Archives for 2014

Balachander – A Eulogy

 చిత్రరచన: బంగారు బ్రహ్మం

 

ismail“జీవితం సినిమా కాదు”

-ఇది ప్రతి ఒక్కరూ విన్న డైలాగే, కానీ కొన్ని జీవితాలు సినిమాలను చూసి నడక సాగిస్తాయి, కొన్ని జీవితాలు సినిమా కథలుగా మారతాయి. నా విషయంలో మొదటిదే నిజమయ్యింది. ‘మరోచరిత్ర’ అనే సినిమా, నా జీవితంలోని కీలక మలుపులకు-అప్పుడు నేను తీసుకొన్న నిర్ణయాలకు కారణభూతమయ్యింది. ఆ సినిమా కథ పుట్టింది ఓ మేధావి మస్తిష్కంలో. ఇప్పుడు ఆ వ్యక్తి కానరాని తీరాలకు సాగిపోయారు.

బాలచందర్ ఇక లేరు!

ఏ మనిషయినా భౌతికంగా ఇక మనకు కనబడరు అంటే ఆ భావనే మనకు బాధ కలిగిస్తుంది. అంతే కదా… కానీ జీవితంలో ఒక్కసారైనా చూడని మనిషి పోతే దు:ఖం ఎందుకు కలుగుతుంది? ఆ మనిషి ఏదో ఒక రూపంలో మనల్ని ప్రభావితం చేసి ఉంటారు కాబట్టి . నా వరకు అలా నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులలో బాలచందర్ ఒక్కరు.

తెలుగు, కన్నడ, తమిళ సినీరంగాల్లో వందకు పైగా సినిమాలకు రచయితగా పనిచేసి, ఎనభై పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ‘మరోచరిత్ర’, ‘ఆకలిరాజ్యం’, ‘అంతులేని కథ’, ‘ఇది కథ కాదు’, ‘రుద్రవీణ’ వంటి కళాఖండాలను అందించిన దిగ్దర్శకుడాయన. అలాగే చలనచిత్ర పరిశ్రమకు ఒక ‘కమల హాసన్’ ను, ఒక ‘రజనీ కాంత్’ను అందించిన కళాస్ప్రష్ట. ఆ మధ్య ఓసారి నా మార్కెట్ విలువ కొన్ని వందల కోట్లు అన్నారాయన…ఈ ఇద్దరినీ గుర్తుపెట్టుకొని.
తన కథలలో నాయకులకు కాకుండా కథకే పెద్ద పీట వేసిన వ్యక్తి. సాధారణ వ్యక్తుల్లోని అసాధారణ ప్రజ్ఞను గుర్తించి, దాన్ని సానబెట్టి ప్రకాశింపచేసిన మార్గదర్శి. ఇందుకు మరో ఉదాహరణ ‘మరోచరిత్ర’    కోసం ఆయన ఎంపిక చేసిన ‘అభిలాష’. పెద్ద పెద్ద కళ్లున్న ఈ పదో తరగతి చదివే అమ్మాయిని ‘సరిత’ గా పరిచయం చేసారు. అద్భుతమైన నటనే కాకుండా మరెంతో అందమైన వాచకం కలిగిన ఈమె, ఆ తర్వాత  ఎందరో హీరోయిన్లకు తన గాత్రాన్ని అరువిచ్చింది.
  ‘కన్నెపిల్లవని కన్నులున్నవని’ , ‘సాపాటు ఎటూ లేదు, పాటైనా పాడు బ్రదర్’ , ‘అరె ఏమిటి లోకం’, ‘తాళి కట్టు శుభవేళా’ , ‘మౌనమే నీ భాష ఓ మూగమనసా’ , ‘ ఏ తీగ పువ్వునో..’, ‘జూనియర్ …జూనియర్… అటు ఇటు కాని హృదయము తోటి’… వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు రాసే అవకాశం తన కథల ద్వారా “ఆచార్య ఆత్రేయ” గారికి కల్పించారు.

తన కథల్లో తొంగిచూసే నిజాయితీ, ఆ కథ ఎలాంటిదయినా ప్రతి సినిమాను ఓ ‘cult classic’గా నిలబెట్టే సత్తా ఉన్న దర్శకుడు బాలచందర్ గారు. సమస్యల వలయంలో చిక్కుకున్నా, చెరగని మధ్యతరగతి మందహాసాన్ని తెరకెక్కించిన ఘనుడు. ఇప్పుడు ఆ విలువలు మనం గుర్తించకపోయినా వాటిని వెండితెరపై అజరామరం చేసిన సృజనాత్మక ఋషి.

 

పుట్టిన ప్రతి వారు ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకోక తప్పదు. కానీ తనకంటూ ఓ స్థానమేర్పరచుకొని, తన ఆలోచనల ద్వారా పది మందిని ప్రభావితం చేయడం కొద్ది మందికే దక్కే అదృష్టం. కళకు పరమావధి అదే. మామూలు ‘సినిమా’ను  గొప్ప కావ్యాల సరసన, సాహిత్యం సరసన నిలబెట్టగలిగే దమ్మున్న దర్శకుడు ఇక లేడు.

Sir, we are going to miss you, but I celebrate your life today. adios!

-ఇస్మాయిల్ పెనుకొండ

చిత్రం: బంగారు బ్రహ్మం

కైలాసం బాలచందర్ తో కాసేపు…!

kb

దాదాపు పదేళ్ల క్రితం…

అప్పటికింకా నేను సినిమా ఇండస్ట్రీ కి రాలేదు. ఆ రోజుల్లో సినిమా అంటే విపరీతమైన అభిమానం తప్పితే మరే ఆలోచన లేదు. అప్పట్లో బెంగుళూరు లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. ఆ రోజుల్లో హైదరాబాద్ లో అంటే సినిమా పారడైజో అనే డీవిడి లు దొరికే షాప్ ఉండేది; అక్కడ్నుంచే నాకు ప్రపంచ సినిమా పరిచయం. అలాగే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఉండేది. కొద్దో గొప్పో అక్కడ కూడా సినీ అక్షరాభ్యాసం చేశాను. బెంగుళూరు లో అంతా కొత్త. కొన్నాళ్ళకు అక్కడ సుచిత్రా ఫిల్మ్ క్లబ్ పరిచయం అయింది. కన్నడంలో సినిమాలు మన కంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నా అక్కడొక గొప్ప సౌలభ్యం ఉంది – అక్కడ కమర్షియల్ సినిమాతో బాటు ప్యారలల్ సినిమా ఏదో ఒక విధంగా సజీవంగానే ఉంటుంది. అందుకు కారణం కొంతమంది కన్నడ చిత్ర దర్శకులు చేసిన అవిరామ శ్రమ అని చెప్పుకోక తప్పదు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు పుట్టన కనగల్.

అయితే ఈ విషయం నాకు బెంగుళూరు కి వెళ్లి సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో చేరే వరకూ తెలియదు. అయితే మనం వయసులో ఉన్నప్పుడు మనకన్నీ తెలుసనే భ్రమలోనే ఉంటాము. అది తప్పు కాదు. అయితే ఒక రోజు పుట్టన కనగల్ దర్శకత్వం లో వచ్చిన “గజ్జ పూజ” అనే సినిమా స్క్రీనింగ్ అవుతోందని తెలిసి వెళ్లాను. సినిమా బాగానే ఉంది. ఆ సినిమా అయ్యాక ఎవరెవరో పెద్ద వాళ్ళు పుట్టన్న గురించి మాట్లాడుతూ, వయసులో తనకంటే చిన్నవాడైనా బాలచందర్ గారు ఆయన్ని గురువుగా భావించేవాడని అన్నారు. అప్పటి వరకూ బాలచందర్ అంటే మనకంతా తెలుసనే భావన. తెలుగులో ఆతన చేసిన సినిమాలన్నీ చూసేయ్యడమే కాకుండా, మళ్లీ మళ్ళీ చూసే అలవాటు కూడా! అయితే బాలచందర్ గారి గురించి కొత్తగా తెలిసిన విషయం అది. దాంతో కేబి అనబడే కైలాసం బాలచందర్ గురించి సరికొత్త అసక్తి మొదలైంది.

10881662_755155524574112_1367463442407730471_nబాలచందర్ అంటే మనకి తెలిసిన “ఇది కథ కాదు”, “అంతు లేని కథ” లాంటి సినిమాలే కాదు, తమిళంలో మన తెలుగు వాళ్లకి పరిచయం లేని చాలా సినిమాలే చేశారని అప్పటిదాకా తెలియదు. ఆ క్రమంలో ఒక రోజు బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన “తనీర్ తనీర్” సినిమా స్క్రీనింగ్ చేస్తుంటే వెళ్ళాను. అప్పటికి నేను సినిమాల గురించి రాయాలన్న ఆలోచనే లేదు. కానీ సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో ఉన్న సినిమా పుస్తకాలు, ఆ రోజు అయన తో గడిపిన కొంత సమయం – ఆ తర్వాతే వాకు తెలుగులో కూడా ఎవరైనా బయోగ్రఫీ, ట్రివియా కి మించి ఏదైనా రాస్తే బావుండనిపించింది . ఒక విధంగా అయనతో మాట్లాడిన తర్వాతే నాకు నవతరంగం ఐడియా పుట్టింది. బాలచందర్ గారితో ఆ రోజు మాట్లాడిన ప్రతి క్షణమూ నాకు ఇంకా గుర్తుంది.

బాలచందర్ గారిని నేను కలిసేటప్పటికి దక్షిణ భారత సినిమా మొత్తం అట్టడుగు స్థాయిలో ఉందని ఆ రోజు అక్కడికి వచ్చిన ప్రేక్షకులందరి అభిప్రాయం. నేను కూడా వారందరి అభిప్రాయంతో ఏకీభవించాను కూడా! కానీ బాలచందర్ ఒక్కరే ఆ రోజు మా అందరి అభిప్రాయంతో విబేధించారు. సినిమా అనే కళ అభివృద్ధి చెందడంలో సినిమా నిర్మాత, దర్శకుల భాధ్యత ఎంత ఉందో, ప్రేక్షకుల పాత్ర కూడా అంతే ఉందని ఆయన అన్నారు. మంచి సినిమాని అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టే, అలాంటి సినిమాలను నిర్మించే నిర్మాతలు తనకు దొరికారని, లేదంటే “తన్నీర్ తన్నీర్” లాంటి సినిమా ప్రస్తుత పరిస్థుతుల్లో తను చేయలేకపోయుండే వాడినని అన్నారు ఆ రోజు.

ఒక విధంగా బాలచందర్ గారి మాటల ద్వారా “నవతరంగం” మొదలైతే, ఆయన నన్ను మరో విషయంలో కూడా ఆసక్తిని ప్రేరేపించారు. ఆ విషయం గురించే నేను ప్రస్తుతం కొన్ని బహుళజాతీయ సంస్థలతో కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాను . అది – ఫిల్మ్ ఆర్కైవల్ గురించి.

ఆ రోజు నేను బాలచందర్ గారితో మాట్లాడుతూ తెలుసుకున్న ఒక బాధాకరమైన విషయమేమిటంటే , ఆయన తీసిన చాలా సినిమాల నెగిటివ్ లు ఇప్పుడు లేకపోవడం. ఆ విషయం గురించే మేము మాట్లాడుకున్నాం ఆ రోజు. ముఖ్యంగా ఆయన తీసిన సినిమాల్లో చాలా ముఖ్యమైన “తన్నీర్ తన్నీర్” లాంటి సినిమా కాపీలు కేవలం సిడి కో లేదా విహెచెస్ టేప్ కి మాత్రమే పరిమితమయ్యాయి . సినిమాని ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ ఒక కళ గా గుర్తించనంతవరకూ మనకీ దౌర్భాగ్యం తప్పదని ఆ రోజు ఆయన అన్నారు. అయితే ఈ రోజు దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే…మొన్నీ మధ్య ఒక ఫిల్మ్ స్కూల్ లో క్లాసులు చెప్తూ బాలచందర్ గారు ఎంతమందికి తెలుసని అడిగితే…సగం మందికంటే తక్కువ మంది చేతులెత్తగా…అందులో ఇద్దరో ముగ్గురికి మాత్రమే ఆయన సినిమాలు చూసిన గుర్తుంది.

ఒక గొప్ప కళాకారుడు, రచయిత, దర్శకుడు… ఇలాంటి వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళని ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంతరించి పోయిన జీవుల్లా, బాలచందర్ లాంటి వాళ్ళు కూడా అంతరించినపోయిన గొప్పదర్శకుల జాతికి చెందుతారేమో!

ఎందుకంటున్నానంటే …నాకిప్పటికీ బాగా గుర్తు. రంజని తో పెళ్ళాయ్యాక మొదటి సారి మద్రాస్ వెళ్లి ఏదో పని మీద లజ్ ఏరియా లో నడూస్తుండగా ఒక ఇల్లు చూపించి ఇది బాలచందర్ గారి ఇల్లు అని చెప్పింది రంజని. ఇక భవిష్యత్ లో ఇలాంటి అనుభవాలు మనకి ఉండవేమో! ఒకటి అంతా అపార్టెమెంట్ల మయమైన ఈ చోట ఎవరి ఇళ్లు ఎక్కడో గుర్తుపెట్టుకోవాల్సిన గొప్పతనం లేకపోవడం ఒక కారణమైతే, అంత గొప్పగా ఫలానా దర్శకుడి ఇళ్లు, ఫలానా దర్శకుడు ఇక్కడే కూర్చుని కాఫీ తాగుతూ కథలు రాసుకునే వారనో చెప్పుకోగలిగినంత గొప్ప వాళ్ళు ఇక లేరనే నా నమ్మకం. అలాంటి వారిలో చివరి తరానికి చెందిన కైలాసం బాలచందర్ ఈ రోజు మనతో లేరంటే…తలుచుకుంటేనే మనసంతా ఒకరకమైన శూన్యంతో నిండిపోతోంది.

బాలచందర్ గారి గురించి, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయన గురించి తలుచుకుంటే…ఒక విషయం గుర్తొస్తుంది. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు తీయలేదు… కానీ ఆయన చూసిన మంచి సినిమాల గురించి మెచ్చుకుంటూ లేఖలు రాశారు. ఒక గొప్ప కళాకారుడు మాత్రమే మరొకరి కళ ను అభినందించగలడు.

ఆయన గురించి రాయాలంటే ఇంకా చాలా రాయొచ్చు. ఆయన సినిమాల గురించి, ఆయన గురించీ…ఇలా ఎంతో రాయొచ్చు. కానీ ఆయన గురించి తెలిసిన వాళ్ళకి మనం ఎంత రాసినా వృధా ప్రయాసే! వందకి పైగా సినిమాలు చేసిన ఆయన గురించి ఈ రెండు పేజీలు ఏం సరిపోతాయి? ఆయన గురించి తెలియని వాళ్ళకి కూడా అంతే! ఈ రెండు పేజీల్లో సంక్షిప్తం చేయగలిగింది కాదు ఆయన చరిత్ర.

మనం అప్పుడప్పుడూ అంటుంటాం, “ఆ రోజుల్లో…రాజులుండే వాళ్ళు, వాళ్ళు గుర్రాలెక్కి, కత్తి పట్టి యుద్ధాలు చేసేవారు,” అని…ఇప్పుడూ అంతే…ఆ రోజుల్లో “బాలచందర్ అని గొప్ప దర్శకుడు ఉండేవాడు. ఆయన మార్కెట్, బాక్సాఫీస్, ప్రేక్షకులు అని ఆలోచన లేకుండా, కాలం కంటే ముందుండే కథల్ని ఎన్నుకుని సినిమాలు తీసేవాడు,” అని చెప్పుకోవాల్సి వస్తుంది.

ఎంతైనా పేరులోనే కైలాసం ఉన్నవారాయన. ఇంత గొప్ప సినిమాలు తీసినందుకైనా ఆయనకి కైలాసంలోనో లేదా మరింకెక్కడో ఆయన ఆత్మకి శాంతి కలిగే అవకాశం దక్కే ఉంటుందనో లేదా, ఆయన సినిమాల ద్వారా ఇప్పటికీ మన మధ్యనే ఉన్నారు, ఇంకా జీవిస్తూనే ఉన్నారనో మాయమాటలతో , బూటకపు పదజాలంతో ఆయన్ని వర్ణించవచ్చు. కానీ అలా రాయడం ఆయనకి ఎంత నచ్చి ఉండేదో నాకు తెలియదు.

కానీ ఒకటి మాత్రం నిజం. ఇవాళ బాలచందర్ గారు లేకపోవడం సినీ ప్రేమికులందరికీ తీరని లోటు.

-వెంకట్ సిధారెడ్డి

వాళ్ళు అయినదేమిటి, నేను కానిదేమిటి ?

ఆప్తులని పోగొట్టుకున్న దుఃఖం కలిగించే దిగులు ఏ ఇద్దరిలోనూ ఒకేలాగా ఉండదు. మనకి తెలియకుండానే మనం సిద్ధపరచబడి ఉంటాము. జన్యులక్షణాలకి తోడు , ‘ ఈ స్థితికి ఇది, ఇంత, ఇన్ని రోజులు ‘ అనే లెక్క మనసులో పనిచేస్తూ ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య సామాజికభేదాలు ఇక్కడా వర్తిస్తూ ఉంటాయి. మగవాడు ఏడవకూడదు, దళసరి చర్మం తో ఉండాలి, వీలైనంత త్వరగా రోజువారీ పనులలో పడిపోవాలి అని ఆశించబడుతుంది. [ ఎవరి చేత ? తెలియదు. ] ఒకప్పుడు మగవాడు మాత్రమే సంపాదించి ఇల్లు గడపాలి కనుక, ఉమ్మడి సంసారాలలో స్త్రీ ఏడుస్తూ కూర్చున్నా ఎవరో ఒకరు ఆమె చేయవలసిన పనులు చేసిపెడతారు గనుక – దీనికి కొంత అర్థం ఉందేమో. ఇద్దరే ఉన్నప్పుడు అది సంక్లిష్టం . బిడ్డ పోతుంది- ఆ బిడ్డ ఇద్దరిదీ, దిగులు మాత్రం ఎవరిది వారిదే. అంతే అవకుండా – అవతలివారు ఇట్టే మామూలయిపోయారే అన్న బాధ, నింద ఉంటే ? అనిపిస్తున్నది సరిగా చెప్పగలిగే నేర్పు లేనప్పుడు ? అప్పుడెలా ?   దిగులుకి కొలతలూ గీటురాళ్ళూ ఏవి? ఎవరు నిర్ణయిస్తారు ?

ఇదే దుఃఖం, వాస్తవ ప్రపంచం లో-   అప్పటిదాకా సయోధ్య లేని రెండు జంటలలో -ఇద్దరిని విడదీయటం నాకు తెలుసు, మరో ఇద్దరిని దగ్గర చేయటమూ తెలుసు.

Robert Frost వి Stopping by woods on a snowy evening, The road not taken వంటి పద్యాలే నాకు తెలుసు అదివరకు, సంపుటమేమీ దొరకలేదు . అంతర్జాలం తెలిసిన కొత్తలో చదివిన ఈ పద్యం వెంటపడుతూనే ఉంది. దీన్ని అనువాదం చేయటం లేదు, నిజానికి ఇందులో అర్థం కానిదేమీ లేదు. నాకు అర్థమైనట్లుగా చెబుతున్నానంతే.

కవి తన జీవితం లో అటువంటి దుఃఖాన్ని, పుత్రశోకాన్ని- అనుభవించి ఉన్నారు, ఆ విషయానికి ప్రాధాన్యం ఉందో లేదో నాకు తెలియదు

దారుణమైన Communication gap ని ఇంత తక్కువ మాటలలో చెప్పటం కష్టం- కవి అనాయాసంగా చెప్పినట్లు అనిపిస్తుందే కానీ…

ఈ వేదనా మయమైన పద్యం సంభాషణలతో , కదలికలతో- ఒక నాటిక లాగా నడుస్తుంది. శోకం నుంచి బయటికి రాలేని, రాదలచుకోని భార్య- ఆ దుస్సంఘటన జరిగిన నాడు కూడా తన మనసుని ఏవో లోకసహజమైన మాటల్లో దాచి మటుకే చెప్పగలిగిన భర్త- ఇందులో. అతను ఆమెకి అర్థం కాడు, నచ్చడు. ఆమె అతనికి అర్థమవుతుంది, నచ్చజెప్పలేడు. అనాలనుకోనివి అంటాడు, అనకూడనివి కూడా, అప్రయత్నంగా, అవివేకంతో. ఆమె పోనీలే అని సహించదు , నిరంతరమైన దుఃఖపు జాతరని విడిచి కాస్త పక్కకి రాదు.   ఈ ద్వంద్వం పద్యం చివరలో కూడా విడిపోదు, వాళ్ళిద్దరూ ఒకటి కారు. పద్యానికి ఉంచిన శీర్షిక వారి బంధాన్ని కూడా ఉద్దేశించినదా అని గుండె గుబుక్కుమంటుంది. కాకూడదు, కాకపోతే బావుండును.

ఆమె ఒంటరిగా నిలుచుని మేడ మీది కిటికీ లోంచి చూస్తూ అతనికి కనిపిస్తుంది.ఏదో భీతి ఆమె ముఖం లో. ఆమెది గతాన్ని ఎట్టయెదుట చూడలేని భీతి, చూపు మరల్చుకోలేని యాతన.    ఆమె అలా చూస్తూండటాన్ని అతను తరచు చూస్తూనే ఉన్నా, ఆ రోజువరకూ దేన్నో ఎందుకో అడగాలని స్ఫురించదు. అది అతని స్వభావం – మామూలు మాటలలోకి రానిది ఏదైనా అతన్ని ఇబ్బంది పెడుతుంది. అడుగుతాడు, ఆమె చెప్పదు. తనూ చూస్తాడు. ” ఆమె చూడనిచ్చింది అతన్ని- గుడ్డివాడిని ” అంటారు కవి. నిజం గానే మొదట ఏమీ కనిపించదు అతనికి. మెల్లగా తెలుస్తుంది- అది వాళ్ళ కుటుంబపు స్మశానవాటిక- ఇంటి ఆవరణ లోనే. ఇక్కడా అతను వేరే ఎవరివో సమాధుల గురించి ముందు మాట్లాడతాడు, చివరన తమ చనిపోయినబిడ్డ ని దాచుకున్న మట్టిదిబ్బ గురించి.

images

దీన్ని మూడు విధాలుగా అర్థం చేసుకోవచ్చు- మొదట అతను నిజంగానే చలనం తక్కువ మనిషి కావచ్చునని, అందుకనే ఆ దృశ్యపు స్థూలమైన స్వరూపమే ముందు కనబడిందని.

రెండోది బిడ్డ సమాధి కనిపించినా ముందే దాని గురించి చెప్పేందుకు నోరు రాలేదని

మూడోది- అతను మనసుని ఎంత సమాధానపరచుకున్నాడంటే , చనిపోయిన బిడ్డ స్మృతి ని ప్రయత్నపూర్వకంగా వెనక్కి నెట్టి ఉంచే అలవాటు చేసుకున్నాడని. అతనితో కవి అనిపించిన మాటలు ” అలవాటైపోయింది, అందుకని గమనించలేదు ” అని.

ఎందుకైనా గానీ, అది ఆమెకి సరిపోదు. ” చెప్పకు, వద్దు ” అనేస్తుంది.

” ఏం ? పోయిన బిడ్డ గురించి ఒక మగవాడు తలచుకోనేకూడదా ? ” అంటాడు అతను. ఈ ప్రశ్న ఆమెనే కాదు, మగవాడు తన మనసు రాయి చేసుకోవాలని బోధించినవారినీ   అడుగుతున్నాడేమో. ఆ  సాధారణీకరణే ఆమెకి నచ్చనిది.

‘’ ఊపిరాడటం లేదు, వెళ్ళిపోతాను ఇక్కడినుంచి ‘’ – బయలుదేరుతుంది .

” వెళ్ళకు- ఈసారి మరొకరి దగ్గరికి ” అంటాడు అతను. ఎవరో పరాయివారి దగ్గర బాధను వెళ్ళబోసుకుంటూ ఉంటుంద న్నమాట.ఆమె వేదనని సరిగ్గా గుర్తు పట్టే ప్రయత్నం లో – నిన్నొకటి అడుగుతాను చెప్పమంటాడు. నీకెలా అడగాలో తెలిస్తే కదా అంటుంది ఆమె.

”తెలియకపోతే చెప్పచ్చు కదా ? ”

ఆమె ఏమీ మాట్లాడదు, పట్టించుకోదు.

” నీతో ఏమన్నా తప్పే. నీకు నచ్చేలా మాట్లాడటం నాకు చేతకాదు. కాని చెబితే నేర్చుకుంటాను కదా ? ” – ఎంతో సాదాగా, పరిచితం గా ఉన్నాయి కదా ఈ మాటలు…మన నాన్నల, అన్నల, భర్తల నుంచి విన్నవి- ఈ పద్యం అందు కూ పట్టి లాగుతుంది.

‘’ A man must partly give up being a man with women-folk. ‘’

ఈ మాటలను మరొకలా చెప్పటం అసాధ్యం.

” మనమొక ఒప్పందానికి వద్దాం- నీకు ఏ విషయం అపురూపమో నేను దాని జోలికి రాను, సరేనా ?

కాని ప్రేమ గల ఏ ఇద్దరూ అలాగ జీవించరాదు

ప్రేమ లేని చోట అలాగే బతకాలి, తప్పదు

ప్రేమే ఉంటే- ఆ అరమరికలు వద్దు-[ఈ మాటలు కవివి కూడా]

నీ దుఃఖం లోకి నన్ను రానీయవూ ? ఈ లోకానికి సంబంధిం చినదే అయితే – నాతో చెప్పకూడదూ ?”

అలౌకికమైనదైతే తన అనుభూతిలోకి రాదనే అతని అనుమానం. మరింకొకరితో మాత్రం పంచుకోవద్దని మళ్ళీ అర్థిస్తాడు.

‘’ వాళ్ళు అయినదేమిటి, నేను కానిదేమిటి ? ‘’

అంటూనే – ” నువు కాస్త అతి చేస్తావనిపిస్తుంది అప్పుడప్పుడు ” అని నోరు జారతాడు

” నువ్విలా కుమిలిపోతూ ఉంటే – ఏ లోకాన ఉన్నాడో గానీ, వాడికేమి మేలు, చెప్పు ? ” అని తర్కిస్తాడు.

దుఃఖం ఏనాడయినా తర్కం తో శమించిందా !

ఆమె ముఖం లో తిరస్కారం.   అతనికి కోపం వస్తుంది.

”ఏమి ఆడదానివి నువ్వు ? పోయిన నా బిడ్డ ని నేను తలచుకుంటే- ఇంత రాద్ధాంతమా? ”

” నీకు తలచుకోవటం వచ్చా ? ఏ మాత్రం సున్నితం ఉన్నా నీ చేతులతో నువ్వే వాడిని పాతిపెట్టే గొయ్యి తవ్వుతావా ? నేను చూస్తూనే ఉన్నాను, ఈ కిటికీ లోనుంచే- ఎంత బలంగా తవ్వావు అప్పుడు ! గులక రాళ్ళు గాలిలో కి ఎగిరెగిరి పడేలాగా…అది నువ్వని గుర్తే పట్టలేదు నేను ”

ఆమె దూషించిన ఆ చర్యే- భగ్నతతో, నిస్సహాయమైన క్రోధం తో జరిగిఉండవచ్చని ఆమెకి తట్టదు. అతనికీ వివరణ, సమర్థన తెలియవు .

” తడిబూట్లతోనే లోపలికి వచ్చావు, ఆ మట్టిని ఇంట్లోకి తేగలిగావు . అప్పటి నీ మాటలు బాగా గుర్తు నాకు ” ఆమె అంది, అతనికీ గుర్తున్నట్లే ఉంది. ” దౌర్భాగ్యుడిని నేను దేవుడా, నవ్వొస్తోంది నాకు- దరిద్రపు నవ్వు ” అని నొచ్చుకున్నాడు .

ఆమె అదే ధోరణిలో – ” ఏమన్నావు నువ్వు ? మూడు రాత్రులు మంచు కురిస్తే, ఒక రాత్రి వర్షం వస్తే – మనిషి వేయగలిగిన ఏ కంచె అయినా కుళ్ళిపోతుందనలేదూ ? అవన్నీ మాట్లాడేందుకు అదా సమయం ? ” -ఆరోపించింది.

ఆ మాటలు బిడ్డ విషయం లో మానవప్రయత్నం అంతా వృధా అవటాన్ని సూచించాయని ఆమె అనుకోదు, అతనూ చెప్పడు- నమ్మదేమో అనా ? కవి చెప్పరు.

ఆమె అంటూనే ఉంది ” పోయినవారితో అంత దూరమూ ఎవరూ పోలేరు నిజమే, కాని మరీ అంత కొద్ది దూరమే అయితే అసలు వెళ్ళనే అక్కర్లేదు. అంత తొందర్లోనే బతికిన మనుషుల వైపుకి, తెలిసిన సంగతులలోకి, ఎవరి ప్రపంచం లోకి వాళ్ళువెళ్ళాలనుకుంటారు కదా, మృత్యువెంత ఒంటరిది ! లోకమెంత చెడ్డది…మార్చలేను కదా దీన్ని ”

అతనికి జాలేసింది – ” పోనీలే, అనాలనుకున్నవన్నీ అనేశావుగా, కొంచెం తేలికపడి ఉంటావు. ఏడుస్తూనే ఉన్నావు, వెళ్ళకు ఎక్కడికీ ‘’

” నీకలాగే ఉంటుంది. అంతటితో తీరుతుందా ..నీకేం చెప్పలేను అసలు- ఉండలేను, వెళతాను ”

ఆమె తలుపు తీస్తోంది…అతను కేక పెట్టాడు, వదులుకోలేక – ” ఎక్కడికి ? చెప్పి వెళ్ళు…నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను, వెనక్కి తెస్తాను- బలవంతంగా ”

పద్యం ముగిసింది.

http://www.poetryfoundation.org/poem/238120

He saw her from the bottom of the stairs

Before she saw him. She was starting down,

Looking back over her shoulder at some fear.

She took a doubtful step and then undid it

To raise herself and look again. He spoke

Advancing toward her: ‘What is it you see

From up there always—for I want to know.’

She turned and sank upon her skirts at that,

And her face changed from terrified to dull.

He said to gain time: ‘What is it you see,’

Mounting until she cowered under him.

‘I will find out now—you must tell me, dear.’

She, in her place, refused him any help

With the least stiffening of her neck and silence.

She let him look, sure that he wouldn’t see,

Blind creature; and awhile he didn’t see.

But at last he murmured, ‘Oh,’ and again, ‘Oh.’

 

‘What is it—what?’ she said.

 

‘Just that I see.’

 

‘You don’t,’ she challenged. ‘Tell me what it is.’

 

‘The wonder is I didn’t see at once.

I never noticed it from here before.

I must be wonted to it—that’s the reason.

The little graveyard where my people are!

So small the window frames the whole of it.

Not so much larger than a bedroom, is it?

There are three stones of slate and one of marble,

Broad-shouldered little slabs there in the sunlight

On the sidehill. We haven’t to mind those.

But I understand: it is not the stones,

But the child’s mound—’

 

‘Don’t, don’t, don’t, don’t,’ she cried.

 

She withdrew shrinking from beneath his arm

That rested on the banister, and slid downstairs;

And turned on him with such a daunting look,

He said twice over before he knew himself:

‘Can’t a man speak of his own child he’s lost?’

 

‘Not you! Oh, where’s my hat? Oh, I don’t need it!

I must get out of here. I must get air.

I don’t know rightly whether any man can.’

 

‘Amy! Don’t go to someone else this time.

Listen to me. I won’t come down the stairs.’

He sat and fixed his chin between his fists.

‘There’s something I should like to ask you, dear.’

 

‘You don’t know how to ask it.’

 

‘Help me, then.’

 

Her fingers moved the latch for all reply.

 

‘My words are nearly always an offense.

I don’t know how to speak of anything

So as to please you. But I might be taught

I should suppose. I can’t say I see how.

A man must partly give up being a man

With women-folk. We could have some arrangement

By which I’d bind myself to keep hands off

Anything special you’re a-mind to name.

Though I don’t like such things ’twixt those that love.

Two that don’t love can’t live together without them.

But two that do can’t live together with them.’

She moved the latch a little. ‘Don’t—don’t go.

Don’t carry it to someone else this time.

Tell me about it if it’s something human.

Let me into your grief. I’m not so much

Unlike other folks as your standing there

Apart would make me out. Give me my chance.

I do think, though, you overdo it a little.

What was it brought you up to think it the thing

To take your mother-loss of a first child

So inconsolably—in the face of love.

You’d think his memory might be satisfied—’

 

‘There you go sneering now!’

 

‘I’m not, I’m not!

You make me angry. I’ll come down to you.

God, what a woman! And it’s come to this,

A man can’t speak of his own child that’s dead.’

 

‘You can’t because you don’t know how to speak.

If you had any feelings, you that dug

With your own hand—how could you?—his little grave;

I saw you from that very window there,

Making the gravel leap and leap in air,

Leap up, like that, like that, and land so lightly

And roll back down the mound beside the hole.

I thought, Who is that man? I didn’t know you.

And I crept down the stairs and up the stairs

To look again, and still your spade kept lifting.

Then you came in. I heard your rumbling voice

Out in the kitchen, and I don’t know why,

But I went near to see with my own eyes.

You could sit there with the stains on your shoes

Of the fresh earth from your own baby’s grave

And talk about your everyday concerns.

You had stood the spade up against the wall

Outside there in the entry, for I saw it.’

 

‘I shall laugh the worst laugh I ever laughed.

I’m cursed. God, if I don’t believe I’m cursed.’

 

‘I can repeat the very words you were saying:

“Three foggy mornings and one rainy day

Will rot the best birch fence a man can build.”

Think of it, talk like that at such a time!

What had how long it takes a birch to rot

To do with what was in the darkened parlor?

You couldn’t care! The nearest friends can go

With anyone to death, comes so far short

They might as well not try to go at all.

No, from the time when one is sick to death,

One is alone, and he dies more alone.

Friends make pretense of following to the grave,

But before one is in it, their minds are turned

And making the best of their way back to life

And living people, and things they understand.

But the world’s evil. I won’t have grief so

If I can change it. Oh, I won’t, I won’t!’

 

‘There, you have said it all and you feel better.

You won’t go now. You’re crying. Close the door.

The heart’s gone out of it: why keep it up.

Amy! There’s someone coming down the road!’

 

You—oh, you think the talk is all. I must go—

Somewhere out of this house. How can I make you—’

 

‘If—you—do!’ She was opening the door wider.

‘Where do you mean to go?  First tell me that.

I’ll follow and bring you back by force.  I will!—’

mythili

 

 

నువ్వో నియంతవి

 

painting: Rafi Haque

painting: Rafi Haque

నువ్వో నియంతవి ఈ రాత్రికే

రాత్రి గుడ్లను పాలించే చీకటి స్వప్నానివి

నిద్దురలోనో మెలకువలోనో ఒకసారి జీవిస్తావు

కళ్ళలో ఇంత ఆశను నాటుకుంటావు

నువ్వో సేవకుడివి ఈ రాత్రికే

యే ఒంటరి చెరువుతోనో నాలుగు మాటలు పంచుకుంటావు

పొద్దూకులా కబుర్లాడతావు

చెట్ల ఆకుల మీదో వాటి పువ్వుల మీదో కొన్ని పదాలను రాస్తావు నీకొచ్చినట్టు

నీ వెన్నెముక ఇప్పుడొక పసుపుకొమ్ము

సరిగ్గా చూడు వీపునానుకుని

నువ్వో నిశాచరుడివి

ఖాళీ స్మశానంలో సమాధులు కడిగే అనుభవజ్ఞుడివి

తలతో శవాల మధ్య తమాషాలను దువ్వుకునే ఒకానొక ఆత్మవి కాదూ

నిరంతర శ్రవంతిలో కొన్ని ఆలోచనలను వింటూ

గడిపే ఒంటరి క్షణాలకు యజమానివి

నువ్వో శ్రామికుడివి

భళ్ళున పగిలే నడకల్లో అడుగులు మిగుల్చుకునే సంపన్నార్జున మనిషివి

ఒకటో రెండో అంతే పంచభూతాలను అంటుకట్టడం  తెలిసిన నిర్మితానివి

కళ్ళల్లోని అనాధ స్వప్నాలకు ఈ పూటకు భరోసా

కనురెప్పలు కిటికీలై తెరుచుకునేదాకా

ఇంకేమిటి

ఇప్పుడొక తాత్వికుడివి ఈ కాసిని వాక్యాల్లో.

-తిలక్ బొమ్మరాజు

15-tilak

డియర్ రెడ్!

untitled

ఏ ఇందిరా పార్క్ దగ్గరో కొందరు బక్కపలచని స్త్రీలు
ఎర్ర జెండాలని భుజాలపై పెట్టుకుని
గొంతు తుపాకుల్లోంచి నినాదాల
తూటాలు పేలుస్తూ సాగిపోతుంటారు

డియర్ రెడ్ !
నీవు ఎప్పుడు ఇట్లా రెపరెపలాడుతూ కనిపించినా
కొన్ని పురా జ్ఞాపకాలు వెంటాడుతాయి
చిన్నతనంలో ఉదయం లేచి చూస్తే
తెల్లటి ఇళ్ళ గోడల పైన ఎరుపెరుపు అక్షరాలు వుండేవి
‘కామ్రేడ్ జన్ను చిన్నాలు అమర్ హై ‘
‘కామ్రేడ్ జార్జిరెడ్డి అమర్ హై’
‘విప్లవం వర్ధిల్లాలి ‘

‘డాక్టర్ రామనాథం ని చంపేశారు
స్కూలుకి సెలవని’ తెలిసిన రోజున
నా జ్వరానికి తీయటి మందులిచ్చిన డాక్టర్ని
ఎందుకు చంపారో తెలియక
ఏడ్చిన రోజు ఆ రోజు గుర్తుకొస్తుంది

ఎవరీ జన్ను చిన్నాలు ?… ఎవరీ జార్జిరెడ్డి?
ఎందుకు విప్లవం ? డాక్టర్ రామనాథం చేసిన నేరమేమి ?
డియర్ రెడ్ ! నీ కోసం మొదలైన ఒక అన్వేషణ ఏదో
కొంత ముందుకు సాగేక,
ఆకర్షణలో, బంధాలో, బాధ్యతలో, మరేవో ….
ఊపిరి సలపని ఏవో వలయాలలో చిక్కుబడి పోయాను
* * * *

కాసేపటి తరువాత, ఆ ఇందిరా పార్క్ దగ్గరి స్త్రీలు
కొన్ని లాటీలు, భాష్పవాయు గోలాల దాడులతో
బహుశా, చెల్లాచెదురు కావొచ్చు

డియర్ రెడ్ !
అన్ని విజ్ఞాపనలు, వేడుకోళ్ళు అయిన పిదప
చివరగా నిన్నే నమ్ముకుని వాళ్ళు రోడ్డెక్కి వుంటారు
రోజూ ఎవరో ఒకరు, నిన్నే నమ్ముకుని
ఈ నగర రహదారుల పైకి దూసుకొస్తుంటారు

కానీ డియర్ రెడ్ !
అసలీ నగరాలు, నగర అమానవులు
మనుషులుగానే పరిగణించని కొందరు మానవులు
పూర్తిగా నిన్నే నమ్ముకుని, అక్కడెక్కడో
ఒక ప్రపంచాన్ని నిర్మిస్తున్నారట
దగా పడిన జాతికి అంతిమంగా విముక్తి కలిగించేది
నీవు మాత్రమేనని వాళ్లకు మాత్రమే అర్థమయిందా ?

(డిసెంబర్ 2014)

కోడూరి విజయకుమార్

vijay

హైదరాబాద్ లో పుస్తక ప్రదర్శన

Dear Book lovers,

“Hyderabad Book Fair 2014” [http://hyderabadbookfair.com] is starting from today(17 dec) to 26th dec 2014 at NTR Grounds, lower tankbund,opp Indira park, Hyderabad. Timings: 2 to 8:30PM; Sunday and holidays: 12 to 9 pm. Please visit.
Some Book shops that I visit regularly are:
1. Manchi Pustakam [For Soviet Children book reprints][Suresh and Bhagyalaxshmi garu] and Kothhapalli(Children magazine) : Stall numbers 253, 254 and 255.
2. Peacock Classics[Gandhi garu]: Stall number: 148
3.Unique book centre[for old and rare books][Arif garu]: Stall numbers: 266, 267 and 268.
4. Navodaya Book House [Sambasivarao and Koteswara rao garu]: Stall numbers: 56, 57, 58 and 59.

Along with this visit Visalandhra , Prajasakthi and other book stalls aswell….
Happy BOOK FESTIVAL TO ONE AND ALL….

Regards,
Anil battula

‘సారంగ’లో త్వరలో ‘జాయపసేనాని’ నాటకం

 

 నేపథ్యం

 

ఓరుగల్లును పరిపాలించిన గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు,బావమరిది..తర్వాతి కాలంలో తామ్రపురి( ఇప్పటి చేబ్రోలు)ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలిన “జాయపసేనాని” భారతీయ నాట్య శాస్త్రానికి సంబంధించి భరతముని చే రచించబడ్డ ప్రామాణిక గ్రంథమైన “నాట్య శాస్త్రము”ను సమగ్రముగా అధ్యయనము చేసి కాకతీయ మహాసామ్రాజ్య వివిధ ప్రాంతాలలోని ప్రజాబాహుళ్యంలో అప్పటికే స్థిరపడి ఉన్న స్థానిక నాట్యరీతులనుకూడా పరిగణనలోకి తీసుకుని “మార్గ”(classical) పద్ధతులతో పాటు “దేశీ” నాట్య రీతులనుకూడా ప్రామాణికంగా గ్రంథస్తం చేసి ప్రసిద్ధ “నృత్త రత్నావళి”ని క్రీ.శ.1254 లో ఆవిష్కరించాడు.దీన్ని శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తెలుగులోకి అనువదిస్తే అంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ 1969 లో పుస్తకంగా వెలువరించింది.

దీనిలోని ప్రధాన “దేశీ” నాట్యమైన శివతాండవ శృంగ నర్తనం “పేరిణి”నృత్యాన్ని డా.నటరాజ రామకృష్ణ తన జీవితకాల సాధనగా రూపొందించి 1985 లో శివరాత్రి పర్వదినాన చారిత్రాత్మక రామప్ప దేవాలయంలో నాలుగు లక్షలమంది వీక్షకుల సమక్షంలో పదివేల ప్రమిదలు ప్రాంగణంలో వందమంది కళాకారులతో “పేరిణి” నృత్యాన్ని ఒక ప్రపంచ రికార్డ్ గా ప్రదర్శించారు.

ఈ నేపథ్యంలో రాయబడ్డ గంట నిడివి గల నాటకం ఈ “జాయపసేనాని”.ఇది మొదట “ఆల్ ఇండియా రేడియో” లో జాతీయ నాటక సప్తాహంలో భాగంగా ప్రసారమైంది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం మొట్టమొదటగా ప్రభుత్వంచేత జనవరి 9,10,11 2015 తేదీల్లో వరంగల్లులో నిర్వహించతలపెట్టిన “కాకతీయ ఉత్సవాలు”లో భాగంగా ఈ “జాయపసేనాని” నాటకం ప్రదర్శించబడనున్నది.

ఈ నేపథ్యంలో..రామా చంద్రమౌళి చే రచించబడ్డ “జాయపసేనాని” నాటకం ఇప్పుడు..మన “సారంగ” పాఠకులకోసం.

2 copy

పెద్రో పారమొ చివరి భాగం

pedro1-1

పేద్రో పారమొ మెదియా లూనా పెద్ద తలుపు దగ్గర పాత కుర్చీలో కూచున్నాడు. రాత్రి ఆఖరి నీడలు తప్పుకుంటున్నాయి. అతనట్లాగే ఒంటరిగా మూడు గంటలనుండీ ఉన్నాడు. అతను నిద్ర పోవడం లేదు. నిద్ర అంటే ఏమిటో, సమయమంటే ఏమిటో అతను మరిచిపోయాడు. “మేం ముసలివాళ్లం అంతగా నిద్ర పోం. దాదాపుగా ఎప్పుడూ. కునికిపాట్లు పడ్డా మెదడు పని చేస్తూనే ఉంటుంది. నాకు చేయడానికి అదే మిగిలింది.” ఆగి పెద్దగా అన్నాడు. “ఎంతో కాలం పట్టదు. ఇంక ఎంతో కాలం పట్టదు.”
ఇంకా కొనసాగించాడు. “నువ్వెళ్ళి చాలా కాలమయింది సుజానా. ఇప్పటి వెలుతురు అప్పటిలాగానే ఉంది, అంత ఎర్రగా కాదు కానీ అంతే పేలవంగా. మంచు ముసుగు వెనక ఉన్నట్టు. ఇప్పటిలాగే. ఇదే సమయం. నేనిక్కడే వాకిలి పక్కనే కూచుని సంజెని చూస్తూ ఉన్నాను. ఈ దారి వెంటే స్వర్గానికి, ఆకాశం వెలిగే చోటికి నన్నొదిలి వెళ్లడం చూస్తూ ఉన్నాను. ఈ నేల చీకట్లలో మరింత అస్పష్టంగా మారిపోతూంది.
“నిన్ను చూడడం అదే ఆఖరి సారి. నువు వెళుతూ దారి పక్క పారడైజ్ చెట్టు కొమ్మల్ని రాసుకుంటూ పోయావు వాటి చివరి ఆకుల్నీ రాల్చేస్తూ. ఆపై మాయమయిపోయావు. నేను నీవెనకే నిన్ను పిలిచాను. ‘తిరిగి రా సుజానా!’
పేద్రో పారమొ పెదాలు కదులుతూ ఉన్నాయి, అవే మాటల్ని గుసగుసలాడుతున్నట్టు. పెదాలు బిగబట్టి కళ్ళు తెరిచి చూశాడు. పాలిపోయిన సంజె ఆ కళ్ళలో ప్రతిఫలిస్తూ ఉంది.
రోజు మొదలయింది.

దోన ఇనెస్ అదే సమయంలో తన కొడుకు గలాంలియెల్ వియాపండో షాపు ముందు ఊడుస్తూంది. అబుందియో మార్టినెజ్ సగం తెరిచిన తలుపు తీసుకుని లోపలికి వెళ్లడం చూసింది. ఈగలు వాలకుండా మొహమ్మీద సొంబ్రేరో (మెక్సికన్ టొపీ) పెట్టుకుని కౌంటర్ మీద నిద్రపోతూ కనిపించాడు గలాంలియెల్ అతనికి. అబుండదియో అతను లేస్తాడని కాసేపు చూశాడు. దోనా ఇనెస్ బయట ఊడ్చే పని అయ్యాక లోపలికి వచ్చి తన కొడుకు డొక్కల్లో చీపురుతో పొడిచిందాకా ఆగాడు.
“నీ కోసం కస్టమర్ వచ్చారు లే!”
గలాంలియెల్ చిరచిరలాడుతూ, గుర్రు మంటూ లేచి కూచున్నాడు. రాత్రి తాగుబోతులకు సర్వ్ చేస్తూ, నిజానికి వాళ్లతో తాగుతూ బాగా పొద్దుపోయి పడుకోవడం వలన కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. ఇప్పుడు కౌంటర్ మీద కూచుని తన తల్లిని తిట్టాడు, తననూ తిట్టుకున్నాడు, అంతటితో ఆగకుండా బతుకునూ తిట్టాడు పెంటకి కూడా కొరగానిదని. చేతులు కాళ్ళ మధ్య పెట్టుకుని అట్లాగే వెనక్కి వొరిగి పడుకుని పోయాడు. తిట్లు గొణుక్కుంటూనే నిద్రలోకి జారిపోయాడు.
“ఈ వేళప్పుడూ ఈ తాగుబోతులు వస్తే నా తప్పు కాదు.”
“పాపం వాణ్ణి క్షమించు అబుందియో. పిల్లాడు రాత్రంతా నిద్ర లేకుండా ఎవరో ప్రయాణికులు వస్తే వాళ్లకు సర్వ్ చేస్తూ ఉన్నాడు. తాగిన కొద్దీ గొడవ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంత పొద్దున్నే వచ్చావేమిటి?”
అబుందియోకి సరిగా వినపడదు కనుక ఆమె పెద్దగా అరుస్తూ చెపుతూంది.
‘ఏం లేదు, ఒక లిక్కర్ సీసా కావాలి.”
“రెఫ్యూజియో మళ్ళీ మూర్ఛ పోయిందా?”
“లేదు, చచ్చిపోయింది విల్యా అమ్మా! రాత్రే, పదకొండయిందో యేమో. నేను పోయి నా కంచర గాడిదల్ని అమ్మాక. దానికి వైద్యం కోసమని ఖర్చులకోసం వాటిని కూడా అమ్మాను.”
“నువు చెప్పేదేమిటో నాకు వినపడటం లేదు. ఏమంటున్నావు? ఏం చెప్తున్నావు నాకు?”
“రాత్రంతా నా భార్య రెఫ్యూజియో శవ జాగరణ చేశాను. ఆమె ప్రాణం రాత్రే పోయింది.”
“చావు వాసన వస్తూందని నాకు తెలిసింది. గలాంలియెల్ కి అదే చెప్పాను ‘ఎవరో చనిపోయారని నాకనిపిస్తుంది. నాకు ఆ వాసన వస్తుంది,’ వాడు నా మాట పట్టించుకోలేదు. ఆ కస్టమర్లతో స్నేహంగా కలిసిపోవాలని తనూ తాగాడు పిచ్చి వెధవ. నీకు తెలుసుగా అటువంటప్పుడు వాడు ఎట్లా మారిపోతాడో! అన్నీ తమాషాగా ఉంటాయి వాడికి. దేన్నీ పట్టించుకోడు. సర్లే, దినానికి ఎవరినయినా పిలిచావా?”
“లేదు విల్యా అమ్మా. అందుకే నాకు లిక్కర్ కావాలి, నా బాధ మర్చిపోవడానికి.”
“స్ట్రెయిటా?”
“అవును విల్యా అమ్మా. తొందరగా నిషా ఎక్కాలి. ఇప్పుడే ఇవ్వు. నాకిప్పుడే కావాలి.”
“నువ్వు కాబట్టి ఒక పైంట్ ధరకే రెండు పైంట్లు ఇస్తున్నా. తన గురించి ఎప్పుడూ మంచిగా తల్చుకునేదాన్నని చనిపోయిన మీ ఆవిడకి చెప్పు. పైకి వెళ్ళాక నన్ను గుర్తుంచుకోమని చెప్పు.”
“చెప్తా విల్యా అమ్మా!”
“ఆమె చల్లబడేలోగా చెప్పు.”
“చెప్తాను. తనకోసం నువు ప్రార్థిస్తావని ఆమెకి నమ్మకం. చివరి కర్మలు చేసేవారెవరూ లేరని ఏడుస్తూనే పోయింది. ”
“అదేమిటి? ఫాదర్ రెంటెరియా దగ్గరికి పోలేదా?”
“వెళ్లా. కొండల్లోకి పోయాడని చెప్పారు.”
“ఏం కొండలు?”
“ఏమో అక్కడ ఎక్కడివో. తిరుగుబాటు జరుగుతూందని నీకు తెలుసుగా!”
“అయితే ఆయన కూడా చేరాడా? దేవుడే మనమీద దయ చూపాలి అబుందియో!”
“దాంతో మనకేం పని విల్యా అమ్మా? అది మనల్ని తాకదు. ఇంకోటి పోయి. ఊరికే అట్లా. గలాంలియెల్ ఎటూ నిద్ర పోతున్నాడుగా!”
“అయితే నువ్వు మర్చిపోకుండా రెఫ్యూజియోకి చెప్పు నాకోసం దేవుడిని ప్రార్థించమని. ఎంత సాయం దొరికితే అంతా కావాలి నాకు.”
“నువ్వేం ఆదుర్దా పడకు. ఇంటికి వెళ్ళిన క్షణమే చెప్తాను. ప్రమాణం చేయించుకుంటాను. ఆమె చేయక తప్పదనీ లేకపోతే నువు దాని గురించి బుర్ర చెడగొట్టుకుంటావనీ చెప్తాను.”
“నువ్వు ఆ పని చేయి. నీకు తెలుసుగా ఆడవాళ్ల సంగతి! ప్రమాణం చేసి చెప్పింది చేసేట్లుగా చూడాలి.”
అబుందియో ఇంకో ఇరవయి సెంటావోలు కౌంటర్ మీద పెట్టాడు.
“ఇప్పుడు ఇంకోటి పోయి సెన్యోరా. ఆపైన నీ చేయి ఇంకొంచెం జారిస్తే అది నీ దయ. వొట్టేసి చెబుతున్నా, ఇది నేను ఇంటికెళ్ళి నా కూక పక్కనే కూచుని తాగుతా.”
“సరే పో, మా అబ్బాయి లేస్తాడు మళ్ళీ. తాగి పడుకున్నాక లేస్తే వాడికి తెగ చిరాగ్గా ఉంటుంది. ఇంటికి పో. మీ ఆవిడకి చెప్పమన్నది మర్చిపోకు.”
అబుందియో తుమ్ముకుంటూ షాప్ బయటికొచ్చాడు. లిక్కర్ మండుతూంది కానీ ఎంత తొందరగా తాగితే అంత తొందరగా తలకెక్కుతుందని ఎవరో చెప్పారని మండుతున్న నోటిని చొక్కా కొసళ్లతో విసురుకుంటూ గుక్క మీద గుక్క తాగాడు. సరాసరి ఇంటికే వెళదామనుకున్నాడు. అక్కడ రెఫ్యూజియో తన కోసం ఎదురుచూస్తూంది కూడా. కానీ తప్పు మలుపు తిరిగి వీధికి అటు వేపు, ఊరి బయటికి వెళ్ళే దారంట పడి పోయాడు.
“డమియానా!” పేద్రో పారమొ పిలిచాడు. ” వెళ్ళి చూడు ఆ రోడ్డమ్మట పడి వస్తున్నదెవరో?”
అబుందియో తల వేలాడేసుకుని తూలుకుంటూ, ఒక్కోసారి చేతులు కూడా నేలకానించి దోగాడుతూ వస్తున్నాడు. అతనికి ఈ భూమి ఒరిగిపోతున్నట్టూ, గుండ్రంగా తిరుగుతున్నట్టూ, తనని ఎక్కడికో విసిరేస్తున్నట్టూ ఉంది. పట్టు దొరకబుచ్చుకోబోతాడు, దొరికిందనుకునేలోగా మళ్ళీ తిరగడం మొదలుబెడుతుంది…. తన వాకిట్లో కుర్చీలో కూచున్న మనిషికి ఎదురు పడిందాకా.
“నా భార్యని పూడ్చిపెట్టడానికి డబ్బు కావాలి. నువు సాయం చేయగలవా?”
డమియానా సిస్నెరోస్ ప్రార్థించింది. “సైతాను బంధనాలనుండి మమ్మల్ని కాపాడు దేవుడా!” చేతుల్ని శిలువ ఆకారంలో పెట్టి అబుందియో వైపు సాచింది.
అబుందియో మార్టినెజ్ కి ఎదురుగా భయపడ్డ ఒక స్త్రీ శిలువ ఆకారంలో చేతుల్ని ఊపడం కనిపించి వణికిపోయాడు. సైతాన్ తనను ఇక్కడిదాకా వెంబడించిందేమోనన్న భయం కలిగింది. భయంకరమైన వేషంలో సైతాన్ కనిపిస్తుందేమోనని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ కనపడకపోయేసరికి మళ్ళీ అన్నాడు.
“నా భార్యను పూడ్చి పెట్టడానికి ఏమన్నా ధర్మం దొరుకుతుందేమోనని వచ్చాను.”
సూర్యుడు అతని భుజాల దాకా వచ్చాడు. చల్లటి తొలి పొద్దు సూర్యుడు పైకి లేస్తున్న దుమ్ములో మసగ్గా.
సూర్యకాంతినుంచి దాక్కుంటున్నట్టు తన భుజాల్ని కప్పుతున్న శాలువాలోకి పేద్రో పారమొ మొహం అదృశ్యమయింది. డమియానా కేకలు మరింత పెద్దవవుతున్నాయి పొలాల మీదుగా “డాన్ పేద్రోని చంపేస్తున్నాడు!”
అబుందియో మార్టినెజ్ కి ఎవరో స్త్రీ అరవడం వినిపిస్తూంది. అయితే ఆమెనెట్లా ఆపాలో తెలియలేదు. తన ఆలోచనల సూత్రమూ అతనికందలేదు. ఆ ముసలామె కేకలు కచ్చితంగా చాలా దూరం వినపడతాయని తెలుసు. తన భార్యకే వినవస్తాయేమో కూడా. ఆ మాటలు అర్థం కావడం లేదు కానీ అతని కర్ణభేరులు పగిలిపోతున్నాయి. తన మంచం మీద ఒంటరిగా బయటి వరండాలో పడి ఉన్న భార్య తలపుకొచ్చింది. శవం తొందరగా పాడుకాకూడదని అతనే బయటికి చలిగాలిలోకి మోసుకొచ్చి పడుకోబెట్టి వచ్చాడు. నిన్ననే తనతో పడుకుని, జీవితం కంటే సజీవంగా, చిట్టి గుర్రంలా గెంతుతూ, మునిపళ్లతో కరుస్తూ, వొదిగిపోతూ ఉన్న తన కూకా. తనకు కొడుకునిచ్చిన ఆడది. పుట్టగానే వాడు చనిపోయాడు. ఆమెకి ఆరోగ్యం బాలేనందువల్లనని అన్నారు. కంటి కురుపూ, చలిజ్వరమూ, పాడయిన కడుపూ ఇంకా ఏమున్నాయో ఎవరికి తెలుసు అన్నాడు కంచర గాడిదల్ని అమ్మి డబ్బు కట్టాక చివరి నిముషంలో చూడ్డాని కొచ్చిన డాక్టర్. ఇప్పుడదంతా చేసిన ఉపకారమేమీ లేదు. తన కూకా కళ్ళు మూతపడి రాత్రి మంచులో పడి ఉంది. ఈ ఉదయాన్ని చూడ లేదు, ఈ సూర్యుణ్ణీ.. ఇంక ఏ సూర్యుణ్ణీ.
“సాయం చేయండి.” అన్నాతను “నాక్కొంచెం డబ్బు కావాలి.”
కానీ అతని మాటలు అతనికే వినిపించలేదు. ఆ ముసలామె కేకలు అతన్ని చెవిటిని చేశాయి.
కోమలా నుంచి వచ్చే దారిలో చిన్న చిన్న నల్ల చుక్కలు కదులుతున్నాయి. క్రమంగా ఆ చుక్కలు కొందరు మగవాళ్ళుగా మారాయి. ఆ తర్వాత వాళ్లు అతని పక్కనే నిలుచున్నారు. డమియానా సిస్నెరోస్ ఇప్పుడు అరవడం మానేసింది. శిలువ ఆకారంలో పెట్టిన చేతుల్ని జారవిడిచింది. నేలమీదికి పడిపోయింది. ఆమె నోరు ఆవులిస్తున్నట్టు తెరుచుకుని ఉండిపోయింది.
ఆ మనుషులు ఆమెని నేలమీంచి లేపి ఇంటి లోపలికి తీసుకుపోయారు.
“మీరు బాగానే ఉన్నారా అయ్యా?” వాళ్ళు అడిగారు.
పేద్రో పారమొ తల ప్రత్యక్షమయింది. అతను తలూపాడు.
చేతిలో ఇంకా నెత్తుటి కత్తిని పట్టుకున్న అబుందియో ని నిరాయుధుణ్ణి చేశారు.
“మాతో రా!” వాళ్ళు అన్నారు. “ఎంత పని చేశావు!”
అతను వాళ్ళననుసరించాడు.
వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళేలోపల తనను క్షమించమని వాళ్ళను ప్రాధేయపడ్డాడు. రోడ్డు పక్కకు వెళ్ళి పసుప్పచ్చగా కక్కుకున్నాడు. కాలువలు కాలువలుగా పది లీటర్ల నీళ్ళు తాగినట్టు. అతని తల మండిపోతుంది. నాలుక మందమయినట్టుంది.
“నాకు బాగా మత్తెక్కింది.” అన్నాడు.
తన కోసం ఎదురుచూస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు. తన చేతులు వాళ్ళ భుజాల మీద వేశాడు, వాళ్ళు అతన్ని ఈడ్చుకు పోతుంటే దుమ్ములో అతని పాదాలు చాళ్లు గీస్తూ ఉన్నాయి.

పేద్రో పారమొ వాళ్ళ వెనక ఇంకా కుర్చీలోకూచుని ఊళ్ళోకి వెళుతున్న ఆ ఊరేగింపుని చూస్తున్నాడు. ఎడమ చేతిని ఎత్తబోతే అది సీసంలా అతని మోకాళ్ళ మీదికి జారిపోయింది. అతను దాన్ని పట్టించుకోలేదు. తన దేహంలో ఏదో భాగం రోజూ మరణించడం అతనికి అలవాటయిపోయింది. పారడైజ్ చెట్టు నుంఛి ఆకులు రాలడం చూశాడు. “వాళ్ళంతా అదే దారి పడతారు. అందరూ వెళ్ళిపోతారు.” మళ్ళీ తన ఆలోచనలు ఎక్కడ ఆగాయో అక్కడికే వచ్చాడు.
“సుజానా,” అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు.. “నిన్ను తిరిగిరమ్మని బ్రతిమలాడాను..
“బ్రహ్మాండమయిన చంద్రుడు లోకం మీద మెరిసిపోతున్నాడు. గుడ్డివాడినయ్యిందాకా నిన్నే తదేకంగా చూశాను. నీ మొహం మీదికి జాలువారుతున్న వెన్నెలనీ. నిన్ను చూడడం ఎన్నటికీ విసుగనిపించదు. మెత్తగా, వెన్నెల నిమురుతూన్న నీ లావైన తడి పెదవులు నక్షత్రాల కాంతితో వెలుగుతూ. రాత్రి మంచుతో పారదర్శకమవుతూన్న నీ దేహమూ. సుజానా. సుజానా శాన్ హువాన్.”
బొమ్మ స్పష్టంగా కనపడేందుకు తుడవడానికి చేయెత్తడానికి ప్రయత్నించాడు. అది అయస్కాంతంలా కాళ్లను వదిలి రాలేదు. ఇంకో చేయి లేపడానికి ప్రయత్నించాడు కానీ అది నెమ్మదిగా అతని పక్కకి నేలను తాకేలా జారిపోయింది ఎముకల్లేని భుజానికి ఆధారంలా.
“ఇది చావు,” అనుకున్నాడు.
సూర్యుడు అన్నిటి మీదా దొర్లుతూ ఉన్నాడు వాటికి మళ్ళీ ఆకారాలు కల్పిస్తూ. ధ్వంసమయిన బంజరు భూమి అతని ఎదురుగా పరుచుకుని ఉంది. ఎండ అతని శరీరాన్ని కాలుస్తూంది. అతని కళ్ళు కదలడం లేదు. అవి జ్ఞాపకం నుండి జ్ఞాపకానికి దూకుతూ ఉన్నాయి ప్రస్తుతాన్ని చెరిపేస్తూ. అకస్మాత్తుగా అతని గుండె ఆగిపోయింది. కాలమూ, జీవన శ్వాసా దానితోటే ఆగిపోయినట్లనిపించింది.
“అయితే ఇంకో రాత్రి ఉండదన్నమాట!” అనుకున్నాడు.
ఎందుకంటే అతనికి చీకటితో, భ్రాంతులతో నిండిన రాత్రులంటే భయం. అతని దయ్యాలతో పాటు అతన్ని బంధిస్తాయవి. అదీ అతని భయం.
“నాకు తెలుసు, కొన్ని గంటల్లో నేను నిరాకరించిన సాయం అడగడానికి అబుందియో నెత్తుటి చేతులతో వస్తాడు. కానీ నా కళ్ళు మూసుకోవడానికీ, అతన్ని చూడకుండా ఉంచడానికీ నా చేతులు లేవు. అతని మాటలు వినక తప్పదు. రోజుతో పాటు అతని గొంతు సన్నగిల్లిందాకా, గొంతు పూర్తిగా రూపు మాసిందాకా.”
తన భుజం మీద ఒక చేయి తాకినట్లనిపించింది. నిటారుగా కూర్చున్నాడు తనను తను దృఢంగా చేసుకుంటూ.
“నేనే డాన్ పేద్రో!” డమియానా చెప్పింది. “నీకు డిన్నర్ తీసుకు రమ్మంటావా?”
పేద్రో పారమొ బదులిచ్చాడు:
“నేను వస్తున్నా. వస్తున్నా.”
డమియానా అందించిన చేయి సాయంతో లేచి నిలబడి నడవడానికి ప్రయత్నించాడు. కొన్ని అడుగులు వేశాక అతను పడి పోయాడు. లోలోపల సాయం కోసం అభ్యర్థిస్తున్నాడు కానీ మాటలేవీ బయటకు రావడం లేదు. ఒక రాళ్ల కుప్ప కూలబడినట్టు ధడేల్మని నేలమీద పడి అలాగే ఉండిపోయాడు.
=======================

మా పెద్దన్నయ్య పెళ్ళి కబుర్లు

మా పెద్దన్నయ్య, వదిన పెళ్లి, మే 16, 1960

1960 దశకంలో మా కుటుంబంలో మూడు పెళ్ళిళ్ళు జరిగాయి…మా కుటుంబం అంటే నా స్వంత అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళలో అన్న మాట.

వాటిల్లో మొట్టమొదట జరిగిన శుభకార్యం మా పెద్దన్నయ్య పెళ్లి. తను ఎస్.ఎస్.ఎల్.సి తో చదువు ఆపేసి వ్యవసాయం లోకి దిగిపోయాడు కాబట్టి మా పెద్దన్నయ్య కి చదువుకోని అమ్మాయిల సంబంధాలే వచ్చేవి. నేను ఎస్.ఎస్.ఎల్.సి లో అడుగు పెట్టాక 1959 నవంబర్ లో మా పెద్దన్నయ్య మా ఇంట్లో మొదటి సారిగా పెళ్లి కాకినాడ దగ్గర ఒక పల్లె టూరికి మా అమ్మ, బాబయ్య గారు, జయ వదిన, అక్క, సుబ్బు, మా తమ్ముడు ఆంజిలతో తన మొదటి పెళ్ళి చూపులకి వెళ్ళాడు. టాక్సీ లో చోటు సరిపోక నన్ను తీసుకెళ్ల లేదు అని చూచాయగా నాకు గుర్తు ఉంది కానీ పెళ్లి చూపులు అయ్యాక కాకినాడ వచ్చేసి మా పెద్దన్నయ్య చెప్పిన ఆ తతంగం ఎంత సరదాగా ఉందీ అంటే …నాకు ఇంకా భలే జ్ఞాపకం. ఇందుతో జతపరిచిన అప్పటి ఫోటో లా ఆ రోజుల్లో సినిమా హీరోలా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని షోగ్గా ఉండే మా పెద్దన్నయ్య “అది కాదు రా… మేము వెళ్లి కుర్చీలలో కూచున్నామా…అంతే. ఆ అమ్మాయి బుల్ డోజర్ లాగానూ, ఆ అమ్మాయి తల్లి ఒక రోడ్డు రోలర్ లాగానూ, అన్నదమ్ములు డీలక్స్ బస్సుల లాగానూ, అప్పగార్లు ఎస్.ఆర్.ఎం.టి (అప్పుడు కాకినాడలో తిరిగే టౌన్ బస్సులు) లాగానూ ఉంటే ఉన్నారు కానీ, ఆ అమ్మాయి చెల్లెలు మాత్రం అంబాసిడర్ కారు లాగా నాజుగ్గా ఉంది. నేను ఆ ఎంబాసిడర్ కేసి చూస్తూ ఉంటే వాళ్ళు ఏవో గుండ్రటి పదార్ధాలు టిఫిన్ లా పెట్టారు.

“ఒరేయ్, కొత్త రకం స్వీట్లు” అని జయ వదిన సంబరపడిపోయింది. తీరా తిని చూస్తే అవి తొక్కలు తీసేసిన సపోటా పళ్ళు. టేక్సీ డబ్బులు వేస్ట్ అయిపోయాయి” అని మా పెద్దన్నయ్య చెప్పిన కథకి అందరం ఒకటే నవ్వుకున్నాం. ఆ తరువాత ఆ ‘ఎంబాసిడర్’ కి అప్పుడే పెళ్లి కుదిరిపోయింది అని తెలిసింది. నన్ను తీసుకెళ్ల లేదు అనే నా ఉక్రోషం పోగొట్టడానికి మా పెద్దన్నయ్య నన్ను “బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్” సినిమాకి తీసుకెళ్ళాడు. ఆ ఇంగ్లీషు సినిమా అర్థం అయింది తక్కువే అయినా అంతా కళ్ళకి కట్టినట్టుగా అద్భుతంగా ఉంది ఆ సినిమా. ఆ సినిమాకి కోకా కృష్ణా రావు, పక్కింటి కీర్తి వారి నారాయణ (జంట కవులు వేంకట పార్వతీశ్వర కవులలో ఓలేటి పార్వతీశం గారి పెద్ద మనవడు) కూడా వచ్చినట్లు గుర్తు.

VSPR Subbalakshmi శుభ లేఖ

కోకా వారు..రమణా రావు, మాధవ్ కాకినాడలో పేరున్న కుటుంబీకులు. మా ఇంటి పక్కనే ఉండే వారు. కోకా సుబ్బా రావు గారు సుప్రీం కోర్ట్ జడ్జీగా చేసి తరువాత ఇండియా ప్రెసిడెంట్ కి పోటీ చేశారు కానీ వారికున్న బంధుత్వం నాకు తెలియదు. ఆ సినిమా చూశాక నేను క్లాసు పుస్తకం కాని నా మొట్టమొదటి ఇంగ్లీషు నవల చదివాను. పెర్రీ మేసన్ నవల అని గుర్తు ఉంది కానీ పేరు గుర్తు లేదు. ఆ వెనువెంటనే చదివిన పుస్తకం ..ఇంకెవరూ…సుప్రసిద్ధ హాస్య రచయిత పి.జి. వుడ్ హౌస్…..కొన్నేళ్లలో నా చేతికందిన వుడ్ హౌస్ నవలలు అన్నీ చదివేశాను. అలాగే అనేక మంది రచయితల ఇంగ్లీషు పుస్తకాలు అన్ని సబ్జెక్ట్ ల మీదా చదివే అలవాటు అయింది. అమెరికా ధర్మమా అని ఇక్కడికి రాగానే ఆ అలవాటు పోవడం నా దౌర్భాగ్యం.

ఇక 1960, ఫిబ్రవరిలో మా చిన్నన్నయ్య, సుబ్బు తప్ప మిగిలిన అందరం కాకినాడ దగ్గర కరప కారణం గారు చాగంటి సుబ్బారావు గారి రెండో అమ్మాయి సూర్య సుబ్బలక్ష్మి ని మా పెద్దన్నయ్య పెళ్లి చూపుల కోసం చూడడానికి వెళ్లాం. అమ్మాయి బావుంది, ఆ కుటుంబం వారి మర్యాదలూ, ప్రతిష్టా అన్నే బాగానే ఉన్నాయి కానీ వెనక్కి తిరిగి కాకినాడ వచ్చాక “ఇంత పొడుగ్గా నా కంటే రెండు అంగుళాలు ఎత్తు ఉండే అమ్మాయిని నేను ఎప్పుడూ చూడ లేదు. పైగా నేను చూసిన వేపు నుంచి బాగానే ఉంది కానీ, రెండో వేపు నుంచి ఎలా ఉంటుందో ?” అని మా పెద్దన్నయ్య అనుమానాలు వ్యక్తం చేస్తే మా అక్కా వాళ్ళు “పోనీ మరో సారి వెళ్లి రెండో వేపు నుంచి చూసి వద్దాం “ అని ఏప్రిల్ నెలలో మా చిన్నన్నయ్య మద్రాసు నుంచి వచ్చాక మొత్తం గేంగ్ అంతా మళ్ళీ కరప వెళ్లాం.

అప్పుడు ఎనభై ఏళ్ళ వయస్సులో ఉన్న పెళ్లి కూతురు తాత గారు వెంకట్రావు గారు, ఆయన పొడుగు ఆరడుగుల పై మాటే…మా అన్నయ్యనీ, ఆవిడనీ పక్క, పక్కనే నుంచోబెట్టి, రెండో పక్క నుంచి కూడా అమ్మాయిని చూపించి అన్ని సందేహాలూ తీర్చారు. ఆయన కూతుళ్ళకి వచ్చాయి. సుబ్బారావు మామయ్యా గారు కూడా ఆరున్నర అడుగుల పొడుగే. ఆయన పోలికలే కూతుళ్ళకి వచ్చాయి.

అన్ని విషయాలూ సరిగ్గా సరితూగేటట్టు ఉన్నా మా పెద్దన్నయ్య కొంచెం తటపటాయిస్తూ ఉంటే “వాళ్లకి మన లాగే వందెకరాల పొలం, పాతిక మంది పాలికాపులు, పశు సంపదా ఉన్నాయి. అన్ని విధాలా నీకు సరిగ్గా సరిపోతారు” అని “ఈ సంబంధం తప్పిపోతే నీకు ఈ జన్మలో పెళ్లవదు” అని మా చిన్నన్నయ్య మా పెద్దన్నయ్యని బెదిరించాడు. మొత్తానికి ఆ కరప వారి సంబంధం కుదిరాక మా మామయ్య గారు పెళ్లి ఏర్పాట్లు మాట్లాడడానికి కాకినాడ రాగానే మా చిన్నన్నయ్య “మా స్టేటస్ కి తగ్గట్టు మీరు మా అన్నయ్య పెళ్ళికి అన్నీ టేబుల్ మీల్స్ పెట్టాలి. చేత్తో వడ్డించకూడదు. గరిటలతోటే వడ్డన జరగాలి” అని ఆంక్షలు పెట్టగానే మా మామయ్య గారు హడిలి పోయి “ఈ సంబంధం మానుకుందామా” అనుకున్నారట.

VSPR హీరో

మా ఇంట్లో మేము నేల మీదే కూచుని తింటాం. అది వేరే సంగతి. కానీ అనుకోకుండా మా చిన్నన్నయ్య కి మద్రాసులో పైలట్ ఇంటర్వ్యూ వచ్చి వెళ్ళిపోయాడు. మద్రాసులో చదువుకునే రోజుల్లో అతను ఎయిర్ లైన్ పైలట్ ట్రైనింగ్ అయ్యే వాడు. మా చిన్నన్నయ్య మద్రాస్ మెయిల్ ఎక్కగానే మా నాన్న గారు వెంటనే కరప కబురు పెట్టి మా మామయ్య గారి భయం పోగొట్టి, మా పెద్దన్నయ్య పెళ్ళికి 1960 మే నెల, 16 వ తారీకు తెల్లారగట్ట ముహూర్తం పెట్టారు. ఆ పెళ్లి శుభ లేఖ ఇందుతో జతపరుస్తున్నాను. నాకు గుర్తు లేదు కానీ, మా పెద్దన్నయ్యకీ, వదిన కీ కామన్ ఫేక్టర్ “సూరీడు”…ఓచ్ ..అంటే పేరులో “సూర్య” అనే మాట అన్నమాట…అని నేను మా స్నేహితులతో చెప్పుకుని మురిసిపోయేవాడినిట. అది విని అందరూ నవ్వుకునే వారుట. ఈ సంగతి మా అన్నయ్య డైరీలో ఉంది.

ఇక పెళ్లి ముందు రోజు నాలుగు బస్సులలో కాకినాడ మా ఇంటికి వచ్చిన బంధువులు, మా పొలం చుట్టూ పక్కల దొంతమ్మూరు, వెల్దుర్తి, సింహాద్రిపురం, రాయవరం, చిన జగ్గం పేట, తాటిపర్తి గ్రామాల నుంచి పెళ్ళికి తరలి వచ్చిన మా రైతులు, ఊరి పెద్దలు సుమారు వెయ్యి మంది … ..అవును…వెయ్యి మంది అన్ని కులాల వారూ కరప తరలి వెళ్లాం. ఇంత మంది మా దివాణం మందీ మార్బలాన్నీ చూసి ఆడ పెళ్లి వారు ఆశ్చర్య పోయారు. అప్పుడు వేసవి శలవులు కనక వాళ్ళందరికీ కరప స్కూల్ లో మకాం ఏర్పాటు చేసి , మా బంధువులందరికీ ఐదారు ఇళ్ళలో విడిది ఏర్పాటు చేశారు. యదావిధిగా పెద్ద బేండ్ మేళం, పెట్రోమేక్స్ లైట్లతో పల్లకీ ఊరేగింపు, అంత మందికీ సకాలంలో టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేశారు.

వంటకాలు ఒకటే అయినా రైతులలో కూడా కులాల వారీగానే భోజనాలు పెట్టడడం ఆనవాయితీ. మా మామయ్య గారు చుట్టలు కాల్చే వారు కాబట్టి పంచె కట్టులో ఉన్న రైతులకి లంక పొగాకు చుట్టలు, బంధువులకీ , లాగులు, చొక్కాలు వేసుకునే షోగ్గాళ్ళకి ఎంతో ఖరీదైన లండన్ ఇంపోర్టెడ్ స్టేట్ ఎక్స్ ప్రెస్ సిగరెట్లు ఇచ్చారు. అప్పటికి అమెరికా పేరు చాలా మందికి తెలియదు. ఎప్పుడూ ఇంగ్లండ్, మహా అయితే జపాను, జర్మనీ, రష్యా ..అంతే! ఎందుకనో భోగం మేళం మటుకు పెట్ట లేదు. మా పెద్దన్నయ్య పెళ్ళికి మద్రాసులో ఉండి పోయిన మా చిన్నన్నయ్య ఒక్కడే రాలేక పోయాడు.

వెంకట్రావ్, కంచి రాజు, పెద్దన్నయ్య, అబ్బులు బావ

వెంకట్రావ్, కంచి రాజు, పెద్దన్నయ్య, అబ్బులు బావ

పెళ్లి అయిన మర్నాడో, రెండో నాడో అందరూ కాకినాడ వచ్చేసి, కొత్త కోడలి గృహ ప్రవేశం చేసి, విఘ్నేశ్వర పూజ, సత్యనారాయణ వ్రతం అయ్యాక అప్పటి మా ఆనవాయితీ ప్రకారం ఏ శుభకార్యం ఆయినా మూడు, నాలుగు రకాల విందులు ఏర్పాటు చేశారు మా నాన్న గారు. ముందు ఇరు పక్కల పెళ్లి వారికీ, బంధువులకీ, స్నేహితులకీ ఒకటి. ఈ రోజుల్లో దీన్ని “రిసెప్షన్” అంటారు. మా పొలంలో రైతులకీ, చుట్టుపక్కల ఊరి పెద్దలకీ ఒకటీ, నాలుగు రోజుల తరువాత మా చిన్నన్నయ్య బెంగుళూరు నుంచి తిరిగి రాగానే ఆ రాత్రి కాకినాడ లో ఉన్న ప్లీడర్లకీ, గుమాస్తాలకీ, జడ్జీలకీ మరొకటీ…ఒక్కొక్క విందుకీ రెండు వందల మంది పైగానే వచ్చారు. మను గుడుపులకి పెద్దన్నయ్య తో పాటు అమ్మ, అక్క, జయ వదిన, అంజి వెళ్ళగా ఆ తరువాత పదహారు రోజుల పండగకి నేను అన్నయ్య తో వెళ్లాను. అప్పుడు అందరం వరసగా “మగ వారి మాయలు”, “మంజిల్”, “అన్నపూర్ణ”, “అన్నా చెల్లెలు” “పైగాం” సినిమాలు చూసేశాం…అంతా మా పెద్దన్నయ్య పెళ్లి సంబడమే !

వీటికి కొస మెరుపు …జూన్ 6, 1960 నాడు వెలువడిన గజెట్ లో చూసి నేను ఎస్.ఎల్.సి.పాస్. అయ్యాను అని తెలిసి అందరూ తెగ సంతోష పడ్డారు. ఎలాగా పాస్ అవుతాను అందరూ అనుకునేదే కానీ..ఆ రోజుల్లో “ప్రతిభ” కి బెంచ్ మార్క్ అయిన 400 మార్కులు వచ్చాయా లేదా అనేది ఆ తరువాత కానీ తెలియ లేదు. నాకు 380 మాత్రమే వచ్చాయి అని నేను భోరుమన్నా ఆ ఏడు కాకినాడ మొత్తానికి ఎవరికీ 400 రాలేదు అని తెలిసి కాస్త తెరిపిని పడ్డాను.

భాను, సీత, పూర్ణ, ఉష

ఎందుకో తెలియదు కానీ, మా పెద్దన్నయ్య పెళ్లి ఫోటోలలో నేను ఎక్కడా లేను. బహుశా ఉండే ఉంటాను కానీ, అవి ఎక్కడా దొరకడం లేదు. మా పెద్దన్నయ్య పెళ్ళికి, పల్లకీలో ఊరేగింపుకీ పెళ్లి కూతురు వళ్ళో మా ఆఖరి చెల్లెలు ఉష కూర్చుంది. అప్పుడు దాని వయసు 5 ఏళ్ళు. ఆ రోజుల్లో తనకి తీసిన ఫోటో అంటే మా కుటుంబం అందరికీ ఇప్పటికీ చాలా ఇష్టం. అది ఇక్కడ జతపరిచాను. పెళ్ళవగానే మా గడ్డి మేటు దగ్గర మా చెల్లెళ్ళు ముగ్గురు, మా వదిన గారి పేద చెల్లెలు సీత తో తీసిన ఫోటో కూడా ఇక్కడ జత పరిచాను. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు. నేను, మా తమ్ముడు నిక్కర్లు వేసుకుని, చొక్కాలు టక్ చేసుకుని టక, టకా మూడున్నర అడుగుల పొడుగ్గా తిరుగుతూ ఉంటే ఆయన ఎత్తులో మూడో వంతు కూడా లేని మమ్మల్ని చూసి మా కరప మామయ్య గారు “అచ్చు దొరల పిల్లల్లా ఉన్నారు” అని మురిసి పోయేవారు. మమ్మల్ని ఆయనా, అత్తయ్య గారూ జీవితాంతం అలాగే, నేను అమెరికా వచ్చేసి పెళ్ళాం, పిల్లల్లతో చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా అంత అభిమానంగానూ ఉండే వారు. మా పెద్దన్నయ్య పెళ్ళితో మా అమ్మ ఆప్యాయత తో సరితూగగలిగే మరొక అమ్మ లాంటి పెద్ద వదిన మా ఇంట్లో అడుగు పెట్టడం ఎంత ముఖ్యమో, ఆవిడ తమ్ముళ్ళు వెంకట్రావు, కంచి రాజు మాకు బంధుత్వం కన్నా స్నేహితులుగా ఆ తరువాత దశాబ్దాల పాటు నిలబడడం అంతే ముఖ్యం.

మా ఆఖరి చెల్లెలు ఉషా రేవతి 5 ఏళ్లప్పుడు

మా ఆఖరి చెల్లెలు ఉషా రేవతి 5 ఏళ్లప్పుడు

నా కంటే చిన్నవాడైన కంచి రాజు కరప సర్పంచ్ గా ఆ గ్రామానికి మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేసి, హై స్కూల్ కట్టించి, రాజకీయంగా పైకి వస్తూ, విధివశాత్తు ఎవరికీ అంతుపట్టని ఊపిరి తిత్తుల వ్యాధితో మూడేళ్ళ క్రితం హఠాత్తుగా మరణించి దేవుడు చేసే అన్యాయాలకి ప్రతీకగా నిలిచాడు. దివంగతులైన కంచి రాజు, పెద్దన్నయ్య, మా అబ్బులు బావలతో వెంకట్రావు ఉన్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. ఇప్పటికీ నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా నా వయసు వాడే అయిన వెంకట్రావు తోటే ఎక్కువ సమయం గడుపుతాను. ఆస్తిపాస్తుల విషయాలలో మా అందరికీ అతనే, ముఖ్యంగా నాకు, ముఖ్య సలహాదారుడు. మామయ్య గారి తరువాత అతనే కరప గ్రామ కరిణీకం చేసి, రిటైర్ అయ్యాడు. ఇప్పుడు అతని కొడుకు విలేజ్ ఆఫీసర్ గా ఉన్నాడు.

ఈ ఫోటోల విషయంలో ఒక చిన్న పిట్ట కథ చెప్పాలి. ఆ రోజుల్లో ఇంట్లో ఫోటోలు తియ్యాలంటే అయ్యగారి సూర్యనారాయణ అనే ఆయన్ని పిలిచే వారు. ఆయనకీ మెయిన్ రోడ్ మీద స్టూడియో ఉన్నా ఇంటిల్లి పాదీ అక్కడికి వెళ్ళే అవకాశమూ లేదు. వెళ్ళినా ఆ చిన్న గదిలో ఇద్దరు, ముగ్గురు కంటే పట్టరు. అంచేత ఫోటో గ్రాఫర్ ఫలానా రోజున ఇంటికి వస్తున్నాడు అనగానే నాలుగైదు రోజుల ముందు అందరూ శుభ్రంగా క్షవరం చేయించుకుని, బట్టలు ఉతికించి, ఇస్త్రీ చేయించి రెడీగా ఉండే వాళ్ళం.

రంగు ఫోటోలు అంటేనే తెలియని ఆ రోజుల్లో ఏ రంగు బట్టలు వేసుకుంటే ఆ బ్లాక్ & వైట్ ఫోటోలలో బాగా పడతారు అనీ, ఆడా, మగా ఫొటోలకి తేడా ఉంటుందా అనీ, వెనకాల బేక్ గ్రౌండ్ తెల్ల గోడా, లేక పువ్వుల డిజైన్లు ఉన్న దుప్పటీలు కట్టాలా అని రక రకాల చర్చలు జరిగేవి. ఇప్పుడు తలచుకుంటే నాకు భలే నవ్వు వచ్చే డైలాగు మా అమ్ముమ్మదే…”అమ్ముమ్మా, రేపు ఫోటోలాయన వస్తున్నాడు” అనగానే మా అమ్ముమ్మ సంతోషపడి పోయి “పోనీ, గారెలు, అరిసెలు చెయ్యమంటారేమిటర్రా?” అంది.

పెళ్ళయి , యాభై ఏళ్ళకి పైగా కాపురం చేసిన మా పెద్దన్నయ్య, పెద్ద వదినల మూడు, నాలుగేళ్ల క్రితం నాటి ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. వారికి పిల్లలు లేరు కానీ, మేం అందరం అలాగే పెరిగాం. “దివాణం” అని పిలవబడే వంగూరి సూర్య ప్రకాశ రావు అనే మా పెద్దన్నయ్య రెండేళ్ళ క్రితం పోయాడు.

 

ముఖమే రంగస్థల వేదిక!

DSC_0261ఎందుకో, ఎవరినైనా చూడాలంటే ముఖమే.
ముఖమే చ్ఛాయ.ప్రారంభం, ముగింపూ ముఖమే.
ముఖమే సముఖం.ముఖం.
ఇండెక్స్.

వాస్తవిక జీవితంలో ముఖమే అధివాస్తవిక చ్ఛాయ.
కల్పన వంటి జీవితంలో ముఖమే రంగస్థల వేదిక.

ముఖమెంత చ్ఛాయ.

+++

కానీ, ఎవరిది వాళ్లకు తెలుసు. ముఖం అన్నింటినీ పట్టిస్తుందని!
అందుకే చిత్రిస్తుంటే దాక్కుంటరు.  చిన్నాపెద్దా అన్న తేడా లేదు. సిగ్గిల్లుతరు.
లౌవ్లీ. అప్పుడు చిత్రించడం నిజంగా ఒక అందమైన బాధ.

ఆ బాధల మరాఠీని నేను.

+++నిజం. చిత్రమే. ముఖమే.మనిషికి తమ ముఖాన్ని పోలిన ముఖం మరొకటి లేనందువల్ల నిజంగా ఇదొక సంబురం.
ఆ సంబురాన్నిఎవరు పడితే వాళ్లు, ఎక్కడ పడితె అక్కడ, ఎందుకు పడితె అందుకు పంచడం ఇష్టంలేకపోవడమూ ఒక అందం. అందుకే ముఖాన్ని చిత్రించకుండా ఎన్ని విధాలుగా అడ్డుపడతారో, దాక్కుంటారో! ఎంత లాఘవంగా తప్పుకుంటారో…
నిజంగా అదెంత చిత్రం.ఇంకా ఎన్నో. కానీ ఇన్ని కారణాల వల్లే ఛాయా చిత్రకళలో ముఖచిత్రానికి ఉన్నన్ని దాగుడు మూతలు మరెక్కడా కానరావని గుర్తు చేయడం.. అదే దృశ్యాదృశ్యం.

+++

అన్నట్టు, ముఖాన్ని చిత్రిస్తున్నకొద్దీ అది సెలబ్రేషన్.
కాకపోతే, ముఖాన్ని కనబడనీయకుండా దాచుకుంటే ఆ చిత్రం ఎప్పటికీ పూర్తికాదని మనిషికి ఎలా తెలుసోగానీ, భగవంతుడా…అందరి ముఖాలూ నీవే చిత్రించావా?
నీకెన్ని కన్నులు?

అడగాలి. తీయాలి.ముఖాలు.
కానీ అనిపిస్తుంది, తప్పించుకోలేని ఏకైక ముఖం భగవంతుడిదే అని!
అందుకే తీయబుద్ధి కాదు.
+++సరే. స్త్రీ.
ఆమె హృదయం ఒక్కటే కాదు, ఎవరి హృదయంలోనైనా భావుకత ఉంటుంది.
అది వ్యక్తమౌతుంది. కళ్లల్లో, ముఖంలో. దాన్ని బంధించాలంటే అవతలి వారికి ఇవతలి వారికి మధ్య ఆ కవిత వినిపించేంత దగ్గరితనం ఉండాలి. సాన్నిహిత్యం ఏర్పడాలి. అప్పుడే ఒక పాట ఇద్దరిమధ్య ప్రవహిస్తుంది. ఆ పాటలో ముఖమే తన కవితై అది అనేక భావ వీచికలతో పడవలా ఇవతలి వారికి కానుకగా చేరుతుంది. అదే చిత్రం. ప్రేమలేఖ. జీవనచ్ఛాయ. ముఖ చిత్రం. చిత్రముఖి.అయితే, ఇది మాత్రం మహిళది కాదు. బాలుడి చిత్రం..
అవును మరి. బాలబాలికలూ దాక్కుంటారు.
స్త్రీకు మల్లే వారిదీ నిర్మల హృదయం..
తమ నిర్మలత్వాన్ని అనుభవంగా భద్రపర్చడానికి వారు ఇష్టపడరు.
అందుకే ఈ దాగుడు మూతలు.+++

విశేషం ఏమంటే, ఎవరినైనా చిత్రిస్తున్నట్టు తెలిసిందా ఇక కెమెరా కంటికి అందకుండా పరుగు పెడతారు. కొందరు కనిపిస్తారు. మరికొందరు కనిపించరు. కానీ అందరూ పరుగులు పెడతారు.
గోడ మాటునుంచి తొంగి చూస్తారు.
అది కనిపించవచ్చూ లేకనూ పోవచ్చు.
కానీ ఒక కూతూహలం. చూపాలని!

అదే సత్యం శివం సుందరం.
కాకపోతే, ఉన్నచోటునుంచే దాక్కోవడానికి ఏమీ లేనప్పుడు ఇదిగో ఇలా చేతులతో ముఖం దాచుకుంటారు.
కానీ క్షణమే. మళ్లీ తర్వాతి క్షణమే అవే చేతులను తొలగిస్తారు.

అప్పుడొక అందమైన కవిత.
వికసిత పుష్ఫం. ఉదయరాగం.

ఆత్మానందం. అదే ముఖం.
ఇలాంటి బ్లర్ అయిన చిత్రాల సంపుటి కూడ ముఖ్యమనే ఈ దృశ్యాదృశ్యం.
అలాంటి చిత్రాల సంగీత ఆల్భం నా దగ్గర ఒకటి ఉందని మహా గర్వం.
చూడవచ్చినప్పుడు మిమ్మల్నీ చిత్రించాలనే, ఈ కుట్ర.
ముఖారవిందాలకు నా పాద ముద్దులు.
– కందుకూరి రమేష్ బాబు

కవిత్వాన్ని జీవిస్తే, జీవితం తిరిగి కవిత్వమిస్తుంది:ఇస్మాయిల్

ismayil painting rainbow

ఈ వారం ప్రత్యేకం: ఇస్మాయిల్ గారి చివరి అముద్రిత ఇంటర్వ్యూ

కవి ఇస్మాయిల్ గారిలో ఒక గొప్ప సాహితీ విమర్శకుడు, నిరంతర అధ్యయన శీలి, దార్శనికుడు, తత్వవేత్త, మారుతున్న ప్రపంచాన్ని మౌనంగా గమనిస్తున్న అలుపెరుగని యాత్రికుడే కాక నిరాడంబర జీవనం గడిపే గొప్ప ప్రేమికుడూ ఉన్నారు. పదిహేనేళ్ళుగా ఆయనను విభిన్న సందర్భాలలో దగ్గరగా గమనించిన నాకు ఏ అంశాన్నయినా ఆయన తన జీవితంలో సాధ్యం చేసుకున్నాకనే కవిత్వంలో అలవోకగా పలికిస్తోన్నట్టు తెలుస్తూ వచ్చింది.  అందుకనే ఆ కవిత్వం అంత శుద్దంగా, గాఢంగా, అడవి పూల గాలి లాగ వ్యాపించి అందరినీ కదిపి ఆలోచింపచేస్తూ ఉంటుంది.

ఇస్మాయిల్ గారు ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చి ఉన్నారు.  ఎన్నో అంశాలమీద సూక్ష్మమయిన నిశితమయిన విమర్శ చేసి ఉన్నారు.  కవిత్వ సృష్టికి, కవితాస్వాదనకి ప్రాణ భూతమయిన ఎన్నో అంశాలను ఎప్పటికప్పుడూ చెప్తూ వచ్చారు.

నిరంతరమూ స్పష్టమయిన అవగాహనతో ప్రపంచాన్ని అధ్యయనం చేస్తూ, ధ్యాన స్థితిలో కవితా సృష్టి  చేస్తున్న, గాఢమయిన అనుభూతి నెరిగిన వ్యక్తిగా, ఇప్పటికీ రాస్తున్నకవి గా, ఆయన కవిత్వం మీదా, కొన్ని సమకాలీన అంశాలమీదా  ఆయన అభిప్రాయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో చేసిన సంభాషణ ఇది.

1945 తర్వాత 15 సంవత్సరాలపాటు జీవితాన్ని గురించి తెలుకోవడంలోనూ, అర్థం చేసుకోవడంలోనూ గడిపానని అన్నారు మీరు.  ఆ తర్వాత 1960లో మీ నుంచి కొత్త కవిత్వం వచ్చిందని, దీనికి విమర్శకులు ‘అనుభూతి కవిత్వమని’ పేరు పెట్టేరని అన్నారు.  కవి కావలసిన ప్రతి వ్యక్తి కి  ఇంత సుదీర్ఘమయిన ప్రపంచ పరిశీలనా, ఆత్మానుశీలనా అవసరమా ? ఈ వేళ కొత్త తరం కవులకు ఇంత ఓపిక ఉందా ?

– నేను సహజంగా మొద్దు నవటం వల్ల కవిత్వం రాయటానికి  వచ్చేటప్పటికి అంత కాలం పట్టిందనుకుంటున్నాను.  కవి కాదలచుకున్న వాడికి ఏకకాలంలో ప్రపంచ పరిశీలనా, ఆత్మానుశీలనా చాలా అవసరమనేది నిస్సందేహం.

బహి:ప్రపంచమూ, అంతశ్చేతనా కలుసుకునే చోటు నుంచికవిత్వాన్ని ప్రత్యక్షం చేసుకోవలసిన అవసరం కవికి ఉందా ?అది  లేకుండా మంచి కవిత్వం కేవల ప్రతిభతో రాయలేడా ?

-బహి:ప్రపంచమూ, అంతశ్చేతనా తారసిల్లినప్పుడే కవిత్వపు రవ్వ పుడుతుంది.  ధన రుణ ధృవాల కలయిక వల్ల  విద్యుచ్చక్తి పుట్టినట్లు. ప్రతిభ అంటే అదే.  మిగతావన్నీ వ్యుత్పత్తికి సంబంధించినవి.

మిమ్మల్ని ప్రభావితం చేసిన కృష్ణ శాస్త్రి గారి నుంచి మీరు విడివడి స్వయం కవితా వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి మీ లోపలి సంఘర్షణా, అన్వేషణల  గురించి ఒకచోట చెప్పారు.  అలా చెయ్యడం వల్ల సాహిత్యం మీద మీరు వేసిన ప్రతేక ముద్ర ఏమిటి ?

– నాకు కృష్ణ శాస్త్రి గారంటే ఆరాధన.  ఐతే, కోతిలా కృష్ణ శాస్త్రి గారిని అనుకరిస్తే, ఇక నేనెందుకు ? నా కవిత్వమెందుకు ?  ఆయన్ని అనుకరించటం మా ఇద్దరికీ అన్యాయమే.  అందుకని, నా సొంత మార్గం వెతుక్కున్నాను.  ముందు నేనెవర్నో తెలుసుకోవటానికి ప్రయత్నించాను.  మరి ముద్ర సంగతా, అసలు ముద్ర పడిందో లేదో కాలం నిర్ణయించాలి.

1960 నుంచి ఈ నాటిదాకా శుద్దమయిన కవితాధార మీ నుంచి ఊటలూరుతూనే ఉంది. అమృతం లాంటి శుద్ధ కవిత్వ జలాల మూలాలు ఏమిటి ?

– కవిత్వానికి మూల మేమిటి ? జీవితమూ, అది జీవించిన తీరూ. కవిత్వాన్ని జీవిస్తే, జీవితం తిరిగి కవిత్వమిస్తుంది.

ismail

 కవిత్వంలో క్లుప్తత, సాంద్రత అన్న లక్షణాలు మీరెలా సాధించ గలిగారు ? అంత సంయమనం ఎలా ఒనగూడింది ?

-కవిత్వం తపస్సులాంటిది. తపస్వికి వాచాలత రాణిస్తుందా ? కనుక కవిత్వానికీ మౌనానికీ ఒక అంగుళం మేర తేడా మాత్రమే ఉండాలి.

చెట్టు ఆదర్శంగా మొదలయినా మీ కవిత్వం ధ్యాన (జెన్ మార్గపు హైకూ) స్థితికి చేరుకోగలగడంలోని క్రమ పరిణామపు అంతస్సూత్రం ఏమిటి ? (చెట్టు ఆదర్శంగా భావించడం నుంచి తానే చెట్టుగా తాదాత్మ్యం చెందడం దాకా)

– ఈ తాదాత్మ్యమన్నది జెన్ బౌద్దుల నించి కొత్తగా నేర్చుకున్నది కాదు.  కవిత్వమెప్పుడూ తాదాత్మ్యం నించే ఉద్బవిస్తుంది.  ప్రపంచంలోని వస్తువులతో తాదాత్మ్యం చెండలేనివాడు కవిత్వం రాయలేడు.  ‘చెట్టు నా ఆదర్శ’మనే కవితకు మూలం చెట్టుతో తాదాత్మ్యమే

ఈ వేళ సాహిత్యంలోకి కొత్తగా ప్రవేశ పెట్టబడిన పర్యావరణ స్పృహ వల్ల పర్యావరణానికి గాని, కవికిగాని వచ్చే ప్రయోజనం ఏదయినా ఉందా?

– పర్యావరణ కాలుష్యం వల్ల  జీవజాలం నశించిపోయే ప్రమాదం ఏర్పడిందివాళ. పర్యావరణ స్పృహ కవులకే కాదు, ప్రతి ఒక్కరికీ ఉండవలసిందే.

ఏడు దశాబ్దాలు దాటిన మీరు జీవితాన్ని కవిగా ఎలా అర్ధం చేసుకున్నారు ? మనిషిగా ఎలా అర్ధం చేసుకున్నారు ? రెండూ ఒకదానికి ఒకటి సహాయపడ్డాయా ?

– కవీ, మనిషీ వేరు వేరు కాదు.  రెండూ ఒకటే. కనుక, కవిగా ఒకలాగా, మనిషిగా మరోలాగా అర్ధం చేసుకోవటం ఉండదు.  కవీ, మనిషీ ద్వంద్వాలు కాదు.  ఇద్దరికీ ఒకటే వేరు – మానవత్వం.

 మానవ జీవితంలో చలం గారు చెప్పినట్టు మోహానుభవాలు, ప్రేమానుభవాల కంటే గొప్పవి ఏవీ లేవా ? లేకపోతే ప్రపంచం మరింతగా రోజు రోజుకీ భౌతిక విలువల పరుగుతో సర్వం ఎలా మరిచిపోగలుగుతుంది ? కవులు కుడా దీనికి మినహాయింపు కావట్లేదెందుకు ?

– మానవ జీవితంలో ప్రేమానుభవం కన్నా గొప్పదేదీ లేదు అన్నారు చలం గారు.  నేను దీన్ని కాస్త విశాలం చేసి ‘మానవ సంబంధాల కన్నా గోప్పవేవీ లేవు’ అంటాను.  సాటి మనుషులతో, స్నేహితులతో, భార్యతో, ప్రియులతో, పిల్లలతో, ప్రకృతితో మానవ ప్రేమానుబంధాల కన్నా నిజంగా జీవితంలో గొప్ప విషయాలేమున్నాయి ? వీటిని వదిలిపెట్టి భౌతిక, వ్యాపార విలువల కోసం పరుగు పెట్టేవారెవరూ సుఖపడగా నేను చూడలేదు.  అన్నీ ఉండి, మానవబంధం లేకపోతే ఎందుకా జీవితం ?

ప్రేమా, కరుణా – ఇటువంటి అనుభూతుల్లోంచి కవిత్వం పుడుతుంది.  ద్వేషంలోంచి కవిత్వం రావటం ఇంతవరకు నేనెక్కడా చూడలేదు.  ప్రపంచ కవిత్వ చరిత్రనంతా గాలించినా ద్వేష కావ్యం వంటిది మీకెక్కడా తగలదు.

ఐతే, ప్రస్తుతం మన కవులు రాస్తున్న రాతలు చాలా వరకు వర్గ ద్వేషాల మీద, కుల ద్వేషాల మీదా, లింగ ద్వేషాల మీద, ప్రాంతీయ ద్వేషాల మీద ఆధారపడ్డవే.  అందుకే, వాటిల్లో కవిత్వాంశ బాగా లోపిస్తుంది. ఇటువంటి సాహిత్య ఉద్యమాల వల్ల తట్టలకొద్దీ అకవిత్వం పుట్టుకొచ్చింది.

కవికీ, రచయితకీ అధ్యయన శీలత అవసరమా ? లేకపోవడం వల్ల  సాహిత్యానికి వచ్చే ప్రమాదం ఏదయినా ఉందా ?

-అధ్యయన శీలత ఒక్కటే కాదు. ఐదు అవసరమన్నారు మనవాళ్ళు.  అందులో వారంగనా సాహచర్యం ఒకటి ! ఆశ్చర్యం కాదూ!

దేశాటనం, పండిత మిత్రతా చ,

వారంగానా, రాజసభా ప్రవేశ:,

అనేక శాస్త్రాన్యవలోడనంచ

చాతుర్యమూలాని భవంతి పంచ.

తెలుగు సాహిత్యానికి మంచి విమర్శ లేదనే పాతబడిన విమర్శ ఒకటి ఉంది. ఉత్తరాధునిక విమర్శనా విధానం ద్వారా కొందరు చేస్తున్న సాహిత్య విమర్శ పట్ల మీ స్పందన ఏమిటి ?

-వెంకటేశానికి సెలవుల్లో చదవాల్సిన పుస్తకాలు లిస్టు చెబుతూ గిరీశం, చివర్న ‘కుప్పుస్వామయ్యర్ మేడ్ డిఫ్ఫికల్ట్’ కుడా రాసుకోమంటాడు.  ఇప్పుడింతమంది కుప్పుస్వామయ్యర్లు పుట్టుకురావటం ఆశ్చర్యంగా ఉంది.

ఉత్తరాధునికత తెలుగు కవిత్వంలోకి ప్రవేశించిందా ? ఆ అవసరమూ, వీలూ తెలుగు కవిత్వానికి ఉన్నాయా ?

– కవిత్వం నిష్క్రమించింది కనుక, ఉత్తరాధునికత ప్రవేశించిందనే అనుకోవాలి.

వాడుకలో భాష పాతబడి భావ స్ఫురణను కోల్పోతున్నప్పుడు కవి తిరిగి భాషను శుభ్రపరుస్తాడు ? మీరు తెలుగు పదాలను ఎలా శుభ్రపరచి మెరిపించగలుగుతున్నారు ? స్పటిక స్వచ్చంగా ఎలా చెయ్యగలుగుతున్నారు ?

– సామాన్యమైన అచ్చ తెలుగు మాటలు చలంగారి రాతల్లో ప్రాణం పోసుకుని కళ్ళు తెరవటం చూసాను. కృష్ణ శాస్త్రి గారి మాటల అందం వేరు. చలం వాడిన వాడుక భాషలో గొప్ప శక్తి ఉంది. అది నన్ను ఆకర్షించింది.  జీవంలేని కావ్య భాష మీద వెగటు కలిగించింది. ముక్కవాసన కొట్టేవీ, అరిగిపోయినవీ, పాత మాటల్ని సాగనంపి, జనం నాలికలమీద జీవ నృత్యం చేసే మామూలు మాటల్ని ఆహ్వానించాను.

 పద్య కవులు పద్యాన్ని బతికించాలని ఈ మధ్య అయిదారేళ్ళుగా చాలా  శ్రమపడుతున్నారు.  వీరి కృషి ఫలితాల మీద మీ అభిప్రాయం ? ఈ కాలానికి ఛందోబద్ద  పద్యాలు పనికొస్తాయా ?

-పద్య కవులు ఈ మధ్య మంచి పద్యాలే రాస్తున్నారు.  కాని, మంచి కవిత్వం సృష్టించలేక పోతున్నారు.  వాళ్ళ హేండీ కేప్స్ రెండు: గ్రాంధిక భాషా, ఛంద: కాఠిన్యమూ. ఇప్పటి ప్రపంచం చాలా మారింది.  ఈనాటి కొత్త ఆలోచనలూ, అనుభూతులూ, గ్రాంధిక భాషలో ఇమడవు. పద్యం ఎంత చక్కగా రాసినా, ఈ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

పోనీ భాష మార్చి వ్యవహరీకరిద్దామంటే, ఛందస్సు బిగబడుతుంది. ఈ ద్వైత సమస్యని (dilemma) పరిష్కరించుకునేవరకు వాళ్ళ కవితాభివ్యక్తి  సార్థకం కాదు.

భువన విజయాలు, అవధానాల వంటి పండిత (పామర) రంజన ప్రక్రియలు తిరిగి ఆంద్రదేశంలో రాజాదరణ (అధికారాదరణ) లోకి, ప్రాపకంలోకి పోతున్నాయి.  ఇవి సాహిత్యానికి మంచి రోజులా ? చెడ్డ రోజులా ?

– సర్కసులలో రెండు రకాలున్నాయి: శారీరక సర్కసూ, మేధా సర్కసూ. భువన విజయాలూ , అవధానాలూ రెండో జాతికి చెందినవి. సర్కసులంటే ఇష్టపడే జనం సమృద్దిగా ఉన్నారు.  వాళ్ళని మనం ఆపలేం. రెండిట్లో ఏదైతేనేం ? మనో రంజనం కోసమే కదా !

 ఈ వేళ వర్గం స్థానంలోకి కులం, లింగ విభజన, ప్రాంతీయత, మతం అన్నవి వచ్చి చేరి సాహిత్యాన్ని ఆక్రమించుకున్నాయి. దీని వల్ల సాహిత్యం నష్ట పోతుందా?

– చాలా నష్ట పోయింది. ఇంతకు మునుపు చెప్పానుగా, కవిత్వం ప్రేమ నించి పుడుతుంది గాని ద్వేషం నించి కాదనీ, ద్వేషం ప్రాతిపదికమీద ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా మంచి కవిత్వం పుట్టలేదనీ.  ఇటీవల తెలుగు వస్తున్న బండ్ల కొద్దీ ఆకవిత్వానికి కారణమిదే.

స్త్రీలు స్వంత వ్యక్తిత్వాల కోసం స్వంత గొంతులు విప్పడం జరిగింది కదా! వ్యక్తిత్వ సాధనలో ప్రేమించగల స్వభావం కోల్పోయే ప్రమాదం ఉందా ? లేదా, మరింత ఎక్కువ ప్రేమించ గలరా ?

-వ్యక్తిత్వ సాధనంటే తన శక్తుల్నీ, చైతన్యాన్నీ పరిపూర్ణంగా వికసింపజేసుకోవటం.  అంటే మానవత్వాన్ని పెంపొందించుకోవటం.  ఆత్మ జ్ఞానాన్ని సాధించటం.  అటువంటి వాళ్ళల్లో ప్రేమించ గల స్వభావం పెరుగుతుంది కాని తరగదు.

కుటుంబం స్త్రీలపై హింసకు కేంద్రమని స్త్రీవాదులు, కుటుంబం లేకపోతే స్త్రీలకు మనుగడే లేదని ఇతరులూ అభిప్రాయ పడుతున్నారు కదా! విస్తృతమైన మీ జీవితానుభవం నుంచి, చలం అభిమానిగా మీ ఉద్దేశ్యం, అవగాహన ఏమిటి ?

-వివాహబంధం స్త్రీకీ, పురుషుడికీ ఇద్దరికీ ఉరితాడు వంటిదని చలంగారు భావించారు. కుటుంబ వ్యవస్త పనికిరాదని ఆయన చెప్పలేదు. పెళ్లి తతంగం వద్దనుకున్నా ప్రేయసీ ప్రియులు కలిసి సంసారం చేసి పిల్లల్ని సాకాలి గదా. కనుక. కుటుంబ వ్యవస్థ తప్పదనుకుంటాను.

ప్రేమ సూత్రం గురించి పదే  పదే కవిత్వం ద్వారా చెప్పే మీరు, మూకల వల్ల కాక వ్యక్తుల వల్ల ప్రపంచం మారుతుందని  చెప్పే మీరు, మీ అనుభవంలో ఈ అంశాన్ని దర్శించారా ?

– గాంధీ గారినీ, చలంగారినీ, ఇంకా ఎంతో మంది మైనరు మహాత్ములని చూస్తున్నారు కదా!

విషాద కషాయంతో జీవిత జ్వరాన్ని నయంచేసుకోడానికి కవిత్వం సహాయపడుతుందా ?

-కవి కూడా మామూలు మనిషే, ఎటొచ్చీ తనకు ప్రత్యేకమైన చైతన్య దృష్టితో సగటు మనిషికన్నా కాస్త లోతుగా విశాలంగా చూడగలడు. కనుక, జీవితపు ప్రతిరోధాల్ని, నిర్భందాలనీ అధిగమించి, ప్రపంచంతో సమన్వయము సాధించ గలడు. బతుకులోని లోటుపాట్లని పూడ్చుకుని కొంత పరిపూర్ణత సాధించగలడు. కవి తాలూకు ఈ అనుభవం జీవితంతో అసంతృప్తి చెందిన సామాన్య పాఠకుడికి ఒక కొత్త వెలుతురునీ, ఒదార్పునీ, సంతృప్తినీ ప్రసాదించగలదు.  ఈ విధంగా కవిత్వ కషాయం జీవిత జ్వరాన్ని నయంచెయ్యటానికి పనికొస్తుంది.

 ఉగ్రవాదం పేరుతో, మతం పేరుతో కళ్ళ ముందు జరుగుతున్న మారణకాండపట్ల కవుల బాద్యత ఏమిటి ?

కవులుగా కవుల ప్రధాన బాద్యత ఏమిటంటే అకవిత్వం రాయకుండా జాగ్రత్త పడటం! ఉగ్రవాదం పేరా, మతం పేరా జరిగే దారుణకాండల్ని ఖండించవలసిందే.  దానికి అనేక మార్గాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనది రాజకీయచర్య.  వాటికి కవిత్వాభివ్యక్తి ఇవ్వదలచుకున్నప్పుడు ఆ అనుభవాలు తన రక్తంలో జీర్ణమై, అనుభూతి లోనూ అస్తిత్వంలోనూ భాగమైనప్పుడే ఆ పనికి పూనుకోవాలి.

తన యెడల, తన పాఠకుల యెడల ఈ బాధ్యతని కవి మరిచిపోకూడదు.

న్యూయార్కు మీద బాంబులు పడగానే అమెరికానీ, బుష్ నీ తిడుతూ తట్టెడు కవితలు వచ్చాయి కాని, బిన్ లాడెన్ నీ, తాలిబాన్ లనీ, వాళ్ళ అమానుష పరిపాలననీ, మత మౌళిక వాదుల్నీ వాళ్ళ మౌడ్యాన్ని, స్త్రీల అణచివేతనూ ఖండిస్తూ ఒక్కటంటే ఒక్క పద్యం ఈ కవులెవరేనా రాశారా? వీళ్ళు మన కవులు!

గుజరాత్ లో అంత దారుణమైన మారణకాండ, మానవహోమం జరిగింది కదా. గ్లోబల్ ఖడ్గాలూ, అమెరికన్ పిల్లలూ అంటూ గెంతే ఈ కవులెంత మంది గుజరాత్ అమానుషత్వానికి స్పందించారు ? చాలా మంది కవుల హ్రుదయాల్నించి మానవత్వం కారిపోయి, ఆ చోటుని కమ్యునిస్టు, కుల, ప్రాంతీయ రాజకీయ విషాలు ఆక్రమించాయి.

ప్రపంచీకరణ, ప్రవేటీకరణ, మార్కెట్ ఎకానమీల పట్ల స్పందిస్తూ కవులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో విమర్శకులు ఆ కవిత్వాల బలహీనతలను ప్రశ్నించడం పట్ల మీ అభిప్రాయం ఏమిటి ?

-కవిత్వం బలహీనమైనపుడు ఆ విషయం నిష్పక్ష పాతంగా వెల్లడి చెయ్యటం విమర్శకుల బాధ్యత. విమర్శకులు తాక కూడనివని నిషేధించటానికి ప్రపంచీకరణ, ప్రవేటీకరణ, అమెరికా ద్వేషం వంటి వస్తువుల్లో పావనత్వమేమీ లేదు.  కవితలో కవిత్వాంశ ఎంత ఉందో బేరీజు వెయ్యటం విమర్శకుల పని.  ఉన్న మాట చెబితే ఉలుకెందుకు వీళ్ళకి!

ఈ వేళ సాహిత్య వాతావరణంలో ఒక స్తబ్దత ఏర్పడిందని పలువురు అంటున్నారు.  ఒక దశాబ్దాన్ని పాలించిన స్త్రీవాద, దళిత వాదాలు కొంత ఉపశమించి, ప్రపంచీకరణ అన్న పెను ముప్పువైపు ఏకోన్ముఖంగా దృష్తి సారించిన ఈ తరుణంలో స్తబ్దత నిజంగా ఉందా?

– రాజకీయ వాదాల వల్ల ఉద్యమాల వల్ల కవిత్వం పుట్టదు. కవిత్వాన్ని కవులు సృష్టిస్తారు. అది వైయక్తిక క్రియ. వ్యక్తి  తాలూకు హృదయ స్పందనకు సంబంధించింది.  వాదాలూ, సిద్దాంతాలూ ఉన్నా ఊడినా, ఉద్యమాలు లేచినా పడుకున్నా ఆర్ద్ర హ్రుదయుడైన కవి రచిస్తూనే ఉంటాడు.  స్తబ్దత అనేది వాదాలకూ ఉద్యమాలకే గాని కవులకు కాదు.

రాజకీయ లేదా ఉద్యమ కవులమని చెప్పుకునే వాళ్ళు ఉద్యమం మందగించగానే వాళ్ళు నీరసపడి పోతారు.  నిజానికి వాళ్ళు కవులూ కారు. వాళ్ళది కవిత్వమూ కాదు.

సాహిత్య వాతావరణంలో స్తబ్దత ఏర్పడిందనే సమస్యని ఐదేళ్ళకోమారు లేవనెత్తి, సాహిత్య పేజీలు  నింపుకోవటం పత్రికల వాళ్లకి అలవాటైనట్లు కనిపిస్తుంది.

 కవిత్వం, కథ ప్రాంతీయతల ఉబిలో చిక్కుకున్నాయా ?

-1972 లో నా ‘చెట్టు నా ఆదర్శం’ ప్రచురితమయాక మరుపూరి కోదండ రామారెడ్డి గారు ‘భారతి’ లో సమీక్ష రాశారు.  ‘ఈ కవి గోదావరి మండల మాండలికాన్ని చక్కగా వాడినారు’ అని.  మనమంతా వాడేది మండలికాల్నే. ఐతే చదువుకున్న వాళ్ళ భాషలో వారే ప్రాంతం వారైనా ఎక్కువ సామ్యం ఉంటుంది. ఒకర్నొకరు సులువుగా అర్థం చేసుకోగలరు. చదువు స్కేల్ లో కిందికి వెళ్ళే కొద్దీ ఒకరి మాండలికం మరొకరికి అర్ధమవటం కష్టమౌతుంది.

మాండలికాన్ని వెలుగులోకి తీసుకురావటం మంచిదే.  కొందరు మాండలిక రచయితల్ని చదువుతుంటే, మన భాషలో ఇంత శక్తీ సౌందర్యమూ ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది.  ఐతే ఏక కాలంలో, అన్ని మాండలికాలని సమన్వయించే ఏకీకరణ క్రియ కుడా భాషలో జరుగుతూనే ఉంది.  ఇలా ఏకకాలంలో విభజనా ఏకీకరణ భాషా క్షేత్రంలో జరుగుతుంటాయనుకుంటాను.

మైనారిటీ రచయితల కథల, కవిత్వాల మీద చెలరేగుతున్న వివాదాలు సాహిత్యానికి అవసరమా ?

మైనారిటీ రచయితలే కాదు, ఏ రచయితల గురించి కూడా మంచి సాహిత్య విమర్శా, విశ్లేషణా జరగటం లేదు.  జరుగుతున్నవి చాలావరకు మత కుల ప్రాంతీయ ప్రాతిపదికల మీద రాజకీయ వివాదాలు.

మీ 75 ఏళ్ల జీవితంలో భావ కవిత నుంచి హైకూ దాకా మీరు చేసిన (1942-2002) మీ అరవై ఏళ్ళ కవిత్వ ప్రయాణంలో జీవితం కవిగా మీకు ఏమిచ్చింది ?

– అనిర్వచనీయమైన ఆనందం.  ఆనందో బ్రహ్మ.

హైకూ పద్ధతి మన భాషకు తగదని కొందరు విమర్శకులు అంటున్నారు.  దీనికి హైకూ మార్గదర్శిగా మీ జవాబు ఏమిటి ?

-హైకూ అంటే స్వేచ్చా కవిత్వం.  ఆనందవర్ధన, అభినవగుప్తుల ధ్వని మార్గమే హైకూ మార్గం. ఇది మన భాషకు పనికిరాదన్న పెద్ద మునుషులెవరో కాస్త చెబుతారా ?

 ఇస్మాయిల్ గారి ఇల్లు ఆంద్ర దేశంలో చారిత్రిక స్థలం. అటువంటి స్థలాన్ని మరే దేశంలోనయినా అయితే ప్రభుత్వం మాన్యుమెంట్ గా కాపాడి ఉండేది – అని మీ అభిమానులకు కొండంత చింత.  అరవై ఏళ్ళుగా ఉన్న ఆ ఇల్లు విడిచిపెట్టి రావలసివచ్చినపుడు మీరు చాలా రోజులు ఎంతో సిక్ నెస్ అనుభవించారు.  ఇటువంటి సెన్సిబిలిటీ మనిషికి అవసరమా? కవికి అవసరమా? అది ఆ మనిషికి ఏం ఉపయోగం ?

-మనిషికి సెన్సిబిలిటీయే మానవత్వాన్ని ఇచ్చేది.  ఇది కవిలో మరీ నిశితంగా, సున్నితంగా ఉండాలి.  అంటే కవిలో మానవతా గుణం ఎక్కువ పాలులో ఉండాలన్న మాట. ఈ సుకుమార చేతనే కవిత్వానికి మూలం.

అప్పుడు శ్రీనాధుడు పాకనాటి వాడితే ఇప్పుడు నేను వలసపాక నాటి వాడను!

మీరు మీ పుస్తకాలను ఎందరో సాహిత్యేతర వ్యక్తులకు అంకితమిచ్చారు.  మీ స్నేహాలు కుడా ఎక్కువ అటువంటి వారితోనే (పదవులు, ధనం లేనివారే ఎక్కువ అందులో) దానికి కారణం ఏమిటి ? లోకానికి ఇంత వ్యతిరిక్తంగా ఎలా ఉండగలుగుతున్నారు ?

-నా అసలు జిహాద్ (ధర్మ యుద్ధం) కమ్యునిస్టులతో . ఇది నలభై ఏళ్ళుగా సాగుతోంది. వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సాహిత్యాన్ని హైజాక్ చెయ్యటానికి ప్రయత్నించి ఇంచుమించు కృతకృత్యులయారు. కవుల్నీ, రచయితల్నీ, కళాకారుల్నీ పార్టీ రాజకీయ ప్రచారం కోసం పార్టీకి అంగంగా ఉపయోగించుకోమని లెనిన్ తన భటులకు ఆదేశమిచ్చాడు.  అప్పటినించీ ప్రతి దేశంలోనూ అభ్యుదయం పేరనో, విప్లవం పేరనో రచయితల సంఘాలు ఏర్పరచి, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడని సాహిత్యం పనికి మాలినదని యువ రచయితలకు నూరి పోసి, వాళ్ళ చేత నినాద ప్రాయమైన శుష్క రచనలు రాయించి పార్టీ ప్రచారం చేయించుకుంటున్నారు. సాహిత్యంలో ఈ రాజకీయ కాలుష్యాన్ని నేను మొదట్నించీ ఎదిరిస్తూ వచ్చాను.  ఈ కమ్యునిస్టు ప్రభావం వల్ల ఎంతో మంది యువ రచయితలు జబ్బుపడి, సాహిత్య పరంగా శవ ప్రాయులయారు.  అకవిత్వ కల్మషం దేశమంతా అలుముకుంది.  ఈ వెల్లువ ఇంకా తగ్గినట్టు లేదు. దీనికి వ్యతిరిక్తంగా, అంటే సాహిత్యంలో స్వేచ్చ కోసమూ, రచయితల వ్యక్తిత్వ ప్రాధాన్యాన్ని ఉగ్గడిస్తూనూ, నలభై ఏళ్లబట్టి పోరు సాగిస్తున్నాను.  కమ్యునిస్టుల చేత చాలా రొస్టు  పడ్డాను.

తెలుగు కవిత్వానికి, ప్రోజ్ కి ఎక్కువగా అనువాదాలు ఎందువల్ల లేవు ? మీరు తెలుగులోకి చేసారు గాని, తెలుగు నించి ఎందువల్ల చెయ్యలేదు  ?

-ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, తెలుగు నించి ఇంగ్లీషుకు గాని, ఇతర భాషలకు గాని అనువాదం చెయ్య గలిగిన సమర్థులు తెలుగు దేశంలో చాలా అరుదు.  ఇతర భారతీయ భాషలనించి ఇంగ్లీషులోనికి అనువాదాలు వస్తున్నాయి.  కాని తెలుగు నించి బహు సక్రుత్తు . తెలుగు సాహిత్యం గురించి ఇతర దేశాల వాళ్లకు చాలా తక్కువ తెలుసు.

అనువాద గ్రందాల విస్తృత అద్యయనం వల్ల నేను గ్రహించిందేమిటంటే, అనువాదకుడి మాతృభాషలోకి అనువదింపబడే గ్రంధం మాత్రమే రాణిస్తుంది.  గ్రందానువాదం అనువాదకుడి మాతృభాష లోకి కాకపోతే, ఆ అనువాదం సమగ్రంగా ఉండదు. ఏదో లోటు కనిపించి తీరుతుంది.

అందుకని, నేను చేసిన అనువాదాలన్నీ తెలుగులోకే.

కవిగా ఎదగడంలోనూ, కేరీరిస్టుగా ఎదగడంలోనూ ఉన్న తేడాను పెద్ద సాహితీ వేత్తలు కూడా ఎందుకు గుర్తించడం లేదు ?

-కేరీరిస్టులుగా ఎదిగి, కవులుగా అణగారి పోయే వాళ్ళని చూస్తే జాలేస్తుంది.

ప్రపంచానికి దూరంగా (కాకినాడకు కాస్త దూరంగా) వలసపాకలలోకి వలస వెళ్ళిన మీరు హైకూతో ఎంత దూరం ప్రయాణించాలనుకుంటున్నారు ? మీ ప్రయాణం నుంచి ప్రపంచానికి మీరు చెప్పే కవితా సందేశం ఇంకా ఎన్ని కొత్త దారులలో ప్రకాశించబోతోంది ?

– రామగిర్యాశ్రమంలో ఉంటూ కాళిదాసకవి మేఘంతో ప్రేయసి జ్ఞాపకాల్లోకి ప్రయాణించినట్లు వలసపాకలలో ఉంటూ హైకూతో కవితా ప్రేయసి సంపూర్ణ సాక్షాత్కారం కలిగే వరకు ప్రయాణిద్దామనుకుంటున్నాను.

ఇస్మాయిల్ గారి 75వ పుట్టినరోజునాడు  జరిగిన సన్మాన సందర్భం ( 2002) లో

వాడ్రేవు వీరలక్ష్మీదేవి చేసిన సంభాషణం

veeralakshmi (2) 

కళింగాంధ్ర కవిత్వ ‘పాయ’ల మురళీకృష్ణ

మా కళింగాంధ్ర ప్రాంతం నుండి చాన్నాళ్ళుగా కవిత్వం రాస్తున్న పాయల మురళీ కృష్ణ గత ఆగస్టులో ’అస్తిత్వం వైపు’ అన్న కవితా సంకలనం ప్రచురించారు. ఈ ప్రాంతం నుండి రాస్తున్న వాళ్ళలో తొంభై తొమ్మిది శాతం ఉపాధ్యాయ వృత్తిలోని వారే కావడం గమనార్హం. టీచర్ గా పనిచేస్తూన్న వారికి నిత్యమూ గ్రామాలలో జరుగుతున్న విధ్వంసం వివిధ వృత్తుల జీవన విధానం ప్రజల దైనందిన జీవితంతో అనుబంధం వారిని రచయితలుగా కవులుగా బాధ్యతతో వ్రాసే వారిగా నిలుపుతుందనుకుంటాను. మిగతా వృత్తులలోని వారి కంటే వీళ్ళకు పిల్లలతో అనుబంధం వుండడం కూడా అదనపు సౌకర్యమే.
MURALI_PHOTO025-page-001

ఒక కుటుంబ నేపథ్యం తెలుసుకొనే అవకాశం వారి పిల్లల చదువు వారి కుటుంబ ఆర్థిక సామాజిక స్థితి గతులను తెలుసుకొనేందుకు, పిల్లలను చూస్తూ వారితో సంభాషిస్తూ వారి రోజువారీ సమయంలో అత్యధికంగా వారితో గడవడం మూలంగా మంచి అవగాహన కలిగిస్తుంది. నిబద్ధత కలిగిన రచయిత కవికి ఇది ముడిసరుకుగా ఉపయోగపడుతుంది. దీనిని కవిత్వీకరించడం ద్వారా సామాజిక ప్రస్తుత వాతావరణాన్ని మన కళ్ళముందు పద చిత్రాలుగా బ్లాక్ అండ్ వైట్ లో స్పష్టంగా చూపించే ప్రయత్నం మురళీ కృష్ణ కవిత్వంలో చూడవచ్చు. అనుభూతి చెంది ఆలోచనలకు ప్రేరణనిస్తాడు కవి.

ఈ సంకలనం ముందు మాటలో శివారెడ్డి గారన్నట్టు కవిత్వం జీవితంలో అన్ని పార్శ్వాలను వెలిగించే దివ్యశక్తి. లోలోన గుణించుకొని కవిత్వాన్ని అల్లే పద్ధతి మురళీలో వుంది. అది ఒక చిక్కని నేతగా అతని కవిత్వంలో కన్పడుతుందంటారు. ఈ కవితలు చదువుతుంటే ఇది అక్షర సత్యం అని ఒప్పుకోక తప్పదు.

 

’అత్యవసరం’ కవితలో

ప్రపంచం ఒక కుటుంబమౌతుంటే

మనిషి మాత్రం ఒంటరిగా చీలిపోతున్నాడు

ఒకప్పుడు హృదయాలను కలిపిన సాయంకాలాలు

ఇప్పటి ఏకాంతాలై శోకిస్తున్నాయి…. అంటూ సమూహం నుండి విడివడి పోతున్న మనిషి పట్ల ఆవేదనను వ్యక్తపరుస్తాడు.

 

“ఈ రోజేం కథ చెప్తారు మాష్టారూ!?” కవితలో

 

ఎన్ని విషాదాలనైనా

ఒక పసి నవ్వు కడిగి పారేస్తుంది

బడి ప్రాంగణంలో మాత్రమే

బ్రతుకు కల్మష రహితమై కన్పిస్తుంది

 

బడి చివరి గంట తర్వాత

బడి భవనం, నేనూ ఇద్దరం నిస్సహాయులమే

రేపటి ఉదయం వరకూ

రెక్కలు తెగిన పక్షులమే… అంటూ ఈ కవితలో మాస్టారుగా కాన్వెంటు బడులు సర్కారు బడులను మింగేస్తున్న వైనాన్ని చెపుతు టీచరుగా వృత్తి ధర్మాన్ని ఎంత నిబద్ధతతో పాటించాలో సవివరంగా వ్యక్తపరుస్తాడు.

 

పర్యావరణాన్ని మింగేస్తున్న విధ్వంసకర అభివృద్ధి మేకప్ వేసుకొని చేస్తున్న వినాశనం తద్వారా మనిషి కోల్పోతున్న సహచర సంపద పట్ల మక్కువను చూపే ప్రయత్నం “మొక్క” కవితలో ఇలా చెప్తాడు

PAYALA MURALI KRISHNA-page-001

భూమికీ ఆకాశానికి తేడా చెప్పమంటే

నేను మొదట మొక్కనే చూపిస్తాను

ఎన్ని చుక్కలున్నా

ఒక్క మొక్కను కూడా సరిపోవు కదా! అంటూ

 

మనుష్యుల మధ్యున్నప్పుడు

చాలా సార్లు పీడించే ఒంటరితనం

మొక్కల మధ్య నన్ను చూస్తే అంతర్ధానం అంటాడు.

 

“రేపటి సూర్యోదయానికి ముందు..” కవితలో బెస్త వారి బతుకుల్లో కంపెనీలు పెట్టిన చిచ్చు తద్వారా వారి జీవిక కోల్పోయినతనాన్ని మన కళ్ళముందు తడిగా ఆవిష్కరిస్తూనే వారికి విముక్తి మార్గాన్ని వారి ఐక్య పోరాటంలోనే సాధ్యమని చెపుతాడు.

 

అతడక్కడే ఉండేవాడు

ఎగసే కెరటాల సాక్షిగా

పగలంతా ఇసుక తిన్నెల మీద

ఈ సముద్రం ఒడ్డునే కూర్చుండేవాడు

నైలాన్ దారాలు ముందేసుకుని

సరికొత్త వస్తువును సృష్టించబోయే

శ్రామికత్వాన్ని ప్రేమించేవాడు

ఓ దారాన్ని తీసి మరో దారానికి కలుపుతూ

సునిశితంగా, వేగంగా

అతడు ముడివేయడం చూసేటప్పుడు

మనిషినీ మనిషినీ అంతే వేగంగా

కలపగలిగే వాడు ఎవరైనా ఉంటే బావుణ్ణనిపించేది

 

చివరిగా ఇలా

 

ఇప్పుడు కూడా అతడక్కడే ఉన్నాడు

తన వాళ్ళ పిడికిళ్ళు ముడివేస్తూ

సరిక్రొత్త మానవ వల అల్లుతున్నాడు

“వేట సముద్రం మీదకి కాదురా

ఒకానొక స్వార్థం మీదకని” చెప్పి

తెప్పల్ని నడిపే తెడ్లన్నీ

తిరుగుబాటు జెండాలు చేసాడు….. అంటాడు మురళీ.

 

అలాగే రైతు పొలాలకు దూరమై వలస బాట పట్టడాన్ని తనదైన శైలిలో “ఒక నిష్క్రమణకు ముందు” కవితలో చిత్రిస్తాడు మురళీ ఇలా

 

భవిష్యత్ ఛిద్రమై పోతున్న ఒకానొక దృశ్యం

ఎవరు మాత్రం ముందుగా ఊహించగలరు?

నడిచే దారులే కంటతడి తుడవలేక

వలసపొమ్మని సాగనంపుతుండడం

ఎవరు మాత్రం జీర్ణించుకోగలరు..!?

 

ఊరూ ఊరంతా భూమిని కరెన్సీగా మార్చేసుకుంటుంటే

విస్తరించే విధ్వంసానికి

విచ్చుకుంటున్న పచ్చదనం బలికాదని ఎలా నిర్ధారించగలరు!?

 

సమూహం నుండి తప్పని సరిగా విడివడుతూ మనిషి తన అస్తిత్వంవైపు ఎలా అడుగులేస్తూ ఉనికిని కోల్పోతాడో ఈ సంకలనం శీర్షిక “అస్తిత్వం వైపు” కవితలో తనదైన శైలిలో ఇలా ఆవేదనగా ఆవిష్కరిస్తాడు

 

కొంత విరామం తర్వాత

అతడలా నడిచి వెళ్తుంటాడు

ఆ రాదారుల కఠినమైన రాళ్ళల్లో

ఏవో చిగురించిన జ్నాపకాలు

సుతిమెత్తగా తగుల్తుంటాయి..

 

ఇంటికెళ్ళేసరికి

సాయంత్రమైపోతుంది

ఇంటి ముందు ఎవరో

దీపాలు పెట్టడం గమనిస్తాడు

వేగంగా అడుగులేస్తాడు

ఒక్క దీపమూ కనిపించదు

 

తన ఇరుగ్గదిలో

తన కోసం ఎవరో పరిచిన చాప మీద

అలాగే నిద్రపోతాడు

 

తెల్లవారిన తరువాత

అతడు లేడు

తనలో ఇంకెవరో తప్ప………….

 

చివరిగా “దారిలో ఒకవేళ…..” కవితలో

 

తంగేడు చెట్టు పసుపు పచ్చగా నవ్వే

ఏదో ఒక వేళ

ఈ దారిలో నా నడక ఆగిపోవచ్చు

అక్కడక్కడా ఉన్న రక్తపు చారలు

చెబుతున్న నిజాలను

కొన్ని పాద స్పర్శలు పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు… అంటూనే

 

ఇప్పుడు

నాతో కవిత్వం నడుస్తోంది

అప్పుడు

కవిత్వంతో నేను నడుస్తాను… అంటాడు కవి ఆశావహంగా…

 

ప్రతులకు..

పి. మురళీకృష్ణ

మెంటాడ – 535 273,

విజయనగరం జిల్లా. 9441026977 సంప్రదించవచ్చు.

-కేక్యూబ్ వర్మ

 varma

 

రచయిత గారి భార్య

Kadha-Saranga-2-300x268

“ఇదిగో . .. ఏమండి ? మిమ్మల్నే ! ” ఎవరో పిలుస్తున్నట్లనిపించింది.

ఆగి చూసాను . ఎవరూ లేరక్కడ . భ్రమ పడ్డాననుకుని మళ్ళీ కదిలాను .

“అలా వెళ్ళిపోతారేమిటండి కాస్తాగి ఈ గోడ ప్రక్కనున్న బెంచీపై కూర్చోండి ” అభ్యర్ధన.

నా బ్రాంతి అయినా కాకున్నా నడచి నడచి కాళ్ళు కూడా నొప్పి పుడుతున్నాయని మనసు చెపుతుందేమో అనుకుంటూ ఆగి చుట్ట్టూ చూసాను, నిజంగానే అక్కడొక బెంచీ వేసి ఉంది “హమ్మయ్య కాస్త కాళ్ళ నొప్పులు తగ్గేదాకా కూర్చుందాం ” అనుకుంటూ బెంచీపై కూర్చున్నాను .

“నా మాట మన్నించినందుకు ధన్యవాదములు ” అన్న మాటలు వినబడ్డాయి. తల పైకెత్తి చూసాను . పేరు తెలియని ఒక చెట్టు.   అది రోడ్డు ప్రక్కగా ఉన్న ఇంటి ఆవరణలో గోడ ప్రక్కన పెరిగి ఉంది. సుమారు ఏడడుగుల ఎత్తు ఉంటుందేమో ! అయిదడుగుల ప్రహరి గోడపైన చిక్కని కొమ్మలతో పచ్చగా విస్తరించి ఉంది. దాన్నిండా అందమైన పువ్వులు కొన్ని, మొగ్గలు కొన్ని. తేలికైన పరిమళం. అదివరకెన్నడూ అలాంటి చెట్టుని చూడనందుకేమో నేను సంభ్రంగా లేచి చెట్టుని చూస్తూ నిలబడ్డాను.   “నేను నచ్చానా? ” అడిగింది చెట్టు . ఎవరైనా కనబడతారేమో ననుకుంటూ వెతుక్కుంటున్నాను చెట్టు పై కూర్చుని మాట్లాడుతూ నన్ను ఆట పట్టిస్తున్నారని నాకనుమానం వచ్చింది కూడా !

“చెట్టు ఎక్కడైనా మాటాడుతుందా అని మీ అనుమానం, ఆశ్చర్యం కదా ! ” అడిగింది

నేను నోరప్పగించి చూస్తున్నాను

“నిజంగానే నేను మాట్లాడుతున్నాను అలాగే నా బిడ్డలైన ఈ పువ్వులు మాట్లాడతాయి   నేను మీకొక కథ చెప్పాలి, వింటారా? ” అడిగింది చెట్టు

నేను అయోమయంగానే తల ఊపాను

చెట్టు చెప్పడం మొదలెట్టింది …

ఆమెకి నేనంటే చాలా ఇష్టం . నాక్కూడా ఆమెంటే చాలా చాలా ఇష్టం . ఇరవయ్యేళ్ళ నుండి కన్నబిడ్డలకన్నా ఎక్కువగా నన్ను సాకినందుకు మరీ   మరీ ఇష్టం . ఆమెది పువ్వులాంటి మనసు . అందరూ పచ్చగా ఉండాలని ఆకాంక్ష. పెళ్ళి చేసుకుని భర్తతో ఈ ఇంట్లో అడుగుపెట్టిన మర్నాడే రాళ్ళతో రప్పలతో నిండిన ఈ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసింది .” ఇక్కడ మొక్కలేం అంతగా రావు . రాతి నేలకకదా మొక్కలు నాటడం శుద్దదండగ ‘ అంటున్న భర్తతో పుట్టింటి నుండి ఇష్టంగా తెచ్చుకున్న నా వేరు మొక్కని నాటుతూ   ” ఆశనే విత్తనాన్ని నాటి చైతన్యమనే నీరుపోసి సంస్కారమనే ఎరువు వేసి మొక్కలని పెంచితే జ్ఞానమనే ఫలాల్ని అందివ్వవచ్చు” అని అంది.

ఆమె ఆశ వమ్ము కాలేదు మండే ఎండలని, బెట్టని తట్టుకుని నేను బ్రతికి చిగురులు వేసాను ఆమె ప్రతి రోజూ నా దగ్గర కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పేది ఆకు ఆకుని తడిపి స్నానం చేయిస్తుంది. నేను ఆరోగ్యంగా ఎదిగి పూలు పూస్తున్నాను . నా పూలంటే ఆమెకి చాలా ఇష్టం . పూవుని తెంపుతూ ” ఏం చేయనురా కన్నా ! ఇంత అందమైన న్స్వచ్చమైన, పరిమళభరితమైన నిన్ను మీ అమ్మ నుండి వేరు చేయాలని లేదు . కానీ నువ్వు నా బలహీనత ” అంటూ .. సున్నితంగా త్రుంచి ఒకటి దేవుని పటం ముందుంచి మరొకటి తన జడలోనూ తురుముకుంటుంది.   పటంలో ఉన్న దేవుని పాదాల దగ్గర కన్నా ఆ నీలాల కురులలో దాగడం కూడా నాకూ చాలా ఇష్టం. అందుకే నా ప్రాణ శక్తినంతా ధారపోసి రోజుకొక రెండు పువ్వులనైనా ఆమెకి కానుకగా ఇస్తూనే ఉంటాను . రెండేళ్ళకి నాతో పాటు ఆ ఇంట్లో ఇద్దరు బిడ్డలూ పెరగసాగారు. వారి నవ్వులూ నా పువ్వులూ ఆమెకి అత్యంత ఇష్టం, మా ముగ్గురికి ఎండా వానకి గొడుగయ్యేది,ఆకలి వేస్తే ఆమ్మయ్యేది,ఇరుగుపొరుగుకి మంచి నేస్తమయ్యేది.

flower

పిల్లలిద్దరూ స్కూల్ బ్యాగ్ తగిలించుకుని వెళ్ళాక భర్త తో పాటు ఆమె కూడా ఉద్యోగానికి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వచ్చాక బండెడు చాకిరి చేసుకోవడం , అత్తగారి సణుగుడు భరిస్తూనే ఆమెకి సేవలు చేయడం , అప్పుడప్పుడూ నా దగ్గరకి వచ్చి కూర్చుని వ్రాసుకోవడం, కన్నీళ్లు తుడుచుకోవడం చేస్తుండం గమనించి .. దానికి కారణం ఆమె భర్తన్న సంగతి గ్రహించి కోపం ముంచుకొచ్చింది . కానీ నేనేం చేయగలను? మానులా ఎదిగాను కానీ ఆమెకి అన్నివేళలా నీడని ఇవ్వలేను కనుక ఆమె కురులలో ముడిచే నా బిడ్డ పువ్వుని ప్రతి రోజూ   ఆ ఇంట్లో ఏం జరుగుతుందోనన్న ఆసక్తితో ఓ.. చెవి వేసి ఉంచమన్నాను. ఇక పువ్వు ఆమె మంచి స్నేహితులు అయ్యారు. వారి అనుబంధం అలా సాగుతూ ఉంది కదా ! ఇక ఆమె గురించి పువ్వే చెపుతుంది వినండి.. అని పువ్వు వైపు చూసింది

పువ్వు మాట్లాడసాగింది. మాట్లాడటం నిజమా అబద్దమా అన్న సంగతి ఆలోచించడం మానేసి మిగతా కథ వినడంలో ఆసక్తిగా చూసాను.

” రోజులో తలదువ్వుకునే సమయంలో తప్ప మిగతా రోజంతటిని ఆమెనే అంటిపెట్టుకుని ఉండే నాకు తల్లిమీద ఉండే ప్రేమకన్నా ఆమె పైనే ప్రేమ ఎక్కువైంది. అది చూసి అమ్మ నవ్వుకునేది. నిజానికి అమ్మ ఒడిని దాటి ఇంకో అమ్మ ఒడిని చేరిందని అక్కడ కూడా అంతే భద్రంగా ఉంటుందని చెట్టు అమ్మకి తెలుసు. అందుకే వాడిన పువ్వులో పోయే ప్రాణాన్ని మళ్ళీ   విచ్చే ప్రతి పువ్వులోనూ నింపుకుని ఆమెని చేరి మురిసేదాన్ని. సుతి మెత్తని మనసున్న తల్లి. అంత మంచి తల్లికి అలాంటి భర్త ఎలా దొరికాడో ! అతని మనస్తత్వం అర్ధమయ్యాక అయిదారేళ్ళుగా ఆమె అతనిని ఎలా భరిస్తుందో ? అనుకునేదాన్ని విషవాయువులని దిగ మింగి స్వచ్చమైన గాలిని ఇచ్చే మా అమ్మ లాగే ఆమె ఎన్నో గరళాలని మింగి నవ్వుతూ బ్రతుకుతుంటుందనుకునేదాన్ని . ఆమె చేసే ప్రతి పని కళాత్మకంగా ఉంటుంది . ముంగిట వేసే ఐదు చుక్కల ముగ్గైనా , చిత్రంలో బంధించిన నీటి తళ తళలలో కదలాడే చంద్ర బింబమైనా సరే , చెట్టు చిత్రమైనా, నా చిత్రమైనా   అందరూ ముచ్చటగా చూడాల్సిందే! చక్కగా పాడుతుంది, కవిత్వమూ వ్రాస్తుంది. తనలాంటి మగువుల మనఃశరీరాల బాధలకి అక్షరరూపం ఇస్తుంది . మొదట్లో ఆమె వ్రాసిన ప్రతి అక్షరాన్ని చదివి అభినందించినతను, ఆమె రచనలు అప్పుడప్పుడూ పత్రికల్లో అచ్చవడాన్నిఏమాత్రం భరించలేకపోతున్నాడు. ఆమె వ్రాసిన ప్రతిదాన్ని బాగో లేదని తెలివిగా నమ్మించి ఏదో కొద్దిగా సరిచేసి అతని పేరుతొ పత్రికలకి పంపడం చేసాడు. అవి అచ్చయి అతనికి కొంత గుర్తింపు తెచ్చిపెట్టాయి. రచయితగా పేరు సంపాదించడం అతనికి బాగా పొగరునిచ్చింది . మద్యానికి అలవాటు పడ్డ మనిషికి పేరాశ కోసం ప్రాకులాడే మనిషికి పెద్ద తేడా ఏమి ఉండదన్నట్లు.” అందరికి సున్నిత హృదయం ఉన్న కవిగా, కథకునిగా అతనికి పేరు వచ్చేసింది కానీ, నిజానికతను అలా నటిస్తూ ఉంటాడంతే !   ఆ పేరు వెనుక దాగిన ఆమె బాధామయ గాధలెన్నో ! వాటినే ఆమె అక్షరాలుగా వ్రాస్తుందని ఎవరికీ తెలుసు ?

అతను ప్రతిరోజూ తనదైన శైలి లో ఆమెని హింసిస్తూనే ఉంటాడు కానీ   ఒక రోజు జరిగిన సంఘటన గుర్తుకు వస్తే మాత్రం నాకు దుఃఖం ముంచుకొస్తుంది. గుర్తు చేసుకుంటూ పువ్వు ఏడుస్తుంది. ఏడుస్తూనే కొనసాగించింది

“నట రాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటియించు నీవని తెలిసి ఆకాశమే ఒంగె నీ కోసం “ఆకాష్” అనే ఆకాశమే ఒంగె నీకోసం ” రేడియోలో వస్తున్నపాటని మనసుపెట్టి వింటున్న ఆమె ఒక్కసారిగా ఉలికిపడింది. అనుకోనిరీతిలో పాటని పేరడీ చేస్తున్నతీరుకి వణికిపోయింది. పడుకుని ఉన్నదల్లా ఒక్కొదుటున లేచి నిలబడింది. ” ఎలా ఉంది నా పేరడీ పాట ? సరిగానే పాడానా ? తీక్షణమైన చూపుతో ఆమె ఒళ్ళంతా గుచ్చుతున్నట్లు చూస్తూ అడిగాడు . ఆమె మౌనంగా అరమర తెరిచి అతనికి లుంగీ టవల్ అందించి స్నానాల గది వైపు నడిచింది. కాగిన నీళ్ళు ని బకెట్ లోకి పోసి బయటకొస్తూ అనుకుంది .   “అతనిలో మళ్ళీ ఇంకో అనుమాన బీజం మొలకెత్తింది.అది మొక్కై పెరిగి వటవృక్షంలా వేళ్ళూనుకోవడానికి ఎంతో కాలం పట్టదు. నలుగురి ముందు మాటల్లో స్వర్గం చూపిస్తూ, గది గోడల మధ్య చేతలలో నరకం చూపిస్తుంటే మొదటిది అనుభవించడం మరీ నరకం” అని .

ఇప్పుడతను ఆమె చిన్ననాటి స్నేహితుడు ఆకాష్ తో ఉన్న పరిచయాన్ని అనుమానిస్తున్నాడు. వారిద్దరూ బాల్య స్నేహితులు. ఇటీవలే ఎక్కడో కలిసారు . ఇద్దరూ పుస్తకాల పురుగులే, అప్పుడప్పుడూ మాటలతో కన్నా రంగులతోనూ, కుంచెతోనూ భావాలు కలబోసుకుంటారు. అతనికది ఏమాత్రం ఇష్టంలేదు. వందల మైళ్ళ దూరంలో ఉన్నతనితో అక్రమ సంబంధం ఎలా పెట్టుకుంటుందో అన్న ఆలోచనైనా లేని మూర్ఖర్వంతో ఆమెని అసహ్యంగా తిడుతూ, కొడుతూ ,తాగుతూ, సిగెరెట్ తో శరీరాన్ని కాల్చుతూ, రాత్రంతా నరకం చూపించాడు. ఆమె తన కష్టాన్ని పెదవి దాటి బయటకి రానీయదు. తనలోనే కుమిలిపోయేది. ఆమెని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనీయడు పదుగురిలో మాట్లాడనివ్వడు. ఎవరితో మాట్లాడినా వాళ్ళతో నీకేం పని అని సతాయిస్తూ ఉంటాడు, అనుమానంతో ఆమెని చంపుకు తింటాడు. చేసిన ప్రతి పనికి ఒంకలు వెదికి చేయి చేసుకుంటాడు. పిల్లలని ఆమెకి చేరువ కానీయడు. నీ పెంపకంలో వాళ్ళు చెడిపోతారంటూ.. వారిని దూరం చేసి తల్లిపై ప్రేమ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

అతను అప్పుడప్పుడూ కథకులతో చర్చలంటూ ఊర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కదా ! ఇప్పుడైతే అర్ధరాత్రుల వరకు మేలుకుని చాటింగ్ లు చేస్తూ ఉంటాడు కదా ! అయినా ఆమె ఏమి అనదు. అతనిది మాత్రం సమాజంలో రచయిత కున్న భాద్యత ఆమెది మాత్రం విచ్చలవిడితనమా? ఏమిటో ఈ బేధాలు? బాధగా నిట్టూర్చింది పువ్వు

“తర్వాత ఏం జరిగింది చెప్పు ? ” నా ఆరాటం

మొన్నటికి మొన్న ఏం జరిగిందో చెప్పనా   … ఆ రోజు నరక చతుర్ధశి. ఆ రోజు కూడా ఆమెకి సెలవు లేదు ఇక్కడంతా ఆ రోజు దోసెలు కోడి కూర తినడం ఆనవాయితీ . అవి చేయలేదని అలిగి పడుకున్నాడు . అంతకు ముందు రోజు పప్పు నానబోయ్యడం మర్చిపోవడం వల్ల పొరబాటు జరిగింది . ఏం రాద్దాంతం చేస్తాడోనని భయపడుతూనే … సాయంత్రం వచ్చి దోసెలు, కోడి కూర చేసి ఇస్తానని సర్ది చెపుతూనే. ఏడూ నలబయ్యికల్లా వంట చేసి రెండు రకాల టిఫిన్ లు చేసి టేబుల్ పై పెట్టి స్నానానికి వెళుతూ ఆగీ “వేడి చల్లారి పోతున్నాయి పోయి తినండి ” చెప్పింది . మంచంపై పడుకుని ఉన్న అతను ఉన్నపళంగాలేచి ఆమె పొట్టలో కాలితో ఎగిరి తన్నాడు ఆ తన్నుడుకి వెళ్లి గుమ్మం వెలుపల పడింది. దారిన పోతున్న ఒకరిద్దరు ఆ విషయాన్ని గమనించారు కూడా ! నాకే గనుక నడిచే వీలుంటే వెళ్లి అతన్ని కుమ్మి పడేయాలన్నంత కసి రేగింది .   ఇలా జరిగేటివన్నీ చూస్తుండే ఆమె చిన్న కూతురు “నాన్నకి కోపం ఎక్కువ, కోపం వస్తే విచక్షణ ఉండదు, చూసి చూడనట్టు వదిలేయమ్మా” అంది. మరి అలాంటి మొగుడిపై ఆమెకి మాత్రం కోపం రావద్దూ .. అని విసుక్కున్నాను.

“పిల్లలకేం ? అలాగే అంటారు వాళ్ళకి కూడా పెళ్ళయి ఇలాంటి భర్త వస్తేనే కదా బాధంటే ఏమిటో తెలిసేది అని అనుకుని .. ఛీ ఛీ .. నే నెందుకిలా ఆలోచిస్తున్నాను .. నా బిడ్డలకే కాదు పగవాళ్ళ కి కూడా జన్మ జన్మలకి ఇలాంటి భర్త రాకూడదు” అనుకుంటూ కారే కన్నీటిని తుడుచుకుంది . .

ఎప్పుడూ అంతే ! అతనికి ఆమె ప్రవర్తనపై అనుమానం. ఆమె ప్రతి కదలికకి చూపుల కరవాలంతో ప్రహరా కాస్తూ ఉంటాడు అనుకున్నవన్నీ అప్పటికప్పుడు అమరకపోయినా పట్టరాని ఆగ్రహం వస్తుంది   అతని కాళ్ళు ఆమెని మట్టగిస్తాయి. గాయాలతోనే లేచి మట్టగించిన ఆ కాళ్ళనే పట్టుకుని బతిమలాడి వేడి వేడిగా వడ్డించాలి, అవసరం అతనిదైనా అతని నడుము పట్టుకోవాలి. ఆవేదనతో కంట్లో తడి ఆరక కంటిపై కునుకురాక రాత్రి తెల్లారిపోతుంది. జీవితం ఇలానే తెల్లారాలేమో… అనుకుంటూ యంత్రంలా పనిలోకి జొరబడి అన్ని అమర్చి పెట్టి ఎనిమిదిన్నరకల్లా ఆపీసుకి వెళుతుంది. ఆఫీసుకి వెళ్ళేటప్పుడుమాత్రం బస్టాండ్ వరకు మోటారుసైకిల్ పై దిగబెడతానని తయారవుతాడు.

ప్రక్కింటి వాళ్ళు చూస్తున్నట్లనిపిస్తేనూ,ఇంకా వీధిలో ఎవరైనా నడుస్తున్నా వాళ్ళ దృష్టినాకర్షించేలా “లంచ్ బాక్స్ తీసుకున్నావా!? పర్స్ మర్చిపోయావేమో చూసుకో! మొబైల్ తీసుకున్నావా? అంటూ శ్రద్దగా అడుగుతుంటాడు. చూసే వారందరికీ ” భర్తంటే అలా ఉండాలనుకునేటట్లు నటించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆ నటనకి జోహారులనాలి. తప్పదనుకుంటుంది   ఒకోసారి అతని ప్రేమ నిజమనుకోవాలో నటననుకోవాలో ఆమెకే అర్ధమవదు. నేను మాత్రం రెండూ నటనే అని తీర్మానించేసుకున్నాను కూడా ! “ఎందుకలా మొహం మాడ్చుకుని కూర్చుంటావు, చూడు బైక్ ల పై వెళ్ళే వాళ్ళందరూ సరదాగా ఎలా ఎంజాయ్ చేస్తూ వెళుతున్నారో! అభియోగం చేస్తూనే   “అయినా మొగుడితో చెప్పడానికి ఏం కబుర్లు ఉంటాయి అదే ప్రియుడితో మాటలైతే ఊటబావిలో నీళ్ళులా ఊరుతుంటాయికాని ” కత్తితో గుచ్చినట్లు మాటలు. ఆ మాటలకి ఆమె విల విల లాడిపోతుంటే చూసి ఆనందించే పైశాచికం. బస్ ఎక్కించి కదిలేటప్పుడు చెపుతుంటాడు “జాగ్రత్త ” అని. అందులో ఎన్నో హెచ్చరికలు .

నిజానికి అతనికి భార్యపై ప్రేమని అసల్నమ్మలేం, ఆమెని బస్ స్టాండ్ లో దిగబెడుతూనే   అనుమానంగా చుట్టూ గమనిస్తాడు. ఆమెకి పరిచయం ఉన్న వ్యక్తులు కానీ , స్నేహితులు కానీ ఎవరైనా ఆమెని పలకరిస్తే ఇక ఆరోజు సాయంత్రమింట్లో కన్నీటి కిటికీని తెరవాల్సిందే ! ఆ మాటల్లో నిగూఢమైన అర్ధాలేవో ఉన్నట్లు అపరాధ పరిశోదన మొదలెడతాడు.   ఇవన్నీ చూస్తున్న నాకు మాను మాకుని కానే కాను అని మనుషులు పాడిన పాట గుర్తుకొస్తుంది . ఈ మగువలకన్నా మాను లైనా ఎంతో హాయిగా ఉన్నాయనుకుంటాను . మహా అయితే   నీరందక ఎండిపోతాము ,ఏ తుఫాన్ గాలికో కొమ్మలు విరిగిపోతాయి, ఏ గొడ్డలి వేటుకో బలైపోతాం తప్ప అంత కన్నా ఏముంటాయి అనిపిస్తుంది.

ఆమె ఆఫీసుకి చేరే లోపే పది నిమిషాలకొకసారి ఫోన్ చేస్తాడు . క్షేమంగా చేరావా? పదింటికి మళ్ళీ ఇంకోసారి కాఫీ తాగావా? అంటూ.   ఒంటి గంటకి “తిన్నావా ?”   నాలుగున్నరకి ” బయలుదేరావా? ప్రక్కన ఎవరితో మాట్లాడుతున్నావ్ ? ఇంత ఆలస్యమైనదేమి ? నువ్వు టైం కి రాకపోతే నాకు ఒకటే టెన్షన్, నువ్వంటే ఎంతో ప్రేమ, నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా ?. అందుకే నా ఈ టెన్షన్, అర్ధం చేసుకో ! అంటూ ఆమెకి టెన్షన్ రుచి చూపిస్తాడు   ప్రక్క ఊరిలో టీచర్ గా పనిచేస్తున్న రమ చాలా సరదా మనిషి . జీవితంలో ఎప్పుడూ కష్టాలు కన్నీళ్లకే చోటుంటే ఏం బావుంటుంది. వాటిని భరించడానికి నవ్వనే టానిక్ ఒకటుందని మర్చిపోయావు. రా.. ఇలా నా ప్రక్క సీట్లో కూర్చో! అంటూ చొరవచేసి చేయి పట్టుకు కూర్చోబెట్టుకుని ఎన్నో కబుర్లు చెపుతూ , హాయిగా నవ్విస్తూ ఆమె ప్రయాణ సమయాన్ని ఆహ్లాదం చేస్తూ ఉంటుంది .ఒక రోజతను ఆమె రమతో మాట్లాడుతూ ఉండటం గమనించాడు .

” అదొట్టి బిచ్ . దానితో నీకు స్నేహం ఏమిటీ ? నువ్వు దానితో తిరిగితే నేను తలెత్తుకుని తిరగలేను . నా స్నేహితులు నిన్ను కూడా ఆ గాటనే కట్టేస్తారు ”   మనసులో ఉన్నదానిని సమాజానికి అంటగట్టే చాతుర్యం అతని సొత్తనుకుంటా! అతనిని చూస్తే నాకు భలే ఆశ్చర్యం.   ఇప్పుడామె కాస్త ఆలస్యంగా బయలుదేరి రమ టీచర్ ఎక్కే బస్ ని ఎక్కకుండా జాగ్రత్త పడుతుంది. ఇంకో రోజు దానితో స్నేహం వద్దన్నానా? నా మాటంటే లెక్క లేదే? నీ పని ఇలా కాదంటూ ఒకేసారి నోటికి, బెల్ట్ కి పని చెపుతాడు . చూస్తున్న నేను కన్నీళ్ళు కారుస్తుంటాను. మళ్ళీ అతనే గాయాలని కట్టు కడతాడు, రెండు వీధుల అవతలున్న ఆమె పెద్దమ్మని పిలుచుకు వస్తాడు. మీ అమ్మాయి చూడండి , ఎలాంటి స్నేహాలు చేస్తుందో ?   మీ అమ్మ చూడండి ఎలా వాదిస్తుందో ? అని లేనిపోనివి నూరిపోస్తూ పెద్దమ్మ, పిల్లల దగ్గర దొంగ ఏడుపులు ఏడుస్తూనే వంకరగా ఆమె వైపు చూస్తూ నవ్వుతాడు .

ఆమె జీతమంతా తను తీసుకుని చిల్లర పైసలు విసిరేస్తాడు సాహిత్య సభల నిర్వహణకి , సంకలనాల అచ్చులకి అన్నింటికీ డబ్బు ఇవ్వాలి. ఇటీవలే క్రొత్తగా కట్టిన ఇంటి కోసం అయిన అప్పులు ,పిల్లల చదువుల కయ్యే ఖర్చులు ఇవ్వన్నీ అతనికి పట్టవు ప్రభుత్వ ఉద్యోగయిన అతను ఎందుకో సేలపు పెట్టి ఇంట్లో కూర్చుండటం వల్ల ఇల్లు నిత్య రణరంగంగా మారిపోయింది. ఎప్పుడూ లేంది ఆమె నన్ను కూడా పట్టించుకోవడం మానేస్తుంది. ఆమె పని చేసే ఆఫీస్ పల్లెలో ఉంటుంది. ఆమె, ఇంకో ఇద్దరు స్టాప్. ఆమెకి   సెలవు కావాలంటే రెండు రోజులు ముందు హెడ్డాపీస్ వారికి చెప్పి అనుమతి పొందాలి. హెడ్ ఆఫీస్ నుండి ఇంకొకరు వచ్చి రిలీవ్ చేస్తే తప్ప ఆమెకి సెలవు దొరకని ఉద్యోగం . కొత్త ప్రభుత్వాల హామీలతో పెన్షన్ దారుల వివరాలు కంప్యూటర్ లో పొందు పరిచే పనిలో నాలుగు రోజులు నుండి ఆమెకి ఒకటే పని ఒత్తిడి . మొన్న   ఆఫీసులో వర్క్ లోడ్ ఉండి రాత్రి ఎనిమిదిన్నర వరకు పని చేయాల్సి వచ్చింది .

సాయంత్రం నుండి అతను ఒకటే పోన్లు రాత్రి తినడానికి నువ్వు వచ్చి వంట చేస్తే కాని కుదరదని ఆజ్ఞలు , నిన్నా అంతే ! పగలల్లా ఆఫీస్ లో పని చేసి ఆమె ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసి నడుం వాలుద్దామనుకుంటే చెప్పా పెట్టకుండా నలుగురి స్నేహితులని వెంటబెట్టుకుని నాన్ వెజ్ తీసుకుని వచ్చి బిర్యానీ చేయమని పురమాయింపు . అసలే పిరీయడ్స్ టైం . నడుం పీక్కూ పోతుంది. అయినా చేయక తప్పలేదు.. అతనికి స్నేహితులు సరదాలు, పార్టీలు వేటీకి లోటుండకూడదు. పాపం ! ఆమె నిన్నటి పని అలసటతోనే ప్రతి రోజు పని మొదలెట్టాలి . సూర్యుడిలా అలసిపోకుండా ఉద్యోగినికి ఏమైనా ప్రత్యేకత ఉంటే బావుండుననుకుంటాను. అతనీరోజు సాయంత్రం నాలుగున్నరకే   సతాయింపు మొదలు పెట్టాడు   ఈ రోజూ కూడా ఆలస్యంగా వస్తున్నావా? నాకు ఆకలవుతుంది అని. అప్పగించిన పని పూర్తీ కాలేదన్న సంగతి చెప్పి   “మీరు ఈ రోజుకి ఎలాగో సర్దుకోండి . బయట నుండి తెచ్చుకుని తినేయండి” అని చెప్పింది .

ఆమెనే చూస్తున్న అసిస్టెంట్ కి “మా వారికి రెండు పూటలా వేడి వేడిగా చేసి వడ్డించాలి, ప్రొద్దున చేసినవి రాత్రికి తిననే తినడు. బయట తినడం తన వల్లకాదంటాడు. అలా అని ఇలాంటి అత్యవసర సమయాలలో కూడా మా అత్తగారు చిన్న సాయమన్నా చేయదు ” తన అసిస్టెంట్ తో చెప్పింది విసుగ్గా . ఆమెకి ఆ మాత్రం కోపం రావడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఈ మనుషులకి ఏమిటో ఈ గొప్ప ? . నాలాగా అతనుకూడా పరమ సోమరిపోతు. ఆమె వండి వార్చి వడ్డిస్తే తప్ప నోటికి పని చెప్పనని కోతలు కోస్తాడు. ఆకలవుతుంటే దానిని తీర్చుకునే వేరే మార్గమే లేదా !? ఒంక కాకపొతేనూ మరీ !   .

ఆమె ఆఫీసులో పని ముగించుకుని బయటకోచ్చేసరికి   రాత్రి ఎనిమిదిన్నర అయ్యింది బయట జన సంచారమే లేదు . అంతలో కరంట్ పోయింది బస్ స్టాప్ లో ఉన్న మెడికల్ షాప్ ప్రక్కన నిలబడింది. ఆ షాప్ ముందుకి వెళ్లి వెలుగులో నిలబడి ఉండటం కూడా ఆమెకి ఇబ్బందే ! ఆ షాప్ ఓనర్ చూపులు త్రేళ్ళుజెర్రులు ప్రాకినట్లు ఉంటాయి.ఉద్యోగం చేసే ఆడవాళ్లంటే చిన్న చూపు   మా ఇళ్ళల్లో ఆడాళ్ళు మగ తోడు లేకుండా కూరగాయల మార్కెట్ కి కూడా వెళ్ళరు అంటూనే కనబడిన ప్రతి ఆడమనిషిని ఒంకర చూపులు చూస్తాడు. బస్ కోసం వెయిట్ చేస్తూనే పదే పదే సమయం చూసుకుంటుంది . సెల్పోన్ లో చార్జింగ్ కూడా అయిపోవస్తుంది ఇరవై నిమిషాలు గడచిపోయాయి. అంతలో తెలిసినతను అటుగా వచ్చాడు” ఏం మేడమ్ ! ఇంతాలస్యమయింది ? ” అంటూ పలకరించాడు. సమాధానం చెపుతూండగానే.. అతను కాల్ చేసాడు. బస్ కోసం వెయిటింగ్ అని చెప్పింది మళ్ళీ బస్ వస్తున్నప్పుడు కాల్ చేస్తే “బస్ వస్తుందండీ” అని చెప్పి కట్ చేసి క్రింద పెట్టి ఉంచిన సంచీ తీసుకోవడానికి ఒంగింది . స్టాప్ లో ఎవరు లే.రనుకుని ఆ బస్ ఆపకుండా దూసుకు వెళ్ళిపోయింది. “అయ్యో ! మీరున్నది గమనించకుండానే బస్ లాగించేసాడు ఇక ఇప్పుడేమి బస్ లు కూడా రావు మేడం .. నేను డ్రాప్ చేస్తాను రండి” అని బండి వైపు దారి తీసాడు పరిచయస్తుడు.

ఇంటి దాక వచ్చి దిగబెట్టనవసరం లేదు .. వెళుతున్న ఆ బస్ ని అందిస్తే చాలని ఒకింత భయపడుతూనే అతని బండి ఎక్కి కూర్చుంది . అతను బైక్ ని ఎంత స్పీడుగా నడిపినా రాత్రి సమయం కావడం వల్ల బస్ ఎక్కేవాళ్ళు తక్కువ ఉండటం వల్ల ఆ బస్ మధ్యలో ఎక్కడా ఆపకుండానే సిటీలోకి ప్రవేశించింది . “ఇక ఇక్కడిదాకా వచ్చేసాం కదా మేడం ..ఇల్లు దగ్గరే కదా! ఇంటి దగ్గర దింపుతాను పదండి” అని. ఇంటి దగ్గర డ్రాప్ చేసాడు, ఆమె ఇంటికి వెళ్ళే లోపే ఆమె బస్ స్టాప్ లో ఎవరెవరితో మాట్లాడిందో ఎవరి బండి ఎక్కి వచ్చిందోనన్న సమాచారమంతా మెడికల్ షాపతనికి కాల్ చేసి తెలుసుకున్నతను   వీధి గేట్ దగ్గరే నిలబడి సెగలుగక్కుతూ ఉన్నాడు . ఇంటిదాకా వచ్చిన పరిచయస్తుడిని మర్యాద కోసం టీ త్రాగి పోదువుగాని రమ్మని లోపలి పిలిచింది . అతను వచ్చి కూర్చున్నాడు ప్రిజ్ద్ లో పాలు కూడా లేవు బయటకి వెళ్లి తెమ్మని అడిగితే ఏం విరుచుకుపడతాడోననుకుని   గ్రీన్ టీ చేసి ఇచ్చింది .

ఆతను వెళ్ళగానే ఆమె అమ్మని అమ్మమ్మని ఏడుతరాల ముందు వాళ్ళని కూడా వదలకుండా తిట్టడం ఆరంభించాడు ఆమె అవన్నీ మౌనంగానే వింటూ స్నానానికి వెళ్ళింది   ఈ లోపు బయటకి పోయి బిర్యానీ పొట్లం పట్టుకుని వచ్చి తింటూ కూర్చున్నాడు . ముద్ద ముద్దకి ఆమెని అసహ్యంగా తిడుతూ తింటే కానీ అతనికి ఆకలి తీరలేదు. చేయి కడుక్కునివచ్చాక ” ఏమండీ అంత కోపంగా ఉన్నారు ? ఏమిటీ విషయం ? ఏమైనా ఉంటే శాంతంగా మాట్లాడుకుందాం రండి ” అంది పిచ్చితల్లి . గది తలుపులు మూసేసి ” ఏం మాట్లాడతావే నువ్వు ? నేను ఫోన్ చేసినప్పుడు ఎందుకు తీయలేదు నువ్వు ” ఆ ఇరవయ్యి నిమిషాల టైం లో ఎవడితో పడుకున్నావ్ చెప్పు ? ఆ విలేఖరి గాడి తోనేనా? అంటూ బెల్ట్ తీసి వంద దెబ్బలకి తక్కువ గాకుండా కొట్టాడు. వెనక్కి తోసి పదే పదే కడుపులో కుమ్మాడు. బెల్ట్ బకిల్ తీసుకుని నుదురు పై గుచ్ఛాడు తలని మంచం కోడుకి వేసి బాదాడు.. కురులలో చిక్కుని ఉన్న నేను చిక్కని రక్తంతో తడిచి ఎర్రబడిపోయాను   దెబ్బల శబ్దానికి ప్రక్క గదిలో ఉన్న చిన్నమ్మాయి, అత్తగారు వచ్చారు .

అమ్మాయి వాళ్ళ నాన్నని బయటకి తోసి ఆమెని మంచం పై కూర్చోబెట్టి రక్తం తుడుస్తుంటే . కొడుకుని మందలించడం కూడా చేయని అత్తగారు గదంతా చిక్కగా చిమ్మిన రక్తపు మరకలని శుభ్రం చేయడం మొదలెట్టింది. ఇలా కొట్టడం ఇది మొదటి సారి కాదు ఆఖరిసారి అవదనికూడా ఆమెకి తెలుసు. తలకి తగిలిన గాయానికి కట్టు కడుతూ రక్తంతో తడిచిన నన్ను తీసి కిటికీ బయటకి విసిరేసింది ఆ పిల్ల . నేను వచ్చి చెట్టు అమ్మ ఒడిని చేరాను . “చూసావా అమ్మా ! మనకన్నా సుకుమారమైన మనసున్న ఆమె బాధలు ఎలా ఉన్నాయో ! ” అని ఏడ్చాను. “ఊరుకో తల్లీ ! ఈ లోకంలో చాలామంది మగువుల స్థితి ఇలాగే ఉంటుంది. లెక్కలేనటువంటి పువ్వులని నలిపెసినట్లే ఆడవాళ్ళ జీవితాలని నలిపేయడం ఈ మనుష్యలోకంలో సర్వసాధారణం” అని ఓదార్చింది   ఆమె కూతురు ఆమె ప్రక్కనే పడుకుని ఓదార్చుతూనే ఉంది . ఆమె రాత్రంతా తల్లిని, తండ్రిని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. ఆమెని చూస్తున్న నేనూ,నా అమ్మ కూడా ఏడుస్తూనే ఉన్నాము

ఉదయాన్నే తలకి కట్టిన కట్టు కనబడకుండా దానిపై మఫ్లర్ చుట్టుకుని బయటకి వచ్చింది . రాత్రి అన్ని దెబ్బలు తిన్నా ఈ రోజు డ్యూటీకి హాజరవక తప్పటం లేదు. రోజూ లాగా నాదగ్గరికి వచ్చి నన్ను తుంచనూలేదు కురుల ముడవనూ లేదు . ఆమెని బస్ స్టాండ్ దగ్గర దించడానికి అతను బైక్ తీసి నుంచున్నాడు. ఆమె నావైపుకి రాకుండా అటువైపుకి వెళ్ళడం గమనించి “పువ్వు పెట్టుకోవడం మర్చిపోయావ్ !” అని గుర్తు చేసాడు. ఆమె “వద్దులెండి ” అంది . చెప్పొద్దూ … నాకు చాలా దిగులేసింది బాధలో ఉన్న ఆమెకి నేను సమీపంగా లేనందుకు , ఇంకా ఎంతో ఇష్టమైన నా పైన కూడా ఆమెకి విరక్తి కల్గినందుకు. అతను వడి వడిగా నా సమీపానికి వచ్చి నన్ను త్రుంచాడు.

మొదటిసారిగా అతని స్పర్శ చవిచూసాను “అబ్బ ఎంత మొరటుదనం ? ” అనుకున్నాను . ఆమెకి నన్నివ్వగానే మౌనంగా అందుకుని ఓ.. మారు నా వాసనని ఆఘ్రాణించి చిన్నగా పెదవులతో ముద్దాడింది. బాధ నిండిన ఆమె మోహంలో చిన్న నవ్వు విరబూసింది. మెల్లగా తలలో తురుముకుంది. ఆ మాత్రం సామీప్యతకే నేను మురిసిపోయాను. ఆఫీసుకి చేరుకొని కుర్చీలో కూర్చుని రాత్రి జరిగినదానిని గుర్తుచేసుకుని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. ఓదార్చడానికి ఎవరు లేని ఆ ఆఫీసు గదిలో ఆమె రోదన అరణ్య రోదనే అయింది   . భుజంపై తట్టి స్పర్శతో నేనున్నాను అనే భరోసా కల్గించడానికి నేనొక మనిషిని కాలేనందుకు మొదటిసారిగా దేవుడ్నితిట్టుకున్నాను. ఆమె బాధల్లో సహానుభూతి చెందడం తప్ప నాకేం చేతనవును ? అయినా ఏదో చేయాలని ఆవేశం , ఆక్రోశం అతన్ని శిక్షించి తీరాలనే కోపం ముప్పేటలా నన్ను చుట్టేసాయి అయినా కురులు దాటి బయటకి రాని స్థితిలో ఉన్నాను కదా !

మధ్యాహ్నం దాకా పని చేసుకుంటూనే ఏడుస్తూ ఉంది . తర్వాత ఏదో నిర్ణయం తీసుకున్నదానిలా కళ్ళు తుడుచుకుని పైకి లేచింది .బేగ్ తగిలించుకుని రోడ్డుపైకి వచ్చి నిలబడింది.

మెడికల్ షాపతను మిట్టమధ్యాహ్నం తలకి మఫ్లర్ చుట్టుకున్న ఆమెవంక విచిత్రంగా చూస్తున్నాడు . ఆమె మఫ్లర్ని తీసి నడిరోడ్డుపై విసిరి పడేసింది . ఎప్పుడో ఒకసారి వచ్చే బస్ కోసం ఎదురు చూడకుండా .. ఆటో ని పిలిచింది ఎక్కి కూర్చుని పోలీస్ స్టేషన్ కి పోనీయ్ ! అంది .

నాకు భలే ఆశ్చర్యంగా ఉంది . ఆటో దిగి సరాసరి ఎస్సై ముందు నిలబడింది . ఎస్సై ఆమెని గుర్తించి “మీరు ఫలానా రచయిత గారి భార్య కదా ! ఏమైంది మేడం ! ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా ? చేసినవాడి గురించి చెప్పండి .. ముందు మక్కెలిరగ కొట్టి కేసు పెట్టి కోర్ట్ కి లాగుదాం. నష్టపరిహారం అడుగుదాం ” అంటూ అలవాటైన శైలి ప్రదర్శించాడు.

ముందు పెన్, పేపర్ ఇవ్వండి . నేను కంప్లైంట్ వ్రాసి ఇవ్వాలి కదా ! అంది . ఈ లోపు సార్ కి ఫోన్ చేయమంటారా ? అంటూనే అతనికి రింగ్ చేయడం మొదలెట్టాడు . మీరు ఆయనకీ కాల్ చేయకండి. నేను కంప్లైంట్ చేస్తున్నదే అతని మీద శారీరక హింస, మానసిక హింసకి గురి చేస్తున్నాడని . ఈ సాక్ష్యం చూడండి అంటూ తగిలిన గాయాన్ని చూపింది. మీరిప్పుడు గృహ హింస యాక్ట్ పై కేసు నమోదు చేసి ఎఫ్ ఐ ఆర్ నకలు ఇవ్వాలి” అంది. అతని క్రూరత్వం గురించి లోకానికి చెప్పడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లిందని…   ఇన్నేళ్ళకైనా ఆమె సహనానికి తెరపడినందుకు నాకు చాలా ఆనందమనిపించింది. ఎస్సై చేతిలో పెన్ జారి క్రింద పడింది. ఆమె ఆ పెన్ ని అందుకోవడానికి క్రిందకి ఒంగింది. జడ ముందుకు జారింది . కురులమధ్య ఇరుక్కుని ఉన్న నేను పెనుగులాడి స్వేచ్చగా బయటకొచ్చి ఆమె పాదాల మీద పడి ఇష్టంగా ముద్దాడాను.   ఇన్నాళ్ళూ ఆమె సుతి మెత్తని భావాలని, బాధమయమైన గాధలన్నింటినీ అక్షర రూపం చేసుకుంటే వాటన్నింటిని తన రచనలుగా చెప్పుకుని రచయితగా పేరు సంపాదించుకున్నతని గురించి, ఆమె గురించి అంటే ఆ రచయిత గారి భార్య కథని చెప్పానని మీరు మనఃస్పూర్తిగా నమ్మితే చాలు.   ఇన్నేళ్ళూ కన్నబిడ్డలా సాకుతున్నందుకు కృతజ్ఞతతో నా తల్లి జన్మ, రోజూ దేవుని పాదాల వద్దకి కి చేర్చినందుకు నా జన్మ కూడా సార్ధకమైనట్లే ! ” అని కథ ముగించింది పువ్వు .

నేను పనిచేసే పత్రిక కోసం ఓ రచయిత ఇంటర్వ్యూ తీసుకుందామని ఆ వూరు వచ్చి ఆ రచయిత అడ్రెస్స్ వెతుక్కుంటుంటే ఆడబోయిన తీర్ధం ఎదురయినట్లు రచయిత భార్య కథ తెలిసాక ఇక అతని ఇంటర్వ్యూ తో పనేంటి ? అనుకుంటూ వెనక్కి తిరిగాను. తానూ చెప్పిన కథ విన్నందుకేమో చెట్టు కృతజ్ఞతగా తన పువ్వులని నాపై రాల్చింది. కథ లాంటి వాస్తవాన్ని నేను నమ్మినందుకు ఓ ..పువ్వు నా హృదయానికి దగ్గరగా ఇష్టంగా.. చొక్కా గుండీ కి చిక్కుకుంది.

-వనజ తాతినేని

10606228_828842293846066_6014391426527802181_n

గుర్రపుకళ్ళెం

chinnakatha 

అనగనగా ఒక ఊళ్ళో ఒక మనిషి. అతనికొక బండి, బండికొక గుర్రం, గుర్రానికొక కళ్ళెం ఉన్నాయి.

మనిషి పొద్దస్తమానం బండికి గుర్రాన్ని కట్టి, బండిలో జనాన్ని, వస్తువుల్ని ఎక్కించుకుని ఒకచోటినించి మరోచోటికి చేరవేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నాడు. సంపాదించిన డబ్బు దాచుకుంటున్నాడు. కానీ గుర్రానికిమాత్రం సరిగా తిండి పెట్టట్లేదు. బలమైన ఆహారం లేక, చాకిరి ఎక్కువై గుర్రం వేగంగా పరుగెత్తలేక పోతోంది. దాంతో కొరడా దెబ్బలు ఎక్కువయ్యాయి. దానికితోడు నోట్లో కళ్ళె మొకటి, ఇబ్బందిగా. గుర్రానికి జీవితం అస్సలు నచ్చలేదు.

ఒకరోజు గుర్రం అతన్ని అడిగిందిబండబ్బాయ్! బండబ్బాయ్! నన్ను ఉపయోగించుకుని నువ్వు ఇంత డబ్బు సంపాదిస్తున్నావే! నాకు కడుపు నిండా తిండి పెట్టరాదా?” అని.

అప్పుడు అతను! ఎన్ని డబ్బులు వచ్చినా నాకు, నా కుటుంబానికి తిండి ఖర్చులకే చాలట్లేదు. ఉన్నదాంట్లోనే నీకూ ఏదో కాస్త పెడుతున్నాను. సరిపెట్టుకోఅన్నాడు.

రోజంతా గుర్రం పరుగెత్తుతూ, పరుగెత్తుతూ ఆలోచించింది, ఆలోచించింది. చాకిరి తప్పించుకుని, సుఖంగా జీవించే మార్గం అన్వేషించింది. చీకటి పడే వేళకి గుర్రం బండిని తిరగేసి, కట్లు తెంచుకుని పారిపోయింది.

బండి లాగే బాధ తప్పించుకున్నాను. ఏదో ఒక ఉపాయంతో కళ్ళేన్ని కూడా వదుల్చుకో గలిగితే నేను చాలాసతోషంగా జీవించ గలుగుతానుఅనుకుంటూ గుర్రం పరుగెత్తుతోంది. అట్లా వెళ్ళివెళ్ళి, తెల్లవారేటప్పటికి అడవికి చేరింది.

అడవిలో జంతువులన్నీ ఒకచోట విచారంగా కూర్చుని ఉన్నాయి. గుర్రాన్ని చూడగానేఎవరు నువ్వు? ఇక్కడి కెందుకు వచ్చావు? ఎక్కడినించి వచ్చావు? నీ నోట్లో అదేంటి? నోట్లో అది పెట్టుకుని గడ్డి ఎట్లా మేస్తావు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాయి.

నేను పట్నంలో బండి లాగే గుర్రాన్ని. మనుషులు పెట్టే హింస భరించలేక పారిపోయి వచ్చాను. నా నోట్లో ఉన్న దీన్ని కళ్ళెం అంటారు. ఇది ఉన్నా గడ్డిమెయ్యడానికి నాకేం ఇబ్బంది ఉండదు. కానీ దీన్ని పెట్టుకోవడం నా కిష్టం లేదు. ఎట్లాగైనా దీన్ని వదుల్చుకోవాలిఅని జంతువుల ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పి గుర్రంమీరంతా అందమైన అడవిలో స్వేచ్చగా తిరుగుతూ ఆనందంగా ఉంటారనుకున్నాను. పొద్దున్నే ఇట్లా కూర్చున్నారేంటి?” అని అడిగింది.

అడవికి రాజు ఒక సింహం. రోజుకొక జంతువు దానికి ఆహారంగా వెళ్ళాలి. అట్లా వెళ్ళడం మా కెవరికీ ఇష్టం లేదు. ఎవరికిమాత్రం చచ్చిపోవడం ఇష్టంగా ఉంటుంది? కానీ ఎదురుతిరిగితే విచక్షణ లేకుండా అందరినీ చంపేస్తుందన్న భయంతో అది చెప్పినట్లే నడుచుకుంటున్నాం. సింహం బాధ తప్పించుకునే ఉపాయం ఆలోచిస్తూ ఇట్లా కూర్చున్నాంఅని చెప్పాయి జంతువులన్నీ ఏడుపు గొంతుతో.

ఇంతలో సింహం అక్కడికి వచ్చిఏమే కుందేలూ! ఎండబడిపోతుంటే ఇక్కడేం చేస్తున్నావు? నాకు ఆకలి దంచేస్తోంది. పూర్వం మా ముత్తాతని బావిలో పడేసినట్లు నన్నూ మట్టుబెట్టాలని చూస్తున్నావా?” అని గర్జించింది.

కాదు మహారాజా! అడవిలోకి కొత్త నేస్తం వస్తే మాట్లాడుతున్నాం. దీనికి మన అడవిలో ఆశ్రయం కావాలటఅంటూ గుర్రాన్ని చూపించింది కుందేలు. అంతటితో ఊరుకోకుండాచూశారా మహారాజా! అడవిలోని మిగతా జంతువుల్లా కాకుండా కొత్త జంతువుకు నోట్లో ఏదో ఆభరణం ఉంది. ‘రాజు మీరైతే ఆభరణం వేరే జంతువు పెట్టుకోవడమేంటి?’ అనిపించినువ్వు అడవిలో ఉండాలంటే ఆభరణం తీసి మా రాజుగారికి బహుమతిగా ఇవ్వాలని సంప్రదింపులు జరుపుతున్నాంఅంది.

సంప్రదింపులు జరిపేదేంటి? ఆభరణం నాకే చెందాలి. తక్షణం దాన్ని గుర్రం నోటినించి తొలగించి నాకు తగిలించండిఅని ఆజ్ఞాపించింది మృగరాజు.

గుర్రం సూచనల ననుసరించి జంతువులన్నీ కలిసి గుర్రం నుంచి కళ్ళేన్ని విడదీసి సింహం నోటికి తగిలించాయి.

నేను ఆభరణం అలంకరించుకున్న శుభసందర్భంగా ఇవాళ్టికి నిన్ను వదిలేస్తున్నాను. రేపు తెల్లవారే టప్పటికి నా గుహ ముందుండాలిఅని కుందేలుకి చెప్పి వెళ్ళిపోయింది సింహం.

అమ్మయ్య!” అనుకున్నాయి గుర్రము, కుందేలు ఒకేసారి.

ఆకలి మాట మర్చిపోయి కొత్త ఆభరణాన్ని అలంకరించుకున్న సంతోషంతో అడవంతా సందడి చేస్తూ తిరిగింది సింహం రోజంతా. మర్నాడు తెల్లవారేటప్పటికి సింహానికి ఆకలి నకనకలాడడం మొదలుపెట్టింది. కుందేలు వస్తుందేమోనని ఎదురు చూసిచూసి సింహమే వేటకు బయలుదేరింది.

నిన్న కుందేలుని తినకుండా వదిలేశానని ఇంక నాకు ఆహారంగా ఎవరూ రావక్కర్లేదు అనుకుంటున్నారా? పిచ్చివేషాలు వేశారంటే అందర్నీ ఒకేసారి చంపిపారేస్తానుఅని అరిచింది ఒకచోట చేరిన జంతువుల్ని చూసి.

జంతువులు వినయంగా చేతులు కట్టుకునిమహారాజా! మీరు కొత్త ఆభరణం ధరించి మరింత హుందాగా, ఉన్నతంగా కనిపిస్తున్నారు. మీకు ఆహారమయ్యే అర్హత మాకు ఉందో లేదో అని సందేహిస్తున్నాముఅన్నాయి.

అప్పుడు సింహం నోరు తడుముకుంది. ‘నోట్లో ఇది ఉంచుకుని తినడమెట్లాఅని ఆలోచించింది.

ముందు దీన్ని తొలగించండి. నా భోజనం అయ్యాక మళ్ళీ ధరిస్తానుఅంది.

అది మాటిమాటికి తీసి పెట్టుకునే ఆభరణం కాదు మహారాజా! ఒకసారి తీస్తే మళ్ళీ పెట్టడం కుదరకపోవచ్చు. మీరు మృగరాజు, అడవికి మహారాజు. ఒకసారి ఆభరణం ధరించి తీసెయ్యడం మీ హోదాకి తగదుఅంది గుర్రం.

మరి నేను ఆహారం తీసుకునే దెట్లా?” ప్రశ్నించింది సింహం.

తమ శరీరం కొత్త ఆభరణానికి ఇంకా పూర్తిగా అలవాటు పడకపోవడంవల్ల ఇబ్బందిగా ఉంది. రేపటికి అంతా సర్దుకుంటుంది. కాస్త ఓపిక పట్టండిఅన్నాయి జంతువులన్నీ ముక్తకంఠంతో.

మనసులో భయాన్ని బయటికి కనిపించనివ్వకుండా బింకంగా కాసేపు అటూఇటూ తిరిగి , ఇంక తిరిగే ఓపిక లేక గుహలోకెళ్ళి పడుకుంది సింహం.

ఆకలివల్ల రాత్రంతా నిద్ర పట్టలేదు సింహానికి. ‘రెండురోజులుగా ఆహారంలేక చాలా నీరసంగా ఉంది. మూడురోజులవార మూడు జంతువుల్ని చంపి తినాలిఅనుకుంటూ అడవిలోకి బయలుదేరింది పొద్దున్నే. కనుచూపు మేరలోనే జంతువులన్నీ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. పట్టుకోబోతే అందట్లేదు. వాటి వెంటపడి అలసిపోయిన సింహం ఏమీ చెయ్యలేక గుహలోకెళ్ళి నిరాహారంగా అలా పడుకుండిపోయింది.

ఇంతలో బండివాడు గుర్రాన్ని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చాడు. గుర్రాన్ని చూసిఎందుకిట్లా పారిపోయి అడవికి వచ్చావు? ఇంటికెళ్దాం రాఅన్నాడు.

నేను రాను. నా కిక్కడే బాగుందిఅంది గుర్రం.

ఎంతో కాలంగా మనం కలిసి ఉంటున్నాం. నా కుటుంబాన్ని పోషించేది నువ్వే. నువ్వు లేకపోతే మేమంతా ఆకలికి తట్టుకోలేక చచ్చిపోతాం.”

నీ దగ్గర నాకు తిండి చాలట్లేదు. అరకొర తిండితో నీకు కావలసినంత చాకిరి నేను చెయ్యలేను.”

ఇకమీదట అటువంటి పొరపాటు జరగనివ్వను. నీ తరువాతే నా కెవరైనా. ముందు నీ కడుపు నిండాకే మా పొట్టల సంగతి చూసుకుంటాము.”

నా కళ్ళెం అడవికి రాజైన సింహం తీసుకుంది. వెళ్ళి తీసుకురా.”

ఇంకా అందమైన కొత్త కళ్ళెం కొంటానుగదా నీకు.”

ఊళ్ళో మనుషులమధ్య జీవితం నాకు నచ్చలేదు.”

ఊళ్ళో మిగిలిన జంతువులు యజమానులపట్ల విధేయతతో మెలుగుతుంటే నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు?”

వాటి గోల నా కనవసరం. నేను నా మిత్రులందరిని వదిలి నీతో రాను.”

బండివాడు కోపంగా చెర్నాకోలా జంతువులవైపు విసిరాడు. జంతువులన్నీ భయపడి చెల్లాచెదురై పోయాయి. బండివాడు బలవంతంగా గుర్రాన్ని తోలుకుని వెళ్ళిపోయాడు.

మరుసటిరోజు మళ్ళీ సింహం ఆహారంకోసం అడవిలోకి వచ్చింది. జంతువులు పారిపోకుండా సింహం ఎదురుగా ధైర్యంగా తిరుగుతున్నాయి. ఉడుతలు, ఎలుకల్లాంటి ఆకతాయిలు సింహం నోట్లోని కళ్ళెంనుంచి కిందకి వేళ్ళాడుతున్న పగ్గాల్ని పట్టుకుని లాగి సింహాన్ని ఆటపట్టించడం మొదలుపెట్టాయి. మిగతా జంతువులన్నీ వినోదం చూసి ఆనందిస్తున్నాయి.

రేయ్! వచ్చి ఆభణాన్ని తొలగించండిరాఅంటూ గర్జించాననుకుని మూలిగింది సింహం.

గుర్రం సహాయం లేకుండా మేం దాన్ని తియ్యలేం మహారాజా!” అన్నాయి జంతువులు.

ఏదీ, ఎక్కడ గుర్రంఅంటూ మళ్ళీ మూలిగింది సింహం.

బండివాడు వచ్చి ఊళ్ళోకి తీసుకెళ్ళిపోయాడు ప్రభూ!” సమాధాన మిచ్చాయి జంతువులు.

సింహం గుర్రాన్ని వెతుక్కుంటూ ఊళ్ళో కొచ్చింది.

రోడ్డుమీద సంచరిస్తున్న గుర్రాన్ని చూసి జనం భయంతో ఇళ్ళలోకి దూరి తలుపులేసుకున్నారు. గబగబా జూ అధికార్లకు ఫోన్లు చేసారు.

చుట్టూ మెష్ తో పంజరంలా ఉన్న వ్యాన్ లో జూ అధికారులు వచ్చారు. మత్తు ఇంజెక్షన్ ని బాణానికి కట్టి అరఫర్లాంగు దూరంనుంచి సింహంమీదికి వదిలారు. సింహం నెమ్మదిగా మత్తులోకి జారింది.

జనం ఇళ్ళలోంచి బయటికి వచ్చారు. నోట్లో కళ్ళెం కలిగిఉన్న సింహాన్ని చూడడానికి ఎగబడ్డారు. వాళ్ళని అదుపు చెయ్యలేక పోలీసులు బాష్పవాయుగోళాల్ని ప్రయోగించారు. జనాన్ని పక్కకి నెట్టి సింహాన్ని బోనులో కెక్కించి జూకి తరలించారు.

వివిధ టీవీ ఛానెళ్ళవాళ్ళు, నోట్లో కళ్ళెంతో ఊళ్ళోకొచ్చిన సింహాన్ని అందరికంటే ముందు తమ ఛానెల్లోనే చూపించాలన్న ఆరాటంతో జూమీదికి దండయాత్రకి వచ్చారు. పోలీసులు వాళ్ళని జూలోపలికి రాకుండా లాఠీలతో నెట్టేస్తూ, అవసరమైతే ఒక దెబ్బ వేస్తూ శాంతిభద్రతల్ని పరిరక్షిస్తున్నారు. ‘పోలీసుల జులుం నశించాలిఅన్న నినాదాలమధ్య జూ అధికారులు నిపుణుల్ని పిలిపించి సింహం నోటినుండి కళ్ళేన్ని విజయవంతంగా విడదీసి మ్యూజియంకు పంపించారు.

జూలోనోట్లో కళ్ళెంతో నగరంలోకి వచ్చిన సింహంగా మృగరాజుకు విశేషమైన ఖ్యాతి లభించింది. దేశవిదేశాలనుంచి యాత్రికులు తండోపతండాలుగా సింహాన్ని చూడడానికి వస్తున్నారు.

అంతరించిపోతున్న జంతుజాతుల్ని పరిరక్షించడం మన కర్తవ్యంఅన్న నినాదంతో జూ అధికారులు అడవిలోంచి రోజుకో జంతువును పట్టుకొచ్చి ఆహారంగా సమర్పించుకుంటూ సింహాన్ని అపురూపంగా చూసుకుంటున్నారు. ఏమాత్రం ఒళ్ళలవకుండా కడుపునిండా తిండి తింటూ, బోరు కొట్టినప్పుడు సరదాగా గర్జించి జనాన్ని భయపెడుతూ సింహం అనతికాలంలోనే దిట్టంగా తయారయ్యింది.

మ్యూజియంలో ధగధగ మెరిసే ఇత్తడి పళ్ళెంలో మఖమల్ గుడ్డ పరిచి సింహం నోట్లో దొరికిన గుర్రపుకళ్ళేన్ని ప్రదర్శనకు ఉంచారు. రోజూ దుమ్ము దులుపుతూ, వారానికోసారి షాంపూతో తలంటు పోస్తూ మ్యూజియం అధికారులు దాన్ని కాపాడుతున్నారు. రోజురోజుకూ కొత్త అందాల్ని సంతరించుకుంటూ విశేషంగా సందర్శకులని ఆకర్షిస్తోంది సింహం నోట్లో దొరికిన గుర్రపుకళ్ళెం.

నోటికి కొత్త కళ్ళేన్ని తగిలించుకుని, చాలీచాలని ఆహారంతో, చర్నాకోలా దెబ్బలు తింటూ, నోట్లో కళ్ళెంతో నగరంలోకి వచ్చిన సింహాన్ని, దాని నోటిలో దొరికిన కళ్ళేన్ని చూడడానికి వచ్చే జనాన్ని అటూఇటూ చేరవేస్తూ భారంగా బతుకీడుస్తోంది బండివాడి గుర్రం.

-పాలపర్తి జ్యోతిష్మతి

 

దమయంతి ఆడిన ‘మైండ్ గేమ్’

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నలదమయంతుల కథ ఇదీ…

దమయంతి గురించి నలుడూ, నలుడి గురించి దమయంతీ విన్నారు. ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. ఓ రోజు దమయంతి గురించే తలపోస్తూ నలుడు ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. అంతలో ఒక హంసల గుంపు ఎగురుతూ వచ్చి అతని ముందు వాలింది. వాటిలో ఒక హంసను అతను పట్టుకున్నాడు. ‘నన్ను విడిచిపెడితే నీ గుణగణాలను దమయంతికి చెప్పి నీ మీదే ఆమెకు ప్రేమ కలిగేలా చేస్తా’నని హంస అంది. నలుడు దానిని విడిచి పెట్టాడు.

గుంపుతో కలసి హంస విదర్భపురానికి వెళ్ళి ఉద్యానవనంలో చెలికత్తెలతోపాటు విహరిస్తున్న దమయంతి ముందు వాలి, కావాలని ఆమె చేతికి చిక్కింది. ‘నీ ప్రియతముడైన నలుడి దగ్గరనుంచి వచ్చాను. నేను ఎంతోమంది రాజుల్ని చూశాను. సకలగుణసౌందర్యంలో నలుడికి ఎవరూ సాటి రారు. నువ్వు నారీరత్నం, అతను పురుషరత్నం. మీ కలయిక ఇద్దరికీ మరింత శోభనిస్తుంది’ అంది.

దమయంతి సంతోషించింది. ‘నలుడి గురించి నాకు చెప్పినట్టే, నా గురించి కూడా నలుడికి చెప్పవా’ అని ప్రార్థించింది. హంస మళ్ళీ నలుడి దగ్గరకు వెళ్ళి దమయంతి గుణ రూపాలను వర్ణించి చెప్పింది. అప్పటినుంచీ ఇద్దరిలోనూ పరస్పర అనురక్తి పెరిగిపోయింది. ఎంతసేపూ నలుడి తలపులతోనే గడుపుతూ దమయంతి నిద్రాహారాలకు దూరమై శుష్కించింది. చెలికత్తెలు భయపడి ఆమె తండ్రి భీముడికి ఈ విషయం చెప్పారు. నలుని ఎలా రప్పించాలా అని ఆలోచించి అతను కూతురికి స్వయంవరం చాటించాడు.

రాజులందరూ ఆ స్వయంవరానికి బయలుదేరి వెళ్లారు. అలాగే నలుడూ బయలుదేరాడు. ‘యుద్ధంలో వీరమరణం చెంది స్వర్గానికి వచ్చి సకల సుఖాలూ అనుభవించడం రాజులకు పరిపాటి కదా, ఇప్పుడు ఎందుకు రావడం లే’దని ఇంద్రుడికి అనుమానం వచ్చింది. నారదుని కారణం అడిగాడు.  ‘అతిలోక సుందరి అయిన దమయంతికి స్వయంవరం జరుగుతోంది, రాజులందరూ పరస్పర కలహాలు విడిచిపెట్టి, స్వయంవరానికి వెడుతున్నారు. అందుకే స్వర్గానికి రావడం లే’దని నారదుడు చెప్పాడు.

దాంతో ఆ స్వయంవరాన్ని చూడాలని ఇంద్రుడు కూడా వేడుక పడ్డాడు. అగ్ని, యమ, వరుణులతో కలసి భూలోకానికి వచ్చాడు. వారికి నలుడు కనిపించాడు. ‘మా తరపున దూతగా వెళ్ళి, మేము చెప్పినట్టు చేస్తావా?’ అని ఇంద్రుడు అతన్ని అడిగాడు. ‘తప్పకుండా! ఏం చేయమంటారో చెప్పండి’ అని నలుడు అన్నాడు. ‘దమయంతి దగ్గరకు వెళ్ళి మాలో ఒకరిని వరించమని చెప్పా’ లని ఇంద్రుడు అన్నాడు. నలుడు విస్తుపోయాడు. ‘నేను కూడా అందుకే వెడుతున్నాను. మీకు ఆ సంగతి తెలిసీ ఇలా కోరడం న్యాయమా?’అన్నాడు. ‘నువ్వు ఇచ్చిన మాట తప్పవని తెలిసి ఈ కోరిక కోరాం. ఇది దేవతలకు ఇష్టమైన కార్యం, కాదనకుండా చేసిపెట్టు. నేరుగా రాజగృహంలోకి ఎలా వెడతాననే సందేహం పెట్టుకోకు. నిన్ను ఎవరూ అడ్డుకోరు’ అన్నాడు ఇంద్రుడు.

చేసేది లేక నలుడు దమయంతి మందిరానికి చేరుకున్నాడు. అతణ్ణి చూసి చెలికత్తెలు అదిరిపడి, ఇతడెవరా అనుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారు. నలుడు తనను దమయంతికి పరిచయం చేసుకుని,’ఇంద్ర, అగ్ని, యమ, వరుణ దేవులు నన్ను నీ దగ్గరకు దూతగా పంపించారు. తమలో ఒకరిని పెళ్ళాడి, తమ అందరికీ సంతోషం కలిగించమని చెప్పమన్నారు’ అన్నాడు.

ఆ మాట వినగానే దమయంతి దుఃఖంతో కుప్పకూలింది. ‘నేనెక్కడ…ఇంద్రాది దేవతలెక్కడ? నేనెప్పుడూ వాళ్ళకు మొక్కుతూ ఉంటాను. నేను నీ ధనాన్ని. నీ కోసమే స్వయంవరం పేరుతో రాజులందరినీ ఇక్కడికి రప్పించాను. నువ్వే నా భర్తవు. నువ్వు ఒప్పుకోకపోతే ఉరేసుకునో, విషం తాగో, అగ్నిలో దూకో ఆత్మహత్య చేసుకుంటాను’ అంది.

‘మహాశక్తిమంతులు, లోకపాలకులు, సంపన్నులు, తేజస్వులు అయిన దేవతలను కాదని; వారి పాదధూళిపాటి కూడా చేయని నా లాంటి మనుష్యుని కోరుకుంటావా? దేవతల ఇష్టం తీర్చకపోతే మనుషులు అధోగతి చెందుతారు. కనుక వారికి ఇష్టం కలిగించి నన్ను కాపాడు’ అని నలుడు అన్నాడు.

దమయంతి చెక్కిళ్లపై కన్నీరు ధారలు కట్టింది. చాలాసేపు దుఃఖిస్తూ ఉండిపోయి, ఆ తర్వాత, ‘నీకు ఆడి తప్పిన దోషం కలగని ఒక ఉపాయం తట్టింది. ఇంద్రాదులు స్వయంవరానికి వస్తే, వాళ్ళ ఎదుటే నిన్ను వరిస్తాను’అంది. నలుడు ఇంద్రాదుల దగ్గరకు వెళ్ళి దమయంతి అన్న మాటలు చెప్పాడు.

‘నలుని తప్ప ఇంకొకరిని వరించదట! ఎలా వరించదో చూద్దాం’ అని ఇంద్రాదులు నలుగురూ అనుకుని నలుని రూపంలోనే స్వయంవరానికి వెళ్లారు. ఎదురుగా అయిదుగురు నలులు ఉండడంతో, అసలు నలుని ఎలా గుర్తించాలో తోచని దమయంతి, మీరే మీ నిజరూపాలను ధరించి నలుని గుర్తించేలా చేయండని దేవతలను ప్రార్థించింది. దాంతో, రెప్పపాటులేని కళ్ళతో, చెమట లేని దేహాలతో, భూమిని అంటని పాదాలతో నలుగురూ ఆమెకు కనిపించారు. ఆమె అసలు నలుని మెడలో దండ వేసింది.

ఇద్దరికీ వివాహం జరిగిపోయింది.

***

ఇంద్రాదులు తిరిగి దేవలోకానికి బయలుదేరారు. దారిలో వారికి కలి ఎదురయ్యాడు. ఎక్కడికి వెడుతున్నావని ఇంద్రాదులు అడిగారు. ‘దమయంతి స్వయంవరానికి’ అని కలి చెప్పాడు. ‘ఇంకెక్కడి స్వయంవరం? అది అయిపోయింది. దమయంతి నలుడనే వాడిని వరించిం’దని వారు చెప్పారు. దాంతో కలికి నలుడి మీద కోపం వచ్చింది. అతన్ని రాజ్యభ్రష్టుని చేయడానికీ, ఆ దంపతులకు వియోగం కల్పించడానికీ నిర్ణయించుకున్నాడు. నలుడు ద్యూతప్రియుడనే సంగతి తెలిసి అతని పాచికలలోకి ప్రవేశించమని ద్వాపరం అనే తన బంటును నియోగించాడు. తను నలునిలో ప్రవేశించాలని చూశాడు కానీ, నలుడు యాగాలు మొదలైన పుణ్యకర్మలు చేసినవాడు కావడంతో అది సాధ్యం కాలేదు. అదను కోసం కలి నిరీక్షిస్తుండగా, ఒక రోజున నలుడు మూత్రవిసర్జన చేసి కాళ్ళు కడుక్కోవడం మరచిపోయి సంధ్యావందనానికి ఉపక్రమించడంతో ఇదే అదను అనుకుని కలి అతనిలో ప్రవేశించాడు. ఆ తర్వాత పుష్కరుడు అనే వాడి దగ్గరకు వెళ్ళి, ‘నువ్వు నలుడితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలుచుకో’ అని చెప్పాడు. అతనికి సహాయకుడిగా వృషుడు అనే వాడిని ఇచ్చి, పాచికలు తీసుకుని తను కూడా పుష్కరునితో కలసి నలుడు దగ్గరికి వెళ్ళి తమతో జూదమాడమని ఆహ్వానించాడు.

కొన్నేళ్లపాటు నలుడు జూదానికి బానిసై చివరికి రాజ్యాన్ని కోల్పోయాడు. ఈ లోపల అతనికి ఇంద్రసేనుడు అనే కొడుకు, ఇంద్రసేన అనే కూతురు కలిగారు. దమయంతి పిల్లలిద్దరినీ పుట్టింటికి పంపేసి తను నలుడితో ఉండిపోయింది. ఇద్దరూ కట్టుబట్టలతో మిగిలి రాజధానిని విడిచిపెట్టారు. మంచినీళ్ళతో కొన్ని రోజులు కడుపు నింపుకున్నారు. ఒక రోజు తన ఎదురుగా బంగారు రెక్కలతో తిరుగుతున్న కొన్ని పక్షులను చూసి, వాటిని పట్టి ఆకలి తీర్చుకోవచ్చు ననుకుని తన కట్టుబట్టను నలుడు వాటిపై విసిరాడు. అవి బట్టతో సహా ఎగిరిపోయి, ‘నీ రాజ్యాన్ని, ధనాన్ని హరించిన పాచికలమే మేము. నీ వస్త్రాన్ని కూడా అపహరించడానికి ఇలా పక్షి రూపంలో వచ్చా’మని చెప్పాయి.

నలుడు దమయంతి చీరచెరగును తనకు చుట్టుకుని నగ్నత్వాన్ని కప్పుకున్నాడు. ఇద్దరూ ఒకే వస్త్రంతో అడవి దారి పట్టారు. ఆకలి, దాహాలకు తోడు; నడిచి నడిచి అలసిపోయిన దమయంతి ఒకచోట ఆదమరచి నిద్రపోతున్న సమయంలో నలుడు తను కట్టుకున్న చీర భాగాన్ని తెంచుకుని ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. నిద్రలేచి భర్తను వెతుక్కుంటూ వెడుతున్న దమయంతిని ఒక కొండచిలువ పట్టుకుంది. ఆమె ఆర్తనాదాలు విని అక్కడికి వచ్చిన ఒక కిరాతుడు కొండచిలువను చంపి ఆమెను కాపాడాడు. ఆ తర్వాత అతను తన పొందు కోరేసరికి ఆగ్రహించిన దమయంతి అతన్ని చావమని శపించగా అతను చచ్చి పడిపోయాడు. ఆమె భర్తను వెతుక్కుంటూ ఒక మునిపల్లె చేరుకుంది. అక్కడి మునులు, ‘నీ భర్త కనిపిస్తాడు. కష్టాల నుంచి గట్టెక్కుతారు’ అని ఆమెకు భవిష్యత్తు చెప్పి అదృశ్యమయ్యారు. దమయంతి ముందుకు వెడుతుండగా ఒక వ్యాపారుల బృందం కనిపించింది. వారు సుబాహు అనే రాజు నగరానికి వెడుతున్నామని చెప్పగా ఆమె వారి వెంట వెళ్లింది. వ్యాపారులు దారిలో ఒక చోట నిద్రపోతుండగా ఒక మదపు టేనుగు వారిలో కొందరిని తొక్కి చంపేసింది. మిగిలినవారితో కలసి దమయంతి చివరికి సుబాహు నగరానికి చేరుకుంది. రాజమాత ఆమెను చూసి, దాదిని పంపి తన దగ్గరకు పిలిపించుకుని వివరాలు అడిగింది. దమయంతి భర్తకు దూరమయ్యానని మాత్రం చెప్పి సైరంధ్రీ వ్రతంలో ఉన్నా నంది. ‘బ్రాహ్మణులను పంపి నీ భర్తను వెతికిస్తాను. నువ్వు నా దగ్గర ఉండు’ అని రాజమాత అంది. దమయంతి ఒప్పుకుంది.

untitled

***

నలుడు దారుణ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒక రోజున అడవి అంటుకుని ఆకాశానికి అంటేలా మంటలు లేచాయి. ఒక నాగకుమారుడు ఆ మంటల్లో చిక్కుకుని చేస్తున్న ఆర్తనాదాలు నలునికి వినిపించాయి. అతను వెంటనే మంటల మధ్యలోకి వెళ్ళి నాగకుమారుణ్ణి రక్షించాడు. తన పేరు కర్కోటకుడనీ, ఒక ఋషి శాపం వల్ల కదలలేననీ, తనను ఎత్తుకుని ఒక సరోవరం తీరంలో విడిచిపెట్టవలసిందని అతను కోరాడు. నలుడు అలాగే చేశాడు. అప్పుడు కర్కోటకుడు అతన్ని కాటేశాడు. దాంతో నలుడు పాత రూపం కోల్పోయి వికృతరూపిగా మారిపోయాడు. ‘నీ మంచి కోసమే నేను ఇలా చేశాను. నీ శరీరంలో నా విషం ఉన్నంతకాలం నీకు ఎవరి వల్లా ప్రాణహాని ఉండదు. నీకు యుద్ధాలలో విజయమూ, భార్యతో కలయికా, రాజ్యవైభవమూ కలుగుతాయి. నీ నిజరూపాన్ని ఎప్పుడు పొందాలనుకుంటే అప్పుడు నన్ను తలచుకో. నువ్వు పోగొట్టుకున్న వస్త్రం నీ దగ్గరకు వస్తుంది, దానిని ధరించగానే నీ నిజరూపం వస్తుంది. అయోధ్యా నగరంలో ఇక్ష్వాకువంశస్థుడైన ఋతుపర్ణుడనే రాజు ఉన్నాడు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళి అతనికి నీకు తెలిసిన అశ్వహృదయ మనే విద్యను ఇచ్చి అతని దగ్గరనుంచి అక్షహృదయ మనే విద్య తీసుకో. బాహుకుడు అనే పేరుతో అతని దగ్గర వంటవాడిగా ఉండు’ అని కర్కోటకుడు చెప్పి అదృశ్యమయ్యాడు.

నలుడు ఋతుపర్ణుని కలసుకుని, తను అశ్వశిక్షలోనూ, వంటలోనూ నేర్పరిననీ, నీ కొలువులో చేర్చుకోవలసిందనీ కోరాడు. ఋతుపర్ణుడు అంగీకరించి అతన్ని అశ్వాధ్యక్షుడిగా నియమించి, వార్ష్ణేయుడు, జీవలుడు అనే ఇద్దరిని అతనికి సహాయకులుగా ఇచ్చాడు.

***

నలుడు రాజ్యం కోల్పోయిన సంగతి విదర్భరాజు భీముడికి తెలిసింది. కూతురు, అల్లుడు ఏమైపోయారో నని అతను దుఃఖిస్తూ వారిని వెతకడానికి అన్ని చోట్లకూ బ్రాహ్మణులను పంపించాడు. నలదమయంతుల ఆచూకీ చెప్పినవారికి వేయి గద్యాణాలు, వారిని వెంటబెట్టుకుని వచ్చినవారికి వేయి గోవులు, అగ్రహారాలు ఇస్తానని ప్రకటించాడు.

భీముడు పంపిన బ్రాహ్మణులలో ఒకడైన సుదేవుడు సుబాహుపురం చేరుకుని రాజగృహాన్ని సందర్శించి అక్కడున్న దమయంతిని చూశాడు. ఆమెను ఏకాంతంగా కలసుకుని తను వచ్చిన పని చెప్పాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన రాజమాతకు దమయంతి విదర్భరాజు కూతురన్న సంగతి తెలిసింది. ఆమె సంతోషంతో దమయంతిని కౌగలించుకుని ‘నీ తల్లి, నేను అక్కచెల్లెళ్లమే’ నని చెప్పింది. ఆమె దగ్గర సెలవు తీసుకుని సుదేవునితో కలసి దమయంతి పుట్టింటికి వెళ్లింది.

ఈసారి భీముడు నలుని వెతకడానికి బ్రాహ్మణులను నియోగించాడు. ‘నలుడు తనను ఎవరూ గుర్తుపట్టకుండా అజ్ఞాతంగా ఉంటాడు కనుక, భార్యను ఏమాత్రం కనికరం లేకుండా విడిచిపెట్టి వెళ్ళడం న్యాయమా అని మీరు వెళ్ళిన ప్రతి చోటా సభలలో ప్రశ్నించండి. దానికి ఎవరు సమాధానం చెబుతారో అతడే నలుడు కావచ్చు’ నని దమయంతి బ్రాహ్మణులకు చెప్పింది.

ఋతుపర్ణుని సభకు వెళ్ళి వచ్చిన పర్ణాదు డనే బ్రాహ్మణుడు, అతని కొలువులో నూరు గద్యాణాలకు పనిచేస్తున్న బాహుకుడు అనే ఒక వికృతరూపుడు తన ప్రశ్నకు సమాధానం చెప్పాడని దమయంతికి చెప్పాడు. అతడే నలుడు అయుంటాడని భావించిన దమయంతి ఈసారి సుదేవుని పిలిపించి, తనకు రేపో, ఎల్లుండో పునస్స్వయంవరం జరగబోతున్నట్టు ఋతుపర్ణునికి చెప్పమని పంపించింది.

***

ఋతుపర్ణుడు ఆ స్వయంవరానికి వెళ్లడానికి ఉత్సాహపడ్డాడు. వార్ష్ణేయుని వెంటబెట్టుకుని బాహుకుడు రథచోదకుడుగా విదర్భపురానికి బయలుదేరాడు. వాయువేగంతో రథం తోలుతున్న బాహుకుని నేర్పుకు ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతుండగా అతని ఉత్తరీయం జారిపడిపోయింది. వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తెస్తాడనీ, వేగం తగ్గించమనీ బాహుకునితో అన్నాడు. ‘ఇంకెక్కడి ఉత్తరీయం? అది పడిన చోటునుంచి వందమైళ్ళ దూరం వచ్చేశా’మని బాహుకుడు చెప్పాడు. అప్పుడు ఋతుపర్ణుడు, ‘అందరికీ అన్ని విద్యలూ తెలియకపోయినా ప్రతివారికీ ఏదో ఒక విద్యలో నేర్పు ఉంటుంది. నేను వస్తువుల గుంపును ఒకసారి చూస్తే చాలు వాటి సంఖ్య చెప్పేస్తాను. కావాలంటే ఆ చెట్టు చూడు. దానికి ఆకులు, పండ్లు ఎన్నున్నాయో చెబుతాను. రెండు కొమ్మలకు పదివేల ఒకటి ఉంటే, మిగిలిన కొమ్మలకు రెండువేల తొంభయ్యే ఉన్నాయి’ అన్నాడు. ‘అయితే లెక్కపెట్టవలసిందే’ నంటూ బాహుకుడు రథం ఆపి దిగి, ఆ చెట్టును కూలదోసి లెక్కపెట్టాడు. సరిగ్గా ఋతుపర్ణుడు చెప్పినన్నే ఉన్నాయి. ఆశ్చర్యపోయిన బాహుకుడు ఆ విద్యను తనకు ఉపదేశించమని కోరాడు. దీనిని అక్షహృదయం అంటారని చెప్పి ఋతుపర్ణుడు అతనికి ఉపదేశించాడు. సంతోషించిన బాహుకుడు, ‘నీకు అశ్వహృదయం అనే నా విద్యను ఉపదేశిస్తాను, స్వీకరించు’ అన్నాడు. ‘ప్రస్తుతానికి నీ దగ్గరే ఉంచుకో. నేను కావలసినప్పుడు స్వీకరిస్తాను.’ అని ఋతుపర్ణుడు అన్నాడు.

అక్షహృదయం పొందగానే కలి అతన్ని విడిచిపెట్టేశాడు. వికృతరూపం తప్ప మిగిలిన దోషాలు అన్నీ తొలగిపోయాయి. రథం విదర్భపురంలోకి ప్రవేశించింది. రథం చప్పుడు వినగానే దమయంతికి అది నలుని రథధ్వనిలా అనిపించింది. తీరాచూస్తే నలుడు కనిపించలేదు. దాంతో నిరాశ చెందింది. భీముడు ఋతుపర్ణునికి తగిన విడిది ఏర్పాటుచేశాడు. పురంలో ఎక్కడా స్వయంవరం మాటే వినిపించకపోవడం, మిగతా రాజులెవరూ కనిపించకపోవడం చూసి ఋతుపర్ణుడు అనుమానపడ్డాడు. ‘దమయంతి ఇంకొకరిని పెళ్లాడే అధర్మానికి పాల్పడుతుందని తను ఎలా అనుకున్నాడు, స్వయంవరం అనగానే తగుదునమ్మా అనుకుంటూ ఎలావచ్చాడు’ అనుకుంటూ సిగ్గుపడ్డాడు.

ఋతుపర్ణుడు అయోధ్యరాజనీ, వార్ష్ణేయుడు సూతపుత్రుడనీ తెలిసింది కనుక మూడో వ్యక్తి అయిన బాహుకుడు ఎవరో తెలుసుకుని రమ్మని కేశిని అనే పరిచారికను దమయంతి పంపించింది. రథశాల దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న బాహుకుని దగ్గరకు కేశిని వెళ్ళి, ‘ఇక్కడికి ఏ పని మీద వచ్చావు, మీతో ఉన్న మూడో వ్యక్తి ఎవరు?’ అని అడిగింది. బాహుకుడు వచ్చిన కారణం చెప్పి, మూడో వ్యక్తి వార్ష్ణేయుడనీ, నలునికి రథచోదకుడిగా ఉండేవాడనీ చెప్పాడు.

దమయంతిని కలిసి బాహుకుని మాటలూ, ఆకారం గురించి కేశిని చెప్పింది. అతడే నలుడని దమయంతికి అనుమానం కలిగింది. ‘అతను ఋతుపర్ణుని వంటలవాడట కదా…అతని వంట గురించి తెలుసుకుని రా’ అని దమయంతి మళ్ళీ కేశినిని అతని దగ్గరికి పంపింది. కేశిని వెళ్ళి వచ్చి ‘అతని గురించి ఏం చెప్పను? అతను మామూలు మనిషి కాదు. అలాంటివాడిని ఇంతవరకు చూడలేదు, వినలేదు. నిజంగా అతన్ని దేవుడు అనచ్చు’ అంటూ అతను వంట చేయడంలో ఎన్ని మహిమలు ప్రదర్శిస్తాడో వర్ణించి చెప్పింది. దాంతో అతని వంటకాలు కొన్ని తీసుకురమ్మని దమయంతి మళ్ళీ కేశినిని పంపింది. కేశిని తెచ్చి ఇవ్వగానే వాటిని రుచి చూసిన దమయంతికి అతడు నలుడే నని మరింత గట్టిగా అనిపించింది. ఈసారి కొడుకునీ, కూతురునీ ఇచ్చి కేశినిని బాహుకుడి దగ్గరికి పంపించింది. వాళ్ళను చూడగానే కంట తడిపెట్టుకుంటూ బాహుకుడు తన ఒళ్ళో కూర్చొబెట్టుకున్నాడు. అంతలోనే జాగ్రత్తపడుతూ ‘వీళ్ళను చూడగానే నా పిల్లలు గుర్తొచ్చారు’ అని కేశినికి చెప్పి, ‘నువ్విలా మాటి మాటికీ రావడం బాగుండదు, ఇక రావద్దు’ అన్నాడు. ఇది తెలిసి, అతడు నలుడే నని పూర్తిగా నిర్ధారణకు వచ్చిన దమయంతి తండ్రికి చెప్పి అతన్ని తనవద్దకు రప్పించింది.

బాహుకుడు దమయంతిని కలిశాడు. తనకు పునస్స్వయంవరం అన్న సంగతిని ఋతుపర్ణుడు ఒక్కడికే తెలియబరిచారనీ, అది నలుని విదర్భకు రప్పించడానికి మాత్రమె నని దమయంతి మాటల ద్వారా అతనికి తెలిసింది. దాంతో అతను కర్కోటకుడిని తలచుకోవడం, పక్షులు అపహరించిన అతని వస్త్రం తిరిగి అతని దగ్గరికి రావడం, అతను దానిని ధరించాగానే నలుని రూపంలోకి మారిపోవడం వెంటనే జరిగిపోయాయి.

దంపతులు ఇద్దరూ తిరిగి ఒక్కటయ్యారు.

నలుడు అక్కడినుంచి నిషధపురానికి వెళ్లి పుష్కరుని కలిశాడు. ‘నా రాజ్యాన్ని గెలుచుకోడానికి వచ్చాను. నాతొ యుద్ధమైనా చెయ్యి. జూదమైనా ఆడు’ అని అతణ్ణి ఆహ్వానించాడు. పుష్కరుడు జూదానికే మొగ్గు చూపించాడు. అందులో అతడు నలుని చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. నలుడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

***

ఈ కథను ఇంకా క్లుప్తం చేసి చెప్పచ్చు కానీ, కొన్ని కారణాల వల్ల ఈమాత్రం వివరంగా చెప్పవలసివచ్చింది. నలుని గుర్తించి, రప్పించడానికి దమయంతి చేసిన ప్రయత్నాలు; బాహుకుడే నలుడా అన్నది నిర్ధారించుకోడానికి అతనితో ఆడిన ‘మైండ్ గేమ్’ —ఎంతో తెలివిగా, ఒడుపుగా అల్లిన కథనరీతిని పట్టి చూపి, పురాణ కథలకు భిన్నంగా తోపిస్తాయి. అంతకంటే విశేషం, ఒక గ్రీకుపురాణకథతో ఈ కథకు పోలికలు ఉండడం!

దాని గురించి తర్వాత….

 -కల్లూరి భాస్కరం

మహదాశీర్వచనం: సీదా సాదా కథ చెప్పే అసాధారణ చరిత్ర

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

“రామారావుగారి కథలు దాదాపు ఏవీ పైకి తెలిసిపోవనీ, పురాతన చరిత్ర కోసం భూమి పొరలను తవ్వే ఆర్కియాలజిస్ట్ పొర పొరా వేరు వేరుగా విడదీసి చూపే దాకా చరిత్ర సమాచారం ఆవిష్కృతం కానట్టు – ఆయన కథలు కూడా పొర పొరా జాగ్రత్తగా విప్పితే కాని కథలో ఏ మాట ఎందుకు అన్నారో బోధ పడదనీ, ఆ కథ రెండోసారి చదివేటప్పుడు — అంతకు ముందు, మొదటిసారి చదివినప్పుడు తోచని లోతులు, గూఢ అర్ధాలు తెలుస్తాయనీ మరొక సారి చెప్పటం అవసరం -”

1986 అక్టోబర్ లో కాళీపట్నం రామారావు కథలు ఒక పాతిక ఆర్కే పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించబడినప్పుడు ‘ఈ కథలు రెండోసారి చదవటానికి ముందుమాట’ రాస్తూ వెల్చేరు నారాయణరావు చెప్పిన ముక్తాయింపు మాటలివి. నిజమే. కాళీపట్నం రామారావు కథలు రెండోసారి, మూడోసారి, మరొకసారి ఇలా మళ్ళీ మళ్ళీ చదివే క్రమంలోమానవేతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని అసలు కథలు తెలిసివస్తాయి. కొడవటిగంటి కుటుంబరావు మాటల్లో చెప్పాలంటే కాళీపట్నం కథలు చదివితే “జీవితం లోని అంతస్సంఘర్షణ కూడా దాని వెనక ఉన్న భౌతిక కారణాలతో సహా స్పష్టంగా -” అర్ధం అవుతుంది. అతిసాదాగా కనిపించే కారా కథల లోని ఆకర్షణ అదే. ఆ ఆకర్షణ లక్షణం వల్లనే కారా గారి ‘మహదాశీర్వచనం’ కథ నాకు చాలా నచ్చింది.

‘మహదాశీర్వచనం’ కథ 1967 ఏప్రిల్ 27 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో మొదట ప్రచురించబడింది. అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇరవై సంవత్సరాలు, ఆంధ్రరాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది. ఆర్ధికాభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి అసమానతలను తగ్గించటం ధ్యేయంగా సాగిన మూడవ పంచవర్ష ప్రణాళిక అప్పుడే ముగిసింది. వ్యవసాయంలో మిగులువిలువను పెంచి నూతన ధనిక వర్గం ఏర్పడటానికి కారణమైన హరిత విప్లవం ఈ కాలపుదే. అసమానతలు తగ్గకపోగా మరింత పెరగటానికి ఇది కారణమైంది. రూపాయి విలువ తగ్గి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి మధ్యతరగతి జీవితం దుర్భరం కాసాగింది. భూ పరిమితి చట్టాల అమలులో వైఫల్యం .. పేద, సన్నకారు రైతుల, రైతు కూలీల బతుకులలోని పీడన, దోపిడీ .. నెహ్రూ వాగ్దానం చేసిన సోషలిస్ట్ సమాజం వాస్తవీకరించబడుతుందన్న ఆశను తుంచేశాయి. అసంతృప్త అశాంత ప్రజాజీవనం నుండి శ్రీకాకుళంలో గిరిజన రైతాంగ పోరాటాలు రూపం తీసుకొంటున్న కాలం ఇది. ఈ రాజకీయార్ధిక నేపధ్యం నుండి అధ్యయనం చేయవలసిన కథ ‘మహదాశీర్వచనం’.

ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం కేంద్రంగా ప్రారంభమైన ఈ కథ స్త్రీల కోణం నుండి నడపబడింది. ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మొదలై బాగా చీకటి పడ్డాక ఆరు ఏడూ గంటల ప్రాంతంలో కథ ముగుస్తుంది. మొత్తం మీద అయిదారు గంటల కాల వ్యవధి మీద నడిచిన ఈ కథను ఇంట్లో మొదలుపెట్టి ఊరి అవతల బడిలోని పోలింగ్ ఆఫీసులో ముగించటంలో ఉంది కారా నిర్మాణ శిల్పం. “ఆయన చావటానికి సిద్ధంగా ఉన్నాడు. రెన్నాళ్ళయీ మూన్నాళ్ళయీ కాదు. నాలుగు సంవత్సరాలై ..” అన్న ప్రారంభ వాక్యంతో ఇంటి యజమాని కామేశాన్ని పరిచయం చేసి.. వెనువెంటనే కొంచెం బియ్యం, వాటికెన్నో రెట్లు ముదురు నూకలు, చాలా మట్టిబెడ్డలు కలసి ఉన్న పాత చాట ముందు పెట్టుకొని, వాటిల్లోంచి బియ్యాన్ని ఏరి తీసుకోవటమో, రాళ్ళను ఎంచి పారేయ్యటమో తేల్చుకోలేని సందిగ్ధ స్థితిలో గుమ్మం ఒడ్డున కూర్చున్న కామేశం భార్య సత్యవతమ్మను పరిచయం చేసాడు కారా. వీధి చీడీలో వదులు మఠం వేసుక్కూర్చున్న ‘వాడు’ అని సర్వనామంతో మరొక పాత్ర పరిచయం అవుతుంది అప్పుడే. కుక్కి మంచంలో ఉండుండి ఎగశ్వాసతో బెక్కుతుండే రోగి వైపు మన దృష్టి మరల్చి, రోగి స్థితికి అదిరిపోతూ రోగి శ్వాస చక్కబడితే తాను కుదుటపడే సత్యవతమ్మను కేంద్రంలోకి తెచ్చి, పన్నెండేండ్ల కూతురు కామేశ్వరిని ప్రవేశపెట్టి కధకుడు నాటకంలో సూత్రధారుడి వలె ఇక జీవన నాటకం చూడండంటూ తాను తప్పుకొన్నాడు.

సత్యవతమ్మ ఏడేండ్ల కొడుకు శంకరం తండ్రిని చూడటానికి వైద్యుడు ఆచార్లును వెంట పెట్టుకొని రావటంతో కథలో కదలిక మొదలవుతుంది. ఆచార్లు రోగిని పరీక్షించి మందులిస్తుండగా ఎదురింటి అరవై ఏళ్ళు పైబడ్డ శేషమ్మ అక్కడకు వస్తుంది. చలన చైతన్యాలు లేకుండా మంచంలో పడి ఉన్న కామేశం జీవితం సమస్తం ఆమె అంతరిక ఆలోచనల వల్ల, ఆమె అనుభవాల జ్ఞాపకాల కధనం వల్ల, వ్యాఖ్యానాల వల్ల పొరలు పొరలుగా పాఠకుల ముందు విచ్చుకుంటుంది.

శేషమ్మ సంభాషణ వల్ల కామేశానికి సత్యవతమ్మకు పెళ్లి శారదా బిల్లు హడావుడిలో జరిగిందని తెలుస్తుంది. వివాహ వయో పరిమితిని అమ్మాయిలకు 14 ఏళ్ళుగా, అబ్బాయిలకు 18 ఏళ్లుగా విధిస్తూ 1929 లో వచ్చిన బిల్లు ఇది . బిల్లు వస్తుందని తెలిసి ముందే పెళ్లిళ్లకు తొందరపడటం, ఆ బిల్లు వర్తించని నైజాం ప్రాంతాలకో, యానాం ప్రాంతాలకో వెళ్లి పెళ్లిళ్లు చేసుకురావటం జరిగింది. ఆ హడావుడిలో సత్యవతమ్మ పెళ్లి జరిగింది అంటే 1929లో జరిగిందన్నమాట. అప్పటికి ఆమె వయసు అయిదు ఏళ్ళు. రెండువందల శుల్కానికి కామేశం ఆమెను కొనుక్కొని పెళ్లి చేసుకొన్నాడు. అప్పుడతనికి 28 ఏళ్ళు. స్కూల్ మాష్టారిగా పని చేసి రిటైర్ అయి స్వగ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. భర్తను స్వార్ధపరుడని, పెళ్ళాం పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించనివాడని శేషమ్మ ఆరోపణగా మాట్లాడుతుంటే సత్యవతమ్మకు అరవై ఏళ్ళు జీవిత భారం మోసి అలసిపోయిన వ్యక్తి ఆఖరి దినాలు హాయిగా గడపదలచటంలో తప్పేమీ కనిపించలేదు అని ఆమె చిత్తవృత్తిని వ్యాఖ్యానిస్తాడు కధకుడు. దీనిని బట్టి కథ ప్రవర్తిస్తున్న కాలానికి కామేశం అరవై ఏళ్ళు దాటినవాడు. అంటే కధాకాలం 1962-63 కావాలి.

చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం మొదలైన వూళ్ళ ప్రస్తావనను బట్టి వాటికి సమీపంలో ఉత్తరాంధ్రలోని ఏ గ్రామంలోనో ఈ కథ ప్రవర్తించిందని అనుకోవచ్చు. ఆ గ్రామం – స్వాతంత్ర్యానంతర గ్రామం ఎలా ఉంది? ప్రాధమికమైన విద్య ఆరోగ్య వసతులే సమకూడలేదు. కొత్తబడి ఊరవతల పెంకుటింట్లో పెట్టబడింది.1960 కల్లా ప్రాధమిక విద్యను సార్వజనీనం చెయ్యాలని భారత రాజ్యాంగం సంకల్పం చెప్పుకున్నా మగపిల్లల చదువులు ఆడపిల్లల పెళ్ళిళ్ళు సమస్యగా భావించే స్థితి మారలేదు. ఇక ఆరోగ్యం ప్రభుత్వం కల్పించే సౌకర్యంగా అన్ని గ్రామాలకూ అందుబాటులోకి రానే లేదు.1959 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 730 రూరల్ డిస్పెన్సరీలు వచ్చినప్పటికీ కధ నడచిన గ్రామం వరకు ఆ అభివృద్ధి ఇంకా రానేలేదు. ఆచార్లు ఆ ఊరి ఆయుర్వేద వైద్యుడు. లేనివాళ్ళ కోసం హోమియో తెలుసుకొన్నాడని, ఉన్నవాళ్ళ కోసం అల్లోపతి ప్రాక్టీసు చేస్తాడని అతని గురించి కధకుడు చెప్పిన మాటలు గమనించవలసినవి. అవసరాన్ని బట్టికాక ఆర్ధిక అంతరాలను బట్టి అందివచ్చే వైద్యవిధానాలు వేరు వేరుగా రూపొందుతున్న అసమ సామాజిక స్థితి వైపు పాఠకుల దృష్టిని మళ్ళించే మాటలివి.

 

ఆరుగురు తిని కుడిచే పిల్లలతో ఒక్కతే సంసారం ఈదవలసిన స్థితిలో ఉన్న సత్యవతమ్మను చూసి ఆచారి అల్లోపతి వైద్యాన్ని హోమియోకి మార్చటమే కాక ఆమె దగ్గర ఫీజు కూడా తీసుకొనటం మానేసాడు. ప్రస్తుత కథా సన్నివేశంలో ఆచారి రోగికి ఉపశమనం కోసం ఒక ఇంట్రావీనస్ ఇంజక్షన్ ఇస్తాడు. సత్యవతమ్మ రెండు రూపాయలు ఫీజుగా ఇవ్వబోతే వద్దని వారించాడు. అది తాను కొన్నది కాదని తనకు అది ఎలా వచ్చిందో చెప్పాడు. వూళ్ళో నాయుడోళ్ళ పాపమ్మకు ఇదే జబ్బు. పట్నం పెద్ద డాక్టర్ ఆమె కోసం రాసిన ఇంజక్షన్ అది. ఆయన డజన్ రాస్తే వీళ్ళు రెండు డజన్లు తెప్పించారుట.. ఈ విషయం చెప్పి వారికి పైసలకు కొదవేమున్నది? అందులోను పంట ధాన్యాల ధరలు ఇలా మండుతున్నప్పుడు.. ! అని వ్యాఖ్యానిస్తాడు ఆచారి.

 

ఊళ్ళల్లో రైతుల దగ్గర ధాన్యం కొని అమ్మే వ్యాపార వర్గం ఒకటి రైతాంగాన్ని కనపడని దోపిడీకి గురిచేస్తున్న వైనాన్ని కారా అంతకు ముందే అప్రజ్ఞాతం కథలో (1951) చర్చారూపంగా భాగం చేశాడు. ఆ తరువాత 1966లో యజ్ఞం కథ ఇతివృత్తంలో భాగం చేసి మానవజీవన సంబంధాలను అవి ఎంత హింసాత్మకంగా ప్రభావితం చేస్తున్నాయో వాటి పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో చూపించాడు. 1967లో రాసిన మహదాశీర్వచనంలో కూడా ఆ ప్రస్తావన చేయలేకుండా ఉండలేక పోయాడు. వస్తూత్పత్తులను సమీకరించటం, నిలవ చేయటం, లాభాలకు అమ్ముకొనటం ఆ వర్గం చేసే పని. ఈ కథలోని నాయుడోళ్ళ చరిత్ర పంట ధాన్యాల అమ్మకాల చరిత్ర. కనుకనే వాళ్లకు పైసలకు కొదవలేదు. పెద్దఎత్తున ధాన్యం కొనటం అమ్మటం అలవాటైన వాళ్ళు కనుక ఇంజక్షన్లు కూడా రెండు డజన్లు తెచ్చి పడేసారు. అవి సాధారణంగా దొరకని మందులు. వాటిని అవసరానికి మించి కొని అట్టే పెట్టుకోనటం అంటే అవసరంలో ఉన్నవాళ్లకు అందకుండా చెయ్యటమే. అది తెలిసినవాడు కనుక ఆచారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా ఆ మందులు కొట్టువాడికైనా ఇచ్చెయ్యమని లేదా తన మోహాన అయినా కొట్టమని అడుగుతూనే ఉన్నాడు. ఎక్స్పైరీ డేటు దగ్గరపడ్డం చూసి తీసుకెళ్ళమని మొన్న ఇచ్చారు అని ఆ ఉదంతం చెప్పాడు. తద్వారా ప్రాణావసరం అయిన వాటిని కూడా పనికి రాకుండా పోయేంత కాలం నిలవ చేసుకొనే వర్గం, ఆ వర్గం విదిలించినవాటితో బతుకుకై పెనుగులాడే వర్గం – రెండింటిని ఎదురెదురుగా నిలిపి చూపినట్లయింది.

ఈ కథలో సన్నివేశం ఒకటే అయినా మూడో మనిషిగా శేషమ్మ, లోపలి మనుషులుగా సత్యవతమ్మ, కామేశ్వరి ఎవరి జీవిత అనుభవాల నుండి, అవగాహన నుండి జ్ఞానచైతన్యాల నుండి వాళ్ళు చేసిన ఆలోచనలు, చేష్టలు, సంభాషణలు కలిస్తేనే ఆ సన్నివేశం ఆకారం తీసుకొన్నది. సజీవ చిత్రమై భాసించింది. వీళ్ళల్లో కామేశాన్ని చాలాకాలంగా తెలిసిన మనిషి శేషమ్మ. పెళ్లి అయి కాపురానికి వచ్చిన కొత్తల్లో కళ్ళనిండా కామంతో అతను చూసే చూపులను ఎదుర్కొన్నది. పెళ్ళిచేసుకొని భార్యను చావకొట్టి హింసపెట్టటం చూసింది. ఆ భార్య చావగానే ఉన్న ఇద్దరు పిల్లల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించటం చూసింది. ఆడపిల్లను చెల్లెలు, మగపిల్లవాడిని బావమరిది తీసుకువెళితే రెండో పెళ్ళికి తొందరపడిన తీరు చూసింది. తన భర్త చనిపోయాక తన కొడుకు మీద మరిదిని, మరిది మీద అతడిని పోటీలు పెట్టి వాళ్ళిద్దరి భూముల మధ్య ఉన్న తన భూమిని తెలివిగా అమ్ముకున్నతీరు చూసింది. మొత్తం మీద కామేశం బుద్ధి మంచిది కాదన్నది ఆమె అభిప్రాయం. తను తన జీవిత సౌఖ్యం తప్ప తన తదనంతరం తనకన్నా 23 ఏళ్ళు చిన్నదైన భార్య, 12 ఏళ్ళలోపు పసిపిల్లలు ఆరుగురితో జీవితం ఎలా వెళ్ళ దీస్తుందా అన్న చింత ఆవంతైనా లేని అతని స్వార్ధబుద్ధిని శేషమ్మఏవగించుకొంటుంది. ఆమె దృష్టిలో అతను ‘పురీషంలో పురుగు’.

శేషమ్మ కామేశం గురించి చేసిన వ్యాఖ్యలు మూడు ఉన్నాయి. ఆచారి ఇంజక్షన్ ఇచ్చి రియాక్షన్ వస్తుందేమోనని కనిపెట్టుక కూర్చున్నాను అన్నప్పుడు ఆమె “ఆ జీవికి అంత అదృష్టం కూడానా” అంటుంది. అతని హీన చరిత్రను, రిటైర్ మెంట్ అప్పుడు పెద్ద భార్య కొడుకు వచ్చి చెప్పిన హితవును అహంకరించి తోసిపారేసి వచ్చి ‘నాదారి నేను చూసుకున్నాను నువ్వూ నీ పిల్లలూ ఏ గంగ లో దూకుతారో దూకండి’ అంటూ మంచమెక్కి పడుకున్న అతని వైఖరి గురించి నిరసనగా మాట్లాడి కొంతసేపు ఊరుకొని ఆ తరువాత ఆమె “మనిషికి స్వర్గం గాని, నరకం గాని ఎక్కడో వుండవు. చేసుకున్నవారికి చేసుకున్నంత – అని ఫలితం ఇక్కడే అనుభవిస్తాం” అంటుంది. ఈ రెండు వ్యాఖ్యానాలూ కూడా ఆమెకు జబ్బుతో ఉన్న అతని పట్ల ఏ సానుభూతి లేకపోవటాన్నే సూచిస్తాయి. స్వార్ధం తప్ప ప్రేమ, బాధ్యత లేని మనుషులు చుట్టుపక్కల వారి జీవితాలలో నింపే విషాద భీభత్సం కళ్లారా చూసిన మనిషి కనుక అనాయాస మరణానికి నోచుకోని కామేశాన్ని అదృష్టహీనుడి గానూ, చేసిన దుర్మార్గాలకు ఈ లోకంలోనే ఫలితం అనుభవిస్తున్నవాడిగాను భావించింది.

కామేశం అలా నాలుగేళ్ళుగా చావటానికి సిద్ధమై మంచంలో పడి వుండటం అతని కర్మఫలం అనుకున్నా అతని వల్ల కష్టాలు, నష్టాలు భరించిన భార్యాపిల్లలకు చావూ బతుకు కాని ఆ స్థితి అది మరొక నరకం. వాళ్ళ కోణం నుండి అతనెంత త్వరగా మరణిస్తే అంత మంచిది. శేషమ్మ ఆ భావాన్ని ప్రకటించే నిష్క్రమించింది. ఏమైనా అవసరమైతే కబురు చేయమని చెప్పి వెళుతూ నువ్వు బెంగ పెట్టుకోకు అని సత్యవతమ్మకు హితవు చెప్తుంది. ‘యేo జరిగినా దేవుడు మన మంచికే చేస్తాడని గుర్తెట్టుకో’ అని చెప్పిన మాటలో అతని మరణం నీ మంచికే అన్న సూచన వుంది. ఆమెను అందుకు సిద్దం చేయటమూ వుంది .

 

శేషమ్మ తరువాత కామేశం గురించి లోపలి నుండి సంపూర్ణంగా తెలిసిన మనిషి అతని భార్య సత్యవతమ్మ. ఐదో ఏట అతని భార్య అయి పదమూడు పద్నాలుగు ఏళ్ళకు కాపురానికి వచ్చింది. తరువాత పదిహేను, పదహారేళ్ళు ఆమె బ్రతుకో మహానరకం అంటాడు కధకుడు. ఆమె బ్రతుకును నరకం చేసిన శక్తుల గురించి కూడా కధకుడే సూచించాడు. భర్త కొట్టటం అందులో ఒకటి. భర్తగా అధికారం నిరూపించుకోవటానికో అహంకారాన్ని సంతృప్తి పరచుకొనటానికో, తనకంటే ఇరవై మూడేళ్ళు చిన్నదైన భార్యపై అనుమానంతోనో నిత్యం అతను కొడతాడు. భర్త వల్ల అవమానాలకు, హింసకు గురయ్యే స్త్రీ అందరికి లోకువే. అయినవాళ్ళ చేత, కాని వాళ్ళ చేత ఆమె చీవాట్లు తినటం అందువల్లనే కావాలి. పరాయి స్త్రీలను కామం నిండిన చూపులతో వేధిస్తూ అశ్లీలంగా మాట్లాడుతూ అవమానించే కామేశం వంటి పురుషులకు కొదువ లేని సమాజంలో శేషమ్మ వలెనే సత్యవతమ్మ కూడా ఒక బాధితురాలే.

 

నోటి రంకు ఆడవాళ్ళ చేత నిందలు పడిందని సత్యవతమ్మ గురించి కధకుడు చెప్పిన మాట గమనించదగినది. ఎవరీ నోటి రoకు ఆడవాళ్ళు? తమ భర్తలు పరాయిస్త్రీల వెంట పడుతుంటే వాళ్ళని మందలించలేక, భరించలేక వదిలివెళ్ళే సామాజిక అవకాశం, సాహసం లేక చేసుకొనే మానసిక సర్దుబాటులో భాగoగా తమ భర్తల తప్పు ఏమీ లేదని తమను తాము ఒక భ్రమావరణంలోకి ప్రవేశపెట్టుకొనేవాళ్ళు. తమ భర్తలను స్త్రీలే చెడుదారులకు ఈడుస్తున్నారని తమను తాము నమ్మించుకొని తోటి స్త్రీలకు అక్రమ సంబంధాలు అంటగట్టటంలో తృప్తిని వెతుక్కొనేవాళ్ళు. సత్యవతమ్మ బ్రతుకు నరకం కావటానికి వాళ్ళు కూడా కారకులయ్యారు. జబ్బులు సంకటాలు, కడుపులు, కడుపులు పోవటాలు, పుట్టీ పెరిగీ పోయే పిల్లలు – ఇవన్నీ ఆమె జీవితాన్ని మరింత దుర్భరం చేసాయి. జబ్బులు సంకటాలు భర్త వల్ల వచ్చినవై ఉండాలి. లేత వయసు కాపురం గర్భస్రావాలకు కారణమై ఉండాలి. పిల్లలు పుట్టి పెరిగి పోవటానికి భర్త పని చేసే జిల్లా గ్రామాలలో తగిన వైద్య సదుపాయాలు లేకనో, భర్త బాధ్యతా రాహిత్యం వల్లనో కావాలి. ఈ నిరంతర హింసాత్మక అనుభావాలు ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 

‘ముప్ఫయ్యో పడి సమీపించాక ఆమె జీవితం చక్క బడ్డది’ అంటాడు కధకుడు. చక్కబడటం అంటే ఏమిటి? పూర్తిగా లొంగిపోవటం. పదిహేను పదహారేళ్ళ కాపురంలో భర్త దెబ్బలవల్ల, గర్భస్రావాల వల్ల, పురుళ్ళ వల్ల, జబ్బుల వల్ల శరీరం చివికి పోయి .. అవమానాల వల్ల, పుట్టీ పెరిగిన పిల్లల మరణాలవల్ల, భర్త నిర్లక్ష్యం వల్ల కలిగిన దుఖ్ఖంతో మనసు అవిసిపోయి, మిగిలిన ఆరుగురు పసిపిల్లల కోసం బతక్క తప్పదని గుండె రాయి చేసుకొనటమే చక్కబడటం అంటే. అప్పటి ఆమె స్థితిని కధకుడు “పరరాజుతో పోరాటం సలిపి, సలిపి ఓటమి నంగీకరించిన రాజ్యలక్ష్మి ఆ రాజు పాలన క్రింద చల్లగా వర్ధిల్లినట్టు” అని వ్యాఖ్యానించటం గమనించదగింది. ఏడు పంక్తులలో సత్యవతమ్మ సంసార జీవితాన్ని వర్ణించి రెండు పంక్తులలో చేసిన ఈ వ్యాఖ్యానం ద్వారా కారా స్త్రీల జీవితం లోని హింసను,ఆరాట పోరాటాలను, ఓటములను, లొంగుబాట్లను అర్ధం చేసుకొనటానికి కావలసినంత అవకాశం పాఠకులకు కల్పించాడు.

కామేశం రిటైర్ మెంట్ ముందర సవతికొడుకు వచ్చి రిటైర్ మెంట్ వల్ల వచ్చిన డబ్బుతో తను ఉండే విశాఖపట్నంలోనే స్థలం కొని, పాక వేసుకొని ఒక భాగంలో ఉంటూ మరొక భాగం అద్దెకు ఇచ్చుకోమని ట్యూషన్ లు చెప్పుకొంటూ వచ్చేదానితో పిల్లలకు చదువు చెప్పించమని, తనకు చాతనైన సాయం చేస్తానని సలహా ఇస్తే అందులో మంచి తనకు కొంత అర్ధమైనా భర్తను సమ్మతింప చేయటానికి సత్యవతమ్మ ఏ ప్రయత్నమూ చేయలేదు. ఎందుకు చేయ లేదు? అంతకాలానికి పచ్చనవుతున్నతనబ్రతుకును మళ్ళా పొగలూ సెగలూ మధ్యకు ఈడ్వడం ఇష్టం లేక అంటాడు కథకుడు. కామేశం దృష్టి లో భార్య సలహాలిచ్చే సహచరి కాదు. తానేమి చేసినా చూస్తూ అనుసరిస్తూ జీవించవలసిన కట్టు బానిస. యజమానికి సలహాలిచ్చే సాహసం చేసే బానిస జీవితం నిప్పుల కుంపటే. తెలిసి తెలిసి కామేశాన్ని కదిపే సాహసానికి ఆమె ఒడి కట్టలేదు. అంతేకాదు. భర్త అన్న ఓకే ఒక బంధం వల్ల, దానిపట్ల తరతరాలుగా చూపవలసిన విశ్వాసం గురించిన బోధనలు ఒంటబట్టిన స్త్రీలకు ప్రతినిధిగా సత్యవతమ్మ అతనిలో స్వార్ధాన్ని కూడా అవసరమైనదిగా, అతి సహజమైనదిగా అనుకొనే స్థాయికి చేరుకొంటుంది. శేషమ్మ ఆరోపణలకు సమాధానం చెప్పే విఫలయత్నం ఆ క్రమంలోనే చేసింది.

 

పల్లెటూర్లో నెలకు నూరు రూపాయలుంటే రాజాలా గడిచిపోతుందని, అధమ పక్షం కూర్చొని తిన్నా పదేళ్ళు గడిపెయ్యగలను అని డంబాలు పలికిన భర్త నిర్వ్యాపారం వల్ల, జబ్బు వల్ల ఉన్నదంతా కరిగిపోయి .. తిండి గింజలకు, మందులకు, డాక్టర్ ఫీజులకు చేతిలో డబ్బాడక, ఒంటి మీద పుస్తే పుడకా పోగోట్టుకొన్న స్థితిలోనూ సత్యవతమ్మ భర్తను తప్పు పట్టలేక పోయింది. రూపాయి విలువ పడిపోవటం వంటి ప్రతికూల పరిస్థితులను తప్పు పట్టింది. నాలుగేళ్ళుగా చావటానికి సిద్ధంగా మంచంలో ఉన్న భర్త ఎగశ్వాస పెడుతుంటే మెడలో పసుపుతాడు వెతుక్కొని వణికే చేతులకు దొరికిన పసుపు కొమ్ము కళ్ళకద్దుకొనే విశ్వసనీయతకు రూపం ఆమె. ఆడవాళ్ళ ఈ అజ్ఞానం మీద, పరాధీనత మీద కారాకు ఉన్నఆగ్రహం ఈకథ ముగింపులో కనబడుతుంది. ఆరోజు ఆ వూళ్ళో జరిగిన పోలింగ్ లో చివరగా తన ఓటు వేసి సత్యవతమ్మ పోలయిన ఓట్ల సంఖ్యను వెయ్యికి పెంచింది. ఓట్లు లెక్కించిన ఆఫీసర్ ఆ విషయాన్ని గుర్తించి ‘ఆ అమ్మ ఎవరోగాని వెయ్యేళ్ళు పసుపు కుంకుమలతో వర్ధిల్లుతుంది’ అన్నాడు. ‘ఆ మనిషి హోదాలో చిన్నవాడైనా వయసులో పెద్దవాడు. ఆయన దీవన ఊరికనే పోరాదు’ అన్న వాక్యంతో కారా కథను ముగించాడు. వాస్తవాలతో సంబంధం లేకుండా చిరకాలం పసుపు కుంకుమలతో వర్దిల్లటం అనే దానిని నిరపేక్ష విలువగా నమ్మి ప్రవర్తించే మానవ ప్రవృత్తిని వ్యంగ్యమానం చేసాడు.

ఈ కథ ఇతివృత్తంలో మరొక ముఖం పన్నెండేళ్ళ కామేశ్వరి ద్వారా ఆవిష్కృతం అవుతుంది. బడికి పోయి చదువుకోవలసిన వయసులో ఆ పిల్ల తల్లికి ఇంటి పనిలో తోడయింది. బియ్యంలో రాళ్ళేరటం, బావి నీళ్ళు తోడి గోలెం నింపటం, తల్లి ఇంటలేని సమయంలో జబ్బుపడ్డ తండ్రిని కనిపెట్టుకొని ఉండటం – ఇవి ఆపిల్ల చేసే పనులు. ఇంట్లో వ్యవహారాలు అర్ధం అవుతుంటే వర్తమానం, భవిష్యత్తు కలగాపులగంగా ఆ పిల్ల ఆలోచనలలో సుడులు తిరుగుతుంటాయి. జీవితం పట్ల పిల్లలకు ఉండే సహజ కుతూహలం కామేశ్వరిలో ఉంది. శేషమ్మ తన నాయనమ్మ, మేనత్తల గురించి తండ్రి మొదటి భార్యగురించి, ఆమె పిల్లల గురించి చెప్తున్న విషయాలు విన్నది. తండ్రి మొదటి భార్యను చావకొట్టిన విషయం ఆ పిల్లకు వింతగా, కొత్తగా అనిపించకపోయి ఉండవచ్చు. కానీ తన ఈడులోనే చిన్న మేనత్తకు పెళ్లి అయిందని తెలిసి ‘అంత చిన్నప్పుడే పెళ్ళా’ అని ఆశ్చర్య పడింది. శేషమ్మ తండ్రి ప్రవర్తనను, ప్రవృత్తిని నిరసిస్తూ మాట్లాడుతుంటే తల్లి తల ఎత్తకుండా మధ్య మధ్య కన్నీళ్ళు తుడుచుకుంటున్న సందర్భంలో ఆమె స్థితిని వ్యాఖ్యానించే ‘కామేశ్వరికి అమ్మమ్మగారు శత్రువో మిత్రమో తెలియడం లేదు’ అన్న వాక్యం ఒకటి ఉంది. తల్లికి మాట సాయంగా వచ్చింది కనుక, తండ్రిలోని స్వార్ధ బుద్ధిని, దురహంకారాన్ని ఏకి పారేసింది కనుక మిత్రమనే అనుకొని ఉంటుంది. తల్లి మీద కోపగించి మాట్లాడటం తల్లి కన్నీళ్లు పెట్టటం బహుశ ఆమెను శత్రువు అనుకొనేట్లు చేసి ఉంటాయి.

అంటే కామేశ్వరికి తల్లి పట్ల సానుభూతి, తండ్రి పట్ల వైమనస్యం ఉన్నాయనుకోవాలా? ఉన్నాయనే సూచనలు కథాగమనం లో కనబడతాయి. కథ ప్రారంభంలోనే తండ్రి కనపడగానే కామేశ్వరి చప్ న తల తిప్పేసుకొనటం చూస్తాం. అది చాలు ఆమెకు తండ్రి పట్ల ఉన్న వ్యతిరేక భావం అర్ధం కావటానికి. వెనువెంటనే తల్లి గురించి ఆమె ‘రోజురోజుకూ చిక్కిపోతున్నట్టు కనబడుతున్నది’ అనుకొనటం తల్లిని ఎంత పరిశీలనగా చూస్తుందో తెలుపుతుంది. తల్లి ఓటు వెయ్యడానికి వెళ్తూ తండ్రికి కాపలా పెట్టింది. గుమ్మంలో తల్లి లాగే కూర్చొని ఉన్న కామేశ్వరికి వీధి వాకిట్లో ఆడుకొంటున్న తమ్ముడు శంకరం పక్కింటి అబ్బాయితో తాము విశాఖపట్నం వెళ్లిపోతామని చెప్పటం వినబడింది. ఎప్పుడు అన్న ఎదుటివాడి ప్రశ్నకు శంకరం గొంతు తగ్గించి ఇచ్చిన సమాధానం వినబడక పోయినా ఊహించ గలదు. తండ్రి మరణంతో గానీ అనివార్యం గా తమకు ఆ అవసరం రాదు.

 

తండ్రి మరణం గురించిన ఆలోచనలు లోలోపల కదలుతుంటే తండ్రి గుండె ఆగి పోయిందేమోనని పదే పదే చూస్తూ తన పాపపు ఆలోచనలకు తనను తానే మందలించుకొంటుంది. బతికి ఉన్న మనిషి మరణాన్ని ఊహించటం పాపమని లోకం చెప్పింది. అది వినీవినీ పెరిగిన పిల్ల కనుక పాపపు ఆలోచనలంటే భయపడుతుంది. అటువంటి ఆలోచనలు చెయ్యరాదని అనుకొంటుంది. అయినా ఎంత ప్రయత్నించినా వాటి నుండి తప్పుకోలేక యాతన పడుతుంది. అటువంటి సమయంలో తన తల్లికి కూడా తన ఆలోచనలవంటి ఆలోచనలొస్తాయా అన్న ఆలోచనలో పడుతుంది. రావచ్చు అని అనుమానo ఉన్నా రావనే సమాధాన పడుతుంది. కానీ నమ్మకం మాత్రం కుదరదు. తండ్రి చనిపోయి దిక్కులేని వాళ్లై అన్న దగ్గరకు వెళితే ఎలా ఉంటుందన్నంత వరకు ఆ పిల్ల ఊహలు పరుగెడుతూనే ఉంటాయి. తన నియంత్రణలో లేని ఈ ఆలోచనలతో వేగిపోతూనే తండ్రి కదులుతూ నాలుకతో పెదవులు తడుపుతుంటే గ్లూకోస్ నీళ్ళు తెచ్చి పోసింది. అవి తాగి మగతగా కన్నుమూసిన కామేశాన్ని చూస్తే ‘తండ్రి మరి చావడు’ అనిపిస్తుంది. అది ఆమెకు ధైర్యాన్ని ఇచ్చిందా, నిస్పృహకు లోను చేసిందా అన్నప్రశ్న వస్తే పరిస్థితులు, ఆ పిల్ల మానసిక ఉద్విగ్నస్థితి రెండవ దానినే సమాధానంగా స్ఫురింప చేస్తాయి. ఎవ్వరి సహాయం లేకుండా తమ బతుకు తాము బతకాలన్న ఆశ, విశ్వాసం కామేశ్వరిలో చూపాడు కారా. సత్యవతమ్మలో లేని గుణం అది. బాధలలో, బానిసత్వంలో క్రుంగిపోయే గతం సత్యవతమ్మ. బాధలలో నుండి పైకెగసి స్వతంత్రులం కావాలన్న భవిష్యత్ ఆశ కామేశ్వరి.

ఈ కథ ఎన్నికల హడావుడి నేపధ్యంలో నడుస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కీలకమైనవి ఎన్నికలు. చైతన్యవంతమైన ప్రజల వివేకవంతమైన ఎంపిక దానికి జీవశక్తి. స్వతంత్రం వచ్చిదశాబ్దం దాటినా దేశ ప్రజాస్వామ్యం ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్య వ్యవస్థగా సారవంతం కాలేదు. సత్యవతమ్మను ఓటు వెయ్యటానికి రమ్మని వెంట పెట్టుకు పోవటానికి నక్షత్రకుడి వలే ఒకడు వచ్చి వాకిటి ముందు కూర్చొనటం దానినే సూచిస్తుంది. సత్యవతమ్మ వలెనే జీవన సమస్యల వలయంలో పడి కొట్టుకొంటున్న చాలామంది జనం అయిదేళ్ళకొకమారు వచ్చిపోయే ఎన్నికల పట్ల నిర్లిప్తులు. వాడూ, వాడూ వచ్చి రారమ్మని ఒత్తిడి పెడితే తప్పనిసరి అయ్యో మొహమోటానికో వెళ్లి ఓటేసి వస్తారు. శేషమ్మ, ఆమె కోడలు పొద్దున్నే వెళ్లి ఓట్లు వేసి వచ్చి ఆతరువాత వంట వార్పూ చేసుకొన్నారు. ఎవరికీ ఓటు వెయ్యాలనిగానీ, ఎవరికి వేస్తే తమకు గ్రామ ప్రజలకు మేలు జరుగుతుందని గానీ వాళ్ళు ఆలోచించినట్లు కనపడదు. జబ్బు పడి మంచం లో ఉన్న భర్తను చూసుకొంటూ సాయంత్రం వరకు ఓటు వెయ్యటానికే వెళ్ళలేకపోయిన సత్యవతమ్మ ఓటు ఎవరికీ ఎందుకు వెయ్యాలని ఆలోచించటం అసలు జరగని పని. కానీ అందరూ వెళ్లి ఓట్లు వేసి వచ్చారు. అంటే ఎవరికీ ఓటు వెయ్యాలో ఎవరో చెప్పి పెడితే దానిని వేసి వచ్చారనుకోవాలి. తమ ఓటుతో అధికారంలోకి వచ్చేవాళ్ళకు తమ జీవన స్థితిగతులను మెరుగుపరిచే బాధ్యత వున్నదనిగానీ, అందుకోసం తాము వాళ్ళను నిలదీయ వచ్చనిగానీ ఊహకే రాని అనేకమందికి వాళ్ళు ప్రతినిధులు. ఈ పరిస్థితులలో ప్రజాస్వామ్యం భ్రమ తప్ప మరేమికాదు.

 

పోలింగ్ బూత్ దృశ్యాన్ని చూపి కథ చివరలో కాళీపట్నం రామారావు చేసిన వ్యాఖ్యానం దానినే సూచిస్తుంది. “టైమయ్యాక తలుపులు వేసుకొన్న పోలింగ్ ఆఫీసర్లు శాస్త్రోక్తంగా ఉత్తర విధులు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు మాట్లాడే తీరూ, కదలికా అర్దరాత్రి ఇంట్లో పడ్డ దొంగల చందంగా ఉంది”— ఉత్తర విధులు అంటే పోలింగ్ పూర్తయ్యాక చేసే పనులు అన్న ప్రస్తుతార్ధాన్ని చెప్తూనే మరణానంతర కర్మలు అన్న భావాన్ని వ్యంగ్యమానం చేస్తుంది. ఇంట్లోపడ్డ దొంగలచందం అన్నమాట పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలు సంతరించుకొన్న దోపిడి స్వభావాన్ని సంకేతిస్తుంది. అంతిమంగా ఈ కథ స్త్రీల భాగస్వామ్య పాత్రతో నిమిత్తం లేకుండా నడిచే కుటుంబ వ్యవస్థను, ప్రజల చైతన్యవంతమైన భాగస్వామ్య పాత్రతో నిమిత్తం లేకుండా నడిచే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని సమాంతరంగా చూపి అవలక్షణాలతో కునారిల్లుతున్న వాటిని దీర్ఘ కాలం వర్ధిల్లాలని వాంఛించటం లోని అసంబద్ధతను గురించి హెచ్చరిస్తుంది.

మహదాశీర్వచనం కథను 1948 లో కొడవటిగంటి కుటుంబ రావు రాసిన ‘నిజమైన అపచారం’ కథతో కలిపి చదువుకోవాలి. జీవితంలో సుఖమన్నది ఎరుగక నానా కష్టాలు పడి చచ్చి స్వర్గానికి వెళ్ళిన కనకమ్మ కేసు విచారణ ఆ కథ. భూలోకంలో ఆమె పట్ల ఇతరులు చేసిన అపచారాల విచారణ అది. ఆ విచారణలో ఆమె క్షయ వ్యాధితో తీసుకొంటూ భర్త వైద్యం కోసం తన ఒంటి మీద నగలు అమ్మిన విషయం చెప్తుంది. అతను తన నగలు అమ్మకపోతే తానూ తనపిల్లలూ అంత త్వరగా ఆకలికి మాడి చచ్చేవాళ్ళం కాదంటుంది. ఆ నగలు అమ్మకముందే భర్త చచ్చిపోయి వుంటే తానూ తన పిల్లలు రెండేళ్ళు ఆలస్యంగా చచ్చేవాళ్ళమని, ఈ లోగా పిల్లలు కాస్త రెక్కలు వచ్చి ఏ మూటలు మోసి అయినా తమ బతుకు తాము బతకగలిగే స్థితికి వచ్చేవాళ్ళని వాపోతుంది. ఆ నాటి కనకమ్మ చచ్చింది కనుక తన ఆంతర్యాన్ని బయట పెట్టగలిగింది. బతికే ఉంది కనుక సత్యవతమ్మకు ఆంతర్యాన్ని బయట పెట్టే అవకాశం లేదు. తండ్రి చావుకు సంబంధించిన ఆలోచనలు తల్లికి రావా అని కామేశ్వరి వితర్కించుకొన్న విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అతని వైద్యానికి పుస్తెని అమ్ముకొన్నా అతను కిందట్టు మీదట్టు అవుతుంటే ప్రత్యామ్నాయంగా కట్టుకొన్నపసుపుకొమ్మును కళ్ళకద్దుకొనే లోకశిక్షణ నుండి తయారయిన పతివ్రత ఆమె. దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లమని పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన దీవన ఆమె పాలిట వరమా శాపమా ఆలోచించమని పాఠకుల వివేకానికి వదిలేసాడు కారా.

 

అలాగే ఈ కథ స్త్రీల జీవితాలకు సంబంధించిన పాత నిర్వచనాలను, విలువలను ప్రశ్నించిన ధిక్కరించిన, పునర్నిర్మాణానికి పూనుకొన్న స్త్రీల స్త్రీవాద కథతోనూ కలిపి చూడవలసినది. స్త్రీ సమస్య, కుటుంబ సమస్య వేటికవిగా ఉండవు, ఆర్ధిక రాజకీయ సమస్యల సంబంధంలోనే వాటిని అర్ధం చేసుకోవాలి, పరిష్కరించు కోవాలి అన్న కారా మాష్టారి శాస్త్రీయ దృక్పధo దీనిని మంచి కథగా చేసింది. ఇది ఇప్పటికి 47 సంవత్సరాల క్రితం వచ్చిన కథ. ఒక జాతి జీవనంలో దాదాపు అర్ధ శతాబ్ది కాలం అంటే తక్కువ కాదు. సామాజిక మార్పులు అనేకం వచ్చాయి. మధ్యతరగతి చైతన్యంలోనూ పరిణామం చోటు చేసుకొన్నది. ప్రజా ప్రయోజనాల రీత్యా చట్ట సవరణలు జరిగాయి. కొత్త చట్టాలు వచ్చాయి. ప్రజాసంక్షేమ విధానాలు రూపొందాయి. సంక్షేమ పధకాలు అమలులోకి వచ్చాయి. ప్రపంచీకరణ ఫలితంగా వచ్చిన నూతన ఆర్ధిక విధానాలు, ఒప్పందాలు ప్రజా జీవితంపై వేసిన ప్రభావం తక్కువది కాదు. అయితే ఇదంతా ఏ మంచికి దోహద పడుతుందో ఎవరి ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నదో స్పష్టం గా తెలుస్తూనే ఉంది. సంస్కరణలు ఎన్ని వచ్చినా కుటుంబ అధికార వ్యవస్థలో గానీ, రాజ్యాధికార వ్యవస్థలో గానీ మౌలికమైన మార్పులు ఏమీ రాలేదు. మానవ సంబంధాలు ఆశించినంతగా ప్రజస్వామికo కాలేదు. అన్ని రంగాలలో మానవీయ విలువల కోసం యుద్ధం అనివార్యమవుతున్న పరిస్థితులలో ‘మహదాశీర్వచనం’ కథా వస్తు జీవిత సంఘర్షణల నుండి, సందర్భం నుండి ఎంత దూరం ముందుకు రాగలిగామో పరీక్షించుకోవలసే ఉంది.

                                                                                             –కాత్యాయనీ విద్మహే

vidmaheసాహిత్యలోకంలో సగం’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకొన్న కాత్యాయనీ విద్మహే సాహితీ లోకానికి సుపరిచితులు. పై అవార్డుతో బాటు ఎన్నో అవార్డులను అందుకొన్న కాత్యాయనీ 26 పుస్తకాలకు సంపాదకులుగా ఉన్నారు. 1980లో ‘రాయప్రోలు వంగమయ జీవిత సూచిక’ దగ్గర నుండి 1994 లో ‘మహిళా జనజీవన సమస్యలు మూలాల అన్వేషణ’, 1995లో ‘తెలుగు నవల కథానిక విమర్శా పరిణామము’, 1998 లో ‘సాంప్రదాయ సాహిత్యం – స్త్రీవాద దృక్పధం’, 2013లో ‘ప్రాంతీయ చైతన్యం – తెలంగాణా సాహిత్యం’ వరకూ మొత్తం 20 పుస్తకాలను ఆమె రాశారు. ఇవి కాక 25 పుస్తకాలకు సమీక్షలు, 24 పుస్తకాలకు ముందు మాటలు రాశారు.

మొదట్లో యద్దనపూడి సులోచనా రాణి, రంగనాయకమ్మలను ఇష్టంగా చదివిన కాత్యాయనీ రంగనాయకమ్మ నవలల ప్రభావం కొత్త చూపునూ స్త్రీ పురుష సమన్వయపు ఆలోచనను ఇచ్చాయని అన్నారు. కొడవటిగంటి, రావిశాస్త్రి, కారా, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, పి. సత్యవతి, ఓల్గా – ఇలాంటి వాళ్ళ రచనలు విస్తృత జీవితాన్ని, బహుముఖ జీవిత పార్శాలను పరిచయం చేశాయని అంటున్నారు. వరవరరావు, త్రిపురనేని మధుసూధనరావు ఉపన్యాసాలు, వ్యాసాలు .. సాహిత్యాన్ని, సమాజాన్ని అర్ధం చేసుకొని విమర్శనా దృష్టిని అభివృద్ధి చేశాయని అన్నారు.

జీవితాన్ని ప్రేమించిన మనుషుల సృజన, విమర్శ, సాహిత్యం, ఆచరణ ఇచ్చే జీవశక్తి నుండి ఈ తరం రచయితలు పుష్టివంతం కావాలని కోరుకొంటున్నారు కాత్యాయనీ .

వచ్చే వారం ‘చావు’ కధ గురించి వినోదిని

మహదాశీర్వచనం కథ ఇక్కడ:

వాళ్ళు ముగ్గురేనా ?

Kadha-Saranga-2-300x268

‘‘ పులిమీదికెక్కి సవారిజేసుడు రాకుంటె, దాని ముంగటి కెందుకు పోవాల్నంట నేను. నిన్ను జూసి అది అయ్యో పాపం అని దయదల్చి తినకుంట ఊకుంటద’’ మసాజ్‌ టేబుల్‌ పై పడుకుని కళ్ళుమూసుకున్న చిత్రకళ ఈ మాటకి కళ్ళు తెరిచి చూసింది. యాదమ్మ చేతి వేళ్ళు చిత్రకళ వంటిపై, తమాషాగా నాట్యం చేస్తుండగా, నోటినిండా పాన్‌ నములుతూ, కొంచం గమ్మత్తుగా అందీ మాటలు యాదమ్మ. ఈ మాటలే కాదు వాటికన్నా ముందు ఆమె అప్పుడప్పుడూ చెబుతూ వుండే సరస జీవితం కూడా ఆమెనీ మధ్య నిలవనీయడం లేదు.  ఆ మసాజ్‌ టేబుల్‌ పై గంటో గంటన్నరో అట్లా వళ్ళంతా క్రీముపూసిన శరీరాన్ని ఆమెకి అప్పగించాక, ఆమె చేతి వేళ్ళ భాషనే కాదు, ఆమె మాటల హోరును కూడా విని మెల్లిగా అర్ధం చేసుకోవడం మెదలు పెట్టింది చిత్రకళ.
‘‘ యాదమ్మా! ఇట్లానే అందరితో మాట్లాడుతుంటావా?’’ అడిగిందోసారి.
‘‘ అందరు నీ లెక్కనే వుంటర? నేను జెప్తున్న. నువ్వింటున్నవ్‌. నా మాటలు నీకు సమజవుతున్నయి గాబట్టే నాకుబీ చెప్పబుద్దయితది.’’ అంది యాదమ్మ.
వట్టిమాటలే కదా అనుకుంటాం కానీ, మనకేం సంబంధం లేని మాటలు కూడా మన అంతరాంతరాళ లోకెళ్ళి, మనల్ని కల్లోల పరుస్తాయి.
దాదాపు నాలుగేళ్ళుగా ఆ జిమ్‌కి క్రమం తప్పకుండా వస్తుంది చిత్ర. దాన్లోనే వుండే స్పాలో తన అందానికి మెరుగులు దిద్దుకోవటంతో పాటూ , మసాజ్‌
చేయించుకుంటుంది. అందుకేనేమో ముఫ్పఏడేళ్ళ వయసులోనూ, ఇంకా యవ్వనపు మెరుపు ఆమెలో తగ్గలేదు.
యాదమ్మలోనూ ఏదో తెలీని ఆకర్షణ వుందనుకుంటుంది చిత్రకళ. రెండు చేతులకీ నిండుగా మట్టిగాజులు, చెవులకి పెద్ద దిద్దులు, ముక్కుపుడక, కాళ్ళకి
గంటీలు, గోళ్ళకి రంగు, అరచేతుల్లో అప్పుడప్పుడు ఎరట్రి గోరింటాకు, మధ్యమధ్య మెరిసే తెల్ల వెంట్రుకలతో ముడేసిన వత్తయిన జుట్టు, చామనచాయ
రంగు, వయసుతో పాటూ పెరిగిన శరీరపు బరువు, కళకళలాడే నవ్వు మొఖంతో పలకరించే యాదమ్మ,  సూటిగా, జంకుగొంకూ లేకుండా మాట్లాడటం చిత్రకళకి ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటుంది. ఆమెలా తను మాట్లాడగలనా, ఆమెలా నాజీవితం నా ఇష్టం మీకెందుకని అనగలనా? పైకి ఖాతరు లేనట్లుగా కనపడే, తనలోపల నిత్యం సుళ్లుతిరుగ్నుతూ వుండే ఆత్మనిందని ఆపగలనా? అనిపిస్తుంది యాదమ్మని చూసినప్పుడల్లా.

యాదమ్మ మొన్నామధ్యే కొడుక్కి పెళ్ళి చేసింది. వెంటనే కొడుకునీ, కోడల్నీ వేరుకాపురానికి పంపింది.
‘‘ అదేం, నీకొక్క కొడుకే కదా! ’’ అంది చిత్ర కొంచం ఆశ్చర్యంగా.
‘‘ గా రెండు అర్రల ఇంట్ల, తల్లి ముంగట పెండ్లాంతో సరసమేం జేస్తడు. అత్త ఆరడి బెడ్తదన్న నింద నాకెందుకు. కిందబడ్డ, మీదబడ్డ ఎవరి సంసారం వాల్లు
ఎల్లదీసుకొనుడు ఒక్కసిత్తం’’  అంది యాదమ్మ. ఆ మాటొక్కటే అంటే  చిత్రకళకి ఏమనిపించేది కాదు.

‘‘ నా కోసం నా ఇంటికొచ్చెటోడు నాకున్నడు. కోడలి పోరి ముందు నేనెందుకు నెత్తిదించుకొనుడు’’ అని కొంటెగా కన్నుగీటి నవ్వింది.

యాదమ్మది మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట దగ్గరి పల్లెటూరు. పురిటిలోనే ఐదారుగురు పిల్లలు చనిపోయాక, లేక లేక పుట్టిన పిల్లేమో, చిన్నప్పుడు
గారాబంగానే పెరిగింది. కూలిచేసుకు బతికే కుటుంబం కాబట్టి కాయకష్టం ఆమెకి కొత్తకాదు. యాదమ్మ పెళ్ళి నాటికే తల్లిదండ్రులిద్దరూ ముసలివాళ్ళయి
పోయారు. మరో కూలివాడితో ఆమె పెళ్ళయింది. అందరిలానే ఆమెకూడా భర్తతో పాటూ,  ఊరువిడిచి పెట్టి, కూలి పనులకోసం హైదరాబాద్‌ నగరానికొచ్చింది. అక్కడే ఒక కొడుకు పుట్టాడు. వాళ్ళు పనిచేసే భవంతులవద్దే, రేకులు, ప్లాస్టిక్‌ పట్టాలతో కట్టిన షెడ్లలో ఆమె కాపురం సాగింది. తొమ్మిదో అంతస్తు వద్ద, మోకులు కట్టిన ఉయ్యాలపై కూర్చొని పనిచేస్తున్న యాదమ్మ భర్త ఎట్లా  పడ్డాడో, కిందపడి అక్కడిక్కడే చనిపోయాడు ఓరోజు. ఏడాది కొడుకును వొళ్ళోవేసుకుని, గుండెలు అవిసేలా తలుచుకొని, తలచుకొని  ఆమె ఏడ్చింది. యాభయి వేలు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నాడు కాంట్రాక్టరు.
యాదమ్మ మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి  చేరింది. ఇప్పుడు కొడుకుతో పాటూ ముసలివాళ్ళిద్దరినీ పోషించే భారం ఆమె మీదే పడిరది. కూతురు బతుకు
బండలైపోయిందన్నదిగులు తో  యాదమ్మ తండ్రి ఏడాది తిరక్కుండానే చనిపోయాడు. ఉన్న ఊర్లో బతుకులేక, ఊర్లోవాళ్ళతో పాటూ ఆమె మళ్ళీ వలసకూలీ అయింది. తట్టలు మోసింది. రోడ్లు ఊడ్చింది. ఇండ్లలో పాచిపనులుచేసింది. రోజుకూలీగా రాజకీయపార్టీల మీటింగుల కెళ్ళింది. అట్లా అనేక పనులు చేసి, చివరికి ఎవరి కాళ్ళో పట్టుకుని, ప్రకృతి వైద్యశాలలో ఊడ్చే పని సంపాదించుకుంది. కొన్నాళ్ళకి  మసాజ్‌ చేయడం నేర్చుకుని, చివరికి నెల జీతం సంపాదించుకునే ఉద్యోగాస్తురాలైమ్ది. . తలలో తెల్లవెంట్రుకలు మెరిసే గడసరిగా, ఎప్పుడూ చలాకీగా, నవ్వుతూ వుండే యాదమ్మగా మారే క్రమంలో ఏ ఆనంద విషాదాలు ఆమెలో ఏ పెనుతుపానులను సృష్టించి వుంటాయి? తనలా కాకుండా, వాటిగురించి ఆమె సంకోచం లేకుండా మాట్లాడగలదేమో నని అనుకునేది చిత్రకళ.

‘‘ మంచి బందోబస్తు గుంటది పోరి. కష్టంజేస్తది. మొగోడు తోడు లేనిదే అది వుండుడు కష్టమని పిస్తది.’’ అంది సరస గురించి ఒకసారి యాదమ్మ. సరస
తమిళ పిల్ల. కానీ తమిళ యాసతో తెలుగు బాగానే మాట్లాడుతుంది. మద్రాసు నుండి తిరుపతికి వాళ్ళ కుటుంబం వలస వచ్చింది. తండ్రి తోపుడు బండి
పెట్టుకొని, ఇడ్లీలు, దోసెలు అమ్ముకుని సంసారం వెళ్ళదీసే వాడు. తెగిన గాలిపటంలా ఎక్కడెక్కడ ఎగిరి, ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో కానీ ఎనిమిదేళ్ళ
క్రితం ఆమె యాదమ్మ వాళ్ల బస్తీ కొచ్చింది. పాతికేళ్ళ యవ్వనంతో తళతళలాడుతూ హుషారుగా వుండే సరస, యదమ్మ ఇంటి పక్క గది అద్దెకు తీసుకుంది. ఒకటి, రెండు గదులతో ఏడు పోర్షన్లు వుండే ఆ కాంపౌండులో సరస అందరి ఆకర్షణకీ కేంద్రమైంది. ఎత్తుచెప్పులు, చేతికి హ్యాండ్‌బ్యాగు, గోళ్ళరంగు, చెవులకి కొత్త కొత్త జుంకాలూ తగిలించుకుని ఏదో ఫ్యాక్టరీలో డ్యూటీ చేసేందుకెళ్లేది. అద్దె వసూళ్లకి వచ్చే ఇంటి ఓనరుకి ఠంచనుగా అద్దె ఇచ్చేది. అందరితో కలుపుగోలుగా వున్నా తనగురించి ఎవరైనా  అడిగితే మాట దాటేసేది. చేబదుళ్ళనో, యాభయ్యో, వందో అప్పనో ఎవరైనా అడిగింతే, అడిగిందే తడవు, కాదనకుండా ఇచ్చేది. గదిముందు రెండు గులాబీ పూల కుండీలు, గది తలుపుకు నీలం, తెలుపు పూల కర్టెను వేలాడే ఆ ఇంటి లోపల కూడా ఎంతో పొందికగా వుండేది. పనిపాటలు చేసుకు బతికే ఆ కుటుంబాల మధ్య ఆమె కాస్త భిన్నంగా వుండేది. అందుకేనేమో చుట్టు పక్కల వాళ్ళు ఆమె పట్ల కాస్త, ఆదరంగానే వుండే వాళ్ళు. అందర్లోకీ యాదమ్మ దగ్గరే  సరసకి ఎక్కువ దగ్గరితనం, చనువు ఏర్పడ్డాయి. తల్లి చనిపోతే, తండ్రి వేరే పెళ్ళి చేసుకున్నాడనీ, ఆ వచ్చినామె చాలా గయ్యాళిదనీ, నానా హింసలూ పెట్టేదనీ, కొన్నేళ్ళు పిన్ని దగ్గరున్నాననీ, బాబాయి ప్రవర్తన మంచిది కాదనీ, అక్కడ వుండలేక, ఒక స్నేహితురాలి సహకారంతో, హైదరాబాద్‌ వచ్చానని యాదమ్మకి చెప్పుకుంది.

ఓ ఏడాది తరువాత, ఆమె వయసే వుండే ఒక అబ్బాయి ఆమె ఇంటికి రావడం ప్రారంభించాడు. వాళ్ళిద్దరూ సినిమాలకీ షికార్లకీ తిరుగుతూ వుంటే
యాదమ్మే ఓరోజు పెద్ద మనిషిలా ‘‘ పోరడు చక్కగున్నడు. ఇద్దరికి ఈడూ జోడు కుదిరింది. పెళ్ళి చేసుకోరాదు’’ అంటూ సరసకి సలహా ఇచ్చింది. యాదమ్మ మాటలకి నవ్వి ఊరుకుంది సరస. కానీ, మరోమూడు నెలలకి ఆ పిల్లవాడు సరస గదికే తన సామాన్లు పట్టుకొచ్చుకున్నాడు. సరస మెడలో కొత్తగా పసుపుతాడు వచ్చి చేరింది. యాదమ్మే వాళ్ళిద్దరినీ తనింటికి భోజనానికి పిలిచి, సరసకి చీర పెట్టింది. నిజం చెప్పాలంటే సరసకన్నా ఆ పిల్లవాడు అందగాడు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతను అమలాపురం నుండీ సినీ అవకాశాలను వెతుక్కుంటూ వచ్చాడని సరస చెప్పింది. ఆరు నెలల తరువాత అతని స్టూడియోలకి దూరమవుతుందని అంటూ, సరసా వాళ్లు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అయినప్పటికీ వీలు చేసుకొని అప్పుడప్పుడూ యాదమ్మ దగ్న్గరకి రావడమో, ఫోన్‌ చేయడమో చేసేది సరస. ఆ తరువాత మెల్లిగా ఆమెతో సంబంధాలు తెగిపోయాయి. దాదాపు ఏడాది తరువాత, మూడు
నెలల పసిబిడ్డని ఎత్తుకుని, యాదమ్మ ఇంటికొచ్చింది సరస. పిల్లవాడికిపాలిస్తూ, ఏడుస్తుంటే, ఆమె కన్నీళ్ళు వాడి నుదిటి మీదా, బుగ్గలపైనా
పడ్డాయి. ఆమె ఎక్కువ వివరాలు చెప్పకుండానే  అర్ధమైంది యాదమ్మకి. వాడు ఆమెని వదిలి పెట్టి వెళ్ళిపోయాడని. ఎక్కడుంటాడో తెలియని వాడ్ని వెతకలేక, కనీసం ఆమె తండ్రి వివరాలన్నా చెప్పమని అందరూ కలిసి సరసని వత్తిడిచేసారు.
చివరికా తండ్రి, తనకా పిల్లతో ఎలాంటి సంబంధం లేదని, తన కూతురు ఎన్నడో చచ్చిందనుకున్నానని, తేల్చి చెప్పేసాడు. ‘‘ నాకెవ్వరూ లేరు’’ అంటూ,
గుండెలు పగిలేలా ఏడుస్తున్న సరసని ఓదార్చటం ఎవరితరం కాలేదు.  పాత సామాన్లు పెట్టుకునే తడికెల పాకని శుభ్రంచేసి, సరస వుండేందుకు చోటు
కల్పించాడు ఇంటి ఓనరు. చుట్టు పక్కల వాళ్ళంతా తలా కాస్త చందాలేసుకుని, అద్దె కట్టి, రెండు, రెండు,మూడు నెలలకి సరిపడేలా బియ్యం, పప్పులు
కొనిచ్చారు. సరస తన మెడలో పసుపు తాడుకు వేలాడుతున్న బంగారపు మంగళసూత్రపు బిళ్ళ  ఇస్తే, పక్కింటి వాళ్ళు అమ్మిపెట్టి, ఆమె చేతిలో
డబ్బులు పెట్టారు. ఇప్పుడా కాంపౌండులో సరసకి ఇంతకు ముందులా ప్రత్యేకమైన గుర్తింపేమీ లేదు. పగిలి నెర్రలుబారిన పాదాల గురించి, మట్టిచేరినవేలి గోళ్ళగురించి పట్టించుకునేంత తీరిక ఆమెకి లేదు. ఇప్పుడా ఇంటి వాకిలికి నీలం పూల కర్టెన్‌ వేలాడటంలేదు. పూల కుండీల ఊససలే లేదు.
పక్కింట్లో వుండే ఓ ముసలమ్మకి నెలకి ఆరొందలిచ్చి , ఆమె దగ్గర  కొడుకును వదిలి పెట్టి, పనికెడుతుంది సరస. యాదమ్మ తనకు తెలిసిన మేస్త్రీతో మాట్లాడి, తట్టలు మోసే పని ఇప్పిచ్చింది. కానీ ఆ పని ఎక్కువ కాలం చేయలేక, ఇళ్ళలో పాచి పనులు, వెతుక్కుంది. కొడుకు మూడేళ్ళ వాడయ్యాడు. సరస జీవితం కాస్త తెరిపిన బడ్డట్లయింది.

‘‘ ఉప్పుకారం తిన్న శరీరమాయె. ఊకోమంటే అది ఊకుంటద? శివసత్తులు సిగమూగినట్లు, వయసు మనల దుంకులాడిస్తది.’’ అంది యాదమ్మ. అట్లా ఆమె, సరస కూడా దుంకులాడిన వైనాన్ని, చిత్రకళకి తమాషాగా చెప్పిందొక సారి యాదమ్మ.

ఆవిరి పొగలు కక్కుతున్న అద్దాల గదిలో కూర్చుని స్టీమ్‌బాత్‌ చేస్తున్న చిత్ర, తన అర్ధనగ్న్న శరీరం వైపోసారి చూసుకుంది. దేహం అంటే ఏమిటి? దాని చుట్టూ ఇంత మంది పోగవుతారెందుకు? మనసెందుకు ఎప్పుడూ, గాలిలో పెట్టిన దీపంలా రెపరెప లాడుతుందెందుకు? దేహమూ, బుద్థీ, మనసు మనిషి జీవించినం కాలం ఎన్నడూ కలవని సమాంతర  రైలుపట్టాల్లా  సాగ్తాయని పిస్తుంది చిత్రకి. ఈ అందమైన వంపులు తిరిగిన శరీరాన్నీ, మనసును, చురుకైన బుద్దినీ తన స్వాధీనం లోకి తెచ్చుకునేందుకు తను ఎలా ప్రయాసపడేదో గుర్తుకొచ్చింది చిత్రకి. శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా వుంచుకోవడం, పెదవులపైన చిరునవ్వును ఎన్నడూ చెదరనీయక పోవడం, కించిత్‌ విసుగు, దిగులు, విషాదాలు, ఏవీ కూడా మెఖం పైన కనబడనీయక పోవటం, చలాకీగా, ఆకర్షణీయంగా మాట్లాడటం ఇవన్నీ, అనేక ఏళ్ళుగా కృషి చేసి సాధించిన విద్యలు. తన ఆలోచనలు ఇప్పుడెందుకో నియంత్రించలేని నయాగారా జలపాతంలా లోలోపల ఎగిసి పడటాన్ని గమనిస్తోంది చిత్ర.

ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరులో పదోతరగతి వరకూ చదువుకుంది చిత్ర. తండ్రి, ఓ స్కూల్లో డ్రాయింగ్‌ టీచరుగా పనిచేస్తూ, ఆ జీతం చాలక మరో
స్నేహితుడితో కలిసి, పెళ్ళిళ్ళలో వీడియోలు తీస్తూవుండే వాడు. ఎంసెట్‌ కోచింగ్‌ కోసం, విజయవాడలో ఓ పేరున్న కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించాడు
తండ్రి. ఇంజనీరింగులో సీటు సంపాదించి, ఏ అమెరికాకో వెళ్ళి బాగా సంపాదించాలనీ, అలా తమ ఆర్ధిక స్థితి మెరుగు పడాలనీ, తల్లి ఆశ పడేది.
నిరాడంబరత్వం, ఆదర్శాలు మాట్లాడే నెమ్మదైన తండ్రిని తల్లి ఎప్పుడూ ఈసడిస్తూ మాట్లాడుతుండటం చిత్ర మీద కూడా ప్రభావాన్ని చూపించింది. అతని
చాత కాని తనం వల్లే, పెదనాన్నలు తాతగారి ఆస్తి తమకి దక్కనివ్వలేదని, తల్లిలా ఆమె కూడా అనుకునేది.

విజయవాడలో తనతో పాటూ చదువుకుంటున్న డబ్బున్న అమ్మాయిల్ని చూస్తే, చిత్రకళకి లోలోపల ఈర్ష్యగా అనిపించేది. అప్పటిదాకా గుర్తించలేదు కానీ, వాళ్ళకు లేనిది, తనకున్నది అందం అని మొదటి సారి తెలుసుకుందామె. డబ్బుంటే ఆ అందానికి మరిన్ని మెరుగ్నులు దిద్దుకోవచ్చని, అందాన్ని కూడా పదిమందీ గుర్తిస్తారని, తల్లిదండ్రుల అదుపాఙ్నలు లేకపోతే, చాలా స్వేచ్చగా వుంటుందని తెలుసుకున్న ఆ రెండేళ్ళ విజయవాడ హాస్టల్‌ జీవితమంటే ఆమెకి ఇప్పటికీ ఇష్టమే. ఇరుకు ఇరుకుగా, పొదుపుగా, భయం భయంగా, అన్నిటికీ కటకటలాడుతూ బతికే తన ఇంటి పరిస్థితి చిత్రకి ఎప్పుడూ నచ్చేది కాదు. ఆమె ఆలోచనల్లో కొంచం వికాసం వచ్చిందేమో కానీ,  ఎంసెట్‌ పరీక్షల్లో ఆమె చివరాఖరికి చేరుకుంది.

ఎట్టి పరిస్ధితుల్లో సీటు రాదని అర్థమయ్యాక, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టించావన్న తల్లి సాధింపుల్ని భరించ లేక, ఇక చచ్చినా మరోసారి ఎంట్రన్స్‌ పరీక్ష రాయనని మొండికేసి, ఒంగోలులో  బికాంలో చేరింది. చదువు పూర్తి      కాగానే, ఆరువేలకి ఎకౌంటెంటుగా హైదరాబాదులో ఉద్యోగం సంపాదించుకొని, ఇంట్లో వెళ్ళద్దని అన్నా వినకుండా వచ్చేసింది. అమీర్‌పేటలో ఓ లేడీస్‌ హాస్టల్లో, చేరింది. దగ్గర్లోనే వున్న ఒక కంఫ్యూటర్‌ సెంటర్‌ లో తన రూంమ్మెంట్‌తో పాటూ చేరింది. ఇరుకు గదుల్ని, సామాన్లని, చిరుతిళ్ళనీ, అప్పుడప్పుడూ దుస్తుల్నీ హాస్టల్‌ మిత్రులతో పంచుకుంటూ, కొత్తకొత్త కలల్ని వెతుక్కుంటూ , కొత్త జీవితాన్ని ప్రారంభించింది చిత్ర. రకరకాల అమ్మాయిలు. చిత్రకళలానే కొంచం అమాయకంగా, మరెంతో ఆశగా జీవితంలో పైకెదగాలన్న ఆశతో బయలుదేరిన వాళ్ళు. వలలను, నిచ్చెనలను తయారుచేసుకోవడం నేర్చుకున్న వాళ్ళు వాళ్ళలో కొందరే.

తనలానే వుండే కొందరమ్మాయిలు కొంత కాలం గడిచాక ఖరీదైన దుస్తులు,సెల్‌ ఫోన్‌లతో, విలాసవంతగా వుండటం, వాళ్ళ కోసం     వీధి మలుపుల వద్ద మగపిల్లలు నిలబడటం, వాళ్ల వెనుక వాళ్ళ గురించి మిగిలిన అమ్మాయిలు చెవులు కొరుక్కోవడం చిత్రకళ గమనించింది. అలా తనకి బాగాదగ్గరైన  తన రూంమ్మెంట్‌ సునీత గురించి కూడా, గుసగుసలుండేవి. తనతో పాటూ మొదటిసారి కొన్ని పార్టీలకి వెళ్ళినప్పుడు, అక్కడికొచ్చిన వాళ్లలో ఎక్కువ మంది ఇంగ్లీష్‌లో మాట్లాడుకోవడం, మంచినీళ్ళు తాగినంత సహజంగా అందరూ మద్యం తాగటం, కొందరమ్మాయిలు సిగిరెట్లు కూడా కాల్చటం, మొదటి సారి చూసింది చిత్రకళ. అలాంటి చోట కూడా తన అందం తనకో గుర్తింపు నిస్తోందని ఆమెగుర్తుపట్టగలిగింది . అందంతో పాటూ చొరవ, చుట్టూ జరుగుతునున్న విషయాలు, కొంచం పుస్తకాలు, సినిమాల వంటివాటి గురించి తెలియడం, ముఖ్యంగా ఇంగ్లీషు బాగా రావడం అవసరమని అనుకుందామె. జీవితంలో ఆర్ధికంగా ఎదగటానికి మనకున్న అందం, శరీరం సాధనమైతే అందుకు చింతించాల్సిన  అవసర మేమీలేదని ఆమెని ఒప్పించగలిగింది సునీత.

‘‘ ఒకటి పొందాలంటే, మరొకటి కోల్పోక తప్పదన్న’’ కొత్త సత్యాన్ని కనుగొన్న విభ్రాంతితో, లెక్కలేని తనంతో గడిపే కొందరు అమ్మాయిల జాబితాలో ఇప్పుడు చిత్రకళ కూడా చోటు సంపాదించుకుంది. ‘‘ శరీరానిదేం వుంది. కొద్ది నిమిషాలు నీవి కావనుకుంటే సరి’’ అందామె స్నేహితురాలు ఓ సారి. అట్లా అనుకోవడానికి చిత్రకి నాలుగేళ్ళ కాలం పట్టింది.

స్నానం ముగించి, అక్కడే తయారయి బయటకొస్తుంటే, చల్లటిగాలి తగిలి శరీరం ఎంతో తేలిగ్గా అనిపించింది. మాదాపూర్‌ దాటుతుండగా హరాత్తుగా పెద్దపెద్ద
చినుకులతో వాన మొదలైంది. కారు కిటికీ అద్దాల మీద జారుతున్న వర్షపు చినుకుల్ని చూస్తుంటే గుర్తొచ్చింది. నోవాటెల్‌ లో రాత్రి వెళ్లవలిసిన
డిన్నర్‌. సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వచ్చే అలాంటి పార్టీలను ఆమె ఎప్పుడూ మిస్‌ కాదు. కానీ ఈ రోజెందుకో ఎక్కడికీ వెళ్లాలని
లేదామెకి. దిగులు దిగులుగా, దు:ఖం బయటకు రాకుండా లోన లుంగలు చుట్టుకుంటూ, ‘‘ పులిని తను నిజంగా స్వారీ చేయగలిగిందా? కనీసం అది తనని పూర్తిగా తినేయకుండా చూసుకో గలిగిందేమో? లేకపోతే తన జీవితం కూడా సరస జీవితంలానే అయ్యేదేమో?’’ ఈ తలపుకు ఒక్కసారిగా ఉలిక్కిపడిరది చిత్రకళ.

మనిషి లోపలి కోర్కె బహుశా, బహుపురాతనమైంది కావచ్చు. అదుపు లేని శరీరానికి ఎన్నెన్ని అడ్డు కట్టలో. అయినా అది గట్లు తెంచుకు పారే నదిలా
ప్రవహిస్తుంది. యాదమ్మ అన్నట్లు అది శివాలెత్తుతుంది.
‘‘సరస కూలికి బోయినప్పుడు, గాడమెకొక మేస్త్రీగానితో సోపతైనది. ఆడు అప్పుడప్పుడు పైసలిచ్చెటోడు. ఆనితో తిరుగుడు బెట్టిందీ పోరి. వానికి
పెండ్లాం బిడ్డలున్నరు. ఎన్నటికన్న నిన్ను ఇడిసిపెడతడే దేడ్‌దిమాక్‌దాన. ఇంక చిన్నదానివే. ఇంకెవలన్న జూసుకుని, పెండ్లి జేసుకోవే అని ఎంత చెప్పిన
ఇన్నదా అది’’ అంది యాదమ్మ.

సరసకీ, తనలాంటి వాళ్ళకీ ‘‘ నీ తాలూకు గతంతో నాకు పనిలేదు. ఇప్పటి నువ్వు మాత్రమే నాకు కావాలి. నిన్ను ప్రేమించాను. మనం పెళ్లి చేసుకుందాం’’ అనే వాడు ఎక్కడ దొరుకుతాడు. శరీరపు కోర్కె తీర్చుకునే ఆటకీ, పెళ్ళనే ఆటకీ, బహుశా వేరు వేరు సూత్రాలు, నిబంధనలూ వుంటాయి కామోలు అనుకుంది  చిత్రకళ.

సరసకి ఒక కాలేజీలో ఊడ్చే పని దొరికింది. పొద్దుట ఇళ్ళలో పని చేసుకుని, కాలేజీ పనికెడుతుంది. సరసకి కొత్తగా జర్దా అలవాటైంది. రోజూ
వండుకునేందుకు బద్దకిస్తుంది. చేతిలో డబ్బులుంటే బిరియానీ పొట్లం తెచ్చుకుంటుంది.
‘‘గట్ల డబ్బులు ఆగం చేయకు. పోరడున్నడు. పానం బాగలేన్నాడు కర్సుల కన్నా అస్తయని అంటే, రేపటి సంగతి రేపు. రేపటికి బతికుంటమో సస్తమో? ఎవలకి ఎర్క అనేది ’’ అంది యాదమ్మ.

సరసకి అంతకు ముందున్న శుభ్రత, పొందిక ఎక్కడ పోయాయో తెలీదుగట్టిగా మాట్లాడుతూ, నీళ్ళ దగ్గరో, ఉమ్మడి స్నానాల గదుల వద్దో, ఇరుగు
పొరుగు వాళ్ళతో తగాదాలు పెట్టుకుంటూ చివరికి ‘‘ అమ్మో, దాని జోలికి పోవద్దమ్మ’’ అన్నట్లు తయారైంది. ఒక్క యాదమ్మంటేనే, కాస్త భయమూ, భక్తీ
రెండూ వున్నాయా పిల్లకి.

‘‘ ఎట్ల దాచి పెట్టిందో దాచిపెట్టిందో పెట్టిందమ్మ. ఐదోనెల కడుపు, జర ఎత్తుగ కనపడబట్టె. ఏందే సరస, గట్లున్నవ్‌. అంటె సప్పుడు జేయలే. అదేం సిత్రమో గాని కక్కుడన్న మాట లేకుండె దానికి. ఒకపారి, నేనే దాన్ని బెదిరించిన. అప్పుడొప్పుకున్నది. ఎన్నో నెలనే అంటె తెల్వదంటది. దావఖానకు బోలె. పరీక్ష సేయించుకోలే. నేను తోల్క పోత, పోదం రాయే అంటే, నేను రానుపొమ్మని జిద్దుజేసింది. మా వాడకట్టు పెద్దమనుష్యు లంత పోగయ్యిన్రు.
కడుపు జేసినోని పేరు జెపితే, వాన్నిగుంజుకొస్తం అన్నరు. ఈ పోరి నోరిప్పలే. ఒకని తానికే బోతె ఎర్కయితి. ఇది ఎందరితానికి బోయిందో అన్నరు
గాపెద్ద మనుష్యులు.. మా అందరికి తిట్టి తిట్టి యాష్టకచ్చిన గాని, అది నోరిప్పలే. కాన్పు ఎప్పుడైతదన్నది కూడ దానికి ఎర్కలేదు’’

సరస రోజూ పనికి వెడుతూనే వుంది. ఆమెను పట్టించుకునేంత తీరిక, బాధ్యత అక్కడ ఎవరికీ లేదు.

‘‘ ఏనిమిది గంటల రాత్రి, దాని ఇంటిగలమకాడ కూసోని ఓ అక్కో నొప్పులొస్తున్నయి. నాకు వశపడ్తలేదు అంట, ఏడ్సుడు, వొర్లుడు షురుజేసింది.
అందరు జేరిసూస్తున్నరు. మా వాడల పెద్దమనిషి ‘ కట్టుదప్పిన బాడుఖావ్‌. దానితానికి ఎవలు పోకుండ్రి’ అన్నడు. ఎవరిండ్లల్లోకి ఆల్లు బోయిన్రు
అందరు. పన్నెండు గంటల రాతిరి, దాని కొడుకు ఏడ్చుకుంట మా తలుపు కొట్టబట్టిండు. ఆడజన్మమంత అన్నాలం లేదమ్మ. నేను ఉర్కిన. నేనుబోయెతల్కి, నేల మీద పడుండుకోని లాష్‌గా వొర్లుతున్నదిగసబెడుతున్నది. దాన్ని చూసెతలికి, నాకు సల్లసెమటలు బట్టినయి. ఏమైతెగదైతది తీయని, మా వాడకట్టు నుండేటి, మంత్రసానిని తోల్కొచ్చిన. పక్కింట్ల కెల్లి ఇంకొక దయగల అమ్మగ్గూడ సాయానికొచ్చింది. దావఖానకు తీస్కపోనీకి టయం లేకుండె. బిడ్డ బయట కచ్చిండు గాని, మాయ బయటపడలె. ఇదేందిర దేవుడ. లేనిపోనిది నెత్తిన బెట్టుకున్న. పెద్దపానానికే ముప్పు అస్తదేమో, దేవ అని గజ్జగజ్జ అనికిన. ఆ బగమంతుని దయ తల్లీ! మెత్తం మీదగండం గడిసింది. పిండం బయటవడ్డది తల్లి.’’

యాదమ్మ ఇంటికొచ్చి వేడినీళ్ళతో స్నానం చేసేసరికి తెల్లవారుజామున నాలుగైంది. మంత్రసాని చేతిలో మూడొందలు పెట్టి, తన పాత చీరెలు రెండిచ్చి
సాగనంసింది. నెత్తుటి మరకతో, నీచుకంపు కొడుతున్న ఆ ఇంట్లోకి మళ్ళీ ఉదయం యాదమ్మ తప్పా, మరెవరూ తొంగి చూడలేదు. హోటల్‌ నుండి ఇడ్లీలు తెప్పించి, ఇంట్లో టీ చేసుకొని సరస గుడిసెలోకి వెళ్లేసరికి నెత్తుటి మరకలంటినగచ్చుపైన నీళ్ళుపోసుకుని కడుక్కుంటున్నారు సరస, ఆమెకొడుకు. పాత నూలు చీరెలో చుట్టిన పసిబిడ్డ, ఆ గదిలోనే ఓ మూల ఆదమరిచి నిద్రపోతున్నాడు. స్నానానికి నీళ్ళుపెట్టుకున్నట్లుంది. స్టవ్‌ మీద అవి సలసలా
మరుగుతున్నాయి.

‘‘ నీది పచ్చి వళ్ళే. రెండురోజులు నేనే వండిపెడత నన్న యినలేదది. ఇంటి కిరాయి రెండు నెలల సంది కట్టలేదని కొట్లాడేందు కొచ్చిన ఇల్లుగలాయన దాని
గతి జూసి ఏమనలేక గమ్మునున్నడు. చుట్టుముట్టోల్లందరం, తలా ఇన్ని పైసలేసుకుని, దానికిచ్చినం. ఏడ్చుకుంటనే తీసుకున్నది.’’ అంది యాదమ్మ.

చిత్రకళ తన పొట్టకేసి చూసుకుంది. చదునుగా, చిరుబొజ్జ కూడా లేదు. వంపు తిరిగిన నడుం కింద చీరమడతల వెనక దాగిన పొట్టపైకి  ఆమెచేతి వేళ్ళు పాకాయి.
కొన్నేళ్ళు గడిస్తే పిల్లల్ని కనగలిగిన శక్తికూడా తనకి లేకుండా పోతుందేమో? తనకి పిల్లలుంటే బావుంటుందా? ఏమో? అప్పుడప్పుడూ వాళ్ళతో
కబుర్లు చెప్పటం, ఆడుకోవడం బాగానే వుంటుంది. పిల్లల్ని కనగల శక్తి ఆడవాళ్ళ శరీరాలకి వున్నా, కనాలంటే మాత్రం తప్పకుండా పెళ్ళిచేసుకో
వల్సిందేనేమో? మల్లెపూల జడేసుకొని, పూలతో అలంకరించిన మంచం పక్కన, చేతిలో పాల గ్లాసుతో, సిగ్గుతో తలవంచుకుని, కాలిబొటన వేలితో నేలమీద చిత్రాలు గీస్తూ, గర్భదానం కోసం ఎదురుచూస్తూ, అట్లాంటి దృశ్యం లో  తనని ఊహించుకోగానే చిత్రకళకి ఫక్కున నవ్వొచ్చింది. నాకెందుకో చిన్నప్పటి నుండీ
పాలంటే అసలు ఇష్టంలేదనుకుంది చిత్ర.

తనజీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం మొదలు పెట్టాక, ఇంట్లో వాళ్ళ నుండి చాలానే ఘర్షణల్ని ఎదుర్కోవలసి వచ్చింది చిత్ర. కొంతకాలానికి వాళ్ళు
ఆమెను, ఆమె వాళ్లని వదిలేసుకునేదాకా  వచ్చాక, తమకి ఇక కూతురు లేదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ చిత్ర పూర్తిగా అలా అనుకోలేక
అప్పుడప్పుడూ అందరూ గుర్తొచ్చి బాధపడుతూ వుంటుంది.‘‘ ఆట ఆడాలనుకున్నప్పుడు ఆ ఆటకి సంబంధించిన సూత్రాలు మొదట నీకు
తెలిసుండాలి. దెబ్బ కొట్టడం, దెబ్బ కాచుకోవడమే కాదు దెబ్బ తగిలితేతట్టుకోవడంకూడా నేర్చుకొవాలి. ఎవర్నీ నమ్మకు. నమ్మినట్లు కనిపించు చాలు.
దేనిలోనైనా సరే నీకు నష్టం జరుగుతుందని అన్పించినప్పుడు, తక్కువ నష్టంతో జాగ్రత్తగా వెనక్కి రావడం ఎలాగో తెలుసుకో’’ అంది ఒకసారి వినీతా
రాధోడ్‌.  మధ్యతరగతి  సంకోచాల్ని వదులుకుంటే తప్ప , హైక్లాస్‌ సొసైటీలో రాణించటం కష్టమని, ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్‌డేట్‌ చేసుకోవాలని, ఆమె చెప్పిన మాటల్ని  చిత్రకళ ఎప్పుడూ మర్చిపోదు. మన చిరునవ్వును, అందాన్నీ చూపితే మోజు పడతారే తప్పా, మన మనసు గాయల్ని చూపితే బాధపడి, బాధ్యత తీసుకునే వాళ్లెవరూ వుండరన్న సత్యాన్ని, ఆటాడే క్రమంలో, పడి లేస్తూ తన స్వంత అనుభవంతో నేర్చుకుంది చిత్ర. ఆర్ధిక స్థితి, మంచి ఉద్యోగం వల్ల మనకి సమాజంలో గౌరవం, హోదా ఆపాదించ బడతాయని తెలుసు కాబట్టే, చిత్రకళ ఏదోక ఉద్యోగం చేయటం ఎప్పుడూ మానేయలేదు. ఒక్కప్పటిలా కాదిప్పుడు. ఏంచేయాలో వద్దో ఎంచుకోగల స్థిమితం అన్ని రకాలుగా తనకి వచ్చిట్లనిపిస్తుంది చిత్రకి.

‘‘ కడుపు జేసినోడు కాన్పు కర్సులకన్నా ఇచ్చినోడు గాదు. కంసేకం దావఖాన కర్సులన్నా ఎల్లేటివి గాదా అన్నరు. సుట్టుముట్లోల్లు. సంపి సావు కర్సులకి
ఇస్త గానీ, ఊకోమన్నట్లున్నది యవ్వారం.’’ అంది యాదమ్మ. ఆడదాని మీద అత్యాచారం చేసి, దానికి వెలగట్టి,గర్భవతిని చేసి, ఆ
గర్భానికి వెలకట్టి, ఎన్నెన్ని బేరసారాలమధ్య ఆడవాళ్లున్నారు? ఊర్లో పొలాని కెడుతున్నప్పుడు, జులాయిగా తిరిగే ఆ ఊరి పెద్దమనిషి కొడుకు, తన
మేనమామ కూతురిపై అత్యాచారం చేశాడు. పంచాయితీ పెట్టి,ఊరి పెద్దమనుష్యులు,కుటుంబం అందరూ కలిసి నిర్ణయిస్తే, కన్నీళ్ళతో తలవంచుకుని పీటలపై
కూర్చుంటే, ఆ రేపిస్టే భర్తయి మెడలో తాళి కట్టాడు. ఆమె బెదురుకళ్ళ దిగులు మొఖం చిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు.

యాదమ్మకున్న తెలివితేటలు, ధైర్యం సరసకి లేవనుకుంటాను అనుకుంది చిత్ర.

రెండోసారి నగరానికొచ్చిన యాదమ్మ వెంట ఇప్పుడు ఆమె తల్లి, నాలుగేళ్ళ కొడుకు వున్నారు. వాళ్ళను పోషించే భారం ఆమెదే. ఆడపని, మగపని అని
లేకుండా ఏ పనైనా ధైర్యంగా చేయటం అలవాటైంది. ఒకసారి కూరల మండీలో పనికి పోతే, ఊర్లనుండి కూరగాయలు ట్రాక్టర్లో వేసుకొచ్చే, ఒక డ్రైవరుతో స్నేహం కుదిరింది. శరీరం మరింత దగ్గరితనాన్ని కోరుకుంది. ఆమె అక్కడ పని మానేసినా వాళ్ళు కలుసుకుంటూ వుండేవాళ్ళు. అతనేమీ ఆమెకి పెళ్ళి
చేసుకుంటాన్నా హామీ లివ్వలేదు. తనుగర్భవతినయ్యానా లేదా, అని ఆమె సందేహ పడుతున్న కాలంలోనే, తట్టమోస్తూ, మెట్లెక్కబోయి కళ్ళుతిరిగి, జారిపడిరది. గర్భస్రావమయి వారంపాటు ఆసుపత్రిలో వుండాల్సి వచ్చింది. తల్లి ముందు, బంధువుల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది.
‘‘ పోరగాన్ని ఎవలకన్న సాదుకునేందు కిచ్చి, మల్ల పెండ్లి జేసుకోయే అంటె ఇనలేదానాడు. నాకొడుకుని నేనే సాదుకుంట నని పట్టుబడితివి. ఇప్పుడు
లేనిపోని కతలు జేయవడ్తివి. అంత ఒపలేకుంటే ఎవన్నోకన్ని మేమే జూస్తుండె’’ అని తిట్టారంది యాదమ్మ. ఆమెతో ప్రేమగా మాట్లాడి, ఆమె శరీరాన్ని కోరుకున్న వాడు ఆమె అట్లా నలుగురి ఎదుటా అవమాన పడుతుంటే ఆమె పక్కన లేడు. అప్పుడే కాదు, మరెప్పుడూ అతడామెకి కనపడలేదు. నా జీవితంలో ఏ కష్టవచ్చినా ఎవరినీ చేయిచాచి సాయమడగనని అప్పుడే యాదమ్మ నిర్ణయించుకుంది. కొడుకును బడిలో చేర్చింది. మరో మూడేళ్ళకి తల్లి చని పోయింది. మరి కొన్నేళ్ళ వరకూ ఆమె జీవితంలోకి ఏ మగవాడూ ప్రవేశించలేదు. పేదవాళ్ళకి ఇండ్ల పట్టాలిస్తున్నరంటే, బస్తీవాళ్లతో కలిసి, ఓ గల్లీ లీడర్‌ నర్సింహని కలవటానికెళ్ళింది యాదమ్మ. రేషన్‌ కార్డు, ఫోటోలు, దరఖాస్తులు అంటూ అతని చుట్టూ, మండలాఫీసుల చుట్టూ, నెలల తరబడి తిరగాల్సి వచ్చింది. కలెక్టరాఫీసు ముందు అందరితో పాటూ ధర్నాకి కూర్చుని తన్నులు కూడా తింది. ఉండేందుకు తనకంటూ ఒక చోటుంటే ఎలాగోలా బతకచ్చన్న ఆశ ఆమెది. చివరికి ఆమెకి ఇళ్ళపట్టా శాంక్షనయింది. దానితో పాటూ నర్సింహతో పరిచయం కూడా పెరిగిందామెకి.

ఎన్నికలు, ప్రచారాలు, బహిరంగ  సభలంటూ బయటి ఊర్లకి రమ్మని ఆమెని పిలిచే వాడు. అట్లా ఒకటి రెండుసార్లు యాదమ్మ, ఢల్లీిలో జరిగిన మీటింగులకు కూడా వెళ్లింది. ఈ తిరగటాలు, కొత్త పరిచయాలు, చుట్టు పక్కల వాళ్ళలో ఆమెకొకగుర్తింపును తెచ్చాయి. ఆపనీ, ఈపనీ చేసి పెట్టమనీ, సలహాలనీ ఎవరోకరు ఆమె దగ్గరికి వచ్చే వాళ్ళు. నర్సింహతో ఆమె సంబంధం బహిరంగమే. పదేళ్ళ కొడుకుని పెంచి పెద్దచేసి, ప్రయోజకుడ్ని చేయడం తన పననుకుంది యాదమ్మ. ఆమె అతడ్ని పెళ్ళి చేసుకోమని ఎన్నడూ ప్రాధేయపడలేదు. అతనే ఓ సారి ఆ ప్రస్ధావన తెస్తే, ‘‘ ఇయ్యాల బాగ్ననే వున్నవు. రేపు నీకో పోరన్నో, పోరినో కంట. అటెన్క, నీ బుద్ధి తిరిగి, నాకు పెండ్లాం, బిడ్డలున్నరు, ఇగ నీతో కాపురం చేయలేనే యాదమ్మ అన్న వనుకో, నా గతి ఏం గావాలె. ఉన్నొక్క కొడుకును సాదలేకనే, నా బతుకిట్లయ్యె. ఇంకొక బిడ్డ నా మెడలెందుకయ్య. నీ పెండ్లికి, నీకో దండమయ్య సామి’’ అంది యాదమ్మ.
అతనొక సారి, నీ ఖర్చులకు డబ్బులు నేనిస్త. పని మానేయమన్నప్పుడు యాదమ్మ కస్సుమంది.

‘‘ నా తిండి నేను సంపాదించుకుంట. నా పోరన్ని నా రెక్కల కష్టం మీద సాదుకుంట. నా యింట్ల నేను బాజాప్త పంట. పని బందు పెట్టి, రేపటికెల్లి,
కుక్క తీర్గ, నువ్వెన్నడు బొచ్చల కూడేస్తవో అన్నట్లు ఎదురుసూడాల్నా? నువ్వు జూజూ అని బుదగరిస్తే, తోకూపుకుంట దగ్న్గరికి రావలె. నీకు
కోపమెచ్చి ,నీ యెడ్మ కాలితో లాష్‌గ ఒక్క లాత్‌ తన్నితే ఏడ్చుకుంట బోవాల్నా? ఎవరి మీద ఆధారపడి బత్కదీ యాదమ్మ. నెలల పోరన్ని, నడుముకు
గట్టుకుని ఒక్కదాన్ని ఎద్దోలె కాయకష్టం జేసిన. ఏమనుకున్నావో. చూసినవా ఈ సేతులు, నా సేతులు ఎట్లున్నయో?’’ అంటూ నిటారుగా నిలబడి, రెండు అరచేతుల్నీ అతని ముందుకు చాచింది. అతను మరింకేం మాట్లాడలేదు.

చిత్రకళ ఇంటికి చేరుకునే సరికి ఏడుకావస్తోంది. వర్షం వెలిసింది. తడిసిన మొక్కలు మరింత పచ్చగా అగపడుతున్నాయి. కాఫీ కలుపుకొని మెల్లిగా తాగ్తూ బాల్కనీలో నిలబడి , తడిసిన ఆకుల నుండి చినుకుల్ని రాలుస్తున్న పారిజాతపు చెట్టును చూస్తుంటే, ఆమెకి ఎందుకో హఠాత్తుగా నాన్నా గుర్తుకొచ్చాడు.
ఇంట్లోవాళ్ళు, ముఖ్యంగా అమ్మా, మావయ్యలూ తన విషయమై  గొడవ చేసారు కానీ , నాన్న ఎక్కువగా మౌనంగానే వున్నాడని ఎందుకో అనిపించింది చిత్రకి. బహుశా, తన జీవితం తనది అని ఆయన ఒప్పుకున్నాడేమో తెలీదు. తెల్లటి దేహంతో నేలను ముద్దు పెట్టుకుంటూ నారింజ రంగ్ను చేతుల్ని ఆకాశంకేసి చాచి ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లున్నాయి రాలిన పారిజాతపు పూలు. ఆయన ఎంతో ఇష్టంగా తనకి చిత్రకళ అని పేరు పెట్టాడు. చిన్నప్పుడు నాన్న తనకి బొమ్మలేయటం నేర్పటం గుర్తొచ్చింది. రకరకాల రంగులు తెల్లటి కాగితంపై పరుచుకొని, అందమైన బొమ్మలుగా మారటం ఎంతో అద్భుతంగా వుండే దామెకి. తను బొమ్మలేస్తుంటే, చేతుల్లోంచి కాగితాలు లాగేసి ‘‘ ఎందుకీ బొమ్మలు, కూటికొచ్చేనా గుడ్డకొచ్చేనా’’  అంటూ  అమ్మ తననీ, నాన్ననీ తిట్టడం కూడా గుర్తుంది చిత్రకి.

‘‘ ఇంతకీ నేను పులిని స్వారీ చేయడం నేర్చుకున్నానా’’ అని తనని తాను ప్రశ్నించుకుంది చిత్ర.
సరసకి అలాంటి విద్యొకటి ఉందన్న విషయం కూడా తెలిసుండదు. కనిపించిన వాడినల్లా గుడ్డిగా నమ్మటం తప్ప ఏమీ తెలీదు.
‘‘ గీ పోరగాల్లను పుట్టించే పని దేముడు మన ఆడోల్లకే ఎందుకు బెట్టిండో తెల్వదు. అదే లేకుంటే మన బత్కు ఇంత అన్నాలం లేకుండు. మన తాన పైసలేక పాయె, పవరు లేక పాయ ఇగ ఆగ్నమాగ్నం గాక ఏమైతమమ్మ’’ అని నవ్వింది యాదమ్మ. పులి ఆమెను మింగేందుకు వాడే సాధనాలన్నిటినీ ఆమె ఒక్క తాపు తన్నినట్లనిపించింది చిత్రకళకి.

దూరంగా హాల్‌లో నుండి సెల్‌ఫోన్‌ మోగుతోంది. ఎత్తి మాట్లాడాలనిపించక దానికేసి అలాగే చూస్తోంది. రెండు మూడు సార్లు మోగాక, చిన్న చప్పుడుతో
మెసేజ్‌ వచ్చింది. అప్పుడు మెల్లిగా ఆ మెసేజ్‌ని తీసి చూసింది చిత్ర. సునీతా రాధోడ్‌ నుండి . ‘‘రాత్రి నోవాటెల్‌ కి వస్తున్నావ్‌ కదా! లెటజ్‌
హావ్‌ గ్రేట్‌ ఫన్‌’’ అనుంది.ఆమె కెందుకో పులిస్వారీ ఆటలో అది తనని తినేయకుండా కాచుకొని, కాచుకొని అలసి పోయినట్లనిపించింది. ఎంతో నిస్సత్తువగా కూడా వుంది. పర్సు తీసుకొని, ఇంటికి తాళం వేసి కిందికి దిగి వెడుతుంటే, కారు తలుపు తీసి పట్టుకొని, డ్రైవరు పిలిచాడు. అతడ్ని ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పి, వీధి లోకొచ్చింది చిత్ర. ఆగి ఆగి కురుస్తున్న ఆ సన్నటి వాన చినుకుల మధ్య నడుస్తూ , వీధి చివరనున్న స్టేషనరీ షాపుకెళ్ళింది. డ్రాయింగ్‌ షీట్లు,
రంగులు, బ్రష్‌లు కొనుక్కొని, ఇంటికి తిరిగి వస్తుంటే చిత్రకళ కెందుకో శాంతంగా అనిపించింది.

vimala1విమల
19.03.2014

“మాటల్లేని చిత్రాల” లోకంలో కాసేపు…

WP_20141202_001

 

ఏ విషయానికి చెందిన పుస్తకానికైనా “చరిత్ర” అనే పేరుంటే ఆ విషయంపట్ల చాలా ఇష్టం ఉన్నవాళ్ళు తప్ప సాధారణంగా అందరూ దాన్ని పక్కన పెడతారు. 675 పేజీలున్న “ప్రపంచ సినిమా చరిత్ర మొదటిభాగం – సైలెంట్ సినిమా 1895-1930” పుస్తకం పేరు చూసి భయపడక్కర్లేదు. గంభీరమైన సిద్ధాంత వ్యాసాల మాదిరిగా ఉండదీ పుస్తకం. మొదలెట్టాక పూర్తయేవరకూ చదవటం ఆపలేకపోయాన్నేను. జవనాశ్వంలా పరుగెత్తే శైలి. సీరియస్ సినిమా విద్యార్ధులు, ఛాయాగ్రాహకులు, ఎడిటర్లు, ఔత్సాహిక దర్శకులు ఈ పుస్తకంలోకి కాస్త తొంగిచూస్తే అమూల్యమైన విషయాలు తెలుస్తాయి.

తెలుగులో సినిమా పుస్తకాల గురించి చెప్పుకుంటే, ఇంతవరకూ సరైన “విమర్శ” రానేలేదు. ఈ మధ్య వస్తున్న పుస్తకాల్లో పాత తెలుగు సినిమాల గురించి సమాచారం, ఆ సినిమాలు తీయడానికి దర్శకులు నిజాయితీగా పడిన శ్రమ, నటీనటుల అనుభవాలు… వీటికి సంబంధించిన చరిత్ర వరకూ బాగానే వచ్చినట్టు కనిపిస్తుంది. దీన్ని మించిన పని చాలా మిగిలేవుంది. ఈ పరిస్థితిలో “ప్రపంచ సినిమా చరిత్ర రాయ తలపెట్టటమే ఓ సాహస చర్య. పైగా ఆ చరిత్రని స్థూలంగా రాయకుండా, సమగ్రంగా, సంక్లిష్టంగా విశ్లేషణాత్మకంగా రాయదలచడం మరింత సాహసంతో కూడుకున్నపని” అంటూనే ఈ పనిలో మొదటి భాగాన్ని పూర్తిచేసి మనముందు పెట్టారు పసుపులేటి పూర్ణచంద్రరావు.

పీటర్ కోవీ “Seventy Years Of Cinema” తన రచనకు స్ఫూర్తి అని చెప్తున్నారు పూర్ణచంద్రరావు. సంవత్సరాలవారీగా వచ్చిన సినిమాల గురించి రాస్తూనే ఫిల్మ్ గ్రామర్ ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందో వివరించే పీటర్ కోవీ పద్ధతినే తానూ అనుసరించినట్టు చెప్పుకున్నారు. 1895లో పుట్టిన సినిమా విదేశాల్లో ఎలా పెరిగిందీ, మనదేశంలో దాని వృద్ధి సమాంతరంగా ఎలా వున్నదీ చెప్తూ ఆసక్తికరమైన తులనాత్మక పరిశీలన కూడా చేశారు ఈ పుస్తకంలో. దేన్నీ దాచే శ్రద్ధ, అలవాటు లేని కారణంగా ఫిల్మ్ లు దొరక్క, మనదేశంలో తయారైన చాలా సినిమాల గురించి మనకు తెలియదు. (ఒక్క దాదా ఫాల్కే మాత్రం తను సినిమా తీస్తున్న పద్ధతినంతా మరో కామెరాతో తీయించడం వల్ల ఆయన తీసిన ఫిల్మ్ ముక్కలతో పాటు చేసిన కృషి కూడా అందరికీ అర్ధమైంది).

భారతీయ సైలెంట్ సినిమా గురించి ఉన్నంతలోనే వివరించారు ఈ పుస్తకంలో. మనదేశంలో తయారై, తరువాత ఆచూకీ తెలియకుండా పోయిన కొన్ని మూకీల గురించి రాయటానికి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆర్కైవ్స్ లో ఉన్న సినిమా ప్రకటనలు బాగా ఉపయోగపడ్డాయట. ఫిల్మ్ సొసైటీలకు సంబంధించిన మొదటితరంవాళ్ళూ, సినిమా వాళ్ళూ ఆనాటి పత్రికల్లో చదివిన సారం ఏమైనా ఉంటే, వారి మెదళ్లలోనే ఉండి ఉండాలి. అలాటివారి సంఖ్య కూడా ఇప్పుడు తక్కువగానే ఉంది. సి. పుల్లయ్య కాకినాడలో ‘భక్త మార్కండేయ’ సైలెంట్ సినిమాను 1925 ప్రాంతాల్లో తీశాడనీ, అదే తెలుగువాడు తెలుగునాట తీసిన మొదటి కథా చిత్రమనీ ఎప్పుడో ‘విజయచిత్ర’లో చదివిన గుర్తు. ఆ సినిమా ప్రస్తావన ఈ పుస్తకంలో లేదు. వి.ఏ.కే. రంగారావు వంటి పెద్దలు ఇలాంటి విషయాలు వివరించగలరు.

నాటక, సాహిత్య, సంగీత, చిత్రకళాకృతులే సినిమా శిల్పాన్ని తీర్చిదిద్దాయి. ఈ రంగాలన్నిటిమీదా కొంత పట్టు ఉన్నవాళ్ళు సినిమా గురించి రాస్తే దానికో దమ్ము ఉంటుంది. వీటిగురించి తెలిసి ఉండటం, వీధినాటక ప్రయోక్త కావటం, ఆంధ్రాలో ఫిల్మ్ సొసైటీ ఉద్యమానికి సేవ చేసిన మొదటి తరం వారిలో ఒకరవటం, దేశాలు తిరిగి రకరకాల సంస్కృతుల గురించి తెలుసుకుని మరీ మాట్లాడగలగటంతో పూర్ణచంద్రరావు సినిమా రాతలు సాధికారంగా సూటిగా ఉంటాయి. అరకొర జ్ఞానం పట్లా, అన్నిరకాల అణచివేతల పట్లా ఈయనకున్న విపరీతమైన అసహనం నిర్మొహమాటంగా బైటపడుతుంది ఈ పుస్తకంలో.

సినిమాశిల్పాన్ని మూకీ సినిమాల బంగారుకాలంలోనే సంపూర్ణంగా చెక్కి పెట్టేశారు జార్జ్ మెలీ, గ్రిఫిత్, ఐసెన్ స్టీన్ మొదలైనవాళ్ళు. వీళ్ళ పనితనం గురించి రచయిత మాటల్లో చదవటం బాగుంటుంది. గ్రిఫిత్ ఎంత గొప్ప సినిమా శిల్పకారుడో అంత అధముడైన జాత్యహంకారి కూడాననీ, చార్లీ చాప్లిన్ ఎంత గొప్ప మానవతావాద హాస్యాన్ని పండించినా, వాన్ స్టెర్న్ బర్గ్ చేత తానే తీయించిన సినిమాని విడుదల చేయకుండా స్వయంగా తగలబెట్టించిన అసూయాపరుడు కూడాననీ నిర్మొహమాటంగా వివరించారు. చాప్లిన్ సినిమాల గురించి ఈయన ఆప్యాయంగా వివరించిన తీరులో చాప్లిన్ అంటే ఉన్న ప్రత్యేకాభిమానం కనిపిస్తూనే ఉన్నా, నిష్పక్షపాతమైన పరిశీలనతో దర్శకత్వం విషయంలో చాప్లిన్ కున్న పరిమితులను గుర్తిస్తారు. చాప్లిన్ తో బస్టర్ కీటన్ ను పోల్చేటప్పుడు, బస్టర్ కీటన్ సినిమాటిక్ నైపుణ్యంతో పాటు అతని హాస్యంలోని మేధావితనాన్ని కూడా గుర్తించటం ఉంది.

సైలెంట్ సినిమాలకోసం థియేటర్లో మ్యూజిక్ బ్యాండ్ లు సంగీతాన్ని వినిపించటం, అక్కడే ప్రేక్షకులకు పల్లీలు అమ్మేవాళ్ళు తిరిగేస్తుండటం, సినిమా షోల ద్వారా వచ్చిన డబ్బుని ఎడ్లబండ్లలో వేసి బ్యాంకుకి తీసుకెళ్లారంటూ జనం చెప్పుకోవటం వంటి తమాషా విషయాలూ ప్రస్తావనకు వచ్చాయి. మొదటిసారి గ్రిఫిత్ వాడిన క్లోజ్ అప్ షాట్ చూసి             “Half Man !!!” అంటూ ఆశ్చర్యపోయారట ఆనాటి జనం. ఈ పుస్తకంలో కదిలేబొమ్మల వింతలు చూస్తున్న అప్పటి ప్రేక్షకులనుంచి వచ్చిన స్పందనలు చదువుతుంటే వేడి పకోడీల్లా మజాగా ఉంటాయి.

‘వెస్టర్న్’ సినిమా తీరుతెన్నుల్ని చెప్తూ కాస్త అమెరికా చరిత్రనూ, వెస్టర్న్ సినిమాల్లో వచ్చే పదజాలాన్నీ వివరించారు. ఇది ఆ సంస్కృతి తెలియనివారికి బాగా పనికొస్తుంది. ‘జర్మన్ ఎక్స్ ప్రెషనిజం’, ‘కామెడీ’, ‘మెలోడ్రామా కళ’ గురించి చేసిన స్థూల పరిచయం కూడా ఉపయోగపడేదే. సినిమా విద్యార్థుల కోసం “Battleship Potemkin” లో ప్రఖ్యాతమైన ‘ఒడెస్సా స్టెప్స్’ దృశ్యపు స్క్రిప్ట్ భాగాన్నీ, గ్రిఫిత్ ‘కటింగ్’ గురించి తెలుసుకోవటం కోసం “Intolerance” సినిమా నుంచీ కొంత స్క్రిప్ట్ భాగాన్నీ ఓపిగ్గా వివరంగా ఈ పుస్తకంలో అందించారు.

చాప్లిన్ సినిమాల రివ్యూలు, ఇంకా “ఫాంటమ్ చారియట్”, “గ్రీడ్”, “ద పాషన్ అఫ్ జోన్ ఆఫ్ ఆర్క్”, “ద జనరల్”, , “బ్లాక్ మెయిల్”, “ద మాన్ విత్ ఎ మూవీ కామెరా”, “పండోరాస్ బాక్స్” “నోస్ఫెరాటు”, ద లాస్ట్ లాఫ్”, “ద కవర్డ్ వేగన్”, “ద క్రౌడ్”, “ద జనరల్ లైన్”, “Un Chien Andalou”, “లిటిల్ సీజర్” సినిమాల రివ్యూలు పూర్ణచంద్రరావు నిశిత పరిశీలనతో పాటు ఆయనలోని కథకుడిని కూడా చూపిస్తాయి.

ఫాల్కే తీసిన ‘రాజా హరిశ్చంద్ర’ కంటే ముందే ‘పుండలీక్’ తీసినంత మాత్రాన దాదా తోర్నీని భారతీయ చలన చిత్ర పితామహుడు అనలేం. అలాగే 1916కే కొన్ని సినిమాలు తీసిన నటరాజ మొదలియార్ ను కాకుండా, శాస్త్రీయంగా పద్ధతిగా సినిమా రంగంలోకి దిగి 1921 లో పూర్తి స్థాయి సినిమా ‘భీష్మ ప్రతిజ్ఞ’ తీసిన రఘుపతి ప్రకాశ్ నే దక్షిణ భారత కథా చిత్రానికి మొదటి దర్శకుడిగా గుర్తించాలని అంటున్నారు రచయిత. ఎవరికీ అభ్యంతరం ఉండక పోవచ్చు.

అలాగే తొలి తెలుగు తార పైడి జైరాజ్ గురించి, “శారీరక సౌష్టవంలోనూ, డైలాగ్ డెలివరీ లోనూ పృథ్వీరాజ్ కపూర్, సొహరాబ్ మోడీలతో పోటీపడి జైరాజ్ హిస్టారికల్ చిత్రాల్లో నటించేవాడు… చరిత్రకందిన మేరకు 1929 నుంచీ నటించిన పైడి జైరాజే తెలుగు వాళ్ళలో మొట్టమొదటి సినిమా నటుడిగా- మొదటి హీరోగా – మనం గుర్తించి తీరాలి”.  

‘Pollyanna’ (ఒక రకమైన మానవతావాదం) ను నెత్తికెత్తుకునే అమెరికన్ ఉదారవాదపు సినిమాల గురించి పూర్ణచంద్రరావు చేసిన పరిశీలన:   “ఇది ప్రధానంగా ప్రారంభ రోజుల్లో అమెరికాకు తరలి వొచ్చిన పేద తెల్లజాతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆనాటి అమెరికాకి అన్వయించుకున్న క్రిస్టియన్ తత్వం. అంతేగానీ, పేదల పక్షం వహించినంత మాత్రాన దీన్ని అన్ని వర్గాలనీ, అన్ని జాతుల్నీ కలుపుకున్న మానవతావాదంగా భావించాల్సిన పని లేదు…   ఈ సినిమాల గురించి నేనిక్కడ ఊరికినే చెప్పడంలేదు! మన భారతీయ ప్రారంభ చిత్రాల్లో కూడా ఇలాంటి false poverty ని చూపించే చిత్రాలు కోకొల్లలుగా వచ్చాయి! వీటినే మానవతావాద చిత్రాలుగా, చివరికి కమ్యూనిస్టు చిత్రాలుగా కూడా భారతీయ ప్రేక్షకులు భ్రమించారు! అక్కడి ఆ “తెల్ల మానవతా వాదం” తెలిసి చేసిన సంకుచిత వర్గతత్వం! ఇక్కడ గుడ్డిగా మనవాళ్ళు చేసిన కాపీ చిత్రాలన్నీ ఆత్మ వంచనలు!”

మనదేశంలో సినిమాలు మొదలైన దగ్గరనుండీ ఇప్పటికిదాకా కూడా హాలీవుడ్ ప్రభావమే ఎక్కువ. అక్కడి బోలుతనాన్ని, పై పై మెరుగుల్నీ చూసి మురిసి, వాళ్ళ ‘సి’ గ్రేడ్ సినిమాని అనుకరిస్తూ తీసినదాన్ని ఇంకా దిగజార్చి ‘ఎఫ్’ గ్రేడ్ కి చేర్చే ఘనులు మనదగ్గర ఉన్నారు. ఈ సందర్భంలో ‘సెసిల్ బి డిమిల్’ సినిమాల గురించి పూర్ణచంద్రరావు చేసిన వ్యాఖ్యానం చెప్పుకోదగ్గది; “అసలు డిమిల్ తీసిన సినిమాలన్నీ అమెరికన్ లోవర్-మిడిల్ క్లాస్ ప్రజలకు హైక్లాస్ వర్గాల ఫాషన్లు – పోకడలని కాపీ చేయడాన్ని నేర్పించడానికే తీశాడా అన్నట్లుంటాయి… ఇలాంటి సినిమాల్లో బీజ రూపంలో ప్ర్రారంభం అయిన ఈ పోసుకోలుతనం భవిష్యత్తులో కూడా చాలా కాలం కొనసాగింది, అంతే కాకుండా సినిమాకు ఈ పోసుకోలుతనమే ఓ నిర్వచనంగా కూడా మారిపోసాగింది! ఈ కృత్రిమ వేషాల హాలీవుడ్ పోసుకోలుతనం క్రమంగా ప్రపంచం అంతా ఎగుమతయ్యింది… ఇండియాతో సహా! అంతా డిమిల్ పుణ్యమే…!”   నిజమే, ‘జిందగీ నా మిలే దుబారా’, ‘యే జవానీ హై దివానీ’ లాంటి consumerist పోసుకోలు సినిమాలు రెచ్చిపోతున్న ఈ రోజుల్లో డిమిల్ ఆదిపాపాన్ని ఎలా మర్చిపోగలం?

వివరణకు లొంగని సర్రియలిస్ట్ సినిమాలను “అతి” వ్యాఖ్యానానికి పోకుండా, అలాగని మొత్తంగా కొట్టి పారేయకుండా (చాలామంది విమర్శకులు ఈ పనే చేస్తుంటారు) నేర్పుగానే మాటల్లోకి లొంగదీశారు పూర్ణచంద్రరావు. ముఖ్యంగా Bunuel తీసిన “Un Chien Andalou”, ‘ద గోల్డెన్ ఏజ్’ వంటి సినిమాలను.   ‘ద గోల్డెన్ ఏజ్’ సినిమా గురించి … “పెయింటింగ్ సంప్రదాయాన్ని సినిమాకు తర్జుమా చేస్తున్న ఓ ప్రక్రియ ఇది. దీన్ని ఆ terms లోనే అర్థం చేసుకొని వొదిలేయడం మంచిది. అంతకన్నా ఎక్కువగా అర్థం కోసం లాగకూడదు. ఇలాంటి చిత్రాల్ని appreciate చేయడానికి ప్రేక్షకులకు తొందరపాటుతనం కూడదు. చాలా ఓపికతో కూడిన receptive తత్వం కావాలి. … సినిమా కళ కన్నా ముందే బాగా అభివృద్ధి చెందిన “avant-garde” visual arts పట్ల కొద్దిగానన్నా అవగాహన వుండాలి – ఇలాంటి సినిమాల్ని చూడాలంటే!”  

1919 లోనే లెనిన్ రష్యాలో సినిమాని జాతీయం చేశాడు. స్టాలిన్ వచ్చాక సోవియట్ చిత్ర దర్శకులు పడిన పాట్లు ఇన్నీఅన్నీ కావు. ఈ బాధ సోవియట్ దర్శకులే కాదు టాకీల కాలంలో ఇరానీ దర్శకులూ పడ్డారు. జైళ్లకు కూడా వెళ్ళారు. సోవియట్ దర్శకుల ప్రతిభ ఎంతటిదో వాళ్లకు ప్రభుత్వాధికారులు పెట్టిన ఆంక్షలూ అంతటివే. రష్యన్ అధికారుల బుర్రలేనితనం మీద రచయిత వేసే వ్యంగ్యపు వేటు మహా ఘాటుగా ఉంది.

“సోవియట్ అధికారులకు నచ్చని ఫిల్మ్ మేకర్స్ ని “FEKS” అని నిక్ నేమ్ పెట్టి విమర్శించేవారు. “FEKS” అంటే “The Factory of the Eccentric Actors” అట.”        

“ఎంత స్టాలినిస్ట్ రోజుల్లోనైనా రష్యన్ ఆర్టిస్టులు “అటుబెట్టీ – ఇటుబెట్టీ” అధికారులు చెప్పిన విషయాన్నే తీస్తున్నాం అని మభ్యపెట్టి – ఎలాగోలా తమకి నచ్చిందే తాము చేశారని Meyerhold, Eisenstein, Vertov, Mayakovsky ల్లాంటి వాళ్ళ కళాఖండాల్ని చూస్తే తెలుస్తుంది.”  

“ అఫీషియల్ గా తియ్యమని ఇచ్చిన ప్రాపగండా విషయాన్ని కూడా ఎలా ఆర్టిస్టిగ్గా తీయాలా? అన్న తాపత్రయంతోనే, సోవియట్ దర్శకులందరూ అటూ ఇటూ కాని సినిమాల్ని తీశారు”.  

“ఎందుకిలా ఒకరిని మించి మరొకరు సోవియట్ దర్శకులు formalists (శిల్పానికి ప్రాధాన్యతనిచ్చే దర్శకులు)గా మారిపోతున్నారు? గొప్ప టెక్నికల్ అతిశయం మధ్య, శిల్ప విన్యాసం మధ్య విషయాన్ని ఎందుకు అస్పష్టం చేస్తున్నారు? విషయాన్ని ప్రాపగండా స్థాయికి దిగజార్చే డిమాండ్ ప్రభుత్వం చేస్తున్నంత కాలం, కళాకారులిలా శిల్ప విన్యాసాల వెనుక, విషయంలోని డొల్లతనాన్ని దాచిపెడుతూనే వుంటారు కాబోలు! “

‘విప్లవం, దాని విజయాలు’ అనే ఒకే ఒక్క విషయంతో నలుగురు మేధావులను పదేపదే సినిమాలు తియ్యమంటే వాళ్ళు పడే పాట్లు ఊహించుకోవలసిందే.  వాళ్లకేమో ఓ కొత్త కళారూపంగా సినిమాను దిద్దటంలోనే ఎక్కువ ఆసక్తి. మరోపక్క కళ అంటే తెలియని అధికారులను మెప్పించాలి. ఒక్క కమ్యూనిజమే అని ఏముంది, ఎటువంటి అధికార చట్రాల్లోనైనా కళాకారుడికి ఊపిరాడదు.

మన సినిమాల్లో ప్రతీ కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరినీ మెప్పించటం కోసం అన్నీకలేసి రుబ్బటం మూకీల కాలంనుంచీ ఉంది. దీని ముచ్చట ఇది; “పౌరాణిక చిత్రాల్ని తీస్తున్నప్పుడు వాటికి ఎలాంటి శిల్పం కావాలో దాన్ని అన్వేషించకుండా, ప్రతి పౌరాణిక కథలోనూ, ప్రతి చరిత్రాత్మక కథలోనూ చిటికెడంత బ్రిటిష్ వ్యతిరేక – రాజకీయాంశాన్ని జొప్పించి, ‘కిచిడీ’ చేయడాన్ని ‘దేశభక్తి’గా భావించే రోజులవి. ఏ genre కి ఆ genre cinematic form and its purity ని భారతీయ దర్శక-నిర్మాతలు గౌరవించలేదు; ప్రతి genre లోనూ కొద్దిగా ‘దీన్ని’, కొద్దిగా ‘దాన్నీ’ పడేసి, కలేసి రుబ్బారు!”

మన తెలుగు పౌరాణిక చిత్రాల కళాత్మక విజయాన్ని గురించి కూడా కీలకమైన మౌలికాంశాన్ని పాఠకుల దృష్టికి ఇలా తీసుకొచ్చారు; “ఏ జాతి కథాసంపదైనా కూడా ఆ జాతి సంప్రదాయ గాథల్లోనే ప్రాథమికంగా నిక్షిప్తమై వుంటుంది…. ప్రజా – పౌరాణిక గాథల్ని తమ జాతీయ సంపదగా గుర్తించి జపనీస్, చైనీస్ …. సినిమా దర్శకులు, యూరోపియన్ దేశాల్లో స్కాండినేవియన్లు కూడా తమ తమ ప్రజా – పౌరాణిక గాథల్ని గొప్ప కళాఖండాలుగా తెరకెక్కించారు.  భారతదేశపు ఖర్మ ఏమిటోగానీ – సినిమా ప్రారంభ చరిత్రలో ప్రతి నిర్మాతకీ, దర్శకుడికీ తిండి పెట్టింది ఈ ప్రజా-పౌరాణిక గాథలే అయినా కూడా, వాటికి తగిన ఆధునిక సినిమా శిల్పాన్ని జోడించి ఉన్నత స్థాయి కళాఖండాలుగా రూపొందించే ప్రయత్నం చేయలేదు మనవాళ్ళు! … ఇందుకు ఎక్సెప్షన్ గా భారతదేశం మొత్తంలో వేళ్ళమీద లెక్కపెట్టగలిగే కొన్ని మంచి, ప్రజా, పౌరాణిక చిత్రాల్ని తీస్తే గీస్తే అవి కేవలం తెలుగువాళ్ళే తీయగలిగారు! కానీ తెలుగుజాతి ఖర్మేమిటోగానీ, ఆ “exceptionally better”పౌరాణిక చిత్రాల్ని వాటి విలువల్ని తెలుగు ఎల్లల్ని దాటి మనం project చేయలేకపోయాం”.

సైలెంట్ సినిమా యుగంలో పెద్దగా ఏమీ సాధించలేకపోయిన భారతీయ సినిమా గురించి ఈ ముగింపు చూడండి… “మన నిశ్శబ్ద చిత్రాలకి ఓ శిల్ప పరిణతి రానేలేదు. గొప్ప భారతీయ సైలెంట్ సినిమాల డిస్కవరీ మాట – దేవుడెరుగు…! ముందు 1930 ల నాటి సైలెంట్ నిర్మాతల ఆలోచనలెలా వున్నాయో చూడండి – 1930 నాటికి ఒక్కో భారతీయ నిశ్శబ్ద సినిమాని 20 వేల రూపాయిల్లో, పది రోజుల్ని మించకుండా లుంగ జుట్టేయొచ్చు! రెండు వారాలాడితే చాలు, పెట్టుబడి పోనూ, కొద్దో గొప్పో లాభం కూడా గారంటీయే! “మరి సౌండ్ సినిమాలొస్తే పూర్తిగా ఎక్విప్మెంట్ ని మార్చేయాల్సి వస్తుందేమో! ఖర్చు ఎలా వుంటుందో! టెక్నికల్ కంట్రోలంతా మన చేతుల్లోనే వుంటుందో – ఇతర్ల చేతిలోకి వెళుతుందో…! అన్నది నిర్మాతల ఆందోళన. సైలెంట్ సినిమాలంటే ఒక భాష అంటూ పరిమితి లేదు. టైటిల్ కార్డ్స్ ఏ భాషలోనైనా కొట్టి, అతికించవచ్చు. అదే టాకీలైతే ఒక భాషకే పరిమితం కావాలి; అంటే ఒక మార్కెట్ కే పరిమితం కావాలి…! “

సినిమా కళ, వ్యాపారం, ఎడిటింగ్, స్క్రిప్ట్, కామెరా, చరిత్ర, సమాజం … దేన్నీ విడిచిపెట్టకుండా లూమియర్ బ్రదర్స్ చూపించిన ‘రైలు స్టేషన్ లోకి రావటం’ అనే మొట్ట మొదటి కదిలే బొమ్మ నుండీ మన దేశంలో టాకీలు వచ్చేంతవరకూ, అంటే 1930 వరకూ వచ్చిన ప్రపంచ సినిమాను తెలుగులో వివరంగా తీసుకురావటానికి ప్రయత్నించిన పూర్ణచంద్రరావు కృషి అభినందనీయం.

Expressionism” అన్న పదాన్ని తొందరపడి తెలుగు చేయకపోవడం మంచిది. మక్కీ కి మక్కీగా కేవలం అర్థాన్ని అనువాదం చేసినంత మాత్రాన ఈ యూరోపియన్ సాంకేతిక పదాల క్లిష్టత మనకు అర్థం కాదు. పైగా అనువాదం చేస్తే తప్పుదారి పట్టే ప్రమాదం కూడా వుంది” అనటం వరకూ రచయిత మాట నిజమే కానీ సులువుగా తెలుగులో రాయగల్గిన చాలా పదాలు కూడా ఆంగ్లంలో దొర్లటం అనవసరం అనిపించింది. అది శైలీవేగాన్ని పెంచినా సరే! ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ భాష పుస్తకం విలువను ఎంతమాత్రం తగ్గించదు. పైగా హింగ్లిష్, తెంగ్లిష్ భాషలకు బాగానే అలవాటు పడిన మనకు చదవటం సులభంగా కూడా ఉంటుంది.

పండు వొలిచి చేతిలో పెట్టినట్టుగా సినిమా జ్ఞానాన్ని అందించిన ఈ పుస్తకంలో చివర్న ఇచ్చిన పది నిశ్శబ్ద కళాఖండాల పట్టిక, చెప్పిన విషయానికి సరితూగి, చాలామంది ఏకీభవించేటట్టు ఉంది. సినిమా ప్రేమికులతో సహా సినిమా రంగంలో ఉన్నవాళ్ళందరూ తప్పనిసరిగా అందుకోదగ్గ ఈ పుస్తకం “ఎమెస్కో” ప్రచురణ.

                                                                                        lalitha parnandi      ల.లి.త.

కవిత్వపు మెరుపు తీగ జాన్ హైడ్!

 

john1
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు
~*~
ఎన్నడో
నిద్రలోనో, మగతలోనో, మెలకువలోనో
పరిచయమనుకున్న ఓ నవ్వు
ఎప్పుడైనా ఎక్కడైనా
ఒక్కసారి కౌగలించుకున్న స్నేహ హస్తపు స్పర్శ
వదిలించుకున్నామని అనుకున్నా
పెనవేసుకున్నామనుకున్నా వెంటాడుతూనే వుంటుంది

జీవితాన్ని నడిచిన క్షణాలు కొన్ని
ధనుర్మాసపు మంచుకమ్మినట్టు కమ్మొచ్చు
మసక మసక వెలుతురుమధ్య జ్ఞాపకాలు కప్పినప్పినప్పుడు
చలికి మునగదీసుకున్న దేహంలా అనుబంధం కుంచించుకున్నప్పుడు
కళ్ళు చెమర్చమడం మరచిపోతుంది

***

అనుబంధాలు
మమకారాలు
కరన్సీని ఉన్నిగా తొడుక్కున్నాక
మాటలు కలిపి కలబోసుకోవడం కనుమరుగయ్యాక
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

నీవు ఒంటరివై
రాత్రిలోకి నిన్నునీవు దూర్చుకొని
తాగినవన్నీ కన్నీళ్ళే కదా!

రగిలిస్తున్న యెదమంటలను
చల్లార్చడం మధువుకే చేతనౌనని అనుకున్నాక
తలుపులు ఒకొక్కటిగా మూసుకుంటుంటే
తలుపు తెరచి తొంగిచూసే ధైర్యలేనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

కొలమానాల లోకం
బిగించుకున్న చట్రాల చూపుల్లో ఇమడనప్పుడు
నీవు వేసిన అడుగులన్నీ
తప్పుడుగానో, తడబాట్లుగానో కన్పిస్తుంటాయి

ఇక ఏ అనుబంధం ముడిపడనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

నీలో నీవే దాచుకున్న దేహాన్ని విదిల్చుకుని
నీవు అలా వెళ్ళిపోతావు
కన్నీరొలికించలేనివారు కళ్ళలోంచి తీసేస్తారు
గుప్పెడుమట్టిని సమాధిపైవేసి
ఎవ్వరిని పలకరించకుండానే వెళ్ళిపోతారు
నిన్ను కప్పిన మట్టిలో సమస్యలు దాక్కోవు

***

పొద్దు గ్రుంకుతుంది
కాలచక్రం ఎక్కడా ఆగదు
కోలాహలమైన పక్షుల కిలకిలరావాలతో
రాత్రిదుఃఖాన్ని విదిల్చి మళ్ళీ తూర్పున సూర్యోదయం

***

నువ్వు ఎవరైనా
మళ్ళీ మనం కలుస్తామనే ఓ నిరీక్షణయైనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు.

john hyde

నలుడు-నరుడు

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)
అందరికీ ప్రత్యక్షంగా కనిపించేదాన్ని, లేదా అనుభవంలో ఉన్నదాన్ని నిజమని అంటాం. నిజాన్ని నిరూపించడానికి ఆధారాలు ఉంటాయి కనుక ఇబ్బంది లేదు. నిజం అనే మాటకు భిన్నమైనది భావన. Perception అనే ఆంగ్లపదాన్ని భావనగా అనువదించుకోవచ్చు ననుకుంటాను. భావన అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండచ్చు. భావనను నిరూపించడం ఒక్కొక్కసారి కష్టం కావచ్చు. అందుకు తగినన్ని ఆధారాలు ఉండకపోవచ్చు. అంతమాత్రాన అది నిజం కాదని కొట్టి పారేయడమూ కష్టమే.
ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, నలదమయంతుల కథ పరిశీలనలో నేను ఈ నిజమూ-భావనల మధ్య సతమతమవుతుండడమే!

పురాణ, ఇతిహాసాలలో నరుడు అనే వాడిని సిద్ధసాధ్యయక్షకిన్నర కింపురుష గంధర్వదేవతాదులతో కలిపి చెప్పడం చూస్తుంటాం. అంటే, నరుడు వేరు, పైన చెప్పిన మిగిలిన వారంతా వేరు అనే అర్థం అందులో ధ్వనిస్తూ ఉంటుంది. కానీ నేటి సాధారణ హేతుబుద్ధితో ఆలోచిస్తే పైన చెప్పిన పేర్లు అన్నీ నరుడికి ఉపయోగించిన జాతి, తెగ, లేదా వృత్తి వాచకాలే ననీ; కనుక వారు కూడా నరులే ననీ అనిపిస్తుంది. అలాంటప్పుడు, నరుడు వేరు, పైన చెప్పినవాళ్లు వేరు అన్నట్టుగా ఎందుకు చెప్పినట్టు?
చాలా వ్యాసాల క్రితం, ఒక వ్యాసంలో ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చాను. నలదమయంతుల కథను పరిశీలించేటప్పుడు ఇంకొకసారి తెచ్చి, మరింత విపులంగా చర్చించవలసిన అవసరం కనిపించింది.

ఒకరకంగా ఇది ఎలాంటిదంటే, ఒక ఇంద్రజాలికుడు తను చేసిన గారడీని, లేదా సృష్టించిన భ్రమా ప్రపంచాన్ని తనే నిజమని నమ్మడం లాంటిది. పురాణ, ఇతిహాసాలకు ఒక నిర్దిష్టమైన రూపం ఉంటుంది. నిర్దిష్టమైన భాష, శైలి ఉంటాయి. అది– దేవతలు, పక్షులు, పాములు, పర్వతాలు, నదులు, మానవులతో సహా చరాచరప్రపంచం మొత్తం ఒక అలౌకిక స్థాయిలో కలగలిసిపోయి ఉండే అద్భుతప్రపంచం. అందులో మామూలు మనిషి కూడా అతిమానుష స్వభావంతో ఉంటాడు. అందుకే మనం పురాణ ఇతిహాస పాత్రలను మామూలు మనుషులుగా కాక; అతిమానుషులుగా, అసాధారణులుగా చూడడానికే అలవాటు పడిపోతాం. కానీ మామూలు మనిషిని కూడా గుర్తించకతప్పదు కనుక, అతనిని నరుడు అనే పేరుతో అతిమానుషులతో కలిపి పౌరాణికుడు చెబుతున్నాడన్నమాట.

ఉదాహరణకు, మహాభారత పాత్రలను కొన్నింటిని తీసుకుందాం. పాండవులను కానీ, ద్రౌపదిని కానీ మనం మామూలు మనుషులుగా చూడం. వారి పుట్టుక నుంచి పెరిగి పెద్దైన తర్వాత చేసిన పనులు, వ్యవహరించిన తీరు వరకు, దాదాపు అన్నింటి చుట్టూ ఒక అతిమానుషత్వం, అద్భుతత్వం ఆవరించి ఉంటాయి. పాండవులు దేవతల అంశతో పుట్టినవాళ్లు. ద్రౌపది యజ్ఞగుండం వద్ద అయోనిజగా ప్రత్యక్షమైంది. అర్జునుడు అసామాన్య వీరుడు. తపస్సు చేసి అనేక దివ్యాస్త్రాలను సంపాదించినవాడు. ఇంద్రుని ఆహ్వానం మీద దేవలోకం వెళ్ళి అర్థసింహాసన గౌరవం అందుకున్నవాడు. పాండవులు, ద్రౌపదే ఏమిటి; దుర్యోధనుడితో సహా మహాభారతంలోని ప్రధానపాత్రలన్నీ దేవతాంశతోనో, రాక్షసాంశతోనో పుట్టినవే. ఆ విషయాన్ని కథకుడు ప్రారంభంలోనే చెబుతాడు.

అయితే, ఈ అతిమానుష, అద్భుత ప్రపంచంలో ముందుకు వెడుతున్నకొద్దీ; సిద్ధసాధ్యకిన్నర కిన్నర కింపురుష యక్షరాక్షసగంధర్వదేవతల మధ్య చిక్కుకున్న నరుడనే మామూలు మనిషిని బయటికి లాగి ముందుకు తేవలసిన అవసరం కథకుడికి కలిగింది. ఆ అవసరం ఎందుకు కలిగింది, ఎప్పుడు కలిగిందనే ప్రశ్నలోకి పూర్తిస్థాయిలో వెళ్లడానికి పూర్వరంగంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. నరుడు అనే మామూలు మనిషిని ముందుకు తేవడం కథకుడు తప్పనిసరై చేసిందే తప్ప అంత ఇష్టంతో చేసిన పనిగా అనిపించదు. అర్జునుడికే నరుడు అనే పేరు ఉండడమే చూడండి. మహాభారతంలో నరుడు అనే పేరు అర్జునుడికి తప్ప మరొకరికి లేదు. మిగిలిన పాండవులు, ఇతరులు నరులు కాదా అన్న ప్రశ్నను కాసేపు ఇక్కడ మరచిపోదాం. ఒక కోణంలో చూస్తే మహాభారతంలో నాయకుడు లేదా హీరో అర్జునుడే. అతను నరుడు కూడా, అంటే మామూలు మనిషి కూడా నన్నమాట. ఆవిధంగా చూస్తే కథకుడు పరోక్షంగా మామూలు మనిషిని కథానాయకుడిగా చేసి మహాభారతకథ చెబుతున్నాడన్న మాట.

అదే సమయంలో, మామూలు మనిషిని కథానాయకుని చేసి; పురాణ, ఇతిహాసాలకు ఉన్న ప్రత్యేక రూప, స్వభావాలను చెరపడం కథకుడికి ఇష్టం లేదు. లేదా శ్రోతలు కూడా అలాంటి కథను ఇష్టంగా వినకపోవచ్చు కూడా. కనుక అర్జునుడు నరుడు మాత్రమే కాదు, మరోవైపునుంచి చెప్పుకుంటే, ఇంద్ర వరప్రసాదంతో, అంటే దేవతాంశతో జన్మించినవాడు. ఇంకా ఎన్నెన్నో విశేషణాలు ఉన్నవాడు. అతను నరుడే అయినా మామూలు నరుడు కాదు; నరుడనే ఒక ఆదిముని అవతారం. ఆపైన నారాయణుడనే దేవుడితో(నరనారాయణులు) కలిపి చెప్పవలసినవాడు. అంటే మామూలు మనిషిని ముందుకు తెస్తూనే కథకుడు మళ్ళీ అతనికి దివ్యత్వాన్ని ఆపాదిస్తూ అతని చుట్టూ ఒక కాంతివలయాన్ని సృష్టిస్తున్నాడన్న మాట.

అర్జునుని నరునిగా పదే పదే నొక్కి చెప్పడం అరణ్యపర్వం, ప్రథమాశ్వాసంలో కనిపిస్తుంది. అందులో కథకుడు అర్జునుని నరునిగా పరిచయం చేయడం మామూలుగా కాక, చాలా వ్యూహాత్మకంగా జరుగుతుంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించడానికి వెళ్ళి తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు కిరాత వేషంలో వెళ్ళి అర్జునుడు వేటాడిన ఒక వరాహాన్ని తను కూడా బాణంతో కొట్టి పడగొట్టి అది తనదే నంటాడు. అప్పుడు వారిద్దరి మధ్యా యుద్ధం జరుగుతుంది. అర్జునుని శౌర్యధైర్యాలను మెచ్చుకున్న శివుడు వరం కోరుకోమంటాడు. పాశుపతాస్త్రం ఇమ్మని అర్జునుడు అడుగుతాడు. ఆ సందర్భంలో శివుడు, “పూర్వజన్మలో నువ్వు నరుడనే దేవరుషివి, నారాయణుడికి సఖుడివి” అంటాడు.
arjuna

అర్జునుడు శివుని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించిన సంగతి తెలిసి ఇంద్రుడు, ఇతర దిక్పాలకులతో కలసి అతని దగ్గరకు వస్తాడు. “నువ్వు నరుడనే పూర్వఋషివి. బ్రహ్మ నియోగంతో మనుష్యుడవై ఉత్తమ క్షత్రియకులంలో పుట్టావు” అంటాడు. అర్జునుడికి అతను ఒక దండాన్ని, మిగిలినవారు తమ తమ అస్త్రాలను ఇస్తారు. ఆ తర్వాత, దేవలోకానికి వస్తే, మరికొన్ని దివ్యాస్త్రాలు ఇస్తానని ఇంద్రుడు అతనికి చెప్పి రథం పంపిస్తాడు. అర్జునుడు రథమెక్కి దేవతల రాజధాని అమరావతికి వెడతాడు. “నరుడనే ఆదిమునే ఇతని రూపంలో జన్మించా” డనుకుంటూ దేవతలందరూ అతనిని చూడడానికి వెడతారు. అప్పుడే దేవవేశ్య అయిన ఊర్వశికి, అర్జునుడికి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది.
అర్జునుడు తన విడిదిలో గంధర్వుల సంగీతగోష్ట్టిని ఆనందిస్తుండగా; వెన్నెల రాత్రి తెల్లని చీరకట్టుకుని, సుగంధద్రవ్యాలను అలదుకుని, రకరకాల సువాసనలను విరజిమ్మే పూలు ముడుచుకుని, ఇంద్రుని మందిరం నుంచి బయలుదేరి అందెల రవళితో ఊర్వశి అర్జునుడి మందిరానికి వచ్చింది. ఆమెను చూస్తూనే అర్జునుడు భయభక్తులతో లేచి నిలబడి నమస్కరించాడు. ‘అమ్మా’ అని సంబోధిస్తూ, “నా మీద పుత్రప్రేమతో, నాకు శుభం కలిగించడానికి వచ్చి నన్ను కృతార్థుని చేశావు” అన్నాడు. అంటే, ఆమె రాకకు కారణం పసిగట్టాడా అన్నట్టుగా ముందరి కాళ్ళకు బంధం వేసాడన్నమాట.

తన కళ్ళనే తుమ్మెదలతో అర్జునుడి అందమనే మధువును తాగుతున్న ఊర్వశి అతని మాటలకు ఉలికిపడింది. “నీ గుణగణాల గురించి మునుల ద్వారా విని నీ పొందు కోరి వస్తే, నన్ను అమ్మా అని పిలుస్తావేమిటి? నేను నీకు తల్లిని ఎప్పుడయ్యాను? దేవలోకవేశ్యలమైన మా దగ్గర ఇలాంటి వావివరసలు నడవవు. ఈ లోకంలో స్త్రీ, పురుషులు విచ్చలవిడిగా క్రీడిస్తారు. అదిక్కడ తప్పు కాదు. ఈ లోకానికి వచ్చావు కనుక నువ్వు కూడా దివ్యపురుషుడివే. కనుక నా కోరిక తీర్చు.” అంది.

“ధర్మానికి ద్రోహం చేసే ఇలాంటి మాటలు నువ్వు నాతో మాట్లాడడం న్యాయమా? లోకాలను పుట్టించేది, గిట్టించేది దేవతలే కనుక వాళ్ళు ఎలా నడచుకున్నా తప్పులేదు. కానీ నేను కర్మభూమిపై జన్మించినవాణ్ణి. కర్మిష్టిని. ఇక్కడి ఆచారం నాకు పనికిరాదు. మా వంశకర్త అయిన పురూరవుడికి భార్యవు కనుక, ఇంద్రుని సేవించుకునేదానివి కనుక నువ్వు నాకు తల్లివి అవుతావు. నన్ను పుత్రవాత్సల్యంతో చూడు” అన్నాడు అర్జునుడు నిర్వికారంగా.

దాంతో ఊర్వశి కోపించడం, నపుంసకుడివి కమ్మని అర్జునుని శపించడం, అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా మారడానికి అతడు ఆ శాపాన్ని ఉపయోగించుకోవడం…అనంతర పరిణామాలు.

అర్జునుని మాటల్ని జాగ్రత్తగా గమనించండి…అతనొక సాధారణ మానవుడిలా ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవతలు ఎలాగైనా ఉండచ్చు, మేము మనుషులమని అతను ఒత్తి చెబుతున్నాడు. దేవతలకు, మనుషులకు మధ్య ఒక విభజనరేఖ గీస్తున్నాడు. దేవతలు, సిద్ధులు, సాధ్యులు మొదలైన వారి నుంచి నరుని, అంటే మామూలు మనిషిని తప్పించి; అతనికి తనదైన ఒక ప్రత్యేకత ఉన్నట్టు ధ్వనింపజేసిన అరుదైన సందర్భాలలో ఇది ఒకటి. బహుశా ఇదే మొదటిదేమో కూడా. ఎవరి గురించి అయినా గొప్ప చేసి చెబుతున్నప్పుడు, ఇతడు మామూలు మనిషి కాదంటూ, మనిషిని చిన్నబుచ్చి చెప్పడం మహాభారత కథకుడు సాధారణంగా అనుసరిస్తూ వచ్చిన వైఖరి. ‘ఇతడు కేవల మర్త్యుడు కాడు’ అనీ, ‘ప్రకృతిజనుడు కాడు’ అనీ అనడం చాలాచోట్ల కనిపిస్తుంది.

అది అలా ఉంచితే, అర్జునుడు ఉర్వశిని తిరస్కరించడానికే కాక; ఊర్వశి-పురూరవుల సంబంధానికి కూడా ఆసక్తికరమైన వేరే అన్వయాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం.

ప్రస్తుతానికి వస్తే, రోమశుడనే ముని ఇంద్రుని సందర్శించడానికి వెళ్లి, అతని పక్కన అర్థసింహాసనాన్ని అధిష్టించిన అర్జునుని చూసి ఇతడెవరని అడుగుతాడు. “ఇతడు నరు డనే మహర్షి. నరలోకంలో పుట్టాడు” అని ఇంద్రుడు చెబుతాడు. చివరిగా, అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించాడన్న సంగతి వ్యాసుని ద్వారా ధృతరాష్ట్రునికి తెలుస్తుంది. అతడు, “దేవతలు అర్జునుడికి పాశుపతం మొదలైన దివ్యాస్త్రాలు ఇచ్చారటగా! అలాంటి నరుడు యోధుడై ఉన్నప్పుడు పాండవులను ఎదుర్కోవడం ఎవడి తరం?” అని సంజయుడితో అంటాడు.

ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి. అర్జునుడు నరుడన్న సంగతిని పదే పదే నొక్కి చెప్పడమూ, పాండవుల యుద్ధప్రయత్నాలూ ఏక కాలంలో జరుగుతున్నాయి. అర్జునుడు దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదించుకునే క్రమంలోనే అతణ్ణి నరుడిగా కథకుడు ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నాడు. ఇటువంటి నరుడు యోధుడిగా యుద్ధం చేసేటప్పుడు పాండవులను ఎదుర్కోవడం ఎవరికి సాధ్యమని ధృతరాష్ట్రుడితో అనిపిస్తున్నాడు. యుద్ధం సమీపిస్తున్న కొద్దీ, యుద్ధమధ్యంలో కూడా నర నారాయణుల గురించి భీష్ముడు మొదలైన పాత్రల చేత చెప్పించబోతున్నాడు. అర్జునుని నరునిగా పరిచయం చేస్తున్న పై ఘట్టానికి సరిగ్గా ముందే; యుద్ధానికి అనుకూలంగా భీముడు, ద్రౌపది ధర్మరాజుతో చాలా వాడిగా, వేడిగా చర్చిస్తారు.

ఈ విధంగా చూసినప్పుడు అర్జునుని నరునిగా చెప్పడానికీ, యుద్ధానికీ ఏదో ముడి ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఎలాంటిదో ముందు ముందు వెల్లడవుతుందేమో చూద్దాం.

***
ప్రస్తుత సందర్భంలో మనం గుర్తించవలసిన మరో విశేషం ఏమిటంటే, అర్జునుని నరునిగా పరిచయం చేసిన ఘట్టం వెనువెంటనే, నల దమయంతుల కథ ప్రారంభమవుతుంది. ఇంకా విచిత్రంగా, మా మాదిరిగా ఇన్ని కష్టాలు పడిన నరులు ఎవరైనా ఉన్నారా అని బృహదశ్వు డనే మునిని ధర్మరాజు అడుగుతాడు. అప్పుడా ముని నల దమయంతుల కథ చెప్పడం ప్రారంభిస్తాడు.

వారి పరిచయం సాదా సీదాగా, ఇంకా చెప్పాలంటే ఓ చందమామ కథలానూ, జానపద కథలానూ ప్రారంభమవుతుంది. నలుడు నిషధదేశపు రాజు వీరసేనుడి కొడుకు; దమయంతి విదర్భరాజు భీముని కూతురు, అంతే! వారు దైవాంశ సంభూతులు కారు. వారి పుట్టుక వెనుక ఎలాంటి దైవ కారణాలూ లేవు. వారి చుట్టూ ఎలాంటి కాంతి వలయాలూ లేవు. వారు గొప్ప గొప్ప పనులు ఏవీ చేయలేదు. మొదట వారు ఓ మామూలు ప్రేమికులు, ఆ తర్వాత మామూలు దంపతులు. అనేక కష్ట నష్టాలకు గురై, ఒకరికి ఒకరు దూరమై, ఆ తర్వాత కష్టాల నుంచి బయటపడి తిరిగి ఒకటైన మానవమాత్రులు వారు.

నలదమయంతుల కథానిర్మాణం చాలా చిక్కగా, మంచి నేర్పరి అయిన కథకుడు అల్లినట్టుగా ఉంటుంది. అందులో ఎత్తులు, పై ఎత్తులు, ఉపాయాలు, వ్యూహాలు, విస్మయం గొలిపే మలుపులు ఉంటాయి. భారతీయ సాహిత్యంలో కథ, నవలా లక్షణాలు ఉన్న తొలి కథ ఇదే ననిపిస్తుంది. ఈ మాట ఇంతవరకు ఎవరైనా అన్నారో లేదో నాకు తెలియదు.

కథ, ఇతర విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం

కళ్ళ మీది కటకటాల్ని చెరిపేసే కవిత!

ismayil painting rainbow

” పెయింటింగ్ ఈజ్ ఎ సైలెంట్ పొయెట్రీ, అండ్ పొయెట్రీ ఈజ్ ఎ పెయింటింగ్ దట్ స్పీక్స్ ” అన్నారు. వర్ణ చిత్రం రేఖలు, రంగుల కలబోతతో నిశ్శబ్దంగా పాడే కవిత్వమైతే , కవిత్వమేమో పదాలు , వాటి మధ్య అందంగా పేర్చిన నిశ్శబ్దంతో గుస గుస లాడే వర్ణచిత్రం.

అసలు కవి అనేవాడు ఏం చేస్తాడు? అందులోనూ ఇస్మాయిల్ గారి లాంటి ప్రకృతి సౌందర్యోపాసకుడైన కవి…

ప్రకృతిలోకి తను వేసే ప్రతి అడుగునీ జాగ్రత్తగా అచ్చు వేసి ఎదుటి తరాల వారికి అందిస్తాడు. తను పీల్చే ప్రతి పరిమళాన్నీ పదాల్లోకి తర్జమా చేసి ఎప్పటికీ వాడిపోనీయక దాచి పెడతాడు. అటువంటి కవి , ఏ స్వప్నాల్లోంచి రాలిపడే వర్ణాలతోనో తన ఊహా జగత్తుని అలంకరించుకుని యధాతదంగా ఆ చిత్రాన్ని మన కళ్ళముందు ఆవిష్కరించే చిత్రకారుడి మీద కవిత రాస్తే అదెలా ఉంటుంది? ఇదిగో ఈ క్రింది విధంగా ఉంటుంది.

488096_10151271931041466_1029829309_n

పికాసో ( చెట్టు నా ఆదర్శం సంకలనం నుంచి )

———

పికాసో చిత్రమైన

అచిత్ర కారుడు

 

అతడు గీసింది కన్నా

చెరిపింది ఎక్కువ

 

మన కళ్ళ మీది కటకటాల్ని

కుంచెతో చెరిపేశాడు

 

అప్పట్నించీ మన కళ్ళు

ఎగరడం నేర్చుకున్నాయి.

 

 

ఒక గొప్ప సత్యాన్ని ఎంత సహజమైన వాడుక భాషలో ఎంత సున్నితమైన , తేలికైన పదాలతో ఎంత గాఢమైన చిత్రాన్ని మన మనసుల్లో చిత్రించిందీ కవిత! ఒక్కసారి ఆ చిత్రం చెప్పే గుస గుసలు వింటే ఎన్ని అర్థాలు అందులోంచి సీతాకోకచిలుకలై ప్రాణం పొంది పైకెగురుతాయ్ !

మనల్ని మనమే కాదు, మన కళ్ళని కూడా ఎప్పుడూ కటకటాల్లోనే ఉంచుతున్నాం అన్నది కాదనలేని సత్యం. ఒక పరిధిని దాటి చూడలేకపోతున్నాం. చూపుల్ని ఎక్కడా లోతుగా నాటలేకపోతున్నాం. అంటే మనవన్నీ పై పై చూపులే. అంతర్నేత్రాన్ని కూడా తెరిస్తేనే మనం చూసే వస్తువు నిజంగా మనకు కనపడేది. ఆ సత్యాన్నే ఈ కవిత చెబుతోంది.

కళ్ళ మీది కటకటాల్ని ఆయన కుంచె చెరిపెయ్యగానే కళ్ళు ఎగరడం నేర్చుకోవడం అన్న భావన ఎంత అద్భుతమైన నిజాన్ని మనకి ఆవిష్కరించి పెడుతోందో చూడండి.

సుమారు ఎనిమిదేళ్ళ క్రితం మొదటిసారి నేనీ కవిత చదివినప్పుడు ఒకానొక గాఢమైన నిశ్శబ్దంలోకి నెట్టబడ్డాను. అతి తేలికగా చెప్పబడ్డ ఒక లోతైన భావనని వెతికి పట్టుకునే ప్రయత్నంలో మళ్ళీ మళ్ళీ ఈ కవితని చదివాను. జీవితపు నడకకి అన్వయించుకోవాలని ప్రయత్నించాను. కళ్ళతో చూసే ప్రతి దాన్నీ వెంటనే అలాగే మనసులో ముద్రించుకోకుండా అంతర్నేత్రాన్ని కూడా తెరుచుకుని చూడటం మెల్ల మెల్లగా అలవాటు చేసుకున్నాను.

చిత్రకళాభిమానిగా ఆ తరువాత నేను వర్ణ చిత్రాల్ని ఆశ్వాదించే తీరు కూడా పూర్తిగా మారిపోయింది. వడ్డాది పాపయ్య చిత్రాల్ని చూసినా, రాజా రవి వర్మ తైల వర్ణ చిత్రాల్ని చూసినా, ఇప్పుడు కొత్తగా ఆర్ట్ గేలరీల్లో ప్రముఖ చిత్రకారులు జీవన్ గోశిక, ప్రభాకర్ అహోబిలం మొదలైన వారి వర్ణ చిత్రాల్ని చూసినా మనసు ఇస్మాయిల్ గారి కవితని గుర్తు చేసుకుంటుంది. ఎవరో రహస్యంగా ఆ చిత్రాల్లోని అంతరార్ధాన్ని బోధిస్తున్నట్టుగా కళ్ళు పూర్తిగా ఆ చిత్రాల్ని రెప్పల్లో దాచుకుంటున్నాయ్.

ఒక కవిత కేవలం కొన్ని పదాల అల్లికలా మిగిలిపోకుండా, పాఠకుడి ఆలోచనా పరిధిని పెంచి, ఒక వస్తువుని గమనించే తీరుని మార్చి జీవితాంతం గుర్తుండిపోవడం, నిశ్శబ్ద నదిలా మనసులో పారుతూ అతన్ని/ఆమెని ప్రభావితం చేయడం ఎంత గొప్ప విషయం!

 -ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

 

 

 

ప్రతి గజల్ ఒక ఆత్మ కథే!

jag1

గజల్ రారాజు జగ్జిత్ సింగ్ గురించి నేను ఎపుడూ ఒకటి అనుకుంటా.. “గంధర్వులు అప్పుడప్పుడు శాపగ్రస్థులయి భూమి పై జన్మిస్తారని” ఒక ప్రతీతి. అలాంటి వారే జగ్జిత్ అనిపిస్తుంటుంది. మన అదృష్ట వశాత్తు తన సంగీతం తో, గానం తో మనల్ని అలరించటానికే తను ఈ జన్మ తీస్కున్నరేమో..!

స్కూల్ లో ఉన్నప్పుడు మా నాన్న గారి వల్ల జగ్జిత్ గజల్స్ తో పరిచయం ఏర్పడింది. మొదట్లో పాటల్లోని సాహిత్యం అర్థం అవకున్నా, గానం లోని మాధుర్యం కట్టిపడేసేది. తరువాత తరువాత సాహిత్యాన్ని అర్థం చేసుకుంటూ వింటూంటే జగ్జిత్ కి, తన గజల్స్ కి బానిసని అయిపోయా.

దాదాపు 10 సంవత్సరాల క్రితం 2004 లో మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) లో  జగ్జిత్ సింగ్ సంగీత కచేరి కి వెళ్ళే మహద్భాగ్యం కలిగింది. దాదాపు 3 గంటల పాటు సాగింది ఆ సంగీత కచేరి. ప్రేక్షకుల కోరిక మేరకు 2-3 పాటల్ని మళ్ళీ మళ్ళీ పాడారు. ఆ కచేరీ లో ఉన్నంతసేపు ఇది నిజమేనా? అనిపించింది. ఏదో తెలియని లోకాలకు ప్రయాణం చేసినట్టు గా అనిపించింది. ఆ ట్రాన్స్ లోంచి బయటకు రావడానికి చాల సమయం పట్టింది..!

జగ్జిత్ పాటల్లో “ఆత్మకథలు” ఉంటాయి. ఎలాంటి భేషజాలు లేని స్వచ్చమయిన ఆత్మ కథలు. అవి మన అందరి కథలు . అందుకే అవి మన ఆత్మ లోతుల్ని తడతాయి. గతం తాలుకా అనుభవాల్ని, అనుభూతుల్ని, మదిలోని గాయాల్ని మెల్లిగా తడుతుంది తన పాట..తన శ్రోతలకి తన పాటలనే “ఆత్మ బంధువుల్లా” పంపిస్తారు జగ్జిత్, అవి మనతో జీవితాంతం ప్రయాణిస్తాయి.

జగ్జిత్ తన స్వస్థలం లో పండిట్ చగన్ లాల్ శర్మ దగ్గర రెండు సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నారు. తరువాత “సైనియా ఘరానా” కి చెందిన ఉస్తాద్ జమాల్ ఖాన్ వద్ద ఆరు సంవత్సరాలు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు.పంజాబ్ మరియు కురుక్షేత్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, లేట్ ప్రొఫెసర్ సూరజ్ భాన్ సంగీతంలో అతనిని ఎంతగానో ప్రోత్సహించాడు. 1965 లో ముంబై వచ్చినేపథ్య గాయకుడు గా మారాడు జగ్జిత్ . మొదట్లో పెళ్ళిళ్ళలో, వేడుకల్లో, ప్రకటనలకి  పాడుతూ తన సంగీత ప్రస్థానం మొదలు పెట్టాడు. ఇదే సమయం లో తన జీవిత భాగస్వామి చిత్ర ని కలిసాడు , ఆ తరువాత రెండు సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నారు.

1976 లో వచ్చిన ఆల్బం “ది అన్ ఫర్గేటబుల్స్” తో తన దశ తిరిగింది. అతి పెద్ద హిట్ ఆల్బం గా రికార్డులు సొంతం చేసుకుంది. ఆ ఆల్బం గజల్ సంగీతాన్ని సమూలంగా మార్చేసింది. అందులోని “బాత్  నిక్లేగి  తో  ఫిర్  దూర్  తలక్  జాయేగీ” తను పాడిన మొదటి పాట.

జగ్జిత్ సినిమాలలో పాడిన పాటలు తక్కువే కానీ, పాడిన పాటలన్నీ అధ్బుతాలే.

మహేష్ భట్ కి జగ్జిత్ తో తన సినిమా కి సంగీత దర్శకత్వం చేయించాలన్న  ఆలోచన రావటం దాన్ని అమలు పరచటం  “అర్థ్” సినిమా కోసం జరిగింది. “అర్థ్” సినిమా కి “ఆత్మ” కథ అయితే “అంతరాత్మ” జగ్జిత్ పాట. పాటలకి “ప్రాణ ప్రతిష్ట” చేసాడు జగ్జిత్. ఆ సినిమా లోని పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. “అర్థ్” సినిమా మహేష్ భట్ “ఆత్మకథ” (సెమి ఆటో బయోగ్రఫీ). (సినిమా కోసం కొన్ని సంఘటనలని మార్చటం జరిగింది). అంతలా తను ఇష్టపడి ప్రాణం పెట్టిన కథ కి జగ్జిత్ ని సంగీత దర్శకుడిగా, గాయకుడిగా నిర్ణయించుకోవటం తోనే మహేష్ భట్ సగం విజయం సాదించాడు . రాజ్ కిరణ్ (హీరో) పాడుతుంటే, ఆ పాటలోని “సాహిత్యాన్ని”, ఆ పాత్రలోని “మానసిక సంఘర్షణ” ని జగ్జిత్ ఎంతగా అనుభవించి పాడారో తెలుస్తుంది.

“తుమ్ ఇత్నా జో ముస్కురారహేహో క్యా గమ్ హై జిస్కో చుపా రహేహో “…”ఇంతలా ఎందుకు నవ్వుతున్నావు? ఏ విషాదాన్ని దాస్తున్నావు?” అంటాడు.

జగ్జిత్ గురించి మహేష్ భట్ అంటాడు ..”బొంబాయి మెట్రో సినిమా లో “అర్థ్” సినిమా రిలీజ్ ఆయినరోజు, “ఝుకీ ఝుకీ సీ నజర్” పాట మొదలయింది.పాట అయిపోగానే హాల్ మొత్తం “వన్స్ మోర్” అన్నారు. ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. ఒక సినిమా పాట ని హాల్ మొత్తం, ప్రేక్షకులంతా  ఏక కంఠం తో “వన్స్ మోర్ ” అనటం నా జీవితం లో ఎప్పుడూ చూడలేదు” .
కైఫీ ఆజ్మి సాహిత్యాన్నిజగ్జిత్  “ఉచ్చాస” లా లోపలి స్వీకరించి, తన “నిశ్వాస”లో సంగీతాన్ని ఇచ్చాడు అంటాడు మహేష్ భట్  “అర్థ్” సినిమా సంగీతం గురించి చెబుతూ..

కొందరికి జగ్జిత్ పాటల్లోని విషాదం , నకారత్మకం గా అనిపించవచ్చు. కాని అవి గాయపడిన మనసుకి సాంత్వన ని ఇచ్చే మందు గుళికలు.అలా అని అన్నీ విషాద గీతాలే పాడలేదు. చిత్ర తో కలిసి ఎన్నో ప్రణయ గీతాలూ పాడాడు. మరెన్నో హుషారు గా ఉండే గీతాలు, భక్తి గీతాలు, ఇలా  అన్ని రకాలయన పాటలూ పాడాడు.

ప్రతీ వ్యక్తి  తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించిన వేదనే జగ్జిత్ తన పాటలతో స్పృశిస్తాడు.

“చిట్టీ న కోయి సందేశ్ జానే వొహ్ కౌన్ సా దేశ్ జహాన్ తుమ్ చలేగయే…ఇస్ దిల్పే లగాకే టేస్ జానే వో కౌన్ సా దేశ్ జహాన్ తుమ్ చలేగయే”

ఈ పాట మరణించిన తన సోదరి కోసం కాజల్ ఏడుస్తున్న సందర్భం లో వస్తుంది. (“దుష్మన్” సినిమా నుండి). కాని ఈ పాట ని ఇంకో కోణం లో కూడా చూడొచ్చు. మనకి బాగా ఆత్మీయులయిన వ్యక్తులు- స్నేహితులో, బంధువులో, ప్రేమికులో, మన నుండి దూరమై తిరిగి మళ్ళీ కలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ పాటలోని “పల్లవి” ఆ వ్యక్తి పడే వేదనని ప్రతిబింబిస్తుంది.

“ఒక లేఖయినా,  ఒక సందేశం”  అయినా ఇవ్వకుండా నా హృదయాన్ని గాయపరిచి తెలియని దేశాలకి వెళ్ళిపోయావు ” అంటాడు.

జగ్జిత్ తో పని చేసిన పాటల రచయితలు అందరూ చాలా గొప్ప సాహిత్యాన్ని అందించారు . జగ్జిత్ వారి సాహిత్యాన్ని తన గానం తో చాలా ఉన్నత స్థాయి కి తీసుకెళ్ళాడు.

“గుల్జార్-జగ్జిత్” కాంబినేషన్ లో వచ్చిన “మరాసిం” ఆల్బం లో ప్రతీ పాట గజల్ ప్రపంచం లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎన్ని సార్లు విన్నా, వింటున్న ప్రతి సారి ఏదో కొత్త అర్థం స్పురిస్తుంది,కొత్త అనుభూతి విని(కని)పిస్తుంది.

“శామ్ సే ఆంఖ్ మే నమీ సీ హై ..ఆజ్ ఫిర్ ఆప్ కీ కామీ సీ హై..”

“సాయంకాలం నుండి కళ్ళలో చెమ్మగా ఉంది..ఈ రోజు మళ్ళీ నువ్వు లేని లోటు తెలుస్తూ ఉంది”

“మరాసిం” గురించి గుల్జార్ అంటాడు ” నాకు జగ్జిత్ తో అనుబంధం నా సీరియల్ “మిర్జాఘలిబ్” నాటిది. ఆ సీరియల్ కి జగ్జిత్ సంగీత దర్శకత్వం వహించాడు. ఆ సమయంలో ఛాలా సులువుగా, అలవోకగా ట్యూన్స్ అందించేవాడు. అది చూసి నేను ఆశ్చర్య పోయేవాడ్ని. “గజల్స్ ” కి ఒక ప్రత్యేకమయిన “ఆలాపనా” , “ఉర్దూ” సాహిత్యాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకునే ప్రతిభా అవసరం. ఆ రెండూ జగ్జిత్ లో పుష్కలంగా ఉన్నాయి. అదే సమయం లో “మరాసిం” ఆల్బం సాహిత్యాన్ని తనకి చూపించా. కొన్ని సులువుగా అనిపిస్తాయి కాని ఛాలా సమయం తీసుకుంటాయి. “మరాసిం” ఆల్బం ని పూర్తి చేయడానికి మాకు 6 సంవత్సరాలు పట్టింది”. పరిపూర్ణత కోసం వారు పడ్డ తాపత్రయం చెప్పకనే చెబుతుంది ఈ మాట.

“మీర్జాఘాలిబ్” సీరియల్ ద్వారా ఘాలిబ్ ని ప్రాచుర్యం లోకి తీసుకువచ్చినందుకు గానూ 1998 లో భారత ప్రభుత్వం “సాహిత్య అకాడెమి అవార్డు” ద్వారా జగ్జిత్ ని సత్కరించారు.

మాజీ ప్రధాని వాజ్ పాయి కవితలతో, జగ్జిత్ గానం తో వెలువడ్డ ఆల్బం “సంవేదన”. వాజ్ పాయి గారి కవితలకి జగ్జిత్ ప్రాణం పోసాడు. జీవితం లోని తాత్వికత ఆ పాటల్లో ఉంటుంది.

“క్యా ఖోయా క్యా పాయా జగ్ మే ..మిల్తే ఔర్ భిగడ్ తే పగ్ మే”

“జీవితం లో సాధించింది ఏంటి? కోల్పోయేది ఏంటి? కూడళ్ళలో కలుస్తూ విడిపోతుంటాము..ప్రతీ అడుగులో ద్రోహం ఉన్నా, నాకు ఎవరిపయినా ఫిర్యాదు లేదు.గడిచిపోయిన కాలం పైన దృష్టి సారిస్తే మాత్రం జ్ఞాపకాల భాండాగారం కదులుతుంది ”

జగ్జిత్ గానం “బోల్ ప్రధాన్” పద్దతిలో సాగుతుంది. దీని విశిష్టత ఏంటంటే “మాటలని” ఉచ్చరించే పద్ధతి పైన ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది.

“జగ్జిత్ కి ముందూ గజల్ గాయకులు, చాలా గొప్ప హేమా హేమీలు ఎంతోమంది ఉన్నారు. “బేగం అఖ్తర్, మేహది హసన్ ” లాంటి వారూ ఉన్నారు. కానీ వారి గజల్స్ సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేట్టు ఉండేవి కాదు. ఎందుకంటె అవి “శాస్త్రీయ సంగీత” ప్రధానంగా ఉంటాయి.  జగ్జిత్ గజల్స్ “సాహిత్యాన్ని , సంగీతాన్ని” ఎంతగా సరలీకరించారంటే అవి సినిమా పాటల్లా సామాన్య ప్రజానీకానికి చేరువయ్యాయి. జగ్జిత్ గజల్స్ కవితాత్మకంగా ఉంటూనే, సరళంగా మార్చబడి  శ్రోతలని రంజింపజేసాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా జగ్జిత్ కి అభిమానుల్ని సంపాదించి పెట్టింది.  హిందీ, ఉర్దూ మాట్లాడే ప్రజలు ఎక్కడున్నా జగ్జిత్ గజల్స్ కి వీరాభిమానులుగా మారిపోయారు”, అంటారు పాటల రచయిత “జావేద్ అఖ్తర్”

“వొహ్ కౌన్ హాయ్ దునియామె జిసే గమ్ నహి హోతా? ..కిస్ ఘర్ మే ఖుషీ హోతీ హై మాథం నహి హోతా?”

–“ప్రపంచం లో బాధలు లేనిది ఎవరికీ? ఎవరి ఇంట్లో కేవలం సంతోషాలు మాత్రమే ఉంటాయి? మరణం (ఎవరైనా మరణించినప్పుడు కలిగే శోకం) లేకుండా?”

మరణించిన తన  కొడుకు ని తిరిగి బ్రతికించాలని ఒక మహిళ “బుద్ధుడి” వద్దకు వెళుతుంది. అపుడు బుద్ధుడు బ్రతికిస్తాను కానీ, అంటూ ఒక షరతు విధిస్తాడు ” ఇంతవరకూ ఎవరూ మరణించని ఒక ఇంటి నుండి పిడికెడు “ఆవాలు” తీసుకురమ్మని చెపుతాడు.

పరుగు పరుగున ఆ గ్రామం లోని ప్రతి ఇంటికి తిరుగుతుంది ఆ మహిళ, సాయంకాలం వరకూ అలా తిరుగుతూనే ఉంటుంది. వెళ్ళిన ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు మరణించే ఉంటారు. చివరికి తనకి అర్థం అవుతుంది, మరణాన్ని ఎవరూ ఆపలేరు అని. ఆ సత్యాన్ని తెలుసుకోవటానికే బుద్ధుడు తనకి ఈ షరతు పెట్టాడని. చివరికి బుద్ధుడి వద్దకు వెళ్లి తనకి సత్యం అవగతమైంది అని కృతజ్ఞతతో, ఏడుస్తూ వెళ్ళిపోతుంది.

ఈ గజల్ లో సూక్ష్మంగా ఇదే విషయాన్ని చెప్పారనిపిస్తుంది. “జననం-మరణం” ఇవి రెండే జీవితం లో సత్యాలు, మిగతావన్నీ “మిథ్యే ” అంటారు దార్శనికులు. “సంతోషం-దుఃఖం” , “జననం-మరణం” ద్వందాలు కావు, అవి ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాలు.

సెప్టెంబర్ 23,2011  న ముంబాయి లో జగ్జిత్ , గులాం అలీ తో సంగీత కచేరి లో పాల్గోవాల్సిన సమయం లో తీవ్ర అస్వస్థత కి గురయ్యారు. “సెరిబ్రల్ హమోరేజ్ “అని తెలిసింది. రెండు వారాలు కోమాలో ఉన్న తరువాత , అక్టోబర్ 11 , 2011 న లీలావతి హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.

జగ్జిత్ విషయం లో “తుది శ్వాస” విడిచారు అనటం సరైంది కాదేమో..ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా తనని అభిమానించే కోట్లాది అభిమానుల గుండెల్లో నిండి , వారి “ఉచ్చ్వాస , నిశ్వాస” ల్లో సంగీతం ఉన్నంతకాలం అమరుడయి, చిరంజీవిలా ఉంటాడు.

జగ్జిత్ సింగ్ కి ఎన్నో పురస్కారాలు లభించాయి. అందులో ముఖ్యమైనవి –

-2012 లో రాజస్థాన్ ప్రభుత్వం “రాజస్థాన్ రత్న” అవార్డు తో సత్కారం (మరణించిన తదుపరి)

-2003 లో భారత ప్రభుత్వం “పద్మ భూషణ్” తో సత్కరించింది.

-1998 లో “మీర్జా గాలిబ్” కి సాహిత్య అకాడమీ అవార్డు (“గాలిబ్ గీతాల్ని” ప్రాచుర్యం లోనికి తీసుకు వచ్చినందుకు)

ఇలా ఎన్నో పురస్కారాలు…మరెన్నో రికార్డులు..!

-“అర్థ్&సాత్ సాత్” కాంబినేషన్ ఆల్బం HMV సంస్థ లో లార్జెస్ట్ సెల్లింగ్ ఆల్బం ఆఫ్ అల్ టైం గా రికార్డు ను సొంతం చేసుకుంది.

-“సజ్దా” ఆల్బం కూడా ఇలాంటి రికార్డు నే సొంతం చేసుకుంది. 1991 లో లతా  మంగేష్కర్ తో చేసిన ఈ ఆల్బం “నాన్-ఫిలిం” కాటగిరి లో  లార్జెస్ట్ సెల్లింగ్ ఆల్బం ఆఫ్ అల్ టైం గా రికార్డు  సాధించింది.

జగ్జిత్ ని తన కొడుకు మరణం బాగా కుంగదీసింది. “విషాదాన్నే” తన “సంతకంగా” మార్చి అభిమానుల హృదయాల్లో ఎన్నటికీ చెరగని ముద్ర వేసాడు. తన భార్య చిత్ర తో కలిసి పాడటం తన కొడుకు మరణం తోనే ఆగిపోయింది. తన ఊపిరి ఆగే వరకు తను ఎక్కువగా విషాదం తో నిండి, హృదయాన్ని ద్రవింపజేసే పాటలే పాడాడు.

జగ్జిత్ అభిమానులకి మాత్రం తను లేరన్న విషయం గుర్తొచ్చినప్పుడు, తన పాటే గుర్తొచ్చి కళ్ళు చెమరుస్తాయి, గుండె బరువెక్కుతుంది.. “శామ్ సే ఆంఖ్ మే నామీ సీ హై..ఆజ్ ఫిర్ ఆప్ కీ కామీ సీ హై” అని…

jsg2

 

తోటివారిని

 

మన తోటివారిని గాజులానో, పూలలానో,
కదలని నీటిపై నిదురించే చంద్రునిబింబంలానో చూడటం నేర్చుకోలేమా

గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే బహుశా
అద్దంలో మన ప్రతిబింబంలా మృదువుగా చూసుకొంటాం ఒకరినొకరం

నిజంగా మనం తెలియనిచోట ఉన్నాం కదా
భూమి ఏమిటో, ఆకాశం ఏమిటో,
మెరిసే ఉదయాస్తమయాలూ, దిగులు కురిసే నల్లని రాత్రులూ
ఎందుకున్నాయో, ఏం చెబుతున్నాయో తెలియని
మంత్రమయ స్థలంలో దారి తెలియక తిరుగుతున్నాం కదా

కనులంటే ఏమిటో, చూడటమేమిటో,
చూపు బయలుదేరుతున్న లోలోపలి శూన్యపు అగాధమేమిటో
ఎరుక లేకుండానే ఋతువుల నీడల్లో తడుముకొంటున్నాం కదా

ఎవర్ని లోపలికంటా తడిమిచూసినా ఏముంటుంది
గుప్పెడు ప్రశ్నలూ, కాస్త కన్నీరూ, ఇంకా అర్ధం సంతరించుకోని ఒక దిగులుపాట మినహా
ఎవరి కథ చూసినా ఏముంటుంది
అంచులు కనరాని కాలపు ఊయలలో ఏడ్చే, నిదురించే పసిబిడ్డ లోపలి నిశ్శబ్దం మినహా

తాకలేమా మరికాస్త కోమలంగా ఒకరినొకరం
చేరలేమా మరికాస్త సమీపంగా ఒకరికొకరం
చూడలేమా ఒకరిలోకొకరం మరికాస్త సూటిగా, లోతుగా, నమ్మకంగా..

-బివివి ప్రసాద్

bvv

అపురూపం

Apuroopam
గీస్తున్న గీత చేరవలసిన గమ్యం తాలుకు విసురులో ఏమాత్రం తొట్రుపడినా, నన్ను భారం కమ్ముకుంటుంది, అనేకానేక ఆలోచనల మధ్య తాత్కాలికంగా విషయం మరిచిపోయినా దాని తాలూకు బరువు రోజంతా వెంటాడూతూనే వుంటుంది, ఇది దేని తాలూకు వేదనబ్బా ! అని పని గట్టుకు వెనక్కువెళ్ళి దుఖాన్ని మళ్ళీ తొడిగేస్తాను ఉపశమనం కోసం కుదరని బొమ్మే మళ్ళీ మళ్ళీ కుదర్చడానికి ప్రయత్నం జరుగుతుంది అప్పటికీ కుదరకపోతే చివరకి బొమ్మ ముక్కలు ముక్కలుగా చిరిగి పోవడం.

బొమ్మ పోతుంది కాని అది చేసిన గాయం?

కుదిరిన బొమ్మల తాలూకు అనుభూతులు ఎప్పుడూ గుర్తుకు వుండి చావవెందుకో! అపజయాల్ని మళ్ళీ మళ్ళీ వెతుక్కుని మరొక అపజయంకోసం సిద్దమైనవాడ్ని నా కాలంలోనే కాదు ఏ కాలంలో నైనా అన్వర్ అనే అంటారేమో?

బొమ్మల పట్ల ఎందుకని నీకంత జాగ్రత్త? ఏమిటా అపురూపం? అని ? ఒక్క బొమ్మలే కాదు, ప్రపంచంలో ప్రతీది అపురూపంగా ఫీలయ్యే సెన్స్ ని పెంచుకోవాలని
అనుకుంటాను, రోజు ఎన్ని సార్లు ఎంతమందికి థేంక్స్ చెబుతావు, థేంక్స్ చెప్పిపుడు నిజంగా ఆ కృతజ్ఞత హృదయంలోంచి బయలి గొంతులోంచి మెత్తగా ఎదుటి వారిని తాకుతుందా ! థాంక్ యు … ఎంత కరుణ కల్గిన మాట ,బొమ్మలు సాధన చేసినట్టు ధేంక్స్ అనే మాట కృతజ్ఞత నింపుకుని బయటకు రావడానికి ఎన్ని జన్మల సాధన అవసరం! నా ఈ జీవితంలో నా థేంక్స్ నిజంగా ఏ ఒక్కరినైనా తాకగలిగిందా? వెల్తున్నవాడు నా థేంక్స్ కి ఆగి పోయి నా ప్రేమను తాకి మరొక ప్రేమను నవ్వుగా ఇచ్చాడా?

ఒక్క బొమ్మలే కాదు, ప్రపంచంలో ప్రతీది అపురూపంగా ఫీలయ్యే సెన్స్ ని పెంచుకోవాలి , ఎందుకంటే ఒక రోజు వస్తుంది ఆ దినం చేతుల్లో కుంచెని ఎత్తేంత బలం మిగలదు, అ దినం చిన్న చుక్క కూడా పెట్టలేని వణుకు వ్రేళ్ళను ఆవరించేస్తుంది, ఆ రోజుకు ముందే గీయవలసినదంతా గీసేయ్యి , అందుకని బొమ్మలు అపురూపం.

ఒక రోజు వస్తుంది నా కాళ్ళకు అప్పుడు అడుగులు వేయడం తెలిసిన రోజు లుండేవి , ఆ నడవాల్సిన దినాల్లో నడుము పడక్కి ఆనించి పెట్టాను అదే సుఖమనుకున్నా కాని ఈ రోజు చిన్న నడక కోసం తపించి పోతున్నా కాని నడవడానికి కాళ్ళేవి? అందులో బలమేది ?
అందుకని నడక అపురూపం.

కార్టూనిస్ట్ శేఖర్ గారు చివరి రోజుల్లో ఒక పైప్ ద్వారా ఆహారం తీసుకునే వారు, ఆయన నాకు పంటి కింద మెత్తగా నలిగే అన్నం మెతుకు శబ్దం వినడానికి ప్రయత్నించమనే పాఠం నేర్పకనే నేర్పారు, అన్నాన్ని నాలిక ద్వారా లోపలికి తీసుకొవడానికి మించిన అదృష్టమేముంది అనిపించింది నాకా సమయంలో. తెలిసీ తెలీక ఒకనాడు విసిరి కొట్టిన అన్నపు పళ్ళెం నన్ను రోజూ భయపెడుతుంది. అందుకని అన్నం అపురూపం.

“ది స్ట్రయిట్ స్టొరీ” అనే సినిమాలోని సన్నివేశం – దాదాపు 80 సంవత్సరాల ‘ఆల్విన్ స్ట్రయిట్’ చుట్టూ చేరిన నవ్వే కుర్రాళ్ళు, తుళ్ళే కుర్రాళ్ళూ , నర నరాన పచ్చీస్ ప్రాయం నింపుకున్నవారు , వారిలో ఒకడు ఆల్విన్ ని అడుగుతాడు వృద్దాప్యం లో అన్నిటికన్నా ఎక్కువ బాధించేది ఏదీ అని, వాడి ఉద్దేశంలో అది కాళ్ళ నొప్పా, కంటి చూపు మందగించడమా లేదా మరొటీ మరొటా అని. దానికి ఆ వృద్దుడి సమాధానం ” నాకు ఒకప్పుడు యవ్వనం ఉండేది అనే విషయం గుర్తు వుండడం”అంటాడు. చూస్తున్న సినిమా పాజ్ చేసి అలా మూగ గా ఐపోలా ! అలా ఒక రోజు మనకూ వస్తుంది , ఆప్పుడు మనకు వేళ్ళు వుండేవి గీయవలసినదంత గీయవలసింది! నడక వుండేది నడవవలసిన దార్లన్ని నడవవలసినది! చేతులు వుండేవి కలిసిన ప్రతి చేతిని అపురూపంగా చేతుల్లొకి తీసుకొవలసినది….క్షమించండి ఒక్క క్షణం ఇది ఆపుతాను నా చెవుల్లొ ఎవరో పాడుతున్నారు “కిసీకి ముస్కురాహటోంపె హో నిసార్ ” అని.

కాబట్టి ఇదంతా గ్రాంటెడ్ కాదు, నా ప్లేట్ లొకి వచ్చే ప్రతి మెతుకు, నా వంటిన తగిలే గాలి, నన్ను స్నేహించే ప్రతి మనిషి, దీవించే ప్రతి దీవెన ………. నాకు తెలుసు బొమ్మ ఏనాటికి నాదాకా వచ్చేది కాదు కాని ఓపికగా సహనంగా సాధన చేస్తే ప్రేమ రావచ్చు , జీవితాంతం నాతో వుండొచ్చు నా తరువాత కూడా నాగురించీ మీలో వుండొచ్చు కాని ప్రేమకు బదులుగా ఇవ్వడానికి నాదగ్గర నాదికాని బొమ్మ వుంది, ఈ రోజు నా అనుకునే ప్రతీదాని వెనుక బొమ్మ వుంది అందుకే బొమ్మ నాకు అపురూపం బొమ్మ నా జాగ్రత్త.

భగవంతుడి స్నేహితుడు

MythiliScaled

అనగనగా పర్షియా దేశం లో అబ్దుల్ కరీం అనే పేదవాడు ఉండేవాడు. అతనికి జెబా అనే భార్య, యూసఫ్, ఫాతిమా అని ఇద్దరు పిల్లలు. కొండలమధ్యన ఉన్న లోయలో వాళ్ళ పల్లెటూరు . కొండల మీదంతా చక్కని పళ్ళతోటలు- వాటిలో పీచ్, మల్ బెర్రీ , ద్రాక్ష లాంటి పళ్ళు విరగకాసేవి.

కరీం ఒక ధనవంతు డి పొలం లో పని చేసేవాడు. అతనికీ కుటుంబానికీ సరిపడా తిండీ బట్టా తప్పించి అతనికి డబ్బుగా జీతమేమీ వచ్చేది కాదు.డబ్బు పేరు వినటమేగాని ఎన్నడూ చూసి ఎరగడు.

ఇలా ఉండగా ఒక రోజున యజమాని కి కరీం చేసేపని బాగా నచ్చి పది రియాల్ లు [ వెండి నాణాలు ] అతని చేతికి ఇచ్చాడు. ఎలా కావలిస్తే అలాగ ఖర్చు పెట్టుకోవచ్చని చెప్పాడు.కరీం కి అది చాలా ఎక్కువ డబ్బు అని తోచింది. ఇంటికి వెళుతూనే ఆ నాణాలని భోజనాల బల్ల మీద పరిచి- ” జెబా, చూడు ! నిధి దొరికింది మనకి ” అని సంతోషంగా అరిచాడు. భార్యా పిల్లలూ చాలా మురిసిపోయారు. కరీం వాళ్ళతో అన్నాడు – ” చెప్పండి మరి, వీటితో ఏం చేద్దాం ?   మషాద్ నగరం ఇక్కడికి ఇరవై మైళ్ళే కదా, అక్కడి ఇమాం రజా సమాధి మీద రెండు నాణాలు సమర్పించి ఆ తర్వాత బజారుకి వెళతాను. అక్కడ మీకేంకావాలంటే అది కొనుక్కొస్తాను ”

” నాకొక పట్టుతాను కావాలి, కొత్త దుస్తుల కోసం ” – భార్య అడిగింది.

” నాకొక మంచి గుర్రమూ కత్తీ ” యూసఫ్ అడిగాడు. అతను బాగా చిన్నపిల్లవాడు .

” నాకొక కాశ్మీరు శాలువా, జలతారు చెప్పులు ” వయసు వస్తూన్న కూతురు ఫాతిమా అడిగింది.

” ఓ.తప్పకుండా. రేపు రాత్రికల్లా మీరు కోరినవన్నీ వచ్చేస్తాయి ” అని ధీమాగా చెప్పేసి కరీం నగరానికి బయలుదేరాడు.

కొండలు దిగి మైదానం లోంచి నడిచి అతను మషాద్ నగరం చేరాడు. ఆ నగరపు వైభవాన్నీ , ఎత్తైన భవనాలనీ , ధగధగమనే మసీదుల గోపురాలనీ చూసి బోలెడంత ఆశ్చర్యం వేసింది అతనికి. ముందు ఇమాం రజా సమాధి ఉన్న పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. వాకిట్లో ఉన్న పెద్దాయనని ” నేను లోపలికి వెళ్ళచ్చా ?” అని అడిగాడు. ” అలాగే , వెళ్ళునాయనా ! నీకు ఉన్నదానిలోంచి ఇవ్వగలిగినంత అక్కడ అర్పించు. అల్లా నిన్ను చల్లగా చూస్తాడు ” అని బదులిచ్చాడు ఆయన.కరీం లోపలికి వెళ్ళాడు. ఆసియా ఖండం మొత్తం నుంచీ అక్కడికి భక్తులు వస్తుంటారు. వాళ్ళు ఇచ్చిన కానుకలతో ఆ క్షేత్రం కళకళలాడుతూ ఉంటుంది. బంగారు, వెండి నగలూ పాత్రలూ ఖరీదైన తివాసీలూ కుప్పలు పోసి ఉన్నాయి అక్కడ. కరీం అవన్నీ నోరు తెరుచుకుని చూసి, రెండు వెండి నాణాలని బెరుకు బెరుకుగా సమాధి మీద ఉంచి వెనక్కి తిరిగాడు. ఇప్పుడు అతని దగ్గర ఎనిమిది నాణాలు మటుకే ఉన్నాయి.

La_civilització_del_califat_de_Còrdova_en_temps_d'Abd-al-Rahman_III

చాలా రద్దీగా, హడావిడిగా ఉన్నాయి అక్కడి బజార్లు. ఒక్కొక్క వస్తువు అమ్మేందుకుఒక ప్రత్యేకమైన బజారు ఉంది. పళ్ళకి ఒకటి, పాత్రలకి ఒకటి, నగలకి ఒకటి, రొట్టెలకి ఒకటి – ఇలాగ. అన్నీ దాటుకుని చివరికి పట్టు వస్త్రాలు అమ్మే చోటికి వచ్చాడు.

ఒక దుకాణం లో ప్రవేశించి అవీ ఇవీ తిరగేసి ఆఖర్న జరీ పని చేసిన వంగపండు రంగు పట్టు తానుని ఎంచుకున్నాడు. ” ఇది తీసుకుంటాను, వెల ఎంత ? ” అని దుకాణదారుని అడిగాడు.

” మామూలుగా నాలుగు వందల వెండినాణాలు అండీ. మీరు కొత్తగా ఇక్కడ అడుగుపెట్టారు కనుక మీకు రెండువందలకే ఇస్తాను, తీసుకోండి ” దుకాణం అతను చెప్పాడు.

” ఏమిటీ, రెండు వందలా? మీరేదో పొరబడినట్లున్నారు. చూడండి- ఇటువంటి నాణాలేనా, రెండు వందలు ? ” తన దగ్గర ఉన్న రియాల్ ని చూపించి అడిగాడు కరీం.

” ఆ, కాక ఇంకేమిటనుకుంటున్నారు ? రెండువందలు దీనికి చాలా సరసమైన ధర ” అని దుకాణం అతను జవాబు ఇచ్చాడు. కరీం దగ్గర ఎనిమిది నాణాలే ఉన్నాయనీ వాటితోనే అతను పట్టు తానూ కత్తీ గుర్రమూ కాశ్మీరు శాలువా జరీచెప్పులూ అన్నిటినీ కొనదలచుకున్నాడనీ విని కరీం ని బయటికి గెంటాడు. ” అడ్డమైన ప్రతివాడూ వచ్చి నా పట్టు తానులు ముట్టుకునేవాడే ” అని తిట్టాడు.

(c) Wellcome Library; Supplied by The Public Catalogue Foundation

నిరాశ తో ఈసారి గుర్రాలు అమ్మే చోటికి వెళ్ళాడు కరీం. బాగా చవకైన గుర్రానికి రెండువందల యాభై నాణాలు ఇవ్వాలని తెలిసింది. కరీం దగ్గర ఉన్న డబ్బు ఎంతో విన్న అక్కడివాళ్ళు దానికి గాడిదలో పదహారోవంతు కూడా రాదని వెక్కిరించారు. కత్తి ధర కనీసం ముప్ఫై నాణాలు, జరీ చెప్పులది యాభై , కాశ్మీరు శాలువాలలో బాగా నాసిరకం దానికి పన్నెండు నాణాలు చెల్లించాలి.

దేన్నీ కొనలేనన్న బాధతో, అలసటగా , కరీం ఊరికి ప్రయాణం అయాడు. దారిలో ఒక బిచ్చగాడు ఎదురై ” అయ్యా, ధర్మం చేయండి. రేపు శుక్ర వారం, పవిత్రమైన రోజు. బీదవాడికి ఇస్తే భగవంతుడికి ఇచ్చినట్లే, అల్లా మీకు వందరెట్లు వెనక్కి ఇస్తాడు ” అని అడుక్కుంటున్నాడు.

కరీం కి ఆపాటికి డబ్బు మీద విసుగుపుట్టి ఉంది. ” నా దగ్గర ఉన్నదాంతో తృప్తి పడగలవాడివి నువ్వొక్కడివే ” అని బిచ్చగాడితో అంటూ తన ఎనిమిది నాణాలనీ అతనికి ఇచ్చే సి వట్టి చేతులతో వెనక్కి వెళ్ళాడు

వాళ్ళ ఇంటి ముంగిట్లోనే ఎదురు చూస్తూ ఉన్న కొడుకు యూసఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి ” నాన్నా, కత్తీ గుర్రమూ ఏవీ ? ” అని అడిగాడు. ఆ వెంటనే వచ్చిన భార్యా కూతురూ కూడా తమ వస్తువుల కోసం అడిగారు. అంతా విన్నాక భార్య జెబా మండిపడింది. ఎనిమిది నాణాలు బిచ్చగాడికి ఇచ్చాడని యజమానికి ఫిర్యాదు చేసింది.

యజమానికీ చాలా కోపం వచ్చింది. కరీం ని పిలిచి తెగ చీవాట్లు పెట్టాడు. ” నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావోయ్ ? పెద్ద జమీందారువా నువ్వు ? బిచ్చగాడికి నేనే ఒక్క రాగినాణెం ఇస్తుంటాను , నువ్వు ఎనిమిది వెండినాణాలు ఇవ్వవచ్చావా ? ” అని కోప్పడి, శిక్షగా అక్కడికి కొంతదూరం లో ఉన్న ఎడారికి పొమ్మన్నాడు. అందులో యజమానికి కొంత భూమి ఉంది . అక్కడ మండుటెండలో పనిచేసి , నీళ్ళు పడేదాకా   తవ్వి అప్పుడు తిరిగి రమ్మన్నాడు.

కరీం   అలాగే వెళ్ళి రోజులతరబడి తవ్వుతూ పోయాడు. చివరికి నీరు పడింది, దాంతోబాటు ఒక ఇత్తడి బిందె కూడా దొరికింది. దాని మీదంతా నగిషీలు చెక్కి ఉన్నాయి. నిండుగా వజ్రాలూ వైఢూర్యాలూ. అవేమిటో కరీం కి తెలియలేదు. కాని మషాద్ నగరపు బజార్లలో అటువంటివి అమ్మటం చూసిఉన్నాడు. వీలు కుదరగానే వెళ్ళి తనూ అమ్మగలిగితే కాస్త డబ్బు వచ్చి భార్య కోపం తగ్గుతుందని అనుకున్నాడు.

ఎడారిలో నీరు పడటం వల్ల యజమానికి ఆనందం కలిగింది. కరీం కష్టానికి జాలిపడి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమన్నాడు. మరుసటిరోజు కరీం జేబునిండా వజ్రాలు నింపుకుని నగరానికి వెళ్ళాడు. ఒక నగలదుకాణం లో అద్దాల కిటికీ లో అటువంటి రాళ్ళు ఉండటం గమనించి వెళ్ళి దుకాణదారుని అడిగాడు ” ఇటువంటి రాళ్ళు అమ్మితే కొంటారా ? ”

కరీం ని చూస్తే వజ్రాలు అమ్మగలిగేవాడు గా కనిపించలేదు. దుకాణం అతను వెటకారంగా ” ఏం ఉన్నాయేమిటి నీ దగ్గర ? ” అన్నాడు.

” ఇదిగో ” అని ఒకటి చూపించాడు కరీం. ” నా జేబునిండా ఉన్నాయి తెలుసా ” అనీ చెప్పేశాడు.

దుకాణం అతను ఆశ్చర్యపోయాడు. కరీం వాటిని దొంగిలించి ఉంటాడని నిర్ణయించుకుని అతన్ని మాటల్లో పెట్టి , నౌకరుతో రక్షక భటులకి కబురు చేశాడు. వాళ్ళు అడిగితే కరీం అంతా చెప్పుకొచ్చాడు. భూమిలో దొరికిన సొత్తు ఏదైనా సుల్తాన్ కి చెందుతుంది కనుక కరీం మీద నేరాన్ని మోపి అతన్నీ కుటుంబాన్నీ చెరలో పెట్టి ఇత్తడిబిందెను స్వాధీనం చేసుకుని ఖజానాకి పంపారు. కరీం కి ఆ బిందె సుల్తాన్ ది అవుతుందనే సంగతి తెలియదు.

Art Painting (45)

ఇదంతా జరిగిపోవటం సుల్తాన్ వరకూ వెళ్ళలేదు. కాని అతనికి ఒకే కల పదే పదే రావటం మొదలైంది. కలలో ఒక గొంతు ” అల్లా స్నేహితుడిని విడిపించు ” అంటూ ఉంది. ముందు పట్టించుకోకపోయినా, ఒక రాత్రి కలలోనే సుల్తాన్ ఎవరినని అడిగాడు. ఎంతో పేదవాడై ఉండీ తనకున్నదానిలో అయిదోవంతు ను పుణ్యక్షేత్రానికీ మిగిలినది బిచ్చగాడికీ ఇచ్చేసిన కరీం అల్లా కి స్నేహితుడని ఆ గొంతు చెప్పింది. అతన్ని చెరలో పెట్టిన వివరం కూడా రాజుకి తెలియజేసింది.

తెల్లవారుతూనే సుల్తాన్ ఆఘమేఘాల మీద చెరసాలకి వెళ్ళాడు. కరీం ని కలుసుకుని అతని సంకెళ్ళు తన చేతులతో స్వయంగా విడిపించాడు. కరీం చెంపల మీద కన్నీళ్ళు కారిపోతూ, ” నన్ను బంధించండి, వాళ్ళని విడిపించండి. వాళ్ళకి ఏ పాపమూ తెలియదు ” అని భార్యనీ పిల్లలనీ చూపించి వేడుకున్నాడు. ” అందరినీ విడిపిస్తాను ” అని సుల్తా న్ ధైర్యం చెప్పాడు. ” మీరంతా రాజభవనం లో భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. నాకు అల్లా పంపిన అతిథులు మీరు ” అని వాళ్ళని గౌరవించి ఆ ఇత్తడిబిందెలో దొరికిన వజ్రాల విలువ మొత్తమూ వెండినాణాలుగా కరీం కి ఇచ్చాడు. వాటిని ఎలా ఉపయోగించాలో కరీం కి ఇప్పుడు తెలుసు గనుక యూసఫ్ తో కలిసి బజారుకి వెళ్ళి ఇదివరకు కొనలేనివన్నీ ఇప్పుడు భార్యకీ పిల్లలకీ కొనిపెట్టాడు. తక్కినదానితో ఏం చేయాలో అతని ఊహకి అందలేదు. భార్య జెబా ఆ బాధ్యత తీసుకుని యజమాని సాయం తో వాళ్ళ ఊర్లో చాలా పొలం కొని, మంచి ఇల్లు కట్టింది. కరీం బీదవాళ్ళకి దానం చేస్తూ ఉండేందుకూ , మసీదులో ఇచ్చుకునేందుకూ అతని జేబులో రోజూ కొన్ని నాణాలు పెట్టేది .

అలా తను ధర్మం చేసినది ఎన్నో వందలరెట్లుగా తిరిగి వచ్చింది. అయితే అదేమీ కరీం మనసుకి పట్టలేదు. భార్యా పిల్లలూ సంతోషంగా ఉండటం అతనికీ సంతోషాన్ని ఇచ్చింది.

islamic-art-paintings

  • పర్షియన్ జానపదకథ

స్త్రీలు మాత్రమే…

DSC_0611

కొన్ని మాటలు థియరీ నుంచి కాదు, అనుభవం నుంచి కూడా కాదు. ఛాయల నుంచి మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే ఛాయాచిత్ర ప్రపంచంలో వాస్తవం చిత్రంగా ఉంటుంది.చిత్రమే అనుభవచ్ఛాయగా మారే మూర్తిమత్వం ఛాయా చిత్రకారుడిది.
ఇదీ అలాంటి ఒక అనుభవ దృశ్యాదృశ్యం.+++

మహిళ.
పేరు ఏదైనా కానీయండి.
ఆమె కేవలం నామవాచకం కాదు. క్రియా- విశేషం.

అయితే, మహిళలు అందరూ ఒక్కరు కాదు.
కష్టజీవి స్వేదంలో మెరిసే అందం వేరు. సుఖవంతుల జీవితాన విరిసే ఆనందమూ వేరు.

చదువూ సంద్యలు ఉన్నంత మాత్రాన మహిళలందరికీ గొప్ప సంస్కారం ఉంటుందనేమీ లేదు.
ఉత్తమాభిరుచులు ఉన్నంత మాత్రాన ఆ మనుషులు సాహసీకులుగా. ధైర్యవంతులుగా,. పరిపూర్ణ ఆనందంతో జీవిస్తారనీ లేదు. కానీ, సామాన్య మహిళలను ‘సామాన్యం’ అని మాత్రం అనుకోవడం మామూలే.
కాదనే ఈ దృశ్యాదృశ్యం.

+++

వారి అభిరుచి వేరు. వారి సంస్కారమూ వేరు.
వారిది మరో ప్రపంచం. అందలి తమ సృజనాత్మకతలూ వేరు. వారి జీవన ధారుడ్యం కూడా వేరు.

వాళ్ల కళ గురించి చెప్పడానికి వారి కట్టూబొట్టూ, పనీపాటా, అనేకం అనేక విషయాలు చెబుతాయి.
ముఖ్యంగా వారి ఈస్తటిక్ సెన్సిబిలిటీస్ కూడా ఎన్నో చెబుతాయి.

చీర కూడా చెబుతుంది.

+++

ఈ చిత్రంలో శ్రామిక మహిళ ధరించిన చీర ఉందే. అది వర్కర్స్ సారీ.
లంగా ఓణి సారీ. అది ఒక వంద మంది శ్రామికులను కలిస్తే పదుగురికైనా ఉంటోంది.
వేయి మందిని చూస్తే వందమందికి ఉంటోంది. పదివేలమందిలో వేయి మందికి ఉంటోంది.
ఛాయా చిత్రకారుడి అనుభవ చిత్రం ఇది.

దానిపై చాలా పని చేశాను.
worker’s saree అన్న శీర్షిక ఒకటి మనసులో పెట్టుకుని,
ఒక వందకి పైగా వేర్వేరు మహిళలు అదే చీరలో ఉండగా భిన్న జీవన ఘడియలను చిత్రించి పెట్టాను.

అది ఆకుపచ్చా ఎరుపులో, తమ నెత్తిలో అలవోకగా ధరించే పువ్వులా…
ఆ పువ్వు పొంటి వుండే ఆకులా వాళ్లకొక ఆనందం.
అందుకే ఈ చిత్రంలోనూ ఆ శ్రామిక మహిళను తీసింది ఆ చీరతోనే.

సరే.
మళ్లీ స్త్రీలు.

వాళ్లు వేరు వేరు.
ఒక్క మాటలో పురుషుడితో సమవుజ్జీగా ఉండాలనుకునే ఆధునిక స్త్రీ వేరు.
తన సామర్థ్యం తనకు తెలిసి, తన బలహీనతా తాను గ్రహించి, పురుషుడికి తనకూ తేడా ఉందని మసలుకునే జానపద శ్రామిక స్త్రీ వేరు.

ఈ తేడాలు సైతం ఛాయా చిత్రలోకంలో నిరాటకంగా కనపడి చిత్రిస్తున్నప్పుడు సహజమూ సౌందర్యమూ అయిన శ్రామిక చిత్రాలు కాలంతో పాటు నిలుస్తూ ఉంటయని, మిగతా ఆధునిక స్త్రీ తాలూకు విశేషమైన చిత్రాలు తరచూ మారిపోతూ వాళ్లేమిటో వాళ్లకూ తెలిసినట్లు అనిపించకుండా ఉంటుందేమో అనిపిస్తుంది.

ఏమైనా, ఎర్రచీర.
అది శ్రమ చీర.

ఎరుపు, ఆకుపచ్చా కలగలసిన చీర.
అది వాడిపోని జీవకళ.

అవి అందానికి నిలబడతాయి.
మాసిపోకుండానూ కాపాడుతాయి.

అయితే, అది విప్లవ బాణీలు పాడేప్పుడు ధరించే చీర కాదు, వర్కింగ్ యూనిఫాం.
పని చేసుంటుంటున్నప్పుడు మాసిపోని చీర. ఒక అలసిపోని శ్రమకు సంకేతంగా పనిలో ఆనందం పెంచే చీర.

దోపిడీకి గురవడం గురించిన దృష్టి కాదు, తలవంచి తన మనాన తాను పనిచేసుకుంటూ విధి రాతను చెమటకొంగుతో తుడుచుకుని శ్రమచీర.
అవసరం అయినప్పుడు నడుం భిగించగలిగే ఛేవనిచ్చే చీర.

అయితే పట్టణంలో చీరలు తక్కువేమీ కాదు. ఎక్కడైనా మహిళలే. కానీ వారిని చిత్రిస్తూ ఉంటే, ఏది సహజమూ ఏది కృతిమమో అవే తెలియజేస్తూ ఉంటై. ఒక్కోసారి ఇద్దరి చిత్రాలూ కలిపి చేయడంతో కొన్ని ఆలోచనలు రగులుతుంటై…

+++

అయితే, ఈ దృశ్యం. ఒక గ్రామం. ఒక సిటీ.

కానీ, చదువుకుని ఉద్యోగాలు చేసే స్త్రీలు కూడానూ కష్టం చేసుకుని బతికే స్త్రీలను ఈసడింపుగా చూడటం మామూలే. మేధోశక్తికి వారిచ్చే గౌరవం రెక్కల కష్టం మీద బతికేవాళ్లను చూస్తే వారికి ఇవ్వబుద్ది కాదనీ తెలుసు.

కానీ, నవ్వు వస్తుంది.
ఇద్దరూ సమాజంలో ఒక రకంగా విక్టిమ్సే! పురుషాధిపత్యానికి ఇద్దరూ ఒకటే.
ఇద్దరూ పని మనుషులే. కానీ, మహిళలను మరో మహిళ జెలసీతో కాకుండా చూసే మరో దృష్టి ఒకటుంటే బాగుండు. అది మనిషిది కావాలి. మగవాడిది కూడా కాదు. మనిషిగా చూడగలగడం.

స్త్రీలకు చాలా కష్టం.
అందుకే, స్త్రీలను స్త్రీలు చిత్రాలు చేయడంలో మహిళ శ్రమశక్తికి విలువ అంత తేలిగ్గా దొరకదు.
అందుకే పురుషులుగా చిత్రాలు చేయడం ఒక రకంగా లాభమే.

మనిషిగా చిత్రించలేనప్పుడు పురుషుడిగా అయినా చేయడం ఎందుకూ అంటే తనకు శ్రమ తెలుసు. రెక్కల కష్టం తెలుసు. తానూ ఒక పనిముట్టే…ఆమే ఒక పనిముట్టే అని అతడికి గ్రహింపు అధికం.
అది నేర్పిన పాఠం ఒకటి తనలో తెలియకుండానే శ్రమను చూపిస్తుంది.
కాబట్టే ఒక చిత్రాన్ని పురుషుడు స్త్రీని చిత్రంచడంలో వెసులుబాటు ఎక్కువ అనిపిస్తుంటుంది.

కానీ, ఇది మనిషి చిత్రం.
ఈ చిత్రంలో ఇద్దరూ స్త్రీలే ఉన్నారు.

విశాలంగా చేతులు చాపిన స్త్రీ ఉంది. ఆమె ఒక మోడల్. ఒక అవసరం కోసం చాచిన చేతులు.
కింద ఒక స్త్రీ ఉంది. ఆమె మట్టిని ఒక తట్టలో ఎత్తి అక్కడ గుమ్మరిస్తోంది. శ్రమలో లేచిన మట్టిచేతులవి.

పైన చూసుకుంటూ పోతారు. అదెప్పుడూ ఉంటుంది. hording.
కింద మారుతారు. కానీ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటారు. surviving.

పైన మాదిరే ఈమె కూడా పని చేస్తున్నది. పెయిడ్ వర్కరే. దినసరి కూలి.
కానీ, పైనున్న ఆమెను తీయడం కన్నా ఈమెను తీయడం దృశ్యం. ఇష్టం.

ఎందుకూ అంటే ఈమె దృశ్యాదృశ్యం.
ఉంటుంది. ఉండదు. కనిపిస్తుంది. కానరాదు.

అభివృద్ధిలో భాగస్వామి అయి, pride ఫీలయ్యే మనిషి కాదు కాబట్టి కూడానూ.
అభివృద్ధిలో అనివార్యంగా తానొక పునాదిరాయి అయి,  తనను తాను నిలబెట్టుకోవడమే ముఖ్యం అయిన మనిషి అయినందువల్లానూ…

అందుకే చిత్రం చేయడం.
దృశ్యాదృశ్యం.

~ కందుకూరి రమేష్ బాబు

“ఇష్ లీబె దీష్!”

1964లో ‘సంగం’ అని ఒక హిందీ సినిమా వచ్చింది. రాజ్ కపూర్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం. ఆరోజుల్లో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన రంగుల చిత్రం. వైజయంతిమాల, రాజేంద్రకుమార్ ఇతర నటులు. శంకర్ – జైకిషన్ సంగీతం ఈనాటికీ మరచిపోలేం.
ఆ సినిమాలో కొన్ని పాటలు మొట్టమొదటిసారిగా స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో చిత్రించారు. అందులో నాకు బాగా ఇష్టమైనది ఒక పాట. ‘ఇష్ లీబె దీష్!’ అనేది. జర్మన్ భాషలో ‘ఇష్ లీబె దీష్’ అంటే ఇంగ్లీషులో ‘ఐ లవ్ యు’ అని. అది ‘వివియన్ లోబో’ పాడిన చక్కటి పాట. స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వత శ్రేణి దగ్గర వైజయంతిమాల, రాజేంద్రకుమార్లతో చిత్రీకరించాడు రాజ్ కపూర్. ఆ సినిమాలో ఆల్ప్స్ పర్వతాల అందాలు చూసి, ఆనాడే జీవితంలో ఒక్కసారయినా స్విట్జర్లాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. చాల దశాబ్దాల తర్వాత, ఇన్నాళ్ళకి అక్కడికి వెళ్ళాం.
౦ ౦ ౦
ఇటలీలోని వెరోనానించి రైల్లో, మిలానో మీదుగా స్విట్జర్లాండ్లోని జెనీవాకి వెళ్ళాం. అక్కడినించీ వెంటనే ఇంకొక రైలు తీసుకుని ‘ఎంగెల్బర్గ్’ అనే వూరికి వెళ్లి, అక్కడే ఒక వారం రోజులు వున్నాం. రైలు ప్రయాణాలు ఎంతో సౌకర్యంగా, వేగంగా వుండటం వల్ల, ఒకే వూరిలో బిచాణా పెట్టి స్విట్జర్లాండ్లోని ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూడాలని మా ఉద్దేశ్యం. ఇప్పుడు కొంచెం స్విట్జర్లాండ్ ఎక్కడ వుందో చెప్పటం అవసరం.
పశ్చిమ యూరప్ మధ్యన వుంది స్విట్జర్లాండ్. ఉత్తరాన జర్మనీ, దక్షిణాన ఇటలీ, పశ్చిమాన ఫ్రాన్స్, తూర్పున ఆస్ట్రియా. ఎంతో పెద్దదయిన Alps పర్వత శ్రేణి ఈదేశంలోనే వుంది. ఇక్కడ గమ్మత్తేమిటంటే, జర్మనీ వేపున, ఆస్ట్రియా వేపున వున్న ప్రదేశాల్లో జర్మన్, ఇటలీ వేపున ఇటాలియన్, ఫ్రాన్స్ వేపున ఫ్రెంచ్ భాషలు మాట్లాడుతారు. ఇక్కడ సర్వత్రా వినిపించే భాష, మన అదృష్టం కొద్దీ, ఇంగ్లీష్.
పదహారు వందల చరపు మైళ్ళ వైశాల్యంలో వుండేది, ఎనభై లక్షల జనాభా మాత్రమే. జెనీవా, జూరిచ్ ఇక్కడ వున్న పెద్ద నగరాలు. బెర్న్ అనే చిన్న వూరు ఈ దేశానికి రాజధాని.
ఇక్కడ తల ఒక్కింటికి వున్న సగటు ఆదాయం, ప్రపంచలోనే ప్రధమ స్థానంలో వుంది. ఎక్కువ కాలం ప్రజలు బ్రతికే దేశాల్లో, ఇది రెండవ స్థానంలో వుంది.
వెరోనా నించీ రైల్లో స్విట్జర్లాండ్ వెడుతున్నప్పుడు, మా ఆవిడకి ఒక చిన్న క్విజ్ పెట్టాను, “స్విట్జర్లాండ్ కనీసం ఐదు రంగాల్లో, దేనికి ప్రపంచ ప్రసిద్దమో చెప్పగలవా” అని.
ఆవిడకి చాకొలేట్, ముఖ్యంగా డార్క్ చాకొలేట్ అంటే బాగా ఇష్టం. అందుకని వెంటనే చెప్పేసింది.
“సరే.. చాకొలేట్ ఒకటి. ఇంకా నాలుగు చెప్పాలి..” అన్నాను.
“రెండు ఛీజ్. స్విస్ ఛీజ్”
“బాగా చెప్పావు. మరి మూడోది..”
“స్విస్ బంగారం నాణాలు”
“అవును. స్విస్ క్రూగరాండ్స్. తర్వాత..” అడిగాను.
“రెడ్ క్రాస్. ఇక్కడే మొదలయి, ప్రపంచ వ్యాప్తమయింది” అన్నది.
“గుడ్! స్విస్ జెండా మీద కూడా వుంటుంది ఆ రెడ్ క్రాస్. దీంతో నాలుగు చెప్పావు. మరి ఐదోది..”
“నేను నాలుగు చెప్పానుగా. నువ్వు చెపు ఐదోది” అన్నది.
“ఐదోదా.. స్విస్ గడియారాలు. ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఆరోది కూడా వుంది. ఇండియాలోని రాజకీయ నాయకులు, నల్ల బజారు పెద్ద మనుషులూ, అప్పనంగా ప్రజల సొమ్ము దోచుకుంటున్న గవర్నమెంటు ఉద్యోగులు, సినిమా యాక్టర్లు, బెట్టింగ్ చేసే క్రికెట్ ప్లేయర్లు.. వాళ్ళ కోట్ల కోట్ల కోట్లు – కోట్లు కాదు – రూపాయలు దాచుకుంటున్నవి స్విస్ బాంకుల్లోనే! ప్రపంచ ప్రసిద్ధి మరి!”
“అవును. అవొక్కసారి చూద్దాం ఎలా వుంటాయో…”
“బయటనించీ చూస్తే, మన అమెరికన్ బాంకుల్లాగానే వుంటాయి. కాకపొతే లోపల వుండే డబ్బే! కొందరు మనుష్యుల్లోని మానవత్వానికి మసి పూసిన నల్ల డబ్బు. మనిషి కాపీనానికి నిదర్శనం. బయటనించీ చూడటానికి ఇబ్బంది ఏముంటుంది. జెనీవా వెళ్ళినప్పుడు చూద్దాం” అన్నాను.
౦ ౦ ౦

satyam1
మా రైలు జెనీవా వెడుతున్నప్పుడే చూశాం. జెనీవా సరోవరం. చాల పెద్దది. వెనక తెల్లగా మెరుస్తున్న కొండలతో, నీలం, ఆకుపచ్చ రంగులతో ఎంతో అందంగా వుంటుంది.

జెనీవాలో రైలు దిగి, వెంటనే లుజర్న్ వెళ్ళే రైలు ఎక్కాం. కొండల్లో పైకి వెడుతూ, ఆ రైలు ప్రయాణం ఇంకా బాగుంటుంది. లుజర్న్ వెళ్ళాగానే, మేము వెళ్ళవలసిన ఎంగెల్బర్గ్ రైలు సిద్ధంగా వుంది. వెంటనే ఎక్కేశాం.
ఎంగెల్బర్గ్ రైల్వే స్టేషన్, మా రోజుల్లో గుడివాడ రైల్వే స్టేషన్లా వుంది. రెండే రెండు చిన్న ప్లాట్ఫారాలు. రైళ్ళు అక్కడితో ఆగిపోతాయి.
రైలు దిగగానే, ఎదురుగా ప్రపంచంలో ఎంతో ఎత్తయిన Alps పర్వత శ్రేణిలో భాగామయిన మౌంట్ టిట్లిస్ ఎదురుగా, సూర్య కాంతిలో తెల్లగా మెరిసిపోతున్నది.
ఒక కిలోమీటర్ దూరంలోనే వున్న మా హోటలుకి నడుచుకుంటూనే వెళ్ళాం. కొంచెం చల్లగా వున్నా, ఎండలో నడుస్తుంటే హాయిగా వుంది. హోటల్లో మా గది కిటికీ తెరిస్తే, మౌంట్ టిట్లిస్. దాని మీద దుప్పటిలా కప్పిన తెల్లటి మంచు పొరలు. ఎండలో మెరిసిపోతూ మనోహరంగా వుంది.
మర్నాడు ప్రొద్దున్నే మా కిటికీ తలుపు తెరవగానే చూశాను. వాతావరణం పూర్తిగా మారిపోయింది. విపరీతంగా మంచు పడుతున్నది. సమయం ఎనిమిది దాటినా ఇంకా ఎండ రాలేదు. కొండ మీదికి వెడితే ఆ మంచులోనే వెళ్ళాలి. అందుకే వేడివేడి కాఫీ త్రాగి, వెంటనే మౌంట్ టిట్లిస్ ఎక్కటానికి బయల్దేరాం.

satyam2

టిక్కెట్లు తీసుకుని వచ్చేసరికీ, అప్పటికే ఎక్కెడెక్కడినించో వచ్చిన స్కీయింగ్ చేసే వాళ్ళు, చాలమంది లైన్లలో నుంచుని వున్నారు. కొండ క్రింద నించీ, నలుగురు మాత్రమే పట్టే కేబుల్ కార్లు, కనీసం వందో ఆ పైనో వుంటాయి, వరుసగా ఒక దాని తర్వాత ఒకటి పైకి వెడుతున్నాయి. అంతమంది వున్నా, కొద్ది నిమిషాల్లోనే మేమూ ఒక కేబుల్ కారు ఎక్కాం.
కేబుల్ కారులో, ఆ వర్ణనాతీతమైన ప్రకృతి ఒడిలో, నేనేప్పటి నించో చూద్దామనుకుంటున్న పర్వతాల మీదకి వెడుతుంటే, ఒళ్ళు, బయట చలిగా వున్నా, పులకరించింది. ఆ అందాలు చెప్పే బదులు, చూస్తేనే సరిగ్గా అర్ధమవుతాయి. అందుకే వాటిని వర్ణించే ప్రయత్నం చేయటం లేదు, “ఇష్ లీబె దీష్” అని మరోసారి పాడుకోవటం
తప్ప.
దారి మధ్యలో కేబుల్ కారు ఆగుతుంది. ఆరు వేల అడుగుల ఎత్తున వున్న ట్రౌబ్సీ అనే చోట, ఈ నలుగురు ఎక్కి కూర్చునే కేబుల్ కారు దిగి, నలభై మంద దాకా పట్టే, కేబుల్ బస్సు ఎక్కాం. దానిలో అందరూ నుంచోవాలి. మనుష్యుల మధ్య స్కీయింగుకు వెళ్ళే వాళ్ళ సరంజామా.

satyam3

చివరికి పది వేల అడుగుల ఎత్తున వున్న మౌంట్ టిట్లిస్ మీద దిగాం. విపరీతమైన గాలి, చలి. ఇంకా మంచు పడుతూనే వుంది. కానీ ఆ అద్భుతమైన ప్రకృతి అందాలు చూస్తుంటే, మనసుకి హాయిగా వుంది. అక్కడే ఒక రుచికరమైన సాండ్విచ్ తిని, వేడివేడి కాఫీ త్రాగాం. క్రిందకి చూస్తే ఎంతోమంది, స్కీయింగ్ చేస్తూ మంచులో అలా పరుగులెడుతున్నారు.

ఇక్కడ వున్న పర్వత శ్రేణిలో మౌంట్ టిట్లిస్ పెద్ద పెద్ద శిఖరాలలో ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాటివి ఎన్నో శిఖరాలు వున్నాయి. దీనితోపాటు పడమట జుంగ్ ఫ్రౌ, మ్యూంక్, సాన్టిస్, మోంటే రోసా…, తూర్పున ముట్లర్, పిజ్ ప్లాటా.. ఇలా ఎన్నో వున్నాయి.
ఇంటర్లాకెన్ అనే వూరి మీదుగా రైల్లో వెళ్లి, జుంగ్ ఫ్రౌ శిఖరం కూడా చూసి వచ్చాం. అక్కడ ఒక పక్క తెల్లటి మంచుతో కప్పబడిన శిఖరాగ్రం, మేము వున్న గుట్ట మీద ఆకుపచ్చని లాన్, దాని క్రింద రైల్వే స్టేషన్. రకరకాల రంగులతో, ఎంతో చాల బాగుంటుంది.

satyam6

దాని తర్వాత లూసర్న్ అనే వూరికి వెళ్ళాం. చిన్నదయినా ఎంతో అందమైన నగరం. చూడవలసినవి చాల వున్నాయి ఇక్కడ. ఎంతో షాపింగు కూడా వుంది.
జెనీవాకి కూడా వెళ్ళాం. అక్కడ యునైటెడ్ నేషన్స్ ఒప్పందాలు ఎన్నో జరిగాయి. చక్కటి నగరం.
జెనీవా ఒక పెద్ద వ్యాపార కేంద్రం. ఎన్నో రకరకాల షాపులు. ఇక్కడ అన్నీ ఖరీదులు ఎక్కువే. స్విస్ వస్తువులు అక్కడికన్నా, అమెరికాలోనే చౌక.
జెనీవాలో ఒక నాలుగు రోడ్ల కూడలిలో చుట్టూ చూస్తే, అన్నీ బాంకులే. పెద్ద పెద్ద బిల్డింగులు. వాటి మధ్య నుంచుని వున్నప్పుడు అనిపించింది. మన రాజకీయ నాయకులూ, వాళ్ళ మిత్రులూ, మన ప్రభుత్వ అవినీతి ఉద్యోగులూ దాచిన డబ్బు నా కళ్ళ ఎదురుగా కాకపోయినా, కాలి దూరంలో ప్రతి చోటా వుంది అక్కడ. ఆ బిల్డింగుల సిమెంటు గదులలో ఎన్నో ఏళ్లుగా బంధించబడి వుంది. బహుశా అది దాచుకున్న వాళ్లకు తెలియదేమో, ఏ మతం వాడయినా సరే, చివరికి పైకి వెళ్ళేటప్పుడు, ఏ విధమైన లగేజీ తీసుకువెళ్ళనీయరని. లగేజీ చార్జీలు లక్షల్లో కట్టినా వీలులేదని!
దానిలో కనీసం పదో వంతు, భారతదేశ అభివృద్ధికి ఖర్చుపెడితే, మన దేశం ఎంత ముందుకి వెడుతుందో కదా అని అనిపించింది.
౦ ౦ ౦

జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు

స్పష్టంగా, సూటిగా, నిరాడంబరంగా, గంభీరంగా ఉండే సమాజ కేంద్ర కవిత్వం రాసే కవులు “సహజ కవి ప్రతిభా పురస్కారాల కోసం” కవితల సంపుటాలు పంపించవలసినదిగా కోరుతున్నాం. వచన కవిత/పద్యం/గేయాల సంపుటి ఏదైనా ఒక పుస్తకం పంపితే చాలు. ప్రచురించిన సంవత్సరంతో పని లేదు.కవికి 2000 రూ. నగదు, శాలువా, జ్ఞాపికతో రావి రంగారావు సాహిత్య పీఠం పక్షాన సత్కరించటం జరుగుతుంది.
డిసెంబరు 31 లోగా పుస్తకాలు పంపించవలసిన చిరునామా.
డా. రావి రంగారావు, 101, శంఖచక్ర నివాస్, అన్నపూర్ణ నగర్ 5వ లైన్ తూర్పు,
గోరంట్ల, గుంటూరు- 522034
phone 9247581825
ebooks may be sent to mail : raavirangarao@gmail.com

నీలాలు కారితే నే చూడలేను!

Neelaalu kaaritee_Naresh Poem_illustration (2)

మోళీవాడి కనికట్టులా
మొదల్లేని ఏడుపు పాయై
ధారగడ్తావు

జంట కంటి కంగారు నలుసై కారిపోతాను

నెత్తిమీద నీళ్లకుండ
జులపాల్లేని నీ జుట్టుక్కూడా
లెక్కతేలని చిక్కులేస్తుంది.

గంగవెర్రుల గంగాభవానిలో సత్తు కాసై మునిగిపోతాను

ముందే జరిగిన కప్పల పెళ్లికి బొంతకాకి కబురు
మూరెడు లేని సొరబూరలో ఎండనే ఎండని ఏరు

**           **           **

ఆదమర్చిన ఆల్చిప్పలో ఆవలింతల ఆకాశం
ఉట్టి మీద సట్టిలో తొణికిన ఉప్పుసంద్రం

కట్ట తెగే నీ కంటి దొరువులో
మూతి చాలని బుంగనై
మునకలేస్తాను
లొడలొడ బుడగల ఊటబావిని
చేంతాడు బొక్కెనై
చేదబోతాను
వైనాల వెక్కిళ్ల
వొంపు కాల్వలో
ఉగ్గిన్నెల యాతమేస్తాను

మంచు బూచోడికి భూగోళం కొసన కొరివి
విరిగిన వంతెన్ల మీద పగటికలల సవారి

దుఃఖనదివై కలకబారితే
దిగులు ద్వీపాన్నై
నొగిలిపోతాను
ఉవ్వెత్తు ఉప్పెన్లకి
నావ విరిగిన నోవానై
బిక్కబోతాను

పిందె గాయాల నీటికి నాలుకే లేపనం
గుట్టు చెప్పని చేప నాల్కకి ఖండనే దండనం

**           **           **

వెదురుబద్ద వెన్నెముక
మబ్బుదుబ్బుల మాటు
ఏడురంగుల్లో ఒంగిపోతుంది

చెట్టు మెటికలో నీటి సడికి ఊసరవెల్లై ఉలికిపడతాను

దుర్గమ్మ ముక్కెరని
పోటు కిట్టమ్మై
ముంచెత్తుతావు

చీదేసిన శ్లేష్మాన్నై జిగురు చాలక జారిపోతాను

మరిక మర్రాకు మీద నువ్ తెప్పతేలితే
బోసినోట్లో ఆ బొటనవేలేంటని
గద్గదంగా గదమాయిస్తాను

**           **           **

ఏడున్నర శ్రుతుల ఏడుపులో నాన్నని ఎడంచేసే నా చిన్నతల్లి ప్రహర్షకి

నరేష్ నున్నా

అసహజమవుతున్న సహజాతాలే ‘ఆర్తి’!

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

 

“మనుషుల్లో ఉన్నన్ని రకాలు కధల్లోనూ ఉన్నాయి. ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నట్టు కధల్లో గొప్ప కధలు వేరు …
… కానీ, ఎవరూ చూడకుండా జరిగిన పనికి అంతరాత్మ సాక్షి అన్నట్టుగా, ఏది గొప్ప కధ అన్నదానికి కధలు చదవడంలో సమర్ధులే సాక్షి. కధలు అందరూ రాయలేనట్టే అందరూ చదవలేరు. ఏ కధనైనా చదవలసిన విధంగా చదివేవారు బహు తక్కువ. అందులోని సారం ఆఖరి బొట్టు దాకా గ్రహించేవారు ఇంకా తక్కువ …”
ఈ మాటలు మా గురువుగారి కధల్ని ఉద్దేశించి వాళ్ళ గురువు గారు అన్నవి. ‘కాళీ పట్నం రామారావు కధలు’కు ఉపోద్ఘాతం రాస్తూ కొడవటిగంటి కుటుంబరావు గారు ఈ మాటలు చెపుతూనే – “… కధా పరిణామం గురించి నాకున్న పరిజ్ఞానం సరి అయినదయితే ‘యజ్ఞం’, ‘ఆర్తి’ లాంటి కధలు ప్రపంచ యుద్ధానికి పూర్వం వచ్చివుండడం సాధ్యం కాదు. ఈ కధలలో విశేషమేమంటే, అట్టడుగు జీవితాల్లోని అంతస్సంఘర్షణ కూడా, దాని భౌతిక కారణాలతో సహా స్పష్టంగా కనిపిస్తుంది. ‘యజ్ఞం’ శ్రీకాకుళం పోరాటాలకు ముందు నడిచిన కధ అనాలి. ‘ఆర్తి’ వాటికి యింకా కొంచెం ముందుదేమో, అందుచేతనే అందులో అంతస్సంఘర్షణ మరింత స్పష్టంగా ఉన్నది. అంతస్సంఘర్షణలు జరిగిపోయినాక విప్లవం తల ఎత్తాలి. ఈ రెండు కధలకూ ఈ నాటి విప్లవోద్యమాలతో రక్తసంబంధం ఉన్నది-’’ అంటారు (1971)
సాహిత్య లోకం యజ్ఞాన్ని పట్టించుకొన్నంతగా ‘ఆర్తి’ని (పట్టించుకోవలసినంతగా) పట్టించుకోలేదు. ‘ఆర్తి’ కధని పట్టించుకోవలసినంతగా పట్టించుకొని వుంటే – అర్ధం చేసుకోవలసినంతగా అర్ధం చేసుకొనివుండి ఉంటే – ఆ చర్చల సారాంశాల ప్రభావం ‘తెలుగు కధ’ మీద పడి మనిషికి సంబంధించిన మరిన్ని చీకటి కోణాలకు ఇంకెన్నో వెలుతురు దారులు చూపించి వుండేది.

కొ.కు. గారే అన్నట్టు ‘యజ్ఞం’ కన్నా ‘ఆర్తి’ లోనే అంతస్సంఘర్షణ మరింత స్పష్టంగా వుంది. మరి ఆ అంతస్సంఘర్షణ మూలమేమిటో కధ ద్వారా కనిపెట్టగలిగితే యిప్పటికైనా ‘ఆర్తి’ తీరుతుంది. అయితే కొ.కు. గారు ప్రస్తావించినట్టు ‘యజ్ఞం’ కన్నా ‘ఆర్తి’ రచనాపరంగా ముందుది కాదు. యజ్ఞం 1964లో రాసింది. 1966లో అచ్చులోకి వచ్చింది. ఆర్తి 1969 అచ్చులోకి వచ్చింది. ఆర్తి ముందుదేమో అనడంలో ‘యజ్ఞం’ జరగడానికి ముందు ‘ఆర్తి’ అలముకున్న విస్తరిస్తున్న వొక దశ అని. కధా సందర్భాల రీత్యా ‘ఆర్తి’కి ఒక విధంగా కొనసాగింపే ‘యజ్ఞం’ అని కొ.కు. భావన అయి వుండొచ్చు. యజ్ఞమూ – ఆ కధ మీద జరిగిన చర్చోపచర్చలూ – అది మన ముందు పెట్టిన ప్రశ్నలూ – వ్యవస్థలో వచ్చిన మార్పులూ – దాని మూలాలూ – యివన్నీ చూపిన మీదట ‘ఆర్తి’ రాశారంటే – ఒకడుగు ముందుకేసి మనిషి మూలాల మనుగడ మీద అంటే సహజాతాల మీద కా.రా. దృష్టి పెట్టారని భావించవలసి వుంటుంది. అందుకు ఆర్తి కధ ఆసరానిస్తోంది.

శబ్దార్ధ రత్నాకరములో ఆర్తి అంటే పీడ, దుఃఖం, మనోవ్యధ, రోగము, వింటికొన అనే అర్ధాలు ఉన్నాయి. సామాన్యంగా ఒక కధా శీర్షికకున్న ఒక అర్ధానికి ఏ కధ అయినా ఒదుగుతుంది. కానీ అన్ని అర్ధాలకూ అన్ని విధాలా సరిగా సరిపోయేలా అర్ధం పడుతుంది ఆర్తి కధ.
కధా లక్షణాల్లో ముఖ్యమైన వాటిల్లో ‘క్లుప్తత’ వొకటి. క్లుప్తతని సాధించాలనుకొనే రచయితలు కారా కధల్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడం అవసరం. అవకాశం కూడా. క్లుప్తతకు గాఢత జోడించి పదం పదం తూసి అక్షరం అక్షరం రాసినట్టుంటుంది రామారావు గారి రచన. ఒక అక్షరం ఎక్కువ కాకుండా ఒక అక్షరం తక్కువ కాకుండా తూకం వేసినట్టుగా వుంటుంది. అక్షరం దగ్గర పొదుపరితనం పాటిస్తారాయన. ఎంత అవసరమో అంతే. అంతకు ఒక్క రవ్వ రాల్చరు. పాఠకుడి సమయం అంత విలువైనదిగా భావిస్తారు. గుర్తించి గౌరవిస్తారు. అంత పొదుపుగా రాసినా ఆర్తి కధ నిడివి చిన్నదేమి కా(లే)దు. అరవై పేజీలు (‘కాళీపట్నం రామారావు కధలు’ – తొలి ముద్రణ 1986 – పేజీ 467 నుండి 526 వరకు) వుంది.

ఊళ్ళోనే … కాదు కాదు – వాడలోనే బంగారి కొడుకు పైడయ్యకి తన కూతురు సన్నెమ్మనిచ్చింది ఎర్రెమ్మ. ఆవేటికి సంకురాత్రి ఆర్నెల్లు గదా, ఆర్నెల్ల కోపాలి కూతుర్ని తీసికెళ్తానంటుంది. వియ్యపురాలైన బంగారీ కాదనలేదు, పండగ రేపనగా వచ్చి తీసికెళ్ళు. పండగెళ్ళేక కాప్పోతే రెణ్ణెల్లుంచుకో నానడ్డనంటుంది. ఈ తగువు తాటాకుల మంటలా యెత్తురు కుంటుంది. నిట్ట పట్టిలా నిలిచీ కాలుతుంది. మొత్తానికి తగువు ముదిరి ముసిరి యెలాగ ముగిసిందన్నదే కధ. పైకి కనిపించే కధ. దిగితే గాని పాతర గుమ్మి లోతూ పల్లమూ తెలీదన్నట్టు కధలోకి దిగితే గాని అసలు లోతు అందదు. ఆ లోతులు పొరలు పొరలుగా అందటానికి కారా మాష్టారై బోధ చేసి కాదనడానికి లేదనటానికి వీలు లేని విధంగా పాత్రల్ని నప్పి మనల్ని ఒప్పిస్తారు. తోడుకున్నోళ్ళకి తోడుకున్నంత. ఎంత తెండితే అంత. మనుగడని గడగడలాడించిన మూలాలేవో అవి ఊట బావిలా ఉబికొచ్చి మన ముఖాల్ని, మస్తిష్కాలని ఫెడీల్మని తాకుతాయి. ఎటొచ్చీ చేదుకొనే శక్తి చదువరికి వుండాలి –

‘వెనుకటి రాజ్జాలు కాదు, రాజ్జాలు మారిపోయాయన్నారు. ఈ సారి రావ రాజ్జం వస్తందన్నారు. కొందరు – కాదు! మాలల రాజ్యం వొస్తోందన్నారు. మాలలకి ఉద్యోగాలు; మాలలకి ఇళ్ళు; మాలలకే బంజర్లన్నీ; మీ వాడే ఒకడు శాస్ త్రాలు రాస్తున్నాడ్రా!- అన్నారు కావందులు. అనడం, ఇనడవే తప్ప – యే బంజరు కాడికెళ్తే, ఆ బంజరు కాడే కర్రల్తో నిలబడేవారు కాపు నాయాళ్ళు …’
ఇంక భూమ్మీద … బూమేది? బువ్వేది?
బతుక్కి తోవేది?
‘ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తులల్లా, రెండే రెండు.
ఒకటి యిల్లు, రెండు వొళ్ళు.
మాల పేటలో యిల్లు అగ్రవర్ణులు కొనరు. అవర్ణులకు కొనే తాహతూ లేదు. అలానే ఒళ్ళు కొంచం కొంచెం అప్పుడప్పుడు అద్దెకివ్వడాన్ని శాస్త్రమూ శాసనాలూ అంగీకరిస్తాయి కాని దాన విక్రయ సర్వాధికారాలతో పూరా అమ్మడానికి అంగీకరించవు. కాబట్టి వాళ్ళలో చాలామంది కడుపేదలుగానే వుండి పోతున్నారు. లేకపోతే యేనాడో నిరుపేదలవ్వలసింది.’
ఊరుకాని ఊరు … కాలం కానీ కాలం … అవే స్థల కాలాలు! మరి పాత్రలకొస్తే- బంగారికి పెనిమిటి పోనూ వరుసగా నారాయుడూ కోటయ్యా పైడయ్యా ముగ్గురు కొడుకులు – అంటే బంగారింట నలుగురు మగ కూలీలు. ఇద్దరు ఆడకూలీలు –
మరి ఎర్రెమ్మ మొగుడా అవిటోడు. పెళ్ళి చేసి పంపిన సన్ని తోడ ఆరుగురు చెల్లెళ్ళు – అంటే సన్నితో కలుపుకున్నా ఎర్రెమ్మ యింట ఇద్దరే ఆడకూలీలు – అని అసలు లెక్క చెపుతారు లెక్కల మాష్టారు. బంగారి కోడల్ని ఎందుకు వదులుకోలేదో కూడా చెపుతారు. ఆవీటికి ముందు గొప్పులూ, వేరుశనగల వేతా … నెల్లాళ్ళు కూల్లుంటాయి. పండగ ముందు నెల్లాళ్ళు ముమ్మరంగా వరికోతలు. అందుకే పండగ ముందు తీసికెళ్తానంటుంది ఎర్రెమ్మ. పండగెళ్ళాక తీసికెళ్ళమంటుంది బంగారి.
అసలు కధ కంటికి కనిపించదు. అందుకే చూసినవాళ్ళు కూతురిని పుట్టింటికి ఎప్పుడు తీసికెల్తే ఏటని అనుకుంటారు. పంపడానికి ఒప్పుకొన్నాక ముందైతేనేం వెనకైతేనేం అని కూడా అంటారు. ఇలాటి తగువు గుద్దులేసుకుంటే మాత్రం తెగుతాదా? ఆ గుద్దులాట ఒక చోటగాని ఆగుతాదా? ఒళ్ళు కొవ్వెక్కి తెగబలిసి కన్ను మిన్నూ కానక కొట్టుకు చస్తున్నట్టు కనిపిస్తారు. ‘ఎంగిలాకుల కోసం వీధి కుక్కలు ఎందుకు చస్తాయో … ఆ విస్తళ్ళలో భోజనం చేసినవారికి అర్ధం కాకపోవచ్చు. ఏడాదిపాటు పేగులు మాడితే యెవరికైనా అందులో నీతి కనబడుతుంది’ అని కధ చూపించే అలవాటున్న మాష్టారు ఇలా ఒక మాట అనకుండా వుండలేక పోతారు.

కాదా… వీరకత్తెలిద్దరూ జుట్లూ జుట్లూ పట్టుకొని, రక్కుకొని, కొరుక్కొని, రాళ్ళతో యుద్ధాలాడి .. దెబ్బలు కాసిన ఎర్రెమ్మ చుట్టూ దాని పిల్లలు మూగి మొర్రోమంటే సన్ని తల్లితో వెళ్లింది. ‘ఇదిగో, యిప్పుడు దానెంట యెల్లినావో, మరీ గడపల అడుగెట్టవ్’ తెగేసి అత్త చెప్పినా అమ్మ వెంట వెల్లింది సన్ని.
ఆ విధంగా పెనిమిటి పెళ్ళాలయిన సన్నెమ్మా పైడయ్యా ఒకరికొకరు పరాయోలయినారు.
ఎందుకూ?
ఆకలి!
ఔను గదా … కూలాడితేగాని కుండాడదు కదా?!

మనిషికున్న సహజాతాల్లో మొదటిది ఆకలి. మొదాట కధ అక్కడే మొదలయ్యింది. ఈ ఆకలే బతుకుని సుట్టబెట్టీసింది. ఎవరాకలి వాళ్ళదే. మాష్టారే చెప్పినట్టు ‘వర్షావసాన వాగులు పుట్టి వరదలై పొంగినట్టు, వ్యక్తులలో పుట్టిన భయం, వెల్లువలై పొంగింది. గడ్డి మొక్కలు ముందు మునిగితే, గాలివానకి వృక్షాలూ, ఆముదపు చెట్లూ ఆ తర్వాత విలవిల్లాడుతున్నాయి అని – నిజమే, మనుషులూ గడ్డిపోచలే. ఉక్కిరి బిక్కిరి కాక తప్పుతారా?

ఒకరికొకరు కావలసిన సన్నెమ్మ పైడయ్య ఒకరికొకరు పరయోళ్ళగా వుండీ, వుండలేక – పైడయ్య మగాడు గనుక దొంగచాటుగా కలిసే చొరవ తీసుకున్నా – ఎవరో చూస్తారన్న భయం ఒక్కటేనా –ముందెల్తే గొయ్యా యనక్కెల్తే నూయ్యా … యిద్దరిదీ అదే పరిస్థితి. మనసులో యిష్టమున్నా పౌరుషాలూ పరాధీనతలదే పై చేయిగా మిగులుతుంది. ఏమీ మిగలకపోయినా ఇద్దరూ కలుసుకున్న కబురు వాడలో తెలిసిపోతుంది.

అమ్మలా అన్నీ అర్ధం చేసుకున్న నరసమ్మ నీ మొగుడు చెప్పినట్టు నడిచి కాపురాన్ని నిలబెట్టుకోమంటుంది. సన్ని ఎద పొయ్యలేక ఏడుస్తుంది. ఆడు రేతిరికి ఎక్కడికి రమ్మన్నాడో చెపుతుంది. తొంగోడానికి చోటు లేదు. వున్న చోట వీలు కాదు. బరితెగించి వెళ్ళి ఒళ్ళెరపెట్టి మొగిడ్ని దారిలోకి తెచ్చుకోవడం చేత కాదు. అందు మార్గం వల్ల అత్త కాదు కదా దాన్ని పుట్టించిన జేజేమ్మని ఎదిరించడం చేత కాదు.
మరి మొగుడు ఎవుల్నయినా మరిగితే, కాపురంలో నీళ్ళు కాదు, నిప్పులు కురుస్తాయన్న భయం.

మనిషి కున్న సహజాతాల్లో భయం కన్నా ముందున్నది కామం. కామం కూడా ఆకలే. దప్పికే. ఆకలిని అర్ధం చేసుకున్నట్టు కామాన్ని ఎవరూ అర్ధం చేసుకోరు. ఆకలికి దేబిరించి నీరసించిన ప్రాణం … ఎన్ని లజ్జుగుజ్జులయినా పడి కొట్లాడి పోట్లాడి ఆకలి తీర్చుకుంటుంది. కామమయినా అంతే. దేబిరించో దౌర్జన్యం చేసో సిగ్గొదిలి .. సెరమొదిలి ఆరాటపడి దప్పిక తీర్చుకుంటుంది.
ఆర్నెల్లయి ఆడమనిషి కోసం ఉపాసం వున్నాడు కాబట్టే పైడయ్యకు పెళ్ళాం సన్నెమ్మ మీద మోజున్నా – రావయ్య కోడలు .. యేపుగా కాసిన కాయాలా, నిండా విడ్డ పువ్వులా వుండి ఆశనిపించింది. ఆశ తీరక ఆ దప్పికతోటే ఊరికీ వాడకీ దూరంగా ఎక్కడో వున్న గంగమ్మని ఎతుక్కుంటూ వెళ్ళాడు. నీ కాడ యేదుంటే అదే యిమ్మన్నాడు. అక్కడితో ఆగక “నానార్నెల్లయి, ఆడమనిషి కోసం ఉపాసవున్నాను. ఇయ్యాల ఇంటికొస్తే మాయమ్మా అత్తా కుమ్ములాడుకొని మమ్మల్నిడదీసినారు. నిన్న రాత్తిరి దాన్ని తవిటప్ప ఇంటికి రమ్మన్నాను. దానికి నా బాధ అర్ధవైనట్టు నేదు. సెప్పకేం – కత్తెట్టి ఒక్కొక్కల్నో పోటు పొడిచేసి, ఆ యెంట నానూ సత్తునా అనుకున్నాను. కాని నాకాపాటి తెగువనేదు –’’ పైడయ్య తన అవస్థలను చెప్పాడు.

గంగమ్మ అర్ధం చేసుకుంది. ఒక దప్పికన్నా తీర్చాలన్న ఉద్దేశంతోనే “– ‘నీకు నాటు సారా పడతాదా?’ అంది తల్లిలా –“ అని మాష్టారు అక్కడ అమ్మని చేశారు గంగమ్మని.
పెళ్ళప్పుడో, సన్నీ కాపురానికి రాకముందో – ఇంకోసారి అడగానంటే, అలాగే కానిమ్మంది గంగమ్మ. మళ్ళీ ఇన్నాల్టికి వచ్చిన పైడయ్యను కాదంది. ‘నానిప్పుడు నీకొదెన్నవుతాను’ అని చెప్పింది. అంతకు ముందే గంగమ్మ చెప్పకముందే ఆమె భర్త మంచానుండి ‘నారాయుడూ’ అని పిలవడం సూక్ష్మ దృష్టి గల పాఠకుడు ముందే గ్రహిస్తాడు.
పైడయ్య మాటా మనోగతం మనిషి కప్పుకున్న మరిన్ని లోపలి పొరల్ని చీలుస్తుంది. సహజమైన సహజాతాల్ని బయట పెడుతుంది.
“మాయన్న అందరు పిల్లల మీద, పెళ్ళాడనంటే, మంచోడు – మంచి పనే చేసేడనుకున్నాను. అయితే ఆడు యెలాగా బరిస్తన్నాడా అని దిగులుగుండేది. ఇదిగిలాగన్న మాట: అని – నన్నడిగితే యిదీ మంచి పనేననాల. అత్తలాడూ సుకపడతన్నాడు. ఇత్తల నువ్వూ సుకపడతన్నావు. మనలాటి కస్టపాటు జాతికే వుంది, కడుపు సుకం లేనే లేదు. ఎయ్యి జనమలెత్తినా వస్తాదని నమ్మకవూ లేదు –

సుకాలన్నిట్లోకి సుకం ఆడ మగా ఒక్కాడ అనుబగించిందే – సుకం! ఇప్పుడిదీ (సారా) సుకవే. కానీ దీనికి కరుసున్నాది. ఇదయ్యాక రేపు కొంత దండుగున్నాది. ఆ సుకానికైతే కానీ కరుసునేదు – రేపు దండుగనేదు. పేదోడికి బగమంతుడు మిగిలించిన సుకవది.-“ అని పైడయ్య తన పరిస్థితికి వాపోతాడు.
పైడయ్యకు వేరే దారి లేదా? ఉంది. అది దారి కాదు. ‘ఇరుగమ్మకో పొరుగమ్మకో పాటుపడితే యిళ్ళిరగతీయాల: కన్నె పిల్లని సెరిపితే, కలకాలం దానుసురు తగుల్తాది. మరింక రోడ్డోర మనుసులున్నారు – ఆలా జోలీ కెళ్తే, ఆసుపత్రికి పోవడం సరే సరి – పన్లోకెళ్ళకండ పది రోజులుంటే కూల్డబ్బుల మాటేటి?’ పైడయ్యకు తోవ లేదు!
‘కడుపుకుండి, మనిషి దొంగతనం సెయ్యరాదు. కట్టుకున్న పెనివిటో, పెల్లవో వుండి కాని పని సెయ్యడం తప్పు. నీకింటి కాడ పెల్లం నేకపోతే సెప్పు. దానికొంట్లో సుకం నేదన్నా నానొప్పుకుంటాను. కానీ తీరి కూకొని కాపరాలు సెడగొట్టకు. అందరు మొగోళ్ళు ఒకటైనట్టే అందరాడోళ్ళం ఒకటే’ అంది రావయ్యకోడలు, పైడయ్య స్నేహితుడు కన్నయ్య తోటి.

వదిన్నవుతానన్న గంగమ్మ – అలా అన్నందుకు ఒగ్గేసిన పైడయ్యలను జాతి తక్కువగా లోకం చూసినా నీతికి తక్కువ కాదు. ఏ తోవా లేక దొంగతోవకొచ్చినా ఎవలతోవ ఆలకి వుండాలి గదా?!
అలాగ లేనపుడు దొంగ తోవయినా వొక తోవుండాలి. నారాయుడూ గంగమ్మ ఆ తోవనే నడుస్తున్నారు. గంగమ్మ మొగుడు అది దొంగ తోవనుకోడు. ఏ తోవా లేనపుడు ఏదో ఒక తోవుండాలని తెలుసుకొని అర్ధం చేసుకున్నాడు గనుకనే ‘నారాయుడూ’ అని కదలిక పసిగట్టి పిలవగలిగేడు.
మానవ సహజాతాల్లోని ఆకలి, కామం గురించే కాదు .. నిద్ర, భయం గురించి కూడా ‘ఆర్తి’ కధ మనకు ఎరుకలోకి తెస్తుంది.
ఆకలి రుచెరగదు. నిద్ర సుఖమెరగదు. నిజమే, కాని శాశ్వత నిద్రకే కాదు, ఒక రాత్రి తెల్లవారాలన్నా ఆరడుగుల నేల కావాలి. ఒక సారికి కాదు, రెప్పలు పడిన ప్రతిసారీ కావాలి. ఒళ్ళు వాల్చడానికి ఆసరా కావాలి. వెన్ను ఆన్చడానికి నేల ఆదరువు కావాలి. మరి ఎర్రెమ్మ యిల్లయితే నరసమ్మ అన్నట్టు పందుల గుడిసే.
‘…తొడుక్కోడానికి చింకి గుడ్డలేనా లేని పిల్లలు – ఈలీకలూ వాలికాలైన కోక ముక్కలు కప్పుకొని, యెముకలు కోరికే చలిలో ఆరు బయట పడుకోలేరు. ఒకళ్ళ మీదోకళ్ళు పడి పెద్దప్ప చుట్టూనో, తల్లి చుట్టో, ఆ గదిలోనే పడుకోవాలి. అంచేత పగలల్లా అత్తవారింట గడిపినా రాత్రికి తాను ఇంటికి తీసుకుపోతాడు పైడయ్య సన్నిని …’ అని పరిస్థితిని వివరిస్తారు మాష్టారు.

రాత్రి నిద్ర పోతూనే, మళ్ళీ తెల్లవారి లేస్తూనే సన్ని కన్నోరింటికి పెనిమిటితో రావడంలో నిద్ర సుఖమేమో గాని, మెలకువ కష్టం మాత్రం మామూలుది కాదు.
పోనీ నరసమ్మ యింట్లో తొంగుంటారంటే – ఏదో మాట కాడ మాటొచ్చి ఏదో అన్నదని సన్ని ఆల అత్తకి గుర్రు.
పైడయ్య పట్నంలో కలాసీ, పడుకోడానికి ‘గది లేదు, కూరల మార్కెట్ లోనే ఓ అరుగు మీద పడుకుంటాడు. చూరునున్న గోనె గుడ్డలూ, చాప ముక్కలూ పీకి వాటినోసారి గట్టిగా దులిపి పక్కలు పరిస్తే – పెద్దమ్మ పేరు చెప్పి చుట్టంగా వచ్చిన రావయ్య.. ముసలాడు నిద్ర పోలేదు. అక్కడ ఊరంతా అంత ఎలుగేటి? – యిక్కడీ సీకటేటి ?- అంటాడు. ఈ అరుగులు యింత గలీజుగా వున్నాయి, ఎప్పుడూ కడగరా – అంటాడు. దోవల్నీ, చీవల్నీ, నల్లుల్ని నలుపుకొంటూ – యిటూ అటూ పరిగెత్తే ఎలుకలూ, పందికొక్కులు యెక్కడ కరుస్తాయో అని భయపడుతూ, యెంతో రాత్రి దాకా నిద్ర పోలేదు.’ ఇవన్నీ చుట్టపు చూపుగా వచ్చిన రావయ్య గుర్తించాడు. పైడయ్య ఏనాడూ గుర్తించలేదు. కాబట్టే బతికేశాడు. అడక్కుండానే రావయ్య ‘నన్నడిగితే, తిండినేక ఏ గడ్డో కరిసి చావడం మెరుగు; పేనాలు ఒకపాలి పోతాయి.’ – అని చెప్పిందాకా పైడయ్య తనేలాంటి చోట వున్నాడో గమనించలేదు. ఆ ఊరి జనంలో అయిదో వంతు అలాగే బతుకుతున్నారని కధకుడు చెప్పి ‘పదిరాళ్ళు జేబులో వున్నప్పుడు పరవాలేదనిపించినా, డబ్బులు తక్కువైనపుడల్లా పైడయ్యకు ఆ మాటలు గుర్తొచ్చేవి.’ అని చెపుతారు. నిత్య రణగొణ ధ్వనుల నడుమ ప్రశాంత మహా నిద్ర అసహజమై పోయిన వొక సహజాతం!

మరో సహజాతం భయం! యిది అంతటా ఆవరించి వుంది. లేని దాని కోసం భయం. ఉన్నది కోల్పోతామేమోనని భయం. బతుకెలా గడుస్తుందో భయం. ఇవాల్టి గురించి భయం. రేపటి గురించి భయం. భయం … భయం .. ప్రతి క్షణం భయం!
కూతురు కాపురం ఏమయిపోతుందోనన్న భయంతో ఎర్రెమ్మ వియ్యపు రాలైన బంగారి యింటి మీద కొచ్చింది. తనకి వెన్నూ దన్నూ లేకపోయినా తెగించింది. తిట్లూ తన్నులూ తిన్న అనుభవం వుండనే వుంది. అల్లుడు సారా బడ్డీ దగ్గర తాగకుండా గంగమ్మ .. లంజ దగ్గరకేల ఎల్లినాడని – భయంతో లేని సంబంధాన్ని ఊహించి ఊరంతా వాడంతా గోల గోల చేసింది. పైడయ్య భయంతో పట్నం బయల్దేరేశాడు. అన్న భయంతో ఆగిపోయాడు.

ఈ తగవు ఎక్కడ తేలుతుందోనన్న భయంతోనే పైడయ్య చిన్నన్న కోటయ్య ఎర్రెమ్మని గత్తురు గత్తిరింది కాక గుఫీ దబీ దుబీమని మూడు గుద్దులు గుద్దేడు. కింద పడ్డ మనిషిని ఎడాపెడా నాలుగు తాపులు తన్నేడు. వెళ్ళవసిన దారి చూపించాడు. వెళ్ళి ఆగి తిట్టి పోసి నోటితో భయపెడదామనుకుంది ఎర్రి. ఎగిరెగిరి పడింది. తిట్టి పోసిందే గాని కోటయ్య సన్నిని తుండగుడ్డ నడుంకేసి లాక్కుపోయాడు.
ఎవరూ ఆపలేక పోయారు భయంతోనే. కోటయ్య ముందు కాకుండా వెనుకన పదిమందీ పది రకాల మాటలన్నారు. అదీ భయంతోనే.
ఊరికి తీర్పులు చెప్పే నాయ్డు పెద్దమనిషి, పెద్దరికం పోకుండా ‘పిలా తొత్తి కొడుకుని, రాకపోతే జుట్టట్టుకు ఈడ్చుకురా’ బారిక పాపయ్యకి ఆజ్ఞ నిచ్చాడు. ‘సిత్తం’ అని బారిక పాపయ్య అన్నాడేగాని కదల్లేదు. నాయ్డుకి అనుమానం వేసి ‘ఏం ఆడు తాగుతాడేట్రా?’ ఈసడించినా భయంతోనే. ‘ఉడుకు తగ్గేక, ఇంకో గంటకి ఆలె తవ పాదాల కాడ కొస్తారు గదా?’ ఉచిత సలహా యివ్వడంలోనూ, తిట్టుకుంటూ నాయ్డు ఆమోదించడంలోనూ భయం ఉంది!

తేలని తగువుని తన బలంతో భయం చూపెట్టి క్షణంలో పరిష్కరించేశాడు కోటయ్య.
ఆ భయం తీరకే ఊరి నాయ్డుని ఆశ్రయించింది ఎర్రెమ్మ. ఆమె వెంట పది పదిహేను మందిని వెంట తీసుకెల్లింది తనకు న్యాయం జరగదేమోనన్న భయంతోనే. బారిక పాపయ్య సలహాననుసరించి కోటయ్యను వాడి అత్తోరి ఊరికి పంపేసినా, పైడయ్యని యింట్లోనే వుంచి పెద్దోడు నారాయుడు నాయ్డు దగ్గరికి బయల్దేరినా ఆ భయంతోనే. నాయ్డు తిట్టినా, ‘చేతిలో కర్ర లేకపోయిందిగాని వుంటే తొత్తికొడుకును ఏకీలుకా కీలిరిసేసి ఆసుపత్రిలో పారేద్దును’ అని అన్నదీ భయంతోనే. నారాయుడు తప్పును అంగీకరించిందీ ఆ భయంతోనే . ఎర్రెమ్మ యెంత రేపెట్టినా, యింటిమీద కొచ్చినా దానింటి మీద పడకూడదని తనతో చెప్పాలని – దురితం కూడదని – దౌర్జన్యం పనికి రాదని – తగువులొస్తే తమలో తాము తన్నుకోడం కాదు, పెద్దల ముందు పెట్టి పరిష్కారం చేయించుకోవాలనడంలో – భయం వలన మాత్రమే అదుపులో వుంటారని నాయ్డుకి తెలుసు. భయపెట్టింనంత కాలమే నాయ్డు అధికారం, పెద్దరికం వుంటుందని మనకి తెలుసు. నాయ్డు మంచి చేసినా చెడు చేసినా.
ముందయితే సన్నెమ్మని దానమ్మ ఎర్రెమ్మకి అప్పగించు అని నాయ్డు తొలి తీర్పు యివ్వడంతో కధ మొదటికొచ్చింది. సమస్య ఉన్న కాడికే వచ్చింది. అయినా ఎర్రెమ్మ పక్షాన వున్న నరసమ్మకూ భయం పోలేదు కాబట్టే ‘బాబో అసలు మనిసినోగ్గేసినావ్..’ అని గుర్తు చేసింది. ‘అన్నట్టు మీయమ్మను కూడా తీసుకురా’ నాయ్డు నారాయుడితో అనడంలో వెలిగిన మొహాల్లో భయం పోలేదు. తమకున్న భయమే ఆలకీ వుండాలన్నదే వాంఛ. నిజానికి అక్కుర్లు బుక్కుర్లేడ్చిఅలసిపోయిన సన్నెమ్మ మొహం కడిగి, కొత్త కోక కట్టుకోమని అత్త బంగారి నయాన బయానా చెప్పడంలో తల్లి ఎర్రెమ్మకు ఏ మాత్రం తీసిపోలేదు.
మొత్తానికి సన్నెమ్మ తిరిగి తల్లి దగ్గరికే చేరింది. యధాతధ స్థితే మిగిలింది.

నాయ్డు లేపోతే, నాయ్డు కాపోతే, కాలం మారిపోతే, పద్దతులు మారిపోతే కూడా నాయ్డు స్థానంలోకి పోలీసులొస్తారు. కేసులవుతాయి. లాయర్లొస్తారు. వాదనలవుతాయి. తీర్పులిస్తారు. ఒకరికి న్యాయం జరిగిందనిపిస్తుంది. మరొకరికి అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. వ్యవస్థల తప్పొప్పుల ఫలితంగా వ్యక్తులు తప్పొప్పులు చేస్తారు. నేరస్తులవుతారు. శిక్షలనుభవిస్తారు.
అయితే కధలో అసిర్నాయుడు ఒకప్పుడు గాంధీ గారి శిష్యుడు కావడం వల్ల – యిప్పటి రాజకీయాలు కిట్టక పోవడం వల్ల – ‘బతుకు యీ వేళుండి రేప్పోయేది. ధర్మం కలకాలం నిలిచేది. దాన్ని తప్పితే లోకం తలకిందులు కాదా?’ అని నమ్మడం వల్ల – న్యాయాన్యాయాలు పక్కన పెట్టి మేలు చెయ్యడానికే పూనుకున్నాడని అర్ధమవుతుంది. అయితే కోటయ్య దోతరపుగా తిరగబడి చేసిన పరిష్కారమయినా, నాయ్డు నిదానంగా నిర్ణయాలు చేసిన పరిష్కారమయినా – రెండూ ఏక పక్షమే! రెండూ ఒకటే! రెండూ భయంతో అదుపులో పెట్టేవే!
కోటయ్యకు కులమే కాదు చదువూ లేదు. ఆలోచన లేదు. ఆపద ఎటునుంచి ఎటుపోయి వస్తుందో తెలీదు. రక్తం ఉడుకులెత్తితే ఉరుకులెత్తడం తప్పితే మంచేదో చెడేదో తెలీదు.

మంచీ చెడూ అన్నీ తెలిసిన నాయ్డుకి కులముంది. బలముంది. బలగముంది. ఆలోచన ఉంది. ఆపద ఎటు నుంచి ఎటు పోయి వస్తుందో తెలుసు. ఇహమూ పరమూ మీద నమ్మకమూ ఉంది. అందువల్ల తిండికి లేపోతే అడుక్కు తినండి అంటాడు. బిచ్చం దొరక్క పోతే, చావడమైనా మేలు అంటాడు. అంతే తప్ప ఉన్నవాడికెందుకుందో లేనివాడికి ఎందుకు లేదో – లేనివాడికి ఎప్పటికుంటుందో చెప్పడు. చెప్పలేడు. అందుకే దొంగతనమో దౌర్జన్యమో చేసి లేనిది సాధించుకుందామన్న వాళ్ళని ‘పట్టుదలగా అణుస్తాడు.’ యధాతధస్థితిని కొనసాగిస్తాడు.

‘ … మీ మాల పేట్లో రోజూ యేవారో ఓ వార, యెందుకో ఒకందుకు తిట్టుకుంటూనే వుంటారు గదా! ఎందుకోసవలా తన్నుకు చస్తారు? ఏం మీకు పంచుకుందికి ఆస్తులున్నాయని తన్నుకుంటారా? కలుపుకుందికి బూవులున్నాయని తన్నుకుంటారా? లేపొతే ఒక నీటి కాడ తగువా? ఒక దరికాడ తగువా? దేనికి మీ తగువులు?’ అని నాయ్డు అక్కడితో ఆగలేదు –
‘ఏదో భవంతుడు మీకింత రెక్కలిచ్చేడు. పదిమందీ పస్లోలలు ఒక్క నాడు తెచ్చినా, పది రోజులు గెంజి తాగి గడిపేసుకోగల్రు. అలాటప్పుడు నలుగురూ కలిసి మెలిసుంటే అదెంత హాయి, యిలా తెల్లారి లేస్తే తగవులు పడ్డం – యిదేం సుఖవు? మీకు మతులుండవా? లేకపోతే, అందులో ఏదో పురుగుండి అలా దొలుస్తుంటుందా?!’
ఏం చెప్తారా జనం ? యేం చెపితే నాయుడికి బోధపడుతుంది.!’ కధకుడు ప్రశ్నించడంలో దొరకబుచ్చుకోవలసిన జవాబు ఏదయితే వుందో – అది ఆర్తి కధ ద్వారా అందాల్సిందేదయితే వుందో – అదేనని మనకు అర్ధమవుతుంది.
స్థిరపరిచిన విలువలే చిరాయువుగా ఎందుకు నిలుస్తున్నాయో – కొత్త విలువలు ఎందుకు తలెత్తడం లేదో – తలొంచుకున్న జనం తలెత్తినపుడల్లా అవి నేరాలుగా ఘోరాలుగా ఎందుకు కనిపిస్తున్నాయో – జనం తమకి తామే శత్రువులుగా ఎందుకు నిలుస్తున్నారో – ఒకే కుటుంబమయిన వాళ్ళు వైరి పక్షాలుగా ఎందుకు మిగులుతున్నారో – నెయ్యాలు మాని కయ్యాలాడి కాట్ల కుక్కలెందుకవుతున్నారో ఏలుబడి చేసిన వాళ్ళకు ఏలిన వాళ్ళకి ఎరిక లేదనా?
అదెంత గాంధీ రాజ్యమయినా .. అది ‘రాజ్యమే’ కదా?!

సరే, మరి రెండో విడత పంచాయితీలో తగువుకి మూల కారణమేమిటో నాయ్డు అడిగినా ఎర్రెమ్మ గాని, తరుపున వచ్చిన వాళ్ళు గాని చెప్పలేకపోయారు. నారాయుడే రెండు పక్కల వున్నదేటో చెప్పాడు. అది కూడా చేతనైనంత నిష్పక్షపాతంగా వివరించాడు. నిజానికి నారాయుడు తన తల్లి తమ్ముళ్ళ కుటుంబం పక్క కదా మాట్లాడాలి. మరెందుకు మాట్లాడలేదలగ? భయం! కాదనేస్తారని భయం! తమ్ముడు కోటయ్య చేసిందానికి తప్పని ఒప్పుకోవడం వల్లే కాదు, ఎర్రెప్ప ఒంటరిదని దారీ తెన్నూ లేనిదని అవతల పక్షము వహించి మాట్లాడడంలో నిజమూ వుంది, తగవరితనంలో అంతకు మించిన బతుకు భయమూ వుంది.
అది సరే, చివరాఖరికి ‘ఎళ్ళి నీ అల్లుణ్ని బతిమాలి తీసుకుపో ‘ అని తీర్పిచ్చి నాయ్డు ‘.. ఉసూరు తగలడం జయం కాదు’ అని బంగారిని హెచ్చరించి వెళ్ళిపోయాడు.

కధ ముగిసి పోయిందా? సమస్య తీరి పోయిందా? అప్పటికి తీరినట్టుగున్నా మళ్ళీ తలెత్తదా? బతుకు భయంతో ఆసరా కోసం ఆదరువు కోసం కూతురు సన్నెమ్మని ఎర్రెమ్మ ఎనక్కి లాగదా? నా బతుకూ నా కోడలూ నా హక్కూ అని బంగారి ముందుకు లాగదా? అటులాగ యిటులాగా – ఎక్కడున్నది అక్కడే వుండదా? చెప్పినట్టుగా నడిచిపోతే, నాయ్డు ఇంతకాలంగా యిస్తున్నతీర్పులకి మాల పేట నిసంకుడయి పోవాల కదా?! అవుద్దా? అవదు! కుక్కల్లా కాట్లాడుకుంటూనే వుంటారు … యిక ముందూ – మనముందూ-
ఎర్రెమ్మకు బుద్ధుంతే బువ్వ తింటాదని నాయ్డు లోపాయికారాన చెప్పినట్టుగే – రాజీ పడి, తగువులు మాని నిగ్రహించుకొని మంచి చేసుకొని మసలుకోగలదా? బంగారో మాటంటే వాగే నోరు మూగయిపోగలదా? ఎన్నాళ్ళు నోరు కుట్టుకుంటాది? అదువు బతుకు కాదా? ఒక్కడే బతకలేక సతమతమై పోయిన పైడయ్యతో కూతుర్నంపి పట్నంలో కాపరమెత్తించగలదా? కడుపు నింపగలదా? కాలం దాటగలదా? ఏమో –

అదొక ఆశ .. ముందటికున్న దారి .. దారి కానీ దారి ..
కోడిగుడ్డు వారిస్తే సట్టిడు! నిజమే గాని, గుడ్డు దానికదే పిల్లయి పోదు కదా. అటుకెక్కించి పొదిగించాలా? అందల కరిగినవెన్నో .. పొదిగినవెన్నో .. ఎన్నో కొన్ని .. అవయినా కాకులకీ గద్దలకీ పిల్లులకీ పీడలకీ దొరక్కండా వుండాల. అంత వార్సాలంటే భూదేవికున్నంత ఓపికా సహనమూ వుండాల… రేపటి మీద నమ్మకముండాల ..
ఆశ కనబడితే శ్వాస ఆడుతుంది…
అవన్నీ కడుపు నిండిన మాటలు … నాయుడే అన్నట్టు ‘కడుపెప్పుడు నిండదో కానీ బుద్దులప్పుడు తప్పవు.’ మరి కడుపు నిండని ఎర్రెమ్మ యివన్నీ కానుకో గలదా? కాసుకో గలదా? ఇయాల దినం తీరడం గురించి తప్పితే, రేపటి దినం గురించి ఆగగలదా? ఆలోచించగలదా?
నాయ్డు మాట మీద నాయురాలు – పులుసొక్కటే కాదు! అన్నం, ఆకులో కూర పెట్టి ఏవేవీ మిగిలితే అవన్నీ యిచ్చినా – ఆ పూటకే. నాయుడి మాట మీద నడవడం ఆ రోజుకే. నెలా పది తిరిగీ సరికి దెబ్బలు మానిపోయినట్టుగే సుద్దులు మరిచిపోయి మళ్ళీ మొదటికే రాదా? ‘ఆర్తి’ .. పీడ, దుఃఖము, మనోవ్యధ, రోగము పోదా? వింటికొన మీద బతుకు కాదా?
అందుకు సాక్ష్యంగా పైడయ్యకు అన్నం తినక పోతే ఆకలి. తినబోతే వెలపరం. నిజమే, ‘మోచేతి కూడు’ అని ఎంచితే – ఎంచడానికి లేనిదేవుందా గుడిసలో?, పెళ్ళాంతో కలిపి. పెళ్ళామే కాదు, తన బతుకులోనయినా ఎంచలేనిదేదయినా వుందా పైడయ్యకి? పైడయ్యకే కాదు, మొత్తం మాల పేటోళ్ళకి? పైడయ్య పని చేసే పట్నంలో అయిదో వంతు జనాభాకి?
ఆకలైనా అప్పటికి పైడయ్య చెయ్యి కడిగేసుకోవచ్చు. కానీ తర్వాతయినా కతక్కా తప్పదు. కక్కకా తప్పదు! కక్కిన కూడు తినకా తప్పదు!! అందుకేనేమో ‘కక్కిన కూడు తినే కూడదు, తింటే కడుపు నిండా తినాల’నీ అంటారు.

సరి సరే .. కడదాకా కధ మారదా అంటే మారాల్సినవేవో మారనంత కాలం మార్సనంత కాలం యింతే. కవుకుల పడిపోడమే.
ఈ కవుకుల్లో అల్లకల్లోలమయి పోయిన బతుకు బతికినోలకి – సహజాతాలైన ఆకలి, కామం, నిద్ర, భయం… ఒకటేవిటి అన్నీ అసహజమయిపోతాయి. అందనివై పోతాయి. తప్పించుకోలేనివయి పోతాయి. ఈ మూలాలు దెబ్బ తినీసినాక మనుషులు మనుషులుగా మనలేరు.

‘ఆర్తి’ కధ ద్వారా కాళీపట్నం రామారావుగారు చెప్పిందీ చూపిందీ యిదే!

 -బమ్మిడి జగదీశ్వర రావు

 

bammidi ఎలాంటి సాహిత్య వారసత్వం లేని కుటుంబం నుండి వచ్చిన బమ్మిడి జగదీశ్వరరావు తన పదమూడో ఏట నుండే కధలు రాయటం మొదలు పెట్టారు. అమ్మ చెప్పే కధలతో ప్రారంభం అయిన ఆయన కధాభిరుచి ఇప్పటికి ఐదు కధా సంపుటిలు, అనేక చిన్నపిల్లల కధల సంపుటిలు, జానపద కధలు వేయటానికి దారులు వేసింది. రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టి తీగలు, హింసపాదు వీరి కధా సంపుటిలు. తధాగత ప్రచురణల క్రింద ‘అమ్మ చెప్పిన కధలు’ ఆరు సార్లు రీ ప్రింట్ అయ్యి ఇప్పుడు ప్రతులు దొరకటం లేదు. ఇవి కాక అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, ఊ కొడదాం, అనగా వినగా చెప్పగా, అల్లిబిల్లి కధలు ఇంకా చాలా జానపద కధలు పుస్తకాలుగా వచ్చాయి. అవార్డ్స్ కి దూరంగా ఉండే బజరా నేటి తరం రచయితలు ‘రాయకుండా ఉండలేక పోవటం’ కాకుండా ‘ప్రచారం లేకుండా ఉండలేక పోవటం’ గురించి అసంతృప్తి వెలిబుచ్చారు. బజరాకు చాలా మంది రచయితలతో పాటు కారా మాష్టారు, పతంజలి అంటే ఇష్టం.       

 వచ్చే వారం ‘మహదాశీర్వచనం’ కధా పరిచయం కాత్యాయని విద్మహే 

 

 ఆర్తి కథ ఇక్కడ: