”-(పే.19)

4.చావగానే అగ్గిపట్టేది మట్టిచిప్పలనే/అంతిమ యాత్ర ముందే అగ్గికుండ నడక/మన్నులోంచి మంటలో కలిసేదాకా/మట్టి పాత్రల మహత్మ్యమే ఇది”-(పే21)

 

5.”దీపావళికి దీపంతల పిలుపు/ఉగాదినడు వాకిలినిండా పచ్చటి పట్వల పంచాంగం/పెండ్లికుండలాకు పట్టిన వొల్లెడ ఒక కీర్తి/ఐరేణి కుండలమీద చిత్రకళలు”-(పే.27)

 

ఈవాక్యాలన్నిటిలో మట్టితోచేసిన ఆకృతులు,వాటి రూపంతో సంస్కృతికి ఉన్న సంబంధాలు కనిపిస్తాయి.మానవశాస్త్రంలో సంస్కృతి లక్షణం(Cultural trait) అనేపదాన్ని వాడుతారు.పైవాక్యాల్లో కుండ జీవితంలో అవసరాల్లోనే కాకుండా వివాహం నుంచి చావుదాకా ఎలా సంబంధం కలిగిందో చిత్రించడం కనిపిస్తుంది.

ఈవాక్యాల్లో కుండ సంస్కృతి విస్తరించిన సమగ్ర చిత్రం (Configuration)కనిపిస్తుంది.బెనడిక్ట్,మార్గరేట్ అనే శాస్త్రవేత్తలు సంస్కృతిలో వివిధ విభాగాలున్నాయని,అవి భిన్నమైన ప్రకార్యాలను నిర్వహిస్తాయని ‘విన్యాసవాదం”ను ప్రతిపాదించారు.అన్నవరం వాడుకున్న పదాలను గమనిస్తే “కూర అటిక”కూరాడు పేరుతో కులదేవత గా శుభకార్యాల్లో వాడే కుండ.ఐరేండ్లు-ఐరేణి ,ఐంద్రి లాంటి దేవతలకు ప్రతినిధులు.జీవన వ్యవహారంలో వంటపాత్రలుగ,నిలువకుండలుగా ఉపయోగం తగ్గిందిగాని,సంస్కృతిలో ఇంకా ప్రధాన భాగస్వామిగానే ఉంది.

“ప్రపంచీకరణ మాయకన్నా ముందునుంచే/కులవృత్తులు కునారిల్లుడు మొదలైంది/గ్లోబలీకరణ డేగచూపులకు  అన్నివృత్తుల్లానే/కుండలు వానడం పురాగ ఆగిపోయింది”

“మట్టి మహిమ స్థానంలో స్టెయిన్ లెస్ స్టీల్/కుండల స్థానంలోకుకర్ విజిల్లు/మట్టినిలోహం పురాగ మింగింది”-(పే.29)

ఈవాక్యాలు విధ్వంసాన్ని చిత్రిస్తాయి.ఈ కవితలో “సల్ప,రౌతు,సున్నగంటు సలప,సారె,గుబ్బిగడ్డ,సారెకోల,”వంటి పదాలతోపాటు “”వానుడు”లాంటిపదాలను రికార్డుచేసారు.కులవృత్తులగురించి వచ్చిన కవితల్లో “బువ్వకుండ”తన స్థానాన్ని నిలబెట్టుకోడమే కాకుండా ఇంకా రావాల్సిన అవసరాన్ని చెబుతుంది.ఒక సుదీర్ఘ సృజనానుభవం తరువాత అన్నవరం దేవేందర్  నడకను ఈ కవిత ఒక మలుపుతిప్పిందనడం అతిశయోక్తి కాదు.

జన్నెకిడిశిన గిత్తగుండెల ప్రేమజనించింది

 

 

-కందికొండ

~

 

ఒక్క తల్లి గర్బంల నా బుజం మీద వాడు వాని బుజం మీద నేను శేతులేసుకోని ఉమ్మనీరులో తేలాడుకుంట, నేను ముందు వాడు ఎనుక అముడాళోళ్ళమై(కవలపిల్లలు) పుట్టినట్టు వాడు నన్ను అన్న.. అన్న… అని మస్తు ప్రేమతోని పిలిశెటోడు. నోట్లె అన్నను బయటికి తీశెటోడు కాదు. గుండెకే గుండె వుంటే ఆ గుండెకే పెదవులుంటే ఆ పెదవులు అన్న.. అని పిలుస్తె ఎంత డెప్త్‌గుంటది. ఎంత ప్రేమగుంటది. ఎంత పావురంగుంటది అట్లుండేది. ఒక్క ముక్కల జెప్పాల్నంటే వాడు అన్న. అనంగనే ఆ మాట నా కర్ణభేరిని తాకంగనే నా చెవులల్ల అమురుతం(అమృతం) పోషినట్టుండేది. వాని పేరు రాజు. వాంది మా పక్కిల్లు. వాడు మా అవ్వోడో, అయ్యోడో గాదు. మా కులపోడో, తలపోడో గాదు కాని మేం ఒకలంటే ఒకలకు మస్తిష్టం. ఎంతిష్టమంటె గుండె కోషి ఇచ్చుకునేంత ఇష్టం. మేము ఈ ఫేసులే తెలువని ఫేస్‌బుక్కు ఫ్రెండ్సు గాదు, మాకు తెలువులచ్చి, ఊహ తెలువకముందు నుంచెల్లే మేము ఒకలకొకలం తెలుసు.

వాళ్ళ అవ్వ, మా అవ్వ మా ఊరి పొలాలల్ల నాటేసెదానికి, కలుపు తీసెదానికి పోయెటప్పుడు మమ్ముల్నిద్దర్ని ఒక ముసలవ్వకు అప్పజెప్పి ఆ ముసలవ్వకు ఎంతో కొంత పైసలిచ్చి మా ఇంటి ముందు యాపశెట్టు కిందనన్నా, వాళ్ళింటి ముందు చింతశెట్టు కిందనన్నా వాకిట్ల ఇడిషిబెట్టి పోయెటోళ్ళట. నేను, రాజుగాడు అంబాడుకుంట (పాకుకుంట), పడి లేసుకుంట, నవ్వుకుంట, తుళ్ళుకుంట పొద్దుగూకెదాక మా అవ్వలు నాటుకు, కలుపుకుబోయి వచ్చెదాక వాకిట్ల ఆడుకునెటోళ్ళమట. అగో… మేము అప్పడిసంది ఫ్రెండ్స్..

మాది వరంగల్ జిల్లాల చిన్న కుగ్రామం. మా ఊళ్లె మాకత్తు పోరగాండ్లం శానామందిమె వుండెటోళ్ళం కని మేం ఇందరమే మంచి సాయితగాండ్లం (ఫ్రెండ్స్) అయినం..మా ఊరి బడిల ఐదో తరగతి వరకే వుండేది. మేము 1978ల బడికి పోవుడు మొదలుబెట్టినం. ఒక పెద్ద తాటాకు కమ్మల కొట్టంల ఏక్లాసోల్లను ఆక్లాసుల లెక్కన కొంచెం దూరం దూరంగా కూసుండబెట్టేటోళ్ళు. రాజుగాడు నేను పక్కపక్క పొంటి కూసునెటోళ్ళం. అప్పుడు షాబద్ బండలా… ఏమన్ననా.. న్యాల(నేల)మీద మట్లె(మట్టి)నె కూసోవాలే. లాగులు రాకిరాకి పిర్రలకాడ శినిగిపోయేటియి. లాగులు షినిగిపోకుంట వుండాల్నని యూరియ పిండి బస్తాల సంచులు తీసుకపోయి ముడ్డికిందేసుకోని కూసునెటోళ్ళం. అట్లా అందరు ఎవ్వల బస్తా వాళ్ళేసుకొని కూసుంటాంటె రాజుగాడు మాత్రం అన్న.. మన రొండు బస్త సంచులు ఒకదానిమీద ఒకటేసుకుని కూసుందమే అనెటోడు. కూసున్నంక నాకు ఎక్కువ జాగిచ్చి  వాడు సగం మట్టిల్నే కూసునెటోడు “ఎహె బత్తమీద కూసోర రాజుగా మట్టంటుతాందికాదుర నీ కాళ్లకు” అని నేనంటే “ఎహే నాకేంగాదు లేవె నువ్వు మంచిగ గూకో”అనెటోడు. పిచ్చి గాడిది రాజుగానికి నేనంటె శాన ప్రేమ.

ఎండకాలంల మా ఊరి చెరువులకు ఈతకు బోయెటోళ్ళం. మాకు ఈత ఎవ్వలు నేర్పలే. మాకు మేమే నేర్చుకున్నం. మేము నీళ్ళల్ల ముంచుకునుడు ఆట ఆడుకునెటోళ్ళం. ఎవ్వల వంతచ్చినప్పుడు వాళ్ళు  తతిమ్మోళ్ళను (మిగతావాళ్లను) ముంచాలె. ముంచుతాంటె తతిమ్మోళ్ళు తప్పిచ్చుకోవాలె. నావంతు వచ్చినప్పుడు రాజుగాడు దొరికినా నేను వాణ్ణి ముంచకపోయేది. వాని వంతచ్చినప్పుడు వాడు నన్ను ముంచకపోయేది.

మేము తాడిచెట్టు అంత ఎత్తునుంచెల్లి చెరువుల దునుకెటోళ్ళం. రాజుగాడైతే డై కొట్టెటోడు. ఇప్పటి పోరగాడ్లను సూతె నవ్వత్తది. స్విమ్మింగు పూల్లకు నడుముమంటి లోతులకు దిగెదానికి కూడా నడుము సుట్టు ట్యూబ్ వుండాలె. అంత నాపగాండ్లు బాయిలర్ కోడీ బతుకులయిపోయినయ్. “జిసం మే తాకత్ నియే దిల్‌మే దమ్ బీ నియే”. మా కత్తు (వయసు) పోరగాండ్లం అందరం గలసి తలా (ఒక్కొక్కరు) పది పైసలు కలేసుకొని టౌన్‌కుబోయి ఒక లబ్బరు  శెండు(బాల్)కొనుకచ్చుకున్నం. పెంకాసులు ఒకదాని మీద ఒకటి పెట్టి పల్లి ఆట ఆడెటోళ్లం.శెండుతోని కొట్టుకునుడు ఆట ఆడుకునెటోళ్లం. నన్ను రాజుగాడు, రాజుగాణ్ని నేను చిన్నగ కొట్టుకునెటోళ్ళం. వేరేటోళ్ళనయితే ఈడిషికొట్టేటోళ్ళం. తతిమ్మా పోరగాండ్లందరూ మమ్ములిద్దరిని తొండి బాడుకావ్‌లు అని తిట్టెటోళ్ళు.

మా ఊళ్ళె ఐదో తరగతి అయిపోంగనే మాకు T.C.లిచ్చిండ్లు. మేము వరంగల్‌కు పోయి U.P.S. బళ్ళె శేరికయినం. దీంట్లె 6th, 7th సదవాలె తరవాత హైస్కూల్ అది వేరే బడి మళ్ళా.

ఏడు గంటలకే ఒత్తుల వేడినీళ్ల తోటి తానం జేసి(స్నానం) రాజుగాడు, నేను తయారయ్యెటోళ్ళం. అప్పుడు మా అవ్వలు కట్టెల పొయ్యి మీద అన్నం, కూర వండతాంటెనే ఓ పక్క(వైపు) ఒత్తుల (కుండ)నీళ్లు కాగేటియి. ఏడుగంటలకే బువ్వ తిని రాతెండి టిపిని గిన్నెల (లంచ్ బాక్స్)అన్నం బెట్టుకొని ఐదు కిలోమీటర్లు కంకరరోడ్డు మీద చెప్పులు లేకుంట వట్టికాళ్లతోటి నడుసుకుంట బోయెటోళ్ళం. సాయంత్రం నాలుగ్గొట్టంగ  బడి ఇడిషిబెట్టేది. నాలుగునుంచెల్లి నాలుగున్నర దాక డ్రిల్లు (ఆటలు) పీరియడ్. బడి ఇడిషిబెడుతరు కాని గేటుదాటి బయటికి పోవద్దు. అక్కణ్ణె ఆడుకోవాలే. రాజుగాడు నేను గోడ దునికి ఇంటిబాట బట్టేది. టౌన్ నుంచెల్లి మా ఊరికి ఐదు కిలోమీటర్లు నడువాలే. అక్కడ ఆటలాడుకుంట కూకుంటే మాకు కుదురది గదా. ఎండకాలంల బుజాలమీద వయ్యిలు(పుస్తకాలు) పెట్టుకొని పోతాంటే చేతుల చెమట వయ్యిలకంటి (బుక్స్‌కు అంటి) చేతుల పదను(తడి)తోటి పుస్తకాలు కరాబయ్యేటియి. అప్పుడు వయ్యిలకు (బుక్స్‌కు) అట్టలేసుకుందామంటే న్యూస్‌పేపర్లు దొరుకకపోయేటియి. ఇట్లయితే కుదరదని మా ఊళ్ళె టైలర్”ఖాదర్” దగ్గర యూరియా పిండి బస్తాల సంచులతోటి చెరో (ఒక్కొక్కరం) వయ్యిల సంచి కుట్టించుకున్నం. ఇగ వయ్యిలు, కాపీలు,ఆ సంచులల్ల ఏసుకోని సంచి బుజానికేసుకోని పోయెటోళ్ళం. ఇప్పటి పొట్టెగాండ్లకు అన్ని సౌలతులు(సౌకర్యాలు) వున్నా సదివి సావరు. “సదువు సారెడు బలుపాలు దొషెడు” అయిపోయింది ఇప్పటి సదువు. యాసంగి సదువులు.

మా అప్పర్ ప్రైమరీ స్కూల్  హెడ్ మాస్టర్ పేరు బాలయ్య సారు. మేం ఆ బడిల శెరీకయ్యినప్పుడే ఆ సారు ఓ కొత్త ఇల్లు కట్టుడు సురువు జేషిండు(మొదలు చేశారు). ఆ కొత్తింటికాడ శానా చిల్లర పనులుండెటియి. మిగిల్న కంకర ఒక దగ్గర నుంచెల్లి ఇంకోదగ్గర కుప్పబోసుడు. ఇంటిముందు పోషిన మొరం కుప్పల  నేర్పుడు (సమాంతరంగ చేయడం), ఇటుకలు ఇరిగిన ముక్కలు ఒక దగ్గర, మంచి ఇటుకలు ఒక దగ్గర పేర్సుడు, గిలాబు కోసం దొడ్డు వుషికెను(లావు ఇసుకను) సన్నగ జల్లెడబట్టుడు, పదను(క్యూరింగు) కోసం గోడలకు, స్లాబ్‌కు నీళ్లుగొట్టుడు, అర్రలల్ల (రూమ్స్) బోసిన మట్టి అణుగాల్నని “దిమ్మీస”గుద్దుడు ఇసొంటియి.

మేం పల్లెటూరోళ్ళం మంచిగ పనిజేత్తమని తెల్లబూరు (White Hair) చెప్రాశి(ప్యూన్) యాకుబ్‌ని పంపిచ్చి మమ్ముల పిలిపిచ్చెటోడు బాలయ్య సారు. మేము సంకలు గుద్దుకుంట సంబురంగ సారు కడుపు సల్లగుండ అనుకొని సారు కొత్తింటి పని జేసెటానికి పోయెటోళ్ళం. మా లెక్కల (మాత్స్) సారు చెయ్యబట్టి మాకు బడంటె బయ్యమయ్యేది. లెక్కలేమో అర్ధం గాకపోయేది. a2+b2=2ab..అని ఏందేందో శెప్పేది. ఇంటి పనిచ్చేది(హోం వర్క్).  చేసుకరాకపోతే మా శేతులు తిర్లమర్ల జేపించ్చి బ్లాక్‌బోర్డ్ తుడిసేటి చెక్క డస్టర్‌తోటి పటపట కొట్టేది. ఒక్కొక్కసారి మాకు మస్తు కోపమచ్చి అరె.. మాకు అర్ధమైతలేవు సారు ఏంజెయ్యాలే అనాల్ననిపిచ్చేది. నోటిదాకచ్చేది కని ఆపుకునేది. అందుకే ఆ దెబ్బలకన్నా ఈ పనే నయ్యమనిపిచ్చేది.

మాకు కష్టం జేసుడంటే సంబురం. మేము పల్లెటూరోళ్లం, ఉత్పత్తి కులాలోళ్లం గదా,మా బతుకుల నిండా కష్టముంటది, కన్నీళ్లుంటయి, ఆకలుంటది, అవమానముంటది, పోరాటముంటది. అందుకే గద్దరన్న పాట రాయలే. “కొండ పగలేసినాం, బండలను పిండినాం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు గట్టినాం, శ్రమ ఎవడిదిరో సిరి ఎవడిదిరో” అని.. మేం బిచ్చగాండ్లకు ఎక్కువ, మధ్య తరగతోళ్లకు తక్కువ. దిగువ మధ్య తరగతోళ్లం. బతుకు దినదిన గండమయినోళ్లం, దిగులే బతుకయినోళ్ళం ఇప్పటికి కూడా అట్లనే వున్నయ్ మా బతుకులు. పనిజేసి పగటాల్ల   కాంగనే కాళ్లు రెక్కలు కడుక్కొని మా రాతెండి టిపిని గిన్నెలల్ల తెచ్చుకున్న  అన్నం తినెటోళ్ళం.

తింటాంటె బాలయ్య సారు భార్య మాకు రొండు బొక్క పిలేట్లిచ్చి (పింగాణి ప్లేట్స్) వాళ్ల ఇంట్ల కూరలు తెచ్చిచ్చేది. ఆమె చేతికి మొక్కాలే. ఏమేషి వండేదో ఏమోగాని, మస్తు రుసుండేటియి. అప్పుడప్పుడు ఆమె “సాంబార్” బోశేది. మాకు పప్పుశారు, పచ్చి పులుసు తెలుసుకని ఈ సాంబార్ తెల్వది. మా ఇండ్లళ్ల అప్పుడు సాంబార్ శెయ్యకపొయ్యేది. దాని పేరు సాంబార్ అని కూడా మాకు సరిగ్గ తెల్వది. ఆ సాంబర్ పోసుకొని తింటాంటే శానాసార్ల రాజుగాని తోటీ నేననేది “అరె రాజుగా ఈ సాంబారేందిరా గింత రుశి పాడుబడ్డది” అని వాడనేది అన్న.. ఇంకింత బోసుకోవే…. పోసుకో అని మొత్తం నా పల్లెంల కుమ్మరించెటోడు లంగగాడు. నేనంటె వాణికి సచ్చేంత ఇష్టం. మొత్తం నాకే పోషినవేందిర పిచ్చిగాడిది అని తిడితే నవ్వేది. అన్న నువ్వు పిచ్చిగాడిది అంటె నాకు మంచిగనిపిస్తదన్న అని మళ్ళా తిట్టిపిచ్చుకునేటోడు.

మా ఊరినుండి టౌనుకు పోతాంటే కుడిచెయ్యిరోకు (రైట్ సైడ్)”లంజపుట్నాల” చెట్టుండేది. ఈ చెట్టు ప్రత్యేకతేందాటంటే ఆ చెట్టు పుట్నాలు (పండ్లు) సప్పుడు జెయ్యకుంట, మాట్లాడకుంట, సైలన్స్‌గా, చీమె చిటుక్కుమన్నంత సప్పుడుగూడ జెయ్యకుంట తెంపుకొని తింటె మస్తు తియ్యగ వుంటయంట. తెంపుకుంట మాట్లాడినా, నోట్లెబోసుకొని నమిలేముందు మాట్లాడినా, గుసగుస పెట్టినా, నవ్వినా, దగ్గినా, తుమ్మినా, చేదు అయితయట. అందుకే వాటికి లంజపుట్నాలు అని పేరొచ్చిందట అని ప్రచారంల వుండేది. ఇసొంటి చెట్లు చానా ఊళ్లల్ల వుంటయ్. ఈ ఇత్తునం (విత్తనం) ఇప్పుడు శానా తగ్గింది. ఇప్పటి పొట్టెగాండ్లకు తెల్వకపోవచ్చుకని మా కత్తోళ్ళ (వయసు)కు తెలుసు.

రాజుగాడు నేను ప్రతిరోజు బడికిపోయెటప్పుడు వచ్చెటప్పుడు తప్పకుంట “లంజపుట్నాల” శెట్టు పుట్నాలు(పండ్లు) తెంపుకునెటోళ్లం. రాజుగాడు వుస్తు కోతిగాడు, ఎచ్చిడోడు, వుచ్చిలి మనిషి. తెంపుతానంటెనన్న నవ్వేది, లేకపోతే దగ్గేది, తుమ్మేది. నోట్లెబోసుకోని నవులేముందన్న నవ్వేది, గుసగుసబెట్టేది. ఏదో ఒకటి మాట్లాడేది. రోజులు, నెలలు, సంవత్సరాలు వాంది ఇదే కత. “అరె రాజుగా నీకు దండం బెడుత ఈ రోజన్నా మాట్లాడకురా, ఇగిలియ్యకురా, దగ్గకురా, తుమ్మకురా అని వాణి గదువపట్టుకోని బతిలాడెటోణ్ణి (రిక్వెస్ట్) సరే.. అన్న.. అనేటోడు.. తీరా…పుట్నాలు తినేముందు మళ్లా ఏదో ఒకటి చేశెటోడు.

అప్పుడు మా దగ్గర పైసలు అసలే వుండేటియి కాదు. మాకు మా అవ్వనాయినలు కూడా పైసలిచ్చెటోళ్ళు గాదు. పాపం వాళ్ల దగ్గరకూడా వుండేటియిగాదు. మాయి మస్తు లేమి కుటుంబాలు కని మాకు తొవ్వ ఖర్సులు, శేతి ఖర్చులుంటయిగద, మాకు కోముటోళ్ళ దుకాండ్ల కొబ్బరి శాకిలేట్ళు, ఉప్పు బిస్కీట్లు కొనుక్కోవాల్నని వుండేది. సిన్మాలు సూడాల్నని వుండేది. మేం పైసలు సంపాయించుడు కోసం “పెంట బొందలమీద  సీసవక్కలు ఏరుకునెటోళ్ళం” చెరో యూరియా బస్తసంచి పట్టుకొని మా ఊరంత తిరిగి ఏరుకునెటోళ్ళం. అప్పుడు మా ఊళ్ళె ఖాళీ జాగాలల్ల  ఎక్కువ చిలుక పర్రాకు చెట్లు, ఎంపలిచెట్లు, బోడసరం చెట్లు, జిల్లేడు శెట్లు, శెవుకచెట్లు వుండేటియి.

ఎంపలి చెట్లల్ల ఎక్కువ సీసవక్కలు దొరికేటియి. మా బస్తాలు నిండంగనే తువ్వాలలు  సుట్టబట్ట చేసుకొని నెత్తిన బెట్టుకోని టౌన్‌కు బోయేటోళ్ళం. రాజుగానికి నేనంటె ఎంత ప్రేమంటే పెద్ద సీసవక్కల బస్త వాడెత్తుకొని చిన్న సీసవక్కల బస్త నాకు ఎత్తెటోడు.” అరె… పెద్దది నేనెత్తుకుంటరా అని నేనంటె ఎహె.. ఊకో అన్న.. నీది సుకాశి పాణం(సుకుమారమైన). నువ్వు నా అంత కష్టం జెయ్యలేవే. నేనే పెద్దది ఎత్తుకుంటలే అనెటోడు. అంతంత బరువులు ఎత్తుకొని పోతాంటె కూడా ఆ “లంజపుట్నాల” చెట్టుకాడ మాత్రం ఆగెటోళ్లం. పుట్నాలు తెంపుకొని తినేముందు మళ్లా రాజుగాడు నవ్వుడో, తుమ్ముడో, దగ్గుడో చేసెటోడు. అరెయ్… రాజుగా లుచ్చ బాడుకావ్ గిట్ల జేసేదనికేనార ఆపింది అని నేను తిడితె ఏం జెయ్యాల్నన్నా నవ్వు ఆగుతలేదే అని మళ్లా కిలుక్కున నవ్వెటోడు. టౌన్‌కుబోయి సీసవక్కలు జోకి(తూచి) అమ్మి వచ్చిన పైసలు చెరిసగం పంచుకునెటోళ్లం. కని ఇప్పటి శాతగాని దొంగనాకొడుకులు ఆడోళ్ళ మెడలల్ల బంగారు గొలుసులు తెంపుకపోతాండ్లు. మళ్ళ వాళ్లకు ఈ పోలీసోళ్ళు మస్త్ పోష్(Posh)గా స్టైల్‌గా ఓ పేరు బెట్టిండు చైన్ స్నాచర్లట.. చైన్ స్నాచర్లు.

ప్రతిరోజు ఈ పది పన్నెండు కిలోమీటర్లు బడికి నడువలేక మేం సాంఘిక సంక్షేమ హాస్టల్ల  చేరినం. మాకు పొద్దున 8.30కు పప్పుతోని, మళ్లా సాయంత్రం 5.30 గంటలకు కూరగాయలతోటి అన్నం బెట్టేటోళ్ళు  పొద్దున, సాయంత్రం. పచ్చిపులుసు మాత్రం రొండు పూటల వుండేది. మేము లైన్ల నిలబడి రాతెండి పల్లాలల్ల అన్నం బట్టుకోని తినెటోళ్ళం. అప్పుడప్పుడు అన్నంల పురుగులత్తె పక్కన పారేశి తినేటోళ్ళం. వారానికోసారి మాకు హాస్టల్ల ఉడుకబెట్టిన కోడిగుడ్డు బెట్టేటోళ్ళు. రాజుగాడు వాణి గుడ్డు గూడ నాకేసెటోడూ. అరె లంగగాడిది నీది నువ్వు తినరాదురా అని నేనంటే “అన్న… నువ్వొకటి నేనొకటానే” అనెటోడు. బళ్లెగాని రాజుగాణ్ని ఎవ్వలన్న కొడితె ఉరికచ్చి నాకు శెప్పెటోడు.

రాజుగాడు జెర దైర్నం (ధైర్యం) తక్కువ మనిషి. నా అంత మొండోడుగాదు. నేను మోర్‌దోపోణ్ణి. రాజుగాణ్ణి కొట్టినోణ్ణి రాజుగాడు నాకు సూపియ్యంగనే నాకు సింహాద్రి సిన్మాల NTRకు వత్తదిగదా కోపం BP, BP అని కుడిశెయ్యితోని తలకాయ కొట్టుకుంటడు సూడుండ్లి గట్లచ్చేది కోపం.  వాని గల్లబట్టి తెరి బహెన్ కీ, అని గిప్ప… గిప్ప… గుద్దెటోణ్ణి మళ్లా రాజుగాడే ఏ వద్దు ఇడిషెయన్న ఇడిషెయ్ అని బతిలాడేటోడు నన్ను గుంజుకపొయెటోడు. అరాజుగాడు చానా ప్రేమ మనిషి ఎదుటోళ్లు బాధపడితే సూడలేదు. మేం హాస్టల్ల ఒకటే రూంల పక్కపక్కన ఇనుప సందూగలు పెట్టుకొని ప్యాన్లులేని రూంల పండుకొని సదువుకునెటోళ్ళం… అట్లా.. పదో తరగతికి వచ్చినంక వాణికి సదువు అబ్బలే పది పేలయ్యిండు. ఎవుసం (వ్యవసాయం) పనులల్లబడ్డడు. నేను పది పాసై ఇంటర్‌ల మళ్ళా  ఇంటర్ డిగ్రీల చేరిన. రోజు ఊళ్ళె కలుసుకునుడు, తిరుగుడు… అన్నీ మామూలే…

రాజుగాడు శిన్నప్పుడు కర్రెగ, పొట్టిగ, బక్కగ, మట్టసన్నంగ వుండెటోడు కని ఇరవై సంవత్సరాలు దాటినంక మంచి ఎత్తు పెరిగిండు. మంచి శలీరం(శరీరం) వచ్చింది. మా ఊళ్ళె రాజుగాణికి సుజాత అనే పిల్లతోని జత కుదిరింది. ఆ పిల్లకు ఓ పదిహేడు సంవత్సరాల వయసుంటది. వాళ్ళిద్దరికి ఎట్లా కుదిరిందో ఏమోగాని ఇద్దరు గలిసి బాగ తిరిగెటోళ్ళు. ఒకల్ను సూడకుంట ఒకలు వుండేటోళ్ళుగాదు. రాజుగాడు రోజూ రాత్రి నా దగ్గరికచ్చి ఆ పిల్లతోణీ ఎక్కడెక్కడ తిరిగింది ఏమేం తిన్నది ఏమేం జేసింది అన్ని శెప్పెటోడూ. ఆఖరికి ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొన్నది ఎట్లెట్ల పాల్గొన్నది, ఎక్కడెక్కడ పాల్గొన్నది కూడా శెప్పెటోడు. మా ఇద్దరి మధ్య శిన్నప్పన్నుంచి పెద్ద దాపరికాలుండేటియి కావు. వాడు ఇవ్వన్ని శెప్పంగనే నేను అఫ్సోస్(ఆశ్చర్యం) అయ్యెటోణ్ణి కాదు. అట్లాంటియి వాడు నాకు గతంల శానా జెప్పిండు. వాణి అక్రమ సంబంధాల గురించి.

ఇది ఏడవది. ఈ ఏడుగురిల నలుగురు పెండ్లయినోళ్ళు.. ముగ్గురు పెండ్లిగానోళ్ళు.ఈ సుజాతకు కూడా ఇంకా పెండ్లిగాలే. రాజుగాడు సిన్నప్పుడు మస్తు అమాయకుడు. వాణికి ఈ పాడు గుణం ఎక్కణ్ణుంచి వచ్చిందో ఏమోగాని ఆడోళ్ళను బెండుగాలాలు ఏషి మొట్టపిల్ల( బురుద మట్టలు) చాపల పట్టినట్టు పట్టెటోడు. ఒకరోజు పగటీలి ఎండల వగిరిచ్చుకుంట(ఆయాసపడుకుంటా) ఉరికచ్చి అన్న.. కొంచెం మంచినీళ్ళియ్యె దూపయితాంది అని చెమటలు తుడుసుకుంట నా పక్క పొంటి గాడంచల కూసున్నడు. నేను ఇంట్లకుబోయి శెంబుల నీళ్లు తెచ్చిచ్చిన. ఏందిర రాజుగ మొత్తం చెమటతోని తడిసిపోయినవ్ అంటే ఆ గంగ లేదా అన్న … ఆమెతోని సెక్స్‌ల పాల్గొంటాంటె ఆమె మొగడచ్చిండు. సైకిల్ సప్పుడు ఇనబడంగనే దన.. దన ఎనుక తలుపు తీసుకొని నిమ్మలంగ రౌతుల గోడ దునికి వచ్చిన అని ఒకటే నవ్వుతాండు. “అరె ఒకవేళ వాడు సూత్తె ఏందిరా పరిస్థితి అంటే  ఎహె.. నా జాగర్తల నేనుంటా అన్న.. ఏడుగురిని ఎట్ల మెంటన్ జేత్తాననుకుంటానవ్ అని జెరంత గర్వంగ నవ్వెటోడు.

ఒకరోజు రాజుగాడు నేను మా ఊరి చెరువు కట్టకు పోయినం. అక్కడ కల్లు తాగినం. మాకు మంచిగ కిక్కెంకింది. ఏవేవో ముచ్చట్లు మాట్లాడుకుంట నడుసుకుంట వత్తానం. “అన్న.. గామధ్య ఒక సిత్రం జరిగిందే శెప్పనా” అన్నడు. “నీ గురించి నాకు తెలువని శిత్రమేందిరో అని నేనన్నా. టౌన్‌ల “నవత” లేదా అన్న.. అన్నడు. ఆ పిల్ల ముచ్చట నాకు తెలుసుకదరా అన్నా. ఎహె.. ఇనన్నా శెప్పెదాక అన్నడు. సరె శెప్పరా అన్నా. మొన్న ఆ పిల్ల వాళ్ల అమ్మను లైన్లకు తెచ్చి సెక్స్‌ల పాల్గొన్న అన్నడు.

నాకు ఎంటనే చలం మైదానంల నవలల నాయకుడు అమిర్ గుర్తుకచ్చిండు. ఇంక నయ్యం అమిర్‌కు నచ్చిన  తుర్కోల్ల పిల్లను నాయిక రాజేశ్వరితోనే మాట్లాడించి ఒప్పిచ్చినట్టు, పిల్లను పంపిచ్చి తల్లితోని మాట్లాడిచ్చి ఒప్పియ్యలె అనుకున్న మనసుల. మరి నవతకు తెలుసార అని అడిగిన. అన్న. నేను పిచ్చోనిలెక్క  కనిపిస్తాన్నానె నీకు అన్నడు. నాకు కొంచెం ఇబ్బందిగా బాధగా అనిపిచ్చింది.నేను రాజుగాణి మీద చానా కోపం జేసిన అరెయ్ రాజుగా నువ్వు జన్నెకు ఇడిషిన కొల్యాగవు అయిపోయినవ్‌రా ఊళ్ళె. ఏందిరా ఈ ఆంబోతు చేష్టలు. మనిషివా, పశువువురా అన్న. అరె ఏందన్న కోపంజెత్తవ్ అన్నడు. లేకపోతే ఏందిరా జన్నెకిడిషిన కోడె ఊరిమీద పడి దొరికిన శేను దొరికినట్టు మేసి బాగ బలిసి “మదం”బట్టి కంట్లెబడ్డ ఆవునల్లా ఎక్కినట్టు (సెక్స్ చేసినట్టు) శేత్తాన్నవ్ ఎట్లుండెటోనివి ఎట్లయ్‌నవ్‌ర అన్నా. అరె ఊకో అన్న.. శిన్నశిన్న ముచ్చట్లను పెద్దగజేత్తవ్ సప్పుడుజేకపా అని హ..హ..హ… అని నవ్వుతాండు. అరె! నేనింత సీరియస్‌గా తిడుతాంటె నవ్వుతానవేందిరా అంటె నువ్వు కోపంజెత్తె నాకు నవ్వత్తదన్న అనెటోడు.

అరెయ్ రాజుగా నీకు మాంసం ముద్దల రాపిడిల వున్న మజా తగిలింది. అది నిన్ను మాయజేసింది. ఏదో ఓ రోజు అది నిన్ను మాయంజేసి నీ పేరు మాపుంది. కత్తిపట్టినోడు కత్తితోనే పోతడు. మందు తాగెటోడు మందుతోనె పోతడు. అక్రమ సంబంధాలు పెట్టుకునెటోడు అక్రమ సంబంధాలతోనే పోతర్రా అన్నా.. అన్న..నువ్వు చీమను గూడ బూతద్దములబెట్టి సూత్తవ్. ఏంగాదుకని పావే అన్న.. అని నాలును తిప్పిండు.. లైట్ తీసుకో అన్న .. అన్నట్టుగ..

ఇంటికచ్చినంక ఇంతంత బువ్వతిని మా  యాపశెట్టు కింద గాడంచ వాల్చుకోని పడుకున్నా. కల్లుతాగి ఇంత తింటే మస్తు నిద్రస్తది. పొద్దాటి కల్లయితే ఇంకా మస్తు నిద్రస్తది. ఆ రోజు తాగింది పొద్దాటి కల్లే. బలిమీటికి కండ్లు మూసుకున్న నిద్రత్తలేదు. రాజుగాని మాటలే యాదికత్తానయ్. పిచ్చిగాడిది గిట్ల తయారయ్యిండేంది అని బాదనిపిచ్చింది. శిన్నప్పటినుంచెల్లి వాడంటె నాకు బొచ్చడంత పావురం. మెల్లంగ నా మనసు సెక్స్ గురించి ఆలోసించుడు మొదలుబెట్టింది. అవును సెక్స్‌ల ఏమున్నది. ఆడోళ్ళ యోనిల మాంసం ముద్దలు, మొగోళ్ళ అంగంల మాంసం ముద్దలు ఓ ఐదు నిమిషాలో, పది నిమిషాలో , మా అంటె ఓ అర్ధగంట ఒకదానికోటి రాపిడి చేసుకునుడే గదా. దీనికి రాజుగాడు ఎందుకు ఇంత బరితెగిచ్చిండు.

రాజుగాని తోని పండుకునే ఆడోళ్ళు ఒకలా, ఇద్దరా, ఇయ్యాల కట్టమీద జెప్పిన నవత తల్లితోని గలిపి ఎనమిది మంది వాళ్ళవాళ్ల తల్లితండ్రులను ఆడిపిల్లలు, భార్యలు భర్తలను, తల్లి పిల్లలను ఎందుకు మోసం జేత్తాండ్లు అని ఆలోసిత్తే నా బేజ గరమెక్కి గుండె గాబరయ్యింది. మరి ఈ పెద్దపెద్ద సార్లు, మేధావులు, సిన్మాలల్లా, కథలల్ల, మీటింగులల్ల, ప్రేమే గొప్పది, సెక్స్‌ది ఏముది అని సెక్స్‌ను గంజిల ఈగను తీసి పారేషినట్టు తీసిపారేత్తరేంది అనిపిచ్చింది. ప్రేమ గొప్పదే కాని సెక్స్‌కు జిందగిల ప్రాముఖ్యతే లేదనుడు ఏ గలత్ బాత్‌హై ఎందుకంటె ఇంట్ల ముసలి అత్తమామలుంటె, అమ్మ నాయినలుంటె సెక్సువల్ జీవితానికి ఇబ్బందిగ వుంటాందని “ప్రైవసి” మిస్సయితాందని వృద్ధాశ్రమాలల్లకు  అత్తమామలను, అమ్మనాయినలను తోలిన కోడండ్లను, కొడుకులను నేను జూసిన.

పసి పోరగాండ్లను హాస్టలల్ల పారేసిన తల్లితండ్రులను జూసిన, మొగుడు నాపగాడని, ఆడిబట్ల శెకల్ ఎక్కువున్నయని సెక్స్‌గ్యానం (గ్నానం) సరిగ్గలేదని మొగోళ్లనొదిలేసి లేచిపోయిన పెండ్లాలను జూసిన. పెండ్లం పెయ్యిల (ఒంట్లో) చెటాక్ మాంసం లేదని, సెక్స్ సుఖం సరిగ్గా ఇత్తలేదని అమాయకమైన ఆడిపోరగాండ్లకు ఇడుపు కాయితాలిచ్చిన మొగండ్లను జూసిన, కొందరు బీద తల్లితండ్రులయితే అల్లుని కాళ్లమీదపడి ఆడిపొల్ల బతుకుమీద మచ్చపడుతది మళ్ళ ఎవరు పెండ్లి జేసుకోరు అని ఏడిషిన ఇనకపోయేది. నాకయితె మస్తు కోపం, దుఃఖమచ్చి వాణిగల్లబట్టి అరె.. ఓ మాకే.. అర కిల మాంసం అటో ఇటో ఎందుకురా పొల్ల బతుకు ఆగం జేత్తాన్నవ్  అని అడుగాల్ననిపిచ్చేది. “కండకావురం గుండె పావురాన్ని” డామినేట్ చేస్తాంది. చానాదిక్కుల  చానాసార్ల ప్రేమ గొప్పదే, సెక్స్ కూడా గొప్పదే అది మనుషుల బతుకులల్ల బలమైన రోల్‌ను ప్లేజేత్తాంది. నాకనిపిస్తది. పెండ్లం మొగల బతుకు సర్కస్ అయితే సెక్స్ రింగ్ మాస్టర్ అసొంటిది. అది కనిపియ్యది. కనిపించకుంట కథ నడిపిత్తాంటది. రింగ్ మాస్టర్ లేకపోతే సర్కస్ ఆగిపోద్ది. అక్కణ్ణే వున్నది అసలు కథ. “ఏడేడు సముద్రాల అవుతల మర్రిశెట్టు తొర్రల మాయల ఫకీరు పాణం వున్నట్టు” కని బయిటికి ఒప్పుకోరు ఎవలు. పెద్ద పెద్ద సార్లు.

చిన్నగ మెల్లగ రాజుగాడు ఎక్కువ టయిము(టైం) సుజాతతోనే గడుపుతాండు. వాళ్ల బంధం రోజురోజుకు బలపడుతాంది అన్ని విధాలుగా, ఒక దినం వీళ్ల ముచ్చట సుజాతోళ్ళ ఇంట్ల తెలిసింది. ఆ పొల్లోల్ల అవ్వ, అయ్య ఆ పొల్లను బాగ తిట్టి కొట్టిండ్లట ఎందుకంటె సుజాత గర్భవతి అయిందట. ఇంక ఆ ముచ్చట బయటికి పొక్కలే (రాలేదు). సుజాత అవ్వ, అయ్యకె తెలుసు”నా కడుపుల శెడబుట్టినవ్ కదనే, ఇంతంత పురుగుల మందు తాగి సావరాదే” అని సుజాతోల్ల నాయిన అన్నడట.

ఇజ్జతికి సుజాత నిజంగనె పురుగుల మందు తాగింది. టౌన్‌కు  తీసుకపోతే సర్కారు దవాఖాండ్ల సచ్చిపోయింది. సుజాతను కోతకాండ్ల (పోస్ట్‌మార్టం రూం) ఏషిండ్లు. మా ఊరు ఊరంతా దవాఖాన కాన్నే వున్నది. డాక్టర్లచ్చి సుజాతను కోషి పోస్ట్ మార్టం జేషిండ్లు. సుజాత కడుపుల సచ్చిపోయిన ఏడు నెలల పిండం ఎల్లింది. ఆడిపిల్లో, మొగపిలగాడో తెల్వది ఎవలం అడుగలేదు. మళ్లా కడుపుల్నే పెట్టి కుట్లేషిండ్లు. పాపం పదిహేడేండ్ల సుజాత ఇంకా లగ్గం గూడా కాని సుజాత, సూడసక్కని గుండ్రని మొఖపు సుజాత బతుకే సూడని సుజాత మస్త్ బౌషత్(ఫ్యూచర్) వున్న సుజాత సచ్చిపోవుడే భరించలేని బాధ అయితే సుజాత కడుపుల ఇంక కండ్లు తెరిశి లోకమే సూడని ఏడు నెలల పసిగుడ్డు కూడా సచ్చిపోవుడు మా ఊరోళ్ళు తట్టుకోలేకపోయిండ్లు. అందరి గుండెలు అవిషిపోయినయ్. ఆడోళ్ళయితే రొంబొచ్చెలు గుద్దుకుంట ఏడిషిండ్లు. మా ఊరోళ్ళ కండ్లు కట్టలు తెగిన కరిమబ్బులయినయ్. ఒక్కొక్కల ఒక్కొక్క కన్ను ఒక్కొక్క నయగార జలపాతమైంది. మా ఊరు కన్నీటి బంగాళాఖాతమైంది. సుజాత శవాన్ని తీసుకపోయి మా ఊరి చెరువాయకు బొందబెట్టిండ్లు.

సుజాత సచ్చిపోయిందని తెల్వంగనే రాజుగాణ్ణి  ఊళ్ళకు రావద్దని వాళ్ల సుట్టాల(బంధువుల) ఇంటికి వాళ్ళోళ్ళు పంపిచ్చిండ్లు. రొండు రోజుల తరువాత రాజుగాడు మళ్లా ఊళ్ళెకు వచ్చిండు సుట్టాలింట్ల వుండలేక. పాపం సుజాత అవ్వ, అయ్య రాజుగాని మీద కేసుపెట్టలే. రాజుగాని ఇంటిమీదికచ్చి లొల్లిగూడ చెయ్యలే. రాజుగాణ్ణి తిట్టలే, కొట్టలే. నల్లా అండ్లె తెల్లా అండ్లే మా సుజాత అవుసు(ఆయుస్సు)గాడికే వున్నది గాడికే బతికింది. అవుసు గూడి సచ్చిపోయింది అన్నరు ఊకున్నరు.

రాజుగాడు నాదగ్గరకొచ్చి నన్ను అమురుకొని బాగ ఏడిషిండు. ఊకోర రాజుగ ఊకో దైర్నం (ధైర్యం) చెడకు అని ఊకుంచిన. సుజాత కడుపుల ఏడు నెలల పిండం ఎల్లిందట అన్న. అనుకుంట ఒకటే ఏడుసుడు, ఊకోర పిచ్చిగాడిది ఊకో అన్ని తలుసుకోకు, తలుసుకుంటాంటె ఏడుపు ఎక్కువైంది. మరిషిపో అని మళ్ళా ఊకుంచిన. ఏడిషి ఏడిషి ఆగి కొంచెం సేపటికి కడుపుల ఏడు నెలల పిండం ఎల్ల్లిందట అన్న. రొండు పాణాలు తీసినట్టయ్యిందే అని మళ్ళా ఏడిషెటోడు. అట్లా ఐదు రోజులు ఏడిషి ఊకున్నడు. బాయికాడికి బోయి ఎవుసం (వ్యవసాయం) పనులు చేసుకుంటాండు. జెర మామూలు మనిషయ్యిండు.

సుజాతోళ్ళ అవ్వ, అయ్య రాజుగాణ్ణి ఒక్క మాటనకపోవుడు, పోలీస్ కేసుబెట్టి జెయిల్ల ఏపియ్యకపోవుడు,  కండ్లు మొత్తె, కండ్లు తెరిత్తె సుజాత గుండ్రని మొఖం రాజుగానికి గుర్తుకచ్చుడు, తిరిగిన జాగాలు , సూశిన సిన్మాలు, శేషిన షికార్లు, మాట్లాడుకున్న ముచ్చట్లు, ఏసుకున్న జోకులు, చేసుకున్న బాసలు, తిన్న తిండి, తిరిగిన బండి, బరిబాత(నగ్నంగ) కావలిచ్చుకొని (కౌగిలించుకొని) పట్టెమంచం మీద పండుకున్న రాత్రులు అన్నిటికన్నా ముఖ్యంగా సుజాత కడుపుల కండ్లు తెరువకుంటనే కండ్లు మూసిన ఏడునెలల పిండం అన్ని కలెగలిసి రాజుగాణి గుండెను యాక్సా బ్లేడై(Acsa Blade) రప్ప్రరప్ప… రప్పరప్ప.. రప్పరప్ప కోశినయ్.

సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు కోత్తాంటే… కోత్తాంటె… కొత్తాంటె.. ఇనుప పైప్‌ను ఆక్సాబ్లేడ్ కొత్తాంటె నిప్పులెట్ల చిల్లుతయ్ అట్లా.. సుజాత సచ్చిపోయినంక ఏడో రోజున ఆ పిల్ల జ్ఞాపకాల యాక్సాబ్లేడ్ (Acsa Blade) కోతకు, రాపిడికి జన్నెకిడిషిన కోల్యాగ(గిత్త) అసొంటి రాజుగాణి గుండెల ప్రేమాగ్ని జనించింది. అది పశ్చాతాపమై ప్రజ్వరిల్లి వాణి గుండెకు అగ్గంటుకున్నది. ఎండకాలం మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండల రాజుగాడు  వాళ్ళ చెలుకకాడ “నవక్రాన్” పురుగుల మందు డబ్బా మూత తీసి గటగట గటగటా తాగిండు.

అదే సర్కార్ దవాఖాండ్ల సుజాత సచ్చిపోయిన సర్కార్ దవాఖాండ్ల మూడు రోజులు సావుతోని కొట్లాడి, కొట్లాడి, అవస్థ  అవస్థ.. అవస్థయితాంది, కడుపుల మండుతాంది అనుకుంట ఏడిషి, ఏడిషి, ఇనుప మంచం మీద తండ్లాడుకుంట, తండ్లాడుకుంట.. మూడోరోజు తలకాయ కుడిపక్కకు వాల్చి కండ్లల్లకెల్లి కన్నీళ్ళూ కార్సుకుంట సచ్చిపోయిండు. “లంజపుట్నాలల్ల” చేదును నాకు మిగిలిచ్చి తీపిని వాడు తీసుకొని తిరిగిరాని లోకాలకు మా రాజుగాడు పిచ్చిగాడిది నన్ను ఒంటరిని జేసి బయిలెల్లిపోయిండు.

*

రంగుల గవ్వ

 

-తిలక్ బొమ్మరాజు 
~

కొన్ని సీతాకోకచిలుకలు

రెక్కలు ముడులు పడ్డ వర్ణాలు
మధ్యాహ్నం అమ్మ వంచిన గంజి నీడలో నాకోసం యెగిరే
వెచ్చని పక్షులవి
ఆబగా వచ్చేస్తాయి యీ పక్కగా యెవరి కోసమో చెప్పనే చెప్పావు
యెన్నెన్ని నవ్వులో పూలముత్యాల్లా
అక్కడెక్కడో మోచేతికి తగిలిన గాయం
పచ్చిగా నానుతూ చెక్కట్టిన తలాబ్ పై బాధతో వాలినప్పుడు
నా కళ్ళు వాటి వీపును యెలా నిమురుతాయో
ఆ ప్రేమనూ,స్పర్శనూ చెప్పలేకపోవచ్చును
రాత్రంతా వొకటే ఆవిర్లుగా మారిన యింటి వరండాలో నుండి
రివ్వురివ్వున వేసంకాలాన్ని నాలోకి తోడిపడేసిన
తేనెపిల్లలు నా యీ శిలీంద్రాలు
దశలుదశలుగా నన్ను అల్లుకున్న గర్భకోశ సముద్రాలు
కోకిలపుళ్ళకు కోనేటి ఆసరా వీటి తిరుగుళ్ళు
నే నమ్ముకున్న కుంకుమ మిణుగురులు
వో హృదయమంత నిశ్శబ్దాన్నీ
వో ముదుసలి యొక్క ముఖచిత్రాన్ని తవ్వే కాన్వాసులేగా
యీ మొక్కలు తమవి కావు
యీ మకరందాలూ తమవి కానేకావు
వో ఆప్తబాటసారి ప్రేమతో పేర్చిన వసుధైక
నిర్మాణంలో తామూ వున్నామని యిలా
రెక్కలు చరిచి రెప్పలు విసిరి చెప్తున్న
శిలా జగత్తు శాసనం యిది
యెవ్వరికీ  కనబడకుండా నాకోసం నవ్వే తడిగవ్వలు.
*

పువ్వులు జాగ్రత్త!

 

 

     -బమ్మిడి జగదీశ్వరరావు

 

అమ్మా..

ఎలా వున్నావమ్మా.. నువ్వూ అల్లుడుగారూ యిద్దరూ బాగున్నారు కదా? నానిగాడు కూడా పదిలమని భావిస్తాను! మీ యింటి నుండి వచ్చాక మనవడి ముచ్చట్లు చెప్పినవే పదే పదే అడిగి మరీ చెప్పించుకుని మీ అమ్మ మురిసిపోతోంది! రోజూ కొత్త కొత్త విషయాలు విన్నట్టుగా వింటోంది! నా మనవడు చాలా తెలివైన వాడు అంటోంది! ఏ మాటకామాట మీ అమ్మ నిన్ను గురించి తలచుకోవడం తగ్గింది! నీ కొడుకు గురించి తలచుకోవడం పెరిగింది! వాడు పుట్టిన ఈ ఆరేడేళ్ళుగా యిదే వరుస! అదే అలవరుస!

అడిగితే చెప్పడానికి నీకేమిటి నొప్పి? అని తిరిగి మీ అమ్మ అడుగుతుంది! గొడవపడుతుంది! పోట్లాడుతుంది! నువ్వేం మనిషివి అంటుంది! నువ్వేం తాతవి అంటుంది! నిజంగా నానిగాడి గురించి చెప్పాలంటే నాకు నొప్పే! మీ అమ్మతో కాదు, నీతో మీ ఆయనతో గొడవ పడాలనిపిస్తుంది! పోట్లాడాలనిపిస్తుంది! తాతనని మరిచిపోయి తాట తియ్యాలనిపిస్తుంది!

అయినా తప్పు వాడిది కాదులే! వాడొక్కడిదే కాదులే! పిల్లలందరూ యిలానే వున్నారేమో..? తలచుకుంటే భయమేస్తోంది! నేను మీ అమ్మలా సరదాగా తీసుకోలేకపోతున్నా! నానిగాడి ముచ్చట్లు చెప్పినపుడల్లా నాకు ముచ్చెమటలు పోస్తున్నాయి! మీయమ్మకు యివేవీ పట్టవు! నేను యెక్కువగా ఆలోచిస్తున్నానని అంటుంది! అనవసరంగా భయపడుతున్నానని అంటుంది!

నాది భయమో.. బాధ్యతో తెలీదు! నీ దృష్టికి తేవాలనిపించింది! యివన్నీ ఫోనులో మాట్లాడలేక వుత్తరం రాస్తున్నాను!

మీ యింటికి వొచ్చిన దగ్గరినుండి నానిగాడు నన్ను ప్రశ్నల వర్షంతో ముంచెత్తాడు! ప్రశ్నించడం జీవ లక్షణం! కాని నా మనవడి ప్రశ్నలకు నాకు రాత్రుళ్ళు నిద్దర పట్టేది కాదు! వేడి పాలు తాగినా వుపయోగం వుండేది కాదు! నువ్వేమో కొత్త ప్లేసు కదా అనేదానివి! ఏమి చెప్పాలో నాకూ తెలీలేదు!

మొదటి రోజు రాత్రి నానిగాడ్ని పక్కన వేసుకొని పడుకున్నానా? వాడి తల నిమిరానా? అప్పుడు అడిగాడు.. ‘తాతయ్యా తలలో యేముంటాయ్?’, నాకు సమాధానం యేo చెప్పాలో తెలీక, తిరిగి ‘యేముంటాయ్?’ అన్నా! ‘అది కూడా తెలీదా?’ అని చాలా ఆశ్చర్యపోయాడు! వాడి ఆశ్చర్యం చూసి నేనూ అంతే ఆశ్చర్యపోయా! అయ్యో అదీ తెలీదా అని నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని కళ్ళతో దగ్గరికి రమ్మని సైగ చేసి నా చెవిలో చెప్పాడు! ‘తలలో యినుము వుంటాది, మెటల్.. మెటల్..’ అన్నాడు! విని, ‘మెంటల్..’ అన్నా! ‘మెంటల్ వాడి తలలో కూడా మెటలే వుంటుంది..’ అన్నాడు! ‘నీకెవడురా చెప్పాడు..?’ అన్నా, ‘అన్నీ అందరూ చెప్పరు, కొన్ని మనకి మనమే తెలుసుకోవాలి..!’ అని నాకు జ్ఞానోదయం చేశాడుతల్లీ నీకొడుకు.. అప్పటికీ ‘నీ తల యిందుకేనా యింత గట్టగా వుంది..’ అని నవ్వేశా! వాడు నవ్వకుండా ‘అమ్మని మట్టి బుర్ర అని నాన్న తిడతాడు, కాని అమ్మతలలోనే కాదు, యెవరి తలలో మట్టి వుండదు, మెటలే వుంటుంది.. వూ..!’ సత్యాన్ని కనుగున్నట్టు చెప్పాడు! అప్పటికీ ‘అలా అని మీ పాఠాల్లో వుందా..?’ అడిగాను. ‘పాఠాల్లో అన్నీ వుండవు తాతయ్యా..’ కాస్త విసుక్కున్నాడు కూడా!

ఒప్పుకున్నాను తల్లీ.. నీ కొడుకుతో చాలలేక వొప్పుకున్నాను!

ఆ రాత్రి నా మనవడు నాతల నిమిరాడు. ‘ఏమిటి తాతా..?’ అన్నాను, ‘నీ తలలో కూడా మెటలే వుంటుంది..’ చెప్పాడు. ‘నయం.. సమయానికి మీయమ్మమ్మ లేదు..’ అన్నా. ‘వుంటే..?’ అన్నాడు. ‘నన్ను యినుప సామానుల వాడికి కేజీల్లెక్క అమ్మేసేదిరా..’ నవ్వుతూ అన్నా. ‘నీకే అనుకున్నా, అమ్మమ్మకి కూడా తెలీదా..?’ అడిగాడు. ఏమిటి అన్నట్టు చూసాను. ‘తలలో మెటల్ వుంటుందని..’ అన్నాడు. ‘చాల్లే పడుకో..’ అన్నాను. నన్ను చూసి నా సమాధానం విని నేను వాడి మాటలు నమ్మడం లేదని అనుకున్నట్టున్నాడు. అందుకే ‘నీ తల మీద సుత్తితో.. వూ.. రాడ్ తో కొట్టి చూద్దామా..? టంగ్ టాంగ్..మని శబ్దం వస్తుంది..’ అన్నాడు. నానిగాడి మాటలకు భయంతో చూసాను. ‘తాతయ్యా.. నీకు భయమేస్తే పోనీ నా తలమీద కొట్టు తాతయ్యా..’ అని తల వంచాడు.

ఏమనాలో తెలీక ‘నాకు నిద్దరొస్తోంది..’ అన్నా. కళ్ళు మూసుకున్నా. ‘తాతయ్యా..’ పిలిచాడు. నే పలకలేదు. కొంపతీసి సుత్తో రాడ్దో తీసుకువొచ్చి మెటల్ సౌండ్ కోసం వొక్కటేస్తే..?’ వులిక్కిపడి కళ్ళు తెరిచాను. నన్నే చూస్తూ నవ్వాడు. ‘నీకు నిద్దర్రావడం లేదు కదా తాతయ్యా..’ అన్నాడు. అని లేవబోతే.. లేవనీయకుండా చెయ్యి అడ్డం పెట్టా. దాంతో వెనక్కి వొక్కసారిగా నేలమీద పడ్డాడు. తలకి తగిలిందేమోనని చేత్తో వాడి తలని తడమ బోయా.

‘తలలో మెటల్ వున్నట్టే.. నేలలో రబ్బరువుంటుంది..’ అన్నాడు. వాడివి వెర్రి మాటలన్నట్టు నేను చూస్తే.. వాడు నన్ను వో వెర్రిబాగులవాన్ని చూసినట్టు చూసాడు. ‘బంతి నేలకు కొడితే యేమవుతుంది?’ అడిగాడు నాని. ‘కొట్టినంత వేగంగా పైకి లేస్తుంది..’ అన్నా. ‘బంతే కాదు, బలంగా కొడితే మనిషులయినా యిలా కిందకి కొడితే అలా పైకి లేచి యెగురుతారు..’ అన్నాడు. అక్కడితో ఆగక ‘యేoటో తాతయ్యా.. ముసలయ్యే కొద్దీ అన్నీ మర్చిపోతారట.. నువ్వు కూడా అన్నీ మర్చిపోయినట్టున్నావ్..’ చెప్పక ముందే ‘వొక్కటిచ్చానంటే మీ అమ్మ దగ్గరకు వెళ్లి పడతావ్..’ అన్నా. ‘గుడ్.. నాకు పొద్దున్న వొక్కటివ్వు తాతయ్యా.. స్కూల్లో పడాలి దెబ్బకి.. స్కూల్ బస్సు మిస్సయినప్పుడు అమ్మ తిడుతుంది గాని గట్టిగా యివ్వదు.. షాట్’ అన్నాడు.

అప్పటికీ వాడిది పిచ్చి వాగుడు అనుకున్నా. కాని సరిపెట్టుకోలేకపోయా. ముందు రోజు జర్నీలో తలకింద చెయ్యి పెట్టుకు పడుకున్నానేమో.. మెడ దగ్గర నరం పట్టేసి జండూబామ్ రాసుకుంటుంటే ‘పైప్ కు ప్రాబ్లమా తాతయ్యా..?’ అని అడిగాడు. ఏమంటే ఏమంటాడో అని ‘ఆ’ అన్నా. ‘పైపుల్లో బ్లడ్డు రయ్ మని తిరుగుతుంది కదా..?’ అన్నాడు. ‘పైపులేమిట్రా.. అవి నరాలు..’ ఆగలేక చెప్పా. ‘పైపులు.. అదే నరాలు.. యెత్తుగా బాడీ మీద కనిపిస్తాయి కదా..’ అని అంటే ‘యెప్పుడు..?’ అని అర్థం కానట్టు చూస్తే, ‘కోపం వస్తే.. యెవడ్నన్నా కొట్టే ముందు.. పైపులు.. నరాలు.. బ్లడ్ అంతా పచ్చగా బాడీ అంతా యిలా యిలా..’ చెప్పేవాడే, ‘తాతయ్యని పడుకోనివ్వవా..?’ వాళ్ళ నాన్న కేకతో సైలెంట్ అయ్యాడు. అలాగే నిద్ర పోయాడు. అని అనుకున్నాను. కాని గొంతు తగ్గించి ‘యెవరైనా మనల్ని గన్ తో కాల్చితే చచ్చిపోతామా? చచ్చిపోమా?’ గుసగుసగా అడిగాడు. నిర్ఘాంత పోయా.

నాకు మాత్రం వచ్చిన నిద్ర వదిలి పారిపోయింది. ‘చెప్పు తాతయ్యా..’ గుగుసగా అడిగాడు. గట్టిగా కూడా అడిగాడు. ‘బుల్లెట్ తగిలితే యెవరైనా చచ్చిపోతారు..’ అన్నా. ‘యెవరి గురించి కాదు.. మన గురిచి చెప్పు.. చచ్చిపోతామా లేదా?’ ఖచ్చితంగా అడిగాడు. ‘మనల్ని యెవరు యెందుకు కాలుస్తారు చెప్పు..’ అన్నా. ‘యెందుకో కందుకు..’ అన్నాడు. ‘నన్ను కాలుస్తున్నావు కదరా..’ అన్నా. ‘సరే కాల్చాను.. చచ్చి పోతావా లేదా?’ అడిగాడు. చేసేదిలేక ‘చచ్చి పోతా..’ అన్నా. ‘నువ్వు బ్యాడ్ పర్సన్ వి.. విలన్ వి.. అందుకే చచ్చిపోతావ్..’ అన్నాడు. ‘మరి నువ్వో..?’అన్నా. ‘ ఐయామే గుడ్ పర్సన్.. హీరో.. యెన్ని బుల్లెట్స్ కాల్చినా..’ యింకా చెప్పేవాడే ‘నానీ..’ వాళ్ళ నాన్న పిలిస్తే వెళ్ళాడు. వెళ్లి నిద్రపోయాడు.

నాకింక రాత్రి తెల్లవార్లూ నిద్ర పట్టలేదు! నువ్వు అడిగినా చెప్పలేదు! ఎందుకంటే నాకే యేమీ బోధ పడలేదు! ‘నాన్నా నువ్వెందుకలా వున్నావ్.. నేనేమి అన్నానా? మా ఆయనేమి అన్నారా?’ అని నువ్వు అడిగావు. చెప్పేంత పెద్ద విషయమూ కాదు, వదిలేసేంత చిన్న విషయమూ కాదు. కూరగాయలు తరిగినట్టు మనుషుల్ని తరిగే సినిమాలకు దూరంగా వుంచు, వుంచగలిగితే! సుత్తితో నెత్తి బద్దలుగొట్టినా రక్తం దారాలు కడుతుంటే దులిపేసుకొని ఫైట్ చేసే తెలుగు హీరోల సినిమాలకు దూరంగా వుంచు, వీలయితే! ఆటవిక రాజ్యం నడుస్తున్నట్టు యెవరు యెవర్నైనా చంపేసుకోవచ్చనే ముఖ్యంగా పోలీసులకు ఆ హక్కువుందనే తొక్కు తెలుగు సినిమాలకు దూరంగా వుంచు, క్రూర జంతువులకంటే దుర్మార్గంగా చంపుకొనే చెత్త సినిమాలకు దూరంగా వుంచు, వాడికో వ్యక్తిత్వం రూపు కట్టేదాకయినా దూరంగా వుంచు, వాడిలో సున్నితత్వం బండబారిపోకుండా దూరంగా వుంచు, వుంచగలిగితే!

టుపుక్కుమంటే పుటుక్కున పోయే ప్రాణాలు కదా మనవి.. మనుషులవి! ప్రాణం విలువ తెలియకుండా వొక్కోడు వొక్కో సినిమాలో పదిమందివో వందమందివో ప్రాణాలు తీయడం.. మన పిల్లల ప్రాణాలు తీయడమే! ఒక్కటంటే వొక్కటి.. వొక్క ప్రాణం పోసే సినిమా.. వొక్క సినిమా వొచ్చినా బాగున్ను! ప్రాణం పోసినట్టుగా వున్ను! ప్రాణం విలువ తెలిసున్ను!

ఎవరికీ వారే- తమ పిల్లలు పువ్వుల్లా కళకళలాడుతున్నారా? యినుప చువ్వల్లా ఫెళ ఫెళలాడుతున్నారా? తెలుసుకోవాలి తల్లీ.. తల్లివి కదా అదేదో నీనుండి ప్రారంభం అవ్వాలని మనసాగక నీకు యీ వుత్తరం రాస్తున్నా..

నానిగాడికి నాముద్దులు..

వుంటానమ్మా..

మీ

నాన్న

 

 

బ‌తుకుపాట‌ల జాడ‌..మ‌న గూడ‌

 

g1

                    -డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌

~

“నేను మీ చ‌ప్ప‌ట్ల కోసం పాడ‌టం లేదు

నేను మీ అభినంద‌న‌ల కోసమూ పాడ‌టం లేదు

నేను నా దేశ స్వాతంత్య్రం కోసం పాడుతున్నాను” అన్నాడు చీలీ దేశ ప్ర‌జాగాయ‌కుడు విక్ట‌ర్ జారా. స‌రిగ్గా అంత‌టి ప్ర‌జావాగ్గేయ‌కారుడు గూడా అంజ‌య్య‌. ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగించే ఉద్య‌మాల‌కోసం పాట‌ల ప‌హారా కాసిన క‌న్ను గూడ అంజ‌య్య‌. తెలుగు స‌మాజానికి సుప‌రిచ‌త‌మైన ప్ర‌జార‌చ‌యిత‌ గూడ అంజ‌య్య‌. ఆయ‌న పాట‌ల‌న్ని గురిచూసి గుండెల్ని తాకే చూపున్న పాట‌లు. ఆయ‌న పాట పాడుతున్నా, వింటున్న ఈ దేశంలో తిండి, బ‌ట్ట‌, నీడ‌కు అల్లాడే పేద‌ల దుఃఖం ఒక దృశ్య‌కావ్య‌మై మ‌న‌ల్ని క‌దిలిస్తది. రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేసే నెత్తుర‌సొంటి శ‌క్తి అంజ‌న్న పాట‌ల‌ది. అవి ఉద్య‌మాల్ని ర‌గిలించి మండించి, పేద ప్ర‌జ‌ల వేద‌న‌ల్ని, అంట‌రానివాళ్ల సంవేద‌న‌ల్ని అర్థం చేయిస్తాయి. దోపిడి కోట‌ల్ని కూల్చ‌డానికి, బ‌డుగుజీవుల‌కు స‌రికొత్త శ‌క్తిని నూరిపోస్తాయి.

 

పాట రాయాలంటే, మిగిలిన ర‌చ‌యిత‌ల లాగ ఆయ‌న పుస్త‌కాల్లోకి తొంగిచూడ‌డు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోకి పోయి, వారితో మాట్లాడి, వారి బాధ‌ల‌ను ప‌ల్ల‌వులుగా, వారి క‌ష్టాల‌ను చ‌ర‌ణాలుగా మ‌లుస్తాడు. అందుకే గూడా అంజ‌య్య పాట‌లు మ‌న‌లో ఒక తాత్విక చ‌ర్చ‌ను రేపుతాయి. అల‌తి అల‌తి ప‌దాల‌తో బ‌తుకును స‌జీవంగా కండ్ల‌ముందుంచ‌డం, ఆ జీవితాలు అలా ఎందుకు అయ్యాయో విడ‌మ‌రిచి చెప్ప‌డం అత‌ని పాట‌ల ల‌క్ష‌ణం. అందుకే బ‌తుకును పాట‌ల‌కు ఒంపిన జాడ మ‌న గూడ‌.

 

నాలుగు ద‌శాబ్దాలుగా తెలుగు నేల మీద అంజ‌య్య పాట‌లు ఉద్య‌మాల‌కు  ఊపిరిపోశాయి. ఒక్క ఉద్య‌మంలో పాల్గొంటేనో, ప‌నిచేస్తేనో ఒక మ‌నిషి జీవితకాలం పూర్త‌వుతుంది. కొన్నిసార్లు ఆ ఉద్య‌మం గ‌మ్యానికి చేరుకోక ముందే ఉద్య‌మ‌కారుడు అల‌సిపోవ‌డమో, అందులోనుండి నిష్క్ర‌మించ‌డమో జ‌రుగుతుంది. అలాంటిది గూడా అంజ‌య్య మాత్రం త‌న ప‌ద‌హార‌వ‌యేట‌నే విప్ల‌వోద్య‌మంలో అడుగు పెట్టి, అందులో అనేక పాట‌లు రాసి పాడి, ప్ర‌జ‌ల మ‌ధ్య, జీవితాన్ని ఆరంభించాడు. అలా విప్ల‌వోద్య‌మమే కాదు తెలుగునేల మీద పుట్టిన ద‌ళితోద్య‌మంలో త‌న వంతు పాత్ర‌ను పోషించాడు. రెండు ఉద్య‌మాల్లో ప‌నిచేసినా స‌రే త‌ను అల‌సి పోలేదు. ప్ర‌పంచం త‌ల‌తిప్పి చూసిన మ‌హ‌త్త‌ర తెలంగాణ ఉద్య‌మంలో కూడా త‌న‌దైన పాత్ర‌ను విజ‌య‌వంతంగా పోషించాడు. తెలంగాణ ప్ర‌జ‌ల విముక్తి కోసం కూడా సిద్ధ‌మై ప‌దునైన పాట‌ల‌నందించాడు. ఇలా అనేక ఉద్య‌మాల్లో ముందుండి ప‌నిచేసిన ఘ‌న‌త గూడ అంజ‌య్య‌దే.

 

నిత్యం పోరాటాల‌తో అల‌రారే తెలంగాణ నేల మీద అనేక మంది వాగ్గేయ‌కారుల‌న్నారు. వారంద‌రిలో గూడా అంజ‌య్య పాట‌ది ప్ర‌త్యేక‌మైన శైలి. ప్ర‌జ‌ల ప‌దాల‌తో పాట‌గ‌ట్టి, చ‌దువురాని మ‌ట్టిబిడ్డ‌ల‌కు సైతం క‌మ్యూనిజాన్ని అలవోక అర్థం చేయించింది. అలా పుట్టుకొచ్చిందే ఊరు మ‌న‌దిరా…ఈ వాడ మ‌న‌దిరా పాట‌. నిజానికి ఈ పాట క‌మ్యూనిస్టు మ్యానిఫెస్టో ఏం చెబుతున్న‌దో, స్థానిక ప‌రిస్థితుల‌కు సుల‌భంగా అన్వ‌యం చేశాడు అంజ‌య్య‌. ఉద్య‌మాల‌కు పాట‌ల‌ను అందించింది ద‌ళితులే. అలా ద‌ళితునిగా పుట్టిన అంజ‌య్య భార‌త‌దేశ గ్రామీణ స్వ‌రూపాన్ని స‌రిగా ప‌ట్టుకున్నాడు. ఊరిలో చాలా కులాలు శ్రామిక కులాలే. అగ్ర‌వ‌ర్ణాలే భూస్వాములుగా పెత్త‌నం చేస్తుండ‌డం అంజ‌య్య‌ను క‌ల‌వ‌ర ప‌ర‌చింది. విప్ల‌వోద్య‌మం ప్ర‌జ‌ల‌కు అర్థం కావాలంటే ఈ దోపిడిని విడ‌మ‌రిచి చెప్పాల‌ని భావించాడు. అందుకే ఊరు మ‌న‌దే, వాడా మ‌న‌దే…న‌డుమ దొరా ఏందిరో, వాని పీకుడేందిరో అని ఘాటుగానే నిల‌దీశాడు అంజ‌య్య‌. అదే ప్ర‌జ‌ల‌కు న‌చ్చింది. అది తెలంగాణ ప్ర‌జ‌ల్లో ర‌గులుతున్న భావ‌న‌. ఆ భావ‌న‌కు పాట‌రూప‌మిచ్చాడు అంజ‌య్య‌.

 

ఈ పాట విన్న మ‌ట్టిబిడ్డ‌లు ఇది నా పాటే. ఇది మా ఊరి చ‌రిత్రే అని ఓనే చేసుకున్నారు. ప్ర‌జ‌ల నాలుక‌ల మీద ఈ పాట ద‌శాబ్దాల కాలం న‌డ‌యాడింది. ఈ పాట‌లో అంజ‌య్య‌లోని ద‌ళిత‌త‌త్వం కూడా పాట‌కు మ‌రింత అద‌న‌పు అందాన్ని తెచ్చింది. అన్ని ప‌నుల కాడ ముందుండే ద‌ళితుల జీవితం ఎందుకిట్ల కూన‌రిల్లుతున్న‌ది. ఏ ప‌నిచేయ‌ని ప‌టేల్‌, ప‌ట్వారి దొర‌లు ఎలా కూర్చుండి తింటున్నార‌నే చ‌ర్చ‌ను ముందుకు తెచ్చింది.

గూడ అంజ‌య్య తొలిపాట “ఊరిడిసి నేబోదునా…అయ్యో ఉరిపెట్టుకొని స‌ద్దునా”.  ఈ పాట‌కూడా గ్రామాల్లో దొర‌ల దాష్టికాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. రైతుల‌కు అప్పులిచ్చి పంట‌లు జ‌ప్తు చేసే దొర‌ల దుర్మార్గాల‌కు బ‌లై, ఊరిడిసి వ‌ల‌స‌పోయే ఓ పేద‌రైతు బాధ‌ను పాటీక‌రించాడు అంజ‌య్య‌.

 

ఈ పాట‌లో రైతు బాధ‌ను ఉన్న‌ది ఉన్న‌ట్టుగా, త‌న‌ను ప‌ల‌క‌రిస్తే వ‌ల‌పోసే తీరును స‌రిగా ప‌ట్టుకున్నాడు ర‌చ‌యిత‌. అందుకే అప్పుతెచ్చిన మాట‌నిజ‌మే. అది వ‌డ్డీకి తెచ్చింది నిజ‌మే అంటాడు. ఈ పాట‌తో మొద‌లైన అంజ‌య్య ప్ర‌స్థానం విప్ల‌వోద్య‌మం మీదుగా ద‌ళిత‌, తెలంగాణ ఉద్య‌మాల‌ను చేరి మ‌రింత ప‌దునెక్కింది. గూడా అంజ‌య్య పాట‌ల్లో బాణీలు కఠినంగా ఉండ‌వు. సామాన్యుడు సైతం, కోర‌స్‌గా గొంతుక‌లిపే విధంగా ఉంటాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్ర‌జ‌ల బాణీల‌ను తీసుకొని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వ‌స్తువుగా జ‌త‌చేసిన  బండియాద‌గిరి, సుద్ధాల హ‌నుమంతుల‌కు వార‌సుడు గూడ అంజ‌య్య‌. అందుకే వారి బాట‌లోనే వారిలాగే ప్రాణ‌మున్న పాట‌ల‌ను ర‌చించాడు. పాట‌కు త‌గిన బాణి, భావానికి త‌గిన ప‌దాల పొందిక‌, అందులో అంజ‌య్య జాగ్ర‌త్త‌గా ఇమిడ్చే ప్ర‌జ‌ల నుడికారాలు, సామెత‌లు పాట‌ను శ‌క్తివంతంగా తీర్చిదిద్దుతాయి.

తొంభ‌య‌వ ద‌శ‌కంలో తెలుగునేల మీద ద‌ళితోద్య‌మం పుట్టింది. ఆ ఉద్య‌మంలో కూడా అంజ‌య్య ముందున‌డిచాడు.

 

“ద‌ళిత ర‌చ‌యిత‌ల క‌ళాకారుల మేధావుల ఐక్య‌వేదిక” ఏర్పాటుకు 1992లోనే పునాది వేశాడు. కంచిక‌చ‌ర్ల‌ల‌లో ద‌ళితుడైన కోటేశును స‌జీవ‌ద‌హ‌నం చేసిన‌పుడు అంజ‌య్య ఆ దారుణం మీద పాట రాశాడు. అప్ప‌టిదాకా పాట‌లు మాత్ర‌మే రాసిన అంజ‌య్య‌, ద‌ళితోద్య‌మంలో ప‌నిచేసే క్ర‌మంలోనే సాహిత్యంలోనే మిగిలిన ప్ర‌క్రియ‌ల వైపు మ‌ర‌లాడు. అంబేద్క‌రిజం ప‌రిచ‌య‌మ‌య్యాక అంజ‌న్న‌కు సాహిత్య ప్ర‌క్రియ‌ల‌తో మ‌రింత ప‌రిచ‌యం ఏర్ప‌డ్డ‌ది. ద‌ళిత‌క‌థ‌లు రాసి పుస్త‌కం వెలువ‌రించాడు. అలాగే “పొలిమేర‌లు” అనే న‌వ‌ల రాసి, తెలుగు విశ్వ‌విద్యాల‌యం చేత‌, ఆ యేటి ఉత్త‌మ న‌వ‌లగా అవార్డు కూడా అందుకున్నాడు. ఇది అంజ‌య్య‌లో మాత్ర‌మే ఉన్న ప్ర‌త్యేక ల‌క్ష‌ణం. వాగ్గేయ‌కారులంతా పాట‌ల ర‌చ‌న‌వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతారు. అంజ‌య్య మాత్రం ఉద్య‌మ అవ‌స‌రాల్లో భాగంగా, ద‌ర‌క‌మే సాన్నిహిత్యంతో క‌థ‌కునిగా, న‌వ‌లాకారునిగా మారాడు.

 

తెలంగాణ ఉద్య‌మానికి పాటే ప్రాణం పోసింది. క‌నిపించ‌ని శ‌త్రువును, కాటేసే కుట్ర‌ల‌ను కండ్ల‌ముందుంచింది పాటే. తెలంగాణ ఉద్య‌మం అర‌వైతొమ్మిదిలో పాల‌కుల చేతిలో ద‌గాకాబ‌డి మ‌ళ్లీ 90ల త‌ర్వాత పుంజుకోవ‌డానికి పాటే ఆయుధంగా నిలిచింది. అలాంటి స‌మ‌యంలో గూడా అంజ‌య్య ర‌చించిన అనేక పాట‌లు తెలంగాణ ఉద్య‌మాన్ని ప‌ల్లెప‌ల్లెకు చేర్చాయి. “నా తెలంగాణ…న‌నుగ‌న్న నా త‌ల్లి నా తెలంగాణ” అంటూ పాట‌రాశాడు.  అది మొద‌లుగా తెలంగాణ ఉద్య‌మం కోసం అంజ‌న్న రాసిన పాట‌ల్లో పుడితె ఒక‌టి స‌త్తెరెండు రాజ‌న్న ఒరె రాజ‌న్న అన్న పాట సుమారు ద‌శాబ్దంన్న‌ర కాలం పాటు తెలంగాణ ప‌దిజిల్లాలో మార్మొగింది. ప్ర‌జ‌ల‌ను ఉర్రూత‌లూగించే ఈ పాట బాణీ, ఉద్య‌మానికి జ‌వ‌జీవాల‌నిచ్చింది.

 

అంజ‌న్న ఈ పాట‌లో ఉద‌హ‌రించిన ఊర్ల‌పేర్లు, వ్య‌క్తుల పేర్లు తెలంగాణ‌లో బాగా పాపుల‌ర్‌వే కావ‌డం మ‌రింత ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించింది. ఈ పాట‌లో తెలంగాణ ఉద్య‌మానికి ఒక దిశానిర్ధేశం చేశాడు. తెలంగాణ రాదేమో అని నిరాశ చెందేవారికి గొప్ప ధైర్యాన్నిచ్చిండు. బ‌రిగీసి బ‌డితందుకోర రాజ‌న్న ఒరె రాజ‌న్న‌, తెలంగాణ రాకుంటె ఒట్టు రాజ‌న్న మా రాజ‌న్న అంటూ ఈ పోరాటం వృధాపోదు, తెలంగాణ వ‌చ్చి తీరుతుంద‌ని ధీమాను వ్య‌క్తం చేశాడు. ధూంధాం వేదిక‌ల మీద ఈ పాటొక ఫిరంగిలా పేలింది.

ఆక‌లిపోరాటం మాత్ర‌మే కాదు, తెలంగాణ ఉద్య‌మంలో ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్య కూడా ఇమిడి ఉంది. అందుకే గూడ అంజ‌య్య పాట‌లో ఆ ఆరాటం ప్ర‌తిధ్వ‌నించింది. తెలంగాణ ప్ర‌జ‌ల యాస‌ను బాస‌ను కించేప‌రిచిన వారిని నిల‌బెట్టి క‌డిగిపాడేసాడు. “అయ్యోనివా నువ్ అవ్వోనివా…” అనే పాట‌లో ఆంధ్రాపెట్టుబ‌డిదారులను నిల‌దీశాడు. అంతేకాదు వారిని తెలంగాణ కోసం ఏం చేశార‌ని ప్ర‌శ్నించాడు. “చార్మినారుకు సున్న‌మేసిన‌వా…గోలుకొండ‌కు రాళ్లు మోసిన‌వా” అంటూ అంజ‌న్న తెలంగాణ ప్ర‌జ‌ల ఆవేద‌నకు పాట రూప‌మిచ్చాడు.

 

తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌తీ వేదిక మీద ఈ పాట మార్మోగింది. అయిదున్న‌ర ద‌శాబ్దాల న‌లిగిపోయిన త‌నం నుండి వ‌చ్చిన ఈ ప్ర‌శ్న‌లు అంజ‌య్యవి మాత్ర‌మే కాదు, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌వి కూడా అందుకే జ‌నం గుండెను సూటిగా తాకి ఆక‌ట్టుకున్నాయి. అలాగే ఆధిప‌త్యాన్ని పెంచి పోషించేవారికి ముచ్చెమ‌ట‌లు పోయించాయి.

 

అంజ‌య్య పాట‌లే కాదు, చాలా వ‌ర‌కు సామాజిక ఉద్య‌మాల్లో వ‌చ్చిన పాట‌లు కూడా రెండు ర‌కాల బాణీల్లోనే ఎక్కువ‌గా వెలువ‌డ్డాయి. ఒక‌టి ప్ర‌జ‌ల జీవితాన్ని పాట‌లుగా మ‌లిచేట‌పుడు వారు ప‌డుతున్న బాధ‌ల తీవ్ర‌త‌ను అర్థం చేయించ‌డానికి క‌రుణ‌రాస‌త్మ‌క బాణీలు, రెండవ‌ది ఉద్య‌మానికి సిద్ధం చేసే వీరర‌సబాణీలు. అందుకే అంజ‌న్న పాట‌ల్లో ఈ రెండు ర‌కాలైన బాణీల‌తో కూడిన పాట‌లే క‌నిపిస్తాయి. అవి కూడా సాదాసీదాగా రాయ‌డం అంజ‌న్న‌కు తెలియ‌దు. ఉద్య‌మ‌ల‌క్ష్యం నెర‌వేరేందుకు అందులో సంపూర్ణస్థాయికి చేరేలా పాట‌ను మ‌లుస్తాడు.  అందుకే ఉద్య‌మాల‌తో స‌మానంగా అంజ‌న్న పాట‌లు సినిమారంగంలో కూడా చెర‌గ‌ని స్థానాని ఏర్ప‌ర్చుకున్నాయి. “భ‌ద్రం కొడుకో నా కొడుకో కొముర‌న్న జ‌ర” అంటూ ముప్ఫై ఏళ్ల  క్రితం తాను రాసిన సినిమా పాట అత్యంత ప్ర‌జాద‌ర‌ణ‌ను పొందింది.

 

అలాగే స‌ర్కార్ ద‌వ‌ఖాన‌ల దీనావ‌స్థ‌ను తెలుపుతూ రాసిన నేను రాను బిడ్డో స‌ర్కారు ద‌వాఖాన‌కు పాట, కొడుకు కొముర‌న్నా…నువ్ కొల‌క‌టేరువ‌నూకుంటునిరో అంటూ రాసిన పాట వెండితెర మీద అంజ‌న్న మార్కు సంత‌కాన్ని చేశాయి.

 

ప్ర‌జ‌ల‌కోస‌మే క‌లం ప‌ట్టి, కడ‌దాకా ఉద్య‌మాల‌కోస‌మే బ‌తికిన ప్ర‌జావాగ్గేయ‌కారుడు గుడా అంజయ్య‌. అడ‌విబిడ్డెల అమ్మవొడి ఆదిలాబాద్‌లో ఒక మారుమూల గ్రామం లింగాపురంలో 1955లో పుట్టిన అంజ‌న్న 61 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే జీవించాడు.  అందులో నాలుగున్న‌ర ద‌శాబ్దాలుగా ఉద్య‌మాలకే కేటాయించాడు. ఫార్మ‌సిస్టుగా కొలువు చేసిన‌ప్ప‌టికీ, పోరాటాల్లోనే అత‌ని జీవిత‌మంతా గ‌డిచింది. అలా ప్ర‌జ‌ల‌కోసం బ‌తికి, ప్ర‌జ‌ల‌కోసం క‌లంప‌ట్టి జీవ‌మున్న పాట‌ల్ని రాసిన అంజన్న‌ను కోల్పోవ‌డం, తెలంగాణ‌కే కాదు యావ‌త్ తెలుగు స‌మాజానికి ఒక తీర‌నిలోటు. ఆయ‌న క‌ల‌గ‌న్న పీడ‌న లేని లోకాన్ని సాధించ‌డ‌మే ఆ మ‌హావాగ్గేయ‌కారునికి నిజమైన నివాళి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చూపులందు ‘మగచూపు’ వేరయా…

 

 

-ల.లి.త.

~

 

 

“There is always shame in the creation of an object for the public gaze”  —  Rachel Cusk.

చూపులు వెంటాడతాయి. చూపులు తడుముతాయి. చూపులు గుచ్చుకుంటాయి.

మగచూపుల తాకిడి… వయసు వచ్చినప్పటినుంచి ఇంటి బైట అడుగుపెట్టిన ప్రతి ఆడపిల్లకీ తప్పదు. ఆ చూపులు ఆరాధిస్తున్నట్టు కనిపిస్తే గర్వంగా, వొట్టికామం కనిపిస్తే అసహ్యంగా అనిపించటం కూడా జెట్ స్పీడ్ లో జరిగిపోతూ ఉంటుంది. ఏరకం చూపులెలాంటి వొంకరలు పోతున్నాయో అప్రయత్నంగా తెలిసిపోతుంది ఆడవాళ్ళకి. చూపులు ముసుగులు వేసుకున్నా కొంచెంసేపట్లోనే ఆ ముసుగుల వెనుక ఏ భావముందో చెప్పగలరు. మగచూపుని గుర్తుపట్టే ప్రాథమికజ్ఞానం వయసుతో పాటే పెరిగి వృక్షం అవుతుంది.

సినిమాలు తీసేవాళ్ళూ రాసేవాళ్ళూ వాటిలో వేసేవాళ్లూ మూడొంతులమంది మగవాళ్ళే అయినప్పుడు వాళ్ళు ఆడవాళ్ళను చూడగానే కళ్ళతో చేసే స్కానింగ్ సినిమాల్లోకి రావటం కూడా అసంకల్పిత చర్యే. అది డబ్బులకోసం  సినిమావాళ్ళు చేసే సంకల్పిత చర్యకూడా. ఎలా చూస్తామో అలాగే రాస్తాం. తీస్తాం. అసలు సినిమా అనేదే ఒక voyeuristic tool. మనుషుల్ని ఎలా కావాలంటే అలా,  ఏ పరిస్థితిలో కావాలంటే ఆ పరిస్థితిలో చూపెడుతుంది. ఇతర్ల జీవితాల్లోకీ, ఇళ్ళలోకీ, పడగ్గదుల్లోకీ తిరిగి చూపించటానికి కావలసినంత స్వేచ్ఛ ఉంది మూవీ కామెరాకి.  సినిమా చూడటంలోని సామూహిక వాయరిజంలోని దృష్టికోణం కూడా మగవాళ్ళదే.  స్త్రీల శరీరాలను ఇష్టమొచ్చినంతమేరా చూపించే అవకాశం ఉండటంతో మేల్ డామినేటెడ్ సొసైటీలో సినిమా ‘మేల్ గేజ్’ నే ధరిస్తుంది.  ఈ విషయాన్ని గ్రహించని ఆడవాళ్ళు ఉండరు గానీ  దాన్నెలా ఎదుర్కోవాలో అర్థంకాదు.  ‘స్త్రీలను సినిమాల్లో అసభ్యంగా చూపిస్తున్నార’ని గోలపెట్టేది ఇందుకే.  కానీ ‘ఇది సభ్యత, ఇది అసభ్యత’ అని గిరులు గీయలేనిది కళాభివ్యక్తి.  ఇదే అదనుగా చాలామంది చేతుల్లో మూవీ కామెరా చెలరేగిపోతూ ఉంటుంది.

లారా ముల్వే స్త్రీవాది. ఫిలిం క్రిటిక్ కూడా. 1975లో  ఆమె ‘మేల్ గేజ్’ అనే మాటను మొదటిసారిగా వాడుతూ సినిమాల్లో ‘మేల్ గేజ్’ గురించి సిద్ధాంతీకరించింది. సినిమాల్లో, వ్యాపారప్రకటనల్లో, టీవీల్లో కనపడుతూ ఉండే మేల్ గేజ్ స్వరూపాన్ని వివరించింది.  మేల్ గేజ్ రెండురకాలు. ఒకటి సినిమాలోని పాత్రల చూపు.  రెండోది సినిమా చూస్తున్న ప్రేక్షకుల చూపు. ఎక్కడైనా చూసేది మగవాళ్ళు. చూడబడేది ఆడవాళ్ళు. సినిమాలోని పాత్రల చూపునీ బయటున్న ప్రేక్షకుల చూపునీ ఏకం చేసేది టెక్నాలజీ. అంటే సినిమాటోగ్రఫీ.  ఒక సీన్లో అమ్మాయి నడుస్తూ వెళ్తోంది. హీరో ఆమెని చూస్తుంటాడు. కామెరా హీరో చూపుని అనుసరిస్తూ వెళ్తుంది.  అమ్మాయిని హీరో ఎక్కడెలా చూస్తాడో ప్రేక్షకులను కూడా అక్కడలా చూసేలా చేస్తుంది.  సినిమా కథని నడిపేది హీరోనే.  అతనిలోనూ చూసేవాళ్లలోనూ శృంగారపరమైన ఉత్సుకత రేపే రూపంతో హీరోయిన్ కనిపించాలన్నది సినిమా ముఖ్యసూత్రం. సినిమాటోగ్రాఫర్ బలమైన విజువల్స్ తో ఈ రూల్ ని పాటిస్తాడు. మేకప్ ఆర్టిస్టులు, దుస్తులు కుట్టేవాళ్ళు హీరోయిన్లను అందంగా ప్యాక్ చేస్తారు. ఇదే అలవాటు  వ్యాపారప్రకటనల్లోనూ కనిపిస్తుంది.

 

లారా చెప్పిన ‘మేల్ గేజ్’ కి క్లాసిక్ ఉదాహరణగా చాలామందికి గుర్తొచ్చేవి జేమ్స్ బాండ్ సినిమాలు. 1962లో వచ్చిన  ‘డాక్టర్ నో’ సినిమాలో ఉర్సులా ఏండ్రెస్ సముద్రంలోంచి రావటాన్ని కామెరా, బాండ్ వేషం వేసిన సీన్ కానరీ, ప్రేక్షకులూ తదేకమైన మగచూపుతో చూస్తారు. అలాంటి దృశ్యాన్నే నలభై ఏళ్ల తర్వాత 2002 లో వచ్చిన ‘డై ఎనదర్ డే’ లో హేల్ బెరీతో మరోసారి తీసినపుడు మగచూపు ఆమెను మరీ ఎక్కువగా తడుముతుంది. ఆడవాళ్ళ ఇమేజ్ అంటే మగవాళ్ళని రెచ్చగొట్టేలా ఉండాలని చెప్తున్నట్టుగా ఉంటాయి జేమ్స్ బాండ్ సినిమాలు.

సినిమాల్లో స్త్రీలు రెండురకాలుగా ఉంటారని చెప్తుంది లారా. లైంగికంగా చురుగ్గా ఉండేవాళ్ళు ఒకరకం. బొత్తిగా బలహీనులు రెండోరకం. ఆమె హాలీవుడ్ గురించే చెప్పినా, మన సినిమాల్లో కూడా ఇవే మూసలు కనిపిస్తాయి. మొదటిరకం ఆడవాళ్ళను అప్పట్లో వాంప్ లనేవారు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ గర్ల్స్ అంటున్నారు. వాళ్ళు శృంగారం కోసమే కనబడుతూ ఉంటారు.  రెండోరకం కథ నడకకి అడ్డం పడుతూ కన్నీరుకార్చే సచ్చీలురైన కలకంఠులు. అమ్మ, ఇంట్లోనే ఉండే భార్య, చెల్లెళ్ళ మూసలివి. వీళ్ళు కరుణరస ప్రదాయినులు. ఈ రెండు రకాలూ కాకుండా సగం శృంగారం, సగం పొగరూ లేదా మంచితనంతో హీరోయిన్ రూపాన్ని తయారు చేస్తారు. ఈ ఫార్ములాలు పెట్టుకుని వందల సినిమాలు వచ్చాయి.

మన సినిమాల్లోకి మొదట్లో  స్త్రీలు అడుగుపెట్టటమే అరుదు, అపురూపం. సినిమా వేషాలకోసం వచ్చినవారి కనుముక్కుతీరు, వాచకం బాగుంటే వేషాలిచ్చేవాళ్ళు. ఇప్పటి అందం కొలతల్లో ఇమడని భారీశరీరాలతో ఉన్న హీరోయిన్ల మీద కామెరా తన ప్రతాపం అంతగా చూపించలేదనే చెప్పాలి.  బిగుతైన బ్లౌజులు, పల్చటి పైటలు వేసుకునేవారుగానీ, వాళ్ళ అభినయంమీదా ముఖాలమీదే అందరి దృష్టీ ఉండేది.  తరువాత అరవైలనుండీ టైట్ పాంట్స్, బిగుతుషర్టుల్లో ఉన్న స్త్రీల శరీరాలమీద కామెరా క్లోజప్ షాట్స్ తో తన అజమాయిషీ మొదలెట్టింది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మితల శరీరాలమీద మేల్ గేజ్ విశృంఖలంగా పాకింది. 70, 80, 90ల్లో వచ్చిన సినిమాల్లో ముఖ్యంగా మలయాళం సాఫ్ట్ పోర్న్ సినిమాల్లో శృంగారం పేరుతో ఆడవాళ్ళ శరీరాలను ప్రదర్శనకు పెట్టారు.

lalita2

సినిమా చూసేటప్పుడు స్త్రీలు కూడా ‘మేల్ గేజ్’ తోనే చూస్తారని చెప్తుంది లారా. హీరోయిన్ల వొంటితో తమ వొంటినీ  బట్టలనూ పోల్చుకుని ఆడపిల్లలు కూడా మగవాళ్ళ కళ్ళలోంచే తమను తాము చూసుకుంటారు. మహిళాదర్శకులు కూడా ఎంత చేటు మేల్ గేజ్ తో  సినిమాలు తీశారో భానుమతి, విజయనిర్మలల సినిమాలు చూస్తే తెలుస్తుంది. వాళ్ళ సినిమాల్లో రేప్ సీన్లు మగదర్శకులు తీసేవిధానానికి ఏమీ తీసిపోకుండా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి.

కళాత్మక సినిమాలు తీస్తున్నానంటూ కామెరాలోంచి స్త్రీల శరీరాలను మర్యాదలన్నీ అతిక్రమించి తడిమేశాడు రాజ్ కపూర్. ఈయన సినిమాల్లో హీరో (అంటే తనే) హీరోయిన్ కళ్ళలోకే తప్ప ఇంకెక్కడా చూడడు. మూడు రకాల మేల్ గేజ్ లలో రెండో రకాన్ని వదిలిపెట్టి హీరోచేత అమాయకపు మొహం పెట్టించి, ఆ మేరకి కామెరాతో ఆడవాళ్ళమీద మరింత దౌర్జన్యం చేస్తాడు. చిన్న దుస్తుల్లో తిరుగుతూ మోడల్స్ లా నడిచే పల్లెటూరి అమ్మాయిల వేషాల్లో ఆడవాళ్ళను  చూసి లొట్టలు వేసుకున్న సెన్సార్ మెంబర్లు రాజ్ కపూర్ mammary obsession ని కళాత్మక అభివ్యక్తిగా కొలిచారేమో అనిపిస్తుంది.

‘జ్యోతి’ లాంటి మంచి సినిమాలు తీసిన రాఘవేంద్రరావు ఒక్కసారిగా తీసుకున్న చారిత్రాత్మక యూటర్న్ గురించి చెప్పుకోవాలి. ఆడవాళ్ళ శరీరభాగాలను ముక్కలుకోసి పళ్ళూ ఫలాల్లా మగవాళ్ళ కళ్ళముందర పళ్ళెంలో పెట్టి అందించాడు. రాఘవేంద్రరావు టెక్నిక్ ని చాలామంది అనుసరిస్తూ పోయారు. పోర్న్ స్టార్ సన్నీలియోన్ కి కూడా మన హీరోయిన్లలాగే బట్టలుకట్టి సినిమాల్లో చూపిస్తుంటే సంతోషంగా మగాళ్ళు చూస్తున్నారంటే ఇలాంటి titillation టెక్నిక్ కి దేశంలో ఉన్న ఆకర్షణ ఎంతటిదో తెలుస్తోంది. ‘వేదం’ లాంటి కొంచెం భిన్నంగా ఉండే సినిమాలో కూడా  ‘ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ’ పాటలోనూ ఇంకా చాలా దృశ్యాల్లోనూ అనుష్క మీద వాడిన కామెరా ఏంగిల్స్,  సెక్స్ వర్కర్ పాత్రేకదా అన్న సాకుతో molest చేస్తాయి.  పాటల చిత్రీకరణలో హీరోయిన్ బొడ్డూ పిరుదులూ రొమ్ముల క్లోజప్ లూ, ఆమె నడుంపట్టుకు వేలాడే హీరోలూ తెలుగు సినిమాలో కొల్లలు.

బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీల కథలను తీర్చిదిద్దిన దర్శకులు కూడా ఉన్నారు కదా. వాళ్ళ సినిమాల్లోకూడా  మేల్ గేజ్ లేకుండా ఉండదు. వుమన్ ఓరియెంటెడ్  సినిమాల్లో కూడా ఎక్కడో ఓ చోట మూవీకామెరా చూపు దానిపని అది చేస్తూనే ఉంటుంది. స్త్రీల సమస్యలమీద మంచి సినిమాలు తీసిన బాలచందర్ కూడా చాలాచోట్ల చూపులు తప్పాడు. ‘అంతులేనికథ’లో కామెరా జయప్రదతో ప్రేమలో పడిపోయి వదల్లేకుండా అయిపోవటాన్ని గమనించటం కష్టమేమీ కాదు. అలాగే ‘మరోచరిత్ర’ కూడా. ‘చక్ర’ సినిమాలో స్మితాపాటిల్ స్నానాన్ని చూపిస్తూ అప్రయత్నంగా కామెరా కొంచెంగా మోహంలో పడిపోయిందనిపిస్తుంది. అందం, బలమైన వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్ అంటే మోహం, ప్రేమ సినిమాటోగ్రాఫర్లలోనూ దర్శకుల్లోనూ కలగటం చాలా సహజం. దాన్ని అదుపుచేసి సినిమాని స్క్రిప్ట్ కి తగ్గట్టు తీసినప్పుడే గొప్ప సినిమాలు వస్తాయి. కానీ సినిమా ఆడాలంటే మేల్ గేజ్ ని పూర్తిగా వదిలేసే ప్రయోగాలు చెయ్యకూడదని పాపులర్ అయిన దర్శకులందరికీ తెలుసు. హీరోయిన్ అంటే ఖచ్చితంగా అందంగా ఉండాల్సిందే.

 

హాలీవుడ్ లో బలం, ధైర్యం ఉండి, యుద్ధాలు చేసే స్త్రీలుగా Uma Thurman (Kill Bill),  Angelina Jolie (Lara Croft etc.), Sigoumey Weaver (Alien) ల ఇమేజెస్ నిలుస్తాయి. అయినా వాళ్ళలోని ఆకర్షణని దర్శకుల మేల్ గేజ్ కొంతయినా ఎత్తి చూపిస్తూనే వచ్చింది. స్త్రీ శరీరాన్ని ఇష్టమొచ్చినట్టు చూపించే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా అణచివేతలోని బాధనీ అన్యాయాన్నీ తీవ్రంగా చూపించిన ‘బాండిట్ క్వీన్’ ని  మేల్ గేజ్ కి చాలావరకూ మినహాయింపనే చెప్పుకోవచ్చు. బాండిట్ క్వీన్ తీసిన శేఖర్ కపూరే ‘మిస్టర్ ఇండియా’లో శ్రీదేవి మీద పూర్తిగా మగచూపుని ఎక్కుపెడితే జనం డబ్బుల వర్షం కురిపించారు.

సినిమాకళతో చాలా ప్రయోగాలు చేసిన యూరోపియన్ సినిమాలో మేల్ గేజ్ అన్వయింపు సులభం కాదు. పాత్ర స్వభావం ఏమిటన్నదే వాళ్ళ దృష్టి. నగ్నత్వం ఎంతగా ఉన్నా దానిలో రెచ్చగొట్టే కోణం ఉండదు. నగ్నత్వం దానంతట అదే అసభ్యత అయిపోదు. చిత్రీకరించిన పద్ధతిని బట్టి అది ఆ సన్నివేశానికి అవసరమా లేక titillation కోసమేనా అన్నది ఎవరికైనా అర్థమౌతుంది. ఉదాహరణకి Jean Luc Godard సినిమాల్లో స్త్రీ అంటే ఒక వ్యక్తిత్వమే. దానికి తోడు ‘బ్రెక్టియన్ ఎలియనేషన్’ టెక్నిక్ కూడా వాడి, అరాచకాన్నీ అన్యాయాన్నీ బట్టలిప్పి చూపిస్తాడు. Godard సినిమాలో పాత్రలకంటే ఆ పరిస్థితులే మనకి భయానకంగా గుర్తుండిపోతాయి.  కొరియన్, చైనీస్ జాపనీస్ సినిమాల్లో ఎవరి కల్చర్ కి వాళ్ళు మేల్ గేజ్ ని కలిపి తీసినవీ, మేల్ గేజ్ ని వదిలి తీసినవీ కూడా గమనించొచ్చు. తరాల సంస్కృతికి  మేల్ డామినేషన్నీ ఆధునికత్వాన్నీ కలిపితే వచ్చే మగచూపులోంచి రకరకాల సినిమాలూ వ్యాపార ప్రకటనలూ తయారౌతున్నాయి.

lalita3

మేల్ గేజ్ ఉండకూడదని మడి కట్టుకుంటే శృంగారాన్నీ మోహాన్నీ సినిమాల్లో ఎలా చిత్రించాలన్నది ప్రశ్న. మంచి ఈస్తటిక్ సెన్స్ ఉన్న దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు శృంగార దృశ్యాలు తీసేటపుడు ఆ పాత్రల మనస్తత్వాలను దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళు కథలో ఏ సామాజిక వర్గానికి చెందినవారన్నది కూడా గుర్తిస్తూ శృంగారాన్ని చిత్రీకరిస్తారు. కథనిబట్టి అది మొరటుగా ఉండొచ్చు, సున్నితంగా ఉండొచ్చు, హింసాత్మకంగానైనా ఉండొచ్చుగానీ స్త్రీలని మాంసఖండాలుగా చూపించేటట్టు మాత్రం ఉండదు. మన సినిమాల్లో ఆడవాళ్ళని వస్తువులుగా చూపించవద్దని  అనుకునేవాళ్ళు శృంగార సన్నివేశాల జోలికే పెద్దగా పోకుండా సినిమా లాగించేస్తారు.  Titillation లేకుండా శృంగారాన్ని చక్కగా తీసేవాళ్ళు తక్కువ.  సెక్స్ ని సహజంగా చిత్రీకరించటంలో ఇప్పుడొస్తున్న మల్టీప్లెక్స్ హిందీ సినిమా, కామెరా తడుములాటకి దూరంగా కొంత ముందుకి వెళ్ళింది.  మిగతా పాపులర్ సినిమాల్లో మేల్ డామినేషన్ ఎలాగూ తప్పదుగానీ, మన వారసత్వసంపద, అదే.. మన తెలుగుహీరోలు.. వాళ్ళ సినిమాల్లోలా వ్యక్తిత్వంలేని ఆడవాళ్ళను  మేకప్ కిట్స్ తో సహా దొరికే బార్బీ డాల్స్ లా చూపించకుండా ఉండే మేల్ గేజ్ మేలనుకోవాలి ప్రస్తుతానికి.

మేల్ గేజ్ ని ఎదుర్కోవాలంటే విజువల్ మీడియాలో ఫిమేల్ గేజ్ ని తీసుకురావాలని కొంతమంది చెప్తారు.  ఫిమేల్ గేజ్ చెయ్యాల్సిన పని,  మేల్ గేజ్ కున్న వాయరిస్టిక్ లక్షణాన్ని అందిపుచ్చుకుని దానిలాగే తెరను ఆక్రమించటం కాదనీ  మగచూపుకున్న అధికారాన్ని తగ్గించటానికి కృషి చెయ్యాలంటే వేరే రకాలుగా కూడా దృశ్యాలను చూపించటం నేర్చుకోవాలనీ అంటోంది Lorraine Gamman.  అంటే తెరమీది స్పేస్ ని స్త్రీపురుషులిద్దరూ పంచుకోవాలని చెప్తోంది.  సినిమాటోగ్రాఫర్లలో స్త్రీలు చాలా తక్కువ. సరైన దర్శకులతో పోటీ పడగల సమర్థత ఉండి, స్త్రీవాదికూడా అయిన సినిమాటోగ్రాఫర్ ఎవరైనా, అలవాటైన మేల్ గేజ్ ని వదిలించుకుని, ప్రయత్నపూర్వకంగా తనవైన కామెరా ఏంగిల్స్ చూపిస్తూ సినిమా తియ్యగలిగిననాడు ఆడచూపును కూడా నిర్వచించవచ్చేమో.                 

***

యాభై ఏళ్ల కిందటైతే వెకిలిచూపులు ఎదురైతే చీరకొంగు భుజాలచుట్టూ నిండా కప్పుకుని తప్పుచేసినట్టుగా తల వొంచుకునేవాళ్ళు భద్రమహిళలు. ఇప్పుడు బహిరంగస్థలాల్లో మగవాళ్ళతో ఇంచుమించు సమానసంఖ్యలో తిరగ్గలగటం వల్ల వొచ్చిన ధైర్యంతో తలెత్తి లెక్కలేనట్టు మామూలుగా హాయిగా తిరుగుతున్నారు. ఆడవాళ్ళ బాడీలాంగ్వేజ్ ఎక్కడున్నా ఏ ఇబ్బందీ లేనట్టుగా మారిపోయింది.  స్త్రీవాదం, ఉద్యోగాలు, ఆత్మవిశ్వాసం స్త్రీలను నిటారుగా నిలబెట్టేవరకూ తెచ్చాయి. ఇదెంతో బాగుంది. కానీ మధ్యలో అన్నిటికీ నేనున్నానంటూ సర్వవ్యాపి మార్కెట్ జొరబడిపోయి, ఉన్న స్వరూపాలని మార్చి గందరగోళం చేస్తుందే!  “నీ శరీరాన్ని అందంగా వీటితో అలంకరించు ఒంటిని తీర్చిదిద్దుకుని చక్కగా స్వేచ్ఛగా ప్రదర్శించు. నీ స్వేచ్ఛకి ఆకాశమే హద్దు” అని ఫెయిర్ అండ్ లవ్లీలాంటి వేలకొద్దీ వస్తువులతో చుట్టుముట్టి  అన్ ఫెయిర్ ఆటలు ఆడుతోందే!  అసలే అలంకార ప్రియులేమో, మార్కెట్ దెబ్బను సగటు అర్భకపు ఆడప్రాణాలు ఎలా తట్టుకోగలవు? వొంటిని కుదించీ పెంచీ, రంగులద్దీ,   ప్రకటనలు ఎలా ఆదేశిస్తున్నాయో అలాగే తయారవటానికి పరుగు పెడుతుంటాయి.

lalita1

నువ్వు నీలాగే ఉండమంటూ ఆ ‘నువ్వు’ ఎలా ఉండాలో చెప్తున్నారు.

 

సైజ్ జీరోలుగా చాలామంది అన్నపానీయాలు మానేసి రోగగ్రస్తులయాక అమెరికన్ fashion diva ‘కిమ్ కడాషన్’ ఈమధ్య కొత్త ట్రెండ్ ఒకటి తీసుకొచ్చింది. ఆమె తన పిరుదుల్ని సర్జరీతో పెద్దవిగా చేసుకుని అందమంటే ఇదేనంది. దానితో ‘బూటీ’ అని ఆడామగా అందరూ ముద్దుగా పిల్చుకునే పెద్దపిరుదుల మీదే ధ్యాసయిపోయింది కొంతమంది ఆడపిల్లలకి.  అవి పెద్దగా లేకపోతే బెంగ.  రేప్పొద్దున్న ఇంకే ఫాషన్ సీతాకోకచిలకో లేదా పిరుదుల్ని సాఫుచేసే మిషన్లని తయారుచేసేవాళ్ళో ముందుకొచ్చి,  ఫ్లాట్  హిప్స్ లేకపోతే బతుకు వ్యర్థమని  ప్రచారం చేస్తే ఆడపిల్లలకి కొత్తబెంగలు పుట్టుకొస్తాయి. మరోపక్క ‘నా వొళ్ళు నాయిష్టం’ అని సినిమాతారలు స్త్రీస్వేచ్ఛకి అర్థం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందంకోసం ముక్కులూ మూతులతో సహా శరీరభాగాలని కోయించుకుని, క్రీములు పూసుకుని మార్కెట్ గేజ్ కి తగ్గట్టు తయారై  ‘నాశరీరం నాయిష్టం’ అని చెప్పటం ఎంత తెలివితక్కువతనమో గమనించలేనంత మత్తులో మునిగున్నారు.  మన శరీరాలను తీర్చిదిద్దుకోవటంలో ఇప్పుడు మన ఇష్టం ఏమీ లేదనీ, కాస్మెటిక్ సర్జన్లూ బిలియన్లడాలర్ల కాస్మెటిక్ వ్యాపారం చేసేవాళ్ళూ బట్టలమ్ముకునేవాళ్ళూ కలిసి పిల్లలతో సహా అందరిమీదా మత్తుమందు జల్లుతున్నారనీ ఎవరికెవరు చెప్పగలరు?

పిట్టలపోరు పిల్లి తీర్చినట్టు ఈ మేల్ గేజ్  ఫిమేల్ గేజ్ ల గొడవని ‘మార్కెట్ గేజ్’ పరిష్కరించింది. ఇప్పుడు అన్నిటికంటే అదే బలమైనదని ఒప్పుకోవాలి. ఆడా మగా అందర్లోనూ నిద్దరోతున్న ‘Exhibitionism’ ని తట్టిలేపి దువ్వి ముద్దుచేస్తూ వేల వెరైటీల వస్తువులు అమ్ముకుంటోంది. అదీ మార్కెట్ చూపు.  సిక్స్ పాక్ ఛాతీలు ప్రదర్శించే ఫాషన్ వచ్చాక మగశరీరాన్ని కూడా ఖండాలుగా ప్రదర్శించేశారు.  అందరూ ఇప్పుడు ఉదారంగా, హక్కుగా, ఇష్టంగా తమ అందచందాలను ప్రదర్శిస్తున్నామని అనుకుంటున్నారు.

ముందు మనని మనం ప్రేమించుకున్నాక ఆ ప్రేమను అందరికీ చూపించుకోవాలి.  ఒకరు చేతిలో మొబైల్ ఫోన్ ని ఎత్తిపట్టుకుంటే ఐదారుగురు దానివైపే చూసే చూపు ట్రెండీ సెల్ఫీ గేజ్. ఎవరిని వాళ్ళు ఎప్పుడూ చూసుకుంటూ (narcissistic) అందరికీ తమని చూపెట్టుకుంటూ (exhibitionistic) ఉండేలా మార్కెట్ తన కనుసన్నల్లో జనాన్ని ఉంచుకుంటోంది.  మార్కెట్ గేజ్ ని ఎప్పటికైనా దాటగలిగితేనే కదా మన చూపుల్లో వేరే పోకడలు కూడా ఉండొచ్చని మనకు తెలియవచ్చేది!

*

 

 

 

 

 

నవల నడచిన దారి

 

 

-దాసరి అమరేంద్ర

~

 

మొదటి తెలుగు నవల వీరేశలింగం గారి రాజశేఖర చరిత్రము – 1878లో వచ్చింది, దాదాపు నూట నలభై ఏళ్ళ క్రితం.

కథ జీవితపు తునక అయితే నవల ఏకంగా జీవితమే.

జీవితం గురించీ, సమాజం గురించీ తపనపడే నవలల గురించి ఈ మాటలు.

జీవితానికీ సాహిత్యానికీ గాఢమైన అనుబంధం ఉన్నది అన్న నమ్మకంతో ఈ మాటలు.

గత నూట నలభై ఏళ్ళలో నవల పోయిన పోకడలూ, ధోరణుల గురించీ, గత ఇరవై ఏళ్ళలో వచ్చిన ముఖ్యమైన నవలల గురించీ, ఈ మధ్య కాలంలో మంచి నవలలు రావడం లేదు అన్న విషయం గురించీ – అందుకు కారణాల గురించీ ఈ మాటలు.

స్థూలంగా చెప్పాలంటే నవల నడచిన దారిని రేఖామాత్రంగా పరిచయం చేసే ప్రయత్నమిది.

***

ఒకప్పుడు సాహిత్యమంటే పాండిత్య ప్రకర్ష.

రాజులూ, జమీందార్ల వ్యవస్థకు వందిమాగధ ప్రక్రియ. వారి వారి మనోరంజక వ్యాసంగం.

భూస్వామ్యం విచ్చిపోతూ, ప్రజాస్వామ్యానికి దారి ఇచ్చినప్పుడు సమాజంలో ‘మనిషి’ ముఖ్యమయ్యాడు. సాహిత్యానికీ, మనిషే కేంద్రమయ్యాడు. స్వంతంగా, స్వశక్తితో తన జీవితాన్ని నిర్ణయించుకొనే మనిషిని గురించి సాహిత్యం రాసాగింది. అందుకు అనుకూలంగా ఉందే సాహితీ ప్రక్రియలు రూపుదిద్దుకొన్నాయి. కావ్యాలూ, ప్రబంధాల స్థానంలో కథ, నవల వచ్చి చేరాయి. ఆంగ్ల సాహిత్యంలో పద్దెనిమిదో శతాబ్దంలో మొదలయితే, మరో వందేళ్ళకు భారతీయ భాషలలోకి ప్రవేశించి నిలదొక్కుకుంది నవల. ఈ ప్రక్రియకు జన జీవితమే వస్తువయింది. నవల అంటే జీవితానికి ప్రతిబింబం అయింది.

***

ముందుగా రెండు ప్రశ్నలు.

నవలలు ఎందుకు రాస్తారూ?

నవలలు ఎందుకు చదువుతారూ?

ఏ మనిషిలో అయినా ఒక నిరంతర అసంతృప్తి ఉంటుంది.

పరిసరాల మీదా, పరిస్థితుల మీదా, సమాజం మీద ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది.

పరిస్థితి మారాలనుకొంటాడు. మార్పు కోరతాడు. ఆ మార్పు ముందుకూ అవవచ్చూ, వెనకకూ అవవచ్చు. మార్పు కోరతాడు. అందుకోసం తపన పడతాడు.

చలనశీలత ఉన్న వ్యక్తి ఆ మార్పు కోసం నడుం కడతాడు. తనదైన పరిధిలో ఏదో ఒకటి చేస్తాడు – నిర్లిప్తంగా ఉండలేడు.

ఆ మనిషికి తన ఆలోచనల మీదా, అక్షరాల మీద ‘అధికారం’ ఉంటే రచయిత అవుతాడు.

పరిస్థితులను ప్రశ్నిస్తూ, ఘర్షణ పడుతూ, జీవితాలను మెరుగుపరచాలని తపిస్తూ, ఆయా సమస్యల పరిష్కారాల కోసం ప్రయత్నిస్తూ, రెబెల్‌గా మారి –

తన అనుభవాలకు తనదైన చైతన్యం జోడించినప్పుడు జీవితాన్ని నడిపించే సూత్రాల గురించి అవగాహన ఉన్నప్పుడు, గతం ఆసరాగా వర్తమనం భవిష్యత్తు వేపుకు వెళుతుంది అన్న అవగాహన కలిగినప్పుడు,

తనదంటూ ఒక దృక్కోణాన్నీ, దృక్పథాన్నీ ఏర్పర్చుకొన్నప్పుడూ – రచయిత అవుతాడు. నవలా రచయిత అవుతాడు.

మరి చదవడం?

novel6

నేను ఒక గాఢ అనుభూతి కోసం ‘హిమజ్వాల’ పదే పదే చదివాను. ఒకానొక జీవితానుభవం కోసం ‘చదువు’ నవల చదివాను. విభిన్నంగా ఆలోచించగల శక్తినిచ్చే చెలాన్ని చదివాను.

విజ్ఞానమూ, సంస్కారాల కోసం ఉప్పల లక్ష్మణరావు గారి ‘అతడు – ఆమె’ లోని శాంతం, శుభ, లక్ష్మిలను పలకరించాను.

ఒక్కమాటలో చెప్పాలంటే జీవితపు చిక్కుముళ్ళు విప్పే శక్తి సాహిత్యానికీ, నవలలకూ ఉంటుందని చదివాను.

జీవితాలను సమూలంగా మార్చి, జీవితాలకు దిశానిర్దేశం చేసే శక్తి ‘జానకి విముక్తి’లకు ఉంటుందని చదివాను.

నా వరకూ నాకు ‘ది మూన్ అండ్ సిక్స్త్ సెన్స్’ అనే ఆంగ్ల నవల దీపస్తంభంలా నిలబడి దారి చూపించడం – స్వానుభవం.

ఒకే ఒక్క జీవితకాలంలో అనేకానేక జీవితాల అనుభవాలను మనకు అందించే శక్తి నవలకు ఉందని చదివాను.

ఈ నేపథ్యంలోంచి చూస్తే తెలుగు నవల నడచిన దారిలో కూడా సమకాలీన జన జీవితంలోని అన్ని పార్శ్వాలు, కోణాలూ, సంఘర్షణలు, పరిణామాలు కనిపిస్తాయి.

నూటా ఏభై ఏళ్ళ తెలుగు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, చరిత్రను మన నవలలు మన ముందు ఉంచుతాయి.

***

ప్రభువుల వ్యవస్థ మారి సామాన్యుడు సాహిత్యానికి కేంద్రబిందువవడం గురించి చెప్పుకొన్నాం. ఆంగ్ల సీమలో పద్దెనిమిదో శతాబ్దానికల్లా కథా నవలా వికసించడం గురించి చెప్పుకొన్నాం.

పంతొమ్మిదో శతాబ్దం ప్రథమ పాదానికల్లా ఆయా మార్పులు మన దేశాన్నీ తాకాయి. ఇంగ్లీషు చదువు మొదలైంది. రాజారామ్‌మోహన్ రాయ్, అతని సంస్కరణలు మనిషికీ, సమాజానికీ వెలుగుబాట పరిచాయి. అదే ఒరవడిలో అక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగార్, ఇక్కడ కందుకూరి వీరేశలింగం.

యాదృచ్ఛికమే అనిపించినా తెలుగునాట అదే సమయంలో అతి ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకొన్నాయి. రెండు ఆనకట్టల పుణ్యమా అని సామాన్యుని కడగండ్లకు తెరపడింది. కడుపు నిండింది. సంపద సృష్టి ఆరంభమైంది. పట్టణాలు మొలకెత్తాయి. ఇంగ్లీషు పాఠశాలలు మొదలయ్యాయి. కొత్త ఆలోచనలకు అంకురార్పణ. కొత్త చైతన్యాలు… పరిస్థితుల మీద అసహనం… మార్పు కోసం తపన… సంస్కరణల అభిలాష…

అదిగో – అలాంటి సమయంలో వచ్చాయి తొలి తెలుగు నవలలు.

రాజశేఖర చరిత్రము – వీరేశలింగం – 1878

సహజంగానే ‘సంస్కరణ’ ఈ నవల ప్రధానాంశం. రాజశేఖరునునికి తన అజ్ఞానమంటే అసహనం కలుగుతుంది. తనలోని మూఢ విశ్వాసాలంటే ఏవగింపు కలుగుతుంది. తనలో తాను సంఘర్షించడం, పోరాడడం, జయించడం…

అదే కోవలో మరో నవల – రామచంద్ర విజయం – చిలకమర్తి.

రాజశేఖరుని సంఘర్షణ తనతోనే అయితే, రామచంద్రుని పోరాటం పక్కవాళ్ళతో, వాళ్ళ స్వార్థాలతో, పరిసరాలతో.

మనిషి తనను తాను సంస్కరించుకొంటే, పరిసరాలను మార్చే ప్రయత్నం చేస్తే పరిస్థితులు మారతాయి, ప్రపంచం మరింత బాగుపడుతుంది – అన్న నమ్మకంతో వచ్చినవీ – సంస్కరణ దశలోని నవలలు.

***

క్రమక్రమంగా – వ్యక్తి చైతన్యం, మనుషులు దగ్గరవడం, ఉమ్మడి ఎజెండాలు. 1885 నాటికి ఆ ఎజెండాలు కాంగ్రెసు సంస్థ ఆవిష్కరణకు దారితీయడం… జాతీయ భావాలు… శతాబ్దం మారేసరికి జాతిలో నవచైత్యన్యం.

ఈలోగా నవలకు తోడుగా కన్యాశుల్కాలు, ధనత్రయోదశిలు, దిద్దుబాటులు… వలపు నవలలు, చారిత్రక నవలలు, దుర్గేశ నందిని నకళ్ళు… ఏదైమైనా సాహిత్య ప్రక్రియగా నవల నిలబడటం…

సంస్కరణ బావాలకు ఉద్యమ స్ఫూర్తి తోడయితే నవలలకు కొదవ ఉండదు. అదే జరిగింది తెలుగు నవల విషయంలో.

1920ల నుంచి కనీసం 1960ల వరకూ జాతీయ ఉద్యమ నేపథ్యంగా ఎన్నో చెప్పుకోదగ్గ నవలలు వచ్చాయి.

అందులో బాలాంత్రపు వెంకటరావు రాసిన “మాతృమందిరం” – 1920 తొలి తెలుగు జాతీయోద్యమ నవల అంటారు చరిత్ర తెలిసినవారు. అందులోని ‘మాతృ’ శబ్దం మాతృ దేశానికి సంబంధించినది. గాంధీ ప్రతిపాదన కన్నా ముందుగానే మద్యపాన నిషేధం, హరిజన సమస్య, స్త్రీల సమస్యలు, వర్ణాంతర వివాహాలు, వితంతు వివాహాలు – ఇలా అనేకానేక విషయాలు చర్చించిదట ఈ నవల.

1922లో వచ్చిన మాలపల్లి ఈ ఒరవడిలోణి ఓ బృహన్నవల. జీవన విస్తృతి, వస్తు గాఢత ఉన్న నవల. భారతీయ సంప్రదాయం పట్ల ఎంతో అనురక్తి ప్రదర్శిస్తూ, ఆ సంప్రదాయం భౌతిక పరిస్థితులలో ఎన్ని మార్పులు వచ్చినా – ఆ మార్పులకు అనుగుణంగా తననూ ముందుకు నడిపించుకొంటోంది అన్న గొప్ప నమ్మకాన్ని వ్యక్తీకరించారీ నవలలో ఉన్నవ లక్ష్మీనారాయణ.

 

సరే రామదాసు, సంగదాసు, తక్కెళ్ళ జగ్గడు లాంటి సజీవ పాత్రలూ, గాంధీతత్వపు ప్రతిఫలన, జన జీవన సమగ్ర చిత్రణ – దాదాపు వందేళ్ళు గడిచినా ‘మాలపల్లి’ని తెలుగు నవలలకు తలమానికంగా నిలబెట్టడం అందరికీ తెలిసిన విషయమే.

మాలపల్లి నవలలో మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి.

సమాజంలోనూ, సామాజిక సంబంధాలలోనూ వస్తోన్న స్ఫుటమైన మార్పుల్ని ఆ నవల పట్టుకోగలిగింది. కొత్త చూపు, కొత్త దృక్కోణం, కొత్త దృక్పథం. సమాజాన్ని వ్యక్తిపరంగా గాకుండా సమిష్టి వ్యవస్థగా అర్థం చేసుకొని విశ్లేషించడం – దిగువ జాతులు చైతన్యం పొంది పోరాటం సాగిస్తేనే ప్రజా ప్రభుత్వం సాధ్యమవుతుంది. అలా కాని నాడు ధనస్వామ్యమే చెల్లుబాటు అవుతుందన్న అద్భుతమైన అవగాహన – వందేళ్ళ క్రితం!!

ఇదే ఒరవడిలో బాపిరాజు నారాయణరావులోనూ, విశ్వనాథ వేయిపడగలులోనూ జాతీయోద్యమం ఒక ప్రధాన పాత్ర పోషించింది. ‘అతడు-ఆమె’, ‘కొల్లాయిగట్టితేనేమి’, ‘రామరాజ్యానికి రహదారి’, ‘చదువు’ లాంటి నవలల్లోనూ జాతీయోద్యమ నేపథ్యం ప్రముఖంగా ఉంది.

అదే వలస పాలన, జాతీయ భావన, ఆధునిక జీవన విధానం – ఇవి ముప్పేటగా సాగుతోన్న సంధి దశలో – 1930లు నలభైలలో – ఈ విషయాలను చర్చిస్తూ, సంప్రదాయంలో వస్తున్న మార్పుల్ని గుర్తిస్తూ నవలా రచన సాగింది. ఉన్నవ లాంటి వాళ్ళు ‘సంప్రదాయం నిలిచి తీరుతుంది’ అంటే, విశ్వనాథ ‘ధ్వంసమయిపోయింది’ అని నిర్ధారించడం – వాస్తవ స్థితి చిత్రణ అనడం కంటే వారి వారి దృక్కోణ వైరుధ్యం అనడం సరైన పని.

ఈ మధ్యలో కొవ్వలి వెయ్యికి పైగా పాపులర్ నవలలు రాసి తెలుగు నవలలకు పాఠకులను ఏర్పరచడమన్నది నవల నడచిన దారిలో ఒక ముఖ్యమైన మైలురాయి.

***

స్వతంత్ర్యం వచ్చాకా సామాన్యుని జీవితం ఎలా పరిణమించింది? సాంఘిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆర్థిక, రాజకీయ, పరిణామాల దిశ ఎటువైపు మళ్ళుతోంది? – అన్న ఆలోచన సాహితీకారుల్లో సహజంగానే వచ్చింది. ఆయా విషయాలను నవలలో చిత్రించే ప్రయత్నమూ జరిగింది.

1953లో వచ్చిన జీవీ కృష్ణారావు గారి ‘కీలుబొమ్మలు’ ఆ కోవకు చెందిన నవలల్లో మొట్టమొదట చెప్పుకోదగ్గది.

ఇది ప్రధానంగా అస్తిత్వవాద పోకడలున్న నవల అని విమర్శకులు నిర్ధారించినా – సమకాలీన జీవిత చిత్రణా, రాజకీయాలన్నవి ఏదో అధికార పీఠాలకు చెందినవి కావు – అవి సామాన్యుని జీవితంలోని అన్ని పార్శ్వాలను తాకుతాయి అన్న బలమైన ప్రతిపాదానా ఉన్న నవల ఇది.

ఆ తాకటం మనిషిని ఎంతగా దిగజార్చుతుందో 1961లో వచ్చిన బలివాడ కాంతారావు ‘దగాపడిన తమ్ముడు’లో కనిపిస్తుంది. 1940 వ దశాబ్దపు చివరి పాదంలో నడిచిన ఈ కథలో సన్నకారు రైతులు పట్నపు కూలీలుగా మారడమూ, చివరికి బిచ్చగాళ్ళుగా దగాపడడమూ బలంగా చూపించిన నవల ఇది.

ఇదే ఒరవడిలో 1969 నాటి బీనాదేవి ‘హేంగ్ మీ క్విక్’ లో రాజమ్మ ఉరిశిక్ష కోసం త్వరపడుతుంది. 1975 నాటి అర్నాద్ ‘చీకటోళ్ళు’ లో అదే పరిణామం మరింత బలంగా కొనసాగడం కనిపిస్తుంది. అరవైలలో వచ్చిన రావిశాస్త్రి నవలల్లో పట్టణాల పేద ప్రజల కన్నీళ్ళు, కడగండ్లూ – వ్యవస్థ ఆ కన్నీళ్ళతో ధనస్వామ్యపు పంటలు పండించడం – స్పష్టంగా తెలుస్తుంది.

పట్టణీకరణ తెచ్చిన మార్పుల గురించీ, అవి మానవ సంబంధాలలో తెస్తోన్న విపరీత పరిణామాల గురించీ, జీవితాలలో ధనమూ, స్వార్థాల ప్రమేయం గురించీ మాలతీ చందూర్ లాంటి వాళ్ళు 1950ల నుంచి రాయడం మొదలుపెడితే, అప్పుడే రూపుదిద్దుకొంటోన్న మధ్యతరగతి వారి జీవితాల గురించీ అందులోని స్వార్థాలూ, త్యాగాలూ, సంవేదనల గురించీ, అరవైల తొలి దినాలలో కొమ్మూరి వేణుగోపాలరావు ‘పెంకుటిల్లు’ వచ్చింది. మరో పదేళ్ళకు కొలిపాక రమామణి ‘ఏటి ఒడ్డున నీటి పూలు’…

novel4

***

అటు తెలంగాణా వేపు దృష్టి సారిస్తే బొల్లిముంత శివరామకృష్ణ ‘మృత్యుంజయుడు’ (1947) నవలలో అప్పటికీ తనదంటూ ఉనికే లేని తెలంగాణా సామాన్యుడు నవలా వస్తువుగా రూపొందడం కనిపిస్తుంది. మరో పదేళ్లకు వచ్చిన వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’లో ఆ సామాన్యుడి ‘కంఠం’ ప్రస్ఫుటంగా ధ్వనిస్తుంది. మరో పదేళ్ళకు వచ్చిన దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్ళు’ నవల – కథాకాలం 1930లకు చెందినదే అయినా – దొరలూ, గడీలూ, ఆడబాపల జీవితాలను కళ్ళకు కడుతుంది. మరో పదిహేనేళ్ళకు అల్లం రాజయ్య కొలిమి అంటించి జనజీవన కఠోరాలను ఆ మంటల వెలుగులో చూపించారు.

ఇటు ఉత్తరాంధ్రకు వస్తే అప్పటి రావిశాస్త్రీ, బలివాడ కాంతారావులకూ, ఇప్పటి అట్టాడ అప్పల్నాయుడికీ సామాన్యుని కతలూ, వెతలే నవలా వస్తువులు. సీమ వేపు వెడితే మధురాంతకం రాజారాం ఆనాడే సిరివాడ చిన్న ప్రపంచాన్ని సృష్టిస్తే, మొన్న కేశవరెడ్డీ, నిన్న నామినీ తమ తమ నవలలకు దిగువ తరగతి జీవితాలనే ముడిసరుకుగా తీసుకొన్నారు. ఈనాటి మధురాంతకం నరేంద్ర తిరుపతి పట్టణంలో గత వందేళ్ళుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా వేళ్ళూని విషవృక్షంగా పరిణమించిందో ‘భూచక్రం’ నవలలో ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు.

***

తెలుగు నవల అంటే అనువాద నవలలను గుర్తు చేసుకోకుండా ఉండలేం. శరత్ తెలుగు వాడా? అన్నది ఏ మాత్రమూ సందేహం లేని ప్రశ్న. బడీ దీదీ మాధవి, దేవదాసు పార్వతి, శ్రీకాంతూ మన మనుషులయ్యారు. గోర్కీ అమ్మ స్ఫూర్తితో నవలలే వచ్చాయి. రాహుల్ సాంస్కృత్యాయన్‌ని చదవని తెలుగు యాత్రాప్రేమి ఉండడు. గోపీనాథ్ మొహంతీ అమృత సంతానం – మన గిరిజనుల గురించేగదా? ‘మరల సేద్యానికి’లో శివరామ కారంత్ చెప్పుకొచ్చిన సరస్వతీ, పారోతీ తెలుగువాళ్ళు గాదూ? ప్రేమ్‌చంద్, యశ్‌పాల్, జయకాంతన్, తజకి, బిభూతిభూషణ్ బందోపాధ్యాయ, జమీల్యా, ఐతమతోవ్, నండూరి అనువదించిన ‘రెండు మహానగరాలు’; ఎన్నో ఎన్నెన్నో పరభాషా నవలలు తెలుగు నవలా సాహిత్యాన్ని సుసంపన్నం చేసాయి.

***

ప్రపంచమూ, సాహిత్యమూ, తెలుగు నవలలు మగవాడి చుట్టూ – అతని సమస్యలూ, పోరాటాల చుట్టూ తిరుగుతోన్న సమయంలో – స్త్రీలకు తమ తమ సమస్యలు లేవా? ఆకాంక్షలు లేవా? పోరాడాల్సిన విషయాలు లేవా? అన్న మౌలికమైన ప్రశ్నలను చలం 20లు, 30లలోనూ బలంగా బయటకు తెస్తే సమాజం ఉలిక్కిపడింది. తత్తరపడింది.

ఆ బాటలో మహిళా నవలాకారులు కొనసాగడం సహజ పరిణామం.

వట్టికొండ విశాలాక్షి 1956లో రాసిన ‘నిష్కామ యోగి’ నవలలో జాతీయోద్యమంలో పాల్గొనేంత చైతన్యమూర్తి అయిన ఓ మహిళ కూడా కుటుంబ వ్యవస్థ దగ్గరకు వచ్చేసరికి నిస్సహాయురాలవడం కనిపిస్తుంది.

మరో ఏడాదికే వచ్చిన డాక్టర్ శ్రీదేవి నవలలో ఇందిర, కళ్యాణిలతో పాటు వసుంధరా వైదేహిలు కూడా వ్యవస్థను ప్రశ్నించి, నిలదీసి, కాలాతీత వ్యక్తులుగా నిలబడడం కనిపిస్తుంది. ‘సహవాసి’ అన్నట్లు తర్వాత వచ్చిన స్త్రీవాదానికి ఆనాటి సజీవవాదం ఈ నవల.

తెన్నేటి హేమలత ఆలోచనలూ, వ్యక్తీకరణలూ ఒక విలక్షణ మార్గంలో సాగితే, రంగనాయకమ్మ కూలిన గోడలు దగ్గర్నించి జానకి విముక్తి దాకా తానే ఒక మార్గం ఏర్పరిచారు. ఎంతో మందికి మార్గదర్శి అయ్యారు. ఓల్గా ఎనభైలలో రాసిన ‘స్వేచ్ఛ’ స్త్రీవాద నవలలకు కొత్త దీపస్తంభం అయింది.

మరో వేపు మాలతీ చందూర్, మాదిరెడ్డి సులోచన, ద్వివేదులు విశాలాక్షి, కె. రామలక్ష్మి, వాసిరెడ్డి సీతాదేవి తమ తమ బాణీలలో మధ్యతరగతి స్త్రీల ఆలోచనలకూ, ఆకాంక్షలకూ, చైతన్యానికీ, వికాసానికీ కేంద్ర బిందువులయిన నవలలు రాసారు. ఇదే ఒరవడిలో సులోచనా రాణి ‘మీనా’ లాంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలను సృష్టించారు.

 

అదే సమయంలో స్త్రీ చైతన్యాన్నీ, అస్తిత్వ స్పృహనూ సంతరించుకొన్న ‘గీతాదేవి’ని మనకు పరిచయం చేసారు వడ్డెర చండీదాస్.

తెలుగు నవలా సాహిత్యంలో 1950లు, అరవైల నాటి తాత్త్విక, అస్తిత్వ, మనోవిశ్లేషణాత్మక నవలలు ఒక ముఖ్యమైన పాయ.

“మనిషిని అర్థం చేసుకోవాలంటే ఏ మనిషిని ఆ మనిషిగా చూడాలి. ఉమ్మడి బతుకుల సిద్ధాంతాలు మనిషి ప్రత్యేకతని దెబ్బతీస్తాయి. మనిషిని యంత్రంగా చేస్తాయి. మనిషే ముఖ్యం.” అంటుంది అస్తిత్వవాదం.

“మనిషి అన్నివేళలా ‘సహజంగా’ ప్రవర్తించడు. అతనిలో అసహజ ప్రవర్తనా ఉండవచ్చు. దానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు వెతకాలి. ఆ ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. అతనికి అప్పుడు సాయం చెయ్యగలుగుతాం” అంటుంది మనోవిశ్లేషణా మార్గం.

మనిషిలోని ఉపచేతన – సబ్ కాన్షియెస్- ను దాటి వెళ్ళి, సుప్త చేతన – అన్ కాన్షియెస్ – లోని భావధారను పట్టుకొనే ప్రయత్నం చేస్తుంది చైతన్య స్రవంతి ప్రక్రియ.

ఈ నవలా కుటుంబానికి తలమానికం 1946లో బుచ్చిబాబు రాసిన ‘చివరకు మిగిలేది’. తన జీవితానికీ, తన ప్రవర్తనకూ తాను జవాబుదారీ కాదు అని భావించే దయానిధి అంతరంగపు పొరలలోకి వెళ్ళి ఆ ధోరణికిని ఆవిష్కరించే ప్రయత్నం ఎంతో సమర్థవంతంగా జరిగింది ఈ నవలలో. తర్వాత వచ్చిన శీలా వీర్రాజు ‘మైనా’ నవలకూ, చండీదాస్ ‘హిమజ్వాల’కూ ప్రేరణ అయింది ఈ చివరకు మిగిలేది నవల.

ఈ బాణీలో రావిశాస్త్రి అల్పజీవి రాసారు. గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర రాసారు. హిమజ్వాలా, మైనాల గురించి చెప్పుకున్నాం. ఈ నవలలోని అస్తిత్వవాదం, మనో విశ్లేషణా, చైతన్యస్రవంతి ప్రక్రియలను ముప్పేటలుగా సాగితే, ‘అంపశయ్య’ నవలలో నవీన్ చైతన్య స్రవంతి ప్రక్రియను పరిపూర్ణ రూపంలో దాదాపు ఏభై ఏళ్ళ క్రితమే మనముందుంచారు.

***

ప్రతీకాత్మక నవలల గురించీ మనం చెప్పుకోవాలి.

రాజకీయాల ఊబిలో చిక్కుకుపోయిన ప్రజాస్వామ్యం దున్న గురించి రాసారు వినుకొండ నాగరాజు. కిక్కిరిసిన బస్సును దేశానికి ప్రతీకగా మార్చి స్వర్ణసీమకు స్వాగతం అన్నారు మధురాంతకం మహేంద్ర. దళిత రాజకీయాలలోని విపరీత లక్షణాలను తనదైన బాణీలో ‘నల్ల మిరియం చెట్టు’లో ఆవిష్కరించారు చంద్రశేఖరరావు. అటు చాళుక్యుల కాలాన్నీ ఇటు రాజశేఖరుల ఆవిర్భావాన్నీ ఒకే నవలలో – వీరనాయకుడు-లో చూపించారు పతంజలి శాస్త్రి. సినిమా రంగపు జీవితాలను బట్టబయలు చేసి మనముందు నిలిపారు ‘పాకుడురాళ్ళు’లో రావూరి భరద్వాజ.

***

ఇక్కడ పాపులర్ నవలల గురించి ఒక్కమాట.

అరవైల ఆరంభంలో కౌసల్యాదేవి ఆరంభించిన చక్రభ్రమణం ఈ ఏభై అరవై ఏళ్ళతో నిరంతరాయంగా యండమూరి సులోచనల సాక్షిగా సాగిపోతూనే ఉంది. ఆ నవలలన్నీ తెలిసోతెలియకో వ్యవస్థకు వంతపాడే బాణీవన్న మాట నిజమే అయినా – ఆయా నవలలూ, రచనలూ పాఠకుల సంఖ్యను గణనీయంగా పెంచాయి. కొత్త కొత్త పాఠకులనూ, యువతరాన్నీ అక్షరాల వేపు ఆకర్షించాయి. ఇది అన్ని భాషలలోనూ జరిగింది, జరుగుతోంది.

 

***

తెలుగు నవలల్లో భాష నడిచిన దారిని ఓ మారు చూద్దాం.

తొలి నవలలు – సహజంగానే – శుద్ధ గ్రాంథికంలో నడిచాయి.

ఇరవయ్యో శతాబ్దపు తొలి దినాలు వచ్చేసరికి నవలల్లో సరళ గ్రాంథికం సామాన్యమయిపోయింది.

నలభైలకల్లా శిష్ట వ్యవహారికం, ఏభైల నుంచీ ప్రజలు మాట్లాడే వ్యవహార భాష నవలలకు ఆధారపీఠమయిపోయింది.

ఎనభైలు వచ్చేసరికి నామిని లాంటి వాళ్ళ పూనిక వల్ల మాండలికం సాహితీభాష అయింది. ఒప్పుదల పొందింది.

అయినా నాలుగేళ్ళ క్రితం వచ్చిన ‘బోయకొట్టములు పండ్రెండు’ అన్న నవలను కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె సరళ గ్రాంథికంలో రాయడం, పదిమందినీ ఒప్పించడం – భాష విషయంలో పాఠకులకూ, రచయితలకూ, తెలుగు నవలా సాహిత్యానికీ ఉన్న పట్టు విడుపులకు ప్రబల నిదర్శనం అని చెప్పుకోవాలి.

***

చారిత్రక నవలలంటే ఏమిటీ?

జీవితమే నవలకు ముడి వస్తువు అయినప్పుడు ఒక రకంగా చూస్తే ప్రతి నవలా చారిత్రక నవలే. తన కాలపు సమాజానికి అద్దం పట్టే నవలే.

అయినా మనకు మొట్టమొదట్లో వచ్చిన చారిత్రక నవలలు సహజంగానే – రాజ ప్రశంస, రాజ్య ప్రశంస, జాతీయ దురభిమానాలు ప్రాతిపదికగా, అభూతకల్పనలతో – వచ్చాయి.

కానీ మానవ పరిణామ క్రమంలో కొన్ని కొన్ని సంఘటనలూ, పరిస్థితులూ నిర్వహించిన పాత్రల గురించీ అవి చరిత్ర గతిని మార్చిన విషయం గురించీ కూడా తెలుగులో నవలలు వచ్చాయి. నిన్న మొన్నటి ‘అతడు – ఆమె’, ‘కొల్లాయిగట్టితేనేమి’ లాంటి నిన్నటి నవలల గురించి చెప్పుకొన్నాం.

novel3

మధ్య యుగాల నాటి సమాజం గురించి తెలుగులో వచ్చిన రెండు నవలల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

పదమూడో శతాబ్దపు గోబీ ఎడారులలోణి ఓ తండాకు చెందిన పనినాయకుడు ప్రతికూల పరిస్థితులలో ఏభై ఏళ్ళ పాటు అలుపు లేకుండా పోరాటం చేసి మానవ చరిత్రలోనే అతి పెద్దదయిన సామ్రాజ్యాన్ని నిర్మించిన వైనాన్ని ‘చెంఘిజ్‌ఖాన్’ నవలలో చెపుతారు తెన్నేటి సూరి. ‘రక్తపు ధారల్లో మునిగి తేలిన మనిషి కథ గదా ఈ నవల’ అన్న విమర్శకులకు – “పీడన ఉంటే అగ్ని పుడుతుంది నిజమే – చెంఘిజ్‌ఖాన్ ఓ అగ్నికణం. విధ్వంసకరమైన జ్వాల పుట్టగూడదు అనేవాళ్ళు ఆ పుట్టడానికి హేతువయిన పీడన ఎందుకు ఉందో చెప్పాలి.” అని సమాధానమిచారు తెన్నేటి సూరి.

ఎనిమిది తరాల ఓ బడుగు బోయ వంశం అటు చాళుక్యులు, ఇటు చోళుళ ఒడిదొడుకుల మధ్య చిక్కడిపోయి, తట్టుకొంటూ మనుగడ సాగించినా పాండురంగడు అన్న సేనాని క్రోధానికి మసి అయిపోయిన విధానాన్ని అతి చక్కని రీతిలో చిత్రించారు ‘బోయకొట్టములు పండ్రెండు’ అన్న నవలలో బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె.

ప్రభువుల పల్లకీల గురించి కాకుండా, రాళ్ళెత్తిన కూలీల గురించి వచ్చిన అరుదైన నవలలు ఇవి.

***

నిన్న మొన్నటిదాకా వ్యవసాయ ప్రధానంగా ఉన్న తెలుగు జీవితంలో, వ్యవసాయమే జీవవ విధానంగా బతికిన సాంబయ్యల గురించీ, బక్కిరెడ్ల గురించీ నవలలు వచ్చాయి. మట్టిని తల్లిగా భావించే రోజులు మారి క్రమక్రమంగా వరూధినిలూ, వెంకటపతిలూ భూమిని వ్యాపార వస్తువుగా పరిగణించడాన్ని ‘మట్టి మనిషి’ బలంగా చిత్రించింది. అదే ఒరవడిలో కేశవరెడ్డి ‘మూగవాని పిల్లనగ్రోవి’ వచ్చింది. ఇరవై ఏళ్ళ క్రితం చంద్రలత ‘రేగడి విత్తులు’… నిన్నటికి నిన్న నల్లూరి రుక్మిణి ‘ఒండ్రుమట్టి’.

novel4

***

జీవితాలను అతి సజీవంగా, అతి సహజంగా చిత్రించిన రెండు పుస్తకాల గురించి – నవలలు కాని నవలల గురించి – చెప్పుకోవాలి.

పంతొమ్మిదో శతాబ్దపు ప్రథమ పాథంలో అర్థ అక్షరాస్యుడిగా భారతదేశంలో అడుగుపెట్టిన మెడోస్ టైలర్ అన్న బ్రిటీషు యువకుని ఆత్మకథ ‘సురపురం’. ఆ యువకుడు సమర్థవంతుడైన అధికారిగా, పరిణతి చెందిన రాజనీతిజ్ఞుడిగా, పరిపూర్ణ మానవుడిగా భారతదేశమే తన దేశమని భావించే మట్టిమనిషిగా 1825 – 65 ల మధ్య పరిణామం చెందిన వైనమూ, ఆ కథ చెపుతోన్న క్రమంలో ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక పరిస్థితుల చిత్రీకరణా – అరుదైన ‘నవల’ ఇది.

1930ల నాటి పట్టణాల్లోని ఓ పెద్ద దళిత కుటుంబంలో ‘చదువు’ మీద ఉన్న పట్టుదల ఎంత గణనీయమైన మార్పులు తెచ్చిందో, ఆ అతి సామాన్యమైన కుటుంబం చదుపు పునాది మీద ఎలా ఎదిగి నిలబడగలిగిందో రాగద్వేషాలకు అతీతంగా నిమిత్తమాత్రంగా చెప్పుకొచ్చిన బయోగ్రఫీ ‘మా నాయన బాలయ్య’. రాసిన మనిషి ఆ బాలయ్య గారి అబ్బాయి సత్యనారాయణ.

ఈ రెండు పుస్తకాలూ ఇంగ్లీషు మూలభాషగా కలవే అయినా వాటి అనువాదాలూ, అందులోని తెలుగు జీవితం – అపురూపం.

***

తెలుగు నవలల గురించి మాట్లాడేడప్పుడు నవలాభిమానులు, ‘విమర్శకులూ’ అడిగేది ఒకటే మాట – ఈ మధ్య కాలంలో మంచి నవలలు అంటూ వచ్చాయా?!

‘వచ్చాయి – లేదు’ అన్నది నా సమాధానం.

ఒక్కసారి గత ఇరవై పాతికేళ్ళను గమనిస్తే మరో ఐరవై పాతికేళ్ళు నిలబడగలిగే నవలలు చాలా కనిపిస్తాయి.

కేశవరెడ్డి నవలలు వచ్చాయి. ‘అంటరాని వసంతం’ వచ్చింది. ‘నల్ల మిరియం చెట్టు’ వచ్చింది. మునెమ్మ, దృశ్యాదృశ్యం, వీరనాయకుడు, బోయకొట్టములు, ఒండ్రుమట్టి, భూచక్రం, నిప్పుల వాగు, వేముల ఎల్లయ్య కక్క…

“వ్యాపార (పాపులర్) నవలల వెల్లువలో కొట్టుకుపోతోన్న తెలుగు నవలకు చేయూత ఇవ్వాలనే” మంచి ఉద్దేశంతో అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ సంస్థలు – ఇరవై ఏళ్ళ క్రితమే – ప్రయత్నం చేసాయి. రేగడి విత్తులు, వలస దేవర, అయిదు హంసలు లాంటి చెప్పుకోదగ్గ నవలలు వచ్చాయి. అమెరికా నేల మీద నుంచి కూడా గొర్తి బ్రహ్మానందం రాసిన ‘అంతర్జ్వలనం’, రెంటాల కల్పన ‘తన్హాయి’ వచ్చాయి. ‘కథతో పాటు నవల కూడా అమెరికా నేల మీద వికాసం చెందుతోంది’ అన్న నమ్మకం కలిగించాయి.

kalpana

అప్పటి మాలతీ చందూర్లకు చక్కని కొనసాగింపుగా మంథా భానుమతి, గంటి సుజలలు చక్కని నవలలు రాస్తున్నారు.

గమనమే గమ్యంగా తెలుగు నవల సాగిపోతోంది.

అయినా –

ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది.

నూతన జీవన విధానాలనూ, ఆర్థిక రాజకీయ పరిణామాలనూ, సాంకేతిక సంక్లిష్టతలనూ ఈనాటి నవల పట్టుకోగలుగుతోందా?!!

లేదనే అనాలి!

ఎందుకనీ?!

నవల అంటే విస్తృత అధ్యయనం. నిరంతర పరిశీలన, విశ్లేషణ. మారుతోన్న జీవితాన్ని ‘పట్టుకోవడం’, కూలంకుషంగా అర్థం చేసుకోవడం… కార్యకారణ సంబంధం మీద మౌలికమైన అవగాహన కలిగి ఉండటం…

ఇది అనుకొన్నంత సులభంగాదు.

మన తెలుగు రాష్ట్రాలలో గత ఇరవై పాతికేళ్ళుగా కంప్యూటర్ వేగంతో మార్పులొచ్చాయి, వస్తున్నాయి. ఈ మార్పుల్ని ‘అందుకోడం’ సామాన్యులకు సాధ్యం కాదు. ఉదాహరణకు కారా గారు ఇరవై ఏళ్ళ క్రితమే తాను కథలు రాయకపోవడానికి మార్పుల్ని పట్టుకోలేకపోవడం ముఖ్య కారణమని అన్నారు. ఇదే మాట ఇంకో సందర్భంలో ఏభై ఏళ్ళ క్రితం కొడవటిగంటి అన్నారు.

ఒప్పుకున్నా లేకపోయినా మనవి ఉద్రేక స్వభావాలు. వెంటవెంటనే స్పందించే తత్వాలు. అవి కవిత్వానికీ, కథలకూ సరిపోతాయేమోగానీ నవల విషయంలో గ్రక్కున విడవాల్సిన విషయాలు. నవలకు సంయమనం, సమగ్రదృష్టి, ఆధార పీఠాలు. కొకు, ఉప్పల, మహీధర లాంటి వాళ్ళు ఆవేశకావేశాలను పక్కనబెట్టి రాసారు. తమ తమ నవలల్లో సిద్ధాంతాల ప్రకారం నడిచే జీవితాలను చిత్రించకుండా, జీవితాలు నడిచే విధానాలను సిద్ధాంతాల నేపథ్యంలోంచి చూపించారు. ఆ సంయమనం ఇప్పుడు – ఈ నూతన జీవన విధానాలలో – కొరవడుతోంది.

నవల రాయడం అంటే ఆరు నెలల తపన, ప్రేమ. కనీసం మూడు నెలల కష్టం. శ్రద్ధగా, ఓపికగా, నిబద్ధతతో, అంతంత కాలం నవల మీద ఖర్చు పెట్టడం – ఊహాతీతమయిపోతోంది!

అయినా

నవల నడిచిన దారిని మరోసారి చూసుకొంటే, గత పాతికేళ్ళ మందగమనాన్ని విస్మరించకుండానే, మనం సంతోషించవలసిన విషయాలు చాలా ఉన్నాయి.

దాదాపు నూట ఏభై ఏళ్ళ తెలుగువారి జీవితాలకు సాక్షీభూతంగా నిలిచింది తెలుగు నవల. అనేకానేక పరిణామాలను ఒడిసి పట్టుకొని నమోదు చెయ్యగలిగింది. గొప్ప సాంస్కృతిక సంపదగా మిగిలింది. అనుమానం లేదు.

ఈనాడూ, రేపూ సంగతి అంటే –

ఆశావాదంలో తప్పు లేదు గదా!

***

ఈ మాటలన్నీ నా పరిజ్ఞాన ఫలితంగా వచ్చినవి గావు.

సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికీ, జీవితానికి అన్వయించుకోడానికీ నేను చేస్తున్న నిరంతర ప్రయత్నంలో ఒక భాగం ఈ  ‘నవల నడిచిన దారి’ కూర్పు.

కొండను అద్దంలో చూపించే ప్రయత్నమిది.

మరి అద్దంలో కొండే కనిపిస్తోందో – ఎత్తిపోతల బండరాళ్ళు కనిపిస్తున్నాయో – తెలియదు.

ఇది సమగ్రమనీ, దోష రహితమనీ, చర్చకు అతీతమనీ – ఆ భ్రమ నాకు లేదు. చర్చ అంటూ జరిగితే అందులోంచి నేను మరికాస్త నేర్చుకోగలనన్న ఆశ ఉంది.

ఈ మాటలు రాయడానికి మిత్రులు వివినమూర్తి, వాసిరెడ్డి నవీన్‌లతో జరిపిన సంభాషణలు బాగా సాయపడ్డాయి. సహవాసి వ్యాస సంకలనం – నూరేళ్ళ కథ, బాగా ఉపయోగపడింది. ఆ పుస్తకానికి కాత్యాయనీ విద్మహే రాసిన సుదీర్ఘమైన ముందుమాట ఒక సాహితీ గనిలా నా ముందు నిలబడింది. ఏ మాత్రమూ సిగ్గూ, మొహమాటాలు లేకుండా ఆ గని లోంచి మాణిక్యాలను ఏరుకొన్నాను. నా దగ్గర ఉన్న రాళ్ళను వాటితో కలిపాను.

వెరసి – ఈ ప్రసంగ వ్యాసం.

 

 

(27 మే 2016 నుంచి 29 మే 2016 వరకు మూడు రోజుల పాటు డాలస్ నగరంలో జరిగిన నాటా మహా సభలలో రెండో రోజు కార్యక్రమాలలో తెలుగు నవలా సాహిత్యం తీరుతెన్నులపై  దాసరి అమరేంద్ర చేసిన ఉపన్యాసపు పాఠం ఇది).

 

నేనెప్పుడూ బాటసారినే: మన్నెం శారద

 

-ఆర్. దమయంతి 

~

 

మెదడు నెమరేసుకునే కథలు   రాయడంలో, మనసున నిలిచిపోయే పాత్రలను సృష్టించడంలో –  తనకు తానే సాటి అన్నట్టు పాఠకుల మన్నన పొందిన రచయిత్రి – శ్రీమతి మన్నెం శారద.

వీరి కథలు చదివించవు. అక్షరాల వెంట చూపుల్ని చకచకా పరుగులు  తీయిస్తాయి.  కథలో కొత్తదనం తప్పని సరి. భాషలో సంస్కారం ఒక సిరి. కథనం లో ఒక ఒత్తైన పట్టు వుంటుంది.  గమ్మత్తైన మలుపుంటుంది. ఒదిగినట్టుంటాయి కానీ, నిలదిసి ప్రశ్నిస్తుంటాయి – పాత్రాలు. రచనలో ఔన్నత్యం ప్రధానాంశం. ఉన్నత భావవ్యక్తీకరణం – వీరి సొంతం. వెరసి మంచి కథకు చిరునామాగా మారారు – మన్నెం శారద గారు.

దరిదాపు నాలుగు దశాబ్దాలుగా రచనా సాహిత్యాన్ని కొనసాగిస్తున్న సీనియర్ రైటర్. వెయ్యి కి పైగా కథలు రాసి ఒక రికార్డ్ సృష్టించిన సంచలన రచయిత్రి.       

వృత్తి రీత్యా ఇంజినీర్. ప్రవృత్తి రీత్యా – రైటర్.

ఉద్యోగమేమో – రహదారులు, భవన నిర్మాణ శాఖలో. కానీ, అక్షర నిర్మాణమేమో – గుండె గుండెనీ దగ్గర చేస్తూ –  కథావంతెనల కట్టడాలు! – రెండు విభిన్న వైనాల మధ్య ఎలా ఈ సమన్వయం ఎలా కుదురుతుంది ఎవరికైనా?  ఇటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, అటు గృహిణిగా ఇంటి బరువులు మోస్తూ, ఇంటా బయటా  వ్యతిరేకతలను ఎదుర్కొంటూ, మరో వెంపు – రచనా సాహిత్యాన్ని చేపట్టడం ఎంత కష్టం!?.. అయినా ఎంతో ఇష్టం గా చేపట్టి, గొప్ప విజయం సాధించడం ఎంతైనా ప్రశంసనీయం. మరెంతయినా అభినందనీయం. ‘అంతా దైవ కృప ‘ అంటూ నవ్వుతూ చెబుతారు కానీ,  తాను సలిపిన కృషి గురించి మాట మాత్రం గా అయినా పైకి చెప్పుకోరు.  తన రచనా ప్రతిభ కు ఎలాటి పబ్లిసిటీ ఇచ్చుకోని సింప్లిసిటీ – వీరి వ్యక్తి త్వం.

మృదు స్వభావి. చాలా సెన్సిటివ్.  మాట మెత్తన. మనసు చల్లన.

మనకున్న బ్రిలియంట్ రచయిత్రుల్లో ఒకరైన మన్నెం శారద గారితో – సారంగ తరఫున ఇటీవల ముచ్చటించడం, ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆ సంగతులేవిటో  – ఈ ఇంటర్వ్యూ చదివి మీరూ తెలుసుకోవచ్చు.

*****

 

మీరు –  దరి దాపు 40  సంవత్సరాలు గా కథలు రాస్తున్నారు కదూ?

* అవును.

మీరు   రాసిన మొదటి కథే ప్రచురణకు నోచుకోవడం జరిగిందా?

* అవును. నా మొదటి కథ – ‘అడవి గులాబి’ ఆంధ్ర జ్యోతి లో పబ్లిష్ అయింది.

 కథ రాయడం వెనక ఒక ఫోర్స్ వుంటుంది.  అది ప్రేరణ కావొచ్చు, ఉప్పొంగిన భావం కావచ్చు.  కథ రాయడం ఎలా జరిగింది?

* మాబావగారు సీలేరులో ఇంజనీర్ గా వున్నప్పుడు నేను మా అక్కతో కలిసి సీలేరు వెళ్లాను.  అంతా ఏజెన్సీ. అడవులు,సెలయేళ్ళు, కొండలు, లోయలు. అద్భుతం ఆ సౌందర్యం. నేను చిన్నతనంనుండి చదివిన సాహిత్య ప్రభావమో లేక నాకు ట్రాజేడీలంటే వున్నఇష్టమో…తెలియదుకానీ కిటికీలోంచి  చూస్తుండగానే ఒక విషాదాంత ప్రేమకధ నామనసులోరూపుదిద్దుకుంది.అంతే రాసేశాను. మరో సంగతి. మాఇంటిదగ్గర ఒకవిషాద ప్రేమకధకి  ఒకఅమ్మాయి బలికావడం కూడా కొంతనాపై ప్రభావంచూపించిందని చెప్పాలి.

 కథని తొలిసారిగా అచ్చులో చూసుకున్నప్పుడు ఏమనిపించింది?

* అప్పుడు నా  వయసు16 .  చాలాత్రిల్  ఫీల్ అయ్యాను. ఎన్నిసార్లుచదువుకున్నానో నాకే తెలియదు. అప్పట్లో ఒక రచనవెలుగు చూడాలంటే చాలాకష్టం.

  ఆ కష్టమేమిటో కాస్త వివరిస్తారా  ఈనాటి  రైటర్స్ తెలుసుకునేందుకు వీలుగా! 

* అప్పటిలో నిష్ణాతులైన ఎడిటర్స్ రచయితలు ..చాలా జల్లెడ పట్టేవారు. రచయితలకి కేవలం పోస్ట్లో  పంపడం, ఎదురుచూడటం అంతే.  ఇంట్లోరచనలు చేయడానికి పెద్దలుఒప్పుకునేవారుకాదు. ఇప్పటిలా పరిచయాలు ఉండేవి కావు. ఇంత విస్తృత అవకాశాలు అప్పట్లో లేవు.  రచయితలంటే   ఇంచుమించు దేవతలే.

 

రచయితలంటే దేవతలని  చాలా చక్కటి నిజం చెప్పారు. అంటే రచయిత లో దైవత్వ  లక్షణాలు వుంటాయని  పాఠకాభిమానులు  భావించే వారేమో?

* అవును .పూర్వ జన్మసుకృతంకొద్దీ సరస్వతీపుత్రులవుతారని భావించే సంస్కృతి మనది.అందుకే ఎంతధనవంతులైనా పండితుల్ని గౌరవించేవారు. అందుకే రచయితలకి అంతటి  ఉన్నత స్థానం ఆరాధనదక్కింది.

 రచనలు చదువుతున్నప్పుడు   రైటర్ పట్ల మనకొక ఇమేజ్ కలుగుతుంది. ఆరాధన కలుగుతుంది.  అలా తెలుగులో మీకనిపించిన అత్యుత్తమ రచన కానీ,  అత్యున్నత రైటర్ కానీ వున్నారా?

* నాకదేమిటో, నేనుచిన్నతనంనుండీ వ్యక్తులని ఆరాధించేదాన్నికాదు. రచనని బట్టే రచయిత. అన్నీచదివేదాన్ని. ఏ అక్షరమూపోనిచ్చేదాన్నికాదు. రంగనాయకమ్మగారి -కృష్ణవేణి, సులోచనారాణిగారి సెక్రెటరీ…అన్నీఆవయసులోఅభిమానించి ఆరాధించిన రచనలే.

 

 ఊహా కల్పిత రచనలమీద కొంత విమర్శ వుంది. స్త్రీ రచనలు  స్వప్న జగత్తున తేలుతుంటాయని. లేదా స్త్రీ పక్షపాతులై వుంటారని!.. ఈ వాదాన్ని మరి మీ రెంతవరకు సమర్ధిస్తారు?

*   ఏదిరాసినా కొంత అవగాహనతో రాస్తే కనీసం చదువరులకి ఆనందాన్నికలిగిస్తుంది. పురుషులంతా గొప్పరచనలు చేసేయలేదు. అంతులేని సమస్యలవలయంలో స్త్రీవున్నప్పుడు   తనగురించి తానుచెప్పుకోక పోతే ఇంకెవరికి స్త్రీ బాధలు అక్కరకొస్తాయి. అయితే కొందరు రచయిత్రులు అసలు సమస్యకానిదాన్ని-  సమస్యగా చూపిస్తూ… ‘మేముకూడాస్త్రీవాదులమే’అని చాటిచెప్పుకోవడానికి కొన్నిఅనారోగ్యకరమైన రచనలు చేస్తున్నారు. వాటికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంలేదు.  స్త్రీ స్వాతంత్రమంటే లైంగికస్వేచ్చేనా? ( రచయిత్రి ప్రశ్నలో ఆవేదన తొంగిచూసింది.)

 

 స్వాతంత్రమంటే లైంగికస్వేచ్చేనా? సూటి అయిన ప్రశ్న! ..నేటి సమాజం లొ మనం చూస్తున్న ‘ లివిన్ రిలేషన్ షిప్’  బాంధవ్యాల పై  మీ అభిప్రాయం?   

* ఎందుకో  స్త్రీ ఈ బంధం లో మరికాస్త కష్టాలనే కొనితెచ్చుకుంటుందని నా ఉద్దేశ్యం. సమాజపు కట్టుబాట్లకే వెరవని  మగాడు.. భర్తగా తన ధర్మాన్ని విస్మరించిన మగాడు.. సహాజీవనంలో స్త్రీని గౌరవించి ప్రేమించగలడా? ఏ సీసాలో పోసినా  అదే సారాయి అయినట్లు, మగవాడి ఆలోచనా విధానం మారుతుందా అనేది పెద్ద సంశయంతో కూడిన ప్రశ్నే!  ఏ బంధం నిలవాలన్నాఅంతర్లీనంగా ప్రేమ, భాద్యత, గుర్తింపు వుండాలి. తిరిగి స్త్రీ చిక్కుల్లో పడి మళ్ళీకష్టాలే కొనితెచ్చుకుంటుందని నా భావన.

ఈ ఇతివృత్తాన్ని ఆధారం గా చేసుకుని కథలేమైనా రాసారా?

* నిజం చెప్పాలంటే – నే రాసిన కథల్లో నా రెండవ కధ  –  ‘దూరపుకొండలు’ ఇలాంటి సబ్జెక్టే .  అప్పటికినాకింకాపెళ్లికాలేదు .   సహజీవనంగురించితెలియదు.  కానీ రాసేసాను. ఆంధ్రప్రభవీక్లీలోవచ్చింది. బాపూగారుబొమ్మవేసారు. మా బావగారు –  ‘నీకిప్పుడే ఇంతింత ఆలోచనలోస్తున్నాయా,’ –  అనిబుర్రమీద ఒకటి కొట్టి, వందరూపాయిలిచ్చారు.

మీరు బహుమతి పొందిన కథలు చాలా రాసినట్టు గుర్తు నాకు! 

* అవునండి. చాలానేరాశాను. తాన కదలపోటీలో బహుమతిపొందిన కధ – ఆ ఒక్కరోజు. బహుమతిపొందిన సీతమ్మతల్లి ,ఛీ మనిషీ….ఇలా చాలానే రాశాను.

ఇన్ని బహుమతి కథలెలా రాయగలిగారు?

* ఎక్కువగా నాకధలు జీవితాల నుండి తీసుకున్నవే. వేదనలేకుండా నాకు రచనలుచేయడంరాదు. బహుశా అదే కారణమై వుండొచ్చు, నా కథలకి అంత ఆదరణ, గుర్తింపు కలగడానికి.

ముఖ్యంగా మరో ప్రశ్న శారద గారు! అప్పట్లో  మీ కథలు ఎంత తరచుగా గా పబ్లిష్ అయ్యేవో అంత త్వరగానూ పాఠకుల మనసుల్లో తిష్ట వేసుకునుండిపోయేవి. ఆ తర్వాత కాలంలో  క్రమక్రమం గా మీరు  కనిపించడం మానేసారు.  దూరం జరిగింది. కాదు, పెరిగింది.  ఈ గాప్ కి కారణం? రాజకీయాలా? లేక మీ వ్యక్తిగతమా?

*( రెండు క్షణాల మౌనం తర్వాత )      – బయట రాజకీయాలని చాలావరకు బాధపడుతూనే ఎదు ర్కొ న్నాను.  వ్యక్తిగతమైన సమస్యలకి …క్రుంగిపోయాను. ఇది వాస్తవం.

…ఈ దూరం ఎం తైనా బాధకరం. కదూ? 

* …  చాలానలిగిపోయాను దమయంతీ! ఇంకా చెప్పాలీ అంటె నన్ను నేను మరచిపోయాను.

 ఇంత కాల వ్యవధి జరిగినా,   మీ రచనల్లో – అదే గ్రిప్ మెయింటైన్ చేయడం ఎంతైనా విశేషం. అందుకు మీరు చేస్తున్న  ప్రత్యేకమైన కృషి ఏమైనా వుందా? 

* కృషిఏమీలేదు, దేవుడు నా కలానికిచ్చిన శక్తీ అంతే. నేను ఏనాడూ రఫ్ రాసి  ఎరుగను, రాయాల్సిందంతా ఒక్కసారే అనుకుని రాసేస్తాను. లేకపోతే నాకసలు టైం అనేదే వుండదు.

*  మీ రచనలు ఏవైనా సినిమా తెరకెక్కాయా?

* ఎక్కేయి .నాపేరుతోకాదు.వాళ్ళతోపోరాడే శతి నాకులేక వదిలేశాను. ‘ మనసునమనసై’ అనే నాకధ తెలుగులోనూ, హిందీ లోనూ హిట్టయిఆడుతుంటే చూస్తూఊరుకున్నాను. అలాగే ఎంతోమంది రెమ్యూనరేషన్స్ ఎగ్గొట్టేరు.  వ్యాపారాల్లో కొచ్చేసరికి ఇదిమామూలే.

? – ‘వాళ్ళతోపోరాడే శక్తీ నాకులేక వదిలేశాను ..’ –  ఇలాటి పరిస్థితి ఎదురైనప్పుడు, ఎదుర్కోలేని అసహాయతలో   అనిపిస్తుంది కదండీ? కలం బలం కన్నా, అహం బలం బలమైనదనీ, గుండె బలం కన్నా ‘గూండా బలం’  గెలుస్తుందని.. ఎంత ఆవేదన కదూ?   ఇతరులకెవరికీ అర్ధం కాని ఈ బాధ కేవలం రైటర్స్ కి మాత్రమే అనుభవైద్యకం. ఎలా తట్టుకుని నిలబడగలిగారు?

* ఒక్కపోరాటంకాదు. అడుగడుగునా ఎన్నోసమస్యలు ఎదుర్కొన్నాను . అటు వుద్యోగం, ఇటు ఇల్లు.  రచనారంగంలోసమస్యలు.  అప్పటికీఇప్పటికీ ఎన్నో…దైవమే తోడయి నన్నుముందుకు నడిపించింది.

ఒకసారి ఒకసినిమాకి మాటలు రాసేను. దర్శకుడు తనపేరు వేసేసున్నాడు. పోరాడేను. గెలిచే సమయానికి మాలాయర్ అటు జంప్. చాలారోజులు నిర్ఘాంతపోయి వుండిపోయాను.  ఎంతోకాలం ఇది నారచనల మీద ప్రభావంచూపింది. అందుకే తర్వాతఎన్నిసార్లుమోసపోయినా…మౌనంపాటించాను. రచయితని మోసం చేయడం తేలిక. డిస్కషన్స్ అంటూ రైంటర్ని పిలిపిస్తారు. కధవింటారు. మళ్ళీపిలుస్తాం అంటారు. ఇక అంతే. అలా నా కధ వాళ్ళచేతిలోకి వెళ్ళిపోయింది. చేసేదేమీలేదు.  కొన్నికోట్లుపెట్టి సినిమా తీస్తారు. కానీ సినిమాకి మూలమైన కథా రచయితని మాత్రం మోసం చేస్తారు. ( ఎంతో బాధ ధ్వనించింది ఆ మాటల్లో.)

  కొత్తగా పెయింటింగ్స్ కూడా చేస్తున్నారు.  :-)  నిజంగా అభినందించదగిన కళ. ఎలా అలవడింది?

* అవునుచిన్ననాటి నుండీ నాకు పెయింటింగ్ అంటేచాలాఇష్టం. నన్ను నేను రవీంద్రనాథ్ ఠాగూర్  ,అడవి బాపిరాజుగారి తో పోల్చుకుని మానాన్న గారికిచెప్పేదాన్ని.కానీనేర్చుకునేఅవకాశంరాలేదు.ఇప్పుడు ఫేస్బుక్ లో ఆ సరదా తీర్చుకుంటున్నాను.అందరూ అక్కా అని పిలుస్తుంటే సంతోషంగావుంది.

ఈ ఫేస్ బుక్ మీకు పునర్జన్మ వంటిదంటూ ప్రశంసించారు?    

* అవునండి. నిజంగానే.

. మీ రచనల్ని ఇంకా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?

* త్వరలో కథల సంపుటి వెయ్యాలనుకుంటూన్నాను.  కౌముది వెబ్ మాగజైన్లో నిదురించేతోటలోకి అనే సీరియల్ రాస్తున్నాను.

అనుభవజ్ఞురాలైన రచయిత్రి గా  చెప్పండి. కథ  అంటే ఎలా వుండాలి? ఎలా వుంటే పాఠకులని ఆకట్టుకుంటుంది? ఔత్స్చాహిక రచయితలకి   మీ సూచనలు సలహాలేవైనా  ఇవ్వగలరా?

* నేను ఇతరులకి చెప్పగలిగినదాన్నోఅవునోకాదో కానీ ఒక్కటిమాత్రం నాపరంగాచెప్పగలను.  శైలి అంటే చదివింపచేయగల శక్తి.  భావానికి తగుమాత్రం భాష ,చిన్నకొసమెరుపు. –  పాత సబ్జెక్ట్అయినా ఒక ఇనోవేటివ్ ఆలోచనా విధానం వుంటే చివరి వరకూ చదివేయొచ్చు.కధకి వ్యాసానికి తేడాతేలియాలి – ముందు.

 సమాజం పట్ల రైటర్ కి బాధ్యత వుంటుందా? వుంటే, ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తారు.

*  వుండాలి. బాధ్యత వుండాలి. కొన్నిరచనలు సరదాగా రాసినా, మధ్యమధ్యలో రచయిత తొంగిచూస్తూనేఉంటాడు.

sarada painting

మీ పరిశీలనలో మీరు చదువుతున్న మనుషుల మనస్తత్వాలలో కానీండి..జీవన విధానంలో కానీండి…ఆ కాలానికీ ఈ కాలానికీ తేడా  వుందనుకుంటున్నారా?

* వుంది. ఇప్పుడు అప్పుడు కూడా సమస్యలు వున్నా ఆలోచించేవిధానంలో  చాలామార్పువచ్చింది,పెద్దల అనవసర పెత్తనాలుఇప్పుడులేవు జీవనవిధానాలు చాలా ఇంప్రూవ్ అయ్యేయి.

స్త్రీలు శాంతి గా బ్రతుకుతున్నారంటారా?

* అని చెప్పను. అన్నివైపులా, మరింత బయటకి రావడమంటే మరింత  యుద్ధానికి తలపడటమే. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. – పోటీయుగం ఇది.

 అవును శారద గారు. స్త్రీలు శాంతి పొందడం కోసం యుధ్ధన్ని చేయాల్సొస్తున్న మాట వాస్తవం. ఆ మాటకొస్తే యుగాల తరబడి నించి  కదూ?

* నిజమేనండి. అందరకీ హాయిగా కడుపులో చల్లకదలకుండా సుఖంగా బ్రతకాలనేవుంటుంది. కానీ,  కొందరికి బ్రతుకంతాపోరాటమే.. పురుషులుస్వార్ధంతో , స్త్రీలు అజ్ఞానంతో స్త్రీ జాతికి అన్యాయం చేస్తూనే వున్నారు. యుద్ధభూమిలో నిలబడి యుద్ధంచేస్తున్నవారి  పరిస్థితి – అంతఃపురంలోకూర్చుని వినోదించే వారికి అర్ధంకాదు.

 

సమస్యల్లో వున్న  స్త్రీని చూసి సాటి ఆడవాళు చులకన చేస్తారు. ఇలా గేలి చేసే  వారిలో పురుషుల కన్నా,  స్త్రీల  శాతమే ఎక్కువేమో కదూ?

* అవును. ఇప్పటకీ ఎప్పటకీ నన్నుతొలిచేసే ప్రశ్న ఒక్కటే. పవిత్రత గురించి ఉపన్యాసాలిచ్చే వారందరూ  స్త్రీని ఇన్నివిధాల అణచివేతకు గురిచేశారెందుకు? ఈ సమాజం లో స్త్రీ ఎక్కడో,  ఏదో ఒక విధంగా స్త్రీమోసపోతూనే వస్తోంది. గాయపడుతూనే వుంది. కన్నీరుపెడుతూనేవుంది.  ఒకచట్రంలో భద్రతగాకూర్చున్నస్త్రీలకి ఇవి అర్ధంకావు.

 

రచయిత్రి గా –   అమితమైన మానసిక  సంఘర్షణకు గురి అయిన  సందర్భం ఏమైనా వుందా? 

* నేను చాలాచిన్నతనంనుండీ ఎదోఒకటిరాస్తూనే వుండేదాన్ని. అప్పటకీఇప్పటకీ ఈమామూలు దైనందిక జీవితచట్రంలో ఇమిడి మనలోని సున్నితత్వాన్ని అలౌకిక భావనా సౌందర్యాన్ని పోగొట్టుకుని బ్రతకాల్సిరావడాన్ని జీర్ణించుకోలేకపోతుంటాను. ఈవిషయంలో నేను  చాలాపరితాపానికి గురయ్యానుకూడా!

 

పాఠకుని కి రైటర్ కి మధ్య గల దూరం పెరిగిందని ఒక అంచనా.  మీరేమనుకుంటున్నారు?

*దూరం అని కాదుగానీ, తెలుగు చదివేవారు తగ్గిపోతున్నారు. పిల్లలు వాళ్ళ పోటీ చదువులలో కాలాన్నంతా చదువుకోడానికే  వెచ్చిస్తున్నారు. ఇక టీవీ  సీరియల్స్ ఉండనేవున్నాయి.  సాహిత్యం పై ఆసక్తి వున్నవారు మాత్రమే పుస్తక సాహిత్యాన్ని చదువుతున్నారు.

  భవిష్యత్తులో  ఇక తెలుగు రచనలుండవన్న వారి జోస్యం పట్ల మీ అభిప్రాయం ?     

* ఉండకపోవడం జరగదుకానీ, ప్రభుత్వం కొంతచొరవ తీసుకుని మన సాహిత్యాన్ని రక్షించాల్సిన అవసరమైతే వుందని నమ్ముతాను.

 

టీవీ  మీడియా ప్రభావం పఠనాసక్తి మీద నీలి మబ్బు పరుచుకుందనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా?  

* అవును.హాయిగా ఏమాత్రం శ్రమలేకుండా నోరావలించి చూడొచ్చు.  కధ వున్నాలేకపోయినా తలపట్టేసినా పడీపడీచూస్తునారు, ఊళ్లలో అయితే మరీ!.. పరగడుపునే  టీవీలు మోగిపోతుంటాయి.

 

మరో చిన్న ప్రశ్న. తెలుగు రైటర్స్ మధ్య ఐక్యత వుందనుకుంటున్నారా?

* లేదు ,వుండదు.  ఎవరూ పక్కవారి ప్రతిభ ఒప్పుకోలేరు. దానికి చాలా విశాలహృదయం వుండాలి.

అలసిపోయిన వేళ..విశ్రాంతి అవసరం కదూ? రిటైర్మెంట్ తర్వాత కాలాన్ని ఎలా గడపాలనుకుంటున్నారు? 

* మాఅబ్బాయికిచెప్పాను – మొన్నటిసారి అమెరికావెళ్ళినప్పుడు!  ‘నేను మీకు అమ్మనే. ఒక కూతురిగా, భార్యగా,  తల్లిగా నా పాత్రలకి  నేను ఎక్కువగానే న్యాయంచేశాను.  ఇక ఇప్పుడు నేనునేనుగా బ్రతకాలనుకుంటున్నాను. నామీద ఎలాంటి ఆంక్షలున్నా నేనురానని చెప్పాను.  నవ్వి,  ‘ సరే అమ్మ ‘ అన్నాడు. నన్నెంతో ప్రేమగా చూసుకుంటాడు.   ఎదుటి వారి  వ్యక్తిత్వాన్ని  గౌరవించి నప్పుడే వ్యక్తుల మధ్య  ఆప్యాయతానుబంధాలు పెరుగుతాయి.

జీవితం అంటే?..

*జీవితం గురించి చెప్ప్పుకోవడానికి ఏమీలేదు. ఇది ఒకబిందువు నుండి మరోబిందువుకి నడిచేఒకచిన్నప్రయాణం. కొందరికి కాలం సాఫీగాజరిగితే,  మరికొందరికి అన్నీ ఒడిదుడుకులే. అన్నీ సుడిగుండాలే. ఎవరైనా చేరేది ఒక్కచోటికే. ‘బ్రతికినన్నాళ్ళూ మనంన్యాయంగానే బ్రతికాం’ అన్నదొకటే గొప్పతృప్తినిస్తుంది మనిషికి. అంతే.  అనుకున్నవి ఏమీజరగ లేదు. జరిగేవి ఆపలేను. కాలాన్ని అనుసరించి సాగుతున్నఒక బాటసారిని నేను. నాదురదృష్టంకొద్దీ నామంచితనమే నాకు అనేక చిక్కులుతెచ్చిపెట్టింది. మనుషుల్ని మనుషులనుకుని నమ్ముతాను. నేను ఆదరించి సహాయపడినవారే నాకు ఎక్కువ హాని చేసారు. ఇదిజీవితం.  అంతే అనుకుంటాను.

చివరిగా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? – సందేశం గా?   

* ‘హాయిగా బ్రతకండి.  పక్కవారిని బ్రతకనివ్వండి.’ –  ఇదే నేను చెప్పదలచుకున్నది దమయంతి!

ఇవీ – మన్నెం శారద గారి మదిలోని మాటలు. మనసు దాచుకోకుండా చెప్పిన సంగతులన్నీ సారంగ పాఠకులతో పంచుకోవాలనే నా  తహ తహ ఇలా నెరవేరింది.

ధన్యవాదాలు శారద గారు!

* మీకూ నా ధన్యవాదాలండి. ఈ అవకాశాన్ని కలగచేసిన  సారంగ పత్రికకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

( పాఠకాభిమానులు శారద గారిని సెల్ ద్వారా కానీ, ఫేస్ బుక్ ద్వారా కానీ కలిసి మీ అభిప్రాయాలను తెలియచేయవచ్చు)

సెల్ :  96189 51250

https://www.facebook.com/profile.php?id=100009804672869

 

***

sarada painting 2

 

రచయిత్రి గురించి :

అసలు పేరు :  పుట్టింటి పేరు మన్నెం. ( పెళ్ళికి ముందునుండే రాస్తున్నాను కాబట్టి, ఇంటిపేరు మార్చలేదు.)

జన్మ స్థలం :   కాకినాడ.

విద్యాభ్యాసం :  engineering graduation.  మానాన్నగారి ఉద్యోగరీత్యా అనేక ఊళ్లలో  చదువుసాగింది.

ఉద్యోగం : రహదారులు  భవనాల శాఖలో ఇంజనీరుగా పనిచేసి స్వచ్చందంగా రిటైర్మెంటు తీసుకున్నాను.

హాబీలు : నాట్యం,చిత్రకళ, రచనావ్యాసంగం – నాకు ఇష్టమయిన హాబీలు. ఇంటీరియర్ డెకొరేషన్ కూడా!

రచయిత్రి గా మీ వయసు :  35 సంవత్సరాలు.  అయితే మధ్యమధ్యలో చాలా బ్రేక్స్ వున్నాయి.

మీరు చదివిన నవలలు :  రంగాయకమ్మగారిబలిపీఠం, రావిశాస్త్రిగారిరచనలు, కొడవటిగంటివారికధలు, శరత్సాహిత్యం, పతంజలిగారి రచనలు..అన్నీఇష్టమే.  మంచి భావుకత వున్న కవిత్వాన్ని కూడా బాగాఇష్టపడి చదువుతాను.

ఆంగ్ల నవలలు? : ఇంగ్లీష్ సాహిత్యాన్ని కొద్దిగాచదివినా, అందులో అంత పెద్ద పట్టులేదు.ఇష్తమైన సినిమా : కన్యాశుల్కం, విజయావారి అన్నిసినిమాలూఇష్టమే. తమిళం.మళయాళసినిమాలుకూడాచూస్తాను. చెమ్మీన్ నవలచాలాసార్లు చదివాను. సినిమా చాలాసార్లుచూశాను.

పబ్లిష్ అయిన  రచనలు : నానవలలు అన్నీమహాలక్ష్మిపబ్లికేషన్స్, కొన్నిఎమెస్కోవారు, మరికొన్నినవభారత్ వారుప్రచురిచారు .

మీకు నచ్చిన మీ రచనలు :  వానకారుకోయిల నవల, ట్వింకిల్   ట్వింకిల్ లిటిల్ స్టార్,  సిస్టర్ సిస్టర్ – నవలలు నాకుబాగానచ్చిన రచనలు.

మొదటినవల : గౌతమి. మొదటిబహుమతి ఆంద్రజ్యోతి డైలీ పేపర్ లో. రెండవ నవల చంద్రోదయం. రెండవబహుమతి  ఆంద్రజ్యోతివీక్లీలో  1984 లో  కధలుచాలావున్నాయి. – ఉరిశిక్ష వుండాలని నేను రాసిన –  ‘ఆగండి ఆలోచించండి’ అన్నకదకి ఆంద్రభూమి వీక్లీ వారు ‘ బెస్ట్ స్టోరీ ఆఫ్ ద  ఇయర్ ‘ గా ప్రకటించి గౌరవించారు.  నానవలలన్నీ కన్నడంలోకి   అనువదింపబడ్డాయి.

మరపురాని సంఘటన : అనంతనాగ్ నారచనలుచదివి అభిమానంతో నన్ను చూడడానికి వచ్చారు.

ఇష్టమైన టూరింగ్ స్పాట్ : సహజసిద్ధమైన అడవులునాకు ఇష్టం. రైల్లో అరకుప్రయాణం  మరచిపోలేనిది

కథల సంఖ్య :  కధలు చిన్నవి, పెద్దవి అన్నీకలిపి 1000 దాకా రాశాను. నవలలు –  43

అవార్డులు : నాపదమూడు కధలు మంజులానాయుడు గారు సీరియల్ గా తీశారు. నేనేమాటలురాశాను. అందుకుగాను  ఉత్తమ రచయిత్రి అవార్డ్ ను రాష్ట్ర ప్రభుత్వంనుండి అందుకున్నాను. రెండు నందిఅవార్డులు,  పొట్టిశ్రీరాములు యూనివర్సిటీనుండి  – ఉత్తమరచయిత్రిగా శ్రీ సి.నారాయణరెడ్డి గారిచేతులమీదుగా అందుకున్నాను.

నేనుకధమాటలురాసిన టివి సీరియల్ ప్రేమిస్తే పెళ్లవుతుందా  కి ఆ ఏడు11 నంది అవార్డులువచ్చాయి.

– ‘ఒకే బహుమతి ’ పోటీ   ప్రకటించారు ఆంద్రజ్యోతివీక్లీవారు.  ‘అది నాకే వచ్చింది – ‘పిలుపునీకోసమే ‘అన్న నారచనకి!

కలిసిన రైటర్స్ : సభలకివెళ్ళేఅలవాటుతక్కువ. వాసిరెడ్డిసీతాదేవిగారు ఎక్కువగా పిలిచేవారు.వారిదగ్గరే ఇతర రచయితలని చూశాను. ఒక నవల వారికి అంకితమిచ్చినప్పుడు శ్రీదాశరధిరంగాచార్యగారు నవలగురించిప్రసంగించారు.

ప్రత్యేక కళ : పెయింటింగ్స్. అంతాస్వయంకృషే . జే.పి సింఘాల్ బొమ్మలకి ఏక లవ్య  శిష్యు రాలీని నేను.

ఖాళీ సమయాలలో : ఖాళీఅంటూవుండదు. గార్డెనింగ్ అంటే చాలాఇష్టం. ఎర్ర మంజిలి కాలనీలో  మా ఇంటి  తోట చూసిజనం ఆగిపోయేవారు.

ఆశయం: నవ్వుతూనవ్విస్తూ నిగర్వంగా జీవించడమే నా ఆశ, ఆశయం.

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అసలు కోణం

 

 

– రాణి శివశంకర శర్మ

~

 

ఆ మహా వ్యాపార దిగ్గజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలని వొక్క దెబ్బతో ఎగరగొట్టేశాడు సిద్ధార్థ. అతనికి అంత శక్తి ఉందని డాక్టర్ కోణార్క్ ‍కు కూడా తెలియదు. డాక్టర్ కోణార్క్ పెద్ద విద్యా వ్యాపారి. కోణార్క్ ఎడ్యుకేషనల్ ఇన్‍స్టిట్యూషన్స్ అనే సంస్థని స్థాపించి శరవేగంతో దూసుక పోతున్న పెద్దమనిషి.

కోణార్కకు ఎదురుగా ప్రిన్సిపాల్ కూర్చొని ఉన్నాడు. “సిద్ధార్థ మంచి లెక్చరర్ కాదు. అతన్ని తీసెయ్యాలి”, అన్నాడు.

“సరే ఆ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి”, అన్నాడు కోణార్క్. బయటకి వెళ్తుండగా మళ్ళీ పిలిచాడు. “చూడండీ, మంచి లెక్చరర్లు చాలా మందే ఉంటారు. సిద్ధార్థ లాంటి బ్రిలియంట్స్ కొంత మందే ఉంటారు. అతడు మనకు కావలసిన వాడు. తన గురించి ఎక్కడా నెగటివ్ కామెంట్ చేయొద్దు. అలా చేస్తే నీ ఉద్యోగం ఊడుతుంది” హెచ్చరించాడు కోణార్క్.

సిద్ధార్థ అంటే అంత అభిమానం ఎందుకు కోణార్కకీ?

కోణార్క గుంటూరు జిల్లాలోని వొక కుగ్రామంలో భూస్వామిగా వెలుగొందుతున్న రోజుల్లో సిద్ధార్థ తండ్రి కోణార్కకి నమ్మిన బంటుగా వుండేవాడు. దాని వల్లే తను విద్యావ్యాపారంలో అడుగు పెట్టిన వెంటనే సిద్ధార్థకి ఉద్యోగం యిచ్చాడు. సిద్ధార్థ తన తండ్రిలాగే కోణార్కకి ఆంతరంగికునిగా మారిపోయాడు.

గిట్టని వాళ్ళ ప్రోద్భలం వల్ల ఇన్‍కంటాక్స్ అధికారులు కోణార్కపై దాడి మొదలు పెట్టారు. అప్పుడు సిద్ధార్థ వెంటనే ఎలర్ట్ అయ్యాడు. నల్ల ధనాన్ని కారులో డంప్ చేసి తరలించేసాడు. దాడులు ముగిసాక భద్రంగా తిరిగి అప్పజెప్పాడు.

అంతేకాదు. వొక కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, కాలేజీ ప్రతిష్టని కాపాడాడు. నిరసన తెలుపుతున్న తల్లితండ్రులనీ, బంధువులనీ బుజ్జగించాడు. విద్యార్థి రాసిన ఉత్తరం మాయం చేసాడు.

సహజంగానే డాక్టర్ కోణార్క్ సిద్ధార్థ ప్రతిభని గుర్తించాడు. నిజానికి సిద్ధార్థ చాలా  ఙ్ఞానం కలిగిన వాడు. కానీ అతని ప్రతిభ క్లాస్ రూమలకు సంబంధించినది కాదు. పౌరులు తరగతి గదుల్లో తయారవుతారు. సమాజాన్ని శాసించేవాళ్ళు క్లాస్ రూం బయట రూపొందుతారు, అనే రహస్యాన్ని గుర్తించిన ప్రతిభాశాలి సిద్ధార్థ.

అతడు పేరుకే లెక్చరర్. రాష్ట్రమంతా వ్యాపించిన కోణార్క్ విద్యా సంస్థలలో యెటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా అక్కడ వాలుతాడు. విషయాన్ని బయటకు పొక్కనీయడు. సమస్యని లోపల్లోపలే ఖతం చేస్తాడు. వొక విద్యార్థినిపై లెక్చరర్లే అత్యాచ్వారం చేసారు.  ఆ సంఘటనని బయటకి పొక్కకుండా , చివరకు మీడియాకి కూడా చిక్కకుండా చేయడంలో సిద్ధార్థ చూపిన ప్రతిభకి కోణార్క్ ఆశ్చర్యపోయాడు. అతని భుజాల మీద తడుతూ అన్నాడు, “యు ఆర్ ఇంటిలిజెంట్ దేన్ ఐనిస్టీన్”.

’ఇతనికి ఐనిస్టీన్‍కీ పోలికా?” అని చెవులు కొరుక్కున్నారు ఉత్తమ పౌరులైన ఉపాధ్యాయులు. అలా పోల్చడానికి కారణం ఉంది. సిద్ధార్థ ప్రతీదీ సాపేక్షకం అంటాడు. విలువలేమీ లేవంటాడు. ప్రతీదీ అనేక కోణాలలోంచీ ఆలోచించాలి అంటాడు. విద్యార్థినిపై అత్యాచారం జరిగినప్పుడు, రెండు చేతులూ కలిసినప్పుడే కదా చప్పట్లూ అని వాదించిన ఘనుడు సిద్ధార్థ. యిప్పుడు అమ్మాయిలు వేసుకునే దుస్తులూ, వాళ్ళ ప్రవర్తన కూడా బాగుండడం లేదన్నాడు.

rafi

Art: Rafi Haque

యిలా అనేక కోణాలని దుమ్ములా రేగగొట్టి సమస్యని చల్లార్చేయ్యడంలో అతడు నిపుణుడు.

అతడు చాలా చదివిన వాడు, చాలా విఙ్ఞానం కలవాడు. మంచి అభిరుచులు కలవాడు కూడా. అది కోణార్కకీ బాగా తెలుసు. వొక సారి కోణార్కకీ జపాన్ దర్శకుడు కురసోవా తీసిన రషోమన సినిమాను చూపించాడు సిద్ధార్థ. ఆ సినిమాలో ఒక హత్యని గురించి నలుగురూ నాలుగు రకాలుగా వ్యాఖ్యానిస్తారు. వారి వారి నేపథ్యాలని బట్టి అలా వ్యాఖానిస్తారు. వొకరి వ్యాఖానానికీ మరొకరి వ్యాఖ్యానానికీ పొంతన ఉండదు. సినిమా అయ్యాక సిద్ధార్థ అన్నాడు. “కోణాలు విభిన్న కోణాలు అంతే. సత్యం అంటూ ఏమీ లేదు. కనుక మనకు కావలసిన సత్యాన్ని మనం సృష్టించుకోవచ్చు. అవసరమైన లాభసాటియైన సత్యాన్ని మనమే క్రియేట్ చెయ్యచ్చు. అల్లచ్చు”.

“సిద్ధార్థా! ఆ అమ్మాయిపై అత్యాచారం సంగతి ……? ”

“ఊరుకోండి సార్, అది నిన్నే సద్దు మణిగి పోయింది”, అన్నాడు సిద్ధార్థ.

“అసలు ఏమి జరిగింది?”

“అసలు ఏమీ జరగలేదు. వట్టి పుకారుగా తేల్చేసాను. మీరు హాయిగా యింటికి వెళ్ళి ఫేమిలీతో గడపండి. యీ రొచ్చంతా మీకెందుకు”, అన్నాడు సిద్ధార్థ.

నిజమే, కోణార్క చాలా స్వచ్చంగా కనిపిస్తాడు. అతనికి యే చిన్న మచ్చయినా అంటగలదా అన్నంత తెల్లగా, తెల్లని దుస్తుల్లో ధవళ హాసంతో తాపీగా ఉంటాడు. తను కోణార్క సూర్యాలయాన్ని దర్శించి వచ్చిన వెంటనే పుట్టాడట. అందుకే అంత అరుదైన పేరును పెట్టారు. ఆయన ఏం చదివాడో యెవరికీ తెలియదు. ప్రపంచాన్ని చదివాను అని చెప్పుకుంటాడు. ఆయన నడుపుతున్న సంస్ఠలన్నీ యింగ్లీషు మీడియంవే.

సిద్ధార్థ సలహాతో తెలుగు భాషా వుద్ధరణ కోసం వొక సంస్థని స్థాపించాడు. పత్రిక నడుపుతున్నాడు. అవార్డులు యిప్పిస్తున్నాడు. అందువల్ల వొక విశ్వవియాలయం వాళ్ళు ఆయన పేరుకి డాక్టర్ తగిలించారు. సిద్ధార్థ నవ్వుతూ అన్నాడు. ” చూసారా నా సలహా యెంత మేలు చేసిందో. మనం అన్ని కోణాలలో ఆలోచించాలి”.

“మనం డబ్బు కోసం కొన్ని పనులు చెయ్యాలి. అధికారం కోసం మరికొన్ని. దాంతోపాటూ సమాజసేవ, పేరు, కీర్తి ప్రతిష్టలు అన్నీ అవసరమే కదా? అవి మీ అధికారానికీ, డబ్బుకీ మరింత వన్నె తెస్తాయి. మీ తెల్లని దుస్తుల్లాంటివే అవీ”, అన్నాడు సిద్ధార్థ.

మాతృ భాషాదినోత్సవం జరపడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసాడు కోణార్క.  అదే సమయంలో సిద్ధార్థని వొక ప్రశ్న అడిగాడు. “విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. నువ్వెలాగో మేనేజ్ చేస్తున్నావు సరే, అసలు వీటిని ఆపలేమా?”

“ఎందుకు ఆపడం?”

“వీటి వల్ల మనకి ఎప్పుటికైనా చెడ్డపేరే కదా? అని ప్రశ్నించాడు కోణార్క.

“బహుశా పేరెంట్స్ కూడా ఇటువంటి వ్యవస్థనే కోరుకుంటూన్నారేమో. యిది మాసోచిజం కావొచ్చు. అంటే తమని తాము స్వయంగా హింసించుకోవడం. ఆధిపత్యాన్ని ఆరాధిస్తారు వీళ్ళు. తెలియని యే తీవ్ర శక్తులో నడిపిస్తే నడిచే మనుషులు”, అన్నాడు సిద్ధార్థ తాపీగా.

సిద్ధార్థ అన్న మాటే నిజమైంది. ఆత్మహత్యలే కాదు. విద్యాసంస్థలు కూడా మరింత విస్తరించాయి. బలపడ్డాయి. యితర విద్యా సంస్థలు వీటిలో విలీనమై పోయాయి.

సిద్ధార్థలో గొప్ప దార్శనికుడు కనిపించాడు కోణార్కకి. అనేక కోణాలని ఏక కాలంలో దర్శించగల మేధావి సిద్ధార్థ అనుకున్నాడు ఆయన. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయి. కోణార్కకి ప్రభుత్వంలో మంచి పరపతి. అతని బంధువులు మంత్రులుగా వున్నారు. ఉన్నత పదవుల్లోనూ ఉన్నారు. యీ క్లిష్ట సమయంలో ప్రతిపక్షం నోరు మూయించగల మేధావి కావాలన్నారు. సిద్ధార్థని పంపించాడు కోణార్క.

సిద్ధార్థ ఒకటే మాట అన్నాడు. “రైతుల ఆత్మహత్యల వెనుక ఉన్న అనేక కోణాలని లాగండి. వాళ్లకి గల మానసిక వైకల్యాలు, ప్రేమ సమస్యలు, సెక్స్ సమస్యలు, వాళ్ళ బాల్యం, తల్లితండ్రుల కలహాలు, వాళ్ళ పునర్జన్మ, జాతకం… యిలా అన్ని కోణాల గురించీ రకరకాల నిపుణుల చేతా, నిపుణుల్లా ఫోజు యిచ్చే వారి చేతా  మీడియాలో చర్చలు చేయించండి.  రకరకాల కోణాల్ని దుమ్ము లేపండి. ఆ గందరగోళంలో అసలు కోణాలు కప్పడిపోయేలా చేయండి”.  ఆ ప్రాజెక్టుని సిద్ధార్థకే అప్పగించింది ప్రభుత్వం. దాంతో అతని పరపతి వొక్కసారిగా పెరిగిపోయింది.

రైతుల ఆత్మహత్యల వెనుక గల కారణాలను సర్వే చేయించడం మొదలు పెట్టింది ప్రభుత్వం. చాలా చావులకి వ్యక్తిగత సమస్యలే కారణాలుగా తేల్చేసింది. దాంతో ప్రభుత్వానికి నష్ట పరిహారం చెల్లించాల్సిన బాధ్యత తప్పింది. దానికి బదులుగా, తమకు అనుకూలంగా మాట్లాడినందుకు  సైకాలజిష్టులకీ, ఆధ్యాత్మిక వేత్తలకీ డబ్బు చెల్లించింది.

ఈలోగా గ్లోబలైజేషన్ యుగం విజృంభించింది. వ్యక్తికి ప్రాధాన్యం పెరిగిపోయింది. ఎవడి బతుక్కీ, ఎవడి చావుకీ వాడే కారణం అన్న భావన బలపడింది. రైతులు వ్యవసాయాన్ని నమ్ముకోవడం మానేసారు. తమ పిల్లల్ని ప్రయోజకులు చేయాలనుకున్నారు. కోణార్క్ విద్యా సంస్థల్నే నమ్ముకున్నారు. రియల్ ఎస్టేట్‍ని కూడా విశ్వసించారు. లాభపడిన వాళ్ళు లాభపడ్డారు.

యీ పరిస్థితుల్లో కోణార్కని సిద్ధార్థ కలిసాడు. కోణార్క సిద్ధార్థ ముందు ఒక నివేదిక ఉంచాడు. “యిది చూసారా, యీ నెల రోజుల్లో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వొక విద్యార్థి తోటి విద్యార్థిని హత్య చేసాడు. యిప్పుడు ఆత్మహత్యలకి హత్యలు కూడా తోడయ్యాయి మన సంస్థల్లో.  మనమేమైనా అమెరికాలో ఉన్నామా? అక్కడ తోచుబడి కాక బోర్‍డమ్ వల్ల తోటీ విద్యార్థుల్ని తుపాకితో కాల్చి చంపేసిన వార్తలు చదివి విస్తుపోతుంటాం”, కోపంగా అన్నాడు కోణార్క.

“మనం కూడా అభివృద్ధి చెందుతున్నాం, అంతే” , అన్నాడు కూల్‍గా సిద్దార్థ.

“ఏమంటున్నావ్ నువ్వు?”, గద్దించాడు కోణార్క.

“నేను అన్నది మీరు సరిగానే విన్నారు. మన విద్యాసంస్థలు తామర తంపరగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రపంచం కూడా వేగంగా మారిపోతోంది. టెక్నాలజీ పెరుగుతోంది. సెక్సూ, క్రైమూ రంగుల దృశ్యాలుగా ముందుకొస్తున్నాయి. దాంతో పాటూ డబ్బు విలువ, సంపాదన కోసం పరుగు వొక ఐదు సంవత్సరాల కంటే బాగా పెరిగింది. వెలుగు వెనుక నీడ ఉంటుంది. తప్పదు,” అన్నాడు సిద్ధార్థ.

“మరి మనమేమి చేయాలి?”

సమస్యలు ఉంటాయి. ఉండనీండీ. వాటి నుంచీ దృష్టి మరల్చాలి.” అన్నాడు టీవీ ఆన్ చేస్తూ సిద్ధార్థ.

“నిజానికి విద్యార్థులందరినీ  ఉద్ధరించడం మన పని కాదు. యికపైన బాగా చదివే విద్యార్థులని ఏరదాం. వాళ్ళని ఒక గ్రూపుగా చేద్దాం. యిలా వర్గీకరిస్తూ పోదాం. బాగా చదివే వాళ్ళకి మంచి లెక్చరర్లని నియమిద్దాం. మంచి జీతాలనిద్దాం. మిగిలిన వాళ్ళకి తక్కువ జీతాల లెక్చరర్లని నియమిద్దాం. కానీ అందరినీ వొకే రకంగా టెన్షన్లో వుంచుదాం.”

“ఈ  టెన్షన్‍కి పిల్లలు చస్తున్నారు”, అన్నాడూ విసుగ్గా కోణార్క.

“చావనీండీ, ఆసంగతి నేను చూసుకుంటాను”, అంటూ వెళ్ళిపోయాడు సిద్ధార్థ.

సిద్ధార్థ రావడంలో గానీ పోవడంలో గానీ ఎంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది. అదే కోణార్కకి నచ్చింది. అతడు సమస్యలకి భయపడడు. సమస్యలని పరిష్కరించాలని కూడా అనుకోడు. మానవ జాతి ఉన్నంత వరకూ సమస్యలు ఉంటాయి. యింకా పెరుగుతాయి. వాటిని ఎదుర్కోవడం కాదు. సమర్ధంగా మరుగు పరచడమే తెలివి అంటే. అభివృద్ధి అంటే ఇదే అని సిద్ధార్థ ఫిలాసఫి.

ఈ ఫిలాసఫీ కోణార్కకి కూడా ఇష్టమే. నిజానికి అది ఆయన తత్వమే. అసలు అనుచరులెప్పుడూ నాయకుని  తత్వాన్ని ఆచరించడంలో దూకుడు ప్రదర్శించాలి. రాజుని మించిన రాజభక్తిని ప్రదర్శించాలి.  సరిగ్గా అలాంటి అనుచరుడే దొరికాడు కోణార్కకి.

కోణార్క విద్యా సంస్థలో వొక విద్యార్థి మరో విద్యార్థిని చంపేసాడు. దానికి కారణం గర్ల్ ఫ్రెండ్. ఆమె పుట్టిన రోజుని వొక గొప్ప రెస్టారెంటులో జరపడం కోసం డబ్బు కావలసి వొచ్చి తోటి విద్యార్థిని చంపేసాడు. హంతకుడు చదువులో ఫస్ట్ ర్యాంకర్.

విద్యార్థుల ఆందోళనలు మొదలయ్యాయి. సిద్ధార్థ అన్నాడు.

” యీ విద్యార్థిని కేసుల నుంచీ బయట పడెయ్యాలి. అతడు మన కాలేజీకే మంచి పేరు తెస్తాడు.”

“ఎలా? బయట ఇంత గొడవగావుంటే,” ప్రశ్నించాడు కోణార్క.

డబ్బిచ్చి కొంత మందిని కొనుక్కొచ్చి కౌంటర్ యాజిటేషన్ చేయించాడు సిద్ధార్థ. అవతలి వాళ్ళు చర్చలకి సిద్ధపడ్డారు. నిజానికి ఉద్యమిస్తున్న వాళ్ళని భయభ్రాంతుల్ని చేసారు. గాయపరిచారు. గొడవలు క్రమేపీ చల్లారి పోయాయి. పోలీసులు కూడా డబ్బులు తీసుకొని మిన్నకున్నారు. పేరెంట్స్ కి కూడా కొంత డబ్బు ముట్టజెప్పారు. చనిపోయిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని కేసు మూసేసారు. హంతక విద్యార్థికి ఫస్ట్ ర్యాక్ వొచ్చింది. టీవీలలో, వొత్తిడిలో కూడా రాణించిన చదువరని అతని పేరూ, విద్యా సంస్థల పేరూ మారు మోగిపోయింది.

“సమస్యలు వుంటాయి. వాటికి అనేక కోణాలు ఉంటాయి. మనకు కావలసిన కోణాన్ని మనం బయటకి లాగి ప్రొజెక్ట్ చెయ్యాలి”, అన్నాడు సిద్ధార్థ మందు తాగుతూ. అభినందనగా భుజం తట్టాడు కోణార్క.

వొక కోణార్క విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అది మామూలే. నిజానికి అదొక వార్త కాకుండా పోవును. ఎందుకంటే కోణార్క విద్యా సంస్థలు చాలా బలపడి పోయాయి యెప్పటి కంటే. ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలూ యేవీ వార్తలు కాకుండా పోయాయి. అన్ని విద్యా సంస్థల కంటే ర్యాకులు ఎక్కువగా వచ్చేది అక్కడే. ర్యాంకుల స్కోరు టీవీల్లో మారుమోగి పోయేది.

విద్యార్థులకు తిండి సరిగా ఉండదు. సౌకర్యాలు సరిగా ఉండవు. కోళ్ళ ఫారాల్లా ఉంటాయి. అయినా ఆ విద్యా సంస్థలే ముందుకు దూసుక పోతున్నాయి. యింక క్రైము రేటు కూడా ఎక్కువే. ఆత్మహత్యలూ ఎక్కువే.

కానీ ఆ ఆత్మహత్య రాష్ట్రాన్ని కుదిపేసింది. సిద్ధార్థకి కునుకు లేకుండా చేసింది. సిద్ధార్థ కూడా అశక్తుడుగా మారిపోవడం వల్ల డాక్టర్ కోణార్క కుదేలు అయిపోయాడు. అసలు సమస్య ఆత్మహత్య కాదు. ఆత్మహత్యల్ని మేనేజ్ చేయడం చాలా సులభం. కానీ ఆ విద్యార్థి చస్తూ చస్తూ లేఖ రాసి పోయాడు. దాన్ని ఔత్సాహికులైన వార్తాపత్రికల వాళ్ళు ప్రచురించేసారు. కుల వివక్ష వల్లే ఆ విద్యార్థి చనిపోయాడని దేశమంతా మారుమోగిపోయింది. రాజకీయ నాయకులు కూడా దిగి  పోయారు. ఇక ఏం చేయాలి?

“సిద్ధార్థ యిప్పుడేం చెయ్యాలి? నీ అనేక కోణాల ఫిలాసఫీ వొట్టిపోయిందేమీ?”అని అడిగాడు కోణార్క.

“లేదు. అదెప్పటికీ పని చేస్తుంది. కొంచెం ఆలస్యం కావొచ్చు అంతే. సైకాలజీ, ఫిలాసఫీ, వాస్తు శాస్త్రం, న్యూమరాలజీ యిలా అన్ని రంగాలలో నిపుణుల చేత టీవీల్లో చర్చలు ఏర్పాటు చేయండి. ఆ విద్యార్థి చనిపోవడానికి కారణాలను రకరకాలుగా వదరమనండి. మన వ్యాపారాలకు సంబంధించిన ప్రకటనలు ఇప్పించండి. ప్రస్తుతం ఇంతే. తర్వాత సంగతి ఆలోచిద్దాం”,  అన్నాడు   సిద్ధార్థ.

సైకాలజిస్టులు, అతడు బాల్యం నుంచీ కుటుంబంలో ఎదుర్కొన్న కష్టాలే చావుకు కారణం అన్నారు. ఆ లేఖలో బాల్యం ప్రసక్తి ఉందన్నారు. ఆధ్యాత్మికవేత్త వొకరు ఆ విద్యార్థి తన లేఖలో దేహం, ఆత్మ వేరు పడి పోయిందని ప్రకటించాడు. కనుక ఆధ్యాత్మిక సమస్యలే కారణమన్నాడు. న్యూమరాలజిస్టు అతనికి పేరులో అక్షరాల సంఖ్య ఆత్మహత్యకు కారణమన్నాడు. జ్యోతీష్యుడు గ్రహబలం సరిగా లేదన్నాడు.  బ్రేకులూ, ఎడ్వర్టయిజ్‍మెంటులూ మధ్య చర్చలు సాగుతున్నాయి. కుల వివక్ష నుండీ దృష్టి మళ్ళించడానికి శాస్త్ర పాండిత్యాలన్నీ భేషుగ్గా ఉపయోగపడుతున్నాయి.

“ప్రపంచం అన్న తరవాత అన్నీ ఉంటాయి. కుల వివక్షో మరో వివక్షో యెలాగూ ఉంటుంది. దాన్ని పెద్ద యిష్యూ కాకుండా యెలా అడుక్కి నెట్టాయలన్నదే మనం ఆలోచించాలి. అదే తెలివి అంటే”, అన్నాడు సిద్ధార్థ.

కానీ తాను స్వారీ చేసే పులి తననే బలి కోరినట్లైంది కోణార్క పరిస్థితి. కోణార్క కూతురునే ప్రేమలో పడేసాడు సిద్ధార్థ. “మీరే సిద్ధార్థ చాలాతెలివైన వాడని మెచ్చుకుంటారు కదా”, అని ఎదురు ప్రశ్న వేసిందా అమ్మాయి.

“యే రకంగా సరి తూగుతాడు మనతో”, అని అడిగాడు కోణార్క. అతనికి ఆస్తులు లేకపోవచ్చు. తెలివి ఉంది. అతని తెలివి వల్లే మన ఆస్తులూ, డబ్బూ ఎదుగుతూ వొచ్చాయి. అతని బుర్ర కన్నా వేరే ఆస్తేం కావాలి?” అని అడిగింది.

“బుర్రలెన్నయినా కొనొచ్చు డబ్బుంటే. కానీ కులాన్ని ఎక్కడ కొంటాం? అతని కులం నీకు తెలుసా?

“కులం అంత ముఖ్యమా?”

“కులమే ఆస్తి”

“నాన్నా, నేను  అతన్నే పెళ్ళాడతాను. నిర్ణయించేసుకున్నాను”,  అని కుండలు  బద్దలు కొట్టింది ఆ అమ్మాయి.

కోణార్క మౌనంగా ఊరుకున్నాడు. సిద్ధార్థ చెప్పినట్లూ సమస్యలు అన్ని చోట్లా ఉంటాయి. యెప్పుడూ ఉంటాయి.

తర్వాతి రోజు సిద్ధార్థ ఉత్సాహంగా కోణార్క ఆఫీసుకొచ్చాడు.

“చాలా ఎదిగి పోయావు నువ్వు. నన్ను మించి పోతున్నావు” , అన్నాడు కోణార్క. సిద్ధార్థ చిరునవ్వు నవ్వాడు. కొద్ది సేపు ముచ్చట్ల తర్వాత బయలు దేరాడు. కోణార్క అన్నాడు, ” నువ్వు చాలా పైకి వెళ్తావు”.

ఆ రోజే సిద్ధార్థ చనిపోయాడు. అది రోడ్డు యాక్సిడెంటా, ఆత్మహత్యా   లేక హత్యా? నల్లుగురూ నాలుగు రకాలుగా చెప్పుకున్నారు.కురసోవా సినిమాలాగే రకరకాల కథలు వ్యాపించాయి.

వొక రోజున కోణార్క తన కొడుక్కి హిత బోధ చేసాడు.

“నేను పెద్దవాన్ని అయిపోయాను. వ్యాపారాలన్నీ ఇక నువ్వే చూసుకోవాలి. అన్ని విషయాలనీ అన్ని కోణాలనుంచీ అర్థం చేసుకోవాలి. కానీ మనకు కావలిసిన కోణాన్నే బయట పెట్టాలి. చూడూ తెలుపులో అన్ని రంగులూ ఉంటాయి. అన్ని రంగులనూ తొక్కేసి తెలుపే తెల్లగా రాజ్యం చేస్తుంది. నలుపుని కూడా తెలుపు చేస్తుంది. ఎరుపుని కూడా తెలుపు చేసేస్తుంది. బుర్ర ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ బుర్రల్ని అన్నింటినీ కొని ఆధిపత్యం చెలాయించగల వాడు ఒకడే ఉంటాడు. యీ వొక్క రహస్యం గుర్తుంచుకో. యీ వొక్క కోణాన్ని మరచిపోకు”

*

కృత్రిమ నక్షత్రం

mandira1

Art: Mandira Bhaduri

 

-అరుణ నారదభట్ల

~

మనసు ఓ అంతరిక్షకేంద్రం
స్పందనలన్నీ బంధనాలు
సృష్టితత్వం బోధపడ్డట్టు జీవనసరళి
అంతటా జ్ఞానోదయపు రావిచెట్లు
అవసరాల ప్రేమ భాషణాలు

కంప్యూటర్ చిప్ లా
ఎన్ని జ్ఞాపకాలనో పోగేస్తూ వస్తున్నాం
నచ్చనివి డిలిట్ చేయడానికి
తేలికపాటి కీబోర్డ్ కాదు నడక
ఎన్నిసార్లు రీఫ్రెష్ నొక్కినా
రీసైకిల్ బిన్ ఒకటుంటుంది
వైరస్ ని సృస్టించడానికి

ఆక్సీజన్ సరిపోదక్కడ
శూన్యం ఆవహిస్తుంది
ప్రాణాయామం చేయాలనుకుంటాం
కార్బన్ మొనాక్సైడ్ నరనరాల్లోని
రక్తంలో జీర్ణించుకుపోయి
ఊపిరాడదు

నైట్రస్ ఆక్సైడ్ విడుదల్లయ్యే సన్నివేశాలు
కేంద్రానికి అందనంత దూరంలో
కనిపెట్టలేని ఉల్కాపాతాలు
అదే సూర్యుడు అవే నక్షత్రాలు
అవే గ్రహాలు
మార్పులన్నీ దూరభారాలు

గ్రహశకలల్లాంటి కొన్ని
అనుకోని సంఘటనలు
కృత్రిమంగా మెరిసే
అంతరిక్ష నక్షత్రం
నిరంతరం స్కానింగ్

ఆకాశంలోకి విసిరేసిన బంతి మనసు
మళ్ళీ భూమినే చేరుతుంది
గురుత్వాకర్షణ సిద్ధాంతం నమ్ముకున్నాం గనక
భూమికీ మనకూ తేడా ఏం లేదు
అదే మట్టి దేహం
అవే నీళ్ళు
అదే అగ్ని
అదే మనసు గాలి

మొక్కలను నరికేస్తే పడే బాధే మనసుది
నచ్చదు కదా
ఊష్ణం…లోనంతా ఊష్ణం పైనంతా ఊష్ణం
పచ్చదనం కరువయ్యాక
భూమి అక్కడక్కడా బద్దలవుతూ
లావాను సునామీలనూ సృష్టిస్తునే ఉంటుంది
ఇలా ఎంతదాకా అంటావా
గురుత్వాకర్షణ ఉన్నంతవరకు

*

వాన రాత్రి

 

 

-అనిల్ డ్యాని

~

 

కప్పుకున్న ఆకుల చివర్లనుంచి

రాలిన వాన నీటి చెమ్మ

ఇల్లంతా పరుచుకుంది

 

భయం తెలియని పురుగులు

దీపం పైకి దూసుకొస్తున్నాయి

చలి పూసుకున్న దుప్పట్ట్లకి

దేహాల శ్వాశ వేడిని నింపుతుంది

 

చూరు కింద చినుకులకి

రాత్రంతా

చీకటి తడుస్తూనే ఉంది

 

వెలుతురు పెంచుకున్న

దీపం దగ్గర నేల

చలి కాచుకుంటుంది

 

దేహం చుట్టూరా

పరుచుకున్న శూన్యం

కళ్లలో వేడి ప్రవాహం

 

పసి దేహాల మధ్యలో పడుకున్న చాతీపై

రెండు చేతుల ఆలంబన

వాళ్లకి తను తనకి వాళ్ళు

రేపటికి సూర్యుడొస్తే చాలు

 

కిటికీ పక్కన

విరిగి పడిన కొమ్మ గూటి మీద

పక్షుల నోళ్ళు తెరుచుకుంటాయి

కూయడానికి కాదు కూసింత తినడానికి.

*

 దేవుడు మాస్టారు-మౌనం

gudem

 

క్లాసులు బాగానే జరుగుతున్నాయి. ఎవరమూ ఊహించని సంఖ్యలో పిల్లలు రావడం మొదలు పెట్టేరు. వాళ్ల ఇంటి చుట్టుప్రక్కల ఉన్న పిల్లల్ని మరికొంతమందిని కూడా తీసుకురావడం మొదలు పెట్టేరు. నా ఆత్మ విశ్వాసం ఆకాశం ఎత్తుకు పెరిగిపోయింది.

రోజూ వెళ్లేప్పుడో, వచ్చేప్పుడో దేవుడు మాస్టారు కనిపిస్తూనే ఉన్నారు. నేను నమస్కారం పెట్టంగానే ఆయనా బదులుగా నవ్వుతూ తల ఊపి తన నడక సాగిస్తుంటారు.

సాయంకాలాలు నేను వెళ్లే సరికి గూడెంలో పిల్లలు పనులలోనో, అవి లేనివాళ్లు ఆటలలోనో మునిగి ఉంటారు.  కొన్ని రోజులు ఒక ఆట మరికొన్ని రోజులు మరో క్రొత్త ఆట నడుస్తూ ఉంటుంది అక్కడ.

ఆడే పిల్లల్లో మూడేళ్ల పిల్లల నుండి ఇరవై ఏళ్ల వయసు పిల్లల వరకు ఉంటారు. పెద్ద పిల్లలు చాలామంది చదువులు మానేసిన వాళ్లే, పగలంతా ఏవో పనుల్లోకి వెళ్లి వస్తారు. నన్ను చూస్తూనే మొహమాటంగా నవ్వి, ‘ ఒరేయ్, టీచరుగారొచ్చారు, క్లాసుకెళ్లండి.’ అంటూ వాళ్లకంటే చిన్నపిల్లల మీద పెత్తనం చేస్తుంటారు. క్లాసుకొచ్చే పిల్లలు సాధారణంగా ఆ ఆటల్లో కనిపించరు.

కానీ ఒక ముగ్గురు, నలుగురు మాత్రం మట్టికొట్టుకున్న బట్టలతో, రేగిన జుట్టుతో, అలసిన ముఖాలతో ప్రక్కన అరుగుల మీద పడేసిన పుస్తకాల సంచీలతో నన్ను చూస్తూనే ఆటలు వదిలి క్లాసులోకి వచ్చేస్తారు. ఇంటికెళ్లి స్నానం చేసి రండని చెప్పినా ‘ఇల్లు తాళం వేసి ఉంది టీచర్, మా అమ్మ పనిలోంచి రాలేదు ఇంకా’ అంటూ రోజూలాగే చెబుతారు. ప్రతిరోజూ శుభ్రత గురించి, ఆరోగ్యం గురించి క్లాసు మొదట్లో చెప్పటం ఆనవాయితీగా మారింది. ఫలితం కొంతవరకు కనిపిస్తున్నా ఇంకా మార్పు రావాల్సి ఉంది.

ఆరోజు నల్లబాలు ( అసలు పేర్లు కాకుండా వాళ్లు పెట్టుకునే ఫ్యాన్సీ ఫేర్లు) నేను క్లాసుకి వెళ్లేసరికి సీరియస్ గా కర్ర,బిళ్ల ఆటలో మునిగి ఉన్నాడు. క్లాసు మొదలైందన్నసంగతి గమనించికూడా వాడు ఆట కొనసాగించటం చూసి, పిలిచాను.

వాడు నిస్సంకోచంగా చెప్పేసాడు, ‘ ఇప్పుడే ఆట మాని రాలేను టీచర్, లేటవుతుంది’ అని.

వాడికి తొమ్మిదేళ్లుంటాయి. నాలుగో క్లాసు చదువుతున్నాడు. వాడి ధోరణి ఆరోజు కొంచెం వింతగానే ఉంది.

‘ఏం, ఎందుకు మానలేవు?’

‘ఐదు రూపాయలు బెట్ కట్టాను టీచర్, ఆట గెలిచి, అవి గెలుచుకుంటే కానీ రాలేను.’ వాడి మాటలకి ఉలికి పడ్డాను.

‘బెట్ ఏమిటి, నీకు డబ్బులు ఎక్కడివి అసలు?’

‘నా దగ్గర మూడు రూపాయలున్నాయి టీచర్, మా మామ్మ నిన్న కొనుక్కోమని ఇచ్చిన డబ్బుల్లో మిగిలేయి. ఒక రెండు రూపాయలు అప్పు తీసుకున్నాను’

వాడి మాటలకి నాకు నోట మాట రాలేదు. బెట్ కట్టటం, అప్పు తీసుకోవటం………….ఏమిటిదంతా? మిగిలిన పిల్లలు క్లాసులోంచి బయటకొచ్చి విషయాన్ని గమనిస్తున్నారు. వాళ్లని తీసుకుని లోపలికి నడిచాను.

ఒక్కసారి పిల్లల తల్లిదండ్రుల్నికూర్చోబెట్టి మాట్లాడాలనుకున్నాను. శనివారం సాయంత్రం పెద్దవాళ్లకి మీటింగ్ ఉందని కబురు పంపేను.

సాయంత్రం ఆరింటికి మీటింగంటే అయిదారు మంది మాత్రమే ఆ సమయానికి రాగలిగేరు. చీకటి పడుతోంది. పనులుకి వెళ్లిన ఆడవాళ్లు చాలామంది షేర్ ఆటోల్లోంచి, మినీ వ్యానుల్లోంచి దిగుతున్నారు. వాళ్లల్లో కొందరు ఇంటి దగ్గర చంటిపిల్లలో, వృద్దులో ఉన్నారంటూ ,‘మీటింగ్ కి మా మగోళ్లొస్తారు’ అంటూ చెప్పి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్లలో కొందరు మీటింగ్ ఏమిటో వినాలన్న కుతూహలంతో అక్కడే కూర్చుండిపోయారు. వాళ్ల ముఖాలు అలసటతో, ఆకలితో చిన్నబోయి ఉన్నాయి.

దేవుడు మాస్టారు మాట్లాడుతున్నారు.

‘ టీచరమ్మ మన పిల్లల కోసం వస్తోంది. మీరందరూ పిల్లల్ని ఇళ్లల్లో ఎట్టానూ చదివించుకోలేరు. సాయంకాలం స్కూలు నుంచి వచ్చిన వాళ్ళని రోడ్డుమీదకి వదిలేయకుండా ఇక్కడికి పంపండి. మీ పిల్లలు చదువుకోవాలంటే ఈ మాత్రం మీరు చెయ్యాలి. రోజూ క్లాసుకి వస్తున్నారో లేదో గమనించుకోవాలి. రోజూ వచ్చి కూర్చుంటే నాలుగు ముక్కలు నేర్చుకుంటారు. టీచరమ్మ మీతో మాట్లాడాలంది, ఆమె గారు చెప్పేది వినండి………’

ఆయన మాటలు పూర్తికాలేదు…………..ఇంతలో లోపల ఆ ఇరుకైన వీధుల్లోంచి గట్టిగట్టిగా అరుపులు, కేకలు, వాటివెంటే జనం పరుగెడుతున్న అలికిడి. వాళ్లు మాముందుకు రానే వచ్చేరు. ఒకరిద్దరి చేతుల్లో విరిగిన ప్లాస్టిక్ బకెట్లు, సింటెక్స్ డ్రమ్ములు, చిన్నపాటి కర్రలూ ఉన్నాయి. ముందు పరుగెడుతున్న వాళ్లు వినడానికి అభ్యంతరకరంగా ఉన్న భాషలో గట్టిగా అరుస్తూ పరుగెడుతున్నారు. వెనక ఉన్న వాళ్లు చేతిలో వస్తువుల్ని అదను చూసి ముందు వెళ్తున్నవాళ్ల  మీద విసిరే ప్రయత్నం చేస్తున్నారు.

క్లాసులో కూర్చున్న పెద్దపిల్లలు ఇద్దరుముగ్గురు లేచి వెళ్లబోతూంటే …….

‘ మీరు ఎక్కడికి’ అన్న నా ప్రశ్నకి

‘నిన్న రాత్రి మా మామయ్య క్రికెట్ గురించి బెట్ కట్టేడు, దాని గురించి మధ్యాహ్నం నుంచీ ఏదో తగువు జరుగుతోంది, చూసొస్తాను టీచర్ ’ జవాబు చెబుతూనే వెళ్లిపోయేడు రమేష్, వాడి వెనుకే వాడి నేస్తాలు. వాళ్ల వెనుకే మరి కొంతమంది లేచి వెళ్లిపోతుంటే చూస్తూ నిలబడిపోయాను.

ఆ గుంపంతా దూరంగా వెళ్లిపోయాక వాళ్ల వెనుకే వచ్చిన కొందరు మీటింగ్ దగ్గర నిలబడిపోయారు. మేష్టారు వాళ్లను ఏదో అడుగుతూంటే జవాబు చెబుతున్నారు.

నేనైతే ఏదో సినిమాలో దృశ్యాన్ని చూస్తున్నట్లుండిపోయాను.

కూర్చున్న ఆడవాళ్లల్లోంచి ఒకావిడ లేచి , ‘ఇదిగో చూడమ్మా టీచరమ్మా, మా పిల్లలు పెద్దయ్యాక మాకు సంపాదించి పెట్టక్కర్లేదు, కాని ఇలా రోడ్లమీద పడి కొట్టుకోకుండా కాస్త బుద్ధులు నేర్పు’ అంటూ ఇంటిదారి పట్టింది. మిగిలిన ఆడవాళ్లు ఆవిడని అనుసరించారు.

మాష్టారు విచారంగా కనిపించారు. మరింక సంభాషణ పొడిగించకుండా మౌనంగా కూర్చుండిపోయారు.

*

పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!

 

 

-రమణ యడవల్లి
~
 
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే పాలకులు. ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగినవారెవరైనా సరే – ఎన్నికల్లో పోటీ చెయ్యొచ్చు, గెలవచ్చు. ప్రజలకి పజ్జెనిమిదేళ్ళు నిండగాన్లే ఓటుహక్కు వస్తుంది, ఈ హక్కుతో వారు ప్రజాప్రతినిథుల్ని ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైనవారు ప్రభుత్వాల్ని యేర్పాటు చేస్తారు. ఇంత పారదర్శకమైన ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఇంకోటి వున్నట్లు నాకైతే తెలీదు.
 
మన్దేశంలో రాజ్యం అనుక్షణం ప్రజల సంక్షేమం గూర్చే తపన పడుతుంటుంది. అందువల్ల ప్రజలు తమగూర్చి తాము ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం యేది తినాలో, యేది తినకూడదో పాలకులే నిర్ణయిస్తారు. ఇది కేవలం ప్రజారోగ్య పరిరక్షణ కోసం మాత్రమేనని మీరు అర్ధం చేసుకోవాలి. ఓటేసే హక్కుంది కదాని యేదిబడితే అదితింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాలకులకి ప్రజలు బిడ్డల్లాంటివారు. మనం మన పిల్లల మంచికోసం జాగ్రత్తలు తీసుకోమా? ఇదీ అంతే!
 
ఇక సినిమాల సంగతికొద్దాం. ఈ దేశంలో సామాన్యుల వినోద సాధనం సినిమా. తినేతిండి విషయంలోనే సరైన అవగాహన లేని ప్రజలకి యేం చూడాలో యేం చూడకూడదో మాత్రం యెలా తెలుస్తుంది? తెలీదు. అందుకే ప్రజలకి మంచి సినిమాలు మాత్రమే చూపించేందుకు పాలకులు ‘సెన్సార్ బోర్డ్’ అని ఒక సంస్థ నెలకొల్పారు. ఇందుగ్గాను మనం ప్రభుత్వాలకి థాంక్స్ చెప్పాలి.
 
‘సినిమా చూసే విషయంలో ఒకళ్ళు మనకి చెప్పేదేంటి?’ అని ఈమధ్య కొందరు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు అనార్కిస్టులు. రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటిస్తాం? మన మంచి కోసమేగా? ఇదీ అంతే! ఆ తెలుగు సినిమావాళ్ళని చూడండి.. బుద్ధిగా రూల్స్ పాటిస్తూ పాటలు, ఫైట్సు, పంచ్ డైలాగుల్తో మాత్రమే సినిమా తీసేస్తారు. ఒక్క తెలుగు సినిమానైనా సెన్సారువాళ్ళు అభ్యంతర పెట్టారా? లేదు కదా! అంటే ట్రాఫిక్ రూల్సు పాటించనివారి వాహనం సీజ్ చేసినట్లే.. సమాజం, సమస్యలు అంటూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే సినిమాల్ని మాత్రమే సెన్సారువాళ్ళు ఆపేస్తున్నారు.
 
అసలు సెన్సార్ బోర్డ్ అంటే యేంటి? అమాయకులైన ప్రజలు యేదిపడితే అది చూసి చెడిపోకుండా వుండేందుకు ప్రభుత్వంవారిచే నియమింపబడ్డ సంస్థ అని ఇందాకే చెప్పుకున్నాం. సెన్సారు బోర్డులో దేశం పట్ల, దాని బాగోగుల పట్లా అవగాహన కలిగినవారు మాత్రమే సభ్యులుగా వుంటారు. వారు మిక్కిలి నీతిపరులు, జ్ఞానులు, మేధావులు. కనుకనే రాముడి కోసం శబరి ఫలాల్ని ఎంగిలి చేసినట్లు, అన్ని సినిమాల్ని ముందుగా చూస్తారు. ఆపై మనం యేది చూడొచ్చో, యేది చూడకూడదో వడపోస్తారు (దుఃఖంతో గొంతు పూడుకుపోయింది, కొద్దిసేపు ఆగుతాను).
 
ఈ విధంగా దేశసేవలో పునీతమవుతూ ప్రశాంతంగా వున్న సెన్సార్ బోర్డుకి అనురాగ్ కాశ్యప్ అనే తుంటరివాడు తగిలాడు. ఆ అబ్బాయి వర్తమాన సాంఘిక సమస్యల ఆధారంగా వాస్తవిక సినిమాలు తీస్తాట్ట. దేశమన్నాక సమస్యలుండవా? వుంటాయి, వుంటే యేంటి? అవన్నీ చూపించేస్తావా? ఒకప్పుడు సత్యజిత్ రే అని ఓ దర్శకుడు వుండేవాడు, ఆయనా అంతే! భారద్దేశం పేదరికాన్ని ప్రపంచానికంతా టముకు వేసి మరీ చూపించాడు. ఆయనకి ఎవార్డులొచ్చాయి, మన్దేశానికి మాత్రం పరువు పోయింది! సమస్యలు ఎవరికి మాత్రం లేవు? మాంసం తింటామని బొమికలు మెళ్ళో వేసుకుని తిరుగుతామా!
 
ఆ అనురాగ్ కాశ్యపో, హిరణ్యకశ్యపో.. ఆ కుర్రాడి సినిమాకి సెన్సార్ బోర్డు బోల్డెన్ని కట్స్ చెప్పిందట, సినిమా పేరులో ‘పంజాబ్’ తీసెయ్యమందిట. ఇందులో అన్యాయం యేమిటో మనకి అర్ధం కాదు – సెన్సారు బోర్డు వుంది అందుకేగా! పైగా ఆ కుర్రాడు ఒక ఇంటర్వూలో – “పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం వల్ల యువత చాలా నష్టపోతుంది. ఒక సమస్యని గుర్తించడంలో సమస్యేంటి?” అని ప్రశ్నించాడు. అంటే ఒక సమస్య వుంటే, దానిమీద యెడాపెడా సినిమాలు తీసేస్తావా? దేశం పరువు బజార్న పడేస్తావా? ఇప్పుడు నీలాంటివాళ్ళ ఆటలు సాగవ్, ప్రజల కోసం నిరంతరం శ్రమించే ప్రభుత్వం వచ్చేసింది.
 
మా పక్కింటాయనకి ముంజేతి మీద యేదో మచ్చ వుంది, ఆయన దాన్ని ఫుల్ హాండ్స్ చొక్కా వేసుకుని కవర్ చేసుకుంటాడు. మా ఎదురింటాయన తెల్లజుట్టుకి రంగేసుకుంటాడు! వాళ్ళ అందానికొచ్చిన ఇబ్బందుల్లాంటివే దేశానికీ వుంటాయి. నీ సినిమాలు యే సౌదీ అరేబియాలోనో తీసిచూడు, దూల తీరిపోతుంది. ఎంతైనా – మన్దేశంలో ఫ్రీడమాఫ్ ఎక్స్‌ప్రెషన్ మరీ ఎక్కువైపోయింది, అందుకే దేశాన్ని విమర్శించడం ఈమధ్య ప్రతివాడికి ఓ ఫేషనైపోయింది.
 
సెన్సార్ బోర్డుని విమర్శించేవాళ్ళు విదేశీ ఏజంట్లు. పవిత్రమైన సెన్సారు వ్యవస్థని కాపాడుకోకపోతే మన దేశభవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. హీనమైన పాశ్చాచ్య సంస్కృతిని వొంటబట్టించుకున్న కుహనా మేధావులు మన్దేశంలో చాలా సమస్యలున్నట్లు చూపించేస్తారు, అతంతా నిజమని అమాయక ప్రజలు నమ్మేస్తారు. చివరాకరికి ప్రజల వల్ల ఎన్నుకోబడి, ప్రజల బాగుకోసం నిరంతరం శ్రమిస్తున్న పాలక వర్గాలపైన నమ్మకం కోల్పోతారు. ఇలా జరగకుండా దేశభక్తులమైన మనం ప్రతిఘటించాలి.
 
భారత సెన్సార్ బోర్డుకి ప్రస్తుత హెడ్ శ్రీమాన్ పెహ్లాజ్ నిహలానిగారు. ఆయన భారతీయ సంస్కృతి పరిరక్షణకి కంకణం కట్టుకున్న వ్యక్తి, గొప్ప దేశభక్తుడు. సినిమా సెన్సార్ విషయాల్లో చంఢశాసనముండావాడు. అందుకే కాశ్యప్‌గాడికి జెల్ల కొట్టాడు. ఆ మేరకు ఒక సందేశం ఆల్రెడీ ఈ సోకాల్డ్ రియలిస్టిక్ సినిమాగాళ్ళకి చేరిపోయింది, ఇక ఇట్లాంటి జాతివ్యతిరేక సినిమాలు తియ్యాలంటే వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అసలు వీళ్ళెందుకు పాజిటివ్ సినిమాలు తియ్యరు? చాయ్ అమ్మిన ఒక మహానుభావుడు ప్రధాని అయ్యాడు. ఈ ఆలోచనే గొప్ప ఉత్తేజాన్నిస్తుంది! ఇట్లాంటి గొప్ప కథాంశంతో యే వెధవా సినిమా తియ్యడు, ఇది మన దురదృష్టం. 
 
సెన్సార్ బోర్డుని విమర్శించేవాళ్ళు దేశద్రోహులని కూడా నా అనుమానం. సెన్సారే లేకపోతే విపరీతంగా బూతు సినిమాలు వచ్చేస్తాయి, యువకులంతా రేపిస్టులుగా మారిపోతారు. ఆడవాళ్ళల్లో పతిభక్తి తగిపోతుంది, బరితెగించిపోతారు. సీతామహాసాధ్వి జన్మించిన ఈ పుణ్యభూమి విచ్చలవిడి భూమిగా మారిపోతుంది.
 
ఇంకో ముఖ్య విషయం – సెన్సార్ బోర్డు వల్లనే సాంఘిక సమతుల్యత రక్షించబడుతూ వస్తుంది. అదే లేకపోతే – దళితుల సమస్యని హైలైట్ చేస్తూ కారంచేడు, చుండూరు మారణకాండల మీద సినిమాలొస్తాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న సహజ సంపదల లూటీకి అడ్డుగా వున్న ఆదివాసీల దారుణ అణచివేతపై సినిమాలొస్తయ్. ఇవన్నీ ప్రజలకి తెలిసిపోతే దేశానికి ఎంత ప్రమాదమో మీరే ఆలోచించండి.
 
సినిమాల్ని నలిపేసే భారత సినిమాటోగ్రాఫ్ చట్టం (1952) యెంతో పవిత్రమైనది. సెడిషన్ యాక్ట్ (1870) లాగే సినిమాటోగ్రాఫ్ చట్టం కూడా నిత్యనూతనమైనది! ఈ పురాతన చట్టాల్ని మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు, వీరిని పట్టించుకోరాదని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. మన కంట్లో మనమే ఎలా పొడుచుకుంటాం!
 
పోలీసులంటే దొంగలకి పడదు. కానీ – పోలీసులు చెడ్డవాళ్ళు కాదు, సమాజ రక్షకులు. సెన్సార్ బోర్డూ అంతే! అంచేత – తనకి అప్పజెప్పిన బాధ్యతల్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్న పూజ్య పెహ్లాజ్ నిహలానిగారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్! గో ఎహెడ్, వుయార్ విత్ యు సర్! 
 
చివరి మాట –
 
ఈ రచనకి స్పూర్తి – “పేదలెవ్వరూ ఇది చదువరాదు. చదివినచో వారు శిక్షలకు పాత్రులగుదురు” అని డిక్లేర్ చేసి ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త!’ కథ చెప్పిన కిరీటిరావు.  

హస్తినలో మళ్ళీ కృష్ణుడు!

Invitation A4.pmd

-దేవరకొండ సుబ్రహ్మణ్యం

~

కృష్ణా రావు గారు ఎన్నో సంవత్సరాలగా డిల్లీలోని తెలుగు సాహితీ అభిమానులకు మంచి మిత్రుడు. . వారు డిల్లీలో ఆంధ్రజ్యోతి దినపత్రికకు సహా సంపాదుకులుగా ఉన్నప్పుడు ప్రతీ బుధవారం “ఇండియా గేటు” అనే శీర్షిక ఆంధ్రజ్యోతి కి రాసే వారు. ఆ దినపత్రికలో చాలా మంచి శీర్షికలలో అదొకటి. బుధవారం పొద్దున్నే లేచి ఆ శీర్షిక చదవడం చాలమందికి ఒక వ్యాపకంగా ఉండేది . వారు దేశం లో జరిగే హీన రాజకీయాల్ని చాల నిశితంగా విశ్లేషిస్తూ రాసే వారు. ముఖ్యం గా 2014 తర్వాత మన దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పులను చాల బాగా పర్తిసీలించి విశ్లేషించే వారు. వారి శీర్షికలో వస్తువు తో పాటు, వారు చెప్పే విధానం, వాడే భాషా కూడా చాల బావుండేవి. ఈ వ్యాసాలతో “నడుస్తున్న హీనచరిత్ర ” అనే పుస్తకాన్ని మే 29 న హైదరాబాదులో ఆవిష్కరించారు.

ఈ పుస్తక పరిచయం డిల్లి లో జూన్ 30 న సాయంత్రం 5.30 నుంచి 7 వరకు తెలుగు సాహితి , ఎమెస్కో సహకారం తో స్థానికంగా ఉన్న తెలంగాణ/ఏ.పి భవనం లో ఏర్పాటు చేస్తోంది.

 

సంభవామి యుగే యుగే!

 

Krishna-Arjuna

-కృష్ణ జ్యోతి

~

 

స్థలం:కురుక్షేత్రం,  కాలం: ద్వాపర యుగం పోయేకాలం,  సందర్భం:మహాభారత యుద్ధ ప్రారంభం

చాలా సేపటినుంచీ ఓర్పుతో చెబుతూనే వున్నాడు.  కానీ ఇంకా అర్జునుడు బిగుసుకునే వున్నాడు!  మరోకళ్ళకైతే చానా కోపం వచ్చుండేది.  కానీ, కృష్ణుడు కదా, మొదట్నించీ దేనికైనా ఓపిక పడతాడు.  లేకపోతే అంతమంది పెళ్ళాలతో రిమార్కు లేకుండా కాపరం చేయగలడా!

“ ఆ పక్క నిలబడింది నా అన్నదమ్ములూ, బంధువులూనూ”ఫల్గుణుడు  ఆక్రోశించాడు

“ఎవరూ? వాళ్ళా?!  బంధుత్వం గురించి కాదు, అందులో ఎవరు నీకు హితులో, సన్నిహితులో చెప్పు”పరమాత్మ చాలెంజ్

“అరిగో, ఆయన ద్రోణాచార్యుడు, నాగురువు”

“ఎవరూ, ఎరికల ఏకలవ్యుడి  వేలు అన్యాయంగా కత్తిరించాయన నీకు గురువా?

“బావా, అలా అనబాకు.  నాకిచ్చిన మాట కోసమే ఆయన అలా చేయాల్సోచ్చింది.  నాకు సమస్త యుద్ధ  విద్యలూ నేర్పించి, ధనుర్విద్యలో ఎదురు లేని నిపుణుడిగా తయారు చేశాడు”

“సరే, మరి ఆ విద్యలు అవసరము వచ్చినపుడు వాడాలని నేర్పలేదా?”

“వాడాలి, కానీ అస్మదీయుల మీద  కాదు.  అటుచూడు.  ఆ తెల్ల గడ్డపాయన.  భీష్మాచార్యులు.  నాకు తాతయ్య.  చిన్నపుడు చానామాట్లు వాళ్ళింటికి ఆడుకోను వెళ్ళేవాడిని.  తనంటే మా అన్నదమ్ములందరికీ ఎంతో గౌరవం, ప్రేమానూ”

“ప్రేమా, ఆపేక్షా మీకుంటే చాలదు.  ఆయనకీ వుండాలి.  ఉండుంటే యుద్ధంలో ఈ పక్కన నిలబడేవాడు”

“ఆయన ధర్మబద్ధుడై పోయాడు.  ధర్మానికి కట్టుబడి అటు నిలబడిపోయాడు.  మనసులో మాత్రం మా మీద ప్రేమే.  అరిగో వాళ్ళు, మా వందమంది ప్రియ సోదరులు. మా రక్త సంబందీకులు.  వాళ్ళ మీదికి బాణాలెట్లా వేసెను?”అర్జునుడు మీసాలు తిప్పుతూ తల బిరుసుగా నవ్వుతున్న సోదరుల్ని వెనకేసుకొచ్చినట్టు చెప్పాడు.

“ఈ సోదరుల్లో ఒకడే కదా, ద్రౌపదిని సభలోకి ఈడ్చుకు వచ్చి చీరపట్టి లాగిందీ?  మిగిలిన వాళ్ళంతా మెదలకుండా గుడ్లప్పగించి చూస్తుండిపోయారు. పైపెచ్చు అది తప్పని చెప్పిన ఒక్కడ్నీ సభలోంచి గెంటేసారు”

“అదేదోలే, పొరపాటుగా జరిగిపోయింది.  అసలు నిజానికి దుశ్శాసనుడు ద్రౌపదిని పరాభావించాలనుకోలేదు.  మరదలి సరసానికి ఉత్తినే అలా పైట పట్టుకు గుంజాడు అంతే.  అంతకు మించి ఏం లేదు”

“ఏం మాట్టాడుతున్నావ్ అర్జునా?! తమ్ముళ్ళ పెళ్ళాంతో మరదలి సరసం ఏమిటి?  ఆ రోజు ద్రౌపదికి నేను చీరలు ఇవ్వకుంటే ఏమయ్యేది?  అంతా మర్చిపోయావా?  పోనీ సభలో జరిగిన రభస గురించి మీ వ్యాస తాతయ్య తన డైరీ లో రాశారు, పైకి చదివేనా?”

“ఒద్దొద్దు.  ఆ డైరీలూ గట్రా ఇప్పుడెందుకులే.  మా వ్యాస తాతయ్య ఇంత సంగతి అంత చేస్తారు.  మనకి తెలీనిదేముంది”

“హతవిధీ!  కలిప్రవేశానికి కాలం దగ్గరలోనే ఉందనే సూచనలు ఎంత చక్కగా కనబడుతున్నాయి.  పాండవ పుత్రుడు పెద్దల గురించి ఎంత తేలిగ్గా మాట్టాడేశాడు.  అయినా ఆ సమయంలో నువ్వు కూడా సభలోనే వున్నవుగాదా.  ద్రౌపది గోడు గోడున ఏడవడం నువ్వు కూడా చూసావుగా?  మీ అన్నదమ్ములు బోలెడు ప్రతినలు పూనారు మరి?”

“ఏమో నేను తలకాయ దించుకున్నా.  సరిగా ఏం చూళ్ళేదు.  ఆవేశంలో నోటి తుత్తరకొద్దీ ఏవో ప్రతినలు పూని ఉండొచ్చు.  అవ్వన్నీ తూచ్.  అయినా మా కుటుంబ గొడవలు పక్కనబెట్టు.  నిజమే, మా తమ్ముడు పొరపాటున ఒక ఆడమనిషి పైట లాగాడు.  నువ్వేం తక్కువ తిన్నావా?  బోలెడు మంది గోపికల చీరెలు దొంగిలించి వాళ్ళని నీళ్ళ లోంచి దిసమొలతో బైటికి రమ్మని వేధించావా లేదా?”ఎట్టకేలకి కిరీటి  మంచి పాయింట్ పట్టేశాడు.

“అది వేరు, ఇది వేరు.  నేనంటే గోపికలకి చాలా ఇష్టం.  నేను చీరెలు దొంగిలించినా, ఎవర్నేనా ఆట పట్టించినా అందులో లోతున చాలా అర్ధం వుంటది.  మామూలు మనుషుల పనుల్నీ, నా లీలలనీ ఒక్కలాగూ చూడగూడదు.  తత్త్వం తెలుసుకోవాలి.  సామాన్య మానవులు  నేను చెప్పింది చెయ్యలిగానీ నేను చేసింది చెయ్యగూడదు”.

“చాల్చాల్లేవయ్య చెప్పొచ్చావ్.  మీ వూళ్ళో వాళ్ళ ఇళ్ళల్లో వెన్నంతా దోచేసి, కుండలు పగలగొట్టి, ఆడపిల్లలని నానా అల్లరీ పెట్టి ఆనక అదంతా సరదా అటని అందర్నీ మభ్య పెడతావు.  మీ అమాయకపు యదు జనులు, నువ్వు చిన్న పిల్లాడివనీ, ముద్దుగా వున్నావనీ, నీ అల్లరి చేష్టల్ని క్షమించి గారాబం చేస్తారు”.

“చెప్పాగా, అదంతా నా లీలలో భాగం.  నాతో పాటు రేపల్లెలో వున్న వాళ్ళంతా పూర్వజన్మలో మునులూ, బుషులూనూ.  నాతో ఆడి పాడే అదృష్టాన్ని నేను ఆ జన్మలో వాళ్లకి వరంగా ఇచ్చాను”.

“ఈ ఆర్గుమెంట్ అంతా ఎందుగ్గానీ, నాకు నీ మీద నమ్మకం వుంది.  నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆపించి కాంప్రోమైజ్ చెయ్యగలవు.  నాకోసం అది చెయ్యి”

“ఆల్రెడీ నేను రాయభారానికి వెళ్ళడం, అది ఫెయిల్ అవడం నీకు తెలుసుగా?”

 

“కపట నాటక సూత్రధారివి.  యుద్ధం జరిపించాలనే నీ సంకల్పం. అందుకే నీ ఫుల్ కౌన్సిలింగ్ టాలెంట్ వాడి కౌరవులని కన్విన్సు చెయ్యాలని చూడలేదు. నా మాట విని ఈ లాస్ట్ మినిట్లోనైనా యుద్ధాన్ని ఆపడానికి నూరు శాతం ఎఫ్ఫెర్ట్ పెట్టి యుద్ధం ఆపించు.”

“సమస్య యుద్ధం కాదు.  మారుతున్న యుగ ప్రభావం చేత విజ్రంభిస్తున్న మానవ అహంకారం.  మదాంధుడై విర్రవీగే దుష్టుల్ని సంహరించడం ఇప్పుడు నీ బాధ్యత.  ధర్మం నశించిపోయి, అధర్మం పెచ్చు పెరిగినపుడు, ధర్మ దేవతను కాపాడేందుకు నేను ప్రతియుగంలో పుడతాను.  ధర్మం కోసరం నిలబడే వారికి డ్రైవింగ్ ఫాక్టర్ గా పనిచేస్తాను”కృష్ణుడు సందర్భంలో గాఢతను అర్జునుడికి తెలపడానికి గ్రాంధిక పదాలు దంచాడు.

“బావా కృష్ణా!కౌరవులు తప్పు చేసివుంటే వాళ్ళ ఖర్మ.  వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు.  పైన దేవుడు వున్నాడు.  చచ్చాక యముడు వాళ్ళని నరకంలో నూనెమూకుడులో వేసి కాలుస్తాడు”.

“ఎహే, చచ్చాక సంగతి తరవాత.  ముందు భూమ్మీద వున్నా పాప భారాన్ని తగ్గించాలి.  నువ్వు నీ బాధ్యత నుండి ఎస్కేప్ కావాలని చూస్తున్నావు.  ఈ యుద్ధానికీ దాని పరిణామానికీ నిన్ను నువ్వు కారకుడిగా భావించడం మానెయ్.  ఈ సమస్త విశ్వంలో జరిగే ప్రతి చిన్న ఏక్షన్కీ రియాక్షన్ కీ నేనే కర్తని.  నువ్వు కాదు”

కృష్ణుడు చానా సేపు థియరీ మాట్టాడాడు.  తర్వాత ప్రాక్టికల్ డెమోలోకి దిగాడు.  తన విశ్వరూపాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూబెట్టాడు.  ధనుంజయుడు  మళ్ళీ బుర్ర గోక్కున్నాడు.

“యుద్ధం కాకండా వేరే దారి చూడగూడదా?”

కృష్ణుడికి అర్ధమైపోయింది.  అర్జునుడు చానా సెన్సిటివ్.  ఇంటి ఇల్లాలి చీర పట్టుకు లాగినోడిని చంపాలన్నా అతనికి మనసొప్పదు.  ఇప్పుడు ఎలాగైనా అతడికి కోపం తెప్పించాలి.  ఆవేశం పుట్టించాలి.  శత్రుసంహారానికి సిద్ధపడేలా ఉసిగొలపాలి.  ఏం చెయ్యాలి?

“హాం ఫట్!”కృష్ణుడు మంత్రం వేశాడు.  విజయుడు  తెలివి తప్పి పోయాడు.

……………….            ……………………..                 …………………

Kadha-Saranga-2-300x268

స్థలం:భారత దేశం. కాలం: కలియుగం ఇప్పటి కాలం, సందర్భం:ఆర్జునుడిని యుద్ధానికి పురిగొల్పడం.

కాసేపటికి కృష్ణుడు అర్జునుడి మొహం మీద నీళ్ళు కొట్టాడు.  అర్జునుడు కళ్ళు తెరిచాడు.  కళ్ళు తెరవగానే కృష్ణుడు కేలండర్ చూబెట్టాడు.  అర్జునుడికి అర్ధం అయ్యింది.  కృష్ణుడు తనని సాధారణ శకం ఇరవై ఒకటవ శతాబ్దం లోకి తీసుకు వచ్చాడని.  వున్న పళంగా యుద్ధక్షేత్రం నుండి ఇక్కడికి ఎందుకు తీస్కొచ్చినట్టూ అని అర్జునుడు తనలో తనే తర్జన భర్జన పడ్డాడు.  కృష్ణుడి వంక చూశాడు.  కృష్ణుడు తలెత్తి చుట్టూ చూడమని సైగ చేశాడు.  చూస్తే ఏముంది, ఎన్నో నేరాలూ ఘోరాలూ.

ఒక చోట మీటింగ్ జరుగుతుంది.   ఓ పెద్ద మనిషి మాట్టాడుతున్నాడు, అత్యాచారానికి గురైన ఆడాళ్ళంతా గోడుగోడున ఏడుస్తూ వింటున్నారు.  రిస్కు సమయాల్లో రిస్కు పనుల్లోకి వెళ్ళకుండా మీ జాగర్తలో మీరుండాలి.  ప్రభుత్వాలకి  వెయ్యి చేతులుండవు ఏపొద్దూ మీ వెంట వుండి మిమ్మల్ని కాపాడేదానికి అంటున్నాడు.

ఇంకో దగ్గర ఓ గ్రూప్ కి  చెందిన నాయకుడు ఎగస్పార్టీ లేడీ లీడర్లని లాక్కొచ్చి రేప్ చేస్తామని బహిరంగంగా స్పీచ్ ఇస్తున్నాడు.  ఇంకో నాయకుడు మొగోళ్ళన్నాకా మొగోళ్లే, ఏవో చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు.  దానికి అదే పనిగా గొడవ చెయ్యడం బాలేదని అక్రోశిస్తన్నాడు.    ఇంకో దగ్గర ఒక్క ఆడ పిల్ల మీద ఒకేసారి నలుగురు అత్యాచారం ఎలా చేస్తారు?  అని ఓ మేధావి ప్రశ్నిస్తున్నాడు.  పక్కనే ఒకడు ఆడ ఆపీసరమ్మని ఒకడు చితకా మతకా బాది పారేస్తన్నాడు.  ఈ ఇన్సిడెంట్లు జరగతా వుంటే జనాలు పక్కనే మామూలుగా ఏం పట్టనట్టు వాళ్ళలో వాళ్ళు మాట్టాడుకుంటా నడిచి పోతన్నారు.  అర్జునిడి రక్తం మరిగి పోయేలా ఎన్నెన్ని సంఘటనలో…అతనికి ఆవేశం పొంగి పొర్లింది

“హార్నీ, ఇంతలేసి ఘోరాలు జరుగుతుంటే ఎవరూ రియాక్ట్ కారేం?”కోపంగా గాండ్హీవం పైకి లేపబోయాడు.  కృష్ణుడు వారించాడు.

“బావా అర్జునా, నీ గాండ్హీవం ప్రభావం ఈ యుగంలో పనిచెయ్యదు.  నీ యుద్ధ ప్రతిభను నే చెప్పిన చోట చూపించు.  నీ బాధ్యత నిర్వర్తించు.  కలియుగం సమస్యల్ని నేను వేరే అవతారం ఎత్తి సాల్వ్ చేస్తాను”అని మళ్ళీ ‘హాంఫట్’ మంత్రం వేశాడు.  తర్వాత పార్ధుడు కళ్ళు తెరిచి చూస్తే ఇద్దరూ కురుక్షేత్రంలో వున్నారు.  ఇంకేం మాట్టాడకుండా అర్జునుడు కౌరవులవైపు గాణ్డీవం సెట్ చేశాడు.

 

ముక్తాయింపు:  భగవానుడు కలియుగం సమస్యల్ని సాల్వ్ చేస్తాననడం ఒక భక్తుడు విన్నాడు.  అందరికీ చెప్పాడు.  అప్పట్నించీ అందరూ పగలంతా భజనలు చేస్తూ, రాత్రిపూట నిద్రపోతూ కాలం గడిపేస్తున్నారు.  పరమాత్మ,  జనాలు నాన్ స్టిక్ పాన్లో నూనె లేకండా చేసిన ప్రసాదాలు తినీ తినీ, వైకుంఠ నివాసంలో ఏ పొద్దూ శేషుడి నీడ పట్టున పడుకుని తీవ్రమైన ఆర్ధరైటిస్ తోనూ, డి విటమిన్ లోపంతోనూ బాధపడుతూ లక్ష్మీ దేవితో రాత్రీ పగలూ అనిలేక కాళ్ళు నొక్కించుకుంటూ తన కష్టాల్లో తను పడి ‘కలియుగ అవతారం’ ప్రామిస్ సంగతి మర్చేపోయాడు!

 

*

క్విడ్ ప్రో కో.. యేలుకో!

 

 

 -బమ్మిడి జగదీశ్వరరావు

~

ప్రియమైన అల్లుడు గారికి!

యెంత రాజ్యసభ సీటు రాకపోతే మాత్రం.. ‘బాగున్నారా?’, అని అన్నా తప్పేనా? ‘యింకెక్కడ బాగుంటాను?’ అని ఫోను కట్ చేసారు! మా అమ్మాయిని అడిగితే ‘ఫోను కట్ అవడం కాదు, నా తల కట్టయినట్టు వుంద’ని మీరు అన్నారట! మీ బాధను నాబాధ చేసుకోగలను! మీ ఆవేశం, ఆందోళన అర్థం చేసుకోగలను! కాని మీరు అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి! యిప్పుడు కాకపోయినా తరువాతయినా నిదానంగా చదువుతారని అవగాహన చేసుకుంటారని ఆశతో యీ వుత్తరాన్ని మెయిల్ చేస్తున్నాను!

రాజ్యసభ అంటే పెద్దల సభ అని మీరూ నేనూ చదువుకున్నాం. మనం చదువుకున్నట్టు యేదీ వుండదు. యెంపిక కూడా వుండదు. సంఘ సేవకులు, కళాకారులు, క్రీడాకారులు, లబ్దప్రతిష్టులైన వివిధ రంగాలకు చెందిన వాళ్ళ ప్రాతినిద్యాన్ని కోరి- యెన్నికలలో నిలబడకుండా పోటీలేకుండా గౌరవించి వారి భాగస్వామ్యం కోరి- వారి మేథని, తెలివితేటల్ని, నైపుణ్యాన్ని వుపయోగించగోరి అంటే అవసరమైన సలహాలూ సూచనలూ కోరి- బలపరిచేది నియమించేది గనుక అది పెద్దల సభ అయ్యింది! ఇదంతా రాజ్యాంగం! రాజ్యాంగము కన్నా రాజ్యము గొప్పది! రాజు గొప్పవాడు!

‘వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చుంటే యేమి?’ అని సామెత.. అంచేత ‘రాజు’ అంటే ‘మంత్రి’ మనవాడు అయ్యుండాల.. రాజ్యం మనదయ్యుండాల.. అప్పుడు మనం పాడిందే పాట.. అంటే మనమే గాయకులం! మనం ఆడిందే ఆట.. అంటే మనమే క్రీడాకారులం! మనం వాయించిందే సంగీతం.. అంటే మనమే సంగీతకారులం! మనం రాసిందే రచన.. అంటే మనమే రచయితలం! మనం నటించేందే నటన.. అంటే మనమే కళాకారులం! మనం చేసిందే సేవ.. అంటే సంఘ సేవకులం! మనకున్న పెట్టుబడి పేరే ప్రతిష్ట.. అంటే లబ్దప్రతిష్టులం! యెప్పుడూ? పైవాడు మనవాడు అయినప్పుడు! అప్పుడు! అప్పుడు మనమే తోపులం! మనమే పుడింగిలం! మనమే లార్డ్ కర్జిన్లం! రాజ్యసభ అభ్యర్దులం! పెద్దలం! పెద్దల సభకు పొద్దులం! యెప్పుడూ? వాడు.. ఆపైవాడు కాదు, ఈ పైవాడు అనుకున్నప్పుడు! అప్పుడు!

అప్పుడు మనం గెలవక్కర్లేదు! గెలిస్తేనే అర్హత అనే రూలేం లేదు! ప్రజాభీష్టంతో సంబంధమూ లేదు! ప్రజలు నువ్వు వొద్దు అని వోడించినా.. నువ్వు వోడినా.. గెలిచినట్టే! డిపాజిట్లు కోల్పోయినా.. గెలిచినట్టే! ప్రజాభీష్టం లేకపోయినా.. వున్నట్టే! గెలిచి యెవడైనా వెళ్తాడు! ఓడి వెళ్ళడం.. అంత మామూలు విషయం కాదు! ప్రజలు కాదన్నాసరే ప్రజా ప్రతినిధిని చేసి అందనాలు యెక్కించడం యిందులో గొప్ప విషయం! అందుకే రాజ్యసభకి వెళ్ళడం అంత గౌరవం! అంత పోటీ! అంత విలువ! అంత అవకాశం! అందరికీ అంత ఆశ! అందరికీ అంత మోజు!

ఎమ్మెల్యే ఎంపీ సీట్లకన్నా రాజ్యసభ సీట్లకు డిమాండ్ యెక్కువ! మామూలుగా అంటే ‘మామూలు’గా.. ధర కూడా యెక్కువ! ఖర్చు తక్కువ! ఓడిపోతామన్న భయం తక్కువ! గెలుపుకు గ్యారంటీ! ఏకగ్రీవానికి వారంటీ!

మన రెండు తెలుగు రాష్ట్రాలే తీసుకో. ఆరుగురు యేకగ్రీవంగా యెన్నికయ్యారు. ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఎంసెట్ సీట్లు లాంటివి అయితే, రాజ్యసభ సీట్లు ఐఐటి ఎఐయంసి సీట్లు లాంటివి అన్నమాట! చాలా పోటీ వుంటుంది. రాకపోతే బాధే! ‘బ్యాడ్ లక్’ అని యిలా బాధపడితే యెలా చెప్పండి.. ‘నెక్స్ట్ టైం బెటర్ లక్’ అనుకోవాలి అల్లుడు గారూ..?!

ఇప్పుడు రాజ్యసభకు యెన్నికయిన ఆరుగురు కంటే నాకు యేమిటి తక్కువ అన్నారు. నిజమే! మీరు యెక్కువే! కాని మన యిద్దరు చంద్రులు వొకేలా ఆలోచిస్తున్నారు! ప్రతిపక్షాల్ని తమ పాలకపక్షంలో కలిపేసుకోవడంలో యిద్దరూ సిద్ధహస్తులే! వేరే పార్టీల నుండి వచ్చిన వారిని తక్కువ చేసి చూడడంలేదని చెప్పడానికి వొక సందేశం పంపడానికి అటు ఆంద్రాలో టీజీ వెంకటేష్ గారికి – యిటు తెలంగాణలో డి శ్రీనివాస్ గారికి రాజ్యసభ సీట్లు యిచ్చారు. సొంత పార్టీలో మీరు వుండొచ్చు. మీకివ్వొచ్చు. కాని అవతల పార్టీ నుండి వచ్చిన వాళ్లకి యివ్వడంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’కు అత్యున్నత పురష్కారం యిచ్చినట్లు అవుతుంది! ఇదేమిటి.. అయినవాళ్ళకి ఆకుల్లో.. కాని వాళ్ళకు కంచాల్లోనా? అనో- యింట్లోవాళ్ళకి యీత చాప.. పై వాళ్ళకు పట్టెమంచం? అనో- అనుకోవచ్చు! కాని యిద్దరు చంద్రులకూ ముందు చూపు యెక్కువ! అవతలి పార్టీలో మిగిలిన వాళ్ళకి వెళ్ళ వలసిన సందేశం వెళ్ళిపోతుంది! పాత కండువా పడేసి కొత్త కండువా వేసుకుంటారు! వేసుకుంటూనే వుంటారు!

ఇదేమిటి అంటావా? ఇదే క్విడ్ ప్రో కో! నిన్ను గెలిపించిన ప్రజల్ని వారి అభిప్రాయాల్ని వెక్కిరించినట్టుగా అవతలకు నెట్టి, నువ్వు మా పార్టీలోకి వస్తే.. నీకు యివ్వాల్సింది యిస్తాం అన్నట్టే కదా? ‘నువ్వు వొస్తావు.. ప్రతిగా మేము యిస్తాము’.. యిది క్విడ్ ప్రో కో కాదా?

తెలంగాణ చంద్రుడు కేసీఆర్ కు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంచి స్నేహితుడు. స్నేహితుడయితే వాళ్ళింటికి నువ్వు వెళ్లి తిను. నీ యింటికి వాళ్ళనొచ్చి తినమను. మీరు మీరు యేదన్నా యిచ్చిపుచ్చుకోండి. కాని స్నేహం పంచాడు కాబట్టి రాజ్యసభ సీటు పంచుతాను అంటే అదెలా? అప్పుడది క్విడ్ ప్రో కో కాదా? క్విడ్ ప్రో కో కిందికి రాదా?

ఇక తెలుగు చంద్రుడు సుజనా చౌదరికి రాజ్యసభ సీటు మళ్ళీ యివ్వదలచుకున్నాడు. సుజనా చౌదరి విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడాడని అందుకే మళ్ళీ రాజ్యసభకు పంపుతున్నట్టు తెలుగు చంద్రుడు చెపుతున్నాడు. విభజనకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళను గౌరవించదలచుకుంటే వైయ్యెస్ జగన్ని కూడా గౌరవించాలి గదా? మరి గౌరవించగలడా..? పైగా విదేశీ బ్యాంకుల ఋణం యెగ్గొట్టినట్టు అనేక అవినీతి ఆరోపణలు యెదుర్కొంటున్న సుజనా చౌదరిని రాజ్యసభకు పంపుతూ వుల్టా ‘పదకుండు చార్జిషీట్లు పదమూడు కేసులూ వున్న ఏ-2 ముద్దాయిని రాజ్యసభకు యెలా పంపిస్తారు? ఏ-1 నిందితుడు సపోర్టు యెలా యిస్తాడు?’ అని చంద్ర బృందం అడుగుతూ వుంటే- యెల్లమ్మని యెంచక్కర్లేదు.. పోలమ్మని పొగడక్కర్లేదు అన్నట్టుగా వుంది.  అవినీతిపరులేనా అభ్యర్ధులు? మరెవరూ యిరు పార్టీలలో లేరా? అంటే అలా యివ్వడంలో క్విడ్ ప్రో కో లేదని చెప్పగలరా?

తెగమాట్లాడే తెలుగు వాడు.. ప్రధాని తరువాత రెండోస్థానంలో వున్నాడంటున్న వెంకయ్య నాయుడుకు కాకుండా మహారాష్ట్రకు చెందిన సురేష్ ప్రభుకు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సీటును వాళ్ళు కోరడంలో- వీళ్ళు యివ్వడంలో మతలబు యేమిటి? పోనీ మన నిర్మలా సీతారామన్ను కర్నాటక పంపడంలో మతలబు యేమిటి? తెలుగు తమ్ముళ్ళు కాదన్నారా? లేక రేపెప్పుడో కాదంటారనా? ‘మీకీ హోదా యిచ్చాం.. మాకు ప్రత్యేకహోదా యివ్వలేరా’ అని అంటారనా? సరే అందరికీ అర్థమయ్యే రాజకీయాలు మాట్లాడుకోవడంలో అర్థం లేదు!

సొంత రాష్ట్రం వాళ్ళే చెయ్యలేనిది.. వేరే రాష్ట్రం వాడయిన సురేష్ ప్రభు చేస్తాడనా? బీజేపీ యెందుకడిగింది? టీడీపీ యెందుకిచ్చింది? ఇది కూడా క్విడ్ ప్రో కో అంటే కాదనగలరా?

కేంద్రంతో అవసరాలు వున్నాయి! కేంద్రం అవసరం మనం తీరిస్తే మన అవసరం కేంద్రం తీరుస్తుంది! కేంద్రానికి మనం సహకరిస్తే కేంద్రం మన రాష్ట్రానికి సహకరిస్తుంది! కేంద్రంతో స్నేహంగా వుండి నిధులు తెచ్చుకోవాలి! రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని వారికి అవకాశం యివ్వాలి! వారికి వొక అవకాశం యివ్వడం అంటే మనం వారి నుండి వొక అవకాశం తీసుకోవడం! కేంద్రంలో అధికారంలో వున్న వాళ్ళకి మనం మన మద్దతు యిచ్చాం.. వారు అందుకు ప్రతిగా మనవాళ్ళకి కేంద్రంలో మంత్రి పదవులు యిచ్చారు! విశాఖపట్నంకు రైల్వే జోన్ యివ్వమని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాం.. యిప్పుడు ఆ రైల్వే శాఖా మంత్రిని రాజ్యసభకు మన ఏపీ నుండి పంపిస్తున్నాం.. కాబట్టి రేపు రైల్వే జోన్ ఆశించొచ్చు.. అడగొచ్చు.. సాధించుకోవచ్చు.. మనం రాజ్యసభ సీటిచ్చాం.. వాళ్ళు మనకి రైల్వే జోన్ యిచ్చారు.. యిస్తారు.. ఏం లేదు.. యిచ్చి పుచ్చుకుంటున్నాం.. ‘నీకిది.. నాకది!’

ఇది కూడా క్విడ్ ప్రో కో కాదా? ఆర్ధిక అవినీతి మాత్రమే అవినీతా? రాజకీయ పార్టీలు జట్టులు కట్టి వుమ్మడిగా ‘నీకిది.. నాకది’ అని అంటే అనుకుంటే ముందుకుపోతుంటే అధికారం పంచుకుంటే అది మాత్రం అవినీతి కాదా? దీన్ని ‘క్విడ్ ప్రో కో’గా చూడకూడదా? అలా చూస్తే తప్పా?

కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి రాజ్యాంగములో యేమి రాసుకున్నా.. మద్దతు వున్న రాష్ట్రాల వాళ్ళతోనే ఆ సంబంధాలు సజావుగా కొనసాగుతాయా? లేదంటే శాంతి భద్రతల బూచి చూపించి రాష్ట్రపతి పాలన విదిస్తారా? రాష్ట్ర అవసరాలకు సహకరించకుండా మొండి చెయ్యి చూపిస్తారా? మద్దతు యిచ్చినప్పుడే వున్నప్పుడే రాజ్యాంగము అమలవుతుందా? లేదంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలని అది నిర్వచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతారా? మరి ‘మద్దతు’ అంటే యేమిటి? ‘నాకు నా పాలనకి- నా అధికారానికి- నేను అధికారంలోకి రావడానికి- అధికారంలో వుండడానికి- నువ్వు సహకరించు.. నీకు నీ పాలనకి- నీ అధికారానికి- నువ్వు అధికారంలోకి రావడానికి- అధికారంలో వుండడానికి- నేను సహకరిస్తా..’ అనే కదా? నాకిస్తే – నీకిస్తా! మళ్ళీ అది అవ్వదా ‘నీకిది.. నాకది?’

ఏది క్విడ్ ప్రో కో కాదు? సమస్తమూ క్విడ్ ప్రో కో నే! సమస్త సంబంధాలు క్విడ్ ప్రో కో నే! రాజకీయ సంబంధాలే కాదు, అధికార సంబంధాలే కాదు, సమస్త మానవ సంబంధాలూ క్విడ్ ప్రో కో నే! కుటుంబంలోనే తీసుకో.. నువ్వు ప్రేమిస్తేనే ప్రేమిస్తారు! ద్వేషించినా ప్రేమిస్తారా? లేదే? నువ్వు నీ కష్టాన్ని యిచ్చావనుకో.. ప్రతిగా నీకు సుఖాన్ని యిస్తారు! నువ్వు వాళ్ళ కోరిక తీర్చావనుకో.. ప్రతిగా వాళ్ళు నీ కోరిక తీరుస్తారు! ఇచ్చిపుచ్చుకోవడం అన్నింటా వున్నదే! యివ్వకుండా పుచ్చుకోలేవ్!

సో.. ఆ ‘క్విడ్ ప్రో కో’లోకి రాకుండా ‘క్విడ్ ప్రో కో’లో లేకుండా రాజ్యమే నిలబడదు! రాజ్యసభ సీటు నిలబడుతుందా? ‘క్విడ్ ప్రో కో’ పాటించకుండా రాజ్యసభ సీటు ఆశించడం నేతి బీరలో నెయ్యిని ఆశించడం లాంటిది! ముందు ‘క్విడ్ ప్రో కో’ని గౌరవించు! ‘క్విడ్ ప్రో కో’ని ఆచరించు! ‘క్విడ్ ప్రో కో’ని అనుభవించు! ‘క్విడ్ ప్రో కో’ నిత్యము! ‘క్విడ్ ప్రో కో’ సత్యము! ‘క్విడ్ ప్రో కో’ శాశ్వతము!

అల్లుడూ.. ‘క్విడ్ ప్రో కో’ యే రూపంలో వున్నా అది అపురూపమైనది! అందులో నువ్వు భాగస్వామి కావలసియున్నది! అది మాత్రమే నీకు భవిష్యత్తులో రాజ్యసభ సీటుని తెచ్చును! యిచ్చును!

వొచ్చే పెద్దల సభ యెన్నికల్లో మీ కోరిక తప్పక నెరవేరుతుంది!

అభిమాన పూర్వక ఆశీస్సులతో..

మీ

మామ

పండు వెన్నెల…ప్రతి చోటా!

 

 

-చందు తులసి 

~

ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వ్యాప్తిలో వున్న ఓ పోస్టు….
ఓ పాప వాళ్లమ్మను అడిగిందట…..
”అమ్మా…మీరు మన బీరువా తాళాలు మన ఇంటి పనిమనిషికి ఎందుకివ్వరు…?” అని…తల్లి ఆశ్చర్యపోయింది. ఐనా అడిగింది తన చిన్నారి తల్లి కాబట్టి ఓపికగా….
” నువ్వు చిన్నపిల్లవు కదా…నీకు తెలీదమ్మా. అలా ఇవ్వకూడదు …”అని చెప్పింది.
 

మళ్లీ ఇంకో ప్రశ్న.
”పోనీ మీ ఏటీఎమ్ కార్డు…మన వంటమనిషికి ఎందుకివ్వవు…?”
తల్లి ఈ సారి…ఆశ్చర్యపోతూనే కోప్పడింది.
”నీకు ఇపుడు చెప్పినా అర్థం కాదమ్మా…చిన్న పిల్లవు కదా”  అంది.
” పోనీ మన దగ్గర ఎంత డబ్బు ఉందో మన ఇంట్లో పనిచేసే తోటమాలికి ఎపుడైనా చెప్పావా..?”
 

ఈ సారి తల్లికి విసుగు, అంతకన్నా కోపం వచ్చింది.
” వొక్క సారి చెబితే అర్ధం కాదా.. మన దగ్గరున్న విలువైన వస్తువుల గురించి పరాయివాళ్లకు చెబుతామా..? చెబితే వాళ్లు దోచుకోరూ…”అంది.
” డబ్బులు, ఏటీఎమ్ కార్డులు, మాత్రం జాగ్రత్తగా చూసుకుంటారు. మరి నన్ను మాత్రం ఎందుకు ఆయా దగ్గర వదిలేసి వెళతారు.  నేను మీకు విలువైన దాన్ని కానా..? ”  అని ఏడుస్తూ అడిగిందట చిన్నారి.

***
కొంత అతిశయోక్తిగా అనిపించినా……ఆ పాప అడిగిన ప్రశ్నలో మాత్రం నిజం వుంది.  ఆ ప్రశ్న కేవలం ఆ చిన్నారిదే కాదు. మన సమాజంలోని అందరి చిన్నారులది.  కారణాలేవైనా కావచ్చు కానీ ఇవాళ అన్నిటికన్నా ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతోంది బాల్యం.
సరైన తిండి పెట్టక పోవడం, వయసుకు మించిన పని చేయించడం, చిత్రహింసలు పెట్టడం….ఎంత నేరమో వాళ్లకు అవసరమైన జ్ఞానాన్ని అందించకపోవడమూ అంతే నేరం. వాళ్ల ఆలోచనలను పట్టించుకోకపోవడం, వాళ్లను సక్రమ మార్గంలో తీర్చిదిద్దక పోవడమూ అంతే నేరం.
పిల్లలంటే కేవలం…ఇంటర్నేషనల్, టెక్నో, కాన్సెప్ట్….ఇలా రకరకాల ముసుగులు తగిలించుకొన్న కార్పోరేట్ కోళ్లఫారాల్ని నింపడానికే పుట్టే అభాగ్యులు కాదు కదా….??
తల్లిదండ్రుల సాధించలేని కోరికలు,  సాధించి పెట్టడానికి దొరికిన కోరికల కొనసాగింపులూ కాదు కదా……??
మరో ఇరవై ఏళ్ల తర్వాత…..మల్టీ నేషనల్ కంపెనీల అవసరాలు తీర్చడం కోసం….తయారవుతున్న రోబోలు కాదు కదా..! …??
 

హరివిల్లుపై జారాలనో, నెలవంకకు ఊయల కట్టి ఊగాలనో…వెన్నెల్లో గోరు ముద్దలు తినాలనో కాకున్నా…..
అమ్మా నాన్నతో కబుర్లు చెప్పాలనో, నాన్నమ్మ, తాత దగ్గర కథలు వినాలనో….లేదా తమకు నచ్చినట్లు తామే కథలు చెప్పుకోవాలనో ఉంటుంది కదా….!
పిల్లలకూ ఆలోచనలుంటాయని, వాళ్లకూ అంతులేని సృజన ఉంటుందనీ ఎవరు గుర్తించాలి…? అవకాశం ఇవ్వాలే కానీ వాళ్లూ సృజనాత్మకత విషయంలో పెద్దవాళ్లకూ తీసిపోరని ఎవరు నిరూపించాలి…? పంజరాల్లాంటి తరగతి గదుల్లోంచి బయటకు తీసుకొచ్చి…. పాఠాలు, పంతుళ్లు, పుస్తకాలకు అందనంత దూరంగా తీసుకెళ్లి, ఓ పెన్నూ పేపరూ ఇచ్చి…. ” పిల్లలూ మీకోసం మీరే ఏం రాసుకుంటారో రాసుకోండర్రా”  అని అంటే….పిల్లలు ఏం రాస్తారు…? ” పిల్లలూ మీకు రెక్కలొచ్చాయి అనుకోండి….అపుడేం చేస్తారు….” అని అడిగామే అనుకోండి. ఊహకైనా అందని ఆ ఆనందాన్ని పిల్లలు ఎలా పంచుకుంటారు.? అలాంటి అబ్బుర పరిచే ఆలోచనల సమాహారమే  సంస్కృతి పబ్లికేషన్ ప్రచురించిన పండు వెన్నెల పుస్తకం. తమ లాంటి చిన్నారుల కోసం…తామే కవులూ, రచయితలూ అయిపోయి కలాలు భుజాన వేసుకుని రచనల సంకలనం.  ఇంతకీ ఈ పండు వెన్నెల ఎలా మొదలైందో చెప్పాలంటే ఓ నెల వెనక్కు వెళ్లాలి.
 

చిన్నారుల్లో దాగి ఉన్న సాహిత్యాభిలాషను, అభిరుచులను, కళలను వెలికి తీసేందుకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు సంస్కృతి గ్లోబల్ స్కూల్ యాజమాన్యం నవతరంతో యువతరం అని ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్నంతా భుజాల మీద మోసింది  ప్రముఖ కథా రచయిత్రి  డా. కె.ఎన్. మల్లీశ్వరి ( ప్రజాస్వామిక రచయితల వేదిక),  కత్తి పద్మ ( మహిళా చేతన సంస్థ),  నిశాంత్ లు. చిన్నారి సాహిత్య కారులు….యువతరం రచయితలతో సమ్మేళనం చేసే ఈ కార్యక్రమంలో సీనియర్ రచయితలూ చాలామంది పాల్గొని తమ ఆలోచనలూ పంచుకున్నారు.
 

కేవలం కథలు చదవడం, రాయడం…వాటి గురించి చర్చించడమే కాదు. పక్కనే ఉన్న గిరిజన ప్రాంతాన్ని సందర్శించారు. దోపిడీని ప్రతిఘటిస్తున్నందుకు అణచివేతను ఎదుర్కొంటున్న అడవిబిడ్డలతో మీకు తోడుగా మేమున్నాం…అని ధైర్యం చెప్పారు.  ఇలా సాహిత్యం, సామాజిక స్పృహ కలగలిసిన ఈ కార్యక్రమం  కేవలం విశాఖ జనాన్నే కాకుండా….తెలుగు సాహిత్య కారులందరినీ ఆకట్టుకున్నది.
 
ఆ నవతరంతో యువతరం కార్యక్రమంలో పాల్గొన్న నేటి, రేపటి తరం సాహిత్య కారుల ఆలోచనలని పండు వెన్నెల పేరుతో ప్రచురించింది సంస్కృతీ పబ్లికేషన్ సంస్థ. ఈ పుస్తకంలో అనుభవాలే కాకుండా బాల రచయితల కథలు, కవితలు కూడా ఉన్నాయి. రాసింది చిన్నారులే ఐనా ….పెద్ద రచయితలకు తామే మాత్రమూ తీసిపోమని నిరూపించారు.
 

కంటనీరు కూడా కలుషితమవుతున్న కాలమిది…అంటూ తన కవితలో ఆవేదన వ్యక్తం చేస్తుంది సోనా-శాంతి. సాహిత్య కారులు ఎటువైపు నిలబడాలో సూచిస్తాడు పృధ్వీ.  పెన్నుతో కాదు భావోద్వేగంతో రాస్తున్నానంటాడు జస్వంత్.   ప్రకృతి విధ్వంసాన్ని ప్రశ్నిస్తుంది…. మన్విత.   అంతం కాదిది ఆరంభం అంటుంది మహాలక్ష్మి. శ్రీశ్రీని గాఢంగా అభిమానించడమే
కాదు…శ్రీశ్రీలా కవిని అవుతానంటాడు మరో చిన్నారి. ఇలా ఈ బుల్లి సాహిత్య కారులు తమ రచనల్లో వయసుకు మించిన పరిణతి ప్రదర్శించారు.  చిన్నారులతో పాటూ కార్యక్రమంలో పాల్గొన్న యువ రచయితలు, సీనియర్ రచయితలూ తమ అనుభవాలనూ, పరిశీలనలూ వివరించారు.
 
సంపాదకులు చెప్పినట్లు ఈ పుస్తకం బాల సాహిత్యం మాత్రమే కాదు…పెద్దల సాహిత్యమూ కాదు. ఈ పుస్తకం విడి విడిగా రాసిన రచనల సంకలనమూ కాదు. అందరి ఆలోచనల సమాహారం.  ప్రతీ పేజీని అందంగా,  చిత్రాలతో రూపొందించడం వల్ల
పిల్లలను ఆకట్టుకుంటుంది.

చివరగా ..ఇలా రేపటి తరం సాహిత్య కారులను గుర్తించి, వారికి సానబెట్టి సమాజానికి అందించే అరుదైన కార్యక్రమాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ముఖ్యంగా …ప్రభుత్వ పాఠశాలల్లో చేపడితే ఎంతో మేలు జరుగుతుంది. తెలుగు నాట అనేక సాహిత్య కార్యక్రమాలు జరుగుతుండడం అందరికీ తెలిసిందే. సన్మానాలు, అభినందన సభల కన్నా…ఇటువంటి కార్యక్రమాల వల్ల సాహిత్యానికి ఉపయోగం. సాహిత్య సంస్థలు, సాహిత్య కారులు  దృష్టి సారించాల్సిన విషయమిది.

(ఈ నెల 16వ తేదీన విశాఖలో పండు వెన్నెల పుస్తకం ఆవిష్కరణ సభ సందర్భంగా…..)

గ్యాలరీకి దూరంగా కవనం: అనంతు

 

 

అనంతుకి బాగా అతికే ట్యాగ్ లైన్ – “కేవలం కవి కాదు!” అటు వచనం, పత్రికా రచనం, ఇటు కవనం, చిత్ర లేఖనం, చలనచిత్రానుభవం- అనంతు అనేక కోణాల kaleidoscope! మాటలో మంత్రం, విశ్లేషణలో గాఢత్వం, కదలికలలో జీవన తృష్ణ, దూరాల్ని జయించే ప్రేమ, భిన్న ఉద్వేగాల కూటమి! తొంభైల తరవాత తరంలోని సంక్లిష్టతల అంతు తెలిసిన వాడు. ఇప్పటి జీవితపు నుడీ నాడీ వెతికి పట్టుకున్న వాడు. నిశ్శబ్దంగా ఉండలేని వాడు – అనంతు. తక్కువే  రాసినా  ఎక్కువ కాలం  గుండెని బొంగరం తిప్పినట్టు తిప్పే  అనంతు కవిత్వాన్ని “ద్వీప కూటమి” శీర్షికతో  ఈ పన్నెండున హైదరాబాద్ లో ఆవిష్కరిస్తున్నారు “ప్రేమ లేఖ” మిత్రులు. ఈ సందర్భంగా అనంతు లోగుట్టు తెలిసిన నలుగురు – నామాడి శ్రీధర్, అఫ్సర్, ఒమ్మి రమేష్, ఎం. ఎస్. నాయుడు, పెద్ది  రామారావు-  అన్న  నానా  మాటలకు అనంతు సమాధానాలివి:

*

నామాడి శ్రీధర్ : ఎందుకీ కవిత్వం అంటే నువ్వేమంటావ్?

అనంత్: నాకు ఎందుకీ కవిత్వం అంటే నా దగ్గర తయారీ సమాధానం లేదు. బహుశా నేనే నన్ను ఆ ప్రశ్న వేసుకోకపోవడం  వల్లే.

కానీ అసలు ఎందుకీ కవిత్వం అనేది చాలా పొరలున్న ప్రశ్న. అది నాకు మాత్రమే సంధించిన లేదా వర్తించే ప్రశ్న కాదు.

మేలైన, లోతైన, ఘాడమైన, లలితమైన కవిత్వం ఎక్కడ అభివ్యక్తిగా, సృజన ప్రక్రియగా తలెత్తుకుని వుంటుందో ఆ జాతికీ, ఆ భాషకీ ఇంకా ఉద్వేగ, ఆక్రోష, ఆకాంక్ష, సౌందర్య  ప్రకటనలు బహిరంగంలోనూ సజీవంగా వున్నాయని లెక్క. అలాంటి కవిత్వం జలాలుద్దీన్ రూమీదయినా, చీనీ లీపోదయినా; అమెరికన్ జనపద వాగ్గేయకారుడు పీటె సీగర్ దయినా, దళిత విప్లవకారుడు శివసాగర్ దయినా; వీట్ మిన్ స్వాతంత్ర్య ఉద్యమ నేత పో చి మిన్ దయినా, స్ఫటిక కవి ఇస్మాయిల్ దయినా సరే మనసుకు దగ్గరై, అర్థమై, మక్కువా అవుతుంది నా మటుకు నాకు.

మన సకల ఉద్వేగాలను కించిత్ కెరలించేది కవనం. అందుకే కవిత్వం.

అయితే కొద్దిపాటికి చెందిన వ్యాసంగమే ఏ సమాజంలోనయినా కవిత్వం. కొందరి మధ్యే ప్రభవించి, పల్లవించి, ప్రవహించే జల అది ఇంకా ఇక్కడ. కవిత్వం కళ. సృజన వేరు. కళ వేరు. చాలా సార్లు సృజన సహజాతం కావచ్చు. పిచ్చుకలు అల్లే అందమైన గూడు లాగా. కానీ కళ తర్ఫీదు వ్యవహారం. రస ఆస్వాదనకు (appreciation) ఏ ప్రక్రియలోనయినా తర్ఫీదు, సాధన తప్పనిసరి. కవిత్వం మినహాయింపేమీ కాదు.

శ్రీ శ్రీ లాంటి కవి మన కవిత్వానికి  icon (మహాకవి) కాకపోయివుంటే మన వచన కవితానుడి ఇన్ని గడులు, సుడులు దాటుకుని ఇంత పెద్ద గెంతుతో వచ్చేది కాదు. కానీ శ్రీ శ్రీ (తరహా) ది మాత్రమే కవిత్వం అయి తక్కినది కాకుండా (చాలా నాళ్ళు) పోవడంలో శ్రీశ్రీ కి కీడు చేసిన వాళ్ళ వాటానే ఎక్కువ. శ్రీశ్రీ లో tautological అంశ కూడా వుంది. అది ఆ కాలానికి తగింది. దాన్ని సందర్భం నుంచి వేరుచేసి తక్కువచేయలేం. కానీ ఆ tautology ఇప్పుడు redundant.

జాషువా, నారాయణబాబు, పఠాభి, దిగంబర కవులు, బైరాగి, వజీర్, ఇస్మాయిల్, అజంతా, మో లాంటి కవులు శ్రీశ్రీ తరహాని పటాపంచలు చేయగలిగారు. అందుకే తర్వాత తరాలకు శ్రీశ్రీ ఇక emotional baggage కాలేదు అంతగా. అయితే మన గొప్ప కవుల్లో చాలా మంది కార్డ్ హోల్డర్స్, గ్యాలరీ ప్లేయర్స్. లేదా showmen అనవచ్చు. అంటే గ్యాలరీ పట్ల విపరీతమైన స్పృహ వున్న ప్రదర్శకులు (performers/charmers). ఇది నిందార్థంలో కాదు. నిశ్చిత అర్థంలోనే. కానీ కార్డులనుంచి, గ్యాలరీలనుంచి విముక్తం అయి వికసించిన, వినిపించిన నిజ కవిత్వం మనకు చాలా తక్కువ. దానికి  ప్రబలమైన కారణాలు మన అతితార్కిక అభౌతికవాద అకమ్యూనిష్ఠాగరిష్ఠు కుబ్జ విమర్శకుల దుందుడుకుతనం, డాంబికం, జడత్వ కొలమానాలూ, పటాటోప ప్రదర్శనం, దూషణం. ఇది చాన్నాళ్ళు కొనసాగింది. కాబట్టే మన socalled  avant-garde writers’ ensemble ఏనాడో dead poets’ society గా మారిపోయింది. పైగా ఎప్పుడో శివసాగర్ చేసిన ఈ ప్రకటననీ, విశ్లేషణని anti-revelutionary elements పెట్టే శాపనార్థాలుగా ఇప్పటికీ తమ శ్రేణుల్లో చెలామణీ చేసుకుంటూ ఆత్మవంచనకు పాల్పడుతూ డాంబికంగా వుంది ఆ సంఘం.

ఇక కొత్త అని చెప్పలేం కాని, భిన్న మైన విమర్శను రంగం మీదకు తీసుకు వచ్చాయి అస్తిత్వ ఉద్యమాలూ, అదే కాలంలో ప్రవేశించిన post-modernism. అయితే అప్పటి వరకూ మిణుకు ఉనికిలో వున్న విమర్శ వీటి నుంచి వినమ్రంగా నేర్చుకున్నది శూన్యం. ఇంకా విషాదం ఏమిటంటే… అస్తిత్వ వాద ఉద్యమాలు, post-modernist లూ  అప్పటి వరకూ వున్న విమర్శలోని ఓగును తగిలించుకుని బాగును విసర్జించడం.

అందుకే ఇప్పటి కవిత్వం కార్డులనుంచీ, గ్యాలరీ కోసం ప్రదర్శణల నుంచీ విముక్తం అయినట్టు పైకి కని, వినిపించినా సాహిత్య విమర్శ గైర్హాజరీ వల్ల  ఇటీవలి కవిత్వంలో కవిత్వమే మృగ్యం. కవిత్వం ఒంటరిగా మనలేదు. సత్ విమర్శ నిశ్వాసం. అది లేని కవనమే ఇప్పటి చెలామణీ మరి.

 

నామాడి శ్రీధర్: రచనకీ, ఆచరణకీ మధ్య కవిలో ఎంతెంత దూరమని చదువరి కొలుస్తాడంటాను. నువ్వేమంటావు?

అనంతు: రచన ముఖ్యమా, రచయిత ముఖ్యమా అన్న చర్చ ఈ నాటిది  కాదు. అత్యంత ఎక్కువగా కార్ల్ మార్క్స్ మీద ఈ నాటికీ జరుగుతోంది. యంగ్ మార్క్స్ అనీ, లేటర్ మార్క్స్ అనీ. రచయిత ఏ కాలంలో, ఏ సందర్భంలో ఏమన్నాడు, కాలానుగుణంగా రచయిత అభిప్రాయాల పరిణామంలో వైవిధ్యాలనూ, వైరుధ్యాలనూ బేరీజు వేస్తూనే వున్నారు చదువరులు. అలా వేస్తూనే వుంటారు. అయితే రచయిత కన్నా రచన కీలకం అనే వర్గంతో నాకు సమ్మతి వుంది.

ముందు తరం పరిమితుల ఎరుక కల్పించుకోవడమే తరువాతి తరం పరిణతి. ఎరుక అదంతకదే మన దరి చేరి రాదు. మనమే కల్పించుకోవాల్సి వుంటుంది. మన చొరవతో, చైతన్యంతో. ఆ చొరవ, చైతన్యమే ఆచరణ. కార్యాచరణ అంటే అన్నిసార్లూ చౌరస్తాలో నిలబడి నినదించడం, నిరసించడం మాత్రమే కానక్కర్లేదు. ఆయుధాలు పట్టుకుని అడవికి వెళ్ళడమొక్కటే ఆదర్శ ఆచరణకు అన్నిసార్లూ గీటురాయి అని ఎవరైనా బుకాయించి దబాయిస్తే చెల్లదు. కొన్నిసార్లు ఇంటిలో సమాయత్తమయి తలుపు తీయడం కూడా కార్యాచరణే. ఆ తలుపు దాటేలోపే ఎన్ని సంశయాలు, ఎన్ని సందిగ్ధాలు. అవన్నీ తీరకుండా అడుగు కదలదు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఆలోచనే ఆచరణ. అట్లాంటి కాలంలో కీలక ఆచరణ ఆలోచన చేయడమే. మన సమ సమాజానికి అనుగుణమయిన నమూనా మనం రచించుకునే వరకూ ఆలోచించడమొక్కటే, చర్చించడమొక్కటే, తర్కించడమొక్కటే, ఆ ఆలోచనల ప్రసారానికి పూనుకోవడం ఒక్కటే ప్రధాన ఆచరణ.

రచన లేదా సృజన కర్తవ్యం అన్ని సందర్భాలలో ఖాళీలను పూరించడం మాత్రమే కాదు. సృజన ఖాళీలను సృష్టిస్తుంది కూడా కొన్ని సందర్భాలలో, కొన్ని కాలాలలో. అఖాతాలను ఏర్పరస్తుంది సాహిత్యం. ఆ ఖాళీలను, అఖాతాలను పూరించాల్సింది చదువరులే. ఎందుకంటే రచయిత తదుపరి కదా చదువరి. సాహిత్యం అంటే కేవలం తెలుగు సాహిత్యం అనే అర్థంలో కాదు. మన ఆవరణలోకి, అందుబాటులోకి వచ్చిన అన్ని భాషల సారస్వతం అనే స్థూల అర్థంలోనే. కొద్ది మంది రచయితలు ఏనాడో ప్రతిపాదించిన విలువలు, ఆయా పాత్రల ఆదర్శ జీవన శైలులు ఇంకా మన కనుచూపు మేరలో కూడా మన సమాజంలో సాధ్యమా అన్నది నేటికీ ప్రశ్నార్థక మే. ఆ రచయితలు అంతటి ఖాళీ సృష్టించి వెళ్ళిపోయారు. ఇక చదువరుల ఆచరణే దాన్ని భర్తీ చేయాలి కదా. గొప్ప రచనలు ప్రతిపాదించిన విలువలు మన అందమైన బుక్ షెల్ష్ లలో దాచుకుని ప్రదర్శనకు పెట్టుకోడానికి కాదు. ఒక రచయిత, మేధావి ప్రతిపాదించిన ఒక ఆమోదయోగ్యమైన జీవన/సమాజ నమూనా అతని జీవిత కాలంలో ఆచరణలో సాధ్యం కాక పోవచ్చు. అలాంటి sensible value systemsని, ideal societyనీ నిర్మించుకునే బాధ్యత చదువరులదే. అంటే ప్రజలదే. ఆ బాధ్యత రచయితది కాదు. రచనే రచయిత మౌలిక ఆచరణ. రచన బాగోగులను నిలకడగానయినా నిగ్గుతేల్చేది చదువరులే. చదువరులలో ముందు వరస తర్ఫీదు అయిన విమర్శకులదే.

anant

ఒమ్మి రమేశ్ బాబు: ఉద్యమాలకీ – కవిత్వానికీ, కవికీ- ఉద్యమాలకీ ఇప్పుడు ఎలాంటి సంబంధం వుంది? ఎలాంటి సంబంధం వుండాలి?

అసలు సంబంధంవుండి తీరాలా? తెలుగులో ఉద్యమ కవిత్వం అనేది నినాద ప్రాయం అయ్యిందన్న విమర్శ సరైనదేనా? నిజానికి నినాదం అనే పదాన్ని తక్కువ చేసి చూడటం తగునా?

అనంతు: కవిత్వం అనే ఉద్వేగ సృజన ప్రక్రియ లేకుండా ఎలాంటి ఉద్యమాలు నడవడం అయినా పెద్ద వెలితే. ప్రపంచ వ్యాప్తంగా నడిచిన ఉద్యమాలకు కవిత్వం చాలా సార్లు కొత్త ఊపిరిలూదింది. చాలా చోట్ల ఉద్యమాలను కొత్త దారులు పట్టించి ఉర్రూతలూగించింది. ఉత్తేజాన్ని రగిలించింది. మన దగ్గర వచ్చిన పలు ఉద్యమ కవిత్వం స్వభావంలో స్థూలంగా ఆయా ఉద్యమ భావాల ప్రచార, ప్రసార పాత్రనే పోషించిందనే చెప్పకతప్పదు. Broadly it is propagandistic in nature.  నిజానికి ఉద్యమంలో కవిత్వం పాత్ర అది కూడా కానీ, అంతే మాత్రం అయితే కానేకాదు. So called విప్లవోద్యమ కవిత్వంలో ప్రధానంగా కనిపించే దూకుడు లక్షణం కవిత్వాన్ని బ్యాక్ బెంచ్ వేయించింది. Metaphorical గా మాట్లాడితే విప్లవాన్ని కాంక్షించే మన కవిత్వంలో భుజాన గన్ను వుండటం మాత్రమే డామినేట్ చేసింది. కానీ ఒక చేతిలో రొట్టె ముక్కా రెండో చేతిలో రోజా మొగ్గా మిస్ అయ్యింది. అందుకే ఇక్కడి విప్లవ కవిత్వంలో నా మల్లియ రాలెనునీ మొగలి కూడ రాలెనునా మల్లియనీ మొగలీ ఆకాశం చెరెను’( మావో కవితకు శివసాగర్ అనువాదం) లాంటి aesthetics, sensibilities, subtleties వున్న orgoanic metaphors తో కవిత్వం చాలా చాలా అరుదుగా వచ్చింది.

నినాద ప్రాయంగా మారిపోయింది విప్లవ కవిత్వం అన్న మాట ఇది వరకే చాలా మంది అనేసి నిర్ధారించేసారు. కానీ అది వాచ్యంగా, డొల్లగా, రొడ్డ కొట్టుడుగా, tautological గా, redundant గా మారిందనే అర్థంలోనే అనుకుంటా. విప్లవ కవిత్వం నిజంగానే నినాదప్రాయంగా మారి వుంటే అంతకన్నా ఏం కావాలి? నినాద ప్రాయం అన్న పదప్రయోగం నిందార్థంలో ఇక్కడ వాడుతున్నారు. లయాత్మక నినాదంలా వుండే ఉర్దూ గజల్ అయినా, పోర్చుగీసు ఫాదూ (Fado)అయినా, సౌందర్యాత్మక తత్వ ధారలను నినాదాల మల్లే పరిమళించే జపనీయ హైకూ అయినా కవిత్వంలో నేటికీ అద్భుతమే కదా? అందుకే కవిత్వం నినాదంగా మారడం ఒక మంచి కవిత్వ లక్షణమే అని నా అబిప్రాయం. అయితే ఆస్థాయిలో తెలుగులో కవిత్వం కైగట్టింది ఒకరో ఇద్దరో.

ఇక అస్తిత్వ ఉద్యమాల కవిత్వంలోని ascertaining tone మితి మీరి, ధ్వనించి కవిత్వాన్ని మింగేసిన సందర్భాలే ఎక్కువ. Statusquoని negate చేయడం, negationతో తమ identity ని establish చేయడం, ఆధిపత్యాన్ని dismantle చేయడం మేరకు అస్తిత్వ ఉద్యమ కవిత్వం ఒక అదివరకు లేని పరిభాషని, అభివ్యక్తిని తెలుగు కవిత్వానికి జోడించింది. ఇది చాలా మెరుగైన జోడింపే. కానీ అక్కడే ఆగి తనని తాను విపరీతంగా రిపీట్ చేసుకుంటోంది అస్తిత్వ ఉద్యమ అభివ్యక్తి. కవిత్వంలో polimical discourse ఎంత భిన్నంగా, అందంగా, అర్థవంతంగా చేయవచ్చో చెప్పేందుకు ఉద్యమ కవిత్వం నుంచి ఉదాహరణలు ఇచ్చేందుకు చేతి వేళ్ళే మిగిలిపోతున్నాయి. వాదమే, వాదనే దానంతకదే కవిత్వం కానే కాదు అనేందుకు మాత్రం అందులోంచి కోకొల్లల ఉదాహరణలు చూపించవచ్చు. కవిత్వం సాధన చేయవలసిన సృజక ప్రక్రియ. కవిత్వం అన్ని తక్కిన కళల్లాగే తర్ఫీదు అవసరం వున్న కళ. అయితే మనకు కొత్త కొత్త inspirations పొందేందుకు చొరవ, చదువు వుండాలి. కదలికా(mobility) కావాలి. మనకు కొత్త కొత్త influences ఎప్పటికప్పుడు ఏర్పడేదందుకు మన తలుపులూ, తలపులూ ఎల్ల వేళలా బార్లా తెరిచే వుండాలి. కేవలం కవిత్వానికే కాదు ఇంకే సృజన కయినా సరే.

 

అఫ్సర్: నీ కవిత్వంలో మంత్ర వాస్తవికత వినిపిస్తోంది. నిజమేనా?

అనంతు: నిజం కాదు. మంత్రవాస్తవికత అంటే magic(al) realism అయితే అది నా కవిత్వంలో లేదనే చెప్తాను. magic(al) realism ని డీల్ చేయగలిగేంత కవిత్వ రచనా పరిపక్వత నాకింకా  రాలేదనుకుంటా. మన రచనల్లో మంత్రవాస్తవికత అనేది మనకు తెలియకుండా చోటుచేసుకునే యాధృచ్ఛిక అంశ కాదు. అది స్పృహతో కూడిన అభివ్యక్తి. పరిణత రచయిత పట్టు అది. Lautréamont రాసిన మలదరోర్ శ్లోకాల నుంచి, మార్క్వెజ్ కాల్పనిక రచనలు, ఎమ్మా అందెజెవస్కా కవిత్వం వరకు magic(al) realism పలురచనల్లో పలురకాలుగా వ్యక్తమయ్యింది. మంత్రవాస్తవికత అని సగర్వంగా అనదగ్గ తెలుగు రచన పతంజలి ఒక దెయ్యం ఆత్మకథ.  అయితే పతంజలి తన కథ చూపున్న పాటని మార్క్వెజ్ కి అంకితమిచ్చాడు. కానీ అందులో మంత్రవాస్తవికత నాకయితే కనిపించలేదు. వున్నదల్లా మాంతాజ్. గోపిని కరుణాకర్ రాసిన కానుగపూల వాన కూడా మంత్రవాస్తవికత పాళ్ళున్న రచన తెలుగులో.

కవిత్వంలో మంత్రవాస్తవికత సాధ్యం కావాలంటే చాలా సాధనతో పాటు, ఆ రచనకి బలమైన తాత్విక పునాది వుండటం ప్రధానం. అది అంత సులభం కాదు; కనీసం కవిత్వంలో. మంత్రవాస్తవికతని ఎస్టాబ్లిష్ చేసేందుకే కొంచెం పెద్ద కాన్వాస్ అవసరం. అందుకే మంత్రవాస్తవికతకి కవిత చాలా ఇరుకైన చోటే.

నా కవితల్లో నేను వాస్తవ, వాస్తవేతర అంశాల, ఉద్వేగాల, భావనల మధ్య కొల్లాజ్ చేయడానికి అక్కడక్కడా చిన్న ప్రయత్నం చేసానేమో మహా అయితే.

anant1

అఫ్సర్: బైరాగి, వజీర్ రెహ్మాన్ లు నీలో ఎంతెంత వున్నారు?

అనంతు: అస్సలు లేరు. ఆలూరి బైరాగివి నేను ఒక ఏడాది క్రితం వరకూ ఒక్క రచనా చదవలేదు. ఆ పేరు సురేంద్ర రాజు నోట 20 ఏళ్ళ క్రితం విన్న గుర్తు. అంత versatile thinker writer అయిన బైరాగి సారస్వతం అందుబాటులో లేకపోవడం తెలుగు సాహిత్య దుర్మార్గాలలో టాప్ టెన్ లో ఒకటి.

బైరాగి కవిత్వంలో వుండే stoicism ఏమైనా నా కవిత్వంలో కనిపిస్తే (ఇదీ నా పరిశీలనే) అది కేవల యాధృచ్ఛికమే. అంతకన్నా ఒక్క వంతు బైరాగి ప్రభావమూ నా మీద వుండేందుకు భౌతిక ఆస్కారమే లేదు.

నా కవిత్వంపైన ఇద్దరి ప్రభావం వుండేది. అది ఎప్పటికప్పుడు కనిపించకుండా, లేకుండా చేసుకోవడమే నేను సచేతనంగా చేసే ఏకైక ప్రత్నం. ఆ ఇద్దరూ నామాడి శ్రీధర్, ఎం ఎస్ నాయుడు.

వజీర్ రెహ్మాన్ నాకిష్టం. అంతే. ఆ ఇష్టం వల్ల నా కవితల్లో వజీర్ ఛాయలున్నాయంటే మరీ ఇష్టం. ప్రభావితమయ్యానా? ప్రశ్నార్థకమే.

 

ఎం ఎస్ నాయుడు: కవితలు రాయడం ఎలా అలవడింది? కొనసాగించడానికి ఏంటి motivation?

అనంతు: కవిత్వం నాకు ఇష్టంగా మారింది నేను హైదరాబాద్ వచ్చిన తర్వాతే(1993).

త్రిపురనేని శ్రీనివాస్, నామాడి శ్రీధర్, ఒమ్మి రమేశ్ బాబు, శశి, సత్య శ్రీనివాస్, సిద్దార్థ, ఎం ఎస్ నాయుడు, ఇంద్ర (ఇది అంబటి సురేంద్ర రాజు కవితా కలం పేరు), అఫ్సర్, యువక(కలేకూరి ప్రసాద్), జ్వాలాసాగర్ (ఇది వెల్చేటి రాజీవ్ కలం పేరు), అలిశెట్టి ప్రభాకర్, సీతారాం, దెంచనాల శ్రీనివాస్, మహెజబీన్, గోరటి వెంకన్న…. వీళ్ళ కవిత్వం నాకు అటీవలి inspiration.

నేను రాసినవి చూసిందీ, చదివింది, నవ్వుకున్నదీ, గేలిచేసిందీ, మెచ్చకున్నదీ, దిద్దిందీ వీళ్ళే. కవిత్వం అంటే నాకు అది వరకు వున్న చిన్న చూపు పోగొట్టిందీ వీళ్ళే.

శివసాగర్ తో వ్యక్తిగత పరిచయం ఏర్పడ్డాక, గంటలకొద్దీ, రోజులకొద్దీ గడిపాకా అతని కవిత్వం పట్ల విపరీతమైన మోహం కలిగింది. నిజ అర్థంలో మన దేశంలో విప్లవకవి దళితుడయిన కామ్రేడ్ శివసాగరే సగర్వంగా.

ఎం ఎస్ నాయుడు: అసలు కవిత్వాన్ని నువ్వు ఎలా చూస్తావు?

అనంతు: మోహంగా. ఇష్టంగా గాలించి చదువుతాను మంచి కవిత్వాన్ని. అంతే మోతాదులో ఇతరులు నా కవిత్వాన్ని ఎలా చూస్తున్నారన్న ఉత్సుకత అందరిలాగే నాకూ వుంది. కొందరు నాది భావ కవిత్వం, దుఃఖ గీతిక, ప్రణయ కవిత్వం, అంతఃపుర దుఃఖం…. అనేసారు. నిజంగా 20 ఏళ్ళ క్రితం ఈ మాటలు నా కవిత్వం గురించి  అని వుంటే (నేనప్పుడు రాసి వుండివుంటే)కుమిలి కుమిలి ఏడ్చేవాడినేమో. కానీ ఇప్పుడు అవి నాకు compliments. భుజమే తట్టే తోడు మిగలని జీవన అవశేషానంతర ప్రయాణంలో శిశిరం మాత్రమే మిగిలితే అదే నా మకుటం. ఏటా వచ్చే శిశిరాన్ని రద్దు చేసే ఆత్మ వంచన కాదు నాది. వసంతాన్ని మాత్రమే project చేయడం మోసం. రుతుమయం కదా కవనం, జీవనం.

ఎం ఎస్ నాయుడు: కథలు ఎందుకు రాయలేదు? కథా విమర్శ జోలికి వెళ్ళినట్టుగా కవితా విమర్శకి ఎప్పటికి వస్తావు?

అనంతు: నా అలజడి జీవితంలో దొరికిన తీరికలో కవిత్వం మాత్రమే అమరింది. అంతే.

కథ రాసేందుకు చాలా నిర్మల జీవనం, తీరిక దైనందినం వుండాలి.  లేదా controlled schizophrenia వుండాలి.

ఎందుకంటే “Art is collective obsession and controlled schizophrenia’’ అని Leibniz అన్న మాట వందొంతులా నిజం. అది వీలు లేని కేవల agitated souls కాల్పనిక సాహిత్యం అంత సులభంగా సృష్టించ లేరు. కథ రాయాలని నా ఆశ. అది ఇంకా మిగిలిన కోరికే. కానీ అంత తీరిక లేకే. కానీ నా మది గది నిండా ఎన్నో కథలు సీమ కొడవళ్ళలా వేలాడుతూనే వున్నాయి. వెక్కిరిస్తున్నాయి. ఆ వెక్కిరింతల నుంచి తప్పించుకునేందుకు నేను అప్పుడప్పుడూ కథల అనువాదాలకు పాల్పడి నా low spirits ని boost చేసుకుంటుంటాను. అప్పటికీ నాకు తనివి తీరకపోతే సమకాలీన కథలను “నేను ఫలానా కథ(ల)ని ఎలా అర్థం చేసుకున్నానంటే…‘’ అనే సాకుతో అడపాదడపా కథలపైన నా విశ్లేషణ రాస్తుంటాను. అయితే అదంతా కథా విమర్శ అనేసుకునే భ్రమ లేదు నాకు.

కథా విమర్శ బాధ్యతాయుతమైన సృజన ప్రక్రియ. నాకు కథా విమర్శన కానీ, కవిత్వ విమర్శన కానీ serious గా pursue చేసే జీవని, నిజాయితీ, తీవ్ర ఇష్టం, academic interest లేకుండా పోయాయి.

కానీ అలాంటి విమర్శకుల అవసరం తక్షణం మాత్రం మన సాహిత్యానికి చాలా వుంది. అందుకే నేను మరీ చెప్తున్నాను; సృజన కాదు ఖాళీలను పూరించేది; చదువరుల విమర్శ మాత్రమే.

 పెద్ది రామారావు: నాటకం ఎంత  గొప్ప ప్రక్రియో రుచి చూసిన వాడివి. మళ్ళీ ఈ (బోడి) కవిత్వం ఏంటిరా?

అనంతు: నాటకం నిజంగానే కవిత్వం కన్నా అనంత ఇంతలు గొప్ప శక్తి కలది. కానీ కవిత్వాంశ లేని నాటకం మృతప్రాయం. కవిత్వం అంశ అన్ని కళల్లోనూ ఆకుపచ్చగా వుండితీరాలి.

నా కన్నా ముందే, నా కళ్ళ ముందే కవిత్వం వెలిగించినవాడివి నువ్వు. నువ్వే కవిత్వం బోడి అన్నావంటే, అది నాటకం వత్తాసుతో నీ లోని నాటక పక్షపాతి పలికిన మాటే. ఆ పక్షపాతితో నాకు అనియమ ఏకీభావం వుంది. నిజమే మనం అనుకున్న నాటకం చేయలేకపోయాం. మనం కలగన్న నాటకం అమలుకు అట్లాంటి బృందం తయారు కాకపోవటం, దాన్ని మనమే తయారు చేయలేకపోవడం మన బలహీనతే.

నాటకం (collective performing art form) సజీవంగా లేని జాతి, భాష more and more individualistic mode లోకి పోతోందని అర్థం. జాతి సాంస్కృతిక ముందడుగు మెరుగయిన నాటకంతోనూ వేయాల్సివుంటుది. సజీవ సంభాషణ అయిన ప్రదర్శనా రూపం లేని జాతి statusquoist అయిపోతుంది అలవోకగా.

నేను నాటకంలో అయిన నా తర్ఫీదును కొనసాగించలేకపోయిన మాట నిజమే కానీ, నాటకాలతో సంబంధం ఈ నాటికీ వుంది. గరికపాటి ఉదయభాను సారథ్యంలో నడుస్తున్న భూమిక అనే సంస్థ వేసే నాటకాలలో మూడింటికి సంగీతం నిర్వహించి పాటలూ రాసాను. పరిషత్తు నాటకాలంటే చిన్న చూపు లేదు నాకు. అందుకే కవలసోదరులు Peter Shaffer and Anthony Shaffer రాసిన నాటకం ప్రేరణగా అనుసృజించి ప్రియాప్రియా చంపొద్దే అనే పేరుతో పరిషత్తు కోసం నాటకం రాసాను. దానికి ఎన్ని అవార్డులొచ్చాయో లెక్కేలేదు.

కానీ నామటుకు నాకు లౌకిక విజయం కన్నా ఆత్మిక తృప్తి పరమం.

HCU అధ్యాపకులు భిక్షు అభ్యర్థన మేరకు నేను అనువదించిన గ్రీకు రచయిత సోఫోక్లీజ్ రచన ఆంటిగొనీ చాలా సార్లు పలు దర్శకుల బిడ్డగా ప్రదర్శనకు నోచుకుంది. వాటన్నింటిలో రాజీవ్ వెల్చేటి చేసిన ప్రదర్శన, interpretation నాకు చాలా ఇష్టం. ఇది పుస్తకంగా రావడానికి పురిటిపొప్పులు పడుతూనే వుందని నీకూ తెలుసు చాలా ఏళ్లుగా.

నేను కథ రాయాలా? నాటకం రాయాలా? అన్న మీమాంసకు గురయితే నా ఓటు ముమ్మాటికీ నాటకానికే ఈ నాటికీ. నేను నాటకం రాయకపోతే, సినిమా తీయకపోతే పోయేదేమీ లేదు… కానీ పోయే లోపు నాటకం మాత్రం రాస్తాను; నా తరహా సినిమా కూడా రాస్తాను; తీస్తాను. ఇది నా నిశ్చయం.

*

 

 

మన కవిత్వం ఇంకా సుఖ జీవన సౌ౦దర్యమేనా ?

 

-కొండేపూడి నిర్మల

~

 

నిర్మల

ఇటీవల ఉత్తర తెలుగు అమెరికా  అసోసియేషన్  తెలుగు కవిత నూతన దృక్కోణం అనే విషయం మీద సెమినార్ నిర్వహించింది. భిన్న అస్తిత్వాలు వస్తు రూపాలు అనే విషయం మీద నేను ప్రసంగించాల్సి వుంది. అఫ్సర్, నారాయణ స్వామి, విన్నకోట రవిశంకర్ , పాలపర్తి ఇంద్రాణి మిగిలిన వక్తలు. మొదటి ప్రసంగం చేసిన ఇంద్రాణి  “కవిత్వానికి ప్రేరణ” గురించి మాట్లాడింది. పనిలో పనిగా  అస్తిత్వవాదులకు కొన్ని చురకలు వెయ్యడానికి నిర్ణయించుకుంది. మెత్తని మృదువైన కవిత్వం రాస్తూ, అనుభూతి, ఆహ్లాదము  కవితా లక్ష్యం గా వున్న ఈ కవయిత్రి  శబ్దానుకరణ విద్యలో అల్లసాని పెద్దన వంటిదని ఆమె పుస్తకానికి ముందు మాటలో మరొక కవి కితాబు ఇచ్చారు.

అల్లసాని పెద్దన అనగానే మనకు గుర్తొచ్చే పద్యం “తూగుటుయాల, రమణి ప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కప్పురపు విడేము, ఉహ తెలియంగల లేఖక పాటకోత్తములు -కవితా రచనకు కనీస అవసరాలు అని కదా. అంత కాకపోయినా ఈ ఆధునిక కవయిత్రికి కూడా  ప్రేరకాలుగా కొన్ని సదుపాయాలు౦డాలట,

“మ౦చి కవి మిత్రులు, సరళమైన జీవన విధానం, ప్రకృతితో మమేకం, ఈ అన్నిటితో కూడిన ఏకాంతం” ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ మాటకొస్తే కవిత్వం రాయడానికే కాదు బిడ్డకు పాలిచ్చే కూలి తల్లికి , మగ్గంమీద బట్ట నేస్తున్న ముసలి తాతకి కూడా ఏకాంతం అవసరమే..

అది కాక కవిత్వాన్ని ఆటంకపరుస్తూ, చికాకు పెట్టే విషయాల చిట్టా కూడా మన ముందు వుంచింది. అదేమిటంటే,

“కవి నిరంతర అధ్యయనపరుడు కావాలి కాని సదరు  పుస్తకాలు  ప్రసంగాలో, సిద్ధాంతాల పట్ల ఆకర్షణ పెంచేవో కాకూడదు. నేను ఫలానా బాధిత వర్గానికి చెందిన స్త్రీని , ఫలానా మతానికి, కులానికి ప్రతినిధిని అని కూడా భావించరాదు. అప్పుడు అది మీ పరిమితిని సూచిస్తుంది.. మార్పులు, వయసు  పెరగడం , అనుభవాలను సృష్టించుకోవడం (?) కూడా కాని పనులే, ఉద్యమకారులు ఉద్యమాలు చేసుకోవాలి కాని కవులవడానికి వీల్లేదు.”

ఇవి   కేవలం వ్యక్తిగత అభిప్రాయాల్లాగా చెబితే ఈ చర్చ  అవసరం లేదు, కాని ఆర్కిమెడిస్ సిద్దాంతంలాగా ఖచ్చితమైన స్వరంతో చెప్పింది. కాబట్టి ఇటువంటి ప్రకటనల పట్లా, వాటి వెనక వున్న  భావజాలం పట్లా నాకున్న స౦దేహల్ని మీతో పంచుకొవాలను కుంటున్నాను.

ఇవికాక ప్రసంగం లో, తన వస్తు ప్రాధాన్యత  గురించి చెబుతూ,  గుడి దగ్గర పూలు అమ్ముకునే అమ్మాయి జ్వరంగా వుంటే తను జ్వరం గురించే రాస్తానని చెప్పింది, జ్వరం పక్కన పెట్టి పూలపుప్పొడి గురించి కూడా రాయచ్చు.

వస్తువు ఎంపికలో వ్యక్తీకరణలో కవికి స్వేచ్చవుంది. ఆ స్వేచ్చను ప్రశ్ని౦చే హక్కు ఎవరికి లేదు.

పూల మీద రాస్తావా? పూలపిల్ల జ్వరం మీదరాస్తావా ? జ్వరంలో వున్నా సరే  పూలు అమ్మక తప్పని గతి మిద రాస్తావా? పువ్వుల పంట చినుకు  లేక ఎండి పోవడాన్ని రాస్తావా? పంట భూములు పోగొట్టుకున్న నిర్వాసితులమీద రాస్తావా? దానికి కారణమవుతున్న సర్కారీ ధోరణి గురించి రాస్తావా? అది కవి తీసుకున్న కాన్వాసుని బట్టి వుంటుంది

ఏ వస్తువు ఎంతవరకు వ్యక్తి గత మవుతుంది, ఏ సరిహద్దు దగ్గర సామాజికమవుతుంది ? నిర్ణయించడం కష్టం.

వ్యక్తిగతమంతా రాజకీయమే అని రుజువైపోయిన చోట కవి కార్యకర్తగా ఎదగడం అనివార్యం కాదా. జీవితంలో అన్నివిధాలా స్థిరపడ్డ కవికి వున్న సుఖ జీవన సౌదర్యం కార్యకర్త కి వుండకపోవచ్చు.

కవులు సరస్వతీ పుత్రులు, సభలు  ఈశ్వర స్వరూపాలు అనుకున్నంత కాలమూ వారిని మోయడానికి నడుం కట్టిన బోయీలు కాని,  కట్టడాలకు రాళ్ళు మోసిన కూలీలు కాని  వస్తువులు కాలేవు.

ఒకవేళ పువ్వులు అమ్మే పిల్ల అక్షరాస్యురాలు అయితే ఆమె అనుభవమే ఒక రచన అవదా ?. అక్షరాస్యతతో సంబంధమే లేక౦డా  గుండె కరిగించే పాట అవదా ? దానికి కావ్య గౌరవం వుండదా?

రచనా ప్రేరకాలుగా ఆ పూలపిల్లకి “బయట వేడి గాలులు తరిమికొడుతూ వుంటే , ఇ౦ట్లో వేడి భోజనం “ అవసరం లేదు. ఆకలి చాలు, వేదన చాలు, వేదన ఒ౦టరిది కాదనే స్పృహ చాలు. అవే ఆమె వ్యక్తీకరణకు కారణాలు.

కవిత్వం బాధకు పర్యాయపదం అన్నాడు కదా శ్రీ శ్రీ .

శ్రీ శ్రీ కి ముందు వచ్చిన భావ కవిత్వాన్ని అంతకు ముందు వచ్చిన పద్య కవిత్వాన్ని కూడా హాయిగా చదువుకున్నాం.

“రాత్రి జిప్పును విప్పుతో కారు ప్రయాణం “అని రాసిన ఇస్మాయిల్ కవితలో సిమిలీలు  ఎవరం మర్చిపోలేం.

“పది రాత్రులు ప్రకృతితో గడిపినవాడేవ్వడు పరుల్ని ద్వేషించలేడు” చిన్నప్పుడెప్పుడో చదువుకున్న వాక్య౦ యిది.

కవి పేరు మర్చిపోవచ్చు కాని కవిత్వం మర్చిపోలేం. ఈ నేలమీద అన్ని ధోరణులు సమాంతరంగా ప్రవహిస్తూనే వుంటాయి. వాళ్ల మధ్య మీరు కుస్తీ పోటీలు కండక్ట్ చేయనక్కర్లేదు.

అస్తిత్వవాద కవులకి ఈస్తటిక్ సెన్స్ ఉండదనే ఒక తప్పుడు అభిప్రాయం ప్రచారంలో వుంది. ఏ కవి అయినా వాదాలకోసం పుట్టడు. వాద ప్రచారం కోసం రాయడు. జీవితాన్ని కవిత్వం చెయ్యడంలో విభిన్న వస్తువులు వచ్చి చేరాయి. అది చాలా అవసరం కూడా.

ఈ పుస్తకానికి రాసిన ముందు మాట చూడండి.

“స్త్రీలలో ఉద్వేగాలు జాస్తి. కవిత్వ మూలాలు అక్కడే వున్నా దానివల్ల కవితాభివ్యక్తికి కలిగే ప్రయోజనం నాస్తి, కారణం దానికి అవసరమయ్యేది రసదూరం పాటి౦చగల నిర్లిప్తదోరణి. స్త్రీలలో అది బహు సకృతు. కాబట్టే మాయో ఏ౦జిలో , ఎలిజిబెత్ బిషప్ లాంటి పేరొందిన కవయిత్రుల్లో కూడా శిల్ప దోషాలు కనిపిస్తాయి. ఇక తెలుగు లో రాస్తున్న కవయిత్రుల గురించి ఎంత తక్కువ  మాట్లాడుకుంటే అంత మ౦చిది. కవులు కూడా అదే బంతిలో కూచుని భోజనాలు కానిచ్చి చేతులు కడిగేసుకు౦టున్నవారే. నానా వాదాల చెత్తను మిగల్చకుండా ఊడ్చి, కొత్త కవిత్వానికి ఇంద్రాణి కనక నాంది పలికితే ఆంధ్ర సారస్వతానికి కావలాసి౦దేమీలేదు.” దీనిభావమేమి యదుకులేశా ?

ఉద్వేగాలు జాస్తి అనే మాట తప్ప ఇంకోటి అర్ధమయితే ఒట్టు. కవిత్వ మూలాలు అక్కడే వున్నా అంటే ఆమెలో, లేక ఆమె చుట్టూరా లేక ఆమెకు అoదే౦త దూరంలో అనేనా? మరి అంత సమీప వస్తువు గురించి ఆమె రాసినప్పుడు కవితాభివ్యక్తికి కలిగే ప్రయోజం నాస్తి ఎలా అవుతుంది? రసదూరం పాటించగల నిర్లిప్త ధోరణి ఆమెలో లేదా?

ఇది ఎవరికయినా అర్ధం అయితే నాకు చెప్పండి ప్లీజ్,

పదిమ౦దిని దూషిస్తే తప్ప పదకొండో వాడ్ని గౌరవించడం కష్టమనుకు౦టే అది వారి వ్యక్తిగత బాధ. సామాజికం కావాల్సిన కవిత్వాన్ని వ్యక్తిగతం అని నేర్పి, వ్యక్తిగత రాగద్వేషాలు సైద్ధాంతిక సత్యాల మాదిరి చెబుతుంటే అచ్చంగా చెవిలో పువ్వులు పెట్టినట్టే వుంది.

సహజ ప్రేరణకి అడ్డుపడుతూ, కవిత్వాన్ని కృత్తిమoగా మార్చడం ఎలా జరుగుతుందో  ఇ౦ద్రాణి చెప్పి౦ది. నేను తనతో  తప్పక ఏకీభవిస్తాను. అదేమిటంటే ,

“మొదట్లో మనకోసం రాసుకున్న కవిత్వాన్ని ఎవరికయినా చూపగానే , ముఖ్యంగా ఎప్పటి ను౦చొ రాస్తున్నకవులకి చూపగానే వాళ్ళు అనే మాటలు, అభిప్రాయాలు, గుర్తింపు, అహం , బ్రాండ్ ఇమేజ్ ని ఇస్తాయి.”

ఇప్పుడు ఒక మ౦చి కవి/కవయిత్రి అలాంటి ప్రమాదాన్ని౦చి బైటికి రావాల్సి వుంది.

 

నిషేధంతో వెలిగిన ‘మరీచిక’                 

                                                                                    

 

“ఈ పుస్తకం ఎవరూ చదవడానికి వీల్లేదు” అని ఒక పుస్తకాన్ని ప్రభుత్వం నిషేధించడం, చాలా అస్తవ్యస్తమైన సమాజంలో జరిగే పనిలా కనిపిస్తుందా లేదా? ఈ పుస్తకం చదవడానికి వీల్లేదు, నువ్విలా రాయడానికి వీల్లేదు, ఈ సినిమా నువ్వు చూడ్డానికి వీల్లేదు, ఈ సినిమా నలుగురిలోకీ రావడానికి వీల్లేదు___________ఈ ధోరణి నిరంకుశమే కాదు, ఇది పాఠకుల, ప్రేక్షకులను వ్యక్తిగతంగా వారి ఆలోచనా శక్తిని అవమానించే ధోరణి కూడా! ఏ సమాజంలో అయినా సరే –

మరీచిక నవలని అలాగే ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం ఆరునెల్ల పాటు నిషేధించింది. ఎప్పుడో మాల పల్లి నవల తర్వాత కొన్ని దశాబ్దాలకు ప్రభుత్వ ఆగ్రహానికి ఆ పైన నిషేధానికి గురైన తెలుగు నవల.

ఇది కాలేజీలో ఉండగా చదివినపుడు దీన్ని ఎందుకు నిషేధించారో బొత్తిగా అర్థం కాలేదు. ఇందులో అంతగా రక్తాన్ని మండించి నక్సలైట్లలోకో, లేక హిప్పీల్లోకో తోసి అటేపు పరిగెత్తించే అంశాలేవీ కనిపించలేదు, 90 లలోని పరిస్థితుల ప్రకారం !  కానీ నవలా కాలం 1978 కాబట్టి అప్పటి సాంఘిక  వాతావరణం ప్రకారం దీన్ని అర్థం చేసుకోవాలి

సాంఘిక సమస్యల గురించి రాసి, తద్వారా ఆ నవల నిషేధానికి గురవడం వల్ల వాసిరెడ్డి సీతాదేవి ఒక ప్రత్యేక గౌరవాన్ని పొందినట్టే! ఆ సమయంలో ఆమెకు పాఠకులు, ప్రజా సంఘాల మద్దతు పుష్కలంగా లభించింది. మహా కవి నుంచి మామూలు పాఠకుడి వరకూ అఖిల భారత స్థాయిలో సీతాదేవి కి తోడుగా నిలబడి గొంతెత్తారు.

అసలింతకీ మరీచిక ను ఎందుకు నిషేధించినట్టు? అందులో అంత నిషేధించాల్సిన అంశాలేమున్నాయి? ఎవరిని ఏ వైపుగా ప్రేరేపించగలిగి ఉండేదని ప్రభుత్వం భావించింది? సవాలు చేసిన సీతాదేవి కి కోర్టులో ఏం దొరికింది? నిషేధమేమైంది?

ఈ నవల ప్రారంభానికి ముందు సీతాదేవి ఇది ఇంత సంచలనం సృష్టిస్తుందని ఊహించి ఉండరు బహుశా! రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు అమ్మాయిల రెండు కథల కథ ఇది. బాగా డబ్బున్న కుటుంబం  నుంచి వచ్చిన శబరి, పట్టుమని పద్ధెనిమిదేళ్లు కూడా నిండని పసిది. డబ్బులో పుట్టి డబ్బులో  పెరగడం వల్ల సామాన్యమైన జీవితం ఎలా ఉంటుందో,ఆకలి ఎలా ఉంటుందో, కష్టం ఎలా ఉంటుందో,శ్రమ ఎలా ఉంటుందో  అనుభవం లోకి రాని  సుకుమారి . బాధ, కనీసం ఆకలి, అవసరం   ఎలా ఉంటాయో చవి చూడాలని, డబ్బు, నగలు, విలాసాలతో నిండి కుళ్ళి రొటీన్ కంపు కొడుతున్న జీవితం నుంచి బయట పడాలని అమాయకంగా ప్రయత్నించే అమ్మాయి. మరో వైపు ఆమె స్నేహితురాలు మిడిల్ క్లాస్ జ్యోతి,వ్యవస్థను నిశితంగా పరిశీలిస్తూ, ఆలోచనలన్నీ విప్లవోద్యమాల వైపు పయనిస్తుంటే, అటు వైపు మళ్ళే దారిలో ఉంటుంది.

లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని శబరి కి డబ్బు పిచ్చిలో పడి కొట్టుకునే తల్లిదండ్రులు! తెలిసిన వాళ్ళలో బాగా డబ్బున కుర్రాడిని చూసి వాడికి శబరిని ఇచ్చి పెళ్ళి చేసేయాలనే తొందరలో ఉంటారు తప్ప కూతురు కాలేజీలో ఏం చదువుతోందో కూడా పట్టించుకునే ఆసక్తి  ఉండదు వాళ్లకి . వాడంటే శబరికి ఏ ఇంటరెస్టూ ఉండదు. ఎప్పుడూ చెదరని బట్టల్లో, ఖరీదైన అలంకరణలో డబ్బుకు ప్రతీక గా కనపడే అతడంటే శబరికి చీదర.

ఆ పిల్ల సర్కిల్లో ఎటు చూసినా డబ్బు, దాని వల్ల వచ్చే విలాసాలు , డబ్బులో పొర్లే మనుషులూ! వీటన్నిటికీ దూరంగా వేరే జీవితం, మామూలుగా హాయిగా, హడావుడి లేని జీవితం కావాలి! ఉక్కిరికి బిక్కిరి చేసే ఈ డబ్బు లేకుండా హాయిగా ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కావాలి. అది ఎక్కడ దొరుకుతుందో తెలీదు. ఎవరి దగ్గరికి పోతే దొరుకుతుందో తెలీదు.

ఎటూ కాని వయసులో ఉన్న పిల్లలు ఎలాటి పరిస్థితుల్లో బురదలో అడుగేస్తారో సరిగ్గా, శబరి కోసం కూడా అలాటి అవకాశం ఒకటి వెదుక్కుంటూ వస్తుంది. కాలేజీ నుంచి కార్లో ఇంటికి వస్తూ, దార్లో మత్తులో పడి పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తున్న ఇద్దరు యువతీ యువకుల్ని చూస్తుంది. ఒంటి మీద బట్టలూ, సరైన స్పృహా రెండూ ఉండవు వాళ్ళిద్దరికీ!

తెలీని ఉత్సుకతతో వాళ్లతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే వాళ్ళు మత్తుతో ఏవేవో మాట్లాడ్డమే కాక కాక ఇంకో సారి రమ్మని, స్వర్గానికి తీసుకుపోతామని చెప్తారు. ఫలితంగా మరో సారి వాళ్ల దగ్గరికి వెళ్ళి మొదటి సారిగా LSD టాబ్లెట్ వేసుకుని మాదక ద్రవ్యం అనుభవాన్ని చవి చూస్తుంది. . శబరిని తమ హిప్పీ గ్రూప్ లోకి లాగాలనే వాళ్ల ప్రయత్నం సఫలమవుతుంది.  పెళ్ళి కొద్ది రోజుల్లో ఉందనగా, శబరి నగలు డబ్బు తీసుకుని జాన్ అనే హిప్పి తో పారి పోతుంది. పోయే ముందు “తాను ఆత్మ హత్య చేసుకుంటున్నాని”ఉత్తరం  రాసి పెట్టి,కట్టుకున్న చీర చెప్పులు కాలవొడ్డున విడిచి పోతుంది.

లోగో: భవాని ఫణి

లోగో: భవాని ఫణి

ఆ తర్వాత గుర్తు తెలీని శవమేదో కుళ్ళి పోయి దొరికితే అదే శబరి అనుకుని సంస్కారాలు చేస్తారు కుంగి పోయిన ఆ తల్లి దండ్రులు! (హిప్పీల వ్యవహారం కొంత తీవ్రంగానే ఉండుండాలి నవలా కాలం లో). బాంబే లో రోడ్ల వెంట పిచ్చి వాళ్లలా ఒంటి మీద స్పృహ లేకుండా తిరిగే హిప్పీలను,వాళ్లలో రకాలని చూసి తెల్సుకుని భయపడి పోతుంది. తప్పటడుగు వేశానని గ్రహిస్తుంది.  ఇంటికెళ్ళి పోతానని ఏడుస్తుంది. పోనివ్వరు వాళ్ళు . కానీ అలా ఏడ్చి గొడవ చేసినపుడల్లా ఒక మత్తు టాబ్లెట్టో పాకెట్టో ఇచ్చి ఆ పిల్లను మత్తులోకి తోసి అక్కడే ఉంచేస్తారు వాళ్ళు.

మరో పక్క జ్యోతి, సమాజంలో అసమానతలను  చూస్తూ భరించలేక వాటిని రూపు మాపడానికి ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. శబరి తో హిప్పీలను కలవడానికి వెళ్ళినపుడు , తన వాదనతో వాళ్లని మార్చి తన మార్గం వైపు తీసుకురావాలనుకుంటుంది. అది సాధ్యం కాక తిరిగి వచ్చ్చేస్తుంది. కొన్నాళ్ళకి , విప్లవోద్యమం వైపు వెళ్ళక తప్పదని నిశ్చయించుకుని, తను నక్సలైట్లలో చేరుతున్నానని తండ్రికి ఉత్తరం రాసి పెట్టి వెళ్లి పోయి ఉద్యమంలో చేరుతుంది.

నెమ్మదిగా అక్కడి కఠిన జీవితానికి అలవాటు పడుతుంది. ఎవడో ఒక భూకామందుని చంపే ఆపరేషన్ లో అవకాశం పొంది సత్యం అనే తన సహ నక్సలైట్ తో కల్సి వెళ్తుంది. కానీ ఆపరేషన్ ఫెయిలై పోలీసుల కాల్పుల్లో సత్యం గాయపడతాడు.అతడిని తీసుకుని కొండల్లో పడి పారి పోతుంది. అలా మైళ్ళ కొద్దీ నడిచాక, పోలీసులు దరి దాపుల్లోనే కనిపిస్తారు కొండ మలుపులో! ఇక తప్పించుకోవడం అసాధ్యమని గ్రహించి సత్యం , ఆమెను వెళ్ళిపొమ్మని తను పోలీసులు చేతిలో మరణిస్తాడు. జ్యోతి అడవి దాటి గ్రామంలో అడుగు పెట్టడం తో కథ సమాప్తం!

నవల నిషేధానికి గురి కాకపోయి ఉంటే, ప్రభుత్వం దృష్టితో చూసినా  పాఠకులకు ఇందులో నిషేధించాల్సిన తీవ్రమైన అంశాలున్నాయని తోచదు. అయితే 1978-82నాటి సాంఘిక వాతావరణాన్ని బట్టి ఈ నవలను దాని నిషేధాన్ని చూడాలి కాబట్టి, ఇప్పటి ధోరణుల్ని బట్టి అంచనా వేయడం కష్టమే! నవల విడుదల అయ్యాక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1982 ఫిబ్రవరిలో నిషేధం విధించగా, ఆర్నెల్ల తర్వాత 1982 ఆగస్ట్ 10 న హైకోర్టు ధర్మాసనం నవలపై నిషేధం చెల్లదని తీర్పు ఇచ్చింది. కట్లు తెంచుకుని మరీచిక మళ్ళీ స్వేచ్చగా  రెక్కలు విదుల్చుకుని  బయటికి వచ్చింది. ఈ ఆర్నెల్ల  కాలం లో  పౌర హక్కుల సంఘాలే కాక సామాన్య పాఠకులు, ప్రజాస్వామిక వాదులు, పాఠకులు ఎందరో మరీచిక ను విడుదల చేయాలని నిరసనలు చేశారు. అరసం, విరసం,విశ్వసాహితి, జనసాహితి,హిందీ లేఖక్ సంఘ్,వంటి సంస్థలన్నీ సీతాదేవికి సంఘీభావాన్ని ప్రకటించాయి. సహజంగానే నిషేధం ఎత్తి వేశాక పుస్తకం కోసం పాఠకులు ఎగబడ్డారు.అంతకు ముందు పెద్దగా పట్టించుకోని వారు సైతం కొని చదవడం తో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.

బోయి భీమన్న, శ్రీ శ్రీ, కె. రామ లక్ష్మి,కన్నాభిరన్ వంటి పలువురు ప్రముఖులు నిషేధం పై, పోలీసు వైఖరి పై తీవ్ర వ్యాఖ్యలతో నిరసన వ్యక్తం చేశారు

ఈ నవల్లో నక్సలిజం  పట్ల సీతాదేవి అటు సానుభూతి గానీ, ఇటు వ్యతిరేకత గానీ, ప్రకటించినట్లు స్పష్టంగా ఏమీ కనిపించదు. నవల చివర్లో జ్యోతిని గ్రామం వైపు వెళ్ళిపొమ్మని సత్యం బలై పోతాడు. జ్యోతి గ్రామం వైపు వెళ్ళింది అంటే జన జీవన స్రవంతి లో కలవడానికి వెళ్ళిందని అర్థం కాదు.పైగా నవల ముందు మాటలో సీతాదేవి “జ్యోతి ప్రజా జీవనాన్ని ఊపిరిగా పీలుస్తూ, రైతు కూలీల మధ్య ఉండే ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అంతే కాక జ్యోతి పాత్రతో మరో నవల రాస్తానని కూడా పాఠకులకు మాట ఇచ్చారు. నక్సలిజం వైపు మళ్ళేటపుడు, దుందుడుకు స్వభావంతో తాత్కాలికావేశంతో నిర్ణయాలు తీసుకోడం పనికి రాదనే సందేశం మాత్రం అందుతుంది.

వర్గ శత్రువులను హత్యలు చేయడం ద్వారా నవ సమాజం నిర్మాణం జరగదని, ఒకడు చస్తే వేల మంది పుట్టుకొస్తూనే ఉంటారని, క్షేత్ర స్థాయిలో ప్రక్షాళన జరగాలనీ జ్యోతికి వచ్చిన కల ద్వారా రచయిత్రి సూచిస్తారు. ఈ కలలో జ్యోతి తన గ్రూప్ తో కల్సి భూషయ్యను చంపడానికి వెళ్తుంది. స్వయంగా జ్యోతే వాడి తల  నరికి పారేస్తుంది. అయితే ఆ తెగి పడిన తల జ్యోతితో మాట్లాడుతుంది.”నన్ను చంపావు సరే, నా కొడుకున్నాడు గా. వాడు కూడా రేపు నాలాగే భూస్వామే అవుతాడు.నువ్విప్పుడు దోచుకెళ్ళే డబ్బుని వాడు ఏడాది తిరక్కుండానే మళ్ళీ సంపాదిస్తాడు” అని ఎద్దేవా చేస్తూ, వ్యవస్థ లో మార్పు రానంత వరకూ వ్యక్తిగత హత్యల వల్ల ప్రయోజనం లేదని కథానాయిక కు క్లాస్ తీసుకుంటుంది.

ఆరుద్ర ఈ నవల కు ముందుమాట గా రాసిన వ్యాసంలో “సీతాదేవి కి నక్సలిజం  పై ఎంత సానుభూతి ఉన్నా, ఆమె దానికి సంపూర్ణంగా వ్యతిరేకి” అని, “నక్సలిజం  వైఫల్యాన్ని ఆమె సంపూర్ణంగా నవల్లో చిత్రించారు” అనీ అంటారు.. ఒక ఆపరేషన్ విఫలమైతేనో, ఒక సత్యం మరణిస్తేనో నక్సలిజం  విఫలమైనట్టు కాదని, జ్యోతి తిరిగి గ్రామం వైపు నడవడం ద్వారా రచయిత్రి సూచిస్తారు.  కానీ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వాసి రెడ్డి సీతాదేవే నవల నక్సలిజం వైఫల్యాన్నే చర్చిస్తుందని అంగీకరించారు. నవల లోని నిషేధిత భాగాలు ఏ విధంగా యువతను నక్సలిజం వైపుగా ఏ విధంగా ప్రేరేపిస్తాయనే విషయాన్ని నిషేధించేటపుడు ప్రభుత్వం ప్రజలకు వివరించాలని ఆమె ఆభిప్రాయ పడ్డారు.

Vasireddy_sithadevi

ప్రభుత్వం నిషేధించిన పేజీల్లో మాత్రం కొంత చర్చ, సంభాషణల రూపం లో నడుస్తుంది.  ఆ పేజీల్లో అప్పుడు వార్తా పత్రికల్లో రోజూ నడుస్తున్న భూస్వాముల హత్యలూ, గిరిజనుల ఆక్రోశాలూ, వాటి మీద రఘురాం, మూర్తి, సతీష్ పాత్రల మధ్య సంభాషణలున్నాయి.యువతీయువకులు అటువైపు ఆకర్షితులు కావడానికి ఏ యే అంశాలు ఆలోచనలు రేకెత్తిస్తాయో, వారి రక్తాన్ని ఉరకలు పెట్టించే అంశాలేంటో సతీష్ చేత చెప్పిస్తారు రచయిత్రి. ప్రభుత్వాన్ని కలవర పెట్టిన అంశాలివే అప్పట్లో!  ఆ నాడు ఉనికిలో ఉన్న సాంఘిక పరిస్థితుల మూలాన ఆ సంభాషణ యువతను చెడు దారి పట్టించేలా ఉందని ప్రభుత్వం భావించిందన్నమాట.

ఆరుద్ర ఒక వాలిడ్ పాయింట్ లేవనెత్తారు. ఈ నవల్లో హిప్పీల జీవితాలు, వాళ్ళు వాడే మాదక ద్రవ్యాల వివరాలు, వాటి పేర్లు మొత్తం వివరిస్తారు రచయిత్రి. “ప్రభుత్వానికి హిప్పీ పిల్ల కథ గురించి ప్రభుత్వం వారికి ఏ విధమైన అభ్యంతరం లేదని వారు ఉటంకించిన పేజీల సంఖ్య చూస్తే తెలుస్తుంది. సాంఘిక దురన్యాయాలకు ఎదురొడ్డి పోరాడాల్సిన యువత హిప్పీలలో చేరి క్షీణించి పోతే పాలకవర్గీయులకు పబ్బమే! ఎటొచ్చీ విప్లవకారులైతేనే తంటా” అంటారు . ఈ నవల రాస్తున్నపుడు సీతాదేవి ఆంధ్ర ప్రదేశ్ యువజన సర్వీసుల విభాగంలో డైరెక్టర్ స్థాయిలో ఉన్నతోద్యోగిగా ఉన్నారు. డిపార్ట్మెంటల్ గొడవలకు ఆమె సాహిత్య శిశువును బలి చేయడం తగదని రాస్తూ ఆరుద్ర ఈ నవల నిషేధానికి ఇతరత్రా కారణాలున్నాయనే హింట్ కూడా ఇచ్చారు

ఈ నవల్లో మొత్తం అక్కడక్కడా 20 పేజీల్లో అభ్యంతర కర విషయాలున్నాయని పేర్కొంటూ ప్రభుత్వం దాన్ని నిషేధించింది. ఏ యే  పేజీలు అభ్యంతరకరమో గవర్నమెంట్ గెజిట్ ఆర్డర్ లో వివరంగా ఆ పేజీలు ప్రింట్ చేసి మరీ ఇచ్చారని విన్నాను. అంటే నవల నిషేధంలో ఉన్నా, ఆ నిషేధించిన పేజీల్లో ఏముందో ప్రభుత్వ గెజిట్ చూసి చదివి తెలుసుకోవచ్చన్నమాట! ప్రభుత్వ గెజిట్ అందరికీ అందుబాటులోనే ఉంటుంది :-) ! అలా ఉంటాయన్నమాట నిషేధాల ప్రహసనాలు !

ప్రశ్నించిన వాళ్ళని, గొంతెత్తిన వాళ్లని నిషేధించడం, నిర్మూలించడం చరిత్రలో ఎంత సహజమో నిషేధం పట్ల నిరసనా, తిరుగుబాటూ అంతే సహజమూ , ప్రజాస్వామ్య వ్యవస్థలో అది అనివార్యమూ కనుక ప్రజా సంఘాలు, సాహితీ సంఘాలు ,పాఠకులు కళాకారులు, రచయితలు పెద్ద ఎత్తున నిరసనలు చేసి కోర్టుకెళ్ళారు. న్యాయం కావాలని గొంతెత్తి వాసి రెడ్డి సీతాదేవి తరఫున నిలబడ్డారు. నిలబడి గెలిచారు.

పుస్తకాల నిషేధం గురించి రంగనాయకమ్మ విలువైన, ఆలోచించ దగ్గ అభిప్రాయాలను మరీచిక నిషేధానికి ముందే ఒక చోట వ్యక్తపరిచారు . యండమూరి తులసి దళం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా, ఆ నవలను నిషేధించాలనలేదు ఆమె !

‘ఆదివారం ’ అనే వారపత్రిక  13-9-1981 సంచికలో ఆమె పుస్తకాల నిషేధం గురించి  తన అభిప్రాయాలను ఇలా చెప్పారు-

‘‘ఒక రచనని నిషేధించడం అంటే , దాన్ని ప్రచురించకుండా ఆపుతారు. అప్పటికే ప్రచురణ అయిన పుస్తకాల్ని పోలీసులు పట్టుకుపోతారు. ఆ నిషేధ రచనల్ని చదివే పాఠకుల్ని అరెస్టులు చేసి, లాకప్పుల్లో పెట్టి వారి నించీ లంచాలు లాగుతారు. చివరికి వారి మీద కేసులుపెట్టి శిక్షలు వేస్తారు.  ఇది ఏ రకంగానూ ఆర్గ్యుమెంటకి నిలబడే విషయం కాదు.

ఎందుకంటే-

 పాఠకులు ఒక ‘రచన’ను చదవడానికి  సిద్ధంగా వున్నప్పుడు ఒక ‘చట్టం’ వచ్చి వారిని

దండించాలనడం  పరమ హాస్యాస్పదమైన, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన విషయం. మనుషుల్ని భయపెట్టి  ఒక పని నించీ ఆపగలమనుకోవడం మనుషుల శక్తీ, మనుషుల ప్రత్యేకతా తెలియని వాళ్ళు చేసే ఆలోచన.   ‘భయం’ అనేదానికి జంతువులు లొంగుతాయి గానీ మనుషులు లొంగరు. లొంగకూడదు.

…. ..

ఒక పుస్తకాన్ని నిషేధించడం అంటే కొందరు ‘మేధావులు’ మొదట దాన్ని చదివి- ‘ఇది చెడ్డ పుస్తకం,  మిగతా వాళ్ళంతా దీన్ని చదవకూడదు’ అని నిర్ణయించడమే. ఆ మేధావులు, ‘మేధావులు కాని’ వారితో  ఇలా అంటారు- ‘‘ఫలానా పుస్తకం మీరు చదవకండి, చెడిపోతారు. మేం మొదట చదివి చూశాం. మేం  మేధావులం కదా? అంచేత ఎంత చెడ్డ పుస్తకాలు చదివినా మేం చెడిపోం. మీరున్నారే, మీరు మాలాగా  మేధావులు కారు గదా, ఇలాంటి పుస్తకాలు చదివితే మీరు చాలా చెడిపోతారు. కాబట్టి ఏది మంచి పుస్తకమో,   ఏది చెడ్డ పుస్తకమో మేం చదివి మీకు చెపుతూ వుంటాం…

 

ఈ రకంగా ఏది మంచో ఏది చెడ్డో మేధావులే నిర్ణయిస్తూ వుంటారు.

కొందరు మేధావులు చేసే నిర్ణయాలకి కోట్ల కోట్ల మంది జనం కట్టుబడివుండాలనడం మేధావుల దురహంకారం తప్ప  ఇంకేమీ కాదు.

ఫలానా  పుస్తకాన్ని ప్రచురించకూడదనీ, చదవకూడదనీ చట్టం వచ్చినంతమాత్రాన దాన్ని ప్రచురించడమూ ఆగదు,  దాన్ని చదవడమూ ఆగదు. కాక పోతే రహస్యంగా…..బహిరంగ రహస్యంగా!

అందుచేత నిషేధాలకన్నా సరియైన, బలమైన, ఆయుధం ఏమిటంటే ఆవిషయంలో పాఠకులకు సరియైన   అభిప్రాయాలు కలిగిస్తూ ‘ఎడ్యుకేట్’ చెయ్యడం. పాఠకుల్ని హేతుబద్ధంగా ఆలో్చించేటట్టు చేసే మార్గం ఒక్కటే  ఈ విషయంలో    సరైన మార్గం.’’

నిషేధం సంగతి పక్కన ఉంచి,నవల కంటెంట్ విషయానికొస్తే నవల గబ గబా నడిచి పోయిన అనుభూతి కల్గుతుంది. రెండు సీరియస్ ఇష్యూలను తీసుకున్న రచయిత్రి వాటి మీద  సీరియస్ గా కాన్సంట్రేట్ చేయలేదనిపిస్తుంది కొన్ని చోట్ల.

శబరి జీవితం అలా ముగిసి పోవాల్సిందేనా? ఆ పిల్ల హిప్పీల్లో కల్సి పోయి ఉంటుందనే సందేహం డ్రైవర్ మాటల వల్ల తండ్రికి వచ్చి అది ధృడపడినా, ఆ వైపుగా ఆమె ఆ ఆచూకీ కనుక్కునేందుకు గట్టి ప్రయత్నాలేమీ సాగవు. అలాటి పిల్లను మళ్ళీ ఇంటికి తీసుకు రావడానికి భయపడ్డారా? ఒక్కగానొక్క కూతురు! నవల చివర్లో శబరి ఆచూకీ కనుక్కునేందుకు కొంత ఆసక్తి చూపిస్తాడు తప్ప, మరేదో పని వచ్చి దాన్ని పక్కకు పెడతాడు తండ్రి! అది చాలా అసహజంగా కనిపిస్తుంది. ఇహ ఆ తర్వాత అమాయకంగా వెళ్ళి ఇష్టం లేకుండా హిప్పీల్లో ఇరుక్కు పోయిన శబరి జీవితం, పద్ధెనిమిదంటే పద్ధెనిమిదేళ్ళ శబరి జీవితం అలా అంతమై పోవలసిందేనా?

ఇక జ్యోతికి విప్లవ భావాలు ఏర్పడడానికి, నక్సలిజం వైపు మళ్ళాలన్నంత తీవ్రంగా ఆ ఆలోచనలు  డెవలప్ కావడానికి గట్టి బేస్ దొరకదు నవల్లో! విప్లవోద్యమ నాయకుల్ని ప్రత్యక్షంగా కల్సుకున్నట్టు గానీ, విప్లవ సాహిత్యం విరివిగా చదివినట్టు గానీ ఉండదు. ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టు మాత్రం చూపించి వదిలేస్తారు రచయిత్రి. అన్నిటికంటే ఘోరంగా అనిపించే విషయం, మాట్లాడితే విప్లవ సూక్తులు వల్లించే జ్యోతి, శబరి పట్ల అసలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది నవల్లో! శబరి హిప్పీల వైపు మళ్ళుతోందని జ్యోతికి తెలుసు. హిప్పీల దగ్గరికి తను కూడా వెళ్ళి మాట్లాడుతుంది. వాళ్ళని తన వైపు తిప్పుకోవడం అసంభవం అని గ్రహించగానే విసుగు చెంది వాళ్లను వదిలేసి వస్తుంది తప్ప శబరిని అటు వైపు వెళ్లకుండా, ఆ ఉచ్చు లో పడకుండా ఆపాలని ఏ ప్రయత్నమూ గట్టిగా చెయ్యదు. తను చెయ్యడం అటుంచి “మీ అమ్మాయి యాక్టివిటీస్ ఇలా ఉన్నాయి” అని శబరి తల్లి దండ్రులకు కూడా సమాచారం ఇవ్వదు. విప్లవ నినాదాలు చేసుకుంటూ నక్సలైట్లలో కల్సి పోతుంది. తర్వాత శబరి కొంపదీసి హిప్పీల్లొ గానీ కల్సి పోయిందా అనే ఆలోచన అయినా రాదు .

సాటి స్నేహితురాలి జీవితం నాశనం కాబోతున్నదని తెలిసీ ఆ వైపుగా ఏ బాధ్యతా చూపించని జ్యోతి విప్లవోద్యమాల్లో ఏ మాత్రం బాధ్యత వహిస్తుందనే ప్రశ్న అప్పుడే తలెత్తుతుంది. దానికి తగ్గట్టే,చివర్లో ఆమె గాయపడిన సత్యాన్ని పోలీసులకు వదిలేసి (అదొక్కటే మిగిలిన చాయిస్ అనుకోండి)గ్రామం వైపు వెళ్ళి పోతుంది. ఆమె పలాయనం చిత్తగించిందా లేక గ్రామం లో పీడిత వర్గాలను ఉత్తేజితం చెయ్యడానికి వెళ్ళిందా అనే సందేహానికి జవాబు మన ఉహకు వదిలేస్తారు రచయిత్రి .

రచయిత్రి మాత్రం జ్యోతి రైతు కూలీల కోసమే పని చేస్తూ ఎక్కడో ఉండే ఉంటుందని నమ్ముతారు. తిరిగి ఆమె పాత్రను కొనసాగిస్తూ మరో నవల రాయాలని కూడా అనుకున్నారు

రెండు తీవ్ర సమస్యల్ని చర్చించి, వాటి వల్ల కంటే నిషేధం వల్ల జనాకర్షణ పొంది, సంచలనం సృష్టించిన మరీచీక నవల ఆన్ లైన్లో ఉచితంగానే దొరుకుతుంది. నవల పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తూ హై కోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఆన్ లైన్లో చదవొచ్చు

వెదికి చదవడమే తరువాయి

 

చిన్న సరదా కొసమెరుపు:

ఆంధ్ర జ్యోతి 1982 దీపావళి సంచిక  వాసిరెడ్డి సీతా దేవి కి ఒక సరదా బిరుదునిచ్చింది “నిషిద్ధ నవలా శోభిత” అని :-)

 

*

 

 

 

 

 

 

కుంచెకీ, రంగుకీ మధ్య సం‘చారి’   !

 

-శివాజీ 

~

       చాలా మంది ఆర్టిస్టు లకి మల్లె చారిలోనూ పాత ప్రశ్నే వచ్చి పడింది… జనం మెచ్చినది మనం చేయవలెనా?  మనం చేయునది జనం చూడవలేనా?  అనే.  కానీ  మధ్యస్తంగా వుంటే పోలా ?  అనే మరోప్రశ్న బిట్క్వశ్చన్లా వచ్చి పడిందతనికి.  ఫలితంగా ‘ చారి చిత్రకళ’ అనేది చారి ‘ఇలస్ట్రేషన్ ‘ పనితో మొదలయింది.

పూర్వంనుంచీ గల డ్రాయింగుల పిచ్చి పాకానపడింది, అది మోహన్ ఆశ్రమంలో మొగ్గలు వేసింది.  కొన్ని పత్రికలకు పని చేసి చూశాడు.  ఇతని పాదాలకు పేద్ద చక్రాలు కలవని, వున్నచోట ఉండడనీ చక్కని పేరు పొందాడు.  కథలకి, వ్యాసాలకి, అట్టమీది బొమ్మలకీ ఇతనినే వాడండి అనే పబ్లిసిటీ వచ్చేలోగానే చిత్రకళ అనే కేన్వాస్ పెయింటింగ్ లో శ్రద్ధ వహించాడు.   అడపాదడపా గేలరీ గ్రూప్ షోల్లో చిన్నపాటి తడాఖా ప్రదర్శించాడు.  నల్లటి రేఖలతో కళకళ లాడే రంగుల్లో బొమ్మల్ని వృద్ది  చేశాడు…

chari2

         ఇది ఇలా వుండగా చారి ఇంట్లో గల పొయ్యి లో పిల్లి  లేవకపోగా పిల్లల్ని పెట్టి పెద్ద చేస్తోంటే, మరోవంక చారి చార్కోల్, అక్రిలిక్స్ తో పెయింటింగుల సంఖ్య పెంచాడు.
ఆమధ్య కొన్ని పెయింటింగ్స్ చేసేకా అతనికి మరొక చిక్కని సందేహం వచ్చింది.   తను వేస్తున్నది రంగుల ఇలస్ట్రేషనా ?  రేఖలు గల పెయింటింగా ?  అని.  అలాగే మనం చూసేది, చదివే పదార్ధం వలె ఆధునికమైనది కాదా?  శైలి పెంచినపుడు వేసిన బొమ్మ వెలిగిపోతే అదే చాలదా? …  ఒకసందేహం మరో సందేహానికి దారి వేసింది.  అంతా ఒకటే అని, వేసింది ఏదయినా బాగా వేయాలి, పనితనం గొప్ప తెలియాలి, అప్పుడదే అద్భుతం కాదా అనే సమాధానమూ పుత్తుకొచ్చిన్దతనికి.  అసలు ఏ చింతా లేకుండా గోడలకు తగ్గ బొమ్మలు, రంగులకు  తగ్గ ఫ్రేములతో మార్కెట్ రంగంలో రాణించే చిత్రకళ కన్నా సొంత బుద్ధితో, నేర్చి శ్రమించి   మంచి  పెయింటింగ్ అని మనకి ముందుగా నచ్చేదే నయం  అని
చారీకి అనిపించింది.  అందుకే కేన్వాస్ లపై తన ముచ్చట తీర్చి దిద్దుకుంటున్నా…  ‘ నిన్నటికంటే ఇవ్వాళ, నేటికంటే రేపు  ఇంకా బాగా అనిపించేదాకా ఊరుకునే ప్రసక్తే లేదంటాడు.  ఇకనేం?!  ఉద్యోగం సద్యోగం లేకుండా పెయిన్టింగే  పనిగా  పెట్టుకుని బోలెడు పెయింటింగ్ లు చేసేడు.  “నడుస్తుందిలే ” అని సరిపెట్టుకునే ధోరణికి పొదల్చుకోలేదన్నాడు.
         ‘మార్కెట్ బూమ్’ వల్ల మాత్రమే స్థిరపడిన చిత్రకళాకారులు, పెద్దకళాకారులూ ఆశీర్వదిస్తేనే ముందుకు పోవాలన్న ముచ్చట కట్టిపెట్టి పెయింటింగ్ చేయడం  మీదనే మనసు పెట్టడం వలన కాబోలు కేన్వాసులు అతనిచేతిలో ధగ ధగలాడాయి. మన ఊరే, మన పాటే, మన మాటే కావచ్చుగాక, అది సుస్వరం, సు’వర్ణం’ (రంగులేనండీ బాబోయ్) స్వీయశైలీ కావడం అత్యవసరం అన్న చూపు కలిగిన పని మొదలయింది చారిలో –
chari3
మనుషులూ, వస్తువులూ, కదలికలు- దేనిమీద మనసుపడినా చారి వాటిని రంగుల్లోకి ‘దించే’ శ్రద్ధలో పడ్డాడు.  ఫలితమూ బాగుంది.  సిద్దిపేటలో పుట్టి ,  కార్తూనింగ్ తో కొంచెం పెరిగి  ఇంకా బాగా ఎదగటానికి 90 ల్లో హైదరాబాదుకు సరఫరా అయ్యాడు.  చిత్రకళాశాల సర్టిఫికేట్ పేచీలేదతనికి.  బ్రష్ లు, పెన్సిళ్ళు, చార్ కోల్ లు అరిగి, కరిగేలా బోలెడు కృషి చేశాడు.  ఇప్పుడు కొత్త బొమ్మల్లో కొత్తదనం కోసం, శైలి కోసం పడ్డ చారి తపన నెరవేరింది.  వీలయితే ఓసారి అతని బొమ్మల్ని నెట్లోనో, ఎగ్జిబిషన్ లోనో చూసి చారిని మనసారా అభినందించండి.
చారీ నువ్వింక ఎనక్కి తిరిగి చూడాల్సిన పని లేదన్నట్టు ….
                                                                                       *

కవిత్వంలో జేన్ దారి!

మమత కొడిదెల

~

జేన్ హర్ష్ ఫీల్డ్ 1973 లో తన ఇరవైవ ఏట మొదటి కవితను రాసింది. ప్రిన్సెటన్ యునివర్సిటీలో మొట్టమొదటిసారి మహిళలకు ప్రవేశం కలిగించిన బ్యాచిలో  ఉత్తీర్ణురాలయ్యింది.
జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కవిత్వం రాయకూడదని ఎనిమిదేళ్లు కవిత్వానికి విరామమిచ్చింది. ఆ సమయంలో సాన్ ఫ్రాన్సిస్కోలోని జెన్ సెంటర్లో చదువుకుంది. “కవిత్వానికి కేవలం కవిత్వమే ఆధారం కాదు. పరిపూర్ణంగా జీవించిన జీవితంలోంచే మంచి కవిత్వం వస్తుంది. అందుకనే ఎట్లాగైనా సరే కవిత్వం రాయాల్సిందేనని అనుకోలేదు. ముందు జీవితానికి అర్థం తెలుసుకోవాలనుకున్నాను” అని చెబుతుంది జేన్ . తనను ఎవరైన ‘జెన్ కవయిత్రి’ అంటే ఒప్పుకోదు. “జెన్ కవయిత్రిని కానే కాదు. నేను మానవీయ కవయిత్రిని” అని స్పస్టం చేస్తుంది.
“మరీ నిగూఢంగా లేకుండా అదే సమయంలో సంక్లిష్టతను మినహాయించకుండా సాగే ఆలోచనలు, సంభాషణల్లా, ప్రపంచాన్ని ఒకేసారి – హృదయం, బుద్ధి, కంఠధ్వని, దేహము- ఇలా ఎన్నోవిధాలుగా తెలుసుకునే కవిత్వంలా, సరళత లేకుండా స్పస్టతను సాధించే కవిత్వం నాకు ఆసక్తి కలిగిస్తుంది.” అని కవిత్వం పట్ల తనకున్న ఇష్టాన్ని వ్యక్తం చేస్తుంది జేన్.
ఆమె కవిత్వం సామాజిక న్యాయాన్యాయాలు, పర్యావరణం వంటి నేపధ్యాలను అన్వేషిస్తుంది. ముఖ్యంగా ప్రకృతి, మానవ ప్రపంచం మధ్య విడగొట్టలేని లంకె ఉందన్న నమ్మిక ఆమె కవిత్వంలోని ప్రధానాంశం. ఆమె కవితలు రాజకీయాంశాలను సూటిగా వ్యాఖ్యానించవు కానీ, తన చుట్టూ సమాజంలోని యదార్థాలను ఎత్తి చూపుతాయి.
నిర్మలంగా, పారదర్శకంగా ఉండే ఆమె భాష, విశేషమైన సవాళ్ళను విసురుతుంది. ఒకేసరి భావగర్భితమూ, సాధారణమూ అయిన భాషతో, ఒక్కొక్క వాక్యంతో, ఒక్కొక్క చిత్రంతో ధ్యానానికీ, మార్పుకు అవకాశాన్నిస్తాయి ఆమె కవితలు.

~

శరణాగత  తేనె

~

ఒక చెక్కడపు బొమ్మ: ఒక కొమ్మ మీద ఖాళీ తేనెతుట్టెతో  ప్రపంచ వృక్షం

 

ఒక అతి సుందర దృశ్యం మనస్సును తిరస్కరిస్తోంది

తెగ వాగే నోరే గాని వినే చెవుల్లేని మనిషి లాంటిదది.

 

బషో నెలల తరబడి సాగిన నడకను పూర్తి చేసినప్పుడు

అరిగిపోయిన చెప్పులు విప్పి

అలా పడేశాడు.

 

ఒకటి వాడిపోయిన చామంతి పరిమళమయ్యింది

ఇంకొకటి కథలోంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది

 

నొప్పిని గమనించిన తరువాతే అదెప్పుడూ వుండిందని నువ్వు తెలుసుకుంటావు

పక్క తెర నుంచి వేదిక మీద అడుగు పెట్టక ముందు కూడా నటుడు వుండినట్లు

 

మరో బషో హైకూ:

శిథిలమైన ఒక పుర్రె, దాని కళ్లలోంచి పెరుగుతుంది పొడుగ్గా గాలికి వూగే గడ్డి

 

వాళ్లిప్పుడు ఒక ఫోటోగ్రాఫులోకి చూస్తున్నారు,

ఫ్రాన్సులో ఒక చదును పొలం, సెప్టెంబరు 1916:

కొందరు మనుషులు వంగి, పొగ తాగుతూ, చిరిగిన సంచుల్లో వెతుకుతున్నారు

ఉత్తరాల కోసం

 

యుద్ధం, నడక, చామంతి, చెప్పులు, గోధుమ పొలం,

కెమరా లెన్సు మీద తేనెటీగ-పొగ, యుద్ధం

 

అవన్నీ గత కాలానికి చెందినవి, మనం ప్రయాణిస్తుంటాం వాటివైపు, వాటికి దూరంగా

మోసుకు తిరుగుతుంటాం మిగిలిపోయిన, మనం కాపాడగల్గిన

 

శరణాగత  తేనెను.

 

“ఇదీ ఓ కథే”

 

 

-భువనచంద్ర 

~

 

అదో పిచ్చిముండ. చెప్పినా విని చావదయ్యా.. ఏం చెయ్యనూ? “పటపటా తలబాదుకుంటూ అన్నది శేషారత్నం. శేషారత్నంది కృష్ణాజిల్లా. పుట్టింది పల్లెటూళ్ళో అయినా పెరిగింది మాత్రం విజయవాడలో. తల్లిదండ్రీ ఉన్నవాళ్లు గనక 10thవరకు చదివి, ఫస్టుక్లాసులో పాసై, డిగ్రీ 2nd  yearలో ప్రేమలో పడి, వాడికోసం నగానట్రాతో సహా మద్రాసు పారిపోయి వచ్చింది. తోడొచ్చినవాడు తెచ్చినవన్నీ ఊడ్చుకుపోతే, ఎలాగోలా మళ్లీ తల్లిదండ్రుల పంచన చేరి జీవితాన్ని మళ్ళీ సజావుగా మలుచుకునే  ప్రయత్నంలో సక్సెస్ అయింది.”అక్షమాల” శేషారత్నం కూతురు. మహా మొండి. అయితే ఆ పిల్ల అందం చెప్పనలవిగాదు.

ఆడపిల్ల అందగత్తె కావడం అదృష్టమే. కానీ, ఆడపిల్లకి తాను అందగత్తెనని తెలిస్తేనే తలనొప్పులు వచ్చేది. అక్షమాలకి నూటికి నూరుపాళ్ళు తాను అందగత్తెనని తెలుసు. అందుకే పట్టుపట్టింది. విషయం చాలా సింపుల్. హైద్రాబాదులో నూతన నటీనటులకోసం ‘సెలక్షన్’ నిర్వహిస్తున్నారు. అక్షమాల అందులో పాల్గొంటానంటుంది. శేషారత్నానికి ఏమాత్రం ఇష్టం లేదు.

“శేషమ్మా.. ఎట్లాగూ వినదని తెలుసుగదా.. పోనీ ఓసారి పంపిస్తే ఏంబోయిందీ? సెలక్టయితే వెరీగుడ్. కాలేదనుకో.. తిరిగొస్తుందీ! అంతేగా..!” నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు తిరగలినాయుడు. తిరగలినాయుడిది ఏలూరు. అసలు పేరు రాజశేఖరనాయుడు. అతనిది చిత్రమైన వ్యాపారం. రోళ్ళూ, రోకళ్ళూ, తిరగళ్ళూ ఉన్నాయి.. ఊరగాయలకి కావలసిన సమస్తం అంటే కారం, ఆవపిండి, మెంతిపిండీ, పసుపూ, అన్నీ మేన్యువల్‌గానే తయారుచేయిస్తాడు. పప్పునూనె, కొబ్బరినూనె, నువ్వుల నూనె, వేరుసెనగనూనె కూడా గానుగ ఆడే సిద్ధం చేస్తాడుగానీ,, మిల్లునూనెలతో వ్యాపారం చెయ్యడు. నిఖార్సయిన సరుకు సప్లై చెయ్యాలంటే నాయుడి తరవాతే ఎవరైనా. ఖరీదు కాస్త ఎక్కువయినా క్వాలిటీలో నంబర్ వన్ గనక వ్యాపారం మూడు పువ్వులూ ఆరు కాయల్లా వృద్ధి చెందుతోంది.

నాయుడికీ శేషారత్నానికి పరిచయమైంది మద్రాసులోనే. పారిపోయి వచ్చినప్పుడు టి.నగర్‌లో ఉన్నది శేషారత్నం(తోడు వచ్చినవాడితో).  ఆ పక్కనే మరో గదిలో అద్దెకుండేవాడు నాయుడు. తోడొచ్చినవాడు ఉడాయించినప్పుడు ఆదుకుని, ఆదరించి, మంచీ చెడూ వివరించి, దగ్గరుండి మరీ తల్లిదండ్రులకి అప్పగించిన నాయుడంటే శేషారత్నానికి దేవుడితో సమానం.

దేవతలూ దానవులూ కూడా ఉండేది మనుషుల్లోనే. నాయుడు నిజంగా గొప్పమనిషి. అంతేకాదు కాలంతోపాటు మార్పు సహజం అనుకునే మనస్తత్వం  వున్నవాడు. తప్పని పరిస్థితుల్లో ఏటికి ఎదురీదాలనీ అతనికి తెలుసు.

సినిమాల్లో ‘పాదరసం’లాంటివాళ్ళు చాలామందే వున్నారు. రాకేష్ అలాంటివాళ్లల్లో ఒకడు. పదిహేడో ఏట సినిమా మీది పిచ్చితో మద్రాసు వచ్చాడు. ‘రెండురోజులు మాత్రం వుంటానని రిక్వెస్టు చేసి, ఆ ఇంట్ళోనే నెలరోజులున్నాడు. ఆ నెల రోజుల్లోనే ‘వడపళని’లో ఓ తమిళియన్ ఇంట్లో రూం సంపాదించి, ఓనర్ మనవరాల్ని మెల్లగా ముగ్గులో దించాడు. ఇతనికి పదిహేడూ పద్ధెనిమిది మధ్య.  ఆ పిల్లది 28. పెళ్ళి కాలేదు. ఇతనేమో అందగాడే. ఆ పిల్ల అనాకారి కాదుగానీ అందగత్తె కూడా కాదు. ఇంటద్దె మొత్తం దొంగతనంగా ఆ అమ్మాయే రాకేష్ చేతికిచ్చి, ఆ డబ్బుని వాళ్ల తాతకి ఇప్పించేది. అంతే కాదు పాకెట్ మనీ కూడా ఇచ్చేది. ఆ పిల్లకి తల్లిదండ్రీ చిన్నప్పుడే పోయారు. తాత అమ్మమ్మలే పెంచారు. అమ్మమ్మ కూడా రెండేళ్ల క్రితం కాలం చేసింది. ఆ అమ్మాయి పేరు ‘అఖిల’.

ఇంటి ఓనర్ పేరు తోతాద్రి. వాళ్లు తమిళ బ్రాహ్మళ్లు. తోతాద్రి తహసీల్‌దార్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. బాగా సంపాయించాడు. టి.నగర్‌లో మూడు ఇళ్లున్నాయి. ఒక్కో ఇంట్లోనూ నాలుగు పోర్షన్లు. పెన్షన్ + ఇంటి అద్దెలు కలుపుకుంటే  బ్రహ్మాండమైన రాబడి. ఒక్కతే కూతురు. ఆ కూతురు, అల్లుడు చనిపోయారు. తోతాద్రికి మిగిలింది అఖిల ఒక్కతే.

“నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే నిన్నెవరు చూస్తారూ?”అంటూ ఇంతకాలం పెళ్ళి చేసుకోకుండా వున్న అఖిల అంటే ఆయనకు ప్రాణం.

రాకేష్ అఖిలని ముగ్గులోకి దించడం గమనించినా, గమనించనట్టు వూరుకున్నాడు తోతాద్రి.’చిన్నవాడో, పెద్దవాడో ఎవడైతేనేం. అఖిల ‘సెటిల్’ కావడం ముఖ్యం’ అనుకున్నాడు.

రాకేష్‌కి హాయిగా గడిచిపోతోంది. మొదట్లో ‘మెస్’కి వెళ్ళేవాడు. అదీ అఖిల ఇచ్చే డబ్బులతోనే. ఆ తరవాత అఖిలే ‘పేయింగ్ గెస్ట్’పేరిట అతనికి కూడా వండేది.

అఖిలకి ఆ ‘యావ’ ఎక్కువ. ప్రతి శుక్రవారం మొహం, కాళ్లూ, చేతులకి చక్కగా పసుపు రాసుకుని, తలంటి పోసుకుని  మహాలక్ష్మిలా కనిపించేది. అందగత్తె కాకపోయినా ఆమెకి వున్న తెలివితేటలు అమోఘం.

కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా వెంటబడుతున్న రాకేష్‌ని జాణతనంతో దూరంగా పెడుతూ, మళ్లీ తనే  దగ్గరగా వచ్చినట్టు వస్తూ ఓ బ్రహ్మాండమైన కైపులో ముంచింది.  ఒకసారి ఆ ‘రుచి’ మరిగినవాడెవడూ వదిలి పోలేడని అఖిలకి తెలుసు.

తోతాద్రికి జరుగుతున్నదంతా తెలుసని అఖిలకి తెలుసు. ‘రాకేష్’ మాత్రం ఫ్రీ బోర్డింగ్ , లాడ్జింగ్‌ని సంపాయించుకున్నందుకు మహదానందంగా వున్నాడు.

పొద్దున్నే దిట్టంగా టిఫిన్ పట్టించి పాండీబజారుకి పోవడం. అక్కడ చెట్లకింద వాలే సినీపక్షులతో పరిచయాలు పెంచుకోవడం చేశాడు. రాకేష్ ‘పాదరసం’లాంటివాడని ముందే అనుకున్నాం కదా.. ఆమాటే నిజం చేశాడు. కరెక్టుగా అఖిలతో ‘పరిచయం’ పెరిగిన నెలరోజులకల్లా సూపర్ డైరెక్టర్ మోహన్ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోయాడు. మోహన్  ప్రసాద్ పట్టిందంతా బంగారమే. ఆయన చేసిన సినిమాల్లో 90% నూర్రోజులకి పైగా ఆడినవే. మిగతావీ ఎబౌ ఏవరేజేగానీ, ఒక ఫ్లాప్ కూడా లేదు.

మోహన్ ప్రసాద్ కి ముగ్గురూ ఆడపిల్లలేగానీ మగపిల్లలు లేరు. రాకేష్‌ని చూడగానే ఆయనకి మనసులో మెదిలిన వ్యక్తి తన మూడో కూతురు. పెద్దపిల్లలిద్దరూ బుద్ధిమంతులు. చెప్పినట్టు వింటారు. మూడోపిల్ల మహా పెంకిది.తను పట్టుకున్న కుందేటికి రెండే కాళ్లు అనే రకం. అదీగాక కులం పెర్‌ఫెక్టుగా కలిసింది. మెల్లిగా కుర్రాడ్ని దారిలో పెడితే పైకి రావడమేగాక ‘ఇల్లరికం’ కూడా తెచ్చుకోవచ్చు.

వేలు చూపిస్తే చెయ్యి మింగేసే  రకం రాజేష్. డైరెక్టర్‌గారిదగ్గర సిన్సియర్‌గా పని నేర్చుకుంటూనే ఆయనకి చేతిలో పెన్నూ, తలలో నాలికలాగ మారాడు.

“పూర్ణానందంగారూ, యీ కుర్రోడు చాకూ, కత్తీ లాంటోడు గాదు, పుటుక్కున పొట్టలో దిగే కైజార్‌లాంటోడు. మోహన్‌గారు అమాయకంగా నమ్ముతున్నాడీయన్ని. ఏదో ఓ రోజు యీడు ఆయనకే వెన్నుపోటు పొడవకపోతే నన్ను చెప్పెట్టి కొట్టండి.” అన్నాడు కో డైరెక్టర్,   సీనియర్‌మోస్ట్ రైటర్ పూర్ణాంద్‌తో. చిన్నగా నవ్వాడు పూర్ణానంద్. ఆయన పక్కా మితభాషి మాత్రమే కాదు. ఎక్కడ, ఎవరితో, ఎంతసేపు మాట్లాడాలో ఖచ్చితంగా తెలిసిన మేధావి. “ఇదిగో సురేషూ, విత్తనం ఎక్కడిదీ, ఎవరిచ్చారూ అనేది ముఖ్యం కాదయ్యా. మొక్క ఎలా పెరుగుతోందనేది ముఖ్యం.

వీడు ఎవర్ని ముంచుతాడో, ఎవర్ని వెన్నుపోటు పొడుస్తాడో తరవాత సంగతి. ఒకటి మాత్రం నిజం. వీడు గనక వీడికున్న తెలివితేటల్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మరో దిగ్దర్శకుడవుతాడయ్యా…!” అన్నాడు పూర్ణానంద్ 555 సిగరెట్ పీలుస్తూ. ఏడాది గడిచింది.

కొందరి మాటలు ఫలిస్తాయి. కారణం చెప్పలేం. పూర్ణానంద్ మాట ఫలించింది. ఓ పేద్ద హీరో రాకేష్‌కి డైరెక్షన్ ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు, “నేనితని వయసు చూడలా. పరిణితిని మాత్రమే చూశా.!” అని ఓ గొప్ప స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఇక్కడి పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, నీ పక్కన వుంటూ,  నీ మీల్స్ టికెట్ మీద భోంచేస్తున్నవాడే, వాడికి లాభం వుందనుకుంటే నీ మీదే విషం చిమ్మగలడు.

తెలివైనవాడు సినిమా సినిమాకీ, పదింతలు ఇరవయ్యింతలు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతే, ‘లౌక్యం’ తెలీనివాడు ఎన్ని హిట్లిచ్చినా పేరు తప్ప ‘డబ్బు’ కూడబెట్టుకోలేడు. అందుకే రచయితలు చాలామంది బీదగా మిగిలేది. ఎందరో క్రియేటివ్ డైరెక్టర్స్ పరిస్థితీ అదే.

సినిమా స్క్రిప్ట్ తయారవుతోంది. కథ, మాటలూ పూర్ణానంద్‌గారివే. చిత్రంగా కోడైరెక్టర్ మళ్ళీ  సురేషే. ఈ పరిశ్రమలో ఇదో విచిత్రం. ఇక్కడ సీనియరా, జూనియరా అనేది ఎప్పుడూ నిజంగా కౌంట్ కాదు. సక్సెస్సా కాదా అనేదే ముఖ్యం. ఓ  పెద్ద హీరో కాల్‌షీట్ ఇచ్చాడంటే , పిక్చర్ సంగతెలా వున్నా నూటికి 50 శాతం సక్సెస్ సాధించినట్టే.

అన్నిటికంటే చిత్రం ఏమిటంటే, మూడో కూతురి కోసం రాకేష్‌ని ట్రెయిన్ చేసిన మోహన్‌ప్రసాద్‌గారే, రాకేష్‌కి ఆఫరొచ్చాక ఆశీర్వదించి పంపడమేకాక తన కోడైరెక్టర్‌ని కూడా రాకేష్ దగ్గర పెట్టాడు. రాకేష్‌కి 10% పని తెలిస్తే, సురేష్‌కి 95% తెలుసు. అలాంటివాడ్ని కోడైరెక్టరుగా పెట్టుకుంటే సినిమా తియ్యడం నల్లేరు మీది నడకే.

మనిషికి ఏది ముఖ్యం? నిజంగా మనుషులు దేన్ని కోరుకుంటారు? కొందరు ధనం అంటే, కొందరు ప్రేమ అంటారు. కొందరు పదవీ పేరూ అంటే, కొందరు మనశ్శాంతి అంటారు. అయితే ఇవన్నీ మామూలుగా చెప్పేవి. పనిలో పడితే తప్ప అసలు సిసలు వ్యవహారం తేలదు.

పని లేనంతకాలం ‘ప్రేమ’ అద్భుతం అనిపిస్తుంది. ఎంతగా మురిపిస్తుందంటే, చిన్న చిన్న అలకలూ, కోపాలూ, బుడిబుడి దీర్ఘాలు, ముక్కు చీదటాలూ కూడా అద్భుతంగా, అత్యంత సుందరంగా కనిపిస్తాయి. యుగమో క్షణంలా గడుస్తుంది.

సరేనయ్యా.. అదృష్టం తలుపుతట్టి బ్రహ్మాండమైన పని చేతిలో పడ్డాక? ??

అవకాశం కోసం ఎదురు చూస్తూ కాలం గడిపేవాడు మూర్ఖుడు. అవకాశాన్ని సృష్టించుకునేవాడు బుద్ధిమంతుడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగ పరుచుకునేవాడు మహాజ్ఞాని. ఎవరికీ  దొరకని అదృష్టం రాకేష్‌కి దొరికింది. “నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి గురూజీ. మీరు ఎంతో అనుభవం కలవారు. దయచేసి నన్ను ‘గైడ్’ చేయ్యండి. ఒకవేళ నేను తప్పు చేస్తున్నాననిపిస్తే వెంటనే హెచ్చరించండి. అస్సలు సందేహించకండి..” ఈ ఒక్క డైలాగ్‌తొ రాకేష్ సురేష్‌ని పూర్తిగా గెల్చుకున్నాడు. అదీ. పూర్ణానంద్ ముందర.

“ఏదో అనుకున్నాగానీ పూర్ణానందంగారూ,యీ కుర్రోడు పెద్దలతో ఎలా మెలగాలో తెలిసినవాడండీ!” ఉబ్బిపోయి మహాసంతోషంగా అన్నాడు సురేషు.

“అందుకే ఇన్నేళ్ళయినా నువ్వు కోడైరెక్టరుగా వున్నావు. ఉత్తి వెర్రిమాలోకానివి.” లోపల్లోపలే సురేష్ గురించి అనుకున్నాడు పూర్ణానంద్. ఒకటి మాత్రం నిజం. రాకేష్ పగలూ రాత్రీ స్క్రిప్టు మీదే కూర్చొంటున్నాడు. ఎవ్వరూ ‘పిండనంతగా’ పూర్ణానంద్‌ని బెటర్‌మెంట్ కోసం పిండేస్తున్నాడు. సిట్టింగ్స్ సవేరా హోటల్లో జరుగుతున్నాయి. అఖిలని కూడా పక్కకు నెట్టి ‘మేక్జిమం’ టైం అక్కడే గడుపుతున్నాడు రాకేష్.

అఖిల అంతా చూస్తూనే వుందిగానీ ఏ మాత్రం బయటపడలేదు. అల్లరి చేసి లాభం ఏమిటీ? అదీగాక పెళ్లి కూడా కాలేదాయె. అప్పటికే చుట్టుపక్కలవాళ్లు కొంచెం చెవులు కొరుక్కుంటున్నారని  అఖిలకి తెలుసు. కారణం వయసుల్లో వున్న తేడా.

తుఫాను గాలికి చెట్లు పడిపోయినా , గడ్డిపోచలు అలానే ఉంటాయి. ఓ సమస్య వచ్చినప్పుడు గడ్డిపోచలా నిబ్బరంగా ఉండగలిగేవారిదే గెలుపు. తొడలు కొట్టి జబ్బలు చరుచుకుని చాలెంజ్ చేసేవాళ్లది కాదు.

అఖిల అవసరమైతే వృక్షమూ కాగలదు, సమస్య వస్తే గడ్డిపోచలాగానూ మారగలదు. ఇప్పుడామె గడ్డిపోచగా మారి పరిస్థితిని నిబ్బరంగా ఎదుర్కొంటోంది.

సినిమాఫీల్డుకి ‘దేవుడు’ అంటే చచ్చేంత సెంటిమెంటు. పూజ అంటే చాలు బోలెడు ఖర్చు చేస్తారు. ముహూర్తం షాట్లు చూడండి. ఎంత వినయంగా, ఎంత భక్తితో వొంగి వొంగి దండాలు పెడుతూ వుంటారో

దర్శకులూ ,నటీనటులూ  నిర్మాతలూ .

రోజూ ,అంటే , రాకేష్ ఇంటికి  రాని రోజుల్లో ఠంచనుగా తొమ్మిదింటికల్లా మహాలక్ష్మిలా, ‘ముప్పత్తమ్మ’ గుడినించి ప్రసాదం తీసుకుని, సవేరాకి వెళ్ళేది అఖిల. అప్పటికే పూర్ణానంద్, సురేషూ, మిగతావాళ్లూ అక్కడ వుంటారని ఆమెకి తెలుసు. భక్తిగా అందరికీ ప్రసాదం పంచి, “మీరందరూ వెయ్యేళ్ళు చల్లగా, సుఖంగా ఉండాలి. ఎప్పుడూ విజయం మీ వెంట నీడలా వుండాలి.. ఇదే నేను రోజూ మొక్కుకునేది. అందరికంటె ‘ఆయన’ చిన్న. అయినా మీరంతా వున్నారుగా..!” అని వినయంగా నమస్కరించి బయటికొచ్చి ఇంటికెళ్ళే బస్సెక్కేది. అఖిలగురించి మొదట్లో కొంత ‘వింత’గా వాళ్ళనుకున్నా, తరవాత్తరవాత ఆమె ‘చూపించే’ వినయానికి ఫిదా అయిపోయారు.

“ఏజ్ ది ఏవుందోయ్! కృష్ణుడికన్నా రాధ పెద్దదికాదూ, ఉండాల్సింది స్వచ్చమైన ప్రేమ!” అంతటి పూర్ణానందే అఖిలని చూసి ముచ్చటపడి అనేవాడు.

సినిమా మొదలైంది. ఓ రోజున మోహన్‌ప్రసాద్‌గారు రాకేష్ వర్క్ ప్రోగ్రెస్ చూద్దామని సవేరాకి వచ్చారు.. అదే సమయానికి అఖిల ప్రసాదం తీసుకొచ్చింది. మామూలుగానే వినయంగా ప్రసాదం పంచి, నాలుగు మంచి శుభాకాంక్షల్ని అందించింది.

“ఎవరీవిడా?” కుతూహలం బయటికి కనపడకుండా మామూలుగా అడిగినట్టు అడిగాడు మోహన్‌ప్రసాద్.

“వాళ్లింట్లోనేనండి రాకేష్ వుండేది!” ఉత్సాహంగా చెప్పాడు కో.డై.సురేష్.

“మరి యీ ప్రసాదాలేంటి?” నవ్వి అన్నాడు కానీ లోపలలోపల ఓ అనుమానం సుడి తిరుగుతోంది.

“సినిమా సూపర్  హిట్టు కావాలనిట. అబ్బ… ఆ అమ్మాయికి ఎంత వినయమో!” అద్దంలాగా మనసుని బయటపెట్టాడు సురేష్. “అలాగా!” అని బయలుదేరాడాయన. ఆయనతోబాటు పూర్ణానంద్ బయటికొచ్చాడు.

“ఏమిటి పూర్ణా యీ పిల్ల వ్యవహారం…!” నెమ్మదిగా అన్నాడు మోహన్‌ప్రసాద్.

“వాళ్లిద్దరి మధ్యా ఎఫైర్ ఉందనుకుంటాను. ఆ పిల్ల సిన్సియరే. రాకేష్ మహాతెలివైనవాడు.”క్లుప్తంగా చెప్పాడు పూర్ణానంద్.

ఆ మాత్రం హింట్ చాలు. ఆ అమ్మాయి సిన్సియర్. రాకేష్ తెలివైనవాడంటే, ఏ ఎండకి ఆ గొడుగు పట్టగలిగే నేర్పు వుందనేగా… ,  నిశ్చింతగా ఇంటికెళ్లాడాయన. ఎఫైర్స్ ఎన్నున్నా ఫరవాలేదు. పెళ్ళి మాత్రం ఒకటే వుండాలి. భార్యా ఒక్కతే వుండాలి. చిన్న యిళ్ళు  ఎన్నున్నా , పెద్దిల్లు పెద్దిల్లేగా! మోహన్‌ప్రసాదూ ఒకప్పుడు గ్రంధసాంగుడే. ఏ హీరోయిన్నీ వదల్లేదని పెద్దపేరుఆయనకి .

స్క్రిప్టు రెడీ. ఇంకో మూడు రోజుల్లో షూటింగ్ మొదలు కాబోతుంది..’విజయా డీల క్స్   లో సాంగ్ రికార్డింగ్.  ‘విజయ’లో రికార్డింగ్ అంటే’విజయం తథ్యం’ అని అందరికీ నమ్మకం.

(నా పాట  మాత్రం ప్రసాద్ old, థియేటర్లో రికార్డయింది. సినిమా పేరు: నాకూ పెళ్లాం కావాలి‘. నటీనటులు, చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, కల్పన, నిరోషా). దర్శకత్వం శ్రీ విజయాబాపినీడు. నిర్మాతలు: ఆలపాటి రంగారావు, శ్రీ శివలింగేశ్వరరావు. సంగీతం వాసూరావుగారు. గానం: SPB, పల్లవి ” వినోదాల విందురా, బాధలన్నీ బంద్‌రా.. సినిమా సాటి లేదురా.. డాన్సూ ఫైటూ మిక్స్రా.. మళ్లీ మళ్లీ మళ్లీ చూడరా” Date of Recording 1-1-1987)

 

అతిరధమహారధులందరూ విజయా గార్డెన్స్   కి వచ్చారు. ఓ కుర్రాడ్ని డైరెక్టర్‌గా చూడ్డం అందరికీ ఆశ్చర్యమే.

******                                     *******                           **********

సినిమా సూపర్‌హిట్. అఖిల ఆ రోజున ముప్పత్తమ్మ గుళ్ళో 101 కొబ్బరికాయలు కొట్టింది.. రాకేష్‌తో కలిసి వచ్చి.

వారం రోజుల్లో రెండో సినిమా మొదలు. ఈసారి ‘స్క్రి ప్ట్  వర్క్’ పెద్దగా జరగలేదు. కారణం ఆ సినిమా ‘తమిళం’నించి తెలుగులోకి రీమేక్. స్క్రిప్టుని పూర్ణానంద్‌గారే సవరించి తెలుగు నేటివిటీకి తీసుకొచ్చారు.

సురేష్ కో డైరెక్టర్. మిగతా అందరు  టెక్నీషియన్స్ మొదటి సినిమాకి పని చేసినవాళ్ళే కావడంతో చకచక షూటింగ్ నడిచి మూడు నెలల్లో పూర్తయింది.

అదీ సూపర్ హిట్టే.

మూడో సినిమా.. మళ్లీ తమిళ్ టు తెలుగు రీమేక్.

నాల్గో సినిమా హిందీ టు తెలుగు రీమేక్.

నాలుగో సినిమా రిలీజ్ నాటికి అఖిలకి వాంతులయ్యాయి.

సరిగ్గా ఆ రిలీజ్ డేట్ ముందు రోజునే మోహన్‌ప్రసాద్‌గారు తన మూడో కూతుర్ని రాకేష్‌కివ్వడానికి రాకేష్‌తో సంప్రదించాడు.

రాకేష్ వినయంగా అఖిల గురించి చెప్పాడు. “ఆ అఫైర్ నాకు తెలుసు. ఒకవేళ అది బయటపడ్డా అందరూ ఆవిడే నిన్ను చిన్నవాడ్ని చేసి ముగ్గులొకి దించిందని బ్లేమ్ చేస్తారు గానీ, నిన్నెవరూ ఏమీ అనరు బాబూ, నువ్వు నిచ్చెనమెట్లు ఎక్కుతున్నావు. కానీ ఇదో వైకుంఠపాళీ అని నీకు తెలీదు. నిచ్చెనల పక్కనే పాములూ వుంటై. కాటు వెయ్యడానికి సిద్ధంగా…! అన్ని అనుభవాలు కలిగినవాడ్ని.. నువ్వు నా అల్లుడివైతే సంతోషిస్తా. లేదంటే నీ యిష్టం. ఇందులో బలవంతం ఏమీ లేదు”   అని  తన బ్రాండ్ నవ్వుతో నవ్వుతూ చెప్పాడు మోహన్‌ప్రసాద్. ఆ మాటల వెనక హెచ్చరిక రాకేష్‌కి స్పష్టంగా అర్ధమయింది.

********                          ************                             ********

తోతాద్రి చనిపోయి దశాబ్దంన్నర దాటింది. అఖిల ఇప్పుడు ప్రతిరోజూ ముప్పత్తమ్మ గుడికి వస్తూనే వుంటుంది. ఆవిడ కొడుక్కి ఇప్పుడు ఇరవై రెండేళ్ళు. చదువులో ఏవరేజ్ అయినా సినిమా  నాలెడ్జి మాత్రం అద్భుతం. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా హైద్రాబాదుకి తరలి వెళ్లిపోవడంతో ఆ పిల్లాడు తమిళ సినిమా ఇండస్ట్రీలో తన వంతు ప్రయత్నాలు ప్రారంభించాడని అఖిల నాతో అన్నది. అన్నట్టు ఆ పిల్లాడికి తెలుగు రాదు. నేర్పేవాళ్లెవరూ? తల్లికీ, తాతకీ వచ్చిన తమిళాన్నే అతనూ నేర్చుకున్నాడు.

మీకు అనుమానం రావొచ్చు. పిల్లాడి తండ్రి ఎవరా అని.. ఆ విషయంలో ఎవరైనా  ఖచ్చితంగా చెప్పగలరు  తండ్రి రాకేషేనని. కానీ అఖిల మాత్రం కొడుక్కి అబద్ధం చెప్పింది, తండ్రి మిలటరీలో పని చేస్తూ చనిపోయాడని.

ఇహ రాకేష్ సంగతా      ?   మోహన్‌ప్రసాద్‌తో జరిగిన సంభాషణని యథాతథంగా పూర్ణానంద్‌కి  చెప్పి అతని సలహా అడిగాడు….. పూర్ణానంద్ అఖిలకీ,  మోహన్‌ప్రసాద్ కూతురికీ  వున్న ప్లస్‌లూ, మైనస్‌లూ వివరించి, నిర్ణయాన్ని రాకేష్‌కే వదిలేశాడు.

తిరుపతిలో జరిగిన రాకేష్, వింధ్యల పెళ్లికి అతిరథమహారథులందరూ ఎటెండై, మోహన్‌ప్రసాద్‌గారిని అభినందనలతో ముంచెత్తారు. అదో ‘టాక్ ఆఫ్ ద  టౌన్..’! దేవుడు గొప్పవాడు. అందుకే చిట్టచివరిదాకా తోతాద్రిని సంరక్షించడమే గాక, అతను సంతోషంగా ఆడుకోవడానికి ఓ మనవడ్ని కూడా ఇచ్చాడు.

మొగుడు లేకుండా బిడ్డని కన్నదని అయినవాళ్లూ, కానివాళ్లూ ఆడిపొసుకున్నా, అఖిల మాత్రం చలించకుండా నిలబడటం నిజంగా గొప్పవిషయమే. ఆ మాటే నేనంటే..,

“అన్నా… ప్రపంచం ఎప్పటికప్పుడు కోరేది కొత్త వింతల్నేగానీ, పాతవికాదు. అయినా పాట విషయాలు  ఎంతకాలం గుర్తుంచుకుంటుందీ?సంవత్సరమో, రెండేళ్ళో మాట్లాడతారు.. ఆ తరవాత?” అని పకపకా నవ్వింది.

లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక ‘కాలపు అల’  రాకేష్‌ని అంతెత్తున నిలబెడితే, మరో ‘అల’ అతన్ని నేలమీదకి విసిరింది.

రోజూ అతను ‘అఖిల’ గురించి కనీసం పదిసార్లయినా ఆలోచిస్తాడు. ‘వింధ్య’ పెంకితనం నానాటికీ పెరుగుతూనే వుందిగానీ తరగలేదు. మోహన్‌ప్రసాద్‌గారు అనారోగ్యంతో బయటికి రావడం లేదు. ఆయనకి ఎనభై రెండేళ్ళు. రాత్రిళ్లు నిద్దర పట్టదు. కానీ,

రాకేష్ వొంటరిగా ‘మందు కొట్టడం’ మాత్రం అతను రోజూ చూస్తూనే వుంటాడు. కూతురు క్లబ్ నించి వొచ్చేసరికి రాత్రి రెండు దాటుతుంది. అప్పుడు కూడా వాళ్లిద్దరూ భార్యాభర్తల్లా వుండరు. ఎవరి పక్క వారిదే, ఎవరి భోజనాలు వాళ్లవే. వాళ్లకి పుట్టిన పిల్లలిద్దరూ కూడా ‘పోష్’ టైపు.

మోహన్‌ప్రసాద్ అప్పుడప్పుడు బాధపడుతూ వుంటాడు. ‘’లెక్కలేనంత ‘ఆస్తి’ సంపాయించి తప్పు చేశానా? ‘’ అని.

ఒకమాట చెప్పకపోతే అఖిలకి నిజంగా అన్యాయం చేసినట్టు అవుతుంది.

రాకేశ్ పెళ్లి అయ్యాక అఖిల ఎవ్వరినీ దగ్గరకి చేరనివ్వలా , ఆఖరికి రాకేష్ ని  కూడా !  సిన్సియర్ గా చిబితే  ఆమె లాంటి ఆడది మాత్రం సినీ ఫీల్డ్  లో  ఈనాటివరకూ నా కంటబడలా   !

మళ్లీ కలుద్దాం

మరో కథతో

మీ

భువనచంద్ర.

 

ఎందుకిలా —?

– ప్రసాద్  బోలిమేరు

~

ఈ లోలోపలి నది , ఈ ధ్యానం
అగరుబత్తి పొగలా అటూ  ఇటూ , ఎటో లాక్కెళుతూనే వుంటుందా?
నువ్వేమో వొంపుతిరిగిన మెత్తటి గాలంలా అమూర్తభావంలా-
చిరుతరగనై  కల్లోల తరంగాన్ని భరించాలని ప్రతిబింబించాలని
నేను
అందీఅందక అల్లంత దగ్గరలోనో దూరంలోనో
మనసు రెప్పలమీద వేలాడుతూ ,,
వన్నెలతో  ,వేళ్ళ కుంచెలతో
రాగాలు రంగరిస్తూ వాసనలద్దాలని,
కాంక్షల శిరస్సుపై నిప్పురవ్వలా భ్రాంతిని , మోస్తూ —
నువ్వేమో
ఈ పురాకృత నదీ నడుమన
అవిధేయ ప్రయాణానివి
గడుసైన అలవికాని చిత్రానివి
నా ప్రేరణకు అందని గేయానివి
మొదటి రాత్రిని ముద్దిడిన మొట్టమొదటి చంద్ర కిరణానివి–
ఎందుకు నేనిలా ?
ఒడ్డున ఆకులురాలిన పొదకు కట్టేసిన
లంగరు వేసిన భావాన్ని ,
రంగుల కళలు తాగని రాత్రిని
పురాతన ఇంద్రియ జ్ఞానాన్ని, మోహాన్ని–