Archives for January 2017

విమర్శలను సహించలేని రచయితలు : పద్మవల్లి

నేను సాధారణంగా కథలు సారంగ, వాకిలి, ఈమాట, కౌముది, ఈనాడు ఆన్లైన్ పత్రికలలోనూ, కొన్ని బ్లాగుల్లో వచ్చినవీ  చదువుతాను. అప్పుడప్పుడూ ఎవరైనా షేర్ చేసినపుడు నవ్య, ఆంధ్రజ్యోతి, సాక్షి మొదలైన ఆన్లైన్ పత్రికల్లోనూ చదువుతాను. నాకు ప్రింట్ పత్రికలు చదివే అవకాశం లేదు. అపరాధ పరిశోధనలు, హాస్యం, సైన్స్ ఫిక్షన్ నేను దూరంగా ఉండే అంశాలు కాబట్టి ఆ కథలు కూడా నేను చదివిన వాటిలో ఉండవు. నా ఈ అభిప్రాయాలు నేను చదివిన కొన్ని కథల మీద ఆధారపడి మాత్రమే తప్ప సంవత్సరం మొత్తంలో వచ్చిన కథలన్నిటి మీదా ఎంత మాత్రమూ కాదు. అలానే రచయితల మీద నా అభిప్రాయాలు కూడా అందరు రచయితలకూ చెందవు. నా అభిప్రాయాలు గత నాలుగైదేళ్ళుగా నేను గమనిస్తున్న వాటి మీద ఆధారపడినవి.

కథ అంటే సమాజానికి సందేశాన్నివ్వాలీ, సమస్యకి పరిష్కారం చూపించితీరాలీ లాంటి భ్రమలేమీ నాకు లేవు.  నేనో సాధారణ పాఠకురాలిని.  మంచి కథ అంటే నా దృష్టిలో, అది ముందు నన్ను పూర్తిగా చదివించగలగాలి. భాషా, శైలీ బావుండాలి. కథ పరిధులు దాటి వ్యాసాలుగా మారకూడదు. ఇవీ నాకు ఓ కథ నచ్చడానికి ఉండాల్సిన కనీస లక్షణాలు. ముఖ్యంగా చదివిన తరువాత అది చదవడానికి పెట్టిన నా సమయం వృధా అనిపించకూడదు.

1.       2016లో వచ్చిన కథల పై వస్తు పరంగాశిల్ప పరం గా మీ అభిప్రాయాలు

కథలు చాలానే ఉన్నా, చదివించగలివినవి గుప్పెడు కూడా లేవని చెప్పొచ్చు. మంచి కథ నాలుగు కాలాలు నిలుస్తుంది అనేవారు, అయితే వీటిలో చదివిన తరువాత నాలుగు రోజులు కూడా గుర్తుండే కథ ఏదీ లేదనే చెపుతాను. చాలామంది కొత్త రచయితలూ కనిపించారు. ఇప్పుడొస్తున్న కథల్లో ఏదో చెప్పాలన్న తాపత్రయం తప్ప, ఎలా చెప్పొచ్చో తెల్సినదనం తక్కువ.  చాలా కథలు వస్తుపరిధి దాటి విస్తరించి, వ్యాసాల్లా తయారయి పూర్తిగా చదివించకుండానే మిగిలిపోయాయి. కొన్నిటి  శైలి చిరాకు తెప్పిస్తే, కొన్నిటి కథాంశాలే విసుగెత్తించాయి. 

ముఖ్యంగా నేను గమనించిందీ, నన్ను బాగా విసిగించి చాలా కథలను పూర్తిగా చదవకుండా చేసినదీ భాష.  కథకు అవసరమున్నా లేకున్నా మాండలికం ఉపయోగించడం అనేది ఒక ఫాషన్ అయినట్టుంది. మాండలికం వాడటం తప్పు అని నేను అనడం లేదు, కానీ వ్రాస్తున్న దాని మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఒక పాత్ర చేత ఓ యాస మాట్లాడిస్తే, మొత్తం కథంతా అదే కంటిన్యూ అవ్వాలి. అలా కాకుండా హటాత్తుగా కొన్ని వాక్యాలు మామూలు భాషలో యాస లేకుండా మాట్లాడేస్తాయి. రచయిత నేరేట్ చేసే భాగాలలో కూడా అంతే. కొంతసేపు యాస, కొంత సేపు మామూలు భాష. చదువుతుంటే అయోమయం, అసహనం కలిగించాయి. కాస్త పేరున్న రచయితల నుండీ క్రొత్త రచయితల వరకూ ఇది సాగింది.  ఈ రకం కథల్లో శ్రద్ధగా వ్రాసినవి నాకు తెలిసి రెండు. ఒకటి జూపాక సుభద్ర ‘కంపనవడ్డ కాళ్ళు’, సాయి యోగి వ్రాసిన ‘ఖుష్బూ’. (ఇది ఈయన మొదటి కథ అని చెప్పుకున్నట్టు గుర్తు.)

చిరాకు కలిగించిన ఇంకో విషయం, చాలా కథలు ఎడిటింగ్ అంటూ ఒకటి ఉంటుందన్నసంగతి రచయితలు  మర్చిపోయినట్టు ఉండటం. వాక్యాల్లో తప్పులు, అర్ధం పొసగని వాక్యాలు. కనీసం ఓ రెండు సార్లయినా శ్రద్ధగా తన కథని చదువుకుంటే తమకే తెలిసే తప్పులు ఎన్నో. ఇలాంటివి కథను పూర్తిగా చదివించడంలో విఫలమవుతాయి.

మొత్తం మీద కథలు పెద్దగా సంతృప్తిని కలిగించలేదు.  మంచి కథలు రాయగలిగిన వారి నుండి కూడా ఈసారి వచ్చిన కథలు నిరాశనే మిగిల్చాయి.

2.      మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా-

ఎన్నెలో ఎన్నెలా  – అట్టాడ అప్పలనాయుడు (సారంగ): రోహిత్ మరణం నేపథ్యంలో నేను చదివిన వాటిలో, అతి నాటకీయత లేకుండా, గాడి తప్పకుండా, నన్ను పూర్తిగా చదివించగలిగిన ఒకే ఒక్క కథ.

 బౌండరీ దాటిన బాలు – మధు పెమ్మరాజు (వాకిలి): ప్రతి ఒక్కరి బాల్యంలోనూ ఇలాంటి  సంఘటన కనీసం ఒకటయినా ఉండే ఉంటుంది. నాస్టాల్జిక్ కార్నర్స్ ని టచ్ చేసిన కథ. చక్కటి కథనం.

 ఏం జీవితం – చంద్ర కన్నెగంటి (ఈమాట): ఒక మనిషి జీవితంలోని వర్ణాలను, సరళమైన భాషలో, చక్కని వచనంతో చూపించిన కథ.

 ద్వారబంధం – మైథిలి అబ్బరాజు (ఆంధ్రప్రదేశ్ పత్రిక):  ఫీల్ గుడ్ స్టోరీ అంటాను దీన్ని.  చక్కని వచనం మైథిలి గారి స్వంతం. ఈ కథ చదవగానే నాకెందుకో కళ్యాణ సుందరీ జగన్నాథ్ కథలు గుర్తుకు వచ్చాయి.

 హృదయం ఇక్కడే ఉంది – ఆర్. దమయంతి (ఈమాట): తప్పులు లేకుండా, మంచి శైలిలో, క్లుప్తంగా అవసరమైనంత వరకూ మాత్రమే చెప్పడం తెలిసిన వారిలో దమయంతి గారు ఒకరు.  ఇది ఇంకో ఫీల్ గుడ్ స్టోరీ.  

 డీహ్యూమనైజేషన్ – దేశరాజు (సారంగ): ఇది కూడా అతి తక్కువ నాటకీయతతో, ప్రస్తుత సామాజిక పరిస్థితుల మీద వచ్చిన సున్నితమైన సెటైర్.

 నచ్చిన ఇంకొన్ని కథలు – బ్లాక్ ఇంక్ – సాంత్వన చీమలమర్రి (సారంగ), కొన్ని ముగింపులు – చంద్ర కన్నెగంటి (సారంగ), సుచిత్ర చెప్పిన కథ – కొత్తావకాయ (బ్లాగ్), అద్భుతం – అరిపిరాల సత్యప్రసాద్ (వాకిలి), కంపనవడ్డ కాళ్ళు – జూపాక సుభద్ర (సారంగ), కొంచెం గెడ్డపు నురగ, ఒక కత్తి గాటు  – ఉణుదుర్తి సుధాకర్ (సారంగ?), గంగమ్మే బెదరిపోయే – ఎండపల్లి భారతి (వాకిలి), సంసారంలో సరిగమలు – తమస్విని (కౌముది), డాక్టర్ చెప్పిన కథలు – చందు శైలజ (కౌముది)

3.      మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు

మధు పెమ్మరాజు, సాంత్వన చీమలమర్రి, ఎండపల్లి భారతి.  సాంత్వన రచనా శైలి బావుంటుంది. భారతి గారు ‘మావూరి ముచ్చట’ శీర్షికన వాకిలిలో వ్రాసిన కథానికలు మంచి మాండలికంతో శ్రద్ధగా వ్రాసినట్టు ఉంటాయి. ఉణుదుర్తి సుధాకర్ గారి రెండు కథల్లో కూడా కథనం బావుంది. ఆయన పేరు వినడం ఇదే మొదటిసారి నాకు.

4.      తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయివ్యక్తిగతంగాసాంఘికంగాఅంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ  గలిగాయా?

సమాజంలో వస్తున్న మార్పులని స్పృశించే ప్రయత్నం అయితే జరిగింది. అయితే సమస్యకు సహజంగా స్పందించి కాకుండా, మేమూ ఏదో చెప్పాలన్న ఆత్రుతతో వ్రాస్తున్నట్టుగా ఉంటున్నాయి. మధ్యలో వాదాలూ, కులాలు ప్రాముఖ్యం సంపాదించుకుని, అసలు సమస్యను వదిలి ఎక్కడికో పోతాయి. వెరసి చాలావరకు విసుగు కలిగించే వ్యాసాలుగా మిగిలిపోతున్నాయి. నిజానికి ఎక్కడన్నా ఏదన్నా జరిగింది అంటే భయం వేస్తుంది, ఆ తర్వాత తెచ్చిపెట్టుకున్న ఉద్వేగాలతో వెల్లువలా వచ్చే పసలేని కథలూ, కవితలూ చూడాల్సి వస్తుందని. అసలు కష్టాన్ని మించిన కష్టం ఇది ఒక్కోసారి నాకు.

5.      మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?

ఇక్కడా అని చెప్పడం కష్టం. ప్రతీ చోటా నచ్చినవీ ఉంటున్నాయి, నచ్చనివీ ఉంటున్నాయి. అయితే ఎక్కువ నాసిరకపు కథలు ఈనాడులో వస్తున్నాయని మాత్రం అనిపిస్తుంది. 

6.      కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?

కథా విమర్శా? అంటే ఏమిటీ, ఎక్కడుందీ అని అడగాలని ఉంది. నావరకూ నాకు మంచి కథలు రాకపోవడం కన్నా, మంచి విమర్శ లేకపోవడమే ఎక్కువ అసంతృప్తిగా ఉంటుంది. కథలను కాకుండా రచయితలను విమర్శించడం/పొగడటం రానూ రానూ ఎక్కువయి, నిజమైన విమర్శ అనేది మాయం అయిపోయింది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాలి. ఒకటో రెండో మంచి కథలు వ్రాయగానే, ఇక వాళ్ళు ఏం వ్రాసినా (అది ఎంత నాసిరకంగా ఉన్నప్పటికీ) అద్భుతంగా ఉందనీ, వాళ్లు తప్ప ఇంకొకరు అలా వ్రాయలేరనీ ఆకాశానికి ఎత్తెయ్యడం.  ఇక సోషల్ నెట్వర్క్ లో గ్రూపులు. గ్రూపులో ఒకరు ఏదైనా వ్రాస్తే, అది ఎలా ఉన్నా సరే మిగిలిన వాళ్ళు భట్రాజులను మించిపోతూ పొగడ్తలు. ఎవరి రాతలైనా నచ్చలేదని ఎవరైనా అన్నారో, అందరూ కలిసి సామూహకంగా అన్నవాళ్ళని టేస్ట్ తెలీని వాళ్ళనీ, అహంకారులనీ ముద్రలు వేసెయ్యడం. సోషల్ మీడియాలో రచయితల ఇన్వాల్వ్మెంట్ పెరిగాక ఈ ధోరణి  ఇంకా ఎక్కువయిపోయింది.

ఇప్పటి రచయితల్లో పొగడ్తలు తప్ప, విమర్శలు సమన్వయంతో తీసుకునే వాళ్ళు దాదాపు లేరనే చెప్పాలి. పొగిడినంత సేపూ సంతోషం. ఎప్పుడన్నా ఎవరైనా ఒకటి నచ్చలేదు అంటే, అక్కడి నుండీ రాజకీయాలు మొదలు. తన కథలోని లోపాలను సహేతుకంగా చూపినందుకు ఒకరిని,  ‘వాచాలత్వం, ప్రేలుడూ, అహంకారం’ అంటూ రభస చేసిన వారొకరు. విశ్లేషణలో తన కథను తను అనుకున్నట్టుగా పొగిడి ఆకాశానికి ఎత్తకుండా విమర్శించినందుకు, వేరొకరు ఫేస్బుక్ లో నడిపిన నాటకాలూ, అస్మదీయుల ఓదార్పులూ. ఇలాంటివి చూస్తూ ఎవరైనా కూడా సరైన విమర్శ చెయ్యాలన్నా వెనుకాడతారు. కొద్దో గొప్పో రచనలు చేసిన వారి నుండి, చెయ్యి తిరిగిన రచయితలు అనిపించుకున్న వాళ్ళ వరకూ, దాదాపు అందరిలోనూ విమర్శల పట్ల ఇదే అసహనం.

అయితే ఈ సందర్భంలో చెప్పవల్సినది ఒకటి ఉంది. దీనికి భిన్నంగా ఓ రెండేళ్ళ క్రితం, ‘అపర్ణ తోట’ తన కథపై వాకిలిలో ఎంతో ఘాటైన  విమర్శలు వచ్చినా, సంయమనంతో, హుందాగా ప్రవర్తించడం అభినందనీయం.    

చాలాసార్లు కథ మీద చర్చలు పక్కదారి పట్టి, అస్తిత్వాలు, ఇజాలు, పరస్పర దూషణలతో నిండిపోతున్నాయి. కథకు సంబంధించి వాఖ్యానించడానికి కూడా ఇక మరెవరూ అక్కడ అడుగు పెట్టే సాహసం చెయ్యరు. ఇక విమర్శలు చెయ్యడానికి ఎవరు ముందుకొస్తారు?

7.       కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

నావరకూ కథల సంకలనాలు అవసరమనే అనిపిస్తుంది.  వాటిల్లో అన్నీ మంచి కథలే ఉంటాయని కాదు. వీటి వల్ల చదవని క్రొత్త కథలు చదివే అవకాశం వస్తుంది. అలానే ఎక్కడెక్కడో చదివిన కథలు మళ్ళీ మళ్ళీ కావల్సినపుడల్లా చదువుకునే వీలుంటుంది. కథాసాహితి సంకలనాల వల్ల నేను ఇంతకు ముందు చదవలేకపోయిన ఎన్నో మంచి కథలు చదవగలిగాను. మళ్ళీ మళ్ళీ చదువుకోగలుగుతున్నాను. అలాగే రచయితల కథల సంకలనాలు కూడా అవసరమనే అనిపిస్తుంది. ఒక్కోసారి ఏదైనా కథ నచ్చినపుడు ఆ రచయితవి మిగిలిన కథలు కూడా చదవాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ సంకలనాలే అక్కరకు వస్తాయి.

8.      మీరు చదువుతున్న ఇతర భాషల కథలకుతెలుగు కథలకు తేడా కనిపిస్తోందాఅయితే అది ఎలాంటి తేడా?

నేను సాధారణంగా ఇంగ్లీష్, అదీ కూడా ఎక్కువగా నవలలే చదువుతాను. నవలకు స్కోప్ ఎక్కువగా ఉంటుంది కథ కన్నా.  కాబట్టి వాటితో తెలుగు కథలను పోల్చలేను.  ఇతర భాషల కథల అనువాదాలు శారద గారు, కొల్లూరి సోమశంకర్ గారు, ఇంకొందరు చేసినవీ కొన్ని చదివాను, అయితే వాటి మూల కథలు ఎప్పుడో వ్రాసినవి కాబట్టి, వాటితో పోల్చడం కూడా సరైనది కాదు అనుకుంటున్నాను. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, అవి ఎప్పటివైనా సరే వాటిలో క్లుప్తత, హద్దులు దాటని నాటకీయత, వస్తు వైవిధ్యం ఉన్నాయి. నీతిసూత్రాలు, ఉపన్యాసాలు దాదాపు లేవనే చెప్పాలి. 

*

పద్మవల్లి

నలుగురు కవులకు రమణ సుమన శ్రీ అవార్డులు

 

దెంచనాల శ్రీనివాస్

సిద్ధార్థ

ఎం.ఎస్‌.నాయుడు

ఉత్తమ కవితా సంకలనాలకిచ్చే రమణ సుమన శ్రీ ఫౌండేషన్‌ పురస్కారాలను ఫౌండేషన్‌ అధ్యక్షులు సుమనశ్రీ ప్రకటించారు. 2015కుగానూ సౌభాగ్య (సౌభాగ్య సమగ్ర కవిత్వం), దెంచనాల శ్రీనివాస్‌ (భస్మ సారంగీ); 2016కుగానూ సిద్ధార్థ (బొమ్మల బాయి), ఎం.ఎస్‌.నాయుడు (గాలి అద్దం) పురస్కారం అందుకుంటారు. జనవరి 18న సాయంత్రం 6 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సెమినార్‌ హాల్లో జరిగే ఈ ప్రదాన వేడుకలో శివారెడ్డి, చినవీరభద్రుడు, నున్నా నరేశ్, కె.బి.లక్ష్మి, సి.వి.కృష్ణారెడ్డి పాల్గొంటారు.

రమణ సుమనశ్రీ

 

యాష్ లీలో ధర్మారావు ఊహల ప్రతిధ్వనులు

సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-10

 

‘వేయిపడగలు’, ‘గాన్ విత్ ద విండ్’-రెండూ వెయ్యి పేజీలు దాటిన బృహన్నవలలు.  తీరా వాటి మధ్య పోలికలు, తేడాలలోకి తొంగి చూడబోతే అదీ అంత భారీగానూ మారేలా కనిపించింది. కనుక వీలైనంతవరకు సంక్షేపించక తప్పదు.

రెండు రచనలూ చిత్రించినది ఒకానొక వ్యవస్థాపతనాన్నే, అయినా మళ్ళీ రెండు వ్యవస్థల మధ్యా తేడా ఉంది. స్థూలంగా చెబితే, వేయిపడగల వ్యవస్థ కాలికంగా ఎక్కువ నిడివీ, లోతు, ఘనీభావస్థితీ కలిగినదైతే; గాన్ విత్ ద విండ్ చిత్రించిన వ్యవస్థకు అంత కాలికమైన నిడివీ, లోతూ లేవు. మధ్యయుగాలనాటి వేయ్యేళ్ళ అంధచరిత్రనుంచి యూరప్ బయటపడి, పునరుజ్జీవన రూపంలో తెచ్చుకున్న అసాధారణ క్రియాశీలత అమెరికాలోకి ప్రసరించిన పరిణామంలో భాగమే గాన్ విత్ ద విండ్ లోని కులీన సమాజం. యూరప్ లో జరిగినట్టు, వేయిపడగల వర్ణ సమాజపు, లేదా ఆ వర్ణసమాజం గురించిన ఊహల తాలూకు పునాదులను కదిలించి పెద్ద ఎత్తున క్రియాశీలం చేయగల, పునరుజ్జీవనంతో పోల్చగల పరిణామం భారతదేశంలో ఆధునికకాలంవరకూ లేదు. లేకపోగా ఆ స్తబ్ధతను, ఘనీభవ స్థితిని, క్రియాశీల, పోరాటరాహిత్యాలను తాత్వికీకరించి ఘనంగా కీర్తించడం ఉంది. వేయిపడగల రచయిత ఒకచోట ఇలా అంటాడు:

ఆమె(జమీందారు రంగారావు పెళ్లాడిన ఆంగ్లేయయువతి శశిని) యొక స్వతంత్రదేశమున పుట్టినది. అచ్చటి మరియాదలకు అలవాటులకు పరదేశములవారు వచ్చి భిన్నముగా నడచినచో ఆమె మనస్సు చాలా బాధపడి యుండును. కాని తన యీ భిన్నప్రవర్తన యిచ్చటి దేశప్రజలకు బాధ కలిగించునని యామెకు యూహయే కలుగలేదు. కలుగవలసిన అవసరము లేదు.

ఈ దేశప్రజలు వచ్చిన కష్టములు దైవికములని వాని నోర్పుతో సహింతురు. తమ కిష్టము లేమి సూచించరు. ఒక విషయమున, ఒక కార్యాచరణమున, తమ యిష్టము లేమిని ప్రతిఘటించి తెలుపుట, శశిని పుట్టిన దేశమున ప్రధాన ధర్మము. తత్ప్రకృతులకు ప్రతిఘటించకపోవుట అంగీకారము క్రిందనే లెక్క!

మొదటి వాక్యాలలో అశక్తతనుంచి పుట్టే ఆక్రోశమూ, నిష్టురత్వమూ వ్యక్తమవుతుంటే; రెండో వాక్యాలు అశక్తతను తాత్వికీకరిస్తూ ప్రతిఘటనలేమిని గుణంగా, ఘనంగా చూపిస్తున్నాయి. ఇది అశక్తతను, అది కలిగించే న్యూనతను ఆధిక్యంగా చిత్రించుకునే ప్రయత్నం.

ఈ అశక్తతకుగల పర్యవసానాలలో ఒకటి రాజీపడడం. మరోచోట మంగమ్మ అనే పాత్రతో వేయిపడగల రచయిత ఇలా అనిపిస్తాడు:

సంఘములో కాని, మతములో కాని, మరొకదానిలో కానీ మీ రెన్ని మార్పులైన తేవచ్చును. ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, తద్వారా భక్తియో, జ్ఞానమో కలుగుటకు వీలుండెనేని మీరు తెచ్చిన మార్పు శిరోగ్రాహ్యము.

సంఘంలోకానీ, మతంలో కానీ మీరు ఎన్ని మార్పులైనా తేవచ్చు ననడంలో స్పష్టంగా వ్యక్తమవుతున్నది, మార్పులతో రాజీపడడమే. అయితే, ఆ మార్పులు ‘ఇంద్రియ, మనోనిగ్రహాలు; తద్వారా భక్తి, జ్ఞానాలు’ కలిగించేవిగా ఉండాలని షరతు పెడుతున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, ‘నీకు నా కూతురినిచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు సకల సంపదలూ సాధించుకు రావా’లని పాతాళభైరవి సినిమాలో నిరుపేద అయిన తోటరాముడికి రాజు షరతు పెడతాడు. తోటరాముడు నేపాళ మాంత్రికుని జయించి పాతాళభైరవిని మెప్పించి సంపదలతో తిరిగి వచ్చాడంటే అది సినిమా! నిజ జీవితం సినిమా కాదు. భక్తి, జ్ఞానాల సంగతి దేవుడెరుగు; ఇంద్రియ, మనోనిగ్రహాలనే మెట్లు ఎక్కడమే రచయిత చెప్పినంత తేలిక కాదు. అమాయకత్వమనాలో మరేమనాలో తెలియదు కానీ; లౌకిక ప్రాతిపదికపై నడిచే సంఘానికి రచయిత అలౌకికమైన, ఆధ్యాత్మికమైన సిలబస్ విధిస్తున్నాడు!

విధించడమే కాదు, వేయిపడగల రచయిత గిరిక, ధర్మారావు, హరప్పల ద్వారా భక్తి, జ్ఞాన, కర్మమార్గాలనే సిలబస్ ను అమలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది వ్యవస్థా పతనాన్ని ఆపలేకపోయింది. చివరికి అరుంధతి రూపంలో పతివ్రతాధర్మం ఒకటి మిగిలిందని ధ్వనించి సంతృప్తి ప్రకటిస్తాడు.

లౌకికంగా క్రియాశీల, పోరాటశీలతలు లోపించిన మహాస్తబ్ధతలో మన ఊహల్ని అస్పష్ట, అవ్యక్త, అధ్యాత్మిక సీమల్లోకి నడిపించి శాంతిని, సమాధానాన్ని వెతుక్కోవడమే ఇది. అలాగని లౌకికజీవితాన్నీ, వాస్తవికతనూ అంత తేలిగ్గా ఎగరగొట్టడమూ సాధ్యం కాదు. దాంతో లౌక-అలౌకికతల మధ్య అంతులేని సంఘర్షణ, సంక్లిష్టత, వైరుధ్యాలు! నిస్సహాయతను నిర్లిప్తతగా ఎంత ఉన్నతీకరించుకున్నా వ్యవస్థాపతనంపట్ల తప్పని దుఃఖం!

రచయిత ఆదర్శీకరించిన చాతుర్వర్ణ్యవ్యవస్థ ఆయన ఊహలో ఉన్నట్టు అచ్చంగా అంత ఆదర్శవంతంగానూ ఎప్పుడైనా ఉందా అంటే, ఉండగల అవకాశమూ లేదు.  పునాదులను కదిలించి ఉపరితలంలో కీలకమైన మార్పును తేగల ఒక మహత్ పరిణామమేదీ లేకపోవడం; ఫలితంగా సుదీర్ఘకాలం వెంబడి కరడుగట్టిన భావజాలమూ, సమాజంపై దాని వక్రప్రతిఫలనమూ, ఆ రెంటి మధ్యా వైరుధ్యాలూ అలా ఉండగానే చాపకింద నీరులా పాకుతూ వచ్చిన మార్పులు; అవి ఎలాంటివో తెలుసుకుని స్పందించేలోగానే అవి జీవితంలో భాగం కావడం! వాటిపై ఏం చేయాలో తోచని నిస్సహాయత! ఇదీ వేయిపడగలు రూపు కట్టిన భారతీయసాంప్రదాయిక సమాజపతనం.

గాన్ విత్ ద విండ్ చిత్రించినది ఇందుకు భిన్నం. అందులోని కులీన సమాజం వేయిపడగల సమాజంలా తీసుకుని తీసుకుని మరణోన్ముఖమవుతున్న సమాజం కాదు. క్రియాశీలంగా మారి చావో రేవో తేల్చుకోవాలనుకుంటుంది. సాయుధ పోరాటానికి దిగుతుంది. ఓడిపోతే పోవచ్చు కానీ అందులో నాన్పుడు లేదు. వేయిపడగలకు రంగస్థలమైన సుబ్బన్నపేటలో ఆధునికమైన మార్పులు సాపేక్షంగా ఎక్కువ కాలవ్యవధిలో సంభవిస్తే; గాన్ విత్ ద విండ్ కు రంగస్థలమైన జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో అంతర్యుద్ధ పర్యవసానంగా నాలుగైదేళ్ళ వ్యవధిలో దాదాపు హఠాత్తుగా సంభవిస్తాయి. యుద్ధానికి ముందు పదివేల జనాభాతో ఒక పెద్ద గ్రామంలా ఉన్న అట్లాంటా యుద్ధకాలంలో ఎలా పెరిగిందో, యుద్ధానంతరం నగర స్థాయిని ఎలా అందుకుందో; ఆ క్రమంలో అది భౌతికంగానూ ఆత్మికంగానూ కూడా ఎలా మారిపోయిందో రచయిత్రి అద్భుతంగా కళ్ళకు కట్టిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రేష్టత్వం నిండిన సాంప్రదాయిక జీవనం నుంచి జారిపోయి సామాన్యత అనే ప్రవాహంలో అది గుర్తుపట్టలేనంతగా కలసిపోతుంది.  ఒక యుద్ధం తెచ్చిపట్టే భౌతిక, మానసిక పరివర్తనకు అంతర్యుద్ధకాలపు అట్లాంటా ఒక గొప్ప నమూనా. సుబ్బన్నపేటలో వచ్చిన మార్పుల చిత్రణ కూడా  ఇంచుమించు ఇలాగే ఉంటుంది కానీ; అది కల్పిత గ్రామమైతే అట్లాంటా వాస్తవికం.

కథాకల్పన, పాత్రచిత్రణ సహా రచనా సంబంధమైన వివిధాంశాలలో ఇద్దరు రచయితలమధ్య మౌలికమైన తేడాలూ ఉన్నాయి. ఆ తేడాలు మళ్ళీ ఇద్దరి దృక్పథాలలో ఉన్న తేడాను వ్యక్తీకరిస్తాయి. వేయిపడగలులో ధర్మారావు ప్రధానపాత్ర. రచయిత భావజాలం ప్రధానంగా అతని ముఖంగానే వ్యక్తమైంది. కథాకాలానికి ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి గతించాడు కనుక అతన్ని పక్కన పెడితే, ధర్మారావు తర్వాత చెప్పుకోదగిన పాత్రలుగా గిరిక, గణాచారి, అరుంధతి, రంగారావు, హరప్ప, పసరిక, కుమారస్వామి, మంగమ్మలు కనిపిస్తారు. అయితే వీరందరూ ధర్మారావు ప్రభావంలో మొదటి నుంచీ ఉన్నవారు, లేదా తర్వాత వచ్చిన వారే(ఉదాహరణకు రంగారావు, మంగమ్మ) తప్ప విరుద్ధభావజాలానికి చెందినవారు కాదు. రాధాపతి, చక్రవర్తి, వామనరావు తదితరులు విరుద్ధభావజాలంగలవారైనా ధర్మారావుతో తులతూగేవారు కాదు. అంటే ఏమిటన్నమాట! వేయిపడగల రచయిత ప్రణాళిక ఏకపక్షం. ఆయన భావజాలానికి తగిన ప్రతివిమర్శ కానీ, దానితో సమానప్రతిపత్తిగల పోటీ భావజాలం కానీ లేవు. సుదర్శనంగారు అన్నట్టు వేయిపడగలను ఆత్మాశ్రయకావ్యమనుకుంటే అది అలా ఉండడానికి ఒక సమర్ధింపు అవుతుంది.

ఇందుకు భిన్నంగా గాన్ విత్ ద విండ్ రచయిత్రి దృష్టి వస్త్వాశ్రయంగా ఉంటుంది. అందులో ప్రధానపాత్ర ఎవరన్న పరిశీలన చేయబోతే ఒకరు కాదు, నలుగురు పైకి తేలతారు: స్కార్లెట్ ఒహారా, రెట్ బట్లర్, మెలనీ, యాష్ లీ! రచయిత్రి స్కార్లెట్ ముఖంగా కథ చెబుతున్నట్టు కనిపించే మాట నిజమే. స్కార్లెట్ ప్రధానపాత్రే. అంతమాత్రాన రెట్ బట్లర్ తక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదు. అలాగే మెలనీ, అలాగే యాష్ లీ…

ఇలా నాలుగు పాత్రలకూ ప్రాధాన్యం లభించడానికి కారణమేమిటి? రచయిత్రి ఈ నలుగురి ముఖంగా నాలుగు దృక్పథా(లేదా ఒకే దృక్పథంలోని భిన్నచ్చాయ)లకు దాదాపు సమస్థాయిని కల్పించడమే. ఈవిధంగా వేయిపడగల లోని ఏకపక్షతకు భిన్నంగా రచయిత్రి బహుళపక్షతకు చోటిచ్చింది. మరోలా చెప్పాలంటే, కాన్ఫడరేట్ గా ఏర్పడి యూనియన్ తో యుద్ధం చేసిన  అమెరికా దక్షిణ రాష్ట్రాలు ఏ భావజాలానికి ప్రాతినిధ్యం వహించాయో ఆ భావజాలాన్ని రచయిత్రి నిరాకరించనూలేదు, స్వీకరించనూలేదు. ఆ భావజాలానికి కాల్పనిక స్థాయిలో యాష్ లీ ప్రాతినిధ్యం వహిస్తాడు. కాకపోతే స్కార్లెట్, రెట్ బట్లర్ ల రూపంలో రచయిత్రి దానికి ప్రతిపక్షాన్ని సృష్టించింది. అలాగే, పాతను పూర్తిగా నెత్తిన పెట్టుకోవడం, కొత్తను పూర్తిగా తృణీకరించడం చేయలేదు. మెలనీ రూపంలో రెంటి మధ్యా మానవీయత అనే అతుకు పెట్టి ఒక గొప్ప సమన్వయాన్ని సృష్టించింది.

గాన్ విత్ ద విండ్ కు పరిమితమై చూసినప్పుడు ప్రాధాన్యక్రమంలో యాష్ లీ ది నాలుగవ స్థానమే. బహుశా నవల చదివిన పాఠకులందరికీ అదే అభిప్రాయం కలుగుతుంది. కానీ వేయిపడగలతో పోల్చి చూసేటప్పుడు అతను  ప్రథమస్థానంలోకి వస్తాడు. అతనిలో అడుగడుగునా ధర్మారావు పోలికలు కనిపించి ఆశ్చర్యం గొలుపుతాయి. ధర్మారావులానే అతను కూడా భావుకుడు. స్వాప్నికుడు. సాహిత్యప్రేమికుడు. సాంప్రదాయికత మీద గాఢమైన అనురక్తి ఉన్నవాడు. అవ్యక్తంలోని సౌందర్యాన్ని ఆరాధించేవాడు. అయితే ఒక తేడా; ధర్మారావుకు భిన్నంగా అతను పతనమవుతున్న వ్యవస్థ పక్షాన ఆయుధం పట్టి యుద్ధం చేస్తాడు. అయితే ఆ యుద్ధ ప్రయోజకత్వం మీద నమ్మకంతో కాదు. అయినా ఎందుకు యుద్ధం చేశాడంటే ‘స్వధర్మా’న్ని పాటించడానికి తప్ప మరో సమాధానం కనిపించదు. సాటి యువకులే కాక, తండ్రులు, తాతలు కూడా యుద్ధంలోకి దిగినప్పుడు అతను దిగకపోవడం ఊహకు అందని విషయం. యుద్ధసందర్భంలో యాష్ లీ మహాభారతంలోని అర్జునుని గుర్తుచేస్తాడు. యుద్ధానంతర పరిస్థితులగురించి అర్జునుడు వ్యక్తం చేసిన భయాలే యాష్ లీ లోనూ వ్యక్తమవుతాయి. అయినా సరే అర్జునుడు స్వధర్మానుసారం యుద్ధం చేసినట్టే యాష్ లీ కూడా చేస్తాడు. భార్య మెలనీకి రాసిన ఒక ఉత్తరంలో యుద్ధం గురించిన అతని ఊహలు ఇలా ఉంటాయి:

పడుకుని నక్షత్రాలవైపు చూస్తూ అనుకుంటాను, “దేనికోసం నువ్వు యుద్ధం చేస్తున్నా”వని. మన రాష్ట్ర హక్కుల కోసం, కాటన్ కోసం, డార్కీల కోసం, మనం ద్వేషించే ఆ యాంకీ(అప్పట్లో అమెరికాలోని ఉత్తరాదివారిని సూచించే నిందార్థకం)ల కోసం. కానీ నా పోరాటానికి ఇవేవీ కారణాలు కావు. నేను ట్వెల్వ్ ఓక్స్ (అతని నివాసం)ను మాత్రమే చూస్తున్నాను. తెల్లని స్తంభాలపై ఏటవాలుగా పడే వెన్నెలను, వెన్నెల్లో వికసించే చంపకాలలో వ్యక్తమయ్యే అలౌకికతను, ఎర్రని ఎండ కాసే మధ్యాహ్నం వేళ కూడా పక్క వసారాలో చల్లని నీడ పరుస్తూ ఎగబాకే గులాబీలను గుర్తుచేసుకుంటూ ఉంటాను. అమ్మ ఆ వసారాలో కూర్చుని కుట్టుపని చేసుకుంటున్న నా చిన్నప్పటి దృశ్యం కళ్ళకు కడుతూ ఉంటుంది. సంజె వేళ అలసిపోయి పొలాలనుంచి భోజనానికి ఇళ్లకు వెడుతూ డార్కీలు పాడుకునే పాటలు, బావిలోకి బొక్కెన దింపి నీళ్ళు చేదుకుంటున్న ధ్వనులూ వినబడుతూ ఉంటాయి. పత్తి పొలాల మీదుగా నదికి దారితీసే బాట తాలూకు పొడవాటి దృశ్యం, మసకచీకటిలో దిగువ భూములనుంచి పైకి లేచే పొగమంచు…వీటి కోసమే నేను ఇక్కడ ఉన్నాను. మృత్యువు, కష్టాలు, కీర్తిప్రతిష్టల మీద నాకు ప్రేమ లేదు. ఎవరిపట్లా  ద్వేషమూ లేదు. బహుశా ఇంటినీ, దేశాన్నీ ఇలా ప్రేమించడాన్నే దేశభక్తి అంటారు కాబోలు. కానీ, ఇది అంతకన్నా లోతైనది.  పైన చెప్పినవన్నీ నేను దేనికోసం నా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టానో, నేను ఏ జీవితాన్ని ప్రేమిస్తున్నానో దానికి ప్రతీకలు మాత్రమే. పాత రోజులకోసం, నేను గాఢంగా ప్రేమించిన పాత జీవితం కోసం పోరాడుతున్నాను. అయితే అవి శాశ్వతంగా అంతరించాయనిపిస్తోంది. ఎందుకంటే, గెలిచినా, ఓడినా మనం ఆ జీవితాన్ని కోల్పోతాం.

ఈ యుద్ధాన్ని, తద్వారా మనం స్వప్నించే కాటన్ సామ్రాజ్యాన్ని గెలిచినా మనం పరాజితులమే అవుతాం. కారణం, మనం విభిన్న వ్యక్తులుగా మారిపోతాం. వెనకటి ప్రశాంత జీవనసరళులు నిష్క్రమిస్తాయి. ప్రపంచం కాటన్ కోసం దేవిరిస్తూ మన గుమ్మంలో పడిగాపులు పడుతుంది. అప్పుడు, కాటన్ ధర మనం ఎంత చెబితే అంత. ఎవరి డబ్బు కక్కుర్తిని, సంపద పోగేసేకునే ప్రవృత్తిని, వ్యాపార ధోరణిని ఏవగించుకుంటున్నామో; ఆ యాంకీలలానే మనం కూడా మారిపోతాం.

ప్రమాదాలకూ, పట్టుబడడానికీ, గాయాలకూ, చివరికి మృత్యువుకు కూడా నేను భయపడడంలేదు. వెనకటి కాలానికి మళ్ళీ ఎప్పటికీ వెళ్లలేమనే భయపడుతున్నాను. నేను పాతకాలం వాణ్ణి. ఒకరి నొకరు ఊచకోత కోసుకునే ఈ ఉన్మత్త వర్తమానానికి చెందను. ఎంత ప్రయత్నించినా ఏ భవిష్యత్తులోనూ ఎక్కడా ఇమడలేనని అనిపిస్తోంది. నాలో ప్రవహించే రక్తమే నీలోనూ ఉంది కనుక నువ్వూ అంతే. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు; కానీ గత మంత అందంగా, తృప్తికరంగా మాత్రం ఉండదు.

పాతకాలం గురించిన యాష్ లీ ఊహల్లో ధర్మారావు ఊహల ప్రతిధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. రుక్మిణమ్మారావుతో అతను అన్న మాటలే చూడండి: “తల్లీ! ప్రాతదంతయు పోవుచున్నది. క్రొత్తదంతయు వచ్చుచున్నది….నేను, మీ యందరును నశించిపోవుచుండగా చూచుటకు మాత్రము పుట్టిన మూర్తిని. నేనును ఈ కాలమునకు తగినవాడను కాను. ఇవి యన్నియు చచ్చిపోవుచున్న యొక జాతి చివరి మెరుపులు!”

ఇంకా ఆశ్చర్యకరంగా, వేయిపడగల రచయితలానే యాష్ లీ కూడా వ్యక్తావ్యక్తంగా ఉండడంలోనే సొగసు ఉందనుకుంటాడు. అతనొకచోట స్కార్లెట్ తో అంటాడు: యుద్ధంలోకి అడుగుపెట్టేవరకూ, జీవితం తెర మీద ఆడించే నీడల్లా తప్ప వాస్తవికంగా ఎప్పుడూ కనిపించలేదు. అదే నాకు ఇష్టంగా ఉండేది. ఆయా వస్తువుల బాహ్యరేఖలు మరీ ప్రస్ఫుటంగా ఉండడం నాకు నచ్చదు. అవి ఒకింత అవిస్పష్టంగా, మసక మసకగా ఉండాలి”

వేయిపడగల రచయిత అంటాడు: “అవ్యక్తమైన స్వరము మధురమైనట్లు, అవ్యక్తమైన భావము సుమనోరంజకమైనట్లు, అవిస్పష్టమైన వెలుగులలో శోభ యెక్కువ యున్నది. పూర్తిగా కనబడినచో జ్ఞానము, కనపడి కనబడనిది మాయ. మాయలోనే యున్నది సౌందర్యము.

యాష్ లీ యుద్ధం నుంచి తారా(స్కార్లెట్ పుట్టిల్లు)కు వచ్చిన తర్వాత ఒకరోజున అతనికీ, స్కార్లెట్ కు జరిగిన సుదీర్ఘ సంభాషణ అతనిలోని ధర్మారావు పోలికలను మరింతగా ఆవిష్కరిస్తుంది. వాటిని స్పృశించే ముందు, ఇద్దరి సారూప్యతను ఒక్క వాక్యంలో చెప్పాలంటే;

గాన్ విత్ ద విండ్ ను పూర్తిగా యాష్ లీ ముఖంగా చెప్పి ఉంటే, (కొన్ని తప్పనిసరి తేడాలతో) అది మరో ‘వేయిపడగలు’ అయ్యేది!

      (సశేషం)

వాస్తవ చిత్రణతో వస్తున్న కథలు : విజయలక్ష్మి పండిట్

1.2016 లొ వచ్చిన కథల పై వస్తుపరంగా శిల్ప పరంగా మీ అభిప్రాయం ?

పత్రికల సంఖ్య ,కథకుల సంఖ్య పెరిగి ఏటేటా కథలు కూడా అదే వేగంగా పెరిగిపొతున్న కాలంలో  అన్నీ కథలు చదవడం ఏ పాఠకుడికి వీలుకాదు.  నేను ఈనాడు ,సాక్షి ,వార్త ,అంద్రజ్యొతి ఆదివార అనుబందాలు ,చినుకు ,సాహితి స్రవంతి ,స్వాతి  చదువుతుంటాను. అప్పుడప్పుడు ప్రచురించే కథా సంపుటాలు కొని చదువుతాను .ఏ కథకయినా కథా వస్తువు ప్రాముఖ్యత వహిస్తుంది .ఎందుకంటే పాఠకులు సమకాలీన సమస్యల చిత్రణ ,పరిష్కారాల కొరకు కూడా కథనుఎన్నుకుంటారు .ఈ సంవత్సరంలొ కథా వస్తువులు – పిల్లల పెంపకం ,అస్తిత్వాల సంఘర్షణ ముఖ్యంగా ఆడపిల్లల ల్లో పెరుగుతున్న తమ జీవితాన్ని నిర్ణయించుకునే  స్వేచ్ఛా కాంక్ష ,సహజీవనం,ఆత్మహత్యలు ,gay& lesbianism, అవయవదానం,వస్తువులుగా గుర్తున్నాయి. ,సైన్స్‌ ఫిక్షన్‌ , హారర్‌ కథలు  కనిపించడం లెదు .అంటే… కల్పన కంటే వాస్తవజీవన ,మానసిక సంఘర్షణల వస్తువుల పైననే ఎక్కువ కథలు వస్తున్నాయి .ఎక్కువ కథలది సాధారణ శైలే .కట్టి పడేసే శైలి కొందరి కథకులదే సొంతమయినా, కథనం లో  మార్పు లు కనిపిస్తున్నాయి .

 2.మీకు నచ్చిన లేదా నచ్చని కథ గురించి కొంచం వివరంగా …

ఈ మధ్య వాకిలి అంతర్జాల పత్రికలొ “రహస్యలిపి ” అనే భైరవ్‌ రాసిన కథ చదివాను .

కథా వస్తువు ..ఒక ఆగంతకుని చేతిలొ కనిపించి మాయమైన “రహస్య లిపి “అనే పుస్తకం  కొసం వేట .తుదకు ఆ పుస్తకం ఒక university గ్రంధాలయంలొ ఒక అమ్మయి చేతిలొ చూస్తాడు .తానే రొజుకు ఆ పుస్తకం  నుండి వంద పదాలు చదివి వినిపిస్తానని , మధ్యలో  ఏ ప్రశ్న వెసినా రోజు వచ్చి చదవడం  మానేస్తా  నంటుంది ఆ అమ్మయి .ఆ ఒప్పందంతో వారి మధ్య కథ చదవడం ముగుస్తుంది .ఇంతకీ ఆ రహస్య లిపి ఎమిటొ అనే ఉత్కంట  .కథ ముగించినా ఆ రహస్యలిపి ఏమిటొ తెలియదు పాఠకునికి .కాని ….కథ  శీర్షిక ,కథా వస్తువు, కథ నడిపిన తీరు పట్టి చదివించెదిగా ఉంది .  రైలు station లో కనిపించి మాయమైన ఆ ముసలాయన ఎవరు ?ఆ అమ్మాయి ఆ ఆంక్షలు ఎందుకు పెట్టింది ? సందేహాలు గానే ఉండిపొతాయి . జానపద కథను తలపిస్తుంది .

 సారంగా లొ ప్రచురించిన తులసి చందు కథ  “రంగు రెక్కల వర్ణ పిశాచం” మొదలు పెట్టిన విధానం వ్యాసాన్ని  తలపించింది . ఆ రోజు నాకు బాగాగుర్తు…. బిగినింగ్ బాగుండేది ఉపొద్గాతం లెకుండా .కథ శీర్షిక కూడా వస్తువుకు సరిపొలేదెమో అనిపించింది   .  కథావస్తువు ,కథనం బాగున్నయి .

3. మీ దృస్టికి వచ్చిన కొత్త కథకులు ?

 ఎవరు ఎంత కొత్తనో తెలియదు .

సామాన్య (ఆరు వంకాయల దొంగ )

ఎం . ఎస్‌ . కె . క్రిష్ణజ్యొతి(నా నేల నాకు ఇడిసిపెట్టు సారు )

c.యమున (రెక్కలొచ్చాయి),

డి. సాయిప్రమొద్‌ (నో టు పొటు ) చందుతులసి ,(రంగు రెక్కల వర్ణ పిశాచం )

భైరవ్‌( రహస్యలిపి)

ఇంకా వెంపల్లి షరీఫ్‌,

రాధ మండువ గుర్తొచ్చారు.

 4. తెలుగు కథా సాహిత్యం లొ 2016 లొ వచ్చిన కథలు ఎలాంటి మార్పులు సూచి స్తున్నాయి? వ్యక్తిగతంగా ,సాంఘికంగా ,అంత ర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలే మైనా స్పృశించాయా ?

కాలానుగుణంగా ప్రపచీకరణ , అంతర్జాలం ,చరవాణి (mobile),facebook , విదేశి వలసల ప్రభావం వస్తువులుగా వచ్చిన కథలునాయి .అవయవ దానం పై కథ. అమెరికాలొ భర్తలు ( Indians)వంట,పిల్లల పెంపకంలొ భాగం పంచుకొనే కథ ఒకటి చదివాను. .కాలం గడుస్తున్న కొద్దీ ,  కథ పేరు మరిచినా కథావస్తువు గుర్తుంటుంది.

 5. మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు ?

 నిర్దిస్టంగా ఇక్కడ  అని చెప్పలేను కాని …కథా సంపుటాలు,సారంగా,వాకిలి మరికొన్ని అంతర్జాల పత్రికలు.అప్పుడప్పుడు స్వాతి వార పత్రిక ,

సాక్షి న్యూస్ పేపర్  లో ఖదీర్‌ మొహమ్మద్‌ మెట్రొ కథలు

 6. కథా విమర్శ –2016 మీకు తృప్తి నిచ్చిందా ?

కథా  విమర్శలపై నేను ఎక్కువ దృష్టి  పెట్టను .అలాంటి సంకలనం ఉన్నదేమో తెలియదు . ప్రతి కథలొ ఎదొ ఒక కథా సంధర్భం ,నీతి లేదా సమస్య పరిష్కారం , పరిష్కరించని ముగుంపులు …అన్ని వాస్తవ చిత్రాలే కదా ! చదివించే గుణం కొన్ని కథలకే ఉంటుంది .కథలను విమర్సించి నపుడు ఎందుకు, ఏ లోపాలో  ఎత్తిచూపడం కాకుండా ఎలా రాస్తే బాగుండేదొ చెప్పగలగాలి . అంత గొప్ప కథా విమర్శకులు తక్కువే.

 7. కథా సంకలనాలు తెలుగు  కథా ప్రయాణానికి ఏ విధంగా దోహద పడతాయి ?

కథా సంకలనాలు కథా వస్తు శైలి ,నిర్మాణం పధ్ధతి లో  భూత , వర్తమాన ,భవిస్యత్‌ కాలాల లొ మార్పులను , మనిషి జీవితం పై ఆ స్థల ,కాలాలలో ఆకథల ప్రభావం అనే అంశాల గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి .  ఏరికూర్చిన కథలు ఒకే గుచ్ఛమ్గా  లభ్యమవడం పాఠకులు (నేను )ఆహ్వానిస్తారు , అన్ని పత్రికలలొ అచ్చయిన కథలను అందరూ చదవలేరు కదా !

  8. మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు ,తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా ? అయితే అది  ఎలాంటి తేడ ?

 ఇతర భాషల నుండి తెలుగు లొకి తర్జుమా  అయిన కథలు కొన్ని చదివాను .  ,ఇస్మత్‌ చుగ్తాయి (రుద్దుడా? గుద్దుడా ?) ,సాదత్‌ హసన్‌ మంటొ ( బంగారు ఉంగరం )ఎచ్‌. ఎచ్‌మ  న్రో (కిటికి) , డొరిస్‌ లెస్సింగ్‌ ( చికాకు) ,ఇజక్‌ బషేవిస్‌ సింగర్‌ ( గడ్డం) మొదలయిన పది మంది ఇతర భాషల కథకుల కథల సేకరణ కె. బి . గొపాలం ( అమెరికా కొడుకు మరిన్ని కథలు )అనే శీర్షికతొ వచ్చిన సంకలనం , కె. బి . లక్ష్మి అనువాదకథలు సంకలనం చదివాను.ఇతర భాషల కథకుల సంస్క్రితి ,సంప్రదాయాలు ,యాసలు నుడికారాలు ఆ కథలలొ దర్సనమివ్వడమె కాకుండా ఆ కథకులు ఎన్నుకొనే కథా వస్తువులొ, కథ నిర్మాణంలొ ,కథనంలొ వైవిధ్యం కనిపిస్తుంది .తెలుగు కథా రచయితలు అనువాద కథలు చదవడం వల్ల వారి కథలొ కొత్తదనాన్ని నింపడానికి అవకాశముంది .

డా. విజయలక్ష్మి పండిట్

 

 

 

ఎండపొడ కు ఆహ్వానం

పాత్రికేయ రచయిత, ఫొటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు ఈ చలికాలంలో ఎండపోడతో మన ముందుకు వస్తున్నాడు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆర్థిక సహకారంతో సామాన్యశాస్త్రం గ్యాలరీలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. దాదాపు 80 ఛాయా చిత్రాలతో నెలరోజుల పాటు వెచ్చటి స్పర్శను పంచబోతున్నాడు. వెలుగు నీడల మాధ్యమం అయిన ఫొటోగ్రఫితో ఈ సారి ఎండకు, నీరెండకు, ఎండపొడకూ తేడా ఉందని, వెలుతురంతా ఒకటే కాదనీ చెప్పబోతున్నాడు. ప్రవేశం ఉచితం. అందరికీ ఆహ్వానం.
వేదిక: సామాన్యశాస్త్రం గ్యాలరీ. అలంకార్ హోటల్ దగ్గర, ఒయు కాలనీ, మనికొండ రోడ్, హైదరాబాద్.
ప్రదర్శన ప్రారంభంః 9 సోమవారం 2017. సాయంత్రం. 6.10 నిమిషాలు.
ప్రారంభకులుః మామిడి హరికృష్ణ, డైరెక్టర్, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
ముఖ్య అతిథిః కట్టా శేఖర్ రెడ్డి. ఎడిటర్, నమస్తే తెలంగాణ.
ప్రదర్శన వేళలుః ప్రతి రోజూ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.30 వరకు.
శని, ఆదివారాలు ఉదయం 1 1 నుంచి రాత్రి 9 దాకా.
మరిన్ని వివరాలకుః  99480 77893

ఉత్తమ నటనకు చిరునామా – ఓం పురీ

  

ఓం పురీ  వెళ్ళిపోయాడు.

66 ఏళ్ల వయసుకే కొంపమునిగిపోయినట్టు ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. గుండెపోటు… ఒంటరిగా తన అపార్ట్ మెంట్ లో మరణం.

ఓం పురీ నటనలో ఊసరవెల్లి లాంటివాడు.

అనంత్ వేలంకర్ గా (అర్థ సత్య)… ఉన్నాడు.  హరి మండల్ (ఆరోహణ్) గా అబూ మియా గా (మిర్చ్ మసాలా) ఉన్నాడు. అహుజా గా (జానే భీదో యారో) ఉన్నాడు. దుఖీ గా (సద్గతి), భిక్కూ గా(ఆక్రోశ్) ఉన్నాడు. దుర్యోధనుడు, రాజరాజ చోళుడు ఇంకా ఎందరెందరో చారిత్రక పురుషులు (భారత్ ఎక్ ఖోజ్) గా ఉన్నాడు.  నాథూ (తమస్ టీవీ ఫిల్మ్) గా ఉన్నాడు. ఇంకెన్నో సినిమాల్లో ఎందరెందరుగానో ఉండిపోయాడు.   ‘భారత్ ఎక్ ఖోజ్’ లో తన నిండైనగొంతుతో అతనిచ్చిన కామెంటరీ మరపురానిది.

ఎందరెందరి వ్యక్తిత్వాలలోనో తనని తాను లీనం చేసుకుని, ఆ కష్టాలూ అనుభవాలూ తనవి చేసేసుకుని సినిమాల్లో ఆవిష్కరించాడు. ‘Method Acting’ నుంచి తరచి చూశాడు.  Method Actors నటించరు. పాత్రలోకి ప్రవేశం చేసి, ఆటుపోట్లన్నీ అనుభవిస్తారని సాధారణంగా అనుకునే మాట.

“ముంబైకీ ఫిల్మ్ ఫీల్డ్ కు తనను బలవంతం చేసి రప్పించినందుకు  నాకే ఆ క్రెడిట్ ఇచ్చాడు. అది నాకు బాగానే ఉందిగానీ నిజానికి తనని ఎవరూ తీసుకు రావక్కర్లేదు. స్టేట్ బాంక్ ఆఫ్ పాటియాలా లో పని చేస్తూ ఉండిపోయినా సరే, సినిమాలు అతన్ని వెదుక్కుంటూ వచ్చేవి” – నసీరుద్దీన్ షా.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఉన్నప్పుడు షా కొంచెం అల్లరిగా ఉంటూ నటనను తేలిగ్గా తీసుకునేవాడట. శ్రద్ధగా నేర్చుకోవటం మీదే దృష్టిపెట్టే ఓం పురీ ని చూస్తుంటే తమాషాగా ఉండేదట.  ఒకసారి అక్కడ ‘కబుకీ’ నాటకం వేస్తున్నారని తెలిసి తానూ అందులో వేద్దామని ఉత్సాహపడ్డాడట. కానీ తనకు అవకాశం రాలేదు. ‘ఇబరాగి’ అనే ఆ కబుకీ ప్లే లో జపాన్ యోధుడిగా ఓం పురీని చూశాక  అతని మీద ఉన్న ఈర్ష్య పోయి, ఆరాధించే స్థాయికి వచ్చానని చెప్తాడు. స్కూల్ ఆఫ్ డ్రామాలో వేసిన తన నాటకాలు ఏవీ ‘ఇబరాగి’ లో ‘ఓం’ చేసిన అభినయానికి కనీసం దగ్గరగా కూడా రాలేకపోయాయని ‘షా’ తన ఆత్మకథ ‘And Then One Day – A Memoir లో  చెప్తాడు.

ఓం పురీ బిడియస్తుడు.

Method Actors, సున్నితమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అందరి జీవితాలూ జీవిస్తూ, వాటిని తట్టుకుంటూ బయటపడాలంటే తప్పనిసరిగా కుటుంబంతో ఉండాల్సిన అవసరం ఉందేమో.  కానీ అతని కుటుంబజీవితం సరిగ్గా లేదు.

జర్నలిస్ట్ నందితా ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు. నందిత ఓంపురి జీవితకథను రాసింది. తనగురించి ఏవేవో రాసేసిందని బాధపడిపోయాడు. అవసరం లేదు. నసీరుద్దీన్ షా లాగా బతుకు పుస్తకాన్ని తెరిచిపెట్టి, తనను చూసి తాను హాయిగా నవ్వుకోనూ వచ్చు. నవ్వుకోలేదు. బాధపడి పోయాడు. నందితతో విడిపోయి మూడేళ్ళయింది.

ఓం పురీ ధైర్యస్తుడు.

స్ఫోటకం మచ్చలతో పీలగా ఉన్న తను,  చెయ్యీ కాలూ సరిగ్గా ఎలా కదపాలో తెలియకపోయినా మంచి రూపాలే పెట్టుబడిగా సినిమాల్లోకి దిగిన హీరోల పక్కన బతకగలనని అనుకోవటానికి ఎంత ధైర్యం ఉండాలి!  ఎన్. ఎస్. డీ లో మంచి పేరు తెచ్చుకున్నా,  మధ్యమ స్థాయిలో ఉన్న చక్కటి స్వరం ఉన్నా, రూపం కారణంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఇతనికి నటన విభాగంలో చేరటం కష్టమైంది. గిరీష్ కర్నాడ్ జోక్యంతో సీట్ వచ్చింది.  ఇంతగా నటన ఊపిరైపోయిన ఈ పంజాబీ కుర్రాడికి రెండు ప్రిమియర్ ఫిల్మ్ స్కూల్స్ (నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్) చుట్టివస్తే గానీ నటనలు నేర్చే దాహం తీరలేదు. నేర్చిన నటనకు సార్ధకతను ఇవ్వటానికి అదృష్టంకొద్దీ  సమాంతర సినిమా అనే మంచి చోటు దొరికింది.  ఆ సినిమాలవి అసలే కుదించుకున్న బడ్జెట్ లు. ఏవో కొంచెం డబ్బులు పారేసి (ఇది ఓం పురీ చెప్పిన మాటే)  తనను ఆ సినిమాల్లో వేయమంటే వేసి, ఏం తింటున్నాడో ఏం తాగుతున్నాడో ఎలా బతుకుతున్నాడో లెక్క చెయ్యకుండా గడిపిన కాలంలో మెచ్చుకోళ్ళూ అవార్డులే ముందుకు నడిపించాయి.  హాలీవుడ్ లో అడుగుపెట్టాకే  సంపాదన బాగా పెరిగింది.

ఓం పురీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, నేర్చుకునే శక్తి తనకు అబ్బురంగా అనిపించేవని అంటాడు మిత్రుడు నసీరుద్దీన్ షా. స్మితా షబానాల లాగే నసీర్ ఓం పురీల పేర్లు విడదీయలేనివి. నటనలో స్పర్ధతో పాటు ఆకలినీ ఆనందాలనూ కలిసి పంచుకున్న మిత్రులు ఇద్దరూ.

 

ఓం పురీ  ఒక అనంత్ వేలంకర్ 

హిందీ సినిమాలో అప్పట్లో Angry Youngman మూసనొక దాన్ని చేసి సలీం జావేద్ లు అమితాబ్ బచ్చన్ కు తొడిగారు. కానీ అసలైన Angry Youngman ఎలా ఉంటాడో ఎలాంటి పరిస్థితుల్లో తయారౌతాడో మొదటిసారి చూపించాడు గోవింద్ నిహలానీ ‘అర్థ సత్య’లో. జనం బాగా చూసిన సినిమా అది.  అనంత్ వేలంకర్ ఒక పోలీస్ కొడుకు. పీలగా బలహీనంగా ఉన్న అతని తల్లిని బలిష్టంగా ఉన్న తండ్రి కొడుతుంటాడు. కొడుకును కూడా పోలీస్ ఫోర్స్ లో చేరమని బలవంతం చేస్తాడు. సబ్ ఇన్స్పెక్టర్ అయిన అనంత్ తండ్రి లాగ తను జీవితంలో ఎప్పుడూ ఎవరిమీదా జులుం ప్రదర్శించకూడదని అనుకుంటాడు. అందులో చేరిన ప్రతి ఒక్కరినీ ముందు మొరటుగా మార్చిపడేసే పోలీస్ డిపార్ట్మెంట్ బలం ముందు అనంత్ ఎంతపాటి వాడు?

 

“చక్రవ్యూహంలోకి అడుగు పెట్టకముందు నేనెవరిని?ఎలా ఉండేవాడిని?

గుర్తేలేదు.

దానిలోకి వెళ్ళేకగానీ దానికీ నాకూ ప్రాణం తీసేంత దగ్గరితనం ఉందని తెలియనేలేదు.

ఈ చక్రవ్యూహంలోంచి బయటపడితేనే నేను విముక్తుడినౌతాను.

అయితేమాత్రం? చక్రవ్యూహ రచనలో ఏం తేడా వస్తుంది గనుక?”

ఇదీ అనంత్ వేలంకర్ అస్తిత్వ వేదన.

ఓం పురీ అనంత్ వేలంకర్నీ అతని వేదననూ తనమీదికి ఆవాహన చేసుకున్నాడు.

ఎన్నో సినిమాల్లో, టీవీ ఫిల్మ్స్ లో, వేరే దేశాల సినిమాలూ టీవీలలో నటించి మెప్పించాడు. నాటక రంగాన్ని ఎంతో ప్రేమించాడు. తెలుగులో కూడా ‘అంకురం’ సినిమాలో అతను వేసిన ‘సత్యం’ రోల్ చాలామందికి గుర్తుండే వుంటుంది.  ఏ పాత్రలో వేసినా అది ఏ ప్రాంతానికి సంబంధించినదైనా ఏ భాషా చిత్రమైనా, అక్కడి సాంస్కృతిక నేపధ్యానికి అనుగుణంగా అన్నీ కూలంకషంగా తెలుసుకుని నటించేవాడు.  పోచంపల్లి నేతపనివాళ్ళ మీద శ్యాంబెనెగల్ తీసిన ‘సుస్మన్’ లో నేతగాడుగా ఆవిర్భవించాడు. అప్పట్లో నేతపని నేర్చేసుకుని మరీ నటించాడు. అవన్నీ ఒకెత్తు. ‘అర్థసత్య’ ఒకెత్తు. చిన్నపాత్ర వేసినా ప్రధానపాత్రలో కనిపించినా, వాటికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా నటించాడు.

తానెంతో ప్రేమించిన నటనతో కలిసి చివరిదాకా నడిచాడు కానీ అర్థాంతరంగా జీవితనాటకం నుంచి నిష్క్రమించాడు ఓం పురీ.

–ల.లి.త.

 

 

కథా నిర్మాణంపై శ్రద్ధ తక్కువ – సాయి బ్రహ్మానందం గొర్తి

కొత్త సంవత్సరం వస్తోందంటే గడచిన ఏడాదిలో జరిగిన సంఘటనలూ, నిర్ణయాలూ, సంతోషాలూ, బాధలూ అవలోకనం చేసుకోవడం చాలామందికి ఒక రివాజు. ఒకరకంగా రాబోయే ఏడాదికి అవి పాఠాలు కావచ్చు; మంచైనా, చెడయినా. సాహిత్యం కూడా జీవితంలో భాగం కాబట్టి ఈ రివాజు దానికీ వర్తిస్తుంది.  డిసెంబరు ఆఖరి వారంలో 2015లో వచ్చిన తెలుగు కథల మీద చెప్పమని ఎనిమిది ప్రశ్నలు పంపించారు సారంగ సంపాదకులు.
రాయాలా, వద్దా అన్న మీమాంసలో పడ్డాను. ఏటా  వెయ్యికి పైగా కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమవుతాయి.  నేను అన్ని కథలూ చదవలేదు. చదవడం అసాధ్యం కూడా. అలా అని చదవకుండానూ లేను. నా దృష్టికి వచ్చినవన్నీ చదివాను. కనుక ఈ ప్రశ్నలు వారివే అయినా ఇవి నా పరిశీలనలే తప్ప కథా విమర్శ కాదు.
 
నేను చదివినదాంట్లో కొన్ని కథలు గురించి ప్రస్తావిస్తాను. అంతకు ముందు ఏడాదితో (2015) పోలిస్తే గడచిన సంవత్సరంలో(2016) వచ్చిన కథలు వస్తుపరంగా, నాణ్యత పరంగా చాలా తక్కువగా వున్నాయి. నాణ్యత అంటే కథా వస్తువు కొత్తదై వుండాలి. నిర్మాణమూ, కథనమూ బావుండాలి. ముఖ్యంగా వాటిలో వాడిన భాష. సహజంగా ఉండాలి. చివర వరకూ పాఠకుల జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి చదివించాలి. ఇవీ నేనెంచుకున్న కొలమానాలు. 
 
1) 2016లో వచ్చిన కథల పై వస్తు పరంగా, శిల్ప పరం గా మీ అభిప్రాయాలు
 
ఇక్కడొక విషయం చెప్పాలి. చాలా కథలు వస్తువు చుట్టూతానే తిరుగుతున్నాయి. కథనం, భాష, నేపథ్యం వంటి విషయాలపై ఎవరికీ ఆసక్తి లేదు. ఎంతో ఇబ్బంది పెడుతున్న అంశం ఒకటుంది. అది – కథల్లో వాడే భాష. అసంపూర్తి వాక్యాలూ, అసంబద్ధ ప్రయోగాలూ చికాకు తెప్పిస్తున్నాయి. 
 
2. మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా-
 
బావున్న కథలు:
 
బౌండరీ దాటిన బాలు (వాకిలి) – మధు పెమ్మరాజు
భేతాళుడితో శైలజ (ఆంధ్ర జ్యోతి) – పి.వి.సునీల్ కుమార్
రాక్షస గీతం (సారంగ) – అనిల్ రాయల్
వలపల గిలక (కొత్తావకాయ ఘాటుగా బ్లాగు) – రచయిత్రి
ఆమ్మ (ఆంధ్రజ్యోతి) – కె.వి.గిరిధర రావు
ఎం. ఎస్.కె. కృష్ణజ్యోతి – (ఆంధ్రజ్యోతి) – నా నేల నాకు ఇడిసిపెట్టు సారూ
కస్తూరి పూలు (ఆంధ్ర జ్యోతి) – వెంకట్ సిద్ధారెడ్డి
ఒరాంగుటాన్ (వాకిలి) – మెహర్ 
సెల్ఫీ – మెట్రో కథలు – (సాక్షి) – ఖదీర్‌బాబు
అతనో అద్భుతం – (స్వాతి) – వంశీ
దుర్గారావు -(స్వాతి) – వంశీ 
రిసరక్షన్ – (సాక్షి) – వెంకట్ సిద్ధారెడ్డి (వస్తువు బర్నింగ్ ఇష్యూ అయినా కట్టిపడేసే కథనం ఉంది.)
 
 
ఎత్తుగడ బావుండి నిరాశ పరిచిన కథలు:
 
ఒక తలుపు వెనుక – అంధ్రజ్యోతి – అఫ్సర్
అశోకం – ఆంధ్రజ్యోతి – ఓల్గా
కొన్ని ముగింపులు – (సారంగ) – చంద్ర కన్నెగంటి 
 
 
నచ్చిన కొన్ని అనువాద కథలు: 
 
కసబ్.గాంధీ @ యారవాడ.ఇన్ – (సారంగ) – శాంతసుందరి 
కాపరి భార్య – (ఈమాట) – శారద
మా చిన్న చెల్లెలు – (సారంగ) – ఆరి సీతారామయ్య
(మల్లాది వేంకట కృష్ణ మూర్తి ఒక కథ అనువాదం చేసారు. ఆంధ్రభూమిలో వచ్చింది. పేరు గుర్తుకు రావడం లేదు.)  
 
3. మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు-
 
అపర్ణ తోట, చందు తులసి, మానస ఎండ్లూరి ఈ మధ్యనే కనిపించే రచయితలు. వీళ్ళకి రాయగలిగిన సత్తా ఉంది. 
 
కానీ వేరే అంశాలపైన శ్రద్ధ పెట్టడం వలన చెప్పదల్చుకున్న విషయం, ముఖ్యంగా కథా ప్రక్రియలో, ఇమడడం లేదు. 
 
ఎవరైనా సీనియర్ రచయితలు మార్గదర్శకం చూపిస్తే వీళ్ళు మంచి కథలు రాస్తారన్న ఆశ అయితే ఉంది. 
 
4. తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ  గలిగాయా?
 
పైన చెప్పినట్లు వస్తువుని దాటి కథ ముందుకెళ్ళడం లేదు. ఆ వస్తువుకి ప్రేరణ కూడా వార్తా కథనాలే. 
ఇవి దాటి సమాజంపైనా, జీవితాలపైనా పరిశీలన అన్నది కనిపించడం లేదు.   
ఇంగ్లీషుకథల్లో – ముఖ్యంగా అమెరికాలో – కథ చెప్పే పద్ధతి చాలా మారింది. వైవిధ్యమైన రీతుల్లో కథలు వస్తున్నాయి. ఉదాహరణకి పెంపుడు కుక్క ఇంట్లో వాళ్ళ కథ చెబుతుంది, తనదైన కోణంలో. అమెరికన్ కథతో తెలుగు కథని పోల్చడం కష్టం. 
 
5. మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?
ఇక్కడా అక్కడా అని లేదు.  ఎక్కడ కథ పడితే అక్కడే.
ఈ పత్రికలోనే మంచి కథలు వస్తాయి అన్న నమ్మకం ఎప్పుడూ లేదు. బ్లాగులో కూడా మంచి కథలు రావచ్చు.
పేరున్న పత్రికల్లో కూడా చెత్త కథలు వచ్చాయి. 
 
6.  కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?
తెలుగులో  కథా విమర్శ దాదాపుగా మృగ్యం. ఎవరైనా చెప్పాలనుకున్నా వినడానికి రచయితలు సిద్ధంగా లేరు. 
కథల బాగోగులు చెప్పే అలవాటు మనకి లేదు. వెబ్ పత్రికలు వచ్చాక కథకుడికీ, పాఠకుడుకీ తేడా పోయింది. 
వెబ్ పత్రికల్లో పాఠకులకంటే రచయితల కామెంట్లే ఎక్కువుగా ఉంటున్నాయి. 
రచయితలకి కామెంట్ల వ్యాధి సోకినట్లుంది. 
 
7.  కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?
రచయితల దృష్టంతా వీటిపైనే. తమ కథకూడా ఈ సంకలనాల్లో రావాలన్న తహతహ అయితే రచయిత్ల్లో బాగా కనిపిస్తోంది. 
అందులోకి ఎక్కడానికే అన్నట్లు కథా వస్తువులు కూడా ఎంచుకుంటున్నారు. కథా సంకలనాల్లో అచ్చైన కథల బాగోగులు 
ఏటా అచ్చేసే వారే చెప్పరు. అందులో వస్తే చాలు తమ కథ గొప్పది అన్న ధోరణికి ఈ సంకలనాలు నాంది పలుకుతున్నాయి. 
 
8.  మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా? 
నేను ఎక్కువగా ఇంగ్లీషు కథలు చదువుతాను. అమెరికన్ కథలకీ, మన కథలకీ చాలా వ్యత్యాసం ఉంది. 
ఉదాహరణకి – కథని ఒక దృశ్యంలా చూపిస్తూ రాస్తారు తప్ప, ఎక్కడా రచయిత పాత్రల్లోకి చొరబడడు. 
అనవసరమైన వర్ణనలూ, కవితాత్మకంగా వాక్యాలు రాయడం వంటివి ఉండవు. 
అలాగే కథల్లో వాడే భాష కూడా ఎంతో సరళంగా ఉంటుంది. భాషా పటాటోపం కనిపించదు.  
కథ చెప్పడానికి ఎన్నుకున్న కాన్వాసు కూడా ఎంతో మారింది. 

నీటి చెలమ

 

సానుకూలం

 

వినాలని ఎదురుచూసే వెదురు కోసం

వేణునాదమవుతుంది గాలి కూడా

కమ్మని కబురులతో తెమ్మెర సమీపిస్తే

తబ్బిబ్బై తలూపుతుంది పూలతీగైనా

నిశ్చలమై తటాకం నిరీక్షిస్తే

తూనీగ కూడా చిత్రాలు రచిస్తుంది

అడ్డంకులెదురైనా ఆగిపోక

తనకోసం పరుగెత్తి వచ్చిన సెలయేటికి

అవనత వదనయై ఆకుపూజ చేస్తుంది అడివమ్మ

చినుకులుగా ప్రేమను చిందించే మేఘం కోసం

అగరు ధూపమైపోతుంది అవని సమస్తం

తన కోసం నింగి నుంచి

నేలకు జారిన వానజల్లు

తాకీ తాకగానే

తటాకం తనువెల్లా పూలవనం!

స్పందించే హృదయానికి

ఎటు చూసినా సౌందర్యమే

ఎరుకంటూ ఉంటే

లోకమంతా సానుకూలమే!

*

నువ్వు……

 

 

నువ్వేమో నిరంతరం

ప్రయాణిస్తున్న దారివి

గమ్యం తెలిసిన రహదారివి

 

దట్టమయిన అడివిలో

ఆకుల సందుల్లోంచి రాలి పడుతున్న

విలుతురు ముక్కల దిక్సూచితో

సుధీర్ఘప్రయాణంలో సాగుతున్న వాడివి

 

రాళ్లూ రప్పలూ

లోయలూ పర్వతాలూ

నీకు చుట్టూరా పహారా

 

చీకటీ వెళ్తురూ

నీ చూపును చెదర్చలేవు

నీ నీడను మరల్చలేవు

 

రాత్రి చెంద్రున్ని ఇష్టపడ్డంతగా

పువ్వు పరిమళాన్ని శ్వాసించినంతగా

నువ్వు నీ విశ్వాసాన్ని ప్రేమించావు

దారీ నువ్వే నడకా నీదే

 

దేహాల్ని చిదిమేస్తే

మరణాలు సంభవిస్తాయా

 

చెట్టు కొమ్మల మీద

పూల రెమ్మల మీద

నీ పాటింకా వినిపిస్తూనేవుంది

 

తడి వున్న గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే వుంది

అంతర్లయగా వ్యాపిస్తూనే వుంది.

 

దృశ్యాదృశ్యం

seetharam3

ఒక విషాద ప్రదోష  రూపకం!

“చెమటచుక్క నేల రాలకుండా డబ్బులె ట్టొస్తయ్యిరా?”

నమ్ముకొన్న సేద్యం చట్టుబండలై చేసిన అప్పులు మెడకు గుదిబండలై వుమ్మడి కుటుంబం విచ్ఛిన్నమై తమవాటా పొలం తెగనమ్ముకొని బతుకు తెరువు కోసం పల్లె నుంచి పట్నానికి వలస వచ్చి కొత్త వంచనల వూబిలో కూరుకుపోయిన నిస్సహాయురాలైన వొక  స్త్రీ సంధించిన ప్రశ్న యిది.

సాహిత్యంలో  వాస్తవికత , సామాజిక వాస్తవికత వంటి పదాలు మన నోళ్ళలో బాగా నలిగిన పదాలే అయినప్పటికీ వాటిని లోతుగా అర్థం చేసుకొన్న రచయితల సంఖ్యతక్కువ. చాలామంది సమాజంలో చోటుచేసుకొన్న మార్పుల్ని యథాతథంగా చిత్రించడం దగ్గరే ఆగిపోతున్నారు. సమాజంలో భిన్నసమూహాల మధ్య యేర్పడుతోన్న/మృగ్యమౌతోన్న మానవసంబధాల్నిశాసించే శక్తుల్ని , సమాజ చలన సూత్రాల్ని కొద్దిమంది రచయితలు మాత్రమే సాహిత్యంలో ఆవిష్కరించగల్గుతున్నారు. తమచుట్టూ వేగంగా చోటుచేసుకొనే మార్పుకి కారణాలు తెలుసుకొనే లోపు దిగ్భ్రమకు గురిచేసే మరో మార్పు సంభవిస్తోంది. ఆ దిగ్భ్రమ నుంచి బయటపడవేసి మార్గదర్శనం చేయించగల సమ్యగ్ దృక్పథాలకు రచయితలు ఆమడ దూరంలో నిల్చుంటున్నారు. ఒక దృక్పథం కల్గి వుండటమే  సాహిత్యనేరం అన్న ఆధునికోత్తరవాదాలకు  లోబడి రచయితలు గందరగోళానికి గురౌతున్నారు. దృక్పథరాహిత్యాన్ని స్వేచ్ఛగా భ్రమింపజేయడంలో ఈ వాదాలు కొంత మేరకు సఫలమయ్యాయి. అటువంటి సందర్భంలో ప్రజాస్వామిక సంస్కృతితో కూడిన ఒక ప్రాపంచిక దృక్పథానికి నిబద్ధుడై సాహిత్య సృజన చేస్తోన్న రచయిత మంచికంటి.

ఇన్నాళ్ళూ తానూ నమ్మిన భావజాలాన్ని కవితద్వారా కథద్వారా మనతో పంచుకొన్న మంచికంటి యిదిగో యీ నవలతో రంగమ్మ వేసిన ప్రశ్నగా మనముందు నిలబడ్డాడు. ప్రశ్న చిన్నదే. సమాధానం అంత తేలికయిందేమీ కాదు. అదొక ‘చిదంబర రహస్యం’. రాత్రులకు రాత్రులే కోట్లకు పడగలెత్తే కార్పోరేట్ బడా బాబులకే తెలుసు ( అది అంబానీలు కావొచ్చు; జిందాళ్ళు కావొచ్చు; నిమ్మగడ్డ , రామోజీలు కావొచ్చు ). వీళ్ళే పాలకవర్గ రాజకీయాల్ని శాసిస్తున్నారు. క్విడ్ ప్రో కో లకు వూపిరిపోస్తున్నారు. దేశసంపదని సొంతం చేసుకొని బయటకు తరలిస్తున్నారు. బయట నుంచి  తెచ్చిన రుణాల్ని వుదారంగా పంచుకొంటున్నారు.

పోయిన శతాబ్ది చివరి దశకంలో మొదలైన వుదార ఆర్ధిక విధానం వుత్పత్తితో సంబంధంలేని ఆర్ధిక వ్యవస్థని బలోపేతం చేసింది. గ్లోబలీకరణ పేరుతొ దేశ సార్వభౌమత్వాన్ని వశపర్చుకొన్న సామ్రాజ్యవాదానికి జాతీయ బూర్జువా దళారిగా రూపొందింది. సాంప్రదాయిక పెట్టుబడీదారి వ్యవస్థ స్థానే ‘సేవారంగం’ బహుముఖాలతో ముందుకొచ్చింది.  దోపిడి రూపం మారింది. వ్యవసాయ – పారిశ్రామిక కార్మికుల ప్రత్యక్ష శ్రమతో సంబంధంలేని బ్యాంకింగ్ , ఇన్సూరెన్స్,   షేర్ మా ర్కెట్  వంటి రంగాలే ప్రధాన ఆర్ధిక వ్యవస్థ అని మేధావుల్ని సైతం భ్రమ పెట్టే స్థాయికి దేశీయ పెట్టుబడిదారులు దిగజారారు. వారికి తాబేదార్లైన పాలకులు అంతర్జాతీయ మార్కెట్ కి తలుపులు బార్లా తెరిచారు.ఇదే అదనుగా బహుళ జాతి కంపెనీలు దేశంలోని వుత్పత్తి – వుపాధి రంగాల్ని హస్తగతం చేసుకొన్నాయి. దీని ప్రభావం కేవలం నగరాలకూ పారిశ్రామికోత్పత్తులకూ పరిమితం కాలేదు. పల్లెల్లోకి సైతం పెట్టుబడులు ప్రవేశించాయి. విత్తనాలు, యెరువులు , పురుగు మందులు … అన్నీ యమ్మెన్సీల అధీనంలోనే వుండటంవల్ల వ్యవసాయం పెనుముప్పుని  యెదుర్కొంటుంది.  రైతుకు  సేద్యం బరువైంది.  వ్యవసాయ భూములు వ్యాపారపు సరుకయ్యాయి. భూమి పైనా  లోపలా వున్న ప్రకృతి సంపద పరాధీనమైంది. ఈ వ్యవహారామంతటికీ ముద్దుపేరు అభివృద్ధి. పాలకుల అవినీతి అభివృద్ధి ముసుగు తొడుక్కొంది. సమాజలోని అన్ని రంగాలనీ నాశనం చేసే ఈ విపత్తుని యెదిరించి నిలవరించి పోరాడే శక్తులకు నాయకత్వం వహించాల్సిన కార్మిక వర్గం ట్రేడ్ యూనియనిజానికి పరిమితమైంది. సమస్త అస్తిత్వాల్నీ కోల్పోతున్న బడుగు జీవులు బతికే హాక్కు కోసం చేసే పోరాటాలు పాశవికమైన అణచివేతకు గురవుతున్నాయి.

ఇదంతా వొక విషాద ప్రదోష రూపకం. ఈ విధ్వంసాల చీకటిని చూసి దృశ్యమానం చేయడానికి ముందువరసలో నిలబడ్డ రచయితల్లో మంచికంటి వొకడు. ఈ నవల్లో రంగమ్మ ముఖత: లేవనెత్తిన వొక్క ప్రశ్న ద్వారా రచయిత  దేశంలో పకడ్బందీగా అమలవుతోన్న వ్యవస్థీ కృత దౌష్ట్యం లోతుల్లోకి దృష్టి సారించేలా చేస్తున్నాడు. తన ప్రాంత ప్రజల మధ్య వుంటూ తన పల్లె మూలాల్ని కాపాడుకొంటూ జీవితాల్ని అతలాకుతలం చేస్తోన్న ఆధునిక ఆర్ధిక దోపిడీల స్వభావాన్ని బహిర్గతం చేయడానికి అతను సాహిత్యాన్ని వొక సాధనంగా యెన్నుకొన్నాడు.

ఒంగోలు పల్లె పట్టులు  మంచికంటి సాహిత్య – సామాజిక కార్య క్షేత్రాలు. మట్టిని తొలుచుకు వచ్చిన ఆ ప్రాంతపు మనుషులే అతని రచనలకు జీవం పోస్తారు. వారి నిత్య జీవిత సంఘర్షణే అతని సాహిత్యానికి ప్రధాన వనరు. విచ్ఛిన్నమౌతోన్న గ్రామీణ వ్యవస్థ , తలకు మించిన మదుపులతో కునారిల్లుతోన్న వ్యవసాయం , అప్పుల పాలైన రైతుల ఆత్మహత్యలు , బతుకులు బుగ్గై కొంపా గూడూ వొదులుకొని దగ్గర్లోని పట్టణానికో నగరానికో వలసపోయే రైతు కూలీల దుర్భర దారిద్ర్యం , కొత్త జీవనోపాధుల్లో , పరిసరాల్లో యిమిడే నేర్పు లేక వారనుభవించే మానసిక వేదన , పట్టణారణ్యంలో దారితప్పి క్రూరమృగాల బారిన పడే నిస్సహాయత – వీటన్నిటికీ మంచికంటి ప్రత్యక్ష సాక్షి. తాను విన్న కన్న స్వయంగా అనుభవించిన వాటి ద్వారా యేర్పరచుకొన్న ప్రాపంచిక దృక్పథం నుంచి ఆ కల్లోలాన్ని వొక సృజనాత్మక రచయితగానే గాక వొక సామాజిక శాస్తవేత్తగా కూడా మంచికంటి వ్యాఖ్యానిస్తాడు , విశ్లేషిస్తాడు. ఒంగోలు ప్రాంత నిర్దిష్టతలోంచి వచ్చినప్పటికీ అతని రచనల్ని ప్రపంచీకరణ నేపథ్యంలోంచే చూడాలి. ప్రపచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రతిఫలనాలు , ప్రకంపనలు స్థానీయ జన జీవితాల్ని అస్తవ్యస్తం చేసిన వైనాన్ని మంచికంటి అద్భుతంగా పట్టుకొన్నాడు. కథల్లో కంటే అది నవల్లో విస్తృతమైన కాన్వాస్ మీద ఆవిష్కారమైంది.

2005 లో అనుకొంటా –  తానా నవలల పోటీకి ‘గబ్బ గీము’ పేరుతొ వచ్చిన యీ నవలని నేను తొలిసారి చదివా. ముందుగా నన్ను కట్టిపడేసింది అందులోని భాష. తర్వాత నవలా నిర్వహణకి రచయిత యెన్నుకొన్నశిల్పం. బహుమతికి అర్హమైన  నవలని యెంపిక చేయడంలో బాధ్యులుగా అంపశయ్య నవీన్ కీ నాకూ మధ్య యీ నవలలోని భాషా శిల్పాలపైనే ప్రధానమైన చర్చ జరిగినట్టు జ్ఞాపకం( ఆ తర్వాత ‘చీకటి వలయాలు’ పేరుతొ యీ నవల చతురలో ప్రచురితమైంది).  ఒంగోలు – కర్నూలు రోడ్డు మీద పట్టణవిస్తరణలో కల్సిపోయిన పల్లె కాని పల్లె పేర్నమిట్టలో పాక హోటలు నడుపుకొనే రంగమ్మ అనే గ్రామీణస్త్రీ జీవితాన్ని బొమ్మకట్టించే క్రమంలో మూడుతరాల సామాజిక చరిత్రని రికార్డు చేయడం మంచికంటి ఈ నవల రాయడంలో ప్రధానలక్ష్యం కావొచ్చు; కానీ ఆ చరిత్ర అంత కష్టభూయిష్టంగానూ దు:ఖభాజనంగానూ వుండటానికి కారణాలేంటని అంతస్సూత్రంగా ప్రశ్నించడం నవల అంతటా  కనిపిస్తుంది. పుట్టినింట మెట్టినింట రంగమ్మ అనుభవించిన సుఖదు:ఖాల  వెనక – ఆమె జీవితాన్ని ఆ విధంగా నడిపించిన దృశ్యాదృశ్య శక్తుల అన్వేషణవైపు ఆలోచించేలా చేయడం మరో ఎత్తుగడగా అనిపించించింది.

రంగమ్మ పుట్టినింటి కంటే మెట్టినిల్లు అన్నివిధాలా మెరుగైందే. కానీ పల్లెల్లో ఎన్నో కుటుంబాల్లగానే ఆమె వుమ్మడికుటుంబం కూడా విచ్ఛిన్నమైంది. అయితే పచ్చికుండలా ఆ కుటుంబం అలా విచ్చిపోడానికి నిర్దిష్టమైన భౌతిక కారణాలున్నాయి. రొయ్యలచెరువులు ‘కమ్మని వొరి పండే పొలాల్ని నాశనం చేసాయి’. పచ్చని కాపురాల్ని కూలదోశాయి.  ఇంటిపట్టునుండి చిన్నదో చితకదో వుద్యోగం చేస్తూ వున్నకమతం చూసుకోనేవాళ్ళు – గ్రానైట్ తవ్వకల్లోకి దిగారు. ఆహార ధాన్యాల పంటలు తగ్గి పొగాకు పత్తి వంటి వ్యాపార పంటలు వ్యవసాయంలో పెట్టుబడుల్ని విపరీతంగా పెంచేశాయి. నకిలీ విత్తనాలూ పురుగుమందులూ కల్తీ యెరువులూ యేదీ రైతు చేతిలో లేకుండా పోయింది.ఆఖరికి నేలలో వేయాల్సిన పంటని కూడా యెవరో యెక్కడనుంచో తెలియకుండానే నిర్దేశిస్తారు. పండిన పంటకి సరైన ధర వుండదు.ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయం జూదమయ్యకా – నడ్డి విరిగిన రైతులకు పురుగు మందులు చావుకే వుపయోగపడతాయి. చేసిన అప్పులు పీకలమీదకొచ్చి అయినకాడికి పొలాలమ్ముకొని రైతు రోజువారీ కూలీగా మారతాడు. రంగమ్మ కుటుంబంలో జరిగిన ఈ హింస సమాజం అంతటా చోటుచేసుకొన్నదే.

ఓడిపోయిన జీవితాన్ని గెలవాలనే పట్టుదలతో పట్టణానికి ‘వలస’ పోయి – అక్కడ దిక్కులేని బతుకు బతకాల్సి వస్తుంది. ‘ఉండూళ్ళో పస్తులుండా నలుగురు మనోళ్ళ మధ్యన ఉండామన్న ధైర్యమన్నా ఉండేది. ఈడ చచ్చేమా బతికేమా అని విచారించేవాళ్ళు కూడా లేకపోతిరి.’   పట్టణ జీవితంలోని సంక్లిష్టతని అర్థం చేసుకొనే లోపే అన్ని విధాలా పతనం కావడం సంభవిస్తుంది.

శ్రమతో సంబంధంలేని డబ్బు చలనం పట్టణంలో ఎక్కువ. విపణి సంస్కృతి , యీజీ మనీ వెంపర్లాట , అవసరంలేని ఆడంబరాలు , కొత్త వ్యసనాలు – వెరసి  నాగరికత మనిషిని పణ్య వస్తువుని చేస్తుంది. అన్ని విలువల్నీ మింగేస్తుంది. అప్పులూ  వడ్డీలపై వడ్డీలు రోజువారీ వడ్డీలూ చిట్టీలూ మైక్రో ఫైనాన్స్ లూ షేర్ బ్యాంక్ లూ పొదుపు సంఘాలూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులూ పుట్టింటి పట్టుచీరా – మా ఇంటికిరా చెల్లీ స్కీం లూ గోల్డ్ గేట్లూ పీర్ లెస్ లూ బాండ్ లూ – ఇదంతా వొక విషవలయం( ఒక్క ఒంగోల్లోనే 500 ఫైనాన్స్ కంపెనీలు వున్నట్లు నవల్లోనే ఒక చోట రచయిత పేర్కొంటాడు ) .  వలపన్నే వేటగాళ్ళ దోపిడీ బహుముఖాలుగా సాగుతుంది. ఒకప్పుడు  ‘ ఫైనాన్సోళ్ళ దెబ్బకి మొగోళ్ళు  ఉరిబెట్టుకున్నట్టు ఇప్పుడు ఆడయ్యి కూడా రాలి ’ పోవడం నిత్య విషాదం. ఇది కొత్త పరిణామం. ఈ క్రమంలో ముఖ్యంగా స్త్రీలే యెక్కువ బలయ్యారు. రంగమ్మలా పల్లెనొదిలి వచ్చిన స్త్రీలందరిదీ వొకే హృదయవిదారమైన కథ. రమణమ్మ ,జయమ్మ, శేషమ్మ , పద్మ , సామ్రాజ్యం , సుశీల , నాగమ్మా – అందరూ తెలిసో తెలియకో పోగొట్టుకొన్నదాన్ని పొందాలనే ‘కసి’ తో అన్నివిధాలా వోడిపోయినవాళ్ళే. ఇంటా బయటా స్త్రీలు ‘వొళ్లిరగ దీసుకొని రూపాయి సంపాదించడానికి కష్టపడుతుంటే’ ‘కాలు కదపకుండా కడుపు నిండాలన్నట్టు’ మగవాళ్ళు నిర్వ్యాపారులై దుర్వ్యసనాలకు బానిసలై అనారోగ్యాల పాలై మృత్యుశకటాలవుతున్నారు .

మంచికంటి వర్ణించిన యీ చీకటి జీవితం కేవలం రంగమ్మది మాత్రమే కాదు. ‘ఒక బెట్ట ప్రాంతంనుంచి’ వచ్చిన రచయితగా అతను దీన్ని సాహిత్యీకరించినప్పటికీ – యిది  వొక్క ఒంగోలుకే పరిమితమైన చరిత్రా కాదు. దేశంలో యే మూలకెళ్ళినా యిదే పరిస్థితి.

మార్పు వొక్కసారిగా రాలేదు గానీ 90 ల నుంచి మార్పు త్వరితమైంది. ఆర్ధిక సంస్కరణల అమలు వేగవంతం అయ్యాకా సామాన్యుడు కన్స్యూమరిజం శ్లేష్మంలో ఈగగా మారాడు. విలాసాల్ని  అవసరాలుగా భ్రమింపజేయడంలో మార్కెట్ శక్తులు విజయం సాధించాయి. దేశం పెద్ద సరుకుల సంతయింది. లేని అవసరాల్ని సృష్టించడం – వాటిని తీర్చుకోడానికి ‘రుణ సదుపాయం’ కల్పించడం – దీంతో దేశపౌరుడు వొక వస్తువ్యామోహం వూబిలోకి కూరుకుపోయాడు. ఉన్నది తినడం కాకుండా అప్పు చేసైనా లేనిది కొని అనుభవించడం మధ్యతరగతి జీవిత విధానమైంది. బ్యాంకింగ్ రంగంలోకి డెబిట్ కార్డ్ కన్నా ముందు క్రెడిట్ కార్డ్ ని వినియోగంలోకి తేవడం వెనక పెద్ద మార్కెట్ కుట్ర వుంది. ప్రభుత్వ నూతన విధానాల అండతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలూ చిట్ ఫండ్ లూ వడ్డీ వ్యాపారాలూ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. వెంటబడి అప్పులిచ్చేదీ – ‘ బళ్ళేసుకుని ఊళ్ళమీదబడి వొడ్డీలకు వొడ్డీలు వొడ్డీలకు వొడ్డీలు కట్టి బెదిరిచ్చి వొసూలు చేసుకొనేది.’   పల్లె పట్నం తేడా లేకుండా ‘ కూలికి విషం తాగే  మనుషులు’ తయారయ్యారు. మనుషులు అన్ని విలువలకీ దూరమయ్యారు.

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్ని  సూక్ష్మదృష్టితో విశ్లేషించడం – గడిచిన కాలంతో పోల్చడం నవల పొడవునా కనిపిస్తుంది.నవల్లో రంగమ్మ ఆలోచనలు గతానికీ – వర్తమానానికీ మధ్య ఆసులో కండెలా తిరుగుతూ వుంటాయి. కావలి – ఒంగోలు మధ్య బొగ్గు బస్సులు నడిచిన రోజుల దగ్గర్నుంచీ – యివ్వాళ కాలేజీ ఆడపిల్లల్ని మోసం చేసి బ్లూ ఫిల్ముల చిత్రీకరణ దశ వరకూ దాదాపు 60 , 70 యేళ్ళ పల్లెల – పట్నాల సామాజిక చరిత్రని రికార్డు చేయడానికి రచయిత యెన్నుకొన్న శిల్పం అపూర్వం కాదు గానీ గత – వర్తమానాల కలనేతలో కథాగమనాన్ని కుంటూ పడనీకుండా , వస్త్వైక్యత దెబ్బతినకుండా నవలని నిర్వహించడం బహుధా ప్రశంసనీయం.

వర్తమాన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లాడే రంగమ్మ ప్రతి సందర్భంలోనూ గతాన్ని నెమరేసుకొంటుంది – యిప్పటి పరిస్థితుల్నీ మనుషుల్నీ వెనకటి రోజుల్తో మనుషుల్తో బేరీజు వేసుకొంటుంది. గత – వర్తమానాల మధ్య చేసే యీ ప్రయాణంలో సామాజిక – ఆర్ధిక విషయాలే గాక సాంస్కృతిక అంశాలు కూడా అలవోకగా వచ్చి చేరాయి. అది రంగమ్మ బాల్య జ్ఞాపకం సింగరాయకొండ తిరణాల కావొచ్చు ; ఆమె పెద్దమనిషయినప్పటి సమర్త బంతి కావొచ్చు ; వూరంతా వొకటై సంబరంగా జరిపిన పెళ్ళి కావచ్చు – అప్పటికీ యిప్పటికీ సంస్కృతిలో వచ్చిన మార్పులు అద్భుతంగా ఆవిష్కారమయ్యాయి. ఈ టెక్నిక్ ద్వారా నవల ప్రకాశం జిల్లా స్థానీయ సామాజిక చరిత్రతోబాటు సాంస్కృతిక చరిత్రను నిర్వచించుకోడానికి సైతం చక్కగా దోహదపడుతుంది.

ఈ స్థానీయ సామాజిక – ఆర్ధిక – సాంస్కృతిక  చర్రిత్రని మనకందిచడానికి మంచికంటి అక్కడి సమాజంలోకి , ప్రజా సమూహంలోకి మనల్ని చెయ్యి పట్టి లాక్కుపోతాడు. అందుకతను స్థానీయభాషని మాధ్యమం చేసుకొన్నాడు.ఈ ప్రాంతపు జనుల జీవద్భాష యింతకు మునుపు సాహిత్యంలోకి యింతగా యెక్కిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతపు భాషే కాదు – ప్రామాణిక భాష ఆధిపత్యం కింద నలిగి ప్రజల సాంస్కృతిక భాషలు దశాబ్దాలుగా సాహిత్యంలో స్థానం పొందలేకపోయాయి. ఇదొక చారిత్రిక విషాదం. రెండున్నర జిల్లాల భాషా ఆధిపత్యం గురించి తెలంగాణా రాయలసీమ సాహిత్యకారుల ఆందోళన ప్రాంతీయ అస్తిత్వ స్పృహ కారణంగా వెలికి వచ్చింది గానీ అదే సమయంలో ఆ రెండున్నర జిల్లాల్లోనే అట్టడుగు వర్గాల భాష కూడా సాహిత్యంలో నిరాదరణకే గురైందన్నది గమనించాల్సిన విషయం . తెలంగాణా రాయలసీమా ఉత్తరాంధ్రాల నుంచి రచయితలు  తమ సొంత భాషల్లో గొంతు విప్పుకొన్న కాలంలో కోస్తా ప్రజల సాంస్కృతిక భాషని పలికించడంలో అక్కడి రచయితల గొంతులు మూగవోయాయి . ప్రజల నోటి భాషని యాసతో సహా మాగోఖలేలా శిష్ట సాహిత్యంలోకి వొంపిన వాళ్ళు ఇటీవలి కాలంలో కరువయ్యారు ( కొలకలూరి ఇనాక్ , కళ్యాణ రావు , పాపినేని  లాంటి వొకరిద్దరు యిందుకు కొంతమేరకు మినహాయింపు) . అందువల్ల జరిగిన అనర్థం అంతా యింతా కాదు. భిన్న ప్రజా సమూహాల భాషలకు ప్రామాణిక భాష దూరమైపోయింది. బడిపలుకులు – పలుకుబడులు వేరయిపోయాయి. ఆ కారణంగానే ప్రజల భాష ద్వారా వ్యక్తమయ్యే సాంస్కృతిక వైవిధ్యం కూడా మరుగున పడిపోయింది. అన్ని ప్రాంతాల – వర్గాల భాషల్ని తనలో కలుపుకొని  ఎదగాల్సిన ప్రామాణిక భాష – అందుకు విరుద్ధంగా కుదించుకుపోయింది. ప్రజా వుద్యమాలతో సంబంధం వున్న రచయితలు యీ లోటుని పూడ్చడానికి పూనుకొన్నారు. గ్రామీణ ప్రజా సంబధాలు కాపాడుకొన్న రచయితలు మాత్రమే ఆ యా స్థానీయ భాషల సొబగుల్ని సృజనాత్మక సాహిత్యం ద్వారా తక్కిన ప్రాంతాలకు అందించగలిగారు.

సాహిత్య భాషలో యేర్పడ్డ యీ ఖాళీని పూరించడానికి చొరవ చూపినవాళ్ళలో మంచికంటికి ప్రత్యేక స్థానం వుంది. కాట్రగడ్డ దయానంద్ , మంచికంటి లాంటి రచయితలు తమ కథల్లో వాడిన ప్రకాశం జిల్లా తూర్పు ప్రాంతపు ప్రజల భాష  తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేసింది. మంచికంటి యీ నవల్లో వుపయోగించిన భాష భాషా అస్తిత్వాల గురించి నాలో చాలా కాలంగా గూడు కట్టుకొని వున్న ఆలోచనల్ని మీతో పంచుకొనేలా చేసింది.

మంచికంటి భాష అక్కడి ప్రజల వ్యావసాయిక సంస్కృతిలోని మట్టి పరిమళాన్ని మోసుకొచ్చిన కమ్మ తెమ్మెరలా వుంది. స్వచ్ఛమైన ఆ పరిమళాన్ని గుండె నిండా పీల్చుకొనే అవకాశం యెంతో కాలం కోల్పోయాం గదా అని నవల చదివిన ప్రతిసారీ అనిపించించింది. తన భాషలోని యాసనీ వ్యక్తీకరణ రీతుల్నీ అక్షరీకరించడంలో కూడా మంచికంటి  యెంతో నేర్పు చూపాడు. రచయిత ప్రజల పక్షాన నిలబడ్డాడనడానికి అతని భాష కూడా ప్రమాణమే.

బతుకులో అనునిత్యం సంఘర్షించే ప్రజల ధిక్కారస్వరమే వాళ్ళ భాషలో వినిపిస్తుంది. అది మండే భాస్వరంలా వుంటుంది. తన చుట్టూ వున్న సమాజంలో నిప్పుల మీద నడుస్తూ మొండిగా జీవిస్తోన్న మనుషుల ఆ ధిక్కారస్వరాన్ని గట్టిగా పట్టుకొన్న మంచికంటి దాన్ని సాహిత్య రూపంలోకి తర్జుమా చేసి మనకందిస్తున్నాడు. తాను పుట్టి పెరిగిన నేల రుణం యీ విధంగా తీర్చుకొంటున్నాడు. చల్లారిన సంసారాలూ ఛిద్రమైన బతుకులూ బలవంతపు పడుపు వృత్తులూ డబ్బు ప్రధానమై చిట్లిపోయిన మానవ సంబంధాలూ మార్కెట్ మాయాజాలంలో మాయమపోతున్న మనిషితనం … సమాజం క్రూరంగా దుర్భరంగా తయారయినప్పుడు , ‘విలువిద్యగాళ్ళుసైతం నేల నాలుగు చెరగులా వేయికాళ్ళతో విస్తరించి ఉన్న స్వార్థ భూతం ప్రలోభాలకు లోనైపోతున్నప్పుడు నిజంగా ఒక మనిషి వైపు ఒక   సామాన్యుడి వైపు కదా నిలబడి కల కనాల్సింది’ యే సాహిత్యకారుడైనా! అలా విశ్వసించినందువల్లే మంచికంటి తన నవల్లో బాధితుల పక్షాన వాళ్ళ కడగళ్ళ జీవిత అస్తిత్వాల్ని రూపు కట్టించగలిగాడు. కుటుంబ నిర్వహణలో అనునిత్యం స్త్రీలు శారీరికంగా మానసికంగా  యెదుర్కొంటున్న దుర్భర హింసని గొప్ప ఆర్తితో చిత్రించగలిగాడు. రచయిత ఆర్తి మన గుండెలోకి కూడా పరివ్యాప్తమౌతుంది. ఆ స్త్రీల ఆవేదనలో మనం కూడా  మగ్నమౌతాం.

సుబ్బులమ్మ – రంగమ్మ – సుధారాణి,సుజాత – మూడు తరాల్లో స్త్రీలు తమ చేతుల్లో లేనిదాన్ని దేన్నో పట్టుకోవాలనే ప్రయత్నం చేసారు. కానీ జీవితం అందినట్టే అంది వారి చేజారి పోయింది. సుబ్బులమ్మ గతం, రంగమ్మ వర్తమానం , సుధారాణి,సుజాతల భవిష్యత్తు అంతా అంధకార బంధురమే. అందుకే నవలంతా తీవ్రమైన దు:ఖం పరచుకొని వుంటుంది. అయితే అడుగడుగునా యెన్ని యెదురుదెబ్బలు తగిలినా రంగమ్మ గుండె దిటవు కోల్పోదు. నైరాశ్యానికి గురికాలేదు( నిలవ నీడ కోసం లైంగిక దోపిడీకి గురైంది , భర్త దేశాలు పట్టి పోయాడు , కొడుకు అనారోగ్యంతో బాధపడుతూ వుంటాడు , ముక్కుపచ్చలారని వయస్సులోనే కూతుళ్ళు పురుషుల వంచనా ప్రపంచంలో అభద్రతా అంచుల మీద స్వారీ చేస్తుంటారు ). ఆమె పోరాటానికి అంతం లేదనే నవల ముగింపు చెబుతుంది. నిజానికి కథ పూర్తి  కాలేదు – మళ్ళీ మొదలైంది.

‘ఒక పక్క రైతుల చావులు , ఒక పక్క ఎన్ కౌంటర్లంటూ నక్సలైట్ల చావులు , మరో పక్క ఘోరంగా ఆడ కూతుర్లను చేర్చి శవాలుగా మార్చడాలు’   – వీటన్నిటి మధ్య ‘ తలగుడ్డలు రోడ్డెక్కినయి. పొలంలో ఉండాల్సిన తలగుడ్డల్ని గవర్నమెంటు రోడ్డెక్కేలా  చేసింది’. పల్లె నుంచి వలసపోకుంటే  రంగమ్మ భర్తతోపాటు తలగుడ్డలతో కల్సి నడిచేదేమో! ఎప్పటికైనా రంగమ్మయినా మనమయినా కలవాల్సిన సమూహం అదే. అటువంటి సామూహిక ప్రతిఘటన మాత్రమే రంగమ్మ లాంటి స్ర్తీలు ఆత్మగౌరవంతో తలెత్తుకు నడవడానికీ , అన్ని చావుల పరిష్కారానికీ తోవ చూపుతుందనీ చిమ్మచీకటిలో వెలుగు రేకల్ని ప్రసరింపజేస్తుందనీ నా నమ్మకం. ఈ నవల చదవడం ద్వారా నాకా నమ్మకాన్నికల్గించినందుకు మంచికంటికి అభినందనలు.

ఒంగోలు పక్కన పేర్నమిట్ట బాట పట్టే ముందు వొక్క మాట –

చీకటికి భయపడేవాళ్ళెవరూ చీకటిని గెలవలేరు. సెలవ్.

విశ్వనాథ నుంచి మిచెల్ దాకా…

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-9

*

దేశాలు, మనుషులు, సంస్కృతులు, సాహిత్యాలు, భాషలు వగైరాలలో భిన్నత్వం ఉంటుంది, నిజమే. కానీ ఏకత్వమూ ఉంటుంది. ఎంచి చూస్తే ఏకత్వమే ఎక్కువ ఉంటుందేమో కూడా.  కొందరు కేవలం భిన్నత్వాన్నే చూడడం, కొందరు ఏకత్వాన్ని కూడా చూడగలగడం వారి దృష్టి భేదాన్ని మాత్రమే సూచిస్తుంది. సగం నిండిన గ్లాసు ఉదాహరణతో చెప్పుకుంటే, కొందరికి నిండిన అర్థభాగం కనిపిస్తే, మరికొందరికి ఖాళీగా ఉన్న అర్థభాగం కనిపిస్తుంది.  వేయిపడగల రచయిత ఫ్రాక్ పశ్చిమ సాహిత్యాలలోనూ సంస్కృతీ, ఆచార వ్యవహారాలలోనూ, మనుషుల ప్రవర్తనలోనూ అంతటా భిన్నత్వమే చూస్తాడు. అందులోనూ శ్రేష్టతా, న్యూనతా అన్న తారతమ్య దృష్టిని ప్రదర్శిస్తాడు.  అది ఒక్కోసారి హాస్యాస్పదంగా కూడా పరిణమిస్తుంది. ఉదాహరణకు, ఒక విషాద ఘటనను ప్రస్తావించి దానిపై పాశ్చాత్యులైతే “బ్యూటిఫుల్ బ్యూటిఫుల్” అని స్పందిస్తారని ఒకచోట ఎద్దేవా చేస్తాడు. అది జాతులు, వారి మనః ప్రవృత్తులు, భాషలు, వ్యక్తీకరణల మధ్య తేడాగా సూత్రీకరిస్తాడు.

నిజానికి ఒక విషాదఘటనపై పాశ్చాత్యులందరి స్పందనా ఆ మాటలోనే వ్యక్తమవుతుందని చెప్పడం శ్రుతిమించిన సాధారణీకరణే. అదీగాక ఒక సృజనాత్మక వ్యక్తీకరణపై, అందులోని వస్తువుతో సంబంధం లేకుండా అలాంటి స్పందన, మన దగ్గర సహా సార్వత్రికంగా కనిపిస్తుంది. ఒకవిధంగా వేయిపడగల రచయిత చేసిన సాధారణీకరణ రససిద్ధాంతానికే వ్యతిరిక్తం. శోక, బీభత్స, వీరరసాదులు వస్తువుగా ఉన్న కావ్య, నాటక, చలనచిత్రాలను మనం పనిగట్టుకుని చదివి, దర్శించి అనుభవిస్తున్నామంటే కారణం, వాటి వెనుక ఉన్న సృజనాత్మక ప్రతిభా వ్యుత్పత్తులు కలిగించే ముగ్ధత్వమే. ఆ ముగ్ధత్వాన్ని ఎవరైనా సరే రచయిత ఎద్దేవా చేసిన మాటలో కాకపోతే, తత్తుల్యమైన మాటల్లోనే వ్యక్తీకరిస్తారు.

భిన్నత్వాన్ని మాత్రమే చూసే దృష్టి మహాకవులను, పండితులను కూడా ఇలాంటి అతార్కిక, అసంబద్ధ నిర్ధారణలవైపు నడిపిస్తుంది. కేవలం భిన్నత్వాన్ని, అందులోనూ శ్రేష్టతా, న్యూనతా అనే తారతమ్య వివేచననే కొలమానాలుగా తీసుకున్నప్పుడు ఆయా దేశాలు, భాషల వారు ఎవరి సాహిత్యాన్ని వాళ్ళు ఆనందించవలసిందే తప్ప ఇంకొకరివి ఆనందించే అవకాశం ఉండదు. కానీ అలా జరగడం లేదు. పాశ్చాత్య సాహిత్యం వైపు మనం ఆకర్షితులైనట్టే ప్రాచ్య సాహిత్యం వైపు వారూ ఆకర్షితులు కావడం సార్వజనిక వాస్తవం.  భిన్నత్వాన్ని కేవలం ‘వారు వేరు, మేము వేరు’ అని విడగొట్టడానికి కాక, పరస్పరపూరకానికి అవకాశమిచ్చే జాగాగా అర్థం చేసుకున్నప్పుడు దృష్టి మారుతుంది. అప్పుడు దేశాలు, మనుషులు, సంస్కృతులు, సాహిత్యాల వెనుక ఏకత్వాన్ని దర్శించే వీలు కలుగుతుంది. ప్రత్యేకించి సాహిత్యం ప్రతిఫలించే మానవ అనుభవం నిండా ఏకత్వమే ఉంటుంది.

చరిత్రలోకి వెళ్ళి చూస్తే, భిన్నత్వం మనుషుల్ని విడగొట్టి ఘర్షణకూ, యుద్ధాలకూ దారి తీయించిన అనుభవాలు ఉన్నట్టే;  ప్రపంచంలోని భిన్న భిన్న సమాజాలు, వ్యక్తులు మానవ అనుభవంలోని ఏకత్వాన్ని దర్శిస్తూ; భిన్నత్వాన్ని పరస్పర పూరకమైన ఒక అవకాశంగా చూస్తూ ఒకరికొకరు దగ్గరై పరస్పరం వికాసం చెందిన అనుభవాలూ ఉన్నాయి. విశ్వనాథ వంటి గొప్ప సృజనశీలి, సాహిత్యమర్మజ్ఞుని దృక్పథాన్ని భిన్నత్వం విశ్వరూపంలో కమ్మేసి ఆయన చేత అతార్కికమైన, సంకుచితమైన నిర్ధారణలు చేయించిందంటే కారణం; నాటి చారిత్రక, సామాజిక నేపథ్యం. వలసపాలనలో ఆత్మన్యూనతలో మగ్గుతున్న జాతి ఆ న్యూనతా భావననే ఆధిక్యంగా మలచుకోడానికి ప్రయత్నించింది. ఎంతైనా ఇదొక తాత్కాలిక భావోద్రేకమే తప్ప స్థిరసత్యం కాలేదు. గురజాడ మీదుగా ప్రారంభమయిన ఆత్మవిమర్శ విశ్వనాథ దగ్గరికి వచ్చేసరికి ఆత్మోత్కర్షగా ఎందుకు పరిణమించిందో తెలుసుకోవాలంటే ఆ ఇద్దరి మధ్యకాలంలోని పరిణామాలలోకి తొంగి చూడవలసి ఉంటుంది.

దానిని అలా ఉంచితే…

‘వేయిపడగల’ గురించి రాస్తూ అందులోని ధర్మారావు పాత్రను విశ్లేషిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిన రచనలు రెండు: మొదటిది, త్రిపురనేని గోపీచంద్ నవల ‘అసమర్థుని జీవయాత్ర’. రెండోది, మార్గరెట్ మిచెల్ నవల ‘గాన్ విత్ ద విండ్’.

‘అసమర్థుని జీవయాత్ర’లో వ్యక్తమైన గోపీచంద్ తాత్విక సంఘర్షణను ఆర్. ఎస్. సుదర్శనం ‘సాహిత్యంలో దృక్పథాలు’లో తనదైన కోణంలో విశ్లేషించారు కానీ అందులోని సీతారామారావుకు, ‘వేయిపడగలు’ లోని ధర్మారావుకు ఉన్న పోలికలను, తేడాలను ఎందుకో ప్రస్తావించలేదు. ఈ ఇద్దరి మీదా తండ్రి ప్రభావం ఉంది. అయితే, వల్లమాలిన అహం, ఆభిజాత్యం నిండిన తండ్రి ప్రభావం నుంచి బయటపడి; సరళత, సామాన్యత నిండిన తల్లివైపు పయనించలేకపోయిన సీతారామారావు, జీవితాన్ని ప్రశ్నల ముళ్లడొంకగా మార్చుకుని చివరికి ఉన్మత్తావస్థకు చేరుకుంటాడు. ఆ దశలో రామయ్యతాత అతనికి జీవితం గురించి బోధిస్తాడు కానీ, అప్పటికే ఆలస్యమైపోయిందనుకున్న సీతారామారావు ఆత్మహత్య చేసుకుంటాడు.

లౌకికంగా చూసినప్పుడు ధర్మారావు కూడా సీతారామారావులానే నిష్క్రియుడే. సీతారామారావులా భిన్న రూపంలో శ్రేష్టతా-సామాన్యతల వివేచనలో గడిపినవాడే. మళ్ళీ భిన్నరూపంలోనే అతనిలోనూ సీతారామారావులో ఉన్నట్టు ఆత్మోత్కర్ష, లోకవిమర్శ, లోకనింద ఉన్నాయి.  తేడా అల్లా, సీతారామారావు శ్రేష్టత్వం నుంచి సామాన్యతవైపు పయనించడానికి కనీసం విఫలయత్నమైనా చేశాడు కానీ; ధర్మారావు శ్రేష్టత్వపు ఊహల్లోనే ఆగిపోయాడు.  చివరివరకూ అసామాన్యుడైన తండ్రి ప్రభావంలోనే ఉండిపోయాడు. అలాగే బాహ్యజగత్తుకు, ఆంతరిక జగత్తుకు మధ్య సామరస్యాన్ని కల్పించుకోడంలో సీతారామారావు ఎదుర్కొన్న తీవ్ర సంఘర్షణ ధర్మారావులో లేదు. ఇద్దరి మధ్యా ఇంకో ముఖ్యమైన తేడా, జీవితం గురించి బోధించడానికి సీతారామారావుకు ఒక రామయ్యతాత ఉన్నాడు. కానీ ధర్మారావు విషయానికి వస్తే, రామయ్యతాత, సీతారామారావులు అతనిలోనే ఉన్నారు. తనే లోకానికి గురువు కనుక ఇంకొకరికి బోధకు అతను చెవి యొగ్గే ప్రశ్నే లేదు.

మరీ లోతుగా వెళ్లడానికి ఇది సందర్భం కాదు కానీ; అసలు ధర్మారావుకు సమాధానంగానే గోపీచంద్ సీతారామారావును సృష్టించాడా అన్న సందేహం కలుగుతుంది. ఈ కోణంలో ఇంతకుముందు ఎవరైనా పరిశీలించారా అన్నది కుతూహలజనకమైన మరో అకడమిక్ ప్రశ్న.

విచిత్రం అనిపించవచ్చు కానీ,  ‘వేయిపడగలు’తో పోల్చి చూడాలన్న గాఢమైన కుతూహలం కలిగించే మరో నవల ‘గాన్ విత్ ద విండ్’. రెంటి మధ్యా తేడాలు ఎలాగూ ఉంటాయి. వాటితోపాటు కొట్టొచ్చినట్టు కనిపించి ఆశ్చర్యం గొలిపే పోలికలూ ఉన్నాయి. ముందుగా తేడాల విషయానికి వస్తే, అతి పెద్ద తేడా ఆ ఇద్దరు నవలాకర్తల మధ్యే ఉంది. విశ్వనాథ(1895-1976) కన్నా మార్గరెట్ మిచెల్(1900-1949)వయసులోనూ, ఆయుఃప్రమాణంలోనే కాదు; సాహిత్యసృష్టిలోనూ, బహుముఖీన పాండిత్యంలోనూ కూడా చిన్నదే. ఆమె కౌమార వయసులో రెండు నవలలు రాసినా పరిమాణంలోనే కాక, ప్రసిద్ధిలోనూ చెప్పుకోవలసిన నవల గాన్ విత్ ద విండ్ ఒక్కటే.  ‘అట్లాంటా జర్నల్’లో జర్నలిస్టుగా పనిచేసిన మిచెల్ 1926 లో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, చీలమండకు తగిలిన గాయంతో ఇంటికే పరిమితమై అమెరికా అంతర్యుద్ధ(1861-1865) నేపథ్యంతో నవల రాయడం ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేసింది. గాన్ విత్ ద విండ్ నేషనల్ బుక్ అవార్డు, పులిట్జర్ అవార్డు పొందడంతోపాటు చలనచిత్రంగా కూడా చరిత్ర సృష్టించింది. మిచెల్ తన 49 వ ఏట, 1949 ఆగస్టు 11న అట్లాంటాలో భర్తతో కలసి ‘ఏ కాంటర్బరీ టేల్’ సినిమాకు వెళ్ళి వస్తూ రోడ్డు దాటుతున్నప్పుడు కారు ఢీకొనడంతో చనిపోయింది.

అబ్రహాం లింకన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు జరిగిన అమెరికా అంతర్యుద్ధానికి మూల కారణం బానిసత్వ సమస్య. యూనియన్ ప్రభుత్వం బానిసత్వాన్ని రద్దు చేయడానికి సంకల్పించింది. బానిసల శ్రమ మీద పత్తి వ్యవసాయక్షేత్రాలను అభివృద్ధి చేసి భారీ ఎత్తున కాటన్ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఏడు దక్షిణాది రాష్ట్రాలు(ఆ తర్వాత మరో నాలుగు రాష్ట్రాలు కలసి పదకొండు అయ్యాయి) బానిసత్వం రద్దును వ్యతిరేకిస్తూ ‘కాన్ఫెడరేట్’ గా ఏర్పడి యూనియన్ తో యుద్ధానికి దిగాయి. 1861నుంచి దాదాపు అయిదేళ్లపాటు జరిగిన ఈ అంతర్యుద్ధంలో 6 లక్షల 20 వేల నుంచి 7లక్షల 50 వేల మంది వరకు చనిపోయినట్టు అంచనా. రెండు ప్రపంచయుద్ధాలలో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ.  దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న మౌలిక నిర్మాణాలు అన్నీ దాదాపు ఈ యుద్ధంలో ధ్వంసమయ్యాయి. చివరికి యూనియన్ సేనలే గెలుపొందాయి. యుద్ధానంతర పునర్నిర్మాణ చర్యలూ వెంటనే మొదలయ్యాయి. అంతర్యుద్ధంతో మిచెల్ కు ఉన్న ఆత్మీయ సంబంధం, అందులో ఆమె తాత పాల్గొనడం. ఆ యుద్ధం గురించిన కథనాలను ఆ కాలానికి చెందిన అమ్మమ్మలు, నాయనమ్మల ద్వారా ఆమె చిన్నప్పటినుంచీ వింటూ వచ్చింది. వాటికి తనదైన కాల్పనికతను, దృక్పథాన్ని, పాత్రచిత్రణ నైపుణ్యాన్నీ జోడిస్తూ వెయ్యి పేజీలను మించిన, గొప్ప ఐతిహాసిక స్థాయి గల నవలగా మలచింది.

బానిసత్వపు పునాదుల మీద లేచిన ఒక కులీన తరహా సమాజమూ, అందులోని యువతీ యువకుల కాల్పనిక మోహాలు, వ్యామోహాలు, ప్రణయావేశాలూ, విందు వినోదాలూ, విలాసాలూ, శౌర్యోత్సాహాలూ, డాంబికాలు, కట్టుబాట్లు, ఆచారాలు, ఆభిజాత్యాలు, వైభవోపేతమైన తమ జీవితం శాశ్వతమూ, స్థిరమూ అన్న భ్రమలతోసహా—అన్నీ తమ కళ్ళముందే- కేవలం నాలుగైదేళ్ళ స్వల్పవ్యవధిలో– కుప్ప కూలిపోవడాన్ని గాన్ విత్ ద విండ్ ఉద్వేగభరితంగా రూపుకట్టింది. ఆ పతనం వ్యక్తులలో కలిగించిన మానసిక, భౌతిక కల్లోలాన్ని; యుద్ధం వాళ్ళ జీవితాలలో తెచ్చిపెట్టిన అనూహ్యమైన మార్పులను అనితరసాధ్యమనిపించే రీతిలో ఆవిష్కరించింది. యుద్ధానికి ముందూ-తర్వాతా ఇతివృత్తంగా ప్రపంచ సాహిత్యంలో వచ్చిన ఎన్నదగిన రచనల్లో గాన్ విత్ ద విండ్ నిస్సందేహంగా ఒకటి. గాన్ విత్ ద విండ్ లాంటి యుద్ధరచన ప్రత్యేకించి భారతీయ సమాజానికి విలక్షణమైన, వినూత్నమైన ఎరుకను, అనుభవాన్నీ కలిగిస్తుంది. ఎందుకంటే, మహాభారతం తర్వాత ఒక యుద్ధం తాలూకు పూర్వాపర పరిణామాలను, పరిస్థితులను అతి పెద్ద కేన్వాస్ పై  ఐతిహాసిక ప్రమాణంలో చిత్రించిన రచన మరొకటి మనకు లేదు.

మహాభారతాన్ని కళ్ల ముందు నిలుపుకుంటూ; చరిత్ర, పురాచరిత్ర, మానవపరిణామచరిత్రలను కూడా తడుముతూ గాన్ విత్ ద విండ్ గురించి మాట్లాడుకోవడం నా వరకు ఎంతో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ కలిగించే వ్యాసంగం. కానీ  సందర్భం కాదు కనుక దానిని అలా ఉంచితే, వేయిపడగలు, గాన్ విత్ ద విండ్ దాదాపు ఏక కాలంలో వెలువడిన రచనలు. మిచెల్ తన నవలను 1926లో రాయడం ప్రారంభించగా 1936లో అది ప్రచురితమైంది. విశ్వనాథ వేయిపడగలను 1934లో 29 రోజులలో చెప్పారు. అంటే, అప్పటికి గాన్ విత్ ద విండ్ ప్రచురితం కాలేదు. వేయిపడగలు 1937-38లలో ఆంధ్రపత్రికలో ధారావాహికగా వెలువడిన తర్వాత 1939లో పుస్తకరూపంలో ప్రథమముద్రణ పొందింది.

రెండింటి మధ్యా ప్రధానమైన పోలిక— ఒకానొక కులీన, శ్రేష్ట, సాంప్రదాయిక సమాజం ఎలా పతనమైందో చిత్రించడం. మిచెల్ చిత్రించిన సమాజం, వేయిపడగలు చిత్రించిన వర్ణసమాజంతో పోలిక ఉన్నదే. వేయిపడగల వర్ణ సమాజంలో అట్టడుగున శ్రామికవర్ణం(గోపన్న) ఉన్నట్టే గాన్ విత్ ద విండ్ లో బానిసల రూపంలో శ్రామికవర్ణం ఉంది. బానిసలలో కూడా మళ్ళీ హెచ్చు తగ్గులు. పొలంలో పనిచేసే బానిసల కంటే గృహంలో పనిచేసే బానిసలు ఉన్నతస్థానంలో ఉంటారు. యజమాని-సేవక సంబంధాల చట్రంలోనే మళ్ళీ యజమానులకూ, గృహ బానిసలకు మధ్య ఆత్మీయ సంబంధాలు ఉంటాయి. యజమానుల్లానే బానిసలు కూడా వ్యవస్థతో తాదాత్మ్యం చెందుతారు. వేయిపడగలలో చిత్రితమైన యజమాని-సేవక సంబంధాలు కూడా ఈ తరహాలోనే ఉంటాయి. సాంప్రదాయిక సమాజాలుగా కట్టుబాట్లు, ఆచారాలు, స్త్రీ-పురుష వివక్ష మొదలైన అంశాలలో కూడా రెండింటి మధ్యా పోలికలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మిచెల్ చిత్రించిన సమాజంలో  కొంతవరకు హైందవ సాంప్రదాయిక సమాజ ప్రతిబింబాన్ని చూడచ్చు. సామాజికంగా వస్తున్న మార్పులు విశిష్ట జీవితాన్ని, విశిష్ట వ్యక్తులను కబళించడాన్నే కాదు; అందరినీ అవి సామాన్యత అనే ప్రవాహంలో ఎలా ముంచి తేల్చుతున్నాయో కూడా రెండు రచనలూ చిత్రిస్తాయి. లోతైన సంస్కారం, అనుభూతి గాఢత లేని వారు ఆర్థికంగా, సామాజికంగా పైకి రావడాన్నీ; అవి ఉన్నవాళ్ళు అట్టడుగుకు జారిపోవడాన్ని రెండు రచనలూ రూపుగడతాయి. అలాగే, వేయిపడగలు దళితోద్ధరణ గురించి, దళితులు స్వతంత్రించడం గురించి చెబితే; గాన్ విత్ ద విండ్ బానిసల ఉద్ధరణ గురించి, వారు స్వతంత్రించడం గురించి చెబుతుంది.

ఈ పోలికల మధ్యే కీలకమైన తేడాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాచ్య, పాశ్చాత్య జీవన తాత్వికతలకు చెందినవనుకుంటే, కొన్ని ఇరు రచయితల దృక్పథ భేదానికి చెందినవి. గాన్ విత్ విండ్ కు వేయిపడగలకు ఉన్నంత బరువైన భావజాలవారసత్వం కానీ, అందుకు సంబంధించిన ఘర్షణ కానీ లేవు.  వేయిపడగలలో లౌకిక-అలౌకిక జగత్తులు ఒకదానికొకటి సమాంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి. గాన్ విత్ ద విండ్ లో అలాంటిది లేదు. అది కేవలం పాత నీటిని కొట్టేసి కొత్త నీరు చేరుతున్న లౌకికమైన ఒకే ప్రవాహంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే, గాన్ విత్ ద విండ్ కు ఉన్న అంతర్యుద్ధ నేపథ్యం వేయిపడగలకు లేదు. అందులో ఉన్నది భావజాల ఘర్షణే తప్ప భౌతిక ఘర్షణ కాదు.

ఈ ఇద్దరు రచయితల దృక్పథ భేదాన్ని తరచి చూస్తే తేలే ఫలితం ఆశ్చర్యకరంగా ఉంటుంది. సాహిత్య సృష్టిలోనూ, ధిషణలోనూ విశ్వనాథ భుజాల వరకూ కూడా రాలేని మిచెల్ ఆయన కన్నా ఎక్కువ పరిణతిని చాటుకుందా అనిపిస్తుంది.

దాని గురించి తర్వాత…

*

 

ప్లీజ్ సేవ్ తెలుగు!

 

“తెలుగు దేశం పార్టీకి ఆ పేరెలా వచ్చింది..?”

“పాఠశాల విద్యలో తెలుగును తొలగించింది, అందుకే ఆపేరు వచ్చింది..!”

*   *   *

“అర్థం పర్థం లేదు.. అనుటకు వొక ఉదాహరణను యిమ్ము..?”

“తెలుగు దేశం పార్టీ’ పాలనలో తెలుగు లేదు, అది వొక దేశమూ కాదు! ‘తెలుగుదేశం’ అనుట అర్థం పర్థం లేనిది!”

*   *   *

“తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలని చెప్పి, తెలుగును తొలగించడమేమిటి..?”

“ఒకప్పుడు తెలుగు వుండేది అని చెప్పుకోవడం వల్లనే కదా.. అది ప్రాచీన భాష అవుతుంది..?!”

                                          *   *   *

“తెలుగు బాషను తొలగిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వాన్ని యేమని డిమాండ్ చేయాలి..?”

“ముఖ్యమంత్రి మొదలు.. తెలుగుదేశం ప్రభుత్వనేతలూ నాయకులు కూడా యిక తెలుగులో మాట్లాడరాదు..!”

                                      *   *   *

“గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్లో- ‘తెలుగుజాతి తమ గౌరవం, తెలుగుజాతి పూర్వ వైభవం, నాలుగొందల యేళ్ళు పాలించిన శాతవాహనులు, యిరవై మూడవరాజు శాతకర్ణి’- అని చరిత్ర చెప్పిన చంద్రబాబు తెలుగును చరిత్రలో యెందుకు కలిపేసారో అస్సలు అర్థం కావడంలేదు..!?”

“ఇందులో అర్థం కాకపోవడానికి యేముంది?, బాలక్రిష్ణ తెలుగులో చెప్పిన డైలాగులు వినలేక.. యేకంగా తెలుగు భాషనే రద్దుచేసి అందరికీ రక్షణ కల్పించారు..!”

                                      *   *   *

“పాతనోట్లు చెల్లవంటే భరించాం కదా?, పాత తెలుగుభాష చెల్లదంటే యెందుకు భరించలేరు..?”

“అయితే.. పాతనోట్ల స్థానంలో కొత్త నోట్లు పెట్టినట్టు, పాత తెలుగు స్థానంలో కొత్త భాష ప్రవేశపెడతారా..?”

                                      *   *   *

“తెలుగు భాషని తొలగించడం అన్యాయం..!”

“ఇంగ్లీషు మీడియంలో మీ పిల్లల్ని చదివిస్తూ తెలుగు భాష వుండాలనడం మరీ అన్యాయం..!”

                                      *   *   *

“తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది..”

“సాంగ్ యీజ్ వెరీ గుడ్.. బట్ వాటీజ్ ది మీనింగ్ అఫ్ తెలుగూ మమ్మీ..?”

                                         *   *   *

“తెలుగు యీజ్ ది ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్!”

“చూశారా?, తెలుగుని కూడా యింగ్లీషులో మెచ్చుకున్నారు.. అందుకే తెలుగు గొప్పతనం తెలుసుకోవాలన్నా యింగ్లీషే అవసరం..!”

                                      *   *   *

“అసలుకే లేదు అంటే కొసరు పెట్టమన్నాడట..!”

“తెలుగే తీసేస్తుంటే.. మాండలికం సొగసే వేరు అన్నాడట..!”

                                      *   *   *

“దేశ భాషలందు తెలుగు లెస్స..!”

“తెలుగు రాష్ట్రంలోనూ తెలుగు లెస్సే..!”

                                      *   *   *

“మా అబ్బాయికీ అమ్మాయికీ యిద్దరికీ తెలుగు అస్సలు రాదు..!”

“మా పిల్లలకీ రాదు, అందులో మునిపటిలా మనగొప్పలేదట, ప్రభుత్వమే తెలుగు పీకేసిందని మన మాటకెవరూ వెయిటివ్వడం లేదు..!”

                                        *   *   *

“తెలుగు తొలగింపు మీద రామోజీరావు యేమంటారు..?”

“మండలి బుద్ద ప్రసాద్ యింటర్వ్యూ మళ్ళీ వేస్తారు. ‘తెలుగు వెలుగు’ ప్రత్యేక సంచిక తీసుకొస్తారు. ఇంకా ఈనాడులో సంపాదకీయమూ రాస్తారనుకుంటా..!”

                                      *   *   *

“తెలుగు భాషలో యాభయ్యారు అక్షరాలు. తెలుగు లిపి గుండ్రంగా వుంటుంది. అందంగా వుంటుంది. మన జాతీయాలూ.. నుడికారాలూ.. సామెతలూ.. పొడుపు కథలూ.. పల్లె పదాలూ.. మాండలిక మందహాసాలూ..”

“అవున్లెండి బతకని బిడ్డ బారెడు.. అనేది కూడా తెలుగు సామెతే!”

                                      *   *   *

“వాడు తెలుగుకు భాషకు వీరాభిమాని. అంతెందుకూ తెలుగే మాట్లాడుతాడు.. తెలుగులోనే రాస్తాడు..!”

“ఏం?, పాపం చదువుకోలేదా..?”

                                      *   *   *

“నోబెల్ తెచ్చిన తెలుగు వారికి వందకోట్లు..!”

“నోబుల్ మాట దేవుడెరుగు.. తెలుగు ఎత్తేయడం వల్ల యింగ్లీషు మీడియం పాఠశాలలకు మరో వందకోట్ల ఆదాయం..!”

                                      *   *   *

 -బమ్మిడి జగదీశ్వరరావు

నేనొచ్చేశాన్లే మళ్ళీ…

1

తలుపు తట్టి ఇగో నేనొచ్చేశాన్లే మళ్ళీ
అని గదిలోపల నవ్వుతూ కూర్చుంటుంది మరణం
ఈ పూటకి చావు వాసన లేకుండా దాటేద్దామని అనుకున్నప్పుడు –

2
ముసుగు తన్ని దుప్పటి పై మీదికి కప్పేసి
వొక ప్రశాంతతని కూడా వొంటి మీదికి లాక్కుని
నిద్రలోపలి గుహలోకి పారిపోతూ వుంటాను
చాల్చాల్లే అని విదిలించుకుని కసురుకొని నన్ను నేను,

లేదులేదులేదు
రానే రావద్దే నువ్వు నా లోపలికి అనుకుంటూ పైకే అంటూ

3

రాత్రి బరువు ఎంతో నీకు తెలుసా?
మరీ దాన్ని రెప్పల మీద మోస్తున్నప్పుడు!

4

పగలగొట్టేయ్యాలన్నంత

కోపమొచ్చేసే గడియారపు బుడి బుడి నడక

వొంటి మీద మెత్తగా గీసుకుపోయే కత్తి

5
రాని నిద్దురని దుప్పటిలా
విసుగ్గా అవతలకి విసిరేసి
పుస్తకంలోకో సినిమాలోకో

అనిద్రని ఖననం చెయ్యాలని కూర్చున్నాను.

ఊహూ,

ఆ అన్నీ లోకాలూ నన్ను విఫలం చేశాయి.

6

కాళ్ళ కింద నేల జారుతున్న అసహనంతో
గది నిండా తిరుగుతున్నప్పుడు
దూరం నించి మిత్రుడి మరణ వార్త.

7
ఆ తరవాత నేనూ చీకటీ
చీకటీ నేనూ వొకరి ముఖంలోకి
ఇంకొకరు చూస్తూ…

*

 

మీ స్మృతిలో మో …

 

(ఇంకో మో అంటూ వుండరు..ఇంకో  ‘బతికిన క్షణ”మూ వుండదు. ఇంకో “చితి-చింత” కూడా వుండదు. అసలు వొక మనిషి ఎప్పుడూ ఇంకో మనిషిని replace గానీ, displace గానీ చేయడం అంటూ వుండదు. అందుకే, వొక మనిషి- అందునా  ఆ మనిషి తనదైన వాక్యాల అడుగుల్ని వెతుక్కున్న మనిషి వెళ్ళిపోయినప్పుడు భరించలేని నిశ్శబ్దం వెంట పడ్తుంది మనల్ని! మో- ఈ జనవరి అయిదున పుట్టారన్నదే నాకు గుర్తుంది. ఆయన వెళ్ళిపోయిన రోజు ఇంకా నా మనసులో సరిగా రిజిస్టర్ కావడం లేదు. మీలో చాలా మందికి అంతే అయి వుండాలి. మీలో చాలా మందికి మో తెలుసు, కవితంలోనూ, వ్యక్తిగతంగానూ, ఉత్తరాల్లోనూ..అలాంటివి మాకు రాయండి. వొక అరుదైన అద్భుతమైన కవిని తలచుకుందాం..)

కావ్య వ్యామోహం వచనానికి శాపం!

కాళిదాస మహా కవి ‘మాళవికాగ్నిమిత్రం’ ఆధారంగా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి నవల, ‘మాళవిక’ ఆవిష్కరణ సంద ర్భంగా వారి ఆప్త మిత్రులు, తల్లావఝుల పతంజలి శాస్త్రి గారు “ఛాయ” సంస్థ కోసం ప్రత్యేకంగా జరిపిన సంభాషణలని రెండు భాగాలుగా మీ కందిస్తున్నాం.

 

  1. మీరు విశ్వనాథ నుంచి ఈ నాటి వరకు అర్థ శతాబ్ది తెలుగు సాహిత్య పరిణామాన్ని చూశారు. కవిత్వంలో, వచనంలో ఈ కాలంలో మీరు అనుకునే మూడు ముఖ్యమైన మార్పులు ఏమిటి?

జ: వెంటనే గుర్తుకు వచ్చేవి :

ఒకటి : గ్రాంధిక భాషా  పధ్ధతి నుంచి రచయితలు క్రమంగా శక్తిమంత మైన వ్యావహారిక వచనం వైపు ప్రయాణించడం. ఇందుకు యిద్దరు వచన శైలీ నిర్మాతల్ని ఉదహరిస్తాను. ఒకరు – చలం. రెండోవారు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి.

రెండు: కవిత్వంలో పద్య పాదాల సంఖ్య భావాన్ని బట్టి పెంచటం, తగ్గించటం.

మూడు: మహా కావ్య రచనా వ్యామోహం వెనకబట్టి – ఖండ కావ్య ప్రక్రియ, గేయ రచనా గౌరవం పెరగడం!

  1. భావకవులు అనేక మంది అనేక భాషా పండితులు. వారంతా స్వాతంత్రోద్యమంలో, హరిజనోధ్యమంతో పాటు బ్రహ్మ సామాజికులు కూడా అయి, తద్వారా సమకాలీన సామాజిక జీవితంతో, పరివర్తనతో సంబంధం ఉన్నవారు. వారి అధ్యయన విస్తృతి, సామాజిక ధృక్పధం వారి కవిత్వంలో కనిపించదంటే ఏమంటారు మీరు?

జ: నా ఉద్దేశ్యం – మీరు మొదటి తరం ఆధునిక రచయితలను గురించి ప్రస్తావించారు.  స్వాతంత్రోద్యమం, బ్రహ్మ సమాజ ఉద్యమం, మానవోద్యమం, కాల్పనికోద్యమం, సంస్కరణోద్యమం కూడా కల్పండి.  సాహిత్య పరులలో అప్పట్లో ఏ కొడాలి ఆంజనేయులు, శివశంకర శాస్త్రి వంటి బహు కొద్ది మంది నేరుగా స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఉండవచ్చు.  కానీ, అలనాటి తొలి తరం కవులు చాలా మందికి ఉద్యమ దృష్టి కంటే కాల్పనిక ఆవేశమే ప్రధానంగా ఉన్నట్లు తోస్తుంది.  ఆంధ్రోద్యమ కవిత్వం చెప్పినా, ప్రణయ కవిత్వం చెప్పినా, అలనాటి మహా నాయకుల్ని కీర్తిస్తూ రాసినా – దాదాపు అందరూ కవిత్వ “కల్పన”, స్మృతి పూర్వక చారిత్రక అభినందనల దగ్గరే ఆగిపోయారు.  కార్య కర్తల గా ఉద్యమాలలో కవిత్వం పేరిట గీతాలు, పద్యాలు రాసిన వారు కవులు కాలేక పోయారు.  కేవలం ఉద్యమ ఆవేశం వెళ్లబోసిన వారు అయ్యారు.  ఈ తేడాను మీరు విశ్వనాధ, రాయప్రోలు వంటి వారి ఉద్యమ కవిత్వాన్ని, గరిమెళ్ళ సత్యనారాయణ, గురజాడ రాఘవ శర్మ వంటి వారి కవిత్వాన్ని పోల్చి చూస్తే బాగా గ్రహించగలరు.  ఇది హృదయ ధర్మాలలో తేడా – వారి అధ్యయనం వేరు, కాల్పనిక సామర్ధ్యం వేరు.

3.మన ఆధ్యాత్మిక సాంప్రదాయం, రవీంద్రుడి మిస్టిసిసమ్ ప్రభావంతో భావకవులు తలమునకలయినారా? వారంతా శాంతినికేతనాన్ని తిరుపతిగా భావించారు కదా?

జ: మన ఆధ్యాత్మిక సాంప్రదాయమంటే : దాని మూలం ఉపనిషత్తులు.  బ్రహ్మ సామాజికులకు ప్రామాణికత వాటి మీదనే.  రవీంద్రుడు బ్రహ్మ సామాజికుడే కదా! అయితే నా కర్ధమైనంతలో రాయప్రోలు, అబ్బూరి,మల్లవరపు విశ్వేశ్వర రావు మాత్రమే నేరుగా శాంతినికేతనం నుంచి వచ్చిన వారు. వేంకట పార్వతీశ కవులు, కృష్ణ శాస్త్రి, చలం వంటి వాళ్ళు రవీంద్రుడి సాహిత్య మార్గాన్ని (అంటే కాల్పనిక వైభవాన్ని) మోహించిన వాళ్ళు.  అందువల్ల నేరుగా మన ఆధ్యాత్మిక సంప్రదాయం నుంచి ప్రేరణ పొందిన వాళ్ళు కారు.  రవీంద్రుడు సూఫీ సంప్రదాయం, కొంత బెంగాలీ స్థానికత నుంచి తెచ్చిన జానపద వాసన గల కాల్పనికత, దైవానికి సంబంధించిన ‘నైరూప్య ’ భావన, కలిపితొరిపిన టాగోరియన్ కాల్పనిక రీతి నుంచి ప్రేరణ పొందిన వారు మన భావ కవులు.

4. భావకవుల్ని ఉతికారేసిన ‘నేటి కాలపు కవిత్వం’ అనార్ద్ర విమర్శ!

జ: ‘నేటి కాలపు కవిత్వం’ అంటూ అక్కిరాజు ఉమాకాంతం గారు చేసిన విమర్శ మొత్తం ‘పూర్వ పక్ష సిద్ధాంత’ ప్రతిపాదన పధ్ధతిలో చేసిన కరుకైన పండిత విమర్శ.  ఆయన ప్రధానంగా ఆక్షేపించిన విషయాలు రెండు. ఒకటి : కవిత్వం పేరిట అస్పష్టత. రెండవది : పాండిత్య లోపం. ఇంకా చెప్పాలంటే అది కృష్ణ శాస్త్రి గారి కాల్పనిక ధోరణి మీద విమర్శ. నిజమే – అనార్ధ్ర విమర్సే.  ఆయన విమర్సే నిజమై ఉంటే, కాల్పనిక సౌకుమార్యాన్ని కొత్త పద బంధాలతో తెలుగు వాళ్ళకి పరిచయం చేసిన కృష్ణ శాస్త్రి బతికి బట్ట కట్ట కూడదు. అలా జరగ లేదే! నానాటికీ ఆయన కాల్పనిక వైభవం కవిత్వాభిమానుల్ని సమ్మోహ పరిచింది.

5. విశ్వనాధ క్రియేటివిటీకి క్లాసికల్ పరిమితులున్నాయని పిస్తుంది. ‘కల్పవృక్షం’ అట్లా ఉంచి, ఆయన ఖండ కావ్యాలలో ఆ లక్షణాలున్నాయా? భావకవుల ‘ఆధునీకత’ ఆయన కవిత్వంలో ఉన్నదా? వస్తువు కాదు, అభివ్యక్తి విషయంలో?

జ: తప్పకుండా.  విశ్వనాధ వ్యక్తిత్వంలో కవిగా క్లాసిసిసమ్, కాల్పనికత రెండూ కలగలిసిపోయిన స్రోతస్సులు. భావ కవుల ఆధునీకత ఆయన “గిరి కుమారుని ప్రేమ గీతాల”లోనూ, “కిన్నెరసాని” గీతాలలోనూ ప్రముఖంగా కనిపిస్తుంది.  ఆయన లోని క్లాసిసిసమ్ వైభవం ‘శృంగార వీధి’ పద్య ఖండికలలోనూ, తెలుగు ఋతువుల పద్యాలలోనూ- కడకు రామాయణ కల్ప వృక్షం కొన్ని ఘట్టాలలోనూ అద్భుతంగా కనిపిస్తుంది.  మరీ తొలి నాటి కవితల సంపుటి “భ్రష్టయోగి” చూడండి.  కాల్పనిక కవిగా ఆయన మనస్సు ఎంత లలిత సుందరమో తప్పక తెలుస్తుంది.

6. విశ్వనాధ వాడుక భాష తుఫాన్నుంచి ఎట్లా తప్పించు కున్నాడు?

జ: విశ్వనాధ   వాడుక భాష తుఫాన్నుంచి తప్పించుకోలేదు.  ఆయన గ్రాంధికంగా రాసిన దంతా, గ్రాంధికపు ముసుగులో దాగిన ఆయన సొంత వ్యావహారికమే!  (బలమైన పానుగంటి వారి గ్రాంధికమూ ఇంతే) క్రియా పదాలు, పదాంతాలు గ్రాంధికపు తొడుగు తొడుక్కున్నా, భాష హృదయం మాత్రం వ్యావహారికపు కాకువు తోడిదే.  అందుకే జీవవంతంగా ఉంటుంది.  విశ్వనాధ, తెలుగు వచన రచయితలలో అరుదైన శైలీ నిర్మాత.

  1. శ్రీశ్రీ లౌక్యుడు. నారాయణబాబు అంత కాదు. లౌక్యం లేకపోవడం వలనా, లేదా నారాయణబాబుని కమ్యూనిష్ట్ల పల్లకీ ఎక్కించక పోవటం వలనా? ఎందువలన ఆయనకి గుర్తింపు లేదు? ఆయన కవిత్వంలో గొప్ప’ఎకానమీ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ ఉంది కదా.

: శ్రీశ్రీకీ  , నారాయణ బాబుకీ  పోలికబెట్టటం సరికాదు.  శ్రీశ్రీ లో ఉన్న రూప స్పష్టత, భావ స్పష్టత నారాయణ బాబులో లేవు.  క్లుప్తత గుణమే; కాదనం -. అయితే అది నారాయణ బాబులో అస్పష్టతకు కొంత వరకు హేతువైంది.  శ్రీశ్రీ లో ఉండే భాషా  నైశిత్యం సాటిలేనిది.  అంతటి స్థితి నారాయణ బాబుకి లేదు.  ‘రుధిర జ్యోతి’ సంపుటి చదవండి. భావ సైధిల్యం జాస్తి, ఆయన ఆవేశపరుడు. ఆ ఆవేశంలో ఏదో కన్ఫ్యూసన్ ఉంది.  నా వరకు చాలా తక్కువ కవితలు మనసును తాకాయి.  శ్రీశ్రీ కవిత్వ పాండిత్యం ఘాఢమైనది.  నారాయణ బాబుకి అంత లేదు.  కమ్యూనిష్ట్ లు శ్రీశ్రీ ని పల్లకీ ఎక్కించటానికి కారణం వాళ్ళ చారిత్రక అవసరం.  శ్రీశ్రీ లౌక్యం కాదు.

  1. భావ కవిత్వానికి పీహెచ్ డీలు, పొగడ్తలు, తిట్లు మినహా సరైన విమర్శ లేదనిపిస్తుంది.

జ: భావ కవిత్వం మీద సరైన విమర్శ లేక పోవడానికి కారణాలున్నాయి.  కృష్ణ శాస్త్రి ప్రణయ కవిత్వం పుణ్యమాని అటు సంప్రదాయ కవి పండితుల నుంచి, ఇటు ఆధునిక సామ్యవాద నైష్ఠికుల నుంచి మొట్టి కాయలు, తిట్లు, వెటకారాలు పుష్కలంగా దక్కాయి.  మీరు నన్ను తిట్టకపోతే  ఒక మాట చెపుతా.  మన తెలుగు వాళ్ళకి తొందరగా  ఎక్కువ భావుకత్వ ప్రధానమైన కవిత్వం అర్ధం కాదు.  తెలిసినా, తెలియక పోయినా ఆధ్యాత్మిక చాపల్యం ఎక్కువ.  వాస్తవికత పేరిట వార్తా కధనాలు తొందరగా మనసు కెక్కుతాయి.  అదీ బలహీనత.  కవిత్వ మూలాలూ, ప్రేరణల పట్ల హృదయ ధర్మ లోపం ఉంటే, విశ్లేషణ కి, విమర్శకి తావేదీ?  నేనెరిగినంతలో డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి  గారు ఎంచదగిన విమర్శ చేశారు.  చాలా తక్కువే అయినా, విశ్వనాధ, శ్రీశ్రీ చాలా మంచి వ్యాసాలు రాశారు.  ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ అనే పుస్తకం రాసిన నిశిత విమర్శకులు, వెల్చేరు నారాయణ రావుగారు భావ కవిత్వం గురించి చేసిన విమర్శ నా ఉద్దేశ్యం పాక్షికమైనదనే.

  1. పూర్వపు తెలుగు కవులు తెలుగుని చంపి సంస్కృతాన్ని బతికించారా, లేదా తెలుగుని, కవిత్వాన్ని చంపి వ్యాకరణాన్ని బతికించారా?

జ: పూర్వ కవులు తెలుగుని చంపి, సంస్కృతాన్ని బతికించారని, తెలుగు కవిత్వాన్ని చంపి వ్యాకరణాన్ని బతికించారని, – ఆరోపించే రెండభిప్రాయాలూ తప్పే. ఆ రెండు భాషల స్వభావాలు, ఆయా సాహిత్య స్వభావాలూ తెలియని వాళ్ళనే మాట.

ఎందుకో చెపుతాను.  చారిత్రకంగా ఒక స్వభావంగా తెలుగు భాష మీద సంస్కృత ప్రభావం ఎక్కువ.  దక్షిణాది భాషలలో మళయాళం మీద కూడా ఎక్కువ.  అదలా ఉంచండి. వ్యాకరణం, ఛందస్సు, అలంకారం అనేవి సాహిత్య శాస్త్రం, సాధకుడికి ఉద్దేశించిన రచనా పరికరాలు మాత్రమే.  ప్రాచీన కవులలో  ప్రముఖులెవరూ వీటిని అర్ధ రహితంగా వాడ లేదు.  పద్య రచనలో గొప్ప శిల్ప నిర్మాణానికే వాడారు.  తెలుగు కవిత్వం తమాషా ఏమిటంటే నూరింట తొంభై మంది సంప్రదాయ కవులు వాళ్ళంతట వాళ్ళు ప్రేరణ కలిగి కావ్యాలు రాసిన వాళ్ళు కారు.  కృతి భర్తగారిని వెతుక్కుని, వారి ఇష్టం మేరకు, వారి అభిరుచులకు కిత కితలు పెట్టడానికి రాసినవే.  సభల్లో పండితుల మెప్పు కోసమో, తమ పాండిత్య ప్రగల్భాలు చాటడం ధ్యేయంగా రాసినావీ ఉన్నాయి.  వెయ్యేళ్ళ సంప్రదాయ పద్య కావ్యాలలో కసరత్తులతో ముగిసిపోయినవి  మనకు ప్రమాణాలు కానక్కరలేదు.  మీరు పేర్కొన్న రెండు ఫిర్యాదులూ నిజమైన  సంప్రదాయ సత్కవుల్ని బాధించవు.

  1. ఎకరాల కొద్దీ కావ్య విమర్శ, వ్యాఖ్యానాలు రాశారు కదా, త్యాగరాజ కీర్తనలకు ఆ స్థాయిలో విమర్శ, వ్యాఖ్యానం ఉన్నాయా?

జ: త్యాగరాజ స్వామి కీర్తనలను గురించి కల్లూరి వీరభద్ర శాస్త్రి గారి వివరణాత్మక వ్యాఖ్య  చాలా ప్రసిద్ధం.  క్షేత్రయ్య పద సాహిత్యం గురించి విస్సా అప్పారావు గారి వివరణలూ, సారంగపాణి పద  వైశిష్ట్యం గురించి, మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు, అన్నమయ్య పద సాహిత్యం గురించి వేటూరి ఆనంద మూర్తి, ముట్నూరి సంగమేశం ప్రబృతులు ఎన్న దగిన విమర్శలు ప్రచురించారు.  ప్రముఖ సంగీత విద్వాంసులు త్యాగరాజ కీర్తన సర్వస్వం పేరిట ఎంచదగిన విశ్లేషణలు చేశారు.

  1. అవధాన కవులలో శిఖరాయమానులైన తిరుపతి వేంకట కవుల ప్రత్యేకత ఏమిటి? ఎండు గడ్డిలాంటి అవధాన పద్యాలు కాక, వారి సారస్వత సేవల ప్రత్యేకత?

జ: అవధానాలనేవి సాహిత్య ప్రదర్శనలు.  శ్రోతలకు వినోదం, ఉత్కంఠ కలిగించటం ప్రధాన్నోద్దేశ్యం.  తిరుపతి వేంకట కవుల ప్రత్యేకత ఏమిటంటే వారికి పూర్వం అరుదుగా మిగిలిన ప్రక్రియని వారు రాజుల దివాణాలలోకి, సభా ప్రాంగణాలలోకి తెచ్చి – అసాధారణమైన ధారణా శక్తి, పద్య రచనా ధార కలిగిన వారు కావడంచేత రకరకాల ప్రాపంచిక, నిత్య కృత్యాలు ఇతి వృత్తాలుగా ఆశువుగా పద్యాలు చెప్పి – వేల కొద్దీ శ్రోతల్ని ఆశ్చర్య చకితుల్ని చేశారు.  సాధారణంగా అవధాన పద్యాలలో చమత్కారాలు, ఛాలెంజ్ లే ఉంటాయి.  మెజారిటీ శ్రోతల్ని మెప్పించటమే ధ్యేయం.  తిరుపతి వేంకట కవులకు అవధానాల పరిమితులు బాగా తెల్సు.  వాటిని వాడుకుంటూ – మరో పక్క సమర్ధమైన కావ్య, నాటక రచనలూ చేశారు.  కావ్యాలలో బుద్ధ చరిత్ర ప్రశస్తం.  పాణి గ్రహీత, శ్రవణానందం, సరదా సరదా చిన్న కావ్యాలు.  ‘శతావధాన సారం’, ‘నానా రాజ సందర్శనం’ సంపుటాలలో వారి పద్య రచనా ధార, పాండిత్యం, ఝటితి స్పూర్తి పుష్కలంగా కనిపిస్తాయి.  చెళ్ల పిళ్ల వేంకట శాస్త్రి గారి ‘కథలు – గాధలు’ వ్యాస సంపుటాలు ఒక విధంగా ఆంధ్ర దేశపు సంస్కృతి, సాహిత్య, సభ్యతలకు నిధులని నా యెరుక.

  1. వివాదాస్పదమైన వ్యక్తిగత జీవితం వల్లనా, ఆయన సాహిత్యం వల్లనా చలం ఎందుకు గొప్ప వాడయ్యాడంటారు?

జ: మొట్ట మొదట గ్రహించ వలసిన సత్యం: చలానికి సాహిత్యం, జీవితం వేర్వరు కాదు.  ఈ విషయం ఆయన వ్రాసుకున్న ఆత్మకథ (చలం) చదివితే తెలుస్తుంది.  చలం సామాజిక పరిశీలన, అధ్యయనం వంటి గంభీరమైన మాటలతో పుట్టిన రచయిత కాడు. ఇంట్యూటివ్ రైటర్. మైదానం, దైవమిచ్చిన భార్య, అరుణ, జీవితాదర్శం, బ్రాహ్మణీకం, వివాహం – అనే ఆరు నవలలు – మ్యూజింగ్సు, ప్రేమ లేఖలు, స్త్రీ, బిడ్డల శిక్షణ, ఆనందం, విషాదం – ఆరు వ్యాసాలంటారో, ఆత్మ ఘోషలంటారో ఆ పుస్తకాలు చలం ఆలోచనా సర్వస్వాలు.  ఆయన ఆలోచనా విధానమే ఆ కాలంలో ఆయన్ని విలక్షణ వ్యక్తిగా, రచయితగా నిలబెట్టింది.

  1. అసలు తెలుగు వాళ్ళకి సాహిత్యం, ఇతర లలిత కళల విషయంలో మీడియోక్రిటి అంటే ఎందుకంత ఇష్టం?

జ: మీడియోక్రిటి అంటే ఇష్టం కాదు;  అది స్వభావం.  చెరువు ఒడ్డున కూర్చుని, చిల్ల పెంకు ముక్కని నీటి మీదకు విసిరితే అది లోతుకి మునగకుండా, తేలుకుంటూ పరిగెడుతుంది.  మీడియోక్రిటి ఆ బాపతుది.  ప్రతీ జాతికి ఒక స్వభావం ఉంటుంది.  వల్గారిటీని హాస్యంగా భావించటం, పోర్నో తరహా స్త్రీపురుషుల కదలికల్ని శృంగారంగా భావించటం, సంగీతంలో శాస్త్రీయమైన మెలకువల్ని, మెలోడీని గ్రహించలేక పోవడం, చిత్ర లేఖనం, శిల్పం, నృత్యం వంటి కళల పట్ల బొత్తిగా దృష్టి లేక పోవడం, తెలియని విషయాల పట్ల తెల్సినట్లు మాట్లాడడం, నిత్యం పాక్టీసు చేసేస్తే ఏదైనా సాధించగలమనే అజ్ఞానపు టెక్కు, ప్రతీ విషయం మీద జడ్జిమెంట్ ఇచ్చే ఉత్సాహం – ఈ లక్షణాలు మీడియోకృటీ పునాదులు.  ఇదే తెలుగు వాళ్ళలో మెజారిటీ మనుషుల జీవ లక్షణం.

  1. ఆధునిక తెలుగు సాహిత్యానికి సరియైన విమర్శ లేదనిపిస్తోంది. వామ పక్ష విమర్శ చాలా పాక్షికమైంది. మీరు ఒప్పుకుంటారా?

జ: వెల్చేరు నారాయణ రావు గారి ఫిర్యాదు ఇదే.  ప్రాచీన సాహిత్యం విషయంలో సాంకేతికంగా విమర్శకు పనికి వచ్చే సాధనాల మీద ఆలంకారీకులు గొప్ప చర్చను లేపారు.  ఈ చర్చలు సుమారుగా శతాబ్దాల పాటు వివిధ మేధావులు సవిస్తారంగా నడిపారు.  అన్ని ప్రక్రియలతో సహా ఆధునిక సాహిత్యం అవతరించి గట్టిగా నూటయాభై యేళ్ళు కాలేదు.  ముఖ్యంగా వచన సాహిత్యం విషయంలో చాలా మంది తమ ఇష్టానిష్టాల ప్రాతిపదిక మీద మాట్లాడారు కాని, objective literary perspective కనపడదు.  మార్క్సిష్టు లకి (ప్రాచీన ఆలంకారీకులకు లాగే) కొన్ని కొలతలున్నాయి.  ఆ కొలతలకు ఆగక పోతే, తిరస్కరిస్తారు.   ప్రాచీన భారతీయాలంకారీకులూ ఇదే పని చేశారు.  శాస్త్రం, నియమాలు యేర్పరచి, క్రియేటివిటీకి గల విస్తారావకాశాలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ వచ్చారు.  అది వ్యాకరణం కావచ్చు, ఛందస్సు కావచ్చు, అలంకారం కావచ్చు, తాత్విక ధృక్పధం కావచ్చు.  ప్రామాణికత్వం నిర్ణయించే వారికి గొప్ప హృదయ ధర్మం ఉండడం అరుదు.  సారాంశం : తెలుగులో ప్రామాణికమైన ఆధునిక విమర్శ చాలా విరళం అయిపోవడానికి కారణం గాఢమైన అధ్యయన లోపం.

  1. పూర్వపు తెలుగు కవులు వస్తువు కోసం సంస్కృత సాహిత్యాన్ని ఆశ్రయించారు – వారంతా గొప్ప సంస్కృత పండితులు. మరి సంస్కృతంలో ఉన్న వచన సాహిత్యం గాని, భాసుడి వంటి నాటక రచయితలు గాని వారికి ప్రేరణ కాలేదు. ప్రభంధాలు రచించినట్టుగా వచనం, నాటకం జోలికి పోలేదు.  కారణం ఏమయి ఉంటుంది?  అసలు సంస్కృత సాహిత్యం లోని సృజనాత్మక వైవిధ్యం ప్రభంధ కవుల్ని ఎందుకు ఆకర్షించ లేదు?

జ: దీని గురించి మా నాన్నగారు, హనుమఛ్ఛాస్త్రి గారు ఒక కారణం చెపుతూ ఉండేవారు.  ముఖ్యంగా నాటకాల విషయం: సంస్కృత నాటకాలలో కచ్చితంగా పాత్రోచిత భాషను పాటించారు.  నాటక కథలో వచ్చే వివిధ పాత్రలలో ఏ తరహా పాత్రకి సంస్కృతం వాడాలి? ప్రాకృతం వాడాలి? అనే నియమాలున్నాయి.  భరతుడు పదిహేడు రకాల ప్రాకృతాల్ని నిర్దేశించాడు.  తెలుగులో సంస్కృత నాటకాల అనువాదాల జోలికి పోతే పండిత కవులకి వ్యావహారిక భాష మింగుడు పడలేదు.  వాళ్ళకి ఆ విషయం ఇష్టం లేదు.  గ్రామ్యం అని లోకువ.   అందుకేంచేసారూ? నాటక కథని తీసుకుని పద్య కావ్యాలు రాయడానికే ఇష్ట పడ్డారు.  చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి , వడ్డాది సుబ్బారాయ కవి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, వీరేశలింగం వంటి వాళ్ళు అనువాదాలు చేసినా, సొంతంగా రాసినా (పానుగంటి వారితో సహా) గ్రాంధికంలోనే చేశారు.  సంస్కృతంలో శ్లోకాల మాదిరే తెలుగు నాటకాలు, సంస్కృత నాటకాల పంపిణీ మీదనే నడిపించారు.  ఒక్క వేదం వేంకటరాయ శాస్త్రి గారు మాత్రం (గురజాడకు ముందు) తమ ప్రతాప రుద్రీయం నాటకంలో ప్రశస్తమైన పాత్రోచిత భాషగా – తొలిసారి – వ్యావహారిక భాష వాడారు.  వచన రచనలుగా సంస్కృతంలో ప్రసిద్ధమైన దశ కుమార చరిత్ర, విక్రమాంక దేవ చరిత్ర, హర్ష చరిత్ర, కాదంబరి, కృష్ణ చరిత్ర వంటి వాటిని అనువదించినప్పుడు సైతం సరళ గ్రాంధికాన్నే అనుసరించారు.  అన్నిటికంటే ముఖ్యం….ప్రాచీన కాలం నుంచీ కూడా సమకాలీన జన జీవితం సాహిత్య సృజనకు పనికి వస్తుందనే స్పృహే తెలుగు రచయితలకు లేదు.  సంస్కృత రచయితలు ఈ విషయంలో చాలా మెరుగు.  ప్రహసనాలు, భాణ సాహిత్యంలో నాటి సామాజిక విషయాల్ని దుమ్ము దులిపారు.  మన వాళ్ళు “కావ్య రచన ఘనమైందనే” వ్యామోహంలో ఇరుక్కుని ఉండి పోవడం వల్ల తెలుగులో శక్తి వంతమైన వచన సాహిత్యం వృద్ధి కాలేదు.

                                                                           …… to be continued

 

 

 

 

 

 

 

 

 

 

 

 

తూరుపు గాలులు ( పెద్ద కథ – మొదటి భాగం )

 

1

వి వర్షావాసపు తొలిరోజులు. ఎక్కడోవర్షించి, తేలిపోయివచ్చిన దూదిమేఘాలు ఆకాశమార్గాన పరుగులు పెడుతున్నాయి. ఉండీఉడిగీ చిరుజల్లులూ, వెంబడే ఉక్కపోత; అంతేగాని భారీవర్షాలింకా మొదలుకాలేదు. సాయింత్రంపూట సముద్రంమీదనుండి చల్లనిగాలివీచినప్పుడే కాస్తంత ఉపశమనం. భద్రపాలుడు ఆమధ్యాహ్నంపూట విహారప్రాంగణంలోని మర్రిచెట్టునీడలో, రాతిగట్టుమీద కూర్చొని, కుడిచేతిని నుదిటిపైన ఆనించి,  కళ్ళుచిట్లించి లోయలోకి చూస్తున్నాడు. చాకలివాళ్ళు లోయలో ఎండలకిచిక్కి సన్నబడిన వాగులోనే బట్టలుతుకుతున్నారు. వర్షాలుపడ్డాక ఆ చిన్నారివాగే పంపానదిగామారి పరవళ్ళు తొక్కుతుంది. చాకళ్ళు బట్టల్ని బండకేసిమోదిన క్షణకాలం తరవాత ‘దభీ, దభీ’ మనే శబ్దం పైకి కొండమీదకి వినవస్తోంది; ఆ వెంటనే ఆ శబ్దపు ప్రతిధ్వని లోయల్లో గింగురుమంటోంది. ఎక్కడ్నించో మొగనెమళ్ళు ఆత్రుతగా, సుదీర్ఘంగా పిలుస్తున్నాయి; ఆడనెమళ్ళు మాత్రం బెట్టుచేస్తూ, అప్పుడప్పుడు క్లుప్తంగా సమాధానం చెప్పి ఊరుకుంటున్నవి. ఉన్నట్టుండి చాకలివాళ్ళ వెంటవచ్చే కుక్కలన్నీ కలసికట్టుగా మొరగనారంభించాయి; ఆ వెంటనే బెదిరినట్టుగా చాకళ్ళ గాడిదలు గుంపుగా ఓండ్రపెట్టాయి.

భిక్షాటనకని వెళ్ళిన భిక్షువులబృందం ఇంకా తిరిగిరాలేదు. వాళ్లు తెచ్చిపెడితే తినాలి. ఈ మధ్యంతా ఇదే తంతు. ఆరోగ్యం బాగోలేక విహారంవిడిచి వెళ్ళలేకపోతున్నాడు. దృష్టి బాగామందగించింది. శృంగవృక్షం గ్రామంలోనే వాళ్ళకి కావలసినంత భిక్ష దొరికిపోతుంది. మధ్యమధ్యలో ఎవరోఒకరువచ్చి పళ్ళు, ఫలాలు ఇచ్చిపోతుంటారు. గ్రామపెద్దలూ, ఒకటిరెండు కుటుంబాలవాళ్ళు, సంవత్సరానికొకటి రెండుసార్లువచ్చి చీవారాలు (భిక్షువులు ధరించే కాషాయి వస్త్రాలు) ఇస్తూంటారు. అందుచేత తిండికీ, బట్టకీ ఇబ్బందిలేదు.  భద్రపాలునివద్దకు వైద్యంకోసం గ్రామస్థులు వస్తూంటారు. అతనిచ్చే వేర్లు, ఆకుపసర్లు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోతారు. వైద్యుడిగా అతడికి మంచిపేరే ఉంది.

భద్రపాలుడికి చావంటే భయంలేదు గాని ‘ఇంకా ఏమేమి చూడాలో’ అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు. దీపాంకరుడికి విహారబాధ్యతలు అప్పగించి వెళ్ళిపోగలిగితే బాగుండునని అతనికి తరచూఅనిపిస్తోంది. దీపాంకరుడు ఎప్పటికైనా తిరిగిరాకపోతాడా అనేఆశ అతనిలో ఇంకామిగిలిఉంది. ఇప్పటికే నాలుగేళ్ళు గడిచిపోయాయి. భద్రపాలుడే పట్టుబట్టి అతడినీ, అతడి శిష్యుడినీ  నాలందా మహావిహారానికి పంపించాడు. మూడేళ్ళల్లో తిరిగి రావాల్సింది.  ఏమైపోయాడో? ఇక్కడ విహారం పరిస్థితి చూస్తే ఏడాదికేడాది దిగజారుతున్నది.

ఈ ఏడాది వర్షావాసానికి పన్నెండుమంది భిక్షువులు మాత్రమే విహారానికి చేరారు. వాళ్ళంతా ప్రతీ సంవత్సరం వచ్చే వాళ్ళే.  మరో పదిమందైనా రావాలి. వస్తారో లేదో; ప్రతీ ఏడూ ఇలాగే ఎదురుచూడడం. విహారంచేరే భిక్షువుల సంఖ్య తగ్గిపోతోంది. ఏ అడవిజంతువు వాళ్ళని కబళించిందో  లేక జబ్బుపడి ఏ మార్గమధ్యాన మరణించారో? దీపాంకరుడి విషయంలోనూ అలాంటి ఉపద్రవమేదైనా జరిగిందా? అసలు చుట్టుపక్కల ప్రాంతాల్లో, రాజ్యాల్లో ఏమి జరుగుతోందో? వచ్చేపోయే వాళ్లులేక ఏ సంగతీ తెలియరావడం లేదు. కళింగపట్నం, కోరంగిరేవుల మీదుగా వస్తూపోయే సింహళ భిక్షువులుకూడా ఈమధ్య ఇటుగా రావడంలేదు.

భద్రపాలుడు యువకుడుగా ఉన్నప్పుడు వర్షావాసాల్లో వందలకొద్దీ భిక్షువులతో కళకళలాడిన విహారం ఇప్పుడు పూర్తిగా  బోసిపోయింది. చుట్టుపక్కల మూడు కొండలకి విస్తరించిఉన్న విహారపుగుహల్లో ఇదొక్కటే వాడుకలో మిగిలింది. ఒకటి పూర్తిగా పాడుబడి గబ్బిలాలనిలయంగా మారిపోయింది. శిల్పులు అసంపూర్ణంగా వదిలిపెట్టిన మూడోగుహలోని స్తూపానికి గతపదేళ్లుగా శివలింగం రూపంలో పూజలూ, జంతుబలులూ జరుగుతున్నాయి. అక్కడ శివరాత్రినాడు జాతరకూడా జరుగుతుంది; ఆరోజున చుట్టుపక్కల గ్రామస్థులు చాలామంది జాతరకని వస్తారుగాని, విహారం జోలికిరారు. ఎప్పుడైనా భిక్షువులు ఎదురుపడితే సాధువులని భావించి భక్తిగా దండంపెడతారు; ఆపాటి గౌరవంఉంది. దగ్గరలో ఉన్న నాలుగు గ్రామాల్లో ఏ గ్రామానికి భిక్షాటనకి వెళ్ళినా ఆ పూటకి సరిపడా భిక్ష దొరికిపోతుంది. ఉండే భిక్షువులే పది, పన్నెండుమంది. కొత్త భిక్షువులు వచ్చిచేరడం ఎప్పుడో ఆగిపోయింది. దీపాంకరుడి తరవాత ఒకరో, ఇద్దరో.

కుక్కలు ఎందుకు మొరిగాయో భద్రపాలుడికి బోధపడింది. ఒక సాధువులగుంపు విహారంవైపుగా వస్తున్నది. పది మంది ఉంటారేమో. ఏదో తత్వం పాడుకుంటూ సునాయాసంగా కొండెక్కుతున్నారు. వాళ్ళ పాట అస్పష్టంగా వినబడుతున్నది. ఎప్పుడైనా ఒకరిద్దరు సాధువులువచ్చి, ఒకటిరెండు రాత్రుళ్ళు తలదాచుకొని వెళ్లిపోవడం చూశాడుగాని ఇంతమంది గుంపుగా ఎప్పుడూ రాలేదు. వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? సాధువులు మర్రిచెట్టుని సమీపిస్తూనే భద్రపాలుడికి నమస్కరించి మంచినీళ్ళడిగారు. గుహలకి దారితీసే రాతిమెట్లకి ఒకవైపున పేర్చిఉన్న కుండలకేసి చూపించాడు. నీళ్ళుతాగి, మర్రిచెట్టుకింద కూర్చున్నారు. సాధువుల్లోని పెద్దాయన అన్నాడు:

“స్వామీ, మేమంతా కాశీనుండి వస్తున్నాం; రామేశ్వరం వెళుతున్నాం. కాశీలో మాకీయన తటస్థపడ్డాడు. ఉజ్జయని మీదుగాకాకుండా తూర్పుగాంగుల రాజ్యంలోంచి, కళింగదేశం మీదుగా తీరంవెంబడి వెళ్తున్నాంఅనంటే మాతోబాటు వస్తానన్నాడు. గోదావరి సమీపంలోని పంపానదీతీరానఉన్న బౌద్ధవిహారానికి వెళ్ళాలన్నాడు; సరే, రమ్మన్నాం. దారిలోఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ, మజిలీలుచేస్తూ వచ్చేసరికి ఏడాది దాటింది. కాశీలో కలసినప్పుడే మీవాడు చాలా  ముభావంగా ఉన్నాడు.  మహానదిదాటి కళింగదేశం చేరేనాటికి బొత్తిగా మాట్లాడడం మానేశాడు. ఆరోగ్యం బాగోలేదు; మతికూడా చలించినట్టుంది”.

భద్రపాలుడికి నెమ్మదిగా అర్థంఅయింది. సాధువులందర్నీ మార్చిమార్చిచూడగా, గొంతుక్కూర్చొని నేలమీద వేలితో గీతలుగీస్తున్న యువకుడు దీపాంకరుడు అయిఉండవచ్చని ఊహించాడు. మిగతా సాధువుల్లాగే గెడ్డం, మీసాలు, జడలుకట్టిన జుత్తు. భద్రపాలుడి గొంతుక ఎండిపోయింది. అతి కష్టంమీద అతనిగొంతు పెగిలింది.

“అవును, ఇతను దీపాంకరుడు. నాలందామహావిహారానికి పంపించాం. ఎప్పుడొస్తాడాఅని ఎదురుచూస్తున్నాం”.

“మీరు వినలేదా? తురుష్కులదాడితో నాలందా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. వందలమంది భిక్షువుల్ని వెంటతరిమి ఊచకోత కోశారు. మిగిలినవాళ్ళు తలోదిక్కూ పారిపోయారు. కాశీలో కలిసినప్పుడు మీవాడిని అడిగితే వివరాలేవీ చెప్పలేకపోయాడుగాని, ఆప్రాంతాల్లో అందరికీ తెలుసు. మేం కాశీలో బయిల్దేరేనాటికి తురుష్కులు తగులబెట్టిన తాళపత్రగ్రంధాలు మూడునెలలపాటు మండుతూనే ఉన్నాయని అంతా అనుకుంటున్నారు”.

చాలాసేపు అంతా మౌనంగా ఉండిపోయారు. రివ్వుమని నీటిమీది గాలి వీచసాగింది – రాబోయే వర్షానికి సూచనగా. నల్లనిమేఘాలు కమ్ముకొచ్చాయి. మర్రిచెట్టు చిటారుకొమ్మలు, ఊడలు ఊగసాగాయి. భూమిలోంచి, కొండరాళ్ళలోంచి  వేడి, పైన రొజ్జగాలి. టపాటపా పెద్ద చినుకులు పడనారంభించాయి. చీకటవుతున్న ఆకాశాన్ని చీలుస్తూ మెరుపుతీగె వెలిగింది; దగ్గరలోనే ఎక్కడో పిడుగు పడింది; కొండలనడుమ ప్రతిధ్వనిస్తూ ఉరుము.

“మేమింక బయిల్దేరాలి…. వర్షాల్లో గోదావరి దాటడం కష్టం” అన్నాడు సాధువుల పెద్ద. సాధువులంతా లేచినిలబడ్డారు.

“దీపాంకరుడివెంట అతని శిష్యుడు ఒకడు ఉండాలే?” అతి కష్టం మీద అన్నాడు, భద్రపాలుడు.

“అవును. కళింగదేశంలో ప్రవేశించిన కొద్దిరోజులకే జ్వరంసోకి ప్రాణంవిడిచాడు. మా సాధువులిద్దరుకూడా పోయారు. అప్పటినుండి ఈయన ప్రవర్తన మరింత దిగజారింది”.

దీపాంకరుడిని తీసుకొచ్చి అప్పజెప్పినందుకుగాను కృతజ్ఞత తెలియపరచాలని భద్రపాలుడికి చాలా అనిపించింది కాని నోరుపెగల్లేదు. వర్షం పెద్దదయ్యేలాగా ఉంది, కాసేపు ఆగమందామా అనుకున్నాడు. ఏదోఒకటి అనేలోగా సాధువులు వర్షంలో తడుస్తూ వెళ్ళిపోయారు. కొండదిగుతూ, చదునుగా ఉన్నచోటున ఆగి, మళ్ళీ తత్వం అందుకున్నారు; గుండ్రగా తిరుగుతూ, నవ్వుకుంటూ, తడిసిముద్దవుతూ, చప్పట్లుచరుస్తూ, తన్మయత్వంతో పాడుతున్నారు.

నీటిబొట్టువు, నీటిబొట్టువు

నింగినుండీ నేలరాలిన – నీటిబొట్టువు – నీటిబొట్టువు

ఒకటి రాలెను కొండమీదా

ఒకటి కురిసెను వాగులోనా  – నీటిబొట్టువు, ….

ఒకటి చేరెను రాజు ఇంటా

ఒకటి పోయెను పేద వెంటా – నీటిబొట్టువు, ….

ఒకటి మిగిలెను చేనులోనా

ఒకటి ఉన్నది అడవి నడుమా – నీటిబొట్టువు, ….

ఒకటి ఇంకీ నేలచేరెను

ఒకటి దప్పికతీర్చి పోయెను – నీటిబొట్టువు, …..

చెరువులోనా, నూతిలోనా

చేదలోనా, కుండలోనా  – నీటిబొట్టువు, …..

వాగులోనా, వరదలోనా

పొలంలోనా, పుట్టలోనా  – నీటిబొట్టువు, ….

ఏది ఎందుకు రాలిపడెనో?

ఏది ముందుగ ఆవిరగునో? – నీటిబొట్టువు,…

చివరికన్నీ గంగచేరును

కడలి కడుపున కలసిపోవును – నీటిబొట్టువు, ….

మేఘమందున మంచినీరే

కమండలమున మంచినీరే – నీటిబొట్టువు, ….

ఏది ఎందుకు ఎక్కడున్నది?

ఏది ఎప్పుడు ఎచటచేరును? – నీటిబొట్టువు, ….

ఎవరుముందో, ఎవరు వెనకో?

నీవు ఎవరో, నేను ఎవరో? – నీటిబొట్టువు, ….

అన్నిదిక్కుల ఉన్నదొక్కటె

విశ్వనాథుని రూపమొక్కటె – నీటిబొట్టువు, …

చివరికదియే నిలిచి వెలుగును

విశ్వనాథుని రూపమొక్కటె – నీటిబొట్టువు, …

విశ్వనాథుని రూపమొక్కటె

విశ్వనాథుని రూపమొక్కటె

దూరంగా కూర్చున్న దీపాంకరుడుకూడా పరధ్యానంగా వంతకలుపుతూ అదేతత్వం పాడుతున్నాడు. సర్వసంగ పరిత్యాగి, గొప్పజ్ఞాని అయిన  భద్రపాలుడి కనులవెంట ఏకధారగా కన్నీళ్లు కారుతున్నాయి. కానీ అతని మొహంలో ఏ భావనాలేదు; అతని గంభీరదుఃఖానికీ, నిశ్శబ్దరోదనకూ కారణం ఇదీ అనిచెప్పడం కష్టం. దీపాంరుడు గురువుగారివంక కాస్తంత ఆశ్చర్యంగా చూసి, లేచివచ్చి పక్కనే కూర్చున్నాడు. వర్షం పెద్దదైంది. దీపాంకరుడి చెయ్యిపట్టుకొని నెమ్మదిగా లేచాడు భద్రపాలుడు. ఇద్దరూ గుహలోపలికి నడిచారు.

***


వర్షాకాలమంతాకూడా విహారంలోని భిక్షువులమధ్య ఒకేచర్చాంశం. శాశ్వతంగా నిలిచిపోతుందనుకున్న నాలందా మహావిహారంలో అంతటి ఘోరం ఎలాజరిగింది? ఎవరీ తురుష్కులు? ఎందుకలా భిక్షువుల్ని వెంటాడి మరీ చంపారు? వాళ్ళకేంకావాలి? ఇంకా ఏంజరగబోతోంది? తన తరువాత వెయ్యిసంవత్సరాల్లో బౌద్ధం అది పుట్టిన గడ్డనుండి నిష్క్రమిస్తుందని తథాగతుడు స్వయంగా అన్నాడంటారు; అదే నిజమవుతోందా?   నాలందా మళ్ళీ ఎప్పటికైనా నిలదొక్కుకుంటుందా?…..ఇవే ప్రశ్నల్ని మళ్ళీమళ్ళీ వేసుకుంటూ అదేపనిగా చర్చించుకోవడమేగాని ఎవరికీ సమాధానాలు తట్టడంలేదు. సాధువులనోట భద్రపాలుడు విన్నసమాచారం తప్ప మరేవివరాలు తెలియలేదు. దీపాంకరుడు ఏమీ చెప్పడు. అతన్ని ప్రశ్నలతో వేధించవద్దని భద్రపాలుడి ఆదేశం. భిక్షువులకు ఎటూ తోచడంలేదు. వాళ్ళ గుండెలనిండా అపారమైన దిగులు.  ముఖ్యంగా భిక్షువుల మూకుమ్మడి హత్యల్ని, గ్రంధాలయాల్ని తగులబెట్టడాన్ని తట్టుకోలేకపోయారు.

దీపాంకరుడి పరిస్థితి మెరుగుకావడానికి చాలాకాలమే పట్టింది. భద్రపాలుడి వైద్యం, సాటి  భిక్షువుల శుశ్రూష అతన్ని కోలుకొనేలా చేశాయి. ఇప్పుడు స్వయంగా భిక్షాటనకు వెళ్తున్నాడు. అయినా చాలాతక్కువగా మాట్లాడుతాడు. నాలందాలో ఏమైందని ఎవరూ అతన్ని ప్రశ్నించలేదు.  అతడూ ఆ విషయాలు ఎత్తుకోలేదు. భద్రపాలుడు అతడిచేత ముఖాముఖీ మాట్లాడించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ వర్షావాసం నిరాశ, నిస్పృహల నడుమ ముగియవచ్చింది.

అది అశ్వయుజ పౌర్ణమి. వర్షావాసపు అంతాన్ని సూచించే పవరన ఉపోసత (సంస్కృతంలో ప్రవరణ ఉపవాసథ) నాడు పాటించే పతిమోక్ఖా (సం. ప్రతిమోక్షా) దినం. వర్షావాస సహవాసంలో భిక్షువులు ఎప్పుడైనా త్రిపీటిక విధించే నియమాలను  అతిక్రమించినా, తోటిభిక్షువులపట్ల దురుసుగా, కరకుగా ప్రవర్తించినా బహిరంగంగా క్షమాపణ చెప్పుకొనే రోజు. ఆ కార్యక్రమం ముగిసిన మర్నాడే సమీపగ్రామాల ప్రజలు ఇక త్వరలోనే ప్రయాణం కట్టబోయే భిక్షువులకు వీడ్కోలుచెప్పడానికి విహారానికివస్తారు. చీవారాలను బహూకరిస్తారు; ఆశీర్వాదాలను కోరుకుంటారు.

ఆనాటి ప్రతిమోక్షాసమావేశానికి ఉదయాన్నే భిక్షువులందరూ ముందుగానేవచ్చి మహాస్తూపానికెదురుగా కూర్చున్నారు. భద్రపాలుడు లోనికివచ్చి అందర్నీ పరిశీలనగా చూశాడు. పట్టుమని పాతికమందికూడా లేరు. వర్షావాస ప్రతిమోక్షాదినాన ఇంతచిన్న భిక్షువులగుంపుని చూడడం అతనికిదే ప్రధమం. చివరివరుసలో దీపాంకరుడు కూర్చొని ఉన్నాడు. భిక్షువులందరిలాగే శిరోముండనం చేయించుకొని, కాషాయిరంగు చీవారాలను ధరించిఉన్నాడు. ముందువరసలోకి వచ్చికూర్చోమని భద్రపాలుడు అతనికి సైగచేశాడు. దీపాంకరుడి వద్దనుండి ఎలాంటి స్పందనా లేదు.  అతని వెర్రిచూపు పోయింది గాని, మౌనం అలాగే ఉంది.

భద్రపాలుడు పాళీ భాషలో త్రిపీటికానియమాలను పైకి బిగ్గరగా చదువుతున్నాడు. ఒక్కో నిత్తనీ (నిష్ఠనీ లేదా నియమాన్ని) పూర్తిగా వినిపింపజేశాక  –

“మీలో ఎవరైనా దీన్ని అతిక్రమించారా?” అని అడుగుతున్నాడు. ఎవరూ స్పందించకపోతే,

“మీ మౌనాన్నిబట్టి మీరెవరూకూడా ఈ నిష్టని అతిక్రమించలేదని భావిస్తున్నాను” అని ప్రకటించి ముందుకి సాగుతున్నాడు.

నిష్టా నియమాల ప్రకటన పూర్తయింది. చివరి ప్రశ్నను సమావేశం ముందుంచాడు భద్రపాలుడు.

“ఎవరైనా, ఏ విషయంలోనైనా పశ్చాతాపం ప్రకటించదలుచుకున్నారా?”

భిక్షువుల నుండి మళ్ళీ నిశ్శబ్దం.

“మీ మౌనాన్నిబట్టి మీరెవరూకూడా ఏ నియమాన్నీ అతిక్రమించలేదనీ, ఈ వర్షావాసంలో ఒకరిపట్ల ఒకరు దురుసుగాగాని,  కఠినంగాగాని వ్యవరించలేదని భావిస్తూ ఈ ప్రతిమోక్షాసమావేశాన్ని ముగిస్తున్నాను” అన్నాడు భద్రపాలుడు.

సరిగ్గా అప్పుడే దీపాంకరుడు ఏదో అన్నాడు. భద్రపాలుడికి వినిపించలేదు.

“ఏమంటున్నాడు?” అని దీపాంకరుడికి సమీపంగా కూర్చున్న భిక్షువులను అడిగాడు.

అంతటా కలవరం. భద్రపాలుడు చెయ్యపైకెత్తి సభికులను నిశ్శబ్దంగాఉండమని సౌంజ్ఞచేశాడు; సద్దుమణిగింది. దీపాంకరుని పక్కనే కూర్చున్న యువభిక్షువు అన్నాడు:

“నాలందాలో ఉండగా – పాళీభాషని బోధించే ఆచార్యుని మరణానికి తానే కారకుడినని అంటున్నాడు”

“ఎందుకని అలా అనుకుంటున్నావు? వివరంగా చెప్పు” అన్నాడు భద్రపాలుడు.

దీపాంకరుడు మాట్లాడ్డం మర్చిపోయిన వాడిలా నెమ్మదిగా, కూడబలుక్కుంటూ జవాబిచ్చాడు:

“ఆ సాయింత్రం……తురుష్కుల బృందం ఒకటి వెంటాడుతూంటే…..నడవలేకపోతున్న ఆచార్యులవారిని ఇక మొయ్యలేక…..ఒక చెట్టుకింద వదిలేశాం…..ఉధృతంగా ప్రవహిస్తున్న గంగానదిని ఏదోవిధంగాదాటి అవతలిఒడ్డున ఉన్నగ్రామంలో తలదాచుకున్నాం ఆ రాత్రికి…..  మర్నాడు ఉదయం, ధైర్యంచేసుకొని, గ్రామస్థులను వెంటబెట్టుకొని వెళ్లి చూస్తే ఆయన తలనరికేసి ఉంది…. ఏదోలా మాతోబాటు నదిదాటించి ఉంటే  బతికేవారు…..”

“మీలో ఎవరో కొందరు ఆయనకి తోడుగా ఉండవలసింది కదా?” అన్నాడు భద్రపాలుడు.

దీపాంకరుడి మాటల్లో వేగంపుంజుకుంది. “మేంకూడా అదేఅన్నాం, భాదంతా. ఆచార్యులవారు అంగీకరించలేదు.

‘మీరెంతమంది తోడున్నా వాళ్ళను నిలువరించలేరు. మనం సైనికులంకాము. మనవద్ద ఆయుధాలులేవు. నాఒక్కడికోసం మీరందరూ ప్రాణాలు వదులుకోవడంలో  అర్థంలేదు. మీరు ముందుకి వెళ్ళండి. నాకోసం ఆగవద్దు. ఇప్పటికే నా మూలంగా తొందరగా ముందుకి సాగలేకపోతున్నారు. మీరంతా చిన్నవాళ్ళు; మీరే రేప్పొద్దున్న బౌద్ధాన్ని కాపాడాలి. నాబోటి ముసలాడు పోయినా సంఘానికి జరిగే నష్టం ఏమీ లేదు. అంతా బాగుంటే మళ్ళీ కలుసుకుందాం… మీరు నాకోసం ఆగవద్దు. ఇది నా ఆదేశం’ అన్నారు”.

చాలాసేపు సభలో నిశ్శబ్దం. చివరికి భద్రపాలుడు ఇలా అన్నాడు:

“ఆచార్యులవారు అన్నదే సహేతుకంగా ఉన్నది. అటువంటి విపత్కర పరిస్థితుల్లోకూడా ఆయన తన తార్కికదృష్టిని మరలించక, తనప్రాణాలను కాపాడుకొనే ప్రయత్నం మానుకొని మిమ్మల్ని బతికించాడు. బౌద్ధానికి సేవచెయ్యమని కోరుకున్నాడు. ఈ విధంగా అతను బౌద్ధధర్మాన్ని నిలబెట్టాడు. తథాగతుని మార్గాన్ని అనుసరించాడు”.

“అదే….అదే మోయలేని భారం. ఏం చెయ్యాలి? ఏమీ తోచడం లేదు భాదంతా”.

“అంటే?”

“అటువంటి ఉత్తముడైన ఆచార్యుడి త్యాగానికి అర్హునిగా నిలవాలంటే నేనేం చెయ్యాలి? ఆయన దయవల్లనే ఈరోజున జీవించి ఉన్నాను. ఇకమీదట నా జీవితపరమార్థం ఏమిటి? అదే తెలియడంలేదు”

మొదటిసారిగా దీపాంకరుడి వ్యధ భద్రపాలుడికి పూర్తిగా అవగతమైంది.

“రేపటి ప్రత్యేక సమావేశంలో ఈ విషయం చర్చిద్దాం. ప్రస్తుతానికి ఈ సమావేశాన్ని ముగిద్దాం” అన్నాడు. దీపాంకరుడు నాలందా విషయమై నోరువిప్పినందుకు భద్రపాలుడి మనసు రవ్వంత తేలికపడింది.

***

బౌద్ధానికి పెద్దపీటవేసిన మహానుభావులు దేవానాంప్రియఅశోకుడూ లేడు; కనిష్కచక్రవర్తీ లేడు; హర్షవర్ధనుడూ లేడు. ముందుముందు అటువంటి అనుకూలురైన సామ్రాజ్యాధిపతులు అధికారంలోకివచ్చే సూచనలూ లేవు. ప్రజల్లోకూడా బౌద్ధానికి ఆదరణ అంతంతమాత్రంగానే ఉన్నది. పాలకులు, పండితుల దగ్గరనుండి సామాన్యప్రజలదాకా ప్రతి ఒక్కరూ శైవ, వైష్ణవ శత్రుశిబిరాలుగా చీలిపోయి, వీధినపడి కొట్లాడుకుంటున్నారు. ఆపైన కొత్తగా ఈ తురుష్కుల దాడి; నాలందా విధ్వంసం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ధర్మాన్ని కాపాడుకోవడమెలా? ఇదీ ప్రత్యేకసమావేశపు ప్రధానచర్చాంశం. భద్రపాలుడితోబాటు మరో ఆరుగురు అనుభవజ్ఞులైన భిక్షువులతోకూడిన సమావేశం. వాళ్ళల్లో దీపాంకరుడు కూడా ఉన్నాడు.

నిజానికి ఇప్పుడంటే నాలందా ఒక అంశంగా చర్చలో చోటుచేసుకున్నదిగాని, ధర్మాన్ని ఎలాకాపాడుకోవాలి? ఎలా విస్తరింపజెయ్యాలి? అనేప్రశ్నలు ప్రతీసారీ ప్రత్యేకసమావేశాల్లో చర్చకువచ్చేవే. అయితే ఇంతకుముందెన్నడూలేని విధంగా – నిస్పృహతోకూడిన ఆందోళన, ఏదోఒకటి తొందరగా అమలుచెయ్యాలనే ఆదుర్దా, ఏం చెయ్యాలో తెలీని సందిగ్ధత – ఇవన్నీ ఆనాటి సమావేశంలో వ్యక్తమయ్యాయి.

రాజులూ, మహారాజులూ బౌద్ధానికి అనుకూలురుగా మారితేతప్ప గతవైభవాన్ని పునరుద్ధరించడం అసాధ్యం అనే వాదనే నేడుకూడా ప్రధానంగా వినిపించింది. అది ఎలాసాధ్యం అనేప్రశ్నకు మాత్రం అందరికీ అంగీకారమైన సమాధానం లభించలేదు. కాకతీయరాజైన ప్రతాపరుద్రుడు జైనమతాన్ని పాటించి, పోషిస్తున్నాడు. అటు కన్నడదేశంలోకూడా ఒకమేరకు జైనానికి ప్రజల్లోనూ, పాలకుల్లోనూకూడా ఆదరణఉన్నది. మరి బౌద్ధం విషయానికి వస్తే ఆమాత్రపు ఆదరణకూడా దుర్లభంగా ఉన్నది…..ఇలా నడిచింది చర్చ. చాలాసేపు మౌనంగా వింటూవచ్చిన దీపాంకరుడు గొంతుసవరించుకున్నాడు. అందరూ అతనికేసితిరిగారు – ఏం చెప్పబోతున్నాడా అని.

“నేను సాధువులతో బాటుగా తిరుగుప్రయాణంచేస్తూ గమనించాను. మొదట గాంగుల రాజైన అనంతవర్మ చోడగాంగు, ఆతరువాత ఓడ్ర రాజైన అనంగ భీమదేవుడు పూరీలో జగన్నాథస్వామి దేవాలయాన్ని నిర్మించి దానికొక ప్రాధాన్యతని కల్పించారు. అయితే జగన్నాథుడిమూలరూపం, మారుమూల ప్రాంతంలో కొండవాళ్ళు కొలుచుకొనే దేవతది. అలాగే మిగతాచోట్లకూడా కొత్తగా సామ్రాజ్యాలను స్థాపిస్తూన్న రాజులు స్థానికదేవుళ్లకు, కులదేవతలకు పెద్దపెద్ద దేవాలయాలు నిర్మించి ప్రాముఖ్యత ఏర్పరుస్తున్నారు. ఆయా దేవుళ్ళని స్వంతం చేసుకుంటున్నారు. వాళ్ళే తమ రాజవంశాలని కాపాడుతారని  నమ్ముతున్నారు, నమ్మిస్తున్నారు. అంతేగాని బౌద్ధం వైపు దృష్టిసారించడం లేదు”.

దీపాంకరుడు చర్చలో పాల్గొంటున్నందుకు సంతోషిస్తూ భద్రపాలుడు అడిగాడు:

“అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి?”

“రాజులూ, రాజ్యాలూ శాశ్వతంగా ఉండిపోవు. మన దృష్టిని రాజ్యాధిపతులపైన కాకుండా సామాన్యప్రజలపైనే పెట్టాలి. సమాజపుకిందిపొరలను బౌద్ధధర్మంవైపు ఆకర్షితులను చెయ్యాలి. పైగా బౌద్ధంఅనేది, జ్ఞానమార్గంలో పయనించే తార్కికులకు, మేధావులకు, పండితులకు పరిమితమైన ధర్మమేగాని, సామాన్యులకు అందుబాటులో ఉండదనే భావన ఒకటి ప్రచారంలో ఉన్నది. ఒకవైపు తాత్విక అన్వేషణలను కొనసాగిస్తూనే మరోవైపు సామాన్యప్రజానీకాన్ని హేతుబద్ధమైన ధర్మపథంవైపు నడిపించాలి. ఇదే మనం చెయ్యవలసిన, చెయ్యగలిగిన ప్రయత్నం. ఫలితాలు మనకు ఇవాళ కనిపించకపోవచ్చు. ఎప్పుడో ఒకరోజున పామరులనుకొనేవాళ్ళే పెద్దసంఖ్యలో బౌద్ధధర్మపు విశిష్టతని గుర్తిస్తారు. అప్పుడే బౌద్ధం నిలబడుతుంది. అది ఎప్పుడు, ఎలా జరుగుతుందని అడిగితే నా వద్ద సమాధానంలేదు”.

“బాగాచెప్పావు. అజ్ఞానపుటంధకారాన్ని శాశ్వతంగా దూరంచేసేది బౌద్ధధర్మమే. ఇవాళ్టి పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉండవచ్చు. రాజపోషకుల ప్రాపకంకోసం దేబిరించడం మానుకొని ప్రజానీకాన్ని ధర్మపథంవైపు నడిపించే ప్రయత్నాలు కొనసాగించాలి. నాలందాలో పోగొట్టుకున్నగ్రంధాలని తిరిగిసేకరించాలి. ఇవేమనపై కాలం విధించిన కర్తవ్యాలు. దీపాంకరుడి ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నాను”. అన్నాడు భద్రపాలుడు. పెద్దలందరూకూడా తమ ఆమోదం తెలియజేసారు. ఆనాటి ప్రత్యేక సమావేశం ముగిసింది.

ఒక చర్చాంశంమాత్రం అసంపూర్ణంగా మిగిలిపోయింది. అరబ్బులూ, పారశీకుల్లాగే తురుష్కులు ఆచరించే ధర్మంకూడా మహమ్మదీయమేఅని అందరికీ తెలుసు. అరబ్బు, పారశీకదేశాల ఓడవర్తకుల రాకపోకలు, వారితో లావాదేవీలు అప్రాంతాల్లో అనాదిగా జరుగుతూనేవస్తూన్నవి. వాళ్లెప్పుడూకూడా ఈ తురుష్కుల్లా ప్రవర్తించిందిలేదు.  “ఎవరీ క్రూర మహమ్మదీయులు? నాలందాపైన ఎందుకు దాడిచేశారు? ఎందుకలా భిక్షువుల్ని వెంటాడి చంపారు?” అన్న ప్రశ్నలకు మాత్రం ఆనాడు సమాధానం లభించలేదు.

***

కొండల్లో చిన్నగా చలి మొదలైంది; ఉదయాన్నా, సాయింత్రంపూటా విహారాన్ని పొగమంచు ఆవహిస్తున్నది; ఇండ్ల పైకప్పులనుండి నీలిరంగు పొగ కానవస్తున్నది. భద్రపాలుడూ, మరోఇద్దరు వృద్ధభిక్షువులూ, ఇద్దరు అంతేవాసులూ విహారంలో మిగిలారు. మిగతావాళ్ళంతా దేశాటనకు వెళ్ళిపోయారు. విహారనిర్వహణాబాధ్యత పూర్తిగా దీపాంకరుడిపైనే పడింది.  చీకటితోనేలేచి పంపానదీ తీరానికిపోయి స్నానంచేసి, నీళ్ళు పైకిమోసుకురావడం, విహారాన్నిఊడ్చి శుభ్రంచెయ్యడం,  భిక్షాటనకు పోయిరావడం వీటితో మొదలుపెట్టి అధ్యయనం, చర్చలు నిర్వహించడం, స్థానికులకు ఉపదేశాలు ఏర్పాటుచెయ్యడం వరకూ అన్నీ అతడే చేస్తున్నాడు.

రోజులు గడిచిపోతున్నాయి. అతనిలో ఏదో తెలియని అసంతృప్తి. ముఖ్యంగా నాలందాలో రెండేళ్ళపాటు అత్యుత్సాహంగా గడిపినదినాలు పదేపదే గుర్తుకొస్తున్నాయి.  ఆ రెండేళ్ళలోనే ఎంతమందితో సావాసం చేశాడు? ఎన్నెన్ని విషయాలు నేర్చుకున్నాడు? అతనిప్పుడు ద్వైత, అద్వైత సిద్ధాంతాల గురించి, వాటి మధ్యగల తేడాలగురించి వివరణ ఇవ్వగలడు; నాగార్జునిబోధనలకు, ఆదిశంకరాచార్యుని ప్రవచనాలకు మధ్యగల సారూప్యాల్ని, అంతరాన్ని విశ్లేషించి చర్చించగలడు. పాళీగ్రంధాలను సునాయాసంగా పఠించి భాష్యం చెప్పగలడు. అయితే కొత్తగా ప్రోదిపడిన ఈ జ్ఞానభండారం విహారానికి తిరిగివచ్చాక అతనికి అక్కరకు రాలేదు – భద్రపాలునితో జరిపిన ఒకటీఅరా సంభాషణలను మినహాయిస్తే. అతనికి జ్ఞానాన్వేషణకు నూతనద్వారాలను తెరిచి, అనేక విషయాలపట్ల కనువిప్పు కలిగించిన ఆ మహత్తరమైనకాలం ఆకస్మికంగా అంతంకావడం, మళ్ళీ ఇక్కడికి చేరుకోవడం అతనికి ఒక వైఫల్యంలాగా, ఎదురుదెబ్బలాగా  అనిపించసాగాయి. రోజులు గడుస్తున్నకొద్దీ అతని అసంతృప్తి మరింత తీవ్రం అవుతోందితప్ప మారినపరిస్థితుల్ని ఆమోదించగల సంయమనం ఏర్పడడం లేదు.

అసంతృప్తితో అల్లాడడం బౌద్ధభిక్షువైన తనకుతగదని దీపాంకరుడికి తెలుసు. గురువుగారైన భద్రపాలుడితో చర్చిద్దామనుకుంటూనే అలక్ష్యం చేస్తూవస్తున్నాడు. అందుకు కారణం ఒకటే. తన సమస్యని వివరించగలడుగానీ పరిష్కారం చర్చించేందుకు అతనివద్ద ఏ ఆలోచనాలేదు. అటువంటప్పుడు వయోభారంతోబాటుగా నాలందా విధ్వంసంకారణంగా కుంగిపోతున్న భద్రపాలుడిని వేధించడం ఇష్టంలేక ఊరుకున్నాడు.

చలికాలం కూడా అలాగే గడిచిపోయింది. వసంతఋతువు సమీపించింది. మామిడిపువ్వు వాసన, కోయిలల పలకరింపులు లోయల్ని ఆవరించాయి. అదేకాలంలో దీపాంకరుడికి ఊహించనివిధంగా ఒకఆధారం దొరికింది; అంధకారంలో ఆశాకిరణం వికసించింది. నాలందాలో బయల్దేరి ఉజ్జయని, ధాన్యకటకం (అమరావతి) మీదుగా ప్రయాణించి కళింగపట్నంరేవుకి వెళ్తూన్న ఇద్దరు సింహళభిక్షువుల ఆగమనంతో అతనిలో ఉత్సాహం పెల్లుబికింది. వారిలో పెద్దవాడు ఆచార్య శాంతిదేవుడు రెండోది అతని శిష్యుడైన గుణసేనుడు. వాళ్ళిద్దరూ సింహళద్వీపంలోని పొలోన్నరువ నగరమందున్న ఉత్తరారామం (గల్ విహార) నుండి వచ్చారు. ఇంకో విశేషమేమంటే వాళ్ళిద్దరూకూడా నాలందాలో దీపాంకరుడి సహాధ్యాయులే; బాగా పరిచయస్థులుకూడా. కళింగపట్నం మీదుగా తిరిగి తమదేశానికి పోదల్చుకున్న  ఆ భిక్షువులిద్దరినీ కొన్నాళ్లపాటు విహారంలో గడపమని దీపాంకరుడేకాక భద్రపాలుడుకూడా అభ్యర్ధించాడు. వారిసాంగత్యంమూలంగా దీపాంకరుడిలో వెల్లివిరుస్తున్న ఉత్సాహాన్ని గమనించిన భద్రపాలుడు వారిమజిలీ మరికొన్నాళ్ళు కొనసాగాలని కోరుకున్నాడు. అందుకు ఆ భిక్షువులు సంతోషంగా అంగీకరించారు.

వారితో పాళీ, సంస్కృత భాషల్లో జరిపిన సంభాషణల్లో నాలందావిధ్వంసం గురించి మరికొన్నివివరాలు తెలిసాయి. మూడు ప్రధాన గ్రంధాలయాలు తగులబెట్టబడినమాట వాస్తవమే. వందలకొద్దీ భిక్షువులను వధించడంకూడా నిజమే.  మరో దారుణం ఏమిటంటే – ఉద్దానపుర, విక్రమశిల, జగద్దల, సోమపుర మహావిహారాలపైనకూడా తురుష్కులు దాడులుచేసి సర్వనాశనం చేశారనే దుర్వార్త తెలియవచ్చింది.  ఇద్దరుసింహళ భిక్షువులలోనూ పెద్దవాడూ, ఎల్లప్పుడూ గంభీరంగాఉండే ఆచార్యుడూ అయిన శాంతిదేవుడు ఇలా అన్నాడు:

“విహారాలపైనా, దేవాలయాలపైనా దాడులుచేసి, అందినదంతా దోచుకోడంతో సరిపుచ్చుకొనే వారుకాదు ఈ తురుష్కులు. వీళ్ళకు ప్రభువైన మహమ్మద్ గోరీ అనే తురుష్కుడు తనకు సంతానంలేకపోవడంతో అతడు జయించిన రాజ్యాలను తన బానిసలకు అప్పగించాడు. ఉత్తరదేశం యావత్తూ ఇప్పుడు వాళ్ళ ఆధీనంలోనే ఉన్నది. నాలందా, తదితర విహారాలనూ, దేవాలయాలనూ ధ్వంసం చేసిందీ, కొల్లగొట్టిందీ అటువంటి బానిస సుల్తాన్లలో ఒకడైన బఖ్తియార్ ఖిల్జీ అనేవాడు. అందుచేత ఈ తురుష్కులు అక్రమించుకోవడానికీ, శాశ్వతంగా ఇక్కడేఉండి పరిపాలించడానికీ వచ్చారు తప్ప పూర్వం రోజుల్లోలా దాడులుచేసి, దోచుకొని పారిపోవడానికి కాదు. ఉత్తరభారతంలో వీరి ఆధిపత్యం స్థిరపడ్డాక దాడులు, ఆక్రమణలు దక్షిణదేశానికి కూడా విస్తరించకపోవు”.

శ్రద్ధగా వింటూన్న భద్రపాలుడు, దీపాంకరుడు హుతాశులైయ్యారు. భద్రపాలుడు నెమ్మదిగా అన్నాడు: “అయితే తథాగతుని గడ్డమీద బౌద్ధం నిలదొక్కుకొనే ఆశ ఇప్పట్లో ఇకలేనట్టే”.

శాంతిదేవుడు మౌనంగా ఉండిపోయాడు. దీపాంకరుడికి ఒకఆలోచన తోచింది.

“పోనీ ఈ తురుష్కుల్నే బౌద్ధానికి సానుభూతిపరులుగా మార్చగలిగితే…..?” అన్నాడు.

విషాదవదనుడైన శాంతిదేవుడు అన్నాడు, “అది అసాధ్యం. వాళ్లకు అర్థమయ్యేభాష సంగ్రామఘోష మాత్రమే; వాళ్ళకు తెలిసిందల్లా ఆయుధాలు, రణరంగం, దోపిడీ, ఊచకోత. అంతటి తథాగతుడుకూడా ఒకేఒక్క అంగుళీమాలుడిని సంస్కరించగలిగాడు. తురుష్కులదాకా ఎందుకు? కోసలరాజైన విరూధకుడు శాక్య గణరాజ్యాన్ని నాశనంచేసి, మొత్తం తథాగతుడి వంశీకులందర్నీ ఏనుగులతో కుమ్మించి మట్టుపెట్టినప్పుడు అతడు ఆ దుర్వార్తవిని మౌనంగా ఉండిపోయాడుతప్ప ఏమీ చెయ్యలేకపోయాడని మనకు తెలుసు”.

దీపాంకరుడు ఉండబట్టలేక, “తథాగతునికి తెలుసు; ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది” అనేశాడు, అస్వభావికమైన ఆవేశంతో.

శాంతిదేవుడు పరమశాంతంగా – “అవును. ఎప్పటికైనా….. ఇప్పుడు మాత్రం కాదు” అన్నాడు.

భద్రపాలుడు జోక్యంచేసుకున్నాడు. “ఇప్పుడు మనబోటి వాళ్ళం ఏంచేయాలి? దీనిమీద మొన్నటి ప్రతిమోక్షాసమావేశంలో పెద్దచర్చే జరిగింది. కాలచక్రదీక్ష పాటించి బౌద్ధులందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ సరైన సమయంకోసం ఎదురుచూడాలా? ఎన్ని తరాలని ఎదురుచూస్తాం? అంతవరకూ మన ధర్మాన్ని, సంఘాన్ని, గ్రంధాలని, విహారాలనీ ఎవరు కాపాడుతారు? బోధనలని ఎవరు కొనసాగిస్తారు? దీపాంకరుడు మొన్న ఒక ప్రతిపాదన చేశాడు – రాజుల్నీ, చక్రవర్తుల్నీ సంస్కరించే ప్రయత్నం మానుకొని సామాన్యప్రజలమీదే దృష్టిపెట్టాలనీ, వాళ్ళే రేప్పొద్దున్న బౌద్ధాన్నినిలబెట్టగలరనన్నీ. ఇవాళ్టిచర్చ తరవాత దీపాంకరుడు చెప్పింది చాలా సబబుగా ఉందని మరీమరీ అనిపిస్తోంది. కానీ అది ఎలా సాధ్యం అనేదే ప్రశ్న”.

“నేనొక సూచన చేయదలచాను, భాదంతే” అన్నాడు శాంతిదేవుడు భద్రపాలుడిని ఉద్దేశించి.

“చెప్పండి, ఆచార్యా”

“దీపాంకరుడు మంచి ఆలోచన చేశాడు. అతని శ్రద్ధాసక్తుల్ని, నియమనిష్టల్ని నాలందాలో ఉండగానే – నేనేకాదు – చాలామంది గుర్తించారు. ఈ ప్రాంతాల్లో బౌద్ధాన్నికాపాడి నిలబెట్టగలిగినవాళ్ళల్లో దీపాంకరుడు ఒకడు. అతను కోరుకుంటూన్నట్టుగా సామాన్యప్రజానీకపు నిత్యజీవనంలో బౌద్ధంఅనేది మీప్రాంతాల్లో ఎప్పుడూ ఒక భాగంగా లేదు. అదే మాదేశంలో అయితే బౌద్ధధర్మమే సర్వవ్యాపితంగా ప్రకాశిస్తున్నది; తరతరాలుగా మా ప్రజల దైనందిన జీవనంలో విడదీయలేని భాగంగా పెనవేసుకుపోయింది. దీపాంకరుడుగనక మాదేశం వస్తే అతను కలలుకంటూన్న భవిష్యత్తుని కళ్ళారాచూడగలడు. అంతేకాదు, మీరిక్కడ అనుసరిస్తూన్న థేరవాదబౌద్ధానికి మాదేశంలో రాజవంశపోషణ, సమర్థన ఉన్నాయి. అందుచేత నేను కోరేదేమంటే దీపాంకరుడిని మాతోబాటు పొలోన్నరువలోని ఉత్తరారామానికి పంపించండి. అక్కడ రెండు, మూడేళ్ళు ఉన్నట్టయితే అక్కడి పద్ధతులను, ఆచరణను స్వయంగా పరిశీలిస్తాడు; తెలుసుకుంటాడు. అంతేకాదు, నాలందాలో మధ్యలో ఆగిపోయిన అధ్యయనాన్ని కొనసాగిస్తూనే మావిహారంలో అధ్యాపకునిగా పనిచేస్తాడు. నాలందాస్థాయిలో సింహళదేశంలోకూడా ఒక బోధనాకేంద్రాన్ని నిర్మించాలనేది మా ప్రభువుల ఆశయం. నన్ను నాలందా పంపిందికూడా అక్కడి పద్ధతులను అధ్యయనం చేయడానికే. ఇప్పుడది ధ్వంసం అయిపోయింది గనక మరింత శ్రద్ధగా, పట్టుదలగా, త్వరితగతిన అటువంటి కేంద్రాల్ని నిర్మించుకోవాలి”.

ఆచార్యశాంతిదేవుని సూచనపై చాలాసేపే చర్చజరిగింది. భద్రపాలుడు కొంత అయిష్టంగానూ, దీపాంకరుడు చాలా ఉత్సాహంగానూ ఆసూచనకు అంగీకరించారు. దీపాంకరుడిని వెంటబెట్టుకొని ఇద్దరుసింహళభిక్షువులూ కళింగపట్నం సమీపంలోని శాలివాటిక విహారంలో కొన్నాళ్లపాటు బసచెయ్యడానికీ, సింహళదేశానికి బయలుదేరే మొట్టమొదటి ఓడనుఎక్కి సముద్రప్రయాణం చెయ్యడానికీ నిర్ణయం తీసుకున్నారు.

 

(రెండో భాగం -వచ్చే వారం )

—ఉణుదుర్తి సుధాకర్

 

కథలు కావవి వ్యాసాలు –ల.లి.త.

2.మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా
లక్షరూపాయల కథ – దగ్గుమాటి పద్మాకర్.  కులం ఇప్పుడు ముసుగులూ మొహమాటాలూ తొలగించుకుని గర్వంగా తనని తాను ప్రదర్శించుకుంటున్నది. కులగర్వాలు ఎక్కడ లేని దర్జాలూ ఒలకబోస్తున్న ఈ రోజుల్లో పాపం ఒక బక్క చిక్కిన అభ్యుదయ రచయిత ధనబలం ఉన్న రెడ్డిగారి కళ్ళలో పడ్డాడు. ఆయనకి  ఈ రచయిత చక్కగా పేరుచివర రెడ్డి అని ప్రదర్శించుకుంటే మనకులంలోనూ ఒక మంచి రచయిత ఉన్నాడని చెప్పుకోవచ్చుగా అని సరదా పుట్టింది. అలా కులంతోక తగిలించుకుంటే లక్షరూపాయలు ఇస్తానంటాడు.  రెడ్డిగారి కుల ధన బలప్రదర్శన ముందు రచయిత అభ్యుదయం రెపరెపలాడి ఆరిపోయింది.
కథ రాయటంలో పద్మాకర్ sharpness గురించి కొత్తగా చెప్పేదేముంది?  ఈ కథని మరో యాభై ఏళ్ల తరువాత మన తరువాతివాళ్ళు assess చేశారనుకోండి.  కులంకొండ ముందు అభ్యుదయం తలవంచుకున్న ఇప్పటి పరిస్థితులు అతిశయోక్తులూ అభూతకల్పనలూ లేకుండా సరిగ్గా అర్థం అవుతాయి. మన కాలాన్ని సరిగ్గా ప్రతిబింబించిన కథ. నిలిచేకథ అని నా ఉద్దేశ్యం.
 సవారీ జడుపు –  చింతకింది శ్రీనివాసరావు.  రాజెక్కిన పల్లకి కాదు అది మోసిన బోయీలెవరో చూడమని శ్రీశ్రీ అంటే, మోసిన బోయీలు సరే, పెట్టెసవారీలో వెన్నువంగి నరాలు కుంగిన రాచపడుచును చూడమంటున్నారు శ్రీనివాసరావు. ఆమె పెట్టె పల్లకీలోకి ఎక్కిందంటే ‘ఎనిమిది గజాల చీరని అగ్గిపెట్టెలో దోపినట్టే’ నట.అన్ని అవయవాలూ బంధించుకుని గంటలతరబడి గాలాడని పల్లకిలో ప్రయాణించే ఒక రాజులమ్మాయి కష్టమిది. విషయం కొత్తది.  ఆ కుటుంబాల్లోని ఆడవాళ్ళకు  తప్ప ఇంకెవరికీ తెలియని కష్టం. శ్రీనివాసరావు వ్యంగ్యం, కథ చెప్పే నేర్పు, రెండూ కలిసి, కథ ఆగకుండా చదివిస్తుంది.
 2016 లో నాకు నచ్చని కథ..
 
బేతాళుడితో శైలజ – పి.వి. సునీల్ కుమార్.
సునీల్ కుమార్ కథలంటే వెంటనే చదవాలని అనిపిస్తుంది. కథ చెప్పటంలో కొత్తదనం, తెలివీ, వ్యంగ్యం, పరిశీలనా ఉండి రెండు మూడు మంచికథలు ఇప్పటికే బాగ్ లో వేసేసుకున్న రచయిత.  ‘బేతాళుడితో శైలజ’ కథ ఎంతో ఆసక్తికరంగా మొదలౌతుంది. శైలజ గోదావరి జిల్లాలోని తన పల్లెటూరు వెళ్తుంది. అక్కడ ఆడవాళ్ళ ప్రైవేట్ జీవితాలమీద మిగతా ఆడవాళ్ళు చేసే కామెంట్స్ ని భరించలేక తన బిజినెస్ మేనేజ్మెంట్  చదువు నేర్పిన తెలివితో ప్రశ్నలు అడిగినవాళ్ళకే తిరిగి దెబ్బకొట్టేలా మాట్లాడుతుంది. అక్కడితో కథ ఆగినా బాగుండును.  వ్యవస్థ మీద పెద్దపెద్ద ప్రశ్నలు వెయ్యకుండా వీళ్ళంతా ఇలా ఏమిటని శైలజ విసుగు. రచయితకీ విసుగే. ఊర్లలో ఉండేవాళ్ళ తెలివినీ హ్యూమర్ నీ మాట చాతుర్యాన్నీ గుర్తించకుండా సిటీల్లో ఉండి ఆలోచించి  తీర్పు చెప్పటం వల్ల ఈ కథ తేలిపోయింది.  నామిని పల్లెటూరి గాసిప్స్, చతుర్లమీద రాసిన చక్కని కథ ‘కుచ్చుంటే కత లేస్తే కత’ గుర్తొచ్చింది. ఇప్పటికీ కొన్ని పల్లెటూళ్ళలో ఆ చతుర్లు మిగిలి ఉన్నాయి. వాళ్ళూ రాజకీయాలు బాగానే మాట్లాడగలరు. సునీల్ కుమార్ నుంచి ఈ కథ రావటం నిరాశ కలిగించింది.
 3.      మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు-
.  Topical issues మీద కథల పేరుతో మామూలు వ్యాసాల్లాంటివి వచ్చేస్తున్నాయి. విషయాలమీద సరైన అవగాహన లేకుండా,  ‘ఏదో చెప్పేయాలి, మరేదో అన్యాయాన్ని ఖండించాలి’ అన్న గొడవే తప్ప, చదివేవాళ్ళ తెలివిని తక్కువ అంచనా వేస్తున్నామన్న స్పృహ లోపిస్తోంది. వీటిమధ్యలో ఎస్. జి. జిజ్ఞాస  రాసిన ‘కలకంఠి కంట కన్నీరేదీ’, ‘దుర్ముఖం’  (రెండూ ఆంధ్రజ్యోతిలోనే) కథలు భిన్నంగా ఉన్నాయి. రెండూ topical issues మీదే.  కథనవిధానం పాతదైనా (కలకంఠి.. లో యముడూ ఆధునిక సావిత్రీ సంవాదం,  ‘దుర్ముఖం’ లో జంతువుల మీటింగ్ లో చర్చలు) sharpness ఉన్న కథలు.
4.  తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ  గలిగాయా?
వ్యక్తిగత, సాంఘిక, అంతర్జాతీయ మార్పులను స్పృశించే ప్రయత్నం తెలుగుకథ చేస్తూనే ఉంది. ఇంటర్నెట్ విప్లవం వల్ల ఎవరికి  తెలిసిన సమాచారం వాళ్ళు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివన్నీ కథలేనా అంటే చెప్పలేం. చాలామందికి  కథ రాసి దాన్ని తిరిగి చూసుకునే టైం కూడా ఉన్నట్టు కనిపించటం లేదు. మొత్తంగా తెలుగు కథ పల్చబడుతున్నట్టు కనిపిస్తోంది. వ్యక్తిగతంగా వస్తున్న మార్పులని చెప్పటానికి ఎక్కువ ప్రయత్నం జరుగుతోంది. వాదాలు నెత్తినవేసుకున్న కథలు మిల్లు చీరల్లా వేగంగా తయారైపోతున్నాయి. కాస్త సమయం పెట్టి చక్కటి కథలను నేయగలిగేవారు కథారంగంలో తగ్గిపోతున్నట్టుగా ఉంది.
5.      మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?
 ఆంధ్రజ్యోతి.

6.      కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?

 కధావిమర్శ ఇప్పుడు తెలుగులో నిల్.

7.       కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

కథాసంకలనాలు చాలా అవసరం. కథాసాహితి ప్రచురణ పాతికేళ్ళ తెలుగుకథ చాలా మంచి సంకలనం. అది చదువుతుంటే సమాజంలో వస్తున్న మార్పులేమిటో, వాటిని అనుసరిస్తూ తెలుగుకథ  తొంభైల నుంచీ ఇప్పటివరకూ ఎలాంటి పోకడలు పోతోందో స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలా సంకలనాలు రావటం చాలా మంచిది. రచయితల కృషిని అంచనా వేసేందుకూ రకరకాల పత్రికల్లో వచ్చే మనం మిస్ అయిన కథలు చదివేందుకూ కథా సంకలనాలు మంచి అవకాశం.
–ల.లి.త.

నాలుగు కాలాలు నిలిచే కథ రాలేదు — అనిల్ ఎస్. రాయల్

  1. 2016లో వచ్చిన కథల పై వస్తు పరంగా, శిల్ప పరం గా మీ అభిప్రాయాలు?

అభిప్రాయాలు చెప్పేముందో విషయం స్పష్టం చేయాలి. తెలుగులో ఏటేటా వెయ్యికి పైగా కథలు వెలువడతాయని ఓ అంచనా. వాటిలో – 2016లో వచ్చిన కథల్లో – నేనొక వంద చదివి ఉంటానేమో. మిగిలిన వాటిలో మంచివి, గొప్పవి ఉన్నా వాటి ప్రస్తావన నేనిక్కడ తెచ్చే అవకాశం లేదు.

2016లో అమరావతి, ఆత్మహత్య, అసహనం మొదలైన సీజనల్ అంశాల మీద కొన్ని కథలొచ్చాయి. అన్నిట్లోనూ ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అస్థిత్వవాదాల కథలూ ఎప్పట్లానే చాలా వచ్చాయి. నాలుక్కాలాలు నిలబడేవి వీటిలోనూ దాదాపు లేవు. నాకిష్టమైన సైన్స్ ఫిక్షన్ విభాగంలో మధు చిత్తర్వుగారు రాసినవి రెండు (వాటిలో ఒకటి తర్జుమా కథ) కనబడ్డాయి. ఇక సస్పెన్స్, హారర్, క్రైమ్, డిటెక్టివ్, హాస్యం మొదలైన విభాగాలు అన్నీ కలిపినా ఐదారు కథలకన్నా లేవు. చరిత్ర నేపధ్యంలో ఉణుదుర్తి సుధాకర్ రాసిన ‘ఒక వీడ్కోలు సాయంత్రం’ అనే కథొకటి కనబడింది. మొత్తమ్మీద ఈ ఏడాది వస్తుపరంగా పెద్దగా వైవిధ్యం కనిపించలేదు.

ఇక శిల్పం. వస్తువుతో సంబంధం లేకుండా – పూర్తిగా చదివించగలిగే కథలన్నీ శిల్ప పరంగా నాణ్యమైనవే అనుకుంటే, అలాంటివి నాకు వేళ్లమీద లెక్కబెట్టేటన్ని మాత్రమే తగిలాయి. ఏం చెప్పాలనేదాని మీద పెట్టే శ్రద్ధ ఎలా చెప్పాలనేదానిమీద పెట్టకపోయే అలవాటు ఈ ఏడాదీ కొనసాగింది. ‘Well crafted story’ అనగలిగేది – నేను చదివినవాటిలో – ఒకే ఒకటి తగిలింది.

  1. మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా –

ఎం. ఎస్.కె. కృష్ణజ్యోతి కథ ‘నా నేల నాకు ఇడిసిపెట్టు సారూ’ ఈ ఏడాది చదివిన కథల్లో నాకు బాగా నచ్చినది. ఇందాక ‘well crafted story’ అన్నాను కదా. ఇదే అది. షరీఫ్ వేంపల్లి ‘దారి తప్పిన కల’ కూడా నచ్చింది.

ఉణుదుర్తి సుధాకర్ రాసిన ‘కొంచెం గెడ్డపు నురగ, ఒక కత్తి గాటు’ కొలకలూరి ఇనాక్ ‘తల లేనోడు’ని గుర్తుకు తెచ్చింది. మంచి కథ. ఇదే రచయిత మరో కథ ‘ఒక వీడ్కోలు సాయంత్రం’ తెలిసిన విషయాలే చెప్పినా పూర్తిగా చదివించింది.

ఇంకా – మెహర్ ‘ఒరాంగుటాన్’, మధు పెమ్మరాజు ‘బౌండరీ దాటిన బాలు’, వెంకట్ సిద్దారెడ్డి ‘కస్తూరి నీడలు’, మన్నె ఏలియా ‘శ్రీమంతుడు’ కూడా బాగున్నాయనిపించిన కథలు. జూపాక సుభద్ర ‘కంపనపడ్డ కాళ్లు’ రొటీన్ కథాంశమే అయినా ఫర్వాలేదనిపించింది.

పైవన్నీ నచ్చిన కథలు అనుకుంటే, తక్కినవన్నీ నచ్చలేదన్నట్లు. వాటి గురించి ప్రత్యేకించి ప్రస్తావించటం అనవసరం.

  1. మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు?

కొత్తో పాతో తెలీదు కానీ – ఉణుదుర్తి సుధాకర్, ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి మరియు వెంకట్ సిద్ధారెడ్డి నుండి భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు ఆశించవచ్చు. సరైన కథాంశాలు ఎంచుకుంటే సాంత్వన చీమలమర్రి కూడా మంచి కథలు రాయగలుగుతుంది.

  1. తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ గలిగాయా?

మీరడిగిన మార్పుల్ని ఏదో ఓ స్థాయిలో స్పృశించే కథలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఈ ఏడాదీ అంతే. వాటిలో ఎన్ని పాఠకుల్ని స్పృశించగలుగుతున్నాయి అనేది ప్రశ్న. వాటిలో ఎన్ని మరో ఏడాది తర్వాతా గుర్తుంటాయి అనేది ఇంకా పెద్ద ప్రశ్న. సమాధానాలు అంత సంతోషకరంగా లేవు.

నా వరకూ నేను అస్థిత్వవాదాలు, సీజనల్ టాపిక్స్, మొదలైన ‘అజెండా’ కథలే కాకుండా ఇతర విభాగాల్లోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో కథలెప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాను. ఆ మార్పు ఈ ఏడాదీ కనపడలేదు.

  1. మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?

తెలుగునాట వెలువడే అచ్చు పత్రికలు చదివే అవకాశం నాకు లేదు. అంతర్జాలంలో అందుబాటులో ఉన్నవే నేను చదవగలిగేది. ఆంధ్రజ్యోతి, సాక్షి, సారంగ – ఇవి మూడూ తరచూ చదువుతాను. వాటిలో వచ్చేవన్నీ మంచి కథలనలేను కానీ , ఉన్నంతలో ఈ పత్రికల్లో కథల స్థాయి మెరుగ్గా ఉంటుందని నా అభిప్రాయం. కినిగె పత్రిక – మూతపడక ముందు – కొన్ని మంచి కథలు ప్రచురించింది. ఇతర పత్రికల్లోనూ అడపాదడపా మంచి కథలొస్తుంటాయి. అవి ఎవరన్నా రికమెండ్ చేసి లంకెలు పంపిస్తే చదువుతుంటాను.

  1. కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?

తెలుగులో నిఖార్సైన విమర్శకులు కరువైపోయినట్లుగా ఉంది. కథకులే విమర్శకుల అవతారాలు ఎత్తటంతో పరస్పర ప్రయోజనాలు అడ్డొచ్చి ఎలాంటి కథకైనా పొగడ్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని వదిలేస్తే, విమర్శల పరిస్థితి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుంది. గొప్ప కథలుంటేనే గొప్ప విమర్శలొస్తాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్నట్లే ఈ ఏడాది కూడా – ముఖ్యంగా ‘వాగు స్వాతంత్రం’ ఎక్కువైన వెబ్ పత్రికల్లో – కథల మీద చర్చలకన్నా రచ్చలు ఎక్కువగా జరిగాయి. ఏదైనా నచ్చటం, నచ్చకపోవటం అనేది సబ్జెక్టివ్. కానీ ఓ కథ బాగోలేదనిపిస్తే ఏం బాగోలేదో చెప్పాలి. అది విమర్శ. ఇంకెలా రాస్తే బాగుండేదో కూడా చెబితే అది సద్విమర్శ. వెబ్ కథా చర్చల్లో వ్యాఖ్యాతల మధ్య యుద్ధాలు ఎక్కువగానూ, అసలు సిసలు విమర్శలు అరుదుగానూ కనిపించాయి.

  1. కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

సంకలనాల్లో ఉన్నవన్నీ గొప్ప కథలు కాకపోయినా, మరీ చెత్త కథలయితే ఉండవు. ఏటేటా వేల సంఖ్యలో కథలొస్తున్నప్పుడు అన్నీ చదవటం ఎంతటి వీర కథాభిమాని తరమూ కాదు. ఏడాదిలో వచ్చిన కథలన్నిట్నీ వడకట్టి ఓ పదో పదిహేనో మంచివిగా ఎంచి కూర్చిన సంకలనంలో అన్నీ కాకపోయినా అధికం పాఠకులకి నచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా పాఠకులకి ఈ సంకలనాలు చాలా సమయం ఆదా చేస్తున్నాయి అనుకోవచ్చు. ఓ పత్రికలో అచ్చైన కథ జీవిత కాలం ఒక వారమో నెల రోజులో అనుకుంటే, సంకలనాలు పది కాలాలు పదిలంగా దాచుకునేవి కాబట్టి వాటిలో ఉన్న కథల జీవితం చిరకాలం. అలా – సంకలనాలు పాఠకులకే కాక కథకులకీ మేలు చేస్తున్నాయి.

  1. మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా?

నాకొచ్చిన ఇతర భాష ఆంగ్లం మాత్రమే. ఆ భాషలో- అడపాదడపా చదివే పాత క్లాసిక్ కథలు వదిలేస్తే – వర్తమాన కథలకన్నా సైన్స్, హిస్టరీ అంశాల్లో వచ్చే నాన్ ఫిక్షన్ రచనలు ఎక్కువగా చదువుతాను. కాబట్టి ప్రస్తుతం వస్తోన్న ఆంగ్ల కథల గురించి పెద్దగా తెలీదు. అందుచేత వాటితో తెలుగు కథల్ని పోల్చలేను. అయితే మన కథల్లో వైవిధ్యం తక్కువ అని మాత్రం చెప్పగలను.

సందర్భం వచ్చింది కాబట్టి ఓ సంగతి చెబుతాను. ఈ మధ్య కథాభిమాని, విమర్శకుడు, సంకలనకర్త ఐన ఒక ప్రముఖునితో పిచ్చాపాటి మాట్లాడుతుండగా “తెలుగు కథల్లో వైవిధ్యం తక్కువగా ఉండటానికి కారణం ఏమిటి?” అనే ప్రశ్న వచ్చింది. దానికాయన సమాధానం:

“అమెరికన్లవి, ఆంగ్లేయులవి కడుపు నిండిన జీవితాలు. అందువల్ల వాళ్లు సాహిత్యంలో ఆకలిమంటల్నే కాకుండా అన్ని రకాల అంశాలనీ స్పృశించగలిగే వెసులుబాటు ఉంది. మన భారతీయ సమాజం – ముఖ్యంగా తెలుగు సమాజం – ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఇక్కడ సమస్యలెక్కువ. కాబట్టి ఎక్కువ కథలు వాటి చుట్టూనే తిరుగుతుంటాయి”.

నాకా సమాధానం సంతృప్తికరంగా అనిపించలేదు. 1945 – 1989 మధ్య కాలంలో రెండో ప్రపంచ యుద్ధం, దాని తదనంతర పరిస్థితుల్లో అంతులేని అణచివేతకి, అశాంతికి నిలయంగా మారిన పోలండ్ దేశం నుండి, మన తెలుగుతో పోలిస్తే సగం మంది మాత్రమే మాట్లాడే పోలిష్ భాషలో, అరవయ్యేళ్ల క్రితమే ప్రపంచ సైన్స్ ఫిక్షన్ సాహిత్యమ్మీద బలమైన ముద్ర వేసిన Stanislaw Lem వంటి మహా రచయిత రాగలిగినప్పుడు – చుట్టూ ఉన్న సమస్యల కారణంగా ఇతర విభాగాలపైకి కథకుల దృష్టి పోవటం లేదు అనేది సహేతుకమైన కారణం అని నేను ఒప్పుకోలేను.

—-అనిల్ రాయల్ , కథకుడు

తెలుగు కథ-2016: మీరేమంటారు?!

 

రో కథా సంవత్సరం ముగిసింది. ఏడాది కి ఒక్కో వార పత్రిక అచ్చు లోనైనా, ఆన్ లో నైనా దాదాపు 50 కు పైగా కథలు ప్రచురిస్తుంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, వార్త, నవ్య వీక్లీ, స్వాతి వీక్లీ, పాలపిట్ట, చినుకు, ఆంధ్రప్రదేశ్, సారంగ, వాకిలి, ఈమాట, కౌముది, సుజనరంజని,మధురవాణి ఇంకా మాకు తెలియని, గుర్తు రాని పత్రికలు ( వెబ్ లేదా అచ్చు). ఏడాదికి ఎలా లెక్కేసుకున్నా దాదాపు మూడు వందల యాభైకి   పైగా తెలుగు కథలు ప్రచురితమవుతున్నాయి. ఎంత కథా ప్రియులైనా అన్నీ కథలు చదవటం సాధ్యం కాదు. అన్నీ మంచి కథలే అచ్చయి ఉండాలనుకోవటం అత్యాశే. కథా సంకలనాలు వేసే వారికి ప్రతి ఏడాది అగ్ని పరీక్షే. చాలా సార్లు పేరున్న రచయితల కథలకు వచ్చిన గుర్తింపు కొత్త గా కథలు రాసేవాళ్ళకు రాకపోవచ్చు. ఆ పరిస్థితి కొంచెం కొంచెంగా మెరుగవుతూ వస్తోంది. కథా సంకలనాల్లో కొత్త కథకులకు స్థానం లభిస్తోంది. కథా విమర్శ మీద కాలమ్స్ వస్తున్నాయి. మాకు నచ్చిన కథ , నచ్చని కథ అంటూ వ్యాసాలూ వస్తున్నాయి. అయినప్పటికీ తెలుగు కథ తీరూ తెన్నూలు అర్థం కావటం లేదు అంత సులభంగా.

2016 లో మీరు చదివిన కథల నుండి (అవి ఎన్ని అయినా సరే) మీకు నచ్చిన కథ ఏమిటి? ఎందుకు నచ్చింది అంటే కొంత ఆలోచనలో పడతారు ఎవరైనా. మాకు అందుబాటు లో ఉన్న కథకులు, విమర్శకులు, పాఠకులను గత సంవత్సరం వచ్చిన కథల గురించి కొన్ని ప్రశ్నలు అడిగాము.  మా ప్రశ్నలు కానీ, ఈ సమాధానాలు కానీ, అభిప్రాయలు కానీ సంపూర్ణం కాదని మాకు తెలుసు. నచ్చిన కథ ఏమిటి అని అడగటం కొంత ఇబ్బంది కరం చాలా మందికి. పేరు లేకుండా, పేరు చెప్పకుండా కథల మీద అభిప్రాయం చెప్తామన్నారు కొందరు.

ఒక కథ చదివి, దాని మీద ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నారు చాలా మంది, కారణాలు ఏమైనా. కొన్ని కథలు, కొందరి కథలు విపరీతమైన చర్చలకు గురవుతుంటే, కొన్ని కథలు అసలు ఎలాంటి సద్విమర్శ కు నోచుకోకుండా అజ్ఞాతం లోకి వెళ్ళిపోతున్నాయి. రచయితలు ముఖ్యంగా తోటి రచయితల కథలను ఒక్క చూపుతో విసిరేస్తున్నారు అన్న ఆరోపణ బలంగా ఉంది. ఒక కథ బాగుంటే, లేదా బాగోలేకపోతే, రచయిత పేరు తోనో, స్నేహంతోనో, శత్రుత్వం తోనో కాకుండా కథ ను కథగా విశ్లేషించటం , లేదా అభిప్రాయాన్ని చెప్పటం అనేదిపూర్తిగా కనుమరుగై పోతోంది. . ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికే ‘సారంగ’ అతి మామూలు ప్రశ్నలు కొన్నింటిని  అడుగుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరైనా రాయొచ్చు.  ఒక ఆరోగ్యకరమైన చర్చ కు “ సారంగ” ఆహ్వానం పలుకుతోంది. మీదే ఆలస్యం!

1.       2016లో వచ్చిన కథల పై వస్తు పరంగా, శిల్ప పరం గా మీ అభిప్రాయాలు

2.      మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా-

3.      మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు-

4.      తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ  గలిగాయా?

5.      మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?

6.      కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?

7.       కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

8.      మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా?

 

ఆ ఎంట్రీ ఒక మెరుపు, కొత్త మలుపు!

krishnudu

 

ట్టమైన పొగమంచు. చలి చర్మాన్ని పదునుగా పలకరిస్తోంది. కాళ్ల క్రింద రహదారిని పోల్చుకోవడం కష్టంగా ఉంది. వాహనాల లైట్లే వాహనాలకు దారి చూపుతున్నాయి. ప్రయాణం చాలా దుర్భరంగా ఉంది. కనపడేవన్నీ నిజాలు కావు కాని కనపడాల్సినవన్నీ కనపడకపోతే.. మనిషిని మనిషి పోల్చుకోవడం కష్టం. కాని మనిషే సమీపించకపోతే.. బతుకు పొగమంచులో ప్రయాణం కన్నా నిస్సహంగా ఉంది. బతుకులోకి ఒక చలి ప్రవేశించింది. జీవితాన్నీ, శరీరాన్ని కొంకర్లు చుట్టేస్తున్నది. అప్రయత్నంగా మనిషి తనకు తాను కుంచించుకుపోతున్నాడు.

ఎదుటి మనిషిని కరచాలనం చేయకుండా పలకరించలేమా? కరచాలనం ద్వారా రక్తస్పర్శ పరిచయం చేయని వాడు దూరం నుంచి మన రక్తాన్ని ఎలా వేడెక్కించగలడు? మనిషిని మనిషి, మనిషిని నినాదాలు, మనిషిని దుర్మార్గాలు, దారుణాలు, మనిషిని హత్యలు, ఊచకోతలు వేడెక్కించడం మానేసి చాల రోజులైంది. ఊపిరి పీల్చి విడుస్తుంటేనే మన  వేడి మనకు తగలడం లేదు. ఇక రోడ్లపై, అడవుల్లో, గుట్టల్లో గుట్టలుగుట్టలుగా పడిఉన్న శవాలు ఎలా వేడెక్కిస్తాయి? కన్ను వేడెక్కితేనే చెలమ ఊరుతుంది.

ఈ ప్రశ్నలు ఇప్పటివి కావు. తెలుగు సాహిత్యానికి తిరుగుబాటు కొత్తది కాదు. ప్రశ్నలు కొత్తవి కావు. సామాజిక సంస్కరణల కవిత్వం, స్వాతంత్రోద్యమ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, ప్రగతి శీల కవిత్వం, దిగంబర కవిత్వం,  విప్లవ కవిత్వం, ఫెమినిస్టు కవిత్వం, దళిత అస్తిత్వ వాద కవిత్వం. ఒక కవిత్వానికి ఎన్ని శాఖలు? కవిత్వం చెట్టు కాదు శాఖలుగా విస్తరించడానికి?  కవిత్వం కాలం కత్తిపై నుంచి కారుతున్న రుధిరధార. రక్తానికి శాఖలు లేవు.

అందుకే ఒకానొక రాజు దాదాపు ముప్పైఏళ్ల క్రితం నేను పనిచేస్తున్న పత్రికా కార్యాలయానికి  పుంఖానుపుంఖాలుగా వస్తున్న కవిత్వ సంపుటాల్లో ఒక పుస్తకం తడమగానే నా రక్తాన్ని స్పృశించినట్లయింది.   దాని పేరే ‘రక్తస్పర్శ’.

raktasparsa

పేరును చూస్తే ఏ అడవుల్లోంచో  పసిరిక వాసన వచ్చినట్లు లేదు. విరసం ప్రచురణ కానే కాదు. రవళి ప్రచురణ అని పెట్టుకున్నా దాన్ని అచ్చువేయించింది ఒక పప్పుమిల్లు యజమాని. పడేద్దామా అనిపించింది ఒక్కక్షణం.  కాని ఆ పుస్తకంలోని అక్షరాలు నా కళ్లనూ, శరీరాన్నీ ఎంతవేగంగా లాగాయంటే నేను పుటల మధ్య బందీ అయ్యానన్న విషయం నాకే తెలియలేదు.  మొదటి కవితే నన్ను జీవితపు దుర్బర నరకం నుంచి మృత్యుసౌందర్యంలోకి లాక్కుపోయింది. అది అఫ్సర్ రాసిన ‘అంతిమ స్పర్శ’.

‘మెత్తటి గోధుమరంగు నేలపై పవళించి, నీ తలపై పచ్చిక ఎగురుతుండగా నిశ్శబ్దాన్ని ఆలకించే నీకు నిన్నా లేదు, రేపూ లేదు. కాలాన్ని మరిచి, జీవితాన్నిక్షమించి, శాంతిలో విలీనమయ్యే మృత్యువు అందంగానే ఉండి ఉంటుంది.. అని రాశాడు అస్కార్ వైల్డ్.

afsar3

‘మృత్యువు నిన్ను అంతిమంగా ముద్దాడింది- విశాలాకాశంగా వికసిస్తావో అశ్రుపూరిత మేఘంగా విహరిస్తావో, కాలంకురులపై మీటుకుంటూ వెళ్తావో  నీ ఇష్టం.. ‘అన్నాడు అఫ్సర్. ‘అశాంత నేత్ర జలపాతాల్లోంచి, ఇరుక్కుంటూ, ఇరుక్కుంటూ అనంతానంత మౌన ప్రవాహంలోకి మృత్యువు చిటికెన వేలు పట్టుకుని మెల్లిగా నిశ్శబ్దాలు రాలుస్తూ వెళ్లిపోయిన నీకు చదువుతూ చదువుతూ నువ్వు సగంలోనే వదిలిపెట్టి వెళ్లిన పుస్తకం ఒంటరితనం రెక్కలు రెపరెపలాడిస్తూ మళ్లీ వస్తావని అమాయకంగా నిరీక్షిస్తుందని ఎవరు గుర్తు చేస్తారు?’

ఎవరీ కవి? అన్ని పాతదనాల్నీ ఊడ్చేసి పాత కోట బురుజుల సందుల గుండా వెచ్చటి స్వచ్చమైన కిరణంలా ప్రవేశించిన ఈ కవి ఎవరు? చదవగానే అనిపించింది తెలుగు కవిత్వంలో మరో కొత్త గొంతుక ప్రవేశించిందని. ఇది యాంత్రికతను చేధించడం కాదు. ఇది స్తబ్దతను భగ్నం చేయడం కాదు.  నాటి రోజులు పిడికిలి బిగిస్తున్న చేతులే జోహార్లు అర్పిస్తున్న రోజులు, నినాదాలు చేసిన గొంతులే విషాద గీతికలు ఆలపిస్తున్న  కాలమది.  ఒక ప్రజాకళాకారుడి నెత్తుటి జోలె విస్తరిస్తున్నసమయం అది, గజ్జెల కాళ్లు గుండెలపై నర్తిస్తున్న ఘట్టం అది. ఆ సమయంలో  ఖమ్మం నుంచి వచ్చిన ఒక స్వచ్చమైన గాలి రెపరెప నన్ను తాకింది.  అవును మనం ప్రశ్శల ఉక్కబోతలో నే చిక్కుకున్నప్పుడు ఇటువంటి రెపరెపలు అవసరం.

రక్తస్పర్శ రాసిన ముగ్గురు కవులు అఫ్సర్, ప్రసేన్, సీతారామ్. ఇందులోని 59 కవితల్లో 27 అఫ్సరే రాశాడు. 22 ప్రసేన్ రాస్తే సీతారాం రాసింది పది కవితలు మాత్రమే. ముగ్గురూ ఒకే రకం కవులు కాదు. ప్రసేన్, సీతారాంలపై మినీకవితలు, దిగంబర కవితల ప్రభావం ఉన్నది. అఫ్సర్ అప్రభావితంగా  రాయడం మొదలుపెట్టిన కవి. అప్రభావితంగా ఎవడూ రాయడు అంటాడు ఒక మేధావి. చదివిన ఫైజ్ అహ్మద్ ఫైజ్ లూ, ప్రతి ఘటనా స్వరాలు ఎక్కడకు పోతాయి? కాని చుట్టూ ఉన్న నిబిడ నిశ్చల నీరవ నిర్విరాణ నీలాకాశం మధ్య కొండకొనపై కూర్చుని ఉన్నట్లుండి గొంతులోంచి అప్రయత్నంగా ప్రకృతిని మైమరిపించే గొల్లవాడి గొంతులోంచి వెలువడిన కొత్త రాగమే అఫ్సర్ కవిత్వం. ఆ రాగం మూలాల్ని వెతకడం అతడి పని కాదు. అతడే ఒక దృశ్యమై, దృశ్యమే అతడై కేన్వాస్ నిండా పరుచుకున్న కవిత్వమది.

అవును శూన్యానికీ శూన్యానికీ మధ్య ప్రపంచాన్ని పరుచుకుని అంతర్వలయాల్లో విహరించే పక్షి అతడు.   నేలరాలిన వీరుడి పరాజయ హస్తాలు, ఆ ఒట్టి చేతులు తెగిపడ్డ ద్వారాల్లా అఫ్సర్ ని నిలదీస్తాయి. అంతర్ధానమైన చివరి చిర్నవ్వు అతడిని పలకరిస్తుంది. నిజం నీడలా వెంటాడుతుంది, నేలకొరిగిన ఏ సూర్యుడిలోంచి స్రవించిందో ఈ రక్తం అని వెతుకుంటాడు. రాత్రిలోంచి రాలిపడ్డ స్వప్నంలా సైగల్ విషాదగీతం సజీవ వేదనాస్రవంతిగా ప్రవహిస్తుంది. వేయి వసంతాలను అరచేతుల్లో పట్టి బంధించేందుకు ఒక్క జ్ఞాపకం తన్లాడుతుంటాడు. అరణ్యాలు కాలుతున్న గుండెల్లో సజీవంగా సమాధి అవుతున్న స్వప్నాల్ని తలుచుకుంటాడు. రాత్రిలోంచి చీకటిలా, చీకటిలోంచి కలలా, కలలోంచి జ్ఞాపకంలా నడిచిపోతుంటే అతడి నీత అతడిని తృణీకరిస్తుంది. భావానికీ, అక్షరానికీ దూరం అపారమా?

సందేహాల మధ్య చుట్టుకుపోయి అతడి అంతరంగం తెరలు దింపుకుంటుంది. రాత్రి అంచుమీద కన్నీటి ఖడ్గం కోస్తూ పోతుంది. చీకటి గుండెల్ని కెలుకుతుంది. చెట్టు గుండెల్లోంచి గొంతువిప్పే పక్షిలా అతడిలో ఏదో అలజడి.

prasen

ప్రసేనైతే పూర్తిగా బహిర్ముఖుడు. రోడ్డుపై  రౌడీ చేతుల్లోంకి ఖాకీ జేబుల్లోకి మారిన రూపాయిని, బండివాడు విసిరేసిన ఇడ్లీముక్కను పసికడతాడు. అంతే కాదు ఉన్నట్లుండి అతడికి రోడ్డు మరోలా కనపడుతుంది.  నగర కన్యనాభిని ముద్దాడి నితంబమునల్లుకుని వలీ అవళిని నిమిరి పయోధరాలను బంధించి నయగారాలు గారాలు పోయే ఓణీ – ఈ రోడ్డు అంటాడు. ప్రసేన్ పరిచయమూ, అపరిచయమూ అతడి కవిత్వంలో దాక్కోవు. అతడి మెదడు వ్యబిఛారిలా మనసుతోనే లేచిపోతుంది. పల్లెలన్నీ ఇథియోపియాలే అనే ప్రసేన్ నిశ్భబ్దంలో జీవించాలనుకుంటాడు. కాని భయంకరంగా వినిపిస్తున్న గుండెస్పందనను తప్పించుకోలేడు.

ఇక సీతారాం ఒక నిరీక్షకుడు.  తెగిన జ్ఞాపకాల మధ్య ఎవరికోసమో నిరీక్షిస్తాడు. రాత్రిపూట ఒంటరిగా ఉండే గోడనూ, ఎప్పుడూ మేల్కొనే ఉండే అడవినీ, క్షణం ముందు వెళ్లిపోయిన అజ్ఞాత పథికుడినీ, చిట్లిన గేయాల్నీ, తెగిన గొంతుకల్నీ, తెగిన అక్షరాల్నీ ఆగిన పద్యాల్నీ స్మరిస్తుంటాడు.స్వర్ణ దేవాలయంపై  రాబందుగా ఎగురుతున్న పావురాల్నీ, దండకారణ్యాన్ని తూర్పార బట్టే తూటాల్నీ, కార్బైడ్ రాత్రుల గాలికేకల్నీ తలచుకుని గుండెకు గర్భస్రావం చేసుకుంటాడు. చిత్రాలకు కన్నీటి రంగులు అద్దుతుంటాడు.  అకస్మాత్తుగా  అన్నిటినీ వదిలి ఆకాశాన్నంటిన స్వప్న పర్వతాలవైపు ఆగకుండా పోవాలనుకుంటాడు.

రక్త స్పర్శలో కొత్త భావాల్నీ, కొత్త ప్రతీకల్నీ ముగ్గురు కవులు పలికించినప్పటికీ ముగ్గురిదీ ఒకే దారి కాదు. కాలం ముగ్గుర్నీ వేర్వేరు దారుల్లోకి, వేర్వేరు స్థాయిల్లోకి తీసుకువెళ్లింది. కాని తెలుగు కవిత్వం తిరిగిన రకరకాల మలుపుల్లో ఒక ముఖ్యమైన మలుపు రక్తస్పర్శ. దిగంబర కవిత్వం తర్వాత ప్రస్ఫుటంగా కనిపించిన మలుపు ఇది. రాను రానూ, ఈ మలుపు విస్తృతమై రహదారిగా మారిందనడం, కవిత్వం ఈ రహదారిలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుందనడం అతిశయోక్తి కాదు. అది నీ నెత్తురును ఎప్పుడూ స్పృశిస్తుంటుంది.

 

*

 

కన్ఫెషన్ హద్దు దాటి కెరటమైన అరుణ్ సాగరం!

arun (2)

రుణ్ సాగర్  చివరి కవితా సంకలనం మ్యూజిక్ డైస్ పుస్తకం అట్ట మీద సీతా రాములోరి బొమ్మ. ఆ రోజు ప్రెస్ క్లబ్ లో కలిసాడు అప్పుడే ప్రెస్ నుండి వచ్చిన కవర్ పేజీ. రావుడి  చేతిలో ధనస్సు వెనక అభయం కోసం సీత. ఎంతో మందిని అడిగి ఒక  ఫోటో తీయమన్నాడు. చానా మంది తీసారు, ఎవరు తీసినా సీత కళ్ళల్లో దాగిన భయం రావడం లేదు. ఆయనకు కావాల్సింది సీతకు కేవలం రావణుడు నుంచి రక్షణ కోసం కాదు. పోలవరం మూలంగా కోల్పోతున్న సర్వస్వం ఆమె కళ్ళల్లో చూసాడు. ఒక సామూహిక దుఖం ఆమె కళ్ళలో కనుగొన్నాడు. వందలాదిగా గొడ్డూ గోడా అదృశ్యం అవుతుంటే వాళ్ళందరి సామూహిక దుఖాలు  ఆమె కళ్ళలో వెతికాడు.కానీ ఆయన కోరుకున్నట్లుగా ఫోటో దొరకలేదు.

ఏదో ఓక్ వెబ్సైటు లో చివరికి  వెబ్సైటులో వంశీ కార్తీక్ అనే అతను తీసిన  ఫోటో తీసుకొన్నాడు . ఇప్పుడు ముంపు మూలంగా పోతున్న సీతారావుని  పర్ణశాల కోసం కాకుండా దాని చుట్టూ ఉన్న అవాసాల కోసం ఏడవాలి. అందుకే ఒరే  రావుడూ ఇలా రారా మట్టి మరణ వాగ్మూలం విను, దమ్మక్క పెడుతున్న శాపనార్ధాలు వినరా విను” అని సీతతో రావుడికి వేడుకోలు చెప్పించాడు . పర్ణశాల లో మిగిలిన సీతా రావణుల బొమ్మలు అవి కేవలం బొమ్మ లేనా వాటి చుట్టూ మిగిలిన ఎట్టి మనుషులు కోల్పోతున్న ఆనవాళ్ళు , విరిగిన కళలు.అలంకార ప్రాయంగా మిగిలిపోతున్న ఎద్దుకొమ్ములు, వెదురు బుట్టలూ,జనావాసాల్లో అలంకరణ కోసం మిగిలిన ఆదిమ కళల ఆనవాళ్ళు. ఎవరయినా పాపికొండల విహార యాత్రకు వస్తే “గుడ్డి నాయాల, చెవిటి నా కొడకా అవి నీళ్ళు కాదురా కన్నీళ్లు కోట్ల క్యూసెక్కుల కన్నీళ్లు” ధైర్యం ఉందా మనకి అరుణ్ లా ఆలోచించడానికి? ఆయన చేసే ప్రతి పనిలో ఇంకా ఏదో మిగిలిపోయిన బాధ్యత. ఒక కొనసాగింపు కోసం నిరీక్షణ. అవును అరుణ్ తన పుస్తకానికి కవర్ పేజీ అట్ట కోసం  ఎన్నెన్ని లోతయిన విషయాలు ఆలోచించాడు.

ఏడాది కింద మువ్వా సార్ వాళ్ళ అమ్మానాన్న సాహిత్య పురస్కారం కోసం ఖమ్మం లో మీటింగ్. రాష్ట్ర వ్యాప్తంగా కవులంతా ఖమ్మం లోనే . మువ్వా సర్ మీటింగ్ అయినా అది అరుణ్ సాగర్ మీటింగ్ లాగానే చేసాడు .ఒక తమ్ముడికోసం అన్న చేసిన మీటింగ్.  వేలాది మంది కూర్చొనే చోటు లేక బయట ఏర్పాటు చేసిన తెరల మీద అరుణ సాగర్ ప్రసంగం. గోరటిపాట  రాష్ట్రంలో పేరుమోసిన కవుల తోబాటు, అప్పుడే కళ్ళు తెరిచిన కవికుంకల దాకా అంతా అక్కడే అదో కోలాహలం. మీటింగ్ అయ్యాక ఖమ్మం శివారులో ఒక రిసార్ట్ లో పార్టీ. గడ్డ కట్టే చలి,ఆ రాత్రి క్యాంపు ఫైర్ వేసారు. రాజేసిన నెగడులో రవ్వలు ఎగజిమ్ముతున్నాయి. ఎవరి చేతిలో ఏముందో వెచ్చటి ద్రావకం ఒక్కొక్కరి  గొంతులో జారుతోంది. ఎగిసి పడుతున్న  మంటల ముందు ఏదో ఆలోచిస్తూ అరుణ్. ఒంటరి ఊపిరితిత్తు ఆయన లోపలి ఎగసే ప్రశ్నలు, తడబడుతున్న హృదయ కవాటాలు, మొరాయిస్తున్న శ్వాస. చీకటి మధ్యలో మంటలు, తెనాలి పద్య నాటక మిత్రుల హరిచంద్ర పాటలు గోరటి   తో జుగల్బందీ . అంతా అవధులు లేని ఆనందం లో అక్కడ కేవలం ఒక్క మనిషి లో విషాదం.అదే అరుణ్ ఆయన  ఆలోచనలు. తరిగి పోతున్న నిముషాలు. ఒక్క్కొక్కటి మాయం అవుతూ ఆయన ఆయుషు తినేస్తున్నట్లు కానీ నాకు తెలుసు ఆయన మందగించిన చూపు, తడబడుతున్న శ్వాస. కోల్పోతున్న ప్రతి నిముషంకు అర్ధవంతం అయిన ముగింపు ఇవ్వాలని తపన, దగ్గరి వాళ్ళతో ఆయన బ్రతికిన క్షణాలు అన్నీ బోనస్ గా దొరికినవి అని. ఆ మిగిలిన  క్షణాలు అమూల్యమైనవి అనీ.తాను మొదలుపెట్టిన ప్రయాణం అర్దాంతరంగా ఆగడం ఇష్టం లేదు. ఆయనకు తెలుసు కాలం ఆయనని తరుముతూ ఉందని.

ఒక సారి లోయపల్లి అని ఒక ఊరు పోయాం . ఆ ఊరిలో ఒక చిరు ఉద్యోగి ఆయన పనిచేసే చానెల్ లో అతనూ,  పూసలోల్లు అని ఒక సంచార కులం నుండి వచ్చిన అతని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. రాష్ట్రం మొత్తం ఆ కులం నుండి  పాత్రికేయ ప్రపంచంలో ఒకడే ఉన్నాడు.ఆ పేరు ఇప్పుడు పాత్రికేయ వృత్తిలో సుపరిచయం. ఇంటర్వ్యూ సమయం లో అతని గురించి తెలుసో లేదో కానీ పూసలు అమ్ముకొనే ఒక తల్లి తన కొడుకుని పాత్రికేయ ప్రపంచానికి అందించిది అది కేవలం అరుణ్ మాత్రమె చేయగలడు. అగొ వృత్తిలో ఇలాంటి మానవీయ విలువలు ఉంటాయా ?

మళ్ళీ ఏడాదికి ఖమ్మంలో క్రాంతి సర్ వాళ్ళ మీటింగ్ అదే సమూహం మీటింగ్ ప్రాంగణం అరుణ్ పేరుతో. వందలాదిగా తరలి వచ్చారు,ఒక్క నిముషం అరుణ్ కోసం నివాళి. మళ్ళీ చిమ్మ చీకట్లో రాజేసిన మంటలు అక్కడ కూడిన అందరిలో ఒక పేరు మిస్ అవడం.పోయిన సారి అందరం ఇక్కడే కలిసాం కదా. అంతా నిశబ్దంగా . అంతకు ముందు. వైజాగ్ జగతి-రామతీర్ధ పిలుపు. మువ్వా,ఖాదర్అన్నా,ప్రసాద మూర్తి,పవనన్న నేను హైదరాబాదు,భద్రాచలం,సుక్మా, కుంట,మీదుగా పాపికొండలు,పోలవరం,మారేడుమిల్లి,లంబసింగి, వైజాగ్ ప్రయాణం.ప్రతి మూలమలుపులో కోల్పోయిన క్షణాలు.ఆయన పుట్టిన పరిసరాలు, శబరి వంపులో తొలి యవ్వన జ్ఞాపకాలు.అరుణ్ కు లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం. ‘’నాగరిక’ సమాజానికి సుదూరంగా కాస్త ప్రేమను వెతుక్కొనే క్రమంలో తిరిగాడు. అరుణ్ కుటుంబం రాజకీయ విశ్వాసాలకోసం విస్తాపితులు అయ్యారు. పుట్టుక,చదువు,కొలువు,చివరి మజిలీ ఏ ఒక్కటీ స్థిరంగా లేని విస్తాపన ఆయనది. నాలుగడుగుల తన చిన్న కాబిన్ లో మానసిక ఉక్కపోతలో ఆయన రాసుకున్న వాక్యాలలో స్వాంతన పొందాడు.ఆ రాతల్లో  అంతరించి పోతున్న ఒక రేలపాట, ఆ పాట  మృత్యు సంగీతంగా మారుతున్న సమయం.  లక్షలాది ఆదివాసీల గుండె గొంతుకకు ఆయన వాక్యాలతో కాస్త దైర్య వచనం అయ్యాడు . మనలో ఎక్కడయినా  కడంచున కాస్తంత మనిషి తనం మిగిలి ఉంటె ఆ వాక్యాలు చదవి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. మాయం అయిపోతున్న మనిషి జ్ఞాపకాలు ఆయన వాక్యాలు. కుంట,చీదరి చంద్రయ్య,ఇరపా లక్ష్మి. అరుణ్ సాగర్ రచనల్లో కావ్యకన్యకలు అయ్యారు.జ్ఞాపకంగా మారిన చీదర చంద్రయ్య కోసం కీట్స్ తన మిత్రునికోసం రాసినట్లు.

khader

అరుణ్ చనిపోయి ఏడాది కూడా కాలేదు. అనుకున్నట్లుగా ఆయనపేర ఒక అవార్డు రూపకల్పన చేసిన మిత్రులు.  ఈ పుట్టిన రోజు ఆయన మిత్రుల సహకారంతో ప్రెస్ అకాడమి ఆయన పేర మూడు అవార్డులు,విశ్వం బాబాయ్ అరుణ్ సాగర్  సమగ్ర కవితా సంకలనంతో ఆయనకు నివాళి. మానవీయ విలువలతో పాత్రికేయ వ్రుత్తి లో ఉన్న వాళ్ళను వెతికారు అల్లం అన్న,రాజకుమార్ అన్న. మొదటి సారి ఖాదర్ అన్నకి ఇస్తున్నారని తెలిసింది.

ఒక మనిషి పుడతాడు పోతాడు. కానీ పోయే లోపు నిన్ను కన్ననేల చెర బడుతున్నప్పుడు కాస్తంత కన్ఫెషన్ అవసరం. కానీ అరుణ్ సాగర్ ఎకంగా కోల్పోతున్నరేల పాటకోసం మరణ వాగ్మూలం రాసుకుండు. ఒక మైదాన వాసి విస్తాపితుడిగా తాను పుట్టి పెరిగిన ప్రాదేశిక ప్రాంతాలు చరిత్ర గతిలో గతంగా మారబోతున్న సంక్షుభిత సమయం లో  ఎనభై అడుగుల లోతులో సమాధి కాబోతున్న మన ఆనవాళ్ళను  దూరంగా మన బిడ్డలకు  చూపించి “అగొ అక్కడే నీ తాతలు తండ్రులు ఒకప్పుడు ప్రాణం తో ఉన్న మనిషి జ్ఞాపకాలు  అని కడసారి మనకు చూపించి కనుమరుగు అయ్యాడు అరుణ్. లేదు నలుగురు కూడిన ప్రతిచోటా అరుణ్ ఉంటాడు.

*