Archives for October 2013

శేషేంద్ర అద్భుత సృష్టి – స్వర్ణోత్సవ కావ్యం ‘ఋతుఘోష’

87648618-seshendrasharma-the

సాత్యకి (శేషేంద్ర కుమారుడు)కి గుర్తుందేమో, తెలుగు సాహిత్య ప్రపంచం మాత్రం ఒక విషయాన్ని మర్చి పోయింది. అదేమంటే ఋతుఘోష కావ్యం పుట్టి 50 సంవత్సరాలు అయిందని. అంటే స్వర్ణోత్సవ సంవత్సరం అన్నమాట. పట్టుమని పది సంవత్సరాలు బతకని కవితలు లేదా కవితా సంకలనాలు రాసి, పైరవీలతో పురస్కారాలు పొందుతున్న కవులూ, వారి సాహితీ జీవిత రజతోత్సవాలు ఇంకా ఇతర ఉత్సవాలు చేసుకుంటున్న కాలం ఇది. కాదు చేయించే సాహిత్య సంస్థలున్న ఈ కాలంలో తెలుగు సాహిత్య ప్రపంచం ఋతుఘోష వంటి కావ్యానికి స్వర్ణోత్సవ ఋతువు వచ్చిందన్న సంగతి మర్చి పోవడంలో ఆశ్చర్యం లేదు. సరే. ఈ ఋతు ఘోష కావ్యాన్ని రాసినవాడేమన్నా మామూలు ఆషామాషీ కవా. అంటే కాదు సాక్షాత్తు గుంటూరు శేషేంద్ర శర్మ నోబెల్ బహుమతి కోసం పేరును ఒక ఎంట్రీగా పంపబడినంతటి గొప్పకవి.

ఈతరం కవులకు అంటే నా ఉద్దేశంలో 30 లేదా నలబై సంవత్సరాల లోపున ఉన్న వారికి, ఒక సాహిత్య జిజ్ఞాసతో వెనక్కు పోయి పెద్దల దగ్గర తెలుసుకుంటేతప్ప, గుంటూరు శేషేంద్ర శర్మ మంచి ప్రౌఢనిర్భర వయఃపరిపాకంలో కవిత్వం రాస్తున్న కాలం తెలియదు. అందుకే శేషేంద్ర వారికి కేవలం వచన కవిగా లేదా సాహిత్య విమర్శకుడుగా మాత్రమే తెలిసి ఉండే అవకాశం ఉంటుంది. శేషేంద్ర ఎంత గొప్ప కవి అంటే నన్నయ కన్నా ప్రాచీన కవి అయిన తెలుగు వారి గోల్డు నిబ్బు విశ్వనాథ సత్యనారాయణ గారే ఆయన పద్యాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. అంతే కాదు, పద్యాన్ని శేషేంద్ర లాగా రాయగలిగిన వారు నేడు ఆంధ్ర దేశంలో పట్టు మని పది మంది అయినా లేరు అని చెప్పారు. అంతే కాదు విశ్వనాథ రాసిన కావ్య పీఠికల్లో రెండు చాలా ఉత్తమోత్తమమైనవి అని మా గురుపరంపరలో ఉన్నతులైనవారు చెప్పేవారు. ఒకటి శేషేంద్ర శర్మ ఋతు ఘోష కావ్యానికి, రెండు వి.వి.యల్. నరసింహారావుగారు రాసిన ఆనంద భిక్షువు కావ్యానికి రాసిన పీఠికలు. ఋతు ఘోష మొదటి సారి 1963లో అచ్చు అయింది. తర్వాత చాలా సార్లు ముద్రించబడింది. ఇటీవలే ఆయన కుమారుడు సాత్యకి తిరిగి ముద్రించాడు. ఒక ప్రౌఢమైన పద్య కావ్యం అదీ ఈ కాలంలో ఇన్ని సార్లు అచ్చు కావడం విశేషమే.

ఋతువులను గురించి కావ్యాగానం చేయడం ఈనాటిది కాదు. అలనాటి వాల్మీకి, కాళిదాసుల దగ్గరనుండి ఈనాటి నారాయణ రెడ్డిగారి ఋతు చక్రం దాకా వస్తూనే ఉంది. ఆచరిత్రలోకి పోయే సందర్భం కాదు  కాబట్టి ఆ చర్చను వదిలేస్తున్నాను.  శేషేంద్ర ఋతు ఘోష కావ్యానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అది ఒక అనుపమాన (యునీక్) ఋతు కావ్యం. కవి పద్యరచనలో చూపిన ప్రౌఢిమ మాత్రమే దీనికి ప్రధాన కారణం కాదు. శేషేంద్ర ఎంత గొప్ప కవో అంతటి పండితుడు. సంస్కృతాంధ్రాలలో ఆయనుకున్న పాండిత్యం ఆయన కాలంలో పుట్టిన వారికి ఉండడం చాలా అరుదైన విషయం. ప్రచారంలోనికి రాలేదు. ఆయన కూడా తనను తాను అత్యంత ఆధునికుడుగా చెప్పుకోవడానికి ప్రయత్నించడం వల్ల శేషేంద్ర పద్యరచనకు అందవలసిన గౌరవం అందలేదు. లేకుంటే శేషేంద్ర సంప్రదాయ పద్యరచనలో పద్య ఛందోనిర్మాణ సంవిధానంలో మరొక విశ్వనాథ అయిఉండేవాడు.

ఋతుఘోష కావ్యం ఇంత గొప్పది అని చెప్పడానికి మొదటి కారణం దీనిలో ఎక్కడా కృత్రిమత్వం లేకపోవడం. అంటే కవి ఋతువుల్ని తాను చదువుకున్న ప్రాచీన కావ్యాల అనుభవంతో దాని ప్రభావంతో మరికొన్ని పద్యాలను ఋతువుల గురించి రాయడం లేదా మరికొన్ని కొత్త వర్ణనలు చేయడం. ఇలా కాక ప్రతి ఋతువును ప్రతి ఋతువులో వచ్చిన ప్రకృతి రామణీయకాన్ని తను గొంతునిండా అనుభవించి పుడిసిలించిన పద్యాలు ఇవి. అందుకే ప్రతి పద్యం గుండెని సూటిగా తాకుతుంది. ఇందులో మరీ ఎక్కువ పద్యాలు లేవు. ప్రతి ఋతువుకూ ఇన్ని పద్యాలు రాయలనే నియమాన్ని కూడా కవి పెట్టుకోలేదు. రెండు ఋతువులగురించి అయితే ఆరు పద్యాలే రాశాడు. కాని ప్రతి ప్రకృతి పరిణామాన్ని ఒంటి నిండా గుండె నిండాఅనుభవించి రాసిన పద్యాలు ఇందులో ఉన్నాయి. (వసంత 18, గ్రీష్మ 7, వర్ష 10, శరత్తు 7 పద్యాలు 5 గేయాలు, హేమంతం 6, శిశిరం 6). మొత్తం 59 పద్యాలే ఉన్నాయి. కాని ప్రతి పద్యం ఒక ఆణిముత్యం, మరువలేనిది. వెంటాడే గుణం కలిగింది.

శేషేంద్ర పద్యాలలోని భాష అత్యంత ప్రౌఢంగా ఉంటుంది. అది అలనాటి ప్రాచీన తత్సమ బహుళ కావ్యభాష. ఇలాంటి భాష రాయగలిగిన పండితులు మనకు ఆంధ్ర దేశంలో అప్పటికి చాలా మందిఉన్నారు. కాని శేషేంద్ర వంటి భావనా ప్రతిభ ఉన్నవారు ప్రాచీన పద్య ప్రక్రియలో అత్యంత ఆధునిక భావాలను అనుభూతిని రంగరించిన కవి ఆనాటికి లేడు. నేటికీ వెదికి పట్టుకోవలసిందే లేరనే చెప్పవచ్చు. నేడు పద్యరచనలు ఈ స్థాయిలో చేసే వారు లేరు అని చెప్పడం తెలుగు వారికి అవమానమే కాని అలా చెప్పాలంటే మరికాస్త శోధన చేయాలి. సాంప్రదాయికమైన అలంకారాలతో పద్యాలను నడపడం అందరూ చేయగలిగిన, చేసిన పనే. కాని చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం, శార్దూలం, సీస పద్యం, కందం వంటి ఛందాలను రాస్తూ పైగా ఋతువుల్ని గురించి రాస్తూ ఆయా ఋతువుల్లో సామాన్య మానవుడు, పేదవాడు పడే బాధల్ని గురించి రాయడం శేషేంద్ర మాత్రమే సాధించిన చూపిన ప్రతిభ, అంతే కాదు సామాజిక చింతన. వృత్త పద్యాలను రాసేటప్పుడు ఏ కవి అయినా ఆగణాలను తప్పనిసరిగా పాటించవలసిందే ఎందుకంటే అవి అక్షర గణాలు కాబట్టి. కాని కవి ఆ పద్యాన్ని ఏ సమాస చాలనంతో ఏ సృజన శక్తితో నడిపాడుఅన్నది ఆ కవికి ఉన్న స్వీయ ప్రతిభను బట్టి ఉంటుంది. ఇక జాతి ఉపజాతి పద్యాలు రాయడం లో కవికి స్వేచ్ఛ ఉంటుంది. కారణం ఇందులో ఇంద్రగణాలు చంద్ర సూర్య గణాలుంటాయి. ఇవి అక్షర గణాలు కాదు మాత్రాగణాలు అంటే కవి తనకు ఇష్టమైన గణాలు ఎంచుకోని రాయవచ్చు. తను ఏవిధమైన లయ సృష్టించాలనుకుంటే దానికి అనువైన గణాలను ఎంచుకోవచ్చు. అంతే కాదు ప్రత్యేకమైన వాక్య నిర్మాణాన్ని అంటే ఇక్కడ పాదనిర్మాణాలను సృష్డించుకోవచ్చు. ఈ పని శేషేంద్ర కంటే ముందు చాలా మంది చేశారు. ఆధునికుడైన కృష్ణశాస్త్రి కూడా పద్యాలలో గణాలను ప్రత్యేకంగా ఎంచుకొని తను కావాలనుకున్న లయను తెచ్చుకున్నాడు. “ఎలదేటి కెరటాల పడిపోవు విరికన్నె వలపు వోలె” ఈ పాదంలో గణాలు చూడండి అన్నీ సలము అనే గణాలను పాదాలలో వాడాడు. కవి ఇంద్రగణాలు ఆరింటిని వాడుకునే స్వేచ్ఛ ఇక్కడి సీస పద్య రచనలో ఉంది. కాని ఒకే గణాన్ని వాడి ఒక ప్రత్యేకమైన లయను ఈ పాదంలో సాధించాడు కవి. శేషేంద్ర సీస పద్య రచనలో ఈ తరహా పాద నిర్మాణ కళను చూపించి సీస పద్యానికి కొత్త అందాన్ని పట్టుకొచ్చాడు, చూడండి.

దుర్నీక్ష్య ప్రభా ధూర్ధరచ్ఛటలతో

క్షేత్ర జీవనుల శిక్షించినాడు

పటు రోష కషాయ కుటిలాంశు కశలతో

గోగణంబుల చావగొట్టినాడు

ఖరమయూఖ క్రూర ఘన కాండ పటలితో

విహగ జాతుల క్షోభవెట్టినాడు

గ్రీష్మకాలప్రాంశు కింశుక ద్యుతులతో

తరువల్లికల కగ్గి దార్చినాడు

గగన ఘనఘోట ఖుర నిరాఘాటధాటి

నలఘు బ్రహ్మాండంబునలగద్రొక్కి

చటుల దుర్జన రాజ్య శాశనమువోలె

సాగె మార్తాండ చండ ప్రచండ రథము.

 

వివిధ నిమ్నోన్నత వీధులం బరుగెత్తి

వైశాఖలో మేను వాల్చె నొకడు

ద్రాఘిష్ఠ ఘంటాపథమ్ములం దిరుగాడి

బెజవాడ కన్నీరు బెట్టె నొకడు

మధ్యాహ్న పరితప్త మార్గమ్ములంబోయి

గుంటూరులో కుప్పగూలె నొకడు,

కాలాహి కుటిల శృంగాటకమ్ములు జుట్టి

నెల్లూరిలో సొమ్మసిల్లెనొకడు

క్రూర దారిద్ర్య దుర్విధి కారణమున

తన భుజాగ్రమునెక్కు భేతాళ మూర్తి

సర్వకాలాను వర్తి రిక్షా ధరించి

లాగలేకను వేసవికాగాలేక.

పైన రెండు సీస పద్యాలలలో గ్రీష్మఋతువును వర్ణించాడు. ఎండా కాలం ఎంత తీక్షణంగా ఉంటుందో అంత ప్రతిభతో రాశాడు ఈ రెండుపద్యాల్ని మొదటి పద్యంలో ఎండ తీవ్రత ఎలా ఉందో చెప్పడం దాని ప్రభావంతో ఏ జనం ఎలా బాధపడుతున్నారో చెప్పడం చేశాడు. సీసపద్యంలో ఒక్కొ పాదానికి  రెండు భాగాలున్నాయి. వాటిలో మొదటి భాగంలో ఒకరమైన నిర్మాణ రీతిని రెండో దానిలో ఒకరమైన నిర్మాణ రీతిని అంటే రెండు భాగాలు కలిపి ఒక పాదానికి ఒక నిర్మాణ రీతిని పెట్టాడు. నాలుగు పాదాలు ఇలాంటి సమమైన నిర్మాణంతో నిర్మించాడు. అందుకే దీనికి అంతటి చక్కటి లయ అమరింది.

ఒక పాదాన్ని చూద్దాం. 1 దుర్నీక్ష్య ప్రభా ధుర్ధరచ్ఛటలతో 2 క్షేత్ర జీవనుల శిక్షించినాడు ఇవి పాదంలో రెండు భాగాలు ఒకటి సూర్యుడి గుణాన్ని చెబుతుంది రెండోది దాని ప్రభావం వల్ల కలిగిన ప్రజల ఇబ్బంది గురించి చెబుతుంది. కన్నెత్తి చూడడానికి ఏమాత్రం వీలుకాని కాంతితో తీక్షణమైన ఎండతో పొలంలో పనిచేసుకునే వారిని శిక్షించాడు అని దీనికి సులభమైన అర్థం. కాని ఈ నిర్మాణ పద్ధతిని నాలుగు పాదాలలో ఒకే విధంగా చేశాడు. నాలుగు పాదాల నిర్మాణంలో సామ్యం చూడండి ప్రతి పాదం చివరలో ఒక క్రియా పదంతో ముగిసింది. శిక్షించినాడు, చావగొట్టినాడు, క్షోభవెట్టినాడు అగ్గిదార్చినాడు అనేవి పాదాంతంలోని నాలుగు క్రియాపదాలు, అలాగే పాదంలోని మొదటి భాగం ముగింపులు అన్నీ ‘తో’  అనే క్రియా సంబంధాన్ని చెప్పే విభక్తితో ముగిసాయి. ఇది పద్య నిర్మాణంలో చూపిన తనదైన కళ. పొలంలో పనిచేసుకునే పనివారిని శిక్షించాడు, గోగణాలను చావగొట్టాడు, విహగజాతుల్ని క్షోభపెట్టాడు, తరువల్లికలకు అగ్గితార్చాడు అలఘు బ్రహ్మాండాన్ని నలగ దొక్కిన సూర్యుడు ఎలా ఉన్నాడంటే అతని రథం దుర్జన రాజ్య శాసనం లాగా కదిలిందట. ఒక మామూలు పద్యకవి అంటే పద్యం రాయడంమాత్రమే వచ్చిన మామూలు కవి గణాలు కిట్టించి సరిపెట్టి పద్యం వచ్చింది అని చెప్పుకోవచ్చు కాని ఉన్న పద్య నియమానలతోనే ప్రత్యేకమైన నిర్మాణ కళని చూపెట్టడం ఛందస్సులో మంచి ప్రభుత ఉన్న కవి మాత్రమే చేయగలడు. అది శేషేంద్ర చేశాడు.

ఇక పైన చూపిన రెండో సీస పద్యంలో కూడా ఇలాంటి ప్రత్యేకమైన నిర్మాణ కళని చూపెట్టాడు.  ఈ పద్యాన్ని రిక్షాకార్మికులు ఎండా కాలంలో పడే బాధను వర్ణించడానికి అంకితం చేశాడు కవి. ఒక్కో పాదాన్ని గమనిస్తే వీటిలోని నిర్మాణ కళ తెలుస్తుంది. పాదం మొదటి భాగంలో ఒక క్రియాపదంతో ముగుస్తుంది రెండో భాగం పడిన బాధతో ముగుస్తుంది. పరుగెత్తి, తిరుగాడి, పోయి, చుట్టి అనే క్రియాపదాలు ఒక్కో పాదం మొదటి భాగంలో చివరిలో వచ్చి కూర్చున్నాయి. అలాగే మేనువాల్చె, కన్నీరు పెట్టె, కుప్పగూలె, సొమ్మసిల్లె అనే నాలుగు బాధను తెలిపే పదాలు అన్నీ ఒక్కో పాదంలో సరిగ్గా ఒకే చోటికి వచ్చేలాగా పాదాలలో వాక్యనిర్మాణాలు చేశాడు కవి. ఇది పద్యరచనలో అత్యుత్తమ నిర్మాణ కళ. అందుకే ఈ పద్యాన్ని చదివితే అత్యంత రమ్యమైన లయ వినిపిస్తుంది. నెల్లూరు, గుంటూరు, బెడవాడు, విశాఖపట్నం నగరం ఏదైతేనేం ఎండకి రిక్షాకార్మికుడు పడిన బాధ కవి తన బాధగా భావించి వర్ణించాడు. ఇలా ప్రతి ఋతువును వర్ణించిన సందర్భాలలో ఆఋతువు పేదవాడికి ఎంత కష్టాన్ని తెచ్చి పెట్టింది అలాగే సంపన్నుడికి ఎలా సుఖాన్ని అమర్చింది అనే విచక్షణతో ఋతువులను వర్ణించాడు శేషేంద్ర. ఋతువుల ప్రభావాన్ని ఇలా వర్ణించిన కవి అంటే ప్రజల బాధన్ని వర్ణించిన తీరు ఇంకా ఏ కవి చేశాడని వెదకాలి.

ఇక పద్యాలలో ఉన్న భాష అత్యంత ప్రాచీన భాష కాని భావాలు అత్యంత నూతనం, సృజన శక్తి భావశబలత సరికొత్తగా మనసుకు హాహి గొలిపే రీతిలోఉంటాయి. కొన్ని పద్యాలు చూద్దాం.

ఈ ఆకాశము నీ మహాజలధులు న్నీధారుణీ మండలం

బీ యందాల తరుప్రపంచనిచయం బీ విశ్వవైశాల్యమెం

తో యంతస్సుషమా సముల్బణముతో నుఱ్ఱూతలూగించె నా

హా యూహా విహగమ్ము తా నెగిరిపో నాశించె నుత్కంఠతో.

 

ఏ మాకంద తకరు ప్రవాళములనో హేలాగతిం గోకిలా

భామాకంఠము శంఖమై మొరసె శుంభత్ కీర నారీ దళ

శ్యామంబై మెరసెన్ నభంబు, భ్రమర జ్యావల్లి మల్లీ సుమ

శ్రీమీనాంక శరమ్ములం గురిసె వాసిం జైత్రమాసమ్మునన్.

రాసింది శార్దూల పద్యాలు భాష కూడా చాలా ప్రౌఢమైంది కానీ భావం అత్యంత సున్నితమైంది. అంతే కాదు కవి ప్రకృతిలో పరవశించి తన స్వీయభావాన్ని ఆవిష్కరించిన తీరు సరికొత్తగా, ఫ్రెష్ గా కనిపిస్తుందీ పద్యంలో. అంతే కాదు పద్యరచనలో పదాలను వెదికినట్లు ఏ పద్యంలో కనిపించదు ఒక్కో పదం దానంతట అదివచ్చి తనకు సరిపడేగణంలో అదే వచ్చి కూర్చున్నంత స్వతంత్రంగా ఉంటుంది శైలి పై పద్యంలో ఇదే కనిపిస్తుంది. భాషలో అంతటి ధార, భావంలో అంతటి ఆవేగం పై పద్యంలో లాగే అన్నంటిలో కనిపిస్తుంది. చైత్ర మాసాన్ని గురించి చెప్పిన పైని రెండో పద్యాన్ని చూడండి ఎక్కడా నట్టుపడదు ధార. నాలుగు పాదాలలో వాక్యం ఏకధాటిగా తిరిగి వచ్చింది ఇది అసాధారణమైన ప్రతిభ ఏ నన్నయ ఏ పోతన ఏ శ్రీనాథుడు వంటి స్థాయి కవులు మాత్రమే చేయగలిగిన పద్యనిర్మాణ శక్తి ఇది. ఇక భావాలు చూద్దాం.

ఇచ్ఛ ప్రకృతిలో రెక్కవిచ్చెనేమొ, యెడద పురుషునిలో మొగ్గ దొడిగె నేమొ విశ్వమందిర కుడ్యముల్ విరగ గొట్టి మోహకల్లోల వీచిక ముంచి వైచె అని తన అనుభూతిని పలికిస్తాడు కవి. ప్రకృతి పట్ల ఒక మోహ కల్లోల వీచిక తనను ముంచి వేసిందని తాను మునిగిపోయిన రీతిని చెప్పాడు. ఏ అంతర్గత సృష్టి సూత్ర మహిమా హేవాకమో అంటాడు ఒక చోట. పొదంల తోటల బాటలాధరలతో పోలేని కూలీ జనుల్ మదిలో గుందుచు చేలలో దిరిగిరా మధ్యాహ్న కాలంబులన్ అంటాడు మరొక చోట. శరీరమొక కారాగారమై తోచగన్ అని అంటాడు ఒక పద్యం చివరిలో ఆసల్ దీరునె దృష్టిచే, మహిత గాఢాలింగనాయుక్తిచే అని సరికొత్తగా చెబుతాడు మత్తేభ పద్యంలో. ప్రకృతి నంతా ఒక పద్యంలో వర్ణించి చివరిలో ఒక శ్రామికుడు ఇంతటి అందమైన ప్రకృతిలో సాయంత్రం దాకా పనిచేసి ఇంటికి బోయేసరికే చీకటి దిక్కులు పిక్కటిల్లింది అని చెబుతాడు. శ్రామికునికి ఈ అందాల ప్రకృతి ఆనందాన్ని ఇవ్వలేకపోయిందని చీకటే మిగిల్చిందని బాధపడతాడు ఒక పద్యపాదంలో.. దూరగ్రహాంతరాగతవినూతన జీవిగ గ్రుమ్మరిల్లి యిల్ సేరగబోవు శ్రామికుడు చీకటి దిక్కుల పిక్కటిల్లగన్ అని రాస్తాడు. ప్రతి పద్యంలో అందం వెనుక ఈ వేదనను చూపుతాడు శేషేంద్ర. ఒక పేద కుటుంబం పడే బాధను ఒకే చోట రెండు పద్యాలలో కూరుస్తాడు. ఇక ఆయన వర్ణించిన ప్రకృతి అందాలు కమనీయం కొన్ని ఇక్కడ గమనిద్దాం.

కనరాదు యామినీ కబరీభరమ్ములో బెడగారు కలికి జాబిల్లి రేక

సికతరీతిగ తమశ్చికురనికరమ్ములో నలతి చుక్కల మోసులలముకొనియె

జిలుగు వెన్నెల చీర చిరిగిపోయినదేమొ కాఱు మబ్బులు మేన గమ్ముకొనియె

యెడదలో నేదేని సుడియుచుండెనొ యేమొ కాకలీ నినదముల్ క్రందుకొనియె

మేను విరిచె నేమె మెల్లగా నిట్టూర్చి

విధురవాయు వీచి విస్తరించె

నాత్మవేదన కొక్క యాకారమై తోచి

నేటి రేయి నన్ను కాటువేసె.

పైది సీస పద్యం కాని ఇందులో సంప్రదాయికమైన అలంకారాలు రాయాలని కవి భావించడు. ప్రతి వర్ణననీ సరికొత్తగా దిద్ది తీర్చాడు కవి. యామిని అంటే రాత్రి కబరీభరం అంటే కొప్పు రాత్రి అనే స్త్రీ కొప్పులో జాబిల్లి రేక కనిపించడం లేదట. తమశ్చికుర నికరం అని అన్నాడు ఇలాంటి సమాసాన్ని ఇంతకు ముందు ఎవరూ సష్టించలేదు. తమస్సు అంటే చీకటి చికురము అంటే వెంట్రుకలు పైన తమశ్చికుర నికరం అనిఅన్నాడు. అంటే వెండ్రుకలు చీకటిలా ఉన్నాయని చెప్పడంకాదు ఆ చీకటి వెంట్రుకల గుంపులా గుబురులా ఉంది అని ఈ సమాసంలో సరికొత్తభావాన్ని సృష్టించాడు కవి. ఇదీ శేషేంద్ర ప్రతిభ. జిలుగు వెన్నెల చీర చిరిగి పోయింది కాబట్టి మేనిమీద కారుమబ్బులు కమ్ముకున్నాయి అన్నాడు. జిలుగు వెన్నెల చీర చినిగి పోయిందేమో అని చెప్పిన కవి ప్రతిభని ఏమని పొగడాలి వాహ్ వాహ్ అని వందసార్లు అనాలి. ఇది అత్యంత నవ్యమైన భావన కాని సంప్రదాయికమైన సీస పద్యంలో రాయగలగడం శేషేంద్ర సాధించిన ఆధునికత. విధుర వాయు వీచి అనడం,  నేటి రేయి ఆత్మవేదన కొక్క ఆకారమై తోచింది అని చెప్పడం అత్యంత నవ్యమైన భావాలు.

ఇక వర్షఋతువను గురించి రాసిన కొన్ని పద్యాలు అత్యంత ప్రౌఢమైనవి గాఢమైన సంస్కృతభాషా పరిజ్ఞానం ఉంటే తప్ప అర్థం కావు. కాని భావాలు అంత్యంత నవ్యం. ప్రకృతి అందాలను ఇంత వర్ణించే కవి పద్యం చివరిలో ఏమంటాడో ఒక చోట చూడండి.

యేమి ధర్మంబు భాగ్యవిహీన దీన

జనులమీదనె దౌర్జన్య చర్యగాని

హేమధామ సముద్దామ సీమలందు

అడుగు వెట్టంగ పర్జన్యుడైన వెఱచు.

అని అంటాడు. పర్జన్యుడు అంటే వర్షాధి దేవతను అదుపులో ఉంచుకునే ఇంద్రుడు కూడా భాగ్యవిహీనులు మీద దౌర్జన్యం చూపిస్తాడు కాని హేమధామ సముద్దామ సీమలలో అంటే కలిగిన వారి బంగారు లోగిళ్ళలో అడుగు పెట్టడానికి ఆయన కూడా భయపడతాడట. నిన్నటి ఫైలిని తుఫాను చేసిన భీభత్సం గుర్తుకు వచ్చేంత నవ్యంగా ఉందీ భావన.

ఇన్ని పద్యాల మధ్యలో నాలుగైదు గేయాలు వాడాడు శేషేంద్ర కొన్ని చూద్దాం.

ముల్లోకములు ఏలు ముద్దు హరిణాంకుడు

విరజాజి తీవలకు విరహిణీ జీవులకు

తరిపి వెన్నెలపాలు తాగించుచున్నాడు

 

ఏగాలికెగసెనో యీ చికిలి తారకలు

అందాల తళుకుతో అప్సరసలకుమల్లె

ఆకాశ రంగానికవతరిస్తున్నాయి.

 

నిర్మాలాకాశంపు నీలాటి రేవులో

పండువెన్నెల నీట పిండి ఆరేసిన

తెలిమబ్బు వలువలు తేలిపోతున్నాయి.

పైభావాలు శేషేంద్ర సృజన శక్తికి మచ్చుతునకలు ముల్లోకములు ఏలే చంద్రుడు విరజాజితీవలకు విరహిణీ జీవులకు తరిపి వెన్నల పాలు తాగిస్తున్నాడంట. వెన్నలను తరిపి పాలు అనిచెప్పడం, నిర్మాలాకాశం అనే నీలాటి రేవులో పండువెన్నెలఅనే నీటిలో పండి ఆరేసిన బట్టలు తెలిమబ్బులు అట అవి తేలి పోతున్నాయట. ఏం చెప్పాలి ఈ భావాల్ని, వాహ్ వాహ్ అంతే. ఇలాంటి మధురమైన వర్ణనలు ప్రతి పాదంలో రంగరించిన అత్యధ్భుత కావ్యం ఋతుఘోష దీన్ని చదవడం అందునా భాషను బాగా అర్థంచేసుకొని చదవడం ఒక అపూర్వమైన, అనుపమానమైన అనుభూతి. ఈ అనుభూతిని ఈ తరం కవులు, పాఠకులు పొందాలి. ఈ నాటి యువతరం కవులు కూడా ఈ ఋతుఘోష కావ్యాన్ని చదివి ఎన్నో నేర్చుకోవచ్చు. అంతే కాదు కవులు అలసత్వాన్ని వదిలిపెట్టాలి. స్నేహించడం, అని ఇంకా రకరకాల కొత్త పదాల్ని కొత్త కవులు ప్రతిభా వంతులు చేస్తున్నారు. నిజమే చేసేటప్పుడు వ్యాకరణం పట్టదు. వ్యాకరణం గురించి మాట్లాడితే మాట్లాడిన వాడు ఛాదస్తుడు. అంతే కాదు శబ్ద స్వరూపం తెలుసుకునే ప్రయత్నం చేయరు. అంటే పుస్తకాలు చదివే బుద్ధి శ్రమపడే లక్షణం అలవరచుకునే వారు తగ్గారు. ఎంత ప్రాచీన భాషలోనైనా ఎంత ప్రాచీన ఛందస్సులోనైనా అత్యంత ఆధునికతని అత్యంత నవ్యమైన సృజన శక్తిని కవి చూపవచ్చు అని చెప్పడానికి ఋతుఘోష కావ్యం మంచి ఉదాహరణ. నేటికవులు దీన్ని చదవాలి శ్రద్ధగా చదవాలి. దీనికి స్వర్ణోత్సవం జరుపుకునే ఈ సంవత్సరంలో మరోసారిదీన్ని ముద్రించాలి. చాలా ఎక్కువ ప్రతులు ఎక్కుమందికి చేరాలి.

పులికొండ సుబ్బాచారి.

subbanna

‘ఖేల్’ … ఒక ‘యోగిని’ విషాదం ..

ఒక ఫాల్గుణ మాసపు మధ్యాన్నం ..  విశాఖపట్నం దగ్గర..  ఆకుపచ్చని కొండని మేలిముసుగులా ధరించినట్టున్న తలుపులమ్మ లోవ గుడిలో,  పూజారితో “ఈ దేవతకు పులిహోర, రవ్వ లడ్డూ మాత్రమె నైవేద్యం పెడుతున్నారా లేక మాంసం కూడానా?” అని అడిగాను. “తల్లికి మాంసం నైవేద్యవెడతానండి. అమ్మకేది కావాలో అదే పెట్టాలి కదా! బ్రాహ్మణ పూజారిని గవర్నమెంటు పెట్టింది కానండి, ఆయన పూజలు ఆయనవి” అన్నాడాయన.

తిరుపతి  పెద గంగమ్మ గుడిలో పూజారిణి, తరాలుగా దేవతను పూజిస్తున్న తనను ఆ పదవినుంచి తప్పించి, మగ పూజారిని పెట్టటానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరిస్తుంది.

ఆదిలాబాద్ దగ్గరలోని ఒక గోండు గ్రామం వెలుపల, చెట్ల మధ్య చిన్న చిన్న హిందూ దేవతల విగ్రహాలను పెట్టారు. “గోండు దేవతల రాజ్యంలో వీళ్ళు ఎక్కడినుంచి వచ్చారా?” అనుకున్నాను.

పాత దేవుళ్ళ ప్రభ తగ్గుతూ, కొత్త దేవుళ్ళు వెలుస్తూ, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకం పూజలూ, పద్ధతులది పైచేయి అవుతుండటం ముక్కోటి దేవుళ్ళూ, ఎంతో వైవిధ్యమూ ఉన్న హిందూ మతంలో సాధారణమే కానీ….

కొన్ని రకాల పూజా పద్ధతులూ, ఆచారాలూ … ముఖ్యంగా స్త్రీ దేవతల విషయంలో చాలా మార్పులు చెందిపోతూ వస్తున్నాయి.  ఏ సమాజంలో స్త్రీ ఎలా ఉండాలని అనుకుంటారో అదే పద్ధతిలో దేవతల మూసలూ తయారు చేసుకుంటుందా ఆ సమాజం?  ఎప్పుడైనా ఒక వింత ఆకర్షణతోనూ, భయంతోనూ,  అడ్డూ అదుపూ లేని స్త్రీ శక్తిని పూజించే రోజులు కొంతకాలంపాటు వచ్చినా, మళ్ళీ వెంటనే తేరుకుని దేవతను అదుపు చేస్తుందా పురుష స్వామ్యం?

*****

*

సబా దివాన్                                             రాహుల్ రాయ్

స్త్రీ శక్తి , పురుష దేవతల ఛాయగా ఎలా మారిపోయిందో, అదే ప్రక్రియ సమాజంలోనూ ఎలా కనిపిస్తోందో వివరించే ఒక డాక్యుమెంటరీ చిత్రం ‘ఖేల్’  ……

 సబా దివాన్, రాహుల్ రాయ్ అనే డాక్యుమెంటరీ చిత్ర దర్శకులు 1994 లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

బ్రాహ్మణ వాద మూసలోని స్త్రీత్వం కంటే భిన్నమైన స్త్రీ తత్వాన్ని వెదికే ఒక అన్వేషణగా ఈ చిత్రం మొదలవుతుంది. స్త్రీ శక్తి ఏ అడ్డంకులూ లేకుండా ప్రవహించే ఒక చోటు కోసం వెదుకులాట.  అచ్చంగా ఆడదానికి మాత్రమే పరిమితమైన ఆది భౌతికత కోసం చూడటం…

మహా యోగినిగా స్త్రీని చూడటం కోసం వారు బుందేల్ ఖండ్ తిరిగి, యోగిని గుడుల గురించి ఆరా తీసారు. బాందా జిల్లా లోని లోఖ్డీ గ్రామం దగ్గర ఒక కొండ మీద ఏ పూజలూ లేని గుడి వారికి కనిపించింది.  పెద్ద వృత్తాకారంలో కనిపించే స్థలంలో ఎటు చూసినా విరిగిపడిన స్త్రీ విగ్రహాలే. వృత్తం.. ఒక సామాన్యత లో ఒక పరిపూర్ణత.  ఆ పరిపూర్ణతను మేము  ఒప్పుకోమంటూ చేసిన విధ్వంసం భీభత్సంగా కనిపిస్తుంది. విరిగిన విగ్రహాల దగ్గర ఇప్పుడు భైరవుడు ఉన్నాడు. చాలా విగ్రహాలను దొంగలు పట్టుకు పోయారు.   అటువంటి వృత్తం మరోచోట కూడా వీరికి శిధిలావస్థలో కనిపించింది. ఆ స్థలంలో ఇంతకుముందు  ఏముండేదని వీరు అడిగితే,   స్థానికులు ఒక అఖాడా (వ్యాయామశాల) అని  చెప్తారు.

(తాంత్రిక విద్యల్లో ఆరితేరిన స్త్రీలు ఒకప్పుడు  ఉండేవారు. హఠయోగాన్ని నేర్చుకున్న వీరిని, యోగినులు అనేవారు. ఇవి రహస్య విద్యలవటం వల్ల, ఆ సమూహంలో ఉండేవారికి తప్ప, బయటి సమాజానికి వారిగురించి పెద్దగా తెలియదు. విచిత్రంగా, అన్నిటా మగవారి పెత్తనమే ఉండే కాలంలో… ఎనిమిది నుంఛీ  పదకొండో శతాబ్దం వరకూ ఉత్తర భారత దేశంలో యోగిని గుడుల నిర్మాణం జరిగింది. పురాణాలలో సప్త మాతృకలు అని చెప్పబడేవారు (బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి) (చండిక,మహాలక్ష్మి లతో కలిపి వీరిని నవ మాతృకలు అని కూడా అంటారు) దుర్గాదేవి శరీరం నుంచి పుట్టి, దుష్ట శక్తులతో ఆమె చేసిన యుద్ధంలో ఆమెకు సహాయం చేసిన సైన్యం.  ప్రతి మాతృకా ఒక యోగిని. వీరికి మళ్ళీ కొంతమంది యోగినులు అనుయాయులు.  మొత్తంగా వీరి సంఖ్య మాతృకలతో కలిసి, 64, లేదా 81 ఉంటుంది. ఇప్పటికీ ఈ యోగిని గుడులు ఒడిషాలో రెండు, మధ్య ప్రదేశ్ లో రెండు ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల వారికే సరిగ్గా తెలియదు.)

విరిగిన విగ్రహాల మధ్య ఒక యోగిని. (లోఖ్డీ వద్ద).

ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ లోకి వెళ్తే..  ఇంకా అక్కడి అడవి ప్రాంతాల అన్వేషణలో చిత్ర దర్శకులకు  అరుదైన ‘జోగినుల’ గురించి తెలిసింది.. ఇక ఎన్ని కథలో. ‘కోల్’ తెగవారు నివసించే బుందేల్ ఖండ్ అడవుల్లో ఈ ‘జోగిని’ ఒక గొప్ప కల్పన,. మాయ. అద్భుతం.. నిజం..

పుల్లలూ, ఆకులూ ఏరుకుంటూ ఈ అడవుల్లో ఎక్కువగా తిరిగే ‘కోల్’ స్త్రీలకు జోగినులు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారట. సంస్కత కావ్య వర్ణనలలో యోగినిగా మారిన మహారాణి,  ఒక రాజకుమారుడిని చిలుకగా మార్చి, తనకు కావలసినప్పుడు అతన్ని మనిషి రూపం లోకి తెచ్చి ప్రేమించే యోగిని… వంటివి ఉంటే, అడవుల్లో చిన్న అందమైన బాలునిగా కనిపించి, చేతుల్లోకి తీసుకోగానే మాయమయ్యే జోగిని, చిన్ని బాలుని రూపంలో కనిపించి, చూస్తుండగానే పెద్ద మగవానిలా మారే మాయా జోగిని… ‘కోల్’ స్త్రీల సామూహిక అంతచ్చేతనలో సజీవంగా ఉన్నారు. మండు వేసవి మధ్యాన్నాల్లో జోగినులు పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ తమకు కనిపిస్తారని, పక్కింటివాళ్ళ గురించి చెప్పినంత సులువుగా వీరు చెప్తారు ఈ చిత్రంలో.  ఒక మగవాడు నది ఒడ్డున జోగిని మాయలో పడి, తోటివారు పిలుస్తున్నా పట్టించుకోకుండా నిలబడిపోతే, తమ కులదేవత వచ్చి చెంపదెబ్బ కొట్టి, అతన్ని రక్షించిందట.  స్త్రీల మాయాశక్తి గురించిన ఇలాంటి కథలు మనమంతా ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం కదా!

సబా దివాన్ ఈ  ‘కోల్’ స్త్రీలను యోగినుల గురించి అడిగితే తమకు అదేమీ తెలియదని చెప్తారు. వారికి తెలిసిన జోగిని అడవినేలుతుంది.  క్రూర మృగాలను అదుపులో పెడుతుంది.   కలల్లో కనిపిస్తుంది. ఆవహిస్తుంది.

.

 

ఉత్తరప్రదేశ్ లో మాయమై, ఈ మధ్యనే ఫ్రాన్స్ నుంచి మన దేశానికి తిరిగి వచ్చిన పదవ శతాబ్దపు యోగిని విగ్రహం.

వృత్తాకారపు యోగిని గుడుల్లోని మాయ, అడవుల్లో తిరిగే ఈ జోగినీ మాయ ఒకటేనా? తాంత్రిక యోగిని, అడవి తెగల్లోని జోగిని ఒకటే ఎందుకు కాకూడదు? సప్త మాతృకల వలె జోగినులనూ ఏడుగురు అక్క చెల్లెళ్లుగా చెప్తున్నారు.

కాళిదాసు, భవభూతి వర్ణించిన  మహా యోగినుల జాడలు ఎక్కడ? ఈ అడవుల్లోనా? స్థల, కాల, సంస్కృతులనూ, కులాన్నీ, వర్గాన్నీ అధిగమించిన సామూహిక జ్ఞాపకాలు ఇవేనా? … ఇదీ సబా దివాన్ ఆలోచన.

‘ఖేల్’ లో ….

రామ్ కలీ, శివ కుమారి ..  అనే ఇద్దరు స్త్రీలు.

రామ్ కలీ .. దేవతకు అంకితమైన స్త్రీ.  పొయ్యి మంట వెలుగులో అలసిన మొహం, చెదిరిన జుట్టుతో నెమ్మదిగా ఎన్నో మాట్లాడుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు భూస్వామి తనను చెరచబోతే, అతన్ని చంపేసి పోలీస్ స్టేషన్ లో నింపాదిగా ఆ విషయం తెలియచేసిన చరిత్ర ఈమెకు ఉందట.  పుట్టిన మూడు రోజులకే ఈమెను దేవత ఎత్తుకుపోయిందని చెపుతుంది. ఎంత వెదికినా పిల్ల దొరకక, ఆమె తండ్రి అమ్మవారి గుడికి వెళ్లి అడిగితే, దేవత కనిపించి, తాను కాళి నని, ఏడుగురు అక్కచెల్లెళ్ళలో మొదటిదానిననీ చెప్పి, తనకు గుడి కట్టిస్తే ఈ పిల్లను తిరిగి ఇస్తానని చెప్పిందట.  పన్నెండేళ్ళ పాటు ఈ పిల్ల పెళ్ళీ, సంసారం లేకుండా తనకు సేవ చెయ్యాలని చెప్పిందట. ఆ మాట పట్టించుకోకుండా తండ్రి తనకు పెళ్లి చేస్తే,  దేవత అక్కడికి వచ్చి తన అత్తవారింట్లో అందరినీ నాశనం చేసిందని చెప్తుంది. ఊరంతా భయపడే ఒక పురుష శక్తి అడవిలో ఆకులు ఏరుకునేటప్పుడు తనను భయపెట్టాలని చూస్తే, తను ఏ మాత్రం భయపడక అతడిని తన మంత్రాలతో కట్టేసి ఊరికి తెచ్చానని చెప్తుంది.  కష్టపడి వంటలు చేసి, ఇదంతా దేవతకు పెట్టాలనీ, ఆమె సేవ చెయ్యకపోతే తను జబ్బు పడిపోతాననీ అంటుంది.

శివకుమారి .. అడవిలో కట్టెలు కొడుతూ, బక్క పల్చని శరీరంతో, విచారమూ, బతుకు భారమూ కలగలిసి ముఖాన్ని అద్దుకున్నట్టు కనిపిస్తుంది. దేవత ఆవహించి మూడు నెలల పాటు అడవిలోనే ఉండిపోయాననీ, పిల్లలని కూడా తన తోనే ఉంచుకుంటే, దేవత వారికి పళ్ళు సమకూర్చి వారి ఆకలి తీర్చిందనీ చెప్తుంది. దేవత ఆవహించినప్పుడు నెలల తరబడి తిండీ, నీరూ లేకుండా, ముళ్ళూ, రాళ్ళలో తిరిగానని చెప్తుంది. అదంతా ఒక నరకం లాగా ఉండేదని చెప్తుంది. సిగ్గూ, లజ్జా పోయాయంటుంది. ఇప్పుడు దేవత తనను వదలకుండా, తన సేవ కోసమే నువ్వు పుట్టావని అంటుందని చెప్తుంది.

వీళ్ళిద్దరూ దేవి ఆవహించినప్పుడు  జబ్బులు బాగుచేస్తామని చెప్తారు.

రామ్ కలీ, శివకుమారి .. వీరిద్దరూ కలుసుకునే సందర్భం కూడా ఈ చిత్రంలో ఒక చోట వస్తుంది. ఇద్దరు శక్తిమంతులైన స్త్రీలు.. ఇద్దరు న్యురోటిక్ స్త్రీలు.. సమాజపు అడుగుపొర లో బ్రతికే వీళ్ళు .. దేవత సాయంతో మగవారిని ధిక్కరించి, ఆజ్ఞాపించే వీళ్ళు.. కలిసిన సందర్భం అపురూపం. శివకుమారి వణికే చేతిని తన చేతిలోకి తీసుకుని, ఆమె బేలతనాన్నీ, న్యురోసిస్ నంతా పోగొట్టేలా మెత్తగా మాట్లాడుతూ, ఒక తల్లి తన బిడ్డను లాలించినట్టు దగ్గరికి తీసుకుంటుంది రామ్ కలీ.

శివకుమారి                        శివకుమారి, రామ్ కలీ

శాంతి

ఈ చిత్ర దర్శకులతో మాట్లాడటానికే ఇష్టపడని స్త్రీ .. శాంతి. ఒకసారి మాట్లాడటం మొదలు పెట్టాక, ప్రవాహంలా చెప్పుకు పోతుంది.  కొండమీద ఉన్న గుడిలో పూజలూ, గుడి గంటల ధ్వనుల మధ్య ఆమె బాల్యం. ఎప్పుడూ దైవ సన్నిధానమే. పెరిగి పెద్దదౌతున్న కొద్దీ ఆంక్షలు. గుడికి వెళ్ళకుండా ఉండలేని ఆమె యాతన. తనకు బలవంతాన పెళ్లి చేసినా, తను మాత్రం   ఎనిమిదేళ్ళ పాటు  భర్త  నీడ కూడా తనమీద పడనివ్వలేదంటుంది.

 ఇక్కడ కథ మనల్ని బేడా ఘాట్ (మధ్యప్రదేశ్, జబల్పూరు దగ్గర) యోగిని గుడికి తీసుకుపోతుంది.  పూర్ణ వృత్తాన్ని  ఎనభై ఒక్క భాగాలుగా చేసి, విగ్రహాలను ప్రతిష్టించిన యోగిని గుడి.. కొన్ని విగ్రహాలకు మృగాల తలలూ, స్త్రీ శరీరాలూ ఉంటాయి. ఆది శక్తి వివిధ రూపాల్లో యధేచ్చగా ప్రవహించిన చోటు.. నేలంతా చదునుగా పరచిన నాప రాళ్ళు. చుట్టూ వేప చెట్లు.  గాలీ, వెలుతురూ నిండి ప్రకాశించే చోటు. యోగిని గుడులను అప్పటి మిగతా గుడుల వాస్తు సంప్రదాయానికి విరుద్ధంగా నిర్మించారు. చుట్టూ వలయంగా విగ్రహాలు. మధ్యలో ఖాళీ స్థలం. ఇదీ యోగిని ఆలయ నిర్మాణ శైలి. తాంత్రిక ఆరాధనా వ్యవస్థకు గొప్ప చిహ్నం.

బేడా ఘాట్

మహా భాగవత పురాణంలోని అంతగా ప్రాచుర్యం లేని ఒక శాక్తేయ వర్ణన ప్రకారం సతి, కాళి నీడగా మారి మంటలు రేపి, తన యోగిని అనుయాయులతో కలిసి, దక్ష యజ్ఞాన్ని భగ్నం చేస్తుందట.  తనను దక్ష యజ్ఞానికి వెళ్ళవద్దని చెప్పిన శంకరునిపై అలిగిన సతి, జుట్టు విరబోసుకుని, దిగంబరురాలై, నాలుక వేలాడేసుకుని, చెమటలతో తడిసి, ప్రచండంగా తన తల్లిని చేరుకుంటుంది. తల్లి ప్రసూతి ఈ దాక్షాయణిని దగ్గరకు తీసుకుని, చెంగుతో ముఖాన్ని తుదిచి, గుండెలకు హత్తుకుంటుంది.  దక్షుడు సతిని నిందిస్తాడు. అప్పుడామె భీభత్సంగా మారి, యోగినులతో కలిసి మదిరా పాన మత్తురాలై నాట్యంచేసి, యజ్ఞాన్ని భంగం చేస్తుంది. శంకరుడు వచ్చాక, ఆ చితి మంటలు మళ్ళీ రగిలి అతడు తన వంతు పూర్తి చేస్తాడట.  బేడా ఘాట్ యోగిని విగ్రహాలను చిత్రిస్తూ, స్తోత్రం వినిపిస్తూ, మధ్యలో ఈ కథను చెప్తుంది సబా దివాన్.

బేడా ఘాట్ గుడిలో చాలా విగ్రహాలు అంగాలు విరిగి కనిపిస్తాయి.  ఈ ఫిల్మ్ లో, ఆ విగ్రహాలతో అత్తవారింటిలో శాంతి పడిన అవస్తనూ, హింసనూ పోల్చి చూపిస్తుంటే, ఆ అణచివేత మనల్ని ఒక తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తుంది. తన వంటిలో ఏ భాగాన్నీ వదలకుండా ఎలా కొట్టి హింసించారో ఆమె చెప్తుంటే, చేతులూ, కాళ్ళూ, స్తనాలూ విరిగిన విగ్రహాలు కనిపిస్తూ ఎంతో బాధిస్తాయి.  యుగాలుగా స్త్రీ శక్తిని, మార్మికతనూ చూసి ఆకర్షితులౌతూనే, భయంతో మళ్ళీ దాన్ని అదుపులో పెట్టాలని ప్రయత్నించే పురుషస్వామ్యపు  విశ్వరూపం కళ్ళకు కడుతుంది.

చాలా సేపు బేడా ఘాట్ విగ్రహాలను అర్ధ వృత్తంగానే చిత్రీకరించి, మనల్ని మరో లోకం లోకి తీసుకెళ్తూ, ఒక్క సారిగా ఆ వృత్తపు మధ్య భాగాన్ని చూపిస్తారు.  ఒక షాక్.  ఆ మధ్యలో ఒక శివాలయం. దీన్ని తరువాతి కాలంలో ఎప్పుడు కట్టేసారో !  నిరాఘాటంగా స్త్రీ శక్తి ప్రవహించే చోటుని, ఆ మండలాన్ని ఛేదిస్తూ, సాంప్రదాయక శివాలయం…  ఇక్కడ పార్వతి శివుడి పక్కన అనుయాయి.  ఈ శివాలయ నిర్మాణంతో శక్తి మండలాన్ని విచ్చిన్నం చేసారంటుంది సబా దివాన్.  అలాగే మధ్య ప్రదేశ్ లోని మతౌళి దగ్గర ఇంకో వృత్తాకారపు గుడినీ చిత్రీకరించారు. అక్కడ స్త్రీ విగ్రహాలని తొలగించి, శివ లింగాలను ప్రతిష్టించారు. తాంత్రిక యోగినీ వ్యవస్థ గురించి మనకు తెలియకుండా చేసే ఈ ప్రయత్నాలూ, శాంతి వంటి స్త్రీల స్వేచ్చకు వేసే సంకెళ్ళూ ఒకలాంటివే

.

బేడా ఘాట్ యోగిని విగ్రహం       యోగిని స్థానం లో శివలింగం (మతౌళి)     వృత్తం మధ్య శివుని మంటపం (మతౌళి)

‘కోల్’ తెగ వారు జరుపుకునే నవరాత్రి పండుగలో ఒక రోజు దాక్షాయణి (సతి) తన తల్లిని కలుసుకొనే పండుగ జరుగుతుంది. కానీ ఈ ఉత్సవాల్లో స్త్రీలంతా ముసుగులు వేసుకుని కూర్చుంటే, మగవాళ్ళదే ‘ఖేల్’ అంతా! దేవత  భక్తురాలు శివకుమారి కూడా నిర్వికారంగా చూస్తూ కూర్చుంటుంది.

 

చివరిగా, శాంతి ఇంట్లో ఆమె కూతురు కేశ్ కలీ కనిపిస్తుంది.  అత్తవారింటి నుంచి వచ్చేసింది ఈమె.  వాళ్ళింట్లో అత్త తనను సరిగా పని చేయటం లేదని తిడుతూ, కొడుతూ ఉంటుందట. ఇక తను తల్లి దగ్గరే ఉంటానంటుంది.  ‘ఈ పిల్లను అత్త ఇంటికి పంపవా?’ అని శాంతిని అడిగితే, ‘తనకు ఇష్టమైతే వెళుతుంది. లేదా ఇక్కడే ఉంటుంది’ అని చెప్తుంది. తాను అనుభవించిన బాధ తన బిడ్డకు వద్దనుకొనే తల్లి మనసు శాంతిది. ఈ ‘సతి’ తన తల్లి దగ్గర ఊరట పొందుతోంది.

సతీ దేవి తన తల్లి దగ్గర చేరటం, శివకుమారి రామ్ కలీ దగ్గర ఊరట పొందటం, కేశ్ కలీ  తన తల్లి శాంతి దగ్గర ఉండిపోవటం… ఆడదాన్ని ఆడదే అర్ధం చేసుకోగలదనే భావాన్నీ, బిడ్డలను లాలించే దేవత కారుణ్యాన్నీ  సూచిస్తుంది. కథా చిత్రం కాకుండా ఒక డాక్యుమెంటరీ చిత్రంలో ఇంత హృద్యంగా ఇది చెప్పటానికి కుదరటం అనేది ఈ చిత్ర దర్శకులకు దొరికిన అరుదైన అవకాశం.

శుభా ముద్గల్ సంగీతం, గానం..  ముఖ్యంగా అడవుల్లో జోగినుల మార్మికతను మనమూ అనుభూతి చెందేలా తీసిన కొన్ని షాట్లు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. యోగిని గుడుల చిత్రీకరణ సరేసరి.

మనకు కలిగే  బాధ,  యుగాలుగా   స్త్రీలందరికీ

కేవలం యోగిని ఆరాధనా వ్యవస్థ గురించే అయివుంటే ఈ ఫిల్మ్ ఒక సంస్కృతిని మాత్రమె వివరించే డాక్యుమెంటరీ అయివుండేది. ఇది కల్పిత సినిమా కథా కాదు. ఇందులోని స్త్రీలు పాత్రలూ కావు.  ఒక anthropological/ ethnographic  డాక్యుమెంటరీలో రక్త మాంసాలతో అదే ప్రదేశంలో తిరుగాడే ఒక తెగ స్త్రీలూ, వారి భిన్నత్వం, తెగువ, మార్మికత, పేదరికం, బాధలు.. అన్నీ కలిపి చూస్తున్నప్పుడు

చెందిన సామూహిక అస్తిత్వ వేదన.

 

****

హిందూ సమాజంలో, పంటలనూ, బిడ్డలనూ కాపాడుతూ వుండే గ్రామదేవతలకున్న ఒక ప్రత్యేక స్థానం కొన్నాళ్ళకు అంతరించిపోతుందేమో అని అనుమానం వచ్చేంతగా బ్రాహ్మణీకరణ జరుగుతోంది. జాతరలు చేసి, బలులు ఇచ్చి, ఊరంతా సంబరాలు జరుపుకోవటం అనేది, సామూహికంగా స్త్రీ శక్తిని ఆరాధించే ఒక తంతు.  ఆదిమ పురుషుడికి స్త్రీత్వం, మాతృత్వం,  అద్భుతాల్లా కనిపించేయి. వ్యావసాయిక సమాజాల్లో పంటలనిచ్చే భూములనూ, పిల్లలనిచ్చే తల్లులనూ పోల్చి చూసుకుని, స్త్రీని దేవత రూపంలో కొలిచారు. పంటలూ, పిల్లలూ పదిలంగా ఉండాలంటే అమ్మ శక్తిని సంతృప్తి పరచాలని భావించారు. వీరిని పూజించటం లో భయం, భక్తీ .. రెండిటినీ ప్రదర్శించారు.  సాలగ్రామ పూజలు చేసే బ్రాహ్మణులూ కూడా గ్రామ దేవత పూజల్లో పాల్గొనటానికి మినహాయింపు కాదు.  బ్రాహ్మణ స్త్రీలు గ్రామ దేవతకు పెరుగన్నంతో చల్లని నైవేద్యం పెడతారు.  పసుపూ, కుంకం, చీరలూ సమర్పించుకుంటారు. మరి ఇప్పుడు గ్రామాలను మొత్తంగా పట్టణాలకు తరలించే పని పెట్టుకున్న ప్రభుత్వాలు మనవి. అదే అభివృద్ధి అంటున్నారు. ఈ వెల్లువలో కొట్టుకుపోతున్నవి ఊళ్ళలోని వృత్తులూ, వ్యవసాయమే కాదు. ఒక సంస్కృతి కూడా.

స్త్రీల శరీరాలే కాదు వారి గర్భాశయాలు కూడా అంగట్లో అద్దెకు దొరుకుతున్న ఈ రోజుల్లో స్త్రీ శక్తికి విలువేముంది? ఉగ్ర రూప గ్రామ దేవతలు కూడా సాత్విక వైష్ణవ అమ్మవార్లయిపోతున్నారు.  అన్ని రకాల దేవతల వైవిధ్యం నశించి, వారంతా సంస్కృత మంత్రాలూ, రాముడూ, సీతా, ఆంజనేయుడూ… వీటిలో హింద్వైక్యం చెందుతున్నారు. ఉగ్ర, ధైర్య, స్థైర్య, కారుణ్య రూపాలలో ఊరినీ, బిడ్డలనూ, పంటలనూ కాపాడే అమ్మ శక్తిని రాను రానూ సాత్వికతకు మాత్రమే ప్రతీకగా ఉండే ఒక నమూనాగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  కొన్నాళ్ళకు కలకత్తా కాళి కూడా రూపం మారి, సీత లాగా ముసుగు వేసుకుంటుందేమో!

ఒకపక్క స్త్రీలను పూజిస్తామంటూనే మరో పక్క మానభంగాలూ, ఆడ పిండాల హత్యలూ జరిగి పోతున్న సమాజాల్లో స్త్రీ దేవతల సాత్విక పరిణామం కూడా ఒక ‘ఖేల్’.

lalitha parnandi—  ల.లి.త.

ఒక్కసారిగా ఎంత వెన్నెల!

 

    PrasunaRavindran

చీకటి…చీకటి…

మండుటెండలో సైతం

మనసు ఖాళీల్లో నిండిపోయిన చీకటి.

పొద్దు వాలినా

ఒక తేడా తెలీని తనంలోంచి

నిర్నిద్రతో

క్షణాలన్నీ నిస్సహాయంగా మండిపోయాక

నిరాశగా పడున్న

చందమామ పుస్తకంలోంచి

ఏ వన దేవతో దయ తలచి వస్తుంది.

నొప్పి కళ్ళలో

ఓ కలను పిండి

తన చేత్తో కళ్ళు మూస్తుంది.

 poem1

చీకట్లను చేదుకుంటూ

పొగ బండి దూసుకుంటూ పోతుంది.

ఎదురుగా …

ఆకాశమంతా పరుచుకున్న చంద్ర బింబం

ప్రతి దిక్కులోనూ ప్రతిఫలిస్తూ

దోచుకోలేనంత వెన్నెల …

సుడిగుండంలా ఉక్కిరి బిక్కిరి చేసాక

సాయం చెయ్యలేనని

భాష చేతులెత్తేసాక

చేసేందుకేముంటుంది !

కవిత్వీకరించాలనే అలోచనలన్నీ

ఒలిచిపారేసి

ఒక్కసారి

ఆ వెన్నెల సముద్రంలో

నాలోని నన్ను

కడిగేసుకోవడం తప్ప!

      ప్రసూన రవీంద్రన్

పుట్టగొడుగు మడి

కె. గీత

కె. గీత

నుదుటి మీదకొక తెల్ల వెంట్రుక

చికాగ్గా-

పండుటాకు కొమ్మను

ఒరుసుకుంటున్నట్లు-

శిశిరం మొదటిసారి

నిర్దయగా తలుపు విరుచుకు పడుతున్నట్లు

నాలో ఎక్కడో పెళపెళా

కొమ్మలు విరిగిపోతున్న చప్పుడు

కొత్త సంవత్సరం వస్తుందంటే

కొత్త బాధేదో నెత్తిన తడుతూన్నట్లుంది

ఎప్పుడు పెద్దవుతామా

అన్న చిన్నప్పటి

ఎదురుచూపు కళ్ల కాయలు

కళ్ల దిగువన వద్దన్నా మొలుస్తున్నాయిపుడు

అదేం విచిత్రమో!

ఎప్పుడూ చెంపలపై వయసు విత్తనాలు

జల్లినట్లు జ్ఞాపకం లేదు

కరిగి కన్నీరయ్యే

కాలాన్ని నిబ్బరంగా మోసిన

మేరు గంభీర భుజాలేనా ఇవి?

ఇప్పుడు నేలవైపు చూస్తున్నాయి?!

girl-before-a-mirror

చిన్నప్పుడే నయం

ముసుగులుండేవి కావు

భయాలుండేవి కావు

కొత్త సంవత్సరపు బాధలుండేవి కావు

అద్దం ముందు నిల్చుంటే

ఇప్పటిలా

మరెవరో కనిపించేవారు కారు

తలమీద ఏముందో తడుముకోవలసిన అవసరం ఉండేది కాదు

జీవితపు రెండో భాగం

నెత్తిన తెల్లగా గుచ్చుకునే ముల్లయ్యి మొదలయ్యింది

ఏం ఎరువు పడుతూందో గానీ

నిద్రపోయి లేచేసరికి కవలలు పుట్టుకొస్తున్నట్లు-

రోజూ పనిగట్టుకుని

కలుపునేరి పారేస్తున్నా

సంవత్సరం గడిచే సరికి తలంతా

పుట్టగొడుగు మడయ్యింది

నుదురు ఎగుడు దిగుడు తిన్నెల ఇసుక ఎడారి అయ్యింది

అయినా నా పిచ్చి గానీ

ప్రవాహం లో నావ వెనక్కి ప్రయాణిస్తుందా!

తలపు పండకున్నా తల పండక మానుతుందా!

తలకు రంగున్నట్లు

మనసుకీ రంగుంటే ఎంత బావుణ్ణు

కాలం గబ గబా

మింగడానికి వస్తున్నా

తెల్లదనాన్ని మళ్లా రంగుల్లో విక్షేపించడానికి

కొన్ని కొత్త జీవిత పట్టకాలు కావాలిప్పుడు

నాణానికి రెండు వైపులూ చూపించే

సరికొత్త కళ్లజోడు కావాలిప్పుడు.

-కె.గీత

“బాగున్నవా తమ్మి?” ఇక వినిపించదు ఆ పలకరింపు!

Sri hari - EPS

రియల్ స్టార్ శ్రీహరి నిజంగానే రియల్ స్టార్ .  అయన లేకపోయారు అంటే నమ్మలేక పోతున్నా ఇంకా ..   ఎప్పుడు ఫోన్ చేసినా అరె తమ్ముడు ఎట్లున్నావు అని ఆప్యాయంగా పిలిచే శ్రీహరి ఇంకా లేరు అంటే ఎలా నమ్మేది ?
శ్రీహరి గారిని మొదట చూసింది పరశురాం షూటింగ్ లో .

అప్పట్లో చిరంజీవి అంజి సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో ఒక ఫ్లోర్ లో రెగ్యులర్ గా జరుగుతూ ఉండేది .  (అది దాదాపు గా ఆరేళ్ళు తీసారు ) నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ శ్యాం గారి ని కలవడానికి అన్నపూర్ణ కి వెళ్తూ ఉండేవాడిని .

అలా ఒక రోజు వెళుతూ ఉంటె , అన్నపూర్ణ స్టూడియో పక్కన ఉన్న భవంతి దగ్గర గోల గోల గా ఉండి చాల మంది గుమిగూడి ఉండటం చూసి బండి పక్కన పెట్టి చూడటానికి వెళ్తే , అక్కడ కనిపించారు శ్రీహరి .

అలా  చూస్తూ ఉండగానే చక చక ఆ భవంతి పైకి ఎక్కి రెండు గొడుగులు పట్టుకుని అకస్మాత్తుగా కిందకి దూకారు, ఒక్క క్షణం అంతటా నిశ్శబ్దం , ఆ తరవాత చప్పట్లతో మారు మోగిపోయింది ఆ ప్రదేశం .

నాకు ఆయనతో పరిచయం లేకపోవడం వల్ల నేను కూడా అందరితో పాటు చప్పట్లు కొట్టి అక్కడ నుంచి వచ్చేసాను .
తరవాత కొన్ని రోజులకి రచయితా / దర్శకుడు / నిర్మాత / నటుడు   పోసాని కృష్ణ మురళి గారిని ఒక స్నేహితుడి ఇంట్లో కలిసినప్పుడు ఆయన చెప్పారు శ్రీహరి గారు ఆయనా ఒకే అపార్ట్ మెంట్ బిల్డింగ్ లో ఉంటున్నారు అని.  నేను కృష్ణమురళి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అయన నన్ను శ్రీహరి గారి ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేసారు . అలా శ్రీహరి గారిని మొదటి సరి కలవడం జరిగింది .  కాని అప్పుడు ఇంటర్వ్యూ లాంటిది ఏమి చెయ్యలేదు ఇద్దరికీ సమయం సరిగ్గా కుదరక .
ఆ తరవాత నేను అమెరికా వచ్చాక అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవాళ్ళం . మహానంది సినిమా విడుదల కి ముందు ఆయన్ని ఇంటర్వ్యూ చేసాను .  తరవాత అక్షర (శ్రీహరి గారి అమ్మాయి బాగా చిన్న వయసు లో పోయింది ) పేరు మీద తను గ్రామాన్ని దత్తత చేసుకున్నపుడు అభినందించడానికి ఫోన్ చేశాను .  ఆ తరవాత అంతగా ఫోన్ చెయ్యలెదు. ఈరోజు పొద్దున్నే ఫోన్ తో మెలకువ వచ్చి మెసేజ్ చూస్తె శ్రీహరి గారు లేరు అని వార్త .  కొంచం సేపు ఇది నిజం కాకపోతే ఎంత బాగుండును అన్న భావన .. అసలు నిజమే కాదేమో అన్న ఫీలింగ్ … ఈ లోపల ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ న్యూస్.
ఎప్పుడు ఫోన్ చేసినా బాగున్నావా తమ్మి అని పిలిచే ఆ గొంతు మూగ పోయింది అంటే ఎలా నమ్మేది . ఒక భద్రాచలం, ఒక షేర్ ఖాన్ (మగధీర) , ఒక ప్రతినాయకుడు, ఒక రియల్ ఫైటర్ , ఒక మంచి మనిషి , ఒక మంచి స్నేహితుడు , వివాదాలు లేని వ్యక్తీ ,  అన్నిటికి మంచి ఒక మంచి మానవతావాది శ్రీహరి గారు . వారి ఆత్మకు శాంతి కలగాలని , వారి కుటుంబానికి ఈ తీర్చలేని లోటు నుండి తట్టుకునే ఆత్మ స్తైర్న్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్దిస్తూ .

– శ్రీ అట్లూరి

పదనిసల ఈ పిల్ల!

పదనిసలు
ఈ బొమ్మలో కాదుగానీ దీనికి ముందూ తర్వాతా ఈ చిన్నారిని చూస్తే మీ హృదయం ద్రవించిపోతుంది. చేతులు చాపే అభాగ్యులు, నిస్సహాయులు, అధోజగత్ సహోదరులెవరిని చూసినా మనసు కలుక్కుమంటుంది. చిత్రమేమిటంటే మన కళ్లలో ప్రతిఫలించే భావాలను వాళ్లూ గ్రహించగలుగుతారు. కానీ బయటపడరు.

మనకిష్టం లేదని వాళ్లకు తెలుసు. కానీ కిమ్మనరు. మనవి జాలిచూపులని తెలుసు. కానీ క్షమిస్తారు. మనం విదిల్చే కాసులకు మనలోనే తృప్తిల్లే ఏవో అజ్ఞాత ఆదర్శాలకూ వాళ్లు  నిందించరు. కానీ సతాయిస్తారు.

రూపాయో రెండ్రూపాయలో ఇచ్చేదాకా విసిగిస్తారు. అయితే, కొన్నిమార్లు తమనూ మననీ మరచిపోయి వాళ్లూ గెంతులేస్తారు. ఈ పిల్ల అలాంటిదే.

రింగ్ ఆఫ్ ట్రూత్ అంటాడు సత్యజిత్ రే – సాంగ్ ఆఫ్ ది రోడ్-పథేర్ పాంచాలి గురించి. సత్యం కాదు, ధర్మం నాలుగు పాదాల చెంత నిమ్మళంగా ఒకేచోట కేంద్రీకృతమైనప్పుడు ఇలాంటి చిత్రాలే అధికంగా కానవస్తాయి. అలా అని నిత్యనృత్యం  ఆగిపోతుందా? లేదు. అదే ఇక్కడి విశేషం.

భారతదేశపు రాజధాని ఢిల్లీలో ఒకానొక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద – వాహనాలు, అందులోని బడాబాబులతో నిమిత్తం లేకుండా చిన్నగా నృత్యం చేస్తున్న ఈ దృశ్యం అప్రమేయంగా, అనాలోచితంగా చిందులేసే వ్యధార్థ మానవుడి హృదయ సంగీతానికి  తొలి అడుగు అనే అనిపిస్తుంది. ‘తొలి అడుగు’ అనడం ఎందుకూ అంటే, ఏమో! ఆ పాప పెద్దయినాక ఏమవుతుందో! మానవేతిహాసంలో ఆ ఎద ఎలాంటి స్వరాలు సంకలనపరుస్తుందో! అందుకు మనని సంసిద్ధం చేయడంలో భాగమో ఏమో, ఈ పిల్ల పదనిసలు.

– కందుకూరి రమేష్ బాబు

ramesh

ఉర్దూ మన భాష, ఉర్దూ సాహిత్యం మన సాహిత్యం!

sky1

ముస్లిం కవులు ఎంత ప్రజాస్వామికంగా, ఎంత లౌకికత్వంతో ఉన్నారో తెలుగు ముస్లింవాద సాహిత్యం ఋజువు చేస్తూ వచ్చింది. అలాగే ఎప్పటికప్పుడు తెలంగాణ సాహిత్య- ఉద్యమకారులు లౌకికత్వ భావనలు విస్మరించకుండా స్పృహలో ఉండేలా  కూడా ముస్లింవాదులు తమ వంతు కృషి చేస్తూ వస్తున్నారు. తెలంగాణ సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేస్తూ వచ్చిన ముస్లింవాదుల నుంచి వస్తున్న ప్రత్యేక సంకలనం ఇది. కొన్ని విలువైన ప్రశ్నలూ, అరుదైన కోణాలూ ఇందులో చూడొచ్చు..

తెలంగాణ సాహిత్యం అంటే కేవలం తెలుగు సాహిత్యమే అనుకునే సంకుచిత జ్ఞానంలో మనం ఉన్నాం. కానీ దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి పొందిన ఉర్దూ కవులు, రచయితలు, విమర్శకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమకారులు, సాహిత్యకారులు సైతం ఈ విషయాన్ని, ఉర్దూ ప్రజల ఒక అతిపెద్ద సమూహం తెలంగాణలో భాగమనే స్పృహను విస్మరించడం విచారకరం (ఒకరిద్దరు తప్ప). ఏ ఒక్క తెలంగాణ సాహిత్య సభలోనూ ఉర్దూ సాహిత్యకారులను భాగం చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ కారణం చేతనూ, ఆంధ్రావారి ఆధిపత్యం వల్లనూ ఉర్దూ రచయితలు వేరొక లోకంగా బతుకుతున్నారు. దేశంలోనే ప్రసిద్ధి పొందిన తెలంగాణ ఉర్దూ రచయితలకు ఆంధ్రా వలస పాలకులు ఏ మాత్రం గౌరవమిచ్చింది లేదు. నిజాంల కాలంలో భారత ఉపఖండంలోనే ఉర్దూ కవులు, రచయితలకు హైదరాబాద్‌ రాజ్యం ప్రసిద్ధి పొందింది. వారిని ఎంతో ఆదరించింది.

తెలంగాణలో దాదాపు 20 శాతం మంది ముస్లింలు ఉంటారు. అందులో తెలుగు చదువుకున్న ముస్లింలతో పాటు, ఉర్దూ చదువుకున్న ముస్లింలు సగానికి సగం ఉండొచ్చు. ఇప్పటి తెలంగాణ ఉద్యమంలో తెలుగు ముస్లిం కవుల గొంతుక బలంగా వినిపిస్తున్నది. కానీ ఉర్దూ ముస్లిం కవులు ఏమంటున్నారో తెలియదు. వాళ్ల గొంతుకు నిదర్శనమే ఈ సంకలనం. తెలుగులో కవిత్వం రాస్తున్న తెలుగు ముస్లిం కవులు, ఉర్దూలో కవిత్వం రాస్తున్న ఉర్దూ ముస్లిం కవులు కలిసిన తెలంగాణ నినాదం ఈ సంకలనం. తెలంగాణ అంటే తెలుగుతో పాటు ఉర్దూ కూడా అని జ్ఞానపరిచే ఒక నిదర్శనమిది. తెలుగువారి, ఉర్దూవారి కలగలుపు తనానికి ప్రతీక – ఇదే గంగా జమున తెహజీబ్‌!

ఎమ్‌ఐఎమ్‌ లాంటి పార్టీని చూపి ముస్లింలు తెలంగాణకు మద్దతివ్వడం లేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్న వారికి చెంప పెట్టు ఈ సంకలనం. తెలుగు ముస్లింలతో పాటు ఉర్దూ ముస్లింలు కూడా బలంగా తెలంగాణను కోరుకుంటున్నారనడానికి నిదర్శనం ఈ పుస్తకం.

తెలంగాణ తనానికి ఒక బండ గుర్తు అయిన ఉర్దూ ప్రజల్ని విస్మరించడం తెలంగాణ  ఆత్మను నిర్లక్ష్యం చేయడం లాంటిదే. బిజెపి లాంటి పార్టీల సాంగత్యం వల్ల ముస్లింలతో పాటు ఉర్దూను, ఉర్దూ ప్రజలను, ముస్లిమీయత వల్ల ప్రభావితమైన  తెలంగాణ తనాన్ని తెలంగాణ ఉద్యమకారులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఇది ఎంత మాత్రమూ క్షమించరాని విషయం.

* * *

కిసీ ఖౌమ్‌కో బర్బాద్‌ కర్నా హైతో

పహ్‌లే ఉస్‌ కీ జబాన్‌ ఖీంచ్‌లో… -అన్నట్లుగా తెలంగాణ తెలుగు వారితో పాటు ఇక్కడి ముస్లింల భాషను గుంజుకోవడం, ధ్వంసం చేయడం జరిగింది. ఇంకా ఇంకా జరుగుతున్నది.

ఇవాళ నాలాంటి వారు ఇంట్లో మాట్లాడేది ఉర్దూ. చుట్టూ తెలంగాణ తెలుగు. బడిలో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, మీడియాలో కోస్తాంధ్రా తెలుగు. అలాంటప్పుడు నేను ఏ భాషలో రాయాలి?

అరవై ఏళ్ళ తరువాత చూస్తే మొత్తంగా ఆంధ్రా ప్రాంతపు తెలుగే మనల్ని ఆక్రమించుకున్నది. ఈ క్రమంలో తెలుగు సాహిత్యానికి సమాంతరంగా తెలంగాణలో ఉర్దూ సాహిత్యమూ కొనసాగుతున్నదనే స్పృహలోనే ఎవరూ లేరు. అతి కొద్దిమంది తెలంగాణ తెలుగువారికి మాత్రమే ఆ విషయం తెలుసు. తెలంగాణలోని ఉర్దూ తనం   గురించి ఎస్‌.సదాశివ, తెలంగాణ జాతిపిత జయశంకర్‌ ఎంతో చెప్పారు. వారితోపాటు బూర్గుల నరసింగరావు, ఎమ్‌.టి.ఖాన్‌, కేశవరావు జాదవ్‌ లాంటి ఎందరో చెప్పే వాస్తవాలు పట్టించుకుంటే ఈ విషయాలు మనకు మరింత బాగా అర్థమవుతాయి.

golconda

ఉర్దూ మీడియం పాఠశాలలన్నీ తెలుగు మీడియం పాఠశాలలుగా మార్చబడినప్పుడు, తెలంగాణ తెలుగువారినే ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా నియమించి ఉంటే, వారికి ఇక్కడి పరిస్థితుల మీదా మనుషుల మీదా ప్రేమ ఉండి అర్థం చేసుకుని మసిలేవారు. అలా కాకుండా ఆంధ్ర నుంచి వలస తీసుకురాబడిన తెలుగువారిని నియమించారు. వారి వల్ల ఇక్కడి వారు, ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా అవహేళనకు గురయ్యారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్రావారు ఉర్దూ పట్ల, ఉర్దూ కలగలిసిన తెలుగు పట్ల ఏమాత్రం మమకారం లేకుండా ప్రతి మాటలోనూ తెలంగాణవారిని, ముస్లింలను తక్కువచేసి మాట్లాడుతూ అవమానించారు. ఆత్మన్యూనతలో పడవేశారు. ఈ కారణాన తెలంగాణ తెలుగు భాషకు, ఉర్దూకు ఎక్కువ నష్టం జరిగింది. ఉర్దూ అంతర్థానమయ్యే ప్రమాదం ఏర్పడింది.

ఎక్కువ కాలం ముస్లిం రాజుల పాలనలో ఉండటం వలన తెలంగాణ వారి సంస్కృతి ప్రాచ్య (ఓరియంటల్‌- ఇరాన్‌, ఇరాక్‌, టర్కీ వగైరా) దేశాల సంస్కృతితో ప్రభావితమైంది. కాబట్టి ఇక్కడి భాష, వేషధారణ, ఆహారపు అలవాట్లు, నిద్ర, కళలు, సాహిత్యం అన్నీ కూడా ప్రాచ్య దేశాలను పోలి ఉంటాయి. ఈ సంస్కృతికి భిన్నంగా చివరి 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పాలనలో ఉండిన ఆంధ్రా ప్రాంతంవారు పశ్చిమ దేశాల (బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికా వగైరా) సామ్రాజ్యవాద సంస్కృతికి అలవాటు పడ్డారు. ఇట్లాంటి రెండు ప్రాంతాలను కలిపి ఉర్దూపై ఆంధ్రా తెలుగును ఆధిపత్య స్థానంలో నిలిపి తెలంగాణపై ఆంధ్రా అధికారం చెలాయించేలా చేయడంతో తెలంగాణ గంగా జమున తెహజీబ్‌ దెబ్బతింటూ కేవలం ఆంధ్రా ఆధిపత్యపు సంస్కృతి తెలంగాణ వారిపై రుద్దబడుతూ వచ్చింది. తెలంగాణ వారు, తెలంగాణ ముస్లింలు భూములు కోల్పోయిన వారిగా, ఆంధ్రా వాళ్లు భూములు ఆక్రమించుకున్న వారుగా తెలంగాణలో- ముఖ్యంగా హైదరాబాద్‌లో, హైదరాబాద్‌ చుట్టూరా కనిపించడం ఒక నిదర్శనం.

ఆంధ్రా వారి డామినేషన్‌తో ముస్లిం కల్చర్‌లోని విభిన్న సాంస్కృతిక విషయాలు వివక్షకు గురవుతూ వచ్చాయి. ఆంధ్రావారికి తెలంగాణ ముస్లింలపై ఏ మాత్రం ప్రేమ లేదు. పైగా చిన్న చూపు. వెకిలిచూపూ. తమ ఆంధ్ర సంస్కృతి నుంచి ప్రతిదాన్నీ చూస్తూ ముస్లిం సంస్కృతుల్ని, అది మిళితమైన తెలంగాణ సంస్కృతిని చులకన చేస్తూ వచ్చారు. తెలంగాణ వారికి సంస్కృతీ సాంప్రదాయాలు, భాష రాదని, తాము వచ్చి అన్నీ నేర్పామని, నేర్పుతున్నామని, నిజమైన సంస్కృతి నేర్పుతున్నామనే అహంభావాన్ని  ప్రదర్శిస్తూ వచ్చారు. ముఖ్యంగా ముస్లిం సంస్కృతి అంటే అదేదో పరాయి సంస్కృతి అన్న ఏహ్యభావం చూపుతూ వచ్చారు.

– స్కైబాబ

(రజ్మియా కి రాసిన ముందు మాట నించి)

sky

జీవిత నాటక రంగం పై “ఆమె” !

bhuvanachandra

Untold Stories – 7

 

“మొదట్లో మా అమ్మంటే  నాకు అసహ్యం..!” నవ్వింది సుచరిత.

“నిజమా?” అడిగాను. నా గొంతులో ఆశ్చర్యం లేదని నాకు తెలుసు.

“నా నాలుగో ఏట నన్ను వదిలేసి, మా నాన్న పరువు తీసి ఇల్లొదిలి పెట్టి వెళ్ళిపోయింది. సంఘంలో నేను చిన్ననాటి నుంచి పడ్డ అవమానాలు నన్నో ‘ఇంట్రావర్ట్’ గా మార్చాయి. దేముడూ, పూజలూ అంటూ పవిత్రంగా ఉండే మా నాన్న మా అమ్మ కొట్టిన దెబ్బకు ‘దేవదాసై’ కొంపని పట్టించుకోవడం మానేశాడు. ఇహ మా బామ్మా, మా తాతయ్య అయితే, నేనో దురదృష్టవతురాల్ననీ, నా దురదృష్టమే కొంపని నాశనం చేసిందనీ, నా చదువు పూర్తయ్యేదాకా సాధిస్తూనే ఉన్నారు. అట్లాంటి పరిస్ధితుల్లో పెరిగిన నాకు, అమ్మంటే అసహ్యం కాక అభిమానమూ, అనురాగమూ పుడతయ్యా?” సుచరిత నవ్వుతూనే చెప్పినా కళ్లల్లో మాత్రం ‘కసి’ నివురు గప్పిన నిప్పులా కనిపిస్తూనే ఉంది.

“అయితే ‘మొదట్లో.  మా ‘అమ్మంటే నాకు అసహ్యం’ అని మీరిచ్చిన ‘స్టేట్మెంట్’ రాంగ్ కదూ. ఎందుకంటే మీ కళ్ళల్లో ఇంకా ‘కసి’ ఉంది” నేను నవ్వుతూనే అన్నాను. ఆ మాత్రం చనువు సుచరితతో నాకు ఉంది. “ఇప్పటికీ అసహ్యం అవునా?” కళ్ళలోకి చూస్తూ అన్నాను.

సుచరిత వాళ్లది తెనాలి. తెనాలి అంటేనే గొప్ప కళాకారులు జన్మించిన ఆంధ్రా పేరిస్. భానుమతిగారూ, రామకృష్ణగారూ, శారదగారూ, ముక్కామలగారూ ఇలా చెప్పుకొస్తే తెనాలి కళాకారులూ, నిర్మాతలూ, దర్శకుల సంఖ్య అనంతం. నాకు డబ్బింగ్ మెళకువలు నేర్పిన అన్నగారు శ్రీ రామకృష్ణగారిదీ తెనాలే.

సుచరిత వాళ్లమ్మ కల్పన.(అసలు పేరు కళ్యాణి) . కల్పనగారు సినిమాల్లో ఎంటరై రెండో సినిమాకే కళాశ్రీ అని పేరు మార్చుకుంది. (ఇది నేను పెట్టిన పేరు. ఆమె కోరికతో అసలు పేరు దాస్తున్నాను). ఇరవై రెండేళ్ళకే ముగ్గురు పిల్లల తల్లై కుటుంబాన్ని వదిలేసుకుని మద్రాసు పారిపోయి వచ్చేసింది. పెద్దకొడుకు, చిన్నకొడుకు అమ్మమ్మగారింట్లో  పెరిగితే కూతురు సుచరిత బామ్మగారింట పెరిగింది. కళాశ్రీగా పేరు మార్చుకున్న తరుణంలో పెద్దాడికి ఏడేళ్లూ, రెండో వాడికి ఆరేళ్ళు, సుచరిత నాలుగేళ్ళు. యీ వివరాలు సుచరితని కలవకముందే నాకు తెలుసు. కళాశ్రీ కూడా ‘అంబిక’ అనే కలం పేరుతో కథలు రాస్తూ ఉంటుంది. అది నాకు తెలుసు.

నిజం చెబితే అంతే కవిగారు. ‘కసి’ ఉందీ…. లేదూ… ఒకటి నిజం. అప్పుడు ఆమె అంటే అంతులేని అసహ్యం. ఇపుడు జాలీ, కసీ ఇంకా ఏదో తెలీని మమకారం కూడా ఉందని అనుకుంటున్నాను. “సూటిగా నా కళ్లలోకి చూస్తూ అంది సుచరిత.

“ఒకే వరలో మూడు కత్తులా?” నవ్వాను.

“జాలీ మమకరం కూడా కత్తులేనా?” కళ్లు పెద్దవి చేసి ఆశ్చర్యం నటిస్తూ అన్నది సుచరిత.

“ఈ  ‘అసహ్యం, కసి’ అనబడే కత్తులకంటే వెయ్యిరెట్లు పదునైన కత్తులు ‘జాలీ, మమకారం’ . ఆ విషయం ఇరవై రెండేళ్ళ వయసులో ఉన్న  నీకు ప్రస్తుతం అర్ధం కాదేమోగానీ, జీవితాన్ని ‘మనసుతో’ గమనించిన వాళ్లకి ఖచ్చితంగా అర్ధమౌతుంది.” నేనూ తన కళ్లలోకి చూస్తూనే అన్నాను.

“ఓహో అవిడా రచయిత్రేగా! అందుకే మీరు కాస్త అటుపక్క మొగ్గు చూపుతున్నారన్నమాట!” మాటల్లో తీవ్రత ఉన్నదని చెప్పక తప్పదు.

“కావచ్చు. కానీ సుచీ, ఒక్క విషయం చెప్పు. అప్పటి ‘కాలా’నికీ, ఇప్పటి ‘కాలా’నికీ, అప్పటి సామాజిక పరిస్థితులకీ, ఇప్పటి పరిస్థితులకి ఉన్న తేడాని బేరీజు వేశావా ఏనాడైనా? మీ అమ్మ ‘లేచి’పోయిందని జనాలు నీతో నీ చిన్నతనాన అన్న మాటలే నీలో పాతుకుపోయాయిగానీ, ఆమె నిజమైన పరిస్థితినీ, బాధనీ ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించావా? కనీసం ఊహించావా?” సిన్సియర్‌గా అడిగాను.

“ఊ!” ఏ కాలమైనా ‘తల్లి’ తల్లేనండీ. తను నవమాసాలూ మోసి చావుకి తెగించి కన్న బిడ్డలని, తనే వదిలిపోయిందంటే, ఆమె తల్లి అవుతుందా? సరే.. తన పరిస్థితి భరించలేనంత దుర్భరంగా వుంటే బిడ్డల్ని కూడా తీసుకుపోవచ్చుగా తనతో? పోనీ తను కొద్దో గొప్పో సెటిల్ అయ్యాకైనా తన బిడ్డల్ని తన దగ్గరికి పిలిపించుకోవచ్చుగా?” కచ్చగా అన్నది సుచరిత.

“నీకు క్రికెట్ అంటే ఇష్టం కదూ? ప్రేక్షకురాలిగా బోలేడన్ని కామెంట్స్ ఎవరైనా ఇవ్వొచ్చు. కానీ, పిచ్‌లో నిలబడి ఆడుతున్నవాళ్లకి కదా కష్టం తెలిసేది.? కాదంటావా?”

“ఓహో … మీరు తర్కం వుపయోగిస్తున్నారన్నమాట. అయ్యా… తర్కంలో కూడా నాలుగు విభాగాలున్నాయని నాకూ తెలుసు. ఇక్కడ కావల్సింది గెలుపోటముల వ్యవహారం కాదు. మానవత్వం” సుచరిత గొంతులో కాస్త అవహేళన ఉంది.

“ప్రస్తుతం మీ నాన్నగారు మంచాన పడి వున్నారని నాకు తెలిసింది. మానవత్వం గురించి చర్చించేటప్పుడు మరి ఆయన హాస్పిటల్ ఖర్చులన్నా నువ్వు భరించాలిగా. భరించే స్థోమత నీకుండీ ఎందుకు మీ నాన్నని దూరంగా పెట్టావు?” బిలో ద బెల్ట్ ఏనాడూ దెబ్బ కొట్టకూడదని తెలిసీ కావాలనే దెబ్బ కొట్టాను.

“ఉక్రోషం ఎంత అసహ్యంగానైనా మాట్లాడిస్తుందనటానికి మీరన్న మీ మాటలే ఉదాహరణ మాస్టారూ.. నిజమే స్థోమత ఉంది. కానీ ఆయన చేసిన అన్యాయం? ఎనిమిదేళ్ళ కూతుర్నీ, అదీ తల్లి ప్రేమకి నోచుకోని దాన్ని పట్టించుకోకుండా, ఇంటీ పనిమనిషిని ఉంచుకుని, దాన్నే పెళ్ళి చేసుకుని, దాన్నే అమ్మ అని పిలవమని నా వీపు మీద వాతలు పెట్టాడన్న విషయం మీకు తెలీదు. వదిలెయ్యండి కవిగారూ.. నా గతాన్ని తలుచుకున్న కొద్దీ పగిలేవి అగ్నిపర్వతాలే!” బొటబొటా కన్నీరు కార్చింది సుచరిత.

“గుడ్! నీ కష్టాలు  నువ్వు తల్చుకోగానే పగిలేవి అగ్నిపర్వతాలు. కానీ, మీ అమ్మ కష్టాలు మాత్రం నీ దృష్టికి శీతలపవనాలుగా అనిపించి ‘కసి రేగుతుంది’ కదూ! ఇదేం న్యాయం?” నా గొంతులో మోతాదుకి మించిన వ్యంగ్యాన్ని వొలికించాను.

“అంటే మీరనేది మా అమ్మ చేసింది రైట్ అనా? “కోపంగా అన్నది.

“తల్లిదండ్రుల విషయంలో తప్పొప్పులు  ఎంచే హక్కు పిల్లలకి లేదు. ఎందుకంటే నీ పుట్టుకకు కారకులు వాళ్లు. తల్లి అండాన్ని దానం చేస్తే, తండ్రి బీజాన్ని దానం చేస్తాడు. అండము, బీజము కలిసి పిండమైతేనే నువ్వు లోకానికొచ్చింది. అయినా, నీ తండ్రికి చెయ్యగలిగీ నువ్వెందుకు సహాయం చెయ్యట్లేదో నీ నిర్ణయం. నీ తండ్రి నీకు చేసిన అపకారాన్నీ, నిన్ను పెట్టిన బాధల్నీ నువ్వు క్షమించలేవు . కానీ నీ తల్లి,  నీ తండ్రి పెట్టిన బాధల్ని మాత్రం క్షమించి ఆ నరకంలోనే ఉండుంటే నీకు చాలా తృప్తి కలిగి, మా ‘అమ్మ దేవత’ అనుండేదానివి కదూ?

అయితే అదే ప్రశ్న మళ్లీ అడగక తప్పదు. ‘ నా కూతురు దేవత’ అని ఇప్పుడు మీ నాన్నతో అనిపించుకోగలిగిన స్థితిలో ఉండీ, ఎందుకు అనిపించుకోలేకపోతున్నావు?” యీసారి నేను నవ్విన నవ్వులోనూ వ్యంగ్యం ఉందని నాకు తెలుసు.

“శబాష్ కవిగారూ! అటు ఆవిడా ఇంకోడ్ని పెళ్ళి చేసుకుంది. ఇటు ఈయనా ఇంకోదాన్ని పెళ్ళి చేసుకున్నాడు. వాళ్లు పరిస్ధితులతో ఏనాడూ రాజీపడలేదు? వాళ్ల బుద్ధికీ, వాళ్ళ మనసుకి తోచింది చాల నిర్భయంగా నిస్సిగ్గుగా చెసేయ్యొచ్చు .  కానీ మేం మాత్రం చాలా విశాల హృదయంతో అర్ధం చేసుకుని, వాళ్ల అవసరాల్ని గమనించాలన్నామట! ఎంత ధృతరాష్ట్ర నిర్ణయం మీదీ?” వ్యంగ్యంగా నవ్వుతూ చప్పట్లు చరిచింది సుచరిత.

“ఓకే సుచీ..  నాది ధృతరాష్ట్ర నిర్ణయమే అనుకో. కాదనను. పోనీ నువ్వన్న మాటనే కాస్త వివరిస్తావా?”

“ఏ మాట?”

“మొదట్లో అసహ్యం ఉండేది. ఇప్పుడు జాలీ, కసీ కొంచెం మమకారం కూడా ఉన్నాయి. అన్న మాటని!”

“దీన్నేనా కాలుకేస్తే వేలికీ, వేలికేస్తే తలకి వెయ్యటం అంటే?  సరే.. జాలి ఎందుకంటే, ఇరవై రెండేళ్ళకే ముగ్గురు పిల్లల్ని వొదిలేసి, వేటూరిగారన్నట్టు యీ దుర్యోధన దుశ్శాసన దుర్మదాంధ ప్రపంచంలోకి ఒంటరిగా ప్రవేశించి నానా అగచాట్లు  పడినందుకు. కసి ఎందుకంటే, కేవలం స్వసుఖం, స్వార్ధం కోసం కన్నబిడ్డల్నీ, ఇంటి పరువు పతిష్టల్నీ నడిరోడ్డున వొదిలి తనతోవ తాను చూసుకొన్నందుకు. మమకారం ఎందుకంటే, నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి గనక. ఆ రాస్కెల్ అదే నా తల్లి గొప్ప నటీమణి. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో వొదిగిపోతుంది. ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన నటీమణుల్లో ప్రధమురాలని అననుగానీ,  ప్రముఖురాలు. ఆవిడ్ని తెరమీద చూసినప్పుడల్లా ‘యీవిడా నా తల్లి!” అని ఆశ్చర్యంతో మైమరచిపోతా. హాల్లోంచి బయటికి రాగానే… “వాహ్.. అంతా నటనే!” అని జ్వలించిపోతా.  ‘తల్లిమనసు’ చిత్రంలో కూతురికి పోలియో అని తెలిశాక ఏడిస్తూ ఆవిడ నటించిన సీను చూస్తే ‘తల్లంటే అదిరా’ అని ఎవడైనా అనుకుంటాడు. అలాంటి అమ్మ ఉండాలని ప్రతివాడు ఊహించుకుంటాడు…. నేను తప్ప!! ఎందుకంటే ఆ ఏడుపు ఆ ఎక్స్‌ప్రెషన్సూ అన్నీ క్షణికాలే.. అంతా నటనే…!”కసితో పాటు అసహ్యమూ ధ్వనించింది. “అయినా .. ఇంత గొప్ప నటీమణి నా తల్లి అన్న గర్వం, మమకారం మనసులో మెదులుతాయి” అన్నది.

నేను సైలెంటైపోయాను. సుచరిత మనసులో కలిగే భావాలు నాకు తెలీకపోలేదు. కానీ నా ప్రయత్నం నేను చెయ్యక తప్పదు.

“నిజంగా సుచీ. నీ హృదయం చాలా గొప్పది. నిష్పక్షపాతం గా  మీ అమ్మగార్ని మెచ్చుకోవడం నీ నిజాయితీకీ, సంస్కారానికీ నిదర్శనం. బహుశా మీ అమ్మ నీకు ఏమిచ్చినా, ఏమివ్వకపోయినా నీకు తన రక్తాన్నేగా ‘నటన’నీ వారసత్వంగా  ఇచ్చిందని చెప్పక తప్పదు. ‘రాలిన చివురాకు’ లోనీ నటనకి అవార్డు రావడమే నీలోని నటి ‘ప్రజ్ఞ’కి నిదర్శనం.”నిజంగానే మెచ్చుకున్నాను.

“అవును గురూజీ! ఇంతకీ నన్ను ములగచెట్టు ఎందుకెక్కిస్తున్నారు?” పరిహాసంగా అన్నది సుచరిత.

“ఒక గొప్ప నటికి మరో మహానటి మనసు అర్ధం కాదా? మీ అమ్మ ఏనాడూ గ్లిజరిన్ వాడదని అందరికీ తెలుసు. సన్నివేశంలో దిగ్గానే కన్నీళ్లు వాటంతట అవే వర్షంలా కురుస్తాయని అంటారు. నువ్వూ ‘రాలిన చివురాకు’ సినిమాలో గ్లిజరిన్ వాడలేదని నాకు తెల్సు. ఆనాడు నీ కళ్లలోంచి వచ్చినవి వెచ్చని స్వచ్ఛమైన కల్తీలేని కన్నీళ్ళే. కళ్లలోంచి నీళ్లు కురవాలంటే మనసు కరగాలి. ఆ మనసు కరగాలంటే  అది పాషాణం కాకూడదు.  చిన్న చిరుగాలికైనా స్పందించి, అటూ ఇటూ ఊగే చిగురాకు  కావాలి.  అలా చూస్తే మీరిద్దరిదీ చివురాకులాంటి స్పందించే మనసులే. పాషాణాలు కావు.” మధ్యలో మాటల్ని ఆపేశాను.

“ఎందుకు మళ్లీ  మేము తల్లీకూతుళ్లమని జ్ఞాపకం చేస్తారూ? మా ఏడుపులూ మా నవ్వులూ ఒకలాగే ఉండొచ్చు. కానీ మా అదృష్టాలూ, దురదృష్టాలూ ఒకటి కాదుగా? ఆవిడకేం? మొగుడున్నాడు. ఒకరో ఇద్దరో మాలాగా కాకుండా, ‘ప్రియమైన’  పిల్లలున్నారు.  ఆస్తి వుంది… అంతస్థూ వుంది…’  నటిగా బోలెడు మందాన పేరుంది. ఇంకేం కావాలీ        “మా గోల మాది. నా ఇద్దరు అన్నలూ ఎందుకూ  పనికిరానివాళ్లయిపోయారు. చిన్నతనం నించీ వాళ్లు పడ్డ అవమానాలు వాళ్లని గొంగళి పురుగుల్లా మార్చినై. ఎక్కడా ఉండలేరు. కనీసం ‘ఇది’ కావాలని అడగలేరు. మమ్మల్ని ఒదిలి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఒకడు ఆర్మీలో ఎక్కడో బోర్డర్లో వుంటే ఇంకోడు రైల్వే కేటరింగ్ సర్వీసులో గంటకో వూరి గాలి పీలుస్తున్నాడు. మరి మీరు మాత్రం మా అమ్మగారిని మాకేదో దగ్గర చెయ్యలనే ప్రయత్నం మాత్రం మానటంలేదు. మమ్మల్ని కలిపితే మీకొచ్చే లాభం ఏమీ లేదని నాకు తెలుసు. కానీ ఆవిడ ‘ఈగో’ సాటిస్‌ఫై అవుతుంది. ఏవో కాకమ్మ కబుర్లు చెప్పి,  నన్ను దగ్గరికి తీసుకుని,” నా తప్పేమీ లేదు బుజ్జీ, ఇది కేవలం విధి లిఖితం. లేకపోతే నీ ‘దృష్టిలోపం’ అని తనని తాను విముక్తురాలిగా చేసుకుంటుంది. మాస్టారూ, అది నాకు ఇష్టం లేదు. ఇన్నేళ్ళ తరవాత ఆమె ప్రేమ ఒద్దు. అసలావిడ ప్రసక్తే మళ్ళీ తీసుకురావొద్దు” ఖచ్చితంగా అన్నది సుచరిత.

నేను నవ్వాను.

“మీరు ఇదంతా ఊహించే వచ్చారనీ, మీరు ఊహించిన మాటల్నే నేను మాట్లాడుతున్నాననీ నవ్వొచ్చిందా మాస్టారూ? నవ్వండి. ఎందుకంటే పులి ఆకలి లేడికి నరకం. మీ రచయితలు బహుశా పులులకంటే క్రూరమైన లక్షణాలతో పుడతారేమో! మీ మీద నాకున్న గౌరవాన్ని దయచేసి అలాగే వుండనివ్వండి.  మా అమ్మకారణంగా దాన్ని మట్టిపాలు చెయ్యకండి.మరి…! “ఆగింది సుచరిత.

“సెలవు తీసుకోమంటావు అంతేగా సుచీ! సరే వెళ్ళొస్తాను. కానీ ఒక్కమాట… తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం న్యాయమే. కాదన్ను. కానీ వాళ్లు తమ తప్పుని సరిదిద్దుకోవటానికి ఓ అవకాశం ఇవ్వడం కూడా అన్యాయం కాదేమో?” ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాను.

“వాళ్లు తప్పు దిద్దుకోవడానికి అవకాశమా? ఇస్తాను. మరి నా బాల్యం వాళ్లు నాకు ఇవ్వగలరా? చెప్పండి… ఇవ్వగలిగితే యీ క్షణమే మా నాన్న కుటుంబాన్ని మద్రాసు తీసుకొచ్చి నేను పోషిస్తా. ఇవ్వగలిగితే యీ క్షణమే మా అమ్మని కల్సి, ఆవిడ పిల్లల్ని నా తోబుట్టువులుగానూ, ‘ఆయన్ని’ తండ్రిగానూ  స్వీకరిస్తా. .. ఏం? నా బాల్యాన్ని మళ్ళీ వాళ్ల చేత నాకు ఇప్పిస్తారా?”

ఇసుకలో ఇంకిన నీటినీ, ‘గతపు’ నీడల్లో ఒదిగిన కాలాన్ని మళ్లీ ఎవరు వెనక్కి తేగలరు?”

“వస్తాను సుచీ.. తప్పో రైటో నాకు తెలీదుగానీ మీ అమ్మ బాధ చూడలేక వచ్చాను. కావాలనే కొన్నిసార్లు నిన్ను బాధపెట్టే మాటలూ, ఇబ్బంది పెట్టే మాటలూ అన్నాను. ఒకటి మాత్రం నిజం…! కొన్ని చెయ్యి జారిపోకముందే జాగ్రత్తపడాలి. కొందరి విషయంలో కాలాతీతం కాకముందే కనికరం చూపించాలి. సారీ.. అది నీ ఇష్టం..” నేను లేచి వచ్చేశాను.

కళాశ్రీ ఇంటికి వెళ్లలేకపోయాను. వెడితే, సుచరిత ఏమన్నదో ఆవిడకి చెప్పాలి. సుచరిత అడిగిన ప్రశ్నలకి ఖచ్చితంగా కళాశ్రీ అనబడే కళ్యాణి దగ్గర జవాబులు లేవు. అంతేగాదు, ఇప్పుడు నేను వెళ్లి సుచరిత అడిగిన ప్రశ్నల గురించి చెప్పినా, సుచరిత తల్లిని యీ జన్మలో చూడటానికి ఇష్టపడటం లేదు అని చెప్పినా, కళ్యాణిని ఇంకా బాధపెట్టిన వాడినవుతాను.

‘మౌనం’ చాలా ఇబ్బందుల్ని తొలగిస్తుంది. నేను అదే పాటిస్తున్నా. నెలన్నర గడిచిందేమో. ‘రాఘవ’ కనిపించాడు. రాఘవ అంటే కళ్యాణి రెండో భర్త. తెలుగువాడే అయినా ‘రాఘవన్’ అని పరిచయం చేసుకోవడమేగాక, కావాలని తమిళ యాసలో తెలుగు మాట్లాడతాడు. “హలో సార్.. ఎట్టా వుండారూ?” తమిళ యాసతోనే అడిగాడు రాఘవ.

“బాగున్నానండీ. ఏంటి విశేషాలు.?” మామూలుగా అడిగాను. ఆయన పరిచయం వున్నా లేనట్టే లెక్క. ఒకందుకు మెచ్చుకోవాలి. కళ్యాణి నాతో మాట్లాడేటప్పుడు మధ్యలోకొచ్చేవాడు కాదు. తను నాతో కూడా ఫ్రెండ్లీగానే అన్నట్టు ‘ఉండేవాడు.’

“ఏం చెబుతాం సార్. అంతా బాగానే ఉంది. ఏదో..!” నవ్వాడు.

ఇంతకీ మేం కలిసింది పాండీ బజార్లో ‘వుడ్‌లాండ్స్’ హోటల్లో.

ఒకప్పుడు (నేను మద్రాసుకి వచ్చిన కొత్తలోకూడా) వుడ్‌లాండ్స్ కాఫీకి గొప్ప పేరు. రచయితలూ, హీరోలూ తరచుగా ఆ రోజుల్లో విజిట్ చేసే హోటళ్ళు నారాయణ కేఫూ… వుడ్‌లాండ్సూ.. ‘దాస్‌ప్రకాష్’ మరో గొప్ప హోటల్. మద్రాసు వచ్చినవాళ్లు దాస్‌ప్రకాష్‌లో తినకుండా వెళ్ళేవాళ్లు కారు. అదో ‘సింబల్’ అలాగే  బుహారీ హోటల్. అఫ్‌కోర్స్ అది మాంసాహార  ప్రియులకి.  నాలాంటి గ్రాస్‌యీటర్స్(వెజిటేరియన్స్)కి కాదు.

నేను ‘రవ్వ దోసె’ తింటుంటే ఆయన ‘మసాలా దోసె’ తింటున్నారు. కాఫీ తాగాక బయటికొచ్చాం. ఆయన ‘కారు’ ఎక్కి వెళ్లిపోయేదాకా ఉండి నేను పానగల్ పార్కులో ‘ఘంటసాల’గారి బెంచీ మీద సెటిలయ్యాను.

పాండీ బజార్ పానగల్ పార్కుకీ, తెలుగువారికీ ఎంత అవినాభావ సంబంధమో.. ఘంటసాల, సముద్రాల, మల్లాదిగారు, కృష్ణశాస్త్రిగారు, ఆరుద్ర, ఇంకా పింగళి నాగేంద్రరావుగారు వీరంతా పానగల్ పార్కులో కూర్చొని మాటలకీ, పాటకీ ‘సొబగులు’ దిద్దినవారే. అద్దినవారే.. సరే.. మరోసారి విపులంగా చెప్పుకుందాం.

బెంచి మీద కూర్చొని  ‘పోయిన మంచోళ్ల’ నీ తల్చుకుంటున్నా. “గురూగారు, రాఘవ మీకు బాగా తెలుసా?” కొంచెం అనవసరపు కుతూహలం   ప్రకటిస్తూ  అడిగాడు ‘చతుర్ బాబు’. అతనో ఘోస్టు రైటరు. అంతే కాదు చిన్న చిన్న వేషాలు కూడా వేసేవాడు. ఎక్కువగా ‘డైలాగ్’లేని శివుడి వేషాలకి ఆయన్ని పిల్చేవాళ్లు.

“తెలుసు” ముక్తసరిగా అన్నాను.

“మహాగట్టోడు” పకపకా నవ్వాడు చతుర్‌బాబు. పేరులో ‘బాబు’ అని గానీ, వయసు ఏభై దాటి వుంటూంది. నేను మాట్లాడలా.

“ఎందుకని అడగరేం? ఆయనది మా ప్రకాశం జిల్లానే. ఊళ్ళో పెళ్లాం పిల్లలూ వున్నారు. వాళ్లని పోషించాలంటే అక్కడ బేలన్స్ నిల్లు. మొత్తానికి కళ్యాణిని  పట్టి పబ్బం గడుపుకుంటున్నాడు. వాళ్లమ్మాయి పెళ్ళి జరిగింది ఆర్నెల్ల క్రితమే కదా..  పైకేమో విడాకులు. మరి పెళ్లిలో ‘కన్యాదానం’ ఎట్టా చేశాడూ?” లాపాయింటు లాగాడు చతుర్.

ఈ చలన చిత్ర పరిశ్రమలో ఎవరైతో ఏం మాట్లాడినా కష్టమే. వచ్చేది మాత్రం మీరు మాట్లాడని విషయమే. నా అదృష్టం బాగుండి ఆ రోజున నా ఫ్రెండ్ శ్రీవిలాస్ నావైపుకి వస్తూ కనిపించారు. ఆయన సూరి భగవంతంగారికి అతి దగ్గరి చుట్టమేగాక మంచి స్నెహితుడు. దాంతో చతుర్‌బాబుగారి ‘సంభాషణకి’ బ్రేక్ పడింది. అయితే రాఘవ కూతురి పెళ్లి  జరగటం, ఆ పిల్లకి రాఘవ కన్యాదానం చెయ్యడం నాకు కొత్తగా తెలిసింది.

ఎందుకో ‘సుచరిత’ గుర్తుకొచ్చి అప్రయత్నంగా (అనొచ్చా) ఓ నిట్టూర్పు వెలువడింది. ప్రస్తుతం సుచరిత అప్‌కమింగ్ నటి. నిజం చెబితే చాలా ‘మంచి’ నటి. మరి ఆమె పెళ్ళికి ఎవరు కన్యాదానానికి కూర్చుంటారు? ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న.

సమాధానం తేలిగ్గానే దొరికింది. రెండు నెలల తర్వాత. ‘సుచరిత’కి కాన్సర్‌ట. డ్రైవర్ కొసం వెయిట్ చెయ్యకుండా ప్రొ.. CMK రెడ్డి FRCS FRST (etc etc etc) గారి  వోల్‌స్టెడ్ సర్జికల్ హాస్పిటల్‌కి డ్రైవ్ చేస్తూ వెళ్లాను. సుచరిత జుట్టు పూర్తిగా ఊడిపోయింది. ఓ.. గాడ్…!!

“ఎంతో కాలం బతకనని నాకు తెలుసు అంకుల్.. అయినా అమ్మని రమ్మని పిలవలేను. ఎందుకంటే నన్నిలా చూస్తే తన గుండె పగులుతుందేమో! వద్దు. ఒక్క విషయం నిజం అంకుల్.. ఐ లవ్ హర్.. ఐ హేట్ హర్ (I love her.. I hate her) ఒక్క రిక్వెస్టు..  నేను చనిపోతే మాత్రం మా ఇద్దరన్నలకి ‘మాత్రమే’ ఇన్ఫామ్  చెయ్యండి. వాళ్లు రాకపోతే…..” సైలెంటైపోయింది.

భగవంతుడా… అసలెందుకీ అన్‌టోల్డ్ స్టోరీస్ రాస్తున్నాను..

 

మీ భువనచంద్ర

 

అర్జున, అశోకుల మీదుగా అమెరికా దాకా…

భీష్ముడు:  ధర్మరాజా, విను. ఒకే ఇంటికి చెందిన జనాలు ఉన్నారు. వాళ్ళలో ధనార్జన చేసేవారు, కార్యనిపుణులు, ఆయుధోపజీవులు, ఇంకా రకరకాల పనులు చేసేవారూ ఉన్నారు. వారే గణాలు. రాజు వాళ్ళతో కలసిమెలసి ఉంటూ వాళ్ళ నడకను కనిపెట్టుకుని ఉండాలి. వాళ్ళను సంతోషపెడుతూ వలలో వేసుకోవాలి.

గణజనాలలో ఓరిమి ఉండదు. బుద్ధిలో, ప్రతాపంలో అవతలివాళ్లు ఎంత గొప్పవాళ్ళైనా సరే, లెక్క చేయరు. వారిలో ఎవడైనాసరే, ఇంకొకడితో శత్రుత్వం వహించగలడు. దాంతో వాళ్ళ మధ్య చీలికలు వస్తాయి. అప్పుడు శత్రురాజులు వాళ్ళలో కొంతమందిని తమవైపు తిప్పుకుంటారు. అది రాజ్య మూలాన్ని తొలిచేస్తుంది. కనుక రాజు ముందే జాగ్రత్తపడాలి. వాళ్ళను మాటనేర్పుతో వశం చేసుకోవాలి. గణముఖ్యులను ఆదరిస్తూ వాళ్ళ చేత పనులు చేయించుకోవాలి. గణజనాలలో ఐకమత్యం చెదిరిపోతే రాజ్యం నాశనమవుతుంది. గణజనాలు ఒక్కమాట మీద ఉంటేనే రాజుకు సిరీ, సంపదా.  కనుక గణపద్ధతులను గమనించుకుంటూ మెలగాలి,

                      -తిక్కన     

(శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసం)

***

కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు గణజనాల గురించి ధర్మరాజును పైవిధంగా హెచ్చరిస్తాడు. దాని నేపథ్యం ఏమిటంటే…

సాముదాయిక అధికారంలో ఉండే గణవ్యవస్థ అప్పటికే శిథిలమవుతోంది. ఏకవ్యక్తి అధికారానికి క్రమంగా దారి ఇస్తోంది. కానీ ఆ పరివర్తన అనుకున్నంత తేలిక కాదు. వ్యవస్థ శిథిలమైనంత వేగంగా వ్యక్తుల జీవనవిధానం శిథిలం కాదు. గణజనాలు తమవైన ప్రత్యేక పరిస్థితులకు అలవాటుపడ్డారు. వారిలో ప్రతి ఒకడూ స్వతంత్రుడు. గణంలోని ప్రతి ఒకడితోనూ సమానుడు. ఎవరో ఒకరి అధికారానికి తలవంచడం వాళ్ళకు తెలియదు. దానికితోడు, గణమనస్తత్వంలో పగ, ప్రతీకారదాహం అనేవి అతి సహజంగా కలసిపోయి ఉంటాయి. వారిలో శత్రువుపై పగ దీర్చుకోవడం కేవలం   క్షణికోద్రేక చర్య కాదు. ఎంతో ప్రణాళికాబద్ధంగా, ఒక మతవిధిగా, ఒక కర్తవ్యంగా, కాలపరిమితితో సంబంధం లేకుండా అమలు జరిగే ప్రక్రియ.

దీనికితోడు వాళ్ళ చేతుల్లో ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధాన్ని ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు ప్రధానంగా ఆయుధోపజీవులు.

bhismaarrowbed

గణవ్యవస్థా, గణజనాలూ అనగానే ప్రపంచమంతా మొట్టమొదటగా తలచుకుని మొక్కవలసిన పండితుడు, లూయీ హెన్రీ మోర్గాన్. ఆయన రాసిన Ancient Society  పురామానవ చరిత్రకారులకు ఓ బైబిలూ, ఓ భగవద్గీతా. అది గణజీవనసూత్రాలను దండగుచ్చిన వ్యాకరణం. మోర్గాన్ కు మహాభారతంతో పరిచయం ఉందని చెప్పలేం. తన పుస్తకంలో ఆయన మహాభారతాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అయినాసరే, ఆయన సూత్రీకరణలకు మహాభారతంలోనే ఎన్నో ఉదాహరణలు దొరకుతాయి. ఆసక్తిగొలిపే ఆ విశేషాలను మరో సందర్భానికి వాయిదా వేయక తప్పడం లేదు.

గణజనాలు ఒక ‘సమస్య’ అని భీష్ముడికి తెలుసు. ఆయననుంచి మూడో తరానికి చెందిన ధర్మరాజుకు తెలుసు. అందులోనూ అర్జునుడికి మరింత అనుభవపూర్వకంగా తెలుసు. ధర్మరాజునుంచి రెండో తరానికి చెందిన జనమేయజయునికి తెలుసు. అక్కడినుంచి ఒకింత చరిత్ర కాలంలోకి వస్తే కోసల, మగధ రాజులకు తెలుసు.  అలెగ్జాండర్ కీ, మౌర్యరాజు అశోకుడికీ, గుప్తరాజులకూ తెలుసు. ఆ తర్వాతి రాజులకు బహుశా తెలియదు, తెలియవలసిన అవసరం లేదు. ఎందుకంటే, మహాభారతకాలంలో ప్రారంభమైన గణజనాల ఊచకోత గుప్తరాజులతో ఒక కొలిక్కి వచ్చింది. గణసమాజమూ, సంస్కృతుల జ్ఞాపకాలు మనదేశంలో ఏ మేరకు మాసిపోయాయంటే; మన ప్రాచీన సారస్వతంలోనూ, ధర్మశాస్త్రాలలోనూ ఉన్న గణసమాజలక్షణాలనూ, వాటి అవశేషాలనూ కవులూ, ఇతర బుద్ధిజీవులూ పోల్చుకోలేనంతగా!  నన్నయభారతం నుంచే ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వచ్చు.

ఆధునిక కాలానికి వస్తే, మోర్గాన్ వెలుగులోనే మనం మళ్ళీ గణసమాజం తీరుతెన్నుల గురించి సాధికారంగా తెలుసుకోగలుగుతున్నాం.

మహాభారతకాలం నుంచి చరిత్రకాలం మీదుగా మనం నేటికాలానికి వచ్చి ఒకసారి మనదేశపు పశ్చిమవాయవ్యాలవైపు వెడదాం. నేటి పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ సరిహద్దులలో కొన్ని గిరిజనప్రాంతాలున్నాయి. అప్ఘానిస్తాన్ వర్తమానం మన గతం అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆధునిక కాలంలో తన ప్రాంతంలోని ఆయుధోపజీవుల స్వైరవిహారం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనే ఒక ఫక్తూన్ నాయకుడిని తీవ్రంగా కలతపెట్టిందనీ, గాంధీ అహింసావాదానికి ప్రభావితుడైన గఫార్ ఖాన్ తన జాతీయులను హింసామార్గం నుంచి తప్పించడానికి కృషి చేశాడని కూడా చెప్పుకున్నాం.

అప్ఘానిస్తాన్ ను ఆనుకుని ఉన్న వాయవ్య సరిహద్దు రాష్ట్రం (నేటి పాకిస్తాన్ వాయవ్య ప్రాంతాన్ని బ్రిటిష్ రోజుల్లో అలా పిలిచేవారు)లోని గిరిజనుల జీవనవిధానం పట్ల గాంధీకి ఎంతో ఆసక్తి ఉండేదని ఆయన జీవితచరిత్ర చదివితే అర్థమవుతుంది. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు పఠాన్ల హింసా పార్శ్వం ఆయనకు స్వయంగా అనుభవంలోకి వచ్చింది కూడా. మీర్ ఆలమ్ అనే ఒక పఠాన్ ఓ వివాద సందర్భంలో గాంధీ మీద దాడి చేశాడు. గాంధీ కొన్ని రోజులు ఆసుపత్రిలో గడపవలసివచ్చింది. గఫార్ ఖాన్ తనను మొదటిసారి కలసినప్పుడే ఇద్దరూ సరిహద్దు రాష్ట్రంలోని గిరిజనుల గురించి ఎంతో ఇష్టంగా మాట్లాడుకున్నారు. కాబూల్ వరకూ వెళ్ళి, సరిహద్దులకు అతీతంగా జీవించే గిరిజనులతో కలసిపోయి గడుపుతూ వారి మనస్తత్వాన్ని అర్థంచేసుకోవాలని ఉందని అప్పుడే గాంధీ గఫార్ ఖాన్ తో అన్నారట. ఆయన మూడుసార్లు సరిహద్దు రాష్ట్రానికి వెళ్ళి గఫార్ ఖాన్ ఆతిథ్యం అందుకున్నారు. తరచు స్థిరజనావాసాలపై దాడులు చేస్తూ హిందూ, సిక్కు అల్పసంఖ్యాకవర్గాలకు సమస్యగా మారిన గిరిజనులను సంస్కరించాలన్న కోరిక ఆయనకు ఉండేది.

కోశాంబి

కోశాంబి

మహాభారతం, కోశాంబీల పరిచయంతో ఆయుధోపజీవులను పరిశీలిస్తున్న నాకు గఫార్ ఖాన్, ఫక్తూన్ తెగల గురించిన వివరాలు; సరిహద్దురాష్ట్రంలోని గిరిజన తెగలపై గాంధీ ఆసక్తి  ప్రత్యేక కుతూహలం కలిగించడం సహజమే.  గాంధీ ఆసక్తికి కారణం, భారతదేశ ప్రధానజీవనస్రవంతి లోంచి ఆయుధోపజీవనం అదృశ్యమైపోవడమే నని నాకు అనిపిస్తుంది.

మహాభారతంతో మొదలుపెట్టి, చరిత్రకాలం మీదుగా అప్ఘాన్ పరిణామాలను అర్థం చేసుకుంటున్న నన్ను,  ఓరోజు ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ప్రముఖ పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు, రాజకీయనాయకుడు ఇమ్రాన్ ఖాన్ అంటున్న మాటలు ఆకర్షించాయి. పాక్-అప్ఘాన్ సరిహద్దుప్రాంతాలలో అమెరికా, దాని మిత్రదేశాల సైనికచర్యను ఆయన ప్రస్తావిస్తూ “అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం వందేళ్లు పోరాడినా ఆ ప్రాంతాలపై ఆధిపత్యాన్ని సాధించలేకపోయింది. ఎందుకంటే, అక్కడ ఉన్న పదిలక్షలమందిలో ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడు. ప్రతి ఒకడి చేతిలోనూ ఆయుధం ఉంటుంది. కనుక సైనికమార్గంలో వాళ్ళను లొంగదీసుకోవడం అసాధ్యం. అమెరికా మరో ఓటమినే మూటకట్టుకుంటుంది” అన్నాడు. ఇమ్రాన్ ఖాన్ మాటలు నా అవగాహనను ధ్రువీకరిస్తున్నాయి.

అంటే, మహాభారతకాలంతో ప్రారంభించి గుప్తరాజుల వరకూ పైన ఇచ్చిన జాబితా, అక్కడితో పూర్తి కావడం లేదన్నమాట. అందులోకి నాటి బ్రిటిష్ ప్రభుత్వమూ, మధ్యలో కొంతకాలం అప్ఘానిస్తాన్ లో చేతులు కాల్చుకుని తప్పుకున్న నాటి సోవియట్ యూనియన్, తాజాగా అమెరికా; దాని మిత్రదేశాలు చేరుతున్నాయన్న మాట. అయితే, ఆయుధోపజీవులతో అర్జునుడు, అశోకుడు తలపడడం; భౌగోళిక హద్దులను దాటుకుని నాటి బ్రిటిష్ ప్రభుత్వం, సోవియట్ యూనియన్, అట్లాంటిక్ ను దాటివచ్చి అమెరికా తలపడడం ఒక లాంటివే కాకపోవచ్చు. తెగలు, దేశాల స్వయంనిర్ణయాధికారంలో జోక్యం చేసుకునే అగ్రరాజ్య దురహంకారంగానో, ప్రపంచశాంతి స్థాపన యత్నంగానో ఎవరి కోణం లోంచి వారు చెప్పుకోవచ్చు. ఆ చర్చను అలా ఉంచి, ఈ సందర్భంలో నన్ను ఆశ్చర్యపరిచేది, చరిత్ర అవిచ్ఛిన్నత!

భారతదేశం వెలుపలికి వెళ్ళి చెప్పుకుంటే, క్రూసేడ్ల పేరుతో చరిత్రకెక్కిన మతయుద్ధాల కొనసాగింపుగా కూడా ఇరాక్, ఇరాన్, అప్ఘానిస్తాన్ లలో పాశ్చాత్య దేశాల జోక్యాన్ని చెప్పుకోవచ్చు. ఈ రోజున  ‘సంస్కృతుల మధ్య యుద్ధం’గా దీనిని చిత్రిస్తున్నా, అది మతయుద్ధాలకు ముసుగు వేసే ప్రయత్నమే. ఈ కోణంలో చూసినప్పుడూ ఇది చరిత్ర అవిచ్చిన్నతకు సాక్ష్యమే. ఒక్క మాటలో చెప్పాలంటే, తమవైన అజెండాతో క్రీస్తుశకంలోకి అడుగుపెట్టిన శక్తులు, క్రీస్తు పూర్వ దశలోనే ఇప్పటికీ ఉన్న సమాజాలను క్రీస్తుశకంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సమాజాలలో భారతీయ సమాజమూ ఉంది. ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందన్నది ప్రస్తుతానికి శేషప్రశ్న. అదే కనుక ఫలిస్తే అప్పుడు ఏర్పడే ఏకరూప ప్రపంచపు ఉక్కుపాదాల కింద ఎంత వైవిధ్యం, ఎన్ని అస్తిత్వ కాంక్షలు, ఎంత సంస్కృతి, ఎంత చరిత్ర అణగారిపోతాయో ఊహించుకోవలసిందే. అలాగని ఈ సమాజాలను క్రీస్తు పూర్వ దశలోనే ఉంచాలా అని అడిగినా వెంటనే సమాధానం తోచదు. చెప్పొచ్చేదేమిటంటే, చారిత్రక ఘర్షణలు కాలాల హద్దులను అధిగమిస్తాయి. వర్తమానానికి మాత్రమే మన చూపుల్ని కుదించుకుంటే చరిత్ర అవిచ్చిన్నత ఎప్పటికీ అర్థం కాదు.

పైన ఉటంకించిన భీష్ముడి మాటల్ని స్మరించుకుంటూ వర్తమానంలోకి వద్దాం. పాకిస్తాన్-అప్ఘానిస్తాన్ ల మధ్య ఉన్న గిరిజనప్రాంతాలు అర్థ-స్వయంపాలితాలు. వాటిని Federally Administered Tribal Areas (FATA) అంటారు. వీటిలో ఏడు గిరిజన జిల్లాలు, ఆరు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. Frontier Crimes Regulations (FCR) అనే ప్రత్యేక నిబంధనల ద్వారా ఇవి నేరుగా పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం కింద ఉంటాయి. తెగల ముఖ్యు(nobles)లకు వీటిలో పలుకుబడి ఉంటుంది. మూడు ఆంగ్లో-అప్ఘాన్ యుద్ధాలతో తల బొప్పి కట్టిన బ్రిటిష్ ప్రభుత్వం తన అవసరాలకు కలసివచ్చే షరతుపై ఈ తెగల ముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చింది. ఇప్పటికీ ఇదే ఏర్పాటు కొనసాగుతోంది.

ఈ వివరాలలో, చరిత్రకందని కాలానికి చెందిన భీష్ముని మాటల ప్రతిధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. ఎంతటి వాళ్ళనూ లెక్క చేయని గణజనాలను మంచి మాటలతో మచ్చిక చేసుకోవాలని భీష్ముడు అనడంలో ఉద్దేశం, వాళ్లపై కత్తి కడితే ప్రయోజనం లేదనే.  అప్ఘాన్లతో మూఢు యుద్ధాలు చేసిన నాటి బ్రిటిష్ ప్రభుత్వమూ,  నిన్నటి సోవియట్ యూనియన్, నేడు అమెరికా నేర్చుకున్న గణపాఠం కూడా అదే.  తన అవసరాలకు కలసివచ్చే షరతుపై గణముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చి బ్రిటిష్ ప్రభుత్వం రాజీ పడడం, గణముఖ్యులను ఆదరించి వారితో పనులు చేయించుకోవాలన్న భీష్ముని సూచనకు అనుగుణమే.

ఇంకా విశేషం ఏమిటంటే, పైన చెప్పుకున్న FATA లాంటి ఏర్పాట్లే మన పురాణ ఇతిహాస కాలం లోనూ ఉండడం! ఉదాహరణకు, ‘పౌరజానపద పరిషత్తు’. ఆనాటికి రాజు సర్వస్వతంత్రుడు కాడు. కొన్ని అధికారాలను పౌర జానపదులతో పంచుకునేవాడు. రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్న దశరథుడు పౌరజానపదపరిషత్తును సమావేశపరచి అనుమతి కోరాడు. పౌర జానపదులలో మ్లేచ్చులు, ఆర్యులు, వనశైలాంతవాసులు; అంటే అడవుల్లోనూ, కొండల్లోనూ ఉండేవాళ్లు కూడా ఉన్నారు. మహాభారతంలో యయాతి తన చిన్నకొడుకు పూరునికి పట్టం కట్టాలనుకుని పౌరజానపదపరిషత్తును సంప్రతించినప్పుడు, పెద్ద కొడుకు యదువు ఉండగా చిన్నకొడుక్కి పట్టం ఎలా కడతావని పౌర జానపదులు ప్రశ్నించారు. అప్పుడు యయాతి వారిని సమాధానపరచి అనుమతి తీసుకున్నాడు. భీష్ముడు పేర్కొన్న గణముఖ్యులను వాల్మీకి గణవల్లభులన్నాడు.

పైన Frontier Crimes Regulations అనే ప్రత్యేక నిబంధనల ద్వారా గిరిజన ప్రాంతాలు పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం కింద ఉంటాయని చెప్పుకున్నాం. అంటే ఒకానొకప్పుడు రాజుతో సమాన ప్రతిపత్తినీ, రాచ మర్యాదలనూ అందుకున్న గిరిజనులు రాజ్యం పట్టు బిగుసుకుంటున్న కొద్దీ నేరస్థ జాతులుగా, నేరశక్తులుగా ముద్రపడుతూ వచ్చారన్నమాట. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు మన పురాచరిత్రలోనూ, చరిత్రలోనూ కూడా  కొల్లలు.

ఖాండవ వన దహనం ద్వారా అర్జునుడు నాగులనే ఆదివాసీ తెగతో తెచ్చుకున్న శత్రుత్వం గురించీ, ఆ తెగవారు దానికి ప్రతీకారం తీర్చుకోడానికి చేసిన ప్రయత్నాల గురించీ, చివరికి అవి అర్జునుడి మనవడైన పరీక్షిత్తు కాలంలో ఫలించడం గురించీ, దానిపై ప్రతీకారంగా పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు నాగులను ఊచకోత కోయడం గురించీ 21 వ్యాసాలలో ఇప్పటికే వేరొక చోట చర్చించాను. కనుక అందులోకి ఇప్పుడు వెళ్ళకుండా; కోసల, మగధ రాజుల కాలంలోనూ, ఆ తర్వాతా జరిగిన విషయాలకు పరిమితమవుతాను.

దానికంటే ముందు ఆయుధోపజీవుల విషయంలో అలెగ్జాండర్  అపకీర్తిని మూటగట్టుకున్న ఒకానొక చర్య గురించి  చెప్పుకోవాలి….

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

ఇదిగిదిగో లోపలి మనిషి చిరునామా!

KuberanatharaoIyalaCover

కన్నడ భాషా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలని తపించే శ్రీ శాఖమూరు రామగోపాల్ వెలువరించిన ఎనిమిదవ పుస్తకం “డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావ్ మరియు ఇయాళ”.

ఈ అనువాద కథాసంకలనంలో మొదటి అయిదు పూర్ణచంద్ర తేజస్వి గారి కథలు కాగా మిగతా పది కథలు వివిధ రచయిత(త్రు)లు రాసినవి.

పూర్ణచంద్ర తేజస్వి గారు రచించిన “కుబి మత్తు ఇయాళ”, “అవనతి”, “అబచూరిన పోస్టాఫీసు”, “తుక్కోజి”, “డేర్‌డెవిల్ ముస్తఫా” అనే ఈ అయిదు కథలు కన్నడ కథామాలలో మణిపూసలనడం అతిశయోక్తి కాదు. ఈ అయిదు కథల తెలుగు అనువాదాలను ఈ వ్యాసంలో పరిచయం చేసుకుందాం.

***

ఆస్పత్రి లోపల్నుంచి ఫినాయిల్, స్పిరిట్, డెట్టాల్‌ల విశిష్టమైన వాసన ఒకటి గుప్పంటూ బయటకు వస్సుంది. బెంచీల మీద ఎంతో మంది రోగులు కూర్చుని ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఖళ్ ఖళ్‌నే దగ్గుతున్నారు. కొంత మంది తమ రోగంలోని కారణాల్ని దాని గుణ లక్షణాల్ని ఇతరులకు వివరిస్తున్నారు. జ్వరపీడితడైన ముసలోడొకడు అస్ ఉస్ అని వదుల్తూ పీలుస్తూ అప్పుడప్పుడు సంకటం సంకటం అని గొణుగుతున్నాడు. వారి మనమడొకడు వారి ఊతకర్రను తీసుకొని అరచేతి మీద నిలువుగా నిల్పే సర్కస్ చేస్తున్నాడు. ప్రతిసారి ఓడిపోయి ఊతకర్ర క్రిందపడినప్పుడు ‘’మరోమారు చూడు తాతా’’ అంటూ తన సర్కస్‌ను పునరారంభిస్తున్నాడు.

గ్రామీణులు దేన్నైనా ఒక సారి నమ్మితే, వారి విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో “డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావ్ మరియు ఇయాళ” కథ చెబుతుంది. సైన్యంలో డాక్టరుగా చేరి, అక్కడ తను చేసేది పెద్దగా ఏముండదని గ్రహించిన డా. కుబేరనాథరావ్ భైరవపురంలోని ధర్మాసుపత్రిలో వైద్యుడిగా చేరుతారు. ఆయన హేతువాది. వైద్యంతో పాటుగా గ్రామంలోని ప్రజలను చైతన్యవంతులని చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆయన ఆ ఊర్లో సాక్షాత్ దైవం వంటి వారు. ఎటువంటి రోగాన్నైనా చిటికెలో నయం చేయగలరని ప్రఖ్యాతి పొందారు. ఆయన హస్తవాసి మంచిదనే నమ్మకం ప్రజలలో పాతుకుపోయింది. ఇయాళ అనే బాలికకి కడుపు నొప్పి వస్తే, వాళ్ళ అమ్మ బాయమ్మ డాక్టర్ గారికి అన్ని రోగ లక్షణాలు వివరించి, మందు రాయించుకుంటుంది. వాళ్ళ నాన్న హసన్‌లో మా మందు సీసా కొనుక్కొని వస్తాడు. ఆ మందు సీసాను ఆయన ముట్టుకుని, మూత తీసి పెట్టి ఇస్తే రోగం ఇట్టే తగ్గిపోతుందని చెప్పి, ఇయాళను డాక్టరు గారి దగ్గరికి పంపుతుంది బాయమ్మ. డాక్టరు గారు అందులోని అసంబద్ధతని చెప్పి, ఇయాళని వెనక్కి పంపబోతారు. చిన్నబోయిన ఇయాళ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అది చూసి కాంపౌండర్ రామారావ్ – ఆ సీసాని ముట్టుకుని ఆ పిల్లకిస్తే తప్పేంటి అని అడుగుతాడు. బదులుగా అశాస్త్రీయంగా మాట్లాడవద్దని, తాము జీతభత్యాలు పుచ్చుకునేది మూఢనమ్మకాలను వ్యాప్తి చేసేందుకు కాదని అంటారు డాక్టరు. కానీ రామారావు వాదనలోని తర్కాన్ని కాదనలేక చివరికి ఇయాళని పిలిచి, ఆ మందు సీసా తీసుకుని, మూత విప్పి, మళ్ళీ పెట్టి ఇస్తారు. ఇయాళ సంతోషంతో ఇంటికి బయల్దేరుతుంది. అయితే, ఆమె ఇంటికి చేరదు. ఎవరో ఆమెని కర్పూర వృక్షం దగ్గర ఓ పెద్ద బండ దగ్గర హత్య చేసి పడేసారు. ఆ హత్య చేసింది ఎవరో తెలియదు. రాజకీయాలు తెలెత్తుతాయి. చనిపోయిన ఆ పిల్లను ఉపయోగించుకుని ఎవరి ప్రయోజనాలను వారు సాధించాలని ప్రయత్నిస్తూంటారు. హత్యకి కారణం తెలియదు. పోలీసులు చేతులెస్తేస్తారు. చివరికి అనుకోకుండా, డాక్టరు కుబేరనాథరావ్ ఆ కారణాన్ని తెలుసుకుంటారు. హంతకుడెవరో వెల్లడి చేస్తారు. తన వృత్తి ధర్మం పరిధి నుంచి బయటపడి, మానవత్వం ఉన్న మనిషిగా ప్రవర్తించినందుకు డాక్టరుగారికి సంతోషమవుతుంది. కానీ జనాలు మాత్రం కుబేరనాథరావ్ ప్రేతాత్మలను లొంగదీసి, నిజాలు వెల్లడి చేయించాడని నమ్మసాగారు. ఆయన ఏ విధానాన్ని నమ్మక తిరస్కరిస్తూ వచ్చారో, అదే సిద్ధాంతాన్ని జనాలు రహస్యంగా ప్రతిపాదించడం కాలపురుషుడిలోని అపహాస్యమేనంటారు రచయిత. ధర్మాసుపత్రి వర్ణన, వైద్యం కోసం అక్కడ ఎదురుచూస్తున్న వ్యక్తుల హావభావాలు, ప్రవర్తన కళ్ళకు కట్టినట్టు చిత్రించారీ 31 పేజీల ఈ పెద్ద కథలో.

ఆ పల్లెలలోని జనమంతా ఒక రకమైన విచిత్రంగా ఉండే వ్యవహరాలలో మునిగి తేలుతుండేవారు. ఉత్తిగనే కాలాన్ని గడుపుకొనే వ్యవహరాలులాగ ఉంటుండేవి వారి పనులు. వెళ్ళేది, వచ్చేది, కూలబడేది నిలుచుండేది… ఈ తరహలో ఉండే ఈ పల్లెజనంకు… ఎలెక్షన్ల కాలంలో వీళ్ళకు ఏమి ప్రలోభాల్ని చూపించి, వీళ్ళనుంచి ఓట్లు గుంజుకొనేది ఎలాగబ్బా అనేది ఒక సమస్యగా ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులకు అంతుచిక్కని సవాల్ అన్నట్టుగా ఉంటుండేది.

అవనతి కథ ఇస్లాపుర, ఇత్తావర, నస్లాపుర, సంగాపుర, మల్లినమడుగు అనే అయిదు గ్రామాల వర్ణనతో మొదలవుతుంది. ఈ అయిదు పల్లెలు విశిష్టమైనవి. అక్కడ మిగతా గ్రామాల్లో ఉండే కక్ష్యలూ, కార్పణ్యాలు లేవు. మత కలహాలు లేవు.. పేద గొప్ప తేడాల్లేవు. ప్రస్తుత ద్వేషమయ రాజకీయ దొమ్మరాటలకు ఈ పల్లెలు పెను సవాలుగా ఉన్నాయి అంటారు రచయిత. ఈ పల్లెల్లో ఉన్న ఇద్దరు గొప్ప వ్యక్తులలో ఒకరైన సూరాచారి, ఈరేగౌడతో కలిసి ఇస్లాపుర నుంచి ఇత్తావరకు వెడుతుండంతో కథ ప్రారంభం అవుతుంది. సూరాచారి నిజానికో శిల్పి. దేవాలయం నిర్మాణానికి ఇస్లాపుర వచ్చిన సూరాచారి అనుకోని పరిస్థితులలో ఇక్కడే ఇల్లరికం ఉండిపోవాల్సి వస్తుంది. కొన్నాళ్ళు దేవుడి విగ్రహాలు, మందిరాలు తయారు చేసి ఇచ్చినా, సూరాచారికి పెద్దగా పని ఉండేది కాదు. కొన్నాళ్ళకి రుబ్బురాళ్ళు, తిరగళ్ళకి గాట్లు పెట్టే పని తప్ప మరొకటి దొరకదు. ఏం చేయాలో తోచదు. చివరికి జనాల కోరిక మీద టేకు చెక్కల నుంచి గ్రామ దేవత బొమ్మలను తయారు చేయడం మొదలుపెడతాడు. కానీ జనాలకి ఆ బొమ్మలు నచ్చేవి కావు. ఆ బొమ్మలలో వాళ్ళకి దెయ్యం కనపడేది గాదు. ఆ బొమ్మలని అంత అందంగా ఎందుకు చేస్తారని ఆక్షేపించేవారు. అనాకారితనం కొట్టొచ్చినట్లు కనపడే బొమ్మలి తయారుచేస్తే వాళ్లెంతో సంతోషిస్తారు. ఈ పనులు చాలవన్నట్లు… మంత్ర తంత్రాలతో తాయెత్తులను ఇవ్వడం, మందుమాకు ఇవ్వడం, విభూది పెట్టడం వంటి ఇతర పనులు చేపట్టాడు. కాలం గడపడం కోసం ఇంకా అనేకానేక పనులు చేసేవాడు. బాకీవసూళ్ళు, ఎడ్ల అమ్మకంలో మధ్యవర్తిగా ఉండడం, పెళ్ళిళ్ళు కుదర్చడం ఇలాంటివన్న మాట. ఉబుసుపోని జనాల మధ్య ఓ పనిలేని తెలివైన వ్యక్తి కూడా ఎలా పతనమవుతాడో చెబుతుందీ కథ. ముప్ఫై నలభై సంవత్సరాల క్రితం గ్రామీణ భారతంలోని జీవనాన్ని అత్యంత సుందరంగా చిత్రించిన కథల్లో ఇది ఒకటి.

పోస్టాఫీసు ఆత్మకూరులో కొత్తగా తెరవబడినప్పుడు బొబణ్ణ ఉదయంలో ఒక గంట, సాయంకాలంలో ఒక గంట టెంపరరీగా పోష్ట్‌మాష్టర్ డ్యూటి చేసేందుకు ఒప్పుకొన్నాడు. బోబణ్ణ ఒప్పకొన్న మీదట అతనుండే ఇల్లరికం ఇల్లే టెంపరరీ పోస్టాఫీసుగా రూపాంతరం చెందింది. అందరూ బోబణ్ణను పోస్టమాష్టరుగారు అని గౌరవంగా సంభోధిస్తుండేవారు. బోబణ్ణలో తానొకడే ఢిల్లి సర్కారు (కేంద్రప్రభుత్వం)తో సంపర్కాన్ని పొందిన ఇండియన్ అనే గర్వం తొణకిసలాడుతుండేది.

ఓ బలహీనమైన క్షణంలో చేసిన తప్పు ఎలా వెంటాడి వేధిస్తుందో, “ఆత్మకూరులోని పోస్టాఫీసు” కథ చెబుతుంది. కొత్తగా పెట్టిన పోస్టాఫీసుకి, ఆత్మకూరులో ఎస్. ఎస్. ఎల్. సి. దాకా చదువుకున్న బోబణ్ణని పోస్ట్ మాస్టర్‌గా నియమిస్తుంది ప్రభుత్వం. ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలలో చాలామంది నిరక్షరాస్యులు కావడంతో, వారికొచ్చిన ఉత్తరాలను చదివి పెట్టడం, వారు రాయాల్సిన ఉత్తరాలను రాసిపెట్టడం వంటి పనులు చేస్తూంటాడు బోబణ్ణ. ఊర్లో పోస్ట్‌మాన్ సౌకర్యం లేకపోవడం వల్ల వచ్చిన ఉత్తరాలన్నీ జాయికాయ పెట్టెలో పడేస్తుండేవాడు. జనాలు వచ్చి ఆ పెట్టెలో వెతుక్కుని తమ ఉత్తరాలు తీసుకువెళ్ళేవారు. అదే సమయంలో ఇతరుల ఉత్తరాలు కూడా చదివేస్తూండేవారు. ప్రస్తుతం బోబణ్ణ ఎంతో దిగులుగా ఉన్నాడు. ఆ దిగులుకి కారణం అతను చేసిన ఓ దొంగతనం. ఆ ఊర్లో ఓ కుర్రాడికి వచ్చిన ఓ కవర్‌ని ప్రేమలేఖగా భావించి దొంగతనంగా చించి తెరుస్తాడు. కానీ అందులో ఓ అర్థనగ్న సుందరి బొమ్మ ఉంటుంది. ఆ క్షణం నుంచి అతనిలో మనో వికారం మొదలవుతుంది. అప్పట్నించి అతను ఆ ఊరికొచ్చే ప్రతీ కవర్‌నీ తెరచి చూసి, వాటిల్లో సుందరాంగుల బొమ్మలేమయినా ఉన్నాయేమోనని వెతికేవాడు. పనిపాట లేని జనాలు పోస్టాఫీసు దగ్గర చేరి ఆయా ఉత్తరాల్లోని విషయాల్ని చర్చించుకుంటూంటారు. ఈ ప్రక్రియలో ఎన్నో పుకార్లు రేగుతాయి. జనాలు బోబణ్ణని కొట్టడానికి వస్తారు. అంతా గందరగోళమై పోతుంది. చివరికి పోస్టాఫీసు, ఇల్లు వదిలి పారిపోతాడు బోబణ్ణ. ప్రతీ వ్యక్తిలోనూ ఉండే చీకటి కోణాలని బహిర్గతం చేస్తూందీ కథ. ఈ కథ చలనచిత్రంగా నిర్మించబడి, జాతీయ స్థాయిలో “ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా” బహుమతి పొందింది.

అతను మరియు అతని భార్యైన సరోజ…ఆ ఇద్దరే కూర్చుని ఎంత పనినైనా చేస్తుండేవారు. భార్యకు మొట్టమొదలు కాజాల్ని కుట్టేది , గుండీల్ని కుట్టేది మొదలైన చిల్లర పనుల్ని ఇస్తుండేవాడు. సరోజకు కొద్దికొద్దగా బట్టల్ని కుట్టే పనితనం పరిచయం అవుతూ రాసాగగా ఇక ఇప్పుడు బట్టల్ని కత్తిరించే పనిని ఇస్తుండేవాడు. ఇతను రంగు సబ్బుముక్క(బిళ్ళ) నుంచి బట్టమీద కొలతల గీట్లును గీసి ఇస్తుండేవాడు. ఆ గీతలకు అనుగుణంగా సరోజ ఆ బట్టల ముక్కల్ని కత్తిరించి ఇస్తుండేది.

ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్ళిచేసుకున్న వాళ్ళు తమ మధ్య ప్రేమని చివరి దాక ఒకేలా ఎందుకుంచుకోవాలో చెబుతుంది “టైలర్ తుక్కోజీరావ్” కథ. తుక్కోజీరావ్ వంశమే బట్టలకు ప్రసిద్ధి. అతని తండ్రి హసన్ పట్టణంలో పేరుమోసిన కట్ పీసెస్ వ్యాపారి. అయితే తుక్కోజీ సామ్యవాద భావాలవైపు మొగ్గుచూపి, తండ్రి అభిమతానికి విరుద్ధంగా ఓ పేద విధవరాలి కూతురు సరోజని పెళ్ళి చేసుకుంటాడు. తండ్రి ఆస్తిలోంచి ఒక చిల్లిగవ్వ కూడా ఆశించకుండా, తన చేతి విద్యని నమ్ముకుని అప్పుడే పెరుగుతున్న గురుగళ్ళికి మకాం మారుస్తాడు. బట్టలు కుట్టడంలో తుక్కోజీకి అద్భుతమైన నైపుణ్యం ఉంది. ఎవరినైనా ఒకసారి తేరిపార చూస్తే వారి శరీరపు కొలతలు అతని మనసుకో ముద్రితమైపోతాయి. అప్పటి దాక రెడీమేడ్ దుస్తులు ధరించే గురుగళ్ళి జనాలు తుక్కోజీ నైపుణ్యం పుణ్యమా అని కట్ పీసెస్ కొనుక్కుని తమ శరీరాకృతికి తగ్గట్టుగా చక్కని దుస్తులు కుట్టించుకుని తిరుగుతున్నారు. భర్తకి సహాయంగా సరోజ మొదట కాజాలు గుండీలు కుట్టడం ప్రారంభించి, క్రమంగా తను బట్టలు కుట్టగలిగే స్థితికి వస్తుంది. కొన్నాళ్ళకి వారికి ఓ కొడుకు పుడతాడు. కృష్ణోజీ అని పేరు పెట్టి కిట్టూ అని పిలుస్తూంటారు. కిట్టూ పుట్టిన తర్వాత సరోజ భర్తకి సాయం చేయడం తగ్గుతుంది. పిల్లవాడు నడక నేర్చే సమయానికి తుక్కోజికి పని ఒత్తిడి బాగా ఎక్కువవుతుంది. సరోజకి బిడ్డతో తీరిక దొరకదు. ఫలితంగా బట్టలు కుట్టడంలో తేడాలొస్తాయి. ఖాతాదారులు గొడవ చేయడం మొదలుపెడతారు. మొదట్లో అన్యోన్యంగా ఉన్న భార్యభర్తల మధ్య తగువులు మొదలవుతాయి. తనని అర్థం చేసుకోవడం లేదని ఇద్దరూ అనుకుంటూంటారు. కొన్నాళ్ళకి బేరాలు తగ్గుతాయి. ఇంట్లో చిరాకులు పరాకులు పెరుగుతాయి. కిట్టు అల్లరి పెరిగిపోతుంటూంది. ఆ ఊర్లో రైలు వంతెన నిర్మాణం కోసం ఓ క్రాలర్ వస్తుంది. కిట్టూ ఆ క్రాలర్‌కి అడ్డంగా వెళ్ళి, దాని అద్దం పగలగొడతాడు. క్రాలర్ డ్రైవర్ వచ్చి తుక్కోజీని మందలిస్తాడు. ఇంకా అల్లరి మానకపోతే, కిట్టూని తాను తీసుకెళ్ళిపోతానని అంటాడా డ్రైవర్. ఒకరి మీద మరొకరు విసిగిపోయి ఉన్న అ భార్యాభర్తలు, “తీసుకుపొండి.. మాకు హాయిగా ఉంటుంది” అని అంటారు. నిజంగానే ఆ డ్రైవర్ పిల్లాడిని ఎత్తుకుని క్రాలర్‌లో కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతాడు. అరగంట అవుతుంది, గంట అవుతుంది, క్రాలర్ జాడ లేదు. భార్యాభర్తలలో అలజడి మొదలవుతుంది. కిట్టూని అడ్డం పెట్టుకుని ఒకరి మీద మరొకరు ప్రతీకారం తీర్చుకోవాలని చూసిన తీరు గుర్తొచ్చి ఇద్దరూ పశ్చాతాప్తం చెందుతారు. క్రాలర్ డ్రైవర్ గురించి ఫిర్యాదు చేద్దామని బయల్దేరుతుండగా డ్రైవర్ తిరిగొచ్చి కిట్టూని అప్పగించడంతో కథ ముగుస్తుంది. ఒక టైలర్ దుకాణం ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్లు చూపిన కథ ఇది.

 ఇక ఇప్పడు ముస్తాఫాలోని టోపి మా క్లాసులో కష్టాల్ని కలిగించసాగింది. ‘టోపి గీపి తీసేదిలేదు. నన్ను కోరేది మానండి. నేను డేర్ డెవిల్ మనుషిని’ అంటూ ముస్తాఫా మొండికేసి కూర్చున్నాడు. ఏమేమి చెప్పినా వినలేదు. మేము సైతం అతను టోపి తీయాల్సిందేనని పట్టుపట్టాము.మొత్తం మా క్లాసులో ముస్తాఫా పరంగా మాట్లాడేందుకు ఏ విద్యార్థి సిద్దమైలేడు. అయినా ముస్తాఫా మాత్రం, ‘’నన్ను వదిలేయండి; నేను డేర్ డెవిల్ లాంటోడ్ని’’ అని అంటూ ఎవరి మాటకు విలువ ఇవ్వకనే కూర్చున్నాడు స్థిరంగా.

హిందూమతానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్న ఓ జూనియర్ కాలేజిలో “జమాల్ అబ్దుల్ ముస్తఫా హుసేన్” అనే కుర్రవాడు చేరతాడు. అయితే ఏ రోజూ కాలేజీకి రాడు. లెక్చరర్ హాజరు పిలిచినప్పుడల్లా మిగతా విద్యార్థులు ఆ కుర్రాడు ఎవరో చూడాలని ఎదురుచూస్తారు. కానీ వాళ్ళకి ముస్తఫా కనబడడు. ప్రతీ రోజూ లెక్చర్ హాజరు పిలవడం, ముస్తఫా పేరు పలికినప్పుడు ఎవరూ జవాబు చెప్పకపోవడంతో మిగతా విద్యార్థులకు చాలా కుతూహలంగా ఉంటుంది. ఎవరితను, ఎందుకు కాలేజీకి రావడం లేదు? అని అనుకుంటూ వాళ్ళ మనసుకి తోచిన కారణాలు ఊహించుకుంటూండేవారు. ఒక రోజు హఠాత్తుగా, ముస్తఫా తరగతికి హాజరవుతాడు. అతన్ని చూసిన విద్యార్థులు విస్తుపోతారు. భిన్న మతాలలోని ఆచార వ్యవహారాలు మనుషుల మధ్య విభేదాలు సృష్టించినట్లే, విద్యార్థుల మధ్య కూడా సృష్టిస్తాయి. మొదట్లో అతన్ని ఆటలలో చేర్చుకోరు. దూరంగా ఉంచుతారు. అయితే వినాయక చవితి సందర్భంగా ముస్తఫా చేసిన మేలు అతడిని మిగతా పిల్లలు ఆమోదించేలా చేస్తుంది. ముస్తఫాలో తుంటరితనం ఉన్నా, అంతకు మించిన సంస్కారం ఉందని, అతను బాగా చదువుకుని భారత ప్రభుత్వం వారి రక్షణ పరిశోధనా విభాగంలో ఉన్నత పదవి సాధిస్తాడు. ముస్తఫా డేర్ డెవిల్ ఎలా అయ్యాడో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.

సాహిత్య స్వరూపం ఏదైనా, అది రాణించాలంటే రచయితకి రచనావస్తువు పట్ల నిబద్ధత అవసరం. కథా వస్తువుని తన నిజ జీవితంలోంచి తీసుకున్నా, సమాజం నుంచి గ్రహించినా, ఆయా వ్యక్తులను అత్యంత సన్నిహితంగా గమనిస్తే తప్పితే రచనను అత్యద్భుతంగా తీర్చిదిద్దలేరు. పూర్ణచంద్రతేజస్వి గారు ఆయన అన్ని రచనలలోనూ ఇదే పని చేసారు. తన చుట్టూ ఉండే వ్యక్తులను అత్యంత సమీపం నుంచి గమనించి, వారి స్వభావాలను, నైజాన్ని అక్షరబద్ధం చేసారు. కథలో తారసపడే ప్రదేశమైనా, సంఘటన అయినా చదువుతుంటే కళ్ళకు కట్టినట్లుంది. తోటివారితోనూ, పరిసరాలతోనూ ఎంతో సాన్నిహిత్యం ఉంటేగాని ఇదంతా సాధ్యం కాదు. ఒకప్పటి గ్రామీణులలోని అమాయకత్వం, సంస్కారం, సానుభూతి, కుళ్ళు, కుత్రలు, కుతంత్రాలు…. ఇలా మంచీ చెడూ అన్నింటిని ఆయా పాత్రల ద్వారా సమగ్రంగా వ్యక్తీకరించారు రచయిత. మనుషుల మనస్తత్వాలు, ద్వంద్వప్రవృత్తులు, మూఢ విశ్వాసాలు వారి జీవనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథలలో చూడచ్చు.

పూర్ణచంద్ర తేజస్వి గారి ఈ అయిదు కథలు మన లోపలి వ్యక్తులను మనకి పరిచయం చేస్తాయనడంలో అనుమానం లేదు.

***

మొత్తంగా తరచి చూస్తే, చక్కని కన్నడ కథలని తెలుగు పాఠకులకు అందించే మరో ప్రయత్నం ఈ సంకలనం అని చెప్పవచ్చు. మంచి కన్నడ కథలని శ్రమకోర్చి తెలుగు పాఠకులకు అందించిన రామగోపాల్ గారు అభినందనీయులు. ఈ పుస్తకంలోని మిగతా కథలని గురించి మరోసారి ముచ్చటించుకుందాం.

 

“డా.వెలిగండ్ల శ్రీయుత కుబేర్‌నాథరావు మరియు ఇయాళ”పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. 198 పేజీల ఈ పుస్తకం వెల రూ.200/- (విదేశాలలోని తెలుగువారికి $10.). ప్రతులకు రచయితనూ సంప్రదించవచ్చు.
చిరునామా: Sakhamuru Ramagopal,
5-10, Road No. 21,
Deeptisri Nagar, Miyapur (post),
Hyderabad – 500 049;
Ph: 09052563666; email: ramagopal.sakhamuru@yahoo.co.in
kolluri–కొల్లూరి సోమ శంకర్

వీలునామా

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

  జేన్ కొత్త బాధ్యతలు       

అనుకున్నట్టే ఆ తరవాత కొద్దిరోజులకే బ్రాండన్ పెగ్గీ ఇంటికొచ్చి జేన్ కి ఫిలిప్స్ ఇంట్లో ఉద్యోగం ఖాయమయినట్టే చెప్పాడు. మరో రెండు రోజుల్లో ఫిలిప్స్ స్వయంగా ఎడిన్ బరో వచ్చి జేన్ ని కలిసి అంతా ఖాయం చేద్దామనుకుంటున్నారట.

మరో రెండు రోజులకి ఫిలిప్స్ పెగ్గీ ఇంటికొచ్చాడు. అయితే తన కూడా పిల్లలు ఎమిలీ, హేరియట్ ని తీసుకు రాలేదు. ఇద్దరూ జలుబుతో పడకేసారన్నాడు. పిల్లల్ని చూడాలని ఎంతో ఆశపడ్డ పెగ్గీ నిరాశ చెందింది.

జేన్, ఎల్సీ ఇద్దరూ ఫిలిప్స్ ప్రవర్తనా, మర్యాదా, మన్ననా చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, పెగ్గీ ఆయన ఇంట్లో పనిమనిషి! అయినా పెగ్గీతో, పెగ్గీ ఇంట్లో పిల్లలతో, తాతగారు లౌరీ తో ఫిలిప్స్ చాలా మర్యాదగా మాట్లాడాడు.

ఫిలిప్స్ ఇద్దరు అక్క చెల్లెళ్ళతో మాట్లాడి తన ఇంటికి జేన్ లాటి మనిషి అవసరం వుందని అనుకున్నాడు. తన ఇంటి వ్యవహారాలు చూస్తూ, పిల్లలకి చదువులు చెప్తే ఏడాదికి డెభ్భై పౌండ్లు జీతం కింద ఇస్తానని చెప్పాడు. అయితే జేన్ రెండే రోజుల్లో బయల్దేరవలసి వుంటుంది.

“మేము ఈ ఎండాకాలం ఇటువైపే వస్తున్నాము కాబట్టి మీరూ ఎడిన్ బరో వచ్చి మీ చెల్లాయిని కలుసుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం మీరు వెంటనే నాతో బయల్దేరాల్సి వుంటుంది.” అన్నాడు ఫిలిప్స్.

“అలాగే బయల్దేరతాను. ఎల్సీ కి వీడ్కోలు చెప్పడం తప్ప ఇక్కడ నాకు మాత్రం పెద్ద పనేముందని?” అంది జేన్.

“అయ్యా! ఇంతకీ పిల్లలెలా వున్నారు?  నేను ఆస్ట్రేలియా వదిలేటప్పటికి ఎమిలీకి నాలుగున్నరేళ్ళు. ఇప్పుడు బాగా పొడుగయిందా?” కుతూహలంగా అడిగింది పెగ్గీ. “ఈ ఎండాకాలం ఇక్కడికే వస్తున్నామని చెప్పా కదా? అప్పుడు చూద్దువుగాని. ఎల్సీ నిన్నయితే గుర్తు పడుతుంది, నువ్వు దాన్ని గుర్తు పడతావో లేదో కాని! నీకు గుర్తుందా పెగ్గీ? ఒకసారిఎవరో ఆర్టిస్టుతో నీ బొమ్మ గీయించా. అదింకా వుంది ఎల్సీ దగ్గర!”

“అవునా? అయినా మీరు పిల్లల్ని గారాబం చేసి పాడు చేస్తారు సారూ! హేరియట్ తరవాత పుట్టిన పిల్లల పేర్లేమిటి?”

“కాన్స్టాన్స్, హ్యూబర్ట్, ఈవా.”

“ఆహా! అమ్మగారికి ఇంగ్లండు నచ్చిందా?”

“చాలా! ఇక్కడి నించి ఆస్ట్రేలియా రాననే అంటోంది. నాక్కూడా ఆవిడ పిల్లల్ని పట్టుకుని ఇక్కడ వుండడమే మంచిదనిపిస్తోంది. నేను వెళ్తూ వస్తూ వుంటాననుకో.”

“అవునండీ! ఇక్కడైతే స్నేహితులూ కుటుంబమూ వుంటాయి. అందుకే ఆవిడకి ఇక్కడ నచ్చి వుండొచ్చు. మిగతా అంతా ఎలా వున్నారు? బెన్నెట్, మార్తా బాగున్నారా? మార్తా టక్ ని పెళ్ళాడిందేమో కదా?”

“అవును పెగ్గీ! ఇద్దరూ అక్కడే వున్నారు. బెన్నెట్ ఎంత పని మంతురాలో ఎంత మంచిదో నీకు తెలుసు కదా? ఆవిడ మొగుడేమో తాగుబోతు, సోమరి. అదే తెలివి తక్కువ మార్తాని అందర్లోకీ కష్టపడి పనిచేసే టక్ కట్టుకున్నాడు. కొన్నిసార్లు ఇలాటి అవక తవక పెళ్ళిళ్ళని చూస్తే విచిత్రంగా వుంటుంది.”

ఫిలిప్స్ వెళ్ళిపోయింతర్వాత పెగ్గీ అమ్మాయిలతో,

“మగవాళ్ళకి తమ పెళ్ళి తప్ప అందరి పెళ్ళిళ్ళూ అవక తవకగానే అనిపిస్తాయనుకుంటా! నాకైతే అసలు ఫిలిప్స్ గారి పెళ్ళే అన్నిటికన్నా అవకతవక పెళ్ళి అనిపిస్తుంది. జేన్, నువ్వు శ్రీమతి ఫిలిప్స్ గారితో కచ్చితంగా వుండలి సుమా! ఆయనేమో మహా మెతక మనిషి,” అంది.

***

veelunama11

ఫిలిప్స్ దగ్గర అక్కకి ఉద్యోగం ఖరారు కాగానే ఎల్సీ శ్రీమతి డూన్ దగ్గర కుట్టు పనిలో చేరడానికెళ్ళింది. జేన్ కి దొరికీ ఉద్యోగం సంగతి విని డూన్ ఎంతో సంతోషించింది.

రెన్నీ కుటుంబం జేన్ వెళ్ళే ముందు ఆమెకోసం చిన్న విందు కూడ ఏర్పాటు చేసారు. ఎలీజా రెన్నీ అయితే అక్క చెల్లెళ్ళిద్దరినీ తాను బ్రాండన్ కి పరిచయం చేయడం వల్లనే ఇదంతా జరిగిందని ఎంతో సంతోషించింది. వాళ్ళ ఇంట్లో విందుకు బ్రాండన్, ఫ్రాన్సిస్, లారా విల్సన్ అందరూ వచ్చారు. ఫ్రాన్సిస్ మొహం వేలాడేసుకుని కూర్చున్నా, బ్రాండన్ తన జోకులతో అందరినీ నవ్వించాడు.

రెండు రోజుల అనంతరం జేన్ తో పాటు ఫిలిప్స్ మాత్రమే కాకుండా బ్రాండన్ కూడా వున్నాడు. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు. జేన్ మాత్రం తన ఆలోచనల్లో తనుండిపోయింది.

***

ప్రయాణం ముగిసి ఇల్లు చేరిన జేన్ శ్రీమతి ఫిలిప్స్ ని చూడగానే ఆశ్చర్యంతో నిల్చుండిపోయింది. తన  జన్మలో అంత అందగత్తెని చూసి వుండలేదు మరి. అయితే ఆమె నోరెత్తి మాట్లాడగానే ఆ పారవశ్యం కొంచెం భంగమైన మాటా నిజమే. ఏ మాత్రం విద్యాగంధమూ, సంస్కారమూ, నాజూకూ లేని మొరటు తెలివితక్కువ మాటలతో ఆమె మౌనంగా వుంటే బాగుండనిపిస్తుంది పక్కవారికి.

కానీ, ఆమె అందం మాత్రం వర్ణనాతీతం. పొడవుగా, మంచి అంగ సౌష్ఠవం తో పాటు, పాల మీగడలాటి రంగూ, అద్దాల్లాటి చెక్కిళ్ళూ, బాదం కాయల్లాటి మట్టి రంగు కళ్ళూ, ఎర్రటి పెదిమలూ, తరంగాల్లా భుజాల చుట్టూ పరుచుకున్న మెత్తటి ఒత్తైన జుట్టూ, ఆమె వైపు ఎంతసేపైనా చూస్తూ వుండిపోవచ్చు.ఆమెని చూడగానే ఆమెని ఫిలిప్స్ ఎందుకు అంతగా ఇష్టపడి చేసుకున్నాడో అర్థమయిపోతుంది. అంత అందగత్తెనని ఆమెకూ తెలిసే వుండాలి. దాంతో సహజంగా ఆత్మ విశ్వాసమూ, ఇతర్లు తన మాట జవదాటరన్న నమ్మకమూ వుండే వుంటాయి. ఈవిడ కింద పని చేయగలుగుతానా, అని భయపడింది జేన్.

ఆమె పెగ్గీ వర్ణించినదానికంటే బాగున్నట్టనిపించింది జేన్ కి. పెగ్గీ వర్ణించింది పదహారేళ్ళ పసి మొగ్గని. ఇప్పుడు తన ముందున్నది ఇరవై యేడేళ్ళ పరిపక్వమైన స్త్రీత్వం. అయిదుగురు పిల్లల తల్లిలా అనిపించనేలేదామె. ఎమిలీకి తల్లి పోలికా,తల్లి అందమూ రాలేదు. అయితే మహా చురుకు. హేరియట్ కొంచెం ముద్దుగానే వున్నా, తల్లి అందం ముందు దిగదుడుపే.

వాళ్ళు ఇల్లు చేరగానే ఎమిలీ తండ్రిని చుట్టుకుపోయింది. హేరియట్ ఆయన వళ్ళోకెక్కి కూర్చుంది. కాన్స్టాన్స్ ఆయన గడ్డాన్ని పీకడం మొదలు పెట్టాడు. మొత్తానికి అందరికీ తండ్రి దగ్గర చాలా చేరిక లాగుంది.

“అబ్బ! నువ్వొస్తున్నావని ఫిలిప్స్ చెప్పగానే ఎగిరిగంతేసా జేన్! ఈ పిల్లల పనీ, ఇంటిపనీ తెగక చస్తున్నాను. అయినా ఇంగ్లండు వచ్చేది ఏదో కాలక్షేపానికో సరదాకో అనుకున్నా కానీ ఈ గొడ్డు చాకిరీ వుంటుందని నాకేం తెలుసు! ఇదిగో పిల్లలూ! కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. లేకపోతే మీ పంతులమ్మ వెళ్ళిపోతుంది.”

“నేను నా ఇష్టమొచ్చినట్టుంటా, నాన్న దగ్గరున్నట్టే!” ఎమిలీ తండ్రి మొహం మీద ముద్దులు కురిపిస్తూ అంది.

“ఎమిలీకి అసలు కుదురే వుండదు. అసలు దానికి బుధ్ధి చెప్పేవాళ్ళే దొరకలేదు ఆస్ట్రేలియాలో, ఇక్కడ ఇహ మీ శిక్షణలో కొంచెం బాగు పడుతుందేమో!” బ్రాండన్ అన్నాడు.

ఎమిలీ తండ్రినొదిలి బ్రాండన్ మీదకి ఉరికింది.

“బాగు పడటమా? అంటే మీ ఏష్ ఫీల్డ్ ఇంట్లో పిల్లలు ఉంటారే, వాళ్ళలాగానా? వద్దు బాబూ, వద్దు! వాళ్ళంత మొద్దు మొహాలెక్కడా వుండరు. వాళ్ళకి మట్టి పిసికి బొమ్మలు చెయ్యడమూ రాదు, చెట్లెక్కడమూ రాదు, గోడలేక్కడమూ రాదు. ఆ రోజు ఆ తోటలో నేనూ హేరియట్ ఎంత హాయిగా పరుగులు తీస్తూ ఆడుకున్నామో! వాళ్ళకేమో అసలు పరిగెత్తడమంటేనే భయం!” అల్లరిగా అంది ఎమిలీ.

“మరి వాళ్ళలాగా నీకు చదువొచ్చా? అయినా ఫిలిప్స్! ఇక నేను వీళ్ళని ఏష్ ఫీల్డ్ తీసికెళ్ళను. తోటంతా పరుగులు పెడుతూ మన పరువు తీస్తారు.”

“తీసికెళ్ళకపోయినా ఏం ఫర్వాలేదు. అసలక్కడ మాకెంత బోరు కొట్టిందో! హేరియట్ కి అక్కడ నచ్చిందేమో నాకు తెలియదు మరి!”

“నాకు పుస్తకాలంటే అసహ్యం!” వున్నట్టుండి అంది హేరియట్.

“బొమ్మల పుస్తకాలో, కథల పుస్తకాలో అయితే తప్ప!”

“జేన్! పిల్లల మాటలు పట్టించుకోకండి,” ఫిలిప్స్ సంజాయిషీగా అన్నాడు.

“అయ్యో! మరేం ఫర్వాలేదండీ. కొన్నాళ్ళకి వాళ్ళకి చదువూ, పుస్తకాల మీద ఇష్టం కలిగించడానికే ప్రయత్నిస్తాను.”

“లిల్లీ! పెగ్గీ అక్కయ్య పిల్లలు ఏం చదువుతారనుకున్నావు? అంతా జేన్ చలవే! పెగ్గీ వాళ్ళకోసం ఎంతెంత డబ్బు కర్చు పెడుతోందో!”

“పెగ్గీ కెలాగైనా మధ్య తరగతిలోకెళ్ళిపోవాలన్న ఆశ. మరీ ఆకాశానికి నిచ్చెనలు వేయడం అంత మంచిది కాదేమో!”

“ఆ పిల్లల తెలివితేటలూ కష్టమూ చూస్తే నువ్వీ మాట అనవు. ఏదో ఒక రోజు నేను టాం లౌరీ ఎదుట టోపీ చేతిలో పట్టుకుని నిలబడ్డా ఆశ్చర్యం లేదు!”

“పో స్టాన్లీ! నీవన్నీ పిచ్చి మాటలు” లిల్లీ అతన్ని వేళాకోళం చేసింది. ఫిలిప్స్ దంపతుల పేర్లు లిల్లీ,  స్టాన్లీ అని అప్పుడే తెలిసింది జేన్ కి.

“మాటలు కాదు. టాం నిజంగానే ఒక పెద్ద ఇంజినీరయ్యాడనుకో, ఏ రైల్వే లైనో వేయించడానికి ఆస్ట్రేలియా వచ్చాడనుకో, అప్పుడు నేను చెప్పినట్టేగా అయేది. అదంతా ఎందుగ్గానీ, నాకు ఆ పిల్లలనీ, వాళ్ళ చదువులనీ చూస్తే ముచ్చటగా అనిపించినమాట నిజం. దానికంతటికీ కారణం జేన్ వాళ్ళకిచ్చిన శిక్షణ అని చెప్పింది పెగ్గీ!”

“ఓ! అందుకన్నమాట నువు జేన్ ని ఇక్కడకి తీసుకొచ్చింది,” నవ్వాడు బ్రాండన్.

“నాకూ పెగీ పిల్లలు నచ్చినా, మరీ నీ అంత కాదు. ఎమిలీ, నిన్ను జేన్ మెల్విల్ ఆ పెగ్గీ పిల్లల్లా తయారు చేయాలన్నదే మీ నాన్న ఆస. వాళ్ళలా నీకూ చదువు మీదా, విద్య మీదా ఆసక్తి పెరిగిపోతుంది ఇక!” ఎమిలీని వేళాకోళం చేసాడు బ్రాండన్.

“మీకు చిన్నప్పట్నించీ చదువుకోవడం అంటే ఇష్టంగా వుండేదా?” కుతూహలంగా జేన్ ని అడిగింది ఎమిలీ.

“అవును ఎమిలీ!” నవ్వుతూ జవాబిచ్చింది జేన్.

“మా అమ్మ కూడా అదే మాట అంటుంది, కాని ఆవిడ అసలు స్కూల్ కెళ్ళిందే లేదు. మరీ ఇంతింత కాకపోయినా, కొంచెం చదువు బానే వుంటుందేమో!”

లిల్లీ ఫిలిప్స్ కి జేన్ చాలా నచ్చింది. ఆమె చదువు ఎక్కువై వుండొచ్చు కానీ, రూపు రేఖలు చాలా సామాన్యం గా వున్నాయి. దాంతో ఒకలాటి జాలి కలిగిందామెకు జేన్ పట్ల. దానికి తోడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని విన్నది.

అందులో ఆమెకి ఇంటి పనులు చేసుకోవడం, డబ్బు లెక్కలు చూసుకోవడం కొంచెం కూడా చేత కాదు. ఎంతో ఓపికస్తుడూ, పెళ్ళాన్ని విపరీతంగా ప్రేమించేవాడూ అయిన ఫిలిప్స్ కూడా భార్య దుబారా ఖర్చు చూసి కొంచెం విసుక్కున్నాడు. ఇప్పుడిక ఆయనే వెతికి ఇంటి పనికీ డబ్బు లెక్కలకీ ఒక మనిషిని పెట్టాడు కాబట్టి తాను ఆ బాధ్యతలన్నీ పట్టించుకోనక్కరలేదు. అందువల్ల జేన్ తో వీలైనంత మంచిగా ప్రవర్తించాలని నిశ్చయించుకుంది.

రాత్రి పది కొట్టగానే లిల్లీ ఫిలిప్స్ నిద్రొస్తూందని వెళ్ళి పడుకున్నది. వెళ్ళేముందు భర్తతో జేన్ కి అప్పజెప్పవల్సిన బాధ్యతలు గుర్తు చేసి మరీ వెళ్ళిందావిడ.

రాత్రి పొద్దుపోయేంతవరకూ ఫిలిప్స్ జేన్ కి శ్రధ్ధగా ఇంటి వ్యవహారాలూ, జమా ఖర్చులూ అన్నీ బోధపర్చాడు. ఇంటి తాళాలూ, లెక్క పుస్తకాలూ, అన్నీ జేన్ కి అప్పగించాడు.

“జేన్!నువ్వు ఇంట్లో ఒక ఉద్యోగిలాకంటే, ఇంటి మనిషిగా వుంటే ఎక్కువ సంతోషిస్తాను. నీకు లిల్లీ గురించి మొత్తం తెలియదు. ఆమె వయసులో పెద్దదైనా ఆ పిల్లల కంటే పసిది. నీకు వీలైతే నువ్వు ఆమెకీ కొంచెం చదువూ సంస్కారం నేర్పితే నీకెంతో ఋణపడివుంటాను!” ఇబ్బందితో ఆయన మొహం ఎర్రబడింది.

ఆలాగేనని ఆయనకి మాటిచ్చినా, తనకంటే వయసులో పెద్దదీ, మహా రాణులకుండే అందచందాలున్నదీ, ఇంటి యజమానురాలూ అయిన లిలీని చదువు వైపు మళ్ళించడం సాధ్యమేనా అన్న ఆలోచనతో నిద్ర పట్టలేదు జేన్ కి. తన మాట పిల్లలు వింటారో వినరో నని జేన్ బెంగ పడింది. కానీ, ఊరంతా ముద్దూ, గారాబమూ చేయడం అలవాటైన ఫిలిప్స్ పిల్లలకి జేన్ క్రమశిక్షణ నిజానికి బాగనిపించింది. మౌనంగా, తక్కువ మాట్లాడుతూ హుందాగా వుండే తమ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం వాళ్ళకి కొత్తగా, హాయిగా అనిపించింది.

ముందుగా జేన్ వాళ్ళ పాఠ్యాంశాలన్నీ వాళ్ళకి సులువుగా అర్థమయ్యేలాగు మార్చేసింది. అది వాళ్ళకి అన్నిటికన్నా యెక్కువగా నచ్చింది. ఏ సంగతినైనా సరళంగా ఓపిగ్గా బీధించే ఆమె పధ్ధతీ, దానికన్నా అసలామెకున్న విషయ పరిఙ్ఞానమూ వాళ్ళకి చాలా అబ్బురంగా అనిపించింది.  భూగోళశాస్త్రమూ, చరిత్రా లాటి మహా విసుగు పుట్టే అంశాలని కూడా ఆమె చాలా ఆసక్తికరంగా మార్చింది.      తండ్రి దగ్గర ఎమిలీ, హేరియట్ ఇదివరకే చక్కవగా చదవనూ, రాయనూ నేర్చుకున్నారు. వాళ్ళకి రానిదల్లా, లెక్కలూ, చరిత్రా లాటి విషయాలు. స్వతహాగా చురుకైన పిల్లలు కాబట్టి వాళ్ళు జేన్ పధ్ధతులకి వెంటనే అలవాటు పడిపోయారు.

లిల్లీ కి జేన్ మొత్తంగా నచ్చినా, ఆమె స్కాట్ లాండు యాస కొంచెం కూడా నచ్చలేదు. పిల్లలూ అదే యాసతో మాట్లాడతారేమోనని భయపడింది కూడా.

లిల్లీ కి ప్రస్తుతం వున్న సమస్య- తన అత్తవారింటికి వెళ్ళడం. అక్కడ ఆస్ట్రేలియాలో ఆమె నిరక్షరాస్యతనూ, మొరటుతనాన్నీ ఎవరూ పట్టించుకోలేరు. కానీ, ఇక్కడ స్టాన్లీ చెల్లెళ్ళూ, బంధువులూ అంతా చాలా చదువుకున్న వాళ్ళు. మహా నాజూకు మనుషులు. క్రితం సారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తననీ, తన పిల్లల్నీ ఎలా పల్లెటూరు బైతుల్లా చూసారో లిలీ కింకా గుర్తే. జేన్ ని  చుస్తూనే తనూ ఆమెలా చిన్న గొంతుతో మాట్లాడడం, నాజూగ్గా  ప్రవర్తించడం నేర్చుకోవాలనుకుంది. ఇప్పుడు పిల్లల ఆలనా పాలనా అంతా జేన్ చూస్తుండడంతో ఆమెకి తీరిక కూడా చిక్కింది.

ఆమెకి పాపం, చదవడం కానీ, కుట్టు పని కానీ, సంగీతం కానీ, ఏదీ రాదు. ఆవిడకి వచ్చిందల్లా, అలా సోఫాలో కూర్చొని పగటి కలలు కనడం. ఆవిడ అలౌకిక సౌందర్యం వల్ల, ఆమె అలా కూర్చొని ఆలోచిస్తూన్నప్పుడు ఆమె ఏదో అద్భుతమైన తత్త్వ చింతన చేస్తూందేమోనని పిస్తుంది కానీ, ప్రాపంచిక విషయాలు ఆలోచించే మామూలు స్త్రీలా అనిపించనే అనిపించదు.

ఒకానొక మధ్యాహ్నం అలాటి అలౌకిక స్థితిలోనే ఆమె విద్యాభ్యాసం గురించి జేన్ దగ్గర ప్రస్తావించింది. జేన్ చదువూ, ఇతర వ్యాపకాల గురించీ వినగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి, నోరు తెరుచుకుంది. ఆడపిల్ల మగపిల్లల్లా లెక్కలూ, సైన్సూ చదవడమా? అంతవరకూ ఆమె అమ్మాయిల చదువంటే ఏదో సంసార పక్షంగా కుట్లూ అల్లికలూ, కాలక్షేపం పుస్తకాలూ కవితలూ, పది ముందు గొప్పగా చెప్పుకోవడానికి కాస్త సంగీతమూ  అంతే అనుకుంది. కానీ చదువంటే కఠోర పరిశ్రమ అనీ, దాంతో మనసుకీ, మెదడుకీ రెక్కలు మొలిపించుకోవచ్చనీ ఊహించనే లేదు. అసలు చదువు పూర్తయింతర్వాత కూడా జేన్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడం ఆమెకి కొరుకుడు పడని విషయం.

తనకి పదహారేళ్ళకే పెళ్ళయిపోవడం తలచుకొని నిట్టూర్చింది లిల్లీ. అంతకుముందు కూడా ఒకటే ఊర్లు మారడంతో ఆమె ఎక్కడా కుదురుగా బడికి వెళ్ళిందే లేదు. ఆస్ట్రేలియాలో వాళ్ళున్న కొన్ని ప్రాంతాల్లో అసలు ఆడపిల్లలకి బళ్ళే లేవు! ఆ మాటకొస్తే ఇప్పుడూ అంతే. అసలు పిల్లల చదువులు అక్కడుంటే పాడవుతాయనే కదా స్టాన్లీ కుటుంబాన్ని ఇంగ్లండు తీసుకొచ్చింది. ఇప్పుడు లిల్లీకి జేన్ చదువు చెప్తే బాగుండనిపించడం మొదలయింది. కానీ జేన్ ఏమంటుందో! నవ్వుతుందేమో, “ఈ వయసులో చదువుకుని ఏం చేస్తారండీ” అని ఎగతాళి చేస్తుందేమో!

జేన్ ఆ అభిప్రాయాన్ని వినగానే ఎగతాళి చేయలేదు సరికదా, ఎంతో ప్రోత్సహించింది. అయితే ఏ విషయం చదవాలన్న విషయం మీద ఇద్దరూ ఒక అభిప్రాయానికి రాలేకపోయారు.  తనకి పూలు తయారు చేయడమూ, పియానో వాయించడమూ ఇష్టమని చెప్పింది జేన్ తో.

“హ్మ్మ్మ్మ్… దురదృష్టవశాత్తూ అవి రెండూ నాకంతగా రావండి. ఒక పని చేద్దాం. అవి నేర్పించడానికి ఎవరీనా టీచర్లు దొరుకుతారేమో చూద్దాం. అంతవరకూ నేను మామూలు చదువు చెప్తాను. అయితే సంగీతం నేర్చుకోవాలంటే కొంచెం కష్టంపడాల్సి వుంటుందేమో!” అన్నది జేన్.

“ఎందుకూ? ఎమిలీ, హేరియట్ ఏమంత కష్టపడుతున్నారు? కనీసం గంటసేపుకూడా సాధన చేయరు! అన్నట్టు నువ్వుకూడా గంటసేపు సాధన చాలన్నావట?”

“అవును, నేను మూడు గంటలు పియానో దగ్గరఊరికే కూర్చునేకంటే, గంట సేపు శ్రధ్ధగా సాధన చేసి తర్వాత ఆడుకొమ్మన్నాను. ఆ వయసులో అంతకంటే ఎక్కువ అవసరమూ లేదూ, వాళ్ళు చేయనూ లేరు. అదే మనలాటి వాళ్ళం ఎక్కువ సమయమూ శక్తీ వెచ్చించాల్సి వుంటుంది,” వివరించింది జేన్.

“అవునవును! అప్పణ్ణించి పిల్లలు రోజూ సాధన చేస్తున్నారట. నాతో చెప్పారు. అయితే నీకొచ్చిందే నాకు నేర్పు. సంగీతం రాకుంటే అది వొదిలేద్దాం.”

***

(సశేషం)

 

 

“మో” రికామీ చరణాల మననం…

 

వేగుంట మోహన ప్రసాద్

వేగుంట మోహన ప్రసాద్

“అట్లా అని పెద్ద బాధా ఉండదు” అవే అవే పాదాల్ని పదే పదే బెంగగా కలగలిపి పాడుకునే మెలాంకలీ లోని నిరీహ తప్ప ఎక్కువగా చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. బహుశా అది “కేవలం దుఃఖానుభూతినైనా పొందలేని డెస్పరేటశక్తత“ కూడా కావచ్చు. మండే వెల్తురు తప్ప కప్పుకోని పూలనీ, అనాచ్ఛాదిత స్వేచ్ఛతో అహరహం చిగుర్లెత్తే సమస్త ప్రకృతిలోని జీవాన్నీ తనలో నింపుకోలేక ఆర్తిచెందిన కవి విషాదం కావచ్చు. “విషాదంలోంచి దుఃఖంలోకి/దుఃఖం లోంచి శోకంలోకి” ఆరోహించే లక్ష సారంగీల వేదనారాగాలు కావచ్చు.

 

“చితి-చింత” సంపుటిలోని “మో” కవితల్లో వికసించిన మందారాల్లా, “ఈ దుఃఖానికి మరికొంచెం వెలకట్టండని దీనంగా ఏడుస్తూ” మందారాలమ్ముకునే వాడి విఫల కాంక్షల గుర్తుల్లా, “ఎగరబోతూ ఎగరబోతూ నేల కూలిన గాలిపటం” పైని రికామీగాలి మోసుకొచ్చిన పాటల్లా, అట్టడుగున జివ్వున సెల ఊరుతున్న చెలమల్లా, పొడవూ వెడల్పుల కొలతలన్నిటినీ లోతులుగా మార్చుకున్న అభివ్యక్తులు కొన్ని బృందగానం చేస్తుంటాయి. “ఎంతో ఎత్తు మీంచి నీచంగా కిందికి చూచే ఆత్మ, ఏ దుఃఖాన్నైనా విదుల్చుకోగలదా? ” అని ప్రశ్నిస్తూ “చెప్పుల్లేక వేయించిన ఇసుక మీద పరపరా నడిచెళ్ళే” మో కవితా భావాల బహుముఖ రూపాల్లోని ఒక ముఖాన్ని ఇక్కడ కాసేపు చూసిపోదాం.
 

త్రికాల బాధితం

 

మనసు నుంచి బయటకు తప్పుకోవాలి

నేను

ఇంటిముంగిట నాల్క చాచి పడుకుని రొప్పే

కుక్క

లాగా కడకొక ఎంగిలి విస్తరాకేనా ఎవరేనా విసిరేస్తారని

చూస్తూ ఉండాలి కడు జాగరూకతతో

నిశ్చేష్టిత నిర్భాషిణి నిత్యం కుంగుతూండే సరస్సు మనసు

చూస్తూ ఉండాలి ఏ కమలం ఉబుకుతుందో పైకి.

ఒంటి మీద ఒక ఈగేనా వాలినా గుండ్రంగ గంతులు వేయాలి.

పైన బస్సు

కింద రైలు

మధ్య వంతెన

ఈ రెండూ

ఇహ పరాలు కోసుకున్న క్లారినెట్ స్పీడ్

రైలు నెత్తిమీద వొంతెన విరిగిపడిన జ్ఞాపకం.

ఇహం పొట్టి

పరం దూరం

వేగం ఒకటే

టైమ్ వేరు

టెన్స్ వేరు

ట్రైన్ పొడుగు

టెన్స్ పొట్టి

టైమ్ పొడుగ్గా పర్చుకున్న వెడల్పు.

వర్తమానపు విత్తు భవిష్యద్వృక్షం.

కొన్నాళ్లకా మర్రిచెట్టు భూతం.

ఆ మర్రి, రావి, జువ్విచెట్ల జుత్తు ఆకాశంలోకి

మనకిప్పటి భూతం భూమిలో వేళ్ళు.

భావం మారదు స్వభావం మారదు

పదం మార్తుంది క్రియాపదం మార్తుంది.

ఉదాహరణని క్షమించాలి

ఉదాసీనం పనికిరాదీ విషయాల్లో.

If you wrote to me tomorrow morning

I would kiss you in the evening.

వాన కురిస్తే మాత్రం వీలుండదు.

వీలు కుదరలేదూ అంటే వాన కురిసిందీ అని అర్ధం.

నీ ఉత్తరం, వర్తమానం లేదో

ఇట్లా వర్తమానం లేని నాలాటివాడు

గతంలోకీ భవిష్యత్తులోకీ, ఇంట్లోంచి బయటికీ

తిరుగుతూ నాల్క చాచుకుని కాపలాకాస్తుంటాడు

ఇహానికీ పరానికీ చెడుతూ.

 

 

వ్యాఖ్యానం:

మనసు- అత్యాశలు పోయి ఆకాశాల్లో తిరుగుతుంది. నిండుపచ్చటి ఆకులపైని ఎండమబ్బుల మిలమిలల్ని మేసి మనసు నింపుకుంటానంటుంది. సాధ్యాసాధ్యాలు, అవసరపు ఆకలీ, పగిలే దేహమూ, పోయే ప్రాణమూ లెక్ఖలేదు. మరి ఏదోలా బతకాలంటే, లేకలేక ఉన్న ప్రాణాన్ని నిలబెట్టుకోవాలంటే బయటపడక తప్పదు మనసునుండి. ఊహల మత్తులో మూసుకుపోతున్న కనురెప్పల్ని నిలిపి- ఇటు చూడు దారిదే అని ఉసిగొల్పి చూపుల్ని తిప్పి “కడకొక ఎంగిలి విస్తరాకేనా ఎవరేనా విసిరేస్తారని చూస్తూ ఉండాలి కడు జాగరూకతతో.”

 

కుంగిపోతుంది మనస్సు అట్టడుక్కో లోలోతుల్లోకో, మరింత కిందకు కుదించుకుని ఏ పాతాళగంగలోనో మునగొచ్చనే ఆశతో లోపలికి అలలెత్తే సరస్సు లాగా. ఉపరితలం మీద మాత్రం “నిశ్చేష్టిత నిర్భాషిణి” లా నిశ్చలమై కనపడుతుంది. “ఏ కమలం ఉబుకుతుందో పైకి” అనే ఎదురుచూపుకి ఆయువు అనంతం కాబట్టి దొరికే ప్రతీ గడ్డిపువ్వునీ పోగు చేసుకుని, తాకే ప్రతీ మాములు గాలిని లోపలికి నింపుకుని, చివరికి “ఒంటి మీద ఒక ఈగేనా వాలినా గుండ్రంగ గంతులు వేయాలి” అని సమాధానపడుతుంది.

 

రెండు వేగాల మధ్య తేడాని సమన్వయం చేస్తూ ఒరుసుకుపోనివ్వకుండా మధ్యలో అడ్డుపడి నడిపే వంతెనలాంటి ఆధారమొకటి కూలిపోతే- సుఖానికి దుఃఖానికీ, ఉండటానికి లేకపోవడానికి మధ్య దూరం ఒక్క ప్రమాదమే కావచ్చు. కాలం నుంచి కాలానికి దూరం నుంచి దూరానికి చేరుకుని అక్కడ నిన్నని ఇక్కడి రేపటిగా మార్చే రైలు పొడుగు ముందు “టెన్స్” ఎలానూ పొట్టిగా కుచించుకు పోతుంది.

 

ఒకనాడెవరో నాటిన విత్తొకటి చరిత్రలోతుల్లోకి విశాలంగా వేళ్ళూని నేడొక మహావృక్షపు గతాన్ని సగర్వంగా కొమ్మకొమ్మకూ చాటుతుంది. కానీ ఏమో! మరెవరికో ఏ దారితప్పిన అర్ధరాత్రో ఆ గతం(భూతం) వికృతాకారమై “ఆ మర్రి, రావి, జువ్విచెట్ల జుత్తు ఆకాశంలోకి“ విరబోసుకుని భూతమై భయపెడుతుందేమో! కేవలం కాలం గడవడం వల్ల, పాతబడ్దం వల్ల, అలవాటు పడ్డం వల్ల, వస్తువులో లేని కొత్త భావమేదో కల్పించుకోదలచుకోవడం వల్ల- మూల స్వభావంలో లేని మార్పుని ఉందని నిర్వచించడానికి “పదం మార్తుంది, క్రియాపదం మార్తుంది.”

 

నమ్మకం ఉంటే ఎదురుచూడగలవు. ఏదురుచూస్తేనేగా నమ్మడానికి ఏదైనా ఆధారం దొరికేది? ఇప్పుడు తాకి నిద్రలేపితే రేపు నువ్వు రాగలవు. రాకుండానే ఎలా తాకేది? సమాంతర సమీకరణాలే అన్నీ.  అందుకే అర్ధం చేసుకుంటావని ముందే చెబుతున్నాడు “వాన కురిస్తే మాత్రం వీలుండదు. వీలు కుదరలేదూ అంటే వాన కురిసిందీ అని అర్ధం.” చివరికి మిగిలే విలువేదో తెలిస్తే సమీకరణాల్లో అక్షరాలు ఇట్టే కనిపెట్టొచ్చు. కానీ తోచిన అక్షరాలు రాసుకుంటూ పోతే కానీ ఒక విలువకి చేరుకోలేము. తీరా ఆఖరు అంకె సరిగ్గా వచ్చేశాక అక్షరాలన్నీ తప్పంటారు మీరు. అందుకే నేనారోజే చెప్పానుగా అనే గొడవ ఈరోజు లేకుండా ఆ కబురేదో అందిస్తావని- అత్తరు చల్లిన ఉత్తరంలో గులాబి రేకలు మడిచి పంపకున్నా పెనుగాలికి గింగిరాలెత్తే ఏ ఎంగిలాకు తోనో పరాగ్గా విసిరేస్తావని “గతంలోకీ భవిష్యత్తులోకీ, ఇంట్లోంచి బయటికీ/ తిరుగుతూ నాల్క చాచుకుని కాపలాకాస్తుంటాడు/ ఇహానికీ పరానికీ చెడుతూ.”

– స్వాతి కుమారి

swatikumari

మూడు జ్ఞాపకాలు- మూడు సాహసాలు!

ఈ రోజెందుకో బాల్యంనాటి సాహసాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి అవి సాహసమేమీ కావు. అయినా ఆ వయసురీత్యా సాహసమనే చెప్పాలి.

అలాంటి మూడు సంఘటనలు.

నిజానికి ఇవి ఏకోవలోకి వస్తాయో  అని ఎప్పుడూ సందేహమే!

1

వయస్సు సరిగ్గా  గుర్తులేదు. బహుశ ఇంకా స్కూలుకు వెళ్ళటంలేదు. అప్పట్లో వయస్సు ఆరో సంవత్సరం వస్తేగాని బడిలో చేర్చుకునేవారు కాదు.

స్థలం మాత్రం పోలవరం (పశ్చిమగోదావరి జిల్లా). మా రూతు ఆంటీ 12వ తరగతి చదువుతుండేది. మా యిల్లు ఉన్నతపాఠశాల ఎదురుగా వుండటంవల్ల ఆంటీ వాళ్ళ స్నేహితురాళ్ళు తరచూ వచ్చి మంచినీళ్ళు త్రాగి వెళ్ళేవారు. అలా వచ్చేవాళ్ళలో   పురుషోత్తపట్నానికి చెందినవారు వుండేవారు. పురుషోత్తపట్నం (తూర్పు గోదావరి జిల్లా)  అంటే పోలవరం గోదావరికి ఆవలి ఒడ్డునవుంది. ఆ గ్రామంనుండి  ప్రతిరోజూ పడవపై వచ్చి,  వెళ్ళేవారు.

ఓ రోజు ఒకరి ఇంట్లో ఎదో కార్యక్రమం (నాకు సరిగ్గా గుర్తులేదు) ఉండటంవల్ల అందరూ కలిసి వెళ్ళాలని మాట్లాడుకుంటున్నారు. అందులో ఆహ్వానం మా ఆంటీకి కూడా వుంది. ఆ మాటలు విన్న నేను, నేనూ వస్తానని  చెప్పాను. నువ్వు సిద్ధంగావుండు మేము వచ్చి తీసుకెళతాము అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు పడవ ప్రయాణం అంటే మహా సరదా. పోలవరం (పశ్చిమగోదావరి జిల్లా) పురుషోత్తపట్నం (తూర్పు గోదావరి జిల్లా) రెండు ఎదురెదురు ఒడ్డుల మధ్య ఎక్కువ వెడల్పువున్న రేవులని చెబుతారు. కొవ్వూరు రాజమండ్రిల మధ్య వెడల్పు ఎక్కువవున్నా రేవులు మాత్రం ఎదురెదురుగా లేవు.  ఇంతకుముందు ఒకసారి ఆంటీయే తన క్లాస్మేట్ ఇంటికి తీసుకెళ్ళింది.  అందుకని చకచకా సిద్దమయ్యి, చాలాసేపు ఎదురుచూసాను. ఎవ్వరు రాలేదు. ఒకవేళ నన్ను మర్చిపోయి పడవల రేవుకు వెళ్ళారా అని సందేహమొచ్చింది. సరే! అక్కడికి వెళ్ళి  చూద్దాం  అని బయలుదేరాను.  నేను అక్కడికివెళ్ళిన సమయానికి ఒక పడవ వెళ్తూ కనిపించింది. అందులో కొంతమంది విద్యార్థునులు  కనిపించారు. నన్ను మర్చిపోయారేమో అనే సందేహం ఎక్కువయ్యింది. అక్కడే చాలాసేపువున్నాను.solo-boat-journey

 

అప్పట్లో అటువైపునుండి ఒక  పడవ ఇటువస్తే, ఇటునుంచి ఒక పడవ అటువెళ్ళేది. అలా అటువైపు పడవ వచ్చింది. పడవవాళ్ళు లంగరులు వేసి బయలుదేరేలోపు వారి వారి పనుల్లో పడిపోయారు. నేను పడవ ఎక్కి కూర్చున్నాను. టిక్కెట్టు ఎమీ ఇవ్వకపోయినా పడవ ఎక్కిన వారిని లెక్కించుకుని, రుసుము వసూలు చేసేవారు. ఇంకా  సరుకులు, సామానులు చూసుకొని  బయలుదేరారు. ఆవలి ఒడ్డు రాగానే  నేను పరుగెట్టుకుంటూ నాకు తెలిసిన ఇంటికి వెళ్ళాను. అక్కడ సందడైతే వుంది కాని, వీళ్ళు ఇంకా రాలేదని తెలిసింది. వస్తారులే అనే ధీమా ఒకవైపు, వస్తారా రారా అనే సందేహం మరోవైపు. అలా ఆ వీధిలో నాలుగు అడుగులు వేసేసరికి గోళీలు ఆడుతూ కొందరు పిల్లలు కనిపించారు. అక్కడికి పడవరేవు కనబడుతూనేవుంది. అటువైపు ఓ కన్నేస్తూనే  మెల్ల మెల్లగా వారితో కలిసిపోయాను. ఎంతసేపు అలా ఆడుతూ ఉన్నానో గుర్తులేదు గానీ కొంచెం చీకటి పడుతున్న సమయంలో ఒక పడవ వచ్చింది. అందులో మా ఆంటీ ఇంకా తన స్నేహితురాళ్ళు ఉన్నారు. నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపోయారు.  ఆంటీకి భయం మొదలయ్యింది ఇంటి దగ్గర నా గురించి ఏమి కంగారు పడుతున్నారోనని. తన ఫ్రెండ్సు అనునయిస్తున్నా భయంగానే సమయం గడిపింది.

ఆఖరి పడవకు పురుషోత్తపట్నంనుండి  పోలవరం వచ్చేసాము. ఇంటికి వెళ్తే ఎవ్వరు కంగారు పడటంలేదు ఎందుకంటే నేను ఆంటీతోనే వెళ్ళానని అనుకున్నారు. అప్పుడు ఆంటీ స్థిమితపడింది.

నాకు మాత్రం పడవ ప్రయాణం అనగానే అదే గుర్తుకొస్తుంది.

 

2

1966, పాత పట్టిసం, పోలవరం తాలూకా, పశ్చిమ గోదావరి జిల్లా.

గోదావరిలో శివాలయంవున్న ఊరుగా ప్రసిద్దమైనది.

అక్కడ ఎలిమెంటరీ స్కూలు ఉంది. బహుశ 3వ తరగతి చదువుతున్నాను. అందులో మా పెద్ద ఆంటీ  కటాక్షమ్మ ఉపాద్యాయురాలుగా పనిచేస్తుండేది. నేను చిన్నక్క మేరీ సలోమి, 5వ తరగతి చదువుతూ ఆమెవద్ద ఉండేవాళ్ళం.  అదే బడిలో ఆంటీతో పాటు  శ్రీమతి శాంతమ్మ, లిల్లీ  అని ఇద్దరు  ఉపాద్యాయురాళ్ళు వుండేవారు.

మంగళవారం 4కి.మీ. దూరంలోవున్న పోలవరంలో సంత జరిగేది. అందుకని మంగళవారం స్కూలుకు మధ్యాహ్నంనుండి శెలవు వుండేది.

లిల్లీ గారు తన తమ్ముడు వివాహానికని పత్రిక ఇచ్చి పెళ్ళిపనుల నిమిత్తం శెలవుపెట్టారు.

ఆ రోజు మంగళవారం. మధ్యాహ్నం బడినుంచి వచ్చి కొద్దిసేపు ఆడుకున్నాక స్నానంచేసి మంచి బట్టలు వేసుకున్నాను. అంతలో ఆంటీ శాంతమ్మగారి ఇంటికివెళ్ళి ఎదో తెమ్మని పంపించింది. వారి ఇల్లు ఊరికి ఆ చివరవుండేది. నేను వెళ్ళేసరికి వారి ఇంటికి తాళంవేసివుంది. ప్రక్కన అడిగితే పెళ్లికి వెళ్ళారు అనిచెప్పారు. వెంటనే నాకు లిల్లీ టీచర్ వాళ్ళ తమ్ముడు పెళ్ళి రేపే అని గుర్తుకువచ్చింది. అక్కడికే వెళ్ళివుంటారని  అనుకున్నాను. ఆ పెళ్ళి కొత్త పట్టిసీమ అక్కడికి ఓ మూడు నాలుగు కిలోమీటర్లు వుంటుంది. గోదావరి గట్టు వారగా వుంటాయి ఆ గ్రామాలు. అప్పటికి ఇంకా చీకటి పడకపోవడంతో సరదాగా నడుచుకుంటూ వెళ్ళాను. ఇల్లు ఎలా కనుక్కున్నానో గుర్తులేదుగాని పెళ్ళి ఇంటికివెళ్ళాను    కొద్ది సేపటికి  లిల్లీ టిచరు కనిపించి  ఆంటీగురించి అడిగి తన పనుల్లో తాను కలిసిపోయింది. పెళ్ళి పందిరివేయడం, దాని డెకరేషను పనుల్లో, కాగితాలు అంటించటంలో నేనూ కొద్దిగా సహాయంచేసాను. చీకటి ఎప్పుడుపడిందో తిన్నానో లేదో తెలియదు.  కొద్ది రాత్రి అయ్యాక పెళ్ళికూతురు వచ్చింది. విడిది ఇల్లు ఇచ్చారు. ఏవేవో కార్యక్రమాలతో కొద్దిసేపు సమయం గడిచిపోయింది. విడిది ఇంటికి, పెళ్ళి ఇంటికి మధ్య తిరుగుతుంటే మగ  పెళ్ళివారు నేను ఆడపెళ్ళివారి తరుపున అనుకున్నారు.   ఆడ పెళ్ళివారు నేను మగపెళ్ళివారి తరుపున అనుకున్నారు, పెళ్ళి తంతులో పడి నాకు ఇల్లు గుర్తురాలేదు. ఆ రాత్రి పెళ్ళి పందిరిలోవున్న ఓ బెంచీపై నిద్రపోయాను.

ఉదయమే పెళ్ళి సందడి. అక్కడ నన్ను గుర్తుపట్టేవారు ఎవ్వరూ లేరు. గుర్తుపట్టగలిగే ఒక్క టీచరు చాలా పనుల్లో హడావిడిగావుంది.

పెళ్ళికూతురు తెల్లటి వస్త్రాలు, మేలిముసుగు (వెయిల్) బ్యాండు మేళాలతో పందిరిలోకి తీసుకెళ్ళడం నన్ను అబ్బుర పరిచాయి.

పెళ్ళి అయిపోయింది, భోజనాల దగ్గర శాంతమ్మ టీచరు భర్త వెంకన్న గారు (ఆయనా టీచరే) కనిపించి పలకరించారు.  ఆంటీ రాలేదా? వస్తే ఎక్కడా అని. అప్పుడు గుర్తుకువచ్చింది ఇల్లు. భోజనాల తర్వాత వెళ్ళిపోదాము అనుకున్నా. ఇంతలో వధూవరులిద్దరూ బ్యాండు మేళాలతో వీధిలో ఊరేగింపు వెళ్ళడం కనిపించింది. కొందరు పిల్లలు ఊరేగింపువెనుక నడుస్తున్నారు  ఆ గుంపులో చేరిపోయాను. ఎంత సమయం గడిచిందో గాని, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఇంటికి వెళ్ళాలనే ద్యాస పుట్టింది. మెల్లగా గోదావరి గట్టు ఎక్కాను. కొద్దిగా ప్రొద్దు గ్రుంకుతున్నది. గట్టువారగా చింతచెట్లు, మరికొన్ని చెట్లు వుండేవి.     కొన్ని చెట్లపై బ్రహ్మజెముడుపక్షి  (గబ్బిలాలు లాంటివి) వున్నాయి. అవి సాయత్రము చెట్లపై ఎగురుతూ, వాలుతూ వుంటాయి. అవి చూసేసరికి కొంచెం భయం మనసులో మెదిలింది.

ఆ భయానికి తోడు ఇంటి దగ్గర ఆంటీ కొడుతుంది అనే భయంకూడా మొదలయ్యింది. అలా భయం, భయంగా నడుస్తున్నాను. ఇంతలో మా వూరి అతను ఒకరు సైకిలుపై వెళూ నన్ను చూసి, ఇక్కడ వున్నావు ఏంటి? నీకోసం ఊరంతా వెదకుతున్నారు అని, తన సైకిలిపై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు.

ఆంటి ఈ వేళ నా తోలుతీస్తుంది అనుకుంటూ సైకిలుదిగుతుండగా నన్ను చూసి ఒకాసారిగా  పరుగెత్తుకునివచ్చి గట్టిగా పట్టుకుని ఏడ్వడం మొదలుపెట్టింది.  ఆ వెనకే నా చిన్నక్క వచ్చి తను ఏడ్వటం మొదలయ్యింది. కొడతారనుకున్న నేను ఒక్కసారిగా బిత్తరపోయాను.

 

ఇక ఇంటి దగ్గర  ఏమయ్యిందంటే :

మా వీధిలో కొందరితో కలిసి ఆంటీ పోలవరంలో వున్న, భానుథియేటర్లో సినిమాకు వెళ్ళడాన్కి  పథకం వేసుకున్నారు. నడిచివెళ్ళడం, సినిమా అయిన తర్వాత నడిచి రావడం కాబట్టి నన్ను తీసికెళ్తే నిద్రపోతే అవస్థ అవుతుందని నన్ను శాంతమ్మగారి ఇంటికి వెళ్ళి రమ్మన్నారు. నేను వెళ్ళి వచ్చేలోగా వాళ్ళు వెళ్ళిపోవాలని పథకం. అలాగే నేను వెళ్ళాక వాళ్లు వెళ్ళిపోయారు. ఇంటివద్ద వున్న చిన్నక్క నేను ఆంటీతో వెళ్ళాను అనుకుంది.

రాత్రి మొదటి ఆట చూసుకొని ఇంటికివచ్చేసరికి ఇంటివద్ద నేను లేకపోయేసరికి ఖంగారు పడ్డారు. వెదకడం మొదలు పెట్టారు. చుట్టు ప్రక్కల ఇళ్ళు, తర్వాత వీధులు. గ్రామాలు అప్పటికే నిద్రలో జోగుతుండేవి.

అప్పుడే ఒక విషయం తెలిసింది. అదేమంటే గోదారిలోవున్న గుడికి ఆ రోజు వుదయం సినీనటుడు ఎన్.టి. రామారావు వచ్చి వెళ్ళాడని. ఆయన్ని చూడడాన్కి   జనాలు ఎగబడ్డారని. అందరిలో ఒక భయం పొడసూపి పలు అనుమానాలు తలెత్తాయి. గోదావరిలో గాని నేను పడిపోయానేమో అనే అనుమానంతో  వెదకులాట గోదావరి తీరాలగుండా సాగింది.

అప్పట్లో మరోవదంతులు కూడా వుండేవి. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారని. ఇలాంటి రద్దీ సమయాలలో వారి చేతివాటం చూపిస్తున్నారని.

చుట్టు ప్రక్కల మాకు బంధువులు వుండే, దొండపూడి, పోలవరం నేను ఆంటి తరచూ వెళ్ళే గృహాలన్నింటికి వెళ్ళి అక్కడికి గాని వెళ్ళానేమోనని వెదికారు.

లిల్లీ టీచరు గారి తమ్ముడి పెళ్ళివిషయం వారికి గుర్తుకు రాలేదు. ఇంతకుముందెప్పుడూ వారి ఇంటికి వెళ్ళలేదు కాబట్టి సందేహం కూడా రాలేదు.

 

3

1969 కొవ్వూరు, పశ్చిమగోదావరి జిల్లా.

నాన్న గారికి కొవ్వూరు బదిలీ అయిన తర్వాత స్కూలు సీట్ల సర్దుబాటు తర్వాత మొత్తం కుటుంబం, రైల్వే స్టేషను దగ్గర్లోని నాదెండ్లవారి వీధిలో అద్దెకు  వుండే వాళ్ళం.

పెద్ద అన్నయ్య రాజమండ్రి , ఆర్ట్స్ కాలేజీలో బి.ఎ. చదువుతుండేవాడు. కొవ్వూరునుండి రోజూ రైలులో వెళ్ళేవాడు.

పెద్దక్క సునీతి, చిన్న అన్న లింకన్ 8వ తరగతి, చిన్నక్క 7వ తరగతి హైస్కూలులో జాయిన్ అయ్యారు.  నన్ను దుంపల బడి అని ఒక స్కూలు 5వ తరగతి లో చేర్చారు (ఈ సంగటన జరిగిన తర్వాత నన్ను మళ్ళీ పట్టిసం పంపేసారు, అందువల్ల స్కూలు పేరు గుర్తులేదు)

కొవ్వూరుకు ప్రక్కనేవున్న   పశివేదలలో మావయ్య వుండేవారు.  ఆయన రైల్వేలో పనిచేసేవారు.

ఓ రోజు మధ్యాహ్నం మావయ్య మాయింటికి వచ్చారు. పెద్దక్క, చిన్న అన్నయ, చిన్న అక్క పశివేదల వస్తామని మావయ్యకు చెప్పారు. సాయంకాలం స్టేషనుకు వచ్చేయండి అక్కడనుండి కలిసివెళదాం అనిచెప్పి మావయ్య వెళ్ళిపొయాడు. అక్క వాళ్ళతో నేనూ వస్తానని చెప్పాను. సరే తయారయ్యివుండు,  బజారుకు వెళ్లి వస్తాము అని వెళ్ళిపోయారు. నేను సిద్దపడి ఎదురుచూడటం మొదలుపెట్టాను.  ఎంతసేపటికి రాకపోయేసరికి స్టేషనుకు వెళ్దామని బయలుదేరి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మేము  వెళ్దామనుకున్న పాసింజరు రైలు అప్పుడే వెళ్తూ కన్పించింది. ఆ రైలులో వెళ్ళిపోయివుంటారని అనుకున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోయాయారు అని ఏడ్పువచ్చింది. రైలుపట్టాలవెంట నడిచివెళ్తే మూడు కిలోమీటర్లు వుండవచ్చు. ఇంతకుముందు ఒకసారి వెళ్ళిన గుర్తు. వెళ్దామని పట్టాలవెంట నడక మొదలుపెట్టాను. మద్యలో కొంగలబాడవ అనే వంతెన వుంది దానిపై దాటదానికి భయంవేసి ఆగిపోయాను. కొద్దిసేపటికి ఒకామె(బహుశ నర్సు అనుకుంట) డ్యూటీనుంచి వస్తూ, రైలు దాటిపోవడంవల్ల ఆమె నడిచి వెళ్తుంది. ఆమె నన్ను వంతెన దాటించింది.

పశివేదల స్టేషనులో దిగితే ప్రక్కనేవున్న రైల్వేక్రాసింగు  గేటు ముందుగా వెళ్తారు అందరు. అక్కడ బంధువు ఆయన కూడా (మావయ్య వరుస)  వుండేవారు. ఆయన గేటు ఆజమాయిషీతోపాటు, టిక్కెట్లను వసులు, తనిఖీ చేసేవాడు.

నేను రైలుపై రాలేదు కాబట్టి అడ్డదారిలో ఇంటికి వెళ్లిపోయాను.  అత్తయ్య గాని, మావయ్య గాని నా రాకను పెద్ద అనుమానంగా చూడలేదు. మిగతా పిల్లలు ఎందుకు రాలేదో రేపు అటువైపు వెళ్ళినప్పుడు కనుక్కుంటాలే అన్నాడు. అలాగే ఉదయమే ఆయన డ్యూటీకి, అత్తయ్య కూడా పనిలోకి వెళ్ళిపోయారు. నా వయసుదే అయిన వదిన కూడా బడికి వెళ్ళిపోయింది. నేను వచ్చినది  సాయంకాలం అవటంవల్ల రెండు రాత్రులు గడిచాయనుకుంట.

ఒక్కడ్నే గదిలో కూర్చొని ఆడుకుంటున్నాను. ఇంతలో పెద్ద అన్నయ్య, పెదనాన్నగారి అబ్బాయి ఇద్దరూ కలిసి వచ్చారు. ఒక్కసారిగా నన్నుచూసి ఆశ్చర్యపోయారు. వెంటనే నన్ను తీసుకొని కొవ్వూరు ఇంటికి వెళ్ళారు.

 

 

ఇక ఇంటి దగ్గర  ఏమయ్యిందంటే :

అక్కవాళ్ళు బయటికివెళ్ళి వచ్చేసరికి సమయం లేకపోవడంవల్ల ఆ రోజుకు ప్రయాణాన్ని వద్దు అనుకొని ఇంటికి వచ్చేసారు.  మొదట పిల్లలతో ఆడుకోవట్డానికి ఎటైనా వెళ్ళివుండవచ్చనుకున్నారు. చీకటైనా రాకపోయేసరికి ఆందోళన మొదలయ్యింది. అందులోనూ పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాళ్ళు రకరకాల రూపంలోనూ, సాధువులుగానూ తిరుగుతున్నారనే రకరకాల పుకార్లు వుండేవి. అవి నిజమో కాదో నాకు అంతగా గుర్తులేదు.

మొదట మా చుట్టుప్రక్కల వీధుల్లో వెదికారు. కొవ్వూరులొనే లూథరన్ చర్చి దగ్గరలో  మా పెదనాన్నగారు వుండేవారు.  అక్కడికి గాని వెళ్ళానేమో అని చూసారు. అక్కడ కనబడలేదు. పశివేదల వెళ్ళేవిషయం తెలిసేసరికి వెళ్ళివుంటే గేటు దగ్గర వుండే మావయ్యకు కనబడతారు కదా అందుకని కొవ్వూరు స్టేషను నుంచి ఫోను చేయించి  అడిగితే నేను చూడలేదు అని, వస్తే కన్పడకుండా ఎలావెళ్తాడు అని  చెప్పారట. దానితో పశివేదల రాలేదని అనుకున్నారు.

పెద్దన్నయ్య, మోషే, లివింగష్టన్ (ఇద్దరూ పెదనాన్న గారి పిల్లలు) అన్నయ్యలు మిగతా స్నేహితులు కలిసి రాత్రంతా వీధి, వీధి వెదికారు.

గోదావరి ఒడ్డున గోపాదాల రేవు వద్ద కొన్ని గుడులున్నాయి. అక్కడ సాధువులు, బిచ్చగాళ్ళు రాత్రిళ్ళు పడుకునేవారు. ఒకొక్కరిని లేపి, ముసుగుతీసి మరీ వెదికారట.  ఎవరెవర్నె లేపారో, దుప్పటి లాగి చూసారో చాలా కాలం కథలు కథలుగా చెప్పుకునేవారు మా అన్నయ్య వాళ్ళ స్నేహితులు

మరసటిరోజు పోలీసు కంప్లయింటు ఇచ్చారట. కొవ్వూరు రైల్వేస్టేషను, రాజమండ్రిలోని గోదావరి, రాజమండ్రి స్టేషనులోనూ వెదికారట.

నిడవోలులో రైల్వేస్టేషనులో ఓ పిల్లాడు దొరికాడని బాగా ఏడుస్తున్నాడని తెలిసిందట. ఆ సమయంలో కొవ్వూరునుండి నిడదవోలుకు రైలు ఏవీ లేకపోవడం, మా అన్నయ్య వాళ్ళు పశివేదలవచ్చి కొంచెం ఏదైనా తిని, ఓ గంట తర్వాత వున్న రైలుకు వెళదాం అని పశివేదల వచ్చారు.

అలా వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోక ఏమి చేస్తారు.

***

ఇక్కడే కొవ్వూరులో వుంటే మళ్ళీ ఏమి చేస్తాడొనని మళ్ళీ నన్ను కటాక్షమ్మ ఆంటీ దగ్గరకు పాత పట్టిసం పంపేసారు.

– జాన్ హైడ్ కనుమూరి

john hyde

ఎంత నేర్చినా…?

SAM_0344

ఆవేళ బుధవారం -పాత బట్టల మూట ముందేసుకుని కూర్చున్నారు అత్తగారు .

అప్పటికి అయిదారుసార్లు తిరగేసి మరగేసి చూసారు అందులో చీరల్ని . ఒక్కోటీ విప్పతీసి చూడటం మళ్ళీ మడతేసి పెట్టడం .ఎప్పటికో రెండు చీరలు తీసి ఒళ్ళో వేసుకున్నారు . అదా ఇదా అని కాసేపు ఆలోచించి చివరికి ఎటూ తేల్చుకోలేక రెండిటినీ మూటలో వేసేసి తలపట్టుకు కూర్చున్నారు . మా అత్తగారి అవస్థ చూసి నేను గట్టిగా నిట్టూర్చాను ఎప్పట్లానే .

“కొత్త చీరలు కొనుక్కునేప్పుడు ఆలోచించాం – హైరానా పడ్డాం అంటే అర్ధం వుంది కానీ , మాయదారి పాత చీరల సెలక్షనుకి కూడా ఇన్ని పుర్రాకులు పడాలా . కళ్ళుమూసుకుని మూటమొత్తంగా తీసుకెళ్ళి పారేస్తే పోయేదానికి” అన్నాను అత్తగారితో . అంతటితో ఊరుకున్నానా …..”దానధర్మాలు చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలటండీ దేవుడు మనకా అవకాశం ఇచ్చాడు కాబట్టి ఉదారంగా ఇచ్చిపారేయడమే . మన ఇంట్లోంచీ ఒక రూపాయి దానంగా వెళితే రెండు రూపాయలు మనింట్లోకొచ్చే దారి చూపెడతాడటండీ ఆ భగవంతుడు . అంటే ….ఇప్పుడు మనం ఒక పాత చీర ఇస్తే రెండు కొత్త చీరలు కొనుక్కునే అవకాశం మనకి దొరుకుతుందన్నమాట” అని ఎక్కడో విన్నవి టీకా తాత్పర్య సహితంగా అనుమానం లేకుండా అప్పచెప్పేసాను.

అయిందా ఉపన్యాసం అన్నట్టు ఆవిడ నాకేసి శాంతంగా చూసి, “ఇలావచ్చి కూచోవే …నీకో కథ చెపుతాను” అనేసరికి గానీ నే చేసిన తప్పు బోధ పడలేదు . దాన ధర్మాల గురించి నేనిలా తేలిగ్గా మాట్లాడినప్పుడల్లా ఆవిడ ఒకానొక బరువయిన కథ చెప్పటం , నేను కళ్ళొత్తుకుంటూ ఆ కథ వినేయడం పరిపాటయిపోయింది .

“వరాల్రాజుగారి కథేనా …..తెలుసుగా “ అన్నాను నింపాదిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ.

“ ఊరికే తలాడిస్తూ వినేస్తే సరిపోయిందా దేన్నుంచయినా నేర్చుకోవాల్సింది నేర్చుకోవద్దూ . అత్తయినా చెప్పిందికాదమ్మా అని అందరూ నన్నంటారు ఇలా వచ్చి కూచొని మళ్ళీ ఒక్కసారి చెప్పించుకోవే “ అని బ్రతిమాలేస్తుంటే ….బ్రోచేవారెవరురా అని నేను దిక్కులు చూడ్డం మొదలుపెట్టాను.

వాకిట్లోంచీ ” అయ్యగారండో ….అయ్యగారండమ్మా …” అన్న పిలుపు వినపడగానే …. బ్రతికానురా భగవంతుడా అనుకొని ఒక్క ఉరుకులో అక్కడినుంచీ బయటపడ్డాను .

చాకలి పోలమ్మ . పాపం పెద్దయ్యగారు ఇస్తానని ఆశపెట్టిన పాత చీరకోసం కాళ్ళరిగిపోయేలా తిరుగుతుంది . మంగళవారం పొద్దొచ్చేసిందనీ, శుక్రవారం పొద్దు ఇంకా దాటలేదనీ , ఈవాళ ఇంట్లో చుట్టాలున్నారనీ, రేపు మాకు పనుందనీ, ఇంకా అదనీ ఇదనీ ఎన్నాళ్ళబట్టి తిప్పుతున్నారో దాన్ని . ఈవాళయినా దాని ఆశ తీరుతుందో లేదో….ఏ చీరను వదిలించుకోవాలి అనే విషయం మీద అత్తగారు ఇంకా ఒక నిర్ణయానికొచ్చినట్టులేదు .

మా అత్తగారి పద్ధతేవిటో నాకు అర్ధం కావటంలేదు . తనంత తాను ఇవ్వాల్సివస్తే ఒకటికి రెండిస్తారు . అడిగింది ఇవ్వడానికి మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు . ఎంత వీలయితే అంత వెనక్కి తీస్తారు . ఆ అడిగినవాడు ఎందుకడిగాన్రా బాబోయ్ అని ఏడ్చేంతగా తిప్పిస్తారు . ప్రతీ ఏటా దీపావళికి ప్రమిదలు తీసుకొచ్చి ఇచ్చే కుమ్మరోళ్ళ పిల్లకి పురుడొచ్చిందని తెలిసి , మెత్తని నూలు చీరలన్నీ ఏరేరి మరీ పంపించారు అబ్బులుగాడితో . ఏనాడో మా ఇంట్లో పనిచేసిన నాగలక్ష్మి నడుం వంగి పనిలోకి వెళ్ళలేకపోతుందని విని బియ్యం బస్తా పడేయించారు దాని పాకలో . “అయ్యగారూ మంచి జరీ ఉన్న పాత కోక ఇప్పించండి బాబూ తవరి పేరు సెప్పుకుని కట్టుకుంటాను ” అని ఆ మధ్య ఎప్పుడో నోరు తెరిచి అడిగింది పాపం పోలమ్మ . ఇదిగో ఇప్పటిదాకా తిప్పుతున్నారు. హేవిటో ఈవిడ వరస అంతా తికమక- మకతిక అనుకుంటుండగా వచ్చారు అత్తగారు .

“ఊ..ఇదిగోనే పోలమ్మా . ….చీర చీరని చంపుతున్నావని ఇస్తున్నా అంచయినా మాయలేదు. జాగ్రత్తగా కట్టుకుంటే పదేళ్ళయినా మన్నుతుంది “ అంటూ ఆవిడ పోలమ్మ చేతుల్లో పడేసిన పాత చీర చూసి నోరెళ్ళబెట్టిన పోలమ్మని చూస్తే నాకు నవ్వాగలేదు . ఆ చీరకసలు అంచేలేదు. రంగయినా ఇదని చెప్పటానికి వీల్లేనిది . విప్పతీస్తే ఇంకా లోపల ఏవేం విచిత్రాలు దర్శనమిస్తాయో .

ఆవుదం తాగినట్టూ మొహం పెట్టి అంతలోనే సర్దుకుంది పోలమ్మ . “సూసేరాండీ సిన్నయ్యగారూ మీ అత్తయ్యగారి పరాచికాలు ” అంటూ నవ్వేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటే….మా అత్తగారు బుగ్గలు నొక్కుకుని ” ఇందులో పరాచికమేవుందేవ్ ! నువ్వడిగింది పాత చీరేగా” అనేసారు తేలిగ్గా.

“ ఆ…..మీరు భలేవోరు అయ్యగారు . పాతకోకని అడగాపోతే తవరు కట్టుకునీ పట్టుకోకలిమ్మని అడుగుతావాండీ … మారాజులు మీరే అర్దం సేసుకోవాల . తవరిచ్చిన కోక కట్టుకుని మా మెండపేట తమ్ముడింటిని ఎలదారనీ , మా అయ్యగారు ఎంత నాణవయిన కోకలు కడతారో అక్కడ మాఓల్లందరికీ సూపిద్దారనీ ఎంత సంబరపడ్డానో తెలుసాండీ” అంటూ….చూసుకోండి మరి ఈ చీర కట్టుకెళితే పోయేది మీ పరువే అన్న అర్ధం ద్వనించేలా కళ్ళూ ఒళ్ళూ విచిత్రంగా తిప్పేసింది పోలమ్మ .

పోలమ్మ వంటిమీద జీరాడుతున్న నిమ్మపండు రంగు గద్వాల చీరను పరీక్షగా చూస్తూ “చాల్లే వే చెప్పొచ్చేవ్ …..నీ సంగతి నాకు తెలీకనా !! నీకు చీరలకి కరువేంటే , రేవులో పడ్డ జరీ చీరలన్నీ ఓ తిప్పు తిప్పికానీ ఇళ్ళకు చేర్చవు కదా . ఇక మాలాంటివాళ్ళిచ్చిన పాత కోకలు చుట్టుకుని చుట్టాలింటికి వెళాల్సిన ఖర్మం నీకేవిటీ” అని అత్తగారు సుతారంగా అంటించేసరికి , ఉడుక్కున్నట్టూ మొఖం ముడుచుకుంది . “మనసులో ఏదో పెట్టుకుని మాట్టాడతన్నారు పెద్దయ్యగారు “అంటూ గారం పోయింది .
దాన్నలా చూస్తే నాకు జాలేసిపోయింది. నిజం చెప్పాలంటే కొంచెం భయం కూడా వేసింది. ఇస్త్రీ కోసం ఇచ్చిన నా పెళ్ళి పట్టు చీర దాని దగ్గరేవుంది. కోపంలో కాల్చి పారేస్తేనో ? మంగలి కత్తి మెడమీద పెట్టినపుడు – చాకలింట మన కొత్తకోక ఉన్నప్పుడు ఎవరయినా ఎంత జాగ్రత్తగా వాళ్ళపట్ల ఎంత మర్యాదగా వుండాలి . అయినా అత్తగారూ …. ఇదేం అమాయకత్వం అని నేను గొణుగుతూనే వున్నాను .

అదేం పట్టించుకోకుండా ఆవిడ అతి సీరియస్ గా మొఖం పెట్టి “ పోయిన పండక్కి పాలేర్లందరితోపాటూ నీకూ కొత్త బట్టలు పెట్టానా ….మా కోడలు తొలిమాటు సారెతో ఇంటి చాకలని నీకో కొత్త చీర తెచ్చిందా …..అవి కాక మా పెద్దొదినగారు దీపావళికి పంపించిన మూరతక్కువ చీర నీకు పనికట్టుకుని కబురంపి మరీ ఇచ్చానా ….అవన్నీ ఏం చేసావ్ …పోనీ ఒక్కమాటు సరదాగా కట్టుకొనొచ్చి అయ్యగారికి కనపడదాం అననుకున్నావా …పైగా రంగు నప్పలేదు, బట్ట బాగోలేదు అని నీ అరుగుమీద కూర్చుని వచ్చేపోయేవాళ్ళకి పేరంటం పెడతావా !….మళ్ళీ ఇప్పుడు ఏం ఎరగనట్టూ అయ్యగారూ పాతకోక అంటూ వచ్చి నిలబడితే నాకేం తెలీదనుకున్నావా …..పోన్లేపాపం ఇంట్లో కట్టుకుంటావని నేనో పాత చీర పడేస్తే అది ఇంటింటికీ కట్టుకెళ్ళి మరీ చూపించొస్తావా ..హమ్మా!! “ అంటూ పాయింటు మీద పాయింటు లాగుతూ చింత నిప్పులా చిటపటలాడిపోతున్న అత్తగార్ని చూస్తూ గాభరాగా గుటకలు మింగుతూ నిలబడిపోయింది పోలమ్మ . నేను మాత్రం గబగబా వంటింట్లోకి పరిగెత్తి గ్లాసు నీళ్ళు తాగొచ్చాను .

అంతటితో వదలకుండా దాన్ని ఎప్పటినుంచో అడగాలనుకున్న నాలుగు ప్రశ్నలూ అడిగేసి, కడిగేసి శాంతించిన అత్తగారు అరుగు చివర కాలుమీద కాలేసుకుని, మూతిమీద వేలుంచుకుని అలిగినట్టూ ఎటో చూస్తూ కూర్చున్నారు.

ఇటువంటి సీరియస్ సీనుల్లో ఎటువంటి డైలాగులుంటాయో తెలీక పాఠం మర్చిపోయిన స్టుడెంట్ లా చేతులు నలుపుకుంటూ పోలమ్మనీ అత్తగార్నీ మార్చి మార్చి చూస్తూ ఉండిపోయాను .

ముందుగా తేరుకున్న పోలమ్మ చెంగున అరుగు మీదికెక్కి చూర్లో దోపిన విసనకర్ర అందుకుని ఆవిడ ఎటు తిరిగితే అటు తిరిగి అత్తగారికి గాట్టిగా విసరరటం మొదలుపెట్టింది.

“అమ్మ…దీని తెలివో !? “ అని ఆశ్చర్యపోయాను .

అదే స్పీడులో నావైపు తిరిగి “అలా సూత్తనిలబడిపోయారేంటండీ …ఎల్లి అత్తయ్యగారికి సల్లగా మజ్జిగిదాహం అట్టుకు రండీ “ అని ఆర్డరేసి పారేసింది .అమ్మమ్మో…ఏం లౌక్యం !!! అని ఈసారి ఇంకాస్త ఎక్కువ ఆశ్చర్యపోతూ లోపలికి పరిగెత్తాను .

అత్తగారు అస్తమానూ చెప్పే వరాల్రాజు అనబడే ఆ వరహాల్రాజు గారి కథ ఆ సమయంలో వద్దన్నా గుర్తొచ్చేసింది .

అనగనగా ఓ వరాల్రాజుగారట . ఆయనదసలు మాఊరు కాదట భీవారం సైడునించీ వచ్చేరట . మా ఊర్లో పాతికెకరాలు కౌలుకి తీసుకుని పొగాకు వ్యవసాయం మొదలు పెట్టారట.అంతకుముందు చేపల చెరువులు, రొయ్యల చెరువులూ చేసి లాసయిపోయేరట .రొయ్యలు పండించిన చేతుల్తో బియ్యం పండించలేక ఇటుసైడు వచ్చేసేరట .”ఊరుకోండి మీరు మరీ సెపుతారు…ఊ కులాసాలకి పోకుండా కుదురుంగా యవసాయం సేసుకుంటే లాసెందుకవుతారు . పావలా పెట్టేకాడ రూపాయెడితే ఇలాగే మిగులుతారు” అని ఆయన్ని గతంలో ఎరిగున్నవాళ్ళు అనేవారట. అయినా అయన అదేం పట్టించుకోకుండా తన కులాసాలు దర్జాలు భేషుగ్గా కొనసాగిస్తూ వచ్చారట .
శ్రీరామనవమి చందాలని వెళితే ఊర్లో అందరూ ఇచ్చినదానిమీద ఓ రూపాయి ఎక్కువ రాసుకోండి అనేవారట . ఆవునో దూడనో కొనాల్సి వచ్చినపుడు అమ్మే ఆసామీ చెప్పిన రేటుకి ఒక రూపాయి ఎక్కువే తీసుకో అనేవారట.

పెళ్ళికీ పేరంటానికీ వెళితే చదివింపుల్లోకూడా తనదే పైచేయి అనిపించుకునేవాడట . దాంతో ఎక్కడెక్కడివారూ ఆయన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఆహ్వానాలు అందించి , ఆయనందిచిన చందనతాంబూలాది సత్కారాలు పొంది వెళ్ళేవారట. ఆస్తి ఉన్నవాడు అందరికీ బంధువే అన్నట్టు మాఊర్లోనేకాక చుట్టుపక్కల ఊర్లలో కూడా అట్టహాసంగా జరిగే ప్రతీ కార్యక్రమానికీ ఆయన్నే ముఖ్య అతిధిగానూ, గౌరవాధ్యక్షుడిగానూ నిలబెట్టి కూర్చోబెట్టేవారట. అడగటవే ఆలశ్యం అన్నట్టుండేదట ఆయనతో పని . మనూర్లోనూ ఉన్నారు రాజులు ఎందుకూ ఊ..మీసాలు తిప్పుకుంటూ తిరగడానికీ మనమీద రంకెలెయ్యడానికీ తప్ప రాజంటే వరాల్రాజు గారే అని మిగతా రాజుల్ని పబ్లిక్ గానే ఆక్షేపించేస్తున్నారట తినమరిగిన జనం .

ముచ్చటగా మూడేళ్ళు గడిచేసరికి ‘మీ చందా ఇంతా’ అని ఎవరన్నాసరే దబాయించి తీసుకునేంత అలుసయిపోయేరట వరాల్రాజుగారు .ఊళ్ళో తీర్థాలకి లైటింగు ఖర్చయినా , శివరాత్రి సంబరాల్లో సినిమా ఖర్చయినా ఆయన ఖాతాకే వెళ్ళిపోయేదట . వరాల్రాజుగారి అయ్యగారు ఊర్లో దిగేప్పుడు పెట్టుకొచ్చిన మొహరీల మొలతాడు కానీ, రూపులపేరు కానీ అయిదేళ్ళ తరవాత ఆవిడ వంటిమీద కనపడలేదట . ఊర్లో దిగిన కొత్తలోనే ఆయన బుల్లెట్టు నడపటానికో మనిషిని పెట్టుకున్నారట .వాడి జీతం కూడా ఊర్లో పాలేర్లందరికంటే ఓ రూపాయెక్కువే అని మాట్లాడుకున్నారట . కొన్నేళ్ళకి ఆ బండిమీద వాడొక్కడే సొంతదారులాగా దర్జాగా తిరుగుతూ కనిపించేవాడు వెనక వరాల్రాజుగారు లేకుండా.

ఆయేడు శ్రీరామ నవమికి చందాలిచ్చినవారి పేర్లు మైకులో చదువుతూ చివరాకర్లో వరాల్రాజు గారి పేరు కూడా ఒక్కరూపాయెక్కువేసి చదివేసి, మర్నాడు పొద్దున్నే ఆయనింటికెళ్ళి చూస్తే తాళం పెట్టుందట . గడపమీద ఆయేటి చందా వందలకట్టతో పాటు ఓ రూపాయి బిళ్ళ ఒత్తెట్టి కనిపించిందట . కొన్నాళ్ళకి రామిండ్రీ నుంచీ , అనపర్తినుంచీ అప్పులోళ్ళొచ్చి తాళం పగలకొట్టి విలువయినవి అనుకున్న సామానులన్నీ పంచుకు పోయారట. అప్పటివరకూ ఆహా అన్నవాళ్ళే అంతా స్వయంకృతం తేల్చేసారట . మాటలేవన్నా కొనితేవాలా? నాలుక మడతేసి ఎటు కావాలంటే అటు ఆడించడమేకదా !రాజంటే వరాల్రాజే అన్నవాళ్ళెవరూ ఆయన గురించి బెంగిల్లిపోలేదు , మనకింత చేసిన మారాజు ఏవయిపోయేడో అని ఆరా తీయలేదు. ఎందరో వరాల్రాజుల్నీ బంగార్రాజుల్నీ మర్చిపోయినట్టే మర్చిపోయి ఊరుకున్నారట . అంతెందుకూ …వరాల్రాజుగారు చేయించి వేసిన ముత్యాల హారాలు, వెండి కిరీటాలు ధరించిన సీతారాములే ప్రతిఏటా ఆ పాడుబడ్డ ఇంటిముందునించీ ఏవీ తెలీనట్టు చిరునవ్వుతో ఊరేగుతూ వెళ్ళిపోతుంటే ఇంక మనుషుల్ని అనుకోటానికేవుందని అత్తగారు తరచూ బాధ పడేవారు .

ఈ కథ ఇంతవరకే ఊళ్ళోవాళ్ళకి తెలుసట .

కొన్నేళ్ళ క్రితం తిరపతి బస్టాండులో ” టికెట్టుకి డబ్బులు తక్కువయ్యాయి ఒక్క రూపాయిప్పించండమ్మా ” అని చేయి చాచిన వ్యక్తిని పరీక్షగా చూస్తుంటే , అనుమానంతో కళ్ళు చిట్లించిన అతను, గబుక్కున చేయి వెనక్కి లాక్కొని మరు నిమిషంలో మాయమయిపోయాడట.

“ఆయన మనూర్నించీ వెళ్ళిపోయిన వరాల్రాజు గారిలా ఉన్నారండీ “ అని అత్తగారు కళ్ళనీళ్ళు తిప్పుకుని మా మాంగారితో అంటే “ చ.చ…అయ్యుండదు” అనేసారట మాంగారు మొఖంలో బాధని దాచేస్తూ .

ఏట్లో పోసినా ఎంచిపోయాలి అనీ , అపాత్ర దానం కూడదనీ, ఇంకా ఎన్నెన్నో సామెతలతో ఈ కథ మా అత్తగారు నాకు మొదటిసారి చెప్పినప్పుడు మనసుకదోలా అయిపోయి కళ్ళనీళ్ళు తిరిగిపోయాయంటే నమ్మండి .

నేను మజ్జిగ దాహంతో తిరిగొచ్చేసరికి పోలమ్మ చెపుతున్న కబుర్లు వింటూ ప్రసన్న వదనంతో కనిపించారు అత్తగారు. ఇంతలో ఏం మాయ చేసేసిందబ్బా అని నేను ఆశ్చర్యపోతుంటే…. “ ఏమేవ్ ….ఆ గుడ్డలమూటిలా పట్రా . పోలమ్మకి నచ్చిన చీరలు తీసుకుంటుంది . అలాగే మొన్న చేసిన మురిపీలు రెండు పుంజీలు పొట్లం కట్టి పట్టుకురా పిల్లలకి పట్టుకెళుతుంది ” అని నాకు పురమాయించి, “ కోళ్ళ గూడు కింద బొగ్గుల మూటుంది వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళవే పోలమ్మా “ అంటూ దర్జాగా వరాలొకపోస్తున్న అత్తగారిని పక్కకి పిల్చి వరాల్రాజుగారి కథ నాకు చెప్పీ చెప్పీ మీరేం నేర్చుకోలేదా ? అని అడిగేద్దామనిపించింది. పొగడ్త పన్నీరు వంటిది పీల్చి వదిలేయాలి కానీ తాగి పడిపోకూడదు అని క్లాసు చెప్పేద్దామా అనికూడా అనిపించింది .

ఏవిటో….!! అనుకుంటా కానండీ …ఒకరి అనుభవం మరొకరికి గుణపాఠం అవుతుందా చెప్పండి ?

–లలిత దాట్ల

చెప్పులో ముల్లులాంటి భాషలో…!

 

 maakuOkaBhashaKaavaaliByWilsonSudhakar

(గత వారం తరువాయి)

నిర్భయ మరణంతో చలించి ఒకేసారి ‘గుడ్‌బై ఇండియా’ వీడ్కోలు నిర్వేదం. ఈ దేశంలో స్త్రీలపై జరిగే దాడులనీ, వేదనలనీ, రోదనలనీ సాహిత్య రూపంగానో లేకపోతే మంచి కళాకారుడి చేతిలో బొమ్మగా మారటం అంత తేలిక కాదు. ఘర్షణలన్నీ గొప్ప కథలుగా కొంతలో కొంత మలచగలుగుతున్నారు. అంటే ఇక్కడ కథలే గొప్ప అని కాదు. అవన్నీ కవిత్వంగా మలచటం అదీ ఒక పరిపక్వమయిన కవిత్వంగా మలచటం లేదా సాహిత్యంగా మారటం చాలా తక్కువగానే జరుగుతుంది. నిర్భయపై చూడండి..

‘నువ్వు బతికొస్తే ఒక్క తల్లి కొడుకయినా

మానవ పునరుజ్జీవన మహోత్సవ పెళ్లి

పీటల వయిపు నీతో నడుస్తాడా

అమ్మల ఆదర్శ స్వరాల హార్మోనియం వినిపిస్తుందా?”

నిజంగా నిర్భయ బతికి ఉంటే ఈ మొదటి లైన్లకి పులకించిపోయేదేమో. పునరుజ్జీవన మహోత్సవ పెళ్లి .. ఎంత అద్భుతమయిన ఊహాదృశ్యం. ఎంతో పొంగిపోయే లోపల కఠోర, కర్కశ నిజాన్ని , సత్యాన్ని పీటలపయిన నడిచే మగపురుగులు ఉండరా?  అమ్మల ఆదర్శ స్వరాలు వినిపిస్తయా?. అని బాధితురాలు తరఫున మన మనస్సులోకి దూరి, నిలేసి మేకులు దిగ్గొడతారు. నిజంగా జాతి సిగ్గుతో ముడుచుకుపోవలసిన క్షణాలు.

ఆదివారం సెలవురోజంత అందంగా చెబుతా. మళ్లీ  వచ్చే సోమవారాన్ని కళ్లలో కారం కొడతాడు. బతుకు పందెంలో ఉరుకు పరుగులు, చింతలు – వంతలు, వంకరలు, తిరకాసులు, ఎంచక్కా నాయితే సెలవొచ్చింది. మా పిల్లలకి టీవీలో సినిమా ఒచ్చింది. మా అవిడ వంటగదిలో కెల్లాల్సి వచ్చింది. ఆడవాళ్లకి కావలసిన విశ్రాంతి, సెలవ గురించి బద్ధకంగా తీరిగ్గా కూచ్చుని కోడికాలు తిన్నత బాగుంది.

‘గుహని మార్చినంత మాత్రాన

పులిని సింహంగా మారవలేమనీ తెలుసు’

ఆమె మతం కూడా ఏమాత్రం ఉద్ధరించదని, ఇవాంజెలికల్ చర్చి పరంపరలో ఉన్న రాజకీయాల కుళ్ళుని , అందులో దూరే సవర్ణులని, ఓ.సి., క్రీస్తు భక్తులని మీకేం పని, మీవల్లనే మేము జాన్ పుల్లయలం, ఫ్రాన్సిస్ చల్లయలం అవుతున్నాం అని అటు ఆళ్లు, ఇటు ఈళ్లు ఎవరూ మమ్మల్ని కలుపుకోరని సమాజంపయిన, సవర్ణ బోధ  గురువులపైనా, ఆ సమాజంపైనా నిరసన జెండా ఎగరేశాడు.

నిన్నటిదాకా రూపాయి చూడని మనం ఏదో ఇవాళ కొద్దిగా పచ్చకాయితాలతో అన్నం తింటంటే, పేరులో రైస్ ఉంది కదా అని భూమి మీద పండే ప్రతి బియ్యం గింజా నేను చెబితేనే తినాలనీ, మా అనుమతి లేకపోతే ఆకలితో చావనయినా చావాలిగాని మాకు ఇష్టం ఉంటేనే ఏ దేశానికయినా కూడెడ్తాం లేదా సముద్రంలో పారబోసుకుంటాం. ఇంక ఎక్కువ మాట్టాడితే ఇరాక్‌లాగా  మసి చేసి నేలమట్టం చేయగలం. ఇంకా ఎక్కువయితే మేం సముద్రంలో అన్నీ దొల్లిచ్చుకుంటాం అనే కండకావరపు అమెరికాని ఎత్తి చూపిచ్చే రొట్టెల తనిఖీ. వీళ్లు పిజ్జాలు, బర్గర్‌లు, కోక్‌లు ఎన్నయినా తినొచ్చు, పీకలదాకా పీలవొచ్చు. మనం మన మాంసం, చేపలు, గుడ్లు ఆడికి ఎగుమతి చెయ్యకుండా తింటే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ‘యాంకీ’బాబు ఒంకర బుష్‌గారి పళ్లు పీకాడు. బడుగులపై బలవంతుడిలాగా, పేద దేశాలమీదేగా అమెరికా ప్రతాపం. మొక్కుబడుల పేరుతో తిరిగి మొలిచే జుట్టుని ఎన్నిసార్లయినా గుండు కొట్టించుకుంటాం. అదే ఏలో, కాలో ఇవ్వాల్సి వత్తే ఇత్తామా? ఇదీ అంతే. మనం  ఇప్పటికే రెండుపూటలా బ్రేవ్‌మని ఏడిసిందెక్కడ?. ఆయనకి తెలుగురాదుగా ఈ విషయాలన్నీ ఎవరు చెబుతారు.

ఒకరోజు  నేనూ  నా స్నేహితుడూ మాట్లాడుకుంటూ పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చిందనే కథ చెప్పుకున్నాం. ఇంత పెద్ద మంద ఉండి ఈ A B, C, D ల పేరుతో ఎదురు పడితే అనాధల్లాగా నొసలు ముడేసుకుని, కళ్ళతో అదేదో కక్కుకుంటున్నారు. ఆప్యాయంగా అందరూ పాలు నీళ్లయితే అధికారపు హంసలకి ఆహారం అందదు కదా. ఎన్నాళ్ళీ Kingmakers బతుకు. మా ఊరిలో మా దగ్గిరలో ఉండే అందగత్తెలు, ఒద్దికయిన వాళ్లు, మానవత్వపు మహిళలు ఇద్దరు, కాళావు, మాంకాళి.  ఆళ్ళు ఏది మాట్టాడినా ఎంత బాగున్నా లేక అలంకరించుకున్నా ఆళ్లని సంబోధించటమే వేరు. లంజ, లంజముండ, లంజలభాష, లంజకొడుకులు, ఒసివి చేస్టలు అనే భాషఘోష నాకు తిరిగి తిరిగి తగులుతున్నది. నా మిత్రుడు, మా పక్క ఊరివాడు ‘విజయవాణి'(కన్నడ పత్రిక) సంపాదకుడు పంపన గౌడ మాటల్లో “ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటాం బుజ్జమ్మా, నువ్వు రచయిత్రివయ్యావు. నేను రిపోర్టర్నయ్యాను. కానీ మన ఊళ్లో రెండూ జాంబుల (గ్లాసుల)పద్ధతిని మార్చలేకపోయాం. చీ! ఏం బతుకులు” అని ఇప్పటికీ సిగ్గుపడతాం. వైద్యుడిగా మా నాన్న ఈ డిస్పోజల్స్ రాకముందు  గాజు సిరంజితో మా దగ్గెరి వాళ్ళకి జరం వచ్చినపుడు సూది మందేత్తే మూడూర్లు మా నాన్న వైద్యాన్ని బహిష్కరించారు. కానీ మా నాన్న అంతకన్నా మొండోడు. వాళ్లు వచ్చినా వైద్యం చెయ్యనని వాళ్లనే బహిష్కరించిన రోజులున్నాయి. మా ఊరి ‘మాంకాళి’ బ్యాడరు కులానికి చెందిన ‘వీరభద్రి’ అనే దర్జీని ప్రేమించినందుకు ఊరూరూ ఆమెని చంపాలంటే, రండిరా చూసుకుందాం అని మా ఇంట్లోనే ఆరునెలలు దాచాడు. ఈ అడ్డనామాల దురాగతాలు ఒకటా? రెండా? సమస్‌కృతం కలిసిందా భాషంటే, మరి పామరుడిదీ,  శ్రమజీవులదీ, చేనుదీ,  చెమట చుక్కదీ, కొట్టంలో నించీ కొట్టే మురికిప్యాటల్ది,  పశువుల పాలకులదీ, సోమరులదీ, సూటుబూటు బొఱ్ఱల బాబులది కాదు.

భాషంటే జాతరది, చర్చిది. సంస్కృతి మన ఒక్కళ్ళదేనా? సృష్టి కన్నా ముందే సంస్కృతి పుట్టిందా? మా ఊరి బుడకజంగాల నడిగితే  విద్య అంటే తెలివే ముందు. గురువే తరవాత. మూర్ఖుడు మాత్రమే గురువులని ఆశ్రయించి కొలుస్తాడు అని అంటారు. మరికొన్ని వేల సంవత్సరాల క్రిందట రాయబడిన ‘పాత నిబంధన’ గ్రంధంలో భాషలు తారుమారయిన ఈ బాజెల్ నగరం కథలు చదువుకోలేదా? పెద్ద మనం డాబులు చెప్పుకునేవాళ్లమేమో. సాటివాళ్లని పశువులకన్నా హీనంగా చూస్తా పెద్ద పెద్ద రిసెర్చి స్కాలర్లు, మేధావులు ఎందుకు అసహ్యించుకుంటున్నారు? గుఱ్ఱం సీతారాములు ఎంత నలగ్గొట్టబడితే గుఱ్ఱం సీతారావణ్‌లవుతారు?

శ్రీలంకలోని నాలుగు మూలజాతులున్నవి. వెడ్డా, అహికుంటిక, రామకుళూవర్, వాగ. ఈ నాలుగింటిలో ఒక్క వెడ్డా తప్ప మిగతా మూడు జాతులు తెలుగు జాతులు. వీళ్లు సింహళం, తమిళం, తెలుగు మాట్లాడగలరు. అదీ ఇంగిలీసు కలవని తెలుగు. అంటే పల్లె తెలుగు. వెడ్డా అనే తెగ దాదాపు అంతరించిపోయే దశలో ఉంది. వెడ్డాల పేర్లు ఇలా చెప్పాడంట. బంటన్న, ఎఱ్ఱ బండన్న, నల్లమ్మ ఇట్టా ఉండి, వాళ్ల భాష మన మూల వాసుల భాషకి చాలా దగ్గరగా ఉందంటే చాలా ఆశ్చర్యపోయాం. ఇవన్నీ ఎవరు పరిశోధనలు చేత్తారు. ఎవరిగోల వాళ్లది. భాష  దళితీకరించబడినప్పుడే కదా బాధితులకి నమ్మకం కలిగేది. ఇక్కడ ఒక ఉదా:- చూడండి. వాళ్లలో బతికి ఉన్న మసెన్న అనే శ్రీలంకవాసితో మాట్లాడుతు ఉంటే (పాములు పట్టటం , ఆడిచ్చటం అతని వృత్తి) ఆ తెలుగు  మన మూలవాసుల తెలుగుతో కలిసి ఉన్నది. అలాగే భోపాల్ వాసులయిన ఆదీవాసుల్లో ఒక భాగస్తులయిన “శుభాష్ సింగ్, దుర్గాబాయి’కు పర్దాన్ గోండు కళలో నిష్ణాతులు. వాళ్లు సంప్రదాయ బొమ్మలు, పుస్తకాల వ్యాకరణాన్ని అందిస్తూ చిత్రించిన “భీమాయణం (అంబేత్కర్ జీవిత యాత్ర)” ప్రతి ఒక్కరు (H.B.T) చూడదగిన పుస్తకం.

సుధాకర్ విల్సన్

సుధాకర్ విల్సన్

Happy New Year

కొత్త యాడాది సంబరాలు

అంటే ఏది తీసుకుంటాం. ఇక్కడ కవి ఎంత పెద్ద తలలో గుజ్జయినా తోడందే వదలనన్నాను. ఈ వ్యంగ్యం మీరూ చూడండి. అమ్మో! రామాయణం అంటే సామాన్యం కాదు.

‘ఇప్పుడు కవిత్వమూ వ్యభిచారమయ్యింది

సమాజంకోసం మొదట్లో రాస్తాం

పోనుపోను కీర్తికిరీటాల కోసం

రాసి రాసి రంపాన పెడుతుంటాం.

నిజమే ఒక్కోసారి మన వల్ల అవతలవాడు చస్తాడని తెలిసినా మన పిశాచ ఆనందం కోసం రచనా హత్యలు చేత్తానే ఉంటాం. ఒక సభలో  ఢిల్లీ ప్రొఫెసర్ చిన్నారావు ఇలా అన్నాడు. “చిన్నప్పుడు ఊరి బయట, ఇప్పుడు రాష్ట్రం బయట” అని. డోంట్ వర్రీ బ్రదర్ కాలం మారింది. మీరు లేందే ఊళ్ళేలేని రోజు ఇవ్వాళ. ఈ దేశంలో ప్రతికులంలోనూ ఒక అంబేత్కర్ రావాలని, అంబేత్కర్‌ని ఉపయోగించుకునే వాళ్లు చెప్పే దళిత బ్రాహ్మణిజానికి కూడా రేవు పెట్టాడు. ఏరు దాటినాక తెప్ప తగలేసినట్టుగా తమకు దళిత అన్నపదమే అసహ్యంగా ఉందని we are more than that  అనీ తాము ఆ స్టేజీ దాటామనీ, శుచీ శుభ్రతలో బ్యామ్మర్లతో సమానమనీ అంటుంటే పిచ్చివాళ్లలారా,  పడకండి పడకండి ఏ వ్యామోహపు గుండాలలో అని ఆరవాలనే ఉంటది. మొదటిసారి చదివినప్పుడు ఎవరీయన అనే ఆశ్చర్యం, చదవగా చదవగా మనవాడై, వేడై, మెదడులో పురుగులాగా, చెప్పులో ముల్లులాగా గుచ్చుకుంటాడు. చేనేత ఉరినేతలా మారటంపై  చూడండి.

‘మా నేతల్ని మేమే నేసుకోవాలి

మా శవాలపై గుడ్డల్ని నేయటమయినా

మా పిల్లలకి నేర్పాలి,

కొడుకులు బట్టలు నెయ్యటం నేర్పారుగానీ

ఉరితాళ్లు పేనటమయినా

వేట కత్తులు నూరటమయినా

నేర్పలేక పోయారు..

ఇది చదివినాక గుండె భగభగమని, తుప్పు పట్టిన సూరులో కత్తి నూరటంలో, ఏ ఉద్యమంలోకో దూకి జండా పట్టటమో, అన్యాయానికి ఉరి వెయ్యటమో, ఏదో లేకపోతే మన పళ్ళనే పటపట, టకటక, కటకట నూరటమో చెయ్యకుండా ఉండం.

‘కామ్రేడ్‌లతో తినిపిచ్చిన ప్రశ్నల ఎండుమిరగాయలు చూడండి.

‘ఆయుధాలు పట్టటం ఇక్కడ ఉద్యమం

మనువుని సంహరించకుండా

మనిషిని వర్గ శత్రువనటం వికటం

పాపం మన కామ్రేడులు మిరపకాయలే కాదు వాటి పొగేసినా చలిచ్చరు.

ఉద్యమ నెలబాలుడి గురించిన గొప్ప వాక్యాలు.

చెట్లెన్ని పడినా వీచెగాలి ఆగదన్నాడు. జనం గుండెల్లో తనెప్పటికీ చచ్చిపోలేదన్నవార్త, తన సమాధినీ చూడగలిగినవాడు. దళితసాగర గీతాన్ని శివమెత్తి పాడుతున్నవాడు రాసినవాడు ఈ కవి. ఇకనించీ మనం కూడా వాళ్ల బతుకు బాసని మాట్టాడదాం. కనీసం ఇందాం. ఫూలన్‌దేవి ఎందుకు తుపాకీ పట్టిందో లోతుగా అధ్యయనం చేద్దాం. పొట్టిలంక మారణహోమం విషయం మరిచిపోయాం,  లక్సింపేట అందమయిన సంకలనం అయింది. భాషలో అరసున్న పోయినప్పుడే గుండుసున్న మిగిలిందని దేన్ని కొట్టి చెప్పాలి. దేనితోనూ కొట్టకుండానే మనకి తగిలేట్టు చెప్పాడు.

మిత్రుడు చంద్ర గురించి ఎవరితను అని చెప్పినపుడు, చదివి నేను రాసినంత సంబరపడ్డా. ఆప్తులయినవాళ్లని అరిచేతులమీద నడిపిత్తారని, అంతులేని కన్నీళ్లతో గుండెల్ని తడుపుతారని, బెంగలతో ఊరేగింపు యాత్రలో పూలవుతారని, కాళ్ళకి అడ్డం పడే బంధువులవుతారనిపిచ్చింది. ప్రేమనాలుకల తడిలవుతారు.

మద్దూరి, శిఖామణి, ఎండ్లూరి తరవాత ఎవరంటే ‘విల్సీ’నే . అలా అచ్చంగా వాళ్లకి చెందినాడేం కాదు. ఆశ్చర్యంగా అప్పుడపుడూ ‘మో’గారి పదాలు కూడా పడతయ్యి. “బ్లాక్ కీ నీగ్రో’ తేడా తెలుసుకున్న మిత్రుడు. నిజంగా కవితా ప్రేమికులకి నచ్చే పుస్తకం మాకూ ఒక భాష కావాలి.

 

దొరికే చోటు: అన్నీ ప్రముఖ పుస్తకాల షాపుల్లో

Ebook: Kinige.com

 

 

– మన్నెం సింధు మాధురి

sindhumadhuri

క్షీరసాగరం

maithili

మైథిలి కి చదవటం చాలా ఇష్టం. ఇన్ని సంవత్సరాలలో ఇది నాలుగో కథ. మొదటి రెండు  కథలు 2001,2003 లలో వార్త లో వచ్చాయి.మొదటి కథ  ‘ నియతి ‘ 2001 తెలుగు యూనివర్సిటీ కథాసంకలనం లోనూ,జగతి పత్రికలోనూ , నాటా 2013 సంచికలోనూ పునర్ముద్రితమయింది. చక్కటి చదివించే శైలి ఆమె సొంతం. –వేంపల్లె షరీఫ్

***

 

 

కనుచీకట్లలో మెడికల్ హాస్టల్ కాంపస్.  ప్రవల్లిక కోసం వెతుకుతూ ఆ వెనకాల లాన్ లోకి నడిచింది ఆముక్త. అమ్మాయిలు చదువుకోవటానికి అక్కడక్కడా దీపాలూ అరుగులూ. ఏ వెలుగూ పడని ఒక మూల కూర్చుంది ప్రవల్లిక. దగ్గరగా వెళ్తే తలెత్తిచూసిందేగాని  నవ్వలేదు. అంత త్వరగా నవ్వదు ఆమె. కఠినంగా బిగిసిఉండే ముఖరేఖలు. మెల్లగా వెళ్లి పక్కన కూర్చుంది ఆముక్త.
బహుళ పాడ్యమి కాబోలు ఆ రోజు…అప్పుడే పైకిలేస్తూ ఉంది చంద్రబింబం.  పాలజలనిధిలోని తెలిపచ్చని మీగడ ముద్దకట్టి వెలుగుతూంది.

‘వల్లీ చూడు…ఎంత బావుందో ‘ …అప్రయత్నంగా అంది

. ‘ఏమిటి చూసేది…చాలాసార్లు చూశాలే…చందమామేగా. ‘

‘అది కాదు. ఏ రెండుసార్లూ ఒకేలా ఉండదు.’ మైమరపు.

‘ నీ మాటలకేంలే… వేరే ఎవరికైనా చెప్పు, నాకు కాదు.’  స్పష్టమైన తిరస్కారం.

పట్టించుకోకుండా అడిగేసింది  ‘ రేపటినుంచీ సెలవలుగా, మా ఊరు వస్తావా? ‘

‘ ఎందుకట అంత జాలి మామీద..’ చేదు ఉబికే  మాటలు.

‘ పండగ రోజుల్లో ఒక్కదానివీ ఏం చేస్తావు? మా ఇంటికి వస్తే బావుంటుందనిపించి అడిగాను. దీన్ని జాలి అనక్కర్లేదు నువ్వు ‘

కాస్త తగ్గింది ప్రవల్లిక. ‘ ఎందుకు రావాలి నేను? నేను ఉంటే ఎవరికైనా బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదే ‘ ఆముక్త జవాబు చెప్పలేదు. ‘సరేలే. వస్తాను. మంచి అమ్మాయిలా ఉండాలంటే మాత్రం నా వల్ల కాదు ‘

‘నువ్వు ఎలా ఉండగలిగితే అలాగే ఉండు. …  ‘ నవ్వేసింది.

ఎక్కడివాళ్లు అక్కడ ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ ని అప్పటికే ఖాళీ చేసేసారు. ప్రవల్లిక గడిచిన నాలుగేళ్లుగా ఎక్కడికీ వెళ్లలేదు. ఆమెకి అసలు ఎవరైనా ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. హాస్యం లేని వ్యంగ్యం ఆమె సొంతం. ఆ వెటకారానికి అడ్డూ అదుపూ ఉండవు. తన మాటలు కనపడని చోట్ల సూదులు గుచ్చినట్లుంటాయి. చెప్పకూడని నిజాలని చర్చకి పెట్టినట్లుంటాయి. ఆ బెదురుతో ఎవరూ తనకి దగ్గరగా వచ్చే సాహసమే చేయరు. ఎక్కడా పరీక్ష తప్పకుండా రాగలిగేటంత చదువుతుంది. తక్కిన సమయాల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కనిపిస్తుంది. ఏమి పాటలు వింటుందో కూడా ఎవరూ అడగరు.

పరీక్షగా చూస్తే ఆ కళ్లు బంధించబడిన జంతువువిలాగా ఉంటాయి. ఆ తీరు ఎవరూ దాడిచేయకుండా రక్షించుకుంటున్నట్లుంటుంది.

ఆముక్త  వేరు. అక్షరాలా ఆనంద కర్పూర నీరాజనం ఆమె. ఉత్సాహమూ ఊరటా రెండిటినీ ఆమె సమక్షంలో గుర్తు పట్టిన కొందరు దగ్గరే ఉంటారు. అంతుపట్టని ఇంకొందరు వెంట తిరుగుతారు

ఎవరినీ తూలి ఒక మాట అనదు. పొరపాటున ఎవరయినా అంటే దెబ్బలాడదు. కష్టపడి చదువుతుంది.. ప్రసన్నమైన ముఖం. ఆమె సౌజన్యమే సౌందర్యమనిపిస్తుంది.

ksheera1

ప్రవల్లిక సడలి మాట్లాడటం కొంతకాలం క్రితం జరిగింది. హాస్టల్ వర్కర్ భార్య రెండేళ్ల బాబుని భర్త తో వదిలేసి తన బావతో వెళ్లిపోయింది. వారిద్దరి మధ్యా ఎప్పటినుంచో సయోధ్య ఉండేది కాదు. అందుకని ఎవరూ అంతగా ఆశ్చర్యపడలేదు. తేలికగా మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా గట్టిగా అరిచింది . ‘ బుద్ధిలేదా? మనిషి పుటక పుట్టలేదా? ఇష్టం లేకపోతే పిల్లాడిని ఎందుకు కన్నది? ఇంతమందిమి ఉన్నాము ఇక్కడ, ఎవరిని అడిగినా చెప్పేవాళ్లం కదా జాగ్రత్తలు …ఇప్పుడు వాడి గతి ఏమిటి? ‘ కోపం కాస్తా బాధగా మారి గొంతు బొంగురు పోయింది. చరచరా అక్కడనుంచి వెళ్లిపోయింది.ఆమెలో ఆ మెత్తదనాన్ని  ఆముక్తఒక్కటే పట్టించుకుంది. కాలేజ్ లో చేరినప్పటినుంచీ ప్రవల్లికకి దగ్గర అవుదామని ప్రయత్నిస్తూనే ఉంది ఎందుకనో… తనకి నచ్చే విషయాలని ప్రయత్నించి తెలుసుకుంది. ధైర్యం చేసి ప్రస్తావించింది. భగీరథప్రయత్నం కొంత ఫలించి ఏదయినా  అడిగితే జవాబు చెప్పే దశ వచ్చింది.

ఆ చుట్టూ కట్టుకున్న గోడ బద్దలు కొట్టి లోపల ఏముందో చూడాలని, కుతూహలం ఒక్కటే కాదు. ఏదో అక్కర . ఈ  పరిసరాల నుంచి  నాలుగురోజులు దూరం చేయాలని.ఎందుకూ అని తనను ప్రశ్నించుకుంది ఆముక్త. ‘ తన ఇల్లు తనకి ఇష్టం, ప్రవల్లికకి నచ్చుతుందనేమిటి? ‘

ఏమో తెలియదు, పిలిచింది అంతే.

ఆ వేసవికి చివరిఏడాది అయిపోతుంది. హౌస్ సర్జన్ లుగా అంత తీరుబాటు ఉండదు. పోస్ట్ గ్రాడ్యుయేట్  ఎంట్రన్స్ కి చదువుకోవాలి పనిచేస్తూనే. . మళ్లీ కుదురుతుందో లేదో..!

తండ్రి స్టేషన్ లోఎదురు చూస్తున్నాడు.  .. కాస్త సన్నగా దృఢంగా పొడుగ్గా హరిచందనపుతరువు  లాగా ఉన్నాడు ఆయన.   వాత్సల్యం చిందేలా నవ్వి ఆముక్తని దగ్గరకి తీసుకుని ప్రవల్లిక  చేయి పట్టుకున్నాడు . ఆ పెద్ద అరచేతిలో ఆమె చేయి ఇమిడిపోయింది, సుభద్రంగా ఉన్న స్పర్శ.

ఒక మోస్తరు పట్టణం అది.ఊరు దాటుతూనే ఇంకొక ఊరు పేరు వచ్చేసింది. జనసాంద్రత ఎక్కువ అంటే ఇదేనేమో … ఈ కొత్తఊరికి కాస్త పల్లెటూరి వాలకం ఉంది.

ఆ దారిలోంచి ఒకవైపుకి తిరిగి పెద్ద ప్రాంగణం లోకి వెళ్లారు. . డా. ఎస్.టి.పి. కులశేఖర్ ఎం.డి. అని బోర్డ్. కిటకిటలాడుతూ పల్లె జనం.

అంతా హాస్పిటల్ వాతావరణం.

దాటివెళ్తే ఇంకొక ఆవరణ. ఆలోపల వింతగా కనిపించే వాళ్ల ఇల్లు…విశాలమైన ఉద్యానం మధ్యని. కాస్త దూరంగా తులసివనం.

వాకిట్లో చుట్టూ బంతిపూలు. అరచేయి అంత పెద్దపూలు విరగబూసి గుమిగూడి ఆకులే కనిపించటం లేదు. దగ్గరికి వెళ్లి ఒక పూవులోకి ముఖం వంచింది ఆముక్త , ముద్దుపెట్టుకుంటోందా అనిపించేలా.

‘ బంతిపూలకి  మంచి వాసన ఉంటుంది తెలుసా .. ‘

ఆ ఇల్లు ఇంచుమించు గుండ్రంగా ఉంది.చుట్టూ వరండా  .  ఒక వైపుకి వాలిన మంగళూరు పెంకుల కప్పు.గోడలంతా టెరకోటా.

లోపలికి అడుగు పెడుతూనే అగరు  పరిమళం  హాయిగా ఉంది ముంగిటిలోనే పెద్ద వర్ణచిత్రం. ఒక పెద్ద దేవాలయ గోపురం  పైన నిలబడి ఏదో చెబుతున్న యతీంద్రుడు. నొసట  ఊర్ధ్వపుండ్రాలు, ముఖంలో జాలువారుతూన్న కరుణ. చేతులు జోడించి వింటున్న జనం .

తక్కిన అన్ని వైపులా పెద్దవీ చిన్నవీ పెద్దవీ తైలవర్ణచిత్రాలూ నీటిరంగులవీ. కొన్నిచోట్ల చక్కటి  చట్రాలలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి, ఇంకొన్నినమ్రంగా  ఒదిగిపోయాయి. గులాబీరంగు గోడలు, పాలపిట్ట వన్నె  పరదాలు.

‘ నాన్న పెయింట్ చేస్తారు ‘

“ఆరా” లని గుర్తుపట్టగలవారికి అక్కడ కెంపుజలతారు వంటి,  ఇంద్ర  నీలాకాశం వంటి,మెత్తగా మెరిసిపోయే  నెమలికంఠం వంటి కాంతివలయాలు కనిపిస్తాయేమో.

ఆ తర్వాతిరోజులలో  ప్రవల్లిక అనుకునేది, ఆ ఇల్లు చేతులు చాచి తనని పిలిచిందని.

.తల్లి మొహం ఇంత చేసుకుని ఎదురువచ్చింది. ‘ రండి, రండి! ‘  చాలా చక్కగా ఉంది ఆమె. ఆముక్త  కి అమ్మా నాన్నా ఇద్దరి పోలికలూ రానట్లుంది.

.’ పాలా? ఇష్టం లేదు ‘ ముఖం చిట్లించింది.

‘ ఒకసారి రుచిచూడు ‘

పచ్చకర్పూరం, కలకండ వేసి కాచిన పాలు..ఒక్క గుక్క తాగాక మొహమాటానికయినా ఆపాలనిపించలేదు … తెలియకుండానే మనసు చల్లబడింది.

ఆ ఇంట్లో కొన్ని చోట్ల  దీపాలు లేకుండానే వెలుతురు,ఇంకొన్ని  చోట్ల ఫాన్లు తిరగకుండానే వీస్తున్న గాలి అలలు.

‘ మయసభలా ఉంది మీ ఇల్లు ‘ ఆ వెటకారంలో వంకర లేదు.

‘ అవును, అలాంటిదే. లారీ బేకర్ అనే ఆర్కిటెక్ట్ పేరు వినేఉంటావు. వీలైనంతగా ప్రకృతికి దగ్గరగా ఉండటం ఆయన ఉద్దేశ్యం. అలా కట్టటం లో ఖర్చు కూడా తక్కువని చెప్పేవారు .కేరళలో చాలా కట్టారు  ఇలాంటివి. నాన్న విని వెతుక్కుంటూ వెళ్లి పరిచయం చేసుకుని ఒప్పించారట , అప్పటికే ఆయన పెద్దవారయిపోయారు . ‘

మనుషులు ఇలా కూడా ఉంటారా? నమ్మబుద్ధి కాలేదు .

తనకి ఒక చిన్న గది ఇచ్చారొక చివరన. పసుపురంగు  గోడలు, చిన్న పసుపుపూలు ఉన్న దుప్పటి మంచం మీద. ఇక్కడి పాశ్చాత్యచిత్రంలో నిశ్చింతగా  ఆడుకుంటున్న అక్కాచెల్లెళ్లు.

స్నానం చేసి వచ్చేటప్పటికి వంటగదిలోనుంచి అంతుపట్టని సువాసనలు  ..

తను ఎన్నడూ తినని పదార్ధాలే అన్నీ.  ఎర్రగా వేయించిన పల్చటి  దొండకాయ ముక్కలు, చారులో  ఇంగువ వాసన వేసే పోపు . మెంతిపిండి వేసిన మామిడిముక్కల పచ్చడి.. ఆశ్చర్యకరంగా సయించకపోవటమేమీ లేకపోగా ఇంకాస్త ఆకలి పెరిగిందేమో కూడా.

ఒక మూల ఎక్కడో టి.వి. కనపడింది. దాన్ని ఆన్ చేసే ధోరణిలో ఎవరూ లేరు. పొందికగా అందమయిన బట్ట కప్పి ఉంది.’  ఏమిటి చేస్తారు వీళ్లు నిద్రపోయేలోపు? ‘ ప్రవల్లిక సందేహం.

సమాధానంగా తంబురా తీసుకు వచ్చింది ఆముక్త .

‘ అమ్మ బాగా పాడుతుంది . సంగీతం ఇష్టమేకదా నీకు, ఎప్పుడూ వింటూనే కనిపిస్తావు ! కాసేపు పాడుకుంటాము, ఉంటావా ?…’

‘ ఉండనీ. ‘ మందలింపుగా నవ్వింది  వసంత.

శృతిచేసుకొని  పాడటం ప్రారంభించింది. ఆమె గొంతులో ఒదుగు ప్రత్యేకంగా ఉంది.. ఆర్ద్రంగా, లోలోపలినుంచి సరాసరి భగవంతుడికే పాడుతున్నట్లు. ముక్త గొంతు కలిపింది. సింధుభైరవి రాగం అది. విషాదం, వేదన…అంతలోనే ఉపశమనం వినేవారికి. అన్నిటికీ తానూ లోనయి లీనమై ఉండిపోయింది  ప్రవల్లిక.  కులశేఖర్ వాలు కుర్చీలో కళ్లు మూసుకొని వింటున్నాడు. తాను దారితప్పి ఏపాత పుస్తకం  లోకో దూరిపోయానా అనుకుంది . .. ప్రవల్లిక వింటూనేఉంది.

ksheera2

తొందరగా నిద్రపోయారు అందరూ. తెరచి ఉన్న కిటికీ లలోంచి తోట లోపలి పూల గాలి. ఎప్పుడూ వినే భారలోహ సంగీతం కాకుండా ఏదో మూడ్ లో డౌన్ లోడ్  చేసుకున్న  బ్రాహం  లల్లబీ ని వింటూ నిద్రని కనుగొన్నది ఆమె.

పెందలాడే నిద్రపోయిందేమో, ఒక రాత్రి వేళ మెలకువ వచ్చేసింది. గడియారం  చూస్తే నాలుగయింది.  ఎక్కడినుంచో సన్నగా ఏదో అంటున్నట్లు  వినిపిస్తోంది. మెల్లగా ఆ ధ్వనినిబట్టి, కర్పూరపు సుగంధం జాడను బట్టి  వెళ్తే అక్కడ పూజ గది. కులశేఖర్  ఎర్రటి పట్టుధోవతి కట్టుకుని ఉత్తరీయం కప్పుకుని   నెమ్మదిగా చదువుకుంటున్నాడు. అది సంస్కృతమూ తెలుగూ అయితే కాదు.చేత్తో చిన్న గంటని మోగించి హారతి ఇచ్చి పక్కనపెడుతూ వెనక్కి తిరిగాడు.వెడల్పుగా ఇంత పొడవున తెల్లని రెండు నామాల మధ్య సిందూరవర్ణపు నామం, కింద చిన్న పాదం. నిద్రకళ్లేసుకుని  చూస్తున్న ఆమెని  చూస్తే ముద్దొచ్చి నవ్వాడు. బదులుగా  కాస్త నవ్వేసి వెళ్లి పడుకుంది.

తెల్లారి  బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర క్లినిక్ కి వెళ్లే డాక్టర్ దుస్తులలోనే కనిపించాడు.కడిగిన ముఖం మీద నిలువుబొట్టు లీలగా కనిపిస్తోంది. వసంత మెత్తటి ఇడ్లీలతో కొబ్బరిపచ్చడి వడ్డించింది.

‘ ఆగు. ముందు ఇది తిను ‘

కిచిడీ లాంటిదేదో పెట్టారు ప్లేట్ లో.

‘ పప్పుపొంగలి. నాన్న ధనుర్మాసం చేస్తారుగా, ప్రసాదం తయారు చేశారు. .భలే ఉంటుంది. ‘

వసంత నవ్వుతూ అంది ‘ఎందుకు బావుండదూ, బోలెడు నెయ్యి పోస్తే !’

పరాచికానికేమిగాని దివ్యంగా ఉంది పొంగలి.

‘మీ ఇళ్లలో మగవాళ్లు వంట చేస్తారా ?’

‘ఇప్పటిసంగతేమో కాని, ఒకప్పుడు మగవాళ్లకి వంట రావటం తప్పనిసరి.’

‘ధనుర్మాసం అంటే?’

‘మార్గశిరం, పుష్యమాసం రెండింటిలోని 30 రోజులని కలిపి అలా అంటారు. బ్రాహ్మీ ముహూర్తం లో తిరుప్పావై చదువుతారు. నైవేద్యాలు పెడతారు.’

‘ అంటే తమిళమా, మీ నాన్నగారు చదివింది?అర్థమవుతుందా? ’

‘ కొన్నాళ్లు పాఠం చెప్పించుకున్నారు తెలిసినవారితో. తెలుగులో కృష్ణశాస్త్రి గారూ ఇంకొందరూ అనువదించారు కదా. ’

‘ మరి హాయిగా తెలుగులోనే చదువుకోవచ్చు కదా ? ’

‘వల్లీ అది దివ్యప్రబంధంలో భాగం.ఆండాళ్ నోటివెంట వచ్చిన మాటలని అలా  పైకి తలచుకోవటమే  విష్ణుప్రీతికరమని అనుకుంటారు. ఆమె ధరించి ఇచ్చిన మాలలని తప్ప ఇష్టపడని వాడు కదా ఆయన!

ఈ శ్రీవైష్ణవ పద్ధతిలో శ్రీ ని అర్చించకుండా విష్ణువు ని పూజించకూడదంటారు. ఆ తల్లి మన ఆర్తీ యోగ్యతా చూసి తండ్రితో చెప్తుందని.

ఆ బొమ్మ చూశావు కదా…నాన్నే వేశారు. ఆయన భగవద్రామానుజులు. గురువు ఆయనకి మంత్రోపదేశం చేసి , “తరింపజేసే ద్వయమంత్రం ఇది. రహస్యం సుమా, ఎవరికయినా చెప్పావా నరకానికి పోగలవు.” అన్నారట. చరచరా వెళ్లి గోపురం  పైకి ఎక్కి అక్కడ ఉన్న జనమందరికీ బహిరంగంగా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉపదేశించారు రామానుజులు. ఇందరు జీవులు తరిస్తూ ఉండగా నేనొక్కడినీ నరకానికి పోతే ఏమనుకున్నారట. దైవాన్ని అంతమందికీ దగ్గర చేశారు. ఆయన గతించాక, కాలం గడిచాక, విశాలమైన ఆ సంప్రదాయం కుంచించుకుపోయింది.’

ఆ ఇంట్లో వారం రోజులు నిర్విచారంగా   కదలిపోయాయి…అది నిజమయిన సంతోష చంద్రశాల. పుస్తకాలు రెండు భాషల్లోవీ కలిపి  ఒక పాటి గ్రంథాలయం అనదగినన్ని ఉన్నాయి. కర్ణాటకమూ, పాశ్చాత్య శాస్త్రీయమూ,   హిందూస్తానీ మూడు పద్ధతులలోనూ సంగీతసరస్వతి కొలువై ఉంది. . ఎక్కడయినా మొదలుపెడితే నెలలు నెలలు గడిచిపోయేలా  ఉన్నాయి. ప్రవల్లిక లోని సున్నితత్వం మెల్లగా కళ్లు తెరిచి గమనించింది అంతా.

కులశేఖర్ మాటకారి, హాస్యప్రియుడు. అతని సమక్షంలో ఎప్పుడూ నవ్వనంతగా నవ్వింది .  వసంత సౌమ్యురాలు, ఆలోచించి మాట్లాడే స్వభావం. ఎందుకో ఆమెతో ఎప్పుడూ మాట్లాడనంతగా మాట్లాడింది. ఎవరూ తనని ఇబ్బంది పెట్టే ఏ ప్రశ్నా వేయలేదని ఆ తర్వాత అర్థమయింది. తమలో ఒకదానిలాగ సహజంగా ప్రేమించారు ,  తిరిగి ప్రేమించకుండా నిలవలేకపోయింది.

పూసిన పున్నాగ చెట్టుకింద కూర్చున్న  ఒక మధ్యాహ్నం అంది .  ‘ ఆంటీ అంకుల్  అసలు పోట్లాడుకోరా? ఆంటీ చదువుకున్నట్లున్నారు కదా, ఉద్యోగం చేయనందుకు బాధ పడరా? ‘

‘వీళ్ల పెళ్లి పెద్దవాళ్లు చేశారా ప్రేమ పెళ్లా?’

‘  రెండూ అవును, రెండూ కాదు.దూరపు బంధుత్వం, దగ్గరి స్నేహం ఉందట  కుటుంబాల మధ్య .పోట్లాడుకునే ఉండి ఉంటారు, కాకపోతే నేను చూడలేదు ఎప్పుడూ. అమ్మ తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో మాస్టర్స్ చేసింది. ఉద్యోగం? ఏమో, తెలియదు మరి ‘

వసంతనే అడిగేసింది .

‘ ఉద్యోగం చేసే తీరాలని పట్టుదల లేదమ్మా . చేయకపోతే ఏమిటంటావు? ‘  సింపుల్ గా అడిగింది. ప్రవల్లిక తబ్బిబ్బయింది. నవ్వుతూ అంది వసంత ‘ ఎవరి ప్రాధాన్యతలని వారే నిర్ణయించుకోవాలనే కదా అంటున్నారు? నా జీవితం ఎవరి కొలమానాల ప్రకారమో గడవాలని అనుకోను నేను ‘  ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదీ స్త్రీత్వపు ఒక పార్శ్వ్యమేనేమోనని ప్రవల్లిక  అనుకోవలసి వచ్చింది.

ఒక చల్లటి సాయంకాలం వ్యాహ్యాళికి  వెళ్లారు.

ఆ దారి వెంట నడవటం  సుఖంగా ఉంది. దీవిస్తూన్నట్లు వంగిన మోదుగ  చెట్లమధ్యలోనుంచి రాలి పడిన ఆకులని రేపుతూ వీచే గాలి.

‘ మా స్కూల్ ఇక్కడే ‘

అక్కడా అక్కడా కట్టడాలు . ఎప్పటినుంచో పెరుగుతున్న బలమైన వృక్షాలు.

ఆ స్కూల్ లో వేరే  రాష్ట్రాలనుంచి వచ్చిన ఉపాధ్యాయులూ విద్యార్థులూ కూడా ఉంటారు. వేసవి లో తప్ప వూళ్లకి వెళ్లరు. ఇద్దరు టీచర్ లు కనిపించారు. ఆప్యాయంగా మాట్లాడారు. హాస్టల్ పిల్లలు చుట్టూ మూగారు. అప్పటి ప్రైమరీ   స్కూల్ పిల్లలు ఇప్పుడు పది, పదకొండు క్లాస్ లు చదువుతున్నారట. ఆయాలు, వాచ్ మన్ అందరూ ఇష్టంగా, చనువుగా పలకరించారు.

వెనకవైపున సరిహద్దు ఏమీ ఉన్నట్లు లేదు.జీడిమామిడి తోట అక్కడ.

‘ ఎవరిదో ఈ తోట?

‘మనదే, ఇష్టఫడటం చాలదూ సొంతం అవటానికి? ‘

ఈ లాజిక్ ఎంతమాత్రమూ అర్థం కాలేదు ప్రవల్లికకి.

ఎంతో అందమైన గుబుర్లు, క్రిందికి వాలిన కొమ్మలు.పువ్వులూ పళ్లూ లేకుండానే శోభాయమానంగా ఉన్న చెట్లు.ఆ నీడ లోకి కదలటం వృక్షపు కౌగిలిలోకి వెళ్లటం లాగా ఉంది. ఉండి ఉండి దూరం నుంచి వినపడే పిట్టల అరుపులు తప్ప ఎక్కడా ఏ శబ్దమూ లేదు, వాళ్లూ మాట్లాడుకోలేదు.  మార్మికమైన శాంతి ఏదో వెన్నెలలా పరచుకుంది. కథలలో రాసినట్లు రెండులోకాల మధ్యని సరిహద్దులాగా ఉంది, అక్కడనుంచి ఏ దేవలోకం  అడుగు పెట్టవచ్చునన్నట్లు. లోలోపలి ముడులేవో విడివడి  విప్పారుతూన్నట్లు.

చాలాసేపటికి వెనుదిరిగారు.

కాస్త తడిసిన కళ్లతో, గొంతుతో అంది , ‘ ఎంత అదృష్టవంతురాలివి ముక్తా. నీ ప్రపంచం ఇంత బావుంది! అన్నీ, అన్నీ.. ఉన్నాయి నీకు. నువ్వు ఎవరికీ అక్కర్లేకపోవటాన్ని ఊహించగలవా? నేనంతే, ఎవరూ లేరు నాకు. నా పుట్టుకే కోరుకోలేదెవరూ! అందుకు ఉంటాను ఇలాగ, నా మీద జాలి పడకూడదు ఎవరూ. భయపడాలి,పారిపోవాలి. నా మాటలే , వెక్కిరింతలే నా రక్ష, నా కవచం. ఎందుకు దాన్ని బద్దలు కొట్టాలని చూస్తున్నావు? మళ్లీ గాయపడిపోతాను, నువ్వుంటావా కాపాడటానికి ‘

‘ ఉంటాను, ఎందుకు ఉండను? నేనెవరికీ అక్కర్లేకపోవటం నాకెందుకు తెలియదు, చాలా బాగా తెలుసు. నమ్మవు కదూ? ఈ అమ్మా నాన్నా పెంచుకున్నారు నన్ను ‘

‘ ఆ. అయితే ఏమి? ఆ తర్వాత బావున్నావు కదా! నన్ను చూడు- ఇరవై ఏళ్లొచ్చాయి, నేను చచ్చిపోతే ఏడ్చేవాళ్లు లేరు తెలుసా! ‘

‘ష్..అలా అనకు.నువ్వు తలుపులన్నీ మూసేసుకుని ఊపిరి ఆడటం లేదంటున్నావు ‘

‘ మూశాను, లోకం మాటలు వినలేక! ‘

‘ మమ్మీకీ డాడీ కి  పెద్దవాళ్లే పెళ్లి చేశారు. మమ్మీకి ఇష్టంలేదట,  మరి ముందే ఎందుకు చెప్పలేదో తెలియదు. ఆమె అయిష్టం డాడీ కీ తెలిసిపోయింది. కలిసి ఎందుకు ఉన్నారో ! ఒకరిమీద ఒకరికి ద్వేషం, అయినా నేను పుట్టాను. తలచుకుంటే సిగ్గుగా ఉంటుంది . నా పేరు పెట్టటంలో మాత్రం ఇద్దరూ ఏకీభవించారట…వాళ్లకే అర్థమయిఉండదు నా పుట్టుక. కాస్త ఊహ వచ్చినప్పటినుంచీ ఆ ఇల్లు నరకానికి చిరునామా. మమ్మీ తన ప్రేమికుడితో వెళ్లిపోయేటప్పటికి నాకు ఎనిమిదేళ్లు. అంతకుముందు కూడా వాళ్లు కలుసుకుంటూనే ఉండేవారని తర్వాత తెలిసింది. డాడీ విపరీతంగా డిస్టర్బ్   అయాడు ఆమె వెళ్లటం వల్ల. అహం దెబ్బతినటం, సొసైటీ  లో తలవంపులు దానికి కారణాలేమో…మిస్ అయేటంత ప్రేమ వాళ్ల మధ్యన లేదు. రాను రాను డాడీ తన ఇష్టం వచ్చినట్లు బతకటం మొదలు పెట్టాడు. అలాంటి పరిస్థితులలో నేను తనతో ఉండకూడదని తనకే తోచిందో, ఎవరయినా చెప్పారో మరి, ఊటీ లవ్ డేల్ లో  వేశారు నన్ను. మంచి వాతావరణం, గొప్ప చరిత్ర ఉన్న స్కూల్ కదా అది. బా గానే ఉండేది. సెలవులలో  డాడీ వచ్చి చూసేవాడు…ఆ తర్వాత మమ్మీ కూడా వచ్చింది. నన్ను వదిలేసి వెళ్లినందుకు గిల్ట్ లాంటిదేమీ లేదేమో…చాలా మామూలుగా, రోజూ చూస్తున్నట్లుగానే మాట్లాడింది. నాకు రోషం, బాధ, కోపం…చివరికి ఒక ద్వేషం. తను ఎవరితో ఉండాలని వెళ్లిందో అలా ఎన్నో రోజులు లేదు. ఆ తర్వాత ఇంకొకరు, వేరొకరు. డాడీ,   మమ్మీ ఇద్దరికీ అంతే. ఆ కొత్త కొత్త స్నేహితులతో నాకు ఎలా ఉండాలో తెలిసేదే కాదు. కొందరు కొంత నచ్చేవారు, ఇంకొందరిని చూస్తే వెలపరంగా అనిపించేది.. నేను ఎవరికీ చెందను అని మాత్రం తెలిసింది. పేరెంట్స్ తో సహా అందరూ నా మీద చూపించింది ఛారిటీ  నే. చాలా ఏళ్లకి డాడీ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. డాడీ భార్యకీ నాకూ హేట్ ఎట్ ఫస్ట్ సైట్. బహుశా ఆమె ఇన్ సెక్యూరిటీ తోనేమో, డాడీ యు.ఎస్. వెళ్లిపోయాడు. మమ్మీ ఆ మధ్యే ఒక ఆశ్రమం లో చేరింది. తనని తాను తెలుసుకుంటుందట, నన్నూ రమ్మని. చచ్చినా రానన్నాను. అదీ కథ అమ్మాయీ, నాకు నేనే, ఏక్  నిరంజన్ ‘ తెలిసిపోయే ఉద్వేగం ఏదీ లేకుండా చెప్పుకొచ్చింది ప్రవల్లిక… ఆ వెనక  నిర్వేదం అలా స్పష్టమయిపోయింది.

‘ ఇదంతా , ఈ ఆలోచించటం- సబబుగానే ఉందా? ఆ తల్లిదండ్రుల ఇబ్బందులూ వారి వైపునుంచి వాదనలూ ఉంటాయి కదా?  ‘  సందేహం ఆముక్తకి. పైకి ఏమీ అనలేదు, బాధో, ఇంకా పైదో…పడినది ప్రవల్లిక గనుక.

‘ ఎందుకు నీకిదంతా చెప్పేస్తున్నానో! తర్వాత నన్ను నేను తిట్టుకుటానేమో , నీముందు బయటపడిపోయినందుకు! ‘

‘ ఊహూ.నేను అలా అనుకోను.చాలా దూరం నడిచాము, మనసులో బరువు దించుకున్నావు..అలిసిపోయి నిద్రపోతావనుకుంటున్నాను ‘

‘ నువ్వు ఇలాగే అంటావు,ఇలాగే ఉంటావు! ఎలాగో నాకు తెలీదు! ‘

‘ ఏముంది వల్లీ ! నాకు జరిగిన మంచిని ప్రతిదినమూ పండగ చేసుకుంటూనే ఉంటాను, ఎక్కడికీ మొహం మొత్తనిదే..’ నవ్వింది .

‘ నా అసలు పేరు చెప్పనా? మా నాయనమ్మ పేరు పెట్టారట. పరవస్తు చూడికుడుత్తమ్మ.’

‘ఈ ఇంటిపేరు ఎక్కడో విన్నట్లుందే ‘

‘ ఆ.గొప్పపండితుడు చిన్నయసూరి   గారి ఇంటి పేరు. నాకు తెలిసి మా వాళ్లెవరూ పండితులు కాదుగదా, పదో తరగతి కూడా పాసవలేదు.జరుగుబాటే కష్టమయిన కుటంబం మాది.చాత్తాద వైష్ణవులం మేము.’

‘ అంటే? బ్రాహ్మలు కారా ? ‘

‘ . ఊహూ.సాతాని వాళ్లంటారు కదా, అది మేము. ఎ ప్పుడో మధ్యయుగాలలో తీసుకున్న వైష్ణవ మతం. కాయగూరలు కానిదేదో తిన్నట్లే జ్ఞాపకం ‘

‘ నాకు నాలుగేళ్లున్నప్పుడు నాన్నకి హెచ్.ఐ. వి. ఉందని తెలిసిందట. సింగరేణిలో పనిచేసేవాడట , మంచివాడేనంటారు.ఆయన నీతీనియమాలని నేను ఎంచలేను కదా. అవమానం, నిరాశ. అమ్మతో సహా ఆత్మహత్యచేసుకున్నాడు. తాత అప్పటికే పెద్దవాడయిపోయాడు, ఆరోగ్యమూ బావుండేది కాదు. బాబాయిలకి ఇష్టం లేదు నేను ఉండటం, ఆజబ్బు నాకూ ఉందనుకునేవారో ఏమో. ఒకసారి తాతకి జబ్బు చేసి సింగరేణి హాస్పిటల్ లో చేరాడు. నాన్న అప్పుడు అక్కడ పనిచేసేవారు. నన్ను చూసి, నా పరిస్థితి  తెలిసి పెంచుకుంటానని అడిగారు, వాళ్లకి సంతానం కలగరని . తాత ముందు సంకోచించాడట.నాన్న  నచ్చజెప్పి తెచ్చుకున్నారు.ఏ పుణ్యం నన్ను వాళ్ల చేతుల్లో పడేసిందో ! అక్కడ ఉద్యోగం వదిలి ఇక్కడికి ప్రాక్టీస్ చేయటం కోసం వచ్చేశారు. ఇక్కడి తాతగారు అప్పటికి బ్రతికి ఉన్నారు, అభ్యంతరం చెప్పారు. నాన్న ప్రమాణాలు చూపించారు. బంధువులు ఎవరూ సమాధానపడలేదు. ఆ ఊరు మనం దిగిన స్టేషన్ కి అటువైపు ఉంటుంది.అంతా శ్రీవైష్ణవ  కుటుంబాలే ఎప్పటినుంచో. అక్కడ తనకి ఉన్నదేదో అమ్మేసి ఈ వైపుకి వచ్చేశారు నాన్న.. ఇంటినీ లోపలి సౌందర్యాన్నీ నిర్మించుకున్నారు. అమ్మ ఈ తోటనంతా పెంచింది.

శాస్త్రోక్తంగానూ, చట్టబద్ధం గానూ కూడా దత్తత చేసుకున్నారు.చూడికుడుత్తమ్మని ఆముక్తమాల్యద గా మార్చారు. రెండూ గోదాదేవి పేర్లే, అర్థం ఒకటే. సాహిత్యం చదివించారు, సంగీతం నేర్పించారు.  . వైష్ణవుల ఇళ్లలో సంగీతం ఎక్కువే ఉంటుంది. …అమ్మకి శ్రీరంగం గోపాలరత్నం గారు పెద్దమ్మ అవుతారట. మేమూ భజన కీర్తనలు పాడుకునేవాళ్లమే కదా, నేర్చేసుకున్నాను.

మెడిసిన్ లో సీట్ శ్రీమత్ తిరుమల పెద్దింట్ల ఆముక్తమాల్యద గానే వచ్చింది. ‘

అడగని సందేహానికి జవాబిచ్చింది.

‘ నాన్న  రోజుకి యాభయి , అరవై మందిని చూస్తారు. ఫీ యాభయి రూపాయలు. ఒకసారి ఇస్తే నెలవరకూ సరిపోతుంది. పరీక్ష చెశాక  ఆ డబ్బూ వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు కొంతమందికి.  అయినా కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. పేషంట్లు టెస్ట్  లు చేయించమన్నా  అవసరం లేనివి రాయరు. మందులూ అంతే. ఇందులోనుంచే అన్ని ఖర్చులూ!

‘ సరిపోతుందా మరి? ‘

‘ సరిపోవటానికి అంతు ఎక్కడుంటుంది ! నాన్న గుంటూరు స్టూడెంట్. అప్పట్లో  మహానుభావుడయిన సర్జన్ ఒకాయన ఉండేవారట శర్మ గారని. ఆయన అనేవారట ,  ఎనిమిది వేలు చాలక  పోతే ఎనభై  వేలూ చాలవు అని. ఆయన నాన్న కి, ఇంకా చాలామందికి  ఆదర్శమూర్తి. అత్యవసరమయితే ఏదో కొంత ఉందనుకుంటాను బాంక్ లో. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది మా ముగ్గురికీ ‘

‘  చాలామంది చదువుల కి సాయం  చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు..  విద్యలో, వైద్యంతో  సహాయపడటం  తప్పనిసరి అని అనుకుంటారు, ఆ పరిధిని తనకి గీసుకున్నారు.

జీవనం  సుఖంగా   సౌకర్యంగా  కొనసాగటానికి కొన్ని లెక్కలు సరిగ్గా వేయాలి, చేయాలి. ఆ తర్వాత అంతా వెసులుబాటే కదా ’

అవును, ఆ వెసులుబాటు అంతటా కనిపిస్తూనే ఉంది.  కాలం  ఇక్కడ తీరికగా ఆగినట్లుంది.

పూర్తిగా ఊపిరి ఆడుతున్నట్లుంది.

భోగి పండగ నాడు  ఆ ముక్త ఊదా రంగు  పట్టు చీర కట్టుకుంది. వంగపూవు రంగులో  అందమైన  సల్వార్ కమీజ్ ఇచ్చారు ప్రవల్లికకి. ఆ దుస్తులలో, ఆ ముక్త వెంట బడి  చేసిన అలంకారంలోతనని తాను  అద్దంలో చూసుకుంది, ఆశ్చర్యపడింది. తను కూడా బావుంటానని ఏనాడూ అనుకోనేలేదు.

భోగి పండగ రోజునే  ధనుర్మాసం ఆఖరట. కాస్త దూరంలో  కొండమీద ఉన్న అందమైన గుడికి వెళ్లారు. గోకుల పారిజాతగిరి అట అది, ఆ పేరే  కవిత్వంలాగా ఉంది. ! చాలా శాంతంగా ఉన్న పరిసరాలు. చుట్టూ ఒకే రకపు చెట్లు.

‘ ఏమిటి ఇవి? ‘

‘ పొగడచెట్లు. వకుళ అంటారు సంస్కృతంలో. శ్రీనివాసుడి తల్లి ఆమె. అందుకు ఇవి చాలా ప్రియం ఈ  దేవుడికి.’

వేయి తల్లిదనాలు రాశిపోసినంత సౌరభం  ఆపూలకి.

రాలిన పూలు గుప్పెళ్లనిండుగా ఏరుకున్నారు. ఆ కొండగాలి, ఆ శీతాకాలం, ప్రదోష వేళ ఆలయంలో వెలిగించిన దీపాలు…లోకాతీతం గా ఉంది.

తిరిగి వెళ్తూన్నప్పుడు

‘ ఇక్కడికే రా. మళ్లీ మళ్లీ రా. చదువు అయిపోయాక వచ్చేసి ఉండిపో ‘

ఆముక్త ఒక్కతే అలా అనుకుంటే సరిపోతుందా?  ..

బదులు చెప్పలేదు .

ఆ మరుసటిరోజున తిరిగి వెళ్లాలి. వసంతా కులశేఖర్ ఇద్దరూ కలిసి వచ్చేశారు ప్రవల్లిక బట్టలు సర్దుకుంటూ ఉంటే.

‘ మళ్లీ ఎప్పుడొస్తావమ్మా? ‘

కేవలం మర్యాదకి అడిగినట్లుగా లేదు…

‘ వస్తానండీ, వీలు చూసుకుని ‘

‘ అది కాదమ్మా. .’  సంకోచిస్తున్నాడు ఆయన.

వసంత అడిగేసింది ‘ నువ్వు..ఏమీ అనుకోకపోతే ప్రతి సెలవలకీ ఇక్కడికి వచ్చేయి… ‘.

ఆయన మొహమాటంగా అన్నాడు, ‘ తర్వాత కూడా…నేనూ పెద్దవాడినయిపోతున్నాను కదా, నాకు తోడుంటావా, ఆముక్తతోబాటు ?

బదులు చెప్పటానికి గొంతుకేదో  అడ్డుపడింది ప్రవల్లికకి.

‘ వస్తాను ‘

తెచ్చుకున్న పొగడపూలని సూట్ కేస్ లో దాచింది. ఆ పరిమళం చాలాకాలం అలాగే  ఉండిపోతుందట. దివ్యలక్షణం వాటిది, ఆ ఇంటిది !

— మైథిలి అబ్బరాజు

 

 

 

పేచీలున్నాయి…మీతో నాకు…నాతో నాకు కూడా!

Chandra2

 

దాదాపు ఏడాది క్రితం వేసంకాలంలో ప్రభవ బళ్ళో గుడిసె వేసే  పన్లో ఉన్నామా,

జూలియా గుంటర్ గారు  వచ్చారు మా ఇంటికి.

అప్పుడే కట్టిన గట్టు మీద కూర్చుని, కొత్త తాటాకుల కమ్మదనంలో మునిగితేలుతూ.. ఆ కబుర్లు ఈ కబుర్లు చెపుతూ , అవీ ఇవీ అడుగుతూ .. వారు ఒక గట్టి ప్రశ్నను యధాలాపంగానే అడిగారు.  ఊరక అడగరు కదా మహానుభావులు !

నేనూ ఆ మాటల వరస లోనే చటుక్కున  చెప్పేసాను. నా మనసులో మాట . తేలిక గానే.

“ What is resistance for you?” అడిగారామె.

“ Being myself ! It’s my resistance and my existence as well!” తడుముకోకుండా చెప్పా.

అక్కడి వరకు బాగానే ఉంది !

ఒక్క సారి తీరికగా మా సంభాషణను నెమరు వేసుకొంటే , నేనంత సులువుగా ఇచ్చేయదగ్గ సమధానం కాదని నాకు తెలియవచ్చింది.

నేనింకా ఆ ప్రశ్నకు సమాధానాలు అన్వేషిస్తూనే. ఉన్నాను కదా…. ఆ జవాబును జీవించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా…  .ప్రతిక్షణం.

సరిగ్గా అప్పటికి రెండు దశాబ్దాల క్రితం నేను రాసిన మాట పదిమంది కళ్ళల్లో పడింది. ఇది ప్రయత్న పూర్వకంగా చేసింది కాదు. బోలెడంత ఆవేశం తో చేసిన పని!

నేను ప్రధానం గా పాఠకురాలిని.

నెల్లూరు చిన్న పత్రికలకు పెట్టింది పేరు. తుంగా రాజగోపాల రెడ్డి గారు “లాయర్” పేరిట ఒక పత్రిక నిర్వహించేవారు. అందులో తిరుమూరు నరసింహా రెడ్డి గారు “లోకాలోకనం”  అని శీర్షిక రాసే వారు. ఆ ఏడాది బడ్జెట్ ను వ్యాఖ్యానిస్తూ , జాషువా గారి పద్యం ” భాగ్య విహీనుల క్షుత్తులారునే ! ” ని mis interpret చేసారు. .పై నుంచి జాషువా గారిపై అనవసరపు అసంగత వ్యాఖ్యానాలు చేశారు. నాకు బోలేడంత కోపం వచ్చింది. వెంటనే తెగ బారెడు ఉత్తరం రాసేసా! రాజగోపాల్ రెడ్డి గారు ఆ ఉత్తారాన్ని యధాతథం గా ప్రకటించారు. తలా తోకా తీసేసి.

అది ఆ టాబ్లాయిడ్ సైజు  పత్రిక లో  ఒక పేజీ నిండుగా అచ్చయిన మొదటి వ్యాస రచన .

అచ్చులో చూసుకోగానే నా దిమ్మ తిరిగి పోయింది. .నేను సహజంగా బిడియస్తురాలిని. పల్లెత్తి మాట్లాడే దానిని కాదు. అలాంటిది నాకెందుకంత కోపం వచ్చిందో ఇలా అక్ష్రాగ్రహం వెలికక్కానో నాకే తెలియదు! బహుశా ఆ పద్యం పట్ల నాకున్న అభిమానం , జాషువా గారి పట్ల ఉన్న అంతులేని గౌరవం కారణాలు కావచ్చు.

అప్పుడు తెలిసింది. తిరుమూరు వారు నెల్లూరి సాహితీప్రముఖుల్లో ఒకరని. వారి అబ్బాయి తిరుమూరు సుధాకర్ రెడ్డి గారు స్థానిక కళా శాలలో తెలుగు ఉపన్యాసకులనీ, స్వయంగా కవీ విమర్షకులనీ.

నాకు కాళ్ళుచేతులు ఆడ లేదు. పెద్దలను ఎదురాడరాదు అని నేర్పిన కుటుంబ నేపథ్యం కలిగిన దానిని కదా. తిరుమూరు వారు వయో వృద్ధులు. నేనా నెల్లూరు వారి కొత్త కోడలిని. ఎంత పని ఛేసాను అని అనిపించిందే కానీ , నా ఉత్తరం నాకు  తప్పుగా తోచలేదు. పత్రిక ప్రతినొక దానిని నాన్న గారికి పంపాను.

అప్పుడు నత్త ఉత్తరాల కాలం కదా. నాన్న గారికి ఒక వారానికి ఆ పత్రిక చేరాక, చదివి ఫోన్ చేసారు.

“నువ్వు సరిగ్గా ఆలోచించావ్!” అన్నారు.

అవును . నాన్న గారు అన్న మాట ఇప్పుడు తలుచుకొంటే, నేను రాయలేదు. నా ఆలోచనలకు అక్షరాలద్దాను. అంతే!

జూలియా తో ప్రభవ పిల్లలూ...చంద్రలత

జూలియా తో ప్రభవ పిల్లలూ…చంద్రలత

నాన్న గారి చిన్న మాట నాకు గొప్ప బలం ఇచ్చింది. నా ఆలోచనలు సరియైన తోవలోనే సాగుతున్నాయని చిన్నపాటి నమ్మకం కుదిరింది.

ఆ దరిమిలా నాన్న గారు ఎప్పుడు ఫోన్ చేసినా  పరామర్షలతో పాటు

“మళ్ళీ ఏం రాశావ్ ? మీ వూళ్ళో వారితో పేచీలేమీ లేవా? ” అనే వారు నవ్వుతూ.

ఎందుకు లేవు  ? బోలెడు!

మా వూళ్ళొ వాళ్ళతోనే కాదు..  నా కుటుంబంతో.. నా సంఘంతో …నాతో నాకే …  పేచీలున్నాయి!

అలా నా చుట్టూ నాలో నిరంతరం జరిగే సంఘర్షణలకు  …నాకు దక్కిన సమాధానాలే… నాలో కలిగిన సందేహాలే … నాలోని సంధిగ్ధాలే .. ఆ క్రమంలో నేను అర్ధం చేసుకొన్న పరిమితులే … …నేను గ్రహించిన  అపరిమితమైన శక్తే .. నేను ఆశించిన మార్పులే…నేను పొందిన స్వాంతనే .. .

నా గుప్పెడు అక్షరాలు !

ఆ సారాంశమే దృశ్యాదృశ్యంలో వ్యక్తపరిచేందుకు ప్రయత్నించాను. కేశవ మాటలుగా .

” ఏమి చూసుకొని నాకీ ధైర్యం?  ఏమీ లేని వాడిని.  సామాన్యుడిని.  అణుమాత్రుడిని.

అయితే ఏం? అనంతమైన శక్తి నాలో లేదూ?”

 

NOTE:

జూలియా గుంటర్ గారు  సెంట్రల్ యూనివర్సిటీ , హైదరాబాద్  లో రీసెర్చ్ స్కాలర్. వారి స్వస్థలం ఆస్ట్రియా. నేను గుంతెర్ గ్రాస్ విద్యార్హ్తిని కావడం మూలాన వారి నేపథ్యం గురించిన బోలెడు కబుర్లు మేము ఇచ్చిపుచ్చుకున్నాం, మా ఇద్దరికీ స్నేహం ఇట్టే కుదిరింది !

నాన్న గారు, శ్రీ కోటపాటి మురహరి రావు గారు. వారు ” వావ్.. వెరీ గుడ్ ” తరహా ప్రోత్సాహాల తండ్రి కారు. తండ్రీబిడ్డల సంబంధాన్ని రచయిత పాఠకుని సంబంధాన్ని ఆయన చాలా స్పష్టంగానే  వేరుచేసి చూసే వారు.  చాలా నిక్కచ్చి విమర్షకులు. నిజాయితీగా నిజం మాట్లాడడం ఆయనకు అలవాటు.

దానా దీనా, గట్టి పేచీ నాన్నగారితోనే అన్న మాట !

బాపూరమణల బళ్ళో ఓ బుడుగు కథ ..!

ఎమ్వీ రాంప్రసాద్

ఎమ్వీ రాంప్రసాద్

 

 

 

 

 

 

 

అనగా అనగా అనగా…..

అనగా నా చిన్నపుడు నానారు నన్ను బళ్ళో పడేదాం అనుకున్నారు.

“బడులు కాని బడులు

తెలుగు పలుకుబడులు రా

విశ్వదాభిరామ వినురవేమ”

అని నమ్మిన కారణాన, నన్ను తీసికెళ్ళి తెలుగు పలుకుబళ్ళో పడేశారు. నాకు మొదట తెలిసిన తెలుగు పలుకుబడి అంటే – నవోదయ బుక్ హౌస్. విజయవాడ. మరి బుడుగూ, సీగానపెసూనాంబ, అప్పారావూ, వీళ్లందరినీ కలిసింది మొదటిసారి అక్కడే!

175-248_muthyala-telugu-m

 

నా ఐదో ఏట – మా నానారిని ఎంకరేజీ చేదామనీ- “పోనీ ముత్యాలముగ్గు సినిమా తీయరాదురా అండీ” అనేశా మా నానారితో . అంతే వెంఠనే బ్భయప్పడిపోయి, తన ఉజ్యోగానికి సెలీవ్ పెట్టి, నిఝం జట్కా మీద మెడ్రాస్ పరిగేఠుకెళ్ళీపోయి సిన్మా మొదలెట్టేశారు.

అన్నట్టు, ఎంకరేజీ అంటే మనకి లాబం వచ్చే పని చెయ్యమని పక్కవాళ్ళని ముందుకు తోయడం ట! మా బాబాయి చెప్పాడు.

ఏం, నానారు మెడ్రాస్ వెళ్తూంటే, ఓ సారో ప్ఫదిసార్లో మేమూ నానారి  చొక్కా పట్టుకుని మెడ్రాసెళ్ళిపోయేవాళ్ళం సెలవుల్లో.

“ఇంతమంది ఉన్నపుడు ఎంచక్కా రైల్లో వెళ్ళాలమ్మా బుడుగూ, జట్కా అయితే, ముప్ఫయ్యో, డెబ్భయ్యో రోలు పడుతుందీ” అన్నారు కదాని. “పోన్లే రైలోనే వెళ్దాం” అని రష్చించేశాను.

కానీ మరి మా నూజివీడుకి మా ఊరి రైలు స్టేషను  చాలా దూరంగ ఉంది కదా! ఎలాగా! (ఎందుకూ అంటే పట్టాలకి దగ్గిరగా ఉండాలనిట .. ఖద విను)

ఏం, అయినా అక్కడ అన్ని రైళ్ళూ ఆగవుట!

” ఓ రెండు జళ్ళ సీతని నించోపెడితే సరి. అన్ని రైళ్ళూ ఈలేసుకుంటూ అవే ఆగుతాయి.” అని నేను అవుడియా చెప్పాను. ఎవరూ విన్లేదు.

హు! వీళ్లకి అవుడియాలు రావు. మనం చెప్తే కాదులేమ్మా బుడుగూ అంటారు.

కాదులే అంటే వాళ్లకి అర్ధం కాలేదనీ, ఆ మాట ఒప్పుకోమూ, అని అర్ధం ట, బాబాయి చెప్పాడు. వాడింకా బోల్డు చెప్తాడ్లే!

ఏం అంచాత మేం విజయవాడ వెళ్ళి అక్కడ రైలెక్కాలన్నమాట. అలా విజయవాడ వెళ్ళినపుడల్లా నవోదయ’లో మాకిష్టమయిన మజిలీ కాసేపు. ‘నవోదయ’లో ఎంచక్కా ఓ రాక్ నిండా బుడుగూ, ఇంకో దాన్లో టామ్ సాయర్లూ, ఇంకోదాన్లో హక్‌లూ వాడి హక్కులూ.. ఇంకా బోళ్ళూ పుస్తకాలన్నమాట. కళ్లు చెదిరిపోయేవి. కొత్త పుస్తకాల గుబాళింపు గమ్మత్తుగ ఉంటుంది లే..

‘బుడుగు’ తీసుకుని బొమ్మలు ఫీడు గా చదివేస్తుంటే, అక్క చూసి జాలిపడి కథ చదివి వినిపించేది. (ఆనక నేనూ చదవడం నేర్చుకున్నాలే ప్పది రోలకో, డెబ్భై రోలకో)

555392_500712493357918_147827536_n

ఏం, ఇంతలో నవోదయ రామ్మోహన్రావ్‌గారు నవ్వుతూ _

“దామ్మా బుడుగూ ఇంద నారాయణ కొట్లో పకోడీలు తినూ” అని ఆయన ఆఫీసు్‌లోకి పిలిచేవారు.

ఎలాగా ఇపుడు?

ఓ పక్క బుక్సూ _

ఇంకో పక్క పకోడీసూ _

బోల్డు సేపు ఆలోచించి, పకోడీలు ఆసాస్వితం, బుక్సు సాస్వితం అని నిట్టూర్చేవాడిని. (అసాస్వితం అంటే గబుక్కుని అయిపోయేవిట , సాస్వితం అంటే బోల్డు రోజులు ఉండేవిట)

అంటే, ముందు పకోడీసు తినేస్తే, బుక్సు ఆనకైనా చదూకోవచ్చు అని అర్ధం అన్నమాట.

మెడ్రాసూ – బాపూ రమణీయం – ఖద

 

ఏం. మెడ్రాస్ వెళ్ళిపోయామా, అక్కడ బాపూరమణగార్ల ఇంట్లో ఉండేవాళ్లమన్న మాట! అక్కడ ఇంతమంది పిల్లలం ఉన్నామా!

(“ఎంతమంది? నువ్వు చెప్పలేదుగా! బుడుగూ!”

“అయితే చదువు “తోక కొమ్మచ్చి” బై అనూ ముళ్ళపూడి ‘అను’ రమణగారమ్మాయి. ‘అను’ మా అమ్ములు”)

ఏం ఇంతమంది ఉన్నామా – గెస్టులూ, ఇష్టులూ . ఇంకా బోళ్ళుమంది.

mullapudi budugu

భగ్యవతీ ఆంటీ మమ్మల్నందరినీ బీచికీ, ఇంకా బోలెడు షికార్లకీ తిప్పేవారు. తిరిగీ, తిరిగీ, అలిసి, సొలసి ఇంటికొచ్చేసరికి, శ్రీదేవీ ఆంటీ మాకందరికీ భోయనాలూ..

పిల్లలందరూ వరసాగ్గా కూచుని.. ఏం . భలే ఉండెదిలే! అల్లరి టుది పవరాఫ్ అల్లరి.

బీచ్‌లూ, షికార్లూ వీటిల్లో మాతోపాటు నానారు లేరన్న సంగతి ఎప్పుడో సాయంకాలం గుర్తొచ్చి

“అమ్మా నానారేరమ్మా” అనడిగితే .. పెద్దాళ్ళతో కబుర్ల హడావిడీలో ఉన్న అమ్మ

“వాళ్ళు కథ మీద కూర్చున్నర్లే ఆ గదిలో” అనేసి మళ్ళీ కబుర్లలో పడిపోయేది.

‘కథ మీద కూచోటం’ అంటే నాకర్ధం కాలేదు.

సర్లే అని ఆ గది గుమ్మం దగ్గిరకెళ్ళి తొంగి చూశా.

బాపూరమణగార్లూ, నానారు ఇంకొన్ని ఫ్రెండ్సులూ సుబ్బరంగా నేల మీదే కూచున్నారు. కథా లేదూ ఏమి లేదు!

అదే సంగతి ఆనక నానారితో చెప్పాను.

“వాళ్లు నేల విడిచి సాము చేయరు” అని వెళ్ళిపోయారు. ఇదీ నాకర్ధం కాలేదు.

హ్మ్మ్ .. ఏంటో ఈ పెద్దాళ్ళు!!

 

ఫోటో వివరాలు -ఎడమ నుంచీ  కుడికి   ( కూర్చున్న వారు ) శ్రీ యుతులు కనుమూరి వెంకట రామరాజు, ముళ్ళపూడి వెంకట రమణ, ఎమ్వీయల్, బాపు,నవోదయ రామ్మోహనరావు గార్లు (నుంచున్న వారు) శ్రీ యుతులు  బివియెస్ రామారావు,  నండూరి రామ్మోహనరావు గార్లు

ఫోటో వివరాలు -ఎడమ నుంచీ కుడికి: ( కూర్చున్న వారు ) శ్రీ యుతులు కనుమూరి వెంకట రామరాజు, ముళ్ళపూడి వెంకట రమణ, ఎమ్వీయల్, బాపు,నవోదయ రామ్మోహనరావు గార్లు, (నుంచున్న వారు) శ్రీ యుతులు బివియెస్ రామారావు, నండూరి రామ్మోహనరావు గార్లు

‘వంట + ‘ఒంట’ బట్టిన వొకాబులరీ ఖద

 మిత్రులతోనూ, అపుడపుడు ఇంట్లోనూ సరదాగా నానారు రమణగారి భాష మాటాడుతుండేవారు. అంచాత మా ఇంటిల్లిపాదికీ అదే విద్యాభ్యాసం. బుడుగు భాష, అప్పారావు భాష, ముత్యాలముగ్గు కంట్రాక్టరు భాష వగైరాలు సమయం సందర్భం బట్టీ.

సోదాహరణముగా వివరింపుము అని మీరంటే గనక, ఓ ఖద (చిన్నదేలే  భయపడకు)

కొత్తావకాయ పెట్టిన రోజుల్లో అమ్మ ఆవకాయ కాకుండా, వేరే ఏదైనా కూర వడ్డించబోతే..

“మహత్తరమైన ఆవకాయ కాకుండా అల్పమైన ఈ కూరలేల?”  అన్న భావన   బట్వాడా చేయటానికి

“ధిక్ అబ్బీ! యామి శిశువా” అని రాజాధిరాజు సైతాను భాష వాడేవారు.

అలాగ రమణగారి భాష మా జనజీవన స్రవంతిలోనే కాక భోజన జీవన స్రవంతిలో కూడా కలిసిపోయి వంట_ఒంట బట్టింది.

———————

” అఋణకిరణుడు కనుచూపు మేరలోకి రాగానే ఋణకిరణాలవాడు పాలిపోయి పారిపోయాడు…” అన్న రమణగారి “ౠణానందలహరి” ప్రారంభవాక్యంలో కథా నేపధ్యం, ఋణహృదయం, బోలెడు  హాస్సెంతో బాటు – సైన్సు సంగతులు కలగలసిపోయి (రమణగారి సాహిత్యంపై సమగ్ర పరిశోధన) చదివితేగానీ, నా చిన్ననాట అర్ధం కాలేదు.

“సూర్యుడు సముద్రం నించీ నీళ్లు అప్పుగా తీసుకుని మళ్లీ వర్షంగా భూదేవికి అప్పిస్తున్నాడు..” అన్న అప్పారావు థీరీ ‘వాటర్ సైకిల్’ అన్న పదిమార్కుల ప్రశ్న వీజీగా గుర్తెట్టుకోవడానికి ఉపయోగపడింది.

ఈ మేజిక్కులు,  నా ఇంజనీరింగ్ చచువులో ఫార్ములాలు అలావోకల్’గా బట్టీ పట్టడానికి ఆస్సెం గుళికలు మిళాయించమని అవుడియాలు ఇచ్చాయి.

పిల్లలకోసం బాపూరమణలు ఇష్టపడీ ఎంతో కష్టపడీ తీసిన వీడియోపాఠాలు ప్రజలకి అందేలా చేయమని శ్రీ ప్రభుత్వం వారిని ప్రార్ధిద్దాం. వీటిలో ముందు తరాల బుడుగులకి ఎంతో లాభం..

————————

“ఆయ్ మరేనండయ్యా! బాపూరమణలు శానా సినేమా కతలూ, వీడియో కతలూ చెప్పేశారు. ఆ బైగినెస్సులో జనాలకి కనీసం రెండు ‘ల’కారాల దాకా మిగిలింది.

‘లె’ర్నింగూ, ‘లా’ఫింగూ” అని ముక్తాయించాడు ము.ము.కాంట్రాక్టరు.

——————

 ముగింపు బిగిన్‌పు

“కొయ్ కొయ్ నా రాజా!”

మీ నానారిని  సిన్మా తీయమని నువు ఎంకరేజీ చేశావా – అదీ నీకు అయిదేళ్లప్పుడు!!

అసలు నువు రాసిందంతా రమణగారి భాష కాపీ” అన్నారు చదివిన కొందరు ప్రజలు.

“మీరు భలే తెలివైనవాడులు!! కనిపెట్టేశారు !! రాతలూ కోతలూ – వారు లేకుండా వేరు శాయంగల పరమహంసలు!

నాకు తెలుసు. అసలు బాపూరమణల్ని కాపీ కొట్టీనంత మాత్రాన్నే తెలుగుభాష ఇంకో ప్ఫదో, డెబ్భయ్యో, పదమూడే ఎక్కంలోని చివరి నెంబరన్ని ఏళ్లు – వాళ్లంత ధీమాగా బతికేస్తుందని, కాపీకొట్టని నా సొంత అభిప్రాయం.

అదియునూ గాక

ఆత్మఖద అంటేనే నికార్సైన ఆత్మస్తుతితో కల్తీలేని పరనింద అన్నారు మా గురువులు రమణారు. మరిహనేం మనకి ‘పవరాఫ్‌టర్నామా’ ఇచ్చేసినట్టే గదా! త్రివిక్రముడు శీనన్న చెప్పినట్టు

మాకు మాత్రం ఆత్మలుండవా ? వాటికీ కథలుండవా? అంచాత వేస్కున్నా నాకు నేనే వీరతాళ్ళు.

———————–

అయితే ఒకటి మాత్రం పచ్చినిజం. కాదు కాదు పండు నిజం.. పండిన నిజం.. మా నానారు నా ఐదోఏట నన్ను బాపూరమణల బళ్ళో పడేసి – గబుక్కున ‘పెన్’చేశారు.

చిన్నపుడు మేం ఆడుకున్న వాళ్ళింటి ముందరి చెట్టు సాక్షిగా!

నేటీకీ గుబాళిస్తున్న నాటి పూల సువాసన సాక్షిగా!!

-రాం ప్రసాద్

( ఎమ్వీయల్  ( 21 సెప్టెంబర్  1944 – 23 జనవరి  1986) వృత్తి రీత్యా తెలుగు అధ్యాపకులు. ప్రవృత్తి  రీత్యా  రచయిత .  ముత్యాల ముగ్గు చిత్ర నిర్మాత గా   , ఆంధ్రజ్యోతి లో ప్రశ్న – జవాబుల శీర్షిక  ‘యువజ్యోతి ‘ నిర్వాహకులుగా ప్రసిద్ధులు.  యువతరం మార్గ దర్శకత్వం, సాహిత్య ప్రచారం  ధ్యేయం గా ఆంధ్ర దేశం అంతటా 

ప్రసంగాల పన్నీటి జల్లులు కురిపించిన వారు. 

మరిన్ని వివరాలు ఈ బ్లాగు లో –

ఈ హార్టికల్ రచయిత ఎమ్వీయల్ గారి అబ్బాయి.  కార్టూన్ బొమ్మ: బ్నిం)

వ్యక్తిగతం

Photo Garimella Narayana

 

తాడు మీద నడిచే విన్యాసపు మోళీ పిల్లలా

కట్టగట్టి గుంపులో నిలబెట్టదు.

పిల్ల మదిలో గూడు కట్టుకున్న

దిగులు  మాత్రమే  అనిపిస్తుంది.

ఆకాశం పైకెక్కి కనివిందు చేసే

ఇంద్రధనుస్సు సోయగంలా కట్టిపడెయ్యదు.

కాని దానిని నేసిన

సూర్యరశ్మి, నీటిబిందువుల పొందికైన కలయికే అయ్యుంటుందనిపిస్తుంది.

చిత్తడి చిరుజల్లుల చిటపటల చిందులా

పలకరించి పోయేలా ఉండదు.

గోప్యంగా మేఘాలకు గాలినిచ్చి పోయిన

ఋతుపవనుడి దానగుణంలా అనిపిస్తుంది.

కనిపించకుండా నిమిరేసిపోయిన

పిల్ల గాలి మంత్రంలానూ

అనిపించదు.

కానీ కెరటాల నుండి చెట్లమీదుగా

జుట్టును రేపిన  లీలేనేమో అనిపిస్తుంది.

 182447_10152600304780363_1937093391_n

విమానంలా గాలిలో గిరికీలు కొట్టదు

రైలులా బస్సులా పడవలా నదిలా

నదిని కట్టిన వంతెనలా

వంతెన కలిసే వడ్డు మీది మొక్కల్లోని పువ్వులా

పువ్వు మీద వాలిన తుమ్మెదలా …

అసలు  యిలాగా  అని

చెప్పేలా ఉండనే ఉండదు

వేరుల్నుండి కాండపు కేశనాళికలలో

చప్పున ఎగసి

ఆ చివరెక్కడో ఆకుల నిగారింపులో

మెరిసి ద్విగుణీకృతమైన

నీటీ జాడ

చేసిన చమక్కేనేమో వ్యక్తిగతమంటె….

వ్యక్తిగతం ఎవరిదైనా ఒక్కటే

ఎవరికైనా ఒక్కటే

వ్యక్తిగతాన్ని తెలుసుకోవడమంటె

చెట్టును నరికేసి నీరు వెళ్ళిన జాడల గురించి తరచి చూడటమేనేమో..

వ్యక్తిగతాన్ని తెలుసుకోవడమంటె

బాతు పొట్టకోసి  బంగారు గుడ్ల కోసం పడే దురాశేనేమో…

వ్యక్తిగతాన్ని తెలుసుకోవడమంటె

వెంబడించి వెంబడించి

మరీ పొట్టన పెట్టుకున్నఅపురూపమైన డయానా ప్రాణమేనేమో…

 నారాయణ గరిమెళ్ళ

అర్ధాంతరంగా….

venu1

నిలువెత్తు మనిషి ఎదుట నిలబడితే

నువ్వేనా, ఆ నాటి నువ్వేనా

నవ్వేనా అప్పటి పారిజాత పువ్వేనా అని

ఆపాదమస్తకం శోధించే చూపులు

ఒక్క కుదుపుకు పూలు జలజలా రాలినట్టు

వేనవేల జ్ఞాపకాల పరిమళాలు

కట్ట తెగి ఒక్కుమ్మడిగా వెల్లువెత్తిన వరదలా

లెక్కలేనన్ని ఉద్వేగాల హోరు

అరమూసిన కళ్లలో సగం ఆరిన వెలుగు

చెంపల మీద జారిపోయిన యవ్వనం

జీవన క్రీడ రెండో సగంలో ప్రవేశించిన జాడ

అక్కడక్కడ వెండితీగలు మెరిసే తల

తెచ్చిపెట్టుకున్నది కాదు, నిజంగానే మీదబడిన పెద్దరికం

ఆత్మీయ మైత్రిని

చాటేదా దాచేదా

ఈ అపరిచిత కౌగిలింత?

mandira1

మాటలు మరచిపోయినట్టు

స్వరం కొత్తగా విప్పుకుంటున్నట్టు

దశాబ్దాల కిందటి పురాస్మృతి

హృదయాంతరాళంలో పోట్లెత్తి

కేరుమనాలా వద్దా అని తడబడుతుంది

కన్నీటి పొత్తిళ్లలో మాట

‘అబ్బ ఎంత మారిపోయావు’ అని ఒక పలకరింపు

‘అప్పట్లా లేవు’ అని ఒక జవాబు

‘బాగున్నావా’ అని ఇద్దరి నోట ఒకే మాటకు

గాలిలో అద్వైతసిద్ధి

కలిసి నడిచిన అడుగులు

పంచుకున్న సంభాషణలు

ఎన్నటికీ మరవని స్నేహం

గుర్తు చేయలేని సంకోచం….

అన్నీ అర్థాంతరంగానే…

(ముప్పై ఏళ్ల తర్వాత కలిసిన సహాధ్యాయులు రమకూ శబరికీ)

ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 28, 2013

painting: Mandira Bhaduri

ఏకాంత సౌందర్యాన్వేషకుడు త్రిపుర

tripuraమనిషి సంఘజీవి.  మనుష్యుల  మధ్యనే జీవిస్తూ మానసికంగా ఏకాంత జీవనసౌందర్యాన్ని అన్వేషించగలిగినవారు, అనుభూతం చేసుకోగలిగిన వారు ఋషి తుల్యులౌతారు.నిరంతర గమనశీలత్వం గలిగిన జీవనంలో గుంపులో కాకుండ, ఒక్క ప్రయాణికుని మాత్రమే తోడుగా ఎంచుకోమని, సరైన తోడు దొరకనపుడు ఖడ్గమృగంలా ఒంటరిగానే గమనం సాగించమని బుద్ధుడుపదేశించాడు. అందుకే, జీవితమంతా ఎంతోమందిని కలుపుకుంటూ విడిపోతూ, సరైన తోడుకోసం అన్వేషిస్తూ జీవనగమనాన్ని సాగించే మనిషి, ఏదో ఒక దశలో ఏకాంత జీవన సౌరభాన్ని ఆఘ్రాణించగలుగుతాడు.   తామరాకు మీది నీటి బొట్టులా ప్రాపంచికబంధాలకు అంటీముట్టనట్లుగా ఉంటూనే, జీవితాన్ని ఉత్సవంలా తీర్చిదిద్దుకోగలుగుతాడు.

సున్నితమనస్కులూ, మానవజీవితాల్లోని అసంబద్ధతలకు, దుఃఖాలకు చలించిపోగలిగిన కరుణాశీలురు, తమనుతాము సరిదిద్దుకుంటూ ఎదిగిన జీవన తాత్వికులూ, ఎన్నో భిన్నమార్గాల్లో గమించి, గమించి, జెన్ బౌద్ధంలో సేదతీరిన సత్యాన్వేషకులూ — వెరశి మానవత్వ ప్రేమికులు అయిన త్రిపుర — ఏకాంత సౌందర్యాన్వేషణలో జీవితాన్ని ఉత్సవంలా మలుచుకున్నవారు.  ఒకే చోట పాతుకు పోయిన వారికన్నా, నిరంతర యాత్రికులు, దేశాంతర వాసులు అయినవారు మానవస్వభావవైవిధ్యాలను, క్షుణ్ణంగా దర్శించగలరు. విభిన్న ప్రాంతాలను సందర్శిస్తూ, రాష్ట్రేతరప్రాంతాలలో ఉద్యోగించిన త్రిపుర ఒకవైపు భిన్నభిన్న సిద్ధాంతాలతోబాటు బౌద్ధాన్ని, ముఖ్యంగా జెన్ బౌద్ధాన్ని, అధ్యయనం చేస్తూనే, మరోవైపు మానవజీవన పార్శ్వాలలోని విభిన్నకోణాలను, అసంబద్ధతలను, ద్వైదీభావ వర్తనలను, జీవన దుఃఖాలను చూచి చలించి పోయారు. తమ గురువు బుచ్చిబాబుగారిలా, తమ ప్రశ్నలకు జవాబులను ప్రపంచ సాహిత్యంలో వెదుక్కునే అలవాటును పెంపొందించుకున్న త్రిపుర – నిరంతర అధ్యయనశీలి త్రిపుర — జీవనగమనంలో ఎన్నో మలుపులు తిరిగి, తిరిగి, ఏకాంత జివనసౌందర్యాన్ని అనుభూతం చేసుకున్న వేళ, పుస్తకాలను గూర్చి, “మనస్సులో మంటలు లేపి, జీవితాన్ని గాలివాన చెట్లను ఊపినట్లు ఊపి, ఇప్పుడు ప్రశాంతంగా బీరువాల్లో పడిఉన్నాయి. అప్పటి వాటి ‘నిజం’, ‘ప్రాణం’ ఇప్పుడు లేవు(చీకటిగదులు), అని గుర్తించిన త్రిపుర అంతర్ముఖత్వంవైపు పయనాన్ని కొనసాగించారు. ఏరుదాటిన తర్వాత తెప్పను ఒడ్డునే వదిలివెడతామనే బౌద్ధభావానికిది గొప్ప ఆనవాలు.
మానవాంతర్గత చీకటికోణాలను ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా మొదలైన త్రిపుర కథారచన, మనిషి, మనీషిగా ఎదగగలిగిన క్రమాన్ని నిర్దేశిస్తాయి. కథలు ఆటోబైయోగ్రఫికల్ గా ఉండాలనీ, రెండురకాల మనస్తత్వాలు లేకుండా, మనం మనతోనే ఇంటర్ రిలేటడ్ గా ఉండాలని నమ్మిన త్రిపుర, తమ కథలను, ఆటోబయోగ్రఫికల్ గా, కన్ ఫెషనల్ గా, ఇంటర్ రిలేటడ్ గా తీర్చి దిద్దారు. తమకు నచ్చని పనిని చేయలేకపోవడం తమ బలం గా కలిగిన త్రిపుర, ‘మనస్సులో కల్మషం ఉంటే దేహానికి జబ్బు ‘ అన్న ప్రాథమిక ఆరోగ్య సూత్రాన్ని గుర్తించిన అపర ధన్వంతరి త్రిపుర, తమను తాము క్షాళన చేసుకుంటూ ఎదిగిన క్రమాన్ని ఆయన కథలు చెప్తాయి.
  జ్ఞాపకాలను కూడా ఆబ్జెక్టివ్ గా చూడడం అలవాటు చేసుకున్న త్రిపుర, తమకు సంబంధించిన సంఘటనలు ఎవరివో అయినట్లు అనుకునే ‘మెంటల్ మేకప్’ను సాధిస్తూ (ప్రయాణీకులు), జీవితానికి అర్థం ఏమిటని ప్రశ్నలు లేవదీస్తూ మౌనం గా ప్రవహించే గంగ ఒడ్డున ఎదిగిన త్రిపుర ముప్ఫై నాలుగేళ్ళకే అరవై యేళ్ళ మనిషి మనస్తత్వాన్ని (చీకటి గదులు)అలవర్చుకునే పక్వతను సాధించారు.తెలుసుకోవడం తమ శిక్షణలో భాగమయినా, తమ మాటల్లో ఖంగుమని ‘నిజం’ మ్రోగించే నేపథ్యంలో తమలోంచి తాము విడివడి బ్రదకడాన్ని సాధన చేస్తూ, మెల్లగా, తొందరలేకుండా ఆలోచించడం నేర్చుకునే మార్గం లో మాటలు తగ్గించి మౌనసాధనతో పరిక్రమించిన త్రిపుర, సులభంగా స్పష్టంగా కత్తీంచులాంటి నిజంచెప్పాలంటే ఎంతగ అంతర్ముఖులు కావలసి ఉందో గుర్తించారు.పరిమిత పాత్రలతో సాగే వారి కథల్లో తమను తాము భిన్న భిన్న పాత్రల్లో రూపొందించుకుంటూ, ‘నేను ‘ అన్న ఆత్మగతస్థాయినే ‘నువ్వు ‘ అనేలా కొత్త వొరవడిని ప్రవేశపెడుతూ, సున్నితమయిన కవితాత్మక శైలిలో సాగే వచనం తో నడిపించడం త్రిపుర ప్రత్యేకత! ఉన్నత లక్ష్య సాధన కోసం జీవించిన వీరస్వామి అయినా, గమనశీల జీవనం లో నిరంతరం పరిక్రమిస్తూ ఉండిన సత్యాన్వేషకుడు భాస్కర్ అయినా (జర్కన్)ఒక పరిపూర్ణ లక్ష్య సాధనలో పరస్పరం సహకార మందించుకోవలసిన ఒకే మూర్తి యొక్క భిన్న రూపాలే! ఏది యాత్ర?  ఏది వృత్తి? అన్న బేధం అదృశ్యమై, విరామం లేకుండా సాగుతున్న జీవన యానంలో, మనిషి తననుండి తాను వేరుపడి జీవించడం సాధన చేసినపుడు మాత్రమే జీవిత శిఖరాగ్రాల నధిరోహించగలడన్నది త్రిపుర అభిప్రాయం మాత్రం మాత్రమే కాదు, వారు సాగించిన అన్వేషణకూ ప్రతీక!

జీవన బంధాలను గొలుసులు లాగే భావించిన త్రిపుర ఆ గొలుసులను త్రెంచుకుంటూ, తమను తాము ప్రపంచం నుండి మానసికంగా విదుదల చేసుకునే దిశగా పయనించారనడానికి వారి చివరి రెండు కథలే ఆధారం!
మనుషులందరిలాగే ప్రపంచంతో కలిసి నడిచిన త్రిపుర,చెప్పవలసినదంతా కేవలం పదమూడు కథల్లోనే చెప్పి, ఇక చెప్పడానికి ఏమీ లేదు అని జీవితాన్వేషణలో క మజిలీకి చేరుకున్న త్రిపుర, దాదాపు దశాబ్దం తరువాత రాసిన కథ ‘గొలుసులు, చాపం,విడుదలభావం ‘ అన్న కథ. ‘నా జాతి, నా వారసత్వం … నా సంప్రదాయం అంటూ వుండి పోతే తుప్పుపట్తి పోతావ్.’ అని గుర్తించిన త్రిపుర, ప్రపంచానికి సంబంధించనట్లు అనిపించే ఈ జీవితం ఒక కాపీ లా, నకల్ లా., కౌంటర్ ఫీట్ లా , ఒక కుట్రలా కనిపిస్తుందని, ఈ కుట్రని చేదించడానికి … మనుషుల్ని దగ్గరగా లోపలికి గుండెల్లోకి లాక్కోడం చేస్తుందనీ, భావించిన త్రిపుర, “జీవితంలోంచే, ప్రపంచంలోంచే ఆలోచనలను లాగాలి” అని గుర్తించిన త్రిపుర మన జీవితం మన ఆలోచనల మూర్తిమత్వమే అన్న బౌద్ధ సత్యాన్ని అవగాహనకు తెచ్చుకున్న త్రిపుర, అన్ని అసంబద్ధతల నుండి జీవన దుఃఖాలనుండి ప్రాపంచిక బంధాలనుండి మానసికంగా విడుదల సాధించే దిశగా తమ పయనాన్ని సాగించారు.    శృంఖలాల క్రౌర్యం ఎంతో, స్వేచ్చ కూడా అంత భయంకరంగా ఉంటుందన్న సత్యాన్ని గుర్తించిన త్రిపుర, ‘చచ్చిపోలేదు గాని జీవితంలో మిగిలి ఉంది ఏదీ లేదు ( వంతెనలు) అని ఎప్పుడో గుర్తించిన త్రిపుర,  ఆలోచనల స్థాయినుండి తెలుసుకునే స్థాయికి గెంతగలగాలని ఒకప్పుడు భావించిన త్రిపుర (జర్కన్), ఆ అఖాతాన్ని దాటడానికి, గొలుసులు-చాపం-విడుదలభావం కథ ద్వారా వంతెనను వేసుకున్న త్రిపుర,  “ఈ ప్రపంచంలో కొన్నాళ్ళు ఊపిరి పీల్చి ఆఖరికి అలా ఊపిరిని బలవంతంగా వదిలివేయడం … దీనికి అర్థం లేదు. ఏ మంచీ చెడుల సంఘర్షణ సిద్ధాంతమూ దీనికి అర్థం ఇవ్వలేదు …ఇదంతా అసందర్భం…’ అనిగుర్తించిన త్రిపుర, నేను అన్న సరిహద్దులను తుడిపేసుకుంటు, హేతుబద్ధంగా, సముదాయంపుగా ప్రకృతినీ మానవ ప్రకృతినీ పూర్తిగా ఆస్వాదిస్తూ, దేనినీ వేటినీ , ఎవరినీ తోసిపుచ్చకుండా, నేలమేదే నడుస్తూ, నిలబడుతూ, ఎటూ తేలి పోకుండా ఉండగల స్థిరత్వాన్ని సాధించారు అండానికి, వారి చివరి కథ, ‘వలసపక్షుల గానం’కథ గొప్ప ఉదాహరణ.
  డ్రాయింగ్ రూములో లలిత్ పూర్ బుద్ధుని బొమ్మ, అభిధమ్మ పఠనం, గౌడమీద చిత్రిపబడిన ఎర్రటి రంగు బుద్ధుడు, బౌద్ధ క్షేత్రాల సందర్శనలు, బౌద్ధోపన్యాసాలు, తాంత్రిక్ బౌద్ధము…వీటన్నిటినీ జీవన దుఃఖాలను పారద్రోలే సధనాలుగా మలుచుకున్న త్రిపుర, తమను తాము లోలోతుల్లోకి అవలోకించుకుంటూ, ఉన్నది ఉన్నట్లుగా స్వేకరించే స్థాయికి ఎదిగిన పరిణితిని వివరిస్తుందీ కథ. సత్యాన్ని మాత్రమే అన్వేషిస్తూ, జన్మించినప్పటినుండి వెంటాడుతూ ఉండే శూన్యాన్ని అవగాహన చేసుకుంటూ, ఆరురోడ్ల కూడలి ద్వారా ప్రయాణిస్తూ, లోలోపలి పురాతన భవనాలను శిధిలం చేసుకుంతూ సాగే అన్వేషణలో చివరికి మిగిలేదంతా మహా  శూన్యం అన్న అవగాహనకు వచ్చారు త్రిపుర. బౌద్ధంలో శూన్య భావ అవగాహన అత్యుత్తమమైన సాధన! ప్రతి భాగానికి విడివిడిగా పేర్లున్న విభిన్న భాగాల సమాహార రూపమే మనిషయినా,చెట్టయినా, మరొకటి మరొకటయినా. మనిషి ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడు అంటే లేడు..ఎందుకంటే విడివిడిగా పేర్లున్న బహిరంతర్గత అవయవాల సమాహార రూపమే మనిషి కనుక, మనిషి అన్న పేరు ఎన్నో ముక్కల ఏకీకృత రూపం మాత్రమే కనుక..అన్నది సామాన్య నిర్వచనం. ఈ శూన్య భావాన్ని అర్థం చేసుకున్న త్రిపుర, వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడమే జీవితం అన్న బౌధ్ద్ధభావాన్ని అనుభూతం చేసుకున్నారు.
  అటునుంచి ఏడోనెంబర్లోనూ, ఇటునుంచి పదమూడో నెంబర్లోనూ రాని భగవంతాన్ని కలవాలనికలవాలని, తామే వెదుక్కుంటూ వెళ్ళిన త్రిపుర, బలమైన ఒళ్ళూ, కరుణార్థ్రపూరితమైన బోధిసత్వ అవలోకితేశ్వరుని కళ్ళూ.. ఉన్న వీరబాహును కలిశారు. ధ్యానాన్ని. ధ్యానంతోబాటు, తమనుతాము రక్షించుకోవడానికి నిరపాయకరమైన కుంగ్-ఫూ- విద్యను నేర్పే జెన్ బౌద్ధానికి ప్రతీక వీరబాహు. జీవకారుణ్యాన్ని ఈ ప్రపంచంలో ఒక సూత్రం లాగా చేసుకుని జీవితాన్ని సాగించగలమా? అన్న సందేహంతో సతమవుతూ సాగిన వారి అన్వేషణ, ఒక్కోసారి లాఘవంగా, మరోసారి గంభీరపు అనివార్యతతో, అప్పుడప్పుడూ బీభత్స వేగంతో దూకుడుగా ..ఏకాగ్రతతో ఏకాంత సౌందర్యాన్నన్వేషించే దిశగా సాగింది.ఉత్త గోధుమరంగు వేడి నుండి, ఉత్త వేడిరంగు గోధుమ ఊహల్లోకి ( భగవంతం కోసం ) జారుకున్న త్రిపుర, నల్లకళ్ళ గోళీలతో పాట చరణం సాగించిన తోటి ప్రయాణికుదు వరదరాజులు , సకల ప్రాపంచిక ప్రాకృతిక జ్ఞానమూ లోపల పూర్తిగా ఇమిడిపోయి జీర్ణమయిపోగా, చూపుల్లో ప్రసారం చేసే గొళీల రాగమాలికలను దాటుకుని, కళ్ళలో పావురాల రంగు గొళీలు స్వల్ప వ్యవధిలో లలితసంగీతపు ఝలక్ లా కాకుండా, వెండి నీరులా ఆలపించే సంగీతాన్ని వినగలిగారు.అందుకే, ‘నేనంటే రెండు మనుషులని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ‘ అని ఎప్పుడో రాసుకున్న వాక్యానికి ఎదురుగా,ఉన్నది ఉన్నట్లుగా స్వేకరించమనే అర్థం లో భగవంతం చేత టిక్కు మార్కును పొందగలిగారు.ప్రేమతో పెంచిన కన్నపిల్లలు ఉద్యోగాల రీత్యా రెక్కలొచ్చి ఎగిరిపోతే, ప్రతి తరంలోనూ తల్లిదండ్రులు పడే వేదనకు వివరణగా కనిపించే ‘వలసపక్షులగానం’ వాస్తవాన్ని యథాతథంగా స్వేకరించక తప్పదనే ‘మహా శూన్యపు భావనకు ‘ ప్రతీకగా నిలవడమే గాక, మంచీచెడులూ, సుఖదుఃఖాలూ వంటి ద్వైదీభావాలు ఉంటాయనీ వాటిని యథాతథంగా అంగీకరించడమే జీవన దుఃఖాలనుండి విముక్తులయ్యే మార్గమనే జీవన సత్యాన్ని గూర్చి చెబుతుంది.
‘ A special Transmission outside the scriptures;
No dependence on words and letters;
Direct pointing to the mind of man;
Seeing into one’s nature and attaining Buddhahood. “—-అంటారు జెన్ బౌద్ధ స్థాపకులయిన బోధిధర్ముదు. ద్యానం ద్వారా అంతర్ముఖులు కావడం ప్రధాన లక  లక్ష్యం జెన్ బౌద్ధంలో. ‘మానసిక పరిణితిని సూచించే ఒక జీవన విధానం బౌద్ధం ‘అనే సత్యాన్ని ఆచరణ సులభం చేసిన విధానమిది. తృష్ణారహితులుగా, కరుణాశీలురుగా, సహానుభూతితో బ్రదకడం అభ్యాసం చేసుకోదగిన వారందరూ చేరుకోదగిన గమ్యమిది. ఈ గమ్యానికి నిరపాయంగా చేరుకున్న ధీశాలి ఏకాంతసౌందర్యాన్వేషకులు   త్రిపుర. .అందుకే ‘Complete rejection of everything, which is complete acceptance of everything aswell ‘  (ఈ మాట) అన్నది వారి జీవన విధాన మయ్యింది. ఎన్నెన్నో సత్యాలవైపు ఆకర్షించబడిన త్రిపుర, బౌద్ధం లో సేదదీరారు కనుకే, లోకం నుండి మానసికంగా తమను తాము విడగొట్టు కున్నారే తప్ప భౌతికంగా లోకానికి దూరంగా పారిపోలేదు. మనుష్యులమధ్యే ఉంటూ, మనసిక ఏకాంత సౌందర్యాన్ని అనుభూతం చేసుకుంటూ, ఆమరణ పర్యంతం జీవితాన్ని, పసిపిల్లల్లా ఉత్సవంలా మలుచుకుంటూ, ప్రతిక్షణం కాసే పున్నమి వెన్నెలలా ఆనందంగా మనగలిగారు.

 

* * *

—డా. రాయదుర్గం విజయలక్ష్మి

ఈ వీధి నాటకం ఈ మనిషికి ప్రత్యేకం!

ramesh

  పాత్రికేయ రచయిత, ఛాయాచిత్రకారుడూ అయిన కందుకూరి రమేష్ బాబు ‘సారంగ’ కోసం వారం వారం మానవ జీవన దృశ్యమాలికను తనదైన పద్ధతిలో పరిచయం చేస్తారు.

*

maanavudu

కన్నంటుకోని నగరం కోల్‌కత. అలుపు సొలుపూ లేని జనారణ్యం కోల్‌కోత. ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు రఘురాయ్ మాటల్లోనైతే ‘అది ఎప్పుడు మేలుకొంటుందో తెలియదు. ఎప్పుడు సద్దుమణుగుతుందో తెలియదు.’ అటువంటి మహానగరంలో కుమార్‌టౌలీ ఒక దివ్యధామం. అక్కడి వీథులన్నీ గర్భగుడికి దారులే. ఇండ్లూ వాకిళ్లూ దేవీ విగ్రహాల లోగిళ్లే.

చూస్తుండగానే, దశమి సమీపిస్తుంది. మానవుడు కనుమరుగై మహోన్నతమైన దుర్గామాత ప్రత్యక్షమౌతుంది. ఇక దేవత యజమాని పరం అవుతుంది. నిజానికి వారికది విగ్రహమే కావచ్చును. కానీ, అదొక తపస్సు. ఆహోరాత్రులూ నవరాత్రుల కోసమే అంకితమయ్యే మహోపాసన. మానవ మహత్కార్యానికి ఒక చిత్రమైన కొలుపు. ఇదంతా ఒక పార్శం. మరొక పార్శం జీవన సమరం.

తొలుత పని చిన్నగానే మొదలౌతుంది. అది అనేక దశల్లో సాగుతుంది. చివరాఖరికి రంగులద్దిన పిదప మాత కన్ను తెరుస్తుంది. విస్తుపోయే వర్ఛస్సుకు లొంగిపోతాడు మనిషి. చిత్రమేమిటంటే, తమ బొమ్మ తమ కార్ఖాణాల్లోనే తల్లిగా మారి పూజలందుకుని వీడ్కోలూ తీసుకుంటుంది. అప్పుడు చిన్నబోవడం వీళ్ల వంతు. అంతదాకా తామే భగవంతులు. ఆ పిదప పూజారులూ కూడా కాదు, చిల్లర దేవుళ్లు.

ఈ వీథి నాటకం ఈ మనిషికి ప్రత్యేకం. కుమార్‌టౌలికీ, కోల్‌కోతాకు ప్రత్యేకం.
వందనం మనిషి! జగమంత విస్తరించే కడుపేద మనిషీ, వందనం!!

శల్యుడు చెప్పిన కాకి-హంస కథ

కర్ణుడు: నువ్వు పాపదేశంలో పుట్టావు. దుర్బుద్ధి తప్ప నీకు సద్బుద్ధి ఎలా వస్తుంది? క్షత్రియాధముడివి. నీచుడివి. లోకంలో ఆబాలగోపాలం చెప్పుకునే వాక్యం ఒకటుంది.  మద్రదేశంవాడు కుటిలబుద్ధి, దేనికీ కలసిరాడు, స్నేహానికి అపకారం చేస్తాడు, చెడే మాట్లాడతాడు, దుష్టుడు, అతి కష్టుడు.  ఆ వాక్యం ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువవుతోంది.

మీలో ఆడా, మగా  వావీ వరసా లేకుండా కలుస్తారు. అది మీకు తప్పుకాదు. మీరు మొదట కల్లు, ఆ తర్వాతే తల్లిపాలు తాగి పెరుగుతారు. మీ రెంత గుణవంతులో ప్రత్యేకించి చెప్పాలా?

అనేకమందికి పుట్టి, కల్లు తాగుతూ పెరిగే మీకు శీలమూ, సభ్యమైన మాటా ఎలా అబ్బుతాయి? మాటలు కట్టిపెట్టి యుద్ధానికి పద.

(మరికొంత సంభాషణ జరిగాక)

శల్యుడు: ఈ పనికిమాలిన మాటలెందుకు? విను కర్ణా…వేయి మంది కర్ణులైనా సరే, కిరీటిని గెలవగలరా?

కర్ణుడు: (కోపంతో ఎర్రబడిన కళ్ళతో నవ్వుతూ) ఒకసారి ధృతరాష్ట్రుని కొలువులో ఉత్తములైన పండితుల గోష్ఠిలో సకల దేశాచారాలూ తెలిసిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు చెప్పగా విన్నాను. బాహ్లిక దేశీయులు గోమాంసం నంజుకుంటూ మద్యపానం చేస్తూ అసందర్భ ప్రేలాపన చేస్తూ నగ్నంగా తిరుగుతూ ఉంటారట. ఇలా అనేకవిధాలుగా బాహ్లిక దేశీయులను నిందిస్తూ ఆయన మాట్లాడాడు. నువ్వు అలాంటి బాహ్లికులకు దగ్గరివాడివి. కనుక వాళ్ళు చేసే పుణ్యపాపాలలో ఆరోవంతు నీకు సంక్రమిస్తుంది. వాళ్ళ అనాచారాన్ని నువ్వు వారించలేదు కనుక పూర్తి పాపం నిన్నే చుట్టుకుంటుంది. బాహ్లికుల కంటే మద్రదేశీయులు మరింత అనాగరికులని పెద్దలు చెబుతుంటారు. నీ గురించి చెప్పేదేమిటి? నోరుమూసుకో.

శల్యుడు: బలాబలాలను, రథ, అతిరథ సంఖ్యను నిర్ణయించే సందర్భంలో భీష్ముడు (నీ గురించి) చెప్పలేదా? ఆ మాటలు ఓసారి గుర్తు చేసుకో. కోపమెందుకు? అంగదేశం వాళ్ళు డబ్బు కోసం ఆప్తుల్ని, బంధువుల్ని కూడా విడిచిపెట్టేస్తారు. కులకాంతల్ని అమ్ముకుంటారు. అలాంటి జనానికి రాజువైన నువ్వు ఇంకొకళ్ళ ప్రవర్తనను ఎంచడం దేనికిలే…                                                                                                             

                                                                                                                        -తిక్కన

(శ్రీమదాంధ్ర మహాభారతం, కర్ణపర్వం, ద్వితీయాశ్వాసం)

          ***

నేను కేవలం మహాభారతం గురించి మాత్రమే రాస్తున్నానని పాఠకులు ఈపాటికి ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు. నిజానికి మహాభారతం గురించి మాత్రమే రాయడానికి ఈ వ్యాసపరంపర ప్రారంభించలేదు. గొలుసుకట్టుగా ఒక విషయంలోంచి ఒక విషయంలోకి వెళ్లవలసిరావడంతో మహాభారతం చుట్టూనే ఈ వ్యాసాలు పరిభ్రమిస్తున్నట్టున్నాయి.  ఇప్పటికే అనేకఅంశాలను ప్రస్తావించి విడిచిపెట్టడం చూసే ఉంటారు. వాటిని పూరించుకుంటూ వెడితే ఎక్కడ తేలతానో నాకే తెలియడం లేదు. మహాభారత కథనం కూడా ఇలాగే ఉపాఖ్యానాల మీదుగా సాగడం ఓ విచిత్రమైన యాదృచ్ఛికత కావచ్చు. నాకు ఇంకోటి కూడా అనిపిస్తూ ఉంటుంది. నా జన్యువులలో బహుశా ఒక పౌరాణికుడు దాగి ఉన్నాడు!

అంతకంటే ముఖ్యమైన ఒక వివరణ ఇచ్చుకుంటాను. కేవలం మహాభారతానికీ లేదా గతానికీ పరిమితం కావడం నా ఉద్దేశం కాదు. పురా కాలం, నేటి కాలాల కొసలు రెండూ ముడి వేయడం మీదే ప్రధానంగా నా ఆసక్తి. రెండు కాలాల మధ్య గొప్ప గుణాత్మక విభజన ఉందని నేను అనుకోను. ఊహాప్రాయాలైన  విభజనలను చీల్చుకుంటూ రెండు కాలాల మధ్యా ఒక పొడవైన సరళరేఖను గీయడానికే నా ప్రయత్నం. ఈ ప్రయత్నం ఎంతవరకు విద్వజ్జనాలను ఒప్పించి మెప్పిస్తుందో ఈక్షణాన నాకు కూడా తెలియదు.

విషయానికి వస్తే, బాహ్లిక, మద్ర జనాలకు అంత మంచి పేరు లేదన్న వాక్యంతో కిందటి వ్యాసం ముగించాను కనుక అక్కడినుంచి ఈ వ్యాసాన్ని ఎత్తుకున్నాను.

కర్ణుడు అంగరాజు. అంగరాజ్యం నేటి బీహార్ తూర్పున కొంతభాగం. చంపానగరం దాని రాజధాని. నేటి భాగల్పూర్ ను అంగరాజ్యంలోదిగా గుర్తించారు. ఇక శల్యుడు మద్రదేశీయుడు, క్షత్రియుడు, పాండురాజు రెండో భార్య మాద్రికి సోదరుడు. గమనించే ఉంటారు, పైన ఉటంకించిన సంభాషణలోని కులనింద, ప్రాంత నిందల ఘాటు నసాళానికి అంటేలా ఉంది. అందులోనూ కర్ణుని మాటలు మరింత పరుషంగా ఉన్నాయి. అయితే, వాస్తవంగా నింద ప్రారంభించింది శల్యుడు. అతని మాటలు ఇంకా పరుషంగా ఉంటాయి. అంటే, కర్ణుని నింద ప్రతినింద మాత్రమే.

కర్ణుడు యుద్ధానికి బయలుదేరగానే శల్యుడు నిందకు తెరదీశాడు. కర్ణుని కులాన్ని ఎత్తి చూపి మాటి మాటికీ ‘సూతపుత్రుడి’గా అతనిని సంబోధిస్తూ తూలనాడాడు. అర్జునుడి పరాక్రమాన్ని అదేపనిగా ఆకాశానికి ఎత్తి ఈసడింపు మాటలతో కర్ణుని కుళ్లబొడిచాడు. ఎంగిళ్లు తిని కొవ్వెక్కిన కాకితో అతనిని పోల్చుతూ కాకి-హంస కథ చెప్పాడు.  ఉబికి వచ్చే కోపాన్ని కర్ణుడు మొదట్లో బలవంతాన అణచుకున్నాడు కానీ,  శల్యుడు ఎంతకీ తగ్గకపోవడంతో తనూ నోరు చేసుకున్నాడు. మొత్తానికి ఇద్దరూ కలసి కుల, ప్రాంత విద్వేష భారతస్వరూపాన్ని అత్యంత నగ్నంగా ఆవిష్కరించారు.

కులనింద, ప్రాంత నింద చరిత్ర పొడవునా జరుగుతూనే ఉన్నాయి. వాటి బీజాలు ఒకనాటి సామాజికమైన అమరికలోనే కాక, నాటి నిరంతరాయమైన వలస జీవితంలోనూ ఉన్నాయి.  మనదేశంలో పశ్చిమ, వాయవ్యాల నుంచి తూర్పుకు వలసలు జరుగుతూ వచ్చాయి. ఆ వలసల క్రమంలోనే వర్ణ లేదా కులవ్యవస్థ; రాజ్యం; నాగరికత, సభ్యత, సంస్కారం, శీలం, గుణగణాల గురించిన భావనలు వృద్ధి చెందుతూ వచ్చాయి. ఇంకొంచెం అర్థమయ్యే పోలికతో చెప్పుకోవాలంటే, నేడు పల్లె నుంచి పట్నానికి మారడం లాంటిదే ఇది కూడా. పట్న జీవితంలోని నాజూకును, వేషభాషలను అలవరచుకున్న కొద్దీ పల్లె జీవితం మోటుగా, అనాగరికంగా కనిపిస్తుంది. పల్లె జనాన్ని పల్లెటూరు బైతులని వెక్కిరించడం ఇప్పటికీ చూస్తుంటాం.

అందరూ కట్ట కట్టుకుని వలసపోరు. కొంతమంది ఉన్నచోటే ఉండిపోతారు. అప్పుడు వలస పోయేవారికీ, వీరికీ మధ్య భౌగోళిక దూరమే కాక; జీవనవిధానాలలో కూడా దూరం పెరుగుతుంది. శల్యుడు ఇంకా బాహ్లిక, మద్రదేశాల దగ్గరే ఉంటే, సాటి క్షత్రియులతో సహా అనేకమంది జనాలు తూర్పుకు వచ్చేశారు. బాహ్లిక, మద్ర దేశాలలో అప్పటికింకా వెనకటి సామాజిక రూపమే కొనసాగుతోంది. కర్ణుడు దానినే ఎత్తిచూపి ఆక్షేపించాడు. అది మాతృస్వామ్య సామాజిక రూపం కావచ్చునా అనే చర్చను ప్రస్తుతానికి పక్కన పెడితే, శల్యుడు కులం రీత్యా ఉన్నతస్థానంలో ఉండగా, కర్ణుడు ప్రాంతం రీత్యా ఉన్నతస్థానంలో ఉన్నాడు. శల్యుడు కర్ణుడి కులాన్ని ఎత్తి కించపరిస్తే; శల్యుని క్షత్రియాధమునిగా కర్ణుడు సంబోధిస్తూ అతని ప్రాంతాన్ని ఎత్తి కించపరిచాడు.

కులదర్పం ఇంతగా కరడుగట్టిన శల్యుడు కర్ణునికి రథసారథి కావడానికి అసలెందుకు ఒప్పుకున్నాడు? అదెలా జరిగిందంటే, శల్యుని తనకు సారథిని చేయమని కర్ణుడే దుర్యోధనుని అడిగాడు. అది కూడా శల్యుని పట్ల ప్రశంసా భావనతోనే. కృష్ణుని సారథ్యంలో అర్జునుడు మరింత అజేయుడవుతున్నాడు కనుక, అశ్వజ్ఞానంలో కృష్ణునికి సాటి వచ్చే శల్యుని నాకు సారథిని చేస్తే అర్జునుని అవలీలగా గెలుస్తానన్నాడు. దుర్యోధనుడు కర్ణుని వెంటబెట్టుకుని శల్యుని దగ్గరకు వెళ్లాడు. అతన్ని అనేకవిధాలుగా ఉబ్బేసి కర్ణునికి రథసారథ్యం చేయమని కోరాడు.

ఆ కోరిక శల్యునిపై ఎంత పిడుగుపాటు అయిందో తిక్కన అద్భుతంగా చిత్రిస్తాడు.  అప్పుడు శల్యుని కళ్ళు కోపంతో జేవురించాయి. నుదుట చెమటలు పట్టేశాయి. ఇంత నీచమైన పనికి నన్నెలా నియోగిస్తావు, నీకు వర్ణధర్మాలు తెలియవా, మూర్ధాభిషిక్తులైన రాజులు ఎన్నడైనా శూద్రులకు పరిచర్యలు చేశారా అని దుర్యోధనుని నిలదీశాడు. సూతపుత్రుడైన కర్ణుని దొరగా చేసుకుని నన్ను సారథ్యం ఎలా జరపమంటావు, అదీగాక కర్ణుడు నాకన్నా బలవంతుడా అని ప్రశ్నించాడు. తెలియక నువ్విలా కోరి ఉంటావు, ఒకవేళ తెలిసీ కర్ణుని మీద పక్షపాతంతో నన్నిలా అవమానించదలచుకుంటే ఇప్పుడే మా దేశానికి వెళ్లిపోతానంటూ రాజుల మధ్యలోంచి చివాలున లేచి బయటకు నడిచాడు. అప్పుడు దుర్యోధనుడు అతనిని ఆపి బుజ్జగించాడు. ఒక్క కర్ణుడే దేనికి, నిన్ను మించిన వీరులు ఎక్కడా లేరు; అశ్వహృదయం తెలియడంలో కృష్ణుని కన్నా కూడా నువ్వు ఎక్కువ కనుకే ఈ కోరిక కోరానన్నాడు. ఆ మాటతో శల్యుడు చల్లబడ్డాడు. ఇంతమంది రాజుల మధ్య నన్ను కృష్ణుడికంటే ఎక్కువన్నావు కనుక ఒప్పుకుంటున్నాను; అయితే ఒక షరతు, నేను కర్ణునితో విచ్చలవిడిగా, తోచినట్లు మాట్లాడతాను, నన్ను తప్పుపట్టకూడదు అన్నాడు.

శల్యుని కులనిందా ప్రతిధ్వనులు ఇప్పటికీ భారతదేశమంతా వినిపిస్తూనే ఉండడం చరిత్ర అవిచ్ఛిన్నతకు సాక్ష్యం. కులనింద; కులం, ప్రాంతం, మతం, ఆచారాలు, విశ్వాసాల పట్టింపు; ఆ పట్టింపుతో ఎంతటి అమానుషానికైనా తెగించడం-ఇవన్నీ ఒకే మానసికప్రవృత్తికి చెందినవి. ఈ మానసిక ప్రవృత్తి కొన్ని ప్రాంతాలలో, కొన్ని వర్గాలలో చాలా ఎక్కువగా, కొన్ని ప్రాంతాలలో సాపేక్షంగా తక్కువగా వ్యక్తమవుతుంది. ఇందుకు చారిత్రక, భౌగోళిక కారణాలు ఉన్నాయి. దక్షిణభారతంతో పోల్చితే ఉత్తరభారతం, అందులోనూ పశ్చిమ, వాయవ్య ప్రాంతాలే చరిత్రకు అసలైన వారసులు. ఉత్తరభారతమే ఈ దేశానికి అన్నివిధాలుగా ప్రయోగశాల. ఈ దేశంపై జరిగే దాడులను తట్టుకున్నవీ, ప్రతిఘటించినవీ ప్రధానంగా ఆ ప్రాంతాలే. అందుకే అక్కడినుంచే వీరులూ ఉద్భవించారు; అక్కడే రకరకాల మౌఢ్యాలూ  పెద్ద మోతాదులో తిష్టవేశాయి. ఆడశిశువుల భ్రూణ హత్యలూ, పరువు హత్యలూ, మతకల్లోలాల చిరునామా ఇప్పుడు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇండియా-భారత్ అని రెండు ఉన్నాయంటారు. నా ఉద్దేశంలో వాటికి మరో రెండు కలుపుకోవాలి: ప్రైవేట్ భారతం, పబ్లిక్ భారతం. భారతదేశ వాస్తవికత ప్రైవేట్ భారతంలోనూ, ప్రైవేట్ సంభాషణల్లోనే ఉంది.

అదలా ఉంచితే, శల్యుడు చెప్పిన కాకి-హంస కథ వేరే కారణంతో అపురూపంగానూ, ఆసక్తికరంగానూ అనిపిస్తుంది. ఆ కథ ఇదీ:

సముద్రంలో ఒక గొప్ప ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో ధర్మవర్తి అనే రాజు పురంలో ఒక సంపన్న వైశ్యుడు ఉండేవాడు. అతనింట్లోకి ఓ రోజు ఓ కాకి ప్రవేశించింది. ఆ వైశ్యుని కొడుకులు ఎంగిళ్ళు తినిపించి దానిని పోషిస్తూ వచ్చారు. దాంతో దానికి  కొవ్వెక్కింది. ఎలాంటి పక్షి అయినా తనకు సాటి రాదన్న అహంకారం పెరిగిపోయింది.  అంతలో ఒకనాడు కొన్ని హంసలు ఆ సమీపంలో కనిపించాయి.  ‘తారతమ్యం తెలియని’ ఆ వైశ్యపుత్రులు వాటిని కాకికి చూపించి, పక్షులలో నీ అంతవారు లేరు కనుక ఆ హంసలతో పోటీ పడి ఎగిరి వాటిని ఓడించు అన్నారు. అప్పుడు కాకి వాటి దగ్గరకు వెళ్ళి, ఓ హంసను గుర్తించి, తనతో సమానంగా ఎగరమని సవాలు చేసింది.  అప్పుడా హంసలన్నీ నవ్వుతూ, మేము మానససరోవరం దగ్గర ఉండేవాళ్లం, మా బలాన్ని వేగాన్ని అన్ని పక్షులూ పొగడుతాయి. మేము ఎక్కడికైనా, ఎంతదూరమైనా వెళ్లగలం, మాకు ఎలాంటి అలసటా రాదు, హంసలను పోటీకి రమ్మని కవ్వించిన కాకిని మేమింతవరకూ చూడలేదు, పైగా మా అందరిలోనూ బలశాలినే ఎంచుకున్నావు, అన్నాయి.

అప్పుడా హంసతో  కాకి, నూటొక్క గతుల్లో నేను ఎగరగలను, ఒక్కొక్క గతిలో వందయోజనాలు వెళ్లగలనంటూ తను చేయగల విన్యాసాలను వర్ణించింది. దానికా హంస, నాకా మార్గాలన్నీ తెలియవు, పక్షులన్నీ ఎగిరే ఒక్క మార్గమే తెలుసు, ఎగురుదాం పద, అంది. రెండూ సముద్రం మీద ఎగరడం ప్రారంభించాయి. చూస్తుండగానే కాకి హంసను దాటిపోయింది. ఇక హంస పని అయిపోయిందని నిర్ణయానికి వచ్చేసి గాలిలో తన విన్యాసాలను మొదలుపెట్టింది. మధ్య మధ్య మళ్ళీ వెనక్కి వచ్చి హంసను వెక్కిరించింది. హంస మాత్రం నిబ్బరంగా సమగతిలో సాగిపోయింది.

కొంతసేపటికి కాకి అలసిపోయింది. వేగం తగ్గిపోయింది. మనసులో అలజడి మొదలైంది. కాలు మోపడానికి ఎక్కడా ఓ చెట్టూ, పుట్టా లేవే అనుకుని కలవరపడింది.  దైన్యం ఆవహించింది. ఎరక్కపోయి ఇరుక్కున్నాననుకుంది. క్రమంగా కిందికి దిగిపోవడం ప్రారంభించింది. అది గమనించిన హంస, ఎన్నో గతులు తెలుసన్నావుగా, ఇది ఏ గతి అని పరిహాసమాడింది.  చివరికి ఎగిరే ఓపిక పూర్తిగా నశించి సముద్రంలో మునిగిపోయే దశలో, ఎంగిళ్ళు తిని కొవ్వెక్కి నీతో పోటీపడ్డాను, బుద్ధొచ్చింది, నన్ను కాపాడి కాకుల్లో కలుపు అని కాకి ఆ హంసను ప్రార్థించింది. అప్పుడు హంస తన కాళ్లమధ్య కాకిని ఇరికించుకుని పైకిలాగి తన వీపున ఎక్కించుకుని తెచ్చి ఒడ్డున పడేసింది.

సరే, శల్యుడు ఈ కథ చెప్పడంలో ఉద్దేశం కర్ణుని ఎంగిలి కూడు తినే కాకి తోనూ, అర్జునుని హంసతోనూ పోల్చడమని తెలిసిపోతూనే ఉంది. దానినలా ఉంచితే, ఇక్కడ కుతూహలం కలిగించే అంశం, పరుగు పందెంలో పాటించే ఒక ముఖ్యసూత్రాన్ని ఇది వెల్లడించడం. ఒలింపిక్స్ లో చూసే ఉంటారు, ముందే వేగంగా పరుగెత్తినవారి కన్నా పరుగులో వెనకబడిన వారిలోనే ఒకరు అంతిమంగా ముందుకొచ్చి పతకం గెలుచుకుంటూ ఉంటారు. అంటే సమగతిలో మొదట పరుగెత్తి, తద్వారా శక్తిని కాపాడుకుంటూ చివరి అంచెల్లో దానిని ఒడుపుగా వాడుకుంటారన్నమాట. కాకి-హంసల పరుగులో కనిపించినది ఆ తేడాయే.

ఇంతకీ ప్రశ్న ఏమిటంటే,  భారతదేశంలో కూడా ఆనాడు పరుగుపందేలు ఉండేవా? ఉంటే, అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేక శల్యుని కథనం వెనుక నాటి గ్రీసు ఒలింపిక్స్ గురించి విన్న ముచ్చట్ల ప్రభావం ఉందా? నాడు భౌగోళికంగా అది సాధ్యమే కూడా.

పరిశీలించవలసిన కోణమే…

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

—కల్లూరి భాస్కరం

 

 

 

 

                                      

పూల బాసలు తెలుసు ఎంకికీ..

“బతుకంతా పాటలాగ సాగాలి” అని పాడుకున్నారొక కవి! పాట అంటే కేవలం సంగీతమే కాదు, అందమయిన సాహిత్యం!  ప్రతి పాటకూ ఓ ప్రత్యేకమైన పదనేపథ్యం ఉంటుంది. ఏదో ఒక విషయం పైన  రాయబడిన బోలెడు. నవ్వు, పువ్వు, వెన్నెల, జీవితం.. ఇలానన్నమాట. అలాంటి కొన్ని నేపథ్యాలను ఎన్నుకుని, ప్రతి వ్యాసంలో ఆ నేపథ్యం తాలుకూ పాటలను గుర్తుకు తెచ్చి, వినిపించే ప్రయత్నం చేయబోతోంది “పాట వెంట పయనం…”

 

 

ఫోటో: దండమూడి సీతారాం

ఫోటో: దండమూడి సీతారాం

పువ్వులు“!

సృష్టిలో తియ్యనిది స్నేహమైతే, సృష్టిలోకెల్లా అందమైనవి పువ్వులు అంటే ఒప్పుకోనివారుండరు. నక్షత్రాలు ఆకాశంలో పువ్వులైతే, పువ్వులు భువిపై ఉన్న నక్షత్రాలు కదూ! అసలు పువ్వులు లేని ప్రపంచాన్ని ఊహించగలమా? పువ్వులు లేని ప్రపంచం నవ్వులేని మొహంలా, గడప లేని ఇల్లులా ఉండేదేమో! కరుణశ్రీగారు పుష్పవిలాపాన్ని మాత్రమే చెప్పారు గానీ ఈ పూలకి మాటలు వచ్చి ఉంటే.. మనతో ఎన్నెన్ని కబుర్లు చెప్పి ఉండేవో.. ! ఒక పూల తోటలోంచి వెళ్తుంటే ఆ పువ్వులన్నీ మనతో ఏవేవో కబుర్లు చెప్తున్నట్లే ఉంటుంది. అందుకేనేమో నాయుడు బావ కూడా “పూల బాసలు తెలుసు ఎంకికీ.. తోట పూల మనసులు తెలుసు ఎంకికీ…” అని పాడాడు.

పువ్వులతో నా సాంగత్యం చిన్నప్పటిది. మా చిన్నప్పటి ఇంట్లో వెనుకవైపు పెద్ద పెరడు ఉండేది. అందులో పారిజాతం, రెండు మూడు మల్లె పొదలు, పందిళ్ళపై పాకిన సన్నజాజి, విరజాజి తీగెలు, గులాబీలు, ఇంకా చుట్టూతా ఏవో గడ్డీపువ్వులతో అనేక వర్ణాల్లో ముస్తాబైన  ఆ తోటంతా సాయంత్రమయ్యేసరికీ మనోహరమైన పరిమళాలను ఉండేది. ఇంకా మా వాకిట్లో అమ్మ పెంచిన కనకాంబరాలు, నిత్యమల్లి, బంతిపూలు, మెట్టతామర, రెండు మూడు రంగుల డిసెంబరు పూలు, ముళ్లగోరింటలు కాక మాతో పాటూ పెరిగిన ఓ పెద్ద రేక నందివర్థనం చెట్టూ ఉండేవి. ఇవన్నీ కాక ఊరెళ్తే, మా నాన్నమ్మ పెంచిన తోటలో దేవకాంచనాలు, పదమూడు రకాల రంగురంగుల మందారాలు, ఆకు సంపెంగ, సింహాచలం సంపెంగ, పారిజాతాలు, చామంతులు, నైట్ క్వీన్, సన్నజాజి, రేకమాలతి పూలు.. ఇవన్నీ నాకు స్వాగతం చెప్పేవి. “ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకూ.. పూలిమ్మని రెమ్మ రెమ్మకూ..” అని పాడుకుంటూ ఆ పూలచెట్ల మధ్యనే తిరిగేదాన్ని. ఇలా ఈ పూలదీ నాదీ ఏనాటిదో అనుబంధం..! అందుకే నాకనిపిస్తుంది.. పుస్తకాలు నాకు మాట్లాడే స్నేహితులైతే.. పువ్వులు నాతో మౌనంగా సంభాషించే మిత్రులు అని!  అందుకనే ఈ పాట వెంట పయనంలో మొదటగా నాకత్యంత ప్రియమైన పువ్వులపై సినీకవులు రాసిన కొన్ని మధురమైన తెలుగు పాటలను ఇవాళ మీకు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా..!

పూల మీద ఎన్నో సినీగీతాలున్నాయి… “ఏ దివిలో విరిసిన పారిజాతమో”(కన్నెవయసు), “ముద్దబంతి పువ్వులో”(మూగమనసులు), “గులాబీలు పూసేవేళ”(భలే అబ్బాయిలు), “మల్లెలు కురిసిన చల్లని వేళలో..”(అడుగుజాడలు),  “సన్నజాజిపూవులు “(అమాయకురాలు),  “నువ్వేనా.. సంపంగి పువ్వున నువ్వేనా”(గుప్పెడుమనసు), “మల్లెలు పూసే వెన్నెల కాసే”(ఇంటింటి రామాయణం), “సిరిమల్లె పువ్వల్లె నవ్వు”(జ్యోతి), “మరుమల్లియ కన్నా తెల్లనిది” (మల్లెపూవు), “సిరిమల్లె నీవే విరిజల్లు కావే”(పంతులమ్మ), “పూసింది పూసింది పున్నాగ..”(సీతారామయ్యగారి మనవరాలు).. చెప్పుకుపోతే ఎన్నో..! పూల సొగసునీ, సోయగాన్నీ, వయ్యారాల్నీ తలుచుకుంటూ మరి నాతో పాటూ మరికొన్ని పూలపాటల్ని వింటూ మీరు కూడా ఆ పరిమళాలను ఆఘ్రాణించండి.

పువ్వులన్నింటిలోనూ మల్లెపూలపై బాగా ఎక్కువ పాటలు రాసారు మన సినీకవులు. అన్నింటిలోనూ ‘మల్లీశ్వరి’ చిత్రంలోని దేవులపల్లి వారి రచన “మనసున మల్లెల..” నాకత్యంత ఇష్టమైన పాట. ఆల్ టైం ఫేవొరేట్ అనచ్చు. ఈ పాటలో సంగీత సరస్వతి భానుమతి గళంతో వెన్నెలలు కాయిస్తుంది. ఎడబాటు లోని విరహాన్నీ, చెలికాని సాన్నిధ్యం లోని అలౌకికానందాన్ని కలగలిపిన ఈ పాటను మీరు చూసేయండి మరి…

http://www.youtube.com/watch?v=CF1v6M6m86U

***

 మల్లెపూలు, గులాబీలూ, సన్నజాజులూ మొదలైన పువ్వులని అమ్ముకునే అమ్మాయి ఓ  పాట పాడుతూ పూలమ్ముతూ ఉంటుంది. పాట బావుంటుంది కానీ కనులు కనబడని ఓ అమ్మాయి పూల అందాలను వర్ణిస్తూ అలా పూలు అమ్ముతుంటే ఎందుకో కళ్ళల్లో నీటిపొర అడ్డుపడకమానదు. “రాజీ నా ప్రాణం” చిత్రంలో “మల్లెపూలు మల్లెపూలు..కావాలా..” అని ఆర్.బాలసరస్వతిదేవి పాడిన పాటని రాసింది కూడా కృష్ణాశాస్త్రి గారే! స్వరపరిచింది ఎస్.హనుమంతరావు. వీరు ఎస్.రాజేశ్వరరావు గారి అన్నగారు.

ఈ పాటను ఇక్కడ చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=7ZxfNYGjEJg

ఈ “మల్లెపూలు మల్లెపూలు..పాటకు ‘La Violetera’ అనే స్పానిష్ ట్యూన్ మాతృక. పాటను తెలుగులో, తమిళంలో కూడా బాల సరస్వతి పాడారు. ఒరిజినల్ స్పానిష్ తో పాటూ తెలుగు, తమిళ భాషల్లో బాల సరస్వతి  పాడిన పాటలను ఒకే విడియోలో క్రింద లింక్ లో వినవచ్చు:

http://www.youtube.com/watch?v=IwEJKZo3q0o

 ***

 

“ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ

గిరిమల్లికలు తప్ప గరికపువ్వులు తప్ప

ఏ కానుకలను అందించగలను చెలీ

గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప

జగతిపై నడయాడు చంచలా మల్లికా తరుణి ఆకృతి దాల్చు

శరదిందు చంద్రికా..శరదిందు చంద్రికా..”

అంటాడో ప్రియుడు..

http://www.raaga.com/player4/?id=192695&mode=100&rand=0.9301893163938075

ఇదే చిత్రం(ఏకవీర)లో చెలి అందాన్ని ప్రశంసిస్తూ, ఆమెను పువ్వులతో, తారలతో పోలుస్తూ.. చెలి కన్నులలో కలువల్లా విరియాలని, చెలి వాల్జెడ సందులలో మల్లియలై తాను విరియాలంటాడు మరొక ప్రేమికుడు..

http://www.youtube.com/watch?v=xOTR-8J9d8I

 

***

 Rajayya 1

 

‘మల్లెకన్న తెల్లన, వెన్నెలంత చల్లన ఏది ఏదని.. ’ అడుగుతాడు ఓ బావ..

‘తేనె కన్నా తీయన, తెలుగంత కమ్మన ఏది ఏదంటుంది’ ఓ మరదలు..

ఈ బావా మరదళ్ళ సరసాన్ని ప్రశ్న- జవాబుల రూపంలో వినడానికి ఎంతో సరదా ఐన పాటగా రూపొందించారు “ఓ సీత కథ” సినిమాకు ‘మహదేవన్’ స్వరపరచగా బాలు, సుశీల గానం చేసారు. ‘సి.నారాయణ రెడ్డి’ రచన.

ఈ గీతాన్ని ఇక్కడ వినవచ్చు:

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4810

 

 ***

 ప్రియుని ఎదలో నిలవాలని, ఇద్దరూ ఒకటిగా కలిసిపోవాలని ఆశ పడుతుంది ప్రియురాలు. అతని సాంగత్యంలో సిగ్గుల మొగ్గై తాను కరిగిపోవాలని ఏవేవో కలలు కంటుంది. అలా కలల ఊయలలో, ఊహల్లో ఉయ్యాలలూగుతూ ఓ ప్రియురాలు పాడుకునే పాట ఇది..

వెన్నెలలో మల్లియలు

మల్లెలలో ఘుమఘుమలు

ఘుమఘుమలో గుసగుసలు

ఏవేవో కోరికలు ఏవేవో కోరికలు..

“మనుషులు-మమతలు” చిత్రంలోని ఈ పాటకు టి. చలపతిరావు సంగీతాన్ని అందించగా, సుశీలమ్మ కమ్మగా పాడారు.

http://www.youtube.com/watch?v=ieRLv2u7rUg

 

***

 అందమైన పడుచుపిల్ల ముద్దబంతి పూలు పెట్టుకుని వయ్యారాలు పోతూ నడుస్తూంటే కొంటె పిల్లాడు ఊరుకుంటాడా?

ఇలా పాడడూ..

http://www.youtube.com/watch?v=dP3eONVT–g

 

***

 ఎన్నాళ్ళ నుండో తాను ఎదురుచూస్తున్న ప్రేమాభిమానాలను తనకు ప్రియమైన అబ్బాయి కళ్ళల్లో హఠాత్తుగా చూసిన ఓ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. చెల్లెల్లి పెళ్ళి అయిపోగానే ఇక తన పెళ్ళేనని సంబరపడుతూ చెప్తాడా అబ్బాయి. తన కలవరపాటుకి చామంతి పువ్వు సాయం చేసుకుని ఆ అమ్మాయి పాడే పాటే “ఆత్మీయులు” చిత్రంలో ‘నారాయణరెడ్డి’ రచించిన “ఓ చామంతీ ఏమిటే ఈ వింత..” గీతం. ‘రాజేశ్వరరావు’ గారి స్వరాలతో ముస్తాబైన ఈ పాట ఇక్కడ వినవచ్చు:

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1659

 

 ***

 “చింత పువ్వు ఎరుపు… చిలక ముక్కు ఎరుపు

చేయి చేయి కలుపు లేత వలపు తెలుపు.. రాణీ..” అంటాడు అబ్బాయి

“మల్లె మొగ్గ తెలుపు మంచి మనసు తెలుపు

చేయీ చేయీ కలుపు నిండు వలపు తెలుపు.. రాజా…” అంటుంది అమ్మాయి,

“ఇంటి గౌరవం” చిత్రంలో అలా చింతపువ్వునీ, మల్లె మొగ్గనీ తలుచుకుంటారు మరో ప్రేమికుల జంట. ఈ ‘ఆరుద్ర’ రచనని ఇక్కడ వినవచ్చు:

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2353

 

***

 ప్రేయసిని గులాబీపువుతో పోల్చుతూ, స్త్రీలు గులాబీలంత నాజూకు వారనీ; తుమ్మెదలా దగ్గరకు వచ్చే మగవారిని నమ్మరాదని, మగవారి నైజాన్ని గుర్తించి మలగాలని అన్యాపదేశంగా పాడే పాట ఇది. గాయకుడు అవ్యక్తంగా తన ప్రేమను కూడా తెలుపుతున్నట్లుండే “ఓహో గులాబి బాలా అందాల ప్రేమ మాలా..” పి.బి.శ్రీనివాస్ హిట్ సాంగ్స్ లో ఒకటి. “మంచిమనిషి” చిత్రంలోని ఈ పాట ఇక్కడ చూడచ్చు …

http://www.youtube.com/watch?v=X0yrSorugWo

 

***

 bhanumathi_03

ప్రేయసి ప్రియులతోనే కాదు వసివాడని పూలను వసివాడని పసిహృదయాలతో కూడా పోల్చారు సినీకవులు. కల్లాకపటం ఎరుగని పిల్లలను దేవుడితో పోలుస్తూ పిలలూ దేవుడూ చల్లనివారన్నారు ఒక కవి. పకపక నవ్వుతూ ఇల్లంతా తిరుగుతూ, ఇల్లు పికి పందిరేసేలా అల్లరి చేస్తూ పరుగులెట్టే పిల్లలవల్లనే ఇంటికి అందం. అలా సందడిగా తిరిగే పిల్లలను “సన్నజాజితీవెలోయ్ సంపంగి పువ్వులోయ్..”  అంటూ అందమైన పువ్వులతో పోల్చారు ‘మల్లాది’.  ‘పెండ్యాల నాగేశ్వర రావు’ స్వరపరిచిన “అనురాగం” చిత్రం లోని ఈ సరదా పాట భానుమతి గళంలో ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/player4/?id=191897&mode=100&rand=0.05453325994312763

 

 

***

“చిన్నారి పొన్నారి పువ్వు.. విరబూసి విరబూసి నవ్వు

మన ఇంటి పొదరింటి పువ్వు.. నిను జూసి ననుజూసి నవ్వు”

 

అంటూ తమ ముంగిట అడుగుబెట్టబోయే నూతన అతిథి గురించిన ఈ పాట “నాదీ ఆడజన్మే” చిత్రంలోది. ‘దాశరథి’ రచనలో ‘ఆర్.సుదర్శనం’ స్వరపరిచిన ఈ గీతాన్ని ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/player4/?id=193567&mode=100&rand=0.23990890616551042

 

***

 “సిన్నారి నవ్వు.. సిట్టి తామర పువ్వు..

సెరువంత సీకటినీ సుక్కంత ఎలుగు

సుక్కంత ఎలుగేమో సూరీడు కావాల

సిన్నారి సిరునవ్వు బతుకంత పండాలా..”

అని ‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ’గారొక పాట రాసారు “కృష్ణావతారం” సినిమా కోసం. ఈ పాట కూడా నాకు చాలా ఇష్టం. ‘కె.వి.మహాదేవన్’ సంగీతాన్ని అందించగా, బాలు, శైలు ఈ పాటను అద్భుతంగా పాడారు. మెల్లగా, చల్లని తెమ్మెరలా ఉండే ఈ పాట మళ్ళీ మళ్ళీ పెట్టుకుని ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనేలా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి. ఈ పాటను ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/player4/?id=193134&mode=100&rand=0.27093348116613925

 

 ***

 మరోసారి మరో నేపథ్యంతో, మరికొన్ని మధురగీతాలతో కలుద్దామే మరి…

 

–  తృష్ణ

 

 

 

 

 

హిందూ-ముస్లిం ఉమ్మడి వారసత్వ సంపద ఉర్దూ

సంగిశెట్టి శ్రీనివాస్‌

సంగిశెట్టి శ్రీనివాస్‌

 సీమాంధ్ర ఆధిపత్యవాదులు, వారి తాబేదార్లు కొందరు తమ రచనల్లో కొత్తగా ఇటీవల ‘తెలంగాణాంధ్ర’ అనే పదాన్ని విరివిగా వాడుతున్నారు. ఇది పూర్తిగా తెలంగాణ తెహజీబ్‌కు వ్యతిరేకమైన పదం. తెలంగాణ ప్రాంతాన్ని సంబోధించడానికి ‘తెలంగాణాంధ్ర’ అనే పదాన్ని వాడినట్లయితే ఉర్దూ మాతృభాషగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న 60లక్షల మందికి పైగా ముస్లింలను అవమానించడమే! వారిని తెలంగాణ నుంచి వేరు చేసి చూడడమే!

కాస్మోపాలిటన్‌ కల్చర్‌తో పారిస్‌, లండన్‌, ఇస్తాంబుల్‌లతో సమానస్థాయిలో విలసిల్లిన హైదరాబాద్‌ ఆత్మను అగౌరవ పరచడమే! నిజానికి హైదరాబాద్‌ సంస్కృతిలో ఎన్నడూ పరాయివారిని, పరాయివారి భాషను కించపరచాలనే భావన ఏ కోశానా ఉండదు. మంచి ఎవరు చెప్పినా ఆచరించడం, అభినందించడం ఆనవాయితీ. కాని ఇప్పటి టీవీల్లో, పత్రికల్లో, సినిమాల్లో వాడే ‘తెలుగు’ భాష కచ్చితంగా తెలంగాణ తనాన్ని కించపరిచేదే! ఛానళ్లలో అలవోకగా ఆరి ‘భడవా’ మాదిరిగా వందలాది పదాలు ఎలాంటి జంకు గొంకు లేకుండా వాడుతున్నారు. ‘భడవా’ అంటే తెలుగులో ‘తార్పుడుగాడు’ అని అర్థం. ఇలా భాష తెలియకుండానే దాని అర్థం తెలియకుండానే సీమాంధ్ర ‘మేధావులు’ వాడేస్తున్నారు.

 

హైదరాబాద్‌ రాజ్య అస్తిత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మింగేయడం మూలంగా తెలంగాణ తెలుగుకు ముఖ్యంగా హిందూ`ముస్లిం ఉమ్మడి సంస్కృతి, వారసత్వానికి ప్రతీక అయిన ఉర్దూకు జరిగిన నష్టం ఎన్నటికీ పూడ్చలేనిది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనీసం కొంతలో కొంతమేరకైనా దీనికి అడ్డుకట్ట పడుతుంది. తెలంగాణ తెలుగు, ఉర్దూ రెండిరటిని సమాధి చేసిన సమైక్య రాష్ట్రంలో ఈనాటికీ అబద్దాలే రాజ్యం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశాడనీ, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని చెబుతున్నారు. నిజానికి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టింది ఆంధ్ర రాష్ట్రం కోసం ఇంకా కచ్చితంగా చెప్పాలంటే మద్రాసు నగరం కోసం. రెండోది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం 1935లో ఏర్పడ్డ ఒరిస్సా. ఇవన్నీ మరిచి అబద్ధాలనే ఆధిపత్యాంధ్రులు ప్రచారంలో పెడుతున్నారు.
1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడంతో తెలంగాణ ప్రజల బహుభాషా ప్రావీణ్యానికి గండి పడిరది. ఉర్దూ, తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని అదే హైదరాబాదియత్‌ని కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని ముక్కలు చేయడం ద్వారా సమున్నతమైన సహజీవనానికి తెరపడిరది. భాషోన్మాదం మూలంగా హైదరాబాద్‌ రాజ్యంలోని తెలుగు ప్రజలు కేవలం తెలుగు భాషకు అదీ తమది కాని భాషలో విద్యాభ్యాసం చేయాల్సి వచ్చింది. విద్యార్థులు ఇంట్లో మాట్లాడే భాష ఒకటి, పాఠశాలల్లో పంతుళ్లు బోధించే భాష మరో యాసలో, చివరికి విద్యార్థి అర్థం చేసుకొని రాసిన భాష, జవాబు పత్రాన్ని దిద్దేవారికి అర్థంగాని గందరగోళ పరిస్థితి. వెరసి తెలంగాణ విద్యార్థికి జీవితకాల నష్టం.
1950కి ముందు హైదరాబాద్‌ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కచ్చితంగా మూడిరటికన్నా ఎక్కువ భాషలు మాట్లాడేవారు. చదువకుకున్న వారయితే వాటికి అదనంగా ఇంగ్లీషు, ఫారసీ, అరబ్బీ కూడా తోడయ్యేది. దైరతుల్‌ మారిఫ్‌ లాంటి హైదరాబాద్‌లోని తర్జుమా సంస్థ మొత్తం ప్రపంచంలోని ఏ భాషలో ప్రచురితమైన సాంకేతిక పరిజ్ఞానం సహా సమాచారమంతా ఉర్దూ మాధ్యమంలోకి అనువదించేది. అయితే హైదరాబాద్‌పై పోలీసు చర్య తర్వాత క్రమంగా మార్పు వచ్చింది. పోలీసు చర్యతో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సైనికాధికారులు ఇంగ్లీషు భాషతో మమేకమయ్యారు. వారి అధికారిక భాష కూడా ఆంగ్లమే. వీరికి సహాయకులుగా పనిచేయడానికి మదరాసు రాష్ట్రం నుంచి తెలుగు అధికారులు వచ్చారు.

urdu1

మొదట వచ్చిన వెల్లోడి ప్రజాస్వామిక భారతదేశంలో హైదరాబాద్‌ రాజ్య తొలి ముఖ్యమంత్రి. ఈయన తన పరిపాలనా సౌలభ్యం కోసం ఇంగ్లీషుని పాలన భాషగా ఏర్పాటు చేసుకొన్నారు. ఇంగ్లీషు భాష తెలిసిన వారు తెలంగాణలో చాలా మంది ఉన్నప్పటికీ వారిని ఉన్నత స్థానల్లో కొనసాగించినట్లయితే హైదరాబాద్‌ రాజ్యంలో వేర్పాటువాదానికి ఊతం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో ఇంగ్లీషు తెలిసిన ప్రాంతేతరులకు ఉద్యోగలిచ్చారు. ఇలా ఉద్యోగం పొందిన వారు ఎక్కువ శాతం మంది ఆంధ్రులే కావడం విశేషం. వీళ్ళు స్థానికభాషలో ప్రజలకు అర్థమయ్యే భాషలో పాలన పేరిట తెలుగుని పరిపాలనలో అమల్లోకి తెచ్చారు. ఇలా తెలుగుని అధికారిక భాషగా చేయడంతో అప్పటి వరకూ అసఫ్‌జాహీ ప్రభుత్వ బోధనా భాషగా కొనసాగిన ఉర్దూని బలవంతంగా తొలిగించారు. ఇలా ఉర్దూని తొలగిండమంటే ఉర్దూ తెలిసిన ఉద్యోగుల్ని తొలగించడమే! ఇలా తొలగించబడిన వారిలో అత్యధికులు ముస్లింలు ఉన్నప్పటికీ ఉర్దూ మాత్రమే తెలిసిన హిందువులు కూడా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారి స్థానంలో ప్రాంతేతరులైన తెలుగువారికి ఉద్యోగాలు దక్కాయి. స్థానికంగా ఉన్నత ఉద్యోగాల్లో తిష్ట వేసిన ఆంధ్రప్రాంత అధికారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ముల్కీ సర్టిఫికెట్లు జారీ చేసి గైర్‌ముల్కీలకు ఉద్యోగాలిచ్చారు.
1952 నాటికి హైదరాబాద్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. ఈయన స్వతహాగా సాహిత్య జీవి. ఉర్దూ, పారసీ భాషపై మంచి పట్టున్న వాడు. ఆ భాషా చరిత్రలను తెలుగు పాఠకులకు అందించాడు. అలాంటి వ్యక్తి మాతృభాషలో విద్యా బోధన పేరిట పాఠశాలల్లో తెలుగులో బోధన చేయించాలని ఉత్తర్వులు జారీచేసిండు. అప్పటి వరకూ ఉర్దూ మాధ్యమంలో టీచర్‌ ట్రెయినీలను తయారు చేసిన హైదరాబాద్‌ ఇన్సిట్యూషన్స్‌, సంస్థలు తెలుగు మాధ్యమంలో బోధించే టీచర్లకు శిక్షణా సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి. హైదరాబాద్‌ ప్రభుత్వం తెలుగులో బోధన తప్పనిసరి జేయడంతో ఆ మాధ్యమంలో బోధించే టీచర్ల కొరత ఏర్పడిరది. అదే ఆంధ్రప్రాంతంలో చాలామంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. ఆంధ్రాప్రాంతం వారికోసమే ఉద్యోగలన్నట్లుగా తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో లెక్కకు మించి, ముల్కీ నిబంధనలకు తిలోదకాలిచ్చి కొన్ని వేలమంది ఆంధ్రప్రాంత టీచర్లకు తెలంగాణలో ఉద్యోగాలిచ్చారు.

ఇలా ఉద్యోగాలు పొందిన వారు మీకు చదువు రాదు కాబట్టి మేం చదువు నేర్పించడానికి వచ్చాం. మీరు నేర్చుకునే వాళ్ళు, మేం చెప్పే వాళ్ళం’ అని అహంభావంతో వ్యవహరించేవారు. ఈ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ 1952 ఆగస్టులో ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయమేంటంటే బహుబాషా ప్రవీణులైన హైదరాబాదీయులని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కేవలం ఏకభాషీయులుగా కుదించింది. తమది కాని భాషని బలవంతంగా నేర్చుకునేలా తప్పనిసరి స్థితిని కల్పించింది.

నిజానికి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 14 భాషల్లో ప్రజ్ఞకలవాడు. బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజి, బిరుదురాజు రామరాజు ఇలా కొన్ని వందల మంది రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు ఈ బహుభాషా సంస్కృతికి అద్దం. హైదరాబాద్‌  రాజ్య ప్రజల ఉమ్మడి భాష అయిన ఉర్దూని క్రమంగా తొలగించడమనేది కేవలం ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చే గైర్‌ ముల్కీలకు మేలు చేకూర్చేందుకు చేసిన పనిగానే భావించాలి. అనుసంధాన భాషగా రాజ్యాంగంలో ఎక్కడా జాతీయ భాష హోదాలేని హిందీని అంగీకరించారు. కానీ రోజు స్థానికంగా మాట్లాడ్డమే గాకుండా విశ్వవ్యాప్తమైన స్థానిక భాష ఉర్దూని తెలంగాణ ప్రజలకు దూరం చేసిండ్రు.
నిజాం ప్రభుత్వంలో ఉద్యోగం చేయడానికి హైదరాబాద్‌ వచ్చిన బ్రిటీష్‌ రచయిత విలియమ్‌ పిక్తాల్‌ ముస్లిం ప్రజల పవిత్ర గ్రంథం ఖురాన్‌ని ఇంగ్లీషులోకి అనువదించడమే గాకుండా మతం మార్చుకొని మహమ్మద్‌ పిక్తాల్‌గా మారిండు. బ్రిటీష్‌ రెసిడెంట్‌ కోఠీలో రెసిడెన్సీని కట్టించిన కిర్క్‌పాట్రిక్‌ హైదరాబాద్‌ వనిత ఖైరున్నీసాను ప్రేమించి పెండ్లాడి హైదరాబాదీలకు ప్రేమాస్పదుడయ్యాడు. ఇలా హైదరాబాద్‌ ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన వారిని ఆదరించింది. వారి నుంచి ఎంతో నేర్చుకున్నది. అంతకన్నా ఎక్కువగా నేర్పించింది.
అయితంరాజు కొండలరావు, బిరుదురాజు రామరాజు, కె.గోపాలకృష్ణారావు తదితరులు తెలుగు`ఉర్దూ నిఘంటువులు తయారు చేసి రెండు భాషల్ని సుసంపన్నం జేసిండ్రు. అలాగే కొన్ని వందల మంది ముస్లిమేతర హైదరాబాదీలు ఉర్దూ మాధ్యమంలో చదువుకోవడమే గాకుండా ఆ భాషలో రచనలు చేసిండ్రు. రాఘవేంద్రరావు జజ్బ్‌, రాజ నర్సింగరాజ్‌ సక్సేనా, కిషన్‌పర్‌షాద్‌, కాళోజి రామేశ్వరరావు ఇట్లా కొన్ని వందలమంది ఉర్దూలో చిరస్థాయిగా నిలిచిపోయే సాహిత్యాన్ని సృజించారు. ఖమ్మం జిల్లా గురించి రాస్తూ ఆకాశం ఆంధ్ర నేల తెలంగాణ అని సెటైర్లు వేస్తుంటారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి నవలాకారుడు కవిరాజమూర్తి, కథలు, కవిత్వం ఇబ్బడి ముబ్బడిగా రాసిన హీరాలాల్‌ మోరియాలు పుట్టుకొచ్చారు. వీరిద్దరూ ఉర్దూలో అత్యున్నత స్థాయి రచనలు చేసిండ్రు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి లాంటి వాండ్లు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నారు. ఇలాంటి వారందరికీ దక్కిన ఉర్దూ నేర్చుకునే భాగ్యం నేటి తరానికి దూరమయింది.
20 మార్కులకే పాస్‌ చేసే హిందీ స్థానంలో ఉర్దూని బోధించనట్లయితే తెలంగాణ ప్రజలందరికీ ఉపయోగకారిగా ఉండేది. ఉర్దూని పాఠశాల స్థాయి నుంచి బోధించక పోవడం మూలంగా గత 60యేండ్లుగా తెలంగాణ తరాలకు జరిగిన అన్యాయం వెలగట్టలేనిది. ఉర్దూ భాష తెలియడం వల్ల మత సామరస్యం పెరగడమే గాకుండా గంగా`జమునా తెహజీబ్‌ పరిఢవిల్లుతుంది.
sky1 ఈ గంగా జమున తెహజీబ్‌ ఇటీవల హైదరాబాద్‌లో మళ్ళీ మొగ్గ తొడిగింది. గతంలో కొత్త వంతెన పేరిట కొంత కవిత్వాన్ని తెలుగు`ఉర్దూ భాషల్లో ఒకే పుస్తకంగా అచ్చేయడం జరిగింది. అలాంటి ప్రయత్నమే మిత్రుడు స్కైబాబ, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వున్న మరో కవి ఖుతుబ్‌ సర్‌షార్‌తో కలిసి ‘రజ్మియా’ పేరిట తెలంగాణ ముస్లింల కవితా సంకలనాన్ని తెలుగు`ఉర్దూ భాషలో తీసుకొస్తున్నారు. తురుకోళ్లు, తెలుగోళ్లు కలిసి వేదికలు నిర్మించుకునే, కవిత్వం చదువుకునే రోజులు హైదరాబాద్‌ రాష్ట్రం ఉన్నంత వరకూ కొనసాగాయి.
హైదరాబాద్‌ రాష్ట్రం అంటేనే దేశవ్యాప్తంగా ఉర్దూ పోషణకు ప్రసిద్ధి. ఉత్తర భారతం నుంచి అనేక మంది సృజనకారులు మహబూబ్‌ అలీఖాన్‌, ఉస్మానలీఖాన్‌ దగ్గర కొలువులు పొందిండ్రు. తమ ప్రతిభ ద్వారా హైదరాబాద్‌కూ గుర్తింపు తెచ్చిండ్రు. అలాగే తెలంగాణ సంస్థానాల పాలకులు సీమాంధ్ర ప్రాంతంలోని పండితులను పోషించారు. ఘనంగా సత్కరించారు. వారి ప్రతిభకు పట్టం గట్టిండ్రు. 1952లో దాశరథి కృష్ణమాచార్యులు అధ్యక్షులుగా ఉన్నటువంటి ‘తెలంగాణ రచయితల సంఘం’ హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారు ఝాము నాలుగ్గంటల వరకూ ముషాయిరా, కవి సమ్మేళనాన్ని నిర్వహించింది. ఇలాంటి ప్రయత్నమే ‘సింగిడి’ తెలంగాణ రచయితల పూనిక మేరకు ఇటీవల హైదరాబాద్‌లోని ఆంధ్రసారస్వత పరిషత్తు హాలులో ఒక రోజంతా జరిగింది. ఈ సమావేశంలో ఉర్దూ కవి సమ్మేళనాన్ని ప్రత్యేకంగా నిర్వహించి, తెలంగాణ ఉద్యమానికి తమ వంతు తోడ్పాటు నందించారు. ఈ పరంపర భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ….

-సంగిశెట్టి శ్రీనివాస్‌

ప్రేమ కూడా ఒక సహజాతమే !

osho dont kill him

ప్రేమ రెండున్నరక్షరాల మాట మాత్రమేనా ? జీవితాల విలువ కాదా ?

“ఢాయి అక్ఖర్ ప్రేమ్ కే” అన్నాడు కబీర్ నిజమే ఈ రెండున్నర శబ్దాల పదాన్ని ఎలా అర్ధం చేసుకోవడం? దీన్ని ఎలా వివరించడం ?

ప్రేమ అనేదే లేదు అదంతా ఒక మానసిక రుగ్మత అని కొట్టి  పారేసే వారున్నారు. . కానీ ఒక నాటికి  ఎంతటి వారలు కూడా ఈ ప్రేమ అనే పదానికి దాసోహమనే అన్నారు అని చరిత్ర చెప్తోంది,జీవితంనేర్పించింది .  ప్రేమా పిచ్చీ ఒకటే నని పదేపదే వెక్కిరించినా నిజమే ప్రేమ పిచ్చే , అందుకే ఆ ప్రేమలోఏమన్నా చేస్తాడు మనిషి .దీనికి చాలా దాఖలాలు ఉన్నాయి మన చుట్టూ. ఈ లోకం లో ద్వేషమనేది లేనే లేదు కేవలం ఒక దాని పైన ఎక్కువ  ప్రేమ మాత్రమే మిగిలిన వాటి నుండి మనుషుల్ని దూరం చేస్తుంది అంటారు ఎడ్ డెల్ సాప్రియో దంపతులు  వారి పుస్తకం “Unconditional love” లో.
.

ప్రపంచంలోవికృతరూపాలుదాలుస్తోందన్నది కూడా ప్రేమే నని సమర్ధిస్తావా ? అడిగారు నన్ను కొందరు . లేదు నిజమైన ప్రేమే కనుక అయితే అది ఇలా విషపూరితమవ్వదు. ఈ ప్రేమ కి సరిహద్దులున్నాయా? దీనికి నిర్వచనం ఉందా? పెద్ద ప్రశ్నలు ?! ఇక మరో ముఖ్యమైన ప్రశ్న, ప్రేమ అంటే కేవలం ఇరువురు స్త్రీ పురుషుల నడుమ ఉండేదేనా ?

ప్రేమకి సరిహద్దులంటూ ఏమీ లేవు . నిర్వచనం  కూడా లేదు ఎవరి అనుభవం అనుభూతి ప్రకారం  వారు ఏర్పరుచుకునేదే తప్ప . కేవలం శారీరిక బంధం మాత్రమే ప్రేమ  కాదు . ఈ ప్రేమ ఎవరి పట్ల అయినా జనించవచ్చు . ఒకసారి కలిగాక పోవడమంటూ ఉండదు ప్రేమకి. నాకు ఆ మనిషి మీద ప్రేమ పోయింది అన్నవారిని చూస్తే ఆశ్చర్యం   కలుగుతుంది నాకు . ఈ ప్రేమను ఎందరో మహానుభావులు వారి అభివ్యక్తి లో చెప్పేరు ఈ విశ్వానికి . అలాంటి ఒక సంచలనాత్మక ప్రేమ గురువు ఆచార్య రజనీష్ . ఒక మామూలు మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన ఈ మనిషి , ఉన్నత విద్యను ,జీవితాన్ని చదువుకుని శోధించి సాధించి చివరికి భగవాన్ రజనీష్ గా మారి ఆ పైన ఓషో (సాగరమంత జ్ఞానం కలిగిన ) గా లోకానికి  చిరపరిచితుడు . మన తెలుగు రచయితల్లో చలానికి మల్లె అయితే ఇతనికి భక్తులు లేదా ద్వేషులు ఉన్నారు.

“సెక్స్ టు సూపర్ కాంషన్స్” (భోగం నుండి యోగం లోకి ) అనే పుస్తకాన్ని రచించి విపరీతమైన సంచలనాన్ని సృష్టించిన  ఈ ఓషో గురించిన ఒక నవ్య కధనం అతని అనుయాయురాలు , సెక్రెటరీ గా ఎన్నో ఏళ్ళు పనిచేసి అతని అనుగ్రహం లో మెలిగి , ఓషో ఆశ్రమ నిర్మాణానికి , ఓరెగాన్ లో అతని కోసం రజనీష్ పురం నిర్మించడం లో నాలుగు స్తంభాలూ తానే  అయి నిలిచి ఆపైన తన పదవిని త్యజించి వెళ్ళిపోయిన మా ఆనంద శీల రాసిన “డోంట్ కిల్ హిమ్” (అతన్ని చంపకండి) , అనే పుస్తకం లో భగవాన్ తో తన సామీప్యం , సాన్నిహిత్యం,జీవితం గూర్చి కొన్ని లోకమెరుగని సత్యాలను బయటపెట్టేరు. అయినా అది ఓషో మీద అభియోగంగా ఒక నింద నిష్టూరంగా కాక కేవలం జరిగిన విషయాలను యధాతధంగా మన ముందుంచారు.

ముందుగా ఈ పుస్తకం చదివిన నాకు కాసేపు మతి పోయినట్లనిపించింది. ఆశ్చర్యం కలిగింది. పుస్తకం పూర్తి చేసేసరికి మా ఆనంద శీల వ్యక్తిత్వం ప్రేమతత్వం పై అమితమైన గౌరవం కలిగింది. ఈ పుస్తకం గురించి కొన్నిసంగతులు మీతో పంచుకుందామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా .

చాలా చిన్న వయసులోనే తన తండ్రి వలన భగవాన్ (ఆమె పుస్తకం లో ప్రతి చోటా భగవాన్ అనే సంబోధిస్తుంది తప్ప వేరొక రకంగా చేయదు), ఆమె జీవితం లో పరిచయం కావడం, చూసిన మొదటి క్షణం లోనే నేను భగవాన్ ప్రేమలోపడిపోయాను అంటుందిషీలా. గుజరాత్ లోని ఒక   నగరం లో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి ఎలా ఓషో కి కుడి భుజమై చిన్న వయసులోనే అతని సెక్రెటరీ కాగలిగింది, అతని కోసం ఏమేం చేసింది , దాని ఫలితాన్ని ఎలా అనుభవించింది ఒక్కో సంఘటనా చదువుతుంటే ఆశ్చర్యం తోనూ ఆర్ద్రతతోనూ గుండెలు చెమరించాయి. భగవాన్ ని ఆమె ప్రేమించడం లో ఒక రాధా , ఒక మీరా , ఒక జయదేవుడు, ఒక తుకారాం ఇలా ఎందరెందరో భక్తుల అవ్యాజ్య ప్రేమ, భక్తి అడుగడుగునా అగుపిస్తాయి. చాలా విషయాలు లోకానికి తెలియనివి తెలుస్తాయి.

ఇందులో ముఖ్యంగా తెలిసిన మొదటి విషయం ఏమిటంటే ఇంతటి సర్వసంగ పరిత్యాగి అయిన గురువు కి కూడా కొన్ని అపరిమితమైన , విపరీతమైన కోరికలు ఉండటం. సరే అది లైంగిక మై౦ది ఒక్కటే కాదు , అది చాలా మందికి ఓషో విషయం లో విదితమే. లైంగిక స్వేచ్ఛను బోధించిన గురువుల్లో ఓషో చాలా మొదటి వారిలో ఒకరు. కానీ ఇక్కడ మనకి తెలిసే విషయం అది కాదు . ఈ భగవానునికి 99 ఉన్న సరే ఇంకా మరిన్ని రోల్స్ రాయీస్ కార్లు కావాలని , ప్రపంచం లో ఉన్న అందమైయన ఖరీదైన రిస్టు వాచీల మోజు . ఇవి ఎలాగైనా కొనాల్సిన బాధ్యత అతని శిష్యులదే .అలాంటి సమయం లో షీలా ప్రవేశం జరిగింది ఓషో ఆశ్రమం లోకి. అప్పటికి అతనికి లక్ష్మి అనే ఒక పెర్శనల్ సెక్రెటరే ఉంది . ఇతని  గొంతెమ్మ కోరికలు తీర్చలేక డబ్బులు తేలేక సతమత మౌతున్నది ఆమె.

ఇక్కడ మనకొక మరో విషయం అర్ధం అవుతుంది అదేమిటంటే , ఏ గురువూ తనంతట తను గా గొప్ప కాదు, అతనిని పిచ్చిగా ప్రేమించి అతని కోసం ఏదైనా చెయ్యగల శిష్య బృందం ఉంటే గానీ. అలాంటి శిష్యులను గుర్తించడం వారి శక్తి సామర్ధ్యాలను అంచనా వేసి తన కొలువులో చేర్చుకోవడం ఈ మహా గురువులు చేసే పని . ఇలాంటివి మరి ఏతంత్రం తో పట్టుబడతాయో వీరికి. సిద్ధ పురుషులు కదా బహుశా అందుకేనేమో , రజనీష్ సరిగ్గానే షీలా శక్తిని పసి గట్టి ఆమెను దగ్గరికి చేర్చుకున్నారు. ఇది శీలకి ఒక దివ్య వరం . ఎని జన్మల పుణ్యమో అనుకుంది ఆమె మొదట్లో. కానీ ఆ తర్వాత ఆ ఆశ్రమాన్ని ఒక కొలిక్కితీసుకురావడానికి , మళ్ళీ ఓరెగాన్ లో ఆశ్రమం ఏర్పరచడానికి షీలా కారణ భూతురాలౌతుందని ఆమె  అనుకోలేదు. ఇదంతా కూడా నేను భగవాన్ అనుగ్రహం తోనే చేశాననంటుంది షీలా ఈ పుస్తకం లో కూడా.

ప్రేమ నేది ఒకరు నేర్పితే వచ్చేది కాదు . నా వరకూ నాకైతే ప్రేమ కూడా ఒక సహజాతమే . అలాంటి ప్రేమలో మునిగిపోయింది షీలా . ఆశ్రమానికి నిధులు సమకూర్చడం లోనూ, పద్ధతిగా ఆశ్రమాన్ని నడపడం లోనూ నిష్ణాతురాలైంది. ఇప్పటికీ మా ఆనంద షీలా (ఈ పేరు భగవాన్ ఇచ్చిందే ఆమెకు ,రజనీషీ అయిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక పేరు తను స్వయంగా ఇవ్వడము, ఆ వ్యక్తి మెడలో ఓషో చిత్రమున్న ఐడెంటిటీ కార్డ్ ఉండటము అక్కడి ఆనవాయితీ), నిజాయితీ, క్రమ శిక్షణ రజనీష్ పురం గురించి ఆమె తీసుకున్న శ్రమ మరవని వారున్నారు .

ఆమె చెప్పిన కొన్ని విషయాలను మీ ముందు యధాతధంగా ఉంచుతున్నాను:

ఆశ్రమం లో చాలా దేశాలనుండి జోగినులు వచ్చి చేరేవారు శిష్యులుగా . వారిలో బాగా డబ్బున్న వారిని ఎక్కువగా ఆదరించేవారు ఓషో . వారి నుండి తనకు కావల్సిన డబ్బును రాబట్టుకోవడం ఆయనకి బాగా తెలుసు .

ఏదైనా కావాలంటే కొనాలంటే డబ్బు అవసరమైతే వారిని ప్రైవేటు గా వేరుగా కలిసి వారికి తన మీద ఉన్న భక్తిని ఫ్రేమను డబ్బు రూపం లోకి ఎలా మార్చుకోవాలో ఆయనకి బాగా తెలుసును.

ఆశ్రమ నిర్వహణ లో కొందరు డబ్బులున్నవారు ఉండేవారు.  వారు ఓషోకి డబ్బులిచ్చాం కనుక తాము అత్యంత సన్నిహితులమన్నట్టు ఆశ్రమ ధర్మాలను కూడా నిరసించి ప్రవర్తించేవారు. ఇక ఆశ్రమం లో ఉన్న కొందరు డబ్బు లేని వారు ఏయే సేవలు చేయ్యగలరో వారిని కూడా సరిగ్గానే గుర్తించి వారి చేత చేయించుకోవాల్సిన శ్రమ అంతా రాబట్టేవారు భగవాన్ .

ఎక్కడెక్కడినుండో వచ్చిన జోగినుల కు అన్ని సదుపాయాలు కల్పించడం ,ముఖ్యంగా విదేశీయుల , గొప్ప వారి మీద ఎక్కువగా శ్రద్ధ చూపమని ఓషో  షీలా  కి చెప్పేవారు. కొంచెం  సమయం లోనే షీలా చాలా సమర్ధవంతంగా భగవాన్ తనకి  అప్పగించిన పనులను చక్కగా చేసి చూపించేది. తద్వారా భగవాన్ ఇచ్చే ఒక చిన్ని మెప్పు కోసం పరితపించేది . తల్లి , తండ్రి, తమ్ముడు ఉన్న చిన్న కుటుంబాన్ని వదిలి షీలా పూర్తిగా ఆ భగవాన్ కే అంకితమై పోయింది .

ఆచర్య రజనీష్ ఒక విశ్వవిద్యాలయం లో తత్వ శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసేవారు . అతని విలక్షణ , విచిత్ర విపరీత బోధన చూసి విద్యాలయం  వారు ఇతనికి ఉద్వాసన పలికారు.

షీలా రజనీష్ వద్దకు వచ్చేటప్పటికి ఆయన గుజరాత్ లో ఒక మామూలు ఇంటిలో ఉండేవారు , ఆయన ప్రవచనాలు వినడానికి కొద్దో గొప్పో కొంతమంది ఉండేవారు. ఆ తర్వాత రజనీష్ తన స్థాయిని పెంచి ఆంగ్లం లోనే ఉపన్యసించి కొందరు అక్కడి స్థానీయుల అభిమానాన్ని కావాలనే దూరం చేసుకున్నారు. ఆ పైన ఇక రజనీష్ ఓషో గా మారిన వైనం ఎలాంటిదంటే :

అక్కడినుండి ముంబై ఒక ఫ్లాట్ లోనికి రజనీష్ ప్రవేశించారు. అక్కడ ఆర్ధికంగా కాస్త బలమున్న వారి ఆశ్రయం సంపాదించారు. అతనికి వ్యక్తిగతంగా ఉండే బలహీనతల మాట ఎలా ఉన్నా అతని ఉపన్యాసం విన్న వారు , అతని కన్నుల్లోకి చూసిన వారు అతనికి  అయిస్కాంతలా అతుక్కు పోతారు అంటారు షీలా .
ఎన్నో మతపరమైన నైతికమైన   ఛాందసాలను కాదని , స్త్రీ కి  కూడా లైంగికత ఉంటుందని , శీలం అనే మాట ఒక వ్యర్ధ పదమని బోధించే ఓషో బోధనలు ఆ సంప్రదాయపు కట్టలను తెంచుకుని పైకి రావాలనుకునేవారికి బాగా ఉపయుక్తంగా అనిపించాయి అనడం లో సందేహం లేదు. ఇలా 1929 లోనే ఒక తెలుగు ప్రాంతీయ రచయితగా మాట్లాడిన  వాడు మన చలం అయితే మళ్ళీ 1975 ప్రాంతాల్లో ఒక ప్రేమ గురువుగా ఇదే విషయాన్ని  ప్రస్తావించి  ప్రబోధించి ఆచరింపచేసిన వ్యక్తి ఓషో.  (ఓషో  “దబుక్ ఆఫ్ ఎ వుమన్ ” చలం “స్త్రీ” ని సరిపోలుస్తూ ఒక పరిశీలనా వ్యాసం రాయాలని ఎప్పటినుండో ఉంది నాకు ).

అతను బోధించే విషయాలలో ఎక్కడా తప్పు లేదు. సార్వజనీనమైన ప్రేమను బోధించారు అంటారు షీలా. అతని బోధల పట్ల ఆమెకు ఇసుమంత కూడా ఫిర్యాదు లేదు . ఆయన తో సాహచర్యం లో తాను ఏమేమి చేశారో ఎలా చేశారో అది కూడా భగవాన్ నేర్పిన ప్రేమ తత్వమనే చెప్తుంది నేటికీ షీలా . ఇది భగవాన్ మీద అభియోగం కోసం రాసింది కాదు . కానీ 39 నెలలు కారాగార శిక్ష  నిష్కారణంగా అనుభవించాల్సి రావడం అదీ ఒక పరాయి దేశం లో ఆమెను ఎలా ఒక వ్యక్తిగా నిలబెట్టాయో ఎలా శక్తిని పుంజుకుని పనిచేయగలిగిందో అంతా చెప్తుంది.

గురువుల గొప్పతనాన్ని ప్రచారం చేయడమే కాక వారి కోసం ఆర్ధికంగా నూ, హార్ధికంగానూ ఉపయోగపడే ప్రియ శిష్యులను గుర్తించే అనితర సాధ్య విద్యకలిగిన ఓషో  షీలాకు  ఆశ్రమ నిర్వహణ అనతి కాలం లోనే అప్ప చెప్పేరు. ఆమెను తన ప్రైవేట్ సెక్రెటరీ గా నియమించారు . ఇది ఆమె భుజాలపై చాలా  భారమైంది .
ఆశ్రమం లో అందరినీ ఒక తాటిన నడిపించాలని , ఒక క్రమశిక్షణ అమలు జరపాలని ఆమె తీసుకున్న శ్రమ చెప్పనలవి కానిది. పొద్దున్న వేకువఝాము నుండి రాత్రి పన్నెండు వరకు ఆమె ఒక యంత్రం లా పనిచేసేది . ఓషో హోం లో అన్నీ విషయాలలోనూ ఆమె నిర్ణయం తీసుకోగలిగేది. ఆమెకు మనసుకి నచ్చిన ఆమెతో పాటు చివరి వరకు  తోడున్న కొందరు వ్యక్తులు ఉండటం వలన ఆమె ఈ పనులు చేయగలిగాను అంటుంది.

రజనీష్ హోమ్ లో మేడిటేషన్ కాంప్ నిర్వహించేవారు . ఓషో ప్రవేశపెట్టిన మేడిటేషన్ విధానం చాలా కఠినమైనది . అందులో ఆరితేరితే ఇక ప్రపంచం లో అన్నీ చేయగలం అంటుంది షీలా. కానీ భగవాన్ అదుపులేని ఖర్చు లు కోరికలు ఆమెను ఆమె తో బాటు పని చేసే కొందరిని బాగా భయపెట్టేవి. అందరినీ తన రక్షణ లో ఒక తల్లి లాగా సాకేది షీలా. ఎన్నో కార్లుండగా మళ్ళీ మరొక కారు , మరికొన్ని వాచీలు , ఈ బలహీనతేమితో అస్సలు అర్ధం కాదు నాకిప్పటికీ  అంటుందీమే. పోనీ అన్నీ పెట్టుకోగలరా అంటే అన్నీ
కార్లలో  ఒకేసారి తిరగగలరా అంటే అసంభవం అని మనకు తెలుసు . అయినా ఈ పిచ్చి వెర్రి కోరికలేమిటో. వీటన్నిటిని సహనంతో భరిస్తూ ఆర్ధికంగా ఎలా నిధులు సమకూర్చాలన్న ధ్యాసతోనే రోజులు గడిచిపోయేవి ఆమెకు.

ఇక మరో సమస్య విదేశాలనుండి వచ్చే జోగినుల ప్రవర్తన . లైంగిక పరమైన స్వేచ్ఛ ఉండటం తో ఆశ్రమం లో నూ డబ్బుల కోసం బయటా కూడా వ్యభిచారానికి పాల్పడే వారు కొందరు. వారికి ఎటువంటి ఆరోగ్య  సమస్యలొచ్చినా (సుఖరోగాలు, గర్భాలు) ఇవన్నీ కూడా తానే పర్యవేక్షిస్తూ పరిష్కరించాల్సి  వచ్చేది . రజనీష్ కి తన ఆశ్రమం లో ఏ ఒక్కరికీ గర్భాలు రావడం ఇష్టం ఉండేది కాదు, ఒక వేళ వస్తే వెంటనే అబార్షన్ చేయించేసి వారిని స్టెరిలైజ్ చేయించేవారు, ఇక పిల్లలు ఉన్న వారు వస్తే వారికోసం వేరే ఏర్పాట్లు. ఈ  జోగినుల పిల్లల కోసం ఒక  నర్సరీ కూడా నడపాల్సి వచ్చేది  ఆశ్రమం  అవతల అంటారు షీలా. ఆసుపత్రి మందుల ఖర్చు గాక , ఓషో అనారోగ్యానికి మందులు (విదేశాలనుండి) , అలాగే కొన్ని మేడిటేషన్లలోకి వాడటానికి మాదక ద్రవ్యాలు (హెరాయిన్, బ్రౌన్ షుగర్) లాంటివి కొనడానికి చాలా ఖర్చు అయేది . అవన్నీ ఒక్క చేతి మీద , మధ్యలో రజనీష్ ఎవరికి చెప్పకుండా కొనుక్కోచ్చే కార్ల లోన్లు ఇవన్నీ వచ్చే ఆదాయానికి మించి పోయేవి. తలకు మించిన బాధ్యత చిన్న వయసులోనే తలపై పడిన షీలా ఆత్మ విశ్వాసం తో తిరుగు లేకుండా ఈ పనులన్నీ ఎలా గో చక్క బెట్టేది. ఏదైనా సమస్యను భగవాన్ కి చెప్తే ఆయన విసుక్కునేవారు.

అంచేత తాను తన బృందం రేయింబగళ్లు కష్టపడేవారు. నిధుల సేకరణకు తరచూ తాను విదేశాల్లో పర్యటించి పోగు చేసుకుని వచ్చేది షీలా. తీరా వచ్చేసరికి ఏదో ఒక అవాంతరమైన ఖర్చు ఎదురు చూస్తుండేది. తాను దాదాపు రోజూ అని విషయాలను భగవాన్  తో చర్చించేదాన్నని , చెప్పేదాన్నని అంటారు షీలా. అతని ఆజ్ఞమేరకు మళ్ళీ పని చేసుకు పోయేదాన్ని . భగవాన్ మాట కాదనే శక్తి మాత్రం ఎవరికి ఉండేది కాదు అంటారామే. ఆమె తొలి భర్త కూడా భగవాన్ శిష్యుడుగా మారి ఉండేవారు. అతనికి తమ పెళ్లి అయేనాటికే కాన్సర్ అని రెండు మూడేళ్లకన్న బ్రతకడని తెలిసినా వారు వివాహం చేసుకున్నారు. ఇది భగవాన్  కి తెలుసు . రాను రానూ  జనసందోహం ఎక్కువ అవ్వడం తో ఉండటానికి కూడా సరైన  స్థలం ఉండేది కాదని కొన్ని సార్లు షిఫ్ట్ ల పద్ధతి లో నిద్ర పోయేవారమని చెప్తారు.

ఇక కొందరు డబ్బున్న జోగినులు డబ్బులు ఇచ్చాము  గనుక మాకే రజనీష్ మరింత దగ్గర అన్నట్టు క్రమ శిక్షణ లేకుండా అసహ్యంగా  వర్తించేవారు మిగిలినివారితో. ఈ గొడవలు తగువులూ అన్నీ షీలా మాత్రమే చూడాల్సి వచ్చేది. సవితా అని ఒక మంచి అమ్మాయి తనకి సహాయం చేసేదని, అలాగే మునుపటి సెక్రెటరీ లక్ష్మి కూడా వారి సహాయం లేకుంటే తానేమీ చేయలేక పోయేడాన్ని అంటారు షీలా. ఇక మరో సమస్య హోమ్ లో ని డాక్టర్లు . కొందరు  రోగులను తమ  లైంగిక స్వార్ధం కోసం వాడుకునేవారనీ. అదేమంటే వ్యతిరేకించేవారనీ ఆ సమస్యలు కూడా తానే పరిష్కరించాల్సిన పని బడేది అని చెప్తుంది. రజనీష్ ఆశ్రమంలో ని వేసుకునే బట్టలు దగ్గరనుండి , అన్నీ విషయాలూ వివరిస్తుంది . ఒక పొడవాటి అంగీని వేసుకోవాలని అందరూ అది ఒక్కొక్కరికి ఆయన నచ్చి చెప్పే రంగులవి ధరించాలని. ఎక్కడా బిగుతూ లేని బట్టలు ధరిస్తే దేహామంతా ప్రాణవాయువు ప్రసరిస్తుందని ఓషో చెప్పేవారు.

ఇక మేడిటేషన్ సమయాల్లో  కొందరు విపరీతమైన  మానసిక ఒత్తిడి కి గురవుతున్నవారికి డ్రగ్స్ ఇచ్చేవారు. ఈ విషయం ఇటు ప్రభుత్వానికి , అటు ప్రజలకి తెలియకుండా కాపాడటం చాలా కష్టమయ్యేది . ఇన్ని చేసీ భగవాన్ కి ఎప్పుడూ ఆరోగ్య సమస్యలతో బాధ పడేవారు. ఆయనకి ఆస్త్మా ఎటాక్ వస్తే మెలికలు తిరిగి పోతున్న భగవాన్  ని చూస్తే ఏడుపొచ్చేదట.  డైబెటిస్ , ఆస్త్మా ,నడుం నొప్పి తో బాధలు పడేవారు భగవాన్. ఇక ఒకనాడు షీలా చెయ్యి దాటిపోయిన పరిస్థితులను చూసి తాను ఆశ్రమం నుండి వెళ్లిపోదల్చుకున్నానని ఒక లేఖ ఓషో కి పంపింది. వెళ్లడానికి వీల్లేదని కోపగించుకున్నారు భగవాన్ . అయినా ఇక తట్టుకునే ఓపిక లేక ఆమె రజ్నీష్ పురం నుండి వచ్చేసింది . ఇక్కడితో ఆమె జీవితం అయిపోలేదు . అసలు కష్టాలు ఇక్కడే ఆరంభమయ్యాయి .
ఆమె ఆశ్రమ నిధుల నుండి 55 వేల డాలర్ల సొమ్మును దొంగిలించి తీసుకుపోయిందని ఆమె పైన కేస్ పెట్టారు ఓషో. ఆమె తో బాటు ఆశ్రమం నుండి వచ్చేసిన వారు కూడా కొందరు ఉన్నారు . అయినా షీలా మీద కోపం తో కేస్ పెట్టేరు భాగ్వాన్. ఇక ఆమె తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి , కొన్ని నేరాలు ఆశ్రమం లో చేసినట్లు ఒప్పుకున్నప్పటికి , డబ్బులు తీసుకు రావడం మాత్రం అసత్యమని తెలిసేసరికి ఆమె ముప్పై తొమ్మిది నెలలు కారాగార వాసం అనుభవించింది. అమెరికా, స్వీడెన్, ఇలా దేశాలు తిప్పి ఆమెను కారా గరం లో ఉంచేవారు . అక్కడ కొన్ని  జైళ్లలో కొందరు మంచి వారు ఉండేవారని అదీ ప్రేమ గొప్పతనమే అంటుంది షీలా . ఎంతో కష్టపడిన షీలా కారాగార వాసం లో చెయ్యని నిందను భరిస్తూ ఎలా బ్రతికిందో అంతా వివరిస్తుంది . నా ఆత్మ స్థైర్యం నా ప్రేమ మాత్రమే నన్ను రక్షించింది అంటుంది . ఒక సారి జైల్లో ఒక పిచ్చి అమ్మాయి సెల్ లోనే తననూ పడేస్తే , కొద్ది రోజులకు ఆ అమ్మాయి లో మార్పు తీసుకోచ్చి అందరి మన్ననలు పొందుతుంది షీలా. అలాగే ఒక జైల్ లో అధికారిని మా ఆనంద షీలా అంటే ప్రాణం పెట్టి తనకి ఇష్టమైన వేడి నీళ్ళ స్నానం ఏర్పాటు చేస్తుందని. మరొక చోట ఫిలిప్పైన్స్ లో జైల్ నుండి వచ్చేసేక ఒక జపాన్ రచయిత్రి తో కలిసి ఒక రూమ్ లో కొన్నాళ్లు గడుపుతుంది . ఆ రచయిత్రికి కాన్సర్ , ఆమె ప్రశాంతంగా నవల రాసుకుందామని అక్కడికి వస్తుంది అటువంటి ఆమె షీలా ను తనతో ఉండటానికి ఇష్టపడుతుంది. ఆమెను ఆమె అద్వితీయ  పట్టుదలను ప్రేమను జీవితాంతం మరువలేనంటుంది షీలా.  షీలా కు సహాయం చేసిన లాయర్ ని వివాహం చేసుకోవాలనుకుంటుంది కానీ అతనికి వేరే భార్య పిల్లాడు ఉండటం తో కుదరదు. మరొక అతన్ని వివాహం చేసుకుంటుంది. జైల్ నుండి వచ్చాక తన కుటుంబం ఎప్పుడూ తనను అదరిస్తూనే వచ్చారని వారి ప్రోత్సాహం తోనే ఈ పుస్తకాన్ని రాస్తున్నానని చెప్తుంది .

తనిప్పుడు ఒక వృద్ధాశ్రమం నడుపుతున్నానని , అది వృద్ధుల ఇల్లు అంతే కానీ ఆశ్రమం అనను అంటుంది. వాళ్ళంతా ఒక కుటుంబంలా ఉంటారు. వారందరికి తానే తల్లి తండ్రి లా సాకుతుంది . ఇన్ని విషయాలను చెప్పిన ఆమె ఇప్పటికీ భాగ్వాన్ పైన అనురాగం పోలేదంటుంది. ఈ ప్రేమ శక్తి అంతా భగ్వాన్ ప్రసాదమే అని నమ్ముతుంది. ఈ విషయాలు ఎందుకు చెప్పేనంటే నేను ఏ దొంగతనమూ చేయకుండా భాగ్వాన్ కోపం తో నా మీద మోపిన అభియోగం గురించి వివరించడానికి. తను ఆశ్రమం నుండి వచ్చేసిన కొద్ది రోజులకే భాగ్వాన్ కూడా అరెస్ట్ అయ్యారు. తాను జైల్ నుండి వచ్చేసిన కొద్ది రోజులకే భగవాన్ ఇక భౌతికంగా లేరన్న  వాస్తవం కూడా తనకి  మీడియా ద్వారా తెలిసింది అంటుంది షీలా .

ఆయన కు వ్యక్తిగత బలహీనతులున్నాయేమో గానీ అతని బోధనలో శక్తి ఉందని నమ్ముతుంది షీలా. ముఖ్యంగా భాగ్వాన్ అమితమైన జ్ఞానానికి , అతని ప్రసంగానికి, అతని ప్రేమ తత్వానికి దాసోహమనక తప్పదు ఎటువంటి వారైనా. అందుకే అతన్ని కాదు అతని బోధనలను ప్రేమించండి. అవి లోకానికి ప్రేమ మార్గాన్ని చూపుతాయ్ అని చాటి చెప్తుంది ఈ నాటికి మా ఆనంద షీలా . ఒక చిత్రమైన  అనుభూతి కలిగించే పుస్తకం వీలైతే చదవండి . ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి మిత్రులారా . భాగ్వాన్ పరిచయం తో తనలో నిండిన ప్రేమే తనని ఇంకా బ్రతికిస్తోందన్న మహా విశ్వాసం కలిగిన మా ఆనంద షీలాను చూస్తే ఆశ్చర్యం ఒక్కటే కాక ప్రేమ అనే రెండున్నరక్షరాలకు ఇంతటి శక్తి ఉందా అన్న ఆనందం కలుగుతుంది . భాగ్వాన్ తో ఆమె ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఇందులో ప్రచురించారు. ఫాక్ట్ ఈస్ స్ట్రేన్జర్ దాన్ ఫిక్షన్ అన్నది నిజమైతే ,ప్రేమ జీవితం కన్నా గొప్పనైనది అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే  ఓషో భక్తులకు కూడా అతని పట్ల ద్వేష భావం కలగదు పైగా అయ్యో అవునా అనిపిస్తుంది.

.

1231658_539630582777569_2120927918_n-జగద్ధాత్రి

 

దళిత కవిత్వపు వెలుగు రవ్వ తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ !

మాకు ఒక భాష కావాలి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్న సుధాకర్ !

గాడిద పేడతో
డిటర్జెంట్లు చేసే రజకుల మేధస్సునీ
గొడ్డుటావుల చర్మాన్ని
గంటలో ఒలిచే చర్మకారుల నైపుణ్యాన్నీ
వాంతి చేసుకోకుండా
దేశీయుల మలాన్ని చేతులతో పట్టుకెళ్ళే
దౌర్భాగ్యుల సహనాన్నీ
గుర్తించని ఈ భాషాజాతులు
ఎవరికి ట్రోజన్‌ హార్సులు!

జాతిలో సమైక్యం కాలేనప్పుడూ
నీతిలో సమతుల్యం లేనప్పుడూ
వాచకాల్లో ఒక్క గౌరవ పదమూ
దళితుల గౌరవం కోసం రాయనప్పుడూ
సమానత్వం ఫ్లాట్‌ఫారాల మీద
సగౌరవంగా వీధులూడ్చే వాళ్ల పిల్లల్ని
సివంగిలా తరిమికొట్టేదెవడిభాష!

                                                                          –తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్

‘చిలిపి కళ్లతో నవ్వుతా భూమి ఆకాశాల మజ్జన ఎవరి పాట వాళ్లు రాసుకోవాలంటాడు’ త్రిపురనేని శ్రీనివాస్. పిడికెడు ఆత్మగౌరవం కోసం అంటాడు కలేకూరి. ఇప్పుడు సుధాకర్ కి  భాష కావాలంట. ఇన్నాళ్లకన్నా ఆ దళిత భాష. ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి స్పృహ వచ్చింది. నిజానికి అంటరాని కవిత్వాన్ని, దళిత జీవితాలని, సాహితీ ఆకాశంలోకి ప్రవేశపెట్టి, బతుకు ఆలోచనల మకిలిని , అహంకారపు మాడుని  పచ్చడి బండతో కొట్టి, నా దారి నేనే ఏసుకుంటా అని ఎగరేసుకున్న జండా సుధాకర్.

ధిక్కారిగానూ, ఒకసారి యోధుడుగానూ, ఒకసారి జపాన్‌లోని పార్కు గురించీ, మరోసారి నొసలు ముడవద్దంటూ విశ్వభాష అయిన నవ్వు గురించి, ఒకటా రెండా, రిజర్వేషన్లు, దళిత క్రైస్తవం, ఇవాంజులికల్ చర్చి పెద్దలు , కామ్రేడ్లపైన చురకలు, వర్గీకరణలు అంగీకరించకుండా ధిక్కరించి, ఏ విభజననీ ఎవ్వరేమనుకున్నా ఒప్పుకోకుండా తుఫానులో లైటు హౌస్‌లాగా నిలబడ్డాడు. చెవిలో సీసం పోసిన వాళ్లని, మురిగిన కషాయాల కాషాయలని, ఉత్తుత్తి ప్రజాస్వామ్యాన్నీ, ప్రజల ప్రాణాలతో ఆడుకునే పాలకుల నిర్ణయాలని, వ్యతిరేక వ్యక్తులనీ, శక్తులనీ, తన కవిత్వంతో, ప్రతి కణాన్ని ఒణికించాడు. గుండెల్ని చీల్చే మాటలతో, విషయాన్ని మూడోకంటితో చూస్తా. ఎప్పటికప్పుడు మారే వాసనలని కలంతో పీల్చుతా, అందరికీ కొంచెం పూశాడు. వర్గీకరణలూ లేని కవిత్వాన్ని ఎంతో కొంత (ఇది సరిపోదు) అందించాడు. దళిత కవిత్వాన్ని అందించాడు. ఇంకొక్కసారి చెపుతున్నా. నిర్బంధ మానవ జీవితాల వ్యధల్ని, ఆంక్షల కట్టడాలని కూల్చిన సరికొత్త కవితా గ్రామ నిర్మాణ శిల్పి. ‘రావణాసురు’డి కాలుతున్న కాష్టపు కంపు ఆరని చితిమంటలని కథలుగా చెప్పుకుంటా, బొట్టూ, పూవులు ఉన్న మండోదరి పతివ్రత అని దణ్ణం పెట్టుకునే లోకంలోనే బతుకులు ఈడుస్తున్నాం. ఆ కవురు కంపుని కాష్టపు పొగలనీ కూడా కవిత్వం చేసినవాడు. తరతరాలుగా దళిత జాతి మనస్సులో, జీవితాల్లో, మాటల్లో చితి ఆరటంలేదు. వాళ్ల మాటల్ని, వాళ్ల బాధల్ని మనం భాషగా ఒప్పుకోం. ఇక్కడ భాషంటే రెండు తోలు పెదాల్లోనించీ స్వరపేటికతో కలిపి వచ్చే శబ్దాలు, అరుపులు. నాలిక మడతలు కాదు. భాష అంటే  పాట్లు, భాష అంటే బతుకు, భాష అంటే జీవితం. కత్తికన్నా కలం పదునయినదన్నది పాత బూజు సిద్ధాంతం. కాదు ఈ రెండింటికన్నా భాష పదునయినదనీ, దానిలో కూడా మళ్లీ ఎన్నో తేడాలు. Power of Languageకి Language of Powerకీ ఉన్నంత తేడా.. దీన్ని చర్చిస్తే  ఒక గ్రంధమే రాయాలి.

maakuOkaBhashaKaavaaliByWilsonSudhakar

సాల్వెడార్ ఆలెండీ మృతివార్త విని ప్లాబో నెరుడా మరణించాడు. విచిత్రం… కవిగా మరణించినా మెదడు మాత్రం ఆఖరి నిముషం వరకు పని చేసిందంట. బహుశా నెరుడా మెదడులోని ఒక కణం ఈ కవి చేతిలో దూరిందేమో. ఎన్నెన్ని సంఘటనలు. కష్టాలు ఎవరివయినా ఒకటే. ఎన్నెన్ని సంఘటనలని రూపం కట్టాడు. నిజానికి పారే నెత్తురికీ, ఊడదీసిన బట్టలకీ, భర్తాబిడ్డల ముందు మానభంగాలకీ, ఓపికలేని కుత్తుకలకీ, పిల్లికూతల స్వరల తరఫున నరాలు తెగిపడేలాగ అరిచాడు. అసలు ఈ సంఘటనలు కవితలుగా మలచటానికి ఇంత ఓపికా, శక్తి ఉండటం కూడా ఆశ్చర్యమే. మట్టిలో పడే పాదముద్రలకి శాశ్వత్వం మళ్లీ వాన కురిసేదాకానే. బాటగా బతుకుపాటగా, పాటుగ మారతయ్యనుకోటం మన ఆశ. అయినా ఎలుగెత్తటం మానకూడదు. ఎలుతురిని ఎతకటంలో తప్పులేదు.

కారంచేడు, చుండూరు, నీరుకొండ, కందమాల్,  భైర్లాంజీ, నిర్భయ, దళితక్రైస్తవం, అంబేద్కర్ , బుద్ధుడు, పూర్తి రిజర్వేషన్లు, అన్నీ చెపుతా ముల్లు కఱ్ఱతో తన వాళ్లని తనే పొడుస్తున్నాడు, పొడిచే పొద్దువైపు చూపుతా.

మరిప్పుడూ భాషెందుకు కావాలి. ఇప్పుడు మాట్టాడే భాష కాదు? మరి అందరూ ఆ భాషే మాట్టాడతంటే వీళ్లెందుకు ఆ భాషని కక్కిన కూడులాగా అసహ్యించుకుంటన్నారు.

వాళ్ల పదాలనీ, జీవితాలనీ, వృత్తులనీ, గుండెనీ, గుడిసెనీ, ఆటనీ, పాటనీ, బువ్వనీ, అవ్వనీ, నవ్వునీ, ఏడుపునీ మనం గుర్తించనప్పుడు అసలు ఈళ్ళు ఉనికే వద్దన్నప్పుడు, బతుకే దినదినగండం నూరేళ్ళ ఆయుస్సు అయినప్పుడు అది ఆనందపు మాటగా, మాట బాసగా మారుద్దా. వాళ్ల పాటకి సరిగమలు లేవంటే అది శ్రమది, ఇది ఇంకోటి. వాపుకీ, బలుపుకీ ఉన్న తేడా.

సంగీతం అంటే సరిగమపదనిసలు. తిరగా బోర్లా ఎనిమిదక్షరాలు. ఆరోహణా, అవరోహణా అనే అర్ధం కాని పదాలా అంటే అవ్వొచ్చు. కాకపోవచ్చు. ఒక సినిమా” ద కలర్ కాల్డ్ పర్పుల్” లో స్పీల్‌బర్గ్ ఇలా అంటాడు. సంగీతం అంటే ఆఫ్రికన్ ఎడారుల్లో రైలు మార్గాలు వెయ్యటానికి, గడ్డపారల్లో పట్టాలు దొర్లించేటప్పుడు ఒదిలే ఊపిరి, కడుపు నింపుకునే ఆహారాన్వేషణలో భయాన్ని పోగొట్టుకోటానికి చేసే ధైర్యపు శబ్దాల పాట. ఆకలేసి, ఏసి ఏడ్చి సొమ్మసిల్లిన నిస్సత్తు రాగం. బహుశా ఇదే నా మెదడులో కూడా ఉందేమో.

ఏది ఏమైనా తెలంగాణా ఉద్యమానికి పునాది వాళ్ల మహోన్నతమయిన సాంస్కృతిక వాదమే. గొప్ప భాష వాళ్ల సొంతం. ఎంతో సొగసైన మాండలికం, కట్టె పుల్లలు, కట్టెల పొయ్యి, దుడ్డు, బిడ్డ, యాట లాంటి అసలయిన పదాలు ఆళ్ల సొంతం. ఎంతెంత సాహితీ సంపన్నులు. మాండలీకాలనే గవ్వలనీ, రవ్వలనీ పోగేసుకున్నవాళ్లు. గద్దర్, గోరేటి లాంటి సంస్కృతీ వారసత్వంతో అదీ ఒద్దీకరించబడి (రికార్డెడ్) ఉండాలి. అక్కడా అంతా గొప్పా అంటే అదేమీ లేదు. పట్టు చీరల గరగరల బతుకమ్మల్లో పాపం మన దళిత సోదరులకి  సోటుందా. సరే మళ్లీ విషయంలోకి వద్దాం. నేను “క” గుణింతాన్ని ఎన్ని రకాలుగా నేర్చుకున్నానో.

1. ‘క’కార అకారముల ‘క’, ‘క’కార ఆకారముల ‘కా’, ‘క’కార ఇకారముల “కి’

2. ‘క’కు దీర్ఘమిస్తే కా, ‘క’కు గుడిత్తే ‘కి’, ‘కి’కు పొల్లిత్తే ‘కీ’

3. క, కా, కి, కీ, కు, కూ,కృ, కౄ

ఇక్కడే మూడు మూడు వర్గాలయ్యాయి. ఒకటి బ్రాహ్మణులది, ఒకటి ధనగ్రవర్ణాలది, ఒకటి బీదలది. అయినా అన్నీ సదివినా, బతుకులో ఈ కాకిగోల ఎంతకి ఉపయోగపడుద్దో అర్ధమే కాదు.

అసలు దళిత వాదానికి పునాది ఏంటి? ఎవరో కొద్దిగా ఆలోచిత్తే చాలు. ఎవరికయినా తెలుత్తుంది. హైందవ అమానవీయ సంస్కృతిని ధిక్కరించే పోరాటమే. ధర్మశాస్త్రాల ఆధిపత్యాన్ని తిరస్కరించిన చార్వాకులు, బౌద్ధులు, అంబేత్కర్, పూలే, పెరియా ఉద్యమాలే కదా మూలం. కుల నిర్మూలన జరగాలనే వాదమే కదా వాస్తవానికి దళితవాదం. ప్రవాహపు నదిలా ఉండి ఉపనదులని కలుపుకుంటా సంపన్నం కావాలి. కానీ కాన్షీరాం అన్నట్టు కడుపు నిండినవాడు ఎవరంటే దళిత బ్రాహ్మణుడు అంటాడు కవి.

వాళ్లలోని ఈ ఆకారం లేని పోకడల పట్ల పెన్నం మీద గింజల్లా పేలతాం కానీ భూమిలోని విత్తులా మొలవరేం. దళితోద్యమాలు చైతన్యపూరితం అయ్యి తీవ్రమయిన అగ్రహాన్ని వ్యక్తం చేసే స్త్రీలని గాయపరిచే భాషలని  వాడటం నివారించగలిగాయి. ఎన్నో సంకలనాలు కూడా వచ్చాయి. ఎంతోమంది కవులు ఎన్నోరకాలుగా రాశారు. కొందరయితే పేరొచ్చినాక దళిత కవిత్వం, దళిత అనే మాటలకే దూరంగా జరిగిపోయారు. (ఇక్కడ  పేర్లు అవసరం లేదు) ఒకరకంగా అన్యాయాల పైన  కూడా . అంటే వాళ్ల మీద వాళ్లే  పోరాటాలు చేసుకోవాలేమో. అయినా ఎంత చెప్పినా దళితవాదం గురించి తక్కువే. అదొక పోరాటం, ఉద్యమం  స్థాయిలో ఇంకా పెరుగుతూనే ఉండాలి.

కొందరికి నదులు, కొండలు, పర్వతాలు, జలపాతాలు, కిటికీలోంచి లోకం, ఉదయాలు, సాయంత్రాలు.. ఇవే కవిత్వం. ఇక్కడి కవికి అణిచివేత, అణగదొక్కటం, నోటితో మాట్లాడి నొసలుతో ఎక్కిరించటం లాంటి వాటిపైన పశృతలతో పడ్డాడు. ఇది నిజంగా కొంతలో కొంత ఆధునిక ధిక్కారం. ఊకబస్తాలాంటి మెదళ్లని కదిలిచ్చటం. అంబరానికి ఎగిరిన పొలికేక, తెగిపడ్డాక కంఠాల అరుపు. మనుషులుగా గుర్తించాల్సిందే అనే హెచ్చరిక. మీద పడయినా మావాటా లాక్కుంటాం. పరిగె గింజలకి కాదు, పాలికుప్పలకోసం, కల్లాల కోసం పోరాటం. ఆమోదాలకోసమో, అలంకారాల కవిత్వం కాదు. ఆకలికేకలు. అణిచివేత అరుపులు, కులాల కుంఠాటల్ని జాడిచాడు.

మాకు ఒక భాష కావాలి. అది దళిత భాష కావాలి. కోరికయితే కోరాడు కానీ నిజానికి సుధాకర్ కవిత్వంలో ఎంత దళిత భాష ఉంది? ఉంటే ఎంత? లేకపోతే ఎంత. కొంచెం ఎనక్కి వెళితే నేను తన ప్రొఫైల్ చూసి ఆశ్చర్యపోయాను. కోస్తాలో మాంచి మోతుబరి కమ్మగ్రామం ఆయన ఊరు. తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులు. తండ్రి ఊరికి మంచి చెడులు చెప్పే పాస్టరు, పోస్టు మాస్టరు, హెడ్ మాస్టరు. తల్లిగారు కూడా ఉపాధ్యాయురాలే. ఒక రకంగా మాస్టారి అబ్బాయిగా మంచి జీవితమే. అందరికన్నా మెరుగయిన బతుకే. అందుకే ఎక్కువగా నాగరిక భాషే ఉంటది.. మరి విషయం దళితులది. విధానం స్థానిక, దేశ, విదేశ పదాల కలగలుపు. అయినా సమస్యనే తీసుకున్నాడు కనక ఈలోపాన్ని వదిలేద్దాం. మరి ఇపుడు మాట్టాడేది భాష కాదా? శ్రమ చేసి వాడి పాదాలు మనతో మాట్టాడాలి. డప్పు కొట్టె చెయ్యి గుండెల దడ కావాలి. కవికి ఒళ్ళంతా కళ్లయి ప్రపంచలోని ప్రాపంచాన్ని చూడాలి. ఎమ్మటే కంటిలో పాపలా లలితంగా మారిపోవాలి. మళ్లీ ఇట్టా అంటాడు. భూమినాది కాదు. భూమిపయిన హక్కు నాది కాదు. ఏ రూపంలోనయినా మమ్మల్ని కలుపుకోనప్పుడు మీ బతుకు కతల్లో మాకు గారవమే లేనప్పుడు, మాకు మీ చెడిన చరిత్రలో చిరుగుల పేజీ అయినా లేనప్పుడు ఈ భాష మాకెందుకు? అప్పుడప్పుడు అనిపిచ్చుది. సమాజం చేసిన గాయం ఎంత లోతయినదో కదా.. ఇంకా గేదె మానాన్ని పొడిచే కాకుల జీవితమే కదా. చిరుగుపాతల గోనెపట్టయినా కప్పట్లేదు. కాకులకి వదిలేశామిది చూడండి.

 

కులపిచ్చిగాళ్లకి దేశమొక ఎలమావితోట

జాతికి జవ్వనాశ్వంలా మేమూ శ్రమదానం చేస్తున్నా

కుల ఓంకారాన్ని ప్రణవాక్షరం చేసుకున్న

దేశపౌరుల గుండెలోతుల్ని తెలుసుకోగలమా!

కాలేజీ రోజులు ఇంకా పచ్చగా, పచ్చిగా కళ్లముందే కదలటల్లా. ఆడు ఒకటా, రెండా అని మీ చెవుల్లో మోగటల్లా.. అన్నియ్యా, అక్కియ్యా, ఒచ్చేడు, ఎల్లేడు అనే ఎకిలి మంత్రాలు ఇంకా వాగి మోగుతున్నాయి.

రామా “అడ్‌కాప్” చెప్పులకన్నా

నీ పావుకోళ్ళ జత గొప్పవైతే

రా! బహుజన సామ్రాజ్యంలో గద పట్టుకు నిలబడ్డ అంబేత్కర్ని దాటి’

ఎంత ధైర్యం, నిబ్బరం, మేము దళితులం అని సగర్వంగా తలెత్తిన క్షణం, బతుకుల్ని బాగుచేసి, చేత్తన్న, చేసే వైనాన్ని కనుక్కొన్నారు. మీకొక మనిషున్నాడు. అతని ఆత్మ అంతరవలయమై ప్రతి దళితవాడని ఇనపకంచెలా, తిరగబడే పిడికిలిలా, కన్నీటిని తుడిచే అమృత హస్తంలా కావలి కాత్తానే ఉంది.  ఏ తలకాయ లేదనుకున్న గొఱ్ఱె తలకాయలకి ఓ సమాధానం ఈ తల. ఏ ధనం లేదనుకున్నవాళ్లకి జై భీమ్ పిడికిలే సంపద. తలే కొన్ని కోట్ల తలల తిరుగుబాటు. తలలకే తల అది. అసలు ప్రతి కులంలోనూ ఓ అంబేత్కర్ ఉండాలంటాడు కవి. అంబేత్కర్ వల్ల కడుపులు నిండినవాళ్ల మానం పైనా చురకలేశాడు. నిజానికి అంబేత్కర్ ఆశయాలు ఎంతగా ప్రచారం పొందాయో, అంతకన్నా త్వరగా దుష్ప్రచారాలని సాగించటంలో కూడా కొన్ని శక్తులు విజయం సాధించాయి. అసలు దళితులే అంబేత్కర్‌ని ఆరాధించాలని ఏమీ లేదు. వ్యక్తిగా ఎవరమయినా అతని గొప్పతనాన్ని సంఘం పయిన ఉండే ముందు చూపుకీ జై భీమ్. రామాలయాలు వద్దు. కాలే కడుపుకి గంజే ముద్దంటాడు.

మాంసం తినే హిందువంటే

మాంసం తినని హిందువు ఇంటిదాకా రానిస్తాడా…..

ఇంటిదాకా కాదు ఒంటికి తగిలినా మునుగుతారు. మన సిగ్గులేని  సమత్వం సిగ్గుతో దాక్కోటాన్ని చూత్తాం.

విత్తమూ నీది కాదు. విత్తనమూ నీది కాదు. విన్నాణమూ నీది కాదు. పుల్ల మామిడి దొరకని పురజనులకి, ఓడలు దిగిన చైనా యాపిళ్లలో గుట్టు, కిమయా డేట్సు, ఓట్సు, Ives(ఏవీస్) మాహిశ్చరైజర్లు, ఈ దేశం నీదయినా, ఈ రాజ్యం నీది కానప్పుడు , ఈ గింజ నీ చేతిలో ఉన్నా భూమి లేనప్పుడు అవి ప్రపంచీకరణ దుష్ప్రభావాలని దుయ్యబట్టి, ఎండేశాడు. ఈ పద్యాలన్నీ చదివితే ఇవి దళిత, బహుజన, క్రైస్తవ సమాజం కోసమే  అనుకుంటే పొరపాటు. ఆలోచిస్తే పుడమిని చీల్చుకుని వచ్చే ప్రతి ప్రాణి బాధ దిగులు. ఉనికిని కోల్పోయే జీవితాన్ని గుర్తు చేస్తా భయంతో చేసే హెచ్చరిక.

sindhumadhuri-మన్నెం సింధు మాధురి

 

(రెండో భాగం వచ్చే వారం)

సానుభూతి

“సరోజా!  ఇటు రా! ”  బీరువా ముందు నిలబడి పనమ్మాయి సరోజని పిలిచింది విమల. 

“ఏంటమ్మా?”  అంది సరోజ విమల గదిలోకి వస్తూ.

“రేపు పార్టీకి ఏం చీర కట్టుకోమంటావు?”  అంది నాలుగు చీరలు తీసి మంచం మీద పడేస్తూ.

“మీరు ఏం చీర కట్టుకున్నా  బాగానే ఉంటారమ్మా!” అంది సరోజ.

“ఊ!  నిన్ను అడగటం నాదే బుద్ధి తక్కువ.  నేనేది కట్టుకున్నా ఆరాధనగా చూస్తావు” అంటూ చీరలన్నీ కలబెట్టింది విమల.  దొంతరలు దొంతరలుగా పేర్చి ఉన్న చీరల్లో ఒక్కటీ నచ్చలేదు ఆమెకి. 

“అబ్బ!  ఒక్కటన్నా బాగా లేదు.  బజారుకి వెళ్ళి కొత్త చీర తెచ్చుకుంటా.  నువ్వు సాయంత్రం ఇంటికెళ్ళేప్పుడు రంగా కి బ్లవుజ్ ఇచ్చి ఉదయానికి రెడీ చేయమని చెబ్దువుగాని.  నేను వచ్చేప్పటికి పని పూర్తి చేసుకుని ఉండు” అంటూ హడావుడిగా బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళింది విమల.

 విమల కొత్త చీర కొనుక్కుని వచ్చి వంట చేస్తున్న సరోజకి చూపించింది.  నెమలి రంగు చీర మీద పసుపు పూల లతలతో ఆ చీర చాలా బాగుంది.  “చాలా బావుందమ్మా! ”  అంది సరోజ. 

“బావుందా!  సరే నువ్వు బ్లవుజ్ కుట్టమని రంగా కి చెప్పి ఇంటికెళ్ళిపో.  రేపు ఉదయం వచ్చేటప్పుడు బ్లవుజ్ తీసుకురా – మర్చిపోకుండా”  అంది విమల. 

కుట్టాల్సిన రవికా, ఆది రవికా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటూ “ఎందుకు మర్చిపోతానమ్మా? రేపే కదా మీ పుట్టినరోజు”  అంది సరోజ.

 

     ***

 

తర్వాత రోజు సరోజ  తన కూతురు చిట్టిని తీసుకొచ్చింది.  చిట్టిని వరండా చివర కూర్చోపెట్టి   రవికల కవరు తీసుకుని లోపలకి వెళ్ళింది.

 

సూర్యుడు గబగబా ఏదో కొంప ముంచుకుపోయినట్లు  పైకి ఎగబాకుతున్నాడు.  వరండాలో కూర్చుని ఉన్న చిట్టికి బాగా ఆకలిగా ఉంది.  అమ్మ కోసం, ఆమె తెచ్చే అన్నం కోసం ఎదురు చూస్తోంది. ఆ ఇంట్లోకి ఎవరెవరో వస్తున్నారు,  వెళుతున్నారు.  ఇంట్లోకి వెళ్ళే వాళ్ళని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు చిట్టి.  కాని లోపల నుంచి బయటకు ఎవరైనా వస్తున్న చప్పుడైతే మాత్రం ఆత్రంగా తల ఎత్తి చూస్తోంది తన అమ్మేమోనని. 

 

లోపల నుండి నవ్వులూ, మాటలూ వినపడుతున్నాయి.  వంటింట్లో నుండి వచ్చే వాసనల వల్ల చిట్టికి ఆకలి ఇంకా ఎక్కువవుతోంది.  ఇంతలో ఇద్దరు పిల్లలు బుట్టెడు ఆట సామాన్లతో వరండాలోకి వచ్చారు.  బుట్టలో నుండి రకరకాల బొమ్మలు తీసి వరండాలో సర్దుతున్నారు.  చిట్టి ఆకలిని మర్చిపోయి వాళ్ళ వైపే చూస్తోంది ఆసక్తిగా.  చివరగా పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు బొమ్మలను తీసిన చిన్న పాప “అక్కా! పెళ్ళి ఆట ఆడుకుందామా?”  అంది.

“సరే”  అంది పెద్ద పాప.

పెళ్ళి ఆట అనగానే చిట్టి ఉత్సాహంగా వారి వైపే చూడసాగింది.  పెళ్ళికూతురినీ, పెళ్ళికొడుకునీ ప్రక్క ప్రక్కనే కూర్చోపెట్టారు.  పురోహితుడి బొమ్మని వాటికెదురుగా పీట వేసి దాని పైన పెట్టారు.  ఆడవాళ్ళనీ, మగవాళ్ళనీ, జంతువులనీ, పక్షుల్నీ వాళ్ళ దగ్గర ఉన్న బొమ్మలన్నింటినీ ఎదురుగ్గా అలంకరించారు.  పెద్ద పాప లోపలకి వెళ్ళి స్టీలు గిన్నెలో ఏవో తెచ్చి ప్రక్కన పెట్టింది.  అవేమైనా తినేవేమో అనుకున్న చిట్టికి నోట్లో నీళ్ళూరాయి.  ఇద్దరూ ఏవేవో మంత్రాలు చదువుతూ బొమ్మలకు పెళ్ళి చేశారు.

“పెళ్ళయింది.  ఇక భోజనాలు పెట్టాలి చుట్టాలకి”  అంది చిన్న పాప.

“ఆ!  అందరూ భోజనాలకు లేవండి” అంది పెద్ద పాప ఎదురుగ్గా అలంకరించిన బొమ్మల వైపు చూస్తూ.

చూస్తున్న చిట్టి అప్రయత్నంగా లేచి వాళ్ళ దగ్గరకి వెళ్ళి భోజనాలా?  అంది.

తలతిప్పి చిట్టి వైపు చూసిన పిల్లలిద్దరూ “ఎవరు నువ్వు?”  అన్నారు ఇద్దరూ ఒకేసారి. 

“మా అమ్మ ఈ ఇంట్లో పని చేస్తుంది” అంది చిట్టి.

“సరోజక్క కూతురివా?” అంది పెద్ద పాప.

తల ఊపింది చిట్టి.

“దా!  నీ పేరేమిటీ?”  అన్న చిన్న పాపను చూస్తూ “చిట్టి” అంది చిట్టి.

“నా పేరు శరణ్య.  ఇది మా అక్క సాహితి” అని అక్కని వేలితో చూపించి “నువ్వు ఎన్నో తరగతి?” అంది మళ్ళీ.

“నాలుగో తరగతి” అంది చిట్టి.

“నేను కూడా నాలుగే..  దా!  కూర్చో!” అంది చిన్న పాప.

చిట్టి కూర్చోలేదు.  అలాగే నిలబడి ఉంది.

“కూర్చో.  ఆడుకుందాం”  అని పెద్ద పాప అనడంతో వాళ్ళకి కొద్ది దూరంలో కూర్చుంది చిట్టి బిడియంగా.

“స్టీలు గిన్నెలో నుండి కేకులు, చిప్స్ తీసి ప్లేట్లల్లో సర్దుతోంది పెద్ద పాప.  చిట్టి వాటి వైపే రెప్ప వాల్చకుండా చూస్తోంది.  దానికి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఆగకుండా.  బొమ్మలన్నింటినీ వరసగా కూర్చోపెడుతున్న చిన్న పాప చిట్టి వైపు తిరిగి “నీకు కూడా ఇలాంటి బొమ్మలున్నాయా?”  అని అడిగింది.

చిట్టి తల అడ్డంగా ఊపింది లేవన్నట్లు.

“లేవా?”  అని ఆశ్చర్యంగా చూసి “ఇంకేమైనా బొమ్మలున్నాయా మరి?”   

“అస్సలు నాకు బొమ్మలే లేవు” అంది చిట్టి మామూలుగా.  దాని గొంతులో ఏమీ బాధ లేదు.  కళ్ళు మాత్రం చిప్స్ వైపే చూస్తున్నాయి.

“నేను నీకు కొన్ని బొమ్మలిస్తానుండు.  ఇది ఇవ్వనా?  అంటూ అమ్మాయి బొమ్మ ఇవ్వబోయిందివద్దు అన్నట్లుగా తల ఆడించింది చిట్టి.  “పోనీ ఇది ఇవ్వనా? ఇది ఇవ్వనాఅంటూ రకరకాల బొమ్మలు చూపిస్తోంది.  ఆ పాప ఏది చూపించి అడిగినా వద్దు – వద్దుఅంటున్న చిట్టిని చూసి పెళ్ళికూతురూ, పెళ్ళికొడుకూ బొమ్మలు మాత్రం ఇవ్వను.  ఇంకేం కావాలన్నా తీసుకో”  అంది చిన్న పాప విసుగ్గా.

చిట్టి ఏమీ మాట్లాడలేదు

ఏం  కావాలో అడుగు భయపడకుండాఅంది పెద్ద పాప చిట్టికి దగ్గరగా వచ్చి

చిట్టికి ఏదైనా ఇవ్వాలని వాళ్ళిద్దరికీ చాలా కోరికగా ఉంది.

ఆకలేస్తుంది.  ఆ రొట్టె కావాలిఅంది చిట్టి కేకును చూపిస్తూ.

అయ్యో!  ఆకలేస్తుందా?అని  గిన్నె దగ్గరకి పరిగెత్తినట్లుగా వెళ్ళింది పెద్ద పాప.

చిన్న పాప నవ్వుతూ “అది రొట్టె కాదు కేకు” అంది.

కేకు, చిప్స్ ఉన్న ప్లేట్ తీసి చిన్న పాపకిచ్చి “చిట్టికి ఇవ్వు.  అమ్మని పిలుచుకొస్తా” అంటూ లోపలకి పరిగెత్తింది పెద్ద పాప.

పెద్ద పాప ‘అమ్మని పిలుచుకొస్తాన’న్న మాటకి చిట్టికి భయమేసింది. నాలుగు రోజుల క్రితం జరిగినది గుర్తొచ్చింది.

నాలుగు రోజుల క్రితం చిట్టి తన గుడిసె ముందు కోర్చోనుంది.  వాళ్ళ పక్క గుడిసెలో ఉండే గౌరి, కిట్టా వాళ్ళ నాన్న అరటి పళ్ళు తీసుకుని లోపలికి వెళ్ళాడు.  చిట్టి తనకి కూడా నాన్నుంటే ఏదో ఒకటి తెచ్చేవాడు కదా అనుకుంటూ వాళ్ళ గుడిసె వైపే చూస్తూ ఉంది.  గౌరి, కిట్టా అరటి పండు తెచ్చుకుని తింటుంటే వాళ్ళ దగ్గరకి పరిగెత్తుకుని వెళ్ళి గౌరిని కాస్త పెట్టమని అడిగింది.  గౌరి సగం తుంచి పెట్టింది.  కిట్టా లోపలకి వెళ్ళి వాళ్ళమ్మకి చెప్పాడు.  వాళ్ళమ్మ పెద్దగా అరుస్తూ బయటకొచ్చి చిట్టి వీపు మీద నాలుగు దెబ్బలేసి రెక్క పట్టుకుని చిట్టి గుడిసె దగ్గరకు లాక్కొచ్చింది.  “అన్నం పెట్టుకోలేక ఊళ్ళో వాళ్ళ మీదకు తోలతన్నావా పిల్లని?  మాకే గతి లేక చస్తా ఉంటే నా పిల్ల దాని చేతిలోది తీసుకుని తింటంది ఇది”  అని చిట్టి అమ్మని తిట్టింది.  చిట్టి అమ్మ ఏమీ చేయలేక చిట్టి వీపు మీద నాలుగు గుద్దులు గుద్ది చిట్టినే వాటేసుకుని ఏడ్చింది.  అది గుర్తొచ్చిన చిట్టి చిన్న పాప ఇస్తున్న కేకుని తీసుకోకుండా వణికిపోసాగింది.

 

పెద్ద పాప లోపల్నించి వాళ్ళమ్మని తీసుకొచ్చింది. నెమలి రంగు చీర మీద పసుపు పూల లతలున్న చీర కట్టుకున్న ఆమె చాలా అందంగా ఉంది.  చిట్టి ఆమె వైపు భయంగా చూసింది.  ఆ చూపులోని భయాన్ని, వణుకునీ, కలవరాన్నీ చూసిన విమల సముదాయింపుగా “ఎందుకు భయపడుతున్నావు?  తీసుకో – తిను” అంటూ చిన్న పాప చేతిలోని కేకుని తీసుకుని చిట్టికి పెట్టింది.  చిట్టికి భయం తగ్గింది. 

“సరోజా! ఇలా రా”  అంటూ కేకేసింది విమల.

సరోజ పరిగెత్త్తుకుంటూ బయటకు వచ్చింది.  “పాపకి ఆకలేస్తుంటే అన్నం పెట్టకుండా ఏం చేస్తున్నావ్?”  అంది విమల.

“మీ భోజనాలయ్యాక పెడతాలేమ్మా”  అంది సరోజ.

“అదేంటీ?  ఇంట్లో వండలేదా”  అంది విమల ఆశ్చర్యంగా.  చిన్న పాప, పెద్ద పాప చిట్టి వైపు దిగులుగా చూస్తున్నారు. 

“లేదమ్మా.  నాకు మీరిచ్చింది సరిపోతుంది.  చిట్టికి స్కూల్లో పెడతారు.  బంద్ అని స్కూలు తెరవడం లేదు.  అందుకని వారం రోజుల నుండీ ఇక్కడ తీసికెళ్ళిందే ఇద్దరం తింటున్నాం”  అంది.  మళ్ళీ తనే “బంద్ ఎందుకోసమమ్మా?”  అని అడిగింది.

 

“రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని బంద్ చేస్తున్నారు.  నీకర్థం కాదులే – ఇట్లా చెప్తే.  ఇప్పుడూ మీ పేట ఉందనుకో – పెద్దమనుషులు దాన్ని రెండుగా చేసి కొంతమంది అటు ఉండండి కొంతమంది ఇటు ఉండండి అని విడదీశారనుకో.  విడిపోవడం ఇష్టం లేని వాళ్ళు ‘అందరం కలిసి ఉందాం’  అని గొడవ చేస్తారు కదా!  అలా మన తెలుగు రాష్ట్రాన్ని వేరు చేస్తున్నారని కలిసి ఉండాలనే వాళ్ళు బంద్ చేస్తున్నారు”  అని విమల సరోజకి వివరంగా చెప్పింది.

“కలిసి ఉన్నవాళ్ళని విడిపొమ్మనడం ఏంటమ్మా?  కలిసి ఉండండి అని చెప్పాలిగాని” అంది సరోజ.

“అటుప్రక్క వాళ్ళు విడిపోవాలంటున్నారుగా” అంది విమల.

“ఇదేదో అత్తా కోడళ్ళ తగాదా లాగా ఉందమ్మా. పెత్తనం తనకే ఉండాలని అత్త కలిసి ఉందాం అంటుంది.  అత్త ఉంటే పెత్తనం రాదు కాబట్టి విడిపోవాలంటది కోడలు.  మా ఇళ్ళల్లో ఎన్ని జరగడం లేదు ఇట్టాంటి తగాదాలు.  అయినా పెద్దోళ్ళు గొడవ పడతా పిల్లలకి బడి లేకుండా చేస్తే ఎట్టమ్మా? మద్యాన్నమన్నం లేకుండా పోయింది”  అంది సరోజ.  సరోజ కళ్ళల్లో సన్నని నీటి పొర.

 

ఈ సమస్య గురించి అవగాహన లేని వాళ్ళకి దీని లోతులు  అంత తేలిగ్గా అర్థం కానుకున్న విమల “సరోజా! నువ్వనుకున్నంత చిన్న సమస్య కాదు ఇది కాని నువ్వన్నట్లు పిల్లలకి బడి లేకుండా చేయడం వల్ల ఎంతమంది చిన్నారులు ఆకలితో బాధపడుతున్నారో పాపంఅంది.

మాటలకి సరోజ కళ్ళల్లోని నీళ్ళు బుగ్గల మీదకి జారాయి.

విమల సరోజ భుజం మీద చేయి వేస్తూ   సరోజా! మీ పిల్లదానికి అన్నం ఇక్కడ పెడితే నేనేమైనా అంటానా?  స్కూలు తెరిచిందాకా రోజూ ఇక్కడే అన్నం పెట్టు”  అంటూ చిట్టిని సరోజతో వంటింట్లోకి పంపించింది. 

 

వాకిట్లో నిలబడి అంతా చూస్తున్న ఆమె స్నేహితులు కొందరు “ఇలా వాళ్ళని ఇంట్లో చేర్చావంటే నెత్తికెక్కుతారు.  ఎక్కడిదీ చాలదు”  అన్నారు. 

“ఫరవాలేదు.  మనం కొనే ఒక చీర ఖరీదు లేదు వాళ్ళు తినేది. ఎక్కడిదీ చాలకపోవడానికి  మనం వాళ్ళకేమైనా చీరలు సారెలూ ఇస్తున్నామా లేక జీవితమంతా పోషిస్తున్నామా?  వాళ్ళ పట్ల సానుభూతితో ‘మీకు కష్టం వచ్చినపుడు మేము ఉన్నాం’  అని అనడమే వాళ్ళకు మనం చేసే గొప్ప సహాయం.  అది వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని, ఓదార్పుని ఇస్తుంది”  అంది విమల. 

ఇలాంటి తన స్నేహితురాళ్ళని మెప్పించడం కోసం, వారి మెరమెచ్చుల కోసం తను నిన్న అప్పటికప్పుడు కొని కట్టుకున్న చీర  బరువైపోయినట్లుగా అనిపించసాగింది విమలకి.

 

  ***                     

radhaమండువ రాధ

సూర్యుడి చూపు కోసమే అద్దేపల్లి కల!

 

సాహితీ లోకానికి సుపరిచితులైన అద్దేపల్లి రామమోహన రావు గారు  ప్రపంచీకరణ నేపథ్యంలో సాగుతున్న అనేకానేక పరిణామాలపై ఎక్కుపెట్టిన వ్యంగ్య, విమర్శనాత్మక కవితా బాణాల సంపుటి – “కాలం మీద సంతకం”.

అద్దేపల్లి కవిగా కంటే విమర్శకులుగా, అద్భుతమైన వ్యాసకర్తగానే నాకెక్కువపరిచయం. పత్రికల్లో చదివిన వారి సాహిత్య వ్యాసాలు, “సాహిత్య సమీక్ష” వంటి పుస్తకాలు, “మా నాయిన” లాంటి ఎన్నో కవితా సంపుటాలకు ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా వ్రాసిన ముందు మాటలూ, ఈయన కవిత్వం పట్ల నాలో ఆసక్తిని రేకెత్తించాయి.

మూఢత్వం మూలంగా నిస్తేజంగా మారిన జనజీవితాల్లోకి వెలుగు రేఖలను ప్రసరింపజేయడమే అభ్యుదయ కవుల లక్షణం. భారతీయ సాహిత్యానికి సంబంధించి, 1935వ సంవత్సరంలో భారతీయ అభ్యుదయ రచయితల సంఘం అలహాబాదులో ఏర్పాటు చేయబడింది. 1936 ఏప్రిలులో ప్రసిద్ధ ఉర్దూ-హిందీ రచయిత మున్షీ ప్రేంచంద్ అధ్యక్షతన ప్రథమ అఖిల భారత అభ్యుదయ రచయితల మహాసభ లక్నోలో జరిగింది.  అదేసంవత్సరం సెప్టంబరులో ఈ కవి జన్మించాడు. అద్దేపల్లి 1960లలో కవిత్వాన్ని వ్రాయడం మొదలుపెట్టారూ అనుకుంటే, అప్పటికి రాష్ట్రంలో అభ్యుదయ కవిత్వోద్యమ తీవ్రత మెల్లిగా సన్నగిల్లి, దిగంబర కవిత్వం ఉద్యమంగా మారుతోంది. (1965 లో దిగంబర కవులు తమ తొలి సంకలనాన్ని విడుదల చేశారు). 70-80 విప్లవ కవిత్వమూ, 80 తరువాత అనుభూతివాదమూ, మినీకవితలూ ఇతరత్రా జోరందుకున్నాయి.

ఇన్ని ఉద్యమాలనూ దగ్గరి నుండీ గమనిస్తూ కూడా, అద్దేపల్లి కవిత్వం తొలినాళ్ళలో వ్రాసిన “అంతర్జ్వాల” మొదలుకుని, ఈనాటి “కాలం మీద సంతకం” వరకూ, శైలి-శిల్పంపరంగా అనివార్యమైన బేధాలు, అభివ్యక్తిలో ప్రస్ఫుటమయ్యే పరిణతీ మినహాయిస్తే, మొత్తంగా అభ్యుదయ కవిత్వ ధోరణిలోనే సాగడం విశేషం. “సమాజంలో ఆర్ధిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘర్షణలు ప్రథానంగా ఉన్నంతకాలం అభ్యుదయ కవిత్వం ప్రథాన కవితా ధోరణిగా ఉండక తప్పదు” అని ఉద్ఘాటించిన ఈ కవి, దశాబ్దాలు దాటినా ఆ మాట మీదే నిలబడి కవిత్వ సృజన చేయడం ఆసక్తికరం.  నమ్మిన కవిత్వోద్యమం పట్ల ఈ కవికున్న నిబద్ధతకు ఇదే నిలువెత్తు నిదర్శనం.

addepali title

ఇక ఈ సంపుటిలోని కవితల విషయానికి వస్తే – మొత్తం యాభై కవితలు. అత్యధికం సమాజంలోని అసమానతలను ఎండగడుతూ, రోజురోజుకీ హెచ్చరిల్లుతోన్న విష సంస్కృతులను విమర్శిస్తూ, సమసమాజాన్ని స్వప్నిస్తూ సాగేవే.  మన భాష గురించీ, సంస్కృతి గురించీ, పశ్చిమ దేశాల ఎఱలకు లోబడుతున్న ఇరుకు మనస్తత్వాల చిత్రీకరణకు సంబంధించీ కొన్ని చిక్కటి కవితలున్నాయిందులో.

 

“ఉగాదికి తెలుగు దూరంగా పరుగెత్తుకు పోతున్నప్పుడు

గంగిరెద్దు మూపురం మీద నించి

జానపదం జారిపోతుంది

హరిలోరంగ హరీ అని

నెత్తి మీద పాత్రలోని బియ్యం కారిపోతుంది

వసంతుడికీ వనానికీ మధ్య ఉన్న వలపు

కోకిల పాటలోంచి పారిపోతుంది ”                                           (పు:71)

 

అలాగే ఈ సంపుటిలో అనేక కవితలకు, చెట్లూ – మనం మినహాయించుకొంటోన్న ఆకుపచ్చందనం వస్తువుగా నిలబడ్డాయి. ” ఏ గడ్డిపరకను చూసినా/మంచు కన్నీటిబొట్టు/సూర్యుడి చూపుల్ని కలగంటోంది/తోటలోని చెట్లన్నీ/పరిశ్రమల దుమ్ములో మాసిపోతున్నాయ”ని ఆవేదన వ్యక్తం చేస్తూ,

“రాతి మేడల నీడలు

తోటల్ని దూరంగా విసిరేస్తున్నప్పుడు

పంచమ స్వరం వినపడని వారికోసం

నా కవిత్వ బంధంతో కోకిలను పట్టి తెచ్చి

ప్రజల గుండెలపై ప్రతిష్ట చేస్తాను

నాకొక్క కొత్త చిగురు చాలు

అరుణారుణ స్పర్శతో

నూతన వసంతోత్సవంలో

తోటంతటినీ జలకాలాడిస్తాను” అంటారు. ( “నాకొక్క చిగురుటాకు చాలు” )

 

ఈ కవికి పశ్చిమ దేశాలు ప్రాక్దేశాల మీద చూపిస్తోన్న ప్రభావం పట్ల ఖచ్చితమైన దురభిప్రాయం ఉంది. మార్పు అభిలషణీయమని అంగీకరిస్తూనే, మన మూలాలను కదుపుతోన్న భావజాలాలను మాత్రం అడ్డుకుందామంటారు. ఈయన కవిత్వంలో ఆవేశంతో పాటు ఆర్ద్రత కూడా సమపాళ్ళలో మిళితమై ఉండి పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

“వేకువ ఝామున అరుణకాంతి వలయాల మధ్య

నేనొక దృశ్యాన్ని చూస్తాను-

దేశాన్ని తలపాగా చుట్టుకుని

భుజాన ప్రాణశక్తిని నాగలిగా పట్టుకుని

కళ్ళనిండా నీటిపొరలు పేర్చుకుని

కాళ్ళకి బురద కడియాలు పెట్టుకుని

గుప్పిట్లోని విత్తనాలు చల్లుకుంటూ

తూర్పు నుండి ఒక రైతు నడచి వస్తున్నాడు-

పెద్ద పండుగ వచ్చేసిందని

అరిచే పిట్టల ఆహ్వాన గీతల మధ్య

రైతు నడచిన అడుగుజాడల్లో

భారతీయ సుక్షేత్ర నిర్మాణం జరుగుతుంది”           (“ఇది హాలికుని అడుగుజాడ”)

ADDEPALLI (1) [3]

ఈ వర్ణన నిజంగా ఏ ఏటికాయేడు తమ ఆకుపచ్చ కలలను మబ్బుల దాకా పంపే హాలికులను సజీవంగా కళ్ళ ముందు నిలబెట్టడం లేదూ? పైన ఉదహరించిన మొదటి పాదంలోనే, –

ఇతను దేశానికేదో అవ్వడం కాదు – ఈ బక్కపచ్చ కలల హాలికుడే దేశాన్ని తలపాగాగా ధరించాడుట! ఎంతటి బాధ్యత కల్గిన వాడు, ఎంత అభిమానధనుడు ఈ దేశపు రైతు – కవి మాటల్లో నుండి ఎంత హుందాగా చదువరుల గుండెల్లోకి నడిచొస్తున్నాడో గమనించారా?!

కవిత్వం నరనారానా జీర్ణించుకున్న వారు దేని మీదైనా అలవోకగా కవితాత్మకంగా వ్రాసేయగలరు. “బీడీ” నుండి “చకారం” దాకా, గాంధీ మొదలుకుని బిస్మిల్లాదాకా, “కాదేదీ కవిత కనర్హం”. ఎంత అభ్యుదయవాది అయినా, అనుబంధాల గురించి మాట్లాడవలసి వస్తే – ఆవేశం పాలు తగ్గడమూ అనురాగం మరింత శోభాయమానంగా వ్యక్తీకరింపబడటమూ సహజమే కదా! వైయక్తికమే అయినా, మనసును తడిమిన కవితలోని భాగమొకటి :

“అర్థరాత్రి వేళ గంగానది

నీ షెహానాయి స్వరాల్ని నెమరు వేసుకుంటూ

ప్రవహించడం మానేసి

నిశ్శబ్ద వేదనతో

ఆకాశ ప్రతిబింబాన్ని హత్తుకుంటుంది

……

నీ షెహనాయి

ఒక్కసారి మనసు కందితే చాలు

ఈ దేశం సంగీత సంస్కారంతో

సమగ్ర వాయువీథుల్నినిర్మిస్తుంది

దేహాన్ని ఆత్మతో అనుసంధానం చేసే

సజీవ మానవుణ్ణి సృష్టిస్తుంది”

 

ఇవి కాక, కవికి ప్రియాతి ప్రియమనిపించే “బందరు”(మచిలీపట్నం) గురించీ , స్నేహాలూ ఇతరత్రా గురించీ మూణ్ణాలుగు కవితలున్నాయి. వాటిలోని పాదాలు (“గుండె వెనుక సముద్రం పిలిచినట్టుంది ” వంటి శీర్షికలు కూడా) బాగున్నాయనిపించినా, ఈ పుస్తకంలో ఇమడలేదనిపించింది. వాటిని మినహాయించి ఉంటే ఈ సంపుటి మొత్తం ఒకే ఊపులో సాగినట్టై, ఒకేవిధమైన భావజాలాన్ని, తదనుభవాన్నీ చదువరులకు మిగిల్చేదేమో కదా అనిపించింది. అలాగే, “మార్కెట్ మగాడి రెక్కలు”, “నెల్లిమర్లలో నెత్తుటి వేళ్ళు” తొలుత తేలిగ్గా అర్థంకాక, కవిత ఉదయించిన సందర్భమేమై ఉంటుందోనన్న మీమాంసకు గురి చేశాయి.

అనుభూతివాద కవిత్వ ఝరుల్లో ఉల్లాసంగా ఓలలాడేందుకు అభిలషించే నవతరం కవిత్వాభిమానులను, అనేకానేక సామాజిక సమస్యలను స్పృశిస్తూ ఆవేశంగా విమర్శనాత్మకంగా సాగిన ఈ అభ్యుదయ కవిత్వం ఏ మేరకు అలరిస్తుందన్నది ప్రశ్నార్థకం. కానైతే, అనిసెట్టి అన్నట్టు “సాహిత్యం ఉద్వేగ మార్గాన జరిగే సత్యాన్వేషణ” అన్న మాటను నమ్మేవారినీ, వివిధ వైరుధ్యాలతో సతమతమవుతున్న సంఘం నాడిని కవిత్వంలో వాడిగా వేడిగా వినిపించడమొక అవసరమే కాదు, అరుదైన కళ కూడానన్న స్పృహ కలిగిన వారినీ- ఈ సంపుటిలోని వస్తువైవిధ్యమూ, శిల్పమూ, గాఢతా అయస్కాంతాలై ఆకర్షిస్తాయనడంలో నాకెటువంటి సందేహమూ లేదు.

77 ఏళ్ళ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా సాహిత్య సభల్లో పాల్గొంటూ, కవిత్వాభిమానులతో ఆత్మీయ చర్చలు జరుపుతూ హుషారుగా కాలం గడుపుతోన్న మన అద్దేపల్లి, మున్ముందు మరిన్ని సంపుటులతో మన ముందుకు రావాలనీ, తెలుగు కవిత్వ చరిత్రలో చెరిగిపోని సంతకమవ్వాలనీ ఆకాంక్షిద్దాం!

– మానస చామర్తి

జొరం

venkatakrishna 

కవి , కథకుడు జి. వెంకట కృష్ణ తొలి కథ “పామును మి౦గిన కప్ప“1994 లో ఆ౦ధ్రప్రభ లో అచ్చయ్యి౦ది . ఇప్పటివరకు వెంకట కృష్ణ 45 కథలు రాసారు.
రె౦డు కథా స౦కలనాలు : గరుడ స్త౦భ౦ (2005 లో) , చిలుకకలు వాలిన చెట్టు (2010) మూడు కవిత్వ సంకలనాలు వచ్చాయి. ఒకటి దీర్ఘ కవిత గా వచ్చింది. వెంకట కృష్ణ పుట్టినదిఅన౦తపుర౦ జిల్లా, వుద్యోగరీత్యా సహకార శాఖలో డిప్యూటి డైరెక్టర్ గా పని చేస్తూ  కర్నూలులో 20 సంవత్సరాలుగా నివాస౦ ఉంటున్నారు. రె౦డు కథా స౦కలానాలకు సహ స౦పాదకత్వ౦ (1) కథా సమయ౦, కర్నూలు 2000 స౦వత్సర౦. (2) హ౦ద్రీ కథలు, కర్నూలు (2003) వహించారు. –వేంపల్లె షరీఫ్

   ***

 

అనిల్ కు కార్టూన్ ఛానెల్  బోర్ కొట్టింది.ఛానెల్  మార్చితే,  స్క్రీన్ మీద తెలుగు అర్ధనగ్నపాటలకు  గెంతులు వేస్తున్న హీరో హీరోయిన్లు. అనిల్ దానికే కళ్లప్పగించాడు. వాడి కళ్ళల్లో మెరుపులు, వాడి తలలో ఏవో దృశ్యాలు. ఆ నృత్యంలోని లయలో, ఆ వూపుల్లో లీలామాత్రంగా వాడు రాత్రుల్లో వినే గుసగుసలూ, శబ్దాలూ పోల్చుకుంటున్నాడు. టీవీ చూస్తున్నాడు కానీ, యింకేదో లోపల జరుగుతుంది. పాటకు అనుగుణంగా శరీరాన్ని కదిలిస్తున్నాడు. అంతలో లోపల్నుంచి హాల్లోకొచ్చి వాడిని గమనించిన వాళ్లమ్మ

“రేయ్! ఏందిరా నువ్ చేస్తుండేది?” అంది

ఉలిక్కిపడి, టీవీ స్క్రీన్ మీద నుంచి కళ్ళు తిప్పి వాళ్ళమ్మను చూసి రిమోట్ తో టీవీని ఆఫ్ చేసి, తమకం పూనిన వాడిలాగా అమ్మను వాటేసుకుని “బోర్ కొడుతుందమ్మా!” అంటూ సరాగాలు పోయాడు. కొడుకును చేతులతో బిగించి ముద్దుపెట్టుకుంటూ . “చదువుకోవచ్చు, బొమ్మలు గీసుకోవచ్చు, బోర్ కొడుతుందంటే ఎట్ల నాన్నా”

“పోమ్మా! ఎప్పుడూ చదూకోమంటావు…” అంటూ గునిసి “ఎందుకమ్మా పాటలు చూడొద్దంటావు?..”

“వాటిని చూస్తే నీకేం అర్ధమవుతుందిరా.. ఆ నడుం తిప్పడంలో నీకేం తెలుస్తుందిరా. అవన్నీ గబ్బు పాటల్రా”

“అయితే టీవీల్లో ఎందుకొస్తున్నాయి?  . నాకేమో చూడాలనిపిస్తుందబ్బా..” అంటూ అమ్మను మరింతగా హత్తుకున్నాడు. “అట్లాంటివి చూడగూడదు. అది సరే  హోమ్ వర్క్ కంప్లీట్ చేసావా..” అంటూ చేతుల పట్టు వదిలేసింది.

వాడు నేల మీదికి జారుతూ, భూమిని తాకిన బంతిలా పైకి లేచి “ఎప్పుడో చేసేసాను…” అంటూ బైటికి వెళ్తున్నాడు.

“రేయ్ ! బయటికొద్దు ” అంది అమ్మ

“నేను ఆడుకునేకి పోతానమ్మా. పక్కింటి అన్నవాళ్లు క్రికెట్ ఆడుతున్నారు ”

“రేయ్ బయటికొద్దు అన్నానా…” అంటూ బయటికొచ్చింది ఆమె.

“రామ్మా పట్టుకుందువు రా చూద్దాం. ” అంటూ పట్టుకునీకి వస్తే తప్పించుకునేందుకు కాచుకున్నాడు.

వాళ్లమ్మ ఒక అడుగు వేస్తే వాడు నలుగడుగులు పరిగెడుతూ స్కేటింగ్ లాగా జారుతాడు.

మొదట రెండుమూడుసార్లు ఆటలాగా అనిపించినా తర్వాత వాళ్లమ్మకు కోపం రావడం మొదలైంది. వాడికేమో ఆటలో మజా ఎక్కువైంది.

అంతలో పక్కింటి ఆంటీ బయటికొచ్చి

“ఏంది కమలా కొడుకుతో కొట్లాటా?…” అంది.

“చూడండి ఆంటీ. వీడు యింతలేడు మాటే వినడు. ఆ జారడం చూడండి. కాళ్లు యిరుగుతాయేమోనని భయమవుతుంది. ఎర్రటి ఎండ, బండలు పేలాలు ఏపుకునేంత కాలిపోతున్నాయి. యీ ఎండల్లో బయట ఆడుకుంటానంటాడు..”

“అవు..  ఎంత ఎండగుంది కమలా.. పిల్లనాయాళ్లు యీ ఎండల్లో తిరిగి జ్వరాలొచ్చి పడతారు. మా సురేష్‌గాడు ఎప్పుడు జారుకున్నాడో సూడు క్రికెట్ బ్యాట్ పట్టుకుని.”

‘టీవీలు చూసి పిల్లలు చెడిపోతున్నారు ఆంటీ. క్రికెట్ ఆటలూ, సినిమా పాటలూ, అబ్బా.. చెడిపేస్తున్నాయి..”

వీళ్లు మాటల్లో పడగానే.. “బై అమ్మా బై బై..” అంటూ వురుకుతున్నాడు అనిల్.

“రేయ్ యిప్పుడు కాదురా సాయంత్రం యింటికొస్తావా. అప్పుడు చెప్తారా నీ కథ… నిన్నూ..” దంచుతానన్నట్లు యాక్షన్ చేసింది వీధిలో కొచ్చి కమల.

వాడు దూరంనుండే బెదిరినట్టు నటిస్తూ…

“నన్ను నలిపేస్తావు గదామ్మా.. రాత్రి నాన్న…” యింకా ఏదో అంటూ యిందాక టీవీలో చూసిన ఒక చేష్టను అభినయించాడు.

కమల బిత్తరపోయింది. “ఏమన్నాడు వాడు. యేదో అన్నాడే. కంత్రీనాయలు. ఎక్కడ వింటాడు యిట్లాంటి మాటలు” అనుకుంటూ సిగ్గుతో కుంచించుకుపోతూ, ఎవరన్నా గమనిస్తున్నారా అని చుట్టూ చూసింది.

పక్కింటి ఆంటి నవ్వుకుంటూ లోనికి పోతోంది.

కొత్తగా కడుతూ ఎందువల్లనో పని నిలిచిపోయిన రెండతస్తుల భవనంలో పిల్లల సందడి. కింద కొందరు క్రికెట్ ఆడుతుంటే పైన కొందరు అల్లరి చేస్తున్నారు. అనిల్ క్రికెట్ వైపు వెళ్తున్నవాడల్లా పైకి చూసాడు. తనతోపాటు స్కూల్ కొచ్చే సునీత రంగురంగు సున్నాలున్న గౌన్లో బలే వుంది. అనిల్ మెట్ల మీదుగా పైకి నడిచాడు. మెదడంతా రంగురంగు సున్నాలు గెంతులు వేస్తున్నాయి. పైన ఐదారు మంది పిల్లలు ఆడుకుంటున్నారు. సునీత దగ్గరకు పోయి నవ్వి ఆ పిల్ల వెనకాలే తిరుగుతున్నాడు. ఆమె కింద పడేసుకుంటున్న ఆటబొమ్మలన్నీ అందిస్తున్నాడు.

ఆ పిల్ల నవ్వుతూ “ఆ యిటుకలతో యిల్లు కడదామా?” అంది. అంతే పక్కనే వున్న యిటుకలను మోసుకొచ్చి గదులు గదులుగా కట్టాడు. హాలు, బెడ్రూం, కిచెన్ ల కోసం చదరాలు చదరాలు పేర్చి ‘బాగుందా’ అన్నాడు. ఆ అమ్మాయి కిలకిలా నవ్వింది. తన బొమ్మలన్నీ ఆ గదుల్లో సర్దింది. ఒక పెద్ద అక్క వచ్చి వీళ్లిద్దరూ ఏం చేస్తున్నారా అని చూసి “యిటుకలతో యిల్లేం బాగాలేదు. యిసుకలో గూడుకడితే బాగుంటుందిరా అనిల్” అంది.

“కదాక్కా.. యిస్క యాడుందక్కా..” సునీత.

“లోపల చూడండి” అని యెవరో పిలిస్తే పరిగెత్తింది.

అనిల్ కు  కూడా అందరి ముందుగా సునీతతో ఆడుకోవడం యిష్టం లేదు. మెల్లిగా ఆ అమ్మాయి చెవిలో “లోపలికి పోయి యిసుక  వెతుకుదామా?” అంటే ఆ పిల్ల తలూపింది. ఇద్దరూ ఒక హాలు దాటి, నడవాకు పక్కనున్న గదిలోకి వెళ్లారు. అది స్టోర్ రూం అయినా పూజగదైనా అయుండొచ్చు. యిరుకుగా వుంది. చీకటిగా వుంది. చల్లగా వుంది. ఏదో వింత చిత్తడి వాసన. యిద్దరూ దాన్ని ఆస్వాదిస్తూ కాస్సేపు నిలబడ్డారు. ఆ తర్వాత భయంతో వెలుగు కన్పిస్తున్న ఎదురుగదిలోకి పరిగెత్తారు. ఆ గది సగానికి యిసుక వుంది. యిద్దరూ ఎగిరి దుమికారు. అనిల్ శ్రద్ధగా గూడు కట్టాడు. కట్టేంతసేపు తదేకంగా చూసిన సునీత గూడు పూర్తి కాగానే, గూడు మీద ఎగిరి దుంకింది. అనిల్ ఒకసారి దీర్ఘంగా ఆమెని చూసి, ఆమె నవ్వును అందుకొని, మళ్లీ గూడు కట్టి ఆమెవైపు చూశాడు. ఒక నవ్వు విసిరి ఎగిరి దుంకింది. అనిల్ మళ్లీ కట్టాడు. ఈసారి ఆ పిల్ల దుమకలేదు. “ఇద్దరూ కలిసి ఒకేసారి దుంకుదాం” అంది.

అనిల్‌కు చాలా సంబరమైంది. చీకటి గదిలో నిల్చున్నప్పటి అనుభూతి వొళ్లంతా పాకింది. ఇద్దరూ ఒకర్నొకరు పట్టుకొని వొకేసారి ఎగిరి జంటగా గూడును కాళ్లతో తొక్కారు. రెండు జతల కాళ్ల అచ్చులు అద్భుతంగా పడ్డాయి. అనిల్ ఆ అచ్చుల పక్కనే మళ్లీ గూడు కట్టాడు. ఇద్దరూ వొకర్నొకరు పట్టుకొని గూడు మీద ఎగిరి దుమికారు. మళ్లీ రెండు జతల కాళ్ల అచ్చులు… అనిల్ మళ్లీ మళ్లీ గూడు కట్టాడు. మళ్లీ మళ్లీ ఆ పిల్ల స్పర్శతో అనిల్ గుండెల్లో రక్తం పొంగులు పెట్టింది. టీవీ స్క్రీన్ మీది పాట లయలా వూపింది. రంగురంగు సున్నాలు తనతోపాటు గెంతులు వేస్తుంటే అద్భుతంగా అన్పించింది. వాళ్ల కాళ్ల అచ్చులతో ఒక వృత్తం ఏర్పడింది. అనిల్‌కు ఆ వృత్తం చుట్టూ ఇంకో వృత్తం పడితే బాగుంటుందనిపించింది.

అంతలో…

“రేయ్.. మీరిద్దరూ యిక్కడున్నారా?.. వాచ్‌మాన్ అరుస్తున్నాడు  పైనుండొద్దని. కిందికి పోదాం రాండి. ఏయ్ సునీ రావే మీ మమ్మీ పిలుస్తాంది..” ఇంతకు ముందొచ్చిన అక్కే సునీతను లాక్కుపోయింది. అనిల్ తలలో చీకటి చీకటి సున్నాలు తిరుగుతున్నాయి. వుసూరుమంటూ మెట్లు దిగాడు. ఎదురుగా సర్రుమంటూ క్రికెట్ బాల్ దూసుకొచ్చింది.

“రేయ్ అనిలూ ఆ బాల్ అందీరా..” కాస్త దూరంనుంచే ఒక అన్న అరుస్తున్నాడు.

“అన్నా నాకూ కొంచెం బ్యాటింగ్ యివ్వవా…?” అంటూ  ఫీల్దింగ్‌లో కలిసిపోయాడు.

Joram

రాత్రి పడుకున్నారు. అనిల్ కళ్ళేమో మూసుకుపోతున్నాయి. నిద్రను ఆపుకుంటూ వొళ్లంతా చెవులు చేసుకొని ఏవేవో గుసగుసల్నీ, గాజుల చప్పుడునూ వినాలని  ప్రయత్నిస్తున్నాడు. అందుకు భిన్నంగా

“యిల్లు మారదామండీ.. పిల్లలకు సెపరేట్ రూమ్ వుండేలాంటిదానికి” అంటోంది అమ్మ.

“పిల్లలు అంటున్నావు.. యిప్పటికి వాడొక్కడే కదా వున్నది. బహువచనానికేమైనా ఏర్పాట్లు చేద్దామా?”

“మీ రెండర్ధాల మాటలూ మీరూ. అవి వినే వీడు యింతలేడు బజార్లో మాట్లాడుతున్నాడు. నాకు తల కొట్టేసినట్ట్లనిపిస్తోంది” నాన్న గట్టిగా నవ్వుతూ, తర్వాత నవ్వు ఆపుకుంటూ .. యేదో అన్నాడు గుసగుసగా.

“నీకు దండం స్వామి. గమ్మున పడుకో. నాకు బాగాలేదుగానీ..”

నాన్న మళ్లీ యేదో అన్నాడు..

“నీ గబ్బు మాటలు వింటూ, ఆ గబ్బు పాటలు, టీవీల్లో చూస్తూ వీడు యెట్లా తయారైతాడొ నీక్కొంచెం కూడా యేమనిపించదా?” అమ్మ గట్టిగా అడిగింది.

అమ్మ మాటలు అనిల్‌కు నిరాశ కలిగించాయి.

“అయినా కమలా చిన్నపిల్లల గ్రహణశక్తి వాడిగా వుంటుంది. యిట్లా టీవీ వొక్కటే కాదు. వీధిలో, స్కూల్లో, స్నేహబంధాల్లో ఎన్నో తెలుస్తాయి వాళ్లకు. వాళ్ల శరీరమొక ఫాక్టరీ. వాళ్ల మెదడొక కంప్యూటర్. ఏవేవో సంకేతాలతో ఏదేదో ఏర్పడుతూ పోతుంది. ఫలానా దానివల్లే ఫలానా విధంగా అయ్యారని నువ్వు నిర్ధారించలేవు. భారతదేశంలో మనలాంటి యిండ్లు సరే, అమెరికాలో, యూరోప్‌లో పుట్టినప్పటినుంచి వేరేగా వుంచే పిల్లల్లో కూడా పువ్వు విచ్చుకున్నంత రహస్యంగా లైంగిక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అయినా తల్లిదండ్రులుగా మన ప్రయత్నాలు మనం చేయాల్సిందే. యీసారెట్లాగూ సాలరీ పెరుగుతుంది. వేరే బెడ్రూమున్న  యింట్లోకి మారుదాం…”

నాన్న మాటలు ఏమీ అర్ధం కాకున్నా అనిల్‌కు మరింత చేదుగా అన్పించాయి. కళ్లు మూసుకుపోతున్నాయి. ఏవేవో దృశ్యాలు పీడకలల్లా దొర్లిపోతున్నాయి. సునీతను ఎవరో లాక్కుపోతున్నట్లూ. మరి ఎప్పటికీ కన్పించనంత దూరం వెళ్లిపోయినట్లూ, లేదు తలుపులు బిగించిన గూడులో వూపిరాడక కూరుకుపోయినట్లు, ఆ గూడు మీద అమ్మానాన్న ఎగిరి దుముకుతున్నట్లూ. తన కళ్లు కట్టేసి, చేతుల్లో బ్యాట్ పెట్టి “రన్ చేయి, రన్ రన్”అంటూ  వెనుకల పడుతున్నట్లూ..

పొద్దునుకి జొరమొచ్చింది అనిల్‌కు. అమ్మా నాన్న మొఖం మీద తొంగి చూస్తుంటే బరువుగా కళ్లు తెరిచాడు. నుదుటిమీదా, ఎద మీదా చేత్తో స్పర్శిస్తుంది అమ్మ.

“వొల్లు కాలిపోతాంది కదండి. డాక్టర్ దగ్గరకు తీసుకుపోదాం” అంటొంది.

“మాటే వినడు. ఎండకూ, గాలికీ పగలంతా తిరుగుతాడు. యింగ జొరం రమ్మంటే రాదా..” గొణుక్కుంటోంది.

మూడు రోజులకి అనిల్ మామూలు స్థితికి వచ్చాడు. ఆ సాయంత్రానికి జ్వరం తెరిపిచ్చింది. మంచం మీదనుండి లేచి బయటికొచ్చాడు. ఇంటి మందు పక్కింటి ఆంటీ, అమ్మ  మల్లెపూలు దండలు అల్లుకుంటున్నారు.

“డాక్టర్ దగ్గరకు పోయినట్లుంటిరి గదా కమలా ఏమన్నారు…?”

“కన్‌ఫర్మ్ అయినట్లే ఆంటీ..”

“ఏరా అనిలూ నీకు చెల్లెలో, తమ్ముడో రాబోతున్నారు. నువ్వేమో జొరంతో పడుకుంటివీ..” నవ్వుతూ అంది పక్కింటి ఆంటీ..

ఏమీ అర్ధం కాకుంటే అమ్మ వైపు చూసాడు అనిల్.

అమ్మ సిగ్గుతో ఆంటీ వైపు చూస్తోంది.

“నాకెవరూ వద్దు. మా అమ్మనే గావాల…” పరుగున వచ్చి కమలను వాటేసుకొని, “అమ్మా, అమ్మా నీ దగ్గరే పడుకుంటా, నాకు వేరే మంచమొద్దు. మీ మధ్యనే పండుకుంటా..”బేలగా అంటున్నాడు.

“యీ మూడు రోజులు నా దగ్గరే పండుకున్నావ్ గద నాన్నా.. పొట్ట మీద పడొద్దమ్మా..” అనునయంగా అంటొంది కమల.

“యింగేం పండుకుంటావు మీ అమ్మ పక్కన. ఆ కాలం అయిపోయిందిరా అనిలూ..”

పక్కింటి ఆంటీ మాటలు వింటుంటే మళ్లీ జ్వరమొచ్చేట్లుంది అనిల్‌కు. కళ్ళలో నీళ్లు తిరుగుతున్న అనిల్‌ని చూసి “తిక్క నా కొడుకు” అని లాలనగా దగ్గరకు తీసుకుంది కమల..

 

కథ: జి. వెంకట కృష్ణ

కథాచిత్రం: మహీ బెజవాడ