Archives for October 2013

జీవితాన్ని ఒడ్డున కూర్చుని చూడాలా?

‘‘జీవితానికి అర్ధం ఏమిటి? పరమార్ధం ఏమిటి?’’
ఈ ప్రశ్న ప్రతి మనిషి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవక మానదు. ఒక సారి ఈ ప్రశ్న ఎదురయినాక మనిషి మనిషి గా మామూలుగా ఉండడు, ఉండలేడు. తనను తాను శోధించుకోవడం మొదలు పెడతాడు. అప్పటి వరకూ తనకు ఎదురయిన అనుభవాలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా తను పాల్గొన్న సందర్భాలు, తాను నడచివచ్చిన దారులు, తాను విడిచి వెళ్ళిన పాదముద్రలు, తనకు ఎదురయిన వ్యక్తులు, తను చదువుకున్న పుస్తకాలు, తాను నివసించిన భిన్న ప్రపంచాలు, వాటి ప్రభావాలు, ప్రమేయాలు, పరిధులు, పరిమితులు ఆధారంగా తనకు నచ్చిన జవాబు ఏదో వెతుక్కుని సంతృప్తి పడతాడు. అదే జీవితానికి అర్ధమూ, పరమార్ధమూ అని సమాధాన పడిపోతాడు.
కానీ, కొన్ని ప్రశ్నలు ఒకే సమాధానాన్ని ఎల్లకాలమూ అంగీకరించవు. జీవితాంతం ఒకే జవాబును మోస్తూ తిరగవు. స్థలాన్ని అనుసరించీ, కాలాన్ని అనుసరించీ జవాబులు మారుతూ వుంటాయి. ప్రశ్నలకు సార్వ కాలీనత, విశ్వ జనీనత వుంటాయి. కానీ…..జవాబులకి సర్వకాలీన సర్వామోదము వుండదు. అందుకే అవే ప్రశ్నలు మళ్ళీ, మళ్ళీ, పుడుతూ కొత్త కొత్త సమాధానాలు అన్వేషిస్తూ వుంటాయి. అందుకే ఒకసారి జీవితానికి ఇదే అర్ధము, పరమార్ధము అని నిర్ణయించుకుని సమాధానపడినా మరుక్షణంలో ఆ సమాధానం అర్ధరహితం అయ్యే ప్రమాదం వుంది. జీవితం లోతూ, విస్తృతి అర్ధం అవుతున్న కొద్దీ, దాని పట్ల క్షణక్షణం మనం నిర్మించుకొనే నిర్వచనాలు మారిపోతూ జీవితం ఒక ప్రహేళికగా, నిండీనిండని గడులతో విస్మయ పరుస్తూ వుటుంది.

‘‘జీవితానికి అర్ధం ఏమిటి?’’ అని చివరకు మిగిలేది నవలలో దయానిధి తన చిన్నప్పుడు వైకుంఠ మాస్టారుని అంతు లేని అసహనంతో అడుగుతాడు. ఆ ప్రశ్నకు వైకుంఠం మాస్టారు తన జీవిత చరమాంకంలో ఒక సీల్డు కవరు ద్వారా దయానిధికి జవాబు చెపుతాడు. కవరు విప్పి చూసిన దయానిధికి అందులో స్వచ్ఛ సుందర శుభ్రస్ఫటికం లాంటి తెల్ల కాయితం కనిపిస్తుంది. కాయితం తెల్లగా వుంది కనుక, జీవితానికి అర్ధం శూన్యం అనుకుని, జీవితానికి అర్ధమే లేదనుకుని సమాధాన పడతాడు దయానిధి.
నిజానికి చివరకు మిగిలేది నవల మొత్తం ‘‘మనుషులు ఎందుకు ద్వేషిస్తారు?’’ అనే ప్రశ్న చుట్టూ, దయానిధి చేసుకున్న ఆత్మావిష్కరణ. సంఘ ద్వేషానికీ, తల్లి కారణంగా తనలో ఏర్పడిన అపరాధ భావానికీ, ఆకుపచ్చని పాపికొండలని, అపరిమితమయిన అనుకంపతోనూ, దయతోనూ ఆప్యాయంగా చుట్టేసిన ప్రసన్న గోదావరిలాంటి ‘‘అమృతం’’ అవ్యాజమయిన అనురాగానికీ, ఒక తుఫానులాగా, ఒక ఉప్పెనలాగా, ఒక సునామిలాగా ఉధృతంగా, ఉద్వేగంగా కల్లోల పరిచే ‘‘కోమలి’’ ప్రేమకీ నడుమ తూగుటుయ్యాల ఊగిన దయానిధి. జీవితం అనే నాణేనికి రెండు ముఖాలుగా వున్న ప్రేమనీ, ద్వేషాన్ని విస్మరించి జీవితానికి అర్ధమే లేదు అనుకునే భావనలోకి వలస వెళ్ళడం ఆశ్చర్యకరమే అయినా కఠిన కరకు వాస్తవం కూడా !

buchibabu
నది ఒడ్డున కూర్చుని నదిలో గిరికీలు కొడుతున్న చేప పిల్లను చూసినట్లుగా జీవితం ఒడ్డున కూర్చుని జీవితం అనే చేప పిల్ల గిరికీలను గమనించండి. జీవితానికి అర్ధమూ, పరమార్ధమూ అర్ధం అవుతాయి అంటాడు జిడ్డు కృష్ణమూర్తి.
‘‘మనసు ఎప్పుడూ జీవితానికి ప్రయోజనం, పరమార్ధం కోసం వెతుకుతూ వుంటుంది. ఎందుకంటే మనుషులు జీవితాన్ని గాఢంగా పూర్తిగా అనుభవించలేరు కాబట్టి. మీరు జీవితాన్ని అనుభవించే తీరు గాఢమయినది అయితే, మీ లోంచి ఈ ప్రశ్న పూర్తిగా పోతుంది. జీవన ప్రక్రియ సంపూర్ణంగా సంతోషకరమైనది అయితే ఇక జీవితానికి ప్రయోజనం, పరమార్ధం అవసరం లేదు. ఉదాహరణకు మీరు  పనిచేస్తున్నారు అనుకుందాం. మీ ఉద్దేశ్యం డబ్బు సంపాదనో, బాధ్యతా నిర్వహణో అయి వుంటుంది. కానీ ఒక విందుకు వెళితే అక్కడ ఉద్దేశ్య మేమి వుంటుంది? ఏ లక్ష్యమూ వుండదు, కేవలం విందులో పాల్గొంటారు అంతే! జీవితం మీకు ఒక పెద్ద విందులాగా, పెద్ద ఉత్సవంలాగా మారిపోతే దాని పరమార్ధం ఏమిటని మీరు అన్వేషించరు. కేవలం అందులో పాల్గొంటారు అంతే! మీరు అక్కడ ఉండటానికి ఇష్టపడతారు అంతే! ఈ జీవితం ఎలా తయారుచేయబడిరది అంటే దానికి ఒక పరమార్ధమే అవసరం లేదు. దానికి అదే ఒక పరమార్ధం. అదే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. సంపూర్ణ స్ధాయిలో సజీవంగా వుంటే చాలు. ఎక్కడికో చేరుకోవాలన్న పరమార్ధం జీవితానికి అవసరం లేదు. అదే సృష్టి అందం’’.
ఈ మాటలు నావి కావు. దేశానికి చాలా కాలంగా ప్రేమ తత్వాన్ని బోధిస్తూ వస్తున్న సద్గురు జగ్గీ వాసుదేవ్‌ వి.
‘‘ఏ నిర్ణయం తీసుకోకపోవడమే ఒక నిర్ణయం’’ అని దేశానికి రాజకీయ చాణక్యం అందించిన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు లాగా ‘‘ఏ అర్ధము లేకపోవడమే జీవితానికి అసలయిన అర్ధం’’ అని జగ్గీ వాసుదేవ్‌ గందర గోళ పరుస్తున్నట్లుగా అనిపించవచ్చుకానీ, ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు.
‘‘ఒకసారి పరమార్ధం అవసరంలేదని మీరు గ్రహించగలిగితే కేవలం సజీవంగా వుండటమే గొప్పగా అనిపిస్తుంది’’.
ఆధ్యాత్మిక తత్వ వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ చెప్పినదానికీ, బుచ్చిబాబు కల్పిత పాత్ర వైకుంఠం మాస్టారు చెప్పిన దానికీ పెద్ద తేడా ఏమీ లేదు.
ఒక మునిగోరింట పువ్వు అందమయిన స్త్రీ జడలో అందంగా ఇమిడిపోతుందా…..? అంతకంటే అందమయిన దేవుడి పాదాల చెంత వినమ్రంగా వాలి పోతుందా? అన్న దానితో సంబంధం లేకుండా పూచినప్పటినుండి రాలిపోయేదాకా తన సౌరభంతో ఈ సృష్టిని పరిమళ భరితం చేస్తుంది.
ఒక మలయానిలం అల్లనల్లన ప్రయాణిస్తూ జలభారంతో నిండు గర్భిణిలాగా వున్న మేఘాన్ని తాకి గ్రీష్మానల తప్త మేదినికి స్వాంతన చేకూరుస్తుందా? చండ ప్రచండ రaంరaా మారుతమయి అగ్ని రగిలిస్తుందా? అనే దానితో సంబంధం లేకుండా తనను తాను విస్తరించు కుంటూ వెళ్ళిపోతుంది.
ఈ చరాచర సృష్టిలో ఏదీ తన సహజ లక్షణాలను కోల్పోదు. ఒక్క మనిషి తప్ప. మనిషి మనిషిలాగా సంపూర్ణంగా జీవించడమే జీవితానికి అర్ధమూ పరమార్ధమూ….
వంశీ ఏమిటి? ఈ నెల అర్ధమూ, పరమార్ధమూ అనే విచికిత్స నడుమ, సత్‌సంశయముతో కొట్టుకుపోతున్నాడు అనుకుంటున్నారా? అదేమీ లేదు…

Gollapudi-Maruti-Rao-Nagireddy-Memorial-Awards
ఇటీవల సుప్రసిద్ధ రచయిత, నటుడు, ప్రయోక్త, కాలమిస్ట్‌ గొల్లపూడి మారుతీరావు గారి పన్నెండేళ్ళ పాత నవల ‘‘సాయంకాలమయ్యింది’’ ని సరికొత్తగా చదువుతున్నప్పుడు నాలో కలిగిన భావ పరంపర ఇది.
ఈ నవలలో ‘‘బత్తిన రేచకుడు’’ పేరుతో ఒక పాత్రని సృష్టించారు మారుతీరావుగారు. ఆ బత్తిన రేచకుడు ఈ ఉపోద్ఘాత మంతటికీ కారణం.
ఆంధ్రదేశం నుండి అమెరికా వెళ్ళిన తొలి తెలుగు వాడి కథ ఇది. ఇప్పుడు గాఢంగా పెనవేసుకున్న అనుబంధానికి రేఖా మాత్రంగా పరిచయం ఏర్పడిన నాటి తొలి ప్రాక్‌ పశ్చిమ సంఘర్షణ ఈ కధా సారాంశం. ‘‘ఒక సాంప్రదాయక శ్రీ వైష్ణవ కుటుంబం’’ అనే వాక్యంలోని సాంప్రదాయమూ, కుటుంబమూ ఎలా సాయంకాలంవైపు నడచి సహజ మరణం పొందాయో చెప్పడం ఈ నవలలోని విషయం. ఈ నవలలో ప్రధాన కథలో ఎక్కడా సంలీనం కానటువంటి పాత్ర ఒకటి వుంది, అదే బత్తిన రేచకుడు. ఈ నవలలోని 23వ అధ్యాయంలో ఈ పాత్ర వస్తుంది. నవల మొత్తం చదవక పోయినా, కేవలం ఆ 23వ అధ్యాయం మాత్రమే చదివినా అర్ధం అయ్యే పాత్ర ఇది. నిజానికి ఇది కేవలం ఒక రచయిత సృష్టించిన పాత్ర మాత్రమే కాదు. ఇంతకు ముందు చెప్పుకున్న అర్ధము, పరమార్ధము లాంటి తత్వ విషయాలు, ఒక భారతీయ పరిపక్వ మనస్తత్వంలో ఎలా అందంగా అర్ధవంతంగా ఇమిడిపోతాయో దృశ్యమానం చేసిన పాత్ర. భారత సమాజం, మరీ ముఖ్యంగా హిందూ సాంప్రదాయక సమాజ జ్ఞానం నుండి పాశ్చాత్య సమాజం ఏం నేర్చుకోవాలో అన్యాపదేశంగా నయినా బలంగా చెప్పిన పాత్ర డెట్రాయిట్‌ లో పనిచేసే తిరుమల భారతదేశం వచ్చాక, తన మిత్రుడు విష్ణుమూర్తి తల్లితండ్రులను చూడటానికి శ్రీకాకుళం దగ్గర వున్న ‘‘గిర్‌గాం’’ అనే పల్లెకు బయలుదేరుతాడు. విష్ణుమూర్తి తండ్రే మన బత్తిన రేచకుడు.

saayamkaalamaindi
విష్ణుమూర్తి తన తల్లి కోసం కొని యిచ్చిన అత్యాధునిక గ్రైండర్‌, తండ్రి కీళ్ళ నొప్పుల కోసం రబ్బరు కణుపులున్న రెండు జతల చెప్పులు తీసుకుని రేచకుడి దగ్గరకు బయలుదేరుతాడు తిరుమల.
బత్తిన రేచకుడు ఒంటరివాడు, వృధ్ధాప్యంలో వుండి చివరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నవాడు. ఇమాంపసందు మామిడి పండ్లంటే అతడికి మహాయిష్టం, ఒంట్లో షుగరు వున్నా పండు మీద మమకారం చంపుకోలేక పండ్లు విపరీతంగా తిని ఒక కాలుని మోకాలు వరకు పోగొట్టుకున్నాడు.
‘‘అసలు కాలు ఎలా పోయింది?’’ అని తిరుమల అడిగిన ప్రశ్నకి రేచకుడు ఏం చెప్పాడో చూడండి
‘‘మనకి ఒంటినిండా సెక్కెరే బాబు తీపి తినక్కరలేదు. సిన్నప్పటి నుండి నేను ఇమాంపసందు అంటే పీక్కోసుకుంటాను. కనిపించే మేరలో అయిదెకరాల మామిడితోపు నాదే, ఆరు వేల పళ్ళు దింపుతాను. ఎండలు ముదిరి తొలకరి దాకా ఎంత లేదన్నా రెండొందల పళ్ళు తింటాను. నీ యవ్వ……పోతే దొర బిడ్డలాగా పోవాలి. కానీ ఏడుత్తూ బతికితే ఏం లాభం….? మా డాట్టరు పద్మనాభయ్య ‘‘ఒరే రేసు నా కొడకా! తింటే సత్తావురా!’’ అన్నాడు. నేను నవ్వి ‘‘అయితే తినే సత్తాను’’ అన్నాను. రెండ్రోజులు పనికట్టుకు తిన్నాను, పండొదిలితే ఒట్టు’’
‘‘మరి విష్ణుకి తెలియజేయలేదేం?’’
‘‘తెలిత్తే ఆడేటి సేత్తాడయ్యా: అన్నీ తెలిసిన మూర్కుణ్ణి నేను’’ ఇప్పుడు ఒక్క పండు కూడా తినలేను’’
కాలు పోయేదాకా మామిడి పండ్లు తిన్న రేచకుడు, తన మనసుకు పసందైన ఇమాం పసందును ఎందుకు మానాడు…………?
భార్యకు ఇచ్చిన మాటకోసం!
కానీ భార్య ` కొడుకు కోసం బెంగ పెట్టుకునీ, పెట్టుకునీ మంచం పాలయితే వంట చేసి పెట్టాడు. మల మూత్రాలు తీశాడు.
నీళ్ళుపోసి చీర కట్టాడు. చివరకు తల కొరివి కూడా పెట్టాడు. తప్పిస్తే భార్య చనిపోయిందన్న విషయం కొడుకు కి కనీసం చెప్పను కూడా చెప్పలేదు. ఎందుకని…….?
‘‘ఇక్కడ జరిగేదేదీ ఆడిని బాధ పెట్టకూడదు. ఆడి సుకాన్ని పాడు చెయ్యకూడదు. అందుకే ఆళ్లమ్మ బతికున్నట్టు దొంగ ఉత్తరాలని పూర్ణయ్య పంతులు రాస్తాడు. సంవత్సరం పొడవునా ఆరికి పది బస్తాల ధాన్యం, అపరాలు, మామిడీ అన్నీ నేను పంపుతాను’’ ఇదీ రేచకుడి సమాధానం.
వృధ్ధాప్యంలో చూడవలసిన కొడుకు ఎక్కడో దూరాన అమెరికాలో వున్నాడు. భార్యలేదు, ఒంటరివాడు పైగా వికలాంగుడు
‘‘మీ సంగతి ఎవరు చూస్తారు?’’ అని అడిగితే………..
‘‘మన సంగతి మరోడు చూసేదేంటయ్యా! రోడ్డు మీద కుక్కపిల్ల సంగతి ఎవరుసూత్తున్నారు, సెరువులో సేపపిల్ల సంగతులెవరు సూత్తారు? నీకు ఓపిక వుందా…….. వండుకు తిను. లేదా నాలుగుపళ్ళు తిను, ఇంకా సేత కాదా సచ్చిపో……..’’
రేచకుడి లో ఎక్కడా పశ్చాత్తాపం లేదు. వేదనలేదు. ప్రతి కష్టాన్ని తృప్తిగా మల్చుకునే అద్భుతమైన సంకల్ప బలం ఏదో వుంది.
‘‘తల్లి చావునే కొడుకు నుంచి దాచి మోసం చేస్తున్న మీరు మీ ఆవిడకు ఇచ్చిన మాట తప్ప లేరా…..? అంటే రేచకుడు………..
‘‘కొడుకుని మోసం చేసేది ఆడిని బాధ పెట్టే హక్కు నాకు లేదని, నా పెళ్ళాన్ని మోసం సెయ్యనిదీ దాన్ని సుఖపెట్టే అవకాశం ఇంక రాదని’’ అంటాడు.
మనిషి స్థితప్రజ్ఞుడు కావడానికి చదువుసంధ్యలతో సంబంధం లేని సంస్కార మేదో కావాలి. దాన్ని రేచకుడు సాధించాడు.
‘‘మీ అబ్బాయికి ఏమయినా  చెప్పమంటారా!’’ అని తిరుమల అడిగితే …..
ఒంటి కాలితో గెతుతూ వచ్చి ‘‘నువ్వు యిక్కడ విన్నది, సూసిందీ ఏమీ చెప్పకు. తల్లికుక్క పిల్లపుట్టగానే దాన్ని తినేత్తాది కారణం తెలుసా? తన ప్రేమ  నుండి ఆ పిల్ల దూరమయి పోతుందేమో అన్న భయం సేత. నా భయానికి ఆడి పీక కొరికీ కొరకకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడుతున్నాను. రెక్కలొచ్చాక పిల్లగూడులోంచి ఎగిరిపోకపోతే తప్పు తల్లిదే కానీ పిల్లది కాదయ్యా! పెపంచకాన్ని అలవాటుచేసి గూడులోంచి తోసెయ్యాల నేనా పనే సేత్తున్నాను’’
రేచకుడు ఒక్క కాలికే వంగి నమస్కారం చేస్తాడు తిరుమల. ఈ పాత్రని తరచి చూస్తే…ఎన్నో విషయాలు బయటపడతాయి!

‘‘పిల్లలు మనలోంచే వస్తారు కానీ, మన ఆశలకీ, ఆశయాలకు వాళ్ళు వారసులు కారు. వాళ్ళదొక ప్రత్యేకమయిన లోకం’’ అనే ఖలీల్‌ జిబ్రాన్‌ గుర్తుకు రాడా……….?
‘‘జీవితాన్ని ఒడ్డున కూర్చుని చూడాలి’’ అన్న కృష్ణమూర్తి గుర్తుకురాడా..? ‘‘జీవితాన్ని తెల్లకాయితంతో పోల్చి చూపి ప్రేమలేఖో, మరణశాసనమో ఏదో అద్భుతంగా నువ్వే రాసుకో’’ అన్న వైకుంఠం మాస్టారి తత్వబోధ యిదే కదా…..!
‘‘మనసు ప్రతిదాన్నీ భాగాలుగానే గ్రహించగలదు. ఈ చిన్ని చిన్ని ముక్కలుని మీరు కలిపితే అది మొత్తంగా మారదు. మీ వద్ద కేవలం ముక్కలు మాత్రమే వుంటాయి. మీరు ఎంత ఎక్కువగా సేకరిస్తే మీరు అన్ని ముక్కలుగా తయారవుతారు. మీరు ఎన్ని ముక్కలు సేకరించినా అవి ఎప్పటికీ మొత్తంగా మారవు. శివుడికి ముక్కంటి అని పేరు. మూడోకన్ను తెరుచుకోవడం అంటే భౌతిక మయిన కళ్ళకి అతీతమయిన జ్ఞానచక్షువు తెరచుకుని, ఇంద్రియాతీతమైన సంపూర్ణత్వాన్నీ, మొత్తాన్నీ చూడగలగడం. జీవితాన్ని పూర్తి లోతుతో, పూర్తి ప్రమాణంతో అర్ధం చేసుకోవడమే…..అదే జీవిత పరమార్ధం’’ అంటున్నాడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌.
రేచకుడు మూడో కన్ను తెరిచాడు కదూ……!
ఆ జ్ఞాన చక్షువే ఈ జీవితానికి అర్ధమూ…….పరమార్ధమూ……!’

-వంశీకృష్ణ

మిత్రమా! అమెరికాలోనూ నీ కంఠస్వరమే. ..

rajayya-150x150

మిత్రమా!

ఇంకా వెలుగురెకలు విచ్చుకోలేదు. ఆకాశం నిండా కుదురుకున్న మేఘాలు.. అందరు తమతమ బతుకుల్లో ఒదగలేక, బయటకు రాలేక అంతర్ముఖులౌతున్న సందర్భంలో మనుషుల లోలోపల ముట్టుకుందామనే సుదీర్ఘ ప్రయాస,  నడకకు ఒక చిన్న అధారం దొరికినందుకు యమ ఉద్విగ్నంగా ఉన్నది.

ఈ తెల్లవారుఝామున మనం కలిసి తిరిగిన నేలమీద నీ పాత ముద్రలకోసం వెతికాను. చెట్లకొమ్మలమీద మన ఆత్మీయ స్పర్శ గురించి ఆకుల మీద మనం రాసుకున్న మానిఫెస్టోల గురించి వెతికి వెతికి చూశాను. లోలోఫలి ఉద్విగ్నతలాగా – ఆకులు దాచుకున్న బాకుల్లాగా చెట్లు దాచిన సుకుమరమైన గాలి స్వరలయల విన్యాసంలాగా – మనం ప్రేమించి ఆడిపాడిన బృందాగానాలు  నా చెవులనిండా హోరెత్తిపోయాయి. ఇదే నేలమీదినుంచి ఇదిగో ఈ మారుమూల చిన్న మోరి దగ్గరినుండి – అదిగో ఆ కనిపించే తెల్లని చెరువు సాక్షిగా – అందులోని చేపపిల్లల సాక్షిగా నువ్వు నడిచిపోయావు. బహుశా ఆ రోజు నాకింకా తడితడిగా గుర్తున్నది. అప్పుడు నా కళ్లల్లో ఊరిన నీళ్లు ఇంకా కళ్లల్లోనే నిలిచిపోయాయి. నేనెందుకు ఇక్కడ నిలబడిపోయానో నాకిప్పటికీ అర్ధం కాదు..

నువ్వట్లా నడుస్తూ  పోతుండగానే – నడిచిన నేలంతా ఎర్రటి పాదముద్రలు. మనిద్దరికి మాత్రమే తెలిసిన పాట నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నది. కాలం, నీరు. – నువ్వు ఒక్క దగ్గర నిలువవు కదా! కొన్నివేల కిలోమీటర్ల దూరంలో కొన్ని వేలమంది సమూహంలోంచి మీ పిలుపు గుండె చప్పుడు వినిపిస్తూనే ఉంది. ఎన్నో చెప్పాలనుకుంటాను. ఎన్నో కలలు కంటాను. కాని రాయాలంటే ఏ వొక్క మాట పలుకదు..

02-03-12WhiteHouse

నేను అమెరికానుంచి వచ్చి అప్పుడే వారం రోజులు దాటిపోయింది. ఈవారం రోజులుగా మనిషి కనిపించిన చోటల్లా నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. విచిత్రంగా గడ్డకట్టిన అమెరికాలో – చీమ కూడా చొరబడకుండా కట్టుదిట్టం చేసుకున్న అమెరికాలో – ఒబామా ఇంటిముందు ఎవరో కంఠంలో విచిత్రమైన మానవస్వరంతో ‘గాటెమాలా’ దీనగాధలు చెప్పుతున్నారు. విచిత్రంగా ఉలిక్కిపడి చూశాను. అది నీ కంఠస్వరమే. .. రకరకాలుగా కనిపించని జైల్లు. తాళ్లు, మాయోపాయాలు చేసి మనుషులను ఒక మందగా, వస్తువుగా మార్చిన చోట గుంపులుగా తిరిగే మనుషుల్లో ఒంటరి కళ్లల్లోకి తొంగి తొంగి చూశాను. మెక్సికన్లు, ఆఫ్రికన్లు, నల్ల జాతీయులు, యూరోపియన్లు, జర్మన్లు, రష్యన్లు, చైనావాళ్లు, జపానువాళ్లు, పాకిస్తాన్, ఇరాక్, ఇరాన్ – ఎన్నిరకాల మనుషులో. మార్కెట్టు కొంతమందిని ఆవహించి వాళ్లను సమూలంగా తొలిచేసి వాళ్లు కుళ్లిపోయి, మొత్తం ప్రపంచాన్ని కుళ్లగొట్టే ప్రయత్నంలో, కుళ్ళిపోవడానికి సిద్ధంగా లేని మనుషులు, వాళ్ల పెనుగులాట బహుశా మళ్లీ నాకిక్కడే కనిపించింది. వినిపించింది. అయినా అంతటా ఒక అబద్ధపు మార్మిక యుద్ధం ప్రపంచమంతటా.. ఒక్క మాట నిజం కాదు.

ఎక్కడా నిలువలేక రైల్లో ఖమ్మం దాకా పోయి వచ్చాను కొన్ని వేలసార్లు రైల్లో నీ జ్ఞాపకాలతో.

కాజీపేట  స్టేషన్ రాగానే నా గుండె కొట్టుకున్నది. ఆ స్టేషన్లో మనం ఎన్నిసార్లు కలుసుకున్నామో? ఎన్ని మాటలు చెప్పుకున్నామో? నాకైతే ప్రతిమాట పోటెత్తింది.. అటుయిటు పచ్చని పంటపొలాల మీదుగా సెంట్రీ చేసే తాడిచెట్లు.. కరిగిపోతున్న రాళ్లగుట్టలు.. నా పక్కన చాలా సంవత్సరాల తరువాత మా తమ్ముడు వీరన్న.

చెప్పాల్సిన విషయాల్లాగే.. దారితెన్నూలేని చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ అన్నిరకాల ప్రజలు తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నారు. లెక్కకుమించి ఆస్తులు కలిగినవాళ్లు – అధికారం – సంపదను అపారంగా చిక్కించుకున్నవాళ్లు , రవ్వంత శాంతిలేక రాత్రి పగలు దేవులాడుతున్నారు. వాళ్లకు ఏ పని చేతకాదుకనుక వాళ్ల అరుపులకోసం జనాన్ని వీధుల్లోకి ఉసిగొల్పారు. రంగస్థలం ఖాళీ కావడంతోటి, నువ్వు లేవు కనుక విధ్వంసమైన పొలాల్లో, కార్ఖానాలల్లో ఉండలేక ప్రజలు వాళ్ల కారణాల చేత వాళ్లు వీధుల్లోకి వచ్చారు. ఏ లక్షణం లేని కూతగాళ్లు, రాతగాళ్లు, నటులు ఇరవై నాలుగు గంటలు బతుకుకు సంబంధంలేని గాలి కబుర్లు ఊదరగొడుతున్నారు. అదే అపురూపమైన పని అనుకుంటున్నారు.

అట్లాంటి మనుషులందరికి, మనందరికి చెవుల ఊదిన ఆదిమానవుడి మాట చెప్పాలి కదా! బహుశా అది సప్తసముద్రాల్ని, మానవరహిత యుద్ధ విమానాల్ని దాటుకొని మనుషులకు చేరుతుందేమో? అదివాసులు మనుషుల మాటను మంత్రంగా భావిస్తారు.   లోలోపలి నుండి వచ్చిన మాట అది. ఇదిగో నేను చూస్తుండగానే గోదావరి తీరం వెంబడి విస్తరించిన బస్తర్ కొండలమీదగా ఉదయించిన లేలేత సూర్యకిరణంలాంటి మాట. మనిద్దరం గొంతుకు కూర్చున్న ఆ పురాతన గోండు ముసలివాన్ని, గోండు మంత్రం గురించి అడిగితే నీ చెవుల, నా చెవుల చెప్పిన మంత్రం గుర్తుందా? “ఆకుబాకవుతుంది…”

ప్రపంచవ్యాపితంగా మృత్యువులా వ్యాపించిన గంధకం పొగల మధ్యలోంచి మనుషులు కల్సుకుంటారు. ఒంటరితనాల్లోంచి, ఎందుకు పనికిరాని వస్తువుల్లోంచి మనుషులు తమను తాము విముక్తం చేసుకుంటారు.

ఆ చారిత్రక సంధికాలంలోమనం ఆ విజయోత్సవానికి వేదిక సిద్ధం చేస్తున్నాం కదూ!

చెప్పరానంత ఆనందంగా ఉంది. ముట్టుకుంటే జలజల కురిసే మేఘంలా తడితడిగా ఉంది. నీకూ అట్లాగే ఉంటుందని నాకు తెలుసు. నా గురించి.. కోట్లాది నాలాంటి ప్రజల గురించి నువ్వు ఒకే ఒక్క మాట చెప్పినావని. కంకవనం మీదుగా వీచిన గాలి కంఠస్వరం ద్వారా నాకు అందింది. అందుకే ఈ సంతోషం.

మా వంగూరి హౌస్ – మా మామిడి చెట్టూ…

 

chitten rajuమా తాత గారు తన స్వార్జితంతో మొదటి ఆస్తిగా ఫిబ్రవరి  2, 1921 లో కాకినాడలో అప్పడు రామారావు పేట అని పిలవబడే ప్రాంతంలో (పిఠాపురం రాజా వారి పేరిట) ఒక్కొక్కటీ 1800  గజాలు ఉండే పక్క పక్కనే ఉండే రెండు ఇళ్ళ స్థలాలు – వెరసి 3600  గజాల స్థలం కొన్నారు. అప్పటి నుంచి, ఇప్పటి దాకా ఆ స్థలం మా అధీనంలోనే ఉంది. కాకినాడ మొత్తం మీద సుమారు తొంభై సంవత్సరాలకి పైగా ఒకే కుటుంబం అధీనంలో ఉన్న అతి కొద్ది గృహాలలో మాది ఒకటి అని నేను అప్పుడప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను.

మా తాత గారు ఆ స్థలం కొన్నాక అక్కడ ఒక పెద్ద మేడ కట్టుకోడానికి ప్రణాళిక వేసుకుంటూ ఉండగా  1923 లో 38 వ కాంగ్రెస్ మహా సభలు జరిగాయి. ఆ మహా సభల ఆహ్వాన సంఘం కార్యదర్శి, స్వాతంత్ర్య సమార యోధుడు, మా తాత గారి తోటి లాయర్ అయిన మహర్షి బులుసు సాంబ మూర్తి (పొట్టి శ్రీ రాములు గారు మద్రాసు లో ఆయన ఇంట్లోనే నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు.—పాపం.) గారి అభ్యర్ధన మీద మా ఇంటి స్థలం అంతా పెద్ద పందిళ్ళు వేసి ఆ కాంగ్రెస్ సభలకి భోజన శాలగా మార్చారు. అక్కడికి వంద గజాల దూరం లోనే ప్రధాన వేదిక. ఆ వేదిక మీద నుంచి మహాత్మా గాంధీ గారు డిశంబర్ 24, 1923 నాడు ప్రసంగించారు.  . ఆ మహా సభల తరవాత ఆ పేట  పేరు గాంధీ నగరం గా మార్చారు. ఇప్పటికీ అది గాంధీ నగరమే! ఆ కాంగ్రెస్ సభలలోనే  జవాహర్లాల్ నెహ్రూ అనే 35 సంవత్సరాల యువకుడు మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గా ఎన్నిక అయ్యాడు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన మహమ్మద్ ఆలీ పేరే ఇప్పటికీ మా రోడ్డు పేరు. మా రోడ్డు పేరు “వంగూరి వారి వీధి” అని మారుస్తామని మ్యునిసిపాలిటీ వారు కొన్ని సార్లు అడిగినా ఒక అలనాటి ముస్లిం నాయకుడి పేరు తీసేసి మా పేరు పెట్టడం సమంజసం అనిపించక మేమే వద్దన్నాం.  అతిశయోక్తి అయినా ఇప్పటి మా ఇంటి ప్రాంగణం అప్పటి భోజన ప్రాంగణం కాబట్టి గాంధీ గారు, నెహ్రూ గారు మా “ఇంటి” కి భోజనానికి వచ్చారు అని నేను చెప్పుకోవడం నాకు సరదా.

ఇక్కడ నేను విన్న ఒక చిన్న పిట్ట కథ ఏమిటంటే ఆ ప్రధాన ప్రాంగణం లోపలికి వెళ్ళడానికి సరి అయిన బేడ్జ్ పెట్టుకోవాలి. నెహ్రూ గారు అది మర్చి పోయి హడావుడి గా లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు 13 ఏళ్ల వాలంటీర్ గా ఉన్న దుర్గాబాయమ్మ గారు ఆయన్ని అడ్డగించి ఆయన ఎంత చెప్పినా, ఆఖరికి సాంబ మూర్తి గారు స్వయంగా వచ్చి చెప్పేదాకా లోపలికికి వెళ్ళనియ్యకుండా అడ్డుకున్నారట.  ఆ విధంగా వారిద్దరికీ పరిచయం అయి జీవిత కాలం నిలిచింది.

నెహ్రూ గారి మంత్రివర్గంలో దుర్గాబాయమ్మ గారి భర్త దేశ్ ముఖ్ గారు ఆర్ధిక మంత్రిగా పని చేశారు. వారు జీవించినంత కాలం మా బావ గారు నండూరి వెంకట సూర్య నారాయణ మూర్తి గారు (హై కోర్ట్ సీనియర్ అడ్వోకేట్)  ఎంతో ఆత్మీయులుగా ఉండి,  లీగల్ సలహా దారుగా వ్యవహరించే వారు. అన్నట్టు, మా అక్కా, బావ గారూ ఉండేది హైదరాబాద్ లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ కాలనీ లోనే!

నేను పుట్టిన ఇల్లూ- మమ్మల్ని చూసుకున్న సూన్నారాయణా

నేను పుట్టిన ఇల్లూ- మమ్మల్ని చూసుకున్న సూన్నారాయణా

 

ఆ కాంగ్రెస్ మహా సభల హడావుడి అంతా అయ్యాక మా తాత గారు మేడ కట్టడం ఆలస్యం అవుతోంది అనుకుని 1925 లో స్థలానికి ఆగ్నేయం మూల ఐదు గదులతో తాత్కాలింగా ఒక ఔట్ హౌస్ కట్టి, గృహ ప్రవేశం చేసారు. అది ఏ ముహూర్తాన చేసారో కానీ ఆ ఇల్లే మూడు తరాలకీ సొంత ఇల్లు అయిపోయింది.  అంత పెద్ద స్థలంలో పెద్ద మేడ కట్టుకుందామనుకున్న మా తాత గారి ఆశ నెరవేర లేదు. ఆయన పోయిన ఏడాది తరువాత 1952 లో మా పెద్దన్నయ్య ఆ మేడ నమూనా ని అగ్గిపెట్టెలతో తయారు చేసి ప్రతీ బొమ్మల కొలువు లోనూ పెట్టేవాడు. ఆ మేడ నమూనా ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను.  నాకు పదిహేనేళ్ళు వచ్చే దాకా కూడా పకడ్బందీగా కొండ రాళ్లతో వేసిన  ఆ మేడ పునాదులు స్థలం మధ్యలో ఉండేవి. మా నాన్న గారు కూడా ఆ మేడ ఇక కట్టలేం అని నిర్ణయించుకుని ఆ పునాదులు తీసేయించి ,  మొత్తం 3600 గజాల స్థలాన్నీ పూల మొక్కలతో, చెట్లతో నందన వనంగా మార్చారు.

1925  లో మా తాత గారూ, బామ్మ గారూ గృహ ప్రవేశం చేసిన కొన్ని రోజులలో ఒక విచిత్రం జరిగింది. ఒక మండు వేసవి నాటి మధ్యాహ్నం ఒక ముసలాయన లోపలి వచ్చి “అమ్మా, దాహంగా ఉంది. కాస్త మంచి నీళ్ళు ఇప్పించండి” అని అడిగాడు. మా బామ్మ గారు ఆయన్ని చూడగానే “అయ్యో పాపం ఈయన భోజం కూడా చెయ్య లేదేమో” అని అడిగి అరిటాకు వేసి కడుపు నిండా భోజనం పెట్టారు. ఆయన సంతృప్తిగా భోజనం చేసి, కాస్సేపు విశ్రమించి లేచి వెళ్తూ తన చేతి సంచీ లోంచి ఒక్కటంటే ఒక్క మామిడి పండు తీసి “అమ్మా, ఈ పండు తిని, ఆ టెంక ఎక్కడైనా పాతండి. అది చెట్టుగా ఎదిగి, దాని పళ్ళు మీ మనవలు, ముని మనవలూ కూడా తింటారు” అని మనసారా ఆశీర్వదించి, ఆ మామిడ పండు ఆవిడ చేతిలో పెట్టి మాయమై పోయారు. అంటే మళ్ళీ ఎప్పుడూ కనపడ లేదు.

మా తాత గారు, బామ్మ గార్లలో ఆ పండు ఎవరు తిన్నారో లేక అప్పటికి చిన్న పిల్లలయిన మా నాన్న గారు, ముగ్గురు మేనత్తలలో ఎవరు ఆ పండు ముక్కలు ఉప్పు, కారం వేసుకుని తినేసి ఆ టెంక ఇంటి ముందు విసిరేసారో తెలియదు కానీ….అ బంగిన పల్లి మామిడి టెంక వేళ్ళూనుకుని, చెట్టుగా ఎదిగి ఇప్పటికీ గత 88 సంవత్సరాలగా అద్భుతమైన పళ్ళు కాస్తూ, వంద మంది పైగా ఉన్న మా బృహత్ కుటుంబం అస్తిత్వానికి నీడ పడుతూ వయోభారంతో కుంగినా గంభీరంగా, దర్జాగా, నిరంతరం కూసే మూడు తరాల కోయిల వంశానికి పట్టుగొమ్మగా నిలుస్తూ, ఇది వ్రాస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

ఆ మామిడి చెట్టు కిందే నా ఇరవై ఏళ్ల చిన్న తనం అంతా గడిచింది. నాదే ఏమిటి, మా అన్నదమ్ములు, అప్ప చెల్లెళ్ళు, మా ఇంట్లో ఉండి చదువుకున్న నాలుగు తరాల బంధువులు అందరికీ ఆ మామిడి చెట్టే ఆయువు పట్టు. కేరమ్స్, చెస్,  పేకాట ఏ ఆట, ఆడుకున్నా ఆ చెట్టు నీడనే. రాత్రి టీ తాగుతూ గుడి దీపాల వెలుగులో పరీక్షలకి చదువుకున్నా ఆ చెట్టు కిందే! అది చిన్న చిన్న పిందెలు వేసి ఆ మాత్రం బరువుకే కిందకి వాలగానే కుర్చీ పీట వేసుకుని పెన్నుతో ఆ పిందెల మీద మా పేర్లు రాసేసుకుని , అవి పెద్దయ్యే దాకా రోజూ, కొలుచుకుంటూ అంటే ఆరాధించడమే కాదు, ఎవరి పిందె ఎంత పెరిగిందీ అని సైజు కూడా కొలుచుకుంటూ, మొత్తం వేసవి శలవులకి మరే వ్యాపకాలు పెట్టుకోకుండా ఉన్నా అదంతా  ఆ చెట్టు మహిమే! ఆ చెట్టు కొమ్మలోంచి తెల్లవారు ఘాము నుంచీ మధ్యాహ్నం దాకా ఎడతెరిపి లేకుండా వినపడే కోకిలారావానికి మేము తిరిగి “కోయ్, కుహూ” అని అరవ గానే ఆ కోకిల రెచ్చి పోయి యింకా గట్టిగా సమాధానంగా చెప్పడం, “ఏమిట్రా ఈ వెధవ కాకి గోల”  అని మా పెద్ద వాళ్ళు కోప్పడడం ఎంత హాయిగా ఉండేదో! ఆ చెట్టు కిందే నా మొట్ట మొదటి ఇంగ్లీషు నవల (పెర్రీ మేసన్) చదివాను. చేతికందిన ప్రతీ వార, దిన పత్రికలూ పెద్ద వాళ్ళు కోప్పడుతున్నా డిటెక్టివ్  నవలలూ అక్కడే చదివాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను సాహిత్యంలో సేద తీరింది ఆమామిడి చెట్టు నీడ లోనే!

మా తాత గారూ, మా నాన్న గారూ కట్టుకుమ్దామనుకునా మేడ నమునా

మా తాత గారూ, మా నాన్న గారూ కట్టుకుమ్దామనుకునా మేడ నమునా

సుమారు ముఫై ఏళ్ల క్రితం కాకినాడ లో వచ్చిన పెను తుఫానులో మా మామిడి చెట్టు మా ఇంటి మీద పడి కూల్చి పారెయ్యకుండా, నిట్ట నులువుగా గంభీరంగా ఉండేదల్లా, సొగసుగా మరొక పక్కకి వాలి మా మీద యింకా ఎంతో దయ, ప్రేమ కురిపిస్తూనే ఉంది. రెండు, మూడేళ్ళ కొకసారి కాయలు కాస్తూనే ఉంది. నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా ఆ మూడో తరం కోకిలారావం రోజుకి ఐదారు గంటలు వింటూనే ఉంటాను. నన్నూ, నా చాదస్తాన్నీ చూసి మా వాళ్ళు అందరూ చాటుగా నవ్వుకుంటూ ఉంటూనే ఉంటారు. అందుకే అంటారు ఎవరి పిచ్చి వారికి ఆనందం అని.

మా చిన్నన్నయ్యకి పెళ్ళయి ఐదుగురు పిల్లలు పుట్టాక, ఇల్లు చాలక అప్పటికి వేరే ఇల్లు కట్టుకున్నాడు. దానికి అమెరికా లో ఉన్న మా తమ్ముడూ, నేనూ ప్రత్యక్షంగానూ, పరోక్షం గానూ చేసిన సహాయం గురించి తెలిసిన మిత్రులు, కాకినాడ బార్ రూమ్ (కోర్ట్ ప్రాంగణంలో లాయర్ల విశ్రాంతి గది) సహాధ్యాయులు దాన్ని డాలర్ హౌస్ అని వేళాకోళం చేసే వారు. ఆ తరవాత నా పై వాడు సుబ్బన్నయ్య మణిపాల్ లో ఎం.. బీ. బీ. యస్ తరువాత  ప్రతిష్టాత్మకమైన పాండిచ్చేరి జిప్మెర్ లో మాస్టర్ ఆఫ్ సర్జరీ చేసి కాకినాడ రంగరాయ  మెడికల్ కాలేజీ లో ప్రొఫెసర్ గా చేరి, ఇంటి తో బాటు అతని భార్య (మా వదిన ) డా. శేషమాంబ గారి కోసం గైనకాలజీ క్లినిక్ కూడా కట్టుకున్నాడు. సుమారు పదేళ్ళ క్రితం 80 ఏళ్ల ‘వయస్సు” వచ్చి మా పెద్దన్నయ్య ఉంటున్న మా ఇంటికి చిన్నా, పెద్దా రిపేర్లు రావడం మొదలుపెట్టాయి. అప్పుడు మా తమ్ముడు  (వాడు యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, బెర్క్ లీ లో మాస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ చెయ్యడానికి 1970 లో అమెరికా వచ్చాడు) వాడి వాటా స్థలంలో మేడ కట్టుకున్నాడు.

ఆ తరువాత బాగా పాత పడిపోయి అవసాన దశలో ఉన్న మా ఇంటిని మనసు దిటవు చేసుకుని, నిర్దాక్షిణ్యంగా నేల కూల్చి చదును చేసేశాం. మా ఇల్లు పడగొట్టి ‘స్మశానానికి’ తరలించడానికి వారం ముందు తీసిన ఫోటో ఇందుతో జత పరుస్తున్నాను. ఆ ముందు నుల్చుని ఆ ఇంటికి ‘ఆఖరి చూపులు’ చూడడానికి వచ్చిన వాడు తన పదో ఏట మా ఇంట్లో పని వాడి గా ప్రవేశించి, అరవై ఏళ్ళకి పైగా మాతోనే ఉండి, మమ్మల్ని ఎత్తుకుని మోసిన ‘సూన్నారాయణ’.  వాడి ఎడం పక్కన ఉన్న రెండు కిటికీల గది  మా ఇంట్లో శాశ్వతంగా ఉన్న “పురిటి గది”. ఆ గదిలోనే నేను పుట్టాను. మొక్కై వంగక పోయినా, తుఫాను ధాటికి మానై వంగిపోయిన మా మామిడి చెట్టు ఇంకా ఇంటి ముందు గంభీరంగానే ఉంది.  అదృష్టమో, దురదృష్టమో చెప్ప లేను కానీ నేను ఆ ఇంటి ఆఖరి చూపులకి నోచు కోలేదు. ఆ మాట కొస్తే 1983 లో మా నాన్న గారు పోయినప్పుడు కానీ, 1999 లో మా అమ్మ పోయినప్పుడూ నేను వారి ఆఖరి చూపులకి నోచుకో లేదు. అది నాకు “అమెరికా వలస” ప్రసాదించిన విమోచన లేని శాపం.

మా ఇంటి సంగతులు ఇంకా చాలా ఉన్నాయి…

స్వర్గాల చీకటి మీద..

నందకిషోర్

నందకిషోర్

1
ఎవరిదైతేనేం?

జాగ్రత్తలేని ఊహల్లోంచి
జారిపడ్డ రాత్రికి గుర్తు.

నీలాగా,నాలాగ
ఒక పసిప్రాణం.

చూస్తూ చూస్తూ
ఎలా చంపమంటావ్?

2

తెలిసిందా?

రాత్రులు నువుమోసిన
స్వర్గాలన్నీ

భారంగా తేలిపోయే
నల్లమబ్బులు.

నిజమైన స్వర్గం ఒకటి
ఖచ్చితంగా వేరే ఉంది.

3

ఏడుస్తావెందుకు?

ముడుచుకున్న పసివేళ్ళన్ని
మృదువుగా కదిలినందుకో

తెరుచుకోనీ కళ్ళవెలుగులో
శూన్యరాశి పరిచినందుకో

4

సున్నితమైన ఓదార్పు మాటతో
ఎముకలు చిట్లేటి
శబ్ధాలు వింటూ

మరలిరాని ప్రాణాల ధ్యాసలో
దీనంగా భారంగా
పాపాన్ని కంటూ

picasso

5

రా!ఇలా!
శుభ్రంగా
చేతులు మనస్సు కడుక్కో.

స్వర్గాల జలపాతాల్లో
నీటి తుంపరలు పిల్లలు

స్వర్గాల చీకటిమీద
నిప్పు తునకలై మెరిసిపోతారు.

6

పిల్లలకేదీ అంటదు!

ఆకాశాలమీద
ఆడుకుంటారు.

ఆకాశమై
వాళ్ళు బతికిపోతారు.

నువ్వే రక్తమని
తెలిసినా లేకున్నా

7

పిల్లలు దోసిళ్ళతో
నక్షత్రాలు చల్లుతారు.

నూరేళ్ళు బతకమంటూ
నిండుగా దీవిస్తారు.

( The greatest destroyer of peace is abortion because if a mother can kill her own child, what is left for me to kill you and you to kill me? There is nothing between. – Mother Theresa)

– నంద కిషోర్

చీకట్లోంచి రాత్రిలోకి…

శ్రీధర్ బాబు

శ్రీధర్ బాబు

ఎంతసేపని

ఇలా

పడిపోతూనే ఉండడం?

పాదాలు తెగిపడి

పరవశంగా

ఎంతసేపని ఇలా

జలపాత శకలంలా

లేనితనంలోకి

దిగబడిపోతూనే ఉండడం?

రాలిన

కనుగుడ్ల నడుమ

కాలిన దృశ్యంలా

ఎంతసేపని

ఇలా నుసిలా

రాలిపోతూ ఉండడం?

గాలి

ఎదురుతన్నుతున్న

స్పర్శ లేదు-

జాలి

నిమిరి నములుతున్న

జాడ లేదు-

ఎవరో.. పైనుంచి

దిగాలుగా చూస్తున్నారన్న

మిగులు లేదు-

లోలోతుల్లో ఎవరో

చేతులు చాచి

నిల్చున్నారన్న

మిణుగురులూ లేవు-

ఎంతసేపని

ఇలా

అడ్డంగా

తలకిందులుగా

చీకట్లోంచి రాత్రిలోకి?

రాత్రిలోంచి చీకట్లోకి?

పొగల

వెలుగు సెగలకు

ఒరుసుకుపోతూ

తరుక్కుపోతూ

ఎంతసేపిలా

లోతుల్లోంచి లోతుల్లోకి..?

Pablo_Picasso_PIP025

వేళాపాళా లేని

ఖాళీలోకి

ఎండుటాకుల గరగరలతో

కూలే చెట్టులా

ఇలా

ఎందుకని

బోర్లపడ్డ ఆకాశంలోకి?

జ్ఞాపకమూ

దుఖ్కమూ

ఆనందమూ

నేనూ

ఎవరికెవరం కానివారమై

రేణువుల్లా చెదిరిపోతూ

పట్టుజారుతున్న

చీకటి వూడల నడుమ

నిద్ర స్రవించిన మెలకువలతో

గాట్ల మీద కట్లు కట్టుకుని

ఇలా ఎంతసేపని

కలల్లోకి

కల్లల్లోకి

కల్లోలంలోకి?

(12 గంటలు, 11 సెప్టెంబర్, 2013)

-పసునూరు శ్రీధర్ బాబు