Archives for November 2015

సీజర్ ను భయపెట్టిన ‘ప్రేతాత్మ’ల నగరం…ట్రాయ్

 

స్లీమన్ కథ-17

 

కల్లూరి భాస్కరం

స్లీమన్ వెళ్ళేటప్పటికే, ట్రాయ్ నలిగిన బాట. ఆ బాటలో పిచ్చి పిచ్చిగా పెరిగిన ముళ్ల పొదలు, శిథిల వృక్షాలు. వాటికింద పాడుబడిన బలిపీఠాలు. ఆ పీఠాల వద్ద ఘనతవహించిన ఎంతోమంది మొక్కులు చెల్లించుకున్నారు. తరం వెంట తరంగా ఆ దుర్గమ ఫ్రిజియన్ తీరాన్ని సందర్శించిన అనేకమంది అక్కడి కూలుతున్న గోపురాల మధ్య తిరిగారు. హెలెన్ (గొప్ప సౌందర్యవతి. మైసీనియన్ స్పార్టాను పాలించే మెనెలాస్ భార్య. ఈమెను ట్రాయ్ రాకుమారుడు పారిస్ అపహరించుకుని వెళ్ళాడు. అది ట్రోజన్ యుద్ధానికి దారితీసింది) నిర్బంధానికీ, పదేళ్ళ యుద్ధానికీ సాక్షులుగా నిలిచిన జీర్ణ శిలల మీద సేదతీరారు.

హెరోడొటస్ మాటలనే విశ్వాసంలోకి తీసుకుంటే, ప్రపంచంలోని అత్యధికభాగాన్ని ఏలిన పర్షియన్ చక్రవర్తి గ్జెరెక్సెస్(క్రీ.పూ. 519) టర్కీ నుంచి గ్రీస్ కు దండు వెడలుతూ ఇక్కడ ఒకరోజు ఆగాడు. కొండ ఎక్కి దుర్గాన్ని చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి చెందిన విజ్ఞులను పిలిపించి అక్కడ జరిగిన ముట్టడుల కథలు చెప్పించుకుని విన్నాడు. ఆ తర్వాత ట్రోజన్ ఎథెనాకు వెయ్యి వృషభాలను బలిచ్చాడు. అక్కడి పూర్వజులైన మహనీయుల ఆత్మశాంతికి మద్యతర్పణాలు ఇవ్వవలసిందిగా పురోహితులను ఆదేశించాడు. ఏవో భయానక ప్రేతాత్మలు భూమిని చీల్చుకుంటూ వచ్చి మీద పడతాయన్న ఊహతోనే పర్షియన్ సేనలు ఆ రాత్రంతా వణికిపోతూ గడిపాయి.

పర్షియన్లకూ, ఇతరులకూ కూడా అది రకరకాల కథలూ, పీడకలలూ కలగలిసిన విచిత్ర భయాలను రేపే ప్రదేశం. అన్ని యుద్ధక్షేత్రాలలోలానే, ఈ ప్రాంతాన్ని కూడా ప్రతీకారదాహంతో ప్రేతాత్మలు పెట్టే పెడబొబ్బలు వెంటాడుతూ ఉంటాయి.  గ్జెరెక్సెస్ కూడా పాత పగలు తీర్చుకోవడమే తన లక్ష్యమని చెప్పుకున్నాడు. ట్రాయ్ పతనమే గ్రీకులకూ, తమకూ మధ్య శాశ్వతశత్రుత్వాన్ని రగిల్చిందని పర్షియన్లు అంటారు.

ట్రాయ్ గడ్డ మీద అడుగుపెట్టగానే, ఆసియా మొత్తం తమ చేజిక్కిందని గ్రీకులు అనుకున్నారు. హెల్స్ పాంట్ మీదుగా అలెగ్జాండర్ పర్షియన్లపై దండయాత్రకు వెడుతూ సెజియమ్(ఒక పురాతన నగరం)లోని ఓ గుట్టమీద ఉన్న అఖిలెస్ (ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్న గ్రీకు వీరుడు) సమాధిని దర్శించుకున్నాడు. ఒంటి నిండా నూనె పట్టించి ఆ సమాధి చుట్టూ నగ్నంగా ప్రదక్షిణ చేశాడు. ఎథెనా ఆలయంలో భద్రపరచిన కొన్ని ఆయుధాలను తను ధరించాడు. ఆ నగరాన్ని తీర్చిదిద్దడానికి బ్రహ్మాండమైన ప్రణాళికలు వేసుకున్నాడు.

భూ, సముద్రమార్గాలలో పాంపే(క్రీ. పూ. 106: రోమన్ సేనాని, రాజకీయ నేత)ను వేటాడుతున్న జూలియస్ సీజర్(క్రీ.పూ.100: రోమన్ సేనాని, రాజకీయనేత) ఇక్కడి రోటియన్ గుట్ట మీదికి చేరుకున్నాడు. అప్పటికి నలభై ఏళ్లక్రితం రోమన్ దళాల చేతుల్లో దగ్ధమైన ఈ నగర శిథిలాల మధ్య తిరిగాడు. చుట్టూ కమ్మేసిన అడవీ; రాజప్రాసాదాలపైనా, ఆలయాలపైనా దట్టంగా పెరిగిపోయిన ఓక్ చెట్లు తప్ప అతనికేమీ కనిపించలేదు. అక్కడక్కడ ఇసుక మేటలు వేసిన ఒక ప్రవాహాన్ని అతడు దాటుతుండగా, “ప్రసిద్ధ నది జంతస్ ఇదే” నని ఎవరో చెప్పారు. అతనో పచ్చిక నేల మీద అడుగుపెట్టినప్పుడు; “హెక్టర్(ట్రోజన్ రాకుమారుడు, ప్రియామ్ కొడుకు, వీరుడు) భౌతికకాయాన్ని తీసుకొచ్చిన ప్రదేశం ఇది. అతని ప్రేతాత్మ కోపగిస్తుంది, జాగ్రత్త” అని ఎవరో బిగ్గరగా అరిచారు. అతను ఒక రాళ్ళగుట్టను సమీపించబోయినప్పుడు, ఎవరో అతని చొక్కా పుచ్చుకుని లాగి,”కనబడడం లేదా? అది హెర్కయన్ జూపిటర్ బలిపీఠం” అని గుడ్లు ఉరిమాడు.

చుట్టూ శిథిలాలూ, అలముకున్న అంధకారం తప్ప ఏమీ కనిపించకపోయినా అదో పవిత్రస్థలి అని సీజర్ కు తెలుసు. అక్కడి ప్రేతాత్మలను తలచుకుని భయపడ్డాడు. అప్పటికప్పుడు మట్టితో ఒక బలిపీఠాన్ని నిర్మింపజేసి, దాని మీద ధూపం వెలిగించాడు. తనకు గొప్ప శ్రేయస్సును ప్రసాదించమని ఆ క్షేత్రపాలకులైన దేవతలను ప్రార్థించాడు. అక్కడి కుప్పకూలిన నిర్మాణాలను పునర్నిర్మించి వాటికి పూర్వవైభవం తీసుకోస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంతలో తన బద్ధశత్రువైన పాంపే గుర్తొచ్చి, అతన్ని చంపే తహతహలో ఓడ ఎక్కి ఎక్కడా ఆగకుండా హడావుడిగా ఆసియాలోని సుసంపన్న నగరాల మీదుగా ఈజిప్టు రాజధాని అలెగ్జాండ్రియాకు వెళ్లిపోయాడు.

ఉన్మాదులూ, చక్రవర్తులూ కూడా ట్రాయ్ ను దర్శించుకున్నాడు. ‘కరకలా’ అనే పేరుతో ప్రసిద్ధుడైన ఉన్మత్త రోమన్ చక్రవర్తి ఆంటోనినూస్(క్రీ.శ. 188) ఇక్కడి ఆలయాలకు వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నాడు. ఈ ప్రాంత గతవైభవస్మరణతో మతిభ్రమించి, మేసిడోనియాలో తనను అలెగ్జాండర్ ది గ్రేట్ గా ఊహించుకున్నట్టే, ఇక్కడ అఖిలెస్ గా ఊహించుకున్నాడు. తన ఆప్తమిత్రుడు పెట్రాక్లస్ మరణానికి అఖిలెస్ అంతులేని దుఃఖంలో కూరుకుపోయిన సంగతి గుర్తొచ్చి, తను కూడా అలాంటి దుఃఖాన్ని అనుభవించాలనుకున్నాడు. తనెంతో అభిమానించే ఫెస్టస్ అనే ఒక మాజీబానిసకు విషం పెట్టి చంపించి అతనికి బ్రహ్మాండమైన చితిని పేర్చవలసిందిగా ఆదేశించాడు. తను స్వయంగా జంతువులను బలిచ్చి, మృతదేహాన్ని చితి మీదికి చేర్చి, నిప్పు అంటించాడు. ఆ తర్వాత ఆ మంటలపై మద్యాన్ని చిలకరించి, తన ప్రాణమిత్రుడి మరణాన్ని పండుగ చేసుకోవలసిందిగా వాయువులను ప్రార్థించాడు. కరకలా ప్రభుత్వంలో చిన్న అధికారిగా ఉన్న హెరోడియన్ ఈ ముచ్చట వివరిస్తూ, తను కూడా పట్టలేని దుఃఖంతో తన తలవెంట్రుక నొకదానిని చితికి అర్పించబోయాననీ, తీరా తనది పూర్తిగా బట్టతల కావడంతో అక్కడ ఉన్నవాళ్ళందరూ నవ్వారనీ చెప్పుకున్నాడు.

ఆ తర్వాత, అఖిలెస్ సమాధి చుట్టూ అలెగ్జాండర్ నగ్నంగా ప్రదక్షిణ చేశాడన్న సంగతి గుర్తొచ్చి కరకలా కూడా అదే చేశాడు.

ఆ తర్వాతి కాలంలోనూ, పర్షియాకో, జెరూసలెంకో నిరంతర ప్రవాహంలా వెళ్ళే యాత్రికుల బృందాలు విధిగా ఆ పవిత్రస్థలి మీద కాలు మోపాయి. తూర్పు భూముల్లో రోమన్ సామ్రాజ్యానికి కొత్త రాజధానిని నిర్మించాలనుకున్న కాన్ స్టాంటీన్(క్రీ.శ.270) అందుకు బైజాంటియమ్ ను ఖరారు చేసేముందు, ట్రాయ్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశాడు. నోవమ్ ఇలియమ్(ట్రాయ్ సమీపంలోని ఒక గ్రామం) ను సందర్శించిన రోమన్ చక్రవర్తి జూలియన్(క్రీ.శ.336), ఏజాక్స్(గ్రీకు వీరుడు)అస్థికలకు కొత్త సమాధిని నిర్మింపజేశాడు. మృతవీరుల అస్థికలను ఆరాధించే క్రైస్తవులను చూసి ఎగతాళి చేసిన ఈ చక్రవర్తే, ఏజాక్స్ సమాధిని భక్తితో కొలిచాడు. ట్రోజన్లు ఆ తర్వాత కూడా మరి కొన్నేళ్లపాటు పురాతన బలిపీఠాల వద్ద రహస్యంగా బలులు ఇస్తూవచ్చారు. రోమ్ లో క్రైస్తవ చక్రవర్తుల రాకతో అది క్రమంగా తగ్గుముఖం పట్టి, ట్రాయ్ మతపరమైన ప్రాముఖ్యం కొల్పోయింది.

greek goddess pallas athena

దర్దనెల్లెస్ కు వెళ్ళే దారులకు పదిహేనువందల ఏళ్లపాటు ట్రాయ్ కాపలా కాయగలిగింది. ఇప్పుడా వీధుల నిండా గడ్డి గాదం పెరిగిపోయాయి. ఆలయాలు, ప్రాసాదాల గోడలు కూలిపోయాయి. ఇప్పుడక్కడ ముళ్ళపొదలు, గడ్డితో నిండిన ఓ పెద్ద దిబ్బ మాత్రమే ఉంది. ట్రయాడ్ తీరం వెంబడి ప్రయాణించిన ఆంగ్లో-శాగ్జన్ చరిత్రకారుడు సావూఫ్ (క్రీ.శ. 1100), ట్రాయ్ శిథిలాలు అనేక మైళ్ళ దూరం వ్యాపించి ఉన్నాయని రాశాడు. ట్రాయ్ పూర్తిగా ధ్వంసమైందనీ, ఏమీ మిగలలేదనీ సర్ జాన్ మండవిల్ అనే మరో పర్యాటకుడు రాశాడు.

నిజమే, ట్రాయ్ ధ్వంసమైంది, అయినా మిగిలింది. జనం ఊహల్ని జ్వాజ్వల్యమానం చేయగలిగిన శక్తి ట్రాయ్ కు ఉన్నట్టు మరే నగరానికీ లేదు. బహుశా ఒక్క జెరూసలెం ఇందుకు మినహాయింపు. సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో ట్రాయ్ స్మృతిని హోమర్, వర్జిల్ సజీవం చేశారు. అఖిలెస్ నడిచిన బాటల మీద తాము కూడా నడిచే రోజు కోసం ఇటలీ పండితులు ఎందరో కలలు గన్నారు. రోమన్లు అనుకున్నట్టే, తాము కూడా ట్రోజన్ల వారసులమనీ, లండన్ అసలు పేరు ట్రాయ్ నోవంట్(నూతన ట్రాయ్) అనీ ఇంగ్లీష్ జనం అనుకుంటారు.

ట్రాయ్ కల్పన కాదు, నిజమనీ; హిస్సాలిక్ దిబ్బ కింద ఆ నగరం తాలూకు గోడలు, ప్రాసాదాలు, అలంకరణసామగ్రితోపాటు ట్రోజన్ల సాహిత్యం కూడా సమాధైందనీ 1870 లలో గట్టిగా నమ్మినవాళ్ళు ఇద్దరే: ఫ్రాంక్ కల్వర్ట్, హైన్ రిచ్ స్లీమన్.  ట్రాయ్ ఉనికి హిస్సాలిక్ దగ్గరే నని 1822లోనే నిరూపించే ప్రయత్నంచేసిన పురాతత్వనిపుణుడు చార్లెస్ మెక్లారెన్ 1870ల నాటికి జీవించిలేడు. బునర్ బషీయే ట్రాయ్ అనీ, హిస్సాలిక్ దిబ్బ మీద తవ్వకాలు జరపడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదనేది దాదాపు అప్పటి పండితులందరి ఏకాభిప్రాయం.

హిస్సాలిక్ దిబ్బ మీద పూర్తిస్థాయిలో తవ్వకాలను చేపట్టగల ఆర్థికస్తోమత ఫ్రాంక్ కల్వర్ట్ కు లేదు, అతనికంత ఆసక్తీలేదు. ఆ దిబ్బలోని తూర్పు భాగం అతని సొంతం. పశ్చిమభాగం కమ్ కేల్ లో ఉంటున్న ఇద్దరు టర్కులకు చెందింది.

సముద్రం వైపు తిరిగి ఉన్న పశ్చిమ భాగంలోనే అతి ముఖ్యమైన నిర్మాణాలూ, విలువైన నిధినిక్షేపాలూ బయటపడతాయని స్లీమన్ నిర్ధారణకు వచ్చాడు. టర్కుల అధీనంలో ఉన్న ఆ ప్రదేశంలోనే మొదట తవ్వకాలు జరుపుదామనీ, కల్వర్ట్ కు చెందిన ప్రాంతంలో తర్వాత ఎప్పుడైనా జరపచ్చనీ అనుకున్నాడు. తను బయటపెట్టబోయే నిర్మాణాలను, నిధినిక్షేపాలను చూసిన తర్వాత; తమ అనుమతి లేకుండా తవ్వకాలు జరిపించిన తన తెంపరితనాన్ని ఆ టర్కులిద్దరూ క్షమిస్తారని భావించాడు.

ఏప్రిల్ 9 న, దగ్గర్లోని రెంకోయ్ అనే గ్రామానికి చెందిన పదిమంది టర్కిష్ కూలీలతో మొదటి కందకాన్ని తవ్వించాడు. ఒక్కొక్కరికి పది పియాస్టెర్ల(పియాస్టెర్: మధ్యప్రాచ్యంలో అనేక చోట్ల చలామణిలో ఉన్న ఒక ద్రవ్యకొలమానం. పౌండులో నూరోవంతు)చొప్పున చెల్లించాడు. పని జరుగుతున్నంత సేపూ బెల్టులో పిస్టల్ తోనూ, చేతిలో కొరడాతోనూ వాళ్ళ నెత్తి మీద నిలబడ్డట్టు నిలబడ్డాడు. తను ‘స్కెయిన్ గేట్’(ట్రాయ్ పశ్చిమ ద్వారం. ఇక్కటే గ్రీకులకు, ట్రోజన్లకు అనేక యుద్ధాలు జరిగాయి) ఉంటుందని ఊహించుకున్న వాయవ్య భాగంలో ఒకచోట మొదటి పలుగు దెబ్బ పడింది. ఒక గంటసేపు తవ్విన తర్వాత రెండు అడుగుల లోతున ఒక ప్రాకారం తాలూకు శిథిలాలు కనిపించాయి. స్లీమన్ ఉత్తేజితుడయ్యాడు. సూర్యాస్తమయానికల్లా 60 అడుగుల పొడవూ, 40 అడుగుల వెడల్పూ ఉన్న ఒక భవనం తాలూకు పునాదులు బయటపడ్డాయి.

మరునాడు మరో పదకొండు మందిని పనిలోకి తీసుకున్నాడు. క్రమంగా బయటపడుతున్న ఆ భవనం ఆగ్నేయ, నైరుతి మూలల్లో తవ్వకాలు ప్రారంభించాడు. చదరపు రాళ్ళు తాపడం చేసిన భవనం పై కప్పు పైకి తేలింది. దాని మీద రెండడుగుల మందంలో మట్టి, వందల ఏళ్ల నాటి గొర్రె పెంటికలు, మొక్కల శిథిలాలు, వాతావరణం తాలూకు ధూళి పేరుకుపోయి ఉన్నాయి. కుండపెంకులేవీ కనిపించలేదు. ఆ చదరపు రాళ్ళ అడుగున తవ్వించాడు. సరిగ్గా అతను ఊహించినట్టే అడుగున అగ్నిప్రమాదాన్ని సూచిస్తూ బూడిద కుప్పలూ, కాలిపోయిన పదార్థాలూ కనిపించాయి. ఒక పద్ధతిగా ఉన్న వాటి అమరికను బట్టి అక్కడ కనీసం పది కొయ్య ఇళ్ళు ఉండేవనీ, అగ్ని ప్రమాదంలో అవి తగలబడి పోయాయనీ, ఆ శిథిలాల మీద ఆ తర్వాత రాతి కట్టడం అవతరించిందనీ అతను నిర్ధారణకు వచ్చాడు. ఆ బూడిద కుప్పల్లో ఒకచోట ఒక నాణెం దొరికింది. దానికి ఒక పక్క రోమన్ చక్రవర్తి కమొడస్(క్రీ.శ. 161) చిత్రం, ఇంకో పక్క యుద్ధంలో ట్రోజన్ సేనలకు నాయకత్వం వహించిన ట్రాయ్ రాకుమారుడు హెక్టర్ చిత్రం ఉన్నాయి. ‘హెక్టర్ ఇలియోన్’ (ట్రాయ్ కి చెందిన హెక్టర్) అని రాసి ఉన్న ఆ నాణెం అత్యంత శుభసంకేతంగా స్లీమన్ కళ్లకు కనిపించింది.

రెండు రోజులపాటు ఆ భవనం చుట్టూనే తవ్వించాడు. మూడో రోజున, ఆ స్థలం యజమానులైన ఆ టర్కులిద్దరూ ఏ క్షణంలోనైనా వచ్చిపడతారనిపించి; తూర్పు నుంచి పశ్చిమానికీ; దక్షిణం నుంచి ఉత్తరానికీ రెండు పొడవైన కందకాలను హడావుడిగా తవ్వించడం ప్రారంభించాడు. అందువల్ల ఆ నగరం తాలూకు పూర్తి చిత్రం ఏర్పడుతుందని అనుకున్నాడు.

అవడానికి అతని ప్రణాళిక పక్కాగానే ఉంది. కానీ పని మొదలెట్టించాడో లేదో, ఆ టర్కులిద్దరూ వచ్చిపడ్డారు. తమ స్థలంలో తవ్వకాలు జరుపుతున్న ఈ చిన్నపాటి సైన్యాన్ని చూసి విస్తుపోయారు. తను శాస్త్రీయ ప్రాముఖ్యమున్న పని చేస్తున్నాననీ, ఇందులో తనకు ఎలాంటి స్వార్థం లేదనీ, నిజానికి తను చేస్తున్న పని టర్కీ గౌరవాన్ని ఎంతైనా పెంచుతుందనీ స్లీమన్ దుబాషీ ద్వారా వారికి వివరించాడు. అప్పటికీ దిగ్భ్రాంతి నుంచి తేరుకోని ఆ టర్కులిద్దరూ ఈ పని చేసేందుకు మీ కెలాంటి హక్కూ లేదు, తక్షణం ఇక్కడినుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దాంతో స్లీమన్ వాళ్ళను బుజ్జగిస్తూ, బతిమాలుతూ తను తవ్వకాలు జరిపిన చోటికి తీసుకెళ్లి చూపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతత్వ శాస్త్రవేత్తలందరూ రేపు పొగడ్తలతో ముంచెత్తబోయే తన పరిశోధనాంశాల గురించి ఓ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు. ఇప్పటికే తను పల్లస్ ఎథెనా ఆలయం గోడలో కొంత భాగాన్ని, అసంఖ్యాకమైన అస్థికలను, తాపడం రాళ్ళను, పంది దంతాలను, అగ్నిప్రమాదం తాలూకు ఆనవాళ్లను బయటపెట్టానని చెప్పాడు.

టర్కులు కొంత మెత్తబడ్డారు. అన్నిటినీ మించి అక్కడ తవ్వి తీసిన పెద్ద బండరాళ్ళ మీద వాళ్ళ దృష్టి పడింది. సిమోయిస్ అనే చోట ఒక రాతి వంతెన కట్టించాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ బండ రాళ్ళు అందుకు బాగా పనికొస్తాయనిపించింది. ఈ రాళ్ళను తమ వంతెనకు వాడుకునే షరతు మీద ఆ రెండు పొడవైన కందకాలను తవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. స్లీమన్ వాళ్ళకు నలభై ఫ్రాంకులు చెల్లించాడు. అవి తీసుకుని వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

స్లీమన్ తను తవ్వి తీసిన వాటికి వెంటనే ఏదో ఒక చారిత్రకనామం ఉంచేవాడు. ఓ పెద్ద గోడ బయటపడగానే, ఆ కట్టడానికి పల్లస్ ఎథెనా ఆలయం అని పేరు పెట్టేశాడు. ఉత్తరపు కందకాన్ని తవ్వుతున్నప్పుడు అడుగున ఇరవై రెండు బూడిద పొరల కింద ఒక మృణ్మయ స్త్రీమూర్తి కనిపించగానే, దానికి హెలెన్ అని పేరు పెట్టాడు. తగిన ఆధారాలతోనే అలా పేర్లు పెడుతున్నాడా అన్నది అతనెప్పుడూ ఆలోచించుకోలేదు.

అయితే, టర్కులు వచ్చి వెళ్ళిన తర్వాత దీర్ఘాలోచనలో పడిపోయాడు. తన అదుపులో లేని శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి తప్ప తను ముందుకు వెళ్లలేడని అతనికి అర్థమైంది. నలభై ఫ్రాంకులు చెల్లించి, వంతెన కట్టుకోడానికి రాళ్ళు ఇస్తానని చెప్పి తను వాళ్ళతో తాత్కాలికంగా ఒప్పందం చేసుకున్నాడు కానీ, అది భగ్నమవదన్న నమ్మకం ఏమిటి? ఈ టర్కులు తమ హక్కులకోసం పట్టుబడితే ఏం చేయాలి? అక్కడికీ తను ఆ మొత్తం స్థలాన్ని కొనేయాలనుకుని బేరమాడాడు. వాళ్ళు చాలా ఎక్కువ ధర చెప్పారు. పైగా ఆ దిక్కుమాలిన వంతెన కోసం రాళ్ళు అడుగుతున్నారు. అంతకన్నా అపచారం ఉంటుందా? వీళ్లతో ఎలా వేగాలి? ఈ స్థలం మీద పూర్తి హక్కులు ఎలా సంపాదించాలి?

అతనిలాంటి ఆలోచనలతో సతమతమవుతుండగానే ఏప్రిల్ 21 న ఆ ఇద్దరు టర్కులూ మళ్ళీ వచ్చారు. ఇప్పటివరకూ తవ్విన రాళ్ళు వంతెనకు సరిపోతాయి, ఇక తవ్వకాలు ఆపేయండని హుకుం జారీచేశారు.

ఈ హుకుంను తోసిపుచ్చగల ఎలాంటి ఆయుధాలూ స్లీమన్ దగ్గర లేవు. వీళ్ళతో ఇక పోరాడి లాభం లేదు, వేరే మార్గాలు చూడాల్సిందే ననుకున్నాడు. తను ఇంతవరకూ చేసిన పనేమిటో, ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో వివరిస్తూ జర్మనీ, ఫ్రాన్స్, ఎథెన్స్, కాన్ స్టాంటినోపిల్ లో ఉన్న మిత్రులకు వరసపెట్టి ఉత్తరాలు రాశాడు. ఒక జర్మన్ మిత్రుడికి ఇలా రాశాడు:

అతి పురాతన ప్రాసాదాలు, ఆలయాల శిథిలాలను నేను బయటపెట్టాను. పదిహేను అడుగుల లోతున, ఒక అద్భుత నిర్మాణానికి చెందిన ఆరడుగుల మందమైన పెద్ద పెద్ద గోడల్ని కనుగొన్నాను. ఇంకా ఏడున్నర అడుగుల లోతున ఇవే గోడలు ఎనిమిదిన్నర అడుగుల మందమైన గోడలపై ఆని ఉండడం చూశాను. ఇవి ప్రియాం ప్రాసాదం గోడలో, లేదా ఎథెనా ఆలయం గోడలో అయుంటాయని అనుకుంటున్నాను.

అయితే, దురదృష్టవశాత్తూ ఈ స్థలానికి యజమానులైన ఇద్దరు టర్కులు అదేపనిగా చికాకు పెడుతున్నారు. బహుశా  రేపటితో వాళ్ళు నా పని ఆపేస్తారు. ఈ లోపల ఆ స్థలం కొనేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఏమైనా ప్రియాం ప్రాసాదాన్ని వెలికితీసే వరకూ విశ్రమించకూడదని నిర్ణయించుకున్నాను.

అలా రాశాడే కానీ, ఆ క్షణాన తను ఇక చేయగలిగిందేమీ లేదని అతనికి తెలుసు. పరిస్థితులకు తలవంచుతూ, పనివాళ్ళకు వేతనాలు చెల్లించి పంపేశాడు. ఈలోపల మైసీనియా తవ్వకాలకైనా అనుమతి వస్తుందని ఆశపడుతూ  ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. కొన్ని వారాలు మైసీనియాలో గడిపి, టర్కిష్ ప్రభుత్వం నుంచి ఫర్మానాను, హిస్సాలిక్ దిబ్బ మీద యాజమాన్య హక్కును సాధించుకున్న తర్వాత  ట్రాయ్ వచ్చి తిరిగి తవ్వకాలను ప్రారంభిచవచ్చనుకున్నాడు.

(సశేషం)

 

 

 

 

 

 

రఫీ వెర్సస్ రఫీ

 

 

 

Prajna-1అది పోలీస్ స్టేషన్. చుట్టూరా కోప్స్. ‘చైల్డ్ హర్రాస్మెంట్’ కేస్ కింద అరెస్టు అయ్యాడు రఫీ.

నా  పేరు రఫీ, మొహమ్మద్ రఫీ. మా నాన్నగారు సింగర్ మొహమ్మద్ రఫీ కి వీరాభిమాని. అందుకే నాకు ఆ పేరు పెట్టారు. అన్నట్టు మా నాన్నగారి పేరు మొహమ్మద్ అలీ. భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ఆయన ఒక కీలక పాత్ర వహించారు. వరంగల్ లో ఆయన జన శక్తి అనే వార్తా పత్రికకి సంపాదకీయం వహించారు. కత్తి కంటే కలం గొప్పది అనే సిద్ధాంతాన్ని ఆయన నమ్మారు. అంతే కాదు! అప్పటి సమాజంలో ఉన్న దురాచారాలని అరికట్టేందుకు తన వంతు సహాయం చేసేవారు. మా నాన్నగారు ఒక సోషల్ రిఫార్మర్. ఆయన ముస్లిం అయినప్పటికీ ఒక బ్రాహ్మల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందుకే మా నాన్నగారి స్నేహితులు అతనిని షేక్ వీరేశలింగం అని పిలిచేవారు. అప్పటి కాలంలో వేరే వాళ్ళ ఇళ్ళలో ఉన్నట్టు ఉండేది కాదు మా ఇంట్లో పరిస్థితి. మా నాన్నగారికి మత పిచ్చి లేదు. కానీ దేవుడు అంటే అపారమైన నమ్మకం. నమాజ్ చేసేవారు, అమ్మ పూజలలో కూడా కూర్చోనేవారు.  మా అక్కలకు భారతి అని, సరోజినీ అని, మా తమ్ముడికి బోస్ అని పేర్లు పెట్టారు. వాళ్ళందరూ  చక్కగా చదువుకున్నారు. అక్కలు, తమ్ముడు – వీళ్ళందరూ  ప్రభుత్వ ఉద్యోగస్తులు. గొప్ప హోదాల్లో రెటైర్ అయ్యారు. 

 నాన్నగారికి నేనంటే ఎందుకో ప్రత్యేక అభిమానం.  నాకు బాగా గుర్తుంది, ఆయనకి యాభై అయిదేళ్ళు వయస్సప్పుడు ఒక రోజు బాగా ఎమోషనల్ అయ్యారు. నన్ను దగ్గరకు పిలిచి, “నీకు పదిహేను యేళ్ళు వచ్చినై . జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావో ఇప్పుడే నిర్ణయం తీసుకో. ఏం చేసినా కానీ, నీ వాళ్ళకి తోడు గా ఉండు” అని అన్నారు. ఆ రోజు నాకు చాలా బాధ కలిగిన రోజు. ఆ రాత్రే కన్నుమూశారు. నాకు ఇంకా గుర్తుంది. నేను నా జీవితంలో జర్నలిజం చేయాలనే అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్న రోజు.

నా జీవితంలో జర్నలిజం ఉన్నదో, జర్నలిజం లో నా జీవితం ఉన్నదో నాకు తెలీదు. కానీ నాకు జర్నలిజం అంటే నా ప్రాణంతో సమానం. నలభై యేళ్లకు పైగా ఈ ప్రొఫెషన్ లో ఉన్నాను. ఎన్నో పలకరింపులు, ఎన్నో అడ్డంకులు, ఇంకేన్నో బెదిరింపులు-ఇలా నా జీవితం సాగిపోయింది. నేను కూడా మా నాన్నగారి అడుగుజాడల్లో నడిచాను. ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లిచేసుకున్నాను. మా బాబు కళ్యాణ్ పుట్టిన మూడేళ్ళకి నా భార్య కాన్సర్ వచ్చి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరూ నన్ను చాలా జల్దీ విడిచి వెళ్ళిపోయారు. నాన్నగారూ, నా భార్యా ఇద్దరూ నన్ను ఒంటరి  వాడిని చేసేశారు. కానీ నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. జర్నలిజం లో మునిగిపోయాను. మా అక్కలు కళ్యాణ్ ని దత్తతు చేసుకుంటాం అన్నారు. కానీ కళ్యాణ్ ని పెంచే బాధ్యత నేనే తీసుకున్నాను.  మా నాన్నగారు మాకు పంచిన విలువలతో వాడిని పెంచాను. అవే మా నాన్నగారు నాకిచ్చిన ఆస్తి.  

“నాన్నా, పదండి వెళ్దాము” కళ్యాణ్ , రఫీ ని పిలవటంతో రఫీ ఈ లోకంలోకి వచ్చాడు.

కళ్యాణ్ తన తండ్రి అంగీకారంతోనే ‘వెరోనికా’ అనే ఒక అమెరికన్ ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఎనిమిదేళ్ళ బాబు. కళ్యాణ్ తన తండ్రి పేరునే కొడుకుకి పెట్టుకున్నాడు ‘రఫీ’ అని. కాలిఫోర్నియా లో ఇల్లు కొనుక్కొని సెటిల్ అయ్యాడు. కళ్యాణ్ కి తండ్రి అంటే చాలా ప్రేమ, గౌరవం.  అరవై యేళ్ళు వస్తున్న తండ్రిని దగ్గరకి తెచ్చుకొని , కేర్ తీసుకోమని వెరోనికా సలహా ఇచ్చింది. రఫీ ని రిటైర్ అవ్వమని చెప్పి, తనతో పాటు కాలిఫోర్నియా లో ఉండమని కళ్యాణ్ కోరాడు. రఫీ కి యాభై యేళ్ళ సావాసం జర్నలిజం తో. కానీ పని వత్తిడి తట్టుకోవడం కష్టంగా అనిపించసాగింది. పైగా కొత్త కొత్త ఛానెల్స్ రావడంతో పాత జర్నలిస్టుల హవా తగ్గిపోయింది. ఇన్నేళ్లు కష్టపడ్డాడు. ప్రాక్టికల్ గా ఆలోచించాడు. తన తండ్రి అన్న మాటలు గుర్తుతెచ్చుకున్నాడు. ఇప్పుడు ఉన్న జీవితాన్ని వదిలేసి, ఫ్యామిలి తో ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకున్నాడు. అందుకే కళ్యాణ్ అడిగిన వెంటనే ఇష్టంగానే ఇండియా వదిలేసి అమెరికా వచ్చేశాడు.

వచ్చిన మొదటి వారంలో నే అరెస్టు అయి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. కళ్యాణ్ తనకి తెలిసిన లాయర్ ని పట్టుకెళ్ళి, రఫీ ని విడిపించుకొని వచ్చాడు. ఇంటికి కార్ లో తిరిగొస్తున్నప్పుడు,

“నా తప్పే. పిల్లాడిని అనవసరంగా కొట్టాను” రఫీ బాధగా అన్నాడు.

“అయ్యో లేదు నాన్నా. ఇక్కడ పిల్లలని దారిలో పెట్టడం చాలా కష్టం. మీ తప్పు లేదు ఇందులో” కళ్యాణ్ డ్రైవ్ చేస్తూ తండ్రిని సముదాయిస్తున్నాడు.

“పిచ్చివాడిలాగా మాట్లాడకు. తప్పు నాదే. ఇంపేషన్ట్ అయిపోయాను సడన్ గా. వాడి అల్లరికి నాకు కోపమొచ్చేసి కొట్టేశాను. కానీ వాడు ఇలా పోలీసులకి కాల్ చేస్తాడని అనుకోలేదు” రఫీ అన్నాడు.

“మీకు తెలిసిందే కదా నాన్న… ఇక్కడ స్కూల్ లో నేర్పిస్తారు. ఇంట్లో ఎవరైనా కొడితే 911 కి కాల్ చేయమని. ఇంతకీ వాడు ఏమన్నాడు మిమ్మల్ని?”

“నన్ను ఒక అసభ్యకరమైన భూతు తిట్టాడు”

“నేర్చుకుంటాడులే నాన్న. ఇంటికెళ్ళాక అన్నీ సర్దుకుంటాయి. మీరు ఎక్కువగా బాధపడకండి” అని కళ్యాణ్ అన్నాడు.

“అలాగే”

ఇంటికొచ్చాక వెరోనికా చక్కగా నవ్వి పలకరించింది. తన మీద ఏం కోపం లేదా అని రఫీ అడిగితే, తన కొడుకే ఏదో వెధవ పని చేసుంటాడని తనకి తెలుసని చెప్పింది. కళ్యాణ్, వెరోనికాలు చూపించే అభిమానం గురించి గర్వపడాలో..ఒక చిన్నపిల్లాడిని కొట్టినందుకు బాధపడాలో రఫీ కి అర్ధంకాలేదు. కొడుకుని తండ్రికి సారీ చెప్పమని అడిగాడు కళ్యాణ్.

“ఐ యాం సారీ” మనవడు అన్నాడు.

“హే రఫీ, ఐ యాం సారీ టూ ” రఫీ మనవడితో అన్నాడు.

“డోంట్ కాల్ మీ దాట్. ఐ యాం రాల్ఫ్, నాట్ రఫీ”

“ఒకే రాల్ఫ్, ఏమైనా ఆడుకుందామా?”

“నో. ఐ డోంట్ లైక్ యు” అనేసి తన రూమ్ లోకి పారిపోయాడు రాల్ఫ్. అలా అనకూడదు అని తిడుతూ వాడి వెంటే వెరోనికా వెళ్లింది.

“మీ పేరు పలకటానికి మీకు ఎక్సైటింగ్ గా ఉంటుందేమో కానీ, వీడికి మాత్రం ఎందుకో ఆ ‘రాల్ఫ్’ అంటేనే ఇష్టం నాన్నా. మీరు ఇంకా వాడికి అలవాటు అవ్వలేదు. వదిలేయండి. వాడిని మీతో వదిలేద్దాం అనుకున్నాము ఈ సమ్మర్ కి. వాడికి కొంచం తెలుగు కొంచం ఉర్దు, కొంచం హింది వచ్చు, మీ చేత అవి బాగా నేర్పిద్దాము అనుకున్నాము. కానీ వద్దులెండి. మళ్ళీ ఏదొకటి చేస్తాడు. సమ్మర్ కాంప్ కి పంపించేద్దాము” అని కళ్యాణ్ అన్నాడు.

మరునాడు పొద్దునే రఫీ నమాజ్ చేసి, కళ్యాణ్ సమ్మర్ కాంప్ వాళ్ళకి కాల్ చేస్తుండగా దగ్గరకి వచ్చి, “నేనొక తండ్రిని. జర్నలిస్ట్ ని. ఇంత అనుభవం ఉన్న నేను నా మనవడితో సఖ్యంగా లేకపోతే నాకు సిగ్గుచేటు. సమ్మర్ కాంప్ వద్దు. నేనే వాడితో ఫ్రెండ్ షిప్ చేస్తాను” అని నవ్వుతూ అన్నాడు.

కళ్యాణ్ కూడా తిరిగి నవ్వాడు, రఫీ ఏదో మాస్టర్ ప్లాన్ వేశాడు అని. తండ్రి అంటే అంత అపారమైన నమ్మకం. తండ్రి మాటంటే అంత గౌరవం.  కళ్యాణ్, వెరోనికా లీ ఆఫీసు కి వెళ్ళిపోయారు. రఫీ మనవడికోసం బ్రెడ్ టోస్ట్ చేశాడు.

“హే రాల్ఫ్, హావ్ దిస్” అని నవ్వుతూ రాల్ఫ్ కి ఇచ్చాడు.

“నో”

“ఆకలి లేదా?”

“నో”

“ఓకే. చాలా టేస్టి గా ఉంది మరి” అని అంటూ మొత్తం తినేశాడు రఫీ. రాల్ఫ్ పెదవులను నాలుకతో తడపటం తప్ప ఏమి చేయలేదు.

మధ్యానం లంచ్ కి ఎగ్ కరీ, అన్నం పెట్టాడు రఫీ. రఫీ వండాడు కనుక రాల్ఫ్ ముద్ద కూడా ముట్టుకోలేదు. కడుపు మాత్రం కాలిపోతోంది. వెరోనికా నాలుగు రోజులకని తన చెల్లెలి ఊరికి వెళ్లింది.  డిన్నర్ టైమ్ కి కళ్యాణ్ ని కిచెన్ లో చూసి, “డాడీ ఇస్ కుకింగ్” అనుకోని కొంచం హాపీ ఫీల్ అయ్యాడు. ఆలు ఫ్రై, సాంబార్ అన్నంతో ఫుల్ గా తినేశాడు రాల్ఫ్.

“డాడీ, కుక్ డైలీ ప్లీజ్. ఐ మిస్ దిస్ ఫుడ్” రాల్ఫ్ కళ్యాణ్ తో అన్నాడు.

కళ్యాణ్ రఫీ తో “డాడీ, కుక్ డైలీ ప్లీజ్. ఐ మిస్ దిస్ ఫుడ్” అని అనేసి నవ్వాడు.

వంట చేసింది తన డాడీ కాదు అని, రఫీ అని తెలుసుకొని, ఉక్రోషం వచ్చింది రాల్ఫ్ కి. కానీ అప్పటికే లొట్టలేసుకుంటూ మొత్తం తినేశాడు. వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ తన రూమ్ లోకి వెళ్లిపోయాడు.

“కళ్యాణ్… నేను నా మెయిల్ చెక్ చేసుకోవాలి, కంప్యూటర్ లేదా ఇంట్లో?” అడిగాడు రఫీ.

“ఉంది నాన్నా, జూనియర్ రఫీ రూమ్ లో” అని కళ్యాణ్ కన్నుకొట్టాడు.

కాసేపయ్యాక, “మే ఐ కమిన్?” రఫీ మనవడి రూమ్ తలుపు కొట్టాడు.

రఫీ గొంతు విని, “నో” అన్నాడు రాల్ఫ్.

“ప్లీజ్”

“నో” అని గట్టిగా అరిచేశాడు. చేసేదేమీ లేక, కళ్యాణ్ లాప్టాప్ ని రఫీ వాడుకున్నాడు. ఆ రోజు అలా గడిచిపోయింది.

మరుసటి రోజు పొద్దునే రఫీ ఉప్మా చేశాడు. కళ్యాణ్ తినేసి ఆఫీసు వెళ్లిపోయాడు. రఫీ కూడా తినేసి టి‌వి చూస్తూ కూర్చున్నాడు. రఫీ కి వినపడేలాగా గట్టిగా ఫోన్ లో తన డాడీ తో వంట ఎందుకు చేయట్లేదని  అడిగాడు. “వంట చేయటం మర్చిపోయాను, తాత బాగా చేస్తాడు. తిను” అని ఫోన్ కట్ చేశాడు కళ్యాణ్. మళ్ళీ ఉక్రోషం తో ఏం తినకుండా పడుకున్నాడు రాల్ఫ్. రాల్ఫ్ ని చూస్తుంటే రఫీ కి బాధగా ఉంది. కానీ వాడిని దారిలో పెట్టాలంటే ఇలాంటి బాధించే పనులు చిన్నవి చేయక తప్పదు. ‘కుచ్ పానే కే లియే కుచ్ ఖోనా హేయ్” అనుకున్నాడు రఫీ.

ఏదో బ్రిల్లియంట్ ఐడియా తట్టినట్లు, రాల్ఫ్ లంచ్ టైమ్ కి రయ్ రయ్ మంటూ రఫీ దగ్గరికొచ్చాడు. లాల్చీ పైజామా లో ఉన్న రఫీ ని చూసి ‘అబ్బాహ్ ఓల్డ్ మాన్’ అనుకున్నాడు.

“ఐ యాం హంగ్రీ”

“ఓకే”

“ఐ వాంట్ ఫుడ్”

“ఓకే”

“నేను కంప్యూటర్ ఇస్తాను. నాకు లంచ్ ఇయి” రాల్ఫ్ అన్నాడు వచ్చి రాని తెలుగులో.

“డీల్” అని రఫీ అనగానే జూనియర్ రఫీ మొహం వెలిగిపోయింది.

లంచ్ చేశాక చెప్పాలా వద్దా అని వందసార్లు ఆలోచించి “థాంక్స్” అనేసి లోపలికి వెళ్లిపోయాడు. మనవడు దారిలో పడ్డాడు అని సంతోషించి తను చదువుతున్న ‘రివర్స్ సైకాలజీ’ బుక్ చూసి నవ్వుకున్నాడు.

రెండు రోజులు ఇలాగే డీల్స్ నడిచాయి ఇద్దరి మధ్యన. రాల్ఫ్ రఫీ ని రఫీ అనే పిలుస్తున్నాడు ఇంకా. తాతా అని పిలిపించుకోవాలని రఫీ కి ఎంతో ఇదిగా ఉంది. ఆ రోజు రాల్ఫ్ దగ్గరకెళ్లి “ఒక ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి” అని తన చిన్నప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చాడు రాల్ఫ్ కి. రాల్ఫ్ ఆ ఫోటో ని జాగ్రత్తగా పరిశీలించి, రఫీ ని గుర్తుపట్టాడు. ఎంతో యంగ్ గా, అప్పట్లో స్టయిల్ తగ్గట్టు పాంట్, షర్ట్ వేసుకొని ఉండటం గమనించాడు.

“యు వర్ సొ హాండ్సమ్” రాల్ఫ్ అన్నాడు.

“యు ఆర్ సొ హాండ్సమ్” అని రాల్ఫ్ జుత్తుని నిమిరాడు రఫీ. రాల్ఫ్ సిగ్గుపడ్డాడు.

సాయంత్రం టైమ్ కి నేను వాకింగ్ చేసోస్తాను అని రాల్ఫ్ తో రఫీ అన్న వెంటనే, షూస్ వేసుకొని “మి టూ” అని రఫీ తో బయలుదేరాడు.  నడుస్తూ మధ్యలో రఫీ ని ఎన్నో ప్రశ్నలు అడిగాడు, రఫీ ఒక గొప్ప వ్యక్తి అని రాల్ఫ్ చిన్న మనసుకు అర్ధమయింది. తన తాత ది కూడా లవ్ మేరేజ్ అని తెలుసుకున్నాడు.

“యు వర్ ఎ ఫ్రీడం ఫైటర్?” అడిగాడు రాల్ఫ్.

“ఇన్ ఎ వే, యెస్” రఫీ అన్నాడు.

“యు ఆర్ గ్రేట్ తాతా” రాల్ఫ్ అన్నాడు.

‘తాతా’ అని వినగానే రఫీ కళ్ళనుండి ఆనంద భాష్పాలు కారాయి. ఎన్నో భావాలు. జర్నలిస్ట్ గా సాధించిన సక్సెస్ అంతా ఈ ఒక్క పిలుపుతో వచ్చినట్లు అనిపించింది. నవ్వుతూ రాల్ఫ్ ని హగ్ చేసుకున్నాడు. రాల్ఫ్ కూడా తన తాత ని మనసారా హగ్ చేసుకున్నాడు.

ఇంటికొచ్చాక తాను తెలుసుకున్న విషయాలు అన్నీ కళ్యాణ్ తో రాల్ఫ్ చెప్పాడు. తన తండ్రి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురుకున్నాడు. చిన్నతనంలోనే రఫీ తండ్రి పోవటం, జర్నలిస్ట్ జీవితం, భార్యతో కూడా ఎక్కువ కాలం గడపలేదు.  అమ్మ లేని లోటు తెలియకుండా, ఎంతో ప్రేమగా, మోరల్స్ నేర్పిస్తూ పెంచిన తండ్రిని హగ్ చేసుకోవడం ఇప్పుడు కళ్యాణ్ వంతు. ఈ సెంటిమెంట్ సీన్ నుండి బయటపడాలని రాల్ఫ్ “తాత ఇవాళ పకోడీ, చికెన్ బిర్యానీ, కేక్ చేస్తాడు” అని అన్నౌంస్ చేశాడు.

“యెస్. పకోడీ ఫర్ ఉర్దు, బిర్యానీ ఫర్ హింది, కేక్ ఫర్ తెలుగు- డీల్స్. అవన్నీ నేర్చుకుంటావా మరి?” కన్నుకొడుతూ అడిగాడు సీనియర్ రఫీ.

“ఎనీథింగ్ ఫర్ ఫుడ్ అండ్ థాథా” అని ‘తాతా’ అనే పదాన్ని అమెరికన్ అక్సెంట్ లో అంటూ, తిరిగి కన్నుకొట్టాడు జూనియర్ రఫీ.

************************************************************************

గమనమే గమ్యం -25

 

img549

 

 

బెంగాల్‌ కరువు గురించి చిన్నగా మొదలైన వార్తలు  కొన్ని రోజుల్లోనే దేశాన్ని ఒణికించేంత పెద్దవయ్యాయి. బెంగాల్‌ ప్రజలకు సహాయం చెయ్యాలనే ప్రచారంతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు కమ్యూనిస్టు యువతీ యువకులు. వారిలో కొందరు పాటలు రాశారు. మరికొందరు నాటకాు తయారు చేశారు. కొందరు ఒక బృందంగా  ఏర్పడి బెంగాల్‌ వెళ్ళి కరువుని స్వయంగా అధ్యయనం చేయాలనీ, దానితో పాటు వాలంటీర్లుగా అక్కడ పని చేయాలనీ నిశ్చయించుకున్నారు. ఆ బృందం లో  కామేశ్వరం వు ఉన్నాడని  తెలిసి శారదకు ఆందోళనగా ఉంది.

కామేశ్వరరావు శారదకు మంచి స్నేహితుడు. మేధావి. బాగా చదువుతాడు. శారదతో దీటుగా చర్చలు  చేయగల  సామర్థ్యం ఉన్న వాడు. కానీ అతి సున్నిత హృదయుడు. ఎదుటివారు బాధపడుతుంటే చూడలేడు. వారి కళ్ళు తడి  కాకముందే ఇతని చెంపలు  కన్నీటితో తడిసిపోత యి. అలాగే హటాత్‌ నిర్ణయాలు  తీసుకుంటాడు. కొన్ని రోజులు  ఎవరికీ కనపడకుండా ఎటో వెళ్ళిపోతాడు. ఇలాంటివాడు ఆ కరువు దృశ్యాలు  చూసి భరించగలడా అని శారదకు భయం వేసింది. వార్తల్లో చదువుతుంటేనే ఒళ్ళు జలదరించి, అన్నం సహించటం లేదు. కామేశ్వరావు అవన్నీ చూసి మనిషిలా తిరిగి రాగలడా అనిపించింది. కానీ ఏం లాభం ఎవరు చెప్పినా  వినే మనిషి కాదు. ఈ బృందంతో వెళ్ళకుండా బలవంతంగా ఆపినా  ఒక్కడే ఏదో ఒకరోజు కలకత్తా రైలు  ఎక్కేయగల  సమర్థుడు. దానికంటే పదిమందితో కలిసి వెళ్ళటమే నయం అనుకుని ఆందోళన అణుచుకుంది.

olgaఅణుచుకోలేని సమయంలో మూర్తితో చెబితే ‘‘నువ్వు ఇన్ని విషయాలు  ఎందుకు పట్టించుకుంటావు. ఒకవైపు ప్రజాయుద్ధ ప్రచారం. మహిళా సంఘం సభ్యులు . నీ హాస్పిటలు , పార్టీ సమావేశాలు  వీటన్నిటితో మళ్ళీ కామేశ్వరరావు ఏమవుతాడు? సోమేశ్వరరావు  ఏమవుతాడు అని ఒక్కొక్కరి గురించి పట్టించుకుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది. ఒక మనిషి చేసే  పనులేనా  నువ్వు చేసేది? అందరి బాధ్యతలూ  నువ్వేనా  మోసేది? కామేశ్వరరావు సంగతి తరువాత,  కాస్త నటాషా గురించి కూడా ఆలోచించు’’ అని మనసులో కోపమంత వెళ్ళగక్కి వెళ్ళాడు.

శారద ఈ ఉరుములేని పిడుగుల  జడి కి ఆశ్చర్యపోయింది? ఏమయింది మూర్తికి? ఏదో జరిగింది. లేకపోతే ఇంత ఉద్రేకపడడు అనుకుని మేడమీది నుంచి కిందకు దిగింది. కింద సుబ్బమ్మ నటాషాని ఎత్తుకుని నిలబడి ఉంది.

‘‘డాక్టరుగారి కూతురికి కాస్త ఒళ్ళు వెచ్చబడింది. డాక్టరు గారి మొగుడికి కోపం వచ్చింది’’ అన్నది తమాషాగా.

శారదకంతా అర్థమైంది. నటాషాను ఎత్తుకుని మేడమీదికి వెళ్ళి మందు తాగించి  నిద్రబుచ్చి మళ్ళీ భుజాన వేసుకుని వచ్చి తల్లికప్పగించింది.

‘‘ఇవాళ అన్నం పెట్టకమ్మా. పాలు చాలు . రేపటికి తగ్గిపోతుంది’’.

‘‘నీ కూతురి గురించి మీ ఆయనకు దిగులు . నా  కూతురి గురించి నాకు దిగులు.   మరీ పనులెక్కువవుతున్నాయి. తిండి  తినటం లేదు. నిద్ర పోవటం లేదు. ఎట్లాగమ్మా ఇట్లాగయితే’’.

‘‘ఏం ఫరవాలేదమ్మా. మా అమ్మ నా  పొట్ట మాడనివ్వదు. ఎలాగోలా నిద్రబుచ్చుతుంది’’.

సుబ్బమ్మ నవ్వి ‘‘మాటలు  చెప్తావ్‌. మూర్తి మాత్రం బాగా దిగుపడుతున్నాడు. అతను మద్రాసు నుంచి వచ్చినా  నీకు తీరిక దొరకదు. అక్కడున్నా  నీ గురించిన బెంగే కదా –  పాపం. పిల్ల కూడా నన్ను ఒదిలి తొందరగా అతని దగ్గరకు పోదు. ఈ దిగుళ్ళతో సతమతమవుతున్నాడు. తనూ ఇక్కడ కే వచ్చేస్తానంటున్నాడు.

‘‘వచ్చి ఇక్కడేం చేస్తాడు. మద్రాసు పనులు  ఎవరికి అప్పజెప్పి వస్తాడు? అతనిక్కడకి వస్తే నాకు  మాత్రం కాస్త తెరిపిగా ఉండదా? కానీ పరిస్థితులు  గందరగోళంగా ఉన్నాయమ్మా. అందరం సర్దుకుపోవాలి’’ అంటూ హాస్పిటల్‌కి వెళ్ళింది శారద.

మూర్తి బెజవాడకు వచ్చి పూర్తికాలం  ఇక్కడ పార్టీ పనులు  చూసుకోమంటున్నామని రాష్ట్ర కమిటీ నుంచి వార్త వచ్చిన రోజు శారద సంతోషించింది. ముఖ్యంగా నటాషా మూర్తి దగ్గరవుతారనీ నిశ్చింతగా అనిపించింది. ఇంట్లో వచ్చిన ఈ మార్పే కాదు బైట వాతావరణంలో కూడా మార్పు వస్తోంది.

ప్రపంచ యుద్ధంలో హిట్లరు పరాజయం  తప్పదని గట్టిగా రుజువవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ క్విట్‌ ఇండియా ఉద్యమంతో ప్రజలకు దగ్గరవుతుంటే కమ్యూనిస్టులు  ప్రజాయుద్ధ పంథాతో దగ్గర అయ్యారు. అది పై తరగతి మధ్య తరగతి వర్గం లో  ఎక్కువ కనిపిస్తోంది. కృష్ణా , గుంటూరు ప్రాంతంలో చిన్న రైతులలో, కూలీలలో కూడా వారు గట్టి పట్టు సంపాదించారు. క్విట్‌ ఇండియా అంటున్న ప్రజల  మనసుల్లో కూడా సోవియట్‌ యూనియన్‌ గురించి ఆసక్తిని పెంచారు. దాని ద్వారా సోషలిజం అనే భావనను బలం గా వ్యాపింప చేయగలిగారు. శారదాంబ, ఆమె చుట్టూ ఉన్న మహిళా బృందం చేసే  పనులు  మామూలు  ప్రజలకు ఆశ్చర్యంగా ఉండేవి కానీ వారి  పట్ల విముఖత కలగలేదు. ఒకవైపు బోసు, మరొకవైపు గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌, ప్రజలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నా, కమ్యూనిస్టు భావనలు  ప్రజలకు దగ్గరయి కమ్యూనిస్టుల  మీద గౌరవం పెరిగిందంటే అది శారద, రామకృష్ణయ్య, ఈశ్వరయ్య, వెంకట్రావు, సూర్యావతి  వంటివాళ్ళ నాయకత్వ ప్రభావమే.

జర్మనీ ఓడిపోయిన రోజున పెద్ద పండగలా ప్రజలో ఉత్సాహం  నింపగలిగారు.

olga title

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత  మొదలైంది అసలు  సమస్య. ప్రజలలోకి ఎట్లా వెళ్ళాలి. ప్రజాయుద్ధ పంథా తర్వాత  ఆంధ్రప్రాంతంలో కార్యక్రమం ఏమిటి? ఈ చర్చలు  జరుగుతుండగానే ఒకవైపు ఎన్నికలు , ఇంకోవైపు తెలంగాణాలో నైజాం వ్యతిరేక పోరాటం లో  పెరుగుతున్న కమ్యూనిస్టు పార్టీ ప్రాబ్యల్యం , బెంగాల్‌లో కరువు గురించి పట్టించుకుని పని చేయాలనే నిర్ణయం, వీటన్నిటికీ తోడు కళా సాహిత్య రంగాల  ద్వారా  ప్రజల కు దగ్గరయ్యే కార్యక్రమాలు , రచయిత సంఘాల  ఏర్పాట్లు , నాటకాలు  –  ఒకటి కాదు ఆలోచించుకునే వ్యవధానం లేకుండా పనులు  వచ్చి మీద పడుతున్నాయి.

మూర్తి మద్రాసు నుంచి బెజవాడకు వచ్చేసిన రెండు నెలలకు అప్పటివరకూ శారద చూస్తున్న కృష్ణాజిల్లా బాధ్యతలు  మూర్తికి అప్పగించింది పార్టీ.

శారదకు ఆ మార్పెందుకో అర్థం కాలేదు.

‘‘నువ్వు కొత్తగా వచ్చావు. ఇక్కడ పరిస్థితుల  గురించి అవగాహన లేదు. పార్టీ నిన్ను గౌరవించటానికన్నట్లు, నీకో పని చూపటానికన్నట్లు ఈ బాధ్యత ఇచ్చిందనుకో -నువ్వెట్లా ఒప్పుకున్నావు? నా  వల్ల  కాదని ఎందుకు చెప్పలేకపోయావు?’’

శారద ప్రశ్నకు మూర్తి దగ్గర సమాధానం సిద్ధంగానే ఉంది.

‘‘నువ్వు చాల  అలిసిపోతున్నావు శారదా –  ఒకవైపు నీ ప్రాక్టీసు. ఇంకో వైపు మహిళా ఉద్యమం. ఇప్పుడు తల్లివయ్యావు. వీటన్నిటితో జిల్లా అంతటినీ నీ భుజాల కెత్తుకోవటం కష్టం. నా భుజాలు  ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ విషయాలు  నీ ద్వారా నాకు చాలా వరకు తెలుసు. తెలియనివి తెలుసుకుంటాను. పార్టీ నిర్ణయం వెనక కూడా ఇవన్నీ ఉన్నాయి’’.

‘‘గృహిణి ` భార్య, తల్లి ఈ పదాలు  నాకు నప్పవు. నచ్చవు. నువ్వు నా  జీవితంలోకి వచ్చినందువల్ల నా  జీవితం ఏమీ మారదు. మారనవసరం లేదు’’. విసుగ్గా అంది.

‘‘మారుతుందో మారదో ఆ సంగతి ముందు ముందు తెలుస్తుంది గానీ, నీకు బాధ్యతలు  పెరిగి పోయాయి. డాక్టర్‌గా నువ్వు చెయ్యవలసినంత చెయ్యలేకపోతున్నావు. నాకు  ఈ జిల్లా పనుల గురించి తెలియజెప్పటానికి నువ్వున్నావుగా’’ శారదకు ఏదో చికాకు మనసంతా – కానీ పార్టీ నిర్ణయాన్ని కాదనటం తేలిక కాదు. తను జిల్లా పార్టీ నాయకత్వం ఒదల కూడదని కాదు – తన స్థానంలో రావటానికి అర్హులైనవారు చాలామంది ఉన్నారు . సుబ్బారావుగారే ఉన్నారు. చాలా కింది స్థాయి నుంచీ  పైకి వచ్చిన కార్యకర్త. నిజమైన కమ్యూనిస్టు. ఊరికే మాటలు  చెప్పి తప్పించుకునే మనిషి కాదు. తన జీవితంలో ఆచరించే వ్యక్తి. మూర్తికి జిల్లా బాధ్యత అప్పగించటమంటే కేవలం  తన భర్త కాబట్టే – తమ పెళ్ళి కాకపోతే అతనిక్కడకి రానే రాడు కదా – ఇంత స్పష్టంగా కనపడుతున్న విషయానికి మూర్తి కళ్ళెందుకు మూసుకున్నాడు.

ఏదేమైన పార్టీ నిర్ణయించినపుడు తనకు ఇన్ని ఆలోచను అనవసరం అని అక్కడ తో సమాధానపడింది శారద.

***

సత్యవతి నాదెళ్ళ వారి పాలెంలో మహిళాసంఘం సభ తర్వాత  వాళ్ళన్నయ్య దాసుని కలిసింది. దాసు పార్టీ నాయకులతో మాట్లాడ ఆమెను రాజమ్మతో కలిసి పార్టీ ఆఫీసు వెనక గదిలో ఉండి మహిళా సంఘం పనులు  చేసేలా ఏర్పాటు  చేశాడు. రాజమ్మది, సత్యవతిది దాదాపు ఒకే వయసు. కాస్త రాజమ్మే పెద్దదేమో. ఇద్దరూ బాగా కలిసి పోయారు. రాజమ్మ చుట్టు పక్కల గ్రామాలన్నీ తిరిగి మహిళా సంఘ ఆశయాలు  వివరిస్తూ మహిళలను సమీకరించే పని చేస్తోంది.

సత్యవతికి బెజవాడలో మహిళా సంఘం పనులు  కొన్ని అప్పగించి రాజకీయ శిక్షణ కూడా ఇచ్చేలా ఏర్పాటు  చేశారు. చెరొక 20 రూపాయలు  నెలకు ఇచ్చేవారు. అద్దె, భోజనం, మిగిలిన ఖర్చులన్నీ అందులోనే. రాజమ్మకు గ్రామాలకు వెళ్ళినపుడు అక్కడ మంచి భోజనం దొరికేది. సత్యవతికి వంట సరిగా రాదు. మొదట్లో అవస్థ అయినా  రానురానూ  అలవాటు పడింది . పార్టీ ఆఫీసులో, మహిళా సంఘంలో చురుగ్గా పని చేస్తూ, కుదురుగా ముచ్చటగా ఉంటూ, ఎంతో సంస్కారంతో మాట్లాడే సత్యవతి పార్టీ సానుభూతిపరులైన కొందరి యువకుల మనసుల్లో కల్లోలం  రేపింది. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనే కోరికను పార్టీ పెద్దతో చెప్పారు. అవివాహిత బాధ్యత పెద్ద బాధ్యత అని పార్టీ భావించేది. వాళ్ళకు పెళ్ళి చేస్తే  తమ గుండె మీది బరువు తగ్గి, వాళ్ళ తిప్పలు  వాళ్ళు పడరారు అనే భావన తెలిసీ తెలియకా అందరిలో ఉండేది. దానితో సత్యవతికి ఇక్కడ కూడా సంబంధాలు రావటం మొదలైంది. సత్యవతి ప్రతి సంబంధాన్నీ తిరస్కరింఛి  పార్టీ నాయకులకు చికాకు, అనవసరమే అయినా  వచ్చింది.

ఈ సత్యవతి సంగతేమిటో తేల్చమని మహిళా సంఘ నాయకులకు ఆదేశాలిచ్చారు. అది శారద వరకూ వచ్చింది. శారద జరిగిందంతా తెలుసుకొని  నిర్ఘాంత పోయింది . ‘‘సత్యవతి పెళ్ళి తప్పించుకుని చదువుకోవాలని  వస్తే  చదువు గురించి ఆలోచించకుండా సంవత్సరంలో నాలుగైదు  పెళ్ళి సంబంధాలు  ఆమె ముందు పెట్టటం ఏమిటి? ఆ అమ్మాయి ఒద్దంటే ఈ అమ్మాయికి ఎవరూ నచ్చరేమిటని కోపగించుకుని అదొక చర్చ చేయటమేమిటని అందరినీ మందలించి – మీకు వీలైతే ఆ అమ్మాయిని బెనారెస్  మెట్రిక్‌కు తయారు చేయండి . లేదంటే జనరల్‌ పుస్తకాలు  చదువుతూ ఆ అమ్మాయి తనే తంటాలు  పడ చదువుకుంటోంది. మహిళా సంఘంలో పని చేస్తుంది కాబట్టి ధైర్యం, ఆత్మ విశ్వాసం లోకజ్ఞానం పెరుగుతాయి. ఆ పిల్లకు పదహారేళ్ళే – చిన్నపిల్ల. ఇది కూడా బాల్య  వివాహమే’’ అంటూ బాగా చికాకు పడింది .

శారద మాట్లాడిన తర్వాత  ఇక సత్యవతికి పెళ్ళి చెయ్యాలనే ఆలోచన అందరూ మానుకున్నారు. సత్యవతి నిశ్చింతగా తన పని తాను చేసుకుంటోంది. ‘కన్యాశుల్కం ‘ నాటకం, ‘‘పూర్ణమ్మ’’ గేయ రూపకం సాంస్క తిక బృందాల  ప్రదర్శనల్లో ముఖ్య భాగమైపోయాయి. పార్టీ సభ్యులు  స్వయంగా నటించి కన్యాశుల్కం  నాటకాన్ని రక్తికట్టిస్తున్నారు. సుభద్ర, సుబ్బారావు దంపతు, కోటేశ్వరమ్మకు కన్యాశుల్కం  నాటకంతో బాగా పేరొచ్చింది. అంతకు ముందొకసారి ముసలి మొగుడి ని పెళ్ళి చేసుకోమనే అర్థం వచ్చే పాటులు  పాడారని మహిళా సంఘం వాళ్ళని తిట్టి మీకు ముసలివాళ్ళు పనికిరారా  అంటూ అర్థం లేని  మాటలు  మాట్లాడిన కార్యకర్తలకు బాల్య వివాహాల   గురించి, వాటి చెడు ఫలితాల   గురించి అర్థమైంది. అలాంటి మాటలు  వినిపించటం లేదు. రచయిత సమావేశాలు  తరచు జరగటంతో ఆంధ్రా ప్రాంతం లో  ఒక చైతన్యం వ్యాపించింది . అది రాజకీయాలకు సంస్కారాన్ని జతగలపటంతో కమ్యూనిస్టులంటే సంస్కారవంతులనీ, స్త్రీలను గౌరవిస్తారనే అభిప్రాయం సామాన్య జనం  లో కూడా ఏర్పడింది.

***

 

 

 

 

 

మట్టి, ఆ మట్టిలో కలిసేవి.

 

 

-కందుకూరి రమేష్ బాబు

~

Kandukuri Rameshచాలా సాహసం అనిపిస్తుందిగానీ ఏమీ కాదు.
దైనందిన జీవితంలో యధాలాపంగా కనిపించే ప్రతీదీ మాట్లాడుతుంది.

అసలు రోజువారీ జీవనచ్ఛాయలోనే సమస్తం ప్రవహించి గడ్డ కడుతుంది.
ఫ్రీజ్ చేసి చూస్తే అన్ని వ్యాపకాలు పరుగులు పెడతాయి.

నిశ్శబ్దంగా చిత్రం పలు చిత్రాలు చెబుతుంది.

నిజానికి ఛాయాచిత్రకళ సింగిల్ ఎగ్జిబిట్.
దేనికదే ఒక గ్రంథం.

తొలుత పుట అనుకుంటాం.
కానీ, పిదప అది పుస్తకం, గ్రంథం.
ఒక్కోసారి ఖురాన్, భగవద్గీతా అవుతుంది.
లేదా ఏమీ కాకుండా చదివిన మర్మాలనెల్లా వదిలించే బ్యాక్ టు బేసిక్ లెసన్ ఒకటి చెబుతుంది.

లేదా సుసాన్ సాంటాగ్ ఆన్ ఫొటోగ్రఫీలా వివరణ.
వివరణలు పోతుంది.
మరోసారి హెన్రీ కార్టియర్ బ్రస్సన్ నిశ్చలం చేసే లిప్త- డిసిసివ్ ముమెంట్.
అంటే మన నుంచి తప్పుకునేదే కాదు, మనం తప్పుకోకుండా ఆగి చిత్రించేదీ అన్న సోయినీ కలిగిస్తుంది.

చిత్రం సామాన్యమైన కొద్దీ పరిపరి విధాలు.
మొదట పరామర్శ లేదా పరిచయం అనుకుంటాం
ఇంకా చూస్తే అంతిమ విశ్లేషణా అవుతుంది.

ఈ చిత్రం నా వరకు నాకు సంక్షిప్తం. విస్త్రృతమూ.
సామాన్యశాస్త్రం. ఒక సింగిల్ ఎగ్జిబిట్.

మొదట బాగోదు.
కానీ, చూడగా చూడగా ఒక డైజెస్ట్ చేసుకోతగ్గ ఫ్యాక్టు ఇందులో రిఫ్లెక్ట్ కావడం లేదూ అని ఎన్నిసార్లు అనుకున్నానో!

కానీ మొహమాట పడ్డాను.
ప్రచురణకు పంపాలంటే రెండేళ్లు పట్టింది.
ఇప్పటికీ అధిగమించడం నయమైంది.

తెలుస్తున్నదేమిటంటే చిత్రించినప్పుడే మొహమాటం అధిగమించానని!
చిత్రించినప్పుడే వికసించామని!

కెమెరా లెన్స్ కలువ పువ్వులా తెరుచున్నదీ అంటే బురద నుంచి వికసించిందనే అర్థం.
అక్కడే వికాసం ఉన్నదీ అంటే వస్తువు నిన్ను హత్తుకున్నదీ అంటే అది సత్యం శివం సుందరం
ఇది అదే మరి!

చూడండి.
మట్టి,
ఆ మట్టిలో కలిసేవి.

ఒకానొక ఉషోదయాన…మేడారం మట్టిలో…చిలకలగుట్ట దిగువన
ధన్యురాలైంది ఈ చిత్రాన్ని భద్రపర్చిన కుంకుమ భరిణె నా కెమెరా.
జీవితం, మృత్యువు. రీసైక్లింగ్ తో పావనం చేసింది ఈ మనిషిని.

ఒక ఫిజికల్ మెటాఫిజికల్ ఎనలైటెన్డ్ భావన.
తీసిన చిత్రం మహత్తరం అని తెలిసినప్పటికీ
ఆ తీసిన చిత్రాన్ని చూపించడం కూడా సామాన్యం కాదనీ తెలుస్తుంది.

చూపిస్తే నా పని పూర్తవుతుంది.
ఈ వారం నా వివరణే దృశ్యాదృశ్యం

నీడ,
జీవనచ్ఛాయ.
రెండూ చూడండి.

పేడు, పేడ.
రెండూ ఒక్కచోట.
సైకిల్, రీసైకిల్డ్.

సత్యం శివం సుందరం.

*

సంగమాలు సంగరాలౌతోన్న సందర్భంలో…

 

-ఎ.కె. ప్రభాకర్

~

కథాసాహిత్య విమర్శకుడు ఎ.కే ప్రభాకర్

వివాహ వ్యవస్థలోని  ఆధిపత్యాల గురించి  అసమానతల గురించి అణచివేతల గురించి అభద్రత గురించి స్త్రీ పురుష సంబంధాల్లో చోటుచేసుకొనే   వైరుధ్యాల గురించి నైతిక విలువల గురించి చర్చిస్తూ యీ నేలమీద స్త్రీవాదం మాట పుట్టక ముందు నుంచి కూడా సాహిత్యం విస్తృతంగానే వెలువడింది. అయితే స్త్రీవాదం ఆ వ్యవస్థలో వేళ్ళూనుకొన్న పితృస్వామ్య భావజాలం జెండర్ రాజకీయాల లోతుల్లోకి వెళ్లి అధ్యయనం చేసి సైద్ధాంతిక పునాదినుంచీ కొత్త దృక్పథాల్ని – కొత్త డిక్షన్ తో సహా – జోడించింది. పెళ్లి వొక ప్రయోగం అనీ ఆ ప్రయోగంలో యెంత మంది యెన్ని సార్లు విఫలమైనా కొత్తవాళ్ళు మళ్ళీ అదే ప్రయోగం చేస్తున్నారనీ కథలు ( ఓల్గా ) వచ్చాయి. పెళ్ళికి   ప్రత్యామ్నాయంగానో  వికల్పంగానో సహజీవనం (లివింగ్ టూగెదర్) వొంటరి బతుకు (సింగిల్ లైఫ్ స్టైల్ ) అనే ఆలోచనా ఆచరణా యిటీవలి కాలంలో బలపడ్డాయి. సహజీవనంలో సైతం  వినిపించే అపశ్రుతుల్ని కనిపించని కట్టుబాట్లనీ బహిరంగంగా చెప్పుకోలేని భయసందేహాల్నీ  సంక్షోభాలనీ సమన్వయ లోపాల్నీ వొత్తిడికి గురౌతోన్న సందర్భాల్నీ కల్లోలానికి లోనయ్యే సున్నితత్వాల్నీ సంక్లిష్టమోతోన్న మానవసంబంధాల్నీ బలంగా ఆవిష్కరించిన కథ ‘శతపత్ర్రసుందరి’( ఆంధ్ర ప్రదేశ్ – మాస పత్రిక , జూన్ 2015). స్త్రీ పురుష సంబంధాల్లోని ఐక్యత ఘర్షణల్నీ కనిపించే పెత్తనాల్నీ కనిపించని హింసనీ మనుషులమధ్య – మనుషుల్లోపల యేర్పడుతోన్నఖాళీలనీ తనదైన శైలిలో చక్కటి నేర్పుతో సాహిత్యీకరిస్తున్న కె ఎన్ మల్లీశ్వరి దాని రచయిత. వస్తు శిల్ప నిర్వహణల్లో యెంతో సంయమనాన్నీ శ్రద్ధనీ గొప్ప పరిణతినీ చూపడం వల్ల యీ కథ మల్లీశ్వరి రాసిన కథల్లో ప్రత్యేకంగా నిలబడుతుంది. కథలో చెప్పిన అంశాలకంటే చెప్పదల్చి చెప్పకుండా వదిలేసిన అంశాలే పాఠకుల బుర్రకి పని పెడతాయి. చదివిన ప్రతిసారీ పాత్రల ప్రవర్తన విషయికంగా కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. వాటి అంతరంగాల లోపలి పొరలు ఆ పొరల్లోపల సంభవించే ప్రకంపనలు ఆవిష్కారమౌతాయి. సంభాషణల్లోని కాకుస్వరాలు  వాక్యాలమధ్య దాగున్న అంతరార్థాల్ని బోధపరుస్తాయి. ముగింపు ఓపెన్ గా వొదిలేయడం వల్ల అనేకార్థాలకీ విరుద్ధ వూహలకీ ఆస్కారం కల్గిస్తుంది. అది యీ కథకున్న బలమో బలహీనతో విశ్లేషించుకోవాలంటే వాచకం లోతుల్లోకి వెళ్ళాలి.

అలా వెళ్ళే ముందు కథా సారాన్ని నాల్గు ముక్కల్లో చెప్పుకుందాం:

క్రిమినల్ లాయర్ సదాశివ యేదో ఆఫీస్ లో వుద్యోగం చేసే నీలవేణి లివింగ్ టుగెదర్ జంట. కథాకాలానికి వొకరి స్వేచ్ఛని మరొకరూ వొకరి వ్యక్తిత్వాన్ని మరొకరూ గౌరవించుకోడానికి కావాల్సిన స్పేస్ ని కాపాడుకొంటూ పది సంవత్సరాలుగా కలిసి వుంటున్నారు. ఆమె వొక  సామ్రాజ్ఞిలా అతని హృదయాన్ని యేలుతూవుంటుంది.  నీలవేణి ఔత్సాహిక నటి కూడా. ఒకానొక నాటక ప్రదర్శన ద్వారా డైరెక్టర్ గౌతమ్ ఆమెకి దగ్గరవుతాడు. యెంతో సంస్కారవంతుడూ విప్లవ భావాలు కలవాడూ న్యాయంకోసం బాధితుల పక్షంలో సమస్త శక్తులూ వొడ్డి పోరాడే సాహసీ అయిన సదాశివ నీలవేణి అల్లుకొనే కొత్తసంబంధాన్నిఅంగీకరించలేడు. నీలవేణి శాశ్వతంగా తనకే – కేవలం తనకే – వుండాలనుకొంటాడు.

కానీ జీవితంలోకి కొత్తగా వచ్చిన గౌతమ్ ఆలోచలు నీలవేణికి ఎంతో హాయినిస్తాయి. వాళ్ళిద్దర్నీ ‘కలిపి ఉంచే మహోద్వేగపు ప్రవాహమే’ ఆమెని నడిపిస్తోంది. సదాశివ సమక్షంలో కూడా ‘సన్నని నూలుచీరలా వొంటికి చుట్టుకొన్నట్టు మనసుకి హత్తుకుపోయిన గౌతమ్ ఊహని విడదీయడం ఆమెకి సాధ్యం కావడం లేదు’. విడదీయాలని కూడా ఆమెకి లేదు. ఆమెకి అతను జీవితలోకి వచ్చేసిన సెలబ్రేషన్. అలా పండగలా వచ్చినతన్ని సదాశివ కోరినంత మాత్రాన పొమ్మనలేదు. పొమ్మన్నాఅతను పోడు. అదే సదాశివకి ఆమె స్పష్టం చేసింది.

సదాశివ  గింజుకొన్నాడు. అడ్డొచ్చిన వాటిని పగలదన్నాడు.  యేడ్చాడు. మొత్తుకొన్నాడు. వాపోయాడు. బతిమాలాడు. బెదిరించాడు. అంతకు ముందు తమ సహజీవనంలోకి తాత్కాలికంగానైనా యిద్దరు స్త్రీలను సదాశివ తీసుకువచ్చినప్పుడు ఆ చొరబాటులో  తానెంత వొత్తిడికి లోనైందీ దాన్ని అధిగమించి సంబంధాన్ని నిలుపుకోడానికి తానతన్ని వోర్పుతో యెంతగా ప్రేమించిందీ నీలవేణి స్పష్టం చేసింది. సదాశివ తప్పు వొప్పుకొన్నాడు. చేతులు పట్టుకొన్నాడు. కాళ్ళబడ్డాడు. ఆమె గాంభీర్యం ముందు భంగపడ్డాడు . చివరికి చస్తానన్నాడు. అతనిలోని ద్వంద్వ ప్రవృత్తి తెలుస్తోన్నా ఆ క్షణంలో ఆమె  గుండెలో యే సానుభూతి వీచిక కదిలిందో యే ప్రేమోద్వేగ పవనం వీచిందో పదేళ్ళ సాహచర్యంలో అనుభవించిన యెడతెగని యే మోహ తరంగం యెగసిందో రచయిత్రి చెప్పలేదు గానీ ఆమె అతణ్ణి “రా” అని దగ్గరకి తీసుకొంది. అయితే ఆ కలయిక ఆమెకి ఆనందాన్నివ్వదు. ‘ఎప్పట్లా తెల్ల పూలదండ అంచుల సముద్రుడిలా కాకుండా విలయం సృష్టించే సునామీలా’ వస్తాడతను. అతని ఆ రాకలో మనశ్శరీరాలని కుళ్ళగించి ఆమెకి ప్రియమైనవాడి వునికిని నిర్మూలించాలన్నలన్న క్రోధంతో చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. అదొక యుద్ధమే అని నీలవేణి భావించినప్పటికీ  ‘జీవితం నాటకం కాదు గదా తెర పడేలోపు యుద్ధం ముగియడానికి!’ అన్న వేదనకి గురౌతుంది. మరోసారి రసభంగమైంది. ఇదీ కథ.

దాంపత్య సంబంధాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం మాత్రమే కాదు సహజీవనంలో ఆశించే స్వేచ్ఛని   సైతం మగవాళ్ళు స్త్రీలపై ఆధిపత్య సాధనంగా వుపయోగిచుకొనే ప్రమాదం వుందన్న ప్రతిపాదన చుట్టూ అల్లిన కథ యిది.

ఒక దృక్పథాన్నే వస్తువుగా చేసుకొని కథ రాయడానికి రచయిత యెంతో జాగరూకతతో వుండాలి. అందుకు అనుగుణమైన పాత్రల్ని నిర్మించుకోవాలి. ఆ పాత్రల ప్రవృత్తుల్నీ స్వభావాల్నీ  ఆలోచనల్నీ వుద్వేగాల్నీ, అంతరంగ మథనాన్నీ , బాహిర శక్తుల ప్రమేయాన్నీ ,  ఆ పాత్రల మధ్య చోటుచేసుకొనే సంఘర్షణనీ దాన్ని ప్రతిఫలించే  సంభాషణల్నీ కొండొకచో నిర్దిష్టమైన ప్రతీకల్నీ  కథలోకి తీసుకురావడంలో  గొప్ప నేర్పు వుండాలి. ఆ నేర్పు మల్లీశ్వరిలో నిండుగా వుందని  యీ కథ నిర్ద్వంద్వంగా నిరూపిస్తుంది. నేపథ్య నిర్మాణం , పాత్ర చిత్రణ , ప్రతీకలతో కూడిన యెత్తుగడ – ముగింపులూ కథా నిర్మితిలో  కథనం అంతటా పరచుకొని వున్న అద్భుతమైన వొక craftmanship విభ్రమం గొల్పుతుంది. అలా అని  అది కథాంశంపై దృష్టి మరలిపోయే విభ్రమమైతే కాదు.

రచయిత్రి కథకి నేపథ్యంగా తీసుకొన్న జీవితం పై తరగతి వారిది లేదా యెగువ మధ్య తరగతి వారిది అన్న విషయం గమనంలో వుంచుకోవాలి (ఇంట్లో బార్ స్టూల్ , సహవాసులిద్దరూ కలిసి తాగడం వంటి వర్ణనలు చూడండి). నీలవేణి ప్రేమైక రూపాన్నీ స్థిర చిత్తాన్నీ గంభీర్యాన్నీ హుందాతనాన్నీ , సదాశివ ద్వంద్వ వైఖరినీ మనోవైకల్యాన్నీ వ్యక్తిత్త్వ విచ్ఛిత్తినీ భావజాల వైరుద్ధ్యాన్నీ ఆవిష్కరించడానికి ఆమె యెన్నుకొన్న కంఠస్వరం స్త్రీదేనని(మొత్తం కథంతా నీలవేణే చెబుతుంది) గుర్తుంచుకోవాలి. అప్పుడు మాత్రమే కథ పారదర్శకమౌతుంది. పాత్రల ప్రవర్తన ప్రస్ఫుటమౌతుంది.

కథలో సదాశివకి అనేక ముఖాలున్నై. అతనిలో  ‘అనేక సదాశివలు’ నీలవేణి స్పష్టంగా  చూడగలుగుతుంది. అందుకు కారణాలు కూడా గుర్తిస్తుంది. ‘సదాశివ అంటే ఉత్తి చేతులతో సాయం కోరే వారికి మేలు చేసే మంచి లాయర్ అనీ , సంస్కారవంతుడనీ, లోకాన్ని మెరుగ్గా అర్థం చేసుకోగల సమర్థుడనీ’ నీలవేణి ప్రేమించింది. అతనూ అలాగే వుండటానికి ప్రయత్నిస్తాడు. కానీ స్వయంగా అతిచరించాడు. సహజీవన సంబంధంలో లాభించిన వెసులుబాటునీ స్వేచ్ఛనీ హాయిగా అనుభవించాడు.  నీలవేణి జీవితంలోకి గౌతమ్ రావడంతో పొరలన్నీ చిరిగిపోయి లోపలి మనిషి బయటకొచ్చాడు. అందుకే సదాశివని రచయిత్రి క్రిమినల్ లాయర్ చేసింది. ‘స్వైర విహార ధీరలగు సారసలోచనలున్న చోటికిన్’ వంటి వసుచరిత్ర పద్యాల్ని సందర్భోచితంగా గుర్తు తెచ్చుకొని ‘స్వైరిణి’ పదాన్ని దాని అర్థచ్ఛాయలతో సహా యెరిగి ప్రయోగించి  ‘రసభంగం’ చేయగల సాహితీ వేత్తకూడా అతను. ‘అన్ని స్వేచ్ఛలనీ గట్టిగా నమ్మిన’ వాడే ; కానీ  ‘మన ఆచరణ శక్తి ఎంతవరకో అంతవరకూ ఉన్నదే విప్లవమనే’ (యీ వాక్యాన్ని  కథకి టాగ్ లైన్ గా రచయిత భావించి వుండొచ్చు)  మేధావుల కోవకి చెందుతాడు. అందుకే గౌతమ్ విషయం వచ్చేసరికి వోర్చుకోలేక ‘వయొలెంట్’ గా ప్రవర్తిస్తాడు. పిచ్చివాడైపోతాడు. తన వొంటరితనపు వేదనని ఆమె ముందు గుమ్మరిస్తాడు. డ్రింక్ ఆఫర్ చేసి ఆమె వద్దన్నందుకు తనతో కల్సి తాగనన్నందుకు గౌతమ్ పరిచయం వల్ల కల్గిన ‘కొత్త పాతివ్రత్యమా?’ అని పరిహసించి గాయపరుస్తాడు. మరీ బెడిసికొడుతుందనుకొన్నాడో యేమో వెంటనే సారీ చెప్పాడు. అంతేకాదు ; ఆమె తనకే కట్టుబడి ఉండేలా యెత్తుగడలు వేశాడు. వ్యూహాలు పన్నాడు.

సదాశివ రచయిత్రి ‘సృజించిన’ పాత్ర కాదు. గురజాడ గిరీశాన్ని గుర్తించినట్టు మల్లీశ్వరి  మన సమాజంలో మగవాళ్ళలో సదాశివని గుర్తించింది. సదాశివలో దాగివున్న మగవాణ్ణి వెలికితీసింది. సదాశివ పాత్రలోని వైరుధ్యాల్ని బహిర్గతం చేయడం ద్వారా   స్త్రీపురుష సంబంధాల్లోని ఆధిపత్య రాజకీయాల్నివాటి భిన్న పార్శ్వాల్నీ ఆవిష్కరించింది.

చానాళ్లుగా నలుగుతోన్న వొక కేసు విజయాన్ని నెపం చేసుకొని సదాశివ పార్టీ యేర్పాటు చేస్తాడు. ఆ కేసులో తాను యెదుర్కొన్న వొత్తిళ్ళను యేకరువుపెట్టి వాటిని అధిగమించడంలో తనకు తోడుగా వుండి తన విజయం వెనక నిలబడ్డ స్నేహమయి నీలవేణి అని అందరిముందూ నాటకీయంగా ప్రకటించాడు. ఒక దెబ్బకి రెండు కాదు; మూడు పిట్టలు. పదిమందిలో ‘ఇన్స్టిట్యూషనల్ గౌరవాన్నిచ్చి’ నీలవేణితో సామాజికంగా తన సంబంధాన్ని పటిష్ఠపరచుకోవడం , తమ మధ్యకి చొరబడిన గౌతమ్ అడ్డు తొలగించుకోవడం ( ఆ పార్టీకి అతణ్ణి పనిగట్టుకు పిల్చింది కూడా అందుకే ) , అక్కడే వున్న లవ్లీ లాయరమ్మకి రాయల్ గా  గుడ్ బై చెప్పడం. నీలవేణి ‘జీవితంలోకెల్లా అత్యంత అవమానంతో సిగ్గుపడిన క్షణాలవి’.  ఇద్దరు స్త్రీల జీవితాలతో హృదయాలతో ప్రేమతో కుటుంబ అనుబంధాలతో పెనవేసుకొన్న వుద్వేగాలతో ఆటలాడే మగవాడి గడుసు పోకడకి , ‘రోదసి నుంచి భూకక్ష్య లోకి ప్రవేశించే వ్యోమనౌక ఫెయిలయ్యి పేలిపోయిన’ప్పటి భీభత్సాన్ని ఆడవాళ్ళ జీవితంలో నింపుతోన్న పురుషాధిపత్యానికి పరాకాష్టగా  రచయిత్రి ఆ సందర్భాన్ని రూపొందించింది. కథా రచనా శిల్పంలో , పాత్రచిత్రణలో  మల్లీశ్వరి సాధించిన  పరిణతికి గీటురాయిలా కనిపించే ఆ సన్నివేశం రచయిత్రి  ప్రాపంచిక దృక్పథానికి గొప్ప తార్కాణం. నీలవేణి పాత్రలోని గాంభీర్యం పాఠకుడిని కట్టిపడేస్తుంది. సాటి స్త్రీ పట్ల ఆమె చూపిన సహానుభూతి మనుషులమధ్య వెల్లివిరియాల్సిన మానవీయతకు నిండైన నిదర్శనం. స్త్రీ జాతి ఆలోచనల్లో కనిపించే సున్నితత్వానికి ప్రతీక – పతాక.

 

నీలవేణీ సదాశివల ఆలోచనల్లో ఆచరణల్లో తేడా వుంది. ఆ తేడా  స్త్రీ పురుషుల సహజ ప్రవృత్తుల్లోనే వుందేమోనని కథ చదువుతోన్నంతసేపూ అనిపించేలా రాయడంలోనే రచయిత్రి నేర్పు కనిపిస్తుంది (నిజానికి ఆ తేడా సామాజికం కూడానేమో ; అన్నిసమాజాల్లో సదాశివలు అలాగే ప్రవర్తిస్తారా? ) సహజీవనానికి మౌలికంగా నిర్మించుకొన్న విశ్వాసాల పునాదిగా (చేసుకొన్న వొప్పందం ప్రకారం?) ఆమె అతనికున్న అన్ని  హక్కుల్ని గౌరవించింది. ఇష్టాల్ని అంగీకరించింది. అతని స్వేచ్ఛకు యెక్కడా  ఆటంకం కాలేదు. బాదంకాయ కళ్ళపిల్ల అతని ప్రేమని కొరికి రుచి చూసి పోయినప్పుడూ  లవ్లీ లాయరమ్మని అతను స్వయంగా వెంటబెట్టుకొని హృదయంలోకి తీసుకువచ్చినప్పుడూ మొదట కొంత అభద్రతకి గురైంది భయానికి లోనైంది. కానీ తేరుకొంది. అతని మనసులో తాను ధీమాతో విశాలంగా పరచుకొని అధిష్టించిన చాప కుదించుకుపోయిందని యేడుస్తూ కూచోలేదు.   ఈర్ష్య పడలేదు. తగవులాడదల్చుకోలేదు. ద్వేషించి భంగపడలేదు. తట్టాబుట్ట సర్దుకొని పోలేదు. తనకు తానే సర్ది చెప్పుకొంది. అతని ప్రేమని పొందడానికి మరింతగా  ప్రేమించడమే దారనుకొంది.  ప్రేమిస్తూనే అతని మనసులో వొక మూల వొదిగి వుండడానికి సిద్ధపడింది.

అతన్నుంచి ( సదాశివ నుంచి) ఆమె తిరిగి అదే ఆశించింది. తన జీవితంలో గౌతంని కూడా ‘వో పక్కగా వుండనీయి’ (సదాశివని దాటి పోకుండానే) అని అడిగింది. కానీ సదాశివ అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఆమె శారీరికంగా మానసికంగా చివరికి సామాజికంగా కూడా తనకే విధేయంగా వుండాలనుకొన్నాడు. ఆమె జీవితంలో యే రూపంలోనూ తనతోపాటు మరోవ్యక్తిని అంగీకరించలేకపోయాడు. ‘బ్లాక్ హోల్’ లా గౌతమ్ ఆమెను లాగేసుకొంటున్నట్టు భావించాడు.  ‘ఉన్నంతలో ప్రాక్టికల్ గా ఇబ్బందులు లేకుండా కాస్త తెలివిగా’ తనతో బంధాన్నికొనసాగించామన్నాడు.  గౌతంతో ఎమోషనల్ గా బాహాటంగా ఓపెన్ కావద్దన్నాడు. డ్యూయల్ వాల్యూస్ ఉండకూడదని తాను ఆచరించని ఎథిక్స్ ఆమెకి బోధించాడు.  ‘ఆకర్షణ కలిగితే వన్  నైట్ స్టాండ్ తీసుకో … లేదూ కాదూ అంటే కాజువల్ రిలేషన్ షిప్ లో ఉండు…’ అని వొక తుచ్ఛమైన ఆప్షన్ యిచ్చాడు. మనుషులమధ్య వుండాల్సిన ‘అంతిమ విలువ – స్వేచ్ఛ’ విషయికంగా అతని దృష్టికోణం అదీ. సదాశివకి స్వేచ్ఛ ఆశయమే కానీ ఆచరణ కాదు( పైగా అది ముసుగు కూడానేమో! ).  ఆమెకి ‘నిలకడగా స్థిరంగా తదేకంగా  ఉండే బంధం కావాలి’. అది తానివ్వలేక పోయినా గౌతమ్ దగ్గర మాత్రం లభిస్తుందని హామీ వుందా  – అని లాయర్ లాజిక్కుతో యెదురు ప్రశ్నించి హెచ్చరించాడు సదాశివ.

స్త్రీ సొంత వ్యక్తిత్వాన్నీ స్వేచ్ఛనీ అభావం చేయడానికి అణచివేత రాజకీయాల్ని యెన్ని రూపాల్లోనైనా వుపయోగించగల మగవాళ్ళకి నమూనాగా సదాశివ పాత్రని చిత్రించడంలో రచయిత్రి నూటికి నూరు పాళ్ళూ సఫలమైంది. అయితే యెంతో చైతన్యవంతంగా ప్రవర్తించాల్సిన నీలవేణి – వొక్క క్షణమే కావొచ్చు – అతనికి లోబడిపోవడమే ఆశ్చర్యం.

సదాశివ ఆలోచనల్లోని వంచననీ  నైచ్యాన్నీ  అర్థం చేసుకొని కూడా – తన నొప్పినీ  కష్టాన్నీ దాచుకొని తనలో రగిలే అగ్ని పర్వతాల్ని కప్పిపెట్టుకొని అతని కష్టానికి దు:ఖిస్తూ నీలవేణి అతణ్ణి వోదార్చడానికి పూనుకొంది. అంత కరుణ ఔదార్యం ఎందుకని పాఠకుడిలో ప్రశ్న మొలకెత్తుతుంది.

స్త్రీలోని లాలిత్యమూ కారుణ్యమూ  ప్రేమైక జీవన తత్త్వమే  ఆమెకు సంకెళ్ళుగా పరిణమిస్తున్న వైనాన్ని రచయిత్రి నీలవేణి ఆచరణలో చూపించింది. ప్రేమకీ స్వేచ్ఛకీ సహజీవనానికీ స్థిరమైన అనుబంధాలకీ స్త్రీ పురుషులిచ్చే నిర్వచనాలు వేరని నిరూపించింది. అయితే –

అనేక ఆధిపత్యాల అసమ సమాజంలో పెళ్లయినా సహజీవనమైనా స్త్రీ పురుష సంబంధాల్లో మార్పేవీ ఉండదనీ , అభద్ర భావన కారణంగానో సంబంధాల్ని అంత త్వరగా వదులుకోలేని బలహీనత కారణంగానో  స్వేచ్ఛతో సహా సమస్తం  కోల్పోతుంది  స్త్రీలేననీ   రచయిత్రి మరోసారి నొక్కి చెప్పాలనుకొన్నట్లు  అనిపిస్తుంది. అదే ఆమె చెప్పాలనుకొన్న విషయమైతే పెళ్లి అనే వ్యవస్థ ( institution ) ని పగలగొట్టి సహజీవనమనే విప్లవకరమైన ఆచరణలోకి వెళ్ళాలనుకొనేవారిని అది కూడా స్త్రీ పురుష సంబంధాల్లో అంతిమ స్వేచ్ఛకి ఆస్కారమివ్వదని అక్కడకూడా యుద్ధం తప్పదని భయపెట్టి వెనక్కి లాగినట్లవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాన్ని మూసివేసినట్లవుతుంది. లేదా స్వేచ్ఛాసమానత్వాలకోసం జరిపే పోరాటంలో సహజీవనం వొక మెట్టే ; అక్కడ కూడా స్త్రీలకు భద్రత లేదనీ , మగవాళ్ళలో పాతుకుపోయిన పితృస్వామ్య ఆధిపత్య భావజాలంతో నిరంతరం పోరాడక తప్పదనీ  హెచ్చరించడమే రచయిత వుద్దేశ్యమైతే కథా ప్రయోజనం నెరవేరినట్లే.

అయితే ఆ యుద్ధాన్ని నీలవేణి సదాశివతో కలసి వుంటూనే చేస్తుందా – విడిపోయి గౌతమ్ దగ్గర చేస్తుందా – యేక కాలంలో యిద్దరితోనూ సంబంధాన్ని కొనసాగిస్తూ ( మల్టిపుల్ రిలేషన్ షిప్ లో) చేస్తుందా – హద్దుల్లేని అప్రమేయమైన ప్రేమతో  యిద్దర్నీ జయిస్తుందా – వోర్పుతో నెగ్గి మానవసంబంధాన్ని నిలుపుకోగలుగుతుందా  – రేపు గౌతమ్ అయినా మరో మగవాడైనా సదాశివలానే ప్రవర్తించవచ్చు కాబట్టి వొంటరిగా స్వతంత్రంగా జీవిస్తుందా – ఆమె తెరవేయలేని యుద్ధాన్ని కేవలం లైంగిక  స్వేచ్ఛ వరకే పరిమితం చేస్తుందా  – పితృస్వామ్య భావజాలానికి సంబంధించిన అన్ని రకాల అసమానతలకీ  వ్యతిరేకంగా నిలబడుతుందా – లేదా మరింత విస్తృతమై సమాజంలో పాతుకుపోయిన  సమస్త ఆధిపత్యాల్ని రూపుమాపే మార్గంలో నడుస్తుందా – అసలు దాంపత్యాలన్నీ యెడతెగని ద్వంద్వయుద్ధాలేనా – సహజీవనాలు సైతం సంగ్రామాలుగా యెందుకు మారుతున్నాయ్ –  బంధాల్ని తెంచుకోలేనితనం  స్తీలకు మనోధర్మమా, సామాజిక అభద్రతాభావన నుంచి వస్తుందా – ఆధిపత్యం పురుష ప్రవృత్తా , అసమ సమాజంలో అది అనివార్యమైన దృగంశమా – స్త్రీ పురుష సంబంధాల్ని మానవీయంగా వుంచగలిగే స్థిరమైన విలువలేంటి – దేశ కాల సంస్కృతులకి అతీతంగా వుపయోగపడే నమూనాలుంటాయా  …… యివన్నీ పాఠకుల ముందు రచయిత పరచిన మరికొన్ని  ప్రశ్నలు.

ఈ ప్రశ్నలు పుట్టడానికి కారణం రచయిత్రి కథని open ended గా వొదిలి వేయడం వొక కారణమైతే ; రెండో కారణం కథ ప్రారంభంలోనూ ముగింపులోనూ ఆమె వాడిన  ప్రతీకలు.

ప్రతీకల వెనకున్న అర్థాలు సులభగ్రాహ్యాలే కానీ పాఠకుడిలో గందరగోళానికి ఆస్కారమిస్తున్నాయి. కథ నీలవేణి నటించే నాటకంలో అంతిమ దృశ్యం యుద్ధంతో మొదలౌతుంది. ‘యుద్ధం ముగిసింది. ఒకరు విజేత. ఆ విజేతని నేనే గెలిచాన’ని  నాయిక ప్రకటిస్తుంది. గెలుపుకీ వోటమికీ మధ్య గీత చెరిగిపోయింది. యుద్ధంలో వోడి మరణించినవాడొకడు. గెలిచి మరణించినవాడొకడు. అదీ విషాదం. వాళ్ళిద్దరి నుంచీ విముక్తే ఆమె కోరుకొంటే మోదాంతం.

కథ మాత్రం విషాదాంతమే. కాకుంటే అది నీలవేణి జీవితం. నాటకంలోలా జీవితంలో ఆమె యెప్పటికి గెలుస్తుందో తెలీదు. యుద్ధం సదాశివ గౌతమ్ ల మధ్యా ? వాళ్ళిద్దరికీ నీలవేణికీ మధ్యా? గెలుపెవరిది , వోటమెవరిది? విముక్తికోసం నీలవేణి తనతో తానే తనలో తానే అంతర్యుద్ధం చేస్తుందా? మొత్తం పురుషసమాజంతో చేస్తుందా? గెలుపు వోటముల ఆటలో హింసని అనుభవిస్తూ కూడా  ఆమె సదాశివకి యెందుకు లొంగిపోయింది? స్వేచ్ఛ ఆమెకి అవసరం కాకుండా ఆకాంక్ష మాత్రమే అవడం వల్ల అలా జరిగిందా? సదాశివ యేడ్చి వోటమిని వొప్పుకొన్నందుకా? స్వేచ్ఛ అవసరంగా పరిణమించినప్పుడు ఆమె సమస్త శక్తులూ వుడిగిపోతే ఆ రోజున పోరాడే పరిస్థితి వుంటుందా? అప్పుడు సదాశివ ప్రవర్తన వూహకందనిదేం కాదు. తన పురుష నైజాన్నీ సమాజం యిచ్చిన బలాన్నీ బాహాటంగానే ప్రదర్శించక మానడు. నైతికంగా వోడిన సదాశివ శారీరికంగా ఆమెపై ఆధిపత్యాన్ని స్థాపించుకొనే ప్రయత్నం చేస్తూనే వున్నాడు కాబట్టి స్త్రీ పురుషులమధ్య జీవితయుద్ధంలో వైరుధ్యాలు యెప్పుడూ శత్రుపూరితంగానే వుంటాయని నిరంతర చైతన్యంతో మాత్రమే వాటిని పరిహరిచుకోగలం అని ప్రతిపాదించడమే రచయిత్రి అభిప్రాయమా? కాకుంటే యీ యుద్ధ ప్రతీకల ప్రయోజనం యేమిటి? ప్రయోజనం లేని ప్రతీకలెందుకు? ‘పంజరంలో సైతం పక్షులు యెందుకు పాడతాయో’ పాడాలో ఆమెకి తెలుసు. ‘కోపం భయం ద్వేషం పగ అన్నిటినీ విసిరికొట్టి ప్రేమించడమే’ యుద్ధాలకి శాంతిపాఠం. అయినా యుద్ధాలకు ముగింపు లేదు. ఆమె కోరుకొనే శాంతి యెక్కడుందో తెలుసుకొనే వరకూ పరిష్కారం రాదు.

కథలు పరిష్కారం చూపేవిగానే వుండాలని నియమం లేదుగానీ ఆ దిశగా ఆలోచింపచేసేవిగా వుండాలని కోరుకోవడం తప్పుగాదు. కానీ యిన్ని విరుద్ధమైన ఆలోచనలకి తావిచ్చేదిగా వుండడమే ‘శతపత్ర సుందరి’ ప్రత్యేకత.

 

తాజా కలం: హైదరాబాద్ – ఆలంబనలో ‘వేదిక’ సాహిత్య సమావేశం( జూలై 12, 2015 ) లో ‘శతపత్ర సుందరి’ పై చర్చ జరిగినప్పుడు కథా శీర్షిక అంతరార్థం గురించి ప్రస్తావనలొచ్చాయి. సహచరుడితో స్వైరిణి గా పిలిపించుకొన్న నీలవేణి లోపలి పొరల సౌందర్యానికి ఆ శీర్షిక ప్రతీక కావొచ్చని వొక ముక్తాయింపు. ఏదీ అంతిమ తీర్పు కాదు.

 *

 

 

ఏంజేత్తదో ఎవలకెరుక..

-కందికొండ

(సినీ గేయ రచయిత)

~

IMG-20151112-WA0010

 

kandiమా అవ్వ బతుకమ్మ పండుగకు ఊరికి రమ్మని ఫోన్ జేసింది . నేనన్నా ‘మా ఇద్దరిపోరగాండ్లకు మాకు ఇంటినలుగురికాకం కలిపి రానుపోను,ఇంటికచ్చినంక పండుగ ఖర్సు కలిపి ఓ నాలుగైదు వేలయితై ఎందుకులే ’  అన్న. ‘రేపు మేం సచ్చినంక మీరు వచ్చేది రాంది మేం సూత్తమాగని  మా జీవి వున్న నాల్గు రోజులన్నవచ్చిపోరాదుండ్లి, మీ పోరగాండ్లు కండ్లల్ల మెరుత్తాండ్లు’ అన్నది. మారు మాట్లాడకుంట ఊరికిపోయినం!

బతుకమ్మ పండుగ బాగనే జరిగింది. దసరా పండుగనాడు ఓ యాటపోగు తీసుకున్నం . మా మచ్చిక లక్ష్మణ్ గౌడ్ చిచ్చా ఇద్దరు రెగ్యులర్ “వాడిక” దార్లకు ఎగ్గొట్టి వాళ్ళ బాపతి కల్లు నాకు పోషిండు. తాగి అబద్దమెందుకు ఆడాలె గని ఉన్న నాలుగు రోజులు కడుపునిండ కల్లు తాగిన. పండుగ సంబురంగనే జరిగింది . కానీ, ఒక్కటే బాధ! ఈ బాధ ఇప్పడిదికాదు ఆరేడు సంవత్సరాలనుంచైతాంది . మా ఇంట్లనుంచి బయటికెల్లంగనే కుడిచేయి రోకు పెసరు కొమ్మాలు ఇల్లు ఉంటది. నేను ఆయనను పెద్దనాయిన అని పిలుస్త. మా నాయిన కన్నా రెండు మూడు సంవత్సరాలు వయసులో పెద్దోడు. వాళ్ళు మా కులపోళ్ళో,సుట్టాలో కాదుగనీ మంచి కలుపుగోలు మనుసులు.వాళ్ళ శిన్నకొడుకు శీనుగాడు నేను సాయితగాండ్లం .

ఆయనకు ఆరేడు సంవత్సరాల కిందట పక్షవాతం (పెరాలసిస్) వచ్చి నోరు కాళ్ళు  చేతులు పడిపోయినై . ఊళ్లే ఆ పెద్దనాయిన తోటోళ్లే కాదు ఆయనకన్నా పెద్దోళ్ళు కూడా ఎవల పని వాళ్ళు చేసుకుంటాండ్లు,మంచిగనే ఉన్నరు.  పాపం పెద్దనాయిన పరిస్తితి అట్లయ్యింది .కొంచం దూరం కూడా నడువలేడు .ఆయన పనులుగుడ ఆయన శేసుకోలేడు. మూత్రం దొడ్డికి అన్నీ మంచం పక్కేనే… ఖాళీ స్థలం లో . అది కూడా ఎవలన్నఆసరుండాల్సిందే,లేకపోతే అన్నీ మంచంలనే. పాపం పెద్దవ్వ పెసరు ఈరలచ్చమ్మ భూదేవసొంటిది,మస్తు ఓపికతోని దొడ్డికి ఎత్తిపోసేది. సుట్టుపక్కల ఊడ్సేది,బట్టలల్ల మూత్రమో దొడ్డికో పోతే బట్టలన్నీ తెల్లగ పిండేది. రెండు మూడు సంవత్సరాల కిందట ఆ పెద్దవ్వ సచ్చిపోయింది. కొడుకులు కోడండ్లు మనవండ్లు మనవరాండ్లు ఉన్నరు,బాగానే అర్సుకుంటరు . కానీ, అన్నీ వుండిలేమి  కుటుంబాలే కదా..కూలికో నాలికో పోకపోతే ఇంట్లకెట్లెల్లుద్ది . వాళ్ళు పనికిపోయేటప్పుడు ఇంత అన్నం, మంచినీళ్లు పెట్టిపోతరు.

పెద్దనాయిన పాత కుమ్మరి గూనపెంక ఇంటి ముందు,చింతచెట్టుకింద ఓ పాత నులక మంచమేసుకుని వచ్చి  పోయేటోళ్లను సూసుకుంట మందలిచ్చి మాట్లాడుకుంటా రోజును ఎళ్లదీత్తడు .రోజెళ్లదీసుడేంది అట్లా ఏడు సంవత్సరాలనే ఏళ్లదీసిండు. ఒకవేళ, ఆదాట్నవానత్తె  తడవాల్సిందే,బాగా ఎండత్తే  ఎండాల్సిందే,సలిపెడితే వణుకాల్సిందే.ఇంకొకల ఆసరా లేకుండా కదలలేడు. పెద్దనాయిన పరిస్తితి సూత్తాంటే నాకు శ్రీ శ్రీ “జయభేరి” కవితల “ఎండాకాల మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా! వానకాలం ముసిరిరాగా నిలువు నిలువున నీరు కాలేదా ! శీతాకాలం కోతపెట్టగ కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే!” అనే పంక్తులు గుర్తుకచ్చి అవి పెద్దనాయిన కోసమే శ్రీ శ్రీ రాసిండా ఏంది ! అనిపిచ్చేది.

ఒకప్పుడు ఇరవై అయిదు ముప్పై సంవత్సరాల కిందట… నేను చిన్నపోరగాన్ని, టూపులైటు లాగులేసుకుని ఎగిడిశిన భూతంలెక్క ఊళ్లె  తిరిగేటోన్ని. అప్పుడు పెద్దనాయిన ఎట్లుండేటోడు పులి లెక్క ! పెసరు కొమ్మయ్య అంటే ఒక ఆట, పెసరు కొమ్మయ్య అంటే ఒక పాట,పెసరు కొమ్మయ్య అంటే ఒక కోలహలం …ఒక కోలాటం. అప్పటి రోజులు నాకింకా గుర్తున్నాయి. ఎండాకాలం,సలికాలం,ఎన్నెల ఎలుగులల్ల నాలుగుబాటల కాడ కమ్యూనిష్టు పార్టీ జెండా గద్దె ముందు రాత్రి ఏడెనిమిది గంటలకు ఊరోళ్ళంతా ఇంత తినచ్చి కూసునేది .

పెద్దనాయిన రాంగనే సందడి మొదలయ్యేది. అందరూ పక్కన పెట్టుకున్న ‘పట్నం తుమ్మ’ కోలలు తీసుకుని గుండ్రంగా నిలబడేటోల్లు ,పెద్దనాయిన కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, చేతిల చిరుతలు పట్టుకుని మధ్యల నిలబడి పాట పాడుకుంటూ చిందేసేది. నాకయితే సినిమాలల్ల కైలాసంల శివుడు నాట్యం శేత్తానట్టు అనిపిచ్చేది.ఆ చిందేసే కాళ్ళు అసలే ఆగకపోయేది. చేతుల చిరుతలు రికాం లేకుండ (నాన్ స్టాప్ గా) మోగేటియి . పెద్దనాయిన పాడుతాంటే సుట్టున్నోళ్ళు కోరస్ పాడుకుంట ఎగిరేటోళ్లు . గుండ్రగ నిలబడి కోలాటమెసేటోళ్ళల్ల ఎవ్వలకన్న దమ్మత్తే(ఆయాసం)వాళ్ళ కోలలు వేరేటోళ్లకిచ్చి వాళ్ళు కూసోని మొస్స తీసుకునేటోళ్లు .కానీ పెద్దనాయిన కాలు నిలవకపోయేది. నోటెంట పాట ఆగకపోయేది. అట్ల ఆగకుండా గంటలకొద్ది చిందులేసిన కాళ్ళు ఇప్పుడు సచ్చుబడిపోయినాయి. గల్లుగల్లున చిరుతలు మొగిచ్చిన చేతులు ఆయన పని ఆయనే చేసుకోవటానికి సహకరిస్తలేవు.

నాలుగు బాటల కూడలిలో గొంతెత్తి పాటపాడితే వాడకొసలకు ఇనచ్చేది,ఊరు మారు మొగిపోయేది. అసోంటి గొంతు బాధైతే చెప్పుకునేదానికి,ఆకలైతే అన్నమడగటానికి కూడా లేత్తలేదు. పెద్దనాయిన పరిస్తితి పగోనికి కూడా రావద్దనిపిస్తది. ఆయన బాధ సూత్తాంటె సూత్తాంటనే నాకు తెలవకుంటనే నా కండ్లల్ల నీళ్ళు కారినయి. ఏడుపచ్చింది. అట్లాంటి పెద్ద నాయినలు ఊరికి ఎంతమంది ఉన్నారో కదా…

జీవితం ఎప్పుడు ఎవల్ను ఏంజేత్తదో ఎవలకెరుక. అందుకే రిచర్డ్ డేవిడ్ బాక్ అనే రచయత ఇట్లన్నట్టున్నది…. “Life does not listen to your logic; it goes on its own way, undisturbed. You have to listen to life”.

*

 

రూప వినిర్మాణం కోసం…

-అరణ్య కృష్ణ
~
aranya
ఎవరో కిరసనాయిల్లో ముంచిన గుడ్డముక్కలకి నిప్పెట్టి
గుండె లోపలకి వదుల్తున్నారు
గంధకం పొడిని ముక్కుదూలాల్లో నింపుతున్నారు
కుక్కపిల్ల తోకకి సీమటపాకాయ జడ కట్టి వదిలినట్లు
రోడ్ల మీద పరిగెడుతున్నాం
భస్మ సాగరంలో మునకలేస్తున్నాం
మాటల్లో పెదాలకంటిన బూడిద
ఎదుటివాడి కళ్ళల్లో ఎగిరి పడుతున్నది
మనిషో మోటారు వాహనంలా శబ్దిస్తున్నాడు
ఇంజిన్ల శబ్దాల్లో మాటలు
పాడుపడ్డ బావుల్లోకి ఎండుటాకుల్లా రాలిపోతున్నాయి
పలకరింపులు బీప్ సౌండ్లలా మూలుగుతున్నాయి
మనుషుల ముఖాలు సెల్ ఫోన్లలా చిన్నబోతున్నాయి
నెత్తిమీద ఏంటెన్నాను సవరించుకుంటున్న పరధ్యానం
ముఖాల మీద తారట్లాడుతున్నది
ఏవో మూలుగులు పలవరింతలే తప్ప
చిర్నవ్వుల పరిమళాల్లేవ్
కరచాలనాల్లో చెమట చల్లదనం  తప్ప
చర్మ గంధం తగలటం లేదు
ఒకర్నొకరు గుర్తుపట్టలేని బంధాలు
గుంపు కదలికల్లో విఫలమైపోతున్న ఆత్మ సం యోగాలు
హోర్డింగులు నిర్దేశిస్తున్న జీవన వాంచలు
ప్రేమల ప్రాణవాయువులందక హృదయాల దుర్మరణాలు
నగరం మానవాత్మల మీద మొలుస్తున్న మహా స్మశానం
నేను మాత్రం రూపవిచ్చతి కోసం గొంగళిపురుగులా
ఒక తావు కోసం వెతుక్కుంటున్నాను .
*

అతను సాహిత్య లోకపు ధృవతార  

 

-భవాని ఫణి

~

bhavani phani.

పందొమ్మిదవ శతాబ్దపు గొప్ప కవి అయిన జాన్ కీట్స్ ప్రేమ (జీవిత) చరిత్ర ఆధారంగా 2009 లో రూపొందింపబడిన చలన చిత్రం “బ్రైట్ స్టార్(Bright Star )”. చాలా మందికి అతని జీవితంలోని విషాదం గురించి తెలిసే ఉంటుంది . పాతికేళ్ల వయసుకే అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన ఆ మహా కవి, తను జీవించి ఉన్న కాలంలో పెద్దగా గుర్తింపు పొందలేకపోయాడు . అతని దృష్టిలో అతనో విఫల కవి. సమాజం ఎప్పట్లానే అతని గొప్పతనాన్ని జీవితకాలం ఆలస్యంగా గుర్తించింది . ఇదంతా పక్కన పెడితే అతని అతి చిన్న జీవితంలోకి వలపుల వసంతాన్ని మోసుకొచ్చిన అమ్మాయి ఫానీ బ్రాన్. వాళ్ల ప్రణయగాథకి దృశ్య రూపమే ఈ బ్రైట్ స్టార్ చలన చిత్రం .

కొంచెం బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పద్దెనిమిదేళ్ల  అమ్మాయి, కళ్లలోంచి కవిత్వాల్ని వొలికించగల జాణ.  యువకుల హృదయాల్ని ఉర్రూతలూపగల అందం , ఆధునికత ఆమె సొంతం . కథానాయిక ‘ఫానీ బ్రాన్’ పాత్ర ధారిణి అయిన ‘అబ్బే కోర్నిష్’  కళ్లకి ఇదీ అని చెప్పలేని వింత ఆకర్షణ ఉంది . ఆ కళ్లలో చంచలత్వం లేదు . ఒక పరిణితి, ఉదాత్తత , హుందాతనం వాటి నిండా కొలువు తీరి ఉన్నాయి . నటిస్తున్నది ఆ అమ్మాయా లేకపోతే ఆమె కళ్లా అనిపించింది ఒక్కోసారి .

ఆ కన్నుల లోతులు కొలవడమంటే
గుండె గర్భానికి బాటలు వెయ్యడమే
ఆ కన్నులతో చూపు కలపడమంటే
మబ్బుల చిక్కదనంలోనికి మరలి రాని పయనమే

అన్న భావం  ఆ అమ్మాయి కళ్లని చూస్తే కలిగింది  . చూసే కొద్దీ ఆ భావం మరింతగా బలపడింది . ఆ కళ్లలో ఏదో ఉంది . అనంతమైన సాగరాల అలజడి , అగ్ని పర్వతాల అలికిడి , సెలయేటి పరవళ్ల ఉరవడి , చిరు అల్లరిని రేగించే సౌకుమార్యపు సడి….. ఇక అవి ఏ కవి కళ్లలో పడినా కవితల సందడే సందడి .ఎందఱో యువకుల ఆరాధ్య దేవత అయినా ఫానీ మాత్రం జాన్ కీట్స్ ని ఇష్టపడింది . మొదట్లో ఆమెని పెద్దగా పట్టించుకోకపోయినా అతని తమ్ముడు క్షయ వ్యాధితో చనిపోయినప్పుడు ఆమె ప్రదర్శించిన దుఃఖాన్ని గమనించాకా  కీట్స్ కి కూడా  ఆమెపై ఇష్టం ఏర్పడుతుంది. కవిత్వ పాఠాలు నేర్చుకునే వంకతో ఫానీ , కీట్స్ తో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది . ఆ  సమయంలో జాన్ కీట్స్ కొన్ని ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్తాడు . “చెరువులోకి దూకడం, వెంటనే ఈదుకుంటూ ఒడ్డుకు చేరడం కోసం కాదట . అక్కడే కొంతసేపు ఉండి , ఆ నీటి తాకిడిలోని లాలిత్యాన్ని అనుభవించడం కోసమట! అది ఆలోచనకి అందని ఒక అపురూపమైన అనుభవమట . అతను ఆ సందర్భాన్ని కవిత్వాన్ని అర్థం చేసుకోవడంతో పోలుస్తాడు . చెట్టుకి ఆకులు చిగురించినంత సహజంగా రానప్పుడు , కవిత్వం అసలు రాకపోవడమే మంచిదట. ”

అలా కవిత్వ పాఠాల ద్వారా ఆ ఇద్దరి మధ్య తగ్గిన దూరం , వారి మనసుల్ని మరింత దగ్గర చేస్తుంది. అలౌకికమైన ఓ ప్రేమ భావన , ఇద్దర్నీ పెనవేసుకుని చిగురిస్తుంది. ఇంతలో ఫానీ , కీట్స్ లకి ఒకే ఇంట్లో పక్క పక్క వాటాల్లో నివసించే అవకాశం లభించడంతో వారి ప్రేమ బంధం మరింత గట్టిపడుతుంది . మధ్యలో కొంతకాలం కలిగిన తాత్కాలికమైన ఎడబాటు సమయంలో కీట్స్ ఆమెకి ఎన్నో అందమైన లేఖలు రాస్తాడు.  అతని కోసం ఏమైనా చెయ్యగలిగేంత ప్రేమ ఆమెది.  ఆమె గురించి పేజీల కొద్దీ సోనెట్లు రాయకుండా ఉండలేనంత అనురాగం అతనిది .

ఆ సమయంలో  కీట్స్ రాసిన కవిత “బ్రైట్ స్టార్” ఇదే .
Bright star, would I were stedfast as thou art—
Not in lone splendour hung aloft the night
And watching, with eternal lids apart,
Like nature’s patient, sleepless Eremite,
The moving waters at their priestlike task
Of pure ablution round earth’s human shores,
Or gazing on the new soft-fallen mask
Of snow upon the mountains and the moors—
No—yet still stedfast, still unchangeable,
Pillow’d upon my fair love’s ripening breast,
To feel for ever its soft fall and swell,
Awake for ever in a sweet unrest,
Still, still to hear her tender-taken breath,
And so live ever—or else swoon to death.ఈ కవితలో కీట్స్ ఒక కదలని నక్షత్రంతో మాట్లాడుతున్నాడు .
అతనికి కూడా ఆ నక్షత్రంలా మార్పు లేకుండా , స్థిరంగా ఉండాలని ఉందట .
కానీ, ఆ నక్షత్రపు ఒంటరితనం ఎంత అద్బుతమైనదైనా అటువంటి స్థిరత్వాన్ని కాదట అతను కోరుకునేది .
ఆ నక్షత్రంలా ఎంతో ఎత్తున నిలబడి ఎప్పటికీ మూతపడని కనురెప్పల మధ్య లోంచి ప్రకృతి చూపించే ఓర్పునీ, మార్పు చెందని ఆధ్యాత్మికతనీ చూడాలని కాదట అతని కోరిక .
గుండ్రని భూమి యొక్క మానవత్వపు తీరాల్ని ఒక పూజారిలా శుధ్ధి చేస్తున నీటి కదలికల్ని గమనించాలని కూడా కాదట అతను స్థిరంగా ఉండాలని అనుకుంటున్నది .
పర్వతాల మీదా, బంజరు భూముల మీదా ముసుగులా పరుచుకుంటున్న మెత్తని మంచుని తదేకంగా చూడటమూ అతని ఉద్దేశ్యం కాదట .
కానీ అతని స్థిరంగా ఉండాలని ఉందట .
పరిపూర్ణమవుతున్న అతని ప్రేమభావం(ప్రేయసి?) యొక్క పయ్యెదని దిండుగా చేసుకుని మార్పు లేని స్థితిలో ఉండాలని ఉందట
ఆ పడి లేస్తున్న మెత్తదనాన్ని అనుభవిస్తూ
ఒక తియ్యని అవిశ్రాంత స్థితిలో ఎప్పటికీ మేలుకుని ఉండాలని ఉందట
ఎప్పటికీ కదలకుండా ఉండి, ఆ శ్వాస తాలుకూ పలుచదనాన్ని వింటూ
ఎప్పటికీ జీవించి ఉండాలని ఉందట, లేకపోతే మరణంలోకి మూర్ఛిల్లాలని ఉందట!!!ఎంత గొప్ప భావం! ఒక్కొక్క పదానికీ ఎన్నెని అర్థాలో!  ప్రతి వాక్యంలోనూ ఎంతటి భావ సంఘర్షణో! ఓ పక్క ఉత్తేజభరితమైన జీవితాన్నీ , మరో పక్క అమానవీయమైన నిశ్చలతనీ కోరుకుంటూ , ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్లాడుతున్నట్టుగా అనిపించే ఈ గొప్ప కవిత రాయడానికి కీట్స్ దగ్గర ఒక బలమైన కారణముంది .
అదేమిటంటే అనారోగ్యం! అప్పటికే అది కీట్స్ శరీరాన్నిఆత్రంగా ఆక్రమించుకుంటోంది. అతని తమ్ముడిని పొట్టన పెట్టుకున్న అదే క్షయ వ్యాధి అతన్ని కూడా తన కబంధహస్తాల మధ్య ఇరికించుకునే ప్రయత్నం చేస్తోంది . పైగా బీదరికం.  అతను అటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఫానీ అతనితో వివాహానికి సిద్ధపడి , అతన్ని తన ఇంట్లో ఉంచుకుని సపర్యలు చేస్తుంది . కానీ అక్కడ లండన్ లో ఉన్న తీవ్రమైన చలితో కూడిన వాతావరణ పరిస్థితుల కారణంగా , క్షీణిస్తున్న అతని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని,  మిత్రులంతా ధనాన్ని ప్రోగు చేసి, చలి కొంచెం తక్కువగా ఉండే ప్రాంతమైన ఇటలీకి అతడిని పంపుతారు . అతను అక్కడే తన ఇరవయ్యైదవ ఏట వ్యాధి ముదిరి మరణిస్తాడు .కీట్స్ కొన్ని రోజులు కనిపించకపోతేనే విలవిల్లాడిపోయే ఫానీ , ఈ దుర్వార్త విని తీవ్ర వేదనకి గురవుతుంది . ఆ సన్నివేశంలో విషాదమూర్తిగా మారిన ‘ఫానీ’గా, అబ్బే కార్నిష్ చూపిన నటన గురించి వివరించాలంటే అద్భుతం అన్నమాట అనక తప్పదు . ఎందుకంటే అంతకంటే ఉన్నతంగా ఆమె నటనని వర్ణించగల పదమేదీ లేదు కనుక . జుట్టు కత్తిరించుకుని , నల్లని దుస్తులు ధరించి , అతను రాసిన బ్రైట్ స్టార్ సోనెట్ ని వల్లె వేసుకుంటూ రాత్రి పూట ఆ ప్రదేశమంతా సంచరిస్తూ చాలా ఏళ్ల పాటు అతని వియోగ దుఃఖాన్ని ఆమె అనుభవిస్తుంది .  అలా అక్కడితో కథని ముగిస్తాడు దర్శకుడు జేన్ కాంపియన్ .

ఈ చలన చిత్రంలోని ప్రతి సన్నివేశం ఓ అపురూపమైన కళాఖండంలా ఉంటుంది . అతి పెద్ద కేన్వాస్ మీద ఓ గొప్ప కవి జీవితంలోని కొంత భాగాన్ని చిత్రించి చూపడంలో  దర్శకుడు ఎంతగా తన ప్రతిభని కనబరిచాడో , నటీనటులంతా అంతే సహజత్వాన్ని తమ తమ నటనలో ప్రదర్శించారు. జాన్ కీట్స్ పాత్రధారి ‘బెన్ విషా’ , ఫానీ పాత్రధారిణి ‘అబ్బే కార్నిష్’ ల నటన అత్యుత్తమం .  ముఖ్యంగా అబ్బే కార్నిష్, చలన చిత్రాన్నీ, ప్రేక్షకుల్నీకూడా  తన చుట్టూ రంగుల రాట్నంలా తిప్పుకోగలిగేంత అద్వితీయమైన చార్మ్ ని ప్రదర్శించింది . అలాగే ఒక సన్నివేశం తాలుకూ ఆడియో మరో సన్నివేశానికి కొనసాగింపబడటం, చలన చిత్రానికి ఒక ప్రత్యేకతని ఆపాదించింది . ఆ విధమైన ఎడిటింగ్ కారణంగా  కాలం  ఏక ప్రవాహమై తన గమనాన్ని గమనించనివ్వకపోయినా, చలన చిత్రమంతా ఓ కొత్త అందమే పరవళ్లు తొక్కింది .

మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రకాశవంతమైన ఈ ‘తళుకుల తార’ , తీవ్రమైన ప్రేమభావాన్ని తనలో తను అనంతంగా జ్వలించుకుని, మన మనసుల్లోపల అపూర్వమైన జ్ఞాపకాల్ని వెలిగిస్తుంది . కానీ అన్ని గొప్ప ప్రేమ కథల్లోలాగే ఇక్కడ కూడా వియోగమే గెలుస్తుంది . విషాదాన్నే మిగులుస్తుంది.

చమ్కీ పూల కథ

 

-పి. విక్టర్ విజయ్ కుమార్

~

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక  సమావేశానికి హాజరై, ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ జరిగిన  delibartions    గురించి ఆలోచిస్తూ వస్తున్నా. ఎంతో మంది రచయిత్రులు అక్కడ వేదిక మీద ప్రసంగించారు. ఆలోచిస్తున్నా – ప్రతి ఒక్కరిలోను ఏదో తెలీని ఆవేశం ! ఆవేదన ! ‘ ఎన్నో సంవత్సరాల నుండి వీళ్ళందరూ ఇన్ని  రచనలు చేస్తున్నారు. వీళ్ళ కథల్లో ఎన్ని ముస్లిం పాత్రలు, ఎన్ని క్రిస్టియన్ పాత్రలున్నాయి ?  వీళ్ళందరూ సృష్టించిన పాత్రల సంఖ్య లో, మత సహనం అనే ప్రత్యేక ఇతివృత్తం తో రాయకపోయినా, కనీసం పదహైదు  శాతం అన్నా మైనారిటీ లకు సంబంధించిన పాత్రలుంటే , అది  secular world of progressive writers    అయినట్టే కదా ? ముస్లిములు ఘాతుకంగా చంపబడిన 2002 సంవత్సరం తర్వాతైనా లేదా 2013 ముజఫర్ నగర్ ఊచకోత జరిగిన తర్వాతైనా సరే – మన తెలుగు రచనల్లో – ఎన్ని ముస్లిం పాత్రలొచ్చాయి ? ఎన్ని సన్నివేశాల్లో ముస్లిములు కనిపిస్తారు ? 2000 మొదట్నుండీ సామాజిక చిత్ర పటం లో ఇన్ని మార్పులు జరుగుతుంటే, గమనించని రచయితలు, రచయిత్రులు – చేస్తున్న ఈ ఆక్రందనల్లో శూన్యత లేదా ? ‘ ఆలోచనల స్రవంతి తెగదు ఇలా ఆలోచిస్తూ పోతే. నాకు ఎవరినీ నిందించాలనో, ఎవరి మీదో ఒక అసహనం ప్రదర్శించాలనో లేదు  గాని – కథ రాసి ఇంటికొచ్చి పిల్లలకు హోం వర్క్ చేయిస్తూ , మన పిల్లోడు కూడా మిగతా పిల్లల మాదిరిగానో, అంత కంటే ఎక్కువ గానో చదవాలి అనే ప్రెషర్ ను మనం తీసుకోవడమో, పిల్లల మీదకు రుద్దడమో ఎలా చేస్తామో – సింపుల్  గా చెప్పాలంటే అదే రకమైన ప్రెషర్ ఇది !!

మొహరం నెల. సూఫీ తత్వ వాదులు పవిత్రంగా పరిగణించే  రోజులు ఇవి.   మన దేశం లో సంస్కృతి ‘ భారత దేశ సంస్కృతి ‘ అని మత ఛాందస వాదులు, ఒక   hypothetical culture   ను జాతీయ వాదం లో భాగంగా ముందుకు తీసుకువచ్చి, ఇక ఏ ఇతర సంస్కృతి అయినా    subservient   అని గర్భితంగా ప్రజల సంస్కృతిని ప్రభావితం చేయదల్చుకుంటున్నప్పుడు –   composite culture  మానవ సంబంధాల్లో ఎలాంటి ఆర్ధ్రత నింపుతుందో తెలియ జేయడానికి , నాకు తెలిసి ఈ మధ్య కాలం లో జరగని ఒక ప్రయత్నం ఒక ముస్లిం చేసాడు. తన అస్తిత్వాన్ని, తను కోరుకునే సామాజిక సఖ్యతకు చమ్కీలద్ది మనకు ‘ చమ్కీ పూల గుర్రం’ ను అందించాడు.       అఫ్సర్ రాసిన ‘ చమ్కీ పూల గుర్రం ‘ మత తత్వానికి వ్యతిరేకంగా నినదించే సమయం లో – వచ్చిన   most well timed story .

కథ ఇతివృత్తం చూస్తే – ఇద్దరు చిన్న పిల్లల స్నేహానికి మత విశ్వాసాలు, పర మత విశ్వాస అసహనం ఎలా దీనావస్థను కలుగ జేస్తుందో తెలియ జేసే కథనం ఇది. మున్నీ పీర్ల ఆరాధన సంస్కృతికి   symbolic  గా ఉన్న చమ్కీ పూల గుఱ్ఱాన్ని బహుమతిగా ఆపూ కు ఇవ్వడం, ఆపూ –  మున్నీ స్నేహం లో ఉన్న అందాన్ని చమ్కీల  అందం లో చూసి ఆనందపడ్డం, హిందూ మత విశ్వాస విషం లో మునిగిన తండ్రి ఆపూ ను కొట్టి కలవకుండా ఇంట్లోనే ఉండమని హుకుం వేయడం, ఆపూకు విన్న పీర్ల కథలు నెమరేసుకోవడం,  ఆపూ తల్లి ఆపూ లొ ఉన్న విషాద అనుభూతిని చూసి నిస్సహాయంగా బాధ పడ్డం, ఆపూ మున్నీ స్నేహాన్ని కలవరిస్తూ చమ్కీ పూల గుఱ్ఱాన్ని  కలలో కలవరింపుల్లో దగ్గరగా హత్తుకుంటూ నిద్రలో ఒద్దిగలడంతో ఆర్ధ్రంగా ముగుస్తుంది కథ.

మొదటగా  కథా ఇతివృత్తం చూస్తే ప్రధానంగా గోచరించేది  “ culture of love and culture of acceptance “ .  మనమిప్పుడు చూస్తున్నది   “ Politics of hate “ ఇదే “ culture of hatred  “ ను పోషిస్తుంది . దీనికి కౌంటర్ గా  మనం ప్రజలకు రుచి చూపించాల్సింది  “ culture of love and affection “ . ప్రేమించే సంస్కృతి – పర విశ్వాస సహనం తొ ఒక స్థాయి వరకు కలిసి ఎదిగినా అల్టిమేట్ గా  ‘ సమ్మతి ‘ అన్నది ‘ సహనం ‘ కన్నా గొప్ప భావన. ఆ సమ్మతితోనే – ప్రేమలో ఒక ఆర్ధ్రత వస్తుంది. ప్రేమ ప్రజాస్వామికంగా ఉండడం వేరు. ప్రేమ ఆర్ధ్రంగా ఉండదం వేరు. మన దేశం లో సెక్యులరిజం ‘ పరమత సహనం ‘ దగ్గరే ఆగిపోయింది. ఈ కథ ఒకడుగు ముందుకేసి ‘ సహనం ‘ ను ‘ సమ్మతి ‘ అనే ఉన్నత స్థాయి దగ్గరకు తీసుకెళ్ళి , మనుష్యుల మధ్య ఉన్న అనుబంధాల్లో  essence  ను మనకు రుచి చూపిస్తుంది.

కథ చెప్పడం లో ఎన్నుకున్న పద్ధతి

పర విశ్వాస సమ్మతికి ప్రధాన అడ్డు గోడ   judgemental analysis of beliefs   .  రాన్ వైల్డ్ అనే ఒక ప్రఖ్యాత ప్రఖ్యాత కళాకారుడి  మాటలు గుర్తొస్తాయి  ”  Seek the wisdom of the ages, but , look at the world through the eyes of a child ”   . ప్రతి మతం గురించి , ప్రతి విశ్వాసం గురించి   dispassionate   గా తెలుసుకోవడం మేధావులుగా ఒక ఎత్తైతే , చిన్న పిల్లల దృష్టిలో చూస్తే మన ప్రపంచాన్ని మనమే ఎంత జఠిలం చేసుకున్నామో అర్థమౌతుంది.  ఇదే మాట ఆపూ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది ” అది చిన్న పిల్ల. దానికి ఈ వయసులో ఏం తెలుస్తుంది ? ఆ దేవుడి బొమ్మ కూడా ఆట బొమ్మ తప్ప ఇంకేమీ కాదు దానికి. కాసేపు ఆడుకుంటుంది. అంతే ! పిల్లల ఆటలో దేవుళ్ళ గొడవ తెచ్చి పెడితే ఎట్ల ? అక్కడ దానికి భక్తి గురించి , దానికి ఇంకా అర్థం కాని ధర్మం గురించి చెప్తే ఎట్ల ? ” నిజమే కదా ?! మనిషికి మత విశ్వాసాలెందుకు ? తన మీద తనకు భరోసా కలిపించడానికి. దాన్ని ధర్మం పేరుతో ఎంత  complicate  చేసుకున్నాం మనమందరం ? దీనికో తత్వాన్ని అద్ది ఛాందస వాదులు ప్రజా జీవితాన్ని ఎంత దుర్భరం చేసారు ? ఆపూ తన కలలో పీర్ల సాయిబు , పీరు బరువు ఎత్తడానికి ఇబ్బంది పడ్డప్పుడు ‘ జై ఆంజనేయ ‘ అంటుంది. దీన్ని ‘ మన ధర్మం గంగ నీరు, పర ధర్మం ఎండ మావి ‘ లాంటి అసంబద్ధ మైన సిద్ధాంతాలు చెప్పి కల్మషం చేయాలని చూస్తుంది ఒక కేరక్టర్ ఇందులో.

కథ మొత్తం చాలా నిర్దుష్టంగా,  situation specific   గా నడుస్తుంది. మన సెక్యులర్ సాహిత్యం  బ్రాహ్మినిజం తో కాంప్రమైజ్ అయ్యి వచ్చిన అర కొరా సాహిత్యం కూడా   abstractise   అయ్యింది.   Abstractisation is actually the biggest threat to secular writing, which actually needs a specific exemplification, reasoned out writing and usage of empathised forms    అబ్స్ట్రాక్టైజ్ చేయడం వలన, సెక్యులరిజం   గురించి     general sense   లో మాట్లాడి బ్రాహ్మినిజం ను వెనక్కు తోసేస్తుంది. దీనితో పాటు, సమస్యల తీవ్రత తగ్గించి కొంత గందరగోళానికి గురి చేసే ప్రమాదానికి కూడా ఇది తోడ్పడుతుంది. మానవులందరూ సమానులే అని కథ రాస్తే, సెక్యులర్ రచన అయిపోదు. విశ్వాసాల మధ్య ఘర్షణ, మెజారిటి వాదం యొక్క నిరంకుశత్వం గురించి నిర్దుష్టంగా మాట్లాడాకపోతే కథ, కవిత, ఇంకేదైనా సెక్యులర్ రచన కానేరదు. కవితాత్మకంగా చెప్పాలని , ఏవో   abstract expressions  ను మధ్యలో దూర్చడం సెక్యులర్ దృక్పథాన్ని తీవ్రంగా  dilute  చేస్తుంది.  ఈ విషయం మన కథకుడికి బాగా అవగాహన కావడం వలననే ఈ కథ అందంగా రాగలిగింది.

చిన్న పిల్ల ద్వారా మత విశ్వాసాలను వివరించడం ఈ కథ లో ఉన్న గొప్ప ఎత్తుగడ.  మనలో ఈ  complexity   కి దూరంగా బతకాలనుకునే ఒక నిర్మల తత్వం చిన్న పిల్లల హృదయం నుండి వివరించడం వలన మనం కోల్పోయిన దేమిటొ తెలియడానికి – ‘ ఆర్ధ్రత ‘ ఒక ఫాం గా నిలబడగలిగింది ఈ కథలో.   ఆపూ బాధ ఈ కథలో ఉన్న ప్రతి స్త్రీ కేరక్టర్  empathise  చేస్తుంది.  పురుష పాత్రలన్నీ వ్యతిరేకమే ! ఎందుకంటే ఇది ఉత్తి పురుష్స్వామ్యం కాదు – బ్రాహ్మణీక పురుష స్వామ్యం కూడా !

ఇంకా చిన్న చిన్న వివరణలు ( నేను వీటిని కథలో ఎత్తుగడలే అనే అనుకుంటున్నా ) –  మున్నీ , ఆపూ తో మాట్లాడక ఐదు రోజులయ్యింది అని ఉంటుంది . మూడు రోజులు ఎందుకు కారాదు ? ఏడు రోజులు ఎందుకు కారాదు ? మనలో కొన్ని  schemas  ఉంటాయి. ఏది దూరం, ఏది దగ్గిర అనడానికి కొన్ని  schematic feelings   ఉంటాయి. ఇది చాలా చిన్న విషయమే కాని, పాఠకుడికి తెలీకుండా పాఠకుడి మనస్సు మీద కొని   schemas  ను తట్టి లేపుతుంది.  ఫాతమ్మ చేసిన పాల కోవా అంటే ఆపూ కు ఇష్టం. అది మున్నీ ఒక్కతే తింటుందా ? తాను కలిసినప్పుడు ఇస్తుందా – అని ఆపూ ఆలోచిస్తుంది. ఇదొక  affectionate jealousy  కి సంబంధించిన   schema . ఇలా ఇంకా ఎన్నో   schemas   ను , తను చెప్పదల్చుకున్న మెసేజ్ కు అనుకూలంగా వాడుకుంటూ వస్తాడు. పాఠకులకు   cognitive complexities  ఉంటాయి. అందుకు   narrative   గా చెప్పడం ఒక పద్ధతి, సిచ్యుయేషన్ మీదా వ్యాఖ్యానిస్తూ   చెప్పడం ఒక పద్ధతి, వాదన చేస్తూ వివరించడం ఒక పద్ధతి. ఆర్ధ్రత,    empathy  ని వివరించాలంటే కథకుడు   schemas   ను తీసుకుని వాటి ద్వారానే, పాఠకున్ని కన్విన్స్ చేయాలనే పద్ధతి ఎన్నుకున్నాడు. అది సరి అయినదే అని కథ చదివాక ప్రతి ఒక్కరు అర్థం చేసుకోక తప్పదు.  అసలు ‘ చమ్కీ ‘ అన్నదే గొప్ప  schema . అది ఆనందాన్ని, అమాయకత్వాని   symbolise   చేస్తుంది.

మన దేశం లో దర్గాలు , పీర్ల సాయిబులు – అతి శూద్ర హిందువులలో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ఇది హైందవత్వం , వీళ్ళ జీవితాల్లోకి తగినంత  చొచ్చుకుపోక పోవడం వలన కలిగిన ఒక    modification of belief  . దర్గాలలో దేవుళ్ళు ఉండరు. ఆరాధ్యనీయమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల ( ఆ వ్యక్తిత్వం మత తత్వమైనా సరే – అది వేరే విషయం )  సమాధులుంటాయి. పీర్ల చావిడిలో ఆర్భాటాలు ఉండవు. సింప్లిసిటీ ఉంటుంది. అక్కడ  Priests  కు తెచ్చిపెట్టుకున్న గొప్ప తనం ఉండదు. ఏ గొప్ప దర్గా సందర్శించినా   composite culture   మాత్రమే కనిపిస్తుంది. ఎవరన్నా సమానులే అక్కడ. ఎవరికీ స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండదు.

ఈ కథను  నాస్తికులు, గానీ    conservative marxists   గానీ దేవుడికి సంబంధించిన విశ్వాసాన్ని ఇంకోలా  glorify   చేసారు అనొచ్చు. మన దేశం లో హిందూ మెజారిటీ వాదాన్ని ఎదుర్కోవాలంటే – మనం అర్థం చేసుకోవాల్సింది , బ్రాహ్మినిజం సృష్టించిన ప్రతి  sentiment  కు మనం   counter-sentiment   ను సృష్టించాలి.  అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించాడంటే – అసలు మతం లేకపోతే మనిషి మనుగడే లేదు అనే నమ్మకం తో కాదు. దేవుడు – సమూలంగా మన జీవితాల్లో నుండి వెళ్ళిపోవాలంటే ఇంకో 500 సంవత్స్రాల పైనే పట్టొచ్చు. అంత వరకు ప్రజలకు  alternate  ఏం చూపించాలి ?  alternate belief system  డెవలప్ చేయకుండా , మనుష్యులను మనం కూడా గట్టుకోలేము. అలా కాక, ‘ అసలు ఏ దేవుడి గురించీ రాయొద్దు, దేవుడే లేదు అందుకోసం ఎవరూ కొట్టుకోవద్దు ‘  అని రాయండి అనడం  dogmatic argument  తప్ప ఏమీ కాదు.

ప్రతి ప్రజాస్వామిక రచయిత, రచయిత్రి – ఇలాంటి కథ ఏదో ఒకటి, ఇలాంటి పాత్రలతో ఏదో ఒకటి రాయండి చాలు. ఆంధ్ర జ్యోతి వేసుకోకపోవచ్చు, ఆంధ్ర భూమి వేసుకోకపోవచ్చు. నష్టం లేదు. ప్రగతి వాదం ఎప్పుడూ మైనారిటీ వాదమే. అదో దీర్ఘ కాలిక తిరుగుబాటులో భాగంగానే ఉంటుంది. అందుకు రచయిత/త్రి గా ఓపిక కావాలి.  అసలు ఇలాంటి కథ ఒకటి రాసి ఎవరూ  వేసుకోకపోతే, మీ దగ్గరే పెట్టుకోండి. మీ ఫేస్ బుక్ వాల్ మీద పెట్టుకోండి. ఎందుకంటే – మీరు రాస్తున్న దృక్పథం మహోన్నతమైంది కాబట్టి. అది ఏదోలా ఎక్కడో చోట వినబడాలి కాబట్టి.

నాకు మాత్రం ఈ కథ చదివినప్పుడు – కలిగిన ఫస్ట్ హేండ్ ఫీలింగ్ – ఈ కథ ఒక ముస్లిం మాత్రమే రాయగలడు. అది అఫ్సర్ కావడం  incidental  !!  ఆయనకు ఈ సాహితీ కళ ఉండడం సామాజికంగా యాదృచ్చికం.  ఇది ఆయన అస్తిత్వ ఫలం!

*

 

 

 

జ్వలనమే జననం!

 

విజయ్ కోగంటి
***
koganti
ఒక దశ లోంచీ
మరొక దశ లోకి ప్రవేశించాలంటే
అవశేషాల్లేకుండా దహించ బడాల్సిందే
నివురయ్యేలా నిశ్శేషమవాల్సిందే.
అంతరాంతరాలలో
పేరుకున్న
కోరికలను, దాహాలను, అహాలను
దహిస్తూ జ్వలించడం ఒకజననమే!
సుఖమైనా, దుఃఖమైనా జ్వలనమే.
బ్రతుకుపైజరిగే
కుట్రను ఛేదించడమూ జ్వలనమే.
గొంగళిలా బ్రతకడమూ జ్వలనమే.
రంగుపూల రెక్కలు తొడిగి
ఎగిరే స్వేచ్ఛై విస్మయపరచడమూ జ్వలనమే.
జ్వలించడం ఒక పోరాటం,
ఒకరూపాంతరం!
అందుకే, జ్వలిద్దామా?!?
*

కవిత్వం luxury కాదు!

 

-నిశీధి 

~

Poetry is not a luxury . కవిత్వం ఎపుడు ఒక విలాసం కాదు . మన ఉనికికి అదో ముఖ్యమయిన ఆధారం ,మనుగడ కలకో ఊతనిచ్చే ఆలోచన ముందు భాష గా మారి మార్పు దిశగా పయనించి ఎప్పటికయినా ఆ కల సాత్కారం అవుతుందన్న నమ్మకమే కవిత్వం అంటారు Audre Lorde. ఎంత నిజం కదా కవిత్వం వైయక్తిక భావనగా మనిషికో ఎదుగుదల చూపినా అసలు ఒక సామాజిక కోణంలో , అణగారిన వర్గాల్లో వాక్యం విలువ ఎంత గొప్పదో . అది ఎన్ని  భయాల అనుభవాలను చెక్కితే  అవధులు లేని ఆశగా మార్పు చెందుతుందో అనుభవించని వాళ్లకి తెలియడం కష్టం .

Audre Lorde (1934–1992)  ఉప్పెనైన కవిత్వానికో పూర్తి చిరునామా . కాబట్టేనేమో ఇంత పదును నిజాలు ఈ రోజు మన మధ్య నిలబడ్డాయి . ఇవి చూడండి “ మనమధ్య తేడాలు కాదుమనల్ని నిజంగా  విడదీస్తుంది  అసలా  తేడాలున్నాయని గుర్తించి సాల్వ్ చేసుకోలేని మన  అశక్తత మనల్ని విడదీస్తుంది .”  అలాగే  “నన్ను నేను నిర్వచించుకోక తప్పదు లేకపోతే జనం వాళ్ళ  కల్పనల్లో నా అస్తిత్వాన్ని సజీవంగా నంచుకొని తింటారు. “ఇదే కాదు  “నా ధైర్యాన్నంతా వాడి శక్తివంతంగా ఉంటూ నాకో విజన్ అంటూ ఏర్పడితే అసలు నాకింకా  భయమేముంది  “ అని చెప్పినా అది తను మాత్రమే అవుతుంది . అలాగే తనని తాను  “ బ్లాక్ , లెస్బియన్ , మదర్ , వారియర్ , పోయెట్ “ గా నిర్వచించుకొనే ఈ రైటర్ సాహిత్యలోకపు కుదుపులు కుదపడమే కాకుండా  , రేసిజం , సెక్సిజం , హోమోఫోబియా ఇలా ప్రతి సామాజిక అన్యాయాన్ని తన చివరి శ్వాస వరకు పోరాడి ఎదురునిలిచింది .

a6

లార్డ్ రాసిన  లవ్ పోయెం ఇంకా  , కోల్ తన కవిత్వాన్ని ఉన్నత స్తాయి కి తీసుకెళ్ళిన మాట నిజమే కాని వ్యక్తిగతంగా  నాకెందుకో తను రాసిన “ పవర్ “ కవితలో మొదటి వాక్యం “  కవిత్వం మరియు వాక్చాతుర్యాన్ని మధ్య వ్యత్యాసం మీ పిల్లల బదులు మీరే  చావడానికి సిద్ధంగా ఉండటం  “ అన్నది అసలు మొత్తం ప్రపంచ సాహిత్యానికే సవాలుగా అనిపిస్తుంది . సేఫ్ గేం  ప్లే చేస్తూ సోయగాల గురించొ సొరకాయ దప్పళం గురించో పద్యాలు రాసుకొనే 99% కవులు రచయితలు తర్వాత తరాలని బలిస్తున్నట్లేగా అనిపిస్తింది. కాని ఎక్కడో మన కలబుర్గీలు , Asharaf Fayadh లు పూర్తిగా  అమ్ముడుపోని లిటరరీ ప్రపంచాన్ని ఇంకా నమ్మగలిగే స్థైర్యాన్ని ఇస్తూనే  ఉంటారు .

అస్థిర పరిస్థితులలో వణుకుతున్న స్వరంలో అయినా అసహనాన్ని చూపుతున్న గుప్పెడు మందిని మందలో రచయితలు సైతం ఇంటాలరేన్సా  అంటే ఏమిటీ అని ప్రశ్నిస్తున్న కాలంలో

 

క్వీన్స్ లో  పదేళ్ళ పిల్లవాడి

రక్తంలో బూట్లు తడుపుకున్న పోలీసు

విచారణలో తన సొంత రక్షణకోసమే బాయినేట్ ఎక్కుపెట్టానని

పరిమాణాలు పరిణామాలు ఏవి చూడలేదు

రంగు మాత్రమే  కనిపించిందని చెప్పాడని

కవిత్వంలో జరుగుతున్న చరిత్రని ,జరిగిన ఎన్నో అన్యాయాలని ఆక్రమణలని భయపడకుండా రాయగలిగిన దమ్ము ఆమె కలానిదే . తన కవిత్వానిదే కదా .

అందుకే ఈసారి మనకోసం మరొక్కసారి power పోయెమ్ .

ad1

 

Power

BY AUDRE LORDE

The difference between poetry and rhetoric

is being ready to kill

yourself

instead of your children.

 

I am trapped on a desert of raw gunshot wounds

and a dead child dragging his shattered black

face off the edge of my sleep

blood from his punctured cheeks and shoulders

is the only liquid for miles

and my stomach

churns at the imagined taste while

my mouth splits into dry lips

without loyalty or reason

thirsting for the wetness of his blood

as it sinks into the whiteness

of the desert where I am lost

without imagery or magic

trying to make power out of hatred and destruction

trying to heal my dying son with kisses

only the sun will bleach his bones quicker.

 

A policeman who shot down a ten year old in Queens

stood over the boy with his cop shoes in childish blood

and a voice said “Die you little motherfucker” and

there are tapes to prove it. At his trial

this policeman said in his own defense

“I didn’t notice the size nor nothing else

only the color”. And

there are tapes to prove that, too.

 

Today that 37 year old white man

with 13 years of police forcing

was set free

by eleven white men who said they were satisfied

justice had been done

and one Black Woman who said

“They convinced me” meaning

they had dragged her 4’10” black Woman’s frame

over the hot coals

of four centuries of white male approval

until she let go

the first real power she ever had

and lined her own womb with cement

to make a graveyard for our children.

 

I have not been able to touch the destruction

within me.

But unless I learn to use

the difference between poetry and rhetoric

my power too will run corrupt as poisonous mold

or lie limp and useless as an unconnected wire

and one day I will take my teenaged plug

and connect it to the nearest socket

raping an 85 year old white woman

who is somebody’s mother

and as I beat her senseless and set a torch to her bed

a greek chorus will be singing in 3/4 time

“Poor thing. She never hurt a soul. What beasts they are.”

 

చివరగా ఇంకో మాట లార్డ్ poems  మిస్ అయినా పర్లేదు కాని కవిత్వం అంటే ఏమిటో ఎందుకో లాంటి ప్రతి ప్రశ్నకి సమాధానం కావాలంటే మాత్రం ఇంటరెస్ట్ ఉన్నవాళ్ళు  తను రాసిన Sister Outsider సాహితీ వ్యాసాలు మాత్రం అసలు మిస్ అవ్వకండి .

*

 

వాళ్ళూ, వాళ్ళ పిల్లలూ…

-మెర్సీ మార్గరెట్
~

mercy

 

 

 

 

 

ఈ నీలాకాశం కిందే
మూడొంతుల నీళ్ళతో  నిత్యం పరిభ్రమించే భూమి మీదే
వారు వాళ్ళ పిల్లల్ని పెంచుతారు

తమ తల్లులు తమని పెంచినట్టు
తండ్రులు పొట్టపై పడుకోబెట్టుకునో, పక్కలో రొమ్ముపై ఆనించుకునో
నానా రహస్యాలు మాట్లాడుకున్నట్టు
చుక్కల్ని లెక్కిస్తూనే కథల్లో లౌక్యం నేర్చుకుంటూ
వారూ పెరుగుతారు
తమ తల్లిదండ్రులు నేర్పిన ఆశలతో
తమలో వారు నాటిన విలువలతో

యేమేమి నేర్పుతారో
యే తర్పీదు నిస్తారో
సద్బోధనో, వైద్యమో, ఔషదమూలికలు కనుగొనడమో
పరామర్శ చేయడమో , పరిచర్య చేయడమో
గురువులైన తలిదండ్రులే తమ ఒడిలో
యే కొత్త ఆకాశాన్నో , యే స్వచ్చమైన పావురాళ్ళనో
లాలనగా పెంచుకుంటారు
ఒకరికొకరు తోడు మనుషులని మళ్లీ మళ్ళీ వల్లెవేయించి
నేర్పుతారేమో మరీ పాఠాలు

ఒకానొక రోజు
ఆ పిల్లల్లకూ పిల్లలు పుడతారు
వాళ్ళూ అమ్మా నాన్నలవుతారు
తమ తల్లులు తమని పెంచినట్టు
తండ్రులు పొట్టపై పడుకోబెట్టుకుని, పక్కలో రొమ్ముపై ఆనించుకుని
తమని పెంచినట్టు వాళ్ళ పిల్లల్నీ పెంచుతారు

కానీ వీళ్లు తమ పిల్లలతో
మతోన్మాదం గురించి మాట్లాడతారు
మక్కా మసీదు, లుంబినీ వనంలో బాంబు పేలుల్ల గురించి
11/9 సంఘటన
పాలస్తీనా, ఇశ్రాయేల్ యుద్ధం గూర్చి
ఆ రాత్రి ఫారిస్ ముఖంపై జరిగిన ఆత్మాహుతి దాడి గురించి
మాట్లాడతారు

తమ పిల్లల వీపు నిమురుతూ
వాళ్ళ కళ్ళలోకి చూస్తూ చెపుతారు కదా
మనిషికి మనిషే తోడు
మృగాల్లా మీరెప్పుడూ ఆలొచించొద్దూ అని
అంతేగా మరి
వాళ్ళూ ఎప్పుడో అమ్మానాన్నలై
గురువులుగా మారుతారు.

*

దిగడానికి కూడా మెట్లు కావాలి!

 

రామా చంద్రమౌళి

~

Ramachandramouliరాత్రి పదీ నలభై నిముషాలు.

డిల్లీ రైల్వే ప్లాట్ ఫాం నంబర్ పన్నెండు.అటు చివర.ఎప్పటిదో.పాతది.దొడ్డు సిమెంట్ మొగురాలతో.సిమెంట్ పలకతో చేసిన బోర్డ్.పైన పసుపు పచ్చని పెయింట్ మీద నల్లని అక్షరాలు.’నయీ ఢిల్లీ ‘.పైన గుడ్డి వెలుగు.కొంచెం చీకటికూడా.వెలుతురు నీటిజలలా  జారుతుందా. కారుతుందా. చిట్లుతుందా. ప్రవహిస్తుందా. వెలుతురుపై. కురుస్తూ. వెలుతురును కౌగలించుకుంటూ.. సన్నగా.మంచుతెర.పైగా పల్చగా చీకటి పొరొకటి.అంతా స్పష్టాస్పష్టత.కనబడీ కనబడనట్టు.కొంత చీకటి..గుడ్డి గుడ్డిగా.కొంత వెలుతురు మసక మసగ్గా.తన జీవితం వలె.చీకటి ఒక లోయ.వెలుతురు ఒక శిఖరమా.లోయ ప్రక్కనే శిఖరం.చీకటి ప్రక్కనే.తోడుగా చీకటి.జతలు.జతులు.ద్వంద్వాలు.వైవిధ్యాలు.వైరుధ్యాలు.

డిసెంబర్ నెల. ఇరవై ఆరు. చలి. గాఢంగా . . అప్పుడప్పుడు వణికిస్తూ. అప్పుడప్పుడు . మృదువుగా స్పర్శిస్తూ. కప్పుకున్న శాలువాకింద శరీరం .  నులువెచ్చగా . భాషకందని గిలిగింత . కళ్ళుమూసుకుంటే..గుండెల్లో భైరవీ రాగంలో ఏదో.. ప్రళయభీకర గీతం.

మేఘాలు చిట్లిపోతూ . . ఆకాశం  పగిలిపోతూ . . ఇసుక తుఫానులతో ఎడారులు ప్రళయిస్తూ.శబ్దం విస్ఫోటిస్తూ.అంతిమంగా.శబ్దాలూ.రాగాలూ.గీతాలూ.అన్నీ.ఒక అతి నిశ్శబ్ద బిందువులోకి అదృశ్యమైపోతూ.చివరికి. ఒట్టి..శాంత మౌన ఏకాంతం.జీవితం ఇది.అంతా ఉండీ.చివరికి ఏమీ లేని.ఏమీ లేక అంతిమంగా అన్నీ ఉన్నట్టనిపించే ఒక సుదీర్ఘ భ్రాంతిగా మిగిలి.,

“జిన్ హే హం భూల్ నా చాహే..ఓ అక్సర్ యాద్ ఆతీహై “..అతి విషాద స్వరంతో ముఖేష్..దుఃఖం గడ్డకడుతున్నట్టు..యుగయుగాల పరితపన కన్నీరై ప్రవహిస్తున్నట్టు.,

ఉష..నలభై ఆరేళ్ళ ఉష.శరీరాన్ని.దళసరి ఉన్ని శాలువాలో దాచుకుని.అటు చీకట్లోకి చూస్తోంది. నిశ్శబ్దం లోకి  .ఆమెకు బయట అటు దూరంగా వందలమంది ప్రయాణీకులు . గోలగోలగా ఉన్నా లోపల తనొక్కతే . అంతా నిర్వాణ నిశ్శబ్దం.నిర్గమ నిశ్శబ్దం. నిరామయ నిశ్శబ్దం.

ఒక ఎలక్ట్రిక్ లోకో ఇంజన్ ఏదో అతి వికారంగా అరుస్తూ ప్రక్కనున్న ట్రాక్ పైనుండి మెల్లగా కదుల్తూ..అటు దూరంగా నిష్క్రమిస్తూ,వెలుతురులోనుండి చీకట్లోకి.పైన అన్నీ ఎలక్ట్రిక్ కేబుల్స్.చిక్కు చిక్కుగా.,

చిక్కు.చిక్కు పడ్డ దారం ఉండ జీవితం.ముళ్ళుపడి.అల్లుకుపోయి.కొస దొరుకక.వెదుకులాట.కొస కోసం.ఒక దరి కోసం.దారికోసం.వెదుకులాట.చిన్ననాటినుండి.ఈ క్షణందాకా.ఒకటే నిరంతరమైన అనంత అన్వేషణ.,

ఇంతవరకు వేల పాటలు. వందల సభలు.లక్షలమంది శ్రోతలు.కోట్ల చప్పట్లు.పట్టణాలు.నగరాలు.దేశాలు.ఖండ ఖండాంతరాలు.అంతర్జాతీయ వేదికలు.సన్మానాలు.సత్కారాలు.జ్ఞాపికలు.శాలువాలు.పర్స్ లు.పైవ్ స్టార్ హోటళ్ళు.బెంజ్ కార్లలో ప్రయాణాలు.ఆకాశంలో మేఘాలను చీల్చుకుంటూ..విమానాల్లో.మళ్ళీ శూన్యంలోకి..అన్నీ ఉండి..ఏదీలేని..ఒక ఖాళీలోకి.

ఇంటిగ్రేట్ .  జీవితాన్ని సమాకలించుకోవాలి .  లోయర్ లిమిట్ నుండి   అప్పర్ లిమిట్ వరకు. అవధులు..అవధులు.కిందినుండి పైకి.పుట్టుక నుండి మృత్యువుదాకా.మృత్యువునుండి..మళ్ళీ జన్మదాకా.

‘ మేడ  లోన  అల పైడి బొమ్మా

నీడనే చిలకమ్మా

కొండలే రగిలే వడగాలీ

నీ సిగలో పువ్వేలోయ్ ‘

..చందమామ మసకేసిపోతుందా.?

ఉష..మసక లోకి..మసక వెలుతురులోకి.మసక చీకట్లోకి.చూస్తోంది.

 2          

digadaaniki-picture వర్షం కురుస్తూనే ఉంది.రెండు రోజులుగా.ఎడతెరిపిలేకుండా.

విజయవాడ..హోటల్ మనోరమ వెనుక గల్లీ..అంబికా వైన్స్.

రాత్రి తొమ్మిదిన్నర.రజియాబేగం కు చాలా అలసటగా..చాలా చికాగ్గా..చాలా దుఃఖంగా,జీవితంపట్ల చాలా విసుగ్గా,రోతగా కూడా ఉంది.

‘ఈ జీవితాన్ని జీవించి జీవించి అలసిపోయాన్నేను’..అని ఏ ఐదు వందలవసారో అనుకుందామె.అనుకుని చాలా నిస్సహాయంగా ఆ వర్షం కురుస్తున్న రాత్రి తనచుట్టు తానే చూచుకుంది.

అంతా నీటి తేమ వాసన.వెలసిన గోడలతో నిలబడ్డ అంబికా వైన్స్..షాప్ ముందు.తోపుడుబండి.ఒక కొసకు వ్రేలాడ్తూ.పెట్రోమాక్స్ లైట్.మసిపట్టిన గాజు ఎక్క.మసక వెలుతురు.. ‘ సుయ్ ‘..మని వొక వింత చప్పుడు..పెట్రోమాక్స్ దీ..ఆమె ఎదుట మూకుడులో నూనెలో వేగుతున్న చికెన్ కాళ్ళ దీ..లోపల గుండెల్లో బయటికి వినబడని యుగయుగాల దుఃఖానిది.ప్రక్కనే వాననీళ్ళు కారుతున్న చూరుకింద నిలబడి కస్టమర్ల ఎదురు చూపు.ఇద్దరుముగ్గురున్నారు.ఒకడికి చికెన్ కాళ్ళు రెండు.మరొకడికి బాయిల్డ్ ఎగ్స్.ఇంకొకడికి.రెండు బొచ్చె చేప వేపుడు ముక్కలు.

రెండ్రోజులుగా ముసురుగా కురుస్తున్న వర్షానికి..నగరంలోని వ్యాపారాలన్నీ మందగించాయి..కాని ఈ వైన్ షాప్ లు మాత్రం పుంజుకున్నాయి.తాగుబోతులకు వర్షాలు కురిసినా..శీతాకాలం మంచు కమ్ముకున్నా..ఎండాకాలం ధుమధుమలాడ్తూ సెగలు చిమ్మినా తాగుడుదిక్కే మనసు పోతుంది..అప్పుడు బ్రాండీ విస్కీలు..తర్వాత చల్లని బీర్లు.కాబట్టి వైన్ షాప్ లన్నీ..ఋతువుల్తో సంబంధంలేకుండా  సర్వవేళల్లో  కళకళలాడ్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాయి.అందుకే అవి ప్రభుత్వాలనూ..కొందరు బలిసిన మోతుబరులనూ పోషించే కామధేనువులు.అసలు ఈ భూమ్మీద మద్యాన్ని అమ్మేవాల్లదీ..తాగేవాళ్ళదీ ఒక ప్రత్యేక జాతిగా రజియా ఏనాడో గుర్తించింది.ఈ రెండు  జాతుల మనుషులతో  ఆమెకు పది సంవత్సరాల అనుబంధం.ఆ వైన్ షాప్ ముందు తోపుడు బండి మీద ‘ తిండి ‘ని అమ్ముతూ ఆమె అక్కడ ఒక శాశ్వత అడ్డా మనిషిగా మారిపోయింది.ఆ పది పదిహేనేళ్లలో షాప్ ఓనర్స్ మారిపోయారుగాని రజియా మాత్రం పర్మనెంటైపోయింది.రజియా చేతి ఐటంస్ రుచి అలాంటిది.ఒక్కతే బండిని చూచుకుంటుంది.సాయంత్రం ఏడునుండి.ఏ రాత్రి పదకొండుదాకానో.

తోపుడుబండికి.ఒక మూలకున్న గుంజకు ఒక పాత గొడుగును సుతిలి తాళ్లతో గట్టిగా కట్టుకుంది రజియా.పైన చత్రీ అక్కడక్కడ రంధ్రాలుపడి..కొద్దికొద్దిగా నీటి తడి కారుడు.కస్టమర్లు వేచిఉండడంవల్ల వడివడిగా పనికానిస్తూ,ప్రక్కనున్న వెదురు బుట్టలోని నాల్గయిదు చేపముక్కలను బేసిన్ గిన్నెలోని కలిపిన శనగపిండిలో వేసి కలుపుతూ..అనుకుంది..’చికెన్ ముక్కలూ,చేప ముక్కలూ ఐపోవస్తున్నాయి. లక్ష్మణ్. ఇంకా రాలేదు ఇంటినుండి సరుకు  తీసుకుని..ఒకవేళ లక్ష్మణ్ లారీ దిగి ఇంకా డ్యూటీ నుండి రాకుంటే అప్పల్రాజన్నా రావాలిగదా.వాడూ పత్తాలేడు.ఇక్కడ గిరాకేమో మస్తుగా ఉంది..ఇప్పుడెలా ‘..అనుకుంటూనే..చకచకా.. ఉడికిన కోడిగ్రుడ్ల పొట్టుతీస్తోంది.చుట్టూ అంతా మసాలా..కాగిన నూనె  కలెగలిసి..అదోరకమైన ముక్క వాసన.

రజియా మనసులో లక్ష్మణ్ కదిలాడు.

లక్ష్మణ్  చిన్ననాడు తమ ఇంటిప్రక్కనే ఉండే పుష్ప అత్తమ్మ కొడుకు.పుష్ప అత్తకు ఒక చిన్న చాయ్ హోటల్ ఉండె.ఆమె భర్త జట్కా నడిపించేటోడు.పుష్ప అత్తమ్మ చాయ్ అంటే చుట్టుపక్కల చాలా ఫేమస్.రోజుకు కనీసం రెండువందల చాయ్ లమ్మేది.లక్ష్మణ్ కూడా తల్లితో కలిసి గారెలు చేసుడు,సమోసాలు చేసుడు,రోటీ చికెన్,రోటీ కీమా తయారుచేసుడు.చాలా బిజీగా ఉండేటోడు.తర్వాత్త ర్వాత పుష్పత్త భర్త ఒక ప్రైవేట్ ఇసుక లారీకి డ్రైవర్ గా కుదిరి అప్పుడప్పుడు లక్ష్మణ్ ను తన వెంట క్లీనర్ గా తీసుకెళ్ళేవాడు.లక్ష్మణ్ ది చాలా శ్రావ్యమైన గొంతు.తల్లి హోటల్ లో రాత్రింబవళ్ళు మోగే రేడియోలోని పాటలను విని వెంటనే ఏ పాటనైనా రెండు నిముషాల్లో అచ్చం అలాగే మళ్ళీ పాడేవాడు.అందరూ ఆశ్చర్యపోయేవారు లక్ష్మణ్ ప్రతిభను చూచి.ఇంటిపక్క హోటలే కాబట్టి..చిన్నప్పటినుండి లక్ష్మణ్ తో ఉన్న దోస్తీ వల్లా దాదాపు ప్రతిరోజూ ఒక్క గంటన్నా ఆ హోటల్లో గడిపేది తను  . ఒకసారి ఎవరో ఒక పెద్దాయన పుష్పత్త చాయ్ పేరు విని తాగడానికొచ్చి లక్ష్మణ్ పాట విని..మెచ్చుకుంటూ “వీడు ఏకసంతాగ్రాహి”అని చెప్పాడు. అంటే ఏమిటిసార్..అని తాను ఆశ్చర్యంగా అడిగితే..వీనికి దేన్నైనా ఒక్కసారి వింటేనే దాన్ని యథాతథంగా ధారణ చేసుకుని పునరుత్పత్తి చేయగల సామర్థ్యముంది.అది భగవదత్తమైన ఒక వరం.అదే వీడు ఏ గొప్ప ఇంట్లోనో పుడితే కొన్ని కళల్లో శిక్షణ పొంది..గొప్ప కళాకారుడయ్యేవాడు.కాని..అని ఆగిపొయ్యాడు.ఆ క్షణం లక్ష్మణ్ నిస్సహాయంగా ఆ పెద్దాయన  ముఖంలోకి చూచిన చూపు తనకింకా జ్ఞాపకమే.

లక్ష్మణ్ లోని ఆ గొప్పతనం తనను ఆశ్చర్యపరిచింది. ప్రతిరోజూ..వీలు చిక్కినప్పుడల్లా ప్రక్కనే ఉన్న బుగ్గోల్ల తోటలోకి ఇద్దరమూ కాస్సేపు పారిపోయి..పాటలను వినేది.తను..అడిగేది..”గిట్ల ఎట్ల జ్ఞాపకముంటై నీకు” అని.కాని లక్ష్మణ్ నుండి ఏ జవాబూ వచ్చేదికాది..

Kadha-Saranga-2-300x268

ఊర్కే నవ్వేవాడు.నవ్వి “అంతే..దేవుని దయ అంతా..”అనే వాడు.లక్ష్మణ్ ముఖంలో ఏదో ఒక వింతకాంతి కనిపించేది  దీపం వత్తిలో వెలుగులా.తర్వాత్తర్వాత..మెలమెల్లగా లక్ష్మణ్ తన తండ్రి వెంట ఉండి తనూ డ్రైవర్ గా మారి,ఒక పర్ఫెక్ట్ లారీ డ్రైవర్ గా పేరు  తెచ్చుకున్నాడు.ఆ క్రమంలో ఏవేవో ఊళ్ళు తిరుగుతూ..ట్రిప్ ల కని..దూర దూర ప్రాంతాలకు ఎక్కువసార్లు వెళ్తూ..దూరమౌతున్న సందర్భంగా..అర్థమైంది తనకు..లక్ష్మణ్ పట్ల ఆ సహించలేని..భరించలేని ఎడబాటునే ‘ప్రేమ ‘ అంటారని.అప్పుడు తను ఒకరోజు లక్ష్మణ్ తో కలిసి అతని అశోక్ లేల్యాండ్ లారీలో కూడా ఎవరికీ చెప్పకుండా తీరుబడిగా మాట్లాడాలని భీమవరం వెళ్ళింది.ఒకరు హిందూ..ఒకరు ముస్లిం..తమ ముందు నిలబడ్డ బలమైన కలిసి బతకాలనే కాంక్ష.అప్పటికి తను ఎనిమిదవ తరగతి చదివింది.లక్ష్మణ్ ఇంటర్ ఫేల్.యౌవ్వనం..లక్ష్మణ్ స్పష్టంగానే నిర్ణయం తీసుకుని అన్నవరం సత్యనారాయణ సమక్షంలో..పెళ్ళడాడు ధైర్యంగా.అన్నాడు..’ రజియా..రెండు చేతులకు తోడు మరో రెండు చేతుల..కలిసి నడుద్దాం ‘ అని. ఆ రాత్రి ..వెన్నెల్లో ఎన్నో పాటలు పాడి వినిపించాడు.

విజయవాడ రైల్వే పట్టాలప్రక్కనున్న..మార్క్స్ కాలనీలో కాపురం..జీవితమంతా రాత్రింబవళ్ళు రైళ్ళ శబ్దాలతోనే సహవాసం.నిత్య  యుద్ధం.బతుకే ఒక సవాల్.లక్ష్మణ్ లారీ పై డ్యూటీలు..తను రోజువారీ సంపాదనకోసం వెదుకులాట.కూరగాయల బేరం..నాలుగిండ్లలో పాచిపని..చిన్న చిన్న హోటల్లలో వంటపని..లక్ష్మణ్ కు దేవుడిచ్చిన  స్వరంలాగనే తనకు..రుచికరంగా వంటలను చేయగల నైపుణ్యం అబ్బి.చివరికి.. హోటల్ మనోరమ కిచెన్ డ్యూటీనుండి..ఒక హోటల్ బాయ్ సహకారంతో..ఈ వైన్ షాప్ దగ్గర దొరికిన ఈ అడ్డా.

ఈ లోగా ఇద్దరు పిల్లలు..ముందు ఉష..తర్వాత షకీల్.

జీవితమంతా పోరాటమే.కమ్యూనిస్ట్ నాయకుల మధ్య విభేదాలతో తాముంటున్న గుడిసెవాసుల పై పోలీసుల దాడి అప్పుడప్పుడు.ఇళ్ళను కూలగొట్టుట.కాల్చివేయుట.పోలీస్ కేస్ లు.కోర్ట్ లు.నేలపై.బురద కుంటల ప్రక్కన నివాసం..ముక్కులు పగిలిపోయే బకింగ్ హాం కెనాల్  ఒడ్డుపై కొన్నాళ్ళు..’ సందులలో గొందులలో..బురదలలో పందులవలె’..చీకట్లో చీకిపోయిన బతుకు.,

తర్వాత..లక్ష్మణ్ లో ఒక మహమ్మారి అలవాటు ప్రవేశించి.తాగుడు.తాగి లారీ నడుపుడు.భగవంతుడిచ్చిన గొంతు నశించి.. మనిషి ముఖం నిండా ఒట్టి దైన్యం.బేలతనం.జాలి కల్గించే ఒట్టి శూన్యం.ఎక్కడికో వెళ్ళి పుస్తకాలు చదివేవాడు.గంటలకు గంటలు లైబ్రరీలో కూర్చుని..బుక్స్ తెచ్చుకునే వాడు ఇంటికి.చదువుతూ చదువుతూ అలాగే పడుకుని..ఏవేవో తనలో తానే తత్వాలను పాడుకుంటూ..సారాయి తాగుతూ,

ఇటు పిల్లలు పెరిగి పెద్దగౌతూ.,

ఎక్కడో పిడుగుపడ్డట్టు అకస్మాత్తుగా ఓ ఉరుము ఉరిమి..రజియా చేయి కొద్దిగా వణికి..ముందున్న నూనె మూకుడు పైనున్న గరిటె కొద్దిగా జారి.,

రెండుమూడు వేడి నూనె రవ్వలు చిట్లి..ఆమె చేతిపైబడి..ఉలిక్కి పడింది.

“జాగ్రత్తమ్మా..నూనె పైబడ్తుంది..”అన్నాడు ఆ ప్రక్క గోడనానుకుని నిలబడ్డ గిరాకీ.

అప్పటికే..చేపలను వేయించడం..చికెన్ లెగ్స్ ప్యాక్ చేయడం..నాల్గు బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వడం..చేస్తూ,

జ్ఞాపకాలు చటుక్కున తెగిపోయేయి..చూరునీళ్ళ ధారవలె.

షాప్ లోపల ఇంకా ఫుల్ గా జనం.ఒకటే రద్దీ.

తన దగ్గర స్టాక్ ఐపోతోంది..లక్ష్మణ్ రాడు..అప్పల్రావూ రాడు.ఇప్పుడెలా.

రజియాలో ఆందోళన.గిరాకీ ఉన్నప్పుడే నాల్గు రూపాయలు సంపాదించుకోవాలి.ఎలా..ఎలా.

సరిగ్గా అప్పుడు ప్రత్యక్షమైంది ఎదుట ఉష..పూర్తిగా తడిచి..నీళ్ళలో ముంచి తీసిన కోడివలె.తలపైనుంది నీళ్ళు కారుతూ..నెత్తిపై, భుజాలపై.ఏదో ఒక పాలిథిన్ కాగితం చుట్టుకుని.

ఉష అప్పుడు ఎనిమిదవ క్లాస్..పొద్దంతా తన తోపుడు బండికి కావలసిన ఉల్లి గడ్డలు కోసుకోవడం..చికెన్ షాప్ లనుండి రెండవరకం మెటీరియల్ ను తెప్పించుకుని..దాన్ని శనగపిండిలో..కారం..మసాలాలలో కలుపుకుని నాన్చడం..కోడి గుడ్లను ఉడి         కించుకోవడం..ఈ పనిలో సహాయం చేసేది.షకీల్ గాడు ఒట్టి వెధవ.ఎప్పుడూ అక్కలా పనిలో సహాయం చేయడు.మళ్ళీ రైల్వే పట్టాలప్రక్కన మార్క్స్ కాలనీకి దగ్గరలో..బోస్ నగర్ కు మారినప్పటినుండి వాడికి అంతా స్నేహితులే.నిరంతరం పోరగాండ్లతో రైల్ పట్టాలపై ఆటలు..కూలిన గోడల్లో  సిగరెట్లు తాగుడు. తండ్రి వలెనే అప్పుడప్పుడు మందు.

“తల్లిదండ్రుల లక్షణాలు తప్పక పిల్లలకొస్తాయా.”అని తననుతాను ప్రశ్నించుకుంటే..’తప్పకుండా..వస్తాయనే ‘అనిపిస్తుంది తనకు.

లక్ష్మణ్ లో ఉన్న ఆ స్వరం..అమృతమయమైన గొంతు..ఉష పాడితే అద్భుతమైన మాధుర్యం..అవన్నీ వచ్చాయి బిడ్డకు..తండ్రి నుండి.

కాని షకీలే..ఒట్టి అవారా ఔతున్నాడు రోజురోజుకు. బడికి పోడు..చిల్లర దొంగతనాలు..పోలీస్ కేసులు.విడిపించుకు రావడాలు.తాగి ఎక్కడెక్కడో పడిపోవడాలు..ఏవేవో సినిమా హీరోల అభిమాన సంఘాలంటాడు. రాజకీయ నాయకుల కనుసన్నలలో.. ఊరేగింపులు. దౌర్జన్యాల్లో పాలుపంచుకోవడాలు.అన్నీ చిల్లర  అల్లరిమూకల  చేష్టలు.

ఆ రాత్రి..ఉష వర్షంలో పూర్తిగా తడుస్తూ..అమ్మ మీద..అమ్మయొక్క జీవనోపాధి ఐన చిన్న వ్యాపారంపైన గౌరవంతో చేయూతగా రావడం..రజియాకు పట్టరాని ఆనందాన్నిచ్చింది.

” క్యా హువా..లక్ష్మణ్ నహీ హై” అంది అప్రయత్నంగానే.

” రాలేదింకా.. బాగా తాగి..హోష్ లేకుండా ఎక్కడున్నాడో.అప్పల్రాజు కూతురుకు యాక్సిడెంటై దవాఖానకెళ్ళాడు.” అని తన చేతిలోని మెటీరియల్ ను అందించింది తల్లికి.

అప్పటికే కావలసిన  తిండి సరుకు లేదని చిన్నబుచ్చుకున్న వైన్ షాప్ కస్టమర్లు..బిలబిలా బండి దగ్గరికి పరుగెత్తుకొచ్చి..” రెండు చేప..పావుకిలో చికెన్ మంచూరియా..మూడు బాయిల్డ్ ఎగ్స్..” ఆర్డర్స్ కురిపిస్తూ.,

మూకుమ్మడి దాడిలో రజియాకు ఉషతో మాట్లాడే తీరికే లేదు.పనిలో మునిగిపోయింది.కాస్సేపాగి..”మరి నే వెళ్ళొస్తానమ్మా..నువ్వు..”అంది ఉష..వర్షంలో తడుస్తూనే.రజియా..తలెత్తి బిడ్డదిక్కు నిస్సహాయంగా చూచి.,

అనివార్యత..అనివార్యత.

” సరే బిడ్డా..నువ్వెళ్ళు..నేనొస్తా..షాప్ మూసుకుని”

‘ సంపాదన..ఒక తాగుబోతు తండ్రిని పోషిస్తూ..ఒక తిరుగుబోతు కొడుకును సాకుతూ..ఒక ఇంటర్ పాసై..గడప దగ్గర నిలబడ్డ బిడ్డకు దన్నుగా ఉంటూ..ఒక తల్లి..రాత్రి పదకొండు గంటలకు..వర్షంలో..తడుస్తూ..నిజాయితీతో కూడిన సంపాదనలో..ఈ దేశాన్ని అవినీతితో దోచుకుంటున్న అనేకమంది వైట్ కాలర్డ్ దొంగలకన్న నిర్మలంగా..తన తల్లి..తన అమ్మ..తన మా. ‘

ఉష తిరిగొచ్చింది  ఇంటికి.

వచ్చేసరికి..ఇంట్లో ఎవరూ లేరు.లక్ష్మణ్ యధావిధిగానే ఎక్కడో తాగుతూ..తమ్ముడు షకీల్ ఏ ఫ్రెండ్స్ తోనో.,

కాని..తమ ప్రక్కనే ఉన్న రేకుల షెడ్ లో ఉండే శరత్ మాత్రం ఎదురుచూస్తూ ఉన్నాడు ఉషకోసం.దాన్ని ప్రేమ అంటాడు శరత్.అది వట్టి బూటకం అని తెలుసు ఉషకు.

ఈ ఏ పూటకాపూట కుటుంబాల్లో..ఇంటి పరిస్థితులు మనుషులకు తప్పులు చేయడానికి చాలా అవకాశాలను కల్పిస్తాయి..ముఖ్యంగా ఒంటరితనాలను..స్వేచ్ఛను..యూజ్ అండ్ త్రో టైప్ సందర్భాలను..బలహీనతలను ఆసరా చేసుకుని.

శరీరం ఒక అగ్ని బాంఢం..వాంఛ ఒక పెట్రోల్ బావి.అగ్గి తారసపడ్తే భగ్గున మండి భస్మం చేస్తుంది.

ఇదివరకు ఉష ..ఒక ముసురుపట్టిన రాత్రి  ఒంటరిగా శరత్ కు ప్రక్కనే తారసపడ్తే.,

ఒక వెకిలి వవ్వుతో..ఒక చూపుతో గుచ్చి గుచ్చి చంపి..ఒక కవ్వింత..లోపల ఒక తీవ్ర జ్వలన.

‘ ఏదేమైనా తెగించి ఒక్కసారి సెక్స్  కార్యం జరిపితే..తీవ్రమైన కోరిక నెరవేరుతుంది..అగ్ని చల్లారుతుంది..ఒక కొత్త అనుభవం గురించిన రుచి తెలుస్తుంది.’అన్న ఉత్సుకత. తహతహ.

ఉష మౌనాన్ని అంగీకారంగా వ్యక్తపరిస్తే..శరత్ తెలుగు సినిమాల్లో దిక్కుమాలిన హీరోలా రెచ్చిపోయి,

ఆ స్వేచ్ఛాయుతమైన రాత్రి..ఓ నాల్గైదుసార్లు తృప్తి.

ఇది తప్పు ..ఇది శీలం పోవుట..ఎవరో ఎవర్నో లొంగదీసుకొనుట..అంతా ట్రాష్ అనుకుంది ఉష .ఉష కించిత్తుకూడా బాధపడలేదు..తనుకూడా  కావాలనుకుంది..చేసింది.సింపుల్ గా చెప్పాలంటే..’అంతే.’

ఒకసారి జరిగిన క్రియను..తప్పును..మళ్ళీ..మళ్ళీ పదే పదే చేసినా..పెద్ద తేడా పడేదేముండదన్న తెగింపు.

చాలాసార్లే జరిగి.,

అప్పుడు..ఆ రాత్రి..ఆ వెన్నెల రాత్రి అన్నాడు శరత్..”నువ్వు చాలా చాలా బాగా పాడుతావు ఉషా..ఒక్కసారి ఆ పాటను పాడవా ప్లీజ్” అని.

ఉష వెంటనే పాడింది..శరత్ పాడమన్నందుకు కాదు.పదే పదే తను నిజంగానే మంచి సింగర్ నేనా..అని నిర్ధారించుకునేందుకు.

ఆ రాత్రి ఉష..దేవుడు తనకిచ్చిన ఈ “ఏక సంతాగ్రాహి” లక్షణాన్ని ఏ రకంగా జీవితంలో శక్తివంతంగా ఉపయోచుకోవాలా అని మొట్టమొదటిసారిగా..కొత్తగా ఆలోచించింది.

ప్రేమలు.శీలాలు.త్యాగాలు.దేన్నో కోల్పోయినట్టు  రోదించడాలు..అన్నీ మరిచి..ఉష తన  కళ్ళముందున్న తెరలనూ,ముసుగులనూ తొలగించుకుంది తెలతెలవారుతూండగా.శరీరాన్ని ఆయుధంలా ఎక్కుపెట్టి..ఒళ్ళు విరుచుకుని..ఆవులించి..కళ్ళు తెరిచింది ఉద్యుక్త ఔతూ.

3

digadaaniki-picture ఉష జీవితంలోకి అవినాశ్ ప్రవేశం ఒక పెద్ద మలుపు.లైబ్రరీలో పరిచయమై ఒకరోజు ఒక పుస్తకమిచ్చాడు అతడు. అది”మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి”.

ఆ వర్షం కురుస్తున్న రాత్రే ఆ పుస్తకాన్నంతా చదివింది తను.

SWOT . . అనాలిసిస్ . . S . . అంటే స్ట్రెంగ్త్. . నీ బలాలు..W ..అంటే వీక్నెసెస్..బలహీనతలు.. O అంటే..ఆపర్చునిటీస్..అవకాశాలు.. T   అంటే థ్రెట్స్.. అవరోధాలు.

ఎప్పుడైనా  ఒక కాగితం తీసుకుని నీ ఆలోచనలనన్నింటినీ   దానిపై రాయమని చెప్పాడు మేనేజ్ మెంట్ పితామహుడు..ఎఫ్. డబ్ల్యు. టేలర్.

రాసింది తను.మూడు పేజీలు నిండాయి..క్రోడీకరిస్తే.. తన బలం.. ఒక్కటే అని తేలింది.అది .. ఒక్కసారి వింటే చాలు..ఆ ధ్వనిని మళ్ళీ సరిగ్గా అలాగే పునరుత్పత్తి చేయగల తన దైవదత్తమైన సామర్థ్యం . .తన బలహీనత.. తన బీదరికం.

చాలా మంది  తను ఎదగడానికి తమ బీదరికం..తగు స్థాయిలో డబ్బు లేకపోవడమే కారణమని అనుకుంటారు.. కాని అది పూర్తిగా తప్పు అని  సెల్ఫ్ మేనేజ్ మెంట్ సిద్ధాంతకర్త  స్మిత్ ఎప్పుడో చెప్పాడు.దేన్నైనా సాధించడానిక్కావలసింది..స్పష్టమైన లక్ష్యం..దాన్ని చేరి అనుకున్నది సాధించాలన్న సంకల్పం..పట్టుదల..ప్రతిభ.

ఊష అనే తను ఇక..’ తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలి ‘ అని బయలుదేరింది ఒక రోజు..హైదరాబాద్ కు.హైదరాబాదే  తన కార్యరంగమని తెలుసుకుందామె.

తన ఆయుధం పాట.

పాటకు ప్రాచుర్యమివ్వగలిగింది సినిమా ఒక్కటే.

తను ఒక ప్రసిద్ధ గాయని ఐ ఒక వెలుగు వెలిగి పోవాలి..అందుకు కావల్సింది ‘అవకాశం.’

.       ‘ మనిషికి దేనికైనా ఒక అవకాశం రావాలి.వచ్చినప్పుడు తెలివిగా దాన్ని గుర్తించి ఉపయోగించుకోవాలి.అవకాశం రానపుడు ఆ అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలి.’

తనకు అవకాశాలు వచ్చే అవకాశం అస్సలే లేదు..కాబట్టి అవకాశాన్ని తనే సృష్టించుకోవాలి.

ఎలా..ఎలా..ఎలా..అన్వేషణ.సరియైన రీతిలో చేయినందించి నడిపించగల వ్యక్తికోసం..సమర్థునికోసం..అన్వేషణ.

మార్కెట్ స్టడీ..ప్రస్తుత మ్యూజిక్ రంగంలో..ఉన్నతుడూ..మార్కెట్ ఉన్నవాడు  ఎవరు..ఎవరు..ఎవరు.?

ఉష అనే తనకు..ఒక నిర్దుష్ట దృష్టితో..శాస్త్రీయంగా..దూసుకుపోతున్నకొద్దీ..మన దగ్గర ప్రతిభ ఉంటే..తనపై తనకు విశ్వాసముంటే..గమ్యాన్ని చేరడం సుళువే అని తొందరగానే అర్థమైంది.వెదికి వెదికి..పట్టుకుంది  ఓ మనిషిని..అతని పేరు..గణేశ్ శాస్త్రి.

గుర్రపు పందెంలో గెలవాలంటే తనకెంత సామర్థ్యమున్నా సరియైన గుర్రాన్ని ఎంచుకోవడం ఒక అత్యంత ప్రధానమైన మెలకువ.ఆ పందెపు గుర్రం ఇప్పుడు గణేష్ శాస్త్రి.

ఒక మనిషికి చేరువై..అతనితో మనం అనుకున్న పనిని సాధించేందుకు ముందు అతని అత్యంత వ్యక్తిగతమైన జీవితాన్ని అధ్యయనం చేయాలి. కొందరికి తిండి బలహీనత. కొందరికి డబ్బు.కొందరికి స్త్రీ.ఇంకొందరికి స్తుతి.కొందరికి కానుకలు.కొందరికి అధికార హోదాలు..ఏదో ఒక మత్తు.వ్యామోహం.ఇవన్నీ బలహీనతలే.యుక్తిపరుడు ఇవన్నీ గ్రహించి..ఒంటరిగానే  కావలసిన వ్యక్తికి చేరువై..కార్యరంగంలోకి దూసుకుపోయి అంతిమంగా  లక్ష్యాన్ని సాధిస్తాడు.

గణేశ్ శాస్త్రి బలహీనతలను పసిగట్టి సరియైన దిశలోనే కలిసింది తను..చాలా మంది పురుషుల్లో ఉన్న బలహీనతే అతనిక్కూడా ఉంది.మందు..మగువ.మందుకు కొదువలేదతనికి.తను తాగగలడు..వేరే వాళ్ళెవరైనా ప్రతిరోజూ అతను తాగగలిగినంత తాగించగలరు.ఐతే తాగుబోతులకు..వేరేవాడెవడైనా తాగిస్తే బాగుండుననే దుగ్ధ ఒకటుంటుంది.అదే ఉంది శాస్త్రిగారిక్కూడా.శాస్త్రి గారికి మ్యూజిక్ చేయవలసిన సినిమాలు కనీసం ఓ పదుంటాయి చేతిలో ఎప్పుడూ..వివిధ భాషల్లో.

ఒక రాత్రి..ఒక సంగీత విభావరి తర్వాత కలిసింది తను ఒక ఫైవ్ స్టార్ హోటెల్లో శాస్త్రిగారిని..కొన్ని సుమబాణాల్లాంటి చూపులనూ..కొన్ని తళుకులీనే శరీర కదలికలనూ ధరించి..తప్పించుకోలేని  మధుర ధరహాస చంద్రికలనూ వలలా వేసింది.

జీవితమంటేనే వ్యాపారమనీ..వ్యాపారమే జీవితమనీ..కదా ఎం బి ఎ లో పాఠం చెప్పేది.

శాస్త్రిగారికీ..తనకూ రోజురోజుకూ దూరం తగ్గుతూ..సాన్నిహిత్యం పెరుగుతూ..పరస్పరం అర్థంకావడం మొదలై.,

కొన్నింటిని అడిగితేగాని ఇవ్వొద్దు..మరి కొన్నింటిని అడుగకముందే ఇచ్చి పిచ్చెక్కించి పరవశింపజేయాలి.ఇంకొన్నింటిని..మరీ మరీ అడిగించుకుని..బ్రతిమాలించుకుని మాత్రమే ఇవ్వాలి.

‘ నేను పాట పాడుతా..నువ్విను ‘ అంటే వినడువాడు.వాడే ‘ ప్లీజ్..ఒక్కసారి ఒక పాటపాడవా.’ అని బతిమిలాడినప్పుడు పాడుతే బహుబాగా వింటాడు..ప్రశంసిస్తాడు.

మంచి మేనేజర్..తననుకున్న జవాబును ఎదుటివాడు వానంతట వాడే చెప్పేట్టు చేసుకుంటాడు.

శాస్త్రిగారు..ప్రక్కమీదున్నపుడు..కొన్నిసార్లు బతిలాడగా బతిలాడగా ఒక పాటను అద్భుతంగా పాడి వినిపించి గిలిగింతలు పెట్టింది తను.ఫ్లాటయ్యాడు ముసలోడు.ముఖ్యంగా ఒక్కసారే విని తను ధారణ చేసి మళ్ళీ వెన్వెంటనే వినిపించే తన ప్రతిభకు షాక్ అయ్యాడు.ఒకానొక తన్మయ స్థితిలో ” ఉషా..రేపే నీ పాట రికార్డింగ్ “అన్నాడు.అని ఆగకుండా..” చూస్తూండు నువ్వు..నిన్ను భారతదేశ అత్యుత్తమ  లేడీ సింగర్ ను చేస్తా రెండేళ్ళలో.నీది ఒక విలక్షణమైన మధుర స్వరం” అన్నాడు. శాస్త్రి గారు తనకు లొంగిన మాట సత్యమే కాని..నిజానికి ఆయన ఒక అత్యున్నత స్థాయి సంగీతకారుడు.

ఒక రోజన్నాడు శాస్త్రిగారు..” నిజానికి కళలన్నీ మనిషికి  దైవదత్తంగా సంక్రమించేవే..కె ఎల్ సైగల్ కు శాస్త్రీయ సంగీతమే రాదు.కాని అద్భుతమైన శాశ్వతమైన జీవవంతమైన గీతాలను అందించాడుగదా.శాస్త్రాలేవైనా మనిషి అనుభవాలనుండీ..అధ్యయనాలనుండే పుట్టాయిగాని..అనుభవాలు శాస్త్రాలనుండి పుట్టలేదు.నువ్వు ఒక సహజ గాయనివి ఉషా” అని.

నిజానికి ఆయన తనను కావాలని పట్టుపట్టి ఒక ప్రపంచస్థాయి గాయకురాలిని చేశాడు.ఈ పన్నెండేళ్లలో  శాస్త్రిగారు పెట్టిన భిక్షే ఈ తన  వైభవ  ప్రాప్తి . ఆయనను వెదికి పట్టుకోవడం తన తెలివి.

ఐతే..గాయనిగా ..ఒక విలక్షణమైన గొంతు ఉన్న దానిగా పొందిన గౌరవాలు,అనేకానేక సత్కారాలు,విజృంభించి అధిరోహించిన అత్యున్నత శిఖరాలు..అన్నీ ఇప్పుడు..ఒక మాయవలె..విడిపోతున్న మంచు తెరలవలె..ఒక దీర్ఘ భ్రాంతివలె,

ప్రశ్నలు..జీవితంలో..ఆ తర్వాత.. అటు  తర్వాత..ఆ ఆ తర్వాత..అని..ప్రశ్నలు.

ప్రశ్నలు..రాలుతున్న ఎండుటాకులవలె..ప్రశ్నలు..కూలిపోతున్న సౌదాలవలె..ప్రశ్నలు చెదిరి విరిగిపోతున్న నీడలవలె.

పెరుగుతున్నకొద్దీ..లోపల విశాలమైపోయిన ఎడారి..ఎక్కడా..సుదూర ప్రాంతమంతా..మనుషుల జాడలే కానరాని ఎడారి. తత్వవేత్తలన్నట్టు..ఎప్పుడైనా మనిషి కొంత పొందుతున్నాడూ..అంటే కొంత కోల్పోతున్నట్టే లెఖ్ఖనా.?

4

 

అమ్మ..రజియా జ్ఞాపకమొచ్చింది ఉషకు. అమ్మ జ్ఞాపకంతోపాటే ఆపుకోలేని దుఃఖం.

తను ఎదుగుతూ..ఇంకా ఇంకా ఎదుగుతూ పైకి వెళ్తున్నకొద్దీ..” అమ్మా..రా నా దగ్గరకు..నాతో..నాతోపాటే ఉండిపోవమ్మా..అమ్మా రజియా..నా దేవత అమ్మా..రా వచ్చి నా తలను నీ ఒడిలోకి తీసుకుని..నన్నొక్కసారి నీ పరిష్వంగంలో..నీ అమృతహస్తాలతో,”

కాని అమ్మ రాలేదు.చనిపోయిన తమ్ముడు షకీల్ జ్ఞాపకాల్లో కనలిపోతూ, చావక ఇంకా మిగిలి ఉన్న నాన్న లక్ష్మణ్  తో ..అదే తోపుడు బండి.అదే జీవితం.అమ్మది.

అసలు జీవితం ఏమిటి.?

బిగ్గరగా రైలు కేక.భయంకరంగా.వికృతంగా.

అసలు తనిక్కడిలా కూర్చున్నట్టు ఎవరికీ తెలియదు.తెలిస్తే.క్షణాల్లో ఇసుకపోస్తే రాలనంతమంది అభిమానులు చొచ్చుకొస్తారు.

ఒక అంతర్జాతీయ స్థాయి గాయనిప్పుడు..ఉష.

కాని..కాని,

లేచి..ఉష శాలువాను శరీరం చుట్టూ  సవరించుకుని,

ఎ-వన్..కంపార్ట్ మెంట్..తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్..లో..ముప్పది రెండో  నంబర్.

కిటికీలోనుండి బయటకు చూస్తూండగానే రైలు మెల్లగా కదుల్తూ..బయటంతా చీకటి.నల్లగా.

కొద్ది నిముషాల్లోనే ఢిల్లీ మహానగరం కనుమరుగౌతూ,

‘ విజయవాడలో దిగగానే..పరుగు పరుగున అమ్మ దగ్గరికి పరుగెత్తి..చుట్టుకుపోయి…అమ్మ..అమ్మ..రజియా..అమ్మ.,’

ఎందుకో చటుక్కున ఉష చేయి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ముఖేశ్ పాటను వింటానికి టచ్ ఫోన్ తెరను తడిమింది.

” జుబాపే దర్ద్ బరీ దాస్ తా  చలీ ఆయీ

బహార్ ఆనేసే పహలే  ఖిజా చలీ ఆయీ..” స్వర ఝరి అది..గాలిలో తేలుతూ.

ఒక మహాద్భుత  విషాద గీతంలో ఎక్కడని వెదుక్కుంటావు..పోగొట్టుకున్న హృదయాన్ని.?

రైలు వేగాన్ని పుంజుకుంటోంది చీకట్లో.                                                                                                             *

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

     గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -20

 

 

                      Anne Of Green Gables By L.M.Montgomery

 

” మెరిల్లా, ఒక్క నిమిషం డయానా దగ్గరికి వెళ్ళి రావద్దా నేను ? ”ఆదుర్దా  గా అడిగింది ఆన్.

” ఎందుకూ ఈ చీకట్లో పడి ? ఇద్దరూ కలిసేవచ్చారుగా బడినుంచి ? మంచులో నిలబడి అరగంటకి పైగా మాట్లాడేసుకున్నారు కూడానూ..అన్నేసి కబుర్లు ఏముంటాయోగాని ! మళ్ళీ ఏమిటట ? ”

” కాని తను నన్ను చూడాలనుకుంటోంది- ఏదో ముఖ్యమైన సంగతే ఉంది ”

” అదెలా తెలుసు నీకు ? ”

” కిటికీ లోంచి సైగ చేసిందిగా ? కొవ్వొత్తి వెలిగించి పెట్టి దాని మీదినుంచి అట్టముక్కని అటూ ఇటూ ఊపాలి… అది నేనే కనిపెట్టాను ”

” నువ్వే లే, అందులో అనుమానమేముంటుంది ! మీ పిచ్చి వ్యవహారం తో కిటికీ తెరలకి నిప్పంటిస్తారో ఏం పాడో ! ”

” లేదు లేదు..మేము చాలా చాలా జాగ్రత్తగా ఉంటాంగా…ఆ ఊపటాలకి ఒక లెక్క ఉందిలే – రెండుసార్లు  ఊపితే – ‘ ఉన్నావా ? ‘ అని. మూడుసార్లు ఊపితే ‘ ఉన్నాను ‘ అని. నాలుగుసార్లైతే ‘ పనిలో ఉన్నాను ‘ అని. అయిదుసార్లు ఊపితే ‘ చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి, త్వరగా వచ్చెయ్యి ‘ అని. డయానా ఇందాక అయిదు సార్లు ఊపింది – ఆ సంగతేదో తెలుసుకోవాలని మహా ఆరాటంగా ఉంది నాకు ”

” సరే, సరేలే. అంత ఆరాటం తట్టుకోలేవుగాని, వెళ్ళి పది నిమిషాల్లో వచ్చెయ్యి ”

ఆన్ ఆ మాట గుర్తు పెట్టుకుని అలాగే వెనక్కి వచ్చేసింది. డయానా చెప్పే అతి ముఖ్యమైన సంగతులని పదినిమిషాల్లో కుదించుకోవటం ఎంత కఠినమైన పనో , ఆ కొద్ది సమయాన్నీ ఆన్ ఎంత బాగా వినియోగించుకుందో – నరమానవుడెవరికీ ఊహకందదు.

” నీకు తెలుసా మెరిల్లా, రేపు డయానా పుట్టినరోజు. బడినుంచి వచ్చేసిన దగ్గర్నుంచి, రాత్రంతా నన్ను వాళ్ళింట్లో ఉండిపోయేలాగా వాళ్ళమ్మని అడుగుతానంది. ఇంకానేమో , డయానా వాళ్ళ కజిన్స్ న్యూ బ్రిడ్జ్ నుంచి రేపు సాయంత్రానికి వస్తున్నారు – మంచి గుర్రపు బగ్గీ ఉంది వాళ్ళకి, అందులో వస్తున్నారన్నమాట. రేపు పొద్దుపోయాక డిబేటింగ్ క్లబ్ లో కచేరీ ఉందట- డయానానీ నన్నూ వాళ్ళు అక్కడికి తీసుకుపోతారట..నువ్వు ఒప్పుకుంటేనేలే..వెళ్ళనా మెరిల్లా..పంపించవూ నన్ను ? ”

”ఊహూ.నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అవి చిన్నపిల్లలు వెళ్ళేవి కావు  ”

” కాదు మెరిల్లా , అక్కడంతా మర్యాదగానే ఉంటుంది ” – ఆన్ నచ్చజెప్పబోయింది.

” కాదనటం లేదు నేను. అవి అయేప్పటికి అర్థరాత్రి దాటిపోతుంది, అంతసేపు మేలుకుని ఉంటే పిల్లలకి ఆరోగ్యాలు  పాడైపోవూ ? మిసెస్ బారీ ఎలా వెళ్ళనిస్తోందో డయానాని – చాలా పద్ధతిగలదాన్నంటుంది మళ్ళీ ”

ఆన్ కళ్ళనీళ్ళపర్యంతమైంది – ” చాలా ప్రత్యేకమైన సందర్భం కదా మెరిల్లా ? పుట్టినరోజు ఏడాదికి ఒకసారే కదా వచ్చేది , అస్తమానమూ రాదు కదా ? ప్రిస్సీ ఆండ్రూస్ అక్కడ పద్యం చదువుతోంది – ‘ నిషేధాజ్ఞ గంట మోగరాదీరాత్రి ‘ అని- అది నీతిబోధకమైనదే కదా ??  భజనమండలి వాళ్ళు నాలుగు విషాద గీతాలు పాడతారట, చర్చ్ లో పాడే కీర్తనల్లాంటివే ! ఆఖరికి పాస్టర్ గారి ఉపన్యాసం కూడా ఉందట- ఆయన చర్చ్ లో మాట్లాడినా ఇంకెక్కడ మాట్లాడినా ఒకటే కదా చెప్పు , విని తీరాల్సిందే కదా ? వెళ్ళనివ్వు మెరిల్లా, నన్ను ” – బతిమాలింది.

” చెప్పింది అర్థమైందా లేదా నీకు ? వెళ్ళి బూట్లు విప్పేసి నిద్రపో, ఎనిమిది దాటుతోంది ”

” ఈ ఒక్క మాటా విను  మెరిల్లా , దయచేసి ! మిసెస్ బారీ వాళ్ళింట్లో ‘ అతిథుల గది ‘ ఇస్తానన్నారట నాకు – చిన్నపిల్లని,  ఎంతో గౌరవం కదా అది నాకు , ఆలోచించవూ ? ”

” నీకిప్పుడు ఆ గౌరవం తో ఏమీ అవసరం లేదులే. వెళ్ళి నిద్రపో, ఇంకేం చెప్పకు నాకు ”

ఆన్ దిగులు దిగులుగా, కళ్ళ నీళ్ళు కార్చుకుంటూ , పైకి వెళ్ళాక , అప్పటిదాకా వసారాలో నిద్రపోతున్నట్లు పడుకున్న మాథ్యూ కళ్ళు తెరిచాడు .

” ఆన్ ని వెళ్ళనిస్తే బావుంటుంది మెరిల్లా ” – మెల్లిగా అన్నాడు.

” అస్సలు వీల్లేదు. దాన్ని పెంచుతోంది ఎవరటా- నువ్వా , నేనా ? ” కస్సుమంది మెరిల్లా.

” అది కాదూ ” నసిగాడు.

” అయితే నువ్విందులో కలగజేసుకోకు ”

” నీ అభిప్రాయం లో నేను కలగజేసుకోవట్లేదు – నా అభిప్రాయం చెబుతున్నా అంతే ”

” ఆన్ చంద్రమండలానికి వెళతానన్నా పంపించమంటావు నువ్వు ” – కొంచెం ప్రసన్నంగానే ఎత్తిపొడిచింది – ” డయానా ఇంట్లో రాత్రికి ఉండేందుకైతే పంపించేదాన్నే ..ఆ కచేరీ వ్యవహారం నచ్చలేదు నాకు. ఆ రాత్రప్పుడు ఇంటికొస్తుంటే చలిగాలికి జలుబూ దగ్గూ పట్టుకుంటే ఏం చెయ్యాలి ? ఆ కచేరీ హడావిడి లో ఉన్నవీ లేనివీ తలకెక్కించుకుని ఉబలాటపడిపోతుంది, ఒక వారం వరకూ మామూలు మనిషి అవదీ పిల్ల- నాకు తెలీదా

దీని సంగతి ? ”

” నువ్వు ఆన్ ని పంపించటమే మంచిదని నేను అనుకుంటున్నాను ” – మాథ్యూ తొణక్కుండా చెప్పేశాడు. అతనికి వాదించటం బొత్తిగా రాదుగాని, అన్న మాటనే పట్టుకు కూర్చోవటం మటుకు బ్రహ్మాండంగా వచ్చు. మెరిల్లా ఇంకేం మాట్లాడలేక అక్కడినుంచి వెళ్ళిపోయింది.

మర్నాడు పొద్దున ఫలహారం అయాక ఆన్ గిన్నెలు కడుగుతోంది- అటుగా వెళుతూన్న మాథ్యూ మెరిల్లా ఉన్న వైపుకి తొంగి చూసి మళ్ళీ చెప్పాడు –

” ఆన్ ని నువ్వు పంపించి తీరాలి మెరిల్లా ”

మెరిల్లా మొహం కందగడ్డలా అయిపోయింది.

అప్పటికి, కోపాన్ని దిగమింగుతూ

” సరే. నువ్వు ఊరుకునేట్లు లేవుగా అసలూ..సరే . ”

ఆన్ అంతా వింటూనే ఉంది, చెంగుమని గెంతింది అక్కడికి – చేతిలో తడిగిన్నెలు తుడిచే గుడ్డతో సహా.

” మళ్ళీ చెప్పు మెరిల్లా, మళ్ళీ చెప్పు ”

” ఒకసారి చెప్పాగా, చాల్లే. నువ్వు ఆ చలిలో నడిచి న్యుమోనియా తెచ్చుకుంటే నాకేం పూచీ ఉండదు గుర్తు పెట్టుకో. కొత్త చోట పడుకుని ఇంకే జబ్బైనా చేసినాదానికీ మాథ్యూనే బాధ్యత వహించాలి, నేను కానే కాదు . ఆన్ షిర్లే, ఆ గుడ్డ లోంచి జిడ్డు నీళ్ళు కారుతున్నాయి, నేలంతా పాడయేట్లుంది, గిన్నెలు సరిగా కడిగావా లేదా అని ? ”

anne20-1

” నాతో నీకు విసుగు పుడుతుంటుంది, తెలుసు నాకు . నా తప్పులకి బాధపడుతుంటాను – కానీ, చేసే అవకాశం ఉండి కూడా కొన్ని తప్పులు చెయ్యను- వాటిని తలుచుకుని తృప్తి పడుతుంటాను. ”- ఆన్ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది-

” మళ్ళీ కడుగుతాలే. నేలంతా ఇసకతో రుద్ది శుభ్రం చేస్తాలే. ఓ- మెరిల్లా, నా మనసంతా కచేరీ మీదే ఉంది, జన్మలో వెళ్ళలేదు నేను. బళ్ళో చాలా మంది వెళ్ళారట ఎప్పుడో ఒకప్పుడు, మాట్లాడేసుకుంటూ ఉంటారు- నేను వెర్రి మొహం వేస్తుంటాను. నాకెలా అనిపిస్తోందో నీకు అర్థం కాలేదు – మాథ్యూ కి అర్థమైంది. అర్థం చేసుకోబడటం ఎంతో ఆనందం గా ఉంటుంది. ”

ఆ ఉత్సాహం తో , బళ్ళో ఆన్ పాఠాల మీద శ్రద్ధే పెట్టలేదు. గిల్బర్ట్ బ్లైత్ , స్పెల్లింగ్ లోఆమె   ని ఓడించేశాడు- నోటి లెక్కల్లో ఆన్ అతనికి ఆమడ దూరం వెనక పడింది. అవేవీ మామూలుగా కలిగించే అవమానాన్ని కలిగించలేదు –  కచేరీ గురించీ డయానా వాళ్ళింట్లో అతిథుల గది గురించీ తలుచుకుంటూ ఉండిపోయింది. ఆన్, డయానా ఆపకుండా మాట్లాడుకుంటూనే ఉన్నారు – మిస్టర్ ఫిలిప్స్ ఏ కళ నున్నాడో , పట్టించుకోలేదు. నిజానికి బళ్ళో అందరూ అదే సందట్లో ఉన్నారు. అవొన్లియా క్లబ్ లో ఇదివరకు చిన్న చిన్న కార్యక్రమాలు జరిగాయిగాని, ఇంత భారీ ఎత్తున జరగటం ఇదే మొదలు. పది సెంట్ లు టికెట్, ఆ డబ్బు తో లైబ్రరీ కి చాలా పుస్తకాలు కొంటారట. పాల్గొనే పిల్లలందరూ ఎన్ని రోజులనుంచో సాధన చేసుకుంటున్నారు – వాళ్ళ తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ వాళ్ళ కంటే హడావిడి పడిపోతున్నారు.

ఆన్ ఆనందం బడి వదలగానే ఇంతెత్తున పొంగింది, అది పెరిగి పెరిగి కచేరీ సమయానికి అవధులు దాటిపోయింది. డయానా ఇంట్లో చాలా నాగరికమైన టీ ఏర్పాట్లు జరిగాయి. అది అయాక డయానా గదిలో ఇద్దరూ ముస్తాబయారు. ఆన్ జుట్టుని కొత్తరకంగా దువ్వింది డయానా. డయానా జుట్టులో రిబ్బన్ లు ఆన్ అందంగా ముడి పెట్టింది. ఇంకా రకరకాల ప్రయత్నాల తర్వాత ముస్తాబు పూర్తయింది , ఇద్దరి మొహాలూ సంతోషం తో , ఉద్వేగం తో కందిపోయి ఉన్నాయి. ఆన్ దుస్తులు మెరిల్లా పద్ధతిలో కొంచెం సాదాగానే ఉన్నాయి . డయానా టోపీ , జాకెట్- అన్నీ మంచి సొగసుగా ఉన్నాయి. ఆన్ కి ఒక్క క్షణం బాధేసింది- సర్దుకుని, తన బట్టలూ  చాలా అందంగా ఉండేందుకు  తన ఊహాశక్తిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది.

కాసేపటికి డయానా కజిన్ లు , వచ్చారు. వాళ్ళ బట్టలు మరీ నాజూకుగా ఉన్నాయి. అందరూ కలిసి బయల్దేరారు. వాళ్ళ గుర్రం బగ్గీ మంచు కప్పిన నున్నటి దారివెంట జారుతున్నట్లు వెళుతూంటే ఆన్ కి దివ్యంగా ఉంది. తెల్లటి మంచుకొండల వెనక సూర్యాస్తమయం అద్భుతంగా ఉంది. సెయింట్ లారెన్స్ సరస్సు చుట్టూ దట్టంగా మంచు, లోపల  నిండా నీలి రంగు నీరు- అందులోకి ప్రవహించే  ఎర్రటి సూర్యకిరణాలు . ముత్యాలూ నీలాలూ తాపిన పాత్రలో మధువులూ జ్వాలలూ కలిసి పొర్లిపోతున్నట్లుంది. దూరంగా స్లెడ్జ్ బళ్ళ గంటల సవ్వడి , ఎవరివో నవ్వుల ధ్వని- వనదేవతల ఉల్లాసం  అంతటా వ్యాపిస్తున్నట్లుంది.

” నువ్వు చాలా బావున్నావు ఆన్ ! నీ గౌన్ రంగు నీకు బాగా నప్పింది ” – డయానా ప్రేమగా చెప్పింది.

ఆ సాయంత్రపు కార్యక్రమాలు  – ప్రేక్షకులలో కనీసం ఒకరి ని – అమితంగా పర వశులను చేసేశాయి . ఒకదానికన్న ఇంకొకటి మరీ మరీ బావుందని ఆన్ డయానా తో అంది. కొత్త గులాబి రంగు గౌనూ , మెడ చుట్టూ ముత్యాల తో ప్రిస్సీ ఆండ్రూస్ తయారై వచ్చింది. మిస్టర్ ఫిలిప్స్ ప్రత్యేకం గా పట్నం నుంచి తెప్పించి ఇచ్చిన కార్నేషన్ పూలు తలలో పెట్టుకొచ్చింది. ఆమె ‘ ని షే ధాజ్ఞల గంట మ్రోగరాదీ రాత్రి ‘ పద్యాన్ని చదివి అభినయిస్తుంటే ఆన్ ఆ విషాదం లో లీనమైపోయి కంటతడి పెట్టుకుంది. తర్వాత చార్లీ స్లోన్ ‘ అతనూ కోడి పెట్టా ‘ పద్యం చదువుతూంటే పడీ పడీ నవ్వింది. చుట్టూ ఉన్నవాళ్ళు పద్యం లో హాస్యం కంటే ఆమె నవ్వును చూసి నవ్వారు. మిస్టర్ ఫిలిప్స్ – ‘ సీజర్ శవం ముందు మార్క్ ఆంటోనీ ఉపన్యాసం ‘ చదివాడు. ప్రతీ వాక్యాన్నీ పట్టి పట్టి – ప్రిస్సీ ఆండ్రూస్ వైపు చూస్తూ చదివాడు. ఆన్ కి ఎక్కడలేని ఆవేశమూ పుట్టుకొచ్చింది- ఒక్క రోమన్ సైనికుడు దారి చూపిస్తే చాలు, యుద్ధానికి బయల్దేరిపోవాలనుకుంది.

ఒకే ఒక్క అంశం ఆన్ కి నచ్చలేదు – అది గిల్బర్ట్ బ్లైత్ చదివిన ‘ రైన్ నది పైన బింజెన్ ‘ పద్యం. రోడా ముర్రే దగ్గరున్న లైబ్రరీ పుస్తకం తీసుకుని చదువుతూ ఉండిపోయింది. గిల్బర్ట్ పద్యం అయాక డయానా చేతులు నొప్పెట్టేలా చప్పట్లు కొడుతూంటే ఆన్ కదలకుండా నిటారుగా బిగిసి ఉండిపోయింది.

అంతా అయి ఇంటికొచ్చేప్పటికి పదకొండైంది- ఎంత తృప్తి గానో జరిగిన ఆస్వాదన తర్వాత , దాన్ని గురించి మళ్ళీ మళ్ళీ ముచ్చటించుకునే ఆనందం ఇంకా మిగిలే ఉంది. అందరూ మంచి నిద్రలో ఉన్నట్లున్నారు – ఇల్లంతా చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది. సన్నటి నడవా లోంచి ఆన్ కి ఇచ్చిన గదిలోకి దారి ఉంది. తలుపు తెరిస్తే లోపల వెచ్చగా హాయిగా ఉంది. నెగడులో నిప్పు కణికలు మినుకు మినుకు మంటున్నాయి.

” అమ్మయ్య. బట్టలు మార్చేసుకుందామా డయానా ? ఎంత బాగా జరిగిందో కదా అంతా ? మన చేతా ఎప్పుడైనా పద్యాలు చదివిస్తారంటావా ? ”

” ఆ. కొన్ని రోజులయాక, బహుశా. పెద్ద పిల్లల చేతే చదిస్తుంటారు మామూలుగా. గిల్బర్ట్ మనకంటే రెండేళ్ళే పెద్ద వాడనుకో, అయినా బాగా చదువుతాడు కాబట్టి అవకాశం ఇస్తుంటారు. ఎంత  గొప్పగా చదివాడు ఆన్..నువ్వేమీ మెచ్చుకోకుండా ఎలా ఉండగలిగావు ? ” – డయానా అతను చదివిన పద్యం లో కొన్ని వాక్యాలు తన్మయత్వం తో ఉచ్చరించింది.

ఆన్ గంభీరంగా పలికింది – ” నువ్వు నా ప్రాణస్నేహితురాలివి అయినా కూడా అతని గురించి  నా ముందు మాట్లాడకూడదు – నేను సహించను. ..’’ – మాట మారుస్తూ , ఎవరు ముందు మంచం మీదికి ఎక్కుతారో పోటీ పెట్టుకుందామా ? ”

డయానాకి ఆ పందెం నచ్చింది- ఇద్దరూ కాస్త వెనక్కి వెళ్ళి, పరిగెత్తుకుంటూ మంచం  మీదికి దూకారు.  మంచం ఖాళీ గా లేదు, ఏదో ఉంది దాని మీద.

ఆ పైన ఒక కేక – ” చచ్చాన్రోయ్ ” అని.

ఆన్, డయానా ఎలా మంచం దిగారో, ఎలా గదిలోంచి బయటికి వెళ్ళారో – వాళ్ళకే తెలీదు. ఒళ్ళు తెలిసే సరికి కాళ్ళూ చేతులూ వణుకుతూ మేడ మెట్ల పైన ఉన్నారు.

” అది ఎవరు…’ వాళ్ళు ‘  ఎవరు ? ” – చలితోనూ భయం తోనూ గజగజమంటున్న పళ్ళ మధ్యలోంచి ఆన్ అడిగింది.

డయానాకి తెరలు తెరలుగా నవ్వొస్తోంది. ” ఆంట్ జోసెఫిన్ ! ఎలా వచ్చిందో అక్కడికి !! అసలే భలే కోపం ఆవిడకి, మనం వెళ్ళి మీదపడ్డాం….” –  భయం లోనుంచి నవ్వు ముంచుకొచ్చి డయానా కి మాట రాలేదు.

” ఆంట్ జోసెఫిన్ ? ”

” ఆ. మా నాన్నకి ఆంట్ , నిజానికి. డెబ్భై ఏళ్ళుంటాయి, సణుగుతునే ఉంటుంది  – అసలెప్పుడైనా ఆవిడ చిన్నపిల్లగా ఉందనే అనిపించదు. ఎప్పుడో ఇక్కడికి వస్తుందని తెలుసుగాని అప్పుడే వచ్చేస్తుందని తెలీదు. మహా పద్ధతైన మనిషి – తెగ తిడుతుంది మనల్ని రేపు…ఇక మనం వెళ్ళి మిన్నీ మే మంచం మీద దాని పక్కన పడుకోవాల్సిందే – నిద్రలో పక్కనవాళ్ళని ఎలా తంతుందో తెలుసా అది ! ”

 

[ ఇంకా ఉంది ]

 

 

 

 

ఒక యుద్ధస్వరం కొనకంచి “మంత్రలిపి”

 

-ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

రాజ్యం ఉనికిలోనుంచే,సమాజం ఉనికిలోనుంచే కొన్ని అపసవ్యదిశలున్నాయి.కాని ప్రపంచీకరణ తరువాత దీని భీకర రూపం ప్రభావం ఎక్కువ.ఈ పరిణామాలతరువాత మనిషి కేవలం ఆర్థికమానవుడుగా ఇంకాచెబితే, కేవలం సాంకేతికమానవుడుగా తయారయాడు.ఈ పరిణామాలు,పరిణామాలఫలితాలు ఈకాలపు కవిత్వంలో ప్రతిఫలిస్తున్నాయి.వస్తుగతంగా “కొనకంచి”-మంత్రలిపి”కూడా దీనికి మినహాయింపుకాదు.కాని కవిత్వంలో కనిపించే సంవేదనాంశానికి,అస్తిత్వజిజ్ఞాసకు,ఈకవిత్వంలోఉండే భావావేశతీవ్రతకు మధ్య చెప్పుకోదగ్గ వైరుధ్యాలున్నాయి.వాక్యాల్లో ప్రస్ఫుటంగా వర్గస్పృహకాకుండా విశ్వాత్మలో చెల్లుబాటయ్యే సార్వజనీన తిరస్కరణనుచూడొచ్చు.

రాజ్యం యొక్క పట్టించుకోని తనాన్ని,లంచగొండితనాన్ని,స్వార్థంలాంటి అంశాలపై కవిత్వం రాసినా ఈవాక్యాలవెనుక ఉనికిసంబంధమైన పోరాటం ఉంది. రాజ్యపులక్షణాలను,రాజ్యం,ప్రపంచీకరణ రెండూ ప్రసారం చేస్తూ మానవీయమూలాలుదెబ్బతీసే ప్రతివ్యక్తీ,అంశం ఈకవిత్వంలో తిరస్కరింపబడుతాయి.అందులోనూ రాజ్యాన్ని ప్రథమశత్రువుగా చూడడం ఇందులో గమనించవచ్చు.అనేక కవితలు అందుకు నిదర్శనం కూడా.కొన్ని కవితల్లో భారతీయ సంస్కృతి,సంప్రదాయాలనుగురించి మాట్లాడటమూ గమనించవచ్చు.జీవితం పోరటమైన సందర్భాలలో మానవుని అస్తిత్వాన్ని గురించి” మంత్రలిపి” ఆలోచిస్తుంది.

అంశాత్మకంగాచూస్తే మానవీయలక్షణాల అణ్వేషణ,దానికి కారణాలను,కారకులను తిరస్కరించడం,క్షేమాన్ని కనిపెట్టాల్సిన రాజ్యపు స్వభావాన్ని,అందులోని దుర్నీతిని తిరస్కరించడం ప్రధానంగా ఎక్కువకవితల్లో కనిపిస్తుంది.

 

ప్రియురాలి హృదయంలో ప్రేమలేదు

ఉన్నదంతా ఒక అవసరం

ప్రియునిమనసులో ప్రేమలేదు

ఉన్నదంతా పచ్చిదేహభాష

 

నెచ్చెలిని కౌగిట్లోనిద్రపుచ్చే

మంత్రగాడిలా మారాలనుకున్నప్పుడల్లా

చీకటి పడీపడకముందే

తొలికోళ్ళు కూస్తున్నాయి

 

స్నేహాన్నినటిస్తూనే

నాకుతెలియకుండా నన్ను ప్లాస్టిక్ పువ్వును చేసి

బతుకు పుస్తకంలో ఉన్న ఆఖరి రక్తమాంసాలని

ఎవరో ఎత్తుకుపోయారు“–(మంత్రలిపిపే.21/22)

 

ఈవాక్యాలన్నీ జీవితవిలువల్లోని చరమస్థాయిని చిత్రిస్తున్నాయి.మొదటివాక్యం జీవన సంబంధాలను ,రెండవవాక్యం బంధాలు దూరమవుతున్న క్రమాన్ని,మూడవభాగం మోసపోతున్న జీవితాలను వ్యక్తం చేస్తాయి.ఇవన్నీ జీవితపు విలువలను వ్యక్తం చేసినా వీటివెనుక ప్రపంచీకరణప్రభావాలను పరోక్షంగాప్రస్తావిస్తాయి.కేవలం అవసరంగామారడాన్ని,సమయంలేకపోవడాన్ని,మేలుచేస్తున్నట్టుగా కీడుచేయడాన్ని ఈవాక్యాలు గుర్తించాయి.నిర్మాణగతంగా ఇవి వస్తువుయొక్క సంవిధానస్థాయిని(the proairetic code) చెబుతాయి.ప్రపంచీకరణ నీడను గుర్తించడానికి ఈవాక్యాలు దోహదం చేస్తాయి.నిర్మాణగతంగా పూర్తిసమాజాన్ని చిత్రించే సంపూర్ణత్వం(Wholeness)దాన్ని అర్థంచేసుకోడానికి గతవర్తమానాలను పరిచయం చేసే పరిణామశీలం(Transformation)ఈ కవితల్లో కనిపిస్తాయి.వీటన్నిటి వెనుక రాజకీయస్పృహ గమనించదగింది.కొనకంచి వాక్యాలన్నీ రాజ్యాన్ని దాన్నీఅనుకొని ఉన్న స్వార్థాన్ని,దోపిడీని ఎక్కు పెట్టేవే.

ఉన్మాదుల..పాలకులచేతుల్లో/మనుషులజీవితాలన్నీ/రాళ్ళు రప్పలపాలయినప్పుడు/అధికారమే మారణాయుధాలతో/తనమనుషులను తానే చంపటానికి దండెత్తినప్పుడు/

మనుషులంతా నీళ్లలో తిరిగే చేపలవుతారు/తమప్రాణాలను కాపాడుకునేందుకు/తామేవెళ్ళి కనపడుతున్న/నైలాన్దారాల్లో దాక్కుంటారు

 చుట్టూ ఉన్న ప్రపంచంలో/మనుషులంతా నడిచే నల్లనాగులుగా మారినప్పుడు/గుడ్డుగుడ్డులాగే ఉంటుంది/గుడ్డులో పచ్చసొనమాయమవుతుంది/మనిషి మనిషిలాగే ఉంటాడు/మనిషిలో మనిషి మాయమవుతాడు/రాజ్యాంగం రాజ్యాంగం లాగే ఉంటుంది/రాజ్యాంగంలో అన్నీ తెల్లకాగితాలే మిగులుతాయి. -(మంత్రలిపిపే.23/24)

చట్టబద్ధంగా రాజ్యంచేసే హత్యలకు/అసలుహంతకులు/రాజ్యాంగం పేజీల్లోనే/అక్షరాలయి దాక్కున్నారు“-(పే.41.ఇది హత్యాత్మహత్య)

kona1

మొదటివాక్యం ప్రజలు తమకు తాముగానే (విధిలేని పరిస్థితుల్లో) బలి అవడాన్ని,రెండవ వాక్యం ప్రజలను బలితీసుకుంటున్న విధానాన్ని చెబుతుంది.ఇందులో రాజ్యం యొక్కప్రవర్తన గుర్తించడంలో కొనకంచిలో విప్లవచాయలున్నాయి.రాజ్యాంగంపైన దేశంలోని రాజకీయపార్టీలు సైద్ధాంతికంగాకానీ,ఆచరణరీత్యాకానీ,మానసిక ప్రవృత్తులవలనకానీ కట్టుబడిఉన్నాయన్న దాఖలాలు లేవు.అంతేకాక ప్రపంచీకరణలోని ప్రధానాంశం ప్రత్యామ్నాయ ఆర్థికవిధానాల అభివృద్ధి(Development group for attentive policies)కి ప్రధానవాహికగా ఉన్నాయి.చిల్లరవర్తకాలపై పెట్టుబడులనాహ్వానించిన మొన్నటి కాంగ్రెస్ నుంచి,ఇప్పటివరకు ఉన్న రాజ్యాలన్నీ దీనికి మినహాయింపుకాదు.స్వాతంత్రాన్ని సంపాదించుకున్న చైతన్యం ఇలా వట్టిపోయిందనే అనాలి.కాడ్వెల్-ఒకమాటంటాడు.

 Consciousness is generated by men’s Active struggle with nature and perishes in a blind formalism once that grapple ceases

 (చైతన్యం ప్రకృతితో జరిగే మనిషిక్రియాశీలపోరాటం నుంచి పుడుతుంది.ఒకసారి అనుకున్నది సాధించాక ఆచైతన్యం ఒక గుడ్డి వ్యవస్థగా మారి నశిస్తుంది-(Illusion and Reality-పే 63).

వర్తమానస్థితిని చెబుతున్న కొనకంచివాక్యాలసారాంశమూ ఇదే.ప్రాచీనభారతీయ రాజనీతిశాస్త్రం రాజును రాజ్యాన్ని ఆరాధించే ప్రజలగురించి ప్రస్తావించింది.

 

ధార్మికం పాలనపరం సమ్యక్పరపురజ్ఞయః

రాజానామభిమన్యంతే ప్రజాపతిమివప్రజాః

 ఈలక్షణాలు లేని ధార్మికత్వం,ప్రజాగతపాలన లేనిరాజ్యాన్నే మంత్రలిపి నిలదీస్తున్నది..వస్తుగతంగా ఉద్వేగమున్నా కవిత్వీకరణలో హృదయాన్ని హత్తుకోగల కళాంశాలనేకంగా ఉన్నాయి.

 కాలం నల్లలాంతరుపట్టుకొని/చీకట్లో చీకటిని వెతుక్కుంటూ/బయల్దేరినప్పుడు“-(పే.37.అప్పుడు ఎప్పుడో ఒకసారి)

 తనకంటే ముందుగా/తనచావే పుట్టిందని

ఇప్పటివరకు/ రైతూ గుర్తించలేదు“-(పే.42.ఇది హత్యాత్మహత్య)

 ఇలాంటివాక్యాల్లోని సంకేతాలు కళాదృష్టిని ప్రసారం చేయడమేకాకుండా వాస్తవికతను బలపరుస్తాయి.ఈ సంపుటిలో ఇలాంటివాక్యాలను అనేకంగా ఎత్తిరాయొచ్చు.ఇవన్నీ వాస్తవాన్ని ప్రతిఫలిస్తాయి.వర్తమాన రాజకీయ,సామాజిక పరిస్థితులపై  గొంతెత్తిన యుద్ధస్వరం కొనకంచి మంత్రలిపి.

                                                                   ___________  

గమనమే గమ్యం -24 వ భాగం

olgaఅన్నపూర్ణ ఏ క్షణమైన అరెస్టు కావొచ్చునని అందరూ అనుకుంటున్నారు. అబ్బయ్య తన ఉద్యోగం ఒదలటానికి సిద్ధంగా లేడు. ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరి వంతూ అన్నపూర్ణే పని చేయాలని. పిల్లను అమ్మమ్మ గారి ఊరు పంపించారు. అన్నపూర్ణ రోజుకో ఊరు తిరిగి క్విట్‌ ఇండియా ప్రచారం చేస్తోంది. ఆమె వెళ్ళిన చోటల్లా ఏదో ఒక బ్రిటీష్‌ ప్రభుత్వ వ్యతిరేక చర్య చేయకుండా, చేయించకుండా వెనక్కు రావటం లేదు. తెనాల్లో రైలు పట్టాు పక్కకు తొలిగాయి. ఇంకో ఊళ్ళో టెలిఫోను వైర్లు తెగాయి. మరో చోట ప్రభుత్వ ఆఫీసులో ఫైళ్ళు తగబడ్డాయి. ఏ రోజు ఎక్కడుంటుందో తెలియకుండా జాగ్రత్త పడుతోంది. అబ్బయ్యను పోలీసులు ప్రశ్నించి, రోజూ పోలీస్‌ స్టేషన్‌కొచ్చి కనపడమని చెప్పి ఒదిలేశారు. వారి ఇంటి మీద నిఘా – భర్తను కలుసుకోవటానికి అన్నపూర్ణ ఒచ్చిన , ఆమెను కుసుకోవాలని అబ్బయ్య కదిలినా తమ పని సువవుతుందని పోలీసు అబ్బయ్యను అరెస్టు చేయలేదు. అసలు సమస్య అన్నపూర్ణ అని వాళ్ళకు తొసు.

ఒకే సమయంలో, ఒకే సందర్భంలో అన్నపూర్ణ రహస్య మీటింగు జరపటమూ, తను బహిరంగంగా తిరిగి మాట్లాడగలగటమూ చిత్రమనుకుంది శారద.

అన్నపూర్ణ అరెస్టు కాకుండా ఉండాలని తనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఆశ్రయం అడగటం, ఆ సంగతి అన్నపూర్ణకు తెలియపరచటం ఈ పనిలో ఏమరుపాటు లేకుండా ఉంది శారద.

నందిగామ దగ్గర ఊళ్ళో తెలంగాణా నుంచి వచ్చిన నాయకులతో రహస్య సమావేశానికి రకరకాల మార్గాల్లో ప్రయాణం చేసి వెళ్ళింది శారద. తెలంగాణా పోరాటానికి ఆంధ్ర ప్రాంతం నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఎలా మద్దతివ్వాలా , ఆహారం, ఆయుధాల వంటి వారి అవసరాలు ను ఎలా తీర్చాలా అని ఇరువైపు వాళ్ళూ కూర్చుని మాట్లాడుకున్నారు. తెలంగాణాలో జరుగుతున్న ఒక్కొక్క సంఘటన గురించి చెబుతుంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళ రక్తం ఉడుకెక్కుతోంది. అందులోనూ వచ్చింది యువకులు . వాళ్ళల్లో చలసాని వాసుదేవరావుని ని చూస్తె శారదకు ముచ్చటేసింది. ఒట్టి ఉద్రేకమే కాదు అతని మాటల్లో వివేకం ఉట్టిపడుతుంది. తెలంగాణా ప్రాంతంలోని భూస్వామ్య సమాజానికీ, ఆంధ్రప్రాంతపు భూస్వామ్య సమాజానికి ఉన్న తేడా చక్కగా వివరంగా చెప్పాడు. ఆంధ్రప్రాంతంలో కూడా రైతును మరింత వేగంగా సంఘటితం చేయాల్సిన అవసరం గురించి, రైతు దయనీయ పరిస్థితి గురించి అంకెలతో సహా చెప్పాడు. శారద అతనిలో భవిష్యత్తుని చూసింది. కాట్రగడ్డ వెంకట నారాయణ, బాపయ్య, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి- ఆ యువకులను చూస్తే శారదకు ఉప్పు సత్యాగ్రహానికి ముందు తమ ఇంట్లో చేరిన యువ బృందం గుర్తొచ్చింది. వాళ్ళల్లో కొందరిప్పుడు కాంగ్రెసు, కొందరు కమ్యూనిస్టు పార్టీలో ఉన్నారు . మరి కొందరు లోహియాకు అభిమానులై సోషలిస్టుయ్యారు. ఈ యువకులందరూ కమ్యూనిస్టులు . వాళ్ళను చూస్తే శారదకు గర్వం అనిపించింది. వాళ్ళందరికంటే తను పెద్దది. ఐన శారద కలా అనిపించలేదు. ఈ యువకులు తనకంటే నాలుగడుగులు ముందే ఉన్నారనిపించింది . మా తరం ఈతరాన్ని సృష్టించింది. వీరికి తిరుగులేదు. వీరి వయసులో తమకున్న అస్పష్టతలు , అయోమయాలు , సందేహాలు వీరికి లేవు. ఎలాంటి యువతరం ఇది. వీళ్ళు దేశానికి కొత్త రూపాన్నిస్తారు. భవిష్యత్తంత వీరిదే. వీళ్ళ నాయకత్వంలో నటాషా పని చేస్తుంది అనుకుంటే మురిపెంగా అనిపించింది శారదకు.

చర్చలు రెండు రోజు పాటు రాత్రింబగళ్ళూ సాగాయి. నైజాంలో రాబోయే గడ్డు రోజులను ఎదుర్కొనేందుకు తాత్కాలిక ప్రణాళిక ఒకటి రాసుకున్నారు . రెండోరోజు రాత్రి పదిగంట తర్వాత శారద నందిగామ నుంచి బయల్దేరింది. కొంతదూరం పొలాల గుండా నడిచి రోడ్డెక్కితే అక్కడేదో బస. తెల్లారేవరకూ అక్కడ ఉండేందుకు డాక్టరు గారి కోసం ఏర్పాట్లున్నాయి . బాగా తెల్లారాక ఆవిడ బండిలో దగ్గరున్న రైలుస్టేషన్ కు వెళ్ళి రైల్లో బెజవాడ వెళ్ళిపోవాలని అన్ని జాగ్రత్తలతో ముందే నిర్ణయమయింది.

శారదకు తోడుగా చలసాని వాసుదేవరావునీ, నారా యణనీ, వెంకటరెడ్డిని పంపారు. శారద నడుస్తూ వాళ్ళతో మెల్లిగా మాట్లాడుతోంది.

వాసుదేవరావు ఉత్సాహం గా తన కుటుంబం గురించి చెబుతున్నాడు.

‘‘మా ఇంట్లో అందరం కమ్యూనిస్టులమే డాక్టరు గారు. మా నాన్న బసవయ్య మాకు పెద్ద అండ. మేమేం చేసిన మా వైపే మాట్లాడతాడు. మా చెల్లెళ్ళు మన పాటలు పాడుకుంటూ పెరుగుతున్నానరు. అందరూ చదువుకుంటున్నారు. మా చిన్న తమ్ముడు ప్రసాదున్నాడాండీ. వేలెడు లేడు జండా పుచ్చుకుని పరిగెత్తుతాడు. మా చెల్లెళ్ళు కూడా మీలా డాక్టర్లు కావాలని మా నాన్న చెబుతుంటాడండీ. ఆడపిల్లలందరికీ మంచి చదువుంటే మన దేశం తొందరగా మారుతుంది. మన మహిళా సంఘంలో చూడండి కాస్త చదువు నేర్చుకునే సరికి వాళ్ళ ముందు, వాళ్ళ ఉపన్యాసాల ముందు, నాటకాలు , బుర్రకథలూ చెప్పే వాళ్ళ నేర్పు ముందు మేమెవరం ఆగలేం డాక్టరు గారూ – మహిళా ఉద్యమం గురించి మీకు నేను చెప్పేదేముంది. అదంత మీ సృష్టి గదా’’.

‘‘నేనేం చేశాను వాసూ?- మీ అందరూ గ్రామాల్లో వాళ్ళకు అన్ని రకాలుగా మద్దతిచ్చారు. వాసూ మీరంత నవ యువకులు . ఒక్క విషయం చెబుతాను. ఆలోచించండి . ఇప్పటికిప్పుడు కాదు. ప్రతిరోజూ ఆలోచించండి ’’.

‘‘చెప్పండి డాక్టర్‌ గారూ’’

పొలాల మధ్య ఆ సన్నని డొంకదారిలో మసక వెన్నెల్లో బాగా చూసుకుంటూ, ఆగుతూ నడుస్తున్నారు. పైన ఆకాశంలో నక్షత్రాలు రెండు వైపులా ఏపుగా పెరిగిన జొన్నచేలు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో చిన్నగా మాట్లాడుతున్న శారద గొంతు సెలయేటి పాటలా ఉంది.

‘‘వాసూ. ఆలోచించండి . స్త్రీలు మహిళా సంఘాల్లోకి బాగా వస్తున్నారు. పార్టీ చెప్పిన పనులు చేస్తున్నారు. కానీ వారు నాయకులు గా ఎదగగలిగే పరిస్థితి ఉందా? వాళ్ళకు నాయకత్వ శిక్షణ ఇస్తున్నాం ? మనందరం ఏం చెబితే అది చేసే అనుచరులుగా తయారు చేస్తున్నామా ? నిజంగా వాళ్ళకేం కావాలి? వల్ల ఆశలేమిటి? కలలేమిటి? స్త్రీ పురుష సమానత్వం గురించి మనం వాళ్ళకు కొత్తగా చెబుతున్నదేమిటి? స్త్రీలకు సమానత్వమంటే అర్థం ఏమిటని మీరంతా ఆలోచించండి . ఆడవాళ్ళను సమానంగా చూడటానికీ – వాళ్ళను ఉద్ధరించటానికీ తేడా ఉంది. ఆ తేడా గురించి ఆలోచించండి ’’ ఒక ఆర్తితో చెబుతున్న ఆ మాటలు ఆ యువకుల మనసుల్లో ఏదో సంచలనం రేపాయి.

వాసు, నారా యణ, వెంకటరెడ్డీ కూడబలుక్కున్నట్టు

‘‘మాకందరికీ మీరు చెప్పాల్సింది చాలా ఉంది డాక్టరు గారు. మేం తొందరలో యువజన సమావేశం ఏర్పాటు చేస్తాం. మీరు వచ్చి మాకు పాఠాలు చెప్పాలి.’’

ఇదే మాట పెద్ద నాయకుల తో చెబితే వారు నవ్వి తీసిపారేసేవారు . ఈ యువకులు ఆలోచిస్తున్నారు. తెలుసు కోవాలనుకుంటున్నారు. వీరే గొప్ప ఆశ పార్టీకి, దేశానికి. వీరి కుటుంబాలకు కూడా. శారదకు తృప్తితో, ఆశతో గుండె నిండిపోయింది.

తన ముందూ వెనకా నడుస్తున్న ఆ యువకులను ఆ మసక వెన్నెల్లో కళ్ళారా చూస్తుంటే సూర్యోదయం త్వరలో జరుగుతుందనిపించింది. ఆ రాత్రి – తన తర్వాతి తరం యువకుతో కలిసి నడిచిన ఆ రాత్రి ఒక సుందర భవిష్యత్‌ స్వప్నాన్ని చేరువ చేసిన రాత్రి అనుకుంది శారద. తన జీవితంలో మర్చిపోలేని రోజుల్లో అదొకటి అనుకుంది.

మాటలు . ప్రశ్నలు . సమాధానాలు . వినిపించీ వినిపించని నవ్వు, ఆ గతుకు డొంకదారి విజయ పథమే అనిపించింది వారందరికీ. తారురోడ్డు ఎక్కేసరికి తెల్లవారు ఝాము కావొస్తున్నట్లుంది. వీరు నిల బడిన చోటికి దూరం నుంచి ఎవరో నడచి వస్తున్నట్లు లీల గా కనపడుతోంది.

olga title

‘‘ఈ వేళప్పుడు ఒక్కరే ఇక్కడ’’ వెంకట రెడ్డి మాటలే అందరి మనసుల్లో. ఆ ఆకారం దగ్గర కొచ్చేసరికి శారద గుర్తు పట్టేసింది.

‘‘అబ్బయ్యా ` నువ్వా? . ఏంటోయ్‌ ` ఈ వేళప్పుడు ` ’’

‘‘ఇవాళ సాయంత్రం అన్నపూర్ణను అరెస్టు చేశారు. నందిగామ జైల్లో ఉంది. ఆమెను చూసి, మా అత్తగారి ఊరు వెళ్ళి పిల్లల్ని చూసి వస్తున్నాను .

మీరేమిటిక్కడ అని అబ్బయ్య అడగలేదు. అందరివీ రహస్య సమావేశాలే. రహస్య జీవితాలే.

‘‘పిల్లలెలా ఉన్నారోయ్‌’’

‘‘బాగా దిగులు పడ్డారు. పెద్దది నాతో వచ్చేస్తానని ఏడుపు. సముదాయించి వాళ్ళను నిద్రపుచ్చి నేనిలా పారిపోయి వస్తున్నా ’’ అబ్బయ్య గొంతు నిండా దిగులే.

‘‘నారాయణా ` అబ్బయ్య తెలుసుగా’’

‘‘తెలుసండీ’’ అన్నారందరూ

‘‘మా యువరక్తం. దేశ భవిత’’ అంది శారద అబ్బయ్యతో గర్వంగా.

‘‘నేను వెళ్తాను. అన్నపూర్ణను తొందరగానే విడుదల చేస్తారనుకుంటా. జైలు కిటకిటలాడుతోంది. మీరు జాగ్రత్తగా వెళ్ళండి ’’. అబ్బయ్య మరోవైపు వెళ్ళాడు.

శారద కాసేపు విశ్రాంతి తీసుకోవాల్సిన ఇంటికి ఆమెను చేర్చి వాళ్ళు ముగ్గురూ మళ్ళీ చేలకడ్డంబడ్డారు.

***

ప్రొఫెషనల్ కిల్లర్స్

 

 vamsi

-అల్లం వంశీ 

~

చిక్కటి కన్నీటి బొట్లు… ఒక్కొక్కటిగా రాలుతున్నాయి…

“నేనియ్యాల బడికి పోనమ్మా,” ఆరేండ్ల చింటూ ఏడ్చుకుంట అన్నడు.

“మా బుజ్జికదా.. ప్లీస్.. ప్లీస్.. ఇయ్యాలొక్కరోజు పొయిరా నాన్నా. ఇయ్యాలొక్కరోజు పొయ్యస్తే మళ్ళ రేపెట్లాగో ఆదివారమే కదా! కావాల్నంటె రేప్పొద్దంత ఆడుకుందువులే,” అని బుద్రకిస్తూ కొంగుతోని పిలగాని కన్నీళ్లు తుడుచుకుంట స్కూల్ ఆటో ఎక్కించింది వాళ్లమ్మ.

చింటూ అలిగిమూతి ముడుచుకున్నడు.

అమ్మ నవ్వుతూ ముద్దిచ్చి “టాటా నానా,” అని చెయ్యి ఊపింది.

కొడుకు మొఖం అటుతిప్పుకున్నడు తప్పితే టాటా మాత్రం చెప్పలేదు.

ఆటో ముందుకు కదిలింది. అమ్మ ఇంట్లకు నడిచింది.

******

ఆటో హారన్ వినిపించుడుతోనే, బాచు గాడు ఇంట్ల లొల్లి షురూ చేశిండు.

“నేనా బడికి పోను డాడీ.. ప్లీజ్.. నాకా బడద్దు..”

“తలకాయ్ తిరుగుతాందా, రోజు నాకీ లొల్లేందిరా?” అనుకుంట వాళ్ల డాడీ, బాచుగాన్ని రెక్కవట్టుకోని బయటికి ఇగ్గుకచ్చిండు.

“ప్లీజ్ డాడీ, నేనీ బళ్లె సదువుతా..”  అనుకుంట వాళ్లింటి పక్కకే ఉన్న బడిని చూయించిండు బాచు.

ఆ బడి ఉట్టి బడి కాదు, సర్కార్ బడి. గోడమీద రాసుండాల్సిన “ప్రభుత్వ పాఠశాల” అన్న అక్షరాలు గాల్లో కలిసిపొయ్యి చాన రోజులైంది. గోడలు ఓ సగం కూలిపొయ్యీ, మిగిలిన సగం మధ్యాన్నభోజనం పొగలకు మాడిపొయ్యీ, నల్లగ పాడుబడిపొయినట్టున్నదా బడి.  బడికి తగ్గట్టే అక్కడి పిల్లలున్నరు. మాసిపొయిన బట్టలతోనీ, చెప్పులు లేని కాళ్లతోనీ, దుబ్బలపడి ఆడుకుంటున్నరు.

“అన్ల సదువుతె సదువచ్చినట్టే నీకిగ. నడు నడు సప్పుడుచేక ఆటో ఎక్కు,” డాడి అన్నడు.

“ప్లీజ్ డాడీ.. నేనా బడికి పోను..”

“బడికి పోకుంటె ఏంజేత్తవ్? బర్ల కాత్తవారా? చల్ నడూ.. ఆటో ఎక్కు..”

“బడికి పోత డాడీ.. కని, ప్లీజ్ ఇగో… ఈ బడికి పోతా… సర్కార్ బడికి..”

“సంక నాకిపోతవ్ అన్లకు పోతె.. ఎన్నడన్న ఒక్క సారు పాఠం చెప్పంగ చూశినవార అన్ల? సర్కార్ బడట సర్కార్ బడి.. ఓ సారుండడు, ఓ  సదువుండదు అదేం బడిరా.. దిక్కుమాలిన బడి.. నడూ.. సక్కగ ఆటో ఎక్కు..” అని గద్రకిచ్చుకుంట మొత్తానికి కొడుకుని ఆటోల కుక్కిండు డాడీ.

ఆటో టైర్లు ముంగటికురికినయ్. డాడి కాళ్లు, వాళ్ల షాపు తొవ్వ పట్టినయ్.

******

హారన్ కొట్టాల్సిన పని లేకుంటనే పింకీ, వాళ్ళ మమ్మీ ఇద్దరూ ఇంటి గేటు ముంగట నిలుచోని ఉన్నారు.

“మమ్మీ… ఆటో అంకుల్ కి ఇవ్వాలైనా స్లో గా వెళ్లమని చెప్పవా.. ప్లీజ్.. కొంచం గట్టిగా చెప్పుమమ్మీ,”  పింకీ అన్నది.

“సరే బేటా. నువ్వైతె ముందు జాగ్రత్తగ కూచో,” అని తనని ఆటో ఎక్కించి, డ్రైవర్ తోని-

“బాబూ, కాస్త మెల్లగానట వెళ్ళవయ్య.. పిల్లలు భయపడుతున్నరు పాపం,” మమ్మీఅన్నది.

“సరే..”

“నువ్వు రోజు ‘సరే’ అనే అంటున్నవ్, కాని మళ్లీ స్పీడుగనే వెళ్తున్నవట కదా?”

“మీరు పంపినట్టు అందరు పిలగాన్లను టైముకు పంపద్దానమ్మా? రోజూ ఎవ్వలో ఒక్కలు లేట్ జేత్తనే ఉంటరు. మరి అందర్ని బల్లె ప్రేయరు టైముకు ఆడ దింపాల్నా వద్దా? అందుకే జరంత ఫాస్ట్ గా తోల్త, గంతేగని పిలగాన్లను భయపెట్టుడు నాకేమన్న సంబురమా ఏందీ?” అని అటు మాట్లాడుకుంటనే ఇటు గేర్ మార్చిండు డ్రైవరు.

మమ్మీ ఇంకేమో అన్నది కనీ ఆ మాటలు ఆటో చప్పుడులో కలిసిపొయినయ్.

ఆటో మూల మలిగింది. గేటు మూసి లోపటికొచ్చింది.

******

తొవ్వల ఇట్లనే ఇంకో ఐదారుగురు పిల్లలు ఆటో ఎక్కిన్లు. ఆరోజు శనివారంకదా, అందుకే పిల్లలందరు తెల్ల యూనిఫాములల్ల ముత్యాల్లెక్కన అందంగ మెరిసిపోతున్నరు.

అందరు ఎక్కినంక ఇగ డ్రైవర్ సెల్ఫోన్ ల ఓసారి టైము చూసుకున్నడు. పావు తక్కువ ఎనిమిది. “బల్లె ప్రేయర్ ఎనిమిదింటికి స్టార్ట్. ఈన్నుంచి బడికాడికి పది కిలో మీటర్లు. అంటె, ఇంకో పావుగంటల నీను పది కిలోమీటర్లు పోవాల్నన్నట్టు”  మనసులనే లెక్కలు వేసుకోని, బండి టాప్ గేర్లకి మార్చిండు.

మెయిన్ రోడ్డు ఎక్కంగనే ఆటో స్పీడు విపరీతంగ పెరిగింది.  ఐతే, అది పేరుకే మెయిన్ రోడ్డుకానీ రోడ్డుమీద మొత్తం లొందలు, బొందలే. అందుకే వాటినుంచి పొయినప్పుడల్లా ఆటో ఎటు వంగుతుంటే లోపట పిల్లలు కూడా అటుదిక్కే వంగుతున్నరు. దీనికి తోడు ఆటో బయటికున్న ఒక కొక్కానికి వాళ్ళందరి స్కూలు బ్యాగులూ, లంచు బ్యాగులూ వేలాడేశుతోని ఆటో మొత్తం ఒక పక్కకు ఒరిగిపోయ్యున్నది.

ప్రతి రోజు అన్నట్టుగనే, ఇయ్యాల కూడా పింకీ- “ప్లీజ్ అంకుల్ కొంచం స్లో గా వెళ్లండి,” అన్నది.

డ్రైవర్ కూడా ఎప్పటిలెక్కనే ఇయ్యాలకూడా ఆమె మాటలు పట్టించుకోకుండ ఇంకింత స్పీడు పెంచిండు.

ఇంతల రోడ్డు మీద ఒక పెద్ద లొంద.

డ్రైవర్ దాన్ని తప్పించపేండు కనీ, చానా స్పీడ్ మీద ఉండుడుతోని బండి కంట్రోల్ కాలే.

కన్నుమూశి తెరిచినంతల.. ఏదైదే జరగద్దో అదే జరిగింది.

ఖతం..  అంతే.. నల్లటి రోడ్డు ఎర్రగయ్యింది.

మహా విషాదం..

ఒక్క క్షణం ముందు వాళ్ళు కడిగినముత్యాలే. కానీ ఇప్పుడా ముత్యాలు నెత్తుటిమడుగుల్లో పడున్నయ్. మూసిన కన్నులతోనీ.. చలనంలేని శరీరాలతోని..

కొన్ని క్షణాల నిశ్శబ్దం…

ఆ వెంటనే అలజడి. చుట్టూ జనం మూగిన్లు, అరుస్తూ కేకలు పెడుతూ కాపాడే ప్రయత్నాలేవో చేస్తున్నారు.

సరిగ్గా అప్పుడే కొద్దిదూరంల ఓ కారు ఆగింది. లోపట ఏదో పాట మోగుతాంది. డ్రైవర్ మోహన్ కార్ దిగి, ఏమైందో చూద్దామని జనం గుంపుల కలిశిండు.

ఆ కార్ వెనుక సీట్ల ముగ్గురు పిల్లలుకూచోని ఉన్నరు. చందూ, అలేఖ్య, దినేష్. కొంచం పెద్ద “చిన్నపిల్లలు”. తొమ్మిదో క్లాసు వాళ్లు.

పాట ఆపి వాళ్లు ముగ్గురు కూడ కిందికి దిగి చూశిన్లు, ఏమైందోనని.

చెల్లా చెదురుగా పగిలిన అద్దం ముక్కలూ.. విసిరికొట్టినట్టు ఎగిరిపడిన పుస్తకాల బ్యాగులు.. తెరుచుకున్న టిఫిన్ బాక్సులూ.. కలిపి ఉన్న అన్నం ముద్దలూ.. వాటి మధ్యలో చిందర వందరగా చెదిరిపోయి, ఆటోకింద నలిగిపోయిన చిన్న చిన్న పిల్లలు… అది చూసిన అలేఖ్య చక్కెరచ్చి కిందపడ్డది. చందూ, దినేష్ ఆమెను లేపి కార్లో కూచోబెట్టి ఏసీ వేసి తాగడానికి ఇన్ని నీళ్ళిచ్చిన్లు.

లేవంగనే అలేఖ్య అడిగింది- “పాపం.. ఎవరట? అసలేమైందట? ఎట్లైందట?” అని.

వాళ్లు- “ఎమ్మో, ఎవరో చిన్నపిల్లలే ఉన్నట్టున్నరు- స్కూల్ బ్యాగ్స్ కనిపిస్తున్నయ్,” అన్నరు.

అంబులెన్సులు వచ్చినయ్. దానెనుకే పోలీసులూ…

టైము ఎనిమిదింబావు అయితాంది.

జరసేపటికి మోహన్ వచ్చి ఏం మాట్లాడకుంట సైలెంటుగ కార్ల కూచున్నాడు. ఆయినె చేతులకు, అంగీకి ఆడీడ నెత్తుటి మరకలున్నాయి. అవి ఎక్కడివని ఈ పిల్లలు అడగలేదు. ఎందుకంటే అవెక్కడియో వాళ్లకు తెలుసు..

వీళ్లు ముగ్గురూ చిన్నప్పట్నించీ మంచి దోస్తులు.  అందరు చదివేది ఒకే క్లాసు. ఒకే స్కూలు.

దినేష్ వాళ్ల డాడి ఆర్ టీ వో, చందు వాళ్ల డాడి గవర్నమెంటు టీచర్, అలేఖ్య వాళ్ల డాడి గవర్నమెంట్ ఆర్ అండ్ బీ రోడ్ కాంట్రాక్టర్. వాళ్లు ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్, ఉండేది కూడా పక్కపక్క ఇండ్లల్లనే అవుడుతోని అందరూ దినేష్ వాళ్ళ డాడి కార్లనే రోజూ ఇట్లా స్కూల్ కి పొయ్యస్తుంటరు.

మోహన్ ఓసారి గట్టిగా ఊపిరి తీసుకోని కారు స్టార్ట్ చేశి రివర్స్ తీస్కున్నడు.

కారు వచ్చిన దార్లనే వెనక్కి పోతోంది.

vamsi

“అంకుల్ స్కూలూ?” చందూ అడిగిండు.

“వాళ్లు మీ స్కూలు పిల్లలే చందూ,” ప్రశాంతంగా చెప్పిండు మోహన్.

ఒక్క క్షణం పిల్లలకు షాక్ కొట్టినట్టయింది.

“అర్రే.. ఔనా? ఏ క్లాస్ వాళ్లట పాపం?”

“ఎమ్మో, అందరు చిన్న చిన్న పిల్లలే! ఫస్టో సెకండో ఉంటరు కావచ్చు”

ముగ్గురికి మస్తు బాధైతుంది కని ఏమనాల్నో తోస్తలేదు.

మళ్ల జరసేపు అంతా నిశ్శబ్దం.

“అసల్ ఎట్ల అయ్యిందట అంకుల్?” దినేష్ అడిగిండు.

“రోడ్డు మీద పెద్ద లొందస్తే, దాన్ని తప్పించపొయ్యి రోడ్ డివైడర్ కు గుద్దిండట..”

“అరెరే.. పాపం…” అలేఖ్య అంది.

అడగాల్నా వద్దా అనుకుంటనే దినేష్ అడిగిండు- “ఎంతమందట అంకుల్?”

“ముగ్గురు పిల్లలున్నూ ఆ డ్రైవరూ. మొత్తం నలుగురు.  మిగిలినోళ్లకు సుత బాగనే తాకినయ్”

“మెల్లగా వెళ్ళుంటే తప్పించుకునేవాళ్ళేమో కదా? అసలు తప్పంతా ఆ డ్రైవర్ దీ, డొక్కు ఆటోదే,” అలేఖ్య కళ్లు తుడ్చుకుంటూ అన్నది.

“కరెక్టే కని, టైముకు ప్రేయర్ కు అందకపోతే మన స్కూల్ల పనిష్మెంటు ఎట్లుంటదో తెల్సుకదా? అందుకే వాడు ఫాస్ట్ గ పొయ్యుంటడు. వాని తప్పేంలేదు. అసల్ తప్పంత మన స్కూలోళ్లదే! తొమ్మిదింటికి పెడ్తె ఏం పోవును చెప్పు! ఛ, పాపం వాళ్లు మన స్కూల్ కాకున్నా అయిపోవును కదా, మంచిగ బతికిపోతుండే,” చందూ అన్నడు.

“మన స్కూల్ తొమ్మిదింటికి పెట్టినా, పదింటికి పెట్టినా ఆటోవోళ్లు అట్లనే అస్తర్రా. తప్పు ఆటోవోంది కాదు, మన స్కూలోళ్లదికాదు. ఆ రోడ్డున్నది చూశిన్లా – తప్పంత ఆ రోడ్డుదీ, దాని మీదున్న లొందలూ బొందలదీ. అవేగిన లేకుంట రోడ్డు మంచిగ సాఫ్ ఉంటె అసల్ ఇట్లయ్యేదా? ఆ రోడ్డేష్నోన్ని తన్నాలె ముందు,” దినేష్ అన్నడు.

ఇట్లా పిల్లలు ముగ్గురూ, ఇండ్లు దగ్గరికచ్చేదాంక తప్పు వీళ్లదంటే వీళ్లదని వాదిచ్చుకుంటనే ఉన్నరు. మోహన్ మాత్రం నిశ్శబ్దంగా వాళ్ల మాటలు వినుకుంట, కారును మెల్లగా ముందుకు పోనిస్తున్నడు.

“ఏం మాట్లాడ్తలెవ్వేందంకుల్? చెప్పున్లీ.. తప్పెవరిది?”

“మీరు ముగ్గురు చెప్పింది కరెక్టే. కానీ తప్పు చేసినోళ్లను తిడ్తెనో, తంతెనో సమస్య తీరిపోదు కదా?”

“మరింకేం చేస్తమంకుల్? మనతోటేమైతది?”

“అచ్చా? మరి ఎవరితోని ఐతది?”

“ఎవరితోనంటే- పెద్ద పెద్దోళ్ళుంటరు కదా? అవన్ని వాళ్లు చూస్కోవాలె. ఏదన్నుంటె వాళ్లతోనే ఐతది.”

“పెద్ద పెద్దోళ్లంటే?”

“ఆ.. పెద్ద పెద్దోళ్లంటే… పెద్దోళ్లంటే…” అని పిల్లలు కొంచంసేపు ఆలోచించిన్లు కని ఆ పెద్దోళ్లెవరో వాళ్లకు తెలుస్తలేదు.

కొంచంసేపటికి అలేఖ్య అంది. “పెద్దోళ్లంటె గవర్నమెంట్ అంకుల్. అవన్ని గవర్నమెంట్ చూస్కోవాలి.”

చందూ దినేష్ లు కూడ మాట కలిపి- “ఆ.. అదే… ఎమ్మెల్యే.. మినిష్టర్.. సీ యం.. వీళ్లంత ఉంటరుకదా గవర్నమెంటుల.. వాళ్లే.. వాళ్లే చూస్కోవాలె ఇసొంటియన్ని,” అన్నరు.

ఆ మాటలకు, అంత విషాదంల కూడా  మోహన్ మొహంలో చిన్న చిరునవ్వు మొలకెత్తింది.

అతనెందుకు నవ్వుతున్నడో పిల్లలకు అప్పుడు అర్థంకాలేదు…

******

కొన్ని రోజులు గడిచినయ్..

స్కూల్ల ‘హాఫ్ ఇయర్లీ ఎగ్జాంస్’ మొదలైనయ్. పిల్లలందరు ఆ విషాదాన్ని మరిచిపోయి, పరీక్షలు రాస్తున్నరు.  ఒక్క ఈ ముగ్గురు తప్ప.

వీళ్లుకూడా పరీక్షలు రాస్తున్నరు కానీ ఇదివరకటిలాగా కాదు. ఒకప్పుడు పరీక్షలంటెనే భయంతోని బేజారయ్యే వీళ్లు, ఇప్పుడు పరీక్షలెగ్గొట్టి నిర్రందిగ బజార్ల తిరిగే  స్థాయికి చేరుకున్నరు.  ఆ మరణాలు వీళ్ల ముగ్గురిలో పెద్ద మార్పునే తీసుకొచ్చినయ్.

చందూ, దినేష్ మ్యాథ్స్ పరీక్ష ఎగ్గొట్టిన్లు. అలేఖ్య పరిక్షకు హాజరైంది కానీ తెల్ల కాగితం ఇచ్చింది.

డ్రైవర్ మోహన్ కి ఈ విషయం ముందే తెల్సినా, వాళ్ల ఇండ్లల్ల చెప్పలేదు.

పరీక్షలు అయిపేనయ్. క్లాస్ లో పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులిచ్చి, పేరెంట్స్ తోని సంతకం చేయించుకోని తీసుకురమ్మన్నారు.

******

“డాడీ ప్రోగ్రెస్ కార్డ్.. సంతకం పెట్టు,” డాడికి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చిండు దినేష్.

“ఏందిరా ఇదీ? లెక్కల పరీక్షలో ఆబ్సెంట్ అని ఉందీ? పరీక్ష రాయలే?”

“రాయలే..”

“రాయలేదా? ఎందుక్ రాయలే??”

“ఉట్టిగనే.. నాకు రాయ బుద్ది కాలే.. రాయలే.. నువ్వైతె సంతకం పెట్టు డాడీ”

“ఏందిరా?  పరీక్షెందుకు రాయలేరా అంటే మళ్ల బౌరుబాబ్ మాట్లాడుతున్నవ్?”

“రాయబుద్ది కాలే అని చెప్తున్నగా. ఆ రోజుసినిమాకు పోయిన, అందుకే రాయలే.”

“గాడిది కొడక. పరీక్ష ఎగ్గొట్టి సిన్మాకు పేంది కాకుండ మళ్ల పెయ్యిల భయం లేకుంట నాకేఎదురుమాట్లాడుతున్నవా,” అని తిట్టుకుంట బెల్ట్ తీసి నాలుగు దెబ్బలు సరిశిండు వాళ్ల డాడి.

పెయి మీద వాతలు తేలినయ్ కని దినేష్ కంట్లో ఒక్క చుక్క కన్నీళ్ళు కూడ రాలే.

“కొట్టుడు ఐపేందా? ఇగో ఈ రెండు వందలు తీస్కోని సంతకం పెట్టు.”

ఒక్క క్షణం వాళ్ల డాడికి ఏం సమజ్ కాలే.

“ఏందిరా ఇది??”

“పైసలుడాడీ, నాకాడ ఇవ్వే ఉన్నయ్. ఇగో తీస్కో, తీస్కోని సంతకం పెట్టు..”

కోపంతోని ఊగిపోవుకుంట గట్టిగ ఇంకో రెండు దెబ్బలు సరిశిండు వాళ్ల నాన.

“పైసలిస్తే, పాడైపోయిన పాత బండ్లకు పర్మిట్లు ఇచ్చుడూ, పచ్చితాగుబోతులకు డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చుడు నీకు అలవాటే కదా డాడీ.. ఇది కూడ అట్లనే అనుకో. ఈ రెండువందలు తీస్కోని నా ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం పెట్టు..”

******

vamsi“డాడీ ప్రోగ్రెస్ కార్డ్.. సంతకం పెట్టు,” అనుకుంట డాడి చేతిల ప్రోగ్రెస్ కార్డ్ పెట్టిండు చందు.

“ఏందిరా ఇదీ? లెక్కల పరీక్ష ఆబ్సెంట్ అని ఉందీ? పరీక్ష రాయలే?”

“రాయలే..”

“ఎందుక్ రాయలేరా?”

“ఉట్టిగనే.. నాకు రాయ బుద్ది కాలే.. అందుకే రాయలే.. నువ్వైతె సంతకం పెట్టు డాడీ..”

“సువ్వర్ కే… నోరు బాగా లేస్తుందేందిరా,”  అని పట్టపట్ట నాలుగు దెబ్బలు సరిశిండు వాళ్ల నాన్న.

ఒక్క దెబ్బ పడినా అమ్మా అని బిగ్గరగా ఏడ్చే చందూ ఇప్పుడు మాత్రం ఎందుకో అస్సల్ ఏడుస్తలేడు.

“ఎందుకు రాయలేదంటే మాట్లాడ్తలెవ్వేందిరా? చెప్పూ ఎందుక్ రాయలే…” ఇంకో దెబ్బ.

“ఉట్టిగనే రాయలే… నువ్వైతె సంతకం పెట్టు..”

“బగ్గ బలిశి కొట్టుకుంటానవ్రా నువ్వూ. చెప్పు.. స్కూలుకుపోతున్నా అని పొయినవ్ కద ఆరోజు? మరి పరిక్ష రాయకుంట బడెగ్గొట్టి ఏడికి తిరుగపోయినవ్రా?” ఇంకో దెబ్బ.

“నువ్వో గవర్నమెంటు టీచర్ వి అయ్యుండి వారానికి నాలుగు రోజులు స్కూల్ ఎగ్గొట్టి బయట తిరుగుతలెవ్వా?  నేను కూడ అట్లనే స్కూలెగ్గొట్టి బయట తిరిగినారోజు..”

“పిస్స లేశిందారా.. ఏం మాట్లాడ్తున్నవ్?”

“నువ్వు రోజు స్కూలుకు పోకున్నా, నీ జీతం నీకైతె వస్తుందిగా డాడీ? అట్లనే నేను కూడా  స్కూలుకు పోకపోయినా నా మార్కులు నాకస్తయనుకున్న…”

******

“డాడీ ప్రోగ్రెస్ కార్డ్.. సంతకం పెట్టు,” అనుకుంటూ ప్రోగ్రెస్ కార్డ్ డాడికి ఇచ్చింది అలేఖ్య.

“లెక్కల్లో వందకి వందా? వారెవ్వా… శభాష్ బేటా.. నువ్వెప్పుడు ఇట్లనే మంచిగ చదుకోవాలె,” అనిబిడ్డను మెచ్చుకుంటూ అలవాటు ప్రకారం సంతకం పెట్టబొయ్యి, ఒక్క క్షణం ఏదో అనుమానం అనిపించి ఆగిండు డాడీ.

“ఇదేందమ్మా! నీకు మొత్తం ఫైవ్ ఫిఫ్టీ రావాలెగా. మరిక్కడ ఫోర్ ఫిఫ్టీ అని ఉన్నది? మీ టీచర్ కు లెక్కల్ రావా?”

“మా టీచర్ కరెక్టే వేసింది డాడీ..”

“నీ మొఖం. కరెక్ట్ ఏడుందే, టోటల్లో వంద తగ్గింది. నువ్వన్న చుస్కోవద్దా?”

“లేదు డాడి కరెక్టే ఉంది. సంతకం పెట్టు..”

“అరే.. మళ్ళ అదే మాట. కావాల్నంటె నువ్ లెక్కపెట్టు ఓసారి. ఆరు సబ్జెక్టులు కలిపి మొత్తం ఫైవ్ ఫిఫ్టీ రావాలె.”

“లేదు డాడీ, ఆ టోటల్ కరెక్టే. మ్యాథ్స్ లో నాకు సున్న వస్తే, నేనే దాన్ని వందగా మార్చిన.”

“ఏందీ??”

“ఔను డాడీ, సున్నాను వంద చేసిన..”

“ఎందుకు??”

“ఉట్టిగనే.. ఇందాక మీరు శభాష్ మెచ్చుకున్నారుకదా, అట్లా మెచ్చుకోవాలనే. సంతకం పెట్టు డాడీ..”

“సిగ్గులేదా అట్ల తప్పుడు మార్కులు వేస్కోడానికి? నిన్ను వేలకు వేలు ఫీజులుకట్టి చదివించేది ఈ దొంగ మార్కులకోసమేనా- ఆ??”

“మరి గవర్నమెంటు మీకు లక్షలకు లక్షలు సాంక్షన్ చేసేది ఆ నాసిరకం రోడ్లకోసమేనా డాడీ?”

“ఏందే? ఏమ్మాట్లాడ్తున్నవ్??”

“ఆ డబ్బులన్నీ మింగేసి, చివర్లో మీరు కూడా వాళ్లకు దొంగ లెక్కలు చూపెడ్తున్నరుకదా? మరి అలాంటి దొంగపని చెయ్యడానికి నీకు సిగ్గులేదా?”

******

బయట కారులో, మోహన్ ప్రశాంతంగ కండ్లు మూసుకోని ఒరిగిండు. అతని మొహంలో, అప్పుడు కనిపించిన చిరునవ్వే మళ్ళీ ఇప్పుడూ కనిపిస్తోంది.

సరిగ్గా అదే టైముకు ఇక్కడ ఇండ్ల లోపట,  ఆ పిల్లల గొంతునుంచి కొత్త మాటలు మొలకెత్తినయ్-

“మీ డ్యూటీని మీరు సరిగ్గ చేసుంటే, పాపం ఇయ్యాల ‘ఆ నలుగురు’ మంచిగ బ్రతికుంటుండే కదా డ్యాడీ? Yes.. You killed them all.. and you are not a Public Servant dad.. You are a Professional Killer..”

తమ పిల్లలు అంటున్న మాటలకు ఆ తండ్రుల గొంతు తడారి పొయ్యి, మాట పడిపోయింది.

కానీ..

కానీ..   వాళ్ల గుండెలు మాత్రం తడయ్యి, ఆ కరిగిన మనసులకు గురుతుగా..

“చిక్కటి కన్నీటి బొట్లు…. ఒక్కొక్కటిగా రాలుతున్నాయి…”   

 

*

తలలు పగలగొట్టుకునే జనాల మధ్య…

    

  అనూరాధ నాదెళ్ళ 

~

62పిల్లల పట్ల ఉన్న ప్రేమ నన్ను టీచర్ని చేసింది.  ప్రస్తుతం మా పోరంకి (విజయవాడ)లో  చదువు అవసరం ఉన్న ఒక గూడెంలో పిల్లలకి సాయంకాలం పాఠాలు చెబుతున్నాను. ఇది కాకుండా  ‘టీచ్ ఫర్ చేంజ్’ అనే స్వచ్చంద సంస్థకు  ఈ మధ్య సభ్యురాలిని అయ్యాను. కథలు, కవితలు అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను . రెండు మూడేళ్ల క్రితం ఒక కథల పుస్తకాన్ని అచ్చువేసుకున్నాను . పుస్తకాలు , పిల్లలు ,సంగీతం , చుట్టూ ఉన్న ప్రపంచం … ఇలా ఇష్టమైన జాబితా చాలా ఉంది . 
~

ఆరోజు గూడెంలో క్లాసు ముగించి ఇంటికి బయల్దేరేను. చీకటి రాత్రులు. వీధి దీపాలు ఎక్కడా వెలగడం లేదు. చేతిలో టార్చ్ లైటు దారి చూపిస్తూంటే గబగబా నడుస్తున్నాను. వీధిలో పెద్దగా అలికిడి లేదు. రోడ్డుకి రెండువైపులా ఉన్న ఇళ్ళల్లోంచి పలుచని వెలుతురు మాత్రం బయటకు పాకుతోంది.గూడెం పొడవునా ఉన్న చర్చిల్లోంచి రికార్డులు వినిపిస్తున్నాయి. క్రిస్మస్ దగ్గరకొస్తోంది. ఇంకపైన గూడెమంతా బోలెడు సందడి మొదలవుతుంది.

ప్రక్కన ఏదో అలికిడి అనిపించి తల త్రిప్పబోయేసరికి తలమీద దెబ్బ పడింది. తలమీద చేత్తో తడుముకుంటూ,’ఎవరది?’ అంటూ వెనక్కి తిరగబోయేంతలోమరో దెబ్బ. చేతిలో టార్చి జారిపోయింది.

‘అబ్బా!.’అంటూ రెండు చేతులతో తల పట్టుకున్నాను. ఎవరో వెనుక పరుగెడుతున్న చప్పుడుతో పాటు ‘గట్టిగా కొట్టలేదుగా ’ గుసగుసగా ఎవరిదో పరిచయమున్న గొంతులాగే ఉంది.

ఎదురుగా ఆటో వస్తున్న శబ్దం విని రోడ్డుకి అడ్డంగా నిలబడి కేక వేసేను. తలమీంచి రక్తం కారుతూంటే చెయ్యి నొక్కి పెట్టి బాధని అణుచుకుంటూ, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి దెబ్బకి కట్టుకట్టించుకున్నాను. రెండు , మూడు కుట్లు పడ్డాయి.

ఏమైంది? ఎవరు చేసి ఉంటారీపని? ఆలోచించే శక్తి లేదు. ఇంటికెళ్లి వండిపెట్టుకున్న భోజనం ముగించి నొప్పి తెలియకుండా ఉండేందుకు డాక్టర్ ఇచ్చిన మాత్ర వేసుకుని పడుకున్నాను.

ఆ పడక పడక వారం రోజులు జ్వరంతో మంచానికి అతుక్కుపోయాను. అమ్మ వచ్చింది. ‘ ఈ మారుమూల నీకు ఈ ఉద్యోగం అవసరమా? పైగా గూడెంలో సాయంత్రం క్లాసులు ! చేసిన దేశసేవ చాలు, ఉద్యోగానికి రిజైన్ చెయ్యి. మన ఊరు వెళ్లి పోదాం. ‘ అంది.

‘ అమ్మా, ప్లీజ్ అలా మాట్లాడకు. నాకు ఇక్కడ ఏ సమస్యా లేదు’

‘ లేకపోతే ఆ రోజు నీమీద దాడి ఎందుకు చేసేరు? ఎవరు చేసేరు? ఆ సమయానికి ఆటో అటుగా రాకపోతే ఏమయ్యేది?  నిన్ను కొట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? నువ్వు చెప్పు పోనీ , వింటాను.’ అమ్మ సవాలు చేసింది.  నాకు మాత్రం ఏం తెలుసు? ఎవరిమీదో చెయ్యబోయిన దాడి చీకట్లో నామీద చేసేరని అనుకుంటున్నాను. అమ్మతో అదే అంటే , ‘ అలా అయితే అసలు నువ్వు అలాటి పరిసరాల్లోకి వెళ్లనే వెళ్లొద్దు. తలలు పగలు కొట్టుకునే జనాల మధ్య కోరికోరి నువ్వు వెళ్లనవసరం లేదు, చెప్పింది విను’ ఇంకేం మాట్లాడకు అన్నట్లు చూసి వంటింట్లోకి వెళ్లి పోయింది అమ్మ.

జ్వరం ఎంత తీవ్రంగా వచ్చిందంటే అసలు నేను ఎన్నాళ్లై మంచం మీదున్నానో అర్థంకాలేదు.ఆలోచనలు సాగడం లేదు. తలనొప్పిగా ఉంది. నీరసం అనిపించి కళ్లు మూసుకున్నాను. అమ్మ వుందన్న ధైర్యం.

స్కూల్ స్టాఫ్ వచ్చి చూసి వెళ్లేరు. స్కూల్లో పనిచేసే ఆయా కమల మాత్రం ఆవేశంగా అంది, ‘ఆ మూర్ఖులకి మీరేం చెయ్యలేరు మేడం. వాళ్లకి చదువులు రావు. దేవుడు మాస్టారు చెప్పిందే రైటు. అసలు మీకెవరిమీదైనా అనుమానం ఉంటే చెప్పండి. వాళ్లని నడిరోడ్డుమీద కి ఈడ్పించి పోలీసులకి పట్టిస్తాం.పిల్లలవరకూ ఈ విషయం వెళ్లనీయలేదు మేమెవ్వరం. టీచరుగార్కి జ్వరం అని మాత్రం చెప్పేం.’ ఒక నిముషం ఆగి,

‘ ఎవరు చేసేరో చెప్పండి టీచర్, మేం చూసుకుంటాం వాళ్ల పని’ అంది మళ్లీ.

‘ లేదు కమలా, ఎక్కడో పొరపాటు జరిగింది అనుకుంటున్నాను. నన్నెవరూ కావాలని కొట్టలేదులే.’ ఆమెని శాంతింపచేసే ప్రయత్నం చేసేను.

‘ గూడెం నుంచి పెద్దోళ్లెవరైనా వచ్చి అడిగితే, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడిన తర్వాతే ఇంక క్లాసులు పెట్టండి మేడం. మీరింక రాబోకండి’

నేను నవ్వేసేను, ‘ఏం భయం లేదు కమలా, మీరంతా ఉన్నారుగా.’ నా మాటలకి అందరూ తెల్లబోయారు.

అమ్మ తనకి లీవ్ అయిపోతోందని వెళ్లాలంది.  ఊరికి బయలుదేరేముందు నన్ను తనతో పాటు ప్రయాణం చేయించాలని విఫల యత్నం చేసింది.

ఆఖరికి కోపంగా, ‘ ఇలా తల బ్రద్దలైందంటూ కబురొచ్చినా మళ్లీమళ్లీ నేను వచ్చి చెయ్యలేను. పంతానికి పోకుండ ఆలోచించు. నీ చదువుకి ఇంతకంటే పెద్ద ఉద్యోగం ఎక్కడైనా వస్తుంది. ఇంక నీ ప్రయోగాలు ఆపి ఇంటికి రా ’ అంటూ అమ్మ వెళ్లిపోయింది.

ఏమో, నాకైతే జీవిక నిచ్చిన ఆ ప్రభుత్వోద్యోగం కంటే సాయంకాలం ఆ పిల్లల మధ్య గడిపే సమయమే నచ్చుతుంది. ఈ పిల్లలు నా జీవితంలో ఎంత ముఖ్య భాగమైపోయారో తలుచుకుంటే ఆశ్చర్యం!

అమ్మ వెళ్లిన రెండో రోజు డ్యూటీలో జాయినయ్యాను. ఆ సాయంత్రం నేను స్కూలు నుండి ఇల్లు చేరేసరికి అమ్మ ఫోన్ చేసింది, ’ ఇంక గూడెంలో సాయంకాలం క్లాసులు మళ్లీ మొదలు పెట్టకు’ అంటూ.

‘ అమ్మా, ప్లీజ్, మళ్లీ మళ్లీ అలాంటివేమీ జరగవమ్మా, అక్కడందరికి నేనంటే బోల్డు ప్రేమ. ‘

రుద్ధమవుతున్న గొంతుతో అమ్మ అంది, ‘దీపూ! నాకూ నువ్వంటే బోల్డు ప్రేమ ఉందిరా’

‘ అయితే సరే. ఆ ప్రేమే నాకు రక్ష. ఇంకేం చెప్పకమ్మా’ అంటూ ఫోన్ పెట్టేసేను.

గబగబా వంట ఏర్పాటు చేసుకుని గూడెంలోకి నడుస్తూంటే ఎప్పటిలాగే ఆ పరిసరాలు నాకు ఎంతో ఆత్మీయమైనవే అన్న భావన కలిగింది. కొంతమంది ఆడవాళ్లు గుమ్మాల్లో నిలబడి నన్ను క్రొత్తగా చూస్తూ వుండటం గమనించాను. నేనే అలా వూహించుకుంటున్నానేమో అని కూడా అనిపించింది.

ఆ సాయంత్రం పిల్లలు మధ్య ఉన్న నన్ను దేవుడు మాస్టారు పలకరించారు. …………

‘ పిల్లల్ని ఈ పూటకి పంపించెయ్యమ్మా. మావాళ్లు నీతో మాట్లాడాలనుకుంటున్నారు’అంటూ.

ఏం మాట్లాడుతారబ్బా అని ఆశ్చర్యపోతూనే పిల్లల్ని పంపించేసేను.

ఒక ఇరవై మంది దాకా ఆడవాళ్లు, మగవాళ్లు ఉన్నారు. వచ్చి చాపల మీద కూర్చున్నారు.ప్రక్కనే అరుగుమీద మాస్టారు కూర్చున్నారు.

‘ టీచరమ్మా, మీరిన్నాళ్లూ జ్వరం వచ్చి రాలేదు అనుకుంటున్నాం. కాని గూడెంలోనే ఇలా జరిగిందని తెల్సింది. వాళ్లెవరో చెప్పండి. వాళ్ల సంగతి మేం చూసుకుంటాం. అసలు ఇలాటి పని చెయ్యాల్సిన అవసరం ఎవరికి వచ్చింది మాకు తెలవాల’ ముందుగా లేచిన ఆయన కాస్త దూకుడుగానే అడిగాడు.

‘ ఆ సంగతి మనం మర్చిపోదామండి. ఏదో పొరపాటు జరిగింది. ‘ తేలిగ్గా తీసేయబోయాను.

నలుగురైదుగురు లేచేరు మాట్లాడేందుకు.

‘ టీచరుగారూ, ఇది మాగూడేనికి, మా పరువుకి సంబంధించిన విషయం. మా పిల్లల్ని బాగు చెయ్యాలని మీరొస్తావుంటే ఇంత అఘాయిచ్చెం జరిగితే మేము ఎట్టా మరిచిపోతాం?’

‘విషయం మాకు తెలవాల, అంతే’

‘ మీరు మనసులో పెట్టుకు బాధ పడుతున్నారు. తప్పు చేసిన వాళ్లని కాయాలనుకుంటున్నారు.ఎందుకు మేడం? మాలో ఎవరీ పని చేసేరో, అది పిల్లలో, పెద్దలో ,అసలు ఎందుకు చేసేరో మాకు తెలవాల’ ఒకావిడ కాస్త పట్టుదలగానే అంది.

నేను నిశ్శబ్దంగా విన్నాను. అవును, తరచి, తరచి అమ్మ అడిగినప్పుడు, జ్వరం తగ్గి నీరసంతో పడుకున్నప్పుడు కూడా నేను ఆలోచించాను. ఈ విషయం ఎక్కడో ఏదో లింకు క్రమంగా దొరికింది. కాని పైకి చెప్పదలచుకోలేదు.

రెండు నిముషాలు ఆగి ,’టీచరమ్మా, నువ్వు చేసే మంచి పనికి దణ్ణం పెట్టాల్సింది పోయి మా గూడెం ఇట్టాంటి పని చేసిందంటే మాకు సిగ్గుగా ఉంది. నువ్వు ఎట్టైనా చెప్పాల్సిందే. లేదంటె మేమెవ్వురం ఈ పూట భోజనాలు చేసేది లేదు’ మరో వృధ్ధుడు కాస్త ఆపేక్షగా హెచ్చరించాడు.

రోజూ నా క్లాసు జరుగుతున్నంతసేపూ ప్రక్కనున్న రచ్చబండ మీద ఖచ్చితంగా వచ్చి కూర్చుంటాడాయన.

పిల్లలు అల్లరి చేస్తుంటే , ‘గట్టిగా నాలుగు తగిలించమ్మా. చదువులు అట్టా ఇట్టా ఊర్కేనే రావు ఈ సన్నాసులకి’ అంటూ కలుగ చేసుకుంటూ పిల్లల్ని బెదిరిస్తూ ఉంటాడు.

ఏం చెయ్యాలి? వీళ్లకి ఏం చెప్పాలి?

ఒక నిశ్చయానికి వచ్చాను. దీర్ఘంగా శ్వాస తీసుకుని మొదలు పెట్టేను.

‘ ఇక్కడ చదువుకుందుకు చాలా మంది పిల్లలు ఆశగా వస్తున్నారు. ఒక మూడు నాలుగు వారాలుగా ఆడపిల్లలు రావడం తగ్గింది. ‘…….ఒక్క క్షణం ఆగాను. అందరూ నేను చెప్పబోయేదేమిటో అన్నట్లు చూస్తున్నారు.

‘వాళ్లకి ఇళ్లలో ఏవో సమస్యలు ఉండటం వలన రావడం లేదని, ఇది తాత్కాలికమే అనీ, వీలువెంట వస్తారని ఎదురుచూసేను.కాని మానేసిన వాళ్లలో ఒక అమ్మాయి స్కూలు నుంచి వస్తూంటే చెప్పింది, కొందరు మగ పిల్లలు అల్లరి చేస్తున్నారని , తమకు చదువుకుందుకు రావాలంటే సాయంకాలం పూట ఇబ్బందిగా ఉంటోందని…………..’ నా ఎదురుగా వింటున్న వాళ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు…………….

‘ నా వైపు నుండి మీ అందరికీ చెప్పదలచుకున్నది ఒకటి ఉంది .పిల్లలు పెరుగుతున్న వయసులో వాళ్లకి మంచి చెడ్డలు తెలియ చెప్పి, సరైన మార్గం లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరిమీదా ఉంది.మీరు ఆలోచిస్తారని చెబుతున్నాను.

మన క్లాసులో కొంతమంది మగ పిల్లలు ఆడపిల్లల్ని ఏడిపిస్తూంటే , తప్పు అని చెప్పేను. ఒకరోజు విన్నారు. మరునాడు అదే ధోరణి. నేను చెబుతున్న విషయం వాళ్లు నవ్వులాట గా తీసుకుంటున్నారని అర్థం అయింది. ఏం చెయ్యాలి. ముందు మెల్లిగా చెప్పి చూసి, ఆ తర్వాత కాస్త గట్టిగానే మందలించాను. మర్నాడు పెద్ద క్లాసు ఆడపిల్లలు తో పాటు మగ పిల్లలు కూడా రాలేదు .క్లాసుకొచ్చిన ఒక పిల్లవాడు నాతో చెప్పేడు,

‘ టీచర్, మీరు నిన్న కోప్పడ్డారు కదా, మీరు ఒక్కరూ ఇంటికెళ్ళేప్పుడు మీసంగతి తేలుస్తామని చెబుతున్నారు’ అంటూ. నాకు ఏం వింటున్నానో ముందు అర్థం కాలేదు. కాని మనం పసిపిల్లలు అనుకుంటున్న వాళ్ళు ఇలాటి ఆలోచనలు చేస్తున్నారంటే కష్టంగా అనిపించింది………..అదే రోజు ఈ హడావుడి జరిగింది. మనమిక ఆ విషయాన్ని తవ్వుకోవద్దు. నేను చెప్పేది ఒక్కటే ,మనమంతా పిల్లల్ని దారిలోకి తెచ్చుకుందుకు కాస్త శ్రమ అయినా ఓర్పుగా ప్రయత్నం చెయ్యాలి…………….’

నా మాటలు పూర్తి అవుతూనే నలుగురు లేచేరు ఆవేశంగా.

‘ఎవరో చెప్పండి మేడం,ఆళ్ల కాళ్ళు చేతులు ఇరగ్గొడతాం’

‘ దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం. పిల్లల్ని కేవలం దండించడం వలన మార్పు తీసుకురాలేం. నాకు నమ్మకం ఉంది, పిల్లల్ని బుజ్జగించి మార్పు తీసుకురావచ్చు. ప్రయత్నం చేద్దాం.అలా మార్పు రాని పక్షంలో ఏంచెయ్యాలో ఆలోచిద్దాం.’

‘ కానీ టీచరుగారూ, మా పిల్లలు ఎట్టాటోళ్లో మీరు చెప్పకపోతే మాకు తెలిసేదెట్టా? చదువుకుందుకు ఎళ్ళేడని అనుకుంటాం. పిలగాళ్లు బయటికెళ్లి ఎట్టాటి పనులు చేస్తన్నారో మాకు ఎట్టా తెలుసుద్ది ?మీరు చెబితేనే కదా మాకు తెలిసేది. మేం గట్టి భయం చెబుతానికి వీలవుద్ది.’

నేను నవ్వేను.

‘ మన పిల్లలు ఎలాటి వాళ్లో, ఎంత అల్లరి చేస్తారో మనకు తల్లిదండ్రులుగా ఎటూ తెలుస్తుంది. కాని మన పిల్లలు గురించి ప్రక్కింటి వాళ్లో, ఎదురింటివాళ్లో మనదగ్గర కొచ్చి ‘మీ వాడు అల్లరి చేస్తున్నాడు’ అంటే  మనకి నచ్చదు. వాడు నిజంగా అల్లరివాడే అయినా మనకు ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు.’

నా మాటలు అర్థమై ఒక్కక్షణం మౌనంగా ఉన్నారు వాళ్లంతా. అంతలోనే మళ్ళీ అన్నారు,

‘ లేదులే టీచరుగారూ, ఇది అట్టా అనుకునేది కాదులే. మీరు మాకు విషయం చెప్పాల’

నేను మాత్రం ఇంక చెప్పేది ఏమీ లేదని, నాకు సమస్య ఏదైనా వస్తే వాళ్లకి చెప్పుకుంటాననీ పదే పదే చెప్పాను.

నామాటలు వాళ్లకి తృప్తి కలిగించలేదు. చాలా సేపు వాళ్లల్లో వాళ్లు తర్జనభర్జన పడ్డారు. నేను సెలవంటూ ఇంటికి బయల్దేరాను.

*

అమాయకత్వం కోల్పోతున్న కొత్త జీవితాల కథలు

ఎన్‌. వేణుగోపాల్‌

~

Loss of Innocense Cover (1)కుప్పిలి పద్మ కథలను ఇరవై సంవత్సరాలకు పైగానే చూస్తున్నాను. పదిహేను సంవత్సరాల కింద తాను రాసిన సాలభంజిక కథ చదివి, సమాజంలోకి వస్తున్న కొత్త జీవితాలను, కొత్త జీవన విధానాలను అర్థం చేసుకుని రాయగలిగిన రచయితగా గుర్తించి, అటువంటి రచయితలకు ప్రోత్సాహం అవసరమని అప్పుడు నేను రాస్తున్న ఒక వారం వారం శీర్షికలో ఆ కథ గురించి రాశాను. అప్పటి నుంచి అడపాదడపా తన కథల గురించి నా అభిప్రాయాలు చెపుతున్నాను.

ఈ కథలలోకి వెళ్లేముందు అసలు ఇటువంటి కొత్త జీవితాల పట్ల, ఆ జీవిత సమస్యల పట్ల సమాజపు దృక్పథాన్ని, ప్రత్యేకించి ఆలోచనా పరుల దృక్పథాన్ని, జాగ్రత్తగా పరిశీలించవలసి ఉందనుకుంటాను. ఈ కొత్త జీవితం ఇప్పటికింకా రెండు మూడు దశాబ్దాలు గడిచి నప్పటికీ సార్వత్రికం కాలేదు. దాని స్వభావం వల్లనే అది సార్వత్రికం కాజాలదు కూడ. ఎక్కువలో ఎక్కువ అది ఎగువ మధ్యతరగతిని తాకి, ఆ కింది వర్గాల మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం వేయగలుగుతున్నది. అది అల్పసంఖ్యాకుల జీవితాల్లోకి మాత్రమే ప్రవేశించి ఉండవచ్చుగాని అంచులలో ఉన్నదని కూడ అనలేం. ప్రచార సాధనాల హడావిడి వల్ల ఒక రకంగా అదే ప్రధానస్రవంతి అనే అపోహ కలగడానికి కూడ అవకాశం ఏర్పడుతున్నది.

ఇళ్లు, ఇళ్లలో వస్తువులు, అలంకరణలు, వాహనాలు, దుస్తులు, తిను బండారాలు, సంబంధాలు, మాటతీరు, వ్యక్తీకరణలు వంటి ఎన్నో వ్యక్తిగత అంశాల మీద ఈ ప్రభావం ఉంటున్నది. సినిమాలో, టెలి విజన్‌లో, పత్రికలలో ఇదే ప్రామాణిక జీవనస్రవంతి అన్నట్టుగా చూపు తుండడం వల్ల రెండు ప్రమాదకరమైన పరిణామాలు కూడ చాప కింది నీటిలా సమాజమంతా విస్తరిస్తున్నాయి. జిలుగువెలుగులతో ఆకర్షణీయంగా చూపడం వల్ల అదే అనుసరణీయమైన జీవన ప్రమాణం అనుకుని, అనుకరించడానికి ఎక్కువమంది ప్రయత్నిం చడం ఒక పరిణామం కాగా, ఆ జీవన ప్రమాణాన్ని అందుకోలేమని తెలిసి, అందువల్ల తమ జీవితమే వ్యర్థమనే న్యూనతా భావనకు మరింతమంది గురికావడం మరొక పరిణామం. అటు అనుకరణ సంస్కృతి అయినా ఇటు ఆత్మన్యూనతా సంస్కృతి అయినా మనిషిని తన నుంచి తనను దూరం చేసేవే. అంటే మనిషిని సంఘం నుంచి, సమష్టితత్వం నుంచి దూరం చేసేవే. అలా మన సమాజంలో ఈ కొత్త జీవితాల ప్రవేశం అంతకు ముందు ఉన్న అంతరాలకు మరొక కొత్త అంతరాన్ని కలుపుతున్నది. ఒక కొత్త ఘర్షణనూ వేదననూ సృష్టిస్తున్నది. ఒక కొత్త పరాయీ కరణను ప్రవేశపెడుతున్నది.
ఈ నేపథ్యంలో ఈ కొత్త జీవనరంగాల గురించీ, వాటిలోపలా, వాటి వల్లా సమాజంలో తలెత్తుతున్న ఘర్షణల గురించీ, వాటి ప్రభావం గురించీ మరింత ఎక్కువగా అర్థం చేసుకోవలసిన, మాట్లాడుకో వలసిన అవసరం పెరుగుతున్నది. ఈ జీవితాల గురించి సాను కూలంగా, ఆకర్షణతో, మోజుతో, సమ్మోహకంగా చెపుతున్న ధోరణి పెరుగుతున్నందువల్ల, వాస్తవికంగా వాటిలోని గుణదోషాలను, సమస్య లను, ఆందోళనలను అర్థం చేసుకోవలసి ఉన్నది. ఆ జీవితాలలోని మంచిగాని, చెడుగాని సమాజంలోని ఇతర వర్గాల జీవితాల మీద ఎటువంటి ప్రభావం వేయగలవో తెలుసుకోవడానికి ఆ జీవితాల గురించీ తెలుసుకోవాలి, ఆ ప్రభావాల గురించీ తెలుసుకోవాలి. ఇంత బలమైన జీవన ప్రభావం సహజంగానే కళకూ కథకూ వస్తువు కాకతప్పదు. ఆ అత్యవసరమైన పనిని పద్మ తన కథల ద్వారా గత రెండు దశాబ్దాలుగా చేస్తున్నదని నాకనిపిస్తున్నది. ఇప్పుడిక్కడ సంకలనం చేసిన పదకొండు కథలు కూడ ఆ పనిలో భాగమే అనుకుంటాను.

 

ద లాస్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌ అనే పుస్తక శీర్షిక ఈ పుస్తకంలో భాగమైన ఒకానొక కథ శీర్షిక మాత్రమే కాదు. ఈ కథలన్నిటికీ ఆధారభూమిక అయిన సార్వత్రిక ఇతివృత్తంగా అర్థవంతమైనది. మరోమాటలో చెప్పా లంటే అది మన సమాజపు ఒకానొక స్థితి. నైసర్గికమైన, సహజమైన అమాయకత్వాన్ని కోల్పోతున్న స్థితిలో ఇవాళ సమాజంలో గణనీయ మైన భాగం ఉంది. ఈ అమాయకత్వం కోల్పోతే దాని స్థానంలో వచ్చేది ఏమిటనేది చర్చనీయాంశం కావచ్చు. కాని వలసవాద మార్కెట్‌ ప్రవేశించిన నాటి నుంచీ భారతీయ సామాజిక జీవితం అమాయ కత్వాన్ని కోల్పోతూనే ఉంది. ఆ మూడు వందల సంవత్సరాల చరిత్ర ఇక్కడ అవసరంలేదు గాని గత రెండు మూడు దశాబ్దాలలో ఈ అమాయకత్వాన్ని కోల్పోయే ప్రక్రియ వేగవంతంగానూ, విస్తారం గానూ, లోతుగానూ జరుగుతున్నది. ఒక మనిషయినా సమాజ మయినా అమాయకత్వం కోల్పోతే, ఆ స్థానంలో జ్ఞానమో, వివేకమో రావచ్చు. లేదా, తెంపరితనమో, తుంటరితనమో రావచ్చు. అజ్ఞానమూ అవివేకమూ కూడ ఆకర్షణీయమైన ముసుగులు వేసుకుని రావచ్చు. ఈ పరిణామం ఎలా జరిగినప్పటికీ, సామాజిక అమాయకత్వం కోల్పోయే క్రమం ఆసక్తి కరమైనది. అది వ్యక్తిగత జీవితాలలో ప్రతి ఫలిస్తూ వ్యక్తులు తమ అమాయకత్వం కోల్పోయే క్రమాన్ని ఒక కళారూపంలో చిత్రించడం మరింత ఆసక్తికరమైనది. ఒకరకంగా చూస్తే ఈ పదకొండు కథలూ కూడ ఒక సమాజం అమాయకత్వాన్ని కోల్పోయే క్రమానికి వ్యక్తిగతస్థాయి ప్రతిఫలనాల చిత్రణలే.

ద లాస్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌లో విహాన్‌ – దర్శనల మధ్య ఉన్న సంబంధానికి పాత పద్ధతిలో పరస్పర నమ్మకం పునాది కాదు. బహుశా పరస్పర అపనమ్మకమే, అవతలి వాళ్లు అబద్ధం చెపుతున్నారన్న నమ్మకమే పునాది కావచ్చు. అమాయకత్వం కోల్పోవడం అంటే అదే. కాకపోతే దానికి లాంగ్‌ కమిట్‌మెంట్స్‌ యివ్వలేకపోవడం అనీ, బ్యాగేజ్‌ వద్దను కోవడం అనీ, కెరీర్‌లో సెటిల్‌ కావడం అనీ కొత్త అర్థాలు చెప్పుకునే తెలివితేటలు ఇప్పుడు వచ్చాయి. ‘యే ఫీల్డ్‌ అయితేనేం కేట్‌ రేస్‌లో అందరం… యేదో రకంగా భాగస్తులమే…’ అనడం అలా అమాయ కత్వం కోల్పోతున్నవాళ్ల అంతరంగానికీ, బహిరంగ సమర్థనకీ ఒక సూచిక. అసలు ఆ కేట్‌ రేస్‌ ఎవరు సృష్టించారు, ఎవరి ప్రయోజనాల కోసం సృష్టించారు, ఆ కేట్‌ రేస్‌లోకి వెళ్లేవాళ్లు ఇష్టపూర్వకంగా వెళుతున్నారా, సామాజిక స్థితి వాళ్లను అటు నెట్టి, వాళ్ల నుంచి అమాయకత్వాన్ని కొల్లగొడుతున్నదా, అలా వెళ్లినందువల్ల వాళ్లేమి సాధిస్తున్నారు అని ఆలోచించడానికి పురికొల్పడమే కథ సాధించదలచిన ప్రయోజనం.

ఈ కొత్త తరం అమాయకత్వం కోల్పోవడాన్ని నిజానికి చాలా రంగాల్లో, కోణాల్లో, స్థాయిల్లో అర్థం చేసుకోవలసి ఉంది. అది సంఘ పరివార్‌, ఖాప్‌ పంచాయతీలు చూస్తున్న ఏకైక, సంకుచిత, పురు షాధిపత్య అర్థంలో మాత్రమే జరగడం లేదు. సంక్లిష్టమైన, అసాధారణమైన రూపాల్లో జరుగుతున్నది. నైతిక పోలీసులు చెపుతున్న సద్యోలైంగిక సంబంధం, కాజువల్‌ సెక్స్‌, వైవాహికేతర సంబంధం, స్వేచ్చాయుతమైన ప్రవర్తన వంటి పాత నైతిక అర్థాలు మాత్రమే ఈ అమాయకత్వ విచ్చేద పరిణామాన్ని పూర్తిగా వివరించజాలవు. అసలు ఆ ప్రక్రియకు ప్రతిసారీ ప్రతికూల అర్థం మాత్రమే ఉంటుం దని కూడ అనుకోలేం. ఒక్కోసారి అధ్యయనం వల్ల, స్పందనల వల్ల, భావుకత వల్ల ప్రపంచానికి కొత్త కిటికీలు తెరుచుకుని, వ్యక్తిత్వం వికసించి, జీవన సార్థకతకు వినూత్న అర్థాలు స్పురించి కూడ అమాయకత్వం కోల్పోయే పరిస్థితి రావచ్చు. ఆ సానుకూల అర్థాలలో కూడ అమాయకత్వ విచ్చేదాన్ని అర్థం చేసుకోవలసి ఉంది.

మెరుగైన ఆర్థికస్థితి ఉన్న మధ్యతరగతి కుటుంబాలలో అంతర్లీనంగా ఎంత పితృస్వామిక భావజాలం ఉన్నప్పటికీ, అమ్మాయిల పట్ల ప్రేమాభిమానాలు కనబరచడం, ముద్దు చేయడం, వాళ్ల ఇష్టాయిష్టాలు తీర్చడం కొంత మెరుగ్గానే ఉన్నాయి. కాని కూతురికి ఉండే ఆ హోదా అదే వయసులో ఉండే కోడలికి లేకపోవడంలోనే పితృస్వామ్యం బయటపడు తుంది. ‘నీకున్న ఫ్రీడవ్‌ు నాకు కూడా మా యింట్లో వుండేది. యిది నా యిల్లు అంటారు. కానీ కాదు. యిది నేను పెళ్లి చేసుకొన్న అబ్బాయి, అంటే నా భర్త యిల్లు. అదీ తేడా… నీకున్నలాంటి ఫ్రీడమ్  నాకు రాదు. పైకి కనిపించని రూల్స్‌ చాలా ఉంటాయి. మ్యారేజి అయ్యాకే నాకు యివన్నీ యెక్స్‌పీరియెన్స్‌లోకి వచ్చాయి,’ అని ‘ఫ్రంట్‌ సీట్‌’లో గ్రీష్మ తన ఆడబిడ్డ ధాన్యతో అనే మాటలు పితృస్వామిక నిర్బంధానికీ, కొత్త తరం యువతుల గ్రహింపుకూ నిదర్శనం. ఇది కూడ మరొకస్థాయిలో అమాయకత్వ విధ్వంసమే.

కొత్తతరం పోగొట్టుకుంటున్న అమాయకత్వంలో, తెచ్చుకుంటున్న కొత్త అలవాట్లలో, విలువల్లో అధికారాన్ని, సంప్రదాయాన్ని ప్రశ్నించడం అనే సానుకూల లక్షణంతో పాటే అనారోగ్యానికీ, అసాంఫిుకత్వానికీ దారితీసే అలవాట్లు కూడ ఉంటున్నాయి. మద్యపానాన్నీ, మాదక ద్రవ్యాల వాడకాన్నీ నైతిక కారణాలవల్ల వ్యతిరేకించనక్కరలేదు గాని అవి మరొకరు మప్పుతున్నందువల్ల, మరొకరి వ్యాపారం కోసం, యువతరాన్ని జోకొట్టడం కోసం వస్తున్నాయా ఆలోచించవలసి వుంది. ‘గాల్లో తేలి నట్టుందే’ కథ ఈ విలువల ఘర్షణను చిత్రిస్తుంది. ‘వో మైగాడ్‌… మమ్మీ నిజంగా నువ్వు యిన్నోసెంట్‌. క్రైమ్  యేంటి? నీకు తెలుసా 21 ఏళ్లు నిండని వాళ్లకీ డ్రింక్స్‌ యిస్తారు పబ్స్‌లో. హుక్కా క్లబ్స్‌లో, పబ్స్‌లో రకరకాల పేర్లతో గంజాయే కాదు, కొన్ని రకాల డ్రగ్స్‌ దొరుకు తాయి. యిదంతా కామన్‌. క్రైమ్ కాదు.  వీటికొచ్చే వాళ్లంతా యెలీట్‌ రిచ్‌ సెక్షన్స్‌ నుంచే. వీటిని రన్‌ చేసేది పవర్‌ఫుల్‌ పీపుల్‌. అలా వాళ్లు సర్వ్‌ చేయటం క్రైమ్  కానప్పుడు మేం తీసుకోవటం క్రైమ్ ఏలా అవుతుంది…’ అన్న సుస్మిత మాటలు కొత్త మార్పులను మాత్రమే కాదు, ఆ మార్పుల వెనుక ఉన్న, లాభ పడుతున్న శక్తులను కూడ చూపుతున్నాయి. ‘యీ జనరేషన్‌ చాలా అందమయినది. తెలివైనది. యెన్నెన్నో విషయాలని సునాయాసంగా కనిపెడ్తూ ఉంది. యిదే జనరేషన్‌లో కొంతమంది యిలాంటి అలవాట్లకి బానిసలవుతూ యిదంతా ఫన్‌ అంటారు. యిలాంటి వాళ్లు యెక్కువగా డిస్ట్రక్షన్‌ వైపు మొగ్గు చూపిస్తున్నారు. వాళ్లకసలు భయం లేదు. ప్రాణాల మీద మమకారం లేదు…. నువ్వంటున్నావు రూల్స్‌ బ్రేక్‌ చేయడాన్ని యిష్టపడుతున్నారని. అన్ని జనరేషన్స్‌లో రూల్స్‌ని బ్రేక్‌ చేయటం వుంది. కాకపోతే అప్పుడు యెక్కువగా వొక వికాసం కోసం చేసేవారు. యిప్పుడు అదంతా వొక విధ్వంసం. అదే మానసికానందం…’’ అని నందినికి వివరిస్తారు మాస్టారు.

పద్మ భాషలో సమ్మోహకమైన, ఆకర్షణీయమైన లక్షణమూ ఉంది. ఒక్కొక్కసారి అది సహజత్వానికి దూరమైందని అనుమానించడానికి ఆస్కారం ఇచ్చే లక్షణమూ ఉంది. ఆమె సృష్టించే సన్నివేశాలు, సంభా షణలు, చివరికి పాత్రల పేర్లు కూడ అసహజమైనవని అనుకునే అవకాశం ఉంది. ఒక్కొక్కచోట పాత్రల, సంభాషణల, ప్రవర్తనల ఔచిత్యం మీద కూడ సందేహం కలుగుతుంది. కళారూపానికి విశ్వ సనీయత, సంభావ్యత పునాది అంశాలు. అవి లేవని లేశమాత్రం అనిపించినా ఆ కళారూపం ఇవ్వదలచిన సందేశం కూడ దెబ్బ తింటుంది.

ఈ చిన్న లోపాలు అలా ఉంచి ఈ కథల గురించి మొత్తంగా ఆలో చిస్తే, ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో మార్క్స్‌, ఎంగెల్స్‌లు బూర్జువా వర్గ ప్రాబల్యం, మార్కెట్‌ ప్రవేశించిన చోట ఏం జరిగిందని చెప్పారో గుర్తుకొచ్చింది: ‘బూర్జువావర్గం… మత, రాజకీయ భ్రమల ముసుగులు కప్పిన దోపిడీ స్థానంలో నగ్నమైన, సిగ్గులేని, ప్రత్యక్షమైన, అమాను షమైన దోపిడీని ప్రవేశపెట్టింది. ఇంతవరకూ గౌరవనీయంగానూ, భక్తిపూర్వక మైన భయంతోనూ పరిగణించిన ప్రతి వృత్తి మీది ఆచ్చాదననూ బూర్జువావర్గం పీకి పారేసింది. వైద్యుడినీ, న్యాయవాదినీ, మతగురువునీ, కవినీ, శాస్త్రవేత్తనూ డబ్బుకోసం తనకు ఊడిగంచేసే కిరాయి కూలీలుగా మార్చివేసింది. బూర్జువావర్గం కుటుంబం నుంచి దాని రాగబంధురమైన మేలిముసుగును చించి పారవేసి కుటుంబ బంధాన్ని కేవలం డబ్బుతో కూడిన సంబంధంగా దిగజార్చింది… సమస్త సామాజిక స్థితులను ఎడ తెగకుండా కలతపెట్టడం, అనిశ్చి తత్వాన్నీ, ఆందోళననూ నిరంతర పరిణామాలుగా మార్చడం బూర్జువాశకపు ప్రత్యేకతలు… గడ్డ కట్టుకుని, తుప్పుపట్టిపోయిన సంబంధాలూ, వాటితో పాటు సనాతమైన, పూజనీయంగా చూసిన దురభిమానాలూ తుడిచిపెట్టుకుపోతాయి. కొత్తగా ఏర్పడిన సంబంధాలు గట్టిపడక ముందే పాతబడిపోతాయి. ఘనీభ వించిన ప్రతీదీ కరిగి గాలిలో బాష్పమైపోతుంది. పవిత్రమైన ప్రతిదీ మలినమై పోతుంది…’

ఈ మాటలు రాసింది 1848లో. ఆ తర్వాత గడిచిన నూట అరవై సంవత్సరాలలో ఆ స్థితి మరింత తీవ్రతరమైంది. ఆ బూర్జువావర్గం తన తొలినాటి ప్రగతిశీల స్వభావాన్నీ, సమాజాన్ని ఇలా సమూలంగా మార్చే బాధ్యతనూ వదులుకుంది. భారత సమాజం వంటి సమాజా లలో పాత, అభివృద్ధి నిరోధక వ్యవస్థలలో తనకు పనికి వస్తాయనుకునే చెడుగులతో మిలాఖత్తు పెట్టుకుంది. ఇప్పుడిది పాతనంతా ఊడ్చి పారేసే కొత్త కాదు. పాత కొత్తల మేలు కలయిక కూడ కాదు. పాత కొత్తల కీడు కలయిక. ఇక్కడ డాలర్ల వేట, ఇంగ్లిష్‌ చదువులు, అపార ప్రపంచజ్ఞానం, అందరాని జీవనశౖలివంటి అత్యాధునిక అంశాలూ, స్త్రీపురుష అసమానత, కులవివక్ష, మతోన్మాదం, మూఢనమ్మకాల వంటి ప్రాచీన అంశాలూ సామరస్యంగా సహజీవనం చేస్తుంటాయి. ఆ పాతకొత్తల కీడు కలయిక స్థితికి సూచికలు ఈ కథలు.

*

 

 

ఝుంకీలు-1: చినుకు చివర కొన్ని మాటలు 

 

 

-మోహన తులసి 

~

Title_Image_1ఇవాళ ఇక్కడ వాన నెమ్మదిగా నీ మాటలాగా కురుస్తోంది!

 

వాన రాసిపెట్టుంది కాబట్టి మబ్బు పట్టిందంటావా. దండెం మీద బట్టల్ని కాస్త స్వేచ్ఛగా చినుకులికి, మట్టి వాసనకి వదిలేయాల్సింది; అలా చివాలున లాక్కోచ్చేసే బదులు. మళ్ళెప్పుడైనా అవేసుకుని నిండుమేఘమల్లే నేల మీదే తిరగొచ్చు. ప్రతి చినుకు చివరా నామాటల్ని అంటించకు మరి. దండెం గుండె నిండా అవే వేలాడుతున్నాయిప్పుడు. వేలికొసతో వరసనే తాకుతూ వెళ్తావో ఏమో; భూకాగితమ్మీద అక్షరాలుగా చిట్లుతాయి.

 

*******

మధ్యలో నీ అందియల చప్పుడు వింటూ వుంటాను నీకే తెలియకుండా!నువ్వు కవిత్వమవుతూనే వుంటావ్! – అని దొంగచాటుగా నీడైరీలో చదివిన నెమలీక గుర్తు.

 

మంచి పుస్తకమో, హత్తుకునే వాక్యాలో చదివినప్పుడు తప్ప నాగ్గుర్తుకు రాని నువ్వు, నా సూర్యచంద్రుల్ని సైతం మీదేసుకుని తిరుగుతుంటావు. నీక్కోపమొస్తూ ఉంటుంది, అదిగో మళ్ళీ తలుపు ఓరగా జారేసి వెళ్ళిపోయావు; కానీ పూర్తిగా మాత్రం ఏనాడు మూసెళ్ళవు. తిరిగి రావడానికి నువ్వట్టిపెట్టుకున్న జాగాలోంచి నాకు పచ్చని అడవులు, ఆకాశపు నీలిరంగు, లేతెండ గాజుపొడి,ఎగిరొచ్చే ఎండుటాకులు, కొన్ని కళ్ళాపి నీళ్ళు, పాకుతూ వెళ్తున్న పసివాడి చొక్కా అంచులు, నిన్నటి కలలో అమ్మ నెయ్యి కాచిపెట్టిన గిన్నె కనబడుతుంటాయని చెబుతాలే నీకు.

 

******

 

anu

Art: Anupam Pal

ఈ ఝుంకీలకి వ్యక్తిత్వం ఎక్కువోయ్, ఉంగరాల ముంగురులొచ్చి సనజాజి పాదల్లే చుట్టుకున్నప్పుడు నువ్వన్నమాట.

బొటనేలుపై బొమ్మలు గీస్తూ పెదాల మీదకు చేరిన లాకెట్టుకి, మరి చివుక్కుమందో ఏమో మెడ మీద సర్దుక్కూచుంది చటుక్కున. మొన్నెప్పుడో ఇలానే నువ్వన్న గుర్తు, నీడ నల్లగానే వున్నప్పుడు వెన్నెలకి- ఎండకి తేడా ఏముందని. చుక్కలన్నీ చిన్నబుచ్చుకోలేదూ, ఓనాల్రోజులు చంద్రుడు మొఖం చాటేయలేదూ. పుణ్యముంటుంది, ప్రకృతిలో దేనితో మాత్రం నన్ను పోల్చకు. ఈరోజు పెట్టుకొచ్చిన ఈకొత్త ఝుంకీలు చూసావా! కాస్త వాటికి నా కధ చెప్పవూ. అప్పుడన్నావు కదా, నీ ఎడమవైపు కాసేపు నిదరవ్వమనీ.

******

 

జీవితం మరీ మరీ ఇరుగ్గా వుంది, చికాగ్గా లేనందుకు సంతోషం అనుకో! ఆలస్యమైన ఆ అమృతమే జీవితం.

 

ఎటువైపు నుండో ఒక్కోక్కళ్ళు వస్తారు; నువ్వేమీ ఆశించని, అనుకోని సమయములో నువ్వేంటో చెప్పేసి చక్కా నవ్వుతారు. నీలోకి నువు తొంగిచూసుకుంటూ నిశ్శబ్దానికి మెటికలిరిస్తూ మళ్ళీ నువ్వే. సరే, అదంతా కవిత్వపు వేదాంతం, వదిలేద్దూ. క్రిందటేడు, ఇదే సమయానికి జీవితమంత జ్ఞాపకాన్ని చేసుకుంటున్నాను. ప్రతిరోజూ పిసరంత గుర్తుతెచ్చుకుంటూ మరుజన్మ వరకు మోసుకెళ్ళేట్టున్నాను. ఇంతకీ నీకొచ్చి ఏమైనా అర్ధమైందా?! ఒక పగలు-రాత్రి కాకుండా, ఒక నవ్వు-దిగులు కాకుండా, పేరు పెట్టలేనిదేదో మిగిలిపోయిందని.

*

 

మనలోకి మనం పుప్పొడిలా…

కొన్ని మాటలూ, పాటలూ, కవితలూ దయలేనివి! కదిలించీ, కంపించి పోయేట్లు చేసి.. మనలోకి మనం పుప్పొడిలా రాలిపోయేలా చేస్తాయి.
‘…నహీ ఆయే కేసరియా బల్మా హమారా..’ అంటున్న శుభా ముద్గల్ స్వరంలో మునిగి, ఆ భావావేశంలో ఊపిరాడక ఉగ్గపట్టినట్లుండగానే ‘యే బారిష్ గున్‌గునాతీ థీ…….’ అంటూ గంభీరంగా గుల్జార్ గొంతు పొదవిపట్టుకుంటుంది.. ఆ మరునిమిషంలోనే ఆ పదాలు తడిచిన కనురెప్పల గుండా గుండెని పెకలించివేస్తాయి!
వెలుతురూ, చీకటితో సంబంధం లేకుండా చుట్టూ నిశ్శబ్దం ఒక కంచెలా పాతుకుపోతుంది. ఎక్కడో మనకి సంబంధంలేని అడవిలోతన మానాన తాను కురుస్తున్న వర్షం అకస్మాత్తుగా రెక్కలు విదిల్చుకుంటూ వచ్చి మన తలుపవతలే కురుస్తున్నట్లు… ఎన్నెన్నో సంగతులు.. బుజ్జగించేవీ, పదునైనవీ, వణికించేచీ… ఏవేవోజ్ఞాపకాలు ఆ కంచె లోపల చేరతాయి.
ఎంతసేపనీ, ఎన్నిరోజులనీ ఇంక లెక్కలనవసరం!
 

రెయిన్‌కోట్ సినిమాలో ‘పియా తోరా కైసే అభిమాన్ ‘ పాట, మధ్య మధ్యలో గుల్జార్ స్వయంగా వినిపించే ఈ కవితా ఆ కోవలోకే వస్తాయి.


ఏదో
ఈదురుగాలి వల్ల అనుకుంటా…

~

ఏదో ఈదురుగాలి వల్ల అనుకుంటా

ఈ గోడకి తగిలించి ఉన్న చిత్రం పక్కకి ఒరిగింది

పోయిన వర్షాకాలంలో గోడలు ఇంత తేమగా లేవు
ఈసారి ఎందుకో వీటిలో తడి చేరింది..
బీటలు వారాయి.
ఈ చెమ్మ ఎలా పారుతుందంటే

ఎండిన చెంపల మీదుగా కన్నీటి తడి జారుతున్నట్టుంది!

ఈ వాన ఇంటి పైకప్పు మీద తనలోతాను పాడుకుంటుండేది
కిటికీల అద్దాల మీద తన వేలికొసలతో ఏవేవో సందేశాలు రాస్తుండేది

ఇప్పుడు మాత్రం మూసిన వెంటిలేటర్ అవతల నిర్లిప్తంగా కురుస్తోంది!

ఇప్పటి మధ్యాహ్నాలని చూస్తుంటే
ఏ పావులూ లేని చదరంగపు బల్ల ఖాళీగా పరిచినట్లుంది

ఎత్తుగడ వేయడానికి ఎవరూ లేరు.. తప్పించుకునే ఉపాయాలు అసలే లేవు!

పగలు మాయమయింది.. ఇక రాత్రి కూడా తప్పించుకుపోతోంది
ఆసాంతం ఆగిపోయింది!
అనుకోని ఋతుపవనాల వల్లనే అనుకుంటా

ఈ గోడ మీద తగిలించిన చిత్రం పక్కకి ఒరిగిపోయింది!

satya

Artwork: Satya Sufi

మూలం:
Kisi mausam ka jhonka tha…

Kisi mausam ka jhonka tha
Jo iss deewar par latki tasveer tirchhi kar gaya hai

Gaye sawan mein ye deeware yun seeli nahi thi
Na jane kyun iss dafa inn mein seelan aa gayi hai
Daraarein pad gayi hain
Aur seelan iss tarah behti hai jaise
Khushk rukhsaaro par geele aansun chalte hain

Ye baarish gungunati thi isii chhat ki mundero par
Ye ghar ki khidkiyon ke kaanch par ungliyon se likh jaati thi sandese
Bilakhti rahti hai baithi hui ab band roshandano ke peechhe

Dopehre aisi lagti hain
Bina moheron ke khali khane rakkhe hain
na koi khelne wala hai baazi, aur na koi chal chalta hai

Na din hota hai ab na raat hoti hai
Sabhi kuchh ruk gaya hai
Wo kya mausam ka jhonka tha
Jo iss deewar pe latki tasveer tirchhi kar gaya hai

——————————————-

ఎవరున్నారు వాళ్ళకి?

 

-ప్రసాద మూర్తి

~

prasada

 

 

 

 

 

 

ఎవరున్నారు వాళ్ళకి

పైన ఆకాశమూ లేక

కింద నేల కూడా లేనివాళ్ళకి

 

జేనెడు పొట్ట చుట్టుకొలతల్ని

ఏ కొండలతోనో సముద్రాలతోనో

కొలుచుకునే వాళ్ళకి

ఆకుపచ్చ రాత్రులై భూగోళమంతా అల్లుకున్నా

పేగుల్లో ఆకలి మిన్నాగులు కదులుతున్న అసహాయులకు

ఎవరున్నారు?

 

సిమెంటు తూరల్లో తలదాచుకుని

 వెండి చందమామల్ని కలగనే

నిండు చూలాళ్ళకు ఎవరున్నారు

రోడ్డు పక్క దేహాలను అమ్మకానికి నిలబెట్టి

ఏ చెట్టుచాటుకో పోయి తమనే  తొంగి చూసే

ఆకాశానికి తలబాదుకుంటున్న ఆత్మలకు ఎవరున్నారు?

 

ఎవరున్నారు వాళ్ళకి

ఏ అర్థరాత్రి ఏ కాలువ  వంతెన కిందో

వందేమాతర గీతం అభ్యసించే అనాధ బాలలకు ఎవరున్నారు

ఏ కుప్పతొట్టి ఉయ్యాలలోనో

నక్షత్రగోళాలు పాడే జోలపాట వింటూ

 ఏడుస్తూ  నిద్రపోయే అభాగ్య  శిశువులకు ఎవరున్నారు?

 

జీవితాలను యంత్రాలకు తగిలించి

 చిట్లిన ఎముకల్లో జీవన రహస్యాలను అన్వేషించే

  ఖాళీ సాయంత్రాలకు ఎవరున్నారు

మట్టికింద తమను పాతుకుని  

నాగలి కర్రుకు నెత్తుటి సంతకమై వేలాడే మట్టిమనుషులకు

ఎవరున్నారు?      

 

పుట్టిన నేలపేగు పుటుక్కుమని తెగుతున్న శబ్దం

నెత్తి మీద మూటల్లో పుట్టెడు దు:ఖం పిగులుతున్న శబ్దం

వెనకెనక్కి తిరిగి చూస్తే తమ నీడలు గోడుగోడున విలపిస్తున్న శబ్దం

ఏ దిక్కూ తోచక ఎటో కదిలిపోతున్న

 కన్నీటి  కాందిశీకులకు ఎవరున్నారు?

 

తగలబడుతున్న అడవుల్లోంచి పారిపోతున్న పిట్టలకు

కారిడార్ వలల్లో చిక్కి విలవిల్లాడుతున్న సముద్రాలకు

ఎవరున్నారు..ఎవరున్నారు

 

 ఇంకెవరున్నారు

కవులుతప్ప?

*

యాదిలో ఎప్పటికీ మిగిలే దృశ్యాలు!

– కందుకూరి రమేష్ బాబు 
~
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 న బుధవారం సాయంత్రం 5.30 గం.లకు హైదరాబాద్ లోని ఐ.సి.సి.ఆర్ ఆర్ట్ గ్యాలరీ, రవీంద్రభారతిలో సుప్రసిద్ధ చిత్రకారులు శ్రీ కాపు రాజయ్య కుమారులు, దివంగత కాపు వెంకట రఘు ఛాయా చిత్ర ప్రదర్శన ప్రారంభమైంది.
ప్రదర్శన ప్రారంభకులు ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు శ్రీ కె.వి. రమణాచారి. ముఖ్య అతిథిగా ప్రముఖ కవి  నందిని సిద్దారెడ్డి, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ శ్రీ ఎం.వేదకుమార్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు ఎం.వి.రమణారెడ్డిలు హాజరయ్యారు.
కాపు వెంకట రఘు సిద్దిపేటలో జన్మించి హైదరాబాద్ లోని జె.ఎన్.టి.యులో ఆర్కిటెక్చర్ ని అలాగే ఫొటోగ్రఫిని అభ్యసించారు. తెలంగాణకు, తెలుగు వాళ్లకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా అనేక స్థలాలను సందర్శించి వందలాది చిత్రాలను భావితరాల కోసం భద్రపర్చారు. వివిధ రాష్ట్రాల్లో ఎంతో ఘనతను సొంతం చేసుకున్న కట్టడాలు, నిర్మాణాలు, వారసత్వ సంపదను, అందమైన ప్రకృతి దృశ్యాలను ఆయన ఎంతో సహజంగా, సుందరంగా చిత్రించారు. “ఆర్కిటెక్ట్ గా ఆయన కృషి విశిష్టమైనది. అయితే, వెలుగు నీడల మాధ్యమమైన ఫొటోగ్రఫిలో ఆయన చేసిన అద్వితీయ కృషికి దృశ్యమానం ఈ ఛాయాచిత్ర ప్రదర్శన’ అని కాపు వెంకట రఘు సతీమణి రాధ అన్నారు. సుమారు నలభై చిత్రాలతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఫొటోగ్రాఫర్ గా కాపు వెంకట రఘుని పరిచయం చేసే తొలి ప్రదర్శన కావడం గమనార్హం.
2
కాపు రఘు 2010లో రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడంతో ఆయన కృషి ఒక రకంగా తెరమరుగైంది. జన సామాన్యానికి చవకగా ఇండ్ల నిర్మాణం, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు ముఖ్యంగా వారసత్వ సంపదను చిత్రించిన విధానం గురించి అసలే చర్చకు రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాపు రఘును స్మరించుకోవడం, అదీ ఆయన 52 వ జయంతి సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం పట్ల బంధుమిత్రులు హర్షం ప్రకటించారు.
కాపు వెంకట రఘు యాదిలో జరిగే ఈ ఛాయాచిత్ర ప్రదర్శన వేళలు ఉదయం 11 నుంచి సాయంత్రం 7 వరకు. ప్రదర్శన 18 వ తేది సాయంత్రం ప్రారంభమై ఆదివారం 22వ తేదీన ముగుస్తుంది.
Invitatiomn

బహుజనవాదానికి కొత్త చిరునామా  

 

                         1983లో తెలుగు దేశం పార్టీ ఏర్పాటయింది. పార్టీ స్థాపించిన తొమ్మిదినెల్లకే అధికారంలోకి వచ్చింది. ఎంత తొందరగా అధికారంలోకి వచ్చిందో అంత తొందరగా ఆగస్టు సంక్షోభంలో ఇరుక్కొని మళ్లీ ఎన్నికకు వెళ్లింది. ఈ సారి థంపింగ్‌ మెజారిటీతో గెలిచింది. ఇట్లా తిరుగులేని మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం, ఆ పార్టీని అన్ని విధాలా ఆదుకున్న కమ్మ సామాజిక వర్గం ప్రభుత్వం తమ కులానిది మాత్రమే అన్నట్టుగా, తమకు ఎదురులేదు అని విర్రవీగుతూ కారంచేడులో దళితును ఊచకోత కోసిండ్రు. ఇది 1985లో జరిగింది. ఇది తెలుగునాట దళిత చైతన్యానికి పునాది వేసింది. ప్రతి గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహం స్థాపించడం చైతన్య స్ఫూర్తిగా మారింది. అంబేద్కర్‌ తన గురువుగా చెప్పిన జ్యోతిరావు ఫూలే 1990వ దశకంలో తెలుగు వారికి పరిచయమయ్యిండు. మహారాష్ట్రలో గెయిల్‌ అంవెట్‌, ధనంజయ కీర్‌, రోజాలిండ్‌ తదితరులు చేసిన కృషితో ఆయన రచనలు ఆంగ్లంలోకి తర్జుమా అయ్యాయి. జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రు వెలువడ్డాయి. దాదాపు ఇదే కాంలో తెలుగునాట ‘నలుపు’ పత్రిక కొంత సామాజిక చైతన్యంతో పనిచేసింది. ఎదురీత పత్రిక దాన్ని పాక్షికంగానే అయినా కొనసాగించింది. నలుపు పత్రిక బాధ్యులే తర్వాతి కాంలో ‘హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌’ తరపున పూలే రచనల్ని, జీవిత చరిత్రను తెలుగులో ప్రచురించారు. 2009 ఎన్నిక సందర్భంలో చిరంజీవి సామాజిక న్యాయం పేరిట ఫూలే పేరును కొంత పాపులర్ చేసిండు. అంతకు ముందు మారోజు వీరన్న 1994లోనే బహుజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, రాజ్యాధికారాన్ని దక్కించుకోడానికి ‘ఇండియాలో ఏం జెయ్యాలి’ అని కొంత చర్చ చేసిండు. విద్యార్థి దశలో వీటన్నింటిని దగ్గర నుంచి చూసిన గాజుల శ్రీధర్‌ అదే ‘బహుజన’ భావజాలంతో, బ్రాహ్మణాధిపత్యాన్ని నిరసిస్తూ ‘వెన్నె కొలిమి’ కవితా సంపుటిని వెలువరించిండు.

    మలిదశలో ప్రత్యేక తెంగాణ ఉద్యమాన్ని 1987లో తెంగాణ ప్రభాకర్‌, హరనాథ్‌ు చిన్న పాయగా ప్రారంభించిండ్రు. వాళ్లు వెలిగించిన వత్తిని 1990లో ఉస్మానియా విద్యార్థులు  అందిపుచ్చుకున్నరు. అట్లా అందుకున్న విద్యార్థుల్లో నేనుకూడా ఒకణ్ణి. తెంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై, ఓపెన్‌ కోటా పేరిట మొత్తం 20శాతం సీట్లను ఆంధ్రా విద్యార్థుల తో నింపడాన్ని తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ నాయకత్వంలో అడ్డుకున్నరు. ఆ తర్వాత భువనగిరి మహాసభ, వరంగల్‌, సూర్యాపేట డిక్లరేషన్లు, ఇంద్రారెడ్డి, జానారెడ్డి తెలంగాణ జెండా అన్నీ రంగం మీదికి వచ్చినయి. టీఆర్‌ఎస్‌ స్థాపనతో తెలంగాణ ఉద్యమానికి ఒక అండ దొరికినట్లయింది. అప్పటి వరకూ అక్కడక్కడా వినిపిస్తున్న గొంతులు  ఒక్క దగ్గరికొచ్చాయి. అస్తిత్వ సోయితో చేసిన కృషి తెలంగాణ దశ, దిశనే మార్చేసింది. అప్పటి వరకూ ఎన్‌కౌంటర్లకు ఎరవుతున్న బిడ్డలు  తుపాకులు అడవుల్లోనే వదిలేసి ప్రత్యేక తెలంగాణ జెండా అందుకున్నరు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నందునే ఈ కాలంలో ఎన్‌కౌంటర్‌ హత్యలు తక్కువయినయి. ‘డెమోక్రాటిక్‌ స్పేస్‌’ దొరికింది. ఈ దొరికిన డెమోక్రాటిక్‌ స్పేస్‌ని ప్రత్యేక తెలంగాణ కోసం టీచర్లను సమాయత్తం చేసేందుకు గాజుల  శ్రీధర్‌, ఆయన మిత్రులు కృషి చేసిండ్రు. సభలు , సమావేశాలు  పెట్టిండు. వ్యాసాలు  రాసిండు. ఇప్పుడు తాను నాలుగేళ్లుగా రాసిన కవిత్వాన్ని మనముందుంచిండు.

IMG_8462 - Copy

    అత్యంత పేదరికంలో బాల్యం  గడిపిండు. టీచర్‌గా సర్కారు బడుల్ని అతి దగ్గరగా చూసిండు. అనుభవించిండు. అందుకే శ్రీధర్‌ కవిత్వంలో బడి, బాల్యం కండ్లముందు కనబడతాయి. నిలదీస్తయి. బహుజన భావజాలంతో రాసిన కవితలే గాకుండా, రాజకీయ కవితలు  కూడా ఇందులో ఉన్నాయి. విమలక్క విడుదలయినప్పుడూ, పైడి తెరేష్‌ చనిపోయినప్పుడూ కవిత్వం రాసిండు. బతికుండి కొట్లాడాలె గెలుచుకోవాలె అని భవిష్యత్‌పై భరోసా కల్పిస్తడు. వాళ్ల నాయిన మీదా, సహచరి మీదా కవిత్వమల్లిండు. ప్రపంచీకరణ, ఆత్మహత్యలు, ఉస్మానియా విద్యార్థులు, మహిళలు, పురుషాహంకారం వస్తువుగా పూర్తిగా తెలంగాణ సోయితో, ఈ మట్టి వాసనను పట్టిచ్చే విధంగా కవిత్వ మల్లిండు. 36 కవితలు , ఆరు పాటలతో పాణం పోసుకున్న ఈ సంపుటి ఉద్యమ సమయంలో అటు విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఇటు తెలంగాణ బిడ్డలు  చేసిన ఉద్యమాలను, త్యాగాలను శ్రీధర్‌ అక్షరీకరించిండు.

    మార్క్స్‌, మావో గురించి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు లెక్చర్ల రూపంలో, అరసం, విరసం మీటింగుల కు ఎప్పుడు పోయినా పుస్తకాల రూపంలో పరుచుకుండ్రు. అందుకే మార్క్స్‌, మావోలు 1940 నుంచి తెలుగు వారికి సుపరిచితం. అదే 1990 నాటికి కూడా బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్‌, పెరియార్‌, కాన్షిరామ్‌లు  అపరిచితులు. ఆంధ్రా వలసాధిపత్యంతో పాటుగా కులాధిపత్యం ఎట్లా ఉందనేది కూడా శ్రీధర్‌కు అర్థమయింది. లెఫ్టిస్టులు ఏనాడూ పట్టించుకోని ఫూలే, అంబేద్కర్‌ను శ్రీధర్‌ పట్టించుకుండు. అందుకే

    ‘‘ఇప్పుడిక

    మార్క్స్‌, మావో స్వప్న గీతాకు

    ఫూలే`అంబేద్కర్ల దండోరా దప్పు దరువు మోగాలి’’ అంటూ కర్తవ్య బోధ చేసిండు.

    బ్రాహ్మణాధిపత్యం సమాజాన్ని దిగజార్చిన తీరుని కళ్లముందుంచిండు.

    ‘‘ఈ దేశపు

    దేహమంతా జందెప్పోగు

    సాలెగూడలో బందీ’’

    ‘‘..అక్షరం మొదలు  ఆయుధం దాకా

    ఈ నేపై మొకెత్తే విత్తులన్నింటికీ

    నెత్తుటి గాయా గురుతులు

    నిత్యం శంబూకుని అంతిమ యాత్రలు’’

    ‘‘…నే నేంతా

    మూల వాసి దోసిలిలో పూదోటై విరిసినా

    మూలాల్ని తెగనరుకుతున్న

    గండ్రగొడ్డలిదే రాజ్యం’’

vennela kolimi

   రాజకీయ రంగంలో బ్రాహ్మణాధిపత్యం 1970 తర్వాత తగ్గు ముఖం పట్టింది. అయితే ఈ ఆధిపత్యం ప్రస్తుతం డైరెక్ట్‌గా తామే రాజకీయ నాయకుల  అవతారమెత్తకుండా, రాజకీయ నాయకుల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నరు. రాజ్యాన్ని నడిపే ఎగ్జిగ్యూటివ్‌ లందరూ బ్రాహ్మణులే! అంతెందుకు బీసీ ప్రధాని మోడీ అని జబ్బు చరుచుకుంటున్న వారికీ ఆ ప్రధానమంత్రి కార్యాయంలో 97 శాతం మంది అధికారులు బ్రాహ్మణులే అంటే ఆశ్చర్యం కలుగక మానదు. అయితే ఇది వాస్తవం. తెలంగాణలో ఈ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. అయితే రాజు. లేదంటే రాజగురువు. ఇదీ బ్రాహ్మణాధిపత్యం.  ఈ ఆధిపత్యాన్ని తుదముట్టించేందుకే ‘వెన్నెల కొలిమి మండిస్తున్న’ అని చెప్పిండు. ఇందులో కవితాత్మకంగా చెప్పిన శంబూకుని అంతిమయాత్ర, శంఖుతీర్థాలదే శాస్త్రీయత, గోత్రం గొడుగు పడగ నీడలు , బలి చక్రవర్తుల  సమాధులు, కారుమబ్బు కౌటిల్యానిదే ఆధిపత్యం అంటూ బ్రాహ్మనిజం సడుగులిరగొట్టిండు. మనువు మడిని మెటామార్ఫోస్‌ చేసి బడికి కార్పోరేట్‌ దడి కట్టాడు,

    ‘‘మట్టీ .. గుట్టా..

    అడవీ.. నీటి నెవూ..

    మొత్తంగా నే నేంతా

    మనువు పిడికిట పెట్టుబడి

    మట్టి గుండెకు నెత్తుటి తడిపై

    కట్టిన లోహపు దడి’’ అంటూ ఆధునిక మనువు రూపాన్ని పట్టించిండు.

    ‘‘.. మట్టి వాసన అస్తిత్వా మొకపై

    వామన పాదా దండు’’

    ‘‘..చిగురించే అక్షరంపై మొకెత్తే గజ్జెపై

    అమ్మపైనా.. అడవిపైనా..

    చెట్టు చాటు యుద్ధం

    అవునూ అమరుందరూ

    అసురులే!’’ అంటూ ఎవరి ఫిత్‌రత్‌ ఏందో జెప్పిండు.

    ‘‘ఉగాది రోజు

    పంచాంగాు, ఎన్నిక మేనిఫెస్టోు

    జమిలిగా

   నిద్రపుచ్చే మాదక ద్రవ్యాలు!’’ అంటూ మతం, మతాన్ని పెంచి పోషిస్తున్న రాజకీయాలపై అక్షరాయుధాన్ని సందించిండు. నిజానికి జందెప్పోగు జాతి, మనువూ.. మట్టి, చెట్టు చాటు యుద్ధం అని కవితా శీర్షికలు పెట్టడంలోనే శ్రీధర్‌ సాహసం కనిపిస్తది.

    రాజకీయ కవితల్లో 2004 ఎన్నికకు ముందు బిజేపి ప్రభుత్వం తమ ఎన్నిక ప్రచారాన్ని దేశం వెలిగిపోతున్నది అని ప్రచారం చేసింది. అయితే అది చేసుకున్న ప్రతి ప్రచార అంశాన్ని అబద్ధంగా విప్పి చెప్పిండు శ్రీధర్‌.

    ‘‘పదునైన పత్తి ఇత్తనం కత్తి వేటుకి

    తెగి పడ్డ మా అమ్మ నుదుటి కుంకుమ

    నూలు  పోగుకు వేలాడుతున్న తల తోరణాలు ’’

    ‘‘ ఇసుక బట్టీల్ల ఇంజనీర్లైన

    బడీడు బుడ్డోళ్లు’’

    ‘‘కూలి గుడిసెల్లో చీపులిక్కరు సీసా కెత్తిన నెత్తురు’’ అంటూ బీజేపి రంగు బహిరంగం చేసిండు.

    ‘‘లెక్కలేని దోపిడితో మీ సోపతి

    వారానికి నెలెన్నని లెక్కించే మీ మతి

    చర్చంటూ సాగదీసె కుటి రాజనీతి

   చరిత్రే సాక్షి కదా బేహారు దుర్గతికి’’ అంటూ గులాం నబీ ఆజాద్‌ ఆంద్రోళ్లకు గులామై తెంగాణను ఆజాద్‌ కాకుండా చేసినందుకు 2013లో కవిత రాసిండు.

    ప్రపంచీకరణ చేసిన నాశనాన్ని మననం చేసుకుంటూ

    ‘‘పాతికేళ్ళ గర్భందాల్చి పాడుకాం

    ప్రసవించిన మార్కెట్‌ మహమ్మారి

    ప్రపంచీకరణ వేటగాడు

    బిగిస్తున్న ఉచ్చుకు

    వేలాడుతున్న అస్తిపంజరాలం’’ బాధపడ్డడు.

    శ్రీధర్‌ వాళ్ళ నాయిన గురించి

    ‘‘దారపు కండెకు చుట్టు కోవాల్సిన నా కంటి చూపును

    పుస్తకాల  పేజీకు అతికిస్తివి’’ అని కృతజ్ఞత చెప్పుకుంటడు. అలాగే సహచరి గురించి

    ‘‘..నాలు కపై గడ్డ కట్టిన మౌనాన్ని

    ఎద లోతుల్లో ఘనీభవించిన దు:ఖాన్ని

    నీ పైట కొంగు వెచ్చదనంలో కరిగించుకుంటా

    సఖీ…’’ అంటూ సేదదీరిండు.

    మహిళా దినోత్సవం సందర్భంగా రాసిన మరో కవితలో వాళ్ళ అమ్మలాంటి అనేక మంది అమ్మలను యాద్జేసుకుంటూ

    ‘‘భూగోళాన్ని

    రాట్నానికి కట్టి

    అరిచేతుకు

    జీవితాల్ని అతికించి

    మీ గుండెల్ని

    చీల్చి

    కండెకు చుట్టుకున్న

    అమ్మలారా!’’ అంటూ తల్లి పాదాకు ప్రణమిల్లిండు.

    ‘‘అక్షరం అందరిదీ కాకూడదు

   జ్ఞానం ఇనుపకంచెల్ని దాటకూడదు’’ అంటూ సర్కారు బడుల  గురించీ, ‘‘అమ్మ కడుపు నుంచే పనిముట్లతో బయటపడిన వాళ్ళం’’ అంటూ పేదల బాల్యం గురించీ రాసిండు.

    ‘‘విచ్చుకత్తుల అంచుపై విమల గానమై

   దూలాడుతూ కదలివచ్చిన కాలిగజ్జెకు…’’ అంటూ జైలు నుంచి విడుదలయి వచ్చిన ప్రజా గాయకురాలు  విమలక్కకు స్వాగతం పలికిండు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కావడికుండలు మోసిన పైడి తెరేష్‌ చనిపోయినప్పుడు

    ‘‘కొన్నాళ్ల పాటు.. కొన్ని చావులపై ..

    నిషేధం విధించమని ధర్నా చేస్తాం

    దారి తప్పకుండా శిబిరానికొస్తావా?

    గులాబి ముళ్లతోటలో గానకచ్చేరి పెడతాం

    గబ్బిలమై గజల్‌ గానం చేస్తావా…?’’

    ‘‘నిశ్చల  సంద్రం లాంటి ముఖాన్ని

    అరిచేతుల్లో దాచుకుందామంటే

   ‘హిందూసముద్రం’లో అగ్ని కెరటాల్ని మొలిపిస్తున్నావు’’ అంటూ నివాళి అర్పించిండు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల  మీద కవిత్వం, పాటా రెండూ ఇందులో ఉన్నాయి.

    ‘‘ఈ నేల  కంటున్నది

    మగపిల్లల్ని కాదు!

    సామూహికంగా పురుషాంగాలకు

   పురుడు పోస్తున్నది’’ అని నిర్భయ అత్యాచారా సంఘటన జరిగినప్పుడు గుండెలోతుల్లోంచి రాసిండు. ఇక్కడ కూడా మనువాదం పనిచేస్తుంది అంటూ ‘‘మూల నపడి మూల్గుతున్న ముసలి మనువు భూజాలపై వేలాడుతూ వెక్కిరిస్తున్నాడు’’ అంటూ రాజకీయ నాయకు, పురుషాధిక్యతతో మాట్లాడే చాంధసుల  గురించి కవిత్వ మల్లిండు. అయితే

    ‘‘తలలు తీసే ఉరిశిక్షలు సరే గానీ!

   ఆరో నూరో తలలు తెగితే…’’ అని అన్నడు. ఉరి శిక్షలు సరే అనడం, అదీ ఎంత ఆవేశం ఉన్నా అన్నీ తెలిసిన శ్రీధర్‌ లాంటి కవి మాట్లాడ్డం అన్యాయం. ఆరో నూరో తలు తెగితే.. అనడం కూడా తగదు. సమాజంలో మార్పురావడానికి, బ్రాహ్మణాధిపత్యానికి, మనువాదానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉద్యమించడమే పరిష్కారం.

    అస్తిత్వ సోయితో తెంగాణ సాహిత్యానికి బహుజన సొబగుల ద్ది, కనుమరుగైతున్న తొర్ర, దారపు కండె , అలుకు పిడుచ, గాలింపు గిన్నె, ఎర్రని జాజు, కందిలి, మసిబట్ట, గొరుకొయ్యల్ని, బుడ్డోళ్లని కవిత్వంలోకి తెచ్చిన శ్రీధర్‌ బహుజనవాదానికి కొత్త చిరునామా!

-సంగిశెట్టి శ్రీనివాస్‌

హోమర్ ను చదువుకుంటూ అతడు-ఆమె

స్లీమన్ కథ-16

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

సోఫియా తల్లిదండ్రులు, తోబుట్టువులు, దగ్గరి బంధువులతో సహా కుటుంబం అంతా అక్కడే ఉంది. అందరూ ఒక టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. ఒకింత విషాదం తొంగి చూసే చిరునవ్వు, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, బట్టతల, వేస్టుకోటుకు వేల్లాడుతున్న బరువైన బంగారపు వాచీ చైనుతో ఉన్న ఈ విచిత్రమైన జర్మన్ వైపు అంతా కళ్ళప్పగించి చూశారు.

కాసేపటికి సోఫియా వచ్చింది. తెల్లని దుస్తులు ధరించింది. జుట్టు రిబ్బన్ తో ముడేసుకుంది. చాలా గంభీరంగా ఉంది. అందరిముందూ వైనూ, కేకులూ ఉంచారు. సోఫియా తలవంచుకుని కూర్చుంది. స్లీమన్ తన ప్రపంచయాత్రా విశేషాలను చక్కని గ్రీకులో చెప్పడం ప్రారంభించాడు. మధ్యలో ఉన్నట్టుండి సోఫియావైపు తిరిగి, “నీకు దూరప్రయాణాలు ఇష్టమేనా?” అని అడిగాడు. ఇష్టమేనని ఆమె చెప్పింది. “రోమన్ చక్రవర్తి హేడ్రియన్ ఎథెన్స్ ను ఎప్పుడు సందర్శించాడు?” అని అడిగాడు. సోఫియా తేదీతో సహా ఠకీమని చెప్పింది. “హోమర్ పంక్తులు కొన్ని అప్పజెప్పగలవా?” అని అడిగాడు. గడగడా అప్పజెప్పింది. పరీక్ష నెగ్గింది.

ఆ తర్వాతి మూడురోజులూ స్లీమన్ పగలంతా ఆ ఇంటి చుట్టూనే వేల్లాడి రాత్రి హోటల్ కు వెళ్ళేవాడు. అతని కళ్ళు తనను కనిపెట్టి చూస్తున్నాయని సోఫియాకు తెలుసు. అయినా తత్తరపడలేదు. తన చెల్లెళ్లతోనూ, బంధువుల అమ్మాయిలతోనూ ఆటపాటల్లో మునిగితేలింది. టేబుల్ సర్దడంలో సాయం చేసింది. మధ్య మధ్య, చమురు డబ్బాలు, వెన్న, ఆలివ్ లు ఉంచిన సెల్లార్ లోకి పరుగుతీసింది. ఇంటినిండా బంధువులు. స్లీమన్ ఓ చిన్న ఉత్తరం రాసి ఎలాగో ఆమెకు అందేలా చూశాడు.

ఇద్దరూ ఏకాంతంగా కలసుకున్నప్పుడు, “నన్ను పెళ్లి చేసుకోడానికి నువ్వు ఎందుకు ఇష్టపడ్డావ”ని హఠాత్తుగా అడిగాడు.

“మీరు ధనవంతులని మా అమ్మానాన్నా చెప్పారు కనుక” అని సోఫియా తటాలున సమాధానం చెప్పింది.

ఆ మాట స్లీమన్ ను నొప్పించింది. కోపంతో విసవిసా హోటల్ కు వెళ్లిపోయాడు. ఈ అమ్మాయిలో ఒక సహజమైన ఉదాత్తత ఏదో ఉందని అతను అంతవరకూ అనుకున్నాడు. కానీ తన ప్రశ్నకు ఒక బానిసలా సమాధానం చెప్పింది. హోటల్ కు వెళ్ళిన తర్వాత వెంటనే ఆమెకు ఉత్తరం రాశాడు:

మిస్ సోఫియా, నువ్విచ్చిన సమాధానం నన్ను తీవ్రంగా గాయపరిచింది. ఒక బానిస మాత్రమే అలాంటి సమాధానం ఇవ్వగలదు. అందులోనూ నీలాంటి ఒక చదువుకున్న అమ్మాయి అలాంటి జవాబు ఇవ్వడం మరింత దిగ్భ్రాంతి కలిగించింది. నేను చాలా సీదాసాదా మనిషిని. గౌరవమర్యాదలు కలిగిన ఓ ఇంటిపక్షిని. మనం పెళ్లి చేసుకోవడమే జరిగితే ఇద్దరం కలసి పురావస్తు తవ్వకాలు జరపచ్చనీ, హోమర్ మీద పరస్పరాభిమానాన్ని పంచుకోవచ్చనీ, ఏవేవో అనుకున్నాను.

నేను ఎల్లుండి నేపుల్స్ కు వెడుతున్నాను. బహుశా మనం మళ్ళీ కలసుకోలేకపోవచ్చు. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక స్నేహహస్తం కావాలనిపిస్తే నీపట్ల అంకితభావం కలిగిన నన్ను గుర్తుచేసుకో.

                                                                                                                  హైన్ రిచ్ స్లీమన్

                                                                                                               డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ,

                                                                                               స్థలం: సెయింట్  మిషెల్, 6, పారిస్ 

ఆ ఉత్తరాన్ని హోటల్ మెసెంజర్ ద్వారా సోఫియాకు పంపించాడు. అది చదివి ఆమె ఉక్కిరిబిక్కిరైంది. అతని కోపం పోయేలా ఒక ఉత్తరం రాయమని కుటుంబం అంతా ఆమెపై ఒత్తిడి తెచ్చింది. ఆమెకు సహకరించడానికి ప్రభుత్వాధికారిగా ఉన్న ఓ దగ్గరిబంధువును కూడా రప్పించారు. అప్పటికప్పుడు ఓ దుకాణం నుంచి కొని తెచ్చిన చవకబారు కాగితం మీద సోఫియా ఇలా రాసింది:

ప్రియమైన హెర్ హైన్ రిచ్:  మీరు వెళ్లిపోతానన్నందుకు విచారిస్తున్నాను. మధ్యాహ్నం నేనన్న మాటలకు కోపం తెచ్చుకోవద్దు. ఆడపిల్లలు అలాగే మాట్లాడాలేమో ననుకున్నాను. రేపు మళ్ళీ మీరు మా ఇంటికి వస్తే మా అమ్మానాన్నా, నేనూ ఎంతో సంతోషిస్తాం.

స్లీమన్ దాంతో తేలికపడ్డాడు. అయినాసరే, ఆమె తనను ఇష్టపడే పెళ్ళికి ఒప్పుకుందా లేదా అన్నది తేల్చుకోడానికి  ఉత్తరాల మీద ఉత్తరాలు రాశాడు. ఆమె ప్రతి ఉత్తరానికి జవాబిచ్చింది. అలా ఆరు రోజులపాటు సాగిన ఆ ఉత్తరాయణంలో చివరికి ఆమె తానుగా వివాహ ప్రతిపాదన చేసిన తర్వాతే అతను బెట్టు వీడాడు. పదిహేడేళ్ళ సోఫియాకు, నలభై ఏడేళ్ళ స్లీమన్ కు సెప్టెంబర్ 24న వివాహం జరిగింది,

స్లీమన్ ఫ్రాక్ కోటు వేసుకున్నాడు. సోఫియా తెల్లని దుస్తులు ధరించి, కొలొనస్ పువ్వులతో అలంకరించిన పెళ్లి కూతురి ముసుగు వేసుకుంది. ఆమె బంధువులందరూ గ్రీకు జాతీయ ఆహార్యంలో పెళ్ళికి హాజరయ్యారు. ఆ తర్వాత సాయంత్రం దాకా విందు జరిగింది. అదే రోజు రాత్రి వధూవరులు ఇద్దరూ ఎథెన్స్ రేవు ప్రాంతమైన పిరయాస్ కు వెళ్ళి, తెల్లవారుజామున మూడు గంటలకు నేపుల్స్ వెళ్ళే ఓడ ఎక్కారు. తన ఆటబొమ్మలు కూడా తెచ్చుకుంటానని సోఫియా పట్టుబట్టింది. స్లీమన్ వద్దని వాదించే స్థితిలో లేడు. అలా అతనిపై ఆమె తొలి విజయం సాధించింది. ఆ తర్వాత చివరివరకూ ఆమె విజయపరంపర కొనసాగింది.

అందంతోపాటు ఆమెలో పసితనం ఉంది. ఆమె నడకలో ఒక సహజమైన హుందాతనం ఉట్టిపడేది. ఆమె జీవితాంతమూ అది చెక్కుచెదరలేదు. అతనిమీద పెత్తనం చేస్తున్నట్టు కనిపించకుండానే పెత్తనం చేసేది. ఆమె అతన్ని తదేకంగా ప్రేమించింది. కానీ ఆ ప్రేమలో పెద్దవాళ్ళపట్ల పిల్లలకు ఉండే ఒక మంకుతనం ఉండేది. సన్నిహితమిత్రులతో కూడా అంటీ అంటనట్టు ఉండే స్లీమన్ సైతం ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె మనస్థితి వెంట వెంటనే మారిపోతూ ఉండేది. నవ్వుతూ నవ్వుతూనే అంతలో గంభీరంగా మారిపోయేది. అది కూడా పిల్లల్లో కనిపించే గాంభీర్యం. అదతనికి ఆహ్లాదం కలిగించేది. “ఆమెలో భర్తపట్ల ఒక అలౌకిక ఆరాధనాభావం ఉంది” అని అతను హానీమూన్ రోజుల్లోనే రాసుకున్నాడు.

నిజానికి, అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య తన జీవితంలోకి అనుకోకుండా అడుగుపెట్టిన ఆమెపై అతనికీ అలాంటి ఆరాధనాభావమే ఉంది. తన తుదిక్షణాలవరకూ ఆమెను అలాగే ఆరాధించాడు. అయితే, వారు కీచులాడుకున్న సందర్భాలు లేకపోలేదు. అతనిలో వెనకటి అసహనం, ఆవేశం తన్నుకొచ్చిన ఘట్టాలూ ఉన్నాయి. అతని అహానికీ, అతిశయానికీ, డాంబికానికీ ఆమెలోని ప్రశాంతతా, ఉల్లాసమూ అడ్డుకట్ట అయ్యేవి. ఆమె సాహచర్యం అతనికి మృదుత్వాన్నీ, మర్యాదనూ మప్పింది. మొత్తానికి ఆమె తన సహచరి కావడం అతనికి ఓ అంతుబట్టని అద్భుతంలా అనిపించేది. తన గొప్ప అదృష్టాన్ని చూసుకుని తనే దిగ్భ్రమ చెందేవాడిలా ఒక్కోసారి ఆమెనే చూస్తూ ఉండిపోయేవాడు.

అదో విచిత్రమైన హానీమూన్. నేపుల్స్…పాంపే…ఫ్లోరెన్స్…మ్యూనిక్…వెంట వెంటనే ఒకచోటినుంచి ఒక చోటికి నిరంతర ప్రయాణం. అందులో విధిగా మ్యూజియంల సందర్శన ఉంటుంది. వాటిలోని కళాకృతులపై స్లీమన్ పెద్ద గొంతుతో ప్రత్యక్షవ్యాఖ్యానం వినిపిస్తూ ఉండేవాడు. విని విని ఇక భరించలేక సోఫియా చెవులు మూసుకునేది. అయినా అతనలా చెప్పడం ఆమెకు ఇష్టంగానే ఉండేది. జనం ఆగిపోయి ఈ నలభయ్యేడేళ్ళ ప్రొఫెసర్ ను, అతని పడచు భార్యను వింతగా చూసేవారు. కళాకృతుల పరిశీలనలో ఇద్దరిలోనూ ఒకే గాంభీర్యం, ఏకాగ్రత. సాయంత్రం హోటల్ గదికి తిరిగి వెళ్ళాక హోమర్ నుంచి రెండువందల పంక్తులు వల్లించమని ఆమెను కోరేవాడు. ఆమె వల్లిస్తూ వల్లిస్తూనే అప్పుడప్పుడు నిద్రలోకి జారిపోయేది. ఆమె అతనిలోని అధ్యాపకుణ్ణి మేలుకొలిపింది.

ఆమెను తన అభిరుచులకు అనుగుణంగా మలచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె భాషావేత్త కావాలని పట్టుబట్టాడు. ఒక ఏడాదిలో జర్మన్, ఇంకో ఏడాదిలో ఫ్రెంచ్ నేర్చేసుకోవాలన్నాడు. అది నీకేమంత కష్టం కాదని బోధించాడు. ఆమెను పారిస్ లోని సువిశాలమైన తన అపార్ట్ మెంట్ కు తీసుకెళ్ళాడు. అది చలికాలం. బాగా మంచుపడుతోంది. ఆమెలో బంధువులకు దూరమయ్యానన్న దిగులు. భర్త రకరకాల ఫ్యాషన్ దుస్తులు తెచ్చి పడేసి వాటిని వేసుకొమంటున్నాడు. కొప్పు ధరించమన్నాడు. కొంతమంది గ్రీకు అమ్మాయిలు ఇంటికి వచ్చినప్పుడు, ఆమె కొప్పు విప్పేసి మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళకు తన ఆటబొమ్మలు చూపిస్తూ మురిసిపోయింది.

పారిస్ ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. మంచుతో వాతావరణం అంతా తడి తడిగా ఉంది. కత్తితో కోస్తున్నట్టు చలిగాలులు. అతని స్నేహాలు, ఆసక్తులు; తరచు జియోగ్రాఫికల్ సొసైటీ సందర్శనలు; ట్రాయ్ గురించీ, మైసీనియా గురించీ, గ్రీకు ద్వీపకల్పంలోని దీవుల గురించీ అతను అదేపనిగా మాట్లాడుతుండడం, అక్కడ భూమిలో కప్పడిన నిధినిక్షేపాల గురించిన అతని ఊహలూ-అన్నీ క్రమంగా ఆమెకు విసుగు తెప్పిస్తున్నాయి. స్లీమన్ బుర్రకు విశ్రాంతి అన్న ప్రశ్నే లేదు. అది గడియారంలా ఎప్పుడూ పనిచేస్తూ ఉండాల్సిందే. తనేమిటో నిరూపించుకోవాలన్న అంతులేని తపనతో ఒక కార్యక్షేత్రం కోసం ఇప్పటికీ అతను వెతుకుతూనే ఉన్నాడు.

స్లీమాన్ & సోఫియా

జనవరి చివరికల్లా మళ్ళీ అస్తిమితంలోకి జారిపోయాడు. ట్రాయ్ కి తిరిగివెళ్లే ఆలోచన ప్రారంభించాడు. అంతలో, కూతురు నడేజ్దా చనిపోయినట్టు పిడుగుపాటులాంటి వార్త! దుఃఖంతో కుప్పకూలిపోయాడు. మళ్ళీ ఏవేవో భూతాలు అతన్ని వెంటాడసాగాయి. కూతురి మరణానికి తనే కారణమనుకుంటూ తనను నిందించుకున్నాడు. ఆమెను దక్కించుకోడానికి తను ఏమైనా చేసి ఉండేవాడు. పెద్ద పెద్ద డాక్టర్లను ఇంటికే రప్పించి వైద్యం చేయించి ఉండేవాడు. అమ్మాయి అస్వస్థ గురించి ముందే తనకు చెప్పి ఉంటే ఎంత బాగుండేదనుకున్నాడు. మిగతా పిల్లల్ని ఓదార్చడానికి అప్పటికప్పుడు సెయింట్ పీటర్స్ బర్గ్ కు బయలుదేరాలనుకున్నాడు కానీ, ఇక్కడ సోఫియా జబ్బుపడింది.

మనిషి పాలిపోయి, నిస్తేజంగా అయిపోయింది. డాక్టర్లకు మాత్రం ఆమెలో ఎలాంటి లోపం కనిపించలేదు. ఫ్రెంచీ, జర్మనూ ఒకేసారి నేర్చుకోవాలని అతను ఒత్తిడి తేవడంతో ఆమె ఎక్కువ కష్టపడుతోంది. ఆమెలో ఇంత మందకొడితనం ఏమిటని అతను అనుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఆమెను సర్కస్ కు తీసుకెళ్లేవాడు, దానిని బాగా ఆనందించింది. కానీ ఎక్కువగా థియేటర్ కు తీసుకెళ్ళేవాడు. వజ్రపు నగలు వేసుకుని, బాక్స్ లో బాసింపట్టు వేసుకుని కూర్చుని, తనకు ఏమాత్రం అర్థం కాని ఉపన్యాసాలు వింటూ విసుగుతో కన్నీళ్ళ పర్యంతం అయ్యేది. చివరికి డాక్టర్లు ఇంటిబెంగ అని తేల్చారు.

ఫిబ్రవరి మధ్యకల్లా ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఉన్నట్టుండి ఏడవడం మొదలెట్టేది. ఆమెను ఎథెన్స్ లో దింపి తను ట్రాయ్ కి వెళ్లాలని స్లీమన్ నిర్ణయించుకున్నాడు. తవ్వకాలకు అనుమతిస్తూ టర్కిష్ ప్రభుత్వం నుంచి ఫర్మానా తెప్పిస్తానని కల్వర్ట్ వాగ్దానం చేశాడు. కానీ ఇంతవరకూ అది రాలేదు.  భార్యతో కలసి నీమన్ అనే స్టీమర్ మీద మార్సే నుంచి పిరయాస్ వెడుతూ, 1870 ఫిబ్రవరి 17న కల్వర్ట్ కు ఇలా ఉత్తరం రాశాడు. అందులో ఎప్పటిలా అతని అసహనం తొంగిచూసింది:

మీకు ఫర్మానా వచ్చిందీ లేనిదీ దయచేసి వెంటనే నాకు తెలియజేయండి. వచ్చి ఉంటే తక్షణమే హిస్సాలిక్ దగ్గర తవ్వకాలు ప్రారంభిస్తాను. పూర్తి అనుకూల వాతావరణం రాకుండా ఇంత ముందే పని ప్రారంభించడం అడ్డంకి అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే, ఇక్కడి వాతావరణం అనుకూలంగా, ఆహ్లాదకరంగా ఉంది. ట్రయాడ్(ట్రాయ్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు)లో ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. అదీగాక, ఆ తర్వాత నాకు వేరే అత్యవసరమైన పనులు కూడా ఉన్నాయి కనుక వెంటనే తవ్వకాలు ప్రారంభించాలనుకుంటున్నాను.

కనుక, మీకు ఫర్మానా వచ్చి ఉంటే దయచేసి అవసరమైన పరికరాలు, సాధనాల జాబితా మరోసారి రాసి పంపగలరు. పారిస్ నుంచి బయలుదేరే హడావుడిలో మీరు కిందటి సారి రాసిన లేఖలోని జాబితాను కాపీ చేసుకోవడం మరచిపోయాను…

స్లీమన్ ఎథెన్స్ కు చేరుకున్నాడు. అప్పటికీ ఫర్మానా రాలేదు. దాంతో మైసీనియాలో కొన్ని తవ్వకాలు జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు. అయితే, అప్పటికి కొన్ని మాసాల క్రితమే ఏడుగురు ఆంగ్లేయుల బృందాన్ని బందిపోట్లు హత్య చేయడంతో మారుమూల ప్రాంతాలలో ఒంటరిగా తిరిగే పురావస్తుపరిశోధకుల మీద గ్రీకు ప్రభుత్వం మండిపడుతోంది. దాంతో నిస్పృహ చెందిన స్లీమన్ ఫర్మానా వచ్చేవరకూ ఎజియన్ సముద్రపు దీవుల మధ్య పడవలో తిరుగుతూ కాలక్షేపం చేయాలనుకున్నాడు.

అదొక దుస్సాహసంగా పరిణమించింది. అతనికి పడవ ప్రయాణంలో అనుభవంలేదు. దానికితోడు, తను కుదుర్చుకున్న గ్రీకు పడవవాడి అనుభవం కూడా అంతంతమాత్రమే అనిపించింది. అపోలో(గ్రీకు దేవుడు) జన్మస్థలమైన డీలోస్ ను, పాలరాతి గుట్టలకు ప్రసిద్ధమైన పారొస్ ను, బాకస్ (రోమన్ దేవుడు)కు పవిత్రస్థలమైన నెక్సాస్ ను సందర్శించాడు. ఆ తర్వాత అతని పడవ తుపానులో చిక్కుకుంది. నాలుగురోజులపాటు రొట్టెతోనూ, మంచినీళ్ళతోనూ గడిపాడు. అక్కడినుంచి చిన్న దీవి అయిన తేరా(సెంటోరీనో)కు వెళ్లాడు. అది అన్నింటికన్నా ఎక్కువగా అతన్ని ఆకట్టుకుంది. ఎజియన్ సముద్రంలో విసిరేసినట్టు ఉన్న చిన్న చిన్న దీవుల్లో దాదాపు దక్షిణం కొసన ఉన్న ఈ దీవికి ఒక చరిత్ర ఉంది. క్రీ.పూ. 631 లో, ఆఫ్రికాలోని సంపన్న ప్రాంతమైన సైరీన్ ను తమ వలసగా మార్చుకోవడానికి గ్రీకులు ఈ దీవినుంచే బయలుదేరి వెళ్లారు. అది అగ్నిపర్వత ప్రాంతం కూడా. లావా పొరలతో; ఎరుపు, నలుపు, పసుపు, గోధుమ వంటి వివిధ రంగుల్లో ఏర్పడిన విచిత్ర శిఖరాలను చూసి స్లీమన్ ఆనందించాడు. ఈ శిఖరాలు ఏడువందల అడుగుల ఎత్తువరకూ ఉన్నాయనీ, “సంభ్రమం గొలిపే ఒక అద్భుతదృశ్యా”న్ని అవి ఆవిష్కరించాయనీ రాశాడు. ఆ దీవిలోని జనం కూడా అతనికి నచ్చారు. మూడు లావా పొరల కింద ఆమధ్యనే దొరికిన కొన్ని రాతి యుగపు కలశాలను వారి దగ్గర కొన్నాడు. అలా ఒక్కొక్క దీవినే చుట్టేసి తిరిగి ఎథెన్స్ కు వచ్చాడు.

ఇంతకుముందు గాలివాన, తుపానులాంటి ఒక పెద్ద విపత్తునుంచి బయటపడిన ప్రతిసారీ అతన్ని అదృష్టం వరిస్తూవచ్చింది. డచ్చి తీరానికి దగ్గరలో టెక్సెల్ దీవి దగ్గర అతను ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోయినప్పుడు అదే జరిగింది. అట్లాంటిక్ మధ్యలో సంభవించిన పెను తుపాను నుంచి బయటపడిన కొన్ని రోజులకే కాలిఫోర్నియా బంగారం వేటలో పెద్ద ముల్లెను మూటగట్టాడు. ఇప్పుడు కూడా తనను తేరా దీవిలోకి నెట్టుకుంటూ వెళ్ళిన నాలుగురోజుల తుపాను, ట్రాయ్ లో తనకోసం ఎదురుచూస్తున్న మరో గొప్ప అదృష్టాన్ని సంకేతిస్తూ ఉండచ్చని అతను భావించి ఉంటాడు.

అప్పటికీ కాన్ స్టాంట్ నోపిల్ నుంచి రావలసిన ఫర్మానా రాలేదు. అయినాసరే, తెగించాడు. తను ట్రయాడ్ కు వెళ్ళి తీరాలనీ, పనివాళ్ళను నియమించుకోవాలనీ, స్వయంగా చేతి గొడ్డలిని అందుకోవాలనీ, తనను ఏ శక్తీ ఆపలేదనీ నిర్ణయానికి వచ్చాడు. సోఫియాను ఎథెన్స్ లో ఉంచేసి, ఒంటరిగా, ఎవరి సాయమూ లేకుండా ట్రాయ్ మీద తుపానులా విరుచుకుపడడానికి బయలుదేరాడు.

(సశేషం)

 

 

 

 

ముగింపు లేని వ్యధ-రైతు కథ

 

-వై. కరుణాకర్

~

ఇటీవల ఓ రెండు కథలొచ్చాయి. ఒకటి పింగళీ చైతన్య రాసిన ’గౌరవం’, రెండు చందుతులసి రాసిన ’ఊరవతల ఊడలమర్రి’.  రాసిన వాళ్ళిద్దరూ కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళు. ఒకరికైతే ఇదే తొలి కథ. రెండింటికీ రైతు ఆత్మహత్యలే నేపధ్యం. ఈ నేపధ్యంలో ఎన్నో కథలొచ్చినా ఈ రెండు కధలు తీసుకున్న ముగింపు వల్ల  ప్రత్యేకత సంతరించుకున్నాయి. చైతన్య ’గౌరవం’ కథలో ఆత్మహత్య చేసుకున్న రైతుభార్య పార్వతమ్మ వ్యవసాయాన్ని వదిలి, పొలం అమ్మి, రాగల అగౌరవ భయాన్ని అధిగమించి .. బ్రతకటానికి మద్యం లైసెన్సు కోసం టెండర్ వేసి దక్కించుకుంటుంది. చందుతులసి ’ఊరవతల ఊడలమర్రి’ కథలో రైతు ’నారయ్య’ అప్పులవాళ్ళ ముందు అవమానం పొంది ఆత్మహత్య తలపును జయించడానికి ఎంతో మంది ఉరిపోసుకున్న ఊడలమర్రిని నరికేస్తాడు. రెండు కథలలో ప్రధాన పాత్రలు వ్యవసాయాన్ని వదిలి వేస్తాయి. అందులో బ్రతకలేక చావడం కంటే ఏ పని చేసికొనయినా బ్రతకడం ముఖ్యమనీ, అది అగౌరవం కాదనీ చెప్తారు. నిజానికి ఈ ముగింపుల గురించి మాట్లాడుకునే ముందు వాటి ప్రారంభం దగ్గరకు వెళ్ళాలి.

ఇప్పటి రైతు ఉసురు తీస్తున్న సంక్షోభ మూలాలు వలస పాలనలోనే ఉన్నాయి. సహజ వినియోగం నుండి మార్కెట్ అవసరాలకోసం భూమిని వినియోగించడం కొంత తెల్లవాడి బలవంతగానే మొదలైనా ఆ తరువాత దేశీయ పాలకుల హరిత విప్లవ నినాదం కలిగించిన మైమరపులో రైతాంగం ఆమోదంతోనే ఈ బదలాయింపు పూర్తయింది. ఫలితంగా ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తి పెరిగింది. దానికంటే పురుగుమందులు, ఎరువులు, యంత్ర పరికరాల వినిమయం పెరిగింది. ఇవి ఎంతగా పెరిగాయో అంతగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ఎనభైలలో వందలాదిగా సాగిన పత్తిరైతుల ఆత్మహత్యలతో ఈ వైరుధ్యం బట్టబయలైంది.

chaitanya

చైతన్య పింగళి

ఈ పరిణామాల సాహిత్య ప్రతిఫలనాలను అటు ఉత్తరాంధ్రలో కారా ‘యజ్ఞం’ కథలో  సీతారాముడు కన్నబిడ్డను చంపుకోవడంగానూ, ఇటు రాయలసీమలో సింగమనేని నారాయణ ‘అడుసు’ కథలో రైతు నారాయణప్ప  రెక్కలుముక్కలు చేసి పెంచిన తోటను నరికివేయడంతోనూ ముగిసాయి. యజ్ఞం కథ ముగింపు ఆప్పుడే మొదలవుతున్న ప్రతిఘటన పోరాటాలకు సూచనప్రాయం చేస్తే, అడుసు కథ రాయలసీమలో ప్రతిఘటన రాజకీయాలు లోపించడం వల్ల వట్టి నైరాశ్యాన్ని ధ్వనించింది. ఈ రెంటికీ మధ్య కాస్త ఎడంగా ఉత్తర తెలంగాణాలో ఉవ్వెత్తున లేచిన రైతుకూలీ పోరాటాల స్ఫూర్తి అటు కార్మికుల్నే కాదు ఇటు రైతాంగాన్ని కూడా కొంతవరకు సంఘటితం చేయగలిగింది. రఘోత్తమరెడ్డి ’పగలు రేయి శ్రమ పడుతున్నా..’ కథలో రైతుకూలీ మల్లేశం రైతు రాంరెడ్డికి ‘మీ కాపుదనపోళ్ళంతా తగిన ధరల్రావాల్నాని బయటకి రాండ్రి. … ఒక్కనెల రోజులు దినుసు మార్కెటుకు కొట్టకుంట ఆపుండ్రి. – మీతోని మేం రాకపోతే అప్పుడనుండ్రి.  సర్కారోన్తోని కొట్లాడితే మీరు మీరు మేం కలిసే కొట్లాడదాం’ అంటూ ధైర్యమిస్తాడు. ’ఒక్కటైతే’ కథలో హమాలీల పొరాటం రామిరెడ్డిలాంటి రైతుకు ఒక్కటవ్వాలన్న ఆలోచన కలిస్తుంది. ఈ ఆలోచనల వల్లనే టంగుటూరులో, కాల్దారిలో రైతులు తూటాలకెదురు నడిచారు. ఉద్యమాలు ఉధృతంగా నడచిన కాలంలో ఆయా  ఉద్యమ ప్రభావిత ప్రాంతాలనుండి రైతుల ఆత్మహత్యల వార్తలు అరుదుగానే వినిపించాయి.

సమాజంలోని అన్నివర్గాలకు ప్రేరణ నిచ్చిన మౌలిక పోరాటాలు ఒకవైపు నెమ్మదించగా మరోవైపు తొంభైలనాటికి ప్రంపంచ మార్కెట్లకు తలుపులు బార్లా తెరవడంతో ఉధృతమైన వ్యవసాయిక  సంక్షోభం నేడు పరంపరగా సాగుతున్న రైతు బలిదానాలతో పరాకాష్టకు చేరింది. రైతుకు భూమితో అనుబంధాన్ని ముగింపుకు తెచ్చింది. ఎనభైలలో, తొంభైలలోనే వ్యవసాయాన్ని వీడి వ్యాపారాలలోకి అటునుంచి రాజకీయాలలోకి వెళ్ళిన వాళ్ళు ఆర్ధిక సంస్కరణల తొలి ప్రయోజనాన్ని పొందగలిగారు. ‘గౌరవం’ కధలో పార్వతమ్మతో పాటు టెండరు వేయడానికి వచ్చిన తెల్లబట్టలవాళ్ళలో వీళ్ళని పోల్చుకోవచ్చు. మరి కొంతమంది పెద్ద పెట్టుబడులతో తిరిగి వ్యవసాయంలోకి ప్రవేశించారు. ట్రాక్టర్లు, పెద్దపెద్ద యంత్రాలు, నెలల తరబడి కోల్డ్ స్టోరేజీలలో పంటని నిలవ ఉంచుకోగల పెట్టుబడి సామర్ధ్యంతో గట్టు మీద నుండి దిగనవసరంలేని కొత్త తరం రైతులు తయారయ్యారు. వీళ్ళు ఒకవైపు ఆశపెట్టగా మరోవైపు పెరిగిన ఖర్చులు, పిల్లల చదువులూ, మారిన అవసరాలూ పెద్దసంఖ్యలో రైతులు ఆ భూమిలోనే పెనుగులాడేట్టు చేశాయి. ‘ఊరవతల ఊడల మర్రి’  కథలో నారాయణలాంటి ఎకరం రెండెకరాల రైతులు మరింత భూమిని కౌలు చేసేలా చేసాయి. బీటీ పత్తి తప్ప మరో పంట వైపు కన్నెత్తి చూడకుండా చేసాయి. ఫలితంగా భూమికి డిమాండ్ పెరిగింది. కౌళ్ళు పెరిగాయి. విత్తనంలోనే చేరిన విదేశీ పెట్టుబడి, ఆపైన పురుగుమందులూ, ఎరువులూ ఆపైన మార్కెట్ ధరల జూదంలో రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తీర్చలేని అప్పులతో నష్టదాయకమైన వ్యవసాయాన్ని వదిలేయాల్సిన ఆర్ధిక అవసరాలకూ, దానిని వదిలి మరో వృత్తిలోకి వెళ్ళలేని సామాజిక అవరోధాలకూ మధ్య రైతు ఉరితాడుకు వేళ్ళాడుతున్నాడు.

IMG_20150628_105027_1447180109835

చందు తులసి

ఇది సాహిత్యంలోకి ఎట్లా ప్రతిఫలిస్తోంది? బుధ్ధిజీవులైన రచయితలు ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు? ఈ ఆత్మహత్యల పరంపరకు ఏ ముగింపు పలుకుతున్నారు? చైతన్య, చందుతులసిల కథలు జవాబు చెప్ప ప్రయత్నించాయి. రెండు కథలూ ఆరుగాలం కష్టపడే రైతు ఆత్మహత్యల నేపధ్యాన్ని మనసుకు హత్తుకునేలా చిత్రించాయి. ఒక పరిష్కారాన్నీ చెప్ప ప్రయత్నించాయి. జీవితం విలువైనది కనుక ఆత్మహత్యం పరిష్కారం కాదు. ఇక మిగిలింది వ్యవసాయాన్ని వదిలివేయడమే. రెండు కథలూ దాన్నే సూచించాయి. రైతు భూమిని వదిలి ఏ పని చేసినా తప్పుపట్టే నైతికార్హత  సమాజానికి లేదని  ‘గౌరవం’ కథ కాస్త ఆగ్రహంగా చెబితే, ‘ఊరవతల ఊడల మర్రి’ కథ ఇదే విషయాన్ని రైతుకు సానునయంగా నచ్చజెప్పింది. ఆ విధంగా అవి అనవసర ప్రాణనష్టాన్ని నివారించ ప్రయత్నించాయి. అందుకే ఇవి మంచి కథలయ్యాయి.

అదే సమయంలో భూమినుండి రైతును బయటికి తరమివేసే రాజకీయార్ధిక క్రమానికి లోబడే ఈ రెండు కథలూ వాటి  ముగింపులూ ఉన్నాయి. కాకపోతే ఆ క్రమం వీలైనంత సులువుగా సాగేందుకు వీలుగా – అయిష్టంగానే, వేరే దారిలేకే – రైతునూ, సమాజాన్ని  సిధ్ధం చేశాయి. దీనికి ఆయా రచయితలను కూడా తప్పు పట్టలేం. మొత్తం సమాజం యొక్క చైతన్య స్థాయిని, సామూహిక కార్యాచరణనూ పెంచే .. స్థిరమైన, బలమైన పోరాట కేంద్రాలు లేని సామాజిక వాస్తవికత -పరిష్కారాలు సూచించడలో వాళ్ళ సృజనకు పరిమితులు విధించి వుండొచ్చు.

అయితే సమాజం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. రైతులే కాదు కష్టజీవులందరూ వారివారి వనరులనుండి దూరంచేసే ప్రయత్నాలను తప్పక ప్రతిఘటిస్తారు. ఆలోచనపరులుగా రచయితల బాధ్యతేమంటే – ఆ ప్రతిఘటన ఎంత సూక్ష్మరూపంలో ఉన్నా, ఎంత బలహీనంగా ఉన్నాగుర్తించడం. తమ తమ సృజనతో దానిని బలపరచి స్పష్టమైన రూపమిచ్చి తిరిగి ఆయా వర్గాలకు ఆయుధంగా అందించడం.  చైతన్య, చందు తులసి కథల వెనుక వారి సంవేదన, నిజాయితీలను చూస్తే భవిష్యత్తులో ఆ బాధ్యత నెరవేరుస్తారనే ఆశ కలుగుతున్నది.

మాలిష్…మాలిష్!

 

రచన – ఇస్మత్ చుగ్తాయీ

అనువాదం – కె. బి. గోపాలం

~

 

బహుశ ముఠ్ఠీ మాలిష్ అనే ఈ కథ 1956 ప్రాంతంలో ప్రచురితమయింది. బొంబాయిలోని బడుగు వర్గాల స్త్రీల పరిస్థితి ఈ కథలో చిత్రింపబడింది. కథ చెపుతున్న ఆడమనిషితోబాటు రత్తిబాయి. గంగబాయి అని రెండు పాత్రలు ఇందులో కనబడతాయి. తరువాత ఈ కథను ముగ్నీ తబస్సుం, వహీద్ అన్వర్ గారల సంపాదకత్వంలో వచ్చిన కహానియా సంపుటి 1 లో ప్రచురించారు. అయితే అక్కడ తేదీ ప్రసక్తి కనబడదు. ఆ సంపుటి బహుశ 1975 ప్రాంతంలో వచ్చి ఉంటుంది. వహీద్ అన్వర్ గతించారు. ముగ్నీ తబస్సుం గారికి కథ వచ్చిన తేదీగానీ సంచికగానీ గుర్తు లేవు. అదే ప్రచురణకర్తలు,  ఉర్దూ క్లాసిక్స్ వారు 1985లో కహానియా రెండవ సంపుటాన్ని ప్రచురించారు. పోలింగ్‌ స్టేషన్‌ దగ్గర తొక్కిడిగా జనం ఉన్నారు. అక్కడికేదో సినిమా మొదటి దినం లాగ! లైను కొన కనిపించకుండా ఉంది. అయిదేండ్ల కింద కూడా అచ్చం ఇట్లాగే లైను ఉంది. అక్కడ తిండిగింజలు చవకగా పంచిపెడుతున్నట్టు! ఓట్లేయడానికి  వచ్చినట్టు మాత్రం కాదు. అందరి ముఖాల్లోనూ ఆశాభావం కనపడుతున్నది. లైను ఎంత పొడుగు ఉంటేనేమి, ఎప్పుడో ఒకసారి మన అవకాశం రానే వస్తుంది. ఇక చూచుకోండి, ఆ తరువాత కట్టలు కట్టలుగా పైసలు! అతను మాకు బాగా నమ్మకం ఉన్న మనిషి. మొత్తానికి మనవాడు ఎన్నికవుతాడు. కష్టాలన్నీ తీరిపోతయి.

*

Spring Explosive‘బాయీ, ఓ బాయీ! ఎట్లున్నవు?’ మాసిపోయిన చీర చుట్టుకున్న ఒక ఆడమనిషి తన పసుపు గారపళ్లను బయటపెట్టి  ఇకిలిస్తూ, నా చేయి పట్టుకున్నది.

‘ఓ నీవా? గంగాబాయి….’

‘కాదమ్మా, రత్తిబాయిని! గంగబాయి వేరె. సచ్చిపాయెగద, పాపం’

‘అయ్యో, అట్లనా….’

ఒక్కసారి నా మెదడు అయిదు సంవత్సరాలు వెనుకకు వెళిపోయింది. ‘రుద్దుడా? గుద్దుడా?’ అడిగాను.

‘రుద్దుడే’ రత్తిబాయి కన్ను గీటింది. ‘ఒద్దే అని చెప్తనే ఉన్న. అది ఇంటదా? బలుపు ఆడిది. బాయి, ఓటు ఎవర్కి  ఏస్తున్నవ్‌?’

‘మరి నీవు? ఎవరికేస్తవ్‌?’ ఒకరినొకరు అడుక్కున్నాము.

‘మా కులపాయన ఉన్నడు. మాతాననే ఉంటడు.’

‘అయిదేండ్లకింద గూడ మీరంత కులపాయనకే ఓటేస్తిరి. కాదు?’

‘అవును బాయి. కానీ, ఆడు దొంగముండకొడుకు. ఏం పనిజెయ్యలే’ ముఖం వేలవేసి అన్నదామె.

‘ఇగ ఇప్పుడు ఈయనగూడ మీ కులపాయననేగద?’

‘ఈయన శాన మంచోడు. అవును బాయి, సూస్తవ్‌గద. మాకంత పొలాలిప్పిస్తడు.’

‘అంటే, నీవింక ఊరికివొయ్యి వొడ్లు దంచుతవు.’

‘ఔ, బాయి’ ఆమె కళ్లు మెరిశాయి.

అయిదు సంవత్సరాల క్రితం ఆసుపత్రిలో ఉన్నాను. మా మున్నీ పుట్టిన కాన్పు కొరకు. రత్తిబాయి తమ కులపాయనకు ఓటేసేందుకు పోతున్నట్లు చెప్పడం గుర్తుంది. వేలమంది ముందు ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం గొప్ప మార్పు చేస్తానన్నాడు. పాలు నదుగా పారుతాయని, బతుకంతా తేనె అవుతుందని అన్నాడు. అయిదేండ్ల తరువాత, ఇవాళ రత్తిబాయి చీర మరింత మురికిగ ఉంది. తల మరింత పండింది. కళ్లలో మెరుపు తగ్గింది. ఈసారి వినిపించిన వాగ్దానాలను ఊతం కర్రగా పట్టుకుని నడుస్తూ, ఆమె మళ్లీ ఓటెయ్యడానికి వచ్చింది.

……..

Akkadi-MeghamFeatured-300x146

‘బాయి, ఆ లంజెముండతోటి అంతగనము ఎందుకు మాట్లాడ్తవ్‌?’ రత్తిబాయి తన సలహాల మూట విప్పుతూ,  బెడ్‌పాన్‌ను నా మంచం కింద నెట్టింది.

‘ఏమి? ఏం సంగతి?’ ఏమీ తెలియనట్టు నేను అడిగాను.

‘చెప్తిగద. అది మంచి ఆడిదిగాదు. పాడు మనిషి. లంజె.’

రత్తిబాయి రావడానికి కొంచెం ముందే, గంగాబాయి సరిగ్గా ఇదే మాటలతో ఈమె గురించి తన అభిప్రాయం చెప్పింది. ‘రత్తిబాయి అస్సలు దొంగది’ అన్నదామె. ఆస్పత్రిలో ఉన్న ఈ పనివాళ్లు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. అప్పుడప్పుడు గుద్దులాట దాకా వస్తారు. నాకు వాళ్లతో మాట్లాడడం సరదాగా ఉండేది.

‘ఆ శంకర్‌గాడు ఉన్నడుగదా, దాని అన్న కానేకాడు. దానికి మిండగాడు! వాని దగ్గర అది పండుతది’ గంగాబాయి చెప్పింది.

రత్తిబాయి మొగుడు దూరంగా ఒక పల్లెలో ఉంటాడు. ఉన్న కొంచెం పొలానికి అంటుకుని ఉంటాడు. పండినదంతా  అప్పు తీర్చడానికే సరిపోతుంది. కొంచెమేదో మిగిలితే, తొందరలోనే తీరుతుంది. అప్పుడు ఆమె పోయి ఆనందంగా పిల్లలతో ఉంటుంది. ఒడ్లు దంచి, ఉనుక వేరు చేస్తుంది. ఆ ఇద్దరు ఆడంగులు, ఆనందమయిన బతుకు గురించి, వడ్లు దంచడం గురించి కలలుగంటారు. మరెవరో పారిస్‌ గురించి కన్నట్టు!

‘కానీ రత్తిబాయి, పైసలు సంపాయించేందుకు నీవు పట్నం ఎందుకు వచ్చినవు? నీవుగాక మీ ఆయన వచ్చి ఉంటే, బాగుండునేమో?’

‘ఓ బాయి! ఆయనెట్లొస్తడు? పొలము పనిజేయాలి గద? ఎగుసము నా నుంచి అయితదా?’

‘మరి మీ పిల్లలను ఎవ్వరు చూస్తరు?’

‘ఒక లంజె ఉన్నది.’ ఆమె తిట్ల దండకం మొదలు పెట్టింది.

‘నీ మొగడు పెండ్లిజేసుకున్నడా ఎట్ల?’

‘దొంగ కొడుకు, గంత దైర్యమున్నాది? ఉంచుకున్నడు.’

‘నీవు లేనిదిజూచి ఇంటిపెత్తనము అది అందుకుంటె?’

‘అదెట్ల? తిత్తిదీసి గడ్డినింపుతా. అప్పుదీరెనా అంటె, నేను మళ్లవోతగద!’

 

రత్తిబాయి తన మొగడు,పిల్లలకు చాకిరిచేసేటందుకు ఆడ మనిషిని తానే ఎంపిక చేసిందని తరువాత అర్థమయింది. పొలం మీద అప్పు తీరితే, ఆమె ఇంటికి  వెళ్లిపోతుంది. ఇల్లాలుగా మారి వడ్లు దంచుతుంది. ఇక మరి ఆ ఉంపుడుగత్తె ఏమవుతుంది? ఆమెకు, పెండ్లాము పట్నం పోయిన మరొక మనిషి దొరుకుతడు. ఆ యింట్లో పిల్లలను సాకే పని దొరుకుతుంది.

‘ఆమెకు మొగడు లేడా?’ అడిగాను.

‘ఉన్నడు.’

‘మరి, ఆయన దగ్గర ఉండదా?’

‘వాని పొలము మందికి పొయ్యింది. వాడు జీతం చేస్తడు. యాడాదిలో ఎనిమిది నెలలు దొంగతనాలు చేస్తడు. పట్నముల తిరుగుతడు. దొంగపనులు చేసుకుంటు బతుకుతడు.’

‘ఆమెకు పిల్లలున్నరా?’

‘ఉండకేమి? నలుగురున్నరు. ఒగడు ఈ పట్నములనె పోగొట్కపోయిండు. దొర్కనే లేదు. ఇద్దరాడి పిల్లలు పారి పోయిన్రు. చిన్న పిలగాడు మాత్రము తండ్రితాన ఉన్నడు.’

‘నీవు ఊరికి ఎన్ని పైసలు పంపుతవు?’

‘మొత్తం నలబై ఒకటి.’

‘మరి నీ సంగతి?’

‘మా యన్న ఉన్నడుగద’ గంగాబాయి చెప్పిన అన్న ఆయనే!

‘మీయన్నకు పెండ్లాం పిల్లలు లేరా?’

‘ఉండకేమి?’

‘ఎక్కడున్నరు? ఊర్లనా?’

‘ఔ. శాన దూరం ఊరు. వాండ్లన్న ఎగుసము జేస్తడు.’

‘ఎవరు? మీ పెద్దన్ననా?’ ఆటపట్టించడానికి అడిగాను.

‘అగజూడు. ఇగ ఉండని. వాడు నాకెట్ల అన్న అవుతడు? ఓ బాయి, నన్నేమి గటువంటి ఆడిది అనుకున్నవా ఎట్ల?  నేను గంగబాయి అసువంటి దాన్నిగాను. తెలుసునా బాయి, నీ తాన ఉన్న పాత శీరలుగట్ల ఆ పాడుముండకు మాత్రం ఇయ్యకు. నాకే ఇయ్యి. సరేనా?’

‘రత్తిబాయి’

‘ఔ బాయి.’

‘మీయన్న నిన్ను కొడ్తడా?’

‘ఆ దుడుక గంగబాయి, అదే చెప్పుంటది. లేదు బాయి, అంతగనం ఏమి కొట్టడు. జర తాగుడు ఎక్కువయితె మాత్రమె. మళ్ల ఎన్కనె మారిపోతడు.’

‘ప్రేమ జూపుతడా?’

‘ఎందుకు జూపడు?’

‘కాని, రత్తిబాయి?, ఆ గాడిదిని అన్న అని ఎందుకంటవు?’

ఆమె నవ్వడం మొదుపెట్టింది. ‘బాయి, మా మాటలే అంత’

‘కానీ రత్తిబాయి? నలభయి ఒక్క రూపాయు వస్తయిగదా? మళ్ల ఈ లంజె తనమెందుకే?’

‘ఇగ మరి ఎట్ల గడవాలె? ఇంటికి పైసలు గావాలె. అది ఇల్లా? ఎలుకలగూడు. మీనికెల్లి దల్లాలుకు అయిదు రూపాయిలియ్యాలె.’

‘ఎందుకంటని?’

‘గాడ ఉన్న ఆడోండ్లు అందరు ఇయ్యాలె. లేకుంటె ఎలగొడ్తడు.’

‘అక్కడ ధంద చేస్తున్నందుకా?’

‘ఔ బాయి.’  ఆమె కొంచెం విస్తు పోయింది.

‘ఇగ మీయన్న. ఆయనేం జేస్తడు?’

‘బాయి, చెప్పగూడదు. ఆడు జేసేడిది లంగదందా. పోలీసోండ్లకు పైసలియ్యకుంటె ఎలగొడ్తరు.’

‘అంటె, పట్నము నుంచా?’

‘ఔ బాయి.’

ఈలోగా గదిలోకి ఒక నర్సు దూసుకువచ్చింది. తిట్లు మొదలుపెట్టింది. ‘ఇక్కడేమి ముచ్చట్లు పెట్టినవు? రూము నంబరు పదిలో బెడ్‌పాన్‌ మార్చాలె. పో’ అన్నది నర్స్‌. ఆమె నా పాపను ఊయల నుంచి ఎత్తుకుని వెళ్లిపోయింది.

………

 

ఆ సాయంత్రం గంగాబాయి డ్యూటీలో ఉంది. కనీసం బెల్‌ కూడ మోగించకుండ నా గదిలోకి వచ్చేసింది.

‘బాయి, బెడ్‌పాన్‌ కొరకు వచ్చిన.’

‘అదేమి గంగబాయి, కూచో.’

‘సిస్టరు తిడతది. దొంగముండ! నీకేంజెప్పింది?’

‘సిస్టరా? నన్ను రెస్టు దీసుకోమన్నది.’

‘కాదు, గా సిస్టరుగాదు. రత్తిబాయి సంగతి.’

‘గంగబాయిని వాండ్లన్న బాగ గొడ్తడని చెప్పింది.’ ఆటపట్టించాను.

‘దొంగముండ, తియ్యి. వానికంత దైర్యమా?’ గంగాబాయి నెమ్మదిగా నా కాళ్లమీద పిడికిళ్లతో కొట్టడం మొదలు పెట్టింది.

‘బాయి, నీ పాత చెప్పులు ఇస్తనంటివి.’

‘సరే. అట్లనెదీస్కో. కానీ నీ మొగనిదగ్గరి నించి ఉత్తరం వచ్చిందా? చెప్పు.’

‘ఔను. గా సిస్టర్‌ లంజె సూసిందంటె, పెద్ద లొల్లి లేప్తది. ప్రతిదాన్కీ లొల్లె’ అంటూనే గంగాబాయి నా చెప్పు మీదికి దాడి చేసింది.

‘గంగాబాయి.’

‘ఔ బాయి.’

‘నీవు మళ్ల ఊరికి ఎప్పుడు ఓతవు?’

నల్లగా మెరిసే గంగ కళ్లు దూరాన ఉన్న పచ్చని పొలాల మీదకు మళ్లాయి. ఒక్కసారి ఊపిరిపీల్చి మెత్తగా మాట్లాడసాగింది. ‘దేవుని దయతోని ఈసారన్నా పంటలు బాగ పండాలె. ఇగ బాయి, నేను ఎల్లిపోత. పోయినసారి ఒడ్లన్ని  వానలల్లనే పాడయిపోయినయి.’

‘గంగబాయి,  నీ మొగనికి నీ దోస్తు సంగతి తెలుసునా?’ తరిచి అడిగాను.

‘ఏమంటున్నవు బాయి?’ ఆమె ఒక్కసారి మూగబోయింది. కొంచెం విస్తుపడినట్టు కనిపించింది. విషయం మార్చాని ప్రయత్నించింది. ‘బాయి, ఇద్దరు ఆడిపిల్లలె పుట్టిరి. సేటుకు కోపమొచ్చుండాలె. ఒచ్చిందే?’

‘సేటెవరు?’ తికమకపడి అడిగాను.

‘నీ మొగడు. కోపమొచ్చి ఇంకొగ పెండ్లి చేస్కుంటె!’

‘చేస్కుంటె, నేనొక మొగణ్ణి ఎతుక్కుంట.’

‘మీరు గూడ అట్లజేస్తరా బాయి. పెద్ద కులపోళ్లయితిరి?’ ఆమె పెద్ద కులాలను ఎద్దేవా చేస్తున్నదని నాకు అర్థమయినట్టే ఉంది. నేను అర్థం చేయించడానికి ప్రయత్నించాను. అయినా సరే, రెండవసారి కూడా ఆడపిల్లను కని నేను తన్నులు తిన్న వలసినంత తప్పు చేశానని, ఆమె గట్టిగ నమ్ముతున్నది. మా సేటు నన్ను చావగొట్టకపోతే, అతను మంచి సేటే కాదు!

…….

 

ఆసుపత్రిలో ఉండడమంటే ఒంటరిగా జైల్లో ఉండడానికి తక్కువేమీకాదు. మిత్రులు, పరిచయస్తులు సాయంత్రం పూట రెండు గంటలపాటు చూడవస్తారు. మిగతా సమయమంతా, నేను గంగాబాయి, రత్తిబాయితో మాట్లాడుతూ గప్పాలు కొడుతూ కాలం గడపాలి. వాళ్లు లేకుంటే, నేను ఎప్పుడో పిచ్చెత్తి చచ్చి ఉండేదాన్ని. కొంచెమేదో లంచం ఇస్తే చాలు, ఒకరి గురించి ఒకరు బోలెడు సంగతులు చెప్తారు. అవి నిజాలా, అబద్ధాలా అన్నది వేరే సంగతి. ఒకనాడు నేను  రత్తిబాయిని ఒక ప్రశ్న అడిగాను. ‘నీవు మిల్లులో పనిజేస్తుంటవి గద. ఎందుకు ఇడిసిపెట్టినవ్‌?’

‘ఓ బాయి, ఆ మిల్లు పెద్ద గడుబడ!’

‘ఏమట్లా?’

‘ఓ బాయి. ఒక్కటేందంటే, పని శాన కష్టం. అయినా మానె. చెయ్యొచ్చు. కానీ, ఆ కొడుకు రొండు నెలలు గాంగనె ఎలగొడ్తడు.’

‘ఎందుకని?’

‘వేరెటోండ్లను పెట్కుంటరు.’

‘ఎందుకట్ల జేస్తరు?’

‘ఎందుకేంది? ఆరు నెలలు నౌకరి జేస్తే, మరి గట్టి చెయ్యాలెగద?’

‘ఓ, అర్తమయింది.’

మరో మాటలో చెప్పాలంటే, అప్పుడప్పుడు మొత్తం సిబ్బందిని మార్చేస్తారు. ఒకే మనిషి ఎక్కువ కాలం పనిలో ఉంటే, సిక్‌ లీవ్‌, మెటర్నిటీ లీవ్‌ అన్నీ చట్టం ప్రకారం ఇవ్వాలి. అందుకే, రెండు నెలలకొకసారి సిబ్బందిని మారుస్తారు.  ఆ పద్ధతిని ఒక మనిషికి ఏటా నాలుగు నెలలు మాత్రమే పని దొరుకుతుంది. ఆ మధ్యకాలంలో ఆడవాళ్లు పల్లెకు వెళిపోతారు. అది కుదరనివాళ్లు మిగతా కార్ఖానా చుట్టూ పని కోసం తిరుగుతారు. లేదంటే, రోడ్డు పక్కన కూరలు అమ్ముతూ బతుకుతారు. అక్కడ తిట్ల పోటీలు, సిగపట్ల పోటీలు ఉంటాయి. లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు పోలీసువాళ్లకు మామూళ్లు ఇవ్వాలి. ఇచ్చినా సరే, మళ్లీ ఒక కొత్త ఆఫీసరు వస్తే, గోల మొదవుతుంది. మూట సర్దుకుని కొంతమంది పక్క సందులోకి జారుకుంటారు. కొంతమంది పట్టుబడి గొంతు చించుకుని ఏడుస్తారు. పోలీసు వాళ్లను స్టేషన్‌కు లాక్కుపోతారు. చూస్తూండగానే మళ్లీ తిరిగి వస్తారు. చింపు బొంత పరిచి మళ్లీ సంతపెడతారు. తెలివిగలవారు  నాుగు నిమ్మకాయలు లేదా మక్క బుట్టలు మూటగట్టుకుని తాము కొనవచ్చినవాళ్లలాగ, తచ్చాడతారు. పక్కనుండే వారితో గుసగుసగా ‘అన్నా, మక్కబుట్టలు. ఏకానకు ఒకటి.’ అంటూ గుసగుసపోతారు. వాళ్ల దగ్గర వస్తువు కొనడం అంటే కలరాను ఇంటికి తెచ్చుకున్నట్టే లెక్క.

మరీ అన్యాయమయినవాళ్లు బిచ్చమెత్తుతారు. వీలయినచోట చేతివాటం చూపించడానికి కూడా వెనకాడరు. నోట్లో ఉన్న పొగాకును నములుతూ, రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోని చీకటి సందుల్లో తిరుగుతూ ఉంటారు. కస్టమర్‌ నడిచి వస్తాడు. కళ్లచూపుతోనే మాట్లాడుకుని బేరాలు కుదుర్చుకుంటారు. పై ఊరు నుంచి వచ్చిన పాలవాళ్లు, పెళ్లాం  ఊళ్లలో ఇళ్లలో ఉన్న కూలీవాళ్లు, నిరంతర బ్రహ్మచారులు వీళ్లకు కస్టమర్లు. ఆ మురికి గొందులే వాళ్లకు ఇళ్లు.

…….

ఒకనాడు ఉదయాన వరండాలో ఇద్దరు బాయీలు యుద్ధానికి దిగారు. రత్తిబాయి, గంగాబాయి కొప్పును ఒడిసి పట్టుకున్నది. గంగాబాయి, రత్తిబాయి మంగళసూత్రాన్ని తెంపింది. అక్కడితో తనకు వైధవ్యం వచ్చినట్టు, ఆ ఆడమనిషి ఆగకుండ ఏడుపు లంకించుకున్నది. వాళ్ల కొట్లాటకు కారణం వెతికితే, కడుపుతో ఉన్న ఆడవాళ్లు వాడిపడేసిన లేదా గాయాలు తుడిచి పడేసిన కాటన్‌ పాడ్స్‌ దాకా కథ వెళ్లింది. చట్టం ప్రకారం ఆ దూదిని కాల్చేయాలి. కానీ, ఈ బాయీలు ఇద్దరూ, ఆ కాటన్‌ను తీసికెళ్లి శుభ్రం చేసి ఇంటికి ఎత్తుకుపోతున్నారట! ఈ మధ్యన ఇద్దరికీ తగాదాలెక్కువయి సంగతిని  గంగాబాయి సూపర్‌వైజర్‌ చెవిన వేసింది. రత్తిబాయి తిట్లు మొదుపెట్టింది. త్వరలోనే ముష్టియుద్ధం మొదలయింది.  ఇద్దరి ఉద్యోగాలు ఊడవసిందే. కానీ, కాళ్లు గడ్డం పట్టుకున్న తరువాత సూపర్‌వైజర్‌ వ్యవహారాన్ని కప్పి ఉంచాడు.

రత్తిబాయి కాస్త బొద్దుగా ఉంటుంది. కనుక చెయ్యివాటం బాగా చూపగలిగింది. గంగాబాయి ఆ తరువాత బెడ్‌ పాన్‌ మార్చడానికి వచ్చినప్పుడు ముక్కు వాచి కనిపించింది. ‘ఆ దూదితో ఏం చేస్తారు, రత్తిబాయి?’ నేను అడిగాను.

‘కడిగి ఎండబెడితే, మళ్ల పనికొస్తది.’

‘ఎట్ల?’

‘దూది కొనెటోండ్లు ఉంటరు.’

‘గంత మురికి దూదిని ఎవరు గొంటరు?’

‘పరుపు కుట్టెటోండ్లు. సోఫలు బాగజేసేటోండ్లు.’

‘ఓయమ్మో!’ నా వొళ్లు జదరించింది.  ఇంట్లో పేము సోఫాలోని దిండ్లను మళ్లా కుట్టించాలని తీసినప్పుడు వాటిలోని దూది నల్లని నలుపుగా ఉండడం గుర్తుకువచ్చింది. అంటే, ఆసుపత్రుల్లో వాడి పడేసిన దూది అక్కడికి వచ్చిందా ఏమిటి? నా బిడ్డ పడుకున్న పరుపులో దూది ఎక్కడిది? పువ్వులాంటి నా కూతురు క్రిముల మీద పడుకున్నదా? ఈ గంగాబాయి పాడుబడ! రత్తిబాయిని దేవుడు ఎత్తుకుపోను!

ఇద్దరూ చెప్పుతోటి కొట్టుకునే వరకు వచ్చారు గనుక రత్తిబాయి కడుపులో రగిలిపోతున్నది. గంగాబాయి వయసులో చిన్నది. కనుక అది మరింత ఎక్కువ పాపం చేస్తున్నదని రత్తిబాయి అభిప్రాయం. అగ్గిలో నెయ్యిపోసినట్టు, ఆ మనిషి గంగబాయి కస్టమర్లను మరల్చుకున్నది. గంగాబాయికి ఎన్ని అబార్షన్స్‌ జరిగినయో. ఒకసారి బతికి ఉన్న బిడ్డను చెత్త కుప్ప మీద పడేసిందట! నోట్లో ఏవో కుక్కినా, ఆ బిడ్డ కదులుతూనే ఉన్నదట. జనమంతా అక్కడ పోగయ్యారు. రత్తిబాయి తలుచుకుంటే, సంగతి బయటపెట్టి ఉండేదే. కానీ, రహస్యాన్ని ఎదలో దాచుకున్నది. మరిప్పుడేమో ఆ పాపి మనిషి ఏ పాపమూ ఎరగనట్టు దారి పక్కన కూచుని పచ్చి రేగుకాయలు, జామకాయలు అమ్ముతున్నది.

‘దోస్తీ సంగతి సరేగాని రత్తిబాయి, ఏమన్న అయితే ఏంజేస్తరు? దవఖానకు పోవొచ్చుగద?’

‘ఎందుకు పోవాలె? మా బాయిలల్ల డాక్టర్లకంటె తెల్విగలోండ్లు ఉన్నరు.’

‘కడుపు పడేందుకు మందులిస్తరా?’

‘ఔ ఇస్తరు. ఏమనుకున్నవు? ఇగ పిడికిళ్లు ఉండనే ఉండె. మాలిషు మరింత బాగ పనిచేస్తది.’

‘పిడికిళ్లేంది? మాలిషేంది?’

‘బాయి, నీకు దెల్వది.’  రత్తిబాయి ముఖం కొంచెం ఎర్రనయింది. ఆమె నవ్వు మొదలు పెట్టింది. కొంతకాలంగా ఆమె నా పౌడరు డబ్బా మీద కన్ను వేసింది. దాన్ని ముట్టుకున్నప్పుడల్లా, ఒక చిటికెడు తీసి అరచేతిలో వేసుకుని బుగ్గకు రుద్దుకుంటుంది. ఆ డబ్బా ఇస్తే సంగతి మొత్తం తెలుసుకోవచ్చునని నాకు తోచింది. నేను ఇవ్వజూపే సరికి, ఆమె భయపడింది.

‘ఒద్దు బాయి, సిస్టర్‌ జంపుతది.’

‘ఏం గాదు. వాసన నచ్చక నేనే ఇచ్చిననని చెప్త.’

‘అగో, వాసన ఎంత బాగున్నది? ఓ బాయి, తిక్కగాని లేచిందా ఏమి?’

చాలాసేపు పోరాడిన తరువాత ఆమె రుద్దుడు, గుద్దుడు గురించి వర్ణించి వివరం చెప్పింది.

‘రుద్దుడు’ పద్ధతి కడుపు వచ్చిన మొదటి దశలో పనిచేస్తుంది. డాక్టర్‌ పద్ధతిలో అది ఫస్ట్‌ క్లాస్‌ అట! కడుపొచ్చిన మనిషిని పడుకోబెడతారు. పై కప్పులోని దూలం నుంచి కట్టిన ఒక తాడు పట్టుకుని ఆమె కడుపు మీదకు బాయి ఎక్కు తుంది. ‘ఆపరేషన్‌’ ముగిసేదాకా కాళ్లతో రుద్దుతుంది. లేదంటే మరొక పద్ధతి ఉంది. బాయి తన జుట్టును తడి నెత్తిన కొప్పుగా కట్టుకుంటుంది. ఆడమనిషిని గోడకు నిలబెడుతుంది. తన జుట్టుమీద ఆవనూనె పోసుకుంటుంది. దాంతో ఆడమనిషి కాళ్లను కుమ్ముతుంది. కొంతమంది ఆడవాళ్లకు ఈ పద్ధతితో పని జరగదు. అప్పుడు గుద్దుడు మొదవుతుంది.  చేతులను నూనెలో ముంచి కడుపు రుద్ది పనికానిస్తారు.

మొదటి దాకిడితోనే, చాలా సందర్భాలో ఆపరేషన్‌ అంతమవుతుందట! పనిలోకి దిగింది అనుభవంలేని మనిషి అయితే, కాలు చెయ్యి విరిగే అవకాశం ఉందట. అయితే, మాలిష్‌ అనే రుద్దుడు పద్ధతితో ఎక్కువమంది చావరు. కాకుంటే, వాళ్లకు రకరకాల రోగాలు పట్టుకుంటాయి. ఒంట్లో భాగాలు వాపు చూపుతాయి. ఆ తరువాత చచ్చినా చావచ్చు.  గుద్దుడు పద్ధతిని ఎప్పుడో మాత్రం వాడరట! మిగతా పద్ధతులు పనిచేయకుంటేనే వాడతారు. బతికి బయటపడ్డవాళ్లు నడక చేతగాక కష్టపడతారు. నాలుగేళ్లు బతికి ఆ తరువాత పోతారు.

 

నాకు కడుపులో తిప్పి వాంతి వచ్చింది. వివరం వర్ణిస్తున్న రత్తిబాయి భయపడి పారిపోయింది. ఆసుపత్రి ప్రశాంతత నన్ను మరింత కుదిపింది. మరొక జీవాన్ని ఈ ప్రపంచంలోకి తెచ్చినందుకు ఇంతటి భయంకరమయిన శిక్షలా? నేను శూన్యంలోకి కదిలిపోతూ, ఆలోచించాను.

నా వొళ్లంతా భయంతో వణికిపోయింది. రత్తిబాయి జీవం నింపుతూ, చిత్రించిన రంగు బొమ్మలు నా కళ్ల ముందు మెదిలాయి. కిటికీ కర్టెన్‌ నీడలు గోడమీద కదులుతున్నయి. అది త్వరలోనే నాకు రక్తం నిండిన శవంలా కనిపించ సాగింది. గంగాబాయి రుద్దుడు పద్ధతికి గురయిన శవం అది. గోళ్లలో మురికి నిండిన ఒక పిడికిలి నా మెదడులో దిగబడింది.  చిన్ని వేళ్లు, వేలాడుతున్న మెడ రక్తం మడుగులో, జరిగిన పద్ధతికి బహుమతి అన్నట్టు కళ్లముందు కదలాడింది. నా గుండె దిగజారిపోయింది. మెదడు మొద్దుబారింది. గొంతెత్తి ఎవర్నయిన అరిచి పిలవాలని ఉంది. కానీ, నా నోట మాట రావడం లేదు. బెల్‌ మోగించాలి అనుకున్నాను. చెయ్యి కదడంలేదు. నా యెదలో మూగ అరుపులు గజిబిజిగా వినపడుతున్నాయి.

ఆసుపత్రి నిశ్శబ్దంలో ఒక్కసారిగా హత్యకు గురయిన ఎవరో అరిచినట్టు ఉంది. ఆ ఎవరో నా గదిలోనే ఉన్నట్టు ఉంది. కానీ నాకు వినిపించడం లేదు. ఆ అరుపు నా గొంతులోనే వస్తున్నట్టున్నాయి. కానీ వినిపించడం లేదు.

‘ఏమిటమ్మా, కల వచ్చిందా?’ ఇంజక్షన్‌ గుచ్చుతూ నర్స్‌ అడిగింది.

‘సిస్టర్‌, వద్దు. అటుచూడు, గంగాబాయి రుద్దిన శరీరం శవమై శిలువమీద నిలబడి ఉంది. దాని అరుపులు నా గుండెను బల్లాలతో పొడుస్తున్నాయి. ఎక్కడో కాలువలోపడ్డ చిన్న ప్రాణం ఏడుపు నా మెదడు మీద సుత్తెతో బాదుతున్నాయి.  మార్ఫీన్‌ ఇచ్చి నా మెదడును నిద్రపుచ్చకు. రత్తిబాయి పోలింగ్‌ బూతుకు పోతుంది. కొత్తగా ఎన్నికయిన మంత్రి వాళ్ల కులం వాడే. ఆమె అప్పు వడ్డీతో సహా తీరుతుంది. గంగాబాయి ఆనందంగా వొడ్లు దంచుతుంది. నా మెదడుమీద నుంచి ఈ నిద్ర తెరను ఎత్తేసెయ్‌. నన్ను మెలుకువగా ఉండనీ. తెల్లని దుప్పటి మీద గంగాబాయి రక్తం మరకలు వెడల్పు అవుతున్నాయి.  నన్ను మెలుకువగా ఉండనీ’.

…….

బల్ల వెనుక కూచున్న మనిషి నా ఎడమచేతి వేలి మీద ఇంకు చుక్కతో గుర్తు పెడుతూ ఉంటే, నాకు మళ్లీ ప్రపంచం తెలిసింది.

‘నీ ఓటు మా కులపాయనకు ఎయ్యి, అట్లనేనా?’ రత్తిబాయి గట్టిగా చెప్పింది.

రత్తిబాయి కులపాయన బ్యాలెట్‌ పెట్టె ఒక పెద్ద పిడికిలిలా పైకి లేచి మొత్తం బలంతో నా గుండె, మెదడు మీద దాడి చేసింది. నేను నా ఓటు అందులో వేయలేదు.

……………

 

 

అనువాదకుని గురించి –

డాక్టర్ కె. బి. గోపాలం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పి. ఎచ్ డి పట్టం పొందారు. కొంతకాలం ఉపాధ్యాయుడుగా పని చేసిన తరువాత ఆకాశవాణిలో హైదరాబాద్ లో సైన్స్ కార్యక్రమాల అధికారిగా చేరారు.

గోపాలం నిర్వహించిన కార్యక్రమాలకు మంచి గుర్తింపు, బహుమతులు వచ్చాయి.

స్టేషన్ డైరెక్టర్ స్థాయిలో ఉండగా ఉద్యోగం వదిలేసి సంగీత సాహిత్య సేవలో కొనసాగుతున్నారు.

 

వైవిధ్యాన్ని ఇష్టపడే వ్యక్తిగా గోపాలం ఎన్నో రకాల పనులను తలకెత్తుకుని విజయాలు సాధించారు.

 

పుస్తకాలు చదవడం తనకు ఇంచుమించు వ్యసనం అంటారాయన. సమీక్షించడమూ అంతే ఇష్టమంటారు.

ఎన్నో విషయాలను గురించి పత్రికలలో, పుస్తకాలుగానూ రాశారు, రాస్తున్నారు.

ఉత్తమ పాపులర్ సైన్స్ రచయితగా గుర్తింపు, అవార్డులూ అందుకున్నారు.

ఎన్నో అనువాదాలు కూడా చేశారు.

ఇంటర్నెట్ లో వీరి బ్లాగులు చాలా పేరు పొందాయి.

దూరదర్శన్ లో గోపాలం నిర్వహించిన క్విజ్ కార్యక్రమం శాస్త్ర ఎంతో పేరు పొందింది. ఈ కార్యక్రమానికి గాను గోపాలం నంది అవార్డు అందుకున్నారు.

 

కర్ణాటక సంగీత రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా కూడా అవార్డులు అందుకున్నారాయన. సంగీతం సేకరించడం ఆయన పెట్టుకున్న పనులలో ముఖ్యమయినది.

 

సైన్స్ ఇంకా సంగీతం అంటే ప్రాణం పెట్టే రచయిత, పాఠకుడు, పరిశీలకుడు అయిన గోపాలం చేయవలసింది మరెంతో మిగిలి ఉంది అంటుంటారు.

కాండీడ్-5

 

 

6వ అధ్యాయం

 

భూకంపంలో పట్టణం ముప్పావు భాగం నాశనమైంది. మిగతా పట్టణాన్ని కాపాడుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు. భూకంపాలను నివారించడానికి కొంతమందిని కనులపండువలా సెగమంటల్లో సజీవదహనం చేయడమే అమోఘమైన ఉపాయమని కొయింబ్రా విశ్వవిద్యాలయం అదివరకే ప్రకటించేయడంతో, ఆ దారి మినహా మరో పరిష్కారం తోచలేదు అధికారులకు.

వావీవరసా లేని పెళ్లి చేసుకున్న ఓ బాస్క్ జాతీయుణ్ని, భోంచేస్తుండగా కోడిమాంసంలో వచ్చిన పందిమాంసం ముక్కల్ని పక్కన పడేసిన ఇద్దరు యూదులను పట్టుకున్నారు. విందు పూర్తయ్యాక పాంగ్లాస్, కాండీడ్ లను బంధించారు. నానాచెత్తా వాగినందుకు గురువును, గంగిరెద్దులా విన్నందుకు శిష్యుణ్ని దోషులుగా తేల్చేశారు. ఇద్దరినీ విడివిడిగా.. సూర్యకాంతి సోకి ఇబ్బంది పెడుతుందన్న భయం లేశమాత్రం లేని నేలమాళిగల్లో పడేశారు. వారం తర్వాత బయటకు తీసుకొచ్చి బలి దుస్తులు తొడిగి, తలలపై పొడవాటి కాగితపు టోపీలు పెట్టారు. కాండీడ్ బట్టలు, టోపీపై.. కిందికి తిరగబడిన మంటలు, పంజాలు, తోకల్లేని దెయ్యాల బొమ్మలు ఉన్నాయి. పాంగ్లాస్ బట్టలు, టోపీపై ఉన్న దెయ్యాలకు మాత్రం పంజాలు, తోకలు ఉన్నాయి. మంటలు కూడా పైకి లేచాయి. తర్వాత వాళ్ల వెనక మేళతాళాలతో అట్టహాసంగా బలి జాతర ప్రారంభించారు. వీనుల విందైన చర్చి పాటలను కూడా పాండించారు. కాండీడ్ ఆ గానమాధుర్యంలో ఓలలాడుతుండగా శిక్ష కింద చెళ్లుమని కొరడా దెబ్బ పడింది. బాస్క్ జాతీయుణ్ని, ఇద్దరు పోర్చుగీసు యూదులను సజీవ దహనం చేశారు. పాంగ్లాస్ ను ఉరి తీశారు. బలి వేడుకలో ఉరితీత ఆచారం కాకపోయినా అలా చేశారు. సరిగ్గా అదే రోజు మళ్లీ భారీ భూకంపం వచ్చింది.

candid

 

ఒళ్లంతా నెత్తురోడుతున్న కాండీడ్ భయంతో గడగడ వణికిపోయాడు. ఆ వణుకులోనే గురువులా మీమాంసలో పడిపోయాడు. ‘లోకాలన్నింటిలో ఇదే సర్వోత్తమ లోకమైతే, ఇక ఆ మిగతా లోకాలెలా తగలడి ఉంటాయో? బల్గర్ల చేతిలో ఇదివరకే కొరడా దెబ్బలు తిన్నాను కనక ఇప్పుడీ దెబ్బలు పెద్ద విశేషమేమీ కాదు. కానీ పాంగ్లాస్ సంగతేంటి? తత్వవేత్తల్లో దిగ్గజం లాంటి ఆ పెద్దాయనను ఉరితీశారు. దీనికి కారణమేంటి? పరమోత్తముడైన జేమ్స్ రేవులో జలసమాధి కావడం ఈ ఘటనల పరంపరలో భాగమా? దారుణంగా హతమైపోయిన తరుణీమణి క్యూనెగొండ్ కు ఆ ఘోరం తగిందేనా?’

అలా ఉపదేశాలు, కొరడా దెబ్బలు, ఉపశమనాలు, దీవెనలు, ఆలోచనలు అన్నీ ముగించుకున్న కాండీడ్ గాయాల నొప్పితో నిల్చోలేక అవస్థ పడుతుండగా ఓ వృద్ధురాలు దగ్గరికొచ్చింది. ‘ధైర్యం చిక్కబట్టుకో అబ్బాయ్! మెల్లగా నా వెంట కదులు’ అంది.

 

7వ అధ్యాయం

 7chap

ధైర్యంగా ఉండాలని చెప్పడం మటుకైతే చాలా తేలిక. పాటించడమే కష్టం. కాండీడ్ ఎలాగోలా కూడదీసుకుని కాళ్లీడ్చుకుంటూ ముసలమ్మ వెంట నడిచాడు. ఆమె అతణ్ని చివికిపోయిన గుడిసెలోకి తీసుకెళ్లింది. తిండి, మంచినీళ్లు ముందు పెట్టింది. గాయాలకు కుండెడు లేపనం, తొడుక్కోవడానికి రెండు జతల బట్టలు ఇచ్చి, మెత్తని పక్క అమర్చింది.

‘భోంచేసి, ఈ రాత్రికి సుఖంగా నిద్రపో! అటోచా మేరీమతా, పడువా ఆంథోని, కాంపోస్టెలా జేమ్స్ అవధూతలు నిన్ను కంటికి రెప్పలా కాపాడుగాక! నేను రప్పొద్దున మళ్లీ వస్తా’ అంటూ వెళ్లబోయింది.

ఇంతవరకు పడ్డ కష్టనష్టాలకే తేరుకోలేకపోతున్న కాండీడ్ ఆ ముసలావిడ ఆదరణ చూసి మరింత చకితుడయ్యాడు. కృతజ్ఞతతో ఆమె చేతిని ముద్దాడబోయాడు.

‘ముద్దాడాల్సింది నా చేతిని కాదులే. తిరిగి రేపొస్తా. మందు పూసుకుని, శుభ్రంగా భోంచేసి, హాయిగా నిద్రపో’ అందామె.

కాండీడ్ తన ఇక్కట్లను క్షణంలోనే మరచిపోయి కడుపునిండా బుక్కి, కంటినిండా నిద్రపోయాడు. ముసలామె పొద్దున్నే అల్పాహారం తెచ్చింది. వీపు చూసి మందు రాసింది. మధ్యాహ్నం భోజనం తెచ్చింది. రాత్రీ  తెచ్చింది. ఆ మర్నాడూ ఈ సేవలను తేడా లేకుండా చేసింది.

‘ఎవరివమ్మా నువ్వు? నాపై నీకెందుకింత ఆపేక్షా, ఆదరణా? నీ ఉపకారానికి బదులుగా నేనేమివ్వగలను?’ అడిగాడు క్షతగాత్రుడు.

ఆమె బదులివ్వకుండా వెళ్లిపోయింది. మళ్లీ పొద్దుగూకగానే వచ్చిందిగాని, భోజనం మటుకు తేలేదు.

‘అబ్బాయ్! ఒక్క మాట కూడా మాట్లాడకుండా నాతో రా..’ అంటూ అతని చేయి పుచ్చుకుని దారి తీసింది.

పావు మైలు నడిచి ఊరిబయటి తోటల, కాలవల మధ్య ఏకాంతంగా ఉన్న భవనం వద్దకు తీసుకెళ్లింది. తలుపు తట్టగానే తెరచుకుంది. ముసలమ్మ అతణ్ని ఓ మూలలోని మెట్లెక్కించి అందంగా అలంకరించిన గదిలోకి తీసుకెళ్లింది. పెద్ద ఆసనంపై కూర్చోబెట్టి, మళ్లీ వస్తానని చెప్పి తలుపు మూసి వెళ్లిపోయింది. కాండీడ్ కు అంతా కలలా అనిపిస్తోంది. గతం పీడకలలా, వర్తమానం తీపికలలా తోస్తోంది.

ముసలావిడ త్వరగానే వచ్చింది. రత్నాభరణాలు ధరించి, మేలిముసుగు వేసుకున్న గొప్పింటి యువతిని నెమ్మదిగా నడిపిస్తూ తీసుకొచ్చింది. ఆ యువతి కాండీడ్ ముందుకు రావడానికి కాస్త తడబడింది.
‘ఆ మేలిముసుగు తీసెయ్యి’ ముసలమ్మ కాండీడ్ తో అంది.

కాండీడ్ నెమ్మదిగా కదిలి వణుకుతున్న చేత్తో ముసుగు తీశాడు. సంభ్రమాశ్చర్యాలతో నోరెళ్లబెట్టాడు. తన కట్టెదుట ఉన్నది క్యూనెగొండేనా? ఇది కలా, నిజమా? తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. విస్మయంతో శక్తి సన్నగిల్లి, నోటమాట రాక దభిళ్లున ఆమె కాళ్లపై పడిపోయాడు. క్యూనెగొండ్ కూడా తన వంతుగా దభీమని దివానంపైన కూలబడిపోయింది. ముసలమ్మ వాళ్లద్దరిపైనా పన్నీరు చిలకరించింది. ఇద్దరూ తెప్పరిల్లుకుని కబుర్లు మొదలుపెట్టారు. మొదట సగం సగం మాటలు, తర్వాత సగం సగం ప్రశ్నలు, సమాధానాలు, ఊర్పులు, నిట్టూర్పులు, వగర్పులు, కన్నీళ్లు, వలపోతలు కొనసాగాయి. ఇద్దరూ మామూలు స్థితికి రావడంతో ముసలమ్మ కల్పించుకుని.. గొంతును వీలైనంత తగ్గించి కబుర్లాడుకోవాలని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయింది.

‘నువ్వు నిజంగా క్యూనెగొండ్ వేనా? అయితే నువ్వింకా బతికే ఉన్నావన్నమాట! నిన్నిలా పోర్చుగల్లులో కలుసుకోవడం చిత్రంగా ఉందే! మరైతే, ఆ దుర్మార్గులు నిన్ను బలాత్కరించి, ఒళ్లు చీరేశారని పాంగ్లాస్ చెప్పింది నిజం కాదన్నమాట..’

‘ఆయన చెప్పింది నిజమే. కాని, ఆ రెండు ఘోరాలకే మనుషులు చావరు.’

‘మీ అమ్మానాన్నలు? వాళ్లనూ చంపేశారా?’

‘ఔను..’ గుడ్ల నీళ్లు కక్కుకుంది క్యూనెగొండ్.

‘మీరి నీ అన్న?’

‘అతణ్నీ చంపేశారు.’

‘మరి నువ్వు పోర్చుగల్లుకు ఎలా వచ్చావు? నేనిక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది? ఈ ఇంటికి నన్నెలా రప్పించుకోగలిగావు?’

‘అంతా వివరంగా చెబుతాగాని, ముందు నీ సంగతి చెప్పు. నువ్వు నాకు అమాయకంగా ముద్దిచ్చి, దారుణంగా తన్నులు తిన్నాక ఏం జరిగిందో అంతా వివరంగా చెప్పు.’

ఆమె మాటంటే అతనికి శిలాశాసనమే. చెప్పడానికి బోల్డంత సిగ్గేసినా, గొంతు వణికి మాటలు తడబడినా, వెన్నుగాయం సలుపుతూనే ఉన్నా.. ఆమె నుంచి విడిపోయిన క్షణం నుంచి ఈ క్షణం దాకా ఏం జరిగిందో ఎంతో అమాయకంగా, ఉన్నదున్నట్టు పూసగుచ్చినట్టు చెప్పాడు. క్యూనెగొండ్ చలించిపోయింది. పాంగ్లాస్, జేమ్స్ ల మరణానికి దుఃఖిస్తూ పైలోకానికేసి చూసి కన్నీటిబొట్లను టపటపా రాల్చింది. కాండీడ్ కథనం పూర్తి చేయగానే తన కథ వినిపించడం మొదలుపెట్టింది. కాండీడ్ ఆమె చెబుతున్నంతసేపూ రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తూ, ఎంతో శ్రద్ధగా, ఒక్కమాట కూడా చెవిజారిపోకుండా విని ఉంటాడని మీరే ఊహించుకోగలరు.

 

8వ అధ్యాయం

8chap (1)

‘ఒక రోజు రాత్రి నేను గాఢనిద్రలో ఉండగా దేవుడి దయవల్ల బల్గర్లు అందాలు చిందే మా థండర్ టెన్ ట్రాంక్ కోటలోకి చొరబడి నా తల్లిదండ్రులను ఖూనీ చేశారు. మా నాన్న, అన్నల గొంతులను పరపరా కోశారు. మా అమ్మను ముక్కలుముక్కలుగా నరికారు. ఆ రక్తపాతం చూసి మూర్ఛపొయ్యాను. ఆరడుగుల ఎత్తున్న ఓ భారీకాయుడు నన్ను చెరచడానికి మీదపడ్డాడు. దాంతో స్పృహలోకొచ్చి గట్టిగా కేకలేశాను. పెనుగులాడాను, కరిచాను, రక్కాను. వాడి కనుగుడ్లను పీకిపారేద్దామనుకున్నాను. మా ఇంట్లో జరిగింది యుద్ధంలో జరిగే మూమూలు తంతేనన్న సంగతి అప్పుడు నాకు తెలియదు. ఆ పశువు నా ఎడమ తొడపై తీవ్రగాయం చేశాడు. ఆ మచ్చ ఇప్పటికీ ఉంది.’

‘అయ్యయ్యో! ఏదీ చూపించవూ..’

‘తర్వాత చూద్దువుగానీలే. ముందు నా కథ సాంతం చెప్పనివ్వు.’

‘సరే, అలాగే’ అని కాండీడ్ ఊ కొట్టగానే క్యూనెగొండ్ మళ్లీ కొనసాగించింది.

‘ఇంతలో ఓ బల్గర్ దళనాయకుడు లోనికొచ్చాడు. నెత్తురోడుతున్న నా దురవస్థను కళ్లారా చూశాడు. నాపై పడ్డ ఆ సైనికుడు కాస్త కూడా పక్కకు కదల్లేదు. సైనికుడు వందనం చెయ్యకపోవడంతో తనకు పెద్ద అగౌరవం జరిగిపోయిందని ఆ దళనాయుడు ఉద్రేకంతో రెచ్చిపోయి ఆ నరపశువును గుంజి, పక్కకు ఈడ్చిపారేశాడు.

తర్వాత నా గాయాలకు కట్టుకట్టించి, యుద్ధఖైదీగా తన మాకాంకు తీసుకెళ్లాడు. నేను అతని బట్టలు ఉతికేదాన్ని. అతనికి ఉన్నవి కొన్నే అనుకో. వంట కూడా చేసేదాన్ని. నేను చాలా అందగత్తెనని, పనికొస్తానని అతడనుకున్నాడు. ఆ మాట పైకే అనేవాడు కూడా. అతడూ అందగాడేననుకో. ఒళ్లు పుష్టిగా మంచి ఆకారంలో, తెల్లగా, కోమలంగా ఉండేది. అంతే, అంతకుమించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. తెలివితేటలు గుండుసున్న. తత్వశాస్త్రం ఒక్కరవ్వ కూడా అర్థం కాదు. పాంగ్లాస్ పండితుడి వద్ద శిష్యరికం చేయలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. మూడు నెలల తర్వాత అతని దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయింది. నాపైన మోజూ తీరిపోయింది. దీంతో నన్ను డాన్ ఇసాకర్ అనే యూదుకు తెగనమ్మేశాడు. ఇసాకర్ కు పోర్చుగల్లు, హాలండ్ లలో వ్యాపారాలున్నాయి. కామపిశాచి. నేనంటే పడిచస్తాడు. కానీ అంతకుమించి ఏమీ చేయలేడులే. నేను ఆ బల్గర్ సైనిక పశువుకంటే ఇతగాడినే తేలిగ్గా అడ్డుకోగలుగుతున్నాను. మర్యాదగల మగువ ఒకసారి బలాత్కారానికి గురైతే గురికావచ్చు కాని, ఆ అనుభవంతో ఆమె గుణగణాలు మరింత ఇనుమడిస్తాయి. నన్ను ఎలాగైనా మంచి చేసుకుని లోబరచుకోవాలని ఇసాకర్ ఈ ఇంటికి తీసుకొచ్చాడు. థండర్ టెన్ ట్రాంక్ కోటకు సాటివచ్చే కోట ఈ ఇలలో లేదని ఇంతవరకూ అనుకునేదాన్ని. కానీ అది శుద్ధ పొరపాటని ఇప్పుడర్థమైంది.. ’ గదిని చుట్టూ కలియజూస్తూ చెప్పసాగింది క్యూనెగొండ్.

‘ఈ పట్టణంలోని ఉన్నత మతవిచారణాధికారి ఓ రోజు నన్ను ప్రార్థన వేడుకల్లో చూశాడు. అలాగా ఇలాగా కాదు, కళ్లు తిప్పుకోకుండా చూశాడు. తర్వాత నాతో వ్యక్తిగత విషయాలను ఏకాంతంగా మాట్లాడాల్సి ఉందని కబురు పెట్టాడు. నన్ను అతని భవంతికి తీసుకెళ్లారు. అతనికి నా పుట్టుపూర్వోత్తరాలను వివరించాను. నేను ఓ ఇజ్రాయెల్ జతీయుడి వద్ద ఉంటూ నన్నూ, నా వంశాన్నీ, అంతస్తును ఘోరాతిఘోరంగా కించపరచుకుంటున్నానని ఆక్షేపించాడు. తర్వాత.. నన్ను మర్యాదగా తనకు అప్పగించాలని ఇసాకర్ కు ప్రతిపాదన పంపాడు. ఇసాకర్ రాజులతో డబ్బులావాదేవీలు నడిపేవాడు కావడం వల్ల, బోల్డంత పలుకుబడి ఉండడం వల్ల ఆ మతపెద్దను లెక్కచేయలేదు. దీంతో మతపెద్ద ఇసాకర్ ను సజీవదహనం చేయిస్తానని బెదిరించాడు. ఈ యూదు వెధవ భయపడిపోయి రాజీకొచ్చాడు. ఈ ఇల్లూ, నేనూ ఇద్దరికీ చెందేటట్టు ఒప్పందం రాసుకున్నారు. సోమ, బుధ, శనివారాల్లో ఇసాకర్, మిగతా వారాల్లో మతపెద్ద అని వాటాలు పంచుకున్నారు. ఒప్పందం కుదిరి ఇప్పటికి ఆరు నెలలయినా గొడవలు మాత్రం పోలేదు. శనివారం రాత్రుళ్లు పాత కాలమానానికి చెందుతాయా, కొత్త కాలమానానికి చెందుతాయా అని తేల్చుకోలేక గింజుకుంటున్నారు. ఇక నా సంగతి అంటావా? ఇద్దరినీ దగ్గరికి రాకుండా అడ్డుకుంటూ వస్తున్నాననింతవరకు. అందుకే నేనంటే ఇంకా పడి మోహంతో పడి చస్తున్నారు..

మళ్లీ భూకంపాలు రాకుండా ఉండడానికి, పనిలో పనిగా ఈ యూదును జడిపించడానికి  విచారణాధికారి సజీవదహన వేడుక జరిపించాలనున్నాడు. నన్నూ ఆహ్వానించాడు. బాగా అనుకూలంగా ఉండే చోట కుర్చీ దొరికింది. ఊరేగింపుకు, బలితంతుకు మధ్య పరిచారికలు చిరుతిళ్లు, రుచికర  పానీయాలు అందిస్తూ సేదదీర్చారు. పందిమాంసం తినడానికి నిరాకరించిన ఇద్దరు యూదులను, వావీవరసా లేని పెళ్లి చేసుకున్న ఆ బాస్క్ మనిషిని నిలువునా తగలబెడుతుంటే భయంతో కొయ్యబారిపోయాను. ఇక.. బలిదుస్తుల్లో ఉన్న పాంగ్లాస్ పండితుణ్ని చూసే సరికి నాలో రేగిన ఆశ్చర్యం, ఆందోళన, భయం, నిరాశా, నిస్పృహలను నువ్వే ఊహించుకో. కళ్లు నులుముకుని పాంగ్లాస్ ను ఉరితీసే వరకు చూసి, శోషతో పడిపోయాడు. స్పృహ వచ్చీ రాగానే నగ్నంగా ఉన్న నువ్వు కనిపించావు. గుండె గుభిల్లుమంది. ఆ క్షణంలో నాకు కలిగిన భీతి, ఆందోళన, క్షోభ, దుఃఖపరితాపాలను సులువగానే ఊహించుకోగలవనుకుంటాను. ఆ బల్గర్ దళనాయకుడి ఒళ్లు కంటే నీ ఒళ్లే తెల్లగా, మృదువుగా మెరుస్తూ ఉందని గట్టిగా చెప్పొచ్చు. నిన్ను ఆ దీనస్థితిలో చూడగానే నాకు పిచ్చి ఆవేశం తన్నుకొచ్చింది. ‘పశువుల్లారా.. ఆపండి!  అని గొంతుచించుకుని అరుద్దామనుకున్నాను. కానీ మాట పెగల్లేదు. అయినా నిన్నలా కొరడాలతో పూర్తిగా చిత్రవధ చేసేశాక వలపోసుకుని ఏం లాభంలే! ‘నా ప్రాణసుఖుడు కాండీడ్, మా విజ్ఞానఖని పాంగ్లాస్ లు లిస్బన్ కు ఎలా చేరుకోగలిగారు? ఒకరు వంద కమ్చీ దెబ్బలు తినడానికి, మరొకరు ఉరికొయ్యకు వేలాడ్డానికా వచ్చారు! అదే నేనంటే పడిచచ్చే మతపెద్ద ఆదేశాపైనేనా.. అయ్యో! ఎంత ఘోరం..! ప్రతీదీ మన మంచికేనన్న మెట్టవేదాంతాన్ని పాంగ్లాస్ నా బుర్రకెక్కించి ఎంత దారుణంగా మోసగించాడు! అని నాలో నేను అనుకున్నాను.

ఆ క్షణంలో ఎంత మనోవేదనతో కుంగిపోయానో ఊహించుకో. ఒక క్షణం దుర్భర ఉద్విగ్నతతో ఒళ్లు తెలియకుండా పోయింది. మరుక్షణం నిస్సత్తువ ఆవరించి మృత్యువాకిట ఉన్నట్టనిపించిది. నా తల్లిదండ్రుల నరికివేత, నా సోదరుడి ఖూనీ, ఆ బల్గర్ సైనికుడి అకృత్యం, చేసిన గాయం, బల్గర్ దళనాయకుడి ఇంట్లో వంటగత్తెగా బానిస బతుకు, ఇప్పుడీ భరించలేని యాదు వద్ద, నీచుడైన మతపెద్ద వద్దా అదే బతుకు, పాంగ్లాస్ ఉరితీత,  నిన్ను చావగొడుతూ భేరీలు, బాకాలతో.. దేవా కరుణామయా! కరుణించవా.. అంటూ హోరుమని వినిపించిన భక్తిపాట.. అవన్నీ నాకు బుర్రలో గిర్రున తిరిగి మాచెడ్డ కంపరం పుట్టించాయి. అయితే  ఆ రోజు నిన్ను మా ఇంట్లో కడసారి కలుసుకున్నప్పుడు ఆ తెరవెనక నువ్విచ్చిన తియ్యని తొలిముద్దును మాత్రం మరచిపోలేకపోయాను. ఇన్ని అగ్నిపరీక్షల తర్వాత నిన్ను మళ్లీ నా చెంతకు చేర్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాను. నిన్ను కంటికి రెప్పలా కాపాడి, వీలైనంత త్వరగా నా దగ్గరికి తీసుకురావాలని ఈ ముసలమ్మను పురమాయించాను. ఆమె నమ్మినబంటులా నా కోరిక నెరవేర్చింది. నిన్ను మళ్లీ చూడ్డం, నీతో మాట్లాడ్డం, నీ మాటలు వినడం.. అబ్బ! చెప్పలేనంత సంతోషంగా ఉంది. సరే, ముచ్చట్లకేం, మళ్లీ చెప్పుకుందాం. నీ కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటాయి. నాక్కూడా అలాగే ఉంది. పద భోంచేద్దాం.’ తన కథ ముగించింది ప్రియురాలు.

ఇద్దరూ భోంచేశారు. తర్వాత అందమైన పాన్పుపై పవళించారు. ఇంతలో ఆ ఇంటి యజమానుల్లో ఒకడైన డాన్ లోపలికొచ్చేశాడు. ఆ రోజు శనివారం కావడంతో తన హక్కును దర్జాగా చలాయించుకోవడానికి, తన సుకుమార ప్రేమను చాటిచెప్పుకోవడానికి అడుగుపెట్టాడు.

(సశేషం)

గమనమే గమ్యం-23

olga title

olga

 

శారదనూ, మహిళా సంఘ సభ్యులనూ నిరాశ లో  ముంచే వార్త మూడో రోజుకే చేరింది.

ఆ రోజు శారద ఉదయాన్నే సరోజినీ నాయుడి  కి ఫోను చేసింది. ఫోను ఎవరు ఎత్తారో  కూడా చెప్పకుండా శారద పేరు వినగానే ‘‘సరోజినిదేవి గారి రెండో అబ్బాయి నిన్న మరణించాడు . ఆవిడ కార్యక్రమాన్నీ రద్దు చేసుకున్నారు  అని చెప్పి ఫోను పెట్టేశారు.

శారద మనసు ఆ తల్లి కోసం కొట్టుకుంది. వెళ్ళి చూడాలనిపించింది గానీ కాటూరు సభ వారంలోకి వచ్చింది. పనులు . పనులు . పనులు . మెల్లీతో ఈ విషయం చెప్పి, మహిళా సంఘం ఆఫీసుకి కబురు చేసి ఆస్పత్రికి వెళ్ళింది.

కాటూరు మహిళా రాజ్యమా  అన్నట్లుంది. ఎక్కడెక్కడ నుంచోవచ్చారు స్త్రీు. ఎన్ని ఆశలో. ఎంత సంబరమో. ఎంత ఆకలో జ్ఞానం కోసం. నాయకులు  చెప్పే  మాటలు  విన్నారు  ఒళ్ళంతా చెవులు  చేసుకుని. శారద ఉపన్యాసాన్ని  తాగేశారు. పాటలు  పాడారు. బుర్ర కథలు  చెప్పారు. నాటకాలు  వేశారు. దేశ స్వాతంత్ర్యం, రైతు విముక్తి, మహిళ హక్కు సాధిస్తామని ప్రతిజ్ఞలు  చేశారు.

శారద స్త్రీలను ప్రత్యేకంగా సమావేశపరిచి ఆరోగ్యం, శరీరం గురించి మాట్లాడింది .

‘‘మగవాళ్ళందరూ రాజకీయాలు  మాట్లాడుతుంటే మనం ఈ విషయాల  గురించి మాట్లాడటమేమిటని అనుకుంటున్నారా  ?

గురజాడ ఏమన్నాడు ?  ‘‘తిండ కలిగితె కండ కలదోయ్‌, కండ గల  వాడేను మనిషోయ్‌’’ అన్నాడా? ఆయన మగవాళ్ళ  గురించి చెప్పినట్లున్నా  మనిషి అన్నాడు  గదా – అంటే మనుషులకు తిండి , బలమైన శరీరం కావాలి. మనకు బలమైన శరీరం  లేకపోవటమంటే రాజకీయాలు  సరిగా నడవటం లేదని అర్థం. మనకు సరైన తిండి  లేదంటే, ఉన్నా  తెలియని అజ్ఞానంలో మనం తినటం లేదంటే ఆడ వాళ్ళు బలహీనంగా ఉండాలని ఎవరో రాజకీయ కుట్ర చేస్తున్నారన్నమాట. మనం ఆరోగ్యంగా లేమంటే ఎవరో  కావాలని మనల్ని అనారోగ్యంలో ఉంచే రాజకీయాలు  నడుపుతున్నారన్నమాట. మన ఆరోగ్యం, శరీరం గురించి మాట్లాడటమంటే చిన్న విషయం కాదు. స్వతంత్రం పొందటమంత పెద్ద విషయం’’ ఒకొక్క విషయాన్నీ నవ్వుతూ నవ్విస్తూ చెప్పే  శారద మాటలంటే ఆడవాళ్ళందరికీ ఎంత ఇష్టమో. చాలా శ్రద్ధగా విన్నారు. మహాసభలయ్యేసరికి మరో కార్యక్రమం ఎదురు చూస్తూనే ఉంటుంది శారదను తనలోకి లాక్కోటానికి.

యుద్ధం రోజుల్లో రోజూ ఏదో ఒక హడావుడి  . శారదాంబ ఇంట్లో రెండు రోజులు గా ముఖ్యమైన సమావేశాలు  జరిగి ఆ రోజు మధ్యాహ్నంతో ముగిశాయి. స్థానిక నాయకులంతా  వెంటనే వెళ్ళిపోయారు. పొరుగు రాష్ట్రా నుంచి వచ్చిన వళ్ళు ఐదారుగురున్నారు. బొంబాయి నుంచి వచ్చిన విద్య కూడా ఉంది. విద్య, శారద మంచి స్నేహితుయ్యారప్పటికే – ఆ ఐదారుగురూ భోజనాలు చేస్తున్నారు  కబుర్లు చెప్పుకుంటూ. విద్య, శారద ఒకళ్ళను మించి మరొకరు ఛలోక్తులు  విసురుతున్నారు . ఆ సమయంలో పార్టీ ఆఫీసు నుండి  గోపాలరావు పదిహేనేళ్ళ అమ్మాయిని వెంటబెట్టుకుని ఆ ఇంటికి వచ్చాడు . శారద భోజనం నుంచి లేచి చేయి కడుక్కుని వచ్చింది.

‘‘ఏంటి గోపాలరావ్‌ –  ఎవరీ అమ్మాయి’’ అంది ఆ అమ్మాయిని పరిశీలనగా చూస్తూ. ‘‘తెలియదు డాక్టర్‌ గారు –  మన దాసు గారికి చెల్లెలి వరసట. సూర్యాపేట నుంచి వచ్చానంతోంది. ఎందుకంటే దాసుగారు రమ్మన్నా రంతోంది. మీ దగ్గరుంటే మంచిదని తెచ్చాను “  అన్నాడు .

వాడిన  ముఖం, రేగిన జుట్టు, అలసిన శరీరం –  ఐనా  కళ్ళల్లో, పెదవుల్లో కనిపించే పట్టుదల  – ఆ అమ్మాయి వంక చూసి ఆప్యాయంగా నవ్వింది శారద. ‘‘రామ్మా –  కాళ్ళూ ముఖం కడుక్కుని అన్నం తిన్న తరువాత  నీ కథ చెబుదువుగాని’’ అంటూ ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని నీళ్ళతొట్టె దగ్గరకు తీసుకెళ్లింది.  ఆ అమ్మాయి కాళ్లూ చేతులు  ముఖం కడుక్కునే సరికి ఎవరో తువ్వాలు  తెచ్చి ఇచ్చారు . ముఖం తుడుచుకుని శారద వెంటే వెళ్ళింది. తెలియని మనుషులు  అందరూ ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయికి భయం, అయోమయం. శారద తినమని మధ్యమధ్యలో హెచ్చరిస్తూ వాళ్ళతో మాట్లాడుతుంది. రెండు రోజులు గా భోజనం లేకపోయిన ఆ వ్యక్తులందరి మధ్యాకూర్చుని కడుపునిండా తినలేక పోయిందా అమ్మాయి.

అందరినీ పంపించాక ఆ అమ్మాయిని తీసుకుని సుబ్బమ్మ గదిలోకి వెళ్ళింది శారద.

‘‘ఇప్పుడు చెప్పు. నీ పేరేమిటి? ఎక్కడ నుంచి వచ్చావు?’’ లాలనగా అడ గింది. ‘‘సత్యవతి నా పేరు . మాది సూర్యాపేట  పట దగ్గర ఒక చిన్న ఊరు’’ –  ‘‘ఐతే `’’ శారదను మాట్లాడనివ్వకుండా సత్యవతి చెప్పుకు పోయింది. ‘‘మా అమ్మది కాటూరు. చిన్నప్పుడు అక్కడా రెండేళ్ళు పెరిగాను. మా అక్కలకు పెళ్ళిళ్లు అయిపోయాయి. మా దగ్గరంతా  ఆడవాళ్ళకు ఘోషా పద్ధతి. ఐతే మా నాన్న ఇంట్లోనే ఒక పంతులు  గారిని పెట్టి తెలుగు రాయటం,  చదవటం మూడేళ్ళపాటు నేర్పించాడు. మా అన్నయ్యు ఆర్య సమాజంలో ఆంధ్ర మహాసభల్లో ఉన్నారు . మా ఇంటికి పుస్తకాలు , పత్రికలు  అన్నీ తెస్తారు. నాకు అవన్నీ చదవటం అలవాటయిందండి . అన్నం తినకుండా నన్నా  ఉంటాను గానీ పుస్తకం చదవకుండా ఉండలేను. ఏడాది నాడు ‘‘గృహాలక్ష్మి’’ పత్రికలో దుర్గా బాయమ్మ గారి ఫోటో చూశాను. ఆమె ప్లీడరి చదివి పట్టా తీసుకుంటూ కోటు వేసుకుని, నెత్తిన టోపీ పెట్టుకున్న ఫోటో –  ఎంత బాగుందంటే –  అప్పటి కప్పుడు నా  మనసులో నాకు  గొప్ప కోరిక పుట్టు కొచ్చిందండీ. ఎట్లాగయిన  చదువుకోవాలి. దుర్గాబాయమ్మ  లాగా పట్టా తీసుకుని అట్లా కోటు వేసుకోవాలి అని – మా ఇంట్లోనేమో నాకు పెళ్ళి సంబంధాలు  చూస్తున్నారు. బాగా డబ్బుందని ఒక రెండో పెళ్ళి సంబంధం కూడా తెచ్చారు. నేను చేసుకోనంటే చేసుకోనన్నాను. సరే ఆ సంబంధం కాకపోతే నీకు ఈడైన వాడినే  చూస్తాం అన్నారు . సంబంధాలు  చూస్తున్నారు. నేనేం చెయ్యను? మా దాసన్నయ్య కమ్యూనిస్టు. ఒక రోజు మా ఇంటికి వస్తే  అన్నయ్యతో చెప్పాను నాకు పెళ్ళి ఇష్టం లేదని, చదువుకోవాలని. సరే నేను ఏదో ఒకటి చేస్తాలే అన్నాడు అన్నయ్య. తర్వాత  కొన్ని రోజులయ్యాక ఒక మనిషితో ఉత్తరం పంపించాడు. ఎట్లాగయిన బెజవాడరా  . అక్కడ బస్సులు  ఆగే చోట, పక్కనే భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుంటుంది. నువ్వక్కడకి వస్తే  నీ పెళ్ళి జరగకుండా పార్టీ చూస్తుంది. మహిళా సంఘంలో పనిచెయొచ్చని చెప్పిపంపించాడు. నేను సమయం కోసం చూస్తున్నాను. మా ఊళ్ళోనే మా బంధువుల  ఇంట్లో పెళ్ళి. అందరూ వెళ్ళారు. నేనూ వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఇంటికొచ్చి, కాసిని డబ్బులు  తీసుకుని సూర్యాపేట  వచ్చాను . అక్కడ మా పంతులు  గారుంటారు. ఆయన ఆంధ్ర మహాసభే –  ఆయన ఉండి  ఉంటే నాకీ తిప్పలుండేవి కావు. ఆయన ఊళ్ళో లేడు. ఎప్పుడొస్తాడో తెలియదు. ఇంక చేసేదేముంది? సూర్యాపేట లో  ఓ బస్సు ఎక్కాను. ఆ బస్సులో ఎవరో పద్మశాలీ భార్యా భర్తలు  బెజవాడ వెళ్తున్నామంతే  వాళ్ళతో స్నేహం   చేసుకుని వాళ్ళ పిల్లలాగానే వాళ్ళతోనే కూచున్నాను. జగ్గయ్య పేటలో రాత్రి  ఆగాం. వాళ్ళు ఒండుకుని తిని సత్రంలో పడుకున్నారు. వాళ్ళు న కులం  అడిగితే చెప్పానుగా –  నాకు వాళ్ళు ఒండుకున్నది పెట్టలేదు. మంచి నీళ్ళు త గి పడుకున్నాను. పొద్దున్నే మళ్ళీ ఇంకా బస్సెక్కి మధ్యాహ్నానినికి బెజవాడలో దిగాం. దాసన్నయ్య రాసినట్టే బస్సు దిగంగానే పార్టీ ఆఫీసు కనిపించింది. అక్కడ కి వెళ్ళి మా దాసన్నయ్య కావాలంటే వాళ్ళు  నన్ను మీ ఇంటికి పంపారు. నేను మళ్ళీ మా ఇంటికెళ్తే పెళ్ళి చేస్తారు. నేను పెళ్ళి చేసుకోను. చదువుకుంటాను. మహిళా సంఘంలో పనిచేస్తాను. దుర్గాబాయమ్మ  లాగా పట్టా తీసుకోవాలి నేను’’ కళ్ళల్లో నీళ్ళు అదిమిపట్టి గొంతులో జీరను పక్కకు నెట్టి చెబుతున్న సత్యవతిని ప్రేపమగా దగ్గరకు తీసుకుంది శారద. ‘‘అలాగే సత్యవతి. పెళ్ళి ఒద్దు. పాడూ ఒద్దు. చదువుకుంటూ మహిళా సంఘంలో పని చేద్దువు గాని ` ఇవాళ నాదెళ్ళవారి  పాలెంలో మహిళా సంఘం మీటింగు జరుగుతోంది. వెళ్దువు గాని. అక్కడ బోలెడుమంది అమ్మాయిులు  పరిచయం అవుతారు. నీకు స్నేహం కలుస్తుంది  వాళ్ళతో . ధైర్యం వస్తుంది. ఒంటరి దానివి కాదు నువ్వు. ఏమీ భయం లేదు. పద, కాసేపు పడుకుని సాయంత్రం వెళ్తావా ? ఇప్పుడే వెళ్తావా ? ఇప్పుడైతే మా పద్మావాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళతో కలిసి వెళ్ళొచ్చు’’ శారదను చూస్తూ  ఆమె మాటలు  వింటే సత్యవతి బెరుకంతా  పోయింది.

‘‘ఇప్పుడే వెళ్తానండీ  ’’ అని ఉత్సాహం గా  లేచింది.

శారద సత్యవతిని నాదెళ్ళవారిపాలెం వెళ్ళే వాళ్ళకు అప్పజెప్పి, గత రెండు రోజుల  సమావేశా వివరాలు రాసుకోవటానికి కూర్చుంది.

కాగితం మీద కలం  పెడితే ఆ పదిహేనేళ్ళ సత్యవతి మాటలే గుర్తొస్తున్నాయి. దుర్గాబాయి  ప్లీడరు పట్టా పుచ్చుకుని దిగిన ఫోటో ఎందరు ఆడపిల్లల  మనసుల్లో ఎన్ని కలలు  రేపిందో `- అట్లా చదవాలనీ, అంతెత్తు ఎదగాలనీ ప్రపంచం అంత చూడాలనీ ఆడపిల్లల  గుండెల్లో ఎన్ని కలలు  రేపిందో –  ఎన్ని కోరికలు  గూడుకట్టుకుని ఉన్నాయో . శారద తెలియని భావోద్వేగంతో ఉక్కిరి బిక్కిరయింది. సంతోషం దిగులూ  రెండూ కమ్ముకొచ్చి కళ్ళల్లో నీళ్ళు నిండాయి.

రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ గుర్తొచ్చింది శారదకు

రాజ్యలక్ష్మ్మమ్మ  అమ్మమ్మ దగ్గరకు పెళ్ళి చెయ్యమంటూ వితంతువులు  వచ్చేవారు. ఆమె వాళ్ళను స్వంత పిల్లల్లా చూసుకునేది. ఇప్పుడు ఆడపిల్లలు  పెళ్ళి ఒద్దంటూ ఇళ్ళనుంచి బైటపడుతున్నారు. చదువు కోసం, జ్ఞానం కోసం తపిస్తున్నారు . అమ్మమ్మ అనుకున్న మార్పు వస్తుంది. కేవం పెళ్ళే కాదు విద్య కావాలంటున్నారు ఆడపిల్లలు . చదువుకుంటే వాళ్లకేదిమంచో ఏది కాదో వాళ్ళకే తెలుస్తుంది. అందుకేగా గురజాడ కన్యాశుల్కం నాటకం లో  బుచ్చమ్మకు పెళ్ళి చెయ్యకుండా చదువుకునే దారి చూపాడు. ఆ దారిలో నడుస్తున్నారు అమ్మాయిలు . ఆ రోజు వీరేశలింగం గారు చేసిన పనిని ఆయన వారసులు గా  కమ్యూనిస్టులు  చేస్తున్నారు. ఔను –  ఆయనకు, రాజ్యలక్ష్మమ్మకు వారసులు తామే –  కమ్యూనిస్టులమే. శారదకు గుండె నిండా ఆనందం పొంగింది. కమ్యూనిస్టులు  వీరేశలింగంగారి భావాలను , ఆయన చేసిన పనిని స్వంతం చేసుకోవాలి. ఆయనను గుర్తు చేసుకుంటూ సభలు  జరపాలి ఇంకా ఎక్కువగా. ఈ సారి దానిని పార్టీ కార్యక్రమంలో భాగంగా చెయ్యాలి. స్త్రీలో చైతన్యం పెరగాలనన్న, స్త్రీల  గురించి పార్టీ సభ్యులో చైతన్యం పెరగాలన్నా  అదొక మంచి మార్గం. కొత్త కొత్త కార్యక్రమాలెన్నో శారద మనసులో ఆకారం దాలుస్తున్నాయి .

***

బుక్కెడు బువ్వ