Archives for 2014

పెద్రో పారమొ-13

pedro1-1పొద్దు పొడుపుతో రోజు మొదయింది, తక్కుతూ తారుతూ. భూమి తుప్పు పట్టిన గేర్లు దాదాపుగా వినపడుతున్నాయి. చీకటిని తోసేస్తూ ఈ పురాతన భూప్రకంపనలు.
“రాత్రి పాపాలతో నిండిపోయిందా జస్టినా?”
“అవును సుజానా!”
“నిజంగా నిజమేనా?”
“అయి ఉండాలి సుజానా!”
“జీవితం పాపం కాక మరేమిటి జస్టినా? నీకు వినపడుతుందా? వినపడుతుందా భూమి కిరకిరలాడటం?”
“లేదు సుజానా! నాకేమీ వినపడటం లేదు. నా రాత నీరాతంత గొప్పది కాదు.”
“నీకు భయమేస్తుంది. నేను చెపుతున్నాగా, నాకు వినపడేది నీకు వినపడితే భయంతో నీలుక్కుపోతావు.”
జస్టినా గది శుభ్రం చేయడంలో మునిగిపోయింది. మళ్ళీ మళ్ళీ తడి చెక్కనేలని గుడ్డతో తుడిచింది. పగిలిన వేజ్ నుండి కిందపడిన నీటిని శుభ్రం చేసింది. పూలు ఎత్తింది. పగిలిన ముక్కల్ని తొట్టిలో పడేసింది.
“నీ జీవితంలో ఎన్ని పిట్టల్ని చంపి ఉంటావు జస్టినా?”
“చాలా, సుజానా!”
“ఎప్పుడూ బాధ వేయలేదా?”
“వేసింది సుజానా!”
“ఇంకా చనిపోక దేనికోసం ఎదురుచూస్తున్నావు?”
“చావు కోసం సుజానా!”
“అంతే అయితే, అదే వస్తుంది. ఆదుర్దా పడకు.”
సుజానా శాన్ హువాన్ దిండుకి చేరగిలపడి కూచుంది. అస్థిరమైన ఆమె కళ్ళు ప్రతి మూలా వెతుకుతున్నాయి. ఆమె చేతులు పొట్టమీద రక్షించే కొక్కెంలా ముడిపడి ఉన్నాయి. ఆమె తలపై రెక్కలాడినట్టు ఝుం అంటూ వినిపిస్తూంది. కిర్రుమంటూ బావిలో గిలక. జనాలు లేస్తున్న సందడి.
“నరకంలో నీకు నమ్మకముందా జస్టినా?”
“ఉంది సుజానా, స్వర్గంలో కూడా!”
“నాకు నరకంలోనే నమ్మకముంది,” అంది సుజానా. అని కళ్ళు మూసుకుంది.
జస్టినా వెళ్ళిపోయాక సుజానా మళ్ళీ నిద్రలో మునిగిపోయింది. బయట సూర్యుడు తళతళ మెరుస్తున్నాడు. హాల్లో పేద్రో పారమొ కనిపించాడు జస్టినాకు.
“సెన్యోరా ఎట్లా ఉంది?”
“బాలేదు,” తల దించుకుని బదులిచ్చింది.
“ఏమన్నా కంప్లెయిన్ చేస్తుందా?”
“లేదు సెన్యోర్! ఆమె దేని గురించీ కంప్లెయిన్ చేయదు. కానీ చనిపోయినవాళ్ళు ఎప్పుడూ కంప్లెయిన్ చేయరని చెప్తారు. మనకు సెన్యోరా దక్కలేదంతే.”
“ఫాదర్ రెంటెరియా ఆమెను చూడటానికి వచ్చాడా?”
“ఆమె కన్ ఫెషన్ వినడానికి రాత్రి వచ్చాడు. ఇవాళ ఆమె కమ్యూనియన్ తీసుకుని ఉండవలసింది కానీ ఆమె మీద దయ ఉన్నట్టు లేదు. ఫాదర్ పొద్దున్నే వస్తానన్నాడు కానీ చూడు ఎంత పొద్దెక్కిందో ఇంకా రాలేదు. ఆమె మీద దయ ఉన్నట్టు లేదు.”
“ఎవరి దయ?”
“దేవుడి దయ, సెన్యోర్!”
“తెలివి తక్కువగా మాట్లాడకు జస్టినా!”
“సరే, సెన్యోర్!”
పేద్రో పారమొ తలుపు తెరిచి దాని పక్కనే నిలుచున్నాడు, ఒక కాంతి కిరణాన్ని సుజాన శాన్ హువాన మీద పడనిస్తూ. అతనికి కనిపించింది బాధతో గట్టిగా మూసుకున్నట్టున్న కళ్ళూ, సగం తెరిచిన తడి నోరూ, దుప్పట్లను వెనక్కి నెట్టేస్తూన్న చేతులూ, బయటపడుతున్న ఆమె నగ్నత్వమూ, మెలికలు తిరుగుతూ వంకరలు పోతున్న ఆమె దేహమూ.
తనకూ, మంచానికీ మధ్య ఉన్న కొద్ది దూరాన్నీ ఒక్క ఉదుటున దాటి ఏలికపాములా గిజగిజలాడుతూ మరింత విపరీతంగా కొట్టుకుంటూన్న నగ్నదేహాన్ని కప్పాడు. ఆమె చెవిలో పిలిచాడు “సుజానా!”. మళ్ళీ పిలిచాడు “సుజానా!”
తలుపు తెరుచుకుని ఫాదర్ రెంటెరియా చప్పుడు కాకుండా గదిలోకొచ్చాడు. “నీకు కమ్యూనియన్ ఇవ్వడానికి వచ్చాను తల్లీ!” అన్నాడు.
పేద్రో పారమొ ఆమెను లేపి తలగడలు సర్ది వాటికి చేరగిలపడేట్టు కూచోబెట్టిందాకా ఆగాడు. సుజానా సాన్ హువాన్ సగం నిద్రలోనే నాలుక చాపి ప్రసాదాన్ని మింగింది. తర్వాత “దివ్యమైన రోజు గడిపాం ఫ్లోరెన్సియొ!” అంది. మళ్ళీ ఆ దుప్పట్ల సమాధిలోకి జారిపోయింది.

“ఆ కిటికీ చూడు దోన ఫౌస్టా, ఆ మెదియా లూనాలో ఎప్పుడూ లైట్ వెలుగుతూ ఉండేది!”
“లేదు ఏంజెలెస్! నాకేదీ కనపడలేదు”
“ఎందుకంటే ఇప్పుడది చీకటిగా ఉంది. అంటే ఏదయినా చెడు జరిగిఉంటుందంటావా? మూడేళ్ళ పైగా ఆ కిటికీలో లైట్ రాత్రి తర్వాత రాత్రి వెలుగుతూనే ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ గది పేద్రో పారమొ గది అని చెప్తారు. పాపమా పిచ్చావిడకి చీకటంటే భయమట. చూడు ఇప్పుడు లైట్ ఆరిపోయి ఉంది. దుశ్శకునం కాదా?”
“చచ్చిపోయిందేమో! బాగా జబ్బు పడి ఉంది. ఎవరినీ గుర్తు పట్టడంలేదంటున్నారు. తనలో తాను మాట్లాడుకుంటుందట. ఆమెని పెళ్ళి చేసుకోవడం మూలాన పేద్రో పారమొకి తగిన శాస్తే జరిగింది.”
“పాపం పేద్రో పారమొ!”
“లేదు ఫౌస్టా. అతనికి అంతే కావాలి. ఇంకా ఎక్కువే కావాలి”
“చూడు గది ఇంకా చీకటిగా ఉంది.”
“ఆ కిటికీని అట్లా వదిలేసి ఇంటికి పోయి పడుకుందాం పద! మనలాంటి ఇద్దరు ముసలాళ్ళకి ఇట్లా రోడ్ల మీద పడి తిరగడానికి వేళ మీరి పోయింది. ”
చర్చి నుంచి పదకొండింటికి బయటపడ్డ ఆ ముసలి ఆడవాళ్ళు అర్కేడ్ ఆర్చీల కింద మాయమయారు. ప్లాజాని దాటుతూ మెదియాలూనా వైపు వెళుతున్న మనిషి జాడ కనపడింది.
“చూడు దోనా ఫౌస్టా! ఆ వెళుతున్న మనిషి డాక్టర్ వలెన్సియా అంటావా?”
“అతను నాఎదురుగా ఉన్నా గుర్తుపట్టలేనంత చత్వారం వచ్చింది నాకు. కానీ అట్లాగే ఉన్నాడు.”
“నీకు గుర్తు లేదా, ఆయన ఎప్పుడూ తెల్ల పాంటూ, నల్లకోటూ వేసుకుంటాడు కదా! మెదియాలూనాలో ఏదో చెడు జరుగుతుందని పందెం. చూడు ఏదో అవసరం పడ్డట్టు ఎట్లా వేగంగా నడుస్తున్నాడో!”
“చూస్తుంటే ఏదో ఘోరం జరిగే ఉంటుందనిపిస్తుంది. తొందరగా వెళ్ళి ఫాదర్ రెంటెరియాకి చెప్పాలనిపిస్తుంది. పాపం ఆమె కన్ ఫెషన్ చేయకుండా చచ్చిపోతుందేమో!”
“దేవుడే కాపాడాలి ఏంజెలెస్! ఎంత దుర్భరమైన ఆలోచన! ఈలోకంలో పడ్డ కష్టాలు ఎటూ పడింది. ఇప్పుడు చివరి కర్మలు జరక్కుండా పోయి మళ్ళీ వచ్చే జన్మలోకూడా ఇంకా కష్టాలు పడాలని ఎవరూ కోరుకోరు. పిచ్చివాళ్ళు కన్ ఫెస్ చేయనవసరం లేదనీ, వాళ్ల ఆత్మల్ని పాపం చుట్టుకున్నా వాళ్ళు అమాయకులేననీ చెప్తారనుకో. దేవుడికే తెలియాలి… చూడు కిటికీలో లైట్ వెలుగుతుందిప్పుడు. అంతా బాగానే అయిపోయి ఉంటుందని ఆశిస్తున్నాను. ఆ ఇంట్లో ఎవరన్నా చనిపోయి ఉంటే మనం క్రిస్మస్ కోసం చర్చిని అలంకరించడానికి పడ్డ శ్రమంతా ఏమయ్యేదో ఊహించుకో. డాన్ పేద్రో అంత పెద్దమనిషి కాబట్టి మన వేడుకలన్నీ సర్వనాశనమయ్యేవి.”
“నువ్వెప్పుడూ అతిగా ఆలోచిస్తావు ఫౌస్టా. నువు నేను చేసినట్టు చేయి- అంతా ఆ దేవుడికే వదిలేయి. కన్య మేరీకి అవ మారియా చెప్పు. ఇప్పట్నుంచి తెల్లారిందాకా ఏమీ జరగదనే నా నమ్మకం. అప్పుడు దేవుడి ఆనే జరగనివ్వు. ఎటు తిరిగీ ఆమె ఈ జీవితంలో ఆనందంగా ఉండలేదు.”
“నిజం చెబుతున్నా ఏంజెలెస్! నీ మాటలు నాకుఎప్పుడూ సాంత్వన కలిగిస్తాయి. ఆ మంచి మాటలే మనసులో పెట్టుకుని నిద్రపోగలను. మన నిద్రలో ఆలోచనలు సరాసరి స్వర్గానికే చేరతాయంటారు. నాది కూడా అంత దూరం పోతుందనే నా ఆశ. రేప్పొద్దున కలుద్దాం.”
“సరే రేపు కలుద్దాం ఫౌస్టా.”
ఆ ముసలి ఆడవాళ్ళిద్దరూ వాళ్ళ సగం తెరిసిన తలుపుల్లోంచి ఇళ్ళల్లోకి వెళ్ళారు. రాత్రి నిశ్శబ్దం పల్లె మీద మళ్ళీ పరుచుకుంది.

“నా నోరు మట్టితో నిండి ఉన్నది!”
“అవును ఫాదర్!”
“‘అవును ఫాదర్ ‘ అనకు. నేను చెప్పేదంతా మళ్ళీ చెప్పు.”
“మీరేం చెప్తారు? నన్ను మళ్ళీ కన్ ఫెస్ చేయమంటారా? మళ్ళీ ఎందుకు?”
“ఇది కన్ ఫెషన్ కాదు సుజానా. నేను నీతో మాట్లాడడానికే వచ్చాను. నిన్ను మృత్యువుకు సిద్ధపర్చడానికి.”
“నేను చనిపోబోతున్నానా?”
“అవును తల్లీ!”
“మరి నా మానానికి నన్ను ప్రశాంతంగా వదిలేయవచ్చుకదా? నాకు విశ్రాంతి కావాలి. నన్ను మెలకువగా ఉంచమని మిమ్మల్నెవరో పంపి ఉండాలి. నిద్ర పూర్తిగా పారిపోయిందాకా నాతో ఉండడానికి. అతన్ని కనుక్కోవడానికి నేనేం చేయగలను? ఏమీ లేదు ఫాదర్! నన్నొంటరిగా వదిలేసి వెళ్ళిపోరాదా?”
“నిన్నొదిలేస్తాను సుజానా. నేను చెప్తున్న మాటలు తిరిగి చెప్తుంటే నెమ్మదిగా నీకు నువ్వే జోలపాడుకున్నట్టు నిద్రలోకి జారిపోతావు. ఒకసారి నిద్రపోయాక నిన్నెవరూ లేపరు. ..నువ్వెప్పటికీ లేవవు.”
“సరే ఫాదర్. మీరు చెప్పినట్లే చేస్తాను.”
తన చేతులు ఆమె భుజాల మీద ఉంచి మంచం అంచున కూచున్న ఫాదర్ రెంటీరియా ఎవరికీ వినపడకుండా ఉండేందుకు ఆమె చెవి దాదాపు తన నోరు తాకుతుండగా ఒక్కోమాటా రహస్యంగా గుసగుసలాడుతూ చెప్పాడు. “నా నోరు మట్టితో నిండి ఉన్నది.” అని ఆగాడు. ఆమె పెదవులు కదులుతున్నాయో లేదోనని చూశాడు. మాట్లాడుతున్నట్టు పెదాలు కదులుతున్నాయి కానీ శబ్దం బయటికి రావడం లేదు:
“నా నోరు నీతో, నీ పెదవులతో నిండి ఉన్నది. గట్టిగా మూసుకుని ఉన్న నీ పెదవులు, నా పెదవులను గట్టిగా అదుముతూ, కొరుకుతూ..”
ఆమె కూడా ఆగింది. తన కంటి చివరి నుంచి ఫాదర్ రెంటెరియా వంక చూసింది. అతనెక్కడో దూరంగా ఉన్నట్టూ, మంచు పేరుకున్న గాజుపలక వెనక ఉన్నట్టూ కనిపించాడు.
మళ్ళీ అతని గొంతు ఆమె చెవిలో వెచ్చగా వినపడింది.
“నురగల ఉమ్మిని మింగితిని. నా గొంతుకడ్డంగా ముడి పడి, నా అంగిటిలో వొరుసుకునునట్లు పురుగులతో లుకలుకలాడుతున్న మట్టి పెళ్ళలని నమిలితిని. నములుతూ కబళించుచున్న నా పళ్ళ వలన చీల్చబడి వంకరలు పోయి నా నోరు విరిగిపడినది. నా ముక్కు మెత్తబడినది. నా కనుగుడ్లు నీరై పోయినవి. నా శిరోజములు ఒక అగ్ని కీలయై మండినవి..”
సుజానా శాన్ హువాన్ అంత నిమ్మళంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి ఆమె ఆలోచనలనూ, తను ఆమెలో ప్రతిక్షేపిస్తున్న దృశ్యాలను నిరాకరించడానికి పెనుగులాడుతున్న ఆమె హృదయాన్నీ తెలుసుకోవాలనిపిస్తూంది. అతను ఆమె కళ్లలోకి చూశాడు. ఆమె కూడా అట్లాగే చూసింది. ఆమె మెలి తిరుగుతున్న పెదవుల చివర ఒక చిన్న నవ్వు మొలకెత్తుతున్నట్టు ఉంది.
“ఇంకా ఉంది. దేవుడు సాక్షాత్కరించిన దృశ్యం. ఆయన అనంత స్వర్గధామపు మెత్తటి కాంతి. సెరాఫిం పాటా, చెరూబిం ఉల్లాసం. శాశ్వత బాధలకు శపించబడ్డ వారికి చివరిసారిగా కనపడి మాయమయ్యే దేవుని నయనాలలో ఆనందం. శాశ్వత బాధకు తోడయ్యే ఈ లోకపు వేదన. ఎముకలోని మజ్జ మండుతున్న బొగ్గయి, మన నరములలో ప్రవహించు రక్తము అగ్ని కీలలై నమ్మజాలని యాతన కలుగజేయును. దేవుని ఆగ్రహము దానిని ఆరనివ్వక విసురుచుండుటవలన ఆ అగ్ని ఎన్నటికీ చల్లారదు.”
“అతడు నాకు తన చేతులలో రక్షణనొసగెను. నాకు ప్రేమనొసంగెను.”
ఆమె చివరి క్షణం కోసం ఎదురు చూస్తూ తన చుట్టూ మూగిన ఆకారాల వంక చూశాడు ఫాదర్ రెంటీరియా. పేద్రో పారమొ చేతులు కట్టుకుని వాకిలి వద్ద ఎదురు చూస్తున్నాడు. అతని పక్కనే డాక్టర్ వాలెన్సియా, ఇంకా కొంతమంది నిలుచుని ఉన్నారు. ఇంకా దూరంగా నీడల్లో ఆడవాళ్ళ చిన్న గుంపు మరణించిన వాళ్ళ కోసం ప్రార్థనలు చేయడానికి ఆత్రంగా నిలబడి ఉంది.
అతను లేద్దామనుకున్నాడు. మరణిస్తున్న స్త్రీకి పవిత్ర తైలం అంటి “నా పని ముగిసింది,” అని చెప్పటానికి. కానీ లేదు, అతని పని ఇంకా ముగియలేదు. ఆమె ఎంతవరకూ పశ్చాత్తాపపడుతూ ఉందో తెలియకుండా ఆ మరణ సంస్కారాన్ని కొనసాగించలేడు.
అతను ఒక క్షణం సందేహించాడు. బహుశా ఆమెకు పశ్చాత్తాపపడవలసిందేమీ ఉండి ఉండక పోవచ్చు. బహుశా తను క్షమించవలసిందీ ఏమీ లేకపోవచ్చు. మళ్లీ ఆమె మీదికి వంగి, ఆమె భుజాలు కుదుపుతూ లోగొంతుకతో చెప్పాడు.
“నువ్వు దేవుని సన్నిధానానికి వెళుతున్నావు. ఆయన పాపులపై తీర్పు చెప్పడంలో క్రూరుడు.”
ఆమె చెవిలో ఇంకా ఏదో చెప్పబోయాడు కానీ ఆమె తల అడ్డంగా ఊపింది. “వెళ్ళి పో ఫాదర్. నాగురించి హైరానా పడకండి. నాకు ప్రశాంతంగా ఉంది. బాగా నిద్రవస్తున్నట్టుంది.”
నీడలో దాగున్న స్త్రీలలో ఒకరి వెక్కు బయటికి వినవచ్చింది.
సుజానా శాన్ హువాన్ కి ఒక్క క్షణం ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంది. మంచం మీద నిటారుగా కూర్చుని అంది:
“జస్టినా, నీకు ఏడవాలనుంటే ఎక్కడికయినా పో!”
అప్పుడు ఆమెకు తల పొట్టమీదికి వాలినట్లనిపించింది. తల పైకెత్తడానికీ, ఊపిరాడకుండా చేస్తున్న పొట్టను పక్కకు నెట్టడానికీ ప్రయత్నించింది కానీ ప్రతి ప్రయత్నంతో ఆమె ఆ రాత్రి లోకి ఇంకా లోతుగా కూరుకుపోసాగింది.

“నేను.. నేను దోనా సుజానితా చనిపోవడం చూశాను.”
“ఏమంటున్నావు డొరోతియా?”
“నీకిప్పుడు చెప్పిందే!”

తొలి సంజ. గణ గణా మోగుతున్న గంటలు జనాల్ని మేలుకొలుపుతున్నాయి. అది డిసెంబర్ ఎనిమిది ఉదయం. మబ్బుగా ఉన్న ఉదయం. చల్లగా లేదు కానీ మబ్బుగా. ఆ మోగడం పెద్ద గంటతో మొదలయ్యింది. మిగతావీ దానికి జత కలిసాయి. ఫెద్ద ప్రార్థన కోసం గంటలు మోగుతున్నాయనుకున్నారంతా. తలుపులు బార్లా తెరుచుకుంటున్నాయి. అన్నీ కాదు; కొన్ని ఇంకా మూసుకునే ఉన్నాయి. బద్ధకస్తులు ఇంకా మంచాల మీదే పడుకుని తెల్లారిందని గంటలు చెప్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ మోగడం మామూలు కన్నా ఎక్కువసేపు సాగింది. పెద్ద చర్చిలో గంటలే కాదు, సాంగ్రె డీ క్రిస్టో, క్రజ్ వర్డె, శాంచువారియో గంటలు కూడా. మధ్యాహ్నమయింది కానీ ఇంకా గంటలు మోగుతూనే ఉన్నాయి. రాత్రి అయింది. పగలూ, రాత్రీ గంటలు మోగుతూనే ఉన్నాయి. అన్నీ, బలంగా, పెద్దగా ఆ మోతలన్నీ గాఢశోకంలో కలిసిపోయేలా. చెప్పేది వినపడక జనాలు పెద్దగా అరవవలసి వస్తూంది. “ఏమయుంటుంది?” వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అడుగుకుంటున్నారు.
మూడు రోజులయ్యేసరికి అందరికీ చెవుడు వచ్చింది. అంతటా నిండిన ఆ ధ్వనులకి మాట్లాడడం అసాధ్యమవుతూంది. కానీ గంటలు మోగుతూనే ఉన్నాయి. కొన్ని పగిలిపోయి ఓటి కుండల్లా డొల్ల మోతలు మోగుతున్నాయి.
“దోనా సుజానా చనిపోయింది.”
“చనిపోయిందా? ఎవరు?”
“సెన్యోర.”
“ఎవరు మీ సెన్యోరానా?”
“పేద్రో పారమొ సెన్యోర.”
ఆ నిరంతర ధ్వనులు విని జనాలు వేరే ఊళ్ల నుంచి రాసాగారు. కోంట్లా నుంచి తీర్థానికొచ్చినట్టు వచ్చారు. ఇంకా దూరాన్నుంచి కూడా. ఎక్కడ్నుంచో ఎవరికి తెలుసు, ఒక సర్కస్ కూడా వచ్చింది ఎగిరే కుర్చీలూ అవీ వేసుకుని. వాయిద్యాల వాళ్ళూ. ముందు ఊరికే అందరిలా చూడ్డానికే వచ్చారు కానీ నెమ్మదిగా అక్కడే స్థిరపడిపోయారు. ప్రదర్శనలూ ఇవ్వడం మొదలుపెట్టారు. నెమ్మది నెమ్మదిగా అంతా ఒక జాతరలాగా అయిపోయింది. కోమలా నిండా జనాలే, సందడి సందడిగా గొడవ చేస్తూ. పండగలప్పట్లా ఇసకస్తే రాలనట్టున్నారు జనం.
గంటలు మోగడం ఆగింది కానీ జాతర అట్లాగే కొనసాగింది. ఇది విచారించదగ్గ సందర్భం అని ఎవ్వరినీ వొప్పించ వీలుగాకుంది. వాళ్లని పొమ్మనే దారీ లేదు. ఒక వైపు జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు.
మెదియా లూనా ఒంటరిగా నిశ్శబ్దంగా ఉంది. పనివాళ్లు చెప్పులు లేకుండా నడుస్తూ, లోగొంతులతో మాట్లాడుతూ ఉన్నారు. సుజానా సాన్ హువాన్ ని పూడ్చిపెట్టడం అయింది కానీ కోమలాలో ఎక్కువమందికి ఆసంగతే తేలీదు. వాళ్లంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. కోడిపందేలూ, లాటరీలూ, సంగీతమూ, తాగుబోతుల కేకలూ. ఊళ్ళోని దీపాల కాంతి మెదియాలూనా దాకా కనిపిస్తూంది బూడిదరంగు ఆకాశంలో తేజోవలయంలా. అవి మెదియాలూనాలో విషాదభరితమయిన రోజులు. డాన్ పేద్రో ఎవరోతోనూ మాట్లాడడం లేదు. తన గదే విడిచి రాలేదు. కోమల మీద పగ తీర్చుకుంటానని వొట్టు పెట్టుకున్నాడు.
“నా చేతిలోంచి గింజ జార్చను. కోమలా ఆకలితో మాడి చస్తుంది.”
అదే జరిగింది.
టిల్కేట్ వార్తలు అందిస్తూనే ఉన్నాడు.
“మేమిప్పుడూ కర్రాంజా తో ఉన్నాం.”
“మంచిది.”
“ఇప్పుడు జనరల్ ఓబ్రెగాన్ తో కలిశాం.”
“మంచిది.”
“శాంతి ప్రకటించారు. మమ్మల్ని పంపించేశారు.”
“ఆగు. నీ మనుషుల్ని పంపేయకు. ఇదెన్నాళ్ళో ఉండదు.”
“ఫాదర్ రెంటీరియా కూడా పోరాటంలోకి దిగాడు. మనం అతనికి వ్యతిరేకమా కాదా?”
“ప్రశ్నే లేదు. నువు ప్రభుత్వం తరఫునే!”
“కానీ మేం మామూలు వాళ్లం కాదుగా. వాళ్ళు మమ్మల్ని తిరుగుబాటుదారులుగా లెక్క వేస్తారు.”
“అయితే విశ్రాంతి తీసుకో!”
“మేం ఇప్పుడు ఇంత ఊపు మీద ఉన్నాము కదా!”
“సరే నీ ఇష్టం వచ్చినట్టు చేయి.”
“నేను వెనక్కి ఆ ముసలి ప్రీస్ట్ దగ్గరికే పోతున్నా. వాళ్ల కేకలు నచ్చాయి. అదీ కాక ఆయనతో వెళితే ముక్తికి ఢోకా లేదు.”
“నువ్వేం చేస్తావో నాకనవసరం.”

పొయెమ్ లాంటి నువ్వు

 

పొయెమ్ లాంటి నిన్ను
నీలాంటి పొయెమ్ ను
ప్రేమిస్తున్నాను

1

రాత్రి
చీకటిని మత్తుగా తాగి
మూగగా రోదిస్తుంటుందేమో
సరిగ్గా నిద్రపట్టనే పట్టదు
కలత నిద్రలో
దిగుల్ దిగులుగా కొలను కనిపిస్తుంది
దిగుల్ దిగులుగానే
వొక పువ్వు విచ్చుకుంటుంది
తెల్లారికి
దిగుల్ పొయెమ్ వొకటి
అరచేతుల్లోకి వచ్చి చేరుతుంది
ఏ అలికిడి లేని
వొంటరి కొమ్మమీద కూర్చొని
రెక్కల్లోకి తలని దూర్చి
దిగుల్ ముఖంతో చూస్తున్న
పావురంలాంటి పోయెమ్
నీలాంటి పొయెమ్
నీలాంటి పొయెమొకటి
తెలతెలవారగానే
కళ్లముందు తేలుతుంది –

2

ఉదయం
రాత్రి చీకటి మత్తుని వొదిలి
కొత్తగా
ఊపిరి పోసుకోవాలనుకుంటుందేమో
కువకువలాడుతున్న పావురం రెక్క
– నీ చూపే
చేతిలో
దిగుల్ దిగులుగా వున్న
దిగుల్ పొయెం కళ్లల్లో
తెల్లగా విప్పుకుంటుంది
దిగులు
ఎటో ఎగిరిపోతుంది
ఆ కాసేపటికే
పొయెమ్
కాంతిని నిండా తాగి
కాంతితో తూగుతుంది
..
యింకా
ఎదిగి ఎదగని
నీలాంటి పొయెమ్ ను
పొయెమ్ లాంటి నిన్ను
నిజంగా
పసిపాపని ప్రేమిస్తున్నట్టే
ప్రేమిస్తున్నాను

-బాలసుధాకర్ మౌళి

బాల సుధాకర్

ఆ జలగండం గుండె కింద కాస్త తడి!

vijays picture[విజయ్ గజం ,ఆంధ్రా యూనివర్సిటీ లో జర్నలిజం పట్టా పుచ్చుకొని వృత్తి రీత్యా ప్రస్తుతం  TV 10 హైదరాబాదు బ్రాంచ్ లో వర్క్ చేస్తూ ఫేస్బుక్ ద్వారా అడపాదడపా తన ఉత్తేజభరితం అయిన కవితలతో సాహితీ రంగం కి ఇపుడిపుడే తన చమక్కులు  అందిస్తున్న  విజయ్   గారు మొదటి సారిగా తన పూర్తి హుదుద్ అనుభవాలని  కథన రూపంలో మనతో పంచుకుంటూ ఇలా .]

 

 

 

అప్పుడప్పుడు అనిపించేది వెన్నెల వెలుగులో డాబా మీద పడుకోవాలని. చిన్నతనం లో లాగా పిల్లలకు తాతలు, అమ్మమ్మలు కథలు చెపుతుంటే వినాలని. కానీ ఈ రాకెట్ వేగం ఆధునిక యుగం లో ఇదంతా అత్యాశ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలైన నేటి రోజుల్లో ఆత్మీయతలు, అనురాగాలు కొనుక్కునే నేటి రోజులలో ఇదంతా అత్యాశే.

నిజం గా ఎంత సంతోషం కరెంట్ లేని ఆ రోజుల్లో సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి రావడం తోనే పుస్తకాలు విసిరేసి దోస్తులతో ఆడుకోడానికి వెళ్ళిన రోజులు. తుంటరి పనులు చేసి దెబ్బలు తిన్న రోజులు.ఇదంతా ఒక పచ్చని జ్ఞాపకం. చాలా సార్లు అనిపిస్తుంది .నేటి తరం పిల్లలు ఏం మిస్ అవుతున్నారో కదా అని. చికెన్ కోసం కోళ్ళను తయారు చేసినట్లు గుమస్తా గిరి ఉద్యోగాల కోసం నేటి తరం పాకులాడుతున్నారు అని ,కానీ అలాంటి అవకాశమే వరుసగా పది రోజుల పాటు వస్తే వినడానికి అత్యాశే అయినా ఇది నిజం గా హుదూద్ తుఫాన్ పుణ్యమా అంటూ ఈ అవకాశం లభించింది.

ఇప్పటి జనరేషన్ రిపోర్టర్ ఉద్యోగం .క్షణం తీరిక ఉండదు ,దమ్మిడీ ఆదాయం ఉండని ఉద్యోగం. ఎప్పుడు ఏం జరుగుతుందో దేని నుంచి ఎలాంటి వార్త రాబట్టుకోవాలో అని గోతి కాడ నక్కలా వార్తల కోసం కాపుకాసే ఉద్యోగం నాది.అందరికీ పండుగలు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటుంటే అత్యవసర ఉద్యోగాలు చేసే మాలాంటి వాళ్ళకు కుటుంబ సభ్యులందరితో చేసుకోడం ఎప్పుడో కలిగే అదృష్టం అనుకోవాలి.

సరే , విషయంలోకి వస్తే అక్టోబర్ నెల అనగానే తుఫానుల నెల అన్న పేరు ఎలాగో ఉంది దసరా దాటినా ఈసారి  అలాంటి వార్తలు ఇంత వరకు ఏదీ రాలేదు.గత సంవత్సరం ఈ సమయానికి హెలెన్ తుఫాన్ తీరం దాటింది.ఈ సంవత్సరం ఇంతవరకూ ఏదీ లేదు అని చూస్తున్న మాకు దిమ్మ తిరిగి పోయే వార్తను తుఫాను హెచ్చరికల కేంద్రం తెచ్చింది.హెలెన్ కంటే 20 రెట్లు పెద్దదైన తుఫాను బంగాళా ఖాతం లో ఏర్పడిందని సమాచారం. తీరం దాటే సమయం లో కనీ వినీ ఎరుగని ఉపద్రవం వస్తుందని అక్టోబర్ తొమ్మిదవ తేదీ అధికారులు పూర్తి స్థాయి  సమాచారం అందించారు. విశాఖ నగరం కేంద్రం గా ఈ తుఫాను కేంద్రం దాటుతుందని చెప్పారు. ఇంకేముంది చేతి నిండా పని.తుఫాను అనంతరం కూడా దాదాపు పది రోజుల పని ఉంటుందని ఊహించాను.నన్ను నేను నిరూపించుకునేందుకు వచ్చిన మరో అవకాశం.”పోరాడుతూ ఉండు. గెలుస్తామో , మరణిస్తామో కానీ నువ్వు వదిలిన జ్ఞాపకం వేలాది మందికి సంతృప్తినిస్తుంది” అన్న చే మాటలు నన్ను ముందుకు ఉరికేలా చేసాయి.

అక్టోబర్ 11 ఉదయం ఒక సాహితీ వేత్తను ఇంటర్వ్యు చేసేందుకు వెళ్ళే సమయానికి తుఫాను ప్రభావం కనిపిస్తుంది. గాలి వేగానికి నా పాత హీరో హోండా ముందుకు దూకనంటుంది.నా మనస్సాక్షికి తెలుస్తుంది ఏదో పెద్ద విపత్తు సంభవిస్తుందని. విశాఖ సిటీ లో కంటే విశాఖ రూరల్ లో ముఖ్యం గా గ్రామాలకు వెళితే బాగుంటుదని హెడ్ ఆఫీస్ కు చెప్పి ఇంటికి వెళ్ళి ఒక జత బట్టలు, ఒక రెండు పుస్తకాలు తీసుకుని మా కెమెరామెన్ తో కార్ లో బయలు దేరాను.విశాఖ నుండి 60 కిలోమీటర్ ల దూరం లో వస్తుంది పుడిమడక గ్రామం. పూర్తి మత్స్య కార గ్రామం.

విశాఖ నుండి నేను అక్కడికి వెళ్ళే సరికి సాయంత్రం 5 అయింది. ముందు పుడి మడక తీరం దగ్గరికి వెళ్ళాను.అప్పటికి చాలా ప్రశాంతం గా ఉంది గ్రామం. తుఫాను దృష్ట్యా ప్రభుత్వ అధికారులు మత్స్య కారులను పునరావాస కేంద్రాలకు రావాలని ఎంతో నచ్చచెపుతున్నారు.”నాను గంగ పుత్రుడుని ,గంగమ్మ తల్లి నాకేటి సేత్తది ,తుఫాను గురించి నువ్వు మాకు చెప్పొచ్చావేంటి వెళ్ళెళ్ళవోయి” అంటూ మత్స్య కారులను గ్రామం నుండి ఖాళీ  చేయిస్తున్న  అధికారులకు మాటలు వినిపించాయి.మేము అధికారులకు, మత్స్య కారులకు మధ్య లో దూరితే మా పనికి ఆటంకం అని మా పనిలో మునిగిపోయాము.విశాఖ జిల్లా అధికారులు 11 వ తేది సాయంత్రం 7 నుండి 12 వ తేదీ ఉదయం 9 వరకూ జాతీయ రహదారి పై ఎటువంటి వాహనాలు తిరగకూడదని హెచ్చరికలు  జారీ చేసారు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను తుఫాను తీవ్రత గురించి మా హెడ్ ఆఫీస్ కు సమాచారం ఇచ్చి నాకు కొంత అదనపు ఎక్విప్మెంట్ కావాలని కోరాను. ఎందుకో వారు అంతగా పట్టించుకోలేదు.ఒక వైపు తుఫాను అన్ని ఆధునిక ఆయుధాలతో ఉన్న సైనికుడిలా యుద్దానికి వస్తుంటే నాకు మాత్రం ల్యాప్ ట్యాప్ తో పాటు ఎప్పుడు బ్యాలన్స్ అయిపోతుందో తెలియని డాంగిల్ ఇచ్చి పంపారు మా హెడ్ ఆఫీస్ వాళ్ళు.

రాత్రి 9 కల్లా చెయ్యాల్సిన పనులు చేసేసి మా అచ్యుతా పురం రిపోర్టర్ విజయ్,మా కెమెరామెన్ రాజశేఖర్, డ్రైవర్ రిలాక్స్ గా ఉన్నాం.హోటల్ రూంస్ ఖాళీ లేకపోతే ఒక చిన్న బ్యాచిలర్ రూం లో అడ్జస్ట్ అయ్యాము. రాత్రి 12 గంటల నుండి స్టార్ట్ అయ్యింది గాలి తీవ్రత. ఇన్ టైంలో హెడ్ ఆఫీస్ కు విజువల్స్ పంపాలన్న తపన. ఎలాగో పని కానిచ్చేసి రెస్ట్ తీసుకునే సమయం లో ఒకటే గాలి. అసలే రేకుల షెడ్డు కావడం తో డమ డమ సౌండ్.ఎలాగో ఉదయాన్నే లేచి మా స్థానిక రిపోర్టర్ విజయ్ కు ఫోన్ చేస్తే వాతావరణం చాలా ప్రశాంతం గా ఉందనీ..ఎందుకు అక్కడికి అనీ అన్నారు.కానీ నాకు తుఫాను ముందర ప్రశాంతత ఇదే అనిపిస్తుంది.పద వెళదాం అని పుడి మడక మా టీం అంతా బయలు దేరాం. ఇక చూడాలి సడెన్ గా గాలి, వర్షం.పుడిమడక తీరం లొనే గత 30 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడనంత ఉధృతం గా కెరటాలు వస్తున్నాయి.

1413181594hudhud-toofan

మా కళ్ళ ముందే ఒక కెరటం లో మత్స్యకారుల  బోట్లన్నీ కొట్టుకుపోసాగాయి.ఓ కెరటం నన్ను తాకేలోగా మా అచ్యుతాపురం రిపోర్టర్ విజయ్ నన్ను లాగేసాడు.అక్కడి నుండి మళ్ళీ  అచ్యుతా పురం వచ్చేసాము. అధ్భుతమైన  విజువల్స్ తీసాడు మా కెమేరామెన్ రాజ శేఖర్.ఆ విజువల్స్ ను హైదరాబాద్ పంపగలిగితే మేము తుఫాన్ కవరేజీ లో టాప్.అదే సమయానికి సరిగ్గా మా ఇంటర్ నెట్ డాంగిల్ నేను పని చేయను…ఏం చేస్తారు తమరు అని ఎగతాళి చేసింది.ఏం చెయ్యాలి? ఎలాగైనా నన్ను నేను నిరూపించుకోవాలి..కొంతమంది అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి నా పని ద్వారా అన్న కసి తప్ప మరేం కనిపించడంలేదు నాకు.అప్పటికి సమయం ఉదయం 9. 60 కిలోమీటర్ లు. గట్టిగా అయితే విశాఖకు గంటలో వెళ్ళిపోతాము. ఇక నేనే గెల్చినట్లు.మా కార్ డ్రైవర్ బాబ్జీ ని పదండి విశాఖ కు వెళదాం అన్నాను.

కానీ గాలి ఎక్కువగా ఉందని మా రిపోర్టర్ విజయ్ వద్దన్నారు. “ధైర్యే సాహసే లక్ష్మీ” అనుకుని బయలు దేరబోయాను. మీకు పెళ్ళయిందా గుర్తుందా అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది నా అర్ధాంగి.నిజమే నాకు పెళ్ళయింది. ఈ వర్షం లో తని ఇంట్లో ఒక్కతే ఎలా ఉందో అసలే సముద్రం ఎదురు ఇళ్ళు.పక్కన ఎప్పుడు వచ్చే చిన్న పాప స్వాతి అయినా దగ్గర ఉందో లేదో అన్న సంశయం తో ఫోన్ చేసాను.అనుకున్నదే అయింది. ఫోన్ నాట్ రీచబుల్.

మా డ్రైవర్ ను సాధ్యమైనంత  త్వరగా వైజాగ్ తీసుకెళ్ళమని ఆర్డర్ వేసాను.ఆయనకు ఆర్డర్ వేసాను గానీ పరిస్థితి బాలేదు. అర్దం అవుతుంది. ఇంతలో “సైక్లోన్ కైలాసగిరి ని తాకింది. తూర్పు వైపుగా సాగుతుంది” అని నా సెల్ లో మెసేజ్.అంటే తుఫాన్ కి ఎదురు ప్రయాణం చేస్తున్నామన్న మాట.ఈ విషయం మా కెమేరామెన్ కు గాని, మా డ్రైవర్ కు గానీ చెప్పలేదు.అప్పటికి మేం పరవాడ దాటాము. గాలి తీవ్రత కు మా కారు ఊగడమే కాకుండా అనేక చెట్లు పడిపోతున్నాయి. మా డ్రైవర్ అంతరంగం తెలియలేదు గానీ, ఏం చేద్దాం అన్నట్టు చూసాడు. పోనియ్యగలరా అన్నాను. పోనిద్దాం సర్ అన్నాడు.

ఫాస్ట్ గా వెళ్ళమన్న నేను నిదానం గానే వెళ్ళండి మనం సేఫ్ గా ఉండాలి కదా అన్నాను.ఇంతలో రాజశేఖర్ గారు ఆయన పని ఆయన చేస్తారు గాని, మనం ఒక దగ్గర కార్ ఆపి మాక్ లైవ్ చేద్దాం అన్నారు. సరే అని తీరా దిగుతుంటే రాజశేఖర్ గారు గట్టిగా “మీరు దిగొద్దు. గాలికి ఎగిరిపోతారు” అన్నారు.గాలి తీవ్రత తగ్గిందాక ఉండి ఒక మాక్ లైవ్ చేసే బయలుదేరాం. మళ్ళీ ఇంకో సమస్య.స్టీల్ ప్లాంట్ మీదుగా వెళ్ళాలా?హైవే మీదుగా వెళ్ళాలా?అని. మా డ్రైవర్ ని నిర్ణయం తీసుకోమన్నాను.

వెంటనే లంకెల పాలెం మీదుగా హైవే చేరాము. కానీ అప్పటికే పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటి పోయింది.మొబైల్స్ పని చేయడం లేదు. ఈ జడివాన లో వెళ్ళగలమా అనే అనుమానం అందరికీ.కనీసం నాలుగు కల్లా ఆఫీస్ కు విజువల్స్  చేరితే మా చానల్ కవరేజీ లో టాప్.ఎలాగైనా వెళ్ళాలి అన్న మొండితనం తప్ప మరేదీ లేదు.అయితే హైవే పై గాలి వాన మరీ ఎక్కువ కాసాగింది.ఎంతలా అంటే సరక్ సరక్ మని గుండు సూదుల్లా చినుకులు గుచ్చుతుంటే మాకు మాట్లాడడం రావడం లేదు. మాక్ లైవ్ చేయడం రావడం లేదు.కానీ మళ్ళీ మాక్ లైవ్ చేసే బయలు దేరాము. దారిలో అడ్డం పడిన చెట్లను నేను, రాజశేఖర్ గారు తప్పిస్తూ ముందుకు సాగాము. ప్రతి సారి మాకు ఎలా వెళ్ళాలి అనేది సమస్య. ఈ సారి నిర్ణయం నేను తీసుకున్నాను.హెచ్.పి. సి.యల్ మీదుగా వెళ్ళండి అక్కడ చెట్లు ఉండవు అని చెప్పాను.నా వైపు అదోలా చూసిన మా బాబ్జీ కారును దూకించాడు. జాగ్రత్తగా విశాఖ చావుల మదం చేరాము.అక్కడ బ్రిడ్జ్ దగ్గర్ నీరు ఎక్కువ గా ఉంది. పోవడం వీలు కాదని చెప్పాడు డ్రైవర్. సమయం 12. ఎలాగైనా ఇంకో గంటలో చేరితే చాలు మా దగ్గర ఉన్న విజువల్స్ పంపేయవచ్చు.నడుచుకుంటూ వెళదామా అంటే దాదాపు రైల్వే స్టేషన్ నుండే 6 కిలో మీటర్లు వస్తుంది. ఆ అవకాశమే లేదు.

కెమెరా కూడా తడిచిపోతుంది. సరే ,కంచర పాలెం మీదుగా ఫ్లై ఓవర్ ఎక్కించండి అన్నాను. మా దురదృష్టం ఎంతలా వెంటాడింది అంటే అక్కడ హై టెన్షన్ విద్యుత్ వైర్లు పడి ఉన్నాయి. ఇక గాలికి ఒక్కసారిగా మా ఎదురుగా ఉన్న హైటెక్ బస్సు లేచి , తిరిగి మళ్ళీ యధాస్థానానికి వచ్చింది . ఇక మనుషులు ఒకరికొకరు గట్టిగా పట్టుకుంటున్నారు. బ్రిడ్జ్ కిందనుండి వెళ్దామని ప్రయత్నిస్తే అక్కడ రైల్వే గేట్ వేసి ఉంది.టైం చూస్తే 1 దాటింది. నాకు ఒక్కసారిగా ఓడిపొయానన్న నిస్సత్తువ ఆవరించింది.ఏం చెయ్యాలో అర్దం కావడం లేదు. ఇంత కష్టపడిందీ ఎందుకు అనిపిస్తుంది.నా పై విమర్శలు చేసిన వారికి సమాధానం చెప్పలేక పోతున్నానే అనిపించి ఒక రకమైన ఆవేదన,నిర్వేదం లో కూరుకుపోయాను.ఈ లోగా మళ్ళీ ఏదో తెగింపు.

మా డ్రైవర్ ను బ్రిడ్జ్ మీదుగా పోనివ్వమన్నాను.మీది ధైర్యమా, మొండితనమా అని మొహం మీదనే అనేసాడు.మా రాజశేఖర్ కూడా వెళ్ళాల్సిందే అనడం తో బయలు దేరాము.అప్పటిదాకా ఆఫీస్ కు రావాలన్న తొందరలో బయట జరిగిన ప్రకృతి నష్టాన్ని పట్టించుకోలేదు. పచ్చదనం తివాచీ పరిచినట్లు ఉండే వైజాగ్ ఇప్పుడు మోడు గా మారింది.ఎక్కడ చూసినా గాలికి ఒరిగిపోయిన ఇళ్ళు.  సర్వం పోయిన బాధలో కొందరుంటే దొరికింది దొరికినట్టు దోచుకుపోయే వాళ్ళు మరి కొందరు. ఎక్కడ చూసినా విరిగి పోయిన వాటర్ ట్యాంక్ లు,  రేకులు, చెట్లు. చివరకు తాటి చెట్ల పాలెం వద్ద ట్రాఫిక్ లో ఇరుక్కున్నాము. గాలి వీయడం మానలేదు. గట్టిగా నడిస్తే 15 నిమిషాలు. మా కెమెరామెన్ రాజశేఖర్ ను దిగమన్నాను.

గొడుగు ఇచ్చి మీరు ఎలాగోలా ఆఫీస్ కు వెళ్ళి ఫీడ్ ఇవ్వండి అని పంపించాను. నేను మాత్రం నిదానం గా దారిలో తెరిచి ఉన్న ఒక షాప్ లో రెడ్ విల్స్ కొని , గుండె నిండా దమ్ము లాగి ఆఫీస్ కు బయలు దేరాను.అప్పటికి సమయం 2 అయింది.పని చేయని 3జి నన్ను వెక్కిరించింది. ఛీ “ దీనమ్మ బతుకు” ఇంత కష్టపడి వృథా అవుతుందా అనిపించింది. రాజశేఖర్ ఫీడ్ పంపాడు,కానీ నాలో ఓడిపోయాను అనే ఫీలింగ్. ఆఫీస్ ఎదురుగా చెట్లు చూస్తుండగానే ఒరిగిపోతున్నాయి. వాటర్ ట్యాంక్ లు వాటర్ తో సహా ఎగిరి పడుతున్నాయి.మా ఆఫీస్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అప్పుడు సడెన్ గా ఇల్లాలు గుర్తొచ్చింది.తను ఇంట్లో ఎలా ఉందో ? సాయంత్రం 6 గంటలకు చీకట్లు ముసురుకునే సమయానికి అదే భీభత్సం లో విజువల్స్ పంపేసాను.ఇక ఇంటికి చేరాలి. నన్ను నమ్ముకున్న ఆ జీవి ఇంటి దగ్గర ఎలా ఉందో? ఈ గాలి వాన లో వెళ్ళొద్దు అని ఆఫీస్ లో వారిస్తున్నా వినకుండా నడుస్తూనే బయలుదేరాను. సీతమ్మ ధార నుండి చిన వాల్తేర్ 6 కిలో మీటర్ ల దూరం. మామూలుగా అయితే అరగంట నడక.ఇప్పుడున్న పరిస్థితి లో నడుస్తూ వెళితేనే బెటర్ అని బండిని అక్కడే వదిలి బయలు దేరాను.

hudhud-toofan-poor-people

పాత ఈనాడు ఆఫీస్ దగ్గరకు వచ్చే సరికి పరిస్థితి మరీ అద్వాన్నం గా తయారయింది. ఎగిరి వస్తున్న రేకుల షీట్ లను తప్పించుకుని నడక సాగించాను.గాలి అడుగు పడనీయడం లేదు. ఒక షాప్ తెరిచి ఉంచితే క్యాండిల్స్ కావాలి అని 20 రూపాయలు ఇచ్చాను.ఇంకో 10 ఇవ్వమని రెండు మైనపు ప్రమిదలు చేతిలో పెట్టాడు షాప్ వాడు. దోపిడీ అప్పుడే మొదలైందా అనుకుంటూ ముందుకు సాగాను. అదృష్టం ఏంటంటే..సత్యం జంక్షన్ నుంచి మద్ది పాలెం జంక్షన్ వరకు రెండు వరుసలలో లారీ లు ఆగిపోయి ఉన్నాయి.వాటి మద్యలో ఉన్న గ్యాప్ లో చక చకా నడిచాను.రైన్ కోట్ పూర్తిగా తడిచిపోయింది.

సర్రున కోస్తున్న ఈదురుగాలి.నేను ఏ యూ ఇంజనీరింగ్ కాలేజ్ వైపు ..త్రీ టౌన్ స్టేషన్ మీదుగా చిన వాల్తేర్ వెళ్ళాలి. ఏదైనా వెహికిల్ కనిపిస్తే లిఫ్ట్ అడుగుదామని ఆశ. నా పిచ్చి గాని ఈ గాలి వాన లో ఎవరు బయటికి వస్తారు? ఏ యూ లో ఎన్నో ఏళ్ళ నుండి ఉన్న చెట్లు కూలిపోయాయి.చిమ్మ చీకటి. మోకాలు లోతు నీళ్ళు. ఆ నీళ్ళళ్ళో చెట్ల కొమ్మలు, కేబుల్ వైర్లు, విద్యుత్ వైర్లు.ఇంజనీరింగ్ హాస్టల్ దగ్గరకు వచ్చే సరికి కాళ్ళళ్ళో పట్టు తప్పింది. కాసే పు ఎలాగైనా ఆగాలి. ఒక 20 అడుగుల దూరం లో ఒక పార్క్ చేసిన పాల వ్యాన్  కనిపించింది. అక్కడకు పరిగెత్తుకెళ్ళి ఒక అయిదు నిమిషాలు గాలి, వాన ను తప్పించుకున్నాను.

అప్పటికి 7 అయింది. త్రీ తౌన్ మీదుగా,సి.బి.ఐ మీదుగా చిన వాల్తేర్ కు నడుస్తున్నాను.చూస్తే నాపక్కనే ఒక 50 సంవత్సరాల వ్యక్తి నడుస్తున్నాడు. అతను జారిపోబోతే పట్టుకున్నాను. అతను శానిటరీ ఇంజనీర్ అట. వెహికిల్ , వాకీ టాకీ పాడయ్యాయని చెప్పాడు. ఇద్దరం ఒకరి చేయి ఒకరం  పట్టుకున్నాము. ఆ పెద్దాయన మనిషికి మనిషి తోడు అంటే ఇదేనేమో అన్నాడు.నేను వేగం గా నడుస్తూ కరెంట్ వైర్ తగిలి పడిపోబోయాను. ఆయన పట్టుకున్నారు. అప్పుడు అనిపించింది ఆయన చెప్పింది మానవత్వం అని. ఆయన ఇళ్ళు వచ్చింది. వెళ్ళారు. నేను నడుస్తూనే ఉన్నాను.

మా వీథి లో చెట్లు ఉండవు గానీ రేకుల ఇళ్ళు ఎక్కువ. ఎటు చూసినా విరిగిన రేకుల ముక్కలే కనిపించాయి.అలాగే ఇంటికి చేరి తలుపు కొట్టాను. నా అర్ధాంగి తలుపు తీసింది.ఆ కళ్ళల్లో నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళావన్న  బాధ, ఇంత గాలి వాన లో నడిచి వచ్చావన్న బాధ…ఒక్కసారే రెండు కన్నీటి చుక్కలై రాలాయి.ఇళ్ళంతా నీళ్ళతో నిండి పోయింది. కిటికీ అద్దాలు పగిలిపోయాయి.తను పరుపు ఎత్తేసి , ప్రమిద వెలుగులో కుర్చీలో కూర్చుని ఉంది.సరే..అసలు మధ్యాహ్నం నుండీ ఏమైనా తిన్నావా అంటే …ఏమీ తినలేదు అంది. నువ్వు నీళ్ళు ఎత్తు…నేను అన్నం సంగతి చూస్తాను అన్నాను.ఇక ఆ రాత్రి అలా గడిచిపోయింది.

ఇక తెల్లవారి అక్టోబర్ 13. హుదూద్ కష్టాలు మెల్ల మెల్ల గా ప్రారంభమయ్యాయి. పాలు లేవు ,పేపర్ లేదు. వాటికోసం రోడ్ మీదకు వెళితే పాల ప్యాకెట్ 100 రూపాయలు, పేపర్ 10 రూపాయలు అన్నారు. ఇవ్వాళ పేపర్ చదవకుంటే వచ్చిన నష్టమేమీ లేదు అనుకుని ఇంటికి వచ్చాను. ఇంట్లో నీళ్ళ కష్టాలు మొదలు.కరెంట్ లేదు. కుళాయిలు రావు. ఇంట్లో ఉన్న నీళ్ళతో స్నానం చేసి నేను, మా కొలీగ్ జార్జి ఇద్దరం ఆఫీస్ కు బయలు దేరాము. ఏయూ మీదుగా వెళదామా అన్నాడు జార్జి.మనం చదువుకున్న ఆ పచ్చదనం ఇప్పుడు మోడై పోయింది,చూడలేము అనుకుని వేరే రూట్ లో ఆఫీస్ కు వచ్చాము. అక్కడ పరిస్థితి అంతే . కేవలం ఇన్వర్టర్ మాత్రం పని చేస్తుంది.ఇక అప్పటికప్పుడు ఆఫీస్ లోని వ్యక్తులం కేవలం కెమెరా బ్యాటరీ లు మాత్రమే చార్జింగ్ పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఏం చేద్దామన్నా ఫోన్లు లేవు. నెట్ లేదు.

అప్పటికే విద్యా సంస్థ లకు సెలవు ప్రకటించారు. ప్రజలు స్వచ్చందం గా  వారి వీథుల్లో ఉన్న చెట్లను,ఇతర వైర్లను తొలగిస్తున్నారు.ఇలాగే మరో రెండు రోజులు గడిచాయి. పరిస్థితి మరీ దిగజారింది. నిత్యావసర వస్తువులైన పాలు, నీళ్ళ కోసం తన్నుకుంటున్నారు. ముఖ్య మంత్రి ఇక్కడ తిష్ఠ వేయడం తో అధికారులు పరుగులు పెడుతున్నారు.మా నీటి కష్టాలు తీరే లా లేవు. పైగా నా భార్యా మణి తెగ నీళ్ళు పారబోస్తుంది. అప్పటిదాకా పట్టించుకోని బోర్లను రెండు బకెట్ల నీళ్ళ కోసం ఆశ్రయిస్తున్నారు.నేనూ ఆ లైన్ లో దూరి నీళ్ళు మోసే సరికి తల ప్రాణం తోక కొచ్చింది.ఇక మా ఆఫీస్ లో ఫీడ్ పంపించడం అవ్వడం లేదు. మీరేం చేస్తున్నారని హెడ్ ఆఫీస్ నుండి షంటింగ్.

ఇక ఇవన్నీ ఇలా ఉంటే కరెంట్ ఉన్నపుడు రాత్రి 10 అయితే తప్ప ఇళ్ళు చేరని నాలాంటి వాళ్ళు 7 గంటలకల్లా ఇళ్ళు చేరుతున్నాము. టీవీలు లేకపోవడం తో పిల్లలు ఆటలే ఆటలు. తాతలు, బామ్మలు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకోని కథలు చెప్పడం చూసాను. నా మటుకు నేను నా అర్ధాంగి తో క్యాండిల్ లైట్ డిన్నర్. నీళ్ళ ట్యాంకర్ రాగానే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన యుద్దాలు మళ్ళీ కనిపించాయి. ఆ యుద్దాలు చేయలేని నాలాంటి వాళ్ళు దూరం నుండి నీళ్ళు మోసుకున్నాం.

దాదాపు తొమ్మిది రోజులు కరెంట్ లేదు. ఇక ఇదే పని.తల్లిదండ్రులు సాయంత్రం 7 కల్లా రావడం, పిల్లలతో గడపడం.ఉదయాన్నే నీళ్ళు మోయడం మంచి ఎక్సర్ సైజ్ . పిల్లలతో టైం స్పెండ్ చేయడంతో అనుభందం పెరిగింది. నాకైతే పక్కింటి వాళ్ళే తెలియదు. హుదూద్ పుణ్యమా అని అందరూ పరిచయ మయ్యారు. ఇక కబుర్లే కబుర్లు. తీయని ఊసులు చెప్పుకుంటూ క్యాండిల్ లైట్ డిన్నర్లు. నా భార్య రోజూ కరెంట్ పోతే బాగుండు మీరు ఎప్పుడూ ఇలా తొందరగా వస్తారు అంటుంటే తుఫాను లో ప్రమోదం ఇదేనేమో అనిపించింది.

ఇక చూస్తుండగానే కరెంట్ వచ్చింది. డ్రింకింగ్ వాటర్ వచ్చాయి. హుదూద్ పుణ్యమా అని ఈ జనరేషన్ కు కథల విలువ తెలిసిందని నేను అంటే  కాసింత ఆత్మీయత అంటే ఏమిటో కూడా తెలిసినట్టుంది అని నా అర్ధాంగి అన్నది.

నిజమే కదా అనిపించింది నాక్కూడా.

 -విజయ్ గజం

 

రోబోసెపియన్ వరాహకస్

Painting: Rafi Haque

Painting: Rafi Haque

పైసలున్నవి
పోరియున్ గలదు
గ్రిల్డ్ చికెన్ గుండెకాయ
ఫిష్ ఫ్రై చర్మము
-ఎంథిరన్!
స్విమ్మింగ్ ఇన్ ద బౌల్
వాకింగ్ ఆన్ ద ట్రెడ్ మిల్
స్పర్శకు రుచి తెలియదు
సోడాబిల్లేడ్ కళ్లకు తడి తగలదు
ఓరీ ఎంసీపీ
(లోకము కన్నెర్ర చేసెను)
కోపం సేయకు దొరా
నన్నంటావుగానీ తన సంగతేందిరా
పోనీ ఒక పజిల్ ను పూరించుము
తేడాలను కనుక్కోండి
ఏది ఉక్కులాంటి ఆకసము
ఏది పచ్చాపచ్చాని నేల
ఏ రెక్కల సవ్వడి
ఏ గండభేరుంఢ ధ్వానము
ఏది అవకాశమేదియాపద
ఆకలికి అన్నము
వాక్యమునకు అక్షరము
అక్షరమునకు ధ్వని
వినరా సోదర వీరకుమారా
ఫోనెటిక్సు నీవూ
“యే నిట్టూరుపు వెనుక
యే భావ ప్రయోగము దాగిఉన్నదో
తెలుసుకోలేనంత కాలమూ
‘పురుష్’లు ముఖము పచ్చడి
చేసుకుంటూనే ఉంటారు”
చూ-24:16:82- మేల్ కొలుపు
వేషము మార్చి భాషను నేర్చి
నవ్వుల జడిలో కరెన్సీ సడి
కొంచెం కీన్ గా చూడు
-ఆ పెదవులు
పర్సులా తెరచుకున్నవి కదూ ;)
హుహ్…బేబీడాల్!
ఓకే ఓకే
అయాం సారీ
అంటే అన్నానంటారుగానీ
నీ సంగతేంది బే?
శూన్యము కానిచోట
పదార్ధము జమపడజాలదు
ఇనుములో
హృదయమూ జనించజాలదు
శుష్క్ ఇష్క్!
చిట్టి చిట్టి రోబో
నా చిన్నిచిన్ని రోబో
మానవుడా మగవాడా
మెట్రోపాలమగారాజా
హోమోసెపియన్ మోడర్నికసుడా
భ్రమ వీడరా
ఒరేయ్ రోబోసెపియన్
బాహర్ నికాల్!
అరుణ్ సాగర్
arun sagar

‘కౌముది’ మాస పత్రిక కథల పోటీ

10685021_917373834941810_1501476356_n

కవిత్వం ఎప్పుడూ అతని తోడు!

10599497_779928925404414_7004760793705969153_n

వర్చస్వి బహుముఖీనుడు, కవి, కథకుడు, చిత్రకారుడు, వ్యంగ్య చిత్రకారుడు. ఇవి కాక మంచి స్నేహితుడు . కవిత్వం తెచ్చిపెట్టుకున్నది కాక, ఇష్టంగానే తానే ఎంచుకున్నది. కవిత్వంలో అతను సంభాషిస్తాడు . కవిత్వంతో అతను మాట్లాడుతాడు . సమాజపు ప్రతి కదలికను అక్షరంలోకి ఒంపుతాడు. కవిత్వాన్నిచిత్రంగా రూపొందిస్తాడు . అలా కవిత్వం తనకొక సీరియస్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న ప్రక్రియగానే భావిస్తాడు . అందుకనే ఈ కవిత్వమంతా అతని సంభాషణ అని అన్పిస్తోంది.

ముభావంగా వుండే అతని వ్యక్తిత్వంలానే, ఇతని కవిత్వం ముభావంగానే, ముక్తసరిగానే పలుకుతుంది, అందుకేనేమో ఈ కవిత్వానికి ఇంత బలం. ధీమా.

ఏ వస్తువు గురించి ఇతని కవిత్వం పలకలేదూ! .. అని నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను . అప్పుడెప్పుడో  మూసీలో మునిగిపోయిన చిన్నారి మాన్వి ఉదంతం నుంచి దిల్‍సుఖ్‍నగర్ ఘటనల వరకూ , కవిత్వం గురించిన తన స్పందన నుంచి, స్నేహవర్షం వరకూ అన్నీ అతని అక్షరాలుగా ఒదిగిపోయాయి. కవి తనతో పాటు తన ప్రయాణం లో కవిత్వాన్ని తోడు తెచ్చు కుంటున్నాడు , తనలోని అన్ని స్పందనలకు కవిత్వాన్ని వాహికగా మార్చు కుంటున్నాడు .

“అంతరించిపోతున్న పిచ్చి పిచ్చుక కంఠం

నన్నప్పుడప్పుడు రెచ్చగొడితే చాలు…….

ఏ రవివర్మ చిత్రమో అంతుపట్టని మర్మ కవిత్వంగా మారి

అర్ధాల్ని నాచెవుల్లో రహస్యంగా ఉపదేశిస్తే చాలు! (కవితోత్పత్తి ) –

వర్చస్వి కవిత్వం లోకి ఎట్లా ప్రవేశిస్తాడో  అర్థంకావాడానికి ఈ కవిత్వపాదాలు చాలేమో !

 

కదిలిపోయే , కరిగిపోయేతనం వున్నవాడవడం చేత, ప్రతి సందర్భానికి, సంఘటనకి, స్పందనకి అక్షరాన్నే ఆశ్రయించాడు. అటువంటి ఉద్వేగ సంభరిత క్షణాలే ఇతని కవిత్వం!

“అంతరంతరాల్లో అలరారే తడివల్ల

లోచూపు వెలుగంగ లోకమగు పించెన”

అని గోరటివెంకన్నచెబుతున్న లోచూపు వెలిగిన సందర్భాలే వర్చస్వి కవితలు . నిశ్శబ్ధంగా ఉండేతనం వల్ల , గాఢమైన పరిశీలనాదృష్టి వలన వర్చస్విలో ఆ లోచూపు వెలిగే సందర్భాలు అనేకం.

బహుశా అదే కారణంకావొచ్చు. వేరెవరూ అందుకోలేని, అంటుకోని వస్తువుల దాకా  ప్రయాణించగలిగాడు. తనను ఆ సందర్భాల్లో అనుసంధానించాడు. మమేకత సాధించాడు . ఆ మమేకత వల్లనే చాలా కవితలలో తనదైన ముద్రతో పలకడమే కాదు , పాఠకుడిని కూడా ఇన్‍వాల్వ్ చేయగలిగాడు . కేవలం కవిత రాయాలనే కాంక్షతో ఏదోకటి రాసేసే తనంతో కాకుండా , తప్పని సరై రాయకుండా ఉండలేని స్థితిలో కవితలను మలిచాడు . అందువల్లనే ఆయా కవితలలో అంతటి పదును, ఆర్ద్రత వచ్చిచేరాయి . కవితాతత్వం కవితలో వర్చస్వి చెబుతున్నది కూడా అదే . కవిత్వ మంటే ఏమిటో స్పష్టంగా ఆయనకు తెలుసు, అదో ఆషామాషీ వ్యవహారం కాదని . అది గోడ పక్కన కట్టేసిన దూడ కాదనే ఎరుక వుంది . ఆ ఎరుకను బాహాటంగా ప్రకటించాడు కూడా !

కవిత్వమంటే కేవలం అక్షరాల్నీ పేర్చుకుంటూ పోవడం కాదు, అందులో ఆత్మను ఆవిష్కరించాలి అనే కవుల కోవలోకి చేరుతాడు వర్చస్వి. తానురాయడం మాత్రమేకాదు, మంచి కవిత్వం ఎక్కడుంటే అక్కడ తన ప్రశంసతో భుజం తడతాడు . కామెంట్ భరోసాయిస్తాడు. తన కవిత్వం కన్నా , ఇతరుల కవితలపైన ఎక్కువ మక్కువ చూపుతాడు . అది ఎంత మంచి కవిత అయితే అంతటి సహృదయుడు . ఆ  సహృదయత , నిజాయతీతనం , కవిత్వం పట్ల వున్న పిచ్చి ప్రేమ – ఇవన్నీ ఆయన కవితల అంతస్సారంగా మనకు కన్పిస్తూనే వుంటుంది. కవిత్వం గురించే ఆయన రాసిన  కవితలు ‘కవిసమయం’ , ‘కెథార్సిస్’ , ‘కవిత్వం కావాలి కవిత్వం’ వంటివి కవిత్వపు సీరియస్‍నెస్ ను అంశాలను ప్రకటిస్తాయి .

కవిత్వభాష విషయంలోనూ వర్చస్విది ప్రత్యేకమైన వర్గం. ఆధునిక కవితకు వాడుతున్న వ్యావహారిక పదాలు , పద బంధాల్లోంచి కొంచెం పక్కకు జరిగి తనదైన స్వంత పదాల మార్పును కవిత్వంలో వాడతాడు . ఆ పదాల కూర్పు ఒకింత ప్రత్యేకం. కవితా శైలి విషయంలోనూ  తనదైన ముద్ర వుంది. ముగింపుల్ని ఒక సందేశంతోనే , చరుపుతోనో, లేదా ఆలోచింపజేసేదిగానో ముగించడం వర్చస్వి కవితల లక్షణం. బహుశా అతనిలోని కధకుడు, చిత్రకారుడు ఈ రకపుశైలికి అదనపు ప్రేరణ అయివుండవచ్చు .

10818812_10205758492627276_800166051_n

కొన్ని కవితల నిర్మాణంలో బిగుతైన పద్దతిని పాటిస్తూనే , కొన్ని కవితలలో ఆ వస్తువును కవిత్వం చేసే క్రమంలో అవసరంగా భావించి దీర్ఘమైన నిర్మాణాన్ని ఎంచుకోవడం చూస్తే, కవిగా ఇతనిలో కవితా నిర్మాణం పట్ల ఉన్న అవగాహన తెలిసి పోతుంది.

వర్చస్వి లోని చతురమైన దిగ్ర్భమ కలిగించే కవిత్వ శైలి నాకు భలే ఇష్టం .

“నగరవాసి చిరునవ్వు ఫెళ్ళున బ్రద్దలైంది” – ఇది ‘అమానుషం’  కవితలోని ప్రారంభ కవితా పాదం . ఈ కవిత దిల్‍సుఖ్‍నగర్ పేలుళ్ళకి స్పందించి రాసినది . ఆ మొదట పాదం లోనే మొత్తం కవితకి సంబంధించిన మూడ్ క్రియేట్ అయింది . ఇటు వంటివి అనేక కవితల్లో తారసపడతాయి .

అవును నాకు పనీ పాటా లేదు ,   నీ పెదవులు బందీలు కావుగా , తిప్పితిప్పి కర్రతో వత్తితే గాని రొట్టెకి టేస్టు రాదు . ఇవన్నీ కవితల ప్రారంభ పాదాలే. ఇటువంటివే   చాలా మట్టుకు చూస్తాం . ఇటువంటి ప్రారంభ పాదాలతో కంచలోకి ప్రవేశించి, తనదైన నిర్మాణ వ్యూహంతో కవిత రాయడం వర్చస్వి లోని ప్రత్యేకమైన పద్దతి . అందువల్లే ఈ కవితల్లో అదనపు బలం జోడింపబడుతోంది . ఆ అదనపు బలంవల్ల  కవితల స్వరంలో బలం వచ్చింది. ఆ విధంగా వర్చస్వి   కవిత్వం, మిగతా కవుల స్వరాల కన్న  విభిన్నమైనది , ప్రత్యేకమైనది కూడా!

జీవితం తాలూకా జాడలు , సమాజపు  ప్రతిఫలనాలు, విభిన్నపార్శ్వాలు, వైవిధ్యమైన కోణాలు వర్చస్వి కవిత్వంలో పరుచుకొని వున్నాయి . ‘లోకాస్సమస్తా… ‘ అంటున్నది కూడా ఇందుకేనేమో ! తనని కదిలించిన వ్యక్తుల గురించి తనని వెన్నాడిన   సందర్భాల గురించి , తనను తానూ లోతుగా పరిశీలించుకున్న క్షణాల గురించి , తనలోకి , తానూ బయటకీ , బయట నుంచి తిరిగి తనలోకి ప్రయాణిస్తున్న  క్రమంలో తారసపడిన అనేక క్షణాల ఆలోచనలన్ని బిగ్గరగా, బయటకి వినిపించేటంత స్వరంతో ఈ కవిత్వాన్ని సృష్టించాడు . ద్వంసమవుతున్న విలువల విషాదాన్ని విషాదంలా కాక , వాస్తవికంగా ప్రకటించే పద్దతిని ఆశ్రయించాడు. మరోరకంగా చెప్పాలంటే చార్లీ చాప్లిన్ ఎంచుకున్న పద్దతి- అన్ని విలువలపై విమర్శ వంటిది ఇతని కవిత్వం .  ఆ ఎంచుకున్న పద్దతి విలక్షణం!

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ఫేస్‍బుక్ కవిసంగమం గ్రూప్ వేదికగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఒకానొకనాడు లాటిన్అమెరికా మహాకవి పాబ్లో నెరూడా ప్రఖ్యాత ‘మెమాయిర్స్’ ను అనువదించమని సహకవులకు సూచించినప్పుడు   వర్చస్వి ఒక్కడే స్పందించి సాధించాడు; ఆ కవితను పరిమిత స్వేచ్చానువాదమే చేశానని వర్చస్వి విన్నవించుకున్నా అపరిమిత మాధుర్యాన్ని తెలుగు సాహిత్య ప్రియులకు అందించాడనడంలో అతిశయోక్తి లేదు. లోకాస్సమస్తాలో ‘పదం’ చదివి తీరాల్సిందే!

 

“ఇప్పుడు పెదాల మధ్యనుంచి

మాయమాటలు ఒక్కొక్కటి

భూటకపుచీరలా జారుతుంటే

బాధేస్తోంది …”                                                           ( మళ్ళీవచ్చేయ్  )

భూటకపు చీర కృష్ణుడు ద్రౌపది కోసం పంపినదా? పెదాల మధ్య నుంచి మాయ మాటలు భూటకపు చీరలా జారడం , కోపాన్ని , ఆక్రోశాన్ని , ఉక్రోషాన్ని మోపడం కోసం, చెప్పడం కోసం ఎంచుకున్న విభిన్నమైన ప్రతీక . ఆ విభిన్నతకు కవి తన కవిత్వం కోసం, తప్పనిసరై, అవసరమై ఆశ్రయించాడు . గద్దింపు కోసం వాడుతున్నాడు, అలా ఆశ్రయించడం కేవలం వర్చస్వి లాంటి బహుముఖీన ప్రతిభ ఉన్నవాడికే సాధ్యమైన పని.

వర్చస్వి కవిత్వం ‘ లోకాస్సమస్తా… ‘ పేరిట పాఠకుడి ముందు సంభాషించడానికి సన్నద్దమవుతున్న తరుణం కూడా ప్రత్యేకమైనదే . అటువంటి ప్రత్యేకమైన సందర్భంలో కవిత్వంలో విభిన్నమైన గొంతుతో వస్తున్న వర్చస్వి కి ‘ జయహో ‘ లు !

 —కవి యాకుబ్

1779260_10203144783201536_2074735339_n

 

 

 

a tale of winter…

DRUSHYA DRUSHYAM

హైదరాబాద్ నగరంలో మింట్ కాంపౌండ్ సమీపంలో ఈమె.
ఒక బట్టల మూటలా ఆమె.

ఏమీ కానివారిని
ఈమె అంటామా ఆమె అంటామా?

ఎపుడూ నిర్లిప్తంగా ఉంటుందామె.
ఏ ఆలోచనా ఈమె చేస్తూ ఉన్నట్టుండదు.
కానీ, తనదైన ఉనికి ఒకటి థింకర్ శిల్పం వలే మనల్ని కట్టి పడేస్తుంది.
పీడిస్తుంది కూడానూ.

ఈమె ఒక తల్లి వేరు.
కూతురుంది. భర్తా ఉన్నాడు.

దాదాపు రెండు దశాబ్దాలుగా ఫుట్ పాత్ మీదే జీవిస్తున్న కుటుంబం ఆమెది.
అక్కడి ఎండా వానా చలీ ఆ చెట్టు నుంచి పడే ఎండపొడా అంతానూ కలగలసిన స్థలపురాణం ఈమె.

సరే. ఒక దృశ్యం.
ఈమె అక్కడే ఆ మూల మలుపులో ఇలా కూచుంటుంది.
ఒక రోజు మట్టిని నేలమీద సాపు చేస్తూ ఉంటుంది. మరో రోజు ఆ మట్టిని తలపై చల్లుకుంటూ స్నానం చేస్తూ కనిపిస్తుంది. ఇంకోరోజు ధ్యానంలో కూచున్నట్టు కూచుంటుంది. మధ్యలో చిన్న డివైడర్ లాంటిది ఉంది. అడ కూచుంటుందోసారి.

ఇవి ఉదయాలు.
సాయంత్రాలు దగ్గర్లోని మజీద్ ముందు కూచుని ఉంటుంది.
ఒక్కోసారి మజీద్ పక్కనున్న ఇరానీ కేఫ్ లో ఛాయ కావాలన్నట్టు నిలబడి ఉంటుంది.

భర్త ఉన్నాడు. ఆయన స్థిమితంగానే ఉంటాడు. ఈమెనైతే అందరూ పిచ్చిదనే అనుకుంటారు.
ఆయన ఆకు నములుతూ ఉంటాడు. ఈమె కూడా ఏదో నముల్తుందిగానీ అర్థం కాదు.

ఒక మూసిన తలుపుల ఇంటి ముందరి ఒక చప్టా వంటిది ఒకటి ఉంటుంది.
ఈమెకు కాస్త దూరంలో ఆయన కాలుమీద కాలు వేసుకుని అక్కడ కూచుంటాడు.

బిడ్డా ఉంది. ఇరవై ఏళ్లుంటుంది. ఇప్పటికి మూడుసార్లు కానుపయింది.
పోయిన ఏడు ఎవరో కానుపు చేయిస్తామని, కాన్పు అయ్యాక బిడ్డను తమకే ఇవ్వాలని ఒప్పించి హాస్పిటల్ కు తీసుకెళ్లారట. బిడ్డ పుట్టగానే వీళ్లను బయటకు గెంటేశారట. ఆ దినాల్లో ఆమెను చూస్తే, గుండె తరుక్కుపోయింది. డైజెస్ట్ కానీ జీవన వాస్తవికత వల్ల వాంతి రావడం తక్కువ. ఒక కవిలా రాయవలసి వస్తే, వాళ్ల దీనావస్థకు గుండెలు అవిసిపోయి ఇక మళ్లీ ప్రపంచంపై స్పందనలుండవిక…

బిడ్డ బాలింతగా ఉన్నా ఈ తల్లిది పిచ్చినవ్వే.
డెలివరీ అయినా అంతే. అయి వచ్చాకా అంతే.

ఒక నిర్లిప్త గాయం.
ఆమె. ఈమె. ఆకాశంలో సగం అనిపించదు.మట్టిలో మెట్టిన భూదేవి అనిపిస్తుంది.

బిడ్డ. ఆమె కాన్పుకు ముందు వారం కనిపించలేదు. కాన్పు అయిన మూడో రోజు మళ్లీ ఇక్కడే…ఇదే వీధిలో…

అమాయకంగా నవ్వుతూ కనిపించింది. ఆ నవ్వు ముడతల్లో తెగని బొడ్డుతాడు కనిపించి మనసు కమిలిపోయింది.భర్తా, బిడ్డా కాకుండా అప్పుడప్పుడూ ఇంకో మహిళ కనిపిస్తుంది. ఆమె వీళ్లకు బంధువట.
ఇద్దరు పిల్లల్ని వేసుకుని వస్తుంది. కనిపిస్తే చేయి చాపుతుంది. కానీ వీళ్లెవరూ చేయి చాపరు.అడుక్కునే మనుషులు కాదు. బతుకులు.
అంతే.ఆంజనేయస్వామి దేవాలయం టర్నింగ్ నుంచి వీళ్లు మొదలవుతారు.
ముందు భర్త…పక్కనే కూచుని నవ్వుతూ బిడ్డ.
పది అడుగులు దాటాకా పూర్తిగా నేలపైనే కూచుని ఈ పిచ్చి తల్లి.ఈ చిత్రం ఈ వారం తీసిందే.
ఒక వాటర్ కలర్ చిత్రంలా ఆమె ఇలా కూచుండి కనిపించింది.
కన్నీరు రాదు. వస్తే ఆ చిత్రం ఇక చిత్రంచలేం.

ఎందుకో ఈ వారం వాళ్లిద్దరూ కనిపించలేదు. ఒక్కత్తే, ఇలా మోకాళ్లలో తల వంచుకుని ఉంది.
చలికాలం అయినందువల్లో లేక బయట ఉన్నది… లోన లేనిదీ ఏమీ లేదన్నట్టు ముసుగు తన్నినట్టూ ఈ మూట.తోడుగా మరికొన్ని మూటలు. ఒక గిలాస. అందులో ఒలిచిన బత్తాయి ఆకలిని, రుచినీ గుర్తు చేస్తూ…

మొత్తంగా మనిషి..ఆ మనిషి మూటలు.
ఈ మూటల్లో ఏముంటాయన్న కుతూహలం కాకుండా చెట్లు నీడలోంచి పడుతున్న నీరెండ వెలుతురు విస్తర్లు.. అవి అధికంగా అవి ఆకర్శించాయి. మనుషులు ఎలాగైనా బతకనీయండి. కానీ, వెలుతురు ఉంది. వెలుతురులో ఉన్నారు. చీకట్లోకి తలవంచుకున్నా వెలుతుర్లోనే ఉండటం జీవితపు రహస్యం అనిపిస్తుంది.

రోడ్డు మీద రహదారిని చెప్పే తెల్లటి మరకా ఒకటి. అదీ ఏదో చెబుతుంది.
బహుశా మన గురించి.

విశేషం ఏమిటంటే, వీళ్లను ఒక ఆశ్రమంలో వుంచడానికి ప్రయత్నం ఒకటి చేశాను. కానీ ఉండలేమన్నారు.
ఇరానీ కేఫ్ యజమాని కూడా చెప్పాడు. ఆ పని తామూ గతంలోనే చేశామని. ఉండరని!

ఇల్లు వాళ్లకు అలవాటు లేకపోవడం ఒకటి చిత్రంగానూ, విచిత్రంగానూ అనిపిస్తుంటే, ఒక పదేళ్లుగా ఈ దారి వెంట వెళుతూ వాళ్లను గమనిస్తూ ఉన్నందువల్లో ఏమో ఇక వాళ్లను ఎక్కడైనా చేర్చాలన్న ఆలోచన చచ్చిపోయింది.

కానీ అక్కడికి రాగానే గుండె మూలుగుతుంది.
ఆ బాధలోంచే ఈమెను, అతడిని, బిడ్డనూ ఎన్ని చిత్రాలు చేశానో.
విచారకరమైనవే కాదు, నవ్వు తెప్పించేవి కూడానూ.

బిడ్డ తండ్రి మోకాళ్లపై నిలబడటం…
తన ఎత్తున్న బిడ్డ అతడి మొకాళ్లపై నిలబడి నవ్వుతూ ఒకసారి కనిపించింది.
పిచ్చిగా అనిపించింది. కానీ, ఆ పాప నవ్వు చూసి ఆ నవ్వులో శృతికలప వలసే వచ్చింది.
చిత్రమేమిటంటే, బిడ్డ చేష్టలు చూసి ఈ తల్లి పళ్లన్నీ కనబడేలా నవ్వినప్పుడు ‘వీళ్లు నవ్వుతారు’ అనిపించి నవ్వు వచ్చింది. ‘చిత్రం’ చేశాను.

ముగ్గురూ కూచుండి మౌనంగా మాట్లాడుకున్నప్పుడూ ఎన్నోసార్లు చూశాను.
ఏం మాట్లాడుకుంటారో అర్థం కాదు. కానీ పరిపరి విధాలుగా వాళ్లను ‘చిత్రాలు’గా చేశాను.

రాత్రిళ్లు మజీద్ దగ్గరే ఉన్న చప్టాపై వాళ్లు ముగ్గురూ కూచుండి కనిపిస్తే, ‘త్రీ మంకీస్’ వలే అనిపించి గాంధీ సమాధి ఏదో గుండెలో కదులుతుంది.
కానీ. నిజం. వీళ్లు ఇక్కడి వారందరికీ తెలుసు. ఇలా వెళ్లేవారందరికీనూ తెలుసు.
వాళ్లు నవ్వుతారు. చిర్నవ్వు చిందిస్తారు. చల్లగా అనిపిస్తుంది. వింటర్ టేల్.
లోపల మృత్యువును తడిమే  జీవితపు దరహాసాలు. అందరికీ తెలుసు.

కానీ, ఒకటి మాత్రం నిజం.
రహదారి సాహిత్యం ఒకటి ఉన్నందువల్ల ఈ కాలిబాట మీది జీవితాలు అగోచరంగా ఉన్నాయి.
వాళ్లను చూసి మనం తోవలో ఆగి ఫొటో తీసినట్టు ఒక కథ రాయడం కాదు. వాళ్ల జీవితాలు ఎలా తెల్లారుతున్నాయో మరెలా నిద్రిస్తున్నాయో, మూగన్నుగా కలవరిస్తున్నది ఏమిటో ఎవరైనా రాయాలి.

ఎండకూ చలికి గాలికీ వాళ్లు అలా చెదలు పట్టని పుస్తకంలా ఎలా గంభీరంగా మన ప్రపంచ షెల్పుల్లోనే పడి ఉండటం పట్ల మనం దయ చూపాలి. వాళ్లను కనిపెట్టి చదవాల్సిందే. అందుకు చలికాలం మంచిది.

ఒక దుప్పటి కప్పి సేవానిరతిని ప్రదర్శించడం సులభం.
కానీ, ఒక్కో పువ్వును తెంపి కొంగులో వేసుకున్నట్టు, ఒక్కో చిత్రాన్ని రచించి గుండెతడి చేసుకున్నట్టు, సాహిత్యకారులు ఎవరైనా ఒకరు వీళ్ల బతుకుల్ని మూటగట్టాలి. లేదా ఆ మూటలు తెరవ ప్రయత్నించాలి.

భరద్వాజలా కాదు. జీవన సమరంలా కానే కాదు.
శ్రీశ్రీలా మార్పు కోసమూ కాదు. అధోజగత్ సహోదరుల్లా చూడటం కోసం కానైతే కాదు.
ట్యాంక్ బండ్ నడుం కింద చేతులేసిన తిలక్ లా కాదు. సుషుప్తిలోని మనిషి మృగచేతన చీకట్లో కరేల్మని కదిలే విధంగానూ కాదు.

సమాజం గురించి కలవరపడే బుద్ధిజీవుల్లా కానే కాదు. వ్యక్తిగతంగా శ్రద్ధ చూపే సామాన్యుల్లా.
ప్రజలుగా కాదు, మానవులుగా…

అంతదాకా చలికాలమే.
ముడుచుకుని ఆమె, మూటలో ఈమె.

a tale of winter…
నేను చిత్రిస్తూనే ఉంటాను, కాలిబాట మీది దృశ్యాదృశ్యాలు.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

మీరే చెప్పండి

  bhuvanachandra (5)ఆ రోజుల్లో ‘పాండీబజార్’ ఎంత ఫేమస్సంటే అక్కడ నడుస్తుంటే చాలు.. బోలెడు మంది ‘ఆర్టిస్టులు’ కనపడే వాళ్ళు. టి.నగర్ సరేసరి. హార్ట్ అఫ్‌ ద సిటీ. ఆసియాలోనే అతిపెద్ద గోల్డ్ మార్కెట్ టి.నగర్. ఎన్ని జ్యుయెలరీ షాపులో లెక్కలేదు. ఇక వస్త్ర వ్యాపారానికి టి.నగర్ పెట్టింది పేరు. పట్టు చీరలు, సిల్కు చీరలు ఇలా ఎన్ని రకాలో అన్ని దొరుకుతాయి.

ఆంధ్రా నుండి పట్టుచీరల కొనుగోలుకి వచ్చే వారి సంఖ్యకి లెక్కలేదు. ఇప్పటికీ ఆ రష్ పెరిగిందే గానీ తగ్గలేదు. వ్యాపారానికి సినీ గ్లామర్ తోడవటంతో టి నగర్ ఎప్పుడూ కిట కిట లాడుతూ వుంటుంది.

‘పానగల్’ పార్క్ కూడ చాలా ఫేమస్. తెలుగు వారందరూ అక్కడికి చేరేవారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు. అక్కడ ఘంటసాల బెంచీ, మల్లాది (రామకృష్ణ శాస్త్రి) బెంచీ, పింగళి గారి బెంచీ ఇలా చాలా బెంచీలు వుండేవి. ఎందుకంటే వాళ్ళు పార్కుకి వచ్చినప్పుడు అక్కడే కూర్చునేవారట. సత్సంగాలూ, కవితాగోష్టులూ ఇవన్నీ అక్కడే సాగేవి. ఇక జరుక్ శాస్త్రి, (జల సూత్రం రుక్మిణీ శాస్త్రి)గారి పేరడీలు అక్కడే పురుడు పోసుకునేవి అంటారు.

అక్కడే ‘మనసత్యం’ (జై హింద్ స్టూడియో) చాలా శ్రమించి జనాన్ని కూడగట్టి ప్రభుత్వాన్ని ఒప్పించి.. సినీ ప్రముఖులతో కలిసి ప్రతిష్టించిన నిలువెత్తు చిత్తూరు నాగయ్యగారి విగ్రహం యీనాటికి మనని పలకరిస్తూ, తెలుగువారి ఒకప్పటి ప్రాభవాన్ని చాటుతూ వుంటుంది. అప్పట్లో కూచిపూడి డాన్స్ అకాడమీ వెంపటి చిన సత్యం గారిది పానగల్ పార్కు పక్కనే వుండేది. స్టాండర్డ్ ఎలెక్ట్రికల్సు.. దాని ముందర ప్లాట్‌ఫాం మీద నాలుగు కుర్చీలు వేసి, బోలెడు పత్రికల్నీ, న్యూస్ పేపర్లనీ (తాజావి) ఓ గోనెపట్టామీద పడేసి, (జనాలు చదువు కోవడం కోసం) మరో కుర్చీలో డాక్టర్ గోపాలకృష్ణగారు కూర్చుని వుండేవారు.

35 సంవత్సరాలకి పైగా కొన్ని లక్షలమందికి ఉచితంగా హోమియో మందులు ఇచ్చిన మహానుబావుడు డా!!గోపాలకృష్ణగారు. సాయంకాలంలో పెద్దపెద్ద వాళ్ళంతా, అంటే, అల్లురామలింగయ్యగారూ, జగ్గయ్యగారూ, శారదగారూ, జలంధరగారూ ఇలా ఎంతమందో అక్కడి వచ్చి, కాసేపు కూర్చుని డాక్టరు గారితో ముచ్చటించి వెళ్ళేవారు. నేనూ, గౌతం కశ్యప్, డైరెక్టర్ బి.జయ అందరం అక్కడే కలిసే వాళ్ళం.

వరద వచ్చినా, ఉప్పెన వచ్చినా వన్‌ఫార్టీఫోర్ సెక్షన్ అమలు చేసినా ‘చెట్టు కింద క్లినిక్’ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉండేది. బీద సాదలకి ఆరోగ్యదానం చేస్తూనే ఉండేది. మండే ఎండైనా సరే, కుంభవృష్టి అయినా సరే, డాక్టరుగారు మాత్రం ఉదయం ఏడున్నర నుండి రాత్రి పదింటి దాకా అక్కడే వుండేవారు. ప్రపంచపు తలుపులు మూసుకుపొయినా డాక్టర్‌గారి హృదయ కవాటాలు మాత్రం తెరిచే వుండేవి.

ఆయన గురించి చెప్పాలంటే ఓ మహా గ్రంధమే అవుతుంది. కలెక్టర్‌కి పి.ఎ.గా, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో గొప్ప హోదాగల అధికారిగా, ఆంధ్రా యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్ పోస్ట్‌గ్రాట్యుయేట్‌గా, కొంతకాలం సినిమా నటుడిగా (చాల short period) నాటకాలలో నటుడిగా, ఆ తరవాత హోమియో వైద్యాన్ని డా!! గాలిబాల సుందర రావుగారి నుంచి నేర్చుకుని హోమియో వైద్యులై. చివరివరకూ ప్రజలకు సేవ చేస్తూనే లోకం నుంచి నిష్క్రమించారు. ఆయనో మహా తత్త్వవేత్త, మహా మానవతావాది, అధ్యాత్మక వేత్త. ఆత్మ దర్శనం పొందిన మహయోగి.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సినీజనాలందరూ సాయంత్రమైతే చాలు గీతాకేఫ్ దగ్గర్లో, రాణీ బుక్ సెంటర్ దగ్గరో (త్రిపురనేని రామాస్వామి కుమార్తె), డాక్టరుగారి దగ్గరో చేరేవాళ్ళు. కాసేపు కబుర్లేగాక సంగీత సాహిత్య చర్చలు జరుగుతువుండేవి. తెలుగు పుస్తకం కావాలంటే రాణీబుక్ సెంటర్‌కి వెళితే చాలు పుస్తకం లేకపోతే తెప్పించి మరీ ఇచ్చేవారు. వారి అబ్బాయి అనిల్ అట్లూరి ఇప్పటికీ సాహిత్య సేవ చేస్తునే వున్నారు. నాకు మంచి మిత్రుడు శ్రేయోభిలాషి.

నా కేరాఫ్ అడ్రస్ డాక్టరుగారే. అక్కడే వుండేవాడ్ని. పని ఉంటే స్టూడియోల్లో – లేకపోతే డాక్టరుగారి దగ్గర.

హోమియో మందులేకాదు… డాక్టరుగారు ఎంతో మందికి సహాయం చేసేవారు. ‘మీటర్’ తిరగని అసిస్టెంటు డైరెక్టర్లు, సినీ కళాకారులూ డాక్టరుగారి సహాయం పొందేవారు. అదో గాధ. అప్పట్లో నెల్లూరి నించి ఓ రెడ్డిగారు మద్రాసులో ఓ చిట్‌ఫండ్ కంపెనీలో గుమాస్తాగా చేరి, సాయంత్రం ఏడు దాటాక మా దగ్గరికి వచ్చేవారు. శివవిష్ణు టెంపుల్ దగ్గరి మేడ మీది రేకుషెడ్డులో వుండేవాడు. పెళ్ళి కాలేదు గనక వచ్చే డబ్బు సరిపోయేది ఆయనకి.

దొరైస్వామి బ్రిడ్జి దాటాక ఆచారిగారి నగల కొట్టు ఒకటుండేది. మంగళసూత్రాలు, ఉంగరాలూ లాంటివి ఆయన చాలా బాగా తయారుచేసేవారు. ఆ రోజులో వ్యాపారం ‘బ్రాండ్’ మీద కంటే ‘నమ్మకం’ మీద ఎక్కువ సాగేది. అయితే ఆ కాలంలో ‘బ్రాండ్’ పిచ్చివాళ్ళు లేరా అంటే ఉన్నారని చెప్పక తప్పదు. ‘స్పెన్సర్’లో కొనడం గొప్ప.. అలాగే పట్టుచీరలకి నల్లిస్ వారూ, బంగారానికి ఉమ్మిడియార్స్… టిఫిన్లకి ఉడ్‌లాండ్స్ ఇలా చాలా ఉండేవి.

ఒకరోజున ఆచారిగారో ఖబురు తెచ్చారు. అప్పుడు నేనూ, రెడ్డిగారూ, సూరి శ్రీ విలాస్ గారూ అక్కడే వున్నాం- ఏమంటే, వెస్ట్ మాంబళం xxx వ నంబరు ఇంట్లోంచి రాత్రిళ్ళు ఏడుపులు వినిపిస్తున్నాయనీ, ఆ ఏడుపుల్ని బట్టి ఏడ్చేది ఒక తెలుగు పిల్ల అనీ!

“వెళ్ళి కనుక్కుందామంటారా?” అన్నారు డాక్టరుగారు.

R19

“ఏంక్వయిరీ చేశా. ఆ ఇంటి ఓనర్లు ఇక్కడ అంటే మద్రాస్‌లో లేరుట. ఇంటిని ఓ టాక్సిడ్రైవర్‌కి అద్దెకిచ్చారుట. అదీ పెద్ద ఇల్లేంకాదు. ఓ రెండుగదులూ, చిన్న వరండా, వంటిల్లూ, బాత్రూమూ. అంతే.. ఆ యింటి పక్కనే మా షాపులో పని చేసే రంగారావు వాళ్ళ అన్న అద్దెకుంటున్నాడు. ఆ పిల్లని లోపల ఏదన్నా హింసిస్తూ వుండి వుండొచ్చు అని అతను నాతో చెప్పాడు.. అన్నారు ఆచారిగారు.

“పోలీస్ రిపోర్టు ఇస్తే?” ఆ టాక్సీ డ్రైవర్ ఓ చిన్న పాటి రౌడీ మాత్రమే కాకుండా అక్కడి లోకల్ పొలిటికల్ లీడర్స్‌కి తొత్తుట. అందుకే కంప్లైంటు ఇచ్చినా లాభం వుండదనీ, అలా కంప్లైంటు ఇచ్చింది ‘ఫలానా’ వాళ్ళు అని తెలిస్తే ఆ టాక్సీవాడు నానా తలనెప్పులు తెస్తాడనీ రంగారావు అన్న భయపడుతూనే చెప్పాడు. అన్నారు ఆచారి.

అయితే ఒక్కపని చేద్దాం.. వాడు లేనప్పుడు మన ఆనందీ యీశ్వరన్‌ని వాళ్ళింటికి సేల్స్ ప్రమోషన్‌కి పంపిద్దాం (ఆవిడ ఆల్‌రెడీ ఉష మెషిన్లకి సేల్స్ ప్రమోటర్) ఆవిడకి బాగా తెలుగు వచ్చు కనక లోపల వున్న అమ్మాయి తెలుగులో మాట్లాడితే అర్త్ధం అవుతుంది. కనీసం లోపలి పొజిషన్ ఏమిటో తెలుస్తుంది. అన్నారు డాక్టరుగారు.

“అది చాలా మంచిపని. తమిళం ఆనందిగారి మాతృభాష గనక టాక్సీ వాడు మధ్యలో వచ్చినా అనుమానం రాదు. అదీగాక కంపెనీ IDకార్డు వుంటుందిగా…” మెచ్చుకున్నారు శ్రీ విలాస్ గారు.

“వర్కవుట్ కాలేదు సార్. ఆ పిల్లని బాత్‌రూంలో నోటికి గుడ్డకట్టి తాళం వేశారు. అలాంటి ములుగు వినిపించింది గానీ… నేను అడగలేను గదా…!” అన్నది ఆనందీయీశ్వర్ డాక్టర్ జీతో. “ఓ పని చేస్తా సర్.. నేను ఎవరో ఎవరికీ తెలీదు గదా. వాడు బయటికి వెళ్ళినప్పుడు నేను బలవంతంగా లోపలికి దూరి ఆ అమ్మాయిని పిడిపించి తీసుకొస్తాను…” కాన్‌ఫిడెంట్‌గా అన్నాడు రెడ్డిగారు.

“ఏ మాత్రం అటు ఇటూ అయినా దౌర్జన్యం కేసు కిందో, గూండా చట్టం కిందో నిన్ను మూసేస్తారు. పిచ్చి వేషాలు వద్దు.” సీరియస్‌గా వార్నింగిచ్చారు డాక్టరుగారు.

“మరి ఏలాగు ?”

“ఇంట్లోనే మూసి పెట్టి ఎన్నాళ్ళుంటారు? ఆ చుట్టు పక్కల ఎక్కడైనా కాపుగాయటానికి వీలుందా?” అడిగారు డాక్టర్.

“రంగారావు అన్నయ్య వాళ్ళు ఇల్లు ఆ యింటి పక్కనేగా..” చెప్పారు ఆచారిగారు.

“సరే.. ఓ రెండ్రోజుల పాటు పగలూ రాత్రి రెడ్డిని అక్కడ వుంచే ఏర్పాటు చేయండి. తరవాత సంగతి చూద్దాం!” అన్నారు డాక్టర్.

“వద్దు సార్.. మా రంగారావునే వాళ్ళన్నయ్య ఇంట్లో వుండి అబ్జర్వు చెయ్యమని చెబుతాను. ఎందుకంటే, కొత్త వాళ్ళు ఎవరొచ్చినా డౌట్స్ వస్తాయి.. రంగారావైతే సందేహంరాదు… అన్నారు ఆచారిగారు. “సరే.. అలా అయితే ఇంకేం కావాలీ!. అన్నారు డాక్టర్ గారు.

ఎంత ప్రయత్నించినా ఆ మరుసటి రోజున కూడ కధ ముందుకు సాగలేదు. ఏడుపులు వినిపిస్తున్నాయిట గానీ బాగా నీరసంగా వినిపిస్తున్నాయట. బయటి వాళ్ళెవరూ ఆ ఇంట్లోకి రాలేదనీ, లోపలి వాళ్ళు బయటికీ రాలేదనీ (టాక్సీవాడు తప్ప) ఇన్‌ఫర్‌మేషన్ మాత్రం ఖచ్చితంగా తెలిసింది రంగారావు ద్వారా.

ఆ మరుసటి రోజున ఆచారిగారు ఉరుకులు పరుగుల మీద పొద్దున్నే ఏడింటికే చెట్టు కిందకి వచ్చారు. బాగా కంగారుగా ఉన్నారు. నేను అప్పటికి కుర్చీలు వేసి పుస్తకాలు, పేపర్లూ పడెయ్యడానికి గోనె పట్టాలు, స్టాండర్డ్ ఎలెక్ట్రికల్స్‌కి ఇవతలి పక్కగా, అంతా, ఎవరికీ అడ్డులేకుండా వేస్తున్నాను.

“ఏమయింది ఆచారిగారూ?” అడిగాను.

“ముందు నన్ను కూర్చోనివ్వండి…!” అంటూ కూర్చుని ఆయాసంగా రొపుతున్నారు. నేను ఆ పక్కనే వున్న టీస్టాల్‌నించి ఓ గ్లాసెడు మంచినీళ్ళు ఆయన చేతికిచ్చి నా పని నేను చేసుకుంటున్నాను.

చిత్రంగా 7.20 కల్లా డాక్టరుగారు వచ్చారు. ఆయన్ని చూడగానే ఆచారిగారు ఏదో చెప్పబోతుండగా, “రాజావారూ, మీరూ రండి” అని డాక్టర్‌గారు నన్ను పిలిచారు. (ఆయన అలాగే పిచేవారు నన్ను). నేనూ కుర్చీలో కూర్చున్నాను.

“ఇప్పుడు చెప్పండి..” అన్నారు డాక్టరు గారు.

“మన రెడ్డి చాలా ఘోరమైన పని చేశాడండీ… పిల్లాపాప వున్నవాడ్నిగదా.. ఇలా నన్ను ఇరికించవొచ్చా…” అని ఏడుపు మొరపెట్టారు ఆచారిగారు.

“అసలు ఏమయిందీ?”

“నిన్న రాత్రి రంగారావుతో రెడ్డిగారు కూడా రంగారావు అన్నయ్య వాళ్ళింటికి కెళ్ళాడుట. రాత్రి పదింటికి ఆ టాక్సీ వాడు బయటికి ఎందుకో పోగానే యీ రెడ్డిగారు ఆ టాక్సీ వాడింట్లోకి చొరబడి, టాక్సీవాడి భార్యని బెదిరించి గది తాళం తీయించి ఆ పిల్లని బయటికి తీసుకొచ్చాడు. ఇంతకీ ఆ పిల్ల ఒంటి మీద బట్టలు వూడదీసి తాళం పెట్టి వుంచాడుట ఆ వెధవ టాక్సీ వాడు. యీయనేమో అర్జంటుగా ఓ దుప్పటి కప్పి బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి గదికి వేసిన తాళమే ఆ యింటికి వేసి రంగారావు వాళ్ళ అన్నగారి టీవీయస్ బండి మీద ఆ పిల్లని మా యింటికి తీసుకొచ్చాడు.” ఆయాసంతో ఆగాడు ఆచారిగారు.

“ఓర్నీ.. అంత ధైర్యం చేశాడా నెల్లూరి రెడ్డి. సరే.. మరి ఆ టాక్సీవాడి పెళ్ళాం అరవలేదా? అన్నారు డాక్టరుగారు.

“నేను ఆంధ్రా పొలీస్ ఇన్‌స్పెక్టర్ని అరిచావంటే చంపేస్తాను అని ‘లియో’ పిస్తల్‌తో బెదిరించాడుట. (లియో పిస్టల్స్ అంటే బొమ్మ పిస్టల్స్.. అవి చూడటానికి నిజం పిస్టల్స్ లాగే వుంటాయి. ఖరీదు కాస్త ఎక్కువ) అయినా ఆ తరవాత ఏం జరిగిందో రెడ్డికి ఎలా తెలుస్తుందీ. ఆ పిల్లని మా యింటికి దగ్గర దింపేసి పొయాడు.” అన్నాడు ఆచారి. (ఇంతకీ ఆ బొమ్మ పిస్టల్ రంగారావు అన్న కూతురిది)

“ఆ అమ్మాయి ఎమన్నదీ?”

“ఏదీ.. చచ్చేంత నీరసంగా వుంది. మూడ్రోజులైందిట అన్నం తిని. రాత్రిళ్ళు ఎముంటై.. ఏదో కాస్త మజ్జిగ మాత్రం మా ఆవిడ ఇచ్చింది. డాక్టరుగారూ, నన్ను అనవసరంగా ఇరికించాడండీ ఆ రెడ్డి. ఇప్పుడా టాక్సీవాడికీ విషయం తెలిస్తే నా బతుకు బుగ్గిపాలు అవుతుంది. అసలే వాడికి పొలిటికల్ సపోర్టుంది…” మళ్ళి భోరుమన్నాడు ఆచారిగారు.

“మీరేమీ వర్రీ కాకండి. మీరు ఇక్కడే వుండండి. నేను ఇద్దరు ఆడపిలల్ల్ని మీ ఇంటికి పంపుతాను. వాళ్ళు పూర్తిగా సమాచారం సేకరించి వస్తారు. ఆ తరవాత ఆలోచిద్దాం ఏం చెయ్యాలో.. మీకు మాత్రం ఏ అపకారము జరగదు.” అని అభయం ఇచ్చారు డాక్టరు గారు.

“మీరు అంత మాట ఇచ్చాక సరేనండీ.. కానీ నా భయము నా పెళ్ళాం పిల్లల గురించే!” నిట్టూర్చాడు. ఆచారిగారు.

డాక్టర్‌గారు విజయకి ఫోన్ చెయ్యమని నాతో చెప్పారు. విజయ హైకోర్టు లాయరు. మాతృభాష తమిళం అయినా తెలుగు భాగా వొచ్చును. పదింటికల్ల ఆవిడ వచ్చింది. ఇంకొకరెవరంటే తెలుగు సినిమాల్లో కోరస్ పాడే సరోజ. పెద్దావిడ.. పెద్ద మనిషి తరవోగా వుంటుంది.

ఇన్‌ఫర్ మేషన్ మధ్యాహ్నాం మూడింటికికల్లా వచ్చింది. ఆ పిల్లది రాజమండ్రి దగ్గర వుండే ఓ పల్లెటూరు. పెద్ద చదువు లేదు గానీ సినిమాపిచ్చి. తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు. వాళ్ళది బాగా కలిగిన కుటుంబమే.

రాజమండ్రిలోనూ, పరిసర ప్రాతంల్లోనూ షూటింగ్ జరుగుతోందని తెలిసి ఫ్రెండ్స్‌తో కలిసి చూడ్డానికి వెళ్ళిందట. అక్కడో కెమేరా అసిస్టెంటుతో పరిచయం అయిందిట. ఇంతకీ చూస్తే అతను కెమేరాకి సంబంధించిన వాడుకాదు.. లైట్ బోయ్. వాడు యీ పిల్లకి వచ్చీరాని తెలుగులో చుక్కలు చూపించాడుట. ఇంకేంవుందీ. స్టారై పోదామని తల్లికీ తండ్రికీ చెప్పకుండా నగలూ డబ్బు కొంత మూటగట్టి వాడితో పాటు మెయిల్ఎక్కిందిట.

తీరా మెయిల్ మద్రాసొచ్చాక చూస్తే వాడూ లేడు యీ పిల్ల నగలూ డబ్బు కూడా లేవు.

ఏడుస్తుంటే యీ టాక్సివాడు చూసి అయ్యో.. మా ఆవిడదీ రాజమండ్రీ. ఇవ్వాల మా ఇంట్లో వుంటే, రేపు మా ఆవిడ్నిచ్చి నిన్ను రాజమండ్రి పంపుతాను. టిక్కెట్టు డబ్బులూ అవీ మీ అమ్మానాన్నని అడిగి ఇద్దుగాని’ అని బుజ్జగించి ఇంటికి తీసుకుపోయాడంట.

ఆ తరవాత కధ ఏముటుందీ? బహుశా రెడ్డిగారు గనక యీ పిల్లని దౌర్జన్యంగా బయటికి తీసుకు రాక పొయి ఉంటే వాడు ఆ పిల్లని పడుపు వృత్తిలో దింపేవాడు.. లేకపొతే ఏ కంపెనీకో అమ్మేసి వుండేవాడు. ఇదీ కధ. ఈ విషయం వివరించి, “డాక్టరుగారూ పిల్ల మాత్రం చాలా అందంగా ఉందండీ అందం కంటే అ పిల్ల అమాయకత్వం చూసి జాలేసింది.” అన్నది లాయరు విజయ.

ఓ చీర, లంగా ఆ పిల్లకి సరిపోయే రెడీమేడ్ జాకెట్టు కొనిచ్చింది సరోజగారు (డబ్బు డాక్టరు గారే ఇచ్చారు). ఇక ఆ అమ్మాయిని పంపాలంటే ఎలాగా అని డిస్కషన్ మొదలైంది. బస్సుల్లోనూ, ట్రైన్‌లోనూ వొద్దనుకున్నాం. కారులో పంపాలంటే బొలేడంత అవుతుంది. అప్పుడే నేను పరిశ్రమకి కొత్తగ వచ్చిన రోజులు గనక నాకూ కాస్త ఇబ్బందిగానే ఉండేది. (అయితే మిలటరి పెన్షన్ వస్తుంది కనక అవసరాల వరకూ హాయిగా తీరేవి నో లగ్జరీస్).

డాక్టర్ గారితో ప్రసిద్ధ రచయిత్రి జలంధర, నేనూ

డాక్టర్ గారితో ప్రసిద్ధ రచయిత్రి జలంధర, నేనూ

దానికి ఓ సోల్యూషన్ దొరికింది. ఉమామహేశ్వరావని ఓ నటుడు శివుడి వేషాలు వేసేవాడు. వాళ్ళ అబ్బాయికి పెళ్ళి సంబంధం చూడటం కోసం గూడూరు వరకూ కార్లో వెడుతున్నారని తెలిసింది. డాక్టరు గారు అతన్ని రప్పించి మరొకర్ని కూడా కార్లో ఎక్కించుకుని గూడూర్లో దింపడానికి వీలవుతుందా అని అడిగారు. ఆయన ఓకే అన్నాక ఆసలు విషయం చెప్పారు.

“తీసుకెళ్ళడానికి అభ్యంతరం లేదుగానీ, ఆమెని గూడూర్లో ఎవరైనా ఇలాగే చీట్ చేస్తే ఎలాగ?” అని ఆయన ధర్మ సందేహం బయట పెట్టాడు.

అప్పుడు శ్రీనివాస్ గారన్నారు. “బయటకి తెచ్చింది రెడ్డిగారు గనకా, అతనిది గూడూరు దగ్గరుండే నెల్లూరే గనకా ఆ పిల్లని అతనితోనే రాజమండ్రిదాకా పంపి పిల్లని వాళ్ళ ఇంటి దగ్గర దింపితే మంచిదేమో!” అని డాక్టరుగారు నవ్వి, “నేనేమో విజయని ఆ పిల్లకి తోడుగా పంపుదామనుకున్నాను. కానీ, మీరన్నట్టు రెడ్డీ రైట్” అన్నారు.

ఇహనేం.. వాళ్ళిద్దరూ గూడూరు నించి రాజమండ్రికి బస్సులు మారుతూ పోయేటట్టూ, మళ్ళీ రెడ్డి ట్రైన్‌లో వెనక్కి వచ్చేటట్టూ నిర్ణయం జరిగింది. గబగబా డబ్బులు కూడా పొగయ్యాయి.. కావల్సిన దానికంటే తక్కువే.

స్టాండర్డ్ ఎలెక్ట్రికల్స్ దగ్గరే, ఎప్పుడూ డాక్టర్ గారికి విధేయుడిగా వుండే ‘కదిరివన్’ ఆటోలో రజని (ఓ సినీ నటికి P.A.) సరోజ వెళ్ళి బాగా చీకటి పడ్డాక ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. గభాల్న మేము ఆ పిల్లను నాయుడి సినీ టైలర్స్’ షాపులో కూర్చోపెట్టాం. నిజంగా చాలా అందగత్తె కానీ బెదిరిపొయి వుంది.

ఎనిమిదిన్నరకు ఉమగారి కారు వచ్చింది. డ్రైవరూ, ఉమామహేశ్వర్రావు, ఆయన భార్య, యీ పిల్ల, రెడ్డిగారూ మొత్తానికి ఆ ఎంబాసిడర్ కార్లో అడ్జస్టయ్యారు.

దిగ్విజయంగా ఆ పిల్లని వాళ్ళింటి వద్ద దించి మధ్యలో వాళ్ళ ఊళ్ళో దిగి ఓ పూట వుండి నాలుగో రోజున వచ్చాడు రెడ్డిగారు.

“వాళ్ళు వాళ్ళు’ చాలా ఉన్నొళ్ళండి. బోలెడంత మర్యాద చేశారండీ.. అంటూ చాలా విషయాలు వర్ణించాడు రెడ్డిగారు.

మద్రాసు వచ్చేసిందని కాకుండా రాజమండ్రి చుట్టాల ఇంట్లో వుండి వచ్చిందని చెప్పమని చెప్పానని కూడా చెప్పాడు రెడ్డిగారు.

మొతానికి ఆ పిల్ల తెచ్చిన నగలూ డబ్బు పోయినా కనీసం పిల్ల, శీలం నిలిచినందుకు అందరం సంతో షించాం.

ఆ తరవాత బాబు అనే ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పరిచయమై మాకు చెప్పాడు. ఇలాంటి టాక్సీ డ్రైవర్ గాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారట. వాళ్ళ పని అమ్మాయిల్ని ఎట్లాగొట్లా మాయ చేసి పడుపు వృత్తిలోకి దించడం అని. మరో విషయం విని షాక్ తిన్నాం. ఏమంటే రోజుకి కనీసం ఓ వంద మంది ఆంద్రా ఆడపిల్లలు సినీ మోజులో మద్రాసుకి వస్తుంటారనీ అందులో అధికభావం పడుపువృత్తిలోకి దింపబడతారనీ. చాలా చాలా బాధపడ్డాము. అర్జంటుగా పేరూ డబ్బు వచ్చేస్తాయనే మోజులో ఆడపిల్లలే కాదు, వందలాది మంచి యువకులు కూడ పరిశ్రమని ఓ వూపు ఊపేద్దాం అని వస్తుంటారు. ఫాల్స్ ప్రిస్టేజితో వెనక్కి వెళ్ళలేక, నికృష్టమైన బతుకులు బతుకుతూ వుంటారు. తెలిసి తెలియని తనం.. ఫీల్డు గురించి అవగాహన లేకపోవడం, ఫాల్స్‌ప్రిస్టేజ్ వీటితో బతుకు నరకమై పోతుంది. “సార్ నేను చిరంజీవి గారికి సరిపడే కధ రాశాననో, సార్ నలభై పాటలు రాశాను సార్. ఏ హీరో కయినా సరిపొతై..” అనో..సినిమా వాళ్ళకి ఫోన్లు వస్తూనే వుంటై. బోలెడు మంది గంపెడు ఆశలతో ఆఫీసుల ముందర కధల కట్టలు, పాటల కట్టలూ పట్టుకుని అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూనే వుంటారు. కొందరికి అవకాశాలు దక్కితే 90% అవకాశాలు దొరక్క తిరిగి ఇంటికి వెడితే తలెత్తుకో లేమని భావిస్తూ ఎలగోలా బండి లాగిస్తూ వుంటారు.

ఇదో అంతులేని కధ. ఇంతకీ చెప్పొచ్చిందేమంటే, మూడేళ్ళ క్రితం అదే అమాయిని హైద్రాబాద్ కృష్ణానగర్లో చూశాను. బాగా లావయింది కానీ మొహం మారలేదు. అప్పటికీ ఇప్పటికీ మధ్య 20 సంవత్సరాలు గడిచాయి.

“సార్ మీరు ఫలానా కదూ!” అని సంభ్రమంగా అడిగింది. అవును అన్నాను “మీ లిటిల్ చాంప్స్ ప్రొగ్రామ్ తప్పనిసరిగా చూసేదాన్ని సార్… మీ పాటలంటే చాలా ఇష్టం..” చెప్పుకుపోయింది. దాన్ని బట్టి నాకు అర్ధమైంది ఏమంటే, ఆనాడు నన్ను సరిగ్గా యీమే చూసి వుండదని.

“మీరేం చేస్తున్నారూ? మీదే వూరు?” అని అడిగాను. మద్రాసులో జరిగిన విషయం ఆమెకి గుర్తు చేయ్యడం నాకు ఇష్టంలేదు బాధ కలిగించే గతాన్ని తవ్వకుండా ఉండటమే మంచిది.

“మేమాండీ? మాది రాజమండ్రి దగ్గరి వూరండీ.. నాకేమో సినీనటి కావాలని వుండేదండి. నా కల కలగానే వుండి పోయిందండి. ఇప్పుడు మా పాపని ‘స్టార్’ని చేసి నా కల నిజం చేసుకునే వుద్దేశంతో హైద్రాబాద్ వచ్చానండి. సార్.. మా అమ్మాయి బ్రహ్మాండంగా డాన్సు చేస్తాదండి. పాటలు కూడా బ్రహ్మాండంగా పాడతాదండి. దయచేసి మీరెవరికన్నా రికమెండ్ చేస్తే… ” అంటుండంగానే ఆవిడ కూతురొచ్చింది. పదిహేడో పద్దేనిమిదో వుండొచ్చు. అచ్చు అప్పటి ‘ఆమె’ లానే వుంది. అమాయకంగా.. అందంగా…..

 

***

మనం కన్నకలలు కలల్లానే మిగిలిపొవచ్చు. కానీ ఆ కలల్ని మన పిల్లల ద్వారా తీర్చుకొవాలనుకోవడం న్యాయమా? పోనీ ఆ ప్రయత్నం చేసే ముందు పిల్లల ఇష్టాలు ఏమిటో కనీసం తెలుసుకోవద్దా?

ఆవిడ జీవితం ఏమయిందో, ప్రస్తుత పరిస్థితి ఏమిటి తరవాత ఏమవుతుందో నాకు తెలీదు.

కానీ పాము నోట్లోనించి బయట పడ్డ మనిషి, తన బిడ్డని, తన కలని సాకారం చేసుకోవడానికి ‘పనిముట్టు’గా వుపయోగించుకోవడం ఎంతవరకూ న్యాయం?

 

నమస్సులతో

భువనచంద్ర

 

 

 

ఇస్మాయిల్, టాగోర్: ఇద్దరు సదాబాలకులు!

ismayil painting rainbow

ఇస్మాయిల్ గారు రాసిన రాజకీయ కవితలు చాలా వరకు వ్యంగ్యాత్మకమైనవి. వాటిలో ఎక్కువ భాగం మార్క్సిస్టుల మీద కోపంతో రాసినవే ఉన్నప్పటికీ, ఇందిరా గాంధీ, ఎన్టీ రామారావు వంటి వారిని అపహాస్యం చేస్తూ రాసినవి (ఈవిడ, గాడిద స్వామ్యం) కూడా లేకపోలేదు. వీటికి భిన్నంగా, ఆయన వేరే ఎక్కడా ప్రస్తావించని అంశాలు – ఆకలి, దారిద్ర్యం, మత ఘర్షణలు, హింస – వంటివాటిని రేఖా మాత్రంగా స్పృశించినా, వాటిపట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ కొంత ఉద్వేగంతో రాసిన ఒకే ఒక కవిత “బోటులో టాగోరు”. అందువల్ల, ఈ కవిత ప్రత్యేకమైనది, ఆయన కవితల్లో ప్రసిద్ధి పొందినది. టాగూరు గురించి ఆయన, ఆయనను గురించి ఆయన అభిమానులు తరచుగా వాడే “సదా బాలకుడు” అన్న పదప్రయోగం ఈ కవిత లోనిదే.

టాగోరంటే ఇస్మాయిల్ గారి కెంత ఇష్టమో ఆయన టాగోరుపై రాసిన వ్యాసం చదివితే తెలుస్తుంది. టాగూర్ గొప్ప సౌందర్యారాధకుడని, సామాన్య విషయాల్లో సంఘటనల్లో దాగి ఉన్న ఆనందాన్ని, ఉజ్జీవాన్ని తన రచనల్లో ఆవిష్కరించాడని ఆయన అంటారు. టాగోర్ కవిగాకన్నా కథకుడుగానే గొప్పవాడని ఆయన అభిప్రాయం. టాగోర్ 1890 నుంచి పదేళ్ళపాటు తమ కుటుంబ ఎస్టేటు చూసుకొంటూ, షిలైదాలో ఉన్నప్పుడు, అక్కడ పద్మానదిని ఎంతో ప్రేమించాడట. కాళిదాసు పర్వత రాజు ఆస్థాన కవి అయితే, టాగోర్ పద్మా నది కవివల్లభుడట. తనకు ప్రియమైన పద్మానదిలో పడవపై తేలుతూ టాగోర్ అనేక దినాలు గడిపేవాడని, ఆయన చాలా కథలకు బీజాలు అక్కడే పడ్డాయని చెబుతారు. ఆ దృశ్యమే ఈ కవితకు మూలం.

బోటులో టాగోరు విన్న కథల గురించి ప్రశ్నిస్తూ ఈ కవిత వాటిలో కొన్నిటిని ప్రస్తావిస్తుంది. అవి సుభా, హోమ్ కమింగ్, కాబూలీవాలా, కేష్ట్ ఎవే. ఇవన్నీ కరుణ రసాత్మకమైన కథలు, చిన్నపిల్లలు లేదా ప్రారంభ యౌవనంలో ఉన్నవాళ్ళు ప్రధాన పాత్రలుగా ఉన్న కథలు. ముఖ్యంగా హోమ్ కమింగ్ , కాబూలీవాలా కథలు అంతకు ముందే ఇంగ్లీషు పాఠ్యాంశాలుగానో, ఇంట్లో ఉన్న టాగోరు కథల పుస్తకాల్లోనో చదువుకొని ఉండటంవల్ల, ఈ కవిత మొదటిసారి చదివినప్పుడు ఎంతో ఎక్సయిటింగ్ గా అనిపించింది. పిల్లల మనస్తత్వాన్ని టాగోరంత బాగా అర్థం చేసుకొన్న రచయిత వేరొకడు కనిపించడని ఆయన అంటారు. ఈ కవితలో వచ్చే నాలుగు కథలూ అందుకు ప్రతీకగా నిలుస్తాయి. సాధారణంగా కవిత్వంలో సెంటిమెంటును ఇష్టపడని ఇస్మాయిల్ గారు టాగోర్ కథల్లో మాత్రం దానిని చాలా అభిమానించినట్టు కనిపిస్తుంది. ఈ కవితలో మబ్బు బెలూన్లు, బిగిసిన జలచర్మంతో నిగనిగలాడే నదిబాజా వంటి విభిన్నమైన పదచిత్రాలు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఈ కథలతో కవిత పూర్తికాదు. నది గురించిన ప్రస్తావన, తన చిన్నతనం వైపుకి, అప్పట్లో చెరువుల్లో ఈత కొట్టటం వైపుకి మరలుతుంది. నదిపై పడవలో తేలటం, ఈత కొట్టేందుకు బట్టలు విప్పి చెరువులో దూకటం రెండూ జలస్నేహానికి రెండు పార్శ్వాలు. బోటులో టాగోర్ తన తలపోతలో చుట్టూ తను చూసిన అనేకమంది సామాన్య జనుల కష్టసుఖాల్ని కథలుగా ఆవిష్కరిస్తే, చెరువులో ఈతకొట్టే తాము “మాతృగర్భంలోకి మరలిపోచూసే పిల్లల్లాగో, ప్రియురాలి అంతరంగంలోకి లయమవాలనుకునే ప్రేమికుల్లానో“ ఉన్నామనటం ఒక భద్రత కోసం చేసే అన్వేషణను ఆవిష్కరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి కాంట్రాస్టుగా కవిత వెంటనే అభద్రత వైపు మళ్ళుతుంది.

పద్మానది ప్రస్తావనకి కొనసాగింపుగా, పార్టిషన్ టైములో పద్మానదిని పంచుకోవటం, అప్పుడు జరిగిన మత ఘర్షణలు, హింస వంటి వాటిని సూచిస్తూ “ఎన్ని వికృత శబ్దాలు, ఎన్ని హాహాకారాలు, ఎంత భీభత్సం” అని రాస్తారు. అంతేకాదు, ప్రస్తుత పరిస్తితుల్లో కొనసాగుతున్న హింస, దారిద్ర్యం వంటివాటి పట్ల ఆవేదనను సూచిస్తూ పోషకాహార లోపంవల్ల జబ్బుపడిన పిల్లల పొట్టల డోళ్ళ చప్పుళ్ళతో కవిత ముగుస్తుంది.

ఇస్మాయిల్ గారి కవితలలో ఒక కవిత నాలుగు పేజీలు  దాటటం ఇందులోనే చూస్తాం. నిడివిలోనే కాదు, రాయటానికి పట్టిన సమయంలో కూడా దీనికి ప్రత్యేకత ఉంది. ఈ కవిత రూపొందటానికి నవమాసాలూ పట్టింది.(జూన్ 73-మార్చి 74) . బహుశా కొంత వరకు రాసి పక్కనపెట్టి, మళ్ళీ ఎప్పుడో పూర్తిచేసారనుకుంటాను. ఆలోచనా స్రవంతిలో దాని ప్రభావం కొంత వరకు కవితలో కనిపిస్తుంది. అయినప్పటికీ, టాగోర్ కథలు, తన బాల్యం, ప్రస్తుత పరిస్థితుల భీభత్సం ఈ మూడు భాగాలలోనూ , చిన్నపిల్లలు లేదా ప్రారంభ యౌవనంలో ఉన్నవాళ్ళ ప్రస్తావన ఒక ఏక సూత్రంగా సాగిందని చెప్పుకోవచ్చు.

చిలకలు వాలిన చెట్టు వచ్చిన కొత్తలో, ఈ కవితలోని టాగోర్ కథలను గురించిన వాక్యాలే కాకుండా – నది బాజాని మోగించే సదా బాలకుడు టాగోర్, చిరంతనపు లోతుల్లోకి చివాల్న దూకేవాళ్ళం, సరిత్తీర నికుంజాల్లో నిరీక్షించేవి మెరిసే కళ్లు కావు గురితప్పని గుడ్డి తుపాకులు, మోగటం లేదు టాగోర్ ఇవాళ హృదయంగమాలైన బాల్య మృదంగాలు – వంటి వాక్యాలు ఎన్నిసార్లు చదువుకొనే వాడినో లెక్కలేదు. (ఈ కవిత మృత్యు వృక్షం లోదే అయినా, నేను మొదటిసారిగా చదివింది చిలకలు వాలిన చెట్టు మూడు పుస్తకాల సంపుటిగా వచ్చినప్పుడే.) ఇస్మాయిల్ కవిత్వం ఇష్టపడని అభ్యుదయ వాదులైన కొందరు మిత్రులు ఈ కవితను మాత్రం మెచ్చుకొనేవారు. ఒకరిద్దరైతే, ఇస్మాయిల్ జీవితానికి ఈ కవిత ఒక్కటి చాలనేవారు. నేనలా అనుకోనుగాని, ఇస్మాయిల్ గారు రాసిన అనేక చిరస్మరణీయమైన కవితల్లో ఇది తప్పకుండా చేరుతుందని మాత్రం చెప్పగలను. ఈ కవిత చదివితే దాని ద్వారా, ఇస్మాయిల్ గారినే కాకుండా, నోబెల్ ప్రైజు వచ్చిన ఏకైక భారతీయ రచయిత అనే విశిష్ట గౌరవాన్ని శతాబ్దం పైగా పొందుతూ వస్తున్న విశ్వకవి రవీంద్రుణ్ణి కూడా తలుచుకొనే అవకాశము కలుగుతుంది.

 – విన్నకోట రవి శంకర్

vinnakota

(వచ్చే వారం: ప్రసూన రవీంద్రన్ వ్యాసం)

నిలకడగా వుండనివ్వని ‘అప్రజ్ఞాతం’

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

ఋతువులతో పాటు రూపు మారే పొలాలు .. ‘బాయల్స్ లా’, ‘న్యూటన్స్ లా’ లతో కొంత సైన్సు .. మానవుని  కోర్కెలు అనంతాలు, శ్రమ నశ్వరము లాంటి పదాలతో అర్థశాస్త్రం .. డెబిట్లు, క్రెడిట్లు, లాభనష్టాల ఖాతాలతో గణకశాస్త్రం .. “మానేజ్ మెంట్ అంటే మిగతావారితో పని పూర్తి చేయించుకోవడం” వంటి నిర్వచనాలతో మానేజ్ మెంట్ చదువులు… తద్వారా ఉద్యోగంలో కుదురుకున్నా, అంతరంగం కుదుటపడలేదు. కుదరని రకరకాల చదువుల మధ్య సమన్వయం, జీవితానికి వీటితో అన్వయం.. ఇవి పూరింపబడని ఖాళీలుగా ఉండిపోయాయి.

అటువంటి స్థితిలో ‘అప్రజ్ఞాతం’ కథ చదవటం జరిగింది. చదివాక అది నిలకడగా కూర్చోనివ్వలేదు. ఏదో హాంటింగు.. ఒక స్లైస్ ఆఫ్ లైఫ్.. జీవితంలో పూర్తిగా జరగటానికి వీలున్న ఒక సంఘటన నా కళ్ళముందు జరిగినట్టు.. ఆ సంఘటనలో నేనూ పాలుపంచుకున్నట్టు.. అదీ ఒక పాత్రగా కాకుండా, పలు పాత్రలతో ఐడెంటిఫై ఔతూ.. కొంత సేపు అభిమన్యుడులా అందరి మధ్య చిక్కుకున్న ‘సుదర్శనం’లా, ఇద్దరు రైతులు ‘బుచ్చిలింగం’ ఇంకా ‘బైరాగి’ లను కలిపేసి రెండుగా విభజిస్తే వచ్చే పాత్రలా కాసేపు. నాకు తెలిసిన అనేకమంది నా పక్కన కూర్చుని ఉంటారు. నాకు తెలిసిన మాటలే వాళ్ళు మాట్లాడతారు. అవే అనుమానాలు వ్యక్తం చేస్తారు. తమ పట్ల సానుభూతి వ్యక్తం చేసే వారినే వేళాకోళం చేస్తారు. నాకు తెలిసిన షావుకార్లు ఇద్దరు ‘సూరప్పడు’ రూపంలో గుళ్ళోకి వస్తారు.

మళ్ళీ చూస్తే మానేజ్ మెంటు డెవలప్ మెంట్ ప్రోగ్రాములో ఇచ్చిన కేసు స్టడీ పేపర్లా కనిపిస్తుంది.

రూపాయి బిళ్ళగా ఘనీభవించిన చెమట దొర్లుకుంటూ ఏ ఏ మజిలీలు చేసుకుంటూ చివరకు ఎక్కడికి చేరుతుందో చూశాను. ఉత్పత్తి కారకాలు శ్రమ, భూమి, పెట్టుబడి, నిర్వహణలు తమ కంట్రిబ్యూషన్ కు ప్రతిఫలంగా వేతనాలు, రెంటు, వడ్డీ, లాభాలుగా పంచుకుంటాయని ఎకనామిక్స్ లో బోధిస్తారు. ఐతే నిజ జీవితంలో ఈ పంపకం, ప్రత్యేకంగా వ్యవసాయంలో 40/50 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అర్ధమైంది. జరిగే ఈ ప్రక్రియకు సాంఘికామోదం ఉండటం/ఉండేటట్టు చేయడం సిస్టం గొప్పదనం.

నిజానికి ఈ సిస్టం బ్రేక్ చేయలేనంత గట్టిదేం కాదు. రైతులు పెట్టుబడి కోసం అప్పు చెయ్యకుండా, స్థిరాస్థి ఐన భూమిని కొంత , చరాస్థి ఐన బంగారాన్ని కానీ పెట్టుబడిగా మర్చుకున్నా సమస్య కొంత తీరుతుంది. సుదర్శనం మాటల్లో “ఒక సామాన్యరైతుకి ఏటా కావలసిన వ్యవసామదుపు నాలుగైదు వందలు. భార్య వంటిని ఆ విలువకు మించిన బంగారం ఉంటుంది. అది తియ్యడు. పాతికసెంట్ల పొలమమ్మినా ఆ మదుపు చేతికొస్తుంది. ఆ పనీ చెయ్యడు.” (మార్కెట్టు, ధర ఇవి కూడా నిజానికి పెట్టుబడితో ప్రభావితమౌతాయి.) ఐతే ఆస్తి, బంగారం కుదువ పెట్టటానికి ఉన్న సోషల్ యాక్సెప్టెన్స్, ఆస్తి అమ్మకానికి లేదు. ఈ ప్రోసెస్ లో రైతు బంగారాన్ని, భూమినీ కూడా పోగొట్టుకుంటాడు.

కథలోనే సమస్యా, పరిష్కారం రెండూ ఉన్నాయి.

దెబ్బతినేవారికి దెబ్బతగిలిన విషయం అర్ధమౌతుంది కాని దెబ్బతగిలే క్రమం తెలియట్లేదు. ఆ క్రమం నాకు ఈ కథ తెలిపింది.

–ముళ్ళపూడి సుబ్బారావు

SRMullapudi

 

 

ముళ్ళపూడి సుబ్బారావు అంటే ‘రెండు నదుల మధ్య’ కధ గుర్తుకు వస్తుంది. 1995 ఆహ్వానం పత్రికలో ప్రచురించబడిన ఈ కధ తరువాత ఋతుపవనాలు, కధ 95, రెండు దశాబ్ధాల కధ సంకలనాలలో వచ్చింది. తరువాత వీరు రాసిన ‘పాలపుంత’ కధ ఆహ్వానం పత్రికలో వచ్చింది. చివరిగా 2011 లో ‘ఋణం’ కధ ఆదివారం అనుబంధంలో వచ్చి కధా 2011 లో ప్రచురితం అయ్యింది. ఇవి కాక సుబ్బారావు అనువాదం చేసిన ఏడు కధలు విపుల, ఆహ్వానం పత్రికల్లో వచ్చాయి. తనను తాను ఎక్కువగా పాఠకుడిగా పరిగణించుకొనే సుబ్బారావు ఒక దశలో ‘వసుంధర’ కధలు ఎక్కువగా చదివారు. తరువాత తిలక్, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు కధలు, ఆ పై గురజాడ, కాళీపట్నం, రఘోత్తమరెడ్డి కధలు ఇష్టపడ్డారు. సుబ్బారావుకి చార్లెస్ డికెన్స్, టాల్ స్టాయ్ రచనలు చాలా ఇష్టం.

 

వచ్చే వారం: బమ్మిడి జగదీశ్వరరావు  ‘ఆర్తి’ కధ పరిచయం

అప్రజ్ఞాతం కథ ఇక్కడ:

 

పెద్రో పారమొ-12

pedro1-1చీకటి పడగానే వాళ్ళు వచ్చారు. వాళ్ల వద్ద చిన్న తుపాకులు ఉన్నాయి. ఛాతీల మీద అటూ ఇటూ ఏటవాలుగా గుళ్ళ పట్టీలు ఉన్నాయి. ఇరవై మంది దాకా ఉన్నారు. పేద్రో పారమొ వాళ్లను భోజననానికి ఆహ్వానించాడు. వాళ్ళు నెత్తిమీద టోపీలు తీయకుండానే భోజనాల బల్ల మీద ఏమీ మాట్లాడకుండా కూచున్నారు. చాకొలేట్ తాగుతున్న చప్పుళ్ళూ, మళ్ళీ మళ్ళీ వడ్డించుకుని టోర్టియాలూ (రొట్టెల్లాంటివి), ఉడకబెట్టిన బీన్సూ తింటున్న చప్పుళ్ళూ మాత్రమే వినవస్తున్నాయి.
పేద్రో పారమొ వాళ్ళనే చూస్తూ ఉన్నాడు. ఇవి తనకు తెలిసిన మొహాలు కావు. టిల్కేట్ అక్కడే అతని వెనక నీడలో నిలుచుని ఉన్నాడు.
“అయ్యలారా!” పేద్రో పారమొ అన్నాడు వాళ్ళు తినడం పూర్తయినట్టు గమనించగానే. “ఇంకా ఏం చేయమంటారు మీకోసం?”
“ఇదంతా నీదేనా?” చేయి సాచి తిప్పుతూ చూపిస్తూ అడిగాడు వాళ్ళలో ఒకడు.
కానీ ఇంకొకతను అడ్డుపడ్డాడు.
“ఇక్కడ మాట్లాడేది నేను.”
“సరే, మీకేం కావాలో చెప్పండి.” పేద్రో పారమొ మళ్లీ అన్నాడు.
“చూస్తున్నావుగా, మేం ఆయుధాలు చేపట్టాం.”
“అయితే?”
“అయితే ఏముంది? అంతే. అది చాలదా?”
“ఎందుకు చేస్తున్నారు ఇదంతా?”
“ఎందుకంటే అందరూ అదే పని చేస్తున్నారు కాబట్టి. నీకు తెలియదా? కాసేపు ఆగు, మాకింకా పైనుంచి ఆదేశాలు రావాలి. అప్పుడు చెప్తాము ఎందుకో. ఇప్పటికయితే, మేం ఇక్కడున్నాం. అంతే.”
“ఎందుకో నాకు తెలుసు,” ఇంకొకతను అన్నాడు. “నీకు కావాలంటే చెప్తాను. మేం ప్రభుత్వం మీదా, నీలాంటి వాళ్ల మీదా తిరుగుబాటు చేస్తున్నాం. మిమ్మల్ని భరించడం ఇక మా వల్ల కాదు. ప్రభుత్వంలో ప్రతి ఒకడూ ఒక దొంగవెధవ. నువ్వూ, నీలాంటి వారూ బందిపోటు దొంగలు. ఇక గవర్నర్ గురించి ఏమీ చెప్పను. ఆ చెప్పేదేదో బుల్లెట్ల తోటే చెప్తాం.”
“మీ తిరుగుబాటుకి ఎంత కావాలి?” పేద్రో పారమొ అడిగాడు. “నేను మీకు సాయం చేయగలనేమో!”
“అయ్య చెప్పేది బాగానే ఉంది పెర్సెవెరాన్సియో. నువు ఊరికే నోరు పారేసుకోకు. మనకు కావలసిన సరంజామా సమకూర్చడానికి డబ్బున్న వాడొకడు ఎటూ కావాలి. ఈ అయ్యని మించిన వాళ్ళెవరు దొరుకుతారు? కాసిల్డో, మనకి ఎంత కావాలి?”
“ఇంతని ఏముంది? అయ్య ఎంత ఇవ్వగలిగితే అంత.”
“ఏమిటీ? ఈ మనిషి పస్తులున్నవాడికి కూడా మెతుకు విదల్చడు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కనక అవకాశం వదులుకోకూడదు. వాడి రోత నోట్లో ఉన్న ఆఖరి మెతుకుతో పాటు ఉన్నదంతా ఊడబీక్కోవాలి.”
“నువ్వాగు పెర్సెవెరాన్సియో! అల్లంతో కంటే బెల్లంతోటే ఎక్కువ ఈగలు పట్టుకోవచ్చు. మనం బేరం కుదుర్చుకోవచ్చు. ఎంతో చెప్పు కాసిల్డో!”
“ఉరామరిగా చూస్తే ఇప్పుడు ముందో ఇరవై వేల పేసోలయితే బాగానే ఉంటుంది. మిగతా వాళ్లంతా ఏమంటారు? మనకెటూ సాయం చేయాలనుకుంటున్నాడు కనక మన అయ్య ఇంకాస్త ఎక్కువే ఇస్తాడేమో, మనకేం తెలుసు? కాబట్టి ఒక యాభై వేలు అనుకుందాం. మీకేమనిపిస్తుంది?”
“నేను లక్ష ఇస్తాను మీకు.” పేద్రో పారమొ అన్నాడు. “ఎంతమంది మీరు?”
“మూడొందల మంది దాకా ఉంటాం.”
“సరే. నేను ఇంకో మూడొందలమందిని మీతో పంపుతాను మీ దళం బలపడేందుకు. ఒక వారంలో మీకోసం డబ్బూ, మనుషులూ ఏర్పాటు చేస్తాను. డబ్బులు ఇస్తాను కానీ, మనుషులు మాత్రం అరువుకే. వాళ్ళతో పని అయిపోగానే తిరిగి ఇక్కడికి పంపేయండి. ఒప్పందానికి సమ్మతమేనా?”
“ఇంకా సందేహమా?”
“సరే, ఇంకో వారంలో మళ్ళీ కలుద్దాం అయ్యలారా! మిమ్మల్ని ఇట్లా కలవడం ఆనందంగా ఉంది.”
“సరే,” చివరిగా వెళుతున్నతను అన్నాడు “కానీ గుర్తు పెట్టుకో. మాటతప్పావా, నీ సంగతి తేలుస్తాడు పెర్సెవెరాన్సియో. అంటే, నేనే!”
పేద్రో పారమొ అతనితో కరచాలనం చేసాడు అతను వెళ్లబోతుండగా.

“వాళ్ల నాయకుడెవరనుకుంటున్నావు?” వాళ్ళు వెళ్ళిపోయాక టిల్కేట్ ని అడిగాడు.
“ఆ మధ్యలో ఉన్నతను అనుకుంటాను. అదే, ఆ పెద్ద పొట్టేసుకుని తల కూడా పైకెత్తకుండా ఉన్నాడే, అతనే అనుకుంటున్నాను. నేనంత తొందరగా పొరబడను, డాన్ పేద్రో.”
“ఈసారి పొరబడ్డావు డమసియో. నాయకుడివి నువ్వు. కొంపదీసి ఈ తిరుగుబాటులో భాగం పంచుకోవాలనిలేదా?”
“ఆ విషయం నాకు వెంటనే తట్టలేదు. అందులోనూ కాస్త చిల్లర దొరుకుతుందంటే నాకెంతో ఇష్టం కూడాను.”
“ఈపాటికే నీకు అర్థమయి ఉండాలి కనక నీకు నా సలహా పెద్దగా అవసరం లేదు. నీకు నమ్మకమయిన వాళ్లను మూడొందలమందిని సిద్ధం చేసి వీళ్లతో జతకలువు. వాళ్ళకోసం నేను పంపిస్తానన్న మనుషుల్ని తీసుకొచ్చినట్టు చెప్పు. మిగతాది ఎట్లా చేయాలో నీకు తెలుసు.”
“మరి డబ్బు గురించి ఏం చెప్పను? అది కూడా వాళ్లకు ఇవ్వనా?”
“నీకు మనిషికి పది పేసోల లెక్కన ఇస్తాను. వాళ్ల తక్షణ అవసరాలు తీరడానికి సరిపోయేంత. మిగతాది వాళ్ళకోసం ఇక్కడ దాచానని చెప్పు. ఈ రోజుల్లో అంత సొమ్ము వెంట వేసుకుని తిరగడం మంచిది కాదు. అన్నట్టు ఆ రాతిగేటు దగ్గర కొట్టం ఎట్లా ఉంటుంది నీకు? సరే. అది నీదే, ఈ నిమిషం నుంచీ. కోమలలో మన లాయరు ఉంటాడు, అదే ఆ ముసలి గెరార్డొ ట్రూహీయో. ఈ కాగితం అతని దగ్గరికి తీసుకు వెళ్ళు. అక్కడికక్కడే ఆ స్థలం నీ పేరు మీదకి మార్పిస్తాడు. ఏమంటావు డమసియో?”
“అనేదేముంది డాన్! కొట్టం సంగతి వదిలేసినా ఈ పని ఆనందంగానే చేస్తాను. దీని సంగతి చూట్టానికయినా. నేను నీకు తెలుసు. ఏమయినా నీకు కృతజ్ఞుడిని. నేనిట్లా తిరుగుతూ ఉంటే మా ముసలిదానికి కాస్త పని కలిపించినట్టుంటుంది.”
“కాసిని పశువుల్ని కూడా తీసుకుపో. ఆ కొట్టానికి కాస్త ఆ సందడి కూడా ఉండాలిగా!”
“ఆ పుంజుల్ని కూడా తీసుకుంటే ఫర్వాలేదా?”
“నీకేం కావాలంటే అవి తీసుకుపో. మీ ఆవిడ వాటిని చూసుకుంటుంది. ఇక మన విషయానికి వద్దాం. నా పొలానికి మరీ దూరం ఆ వెళ్లనివ్వకు. ఇంకెవరన్నా వస్తే ఇక్కడ ఇప్పటికే వీళ్ళున్నారని తెలిసేట్టుండాలి. నీకు వీలయినప్పుడో, ఏదన్నా వార్త ఉన్నప్పుడో రా.”
“వస్తాను అయ్యా!”

“ఆమె ఏమంటూ ఉంది హువాన్ ప్రెసియాడో?”
“తన పాదాలను అతని కాళ్ళ మధ్య పెట్టుకునేదాన్నని చెపుతూంది. చల్లటి రాళ్ళలాగా ఉన్న పాదాల్ని బట్టీలో రొట్టె కాల్చినట్టు వెచ్చగా చేసేవాడు. అవి బంగారు రొట్టెలంటూ వాటిని మునిపళ్లతో కొరికేవాడనీ చెప్పింది. ఆమె అతని దగ్గరగా ముడుచుకుని పడుకునేది అతని చర్మం కింద, శూన్యంలో తప్పిపోతూ. తన కండరాలు నాగటి చాళ్లలా విడివడుతూ, మంటతో మొదలై వెచ్చగా, మెల్లగా ఆమె మెత్తటి కండరాలను తోసుకుంటూ లోపలికి, లోలోపలికి ఆమె కేక పెట్టిందాకా. కానీ అతని చావు ఆమెని చాలా చాలా బాధించింది. అదీ ఆమె చెప్పింది.”
“ఎవరి చావని ఆమె ఉద్దేశం?”
“ఆమెకంటే ముందుచనిపోయినవాళ్ళెవరో!”
“కానీ ఎవరయి ఉంటారు?”
“నాకు తెలియదు. ఆమె అనడం అతను ఆలస్యంగా వచ్చిన రాత్రి ఆమెకి గట్టిగా అనిపించిందట అతడు ఆలస్యంగా వేకువజాముకయినా వస్తాడని. ఎందుకంటే ఆమె చల్లటి పాదాలు దేంతోటో చుట్టేసినట్టూ, ఎవరో కప్పి వేడి చేస్తున్నట్టూ అనిపించిందట. ఆమె లేచేసరికి తాను అతనికోసం ఎదురు చూస్తూ చదువుతున్న న్యూస్ పేపర్ ఆమె పాదాలకు చుట్టి ఉందట. అతను చనిపోయిన వార్త వాళ్ళు ఆమెకు చెప్పడానికి వచ్చినప్పుడు ఆమె ఆరాత్రి నిద్రకు తాళలేనప్పుడే నేలకు జారిపోయిన పత్రిక ఆమె పాదాల చుట్టూ కప్పబడి ఉంది.
“ఆమెను పూడ్చిపెట్టిన పెట్టె బద్దలయి తెరుచుకున్నట్టుంది. చెక్క కిర్రు మనే చప్పుడు వస్తూంది.”
“అవును నాకూ వినపడుతుంది.”

ఆరాత్రి ఆమెకు మళ్లీ కలలు వచ్చాయి. ఎందుకంత గాఢంగా అన్ని విషయాలనూ గుర్తుంచుకోవడం? అతని చావు మాత్రమే కాక ఎప్పటిదో మృదువయిన సంగీతం?
“ఫ్లోరెన్సియో చనిపోయాడు సెన్యోరా!”
ఎంత భారీ మనిషి! ఎంత పొడవు! అతని గొంతెంత దృఢంగా ఉండేది!. ఎంతో పొడి అయిన నేలంత పొడిగా. అతని దేహాన్ని సరిగ్గా చూడలేకపోయింది. లేక జ్ఞాపకాల్లోంచి చెరిగిపోయిందా? వాళ్ల మధ్య వానేదో పడుతున్నట్టు. అతనేమన్నాడు? ఫ్లోరెన్సియో? ఏ ఫ్లోరెన్సియో? నావాడా? మరయితే అప్పుడు నేనెందుకు ఏడవలేదు నాకన్నీళ్లలో నన్ను ముంచేసుకుని నా వేదననంతా కడిగేసుకునేట్టు? ఓ దేవుడా! నువు నీ స్వర్గలోకంలో లేవు. అతన్ని కాపాడమని నిన్ను కోరాను. అతన్ని జాగ్రత్తగా చూసుకోమని. నిన్నడిగింది అదే. కానీ నీకు పట్టిందల్లా ఆత్మలు. మరి నాకు కావలసింది అతని శరీరం. నగ్నంగా, ప్రేమతో వేడిగా, కోరికతో కాలిపోతూ, నా వణికే రొమ్ముల్నీ, చేతుల్నీ రాస్తూ. అతని దేహాన్నుంచి నా పారదర్శక దేహం వేలాడుతూ. అతని బలం పట్టి విడుస్తున్న కామాతురమైన నా దేహం. అతని పెదవులు కప్పని నాపెదవులతో ఏం చేయను? నా పేద పెదవులేమవుతాయి?
సుజానా శాన్ హువాన్ తన పక్కలో అటూ ఇటూ దొర్లుతూ ఉంటే పేద్రో పారమొ తలుపు దగ్గరే నుంచుని ఆమెనే చూస్తూ ఈ కొత్త కలని సెకన్లలో కొలుస్తున్నాడు. లాంతరులో నూనె తగ్గి మంట రెపరెపలాడి బలహీన పడుతూ ఉంది. తొందర్లోనే అది ఆరిపోతుంది.
ఈ అంతులేని శిక్షింపజేసే కలలు కాకుండా ఏదన్నా నొప్పితో బాధపడుతూ ఉంటే అతను ఉపశమనానికేమయినా చేసుండేవాడు. సుజానా శాన్ హువాన్ నే చూస్తూ ఆమె ప్రతి కదలికనూ గమనిస్తుంటే పేద్రో పారమొకి కలిగిన ఆలోచనలు అవి. ఆమెను చూడడానికి సాయపడుతున్న ఆ పాలిపోయిన వెలుగు లాగా ఆమె బ్రతుకు కూడా హరించుకుపోతే తనేం చేయాలి?
అతను చప్పుడు కాకుండా తలుపు మూసి బయటికి నడిచాడు. బయట చల్లని గాలి. సుజానా శాన్ హువాన్ రూపాన్ని చల్లటి రాత్రి తుడిచేసింది.
వేకువజామున సుజానాకు మెలకువ వచ్చింది. ఆమెకు చెమట్లు పోస్తున్నాయి. పైనున్న బరువయిన దుప్పట్లను నేల మీదికి విసిరేసి దాని వేడి నుంచి తప్పించుకుంది. ఉదయపు చల్లటి గాలి ఆమె నగ్నదేహాన్ని చల్లపరుస్తూ ఉంది. ఆమె నిట్టూర్చి తిరిగి నిద్రలోకి జారుకుంది.
కొన్నిగంటల తర్వాత ఆమె ఫాదర్ రెంటెరియాకు అట్లాగే కనిపించింది. నగ్నంగా నిద్రపోతూ.

“ఇది విన్నారా డాన్ పేద్రో? టిల్కేట్ ని లేపేశారు”
“రాత్రి గొడవేదో వినపడుతూ ఉంది కనక కాల్పులు జరిగినట్టు తెలుసు. కానీ నాకంతవరకే తెలుసు. ఇది నీకెవరు చెప్పారు గెరార్డో?”
“గాయపడ్డవాళ్ళలో కొంతమంది కోమలా చేరుకున్నారు. నా భార్య వాళ్ళకి కట్లు కట్టడానికి సాయపడింది. వాళ్ళు డమసియోతో ఉన్నట్టూ, చాలా మంది చనిపోయారనీ చెప్పారు. విజీస్తాలమని చెప్పుకునే వాళ్ళెవరితోనో గొడవ జరిగినట్టుంది.”
“ఓరి దేవుడా! ముందుముందు అన్నీ పాడురోజులే రాబోతున్నట్టున్నాయి గెరార్డో! నువ్వేం చేయాలనుకుంటున్నావు?”
“నేను వెళ్ళిపోతున్నా డాన్ పేద్రో! సయులాకి. అక్కడ మళ్ళీ మొదలుపెట్టుకోవడమే.”
“మీ లాయర్లకా అవకాశముంది. మిమ్మల్ని చంపనంతవరకూ మీ సొత్తంతా తీసుకుని ఎక్కడికయినా పోవచ్చు.”
“అట్లా అనుకోకండి డాన్ పేద్రో! మా సమస్యలు మాకున్నాయి. అంతేకాక మీలాంటి వాళ్ళను వదిలిపోవడం కష్టంగానే ఉంటుంది. మీ మర్యాదలు మళ్లీ ఎక్కడ దొరుకుతాయి? మన ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుందనుకుంటే కాస్త మనశ్శాంతి. మీ పేపర్లన్నీ ఎక్కడ వదిలేయమంటారు?”
“వదిలేయద్దు. నీతో పాటు తీసుకు వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడనుంచే నా వ్యవహారాలు చూడడం కుదరదా?”
“నామీద మీరుంచిన నమ్మకానికి చాలా సంతోషంగా ఉంది. నిజంగా. కానీ మీ పనులు చూడడం కుదరదని చెప్పే సాహసం చేస్తున్నాను. కొన్ని అవకతవకలు.. మీకు తప్ప మరొకరికి తెలియకూడని విషయాలున్నాయి. మీ పేపర్లు తప్పుడువాళ్ల చేతుల్లో పడితే వాళ్ళు ఏమయినా చేయొచ్చు. వాటిని మీతో ఉంచుకోవడమే మంచిది.”
“నువు చెప్పింది నిజమే గెరార్డో! వాటిని ఇక్కడే వదిలేయి. వాటిని తగలబెట్టేస్తాను. పేపర్లున్నా లేకపోయినా నా ఆస్తి గురించి నాతో పెట్టుకునేదెవడు?”
“ఎవరూ లేరు డాన్ పేద్రో! నాకా నమ్మకముంది. ఇక నేను వెళతాను.”
“దేవుడు తోడుగా పో గెరార్డో!”
“ఏమన్నారు?”
“దేవుడు నీకు తోడుగా ఉంటాడంటున్నాను.”
గెరార్డో ట్రూహీయో చాలా నెమ్మదిగా వెళ్ళిపోయాడు. అతను ముసలివాడే కానీ అంత నెమ్మదిగా, ఆగుతూ ఆగుతూ నడవవలసిన అవసరం లేదు. నిజానికి అతనేదన్నా బహుమానం దొరుకుతుందని ఆశించాడు. పైన ఎక్కడున్నాడో డాన్ లూకాస్, అప్పుడతని పనీ, ఇప్పటిదాకా డాన్ పేద్రో పనీ అతనే చూశాడు. డాన్ పేద్రో కొడుకు మిగెల్ పని కూడా. ఏదన్నా గుర్తింపు కోసం ఆశపడ్డాడు. అతను చేసిన సేవలకు బదులుగా కాస్త పెద్ద ఎత్తున. అతని భార్యకు చెప్పాడు వచ్చేముందు “నేను వదిలిపెట్టి పోతున్నానని డాన్ పేద్రోకి చెప్తాను. నాకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటాడని నాకు తెలుసు. ఆయనిచ్చే డబ్బుతో సయులాలో స్థిరపడొచ్చు. ఇక మిగతా జీవితం హాయిగా గడిపేయొచ్చు.”
కానీ ఆడవాళ్ళకి ఎప్పుడూ సందేహాలు ఎందుకు వస్తాయి? అసలేమిటి? వాళ్ళకు పైనుంచి ఏదన్నా సమాచారం అందుతుందా? అతని భార్యకు నమ్మకం లేదు అతనికేదన్నా బహుమానం దక్కుతుందని.
“నీ తల నీళ్ళలో మునగకుండా చూసుకోవడానికి నువు కుక్కలా పనిచేయాలి. అతడి నుంచి నీకేమీ రాదు.”
“ఎందుకట్లా అంటున్నావు?”
“నాకు తెలుసు, అంతే!”
వెనకనుంచి పిలుపు వస్తుందేమోనని ఇంకా వాకిలి వైపు నెమ్మదిగా నడుస్తున్నాడు.
“ఓ గెరార్డో! పరధ్యానంలో బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. నువు చేసినదానికి డబ్బుతో బదులు తీర్చుకోలేను. సరే, ఇది తీసుకో. ఏదో కాస్త కృతజ్ఞతగా.”
కానీ ఆ పిలుపు రాలేదు. ముఖద్వారం నుండి బయటకు వచ్చి రాటకు కట్టిన గుర్రాన్ని విప్పాడు. దానిపై ఎక్కి నెమ్మదిగా కోమలా వైపు బయలు దేరాడు కూతవేటు దూరం దాటిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ. మెదియా లూనా కనుచూపు మేరలనుంచి దాటిపోయాక అనుకున్నాడు “అప్పు అడగడం ఎంత నీచమైన పని?”

“డాన్ పేద్రో. నాకే ఎందుకో బాగాలేక తిరిగి వచ్చేశాను. నీ పనులు చూడ్డం నాకు సంతోషమే.”
అరగంట క్రితమే వదిలిన డాన్ పేద్రో ఆఫీసులో కూచుని ఉన్నాడు అతను మళ్ళీ.
“నాకేమీ అభ్యంతరం లేదు గెరార్డో. అవిగో పేపర్లు. ఇంకా నువు వదిలిపెట్టిన చోటనే ఉన్నాయి.”
“మరి నా ఖర్చులకి.. నా ఫీజ్లో కొంత అడ్వాన్స్ గా.. కొద్దిగా ఎక్కువ ఏమన్నా ఇస్తే.. మీకు పర్వాలేదనిపిస్తే..”
“అయిదొందలు?”
“ఇంకొంచెం.. చాల కొంచెం ఎక్కువ కుదరదా?”
“వెయ్యి సరిపోతుందా?”
“అయిదు వేలు..”
“అయిదు.. ఏమిటీ? అయిదు వేల పేసోలా? నాదగ్గర అంత లేదు. అందరికంటే నీకే ఎక్కువ తెలిసి ఉండాలి నాకున్నదంతా ఇరుక్కుపోయి ఉన్నదని. నేలా, పశువులూ.. నీకు తెలుసా సంగతి. వేయి తీసుకో. అది సరిపోతుందిలే నీకు.”
ట్రూహీయో కూచుని ఆలోచిస్తున్నాడు. ఛాతీమీదికి తల వాల్చి. పేద్రో డబ్బు లెక్కపెడుతున్న వైపు నుంచి పేసోలు బల్లపై ఠంగుమని పడుతున్న చప్పుడు వినపడుతూంది. తన ఫీజు చెల్లించకుండా ఎప్పుడూ దాటవేసే డాన్ లూకాస్ ను గుర్తు తెచ్చుకున్నాడు. మొదట్లో ఏ మచ్చా లేని డాన్ పేద్రోని. అతని కొడుకు మిగెల్ని కూడా. ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టాడు ఆ పిల్లాడు?
కనీసం పదిహేను సార్లు జైలునుంచి బయటకు రప్పించాడు. ఆ మనిషిని చంపిన కేసొకటి. ఏం పేరు అతనిది? రెంటెరియా. అవును, అదే. శవం చేతిలో తుపాకీ ఉంచారు. తర్వాత దాని గురించి నవ్వేసేవాడు కానీ మిగెలో జడుసుకు చచ్చాడు. ఆ వొక్కసారికే డాన్ పేద్రోకి ఎంత ఖర్చయి ఉండేది చట్టప్రకారం వెళ్ళుంటే. ఇంక ఆ బలాత్కారాల సంగతేమిటి? ఎన్ని సార్లు తన జేబులోంచి డబ్బు తీసి ఆ అమ్మాయిల నోరు మూయించలేదు? “మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీకు తెల్లటి బిడ్డ పుట్టబోతున్నాడు కాబట్టి,” వాళ్ళకు నచ్చచెప్పేవాడు.
“ఇదుగో గెరార్డో, జాగ్రత్తగా చూసుకో. డబ్బు చెట్లకేం కాయదు.”
తన ఆలోచనల్లో ఇంకా మునిగి ఉన్న ట్రూహీయో బదులిచ్చాడు “చనిపోయినవాళ్ళు సమాధుల్లోంచి పైకి లేచి రానట్టే.”

తెల్లారడానికి ఇంకా చాలా సమయముంది. దీర్ఘరాత్రి వలన ఉబ్బిన లావాటి నక్షత్రాలతో ఆకాశం నిండి ఉంది. జాబిలి కొంచెం పైకి లేచి కనపడకుండా పోయింది. అది ఎవరూ చూడని, పట్టించుకోని దిక్కుమాలిన జాబిళ్లలో ఒకటి. అక్కడే కొద్దిసేపు వేలాడింది వక్రంగా, వెన్నెలేమీ కురవకుండా. తర్వాత కొండల వెనక దాక్కోవడానికి పోయింది.
దూరాన్నుంచి చీకటి ముసుగులో ఎడ్ల రంకెలు వినిపిస్తున్నాయి.
“ఆ పశువులు ఎప్పుడూ నిద్రపోవు.” డమియాన సిస్నెరోస్ అంది. “అవి ఎప్పుడూ నిద్రపోవు. అవి సైతాను లాగా ఎప్పుడూ ఏ ఆత్మను తన్నుకు పోదామా అని చూస్తూ ఉంటాయి.”
ఆమె అటు గోడవేపుకు తిరిగి పడుకుంది. అప్పుడే ఆమెకి ఎక్కడో తట్టిన చప్పుడు వినపడింది.
ఆమె ఊపిరి బిగబట్టి కళ్ళు తెరిచింది. మళ్ళీ మూడు సార్లు చిన్నగా తట్టిన శబ్దం వినపడింది ఎవరో గోడమీద కొడుతున్నట్టు. ఆమె పక్కనే కాదు, ఎక్కడో దూరంగా, కానీ అదే గోడ మీద.
“దేవుడే కాపాడాలి. అది శాన్ పస్కూల్ అయి ఉండాలి. మూడు సార్లు తట్టి, తనను నమ్మినవాళ్ళల్లో ఎవరికో సమయమాసన్నమయిందని హెచ్చరిస్తున్నాడు.”
కీళ్లనొప్పులవల్ల చాలా రోజులనుంచీ నొవేనా చేయలేదు కనక ఆమె ఆందోళన చెందలేదు. కానీ భయపడింది. భయాన్ని మించి కుతూహలం.
ఆమె మంచం మీనుండి సద్దు చేయకుండా లేచి కిటికీ నుంచి బయటికి తొంగి చూసింది.
పొలాలు నల్లగా ఉన్నాయి. ఆమెకి ఆ చుట్టుపక్కల అంతా క్షుణ్ణంగా తెలుసు కనక చీకట్లో కూడా పేద్రో పారమొ భారీ శరీరం మార్గరిటా కిటికీలోకి దూకడం కనపడింది.
“ఆ డాన్ పేద్రో..” డమియానా అనుకుంది “అమ్మాయిల వెంట పడడం మానడు గదా! నాకర్థం కానిదేమిటంటే అప్పటికేది తోస్తే అది చేయాలని ఎందుకనుకుంటాడన్నది. నాకు ముందే చెప్పి ఉంటే అయ్యగారికి ఆరాత్రికి తను కావాలని మార్గరిటాకి చెప్పేదాన్ని. అతనికి మంచం వదిలి వెళ్ళాల్సిన శ్రమ తప్పేది.”
ఎడ్లు ఇంకా రంకెలు వేస్తుండగానే ఆమె కిటికీ మూసింది. తన మంచంలో పడుకుని దుప్పటి చెవులదాకా కప్పుకుంది. కుర్ర మార్గరిటానిప్పుడు అతను ఏం చేస్తూ ఉంటాడో ఆలోచిస్తూ పడుకుని ఉండి పోయింది.
కాసేపటికి రాత్రి వేడెక్కినట్టనిపించడంతో లేచి నైట్ గౌనును విప్పేయక తప్పింది కాదు.
“డమియానా!” ఆమెకు వినిపించింది.
ఆమె చిన్నపిల్ల అయిపోయింది.
“తలుపు తెరువు డమియానా!”
ఆమె గుండె ఉరఃపంజరంలో చిన్న కప్పపిల్ల లాగా ఎగిరెగిరి పడుతూంది.
“ఎందుకు అయ్యా?”
“తెరువు డమియానా!”
“బాగా నిద్రలో ఉన్నానయ్యా!”
తర్వాత ఆమెకు డాన్ పేద్రో బయట కారిడార్లో అటూ ఇటూ నడుస్తున్న చప్పుడు వినపడింది. బూట్ల మడాలు టక్కు టక్కుమని గట్టిగా శబ్దం చేస్తున్నాయి, అతని కోపాన్ని తెలియజేస్తూ.
మరుసటి రాత్రి అతనికి మళ్ళీ కోపం రాకుండా ఉండేందుకు ఆమె తలుపు వారగా తెరిచి ఉంచింది. అతని పని సులభమయ్యేందుకు నగ్నంగానే పడుకుంది. కానీ పేద్రో పారమొ మళ్ళీ రాలేదు.
ఇప్పుడు ఆమె మెదియా లూనాలో పనివాళ్లందరికీ మేస్త్రీ. ముసలిదయి నలుగురి గౌరవాన్నీ సంపాదించుకుంది. ఈ రాత్రి ఆమె ఇంకా ఆ రాత్రి గురించే ఆలోచిస్తూ ఉంది – పేద్రో పారమొ “తలుపు తెరువు డమియానా!” అంటూ పిలిచిన రాత్రి.
ఈ గడియలో కుర్ర మార్గరిటా ఎంత సంతోషంగా ఉండి ఉంటుందో అనుకుంటూ నిద్రపోయింది.
తర్వాత ఆమెకు ఎవరో తలుపు తట్టడం వినిపించింది. కానీ ఈసారి పెద్ద తలుపు. ఎవరో తుపాకీ మడమతో దాన్ని పగలకొట్టాలని చూస్తున్నట్టు.
రెండో సారి ఆమె కిటికీ తలుపు తెరిచి బయటికి రాత్రిలోకి చూసింది. పురుగులు దొర్లే నేలపై వాన పడ్డాక ఆవిర్లొస్తున్నట్టనిపిస్తున్నా ఆమెకు ఏమీ కనపడలేదు. ఆమెకు ఏదో పైకి తేలి వస్తున్నట్టనిపించింది – చాలామంది మగవాళ్ళ వేడి. ఆమెకు కప్పల బెకబెకలూ, కీచురాళ్ళ చప్పుడూ వినిపించాయి. వానాకాలంలో ఒక సందడి లేని రాత్రి. మళ్ళీ తలుపు బాదుతున్న చప్పుడు వినిపించింది.
ఒక దీపం వెలుతురు గుంపులోని మనుషుల మొహాల మీద పడింది. అంతలోనే అది ఆరిపోయింది.
“ఇవన్నీ నాకవసరం లేని విషయాలు,” అని డమియానా సిస్నెరోస్ కిటికీ మూసుకుంది.

“నిన్ను చితకతన్నారని విన్నాను డమసియో! అట్లా ఎట్లా జరగనిచ్చావు?”
“నీకు తప్పుడు వార్త అందినట్టుంది అయ్యా! నాకేమీ కాలేదు. నామనుషులెవరూ చచ్చిపోలేదు. నాకింద నా వాళ్ళే ఏడువందలమంది ఉన్నారు. ఆపైన వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళు ఇంకొంత మంది. ఏమయిందంటే ఆపాతవాళ్లకు పనేమీ లేక విసుగుపుట్టి బోడిగుళ్ళ వాళ్ళ మీద కాల్పులు మొదలుపెట్టారు. చూడబోతే వాళ్లది పెద్ద సైన్యం. తెలుసుగా, ఆ విజీస్తాలు!”
“ఎక్కడినుంచి వచ్చారు వాళ్ళు?”
“ఉత్తరాన్నుంచి. వచ్చేదారంతా వాళ్ళకు కనపడినదంతా చదును చేసుకుంటూ వస్తున్నారు. మనకి తెలిసినంతవరకూ ఇక్కడిదాకా పంటలన్నీ దోచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు బాగా శక్తివంతులు. అది మాత్రం కాదనలేం.”
“మరి వాళ్లతోటే కలవకపోయావా? మనం గెలిచే పక్షం వైపే ఉండాలని నీకు ముందే చెప్పా గదా!”
“ఆపని ముందే చేశాను.”
“మరి ఇక్కడికెందుకు వచ్చావు?”
“మాకు డబ్బు కావాలయ్యా! మాంసం తప్ప మరేమీ తినక విసుగు పుట్టింది. ఇక అది రుచించడం లేదు. మాకు అరువు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నువు మాకు కిరాణా సరుకులు కొనిపెడతావన్న ఆశతో వచ్చాం. మేం ఎవరినుంచో దొంగిలించదల్చుకోలేదు. ఇంకాస్త దూరం వెళ్ళినట్టయితే అక్కడివాళ్ళనుంచి కాస్త ‘అప్పు‘ తీసుకునే వాళ్ళమేకానీ ఈ చుట్టుపక్కల అంతా చుట్టాలేనయిపోతిరి. వాళ్ళను దోచుకోవడం బాగోదు. మాకు కావలసింది తిండి కొనడానికి డబ్బు, కాసినయినా మిరపకాయలూ, టోర్టియాలూ కొనుక్కోవడానికి.”
“అయితే నాదగ్గరే నీ డిమాండ్లు మొదలుపెట్టావన్న మాట!”
“ఛ! లేదయ్యా. నేను ఈ కుర్రాళ్ల కోసం అడుగుతున్నా. నాకు మాత్రం ఏమీ అక్కర్లేదు.”
“నీ మనుషులకేం కావాలో నువు చూసుకుంటున్నావంటే అది నీ మంచితనమే కానీ నీకేం కావాలో అది ఇంకెవరినన్నా అడుక్కో. నేను నీకు ముందే డబ్బు ఇచ్చాను. నీకిచ్చిన దాంతో సంతోషపడు. నీకేం సలహా ఇవ్వాలని కాదు కానీ, కోంట్లాకి వెళ్ళాలన్న ఆలోచన రాలేదా? మీరు తిరుగుబాటు యుద్ధం ఎందుకు చేస్తున్నారు? మూర్ఖులే అడుక్కు తినేది. ఇంటికిపోయి కోళ్లకి మేత వేసుకోకపోయావా మీ ఆవిడతో కలిసి? వెళ్ళి ఏదో పట్టణం దోచుకోండి. నువు నీ తలమీదికి తెచ్చుకుంటున్నావు, మిగతావాళ్ళు వాళ్ళ పని చేయలేరా? కోంట్లా అంతా ధనవంతులే. వాళ్ళు దాచుకున్నదాంట్లో కొంత తీసుకో. లేకపొతే నువ్వేమన్నా వాళ్ళకి పాలిచ్చే దాదివనుకుంటున్నావా వాళ్ల అవసరాలు కనిపెట్టుకోటానికి? లేదు డమసియో. నువ్వేం సరదాకి తిరగడం లేదని తెలిసేట్టు చేయి. కాస్త బెదిరించు, సెంటావోలు అవే వస్తాయి.”
“నువు చెప్పినట్టే చేస్తానయ్యా. నువు మంచి సలహాలిస్తావనే నా నమ్మకం.”
“సరే, అది చేసి చూపించు.”
ఆ మనుషులు స్వారీ చేస్తూ వెళ్ళిపోతుంటే పేద్రో పారమొ చూస్తూ ఉండిపోయాడు. చీకట్లో కనపడకుండా గుర్రాలు దౌడు తీయడం వినిపిస్తూంది. చెమటా, దుమ్మూ; వణుకుతున్న నేలా. మిణుగురుల కాంతి మళ్ళీ మెరుస్తుంటే అందరూ వెళ్ళిపోయినట్టు అర్థమయింది. అతడొక్కడే మిగిలిపోయాడు, లోపల పుచ్చుతూన్న దృఢమైన వృక్షంలా.
అతనికి సుజానా శాన్ హువాన్ తలపుకొచ్చింది. తనతో అంతకు ముందే పడుకున్న యువతి కూడా. చిన్నగా, భయంగా వణుకుతూన్న దేహమూ, ఛాతీలోంచి ఎగిరి బయటపడుతుందేమో అన్నట్టు దడదడమని కొట్టుకుంటున్న గుండే. “చిన్నారి చిలకా,” అన్నాడు ఆమెతో. ఆమెను వాటేసుకున్నాడు ఆమెను సుజానా సాన్ హువాన్ గా మార్చడానికి ప్రయత్నిస్తూ. “ఈ లోకానికి చెందని స్త్రీ!”

ముడి

MythiliScaled

చాలా కాలం కిందట ఫ్రాన్స్ , బెల్జియం సరిహద్దులో ఒక పట్టణం . అది బర్చర్డ్ అనే జమీందారు అధీనం లో ఉండేది. అతను చాలా క్రూరుడు, ప్రజలు చాటుగా అతన్ని ‘ తోడేలు జమీందారు ‘ అనేవారు. అతని భార్య మాత్రం చాలా మంచిది. భర్త వల్ల కలిగే కష్టాలనీ నష్టాలనీ తగ్గించేందుకు రహస్యంగా తన ప్రయత్నం తను చేస్తూ ఉండేది. అతనూ భార్య అంటే ఏ కాస్తో గౌరవం ఉన్నట్లుగా చూసీ చూడనట్లు ఊరుకునేవాడు – జనాన్ని హింసించటం మాత్రం కట్టిపెట్టేవాడు కాదు.

dyck-self-portrait

ఒక రోజు వేటకి వెళ్ళి వస్తుండగా అడవి అంచున ఒక చిన్న ఇంటి ముంగిట్లో చక్కని అమ్మాయి నార వడుకుతూ కనిపించింది.

” నీ పేరేమిటి ? ” అడిగాడు

” రెనెల్డ్, అయ్యా ! ”

” ఇక్కడ ఏ సందడీ లేదులా ఉందే- అస్తమానమూ ఇక్కడే ఉంటే విసుగు పుట్టదూ నీకు ?”

” లేదయ్యా , అలవాటైపోయింది ”

” అలా కాదులే. నాతోబాటు కోటకి రాకూడదూ ? అమ్మగారికి చెలికత్తెగా ఉండిపోవచ్చు ”

” కుదరదదయ్యా. మా అమ్మమ్మ పెద్దదైపోయింది.ఆమెని నేనే చూసుకోవాలి ”

” ఆ వంకలేం చెప్పకు. సాయంత్రానికల్లా అక్కడికి వచ్చేయి ”

కాని రెనెల్డ్ వెళ్ళలేదు. ఆమెకి గిల్బర్ట్ అనే కట్టెలుకొట్టే యువకుడితో పెళ్ళి కుదిరిఉంది కూడా.

మూడురోజులయాక జమీందారు మళ్ళీ ఆ వైపు వచ్చాడు.

” ఏం అమ్మాయ్ , రాలేదేం ? ”

” చెప్పాను కదయ్యా, వీలుకాదని ”

ఇలా రెండు మూడు సార్లు ఆమెని కోటకి చెలికత్తెగా రమ్మని అడిగి, ఆమె రాకపోయేసరికి ఒకరోజు ” నువ్వు వస్తే అమ్మగారిని వదిలేసి నిన్నే పెళ్ళాడతాను ” అనేశాడు జమీందారు.

రెనెల్డ్ కి అతని దుర్బుద్ధికి అసహ్యం వేసింది. రెండేళ్ళ కిందట ఆమె తల్లి పోయినప్పుడు జమీందారిణి వాళ్ళని ఎంతగానో ఆదుకుంది. ఆవిడకి హాని చేసేపనిని రెనెల్డ్ కలలో కూడా తలపెట్టలేదు.

John Faed The Spinningwheel

అలా కొన్ని వారాలు గడిచాయి. అతని పీడ వదిలిందని రెనెల్డ్ అనుకుంది. కాని ఆ రోజు చేతిలో తుపాకీ పట్టుకుని అతను మళ్ళీ వచ్చాడు. ఈసారి రెనెల్డ్ నార బదులు నూలు వడుకుతోంది.

” ఏమిటి చేస్తున్నావు ? ”

” నా పెళ్ళి గౌన్ కోసం అయ్యా ”

” నీకు పెళ్ళా ఏమిటి, అయితే ? ”

” అవునయ్యా. మీరు అనుమతి ఇస్తే ”

ఆ రోజులలో ప్రజల్లో ఎవరు పెళ్ళి చేసుకోవాలన్నా జమీందారు ఒప్పుకోవలసి ఉండేది. సామాన్యంగా ఒప్పుకోకపోవటమేమీ ఉండేది కాదు.

అయితే ఈ దుర్మార్గుడు ఇలా అన్నాడు ” ఆ. ఒప్పుకుంటాలే. అదిగో, ఆ దురదగొండి పొదలు లేవూ ? వాటిపీచులోంచి బట్ట నేసి ఉంచు. నీ పెళ్ళి గౌన్ కీ, నేను చచ్చిపోయినప్పుడు కప్పే గుడ్డకీ- రెంటికీ సరిపోవాలి అది . ఎందుకంటే నన్ను పాతిపెట్టే రోజునే నీకు పెళ్ళి ! ” చెప్పేసి వికటంగా నవ్వుతూ వెళ్ళిపోయాడు జమీందారు.

రెనెల్డ్ వణికిపోయింది. దురదగొండి పీచునుంచి దారం తీయటం కనీ వినీ ఎరగని సంగతి. ఇక బట్టని నేయటమా ? అసలు చేతులకి తగిలితేనే దురదా మంటా పెడతాయి కదా.

పైగా జమీందారుకి నడివయసు దాటలేదు. మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. అతను పోయాక తన పెళ్ళి ఏమిటి- ఆమె ఇంక ఆలోచించలేక పోయింది.

ప్రతిసాయంత్రమూ గిల్బర్ట్ వాళ్ళింటికి వస్తుండేవాడు. ఆరోజు అతనికి జరిగినదంతా రెనెల్డ్ చెప్పింది. అతనికి చాలా కోపం వచ్చింది – ” ఈ గొడ్డలి తో వాడి బుర్ర బద్దలు కొడితే శని  వదిలిపోతుంది ” అన్నాడు.

రెనెల్డ్ వద్దంది. శుభమా అని పెళ్ళి చేసుకోబోయేముందు- ఎవర్నైనా సరే, చంపటం మంచిది కాదంది. జమీందారిణి తమ పట్ల చాలా దయగా ఉండటాన్ని గుర్తు చేసి ఆమె భర్తని చంపటం ధర్మం కాదని చెప్పింది.

ప్రయత్నించి చూద్దామనుకుని మర్నాడు ఆ పొదల నుంచి పీచుని లాగి వడికింది. ఆశ్చర్యకరంగా ఏ దురదా పెట్టకపోగా మెత్తగా తేలికగా బలంగా ఉన్న దారం తీయటం వీలయింది. త్వరలోనే తన పెళ్ళి గౌన్ కోసం బట్టని నేసి కుట్టేయగలిగింది. అయితే జమీందారు తన శవం మీద కప్పే బట్ట అన్నాడు కదా, దాన్ని మాత్రం నేయటం మొదలుపెట్టలేదు. అందుకు ఆమెకి మనసు రాలేదు. ఎలాగో తన గౌన్ ని తయారుచేయగలిగింది కనుక జమీందారు ఆ రెండో బట్ట సంగతి ఎత్తడులే అని ఆశ పడింది.

జమీందారు వచ్చాడు. తెల్లగా మృదువుగా ఉన్న పెళ్ళి గౌన్ ని చూపించింది.

అతనువెలవెలబోయాడు . ” సరేలే. రెండోది కూడా కానీ మరి ” కరుగ్గా అని వెళ్ళిపోయాడు. ఆమె నేయటం మొదలు పెట్టింది. జమీందారు కోటకి వెళ్ళేలోపే అతనికి నలతగా అనిపించింది. కాసేపటికి జ్వరం తగిలింది. అన్నం తినలేకపోయాడు, నిద్రపట్టలేదు. మరుసటిరోజు పక్కమీదినుంచి లేవలేకపోయాడు. ఆ జబ్బు తగ్గేటట్లుగా అనిపించలేదు. ఇదంతా రెనెల్డ్ నేస్తున్న బట్ట వల్లనేనని అతనికి అర్థమైంది. దాన్ని వాడాలంటే చనిపోవాలి కదా.

వెంటనే ఆ నేయటాన్ని మానేయమని ఆమెకి కబురు చేశాడు. రెనెల్డ్ మానేసింది, ఆ పని ఆమెకే ఇష్టం లేదు.

ఆ సాయంత్రం గిల్బర్ట్ వచ్చాడు. ” జమీందారు మన పెళ్ళికి అనుమతి ఇచ్చాడా మరి ? ” అడిగాడు. ” లేదు ” రెనెల్డ్ చెప్పింది. ” అయితే నేయటం మానేయకు. ఇంక వేరే ఎలాగూ అతను ఒప్పుకునేటట్లు లేడు ” గిల్బర్ట్ అన్నాడు.

సరే, ఆ తర్వాతి రోజు మళ్ళీ ఆమె మగ్గం ముందు కూర్చుంది. రెండు గంటలు గడిచేలోపు జమీందారు సైనికులు వచ్చి ఆమె చేతులూ కాళ్ళూ కట్టేసి నది లోకి విసిరేసి ఆమె మునిగిపోవటం చూసి వెళ్ళిపోయారు. వర్షాలు పడి నది పొంగిపొర్లుతూ ఉంది. రెనెల్డ్ కి ఈత రాదు. కాని ఆమె నీళ్ళ మీద తేలింది, ఒడ్డుకీ చేరింది.

ఆ వెంటనె ఆమె ఇంటికి వెళ్ళి నేయటం మొదలుపెట్టింది. ఈసారి సైనికులు ఆమె మెడకొక బండరాయికట్టి మరీ నదిలోకి విసిరారు. వాళ్ళు అటు తిరగగానే ఆ రాయి ఊడిపోయింది, మళ్ళీ ఆమె తప్పించుకుంది. నేస్తూనే ఉంది. జమీందారు జబ్బు ఎక్కువైంది. తుపాకీ తో కాల్చాడు, ఆమెకి గుండు తగల్లేదు. మగ్గాన్ని విరగగొట్టారు, దానంతట అదే బాగయింది. చెరలో పెట్టారు, ఆమె ముందు మగ్గమూ దారమూ ప్రత్యక్షమయాయి. చేతులు కట్టేస్తే వెంటనే విడిపోతున్నాయి. ఆమెని చంపేసే ప్రతి ప్రయత్నమూ విఫలమైంది. ఇంక చేసేది లేక జమీందారు చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

wassilij-maximowitsch-maximow-kranker-mann-06299

 

భర్త పరిస్థితి చూసి జమీందారిణి దిగులుపడింది. జబ్బుకి కారణం తెలుసుకుని అతనికి మంచిమాటలు చెప్పింది. అప్పటికి కూడా వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోవాలని అతనికి అనిపించలేదు. అంత అహంకారం. అప్పుడు అతనికి తెలియకుండా ఆమె రెనెల్డ్ దగ్గరికి వెళ్ళి ఇంక ఆ బట్టని నేయవద్దని వేడుకుంది. అంత పెద్దావిడ వచ్చి అడిగేసరికి రెనెల్డ్ కాదనలేకపోయింది, అలాగేనని మాట ఇచ్చింది.

ఆమె నేయకపోవటం గిల్బర్ట్ గమనించాడు – ” అయితే మన పెళ్ళికి అనుమతి వచ్చిందా ? ” అడిగాడు. ” లేదు ”

” మరి ? ”

” అమ్మగారికి మాట ఇచ్చాను, మానేస్తానని ”

‘’ అతను చచ్చిపోతే మనకేమిటి ? ”

” అయ్యో, అమ్మగారు ఏమనుకుంటారు ! కొన్ని రోజులు వేచి ఉందాం. అతని మనసు కరుగుతుందేమో ” రెనెల్డ్ అంది.

వాళ్ళు రోజులూ వారాలూ నెలలూ ఎదురు చూశారు. జమీందారు రెనెల్డ్ ని వేధించటం మానుకున్నాడు గానీ పెళ్ళికి అనుమతి ఇవ్వనేలేదు. రెనెల్డ్ మళ్ళీ నేయటం మొదలుపెట్టలేదు. గిల్బర్ట్ కి చిరాకు, కోపం వచ్చాయి. ” ఇంక చాలు ” అన్నాడు. ” ఇంకొద్ది రోజులు చూద్దాం ” అంది ఆమె. గిల్బర్ట్ కి విసుగు పుట్టింది, రావటం మానేశాడు. రెనెల్డ్ చాలా ఏడ్చింది, కాని మళ్ళీ ఆ బట్టని నేయలేదు.

ఒకరోజు జమీందారు ఆమెకి ఎదురు పడ్డాడు. ఇప్పుడతని ఆరోగ్యం బావుంది.

ఆమె చేతులు జోడించి అడిగింది- ” అయ్యా, దయ చూపండి ” అని. అతను తల తిప్పేసుకుని వెళ్ళిపోయాడు. అప్పటికీ ఆమె ఇచ్చినమాట నిలబెట్టుకోవాలనే అనుకుంది. గిల్బర్ట్ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆమెకి చెప్పనైనాలేదు. ఆమె కుమిలిపోయింది.

ఇంకొక ఏడాది గడిచింది. జమీందారు మళ్ళీ జబ్బు పడ్డాడు. జమీందారిణి రెనెల్డ్ ఇంటికి వెళ్ళి చూసింది, కాని ఆమె నేయటం లేదు. ఈసారి జబ్బుకి కారణం ఆమె కాదు.

రోజులు గడుస్తున్నాయి. ఆ జబ్బు ఇక కుదిరేది కాదని వైద్యులు చెప్పేశారు. విపరీతమైన బాధగా ఉండేది. మృత్యువు వస్తే బావుండునని జమీందారు అనుకున్నాడు. కాని అతను చనిపోలేదు. ఎంతకాలం గడిచినా అతని స్థితిలో మార్పు రాలేదు. బతకనూ లేడు, చావనూ లేడు.

అప్పటికి తెలిసివచ్చింది అతనికి. తన మీద కప్పబోయే బట్టని రెనెల్డ్ నేసి ఇస్తేనేగాని తను చనిపోలేడు. ఇదీ ఆమె చేతిలోనే ఉంది. పిలిపించాడు. ఆమె వచ్చి మంచం పక్కన నిలుచుంది. మళ్ళీ నేత మొదలుపెట్టమని అజ్ఞాపించాడు. ఆమె జమీందారిణి వైపు చూసి తలదించుకుంది. జమీందారిణి భర్తతో అంది – ” అంతకన్న వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుని చూడకూడదా ? ” అతనికి మొదట నచ్చలేదు. చావనైనా చావాలిగానీ తన నోటితో తను ఆమె పెళ్ళికి ఒప్పుకోకూడదని అతని పట్టుదల. భార్య పదే పదే బ్రతిమాలింది. ఆమెని తను ఏనాడూ సంతోషంగా ఉంచలేదు కదా అని అతనికి స్ఫురించింది. చేతిసైగ తో సరేనన్నాడు . రోజు రోజుకీ అతని శరీరం తేలికవుతూ వచ్చింది. రాయిలాంటి మనసు మారింది. పశ్చాత్తాపం వచ్చింది. ఆమెని క్షమించమని అడిగాడు. రెనెల్డ్ గడిచినదేదీ మనసులో పెట్టుకోకుండా అతన్ని క్షమించింది. ఆ ఊర్లో వాళ్ళంతా రెనెల్డ్ కి చాలా మహిమ ఉందని అనుకున్నారు. రెనెల్డ్ మాత్రం ఆకాశం వైపు తిరిగి దణ్ణం పెట్టింది. దేవుడిచ్చిన అవకాశాన్ని అందుకుని జమీందారు ఉత్తముడుగా మారాడు.

గిల్బర్ట్ ఆమెని మరిచిపోలేదు. ఆమె మీద అతనికి ప్రేమ పోలేదు. జమీందారు   తమ పెళ్ళికి ఒప్పుకున్న సంగతి తెలియకుండానే , వారం గడిచేసరికి తిరిగి వచ్చాడు. మొదటినుంచీ , మొత్తం రెండేళ్ళు పూర్తయాక అప్పుడు వాళ్ళకి పెళ్ళి జరిగింది. వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా బ్రతికారు .

Flemish_Wedding_17th_century

  • ఫ్లెమిష్ జానపద కథ
  • సేకరణ- Charles Deulin, Andrew Lang

 

 

కిటికీ బయటి ఆకాశం – వెన్నెలలోని వికాసం

veeralakshmi (2)వాడ్రేవు వీరలక్ష్మి గారు బహుముఖ ప్రజ్ఞావంతులు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేసిన ప్రతిభాశాలి. ప్రకృతిని, సంగీతాన్నీ ప్రేమించే భావుకురాలు. అంతేకాదు లలిత గీతాల్ని మధురంగా పాడతారు. ఒక అధ్యాపకురాలిగా రెండు తరాల విద్యార్ధుల్ని ప్రభావితం చేసిన చక్కటి ఉపన్యాసకురాలు.

ఇప్పటికే వీరలక్ష్మిగారి కధలు ఉత్సవ సౌరభం, కొండ ఫలం అనే రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. వెల్లువ అనే నవల రాసారు. పత్రికల్లో ఆవిడ రాసిన కాలమ్స్‌ ఆకులో ఆకునై, మా ఊర్లో కురిసిన వాన గా వెలువడ్డాయి. ఆవిడ రాసిన సాహిత్యానుభవం వ్యాస సంకలనం, సత్యాన్వేషి చలం పరిశోధనా గ్రంథం అనేక ప్రశంసలనీ, పురస్కారాలని అందుకున్నాయి. భారతీయ నవలల్లోని ఉత్తమ నవలల్ని వరుసగా పరిచయం చేస్తూ ఒక కాలమ్‌ని ఆవిడ నిర్వహించారు.

ఇటీవల ఆవిష్కరించిన ‘‘ కిటికీ బయటి వెన్నెల’’ ఆవిడ మూడో కధా సంకలనం. వీరలక్ష్మి గారు ఈ కధా సంకలనం గురించి సభలో మాట్లాడ మన్నప్పుడు ఇష్టంగా ఒప్పుకున్నాను. ఆవిడ రచనల్లోని భావుకత, మెరుపు మెరిసినట్టు తటాలున చమక్కుమనే జీవిత సత్యాలు బావుంటాయి నాకు. నదీ మూలాలు ఎప్పుడూ ఒక సన్నటి జలధారగా ప్రారంభమయి క్రమంగా విస్తరించి, అనంత జలరాశి అయి నిత్యం ప్రవహిస్తాయి. చాలా కాలం క్రితం ఒక సారి ప్రళయకావేరి నది నుండి మొదలై, దాని మూలాల్ని వెతుక్కుంటూ వెళ్ళి చూసినప్పుడు, నా కెందుకో విచిత్ర భావన కలిగింది. మనిషి జీవితం కూడా అట్లాంటిదే కదా! మూలాల్ని గుర్తుంచుకుని, నడిచి వచ్చిన దారుల్ని, నిలబడ్డ నేలనీ మరిచిపోకుండా విస్తరించటం తెలియాలి. వీరలక్ష్మి గారి రచనల్ని చదివినప్పుడు, ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ కూడా అలాంటి వారేనేమో అనిపించింది. తన బాల్యం గడిచిన ఆదివాసీ పల్లెల పచ్చదనాన్నీ, ప్రేమల్నీ, సంఘర్షణలను, జీవన కాంక్షల్నీ, తనలో నింపుకుంటూ, రకరకాల అస్ధిత్వ వేదనల్నీ, మారుతున్న ప్రపంచం పోకడల్నీ, విలువల్నీ, మానవ సంబంధాల్నీ అర్ధం చేసుకుంటూ, తన సాహితీ ప్రస్ధానాన్ని కొనసాగిస్తున్న ప్రవహిస్తున్న, నిత్య నూతన నదిలాంటి వారు ఆమె.

వీరలక్ష్మి గారి కధల గురించి మాట్లాడు కోవడమంటే, మన రోజువారీ జీవితాల్లో, నిత్యం తారసపడే అనేకానేక మంది మనుష్యుల గురించి మాట్లాడుకోవడమే. మానవత్వం, దయ, మనుష్యుల పట్ల అపారమైన ప్రేమ వున్న, సరళంగా, సూటిగా, గుండె నిబ్బరంతో బతికే మనుష్యుల గురించి మాట్లాడు కోవడమే. మనలో వుండే ఉక్రోషాలు, కోపాలు, నిస్సహాయతలు, నిర్భీతులు, లెక్కలేని తెంపరితనాలు, ఈర్ష్య, అసూయలు, ఆనందాల గురించి మాట్లాడు కోవడమే. ఎదురు దెబ్బలు తగిలినా, పడితేచే కెరటాల్లా, జీవితంపైన గొప్ప ఆశతో, కాంక్షతో ఎలా బతకొచ్చో తెలుసుకోవడమే. ఇవి సహజ కధలు.

kitike-196x300

మంచికో చెడుకో రచనలకి ప్రేరణ మనిషి జీవితం. మనిషి లోపల, బయటా జరిగే విధ్వంసం, అందుకుగల కారణాలను అన్వేషించేపని సాహిత్యం చేస్తుంది. జీవితాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు అతి సాధారణమైన మనుష్యులు పడే పెనుగులాటలు, ప్రయత్నాలు, సమాజపు అంచులకు నెట్టి వేయబడ్డ వివిధ సమూహాలు ఎదుర్కొంటున్న వివక్షత, హింస, అణిచివేతలు, జీవితంలోని అస్థవ్యస్థలు, ఆశ నిరాశలు, కలలు ఈ నేపధ్యమంతా, కధలుగా, కవిత్వంగా రూపుదిద్దుకుంటాయి. వీరలక్ష్మి గారి కొత్త కధల సంకలనం కిటికీ బయటి వెన్నెలలోనూ, మనిషి తాలూకు వేదనలు, కలలు, ఆశలు వున్నాయి. ఆవిడ కధలన్నీ స్త్రీలను కేంద్రంగా చేసుకొని, బహుముఖ రూపాల్లో పితృస్వామ్యం ఎలా ఆపరేట్‌ అవుతుందో చెబుతాయి. జీవితాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా జీవించగలిగితే మనిషి జీవితం మరింత సరళంగా, మానవీయంగా వుంటుందో చెబుతాయి. ఈ కధల్లోని పాత్రలు గొప్ప జీవకాంక్షతో, భవిష్యత్తు పట్ల చెదరని విశ్వాసంతో మనల్ని పలకరిస్తాయి.

పునరుద్ధానం కధలో ఆదిలక్ష్మి, ఈ విషాదానికి ఈ తేనె చాలులో వింధ్య, అనురాధ, తన్మయిలో సంగీతాన్ని ప్రేమించే తాయారు, భువన, తన్మయి, బరువు భారాల్లో రాజ్యం, ఆరాత్రిలో విశాల, రజని .. ఇటాంటి వాళ్ళంతా, తమ జీవితాల్లో ఎదురైన సవాళ్ళను ఎంతో నిబ్బరంగా, ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొంటారు. ఏ హంగులు, ఆర్భాటాలు, తీర్పులు, బోధలు లేకుండా తాము నిజమని, మంచి అని నమ్మిన పద్దతుల్లో జీవించిన, జీవితాల్ని తిరిగి నిర్మించుకునేందుకు ప్రయత్నించిన స్త్రీలు వీళ్ళు.

పునరుద్ధానం కధలో వ్యసనపరుడై ఆస్తులన్నింటినీ పోగొట్టడమే కాకుండా, నిత్యం హింసించే భర్తని, తన ముగ్గురు పిల్లల్ని , పేదరికాన్ని భరిస్తూ కూడా తన ఇంటి చుట్టూ, పచ్చటి మొక్కల్ని పెంచుకుటుంది ఆదిలక్ష్మి. ఇంటి అరుగులపై ముగ్న్గులేస్తుంది. తనలోని చిరునవ్వుని, ఉత్సాహాన్ని ఎన్నడూ కోల్పోకుండా, జీవితంలో తనకెదురైన ప్రతికూలతలను ఎదుర్కొంటుంది. పిల్లల్ని పెంపకానికిచ్చి, పొట్టచేత బట్టుకుని వలస పోయిన ఆదిలక్ష్మి తిరిగి తన ఊరికి తిరిగి వచ్చి, గొప్ప ఆశతో జీవితాన్ని ప్రారంభిస్తుంది.

‘‘ బతుకు బరువైనప్పుడల్లా, ఎవరో ఒక ఆదిలక్ష్మి శిధిలాలలోనుంచి, కొత్త జీవితాన్ని నిర్మించుకుంటూ, దారిచూపుతూనే వుంటుందన్న’’ ఆశావాహ దృక్పధంతో ఈ కధని ముగిస్తారు వీరలక్ష్మి.

బరువు భారాలు కధలో రాజ్యంలా కాలాన్ని అదుపు చేయగల విద్యని ఎవరైనా మనకి నేర్పితే బావుండనిపిస్తుంది. వారసత్వంగా తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళ ఆస్తుల్నే కాదు,జ్నాపకాల్ని కూడా మిగిల్చి వెడతారు. అలా పెద్దవాళ్ళు వదిలి వెళ్ళిన ఆ పాత వస్తువుల చుట్టూ అనేక జ్నాపకాలున్నా, మళ్ళీ ఎవరికి వారు కొత్త వస్తువుల్ని పోగుచేసుకుంటూ, వాటి చుట్టూ తమవైన జ్నాపకాల్ని అల్లుకుంటూ వుంటారు. ఈ పరంపర అలా కొనపాగుతూనే వుంటుంది. ఒక తరం నుండి మరో తరానికి వచ్చే సరికి ఆ ఆస్తులు, వస్తువులతో వున్న అనుబంధం సహజంగా తగ్గిపోతూ వుంటుంది. ఉతికి మడత పెట్టడానికి ఎదురు చూస్తున్న చీరెల్ని, ఇంట్లో ఎక్కడి వస్తువుల్ని ఎక్కడిక్కడే అర్ధాంతరంగా వదిలేసి సీతమ్మ జీవితం నుండి శాశ్వితంగా నిష్క్రమిస్తుంది. అట్లా వదిలేసిన ఆ ఇంటిని వీరలక్ష్మి వర్ణించిన తీరు మనల్ని చాలా కలవర పరుస్తుంది. ‘‘ రాజ్యం అంటే ఎవరు, ఒక వ్యక్తని ఎందు కనుకుంటున్నావ్‌. పోగు చేయటం నుండి పంచి పెట్టడం దాకా చేసే ప్రయాణానికి తను ఒక రోల్‌ మోడల్‌’’ అన్న గొప్ప తాత్విక సత్యాన్ని చెబుతారు రచయిత్రి. నిజానికి మనుష్యులకి పోగేసుకోవడం అలవాటైనంతగా పంచి పెట్టడం అలవాటు కాలేదు. అది అలవాటైతే పోగేసుకునే కాంక్ష మెల్లిగా కనుమరుగవుతుందన్న ఆశ కలుగుతుంది.

కిటికీ బయటి వెన్నెల కధలో మనం వుండే ఇరుకు గదుల అపార్ట్‌మెంట్‌లలోనూ, ఆకాశాన్ని, పచ్చటి చెట్లనీ, పక్షుల్నీ, కనపడటమే తప్పా వినపడని మనుష్యుల్నీ గమనిస్తూ, మనలో ఒక భాగం చేసుకుంటూ ఎలా ఉత్సాహంగా జీవించవచ్చో రాసారు. ఈ కధలోని నేను పక్కింటి వాళ్ళని ఆమె చూస్తూ వుంటుందన్న విషయాన్ని గమనించారని పనిమనిషి చెప్పాక కూడా ఆమె తన పడక గది కిటికీని మూసేయాలనుకోదు. చుట్టూ వున్న ప్రకృతిలానే ఆ తెలియని మనుష్యులు ఆమె రోజువారీ జీవితంలో భాగమైపోయారు.

‘‘ ఈ మనుష్యుల గురించి నాకు ఎంత తక్కువ తెలిస్తే, అంత మంచిది. ఎందుకంటే, వాళ్ళు నాకు కావాలి గనుక.’’ అనుకుంటుందామె. ఈ తూర్పు వేపు నిమ్మచెట్టులాగే, ఉత్తర దిక్కునున్న వేపచెట్టు గలగలలోంచి కదిలే ఆకాశపు నీలిమల్లాగే వాళ్లూనూ అని ఆ అపరిచిత మనుష్యుల గురించి అనుకుంటుంది. వాళ్ళని వాళ్ళలాగే ఇప్టపడగల సంస్కారం ఆమెది.

తన్మయి కధలో పాట తనకు తెలియకుండానే తన ఊపిరిలోకి వచ్చేసిన, కడుపు నిండా పాటల్ని దాచుకున్న తాయారు బడిలో, వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాటల్ని పాడేది. అలాంటి తాయారుకి బావతో పెళ్ళయ్యాక ఇంటి పనులు, పిల్లలు, కుటుంబ బరువు బాధ్యతలు, పెద్దవాళ్ళ ధాష్టికాల మధ్య గొంతు దాటి వచ్చేందుకే భయపడిన పాట అమె అంతరంగం లోని పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుంది. పాడమని అడిగే వాళ్ళు లేక, అవకాశంలేక మూగవోయిన ఆమె గొంతు అనేక ఏళ్ళు గడిచాక, చివరికి మేనకోడలు భువన పాడమని అడిగినప్పుడు పలుకుతుంది. విశాఖ సముద్రం ఎదుట నిలబడి ఆమె పాటపాడినప్పుడు, ‘‘ చిన్నప్పుడు పిల్లల కోసం పాలు చేపుకు వచ్చిన అనుభవం లాంటి అనుభవం ’’ కలుగుతుంది తాయారుకు. అమెకి తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు, కంఠం లోంచి పాట కూడా బయటకు ప్రవహిస్తాయి. తాయారు తరువాతి తరానికి చెందిన భువన తన కెంతో ఇష్టమైన సంగీతాన్ని తనలో నిలుపుకున క్రమంలో, భర్త నుండి సహాయనిరాకరణను, కుటుంబంలో అశాంతిని భరించాల్సి వస్తుంది. తాయారు, భువన పొందలేని, స్వేచ్ఛని, గాయినిగా పేరు ప్రఖ్యాత్తులను ఆ తదుపరి తరానికి చెందిన తాయారు మనవరాలు తన్మయి తన జీవితపు తొలి యవ్వన కాలంలోనే సాధిస్తుంది. స్త్రీల స్వరాలను, స్వప్నాలను బంధించే పురుషాధిపత్యం, కుటుంబంలో కనబడని హింస ఎలా వుంటాయో ఎంతో ఆర్ధ్రంగా చెబుతుంది తన్మయి కధ.

ధైర్యంగా, ఆదర్శవంతంగా జీవించే ఆడవాళ్ళు కూడా ఒక్కో సారి జీవితంలో ఆకస్మికంగా ఎదురయ్యే కష్టాలకి కుంగి పోయి, బాబాలు, స్వాములవార్ల మూఢత్వంలోకి ఎలా పడతారో, చెబుతుంది ఈ విషానికి ఈ తేనె చాలు కధ. భర్తను కోల్పోయి, ఆ దు:ఖం నుండి బయట పడేందుకు, స్వాంతనను పొందేందుకు వింధ్య చేసిన ప్రయత్నంలో అది దొరక్క పోగా, అక్కడా హిందుత్వ మనుధర్మం ఆమె స్థితిని అవమాన పరచటంతో చివరికి మేల్కొని బయట పడుతుంది వింధ్య.

నీడ కధలో   కష్టాల్లో వున్న స్త్రీలని ఆదుకునేందుకు చేసే ప్రయత్నాలు చిత్తశుద్దితో ఉండాలని, ఒకరికి సహాయం చేయాలనుకున్నప్పుడు ఎమోషనల్‌గా, హృదయంతో చేయాలి తప్పా, అన్నింటికీ లాజిక్‌ను అప్లయ్‌ చేయాలనుకుంటే సాధ్యం కాదని, నలుగురు కలిస్తేనే అది సాధ్యమవుతుందని చెపుతుంది.

ఆ రాత్రి కధలో ఒక మారు రాత్రి దాడికి గురైన విశాలని ఆమె తల్లి ‘‘ లోకపు ముళ్ళు గుచ్చుకున్నా, గాయాల పాలవకుండా ’’ కాపాడుకో గలిగింది. భర్త ప్రవర్తన వల్ల కలిగిన గాయాలు విశాల తల్లికి లోకజ్నానాన్నిచ్చాయి. పెద్దగా చదువుకోని ఆ తల్లి, కాస్త చదువుకున్న విశాల సామాజిక దౌష్ట్యం కిందపడి నలిగి పోకుండా తమని తాము కాపాడుకోగలిగారు. నగరాల్లో, ఆధునికంగా జీవిస్తున్నామనుకునే ఆడపిల్లలూ మగ్నవాళ్ళ అసభ్యప్రవర్తననీ, దౌర్జన్యాన్నీ ఎదుర్కోక తప్పటంలేదు. వ్యవస్థ విఫలమైన చోట ఎవరి రక్షణని వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది అంటూనే స్వేచ్ఛతో పాటూ విచక్షణ లేక పోవడం పట్ల ఆందోళన పడుతుంది రజని. గీతల్ని చెరుపుకోవచ్చు కధ ప్రాంతాల మధ్య, మనుష్యుల మధ్య వుండే సంబంధాల గురించి చెబుతుంది. తెలియనప్పుడు, అర్ధం కానప్పుడు అపార్ధాలు మిగులుతాయి. కానీ ఒక సమయమొస్తే అందరూ మనుష్యులుగా మారతారు. అపార్దాలు కరుగుతాయి. విభజన రేఖలు, సరిహద్దులూ, దూరాలూ ఉంటాయి. కానీ జీవితం అప్పుడప్పుడూ వాటిని చెరిపేసి మనుష్యుల్ని కలిపే సందర్భాలను కూడా పట్టుకొస్తుంది. వ్యక్తులకీ, ప్రాంతాలకి కూడా వర్తించే మంచి కధ ఇది.

మెత్తంమీద ఈ సంకలనంలోని కధలు క్లుప్తంగా, సరళంగా, సూటిగా వున్నాయి. వీరలక్ష్మిగారు భావుకురాలు కాబట్టి కధనానికి అడ్డుపడని కవిత్వపు జల్లులు చాలా చోట్ల కనిపిస్తాయి.

‘‘ఇల్లంటే మనకి స్థిమితాన్నీ, శాంతిని, ఇవ్వవలసిన చోటు. అది దొరక్కపోతే, ఆ ఇంటి గురించి ఆలోచించటం అనవసరం. అదసలు ఇల్లేకాదు’’ ‘‘ సౌకర్యాలు, సుఖాల ముందు జ్నాపకాలేపాటివి’’

(పునరుద్ధానం). ‘‘ నీ గురించి మితంగానూ, ప్రపంచ క్షేమం గురించి అతిగానూ ఆలోచించక పోతే, ఎందుకిలాంటి గేదరింగ్స్‌’’ (నీడ) వంటి జీవిత సత్యాలను ఈ కధల్లో చాలా అలవోకగా చెబుతుంది ఆవిడ.

కుటుంబరావు రచనల గురించి కాళీపట్న రామారావు మాష్టారు చెప్పిన మాటలు వీరక్ష్మిగారి కధలకు కూడా వర్తిస్తాయనిపించింది నాకు.

‘‘ భాషేకాక, ఆ కధ కట్టే తీరు కూడా చాలా సరళంగా, వుండేది. వాటిలోని పాత్రలు, ఆ పాత్రల తాలూకు సమస్యలు, వాటిని వారు ఎదుర్కొనే తీరు, అన్నీ నేనెరిగిన మనుష్యులకూ, జీవితాలకూ, చాలా దగ్గరగా కనిపించేవి. కధ మధ్య వారు చేసే వ్యాఖ్యలు నా అవగాహనకు చాలా అవసరంగా వుండేవి. చివరికి కధ ముగించే సరికి, నా అనుభవమో, జ్నానమో, లేక రెండూనో, ఎంతో కొంత మేరకి పెరిగినట్లుండేవి’’

వీరలక్ష్మిగారి కధల్ని చదువుతున్నప్పుడు మనకి సరిగ్గా అలానే అనిపిస్తుంది. అంచేత ఈ కధలు కాలానికి నిలుస్తాయి. ఆవిడ జీవితపు దృక్పధం మనుష్యులు సుఖంగా, మంచిగా, ప్రకృతికి దగ్గరగా, నిరాడంబరంగా, ఆత్మ గౌరవంతో జీవించాలని. మానవ సంబంధాల్లో వున్న సకల అమానవీయతలూ పోవాలనీ, మంచి సమాజం రావాలనీ. ఏ సమాజంలోనైనా జరగాల్సింది ఇదే. వీరలక్ష్మి గారి కిటికీ బయటి వెన్నెల కధల పుస్తకం అందరూ చదవాల్సిన పుస్తకం. ఆవిడ మరిన్ని మంచి కధలు రాయాలనీ, ఆమె మాత్రమే చేయాల్సిన, అసంపూర్ణం గా మిగిలిపోయిన రచనలను ఆమె పూర్తిచేసేందుకు పూనుకోవాలనే చిన వీరభద్రుడు ఆకాంక్ష , అవిడని అభిమానించే పాఠకులందరిదీనని ఆవిడ గుర్తిస్తారని ఆశిద్దాం.

-ఎం. విమల

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

గీతాంజలి

Kadha-Saranga-2-300x268
రమ్యా, రమ్యా” అని ఎవరో గెట్టి గెట్టిగా లోయలోనుండీ అరుస్తున్నారు.
 ఆ సమయంలో ఓ పర్వత శిఖరపు అంచులో ఉన్నాను నేను. ఎవరబ్బా నా పేరు పిలుస్తున్నారు అని లోయలోకి తొంగి చూస్తే  అక్కడ మా నానమ్మ ఉంది. అరుపులు గెట్టి గెట్టి గా వినిపిస్తున్నాయ్…వులిక్కిపడి కళ్ళు తెరిచాను, ఎదురుగా నన్ను నిద్రలేపుతూ మా నానమ్మ.  “ఎంత సేపమ్మా పడుకునేది, సమయం 12 కావొస్తోంది. ఆదివారం కాబట్టి సరిపోయింది…కాలేజి ఉన్నప్పుడు కుడా ఇంతే నా నువ్వు” అని అడిగింది.
నేను విసుక్కుంటూ  “నీకు తెలీయదు లే నానమ్మా, కాలేజి ఉన్నప్పుడు అయితే క్లాస్ లు ఉంటాయ్ అని ఎప్పుడో లేచేసే దాన్ని. హాలిడేస్ కద అని ఇలా ఉన్నాలే” అన్నాను.  హాలిడేస్ కి మదనపల్లి లో ని మా నానమ్మా వాల్ల ఇంటికి వొచ్చాను.  ఇప్పటికే ఇక్కడికి వొచ్చి ఒక వారం అవుతోంది. ఇన్ని రోజుల్లో ఒక్క సారి కుడా వూరిలోకి పోలేదు. కాని రోజు సాయంత్రం మాత్రం సైకిల్ తొక్కుతూ అలా రోడ్డు మీద  కొండలవైపు వెల్లటం నాకు అలవాటు. కాని ఇంకొక రెండు రోజుల్లో తిరిగి నెల్లూర్ వెల్లిపోవాలి, కాలెజ్ కి, అదే కొంచం బాధ. సగం నిద్ర ని మోసుకుంటూ కష్టపడి రూం బయటకి వొచ్చాను.  లేచిలేవ గానే టివీ చూద్దాం అని కూర్చుంటే డిష్ రావట్లేదు. “నానమ్మా, టివి రావట్లేదూ?” అని అడిగాను. “డిష్ వైర్ కి ఏదో అయ్యిందట రాత్రి వర్షం వల్ల, ఈ రోజంతా టివీ రాదు” అనింది. ఏం చేయాలో అర్థం కాలేదు ఆరోజంతా నాకు.
 ఇల్లంతా సద్దుతూ, ఏదో తెలియని దానికోసం వెతుకుతూ, సైకిల్ తొక్కటానికి సాయంత్రం కోసం ఎదురు చూస్తూ, గడిపాను.  అలా సద్దుతూ ఉన్నప్పుడు నాకు మా తాతయ్యవి పాత పుస్తకాలు కనిపించాయి. ఆ పుస్తకాలన్ని ఒకొక్కటిగా తీస్తూ ఉంటే మధ్యలో టాగూర్ “గీతాంజలి” కనిపించింది.  గీతాంజలి గురించి తెక్స్ట్ బుక్కులలో చదవటమే కాని నేను ముందెప్పుడూ చదవలేదు. ఎలాగో ఖాలీగా ఉన్నాను కద, ఇది అయినా చదువుదాం అని చదవటం మొదలు పెట్టాను. అంతకు ముందెప్పుడూ కవిత్వం చదవలేదు నేను.దాన్ని చదువుతుంటే మాత్రం చదువుతూ అలాగే ఉండిపోయాను. సమయం గురించి ఆలోచించలేదు. మన అందరికీ అంతుచిక్కనిదేదో ఉంది ఆ కవిత్వంలో. ఏదో మాంత్రికత ఉంది. సంగీతం వింటున్నప్పుడు మనసు ఎలా తేలికవుతుందో అలా అయిపోయింది.  సమయపు ప్రవాహంలో జీవితం గడ్డ కట్టినట్టు అనిపించింది. కొద్ది సేపు  ఆ కవిత్వపు గాలులలో నేనొక ఈక నయిపోయానా అనిపించింది.  చుట్టూ చూసాను – ప్రపంచాన్ని  కొత్తగా స్పర్షిస్తున్న అనుభూతి కలుగుతోంది.  నా లోపలి ఒకొక్క పొరని పక్కకు తీసుకుంటూ నా అంతర్లోకాల కీకారణ్యంలోకి ప్రయాణిస్తున్నట్టు అనిపించింది.  కొంచం సాహసం గా, కొంచం మాయ గా, మధురం గా ఉంది ఆ మొత్తం అనుభవం.
అప్పటినుండి నా చుట్టూ ఉన్న ప్రపంచానికి ఏదో అయ్యింది. ప్రపంచం తనలో ఒక రహస్యాన్ని మోస్తూ నాకు చూపించకుండా దాపెడ్తోందేమో అనిపిస్తోంది.  నా మనసు కుదురుగా లేదు. ఇప్పటివరకు ఎప్పుడూ టెక్స్టు బుక్కులు చదవటమే  కాని కవిత్వం చదవని నాకు ఇదేదో వింతగా ఉంది.  ఏమయింది? ఏంటి ఇది? ఎవరు చదివినా ఇలానే ఉంటుందా? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలలో తడిచిపోయాను.
సాయంత్రం 5 కాగానే   నాపాత సైకిల్ వేస్కొని అలా ఆలోచనల రోడ్డు మీదకు వొచ్చాను. రోడ్డు తిన్నగా ఆకాశానికి దారితీస్తోంది. రాత్రి పడిన వర్షం వల్ల ఇంకా నేల తడిగానే ఉంది. అక్కడక్కడ పిల్లకాలువలు ప్రవహిస్తున్నాయి. దూరంగా కొండలు టోపి పెట్టుకున్నట్టు మేఘాలు కమ్ముకున్నాయి. నేన్ సైకిల్ తొక్కుతుంటే,సైకిల్ చక్రాల చెప్పుడు, చుట్టూ ఆవరించిన నిషబ్ధం లోకి ఇంకిపోతోంది.  ఇక్కడి నిషబ్ధం బలె వింతది. సముద్రంలా అలలు అలలుగా తాకుతుంది.  హట్చు కుక్కపిల్లలా ఎక్కడికిపోయినా వెంటనే వొస్తుంది. ఈ నిషబ్ధం నిరంతరం విచ్చుకునే ప్రక్రియలో నిమఘ్నమయి ఉంటుంది. అయినా నేన్ ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను, క్రితం ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు నాకు రాలేదే, ఏమయ్యింది నాకు అనిపించింది.
నాకు చాల దాహం అనిపించింది. లక్కీ గా ఆ పరిసరాల్లోనే ఒక చిన్న అంగడి కనిపించింది. సరే అని నా సైకిల్ నిపక్కకు పెట్టి, ఆ అంగడి దెగ్గర ఒక నీల్ల పేకెట్ కొన్నాను.   ఒక అల్లరి గాలి  అక్కడ తగిలించి ఉన్న వార్తా పత్రికలను తాకి , చుట్టూ ఉన్న నిషబ్ధంలో అలజడి కలిగించింది. ఆ కాగితాలన్ని రెక్కల్లా రెపరెపా  కొట్టుకున్నాయి.  ఆ సమయంలో ఒక పత్రిక లో నుంచి టాగోర్ ఫోటో తొంగిచూసింది .  అప్పుడే  గీతాంజలి చదివి ఒక మధురమైన అనుభూతిని పొందిన నేను ఆ ఫోటొ కనిపించిన వెంటనే ఆ పేపర్ తీసుకొని చూసాను.  ఆగస్ట్ 7త్ న, అంటే ఈ రోజు, 1941 లో టాగోర్ చనిపోయాడట. ఆయన స్మారకార్థం అన్నీ బెసంట్ కళాశాలలో ని కాంఫరెన్స్ హాల్ లో ఒక చిన్న కార్యక్రమం సాయంత్రం ఏడు కి జరగబోతోంది అని ఉంది.  అది చదివిన వెంటనే అనుకున్నాను, ఎలాగైనా ఆ కార్యక్రమానికి వెల్లాలి అని.
ఇంటికి తిరిగి వెల్లిపోయి  చెక చెక రడీ అయ్యాను. నానమ్మా ఒక పక్క అరుస్తూనే ఉంది “ఏంటే ఆ తొందర?” “ఎక్కడికి వూరేగుతున్నావ్?” అని. “నేను వూరిలోపలికి వెల్లాలి, నాకు పని ఉంది” అని చెప్పాను.  “నీకు ఈ వూరిలో ఏం పని ఉంది?” అని అడిగింది నానమ్మ. ఎందుకో నిజం చెప్పాలి అనిపించలేదు. “ఫ్రెండ్ ని కలవాలి” అని చెప్పాను. “ఈ వురిలోకుడా నీకు ఫ్రెండ్స్ ఉన్నారా?” అని అడిగింది నానమ్మ, అనుమానాస్పదంగా. “ఏం ఉండకుడదా?” అని విసుక్కుంటూ ఇంటి బయటకు వొచ్చేసాను.   అన్నీ బెసంట్ కాలేజ్ మా ఇంటి నుండి ఒక మైలు దూరం వుంటుంది. సమయం ఇంకా 6:15. ఆ ప్రోగ్రాం ఏడు కి కద, అంత త్వరగా వెల్లి నేన్ ఏం చేస్తాను అనుకుని, నడుచుకుంటూ వెల్లాలి అనుకున్నాను.  చిన్న చిన్న చినుకులు పడ్తున్నాయి. ఇంకా వూరు తడిగానే ఉంది. సాయంత్రం పానిపూరి/ చాట్ బండులను జనాలు చుట్టుముట్టారు .  వుద్యోగస్తులు, పిల్లలూ ఇంటికి వెల్లే సమయం అది…రోడ్డు అంతా గందరగోలంగా ఉంది. ఎన్నో శబ్ధాల మధ్య నా మౌనం తప్పిపోయింది. ఏన్నో ఆకారాల మధ్య నా శరీరం అంతరిక్షంలో ఒంటరి నక్షత్ర శకలంలా అనిపించింది.  ఎందుకో గీతాంజలి చదవకపొయ్యుంటే బాగుండేది అనిపించింది…ఈ యాంత్రిక ప్రపంచంలో నేను ఒక యంత్రంగానే ఉంతే బాగుంటుంది. గీతాంజలి నాకు ఎందుకో నాలోని ఒంటరితనాన్ని గుర్
తుచేసింది.
అంతమంది జనాలలో, అన్ని శబ్ధాలలో అకస్మికంగా ఒకతను కనిపించాడు.  యవ్వనపు అందంతో వెలిగిపోతున్నాడు.  ముడతలు పడిన కుడ్తా, జీన్స్ పాంటు  వేస్కొని, ఒక సంచిని భుజానికి తగిలించుకొని రోడ్డు పై నడుచుకుంటూ వెల్తున్నాడు.  ఎందుకో చూసిన వెంటనే చాల ఆసక్తికరంగా అనిపించాడు ఆయన. తనంతకు తాను, తనకు మాత్రమే ప్రత్యేకమైన లోకం లోకి వెల్తున్నట్టు నడుస్తున్నాడు. నాట్యురల్ గా గాలికి చెదిరిపోయిన జుట్టూ,  ఎటువైపో చూస్తున్న చిన్న చిన్న నిశ్చలమైన, ప్రకాశవంతమైన కళ్ళు,  పెదవుల దెగ్గర దాగిపోయిన విరిసీ విరయని నవ్వూ, ఆగిపోయిన పాట, బయటపడ్డ రహస్యం అన్నీ కనిపించాయి ఆయను చూస్తుంటే. కొంచం సేపు అలానే ఆయన్ను చూస్తూ ఉండిపోయాను.  ఎందుకో ఆ సందర్భంలో నా పరిస్థితి గురించి ఆయన ఇట్టే అర్థంచేస్కోగలడు అనిపించింది. ఊరుకాని ఊరు, ఆయన ఎవరో అనామకుడు-  మనకెందుకులే ఈయన విషయాలు అనిపించికొంచం తొందరగా నడిచి ఆతన్ని దాటుకున్నాను. అలా నడుస్తూ నడుస్తూ సగం దూరం వొచ్చాక కుడా నా మనసు ఆయన్ను చూసిన తరునంలోనే ఆగిపోయింది . ఎవరతను? చుట్టూ ప్రపంచం పట్టనట్టుగా అలా వెల్లిపోతున్నాడేంటి? అని అలోచిస్తూ అలోచిస్తూ ఉంటే మధ్యలో ఒక ప్రశ్న వొచ్చింది.  నేన్ ఎందుకు ఆయన గురించి ఇంత ఆలోచిస్తున్నాను? ఎవరి గురించి అయినా ఇలా నే ఆలోచిస్తానా లేక ఆయన ఒక్కడి గురించేనా? అని. ఆ ప్రశ్నకు సమాధానం వెతకటం కంటే ఏం ఆలోచించకుండా ఉండటమే నయం అనుకుని నా ఆలోచనలను అదుపు చేసుకున్నాను.
కొంచం దూరం వొచ్చాక ఎందుకో అనుమానంవొచ్చి ఒక సారి వెనక్కి తిరిగి చూసాను. ఆయన నా వెనకాలే ఇంకా ఉన్నాడు. కాని అంతే అయోమయంగా, ప్రపంచం పట్టనట్టు నడుస్తున్నాడు. నాకు ఒక కొంచం సేపు చచ్చేంత భయం వేసింది. ఎవరు ఈయన? నన్ను ఏమైనా ఫాలో చేస్తున్నాడా అని.  వెన్నులో వొణుకు పుట్టింది. ఎందుకొచ్చిందిలే అని ఒక ఆటో మాట్లాడుకున్నాను అనీ బెసంట్ కాలేజ్ వరకు.
ఆటో లో వెల్తున్నప్పుడు ఆకాశంలో వురుములు మెరుపులు వింపించాయి. వర్షం పెద్దది అయ్యే లా ఉంది. ఆటో తీస్కొని మంచిపని చేసాను లే అనుకున్నాను.   కాలేజ్ చేరే సమయానికి 6:45 కావొస్తోంది.  కాలేజీ వాట్చ్-మేన్ ని కాంఫరెన్స్ హాల్ ఎక్కడ అని అడిగి, తిన్నగా కాంఫరెన్స్ హాల్ లో కి వెల్లి కూర్చున్నాను. లోపల ఒక యాభై మంది కూర్చోవటానికి అనుకూలంగా ఉంది. అప్పటికి ఇంకా కూర్చీలను సద్దుతున్నారు. అందరికంటే మొదట వొచ్చింది నేనే.  బయట వర్షం పెద్దది అవుతున్న శబ్ధం వినిపిస్తోంది. నిర్వాహకులు కొంచం కంగారు పడుతున్నారు. నెన్ వొచ్చిన ఒక 5 నిమిషాలకి ఇంకొక ముస్సలి ఆయన వొచ్చాడు.  అలా ఒకొక్కరుగా వస్తూ ఒక ఇరవై నిమిషాలలో మొత్తం హాల్ నిండిపోయింది.  చివర్లో వొచ్చిన వాల్లు అందరూ వర్షానికి బాగా తడిచి పోయి ముద్ద అయ్యారు. ఒక సారి అందరినీ గమనించాను.
అక్కడ ఉన్నవాల్లు అందరు వయసులో నాకంటే చాల పెద్ద వాల్లు.  ముడతలు పడిన మొహాలు, తెల్ల జుట్టూ, కంటెద్దాలు ఇవన్నీ అక్కడ వొచ్చిన వారి కనీస క్వాలిఫికషన్స్.  ఇంతలో ఒక పెద్దాయన మైక్ లో టాగోర్ ని పరిచయం చేసి ఒకొక్క వుపన్యాసకుడినీవేదిక  పైకి పిలవటం మొదలుపెత్తాడు.  వేదిక  పైన ఉన్న వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళకంటే ముసలి గా ఉన్నారు. చివర్లో ఆ రోజుటి ముఖ్య అతిథి ని పిలుస్తూ ఆయన గురించి కొంచం పరిచయం చేసాడు వుపన్యాసకుడు. పేరు తపస్ బంధోపాధ్యాయ. ఆయన శాంతినికేతన్లోని విశ్వ భారతిలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా  పని చేస్తున్నాడట.  టాగోర్ యాత్రా రచనల పైన రీసర్చ్ చేసాడట. రవీంద్రుని సంగీతం గురించి మాట్లాడటానికి ప్రపంచంలో చాలా ప్రదేశాలకు వెల్లాడట.  ఈయన పరిచయం బట్టి కచ్చితంగా ఈయనకు వాకింగ్ స్టిక్ ఉంటుంది అనుకున్నా…చూస్తే రోడ్డు మీద  నన్ను వెంబడించిన ఆ యువకుడే ఈ వ్యక్తి.
untitled

painting: Tagore

అప్పటినుండి నేను మాత్రం నా ఇంద్రియాలను ఆయనకు అతికించేసాను.  ఆయన్నే తదేకంగా గమనిస్తూ ఉండిపోయాను. వేదిక మీదున్న పెద్దమనుషులు ఏదేదో చెప్తున్నారు, నేను వాళ్ళ మాటలను కొంచం కుడా పట్టించుకోలేదు. తపస్ బంధోపాధ్యాయ, టిపికల్  బెంగాలి పేరు. అసలు ఈయనకు వయసు ఎంత ఉంటుంది.  పెళ్ళి అయ్యుంటుందా? అది ఏమో గాని చూడ్డానికి చాలా బాగున్నాడు. చాలా సింపుల్ గా ఉన్నాడు. జుట్టు ని దువ్వుకోలేదు,..సముద్రంలా, అలలు అలలు గా ఉంది ఆయన జుట్టు.  ఆయన రెండు కల్లు, రెండు ఆకాశాలేమో. నిర్మలంగా, కదలకుండా ప్రషాంతంగా ఉన్నాయి. అయినా ,నేన్ ఏంటి ఇలా ఆలోచిస్తున్నా? ఏంటో ఇదంతా అని అనుకుంటూ ఉన్న సమయంలో…అయన తల ఎత్తి వేదిక  పైన నుండి అంత మంది ఆడియన్స్ మధ్యలో ఉన్న నన్ను చూసాడు. వెంటనే నా చూపులను కిందకి దించేసాను. భయం తో లోపల ఒక మంచుగడ్డ కరిగింది. చా! దొరికిపొయ్యానే అని అనిపించింది. ఇంక తల ఎత్తటానికి ధైర్యం సరిపోలేదు. లోపలి ప్రసంగాల కంటే బయటి వర్షమే ఎక్కువగా వినిపిస్తోంది.  ఆయన మాట్లాడ్తున్నప్పుడు మాత్రం ఒకటి రెండు సార్లు తల ఎత్తాను. రవీంద్రుడు రాసిన హైకూ ల గురించి, చైనా ప్రయాణం గురించీ,  రవీంద్రుని కవిత్వంలోని విష్వమానవ అన్వేషణ గురించి ఆయన ఏదేదో మాట్లాడాడు. సగానికి సగం నాకు అర్థం కాలేదనే చెప్పాలి. కాని ఆయన వుపన్యాసం అయిపోయాక హాల్ లో ఉన్న పెద్ద మనుషులందరూ లేచి నిలబడి మరీ చెప్పట్లు కొట్టారు.  నేను అందరితో పాటు లేచి చెప్పట్లు కొట్టాను.  ఆయనతో మాట్లాడాలి అని చాలా కోరిక కలిగింది.  చివర్లో మాట్లాడదాంలే అనుకున్నాను.
మొత్తం కార్యక్రమం అయిపోయే సమయానికి 9 కావొస్తోంది. వర్షం కొంచం తగ్గింది. ఇంటికి వెల్లాలి. కాని తపస్ ను వొదిలి ఎలా వెల్లటం?  ఇంకెప్పుడూ కనిపించడేమో.  ఆయన ఊరికి వెల్లిపోతాడేమో , అని ఏదో దిగులు ఆవరించింది.  సరే అని ధైర్యం చేసి ఒక సారి మాట్లాడాలి అనుకున్నాను.  ఆయనని అప్పటికే అందరూ చుట్టుముట్టారు.  వాల్లలో కొంత మంది విలేఖరులు కుడా ఉన్నారు. ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు. అందరూ వెల్లిపోయాక మాట్లాడొచ్చు లే అనుకొని ఒక పక్కన నిలబడి వెయ్ట్ చేస్తూ ఉండిపోయాను. ఒకరు పోతే ఇంకొకరు వచ్చేస్తున్నారు తప్ప ఆయన మాత్రం అసలు ఖాలిగానే లేడు. మధ్యలో రెండు మూడు సార్లు ఆయన కోసం వేచిచూస్తున్న నన్ను గమనించాడు. కాని ఆయన మొహంలో నిస్సహాయత కనిపించింది.
నా ఫోన్ మోగింది. ఇంటినుండి. నానమ్మ, అటువైపు నుండి ఒకటే అరుపు ‘ఏమైపోయావ్? ఎక్కడికెల్లిపోయావ్? చెప్పకుండా అలా వెల్లిపోతే ఎల? లేట్ అయిపోయింది, వర్షం పడ్తోంది…తొందర్గా తిరిగి వొచ్చెయ్.”
“వొచ్చేస్తున్నాను” అని చెప్పి కాల్ కట్ చేసాను.
ఇలా అయితే కుదరదూ అని నేనే ధైర్యం చేసి ఆయన చుట్టు ఉన్న ముసలి గుంపు లోకి దూసుకుపోయాను.  ఆ గందరగోలం మధ్యలో ఆయనను పిల్చాను- “తపస్ తపస్” అని. ఆయన నా వైపు తిరిగి చూసాడు, చుట్టూ అందరూ మాట్లాడటం ఆపేసారు.  సడన్ గా ఏం మాట్లాడాలో గుర్తుకురాలేదు. ఏదో ఒకటి అడిగేద్దాం లే అని  “గీతాంజలి లో మీకు నచ్చిన పద్యం ఒకటి చెప్పరా”  అని అడిగాను. ఆయన నవ్వి,  బెంగాలి లో రవీంద్రుని కవిత ఒకటి చెప్పాడు~
“నువ్వు నాకు దెగ్గరిగా వస్తున్నావో నాకు తెలీదు.
రవి, తారలైనా నిన్ను నా నించి
ఎప్పటికీ దాచి ఉంచలేవు.
అనేక ఉదయ సాయంకాలాలు
నీ పాదధ్వనులు వినవొచ్చాయి.
నీ దూత నా హృదయంలోకి వొచ్చి
నన్ను రహస్యంగా పిలిచి వెళ్ళాడు.
ఇవాళ నా జీవితం ఎందుకు ఇట్లా కంపిస్తోంది
ఎందుకు నా హృదయంలో ఆనందం స్పందిస్తోంది తెలీదు.
నా పనులు కట్టిపెట్టవలసిన సమయం ఆసన్నమైనట్టుంది.
నీ మధుర సమక్షావ్యక్త పరిమళం గాలిలో వూగుతోంది.”
బెంగాలి లో ఆయన చెప్పినది అర్థం కాకపోయినా, ఆయన ఆ కవిత చెప్తున్నంత సేపూ నాకు లూఇస్ ఆరంస్ట్రాంగ్ పాట “లె వి ఎన్ రోసె” లో రెండు లిరిక్స్ పదే పదే గుర్తొచ్చాయి.
“and when you sing angels sing from above
everyday words seem to turn into love songs”
ఆ గుంపు నుండి బయటకు పడి, ఆయన్ను చివరి సారి చూసాను. ఆయన నన్ను నవ్వుతూ ఇంకా చూస్తున్నాడు.   అక్కడి నుండి ఇంటికి వొచ్చేసాను.  “లె విఎ ఎన్ రోసె” పదే పదే గుర్థొస్తోంది.  నానమ్మతో బాగ తిట్లు తిని, ఏదో తినేసి నిద్రపోయాను. కలలో అంతా ఆ కవిత్వమూ, ఆయన నవ్వూ, ఆ పాటే – పదే పదే గుర్తొచ్చాయి.
 -సిరా
 

‘ఆమె మెచ్చినదే అందం’

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నల దమయంతు లిద్దరు మనఃప్రభవానలబాధ్యమానలై
సలిపిరి దీర్ఘవాసరనిశల్ విలసన్నవనందనంబులన్
నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులం
దలిరుల శయ్యలన్ సలిలధారల చందనచారుచర్చలన్

మహాభారతం, అరణ్యపర్వం, ద్వితీయాశ్వాసంలో ఉన్న ఈ ప్రసిద్ధపద్యం నల దమయంతులనే ప్రేమికుల విరహతాపం గురించి చెబుతోంది. ఆ తాపాన్ని ఉపశమింపచేసుకోడానికి వారు శీతలోపచారాలను ఆశ్రయించడం గురించి చెబుతోంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు; ‘మా మాదిరిగా భూమిని, రాజ్యాన్ని, బంధువులను విడిచిపెట్టి అడవులపాలై జంతువులతో కలసి జీవిస్తూ కష్టాలు పడిన నరులు ఇంకెవరైనా ఉన్నారా’ అని బృహదశ్వుడు అనే మునిని ధర్మరాజు అడుగుతాడు. అప్పుడు ఆ ముని నలదమయంతుల కథ చెబుతాడు.

నలుడు నిషధదేశపు రాకుమారుడు, దమయంతి విదర్భరాజు కూతురు.
నాకు ఎందుకో మహాభారతంలో నలదమయంతుల కథ విలక్షణంగా కనిపిస్తుంది. కారణం మరేం లేదు…అంతవరకు కొన్ని రకాల స్త్రీ-పురుష సంబంధాలు, వివాహసంబంధాలు కనిపిస్తాయి. నలదమయంతుల కథ దగ్గరికి వచ్చేసరికి అది భిన్నమైన కథగా అనిపిస్తుంది. అందులోనే స్త్రీ-పురుష సంబంధాలలో మొదటిసారిగా మనసు, ప్రేమ, విరహం మొదలైన సుకుమారభావనలు అడుగుపెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. అంతకు ముందున్న కథలకు, ఈ కథకు ఉన్న తేడాను వీలైనంత క్లుప్తంగా చూద్దాం.
ఆదిపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్న రురుడు-ప్రమద్వరుల కథ, వివాహం నిశ్చయమైన ఒక జంట గురించి చెబుతుంది. ఆవిధంగా వారిద్దరి మధ్య వివాహానికి ముందే అనురాగం ఏర్పడడానికి అవకాశం ఉంది కానీ, దానిని ప్రేమకథగా చెప్పలేం. ప్రమద్వర పాముకాటువల్ల మరణించగా తన ఆయుర్దాయంలో సగం ఆమెకు ధారపోసి రురుడు ఆమెను బతికించుకుంటాడు. ఆ తర్వాత వారి వివాహం జరుగుతుంది.

ఆ తర్వాత చెప్పుకోవలసింది యయాతి-దేవయాని; యయాతి-శర్మిష్టల త్రికోణ సంబంధకథ. రాచకూతురు అయిన శర్మిష్టపై అసూయతో, ఆమె కన్నా తను ఆధిక్యతను పొందాలనే కోరికతో దేవయాని యయాతిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కనుక వారిద్దరిదీ ప్రేమ సంబంధమని చెప్పడానికి లేదు. పైగా యయాతి శర్మిష్టమీదే తప్ప దేవయానిపై మనసు పడినట్టు కనిపించడు. శుక్రుడిపట్ల భయంతోనో, గౌరవంతోనో అతను దేవయానిని పెళ్లాడినట్టు కనిపిస్తాడు. కనుక అది ఒకవిధంగా నిర్బంధవివాహం.

nala

తొలిచూపులోనే అతనిని ఆకర్షించింది శర్మిష్ట. అయితే ఆ ఆకర్షణకు కారణం ఆమె అందమే కానీ, అందులో ప్రేమగా చెప్పదగిన మానసికకోణం ఏమీ లేదు. ఇంకా విశేషమేమిటంటే, యయాతితో తన సంబంధంలో మొదట చొరవ తీసుకున్నది శర్మిష్టే. అందుకు కూడా అసలు కారణం, దేవయానికి పట్టిన అదృష్టం తనకు పట్టలేదన్న చింతే. భర్త లేకపోవడంతో ఇంత యవ్వనమూ వృథా కావలసిందేనా అన్న విచారంతోపాటు; దేవయాని భర్తను, సంతానాన్ని పొందినట్టు తను పొందలేకపోయానే అన్న బాధా ఆమెలో ఉంది. పైగా యయాతికి, తనకు మధ్య ఉన్నది దాసి-యజమాని సంబంధమని ఆమె గుర్తుచేస్తుంది. అంటే, వారిది ప్రేయసి-ప్రియుల సంబంధం, భార్యా-భర్తల సంబంధం కాదు సరికదా; సమానుల మధ్య సంబంధం కూడా కాదన్నమాట. ఆపైన ఆమె ఋతుకాలోచితాన్ని ప్రసాదించమని అడుగుతుంది. ఇలా ఏ కోణంలో చూసినా వారిది శారీరక సంబంధమే తప్ప ప్రేయసీ, ప్రియుల మధ్య తప్పనిసరిగా ఉండవలసిన మానసికబంధం కాదు.

శకుంతలా-దుష్యంతుల కథకు వస్తే, అది పైకి ప్రేమకథలా కనిపించే మాట నిజమే కానీ, అది గాంధర్వవివాహం అనే చట్రంలో జరిగిన కథ. పైగా అది ప్రేయసీ ప్రియుల మధ్య ఉండే మానసిక బంధాన్ని కాకుండా ప్రధానంగా భార్య-భర్త-సంతానం మధ్య ఉండే ధార్మిక సంబంధాన్ని, గృహస్థధర్మాన్ని వేదప్రమాణంతో నొక్కి చెబుతుంది. ఆ తర్వాత వచ్చే గంగ-శంతనుడు, సత్యవతి-శంతనుల కథల్లో ప్రేమ, మనసు కాక పురుషుడిలోని కాముకత్వానిదే పై చేయి అవుతుంది. ఇక గాంధారి-ధృతరాష్ట్రులది, కుంతి,మాద్రి-పాండురాజులది పెద్దలు నిర్ణయించిన వివాహసంబంధం. వీటికి భిన్నంగా అంబ-సాల్వులది ప్రేమకథగా కనిపిస్తుంది. కానీ అది నలదమయంతుల కథలా పూర్తిస్థాయిలో చిత్రించిన కథ కాదు.

ఆ తర్వాత వచ్చేది హిడింబా-భీముల సంబంధం. ఇది పై కథలకు భిన్నంగానూ, శర్మిష్ట-యయాతి కథకు దగ్గరగానూ కనిపిస్తుంది. ఎలాగంటే, హిడింబా-భీముల కథలో కూడా చొరవ హిడింబదే. అసలు ప్రకృతి రీత్యా చూసినా స్త్రీ-పురుష సంబంధాలలో చొరవ తీసుకునేది స్త్రీయే నంటూ రాంభట్లగారు ‘జనకథ’లో ఇలా రాస్తారు:

జంతువుల్లో మగ జంతువు ఉదాసీన, ఆడజంతువు క్రియాశీల. ఆడజంతువు సమ్మతించనిదే మగజంతువు దాని దరిదాపులకు కూడా చేరజాలదు. ఆమె కటాక్షం కోసం మగజంతువులు పుట్టుకతో సౌందర్యాన్ని సంతరించుకుంటున్నాయి. అయితే మగ జంతువు ఈడేరేదాకా ఆ సహజసౌందర్యం పొటమరించదు. అది ప్రకృతి పెట్టిన ఆన.
మనిషికి కూడా సహజసౌందర్యం ఉంటుంది. ప్రకృతి పెట్టిన ఆన ప్రకారం అది యౌవనారంభంలో వ్యక్తమవుతుంది. జంతువుల్లా పురుషుడు కూడా ఉదాసీనుడు, స్త్రీ క్రియాశీల. ఈ సత్యాన్ని ప్రపంచంలో ఒక్క సాంఖ్యతత్వం మాత్రమే చెప్పింది. మన పురాణాల్లో రాజులు తమ కూతుళ్లకు స్వయంవరం చాటిస్తారు. ఈ స్వయంవరాన్నే డార్విన్ “నేచురల్ సెలెక్షన్” అన్నాడు. ‘వధూ’ అంటే స్త్రీ సామాన్యవాచకం. ‘వరః’ అంటే కోరదగ్గవాడు. ఈ మాటల్ని బట్టే పురుషుడు ఉదాసీనుడని తేలుతుంది.

అదే పుస్తకంలో ఇంకో చోట ఆయన ఇలా అంటారు:

జంతుప్రపంచాన పోతులు సహజాలంకారాలను సంతరించుకుని పుడతాయి. అందులో సింహం, చీంబోతు, పొట్టేలు, వృషభం –వాటి దర్పమే వేరు. ఋతుకాలాన పెంటి జంతువుల చుట్టూ ఈ పోతుజంతువులు చేరి ప్రదర్శనలు ఇస్తూ ఉంటాయి. ఎన్ని జంతువు లెంత ప్రదర్శనలు చేసినా పెంటి జంతువు అందులో బక్కపోతునే వరిస్తుంది. దాన్నే నేచురల్ సెలెక్షన్ అన్నాడు డార్విన్. అదే స్వయంవరం. వరణం దక్కని పోతులు పరస్పరం పోట్లాడుకుంటాయి.

జంతుప్రపంచం దాటివచ్చిన జనప్రపంచం కూడా అంతే. ‘ఆడది మెచ్చినదే అందం. మొగాడి కన్ను మసక’ అంటుంది మధురవాణి. ఆమె నోట ఈ మాట పలికించిన అప్పారావుగారు ఎంత గొప్ప శాస్త్రవేత్తో! వరమాల దక్కని పురుషులు కూడా జంతువుల్లానే పోట్లాడుకునే వారంటాయి మన పురాణాలు. ఈ స్వయంవరణ రహస్యం నేటికీ పరమ రహస్యంగానే ఉంది.

పురుషుడు ఉదాసీనుడు, స్త్రీ క్రియాశీల అన్న సూత్రీకరణకు యయాతి-శర్మిష్టల సంబంధం అతికినట్టు సరిపోతుంది. అలాగే భీమ-హిడింబల సంబంధం కూడా.
వారణావతంలో లక్క ఇంటి దహనం నుంచి పాండవులు తప్పించుకున్న తర్వాత ; హిడింబుడు అనే రాక్షసుడు, అతని చెల్లెలు హిడింబ ఉండే అరణ్యానికి చేరుకుంటారు. భీముని చూడగానే హిడింబకు అతనిపై కోరిక కలుగుతుంది. హిడింబునికి, భీమునికి జరిగిన యుద్ధంలో హిడింబుడు మరణించిన తర్వాత కుంతి, పాండవులు అక్కడినుంచి బయలుదేరతారు. వారితో హిడింబ కూడా బయలుదేరుతుంది. భీముడు అందుకు అడ్డు చెబుతాడు. అప్పుడు ధర్మరాజు జోక్యం చేసుకుని ఆమెను కూడా రానివ్వమంటాడు.
ఆ తర్వాత కుంతిని హిడింబ ఏకాంతంగా కలసుకుని ‘మన్మథ వాంఛ అన్ని ప్రాణులలోనూ సాధారణమే అయినా స్త్రీలలో అది మరింత విశేషంగా ఉంటుంది. భీమునిపై కోరికతో చుట్టాలను, చెలులను విడిచిపెట్టి వచ్చాను. మీరు నా ఇష్టాన్ని కాదంటే ఆత్మహత్య చేసుకుంటా’నని అంటుంది. నా దగ్గర ఎన్నో మహిమలు ఉన్నాయని కూడా చెబుతుంది. కుంతికి ఆమె మీద ఇష్టం కలుగుతుంది. తన మాటను, అన్న ధర్మరాజు మాటను మన్నించి ఆమెను చేపట్టమని కుంతి భీమునికి చెబుతుంది. ఇందువల్ల నీకు పుత్రసంతానం కలుగుతుందని, నీ తండ్రి పాండురాజు కూడా సంతోషిస్తాడని అంటుంది. భీముడు ఒప్పుకుంటాడు. అయితే పుత్రసంతానం కలిగే వరకే మా ఇద్దరి సంబంధం అని షరతు పెడతాడు. ‘నువ్వు శుచిగా ఉంటూ ఉత్తమ స్త్రీ గుణాలతో భీముడికి ప్రీతి కలిగేలా నడచుకో. పగలు మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా విహరించండి. రాత్రుళ్ళు మాత్రం మా దగ్గర ఉండం’డని హిడింబకు కుంతి చెప్పింది.

సరే, ఇందులో చొరవ హిడింబదే నన్న సంగతి అర్థమవుతూనే ఉంది. పైగా భీమునిపై ఆమెకు కలిగిన కోరిక శారీరకమైనదేనని ఆమె మాటలు వెల్లడిస్తున్నాయి. కుంతి దగ్గర పచ్చిగా ఆ సంగతి బయటపెట్టింది కూడా. కనుక, ప్రేమ, మనసు అనే నాజూకు భావనలకు అక్కడ అవకాశం లేదు. అలాగే, ఈ మొత్తం ఘట్టంలో వారిద్దరి మధ్య వివాహం అనే మాటే రాలేదు. రాకపోగా, నీకు కొడుకు కలుగుతాడు, పాండురాజు కూడా సంతోషిస్తాడని కుంతి భీమునితో అంటోంది. అంటే, ఇక్కడ వివాహవిధి కన్నా సంతానం పొందడమే ప్రధానంగా కనిపిస్తోంది. పగలు మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా విహరించండి, రాత్రుళ్ళు మాత్రం మా దగ్గర ఉండండని హిడింబకు కుంతి చెప్పడం కూడా, అది సాధారణ దాంపత్య సంబంధానికి భిన్నమైన సంబంధంగా ధ్వనింపజేస్తోంది. పుత్రుడు కలిగేవరకే మా సంబంధం అని భీముడు అనడం, అది అవసరార్ధం కల్పించుకున్న తాత్కాలిక సంబంధమేనని స్పష్టంగా చెబుతోంది. హిడింబ ఆటవిక స్త్రీ అనుకుంటే, భీముడికి, ఆమెకు కలిగినది అసమసంబంధం కనుక ఈ చిత్రీకరణ దానికి అనుగుణంగానే ఉంది. సంతానం కోసం ఆటవిక స్త్రీలతో సంబంధం పెట్టుకుని, సంతానం కలగగానే వారిని విడిచిపెట్టిన ఉదంతాలు మహాభారతంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇది నేటికీ గిరిజన, గిరిజనేతరుల మధ్య జరుగుతున్నదే. చరిత్ర అవిచ్చిన్నతకు ఇదొక ఉదాహరణ.

హిడింబ-భీముల సంబంధం తర్వాత చెప్పుకోవలసింది ద్రౌపది-పాండవుల సంబంధం. అందులో కూడా ప్రేమ అనీ, మానసికమైనదనీ చెప్పదగిన బంధమేమీ లేదు. అది కూడా ప్రధానంగా రాజకీయ అవసరార్ధం జరిగిందిగానే కనిపిస్తుంది. ద్రౌపదిని వెంటబెట్టుకుని అర్జునుడు, భీముడు ఇంటికి వచ్చి, భిక్ష తెచ్చామని తల్లితో అన్నప్పుడు, దానిని అయిదుగురూ పంచుకోండని తల్లి అన్నప్పుడు, ‘ఆమెను చూడగానే పాండవులు అయిదుగురూ మన్మథ బాణాలకు గురయ్యారు’ అంటాడు కవి. ఆ మాట ప్రధానంగా శరీరకవాంఛనే సూచిస్తోంది.

కాకపోతే, రాచకూతురుగా, తండ్రిచాటు బిడ్డగా ద్రౌపదికి, ఆటవిక స్త్రీగా హిడింబకు ఒక స్పష్టమైన తేడా ఉంది. భీముడితో సంబంధంలో హిడింబ చొరవ తీసుకుంటే; పాండవులతో సంబంధంలో ద్రౌపది, తండ్రి ఎలా వంచితే అలా వంగే మైనపు ముద్ద, మౌనమూర్తి అయింది. తను స్వయంవరంలో అర్జునుని వరించినా, అత నొక్కడికే భార్య అయ్యే హక్కును ఆమె పొందలేక పోయింది. ఆవిధంగా అది ఉత్తుత్తి స్వయంవరమే అయింది.

ఆ తర్వాత వచ్చేదే నలదమయంతుల కథ. పైన చెప్పుకున్నట్టు, ప్రేమ, మనసు, విరహం వంటి దినుసులతో ఈ కథ; పై కథలకు భిన్నంగా, దాదాపు ఆధునిక ప్రేమ కథలకు దగ్గరగా ఉంటుంది. అంతేకాదు, కనీసం ఉన్నత కుటుంబాలకు పరిమితమై చెప్పుకున్నా ప్రేమ, పెళ్లి అనేవి కేవలం వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు చెందినవే తప్ప రాజకీయ అవసరం కోసమో, మరొక అవసరం కోసమో పెద్దలు మెడ వంచి రుద్దేవి కావని చెబుతున్నట్టు ఉంటుంది. ఇలా ఈ కథలను ఒక క్రమంలో పేర్చుకుని చూసినప్పుడు మహాభారతం స్త్రీ-పురుష సంబంధాల పరిణామక్రమాన్ని కూడా చెబుతోందా అనిపిస్తుంది.

దమయంతి విదర్భరాజు కూతురు అన్నప్పుడు, అది నేటి మహారాష్ట్రలోని విదర్భనే సూచిస్తోందనుకుంటే, బహుశా ఇది దక్షిణ భారతం దిశగా భౌగోళిక విస్తరణ క్రమాన్నీ వెల్లడిస్తూ ఉండచ్చు. దానికి తగినట్టే స్త్రీపురుష సంబంధాలు మొరటుతనం నుంచి నాజూకును సంతరించుకుంటూ ఉండచ్చు.

మరింత విపులమైన పరిశీలన చేయవలసిన ఆ అంశాన్ని అలా ఉంచితే, నలదమయంతుల కథలో చెప్పుకోవలసిన విశేషాలు ఇంకా ఉన్నాయి. వాటి గురించి తర్వాత….

-కల్లూరి భాస్కరం

30 న హైదరాబాద్ లో కథా ఉత్సవం

1535038_903793006297538_2212784229189647637_n

పోయిన జన్మలో…

10811439_4929245406052_1430079235_n

మృత్యుంజయ్

మృత్యుంజయ్

అదనపు విలువపై అధికారం నిర్ధారించే ‘తీర్పు’

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

 

తీర్పు వొక రాజకీయ కథ. అదొక పాఠం కూడా . శ్రామిక వర్గ దృక్పథం ఆ కథకి ఆయువుపట్టు.

రచయిత తాను నమ్మిన భావజాలాన్ని గానీ, తన ప్రాపంచిక దృక్పథాన్ని గానీ సాహిత్యంలో చెప్పడం వల్ల కళాత్మక విలువలు దెబ్బతింటాయని వొకప్పుడు కేవల అనుభూతి వాదులూ, ఆ తర్వాత శుద్ధ రూపవాదులూ , యిటీవల వామపక్ష ప్రగతిశీల దృక్పథాన్ని వ్యతిరేకించడమే ఫ్యాషన్ గా మార్చుకొన్న కొంతమంది పోస్ట్ మాడర్నిస్టులూ సణిగే సణుగుళ్ళూ  కూసే కూతలూ రాసే కొక్కిరాయి రాతలూ పస లేనివని నిర్ద్వంద్వంగా తిరస్కరించడానికి నిండైన వుదాహరణ 64 లో కాళీపట్నం రామారావు మాష్టారు రాసిన ‘తీర్పు’ కథ . నేనీ మాటలు యింత నిక్కచ్చిగా చెప్పడానికి బలమైన కారణాలే వున్నాయి. ‘తీర్పు’ కథలో కారా ప్రతిపాదించదలచుకొన్న సారం రూపానికి హాని చెయ్యలేదు. వస్తు నిర్వహణకి శిల్పం యెలా దోహదం చేస్తుందో లోతుగా తెలిసిన రచయితగా మాష్టారీ కథలో దర్శనమిస్తారు. వస్తువుకి విధేయమైన శిల్పం మాత్రమే పాఠకుణ్ణి యెటూ మెదలనివ్వక కట్టి పడేస్తుంది. వస్తు ప్రధానమైన యీ కథలో దృష్టి యెంతసేపూ సారం మీదే వుండేలా చేయడానికి కథా నిర్మాణ విషయంలో రచయిత తీసుకొన్న శ్రద్ధ ప్రతి పదంలోనూ  గోచరిస్తుంది.

పెట్టుబడులు – వనరులు – వుత్పత్తి సాధనాలు – శ్రమ – వుత్పత్తి ఫలాల గురించి , వాటి అదుపు గురించి మార్క్సిజం చెప్పిన సూత్రాలను అర్థం చేసుకోడానికి ‘తీర్పు’ కథ వొక పాఠంలా నాకెంతో తోడ్పడింది. తరగతి గదిలో భాషాధ్యాపకుడిగా సామాజిక శాస్త్రాంశాల్ని అన్వయిస్తూ సాహిత్యాన్ని బోధించే స్వేచ్ఛ వుండడం వల్ల ‘ తీర్పు’ కథని యెన్నో సందర్భాల్లో పిల్లలకి చదివి వినిపించాను, చేతిలో కథ లేనప్పుడు మౌఖికంగా చెప్పాను. ప్రతిసారీ కథలోని సారం మీద చర్చలు జరిగేవి. సుందర రామయ్య రెండో కొడుకు ఇచ్చిన తీర్పుకే అంతిమంగా ఆమోదం లభించేది. మాష్టారి తీర్పు కథని తొలిసారి నేనెప్పుడు చదివానో గుర్తులేదు కానీ – కథలోని ‘ రెండోవాడు’ నన్ను జీవితం పొడవునా ఆవహించిన హీరో అయ్యాడు. అతని నిర్ణయాత్మక ధోరణి , తర్కబద్ధమైన వాదనా పటిమ , చూపులో చురుకుదనం , మాటలో నైశిత్యం, ముక్కుసూటిదనం , హేతుదృష్టి , అభిప్రాయ వ్యక్తీకరణలో నిక్కచ్చిదనం, ఆశయసాధన పట్ల సడలని పట్టుదల , ఆధిపత్య నిరసన , తిరుగు బాటు తత్త్వం వంటి అనేకానేక గుణాలు నాకాదర్శమయ్యాయి.

మానవ శ్రమే సమస్త సంపదల సృష్టికి కారణమైనప్పుడు దానిమీద సర్వ హక్కులూ – అనుభవించడం, పరిరక్షించడం, పంచడం యేవైనా కావొచ్చు – అవి శ్రమ చేసినవారికే చెందుతాయన్న మార్క్సిజం మౌలిక సూత్రాన్ని అతి సరళంగా కళాత్మకంగా ఆవిష్కరించిన ‘తీర్పు’ కథ వొక విధంగా అన్యాపదేశ కథ.  అన్యాపదేశ కథల్లో అంతరార్థం తెలిసీ తెలియనట్టుగా దాగుడుమూతలాడుతూ మంచుపొర కింది పువ్వులా గోచరం కావడం వొక టెక్నిక్. అయితే వొక్కోసారి రచయిత చెప్పదల్చుకొన్న అంతరార్థం పాఠకుడికి అందదు. అలా అందక పోయినా రచయిత ప్రతిభ కారణంగా ఆ లోటు కనపడదు. పాత్రలూ సన్నివేశాలూ సంభాషణలూ సంఘటనలూ అన్నీ కలిసి వొక కథగా హాయిగా చదువుకోడానికి యెటువంటి  యిబ్బందీ కల్గదు. అంతరార్థం ద్యోతకం కాపోయినా అది కథగా మనగల్గుతుంది – యిది మరో టెక్నిక్. ‘తీర్పు’ కథలో అర్థం నిగూఢం  కాదు. అలా అని పూర్తిగా బహిరంగం కాదు. చదివిన ప్రతిసారీ పదాలపైనా పాత్రలపైనా  కొత్త కాంతి ప్రసరిస్తుంది. పదాల మధ్య, వాక్యాల మధ్య , నిశ్శబ్దంలోనూ దాగివున్న లోతుని ఆనందించగలం. పాత్రలు ప్రతీకలుగా గాక నమూనాలుగా కళ్ళముందు నిలుస్తాయి. జీవిత సత్యాల్ని బోధపరుస్తాయి. ఒక యింట్లో దేశం, వొక కుటుంబంలో సమాజం , అందులోని భిన్న వ్యవస్థలూ ఆవిష్కారమౌతాయి. ఆ యా సన్నివేశాల్లో పాత్రల మాటలూ చేతలూ ఆలోచనా సరళీ నడవడికా అందుకు దోహదం చేస్తాయి. వాటిని విశ్లేషించుకొనే  ముందు స్థూలంగా వొకసారి కథలోకెళ్దాం :

సుందర రామయ్యకి నలుగురు మగపిల్లలు. కడగొట్టుది ఆడపిల్ల. పెద్దవాళ్ళు ముగ్గురూ హైస్కూలుకు పోతున్నారు. రెండోవాడికి బళ్ళో అట్టలు చేయడం నేర్పేరు. అలాంటివి బళ్ళో చేసి అమ్మేరు. ఒక్కొక్కటి ముప్ఫై నయా పైసలకమ్మేరు. పెద్దవాడు అర్థరూపాయి ఖర్చుతో అరడజను చేయవచ్చని కనిపెట్టేడు. బజారులో ఆ అట్టలే ఒక్కొక్కటి ఆరణాలని చెపితే వాళ్ళ అమ్మ అర్థ రూపాయి యిచ్చింది. ఉన్నవాళ్ళు ఐదుగురే కాబట్టి అయిదు అట్టలే చేసుకుందామన్నారు. మిగిలిన డబ్బు – ఒక అట్టమీద అధికంగా పెడితే అది అందమయిన కాలికో అట్ట అయింది.

తాను పెద్దవాడు కాబట్టి, తనది పెద్ద క్లాసు కాబట్టి, ఆ అందమైన అట్ట తాను తీసుకుంటానన్నాడు పెద్దవాడు. అలా వల్ల కాదు నేను తీసుకుంటానన్నాడు రెండోవాడు – తల్లి మొదట పెద్దవాడికే యిచ్చేయమంది. రెండోవాడు వాదిస్తే వాడికే ఇచ్చేయబోయింది. తగువు తెగకపోవడంవల్ల తండ్రి దగ్గరకు వచ్చింది.

ఇక్కడ నుంచి అసలు కథ మొదలైంది. కుటుంబం దానికదే వొక యూనిట్ అయినప్పటికీ  సమాజం లోని అన్ని దృగంశాలూ అక్కడా వుంటాయి. కుటుంబంలో అందరూ సమానమేగానీ కొందరు ఎక్కువ సమానం. దానికి కారణాలు సవాలక్ష. పాతుకుపోయిన భూస్వామ్య విలువలు, అయాచితంగా ప్రవహిస్తూ వచ్చే పితృస్వామ్య భావజాలం, ప్రశ్నించరాని సంప్రదాయాలూ ఆచారాలూ,  జెండర్ వివక్ష, వ్యక్తుల బలాలు – బలహీనతలు, ప్రత్యేక ప్రేమాభిమానాలూ, నిర్వచించలేని వుద్వేగాలూ యిటువంటివన్నీ అక్కడ సంబంధాల్నిశాసిస్తాయి. నిర్ణయాల్ని నిర్దేశిస్తాయి.

కుటుంబ పెద్దగా సర్వాధికారాలూ సొంతం చేసుకొన్న సుందర రామయ్య న్యాయమూర్తి స్థానంలో కూర్చొని సమస్యని తన పెద్దరికంతో సులువుగా పరిష్కరించొచ్చు అనుకొన్నాడు. అయితే అతను ప్రజాస్వామ్య పద్ధతిని యెంచుకొన్నాడు. అసమానతల వ్యవస్థలో ప్రజాస్వామిక సంప్రదాయం యేమేరకు సరైన న్యాయం చేయగల్గుతుందో అతనికి తెలియదు. నిజానికతనికి యీ తగువు అంతగా నచ్చలేదు. అతను వర్తమానంలో యెంతగా జీవించాలనుకొంటాడో అంతగా వెనకటి కాలాన్ని ప్రేమిస్తాడు.

‘తన పిల్లలు త్రేతాయుగం నాటి శ్రీరామచంద్ర సోదరులను తలపిస్తూ, ఒక్కటిగా ఉండాలని అతని అభిమతం.’

ఎంత ప్రజాస్వామికంగా వుందామనుకొన్నా సుందరరామయ్య రక్తంలో దాగున్న ఫ్యూడల్ విలువల అవశేషాలు అతన్ని యిబ్బంది పెడ్తూ వుంటాయి. పెద్దకొడుకు తన ఔరసుడన్నభావన అతనిలో బలీయంగానే వున్నట్లుంది. వాడికి తన తండ్రి పేరే పెట్టుకొన్నాడు. వాడి పట్ల ప్రత్యేకంగా పక్షపాతం చూపించినట్లు కనపడకూడదని ప్రయత్నపూర్వకంగా ప్రజాస్వామిక కండువాని సర్దుకొంటూ వుంటాడు.

పెద్దవాడు – తెల్లగా నాజూగ్గా స్టయిలుగా వుంటాడు. కళ్ళల్లో కొంత తెలివి కూడా కనపడుతుంది. పెద్దకొడుక్కే వారసత్వపు హక్కులు వుంటాయన్నసంప్రదాయం వాడికి తెలిసినట్టే కనపడుతుంది. అందువల్ల పెద్ద అట్ట తనకే  దక్కాలని వాడి అభిమతం. తమ్ముడి ప్రతిఘటనతో వాడి అభిమానం దెబ్బతింది. దాన్ని దాచుకోడానికి బేలగా ప్రయత్నిస్తూ వున్నాడు. కానీ తండ్రి ప్రేమ తనవైపే మొగ్గుతుందని గట్టి నమ్మకం. తండ్రి తీర్పు తనవైపేనని వాడికి  భరోసా .

రెండోవాడు కాస్త బండగా వుంటాడు. వాడి మూసి వుంచిన పెదవుల్లో పట్టుదలా, తెరచి ఉంచిన కళ్ళల్లో నిబ్బరం కనిపిస్తాయి. చూసేవాళ్ళకి, వాడితో కొంచెం జాగ్రత్తగా వుండడం మంచిదనిపిస్తుంది. వాడి గురించి తండ్రికి ముందే కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి.

‘వాడు ప్రతిదానికీ యిట్టే సీరియస్ అయిపోయే రకమని సుందర రామయ్య అంతకుముందే వాడిని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకొన్నాడు.’

నిజానికి న్యాయమూర్తికి యిటువంటి పూర్వ నిశ్చయాలు – ప్రిజుడీస్ వుండకూడదు. కానీ వాడిని కన్నతండ్రిగా అలా అభిప్రాయపడే హక్కు కూడా అతనికి సహజంగానే వుంటుంది. ఈ ద్వైధీభావం, సంఘర్షణా కథ పొడవునా అతనిలో కనిపిస్తూనే వుంటాయి. ప్రజాస్వామిక విలువలు వొక వైపు, భూస్వామ్య భావజాలం మరొకవైపు అతను మధ్యలో వేలాడుతూ వుంటాడు. అయితే తనలోని యీ వైరుధ్యాన్ని కనపడనివ్వని గాంభీర్యం కూడా అతను ప్రదర్శిస్తాడు. మార్క్సిస్ట్ పరిభాషలో – జార్గాన్ అనుకోకుంటే – అతణ్ణి సెమీ ఫ్యూడల్ అనొచ్చు.

అందరికీ సమన్యాయం ప్రసాదించిన రాజ్యాంగం వంటిది తల్లి. అర్థ రూపాయి పెట్టుబడి పెట్టిన కారణంగా పరిష్కారాన్ని తన చేతుల్లోకి తీసుకోవచ్చుగానీ ఆమె స్వేచ్ఛకీ పరిమితులున్నందువల్ల తగువుని వున్నత న్యాయపీఠానికి తీసుకువచ్చింది.  ఆమె నిర్ణయం చెయ్యలేక పోడానికి ఆడబిడ్డ – సుందరరామయ్య అక్క – కూడా కొంతవరకు కారణం కావొచ్చు.

సుందర రామయ్య అక్క పాత్రని రచయిత రాజ్యాంగేతర శక్తికి నమూనాగా తీర్చిదిద్దారు. అది మత ధార్మిక శక్తి కావొచ్చు;  ఆధునిక న్యాయ గ్రంధాల్లోకి బలవంతంగా చొచ్చుకొచ్చే కాలం చెల్లిన స్మృతులు కావొచ్చు.  చాలా సందర్భాల్లో యీ శక్తులు న్యాయవ్యవస్థని శాసిస్తాయి. అనూచానంగా వస్తున్న సంప్రదాయాల్నీ రీతీ రివాజుల్నీ ధర్మం పేర్న న్యాయంగా చెలామణీ చేయించాలని కంకణం కట్టుకొని ప్రయత్నిస్తాయి. అందుకే –

‘చిన్నప్పుడు తమ పుట్టింట్లో వారాలబ్బాయే యివ్వాళ తను హాజరయిన కోర్టులో జడ్జిగా కనిపించినట్టు ఆ అప్పగారు తమ్ముడి వంక ధీమాగా చూస్తోంది.’

విచారణ ప్రారంభమయ్యేసరికి  – దాదాపు అనగనగా కథలా మొదలైన కథ నాటకంగా రూపొందుతుంది. వాదాలూ ప్రతివాదాలూ సంభాషణలూ ఆంగిక సాత్త్వికాల్తో నిండిన పాత్రల హావభావాల్తో పాఠకుడి కళ్ళముందు వొక కోర్టు దృశ్యం సాక్షాత్కారమౌతుంది. ఇది శిల్పానికి సంబంధించిన అంశం. ఈ కథలో శిల్ప చర్చ అంత ప్రధానం కాదు. వస్తు నిర్వహణ ముందు అది గౌణమైపోయింది. వస్తువుకి శిల్పంతో  స్వచ్ఛందంగా వూడిగం చేయించడం కారా కథల్లో విశిష్టత. ‘ఈ తగువులింక నే తీర్చలేను’ అన్న వుత్కంఠభరితమైన వాచికంతో కథ యెత్తుగడ దగ్గరే  ఆ చాకిరీ మొదలైంది.  మళ్ళీ కథలోకెళ్తే …

నాల్గో పిల్లడు – తానందరికంటే చిన్నవాడు కాబట్టి యెంచుకొనే అవకాశం తనకివ్వాలంటాడు. ఇది బలహీన వర్గాల రిజర్వేషన్ విధానంలా వున్నప్పటికీ నిజానికి యింకా చిన్నది ఆడపిల్ల వుంది – రిజర్వేషన్ అమలు కావాలంటే  – అట్ట ఆ పిల్లకు చెందాలి. అయితే ఆ పిల్లకి తన హక్కులు వినియోగించుకొనే / సాధించుకొనే తెలివీ చొరవా యింకా యేర్పడలేదు.

మూడోవాడి దృక్పథం, ఆచరణా యిందుకు భిన్నం. అట్టల తయారీలో వాడి శ్రమ కూడా కొంత వుంది. ‘అవసరం’ దృష్ట్యా పెద్ద అట్ట తనకివ్వమంటాడు. లేదంటే అన్నివిధాలా శ్రమ చేసి అట్టలు సృష్టించినవాడు రెండవవాడే కాబట్టి వాడికివ్వడమే న్యాయమంటాడు. ప్రజాసంఘాల వాళ్ళు న్యాయానికి వత్తాసు పల్కినట్టు రెండోవాడి తరపున వకాల్తా తీసుకొన్నాడు. అట్టల ఐడియా పెద్దవాడిదే అయినప్పటికీ ‘ఒట్టి ఐడియా’లకు అట్టలు పుట్టవన్న భౌతికోత్పత్తి రహస్యాన్ని  వెల్లడించాడు. వనరులూ పెట్టుబడులూ యెవరికైనా సమభావంతోనే రాజ్యం సమకూర్చాలనే రాజ్యాంగ నైతికతని కూడా గుర్తు చేసాడు. రెండోవాడికి యింతకు ముందే తల్లి యిచ్చిన నైతిక బలం వుంది. ఇప్పుడు తమ్ముడి న్యాయబద్ధమైన తోడ్పాటు లభించింది. నిజానికి వాడికి అన్న పెద్ద ప్రతిద్వంద్వి కూడా కాదు. ఇక తన శ్రమఫలం మీద అధికారాన్ని స్థాపించుకోవాలంటే రెండు అడ్డంకుల్ని అధిగమించాలి. ఒకటి న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న తండ్రి – రెండు తండ్రి  నోటినుంచి తీర్పు వచ్చేలోపే దాన్ని ప్రభావితం చేసే మేనత్త.

తండ్రి మొఖానికి తగిలించుకొన్న  ప్రజాస్వామ్యంతోనే అతనిలో దాగివున్న ఫ్యూడల్ విలువలకి గండికొట్టాలి,  మొత్తం న్యాయప్రక్రియ పైనే ధాష్టీకం చేయగల మేనత్త యేకరువు పెట్టే ధర్మపురాండాలని కట్టడి చేయాలి. లేకపొతే తనకు న్యాయం దక్కదని రెండోవాడు గ్రహించాడు. ఇంటికి పెద్దవాడూ తండ్రి తర్వాత తండ్రంతటి వాడూ లేదా తండ్రికి తల కొరివి పెట్టేవాడూ కాబట్టి తీర్పు పెద్దవాడికి అనుకూలంగా మారకుండా జాగ్రత్తపడ్డాడు.

‘ఇంటికి పెద్దవాడు కదా – ఎప్పటికైనా – మీ తరువాత ….’ అన్న అసంపూర్ణ వాక్యంతో తండ్రి ముందు కాళ్ళకి బంధం వేశాడు. పెద్ద కొడుకు వైపు తీర్పునిస్తే అది పక్షపాతంతో కూడినదన్న అపవాదునెదుర్కొవాల్సి వస్తుంది కాబట్టి సుందర రామయ్యకి తన  ‘ధర్మ నిబద్ధత’ని నిరూపించుకోక తప్పని పరిస్థితి కల్పించిందీ వాక్యం. న్యాయ ప్రక్రియపై రెండోవాడి తొలి పట్టు యిది.

ఇప్పటిదాకా సుందర రామయ్య యెదుర్కొన్నది బాహిరమైన సంఘర్షణే. ఇక యిప్పుడు అంతరంగ మథనం ప్రారంభమైంది. అతని హృదంతరాళాల్లో గూడు కట్టుకొని వున్న ఫ్యూడల్ నీతి వొళ్ళు విరుచుకొంది. రెండోవాడికి అందమైన అట్ట దొరకుండా చేయడానికి దారులు వెతుకుతున్నట్టు ప్రవర్తిస్తాడు.

మేనత్త  ‘లోకాచారాలూ, సబవులూ’ మాట్లాడడంతో  – తల్లి మౌనంగా వుండలేకపోయింది. ‘పెద్దవాడి వంతు వాటా వేయడం – చిన్నవాళ్ళు ఎత్తుకోవడం రివాజు’ అని నోరు విప్పింది. మేనత్తకి కౌంటర్ యిచ్చేటప్పుడు రెండోవాడి గొంతులో ధ్వనించిన వెటకారం, కరకుదనం,  న్యాయమూర్తి పట్ల చూపే వొక విధమైన అవిధేయత సుందరరామయ్యకి విసుగు పుట్టించాయి. వాడి ధిక్కారం నెగ్గకూడదని అతను నిర్ణయించుకొన్నట్టు చూపుల్లో మాటల విరుపుల్లో తెలుస్తూ వుంటుంది. వాడి దేహ భాషా, వచో వైఖరీ, ప్రవృత్తీ అతనికి భయం కల్గించాయేమో కూడా. సంభాషణల్లో వినిపించే కాకువూ పాత్రల స్పందనల్లో రచయిత చెక్కిన సున్నితమైన భాషాశిల్పం ఆయా సందర్భాల్లో వ్యక్తుల మనస్తత్వాన్ని కళ్ళకు కట్టడానికి అమోఘంగా వుపయోగపడ్డాయి.

భార్య చెప్పినట్టు  నాలుగో వాడికిద్దామని సుందర రామయ్య  ప్రతిపాదించాడు. ఆడపిల్లకి – అందరికన్నా చిన్నదైనా – యీ పంపకంలో వాటా గురించి అతను ఆలోచించడు.

‘ఆడపిల్ల కదా అని ఆడపిల్లకిచ్చేయడం ఆడదాని వ్యవహారమనిపించింది సుందరరామయ్యకి.’ అతనిలోని ఫ్యూడల్ మనస్తత్వానికి యిక్కడికొచ్చేసరికి దాపరికాలక్కరలేకపోయాయి.

అప్పటికే నాల్గోవాడు సాదా అట్టకి సర్దుకొన్నాడని రెండోవాడు చెప్పినప్పుడు –

‘చదరంగం ఆడే ఆసామి ‘ఆటకట్టు’ ఎత్తువేశాకా చూసే చూపు వాడి కళ్ళల్లో కనిపించింది’  సుందర రామయ్యకి.

ఇది న్యాయాన్ని తనవైపు  తిప్పుకొనే క్రమంలో రెండోవాడి మలి విజయం. తాననుకొన్న తీర్పు యివ్వలేకపోతున్నందుకు న్యాయమూర్తికి ‘క్రమంగా చిరాకు ప్రారంభమైంది.’

సుందర రామయ్యలో వున్న సమస్త వైరుధ్యాలూ మూకుమ్మడిగా అతని మీద దాడిచేశాయి.

పెట్టుబడి తనదే కాబట్టి – సంపదనంతా జాతీయం చేసయినా తన ఆధిపత్యం నిలుపుకోవచ్చన్న వూహ కూడా అతనికి వస్తుంది. ‘అట్టలెవరివీ కావని దాచేస్తే’ అనుకొంటాడు. ‘లాటరీ వేస్తే?’ అతనిలో యెక్కడో మిగిలివున్న బలహీనమైన ప్రజాస్వామ్యవాది ఆలోచన. క్యాలికో అట్ట కన్నా మంచి అట్ట తను స్వయంగా చేసి పెద్దవాడికిస్తే  – అని వుద్వేగంతో నిండిన అతని గుండె చప్పుడు చేస్తుంది. ఒక అట్ట వేరుగా చేసినందుకు కోపం వస్తుంది. రెండోవాడు ‘అన్నీ ఒకలాటివే చేసుకుందామ’ని చెప్పినా పెద్దవాడే ప్రత్యేకమైన అట్ట ప్రతిపాదన తెచ్చాడని విన్నాకా అతనికి సమస్య మరింత జటిలమైంది. మొదట్నుంచీ  రెండోవాడే న్యాయమార్గం లో వున్నాడని తేలడంతో దిక్కు తోచలేదు. అలా అని తీర్పు వాడి వైపు చెప్పడానికి కూడా మనసొప్పలేదు. ‘ఎటుపోయినా ఓటమి ఎదురవడం చిరాకుని పెంచుతుంది’. అతని మౌనంతో కోర్టు హాల్లో ‘ఆర్డర్’ దెబ్బతింది.

ఆ బలహీన క్షణాల్ని ఆసరా చేసుకొని గ్రంథాలయాలమీదా ఆర్ట్ మ్యూజియంల మీదా దాడిచేసే మనువాద సాంస్కృతిక సైన్యంలా మేనత్త రెచ్చిపోయింది. ‘చిన్నంతరం – పెద్దంతరం’ గురించి మాట్లాడింది. ఇవ్వాళ అన్నని కాదన్నవాడు రేపు తండ్రిని కాదంటాడని రెచ్చగొట్టింది. పొరుక్కి ఉపకారమంటే పొయ్యార్పుకునే రకమని శీలహననం చేసింది. పరోపకార గుణం గురించి నీతి సూత్రాలు యేకరువు పెట్టింది. న్యాయం కోరేవాణ్ణి నేరస్తుడిగా తీర్మానించింది. వాడు జన్మలో బాగుపడడనీ పుట్టగతులుండవనీ భయపెట్టింది. పాపం చేస్తే పాపం; పుణ్యం చేస్తే పుణ్యం తప్ప యింకేదీ వెంటరాదని సిద్ధాంతీకరించింది.

ఇప్పుడు రెండోవాడు సమస్త కార్మిక వర్గానికీ ప్రాతినిధ్యం వహిస్తూ తీర్పు యివ్వబోతున్నాడు. మేనత్త వూదరగొడుతోన్న అశాస్త్రీయ భావజాలాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాల్సిన సందర్భం వచ్చింది.

‘ – ఒక్క అట్టలు తప్ప’ అని ఆమె మాటలకి ముక్తాయింపు పలికాడు.  యుగాలుగా సంకెళ్ళుగా మారిన విశ్వాసాలను తెంచుకొన్న సవ్వడి ఆ మాటల్లో వొక విలక్షణతతో వినిపిస్తుంది.

తమ హక్కుల్ని స్థిరీకరించుకోవాలన్నా సాధించుకోవాలన్నా తరాలుగా పాతుకుపోయిన అభౌతిక భావజాలాన్ని కూకటివేళ్ళతో పెళ్ళగించాలి – అప్పుడు మాత్రమే కార్మికవర్గ నియంతృత్వాన్ని స్థాపించుకోగల అంతిమ తీర్పుని యివ్వగలం – అన్న చైతన్యం, వుద్బోధ రెండోవాడు పల్కిన మాటల్లో అక్కడందరితోబాటు పాఠకుల చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి.

న్యాయ పోరాటంలో విజయం సాధించాలంటే పితృస్వామ్యం చుట్టూ పాత బూజుపట్టిన  సంప్రదాయాల చుట్టూ అల్లుకొన్న సమస్త సాంఘిక – సాంస్కృతిక కట్టుబాట్లని తెంచుకోక తప్పదు.  రాజ్యం, దాని పరిరక్షకులూ సరైన న్యాయం చేయలేరని నిర్ధారణ అయ్యాకా లేదా తీర్పు యేకపక్షంగా అధర్మబద్ధంగా వెలువడవచ్చని అనుమానించాకా బాధితులు తమకేం కావాలో తామే నిర్ణయించుకొని దాన్ని అమలు చేసే అధికారాన్ని సొంతం చేసుకోక తప్పదు.

తన శ్రమ ఫలంపై అధికారాన్ని  స్వయంగానే ప్రకటించడానికి సిద్ధమయ్యాడు రెండోవాడు. తానే తీర్పరి అయ్యాడు.

మొత్తం అయిదు అట్టల్లో రెండు సాదా అట్టలు – వొక్కో దానికీ  పావలా లెక్కన ధర కట్టి – పెట్టుబడి పెట్టినందుకు యిచ్చేశాడు. మిగతా మూడు అట్టలూ పెట్టుబడి పోగా – అదనపు విలువ ( కార్మికుడి శ్రమే యీ విలువకి మూలం – అది  లాభం పేరుతో పెట్టుబడిదారుల పెట్టెల్లోకి చేరుతోంది). దాని న్యాయబద్ధమైన పంపిణీని కూడా తానే నిర్ణయించాడు. ఐడియా యిచ్చినందుకు (బౌద్ధిక శ్రమకి) పెద్దవాడికి పావలా అట్ట వాటా , పనిలో సాయం చేసినందుకు మూడోవాడికి మరో పావలా అట్ట వాటా ప్రతిఫలంగా ( అది ఎక్కువేనని చెబుతూనే) యిచ్చేశాడు. క్యాలికో అట్ట తనకిష్టమైంది కాబట్టి తానుంచుకొన్నాడు. ఇది  తిరుగులేని అంతిమ తీర్పు.

కార్మిక వర్గ నియంతృత్వంలో వుండే  సమత్వ భావననీ, ప్రజాస్వామిక లక్షణాన్నీ , వుత్పత్తి సంబంధాల్లో పరిఢవిల్లే మానవీయతనీ , సమ న్యాయాన్నీ, శ్రమఫలం పై దాని సామాజిక పంపకంపై శ్రామికులకు లభించే సాధికారికతనీ రెండోవాడి తిరుగుబాటు ద్వారా ప్రతిపాదిస్తూనే రచయిత కథ ముగింపుని తెరచి వుంచారు.

రెండోవాడి ‘అఘాయిత్యాన్ని’ సుందరరామయ్య యెలా స్వీకరించాడన్నది ప్రశ్న. తరతరాల సంప్రదాయాలు , విలువలు వాటిద్వారా సంక్రమించిన అధికారాలు, సౌకర్యాలు , పెద్దరికం తల్లకిందులయ్యాకా ‘ఎర్రగా చాలా ఎర్రగా జేవురించిన  ముఖం’ యెటువంటి ప్రతిక్రియకి పూనుకొంటుందో కాలం నిర్ణయిస్తుంది. ఈ తీర్పునిచ్చిన రెండోవాడే శ్రీకాకుళం కొండల్లో పుట్టిన నిప్పందుకొని సత్యంవైపు నిలబడి వుంటాడు. వాడి గురించిన సుందర రామయ్య భయాలు ఆ విధంగా నిజమయ్యాయి. ఈ కథ పుట్టిన మరో పుష్కరానికి  42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫ్యాక్టరీల నిర్వహణలో కార్మికులకి భాగస్వామ్యం కల్పించే చట్టం రూపొందింది. దానిద్వారా నిర్వహణలో కార్మికుడు అభిప్రాయ వ్యక్తీకరణకి పరిమితమై అధికారానికి యెప్పటికీ దూరంగానే వుండిపోయాడు.

కథ 2011 ఆవిష్కరణ సభ. డిసెంబర్ 2, 2012న. విజయనగరంలో. వరసగా ఎడమ నుంచి... చెలం , సంపాదకుడు నవీన్ , సభకి అధ్యక్షుడు  అప్పల్నాయుడు , పుస్తకం ఆవిష్కర్త శ్రీపతి.   కారా మాష్టారి పక్కన ఎ . కె. ప్రభాకర్

కథ 2011 ఆవిష్కరణ సభ. డిసెంబర్ 2, 2012న. విజయనగరంలో. వరసగా ఎడమ నుంచి… చెలం , సంపాదకుడు నవీన్ , సభకి అధ్యక్షుడు అప్పల్నాయుడు , పుస్తకం ఆవిష్కర్త శ్రీపతి. కారా మాష్టారి పక్కన ఎ . కె. ప్రభాకర్

50 యేళ్ళ తర్వాత యివ్వాళ సుందర రామయ్యలు ప్రజాస్వామ్యపు ముసుగుల్ని సైతం వదిలేశారు. ఫ్యూడల్ విలువలకే సాంస్కృతిక జాతీయవాదం టాగ్ తగిలించి చెలామణి చేస్తున్నారు.  చట్టాలకీ న్యాయాలకీ అతీతంగా యెటువంటి విచారణలకీ తావులేకుండా దేశ విదేశ ధనికస్వాములకు దాస్యం చేస్తూ ప్రకృతి వనరులతో సహా సమస్త సంపదని స్వయంగా స్వాహా చేస్తూ ఆశ్రితులకి అడ్డగోలుగా పందేరం చేస్తూ నిర్లజ్జగా స్వైరవిహారం చేస్తున్నారు. కాదంటే – దుడ్డుకర్రనుపయోగించి రెండోవాడి మూడోవాడి నోళ్ళు మూయిస్తున్నారు. నిజానికి కార్పోరేట్ కల్చర్ లో యివాళ తాను చేస్తున్న  వుత్పత్తి తుది రూపం కూడా రెండోవాడికి తెలీదు. శ్రమ పరాయీకరణ పరాకాష్టకి చేరుకొన్న దశలో శ్రమఫలం పై అధికారం గురించి ఆలోచించే స్థితిలో లేడు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకొన్న హక్కులకి వాడు దూరమయ్యాడు. తల్లి పాపం అమాయిక – ఆమె యెప్పుడూ మౌన ప్రేక్షక స్థానంలోనే వుంది. మేనత్తలు సుందర రామయ్యల తెలివికీ తెంపరితనానికీ మురిసిపోతున్నారు. అందువల్ల ‘తీర్పు’ కథ 64 లో అందించిన  చైతన్యాన్ని యివ్వాళ కొత్త తరం అందిపుచ్చుకోవాల్సిన అవసరం మరింత యెక్కువగా వుంది.

1948 – 55 మధ్య చేసిన రచనల తర్వాత , దాదాపు 9 సంవత్సరాల విరామం తర్వాత 64 లో వెలువడ్డ  తీర్పు దాదాపు అదే కాలంలో రాసిన యజ్ఞానికి కృత్యాద్యవస్థలానో డ్రెస్ రిహార్సల్ లానో డ్రై రన్ లానో వుంటుంది. శ్రీరాములు నాయుడికి సుందరరామయ్య చిన్న మోడల్ లా వుంటాడు. శిల్ప పరంగా తీర్పులో నాటకీయతే యజ్ఞంలో  విశ్వరూపం ధరించి పెద్ద రంగస్థలం మీదికెక్కింది. సుందర రామయ్య యింట్లో వెలసిన కోర్టు హాలే యజ్ఞంలో న్యాయమంటపమైంది. రెండుచోట్లా అది కూలుతున్న దృశ్యమే. అయితే తీర్పు సింగిల్ పాయింట్ కథ. యజ్ఞం బహుముఖీన కథ.

తీర్పు న్యాయబద్ధం కానప్పుడు కుహనా అభివృద్ధిపై ఫ్యూడల్ ఆధిపత్యంపై  నిరసనగా బానిస బతుకు మీద తిరుగుబాటుగా సీతారాముడు కన్న కొడుకుని చంపుకొన్నాడు. సీతారాముణ్ణి అటువంటి వున్మాద స్థాయికి నడిపించిన పరిస్థితుల్ని యజ్ఞం కథలో విస్తృతంగానే వర్ణించినప్పటికీ – దాని బీజాలు తీర్పు కథలోనే వున్నాయి. సమస్య పరిష్కారానికి ‘అట్టలన్నీ చించేస్తే పీడా పోతుంద’ని భార్య అనొచ్చన్న వూహ వొకానొక దశలో సుందర రామయ్యకి కల్గుతుంది. ఆ వూహే సీతారాముడిలో ధ్వంస రచనాత్మకమైన నిరసన రూపం ధరించిందేమో!

సీతారాముడికి తనకేం కావాలో తెల్సు; కానీ సాధించుకొనే దారి లేదు. తన కొడుకు కంబారిగా వుండకూడదంటే తాను తీర్పరి స్థానంలోకి రావాలని సీతారాముడికి తెలుసో లేదో గానీ తీర్పులో సుందర రామయ్య రెండో కొడుక్కి మాత్రం స్పష్టంగా తెలుసు. వాడికి మొదట్నుంచీ తనకేం కావాలో తెల్సు. దాన్ని సాధించుకోడానికి వున్న ఆటంకాలేవో తెల్సు. వాటినెలా అధిగమించాలో వాద ప్రతివాదాల క్రమంలో నేర్చుకొన్నాడు. న్యాయాన్నో చట్టాన్నో తన చేతుల్లోకి తీసుకొంటేగానీ సరైన తీర్పు లభించదనే యెరుక పొందాడు. ఉత్పత్తిలో న్యాయబద్ధమైన భాగస్వామ్యం కోరుకోవడం దగ్గర మొదలైన అతని పోరాటం సమ న్యాయం కోసం మొత్తం వ్యవస్థ పైనే తిరుగుబాటుగా పరిణమించింది. కార్మికవర్గ నియంతృత్వ స్థాపన దిశగా ప్రయాణించింది. అప్పుడు  వుత్పత్తి ఫలాలమీదే కాదు – పెట్టుబడులు, వనరులు, వుత్పత్తి సాధనాలమీద కూడా శ్రామికుడికే సర్వాధికారాలూ దక్కుతాయి. ఇదంతా వొక గతి తార్కిక క్రమం.  విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ. ఆ సంఘర్షణ క్రమాన్ని, శుద్ధ సిద్ధాంతాన్నీ కథగా మలచిన కారా మాష్టారి నేర్పు అద్వితీయం. పైకి సరళంగా కనిపించే యీ తీర్పూ నేర్పూ రెండూ నిజానికి యెంతో సంక్లిష్టమైనవి. తన తీర్పుని అమలు పరచడానికి కథ చివర్లో రెండోవాడు పడిన యాతన వంటి యాతనే కేవల సిద్ధాంతాన్ని కళాత్మకంగా జీవితానికి అన్వయించడంలో  రచయిత కూడా అనుభవించి వుండొచ్చు. అయితే కథ పూర్తయ్యేసరికి సంక్లిష్టత విడిపోయి పాఠకుడికి చేరువై రచయిత ఆశించిన ప్రయోజనం నెరవేరింది. ప్రయోజనోద్దిష్టమైన సాహిత్యానికి వొక పాఠంలా కథ రూపొందింది.

కారా 64 తర్వాత రాసిన కథల్లో ప్రతిపాదించిన సామాజిక – ఆర్ధిక – రాజకీయ దృక్పథానికి సైద్ధాంతిక భూమికనేర్పరచిన కథ ‘తీర్పు’. మాష్టారి సృజనాత్మక రచనా మార్గంలో పెద్ద మలుపు. తర్వాతి తరానికి ఆయన అందించిన ముందుచూపు.

 [తెలుగు కన్నడ రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయిన ఎ.కె. ప్రభాకర్ ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు , నిషేధ గీతాలు , జాంబ పురాణం , రెండు దశాబ్దాలు కథ , బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది , నోబెల్ కవిత్వం , తొవ్వ ముచ్చట్లు  జూలూరి గౌరి శంకర్ గారి యుద్దవచనం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పుస్తకం ఇటీవలే వచ్చింది. అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జనవిముక్తికి దారి తీయాలని ప్రభాకర్ కోరుకుంటున్నారు.  ]

 

 వచ్చే వారం: అప్రజ్ఞాతం కధ గురించి ముళ్ళపూడి సుబ్బారావు 

 

తీర్పు  కథ:

 

Fusion షాయరీ on స్వప్న భంగమ్!

Pyramid-Skulls-Cezanne-l

painting : Paul Cezanne

1. బచ్ పన్ సే మనో ప్రవాహం లో సప్నో కె కష్టీ ని నడిపిస్తూనే ఉన్నాను. ప్రవాహమోసారి మా ఊరి నాగసముద్రం లా నిమ్మళంగా ఉంటే, ఇంకో సారి Pacific ocean లా గంభీరమై, ఓ సారి Red Sea లా ఎగిసిపడి, మరో సారి Dead Sea గా ఉప్పబారిపోతుంది.

Prior to my బాల్యం, there is a స్వప్నం…. ఔర్ that is the సత్యం !

2. సింధు నది నుండి హిందూ మహా సముద్రం లోకి చొరగిలబడి సట్లెజ్ సావాసంతో Mediterranean లో దూకేసి Adriatic తీరం వెంట రోమన్ Renaissance గోడల వెంట , forgotten empires గుండా forbidden times లోకి ప్రయాణించిన వో షామ్ కుచ్ అజీబ్ థీ…

Paul Cezanne చిత్రాల నిండా, Pyramid of Skulls రంగుల నిండా పరచుకున్నది స్వప్నమే… భగ్న గాయాల రాట్నమే… షోలే కా షబ్నమే!!

3. బ్యాక్ డ్రాప్ ఏదైనా, నీళ్లేవైనా అలలు మాత్రం పడవ పాదాలను ముద్దాడుతూనే ఉంటాయి. Laws of Flotationని, Flaws of Mutationనీ రంగరించాక Manchester బెరడుపై వాలిన సీతాకోక moth లా, Glass of Tearsగా ఒలికిపోయి, Mass of Fearsగా ఉద్విగ్నించి, Clash of Liersగా కొట్టుకుని ఎగబాకి Acancagua శిఖరం నుండి పట్టు తప్పి లోయలోకి జా…. రి…. పో…. తూ …., చరియలలోని ఏ చెట్టు కొమ్మకో చిక్కుకుని వ్రేళ్ళాడుతూ, ప్రవాహం కాస్తా ప్రమాదమై, కల కాస్తా వికలమై, Dream Boat కాస్తా Scream Note గా, Scapegoat గా……. క్యా హాల్ హై, క్యా దిఖా రహే హో దోస్త్!

ముఖానికి ఏక్ తరఫ్ ఈ ప్రపంచం… దూస్రా తరఫ్ ఉన్నదే స్వప్నం!!

4. స్వప్న భంగమై, గౌరీశంకర శృంగమంతా ఖండిత అంగమై, చుంబిత రంగంలోని పరిప్లవిత విహంగం కాస్తా రసజ్వలిత మృదంగమై, సర్వ హృదంగమై, గర్వ భంగమై, స్వర భంగం లోని మాన భంగం వల్ల జరిగిన మౌన భంగం నుండి వ్రత భంగమై, శ్రుత భంగమై, మృత భంగమైనాక తపోభంగపు ఒడి నుండి ధ్యానభంగపు జడిలోకి యాన భంగమై, ప్రయాణ భంగిమై, విమానయాన భంగమైనాక….

స్వప్నం, భూగోళానికి మరో అంచున కొత్త లోకం… self discovery లో ఆకాశ గోపురం !!!

5.అంగ వంగ కళింగాది రాజ్యాంగం తోడుగా రాజ్యాధికార భంగం నుండి పుట్టిన పదవి భంగం లో, పెదవి భంగం లో, కొసాకి లింగాన్నే వాటేసుకున్న మార్కండేయుని చేతుల మధ్య నలిగిపోయి,పెక్కు భంగులలోని “భంగు”లలో విచ్చుకుని, మెత్తని కత్తులను కుత్తుకలలొ గుచ్చుకుని, నల్లని రక్తాన్నీ, యెర్రని అశ్రువులనీ, పచ్చని ఆకాశాన్నీ, పసుపు గాలినీ త్రుంచి రోకట్లో వేసి దంచి ఓ “ధవళ కల”ని కందాం… వో జానేవాలే హో సకే తో లౌట్ కె ఆనా….

Mind మర్రి చెట్టు బహు గాఢ suppressionల ఊడలకి వ్రేల్లాడుతున్న impression కదా స్వప్నం, ప్రతి రోజూ reality మట్టి లోకి దిగబడాలని తపన పడుతూనే…
ఆ యాతన లోనే…
నిశ్చింతన లోనే…
చింతన లోనే …
తన లోనే…
నా లోనే….. !!

— మామిడి హరికృష్ణ

mamidi harikrishna

ఆరేసిన చేయి

drushya drudshyam

మనకెన్నో పనులు.
నిజానికి చిన్నచిన్న పనులను గమనించం.
బట్టలు ఉతకడం గురించి కూడా ఆలోచించం.
ఇప్పుడు వాషింగ్ మెషీన్ వాడుతున్నాం అనుకుంటాం గానీ, అందునా ఎంతో పని.
ఆరేయడమూ ఒక తప్పనిసరి పనే.

ఉదయం వంటపని అయ్యాక పిల్లాజెల్లా బయటకు వెళ్లాకా మహిళలు చేసే పనులు ఎన్నో చిత్రాలు.
అందులో ఒకటి ఇది. బంగారు అంచుచీర.

కానీ. ఒకటైతే చెప్పాలి ఇక్కడ.
అమ్మ. వదిన, అక్క, భార్య, చెల్లె…బిడ్డ- వాళ్లు ఎవరైనా కానీయండి.
తల్లి వలే పని చేయడం ఒక కలనేత.

ఆఖరికి పనిమనిషి అయినా సరే, ఆమె అమితశ్రద్ధగా పనిచేసే తల్లే.
మనం ధరించే దుస్తులన్నిటా కనిపించని స్వేదం, తడి ఆరిన శ్రమైక గీతికా ఆమే!

ఆమెవి ఉతికి ఆరేసే చేతులే
అవి చలికి వానక ఎండకు వెరవని చేతలు.

చిత్రమేమిటంటే, బట్టలు ఉతకడమూ, వాటిని ఆరేయడమూ మనం చిన్నప్పటి నుంచీ చూస్తూనే ఉన్నాము.
కానీ, పెద్దయ్యాక దైనందిన జీవన సమరంలో పడిపోయాక వాటి గురించి ఆలోచించనే చించం.
అందులోని కవిత్వం గురించి గమనించనే గమనించం, జీవన గ్రంథమంతా మనమే అనుకుంటే, దుస్తులను మరచి!

+++

అంగీ గుండీలు దెబ్బతినవు.
లాగు జేబులో ఒక్కోసారి ఐదు రూపాయల కాగితం మడత దొరుకుతుంది.
కానీ, రోజూ దొరకవంటే ఏమిటీ అర్థం?

అమిత శ్రద్ధగా జేబుల్లో చేతులు పెట్టే ఆ తల్లి ఇగురమే అందుకు కారణం.
కానీ అది గమనించం.

బాగా మైల పట్టిన ప్యాంటు ఒక ఉతుకుతో శుభ్రం కాదని తెలుసు.
కానీ, మళ్లీ మళ్లీ నానబెట్టి ఉతకిన విషయమూ గుర్తురాదు.

అన్నిటికన్నా చిత్రం. బట్టలు ఉతకడం, ఉతికిన వాటిని వడివెట్టి పిండటం, అవసరమైతే అటు నువ్వు ఇటు నేనూ నిలబడి వడివెట్టి పిండటం. మళ్లీ మన మానాన మనం.
ఆమె మళ్లీ ఉతుకులో, ఆరేయడంలో నిమగ్నం.

+++

కానీ, తీరుబడి విలువ తెలిసిన వాళ్లకో మాట.
బట్టలు ఉతకడం ఒక జీవకళ.
ఉతికిన బట్టల్ని జాడీయడం..తర్వాత వాటిని దులిపి ఆరేయడమూ చిత్రమే.

అయితే, ఆ దుస్తులను ఆరేయడానికి కూడా కొన్ని చోట్లు ఉంటాయి.
తీగల మీద, దండేలా మీదా ఇంకా చాలాచోట్ల.
అయితే, గాలికి కొట్టుకు పోకుండా క్లిప్పులు పెట్టడం సరే!
కానీ, బంగ్లామీద ఇట్లా ఈ దృశ్యంలో ఆమె చీరను ఆ సందునుంచి వదిలి పైకి తీయడం ఉన్నదే అలా…
ఎండ పొడలో వెచ్చని దృశ్యం ఒకటి గమనించనే గమనించం. కానీ, ప్రతిదీ ఒక చిత్రం.
ఒక తెలివిడి, అమరిక. సుతారమైన శైలి. మహిళల జీవన మాలికా సంపుటిలో దాగిన అనురాగ దొంతర.
మన దృష్టిలో పడని నెమలీక.
దృశ్యాదృశ్యం.

+++

ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టుకోవడం ఒక చిత్రమే.
అయితే, అసలు సంగతి అది కాదు. తల్లి.
అవును. మనం ఒంటిమీద ధరించే దుస్తులన్నీఇక్కడ మీరు కూర్చున్న చోట మీతో ఉన్నాయిగానీ అవన్నీ అక్కడ తడిసాయి. ఆరాయి. బలంగా వడితిప్పబడినాయి. ఒక్క ఉదుటున దులుపబడి తీగల మీద నిశ్చలంగా ఆరవేయబడినాయి. అవి గాలి మాటుకు రెపరెపలు పోయినా పోయాయి. నీడలోనూ అవి సేద తీరే ఉంటాయి.

ఇక ఇంట్లోని మనుషుల్లా లేదా ఒక పుస్తకంలోని కవితల్లా అవన్నీ ఒకదాంతో ఒకటి రహస్యంగా అనుభూతులు పంచుకునే ఉంటాయి. ప్యాంటు, షర్టు, చీర. రవిక…ఏమైనా కావచ్చు

అవన్నీ వయోభేధాల జీవన వలువలు. విలువలు.+++ఒక్కమాటలో కుటుంబ సభ్యులందరికీ చెందిన దుస్తులన్నీఒకరి చేతిలో పిండి వారి చేతిలో ఆరేయబడినవే అని తెలిస్తే, అవే మన ఒంటిపై నిలిచినవీ అని గనుక గమనిస్తే, ఆఫీసుకు వచ్చేముందు దండెం మీదికి చూపు వాలవలసిందే.  వీధుల్లోకి వచ్చాక బంగ్లాపైకి చూడవలసిందే.

తల్లులు కనిపిస్తూనే ఉంటారు.
అపుడు మన ఒంటిపై స్పృహ కలిగి, ‘ఓహో’ అనుకుంటే మన మనసుకు నిజంగా శాంతి.

ముఖ్యంగా ఈ చలికాలంలో ఒకమాట చెప్పాలి. మన దుస్తులన్నీనూ వెచ్చగా ఉన్నయి అనుకుంటే…
బహుశా పైన ఒక సుదీర్ఘ కవితలాగా తల్లి ఆ చీరను ఆరేస్తున్నదే…ఆమె స్వేదంతో మరింత గాఢంగా మారి ఉండటం వల్లని?  ఏమో! అవి ఈ చలికాలాన వెచ్చగా అందుకే మారి ఉన్నాయి కాబోలు అనిపిస్తోంది.
వాటిని చిత్రంలో పటం కట్టలేకే ఈ ‘దృశ్యాదృశ్యం’ అనీ చెప్పబుద్ధవుతున్నది.

~ కందుకూరి రమేష్ బాబు

బతుకు బొంగరంపై ఫోకస్ ‘ప్రపంచాక్షరి’

గరిమెళ్ళ నాగేశ్వరరావు  ప్రపంచాక్షరి కవితా సంపుటి 1997 నుండి 2008 ల మధ్య దశాబ్ద కాలములో వ్రాసిన 51 కవితల సమాహారం. ప్రపంచాక్షరి అన్న పేరుతోనే వినూత్నంగా విశ్వమానవ కళ్యానానికి శ్రీకారం చుట్టిన ఈ కవి దృక్కోణం గురించి పూర్తిగా ఆశ్చర్యం నుండి తేరుకోకముందే, కవితలకు ముందూ వెనుకా ఉన్న పేజీలలో పొందుపరచిన అవార్డులు స్వీకరిస్తున్న ఫోటోలు, పురస్కారాల వివరాలు ,పెద్దలు వ్రాసిన మాటలు ఇవన్నీ కలిసి ఈ మాస్టారి అప్రతిహత బహుముఖ ప్రజ్ఞ ‘రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకునే వరకూ’ సాగి ఇంకా అదే వేగం తో పరుగెడుతోందని తెలిసి మరెంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

కవి స్వయంగా రూపొందించిన ముఖచిత్రం ఈ కవితా సంపుటి శీర్షికకు తగ్గట్టూ శాంతి (పావురం), వీణ (కళ), బాలిక (స్త్రీ హిత), బిడ్డను పొదవుకున్న మైనర్ తల్లి ( అవాజ్య ప్రేమ)  దీన బాలుడు (అన్నార్తుల వేదన) ప్రతీకలు సృజించి  లోపలి  కవితా వస్తువుల గురించి చెప్పకనే చెబుతుంది .

కవిత్వాన్ని ఒక రైలు బండిలా మార్చుకుని నేల నలుచెరగులా దాన్ని కవి నడిపించడమే కాకుండా, పట్టాలు తప్పే ప్రమాదమున్న సందర్భాలను ముందే అంచనా వేసి తదనుగుణంగా హెచ్చరికలు చేసి, ఆగే ప్రతి స్టేషన్ గురించి కూలంకషంగా చెబుతూ, ఎక్కే దిగే ప్రయాణికుల భద్రతను కాంక్షిస్తూ, వారి గాధలని ఆలపిస్తూ కవి చేసిన చైతన్య ప్రయాణమే ప్రపంచాక్షరి. ముల్లు మొదలు తల వరకూ బొంగరానికి తాడుని పకడ్బందీగా చుట్టి, గచ్చు నేల మీదికి లాఘవంగా విసిరి తాడు లాగి ఆ బొంగరం చేసే గింగిరాల వీరంగాన్ని వీక్షిస్తే ఆ ఫోకస్ (తదేకత) లో ఎంత సంతృప్తి కనబడుతుందో… ప్రతి కవితలో కూడా అంతే చక్కటి ఫోకస్ ని దట్టించి పాఠకుడి మనోఫలకం మీద తిప్పగలగటం గొప్పగా గోచరిస్తుంది. అందుకే ఈ పుస్తకాన్ని ఊసుపోనప్పుడో, నిద్రపోవడానికి ముందో చదవాలనుకునే కన్నా, రోజంతా శ్రమలో మునిగి తేలిన రాత్రి ఎనిమిదిగంటల పాటూ నిద్ర పోయి మర్నాడు ఉదయం లేచిన తరువాత తిరిగి చైతన్యానికి శ్రీకారం చుట్టే సమయాలలో చదివితే చాలా బాగుంటుందనిపిస్తుంది.

Cover Page Prapanchakshari

ప్రారంభం లోనే స్వాగతం పలికే ‘ప్రపంచాక్షరి’శీర్హిక కవిత, కవి అతని కవిత్వం  విస్తృత పరమార్ధాన్ని, విశాల భావజాలాన్ని, వస్తు సందర్శనాన్ని బలీయంగా చెబుతుంది. “బండరాళ్ళ… మొండి శిలల మీద వాక్యాలు జల్లి కన్నీరు చెమర్చడం నేర్పాను.… అక్షర మూర్తిని, నేను కవిని” అని తనను గురించి పరిచయం చేసుకుంటూనే కదన రంగం లో ఆయుధాన్ని పూనిన సైనికుని ఆత్మవిశ్వాసం మాదిరిగా ఉత్సాహం తో కవిత్వాన్ని చెబుతారు.నెల్సన్ మండేలా, రెండు జర్మనీల మధ్య కూలిన అడ్డుగోడ, సోమాలియా ఆకలి, హిరోషిమా బూడిద వగైరా చారిత్రక సందర్భాలను ఆయా వస్తు నేపధ్యాల ప్రయాణంతో కవితను ఆవిష్కరించిన తీరు అబ్బురపరుస్తుంది. అందులో …

నదీ తీర తవ్వకాలలో బయల్పడిన

నాగరికతల ముఖాల మీద

నవ్విన సంతకాన్ని నేను

 

జైలు గోడల మధ్య సూర్యోదయమయిన

నెల్సన్ మండేలా బిగిపిడికిలి విప్పిన చప్పుడులో

వినిపించిన విజయధ్వానాన్ని

 

కల్పనా చావ్లా రెప్పల వెనుక చేజారిన స్వప్నాన్ని

సునీత కళ్లతో నేలకు చేర్చినప్పుడు

మురిసి పోయిన తారకల్లో మెరిసింది నేనే

 

అంతరిక్షం నుండి పాతాళం వరకూ

… శాంతి కోరి తపిస్తూ జపించే …ప్రపంచాక్షరి ఇది

 

మరొక కవిత ‘సైబర్ కూలీ స్వగతం’ లో డాలర్ల దాహంతో పరాయి దేశానికి అంగలార్చిన సాఫ్ట్ -వేర్ ఇంజనీర్ దైనందిన జీవితం ఎంత యాంత్రికంగా సాగుతుందో వివరంగా చెప్పారు. “ అత్యాధునిక శ్రామికుణ్ణి..కీ బోర్డు దేహాన్ని మీటుతూ కొత్త సృష్టికి ఊపిరి పోసే కృత్రిమ బ్రహ్మని..” అని అతని లోకి పరకాయ ప్రవేశం చేసి స్వగతంగా పూర్తిగా చెప్పాక,దూరాన అతను కోల్పోతున్న దగ్గర వారి గురించి టార్చ్-లైట్ వేసి మరీ చూపించి అతను తిరిగి తనవారి మధ్య కు వచ్చి అదే వృత్తిని కొనసాగించే వీలు ఎంత సాధ్యమో “అవును ప్రపంచం పల్లెటూరయ్యాక పొలిమేరలు దాటాల్సిన పనేముంది?” అని  ప్రశ్నిస్తూ చెబుతారు.

డౌన్-లోడ్ చేసిన ఫైల్లో … పెరటి చింతచెట్టు

కొత్తగా చిగురించినట్టు కనిపిస్తోంది

 

ప్రేమ ఫైల్ ఓపెన్ చేసేందుకు

పాస్వర్డ్ ఎక్కడా దొరకడం లేదు

 

అభిమానం ఆచూకీ రీసైకిల్ బిన్ లోనైనా

రీస్టొర్ చేసేందుకు అందదు

 

అని కంప్యూటర్ పదాల పరిభాషలో యాంత్రికత్వాన్ని నిరసించి, ద్వేషించి బాధపడి… పొలిమేరలు దాటాల్సిన పనేముంది?” అని తనకి తాను పూర్తిగా సమాధానపడటం ప్రశ్నతో ముగుస్తుంది.

ఈ రెండు కవితలలోనూ కదిలించిన చరిత్ర, కదులుతున్న వర్తమానం అంశాలుగా కవి చేసిన ప్రయాణం అతని తపననీ, జ్ఞానాన్ని మనముందు రంగరించి పోస్తాయి.

అనంత జీవన యానంలో శిధిలమైపోతున్న రంగుల స్వప్నాలని ప్రస్తావించి మానవత్వపు మేడొకటి నిర్మించాలని సూచించిన “ మా విద్వి షాహహై ” అనే కవితా, తడారిపోతోన్న మట్టి పొరలల్లోంచి ప్రపంచానికి పట్టెడన్నం పెట్టడానికి రూపాయి చూపులను మరోసారి మట్టిదారి పట్టించాలని చెప్పే “ మట్టిదారిలో మరోసారి..” లాంటి ప్రతి కవిత లో సమస్యలను ఎత్తి చూపించడమే కాకుండా పరిష్కార మార్గాలనూ సూచించారు.

‘ ప్రశ్నలు ‘ లో ఇరాక్ మీద అగ్ర రాజ్యం దాడినీ, ‘ గుండెలోతుల్లోంచి ’ లో మన విలాస స్వార్ధాలకు ప్రకృతిలో కోతీ, పామూ, ఆవు, కప్ప, ఉడుత, తూనీగ  లాంటి జీవుల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా, నిర్లజ్జగా ఆహుతి చేస్తున్న తీరునీ చదివాక, చుట్టూ పేరుకున్న హింసలో కలిసిపోయి బతికేస్తున్న మనకి గగుర్పాటు కంపరం కలుగుతుంది.

అమ్మ, మాస్టారుకో పద్యం, పండగ, మొదలైన జ్ఞాపకాలలో సౌమ్యంగా ఉన్నత మూర్తులకు చేసిన సన్మానాలను చూడొచ్చును.

ఓటు వజ్రాయుధాన్ని సరిగ్గా ఎక్కు పెట్టమని నిర్దేశం చేసిన ఆ కలం తోనే, పిచ్చుకల లాంటి అంతరించి పోతున్న పక్షుల మీద కాలుష్యపు వజ్రాయుధాల్ని ఎక్కుపెట్టొద్దని చెప్పి కట్టడి చేశారు.

ప్రేమ పేరుతో స్వైర విహారం చేస్తున్న ప్రేమ-చిరుతల పట్ల మిక్కిలి జాగురూకతతో వ్యవహరించాలని ‘లేడీ (ఆడ)’ పిల్లలను కవి హెచ్చరించిన తీరు ‘ప్రేమ-చిరుత’ కవితలో సమగ్రంగా ఉంది. ఇది ఇప్పటి కాలానికి…అందరు ఆడపిల్లలకూ తప్పని సరి పాఠం. ఈ కవితను రెండు తెలుగు రాష్ట్రాలు ఇంటర్మీడియట్ లేదా పదవ తరగతి తెలుగు వాచకములలో చేరిస్తే బాగుంటుంది.

‘నగరంలో ఇప్పుడు…

ప్రేమ చిరుతలు తిరుగుతున్నాయి

“లేడీ” పిల్లల్లారా….జాగ్రత్త!’

అని ప్రారంభమవుతుంది ‘ప్రేమ-చిరుత’ కవిత.

‘ ప్రేమంటే వెంబడించిన వాడి వెంట

అడుగేసి గుడ్డిగా నడుస్తూ…

దారి తప్పిపోవడం కాదు కదా?!’

ప్రాణాలు తియ్యడం, తీసుకుంటామని భయపించడం ,యాసిడ్ దాడులు చెయ్యడం, ఇంట్లో వారినీ, బంధు మిత్రులనీ, చుట్టు పక్కల వారినీ భయభ్రాంతులని చేసి మరీ అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయే పైశాచిక ప్రేమల గురించి ఆడపిల్లలు తప్పని సరిగా అలెర్ట్ కావాలి.

మొదట ‘ప్రపంచాక్షరి’ కవిత లో కవిత్వ పరమార్ధాన్ని చెప్పి, అఖరున ‘ కలాన్ని మోసే వాడు ‘ కవితలో ” మిత్రమా కలాన్ని మోయడం కాలాన్ని మోసినంత సులువు కాదు” అనడం చదివాక ఈ రెండు కవితలూ అటూఇటూలుగా  మిగిలిన కవితలతో చక్కగా అల్లిన దండ ప్రపంచాక్షరి కవితా సంకలనమని అవగతమౌతుంది.

చీకటికి ఆనవాలమవుతున్న అనైతికత, నిర్లక్ష్యం, స్వార్ధం, అవకాశ ధోరణులు; వెలుగు దివిటీలు పట్టుకు తిరిగిన నాయకులు, కవులు… ఇంకా వెలుతురు మయం గావించాల్సిన మూల మూలల్లోని విషయాలు; కూలగొట్టవలసిన అడ్డుగోడలు; వేయ వలసిన వంతెనలూ; కట్టాల్సిన ఆనకట్టలూ, నిర్మాణాలు వీటన్నీంటి గురించి ప్రపంచాక్షరి కవితలు అనేక విషయాలను చెప్పకనే చెబుతాయి.

“చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా “ అని కవి గరిమెళ్ళ నాగేశ్వర రావు గారు పిలిచి చూపించిన విషయాలు, వెలుతురు ప్రసరించిన దారులూ, కొనియాడి అధిరోహింప జేసిన ఆదర్శవంతమైన శిఖరాలు బహుదా ప్రశంసనీయం, సర్వదా అభినందనీయం.

కవి తపన, తదేకత, మమేకత ,సంస్కరణాభిలాష,వస్తుగతజ్ఞానము మొదలైన అనేక విషయాలను ఈ కవితా సంపుటి ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తుంది. విలువలు ప్రాతిపదికగా కవిత్వాన్ని ఆస్వాదించి అనుభూతించి ఆ మార్గాలను అనుసరించాలనుకునే ప్రతి ఒక్కరి దగ్గరా తప్పక ఉండాల్సిన పుస్తకం ఈ‘ ప్రపంచాక్షరి ‘.

ప్రతులకు సంప్రదించండి.

Email: gvsnrao08@gmail.com

 -నారాయణ గరిమెళ్ళ.

Photo Narayana Garimella

అంతర్నేత్రపు తల్లడిల్లిన చూపులు-“జీరోడిగ్రీ”

10653339_716759828412278_2494152736493877358_nకవిత్వాన్ని మామూలుగా చదవటం అర్థమయ్యాక ఎక్కడైనా,ఎప్పుడైనా ఒక వినూత్నమైన వస్తువో,నిర్మాణమో శైలినో కనిపిస్తే మనసు ఆహ్లాద పడుతుంది.ఈ క్రమంలొ సాహిత్యాంశాలగురించి,సాహిత్యేతరాంశాల గురించి రెండిటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం మోహన్ రుషి కవిత్వం కలిగిస్తుంది.రుషి నిశ్చయంగా ఒక దు:ఖవాతావరణం లోని సంకోచ వ్యాకోచాలను అనుభవిస్తాడు.ఈ సంఘర్షణ వెనుక ఉండే ఒక గంభీర నిశ్శబ్దాన్ని కవిత్వం చేస్తాడు.అందువల్ల కవిత్వానికి దానివల్ల ఉత్పన్నమైన మానసిక స్థితికి ఒక లంకెను జోడించి “కాలిక స్పృహ”తో మాట్లాడుకోవాల్సిన సమయం.

రెండవది తనకు సరిపోకున్నా ఏదో ఒక నిర్మాణంలోకి ఒదిగిపోకుండా తనగొంతుకకుతగిన పరికరాలను తానుగా తయారు చేసుకుని లేదా ఎన్నుకుని నిలవడం.స్పష్టంగ ఈరెండు అంశాలు రుషిని ప్రతేకంగా చూచేలా చేస్తాయి.ఒక సామాజిక వాతావరణాన్ని,ఒక సాహిత్యవాతావరణాన్ని రెంటినీ గమనించి ఆతాలూకు స్పృహనుంచి తానుగా వ్యక్తమౌతున్నాడు.

రుషిని అర్థం చేసుకోడానికి అస్తిత్వ వాదం(Existentialism)కొంత ఉపయోగ పడుతుంది. హైడెగర్ (Martin Heidegger)మానవాస్తిత్వం అనేక సంభావ్యతల క్షేత్రం అన్నాడు.సంభావ్యత(Possible)మనిషిలోని నిశ్శబ్దశక్తి.ఏక కాలంలో మనిషిలో అనేకాంశాలుదాగుంటాయి.కటి ఉపయోగంలో ఉన్నప్పుడు మరొకటి నిశ్శబ్దంగా ఉంటుంది.ఈ అంసం నిశ్శబ్దాన్ని భరించలేదు.ఈ నిశ్శబ్దంలో మనిఉషి అర్థమానవుడుగా,పార్శ్వమానవుడుగా ఖండ మానవుడుగా జీవించాల్సి వస్తుంది.రుషి కవిత్వం “జీరోడిగ్రీ”లో “సోమవార మహత్మ్యం(పే.76),8 pm(పే.82)నో అదర్ గో (పే.77)మొదలైఅన కవితలన్నీ ఇలాంటివే.ఒక అంశానికి కట్టుబడి బతికే యాంత్రిక యాంత్రిక జీవన విరక్తి(Aversion of mechanical life)వీటిల్లో కనిపిస్తుంది.

“బతికే ఉన్నందున పాపానికో, పుణ్యానికో/
వెళ్ళే తీరాలి, ఆఫీసులకీ, స్కూళ్ళకీ-/
పెద్దగా చెయ్యడానికేం ఉండకపోవచ్చు కానీ/
ఉండాలి అక్కఢ మెకానికల్ గానో, మెకాలేకు
లాయల్ గానో”- -(సోమవార వ్రత మహత్మ్యం)

పొద్దున ఇటూ సాయంత్రం అటు/ఉరుకుతుండాలి/
ఆలోచనకు అవకాశమివ్వకుండా”-(8pm)
“నీ ప్రపంచంలో నువ్వు ,నా కరాబ్ దిమాక్ లో నేనూ/పొద్దున్నే లేచిన తర్వాతకూడా బతికే ఉన్నాం/ఈ జీవితానికి ఈఅదృష్టం చాలదా ?”-(పొడిచిన పొద్దు-80 పే.)

“ఎవరిగురించి చూస్తున్నావు/
నిన్ను నిన్ను కాకుండా చేసిన ఈ మధ్యాహ్నం పూట ?!”-(నువ్విలా ?-30పే.)

1655904_593020304119565_1297827243_n
జీవితంపై పెంచుకున్న అపేక్షని,దాన్ని అందుకోవడంలో ఉండే ఇబ్బందిని రుషి కవిత్వం చేస్తాడు.జీవితంలో యాంత్రికతకు,ఇష్టానికి మధ్య సంఘర్షణను వ్యక్తం చేస్తున్న ఈ వాక్యాల వెనుక ఒక పెయిన్ ఉంది.రుషి స్వీయ జీవితాన్ని కూడా ఒక దృశ్యం చూసినట్టుగా చూస్తాడు.ఇది ఒక్కోసారి ఆనందాన్ని,విసుగును ఇవ్వొచ్చు.కీర్క్ గార్డ్ చెప్పిన అస్తిత్వ దశల్లోరెండవది బౌద్ధిక సౌందర్యం(Intellectual aesthete)ఇందులో మనిషి జీవితానికి వెలుపల ఉండి గమనిస్తాడు.ఈ వాక్యాలు ఇలాంటివే.ఈ వాక్యాలు అలాంటివే.కొన్ని సార్లు తృప్తిని ప్రకటించిన సందర్భాలూ ఉన్నాయి.
“ఏమికావలె ఇక ఈ సమయానికి జీవితానికి ?/పై గుండీ విప్పి,అంగీ /వెనక్కి లాగితే తగిలే చల్లగాలి “-(పే.56)
“ఆటోకిందా మీదా/అయినప్పుడు “రోడ్డుసల్లగుండ”అంటూ/
కోపంలోనూ నోరుజారని వాళ్ళు”-(నేర్చుకోవాలి.పే.86)
కవిత్వాన్ని చెప్పడానికి ఉపయోగించుకునే పద్ధతిని,పరికరాలను కూడా గమనించాలి.భాష ఆలోచన రెండు వేరుకాదని(Language is implict thought)అస్తిత్వ వాదుల అభిప్రాయం.ఆలోచనకు దాని ఆవేశ స్వభావాలకు వెలుపల రుషి భాష అలంకారాలను తొడుక్కోదు.చూడటానికి శుద్ధవచనం(Plain prose)లా కనిపిస్తుందికాని,సాంద్రమైఅన వాక్య సౌందర్యం ఉంది.మనసులోని స్వభావసారాన్ని కవిత్వం చేయడం వల్ల సౌందర్యమూ ఆమేరకే కనిపిస్తుంది.జ్ఞానం ప్రేరేపించే ప్రయత్న పూర్వక కళావాక్యాల నిర్మాణం లేదు.కొన్ని సార్లు విలోమ వాక్యాలు రాయటం కనిపిస్తుంది.
1″ఏమికావలె ఇక ఈ సమయానికి జీవితానికి ?”-(పే.56)
2.”బతికే ఉన్నందున పాపానికో, పుణ్యానికో/
వెళ్ళే తీరాలి, ఆఫీసులకీ, స్కూళ్ళకీ-/-(పే.76)
సాధారణంగా ఈ వాక్యాలు”ఇక ఈసమయానికి జీవితానికి ఏమికావాలె”/పాపానికో పుణ్యానికో బతికి ఉన్నందున ఆఫీసులకీ,స్కూల్లకీ వెళ్లేతీరాలి”ఈ క్రమంలో ఉంటాయి..వాక్యంలోని పదాలస్థానాలను మార్చిరాసి కవితాత్మకతను అనుభవించడం ఇక్కడ కనిపించేది.వాక్యాలు సంభాషణాత్మకం కావడం వల్ల చిన్న చిన్న వాక్యాలుగా రాయటం,కొన్ని సార్లు పదసమ్మేళనాలని,ప్రశ్నా వాక్యాలనీ ఎత్తుకోవడం కనిపిస్తుంది.ముఖ్యంగా శబ్దంలో ఉండే చమత్కారాన్ని బాగా ఉపయోగించుకుంటారు.
“మెకానికల్ గానో/మెకాలేకి లాయల్ గానో..(పే.76)మరణ జన్మ సంయోగక్రియ(పే.70)నరగ్రహ కూటమి-ఇలాంటివి అనేకంగా కనిపిస్తాయి.ఇదే సందర్భంలో గంభీర సౌందర్యం గల వాక్యాలూ,పదబంధాలూ కనిపిస్తాయి.ఆకాశదారులు(పే.79)జీవితగణితం(పే.16.పే.)స్టీరియో నవ్వులు(పే.13)లాంటి ఆధునిక పదబంధాలూ కుమ్మరిస్తాడు.రుషిలో తనదైన అభివ్యక్తి ముద్ర ఉంది.అభివ్యక్తి,నిర్మాణం,వాక్యసంవిధానాలకు సంబంధించిన చర్చ జరిగితే ఒక అంచనాలో మోహన్ రుషిలాంటివారు ఒక మలుపులో నిలబడతారు

– ఎం.నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

కూలి బతుకు

Kadha-Saranga-2-300x268

సూరీడు సరిగ్గా నడినెత్తి మీదకొచ్చాడు. మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల ఎండ ఇరగ్గాస్తుంది. మేనెల్లో ఎండలు ఉండాల్సిన దానికంటే ఈ సంవత్సరం కాస్త ఎక్కువగానే ఉన్నాయి. చెమట పట్టడం వలన సిమెంటు పొడి మొహానికి అతుక్కుపోయి రాముడి మొహం జిడ్డుగా ఉంది. తలకు చుట్టుకున్న తువ్వాలు గుడ్డను విప్పి, ఆ తువ్వాలుతో మొహం తుడుచుకున్నాడు. చెమట తుడుచుకున్నాడు గాని జిడ్డుమాత్రం పోలేదు. ఆ జిడ్డు మొహంతోనే అడ్డ పారేసి సిమెంటును ఒక చోటకు లాగాడు. అప్పటికే మూడు సార్లు సిమెంటును కలతిప్పినా ఇంకా అక్కడక్కడ ఇసుక కనిపిస్తూనే ఉంది.

అంతలో ‘రేయ్… బామ్మార్ది… సిమెంటురా… ఈడ సిమెంటు అయిపోయి చాలా సేపయిందిరా మామా… తొందరగా తీసకరా…’ అని లోపలున్న బేల్దారి శీను అరిచాడు. ‘ఆ మామా… తెచ్చాన సామి. సిమెంటు కలిపి, కుంది తీసి నీళ్ళు పోసినా… రెండు నిమిషాలబ్బా…’ అని రాముడు శీనుకు చెప్పాడు. ‘దా…దా… నేను ఇంతలోపల ఒక దమ్ము లాగిస్తా… ’అని చెప్పి చొక్కా జేబులో ఉన్న బీడి తీసి వెలిగిచ్చాడు. ఒక్కసారి గట్టిగా ఆ బీడిని లాగి పొగ ఊదేతలికే ఆ పొగ నీళ్ళలో వేగంగా పాకిన పాములాగా మెలికలు తిరుగుతూ ఒక మూలకు పోయింది. సిమెంటులో నీళ్ళు పోసినాడే గానీ రాముడి మనసంతా గందరగోళంగా ఉంది. ఏమి దిక్కు తోచడం లేదు. పనిలో ఒంగినాల నుంచి రాముడి మనసు అదోలా ఉంది. ఎంత వద్దనుకున్నా నిన్నటి సంఘటనే గుర్తుకొస్తావుంది. ఎంత మరిచిపోదామన్నా ఆ సంఘటనే గుర్తుకు వస్తావుంది. ఆ సంఘటన వలన రాత్రికూడా సరిగా నిద్రపోలేదు.

’ఏం రా… సిమెంటు రెడీనా?’ అని శీను ఒక్కసారి గట్టిగా రాముడిని పిలిచాడు.

’ఆ మామా… రెడీ… కావాలా..’

’తొందరగా తీసకరా… పద్దన్నుంచి ఇప్పటికి సరిగా చదరం పూతకూడా జేయ్ లా… మీ తాత వచ్చినడంటే నీకు నాల్గు, నాకు నాల్గు సింగారాలు ఇచ్చడు.. తొందరగా తీసుకురా…’

’ఇదోబ్బా… కానీ మరి… అన్నానికి ఇంకా అర్ధ గంట టైముంది. ఈ లోపల ఈ గోడ పూర్తైతది. గబగబ కాని మరి. సిమెంటు రెడీ. నేను గబగబ అందిచ్చా… నీదే లేటు మరి’ అనిచెప్పి సిమెంటు గోలం తెచ్చి శీను నిలబడిన సారవ మీద పెట్టాడు రాముడు.

’సరే మరి అందీ… నువ్వు కొంచెం ఉషారుగా ఉంటే ఈ పాటికి సుమారుగా అయి పోయిండేది. నువ్వేమో పద్దన్నుంచి మన్ను తిన్న పాము మాదిరి మెత్తంగుండావ్…’ అని రాముడితో చెప్పి గోలంలోని సిమెంటు తీసుకొని గోడకు లకారిచ్చడం మొదలు పెట్టాడు శీను. పది, పదైదు గోలాల సిమెంటు అందించి గోడకు కాలు ఆనించి నిలబడ్డాడు రాముడు. గోడకు సిమెంటు లకారించడం పూర్తైంది. గజంకట్టె తీసుకొని గోడకు గజం ఈడ్చడం ప్రారంభించాడు శీను. గజం ఈడ్చడం పూర్తైం తరువాత గోడకు ఉన్న హెచ్చుతగ్గులకు మళ్ళీ సిమెంటు లకారించాడు.

’రేయ్ బామార్ది… చక్కతాపి తీసకరా… ’ అని రాముడిని శీను పిలిచాడు.

తలపైకి పెట్టి పైనున్న స్లాబు వైపు చూస్తున్న రాముడు ఒక్క సారిగా శీను వైపు తిరిగి ’ఆ మామా…’ అని అన్నాడు.

’చక్కతాపిరా సామి’ అని మరో సారి గట్టిగా అరిచాడు శీను.

’ఇదిగో..’

’పద్దన్నుంచి ఎదో ఒకమాదిరిగా ఉండావురా… ’ అని చక్కతాపి తీసుకొని గోడకు చక్కపట్టాడు. అక్కడక్కడా నొక్కులు మాదిరిగా ఉండే సరికి మరోసారి తాపితో సిమెంటు తీసుకొని నొక్కులకు సిమెంటు పెట్టి చక్కపట్టాడు. ఇసారి శీను అడక్కముందే స్పాంజిని నీళ్ళల్లో పిండి చేతిలో రెడీగా పట్టుకుని ఉన్నాడు రాముడు. ’ఆ స్పాంజి ..’ అని శీను అడగి అడగక ముందే చేతిలోని స్పాంజిని బేల్దారి చేతికిచ్చాడు రాముడు. అలా నాలుగైదు సార్లు స్పాంజిని నీళ్ళలో పిండి శీనుకు అందించాడు రాముడు. సగం గోడ పూత దాదాపు పూర్తైంది. గట్టున ఉన్న కప్ప నీళ్ళలోకి దూకినట్టు అప్పటి దాకా సారవ మీద ఉన్న శీను ఒక్క ఉదుటున ఇసుకలోకి కిందికి దూకి ’టైం ఎంతైందో చూడు’ అని రాముడిని అడిగాడు. రాముడి దగ్గర కూడా వాచి లేకపోవడంతో ’ఉండు చూసొచ్చా!’ అని చెప్పి పక్కింట్లో ఉన్న అబ్బాయిని ’అన్నా టైమెంతా?’ అని అడిగాడు. అతడు వెంటనే చేతిలో వాచిని చూసి ’పన్నెండు ముక్కాలు’ అని రాముడితో చెప్పాడు. రాముడు శీను దగ్గరికి వచ్చి ’మామా ఇంకా ఒంటి గంటకు పదహైదు నిమిషాలుంది సామి. ఏం చేద్దాం?’ అని బేల్దారిని అడిగాడు. పని దగ్గర అంతా కూడా బేల్దార్లు చెప్పినట్లే వినాలి. ముఖ్యంగా చిన్న కూలోల్లు, పెద్దకూలోల్లు బేల్దార్ల మాటలు తు.చ. తప్పక ఆచరించాలి. పని దగ్గర మేస్త్రి తరువాత బేల్దారి మాటే వేదవాక్కు. వారు ఏం మాట చెబితే ఆ మాట కూలోల్లకు శిలాశాసనం.

’ఇంకా పదైదు నిమిషాలుంది. సరే ఒక పని చేయి… ఇప్పుడు అర మూట దాకా సిమెంటుంది. ఇంకొక మూటకు ఇసుక కొలిచి సిమెంట్ కలుపు. మధ్యాన్నం వస్తానే పని జరుగుతది. సిమెంటు కలిపిన తరువాత అన్నానికి చాలిద్దాం’ అని శీను రాముడితో చెప్పాడు. మాములుగా అయితే అరమూట సిమెంటుతో గంట పని జరుగుతుంది. ఆ పదైదు నిమిషాలు పనిచేయటం ఇష్టం లేక సిమెంటు కలపమని రాముడితో చెప్పాడు. తమకు పని చేయటం ఇష్టం లేనప్పుడు చిన్నకూలోల్లకు, పెద్దకూలోల్లు ఏదో ఒక పని చెప్పి తాము బాతాఖాని చేయడం బేల్దార్లకు మామూలే. ’ఆ…సరే మామా’ అని మూటకు పదైదు గోలాలు ఇసుక కొలిచి కుప్పగా పోసి, దాని మీదకు సిమెంటు మూటను లాక్కొచ్చాడు రాముడు. సిమెంటు మూటను విప్పటానికి పదునైన రాయి కోసం అంతా పరికించి చూశాడు. ఎక్కడా కనిపించకపోయే సరికి ఇంతకు ముందు సిమెంటు మూట విప్పినప్పుడు ఒక సూదైన రాయిని తెచ్చి గూట్లో పెట్టాడు. వెళ్ళి గూట్లో రాయి తీసుకొచ్చి సిమెంటు మూట ఒక కొసన చిన్న దారాన్ని కోశాడు. దానితో మొత్తం దారమంతా సులభంగా ఊడొచ్చింది. తరువాత అదే మాదిరిగా రెండో కుట్టును కూడా విప్పదీశాడు. సిమెంటు సంచిని పైకెత్తి సిమెంటు పొడి మొత్తాన్ని ఇసుక పైకి గుమ్మరించాడు. సిమెంటు మూట ఎండలో ఉండటం వలన ఒక్క సారిగా సిమెంటు పొడి కాళ్ళకు చాలా వేడిగా తాకింది. కాళ్ళతో సిమెంటును అటు ఇటుగా నెరిపెతలికే కాలుతున్న పెనం మీద కాలును పెట్టినట్లనిపించింది రాముడికి. తలపైన భానుడు, కింద సిమెంటు పొడి ప్రతాపం చూపుతుంటే వీరికి సావాసగాడైనట్లు వాయుదేవుడు కూడా చడిచప్పుడు చేయకుండా ఉన్నాడు. అన్నంవేళ కావడంతో ఆకలితో ఉన్నరాముడు వీరందరి బాధితుడైనట్లు నీరసంగా సిమెంటును కలిపి, కుంది కొట్టి, అందులో రెండు బిందెలు నీళ్ళు పోశాడు. అప్పటికే కాళ్ళు మొహం కడుక్కొని శుభ్రంగా తయారైన శీను ’నేను ఇంటికి పోయి అన్నం తిని గబక్కనొచ్చాగానీ, నువు తిని సిమెంటును అంతా కలిపి రెడీ చేసిపెట్టు’ అని సైకిల్ తీసుకొని దావపట్టాడు. రాముడు కూడా డమ్ములో ఉన్న నీళ్ళు తీసుకొని కాళ్ళు మెహం కడుక్కొని, అన్నం తెచ్చుకొని, మూలన ఒక చోట కూర్చున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న ఒక కుక్క ’నాకు ఒక ముద్ద పెట్టవా’ అన్నట్లు ఎదురుగా నిలుచుంది. దానికి ఒక ముద్ద పెట్టి, చూస్తున్నాడు. ఆ అన్నం ముద్ద తిని ఇంకా పెట్టమన్నట్లు తిరిగి రాముడివైపు చూసింది. ఇక ఈ కుక్కపోదని తెలిసి, పక్కనున్న గజం కట్టె తీసుకొని ’ఏయ్…పో… పో… ’అని గట్టిగా తరుముకునే లోపల ఆకుక్క అక్కడనుంచి వెళ్ళిపోయింది. అప్పటికే రాముడు ఆకలితో నకనకలాడుతుండడంతో అన్నం దగ్గర పెట్టుకొని తనకిష్టమైన చనిక్కాయల కారాన్ని అన్నానికి దట్టంగా కలిపి తినడం మొదలుపెట్టాడు. ఆకలిమోపున గబగబ అన్నం ముద్దలు నోట్లోకి పోతున్నాయి. అతడు అన్నం తినేవిధానం చూస్తే, ఇదేమిటి? ఇంత ఆత్రంగా తింటున్నాడు? అనేలా తింటున్నాడు. బహుశా ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందేమో! అన్నం తినడం పూర్తైన తరువాత గిన్నెను ఇసుక వేసి ఒకటికి రెండు సార్లు కడిగి, వైరుబుట్టలో పెడుతుంటే, ఆ గిన్నెలో తన మెహం కనిపించింది. మొహానికి నాలుగైదు సార్లు సబ్బును రుద్దీ, రుద్దీ మెహం కడుక్కొని కాలేజికి వెళ్ళేవాడు, ఇప్పుడు పని సాలిచ్చి, కనీసం మొహం మీద నీళ్ళుకూడా పోసుకోకుండానే అన్నం తిన్నాడు. ఆ విషయం గుర్తొచ్చి తనలో తానే ముసిముసిగా నవ్వుకొన్నాడు. నడుముకు కట్టుకున్న తువ్వాలు గుడ్డను ఇసుకలోపరిచి, నడుం వాల్చాడు. మామూలుగా అయితే మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు. రాత్రి సరిగా నిద్రపోకపోవడం వలన కొంచెం అలసినట్టుగా ఉంది. దీనికి తోడు ఈ రోజు ఎవరూ చిన్న కూలోల్లు కూడా రాలేదు. ఒక్కడే కావడం వలన పని ఎక్కువై కొంచెం అలసినట్టుగా ఉంది. పడుకుందామని కళ్ళు మూసుకున్నాడు. కాని నిన్న జరిగిన సంఘటన పదేపదే తనకు తెలియకుండానే గుర్తొస్తుంది.

*****************

Sketch5394246

రాముడు గత నెల రోజులుగా తన దూరపు బంధువుగా చెప్పుకొనే చలమయ్య దగ్గరకు పనికి వస్తున్నాడు. సంవత్సరం పొడుగునా పనికి రావడం రాముడి వృత్తి కాదు. బి.ఎ. రెండవ సంవత్సరం చదువుతున్నాడు. రాముడికి ఇంట్లో ఆర్ధిక ఇబ్బందుల వలన ప్రతి సంవత్సరం ఎండాకాలం సెలవల్లో, ఇలా ఎవరో ఒకరి దగ్గరికి పనికి వెళ్ళి పుస్తకాలకు, ఫీజులకు కావలసిన డబ్బును తనే సంపాదించుకుంటున్నాడు. అందరి పిల్లలకు స్కూలు సెలవలు వస్తే ఆనందం. కానీ రాముడి పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. సెలవల్లో పనికి పోవాల్సిన పరిస్థితి. తండ్రి మరణించడంతో తల్లి చేసే కూలి డబ్బులు తిండికే సరిపోని పరిస్థితి. ఇక ఫీజులకు, పుస్తకాలకు, బట్టలకు డబ్బంటే కష్టంతో కూడుకున్న పని. అందుకు సెలవు సమయాల్లో పనికి పోవడం చిన్నప్పటినుంచే అలవాటు చేసుకున్నాడు. పనుల దగ్గర ఆడవాళ్ళ ఇబ్బందుల గురించి అప్పటికే పలువురి ద్వారా విని ఉన్నాడు. ముఖ్యంగా బేల్దార్లు అక్కడ పనికి వచ్చే ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారని కొంతమంది మాట్లాడుకోవడం వినివున్నాడు. కానీ ఆడవాళ్ళలో కూడా కొందమంది జాచ్చి ముండలే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారని ఊర్లో ఉన్న బేల్దార్లు అరుగు మీద కూర్చోని మాట్లాడుకోవడం రాముడు విని ఉన్నాడు.

చలమయ్య దూరపు బంధువు కావడంతో వేరే వాళ్ళ ద్వారా తను కూడా పనికి వస్తానని అడిగి రమ్మన్నాడు. చలమయ్య రమ్మనడంతో అతని దగ్గర పని చేస్తున్నాడు. ఈ నెల రోజుల్లో అతని దగ్గర ఉన్న బేల్దార్లతో, పెద్ద కూలోల్లతో, చిన్న కూలోల్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఎవరేమిటి? అనే ఒక అవగాహన వచ్చింది. అక్కడకి పనికి వచ్చే వాళ్ళలో పార్వతమ్మ, రాజమ్మ, శీనులపై ప్రత్యేక అభిమానం ఏర్పడింది రాముడికి. ఆ అభిమానం ఏర్పడటానికి కారణం ఉంది. వారు రాముడు చదువుకునే పిల్లోడని జాలి చూపేవారు. శీను కూడా తను పనిచేసే చోటకు రాముడిని తీసుకు వెళ్ళేవాడు. రాజమ్మ నడివయసు మనిషి. దాదాపు యాభై సంవత్సరాలకు అటు ఇటు ఉంటాయి. ఎత్తైన మనిషి. చామన ఛాయ రంగు. రూపాయి మందంతో ఉండే బొట్టు, వక్కాకు నమలడం వలన ఎరుపు, తెలుపు రంగులో ఉండే పళ్ళు. ఎందుకో తెలీదుకానీ చూడడానికి ఆమె కొంత ప్రత్యేకంగా కనిపిస్తుంది. పార్వతమ్మ పేరు కొంచెం పెద్దవారి పేరులా కనిపిస్తున్నా, వయసు పాతిక సంవత్సరాలకు మించదు. కాస్త ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ చాలా చక్కనైన రూపం. చాలా తెల్లటి మనిషి. ఆమె మనసు కూడా పాల మీగడలాగా తెల్లగా ఉంటుందని ఆమె మాటల ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. పెళ్ళై ఆరు సంవత్సరాలైనా ఇంకా పిల్లలు లేరు. దాదాపు మూడు నాలుగు నెలల కిందటి నుంచే చలమయ్య దగ్గరకు పనికి వస్తుందని రాజమ్మ ఏదో సందర్భంలో రాముడితో చెప్పింది. రాముడు కూడా అక్కా… అక్కా… అంటూ పార్వతమ్మతో మాట్లాడేవాడు. ఆమె కూడా అభిమానంగా రాముడితో మాట్లాడేది. పని దగ్గర వారు చూపే అభిమానం వలన రాముడు కూడా వారితో పని చేయడం ఆనందంగానే భావించేవాడు.

అయితే వారిలో బేల్దారి గిరి కొంచెం అసూయ మనిషి. పని దగ్గర కొందరితో పనికిమాలిన విధంగా ప్రవర్తించేవాడని వేరే బేల్దార్లు అంటుండేవారు. అతడి గురించి బేల్దార్లు బయట గుసగుసలాడినా పైకి మాత్రం అతనితో బాగానే ఉండేవారు. అతడు పని బాగా తెలిసినవాడని చెబుతారు. అందువలన అతడు చెప్పిన మాట చలమయ్య వింటాడని అందరు అంటారు. గిరి దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా చలమయ్య దగ్గర పని చేస్తున్నాడు. పనికాడ గిరికి కమల అనే ఆమెతో సంబంధం ఉందని అందరికి తెలుసు. అతను పని చేసే దగ్గర చిన్న కూలిగా కమలే ఉంటుంది. సిమెంటు, ఇటుకలు అన్ని కూడా ఆమే గిరికి అందిస్తుంది. గిరి కూడా సులభమైన పనులే కమలకు చెబుతాడు. బరువైన పనులు ఇతరులకు చెబుతాడు. అయితే పార్వతమ్మ చలమయ్య దగ్గర చేరినప్పటి నుంచి గిరి కన్ను ఆమెపై పడింది. చాలా సందర్భాలలో ఆమెతో ద్వంద్వార్థాల మాటలు మాట్లాడేవాడు. ఆమె ఆ విషయాలను పెద్దగా పట్టించుకునేది కాదు. నలుగురైదుగురు బేల్దార్లు ఒకేచోట పని చేయటం వలన అతనికి ఆమెను చెనికే అవకాశం రాలేదు. పైగా ఆమెతో ద్వంద్వార్థాలు మాట్లాడిన ప్రతిసారి కమల గిరిని గుడ్లురిమి చూసేది. ఆమెతో సంబంధం ఉండటం వలన కాబోలు కక్కలేక, మింగలేక గుక్కూరుమని ఉండేవాడు. గత వారం రోజులుగా గిరితో సంబంధం ఉన్న కమల కూడా పనికి రావడం లేదు. చలమయ్యకు రెండు కొత్త పనులు పడటంతో ఒకరిద్దరి బేల్దార్లనే ఒక చోట ఉంచుతున్నాడు. కమల లేకపోవటంతో తన దగ్గర సిమెంటు, ఇటుకలు అందించడానికి పార్వతమ్మని పిలిచాడు గిరి.

ఇద్దరు బేల్దార్లు, ఇద్దరు చిన్న కూలోల్లు, రాముడు మాత్రం ఒక పనికాడ పని చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో చలమయ్య పని దగ్గరకి వచ్చి ’రేయ్ శీను మధ్యాన్నుంచి పని భాగ్యనగర్ కాలనీలో చెయ్యాలరా. ఈడ ఒక బేల్దారి ఆడమనిషి చాలు. నువ్వు, వాడు రాముడు ఒక ఆడమనిషి ఆడికిపోండి’ అని శీనుతో చెప్పాడు. మొదట శీనుతో ’నేను వస్తానన్నా…. ఆ పనికాడికి’ అని పార్వతమ్మ చెప్పింది. అయితే ఈ పనికాడ తాపలు ఎక్కి సిమెంటు అందించాలి. దానితో పెద్దామైన రాజమ్మకు కష్టం అని గిరి తెలుసు. ఇదే అదునుగా ’పార్వతమ్మ ఈడ పెద్దామ తాపలెక్కి సిమెంటు అందీలేదు. నువ్వు ఈడ ఉండు. పెద్దామ, రాముడు, శీనుగాడు ఆడికి పోతారు’ అని చెప్పాడు. రాజమ్మ కూడా తాపలెక్కలేక ’నువ్వుండు పార్వతమ్మ నేను ఆడికిపోతా…’ అని చెప్పింది. పార్వతమ్మకు గిరి దగ్గర పని చేయడం కంటే మధ్యాహ్నం మానేస్తే బాగుండనిపించింది. కాని ఇప్పుడు పనికాడ ఆడమనిషి కావాలి. ఇప్పుడు పనికిరానంటే రేపు వద్దంటాడేమోనని మనసులో అనుకుంది. ’సరేలేయ్యా… నేను అన్నం తిని ఈడనే పనిజేచ్చాలే’ అని చలమయ్యతో చెప్పింది పార్వతమ్మ. గిరికి మనసులో ఎక్కడో తెలీని ఆనందం కనిపించినప్పటికీ బయటపడకుండా ’నేను అన్నం తినేసి వచ్చాగానీ, రాముడు ఒక అర మూటకు ఇసుకపోసి, ఆ సిమెంటును కూడా దీంట్లో ఏసి మెత్తం ఒకసారి తీరగేయ్’ అని రాముడుతో చెప్పాడు. ’రేయ్ మీరాడికి రాండిరా… నేను ఒక అరగంటకల్లా ఆ పనికాడికొచ్చా…’ అని చెప్పి చలమయ్య సైకిల్ ను ఇంటి దారి పట్టించాడు. అందరు ఇండ్లకు అన్నానికి వెళ్ళారు. రాముడు ఏడుగోలాలు ఇసుకపోసి, సుమారు ముక్కాలుమూట సిమెంటేసి, పాత సిమెంటుని దాంట్లో ఏసి, రెండు సార్లు తిప్పి, కుంది కొట్టాడు. నీళ్ళు పోయటానికి బిందె తీసుకొని సిమెంటులో నీళ్ళు పోసి, అక్కడే కాళ్ళు కడుకున్నాడు. చలమయ్య వేరేపనికాడికి అరగంటకల్లా వస్తానన్నాడు కాబట్టి తాను కూడా అక్కడికి తొందరగా తినేసి వెళ్ళాలనుకున్నాడు. అన్నం తిని పదినిమిషాలు కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. ఇక వారం రోజుల్లో తన కాలేజి తెరుస్తారు. ఈ పని బాధ తప్పుతుందనుకున్నాడు. ఇక బయలు దేరుదామని రాముడు అనుకుంటుండగా ఇంతలో గిరి అక్కడి వచ్చాడు. మామూలుగా అయితే మధ్యాహ్నం రెండు దాటిన తరువాత వచ్చేవాడు. కాని ఈరోజు ఒకటి నలభైకల్లా ఇక్కడుండడం రాముడికి కొంత ఆశ్చర్యమేసింది.

’చిన్నోడా ఇది ఒక సారితిరగైరాదు’ అని రాముడుతో గిరి చెప్పాడు.

’ఆ అన్నా… తిరగేసి ఆ పనికాడికెళ్తా…’

’కానీ…, కానీ… గబగబ కానిచ్చీ ఆడికంట బయలు దేరు’

’సరే అన్నా…’

రాముడు పార తీసుకొని గబగబ రెండు నిమిషాలలో సిమెంటు మొత్తం తిరగేసి కాళ్ళు చేతులు కడుకున్నాడు. గోడకున్న చొక్కా, ప్యాంటు తీసుకొని బట్టలు మార్చుకున్నాడు. అన్నం క్యారీ, లుంగీ, తువ్వాలును సంచిలో పెట్టుకొని సైకిలెక్కి భాగ్యనగర్ కాలనీలోని పని దగ్గరకు వచ్చాడు. అప్పటికే చలమయ్య అక్కడికి వచ్చి ఉన్నాడు.

’రేయ్… ఆ రూముల్లో మట్టెత్తు. వాళ్ళు మోచ్చరు. శీను ఆ పక్క కొయ్యలతో బయట సారవలు కట్టుకుంటాడు. ఆ రూముల్లో పారలు, గోలాలు ఎన్ని ఉండయో చూడు’ అని చలమయ్య రాముడితో చెప్పాడు. లోపలికెళ్ళి గోలాలు, పారలు చూసి ’మూడు పారలు, ఎనిమిది గోలాలున్నాయి తాతా…’ అని చలమయ్యతో చెప్పాడు రాముడు. ఇంతలో రాజమ్మ, శీను మరో ముగ్గురు కొత్త కూలోల్లు అక్కడికి వచ్చారు.

’శీను… నువ్వు సారవలు కట్టుకో. వాడు మట్టి ముంచుతాంటాడు. పెద్దామా… నువ్వు, కొత్తోళ్ళు మట్టి మోయండి. ఈ రోజు మూడురూముల్లో మట్టి అయిపోవాలా… ఎప్పుడన్న అయిపుజేసుకోని పోండి. నేను వేరే పనికాడికి పోతాన…’ అని కూలోల్లతో చెప్పి చలమయ్య వెళ్ళిపోయాడు.

’రాండిమ్మా… గబగబ నాలుగున్నర్రకల్లా ఈ మట్టి ఎత్తి ఇంటికి పోవాల… మీరు కొంచెం హుషారుగా తిరగండి. నేను గబగబ మట్టి ముంచుతా’ అని రాజమ్మతో అన్నాడు రాముడు.

’తాలు నాయనోవ్… యాడ నాలుగున్నర్రకు అయిపోతది. మీ తాత అయిపోజేసుకొని పోండని ఏదో ఒక మాట చెప్పినాడు. అది అయ్యే పని కాదు. చూడ్డానికి రోంతున్నెట్లుంది. అయిపోయేతలికి అయిదున్నర అయితది’ అని రాజమ్మ రాముడితో అనింది.

’సరేమ్మా ఎన్ని గంటలైన పర్వాలేదులే అని చెప్పి’ మట్టి ముంచి ఆడోల్లకిస్తున్నాడు రాముడు. దాదాపు మూడు గంటలకల్ల ఒక రూము మట్టి ఎత్తేది పూర్తైంది. ఇంతలో చలమయ్య పని దగ్గరకొచ్చాడు.

’ఓమ్మా రాజమ్మా… రూంలో టేపేమన్నా ఉందేమో చూడు’ అని రాజమ్మతో చెప్పాడు.

దాదాపు అయిదు నిమిషాల తరువాత ’ఈడ లేదయ్యా. ఆ పనికాడేమన్నా ఉందేమో… ’ అని చెప్పి వెంటనే ’ఆడ్నే ఉందయ్యో… నేను నిన్న చూసినా… సామాన్ల సంచిలో ఉంది.’ అని చలమయ్యతో చెప్పింది.

’రేయ్… ఆడికి పోయి టేపు తీసుకొద్దురా…’అని రాముడితో చెప్పాడు చలమయ్య.

అంతలోనే ’బామ్మార్ది… నువ్వు అటుపోతాండావ్. ఇదో వచ్చేటప్పుడు ఒక కట్ట సంఘం బీడీలు తీసుకొనిరా’ అని చెప్పి పది రూపాయల నోటు రాముడి చేతికిచ్చాడు శీను. ఆ మాటలు విన్నాక, నీళ్ళడమ్ము దగ్గరకు వచ్చి, నెత్తికున్న తువ్వాలు గుడ్డను విప్పి పక్కనపెట్టి, మొహం కడుక్కొన్నాడు రాముడు. చొక్కా వేసుకొని గుండీలు పెట్టుకుంటుండగా ’రేయ్ ఈనించి ఈడికి ఇంత సోకు అవసరమారా… గబక్కన పోయొజ్జురారా మామా నువ్వు’ అని చలమయ్య గట్టిగా అరిచాడు. సరే అని అట్లే ఆ సగం గుండీలు పూర్తిగా పెటుకొని, నెత్తిని చేత్తోనే దువ్వుకొని తన సైకిల్ తీసుకొని పాత పనికాడికి వచ్చాడు.

సైకిల్ ఇంటి ముందర పెట్టి రూము లోపలికెళ్ళి ’అక్కా…’ అని అలాగే నిలబడిపోయాడు రాముడు. ఒక్క సారిగా ఏదో తేడాగా అనిపించింది. తన కళ్ళను తానే నమ్మలేనట్లు గమ్ముగా లోపల ఉన్న పార్వతమ్మను, గిరిని చూస్తుండి పోయాడు రాముడు. పార్వతమ్మ ఏడుస్తూ ఉంది. ఆమెకు అలా దూరంలో భయంతో ఉన్నట్లుగా నిలబడివున్నాడు గిరి. తనను చూడగానే కళ్ళు తుడుచుకొని అలాగే గమ్ముగా నిలబడింది పార్వతమ్మ. ’ఏం గావాల్రా …ఏం ఇటొచ్చినావే’ అంటూ చాలా హీన స్వరంతో గిరి రాముడ్ని ప్రశ్నించాడు.

’అన్నా… తాతా… టేపు తెమ్మన్నాడన్నా… సామాన్ల సంచిలో ఉందని రాజమ్మక్క చెప్పింది’ అని రాముడు గిరితో చెప్పాడు. గిరి మాటలో శరీరంలో ఏదో భయం కనిపిస్తుంది రాముడికి. పార్వతమ్మ మాత్రం ఏమి మాట్లాడకుండా అలాగే ఉంది. గిరి సామాన్ల సంచిలో చూస్తానే చిన్న టేపు, పెద్ద టేపు కనిపించాయి. ’ఏదిరా… చిన్న టేపా? పెద్దటేపా? కావాల్సింది’ అని రాముడ్ని అడిగాడు.

’అదేం చెప్పలేదన్నా తాత…’ అని చెప్పాడు రాముడు.

’సరే! రెండు టేపులు పట్టకపో. రెండు టేపులు నేనే తెచ్చినా అని చలమయ్యతో చెప్పు. నేను ఇచ్చినాని చెప్పాకు’ అని గిరి రాముడితో చెప్పి రెండు టేపులు చేతికిచ్చాడు. ఆ టేపులను తీసుకోవడం కంటే పార్వతమ్మ కళ్ళలో వచ్చే కన్నీళ్ళనే చూస్తున్నాడు రాముడు. ఇది గమనించిన గిరి ’రేయ్! ఈ టేపులు తీసుకొని పో’ అని తొందరగా రాముడ్ని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు గిరి. రాముడి మనసులో ఎన్నెన్నో సందేహాలు వస్తున్నాయి. ఏమి మాట్లాడటానికి అవకాశం లేక అక్కడే నిలబడ్డాడు. పార్వతమ్మ ’నన్ను ఈడు పట్టుకున్నాడు రాముడు’ అని ఒక్క మాట అంటే చాలు వాడి మీద కలబడి కొట్టాలన్నెంత కోపం రాముడి మనసులో ఉంది. కాని ఆమె మాత్రం రాముడి మొహం వైపు చూసి, కన్నీళ్ళు తుడుచుకుంది. రాముడు కూడా ఏమి మాట్లాడకుండా అక్కడే నిలబడ్డాడు. ఇంతలో గిరి ’రాముడు నువ్వెళ్ళు’ అని చిన్నగా చెప్పాడు. ఏమి మాట్లాడలేక టేపు తీసుకొని పని దగ్గరకు బయల్దేరాడు. దారిలో వస్తున్నప్పటికీ పార్వతమ్మ కన్నీళ్ళే గుర్తొస్తున్నాయి. ఆ కన్నీళ్ళు గిరి వలన చిందిన అకాల వర్షపు చినుకులుగా కనిపించాయి రాముడికి. ’గిరి ఆమెను ఏదో అన్నాడు’ అనే అభిప్రాయానికొచ్చాడు రాముడు. అర్థంపర్థం లేకుండా ఏవేవో ఆలోచనలు మనసుకు తట్టుతున్నాయి రాముడికి. బహుశా బోయవాని బాణం దాటికి పక్షి కూడా ఇలాగే విలపించింటుందేమోననిపించింది రాముడికి. ’గిరి మీద నాకు మనసులో కోపం వచ్చినప్పుడు ఒకవేళ పార్వతమ్మ నన్ను గిరిని కొట్టమని చెప్పింటే’ అని గబక్కున ఆలోచనలో పడ్డాడు రాముడు. తనకు తెలుసు గిరిని తనుకొట్టలేడని. తనేమో పిల్లోడు. గిరి చూస్తే దున్నపోతుమాదిరి ఉండాడు. ’అయినా సరే కలబడేవాన్ని. నా కొడుకుని ఏది దొరితే అది తీసుకొని ఏసిందును’ అని తన మనసుకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ’ఆమె ఏమి చెప్పంది మనం ఏం చేయలేం. ఆమె ఏమి చెప్పకుండా ఉందంటే ఏదో బలమైన కారణం ఉంటుంది’ అని తనకు తానే ఏవేవో ఊహించుకొన్నాడు. ఈ ఆలోచనలతోనే భాగ్యనగర్ కాలనీలోని పని దగ్గరకొచ్చాడు. అక్కడ చలమయ్య తన కోసమే ఎదురు చూస్తున్నాడు.

’ ఏరా! టేపు ఉన్నిందా?’ అడిగాడు చలమయ్య.

ఏమి మాట్లాడకుండా రెండు టేపులు చలమయ్య చేతికందించాడు రాముడు.

’పెద్దటేపు ఒకటి చాలు రా సామి. సరేలే… రెండు టేపులు పనికొచ్చయ్’ అని టేపులు తీసుకొన్నాడు.

’మట్టి ఎత్తడం ఎంత వరకు వచ్చిందిమ్మా…’ అని రాజమ్మను అడిగాడు.

’ఇంకో గంటకల్లా అయిపోతదయ్యా. అయిపోయిన తరువాతే ఇంటికి పోతం’ అని రాజమ్మ సమాధానం చెప్పింది.

’శీను నువ్వు రా. ఆ పని కాడ ఒక్కరవ్వ మార్కింగ్ వెయ్యాల’ అని శీనును పిలిచాడు.

’మరి సారవా?’ అని శీను చలమయ్యను అడిగాడు.

’దాని పరిస్థితి రేపు చూద్దాం రా…’ అని చలమయ్య చెప్పడంతో శీను మొహం కడుక్కొని అతనితో పాటు వెళ్ళిపోయాడు. రాముడు మిగిలిన నలుగురు ఆడోళ్ళు మాత్రమే పనికాడ ఉన్నారు. తాను చూసిన విషయాన్ని రాజమ్మతో చెపుదామనుకొన్నాడు రాముడు. కాని ధైర్యం చాల్లేదు. మళ్ళీ ఎందుకొచ్చిన గొడవ అనుకొన్నాడు. ఏ విషయం తేల్చుకోలేక సతమతమవుతున్నాడు. మనస్సులో ఏవేవో ఆలోచనలు… చివరకు ఏదో ఒక విధంగా మౌనంగానే ఆ పని దగ్గర రూముల్లో మట్టి ఎత్తడం పూర్తిచేశాడు. రాముడు మౌనంగా ఉండటాన్ని పలుసార్లు రాజమ్మ అడిగినప్పటికీ ఏమి మాట్లాడకుండా మట్టిపని పూర్తిచేశాడు రాముడు. ఇంటికి వెళ్ళినప్పటికీ పార్వతమ్మ కన్నీళ్ళే గుర్తొస్తున్నాయి.

************

’రాముడూ… రాముడూ…’ పిలిచేతలికే ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు రాముడు. తీరాచూస్తే పిలిచింది రాజమ్మ.

’ ఆ… అక్కా… దా…’ అని పిలిచాడు.

’చలమయ్య రాలేదా రాముడు?’ అని అడిగింది.

’మధ్యాహ్నం అన్నానికి వెళ్ళే ముందు వచ్చి వెళ్ళాడక్కా’ అని చెప్పాడు రాముడు.

’ఏం లేదయ్యా. లెక్కిస్తానన్నాడు. అందుకని ఈడికొచ్చినా.’

’ఇప్పుడు మళ్ళీ ఈడికొచ్చి వెళ్తాడక్కా…’

’అందుకోసమే ఈడికొచ్చినా, ఎవరెవరు పని చేస్తానరిక్కడ?’ అని అడిగింది రాజమ్మ.

’నేను, శీను మామ ఇద్దరమే అక్కా’ అని చెప్పాడు రాముడు

’ఏం అక్కా నువ్వు పనికి రాలేదా ఈరోజు?’ అని తిరిగి అడిగాడు రాముడు రాజమ్మను.

’నాకు ఈ రోజు పని పడిందయ్యా. నాకూతురును ఆసుపత్రికి తీసికెళ్ళాల. అందుకనే రాలేదు’ అని చెప్పింది రాజమ్మ.

’మరి పార్వతమ్మక్క కూడా రానట్టుంది కదక్కా’ అని అడిగాడు రాముడు. ఇలా అడగడంలో రెండు రకాల అర్థాలున్నాయి. ఆమె రానందుకు కారణం అడగడమే కాక, నిన్న జరిగిన సంఘటన గురించి ఆమెకేమైన తెలుసేమో తెలుసుకోవాలనే ఆతృత.

’రాముడు. పార్వతమ్మ ఏడుస్తుండేది నువ్వు చూసినావంటగదయ్యా!’ అని నిన్న జరిగిన సంఘటనను ఆమే ప్రస్తావించింది. పార్వతమ్మ నిన్న ఏడ్చిందానికి కారణం ఆమెకు తెలిసివుంటుందని నిర్ణయానికొచ్చాడు రాముడు.

’అక్కా! నిన్నట్నించి ఏదో ఒక విధంగా ఉందక్కా. ఎప్పుడూ సరదాగా మాట్లాడే పార్వతమ్మక్క ఎందుకు ఏడ్చిందక్కా? నేను అడుగుదమన్నాగానీ, గిరన్న పొమ్మన్నట్లు మాట్లాడినాడు. ఏం జరిగిందో పార్వతమ్మక్కను అడగలేక, ఎవరికీ చెప్పలేక మనసంతా ఏదో గందర గోళంగా ఉంది. అసలు ఏం జరిగిందక్కా. బహుశా నీకు తెలిసే ఉంటుంది. చెప్పు.’ అని బతిమాలినట్లు అడిగాడు.

’నువ్వు ఏమేం ఊహించుకున్నింటావో అదే జరిగిందయ్యా. ఆనాకొడుకు ఆయమ్మిని పట్టుకున్నాడంటయ్యా. ఈ పనలకాడ ఇయన్నీ మామూలైపోయాయి. ఆనాకొడుకు మొకమైన చెడిపోయి, మూలబడిన లారికున్నట్లుంది. వాడికి ఆయమ్మి కావాలంట. బలంతం చేశాడంటా. అరుచ్చా, నా మొగుడికి చెబుతా అని చెప్పినా చాలా ఇబ్బంది పెట్టాడంటా. వాడు చూస్తే దున్నపోతు మాదిరుండే. ఈయమ్మి ఏమనగలదు. చివరకు ఏడ్చి, ఇడిపిచ్చుకొని బయటకొచ్చే ప్రయత్నం చేసింది. అప్పుడు మళ్ళీ వచ్చి, తప్పైపోయింది, కాళ్ళు పట్టుకుంటా… ఎవరికి చెప్పొద్దని బతిమిలాడినాడంట. అపుడే నువ్వు వెళ్ళినావు. చివరికి ఎవరికి చెప్పద్దని ఆయమ్మికి దన్నం పెట్టినాడట. వాని నోట్లో నామెట్టు పెట్ట. ఆనాబట్ట కొడుక్కు పెళ్ళాం ఉంది. ఆ పనికిమాలిన లం… కమల ఉంది. ఇంకా వేరేవాళ్ళు కావాలంట. మరి వాడు ఎంత పోతుమొగోడో మరి’ అని గిరిని నోటికొచ్చినట్లు తిడుతూనే ఉంది.

’అక్కా! వాడింత జేస్తే పార్వతమ్మక్క వాళ్ళమొగుడికి చెప్పలేదాక్కా?’ అని రాజమ్మను అడిగాడు రాముడు.

’ఆయమ్మి వాళ్ళ మొగుడితో చెప్తే లేనిపోని తలనొప్పి నాయినా. ఆయమ్మి మొగుడు తాగుబోతు, మెంటల్ నాకొడుకు. వానికి తెలిస్తే వాడు ఏమైనా చేస్తాడు. వాడు ఎంతకైనా తెగించే మనిషి. వాళ్ళు మా ఇంటికాడ్నే ఉండేది. నాకు అయిదు సంవత్సరాల్నుంచి తెలుసు. ఒక సారి మా వీధిలో నీళ్ళకాడ ఒకడు ఆయమ్మీతో ఏదో జాంతానమాడినాడని వాడితో గొడవపడి, కట్టెతో వాడి తలపగలగొట్టాడు. అది కేసయ్యి పెద్ద తలనొప్పైంది. ఆయమ్మి పని చెయ్యకపోతే ఇంట్లో జరగని పరిస్థితి.’ అని చెప్పింది.

’మరి నిన్న జరిగిన విషయం నీకెవరు చెప్పారక్కా?’ అని రాముడు అడిగాడు.

’ఆయమ్మే చెప్పిందయ్యా. ఇంకా చాలా ఇబ్బందులు పడిందయ్యా ఆయమ్మి. ఇంతకు ముందు ఆయమ్మి కర్రి నారాయణ దగ్గర పని చేస్తుండేది. ఆడొక బేల్దారి… మాట్లాడితే ఈయమ్మితో జాంతానం ఆడేవాడంట. ఒక రోజు ఆయమ్మి ఆ బేల్దార్ని గదురుకునే సరికే వాడు ఆయమ్మికి బరువు పనులు చెప్పావాడంట. ఆయమ్మికి మూడొ నెలప్పుడు ఇంట్లో కష్టంగా ఉంటే పనికి పోయింది. అప్పుడు కర్రినారాయణ దగ్గర రాతి కట్టుడు పని ఉన్నింది. వాడు కావాలని ఆయమ్మితో పెద్దపెద్ద రాళ్ళు ఎత్తించాడు. ఆయమ్మి ఆబరువులు మోసెతలికే కడుపు పోయింది.’ వాడి పోడు తట్టుకోలేక ఆడపని మానేసింది. నాలుగు రోజులు ఇంటికాడుండి మల్లా ఈ చలమయ్య దగ్గరకొచ్చింది. మీ తాత చలమయ్య ఏం తక్కువోడు కాదయ్యా. ఒట్టి పనికిమాలినోడు. అన్ని తెలుసు. ఏం చెయ్యాల. గతిలేక పనికొచ్చానం.’ అని చెప్పింది రాజమ్మ రాముడికి.

ఇది విన్న రాముడు ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. ’నాకు చాలా మంది బేల్దార్లు తెలుసు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇక్కడ కూడా కొంత మందిపైన చాలా గౌరవం ఉంది. కానీ బేల్దారి పని దగ్గర కొందరు బేల్దార్లు ఇంత ఘోరంగా ఉంటారా’ అని మనసులోనే తిట్టుకున్నాడు. ఇంతలో రాజమ్మ ’అయ్యా నీకు ఈ విషయం చెప్పడానికి ఒకే కారణం ఉందయ్యా. నువ్వు ఈ విషయాన్ని ఎవరికకీ చెప్పొద్దయ్యా. పార్వతమ్మ నాతో ఈ మాటే నీతో చెప్పమనిందయ్యా. ఎవరికన్నా తెలిస్తే పరువు పోతుందయ్యా. ముఖ్యంగా ఆయమ్మి మొగిడికి తెలిస్తే లేనిపోని తలనొప్పి. నీకు దండం పెడతా ఎవరితో చెప్పాకు. రేపట్నుంచి నేను పని చేసేకాడికి ఆయమ్మిని వెంట పెట్టకపోతా’ అని రాముడితో విన్నవించుకొన్నట్లు చెప్పింది.

ఈ మాటలు విన్న రాముడి ఏం మాట్లాడాలో తెలీక ’సరే అక్కా నువ్వు చెప్పావు గదా. వారం తరువాత నా కాలేజి తెరుస్తారు. తరువాత నేను ఎలాగు ఈ పనికి రాను. నాకేం పనక్కా చెప్పడానికి. పొరపాటున కూడా ఎవరికి చెప్పను’ అని రాజమ్మతో రాముడు చెప్పాడు. ’సరే చలమయ్య వచ్చేటట్టులేడు. వచ్చే నేను వచ్చిన్నానని చెప్పు’ అని చెప్పి వెళ్ళింది. ఆమె వెళ్తూ ఉంటే ఆమె వంకే చూస్తూ ఉన్నాడు రాముడు. ’కష్టం, ఓర్పు, బాధను దిగమింగి నడుస్తున్న ధరిత్రీలాగా’ కనిపించింది రాజమ్మ రాముడికి. ’ఈ పనిలో ఇంత ఇబ్బందుంటుందా! బేల్దార్లు కూలికే పనికి వస్తున్నారు. ఆడోళ్ళు కూలి కోసమే పనికి వస్తున్నారు. కానీ మరి మగాళ్ళు ఆడవాళ్ళను ఎందుకు ఇంత హింస పెడుతున్నారు. ఎందుకు మృగాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు! అని పలువిధాలైన ఆలోచనలు చేస్తుకుచ్చున్నాడు రాముడు. ఒకవేళ తన వాళ్ళు పనికి వచ్చినా ఇలాగే ప్రవర్తిస్తారా? ఆ ఆలోచన రాగానే ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది రాముడికి. ఛ! ఇలాంటి ఆలోచనలొస్తున్నాయేమిటి? అనుకొన్నాడు. దీని గురించి ఆలోచిస్తూ అలాగే కూర్చుండి పోయాడు రాముడు. గిరిలాంటి వాళ్ళు పరాయి ఆడమనిషి గురించి చెడుగా తలుచుకుంటేనే వణుకుపుట్టేలా చేయాలి. అదే సరైన పరిష్కారం అని మనసులో అనుకున్నాడు రాముడు.

**************

 

జి. వెంకట రామయ్య

జి. వెంకట రామయ్య

 

మూడు నవలలు, ముగ్గురు స్త్రీల పోరాటం!

మహిళల మనస్తత్వాలను, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఎంతో చాకచక్యంగా తన రచనల్లో చిత్రించిన చక్కని రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి గారు. ఇటీవల ఆమె మరణించడం ఎంతో విచారకరం. ఆమె రాసిన మూడు రచనలపై నాకు తోచిన అభిప్రాయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.

గోమతి (నవల):

అమ్మానాన్నల అపురూపంగా చూసుకునే గారాలపట్టి గోమతి. ఆకుసంపెంగ తోటల్లో, పెరటి జామచెట్టు నీడల్లో ఆడుతూ పాడుతూ పెరిగిన అమ్మాయి తను.

ఊహ తెలిసినప్పటినుండీ పొరుగింటి కుర్రాడు గోవిందుతోనూ, అటుపై బావ గోపాలంతోనూ అల్లరిచిల్లరిగా, నవ్వుతూ తుళ్ళుతూ హాయిగా గడిచిన చిన్నతనం గోమతి సొంతం.

అటు గోవిందుకి, ఇటు గోపాలానికి ఆరాధన తానై ఎవరి ప్రేమను ఎలా అర్థం చేసుకొవాలో తెలియక ఎంతో మానసిక సంఘర్షణకు గురై చివరకు గోవిందుకి భార్యవుతుంది. అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా. అత్తవారి ఆస్థి మొత్తం కరిగి రోడ్డున పడాల్సి వస్తుంది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుగా భర్తకు అంగవైకల్యం సంప్రాప్తిస్తుంది. అలాంటి నేపథ్యంలో తానే కుటుంబానికి అండగా నిలబడి పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడుతూ జీవిత సమరం సాగిస్తుంది గోమతి.

అనుకోకుండా ఆమె జీవితంలోకి బావ గోపాలం పునరాగమనం, అతని సాన్నిధ్యంలో ఆమె సాంత్వన పొందడం, తప్పు చేస్తునానన్న అపరాధభావంతో బాధ పడడం, గోపాలంతో భార్య చనువుతో పాటుగా అంగవైకల్యంతో గోవిందులో కలిగే ఆత్మన్యూనత, ఇష్టమైన మరదలికి తన ఇష్టాన్ని తెలియచేయలేని తన అశక్తతతో గోపాలం చెందిన వ్యథ, తిరిగి ఆమె కనిపించినప్పుడు అతను పొందిన ఆనందం… ఒకటా రెండా… అత్యంత సహజంగా ఈ కథలో జరిగే సంఘటనల మధ్యలో కథలోని ఈ పాత్రలు పడిన మానసిక క్షోభను కానీ, శారీరక శ్రమను కానీ అత్యంత సహజంగా, ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు రచయిత్రి విశాలాక్షి.

ముఖ్యంగా గోమతి పాత్రను విశాలాక్షి గారు మలచిన తీరు అత్యద్భుతం. ఆద్యంతం గోమతి పదే యాతనలను తమ యాతనగా పాఠకులు అనుభూతి చెందుతారు. మనసనేది ఎంత దిటవు కలదో అత్యంత సున్నితమైనది. సంఘటనలను బట్టే ఈ రెండు స్వభావాలూ బయటపడతాయి. గోమతి విషయంలో జరిగే ఈ మానసిక పరిణామాలను అత్యంత సహజంగా చిత్రించారు రచయిత్రి. అంతే కాదు- స్త్రీకి ఉద్యోగమనేది ఎంత ఆవశ్యకమో, ఉద్యోగపర్వంలో ఆమె ఎలాంటి రకరకాల సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా చాలా బాగా తెలియచేశారు విశాలాక్షి గారు.

గోమతి నవల పూర్తి చేసినా ఆమె మాత్రం మన మనసులను వెంటాడటం మానదు. అదీ ఈ నవల ప్రత్యేకత!

untitled

***

మనస్వి (కథ) :

పరమేశం, కాంతం అల్లారుముద్దుగా చూసుకుంటున్న పాప పుట్టినరోజును ఆనందంగా జరుపుకుంటున్న రోజే రంగస్వామి అనే ఓ వృద్ధుని రూపంలో వారికి ఎదురవుతుందో గండం. ఏడాది క్రితం ఓ తిరునాళ్ళలో జరిగిన అగ్నిప్రమాదానంతరం తనకు దొరికిన పాపను తెచ్చుకున్న పాపను నా మనవరాలేమోనని వెదుక్కుంటూ వచ్చాను అని రంగస్వామి చెప్పినప్పుడు పరమేశం గుండెలో రాయి పడుతుంది.

అంతవరకూ అపురూపంగా చూసుకుంటూ, పిల్లలు లేని తమ ఇంట్లో మహాలక్ష్మి వెలసిల్లిందని ముచ్చటగా తాము పెంచుకుంటున్న ఆ పాప ఎక్కడ దూరమైపోతుందో, రంగస్వామి గుర్తు పట్టి తీసుకుపోతాడేమో అని పరమేశం పడిన మానసిక సంఘర్షణ కానీ రంగస్వామి, పాప ఒకరినొకరు చూసుకున్నప్పుడు జరిగే సన్నివేశాలను కానీ కళ్ళకు కట్టినట్టుగా రచయిత్రి ఈ కథలో చిత్రించిన తీరు నిజంగా అద్భుతంగా ఉంటాయి. తిరునాళ్ళలో జరిగిన అగ్నిప్రమాదం గురించి కూడా ఎంతో బాగా దృశ్యీకరిస్తారు రచయిత్రి.

విశేషం ఏమిటంటే కథల్లో కానీ నవలల్లో కానీ ఇన్ని వైవిధ్యాలు, మానసిక సంఘర్షణలు, వర్ణనలు ఉన్నా అవి పదాడంబరాలతో పాఠకులను శ్రమ పెట్టవు. తేలికైన పదాలతో, చక్కని మాటతీరుతో ప్రతి పదాన్నీ వదలకుండా చదివింపచేసేలా ఆసక్తికరంగా చదువరులను చదివింపచేస్తాయి. అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్న స్త్రీ జీవితాలను కానీ, అనేకానేక సామాజిక సమస్యలను కానీ తన కలం ద్వారా యధాతథంగా చిందించి పాఠకులను ఆలోచింపచేస్తాయి. మనసులను రంజింపచేస్తాయి. మంచి రచనల ప్రధానలక్ష్యం అదే కదా!

***

గ్రహణం విడిచింది (నవల) :

ఓ అందమైన అమ్మాయి, తనను చక్కగా చూసుకునే ఆమె భర్త! హాయిగా ఆనందంగా గడిపేందుకు అంతకంటే కావలసినదేముంది?! కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. అనుకోకుండా ఆ అందమైన అమ్మాయి భారతి భర్త మాధవ్ ప్రమాదంలో మరణించడంతో అప్పటివరకూ సుఖమయంగా సాగిన ఆమె జీవనం ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనవుతుంది.

భర్త పనిచేసిన సంస్థనుండి రావలసిన పెద్దమొత్తం అతని మరణానంతరం భారతికి అందుతుంది. అంతే! అక్కడినుండి భారతికి ప్రతిచోటా మరో కొత్త లోకం కనిపిస్తూ ఉంటుంది.

ఆత్మీయంగా చూసుకున్న అన్నావదినల్లోనూ, అత్తయ్యా మావయ్యల్లోనూ, ఆప్తుడిగా స్నేహితుడైన జగదీష్ లోనూ, చివరికి వీళ్ళందరినీ కాదనుకుని నమ్మి ఆమె వెళ్ళీన బాబాజీ లోనూ కూడా ఇదివరకు లేని ధనవ్యామోహాన్ని చూస్తుంది భారతి. తన దగ్గర డబ్బు లేనప్పుడు ఉన్న ఆత్మీయత స్థానంలో ఇప్పుడు డబ్బు వలన వచ్చిన తెచ్చిపెట్టుకున్న ఆప్యాయతలనే వారు ప్రదర్శిస్తున్నట్టుగా ఆమెకు తోస్తుంది. అనుకోకుండా ఆమెకు ఎదురైన సంఘటనలు, వ్యక్తుల ప్రవర్తనలు కూడా ఆమె అభిప్రాయానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి.

వ్యక్తిలో జరిగే ఓ మానసిక సంఘర్షణను, నిత్యం ఆమెలో జరిగే ఆలోచనాధోరణులను, మానవ బలహీనతలను సమర్థవంతంగా భారతి పాత్ర ద్వారా తెలియజేస్తారు విశాలాక్షి గారు. అంతే కాదు… దశాబ్దాల క్రితమే భర్తను కోల్ఫోయిన స్త్రీలు మరో వ్యక్తితో కొత్తజీవితాన్ని కోరుకోవడం తప్పేమీ కాదని ఎంతో నేర్పుగా భారతి పాత్ర ద్వారా సమర్థవంతంగా చెప్తారు రచయిత్రి.

డబ్బు అనేది ఎవరికైనా అత్యంత ఆవశ్యకమైన వస్తువే. అది అందుబాటులో ఉన్న మనుషులతో డబ్బు కోసం చుట్టూ ఉన్న మనుషులు ఎలా ప్రవర్తిస్తారో, ఆ డబ్బు తమకు కూడా చెందాలని ఎంతగా తాపత్రయపడతారో కూడా అత్యంత సహజంగా ఈ పుస్తకంలో చిత్రిస్తారు రచయిత్రి.

ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ భారతి మనసూ మన మనసూ మమేకమైపోతుంది. తనను విడిగా చూడటం మనకు తెలీకుండానే మరచిపోయి అడుగడుగునా ఆమెను సమర్థిస్తూనే ఉంటాం.

ఒక అమ్మాయికి వ్యక్తిగతంగా జరిగిన అనుభవాలను చక్కని కథగా మలిచి, ఆమె జీవితం తిరిగి సంతోషమయం కావాలని పాఠకులు కూడా కోరుకునేలా చేసి “గ్రహణం విడిచింది” అనే శీర్షికను కథకు, కథలో సందర్భానికి అన్వయిస్తూ రచయిత్రి నవలను ముగించిన తీరు హృదయాలను ఆకట్టుకుంటుంది.

గుండెను తడిమేసి దానిని తడి చేసే కథలు రాయగలిగే నేర్పూ విశాలాక్షిగారిదే అని నిరూపిస్తుంది “మనస్వి” కథ!

 -రాజేష్ యాళ్ల

rajesh

మరల యవ్వనానికి…

10801844_1547986905415644_141749359838664061_n

painting: Mamatha Vegunta

 

పరవశంతో
నిలువెల్లా విరబూసిన
మునుపటి పడుచుదనపు మహదానందం
ఒక్కసారి నువ్వు నాకు తిరిగి ప్రసాదించు

కాలం
ముంచుకొచ్చిన తుఫానుగాలి
ఆసాంతంగా ఊడ్చుకొనిపోతే పోనీ

కొంజివురుల్నీ పచ్చనాకుల్నీ
అరవిరి మొగ్గల్నీ నవనవ కుసుమాల్నీ
అన్నీ మరల మరల చిగురువేయించు
చేవగల నిండు గుండెలోనుంచి
గుత్తులుగా పుష్పవర్షం కురిపించు

మునిమాపుల్ని లెక్కపెడుతో
అంటిపెట్టుకుని వున్నది
పక్షిరుతాల్లేని ఖాళీగూడు
శిశిరావృత నగ్నదేహాన్ని
ఉత్తిచేతులతో మోయలేదు
ఏటెల్లకాలం చెట్టు

కింద ధరిత్రీమాత
మీద ఆకాశదేవత
ఎవరి తరమూ కాదు మరి పునర్నవం

ఆదివనిత నువ్వు మహిమాన్విత నువ్వు
అత్యనురాగం అంతర్భందనం నువ్వు
ఒక్క నువ్వే
నీ రామచిలుక వన్నె వలువలో
ఇచ్ఛానుసారం ఓ తంతువుని తెంచి
విసురు బహుదూరపు కీకారణ్యం నుంచి
ఇటువేపే
ఈ మోడుమీదికి సరాసరి రివ్వున
నా తనివితీరా చుట్టబెట్టు
ఆ మోసులెత్తే చైత్రపర్వపు ఆచ్ఛాదన

-నామాడి శ్రీధర్‌

namadi sridhar

అక్కడితో బాల్యం అంతమైంది!

 ismayil painting rainbow

[ఈ వ్యాసం 2003 డిసెంబర్ లో రాసింది. అంటే, ఇస్మాయిల్ గారు కన్ను మూసిన పక్షం రోజుల తరవాత రాసింది. నవంబరు 23, 2003 ఇస్మాయిల్ గారు వెళ్ళిపోయారు. మంచి కవిగా ఆయన నాకు ఆత్మబంధువు. కాని,అంత కంటే ఎక్కువగా ఆయన బంధువు కూడా. ఆయన చివరి రోజుల జీవితాన్ని దగ్గిరగా చూసిన వాణ్ని కావడం వల్ల ఈ వ్యాసం పైపైన రాసినట్టే అనిపిస్తుంది నాకు ఇప్పటికీ- కాని, ఆయన మరణానికి తక్షణ నివాళి ఇది. నా దగ్గిర లేని ఈ వ్యాసం ప్రతిని పంపిన మిత్రుడు విన్నకోట రవిశంకర్ కి ధన్యవాదాలు]

 

1

ఇస్మాయిల్ గారి ఈ నిశ్శబ్దం ఇక చిట్ట చివరిది.

ఆయన ఇంక అసలే మాట్లాడరు. మనకు ఈ నిశ్శబ్దం అలవాటై, అయిదేళ్ళ పైనే అయింది. మనం ఏదైనా అన్నప్పుడు అయితే చిరునవ్వుతో, కాదంటే వొక పెద్ద నవ్వుతో సమాధానం చెప్తున్నారు కొంత కాలంగా ఆయన- లేదూ, మనం చెప్పింది నచ్చనప్పుడు చిన్న నవ్వుతో చెయ్యి జెండాలా వూపుతున్నారు తప్ప మాట లేదు. ఆయన మాటలన్నీ మనం చూస్తూండగానే ఆయన వుండగానే నిన్నటి జ్ఞాపకాలయ్యాయి. ఆయన మల్లెపూవులాంటి నవ్వునీ, చిరుగాలిలాంటి అందమైన కదలికల్నీ వొక తెల్లవస్త్రం దాచెయ్యడం ఏమిటి?! ఆయనకి చివరిసారి భుజాన్ని అందించలేని దూరంలో నేను వుండడం ఏమిటి?

మాటల్లో ఏమైనా చెప్పడం కష్టం. అందుకే ఆయన మొదటినించీ నాకూ మనకీ నిశ్శబ్దాన్ని అలవాటు చేస్తూ వచ్చారు. ఇంత దూరంలోంచి నిశ్సబ్దంగా నిశ్శరీరంగా భుజాన్నివడంలో ఎన్ని దిగుళ్ళున్నాయి?! ఎన్ని జ్ఞాపకాలున్నాయి?గొంతు దాటని ఎన్ని మాటలున్నాయి? పోయిన నెల ఆయనకి చివరిసారి భుజాన్నిచ్చిన స్నేహితులందరి భుజాల మీదా వొక చిన్ని ముద్దు!

నమ్మలేకపోతున్నాను!

వొక నాటి రోజుల్లో ఎర్రసిరా తారీఖూ ఆకుపచ్చ అక్షరాలూ కనిపించగానే ఎంత ఆనందం! చిన్న చిన్న వాక్యాల మధ్య స్వచ్చమైన కలకల నవ్వు వొక్కోసారీ, పదునైన వ్యంగ్య బాణాల విసురు మరోసారీ – ఇప్పుడేమీ కనిపించవూ వినిపించవు కదా!

ఇస్మాయిల్ గారిని తలచుకోగానే నా మటుకు నాకు తక్షణం గుర్తొచ్చేవి – అవును, ఆ ఆకుపచ్చ అక్షరాలే! అలాంటి ఆకుపచ్చా పచ్చని వుత్తరం మొదటి సారి ఇరవయ్యేళ్ళ కిందట అందుకున్నాను.

2

అప్పటికింకా “రక్త స్పర్శ” అచ్చు కాలేదు. “శిధిల నేత్రాలు” అనే నా కవిత ఆంద్ర ప్రభలో అచ్చులో చూసి వెంటనే ఆయన వుత్తరం రాశారు, “ఇది తెలుగు పద్యంలా లేదు!” అని! ఆయనేమంటున్నారో నాకు అర్థం కాక, వెంటనే నేను మళ్ళీ వుత్తరం రాస్తే, వారం పది రోజుల తరవాత (ఈమెయిల్ లేని కాలంలో ఆ ఎదురుచూపు ఎంత నరకమో!) ఆయన సమాధానం. “తెలుగు పద్యం అంటే ఇప్పుడు మనకి ఒక స్థిరమైన చట్రం వుంది. ఈ చట్రం శబ్దంలోనూ, అర్థంలోనూ గట్టిగా బిగుసుకొని వుంది. మీరు చట్రాన్ని తప్పించుకుంటున్నారు లేదా దాన్ని ముక్కలు చేస్తున్నారు. మీ గొంతు ఈ కాకిగోలలో మునిగిపోవచ్చు. లేదా, మీకు శక్తి వుంటే కాకుల్ని మీరే తరిమేయచ్చు.” అసలు వాక్యం రాయడానికే సిగ్గుతో చితికిపోతున్న కుర్రకవికి ఆ మాటలు కొన్ని రోజుల పాటు నిద్రాభంగమయ్యే పెద్ద సత్కారం.

బహుశా, ఈ బందాల్నీ, చట్రాల్నీ నిరాకరించడమే ఆయన తన కవిత్వంలోనూ, వచనంలోనూ, చివరికి వొక్క క్షణమూ శాంతినివ్వలేని జీవితంలోనూ చేశారేమో! ఇప్పుడనిపిస్తుంది, వొక్క వాక్యంలో ఇస్మాయిల్ గారి గురించి చెప్పాలంటే – అలాంటి చట్రరహితమైన జీవనస్వేచ్చకి ఆయన ప్రతీక. నలభయ్యేళ్ళ పైబడి తెలుగు కవిత్వంలో ఆ ప్రతీకని వొక చెట్టు రూపానికి పరిమితం చేసి మనం మాట్లాడుతూ వచ్చాం. ఆ ప్రతీక మనలోని సాంప్రదాయపు వేళ్ళని పెళ్లగించింది. ఆలోచనల్ని బిగించి పెడుతున్న మూసల్ని చెదరగొట్టింది. పదాల మారుమూలల్ని శుభ్రం చేసింది. మామూలు పదాలకు అమామూలు శక్తినిచ్చింది. జీవితంలోని ముచ్చట ఎక్కడో లేదనీ, మనలోనే మన చుట్టే వుందని మనల్ని మన పరిసరాల్లోకి మళ్ళీ ప్రతిష్టించింది.

ఈ పరిసరాల స్పృహలోంచి ఇస్మాయిల్ రెండు ముఖ్యమైన పనులు చేశారనుకుంటాను. వొకటి: జీవితం చుట్టూ, సాహిత్యం చుట్టూరా పేరుకుపోయిన కాలుష్యాల్ని తుడిచిపెట్టడం; రెండు: సిద్ధాంతం అనేది వొక బ్రహ్మ పదార్ధం లాంటి metanarrative కాదనీ, అది మన కళ్ళ ముందే పరచుకొని వుందనీ అసిద్ధాంతీకరించడం (ఇప్పుడు దీన్ని మనం deconstruction / de-schooling అనుకుందామా?) ఈ రెండూ ఆయన పుస్తక జ్ఞానంలోంచి కాకుండా తన ఆనుభవిక చైతన్యంలోంచి చెప్పడం ఆయనలోని overarching phenomenon.

కవిత్వానికి గొప్ప వస్తువు అంటూ అక్కర్లేదు. నిజమే, కాని, అలా అనుకున్న తరవాత నిజంగా కవిత్వం రాయబోయేసరికి ఆ గొప్పది కాని విషయాన్ని అర్థం చేసుకొని రాయడం అన్నది అంత తేలిక కాదు. అసలు తేలికగా కవిత్వం చెప్పడం అంత తేలిక కాదు. తేలిక మాటల్ని అనుభవాల బరువుతో తూకం వేయడం చిన్న సంగతీ కాదు. పదచిత్రాలూ, ప్రతీకలూ ఇతర అలంకారాలేవీ లేకుండా కేవలం వొక భావమే ప్రాణంగా కవిత్వాన్ని బతికించుకుంటూ పోవడానికి కవికి చాలా శక్తి కావాలి. ఇప్పటిదాకా మనం చేస్తూ వచ్చిన పొరపాటు ఏమిటంటే, కవిత్వం జీవితమంత బరువుగా వుండాలేమో అనుకొని దాని మీద గాడిద బరువు మోపుతున్నాం. ఇస్మాయిల్ గారి కవిత్వంలో గాడిదల ప్రస్తావన చాల చోట్ల వస్తుంది. బహుశా, గాడిదలకి అంత సాహిత్య పాపులారిటీ ఇచ్చిన రచయిత కిషన్ చందర్ తరవాత ఇస్మాయిల్ గారే కావచ్చు. కవులు గాడిదలు కాకూడదన్న సందేశం ఇస్మాయిల్ కవిత్వంలో వుందని వేరే చెప్పక్కర్లేదు కదా!

ఆ గాడిద బరువు లేకుండా కవిత్వం నిరలంకారంగా వుండాలన్న టాగోర్ ని సదా బాలకుడని వో పద్యంలో వర్ణించారు ఇస్మాయిల్. నిజానికి సదాబాల్యం ఇస్మాయిల్ కవిత్వానికి అంతర్వస్తువు (Internalized theme). ఆయన బాల్యం గురించి రాసిన పద్యాల్లో కేవలం బాల్యం గురించే ఆయన చెప్పలేదు. ఆ మాటకొస్తే, బాల్యం ఆయనకొక గతానుభవం కాదు. ఆ నిన్నటి బాల్యంలోంచి ఆయన గుర్తుచేసే/ గుర్తించే వర్తమానం ముఖ్యమైంది. జీవితంలోని స్వచ్చతని పదిలంగా కాపాడే శక్తి బాల్యానికి మాత్రమే సొంతం. ఆ స్వచ్చతని చెప్పడానికే ఆయన పసితనం గురించీ, పసివాళ్ళ గురించీ రాస్తారు.

గుర్రప్పిల్ల కాళ్ళతో

పరిగెత్తుకుంటూ వచ్చాడు

బడి వదిలినట్టున్నారు.

బుర్రనీ, కాళ్ళనీ

బంధించిన సంకెళ్ళు విప్పేయగానే

మధ్యాహ్నపు ఎండ బయళ్ళు

మహోత్సాహంతో ఆహ్వానించాయి

ఎంత స్వేచ్చ! ఎంత హాయి!

అన్న పద్యపాదాల్లోంచి కనిపించేది ఆయన మనవడా? ఇస్మాయిల్ గారా? మనమా? నన్నడిగితే అది వొకే సమయంలో ఒకే దృశ్యంలో ముగ్గుర్ని బంధించే కవిత. ఆ తరవాత ఆ మనవడు చేసే పనుల జాబితాలోని పనుల్ని యింకో కోణంలోంచి చూస్తే, అవి ఇంకో రూపంలో మనకీ స్వేచ్చనిస్తాయి. రోజువారీ బతుకులో పోగొట్టుకుంటూ వస్తున్న మన స్వేచ్చని గుర్తు చేస్తూ- చివరికొచ్చేసరికి మనం పోగొట్టుకున్న ఆ స్వేచ్చని అందంగా అప్పగించడం ఈ కవిత చేసే పని. అలా అందుకోడానికి మనకి కాసింత వెసులుబాటు దొరకాలి అంతే! ఆ కాస్త వెసులుబాటే దొరికితే జీవితానికి అర్థమే మారిపోతుంది. అలాంటి అర్థాన్ని వెతుక్కునే దారినే ఆయన “ఉత్సవం”గా వర్ణించారు వొక సందర్భంలో-

“చెట్టు నా ఆదర్శం” నించి ఇటీవలి “కప్పల సముద్రం” దాకా ఇస్మాయిల్ గారి కవిత్వ ప్రయాణాన్ని నిశితంగా గమనిస్తే, ఆయన పోనుపోనూ బాలకుడైపోతున్నాడని అనిపిస్తుంది. అది ఆయన తీసుకునే ఆయన వస్తువులోనూ కనిపిస్తుంది. ఆయన రాసుకునే భాషలోనూ అనిపిస్తుంది. లేకపోతే-

తరుచాపము వీడిపోయి

గురిమరచిన బాణంలా

తిరుగాడును పిట్ట

అంటూ అత్యంత గంభీరంగా రాసిన కవి, పదచిత్రాల మీదా, కొండొకచో అంత్యప్రాసల మీదా ఆధారపడిన కవి నెమ్మదిగా ఆ ఆధారాల్నీ, ఆ అలంకారాల్నీ వొదిలేసి-

నా కోసం పూర్తిగా

నగ్నవైనపుడు మాత్రమే

నా దానివి

అని తనే వొక కవితలో అన్నట్టు తన ‘self’ ని ఆవరిస్తున్న ఆచ్చాదన గుర్తెరిగి రాయడం ఆయన కవిత్వంలోని ఇంకో రహస్యం అనుకుంటాను. ఆ ఆచ్చాదనల్ని చింపేసిన ఉత్సవ సమయంలోనే ఆయన “గోళీకాయలు” “బెల్లంకాయ” లాంటి కవితలు రాశారనుకుంటాను. ఆ సమయంలో చుట్టూ వున్న లోకంలోంచి వొక సంతోషాన్ని, వొక ఆశ్చర్యాన్ని తోడుకునే విషయాలన్నీ ఆయనకు కవిత్వమవుతాయి. ధనియాలతిప్ప అనే స్పష్టమైన స్థలం చూస్తే ఎంత ఆనందమో, అస్పష్టమైన వొక వాన్ గొ చిత్రం చూసినా అదే ఆనందం. పాముల వాణ్ని చూస్తె ఎంత సంభ్రమమో, పికాసో బొమ్మని చూస్తే అంతే సంభ్రమం. చుట్టూ పరచుకొని వున్న చెట్లనీ, నదుల్నీ, మనుషుల్నీ చూస్తే ఎంత సంతోషమో, ఎక్కడో వున్న పారిస్ మహానగరాన్ని చూసినా అంతే సంతోషం. ముఖ్యంగా, వ్యక్తులూ, స్థలాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఇంత సున్నితంగా ప్రేమగా రాసిన ఇంకో కవి ఎవరైనా వున్నారా అంటే లేరనే అనిపిస్తుంది నాకు. చాలా మంది ఆయన కేవలం ప్రకృతి గురించే రాశారని పొరబడతారు కాని, నిజానికి ఆ ప్రకృతిలో లీనమయ్యే కల కంటున్న మనుషుల్ని గురించే ఆయన రాస్తున్నారని నేను అనుకుంటాను.

పిల్లల్ని గురించి, అంత కంటే ఎక్కువగా తన స్నేహితుల్ని గురించి రాయన రాసిన కవితలు నన్ను ఎప్పుడూ విస్మయంలో పడేస్తాయి. సూఫీలు కలకంటున్న వొక ప్రాపంచిక జీవిని ఈ మూడింటి కలయికలోంచి చూపిస్తున్నారా అనుకుంటాను. మా ఇద్దరి సంభాషణల్లో సూఫీ మహాకవి హఫీజ్ ని ఆయన ఎన్నిసార్లు ప్రస్తావించే వారో లెక్కలేదు. మొదట్లో నేను హఫీజ్ ని చదవడానికి బద్దకిస్తున్నప్పుడు “అయ్యో…హఫీజ్ ని చదవకుండా, ఎట్లా రాస్తారు మీరు అసలు?” అని వొక సారి గట్టిగా మందలించే వారు కూడా- ఈ కాలంలో అలా మనల్ని ఫలానా చదవలేదే అని మందలించే వాళ్ళు లేరు కదా అనిపిస్తుంది కొన్ని సార్లు! అలాంటి క్షణాల్లో ఆయన మాటలు గుర్తొచ్చి మొదట ఆయన మాటనీ, తరవాత ఆయన్నీ పోగొట్టుకున్నాను కదా మరణం అనే ఈ తెర అడ్డుపడి అనుకుంటూ వుంటాను.

4

కవిత్వం విషయంలో నాకూ మా నాన్నగారికి మొదటి నించీ చుక్కెదురు. మా నాన్నగారు కమ్యూనిస్టు సాహిత్య జీవి. నాకు కవిత్వ ఊహలు అప్పుడప్పుడే అందుతూ వస్తున్న నా డిగ్రీ రోజుల్లో “లేచిపోదామా?” అని చిలిపి హుషారుగా అనే అమ్మాయిలా ఇస్మాయిల్ గారు అనిపించారు నాకు. కవిత్వ పరంగా నేను ఆయనతో లేచిపోయాను, మా నాన్నగారి కమ్యూనిస్టు పంజరం విడిచి-

అయితే, నా మొండితనం మీద గాఢమైన నమ్మకం వుండడం వల్ల నాన్నగారు నన్ను ఇస్మాయిల్ గారి మైదానంలో హాయిగా వదిలేశారు. నాన్నగారు మంచి సాహిత్య వక్త. ఖలీల్ జిబ్రాన్ గురించీ, కొంత మంది పర్షియన్ కవుల గురించి నాన్నగారి రేడియో ప్రసంగాలు విని, ఇస్మాయిల్ గారు “కౌముదీ, మీలోని నిజమైన వ్యక్తీ ఇదిగో ఇక్కడున్నాడు! మీరు ఎందుకలా తప్పించుకు తిరుగుతారు అతన్నించి!” అని వొక సారి కార్డు ముక్క రాశారు. అదే వుత్తరం కింద నా కోసం “అఫ్సర్, నాన్నగారి మార్క్సిస్టు మాటలు మినహాయించుకొని, ఇదిగో హాయిగా ఈ పర్షియన్ కవుల్ని చదువుకో నువ్వు! ఆయన మార్క్సిస్టు కాని వేళల్లో సాహిత్యం గురించి చక్కగా మాట్లాడతారు.” అని రాశారు.

ఇక నించి అలాంటి ఆకుపచ్చ ఉత్తరాలూ, అందమైన వాక్యాలూ రావు కదా!

ఇలా వెళ్లిపోతారని తెలిస్తే, ఇంకాసిని ఎక్కువ మాటలు ముందే మాట్లాడి వుండే వాణ్ని కదా, ఇంకా కొన్ని కాలాలు నాలో దాచుకోడానికి!

(లోగో: సాయి కిరణ్)

 వచ్చే గురువారం: విన్నకోట రవిశంకర్ వ్యాసం “ఆ ఇద్దరూ సదాబాలకులే!”

 

Interstellar: మనిషికీ సైన్సుకీ మధ్య…

imagesODLF8DC7

Interstellar సినిమా రెండో సారి చూశాను మొదటిసారి చూసినప్పుడు అర్థం కాని విషయాలు రెండోసారికైనా అర్థమవుతాయని ఆశతో వెళ్లాను. కొంత నయం. ఇంకో రెండు సార్లు చూస్తే అర్థమయిపోతుంది. చాలా రోజుల తర్వాత నాలో సైన్స్ జిజ్ఞాస మళ్ళీ ఊపిరి పోసుకుంది. ఈ వ్యాసంలో ఆ సినిమాలోని సైన్స్ ని నేను వివరించబోవడంలేదు. కాని కొన్ని ముఖ్యమయిన విషయాలు చర్చించుకోవడానికి ఆ సినిమా గొప్ప ఉదాహరణ.

క్లుప్తంగా Interstellar కథ ఇది:

కొన్ని దశాబ్దాల తర్వాత భూమి ఇక మనిషిని తట్టుకోలేని రోజులవి. మానవ జాతి అంతరించిపోవస్తున్న కాలం అది. ఇసుక తుఫానుల వల్ల, పంటలు పండకపోవడం వల్ల, ఆహార కొరత వల్ల జనాభా క్షీణిoచిపోతూ ఉంటుంది. కూపర్ అనే రైతు (ex-NASA Aircraft Pilot), అతని కూతురు కొన్ని విచిత్ర సంఘటనల ద్వారా, అప్పటికే మూతపడిపోయింది అనుకున్న NASA రీసెర్చ్ సెంటర్ ఒకదాని లోకి వచ్చి పడతారు. అక్కడి ముసలి ప్రొఫెసర్ కూపర్ కి మానవ జాతి అంతరించిపోబోతోంది అని వివరించి, అంతరిక్షంలో సుదూరాన ఉన్న కొన్ని గ్రహాల మీదకి వెళ్లి, వాటిలో ఏది మానవుల మనుగడకి అనువైనదో కనుక్కుని రావడానికి ఒప్పిస్తాడు. కూపర్ ఇంకో ముగ్గురు మనుషులూ, ఒక రోబోట్ తో కలిసి ఈ అన్వేషణ కి బయల్దేరతాడు. మనకి తెలిసిన సైన్స్ కి అవతలి చివర ఉన్న ఎన్నో వింతలూ, సమస్యలూ దారిలో ఎదుర్కొంటూ చివరికి ఎం చేశాడా అన్నదే సినిమా.

ఇదేదో మాములు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకోవద్దు. ఇందులో మానవ సంబంధాలని అత్యద్భుతంగా చిత్రించాడు నోలాన్. Warm Holes, Black Holes, Time Dilation లాంటి ఎన్నో క్లిష్టమైన అంశాలు ఇందులో ఉన్నప్పటికీ హ్యూమన్ ఎలిమెంట్ ని ఎక్కడ వదలకుండా చాలా చక్కగా తీశాడు. అన్నింటికంటే మించి మానవ జాతి భౌతిక శాస్త్రం(Physics) లో ఇప్పటి వరకూ సాధించిన అభివృద్ధికి ఈ సినిమా దృశ్య రూపం. అంతేకాక మనం ఇంకా ఏమేమి తెలుసుకోవాలి అనుకుంటున్నామో అవి కూడా ఊహామాత్రంగా చూపిస్తుంది. శాస్త్ర అభివృద్ధి లో, లేదా ఇంకా విస్తృత స్థాయిలో చెప్పాలంటే, మానవాభివృద్ధి లో కళ పాత్ర ఏమిటి అనే చర్చ మన ముందుకు పెడుతుంది ఈ సినిమా.

మనిషి ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. ప్రతి భౌతిక సంఘటన, ప్రతి భౌతిక వస్తువూ మనిషి మెదడులో ఏదో ఒక చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ చైతన్యం ఆధారంగానే మనిషి ప్రకృతిని, సమాజాన్ని అర్థం చేసుకుంటాడు. మనిషి ప్రపంచాన్ని ఆకళింపు చేసుకునే ఈ క్రమంలో అనేక చైతన్య రూపాలు పుడతాయి. వాటిలో కళ ఒకటి. ఉదాహరణకి వేట ఒక శాస్త్రం. ఆదిమ మానవుడు వేటలో ప్రావీణ్యం తెచ్చుకోడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. వేటలోని మెళకువలను, సూత్రాలను అనుభవాల ద్వారానే అతను నేర్చుకున్నాడు. నిజానికి ఏ శాస్త్రానికైనా పునాది మానవానుభావమే. అలాంటి అనుభవాలు, అనుభూతులు, ఆవేశాలు, భావాలు మొదలైనవి గుంపులోని మిగతా సభ్యులతో సంజ్ఞల ద్వారా, భాష ద్వారా, గోడల మీద బొమ్మల వెయ్యటం ద్వారా పంచుకున్నాడు. కాలక్రమేణా ఇవి కొన్ని నిర్దిష్ట రూపాలు తీసుకున్నాయి. అలా పుట్టినవే నేడు మనం చూస్తున్న అనేక కళారూపాలు.

సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికీ ప్రత్యేకమైన అనుభవాలు కొన్ని ఉంటాయి, వాటి వల్ల కలిగిన ప్రత్యేకమైన చైతన్యం కూడా కొంత ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక చైతన్యాల నుంచే సమాజ చైతన్యం (Social Consciousness) పుడుతుంది. ఇక్కడ సమాజ చైతన్యం అంటే ఆ సమాజం తనని తానూ, తన చుట్టూ ఉన్న ప్రకృతినీ అర్థం చేసుకునే క్రమమే. ఇది ఎప్పుడూ ఆ సమాజంలో చలామణి అవుతున్న భౌతిక పరిస్థితులు, ఉత్పత్తి సంబంధాలు, మానవ సంబంధాలకి లోబడి ఉంటుంది. ఒక తరం తన అనుభవాల ద్వారా పొందిన చైతన్యాన్ని తన తరువాతి తరానికి సమగ్రంగా అందించినప్పుడే రెండవ తరం చైతన్య స్థాయి మొదటి దానికంటే ఉన్నతంగా ఉంటుంది, పురోగతి సాధ్యపడుతుంది. ఈ అవసరాన్ని కళలు చాలా సమర్ధవంతంగా తీరుస్తాయి. సులువుగా చెప్పాలంటే సమాజంలో అంతర్భాగమైన రకరకాల మనుషుల యొక్క ప్రత్యేక చైతన్యాలని తీసుకుని సమాజం మొత్తానికి సమానంగా పంచిపెట్టి, ఒక నిర్దిష్టమైన సమాజ చైతన్యం రూపొందేలా చెయ్యడం కళ పని. మనిషి ప్రపంచాన్ని అవగతం చేసుకోవడానికి కళ ఒక సాధనం.

our-legend-of-cinema-christopher-nolan-1007037965

నిప్పు కనిపెట్టడం ప్రకృతి పై మానవుడు సాధించిన మొదటి విజయం. బండి చక్రమొక విప్లవం. భాషలకి లిపి తయారు చేసుకోవడం ఒక విప్లవం (చిత్ర కళ లిపికి మూలం అయ్యింది). ఇవన్నీ చాలా శాస్త్రీయమైన, సైన్సుతో ముడిపడి ఉన్న విప్లవాలే. భూమి నుంచి ప్రసవ రహస్యాన్ని కనిపెట్టి అడివి మనిషి వ్యవసాయదారుడిగా మారడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. కొన్ని వందల తరాలు మారాయి. ఆ చైతన్యం (సైన్స్) ఇన్ని తరాల పాటు, ఇన్ని ప్రాంతాలలో విస్తరిస్తూ రావడంలో కళ పాత్ర అత్యంత కీలకం. అసలు కళ పుట్టుకే ఒక విప్లవం.

నిజానికి కళ, సైన్స్ రెండింటి జన్మస్థానం ఒక్కటే – మానవ జీవితానుభవం.

ఆ రెండింటి లక్ష్యం కూడా ఒక్కటే – సర్వ మానవ శ్రేయస్సు.

కళ, సైన్స్ ఒక దానిని ఒకటి సంపూర్ణం చేసుకుంటూ ముందుకు సాగుతాయి. ఆ రెండిటినీ విడగొట్టడం అనేది కుట్ర. కళని సైన్స్ ని దూరం చేసి, ఆ రెండూ రెండు వేరు వేరు రంగాలుగా తయారు చెయ్యడం కుట్ర. సైన్స్ కళ నుండి విడివడినప్పుడు మానవ జాతి పురోగతి మందగిస్తుంది. సమాజ చైతన్యం సమాజం మొత్తానికి చెందకుండా కొంత మందికి మాత్రమే పరిమితమై పోతుంది. శాస్త్రాలు మొత్తం సమాజం అభివృద్ధికి ఉపయోగపడకుండా, “టెక్నాలజీ” అనే పేరుతో కొంత మంది అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడతాయి. ఒక వైపు మనం అంగారకుడిని అందుకుంటుంటే ఇంకోవైపు దొంగ బాబాలు దేశం లో స్వైరవిహారం చేస్తుండటం ఇందుకు ఒక ఉదాహరణ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సైన్స్ అంటే స్పేస్ సైన్స్ (Space Science) మాత్రమే కాదు. ఇంకా ఎన్నో శాస్త్రాలు – ముఖ్యంగా సామాజిక శాస్త్రాలు – మానవులకు తక్షణ అవసరాలుగా ఉన్నాయి. వాటన్నిటి మీదా సినిమాలూ, కథలూ, కవితలూ, నాటకాలూ మొదలైనవి రావాలి. ప్రచారం జరగాలి. సమాజ చైతన్యం పై ప్రతి మానవుడికీ సమానమైన హక్కు ఉంది.

ఈ నేపధ్యంలో ఈ సినిమా ఒక చిన్న విజయాన్ని నమోదు చేసింది అని చెప్పొచ్చు. భౌతిక శాస్త్రాన్ని చాలా చక్కటి కథతో హృద్యంగా చిత్రీకరించారు. అలాగని ఈ చిత్రం లో వ్యాపార కోణం లేదు అని నేను అనడం లేదు. వెయ్యి కోట్ల బడ్జెట్ తో వ్యాపారం కోసమే ఈ సినిమా తీశారు. అందులో సందేహం లేదు. ఈ చిత్రంలో చూపించినది అంతా శాస్త్రీయమైనది అని కూడా నేను అనడం లేదు. ఏ కళలోనైనా స్వాభావికంగానే వాస్తవికతతో పాటు కొంత ఊహ, కొంత అధివాస్తవికత ఉంటాయి. ఆ ఊహలు భవిష్యత్తులో మానవ జాతి ఛేదించాల్సిన ఎన్నో ప్రశ్నల వైపు, సాధించాల్సిన ఎన్నో విజయాల వైపు నడిచే ఉత్సాహాన్నిస్తాయి.

 -వినోద్ అనంతోజు

vinod anantoju

 

ఏకలవ్యుడి బొటనవేలు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఏకలవ్యుడి గురించి రాద్దామని మొదలు పెట్టబోయేసరికి ఒక ఉదంతం గుర్తొచ్చింది…

అప్పుడప్పుడే నేను కాలేజీ చదువులోకి అడుగుపెట్టాను. మా నాన్నగారు కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులుగారు పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా ఉండేవారు. ఆ సమయంలోనే కరటూరి సత్యనారాయణగారు వాణిజ్యపన్నుల అధికారిగా ఉండేవారు. సత్యనారాయణగారు కవి కూడా. ఆయన అప్పటికే కొన్ని పద్యకావ్యాలు రాశారు. కొత్తగా ‘కరుణాసౌగతము’ అనే ఖండకావ్యం రచించారు. అది బుద్ధుడికి సంబంధించిన కొన్ని కథలను దండగుచ్చిన కావ్యం. ఆ కావ్య ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు.

వాణిజ్యపన్నుల అధికారికి సంబంధించిన కార్యక్రమం కదా… పట్టణంలోని వర్తకప్రముఖులందరూ రంగంలోకి దిగారు. ఉభయగోదావరి జిల్లాలలోని పలువురు సాహితీ ప్రముఖులను వక్తలుగా ఆహ్వానించారు. అందులో సంప్రదాయ, ఆధునిక అన్న తేడా చూపించలేదు. అలా ఆ సభ, ఓ అరుదైన ఉభయసాహితీ సమ్మేళనం. ఆధునికులలో నాకు బాగా గుర్తున్న పేరు ఆవంత్స సోమసుందర్ గారు. సంప్రదాయపండితులలో వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు కూడా ఉన్నట్టు జ్ఞాపకం. స్థానిక సాహితీ ప్రముఖులు దిగుమర్తి సీతారామస్వామిగారు సభాధ్యక్షులు. మా నాన్నగారు వక్తలలో ఒకరు.

ఇంటికి వాహనం పంపించారు. మా నాన్నగారితో నేనూ వెళ్ళాను.

సభ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో. మేము వెళ్ళేటప్పటికే కుర్చీలు చాలావరకు నిండిపోయాయి. ఎక్కువమంది వర్తకులే. వారి మెడల్లో ఒంటిపేట బంగారపు గొలుసులు, చేతికి బంగారపు చెయిన్ తో రిస్టువాచీలు, వేళ్ళకు రవ్వల ఉంగరాలు జిగేలుమంటున్నాయి. సాహితీ ప్రముఖుల ఎదురుకోలు సన్నాహాలు, పన్నీటి చిలకరింపులు, స్వాగతాలు వగైరాలు ముగిసిన తర్వాత సభ ప్రారంభమయింది. కనీసం పదిమంది వేదికను అలంకరించినట్టు జ్ఞాపకం.

bhasaram garu

ఆవిష్కరణ ముగిసి ప్రసంగాలు జరుగుతున్నాయి. వివరాలు నాకు గుర్తులేవు కానీ, ‘ఎవరో రసమా. భావమా?” అనే చర్చ లేవదీశారు. చూస్తుండగానే ఆ చర్చ సంప్రదాయ, ఆధునికుల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. సభాస్థలి వేడెక్కింది. అసలే కిక్కిరిసిన సభ. ఆపైన వేసవి కాలం. పైన పంకాలు తిరుగుతున్నా ఆ గాలి సరిపోవడం లేదు. వేసవి తాపానికి తోడు సభా తాపం. వర్తకశ్రేష్టులకు వేదిక మీద ఏం జరుగుతోందో అర్థం కావడంలేదు. బిక్కమొహాలు వేసి బెదురుచూపులు చూస్తున్నారు. వారి స్థూలకాయాలు కుర్చీల్లో ఇబ్బందిగా కదులుతున్నాయి.

వక్తలను నియంత్రించడానికి అధ్యక్షులవారికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఎలాగో ఆవేశ కావేషాలు సద్దుమణిగి ఊపిరి పీల్చుకున్నాక సోమసుందర్ గారిని మాట్లాడమన్నారు. ఆయన ‘కరుణా సౌగతము’ అనే ఆ కావ్యంలోని అంగుళిమాలుని కథను ఎత్తుకుని, దానికి మహాభారతంలోని ఏకలవ్యుని కథ కూడా మేళవించి, ‘గురువులందరూ శిష్యద్రోహులే’ నంటూ కొత్త మంట రాజేశారు. దాంతో మళ్ళీ సంప్రదాయసాహితీవేత్తలనుంచి నిరసన…ఉభయుల మధ్య వాగ్యుద్ధం…

కాసేపటికి మా నాన్నగారి వంతు వచ్చింది… ఆయన ఒక స్వీయపద్యంతో ప్రసంగం ప్రారంభించారు. ఆ పద్యం ఇదీ!

నలువకు నాల్గు నాల్క లట నర్తనమాడెడు నీ తనుప్రభల్

తలకొక దారి వింత గతులన్ మెరయించిన మోసపోయి వా

దులు గొని మచ్చరింతురు బుధుల్ తదుదగ్రరుషాతమమ్ముపై

వెలిగెడు నీదు చిర్నగవు వెన్నెల పండువు మాకు భారతీ!

ఓ సరస్వతీదేవీ! బ్రహ్మదేవుడికి నాలుగు నాల్కలు కదా. ఆ నాలుకల మీద నువ్వు నాట్యం చేస్తూ ఉంటావు. అప్పుడు నీ శరీర కాంతులు పండితులకు ఒక్కొక్క విధంగా వింత గతుల్లో మెరిసిపోతూ కనిపిస్తాయి. దాంతో వారు మోసపోయి వాదులాటకు దిగి మత్సరం పెంచుకుంటారు. ఉగ్రమైన ఆ చీకటి నాలుకలపై వెలిగే నీ చిరునవ్వే మాకు వెన్నెల పండుగ- అని ఈ పద్యానికి అర్థం.

ఆశ్చర్యం! పద్యం ముగిసిందో లేదో, సభ అంతా చప్పట్లు… నడివేసవిలో మిట్ట మధ్యాహ్నం హఠాత్తుగా మలయమారుతం వీచినట్టుగా వర్తక సభాసదుల ముఖాల్లో ఏదో తెలియని ఉల్లాసం. వారికి ఆ పద్యంలోని భావం అర్థమై కాదు. మా నాన్నగారని అనడం కాదు కానీ, పద్యం బాగా చదువుతారని ఆయనకు పేరు. శ్రావ్యమైన పద్యగానంతో సభ మీద ఆయన సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు.

సరే, ఆయన సందర్భోచితంగా పద్యాన్ని ఎత్తుకున్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఆ వెంటనే పండిత సత్కారం నిర్వహించిన వర్తకముఖ్యుని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్య ఈసారి సభలో నవ్వులు పూయించింది…

‘ఈయనెవరో మహానుభావుడు. ఈయనకు సంప్రదాయం తెలుసు. జంట వస్త్రాలతో సత్కరించాడు. నేను చాలా సభల్లో చూస్తూ ఉంటాను. శాలువా కప్పుతూ ఉంటారు. అలా ఏకవస్త్రం ఎవరికీ ఇవ్వకూడదు. పైన శాలువా కప్పుకుని కింద అలా వదిలేయాలనో ఏమిటో వాళ్ళ ఉద్దేశం’ అన్నారాయన. పండితచర్చ ఏమీ అర్థం కాక అంతసేపూ బిక్కచచ్చి ఉన్న వర్తకశ్రోతలకు అర్థమయ్యే మాటలివి. ఆ రిలీఫ్ వాళ్ళలో కనిపించింది.

కావ్యం మీద ఆయన ఏం మాట్లాడారో నాకు గుర్తులేదు. కానీ గురువులందరూ శిష్యద్రోహులే నన్న సోమసుందర్ గారి వ్యాఖ్యను ప్రస్తావించి, ‘అది ద్రోహం కాదు, శిష్యులపై గురువు చూపిన విశేష అనుగ్రహం’ అనడం మాత్రం గుర్తుంది. ఎంత మా నాన్నగారు అయినా, ఆయన మాట నన్ను ఒప్పించలేకపోయింది.

***

నేను ఒక ప్రత్యేక అవసరం కోసం కరటూరి సత్యనారాయణగారిని బ్రాహ్మణేతరకవిగా చెప్పాల్సివస్తోంది. ఆయన బుద్ధుడి కథలు ఇతివృత్తంగా ఆ కావ్యం రాయడమే చూడండి…బుద్ధుడి కథలతో బ్రాహ్మణకవులు రాసిన కావ్యాలు అంత ఎక్కువగా కనబడవు. తిరుపతి వెంకటకవుల ‘బుద్ధచరిత్రము’, పింగళి-కాటూరి కవుల ‘సౌందరనందము’ వంటివి కొన్ని మినహాయింపులు. బుద్ధుడి పట్ల బ్రాహ్మణేతరకవులకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉన్నట్టు కనిపిస్తుంది. కవులనే ఏమిటి, బ్రాహ్మణేతర మేధావులకు కూడా. తెలుగువాళ్లలో బుద్ధుడిపై, బుద్ధుడి తాత్వికతపై ఆసక్తితో ప్రత్యేక అధ్యయనాలు చేస్తూవచ్చిన వారిలో బ్రాహ్మణేతర మేధావులే ఎక్కువగా కనిపిస్తారు. చరిత్రలోకి వెడితే బుద్ధుడి కాలంలో, బహుశా ఇంకా అంతకుముందే వైదిక/సనాతన ధోరణులకు సమాంతరంగా భిన్న తాత్విక ధోరణి ఒక్కోసారి జ్ఞాతంగా, ఒక్కోసారి అజ్ఞాతంగా ప్రవహిస్తూనే ఉందని అర్థమవుతుంది. వెనకటి రాజుల కాలంలో భర్త వైదికమతాన్ని అభిమానిస్తే, భార్య బౌద్ధాన్నో, జైనాన్నో ఆదరించడం, వాటికి చెందిన వ్యవస్థలకు దానాలు చేయడం కనిపిస్తుంది. ఈ విషయంలో స్త్రీలకు, బ్రాహ్మణేతరులకు ఒక సామ్యం కనిపిస్తుంది. బి.ఎస్.ఎల్. హనుమంతరావుగారు రాసిన ఆంధ్రుల చరిత్రలో ఇందుకు సంబంధించిన సమాచారం దొరుకుతుంది.

ఆశ్చర్యమేమిటంటే, ఏనాడో బుద్ధుడి కాలానికి చాలా ముందునుంచీ ప్రారంభమైన సమాంతర తాత్వికత అనే పాయ ఒక అంతర్వాహినిగా మారి, కాలం కల్పించిన హద్దులను దాటుకుంటూ తెలుగునేల మీద నేటికీ ప్రవహిస్తూ ఉండడం!

***

సోమసుందర్ గారు ప్రస్తావించిన అంగుళిమాలుడి కథ ఇలా ఉంటుంది…

అంగుళిమాలుడు తక్షశిలలో ఒక గురువు వద్ద విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాడు. మంచి చురుకు, ప్రతిభ ఉన్నవాడు. దాంతో తోటి విద్యార్థులకు అతనిపై అసూయ కలిగింది. గురువుగారికి అతనిపై ఉన్నవీ, లేనివీ నూరిపోశారు. ఆయన అంగుళిమాలుడిపై ఆగ్రహం పెంచుకున్నాడు. విద్యాభ్యాసం ముగిసి గురుదక్షిణ చెల్లించే సందర్భం వచ్చింది. ‘వెయ్యిమంది చిటికెన వేలు ఖండించి వాటిని నాకు గురుదక్షిణగా చెల్లించు’ అని అంగుళిమాలుని గురువు ఆదేశించాడు.

గురుదక్షిణ చెల్లించితీరవలసిందే. లేకపోతే గురుద్రోహం అవుతుంది. నేర్చుకున్న విద్య ఒంటబట్టకపోగా శాశ్వతంగా అపకీర్తిని మోయవలసివస్తుంది. కనుక గురువు కోరిన దక్షిణ చెల్లించడానికే అంగుళిమాలుడు సిద్ధపడ్డాడు. ఒక అరణ్యంలో ఉంటూ దారినపోయేవారిని అటకాయించి, చంపి వారి చిటికెన వేలును ఖండించి తీసుకునేవాడు. వాటన్నింటినీ మాలగా గుచ్చి తన మెడలో వేసుకునేవాడు. అందువల్ల అతనికి ‘అంగుళిమాలుడు’ అనే పేరు వచ్చింది. అలా తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేళ్ళు అయ్యాయి. ఇంకొక్క వేలు దొరికితే వెయ్యీ పూర్తవుతాయి.

బుద్ధుడు అంగుళిమాలుడు ఉన్న అడవిమీదుగా ఒంటరిగా సంచారానికి బయలుదేరాడు. అనుయాయులు అంగుళిమాలుడి గురించి చెప్పి, వద్దని వారించారు. బుద్ధుడు వినలేదు. అంగుళిమాలుడు బుద్ధుణ్ణి చూశాడు. ఈరోజుతో వెయ్యి చిటికెన వేళ్లూ పూర్తవుతాయనుకుని సంతోషిస్తూ బుద్ధుణ్ణి అడ్డగించడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి అందకుండా బుద్ధుడు ముందుకు వెళ్లిపోయాడు. అంగుళిమాలుడు ఆయన వెంటపడ్డాడు. కానీ ఆయనను అందుకోలేకపోయాడు. అలసిపోయి చెమటలు కక్కుతున్న స్థితిలో ‘ఆగు’ అని ఒక్క కేక పెట్టాడు. బుద్ధుడు ఆగాడు. అంగుళిమాలుడు బుద్ధుని సమీపించాడు. అతని చేతిలో కత్తి ఉంది. అయినా బుద్ధుడు ఏమాత్రం తొణక కుండా అతని కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వుతో అలాగే నిలబడిపోయాడు. అంగుళిమాలునికి ఆశ్చర్యం కలిగింది. చేతిలో ఉన్న కత్తి జారిపోయింది. బుద్ధుని పాదాల మీద పడ్డాడు. ఆ క్షణంలోనే బుద్ధుని అనుయాయిగా అతను పునర్జన్మ ఎత్తాడు.

***

ఇప్పుడు ఏకలవ్యుని కథకు వద్దాం.

మహాభారతం, ఆదిపర్వం, పంచమాశ్వాసంలో ఇతని కథ ఉంది. దాని ప్రకారం ఏకలవ్యుడు హిరణ్యధన్వుడనే ఎరుకలరాజు కొడుకు. ద్రోణాచార్యుని ప్రసిద్ధిని విని ఆయన దగ్గర విలువిద్య నేర్చుకోవాలనుకున్నాడు. వెళ్ళి ద్రోణుని కలిశాడు. అతను నిషాదుడు(బోయ)కనుక అతణ్ణి శిష్యుడిగా చేసుకోడానికి ద్రోణుడు ఒప్పుకోలేదు. దాంతో ఏకలవ్యుడు ఆయన అనుమతి తీసుకుని, మట్టితో ఆయన ప్రతిరూపాన్ని తయారు చేసుకుని భక్తితో దానికి మొక్కుతూ విలువిద్యను సాధన చేసి ప్రావీణ్యం సంపాదించాడు.

అలా ఉండగా పాండవులు, కౌరవులు కలసి గురువు ద్రోణాచార్యుని అనుమతి తీసుకుని ఏకలవ్యుడు ఉన్న అడవిలోకి వేటకు వెళ్లారు. వేట కుక్కలను తీసుకుని వారి వెంట భటులు కూడా వెళ్లారు. ఆ కుక్కల్లో ఒకటి మిగిలిన కుక్కలనుంచి వేరుపడి ఏకలవ్యుడున్న చోటికి వెళ్ళి అతణ్ణి చూసి మొరగడం ప్రారంభించింది. అప్పుడు ఏకలవ్యుడు ఎంతో లాఘవంగా ఏడు బాణాలను దాని నోట్లోకి ప్రయోగించి నోరు మూశాడు. అది ఆ బాణాలు అలా ఉండగానే కురుపాండవుల దగ్గరకు పరుగెత్తింది. వారు దానిని చూడగానే ఆశ్చర్యపోయారు. అంత లాఘవంగా బాణాలు ప్రయోగించింది ఎవరా అనుకుంటూ వెతుకుతూ ఏకలవ్యుడున్న చోటికి వచ్చారు. దుమ్ము కొట్టుకున్న బలిష్టమైన దేహంతో, జడలు కట్టిన జుట్టుతో, జింక చర్మం ధరించి, ధనుర్బాణాలు పట్టుకుని ఉన్న ఏకలవ్యుడు వారికి కనిపించాడు. అతనిపై వారికి అసూయ కలిగింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘నువ్వెవరు, ఎవరి దగ్గర విలువిద్య నేర్చుకున్నా’వని అడిగారు. తను హిరణ్యధన్వుని కొడుకునని, ద్రోణుని శిష్యుడినని అతను చెప్పాడు.

untitled1

హస్తినాపురానికి తిరిగి వచ్చిన కురుపాండవులు ఇదంతా ద్రోణుడికి చెప్పారు. ఆ తర్వాత అర్జునుడు ఒక్కడే ఏకాంతంగా ద్రోణుని కలుసుకున్నాడు. ‘విలువిద్యలో నాకు ఎవరూ సాటిరాని విధంగా విద్య నేర్పుతానని మీరు మాట ఇచ్చారు. విలువిద్యలో నేనే కాదు, ముల్లోకాలలోనూ ఎవరూ ఆ బోయవాడికి సాటి రారు. నాకంటే, మీకంటే, లోకంలో అందరి కంటే ధనుర్విద్యలో అతడు నేర్పరి. పైగా మీ ప్రియశిష్యుడే నట’ అంటూ ఎత్తిపొదుపు మాటలు మాట్లాడాడు.

ద్రోణుడు అదిరిపడ్డాడు. ‘పద, అతణ్ణి చూద్దాం’ అంటూ అప్పటికప్పుడు అర్జునుని వెంటబెట్టుకుని ఏకలవ్యుడు ఉన్నదగ్గరకు వెళ్ళాడు. ఏకలవ్యుడు ఆయనకు ఎదురేగి పాదాభివందనం చేసి, ‘నేను మీ శిష్యుడిని, మిమ్మల్ని ఆరాధిస్తూ ఈ విలువిద్య నేర్చుకున్నాను’ అన్నాడు. ‘అయితే నాకు గురుదక్షిణ ఇవ్వు’ అని ద్రోణుడు అన్నాడు. ‘ఇది నా దేహం, ఇది నా సంపద, వీళ్ళు నా పరిజనం. వీటిలో మీకు ఏది ఇష్టమో చెప్పండి, సంతోషంగా ఇస్తాను’ అని ఏకలవ్యుడు అన్నాడు. ‘నీ కుడి చేతి బొటనవేలును ఇవ్వు’ అని ద్రోణుడు అన్నాడు. వెంటనే ఏకలవ్యుడు బొటనవేలును ఖండించి ద్రోణుడి చేతుల్లో పెట్టాడు. ఆ బొటనవేలుతోనే అతని విలువిద్యా లాఘవమూ పోయింది. అర్జునుడి మనసు చల్లబడింది.

***

సరే, ఏకలవ్యుడిపై అర్జునుడి అసూయ, ద్రోణుడు అతనికి చేసిన అన్యాయం ఈ కథలో ఒక కోణం. చాలా కాలంగా చర్చలో ఉన్న కోణం. సౌదా తన ‘అపూర్వ పురాణకథలు’లో చిత్రించిన బర్బరీకుని పాత్ర కూడా ఇలాంటిదే. ఒక ఆటవిక స్త్రీకి భీముని వల్ల జన్మించిన బర్బరీకుడు కూడా మంచి విలుకాడు. అతను మహాభారత యుద్ధంలో పాల్గొనాలని ఉత్సాహపడతాడు. కానీ కృష్ణుడు అది జరగనివ్వడు. పైగా యుద్ధానికి ముందు అతణ్ణి ‘వీరబలి’ ఇస్తారు. దానికి ఉపశమనంగా అతని శిరస్సుకు యుద్ధాన్ని తిలకించే అవకాశం ఇస్తారు.

నేను ముందుకు తెచ్చే ప్రశ్నలు భిన్నమైనవి. అసలు విలువిద్యలో ఎవరు గురువు, ఎవరు శిష్యుడు అన్నది వాటిలో మొదటిది. ఏకలవ్యుడు అనే బోయకు ద్రోణుని గురువుగా చేసుకుని ఆయన దగ్గర ఉన్న అస్త్రవిద్య అంతా నేర్చుకోవలసిన అవసరం ఏమిటన్నది రెండవది.

మొదటి ప్రశ్నకు వస్తే, అసలు విలువిద్య ప్రప్రథమంగా ఆటవికులది, అంటే ప్రస్తుత సందర్భంలో ఏకలవ్యుడిది. కనుక విలువిద్యలో ఆటవికులే అసలు గురువులు. ఈ దృష్ట్యా ద్రోణుడి లాంటి మైదానప్రాంతవాసులు ఆటవికులకు శిష్యులు కావడమే న్యాయం. కానీ ఇక్కడ తలకిందులవుతోంది. ఆటవికుడైన ఏకలవ్యుడు శిష్యుడు, మైదానవాసి అయిన ద్రోణుడు గురువు అవుతున్నారు. విషాదం ఏమిటంటే, తనదైన విద్యను పరుల నుంచి ఏకలవ్యుడు నేర్చుకోవాలని అనుకోవడం.

ఇక్కడ ఇంకో తేడా కూడా ఉంది. విలువిద్య ఆటవికులలో లేదా ఆదిమ జాతులలో ప్రధానంగా అన్నసంపాదనలో భాగంగా పుట్టిందే తప్ప మనుషుల్ని చంపే మారణాయుధంగా కాదు. విల్లు, బాణాలే కాక; ఇతర ఆయుధాలు కూడా అన్న సాధనాలుగా పుట్టినవే. రాంభట్ల కృష్ణమూర్తిగారి ‘వేదభూమి’ నుంచి ఉటంకించుకుంటే; శావేజీ ద్వితీయదశకు వచ్చేసరికి (మోర్గాన్ ప్రాక్చరిత్రను శావేజీ, బర్బరదశలుగా విభజించాడు. మళ్ళీ ఒక్కొక్క దశనూ మూడు అంతర్దశలుగా విభజించాడు) మనిషి నిప్పులో చేపల్ని కాల్చుకుని తినగలిగే స్థితికి వచ్చాడు. రాతి పనిముట్లతో ముడిగల చెట్టుకొమ్మను గదగా మలచుకున్నాడు. గట్టి కొయ్యతో త్రిశూలాన్ని చేసుకున్నాడు. త్రిశూలం అంటే మూడు కొనలూ పైకి ఉండే ఆయుధం కాదు. ఒక కొన వెనక్కీ, రెండు కొనలు ముందుకీ ఉండేది. అలాంటి అమరికే చేపల్ని పట్టుకోడానికి అనువుగా ఉంటుంది. పాశం కూడా చేపల్ని పట్టుకోడానికి ఉద్దేశించినదే. ఇక మూలమట్టంగా ఉండే కొయ్యను చక్రంగా మలచుకుని జంతువుల మీద ప్రయోగించేవాడు. అది జంతువును పడగొట్టనైనా పడగొడుతుంది, గురి తప్పితే విసిరిన వాడి చేతికే తిరిగి వస్తుంది. దీనిని తెలుగులో ‘వలరి’ అన్నారు. అరవంలో ’వలయత్తడి’ అన్నారు. ఆస్ట్రేలియా ఆదివాసులు ‘బూమరాంగ్’ అన్నారు. గద, త్రిశూలం, పాశం, చక్రం అనే ఆయుధాల పుట్టుక నేపథ్యం ఇదీ.

ధనుర్బాణాల విషయానికి వస్తే, అవి శావేజీ తృతీయదశ ప్రారంభంలో పుట్టాయి. ధనుర్బాణాలు చాలా సంక్లిష్టమైన యంత్రం. వేల సంవత్సరాల అనుభవం రాసిపడిన తర్వాతే ఈ గుణాత్మక నైపుణ్యం అలవడిందని రాంభట్ల అంటారు. అదివరకటి ఆయుధాలు ముఖాముఖీ ప్రయోగించడానికి మాత్రమే వీలైనవి. బాణాలను చాటునుంచి కూడా ప్రయోగించవచ్చు. అందుకే ఈ ఆయుధానికి మహత్యాలు పుట్టాయని ఆయన అంటారు.

ఇక్కడ జరిగింది ఏమిటంటే, అన్న సంపాదనలో భాగంగా ఆటవికులు సృష్టించిన ధనుర్బాణాలు ఆటవికేతరుల చేతికి వచ్చేసరికి మారణాయుధంగా మారిపోయాయి. అంటే, వాటి ప్రయోజనమే మారిపోయింది. ద్రోణుడు విలువిద్యను సాధనచేసి, ప్రావీణ్యం గడించింది, ఒక మారణాయుధంగా మాత్రమే! క్షత్రియులకు మారణాయుధంగానే విలువిద్యతో అవసరం కనుక ద్రోణుడు క్షత్రియ కూటమికి దగ్గరగా ఉన్నాడు. అది ఉభయులకూ లాభదాయకమైన సంబంధం. కనుక తన విద్యను అతను ఇంకొకరికి ఇచ్చే ప్రశ్న లేదు.

విలువిద్యతో ఏకలవ్యుడి అవసరం వేరు. అతనింకా అన్న సంపాదనకోసం విల్లమ్ములపై ఆధారపడే ఆటవిక దశలోనే ఉన్నాడు. అందుకు సరిపోయే విలువిద్య అతనికి అడవిలోనే లభిస్తుంది. ద్రోణుడి దాకా వెళ్ళనవసరమే లేదు. ఏకలవ్యుడు అడవికి కాబోయే రాజు కావచ్చు కానీ, అతనికి రాజ్య విస్తరణ దాహం ఉండే అవకాశం లేదు. శత్రుభయం ఉండే అవకాశమూ తక్కువే. ఒక వేళ ఉందనే అనుకున్నా; కురు-పాండవుల యుద్ధంలో మాదిరిగా భారీ సైనిక, ఆయుధసంపద, సంక్లిష్టమైన వ్యూహప్రతివ్యూహ చాతుర్యం అవసరంలేదు.

ఒక పోలిక చెప్పాలంటే, కత్తులు, కటార్లతో రెండు గుంపుల మధ్య జరిగే ఘర్షణకూ; శతఘ్నులు, ట్యాంకులు, యుద్ధవిమానాలతో రెండుదేశాల మధ్య జరిగే యుద్ధానికీ మధ్య ఎంత తేడా ఉంటుందో; విలువిద్య అవసరంలో ఏకలవ్యుడికీ, అర్జునుడి లాంటి క్షత్రియుడికీ అంత తేడా ఉంటుంది.

అయినా సరే, ఏకలవ్యుడు ద్రోణుని దగ్గర విలువిద్య నేర్చుకోవాలని ఎందుకు కోరుకున్నాడు? అంత విద్యను అతను ఏం చేసుకుంటాడు?! ఈ ప్రశ్నలను ఇంతవరకు ఎవరూ ముందుకు తెచ్చినట్టు లేదు.

తెగిన ఏకలవ్యుడి బొటనవేలు చెబుతున్న కథ కంటె, చెప్పకుండా దాచిన కథ వేరే ఉందా?! మనకు తెలియదు.

మరో అంశంతో వచ్చేవారం…

 

 

పెద్రో పారమొ-11

pedro1-1
కోమల లోయలోని పొలాల మీద వాన పడుతూంది. కుంభవృష్టి కురిసే ఈ ప్రాంతాల్లో అరుదుగా పడే పలచటి వాన. అది ఆదవారం. ఆపంగో నుండి ఇండియన్స్ వాళ్ళ సీమ చేమంతి జపమాలలతోటీ, మరువం, దవనం కట్టలతోటీ దిగబడ్డారు. కలప అంతా తడిగా ఉండడం చేత పైన్, వోక్ కట్టెలు లేకుండానే వచ్చారు.
వాన నిలకడగా పడుతూంది. చిన్న గుంటల్లో నిల్చిన నీటి మీద సొట్టలు పడుతున్నాయి.
నాగటి చాళ్ళనుండి నీరు కాలవలుగా మారి మొలకలెత్తుతున్న లేత మొక్కజొన్న వైపు పారుతున్నాయి. మగాళ్ళెవరూ సంతకి రాలేదు. వాళ్లంతా పొలాల్లో పారే నీటికి గండ్లు కొడుతూ దారి మళ్ళించి లేతపంటను ముంచెత్తకుండా చూస్తున్నారు. వాళ్ళు గుంపులుగా కదులుతూ ఆ వానలో వరదలెత్తిన పొలాల్లో దారి చేసుకుంటూ మెత్తబడ్డ మట్టిని పారలతో తెగకొడుతూ, మొలకలను చేతితో కదతొక్కుతూ అవి బలంగా పెరిగేందుకు దోహదం చేస్తున్నారు.
ఇండియన్స్ ఎదురుచూస్తున్నారు. ఇది తమకు మంచిరోజు కాదు అనుకున్నారు. అందుకే వాళ్ళు తడిసిన గబానేల, చెత్త టోపీల కింద వణుకుతున్నారు. చలితో కాదు, భయంతో. వాళ్ళు సన్నగా పడుతున్న వాన వంకా, పైన ఇంకా నిండుగా కనిపిస్తున్న మబ్బులవంకా తేరిపార చూస్తున్నారు.
ఎవరూ రావడం లేదు. ఊరంతా నిర్మానుష్యంగా అగపడుతూంది. ఒకావిడ ఒక గుడ్డ పీలికా, పంచదార పొట్లం, ఉంటే జొన్నగంజి వార్చడానికి చిల్లుల గిన్నే కావాలని అడుగుతూంది. సమయం గడుస్తున్న కొద్దీ గబానేలు బరువెక్కుతున్నాయి తడికి. ఇండియన్స్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ, చతుర్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. సీమ చేమంతి ఆకులు వాన తడికి మెరుస్తున్నాయి. “కాస్త కిత్తనార సారా తెచ్చి ఉంటే బాగుండేది కానీ కిత్తనార చెట్లన్నీ మునిగిపోయి ఉన్నాయి,” అనుకుంటూ ఉన్నారు.జస్టినా డయజ్ గొడుగు వేసుకుని మెదియా లూనా నుండి తిన్నగా ఉన్న దారిలో వేగంగా పారుతున్న నీటి కాలవలను తప్పించుకుంటూ వస్తూంది. చర్చి ప్రధాన ద్వారం దాటుతూ గుండెల మీదుగా చేత్తో శిలువ గుర్తు వేసుకుంది. ఆర్చీల కింది నుంఛి ప్లాజా లోకి వచ్చింది. ఇండియన్స్ అంతా ఆమెను చూడ్డానికి అటువైపు తిరిగారు. అందరి కళ్ళూ తనమీదే ఉన్నట్టూ, అందరూ తనను గుచ్చి గుచ్చి చూస్తున్నట్టూ అనిపించిందామెకి. ఆకులూ అలములూ పరిచిపెట్టుకున్న చోట్లలో మొదటిదాని దగ్గర ఆమె ఆగింది. పది సెంటవోల దవనం కొనుక్కుని వెనుతిరిగింది. ఇండియన్స్ కళ్ళన్నీ ఇంకా ఆమె వెన్నంటే ఉన్నాయి.
“ఈ కాలంలో అన్నీ ప్రియంగానే ఉంటాయి,” అనుకుంది మెదియాలూనా వెళుతూ దారిలో. “ఈ కాస్త దవనం పది సెంటవోలు! వాసన చూడ్డానికి కూడా చాలదు.”
పొద్దుపోతుండగా ఇండియన్స్ వాళ్లు తెచ్చుకున్న దినుసులన్నీ ఎత్తేసుకున్నారు. బరువుగా ఉన్న మూటల్ని భుజాన వేసుకుని వానలో నడిచారు. చర్చి దగ్గర ఆగి కన్య మేరీని ప్రార్థించి, ఒక మరువం కట్ట నైవేద్యంగా పెట్టారు. అపాంగో వైపు తమ ఇంటి దారి పట్టారు. “ఇంకో రోజు,” అనుకున్నారు. చతుర్లాడుకుంటూ నవ్వుతూ దారి వెంట నడిచారు.
జస్టినా డయజ్ సుజానా శాన్ హువాన్ గదిలోకి వెళ్ళి దవనాన్ని చిన్న అలమరలో పెట్టింది. పరదాలు కిటికీని పూర్తిగా మూసేయడంతో చీకట్లో ఆమెకు నీడలు మాత్రమే కనిపించాయి. కనపడని వాటిని ఉరామరిగా ఊహిస్తూంది. సుజానా శాన్ హువాన్ నిద్రపోతున్నట్లుంది అనుకుంది. ఆమె ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటే బాగుండుననుకునేది. ఇప్పుడు నిద్ర పోతుంది కనక జస్టినాకి తృప్తిగా ఉంది. కానీ ఆమెకి ఆ చీకటి గదిలో ఒక దూరపు మూలనుంచి నిట్టూర్పు వినవచ్చింది.
“జస్టినా!” ఎవరో పిలిచారు.
ఆమె చుట్టూ తిరిగి చూసింది. ఎవరూ కనపడలేదు కానీ భుజమ్మీద చేయీ, చెవి దగ్గర ఊపిరీ తగిలాయి. ఒక గొంతు రహస్యం చెపుతున్నట్టు అంది “వెళ్ళి పో జస్టినా, నీ సామానంతా సర్దుకుని పో. ఇక నువ్వు మాకక్కర లేదు.”
“ఆమెకి నా అవసరం ఉంది,” నిటారుగా నిలబడుతూ అంది. “ఆమెకి జబ్బు చేసింది. ఆమెకి నా అవసరం ఉంది.”
“ఇకపై అవసరం లేదు జస్టినా! నేనిక్కడే ఉండి ఆమెను చూసుకుంటాను.”
“నువ్వేనా బార్ట్లోం?” అడిగింది కానీ జవాబుకోసం ఆగలేదు. పొలాలనుంచి తిరిగి వచ్చే ఆడా మగా చెవుల పడేట్టు ఒక్క అరుపు అరిచింది. అది విన్న వాళ్ళు “ఇదేదో అరుపులా ఉంది కానీ మనిషి అరుపులా మాత్రం లేదు,” అనుకున్నారు.
వానకి చప్పుళ్ళనీ సన్నగిల్లుతున్నాయి. మిగతా సందడంతా సన్నగిల్లినప్పడు అది చల్లటి చినుకుల్ని విసిరికొడుతూ, జీవన సూత్రాన్ని నేయడం వినిపిస్తూంది.
“ఏమయింది జస్టినా? ఎందుకంతగా అరిచావు?” సుజాన శాన్ హువాన్ అడిగింది.
“నేనేం అరవలేదు సుజానా! నువు కలగన్నట్టున్నావు.”
“నాకు కలలు రావని చెప్పానుగా! నీకేం పట్టదు. ఒక రవ్వ కన్ను మూతపడింది. పిల్లిని రాత్రి బయట వదిలివేయలేదు. అది నన్ను రాత్రంతా నిద్ర పోనివ్వలేదు.”
“అది నాతో పడుకుంది, నా కాళ్ల మధ్య. అది తడిస్తే చూడలేక నా మంచం మీదే ఉండనిచ్చాను. కానీ అది గొడవేం చేయలేదు.”
“లేదు, గొడవేం చేయలేదు! రాత్రంతా సర్కస్ పిల్లి లాగా నా కాళ్ల నుంచి తలమీదికి దూకుతూ ఉంది ఆకలేసినట్టు మెల్లగా మ్యావ్ మ్యావ్ అంటూ.”
“దానికి తిండి బాగానే పెట్టాను. అది రాత్రంతా నా పక్క వదల్లేదు. మళ్ళీ ఏవో అబద్ధాల కలలు కంటున్నావు సుజానా!”
“అది రాత్రంతా దూకుతూ నన్ను జడిపిస్తూనే ఉందని చెపుతుంటే వినవేం? నీ పిల్లంటే నీకు ముద్దేమో కానీ నేను పడుకున్నప్పుడు నా దగ్గరికి రానీయకు.”
“ఊరికే ఊహించుకుంటున్నావు సుజానా. అంతే. పేద్రో పారమొ వచ్చాక ఇక నీతో నా వల్ల కాదని చెప్పేస్తా. వెళ్ళిపోతానని చెప్తా. పనికి పెట్టుకునే మంచి వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. అందరూ నీలా తిక్కగా ఉండరు, ఇట్లా ఏడిపించి నవ్వుకోరు. రేపు నేను వెళ్ళిపోతాను. నా పిల్లిని తీసుకుని పోతా, నువ్వు సుఖంగా ఉండు.”
“నువ్వు పోవు పాపిష్ఠి జస్టినా! నువ్వెక్కడికీ పోలేవు. నీకు నాలా ప్రేమించేవారు ఎక్కడా దొరకరు.”
“అవును, నేను పోను సుజానా. నేను పోను. నిన్ను చూసుకుంటానని నీకు తెలుసు. నేను ఏం చేయనని నువు తిట్టినా నేనెప్పుడూ నిన్ను చూసుకుంటాను.”
సుజానా పుట్టిన రోజునుంచీ ఆమే సాకింది. ఆమెను తన చేతుల్లోకి తీసుకుంది. ఆమెకు నడవడం నేర్పింది. ఎప్పటికీ గుర్తుండి పోయే ఆ మొదటి అడుగు వేయడం. ఆమె పెదవులూ, కళ్ళూ పంచదార చిలకల్లా తీపెక్కడం చూసింది. “పీచు మిటాయి బులుగు, పసుపూ బులుగూ, పచ్చా బులుగూ, అదీ ఇదీ కలుపు,” బొద్దుగా ఉన్న ఆమె కాళ్ళను మునిపళ్లతో కొరికేది. పాలు రాని రొమ్ముని బొమ్మలా ఆమెకందించి ఆనందపరిచేది. “ఆడుకో దీనితో,” సుజానాతో చెప్పేది. “నీ చిన్న బొమ్మతో నువ్వాడుకో,” ఆమె ముక్కలవుతుందా అనేట్టు వాటేసుకునేది.
బయట అరటి ఆకులమీద వాన పడుతూంది. నీరు కింద మడుగుల్లో పడి మరుగుతున్న చప్పుడు వస్తూంది.
పక్క దుప్పట్లు చల్లగా, చెమ్మగా ఉన్నాయి. పగలూ రేయీ, పగలూ రేయీ పనిచేసి అలసిపోయినట్టు తూముల్లో జల జలమంటూ నురగలు తేలుతున్నాయి. ప్రళయ కాల ధ్వనులతో వాన కుంభవృష్టిగా పడుతూనే ఉంది కాలవలు కడుతూ.

అర్ధరాత్రయింది. బయట వాన చప్పుడు అన్ని శబ్దాలనూ మింగేస్తూంది.
సుజానా శాన్ హువాన్ పెందలకడనే నిద్ర లేచింది. నెమ్మదిగా లేచి కూచుని మంచం దిగింది. మళ్ళీ ఆమెకు కాళ్ళు బరువెక్కినట్టనిపించింది. ఒళ్ళంతా కూడా బరువుగా ఉన్నట్టూ, అది తలకెక్కుతున్నట్టూ అనిపించింది.
“ఎవరది? నువ్వేనా బార్ట్లోం?”
ఎవరో వస్తున్నట్టో, పోతున్నట్టో తలుపు కిర్రుమనడం విన్నాననుకుంది. మళ్ళీ చల్లటి వాన, ఆగాగి ఆరటి మొక్క్ల మీదినుంచి జారిపడుతూ, దాని పొంగులోనే మరుగుతూ.
ఆమె మళ్ళీ పడుకుని పొద్దున ఎండ చెమ్మనీటితో పూసలు కట్టిన ఎర్రటి ఇటుకల మీదపడిందాకా లేవలేదు.
“జస్టినా!” ఆమె పిలిచింది.
భుజాల మీద శాలువా కప్పుకుంటూ ఆమె ప్రత్యక్షమయింది తలుపు పక్కనే ఉన్నట్టు.
“ఏం కావాలి సుజానా!”
“పిల్లి. పిల్లి మళ్ళీ ఇక్కడికి వచ్చింది.”
“అయ్యో నా సుజానా!”
సుజానా రొమ్ముల మీద తల ఆనించి కౌగిలించుకుంది. సుజానా తలపైకెత్తి అడిగింది “ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నువ్వు నన్నెంత బాగా చూసుకుంటున్నావో పేద్రో పారమొకి చెప్తాను. నీ పిల్లి నన్నెట్లా జడిపిస్తుందో అతనికి చెప్పనులే! ఏడవకు జస్టినా!”
“మీ నాన్న చనిపోయాడమ్మా! మొన్న రాత్రే చనిపోయాడు. మనం చేయవలసింది ఏమీ లేదని ఇవాళే వచ్చి చెప్పారు. అక్కడే పూడ్చేశారట. ఇక్కడి దాకా తీసుకురావడం దూరాభారమని. నువ్వొంటరిదానవయ్యావమ్మా, సుజానా!”
“అయితే అది నాన్న అన్నమాట.” సుజానా నవ్వింది. “నాకు సెలవని చెప్పటానికి వచ్చాడు,” ఆమె మళ్ళీ నవ్వింది.
చాలా ఏళ్ళ క్రితం ఆమె చిన్న పాపగా ఉన్నప్పుడు అతను ఒకరోజు ఆమెతో అన్నాడు “కిందికి దిగు సుజానా! వచ్చి నీకేం కనిపించిందో చెప్పు!”
ఆమె నడుముకు కట్టుకున్న తాడు నొక్కుకుపోతున్నా వేలాడుతూంది. చేతులు దూసుకుపోతున్నా వదిలి పెట్టడం లేదు. బయటి ప్రపంచాన్నీ ఆమెనీ కలిపి ఉంచే బంధం ఒక్క ఆ తాడే.
“నాకేం కనపడడం లేదు నాన్నా!”
“సరిగా చూడు సుజానా! ఏమన్నా కనిపిస్తుందేమో చూడు,” లాంతరు వెలుగు ఆమె మీద పడేట్టు చేశాడు.
“నాకేం కనపడడం లేదు నాన్నా!”
“ఇంకొంచెం కిందికి దింపుతాను. నేల తగలగానే చెప్పు.”
ఏవో చెక్కల మధ్య సన్నటి సందు నుండి లోపలికి పోయింది. బంకమట్టితో కప్పబడి, పుచ్చి పాడయిన చెక్కల మీద నడిచింది.
“నెమ్మదిగా పో సుజానా. నీకు నేను చెప్పింది కనిపిస్తుంది.”
ఆమె చీకట్లో అటూ ఇటూ ఊగుతూ, దేనికో కొట్టుకుంటూ కిందికి, ఇంకా కిందకి వెళ్ళింది కాళ్ళు గాల్లో తేలుతుంటే.
“కిందికి సుజానా. ఇంకొంచెం కిందికి. ఏమన్నా కనిపిస్తుందేమో చూసి చెప్పు.”
కాళ్ల కింద నేల తగిలినప్పుడు ఆమె భయంతో అక్కడే నిలబడిపోయింది. దీపపు కాంతి ఆమె మీదే తిరిగి ఆమె పక్కనే కేంద్రీకృతం అయింది. పైనుంచి అరుపు విని వణికింది.
“అది నాకివ్వు సుజానా!”
ఆ పుర్రెను చేతుల్లోకి తీసుకుంది కానీ వెలుతురు పూర్తిగా దాని మీద పడేసరికి వదిలేసింది.
“ఇది చచ్చిపోయన వాడి పుర్రె,” అంది.
“దాని పక్కనే ఇంకేదో ఉంటుంది చూడు. ఏం కనిపించినా నాకివ్వు.”
అస్తిపంజరం ఎముకలుగా విడివడి ఉంది. దవడ ఎముక పంచదారలాగా పక్కకి పడిపోయింది. బొటనవేలు దాకా ఒక్కో ముక్కా కీలు తర్వాత కీలుగా అతనికి అందించింది. అన్నిటి కంటే ముందు ఆమె చేతుల్లోనే పొడయిన గుండ్రటి పుర్రె.
“బాగా చూడు సుజానా! డబ్బు కోసం. గుండ్రటి బంగారు నాణేలు. అంతా చూడు సుజానా!”
తరవాత ఆమెకి ఏమీ గుర్తు లేదు కొన్ని రోజుల తర్వాత మంచుగడ్డలోకి అడుగుపెట్టిందాకా. ఆమె తండ్రి చూపుల్లోని మంచుగడ్డ.
అందుకే ఆమె నవ్వుతూందిప్పుడు.
“అది నువ్వేనని నాకు తెలుసు బార్ట్లోం!”
ఆమె రొమ్ముల మీద తలపెట్టి ఏడుస్తున్న జస్టినా పైకి లేచి చూసింది ఆమె ఎందుకు నవ్వుతుందా అనీ, ఆ నవ్వు అట్టహాసంగా ఎందుకు మారిందా అనీ.
బయట ఇంకా వాన పడుతూంది. ఇండియన్స్ వెళ్ళిపోయారు. అది సోమవారం. కోమల లోయ వానలో మునుగుతూ ఉంది.

రోజు తర్వాత రోజు గాలులు విసిరి కొడుతున్నాయి. వానలు తీసుకు వచ్చిన గాలులు. వాన పోయినా గాలి ఉండిపోయింది. పొలాల్లో లేత ఆకులు ఇప్పుడు ఎండిపోయి చాళ్ళలో పరిచినట్టు పడి ఉన్నాయి గాలికి ఎగిరిపోకుండా. పగటిపూట గాలులు ఐవీ తీగలను కదిలిస్తూ, కప్పుపై పెంకుల్ని దడదడమనిపిస్తూ కొంత భరించగలిగేలా ఉన్నా రాత్రయ్యేప్పటికి ఆగకుండా ఒకటే రొద పెడుతూన్నాయి. ఆకాశంలో పందిరిలా కమ్ముకున్న మబ్బులు నిశ్శబ్దంగా కదిలిపోతున్నాయి నేలను రాసుకుపోయేంత కిందగా.
సుజానా శాన్ హువాన్ మూసి ఉన్న కిటికీని గాలి విసిరి కొట్టడం వింటూంది. చేతులు తలకింద పట్టుకుని ఆలోచిస్తూ పడుకుని రాత్రి చప్పుళ్ళు వింది. గాలి అసహనంగా ఉండుండి రాత్రిని వేధిస్తూంది. అకస్మాత్తుగా ఆగిపోతుంది.
ఎవరో తలుపు తెరిచారు. గాలి విసురుకి దీపం ఆరిపోయింది. ఆమె చీకటినే చూస్తూంది ఆలోచించడం ఆపేసి. మరుక్షణం అడ్డదిడ్డంగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు వినపడింది. మూసిన కనురెప్పలమీద దీపపు కాంతి పడడం తెలుస్తూంది.
ఆమె కళ్ళు తెరవలేదు. వెంట్రుకలు మొహం మీద చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. ఆమె పై పెదవి మీద చెమట చుక్కల్ని దీపం వేడెక్కిస్తూంది.
ఆమె అడిగింది “నువ్వేనా ఫాదర్!”
“అవునమ్మా, నేను నీ తండ్రిని.”
సగం తెరిచిన కళ్ళతో చూసింది. పైకప్పు మీద నీడలాంటి ఆకారం ఆమె మొహం మీద పడుతున్నట్టూ, దాన్ని ఆమె జుట్టు మూసేస్తున్నట్టూ ఉంది. దాని తల ఆమె మొహం మీదికి వచ్చినట్టుంది. కనురెప్పల వెంట్రుకల్లోంచి బూజరగా ఉన్న ఒక ఆకారం రూపుదాల్చింది. దాని గుండె స్థానంలో ఒక దీపం వెలుగుతూంది. చిన్న గుండె దీపంలా రెపరెపమంటూ కొట్టుకుంటూంది. “నీగుండె నొప్పితో చనిపోతూ ఉంది,” ఆమె అనుకుంది. “నాకు తెలుసు నువ్వు ఫ్లోరెన్సియో చనిపోయాడని చెప్పడానికి వచ్చావని. కానీ నాకు ఆ విషయం ముందే తెలుసు. ఇక దేని గురించీ విచారించకు. నాగురించి ఆందోళన పడకు. నా దిగులు భద్రంగా దాచి ఉంచాను. నీ గుండె జారిపోనీకు.”
మంచం దిగి ఫాదర్ రెంటెరియా వైపుకు ఈడ్చుకుంటూ వచ్చింది.
“నన్ను ఓదార్చనీ.” అన్నాడు కొవ్వొత్తి వెలుగుని తన చేతితో కాపాడుతూ. “నా తీరని దుఖం తో నిన్ను ఓదార్చనీ!”
ఆమె అతని వద్దకు వచ్చి కొవ్వొత్తి జ్వాల చుట్టూ తన చేతుల్ని అడ్డుపెట్టి, దానివైపు తన ముఖం వంచడం ఫాదర్ రెంటెరియా చూస్తూ ఉండిపోయాడు. కాలుతున్న మాంసం వాసన రావడం తో కొవ్వొత్తిని ఒక్క ఊపున పక్కకి లాగి ఆర్పేశాడు.
చీకట్లో సుజానా మళ్ళీ పరుగెత్తింది తన దుప్పటి కింద దాక్కోవడానికి.
“నిన్ను ఓదార్చడానికి వచ్చానమ్మా!”
“అయితే నువ్వెళ్ళవచ్చు ఫాదర్!” ఆమె చెప్పింది. “మళ్ళీ రావద్దు. నాకు నీ అవసరం లేదు.”
వెనుతిరిగిపోతున్న అడుగుల చప్పుడు వినిపించింది. ఎప్పటిలా చలినీ, భయాన్నీ కలగజేస్తూ.
“చచ్చిపోయినవాడివి, నన్ను చూడడానికి ఎందుకు వచ్చావు?’
ఫాథర్ రెంటెరియా తలుపు మూసి రాత్రి గాలిలోకి అడుగు పెట్టాడు.
గాలి వీస్తూనే ఉంది.

టర్తముడో అని అందరూ పిలిచే అతను మెదియా లూనా వచ్చి పేద్రో పారమొ గురించి అడిగాడు.
“అతన్నెందుకు కలవాలనుకుంటున్నావు?”
“మ..మాట్లాడదామని..”
“ఇక్కడ లేడు.”
“వ..వచ్చాక చెప్పు ఆయనకి. డ..డాన్ ఫుల్గోర్ గురించి.”
“నేను వెళ్ళి చూస్తాను. కాసేపు ఆగాల్సి ఉంటుంది.”
“అ..అర్జెంటని చెప్పు.”
“చెప్తాలే!”
టర్తముడో గుర్రం దిగకుండానే ఎదురుచూశాడు. కొద్దిసేపయ్యాక అతనెప్పుడూ చూడని పేద్రో పారమొ వచ్చి అడిగాడు “ఏం పని నీకు?”
“నే.నేను అయ్యతోటే మాట్లాడాలి.”
“నేనే అయ్యను. నీకేం కావాలి?”
“ఏ..ఏమిటంటే డాన్ ఫుల్గోర్ సెడానో ని చ..చంపేశారు. నె..నేను అతనితోనే ఉన్నాను. ని..నీళ్ళు రావడం లేదేమిటా అని చు..చూడ్డానికి కాలవ పైకి వెళ్ళాము. వె..వెళుతుంటే కొంతమంది గుర్రాల మీద మాకెదురుగా వచ్చారు. వ..వాళ్లల్లో ఒకడు ‘వాడు నాకు తెలుసు, మె..మెదియా లూనాలో మేస్త్రీ’ అని అరిచాడు. వ..వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. డ..డాన్ ఫుల్గోర్ ని గుర్రం ది..దిగమని చెప్పారు. వ..వాళ్ళు తిరుగుబాటుదారులమని చెప్పుకున్నారు. వ..వాళ్లకి మీ భూములు కావాలంట. ‘పొ..పో!’ అని డాన్ ఫుల్గోర్ని అన్నారు ‘పో, పోయి మీ అయ్యగారితో చెప్పు మె..మేం వస్తున్నామని.’ బ్..భయపడిపోయి బయలుదేరాడు. ల..లావు కదా, మరీ వేగంగా కాదు కానీ పరుగెత్తాడు. అ..అతను పరుగెడుతుంటే వాళ్ళు కాల్చారు. ఒ..ఒక కాలు గాల్లో, ఒక కాలు నేలమీద ఉండగానే చ..చచ్చిపోయాడు.
“నె..నేను ఒక్క అడుగు కూడా క..కదల్లేదు. ర..రాత్రంతా అక్కడే ఉండి ఏం జరిగిందో చె..చెప్పడానికి వచ్చాను.”
“మరి ఇంకా దేనికోసం ఆగావు? నీ దారిన పో. వెళ్ళి వాళ్ళు ఎప్పుడు వచ్చి కలవాలన్నా ఇక్కడే ఉంటానని వాళ్ళకు చెప్పు. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను. ముందు కొసగ్రేషన్ రాంచ్ మీదుగా వెళ్ళు. నీకు టిల్కేట్ తెలుసా? అక్కడ అతనుంటాడు. అతన్నొచ్చి నన్ను కలవమని చెప్పు. తర్వాత వాళ్ళకు చెప్పు ఎంత తొందరగా వస్తారా అని ఎదురు చూస్తున్నానని. ఏ రకం తిరుగిబాటుదారులు వాళ్ళు?”
“న..నాకు తెలియదు. ఆ పేరే చెప్పుకున్నారు.”
“ఆ టిల్కేట్ ని ఇక్కడ ఉన్నట్టు రమ్మను.”
“ఆ..అట్లాగే అయ్యా!”
పేద్రో పారమొ తన ఆఫీసు గది తలుపులు మూశాడు. తను ముసలివాడయినట్టూ, అలసిపోయినట్టూ అనిపించిందతనికి. ఫుల్గోర్ గురించి ఎక్కువ దిగులుపడలేదు. “అతనీ లోకం కంటే పై లోకానికే చెందినవాడు.” ఫుల్గోర్ చేయగలిగిందల్లా చేశాడు. ఇంకెవరికంటేనూ ఎక్కువగా కాకపోయినా ఉపయోగపడ్డాడు. “కానీ ఆ దొంగలంజకొడుకులకి కొండచిలువలాంటి టిల్కేట్ వంటి వాళ్ళు ఎదురుపడి ఉండరు,” అనుకున్నాడు.
అతని ఆలోచనలు ఎప్పుడూ తన గదిలో నిద్రపోతూనో, నిద్ర నటిస్తూనో ఉండే సుజానా శాన్ హువాన్ వైపు మళ్ళాయి. అతను ముందు రాత్రంతా అమె గదిలో గోడ కానుకుని నిలుచుని పల్చటి కొవ్వొత్తి కాంతిలో ఆమెనే గమనిస్తూ గడిపాడు. చెమటతో తడిసిన మొహం, దుప్పటిని అటూ ఇటూ కదిలిస్తూ, దిండు పీలికలయ్యేట్టు పీకుతూన్న చేతులూ.
ఆమెను తనతో కాపురానికి తీసుకువచ్చినప్పటినుంచీ ప్రతి రాత్రీ అంతే. రాత్రంతా ఆమె అంతు లేని కలతతో బాధపడుతూ ఉండడం చూస్తూ గడపడమే. ఇట్లా ఎన్నాళ్ళు సాగుతుందని తనను తనే ప్రశ్నించుకున్నాడు.
చాలా రోజులు ఇట్లా ఉండదని ఆశించాడు. ఏదీ ఎల్లకాలమూ ఉండబోదు. ఏ జ్ఞాపకమూ ఎంత గాఢమైనదయినా మాసిపోకుండా ఉండదు.
ఆమెను అంతగా లోలోపల చీలుస్తూ వేధించేదేమిటో, నిద్రపట్టక అటూ ఇటూ దొర్లేట్టు చేస్తున్నదేమిటో తనకు తెలిస్తే బాగుండును.
ఆమె తనకు తెలుసుననుకున్నాడు. తెలియదని తెలిసినప్పటికీ, తను ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించిన వ్యక్తి అని తెలియడం చాలదా? ఇంకా – ఇది అన్నిటికంటే ముఖ్యమైనది – ఆమె వలన మిగతా జ్ఞాపకాలన్నీ చెరిపేసుకుని వెలిగే రూపుతో ఈ భూమిని వదిలిపోతాడు.
కానీ సుజానా శాన్ హువాన్ ఏ లోకంలో బతుకుతూంది? పేద్రో పారమొకి ఎప్పటికీ తెలియని విషయాల్లో అది ఒకటి.

“వెచ్చటి ఇసుక వొంటికి తగులుతూ హాయిగా ఉంది. నా కళ్ళు మూతపడీ, చేతులు బార్లా సాచీ, కాళ్ళు ఎడంగా సముద్రపుగాలికి తెరుచుకునీ ఉన్నాయి. నా ముందు దిగంతాలదాకా వ్యాపించిన సముద్రముంది కెరటాలతో నా పాదాలని కడిగి వాటిపై నురగలు వదులుతూ..”
“ఇప్పుడు మాట్లాడుతూంది ఆమే, హువాన్ ప్రెసియాడో. ఆమె ఏమంటూ ఉందో నాకు చెప్పడం మర్చిపోకు.”
“.. అది పొద్దున్నే. సముద్రం లేస్తూ పడుతూ ఉంది. దాని నురగ నుండి జారుకుని పచ్చటి నిశ్శబ్ద కెరటాలుగా పరుగెడుతూంది.
“’నేనెప్పుడూ నగ్నంగానే సముద్రంలో ఈదుతాను,’ అని అతనితో చెప్పాను. అతను కూడా ఆ మొదటి రోజు నాతో పాటు నగ్నంగానే దిగాడు. వెనక్కి తిరిగి నడిచి వస్తూ మెరుస్తూన్నాడు. సముద్రపు కాకులెక్కడా కనపడలేదు. ‘కత్తి ముక్కు ‘ పిట్టలని అందరూ పిలిచే పిట్టలు మాత్రం గురక పెడుతున్నట్టు గుర్రుగుర్రు మంటున్నాయి. అవి కూడా పొద్దెక్కేపాటికి మాయమయ్యాయి. నేను తోడు ఉన్నప్పటికీ అతనికి వొంటరిగా ఉన్నట్టనిపించింది.
“’నువు ఆ పిట్టల్లో ఒకదానివయితే ఎంతో అంతే,’ రాత్రి అతను అన్నాడు. ‘రాత్రి పూట మనమిద్దరమూ ఒక దుప్పటికింద ఒకే దిండు వేసుకుని పడుకున్నప్పుడే నిన్ను బాగా ఇష్టపడతాను.’
“అతను వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడూ తిరిగి వెళుతుండేదాన్ని. సముద్రం నా చీలమండల్ని కడిగి వెనక్కి పోతుంది, నా మోకాళ్ళను కడుగుతుంది, నా తొడలను కూడా. తన మెత్తటి చేయిని నా నడుం చుట్టూ వేసి, నా రొమ్ముల చుట్టూ తిరిగి, నా గొంతును పెనవేసుకుని, భుజాల్ని అదుముతుంది. నేను అప్పుడు దాంట్లోకి మునిగి పోయాను, నా పూర్తి శరీరంతో. దాని తాడన బలానికి నన్ను నేను అర్పించుకుని, ఏమీ దాచుకోకుండా దాని హస్తగతమౌతాను.”
“’నాకు సముద్రంలో ఈదడం ఇష్టం,’ అతనికి చెప్పాను.
“కానీ అతనికి అర్థం కాలేదు.
“ఆ మరుసటి రోజు నేను మళ్ళీ సముద్రంలో ఉన్నాను నన్ను నేను శుద్ధి చేసుకుంటూ. నన్ను ఆ కెరటాలకు అర్పించుకుంటూ.”

నీలిపూల రహస్యం

MythiliScaled

ఒకానొకప్పుడు  హాలండ్ లో  పెద్ద అడవి ఉండేది. అందులో ఒక ముచ్చటైన పాపాయి , తనకి నలుగురు అన్నలు. చెల్లెలిని చాలా ముద్దుగా చూసుకునేవారు.అడవిలో ఆకాలం లో విపరీతమైన చలి. పిల్లల తల్లి జంతువుల చర్మాలతో దుస్తులు కుట్టేది. అవి అందంగానూ మెత్తగానూ ఉండేవి. అమ్మాయి చిన్నపాపగా ఉన్నప్పుడు పొద్దున్నే పాలుపట్టి వాళ్ళ అమ్మ చెట్టుకొమ్మకి వేసిన ఉయ్యాలలో వెచ్చగా కప్పి పడుకోబెట్టేది. పాప నిద్రపోయేది. లేచేసరికి ఉయ్యాల చుట్టూ చిట్టి చిట్టి ఉడతలు మూగి ఆడుతూ ఉండేవి. ఆకుల్లో పాకే సాలీళ్ళని పాప ఆసక్తిగా గమనించేది.అవి పట్టుదారాలు అల్లి గూళ్ళు కట్టుకోవటం ఎంత సేపు చూసినా బావుండేది. వాళ్ళ నాన్న నిపుణుడైన వేటగాడు. అవసరం కొద్దీ  వేటాడే నేర్పుతోబాటు పట్టుబడిన మూగజీవులని దయగా కాపాడటం కూడా అతను పిల్లలకి అలవరచాడు. అలా వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పులిపిల్లలూ తోడేలు పిల్లలూ అడవి పిల్లిపిల్లలూ పెరుగుతుండేవి. వాటి పోషణ అంతా పాప పెద్దదయాక తనే చూసేది, వాటితో ఆడుకునేది. అవి  క్రూరజంతువులు కనుక ఎదిగేకొద్దీ చెల్లెలికి ఏమైనా హాని చేస్తాయేమోనని అన్నలు ఒక కంట కనిపెడుతూ ఉండేవారు. అయితే ఆమె కి ఆ భయమే లేకపోయేది- అవీ ఎంతో స్నేహంగా మసలుకునేవి, ఆమె కళ్ళెర్రజేస్తే భయపడిపోయేవి కూడా.

చక్కటి  ముఖం, దృఢమైన శరీరం- వీటికితోడు తల్లి తయారు చేసే సొగసైన గౌన్ లు- ఆమె ఒక రాజకుమారిలాగా కనిపించేది. వేసవికి తేలికగా రంగు రంగుల ఈకలతో ఆ దుస్తులు ఉండేవి. జుట్టులో సువాసన వేసే  అడవిపూలు  పెట్టుకునేది. చలికాలానికి కోట్ లూ, టోపీలూ చేతితొడుగులూ – ఇవన్నీ తెల్లని చర్మాలతోనే తల్లి కుట్టేది. మెరిసే నల్లని కళ్ళూ గులాబిరంగు బుగ్గలూ తప్పించి ఆమె మంచులోం చే  పుట్టినట్లు ఉండేది. ఉత్తరపుదిక్కున ఉల్ రుం భూమిలో ఉండే  మంచు దేవుడి కూతురే అలా వచ్చిందని అనుకునేవారు. ఆమె పేరు డ్రి-ఫా [ అంటే మంచులాగా తెల్లనిది అని ].

1aba3658d6313642da4d32068e1a43a1

ఆ ప్రాంతాలలో ఎవరికీ లేని అందం, సంపద ఉన్నా ఎందుకో ఆమెకి తృప్తిగా ఉండేది కాదు. చాలా మంది యువకులు పెళ్ళి చేసుకుంటామని అడిగినా ఎవరినీ ఒప్పుకోలేదు. కొంతమంది తాము వేటాడి సంపాదించిన ఉన్ని చర్మాలను, చాలా మేలైనవాటిని – బహుమతిగా ఇవ్వబోయేవారు. ఇంకొందరు తమ బలాన్నీ చాకచక్యాన్నీ ప్రదర్శించేవారు. ఫెయిరీ ల తో స్నేహం చే సీ , కబౌటర్ [ డచ్ దేశం లో పొట్టిపిశాచాల వంటివి ] లను మెప్పించీ తెచ్చిన వజ్రాలనూ  విలువగల లోహాలనూ ,మరికొందరు,  డ్రి-ఫా ప్రేమను పొందేందుకు చూపించేవారు. దూరసముద్రతీరాల లో దొరికిన సాంబ్రాణినీ రత్నాలనూ తీసుకొచ్చిన వారూ ఉన్నారు. ఒకరైతే ఏకంగా పెద్ద ముత్యాలహారాన్నే కానుక చేయబోయారు. ఆ శీతల అరణ్యాలలో ముత్యాలు చూడటమే ఒక అద్భుతం. కాని ఏదీ డ్రి-ఫా ని సంతోషపెట్టనేలేదు. వచ్చినవారంతా అదే దారిని తిరిగి వెళ్ళిపోయేవారు.

 

అందరి కంటే చివరన సాలీడులాగా కనిపించే వింతమనిషి వచ్చాడు. తన పేరు స్పిన్ హెడ్ అని చెప్పాడు. మణిమాణిక్యాలకన్న, బంగారం కన్న, ఉన్ని కన్న విలువైన రహస్యం తనదగ్గర ఉందని చెప్పాడు. డ్రి-ఫా తల్లికి అతన్ని చూస్తే చిరాకు వేసి పంపించేసింది.

 

కొన్నేళ్ళు గడిచాయి. ఇక డ్రి- ఫా కి పెళ్ళి కాదేమోనని తల్లిదండ్రులు దిగులుపడేవారు. ఒకరోజు ఆమె అడవిలో తను చిన్నప్పుడు ఉయ్యాల ఊగిన ఓక్ చెట్టుకింద పచార్లు చేస్తోంది . అప్పటికి వాళ్ళ ఇల్లు అక్కడికి దూరంగా ఏర్పాటు చేసుకున్నారు.

చెట్టుకొమ్మలలోంచి ఒక సాలీడు వచ్చి  పక్కనే కూర్చుంది. అది మాట్లాడింది కూడా.

ఇలా –   ‘’ డ్రి-ఫా ! నిన్ను ప్రేమిస్తున్నాను , ఆ సంగతే చెప్పేందుకు వచ్చాను. నువ్వేమీ ఇప్పుడే నన్ను పెళ్ళాడనక్కర్లేదు. నీ గది లో నన్నొక గూడు అల్లుకోనీ. అక్కడే నీ కనుచూపుమేరలో ఉంటాను. నీకు చాలా మంచి జరుగుతుంది, కాదనకు ” ఆశ్చర్యపోయి, తనకొక గది ఎక్కడుందా అని ఆలోచిస్తూ, డ్రి- ఫా సరేనంది.

వెంటనే పెద్ద గాలిదుమారం వచ్చి ఓక్ చెట్టు కూలిపోయింది. అక్కడ పెద్ద భవంతి వెలిసింది. పక్కనే విశాలమైన తోట. డ్రి-ఫా అందులో అడుగు పెడుతూనే  ఆమె పాదాల దగ్గర ఒక నీలి పూల చెట్టు మొలిచింది. సాలీడు అంది ” ఈ ఇంట్లో నీకు బాగా నచ్చిన గదిని ఎంచుకో. నూరు రోజులపాటు  నన్ను బాగా చూసుకుంటే ఈ నీలిపూవు రహస్యం నీకు చెబుతాను ”

బాగా సూర్యకాంతి పడే గదిని డ్రి-ఫా ఎంచుకుంది. ఆ గది కిటికీ పైనుంచి కప్పు వరకూ సాలీడుకి కేటాయించింది.

వెంటనే అది తళతళమనే దారాల అల్లిక మొదలుపెట్టింది. చీకటిపడేదాకా దాకా అల్లుతూనే ఉంది. డ్రి-ఫా తనకి కూడా ఆ నాజూకైన అల్లిక చేతనయితే బావుండుననుకుంది. ఏదో రహస్యం అంది కదా సాలీడు, అది దీనికి సంబధించినదేమోననే అనుమానమూ ఆమెకి వచ్చింది. రాత్రయింది. ఇంటికి వెళ్ళటం కష్టం. కాని అక్కడే తన గదిలో నిద్రపోయేందుకు పరుపులూ దుప్పట్లూ  ఏమీ లేవు.

Bronx_Zoo_Spider_Web

” నీకు మంచి పక్క వేస్తాను చూడు ” అంది సాలీడు. ఆ గొంతు ఒక యువకుడిది లాగా ఉంది ఇప్పుడు. డ్రి-ఫా విస్తుపోయిందికానీ ఏమీ అనలేదు. చూస్తుండగానే అతి మెత్తటి, వెచ్చటి పక్క దానంట అదే వచ్చింది. ఇంట్లో కంటే కూడా సుఖంగా , సౌకర్యంగా  ఆమె నిద్రపోయింది.

ఆమెకొక కల వచ్చింది. అప్పటివరకూ ఎవరూ చూసిఉండని తెల్లని వింత  వస్త్రాన్ని ధరించి ఉంది ఆ కలలో. జంతువు చర్మం లాగా దట్టంగా లేదు అది, చాలా పల్చగా, తేలికగా ఉంది . పొద్దుటి వెలుతురులో పచ్చిక మీద సాలెగూడు మెరిసినట్లు మెరుస్తోంది, గడ్డిపరకల మీది మంచుబిందువులలాగా కూడా.

 

నూరు రోజులు గడిచాయి. డ్రి-ఫా ఆ ఇంట్లో ఉదయం నుంచి రాత్రివరకూ ఉండేది. . ఇద్దరూ కబుర్లు చెప్పుకునేవారు. సాలీడు దారాలు అల్లుతూనే ఉండేది. డ్రి-ఫా ఆ రహస్యం ఎప్పుడు తెలుస్తుందా అని ఎదురు చూసేది. ఏమైనా సరే, తొందరపడి అడిగేయకూడదని , సాలీడు చెప్పెదాకా ఆగాలని ఆమె నిశ్చయించుకుంది.

 

నూరు రోజులు పూర్తవబోతున్నాయి. శిశిరఋతువు వచ్చింది. డ్రి-ఫా తోటలో తిరుగుతోంది. చలిగాలులు వీస్తున్నాయి, పండిపోయిన ఆకులు రాలుతున్నాయి. ఆ నీలిపూవు కూడా ఎప్పుడో రాలిపోయింది. నల్లటి గట్టి కాడ మాత్రమే మిగిలింది. ” ఏముంటుంది ఇక  ఇందులో అద్భుతం ?” అనిపించింది డ్రి-ఫా కి. ఉన్నట్లుండి చాలా బెంగ వచ్చింది . ఉన్నట్లుండి హోరుమని ఈదురుగా లి – అన్ని ఆకులూ రాలి నేలని పసుపచ్చగా కప్పేశాయి. కొన్ని చెట్లు కూడా పడిపోయాయి. అంతలోనే అంతా నిశ్శబ్దంగా అయింది. డ్రి- ఫా పక్కన ఒక యువకుడు ఉన్నాడు. తన అన్నలకంటే, తనను పెళ్ళాడమని అడిగినవారందరి కంటే- తను చూసిన ఎవరికంటే కూడా అందంగా ఉన్నాడు. సొగసైన తెల్లని దుస్తులు వేసుకున్నాడు. ఆ బట్ట మెత్తగా తను కలలో చూసినదానిలాగే ఉంది. అతని చేతిలో ఆ నీలిపూవు కాడ ఉంది.

” నేనే స్పిన్ హెడ్ ని. నూరు రోజులూ అయిపోయాయి, నా శాపం తీరింది. ఇదిగో నా కానుక నీకు ” అని ఆ పూవుకాడని చూపించాడు. సాలీడు అతనుగా మారినందుకు ఎంతో ఆనందించింది డ్రి-ఫా. అయితే ఆ ఎండిపోయిన కాడ , గొప్ప కానుక ఎలా అవుతుందో ఆమెకి తెలియలేదు. ‘ దాన్ని చీల్చి చూడు ” యువకుడు చెప్పాడు. అలాగే చేసింది ఆమె. లోపల సన్నటి పొడుగాటి నాజూకైన పోగులు, సా లెపురుగు గూటివి లాగా. ఉత్సాహంగా బయటికి లాగింది.

” ఈ విత్తనం నాటితే లక్షల పూలు పూస్తాయి. ఆ కాడల్లోంచి తీసినదారాలతో- ఇదిగో, దీన్ని తయారు చేయచ్చు ” అని చక చకా తెల్లటి బట్టని నేశాడు .అదే లినెన్.

డ్రి-ఫా సంతోషంగా చప్పట్లు కొట్టింది.

1251810-bigthumbnail

” నీ పెళ్ళి గౌన్ కోసం ఇది- పెళ్ళి చేసుకుంటావా నన్ను ? ”

ఆమె సిగ్గుపడింది, అయినా ” ఓ, అలాగే ” అంది.

” నీకు మేలిముసుగుని తయారు చేస్తాను ఉండు ”

మళ్ళీ అతని వేళ్ళు అద్భుతంగా కదిలాయి. ఇంకా సున్నితమైన వస్త్రాన్ని , గజాల కొద్దీ నేశాడు. దాన్ని గాలిలో ఎగరేశాడు, పక్షిలాగా తేలింది అది. అప్పుడు ఆమె మీదికి జార్చాడు. ఆమె ముఖాన్ని కప్పి వీపు మీదినుంచి జీరాడింది. అది  లేస్.

వాళ్ళు పెళ్ళి చేసుకుని  నీలిపూవులు పూయించారు. అవి ఆ నేలకి కొత్త ఆకాశంగా మారాయి. మనుషులు కష్టపడి పని చేశారు.   నగరాలు కళకళలాడాయి. లినెన్ నుంచి బెల్జిక్ ప్రాంతాలకి [ ఇప్పటి నెదర్ లాండ్స్, బెల్జియం, లక్సెం బర్గ్ ] ఐశ్వర్యం వచ్చింది.

linen_history_img_1_blue_flowering_flax

  • డచ్ జానపదకథ
  • అనువాదం: మైథిలి అబ్బరాజు
  • mythili