Archives for December 2016

నిజ జీవిత చెరసాలల్లో…

art: satya sufi

art: satya sufi

నీడలతో క్రీడిస్తూ
నిజంతో సహజీవిస్తున్నాననుకొని
భ్రమల సాలెగూటిలో
బంధాల ఆశలల్లుతూ ఎడతెగక.
తలుపుకవతల ఏవో పిలుపులు..
నన్నేనని నమ్మి
ఆత్రంగా పరిగెడతా గదికడ్డంగా.
వీధి గుమ్మం ముందర తచ్చాడుతున్న
నిరూపమైన దేహపు అలికిడి,
స్పృశించే విఫలయత్నంలో తడబడి,
శూన్యపు సౌధాలలో
నీ పిలుపుల ప్రకంపనలలు
అలసిన నా శరీర కంపనలతో కలిసి,
అభావపు చిరునవ్వై..
పొడి పెదవులపై నిర్జీవంగా.
దేహపు సడి వెచ్చగా చేతికంటదు.
మాటల తడి చెమ్మగా గుండెకు చిక్కదు
ఆలోచనా స్వేఛ్ఛాలోకపు ఆకారాలతో
నిజ జీవిత చెరసాలల్లో సంభాషిస్తూ,
వసారాలో,కిటికీ మూలల్లో
పడక గదిలో, నీళ్ళగదిలో..
వెతుకులాటలు.
చిరుచినుకుల సవ్వళ్ళకు
విప్పారి విరబూసే మరిన్ని మనసుల ఉనికికై
రెపరెపల బ్రతుకులాటలు.
ఇల్లంతా ఒంటరితనపు వాసన
దండాలపై వేలాడుతున్న ఏకాకితనపు వస్తాలు
ఎండిన పూలన్నీ ఒక్కొక్కటిగా రాలిపోతూ
వేదాంతం విరజిమ్ముతుంటే
చివుక్కుమన్న మనసుతో
చిన్నబుచ్చుకున్న మోము.
పూబాలల సౌరభాల్ని ఒడిసిపట్టి
గుదిగుచ్చిన దారపుపోగు.
నల్లని కనుపాపల్లో విఛ్ఛిల్లిన ఆపేక్షకెరటం.
చెమ్మగిలిన కనుల గడపదాటి
చెప్పరాని గుబుళ్ళ దోవన
అడియాసలైన నిన్నటి ఆశల పరావర్తనం.
దారిపోడవునా తోడొస్తున్న
తెలియని సాన్నిహిత్యపు స్పర్శ.
నామకరణం చెయ్యను
ఎవరివి నీవనీ అడగను.
ఎందాకా వచ్చినా నవ్వుతూ నేస్తం కడతాను.
గమనమే గమ్యం.
ఆసాంతం కలిసొస్తావనే చిగురాశే..
సుదూరపయనానికి మనసైన ఇంధనం.
*

ఏడుపో, ఎతుకులాటో, యాతనో…!

screenshot_20161214-073853వాకిండ్లే వారగియ్యని  పల్లెల్నిర్సి మూసిన వాకిండ్లను తెర్సని టవున్లకు వలసొచ్చిన మట్టిమనుసులకు నాలుగ్గోడల మధ్యన బతుకు శానా ఇరుగ్గా అనిపిచ్చాది. అణువణువూ తెల్సిన ఊర్లో నుంచి అంగుళం గూడా తెలీని నగరంలోకి అడుగుపెట్టగానే మనసంతా అదోరకం ఎడారితనం ఆవహిచ్చాది. బెరీన ఆన్నుంచి తప్పిచ్చుకోని యాడికైనా పారిపోవాలనిపిచ్చాది. అట్లా ఆ ఇరుకుతనంలో నుంచి, ఆ ఉక్కిరిబిక్కిరి తనంలో నుంచి రోంతట్లా తలుపు తెర్సి సాగే సల్లని పల్లె ప్రయాణం ‘సగిలేటి కథల’ సంపుటి.

ఈ కథల్లోకి తవ్వుకుంటా పొతే ఒక్కోసాట ఒక్కో తడి తగులుతాంటాది.  అది ఏడుపో, ఎతుకలాటో, యాతనో, యాపమాను మీద ప్రేమో, సరసమో, చెతురో, ఆకలో, అమ్మతనమో ఏదో ఒకటి. కత కోనేటి ఊటై దప్పిక తీరుచ్చాది. ఏటిగట్ట్టై సేదతీరుచ్చాది. అట్లని అది ఎప్పుడూ సంబరమే గానక్కర్ల్యా. అప్పుడప్పుడు సన్నాసపకోళ్ళ తీరని ఆకలి కోరికల్ని మనకు రుచి సూపిచ్చి కళ్ళనిండా కన్నీళ్లను కుమ్మరిచ్చి పోతాది.( కురాక్కు సచ్చోటోన్నా…)

శాన్నాల్లకు అమ్మలేని ఊర్లో అడుగుపెట్టినప్పుడు , అప్పటికే మనసులో పూడ్చలేని అగాధం ఒకటుంటాది. ఆ ఎలితిలో ఊరు ఇదివరకు మాదిరి ఉండదు. మన మనసులోనే ఒక తెరప ఉంటే అవతల ఏదీ కూడా నిండుగా కాన్రాదు. ఏదో పేగుతెగి ఒక ఖాళీతనం మనలో సుడుల్దిరుగుతాంటాది. “ బస్టాండు దాట్తానే ఒక పెద్ద వొనుం ఉంటది. దాన్నిండా సెట్లుంటాయి. ఆ వనం సుట్టు సూచ్చి తెరపలు కనపద్తాంది. …రోడ్డుమీదికి కొమ్మలు సాపుకోని ఉన్నే శింతశెట్టు శేతులు కాళ్ళు పడిపోయిన మాదిరి కొమ్మలు తెగిపోయి దీనంగా సూచ్చాన్నెట్టు కనిపిచ్చ. “ రాతగాడు ఎదుటి ప్రాణిలో దూరిపోయి తనలో తొలిచే ఖాళీ తనాన్ని బూర్సుకునే ప్రయత్నమన్న మాట. ఆయప్ప ఆన్నే ఆగిపోడు. అట్లా ఇంగా శానా లోతుకు తవ్వుకుంటాడు.  ” దానితట్టు తేరిపార జూచ్చా “నన్ను గుడ్తు పట్నావా? ఎప్పుడూ నీ ఒళ్ళో ఆడుకుంటాంటి. మా యమ్మకాడ ఆడుకుంటాన్నట్టు. శింతశిగురు, పూత, పిల్ల శింతకాయలు, దోర శింతకాయలు, బొట్లు అన్నీ తెంపుకుని తింటాన్న గూడా ఏమి అనకపోతాండే(టివి)” మాయమ్మ మాదిరే. ఆయన్ని మతికొచ్చి ఉరుకుతాపోయి చెట్టును గట్టిగా కర్సుకోని ఎడుజామనుకుంటి, తమాయించుకోని అట్టనే నర్సుకుంటాపోతి.( ఎట్లపాయనో మాయమ్మ….)
 పదాలు ఇంత తడిగా కూడా ఉంటాయా  అనిపిచ్చాది. సెట్టును పట్టుకోని ఏర్సడమేంది పిచ్చిగాకపొతే, అనిపిచ్చాది. కానీ మనసులో ఉబికొచ్చే కన్నీటి ఊటను ఆ క్షణంలో బయటికి పారియ్యడానికి ఒక కాలవ గావాల. ఒక జీవం గావాల. చెహోవ్ కథ ‘బాధ’లో కొడుకు సచ్చిపోయినపుట్టుడు మనసులోని బాధను ఎల్లగక్కడానికి  జట్కా బండతను మనిసి దొరక్క ఆఖరికి తన గుర్రాన్ని పట్టుకుని ఏర్సడం గుర్తుకొచ్చాది. బాధ లోపల కాల్చేసేటప్పుడు ఎదురుగా ఉండేది మనిషే గానక్కర్ల్యా మండిపోడానికి. అది మానైనా పర్వాలేదు. మూగ జీవమైనా పర్వాలేదు.
kathana
 “మాయమ్మ  వెళ్ళి పోయినంక నా మనసు ఎట్ట శీకటయిందో అట్ట శీకటయింది. నేను హైదరాబాదు బస్సెక్కితే బస్సు గిద్దలూరు దావంబడి లైట్లు శీకటిని శీల్చుకుంటా పోతనాయి. లైట్ల ఎనక బస్సు, బస్సులో నేను, నా ఎనక శీకటి..ఆ శీకట్లో ఎనిక్కెనిక్కి పోతాన్నె మా ఊరు..”.
 పోలీసు స్టేషన్ కాడ యాపమాను కొట్టేసేటప్పుడు, ఆయప్ప గుండె రంపపు కోతకు గురైపోతాది. అధికారానికి తిరగబడి తగరారు పల్లేక మనసు మోనంగా ఎడుచ్చాది. మనసులోని ఆ అలజడే కండ్లపై తడిపొరై తచ్చాడతాది .

ఊర్లల్లో కొన్ని ‘గొప్ప’మాన్లుంటాయి . నిజంగా సెప్పాలంటే ఆ మాన్లను ఎవరు నాటింటారో, అయి ఎన్ని తరాల కిందటియో కూడా తెల్సుండదు. ఒక్కసారిగా ఆ మాన్లే గనకా కాన్రాకపోతే ఆడ శూన్యం సుడులు తిరుగుతాది. అంతా బోడిగుండు మాదిరి బోసిపోయినట్లుంటాది. కడుపులో తెడ్డు పెట్టి గెలికినట్లుంటాది. కూలిపోయిన ఆ మానుకింద పిల్లప్పుడు ఆడుకున్న్య గోలిగుండ్లాటలు, ఎండాకాలం సల్లని నీడను పరిసే ఆ మాను కొమ్మలు అన్నీ మతికోచ్చాయి.

 “తల్లిలాంటి సెట్టును నరుకుతాంటే ఇదేమన్యాయం అనడిగితే లోపలేశిరి( పోలీస్టేషన్ లో ). …బస్టాండుకు పోతా యాపసెట్టు తట్టు జూచ్చి. తుంటలు తుంటలు నరికి టేషన్ పక్కకు కువ్వ పోసిండ్రు. సెట్టు మొదలు తిట్టు జూచ్చి. ఎదిగి శేతికొచ్చిన కొడుకు సచ్చిపోతే రాగాలుదీసి ఏడుచ్చాన్న తల్లి మాదిరి అగుపిచ్చింది. కడుపులో ఎవురికీ సెప్పుకోలేని బాధ. …”( యాపశెట్టు).  ఇట్లా శానా దిగులు మోడాలు మనకు ఈ బుక్కులో ఎదురైతాయి. మన కండ్లల్ల ఇన్నిగనం కన్నీటి సినుకుల్ను రాల్చి పోతాయి. మనిషి కోసరం ఒక మనిషి పడే యంపర్లాట. ఇదో తవ్వులాట.
 ఊరంటే ఆడ ఒక్క మనిసే ఉండడు. మనిసితో పాటు ఎద్దులు ఎనుములు, కుక్కలు కోళ్ళు , సెట్లు శ్యామలు, వాగులు వంకలు, ఏర్లు బావులు ఇట్లా ఇయ్యన్నీ రోంతరోంతగా పెనేసుకొని ఉంటాయి. ఇయ్యన్నీ తడికెలో దబ్బలు గదా ఉన్నెట్లు ఒకదానికొకటి ఇడదీయరాకుండా అల్లుకోనుంటాయి. ఆ అమరికే ఊరైతాది. “ ఇట్టా చెతురు మాట్లాడుకుంతూమ్డగానే ఏరుదాటి మెయిన్ రోడ్డెక్కితిమి రోడ్డు మింద నుంచి మా ఊర్ని జూచ్చే నిద్దరపోడానికి ముందు తూగుతాన్న సిన్నపిల్లోని మాదిరున్నెది(సిన్నిగాడి సికారి ) . అది ఊరంటే.
“(ఊర్లో) బస్సు దిగుతానే తిర్నాల్లో దావ  తప్పోయి తల్లిని కనుక్కున్నా పిల్లోని మాదిరి అనిపిచ్చ ఎంకటేసుకు. ఊర్లో తెలిసిన వాళ్ళందరూ పలకరిచ్చాంటిరి. ఇంటిదావనర్సుకుంటా పోతాంటే ఊళ్ళో చెట్లు, పండ్లు, అంగళ్లు అన్ని నవ్వుతా పలకరిచ్చాన్నట్లుండె.” ( బతకలేక బాయిలోపడ్తే…) . ఆఖరుకు అట్లాంటి ఊర్లోనే బతుకు బండి వాటుపడి “తనకు సొర్గం సూపిచ్చాదన్న బూమిలోనే సొర్గస్తుడయిపోయిన” ఎంకటేసును తల్సుకుంటే కండ్లు సెమ్మగిలుతాయి.
నీళ్ళు ల్యాక, పనీబాటా ల్యాక బేకారుగా తిరిగే పిల్లోల్లు కూడా ఈ కథల్లో కనిపిచ్చారు. రాయలసీమలో పిల్సకుండానే పలికే కరువులు, ఎండిపోయిన సెరువులు, కడాకి “అమ్మకు కొత్త కోక కొనిపిచ్చే…” తాపత్రయంలో బతుకు బుగ్గిపాలు గావడం( నెత్తుటి మరకలు ), దిక్కులేని సుబ్బులు సచ్చిపోతే , బతికుండగా జరిగినయన్నీ మర్సిపోయి ఊర్లో తలా ఓ సెయ్యేసి  “…యాడ జేచ్చే ఏముందిలేండ్రా మంచి కులంలోనే పుట్టినట్లుంది. కాకపొతే కడుపాత్రం కోసరం ఇట్టయ్యింది గానీ, ఏ ఆడకూతురైనా ఇట్టాటి బతుకు బతకాలనుకుంటదా!” ( ఇంకుడు బతుకులు ) ఇట్లా ఈ కథలన్నీ మామూలోల్ల కథలే.
మట్టి మనుషుల కథలు సెప్పుకోవాలంటే భాషలో ఆ మట్టిమనుషుల మాట్లాడే యాసుండాల. పదాలకు షోకులు నేర్పకుండా సాదాసీదాగా , కట్టిర్సి పొయ్లో పెట్నేట్లుండాల. జానపద శైలి ఉండాల. రాయలసీమ యాసలో ఈ కథలు సదువుతాంటే “పొగలు వచ్చాన్న సంగటిని చేత్తో అట్టట్ట అదిమి తుంటలు తుంచి గోవాక్కారంలో పొల్లిచ్చి నోట్లో పెట్టుకుని( ఎంటిక )” మింగినట్లుంటాది. కారం కారంగా బలే కమ్మగుంటాది.
ఇప్పుడు రాయలసీమ తన ఉనికిని సాటుకోవాలంటే ఇట్లాంటి కథలు ఇంగా శానా రావాల. కరువు పేరిట ఎండి ఎడారై పోయిన పెన్నేటి గట్టు అసలు గుట్టు ఇప్పడానికి సీమ భాషలో, సీమ యాసలో, సీమ యాతనను పట్టి నిలిపే మరెన్నో కథలు రావాలి.
***

జ్ఞానానికి అడ్డుగోడ

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-7

 

sudrarsanamధర్మారావు ఊహాప్రపంచంలో అప్రత్యక్షానికి, అతీతజ్ఞానానికి, అవ్యక్తానికే ప్రముఖస్థానం. నేత్రాల కన్నా మనసుకు, మనసుకన్నా ఆత్మకే ప్రాధాన్యం. అతని సిద్ధాంతాలు, సూత్రీకరణలు అన్నీ వీటి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అంటే, ఎంతసేపూ ప్రత్యక్షం నుంచీ, వాస్తవికత నుంచీ దూర దూరంగా పయనించడమే.

ఒక చోట మడికి, పరిశుభ్రతకు మధ్య తేడాను ఇలా చెప్పుకొస్తాడు:

“పరిశుభ్రముగా నుండవలయును గాని, మడిలో ఏమున్నదనును. పరిశుభ్రముగా నుండుటలో మాత్రమేమున్నది?…ఏనాది వారు, కొందరు నీచజాతివారు అసహ్యమైన దేహములతో గుడ్డలతో తినుట లేదా? వారనాగరకులు, బుద్ధిమాలినవారు, నేను నాగరకుడను, నాకు పరిశుభ్రముగా నుండవలయు ననును. పరిశుభ్రముగా నుండుట నాగరకత యైనచో భోజనము చేయువేళ మడిబట్ట యని, దానితో నింకెవరిని తాకనని నియముగా నుండుట మరియు నాగరకత యేమో! మురికి యుండుట లేకపోవుటలలోని తారతమ్యము ప్రత్యక్షము; శుభ్రమైన వస్త్రమునకు, మడిబట్టకును గల తారతమ్య మప్రత్యక్షము. నీవు దేవుడున్నాడందువేని అది అప్రత్యక్ష విషయము. అప్రత్యక్షమై బుద్ధిమంతునిచేత నూహింపబడునదియే మతము. అదియే దివ్యము. అది నీ సామాన్యజ్ఞానమును దాటి యుండును. సద్విషయమును నీ వాచరించవేని యది నీకే నష్టము.”

ఇంకోచోట రచయిత ఇలా అంటాడు:

“అవ్యక్తమైన స్వరము మధురమైనట్లు, అవ్యక్తమైన భావము సుమనోరంజకమైనట్లు, అవిస్పష్టమైన వెలుగులలో శోభ యెక్కువ యున్నది. పూర్తిగా కనబడినచో జ్ఞానము, కనబడి కనబడనిది మాయ. మాయలోనే యున్నది సౌందర్యము.”

ఈ మాటలు సాహిత్య సందర్భానికి వర్తించేటట్టు ఉన్నా, రచయిత తాత్వికతకూ సమానంగా వర్తిస్తాయి.

ఏనాది వారు, అలాంటి ‘నీచజాతివారు’ ‘అసహ్యమైన దేహాలతో గుడ్డల’తో తినడానికి కారణమైన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి ధర్మారావుకు అక్కర్లేదు. ఆ పరిస్థితులు మారితే వారూ పరిశుభ్రతకు మళ్ళవచ్చునన్న ఊహ అతనికి లేదు. ఆ ఊహ కలగడానికి అతనిలో పరిణామస్పృహే లేదు. ఆ స్పృహ ఉండడం అతని సిద్ధాంతాలకు భంగకరం కూడా. కనుక అతని దృష్టిలో తను విశ్వసించే చాతుర్వర్ణ్యవ్యవస్థలానే, నీచజాతులన్నవి కూడా ఒక స్థిరసత్యం. అవి ఎప్పటికీ స్థిరంగా ఉండవలసిందే. ఎందుకంటే, కొన్ని ‘నీచజాతులు’ ఉండడంలోనే వర్ణవ్యవస్థ ఉనికి కూడా ఉంటుంది. అవి పరస్పర ఆధారితాలు.  ఈ ‘నీచజాతు’ల విషయాన్ని పట్టించుకోని ధర్మారావు, పరిశుభ్రత గురించి వాదించే ‘నాగరకుల’తో పోటీపడి, మడిబట్ట కట్టుకోవడం అంతకంటే నాగరకం అంటాడు. ఆపైన శుభ్రతకు, మడికి తారతమ్యం అప్రత్యక్షం, అంటే కంటికి కనిపించదంటాడు. మడితోపాటు అప్రత్యక్షాలైన దేవుణ్ణీ, మతాన్నీ కూడా తీసుకొచ్చి అవి దివ్యాలంటాడు. మతం కేవలం బుద్ధిమంతుని ఊహకు మాత్రమే అందుతుందని, సామాన్యజ్ఞానాన్ని దాటి ఉంటుందనీ అంటాడు. ఇలాంటి సద్విషయాలను ఆచరించకపోతే నీకే నష్టమని బెదిరిస్తాడు.

లోకం ప్రత్యక్ష, వ్యక్త, వాస్తవికజ్ఞానాన్ని అనుసరించి నడుస్తుంది. అలాగని అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానం లేదనీ అనాల్సిన అవసరం లేదు. అది వ్యక్తుల స్థాయిలో అనుభూతమయ్యే జ్ఞానం కావచ్చు. కానీ సాముదాయిక స్థాయిలో ప్రత్యక్ష, వ్యక్త, వాస్తవికజ్ఞానానికే ప్రాధాన్యం.  ఈ జ్ఞానరంగాన్ని ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ, ఉపయోగకరంగా మలచుకుంటూ ఉన్నప్పుడే  ప్రపంచం అందరికీ సమానంగా వాసయోగ్యం అవుతుంది. ఎంత అసామాన్యజ్ఞానాన్నైనా సామాన్యీకరించి అధికసంఖ్యాకులకు అందుబాటులోకి తేకపోతే దానివల్ల లోకానికి ఉపయోగం ఉండదు.  ఒక పోలిక చెప్పుకుంటే, ఒకప్పుడు మహర్షులు దివ్యదృష్టితో ఎక్కడ ఏం జరుగుతోందో దర్శించేవారంటారు. అది నిజమో, కాదో మనకు తెలియదు. ఒకవేళ నిజమే అనుకున్నా ఆ దివ్యదృష్టి ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం. అదే శాస్త్రవిజ్ఞానానికి వస్తే, టెలివిజన్ రూపంలో అలా చూడగల అవకాశాన్ని అది సాముదాయికం చేసింది. ఇలా అప్రత్యక్ష అతీతజ్ఞానాన్ని సామాన్యీకరించి సాముదాయకం చేయాలన్న దృష్టి ధర్మారావులో కనిపించదు. శాస్త్రవిజ్ఞానానికీ, ఆధ్యాత్మికతకూ మధ్య విరోధాన్ని ఊహించుకుని శాస్త్రవిజ్ఞానం కన్నా ఆధ్యాత్మికమే గొప్పదని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. ఒకచోట ఇలా అంటాడు:

“సర్వశాస్త్రములు ఆదిహేతువును కాదు, తద్వికారములను గూర్చియే యుపన్యసించును. ఈ యీ పదార్థములయందీ ధర్మమున్నదని యుపన్యసించును గాని యా ధర్మమేల యున్నదో శాస్త్రము చెప్పలేదు. ఆకాశమునం దా నైల్య మేల కనిపించుచున్నది? వాయువో, జ్యోతిస్సో యేదో యొకానొక తరంగసమితి ప్రసరించుటవలన ఈ నీలవర్ణ మేర్పడుచున్నది. దానిని శాస్త్రజ్ఞులైన సి.వి. రామన్ గారు కనిపెట్టిరి. దానికే ‘రామన్ గారి సిద్ధాంతమ’ని పేరు వచ్చినది. ఆ రీతిగా అట్టి తరంగప్రసారమువలన ఆ నీలవర్ణ మేల ఏర్పడవలయు నన్న ప్రశ్న కా మహానుభావు డేమి చెప్పును? అట్టి తరంగ ప్రసరణ మా నైర్మల్యమునకు హేతువనునది ధర్మము. ఆ శాస్త్రజ్ఞుడా ధర్మమును చూచెను. ఆయన చూడక ముందా ధర్మమున్నది. ఆ ధర్మము నిత్యమైనది. తన్నిత్యతా జ్ఞానముండుట కాస్తిక్యమని పేరు. చంద్రుడు, నక్షత్రములు, ఆకాశము; యీ సర్వము తద్ధర్మోపన్యాసమునే చేయుచున్నవి.

…ఆ ధర్మము శాస్త్రజ్ఞులు చెప్పిననే కానీ యితరులు విశ్వసించరట! ఆ శాస్త్రజ్ఞులనైనను, అందరు శాస్త్రజ్ఞులు ఒప్పుకొనవలయునట! వారును పదార్థవిజ్ఞానశాస్త్రవిషయోపన్యాసము లొప్పుకొందురట. ఆధ్యాత్మికవిజ్ఞానశాస్త్ర విషయములందు సందేహమేనట! భౌతికమునకు ఆధ్యాత్మికమునకు నడుమ నున్న మహాసముద్ర మెవ డుల్లంఘించగలడు?”

ఇలా అన్న ధర్మారావు,  మిగతా వానరవీరులెవరూ చేయలేని సముద్రోల్లంఘనను ఆంజనేయుడు ఒక్కడే చేయడాన్ని ఉదహరిస్తాడు. ఆంజనేయుడి సముద్రోల్లంఘనను మిగతావారు విశ్వసించారు కనుక సరిపోయింది కానీ, విశ్వసించకపోతే అతని బతుకేమయ్యేదంటాడు. ప్రతిదీ అందరి అనుభవంలోకి రావలసిందే నంటే, ఐన్ స్టీన్, రామన్, బోసు మొదలైనవారు చెప్పినవన్నీ అందరి అనుభవంలోకి వస్తున్నాయా, అయినా విశ్వసించడం లేదా అని ప్రశ్నిస్తాడు. “ఇది ధర్మమని చెప్పినచో విశ్వసించవలయును…ఒకడు తర్కముచే చూచిన దొకడు విశ్వాసముచేత చూచును”: ఇదీ అంతిమంగా అతని నిర్ధారణ.

visanaa

దీనినిబట్టి ఏమర్థమవుతోంది? శాస్త్రవిజ్ఞానంతో సహా అన్ని రకాల జ్ఞానాలకూ ఆఖరి మెట్టు ఆధ్యాత్మికజ్ఞానం. అది ఎలాంటి జ్ఞానమంటే, అప్రత్యక్షం, అవ్యక్తం, అతీతం! అది ఏ కొందరికో మాత్రమే అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి రాని అసంఖ్యాకులు ఏం చేయాలంటే, తమకు అనుభవంలోకి వచ్చిందని చెప్పిన ఆ కొద్దిమందినీ నమ్మాలి! ఏ కొందరి అనుభవంలోకో వచ్చే ఆధ్యాత్మికజ్ఞానాన్ని అన్ని జ్ఞానాలకూ ఆఖరి మెట్టుగా నిలబెట్టి, ఆపైన తర్కాన్ని, ప్రశ్నల్ని నిషేధించి విశ్వాసాన్ని స్థాపించడమంటే ఏమిటి? జ్ఞానాన్వేషణకు హద్దులు గీయడమే! నువ్వెంతైనా జ్ఞానాన్వేషణ చేయి, అది అంతిమంగా విశ్వాసం దగ్గర ఆగిపోవాలి!

జ్ఞానంలోనూ ధర్మారావులో విభజన దృష్టే. శాస్త్రజ్ఞానమే అయినా, ఆధ్యాత్మికజ్ఞానమైనా జ్ఞానం అనేది ఒకదానితో ఒకటి ముడిపడిన సరళరేఖలాంటిదే. కానీ ధర్మారావు శాస్త్ర, ఆధ్యాత్మికజ్ఞానాలను పరస్పర సమాంతరాలుగా ఊహించుకుంటాడు. రెండింటి మధ్యా పోటీ పెడతాడు. ధర్మారావు చెప్పే ఆధ్యాత్మికజ్ఞానాన్ని కూడా శాస్త్రవిజ్ఞానం పరీక్షకు పెడుతుంది తప్ప మొండిగా నిరాకరించదు. దేనినైనా మొండిగా నిరాకరించేది శాస్త్రవిజ్ఞానమే కాదు. కాకపోతే, ఏ జ్ఞానమైనా నిరూపణకు అందాలని చెబుతుంది. ఇందుకు భిన్నంగా  ఆధ్యాత్మికజ్ఞానం విశ్వాసాన్ని నొక్కి చెబుతుంది.  ఎప్పుడైతే విశ్వాసం అనే అడ్డుగోడను కట్టేశారో, ఆ తర్వాత ఇక జ్ఞాన విస్తరణా ఉండదు, వికాసమూ ఉండదు. ధర్మారావు ఊహల పర్యవసానం అలా ఉంటుంది.

శాస్త్రవిజ్ఞానం నిరూపణ మీద ఆధారపడుతుందన్న అవగాహన ధర్మారావులో లేదు. అందులోకి కూడా విశ్వాసాన్ని తీసుకొచ్చి, ‘శాస్త్రజ్ఞులు చెబితే కానీ నమ్మరట’ అని ఎత్తిపొడుస్తాడు. వాస్తవం ఏమిటంటే, ఐన్ స్టీన్, బోస్, రామన్ లాంటి శాస్త్రజ్ఞులు చెప్పారు కనుకే ఎవరూ గుడ్డిగా నమ్మడం లేదు. వారి సిద్ధాంతాలు, సూత్రాలు తాము అర్థం చేసుకోగలిగిన, నమ్మగలిగిన భౌతికప్రమాణాలకు అనుగుణంగా ఉండి, నిరూపణకు అందుతున్న మేరకు నమ్ముతారు. అధ్యయనమూ, ప్రయోగమూ, నిరూపణా అనేవి శాస్త్రవిజ్ఞానరంగంలో నిరంతరం సాగుతూనే ఉంటాయి.

మనుషులను విశిష్టులుగా, సామాన్యులుగా విభజించే ప్రయత్నంలో రచయిత పశుపక్ష్యాదులను కూడా విభజిస్తాడు. అనసూయ(చిన్న అరుంధతి తల్లి, ధర్మారావు అత్త), ధర్మారావుల మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది:

అన:…యాథార్థ్య మతీతజ్ఞాన విషయము గాని యెక్కువమంది చెప్పునది కాదు. గొర్రెలు మంద యుండును. ఏనుగులు రెండో, మూడో. గౌరవ మేనుగులకే. ఏనుగు గొప్ప యేమనినచో యేమని చెప్పగలము? అది మనసునకే తెలియును.

ధర్మా: ధర్మము కూడ నట్టిదే. అదియు మనసునకే తెలియును. మన మేనుగుల కిచ్చినంత గౌరవము పాశ్చాత్యులీయరు.

ఎక్కువమంది చెప్పలేని, మనసుకు మాత్రమే తెలిసే యాథార్థ్యం అనే అతీత జ్ఞానంతో కానీ, ఏనుగుల గొప్పతనంతో కానీ అసంఖ్యాకులకు పనేమిటన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. సమస్య ఏమిటంటే, రచయిత నొక్కి చెప్పే అప్రత్యక్ష, అతీత జ్ఞానం కేవలం జ్ఞానస్థాయిలోనే ఉండిపోదు. బౌద్ధికజీవితంపైనే కాక సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయజీవితంపై వాటి ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది. లౌకికమైన అన్ని రంగాలలోనూ విశిష్టత, సామాన్యత అనే తారతమ్యాలు ఏర్పడతాయి. విశిష్టత, సామాన్యతా సూత్రాన్ని రాజకీయ పరిపాలనారంగాలకు అన్వయిస్తే అది వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల అనుశాసనం మాత్రమే చెల్లుబాటు అయ్యే రాచరికం అవుతుంది. అధికసంఖ్యాకుల ఆమోదం మీద సాగే ప్రజాస్వామ్యం దానికి పూర్తి భిన్నం.

రాచరికవ్యవస్థతో సంపూర్ణ తాదాత్మ్యాన్ని చాటుకున్న వేయిపడగల రచయిత, అధికసంఖ్యాకుల ఆమోదానుసారం నడిచే ప్రజాస్వామ్యాన్ని తృణీకరించిన సందర్భాలు అనేకచోట్ల కనిపిస్తాయి. ప్రజాస్వామ్యాన్ని నిరాకరించడమంటే వైవిధ్యాన్ని నిరాకరించడమే. ఆయన కసలు ప్రజాస్వామ్యపు మౌలిక స్వభావమే అర్థం కాలేదు. “రాజును నా వంటి వాడే యని వీతిలో నిలుచుండి యనుము. ఏమగును? ఉరికి జానెడు బెత్తుడులో నుందువు” అని ధర్మారావు ఒకచోట అంటాడు.  ప్రజాస్వామ్యంలో ప్రధానిని, ముఖ్యమంత్రిని, మంత్రులను నిస్సంకోచంగా విమర్శించవచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజలే ప్రభువులు. మంత్రులు వారి ప్రతినిధులు, సేవకులు మాత్రమే. రాచరికంలో ప్రభునింద తప్పైతే ప్రజాస్వామ్యంలో ప్రజానింద తప్పవుతుంది. రచయిత ప్రాపంచిక దృక్పథం ప్రకారం సామాన్యులు, అసామాన్యుడి ముందు తమ అల్పత్వాన్ని అంగీకరించి అతని ఆధిపత్యానికి తలవంచాలి. అతడు ఏం చెబితే అది నమ్మాలి. ఈ నమ్మడం అనేది కేవలం అలౌకిక విషయాలకు మాత్రమే కాక, అన్ని లౌకిక విషయాలకూ వర్తిస్తుంది. సామాజికంగానే కాక సృష్టి సహజంగా కూడా మనుషుల సామర్ధ్యాలలో, ఆలోచనాసరళిలో, జీవన విధానాలలో, ఆహారపు అలవాట్లలో, విశ్వాస, అవిశ్వాసాలలో వైవిధ్యం ఉంటుంది. కానీ విశిష్టత- సామాన్యత అన్న విభజన సూత్రం ఆ వైవిధ్యాన్ని గుర్తించదు. తనదైన మూసలోకి అందరూ రావలసిందే నని శాసిస్తుంది. రానివాళ్లపై హింసను ప్రయోగిస్తుంది. గోరక్షణ పేరుతో గుజరాత్ లోని ఉనాలో దళితుల వీపులపై లాఠీల స్వైరవిహారం ఒకానొక ఉదాహరణ. విశ్వాసి కానివాడికి, ప్రశ్నించేవాడికి ఈ స్కీములో చోటు ఉండదు. అవిశ్వాసి నోరు ఎత్తడానికి వీలులేదు. నోరెత్తితే అతని జీవితం నరకమవుతుంది. భౌతికంగానే గల్లంతు అవుతుంది. అలనాటి చార్వాకుడి నుంచి, ఇటీవలి కల్బుర్గి, ధభోల్కర్ ల వరకు ఇందుకు అనేక ఉదాహరణలు.

ప్రజాస్వామ్యం రాచరికానికి పూర్తిగా తలకిందుల రూపం. ఇందులో అధికసంఖ్యాకుల మాటకే చెల్లుబాటు. అధికసంఖ్యాకులు ఆమోదించిన రాజ్యాంగం ప్రకారమే ఇందులో పరిపాలన సాగాలి తప్ప కొందరు రుద్దే విశ్వాసం ప్రకారం, కొందరి మనసులో ఉన్న ఊహల ప్రకారం; అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానం ప్రకారం పరిపాలన సాగదు. జ్ఞానాన్ని అందరికీ అందనంత ఎత్తుకి తీసుకువెళ్లడం విశిష్టుల పాలనలో పద్ధతి. జ్ఞానాన్ని జనానికి అందే ఎత్తుకి తీసుకురావడం ప్రజాస్వామ్యంలో అనుసరించవలసిన పద్ధతి. ప్రజాస్వామ్యం ఎవరి వ్యక్తిగత విశ్వాసాలనూ ప్రశ్నించదు. సాముదాయిక ప్రయోజనాలనే ఉమ్మడి ప్రాతిపదికపై అది పనిచేస్తుంది. సామాజిక సామరస్యానికి, శాంతిభద్రతలకు భంగం కలిగించనంతవరకు అది ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛనూ అడ్డుకోదు.

అప్రత్యక్ష, అవ్యక్త, అతీతజ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రజాజీవితంలోకి తీసుకొచ్చినప్పుడు జరిగే నష్టం బహుముఖంగా ఉంటుంది. అది పరిపాలనారంగంలో పారదర్శకతను హరిస్తుంది. భావోద్వేగ అంశాలను నినాదాల రూపంలో ముందుకు తెస్తుంది. పాలకుల చుట్టూ కాంతి వలయాన్ని సృష్టించి వారిని దైవసమానులుగానే కాదు,  దైవాలుగా, మెసయ్యాలుగా మారుస్తుంది.  రకరకాల వైరుధ్యాలపై తెర కప్పి జనంలో అయోమయాన్ని సృష్టిస్తుంది. జనం నమ్మకాలను, బలహీనతలను, భావోద్వేగాలను అధికారానికి నిచ్చెనమెట్లుగా వాడుకుంటుంది.  ఆ ప్రయత్నంలో జనాన్ని బెదిరిస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది, హింసకు పాల్పడుతుంది.

పైన ఉదహరించిన  “సద్విషయమును నీ వాచరించవేని యది నీకే నష్టము”  అన్న ధర్మారావు మాటలో ఉన్నది బెదిరింపు, బ్లాక్ మెయిలే. అప్రత్యక్ష, అతీత జ్ఞానాల పేరుతో విశ్వాసాన్నిజనం మీద రుద్దడంలోనే మాయలూ, మోసాలూ అడుగుపెడతాయి. ‘వేయిపడగ’ల కంటే చాలా ముందే వెలువడిన గురజాడవారి ‘కన్యాశుల్కం’ నాటకంలో సారాయి దుకాణం వెనక తోటలో బైరాగి, మునసబు సోమినాయుడు, సాతాని మనవాళ్ళయ్య, జంగం వీరేశ, దుకాణదారు రాందాసు, హెడ్ కానిస్టేబుల మధ్య జరిగే సంభాషణ ఇందుకు చక్కని నమూనా:

మునసబు: గురూ! బంగారం సేస్తారు గదా, అదెట్టి హరిద్దోరంలో మటం కట్టించక మాలాటోళ్లని డబ్బెందు కడుగుతారు?

బైరాగి: మేం చేశే స్వర్ణం మేవే వాడుక చేస్తే తల పగిలిపోతుంది.

హెడ్: అవి వేరే రహస్యాలు. వూరుకొండి మావా! గురోజీ! హరిద్వారంలో చలి లావు గాబోలు?

బైరాగి: నరులక్కద్దు. మాబోటి సిద్ధులకు చలీ, వేడీ, సుఖం, దుఃఖం యెక్కడివి?

హెడ్: ఆహా! అదృష్టవంటే సిద్ధుల్దే అదృష్టం.

మునసబు: గురూ, హరిద్దోరం నుంచి యెప్పుడు బైలెళ్ళారు?

బైరాగి: రెండు రోజులయింది. మొన్న వుదయం ప్రయాగ, నిన్న వుదయం జగన్నాధం శేవించాం. ఖేచరీగమనమ్మీద ఆకాశమార్గాన పోతూవుండగా మీ వూరి అమ్మవారు వనం దగ్గర గమనం నిలిచిపోయింది. యేమి చెప్మా అని యోగదృష్టిని చూసేసరికి అమ్మవారి విగ్రహము కింద ఆరునిలువుల లోతున మహాయంత్రం వొకటి స్థాపితమై కనపడ్డది. అంతట భూమికి దిగి, అమ్మవారిని శేవించుకొని ప్రచ్ఛన్నంగా పోదావనుకుంటే యీ భక్తుడు మమ్మల్ని పోల్చి నిలిపేశాడు.

దుకాణదారు: చూడగానే నేను సిద్ధుల్ని పోలుస్తాను గురూ!…

మునసబు: సుక్కేసేవోళ్లని మా బాగా పోలుస్తావు! మా వూరమ్మోరు జగజ్జనని! మా చల్లని తల్లి.

ధర్మారావు చెప్పే అప్రత్యక్షాన్ని ప్రత్యక్షీకరిస్తే ఇలాంటి సన్నివేశాలు ఏర్పడతాయి. తన నీడను చూసి తనే భయపడినట్టుగా, అప్రత్యక్షజ్ఞానాన్ని సృష్టించినవాడే దానిని నమ్మవలసీ, భయపడవలసీవస్తుంది. ‘కన్యాశుల్కం’ నుంచే ఇంకో సన్నివేశం. బ్రహ్మరాక్షసిని సీసాలో బంధించానంటూ పూజారి గవరయ్య, అతని తోడుదొంగ అసిరిగాడు లుబ్ధావధాన్లుతో ఒక ఆట ఆడుకుంటారు:

లుబ్ధావధాన్లు: బాబ్బాబు! సీసా నా యింట్లో పెట్టకు. మీ యింట్లో పెట్టించండి.

గవరయ్య: మా పిల్లలు తేనె సీసా అని బిరడా తీసినట్టాయనా, రెండు దెయ్యాలు వచ్చి మళ్ళీ మీ యింట్లోనే వుంటాయి.

లుబ్ధా: అయితే సీసా భూస్థాపితం చెయ్యండి.

గవ: భూస్థాపితం మజాకా అనుకున్నారా యేవిటీ? భూస్తాపితం చెయ్యడానికి ఎంత తంతుంది! పునశ్చరణ చెయ్యాలి, హోమం చెయ్యాలి, సంతర్పణ చెయ్యాలి.

లుభ్దా: నా యిల్లు గుల్ల చెయ్యాలి.

(సశేషం)

డీహ్యూమనైజెషన్

Art: Satya Sufi

Art: Satya Sufi

 

 

‘కాసేపట్లో సంచలన ప్రకటన చేయనున్న మోడీ. వాచ్ మన్ కీ బాత్’ వాట్సప్ సందేశం. అప్పటికే ఆలస్యమైంది. హడావిడిగా టీవీ పెట్టేసరికి బ్రే కింగులకే బ్రేకింగ్ లాంటి న్యూస్. వెయ్యి, ఐదొందల నోట్లు చెల్లవంటూ ప్రకటన. టీవీ సౌండ్ విని వంటింట్లోంచి ఆమె కూడా వచ్చింది. లైన్ల వెంట ఇద్దరి కళ్లూ పరిగెడుతున్నాయి.

‘బ్యాంకుల్లో మార్చుకోవచ్చన్నాడుగా ఫరవాలేదు. బోలెడంత టైం కూడా ఇచ్చాడు’

‘మొన్ననే సర్జికల్ స్ట్రయిక్స్ అంటూ హడావిడి.. ఇంతలోనే ఇదేంటి? యూపీ ఎన్నికలకు ఇంకా టైముందనుకుంటగా..

అయినా, నా దగ్గర ముప్పయ్యో, నలభయ్యో వున్నాయ్ అంతే’

‘ఫరవాలేదు, నా దగ్గర ఓ ఎనభై వరకూ వుంటాయి. ఈ నెల చాలామందికిచ్చేశాం కాబట్టి ఫరవాలేదు. ఎవరికైనా ఇవ్వడానికి తెచ్చినవి మీ దగ్గర వుంటే..’

‘వున్నాయి, కరెంట్ బిల్లు, స్కూలు ఫీజు కట్టడానికి, ఖర్చులకని డ్రా చేసినవి’

‘ఎన్నుంటాయి’

‘ఇరవై అయిదో, ముప్పయ్యో’

‘అన్ని వేలే’

‘మరి, ఏటీఎమ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైతే చార్జీలంటున్నారని.. ఒకేసారి డ్రా చేసుకొచ్చా. అయినా, అకౌంట్ లో వేసుకోవచ్చుగా..’

‘రేపా పని చూడండి, లేదంటే అన్నీ వేస్ట్ అయిపోతాయి’

‘నాల్రోజులవుతోంది, అవి డిపాజిట్ చేశారా’

‘లేదు, ఎక్కడ చూసినా బోలెడంతమంది జనం. బ్యాంకుల దగ్గరే కాదు, ఏటీఎంల దగ్గర కూడా భారీగా వున్నాయ్ లైన్లు. వచ్చిన డబ్బు వచ్చినట్టే అయిపోతోంది. పదిమందైనా తీసుకుంటున్నారో.. లేదో.. అయినా, అంత టైమిచ్చినా అందరికీ ఈ హడావిడేంటో’

‘బావుంది అందరూ మీలా నిమ్మకు నీరెత్తినట్టుంటారా? ఎవరి జాగ్రత్త వారిది’

‘సరేలే, రేపో, ఎల్లుండో డిపాజిట్ చేసి, ఓ నాలుగు వేలు ఎక్సేంజ్ చేసుకొస్తా. మన డబ్బులు ఎక్కడికి పోతాయ్.

అది సరేకానీ, మన సంగతేంటి?’

‘ఏం సంగతి?’

‘అదే..’

‘ఊ.. దానికేం లోటుండ కూడదు. పిల్లలు పడుకోవాలిగా’

‘వాళ్లు పడుకుని చాలా సేపయ్యింది’

‘సరే.. పదండి..

‘అపోజిషన్ వాళ్లు ఎందుకు గొడవ చేయట్లేదు. ఏదో బందూ అదీ అంటున్నారుగానీ, అంత సీరియస్ గా ఏమీ వున్నట్టు లేరు. పెద్దలంద రికీ ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేసి వుంటుంది. లేకపోతే ఈపాటికి అంతా గగ్గోలు పెట్టేవారు కాదా?’

‘ఇప్పుడా గొడవంతా ఎందుకు? ముందు మూడ్ లోకి వస్తే..’

‘వస్తా.. మీకెప్పుడూ ఒకటే గొడవ. కొంచెం లావైనట్టు అనిపిస్తు న్నానా? ఈ నైటీయే అలా వుందంటారా?’

‘చక్కనమ్మ చిక్కనా అందమే అని ఎవడో తెలివితక్కువ వాడు అనుంటాడు. లావైనా అందమేనని వాడికి తెలిసుండదు. నువ్వా నీవియా వదిలేసి లారెయల్ లాంటివేవైనా వాడచ్చొగా.. బావుంటుంది’.

‘వాడాలి.. ఫేషియల్ కూడా చేయించుకోవాలి. ఎప్పటికప్పుడే వాయిదా పడుతోందనుకుంటుంటే.. ఇప్పుడీ నోట్ల గొడవొకటి. వాళ్ల దగ్గర కార్డుందో లేదో.. కనుక్కోవాలి.

అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నేనాఫీసుకెళ్లాక అమ్మ ఫోన్ చేసింది. నాన్న ఇచ్చినవాటిలోంచి మిగిలించుకున్నవి ఇరవై రెండు వేలున్నాయట. అందులో పదిహేడు వేలు మార్చాలట. పన్నెండో ఏమో వేలూ, మిగిలినవి ఐదొందళ్లూ..’

‘మళ్లీ నీ నోట్ల గొడవ మొదలెట్టావా? ఇలాయితే, మూడే మొస్తుంది. నా మొహం..’

‘సారీ, సారీ.. ఇక ఆ ఊసెత్తను లెండి. కాపురం మొదలెట్టి ఇరవై ఏళ్లు అవుతోంది. ఇంకా, మూడులూ.. నాలుగులూ అంటే ఎలా?’

‘ఉయ్యాలైనా.. జంపాలైనా..’

‘మధ్యలో ఇదొకటి. ఇంత రాత్రి ఫోన్లేమిటి?’

‘సార్.. పడుకున్నారా? నేను..’

‘లేదు సార్.. చెప్పండి’

‘మన కాలనీ చివర్లో పెద్ద కిరాణా కొట్టుంది కదా. దాని వెనుకున్న ఏటీఎమ్ దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడే లోడ్ చేయడానికి క్యాష్ వాళ్లు వచ్చారు.’

‘ఇప్పుడా.. సరే, అలాగే’

‘అలాగే కాదు, అప్పుడే మన వాళ్లంతా వచ్చేసి లైన్ కట్టేస్తున్నారు. తొందరగా రండి లేదంటే డబ్బులైపోతాయ్’

‘సరే.. సరే..’

‘..గారని, ఆయన. ఏటీఎంలో డబ్బులు లోడ్ చేస్తున్నారట. రమ్మంటున్నాడు’

‘మరి తొందరగా వెళ్లండి. ఓ రెండు వేలు వస్తే.. ఖర్చులకు పనుకొస్తాయి. ఇప్పటికే ఆటో వాడి దగ్గర్నించి అందరికీ అరువు పెడుతున్నా’.

‘సరేలే.. ముందు..’

‘కానివ్వండి మహానుభావా.. మీకు ఏ పని ముందో ఏది వెనుకో కూడా తెలీదు. చిన్నపిల్లాడిలా..’

‘..తృప్తిగా లేదు’

‘ఎందుకుంటుంది.. ప్రతిసారీ ఒకేలా వుంటుందా యేం? పోయి రండి ఏటీఎంకి. రేపెప్పుడో తీరుబాటుగా ఎంజాయ్ చేయొచ్చు. నేనక్కడికీ పోనూ, మీరూ ఎక్కడికీ పోరు. వెళ్లేప్పుడు స్వెట్టర్ గానీ, షాల్ గానీ తీసుకువెళ్లండి. టేబుల్ మీద అరటి పళ్లుంటాయి. రెండు తీసుకు వెళ్లండి. ఆయనకోటిచ్చి, మీరొకటి తినొచ్చు’.

‘వచ్చారా.. ఇప్పుడా రావడం. ఎంతసేపైంది నేను ఫోన్ చేసి. చూడండి లైన్ ఎలా పెరిగిపోయిందో. ఇంకా క్యాష్ లోడ్ చేస్తున్నారు కదాని సిగరెట్ వెలిగించుకొచ్చేసరికి.. అప్పుడే పదిమంది చేరారు. ఏం చేస్తాం వాళ్ల వెనకే నిలబడ్డా.

‘ఇది చూశారా, మా బావమరిది. వాళ్లింటి దగ్గర బ్యాంక్ లో మొన్న ఐదొందల నోట్లు ఎక్సేంజ్ చేసుకుని రెండు వేల నోటు తీసు కున్నాడట. సెల్ఫీ దిగి ఫేస్ బుక్ లో పెట్టాడు. ఇదిలా సెల్ఫీలు తీసుకో డానికి తప్ప ఎందుకూ పనికిరావడం లేదట. రెండు వేలుకు చిల్లరిచ్చే వాడేడి. ఈ కలరూ అదీ కూడా చూశారూ, పిల్లలు ఆడుకునే బ్యాంక్ గేమ్ లోని నోటులా వుంది’.

‘అదేంటి.. గొడవ. హలో.. మాష్టారూ.. ఏమైంది?’

‘ఏమో, ఏడెమినిదిమందికి క్యాష్ వచ్చినట్టుంది. తర్వాత నుంచి డబ్బులు రావడంలేదట. అసలు కారణమేంటో ఎవరికి తెలుసు. సాఫ్ట్ వేర్ ప్రాబ్లమో, ఏమో’

Kadha-Saranga-2-300x268

‘ఏమైంది, డబ్బులొచ్చాయా?’

‘అంటే.. నా ముందు వరకూ వచ్చాయి. ఇంతలో..’

‘మీ వల్ల ఏ పనీ కాదు, ఫోన్ వచ్చిన వెంటనే వెళ్లుంటే..’

‘ఆయనకీ దొరకలేదు’

‘దొందూ దొందేనన్నమాట. ఖర్మ.. పోయి పడుకోండి… తృప్తిగా’

కిడ్డీ బ్యాంకులు ఓపెన్ చేసిందామె.

‘మన పిల్లలు బాగానే దాచారు. ఈ కాయిన్స్ అన్నీ కలిపితే నాలుగువేలైనా వుంటాయి. ఇవన్నీ నేను లెక్కబెట్టా.. పద్దెమిదొందలు న్నాయి. మిగిలినవి మీరు లెక్కబెట్టి చూడండి. నోట్లు ఇచ్చేట్టయితే ఏ షాపువాడికో ఇచ్చి తీసుకురండి. లేదంటే, ఓ కవర్ లో ఈ చిల్లర పోసు కుని పోతా. ఆటోవాడికీ, కూరలవాడికీ కూడా చిల్లరే ఇస్తా’.

‘అంత చిల్లరేం మోసుకుపోతావులే. నోట్లు తీసుకొస్తా’.

ఇంతలో అమ్మ వచ్చింది.

‘అయితే, ఆఖరుకు పిల్లల డబ్బులకి రెక్కలొచ్చాయన్నమాట’

‘ఆఁ లేకపోతే చిల్లరెక్కడ దొరుకుతోంది గనుక. పిల్లలకేమైనా సంపాదన ఏడిసిందా? మీ అబ్బాయో, నేనో ఇచ్చినవేగా ఇవన్నీ..’

‘అన్నట్టు చెప్పడం మరిచిపోయారా, ఇక్కడ దింపినప్పుడు నీ తమ్ముడు ఓ వెయ్యి చేతిలో పెట్టాడు. ఏమైనా కోనుక్కో అమ్మా అని. ఆ మధ్యెప్పుడో ఓ అయిదొందలు మార్చి యాపిల్స్ కొనుక్కున్నా. ఇంకో అయిదొందల నోటుండిపోయింది. నీవాటితోపాటు ఇది కూడా మార్చి పెడుదూ’.

‘ఇవాళ అసలు కుదరదు. ఆఫీసులో బిజీ. ప్రతి వాడూ ఏటీఎమ్ కు వెళ్లాలనీ, బ్యాంకుకు వెళ్లాలనీ తిరుగుతున్నారు. ఎక్కడ పని అక్కడే వుంటోంది. ఇక నేను కూడా తిరుగుతూ కూర్చుంటే.. రేపు మొహం వాచేట్లు చివాట్లు తినాలి’.

‘అయినా, అందరికీ రెండు వేల కంటే ఎక్కువ ఎక్సేంజ్ చేయడం లేదు. నువ్వే కాస్త ఓపిక చేసుకో.. అది ఆఫీసుకు వెళ్లేప్పుడు బ్యాంక్ దగ్గర దింపేస్తుంది. నీ దగ్గర ఒకటే వుందన్నావుగా, ఆమె దగ్గర నుంచి ఇంకో మూడు నోట్లు తీసుకో. ఎంత లేటైనా టూ, త్రీ అవర్స్ కంటే ఎక్కవ పట్టదు. భోజనం టైముకు ఇంటికి వచ్చేయొచ్చు. కాస్త లేటైనా నువ్వేం హైరాన పడకు. ఏదో పనుందని ఆమె సాయంత్రం పెందరాలే వస్తోంది. రాత్రికి వంట సంగతి చూసుకుంటుంది. సరేనా..’.

పెద్దావిడ లైన్ లో నుంచుంది. మాటలు కలిశాయి. ఎవరో చెబుతున్నారు.

‘అసలు మన వాడిది హనుమంతుడి అంశ అటండీ. ఆయన ఎలాగైనా ఒక్కడే లంక దహనం చేసుకుని చక్కగా తిరిగొచ్చేశాడో, ఈయన కూడా దగ్గరుండి మన సైనికులను ఆ దేశం మీదకు పంపి.. ఆ పళంగా అక్కడున్న వెధవలందరినీ చంపిచేసి.. మన వాళ్ల మీద ఈగ కూడా వాలకుండా దేశంలోకి వచ్చేసేలా చేశాడట’.

‘టీవీలో ఎవరో పెద్దాయన చెబుతుంటే నేను కూడా విన్నాలెండి’.

వీరిలా మాటల్లో ఉండగానే హడావిడి మొదలైంది.

‘రెండు వేల నోటుకు చిల్లర దొరకడం లేదు. ఐదొందల నోట్లు వచ్చాయని టీవీల్లో చెబుతున్నా ఎందుకివ్వడం లేదం’టూ గొడవ. కమీషన్ల బ్యాంకువాళ్లు కక్కుర్తి పడుతున్నారని అరుపులు. పోలీసులు కూడా వచ్చారు. కర్రలకు పని చెప్పారు.

‘ఏమో అనుకున్నాం కానండి.. మొత్తానికి మొండిఘటం అని నిరూపించుకున్నారు మీ అమ్మగారు. నేనొచ్చే సరికి విజయగర్వంతో రెండు వేల నోటు పట్టుకునొచ్చారు. బ్యాంకు దగ్గర చాలా గొడవైందట. బాగా తోసుకున్నారట. ఈవిడ కిందపడితే.. అక్కడి వాళ్లు గబుక్కున లేపి నిలబెట్టారట. ‘లేకపోతే, ఈపాటికీ నన్ను పీచుపీచుగా తొక్కేసుందురే’ అన్నారు. ఆయాసంగా వుందంటే సరేని, కాసేపు నడుం వాల్చమన్నా’.

‘రాత్రికి దొండకాయ కూర చేస్తున్నా. మార్కెట్లో చూశారా? కూరల ధరలన్నీ భలే తగ్గిపోయాయి. కొనేవాడే లేడు. ఇంతకుముందు ఏరుకోడానికి కూడా ఖాళీ వుండేది కాదు. ఇవాళైతే ప్రశాంతంగా వుంది. కుళ్లిపోతాయనుకున్నారో ఏమో చవగ్గా అమ్మేస్తున్నారు’

‘దొండకాయ కూరైతే మేం తినం. ఎప్పుడూ దొండకాయీ, వంకేయేనా? ఏదైనా వెరైటీగా చేయొచ్చుగా’ -పిల్లల గోల.

‘వెరైటీగా అంటే ఏముంటుందర్రా.. టీవీల్లోనూ, యూట్యూబ్ ల్లోనూ చూసినవన్నీ చేయమంటే నా వల్ల కాదు’

‘రాత్రికి దొండకాయ కూర తినాలంటే ఓ షరతు.. ఇప్పుడు పానీపూరీ తిననియ్యాలి’.

‘కుదరదు.. ఇప్పుడు పారీపూరీలు, చాట్ లు తిని, రాత్రికి ఆకలేదని చేసిందంతా నాకు తలంటుతారు’

పిల్లలు కదా, వినలేదు. ఆమె సరే అంది.

‘కాకపోతే.. ఓ పని చేయండి. పానీ పూరీ బదులు సబ్ వేగానీ, పిజ్జాగానీ తెప్పించుకోండి. దొండకాయ కూర పొద్దన్న చేస్తా. ఇప్పటికి మేం పెద్దవాళ్లం ఏదో పచ్చడేసుకుని తింటాం’

‘అదేంటి.. ఇరవైకో, ముప్పయ్ కో అయిపోయేదానికి, ఏకంగా వందలు తగలేస్తున్నావ్’

‘నేనేం చేసినా మీకు తగలేసినట్టే వుంటుంది. వున్న చిల్లర కాస్తా, పానీపూరీ వాడి మొహాన కొడితే.. రేపేదైనా అవసరమొస్తే ఏం చేస్తారు’

‘ఓహో, సబ్ వే, పిజ్జాలు ఫ్రీగా వస్తాయన్నమాట. చిల్లర అవసరం లేకుండా’

‘మీ మట్టిబుర్రకు ఏదీ వెలిగి చావదు. వాటికైతే ఆన్ లైన్ లోనో, పేటీయంలోనో గీకొచ్చు. వందలు వందలు చిల్లర తెచ్చివ్వక్కర్లేదు’.

‘హోం డెలివరీ తెప్పించుకుంటూ కార్డెలా గీకుతావ్’

‘మీరు కాస్త ఆపుతారా, ఏదో పొరపాటున అన్నా. గీకకపోతే ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తాం లేదంటే పేటీయమ్ లో ట్రాన్సఫర్ చేస్తాం.

‘మీరు నా మాటలకు ఈకలు పీకడం మాని, వెళ్లి ఏదో ఒకటి కొని.. ఆ రెండు వేలు మార్చుకురండి’.

‘ఏవండీ ఎక్కడున్నారు? చిల్లరలేకపోతే పీడా పోయే. తొందరగా ఇంటికి రండి. ఇక్కడ కొంపలంటుకున్నాయ్’

కొంపలంటుకోవడం వెనుక విషయమేంటో చెల్లెలికి చెప్పింది. సిటీలోనే వుండే చెల్లెలు ఉబర్ కట్టుకుని వాలింది. గంటన్నరకి ఈసురో మంటూ ఆయనొచ్చాడు.

‘చిల్లర కోసం అక్కడక్కడా తిరిగే సరికి పెట్రోల్ అయిపోయింది. బంక్ వాడు కూడా పోయించుకుంటే రెండు వేలకీ పోయించుకోవా ల్సిందే, చిల్లర లేదన్నాడు. నా బండిలో రెండు వేల పెట్రోల్ ఎక్కడ పడుతుంది. క్రెడిట్ పని చేయలేదు. డెబిట్ కార్డు గీకితే.. నెట్ వర్క్ లు బిజీ కదా, ఓటీపీ రాదు. చివరకెలాగో పని కానిచ్చేసరికి ఈ టైమ్ అయింది’.

‘ఇప్పుడు మిమ్మల్ని ఆ వివరాలన్నీ ఎవరడిగారు. తొందరగా ఇటు రండి. మీ అమ్మగారికి ఏం బాగున్నట్టు లేదు. ఓసారి డాక్టర్ కు ఫోన్ చేయండి’.

‘ఏమైంది’

‘ముందు ఫోన్ చేయమన్నానా’

‘ఇందాక చపాతీలు చేసుకుని, మీ అమ్మగారికి ఇష్టం కదాని చింతకాయ పచ్చడిలో పోపు పెట్టి.. వేసుకుని వెళ్లా. అత్తయ్యగారు టిఫిన్ అంటే.. ఓ ఉలుకూ లేదూ, పలుకూ లేదు. నాకెందుకో భయమేసి దానికి ఫోన్ చేశా. ఇద్దరం పిలిచాం, కానీ, పెద్దావిడలో కదలికే లేదు’

డాక్టర్ వచ్చాడు

‘మధ్యాహ్నం అంతా బ్యాంక్ దగ్గర లైన్ లో నిలబడింది. ఇంటికొచ్చినప్పుడు బానే వుందట. కాస్త ఆయాసం వస్తోందని పడుకుంది. తీరా సాయంత్రం చూసే సరికి..

డాక్టర్ కు ఆయన వివరించాడు. డాక్టర్ కు అర్థమయ్యింది. పెద్దావిడ వెళ్లిపోయిందని తేల్చేశాడు.

ఆడవాళ్లిద్దరిలోనూ దు:ఖం పెల్లుబికింది. బిగ్గరగానే ఏడ్చారు. అంతలోనే పక్క ఫ్లాట్లవారికి వినపడకుండా సర్దుకున్నారు. మెయిన్ డోర్ దగ్గరగా వేసి పెద్దావిడని గదిలోంచి హాలులోకి మార్చారు. కావాల్సిన వాళ్లందరికీ ఫోన్ లు వెళుతున్నాయ్.

‘ఏదో హార్టేటాక్ అని చెప్పండి. అంతేగానీ, బ్యాంక్ దగ్గర నిలబడిం దనీ, కిందపడిందనీ అందరికీ చెప్పకండి. ఆర్చేవాళ్లు, తీర్చేవాళ్లు లేరు గానీ.. ప్రతి ఒక్కళ్లూ నన్నాడిపోసుకుంటారు.

‘మీకే చెబుతున్నా.. అర్థమయ్యిందా’

అయ్యిందన్నట్టు ఆయన తలూపాడు. పెద్దల ఏడుపు చూసి కాసేపు ఏడ్చిన పిల్లలు గప్ చిప్ గా బెడ్ రూంలో దూరారు. బంధు వుల పరామర్శలకు సమాధానాలు చెబుతూ ఆయన సోఫాలోనే ఒరిగాడు.

‘ఏమే.. పడుకున్నావా?’

‘లేదు, ఆవిడని అక్కడ పెట్టుకుని ఎలా నిద్ర పడుతుంది. పాపం ఆవిడని పంపకుండా వుంటే బావుండేది. ఇంకో నాలుగేళ్లు హాయిగా గడిపేసేది’

‘పాపం సంగతి అలా వుంచు. నీ దగ్గర బంగారం ఏపాటి వుంది’

‘నీకు తెలియని బంగారం నా దగ్గర ఏముందే’

‘లేదులేగానీ, ఇప్పుడు బంగారం మీద కన్నేసారట. అరకేజీ కంటే ఎక్కువుంటే రశీదులవీ చూపించి, టాక్కులు కట్టాలిట’

‘మన దగ్గర అంతెందుకుంటుందే’

‘ఎంతుందో ఎప్పుడు చూశాం. ధన త్రయోదశినీ, ధంతేరాస్ అనీ, దీపావళనీ, శ్రావణ శుక్రవారం అనీ, ఇంకేదో అనీ.. అంత పిసరో, ఇంత పిసరో కొంటూనే వుంటాంగా… మనకీ ఆడపిల్లలున్నారు కాబట్టి’

‘అవుననుకో అంతా కలుపుకుంటే ఎంతవుతుందే, మహా అయితే..’

‘అన్నీ పక్కనబెట్టు. ఇప్పుడున్నది రేపెప్పుడైనా మళ్లీ కొనుక్కోమా? వాళ్లెప్పుడొచ్చి అడుగుతారో లెక్కలు.. ఎవరు చూడొచ్చారు. తక్కెడులూ, తాళ్లు పట్టుకొచ్చి అంతుంది, ఇంతుంది.. కక్కమంటే ఏం చేస్తాం.

‘నువ్వేమో వెర్రిబాగుల దానివి.. బావగారేం పట్టనట్టే వుంటారు. అన్నానని అనుకోకు. ఇప్పుడో అవకాశం వచ్చింది కదాని..’

‘ఏంటది?’

‘వారసత్వంగా వచ్చినదానికి లెక్క చెప్పక్కర్లేదన్నారు. కాకపోతే వారసత్వంగా వచ్చిందని సాక్ష్యాలు కావాలి, అంతే’

‘అయితే..‘

‘ఏమీ లేదు.. మరోలా అనుకోకు, నీ దగ్గర వున్న పెద్ద నెక్లెస్, పదో పెళ్లిరోజుకు కొనుక్కున్నావ్ చూడు.. రాళ్ల గాజులు అవీ, ఇంకా ఒకటో రెండో గొలుసులు మీ అత్తగారి మెడలో కాసేపు అలా పెట్టి..

‘అలా భయపడి చస్తావేమే? నీ నగలు పెట్టగానే మీ అత్తగారు లేచి కూర్చుని, పట్టుకుపోతుందేమోనని భయమా?’

‘ఆయనేమంటారో అని..‘

‘ఏమీ అనరు, కావాలంటే నేను కూడా చెబుతాలే బావగారికి. ఆ నగలు వేసి ఆయన దగ్గరున్న సెల్ ఫోన్ తో ఫొటోలు తీసి జాగ్రత్త పెట్టమను. ఫొటోలు తీసిన వెంటనే నీ నగలు తీసి బీరువాలో పెట్టుకుందువుగాని. తెల్లారితే మళ్లీ అందరూ వచ్చేస్తారు’

‘ఆయనతో ఓ మాట అని చూస్తా..’

‘ఏమీ వద్దు, ముందు నీ నగలు బయటకు తియ్యి. కామ్ గా వెళ్లి గాజుల తొడుగు, నెక్లెస్ లూ అవీ అలా పెడితే చాలు. తర్వాత మీ ఆయన్నొచ్చి పనికానియ్య మందాం’

అనుకున్నంత పనీ చేశారిద్దరూ.

ఆయనొచ్చి అమ్మ వైపు చూశాడు.

ఆమె మృతదేహంలా లేదు, మహలక్ష్మిలా ఉంది.

*

‘చో’ ఆగిపోయింది!

cho-ramaswamy

1976లో ‘బంగారు పతకం’ అనే సినిమా చూశాను. అది తమిళం నుంచి తెలుగుకు డబ్ చేసిన సినిమా. శివాజీ గణేశన్, కె. ఆర్ . విజయ హీరో, హీరోయిన్లు. చాలా సీరియస్ సినిమా. అయినా ఆ సినిమాను మూడుసార్లు చూశాను. కారణం, అందులో చో రామస్వామి సెటైర్లు. ఆ సెటైర్లు కానీ, అందులో ఆయన పాత్రకానీ ఇప్పుడు గుర్తు లేవు. ఆ సినిమా కోసం నెట్ లో చూస్తే దొరకలేదు. అదే సినిమాను 1981లో ‘కొండవీటి సింహం’పేరుతో ఎన్టీఆర్, శ్రీదేవిలతో తెలుగులో రీమేక్ చేసినట్టు మాత్రం చూశాను. ఆ సినిమా నేను చూడలేదు.

‘బంగారు పతకం’ లో చో రామస్వామి పోలీస్ కానిస్టేబుల్ గా నటించినట్టు లీలగా జ్ఞాపకం. అతనికి ఒక కొడుకు. తండ్రి-కొడుకుల సంభాషణలో గొప్ప రాజకీయ వ్యంగ్యోక్తులు పేలుతూ హాలంతా నవ్వులు పండిస్తాయి. లీలగానే  గుర్తున్న ఒక సెటైర్ ప్రకారం, కొడుకు చదువురాని బడుద్ధాయి. “అయితే ఇంకేం! రాజకీయనాయకుడి వవుతావు” అని తండ్రి ఊరడింపు.

మనిషికి పుట్టుకతో కొన్ని ఆనువంశిక లక్షణాలు సంక్రమించవచ్చు. కానీ ఐడియాలజీతో సహా అతని ఆలోచనాసరళిని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది అతను పుట్టి పెరిగిన భౌతికవాతావరణమే. అంటే ఆలోచనారీతి, వాటిని వ్యక్తీకరించే పద్ధతితో సహా అన్నీ కండిషండే తప్ప సర్వస్వతంత్రాలు కావు. చో రామస్వామి ఒక ఉదాహరణ.

దక్షిణాదిన ఇంగ్లీష్ వారు తమ స్థావరంగా మార్చుకుని అభివృద్ధి చేసిన తొలి నగరం మద్రాసు కావడం, ఆ విధంగా ఇంగ్లీష్ ప్రభావాలకు బ్రిటిష్ పాలన తొలిరోజుల్లోనే అది లోను కావడం, ఆ ప్రభావాలను సామాజికంగా, సాంస్కృతికంగా అగ్రస్థానంలో ఉన్న బ్రాహ్మణులు వెంటనే అంది పుచ్చుకోవడం, మద్రాసు తనదైన విలక్షణమైన సంకీర్ణ నాగరికతను తెచ్చుకోవడం, ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో భాగంగా అక్కడి స్థానిక, బ్రాహ్మణేతర వర్గాలు క్రమంగా జాగృతమై బ్రాహ్మణీయతను సవాలు చేస్తూ భిన్నశక్తిగా మారడం, అది బ్రాహ్మణవ్యతిరేక ద్రవిడ ఉద్యమంగా బలపడడం, దానికి ప్రతిక్రియగా బ్రాహ్మణీయ శక్తులు పోలరైజై  ఉనికి పోరాటానికి దిగడం…

ఇంతటి ‘నలుగు’ పిండినుంచి వినాయకుడిలా రూపం దిద్దుకున్నవాడే చో రామస్వామి! ఈ నేపథ్యం లేకపోతే మనకు తెలిసిన ఇప్పటి రూపంలో చో ఉండడు!

తెలుగు ప్రాంతాలలోని బుద్ధిజీవుల్లోంచి  చో రామస్వామి లాంటి ఓ కేరక్టర్ ఎందుకు పుట్టలేదన్న కుతూహలకరమైన ప్రశ్ననుంచి ఈ నేపథ్యాన్ని తడమాల్సివచ్చింది. తెలుగు ప్రాంతాలలో ఆంధ్ర,రాయలసీమలకు వస్తే ఇక్కడి వాళ్ళకు తమిళులకు ఉన్నట్టు మద్రాసు లాంటి ఒక స్వతంత్ర రాజధాని నగరం లేదు. రాంభట్లగారి సూత్రీకరణనే పరిగణనలోకి తీసుకుంటే, సొంత నగరం లేని జనాలకు గుర్తించదగిన సొంత నాగరికత ముద్ర ఉండదు. అలాగే మద్రాసీలకు ఉన్నంత ఇంగ్లీష్ ప్రభావమూ వీళ్ళ మీద లేదు. తెలంగాణకు హైదరాబాద్ లాంటి నగరం ఉన్నా దాని స్వభావం వేరు. తెలంగాణలో, ఆ సంబంధంతో కొంతవరకు ఆంధ్రలో వామపక్ష ఉద్యమాల ప్రభావం ఉంది. అదంతా చాలా సీరియస్ వ్యవహారం. అక్కడ వ్యంగ్యానికి, హాస్యానికి చోటు తక్కువ. తమిళనాడు కొస్తే అక్కడ బ్రాహ్మణీయ వ్యతిరేక ద్రావిడ ఉద్యమం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభావాలే తప్ప వామపక్షఉద్యమ ప్రభావాలు చాలా తక్కువ.

వ్యంగ్యం, హాస్యం, ఝటితి చమత్కారం(రిపార్టీ) చోకు ఆనువంశికంగానో, వ్యక్తిగతంగానో సంక్రమించి ఉండచ్చు. కానీ వాటిని తారస్థాయికి పెంచి రాజకీయవస్తువుకు వాటిని మేళవించి జనరంజకం చేయడానికి చో కు నిస్సందేహంగా తను పుట్టిన పెరిగిన భౌతికవాతావరణమే తోడ్పడింది. మద్రాసు ముందే నగరం కావడంవల్ల అక్కడ విద్యావంత మధ్యతరగతి పెద్ద సంఖ్యలో ఏర్పడింది. వారిలోంచి ఆవురావురుమనే పాఠకులు పెరిగారు, పత్రికలు పెరిగాయి. సినిమాతో సమానంగా థియేటర్ నూ కాపాడుకుంటూనే వచ్చారు. ఆ విధంగా చో  రంగప్రవేశం చేసి విజృంభించడానికి అవసరమైన పూర్వరంగమూ, ఆయన బహుముఖీన ప్రతిభావ్యుత్పత్తులకు స్పందించి ఆస్వాదించగలిగిన పాఠకులు, ప్రేక్షకులు ముందే ఏర్పడ్డారు. ఇక జరిగింది… చరిత్ర.

చో బహుముఖీనత తెలుగు ప్రమాణాలతో చూస్తే విస్మయం కలిగిస్తుంది. ఆయన లా చదువుకున్నాడు. ఓ పెద్ద కంపెనీకి లీగల్ అడ్వైజర్ గా ఉన్నాడు. ఇంకోవైపు తుగ్లక్ పత్రిక ద్వారా జర్నలిస్టుగా అవతారమెత్తాడు. ఆపైన నాటకాలు రాశాడు, వేశాడు. 200 కు పైగా సినిమాల్లో నటించాడు. అది కూడా ఎమ్జీఆర్, శివాజీ గణేశన్, జయలలిత, ఎం ఆర్ రాధా, జయలలిత, నగేష్, రజనీకాంత్, కమల్ హాసన్, మనోరమ, సచ్చు లాంటి హేమాహేమీలతో. మొదట్లో తన రాజకీయ వ్యంగ్యాస్త్రాలను ద్రవిడపార్టీమీదా, వామపక్ష భావజాలం మీదా ఎక్కుపెట్టాడు. అవి ముఖ్యంగా ద్రవిడ నేతలకు తగలవలసిన చోటే తగిలి తహ తహ పుట్టించడం ప్రారంభించాయి. ఆయనపై రకరకాల రూపాల్లో ప్రతి దాడికీ సిద్ధమయ్యారు. డెబ్బై దశకంలో ఆయన తీసిన మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమా ఆడే థియేటర్లపై కూడా దాడులు జరిగాయి. అయినా నిర్భీతికి చిరునామాగా చో నిలబడ్డాడు. కారణం మరేం లేదు. బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమాన్ని  ప్రతిఘటించడం ద్వారా రాటుదేలిన బ్రాహ్మణీయవర్గాల మద్దతు ఆయనకు ఉంది. తన పత్రికకు, తన రాతలకు, నాటకాలకు ఆ వర్గాల వెన్ను దన్ను, ప్రోత్సాహం ఆయనకు ఉన్నాయి. అదీగాక నిన్నమొన్నటి వరకు మధ్యతరగతి విద్యావంతవర్గానికి సొంత రాజకీయ అభివ్యక్తికి బలమైన వాహకం లేదు. దాంతో అది యాంటీ-ఎస్టాబ్లిష్మెంట్ ధోరణిని జీర్ణించుకుంది. ఇది కూడా చో కు కలసివచ్చి ఆయన రాజకీయవ్యంగ్యానికి మరింత పదును పెట్టింది. తుగ్లక్ లాంటి పత్రికకు 90 వేలకు పైగా సర్క్యులేషన్ ఉండేదంటే చో కు లభించిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు.

ఎమర్జెన్సీ దరిమిలా ఆయన గురి కాంగ్రెస్ వైపు తిరిగింది. తుగ్లక్ పత్రిక ద్వారా ఆయన సాగించిన ఎమర్జెన్సీ వ్యతిరేకపోరాటం మరో అధ్యాయం. ఎల్టీటీయీ తీవ్రవాదాన్ని వ్యతిరేకించడంలోనూ అంతటి నిర్భీతినే ఆయన చాటుకున్నాడు. అధికారబలం, అంగబలం, రాజకీయబలం లేకపోయినప్పటికీ అవన్నీ ఉన్న ఉద్దండ శక్తులకు ఎదురు నిలిచి నిలదొక్కుకోవడంలో చో తో పోల్చదగిన వ్యక్తి సుబ్రమణ్యంస్వామి. వీరు తమిళనాడులోని ప్రత్యేక పరిస్థితులనుంచి ప్రాణం పోసుకున్న వ్యక్తులు.

వ్యక్తిగా కొంతవరకు చో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించినట్టే కనిపిస్తాడు. మంచి ఎక్కడున్నా ఎంచి చూపడంలో, చెడును నిర్దాక్షిణ్యంగా ఖండించడంలో ఆయనకు స్వ, పర భేదాలు లేవని పేరు. జయలలిత కుటుంబంతో ఆయనకు ముందునుంచీ పరిచయం. ఆయన నాటకాలలో జయలలిత నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా కలసి నటించారు. అయినా జయలలిత పాలన అవినీతి భూయిష్టంగా కనిపించినప్పుడు ఆమెను బహిరంగంగా వ్యతిరేకించడమే కాదు; ఆమెకు వ్యతిరేకంగా తన బద్ధ విరోధి అయిన కరుణానిధి, తమిళ మానిల కాంగ్రెస్ ల మధ్య సయోధ్యకు కృషి చేశాడు. వ్యక్తిగతమైన ఈ నిష్పాక్షిక వైఖరే ఆయనను అన్ని పార్టీలవారికి దగ్గర చేసినట్టు కనిపిస్తుంది. జయలలితే కాదు; ఎమ్జీఆర్, శివాజీ గణేశన్ సహా ఎందరో ఆయన సలహాను ఆపేక్షించేవారని అంటారు. ఆయనను రాజగురువుగా ప్రధాని మోడీ చేసిన అభివర్ణనను పూర్తిగా అతిశయోక్తి అనలేం.

చో ఆర్ ఎస్ ఎస్ వైపు, హిందుత్వ భావజాలం వైపు ఒరగడం, వాజ్ పేయి హయాంలో రాజ్యసభ సభ్యత్వం పొందడం వగైరాలను ఆయన పుట్టి పెరిగిన తమిళనాడు పరిస్థితుల నేపథ్యం నుంచి వేరు చేసి చూడలేం. మొత్తం మీద చెప్పాలంటే ఆయన జీవితం, ఆయన పత్రిక, నాటకాలు యాభై ఏళ్ళకు పైబడిన మన ప్రజాస్వామిక రాజకీయ వైఖరులకు నిలువెత్తు ప్రతిఫలనాలు.

                                                                                                           -భాస్కరం కల్లూరి

అతని ఊహా వైపరీత్యం!

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-6

 

sudrarsanamనిజానికి ‘వేయిపడగలు’ లోని ధర్మారావు ఒక మనస్తత్వ సంబంధమైన కేసు. నవలలో చిత్రితమైన మేరకు అతను జీవితం పొడవునా చేసినది ఒకటే… వాస్తవిక జగత్తు అనే చతురస్రంలో కాల్పనిక జగత్తు అనే వలయాన్ని ఇరికించే ప్రయత్నం. అది ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. అయినా విసుగూ, విరామం లేకుండా ధర్మారావు చేసింది అదే. ఆ వైఫల్యమే అతనిలో నిస్పృహ, నిర్వేదం, నిస్సహాయత, నిష్క్రియతా పెంచి; స్వరాజ్యోద్యమంలో పాల్గొన్న అతని మిత్రుడు రాఘవరావుతో పోల్చినా అతనినొక నిరుపయోగిగా మార్చింది. అలాంటి ధర్మారావును యోగిగా, విరాగిగా, నిర్లిప్తుడిగా చూపించబోవడం రచయిత విశ్వసించే తాత్వికతలోని ఒక వైచిత్రి.

ధర్మారావుకు చెందిన కాల్పనిక జగత్తు ఒక విశిష్టమైన జగత్తు. అందులో అందరూ విశిష్టులే ఉంటారు. వారిది ఎంతో విశిష్ట సంప్రదాయం. వారిలో గాఢమైన, లోతైన రసజ్ఞత, అనుభూతి సాంద్రతా ఉంటాయి. వారు మనసును నియమించుకుని, నిగ్రహించుకోగల స్థితిలో ఉంటారు. వారిలో అతీతమైన, అలౌకికమైన జ్ఞానం వెల్లివిరుస్తూ ఉంటుంది. వాస్తవిక జగత్తు అందుకు భిన్నం. అందులో అంతా సామాన్యులు, నేలబారు మనుషులు;  లోతైన రసజ్ఞత, అనుభూతి గాఢత  లేనివారు, లౌకికమైన సుఖాలకోసం, సంపదకోసం పాకులాడేవారు ఉంటారు. గొప్ప జ్ఞానిగా, వివేకిగా  రచయిత చిత్రించిన ధర్మారావులోని భ్రమాజనిత విశ్వాసం ఎలాంటి దంటే; ఒకప్పుడు ఈ దేశంలో అందరూ విశిష్టులు, ఉన్నతులే  అయిన  వ్యవస్థ నిజంగా ఉండేది!

ధర్మారావు ఊహల్లోనూ, అతను మిగతా పాత్రలతో జరిపే సంభాషణల్లోనూ ఈ విశిష్టతా-సామాన్యతల మధ్య వివేచన నవల అంతటా జరుగుతూనే ఉంటుంది. పింగళి సూరన కావ్యం ప్రభావతీ ప్రద్యుమ్నం చదివి రసస్ఫూర్తిని పొందిన ధర్మారావు, అందులోని “(కొన్ని) భాగములు నేటి కసభ్యములుగా నగుచున్నవి. గాఢమైన శీలము చచ్చినకొలది ప్రాణములు ప్రతి సంగతిలో లోతులు వాంఛించవు. పైపై మెరుగులతో తృప్తి చెందును. అదియే నాగరికత యని విర్రవీగును” అనుకుంటాడు. మిత్రుడు రాఘవరావుతో కలసి రెడ్డి రాజుల రాజధాని అయిన కొండవీడుకు వెళ్ళి అక్కడి శిథిలాల మధ్య తిరుగుతున్నప్పుడు, “ఆ రెడ్లు, వారి పరాక్రమము, వారి ఔదార్యము, వారు పోషించిన కవులు” వారి హృదయాలను ఆనందభరితం చేస్తాయి. “అది యొక పుణ్యసమయము. మన మపుడైన బ్రతికి యున్నాము కాదు” అని ధర్మారావు అనుకుంటాడు. ఇంకోచోట, “రసమునందు పర్యవసించుట యెవనికి? రసజ్ఞుడైన వానికి. ప్రతివిషయము నెవడు హృదయము దాక తెచ్చుకొనగలుగునో వాడు రసజ్ఞుడు. ప్రతివాడు నట్లు చేయలేడు…భగవంతుడెంతయైన లోతైన విషయము. ఆ లోతు మహాపరిపక్వ దశయందున్న దేవదాసి మనస్సునకే తెలియుచున్నది” అనుకుంటాడు.

రాణి రుక్మిణమ్మారావుతో మాట్లాడుతూ, “తల్లీ! ప్రాతదంతయు పోవుచున్నది. క్రొత్తదంతయు వచ్చుచున్నది. రంగాజమ్మగారిని చూడుడు! ఆమె పూర్వపు భావోన్మాదము, పాతివ్రత్యము, వర్ణస్వచ్ఛతకు చిహ్నమైన మూర్తి. అవి యన్నియు యామెతో నంతరించినవి. కృష్ణమనాయుడుగారు పూర్వరాజచిహ్నము. ఆయనతో అది పోయినది. దేవదాసితో దేవదాసీత్వమే నశించిపోవును. మీతో మహారాజ్ఞీత్వమే నశించును…నేను మీ యందరును నశించిపోవుచుండగా చూచుటకు మాత్రము పుట్టిన మూర్తిని. నేనునూ ఈ కాలమునకు తగినవాడను కాను. ఇవి యన్నియు చచ్చిపోవుచున్న యొక జాతి చివరి మెరుపులు!” అంటాడు.

రాచరికవ్యవస్థతోనూ, గతంతోనూ ధర్మారావు తాదాత్మ్యం ఎంతటి దంటే, “కోటకు కోట యాకృతి పోయి యొక పెద్ద ధనవంతుని యింటి యాకారము పడినది” అనుకుని బాధపడతాడు.

ఇంతకీ ధర్మారావుకు అంత ఆదర్శవంతంగా కనిపించిన సుబ్బన్నపేటలోని రాచరిక వ్యవస్థ ఎలాంటి పునాదుల మీద లేచింది? అది మరో ఆశ్చర్యం. రచయిత ఏ మాత్రం దాపరికం లేకుండా దానిని బయటపెడతాడు.  అయిదారు జతల ఎడ్లను కిరాయికి తిప్పుకుంటూ  జీవించే వీరన్ననాయడు అనే సాధారణ సంసారి, టిప్పు సుల్తాన్ పై యుద్ధానికి వెడుతున్న ఇంగ్లీష్ వారికి తన ఎడ్లనిచ్చి సాయపడతాడు. వారు శ్రీరంగపట్నాన్ని దోచుకుంటారు. అప్పుడు వీరన్ననాయడు తనవంతు దోపిడీకి అవకాశమిమ్మని అడుగుతాడు. వారు కోటలోని ఒక కొట్టును చూపించి దానిని దోచుకొమంటారు. అతని అదృష్టం కొద్దీ దానినిండా నవరసులు ఉంటాయి. వాటిని అతను రహస్యంగా ఎడ్లకు ఎత్తుకుని ఇంటికి తోలుకుంటాడు.

veyi

ఆ దోచుకున్న ధనబలంతోనే అతను సుబ్బన్నపేటకు రాజవుతాడు. స్థానికంగా ఉన్న ఒక బ్రాహ్మణుడు అతనికి తోడవుతాడు. ఫలానా చోట కోట కట్టుకోమని అతనే చెబుతాడు. బ్రాహ్మణునికి కావలసింది ఆ ఊళ్ళో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టించడం. కోట నిర్మాణం, గుడి నిర్మాణం ఒకేసారి మొదలవుతాయి. వారిద్దరి అన్యోన్యత అలా ప్రారంభమై నానాటికీ బలపడుతుంది. విశేషమేమిటంటే,  వీరన్ననాయడు ఏ కులంవాడో రచయిత మొదట్లో ఎక్కడా చెప్పడు. కానీ రాజు కాగానే ‘క్షత్రియు’డైపోతాడు. మన దేశంలో వివిధ రాచవంశాల పుట్టుక గురించి ఇక్కడ విశ్వనాథ వాస్తవాన్నే బయటపెడుతున్నారు. ఈ దేశంలోనే ఉన్న ఇతర రాజ్యాలను దోచుకునో; లేదా దేశీయుడా, విదేశీయుడా అన్న తేడా కూడా చూడకుండా దోపిడీ శక్తులకు సాయపడో గడించిన సంపద పునాదుల మీద లేచినవవి. దోచుకున్న వ్యక్తి ఏ కులానికైనా చెంది ఉండవచ్చు; కానీ అధికారబలం, ధనబలం లభించగానే  బ్రాహ్మణ్యం అతనికి క్షత్రియత్వం కల్పిస్తుంది. ఇది ఉభయతారకమైన ఏర్పాటు. దోచుకున్న సొమ్ము అయితేనేం, అందులో కొంత దేవాలయానిర్మాణం వంటి దైవకార్యాలకు వినియోగిస్తే అది పవిత్రమైపోతుంది. ఈ రోజున కూడా తిరుపతి హుండీలో నల్లడబ్బు ఏ ప్రమాణంలో చేరడం లేదు?

ధర్మారావు ఊహాజగత్తులో అత్యంత విశిష్టంగా, ఆదర్శవంతంగా రూపుదిద్దుకున్న సుబ్బన్నపేట జమీందారి యథార్థరూపం ఇదీ. తన ఊహాశాలితను కాస్త నేలమీదికి మళ్లించి జమీందారీ మూలాలను తడిమి ఉంటే, అది దోపిడీ సొమ్ము మీద లేచిన వైభవోపేత నిర్మాణం అన్న సంగతి ధర్మారావుకు తెలిసేది. కానీ వాస్తవికత అనే నేల విడిచి ఊర్ధ్వయానం  సాగించడమే తప్ప కిందికి ప్రసరించే తత్వం అతని ఊహాశాలితకు లేదు. ఆ ఊర్ధ్వయానంలో పై పైకి వెళ్ళిపోయి కింద వాస్తవిక ప్రపంచం అనేది ఒకటుందన్న సంగతిని కూడా అతను ఒక్కోసారి మరచిపోతాడు. కావ్య రసాస్వాదన విషయానికే వస్తే, అతను తరచు రసప్రపంచంలో తప్ప మనుష్యలోకంలోనే ఉండడు. కావ్యజగత్తు గురించిన అతను చేసిన కింది  ఊహలు, వ్యవస్థ గురించిన అతని  కాల్పనిక ఊహలకూ యథాతథంగా వర్తిస్తాయి:

“ఓహో! కావ్యజగత్తు కల్పితజగత్తనుకొంటిని. కావ్యజగత్తే యథార్థమైన జగత్తు. అపరిపక్వమైన మనస్సులు, కృత్రిమ ప్రకృతులు, అసహజమైన మనోభావములు కలిగిన మనమే కల్పిత జగత్తు. యథార్థమైన మనోభావములు, నిర్మలమైన హృదయము, మహానాగరకత పొందిన బుద్ధీంద్రియములు కలిగినచో, తన దృష్టి, తన రక్తము కల్మషరహితమై, ధర్మగుణభూయిష్ఠములైనచో శీలము నందంత గాఢత్వముండును. అంత యేకాగ్రత యుండును…వర్ణసంకరము లేని రక్తము స్వచ్ఛమైనది.”

రాచరికవ్యవస్థ గురించిన అతని ఊహలు ఇంకా ఎంత హాస్యాస్పదంగా వ్యక్తమవుతాయంటే; అవి నవ్వునీ, బాధనీ కూడా కలిగిస్తాయి. అతనొకసారి ఇలా అనుకుంటాడు:

“మా తండ్రి నన్నేమో మహావైదికుని చేయవలెననుకొనెను. అన్న రామచంద్రరాజును గొప్ప విలుకానిని చేసి, అతనికి బ్రహ్మోపదేశము చేసి అధర్వవేదము పునరుద్ధరించి బ్రహ్మాస్త్రము మొదలైనవి కల్పితములు కావు, యథార్థములని రుజువు చేయించి, జగత్తు మరల క్షత్రియులచే నేలించవలయు ననుకొన్నాడు.”

ఈ నవల రచించే కాలానికి ఎంతో ముందే యుద్ధతంత్రంలోకి ఆధునిక మారణాయుధాలు ప్రవేశించాయి. మరో ఒకటిన్నర దశాబ్దాల కాలంలో అణ్వాయుధాలు కూడా ప్రయోగంలోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మారావు విలువిద్య గురించి, అధర్వవేదాన్ని పునరుద్ధరించి బ్రహ్మాస్త్రం మొదలైనవి కల్పితాలు కావని నిరూపించడం గురించి, జగత్తును(ఒక్క భారతదేశాన్నే కాదు) క్షత్రియులచే ఏలించడం గురించి కలలు కనడం అతని మానసికవైపరీత్యాన్నే సూచిస్తుంది. అతని ఊహలు పరిణామశీలాన్ని గుర్తించకపోవడమే కాదు; కాలాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తున్నాయి. క్షత్రియుడి పాలనను జగత్తు మొత్తానికి విస్తరింపజేస్తున్నాయి.

అతని ఊహలు, మధ్య మధ్య రచయిత చేసిన నిర్ధారణలు హాస్యాస్పదాలే కాదు; తర్కానికీ, హేతుబద్ధతకూ, శాస్త్ర నిరూపణకూ, చరిత్రకూ నిలవనట్టు ఉంటాయి. ఒకచోట రచయిత ఇలా అంటాడు: “ఏదో బలహీనపు గాలి మన దేశము మీదికి విసిరెను. ఆజానుబాహులై, విశాలవక్షులై, యేనుగు తొండము పూని విరువగల జాతికి; గుజ్జులై బక్కపలచనై, తెల్లవారి లేచినంతనే యేదియో యాహారము లేకపోయినచో తపతపలాడిపోవు జనులు పుట్టిరి.” మనదేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా ఒకప్పుడు అందరూ ఆజానుబాహులు, విశాలవక్షులు ఉండి; ఇంకొకప్పుడు అందరూ గుజ్జులు, బక్కపలచని వారు ఉండడం జరుగుతుందా? శరీరాకృతులు కానీ, ఆరోగ్యఅనారోగ్యాలు కానీ, ఆయుర్దాయంకానీ ఆయా కాలాలలో పుష్టికరమైన ఆహారలభ్యత, వైద్యసేవలు, ఆర్థిక సమానత లేదా అసమానత  మొదలైన భౌతిక, శాస్త్రీయ కారణాలపై ఆధారపడి ఉంటాయి తప్ప నిత్యసత్యాలుగా ఉండవు.

రక్తం, వర్ణం మొదలైన ప్రాతిపదికలపై జాతులను, మనుషులను విడగొట్టి చేసే ఊహలు కూడా అంతే అతార్కికంగా, అశాస్త్రీయంగా ఉంటాయి. ఆయా భాషల్లోని ఆయా వైచిత్రుల సమగ్రత తెలియడం, అవి అర్థమవడం ఆ దేశాల్లో పుట్టి ఆ భాషలు చిన్నప్పటినుంచి మాట్లాడితే కానీ సాధ్యం కాదని ధర్మారావు అనుకుంటాడు. “ఒక జాతి గుణములు, మతాభిప్రాయములు, తజ్జాతి రక్తము నెట్లుండునో, ఆ జాతి మాట్లాడు భాషలోని సమగ్రమైన రసాభావాదులర్థము చేసికొనుట కూడ శరీరములోని తద్రక్తము వలననే సంభవించు నని”  ఊహించుకుంటాడు. “వర్ణసంకరము లేని రక్తము స్వచ్ఛమైనది” అనుకుంటాడు. “ఆవు చురుకైన జంతువు. బర్రె మందమైన జంతువు…ప్రకృతిలోని యా మాంద్యము దాని రక్తమందున్నది. ద్రవ్యమును బట్టియే గుణము వచ్చినది. వాని రెండింటికి నవినాభావ సంబంధమున్నది. బ్రాహ్మణుని చూడగానే బ్రాహ్మణుడని తెలియుచున్నది. తుని వైపు క్షత్రియులను చూడుము. వెంటనే క్షత్రియుడని తెలియును…క్రైస్తవుడు క్రైస్తవునివలె కనిపించుచున్నాడు. అది భేదమే. అది వర్ణమే…అందర మొక్కటి యను సిద్ధాతము పశువులన్నియు నొక్కటియే యను సిద్ధాంతము వంటిది…అట్లే భిన్న వర్ణములందు భేదములున్నవి” అంటాడు. “ఆత్మలో భేదము లేదు. జీవునిలో భేదమున్నది…జలమే తాను తన యున్న భిన్నప్రదేశమును బట్టి భిన్నత్వము తెచ్చుకున్నది. తదుపాధిగత గుణదోష సంక్రాంతిచేత జీవుడు భిన్నుడగుచున్నాడు” అని తీర్మానిస్తాడు.

పోనీ వాదానికి రక్తభేదం, వర్ణభేదం ఉన్నాయని ఒప్పుకున్నా; అవి సంకరం కాకుండా ఎప్పుడైనా ఉన్నాయా? ప్రపంచచరిత్రలోకి వెడితే వర్ణసంకరం, జాతి సంకరం కాని కాలమే కనిపించదు. నాగరికత సోకని ఏవో మారుమూల ఆదివాసుల ప్రాంతాలలో తప్ప; నాగరికత పరిధిలోకి వచ్చిన ప్రపంచ జాతులు, మనుషుల మధ్య సాంకర్యం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. వర్ణసాంకర్యం గురించి మహాభారతంలోని అర్జునుడే గగ్గోలు పెట్టిన ఉదాహరణ ఉండగా, ‘వేయిపడగలు’ రచయిత ఏ వర్ణస్వచ్ఛత గురించి మాట్లాడుతున్నట్టు?

ఇంకోచోట, “కులవిద్యయే  కూడు బెట్టును. ఇప్పుడు కులవిద్యలు చెడిపోయి, సంపాదించుటకు చదువు కొనవలసివచ్చుచున్నది” అంటాడు. ఇక్కడ కులవిద్య అనే మాటను వృత్తి విద్యగా తీసుకుంటే బ్రిటిష్ పాలనలో వృత్తులు క్షీణించి వాటిని ఆశ్రయించుకున్న జనం అల్లాడవలసివచ్చిన మాట నిజమే. వారికి తగిన ప్రత్యామ్నాయం అభివృద్ధి చెందని మేరకు పై అభిప్రాయంలో కొంత నిజం ఉన్నమాట వాస్తవం. అయితే, కులవిద్య అన్నప్పుడు ఏ విద్య ఏ కులానిది; ఎక్కడ హద్దులు గీయగలం అనే ప్రశ్న వస్తుంది. బ్రాహ్మణులు మంత్రులుగా, సేనానులుగా లేరా? యుద్ధాలు చేయలేదా? అలాంటప్పుడు వారి కులవిద్య ఏదని చెబుతాం? అలాగే, వర్ణవ్యవస్థ ప్రకారం రాజ్యాధికారం క్షత్రియుడిది అనుకుంటే, రాజ్యాధికారంలోకి వచ్చిన వాళ్ళు అందరూ క్షత్రియులేనా? రాజులుగా ఉన్నవాళ్ళు అందరూ పుట్టు క్షత్రియులు కారనీ, వారికి క్షత్రియత్వం కల్పించారనీ, అందుకు హిరణ్యగర్భ క్రతువు వంటి అనేక ప్రక్రియలను అనుసరించారనీ తెలిపే ఉదాహరణలు అనేకం కనిపించడం లేదా? కులవిద్యనే అంటిపెట్టుకుని ఉంటే, ఒక వ్యవసాయదారుడు, ఒక కమ్మరి, కుమ్మరి, రజకుడు అధికారి, మంత్రి కాగలరా?

ఎలాంటివాడు ధర్మారావు? ఒకవైపు ఒక సంప్రదాయం చచ్చిపోతోందంటాడు. ఏదో బలహీనపు గాలి దేశం మీదికి విసిరిందంటాడు. ఒక మహా ప్రచండవాయువు వీస్తూండగా ఒరిగిపోయే వృక్షాలను నిందించి ఏం లాభమంటాడు. ఎవరిలోనూ ఉత్తమగుణాలు లేవంటాడు. మహార్థవంతమైనవన్నీ నశించిపోతున్నాయనీ, అల్పప్రయోజనములైనవన్నీ విజృంభిస్తున్నాయంటాడు. ఇంకోవైపు, ఇంతటి విపత్కరస్థితిలో కూడా కులవిభజన, వర్ణవిభజన, జాతి విభజన అంటూ ఎక్కడికక్కడ మనుషుల్ని చీల్చి మాట్లాడుతూ ఉంటాడు. అందరూ ఉమ్మడిగా ఎదుర్కొంటున్న పతనం నుంచి బయటపడడానికి ఐక్యంగా ఏం చేయాలన్న ఆలోచనే అతనిలో కనిపించదు. అతని ఉద్దేశంలో వర్ణవ్యవస్థ మళ్ళీ అవతరించి, జగత్తును అంతటినీ ఏలే అధికారం తిరిగి క్షత్రియుడికి కట్టబెడితే చాలు, అన్ని సమస్యలూ పరిష్కారమైపోతాయి.

అతనిలోని విభజిత దృష్టికి అంతే కనిపించదు. మనుషుల్నే కాదు మతాలను విభజిస్తాడు, సాహిత్యాన్ని విభజిస్తాడు, శిల్పాన్ని విభజిస్తాడు, చిత్రకళను విభజిస్తాడు. ఈ విభజనలో కొన్ని చోట్ల ఎక్కడైనా, ఏ కొంచమైనా వాస్తవం ఒకింత తళుక్కు మంటే అనవచ్చు. కానీ అతనిలో విరాట్ రూపంలో వ్యక్తమయ్యే స్వ, పర చింతన దానిని పూర్తిగా కప్పివేస్తుంది. అన్ని నదులూ సముద్రంలో కలసినట్టు ధర్మారావు ఊహలన్నీ ఆత్మోత్కర్షలో కలుస్తాయి. ఎందులోనైనా సరే మనమే గొప్ప. “మన దేశమునందు పుట్టిన దేనికి మాపులేదు. ఖద్దరు గుడ్డకు మాపేమిటి? అది యెప్పుడును పవిత్రమే. ఎప్పుడును నిర్మలమే” వంటి నిర్ధారణలు సర్వత్రా కనిపిస్తాయి. మళ్ళీ ‘మన దేశీయులు’ అన్నప్పుడూ అక్కడ మరో విభజన:

“మన దేశమనగా నాల్గు హద్దులు గల ప్రదేశమని కాదర్థము. ఇచ్చటి మతము, సంఘము, ఆచారములు సర్వము నని యర్థము. ఈ భూఖండము నందు పుట్టినంతలో నొరిగినది లేదు. మన మతసంఘాచారములయందు పుట్టవలయును. వాడూ మన దేశస్థుడు.”

(సశేషం)

 

 

 

నోస్టాల్జియా

Art: Mandira Bhaduri

రాక

 

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

 

 

ఎపుడొస్తవొ తెల్వక బాటపొంటి

చెట్లెంట నేనొక నీడనై నిలుచున్న

అట్లట్ల పొయ్యేటి ఆ మబ్బుల్ని నిలబెట్టి

నువ్వు పోయిన దేశాలజాడలడుగుతున్న

దేవులాడుకుంట వద్దమంటె నీ అడుగుల ముద్దెర్లు లెవ్వు

పొద్దంతా పచ్చటాకు మీద పొద్దురాసిన కైతల్ల

నీ ముచ్చట్లనె పాడుకున్న

వో సోయిలేదు, వో క్యాలి లేదు

 

రెండునీటిపాయలు జోటకట్టిన దగ్గర నవ్వుల నురుగులు

రెండు కలిసీకలువని దేహాలగాలులు ధూళీధూసరితాలు

రెండు చూపులందని దూరాలకొసలమీద కాలం పందాలు

 

నిలువుగా చీల్చిన రాత్రి రెండోముక్కలో వో కలవరింత

కొడిగట్టిన దీపపువత్తి రాస్తున్న ఆఖరు నిరీక్షణ కవిత

పూలరేకులనంటుకుని శ్వాసతీసుకుంటున్న పచ్చి పచ్చి పరిమళాలు

తేనెతాగిన తేటిపెదవులమీద భ్రమరగీతాలు

ఏమో, నా పక్కన్నె కొడగొడుతున్న నీ ఊపిర్లు

నిఝంగా నువ్వొచ్చినట్లె…

*

 

 

 

 

 

 

నేనో కవితా పాదమై

Art: Satya Sufi

Art: Satya Sufi

ఒక్కసారిగా చైతన్యం..

seetaram

ఫోటో: దండమూడి సీతారాం

 

  • కలల పయనమింకా పూర్తికాకుండానే వేకువ పరిమళమొచ్చి వెన్ను తట్టినా హేమంతపు చలిపాటకి మదిలో గూడు కట్టుకున్న ఊహలూగుతున్నా రెప్పలు మాత్రం వెచ్చని బరువుని వీడనంటున్నాయి

    మూతబడ్డ కన్నుల మాటు నీలినీడలు కవిత్వాన్ని కురిపించాలని చూసినా శబ్దంలేని భాషను రాయడం చేతకాక మిగిలిపోయిన ఏకాకితనంలా పూలగాలికి బద్దకం తోడై మరోసారి పులకింతను సవరించుకుంది మేను

    విశ్వశూన్యం ఆవరించిన సుషుప్తిలో నవోదయం ఆలపిస్తున్న రసాత్మక గీతం ఆనాటి లక్ష్యాన్ని వశీకరించగానే ఒక్కసారిగా చైతన్యం ఉరకలెత్తింది కృతిగా ప్రకృతిని పలకరించాలని..

  • ప్రకృతి గీసిన వర్ణచిత్రం స్మృతిపధంలో మెదిలిన వేళ మనసులో పచ్చని అనుభూతి పెదవంచుని తాకింది చిరునవ్వుగా

    మౌనంగా నిలబడ్డ తరువులు తల ఊచి సుప్రభాతాన్ని వీయగా ఊహల తెమ్మెర తొణికింది మధురిమగా గగనపు నీలిమ నారింజను పూసుకొని తొలికిరణాన్ని ముంగిట్లో జార్చినప్పుడు కాలం పరవశించింది గోరువెచ్చగా

    మునుపెరుగని రంగులవలలో చిక్కిన మది పుప్పొడి గంధాలను తాగి చైత్రగీతిని మొదలెట్టి నిశ్శబ్దానికి రాగాలను పరిచయించింది రోజూ చూసే ఉషోదయమైనా ఈరోజెందుకో సరికొత్తగా పురి విప్పినట్లుంది..

  • నిశ్శబ్దం నిద్దురలేచి పక్షుల కిలకిల ఓంకారాలతో స్వప్నం నుండి మనసుని వేరు చేసినప్పుడే ఆవిరైన హిమబిందువు వీడుకోలు మాదిరి కన్నుల్లో నిదురమబ్బు కరిగిపోయింది మంచుతెరల నడుమ సూర్యోదయం భూపాల రాగాల మాధుర్యం ఒంపుకొని ఒక్కో కిరణం వెల్లువై పుడమిని తడిమింది

    సౌందర్యాన్వేషణలోని మలయ సమీరం ఎన్ని కల్పాలను చుట్టొచ్చిందో తిమిరాన్ని చల్లగా తరిమింది ఊహలకి రెక్కలొచ్చి ఎగిరిన చందం తనువంతా వ్యాపించింది మైమరపు గంధం మనసుకు కళ్ళున్నట్లు గుర్తించిన మధురక్షణం సుదీర్ఘ కవనమొకటి రాయమంది తక్షణం..

     -లక్ష్మీ రాధిక 

నీ కవిత్వాన్ని నిషేధించాల్సిందే!

mouli

 

నిన్ననే చేతుల్లోకి వచ్చింది పద్యం,ఒంటి నిండా బాల సుధాకర మౌళి ని తొడుక్కుని. వొచ్చి వారం పైనే అయిందట ఊళ్ళోకి. వెళ్ళి పోస్టుమ్యాన్ ని బతిమాలుకుంటే దయ తల్చి నిన్న ఇచ్చాడు.

గుండె కళ్ళకు ప్రేమ గా అద్దుకుని మనసు చేతులు చాపి వెచ్చగా హత్తుకున్నాను.ఎలా ఉంది స్పర్శ? పువ్వులా మెత్తగా ఉంది. కత్తిలా కరుకు గా ఉంది. పాట లా తీయ గా ఉంది. బాధ లా చేదు గా ఉంది.అంటుకుంటున్న అడవి లా ఉంది. ’ఆకు కదలని చోటు’ లా ఉంది.

ఎన్ని ముచ్చట్లు పెట్టిందో! ఎక్కడుంటావు నువ్వని అడిగితే ఎంత హాయిగా నవ్విందో,అచ్చం కొంచెం గడ్డం తో అమాయకం గా కనపడే ఆ విజయనగరం పిల్లోడి లాగా. “ వేకువనే లేచి ఊరు దాటుతున్న ఆ భుజమ్మీది కావిడి లో లేనా” అంది. “ రేపటి విలుకాడి వద్ద శిష్యరికం చేస్తూ లేనా” అంది.

**

ఏవయ్యా మౌళీ..ఏం చేస్తున్నావు నువ్వు? “ప్రపంచం మధ్య లోంచి ఎక్కడో ఏ ఊరులోనో మొదలయి కాగడా లాంటి మనిషి ఒకరు నడుచుకుంటూ నడుచుకుంటూ వొచ్చినట్టు” – ఏంటి ఇలా లోలోపలకు వొచ్చేస్తున్నావ్? చంపేస్తున్నావ్, తిరిగంతలోనే బతికిస్తున్నావ్.

“ నీడ కురిసే చెట్ల మధ్యో,ఎండ కాసే వీధుల్లోనో, గోళీలాడుకుంటున్న పిల్లాడ్ని బంధించి కణతలపై గురి చూసి తుపాకీ కాల్చకూడద”ని గదా…కవికీ, కవిత్వానికీ నిషేధాలుండకూడదని గదా నువ్వంటున్నావ్. ఉహూ.. నిన్ను మాత్రం కాల్చేయాల్సిందే,నీ కవిత్వాన్ని నిషేధించాల్సిందే. లేకుంటే నువ్వు నిద్ర పోనిచ్చేట్టు లేవు.

ఎన్నో ఉద్విగ్న క్షణాలనుతీసుకొచ్చి మా రక్తనాళాల్లోకి ఊదేటట్టున్నావ్. రగిలే పోరుజెండా నీడలో రాలే పూలన్నీ మన కలలే అని అనిపించేటట్టున్నావ్. చలికి వణికే వానకు తడిసే భయపడి పరుగులు తీసే కొండ మేక ఒక్కసారి ఆగ్రహించి కాళ్ళకింది నేలను కబళించే వాళ్ళను నేలకేసి కుమ్మేసే దృశ్యాన్ని కళ్ళకు కట్టేటట్టున్నావ్.

ఎలా చెప్పు నిను నిషేధించకుంటే. దేశ అంతర్గత భద్రతను అసలు పట్టించుకోకుండా బస్తర్ ను ఎక్కుపెట్టిన విల్లు అంటావా? నిర్బంధం లో ఎగిరే పావురమంటావా? అరే ,అలా అమాయకంగా కళ్ళజోడొకటి పెట్టుకుని “ నెత్తురోడుతున్న నేల మీది వీరోచిత గాన”మంటావా?

ఏమంటావూ రాత్రిని? ఏ ఆదిమ మానవ సమూహమో నెగడు చుట్టూ చేరి ఆడి ఆడిఅలసి నిద్రలోకి జారుకున్నప్పుడు ఒడిలో వేసుకుని ఓలలాడించిన రాత్రా? ఆకుపచ్చని అడవి వాసన వేసే, నిషేధిత మనుషుల మహాస్వప్నాల వాసన వేసే రాత్రా?

ఏం చేయగలం మేము మాత్రం నీ లాగే ఆకుపచ్చని వాసనేసే రాత్రిని కళ్ళతోనూ హృదయం తోనూ ప్రేమించకా మోహించకా..?

**

ఏం చేద్దాం ఈ కవి ని? “ ఒక దుశ్చల స్థితి నుంచి కదులుతున్న పడవను ఒడ్డుకి చేర్చే ప్రయత్నం లో సంభవించే ఏ చిన్న కదలిక నైనా యుద్ధ విన్యాసం గానే భావిస్తాన”ని అంటున్న వాణ్ణి, “ అంతిమం గా యుద్ధాన్నే నేను ప్రేమించేద”ని తెగేసి చెబుతున్న వాణ్ణి.

తను తన విద్యార్ధికి చెప్పినట్టు , తన కవిత్వాన్ని ముద్దు పెట్టుకుందామా..అంతరాంతరాల్లోకి హత్తుకుందామా…?

ఆకు కదలని చోటుల్లోనూ నెమ్మదిగా ప్రశాంతంగా అంటుకడుతున్న  ముఖంలోనేలతారాడే మనుషుల్ని, దేహమంతా వేళ్ళే మొలిచే నిరసన దృశ్యాల్ని, HCU దారిన పోతున్న ఆ వరి సొప్పల కంఠపు అబ్బాయిని, కళ్ళ మీదకు ఆకాశాన్ని దించుకున్న అమ్మాయిని అందరినీ అన్నిటినీ దగ్గరకు తీసుకుందామా?

**

“నది మీద పిట్టెగురుతుందంటే నది బతికున్నట్టు….” అని మౌళి అన్నట్టుగా రేపటిని స్వప్నిస్తోన్న అక్షరాల్ని ప్రేమిస్తున్నామంటే మనం బతికున్నట్టు.

*

ప్రజల కష్టాలే కొలబద్ద: పి. చంద్

chandగత ముప్పై ఏండ్ల నుంచి సింగరేణి కార్మికుల కష్టాలను, ఆశలను, ఆకాంక్షలను అక్షరీకరిస్తున్న, తెలుగులో మొట్ట మొదటి ఏకైక కార్మిక వర్గ రచయిత పి.చంద్ గారు… శేషగిరి, అంతర్జాతీయ శ్రామిక యోధుడు కే.ఎల్ మహేంద్ర, శ్రామిక యోధుడు, ఒక కన్నీరు, నెత్తుటి ధార, విప్లవాగ్ని, హక్కుల యోధుడు బాల గోపాల్, తెలంగాణ సాయుధ రైతాంగ యోధుడు బండ్రు నర్సింహులు, తెలంగాణ, నల్లమల, మేరా సఫర్(జి.వెంకట స్వామి జీవిత చరిత్ర) వంటి నవలలు మరియు భూనిర్వాసితులు, సమ్మె, జులుం, గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు వంటి కథా సంపుటాలు ప్రచురించి ప్రచారార్భాటాలకు దూరంగా ఉండి పోయారు. సింగరేణి ఉద్యోగానికి గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి, గోదావరిఖని యైట్ ఇంక్లైన్ కాలనీలో తన క్వాటర్ లో ఉండి, సైకిల్ తొక్కుతూ సింగరేణి జీవితాల్ని నిశ్శబ్దంగా గమనించి రచనా ప్రస్థానం కొనసాగిస్తున్న పి.చంద్ ఉరఫ్ యాదగిరి ఈ మధ్య తన జన్మస్థలం వరంగల్ కు మారినారు. వారితో బూర్ల వేంకటేశ్వర్లు జరిపిన ఇంటర్వ్యూ….

ప్ర…చంద్ సార్ మీ సాహిత్యానికి ప్రేరణ ఎక్కడ మొదలైంది?

జ…సాహిత్యానికి గాని దేనికి గాని మనిషి జీవితమే పునాది. మనం బతికిన జీవితం మనం చూసిన రచనలకు ప్రేరణ కలిగిస్తది, ముఖ్యంగ ఏందంటే, కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గాబట్టి, మా నాయిన ఆజంజాహి మిల్లు లోపట పనిజేసిండు గాబట్టి, చిన్నప్పట్నుంచి గూడ కార్మిక కుటుంబాల్లో ఉండే సాధక బాధకాలు ఏందో తెలుసు, రెండోది ఏందంటే ఒక చారిత్రిక దశలోపట మనం బతికినం, డెబ్బై ఎనబై దశకం లోపట సమాజంలో ఒక చలనం మొదలైంది. ఎక్కడో ఒక సామాన్యునికి ఏదో జరిగితే వీథులల్లోకి వచ్చి కొట్లాడే రోజులు. ఇయ్యాల్ల పక్కింటోడు చచ్చిపోతాండంటే గూడ పట్టిచ్చుకొని పరిస్థితి. సమాజం ఒక అలజడికి గురవుతున్న తరంలో పుట్టినం, ఈ సమాజాన్ని అధ్యయనం చేయడమనేది జీవితంలో భాగమైంది. అదిగాకుంట ఆ రోజులల్లోనే ఈ సమాజం మార్పు కోసం ఎంతో మంది యువకులు వచ్చినట్టు మేం గూడ వచ్చినం, ఎమర్జన్సీలో ఎంతోమంది లాకప్ లకు, జైళ్ళకు పోయి వచ్చిన సంఘటనలు గూడ ఉన్నయ్.

ఈ నేపథ్యమేదైతే ఉన్నదో, అంటే కార్మిక వర్గ జీవితం, మనం బతికిన కాలం, దానికి తోడు నిరంతర అధ్యయనం ఇవన్నీ ప్రేరణే. వరంగల్ సెంట్రల్ లైబ్రరీకి సైకిలేసుకొని పొయ్యేది. ఇప్పటిగ్గూడ సైకిలే తొక్కుతున్న, బండి జీవితంల వాడలే!. అప్పుడున్న అన్ని లైబ్రరీలల్ల నాకు మెంబర్ షిప్ ఉండేది. మన అభిరుచికి అనుగుణంగ తత్త్వ శాస్త్రం, ఆ తర్వాత జీవితానికి సంబంధించిన సాహిత్యాన్ని, ప్రామాణికంగా వచ్చిన ‘గోర్కీ’ కావచ్చు , రష్యన్ నవలలు, చైనీస్ నవలలు గూడ వచ్చినయ్. ఇట్లా అనేక పుస్తకాలు చదివే వాణ్ణి.

తర్వాతేమయిందంటే, పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టైంది నా పరిస్థితి. నేనచ్చి మల్ల సింగరేణి ప్రాంతంల ఉన్న, అప్పుడే సింగరేణిల ఎమర్జెన్సీ ఎత్తేసిండ్లు అయితే ఆ అణచివేత నుంచి, తిరుగుబాటు ఉద్యమ రూపం సంతరించుకున్న క్రమంల నేనిక్కడ ఉన్న, అందువల్ల సింగరేణిల విప్లవోద్యమానికి ఒక ప్రత్యక్ష సాక్షిని, ఐ విట్నెస్ అన్నట్టు. దానితోనేమయిందంటే మనం మరింత పదునుదేరడానికి మన ఆలోచన పదునుదేరడానికి సాధ్యమైంది. ఒక విప్లవకారుని గురించి రాయాల్నంటే ఎప్పుడు గూడ ఊహల్లో రాయలేం!, ఒక రిక్షా కార్మికుని గురించి రాయాలంటే వాని సాధక బాధకాలు, వాని కష్టం సుఖం అన్ని గూడ ప్రత్యక్షంగ చూసన్న ఉండాలె, పరిశీలించన్న ఉండాలె, అనుభవించన్న ఉండాలె. అట్ల ఉంటే మాత్రమే లైవ్లీగ వస్తది. లేకుంటే వాళ్ళ జీవితం వేరుంటది, మన బుర్రలో పుట్టినట్టత్తది, ప్రామాణికంగా నిలబడలేదు. యాబై ఏండ్ల కింద నేను పుట్టక ముందు సమయంలోపట ఉన్న శేషగిరిరావు అనే ఒక విప్లవకారుని గురించి నేను లైవ్ లీ గ రాయగలిగిన అంటే, విప్లవకారుల స్వభావం ఏం ఉంటది, వాళ్ళ త్యాగ నిరతి ఎట్ల ఉంటది, ప్రజలకోసం ఎంత అంకిత భావంతో పనిజేస్తరు, ఎటువంటి కష్టాల్నేదురుకుంటరు. అనే దృశ్యాల్ని నేను చూసిన, కాబట్టి నాకు తేలికైపోయింది, శేషగిరిరావు ప్లేస్ లోపట నేను చూసిన ఏదో ఒక విప్లవకారున్ని పెట్టిన కాబట్టి లైవ్లీ గ రాయగలిగిన.

ప్రశ్న… చంద్ సార్! మీరు కార్మికుల  హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి శేషగిరి రావు, కే.ఎల్.మహేంద్ర, బాలగోపాల్, బండ్రు నర్సింహులు మొదలైన వారి జీవితాలను నవలలుగా రాసిండ్రు గద, మీ ఈ కృషి వెనుక నేపథ్యం  గురించి చెప్పుతరా?

జవాబు….. తెలంగాణ సాయుధ పోరాటం మీద చాలా మంది గొప్ప రచయితలు సుమారు ఇరువై రెండు నవలల దాకా రాస్తే, అందులోపట మొట్ట మొదటి సారిగా తె.సా.పోరాటం నేపథ్యం లోపట కార్మిక వర్గ లిటరేచరచ్చింది. అది పందొమ్మిది వందల నలబై లోపట స్టార్టయ్యింది. వాస్తవానికి ఏమైందంటే, పద్దెనిమిది వందల ఎనబై లోపట సింగరేణి స్టార్టయినప్పటికి గూడ పందొమ్మిది వందల నలుబై వరకు ఎటువంటి యూనియన్ యాక్టివిటీస్ లేవు. అంటే, ఒక యాబై సంవత్సరాలు ఎటువంటి యూనియన్ యాక్టివిటీస్ లేవు. ఎందుకంటే, ఫ్యూడల్ రాచరిక వ్యవస్థ, బ్రిటీష్ యాజమాన్యం, ఒకటి వలసవాద పాలన రెండోది ఫ్యూడల్ దోపిడీ, ఇవి రెండు ఎటువంటి ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ లేకుండా అణచివేసినయ్.

అటువంటి నేపథ్యం లోపట, ఎప్పుడైతే ఆంద్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతూ వచ్చిందో వాళ్లు కార్మిక రంగం మీద కాన్ సన్ ట్రేట్ చేసి పని చెయ్యడం మొదలైంది. ఆ నేపథ్యంలోపట మగ్దూమ్ మొహియుద్దీనేమో హైద్రాబాదులోపట పరిశ్రమించిండ్రు. వరంగల్ జిల్లా ఆజం జాహిమిల్ ప్రాంతం లోపట సర్వదేవ భట్ట రామనాథం,  శేషగిరిరావు అనేటాయినేమో సింగరేణి లోపట మొట్ట మొదటి సారి యూనియన్ స్థాపకుడైండు. అయితే అప్పుడు నలబై ఆ ప్రాంతం లోపట  చరిత్రలో దాదాపు ఒక వందమంది ఆనాటి సాయుధ పోరాటం లోపల కార్మికులు పార్టిసిపేషన్ చేసి చనిపోయిండ్రు. కని, వాళ్లకు సంబంధించి రికార్డు ఎక్కడా చరిత్రలో నమోదుగాలే. ఒక సుందరయ్య రాసిన తెలంగాణా సాయుధ పోరాటం గుణపాఠాలు లో మాత్రం శేషగిరిరావు గురించి ఒక పేజీ, పేజీన్నర మ్యాటరున్నది. అంతకుమించి సమాచారం ఎక్కడా చరిత్రలో రికార్డు కాలేదు. ఆ తరం వాళ్ళలోపట శేషగిరిరావు సార్ కు కార్మిక వర్గం లోపట పెద్ద పేరున్నది. ఇప్పటికీ, ఆయన అట్ల చేసిండు, ఇట్ల చేసిండు అని చెప్పుకుంటరు. చనిపోయే నాటికి ఆయన వయసు  ముప్పై ఏండ్ల లోపట్నే. ఆ నేపథ్యం లోపట విప్లవోద్యమం ఏం చేసిందంటే పాత చరిత్రను తవ్వి తీసే క్రమం లోపట కొమురం భీం చరిత్రను తీసుకచ్చింది. అట్లాగే ఇక్కడ గూడ సింగరేణిలో విప్లవోద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో పాత చరిత్రను తవ్వి తీసుకునే క్రమం లోపట శేషగిరిరావు గురించి ఈ కార్మికుల్లో ఉన్న బహుళ ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అన్వేషణ చెయ్యడం జరిగింది. దాదాపు ఒక నూరు నూట యాబై మంది ఆ తరం వాళ్ళను ఇంటర్వ్యూ చేసిన. అసలు ఏంజేశిండు ఆయన, ఎట్ల జేశిండు, ఏ సమస్య మీద ఎట్ల కొట్లాడిండు, అప్పటి పరిస్థితులు ఎట్ల ఉండేది అని సమగ్రంగ, ఒక ఐదారు సంవత్సరాలు ఇదే పనైపోయింది. అంటే, ఒక రిసెర్చ్ వర్క్ లాగ ఐపోయింది. ఆ తర్వాత దాన్ని తీసుకొన్న, అది రిపోర్ట్ గ రాస్తే దానికి విలువ ఉండది.

ఫిక్షన్ మనిషి హృదయానికి సంబంధించిన విషయం మనిషి హృదయం లోపట ఒక ముద్ర వేస్తదన్నమాట. అంటే, అది డాక్యుమెంటేషన్ కు పరిమితం చెయ్యలేదన్న మాట. అట్లగాకుంట ఏం జేసిన్నంటే దీన్ని విశ్లేషణ జెయ్యాల్నని జెప్పి వందలాది పాత్రల తోటి అప్పటి పరిస్థితులు, అప్పటి బొగ్గుబాయి పరిస్థితులు, అప్పటి భౌతిక పరిస్థితులు, అప్పటి కార్మికుల కష్టాలు, వాళ్ళ ఆరాటాలు, వాళ్ళ పోరాటాలు, ఆ నిర్బంధాలు ఇవన్నీ మొత్తం గలిపి శేషగిరి నవల రాసిన. అందుకోసం ఏందంటే తెలుగు సాహిత్యం లోపట వచ్చిన సాహిత్యం లోపల “శేషగిరి” నవల అంత విస్తృత క్యాన్వాస్ తోని, ఒక ఉద్యమం ఎట్ల నిర్మించబడుతుంది, ఉద్యమ కారులు ఎట్లా ఉద్యమాల్ని నిర్మిస్తరనిజెప్పి ఇంత బ్రాడ్ కాన్షియస్ తోని వేరే నవల లేదని చెప్పి విమర్శకులు అంటరు.

ప్ర… “హక్కుల యోధుడు బాల గోపాల్”  ఏ నేపథ్యంతోని రాసిండ్రు?

జ… బాల గోపాల్ ను ఒక ఆలంబనగ చేసుకొని సింగరేణి ప్రాంతంలో స్టేట్ చేసిన రిప్రెషన్ ను రాసిన, రాజ్యం కార్మిక వర్గం మీద చేసిన దాడిని రాసిన, ఆయనను ధారలాగ పెట్టుకొని రాసిన. ఆయనతో వ్యక్తిగతంగా తిరిగిన కాబట్టి ఆయన ఎట్లా విషయాల్లో అప్రోచవుతడనడానికి లైవ్లీనెస్ రావడానికి అది దోహదపడ్డది. ప్రమాదాలు, ఎన్ కౌంటర్లు, ప్రభుత్వ నెగ్లిజెన్స్ ఆధారంగా చేసుకొని రాసిన. ప్రతి విషయాన్ని గూడ ప్రజల పక్షాన తీసుకొని రాసిన.

ఇయ్యాలటి రోజుల్ల సాహిత్యంలో ఉన్న ఈ గ్యాప్ ను పూర్తి చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగ లేరు. బాలగోపాల్ పై స్టేట్ రిప్రెషన్ గురించి రాయాలనుకో అసలు స్టేట్ రిప్రెషన్ ఏం జేసిందో తెల్సి ఉండాలె గద!, తెలిసినా దాన్ని ఆ ఫామ్ లో పెట్టాలె! పాఠకునికి హృదయానికి నాటుకునేలాగ, చొచ్చుకుపొయేలాగ, అయ్యో! గింత ఘోరం జరిగిందా! అని అనిపించేలాగ రాసిన. నేనేదైతే ఫీలయ్యిన్నో , అది పాఠకులకు కన్వేజెయ్యటం కోసం ఈ మాధ్యమాన్ని ఎన్నుకొన్న. స్టేట్ లో ఫలానప్పుడు ఎన్ కౌంటర్ జరిగింది, బాలగోపాల్ సార్ అచ్చి మాట్లాడిండు అన్న విషయం కంటె గూడ, ఆ ఎన్ కౌంటర్, ఆ భీభత్సం, ఆ దుక్కాన్ని పాఠకునికి అందియ్యదల్సుకున్న, అందుకోసం ఈ ఫిక్షన్ ఫామ్ అనేది ఆలంబన చేసుకొని రాయడం జరిగింది.

ప్ర…మీరు కార్మిక వర్గ చరిత్ర నిర్మాణం కోసం కథ, నవల ప్రక్రియలను తీసుకున్నరు, కానీ కార్మికులంటే సామాన్య ప్రజలు వాళ్ళెప్పుడు పనిలోనే నిమగ్నమై ఉంటరు. చదివే అంత తీరిక ఉండదు కదా! పాట దిక్కు మొగ్గు చూపుతరు అనుకుంట – మీరు ఎన్నుకున్న ప్రక్రియ ఎటువంటి ప్రయోజనాల్ని నెరవేర్చింది?

జ…పాటకుండే పరిమితి పాటకుంటది. పాట ఇమిడియేట్ గా మనిషి హృదయంలోకి చొచ్చుక పోతది. కానీ, దాని ప్రయోజనం తాత్కాలికం. నేను కేవలం ఫిక్షనే రాయలే, చరిత్రను కూడ రికార్డు చేసిన. దాదాపు పదిహేను ఇరువై పుస్తకాలు నేను సింగరేణి కార్మికుల జీవితాల మీద రాసిన, ఉదాహరణకు తరతరాల పోరు, సంస్కరణలు ఒక పరిశీలన, వేజ్ బోర్డులు మొ.. వాటిమీద రాసిన. వనరుల తరలింపు క్రమంలోపట, సింగరేణి ప్రాంతంలోపట  ఆంధ్రా వలసవాద దోపిడీ ఏవిధంగా జరుగుతంది, ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా ఎందుకు పోరాటాలు జరుగుతున్నాయి, ఓపెన్ కాస్ట్ వల్ల జరిగే బీభత్సమేమిటి ఇట్లా చాలా పుస్తకాలు రాసిన. అయితే గమ్మతైన విషయమేందంటే సింగరేణి ఎంప్లాయ్ గ ఉండటం వలన వాటిని నాపేరు మీద వేసుకునుటానికి అవకాశం లేకుంట పోయింది. మారుపేర్లతో వచ్చినయ్. ఇంకో గమ్మతేందంటే సంస్కరణలనేవి భారతదేశం మొత్తం మీద పందొమ్మిది వందల తొంబై ఒకటి తర్వాత జరిగినయ్. వీటిని ఒక కేస్ స్టడీ లాగ సింగరేణిలో ఎలాంటి పరిణామాలు వచ్చినాయని ఎవరూ రాయలేదు. సంస్కరణలు ఒక పరిశీలన అని పుస్తకంగ రాసిన. దాన్ని పిట్టల రవీందర్ పేరు మీద ఒక పుస్తకంగ వేస్తె దానిమీద కంపెని బాగ షేకయ్యింది. భావజాల పరంగా ఒక ఆందోళన మనిషికి రావాల్నంటే ముందు మానసికంగా ఆందోళనకు సిద్దం కావాలె . అందుకే జయ శంకర్ సార్ “భావజాల ప్రచారం”, “ఆచరణ” అన్నడు. ముందు మనం చేస్తున్నది న్యాయమైంది, చెయ్యాలనుకునే ఒక ఆకాంక్ష పుట్టినప్పుడు, నువ్వు చేయడానికి సిద్ధపడితే మార్గం అదే దొరుకుతుంది. భావజాల పరమైన మార్పు రాకుంట ఆచరణకు పొయ్యే అవకాశం ఉండదు.

మళ్ళీ మొదటికి వస్తే రచయితకు ఉన్న అభిరుచిని బట్టి కావచ్చు, కాపెబులిటీ కావచ్చు, పాట రాయాల్నంటే పాటగాడై ఉండాలె. పాటగాడై ఉంటే ఆ పాటకు ట్యూన్ దొరుకుతది. చాలా వరకు పాటగాళ్ళు మాత్రమే పాటలు బాగా రాయగలిగిండ్రు. ఎవలన్న ఒకలిద్దరు రాసినప్పటికి గూడ వాళ్ళంత బలంగ రాయలేకపోయిండ్రు. తెచ్చిపెట్టుకున్నట్టై పోయింది. కాబట్టి కథా, నవలా రచన మేధోపరమైనది. ఉద్యమాలు ఆకాశం నుండి ఊడిపడయి, ఉద్యమాలు ఎందుకు పుట్టినయ్, దాని భౌతిక పరిస్థితులేమిటి, సమస్యకు దారితీసిన పరిస్థితులేమిటి దాని నేపథ్యమేమిటి, దాన్ని మార్చుకోవడం కోసం వాళ్ళెటువంటి పోరాటం చేసిండ్రు, వాళ్ళ వైఫల్యాలేమిటి, సక్సెస్ లేమిటి, అంతిమంగ ఏం జరిగింది. ఇట్లాంటి విషయాలను ఎంత లోతుగా అధ్యయనం జేస్తే అంత బాగ చెప్పగలం. ఇలా ప్రతి పుస్తకం వెనుక ఇటువంటి మేధోపరమైన శ్రమ ఉన్నది.

ప్ర… సార్!  ఊరుగొండ యాదగిరి గా ఉండే మీరు పి.చంద్ గా మారడానికి, కార్మిక, వీరమల్లు, కే.రమాదేవి, ఉదయగిరి, ఏ.చంద్ర శేఖర్, వి.హరి, గోపి, వినీల్ చైతన్య మొ..ఇరవై దాకా కలం పెర్లతోని రాయడానికి కారణమేంది?

జ…ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగ లేకుంటే దోపిడీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగ ఉన్నటువంటి భావజాలాన్ని గూడ వాళ్ళు సహించలేని పరిస్థితి, తీవ్రంగ అణచివేసే పరిస్థితి, చిన్న కాయిదం ముక్క దొరుకుతే గూడ చంపేసిన సంఘటనలున్నయ్ సింగరేణి ప్రాంతంలోపట, దేశ వ్యాప్తంగ గూడ… అటువంటి పరిస్థితిలోపట మనం చూస్తున్న జీవితం, మనం అనుభవిస్తున్న జీవితం, మన చుట్టూ జరుగుతున్న వాతావరణం ఒక రచయితగా నన్ను ఖాళీగా ఉంచలేకపోయింది.

ఉదాహరణకు మన రోడ్డు మీద ఎవరో పిల్ల అడుక్కుంటున్నదనుకో చూసే వరకు జాలి అనిపిస్తది. అయ్యో! చిన్నపిల్ల ఆకలితోటి ఉన్నట్టున్నదని రూపాయో రెండో ఇయ్యాలనిపిస్తది ఎందుకు? మానవత్వంతోనే కదా!, అట్లనే మన చుట్టూ జరుగుతున్న జీవితాల్ని చిత్రించే క్రమంలోపట మనం రచనలు చేస్తం. ఉదాహరణకు ఒక వేశ్య గురించి ఒక రచయిత రాసిండు. రాసినంత మాత్రాన ఆ రచయిత వేశ్య కాలేడు గద, ఆమె జీవితం దుర్భరంగ ఉందని ఏదో జాలిపడిపోయి, అరె ఒక ఆడామె ఇంత అధ్వాన్నంగ బతుకుతంది అని, ఆ బాధను తనకు తెలిసిన ఫాం లోపట వ్యక్తీకరిస్తడు… అట్ల వేశ్య గురించి రాస్తే నిన్నెవరు పట్టించుకోరు. కని మార్పు కోసం కొట్లాడుతున్న ఒక కార్మికుని గురించో, ఉద్యమ కారుని గురించో రాస్తే ప్రభుత్వం పట్టించుకుంటది. దీన్ని ఏవిధంగ అర్థం జేసుకోవాలె? అటువంటి పరిస్థితిలోపట ఒక సామాన్యమైన జీవితం గడుపుతూ ఈ స్టేట్ కు వ్యతిరేకంగ రాస్తున్న క్రమంలోపట, మన ఒళ్ళు మనం కాపాడుకోవడానికి ఈ మారుపేర్లు వాడుకోవాల్సి వచ్చింది. కొన్ని త్యాగాలు చెయ్యాల్సి వచ్చింది. ఎవ్వరూ రాయనంతగా విప్లవోద్యమం మీద రాసి గూడ, ఎవరికీ తెలియకుంట ఉన్న పరిస్థితి కొన్నేండ్ల వరకు ఉండిపోయింది. ఈ మధ్య “గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు” కథా సంపుటి వచ్చిన తర్వాతనే ఓహో ఈయనే ఇవన్నీ రాసిండని తెలిసి వచ్చింది.

ప్ర…సరే! అప్పటి అలజడి నుండి, కార్మికోద్యమాల నుండి, అనుభవించిన జీవితం నుండి ఇన్ని రచనలు వచ్చినయ్ గదా! ఇప్పుడు గూడ విధ్వంసం కొనసాగుతనే ఉన్నది? ఓపెన్ కాస్ట్ ల రూపంలో మరింత జీవన విధ్వంసం జరుగుతున్నది. దీనిమీద ఏమన్నా రాసిండ్ర మీరు?

జ…. అసలు ఓపెన్ కాస్ట్ ల మీద జరుగుతున్న విధ్వంసం గురించి మొట్ట మొదట రాసింది నేను. ఇయ్యాల్ల ఓపెన్ కాస్ట్ ల గురించి ఎవరు మాట్లాడుతున్నా, అది చంద్ రాసిన విషయాలను తప్ప అదనంగా ఏం మాట్లాడుతలేరు, ఓపెన్ కాస్ట్ ల విషయంలోపట నేను రాసిన పుస్తకాలే, అంటే రూట్ లెవల్లోపట అధ్యయనం జేసిన చెప్పిన విషయాలే…. “భూ నిర్వాసితులు” అనే కథల సంపుటి నా మొట్టమొదటి కథల సంపుటి. అది మొత్తంగ గూడ ఓపెన్ కాస్ట్ ల వల్ల నిర్వాసితులైన ప్రజల యొక్క జీవితాలను చిత్రించింది. అక్కణ్ణుంచి మొదలుకొని “భూదేవి” అనే నవల (ఇంకా ప్రింట్ కాలేదు) ఏందంటే ఓపెన్ కాస్ట్ వల్ల నిర్వాసితురాలైన ఒక గ్రామాన్ని కేంద్రంగా తీస్కొని, ఒక మధ్య వయస్కురాలైన భూదేవిని పాత్రగా పెట్టుకొని, ఆ మొత్తం భూమికి ఈమెను ఒక రిప్రజెంటేటివ్ గ పెట్టుకొని, ఆమె జీవితాన్ని తీసుకొని రాసిన… అంటే సామాన్యుల జీవితాలు ఎట్లుంటయ్… కొడుకు పిల్లలు మంచిగా బతుకాలనుకుంటరు… కానీ అవన్నీ వీళ్ళ ప్రమేయం లేకుంట, ఉన్న భూములు కోల్పోయి, కూలీ నాలీ జేసుకొని బ్రతికే పరిస్థితులు.. యిట్లైతే మాజీవితం అన్యాయమైపోతది గదా అని, దానికి వ్యతిరేకంగ వాళ్ళు జేసే పోరాటాలు, అవి ఎట్లా నిష్ప్రయోజనమైతున్నయ్, ఎట్లా నిర్బంధాలకు గురైతుండ్రు, ఎట్లా నలిగి పోయిండ్రు అనే విషయాన్ని… అంటే సామాన్యులు భూములు కోల్పోవడం వలన, ఓపెన్ కాస్ట్ ల వల్ల బతుకు కోల్పోవడం వలన ప్రజలు పడే బాధల్ని “భూదేవి” నవలగ రాసిన…

అట్లనే “దేవుని గుట్ట” అనే నవల కరీంనగర్ జిల్లలోని గ్రానైట్ క్వారీస్ గురించి రాసిన. ఇవన్నిట్ల ఉద్యమంల పనిచేసిన వాళ్ళ ప్రత్యక్ష అనుభవాల్నే రాసిన. అందుకే ఇవన్నీ ఎక్కడో ఒకచోట విన్నట్టు, చూసినట్టు  అనిపిస్తయ్. ఇవన్నీ శకలాలు శకలాలుగ ఉన్నయ్… నేను వాటన్నిటినిదీసుకచ్చి ఒక కుర్చీగానో, బెంచీగానో తయారు చేసిన, ఒక కర్ర అక్కడ పడి ఉందంటే, అరె! ఇది వంక కర్ర చెయ్యికి బాగ పనిజేస్తదని తీసుకచ్చుకొని వాడుకున్న… నాకు ఇటువంటి రచనలు చేయడమంటేనే ఇంట్రెస్ట్ అనిపిస్తది… నా మనుసుకు  సంతృప్తి అనిపిస్తది…

ప్ర… అభివృద్దిలో భాగంగా గ్రానైట్ క్వారీస్, సింగరేణి కాలరీస్ ఇట్లా సహజ వనరులను వెలికి తీసి అభివృద్ధి చేస్తున్నమని ప్రభుత్వాలు చెప్తున్నయ్! సింగరేణి ఎట్లనో గ్రానైట్ ను గూడ అట్లనే చూడవలసి వస్తే అది ఎంత వరకు సబబు? అభివృద్ధికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?

జ… ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అందరు అభివృద్ధి గావాలె అభివృద్ధి గావాలె అంటున్నరు. బొగ్గు కావాల్నంటే ఓపెన్ కాస్ట్ లు జేస్తే అభివృద్ధి ఐతది.. అవసరాలు తీరుతయ్ అంటున్నరు. కానీ, ఒక విషయం ఫండమెంటల్ గ గుర్తుంచుకోవల్సిందేందంటే రెండు అంశాలున్నయ్. ఇండ్ల ఒకటేమో అభివృద్ధి గురించి… ఎవరికి అభివృద్ధి? కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు కొద్దిమంది అభివృద్ధి ఒక పక్కకు… ఏదైన అభివృద్దే గాబట్టి, తలసరి ఆదాయం విషయంలో వానికొక లక్షరూపాయలస్తే నీకు పది రూపాయలచ్చినగానీ  ఇద్దరికీ యాభైవేలైతయనేది ఒక అభివృద్ధి సూత్రం.. అదొక అంశం… రెండోది ఏందంటే అభివృద్దంటే ఏంటి… అసలీ ప్రాంతంలోపట వేల సంవత్సరాలుగా మనుషులు బతికిన ప్రాంతాన్ని భవిష్యత్తులోపట మనుషులు బతుకకుండా ఒక ఎడారిగా మార్చేది ఎట్లా అభివృద్ది ఐతది?.. ఒక విధ్వంసాన్ని సృష్టించి, తాత్కాలిక లాభాలకు, గోరంత లాభం కోసం కొండంత నష్టం జేసేది అభివృద్ధి ఐతదా?.. నిజంగా… మనిషి బతుకాల్నంటే వనరులు గావాలె, భూమి ఉండాలె, భూమ్మీద ఫార్మేషన్ ఏర్పడుతా ఉంటది, మానవులు గాని, జంతుజాలం జీవించడానిగ్గాని, వృక్షాలు పెరగటానిగ్గాని, కొన్ని వేల సంవత్సరాల పరిణామ క్రమంల ఆవిర్భవించింది భూమి… అటువంటి భూమిని తలకిందులు జేసి, మనుషులు, జంతువులు,వృక్షాలు బతుకకుండజేసేదాన్ని ఎట్లా అభివృద్ధి అంటం?..తల్లకిందుల అభివృద్ధి అభివృద్ధి గాదు…

ప్ర…మీరు సింగరేణి కార్మికుల గురించి, సంఘాల గురించి ఎన్నో కథలు రాసిండ్రు గద, ఒకప్పుడు చాలా బలంగా ఉండి ఉమ్మడిగా పోరాటాలు చేసిన కార్మిక సంఘాలు  ఇప్పుడు ఎట్ల పనిజేస్తున్నయ్?

జ.. ప్రధానంగ ఏందంటే… మనకు ఒక వంద సంవత్సరాల పైచిలుకు కార్మికోద్యమ చరిత్ర ఉంది. ఒకప్పుడు ప్రభుత్వరంగ పరిశ్రమల్నే గాని, ఇతర పరిశ్రమల్నే గాని కార్మిక వర్గం డిమాండ్ జేసే పరిస్థితి ఉండే.. ఇయ్యాల్ల శాసించే పరిస్థితి నుంచి యాచించే పరిస్థితికచ్చింది.. ఎందుకచ్చిందంటే కార్మిక వర్గ సంఘాలు బలంగా పనిజేయ్యలేకపోవటం వల్ల, ఎదురవుతున్న దాడిని తిప్పికొట్టడంలో నాయకత్వం వైఫల్యంజెందటం వల్ల ఇది జరిగింది.. వాస్తవానికి ఇట్లా జరగడానికి ప్రధాన కారణం ఏందంటే గ్లోబలైజేషన్… ఈ గ్లోబలైజేషన్ ఏంజేసిందంటే లాభాలకోసం పరిశ్రమల స్థాపన దోపిడీ ఒకటేగాక మానసికమైన దాడి గూడ మొదలువెట్టింది. కార్మిక సంఘాలను వీక్ జెయ్యడమనేదాన్ని గూడ ఒక ప్రణాళిక ప్రకారం చొప్పించింది. ఒక ఉదాహరణ చెప్తే.. మా తరం లోపట సామాజిక సమస్యలస్తే మేమంతగూడ వాటికి రెస్పాన్డైనం యువకులంతా సమాజం లోని అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడినం.. ఆ తరం వాళ్ళే ఇవ్వాళ భారతదేశం మొత్తం మీద విప్లవోద్యమాలు నడిపించే పరిస్థితచ్చింది. కాబట్టి దీన్నుంచి గుణపాఠం నేర్చుకొని, సామాజికాంశాల నుంచి విద్యార్థులను దూరం చెయ్యాలె కాబట్టి, ఒక ప్లాన్ ప్రకారం ఎజుకేషన్ అంత గూడ సెల్ఫ్ సెంటర్డ్ విధానంజేసిండ్రు.. నువ్వు చదువుకో నువ్వు బాగుపడు.. చదువుకున్నా బాగుపడుతడా అంటే బాగుపడడు.. అది అర్థం అయ్యే వరకు జీవితం వృథా ఐపోతది… అంటే సమాజం నుంచి ఐసోలేట్ జేసేసి విద్యనేంజేసిండ్రంటే…సెల్ఫ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ చేసిండ్రు… ఎవడెట్లనన్న సావనియ్ మనం బాగుపడాలే… ఇది ఎందుకు జెప్పిండ్రంటే, హార్డ్ కోర్ గా ఉన్న విద్యార్థి రంగాన్ని కరప్ట్ జెయ్యడం కోసం, డైవర్ట్ జెయ్యడం కోసం… గ్లోబలైజేషన్, చేతిలో ఉన్న సాధనాలైన విద్యా విధానం లోపట మార్పుజేసుకున్నది.. ఏ వ్యవస్తైతే అధికారంలో ఉందొ ఆ వ్యవస్థకు అనుకూలమైన భావజాలాన్ని సమాజంలోపట చొప్పిస్తున్నరు.. ఉదాహరణకు క్రికెట్… క్రికెట్ లేకుంటే ఖాళీ సమయం దొరుకుతది.. ఎండాకాలం ఏదో నాలుగు బ్యాట్లిస్తరు… వాడు వీణ్ణి, వీడు వాణ్ణి ఓడిస్తడు.. వీడు ఖాలిగ ఉంటే ఎంజేస్తడు….ఇంకో దిక్కు ఆలోచన పోతది.. అంటే ఒక వ్యవస్థ అధికారంలో ఉన్నప్పుడు, రాజు అధికారంలో ఉన్నప్పుడు రాజే గొప్ప వ్యక్తి, రాజే బాగ చేస్తడు అన్న భావజాలమే ప్రచారంల ఉండాలె… అట్లైతేనే వాళ్ళు నిలబడగలుగుతరు…

అట్లాగే గ్లోబలైజేషన్ ఏంజేసిందంటే ప్రపంచ వ్యాప్తంగ వచ్చిన పరిణామాల్లోపట… కమ్యూనిస్టు ఉద్యమాలు కమ్యూనిస్టుల చేతుల్లోపట ఉన్న తర్వాత ఏర్పడ్డ అంతర్గత పోరులోపట పెట్టుబడి ఆధిపత్యం సంపాయించింది.. పెట్టుబడి ఏంజేసిందంటే అది తన అస్తిత్వం  కొనసాగించడం కోసం.. ఒక వ్యాపారం మీదనే కాదు, మనుషుల మీద, వాళ్ళ ఆలోచనలను గూడ నియంత్రించే ఒక పరిస్థితిని తీసుకచ్చింది… ఆ నేపథ్యంలోపట కార్మిక సంఘాలను గూడ నిర్వీర్యం జేసింది. వ్యాపార దృక్పథంలో ఉండు, నువ్వు సంపాయించుకో అన్నది. సింగరేణి ల సికాస ఏంజేసింది… నువ్వు ఒప్పుకున్న అంశాలు అమలుజేయి అన్నది. పర్మనెంట్ జేస్తా అంటే నూటాటొంబై మస్టర్ల తర్వాత పర్మనెంట్ జెయ్యమన్నది.. నాలుగేండ్లకొకసారి  వేజ్ బోర్డు పరిష్కరిస్త అంటే… నాలుగేండ్లు పోయి రెండేండ్లు గడిచింది నువ్వు ఎందుకు చెయ్యలేదు అన్నది… అట్ల అంటే రాజీలేని పోరాట శక్తులను నిర్దాక్షిణ్యంగ చంపేసింది… రాజీపడ్డ వాళ్ళను మాత్రమే అస్తిత్వంల కొనసాగించింది… ఆవిధంగ నాయకత్వ లేమితోని అవి నిర్వీర్యమైపోయినయ్.. మరి ఏం జేస్తరు ప్రజలు.. ఎన్నిరోజులు ఇట్ల సర్దుకొని బతుకుతరు… సర్దుకొని బతుకలేరుగాబట్టే ఇవాళ దేశవ్యాప్తంగా విప్లవోద్యమానికి నేపథ్యమున్నది.  గ్లోబలైజేషన్ సృష్టించిన ఈ విధ్వంసకర జీవన విధానమే రేపు ఉద్యమాలకు వనరుగ పనిజేస్తది. తాత్కాలికంగ నువ్వు అణిచిపెట్టవచ్చు, నాయకత్వం లేకుంట జేయ్యవచ్చు . ఇయ్యాల్ల ఎందుకు విప్లవోద్యమ నాయకుల మీద టార్గెట్ జేస్తుండ్రు. ఎందుకంటే ఇయ్యాల్ల యాబై రెండు శాతం బీసీలున్నరు. వాళ్లకు సమాజంల ఒక న్యాయం రాలేదు. కని పన్నెండు శాతం ఉన్న ఎస్సీ,ఎస్టీ లకు ఎంతో కొంత న్యాయం జరగడానికి వాళ్ళ తరపున అంబేద్కర్ అనే ఒక నాయకుడున్నడు. అంబేద్కర్ ఏమన్నడు. రాజ్యాధికారం లోపట మా పాత్ర లేకుంట మాకు న్యాయం జరగదు, ప్రభుత్వం లోపట మా వాటా మాకుంటే న్యాయం జరుగుతదని చెప్పిండు. బీసీ కులాలకు నాయకత్వం లేక ఉత్పత్తి కులాలు బతకలేని పరిస్థితి వచ్చింది. అట్లాగే నాయకత్వాన్ని నిర్వీర్యం జేస్తే మొత్తం వ్యవస్థంత కుప్పకూలిపోతుంది. ఇవాళ కేసీఆర్ లాంటి ఒక బలమైన నాయకుడుండడం వల్లగదా కల సాకారమైంది…

ప్ర… కేసీఆర్ ప్రస్తావన వచ్చింది గదా! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి, భవిష్యత్తు గురించి మీ అభిప్రాయం ఏంది?

జ… తెలంగాణ కోసం వేలాదిమంది, కోట్లాది మంది సామాన్యులు గూడ ఉద్యమంల పార్టిసిపేట్ జేసిండ్రు. కేసీఆర్ తో పాటు సామాన్యులు గూడ ఇదే ఆకాంక్షను కలిగి ఉన్నరు. తెలంగాణ వస్తే మన బతుకు బాగుపడుతుందనుకున్నరు. వాళ్ళ కనీస జీవితం… కొంత తిండి, కొన్ని మందులో, ఉండుటానికి ఇల్లో, కనీస వసతులు, అవసరాలు తీరేలాగ ఉండాలనుకున్నరు. ఐతే దాన్ని ఎట్లా ఫుల్ ఫిల్ జేస్తరనే విషయం ఒకటి ముందున్నది. ఎందుకున్నదంటే… ఆంధ్రా వాళ్ళచ్చేసి మన వనరులనుగాని, మన భూములను గాని, నీళ్ళను గాని దోసుకున్నరు. ఈ దోసుకునుడనేది ఒకటి ఉండటం వల్లనే ఈ ఆందోళన మొదలైంది. రేపు ఈ సమాజంలో దోపిడీ స్వరూపం మారి ఇంకో రూపంల కొనసాగుతే ప్రజలకు న్యాయం జరుగది. దోపిడీ స్వభావం లేని సమాజం గావాలె తప్పితే బాగుపడే అవకాశం లేదు. అటువంటి పనేమన్న కేసీఆర్ జేసేదుంటే ప్రజల ఆకాంక్షలు తీరుతయ్. ప్రజలకు ఉపయోగపడే విషయం లోపట ఒక నిర్దిష్టమైన విధానం ఉండాలె. దాన్నే పాలసీ అంటరు. ఏం పాలసీ అనుసరిస్తున్నరు అన్నదాన్ని బట్టి ఉంటది. బూమికి నీళ్ళిత్త అంటున్నడు. కాని బూమిలేని వాళ్లకు నీళ్ళెం పనిజేస్తయ్. ముందు సమస్య బూమి ఉండాలె, బూమికి నీళ్ళు గావాలె. బూమంత ఎవని చేతుల్నో ఉంటే ఈ నీళ్ళిచ్చి ఎవన్ని పెంచి పోషిస్తవు.

తర్వాత ఉద్యమంలోపట ఇయ్యాళ్ళ పదేండ్ల కాన్నుంచి దెబ్బలుదిని అన్నిట్ల పార్టిసిపేట్ జేసినోల్లంత వెనుకకుబోయి, నాలుగు పైసలున్నోళ్ళు, పైసలు కర్చు పెట్టేవాళ్ళు, ఎన్నికల రాజకీయాల్ల్లో ముందుకచ్చిన వాళ్ళు, ఉద్యమానికి ద్రోహం జేసిన వాళ్ళు గూడ ఇవాళ్ళ ప్రజా ప్రతినిధులుగ న్యాయం జేస్తరా, రాత్రికి రాత్రి ఉద్యమకారులైనోళ్ళు ఏ మేరకు న్యాయంజేస్తరన్న దాన్ని బట్టి కేసీఆర్ గారు సక్సెసైతరు…

ప్ర… మీ దృష్టిలో బంగారు తెలంగాణ ఎట్లుండాలె?

జ…  ప్రజలకు ఉపయోగపడే విధంగ ఉండాలె. ప్రజల్ని మెరుగు పరిచే విధంగ ఉండాలె. బ్రాడ్ సెన్స్ ల జెప్పాల్నంటే…. పాలసీల పరంగా వీళ్ళేం భిన్నంగ పోయే పరిస్థితి అగుపిస్తలేదు. కాకుంటే ఏందంటే గతంలో కంటె మరింత మెరుగైన సంస్కరణలు చేపట్టాలె. ఇప్పుడీ వనరుల దోపిడీ, సింగరేణి సంపద మన దగ్గర నుండి అక్కడికి పోకుంట ఇక్కడ మన వనరులు మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తే కొంత అభివృద్ధి జరుగుతది. కాని మౌలికమైన మార్పు సమాజంలో వస్తదని నేననుకోను. కేసీఆర్ ఏమన్నజేసేదుంటే సంతోషం. ఎంతవరకైతే ప్రజలకు న్యాయం జరగదో అంతవరదాక వాళ్ళు ఈ రూపంలో కాకపొతే ఇంకో రూపంలో కొట్లాడుతనే ఉంటరు. ఎందుకంటే వాళ్ళు బతుకాలె. వాళ్ళు బతుకాల్నంటే తప్పనిసరిగ ఐతేనేమో ఆకలికి సావడం, లేకుంటే బతుకడం కోసం పోరాటం జెయ్యడమో మిగిలిపోతుంది. అసమానతలు ఉన్నంత సేపు ఉద్యమాలు పుడుతనే ఉంటయ్. ఉద్యమకారులు పుడుతనే ఉంటరు.

ప్ర… తెలంగాణ సాహిత్యం, చరిత్ర, సంస్కృతి పునర్నిర్మాణం జరుగాలంటున్నరు గదా! ఇది ఎట్లుండాలే?

జ.. సాహిత్యకారులు గాని, సామాజిక వేత్తలుగాని, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవారు గాని, ముందుగా చేయాల్సిందేందంటే, అసలు రోగమేందో తెలుసుకొవాలె, ప్రజల సమస్యలేందో తెలుసుకొవాలె, లోతుగా అధ్యయనం చేయాలె, చేసి, అవి వెలుగులోకి తీసుకస్తే అది ఒక ఎజెండాగా మారుతె దాన్ని పరిష్కరించే మార్గం దొరుకుతది. దాన్ల గూడ రెండు రకాలు! ఒకటి మౌలికంగ మొత్తంగ మార్చడమనేది ఈ వ్యవస్థల సాధ్యం గాదు. వితిన్ ద ఫోల్డ్ లోపటనే చేయగల అంశాలు చాల ఉన్నాయ్. ఉదాహరణకు ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా లోపట మలేరియా వచ్చి వేలాది మంది చచ్చిపోతండ్రు. మలేరియా క్యూరేబుల్, చాలా ప్రైమరీగ చెయ్యచ్చు. అటువంటి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీస్కపోతే ఇంకొన్ని పి.హెచ్.సి లు పెంచడం వల్లనో ఆ చావులను ఆపగలుగుతం… వేలకోట్ల రూపాయలు పెట్టి రోడ్లేస్తండ్రు కని, రైతు పంట పండిచ్చుకొని వస్తే మార్కెట్ల పెట్టుకుందామంటే షెడ్లు లెవ్వు. అట్లాంటి వాళ్లకు మేలు చెయ్యాలె. ప్రజలకోసం ఆలోచించే వాళ్ళు ప్రజలు బతికే మార్గం ఆలోచించాలే. ప్రజల కష్టాలే కొలబద్ద కావాలె..

ప్ర… మీరు ఒక సామాజిక మార్పును ఆశించి చేసిన రచనలు మీరు అనుకున్న పాఠకులకు చేరినయా? మీ పాఠకులు ఎవరు?

జ… సమాజం గురించి ఆలోచించే వారు, సమాజంలో మార్పుకోసం తాపత్రయపడే వాళ్ళే నా రచనలు ఎక్కువగా చదువుతరు. సమాజాన్ని అర్థం చేసుకోవడం, అందులో ఉండే లోటుపాట్లు, కష్టాలు, నష్టాలు తెలుసుకోవాలనుకునే వాళ్లు, నా రచనలు వెతుక్కొని చదువుకుంటండ్రు. ఫలానా పుస్తకం వచ్చిందట చంద్ గారిది, ఏడ దొరుకుతదని తెప్పిచ్చుకొని చదివిండ్రు. నేను ఎంత మంచిగ రాసినప్పటికి గూడ, ఒక వ్యాపార పత్రికో, ఒక సినిమా స్టైల్ సాహిత్యాన్ని చదివే వాళ్ళను ఆకర్షించలేను. నా పాఠకులు నాకున్నరు.

ప్ర… ఏ అవార్డులను ఆశించి మీరు రాయకపోయినప్పటికీ… మీకు సరియైన గుర్తింపు రాలేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

జ… ఆర్నెల్లు కష్టపడి పంట పండిచ్చిన వాడు పంట రాకుంటే ఏం జేస్తడు… జీవితమంత బొగ్గు బాయిల పనిజేసి ముసలితనానికి వచ్చినంక అడుక్కుంటున్నోని సంగతేంది? ముప్పై ఏండ్లు బొగ్గుబాయిల కాలం తోటి పోటీ పడి అననుకూలమైన  పరిస్థితిలో సచ్చి పుట్టినోని సంగతేగట్లుంటే నాకు గుర్తింపు గావాల్నని నేననుకోను.. నాకు గుర్తింపునియ్యడానికి వాళ్ళ ప్రమాణాలు వేరు. అట్ల ఆశించడం అర్థం లేని విషయం. ఏ సాహిత్యమైనా మంచిగుంటే నిలబడుతది. లేకుంటే కొట్టుకపోతది. ప్రజల హృదయాల్లో ఉండుడే అసలైన గుర్తింపు…

*

మరాద్దప్పేరు

pagideela-padava

 

‘ గిద్దన్నర బియ్యం పొయ్యిమీదడేసి, బద్దన్నర పప్పుతో  రాచ్చిప్పడు పప్పులుసెట్టుకొని, రెండుపూటలా సుష్టుగా భోంచేస్తూ బోషాణం పెట్టి పక్కనే మంచవేసుకొని, కంటికి రెప్పెయ్యకుండా కాపలా కాచుకుంటూ మా సుబ్బారాయ్డుమామ్మియ్య ఎన్నేళ్ళనుంచో దాచుకుందంతా రాత్రికిరాత్రే చడీచప్పుడు కాకుండా దోచుకుపోయారు దొంగ సన్నాసులు. ఆళ్ళకిదేవన్నా మరేదా? మీరే చెప్పండి’

కోలంక శివారు పెదలంక.చాలా సంవత్సరాల క్రిందటి సంగతి.

ఆరోజు, పెరట్లో ముంజకాయల బండి దొళ్ళించుకుంటున్నాడు. చిరంజీవివర్మ అనే  వత్సవాయి చిట్టి వెంకటపతిరాజు.

సుబ్బన్నయ్య  చురకత్తి మీసం తిప్పుకుంటూ అరుగు దిగడం చిరంజీవి కంట్లో పడింది.

ఎక్కడి బండి అక్కడే పడేసి, వీధిలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన అతను ” నేనూ వత్తా ” అంటూ గారాలు పోయాడు.

” నువ్ బళ్ళోకెళ్ళేద్రా ” అన్నాడు సుబ్బన్నయ్య. కంపెనీ చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుంటూ.

” నీకూడా వద్దావని మానేసాన్లే ” అని సుబ్బన్నయ్య చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు చిరంజీవి. వదిలేస్తే  ఎక్కడ వెళ్ళిపోతాడోనన్న భయంతో.

సుబ్బన్నయ్య జేబుల్లో అన్నీ ఉన్నాయో లేదోనని తడుముకుంటుంటే…

” ఏయ్ పూన్నా! నా జోళ్ళిలా ఇసిరీవే,  అలాగెళ్ళొత్తా ” హాల్లోకి చూస్తూ అరిచాడు చిరంజీవి.

పూర్ణ చిరంజీవికి పిన్నమ్మ, సుబ్బన్నయ్యకి   చెల్లెలు. నిజానికి సుబ్బన్నయ్య  చిరంజీవికి మేనమామ.  వాళ్ళ అమ్మ, పిన్ని, మిగతా మావయ్యలు ఆయన్ని అన్నయ్యన్నయ్యని పిలుస్తుండంతో చిరంజీవికీ  ఆ పిలుపే అలవాటయిపోయింది.

” ఏమే, ఒసేయ్, ఏంట్రా? ఆ పిలుపు. పెద్దంత్రం, చిన్నంత్రం లేదా? ”  అంటూ మధ్యగదిలోంచి జోళ్ళిసిరేసిన పూర్ణ, వాటికన్నా జోరుగా వీధి గుమ్మంలోకి వచ్చేసింది.

చిరంజీవి రెక్క పట్టుకుని రెండు తగిలించాలన్నంత కోపంతో .

” ఆడిట్టం. మీకు నచ్చితే పలకండి, లేపోతే అంతా కట్ట కట్టుకొని గోదాట్లో దూకండి. ఏరా బాజ్జీ అంతేనా ” అన్నాడు సుబ్బన్నయ్య.

” నువ్వలా వెనకేసుకొస్తే, వీడెందుకూ పనికి రాకుండా పోతాడు కొన్నాళ్ళకి ” వెనక నుంచి వినిపిస్తున్న పూర్ణ  మాటలు వినపడనట్టే, ఆ మామా అల్లుళ్ళిద్దరూ  అల్లుడు మావా గిత్తల్లా ముందుకు కదిలారు.

తెల్లటి షరాయి, లాల్చీ వేసుకున్నాడు సుబ్బన్నయ్య. సుబ్బన్నయ్య వ్రేలు పట్టుకొని, కొబ్బరి తోటలోంచి చలాగ్గా నడుస్తున్నాడు చిరంజీవి.

తోట దాటి,  పంటబోది మీద అడ్డుగా ఉన్న  కర్రల వంతెనపై జాగ్రత్తగా నడచి మాణిక్యాలమ్మ గుడి దగ్గరకి వచ్చారు ఇద్దరూ.

కాల్వకి ఈ పక్కన మాణిక్యాలమ్మ గుడి, గుడిపక్క నుంచే ఇంజరం కాల్వగట్టు, గట్టు పక్కనే ప్రవహిస్తున్న ఇంజరం కాల్వ. కాల్వకి ఆ పక్కన ఏటిగట్టు, ఏటి గట్టుకా  కింద, దూరంగా గోదారి. ఇంజరం కాల్వని అటూ ఇటూ దాటడానికి బల్లకట్టు. ఏటి గట్టుమీద రావిచెట్టు, దానికెదురుగా ఈ ప్రక్కన కాలవ గట్టు మీద మర్రిచెట్టు.

మర్రిచెట్టుకి తలకిందులుగా  వ్రేళ్ళాడుతూ ఋషిపిట్టలు తపస్సు చేసుకుంటున్నాయి.

రావిచెట్టు పచ్చనాకుల్లో ఆకుల్లా కలిసి పోయిన రామచిలకలు కళ్ళకి కనిపించట్లేదు. కానీ కీకీమని అరుస్తూ ఋషిపిట్టలకి తపోభంగం కలిగించే పనిలో తలమునకలయ్యాయి. ఎర్రటి మర్రి పళ్ళని ముక్కున కరుచుకొన్న నాలుగైదు కాకులు, కావ్ కావ్ మంటూ రామచిలకల కేరింతలకి ఆటంకం కలిగిస్తున్నాయి. కాకి ముక్కున  గమ్మత్తుగా కనిపిస్తున్న మర్రిపళ్ళు రామచిలకలకి వళ్ళు మండిస్తున్నాయి.

మర్రిచెట్టు క్రింద ఉన్న భద్రం కాపు వొటేల్ ముందు, తాటిపట్టి బల్లల మీద కూర్చున్న పనీ పాటా లేని ముసలి వాళ్ళిద్దరు కాలవగట్టంటా వచ్చే పోయే వాళ్ళని ఆపి  యోగక్షేమాలు విచారిస్తున్నారు.

సుబ్బన్నయ్య  చెప్పులు విప్పేసి,  కళ్ళు మూసుకొని మాణిక్కాలమ్మకి మనసు నిండా దణ్ణం పెట్టుకున్నాడు. పళ్ళెంలో ఉన్న కుంకుమ బొట్టు వ్రేళ్ళతో తీసి మొహంపై పెట్టుకొని, అది చూస్తున్న చిరంజీవి కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టి   చిన్న బొట్టు పెట్టాడు.

కుంకుమ కళ్ళల్లో పడితే మండుతుంది కదా! తర్వాత చిరంజీవి కాళ్ళకి ఉన్న  చెప్పులు విప్పించేసి, రెండు చేతుల్తో అతన్ని కొంచెం పైకెత్తి తలుపుకు ఉన్న డిబ్బీలో  పావలాకాసు దక్షిణ వేయించాడు.

దక్షిణలూ దణ్ణాలూ అయ్యాకా మళ్ళీ ఇద్దరూ నడవడం మొదలెట్టారు.

నడిచి  వెళ్ళడమంటే చిరంజీవికి మహా సరదా.

కానీ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే,   సత్తిగాడి భుజాల మీద మేకపిల్ల ఎక్కించి పంపిస్తారు ఇంట్లో.

పక్క పక్కనే  వాళ్ళలా కాల్వ గట్టంటా నడుచుకుంటూ పోతుంటే సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు మర్యాదకి సగం సైకిల్ దిగి వీళ్ళని దాటేసేకా మళ్ళీ   తొక్కుకుంటూ పోతున్నారు.

నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు నవ్వుతూ ” సుబ్రారు బాన్నారా? ” అని పలకరిస్తూ నమస్కారాలు పెడుతున్నారు.

కొంతమందైతే తలపాగాలు తీసేసి, చేతులు కట్టుకొని  విప్పేస్తున్నారు.

ఏటిగట్టుకింద, ఇటు వైపు కూర్చొన్న కొంతమంది కుర్రాళ్ళు కాల్వలో గేలాలేసి చేపలు పడుతున్నారు.

కాలవగట్టు మలుపు దగ్గర ఉన్న రేవులో,  కొంతమంది ఆడవాళ్లు బట్టలు ఉతుక్కుంటున్నారు. మావా అల్లుళ్ళు రావడం చూసి,  వాళ్ళు దోపుకున్న కచ్చాకట్టులు విప్పేసి, పైట కొంగు నెత్తిన కప్పుకొని మేం ఏమీ చూడలేదు అన్నట్టు అటు తిరిగి నిలబడుతున్నారు.

” సుబ్బన్నయ్యా! నాకొహటో తరవాతి పుష్కం మొత్తవొచ్చేసింది. రెండెక్లాస్ పుష్కం కొనెయ్ ” అన్నాడు చిరంజీవి.

” వచ్చినా రాపోయినా, ఏడాది మొత్తం  అదే చదూ కోలెదవా ”

” నీకు తెల్దులే. కావాలంటే అప్ప జెప్పేత్తాను చూడు. అ  అమ్మ, ఆ ఆవు , ఇ ఇల్లు, ఈ ఈగ ” అని పుస్తకం చదవడం మొదలు పెట్టాడు చిరంజీవి.

ఇంతలో వెనకాల నుంచి…

” ఏండోయ్ సుబ్నబారు, సుబ్నబారండోయ్. ఇంత చేటరుత్తున్నా చూడ్రేటండి బాబూ ” అంటూ సైకిల్ పట్టుకొని, పరిగెత్తుకు వస్తూ  గావు కేకలు పెడుతున్నాడు వెంకన్నగాడు.

” సైకిల్ తోసుకొచ్చేకన్నా తొక్కుంటా రావొచ్చుకద్రా, ఎదవ మర్యాదా నువ్వూను. గుండాగి చత్తావ్ ” అన్నాడు వెనక్కి చూసిన సుబ్బన్నయ్య.

“మరేదా కాదు, మసేనం కాదండి బాబూ చైనూడి పోంది. ఇంటికెల్తే, పూన్నమ్మ గోరిప్పుడే ఎల్లేరని చెప్పేరండి. అందుకే గేలాపు నొత్తంట. మీకెదర చూపే గానీ ఎనక చూపుంటేనా? ”

” ఏడ్చావులే ఇగో ఈడ్ని నీ సైకిలెక్కించుకో ”

వెంకన్న సైకిల్ నిలబెట్టగానే సుబ్బన్నయ్య చిరంజీవిని సైకిల్ సీట్ మీద కూర్చోబెట్టాడు.

వాడు నెమ్మదిగా సైకిల్ దొర్లిస్తున్నాడు.

” యా, ఏంటీ పని? ” అడిగాడు సుబ్బన్నయ్య.

” ఏం లేదండె మైనర్ బారు, పేకాటకి యాండ్ కాలీగుంది సుబ్రారున్నారేమో సూసిరారా అన్నారండే ”

” ఓహ్ అదా! అక్కడికే  బైదెల్లేనురా, ఇంతట్లోకీ నువ్వొచ్చేసావా? సన్నాసని ”

” ఐతే ఫుల్ బోడ్డడిపోనట్టే. మీరూ, బద్రంగోరు, టాట్రుగోరు, కాశీరారూ, చుట్టంరాజుగోరు, తాతరారు,మారాజు గోరు ఏడుగురూ సరిపోఏరండే ఇంచక్కానూ ” లెక్క పెట్టుకున్నాడు వెంకన్న.

” ఆహా, ఏర్పాట్లేటైతే? ”

” మల్లిసాల నుంచి మైనర్ బారి మాంగోరు, కొండగొర్రి మాసం అంపేరండే. అంతో ఇంతో అడింపంది కూడా ఉంద్లేండి. మజ్జేనం బోజనోల్లోకి చిన్నయ్యగోరు కొండగొర్రి పులావూ, పెద్దయ్యగోరు అడుంపంది కూర్మా కూరా  చేత్తన్నారు. యానాం నుంచి సీమ సరుకట్రమ్మని పెద్ద పాలేర్నంపేరండీ ”

” మీరాజు యవ్వారం మా జోరుమీదుందైతే  ”

” మరేండి ” అన్న వెంకన్న, చిరంజీవి వంక అనుమానంగా చూసి ” సిరంజిగోరు మీకు దన్నం వెడతానండీ బాబూ. దైచేసి మీ పుష్కం పాటం మొదలెట్టకండే.అసలే ఆయాసంతో చత్నానూ ” అన్నాడు.

‘పుష్కం’ మాట వినపడేసరికి నడుస్తున్న వాడల్లా ఆగి మరీ  చూసేడు సుబ్బన్నయ్య వాళ్ళిద్దరినీ.

” సిరంజీగోరి చదుం, ఊరు మొత్తం తెల్సి పోందండి. మీ నోగిట్లో అడుగు ఎట్నాకే బైపడి పోత్నారంతా ”  చెప్పాడు వెంకన్న .

వెంకన్న రాకతో పుష్కం గొడవ మర్చి పోయిన చిరంజీవికి,  వాడి వాగుడుతో మళ్ళీ అది గుర్తుకు వచ్చింది.

వాడు సైకిల్ దొర్లిస్తుంటే  ” ఇగో రెంకన్న, ఇలా ఇన్రా నువ్వూ ” అని  ‘ తెలుగువాచకం ఒకటవ తరగతితో మొదలు పెట్టి, అంటరానితనం అమానుషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరకూ’ వల్లించడం మొదలు పెట్టాడు చిరంజీవి.

వెంకన్న ఆ పాఠాలు వినలేక  వెర్రిమొహంతో  ఈసురోమని నడుస్తుంటే, సుబ్బన్నయ్య ముసిముసిగా నవ్వుతూ చురుగ్గా ముందుకు అడుగులు వేస్తున్నాడు.

వాళ్ళు కాపుల వీధుల్లోంచి,  రాజుల లోగిళ్ళు దాటి, మైనర్ గారి మండువా ఇంటి ప్రహరీగేటులో అడుగు పెట్టేసరికి, చిరంజీవి పుస్తకంలో పాఠాలన్నీ వెంకన్నగాడికి అప్ప జెప్పి పారేసాడు.

” అత్తమానూ ఒకే పుష్కం చదీతే  చిరాకేత్తంది. అందుకే నాకు రెండెక్లాస్ పుష్కం కావాలంట ” చెప్పాడు చిరంజీవి సుబ్బన్నయ్య లాల్చీ పట్టుకొని లాగి.

” అరే ఎంకన్నా ”

” చిత్తం ”

” నువ్ యానాం పేపర్ తేడానికి వెళ్లినప్పుడు ఈడికి రెండెక్లాస్ పుస్తకాలు రెండు తెచ్చి పడెయ్యరా. ఒకటి చిరీ పోయినా ఇంకోటుంటది ” పురమాయించాడు సుబ్బన్నయ్య.

” ఇయ్యాలకి ఇంకవ్వదండే. పేక్కట్టలకి ఎల్లినప్పుడే  ‘వాందరపొబ’, ‘వాందరపొతిరిక’ వట్టుకొచ్చేసేనండీ. ఒకేల ఎల్దారన్నా వంటల గొడవోటుంది కదండి మరి ” చెప్పాడు వెంకన్న.

” నాకేం, నాక్కుదర్దు. నాకియ్యాలే కావాలి. లేపోతే నే సైకిల్దిగను ” అంటూ హెచ్చరించాడు చిరంజీవి.

” ఐతే ఎవరి దగ్గరన్నా, పాత పుస్తకం ఉందేమో పట్టు కొచ్చియ్యరా  అందాకా ”

” ఆయ్, అలా అన్నారు పట్టుగుంది ” అన్నాడు వెంకన్న సైకిల్ స్టేండేస్తూ.

సుబ్బన్నయ్య వాళ్ళిద్దరినీ వాళ్ళ మానాన వదిలేసి, మైనర్ గారి మండువా వేపు అడుగులు వేసాడు.

ఎత్తుగా ఎడం వేపున్న  అరుగుమీద జిమ్మకానాలు పరిచారు. వాటిమీద గుండ్రంగా కూర్చొని పేకాడుతున్నారు రాజులంతా. ఊళ్ళో రాజులతో పాటూ చుట్టపు చూపుగా వచ్చిన రాజులు కూడా ఉన్నారు అక్కడ.

సుబ్బన్నయ్యని చూడగానే…

“రావోయ్ సుబ్రాజూ”

“రండి బావా”

“చాన్నాళ్ళ కండోయ్”

అని ఆహ్వాస్తూ వంతుల వారీగా మర్యాద ప్రదర్శించారు.

” దిగండే. తాలింపుకి కరేపాకు కొయ్యాల. అసలే ఆలీస వైపోయింది ”  అన్నాడు వెంకన్న. చిరంజీవిని సైకిల్ దింపడానికి చేతులందిస్తూ.

” నేను మాటంటే మాటే, మరేద్దప్పను.  ముందు నాకు పుష్కం పట్రా, అప్పుడు దిగుతా ” అన్నాడు చిరంజీవి కరాఖండీగా.

ఎంతసేపు బ్రతిమాలినా చిరంజీవిని సైకిల్ దింపడం వాడి తరం కాదు కదా! వాడి తాతతరం కూడా కాకపోయింది.

” దీనెమ్మ పుష్కం, దొబ్తున్నాడు చిన్రాజు ” అని  చిరంజీవిని అలాగే సైకిల్ మీద వదిలేసి, తలపాగా దులుపుకుంటూ మైనర్ గారి మండువా పక్కన ఉన్న సుబ్బారాయ్డు మామ్మియ్య గారింట్లోకి వెళ్లిపోయాడు వెంకన్న.

చిరంజీవికి వాడు కాస్త మర్యాద వదిలేసినట్టు అనిపించింది. చూద్దాంలే? ఎక్కడకి పోతాడు? మనసులోనే అనుకున్నాడు.

అరుగు మీద కూర్చున్న రాజులంతా మధ్య మధ్యలో సైకిల్ మీద కూర్చున్న చిరంజీవినీ, బ్రతిమాలుతున్న వెంకన్ననీ మార్చి మార్చి చూస్తుంటే, సుబ్బన్నయ్య నవ్వుతూ వాళ్ళకి ఏదో చెబుతున్నాడు. వాళ్ళేం చెప్పుకుంటున్నారో చిరంజీవికి వినపడ్డంలేదు.

సుబ్బారాయ్డు మామ్మియ్యగారి ఇంటి వైపు వెళ్ళిన వెంకన్న, తిన్నగా నూతి దగ్గరకి పోయి చేదతో చేదడు మంచినీళ్ళు తోడుకుని గటగట త్రాగేసాడు.  తువ్వాలు టపాటపా దులిపి మళ్ళీ తలకి బిగించుకొని గుమ్మం వేపు వచ్చాడు.

సైకిల్ సీటు మీద ఎత్తుగా కూర్చోవడంతో, చిరంజీవికి పిట్టగోడ మీదనుంచి లోపల వాడేం చేస్తున్నాడో, అంతా వివరంగా కనిపిస్తోంది.

ఎకరంస్థలంలో కట్టిన  విశాలమైన లోగిలి సుబ్బారాయ్డు మామ్మియ్యది.కానీ లోగిలంత విశాలమైన మనస్సు కాదు సుబ్బారాయ్డు మామ్మియ్యది. పీనాసి, గయ్యాళి లాంటి మారుపేర్లు చాలానే ఉన్నాయి మామ్మియ్యకి.

అరుగుమీద సుబ్బారాయ్డుమామ్మియ్య పెంపుడు అల్లుడు సీతమావయ్య, పారిన్ అంబర్ సైకిల్ కి సుతారంగా సన్నటి గుడ్డతో కొబ్బరి నూనె పెట్టుకుంటున్నారు.

ఆ సైకిల్ ఎప్పుడో సుబ్బారాయ్డుమామ్మియ్య పెనిమిటి, గొప్పిరేవు హైస్కూల్ కి వెళ్ళినప్పుడు  కొనుక్కున్నది. నిన్నో మొన్నో కొన్నట్టు ఇంకా కొత్త దానిలాగా తళ తళ మెరుస్తోంది.

సీతమావయ్య దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్న వెంకన్న ” ఏండె సీతగోరూ ఆ సుబ్రారి మేనల్డు గోరికి, ఏదన్నా పాత పుష్కం  ఉంటే ఇయ్యండే గోలెట్టేత్తనారు ” అని అడిగాడు.

సీతమావయ్య వాడిని ఎగాదిగా చూసి, చిరంజీవి వైపు గోడమీద నుంచే ఓసారి అలా తొంగి చూసారు.

” పిల్ల పుస్తకాలు మన దగ్గరేముంటాయండీ? అన్నీ పెద్ద పుస్తకాలే. అవేనా ఇంగ్లీష్ బుక్సే ఉంటాయండి ”

” ఆళ్ళ మాయగోరే మిమ్మల్నడిగి రమ్మన్నారండే, లేదండం  రాజుల కేవన్నా  మరేదేటండీ. ఏదోటి ఆ వింగ్లీసు పుష్కమే అడెయ్యండి మరి. ఆకలి దంచేత్తంది.” రాజులకే మర్యాద నేర్పేలా బ్రతిమాలాడు.

వాడు చేసే ప్రయత్నం  అంతా చిరంజీవికి కళ్ళకి కట్టినట్టు వినపడుతోంది.

సీతమావయ్య  ఏమనుకున్నారో ఏమో? అరుగు మీద వున్న గదిలోకి వెళ్ళి,  సుబ్బారాయ్డుమామ్మియ్య కానీ చూడ్డం లేదు కదా! అన్న అనుమానంతో రెండు మూడు సార్లు లోపలకి తొంగిచూసి, ఆయన ఎప్పుడో రాసేసిన రామకోటిపుస్తకం ఒకటి తెచ్చి వెంకన్న చేతిలో పెట్టారు.

పుస్తకం చేతిలో పడగానే వెంకన్న  మొహం మతాబాలా వెలిగిపోయింది.

పరుగులాంటి నడకతో చిరంజీవి దగ్గరకి వచ్చేసి ” ఇగోండే సిరంజీగోరూ అన్నెక్లాసుల్కీ ఇదే పుష్కం అంట, సీతగోరు చెప్పేరు. చింపేయకుండా సదుం కోలి మరి ” అంటూ ఆ పుస్తకం చేతుల్లో పెట్టాడు.

దాన్ని చూడగానే చిరంజీవికి ఎగిరి గంతెయ్యాలనిపించింది.

“ఇక దిగండే. కడుపులో ఎలకలు పరిగెడత్నాయి. చద్దొన్నం కూడా తిన్లేదు పొద్దున్నుంచీ ” అని వెంకన్న  చేతులు అందివ్వగానే  సైకిల్  మీదనుంచి వాడి చంకలోకి  చెంగున దూకేసాడు చిరంజీవి.

‘ ఎంకన్నగాడు మర్యాదస్తుడే! ఆకలీ, దాకం పాపం ఆడి చేతలా చెయ్యించాయి.అనవసరంగా తప్పుగా అర్ధం చేసుకున్నాను వాన్నీ  అనుకున్న చిరంజీవి సుబ్బన్నయ్యా వాళ్ళూ కూర్చున్న వైపు పుస్తకం పట్టుకొని పరిగెత్తాడు.

అప్పటికే రాజులపేకాట జోడుగుర్రాల్లా పరిగెడుతోంది.

రాజులు పేకాట ఆడుతున్న ఎడమ చేతి వైపు అరుగు మీదకి కాకుండా, ఖాళీగా ఉన్న కుడి చేతి వైపు అరుగు మీదకి వెళ్ళి ఆత్రంగా పుస్తకం తిరగేసాడు చిరంజీవి.

‘శ్రీరామ శ్రీరామ’ అని తప్ప అందులో ఎక్కడా బొమ్మన్నదే కనపడ్డంలేదు.

దీంతో బిక్క చచ్చిపోయిన అతను  బుర్ర గోక్కుంటుంటే, అరుగుకి ఆ చివరన  సగం చిరిగిన  పేపర్ ఒకటి కనిపించడంతో అటు జరిగాడు.

“ఏంట్రా అల్లుడూ ఏం పుస్తకం తెచ్చుకున్నావ్? ఏదిలా పట్రా ఓ సారి చూసిస్తా ” అంటూ పిలిచారు మైనర్ మావయ్య.

” ఉండండి, అట్టేసి తెత్తాను ” అని పేపర్ని అడ్డంగా చింపి, ఓముక్కతో రామకోటికి అట్టవేసి, పుస్తకానికి గట్టిగా బందోబస్త్ చేసిన చిరంజీవి, దానిమీద కూర్చొని అటూ ఇటూ రెండుసార్లు తిప్పి సాపు చేసాడు. తర్వాత మైనర్ గారి దగ్గరకి పట్టుకెళ్ళి,” ఇగోండి మోవయా ” అని  ఇచ్చాడు.

దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి చూసిన ఆయన ” హహ్హహ్హ ” అంటూ పెద్ద నవ్వు నవ్వడం మొదలు పెట్టారు.

పేకాట రాజులంతా ఆయన వంక చాలా ఆశ్చర్యంగా చూసారు.

” ఏంటి బావా? ” అని బెల్ట్ భద్రం, ” ఏంటన్నయ్యా? ” అంటూ తాతనాన్న ఆత్రంగా ప్రశ్నల వర్షం కురిపించేరు.

“కుర్రోడు ఏడుస్తున్నాడంటే, ఏదో బొమ్మలబొక్కు ఇచ్చాడనుకున్నాన్రా. కానీ ఆ సీతగాడు చూడండ్రా, ముసలోడికి ఇచ్చినట్టు రామకోటిచ్చి పంపాడూ ” అన్నారాయన నవ్వు ఆపకుండానే.

” వీడసాధ్యం కూలా! అలా చేసేడా?  ఏదీ. చూడనీ ” అంటూ చెయ్యి చాపారు ట్రాక్టర్రాజుగారు.

సుబ్బన్నయ్యతో సహా ఒకరి తరువాత ఒకరు రామకోటిని పరిశీలించి పరిశీలించి చూడడం మొదలు పెట్టారు.

“మరి చూసేరా? ఆడి ఇరక తరకలు. అంటే అన్నాననీ, తిడితే తిట్టాననీ అంటారు గానీ మీరు ”  పళ్ళు కొరికారు తాతనాన్న.

లోపలనుంచి వెంకన్న, ఓ పళ్ళెంలో యాలిక్కాయలు వేసి పెట్టిన టీని ఇత్తడి గ్లాసుల్లో పోసి పట్టుకొచ్చేడు. వాటిని అందరికీ అందించి, మైనర్ మావయ్యకి దగ్గరగా వెళ్ళి, ఆయనకి మాత్రమే వినిపించేలా  ” అందాకా తింటానికి ఏడిసెనక్కాయలు ఏవైనా ఏపమంటారా? లేపోతే ఉప్మాలాటిది కానీ చైమంటారో? అడిగి రమన్నారండి చిన్నయ్యగోరు ” చెవిలో గుసగుసగా అడిగాడు.

” ఓ పంజెయ్యమను. జీడిపప్పుని దోరదోరగా ఏయించి, పల్చపల్చగా పకోడీలొండించి పంపమను ” పురమాయించారు  అంతే గుసగుసగా మైనర్ మావయ్య.

సీతమావయ్య అంటే తాతనాన్నకి అస్సలు పడదు.

తాతనాన్న సుబ్బారాయ్డుమామ్మియ్య వాళ్ళ రాజుగారికి అన్నగారి కొడుకు.  పద్దతి ప్రకారం సుబ్బారాయిడ్డుమామ్మియ్య ఆస్థంతా ఆమె తదనంతరం తాతనాన్నకే దక్కాలి. కానీ సుబ్బారాయుడ్డుమామ్మియ్య, వాళ్ళ రాజుగారు పోయాక,  ఆమె అన్నగారి కొడుకున్నూ తనకి మేనల్లుడున్నూ అయినట్టి సీతమావయ్యని కోటనందూరు నుంచి తెచ్చి పెంచుకుంటున్నారు.ఆస్థంతా చిల్లిగవ్వతో సహా ఆయనకే అంటూ రాతకోతలు చేసేసారు. దాంతో తాతనాన్నకి ముట్టాల్సిన ఆస్థంతా సీతమావయ్య సొంతవయిపోయింది. కానీ ఏం లాభం? సుబ్బారాయ్డుమామ్మియ్య ఇచ్చింది పుచ్చుకోవడమే తప్ప, సీతమావయ్యకి జేబులో చిల్లుకానీ కూడా ఉండదు. సుబ్బారాయ్డుమామ్మియ్య తెచ్చి పెట్టుకున్న ఈ పెంపుడు అల్లుడు వల్ల, ఊళ్ళో చుట్టాలంతా మామ్మియ్యకి చాలా వ్యతిరేకం అయి పోయారు. ఆ ఇంటికి రాకపోకలు కూడా తగ్గించేసారు. ‘ బానే మానేసేరు. ఈ మాయముండా సంతంతా వచ్చెళ్తుంటే, ఈ పాటికి గుమ్మాలూ తలుపులూ ఇరిగిపోను. ఆ బాధ తప్పింది ‘ అని సుబ్బారాయ్డుమామ్మియ్య తెగ సంతోషించారు తప్ప, కించిత్ కూడా విచారపడలేదు.

” ఆడు మాత్రం చేసిందేముందిరా తాతా? మీ కన్నమ్మ కొంగుచాటు అల్లుడు కదా! ఆళ్ళింట్లో రామకోటి తప్ప ఇంకేముంటుంది చెప్పు ” అన్నారు ట్రాక్టర్రాజు గారు ముక్క కొడుతూ.

ఆ ముక్క ఎత్తుకున్న  సుబ్బన్నయ్య ముక్కలని అటిటు, ఇటటు మార్చి షో తిప్పేసాడు.

” చంపేసారు బావా. ఫుల్ కౌంట్ ” అన్నారు తాతనాన్న ఉస్సూరుమంటూ ముక్కలు కిందకి విసిరేసి.

” ఇంత పాస్టయి పోందేటాట. నాదీ కౌంటేరా సుబ్బన్నా ” అన్నారు మైనర్ మావయ్య కూడా. సుబ్బన్నయ్య చూపించిన ఆటని వ్రేలితో కెలికి కెలికి పరీక్షిస్తూ.

” మీరు కుదురుండ్రండే. ఆ చతాడీగాడి పేరు తలుచుకున్నారు. ఇద్దరం ఫుల్ కౌంట్ అయిపోయేం ” చిరాకు పడ్డారు తాతనాన్న మైనర్ మావయ్య మీద.

“ఊరు కోవోయ్.  పగిడీ చుట్టలేక తలొంకర అన్నాడంట, ఎనకటికి నీ బోటోడే. ఆటలు కొట్టాలన్నా! ఆస్థులు కలవాలన్నా! ఆషామాషీ ఏంటి? సుడుండాల. నీకు అదిలేదు కాబట్టే ఆస్థి ఆడికి పోయింది. నా మీదెగురు తావేటీ. మీ కన్నమ్మీద చూపించు నీ పెతాపం ” అంటూ పైకి లేసారు మైనర్ మావయ్య. పైన ఉన్న డబ్బులు అయిపోయినట్టున్నాయి. మొల దగ్గర వున్న లింగీ మడత లోంచి డబ్బులు తీయడానికి మొలతాడుని వదులు చేసుకుంటూ.

“పంట్లాం ఏసుకొని పేకాట్లో కూచ్చున్నంత బుద్ది తక్కువ ఇంకోటి లేదు.కాళ్ళు పట్టేత్నాయి బాబోయ్. హమ్మ ” అంటూ పైకి లేచి,  పంట్లాం జేబీలోంచి కత్తిరి మార్కు సిగరెట్టుపెట్టి తీసి, అందులోంచి ఓ సిగరెట్ లాగిన తాతనాన్న, మైనర్ గారి మండువా అరుగు మీంచి సుబ్బారాయ్డు మామ్మియ్య  ఇంట్లోకి అలా తొంగి చూసారు.

చూసిన ఆయన చూసినట్టు ఉండకుండా …

” మైనరన్నయ్యా బేగా రండే. మీ వోడు ఏం చేస్తున్నాడో? చూద్దురు గాని ” అని పిలిచారు. అగ్గిపుల్ల వెలిగించుకుంటూ.

గబగబా మైనర్ మావయ్య తాతనాన్న పక్కకి వెళ్ళారు.

అక్కడ కరివేపాకు మొక్క మొదట్లో  బియ్యంకడుగు పోస్తున్న నాగమణిని చూస్తూ ” అదెవత్రోయ్,  పిటపిటలాడి పోతోంది. కొంపదీసి కోటేశు గాడి కొత్తకోడలా? ” అనడిగారు అసలు విషయం వదిలేసి.

“ఊకోండే. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు,   మీకంట్లోనూ అదే పడిందా?  దాన్ని తీసేసి మీ సీతగాన్ని చూడండే. గుమ్మాలని, తలుపులనీ ఎలా అరగ దీసేత్తన్నాడో ” కసురుకున్నారు తాతనాన్న.

” అవున్రొరేయ్ ఎంత నీట్నీసో కదాడికి. ఇంట్లోకి ఈగనే కాదు, అరుగుమీదకి దుమ్మూదూళ్నీ కూడా రానియడు. ఆడ్రా కుర్రోడంటే నిజంగా ” మెచ్చుకున్నారు మైనర్ మావయ్య.

” ఆపండే, ఎప్పుడూ ఆడి పల్లకీ యే మోస్తారు.  ఓ ఎకరం ఏవన్నా రాసిస్తాడు అను కుంటున్నారేటీ ? ” అన్న తాతనాన్న గట్టిగా దమ్ము లాగి, సిగరెట్ విసిరేసి ఆయన చోట్లోకి వచ్చి కూర్చున్నారు .

సీతమావయ్య మీద వంకపెట్టి, నాగమణిని అమితారాధనగా చూస్తున్న మైనర్ మావయ్య అది అలా తిప్పుకుంటూ లోపలికి పోగానే…

” సీతా, ఏమోయ్ సీత్రావరాజూ ” అంటూ చప్పట్లు కొట్టి పిలిచారు సీతమావయ్యని.

అప్పటికి తలుపుల్నీ గుమ్మాల్నీ మూడో సారో, మూడున్నర సార్లో తడిగుడ్డతో తుడిచేసిన సీతమావయ్య  మైనర్ మావయ్యని చూసి నవ్వుతూ “అయ్యా! పిలిచారా అన్నయ్యా ”  నన్నేనా? అన్నట్టు గుండెలమీద చెయ్యి పెట్టి చూపించుకున్నారు.

” నిన్నే, నిన్నేన్రా, ఓ సార్రారా మళ్ళెళ్లి పోదూ గానిలే ”

” అయ్యా!  చేతులు కడుక్కుని వస్తానండీ అన్నయ్యా ” అంటూ సైగలు చేసారు  సీతమావయ్య అటు వైపు నుంచి.

“రాడం ఎందుకు? పోడం ఎందుకు? మనందరి మీదా పసుపునీళ్ళు కానీ జల్లేసి పోతాడో ఏంటో? ” ఎకసెక్కం చేసారు తాతనాన్న.

పెరట్లోంచి పలావ్ వాసన వీధిలోకి మహా ఊపుగా వస్తోంది. మండువా ఇంటి ముందు నుంచి కాలి బాటమీద పోతున్నవాళ్ళు, ఓ సారి అలా ఆగి ఇలా ‘ఊంఊం’ అంటూ ముక్కు ఎగబీల్చి, ‘ రాజులొంట దంచేత్తనారు, దేనికైనా దంత సిరొండాల’ అని నిట్టూరుస్తూ ఎవరి పనులమీద వాళ్ళు వెళ్ళి పోతున్నారు.

శ్రీరాజావత్సవాయి శ్రీశివనాగరాజుగారు ఒకరి వెనక నుంచి మరొకరి వెనక్కి, వజ్రాసనంలో పాక్కుంటూ  పాక్కుంటూ  తాతనాన్న పక్కకి చేరుకున్నారు. ఆయనకి పేకాట ఆడటం కంటే, చూడటం ఎక్కువ ఇష్టం. ప్రస్తుతం ఆయన అదే పనిలో తీరుబాటు లేకుండా ఉన్నారు. అందరినీ పేరుచివరన కుమారం అని తగిలించి  పిలవడం ఆయనగారికి అలవాటు.

” అదేమిటోయ్ తాతకుమారం, అస్తమాటుకూ ఆ దత్తకుమారాన్ని అలా ఆడి పోసుకుంటావు? ఈ పరగణాలో ఏ పనికిమాలిన కుమారవన్నా చెన్నపట్నం వెళ్ళి, లా చదూకున్నాడా చెప్పు? ఇక్కడిక్కడే ముగ్గులెయ్యడం తప్ప” ప్రశ్నించారు. తాతనాన్న  పేకముక్కలని నిశితంగా పరిశీలిస్తూ.

” లాయే చదూతున్నాడో, బజారంట ఇనబ్బకెట్లే అట్టుకు తిరుగు తున్నాడో, మనవెళ్లి చూడొచ్చామా తాత కుమారం? ” అంటూ  కయ్యిమన్నారు తాతనాన్న.

” రేయ్ తాతా!  నువ్వు  సీతమీదా, మీ కన్నమ్మ మీదా, వాజ్జం మీద వాజ్జం ఏసేసి డిక్రీ పొందెయ్యొచ్చు కదరా? ” సలహా పారేసారు ట్రాక్టర్ రాజుగారు ఆటని డ్రాప్ చేస్తూ.

ఆయన కూర్చొన్నప్పట్నుంచీ టిక్కున ఒక్క ఆట కూడా బోణీ కొట్టలేదు.

” వీళ్ళకలాంటి ఎదవ్వయిడియాలు వస్తాయనే, ఈళ్ల కన్నమ్మ సీతగాడిచేత మెడ్రాస్లో  ప్లీడరీ చదివిస్తుంట” అడ్దుపడ్డారు మైనర్  మావయ్య.

” తమరి ఉచిత సలహాయే అయ్యుంటది లెండి. లేపోతే ఆవిడకన్ని అతిక తెలివితేట్లెలా వస్తాయి? ఏరా తాతా నిజవే కదా! ” మధ్యలో  దూరారు బెల్ట్ భద్రం.

ఇంతలో సీతమావయ్య  అక్కడకి వేంచేసారు. అందరికీ చేతులు జోడించి నమస్కరించి, తాతనాన్న మొహంలోకి తప్ప, ప్రతోళ్ల మొహంలోకీ పరికించి పరికించి చూసి, వాళ్ళందరి చేతా తిరిగి మర్యాదపూర్వకంగా తల ఊపించుకున్నారు.

సీతమావయ్య బోస్ ఫేంట్ వేసుకొని, పైన దసరాబుల్లోడు చొక్కా తొడుక్కున్నారు.కాళ్ళకి పేషన్ చెప్పులు కట్టుకున్నారు.కుడి చేతికి పోచ్చీ, ఎడం చేతికి చైనోచ్చీ తగిలించుకున్నారు.బొటనవ్రేళ్ళు మినహా అన్ని వ్రేళ్ళకీ ముద్దుటుంగరాలు మెరుస్తున్నాయి. మెడలో కన్నెతాడంత లావున బంగారం గొలుసుంది. దానికి చివరన పులిగోరు వ్రేళ్ళాడుతోంది.

అందరికీ వందనాలయ్యాకా, రెండో అరుగు అంచుమీద, అంటీ అంటనట్టుగా కూర్చుండీ కూర్చోనట్లుగా కూర్చొన్నారు. శుభ్రం ఎక్కువ కదా! బట్టలు మాసి పోతాయేమోనని.

” ఏమోయ్ సీతా! హేండ్ డల్లయి పోయింది. నాయి రెండాటలు చూసి పెట్టకూడదూ ” అన్నారు ట్రాక్టర్రాజు గారు.

” హమ్మో! నేనా? పేకాట జోలికి వెళ్ళనని అత్తయ్యాజీకి ప్రామిస్ చేసానండీ ” అంటూ చిరంజీవి వైపు చూసి ” పిల్లలు ఇక్కడెందుకూ మీరు, బేడ్బోయ్ అనరా? ఎవరన్నా చూస్తే ” అని తన దగ్గరకి రమ్మన్నట్టు చెయ్యి ఊపారు.

” నువ్, పెద్ద పోత్సుమెన్నంట కద్రా.  అందులో  పేకాటుండదేటోయ్? ” సందేహం వ్యక్తం చేసారు రాజబాబు. మల్లిసాల నుంచి కొండగొర్రీ, అడవిపంది మాంసం ఆయనే పట్టుకుని వచ్చారు.

ఆయన తిక్కప్రశ్నకి ఉక్కిరి బిక్కిరయిన  సీతమావయ్య, ఏం సమాధానం చెప్పాలో తెలీక,  చిరంజీవికి హస్తసాముద్రికం చూడడం మొదలు పెట్టారు.

శ్రీరాజావత్సవాయి శ్రీశివనాగరాజుగారు  మెల్లగా సుబ్బన్నయ్య వెనక్కి చేరి ఆటని పరిశీలిస్తూ ” మా అల్లుడు కుమారంగారు ఎప్పుడైనా కనిపిస్తున్నారేటోయ్? సీతకుమారం ” అని అడిగారు.

సీతమావయ్యతో సహా అక్కడున్న కుమారాలంతా ఆయన వంక చాలా ఆశ్చర్యంగా చూసారు.

పిల్లా జల్లాలేని వృధ్ధ రాజావారికి!  అల్లుడెలా పుట్టుకొచ్చాడా? అన్నదే ఆ ఆశ్చర్యానికి కారణం.

” మీ అల్లుడెవరండి తాతయ్యా? ” అడిగారు బెల్టు భద్రం. ఆశ్చర్యంలోంచి అందరికన్నా ముందు తేరుకొని.

” అదేనోయ్ మన రాపర్తికుమారంలేరూ? హర్నాదో, హరనాధమో అంటారు కదా! సిన్మా యాట్రు. ఆ మజ్జన వారి బావాజ్జీ కనబడినప్పుడు, రాజుల వంశవృక్షమేదో రాస్తన్నానని కూడా చెప్పేరు ”

“ఆంహా! రాపర్తి రాజులకీ, చిల్లంగి రాజులకీ చుట్టరికం ఎక్కడి దండోయ్? బావగారూ ” కూపీ లాగడం మొదలు పెట్టారు రాజబాబు.

” ఆ బోడి చుట్టరికాల్దేం వుందండీ? బావకుమారం. తాడు పేన్నట్టు పేనుకుంటూ పోతే, అయ్యే కలిసి పోతుంటాయి ” అన్న శ్రీరాజా వత్సవాయి శ్రీశివనాగరాజుగారు,  కాశీరాజుగారి పేక ముక్కల్లోకి తన కళ్ళని తనే నమ్మలేనట్టుగా చూసారు. ఆయన మొహంలో రంగులు గాభరాగా గాభరాగా మారిపోతున్నాయి. అక్కడున్న అంతా ఆ రంగులని గమనించినా గమనించనట్టే ఉన్నారు.

” షో ” అన్నారు ట్రాక్టర్ రాజుగారు.

” నిల్ ”

” నిల్నిల్ ”

” నిల్నిల్ నిల్నిల్ ” అంటూ ఆటగాడు రాజులు, వివరంగా ముక్కలు చూపించి,వాటిని కింద పడేసారు. ఒక్క కాశీ రాజుగారు తప్ప.

” కొట్టక్కొట్టక చచ్చాట కొట్టానన్నమాట త్పూ ” అంటూ నిట్టూర్చారు ట్రాక్టర్రాజు గారు.

” అలా చింతించకులే కుమారం. ఈ కుమారంగారు చాలా బలంగా ఇచ్చేర్లే ” అన్న శ్రీరాజావత్సవాయి శ్రీశివనాగరాజుగారు ” హేమిటోయ్ కాశీకుమారం, నీ అధ్వాన్నం ఆటా నువ్వూనూ. సుబ్బన్న కుమారం తిప్పిన ఓపెన్ కార్డ్  రెండెత్తేస్తే, నీది డీల్  షో అయి పోయింది కదా! నీకీ కౌంట్ ఖర్మెందుకూ? ”  అంటూ కాశీరాజు గారి మీద కోప్పడ్డారు.

వెంకన్నగాడు, లోపలనుంచి క్రీడాప్రాంగణంలోకి ఆదరా బాదరాగా ప్రవేశించాడు. అందరికీ పళ్ళెంలో ఉన్న జీడిపప్పు పకోడీవున్న ప్లేటులు అందించి, నెమ్మదిగా మైనర్ మావయ్య దగ్గరకి వెళ్ళి చెవిలో ” అడింపంది ఆరు, ఆ పళంగా కూరలో ఉంచెయ్యమన్నారా? లేపోతే  పచ్చేకంగా పులుసెట్టమన్నారా? ఇవరంగా అడిగిరమ్మన్నారండీ పెద్దయ్యగోరు ”   గుసగుసగా అడిగాడు.

” ఓ పని చెయ్యమను, ఆటిని తమాసగా ఏపించేసి అరిటాకుల్లో పెట్టి పంపమను. మందులో నంజుకోడానికి బాగుంటాది. ఇంకోసారి ఎవరన్నా టీ పుచ్చుకుంటారేమో అడుగు. ఈసారి అల్లం టీ పెట్టించి పట్టుకురా. ఆ పెద్ద పాలేరొచ్చేడా? రాలేదా? ఓసారి చూడు ” వాడి చెవిలో ఎవరికీ వినపడకుండా చెప్పేరు మైనర్ మావయ్య.

” అది, అరక రెండండీ. అందుకే ఎత్తలేదు ” అన్నారు పంచడానికి ముక్కలు కలుపుతున్న కాశీ రాజుగారు కత్తిరేస్తూ.

“అయితే ఏంటోయ్? చెయ్యట్టుక్కానీ కరిచేస్తదా? పోగాలం కాపోతే ”

” అయ్యో! మావయ్యా మీకెలా చెప్పాలి? నిరుడు కాశీ ఎళ్లినప్పుడు దాన్ని గంగలో వదిలేసొచ్చానండి.ఇందాకట్నుంచీ అందుకే నేనా ముక్క ఎత్తడంలేదు.ఒకేల పేకలో తగిలినా ఎంటనే ఇసిరేత్తనాను. ” వివరణ ఇచ్చారు.ఆయన మాటలకి అక్కడున్నవాళ్ళు ఉలిక్కిపడ్డంకంటే కూడా ఇంకా  ఏదో ఎక్కువే పడ్డారు.’ కాశీలో వదిలేసేవా’,’ కాశీలో వదిలేసేవా’ అంటూ అంతా కళ్ళు తేలేసేసారు. ఇంక ఏంజెయ్యాలో తెలీక.

కాశీరాజుగారి వివరణతో పేక చూడటమే కానీ, ఆడడం ఎరగని శ్రీరాజావత్సవాయి శ్రీశివనాగరాజుగారికి తల దిమ్మెక్కిపోయింది. తలపాగా లేపి, అందులో దాచుకున్న అమృతాంజనం సీసా తీసుకొని, కణతలకి దట్టంగా పట్టించుకున్నారు.

” అదేంటయ్యా సీతకుమారం? పిల్లాడు ఏడుస్తుంటే ఏ చందువాయో, బొమ్మిడాయో ఇచ్చి పంపించకుండా రామకోటిచ్చి పంపావ్? ”  సీతమావయ్యని అడిగారు శ్రీరాజావత్సవాయి శ్రీశివనాగరాజు గారు. ముక్కలు కలుపుతున్న కాశీరాజు గారి వెనక నుంచి, మైనర్ మావయ్యకీ  తాతానాన్నకీ మధ్య ఉన్న ఖాళీలోకి  పాకుతూ.

”  వాట్ చందువా? వాట్ బొమ్మిడాయ్? ఐ కాంట్  ”  ఆదుర్దాగా అన్నారు  సీత మావయ్య .

“అదేరా తమ్ముడూ  చందమామ, బొమ్మరిల్లు ఉంటాయి కదా! కధల పుస్తకాలు  అయ్యి ” అన్నాడు సుబ్బన్నయ్య.

“ఓ అవా? మనదగ్గర ‘సిడ్నీ షెల్టన్’, ‘ఇర్వింగ్ వాలెస్’ వీళ్ళవే ఉంటాయన్నయ్యా ” చెప్పారు సీతమావయ్య చిరంజీవి చొక్కాకి పీక బొత్తాం పెడుతూ.

” చట్నీ చేస్తాన్ ? ఇడ్లీలొండుతానా? ఇదేంటోయ్ చెన్నపట్నవెళ్ళి వకీలవుతున్నావా? వంటోడివవుతున్నావా?  ఇదేం టిలాటియ్యి చదుంతున్నావ్? ” ప్రశ్నించారు బెల్ట్ భద్రం.

పేకాటరాజుల పరాచికాలకి సీతమావయ్య, మైనర్ గారి వంటింట్లో ఉడుకుతున్న అడవిపంది మాంసంలా కుతకుతా ఉడికి పోతున్నారు. కానీ పైకి ఏమీ తేలడం లేదు.ఆయన పరిస్థితిని చూసి తాతనాన్న మనసులోనే తెగ పండగ చేసుకుంటున్నారు.

” హిహ్హిహ్హ్హ్హి ” అంటూ తింగరి నవ్వొకటి సమాధానంగా పడేసిన సీతమావయ్య, తనదృష్టి పూర్తిగా చిరంజీవి మీదనే కేంద్రీకరించి “హౌఓల్డార్యూ? ” అనడిగారు చెయ్యిని ప్రశ్నార్ధకంలా ఊపుతూ.

మొన్నా మధ్య  రామచంద్రపురం వెళ్ళినప్పుడు, కండక్టర్ బస్ వెళ్ళేటప్పుడు ఓల్డానని, బస్ ఆగినప్పుడు రైట్రైట్ అని అనడం గుర్తుకు వచ్చిన చిరంజీవి, సీత మావయ్య ‘ఓల్డాన్’ అన్నారు కాబట్టి మనం  ‘రైట్ రైట్’  అనాలేమో అనుకొని ” రైట్ రైట్ ”  అనేసాడు.

మొహమాటం కోసం, నవ్వు ఆపుకుంటున్న పేకాటరాజులు  చిరంజీవి చెప్పిన  సమాధానంతో ఇంక నవ్వు ఉగ్గబట్టు కోలేక పోయారు.

సీతమావయ్యకి  నవ్వాలో ఏడవాలో తెలీని దుస్థితి వచ్చేసింది.అయినా చిరంజీవి ఇంగ్లీష్ ప్రావీణ్యాన్ని పరిక్షించడంలో ఆయన ఏమాత్రం వెనక అడుగు వేయదల్చుకోలేనట్టుంది.

” పోనీ ఇదన్నా చెప్పండి? వాటీజ్ యువర్ నేం ” అనడిగారు.

“ఏంటీ”

” అదే మీ పేరేంటీ అనడగుతున్నా ”

” ఓ ఆ వాట్టా? నేనింకో వాట్టనుకున్నాన్లెండి ” అన్న చిరంజీవి  “వోత్సవాయ్ చిట్వెంకట్ పాత్రాజ్ ” అని ఇంగ్లీష్లో చెప్పాడు . సీతమావయ్యకన్నా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతూ.

” పార్డన్ ” అన్నారు. సీతమావయ్య మొహం చిట్లించి.

” పాడనా? సరే ” అని ఎడం చేత్తో ఎడమ చెవి మూసుకొని, కుడి చేత్తో గాలిని అడ్దదిడ్డంగా నరికేస్తూ, కళ్ళు మూసుకొని మనసులో కురుక్షేత్రం నాటకంలో  కృష్ణున్ని తలచుకొన్న చిరంజీవి ” వో…త్సవాయీ… చిట్టీ… వేంవేంవేం… కటా…పతీయ్ తీయ్ తీయ్య్ తీయ్ తీయ్  రాజూజూజూజూ, వాత్సవాయి చిట్టి వెంకట పతి రాజూజూజూజూ… ” అని పాడి పారేసాడు.

తన పేరు పాడుకొని చిరంజీవి కళ్ళు తెరిసే సరికి, అరుగు మీదున్న రాజులు ఎక్కడి ముక్కలు అక్కడే పడేసి, పొట్టలు నొక్కుకుంటూ పడిపడి నవ్వుకుంటున్నారు.

తాతనాన్న అరుగుదిగి, వాకిట్లో ఓ మూలకి పారిపోయేరు. కళ్ళ వెంట నీళ్ళొచ్చేస్తున్నాయి, ఆయన ఏడుస్తున్నారో నవ్వుతున్నారో ఎవరికీ  అర్ధం కావడంలేదు.

“ఓహ్ సారీ ” అన్నారు సీతమావయ్య.

ఆయన మొహం చిన్న గోళీకాయంత అయిపోయింది. ఆ గోళీకాయలో అక్కడనుంచి ఏదోలా పారిపోవాలన్న ఆత్రం కనిపిస్తోంది.

” సుబ్బన్నయ్యగారూ బాబునలా తీసుకెళ్ళి కొంచెం ‘బేసిక్స్’ అవీ నేర్పి తీసుకు రమ్మన్నారా? ” అన్నారు లేస్తూ.

“వద్దులేరా తమ్ముడూ, వాడసలే వికారంగాడు ” వారించాడు సుబ్బన్నయ్య.

” ఏం ఫర్వాలేదండీ, నన్నడిగితే పిల్లలని  ఈ ఎన్విరాన్మెంట్లోకి అస్సలు రానీయకూడదు తెలుసా? కాస్త ఆల్ఫాబెట్స్ అవీ చెబుతాను. డెవలప్ మెంటొస్తుంది ” అంటూ చిరంజీవి చేయిపట్టుకొని ” తమరు రండీ ” అన్నారు.

చిరంజీవికి మీరూ తమరూ అంటూ తెగ మర్యాదిస్తున్న సీతమావయ్య అంటే భలే గౌరం కలిగింది.

” ఏరా అల్లుడూ “, ” ఏరా తాతా “, ” బుజ్జిగోరో”, “గజ్జిగోరో” అనేవాళ్ళే తప్ప, ఇలా సీతమావయ్యలా పధ్ధతిగా మీరూ, తవరూ అని మర్యాదిచ్చిన వాళ్ళు ఇంతవరకూ ఎవరూ కనపడలేదు అతనికి.

అందులోనూ ‘బేసిక్స్’ అయీ అంటున్నారు. అయి బిస్కట్లా కమ్మగా ఉంటాయో? చాక్లెట్లా తియ్యగా ఉంటాయో? రుచ్చూసొద్దాం పోనీ ‘   అనుకొని సీతమావయ్య చెయ్యి పట్టుకొని సుబ్బారాయ్డుమామ్మియ్య ఇంటివైపు కదిలాడు .

పెద్ద ఇత్తడిపల్లెంలో, నీళ్ల చెంబులూ ఖాళీ గ్లాసులు తెచ్చి, వాటిని రెండో అరుగు మీద సర్ది, మళ్ళీ లోపలకి వెళ్ళి, అరిటాకుల్లో అడవిపంది వారుమాంసం ఉన్న  ఇంకో పళ్ళెం తెచ్చి, దాని పక్కనే ఇది  పెట్టి, మెల్లగా మైనర్ మావయ్య దగ్గరికి వెళ్ళాడు వెంకన్న.

” మీరెప్పుడు చెప్తే, అప్పుడు వడ్డన్లు చేసేత్తామన్నారండీ చిన్నయ్యగోరు ” అన్నాడు  గుసగుసగా.

” ఇప్పటికే ఐదొందలు బొక్కలో ఉంది మన కంపెనీ. అది రికవరైయ్యాకే వడ్డన్లు. ఈలోగా ఆడోళ్ళని భోంచేసి, ఓ కునుకు లాగెయ్యమను. ఈళ్లకి, గ్లాసుల్లో మందేసేటప్పుడు రెండు చుక్కలు ఎక్కువ తగిలింతుండు. అప్పుడే కిక్కెక్కేసి, ఏ ఆట పడితే ఆ ఆట లాగేస్తారు. మనం కంట్రోల్లో ఆడి, ఎంటనే రికవరై పోవచ్చు ఏవంటావ్? ” ఎవరికీ వినపడకుండా గుసగుసగా చెప్పేరు మైనర్ మావయ్య.

” నాకొదిలీండింక, ఒక్కోల్లనీ ఎలా తొంగడేసేత్తానో మీరే చూద్దురుగాని ” గుసగుసగా చెప్పి, ఉత్సాహంగా గ్లాసుల్లో మందుపోయడం మొదలు పెట్టాడు వెంకన్న.

” నన్నడిగితే నట, ఈడ్నెవడడిగేడండీ బోడి? పళ్ళు రాలగొట్టెయ్యలేపోయారూ! ఎదవ బడాయి కాపోతే ” అంటూ వాకిట్లో పడీ పడీ నవ్వుకుంటున్న తాతనాన్న,  సీతమావయ్యా  చిరంజీవీ ఇలా  బయలుదేరగానే అలా అరుగు పైకి వచ్చేసారు.

” కడుపుబ్బించేసాడు, బాలకుమారం ” అన్నారు శ్రీరాజావత్సవాయి శ్రీశివనాగరాజు గారు.

” అవునండే ” అంటూ తాతనాన్న మళ్ళీ గట్టిగా నవ్వడం మొదలెట్టేరు.

అందరూ మళ్ళీ ఘొళ్ళుమంటూ నవ్వుకోవటం వెళ్ళే వాళ్ళకి వెనక నుంచి వినిపిస్తూ ఉంది.

చిరంజీవీ సీతమావయ్యా కలిసి, వాళ్ళింట్లోకి రావడం సుబ్బారాయ్డు మామ్మియ్య పెరట్లోంచి చూసేసారు. కళ్ళజోడు లేకపోయినా.

” ఏవిరా సీతప్పడా, ఎవుర్రా ఆ పిల్లోడు? ఇలా పంప్మీ ” అంటూ లోపలనుంచి  గాండ్రించారు మామ్మియ్య.

” మన వరాలప్ప కొడుకులుంగారు అత్తయ్యాజ్జీ ” అని చెప్పిన సీత మావయ్య ” నేనిక్కడే ఉంటా మామ్మియ్యాజ్జీ పిలుస్తున్నారు తమరిని, వెళ్ళిరండి. ” అంటూ చిరంజీవిని లోపలకి తోసేసేసారు.  అతని చేతిలో ఉన్న రామకోటి  లాగేసుకొని.

లోపల, వళ్ళో సాపుపీట పడుకో బెట్టుకుని, దాని మీంచి జారబోస్తూ  సుబ్బారాయ్డు మామ్మియ్య, పెసలు బాగు చేస్తున్నారు.

మామ్మియ్య బాగు చేసిన పెసలని నాగమణి తిరగట్లో పోసి విసురుతోంది.

నూనె రాసిన పచ్చని పెసలు  నిగనిగా నాగమణిలాగా  మెరుస్తున్నాయి.

” నువ్వహ్టోయ్ సింజీ, బాగా సాగిపోయావ్ సుమా. దా దా కూకో ” అంటూ ముక్కాలి పీటని ఆమె దగ్గరకంటా లాగి సుబ్బారాయ్డు మామ్మియ్య చిరంజీవిని కూర్చోమన్నారు.

ఆ ముక్కాలిపీటని, మళ్ళీ తన దగ్గరకంటా లాక్కుని కూర్చొని, పళ్ళెంలో ఉన్న పెసలని గుప్పెటతో తీసి, మామ్మియ్య వళ్ళో ఉన్న పీట మీద మెల్లిగా పొయ్యడం మొదలు పెట్టాడు చిరంజీవి.

సుబ్బారాయ్డుమామ్మియ్య  రుబ్బురోలుపొత్రంలా గుండ్రంగా, నిండా ధాన్యంపోసిన పొనకలా పొడుగ్గానూ దిట్టంగానూ ఉన్నారు.

” అప్పయ్య ఊరెళ్ళేహ్టగా, వచ్చేసారా? హేవిటోయ్ ” అని అడిగారు.

” ఇంకా రాలేదు మామ్మియ్యా, రేపో ఎల్లుండో కోలంక బండి పంపుతా అన్నాడండి, మా రామన్నయ్య ” చెప్పేడు చిరంజీవి.

చిరంజీవీ సుబ్బారాయ్డుమామ్మియ్యల వేపు కళ్ళు భూచక్రాల్లా తిప్పి తిప్పి చూస్తూ, చేత్తో  గురుజు పట్టుకొని తిరగలి చక్రాన్ని గిర్గిరా తిప్పుతా ఉంది నాగమణి. దాని తిప్పుడికి పెసలు బదాబద్దలై, తిరగలి కింద వేసిన చిరుగు చీర మీద పడుతున్నాయి.

” హేంటో, మా ఇద్దరి బతుకులూ చెరో తీరయి పోయాయంకో. ఆవెకేమో ఇంటినిండా మనుషులున్నా సుకంలేదు. నా కేమో కబురు తేడానికైనా   కాకుండదు. లంకంత కొంపలో ఒంటిపిల్లి రాకాసిలా పడుంట్నా అంకో ” పెసలు నేమడాన్ని ఆపి, మధ్యలో మామ్మియ్య కొంగుతో ముక్కు చీదుకున్నారు.

” అయ్యగారండేయ్! నా తెలీకడుగుతాను. మీరెప్పుడన్నా ఎంగిలి చేయిదిలింతేనా? మనింటి కాడ కాకులోలడానికి? ” ప్రశ్నించింది నాగమణి విసురుతున్న తిరగలిని ఓసారి ఆపి.

” నువ్వూరికే మిట మిట్లాడి పోకే మిడత మొందానా. పద్దానికీ తయారై పోత్నావీ మజ్జన ” కస్సుమన్నారు ఉడుక్కున్న మామ్మియ్య .

” హుహ్హూం, ఉన్నమాటంటె ఉలుకుందెకో ” అని మూతి తిప్పుకుంటూ, నాగమణి చీరమీద పడ్డ పెసరపప్పుని చేటలోకి ఎత్తడం మొదలెట్టింది.

” మిట మిటలాడిపోతున్నావ్! అనకూడదు మామ్మియ్యా,   పిట పిట లాడిపోతున్నావ్ అనాలి ” చెప్పాడు చిరంజీవి. ఇందాకా మైనర్  మావయ్య అన్న మాటలు గుర్తొచ్చి. సుబ్బారాయ్డుమామ్మియ్య  తప్పుని సరి దిద్దుతూ.

చిరంజీవి మాటలకి, మామ్మియ్య శవంలా కొయ్యబారి పోయారు.

నాగమణి మాత్రం తోక తొక్కిన త్రాచులా లేచిపోయింది.

” ఈ రాజుల నోటికి సుతం బొతం లేకుండా పోతంది. ఏల్డంత లేపోనా, ఎంత లేసి మాటలంట్నారో? చెబ్తా చెబ్తా, నాక్కానీ మండిందంటే కోసి కారం బెట్టేత్తా నొక్కోళ్ళకి  ” అని సాగ దీసుకుంటూ, విసిరిన పప్పుని చేటలో వేసి తెగ చెరగడం మొదలు పెట్టింది.

“………”

” వామ్మో!  మంచెడ్లుండవ్ కానీ, ఈళ్ల మొకాలకి మళ్ళీ మరేదలోటీ ” చేట చెరుగుడు వేగం ఇంకా పెంచింది.

చేటలోంచి వస్తున్న దూగరకి, చిరంజీవికీ మామ్మియ్యకీ ఊపిరి ఆడడం మానేసింది.

” ఆగవే, ఆగంట్నానా ” అని మామ్మియ్య రంకెలేస్తున్నా వినిపించుకోవడం లేదు నాగమణి.

“ఒసేవ్,ఒసేవ్ ,  నీయమ్మ కడుపు మాడా. నా ఇంట్లో నువ్వోచ్చణం ఉండొద్దే ముండా, అవతలప్పో” అంటూ నాగమణి మీదపడి  చేతిలోంచి చేట లాగేసుకున్నారు మామ్మియ్య. ఇంక దీనితో ఇదికాదు పని అని చెప్పి.

” ఆ పోతాం, పోపోతే, మీ మీద కాలేసుకుని కాపరం చేత్తాం అను కొంట్నారా? ” అంటూ కచ్చా విప్పేసి,  కొంగు నడుం చుట్టూ బిగించి, దొడ్ది గుమ్మంలోంచి బయటకి పోయింది. కాలికి అడ్డంపడ్డ అంట్ల తెపాలాలని టపా టపా కసిగా తన్నుకుంటూ.

దగ్గుకుంటూ, తుమ్ముకుంటూ  చిరంజీవీ మామ్మియ్యా పెరట్లోంచి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వీధిలోకి వచ్చి పడ్డారు.

అప్పటి వరకూ లోపల జరుగుతున్నదంతా వీధి గుమ్మంలోంచి కాలుగాలిన పిల్లిలా  నక్కి నక్కి చూస్తున్న సీతమావయ్య, మామ్మియ్యా చిరంజీవీ  వస్తున్న సడి అవ్వడంతో ఏమీ తెలియనట్టు కుర్చీలో కూలబడ్డారు.

మామ్మియ్యని చూడగానే, వందనంగా లేచి నిలబడి ” అత్తయ్యాజ్జీ నన్నూ, బాబునీ అలా వెళ్ళి శివాలయం చుట్టూ  మూడు ప్రదక్షిణలు చేసి వచ్చెయ్య మన్నారా ” అని అడిగారు వినమ్రంగా.

కళ్ళల్లోకీ, ముక్కుల్లోకీ దుమ్మూ దూగరా దూరిపోయి, దగ్గలేక కిందా మీదా పడుతున్న సుబ్బారాయ్డుమామ్మియ్య  ఏమీ మాట్లాడలేక ‘పొండి పొండన్నట్లు’ చేతులు రెండూ గాల్లోకి ఊపారు.

సీతమావయ్య, చిరంజీవి చేయ పట్టుకుని రెండు అంగల్లో గుమ్మం దిగేసారు. మామ్మియ్య మళ్ళీ ఎక్కడ మనసు మార్చుకుంటారో అన్న భయంతో కాబోలు. ఇంటి గేటు దాటాకా, బొడ్లో దోపుకున్న  రామకోటి పుస్తకం చిరంజీవికి ఇచ్చేసారు.

“అదేంటి మోయ్యా! గుడి  ఆఏపు కదా? ఇయ్యేపు ఎళ్తన్నామేంటి? ” అనడిగాడు చిరంజీవి, దారి మారడం గమనించి.

” ఇలాగైతే త్వరగా వెళ్ళిపోతామండీ”

” ఓహో ”

ఇద్దరూ బోదిగట్టు ఎక్కి నడుస్తున్నారు. అలా కొంతదూరం వెళ్ళేటప్పటికి నాగమ్మ ఇల్లు వచ్చింది. నాగమ్మ తాటాకు ఇంటిచుట్టూ ఎత్తుగా కొబ్బరాకుల దడి ఉంది. వీధిలో దడి గుమ్మానికి నాగమ్మ కొబ్బరీఅకుల చాపని తలుపులాగా కట్టుకొంది.ఇద్దరూ ఆ ఇంటి ముందుకు వచ్చేసరికి ఎండు చేపలకూర ఘుమ ఘుమలాడుతూ  పలకరించింది. దడి గుమ్మానికి అడ్దంగా నాగమ్మ నిలబడి ఉంది. పువాకు బొండంలా ఉండే నాగమ్మ వాలకం, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుంది. లేకపోతే కూరవాసన బయటికి పోతోందన్న బెంగతో అది అలా గుమ్మానికి అడ్దంగా నిలబడిందో.

” ఆయ్, రండ్రండే బాన్నారా?  బాగా అలిసి పోనట్టున్నారేటీ? కూసేపు కూకెనులుద్రు గాని లోపల్రండి ” అంటూ, మొహమంతా నోరు చేసుకొని నవ్వుతూ ఆహ్వానించింది, సీతమావయ్యనీ చిరంజీవినీ.

” వద్దులే, మాకు పెద్దపనే వుందియ్యాళ. శివాలయం చుట్టూ మూడేస్సార్లు తిరగాలి మేం ” అంటూ ఆ ఆహ్వానాన్ని మన్నించ లేక పోయాడు చిరంజీవి.

” పోనీ లెద్దురూ. పెద్దామె రమ్మంటున్నారు కదా పాపం. ఓ సారి ఇలా వెళ్ళి, అలా కూర్చుని వచ్చేద్దాం, పీలవుతారేమో ” అన్నారు సీత మావయ్య.

ఇక తప్పదన్నట్టు, ఇద్దరూ లోపలకి వెళ్లి నాగమ్మ ఇంటి అరుగు ఎక్కారు.

సీతమావయ్య అక్కడ వున్న కర్ర కుర్చీలో కూర్చొంటే, చిరంజీవి అరుగుమీద కూలబడ్డ నాగమ్మ కాలుమీద సుఖాసీనుడయ్యాడు.

” అమ్మలమ్మో, ఇదేటిలా బరువెక్కిపోఏరు. పెద్దోలయిపోత్నారండి, ఓ పాలుండండి. సరీ కూకుందురు ” అని నాగమ్మ చిరంజీవిని లేపి కాలు సర్దుకొంది.

” ఏంటలా డల్ అయి పోయారు? కొంపదీసి మేకపిల్ల కానీ ఎక్కించు కోమన్నారా! ఏంటి? ” అని ప్రశ్నించారు సీతమావయ్య చిరంజీవి మొహంలోకి  చూస్తూ.

పొద్దున్నుంచీ నడిచి నడిచి అలసి పోయున్నాడేమో, అదే మంచిది అనుకొని ”  ఎక్కించేసుకోండయితే ఎళ్ళి తిరిగేద్దాం ” అన్నాడు చిరంజీవి.

” నాన్సెన్స్, నేనా ? మిమ్మల్నా? మేకపిల్లా ? నో. ఓ పని చెయ్యండైతే, నాగమ్మగారు తాటిపళ్ళు ఏరడానికి వెళతారట, కూడా వెళ్ళిపోండి .ఇంటిదగ్గర దిగ బెట్టేస్తారు మిమ్మల్ని” అంటూ సలహా ఇచ్చారు సీతమావయ్య.

“అదెంత బాగ్గెం, రండి బావైతే ” అని, ” ఒలేయ్ఓ లి సరసోయ్!  ఆ  మంచంకింద, చిన్న గంపుంటాది ఇలాగియ్యే ” అని పిలిచింది లోపలకి చూస్తూ.

” వత్తానని, రాపోతే శివుడు మూడోకన్ను తెరుస్తాడేమో ” అన్నాడు చిరంజీవి భయంగా.

” ఫర్లేదండీ మీ పేరు చెప్పి, నేను ఇంకో మూడు నాలుగు రౌండ్లు ఎక్కువ వేసేస్తా లెండి, అలా చెయ్యొచ్చట ” చిరంజీవి భయం పోగొట్టారు సీతమావయ్య.

లోపలనుంచి నాగమ్మ కూతురు సరస గంప తెచ్చి, చిరంజీవిని చూసి పలకరింపుగా నవ్వింది. అతని రెండు బుగ్గలూ గట్టిగా సాగదీసి  ‘ఉం’అంటూ ఒక్క అంగలో లోపలకి గెంతేసింది.

” నీయ్యెమ్మ, మండిపోత్నాయే. నా బుగ్గల్లాగొద్దని నీకెన్ని సార్లు చెప్పేనే, దొంగముండా ” అంటూ చిరంజీవి దాన్ని కొట్టడానికి పైకి లేచాడు.

” పోలెద్దురూ.ఏదో చిన్నపిల్ల. సద్దా పడింది. కుదురుగా గంపలో కూకోండి ఇంటికెళ్ళిపోదారి ” అంది నాగమ్మ చిరంజీవి చెయ్యి పట్టుకొని ఆపుతూ.

” అది చిన్న పిల్లేటి? పొదుగుడు పెట్టలా ఉంటే ”

” రాజుల్కి, చిన్నప్పట్నుంచీ సరసాలే. నడండి నడండి” అంది నాగమ్మ గంపలో పాతచీర  సర్దుతూ.

అప్పటికి ఇక సరసని క్షమించేసి,  గంపలోకి ఎక్కి గుమ్మడిపండులా కూర్చున్నాడు చిరంజీవి. సీతమావయ్య సాయం చెయ్యడంతో గంప నెత్తిమీద పెట్టుకుని, నాగమ్మ వయ్యారంగా బయలుదేరింది.

గంప ముందుకు కదులుతుంటే, వెనక్కి వెళ్ళిపోతున్న తాడిచెట్లకి లేత ముంజకాయలు కనిపిస్తున్నాయి. ‘ఈ తింగరి దానికి ఇప్పుడు తాటిపళ్ళెక్కడ దొరుకుతాయి? అన్నీ ముంజకాయలే ఉంటే! అనుకొన్న చిరంజీవి, ఆ విషయం నాగమ్మకి చెబుదాం అనుకున్నాడు. కానీ అంతట్లోకీ అతనికి రామకోటి పుస్తకం గుర్తొచ్చింది. నాగమ్మ ఇంటి అరుగుమీద మర్చి పోయాడుదాన్ని .

” ఏయ్, నాగమ్మా ఆగవే. ఓ సారి గంప కిందకి దింపు” అని ఆజ్ఞాపించాడు.

“ఎందుకు? బావూ  ఏం? ” అంటూ గంపని పక్కనే ఉన్న కొబ్బరి చెట్టుకి దాపెట్టి కిందకి దింపింది నాగమ్మ. వెంటనే చిరంజీవి గంపలోంచి చెంగున కిందకి దూకి, నాగమ్మ ఇంటి వైపు దూసుకుపోయాడు.

కంగారుపడ్డ నాగమ్మ “యాండే ఎక్కడికండీ బావుగోరూ,నా కొంప ముంచీసీలా ఉన్నారు” అంటూ  గంపపట్టుకొని చిరంజీవి వెనకాల పడింది.

చిరంజీవి  నాగమ్మ ఇంటికి  వచ్చేసరికి దడికి తడక వేసేసి ఉంది.తడక తోసుకుని లోపలకి వెళ్ళేసరికి, ఎండ పడకుండా కాబోలు చూరుకి ఈ చివర నుంచి ఆ చివరి దాకా చీర కట్టేసి ఉంది. గాలికి ఎగురుతున్న చీర కింద నుంచి  రామకోటి కనిపించడంతో అది పట్టుకొని, మళ్ళీ వచ్చిన దారినే వెనక్కి పరుగు అందుకున్నాడు చిరంజీవి.

అప్పటికి నాగమ్మ ఆపసోపాలు పడుతూ పరుగులాంటి నడకతో దొర్లుకుంటూ వస్తోంది.

” యాండే బాబూ ఎక్కడికి లగెత్తారు “.

“ఇగో ఈ పుష్కం మర్చిపోయా ” అని రామకోటి చూపించాడు.

“ఓహ్ ఇదా? ఏం మోయ గారున్నారుకదా? ఆయనట్టుకొద్దురు కదా? ” అంది తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ.

” ఏమోనెహే, ఉన్నారో ఊడేరో ఎవడికి తెలుసూ, నాకు ఆకలేసేత్తంది. బేగా ఇంటికి తీసుకెళ్లి పోవే బాబూ “అన్నాడు. చిరాగ్గా గంపలోకెక్కి.

అలా సైకిల్ మీద వెళ్తున్న ఓ మనిషిని పిలిచి, నాగమ్మ గంపని నెత్తికి ఎత్తమంది.

తీరా చూస్తే, వాడు  సత్తిగాడు కొడుకు వీరాసామి.వాడు గంపలో ఉన్న చిరంజీవిని చూడనే చూచేసాడు.

” చీచ్చీ, గంపలో కుచ్చున్నారా? రాజుల మరాదేవన్నా మన్నుద్దా? ఎవులైన చూత్తే ఎంత నామద్దా? దిగండి దిగండే. దిగి నా సైకిలెక్కెయ్యండి జోరుగా పోదాం ” అన్నాడు వీరాస్వామి.

గంపలోంచి గబుక్కున దిగేసి, ఎవరూ చూడలేదని నిర్ణయించుకున్నాకా, వీరాస్వామి సైకిల్ ఎక్కేసాడు   చిరంజీవి.

చిరంజీవి ఇంటికొచ్చే సరికి, వసారాగదిలో పందిరిమంచం మీద పడుకొన్న  రామన్నయ్య డిటెక్టివ్ యుగంధర్ తో కుస్తీ పడుతున్నాడు.

చిరంజీవిని, ఓసారి వారగాచూసి  ” రాత్రి ఒంటిగంట ”  అని మళ్ళీ పుస్తకంలో మొహం దూర్చేసాడు.

పూర్ణ పెరటి వైపు వసారాలో కూర్చొని, చెలికత్తెలతో చింతపిక్కలు  ఆడుకుంటోంది.

” పూన్నా, అన్నం” అంటూ గట్టిగా కేకేసాడు చిరంజీవి.వీధిలో ఉన్న బిందెలోని నీళ్లతో కాళ్ళు, చేతులూ, మొహం కడుక్కొని.

చిరంజీవి, హాల్లో  పడక్కుర్చీలో కూర్చొంటే,  పూర్ణ అన్నం తినిపించింది. పొద్దుటి కోపం మర్చిపోయినట్టుంది, ఏమీ అనలేదు. అన్నం తినడం అయ్యాకా, చిరంజీ రామకోటిని అందరికీ చూపించాలన్న ఉబలాటంతో తోట పక్క, దిగువ పేటలోకి పరిగెత్తాడు.

చిరంజీవి, పొద్దున్న లేచేసరికి ఊరు మొత్తం అగులో బొగులో అంటూ ఉంది.

రాత్రి సుబ్బారాయ్డుమామ్మియ్య  ఇంట్లో దొంగలుపడి సమస్తం దోచుకు పోయారు.

ఈ ఇరవై, పాతికేళ్ళలో ఇంత పెద్ద దొంగతనం చుట్టు పక్క లెక్కడా చూడలేదని ఊళ్ళోవాళ్ళు చెప్పు కుంటున్నారు.

సుబ్బారాయ్డుమామ్మియ్య బోషాణంపెట్టి గొళ్ళెం ఊడగొట్టేసి, మూటలు మూటలుగా కట్టి పెట్టుకున్న,  డబ్బూ దస్కం మొత్తం ఊడ్చి పారేసారు.

ఒక్క బంగారమే ఏడీసెలో, ఎనిమిదీసెలో ఉంటుంది అంటున్నారు.డబ్బు అయితే లెక్కేలేదు.నాలుగైదు లక్షలు దాటొచ్చు అట.

సీతమావయ్యకి, మామ్మియ్య మురిపెంగా చేయించిన, ఏ బంగారపు వస్తువూ దొంగ వెధవలు మిగల్చలేదు.

‘ గిద్దన్నర బియ్యం పొయ్యిమీదడేసి, బద్దన్నర పప్పుతో  రాచ్చిప్పడు పప్పులుసెట్టుకొని, రెండుపూటలా సుష్టుగా తింటూ… బోషాణం పెట్టి పక్కనే మంచవేసుకొని… కంటికి రెప్పెయ్యకుండా…. కర్రట్టుక్కాపలా కాచుకుంటూ…  మా సుబ్బారాయ్డు మామ్మియ్య ఎన్నేళ్ళనుంచో దాచుకుందంతా రాత్రికి రాత్రే చడీచప్పుడు కాకుండా దోచుకుపోయారు దొంగ సన్నాసులు’

“అయ్యో” అని ఏడ్డానికి కూడా పాపం మామ్మయ్యకి  అవకాశం లేకుండా పోయింది.

ఎంతెంత మంది, ఈనోటట్టం మనిషి నోరు పడిపోతే బావున్నని శాపనార్ధాలు పెట్టారో? ఏమిటో ? అవన్నీ ఆలస్యంగా విన్న, తదాస్థు దేవతలు అలాగే అనేసినట్టున్నారు. దొంగలని చూసిన భయం వల్లనో ఏమిటో? మామ్మియ్యకి పక్షవాతంవచ్చి నోరు ఒక పక్కకి లాగేసి, మాట పడి పోయింది.కుడిచెయ్యి, ఎడంకాలు కూడా లాగేసింది. నడవడానికి లేకుండా.

“చూడకూడనిది ఏదో అకస్మాత్తుగా చూసి, తీవ్రమైన భయాందోళనలకి గురైనప్పుడు,  ఇలాంటి విపరీత పరిణామాలు సంభవిస్తాయి” అని రాంచంద్రపురం నుంచి కారులో వచ్చిన పెద్ద డాక్టర్ గారు చెప్పారు. ” భవిష్యత్ లో  మరిక బాగు అయ్యే అవకాశం కూడా లేదు ” అన్న ఆ డాక్టర్ గారు ” ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు ” అని తేల్చి చెప్పి  ఫీజు పట్టుకుని వెళ్ళిపోయారు.

మైనర్ మావయ్య, కోటేశుగాడికి ఖర్చులకి డబ్బులు ఇచ్చి, మామ్మియ్య వాళ్ళ చుట్టాలకి కబురుచెప్పి రమ్మని కోటనందూరు పంపించారు.

ఊళ్ళో వాళ్ళంతా వచ్చి మామ్మియ్య మీద జాలి, సానుభూతి వానలా కురిపించి వెళ్ళి పోతున్నారు. సత్తిగాడి భుజాల మీదనుంచి మేకపిల్ల దిగిన చిరంజీవి స్థిమితంగా మామ్మియ్య దగ్గరకి వెళ్ళాడు.మామ్మియ్య మనుషులని బాగానే గుర్తు పడుతున్నారు.చిరంజీవిని  చూడగానే కళ్ళ వెంట నీళ్ళు కారుస్తూ ” బ్బేయ్ బ్బెయ్ ” అన్నారు. ఎడమ చేత్తో గాల్లో బొమ్మలు గీస్తూ. ఎవరితో నైనా మాట్లాడాలని అనిపిస్తే పాపం మామ్మియ్యకి ” బ్బేయ్ బ్బెయ్ ” అన్న ముక్క ఒక్క మాత్రమే ఓపక్క నోట్లోంచి వస్తోంది.

ఆ ” బ్బేబ్బే”  చిరంజీవికి ” మీ అమ్మమ్మ ఊర్నొంచొచ్చిందా? ” అని అడిగినట్టు అనిపించింది.

” ఇంకా రాలేదు మామ్మియ్యా. మీ ఇంట్లో చోరీ పరిశోధనలో మునిగితేలుతున్న మా రామన్నయ్య, కోలంక బండి పంపడం మరిచి పోయాడు” అన్నాడు.

” బ్బెబ్బే” అన్నారు మామ్మియ్య మళ్ళీ.

” ఇక వచ్చేకా చెబుతాలెండి మరి, నోరడి పోయే ముందు మామ్మియ్య నిన్నే తలుచు కున్నారని ” అని చెప్పి అక్కడ నుంచి వీధిలోకి వచ్చేసాడు. ఆ బే భాష భరించ లేక.

వసారా గదిలో కూర్చున్న, సీతమావయ్య బాధ అంతా ఇంతా కాదు. ఆయన్ని ఓదార్చడం ఎవరి వలనా కాక పోతోంది. వచ్చిన వాళ్ళందరినీ పట్టుకుని ఘొళ్ళుమని ఏడ్చేస్తున్నారు కూడాను. ” బేడ్ వెరీ బేడ్, క్యాషూ గోల్డూ  పోయిందని కాదండీ బాధ. నిక్షేపంలాంటి అత్తయ్యాజ్జీ నోరూ చెయ్యీ పడిపోవడమే సేడ్. అన్యాయం  చేసాడండీ ఆ గాడ్. అప్పటికీ  శివాలయం చుట్టూ ఆరు ప్రదక్షిణలు కూడా చేసాను నిన్న” అంటూ బావురుమంటున్నారు.

ఆయన ఏడుపుచూసి, ఎప్పుడూ ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే , తాతనాన్న కూడా కరిగి నీరై పోతున్నారు.

” ఎప్పుడూ ఎంగిలిచేత్తో కాకినన్నా కొట్టేవోరు కాదు మా కన్నమ్మ. అంతా ఆ బగమంతుడి లీల. ఇలా జరుగుతుందని ముందే తెల్సినట్టు, ఇంకెప్పుడూ చేసి పెట్టలేనని అనుకున్నారో ఏటో! సీతగాడికోసం కజ్జికాయలూ, పోకుండలూ వండి, గోరుమిటీలు పాకంపట్టి, పూచ్చుట్టలు చుట్టించి బిందెల్లో వాసం గట్టుంచారట పాపం. మారిన మా కన్నమ్మ మనస్సన్నా అర్ధం చేసుకోలేపోయావా దేముడా ” అని మామ్మియ్య కాళ్ల దగ్గర కూర్చుని వలవలా ఏడవడం మొదలెట్టారు తాత నాన్న.

ఎడంచేత్తో, ఆయన జుట్టు పట్టుకుకొన్న మామ్మియ్య “బ్బే బ్బే” అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించడం చూసి, అందరి మనస్సూ కలిచి వేసింది.’జుట్టట్టుకున్నారేవిటి ఈవిడ? పాత పగలు కానీ మర్చిపోలేదా?’ ఎందుకన్నా కానీ దూరంగా వుండడం మంచిది. అని అక్కడ్నుంచి లేచి పోయారు తాతనాన్న.

కోడికూతల వేళ, కసరత్తు చెయ్యడం కోసం లేచిన సీతమావయ్య బయటకి వచ్చి చూసే సరికి, వాకిట్లో మూటలు విప్పేసిన చీర పీలికలు చెల్లా చెదురుగా పడున్నాయట.అందులోనూ ఇవాళ సీతమావయ్య చెన్నపట్నం ప్రయాణం కూడానూ. లోపలకి వెళ్ళి చూస్తే ఎప్పుడూ లేంది,  గొళ్ళెం ఊడిపోయిన బోషాణం పెట్టి తలుపు లేపేసి ఉంది.  పాపం మామ్మియ్య మంచం మీద అడ్డ దిడ్డంగా పడుకొని, కాళ్ళూ చేతులూ కొట్టు కుంటున్నారట. వెంటనే వెళ్లి , విషయం చెప్పి మైనర్ మావయ్యని లేపి తీసుకొనివచ్చారు సీతమావయ్య.

ఏ తెల్లవారు జామునో వచ్చుంటారు దొంగలు. ఇంతింత బరువులతో ఎంతో దూరం పోయి ఉండరులే?  పట్టుకొని నరికివేద్దాం. అని ఊళ్ళో వాళ్ళంతా పొలాలకి అడ్డంబడి టేకుతోకలూ , కర్రలూ, కత్తులూ , గొడ్డళ్ళూ,గునపాలూ  పట్టుకొని అణువణువూ గాలించారు.ఎక్కడా ఒక కొత్తమొహం అన్నదే కనపడలేదు ఎవరికీ. ఎలా దాటించేసారో బిందెల కొద్దీ బంగారమూ డబ్బూను.  చిత్రంగా దాటించేసారు.అంతా మాయలా ఉంది. అందరినోటా ఇదే మాట.

పోనీ పోలీస్ ఠాణాకి వెళ్ళి ఫిర్యాధు ఇద్దామంటే, పొద్దుగూకే దాకా రాజులంతా మైనర్ గారింట్లో పేకాట ఆడుతూనే ఉన్నారు. ఆ పోలీసులు ఏమయినా ఇంట్రాగేషనూ, ఇసాకపట్నం అంటే  రాజుల మర్యాదేమైపోవాల? ఊళ్ళో వాళ్ళందరి దృష్టిలో దొంగల్లా మిగల్రూ? ఎవరికి ఎంత రుణమో అంతే. అని సీతమావయ్య సర్ది చెప్పడంతో ఎవరి మట్టుకి వాళ్ళే, బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుని పోలీస్ మాట ఎత్తలేదు ఇంక. చిన్నోడైనా సీతమావయ్య చూపిన పెద్ద మనసుకి ఊళ్ళో రాజుల గుండెలన్నీ గోదారైపోయాయి.

మామ్మయ్యకిలా అవడంతో సీతమావయ్య చెన్నపట్నం ప్రయాణం ఆగి పోయింది. లేకపోతే  ఈ పాటికి సవారీబండి మీద కాకినాడకి కూతవేటు దూరంలో ఉండాల్సింది. మామ్మియ్య సీతమావయ్యకి చెయ్యక చెయ్యక చేసిన ఫలహారం బిందెలు వసారాగదిలో ఆయన మంచంకింద కుదురుగా సర్ది ఉన్నాయి.చిరంజీవికి ఆకలి వేసినట్టు అయ్యి, బిందెలోంచి ఏదో ఒకటి తీసుకుని తిందామనిపించింది.’ కజ్జికాయలొద్దు ఎదవ కొబ్బరినూని కంపు, పోకుండలైతే పంటికి అంటుకుంటాయి అసయ్యంగా. మైసూరు పాకుల గురించి తెలీందేముంది గోడకి మేకులు దిగ్గొట్టు కోవాలంతే వాటితో. మురిపీలు గాడిదగుడ్దుల్లా వంకర టింకరగా ఇంతపొడవుండి అంగిలి కొట్టుకు పోతుంది. అదే పూచ్చుట్టలైతేనా! ఆహా మెత్తగా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి. నెమ్మదిగా మంచంమీద  కూర్చున్నట్టే కూర్చొని ఎవరూ చూడకుండా వాసం కట్టిన బిందెలోకి చెయ్యి తోసి  దాన్ని అటూ ఇటూ ఆడించాడు. పూచ్చుట్టలు మెత్తగా కాకుండా గట్టిగా తగులుతున్నాయి.

ఇంతలో అది చూసిన   సీతమావయ్య ఖంగారుపడిపోయారు  ” అయ్యయ్యో, ఇదేమన్నా మర్యాదా?మీకు  ”  అని బిందెలని లోపలికి తోసెయ్యడంతో,  దొరికిపోయిన దొంగలా అవమానభారంతో బయట కొచ్చేసేడు చిరంజీవి.

‘ పోనీ వచ్చినోళ్ళందరికీ ఆ ఫలారం తలా ఒకటీ పెట్టి మర్యాద చేద్దామన్నా! ఆ ఇంట్లో ఆడ దిక్కు వుంటేనా? మామ్మియ్యేమో మూలన పడి పోయారాయె. నిన్నటి దాకా ఉన్న నాగమణిని,  మామ్మియ్యే నానా తిట్లు తిట్టి తగిలేసారు.అంతా నా వల్లే. అది వుంటే, అసలు మామ్మియ్యకి ఈ యాతనే లేపోనేమో? ఆడ దిక్కులేని ఇంట్లో, ఏదో చిన్నపిల్లాడు ఆశగా ఓ పూచ్చుట్ట తీసుకుంటే తప్పా? వద్దొద్దనడం, మర్యాదస్థుడైన సీత మావయ్యకి ఏవన్నా మరేదేనా? బిందెలకొద్దీ ఫలారం ఒక్కల్లే తిని అరిగించుకోగల్రా? అయ్యిందేదో అయ్యింది. సీతమావయ్య చెప్పింది కూడా నిజమేలే! ఎవరింటికైనా వెళ్ళినప్పుడు,  వాళ్ళు పెడితే తినడమే మనకీ ఆళ్ళకీ మర్యాద. సీతమావయ్య మర్యాదస్థులు కాబట్టి ఈ విషయం ఎవ్వరికీ చెప్పరు. ఒకేళ, తను చేసిన పని నలుగురికీ తెలిత్తే, ఏవన్నా ఉందా! ఎంత అప్రదిష్ట?’ అని  తనలో తనే తెగ మధనపడ్డాడు చిరంజీవి.

మజ్జాన్నం దాకా “అయ్యో అయ్యో ” అని కిందా మీదా పడ్డ అయ్యలూ, అమ్మలూ అంతా ఎవరి దారిన వాళ్ళు నెమ్మదిగా జారుకున్నారు. మధ్య గదిలో మామ్మియ్య, వసారా గదిలో సీత మావయ్యా ఒంటరిగా మిగిలి పోయేరు.’ఎవరికి తప్పినా, మామ్మియ్య బాజ్జత సీతమావయ్యకి తప్పుద్దా ఏవన్నానా?  ఒకేళ ఆయన ఇక్కడ మామ్మియ్యకి, సేవలు చేసుకుంటూ కూర్చుంటే అక్కడ ప్లీడర్ చదువు  చంకనాకిపోదా? భగమంతుడా, సీతమావయ్యకి ఇన్ని కష్టాలు పెట్టేవేటి తండ్రీ’ అని తనలో తనే నిట్టూర్చాడు చిరంజీవి. ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయిన సీతమావయ్య,  మామ్మియ్య దగ్గరికెళ్లి మొహం చూపే సాహసం చెయ్యలేక పోతున్నారు. ఏంచెయ్యాలా? అనాలోచించి,ఆలోచించి ఏదో మంచి ఆలోచన వచ్చినట్టు అలా నాగమ్మ ఇంటివైపు వెళ్ళారు. నాగమ్మని బతిమాలి,బామాలి ఎలాగోలా ఒప్పించి దాన్ని సాయంత్రానికి మామ్మియ్యకి సంరక్షకురాలిగా నియమించారు.

నాగమ్మని చూడగానే మామ్మియ్య మళ్ళీ ‘ బెబ్బే ‘ భాషలో లబోదిబోమన్నారు.

” మీ బాధ నాకు అద్దమైంది లెండయ్యగోరూ, మెల్లిగా  అన్నీ నేను చక్కబెట్టుకుంటాను కదా!”   అంటూ మామ్మియ్యకి కొంత దూరంలో చతికిలబడింది.

“మడిసంటే నాగమ్మే మడిస్రా! తస్సారవ్వలా, మూలన పడ్డోళ్లకి సేవ చేయడానికి ఎంతిత్తే మాత్రం  ఎవరొత్తారు? అదీ సుబ్బారాయుడ్డు గార్లాంటి గయ్యాలయ్య గోరికి సేవ చేనాకి ” అని నాగమ్మని ఒహటే పొగిడేసారు ఊళ్ళో వాళ్ళంతా.

నాల్రోజులు ఇట్టే గడిచి పోయాయి.ఐదో రోజున సీతమావయ్య బట్టల పెట్టెలూ, పుస్తకాల సంచులతోపాటూ సుబ్బారాయ్డుమామ్మియ్య  బిందెల్లో వాసంకట్టుంచిన ఫలహారాలన్నీ, మైనర్ మావయ్య స్వయంగా దగ్గరుండి మరీ సవారీ బండికి ఎక్కించారు.

” అప్పుడప్పుడూ చూసి వెళ్ళండి అన్నయ్యా ” అంటూ మైనర్ మావయ్య చేతులు పట్టుకొని  కన్నీళ్ళతో మామ్మియ్యని అప్పగింతలు పెట్టి,  చెన్నపట్నం వెళ్ళడానికి సవారీ బండెక్కారు సీతమావయ్య.

మధ్య గదిలోంచి, ఇదంతా చూస్తున్న సుబ్బారాయ్డుమామ్మియ్య ” బెబ్బే బెబ్బే ” అంటూ ఎడంచేత్తో బోషాణం పెట్టిని పట్టుకొని, కుడికాలిమీద బలవంతంగా పైకి లేచారు. ఆసరాకి మరోచెయ్యి, అడుగెయ్యడానికి  ఇంకో కాలూ సహకరించక, మామ్మియ్య   అదుపు తప్పి బోర్లా పడిపోవడంతో నుదుటికి పెద్దదెబ్బ తగిలేసింది.అదిచూసిన  మామ్మియ్య వైపు  చుట్టాలూ,  మైనర్ మావయ్యా,  అయ్యో అయ్యో అంటూ లోపలకి పరిగెడుతుంటే…

” నాకు ట్రెయిన్ కి టైం అయిపోతోంది, నన్నెళ్ళొద్దని అత్తయ్యాజ్జీ చెప్పాలనుకుంటున్నారేమో? కాస్త మీరే సర్ది చెప్పండి ” వెనకనుంచే పరిగెత్తేవాళ్ళకి చెప్పి “బండిని పోనియ్యండి” అన్నారు. బూరయ్యతో   సీతమావయ్య.

కనీసం బండన్నా దిగకుండానే, పడిపోయిన మామ్మియ్యని పలకరించకుండానే,  సీతమావయ్య అలా వెళ్ళిపోవడం అరుగు మీద నిలబడి  చూస్తున్న చిరంజీవికి నచ్చలేదు. సీతమావయ్య ఎందుకో మరాద్దప్పేరనిపించింది.

దారి పొడుగునా తెలిసిన వారెవరైనా కనిపిస్తే, బండిని ఆపించి, వారి నుంచి ఎంతో కొంత సానుభూతిని మూటగట్టుకుంటూ, సీతమావయ్య ఊరి పొలిమేరలు దాటారు.అక్కడకి వెళ్ళేసరికి  నెత్తిమీద రేకుపెట్టె, ఓ జబ్బకి  చేతి చిక్కం తగిలించుకొని కోలంకవైపు నడిచి వెళుతున్న ఓ ఆడమనిషి బండి ఆపమంటూ సైగ చేసింది.

” య్యా యేటీ? ” అన్నాడు బూరయ్య బండి ఆపి.

” కూతంత, ఆ కోలంక దగ్గర దింపెయ్యరా అయ్యా.బస్సుకి ఆలీసవైతే రాజమంద్రంలో రెయిలు తప్పోతాది ” బతిమాలింది ఆ ఆడ మనిషి.

“ఎళ్ళెళ్ళు, బాడుగ బండనుకుంట్నావా? రాజుల సవారీబండిది. నీలాటోళ్ళనెక్కించుకుంటే ఆళ్ళ మరేదేమన్నా మిగుల్దా లెగు లెగాసి ” అంటూ విసుక్కున్నాడు బూరయ్య గిత్తలని అదిలిస్తూ.

” ఎవరండీ వారు ? ” అడిగారు సీత మావయ్య బాధనిండిన కళ్ళని తెరవకుండానే.

” మనూరేనండె, బోదిగట్టునుంటది కదండీ నాగమ్మ. దాని కూతురు సరసమ్మండి.  కోలంక దాకొత్తానని లబలబలాడతందండి ”

” అరరే, ఆ నాగమ్మ గారు మనింట్లోనే కదండీ పని చేస్తున్నారు. వారి అమ్మాయిగారా,   పాపం ఎక్కించుకోండి. ఏం పోయింది? ” అన్నారు సీత మావయ్య దయ తలుస్తూ. బండి వెనక నుంచి ముందుకు జరుగుతూ.

గిత్తలు పరుగు వేగం పెంచాయి.

కోలంకలో   సరసని దింపేసిన సీతమావయ్య, కాకినాడ రైల్వే స్టేషన్ దాకా సవారీ బండి మీదవెళ్ళి అక్కడ నుంచి  చెన్నపట్నం  వెళ్ళే రైలు ఎక్కేసారు.

రాజమండ్రి బ్రిడ్జ్ మీదనుంచి చెన్నపట్నం రైలు డబడబమంటూ పోతోంది.

వెళ్తున్న రైల్లోంచి గోదారిని చూడ్దం సీతమావయ్యకి మొదట్నుంచీ సరదా.

ఎప్పట్లాగే అలవాటుగా గోదారిని చూద్దామని, రైలు తలుపు దగ్గరకొచ్చిన సీతమావయ్య అప్పటికే అక్కడ నిలబడి గోదారి అందాన్ని చూస్తున్న  సరసని చూసి ” నువ్విక్కడున్నావా? ” అన్నారు.

పనోళ్ళనీ, పిల్లల్నీ కూడా ‘ అండీ ‘, ‘రండీ’, ‘ ఏవండీ’ అని మర్యాదచేసే సీతమావయ్య  సరసని ‘ నువ్వు ‘ అనడం  చూసివుంటే? చిరంజీవి ఏమనుకునేవాడో? కానీ  అక్కడ లేడు కదా!.

*

మోహన రాగ మహా……

tyagaraja-inmemory

కొందరు స్త్రీలు, కొన్ని సమయాలు!

konninakshtralu-cover-page

 

నేనెన్నో పుస్తకాలను పరిచయం చేశాను. నాకు నచ్చిన పుస్తకాలను చదవమని చాలామందికి చెబుతుంటాను. కాని ఓ పుస్తకం నాకు బాగా నచ్చినా – దాన్ని చదవమని నేను అందరికీ ధైర్యంగా రికమెండ్ చేయలేకపోతున్నాను. అయినప్పటికీ… చదవాల్సిన ఆ పుస్తకం – విమల గారి కథల సంకలనం కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు‘. ఎందుకంటే ఈ పుస్తకం చదువరులను ఓ రకమైన నిర్వేదంలో ముంచుతుంది. వాళ్ళ మనసులను వ్యథాభరితం చేస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సమస్యలుంటాయి, కాని మరీ ఇన్నా అని అనిపిస్తుంది. పరిష్కరించలేని, జటిలమైన సమస్యలు ఎందరి జీవితాలను ఊపిరాడకుండా చేస్తున్నాయో ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది.

స్త్రీలు, బాలికలు, ఆసరా కోల్పోయినవాళ్ళూ, నిరాశ్రయులూ, చాలీ చాలని ఆదాయాలు సంపాదించేవాళ్ళూ, కుల మత లింగ భేదాల ఆధారంగా వివక్షకు గురైనవారూ… ఇలా ఎందరెందరివో దుఃఖాలు, వెతలు… భద్రజీవుల మొద్దుబారిన మనసును కదిలిస్తాయి. స్పందించే గుణం ఉన్నా ఏ రకంగానూ సాయం చేయలేని సానుభూతిపరుల నిస్సహాయత… ఇవన్నీ కలగలిసి మన మీద మనకే ఓ రకమైన రోత కలుగుతుంది. మనసులోని కల్లోలాన్ని అదుపు చేసుకుని, గుండెని దిటవు చేసుకుని ఈ పుస్తకాన్ని చదవాలి, ఇతరులతో చదివించాలి కూడా. అభద్రతా వలయంలో బతుకుతున్న అనేకానేక జీవులకు మనమీయగలిగే కనీసపు ఊతం – ఈ పుస్తకం చదివి – వాళ్ళని కాస్తయినా అర్థం చేసుకోవడం! అలాంటివాళ్ళూ తారసపడినప్పుడు తలవంచుకుని తప్పుకునిపోకుండా – కాస్త సాంత్వన కలిగేడట్టు పలకరింపుగా ఓ చిరునవ్వయినా నవ్వగలగడం!

ఇక ఈ పుస్తకంలోని కథలను పరిచయం చేసుకుందాం.

***

నాలుగేళ్ళపాటు భరతనాట్యం నేర్చుకుని, నృత్య కళాకారిణి అవ్వాలనుకున్న ఓ యువతి ఆశలు ఎలా తారుమారయ్యాయో “నల్లపిల్ల నవ్వు” కథ చెబుతుంది. అయినా ఆమె జీవన పోరాటం ఆపదు. ఏం చేసైనా బ్రతకాలనుకుంటుంది. ఇద్దరు పిల్లల్ని పోషించాలి. గత్యంతరం లేక సినిమాల్లోనూ/టీవీ సీరియళ్ళలోనూ గ్రూప్ డాన్సర్‌గా మారి జీవిక కల్పించుకుంటుంది. జీవిక కోసం కష్టపడే వ్యక్తుల ధైర్యాన్ని చాటుతుంది ఈ కథ.

ఉద్యమంలో పనిచేసేవారి అవసరాలు, ప్రాధాన్యతా క్రమాలు వేరు. లక్ష్యం కోసం వ్యక్తిగత ఆసక్తులను/ఆకాంక్షలను అణుచుకుంటారు. విప్లవ నేపథ్యం నుంచి రాసిన ప్రేమ కథ “కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు“. జీవితం పట్ల ప్రేమ కథ ఇది. ఒకే ఊరిని కథ ఆరంభంలోనూ, చివర్లోనూ రెండు కోణాలలో చూపించి; మారని జీవితాలనీ, మారిన ఊరుని పరిచయం చేస్తుందీ కథ.

యాభై నాలుగేళ్ళ వయసున్న మాధవి అనే లెక్చరర్‍ మొబైల్‌కి వేళాపాళా లేకుండా ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతుంటారు కొందరు. అత్యంత జుగుప్సాకరంగా వర్ణనలు చేస్తూ ఆమెని వేధిస్తూంటారు. విసిగి వేసారిన ఆమె పోలీస్ కంప్లయింట్ ఇస్తే, ఆ కాల్స్ ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారో ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకుంటారు పోలీసులు. తీరా వెళ్ళి చూస్తే, అందులో ఇద్దరు ఆమె స్టూడెంట్సే! “నీ వయసెంతయినేం, నువ్వెవరైతేనేం..?” అంటూ తన అవయవాల గురించి మాట్లాడిన పిల్లల్ని ఏం చేయాలో ఆమె కర్థం కాదు. పోలీసులు వాళ్ళని తిట్టినా… ఆ తిట్లు కూడా స్త్రీలకే తగులుతున్నాయని గ్రహిస్తుంది. ఆ రాత్రి ఎవరెవరు “దేహభాష“ను మాట్లాడబోతున్నారో… అని అనుకుంటూ ఒకానొక అచేతన స్థితిలో ఉండిపోతుందామె.

విడివిడిగా మంచివాళ్ళయిన ఇద్దరు స్త్రీ పురుషులు ఎందుకు మంచి భార్యాభర్తలు కాలేకపోతారో చెబుతుంది “వదిలెయ్” కథ. పురుషాహంకారంతో భార్యపై చేసే కామెంట్లు, హేళనలు, విసుర్లు – వారినెంత ఆవేదనకి గురి చేస్తాయో, అటువంటి స్త్రీలు తమలోని సృజనాత్మకతని ఎలా కోల్పోతున్నారో చెబుతుందీ కథ. ఇటువంటి పరిస్థితులలో తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుని, మరి కొంతమందికి స్ఫూర్తినిచ్చిన ఓ మహిళ కథ ఇది.

మనని వద్దనుకున్న మనిషితో కలసి జీవించాల్సి రావడం ఎంత దుర్భరమో “మా అమ్మా, ఆమె దోస్త్ మల్లి” కథ చదివితే అర్థమవుతుంది. మానసికంగా ఒంటరిగా ఉండడం ఎంత వేదన కలిగిస్తుందో, ఎంత క్రుంగదీస్తుందో తెలుస్తుంది. భౌతికంగా అందరితో కలిసి ఉన్నా, జీవితానందం కోల్పోయిన మహిళ కథ పాఠకులని కదిలిస్తుంది.

ఆడపిల్లల శరీరమే కాదు, వాళ్ళ ఆలోచనలూ ఎందుకో ఒక్కసారిగా ఎదిగిపోయినట్లనిపించిన ఓ తల్లికి – తన కూతురిక లేదనే వాస్తవం జీర్ణించుకోడం కష్టమవుతుంది “దౌత్య” కథలో. ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకునే ముందు తల్లిదండ్రులకీ, అన్నయ్యకీ ఓ ఎస్.ఎమ్.ఎస్. పంపుతుంది. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడిన క్షణాల్లో తాము ఆమె దగ్గర లేమని విలవిలలాడిపోతాడా తండ్రి. స్త్రీల హృదయ భాషని అర్థం చేసుకోలేని వ్యక్తిని ప్రేమించి మోసపోయినందుకు బలవంతంగా తనువు చాలించి తల్లిదండ్రులకు క్షోభని మిగిల్చిన ఆ అమ్మాయి లేవనెత్తిన ప్రశ్నలకు ఎవరు జవాబిస్తారు?

అరణ్యంలోకి నిస్సంకోచంగా వెళ్ళిన ఓ మహిళ అడుగులు జనారణ్యంలోకి వచ్చేసరికి ఎందుకు తడబడ్డాయి? తాము నమ్మిన నమ్మకాలపైనే నమ్మకం ఎందుకు సడలిపోయిందామెకు? దేన్నయినా, ఎవరినైనా ప్రశ్నించగల ధైర్యాన్ని, ఒంటరి పోరాటాలలో కోల్పోయిన “కనకలత” జీవితం విషాదమయం!

‘జీవితాన్ని రకరకాల దారులలో తిప్పి, అలసి సొలసి, లోలోన విధ్వంసమై, చివరికి వీధుల పాలై, దేశద్రిమ్మరులై….’ బ్రతుకుతున్న వారితో ఒక రాత్రి గడిపేందుకు ప్రయత్నించిన బృందానికి – కలవరం కలిగించే ప్రశ్నలు ఎదురవుతాయి. “చుక్కల కింది రాత్రి” మనలో ఓ పెనుగులాటకి కారణమవుతుంది.

విశాలమైన ప్రపంచంలో, తానెక్కడో ఒక ఇరుకు మధ్య కూలబడి బ్రతుకుతున్నానని అనుకున్న ఓ యువతి, మిత్రుడి సహాయంతో కొత్త రెక్కలు తొడుక్కుంటుంది. అతని ప్రభావంతో ఉద్యమాలలోకి అడుగుపెడుతుంది. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారు. ఇద్దరూ కలసి కొన్నేళ్ళు పని చేశాకా, అతన్నీ మరి కొంతమందిని అరెస్టు చేస్తారు. విచారణ అనంతరం అతనికి యావజ్జీవ శిక్ష పడుతుంది. ‘ఎవరో ఒకరికి ఎడబాటు శాశ్వతమైన చోట, మరొకరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి’ అంటూ ఓ ఉత్తరం ద్వారా ఆమెకి సూచిస్తాడు. ఉద్యమాలలో పని చేసే ఆప్తుల్ని కోల్పోవడం ఎంత విషాదంగా ఉంటుందో “మార్తా ప్రేమకథ” చెబుతుంది.

‘మన చిరునవ్వును, అందాన్ని చూపితే మోజుపడతారే తప్ప, మన మనసు గాయల్ని చూపితే బాధపడి బాధ్యత తీసుకునే వాళ్ళెవరూ ఉండర’న్న వాస్తవాన్ని ముగ్గురు మహిళల జీవన నేపథ్యంతో చెప్పిన కథ “వాళ్ళు ముగ్గురేనా?“. పులిస్వారీ ఆటలో పులి తనని తినేయకుండా కాచుకుని కాచుకుని అలసిపోయిన ఓ స్త్రీ గొప్ప మనోనిశ్చయంతో తనకిష్టమైన జీవన విధానంలోకి మారడానికి ప్రయత్నిస్తుంది.

బయటకి తక్కువగా మాట్లాడుతుందని అనిపించే నీల – తన లోలోపల, తనతో తానే ఎడతెగని సంభాషణ సాగిస్తుంది. జీవితం సంక్లిష్టమైన, పూరించడం కష్టమైన గళ్ళ నుడికట్టులా మారిన యువతి కథ “నీలా వాళ్ళమ్మ, మరి కొందరు“. భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే దాని ఆనవాళ్ళు భార్య ముఖంపైనే ఎందుకు కనబడతాయని ఈ కథ ప్రశ్నిస్తుంది. తమకి శారీరకంగా బలం తక్కువ అనీ, పురుషులనే అహంకారంతోనూ భార్యలపై భర్తలు చేసే దాష్టీకాన్ని ఒక్క వాక్యంలో చెప్పారు రచయిత్రి. చావంటే మనుషులు హఠాత్తుగా మాయమైపోవడం’ అని రచయిత్రి మరణం గురించి చెప్పిన మాటలు చదువుతుంటే అప్రయత్నంగానే ఒళ్ళు జలదరిస్తుంది.

‘కలలకీ కన్నీళ్ళకీ కాలం కాదిది’ అని భావించే విరాళి తనిష్టపడిన వ్యక్తితో జీవితం పంచుకోలేకపోతుంది. మనసులో తడి ఆరి, బీటలువారి బండరాయిలా ఘనీభవించిపోతుందామె. ‘మాడుగ వాసన వేస్తున్న జీవితం నాది’ అని అనుకుంటుంది. పాతమిత్రులు కలసినప్పుడు, “ఒక్కోసారి ఒడ్డున కూర్చుని మనం నదిలా ప్రవహించడాన్ని మనమే చూసుకుని నవ్వుకోవాలి” అంటూ ఓ మిత్రుడు చెప్పిన మాటలు ఆమెలో జీవితేచ్ఛని మళ్ళీ రగిలిస్తాయి. మనకి ఇష్టమున్నా లేకున్న మన జీవితాలలోకి చొచ్చుకువచ్చే మార్పులని అధిగమించి ముందుకు సాగాలని సూచిస్తుంది “సూర్యుడి మొదటి కిరణం” కథ.

***

ఇంతమంది స్త్రీల బాధలను మన గుండెల్లోకి పంపి మనల్ని సున్నితం చేయబూనుకున్న విమల కథలను ఇష్టపడటం మొదలుపెడతాం. విమల కథలను ఇష్టపడటం అంటే బాధను అర్థం చేసుకోవడం. బలహీనులను అర్థం చేసుకోవడం. బలహీనులుగా కనిపించేవారిలో బాధితులుగా కనిపించేవారిలో ఉన్న బలాన్ని అర్థం చేసుకోవడం” అంటారు ఓల్గా. ఈ కథలు చదివాక, ఓల్గా గారి అభిప్రాయంతో ఏకీభవించని పాఠకులు ఉండరని నా ఉద్దేశం.

చినుకు ప్రచురణలు, విజయవాడ వారు ప్రచురించిన ఈ 215 పేజీల పుస్తకం వెల 120/- రూపాయలు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది.

ప్రేమ పల్లకీ

లోగో: భవాని ఫణి

లోగో: భవాని ఫణి

 

థ లేకుండా కేవలం ఒక కొత్త జంట మధ్య జరిగే సరదా సన్నివేశాలతో ఒక నవల రాయడం చాలా కష్టం. అది శ్రీరమణ ఎంత సక్సెస్ ఫుల్ గా చేశారంటే,ఆయన ఈ నవలని పెద్దగా నచ్చక పోయినా, పాఠకుల్లో యూత్ అబ్బాయిలంతా అప్పట్లో  హీరోయిన్ గీతను అమాంతంగా ప్రేమించేశారట. ఈ నవల గురించి విశేషాల కోసం శ్రీరమణ గారిని కదిలిస్తే చాలా సంగతులు చెప్పారు. 1976 లో ఆంధ్ర జ్యోతిలో సీరియల్ వచ్చిన ఈ నవలను ఆయన ఆట్టే ఆసక్తి గా ఏమీ మొదలు పెట్టలేదాయన. ఫుల్ టైమ్ గా పని చేస్తూ రెండు చేతుల్తో  బిజీగా ఉన్న ఆ పాతికేళ్ళ వయసులో, టీ కప్పులో సూర్యుడు, రంగుల రాట్నం వంటి ఫేమస్ ఫీచర్లతో అతి బిజీగా ఉంటూ పురాణం సుబ్రహ్మణ్యం గారి కోరిక మేరకు  ఏ వారానికి ఆ వారం హడావుడికి  రాసిచ్చేస్తూ ప్రేమ పల్లకీ ని అలంకరించారు. ఆయన రాసిన ఏకైక నవల ఇది! పైగా ఆయనకు పెద్దగా నచ్చని, తృప్తినివ్వని నవల. అయినా పాఠకులు గీతను తమ ఇంటి పిల్లగా చేసుకుని సూపర్ హిట్ చేసి కూచోబెట్టి అందమైన నేత చీరతో సారె పెట్టారు. 

 aamani1
అందంగా, తెలివిగా ఉంటూ, ఆ తెలివిని అవసరమైన చోట వాడుతూ,  మొగుడి గారి ఇగో గాయపడకుండా చాకచక్యంతో కథ నడిపించి ఎప్పటికప్పుడు గట్టున పడేస్తూ ఉండే గీతకి అసంఖ్యాకంగా ప్రేమికులు ఏర్పడిపోయారు ఆ రోజుల్లో! కుర్రాళ్లంతా , చేసుకుంటే అలాటి పిల్లను చేసుకోవాలని తెగ ఉవ్విళ్ళూరారట. బాపు రమణలకు కూడా  గీత తెగ నచ్చేసింది . అందుకే మిస్టర్ పెళ్ళాం, పెళ్ళి పుస్తకం హీరోయిన్లలో గీత  ప్రతిఫలించేలా చూసుకున్నారు. ముఖంగా మిస్టర్ పెళ్ళాం లో! ఆ సినిమా  చూసినపుడు, ఆమని పాత్ర చాకచక్యం, తెలివీ, పని తనం  ఎక్కడో చూశా ఈ పిల్లను అనిపించేది గానీ ఆ పిల్ల “గీత” అని తట్టనే లేదు. మొన్న శ్రీరమణ గారు చెబుతుంటే “అవును, గీతే సుమా ” అనిపించింది. బహుశా గీతను నేను ఆమని రూపంలో కాక మరో రకంగా మనసులో చిత్రించుకుని ఉంటాను  
 
అన్ని పుస్తకాలూ ఒకే రకంగా నచ్చవు. కొన్ని మెదడులో రగిలించే ఆలోచనలతో పరుగులు పెట్టించి నచ్చితే, మరి కొన్ని చల్లని పడవ ప్రయాణంలా సాగుతూ ఆ పయనం వల్ల నచ్చుతాయి. మరి కొన్ని మరో రకంగా! శ్రీరమణ గారి రచనలెప్పుడూ రెండో రకమే! 
sreeramana
 
మిధునం, బంగారు మురుగు, ధనలక్ష్మి,సోడా నాయుడు.. ప్రతి కథా అంతే! నాకు బుచ్చి లక్ష్మి కంటే ధనలక్ష్మి ఎంతో ఇష్టమైన పాత్ర! ఆ కథను ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు. ఇంట్లో మగవాళ్ల అహాన్ని  తృప్తి పరుస్తూనే మరో వైపు కాడికి రెండు వైపులా తనే ఇద్దరై మోస్తూ.. సంసారాలను కల్పవృక్షాలుగా చేసిన ధనలక్ష్ములు మన చుట్టూరానే ఎంతోమంది ఉంటారు. అలాటి వాళ్ళందరినీ ఆ పాత్ర లో ప్రతిష్టించారు రచయిత.  ఆ భర్తలకు కూడా తెలుసు , భార్యలు తమ అహాన్ని తృప్తి పరుస్తున్నారని, వాళ్ల సామర్థ్యంతో తాము తూగలేమనీ!  
 
శ్రీరమణ రచనలతో ఎక్కడో సున్నితంగా కనెక్ట్ అయిపోతూ… ఆ బంధాలతో మనం కూడా బంధం పెంచేసుకుంటాం.  ఏ రచన అయినా , చదివాక , అక్కడ పడేసి లేచెళ్ళి పోలేం! అపురూపంగా  ఆ రచనను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ హాయిగా వెనక్కు వాలి కాసేపు స్థిరంగా దాన్ని అనుభూతించాలని అనిపిస్తుంది. అదెలా ఉంటుందంటే దీపావళి రోజు అమెరికాలో కూచుని ఇండియాలో వెలిగే దీపాల్ని, పేలే టపాసులని దిగులుగా ఊహించుకున్నట్టు .
 
నాలుగు  దశాబ్దాలకు ముందు ఆంధ్ర జ్యోతి వార పత్రికలో సీరియల్ గా వచ్చిన ఈ నవల తర్వాత విడి నవల గా పబ్లిష్ అయింది.ఆ నవల సీరియల్ గా వచ్చినన్నాళ్ళూ, సస్పెన్స్, ఉత్కంఠ రేకెత్తించే అంశాలు ఏవీ లేక పోయినా, గీత రాంపండు ల  ప్రేమప్రయాణం ఈ వారం ఆ పల్లకీ లో ఎలా సాగిందో తెల్సుకోవాలన్న ఉత్సుకతతో పాఠకులంతా ఎదురు చూసే వాళ్లట. 
 
శ్రీరమణ గారి రచనల్లో పాత్రలన్నీ సగటు పాఠకుడికి ఎక్కడో ఒక చోట తారస పడేవే. కానీ వాళ్ళని రచయిత మళ్ళీ మనకు పరిచయం చేస్తుంటే, కొత్తగా అర్థమవుతుంటాయి. మనం మిస్ అయిన కోణాన్ని రచయిత పట్టుకుని మనకు సున్నితంగా అందించేసి నిశ్శబ్దంగా తప్పుకుంటారు.పాఠకుడు మాత్రం ఆ అనుభూతిలో చాలా సేపు ఉండి పోతాడు. 
 
ఈ నవల్లో కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు నిజానికి. ఒక కొత్త జంట, పెళ్ళయి ఎనిమిది నెల్లలంటే ఎనిమిది నెలలైన ఒక కొత్త జంట సరి కొత్తగా కల్సి మొదలెట్టిన ప్రణయ నౌకా విహారమే ఈ నవల. చిలిపి కజ్జాలూ, అలకపాన్పులూ, సరదాలూ, కూసింత జీవితం, వీళ్ల చుట్టూ నలుగురు మనుషులూ, వాళ్ల మనస్తత్వాలూ, కొన్ని ప్రేమలూ, పచ్చని తాటాకు పందిరిలో పెళ్ళి వాతావరణంలో చోటు చేసుకునే హాస్యాలూ , పెదవులపై అవి పూయించే చిరునవ్వులూ.. ఇంతే!
 
గీత, రాంపండు(aka రామకృష్ణ) కాపురముంటున్న అద్దె కొంప కి రైలు పెట్టెల్లా వరసాగ్గా మూడు గదులు.  అలాగని ఎవరైనా “ఎంతైనా ఈ ఇంట్లో గాలీ వెలుతురూ తక్కువే” అనంటే ఆ ఇంటి ఓనరు ఉగ్రుడై పోయి “అవును, మాది గాలి కొంప కాదు” అంటాట్ట. రాంపండు మొహమాటమనే కవచంతో పుట్టిన మనిషి. గీతేమో గల గల పారే సెలయేరు.రాంపండుకి  ఎవరితో ఎక్కడ ఏం మాట్లాడాలో బొత్తిగా అర్థం కాదు, తెలీదు. అసందర్భంగా ఏదో ఒకటి అనేసి నిలువునా దొరికి పోతుంటాడు. గీత భగవద్గీతలా రాంపండు  వెనకాలే ఉండి, అతని మొహమాటం వల్ల వచ్చే కష్టాల్ని  ఎప్పటికప్పుడు సాల్వ్ చేసేసి, గట్టెక్కించి “ఆన్సర్ చూసుకో”అన్నట్టు మొహం పెడుతుంది.   
 
 చల్లగా సంసారం సాగి పోతున్నా రాంపండుకి మనసులో ఏదో అసంతృప్తి.  ఏదో షాపులో సేల్స్ గాల్ తో క్లోజ్ గా మాట్లాడుతున్న అబ్బాయిని చూసి “వాళ్ళిద్దరూ లవర్సు! అందుకే అంత క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు. “అని తనే తీర్మానించుకుంటాడు. తనకు “లవర్ లైఫ్” లేకుండానే పెళ్ళై పోయిందని మనసులో ఉన్నా గీత ముందు బయట పడడు. ఆవలింత రాబోతుండగానే పేగులు లెక్కెట్టే గీతకు రాంపండు మనసులో ఏముందో కనుక్కోడం పెద్ద కష్టం కాదు. 
 
రాంపండు కి ఇలా తీరకుండానే మిగిలిపోయిన అతి చిన్న కోరికల్లో పెళ్ళిలో “పల్లకీ” ఎక్కి వూరేగాలని! పాపం అతని పెళ్ళిలో మునసబు గారి ఇంజను లేని కార్లో నెట్టుకుంటూ శక్తి కొద్దీ, స్థోమత కొద్దీ గీతా వాళ్ళు ఊరేగింపు ముచ్చట కూడా తీర్చారు కానీ, ఇంజను లేని  కార్లో ఊరేగింపు అని తల్చుకున్నపుడల్లా రాంపండు ఒళ్ళు జల్దరిస్తూ ఉంటుంది.  
prema-pallaki-cover-page 
రాంపండు ఆఫీసులో పని చేసే చలాకీ భానుమతి, ఆవిడ మొగుడూ వీకెండ్స్ ఇంట్లో బోరు కొట్టించుకోకుండా స్టార్ హోటల్ లో రూము తీసుకుని జాలీగా గడిపేస్తారని తెలుసుకున్న రాంపండు కి స్టార్ హోటల్లో గది ఎలా ఉంటుందో చూడాలని తపన పట్టుకుంటుంది. హోటల్ కి వెళ్ళాక రిసెప్షన్ లో స్కర్ట్ వేసుకున్నమాయి తో ఏం మాట్లాడాలో తెలీక ముందే, ఆ పిల్ల రిజిస్టర్ తీసి “ప్లీజ్” అనగానే , నేను రూము చూడ్డానికొచ్చానని చెప్పడానికి మొహమాటం అడ్డం పడి “సింగిల్ రూం” అంటాడు. రూము బుక్కై పోతుంది. జేబులో డబ్బుల్లేవు. “తర్వాత పంపిస్తాను” అని రూములోకి వెళ్తే, మతి  పోతుంది భయమేస్తుంది. స్కర్టమ్మాయి చూడకుండా బయట పడతాడు గానీ గీతకి చెప్పాలంటే దడ. పాల పాకెట్ కోసం చిల్లర కోసం జేబువెదికిన గీతకు రసీదు దొరికితే.. గీత, అనుమాన పడదు. రాంపండు వ్యవహారం తెలిసిందే కాబట్టి తనే వెళ్ళి రూము డబ్బు కట్టేసి కీ ఇచ్చేసి వచ్చి “ఆన్సర్ చూసుకో” అని మొహం పెడుతుంది.
 
పైకి డాబుగా కనిపిస్తూ, విలాసాల్లో మునిగి తేలే మొగుడూ పెళ్ళాలు మూర్తీ హేమా చీటికీ మాటికీ రాంపండూ గీతల దగ్గర దర్జాగా అప్పులు దబాయించి పట్టుకెళ్తారు. వీళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ చెరో కథా చెప్పేసి బాంక్ లోన్ మీద సంతకాలు పెట్టేస్తారు.వీళ్ళు షాపింగ్ చేసిన వస్తువుల్ని “మేము నిన్ననే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం” అని జబర్దస్తు గా లాక్కు పోతుంది హేమ. సినిమాకెళ్తున్నామంటూ వీళ్ళని కూడా లాక్కు పోయి ఖర్చంతా పెట్టిస్తారు. రాంపండు మొహమాటాన్ని గీత తిట్టదు, విసుక్కోదు. నవ్వుతూనే అతని వెనకాలే ఉంటూ భరిస్తుంది. వీలైనంత వరకూ ప్రతి సమస్యనూ చాక చక్యంగా తేల్చేస్తుంది. 
 
రాంబాబు మనసులో ఉన్న “ప్రేమికుల” కోరికను గీత ఆ మాత్రం  గ్రహించలేదా ? అందుకే ఒక రోజు లంచ్ బాక్స్ తెరిర్చే సరికి “రేప్పొద్దున నుంచీ ప్రేమికులుగా మారి పోదాం, పెళ్ళయిన సంగతి మర్చిపోండి” అని చీటీ కనిపిస్తుంది. ఈ ఎదురు చూడని సర్ప్రైజ్ బాగానే ఉంటుంది కానీ అనుభవంలోకొచ్చాక రాంపండుకి ఒళ్ళు మండేలా చేస్తుంది. గీత “ఏవండీ”లు మనేసి “ఏమోయ్” లోకి దిగుతుంది. ఇంట్లో ఒక ఫుల్ టైమర్ పని పిల్లను పెడుతుంది. “ప్రేమికులన్నాక పొద్దూకులు ఇంట్లో పన్లు చేసుకుంటూ ఉండరు! ఒక ఫుల్ టైమర్ ఉండాలి” అంటుంది. ఆర్భాటంగా ఇంట్లోనే బర్త్ డే చేస్తుంది రాంపండు కి. అదేమంటే “ప్రేమించిన పిల్ల తలంటు పోయడం ఎక్కడైనా ఉందా అసలు ? మనం లవర్స్  కదా “
 
 బట్టలు తనే సెలెక్ట్ చేసి ఖరీదైన టైలర్ దగ్గర బెల్ బాటంస్ కొలతలు ఇస్తుంది. “నువ్వు చాలా హడావుడి చేస్తున్నావ్ గీతా” అని విసుక్కోగానే ” ఇప్పుడు మనం యంగ్ లవర్స్ మి కదా, గుండె కి గుండె అడగ్గానే ఇచ్చి పుచ్చేసుకున్న వాళ్ళం, ఇలాటి చిన్న విషయాల్లో వెంకాడ్డం బాగోదు” అంటుంది. 
 
గీత చెల్లెలు సీత పెళ్ళి  నవలను సరదాగా నడిపే మరొక ఎపిసోడ్. పెళ్ళికి ఇచ్చే బహుమతి మన అభిరుచిని ప్రతిబింబించేలా ఉండాలని రాంపండు అంటే గీత “స్టీలు కంచం కూడా బాగానే “ప్రతిబింబిస్తుంది” పోనీ అది కొందాం” అంటుంది.`
 
గీతా వాళ్ళ వూర్లో రాంపండుని అందరూ “అతనే గీత మొగుడు” గా చెప్పుకోడం రుచించదు. తనకి కొత్త గాజులు తెమ్మని అతన్ని బజారుకి పంపిన గీత అతను వీధిలో పదడుగులు నడిచాక వీధి అరుగు మీద నిలబడి ” కెంపు రంగు గాజులు తీస్కోండి. నిండు నీలం అయినా పర్లేదు, గానీ మెరుపులు వద్దు.” అని అరిచరిచి చెప్పడం రాపండుకి ఉడుకుమోత్తనం తెప్పిస్తుంది. ఆడంగి పన్లు చెప్పడమే కాక అవి నలుగురికీ తెలిసేలా కేకలు.  సిటీ బస్సెక్కితే, తను ఆడవాళ్ళ సీట్ల వైపు వెళ్ళి కూచుని, వెనక సీట్ల వైపు వెళ్ళిన కండక్టర్ కి “గళ్ల చొక్కాకి ఇక్కడ తీసుకున్నాం” అనగానే బస్ లో అన్ని తలకాయలూ రాంపండు గళ్ళ చొక్కా వైపు తిరుగుతాయి.  
 
ఇలాటి చిన్న సైజు అవమానాలు రాంపండుకి చాలానే జరుగుతాయి. . “ఈ గాజులు మా వారు తెచ్చారు” అని గీత అందరికీ చూపిస్తుంటే వినడానికి బాగానే ఉంటుంది కానీ తన్ని “గాజులు తెచ్చే మగాడి కింద కడతారేమో” అని భయమేస్తుంది. కొత్తగా కొన్న రీలు కెమెరాతో రాంబాబు బల్లలు, కుర్చీలు ఎక్కి పెళ్ళి ఫొటోలు తీస్తుంటే అందరూ వింతగా చూస్తుంటే రాంపండు గొప్ప ఫొటోగ్రాఫర్ గా ఫీలవుతాడు. స్టూడియో ఫొటోగ్రాఫర్ రాగానే గీత అందరి ముందూ “అమ్మయ్య,వచ్చారా?రక్షించారు” అనడం పాపం మింగుడు పడదు గానీ మింగక తప్పదు 
 5th-photo-220x300
 “బాత్ రూంలో కొత్తయ్య గారు స్నానం చేస్తున్నారు, మిమ్మల్ని బావి గట్టు దగ్గర చెయ్యమన్నారు” అని పని మనిషి చెప్పగానే గొప్ప రెస్పెక్ట్ పోయినట్టు ఫీలింగ్. సబ్బు కాస్తా జారి బావి లో పడిపోగానే పని పిల్ల ” అయ్యగారు సబ్బు బావిలో పడేశారు” అని పెద్దగా అరవగానే అందరూ బావి చుట్టూ చేరడం, వాళ్ల మధ్య  టవల్ కట్టుకుని  దోషి లా రాంపండు! “సబ్బు పోతే సరే, ఇప్పుడు వంటకి నీళ్ళు పక్కింటి బావి నుంచి తేవాల్సిందే” అని నిర్మొహమాటంగా విసుక్కుంటుంది పని పిల్ల! 
  
ఈ అవమానం నుంచి బయట పడదామని చూస్తుండగానే , దెబ్బ మీద మరో దెబ్బ! మధ్యాహం వేళ ఒక పదేళ్ల పిల్ల వచ్చి “గీతత్తయ్య నిన్ను రమ్మంది” అని చెప్పగానే గీత ఎక్కడుందో తెలుస్కుని మర్యాదగా వెళ్లాలా? ఆ పిల్లని ముద్దు చేస్తూ “ఎవర్నీ? నన్నా? నన్నే రమ్మందా మీ గీతత్తయ్య” అని సాగదీస్తుంటే “సబ్బు మావయ్యంటే నువ్వేగా?” అందా పిల్ల! ఒళ్ళు జల్దరిస్తుంది రాంపండుకి
 
“సబ్బు మావయ్యని రమ్మను” అని చెప్పి పంపిందా గీత! అందరూ తనకి ఆ పేరు పెట్టారా? మళ్ళీ అవమానం
 
మరదలి శోభనం ఏర్పాట్లు జరుగుతోంటే రాంపండుకి తన శోభనం గుర్తొస్తుంది. పాపం అదేమీ రస కావ్యం కాదు. ఫస్ట్ క్లాసు కూపే లో గీతతో కల్సి మద్రాస్ వెళ్దామని ప్లాన్ చేసి రైలెక్కాక, చివరి నిమిషంలో వచ్చిన గీతావాళ్ళ చుట్టాలాయన ఆరేళ్ళ పిల్లకాయని అప్పగించి “ఈ భడవని గూడూరులో వాళ్ళ నానొచ్చి దింపుకుంటాడు, తీసుకుపోండి, ప్రాణాలు తోడేస్తున్నాడు” అని అరటిక్కెట్టు కొని అప్పగించాడాయె, వాడు తెల్లవార్లూ పెట్టిన చిత్ర హింసలకి రాంపండు కలలన్నీ ఆవిరై పోయాయి. 
 
 సీత, సీత మొగుడూ వీళ్ళింటికి వచ్చినపుడు “మీ బావగారికి కజ్జికాయలు, కొబ్బరుండలు, పూతరేకులూ ఇష్టం” అని గీత చెప్పడం నచ్చదు. వెధవ పల్లెటూరి పిండివంటలన్నీ తనకు నచ్చుతాయని దేశమంతా చాటింపేయాలా?
 
“సీత మొగుడితో కాస్త మాట్లాడండి పాపం, ఆ అబ్బాయికి కొత్త కదా, మీరే కలుపుగోలుగా ఉండాలి” అని గీత చెప్పాక రాంపండు తోడల్లుడితో మాట్లాడే మాటలు
 
“మీరు గెజిటెడ్ రాంక్ లో ఉన్నారు కదండీ,మీ ట్రూ కాపీల మీద మీరే అటెస్టేషన్ సంతకాలు పెట్టుకోవచ్చు ఎంచక్కా”
 
ఆఫీసులో అతి సామాన్యుడు గా, అర్భకుడుగా కనిపించే శాస్త్రి పక్కింటి మేష్టారి అమ్మాయిని ప్రేమవివాహం చేసుకున్నాడని తెలిసి ఆశ్చర్య పోతాడు రాంపండు.  హేమ మూర్తీ తాను అనుకున్నంత సంతోషంగా లేరనీ, నిత్యం చలాకీ గా కనిపించే స్టెనో భానుమతి జీవితంలో కనిపించని సుడి గుండాలున్నాయనీ గ్రహిస్తాడు. గీతతో చెప్తే “ఇవన్నీ నాకెప్పుడో” తెల్సంటుంది.
 
“మా శాస్త్రి ఆదర్శ వివాహం చేసుకున్నాడు గీతా”
 
“అంటే పల్లకీ పెళ్ళా?”
  
“పల్లకీ లో ఏం లేదు గీతా”
 
“ఎన్నాళ్ళకి సత్యం బోధ పడింది స్వామీ “
 
నిజానికి గీత మొదటి నుంచీ రాంపండుకి అనుక్షణం అనుభవంలోకి తేవాలని ప్రయత్నిస్తున్నది ఇదే
 
ఇలా చిన్న చిన్న సరదా సంఘటనలూ, వాటిలో దాగున్న అతి సూక్ష్మమైన సూత్రాలతో హాయిగా సాగి పోతుంది గీత రాంపండుల ప్రేమ పల్లకీ ! చివర్లో రచయిత అంటారు “ఈ కథ పూర్తి కాదు. ఏ కథయినా అంతే!పెళ్ళయ్యాక ప్రేమ కథలు పల్లకీ దిగితే కానీ బయట పడవు. గీత రాంపండులు ఎవర్ గ్రీన్ దంపతులు. ఆ మాటకొస్తే మీరు మాత్రం కారేమిటి?కొన్నాళ్లు ఆగితే వాళ్ళిద్దరూ ఏ కథలు చెప్తారో, మనం కాస్త ఆగాల్సిందే”  
 
అయితే ఆ తర్వాత గీత రాంపండులో లేక శ్రీరమణ గారో  బిజీ అయిపోయినట్టున్నారు. ఏ కథలూ చెప్పలేదు. ఆ పాత్రలతో శ్రీరమణ గారు మరో కథ రాయడం గానీ, దీనికి సీక్వెల్ రాయడం గానీ చేయలేదు.
 
ఒక మిడిల్ క్లాస్ జంట వాళ్ళిద్దరూ! కాలంతో పాటూ మిడిల్ క్లాస్ కి నిర్వచనం మారి పోయింది అనివార్యంగా! రాంపండు వాళ్ళుండే అద్దె కొంపను వర్ణిస్తూ రచయిత ఇలా రాస్తారు.”ఇంట్లో ఉన్న కొద్ది పాటి విలాస వస్తువులనీ మధ్య గదిలో పెట్టుకుని ఆనందిస్తున్నారు. ఒక టేబుల్ ఫాను, పోర్టబుల్ రేడియో,అలారం టైం పీసు,చిన్న సైజు ఇనప బీరువా,దాని మీద రెండు సూట్ కేసులూ, ఒక ఆఫీసు టేబులు, ఇవి కాక డబుల్ కాట్ బెడ్….” ఆ మధ్య గదిలో వొదిగిన విలాస వస్తువుల జాబితా ఇది. అవసరం కొద్దీ కొనడం, అవసరమైనవి మాత్రమే కొనడం అనేవి ఇవాళ్టి జీవితాల్లోంచి మాయమై చాలా కాలమైంది. అందుకే నలభయ్యేళ్ళ క్రితం నాటి ఆ విలాస వస్తువుల్ని చూసి, ఒక్క క్షణం కాంటెంపరరీ పాఠకుడు అబ్బుర పడతాడు.
 
మధ్యతరగతి జీవన సౌందర్యం అనుభవంలోకి వస్తే గానీ తెలియని ఒక గొప్పసత్యం .  ఎంతో శాంతి, పరిపూర్ణత్వం, సమతుల్యం, నిబ్బరం ఇవన్నీ మధ్య తరగతి జీవితం సంపాదించుకున్న ప్రత్యేకతలు, మనిషికి నేర్పే లైఫ్ స్కిల్స్ కూడా  ! 
 
నటి భానుమతి రచయిత్రి జలంధర గారికి చెప్పారట ” మీ ఆయన ఎంత సంపాదించినా సరే, జీవితంలో అప్పర్ మిడిల్ క్లాసు జీవన శైలిని కోల్పోవద్దు” అని!(సారంగలోనే మైథిలి అబ్బరాజు గారు జలంధర గారిని చేసిన ఇంటర్వ్యూలో) ఆ వాక్యాలు ఎంత ఆకట్టుకుంటాయంటే ప్రతి ఒక్కరూ వాటిని ఒక జీవన వేదంగా స్వీకరించాలనిపిస్తుంది . బాపు, రమణలు, శ్రీరమణ గారు కూడా మధ్యతరగతి జీవితాన్ని తాము అనుభవించడమే కాక, దాన్లోని సౌందర్యాన్ని పాఠకులందరిలోనూ నింపి, అవగతం చేసి పాఠకుడి నట్టింట్లో దానికి మాంచి నరసరావు పేట పడక్కుర్చీ వేసి కూచోబెట్టారు. 
 
ఈ నవల్లోని ప్రతి సంఘటనా మిడిల్ క్లాస్ ఇళ్ళలో అందరికీ ఎక్కడో ఒక చోట ఎదురయ్యే ఉంటుంది. భానుమతీ, శాస్త్రీ,మూర్తీ, హేమా,అందరూ మన ఎరికలో వాళ్ళే అనిపిస్తుంది.   అందుకే 1976 నుంచీ ఇవాళ్టి ఉదయం వరకూ కూడా గీత రాంపండు ఎవర్ గ్రీన్ జంటగానే ఉండి పోయారు. ఉండి పోతారు కూడా! నలభయ్యేళ్ళ క్రితం కొత్తగా పెళ్ళాడి విజయవాడ లాంటి సిటీలో కాపరం పెట్టిన ఆ జంటకి ఈ నాటికీ, ఏ నాటికీ వయసు పాతిక, ముప్ఫయి లోపే! 
 
నవలను నవోదయ విజయవాడ వాళ్ళు వేశారు, కవర్ పేజీ బాపూ! ఈ కవర్ పేజీని అడగ్గానే సంతోషంగా పంపిన శ్రీరమణ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న ఈ నవలకు అప్పటి నుంచీ కవర్ పేజీ లేకుండానే అనేక సార్లు చదివాను, కవర్ పేజీ ఏమై ఉంటుందా అని ఊహించుకుంటూ.
 నవల బయట షాపుల్లో దొరక్క పోవచ్చు కానీ ఆన్ లైన్లో ఒక చోట ఉందని సమాచారం ఉంది . ప్రయత్నించవచ్చు
 *

ఇక్కడ గొంతులు నొక్కబడును

డేవిడ్ కథకు పాఠాంతర పరామర్శ

ఆకాశంలా ఆవరించిన అనుభవంలో అరూప్యమైన మబ్బు తునకల వంటివి కదా జ్ఞాపకాలు. ఎగుడుదిగుడు అంతరంగంలో ఒకే జ్ఞాపకంగా కుదురుకున్న అనేకానేక సంఘటనల, సన్నివేశాల సమాహార బిందుసందోహాన్ని కలిపి గీసే contour line వంటి కథ ఎలా ఉంటుంది? మబ్బుపింజకి జరీ అంచులా మెరిసే కిరణపు అనాకృతిని పోలి ఉంటుందే తప్ప నిర్దిష్టంగా ఉండదు, ఉండాల్సిన అగత్యం లేదు. కానీ, అడ్డూఅదుపూ లేని, మొదలు- తుది ఉండనక్కర్లేని అటువంటి అపురూపమైన వంకర్ల పరివృత్తంగా కొనసాగుతున్న రచనని చప్పున ఒద్దికైన సరళరేఖగా వొంచిన తొట్రుబాటుకి, తొందరపాటుకీ తాజా ఉదాహరణ మన్నం సింధుమాధురి ‘డేవిడ్’!

ఆకతాయి అంగలతో టీనేజీ లోగిళ్ళు దాటుతున్నప్పుడు తోడైన చెంబుగాడు, యవ్వనారంభంలో వయసుపొదల మాటున ఎన్నో దైహిక రహస్యాలు దారికాసిన వైనాన్ని గుర్తుచేశాడు. నిజానికి ఆ గుట్టుమట్లన్నీ విప్పి చెప్పేంత ఆరితేరిన ఆగడీడు కాడు, చెబుతున్నట్టే తెలుసుకున్న ఆరిందగాడు.  తుంగభద్ర ఒడ్డున, హంపీ ఒడిలో చెట్టూ చేమా గుట్టా పుట్టా…. అన్నింటినీ తమ తూరుపూ- పడమరలంత దూరాల్ని రద్దు చేసేకుకొని మరీ ఆటాపాటా చేసుకున్న చిన్నారి నేస్తులు, ఆపై ఈడొచ్చిన పిల్ల ప్రేమికుల ఈ కథని ఒక సారాంశంగా రెండుమూడు వాక్యాల్లోకి కుదించుకొని చెప్పుకుంటే ఏముంటుంది విశేషం? కేవలం story for story sake గా, బండ్లకెత్తబడుతున్న అనేకానేక కథలకి మరో చేర్పు వంటి కథే అయినట్టైతే: నూనూగు ప్రాయల అమలిన ప్రణయం- విలనై విడదీసే విధి- చివర్లో శుభం కార్డుకు ముందు పునస్సమాగమం- అని మూడు ముక్కల్లో తేల్చేయొచ్చు! అలాంటప్పుడు దీనికి కథానాయకుడు లక్కవరప్పాడు, లేదా లక్నో, కాదంటే ఇలా లండన్- ఎక్కడి వాడైతేనేం?  కానీ, చిన్నదో… పెద్దదో – అదనుకొక అనుభవంగా, దిగంతాలే హద్దులుగా చెలరేగిపోయిన, విశృంఖల వాక్యాలుగా వెదజల్లుకుపోయిన కథనం కదా – ‘డేవిడ్’ అనే ఈ కథకి ప్రాణం… ప్రణవం! ఐతే, మొదట్లోనే ఆరోపించినట్టు- స్ఖలిత బ్రహ్మచారి డేవిడ్ virginityకి సంప్రదాయక మురిపెంతో నాయిక ఎసరుపెట్టడం ద్వారా ఉన్నట్టుండి కథ ఒక ఒద్దికైన సాదాసీదా ముగింపుకి చేరుకొని చదువరిని కుదేసింది. ఆత్మగతమైన ‘memoir’ని depersonalize చేసి ‘కథ’గా విశ్వజనీనం చేయడం, అన్యానుభవాన్ని కూడా సహానుభూతితో ‘స్మృతిరచన’గా సొంతం చేసుకొవడం- అనే రెండు భిన్నమైన genresకి ఒక మేలైన సంయోగంగా నడిచిన ఈ రచనని చిట్టచివర్లో రచయిత్రి తేల్చేశారన్నదే నా ప్రధాన అభియోగం.

(అసలు నా అభియోగంతోనే సమ్మతి లేనప్పుడు, ఇక ముందు నేను చేయబోయే వాదనలు పట్టించుకోనక్కర్లేదు, ఈ వాక్యాన్ని దాటి బహుశా చదివే శ్రమ తీసుకో పన్లేదు)

**           **           **

art: satya sufi

art: satya sufi

ఆదిమధ్యాంతరాలతో ఒక ఎత్తుగడలాగా, పతాక ఘట్టం ఒక పకడ్బందీ స్కెచ్ మాదిరిగా కథ ఉండవల్సిన పన్లేదని నవతరం కథకుల రచనలు  ప్రపంచ కథా సాహిత్యవీధుల్లో భాషాతీతంగా ఎప్పటినుంచో చాటి చెబుతున్న విషయం రచయిత్రి సింధు మాధురికి తెలియకే తన కథని ఒక సుఖాంత సీమలకి నడిపించారా? ప్రశ్నలా కనిపించే ముందు వాక్యానికి అవునో… కాదో రచయితకి బదులుగా- అభియోగాలు మోపి, ప్రశ్నలు సంధించిన నేనే వివరణ ఇవ్వడం హాస్యాస్పదం, అసంబద్ధం కావొచ్చు. నేనిక్కడ ఇవ్వబోయే వివరణ కథ తాలూకూ వాచకపు హద్దులు మీరి, text కు మాత్రమే పరిమితం అయ్యే (అవ్వడానికి మాత్రమే తయారుగా ఉన్న) పాఠకుడి హక్కుని కాలరాయడం వంటిది; పాఠకుడి కట్టెదురున ఉన్న  వాచకాన్ని దాటి పిల్లిమొగ్గలేసి, పాఠాంతరమైన మరేవో అసందర్భ అంశాల్ని అతని ముందుకు లాకొచ్చి ప్రదర్శించే దాష్టికంలాంటిది. ఇదంతా తెలిసి కూడా, ‘డేవిడ్’ అనే రచనకి సంబంధించిన వాచకానికి పరిమితం కాకుండా, ‘రచయిత – సింధుమాధురి (అక్షరంతో మాత్రమే)తో నాకు పరిచయం ఉంద’న్న సంజాయిషీ వంటి సాకులే పునాదిగా నా ఈ వాదన అనే మట్టిగోడని నిలబెట్టదల్చుకున్నాను.

**           **           **

‘నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా. అంచేత కథల్లో సన్నివేశాలకు, పాత్రలకు రవంత దూరంగా వుండడానికి ప్రయత్నించేవాణ్ణి, వాటితో నాకెంత గాఢమైన బంధం వున్నా…’ అన్నారు పాలగుమ్మి, త్రిపుర కథలకు 35 ఏళ్ల క్రితం రాసిన ముందుమాటలో. ‘బైటపడిపోతామేమో అన్న భయం’ ఒక్క పాలగుమ్మినే కాదు, మొత్తం ఆధునిక తెలుగు సాహితీకారులందరినీ పట్టిపీడించింది. ఇంకా ఆశ్చర్యమేమంటే, సాహిత్యం- జీవితం అనేది అసలు ద్వంద్వమే కాదని తన యావజ్జీవితాన్ని రుజువుగా నిలిపి చూపిన చలం గారి తర్వాత యుగం యావత్తూ ఆ భయానికే బద్ధులై ఉండటం.

ఇంతలో ఆధునికోత్తర యుగంలో ఒక విచిత్రం జరిగింది. విశ్వరచనలకీ, మహాకథనాలకీ సెలవంటూ, Jean-François Lyotard అనే సాహితీవేత్త ‘petits récits’ (meta-narrative) – అంటే స్వకీయమైన, స్థానికమైన, దుర్బలమైన కథనాలకు స్వాగతద్వారాలు తెరిచి, ప్రపంచానికి, ముఖ్యంగా మూడో ప్రపంచానికి ప్రాధాన్యత పెంచాడు. Lyotardని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆవాహన చేసుకొని తెలుగులో నామిని సుబ్రమణ్య నాయుడు వంటి రచయితలు గొప్ప సాహిత్యాన్ని కల్పించారు. అంతకు ముందటి తరాన్ని పీడించిన ‘బైటపడిపోతామేమో అన్న భయాన్ని’ మొదలంటా పెకలించి పడేసి, తామే హీరోలైన తమ రచనల్లో సన్నివేశాలకి, సందర్భాలకి, పాత్రలకీ కాస్తంత దూరంగా వుండడానికి కూడా ప్రయత్నించలేదు. అయితే, దురదృష్టవశాత్తూ ఈ తరహా రచయితల తరం ఫోకస్ చేసిన అంశం ‘పేదరికం’. ప్రతిభావంతంగా చెప్పినా, తమ తమ మాండలికాల్లో చెప్పినా, చాప్లిన్ హాస్యంలా నవ్వించి గిల్లినట్టు చెప్పినా – తమ nostalgiaలో ప్రాధానంగా రాజ్యమేలింది ‘పేదరికమే’నని చిత్రించారు. వారి వారి కుల, ఉపకుల, మత, ప్రాంత, సామాజిక సాంస్కృతిక నేపథ్యాల భిన్నత్వం ఆ రచనల్లో కదలాడినా, స్థూలంగా చూస్తే అన్నీ మూసపోసినట్టై, ఆ లేమికి చెమర్చకపోతే, లేదా ఆ బీదతనాన్ని చూసి బిక్కపోకపోతే ఎక్కడ అగ్ర కుల.. మత దురహంకారమని ముద్రలేస్తారోనని భయంతో చదువరులు మూకుమ్మడిగా సంఘీభావాలు ప్రకటించేలా తయారయ్యాయి. దాంతో, అప్పటికే ఇబ్బడిముబ్బడిగా కీర్తి వచ్చిపడిపోతుండటంతో, చేయి మెలితిరిగిన రచయితలు కూడా తమని తామే అనుకరించుకునే దుస్థితికి చేరి, meta-narratives చిత్రణలో మీదుమిక్కిలి monotonyకి కారణమయ్యారు.

అదే స్వకీయ, స్థానికీయ కథనాల ఆధునికోత్తర వాతావరణం ఇచ్చిన దన్నుతో వచ్చినట్టే కనబడిన సింధుమాధురి తాలూకూ ప్రపంచం మానసికంగా, భౌతికంగా భౌగోళికంగా కూడా పెద్దది కావడమే విశేషంగా, ఆమె ప్రత్యేకత గానూ గుర్తించాలి. అంటే, పైన చెప్పిన, monotonous మంద నుంచి వేరై uniqueగా నిలిచిన సింధు మాధురి అనే ఈ రచయిత్రి దేశదేశాలూ తిరిగారా? తన కథలన్నీ ఆమె స్వానుభవాలా? – వంటి వ్యక్తిగతమైన ప్రశ్నలకి అనేకానేక ఆమె పాఠకుల్లో ఒకడిగా నాకూ సమాధానాలు తెలియవు. ఒకవేళ తెలిసిన వారెవరి వకాల్తా అయినా, పాఠకులుగా మనం వినవల్సిన అగత్యం లేదు. కానీ, గతంలో ప్రచురించబడిన కథల ఆధారంగా hypothesis వంటి కొన్ని తీర్మానాలు చేసుకోవడం ఏమంత పెద్ద పాఠాంతర దోషం కాదనుకుంటాను.

అటువంటి hypothesis ఆధారంగానే, డేవిడ్ కథలో నీరసపడిన ఉపసంహారానికి కారణాలు ఊహిస్తున్నాను:  ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో నాలుగేళ్ల క్రితం ‘కలాపి ‘ అనే కథ రాశారు సింధు మాధురి. ఐదారు పెళ్లిళ్లు చేసుకున్న ఓ polyandrous స్నేహితురాలి జీవితచిత్రాన్ని కథగా ప్రతిభావంతంగా చిత్రించారామె ఆ కథలో. అది ఆ తర్వాత వివాదాలకు దారితీయడం వేరే వ్యవహారం. కానీ, అంతకు ముందే, ఆ కథ ప్రచురించినప్పుడు దాని illustration గా protagonist రూపాన్ని నేరేటర్ సింధు మాధురి (ఫొటో ఆధారంగా ) పోలికలతో portrait గా గీశాడు ఆంధ్రజ్యోతి (మగ) ఆర్టిస్టు. ‘కలాపి’ అనే ప్రొతాగనిస్టుకి సింధు మాధురి అనే రచయిత బొమ్మ వేయడం తెలియకో, పొరబాటునో, యథాలాపంగానో జరిగింది కాదు. అటువంటి బరితెగింపుల కథానాయికగా రచయిత్రినే చేయడం వెనక సగటు మగవాడికి ఉండే photo morphing syndrome వంటిదే పనిచేసింది. ఇటీవల వచ్చిన ‘పింక్’ సినిమా పరిభాషలో చెప్పాలంటే, మగవాళ్ల రూల్ బుక్కులో అటువంటి లైంగికాంశాలు రాసే ఆడవాళ్లు ‘కొంచెం లూజు’, ఈజీగానే ‘పడతారు’!

రచన అంటేనే- అనలవేదిక ముందు అస్రనైవేద్యం; సింధు మాధురిలా లోనుంచి పెకలించుకు వచ్చే అనుభవాలను అక్షరబద్ధం చేసే రచయితల విషయంలో అయితే మరీనూ. జ్వాలా సౌందర్యాన్ని గాఢంగా కోరి, ఆ కాంతిలో ఐచ్ఛికంగా కాలి, దీపం సెమ్మ నీడలో రెక్కలు రాలిపడినా ఉపశమించని ఉసిళ్ళ మోహావేశం వంటి అనలాక్షరాపేక్ష ఉన్న ఇటువంటి రచయితలకు, అందులో ఆడవారైన పాపానికి రకరకాల రూపాల్లో, వేషాల్లో వేధింపులు ప్రతిఫలంగా ఎదురౌతుంటే ఏమవుతుంది? అక్షరానికి దాపరికం అవసరపడుతుంది, ముసుగుల పనిబడుతుంది, చివరికి సత్యాన్వేషణకి హిపోక్రసీ అడ్డుపడుతుంది.

‘… బాగా బేక్‌ అయిన కేక్‌లోకి నైఫ్‌ ‌దింపినట్టుగా ఉండే అనుభవాన్ని ఇద్దరం కలిసి చూద్దామ’ని బరితెగించి అడిగిన నెరజాణ సొంత కథే ఇది అనిపిస్తే అంటగట్టబడే vulnerabilities అన్నింటికీ వెరసి, కథతో తగుమాత్రం దూరాలు పాటించడానికే, బహుశా సింధు మాధురి ‘డేవిడ్’ కథకి నప్పనిదే అయినా, ఒక నాటకీయమైన ముగింపు ఇచ్చారని నా ఊహ. ప్రాచీన, అర్వాచీన తెలుగు సాహిత్యంలో(భారతీయ, ప్రపంచ సాహిత్యంల్లో కూడా కావొచ్చు) వినిపిస్తున్న స్త్రీ స్వరాలు- అయితే పురుషులవీ, లేకుంటే, యుగాల పురుషాధిక్య దౌర్జన్యం మీద reactionary గా పుట్టుకొచ్చిన ‘పెడసరి’ ‘గయ్యాళి’ స్త్రీవాదులవీనూ. ఎక్కడైనా అరుదుగా ఇప్పుడిప్పుడే సహజంగా వికసిస్తున్న, వినిపిస్తున్న గొంతుకల్ని కూడా నొక్కేసే దౌర్జన్యం పలు రూపాల్లో కొనసాగితే మిగిలేవి ముసుగులు, ముసురులే.

–నరేష్ నున్నా

డేవిడ్ కథను ఇక్కడ చదవొచ్చు.

కొన్ని ముగింపులు

Art: Satya Sufi

Art: Satya Sufi

ఒకానొక ఆమె. పెళ్లయిన ఆమె.

ఆమె సన్నగా ఉంది,లావుగా ఉంది.  లేదూ సమంగానే ఉంది. పొడుగ్గా ఉంది, పొట్టిగా ఉంది. కాదూ సగటుగానే ఉంది. నల్లగా, తెల్లగా, చామన చాయలో. మొహం కోల గానూ, గుండ్రంగానూ. ముక్కు మీదో, బుగ్గ మీదో పుట్టుమచ్చా. పొట్టిదో, పొడుగుదో, ఉంగరాలు తిరిగో సాఫీగానో జుట్టు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్లర్క్, టీచర్, సేల్స్ గర్ల్, మేనేజర్. లేదూ ఇంటి వద్దనే పిల్లల్ని చూసుకుంటూ చదివిస్తూ.

బస్టాండ్ లో కలిశారు మొదట. రైల్వే ప్లాట్ ఫాం మీద కూడా కావచ్చు. ఎయిర్ పోర్ట్ బయట ఎదురు చూస్తూనో. లేదూ ఆఫీస్ లో. ఏదో పార్టీలోనో, ఎవరో స్నేహితుల ఇంట్లోనో. ఫేస్బుక్ లో కూడా అయి ఉండొచ్చు. అది మొదటి సారీ కాకపోవచ్చు. ఒకప్పటి క్లాస్ మేటో, స్నేహితుడో, టీనేజ్ కాలపు ప్రియుడో మళ్లీ ఇప్పుడు. రోజూ కలిసే తోటి ఉద్యోగో, పొరుగింటి వాడో, అదే వీధి వాడో కూడా.

అప్పుడు అతన్ని చూడగానే ఆత్మీయంగా అనిపించింది. లేదూ మాటల్లో ఎప్పుడో దొర్లిన చిన్న మాటకో. చేతిలోంచి జారిపడ్డ దేన్నో ఒంగి తీసి చేతికిచ్చినప్పుడో. బహుమతి ఏదో కొని ఇచ్చినప్పుడు. అతను పక్కనున్నప్పుడు హాయిగా వీచిన ఆ సాయంత్రపు గాలి వల్ల. నాలుగు చినుకులు పడ్డందుకు. పక్కనుంచి పూల వాసనకి. ఎక్కడినుంచో వినవస్తున్న ఎప్పటిదో యవ్వనకాలపు పాటకి. ఎప్పటివో జ్ఞాపకాలు కదలాడినందుకు. అహితమైనవన్నీ మరిచిపోయేలా చేసినందువల్ల. మొత్తానికి ఒక మాంత్రిక క్షణం. శాశ్వతం అవుతుందనిపించేలా అవాలనిపించేలా.

ముందు సరదాకే కొనసాగిందది. రోజువారీ పనుల మధ్య ఆటవిడుపుగా. కాదూ ఆశపడ్డట్టుగాలేని సంసారం పట్ల అసహనం నుంచి విడుదలగా. చెప్పుకోలేని ఒంటరితనం, ఇరుకూ, ఏవో అసంతృప్తులూ. ఎవరి మీదో చెప్పలేని విసుగూ. భౌతికమైనదో, మానసికమైనదో హింసా. తెలియని వెలితి ఏదో పూడ్చుకోవడానికి. అంతకుమించి ఉద్వేగపూరితమైనదేదీ చేయడానికి లేక. కాదా ఓదార్పుగా ఒక మాట. మెచ్చుకోలుగా ఇంకో మాట. కలిసిన చూపులో, తెలిసినట్టు ఒక నవ్వో. పోగొట్టుకున్న రోజుల్ని అపురూపంగా మళ్ళీ బతుకుతున్నట్టు.

క్రమంగా అది చిలిపి సంభాషణల్లోకి దిగింది. ఒకరి తోడు ఒకరికి నచ్చింది. మాటలే మాటలు. అటు తిరిగీ ఇటు తిరిగీ దాగుడుమూతలాడీ ఎప్పటికో స్పష్టపడింది. ఆకర్షణలోని ఉద్వేగానికి కొట్టుకుపోతూ. రహస్యంగా వెతుక్కునే కళ్ళూ, వేగంగా కొట్టుకునే గుండే, ఒంట్లో కొసలదాకా పరుగులు తీసే నెత్తురూ, తిరిగొచ్చిన యవ్వనపు అలజడీ, ఎడబాటులో అతనిపైనే ధ్యానమూ.

అది ప్రేమో, అటువంటిదేదో అన్న నిర్ణయానికి వచ్చారు. తమ అదృష్టాలను తాము పొగుడుకున్నారు. తర్వాత ఒకరి అదృష్టాన్ని ఒకరు పొగుడుకున్నారు. అంతకంటే ముందే కలవనందుకు చింతించారు. ఉత్తేజపూరితమైన, ఉద్వేగభరితమైన ఆ దినాల్లో ఒకసారి అడిగిందామె. “మన కథ ఎలా ముగియబోతుంది?”

0.చివరికి ఏమీ కాలేదు. మరెందుకూ దారి తీయక మునుపే అతనికి దూరమయ్యింది. కావాలనే. అప్రయత్నంగానో. అతడికి ఇంకొక ఆమె    ఎవరో పరిచయమయ్యారు ఆశ తీరే దగ్గర దారి చూపెడుతూ. ఆమె భర్త ఉద్యోగం మారడంతోటో, వాళ్లు ఇల్లు మారడంతోటో ఆమెతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. లేదా వేరే ఊరికి ట్రాన్స్ఫర్. కాదూ ఆమె పిల్లల చదువు గొడవలో పడిపోయింది. ఏ తెర మీదో, రోడ్డు పక్కనో ప్రేమ ప్రకటించుకుంటున్న జంటని చూసినప్పుడో, మసక చీకట్లో ఎవరో అతనిలా కనిపించినప్పుడో అతను గుర్తొస్తే కొంచెం దిగులు పడి కాసేపు పాత ఏడుపు పాటలు విని. ఏదయినా బాధ కలిగినప్పుడు ఓదార్పు గానో. కొంత అపరాధభావనా. లేదా చేతికందీ జారిపోయినట్టు చింత. లేదూ మళ్లీ అతనెప్పుడూ ఆమెకు గుర్తు రాలేదేమో కూడా.

1.ఏదో అయ్యేలోపే ఆమెకు మరొకతను దగ్గరయ్యాడు. ఆమెని ఇంకాస్త నవ్వించేవాడు. లేక ఎక్కువ సమయమో, డబ్బో ఉన్నవాడు. ఎట్లాగో ఇంకొంచెం మెరుగయిన వాడు. లేదా ఆమె వినాలనుకున్నవే చెప్పేవాడు. కథ మళ్లీ మొదట్నుంచి. ఏదో ఒకటి జరిగి ఇంకోరకంగా ముగిసిందాకా. లేక ఆమెకు విసుగెత్తిందాకానో, వయసు ఉడిగిందాకానో, మరణించిందాకానో. ఏది ముందయితే అప్పటిదాకా.

2.ఒకరోజు పగలో, రాత్రో, రెంటి మధ్యో. అతనితో సెక్స్. చాలా పకడ్బందీ ప్లానింగ్ తోటే. ఒక్కో అడుగూ ముందుకు జరిగో, ఎప్పుడో ఎలాగో అకస్మాత్తుగానో. ఒకసారో కొన్ని సార్లో లేక దాదాపుగానో. బయట ఎక్కడో హారన్ మోత. ఎక్కడో భయం, అంతలో తెగింపు. మధ్యలో పోయిన కరెంట్, ఆగిన ఫాన్. లేక హుమ్మంటూ ఏసీ.  కాక మొదట్లోనో, మధ్యలోనో మనసు మారి తలుపు తీసుకుని పరుగు తీసి ఇంటికి వచ్చి ఏడ్చి స్నానం చేసి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామన్న ప్రశ్నే రాలేదు. అతన్ని మళ్లీ కలిసింది లేదు. ఎదురుపడ్డా ఒక పొడి హలో చూపు పక్కకి తిప్పుకుంటూ తప్పుకుంటూ. ఏమీ జరగనట్టూ, జరిగిందీ, జరగందీ మర్చిపోవాలని ప్రయత్నిస్తూ. లేదా ఆమెకు గుర్తున్నదల్లా అతని భుజమ్మీద ఎప్పటిదో మచ్చ.

2.1. తప్పు చేసిన భావన ఆమెను నిలవనీయలేదు. భర్త ఏ కొంచెమో ప్రేమ చూపినప్పుడల్లా అది ఎక్కువయ్యేది. చెప్పడమా, మానడమా అని ఊగులాడింది.

2.1.1. ఆమె తన స్నేహితురాలితో చెప్పుకుంది. ఆవిడ ఆమెని తిట్టింది “ఎందుకిలా చేశావు?” ఆవిడకూ ఎటూ తోచక ఒక ఫేస్బుక్ గ్రూప్ మొదలెట్టి అందులో ఇదంతా ఒక కథ అయినట్టు చెప్పి, ఇప్పుడా పాత్ర ఏం చేస్తే బావుంటుందని అడుగుతూ పోస్ట్ చేసింది. లేదా అప్పటికే ఉన్న గ్రూప్ లోనో. చెప్పడం నైతిక ధర్మమని కొందరూ, చెప్పకపోవడం జీవనధర్మమని కొందరూ వాదించుకున్నారు.  శాస్త్రాలనూ, సోషియాలజిస్టులనూ ఉటంకించారు. చివరికి అది కొన్ని చోట్ల విశ్వనాథ, చలం భక్తుల మధ్య జగడంగానూ, కొన్ని చోట్ల మోడీ భక్తుల మధ్యా ద్వేషుల మధ్యా గొడవగానూ పరిణమించింది. ఆమె ఫేస్బుక్ అకౌంట్ డీయాక్టివేట్ చేసుకుంది. తర్వాత 2.1.2. గానీ 2.1.3. గానీ.

2.1.2. ఒక రాత్రి నిద్రపోతున్న భర్తను లేపి చెప్పింది. “నేను తప్పు చేశాను. మీకు ద్రోహం చేశాను.” ఆమె భర్తకి అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెప్పింది. మౌనంగా ఉండిపోయాడు. “ఎలా జరిగిందో తెలియదు. ఏ వాలునీటిలోనో కాళ్ల కింద మట్టి జారి కొట్టుకుపోయినట్టు.” తల వంచుకుని చెప్పింది. లేదా కళ్ల వెంట నీరు. కాకపోతే అంతా వివరిస్తూ ఒక ఉత్తరం.  “ఇట్స్ ఓకే!” కాసేపటికి చెప్పాడు ఆమె చేతి మీద చేయి వేసి.  “నన్ను క్షమిస్తారా?” ఆగి అంది “నన్ను వెళ్లిపోమన్నా అర్థం చేసుకోగలను.” ఆమె భర్త ఆమెను దగ్గరకు తీసుకుని సముదాయించాడు. “ఒక్కసారి కాలంలో వెనక్కి వెళ్లగలిగితే..” అనుకుందామె. ఒక్కోసారి మళ్లీ 2.2 కి. లేదా 6 కు.

2.1.3. ఆమె ఎవరితోనూ మనసు విప్పి చెప్పుకోలేదు. చెప్పే ధైర్యం చేయలేకపోయింది. ఆ రహస్యాన్ని జీవితాంతం మోస్తూ బతికింది. చనిపోయే ముందు హాస్పిటల్లో చేయి పట్టుకుని మంచం పక్కనే కూచున్న భర్త వంక చూస్తూ నోరు తెరిచింది. “నన్ను క్షమించగలరా?” అంది. లేదా అనాలనుకుంది. అన్నాననుకుంది.

2.2. తర్వాత చాటుమాటుగా కలుసుకుంటూనే ఉన్నారు. అతనికెక్కడో వేరే ఉద్యోగం వచ్చి తనతో వచ్చేయమని గొడవ. ఆమె భర్తకు ఏదో అనుమానంగానే ఉంది. లేక అనుకోని షాక్. చెప్పిందామె “అయాం సారీ సారీ సారీ. నాది తప్పే కానీ చేయక తప్పదు. నాకోసం. అతని కోసం”  లేదా “తప్పంతా నీదే. నీమూలానే చేయవలసి వస్తూంది ఇలా!” ఏం చేయాలో పాలుపోలేదు ఆమె భర్తకి. లేదా ఎగిరి గంతేశాడు. అది అతని ఎన్నాళ్ల కలో. “పిల్లలో?” అడిగాడు.”ఫర్వాలేదు , మీరే ఉంఛుకోండి,” అంది. “లేదు లేదు, నువ్వే తీసుకుపో!” అన్నాడు. కాదూ పంచుకోవడమో, తనకే కావాలని గొడవో. పిల్లలు ఆమెను ఎప్పుడూ క్షమించలేదు. ఆపైన 7.1 గానీ 7.2 గానీ.

3.కథ మొదలయిన సంగతి ఆమె భర్తకి తెలుసు. అసలు అతనే దోహదపడ్డాడేమో కూడా. ఏదో వ్యసనం. కాదా దురాశ. మొత్తానికి డబ్బు అవసరం. లేదా లైంగిక అసమర్థత. ఆమెకూ తెలుసు అయినా తెలియనట్టు. లేదా తెలియదు. అతనితో సెక్స్, తర్వాత దొంగచాటుగా కలవడం నుంచి అవసరమయినప్పుడల్లా అతను ఇంటికే రావడం అలవాటయింది. ఆమె భర్త చాకచక్యంగా తప్పుకునేవాడు. లేదూ అతనితో స్నేహం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోనే కూచుని కలిసి తాగే దాకా. ఆమె మీద జోకులు వేసి ఆనందించే దాకా. లేదా జోకు అనుకుంటూ ఎత్తిపొడుపు. “నీ ప్రేమ నా మీదా, నా డబ్బు మీదా? అందుకే వల వేశావు గదూ?” ఆమె వినలేదు. లేక విననట్టు నటింఛింది.

4.బట్టల్లేకుండా వాళ్లు కలిసున్నప్పుడు ఫొటో తీశారెవరో. కాదూ వీడియో. అతని ఫ్రండే. లేదా ఆమె భర్త ఫ్రండ్. కాదూ ఎవరో ముఖపరిచయస్తుడు. అనుకోకుండానో, అతని ప్లాన్ లో భాగంగానో. ఆమె ఫోన్ కి ఒక బెదిరింపు మెసేజ్. బ్లాక్ మెయిల్. ఆమె కావాలి, లేదా డబ్బు. అతను తప్పుకున్నాడు. ఆమె బ్లాక్ మెయిలర్కి అడిగిందల్లా ఇచ్చింది. చెప్పినట్టల్లా చేసింది. అయినా ఫొటోలో వీడియోలో బయటపడ్డాయి. చివరికి నెట్కి ఎక్కాయి. ఆమె ఆత్మహత్య చేసుకుంది. లేదా అతన్ని హత్య చేసింది. తప్పుకోకుంటే అతనితో కలిసేనేమో. ఏ కోర్టులోనూ కేసు లేదు. లేదా ఇంకా నడుస్తూంది. ఇద్దరూ జైల్లోనయినా. కాదూ భయపడి 2.1.2.కో.

5.అతనితో సంబంధం కొనసాగుతుండగా ఆమె భర్తకి అనుమానం కలిగింది. కొన్ని గుర్తులు ఆమె ఒంటి మీదో, ఇంట్లోనో. సమయం కాని సమయంలో ఫోన్లో మెసేజ్లు. అడిగితే చెప్పిన సమాధానాలు అతికీ అతకనట్టు. చివరికి ఆమె భయపడిపోయి అతనితో తెగతెంపులు చేసుకుంది. లేదా చుట్టుపక్కల వాళ్ల గుసగుసలు గమనించి బెదిరిపోయో. ఏ సాక్ష్యమూ దొరక్క ఆమె భర్త అనుమానాన్ని మనసులోనే అణుచుకున్నాడు. తన చిన్న కొడుకుని చూసినప్పుడల్లా అది బయటికి వస్తుంది. తమవి కాని పోలికలకోసం వాడి మొహం వంకే చూస్తాడు. అకారణంగా ఆమెపై విసుగు. లేదా వేధింపులు. ఎప్పుడయినా 2.1.2.కి.

6.ఆ రోజెందుకో ఆమె భర్త తొందరగా ఇంటికి వచ్చాడు. ఎందుకో కాదు అనుమానంతోటే. ఇద్దరూ దొరికిపోయారు.

6.1. అతను పారిపోయాడు. ఆమె భర్త ఆమెని ఒక్క మాటా అనలేదు. ఆమె ప్రయత్నించింది. ఏడ్చీ, బ్రతిమలాడీ. చుట్టాలూ, స్నేహితులూ చెప్పి చూశారు. తర్వాత విడాకులూ, పిల్లల కస్టడీ గొడవా. ఆమె భర్త మాత్రం ఆమెతో మాట్లాడింది లేదు అప్పటినుంచీ. ఆమె అసలు లేనట్టే.

6.2. అతను పారిపోయాడు. ఆమె భర్త ఆమెని చితకబాదాడు. లేదా అవమానం, దుఃఖంతో కూర్చుండిపోయాడు. ఆమె ఏడుస్తూ క్షమాపణ అడిగింది. తల గోడకేసి కొట్టుకుంది. ఆమె భర్త ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆమెకు మరింత దుఃఖం పొంగుకొచ్చింది. తర్వాత వేరే ఇంటికో, ఊరికో మారిపోయారు.

6.2.1. అయినా ఆమె భర్త ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయాడు.  మనసు తొలిచే ప్రశ్నలు అడక్కుండా ఉండలేకపోయేవాడు. ‘ఎందుకు?’,’ఎన్నాళ్ల నుంచి నడుస్తుంది?’ నుంచి వాళ్ల మధ్య నడిచిన సెక్స్కు సంబంధించిన ప్రశ్నల దాకా. ఒక్కోసారి భోరున ఏడ్చేవాడు. లేదా ఆమెను కొట్టేవాడు. ఏ వాదన జరిగినా చివరికి ‘నిన్ను క్షమించడం నా బుద్ధితక్కువ!’ తో నోరు మూయించేవాడు. ఒక రోజు ఆమె ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏవో బిళ్లలు మింగో. లేదా జీవచ్ఛవంలా బతికింది.

6.2.2. ఆమె భర్త ఆ సంగతెప్పుడూ ఎత్తలేదు. తిడితేనో, కొడితేనో బాగుండుననుకునేది. అతని మంచితనాన్నీ, కృతజ్ఞతాభారాన్నీ భరించలేకపోయేది. అప్పుడప్పుడూ గొడవ పెట్టుకునేది “మీకు నామీద ప్రేమ ఉంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది?” అదే అబ్సెషన్ కావడంతో కొన్నాళ్ల సైకియాట్రీ ట్రీట్మెంట్ తర్వాత విడాకులు తీసుకుంది. లేదా ఉత్తరం రాసి వెళ్లిపోయింది. కాదూ ఆత్మహత్య.

6.2.3. మళ్లీ అతని మొహం చూడకూడదని కచ్చితంగానే అనుకుంది కానీ అతను కనిపించగానే అన్నీ మరిచిపోయింది. లేదా కొన్నాళ్లు అతను మళ్లీ వెనక పడ్డాక. అతనితో సెక్స్ వీలయినప్పుడల్లా సాగిస్తూనే ఉంది. తిరిగి 6 కి.

6.3. ఆమె భర్త కోపం పట్టలేకపోయాడు. కత్తితో వాళ్లిద్దరినీ ఎడాపెడా పొడిచాడు. లేక ఇద్దరిలో ఒక్కరినో. తర్వాత కత్తితో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, తాపీగా కూర్చుని వాళ్లనెందుకెట్లా చంపిందీ వివరంగా చెప్పి లొంగిపోయాడు. లేదా ఆ శవాన్నో శవాలనో ఎక్కడో పూడ్చో కాల్చో మాయం చేశాక తర్వాతెప్పుడో బయటపడి పోలీసులకి దొరికిపోయాడు. లేదూ ఆమె ఆనవాళ్లు ఎప్పటికీ బయటపడలేదు. కాదా ఆమె భర్త కూడా అప్పుడో కొన్నాళ్లకో ఆత్మహత్య చేసుకున్నాడు.

6.4. ఆమెని తిట్టాడు. కొట్టాడేమో. ఆమె అతన్ని కలవడం మానలేదు. భర్త ఆంక్షలూ, వేధింపులూ తట్టుకోలేక అతనితో చెప్పుకుని ఏడ్చింది.  మరో నాడు పట్టుబడినప్పుడు ఇద్దరూ కలిసి ఆమె భర్తని కొట్టో పొడిచో చంపేశారు. లేదా ప్లాను ప్రకారమే ఆమె భర్తని మట్టు పెట్టారు. తాడుతోనో, దిండుతోనో, విషంతోనో. కాదూ అతను తన స్నేహితులతో కలిసి ఆమె భర్తకు మద్యం తాగించి ఊరవతలకి తీసుకెళ్లి. లేక ఏ కారుతోనో గుద్ది. చివరికి పోలీసులకి చిక్కారు. లేదు.

7.”నీకో విషయం చెప్పాలి” అన్నాడు ఆమె భర్త ఒక రోజు. లేక ఆమే అంది. “ఏమిటి?” “నాకు విడాకులు కావాలి.” “అవునా? నేనూ అదే చెప్దామనుకున్నాను.” “అవునా? నేను ఇంకొకరితో ప్రేమలో.. ఎలా చెప్పాలో తెలియలేదు.” “నేనూ..” ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. విడాకులు తీసుకున్నారు. ఒకరి పుట్టినరోజుకొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు.

7.1. ఆమె విడాకులు తీసుకుంది కానీ అతను తీసుకోలేదు. ఏవో సాకులు. పిల్లల చదువులనో వాళ్ల ఆవిడ ఆరోగ్యం బాలేదనో. అసలు పెళ్లి చేసుకుందామని తను అనలేదనీ, ఊరికే సరదాకన్నాననీ బుకాయింపు. లేదా మొహం చాటు చేసుకుని తిరగడం. కొన్నాళ్లు ఎదురు చూసి ఒక రోజు వాళ్లింటికే వెళ్ళి తిట్టి వచ్చింది. అతని భార్య ఎదురుగానే.

7.1.1. మళ్లీ అతను ఆమె వద్దకి వస్తూనే ఉన్నాడు. ఆమె అతనికి రెండో సెటప్ అని అనుకుంటుంటారు చుట్టుపక్కల వాళ్లు. రెండో భార్యగా మిగిలిపోయేనేమిటని దిగులు పడి అతనితో గొడవపెట్టుకుంటుంది అప్పుడప్పుడూ. ఆమె జీతమూ, ఉంటే ఆస్తీ కాజేసుతున్నందుకేమో కూడా. తీసుకెళ్లి భార్యకో, పిల్లలకో పెడుతున్నందుకు కూడా.

7.2. ఆమె అతన్ని పెళ్లి చేసుకుంది. లేదా కలిసి బతకడం మొదలెట్టారు. ముందెన్నడూ లేనంత ఆహ్లాదంగా గడిచింది ప్రతి దినమూ. అతన్ని ముద్దు పెట్టుకుంటూ “మనుషులు ఇంత హాయిగా బతుకుతారని నాకు ఇప్పటిదాకా తెలియలేదు” అందామె. లేక అటువంటిదేదో.

7.2.1. మళ్లీ అదే మొనాటనీ. అసంతృప్తి. భర్త మారేడు కానీ అచ్చు ముందులాగే జీవిస్తున్నట్టు. ఒకరోజు ఇంకో అతను కలిశాడు. అదృష్టవశాత్తూ. లేదా దురదృష్టవశాత్తూ. కథ మళ్లీ మొదటికి.

7.2.2. ఒక రోజు ఆమెకి అతని జేబులో పూల రుమాలు దొరికింది. అచ్చు తన రుమాలు ఒకనాడు అతను జేబులో పెట్టుకుని మర్చిపోయి అప్పటి వాళ్లావిడకి దొరికినట్టే. లేదా అలవాటు లేని సెంట్. అడిగితే ఏదో నమ్మలేని బదులేదో చెప్పాడు. “నన్నే అనుమానిస్తున్నావా,” అంటూ బాధపడ్డాడు. దాన్ని పట్టించుకోకుండా వదిలేయడమా లేక అతన్ని వదిలేయడమా అని ఆలోచిస్తూంది.

ఎన్+1. ___________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________________.

ఎగ్జిట్ 1. ఆమె మరణించింది. సమయం తీసుకునో హఠాత్తుగానో. ఏదో కేన్సర్ వంటి తగ్గని జబ్బు. కాదా యాక్సిడెంట్. బస్ బోల్తా, పట్టాలు తప్పిన రైలు, వర్షంలో డ్రయినేజ్ హోల్.  లేదా ఎప్పుడయినా ఒక క్లిక్తోనో,కరెంట్ పోయో. లేదా బ్యాటరీ అయిపోయి.

ఎగ్జిట్ 2. ఉల్కాపాతం. లేదా మూడో ప్రపంచ యుద్ధం. మొత్తానికి మహా విలయం. మానవజాతి సమస్తం నశిస్తుంది. మిగతా ముగింపుల్నీ, వాటిని పట్టించుకునేవాళ్లనూ, ఏదీ పట్టని వాళ్లనూ మింగేస్తూ. అంతా అసంబధ్దంగా మిగిలిపోతుంది. మిగలదు.

—-చంద్ర కన్నెగంటి

 

ప్రధానమంత్రికి ప్రేమలేఖ!

 

images

ప్రధాన మంత్రి మోడీగారికి-

అయ్యా.. మీరు తీసుకున్న చర్య బహు బాగున్నది. మీ లాంటి ఉత్తములు ప్రధాన మంత్రి కావడం మాలాంటి నిజాయితీ పరులకు ఊతమిస్తోంది. ఊపిరి పోస్తోంది. సరిగ్గా ఆలోచించేవాళ్ళు వున్నారు సార్.. మిమ్మల్ని అర్థం చేసుకున్నవాళ్ళు వున్నారు సార్.. అందుకే మీరు ఐదొందలూ వెయ్యి నోట్లూ రద్దు చెయ్యడమే కాదు, (మన వాళ్ళకి ప్రజాస్వామ్యం విలువ తెలీకుండా మాట్లాడుతున్నారు) అవసరమైతే ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చెయ్యండి.. ఏం ఫరవాలేదు. ఇలాగే నాల్రోజులు గోలగోల చేసి అలిసిపోయి ఆగిపోతారు. అలవాటైపోతారు. కాని సార్.. ముందుగా ముఖ్యంగా చెప్పేది.. ఆ కోర్టుల నోళ్ళు మూయించండి సార్.. ఏ దేశంలోనయినా న్యాయం ఆరాజ్య ఆకాంక్షలకు లోబడి కట్టుబడి వుండాలి కదా

సార్.. మన సుప్రీం కోర్టును చూడండి యెలాంటి వ్యాఖ్యలు చేస్తోందో.. ఇది చాలా తీవ్రమైన విషయమట! ప్రజలు క్యూల్లో నిలబడడం తీవ్ర సమస్యట! ప్రజలు ఉపశమనం కోసం కోర్టులకు వెళతారట! కేంద్ర నిర్ణయంతో ప్రజలు ప్రభావితం అయ్యారట! ప్రజలు ఆవేశంలో వున్నారట! దాడులు కూడా జరగొచ్చట! అల్లర్లు జరగొచ్చట! అవకాశాలు వున్నాయట! అంచేత కోర్టులకు యెక్కే అవకాశం యిస్తే ఉపశమనమట! సరే, ఒకవేళ ప్రజలు అలా వున్నా- వున్నారని అనొచ్చునా? రెచ్చగొట్టినట్టు అవదూ? ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోందా? ప్రజలకు లేనిపోని ఆలోచనలు అందిస్తోందా? ప్రజలను అల్లర్లకూ అలజడులకూ పురికొల్పుతోందా?

జీ.. మీరు ఐదొందలూ వెయ్యి నోట్లూ రద్దు చెయ్యడమే కాదు, అవసరమయితే వందా యాభై యిరవై కాదు, పది నోట్లనీ రద్దు చెయ్యండి. నోట్లనేవే లేకుండా రద్దు చేయండి. దెబ్బకి దేశం లైన్లోకి వస్తుంది.. ఇప్పటికే వచ్చేసింది.. లైన్లోకి వచ్చి నిలబడింది.. ఎటియంల ముందు! ఫేస్ బుక్కుల్లో ఈ విషయాన్ని గర్వంగా పెడుతూవున్నారు. మనకు మద్దతునిస్తూవున్నారు. ఏటియంల ముందు నిల్చుంటే యేo? సినిమా టిక్కెట్ల కోసం క్యూ లైన్లలో నిలబడి చచ్చిన వాళ్ళు లేరా? రేషన్ కోసం క్యూ లైన్లలో కొట్టుకు చచ్చినవాళ్ళు లేరా? దేవుడి దర్శనం కోసం క్యూ లైన్లలో పడిగాపులు పడినవాళ్ళు లేరా? కరెంటు బిల్లులూ వాటరు బిల్లులూ కట్టడానికి క్యూ లైన్లలో అఘోరించినవాళ్ళు లేరా? రైలు రిజర్వేషన్లకి క్యూ లైన్లలో రేయింబవళ్ళూ కాచినవాళ్ళు లేరా? పిల్లలకి చదువుకోసం సీట్లకోసం క్యూ లైన్లలో కునుకుపాట్లు పడుతున్నవాళ్ళు లేరా? ఈసేవా మీసేవా అని సేవలు అందుకోవడానికి క్యూ లైన్లలో కుదురుగా వున్నవాళ్ళు లేరా? ఫోను చేస్తే కూడా యూ ఆర్ యిన్ క్యూ- అంటారే.. జీవితమంతా క్యూ లైన్లలోనే బతికి చచ్చిన వాళ్ళకి క్యూలోనే వుండడం కొత్తా కాదు. కష్టమూ కాదు. అందరూ లైన్లలోనే వున్నారు. దేశమొక్కటే లైన్లో లేదు. మీరు లైన్లో పెడుతున్నారు. పెట్టండి. మేమంతా అచ్చాదిన్ కోసం యెదురు చూస్తున్నాము. అచ్చాదిన్ రావాలంటే కొందరికి చచ్చేదిన్ తప్పదు. చచ్చాదిన్ రుచి చూసినప్పుడే అచ్చాదిన్ కు విలువ. మీ విలువ మాకు తెలుసు!

మీరు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. లోకం ఆ శ్రీరామచంద్రుడినే- భార్యని అడవిలో నిండు చూలాలిగా వదిలిపెట్టాడని, వాలిని చెట్టుచాటు నుండి యెన్కౌంటరు చేసాడని- యెన్నో విధాల నిందించింది. ఆ రాముణ్ణి నమ్ముకున్న పార్టీ మీది. ఆ పార్టీకి సారధి మీరు. మీకు నిందలు రాకపోతే ఆశ్చర్యపోవాలి గాని వస్తే ఆశ్చర్యపోయేది యేమీ లేదు. అయినా మీకు నిందలు కొత్తా? గుజరాత్ అల్లర్లలో వేలాది మందిని హింసించి చంపించడంలో మీదే అసలు పాత్రని ఆనాడు లోకం కోడై కుయ్యలేదా? ఈనాడు మీకు బ్రహ్మరథం పట్టలేదా? అప్పుడు ప్రపంచానికి పెద్దన్న మీ వీసాని కూడా రద్దు చెయ్యలేదా? అమెరికా రావడానికి లేదని వీల్లేదని నిషేధం కూడా విధించలేదా? మళ్ళీ మిమ్మల్ని పిలిచి పీట వేయలేదా? అంతెందుకు వైట్ హౌస్ లోకి రానున్న ట్రంప్ నిన్నటికి నిన్న మీ పాలన బాగుందని కితాబు యివ్వలేదా? అమెరికా ప్రెసిడెంటే యిచ్చినప్పుడు యింకా మన దేశ ప్రజలు యిస్తే యెంత? యివ్వకపోతే యెంత? వీళ్ళ మాటలెంత? వీళ్ళివాళ నొచ్చుకున్నా రేపు మళ్ళీ మిమ్మల్ని చచ్చినట్టు మెచ్చుకుంటారు. అంచేత యెప్పుడూ ఈ పరిస్థితే వుండదు! మీరు క్షిపణిలా ప్రజల మీదకి దూసుకుపొండి! క్షిపణి అంటే గుర్తుకువచ్చింది.. మీరు చేసింది ప్రజల మీద ‘సర్జికల్ దాడి’ కాదట, ‘కార్పెట్ బాంబింగ్’అట.. సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్య.. ముందుగా ముఖ్యంగా చెప్పేది ఆ సుప్రీమ్ కోర్టు నోరు ముయ్యించండి సార్.. ప్రజలనోళ్ళు ఆటోమేటిగ్గా మూతబడిపోతాయి. సోషల్ మీడియాలో మిమ్మల్ని తప్పుపడుతూ పోస్టు పెట్టిన యిద్దరు వుద్యోగులని విధులనుంచి తప్పించారని వార్తలు చూస్తున్నాం. ఆ సంఖ్యను యింకాస్త పెంచితే అందరూ ఆఘమేఘాల మీద మీ చర్య వుత్తమోత్తమైనది అంటూ బుద్దిగా వుద్యోగాలు చేసుకుంటూ బతికేస్తారు.

అప్పుడే ఎనభై మంది ప్రజలు నోట్ల రద్దువల్ల చనిపోయారని లెక్కలు చూపిస్తున్నారు. ఎనభై కాకపోతే నూటాయెనభై మంది ప్రజలను చావనివ్వండి. బ్యాంకు వుద్యోగులు యిరవైమంది వొత్తిడితో చనిపోయారని చెపుతున్నారు. ఇరవై కాకపోతే నూటాయిరవై మంది వుద్యోగులను చావనివ్వండి. రథాన్ని లాగినప్పుడు తలలు రాలిపడతాయి. అయినా రథయాత్రలు చేసి రణరంగం వీరంగం చేసిన పార్టీవారు మీరు. మీకు చెప్పాలా? అయినా ప్లేగు వస్తే చావలేదా? కలరా వస్తే చావలేదా? డెంగ్యూ వస్తే చావడం లేదా? చికెన్ గున్యా వస్తే చావడం లేదా? ఎలకలకి నీటి కలకలకి దోమలకి అంతమందిని అప్పజెప్పినప్పుడు దేశ ప్రధానిగా మీకు వెయ్యీ పయీ అప్పజెప్పొద్దా? ఆమాత్రం మీపట్ల గౌరవం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళను చూస్తే మండుతోంది.

ఏమయినా ఒకమంచిపని చేసేటప్పుడు నలుగురు నాలుగు మాటలు అంటారు. బురద జల్లుతారు. తిట్టిపోస్తారు. శాపనార్థాలు పెడతారు. అసలు ప్రభుత్వం యేది చేసినా ప్రజలను మోసం చేసి పార్టీకి మేలు చేయడానికేనని పెడార్ధాలు తీసే మేథావులు మందలకొద్దీ మనకున్నారు. వాళ్ళు యూపీ ఎలక్షన్ల కోసమే మీరు యిదంతా చేసారని అంటున్నారు. అనుకోనివ్వండి. అలా అన్నా నోట్లతో వోట్లని కొనడానికి వీలు లేకుండా చేసిన మిమ్మల్ని అభినందించాలి కదా? మీ పార్టీ వాళ్ళు ముందే జాగ్రత్తపడ్డారని, సాక్ష్యంగా మీ ప్రకటనకు ముందే రెండువేల నోటుని సాంఘిక మాధ్యమాల్లో మీ నాయకుడు ట్వీట్ చేసాడని అంటున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నరు అనిల్ అంబాని మరదలికి మొగుడు అంటున్నారు. అన్నీ అందరికి తెలుసు అంటున్నారు. ఒకటా రెండా గవర్నరు సంతకాల దాక.. యెన్నో ఆధారాలంటూ ముందుకు తెస్తున్నారు. తేనివ్వండి. ఏనుగు వెళిపోతుంటే వెయ్యి కుక్కలు మొరుగుతాయి. మొరగనివ్వండి. అధికారం మంత్రదండం. ఆ మంత్రదండమే మీ చేతిలో వుంది. అంతకు మించిన ఆయుధం లేదు. అణచివేత మీ సాధనం. అదే యింధనం. మీదే విజయం!

అవకాశం కోసం కాచుకూర్చున్న ప్రతిపక్షాలు మీ మీద యుద్ధం చేస్తున్నాయి. చెయ్యనివ్వండి. పాకిస్తాన్ యుద్ధమే నోట్ల రద్దు దెబ్బకి ఆగిపోయింది. ఆ వార్తలే పత్రికల్లో లేకుండా పోయాయి. నోట్లు రద్దవడం కాదుగాని అన్ని సమస్యలూ దెబ్బకి రద్దయిపోయాయి. ప్రజలకీ పార్లమెంటుకీ వొక్కటే ఎజెండా. నోట్లే జెండా. నోట్ల రద్దుతో మీరు అనేక సమస్యల్ని అవలీలగా రద్దు చేసేసారు. మీ తెలివి చూస్తే నాకు ముచ్చటేస్తోంది! మీరు అధికారంలోకి వచ్చాక అన్నిటా అంతటా హిందూత్వం పెరిగిపోయిందని, గోరక్షణ పేరుతో దళితుల మీదా మైనారిటీల మీదా-  దాడులూ హత్యలూ దేశంలో యెక్కడో వొక చోట ఆగకుండా జరుగుతూ మీకు మచ్చతెచ్చాయి. ఆమచ్చ చెరుపుకోవడానికి ఆలస్యంగానైనా మీరు ‘దళితులు నాసోదరులు, నన్ను చంపాకే దళితుల్ని చంపండి’ అని ప్రకటించాల్సి వచ్చింది. ఆమొత్తాన్ని మీరిప్పుడు చెరిపేశారు.

మీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం మధ్యతరగతి జీవుల్లో మీకు మంచి మార్కులే వేసింది. మిమ్మల్ని తప్పు పట్టిన వాళ్ళనే తప్పు పట్టే దేశభక్తుల్ని తయారు చేసింది. పైగా ‘నా నిర్ణయంలో దురుద్దేశం వుందని తేలితే నన్ను నడిబజార్లో వురి తీయండి’ అని మీరు భావోద్వేగాలకు గురి కావడం- ‘నన్ను ప్రాణాలతో వుండనివ్వరేమో? ఐనా జంకను, సజీవ దహనం చేసినా నల్లధనం పై పోరు ఆపను’ అని మీరు కళ్ళనీళ్ళపర్యంతం కావడం- మమ్మల్ని చాలా దుఃఖానికి గురి చేసింది. మీరు మాటి మాటికి ‘నన్ను చంపండి.. నన్ను కాల్చండి.. నన్ను వురి తియ్యండి.. నన్ను సజీవ దహనం చేసినా..’ అని అస్తమానూ అనకండి సార్.. పైన తధాస్తు దేవతలు వుంటారు! మీరు లేని దేశాన్ని ఊహించలేకపోతున్నాను! దేశాన్ని అనాధను చెయ్యొద్దు! మీ పాలనలో ప్రజలు యెంత సుఖ సంతోషాలతో వున్నారో మీరెరుగరా?!

జీ.. రేపటి యేడాదికి డబ్బై యేళ్ళుగా పట్టిన మురికిని మంత్రం వేసినట్టు మాయం చెయ్యడం వశమయ్యే పనేనా? చురుక్కు మనకుండా యింజక్షనే వెయ్యలేరే. నొప్పి లేకుండా పుప్పన్నే తీయలేరే. మన గడ్డం మనం గీసుకున్నా- అది మన బ్లేడే అయినా- మన చెయ్యే అయినా- తెగకుండా వుంటుందా? అంతెందుకు నొప్పులు లేకుండా ప్రసవం అవుతుందా? ప్రసవ నొప్పులు ప్రజలకూ వుంటాయని తెలుసుకోవాలని యీ సందర్భంగా ప్రజలకు మీ విధేయునిగా విజ్ఞప్తి చేస్తున్నాను!

యధ్బావం తద్భవతీ.. అన్నారు. ప్రతిదాంట్లోనూ మంచి చూస్తే మంచి- చెడు చూస్తే చెడు కనిపిస్తాయి. మీ నిర్ణయంలో మంచిని చూశాను. ఇంత మంచిని చేసిన మీముందు ఆ మంచి మంచి విషయాలూ ఫలితాలూ రాశి పోసి పంచుకోకపోతే నాకు పాపం చుట్టుకుంటుంది.

ఎన్నడూ లేనిది ప్రజలకు డబ్బులు లేకుండా జీవించడం వచ్చేసింది. ఉన్నదాంట్లో వొద్దికగా బతికే నేర్పు వచ్చేసింది. ఆర్భాటాలు లేవు. అనవసర ఖర్చులు లేవు. షాపింగులు లేవు. సరదాలు లేవు. సందళ్ళు లేవు. సినిమాలు లేవు. షికారులు లేవు. పనుల్లేవ్. పాకుల్లేవ్. ఉన్నదాంట్లో తిన్నామా.. ఏటియం క్యూ లైన్లో నిల్చున్నామా.. వచ్చి గూట్లో గుట్టుచప్పుడుగా పడుకున్నామా.. అంతే. పొదుపుగా పొద్దు పుచ్చడం వచ్చింది. (చెప్పకేం దుబారా చేసే మాఆవిడ కూడా యెంత చిక్కిడి అయిపోయిందో..?) రేపు డబ్బులు చేతికి వచ్చినా ఏం చేసుకోవాలో తెలీక జనాలు తికమకపడతారంటే అతిశయోక్తి కాదు. కాదంటే మీ మీదొట్టు..

మరొక్క విషయమూ యిందులో వుంది. మనిషి తన మూలాలను గుర్తిస్తున్నాడు. వస్తుమార్పిడి విధానం మళ్ళీ మొదలైంది. మాదగ్గర బియ్యం తీసుకు వెళ్ళే మా పక్కింటివాళ్ళు మాకు అందుకు ప్రతిగా పప్పులూ ఉప్పులూ యిస్తున్నారు. మేం చింతపండు యిస్తే వాళ్ళు ప్రతిగా పసుపూ కారం యిస్తున్నారు. మనదగ్గర వున్నది యివ్వడం.. వాళ్ళదగ్గరున్నది పుచ్చుకోవడం.. యిలా యిచ్చిపుచ్చుకోవడంలో దేశ ప్రజల సహనమూ సౌశీల్యమూ స్నేహమూ సౌభ్రాతృత్వమూ యింకా చాలా చాలా వగైరాలు చూడగలిగాను!

మీ నిర్ణయం తర్వాత తాగుబోతులు తాగడం తగ్గించేసారు. జేబులు ఖాళీ అయి బుద్దిగా యింటికి వెళ్ళిపోతున్నారు. తంతే మరి నాలుగు పెళ్ళాలని తంతున్నారే తప్ప-  తప్పతాగి యెక్కడికక్కడ పడిపోవడం లేదు. చిల్లర సమస్య తాగుబోతులకు వుండరాదని రౌండ్ ఫిగరు చేసినప్పటికిన్నీ నలభై నుండి యాభై శాతం తాగడం తగ్గింది అంటే ముందు ముందు ఆశాతం మరింత పెరగొచ్చు అని రూడీగా చెప్పొచ్చు. చచ్చినట్టు మద్యపాన ప్రియులు కుటుంబప్రియులు అవుతారు. దేశంలోని మహిళలంతా యెప్పటికీ మీ ఋణం తీర్చుకోలేరు గాక తీర్చుకోలేరు!

కొందరు పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయని ఓ గగ్గోలు పెడుతున్నారు తప్పితే, సింపుల్ గా పెళ్లి చేసుకోవడం నేర్చుకు చావరే. అయినా పెళ్ళిళ్ళు ఆగిపోవడంవల్ల దేశానికి యెంతో మేలూ లాభమూ వున్నదన్న సంగతి మర్చిపోతున్నారే. పెళ్ళయితే యేముంది? మాహా అయితే పిల్లల్ని కంటారు. కోట్లలో జనాభాను పెంచుకుపోతారు. అదే పెళ్ళిళ్ళు ఆగిపోవడంవల్ల సంతతి ఆగిపోతోంది.. జనాభా తగ్గిపోతోంది. ప్రతి దానిలో పాజిటీవు కోణం చూడగలిగిన వాడే నిజమైన భారతీయుడు కాగలుగుతాడు!

పెద్దనోట్ల రద్దువల్ల యిచ్చిన లంచం తిరిగి వెనక్కి యిచ్చేస్తున్నారు ప్రభుత్వోద్యోగులు. లంచం లేకుండానే పనులు చేసేస్తున్నారు. ‘ఇప్పుడు కాదు, పని అయ్యాక ఆరుమాసాలు పోయాక యివ్వండి’ అని అంటున్నారు. డబ్బులు యిస్తేగాని పనిచెయ్యమని యిన్నాళ్ళలా పీక మీద కత్తి పెట్టుకు కూర్చోవడం లేదు. ఇంతటి పెను మార్పును మా జీవితాల్లో మేము చూస్తామని యెన్నడూ కలలో గాని అనుకోలేదు. ఈ శుభపరిణామానికి దేశంలోని పరిణామాలే కారణమని చెప్పకతప్పదు. అందుకు కారణమైన మిమ్మల్ని అభినంధించకా తప్పదు!

పేకాట రాయుళ్ళు పేకాట మానేశారు. డబ్బులు లేకుండా వొత్తి పుణ్యానికి ఆడడంలో వాళ్లకి మజా లేదు. అంతెందుకు కుర్రాళ్ళంతా వారం వారం అడ్డమైన సినిమాలను చూసేవాళ్ళు. వారానికి వో అరడజను సినిమాలు రిలీజు అయ్యేవి. యేవి.. యిప్పుడు వొకట్రెండు సినిమాలే ట్రెండు. బెండు తీసారు. ఇప్పుడు పిల్లలు గమ్మున యింటిపట్టున వుండి ఫేస్ బుక్కులు చక్కగా చదువుకుంటూ యూ ట్యూబులు చూసుకుంటూ వున్నారు.  టీవీల్లో వచ్చే సినిమాలు చూసుకుంటూ కాలం గడిపేస్తూ వున్నారు. యువత మీ మేలు మరిచిపోదు.. పోలేదు!

మరో ముఖ్యమైన విషయం చెప్పనా? దొంగతనాలు మా బాగా తగ్గాయి. అలవాటులో పొరపాటుగా వచ్చిన దొంగలు వెయ్యీ ఐదు వందల నోట్లు కళ్ళముందు కనిపించినా యెత్తుకు పోవడం లేదు. మా ఆవిడ దాచుకున్న పాతిక వేలు యెలా మార్చడమా అని ఆపసోపాలు పడుతున్న వేళ.. మొన్నటికి మొన్న మా యింట్లో పడ్డ దొంగ అది చూసి నన్ను బుద్దుందా? అని తిట్టాడు. క్లాసు కూడా పీకాడు. కౌటిల్యుడిలాగ బోధించాడు. డబ్బును డబ్బుగా దాస్తే దాని విలువ తగ్గిపోతుందట. కోల్పోతుందట. అందుకని బుర్రన్న వాడెవడైనా డబ్బు దాచుకోడట. భూమ్మీదో బంగారమ్మీదో షేర్లమీదో బినామీల మీదో పెడతాడు తప్ప యింట్లో లిక్విడ్ క్యాష్ దాచుకోర్రా యెర్రి నాగన్నా.. అని హితబోధ చేసాడు. నీదగ్గర కోటిరూపాయలు వుంటే పదిలక్షలైనా జేబులో కాదు కదా యింట్లో పెట్టుకుంటావా?.. అని అడిగాడు. డబ్బు పొదుపు చేసే కన్నా పొదిగితే పెరుగుతుంది.. ఈ సత్యం తెలియని సత్తికాలపు సత్తెయ్యవా నువ్వు?  దాచుకున్నా అది అయిదూ పది శాతమేన్రా నీ యబ్బా.. అని తిట్టి పోశాడు. బుర్రతక్కువ యెదవలు అని కూడా అనేశాడు. ఆ తిట్టు నాకు తగిలినందుకు కాదు, మీకూ తగిలినందుకు నేను చాలా విచారపడి విలవిలలాడిపోయానంటే నమ్మండి. మా ఆవిడ కూడా దొంగకే వంత పాడింది.

పర్లేదు.. మీది మహోన్నత నిర్ణయం. మీ దయవల్ల అందరికీ పని దొరుకుతోంది. బిందెలకు మాట్లేస్తాం.. అన్నంతగా మూల మూలలా వేల వేళలా- మీ పాత బిందెలకు కొత్త బిందెలు యిస్తాం.. అని అన్నంతగా  మీ పాత నోట్లకు కొత్తనోట్లు యిస్తాం.. అని నోట్లు మార్చే పని కుటీర పరిశ్రమలా సాగుతూ వుంది. అన్ని వ్యాపారాలు ఆగిపోయినా ఈ యవ్వారాలు ఆగలేదు. పెద్ద పార్టీలకు థర్టీ పర్సెంట్. డోర్ డెలివరీ సదుపాయం కూడా వుంది. బ్యాంకు మారాజులు మా బాగా చెయ్యి కలుపుతున్నారు. పోస్టుమాస్టర్సూ పోస్టాఫీసుల్లో నగదు మార్పిడిల్లో మాబాగా మార్చారు. ఏమార్చారు. ఏమయితేనేం మనం పాజిటీవుగా చూస్తే చాల మందికి పని దొరికింది. మీపేరు చెప్పుకొని పావలా పరకో యింతో అంతో సంపాదించుకుంటున్నారు.

అసలు సంపాదించుకోనిది యెవరు? ప్రభుత్వ సంస్థలే తీసుకుంటే యింతకు మునుపు కునారిల్లిపోయి వుండేవి. ఇప్పుడు కూటికి లేనివి కోటికి పడగలెత్తాయి. వెయ్యీ ఐదువందల నోట్లతో అన్ని పన్నులూ పాత బకాయిలూ కట్టొచ్చునని చెప్పినతరువాత మా హైదరాబాదు జీహెచ్ఎమ్సీ రెండువందల కోట్ల పైనే రాబట్టింది. గత వసూళ్లతో పోలిస్తే రెండువేల రెండువందల రెట్లు యెక్కువని కూడా వార్తలు వస్తున్నాయి. మొండి బాకాయిలు వసూలవుతున్నాయి. గుడ్డివాళ్ళు యివన్నీ చూడలేరు.

ప్రభుత్వ సంస్థలే కాదు, ప్రవేటు వ్యక్తులకు అప్పులు వున్నా- బ్యాంకులకు అప్పులు వున్నా కూడా కొందరు ఆపద్భాందవుల్లా ముందుకు వచ్చి మీ అప్పులు తీరుస్తామని కోరి చెపుతున్నారు. మీరు తరువాత మాకు తీర్చండి అని భరోసా యిస్తున్నారు. మనిషిని మనిషి నమ్మని యీ రోజుల్లో యీ విధంగా మానవీయత పరిమళిoచడం మానవత్వం కాదా? ఇంతకుమించిన మానవత్వం వుంటుందా అని అమర్త్యసేన్ని అడుగుతున్నాను..

మనుషులే కాదు దేవుళ్ళ పరిస్థితి కూడా మెరుగయ్యింది. గుళ్ళూ గోపురాలు పుట్టిబుద్దెరిగి యింత కలక్షన్లు కల్లజూసాయా అని అడుగుతున్నాను. కలక్షన్ల కింగ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామివారి ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఇంకా పెరుగుతుంది. శ్రీవారికి వొక్క రోజుకే ఆదాయం నాలుగుంపావూ నాలుగున్నర కోట్లు దాకా వస్తోంది. విజయవాడ దుర్గమ్మకూ మునుపెన్నడూ లేని ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం నెలాఖరుకల్లా మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏ మాత్రం ఆదాయం లేని స్థానిక దేవుళ్ళ గుడిలో దీపాలు వెలుగుతున్నాయి. తీర్థ ప్రసాదాలు అందుతున్నాయి. ఇదంతా మీ చలవే. భక్తులు పాత నోట్లని సగర్వంగా సమర్పించుకుంటున్నారు. అదీ యీ మీడియా వాళ్ళకి తప్పే. పాపంలో వాటా భగవంతుడికీ పంచుతున్నారని గోల పెడుతూ ప్రోగ్రాములమీద ప్రోగ్రాములు చేసేస్తున్నారు. దేవుడి దృష్టిలో చెల్లుబాటు అయేది.. చెల్లుబాటు అవనిది అంటూ వుంటుందా? దేవుడు అన్నిటినీ సమంగా స్వీకరిస్తాడు అన్న సత్యాన్ని మరిచిపోతున్నారు. తుచ్చులు.. సమాజానికి ఉచ్చులు..

అరే హాస్పిటల్స్ లో రోగాలన్నీ నయం చేసుకుంటున్నారు. అనారోగ్యాలను యేమాత్రం వాయిదా వెయ్యడంలేదు. నోట్లని మార్చేసుకోవడానికిది మరో మార్గం అని అంటున్నారే తప్ప యిందులోని పాజిటీవు అవకాశపు కోణం చూడరే అంధులు.. అర్భకులు..

విదేశాల్లోని నల్లధనం మీరు తీసుకురాలేక ఆ చిత్తశుద్ది మీలో లేక స్వదేశంలో డ్రామాలు చేస్తున్నారని అన్నవాళ్లకీ ఆడిపోసుకున్నవాళ్ళకీ వొక్కటే నా సమాధానం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. మన సంస్కృతీ సాంప్రదాయాలూ వీళ్ళకి తెలిసి చావవు. అయినా స్విస్ బ్యాంకు రెండేళ్ళ తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిదిలో కొత్తగా ఖాతాలు తెరిచినవాళ్ళ వివరాలను చెపుతామని చెపితే సంతోషించక- అది మీ కృషి అని అంగీకరించలేక-  పాత ఖాతాదారుల వివరాలు రాబట్టలేరా.. అని తిరిగి అడుగుతారు. మాల్యాని మీరే టిక్కట్టు తీసి దగ్గరుండి పంపించినట్టు మాట్లాడుతారు. వదిలేసారని వాపోతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడువేల పదహారు కోట్లు ‘రద్దు పద్దు’లో వేసి నీళ్ళోదిలేసిందని, అందులో పన్నెండు వందల వొక్క కోటి విజయమాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దని, యిందులో ఆరు సంస్థలు మన తెలుగు రాష్ట్రాలవని కూడా వున్నాయని వాపోతున్నారు. అక్కడితో ఆగక మా బాకీలు కూడా మీ ‘రద్దు పద్దు’లో వేసి ఆదుకోమని వాడెవడో బయలు దేరాడు. ఇంక అందరూ అలా ముందుకు వస్తే బ్యాంకింగు వ్యవస్థ కుప్పకూలిపోదూ? అందుకే గదూ రైతుల్ని చితకతన్ని పాతిక వేలయినా లాక్కోనేది.. జప్తు చేసేది? మన బ్యాంకులను, మన ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవద్దూ? ప్రతి దానిలో మంచి చూడడం వీళ్ళకు యెందుకు రాదో నాకర్థమే కాదు!

ఉగ్రవాదం.. తీవ్రవాదం.. నక్సలిజం యివన్నీ అంతరించిపోవాలంటే నల్లదనం అరికట్టాలి. ఆ నల్లదనం పెట్టుబడిదారుల వ్యాపారుల దగ్గర వుంటే వ్యాపారాలు చేస్తారు. వారు అభివృద్ధిలోకి వచ్చి దేశాన్ని అభివృద్ధిలోకి తెస్తారు. మనీని డెడ్ చెయ్యరు. డెత్ కు వాడరు. మరంత మనీ జనరేట్ చెయ్యడానికి వాడుతారు. అంచేత అందర్నీ వొక గాట కట్టలేం!

మీ విజన్ మాకు తెలుసు. మీరు మన కంట్రీని  క్యాష్ లెస్ కంట్రీగా చెయ్యాలని కలలు కంటున్నారు. మీరు మాత్రమే కలలను నిజం చెయ్యగలరు. ఎనభైయ్యారు శాతంగా వున్న పెద్దనోట్లు రద్దయ్యాక- ఎనభైయ్యారు శాతం ఏటీయంలు పనిచెయ్యకుండా వున్నాక- అంతా క్యాష్ లెస్సే! మనది క్యాష్ లెస్ కంట్రీయే! మరో విషయం పాలుకీ పనిమనిషికీ కూరలకీ కోడిగుడ్లకీ స్వైప్ మిషనేనా అని యెద్దులు యెద్దేవా చేస్తున్నారు! కాని చిన్న చిన్న దుకాణాలలో అమ్ముకొనే స్క్రాప్ ని మీరు తీసి పడేసి- అంతా అందంగా హై ఫై చేసి- కార్పోరేట్ వ్యాపారాలవైపుకు మళ్లిస్తున్నారన్న మర్మాన్ని అర్థం చేసుకోరే?! పెద్దపెద్ద పెట్టుబడులు పెట్టి మనదేశానికి వచ్చిన వాళ్ళని మనం ఆ మాత్రం ఆదరించవద్దా?

చిన్నా పెద్దా తేడాలేకనే లక్షల కోట్లు బ్యాంకుల్లో అప్పుతీసుకున్న ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ, రూలియా బ్రదర్స్, అనిల్ అగర్వాల్, గౌతమ్ ఆదాని- వేల కోట్లు అప్పుతీసుకున్న సైరుస్ మిస్త్రీ, మనోజ్ గౌర్, సజ్జన్ జిందాల్, లాంకో మధు, జియం రావ్, వియ్యన్ ధూప్, జీవీకే రెడ్డి- వీళ్ళ గురించి యిప్పుడే కొత్తగా తెలిసినట్టు తెగ యిదై పోతున్నారు. వాళ్ళు చేసిన రుణాలు కక్కించమంటున్నారు. లాగొచ్చు. కాని ఆ డబ్బు యెవరిది? వాళ్ళ వ్యాపారాలలో వున్నది ప్రజల డబ్బే. వాళ్ళు కుదేలయితే ప్రజలకు ఆ దెబ్బతాకుతుంది. అందుకని యిలాంటి పెద్దల్ని గౌరవంగా చూసుకోవాలి. ప్రోత్సహకాలు యివ్వాలి. రైతులకు సబ్సీడీలు తీసేసినా వ్యాపారాలకూ పెట్టుబడిదారులకూ సబ్సిడీలను యిచ్చి ప్రోత్సహించాలి. ఉచితంగా కోరినంత భూమి, కరెంటు, నీళ్ళు, ప్రభుత్వ సహాయ సహకారాలు అందివ్వాలి. మీ చర్యతో బ్యాంకుల్లో చేరిన అనెకౌంటెడ్ మనీని.. ఎకౌంటెడ్ మనీని- ఈ పెద్దలకు మళ్ళీ మళ్ళీ రుణాలుగా యివ్వాలి. వాళ్ళు వ్యాపారాలు చేసి దేశ ప్రజలకి ఉపాధి కల్పిస్తారు. ఊతమిస్తారు. అంతే కాదు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారు. వాళ్ళని క్యూల్లో వచ్చి నిలబడాలని కొందరు మూర్ఖంగా ఆలోచనలు చేస్తున్నారు. మన దేశం సంపన్నుల జాబితాలో చేరడానికి కారకులైన వాళ్ళను మనం గౌరవించకపోతే ప్రపంచం గౌరవిస్తుందా? పేద దేశంలో ధనికులుగా రాణించడం అంత ఆషామాషీ యవ్వారం గాదు. అందుకైనా వాళ్ళ కాళ్ళు కడిగి మన నెత్తిన పోసుకోవాలి. ఆపనిచేస్తున్న ఏలికలకు యెంతగానో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

బీజేపీ యంపీ హర్షవర్ధన్ గారిని జనం అసహనంతో చితకబాదితే దేశమంతా అసహనం వున్నట్టు చిత్రీకరిస్తున్నారు. పాతిక రోజులుగా జనం కుక్కిన పేనుల్లా పడి లేరా? అవస్థలు పడుతూ ప్రజలు మీకు సహకరిస్తూ వుంటే వీళ్ళకు  కంటగింపుగా వుంది. మీ నిర్ణయాన్ని వ్యతిరేకించేవాళ్ళకు తగిన సమాధానం యిచ్చారు. అవినీతి పరులుగా ముద్ర వేసారు. అందుకే ప్రతొక్కరూ’ మోడీగారి నిర్ణయం మంచిదే కాని..’ అనేదాకా వచ్చారు. అది చాలు.. మీరు విజ్రుభించేయడానికి!

ప్రజలకి ఓర్పు లేకపోతే యెలా? భార్యా బిడ్డలా యేమి స్వార్థం మీకు? కాని భార్యా బిడ్డలు వుంటే మీరు యిలా చేసేవారా.. అని తిరిగి అడిగేవారూ వున్నారు. ఇలాంటి ప్రజలకోసమా మీరిన్ని అవస్థలూ పడుతున్నది అని తలచుకుంటే దుఃఖం వస్తుంది.

అప్పుడే రెండువేల నోట్లు నకిలీవి వచ్చేసాయని అంటున్నారు. ఇదీ తప్పేనా? తెలివిగా ఆలోచిస్తే నోట్ల కొరత వున్నప్పుడు నకిలీ నోట్లు కూడా చెలామణీ కావడం కొంత ఊరటే. అవి ఖాళీలను పూరిస్తాయి. అన్నీ నోట్లూ ప్రింట్ అయి వొకేసారి రావాలంటే కష్టం గదా? ఆమాటకు వస్తే మన భారతదేశానికి పాకిస్తానుకు మెటీరియల్ సరఫరా చేసేవాడు వొక్కడే. ఇప్పుడు యేమయ్యింది.. నోట్ల కొరత కొంత తీరుతోంది గదా.. అని పాజిటీవ్ గా చూస్తే నెలకొన్న సమస్య తీరడంలో నకిలీ నోట్లు అవసరం. లోపాలతో వున్న అయిదువందల నోట్లని వొదల్లేదా? రెండువేలతో సహా అన్నీ రేపు భవిష్యత్తులో రద్దయ్యేవేగా?

చెప్పడం మరిచాను. జనధన్ ఖాతాల్లో భారీగా డబ్బు చేరడంవల్ల పేద సాదలకు పైసా పరకో దొరుకుతుంది. మీరు చూసీ చూడనట్టు పోవడం వల్ల రేపు మీరు వొక్కొక్క ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామని ముందే యిచ్చిన హామీని నిలబెట్టుకోకపోయినా పోయింది పొల్లు వచ్చింది గట్టి.. అని మిమ్మల్ని మన్నిస్తారు.

మీ ధ్యేయం ఫలిస్తోంది. నలుపు తెలుపవుతోంది.. బ్లాక్ మనీ మీరన్నట్టే తీసి పారేశారు. నల్లధనం లేదు. వుండదు. ఈ డిసెంబరు ముప్పైలోగా వున్న నల్లధనం తెల్లధనంగా మారిపోతుంది. స్వయంగా వస్తే ఫిఫ్టీ పర్సెంటు.. మేం పట్టుకుంటే ఫిఫ్టీన్ పర్సెంటు.. అని బంపరాఫరే యిచ్చారు. నలుపుని తెలుపు చేసుకొనే మహదవకాశం మీరిచ్చారు. కాని మనవాళ్ళు ఈలోపలే మార్చేసారు. ఉన్న అరా కొరా మీరిచ్చిన ఆఫర్లో మార్చేసుకోవచ్చు. నల్లధనమే కాదు, నాలుగు వందలకోట్ల నకిలీ నోట్లు కూడా దెబ్బకి బ్యాంకుల్లో జమయిపోయాయి. చెల్లని నోటుకు మళ్ళీ అది అసలా నకిలీనా అని చూస్తారా? అంత సమయం మన బ్యాంకుల వాళ్ళకి వుందా? లేదు! మన దేశంలో రద్దయిన పెద్దనోట్ల మొత్తం విలువ పదిహేనున్నర లక్షల కోట్లు. నవంబరు ఆఖరి నాటికే పదకుండు లక్షలకోట్లు బ్యాంకుల్లో జమయినాయి. మిగిలిన నాలుగున్నర లక్షలకోట్లు ఈ నెలాఖరులోపల ఈజీగా జమవుతాయి. బ్యాంకులకు రాకుండా నల్లధనం బయట మిగిలిపోయే అవకాశమే లేదని ఆర్ధిక నిపుణులు లెక్కలు కడుతున్నారు. తిరిగి లక్షన్నర కోట్లు మీ చర్య వలన నష్టం వస్తుందని కూడా చెపుతున్నారు. ఎవరెన్ని చెప్పినా యిప్పుడు మీ అడుగు వెనక్కి తీసుకోవడానికి లేదు. దేశం వృద్ధిరేటు తగ్గినా తప్పులేదు. ఎందుకంటే మీరు యెంతో సాహసంతో దేశంలో నల్లధనం లేకుండా చేసారు.  అది చాలు. ఆపేరు చాలు. నల్లధనంతో నానా అవస్థలూ పడుతున్న పెద్దలకు మీరిచ్చిన అవకాశం అమూల్యమైనది. అపురూపమైనది. మీరే మళ్ళీ మళ్ళీ మనదేశ ప్రధానమంత్రిగా వుండాలి. నల్లధనం లేని దేశంగా భారత దేశాన్ని మార్చేసి  చరిత్రలో స్థానం కల్పించిన మీకు ఈ దేశప్రజలు యెప్పటికీ ఋణపడే వుండాలి. వుంటారు!

ఈ దేశప్రజల్లో వొకడినైనందుకు యెంతగానో గర్విస్తున్నాను!

కృతజ్ఞతా పూర్వక నమస్కారాలతో-

మీ

అనామక భక్తుడు.

 

ధర్మారావులో ఒక ‘అపరిచితుడు’

 

‘సాహిత్యంలో దృక్పథాలు’ రెలెవెన్స్-5

 

sudrarsanamదుఃఖించే మనిషిని చూడండి. అప్పుడతని, లేదా ఆమె ముఖకవళికలను చూడండి. దుఃఖం కళ్ళను తడిపి, ఆ తర్వాత, సృష్ట్యాదినుంచీ తన లోపల గడ్డ కట్టిన  ఒక పెద్ద మంచుఖండం వేదనా విలయాగ్నికి కరిగి ఒక మహా ప్రవాహంలా మారి కళ్ళు అనే రెండు ఇరుకు బిలాలనుంచి ఒక్కుమ్మడి ముందుకు దూకడానికి ప్రయత్నిస్తోందా అన్నట్టు ఉంటుంది!

ఎప్పుడైనా, ఎవరిదైనా సరే దుఃఖం హఠాత్తుగా మనల్ని ఒక అలౌకిక జగత్తులోకి తీసుకుపోయి అస్తిత్వం తాలూకు అనాది ఆర్తారావాన్ని శబ్దంగానూ, నిశ్శబ్దంగానూ కూడా ధ్వనిస్తుంది.

ప్రతి దుఃఖం వెనుకా గొప్ప కారణం ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి దుఃఖమూ అర్థవంతం కావాల్సిన అవసరమూ లేదు. అమ్మతో అయిదేరాళ్ళ కుర్రాడు జనసమ్మర్దంలోకి వెళ్లినప్పుడు, అంతవరకూ పక్కనే ఉన్న అమ్మ, అంతలో కనిపించకపోతే భయవిహ్వలతతో బావురు మన్నప్పుడు కూడా ఆ దుఃఖంలో అస్తిత్వపు అనాది ఆర్తారావమే తళుక్కుమంటుంది.  కొత్తగా అత్తింటికి వెళ్ళే నవవధువు తల్లిదండ్రులను విడిచి వెళ్ళేటప్పుడు పడే దుఃఖం కూడా అలాంటిదే. బిడ్డ పోయినప్పుడు తల్లి, తల్లి పోయినప్పుడు బిడ్డ పడే దుఃఖం వీటికన్నా సహస్రాంశాలు పెద్దవిగా, అర్థవంతమైనవిగా మనకు అనిపించవచ్చు.  కానీ దుఃఖితుడిలో అలాంటి తేడాలు ఏవీ ఉండవు. ఆ క్షణంలో తన దుఃఖమే తీవ్రం. అందుకు దారి తీయించినదే గొప్ప కారణం.

దుఃఖానికి ఇంకొక విలక్షణ స్వభావం కూడా ఉంది. దుఃఖితుడు, అతని లోపాలోపాలు, దుఃఖకారణాలు, అందుకు సంబంధించిన తర్కవితర్కాలు సహా అన్నింటి నుంచి అది వేరుపడి స్వతంత్రను స్థాపించుకుంటుంది. అప్పుడా అశ్రుధార ఏ మాలిన్యాలూ అంటని స్వచ్ఛజలం. తన ‘పరమపావన వంశాన్ని’ వెలగా చెల్లించి కొనుక్కున్న ‘కడజాతి’ ఇల్లాలు మరణించినప్పటి నిగమశర్మ దుఃఖం కూడా అంతటి స్వచ్ఛమే.

ఒక కోణం నుంచి చూస్తే గొప్ప అనుభూతి గాఢత నిండిన కవిత్వమూ, గొప్ప దుఃఖమూ విమర్శకు అతీతాలు. ‘వేయిపడగలు’ పేరుతో వేయి పుటల మీదుగా ప్రవహించినది, విశ్వనాథవారి అలాంటి మహాదుఃఖం. మహాకవితాత్మక దుఃఖం. అది గతించిన, గతించిపోతున్న ఒకానొక వ్యవస్థను గురించిన దుఃఖం. బహుశా అప్పటికి ఎంతోకాలంగా హృదయంలో సుడులు తిరుగుతున్న ఆ దుఃఖం ఒకానొక క్షణంలో కట్టలు తెంచుకుని ఇరవై తొమ్మిది రోజులపాటు ఏకబిగిని ప్రవహించి అక్షరరూపం ధరించి మహా శోకప్రవాహం అయింది. ఆ ప్రవాహపు ఉరవడిలో మనం ఉక్కిరిబిక్కిరవుతాం, అప్రతిభులమైపోతాం, మనకు తెలియని ఒకానొక అపూర్వ జగత్తులో …అనేకానేక సందేహాలు, విచికిత్సల మధ్య దిక్కు తోచని స్థితిలో కొట్టుకుపోతాం.

రచనాంతంలో, ‘ఏమి మిగిలింది?’ అని ప్రశ్నించుకున్న ధర్మారావుతో, ‘నేను మిగిలాను’ అని చిన్న అరుంధతి అంటుంది. ‘అవును. నీవు మిగిలితివి. ఇది నా జాతి శక్తి. నా యదృష్టము. నీవు మిగిలితివి’ అని ధర్మారావు అంటాడు. కానీ, పుస్తకాన్ని మూసేసి,  ఇంతకీ రచన ఏం చెప్పిందని సవిమర్శకదృష్టితో ప్రశ్నించుకునే పాఠకునికి ధర్మారావుకి లభించిన సంతృప్తి లభిస్తుందా అంటే సమాధానం దొరకదు.

ఒక కారణం, రచన పరిణామశీలాన్నే నిరాకరించడం. రచయిత చిత్రించినది, కాంక్షించినది ఎటువంటి మార్పులకూ, కొత్తదనానికి చోటివ్వని…కాలంలో ఘనీభవించిపోయిన ఒక వ్యవస్థను! రచన చివరిలో ఇలా అంటాడు:

“ఆహా! ఏమి కాలము!  ఏమి మార్పు! ఎన్నెన్ని ప్రాతవి నశించిపోయినవి? ఎన్నెన్ని క్రొత్తవి తలచూపినవి! లోకమంతయు నూత్నత్వము శక్తి యనుకొనుచున్నది. నూత్నత్వము నూత్నత్వమే కానీ శక్తి యెట్లగును? కొత్తలో గాడిదపిల్ల కూడ కోమలముగానే యుండును. ఆహా! ఎంత నశించిపోయినది? నశించిపోయినదానిని చూచినచో కడుపు తరుగుకొని పోవుచున్నది. ఈ నశించిన దంతయు వ్యర్థమై తేజోరహితమైనదైనచో దుఃఖము లేదు. నా జాతి యింత దైవోపహతమైన దేలకో? ఈ జాతి చేసిన పాపమున కంతులేదు కాబోలు!”

నిత్య పరిణామానికి సాక్షులుగా ఉండి, దానిని సహజంగా తీసుకుని, పాత, కొత్తల మధ్య ఒక సమన్వయానికి నిరంతర సాధన చేసే జనాలముందు పై వాక్యాలు ముందుకీ, వెనక్కీ కూడా  వెళ్లలేని ఒక అడ్డుగోడను రెండు వైపులా నిర్మిస్తాయి. అయోమయాన్ని కల్పిస్తాయి. విశ్వనాథవారు లక్షించిన వ్యవస్థే కానీ, మరొక వ్యవస్థే కానీ ముందు వెనకల ఎలాంటి పరిణామసూత్రమూ  లేకుండా స్వయంభువుగా అవతరించి అలా ఉండిపోయిందా అని ప్రశ్నించుకున్నప్పుడు రచనలో సంతృప్తి కరమైన సమాధానం దొరకదు.

రచయిత లక్ష్యం స్పష్టమే. చాతుర్వర్ణ్యవ్యవస్థను అత్యంత వైభవోపేతంగా, ఆదర్శప్రాయంగా చిత్రించడం. నాలుగు వర్ణాల వారూ ఎవరి ఎవరి వృత్తి ధర్మాల పరిధిలో వారు ఉంటూనే దేవాలయం, దైవభక్తి కేంద్రంగా పరస్పర ప్రేమాభిమానాలతో హృదయైక్యతతో ఉండడం. ఇందులో పంచములకు స్థానం లేదు. అయితే, ఈ వ్యవస్థకు కాల్పనికప్రపంచంలో ఉన్నంత ఉనికి వాస్తవిక ప్రపంచంలో కనిపించదు. అందుకు తగినట్టే ఇందులోని పాత్రలు రామేశ్వరశాస్త్రి, ధర్మారావు, కృష్ణమనాయుడు, రుక్మిణమ్మారావు, సరోజిని, హరప్ప, గిరిక, గణాచారి, పసిరిక, రంగాజమ్మ, రత్నగిరి మొదలైన పాత్రలు కాల్పనిక ప్రపంచజీవులుగా, అతి మానుషులుగా కనిపిస్తారు. పెళ్లై అత్తింటికి వచ్చిన ధర్మారావు భార్య పెద్ద అరుంధతిని కూడా ఆశ్చర్యచకితం చేసిన అతిమానుష స్వభావం వారిది.  ధర్మారావు మిత్రులు కిరీటి, సూర్యపతి, కుమారస్వామి, రాఘవరావు తదితరులు, మంగమ్మ  వాస్తవిక ప్రపంచానికి చెందిఉంటూనే ధర్మారావుకు చెందిన అతిమానుష కాల్పనిక జగత్తుపట్ల సానుకూలతను, ఆరాధనాభావాన్ని చాటుకుంటూ ఉంటారు. రాధాపతి, చక్రవర్తి, పత్రికాసంపాదకుడు వామనరావు తదితరులు  ఆ భావజాలానికి ప్రతివాదులు. కుమారస్వామి అయితే ధర్మారావుకు విస్తరిత రూపమే. ధర్మారావులోని భావతీవ్రతే అతనిలోనూ ఉన్నా, ధర్మారావు ఉగ్రతను శాంతం కప్పి ఉంచితే కుమారస్వామి ఉగ్రత నేరుగా వ్యక్తమవుతుంది. కుమారస్వామి అని పేరుపెట్టడంలో దేవతల సేనాని అయిన కుమారస్వామిని రచయిత దృష్టిలో ఉంచుకున్నట్టు అనిపిస్తుంది. చివరిలో చిన్న అరుంధతిని పెళ్లాడిన ఘట్టంలో ధర్మారావుకి శివునితో సామ్యం కనిపిస్తుంది.

viswanatha

రామేశ్వరశాస్త్రి, కృష్ణమనాయుడు, రుక్మిణమ్మారావు, సరోజిని తదితర పాత్రలను అలా ఉంచితే; నవలలో దాదాపు చివరివరకు జీవించిన గిరిక, గణాచారి, పసిరికలు పూర్తిగా అతిమానుషప్రపంచంలోనే ఉండిపోతారు. ధర్మారావు ఒక్కడే అతిమానుష, వాస్తవిక ప్రపంచాలకు మధ్య లంకెగా ఉంటూ, వాటి మధ్య పరిభ్రమిస్తూ, రెండింటి తారతమ్యాలను అడుగడుగునా వివేచించుకుంటూ  గడుపుతాడు. అతని స్థితిని రచయితే ఇలా చెబుతాడు:

“ధర్మారావునకు రెండు జగత్తులు. ఒక జగత్తులో మూకీభావము. మరొక జగత్తులో అనియత వాగ్వ్యాపారము. ఒక జగత్తు దివ్యము, ఒక జగత్తు భౌమము. భౌమములో అతి భౌమము. ఒకటి పునీతము, ఒకటి ఇంద్రియ పరాభూతము. దివ్యమునుండి భౌమమునకు వచ్చుట ఎంత కష్టమో, దీనినుండి దానికి పోవుటయు అంతే కష్టముగా నున్నది. సెలవులు వచ్చినచో గణాచారి, దేవదాసి, పసిరిక, అరుంధతి! సెలవులు లేనిచో కిరీటి, శివరావు, కళాశాల”.

దివ్యజగత్తులో గడిపే ధర్మారావుకు భౌమ(భూసంబంధమైన)జగత్తులో గడిపే ధర్మారావుకు మధ్య ఎంతో వ్యత్యాసం. భౌమ జగత్తులో గడిపే ధర్మారావు పాఠకులు హృదయాలపై గాఢంగా ముద్రపడతాడు. ఈ జగత్తులో అతను నిరహంకారి, నిగర్వి, గొప్ప మానవీయత కలిగినవాడు, వ్యక్తిత్వమూ, శీలమూ, స్వాభిమానమూ, స్నేహశీలమూ ఉన్నవాడు. వాటితోపాటు కొన్ని లౌకికమైన బలహీనతలూ ఉన్నవాడు. అతని స్నేహశీలాన్ని, మానవీయతను, కృతజ్ఞతను వెల్లడించే హృద్యమైన ఘట్టాలు నవలలో అనేకం ఉన్నాయి. మిత్రుడు రాఘవరావు భార్య మశూచితో చనిపోయినప్పుడు, అంతిమ సంస్కారానికి ఎవరూ సాయపడనప్పుడు; ధర్మారావు, అతని మరో మిత్రుడు సూర్యపతి స్వయంగా శవాన్ని శ్మశానికి తీసుకెళ్లి పాతిపెట్టిన ఘట్టం వాటిలో ఒకటి. అలాంటిదే జేబుదొంగ అయిన ఆసిరి అనే కుర్రవాడిని ఆదరించిన ఘట్టం. నాయర్ అనే ఒక దుకాణదారు తన అవసరానికి రెండు రూపాయలు ఇచ్చి ఆదుకున్నప్పుడు, తన చేతిలో డబ్బు పడీపడగానే అతని బాకీ తీర్చడానికే ధర్మారావు  తొలి ప్రాధాన్యం ఇస్తాడు. తీరా అతని దుకాణానికి వెడితే, అతను తీర్థయాత్రలకు వెళ్ళినట్టు తెలిసి ఎంతో నిరాశ చెందుతాడు. ఇది అతనిలో కృతజ్ఞతాబుద్ధిని చూపుతుంది.  అతను అనుభవించిన పేదరికం మన మనసుల్ని మెలిపెడుతుంది.

లౌకికంగా అతను కూడా అందరూ ఎదుర్కొనే సాంసారిక సమస్యలు ఎదుర్కొంటాడు, డబ్బు కోసం ఇబ్బంది పడతాడు. ఇంగ్లీషు చదువుతాడు. ఉద్యోగం కోసం ఆరాటపడతాడు. ఒక యవ్వనవంతుడిలో ఉండే సహజమైన వాంఛలు అతనికీ ఉంటాయి. మళ్ళీ తను కూడా అందరిలానే ప్రవర్తిస్తున్నానే అన్న స్ఫురణా ఉంటుంది. తన కార్యానికి తానే వందరూపాయలు పుట్టించుకుని అత్తవారింటికి వెడతాడు. వెళ్ళే ముందు దేవాలయానికి వెళ్ళి శివపార్వతులను చూసి, శివుడికే సంసార జంజాటం తప్పనప్పుడు తనెంత అనుకుంటాడు. ‘ధర్మారావు సగము విరాగి, అతనిలో వైరాగ్యమెంతయో లాలసత యంత’ అని రచయిత అంటాడు. అయితే శోభనం గదిలో పడక మీద భార్య సరసన ఉండి కూడా అతను దైవచింతనలోకి జారుకోవడం కొంత విపరీతంగా అనిపిస్తుంది. అది రక్తికే కానీ, భక్తికి సందర్భం కాదు. అతనిదా వయసూ కాదు. నవలలో విశేషంగా ఆకట్టుకునే వాటిలో ఒకటి, దాంపత్య శృంగార చిత్రణ. దానిని విశ్వనాథ అంత అందంగా, హృదయదఘ్నంగా చిత్రించినవారు మరొకరు లేరేమో ననిపిస్తుంది.

ఇదే ధర్మారావులో కొన్ని ఇతర లక్షణాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది విశ్వనాథ వాస్తవికతను అనుసరించిన ఫలితం కావచ్చు. ఎవరితోనైనా వాదించేటప్పుడు ధర్మారావు ఆవేశపడతాడు. అదే సమయంలో తాను ఆవేశపడుతున్నానన్న స్పృహ అతనిలో ఉంటుంది. అలాగే, సారంగధర నాటకానికి వెళ్లినప్పుడు ఒకవైపు నాటకం జరుగుతుండగానే తనూ, కుమారస్వామి అందులోని పాత్రధారులపై, వారి ఆహార్య, అభినయాలపై వ్యాఖ్యలు చేస్తారు. అది పక్కవారికి ఇబ్బందికరమన్న చిన్న విషయం ధర్మారావుకు స్ఫురించదు. ఒక ప్రేక్షకుడు దానిని ప్రశ్నించినప్పుడు కోపం పట్టలేకపోయిన ధర్మారావు తెలిసిన ఒక రౌడీని అతనిపైకి పురిగొల్పుతాడు.

ఇక ధర్మారావు, అతని భావజాలం… అదొక విచిత్ర సంబంధం. ధర్మారావు వ్యక్తిగత లౌకిక ప్రవర్తనలో  వక్రత, సంకుచితత్వం, అమానవీయత, అహంకారం  లేవు. కానీ అతను త్రికరణశుద్ధిగా విశ్వసించే భావజాలంలో అవి ఉన్నాయి.  భావనాత్మకంగా, లేదా సిద్ధాంతపరంగా చెప్పుకుంటే  ఆ భావజాలంలోనూ వక్రత, సంకుచితత్వం, అమానవీయత లేవు. కానీ ఆ భావజాలపు లౌకికప్రతిఫలనంలో ఉన్నాయి. వ్యక్తిగా ధర్మారావులో ఆధిక్యభావన, కింది కులాలపట్ల వివక్ష, ఇతర జాతులపట్ల తృణీకారభావం లేవు. కానీ భావజాలం దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ వ్యక్తమవుతాయి. అవి కూడా వాస్తవానికి ఆ భావజాల నిర్మాణంలో ఉన్నాయి. సనాతనధర్మం, హిందూ వ్యవస్థా ధర్మం అనేవి ధర్మారావు అనే వ్యక్తి మనస్తత్వంలోని వక్రత, సంకుచితత్వం ద్వారా దృశ్యమానమవుతున్నాయని సుదర్శనంగారు అన్నారు కానీ వాస్తవానికి వాటిలోని వక్రత, సంకుచితత్వమే ధర్మారావులో దృశ్యమానమవుతున్నాయని భావించడం న్యాయం. మనకిప్పుడు బాగా తెలిసిన ఒక పోలికతో చెప్పాలంటే, ధర్మారావు, అతని భావజలాల సంబంధం ‘అపరిచితుడు’ సినిమాలో హీరో తరహాలో ఉంటుంది.

ఆ భావజాలానికి కాల్పనిక జగత్తులో ఉన్న ఉనికి లౌకిక జగత్తులో లేకపోవడం ఈ వైరుధ్యానికి కారణం. అందులో ప్రాధాన్యం వహించే చాతుర్వర్ణ్యవ్యవస్థ అందరినీ ఇముడ్చుకోగలిగినంత వైశాల్యం కలది కాదు. పంచములకు, మతేతరులకు, విజాతీయులకే కాదు సరికదా; దేవాలయం కేంద్రంగా ఉన్న ఆ వ్యవస్థలో, చాతుర్వర్ణ్య వ్యవస్థలోనే ఉన్న నాస్తికులకు కానీ, ఆ వ్యవస్థను ప్రశ్నించేవారికి గానీ స్థానం ఉండదు. ఆవిధంగా అది ఇరుకుగానే కాక, నిరంకుశంగా కూడా మారుతుంది. దేవాలయాన్ని, దేవుడినీ, మతాన్ని వ్యక్తిగతం చేసి; భిన్న ప్రాతిపదికపై అందరినీ కలిపే ఏర్పాటుకు అందులో అవకాశం లేదు. ఆ వ్యవస్థలోని మూసుకుపోయిన లక్షణమే ధర్మారావు ఆలోచనల్లోనూ మాటల్లోనూ వ్యక్తమవుతూ ఉంటుంది. అతని దృష్టిలో తన దేశానికి, మతానికి, సంప్రదాయానికీ, సాహిత్యానికి, శాస్త్రాలకూ చెందినవన్నీ గొప్పవే; అందులో చెడు ఉండడానికి అవకాశమే లేదు. ఇతరుల మతాలలో, సంప్రదాయాలలో, సాహిత్యంలో అతనికి అన్నీ లోపాలే కనిపిస్తాయి. ఈ రకమైన అతని తారతమ్య వివేచనలో అక్కడక్కడ అర్థవంతమైన, లోతైన భావాలు కనిపించినప్పటికీ ఆ వివేచన  చాలాచోట్ల అశాస్త్రీయంగానూ, హాస్యాస్పదంగానూ పరిణమిస్తుంది. అతను వర్ణభేదం, జాతిభేదం రక్తంలోనే ఉన్నాయని అంటాడు. ఇతర జాతులలోని చెడును విమర్శించేటప్పుడు అలాంటిదే స్వజాతిలోనూ ఉన్న విషయాన్ని విస్మరించి ఆ చెడును ఆ ఇతర జాతి మొత్తానికే ఆపాదిస్తాడు. ఉదాహరణకు, బ్రాహ్మణ యువతి అయిన మంగమ్మ కూడా డబ్బు మీద ఆశతో రామేశ్వరం అనే బ్రాహ్మణేతరునితో సంబంధం పెట్టుకుంటుంది. అలాగే డబ్బుకోసం జమీందారు రంగారావును పెళ్లాడిన ఆంగ్లేయయువతి శశిని చర్య మాత్రం ఆ జాతి స్వభావంగా  కనిపిస్తుంది. లౌకికంగా హృదయవైశాల్యం ఉన్నవాడిగా  కనిపించే ధర్మారావు భావజాలం దగ్గరికి వచ్చేసరికి కరడుగట్టి కనిపిస్తాడు.  జాతిమతవర్ణభేదాలను ఎత్తి చూపుతూ మనుషుల్ని ఎక్కడిక్కడ చీల్చి తనను ఆధిక్యస్థానంలో నిలుపుకుంటాడు. ఇందులో పరవిమర్శే తప్ప ఆత్మవిమర్శ తక్కువగా ఉంటుంది.

veyi

ఆధునికమైనవీ, నేడు ప్రగతిశీలకంగా భావించే వాటిని అన్నిటినీ ధర్మారావు మూలమట్టంగా వ్యతిరేకిస్తాడు. అతని దృష్టిలో బాల్యవివాహాలే మంచివి. పంచములు దేవాలయంలోకి రాకూడదు. విద్యుద్దీపాలకన్నా ఆముదం దీపాలే శ్రేష్టం. పర్యావరణం గురించి, ప్రకృతిపట్ల ఆనుకూల్యత గురించి అతని ముఖంగా, లేదా ఇతర పాత్రల ముఖంగా  రచయిత చెప్పే అనేక విషయాలు అర్థవంతంగా ఆలోచనీయాలుగా  కనిపిస్తాయి. అయితే పరిణామగతిలో కొంత మంచితో పాటు చెడూ కొత్తగా వచ్చి చేరుతూ ఉంటుందనీ, ఆ చెడును తొలగించే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉండాలన్న స్పృహకు బదులు; అసలు పరిణామశీలాన్నే వ్యతిరేకించి గతంలోనే ఘనీభవించాలన్న ఒక అసహజమైన, సృష్టి వ్యతిరేకమైన ధోరణి వ్యక్తమవుతూ ఉంటుంది.

ధర్మారావులో ప్రశ్నను, విమర్శను కూడా నిషేధించే వైఖరి కనిపిస్తుంది. భార్య అరుంధతి తన మామగారు రామేశ్వరశాస్త్రి నాలుగువర్ణాల వారినీ పెళ్లి చేసుకోడంగురించి, ఆయనకు రత్నగిరి అనే భోగం స్త్రీవల్ల కలిగిన దేవదాసి గిరిక గురించి ఎత్తినప్పుడు అతనికి కోపం వస్తుంది. ఆ ప్రస్తావననే అతడు నిషేధిస్తాడు. ప్రశ్నకన్నా విశ్వాసమే అతని ఆలోచనాసరళికి కేంద్రబిందువు అవుతుంది.

అసలు ధర్మారావుకు ఆదర్శప్రాయమైన ఆ వ్యవస్థ అంత ఆదర్శవంతంగానూ ఎప్పుడైనా ఉనికిలో ఉందా అని ప్రశ్నించుకుంటే దానికీ సమాధానం దొరకదు. ఆ వ్యవస్థకు తనలానే మొత్తం బ్రాహ్మణ్యమంతా ప్రాతినిధ్యం వహిస్తోందా అంటే, మంగమ్మ భర్త, ఉపాధ్యాయుడు అయిన జోశ్యులు తన వ్యక్తిత్వాన్ని చంపుకుని తాలూకా బోర్డు అధ్యక్షుడైన రామేశ్వరం ప్రాపు కోసం ఎందుకు పాకులాడతాడు? తన భార్యను అతను లొంగదీసుకునే పరిస్థితిని ఎందుకు కల్పిస్తాడు? మంగమ్మ డబ్బు మీద ఆశతో ఎందుకు కాలుజారుతుంది? ధర్మారావు అత్తగారివైపు వారు కూతురిపట్ల అంత నిర్దయగా, ధర్మవిరుద్ధంగా ఎందుకు వ్యవహరించారు? రామేశ్వరశాస్త్రి మంచి స్థితిలో ఉన్నప్పుడు అతని వల్ల లాభపడిన బంధువులు అతను చితికిపోగానే ఎందుకు మొహం చాటేశారు?

కనుక ధర్మారావు తను లక్షించిన ఆ వ్యవస్థకు ప్రతినిధి తనొక్కడే తప్ప, సాటి బ్రాహ్మణ్యం తోడు కూడా అతనికి లేదు. మరి బ్రాహ్మణ్యం ఇలా ఎందుకు దిగజారింది అంటే అందుకు కారణం పరాయి పాలన, పాశ్చాత్యపు పోకడలని ధర్మారావు చెప్పగల సమాధానం. అసలు అంత గొప్ప వ్యవస్థ పరాయి పాలనకు, పాశ్చాత్యపు పోకడలకు ఎందుకు అవకాశమిచ్చింది; ముందే తను దిగజారడం వల్ల అలా జరిగిందా, లేక అది జరిగినందువల్ల తను దిగజారిందా? ఏది ముందు, ఏది వెనక? అన్న ప్రశ్నలకూ సమాధానం దొరకదు.

(సశేషం)

 

 

 

 

“ఈ భూమి అమ్మకానికి లేదు”

mamata%e0%b1%a9

మెక్సికో నుంచి వచ్చిన ఉద్యమకారుల ఆజ్టెక్ నృత్య ప్రదర్శన.

 

పడమటికి వాలిపోతున్న వెలుగులో నా కారుతో పోటీ పడుతూ గుట్టలమీద జరజర పాకుతున్న కారు నీడ తప్ప మరే కదలికా లేదు.  తెల్ల సున్నం రాయి గుట్టలూ, కొండల మధ్య చిన్న చిన్న ఊర్లు దూర దూరంగా ఉన్నాయి. పేరుకు పట్టణాలు అనేవి రెండు మూడు వందల మైళ్లకు ఒకటి తగుల్తోంది. మైళ్ల కొద్దీ నా కారు తప్ప ఇంకొక కారు ఆరోడ్డు మీద కనిపించడం లేదు.

ఎంతో సేపు ప్రయాణం చేసిన తరువాత, తప్పు దారిలో వచ్చానేమో అన్న అనుమానం, ఇంకో  రెండు గంటల్లో చీకటి పడ్డాక కొండల మధ్య చీకట్లో కారు పాడయితే ఏం చేయాలనే ఆలోచన ఒకవైపు. సెల్ ఫోన్ కూడా సరిగ్గా పని చెయ్యట్లేదు. ఒక్కోసారి దగ్గరగా, ఒక్కోసారి ఉన్నదో లేదో అన్నట్లూ దూరంనుంచే మురిపిస్తూ మిస్సౌరి నది. గుట్టలు ఎక్కినప్పుడు నీలాకాశంలో సగం చందమామ నేను ఉన్నాన్లే అంటున్నాడు. ఇంత అందంలో తప్పిపోతేనేం అనికూడా అనిపిస్తోంది. హఠాత్తుగా రోడ్డు పక్కన పొలాల్లో, రోడ్డుకు సమాంతరంగా  ఒక మీటరు వెడల్పున చదును చేసిన నేల మీద నీలి రంగు పైపులు కనిపించడం మొదలయ్యింది. నిజానికి ఇవాళ్టికి అవి భూమిలో ఉండాల్సినవి. వాటిగుండా చమురు పారుతూ ఉండాల్సింది.

కాసేపటికి  రోడ్డు పక్కన ఒక చోట మూడు పోలీసు కార్లు కనిపించాయి. చెక్ పోస్టులా ఉంది. ఆ కార్లకు ఎదురుగ్గా ఉన్న రోడ్డు మీదకు కారు పోనిచ్చాను. దూరంగా విసిరేసినట్లున్న ఇళ్లను చూస్తూ ఓ పది నిమిషాలు బీటలువారిన రోడ్ల మీద తిరిగాను. నేను వెతుకుతున్న ప్రదేశం ఈ చుట్టుపక్కల లేదని అర్థమయ్యింది. ఇందాక చూసిన చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్లి మళ్లీ మెయిన్ రోడ్డు ఎక్కాను. ఈరోజుకి నేను వెళ్లాల్సిన చోటు దొరకదేమో అని నిరాశ.

నార్త్ డకోట రాష్ట్రంలో, కానన్ బాల్ అనేది ఒక చిన్న ఊరు. లకోట,  డకోట తెగలకు చెందిన స్టాండిగ్ రాక్ రిజర్వేషన్ భూభాగం చిట్టచివర, ఆకాశమే దిగివచ్చినట్లుండే నీలాల మిస్సౌరి నది పక్కన, కొండల మాటున ముడుచుకుని ఉంటుంది ఈ ఊరు. ఈ ఊరికి కొంచెం ఎగువన మిస్సౌరీ నది అడుగునుంచి డకోట ఆక్సెస్ ఆయిల్  పైప్ లైన్ వేద్దామని సంకల్పించింది  ఎన్ ట్రాన్ పార్ట్నర్స్ (Energy Transfer Partners) అనే కంపెనీ.

నార్త్ డకోట ఉత్తర ప్రాంతంలో వెలికి తీసిన చమురును, రిఫైన్ చేయడానికి సౌత్ డకోట, అయోవా రాష్ట్రాల గుండా  ఇల్లినాయ్ రాష్ట్రానికి తరలించాలని ఈ పైపులైన్ నిర్మిస్తున్నారు. ఈ మధ్యే దేశంలో ఎన్నో ప్రాంతాల్లో నదుల కిందనుంచి గ్యాస్ లేక చమురు సరఫరా అవుతున్నప్పుడు, ప్రమాదం జరిగి నదుల్లో నీళ్లు కలుషితమయ్యాయి. ఈ పైప్ లైన్ లో కూడా అదే జరిగితే రిజర్వేషన్లోని ప్రజలకే కాక నదీ జలాల మీద ఆధారపడిన మరో పదిలక్షలమందికి తీవ్ర ప్రాణ, ఆర్థిక నష్టం జరిగుతుంది. అందుకే పైప్ లైన్ మిస్సౌరి నది దాటే చోట కొన్ని వందలమంది నేటివ్ అమెరికన్లు కలిసి పైప్ లైన్ కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు.

ఈ మధ్యే ప్రముఖ వార్తా పత్రికలు, న్యూస్ ఛానెల్స్ ద్వారా ఉద్యమ వార్తలు తెలుస్తున్నా. ఉద్యమకారుల దగ్గరికే వెళ్లి, ఉద్యమ నేపథ్యాన్ని తెలుసుకుందామని, వాళ్లతో ఒకపూట గడుపుదామని బయలు దేరాను.

నార్త్ డకోట రాష్టం లోని క్యానన్ బాల్ దగ్గర ఉద్యమకారుల క్యాంప్ ఉందని మాత్రమే తెలుసుకున్నాను. క్యానన్ బాల్ కు వెళ్లగానే క్యాంప్ కనిపిస్తుందని సౌత్ డకోటలో కొంత మంది చెప్పారు.  క్యానన్ బాల్ నది ఇందాకే దాటేశాను. అంటే ఊరు దగ్గరున్నట్లే. కానీ క్యాంప్ ఎంతకీ కనిపించదే!

ఒక గుట్ట దిగీదిగకముందే, మలుపులో హఠాత్తుగా రోడ్డు పక్కన చిన్న లోయలో డేరాలు, కంచెకు కట్టిన జెండాలు ఎగురుతూ కనిపించాయి.  నా గుండె వేగంగా కొట్టుకుంది. అదే! ఒచేడి షాకోవీ (Oceti Sakowin – Seven Council Fires) క్యాంప్! రోడ్డు దిగి, చిన్న గేటు దగ్గరకి కారు పోనిచ్చాను. తలకు రుమాలు కట్టుకున్న ఒక యువకుడు నా కారు దగ్గరికి వచ్చాడు. నుదుటి మీదకు వచ్చేలా కట్టిన ఆ రుమాలు మీద నన్ను ఇక్కడికి రప్పించిన నినాదం, Water is Life (నీళ్లే ప్రాణం) అని రాసి ఉంది. కారు ఎక్కడ పార్కు చేసుకోవచ్చో చూపించాడు.

కారు పార్కు చేసి, పక్కనే ఉన్న గుట్ట ఎక్కి కాసేపు నిలబడ్డాను. నాకు దగ్గర్లో ఇంకొంత మంది నిలబడ్డారు. అందరూ పలకరింపుగా నవ్వారు, ఎప్పట్నుంచో తెలిసిన స్నేహితుల్లా అనిపించింది. నా చేతిలో కెమెరా చూసి, ‘మీరు జర్నలిస్టా’ అని ఒక యువకుడు అడిగాడు, నల్లగా మెరుస్తున్న పొడవాటి జుట్టును ముఖంమీద పడకుండా ఒకచేత్తో పట్టుకుని.

“లేదు. మీ ఉద్యమానికి మా ఇండియన్ పర్యావరణ ఉద్యమకారుల తరుపున  మద్దతు తెలపడానికి వచ్చాను. ఇంతకీ మీరు ఇక్కడ ఎప్పట్నుంచి ఉంటున్నారు?” అని అడిగాను.

“నేనైతే ఈమధ్యే వచ్చాను. నా స్నేహితులు చాలామంది దాదాపు ఉద్యమం మొదలైనప్పటి నుంచి, అంటే ఏప్రిల్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. చలికాలం మొదలయ్యేలోగా పోరాటం విజయవంతం కావాలని చాలా మందిమి వచ్చాం.”

“ఏ రాష్ట్రం మీది?”

“ఏ రాష్ట్రం  కాదు. ఏ దేశం అని అడగండి. గ్రేట్ సూ నేషన్ మాది. ఓగ్లాల లకోట తెగ.” గర్వంగా అన్నాడతను. ఓగ్లాల లకోట అనేది లకోట తెగలో ఏడు ఉపతెగల్లో ఒకటి. ఇక్కడికి దాదాపు నాలుగు వందల మైళ్ల దూరంలో ఈ ఉపతెగకు కేటాయించిన రిజర్వేషన్ ఉంటుంది.

“అంత దూరం నుంచి వచ్చారా?”

“అదేమంత దూరం? కొంతమంది దక్షిణ అమెరికాలోని పెరు, చిలీ నుంచి  వచ్చారు. కొంతమంది న్యూజీలాండ్  నుంచి కూడా వచ్చారు. మీరు…? ఇండియా నుంచి కదా?”

“ఇండియా నుంచి ఈ దేశానికి వచ్చి చాలా ఏళ్లే అవుతోంది. ఇక్కడికి న్యూ జెర్సీ నుంచి వచ్చాను.”

“మీరు కూడా చాలా దూరం నుంచి వచ్చారు. మా గురించి ఇండియా ప్రజలకు చెప్తారు కదా?”

“నేనైతే చెప్తాను. వింటారా లేదా అన్నది వాళ్ల ఇష్టం కదా?”

అప్పటి దాకా నవ్వుతూ మాట్లాడుతున్న అతను ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. “వాళ్లు వినాలి. ప్రపంచంలో అందరూ వినాలి. ఎందుకంటే ఇది ఇక్కడున్న వాళ్ల సమస్యనో, నాలుగు వందల మైళ్ల దూరంలో ఉన్న మా సమస్యనో కాదు. పర్యావరణ సంరక్షణ అన్నది భవిష్యత్తు తరాల పట్ల కొంచెమన్నా బాధ్యత ఉందనుకునే వారందరి సమస్య. ”అన్నాడు.

వివరంగా చెప్పమని అడుగుదామని అనుకునేలోగా అతన్నెవరో పిలిచారు. “ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు.” అంటూ వెళ్లిపోయాడతను.

కొద్దిసేపు అక్కడే నిలబడి కొన్ని ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించాను. నా ముందు పరుచుకున్న అద్భుత దృశ్యం నా కెమెరా లెన్సుకు పూర్తిగా చిక్కడం లేదు. దూరాన కొండల ముందు రిబ్బనులా వంపులు తిరిగి మిస్సౌరి నదిలో కలవబోయే ఒయాహే సరోవరం(Lake Oahe) చాలా దూరానికీ నీలంగా మెరుస్తూ కనిపిస్తోంది. ఆ సరోవరానికీ నాకూ మధ్య  వందల కొద్దీ గుడారాలు, టీపీలు (త్రిభుజాకారంలో జంతు చర్మంతో సూ తెగ ప్రజలు వేసుకునే గుడారాలు). వాటిమధ్య ఒక మట్టి బాట, బాటకు అటూ ఇటూ వివిధ తెగల జెండాలు ఎగురుతున్నాయి. గుట్ట దిగువన గుర్రాల కోసం కట్టిన కంచె.

గుట్ట దిగి గుడారాల మధ్య నడిచాను. అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు. ఒక గుడారం ముందు ఇద్దరు మహిళలు కూర్చుని సూప్ తింటూ కనిపించారు.

“మీతో కూర్చోవచ్చా” మొహమాటం లేకుండా అడిగేశాను.

“తప్పకుండా.”

వాళ్ల పక్కనే నేలమీద కూర్చున్నాను.

“నా పేరు మమత. న్యూ జెర్సీ నుంచి వచ్చాను. మీరు ఎక్కడ్నుంచి వచ్చారు?”

“నా పేరు సూసన్. నేను కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి, నా స్నేహితురాలు బార్బర,  సౌత్ డకోట నుంచి.” (ఈ పేర్లు వాళ్ల నిజం పేర్లు కాదు.)

“ఎప్పటిదాక ఉంటారు?”

“పైప్ లైన్ నిర్మాణం ఆగిపోయేదాక. ఎంతకాలమైనా సరే. బార్బర రిటైర్డ్ టీచర్. నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వచ్చాను.” సూసన్ అన్నది.

“అదేంటి. వెనక్కి వెళ్లినప్పుడు కష్టం కాదూ? అట్లాంటి కష్టమైన నిర్ణయం తీసుకునేంత ముఖ్యమా ఈ ఉద్యమం?”

“ఒక్కోసారి  తప్పదు. దాదాపు 300 నేటివ్ అమెరికన్ తెగలు ఒక సమస్య గురించి పోరాడడానికి కలిసిరావడం సామాన్య విషయం కాదు. ఈ సమస్య కూడా సామాన్యమైనది కాదు కదా? మనుషులు, చెట్లు, జంతువులు, ప్రకృతిలో భాగమని నమ్ముతాం.  పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి  ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. మేం నిరసన కారులం కాము, ప్రకృతి సంరక్షకులం. మా కాలిఫోర్నియా రాష్ట్రంలో కూడా ఫ్రాకింగ్ జరుగుతోంది. అక్కడ కూడా ఉద్యమాలలో పాల్గొన్నాను. మా గొడవ ఎవరూ పట్టించుకోకుండానే నేను పాల్గొన్న ఉద్యమం సమిసిపోయింది. ఇక్కడ ఉద్యమం కూడా ఈ రిజర్వేషన్లోనే ఒక చిన్న గుంపు మొదలుపెట్టింది. తమతో ఎవరు కలిసినా కలవకపోయినా పోరాడకుండా ఓటమిని అంగీకరించకూడదని అనుకున్నారేమో.”

“ఆ చిన్ని బృందానికి అంత ధైర్యం ఎట్లా వచ్చింది?”

mamata1

అప్పటిదాక ఏమీ మాట్లాడని బార్బరా బదులిచ్చింది, “మీకు కొంచెం మా చరిత్ర చెప్తాను. ఒక నూటాయాభై ఏళ్ల క్రితం నుంచి జరిగిన చరిత్ర చెప్తాను. 1860ల్లో అమెరికా పడమరవైపు ఉన్న మా భూముల్లోకి చొచ్చుకుని వస్తున్న కాలం. అమెరికా సైన్యం చాలా బలమైంది. అయినా చాలా తెగలు ఆ దురాక్రమణను వీరోచితంగా ప్రతిఘటించాయి. నేటివ్ అమెరికన్ తెగలను అణిచివేయాలని ఎన్నో సైనిక దళాలు దేశమంతా దండయాత్రలు మొదలుపెట్టాయి.

1863 వేసవి చివర లకోట, ఇంకొన్ని మిత్ర తెగలు కలిసి మిస్సౌరి నదికి అవతలి వైపున విడిది చేసి చలికాలం కోసం తయారవుతున్నారు. అడవి బర్రెల వేటలు ముగించి, మాంసం ఎండబెట్టడం, టిపిలు వేసుకోవడం, బర్రె చర్మం దుప్పట్లు తయారు చేసి అమ్ముకోవడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. మొత్తం విడిదిలో 3000 మంది దాకా ఉన్నారు. అట్లాంటి విడిది దగ్గరకు సైనిక దళాలు వచ్చాయి. ఆ దళాలు యుద్ధానికే వచ్చాయని భావించి, తాము యుద్ధం చేయడానికి గుమిగూడ లేదని, శాంతియుతంగా తమ పని తాము చేసుకుంటున్నామని తెలియజేయడానికి కొంతమంది నాయకులు తెల్లజెండాలు పట్టుకుని సైనిక నాయకుడి దగ్గరకు వెళ్లారు. అట్లా వెళ్లిన నాయకులను సైన్యం బంధించడం దూరన్నుంచి గమనించిన యువకులు  విడిదిలోని ప్రజలను వెంటనే అక్కడ్నుంచి పారిపొమ్మని హెచ్చరించారు.

కానీ సైన్యం విడిదిని చుట్టుముట్టి దాదాపు 400 మందిని ఆరోజు హతమార్చింది. విడిదిలో ఉన్న మగవాళ్లు హఠాత్తుగా వచ్చి పడిన సైన్యాన్ని ఎదిరించకపోయివుంటే, అక్కడ్నుంచి పారిపోలేక ఇంకా ఎన్ని వందలమంది చనిపోయేవారో. ఖాళీ అయిన విడిదిలో చలికాలం కోసం పోగేసిన మాంసాన్ని, రోజువారి సామాగ్రిని, టిపీలను గుట్టలుగా పోగేసి తగలబెట్టింది సైన్యం. అక్కడ్నుంచి పారిపోయి మిస్సౌరి నది దాటి వచ్చిన జనం ఈ ప్రాంతంలో మెల్లగా నిలదొక్కుకున్నారు. సైన్యం నేటివ్ అమెరికన్ తెగలను పూర్తిగా హతమార్చలేకపోయింది. మా వీరులు అడపాదడపా సైన్యంతో తలపడేవారు. చివరికి ఎవరికీ శాంతి లేదని, 1868లో అమెరికా ప్రభుత్వం మా తెగలతో  ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం లకోట, డకోట తెగలకు, ఇంకొన్ని మిత్ర తెగలకు చెందిన ప్రజలకు ఇప్పటి డకోటా రాష్ట్రాల్లో, మిస్సౌరి నదికి పడమర ఉన్న భూభాగాన్ని, మిస్సౌరి నదిని, పవిత్రమైన బ్లాక్ హిల్స్ ను  కేటాయించి “గ్రేట్ సూ నేషన్” అని రిజర్వేషన్ కు పేరు పెట్టింది.

ఈ ప్రాంతమంతా స్వేచ్ఛగా తిరగాడిన ప్రజలకు సరిహద్దులు ఏర్పాటు చేసింది. అయితే  తెగలతో చేసుకున్న ఒప్పందాల మీద అమెరికా ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవంలేదని మాకు రెండేళ్లలోనే తెలిసివచ్చింది. 1870ల్లో బ్లాక్ హిల్స్ పర్వతాల్లో బంగారం బయటపడింది. మాకు కేటాయించిన భూభాగాన్ని ముక్కలు చేసి ఆ పర్వత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది అమెరికా ప్రభుత్వం. ఎదురు చెప్పిన తెగలకు బ్లాక్ హిల్స్ కొంటామని బేరం పెట్టింది. “మనుషులు నడయాడే భూమిని ఎవరూ అమ్మలేరు.” అంటూ ఓగ్లాల లకోట వీరుడు తాషుంక వీట్కొ (Crazy Horse)  అమెరికా ప్రభుత్వాన్ని ఎదిరించాడు. ఆయన, మరో నాయకుడు  తతంక యియోతక (Sitting Bull) కలిసి కొన్ని యుద్ధాలు చేశారు. తతంక యియోతక ఇందాక చెప్పిన హత్యాకాండలో సైన్యంతో పోరాడి చివరికి ప్రాణాలతో బయటపడిన హుంక్పప లకోట తెగ వీరుడు. అయితే, కొన్ని నెలల్లోనే తాషుంక వీట్కోను హత్య చేశారు. తతంక యియోతక అప్పటికే పెద్దవాడు. తాషుంక వీట్కో హత్య తరువాత ఒంటరివాడై, అలసిపోయిన తన అనుచర బృందంతో సహా సైన్యానికి లొంగిపోయాడు. ఎవరికీ ఏమీ చెల్లించకుండానే బ్లాక్ హిల్స్ అమెరికా పరమయ్యాయి. 1980లో మాకు క్షమాపణలు చెప్పి, 102 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది కానీ, మేం ఒప్పుకోలేదు. ఆ డబ్బును అమెరికా ప్రభుత్వం ఒక ట్రస్టులో పెట్టింది. ఈనాటికి అది $1.3 బిలియన్ డాలర్లయింది. ఆ డబ్బు మాకు వద్దు. మా నాయకుడు తాషుంక వీట్కొ అన్న మాట ఎప్పటికీ మరిచిపోం. ఆయన మాటే మా మాట. ఈ భూమి…” కోపంతో, దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుతో ఆగిపోయింది బార్బర.

“ఈ భూమి అమ్మకానికి లేదు.” మెల్లగా అన్నాను. నాకూ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

కళ్లల్లో నీళ్లతో, చిర్నవ్వుతో చూసింది బార్బర. “ఏ దేశంలో చూసినా, ఏ మూల చూసినా అవే అన్యాయాలు, దుఃఖాలు కదూ?” నిర్లిప్తంగా అన్నది సూసన్.

“అంతే ధైర్యంతో పోరాటాలు… “ అన్నాను.

ఊపిరి పీల్చుకుని మళ్లీ అందుకుంది బార్బర, “అప్పట్లోనే మా ఒక్క గ్రేట్ సూ నేషన్ ను ఆరు రిజర్వేషన్ భూభాగాలలో కుదించారు. ఇప్పటికీ ప్రైవేట్ సంస్థలకు అమ్ముతూ కొంచెం కొంచెంగా మా భూమిని ఆక్రమిస్తోంది అమెరికా ప్రభుత్వం. ఈ పక్కన కనిపిస్తొందే ఒహాయే సరస్సు. అది నిజానికి ఒక రిజర్వాయర్.  మిస్సౌరి నదిని దాటి వచ్చిన ప్రజలు ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పరుచుకున్నారు. మెల్లగా వ్యవసాయం, వ్యాపారాలు మొదలు పెట్టారు. చుట్టుపక్కల కొన్ని టౌన్లు ఏర్పడ్డాయి. అయితే 1944లో ఇక్కడ డ్యామ్ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1948లో నిర్మాణం ప్రారంభమయ్యింది, 1968లో కెన్నెడీ డ్యాము ప్రారంభోత్సవం చేశాడు. తెగ ప్రజలు ఎంత ప్రతిఘటించినా  ఫలితం లేకపోయింది. నిర్వాసితులైన ప్రజలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. కృత్రిమ సరస్సు ఒయాహే కింద కొన్ని టౌన్లు, పంట భూములు, విలువైన మూలికలు దొరికే స్థలాలు మునిగిపోయాయి. ఇప్పుడు మిగిలిన భూమిలో సున్నం ఎక్కువ కలిసి వుంది. పంటలు మునుపటిలా పండవు. అరుదైన మూలికలను పోగొట్టుకున్నారు ప్రజలు.  ‘ఈ రిజర్వేషన్లో ముసలి వాళ్లు ఎక్కువ కనిపించరేమి’ అని అడిగితే.‘పెద్దవాళ్లు గుండెపగిలి చనిపోయారు’ అని అంటారు. నిజంగానే ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు ఈ రిజర్వేషన్ ప్రజలు. ఇప్పుడు ఈ పైప్ లైన్ మరో పెద్ద దెబ్బ.”

“పైప్ లైన్ వేసేముందు ఈ రిజర్వేషన్ ప్రజల అభిప్రాయం కోసం మీటింగులేవీ పెట్టలేదా? ఇంతకీ ఇప్పటి టెక్నాలజీ తయారైన పైపులు సురక్షితమైనవని అంటున్నారు?” నా ప్రశ్నకు నాకే విరక్తితో నవ్వొచ్చింది.

“నిజానికి ఈ పైప్ లైన్ ఇక్కడికి ఎంతో ఎగువన మిస్సౌరి నదిని దాటాలన్నది మొదటి ప్రణాళిక. అప్పుడు వీళ్లను పిలువలేదు. ప్రపంచానికైతే పైపులు సురక్షితమని చెప్తున్నారు కానీ,అవే పైపులు పగిలితే బిస్మార్క్ నగరానికి ప్రమాదమని దారి మళ్లించారు. అంటే వాళ్లకూ వాళ్ల పైపుల మీద నమ్మకాలు లేవు. దారి మళ్లించినప్పుడు తెగ నాయకులతో మంతనాలు జరిగినప్పుడు, ఈ రిజర్వేషన్ చైర్మెన్ డేవ్ ఆర్చెమ్ బాల్ట్ తెగ ప్రజలు ఈ పైప్ లైన్ కు విరుద్ధమని ఖచ్చితంగా చెప్పాడు. అయినా ఈ స్థలాన్ని పైప్ లైన్ కు కేటాయించింది ఆర్మీ కార్ప్స్ ప్రభుత్వ విభాగం. ఒకరోజు పవిత్ర స్థలాలనేమీ పట్టించుకోకుండా బుల్ డోజర్లతో ఆ ప్రదేశాన్నంతా చదును చేసేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన ఉద్యమకారుల మీద వేటకుక్కలతో దాడిచేశారు.”

 

సూసన్ మధ్యలో అందుకుని చెప్పింది,  “ఇంతకీ ఆ దాడి ఎప్పుడు జరిగిందో తెలుసా? సెప్టెంబరు 3న! నూటాయభై మూడు సంవత్సరాల క్రితం అదే రోజున వీళ్ల పూర్వీకుల విడిది మీద దాడి చేసి, పిల్లలని కూడా చూడకుండా, దొరికిన వాళ్లను దొరికినట్లు అతిదగ్గరగా తుపాకులతో కాల్చి దారుణంగా హత్య చేసిన రోజు.”

అవునన్నట్లు తలాడించింది బార్బరా, “నేటివ్ అమెరికన్లను ప్రాణమున్న మనుషులు అనుకోరు, ఇక పవిత్ర స్థలాల గురించి ఏం పట్టించుకుంటారు? ఇంతలా తెగించి పోరాడడానికి అసలు కారణం మిస్సౌరి నది. మంచినీళ్లు తాగడానికి కూడా భయపడే పరిస్థితి. చమురు తాగి బతకలేం కదా? నీళ్లే ప్రాణం కదూ? ఇక తెగించి పోరాడాల్సిందే.”

ఇంతలో కొంత మంది పిల్లలు ఒకరినొకరు తరుముకుంటూ పరిగెత్తుతున్నారు.

“ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. బడి ఎట్లా వీళ్లకు? శని ఆదివారాలు వచ్చి వెళ్తుంటారా?”

సూసన్ సమాధానమిచ్చింది, “లేదు, కొంత మంది చాలా దూరం నుంచి వచ్చారు. ఇక్కడ ఒక బడి కూడా ఏర్పాటైంది. ఒక ఊరిలో ఉండాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. చలికాలంలో మంచు తుపాన్లు పెద్ద ఎత్తున చెలరేగుతాయి. ఒక పెద్ద లాడ్జి ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నారు. అందరం కాకుండా వంతులవారిగా వచ్చి వెళ్లాలని అనుకుంటున్నాం. పరమ క్రూరంగా ప్రవర్తిస్తున్న నార్త్ డకోట పోలీసులకంటే, ప్రభుత్వం కంటే క్రూరమైనవి కావు మంచు తుపాన్లు.”

పకపక నవ్వుతూ ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ కాసేపు కూర్చున్నాం.

“ఇంత మంది ఎలా కలిసి కట్టుగా పని చేస్తున్నారు?  ఈ ఉద్యమంలో ఇన్ని నేటివ్ అమెరికన్ తెగలు కలిసిరావడం చూస్తే  ఇంత మంది మద్దతు ఎలా సంపాదించుకోగలిగారు?” అని నా ఆశ్చర్యాన్ని ప్రకటించాను.

“మొదటిది, మేం నిజానికి కలిసికట్టుగా లేం. ఈ చుట్టుపక్కల ఐదు క్యాంపులున్నాయి. ఇక్కడ కూడా సైద్ధాంతికపరమైన అభిప్రాయ భేదాలు వున్నాయి. అయితే, పోలీసులతోనో, సెక్యూరిటీ గార్డులతోనో గొడవలైనప్పుడు, ర్యాలీలో పాల్గొనేటప్పుడు మా నాయకులు ఒకరినొకరు సంప్రదించుకుంటారు. అందరం కలిసే పోరాడుతాం. ఏదో ఒకలా చిన్న చిన్న ఉద్యమాల్లోనో, ర్యాలీలోనో పాల్గొని ఓడిపోయి, ఇక ఏం చెయ్యలేం అనుకున్నప్పుడు ఒక చిన్న గుంపు ప్రభుత్వాన్ని, ఒక మెగా కార్పొరేషన్ను ఎదుర్కుంటోందని తెలిసినప్పుడు మళ్లీ ఆశ పుడుతుంది. ఒక్క చోటైనా ఉద్యమం గెలవదా అని. వేరే ఎన్ని కారణాలున్నా, ఇప్పుడు మన అందరి ముందు ఉన్నది పర్యావరణ సమస్య. కొన్ని రాష్ట్రాల్లో అనావృష్టి, ఎక్కువౌతున్న టొర్నడోలు, హరికేన్లు, మంచు తుపాన్లు, ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు. ఈ ప్రకృతి వైపరిత్యాలు ఎప్పుడూ ఉన్నాయి, కానీ ఇంత ఎక్కువ సంఖ్యలో, ఇంత విధ్వంస పూరితంగా లేవు. భూకంపాలు కూడా ఫ్రాకింగ్, షేల్ గ్యాస్ కోసం తవ్వకాల్లో ఉపయోగించిన కలుషిత నీటిని భూగర్భంలో భద్రపరచడం వల్ల కూడా ఎక్కువయ్యాయి. భూతాపాన్ని అపాలంటే భూగర్భ వనరులను ఇక ఏమాత్రం వెలికి తీయకూడదని ఎంతోమంది శాస్త్రజ్ఞులు చెప్తున్నా ఇంకా చమురు, బొగ్గు, షేల్ గ్యాస్ వంటి భూగర్భ వనరులను వెలికి తీస్తునే ఉన్నారు. ఈ పైప్ లైన్ నిర్మాణానికి ఖర్చవుతున్న 3.5 బిలియన్ డాలర్లు వాయు, సౌర శక్తి లాంటి ప్రాజెక్టులకు పెట్టరు. అందులో ఎక్కువ లాభాలు ఉండవని. భూమే మిగలనప్పుడు లాభాలతో ఏం చేసుకుంటారో. డోనాల్డ్ ట్రంప్ పర్యావరణ విపత్తు మీద నమ్మకంలేదని అంటాడు. ట్రంప్ కు ఐర్లాండ్ దేశంలో, సముద్రం పక్కన ఒక  గోల్ఫ్ కోర్స్ వుంది. ఎలక్షన్ కు కొన్ని రోజుల ముందే, ఆ గోల్ఫ్ కోర్సు చుట్టూ ఎత్తైన గోడ నిర్మించేందుకు ఆ ప్రభుత్వాన్ని అనుమతి కోరాడు. భూతాపం వల్ల సముద్రమట్టం పెరిగి మునిగిపోతుందని కారణం చెప్పాడు. ఎంత ఎత్తు గోడ కట్టాలనుకుంటున్నాడో, భూమి కుంగి పోతే ఏం చేస్తాడో?”

కాసేపు మౌనంగా కూర్చున్నాం. నాకు అక్కడనుంచి కదలాలనిపించలేదు. కానీ, మాముందు నీడలు పొడుగవుతున్నాయి. “ఇక బయల్దేరుతాను. ముందు దారి ఎలా ఉంటుందో తెలీదు. ఇన్ని విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.” అంటూ లేచి  నిలబడ్డాను.

%e0%b0%ae%e0%b0%ae%e0%b0%a4%e0%b1%a8

ఇద్దరూ లేచి నిలబడ్డారు. “అభివృధ్ధి పేరిట ఇంకా ఎంత మందిమి చనిపోవాలి? ఎంతమంది నిర్వాసితులు కావాలి? చావో బతుకో, ఇక పోరాడాల్సిందే. ఇంతవరకూ మనకు ప్రాణ మిచ్చిన భూమి కోసం, నీటి కోసం  పోరాడాలి.”

అక్టోబరు మొదటి వారాంతాన, బార్బరా, సూసన్లతో నేను మాట్లాడిన రోజు వాళ్లకు ప్రశాంతంగా గడిచిన ఆఖరి రోజు. మరుసటి రోజునుంచే ఆందోళనకరమైన వార్తలు వినవస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని ఏ ప్రముఖ న్యూస్ మీడియా పట్టించుకోకపోయినప్పుడు, “డెమాక్రసీ నౌ” అనే వార్తా సంస్థ అధిపతి అయిన ఏమీ గుడ్ మన్ ఉద్యమకారుల మీద దాడిని మొదటిసారి రికార్డు చేసి ప్రపంచం ముందు పెట్టింది. ఏమీ మీద ట్రెస్ పాసింగ్ కేసు పై అరెస్టు వారంట్ ఇచ్చారు. జర్నలిస్టుగా తన విధి నిర్వహణ ప్రకారం వీడియోలు తీశానని కోర్టులో చెప్పుకున్న తరువాతే ఆమెపై కేసు ఎత్తివేశారు. పైపులైను నిర్మాణాన్ని శాంతియుతంగానే అడ్దుకునేందుకు వెళ్లిన వాళ్లమీద పెప్పర్ స్ప్రే, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించారు. ఎన్నో వందలమందిని అరెస్టు చేశారు. రిజర్వేషన్ చైర్మెన్ అయిన డేవ్ ఆర్చెంబల్ట్ ను కూడా అరెస్టు చేశారు.

ఇటీవల, నవంబరు 24 (అమెరికన్ హాలిడే అయిన థాంక్స్ గివింగ్ రోజు) రాత్రి జరిగిన పోరాటంలో ఉద్యమకారుల మీద రబ్బరు బుల్లెట్లతో పాటు, పెప్పర్ స్ప్రే కలిపిన వాటర్ క్యానన్స్ ప్రయోగించారు. ఆ సమయంలో ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీలు. ఒక పెద్దాయనకు గుండెపోటు వచ్చింది. కొంతమంది అల్పోష్ణస్థితికి గురయ్యారు. ఉద్యమకారులకు వైద్యులూ మద్ధతు ఇస్తూ అక్కడ ఉన్నారు కనుక వెంటనే వైద్య సహాయం అందబట్టి బతికిపోయారు లేకపోతే కొందరు గుండె ఆగి పోయో, శ్వాస ఆడకో మరణించి వుండేవారు. ఒక పోలీసు విసిరిన క్యానిస్టర్ తగిలి ఒక యువతి చెయ్యి ఎముక చిట్లిపోయింది. ఇంత జరిగినా ఉద్యమకారులు తమ పోరాటం ఆపేదిలేదని చెబుతున్నారు.

*

 

 

పంజరాల్లేని లోకం..

seeta

పక్షుల లోకం…మనం  కోరుకునే స్వేచ్చా గగనం. నిర్నిబంధ భూతలం.  దండమూడి సీతారాం కెమెరా నేత్రానికి  చిక్కిన ఇంకో అపూర్వమైన దృశ్యం!

ఈ దృశ్యాన్ని మీ మాటల్లోకి  తర్జుమా చేయండి. ఇక్కడ వ్యాఖ్యగా  రాయండి.

నాకు మ‌న‌స్సు ఉంటుంది                   

Pablo_Picasso,_1910,_Girl_with_a_Mandolin_(Fanny_Tellier),_oil_on_canvas,_100.3_x_73.6_cm,_Museum_of_Modern_Art_New_York.

ఉద‌యం 9 అయ్యింది విశాఖ వ‌చ్చే పాటికి..స‌త్య అప్పటికే రిసీవ్ చెసుకోడానికి రెడీగా ఉన్నాడు.. హోట‌ల్  రూం తీసుకోని కాస్త ఫ్రెష్‌ అయి.. ఇద్దరం ఆఫీస్‌ దగ్గరకు వెళ్లాము.. మధ్యాహ్నం  లంచ్ కి విశాఖలో నేను అమితంగా ఇష్టపడే  అల‌కాపురికి వెళ్లి చెరొక బిరియానీ తిని బైక్ మీద బ‌య‌లు దేరాము..ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గర సిగ‌రెట్స్ కోసం అగాము..ఎవరో బిచ్చగత్తె 29 నుంచి 35 సంవ‌త్పకాల మధ్య ఉంటాయేమో.. ఎముకల గూడులా ఉంది.. అడుక్కోవ‌డానికి వ‌చ్చింది..గ‌తంలో ఆమెను ఎక్కడో చూసినట్లు గుర్తు..కానీ ఎంత అలోచించినా ఎక్కడ చూశానో  గుర్తుకు రావ‌డం లేదు..స‌త్యా బాస్ ఇంట‌ర్యూకు వ‌చ్చిన వాళ్లను సాయంత్రం ఇంట‌ర్యూ చెయ్యాలీ అని గుర్తు చేసిన త‌రువాత గానీ అక్కడ నుంచి బ‌య‌లుదేర‌లేదు..ఇంట‌ర్వ్యూలు చేస్తున్నాం.. అయినా ఆ బిచ్చగత్తె మాత్రం కళ్లలోనే మెదులుతూ ఉంది..రాత్రి స‌త్యతో పాటుగా నా పీజీ క్లాస్ మెట్స్ మ‌రో ఇద్దరు, నేను వ‌చ్చాన‌ని క‌ల‌వ‌డానికి రూంకి వ‌చ్చారు..ఫార్మల్‌గా త‌లా రెండు పెగ్గులు తీసుకున్న త‌రువాత ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు..పాత మిత్రుల‌ను  క‌ల‌వ‌డంతో విశాఖ‌తో నా ప‌రిచ‌యం , పీజీ చ‌దువు అంతా కళ్లముందు క‌దిలింది..మిత్రులు వెళ్లిపోయాక  హోట‌ల్ బాయ్  రూంను శుభ్రం చేసి భోజ‌నం వ‌డ్డించాడు..భోజ‌నం త‌రువాత  ఫ్రెష్‌గా మ‌రో రెడ్‌విల్స్ వెలిగించ‌గానే అప్పుడు గుర్తుకు వ‌చ్చిన పొద్దున చూసిన బిచ్చగత్తె..నా జీవితంలో ఒక అద్భుత‌మైన పాఠం నేర్పిన వ్యక్తి..

 

పీజీ చదవడానికి తొలిసారిగా విశాఖ నగరానికి వచ్చాను..పీజీ చదువు..ప్రఖ్యాత అంధ్రా యూనివర్సిటీలో నాకు ఇష్టమైన జ‌ర్నలిజం ప్రొఫెషనల్‌ కోర్సు..అప్పటి దాకా పేపర్ల లోనూ టీవీలలోనూ విశాఖ గురించి విన‌డం, చదవడం,  చూడటం తప్ప మ్యాప్‌లో విశాఖ నగరం ఇలా ఉంటుందా అని అనుకోవడం  తప్ప ఎప్పుడూ విశాఖ వ‌చ్చిందీ లేదూ చూసింది లేదు.. పీజీ చ‌దువుతో ప్రారంభమైన నా విశాఖ పరిచయం, క్రమ క్రమంగా అంతులేని మోజులా మారిపోయింది..ఎన్నిరోజులు బీచ్‌లో మిత్రుల‌తో భ‌విష్యత్‌ గురించి క‌ల‌లు క‌న్నాన్నో..ఎన్ని రాత్రులు స‌ముద్ర కెర‌టాల‌పై పాల నురుగులా ప‌డుతున్న వెన్నెల‌ను స్వాదించానో..వ‌ర్షంలో కెర‌టాల‌తో అడుకున్నానో..అమావాస్య నిశీ చీక‌టిలో అల‌కూ అల‌కూ మ‌ధ్య నిశ‌బ్దాన్ని వింటూ గ‌డిపానో ముఖ్యంగా బీచ్‌లో కూర్చోని హాప్రస్థానం చ‌దువుతుంటే శ్రీశ్రీ స్వయంగా మ‌హా ప్రస్థానన క‌విత‌ల్ని చ‌దివి వినిపిస్తున్నారు అనే భ్రాంతి క‌లిగేది నాకు.. పీజీ త‌రువాత ఉద్యోగం కోసం విశాఖ వీడి వెళ్లిన త‌రువాత కూడా ఎప్పుడైనా బోర్ అనిపిస్తే విశాఖ వ‌చ్చే వాడిని..ఆ త‌రువాత విశాఖ‌లో రెండు సార్లు ప‌నిచేసినా ట్రాన్స్‌ఫర్‌ వ‌ల్ల ఎప్పుటి క‌ప్పుడూ చుట్టపుచూపుగానే వ‌చ్చి వెళ్తూ ఉండేవాడిని..జీవితంలో స్థిరపడితే విశాఖలోనే స్థిరపడాలనేదీ నా భ‌ల‌మైన కోరిక‌.

 

మ‌న‌కు జీవితంలో తార‌స ప‌డే ప్రతి జీవీ మ‌న‌తో బ‌ల‌మైన రుణ‌బంధం క‌లిగి వుంటుందనీ ఏదో తత్త్వవేత్త పుస్తకంలో చ‌దివాను అలాంటి ప‌రిచ‌య‌మే నాకు వాసుతో క‌లిగింది..వాసు నాతో పాటు జర్నలిజం చ‌దివిన స‌హాద్యాయి..ఇద్దరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే కావ‌డంతో స్వతహాగా దగ్గరయ్యాము..దానికి తోడు ఇద్దరం పుస్తకాలు, సామాజిక ఆలోచ‌న‌లు చుకునే వాళ్లము… కొన్ని విష‌యాల‌పై ఇద్దరిలో తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నా చాలా విషయాలలో మాత్రం ఒకే మాట ఒకే బాట‌గా ఉండే వాళ్లము ..ఒక ర‌కంగా నా ఆవేశ‌పు అగ్నికి వాడి లోచ‌న గాలీ తోడ‌య్యేదీ..పీజీ రోజుల‌లోనే ఇద్దరం చెరొక పత్రికలో ప‌నిచెసే వాళ్లం.. యూనివ‌ర్సిటీలో జ‌రుగుతున్న అక్రమాలపై పోటీపడీ మరి వార్తలు రాసేవాళ్లం..మా వార్తలకు కొంత మంది డైలీ వైజ్ వ‌ర్కర్‌కు  యూనివ‌ర్సిటీ ప‌ర్మినెంట్ చేయడంతో మా సంతోషానికి అవ‌దులు లేవు..జ‌ర్నలిజం వ‌ల్ల ప్రజలకు మంచి జ‌రుగుతంద‌నీ ఎలాగైనా ఇద్దరం రిపోర్టింగ్‌ ఫీల్డ్‌లోనే ఉండాలని డిసైడ్‌ అయ్యాము..నాలుగు గోడ‌ల మ‌ద్య చ‌దివే చ‌దువులో కంటే నాలుగు రోడ్ల మ‌ద్య నేర్చుకునే ప్రాక్టిక‌ల్ చ‌దువే కావాల‌నుకున్నాం ఇద్దరం.. స‌మాజంలో మ‌న చుట్టూ నిత్యం జ‌రిగే వాటిపై స్టోరీ చెయ్యాల‌ని నిర్ణయం తీసుకొని..ఆ క్రమంలో జీవీఎంసీ ఎన్నిక‌ల‌లో డ‌బ్బు ప్రవాహం..యూనివ‌ర్సిటీలో కుల‌గ‌జ్జీ, ర్యాగింగ్ వంటి అనేక అంశాల‌పై స్టోరీలు రాసేవాళ్లం..ఇంకేదైనా డిఫ‌రెంట్‌గా చేద్దాం అనుకుంటుండ‌గా వాసు నైట్ స్వీప‌ర్స్ పై అద్భుత‌మైన ఐటెం రాశాడు..వాడి వార్త దెబ్బకు పారిశుద్ధ్య కార్మికుల‌కు క‌నీస స‌దుపాయాలు అయినా మాస్కులు వంటి స‌దుపాయాలు క‌ల్పించింది యాజ‌మాన్యం..వాడికి పోటీగా ఏజ‌న్సీ విద్యా వ్యవస్థ మీద నేను ఐటెం రాశాను..ఇంకా ఎదైనా రాయాలి కాస్తా డిఫ‌రెంట్ గా స‌మాజం తీరుపై కొర‌కాసుతో కాల్చీ వాత పెట్టేదీ గా ఉండాలి ఆ స్టోరీ… అలాంటి దానికోసం వెతికే క్రమంలో పొట్టకూటికోసం ఒల్లంమ్ముకునే వేశ్యలపై  స్టోరీ చేద్దాం అనుకున్నాం.. కానీ ఎలా..వారు ఎక్కడ ఉంటారు..? కాంటాక్టు చేయడం ఎలా..? ఒక మిత్రుడు చెప్పాడు..రాత్రులు రైల్వే స్టేష‌న్ దగ్గరా, బ‌స్టాండ్ ద‌గ్గరా ఉంటార‌నీ..ఇక వాళ్లని క‌లిసి మాట్లాడాలి..అలాంటి వాళ్ల కోసం చాలా రోజులు విశాఖ బ‌స్టాండ్ లో గ‌డిపేవాళ్లం..

 

ద‌స‌రా సెల‌వ‌ల‌కూ అంద‌రూ మిత్రులు వెళ్లిపోయినా నేనూ వాసు ఇద్దరం యూనివ‌ర్సిటీలో ఉండిపోయాము..రాత్రి సెకండ్ షో జ‌గ‌దాంబలో చూసిన త‌రువాత  సిగ‌రెట్ల కోసం ఆర్టీసీ బ‌స్టాండ్‌కు వెళ్లాము..సెడ‌న్‌గా ఒక అమ్మాయి క్యాంటిన్‌లో టిఫిన్ చేస్తుంది..కాస్తా ర‌ఫ్‌గా సాధార‌ణ అమ్మాయిల‌తో పోల్చితే క‌నిపించే సున్నిత‌త్వం కనిపించడం లేదు..నిదానంగా వాసు గాడు మాట‌లు క‌లిపాడు..బుల్లేట్ లా దూసుకు వ‌చ్చింది ఆమె దగ్గర నుంచి ఇద్దరం ఉన్నారా రెండు వేలు ఇవ్వండీ అని.. అంత కాదు ఇంతిస్తాం అని కాదు నేను అడిగినంత ఇవ్వాలీ అని తనూ.. బేరం ఎంతకీ తెగడం లేదు.. ఈ లోగా అర‌గంట‌కు అంతివ్వాలా అన్నాడు వాసు..ఇష్టం ఉంటే రండీ లేక పోతే పోండీ..ప్రతి పోటుగాడూ బేరాలాడే వాడే అని ఎట‌కారంగా మాట్లాడీ వెళ్లడానికి అడుగు ముందుకు వేసింది త‌నూ..ఒక్క సారిగా నేను మగాడ్నీ అనే అహంతో రెచ్చిపోయిన నేనూ ఒల్లమ్ముకునే దానివి ఎందుకే నీకంత పొగ‌రూ అన్నా…తోక తొక్కిన తాచులా చుర్రున చూసిందీ క‌ళ్లల్లో నీరుతో ఒళ్లు కొవ్వెక్కీ ఒళ్లమ్ముకోవ‌డం లేదు బతకడానికి ఒళ్లమ్ముకుంటున్నాను..నాకు మ‌న‌స్సుంటుందీ..అంద‌రిలాగా ఉండాలనీ ఉందీ అంటూ వేగంగా వెళ్లి పోయింది..తొంద‌ర ప‌డ్డావురా బావా అన‌వ‌స‌రంగా ఆడ పిల్లను మాట అన్నావు అన్నాడు వాసు..నిజ‌మే నాకు అర్ధమవుతుంది చేసిన త‌ప్పు..కానీ స‌రిదిద్దుకోలేను..భారంగా బీచ్ కు య‌లుదేరాం..

 

ఆ సంఘ‌ట‌న త‌రువాత మ‌రో రెండు రోజులు ఆ అమ్మాయి కోసం వెతికాము కానీ ఫ‌లితం లేదు..ఆ అమ్మాయి గురించి .అలోచించ‌డం మానేసి  ఎగ్జామ్స్ హ‌డావుడిలో ప‌డ్డాము..చ‌దువు పూర్తయింది..వాసుకు నాకు వేరు వేరు ఛాన‌ల్స్ లో  ఉద్యోగాలు వ‌చ్చాయి..అయితే రెండు సంవత్సరాల‌కు విశాఖ ట్రాన్స్ ఫ‌ర్ అయింది..ఓ రోజు సాయంత్రం  6.30 స‌మ‌యంలో బస్టాండ్ ద‌గ్గరే క‌నిపించింది..ఎవరి కోసం అయినా ఎదురు చూస్తుందో తెలియ‌దూ..వెంట‌నే వెళ్లను..అదే రెక్ లేస్ ఎంత మంది ఉన్నారు అందీ .. ఒక్కడినే అన్నాను. రెండు వేలు అందీ..ప‌దా అని లాడ్డికి తీసుకు వెళ్లాను..త‌న డ‌బ్బులు దారిలోనే ఇచ్చేశాను..

భోజ‌నం చెశావా అన్నాను..లేదు అందీ..భోజ‌నం తిన్న త‌రువాత న‌న్ను గుర్తు ప‌ట్టావా అన్నాను..ఎంతో మందిని చూశాను నువ్వేల గుర్తుంటావు అని ఎదురు ప్రశ్న వేసింది….అదీ నిజ‌మే ప్రవహించే న‌దీ ఎన్ని మ‌జిలీల‌ల‌ను గుర్తు కు పెట్టుకుంటుంది అనిపించింది.. రెండు సంవ‌త్సరాల క్రితం జ‌రిగిన విష‌యం గుర్తు చేశాను..త‌న మోహం ఎర్రగా కందిపోయింది..కోపంతో ముక్కు పుటాలు అదురుతున్నాయి..వెళ్లిపోతాను నేను అంటూ లేచింది..కాదు కూర్చో నీతో మాట్లాడాలీ, అని బ‌ల‌వంతంగా కూర్చో బెట్టాను..చెప్పు ఏంటీ నీ స్టోరీ అన్నాను..విజ‌యన‌గ‌రం ద‌గ్గన ఊరు నాదీ..అమ్మానాన్నలు కూలీలు..టెన్త్ వ‌ర‌కూ చ‌దివాను..అమ్మానాన్న చనిపోయారు.. నా అశ‌లు కూలిపోయాయి..ప‌ని ఉంద‌నీ చెబితే ఇక్కడ‌కు వ‌చ్చాను..ఇక్కడ‌కు వ‌చ్చిన త‌రువాత ఈ ప‌ని అని తెలిసింది.. ఆక‌లికి త‌ట్టుకోలేక పోట్టకూటి కోసం ఈ ఫీల్డ్‌లోకి వ‌చ్చాను అందీ..మ‌రీ ఎక్కడ ఉంటావు అన్నాను..ఇక్కడే ఓ మ‌రో ముగ్గురు ఇదే వృత్తి చేసే వారితో ఉంటాను..అంద‌రిలోనూ చిన్నదాన్ని నేనూ..వాళ్లకు అంత బేరాలు ఉండ‌వూ..నాకు వ‌చ్చే డ‌బ్బుల‌తో వారి పిల్లల‌ను స్కూల్లో చ‌దివిస్తున్నాను అందీ..ఇలా ఎంత కాలం ఉంటావు ఏదైనా ఉద్యోగం చెసుకోవ‌చ్చు క‌ధా అంటే నువ్వు ఇప్పిస్తావా  ఉద్యోగం..ఈ ఫీల్డ్ వ‌దిలేసి ప‌నిచేసుకుంటాను అందీ..నేను సైలెంట్ అయ్యాను..చూశావా ఇన్ని అద‌ర్శాలు చెప్పిన నువ్వు కూడా  మౌనంగా మారావు.. చెప్పినంత ఈజీకాదు ఆచ‌రించ‌డం..నువ్వు ఆరోజు అన్న మాట అప్పడ‌ప్పుడు గుర్తుకు వ‌స్తుంటుంది..చాలా బాధగా అనిపిస్తుంది..ఒక్కటి గుర్తుంచుకో మ‌నిషిని మ‌నిషిగా చూడ‌నీ ఆద‌ర్శాలు పాటించ‌కూ..జీవితం అంద‌రికి అన్నీ ఇవ్వవూ..ఏదో పొందుతూ ఉంటాం ఇంకేదో కోల్పోతూ ఉంటాం..నువ్వనుకుంటావేమో ఒళ్లమ్ముకునే దానివి వేదాంతం మాట్లాడుతున్నావే అని, నేను ఎంతో మంది మ‌నుషుల‌ను చ‌దివాను..ఒక్కటి గుర్తుంచుకో..ఒళ్లమ్ముకునే వాళ్లకూ మ‌న‌సు ఉంటుందీ ..చేసే ప‌నుల‌ను బ‌ట్టీ మ‌నుషుల‌ను అంచనా ఎప్పుడూ వేయకు అనీ అంటూ లేచిందినేను బ‌య‌లుదేరుతాను..నీ డ‌బ్బు నాకు వ‌ద్దూ నేనూ ఏ ప‌నీ చేయలేదు ఇక్కడ అంటూ వెళ్లిపోబోయింది..స‌రే నీ ప‌నికోసం కాక‌పోయినా నీ ద‌గ్గర ఉన్న పిల్లల కోసం అయినా డ‌బ్బు తీసుకో అన్నాను..నీతో ఇప్పటి వ‌ర‌కూ మాట్లాడిన దానికి స‌గం చార్జీ  తీసుకుంటాను అని వెళ్లిపోయింది..వాసు గాడికి ఈ సంగతి చెప్పాను..

 

కాల‌గ‌ర్భంలో సంవ‌త్సరాలు గ‌డిచిపోయాయి..నాకు హైద్రాబాద్ ట్రాన్స్ ఫ‌ర్ అయింది..దాదాపు 8 సంవ‌త్సరాల త‌రువాత ఇప్పుడు మ‌ళ్లీ ట్రాన్స్‌ఫ‌ర్ పై విశాఖ‌కు వ‌చ్చాను..నాకు అద్భుత‌మైన జీవిత పాఠం నేర్పిన వ్యక్తి క‌లిస్తే ఇప్పుడైనా ఏదో ఒక‌టి చెయ్యాలీ అనిపించింది..ఇప్పుడు నాకంటూ ఒక హోదా ఉంది కాబ‌ట్టి ఆ ర‌క‌మైన ప్రయత్నం చేయాలని అనుకున్నాను .. ఉద‌యాన్నే అక్కడికి వెళ్దామ‌నుకున్నాను..కానీ వేరే ప‌నుల‌లో రెండు రోజులు గ‌డిచిపోయింది..మూడో రోజు ఎలా గైనా కల‌వాలనుకొని నిన్న స‌త్యకు నాకు త‌ను క‌నిపించిన ప్రాంతానికి వెళ్లాము..అక్కడ‌కు వెళ్లే పాటికి జీవీఎంసీ వాళ్లు అడావుడీ చేస్తున్నారు..స‌త్యాని ఏం జ‌రిగిందో క‌నుక్కో అని పురమాయించి సిగ‌రెట్ వెలిగించాను..అన్నా ఎవ్వరో బిచ్చగ‌త్తే చ‌నిపోయింది అని చెప్పాడు..నాకు ఎందుకో ఆ శ‌వాన్ని చూడాల‌ని అనిపించింది..స‌త్యా నేనూ ఇద్దరం వెళ్లాము..నా అనుమాన‌మే నిజం అయింది.. త‌నే..శవాన్ని ఎక్కడ‌కు తీసుకుళ్తారు అని అడిగానూ అనాధ శ‌వం క‌ధా సార్..ఎక్కడైనా పూడ్చి పెడతాం అని చెప్పారు మున్సిపాలిటీ వారు..స‌రే ఖ‌ర్చులు నేను బ‌రిస్తాను..సాంప్రదాయంగా ద‌హ‌నం చేయండి నేనూ వ‌స్తాను అని చెప్పాను..స‌త్యా కూడా నాతో శ్మశానానికి వ‌చ్చాడు..క‌పాల మోక్షం జ‌రిగిన త‌రువాత శ్మశానం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాము..

నేను నేర్చుకున్న అద్భుత పాఠం..నాకు పాఠం నేర్పిన గురువు రుణం ఆ విధంగా తీర్చుకున్నాను..కాని త‌ను అన్న మాట‌లు నాకు ఎప్పుడూ గుర్తు ఉంటుంది..అంద‌రినీ మ‌నుషులుగా చూడూ..అంద‌రికి మ‌న‌స్సు ఉంటుందీ అనీ….హెట్స్ ఆఫ్ హ‌ర్……..అమే కోసం..

 

………….ఆమే………………..

 

మెర్క్యూరి లైట్ల దగదగల క్రింద..

పిలుస్తున్న అస్పష్ట ఆకారం..

దగ్గరకు వెళ్లితే మత్తెక్కించే చౌకరకం సెంటు గుబాలింపు..

చుట్టూ పరకిస్తూనే రావాలా అంటూ ప్రశ్న..

కొంచెం లేటయిందో..

త్వరగా తేల్చుకో..

ఇంకో బేరం ఉందంటూ గదమాయింపులు..

…………………………………….

ఆ చూపులో కోరిక లేదు..

దోరికి పోతామన్న భయం లేదూ..

కొత్త అనుభవాలను ఓడిసి పట్టుకోవాలన్నా అత్రుత లేదు..

నన్ను నమ్ముకున్నోళ్ల కడుపు నింపాలన్న తపనే కనిపిస్తుంది..

ఆ చూపుల్లో..

ఆకలే కనిపిస్తుంది ఆ చూపుల్లో..

…………………………………………..

ప్రేమించిన వాడు మోసం చెసి కొందరూ..

మొగుడు వదిలేసిన వారు మరికొందరూ..

నా అనే వాడు పట్టించుకోక ఇలా ఎందరో..

అప్పులు తాళలేక..

బిడ్డలను పస్తులుంచలేక..

తన శరీరాన్నే వ్యాపార పాన్పుగా మారుస్తుందా పడతీ..

……………………………………………………

ఆమెను కదిలిస్తే ఎన్నో కధలు…

మరెన్నో వ్యధలు..

రాత్రంతా జడలో నలిగిన మల్లెపువ్వులా వాడిపోయింది అంధం..

తన శరీరాన్ని కాక మనస్సున్న మనిషిగా గుర్తించమని పోరాడుతుంది ఆమె

 

ఆయువు..

నడుస్తున్న కాలానికి బ్రతుకుతున్న జీవితానికి ఏర్పడిన కాళీని పూర్తిస్తుంది ఆమె..

శూన్యమైన మనస్సాక్షితో…….

కాలం రోగాల సర్పాలై ఆమె అయుష్షుని మింగేసింది..

కవ్వించే ఆ శరీరం ఇప్పుడు ఎముకల గూడైంది..

చీకటి పరదాలలో కూరుకుపోయిన..

హృదయాన్ని క్షమించి ఇంకా ఎంతకాలం వెలుగు నటించగలని ప్రశ్నిస్తుంది ఆమె..

నిజమే…

ఆమె కౌగిలి పాన్పు తప్ప మనస్సుకు అంటుకున్న గాయాల వాసన ఎవరికి..

ప‌డుతుంది చెప్పూ…

క్రొవ్వొత్తీ వెలుగే కాని ..

ఆరిపోయిన కొవ్వొత్తి పొగ రింగులుగా అనంత వాయువుల్లో కలిసే ఆయువు ఎవ్వరికి

కావాలి..

*

ఓ బంగారు ‘కుట్టపాయ్’ కథ

 

 mahy

‘మాహీ’ నా తొమ్మిదేళ్ళ బుజ్జి ఫ్రెండ్. పక్కింటి బీహారీ పిల్ల. ఇంటి తలుపులు ఎప్పుడూ తీసే ఉంచుతాను. ఈ చిన్న సీతాకోకచిలక స్కూల్ లేని టైంలో బుద్ధి పుట్టినప్పుడల్లా నా మీద వచ్చి వాలుతూ ఉంటుంది.  టాటాస్కై చానెల్ లో వస్తున్న ‘ఓట్టాళ్’ మలయాళీ సినిమా చూస్తున్నాను. వచ్చి వాలింది మాహీ. కూచోబెట్టి సినిమా చూడమన్నాను. కుర్చీ తెచ్చుకుని కూర్చుంది బుద్ధిగా.

ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ అంటూ ఓ చానెల్ కి పేరు పెట్టి 2015లో వచ్చిన కొన్ని మంచి సినిమాలు వేస్తోంది టాటాస్కై. ఇంతకుముందు దూరదర్శన్ చేసేపనిని చేస్తోందన్నమాట.

‘ఓట్టాళ్’ అంటే అర్థం ‘చేపల్ని పట్టే బుట్ట’ అని. ఇదేదో 70ల్లో వచ్చిన ఆర్ట్ ఫిల్మ్ లా ఉన్నట్టుందిలే, మాహీ తితిలీ రెక్కలు విదిలించి లేచెళ్లిపోతుందని అనుకుంటూనే ఉన్నా, ఇంతలోనే నన్నూ మాహీని బుట్టలో పెట్టేసింది ఆ సినిమా. బుద్ధిని కాదు. మనసుని నిజాయితీగా స్పర్శిస్తోంది ‘ఓట్టాళ్’.

‘వాంకా’ కథ ఏంటన్ చెకోవ్ ది.  వాంకా అనే ఒక చిన్న పిల్లవాడు తన తాతకు రాసిన ఉత్తరం అది. తాత అతన్ని మాస్కోలో ఒకరింట్లో పనికి పెడతాడు. అక్కడ వాళ్ళు తనను పెట్టే హింస అంతా వివరిస్తూ తనను ఇంటికి తీసుకుపొమ్మని ఏడ్చుకుంటూ వాంకా పల్లెటూళ్ళో వున్న తాతను బతిమాలుతూ రాసిన ఉత్తరం ఆ కథ.  చివరకు అడ్రెస్ రాయాల్సిన చోట ‘To my grandfather, The village’ అని రాసి కొంచెం ఆలోచించి తాత పేరు కూడా రాసి పోస్ట్ డబ్బాలో వేసేస్తాడు. మనుషుల అడ్రెస్ లెలా ఉంటాయో తెలియని అమాయకపు పిల్లగాడు వాడు. ఆ రాత్రి నిద్రపోతూ తాత తన ఉత్తరాన్ని చదువుతోన్నట్టు కలగంటూవుంటాడు. కథంతా చదివాక ‘అబ్బా, వీడిబాధ ఇక ఇంతేనన్నమాట’ అని నిస్సహాయతలో పడతాం.  చెఖోవియన్ టచ్…

mahy5

ఈ కథని కేరళకి లాక్కొచ్చి కుట్టనాడ్ నీలాల నీళ్ళూ, ఆకుపచ్చ పొలాలూ, అడుసునేలల మీద నిలబెట్టేడు దర్శకుడు జైరాజ్. (దేశాడనం, కలియాట్టం లాంటి సినిమాలుతో పేరు తెచ్చుకున్న జైరాజ్ ఇంకో సినిమా ‘వీరమ్’ ఈ డిసెంబర్ లో వస్తోంది. ప్రముఖుల సాహిత్యాన్ని సినిమాలు తీయటం ఈయనకు ఇష్టం). చెఖోవ్ కథకు పర్యావరణస్పృహనీ  కుట్టనాడ్ జీవనశైలినీ జోడించి ‘ఓట్టాళ్’ సినిమా తీశాడు జైరాజ్.  ఈ సినిమాలో వున్న తాతా మనవళ్ళ అనుబంధమంత బలంగా కనిపించదు చెఖోవ్ కథలోని వాళ్ళిద్దరి అనుబంధం.  కాకపోతే బాలకార్మికుల వ్యవస్థ నూటముప్ఫై ఏళ్ల కిందట చెఖోవ్ కథనాటికీ ఈనాటికీ మురికిగుంటలా ఊరుతూనే ఉంది.

కేరళ సాంప్రదాయనృత్య రీతులమీదా, సంగీతం, జానపద శైలుల మీదా ఆసక్తి ఉన్న జైరాజ్ ఈ సినిమాకి నాటకరంగ ప్రముఖుడూ కవీ అయిన కావలమ్ నారాయణ పణిక్కర్ ను సంగీతదర్శకునిగా తీసుకున్నాడు. తాతా మనవడూ విడిపోయే ముందు ఒక పాట వస్తుంది. బాధనంతా రంగరించి పణిక్కర్ ఆ పాట రాశారు. (ఆర్నెల్ల కిందటే పణిక్కర్ చనిపోయారు) ఆయనసంగీతం, పాటా తోనే సినిమాకు సగం ఆర్ద్రత వచ్చేసింది. మరింత తడిని అద్దింది సినిమాటోగ్రాఫర్ ఎం.జే.రాధాకృష్ణన్.  ఎంత బడ్జెట్ ఉన్నా ఎడిటింగ్ సూట్ దగ్గర రంగులన్నిటినీ  సాచురేషన్ బార్ చివరికి తీస్కెళ్ళి, ఆకుపచ్చరంగుకైతే  రేడియం అద్దినట్టుచేసి మన మొహాన గుద్దుతున్న  సినిమాలూ సీరియళ్ళనుండి పెద్ద రిలీఫ్ ‘ఓట్టాళ్’.  రేడియం ఆకుపచ్చ కాకుండా పచ్చనిఆకు రంగు దొరుకుతుంది ఈ సినిమాలో.  ఫిష్ ఐ లెన్స్ తో మనోహరమైన కుట్టనాడ్ భూమినీ నీళ్ళనీ వంచినా, బాతులమంద వంకీలు వంకీలుగా నీళ్ళమీద చేసే విహారాన్ని సరైన లెన్సింగ్ తో పట్టినా, ‘కుట్టపాయ్’ నల్లటి చిన్ని మొహంలోని కళ్ళమీది వెలుగుని ఇట్టే పట్టుకున్నా రాధాకృష్ణన్ అన్నిట్లోనూ లీనమై చేశాడు.

mahy2

పై ఫోటో రితు రాజ్ కన్వర్ (‘ది హిందూ’ ఫోటోగ్రాఫర్) అస్సాం వరదలప్పుడు 2014 లో తీసినది. ఈ ఫోటో చూశాకా ‘వాంకా’ కథను ఎలా తీయాలన్న విషయమై ఒక స్పష్టత వచ్చిందని అంటాడు జైరాజ్. తన సినిమాలో కూడా ఇలాంటి ఫ్రేమ్ ను తీయాలని అనుకున్నాడట. అలా కుట్టనాడ్ లోకి వచ్చిదిగింది ‘వాంకా’ కథ.

స.వెం. రమేశ్ ప్రళయకావేరి కథల్లాగా ‘ఓట్టాళ్’ కుట్టనాడ్ జీవనసరళిని గానంచేసే దృశ్యకావ్యం.  ఇది బాలల చిత్రం. పర్యావరణ చిత్రం. తాత్విక చిత్రం. ఇంకా మనిషిని ప్రకృతినుంచి లాక్కెళ్ళి ఎక్కడెక్కడో పరాయిచోట్లకి విసిరేసే అసమానతలనీ బీదరికాన్నీ, డబ్బుకోసం బాల్యాన్ని కాటేసే పాముల దౌష్ట్యాన్నీ  చూపించే చిత్రం.

చలం బెన్నూర్కర్ తీసిన తమిళ డాక్యుమెంటరీ ‘కుట్టి జపానిల్ కులందైగళ్’ (Children of mini Japan) శివకాశీ పరిశ్రమల్లో నైపుణ్యం లేని బండచాకిరీలు చేసి కునారిల్లే బాలకార్మికుల కథల్ని చెప్తూ బాధిస్తుంది. మీరా నాయర్ తీసిన ‘సలాం బాంబే’ చూస్తే ముంబై రెడ్ లైట్ ఏరియాలో కాలిపోతున్న బాల్యపు మొగ్గల కమురువాసన ఘాటుగా ఆవరించి చెమటలు పట్టిస్తుంది. ‘ఓట్టాళ్’ ఓ పక్క ప్రకృతితో మనల్ని ముడేస్తూనే మరోపక్క తెగిన బంధపువేళ్ళ తడిని కంటిమీదికి రప్పిస్తుంది.

mahy4

‘ఓట్టాళ్’ ని తీరికగా ఎక్కడా ఆగకుండా (టాటాస్కై అలాగే వేస్తోంది యాడ్స్ బాధ లేకుండా) కళ్ళకు నింపుకుంటూ చూడాలి. నెమ్మదైన జీవితవిధానానికి తగ్గట్టున్న విలంబిత లయ ఈ సినిమాది. ఎప్పుడూ గేలం వేసి ఒడ్డున కూచుని ఎదురుచూసే ఒక పరిచయస్తుడైన వృద్ధుడు “చేప పడటంలోనే కాదు. ఇలా కూచోడంలో కూడా ఆనందం ఉంది” అంటాడు కుట్టపాయ్ తో. ఎదురుచూడటాన్ని ఎంతమంది ఆనందిస్తున్నారిప్పుడు? కుట్టపాయ్ ఆయనతో ‘నేను చదువుకుని సిటీకి వెళ్లి చాలా సంపాదించి నీకో పెద్ద గేలం కొనిస్తా’ అంటే ‘చేపలు పట్టటానికి చిన్న గేలం చాలు. చిన్నగా బతికితే చాలు’ అని హితవు చెప్తాడు.

డెబ్భైఅయిదేళ్ళ ‘వలియప్పచ్చాయ్’(వాసుదేవన్) తొమ్మిదేళ్ళ కుట్టపాయ్ (ఆశాంత్ కె. షా)కి తాత. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకు చనిపోగా మిగిలిపోయిన కుట్టపాయ్ ని కుట్టనాడ్ తీసుకొచ్చి బాతులమందను సాకుతూ బతుకు లాగుతుంటాడు. ఆ ఊర్లోనే ఉన్న పెద్దింటి పిల్లవాడు టింకూ కుట్టపాయ్ తో స్నేహం చేస్తాడు.  అతని తల్లి కుట్టపాయ్ ని కొంత దయతో చూస్తుంటుంది. టింకూ తండ్రికి మాత్రం కుట్టపాయ్ ఓ అలగాజాతి పిల్లవాడంతే. తాతను సతాయించి చేపా రొయ్యా పట్టి, గిన్నె గరిటా కొనిపించి మరీ టింకూ కోసం వంట చేయిస్తాడు కుట్టపాయ్.  టింకూని భోజనానికి పిలవటానికని కుట్టపాయ్ వస్తే, ఎందుకొచ్చాడో కూడా తెలుసుకోకుండా ‘మిగిలిన తిండి వస్తువులేవో  వాడికిచ్చి పంపించు’ అని భార్యతో అనగలిగేంత బండమనిషి టింకూ తండ్రి.  కలువపూలూ, బాతులూ, వాటి గుడ్లూ, వాటిని పొదిగే కోడిపెట్టా, పేరులేని కుక్క (దానినలాగే పిలుస్తాడు కుట్టపాయ్), పడవలవాళ్ళ కోసం ఎత్తయిన కర్రచివర్న దీపంపెట్టే పరోపకారీ, ఎప్పుడూ ఓపిగ్గా గేలంవేసి ఎదురుచూసే మరో పండుముసలాయనా,  కుట్టనాడ్ లో ఎవరికీ ఉత్తరాలు రావని చెప్తూ సైకిల్ మీద తిరిగే పోస్ట్ మాన్,  తాత కల్లు తాగే అంగడీ… వీటన్నిటి మధ్య ప్రకృతి పాఠాలతోబాటు బాతుల్ని సాకటం నేర్చుకుంటూ బతికే కుట్టపాయ్ కొంచెం అల్లరీ, ఎంతో తెలివీ, మరెంతో సున్నితత్వం నింపుకున్న బంగారుతండ్రి. స్వేఛ్చగా కుట్టనాడ్ ఒడిలో ఆదమరిచి వున్న వాడి కొంపముంచే మాయరోగం తాత ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. చావుకి దగ్గరలో ఉన్న తనతర్వాత ఈ పసివాడిని చూసుకునేదెవరని బెంగపడ్డ వలియప్పచ్చాయ్ పాపం ఈ బుజ్జి బాతుపిల్లను, శివకాశీ పరిశ్రమకి పిల్లల్ని అమ్ముకునే పాము మాటలు నమ్మి, వాడితో పంపించేస్తాడు. ప్రశాంత ప్రకృతిలోంచి గాడీరంగుల ఇళ్ళతో నిండిన శివకాశీకి ఒక్కసారి కుట్టపాయ్ తో వచ్చిపడటం మనకీ ఎంత బాధో!  జైరాజియన్ టచ్…

mahy3

ఇంకేముంది? తను పడుతున్న బాధలు వివరిస్తూ ఉత్తరం రాసి పోస్ట్ డబ్బాలో వేస్తాడు కుట్టపాయ్. వాడు రాసిన అడ్రెస్,  “మా తాతకి, కుట్టనాడ్” అంతే.  ఆ రాత్రి నిద్రపోతూ తన ఉత్తరాన్ని తాత, టింకూ కలిసి చదువుతున్నట్టు కలకంటుంటాడు. ఆ కల నిజం అయిపోతే బాగుండును  …

“నా మనసులోని పిచ్చుక ఏడుస్తోంది.

పంటలైపోయాయ్, పండుగలైపోయాయ్.

మనసులోని పిచ్చుక ఏడుస్తోంది.

దేశదిమ్మరిదొర కలలపిట్టా

ఎక్కడికి పోయావ్? ఎటు తప్పిపోయావ్?

మనం ఒకర్నొకరు కనలేదూ ?

ఒకర్నొకరం వినలేదూ?

మనస్సలా చూస్తూనే ఉన్నా, మౌనం ఇంకా బద్దలుకాలేదు.

నా బాతులమంద లాగా

నేను చెదిరిపోయాను.

నేను చెదిరిపోయాను.

మీసాల కొసలు చెదిరిపోయాయ్.

పంపానది ఆత్మలోకి మాయమైపోయాయ్.

కదిలే నా తెడ్లు చెదిర్చిన నీటిలాగా నేనూ చెదిరిపోయాను.”    

తాత చెదిరిపోయాడు. మనవడు పట్నంపాలై పోయాడు.

“ఇలా బాలేదు ఆంటీ. తాత దగ్గరికి ఇంక వెళ్లలేడా?” అని బెంగగా వెళ్ళిపోయింది మాహీ.

(ఈ సినిమా టాటాస్కై ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ చానెల్ లో పదేపదే చూపిస్తున్నారు. ఇంగ్లిష్ సబ్స్ తో సహా)

పాట ఇక్కడ ఉంది.

 

 

డేవిడ్‌

art: satya sufi

art: satya sufi

ఒం‌టె చర్మం మొద్దుగా ఉంటది. దానిలోకి సూది దింపి దారాలతో పూలు కుట్టిన, ఎంబోజింగ్‌ ‌పనితనంతో ఉన్న పర్సులని చూత్తా బజారులు తిరుగుతున్నా. హంపీకి యాత్రికురాలిగా రావటం మొదలుపెట్టి ఇరవై ఏళ్లవుతుంది. ఇదేంటి అంటే అంతకు ముందు నా ఊరు ఇదే. ఉద్యోగం బాధ్యతలతో సొంత ఊరికి యాత్రికురాలిని అయిపోయా. ఇంకొక్క రోజులో ముప్పై తొమ్మిదేళ్లు నిండి నలభైలోకి అడుగుపెడతా. ఊరి పొలిమేరల బంధం చాలా గొప్పది .నలభైలు అంటే నాకు మామూలుగానే ఉంది. చెంపల సందుల్లో నించీ దొంగ చూపుల తెల్లవెంట్రుకలు, కొద్దిగా ముందుకొస్తున్న బెల్లీ అన్నీ కలిపి ‘ఏజ్‌ ‌గీవ్స్ ‌గ్రేస్‌’ అన్నట్టుగా ఉంది.

‘వర్కవుట్స్ ‌చెయ్యొచ్చు కదా. ఇప్పుడు మొదలుపెడితే ఇంకా ఇరవై ఏళ్లు యాక్టివ్‌గా ఉంటావు’ 21 సం.ల కొడుకు సలహా.
‘నేను ఇరవై ఒకటి కాదు ముప్పై తొమ్మిది. నాకేం లో వేస్ట్ ‌జీన్స్‌లు వేసుకుని తిరగాలని లేదు’.

‘మా నువ్వు మారిషస్‌ ‌వెళ్లినపుడు ‘స్పెగెట్టీ’ టాప్‌తో ఉన్న ఫొటో సెల్‌ఫోన్‌కి స్క్రీన్‌ ‌మీద పెట్టాను. మా లెక్చరర్‌ ఎవరు నీ గాల్‌‌ఫ్రెండా, చాలా బాగుంది, ఇట్లా పెట్టుకు తిరగాల్సిన అవసరం ఉందా’ అని క్లాస్‌ ‌పీకాడు.
‘నన్ను ఈ భూమి మీదకి తెచ్చిన గాళ్‌, ‌మా అమ్మ ‘వన్‌ ఇన్‌ ‌మిలియన్‌’ అన్నాను

నేను నవ్వుకుంటా వాడి మాటల్ని మురిపెంగా వింటా, వీడు ఏదో నా దగ్గర దాస్తున్నాడు అనుకుంటా. బ్యాగుల్ని చూస్తన్నా. కొన్ని లేత రంగులు, ముదురు రంగులు కావాలంటే ఆవనూనెతో రుద్ది రంగు మార్చి ఇస్తన్నారు. ఒక గవ్వల యాంక్లెట్‌ (‌కాలి పట్టీలాంటిది) కొని నా కాలికి తొడిగాడు.

‘మా నువ్వు చాలా బాగుంటావు, ముప్పై ఏళ్లా అన్నట్టుగా, నా ఫ్రెండ్స్ అం‌తా మీ అక్కా అని అడుగుతారు. ఒకసారి నా ఫ్రెండ్‌ ‌పుట్టినరోజుకి ఐవరీ అండ్‌ ‌గ్రే కలర్‌ ‌పట్టుచీర కట్టుకుంటే, విప్పి వేరే చీర కట్టుకునే వరకూ ఏడ్చాను. గుర్తుందా అందులో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అచ్చం నీలాంటి అమ్మాయి నాకు తోడు దొరకాలి’.

ఎందుకో వాడ్ని చూశాను, కొత్తగా ఉన్నాడు, కళ్లల్లో ఏదో కాంతి, నా రక్తం కదా, రూపం నాదే, నేను పంచిన మాంసం, మొత్తం మీద నా ఎక్స్‌టెన్షన్‌. ఈరోజు వాడి కళ్లు ఏదో మెరుపుని మోస్తా ఉన్నట్టుగా,… పరిశీలించటం ఆపి…
ఏంటి ఇవ్వాళ ఓ.. అని పొగుడుతున్నావు.. నీ మీద నాకేదో అనుమానం, కొత్తగా నీకు అమ్మ కనపడిందంటే.. ఈ అబ్బాయిలందరూ అమ్మలని కావాలనుకోవటం మానేసి ,అమ్మాయిలని, పెళ్లాలని కోరుకోవాలి, ఒక పాత్రతోనే తృప్తిపడాలి. ఇవ్వాళ, రేపు అమ్మాయిలు అన్ని పాత్రలూ పోషిస్తా కాలం వేస్ట్ ‌చేసుకోరు.

Kadha-Saranga-2-300x268
ఏదో దొరికి పోయినట్టుగా మొఖం పెట్టి..
‘నీకొకటి చెప్పాలి. నువ్వు నో చెప్పవని ఒకడుగు ముందుకి వేశాను. నీ పుట్టిన రోజుకి చిన్న సర్‌‌ప్రైజ్‌. ‌నా బ్యాచ్‌మేట్‌ ఐరిష్‌ అమ్మాయి తన పేరు ‘వీనస్‌’ ‌తనని పిలిచాను. తను నాకు క్లోజ్‌. ‌ముందే చెబుదాం అని అనుకున్నాను. కానీ…’
దగ్గరగా జరిగి వాడి బుగ్గమీద ముద్దు పెట్టుకున్నా. నా ఎనక నించీ ఎవరినో రమ్మని చేతులు ఊపాడు. ఎదురుగా ఉండే కొట్టులో టిబెటియన్‌ ‌మ్యాజిక్‌ ‌బౌల్‌ని కర్రతో తిప్పతా సంగీతం వినేదల్లా వదిలేసి వచ్చింది.

‘వీనస్‌’ అన్నాడు.
నవ్వుతా ‘హౌ ఆర్‌ ‌యు’ అన్నా.
రెండు చేతులూ ఎత్తి ‘నమామాస్తే ఆంటీ’ అంది.

ఆ అమ్మాయిని చూస్తే వీడికన్నా రెండంగుళాల ఎత్తు, రాజస్థానీ  కుచ్చుల లంగా, పైన పొడుగు చేతుల పొట్టి టాప్‌, అడ్డంగా యాలాడే బ్యాగ్‌, ‌మెడని పట్టి జారుతున్న రంగుపూసల దండ, పైకి క్లిప్‌ ‌చేసిన రాగి జుట్టు, నవ్వినప్పుడు అందంగా షైన్ అవుతున్న ఐవరీ కలర్‌ ‌పళ్లు, పిల్లి కళ్లు, భలే క్యాచీ లుక్స్, ‌మొత్తానికి చాలా క్యూట్‌ అనుకున్నా.

‘ఈ తెల్లది నీకెక్కడ దొరికిందిరా’
‘మా ప్లీజ్‌ ‌తనకి తెలుగు వచ్చు.. ముందు బ్యాగులు చూడు’

రకరకాల బ్యాగులు, ట్యాజిల్స్ ‌హ్యాంగ్‌ ‌చేసి సెల్ఫ్ ‌ప్రెస్‌డ్‌, ‌హ్యాండ్‌ ఎం‌బ్రాయిడరీ, కచ్‌ ‌వర్క్, అద్దాలవీ, గవ్వలవీ, పూసలు, ఏది ఏరుకోవాలో తెలియట్లా. చూస్తా చూస్తా ఒక మూల ఆగిపోయాను. అదేనా.. ఇది అదేనా.. ఆ వస్తువు అక్కడ, ఇన్ని సంవత్సరాల తరవాత చూసినా చటుక్కున గుర్తుపట్టాను. కాదు.. లేదు.. ఒంటిని విడివిడిగా నరికి పేళ్లుగా చీల్చినా, ప్రతిభాగం దాన్ని గుర్తు పట్టుద్ది. నాలో సన్నని వణుకు. ఇది తను మాత్రమే చెయ్యకలదు. అతని చేతిలో తోలు కొబ్బరాకులాగా, తడిపిన నారలాగా, కుప్పలో నించీ తీసిన జమ్ములాగా మారుద్ది. ఆ విషయం నాకు బాగా తెలుసు. నా ప్రమేయం లేకుండా చేతులు అపురూపంగా తడుముతున్నయ్యి. దాన్ని నా ఒళ్లోకి తీసుకున్నా. ప్రపంచంలోనే చాలా అరుదైన తక్కువగా చేసే ఒక రకమైన తోలు పనితనం. అది తెలిసిన కొద్దిమందిలో అతనూ ఒకడు. ఆ వస్తువు బుల్లెట్‌ ‌సీటు కవర్‌. ‌రేటు లక్షా యాభై వేలు అని ఉంది.

ప్రతి రెండు సంవత్సరాలకీ ఒకసారి ఐదు తెస్తాడు. గోవా కస్టమర్లు మూడు కొనుక్కుని వెళతారు. ఒకటి ఇక్కడ రాజకీయ నాయకుడి కొడుకు కొంటాడు. ఒక్కటే మిగిలింది. కావాలంటే లక్షా ఇరవైకి ఇచ్చేస్తా అని షాపతను చెప్పుకు పోతా ఉన్నాడు.
‘డేవిడ్‌ ఇక్కడికి ఎపుడొచ్చాడు’ అని బలవంతాన అడిగాను.

‘ఓ.. మీకు తెలుసా.. సంవత్సరంన్నర పైనే అయి ఉండొచ్చు. మీకెలా పరిచయం, చాలా పేరున్న కుటుంబం అంట. మౌన ఋషిలాగ ఉంటాడు. ఇక్కడికి గాల్‌ ‌ఫ్రెండ్స్‌తో గానీ, దారిలో పరిచయం అయిన టూరిస్టులనయినా తెచ్చుకుంటారు, కానీ తను మాత్రం ఒక్కడుగా వస్తాడు. ఇక్కడ ప్రతి రాయీ, ప్రతి శిల్పం, ప్రతి శిధిలం, ప్రతి గోపురం నా ప్రియురాలే, తుళ్లిపడే తుంగభద్ర పరవళ్లలో, నేను చూసే ప్రతి జంట ఆనందంలో, ఈ హంపీ మొత్తం తనే, ఇక్కడ పాదం పెడితే తనతో కలసి ఉన్నట్టే… అందుకే క్రమం తప్పకుండా వస్తాను అంటాడు.

అక్కడ ఉన్న కుర్చీలో ఇడిచిన బట్టల కుప్పలా కూలపడ్డా. చాలా నీరసంగా అనిపించి నీళ్లు కావాలని అడిగా.
‘మా .. అమ్మా.. ఏంటి ఇట్టా అయిపోయావు. పొద్దున్నించీ ఏమన్నా తిన్నావా.. వీనూ.. గెట్‌మి ఒన్‌ ‌టెండర్‌ ‌కోకోనట్‌, ‌యాపిల్‌ ‌పై.. గెటిట్‌ ‌ఫ్రం ద బేకరీ.. ఫాస్ట్…’

‘‌వద్దు నాన్నా ఆకలి లేదు’.
‘కొంచెం తిను, మాట్లాడకు, అని మొత్తం తినిపిచ్చి, లేత కొబ్బరి నీళ్లు తాగినాక తేరుకున్నా’.
ఇంత జరిగినా ఆ లెదర్‌ ‌కవర్‌ని మాత్రం చేతిలోనే గాజుబొమ్మని పట్టినంత భద్రంగా పట్టుకున్నా.
‘రామ్మా.. ఎలదాం.. రేపు కొనుక్కుందాం’ అని లేపాడు.
‘డేవిడ్‌ ‌వస్తే మీ రిఫరెన్స్ ఏమయినా చెబితే గుర్తు పడతాడా’ కొట్టతను.
‘థాంక్స్.. ‌నథింగ్‌’ అని బలవంతాన సీటుకవరు వదిలి బయటకొచ్చాను.

‘అక్కా చెల్లెళ్లు గుండు (అదొక ప్రదేశం) దగ్గరకి తీసుకెళ్లు నాన్నా’
‘వాడూ, ఆ అమ్మాయి మొకమొకాలు చూసుకుని అక్కడికి తీసుకెళ్లారు. గుట్టెక్కి రాతికాళ్ల మంటపం దాటి, గుండుని గుర్తుపట్టి నిలబడ్డా. దాన్ని ఆనుకుని  ఒరిగినట్టుగా రహస్యంగా ఉండే గుర్రం మొకం బండ. ముందుకి వంగి బండమీద పడుకున్నట్టుగా చూస్తేగాని అక్కడ ఏం ఉందో కనపడదు.

— — —
స్వేచ్ఛగా పరచుకుని విప్పారిన టేకుపూత రంగుకి, కుంకపు రంగు అంచులంగా దానిమీద కుంకపు రంగు జాకెట్టు, తలంటుకుని నీటి చుక్కల కారతన్న రొండు జడలు శనివారం స్కూలు డ్రస్సు ఉండదు. కిలోమీటరు దూరం ఉండే బడికి, అల్యూమినియం పుస్తకాల పెట్టెతో నడుస్తున్నాను. అసలే ఆలస్యం, ఛీ.. ఛీ.. బడినించీ వచ్చినాక తలంటొచ్చు కదా. ఈ అమ్మమ్మ ఒకటి. టింగూ, టింగూ అని రొప్పుకుంటా గెట్టు (గట్లు)కి అడ్డంపడి బడి దారి పట్టాను.

‘హలోవ్‌.. ‌బేబీ వేరీజ్‌ ‌తుంగభద్రా రిసార్టస్..’
‘‌తలెత్తి చూస్తే ఒక విదేశీ కుటుంబం, భార్య, భర్త, ఇద్దరు మొగ పిల్లలు. ఈళ్లు అడిగిన అడ్రస్సు చేతితో చూపిచ్చి బై చెప్పా. సాయంత్రం బడినించీ వచ్చేటప్పటికి మామిడి చెట్టు కింద ఉన్న రెండు హట్స్‌లో వాళ్లు దిగారు. ఒక దాంట్లో ఆ జంట, రొండో దాంట్లో పిల్లలు. వాళ్లు బ్రిటిషు వాళ్లని రెండు నెలలుంటారని తెలిసింది.

స్నానం అయినాక పొద్దున ఆదరాబాదరా ఏసిన జడలు ఇప్పి చిక్కుతీసి ఒక జడ ఏసి మల్లెపూలు మరవం దండ తలలోకి ఎక్కిచ్చి, చేతిని జున్ను గిన్నె ఇచ్చింది అమ్మమ్మ. మామిడి కొమ్మకి కట్టిన ఉయ్యాలలో ఊగుతా జున్ను లాగిస్తున్నా. కాసేపటికి గుడిసెలో నించీ కొట్టుకుంటా అన్నదమ్ములు బయటకొచ్చారు. అన్న వాళ్ల తమ్ముడితో..

‘పగలంతా నీతో ఆడలేను. ఈత కొట్టు, కోళ్లు, గేదెల్ని కాస్తా ఆడుకో, రాళ్లెక్కు.. ఇంకా.. ఇదిగో ఈ పిల్లని పరిచయం చేస్తాను ఇద్దరూ ఆడుకోండి.
హాయ్‌ ‌వీడు నా  చిన్న తమ్ముడు. సెలవలకి ఇండియా వచ్చాం. ఇక్కడ బాగుంది. మీరు వీడితో ఆడుకోవచ్చు. మంచివాడు. సారీ అన్నీ నేనే చెబుతున్నాను. మీ పేరు’
‘సిరి’
‘వాటార్యూ’
‘సిక్స్ ‌గ్రేడ్‌’
‘‌వెల్‌కమ్‌ ‌టు టీన్స్, ‌సెక్సీ వెల్‌కమ్‌, ‌సాయంత్రాలు, శని, ఆదివారాలు కలసి ఆడుకోండి. మీరు చాలా షేర్‌ ‌చేసుకోవచ్చు. కాళీ ఉంటే నేను కూడా జాయిన్‌ అవుతా. నాకు వేరే పనులు ఉన్నయి. బై.

‘తను నాకన్నా చిన్నది. నీకేం పనులు, అద్దెబుల్లెట్‌ ‌మీద ఎవరో ఒక అమ్మాయితో తిరగటమా’.
‘కాదు, అయినా ఆ విషయాలు నీకు అనవసరం’ అని కదిలాడు.
పరుగెత్తుతా వాళ్ల అన్న ఎనకాల పడ్డాడు. నన్ను ఏదో చేత్తాడు అనుకుని పిల్లల కోడి మీదపడి పీకబోయింది. దెబ్బతో వచ్చి నా ఎనకాల చేరాడు. నవ్వుకుంటా.

‘తింటావా’
‘ఏంటది’
‘కంట్రీ ఛీజ్‌’
‌మాట్లాడుకుంటా కోళ్లమ్మటపడి, కోళ్లని కప్పెట్టి, గూటికి నాపరాయి అడ్డంపెట్టి, చేతులు కడుక్కునేటప్పటికి, చీకటి పడింది. చదువూ, రాతా లేదా అని అమ్మమ్మ కేకలు.
‘రేపు బడి అయినాక నాలుగింటికి కలుద్దాం’.
‘నీ జడ బాగుంది. యు లుక్స్ ‌స్వీట్‌’ ‌బై.

‘నాలుగింటికి కలిశాం. పగలంతా వాళ్లమ్మతో టెంపుల్స్ ‌తిరిగానని డ్రాయింగ్స్ ‌వేస్తుంటే చూశానని చెప్పాడు. రోజూ కలిసే వాళ్లం. నీ ముక్కెందుకు అంత పొడుగ్గా చివర వంకరగా ఉంది. ఇక నించీ నువ్వు ‘పారెట్‌’ ‌నీ తలెందుకు అట్టా ఎర్రగా ఉంది. నువ్వు ‘రాగి చెంబు’ అంటే పడి పడినవ్వాడు. నాకు చాలా సమస్యలు ఉన్నయ్యి. అయ్యి నీతో చెప్పుకోవాలి. అని అలా రోజూ ఇద్దరం కలసి తిరగటం, ఆటలు, గోల.

మా ఇద్దరివీ మరీ అంత చైల్డిష్‌ (‌పిల్లల) ఆటలేం కాదు. టీనేజ్‌కీ, యంగ్‌స్టర్స్‌గా మారే మధ్య దశ ఆటలనుకుంటా. అవి ఆటలా చేష్టలా తెలియదు. తేనెకళ్లు, సన్న ముక్కు, రాగి జుట్టు ఉన్న పద్నాలుగేళ్ల పిల్లాడు, ఏదో ఒక పని చేత్తా ప్రతిదాన్ని పరిశీలనగా చూస్తా, నవ్వినపుడు ముక్కూ, పెదవులు కదిలించటం, చాలా దగ్గరగా నిలబడి మాట్లాడటం, ఇది ఏంటోగా ఉండేది. మరి నా తరగతి అబ్బాయిలతో ఇట్లా అనిపిచ్చలా. నాకన్నా పెద్ద ఆనంద్‌ ‌వాడితో కూడా చాలా క్లోజ్‌, అమ్మా వాళ్లు ఊరెళితే నేను, అన్నయ్య, వాడూ అందరం ఒకే దగ్గిర పొడుకున్నా ఏమీ తేడాలేదు. కానీ వీడు మాత్రం తేడాగాడు. వీడిని చూత్తే నా కళ్లు నవ్వుతయ్యి. ఎందుకు? ఏమో చెత్తగాడు. మొత్తానికి నచ్చుతాడు.

గేదల్ని తోలుకుని పాలేరు నదికి ఎలతంటే వచ్చా. ఎనకాల తోకలాగా వీడూ తయారు. ఈడితో పెద్ద గేదని తోమిచ్చా. కబుర్లు చెప్పుకుంటా లోతుకి ఎల్లాం.

‘సిరీ ఈత కొడదామా’
ఈదుకుంటా దూరం వచ్చాం. ఒక దగ్గిర ఆగి నా శిల్కు లంగాని గొడుగులాగా చేసి ఆడతన్నా.
‘పారెట్‌ ఐ ‌వాంటు ఆస్క్ ‌సమ్‌థింగ్‌’ (‌నిన్నొకటి అడగాలి)
‘ఏంటది’?
‘విల్‌ ‌యు బి మై గాళ్‌’ (‌నా అమ్మాయిగా ఉంటావా?)
‘అదేంటో అర్థం  కాలేదా? అయ్యిందా, ఎంతో మంది విదేశీ జంటల్ని చూశాం. నాదాకా వస్తే ఏంటో ఒకలాంటి.. ఏం చెప్పాలో తెలియలా’.
‘సరే అంటే చెయ్యి పట్టుకుని ఇద్దరం ఈదుదాం’ అని చెయ్యి చాచాడు. ఆ చేతిని అందుకుని ఈదాం.
దగ్గరగా జరిగి ‘యు ఆర్‌ ‌మై గాళ్‌’.

‌చూపులు, మాటలు, నవ్వులు, పక్క పక్కన కూచ్చోటం, చేతులు పట్టుకోటం, ఇలా ఉండేవి మా చేస్టలు. తన దగ్గరున్న డబ్బులతో లంబాడీలు కుట్టిన గవ్వల నడుం పట్టీ కొని నా నడుముకి చుట్టాడు.

‘డబ్బులు ఎక్కడియ్యి, మీ అమ్మ ఇచ్చిందా’

‘కాదు. మేం పని చేసుకుని పాకెట్‌ ‌మనీ సంపాదిస్తాం. నేను రోజూ రొండు గెంటలు లెదర్‌ ‌కటింగ్‌కి వెలతా’.
రోజూ బడిదాకా దించటం, తిరిగి తీసుకురాటం, బలే సరదాగా ఉండేది. ఒకసారి ఎక్కువ కుచ్చులున్న పట్టులంగా వేసుకున్నా. స్టిచ్‌డ్‌ ‌దిస్‌ ‌విత్‌ ‌లాంగ్‌ ‌క్లాత్‌, అం‌డర్‌ ‌దిస్‌ ‌యు వేర్‌ ‌లంగరీ’ నవ్వొచ్చింది తన అనుమానానికి, ఎందుకో సిగ్గుపడ్డాను కూడా.
‘షటప్‌ ఇట్టాంటియ్యా నువ్వు అడిగేది’ ఆరోజంతా బిడియంగా అనిపిచ్చింది.

‘వై షై , ఇట్స్ ‌మై డౌట్‌, ఐ ‌హావ్‌ ‌టు ఆస్క్’
‌కబుర్లు బాగా చెప్పేవాడు.
హిల్‌ఫోర్ట్ ‌టెరిల్‌ (‌లండన్‌) ‌ప్రాంతంలో వాళ్ల స్పెన్సర్‌ ‌ఫ్యామిలీ బంగళా గురించి, తన స్కూలు, ఆల్గేసిటీ (నాచుతో కప్పి ఉండటం), తన ఆటలు, చిన్నప్పటి నుంచి ఇండియా రాటం వలన ఇండియా అంటే ఇష్టం, మరీ ఎక్కువగా చలికాలంలో ఇక్కడ బాగుంటదని, ఇక్కడికి రావటం కోసం సంవత్సరం అంతా సెలవలు తీసుకోకుండా వాళ్ల అమ్మా, నాన్న పనిచేస్తారని, రొండు నెలలు వాళ్ల అమ్మ గోపురాలు, ప్రహరీల నమూనాలని స్కెచ్‌లుగా మార్చి  వాటిని రీసెర్చ్ ‌చేస్తుందని చెప్పాడు. ఇంకా పదహారేళ్ల వరకే అమ్మా నాన్నా పోషిస్తారని, తరవాత సంపాదనా తోడూ సొంతగా ఎతుక్కోవాలనీ, డేటింగ్‌ ‌చెయ్యకపోతే తప్పుగా చూస్తారు. అక్కడ నాకు ఎవరూ నచ్చలేదు. లక్కీని…. ఇక్కడ నువ్వు నచ్చావు. స్వీట్‌ ‌గాళ్‌ అన్నాడు. నేను చెట్టుమీద చిలకల్ని చూస్తన్నా. ఏదో ఆలోచిస్తా వింటన్నా.
‘ప్యారెట్‌, ఆర్‌ ‌యు ఓకే, యు ఆర్‌ ‌నాట్‌ ‌కేరింగ్‌, ‌నాట్‌ ‌లిజనింగ్‌ ‌మి. (నువ్వు నా మాటల్ని నన్నూ లెక్కలేకుండా తీసుకున్నావ్‌)’ అని అలిగి ఎల్లిపోయాడు.

‘ఏయ్‌ ‌చెంబూ, డేవీ, డేవిడ్‌ ‌వెయిట్‌’.. ఆగలేదు.
తిక్క సచ్చినోడు, ఎక్కడికి పోతాడు ఆడే తిరిగొత్తాడని ఊరుకున్నా. మరుసటి రోజు ఆదివారం, మధ్యానం దాకా చూశా. రాలా. వాడి గుడిసెలోకి చూత్తే వాళ్ల అన్నతో లూడో (గేమ్‌) ఆడతన్నాడు. వాళ్ల అన్న నన్ను చూసి నవ్వి,,
‘యు బోత్‌ ‌ఫాట్‌ ‌యస్టర్‌డే’ (నిన్న కొట్టుకు చచ్చారా)

‘డేవీ సారీ, దా’
‘ఆటలో పావులు చెరిపేసి బయటకొచ్చి నా చెయ్యి పట్టుకుని, వాళ్ల అన్నకి ‘బై’ కూడా చెప్పకుండా పరుగో పరుగు’
‘మిస్‌ ‌యు సిరీ’
‘మిస్‌ ‌యు డేవిడ్‌’
‘‌నో కాల్‌ ‌మి చెంబు, ఐ విల్‌ ‌కాల్‌ ‌యు ప్యారెట్‌’
‌తుంగభద్ర ఒడ్డున పల్లంలో నాలుగు అంకెలా ఉన్న మలుపు దగ్గర రొండు బండల చాటున మా కబుర్లు. అక్కడ కూచ్చున్నాం.
‘నిన్న రాత్తిరి నాకు నిద్రలేదు. నీ వలన మా అన్న నిద్ర కూడా చెడగొట్టాను’

‘నువ్వు మీ అన్న దగ్గర పొడుకున్నావా’
‘అవును మరి నువ్వు’
‘మా అమ్మ దగ్గర’
‘దెన్‌ ‌విత్‌ ‌హూమ్‌ ‌యువర్‌ ‌డాడ్‌ ‌విల్‌ ‌స్లీప్‌ (‌మరి మీ నాన్న ఎవరితో పొడుకుంటాడు)
నాకేం చెప్పాలో తెలియలా. అమ్మకానీ, అమ్మమ్మ కానీ పక్కన లేకుండా నిదర ఎట్టా పట్టుద్ది. భయం కదా, ఈ విషయాలు మాట్లాడకూడదని అమ్మమ్మ చెప్పింది. అడిగితే మొట్టికాయలేసి చచ్చేటట్టు తిట్టుద్ది.

తినటం, చెట్లు ఎక్కటం, రాళ్లు, తుంగభద్ర, హంపీ శిధిలాలతో పాటు ఈ పిల్లాడు అంటే కూడా ఇష్టం. ఎప్పుడూ తల దువ్వుకోడు. ఆ రాగిరంగు జుట్టు అట్టా పెంచి సంవత్సరానికి ఒకసారి గుండు కొట్టిచ్చుకునే వాడు. అమ్మమ్మ తన భాషలో..
‘ఆ తలకి నూని తగలబెట్టు కోడే,’ అనేది.

‘నో నుప్పు ఐ డోంట్‌ ‌వాంట్‌’ అనేవాడు. అందరం నవ్వుకునే వాళ్లం.
రోడ్డు మీద గణేశుడిది చిన్న రాతి శిల్పం దొరికితే తెచ్చి వేపచెట్టు కిందపెట్టి రోజూ దణ్నం పెట్టుకునే దాన్ని. తను కూడా ఎలిఫెంట్‌ ‌గాడ్‌ అని దణ్నం పెట్టుకునే వాడు.

మా పిన్ని కూతురు వచ్చింది. ఎప్పుడూ మాట్లాడతానే ఉండేది. చాలా గొప్పగా మాది పెద్ద ఇల్లు. నాన్నమ్మ, తాతయ్య, బాబాయిలు, పెదనాన్నలు కలిసి నలభై మందిమి ఉంటాం. జాయింట్‌ ‌ఫ్యామిలీ తెలుసా అని వాడి మెదడు తినటం మొదలుపెట్టింది.
‘హౌ మెనీ బాత్‌రూమ్స్ ‌ఫర్‌ ‌ఫార్టీ మెంబర్స్…’
‘ఓన్లీ వన్‌’ అం‌ది.
‘ఓఓ.. మైగాడ్‌ ‌హౌకెన్‌ ‌యు లివ్‌ ‌దేర్‌’
ఇది ఏం చెప్పాలో తెలియక నోరు తెరచుకుని బిగదీసుకుని నిలబడింది.

‘ఎక్స్‌క్యూజ్‌మి వి నీడ్‌ ‌ప్రైవసీ’ అని నా చెయ్యి పట్టుకుని ఈడ్చుకుపోయాడు.
‘ఈడు చెంబుగాడు కాదు పిచ్చిక గూడుగాడు. ఒరేయ్‌ ఎప్పుడో ఏ నుప్పు పుల్లో అంటుకుని గడ్డివామిలాగా ఆ తల తగలబడుద్ది’ అని తిట్టుకుంది. ఎప్పుడు సెలవులకి వచ్చినా ఎల్లే ముందు రొండు రోజులు కూచ్చుని జడకి తోలు బ్యాండ్లు, పర్సు, రిటన్‌ అ‌డ్రస్‌ ఉన్న ఇంటర్నేషనల్‌ ‌లెటర్స్ ఇచ్చి వెళ్లేవాడు’.

‘లండన్‌లో నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను సిరీ’ అని ప్రతిసారీ చెప్పేవాడు.
ఎప్పుడు ఉత్తరాలు రాసినా ‘టు మై గాళ్‌తో మొదలయ్యి, మిస్‌ ‌యు తో ముగిసేది.


డేవిడ్‌ – ‌సిరి 1986
డేవిడ్‌ – ‌సిరి 1988
డేవిడ్‌ – ‌సిరి 1990
డేవిడ్‌ – ‌సిరి 1992
డేవిడ్‌ – ? 1994 ‌నుంచీ ఒక్కడి పేరే చెక్కి ఉంది. సిరి కింద క్వచ్చన్‌ ‌మార్క్ ఉం‌ది. అక్కా చెల్లెళ్ల గుండుని తడుముతా ఎర్రపడిన ముక్కూ, వణకే గుండెతో చూశా. పోయిన ఏడాది కూడా వచ్చాడన మాట. పేర్లని ఆప్యాయంగా తడమాలి అనిపించింది. పిల్లలు చూస్తే బాగోదని ఊరుకున్నా.

వాళ్లని పిలిచి ‘ఈరోజు నాకు సన్‌సెట్‌ (‌పొద్దువాలటం) చూడాలని ఉంది. మీరు ఎల్లిపోండి. ఏడింటికి వస్తాను’.
‘నో మా.. నిన్ను ఒంటరిగా వదలను. ఎంతసేపు అయినా ఉండు. మేం కొంచెం దూరంగా కూచుని కబుర్లు చెప్పుకుంటాం’
చుట్టూరా కొండలు, పగిలిన సిధిలాలు, విరిగిన మంటపాలు, వీటి అన్నిటినీ చుట్టి గొంతుకకి పట్టిన కంఠి (హారం) లాగా పెనుగొండకి వెళ్లేదారి. కొండల మధ్యలోనించీ నేలలోకి తనని కుక్కుకుంటున్న సూర్యుడు. అప్పుడు అదే యవ్వనంలో డేవిడ్‌ ‌సాహచర్యం.
మైఖేల్‌ ఏం‌జిలో అంత అందంగా ఉండని మనిషి, ప్రపంచంలోనే అందమైన• డేవిడ్‌ ‌శిల్పాన్ని మలిచాడు. ఓ మత పెద్ద ఇంత అందంగా ఎలా చెక్కావు అంటే ‘అందులో డేవిడ్‌ ‌కాని దాన్నంతా తీసేశాను’ అన్నాడంట. ఎప్పుడూ నీడలా ఉండే నా జీవితపు విషాదం వెనకాల గోరింట పంట లాగా పెదాల మీద నవ్వు పూస్తంది అంటే ‘డేవీ’నే కారణం. తను చెక్కిన శిల్పం నేను. వికారాలన్నిటినీ విరగొట్టి కొత్త సౌందర్యంతో నన్ను మలిచాడు. నా జీవితపు మైఖెల్‌ ఏం‌జిలో అతను. చాలా అరుదైన కోహినూర్‌ ‌లాంటి చెలికాడు. పోగొట్టుకున్న నెమలి సింహాసనం లాంటి జ్ఞాపకం అతను.


ఈసారి సెలవల్లో వాళ్ల అన్న రాలేదు. హైస్కూల్‌ అయిపోయిందని (10+2) ఇప్పుడు ఇక కాలేజ్‌కి వెళ్లాలి. ఈసారి ఆరు నెలల సెలవులున్నయ్యి. స్వీటీ మనం చాలా హ్యాపీగా గడపొచ్చు అని బుగ్గకి బుగ్గ ఆనించాడు. వాక్‌మెన్‌, ‌పాటల క్యాసెట్స్ ‌తెచ్చాడు. మొట్టమొదటిసారిగా ‘హెవీమెటల్‌’ ‌పాటల్ని పరిచయం చేశాడు. సంగీతం అంటే ఇలా కూడా ఉంటదా అనుకున్నా. ఊరి మొత్తంలో వాక్‌మెన్‌ ‌నా దగ్గరే ఉండేది, పైగా ఒక అబ్బాయి ఇచ్చింది. ఇక మనం రచ్చా, రావిడిఅన్నట్టుగా గేదలకి కుక్కలకి, మేకలకి, మొక్కలకి ఇనిపిచ్చే దాన్ని. ఒక కొత్త వింత సంగీత పరికరం చేసి ఇనిపించాడు. బ్రహ్మజెముడు కాడల గుజ్జు తీసేసి ఆ పొడుగుదాంట్లో బద్దీలు దూర్చి బూరలుగా చేసి ఊదటం. వాకిలి నిండా బ్రహ్మజెముడు ముళ్లు ఏసినందుకు అమ్మమ్మ చీపురు తీసుకుని ఎమ్మటపడింది. అమ్మమ్మ తిడతంటే వాటిని రిపీట్‌ ‌చేసేవాడు.

సచ్చినాడా – సఛినాడా, జిమ్మదియ్య – జమదియ, మొదులారా – ముదులారా, జులపాల పోలిగా – జలపాల పోలిగా ఇట్టా. నాకు లెక్కలంటే బయ్యం. రోజూ సాయంత్రం నాకు ప్రయివేటు లెక్కలు నేర్చుకోవాలంటే బూరల సంగీతం నేర్పాలి.
పౌర్ణమి రోజుల్లో అదర్‌సైడ్‌ (‌తుంగభద్రకి అవతల) వెళదాం అనేవాడు. శని, ఆదివారాలు అరగోలి (చిన్నపడవ) ఏసుకుని నది దాటేవాళ్లం. వీడి సావాసం వల్ల అమ్మ, అమ్మల దగ్గిర పడుకోటం మానేసి వంటరిగానే పడుకోటం అలవాటయ్యింది. వెన్నెలలో సిధిలాలని చూత్తా, కబుర్లు, నడక, నీళ్లలో చందమామని చెదరకొట్టటం, తన బడి కబుర్లు, అమ్మాయిల, అబ్బాయిల ముద్దులు, బ్రిటిష్‌ ఇం‌గ్లిష్‌ ఎం‌దుకు అమెరికన్‌, ‌యూరోపియన్‌ ఇం‌గ్లీషుకన్నా గొప్పదో, వాళ్ల యాసలో తేడాలు, ఎక్కిరింతలు.. ఇలా సంగీతం కుక్కునపల్లి (లంబాడీల) సంతకెళ్లేది..

ఓ వెన్నెల రాత్రి తన మాటల్ని గాలికి ఊగుతున్న నందివర్ధనం పువ్వులాగా ఇంటన్నప్పుడు…
‘కెన్‌ ఐ ‌కిస్‌ ‌యు’
ఏం చెప్పాలో అర్ధం కాలేదు. చేతులతో మొకాన్ని దగ్గరగా తీసుకుని తన పెదవులతో పెదవుల్ని కలిపేసుకుని, ఆ చర్యకి మాయమైపోయిన నేల, ఏరూ, ఊరూ, నేనూ.. ఇంకా చెప్పాలంటే, తోలు పొరల్ని చీల్చుకు వచ్చే రోమాల మొనల్లాగా, ఏదో, ఏదో గమ్మత్తుగా మత్తుగా.. ఎమ్మటే గందరగోళంగా.. బండమీద చచ్చుపడిపోయా. తన భుజంమీద వాలిపోయా. తేరుకుని
‘ముద్దెందుకు పెట్టావు’

‘మా అమ్మా,  నాన్నా కిస్‌ ‌చేసుకుంటారు కాబట్టి’
‘కానీ మా వాళ్లు ముద్దు కాదు కదా, పక్క పక్కన కూచోటం కూడా చూళ్లేదు’
‘నీకో విషయం తెలుసా మా దేశంలో ముద్దు చాలా మామూలు. హైస్కూల్‌ ‌నించీ మొదలు పెడతారు. లెటర్స్ ‌కూడా రాసుకుంటారు. నువ్వు రాసే సుద్దపప్పు లెటర్స్ ‌చూసి మా ఫ్రెండ్స్ ‌నువ్వు నాకు స్పెషల్‌ ‌ఫ్రెండ్‌ ‌కాదు. ఉత్త ఫ్రెండ్‌ అని అనుకుంటన్నారు. ఈసారి నీకు ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్‌ ‌చెయ్యటం, గ్రీటింగ్స్ ‌రాయటం నేర్పుతా’
‘నీకు గ్రీటింగ్స్, ‌పోస్ట్‌కార్డస్ ‌పంపాలని నాకూ ఉంది. కానీ దానికోసం ఇంట్లో వాళ్లని డబ్బులు అడగటం ఇష్టం లేదు. వి వాంట్‌ ‌టు డు సమ్‌థింగ్‌’

‘‌దెన్‌ ‌హూ ఈజ్‌ ‌స్టాపింగ్‌  ‌యు’ (ఎవరన్నా వద్దన్నారా)
మరుసటి రోజు నా వ్యాపారం చెప్పాను.
‘గో హెడ్‌’ అన్నాడు.

‘రోజూ సాయంత్రం బాదం పాలు, రాగి అంబలి అమ్మేదాన్ని. అమ్మమ్మ చెయ్యటం నేను అమ్మటం. యాభై రూపాయిలు దాకా ఒక్కసారి మిగిలేది. సాఫ్ట్‌గా మాట్లాడటం, థాంక్స్ ‌చెప్పటం, వాళ్లని మాటల్లో పెట్టే విధానం అన్నీ నేర్పాడు. ఓసారి మాట్లాడుతూ రాత్రి ఒంటి గంట అయ్యింది. ఆవలింతలు వచ్చాయి. ‘సరే నిద్దరొస్తాంది, బొజ్జోవాలి ఎదాం’ అన్నా.

‘చిన్న పిల్లలా కిడ్‌లా మాట్లాడొద్దు. చిలకపలుకులు వద్దు, బేస్‌ ‌వాయిస్‌, ‌లంగా, ఓణీ, పొడుగు జడ, ట్రై టు బి లైక్‌ ‌దట్‌. ‌కొన్నిసార్లు హస్కీ టాక్‌.. ‌నువ్వు అలా ఉంటే బాగుంటావు. పద వెలదాం’

కాలిగజ్జెలు తీసి చప్పుడు కాకుండా వచ్చి పడుకున్నాను. పొద్దునే ఊరిలో జాతర. నగలు, పట్టు లంగా, చిట్టి చేమంతులు, జాగర్తగా తీసుకెళ్లి తీసుకురా అని పాలేరుకి అమ్మమ్మ ఆర్డర్‌. ‌కెమెరా, లాల్చీ, పైజామాతో చెంబు రెడీ.

‘పారెట్‌ ‌యు లుక్స్ ‌గాడెస్‌ ‌పర్వతీ (పార్వతి). అయామ్‌ ‌లక్కీ’ (పార్వతిలా ఉన్నావు)
‘నీ మూడో కన్ను ఎక్కడ దాచావు’ అన్నా.
‘థాంక్యూ. నాకు ఇండియాలో స్పెషల్‌ ‌గాళ్‌ ఉం‌ది అంటే నా ఫ్రెండ్స్ ‌నమ్మటల్లేదు. నీకోసం బడిలో స్పెషల్‌ ‌సబ్జెక్ట్‌గా ఫొటోగ్రఫి నేర్చుకున్నాను. నీ ఫొటోస్‌ ‌వాళ్లకి చూపిచ్చి నోళ్లు మూయిస్తా. రోజంతా ఐదారు రీళ్లు ఫొటోలుగా తీశాడు. అటుగా ఎల్లే ఫారినర్స్‌ని ఆపి నన్ను ఎత్తుకుని పొడుగు జడని మెడచుట్టూ తిప్పుకుని, మా నల్ల మాళీ గేద మీద, ఉప్పు మూటలాగా, ఫొటోలే ఫొటోలు. చాలా ఎత్తుగా ఉన్న తను నాకు బలమైన ఆసరా అనిపించాడు.


దసరా సెలవల్లో వచ్చిన ఇరిటేషన్‌ ‌పేరు పెద్ద మనిషవ్వటం. అమ్మతో పోట్టాడి మరీ తాటాకుల మీద కూచ్చోపెట్టింది అమ్మమ్మ. మట్టి మూకుట్టో పప్పు, నెయ్యి, కొబ్బరి బెల్లం నువ్వుల చిమ్మిడి తొక్కటం, ఇవేమీ చెంబుకి అర్ధం కాలా. ఆనంద్‌ (‌ఫ్రెండ్‌) ‌చెబితే పడి పడి నవ్వాడు. అమ్మమ్మ దగ్గిరగా వచ్చిన వాడ్ని చూసి కళ్లు ఉరిమి దూరంగా సావమను అంది.

‘గో డేవీ, యు ఆర్‌ ‌నాట్‌ ‌సపోజ్‌ ‌టు సిట్‌ ‌హియర్‌, ఐ ‌యామ్‌ ‌మెచూర్డ్’
‘‌వాట్‌ ఎబౌట్‌ ఆల్‌ ‌దీజ్‌ ‌డేస్‌’ అని నవ్వి.
సిరీ డాల్‌, ‌మై ప్యారెట్‌, ఐ ‌విల్‌ ఎక్స్‌ప్లెయిన్‌ ‌యు’
ఒక పుస్తకం తెచ్చాడు. అది యవ్వనంలో అడుగుపెట్టే వాళ్లు శారీరక మార్పులకి సంబంధించింది. పెద్దమనిషి అవ్వటం సాధారణ చర్య అది రక్తం కాదు, టిష్యూ అని ఉంది. ఆ విషయం బొమ్మలతో సహా చూపిచ్చి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కడుపులో బిడ్డకి అదే ఆహారం అని చెప్పాడు. దీన్ని నెలనెలా ఎట్టా భరిచ్చాలి. డేవిని వదిలి అమ్మని పిలిచా.

‘అమ్మా ఈ ఇరిటేషన్‌ ‌వద్దమ్మా. అది నెలనెలా ఒకేసారి బయటికి వచ్చే మిషన్‌ ఉం‌టే బాగుణ్ణు. ఈ నెప్పి కూడా వద్దు అని ఏడ్చా. తను కూడా ఒకప్పుడి ఇలాంటి ప్రశ్నలు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా బయటికి వచ్చింది కదా. కళ్లని నీటి కాలువలతో నింపుకుని ఇవన్నీ నేచర్‌ ‌కాల్స్. ఏ ‌వయసులో రావలసినయ్యి ఆ వయసులో వస్తయ్యి అని ఓదార్చింది.

డేవీని అడిగాను ‘నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు, ఈ పుస్తకాలు ఎక్కడివి?’
‘మా బడిలో ఇస్తారు. ఇయ్యన్నీ పెయింటింగ్‌లు, ఫొటోలు, సినిమాల ద్వారా చూస్తాం. యు ఆర్‌ ‌గ్రోన్‌ అప్‌. ఇయ్యన్ని నువ్వు కూడా తెలుసుకోవాలి. శరీరం, దాని నిర్మాణ రహస్యాలు అందరూ చదువుకోవాలి’.

‘ఆ వయసుకి నాకు వాడికన్నా తెలివయిన వాడు ప్రపంచంలో ఉండడు అనిపించింది’.
‘సిరీ నీకు తెలుసా ఓసారి మా అన్న అమ్మ దగ్గరికొచ్చి నేను వర్జినిటీ పోగొట్టుకున్నానని చెప్పాడు’.
‘మరుసటి రోజు నేను కూడా మా అన్నతో వర్జిన్‌ ‌కాదు అన్నాను’
ఆశ్చర్యపోయి,
‘నువ్వు చిన్నోడివి, ఒంటరివి, గాళ్‌ ‌ఫ్రెండ్‌ ‌లేదు అదెలా సాధ్యం’
‘రాత్రి మంచం పయిన నా పురుష అవయవం నించీ పడిన ద్రవాన్ని చూపిచ్చాను’

‘అప్పుడు అది వేస్ట్ ‌జెల్‌’ అని చెప్పాడు. ఎవ్వరికీ మొదట్లో అంతా తెలియదు. అంతా గందరగోళంగా ఉండేది. అందరూ కలసి చెబితే, ఇప్పుడు నేను నీకు చెప్పగలుగుతున్నాను.
ఎన్నో చర్యలు ముఖ్యంగా రొండో తరం శారీరక మార్పులు, జుట్టు, చర్మం, టి జోన్‌ ‌శుభ్రత మా మధ్య వచ్చేవి. ఇయ్యన్నీ నాకు ఏ టీచరూ, పెద్దలూ చెప్పలేదు. లండన్‌ ‌నించీ కండోమ్‌ ‌తెచ్చి చాలా రహస్యంగా చూపిచ్చాడు.

ఒకసారి ఉండబట్టలేక అడిగాను. ‘ఆ.. అనుభవం ఎలా ఉంటుంది’ అని.
‘నాకూ తెలియదు. ప్రాక్టికల్‌గా చెయ్యలా, కానీ ఎక్కడో చదివాను’
‘అదే చెప్పు’.
‘బాగా బేక్‌ అయిన కేక్‌లోకి నైఫ్‌ ‌దింపినట్టుగా ఉంటది అని’. కాసేపాగి నా వైపుకి తిరిగి.
‘ఐ వాంట్‌ ‌టు లూజ్‌ ‌మై వర్జినిటీ విత్‌ ‌యు ఓన్లీ’ అని ఎల్లిపోయాడు.
అప్పుడప్పుడే కలిగే ఊహలు, కోరికలు, బిడియం, మధురమైన దిగులుతో ఉండేయి. సెలవలు అయిపోవచ్చినయ్యి. రేపు తను వెళతాడు అనగా మా బండల మీద కూచ్చున్నాం. నీళ్లు నిండిన కళ్లతో…
‘వెళ్లొద్దు డేవీ’
‘కాలేజ్‌ ఉం‌ది. మళ్లీ వచ్చేస్తాకదా’

‘నాకో అనుమానం, నా కోసం ప్రామిస్‌ ‌చేశావు కదా. అదే నీ వర్జినిటీ ఎవరితోనైనా పోగొట్టుకుంటే నాకు తెలవదు కదా’
‘చాలా ఆశ్చర్యంగా, కొంచెం కోపంగా గట్టిగా నన్ను పట్టుకుని, ఏ దేశంలోనైనా ఆడపిల్లకి అనుమానం ముందే ఉంటదంటే నమ్మలేదు. నేను ‘సిరీ’బోయ్‌ని. బిలీవ్‌ ‌మి. సిరి కాని అమ్మాయి నాది కాదు’.


నేను తనకి బాగానే ఇంగ్లీషులో ఉత్తరాలు రాసేదాన్ని. వాళ్ల నాన్నకి చెందిన కస్టమ్‌మేడ్‌ ‌బైక్‌ ‌షాప్‌లో సీటు కవర్లు కుట్టటం, వాటి పైన తోలు డిజైన్లు చెయ్యటం నేర్చుకుంటున్నానని, తను చేసిన వాటి బ్రాండ్‌ ‌నేమ్‌ ‘‌సిడాడ్‌’ అం‌టే సిరీ డేవిడ్‌ అనీ, తన అన్న ఇంట్లో ఉండటం లేదని గాళ్‌ ‌ఫ్రెండ్‌తో వేరే ఉంటున్నాడని, తన స్కిల్స్‌కీ, హ్యాండ్‌ ‌వర్క్‌కీ గుడ్‌ ‌మనీ వస్తుందనీ, చాలా గిఫ్ట్‌లు కొనగలను, నీ బిజినెస్‌లో కొత్త ప్రయోగాలు చెయ్యి. అమ్మమ్మ కొత్త తిట్లు క్రియేట్‌ ‌చేస్తుందా, క్యాథీ, ధోరా (ఫ్రెండ్స్)‌ని, మీ పిన్ని కూతురినీ అడిగానని చెప్పు. ఎలిఫెంట్‌ ‌గాడ్‌ ‌బొమ్మ కొని రోజూ పూజ చేస్తున్నా’.

సిరీ నీ కోసం బ్యూటిఫుల్‌ ‌లింగరీ (లో దుస్తులు) తీసుకున్నాను.
మిస్‌ ‌యు
బై ప్యారెట్‌, (‌చిలుకమ్మ)
ఆల్వేస్‌ ‌యువర్స్
‌డేవిడ్‌ ‌స్పెన్సర్‌.  ….. …

ఈసారి డేవీని చూస్తే నాకు చాలా బిడియం, భయంగా అనిపించింది. వాయిస్‌ ‌గంభీరంగా అయిపోయింది. ఇంట్లో ఎవరో బంధువులు రాటం వలన చాలా ఆలస్యంగా సీక్రెట్‌ ‌ప్లేస్‌కి వెళ్లాను. చాలా కోపంగా ఉన్నాడు. తనతో గడపనందుకు కాదు. జుట్టు చివర్ల, కనుబొమ్మలూ కత్తిరించినందుకు. నా మోపెడ్‌ ‌సీటుకి లెదర్‌ ‌కవర్‌, ‌హ్యాండ్‌ ‌బ్యాగ్‌, ‌మినీ లెదర్‌ ‌స్కర్ట్, ‌జడ కోసం రకరకాల తోలు బ్యాండ్లు చేసుకొచ్చాడు. ఇంట్లో వాళ్లు తన పనితనానికి మురిసిపోయారు. అమ్మమ్మ చేసిన పప్పు, ఆవకాయ, నెయ్యి, రోటి పచ్చళ్లు, రొప్పుతా తినేవాడు.

అమావాస్య రోజు ఇంట్లో చెప్పి డార్క్ ‌డే పార్టీకి ఎల్లాం. అది ‘సిజరీ’ బాబా  గుహలో, పీటర్‌ ‌శాక్సాఫోన్‌, ‌మురళి తబలా, డేవీ బూరల సంగీతం, నా డాన్సూ, ఆనంద్‌ ‌జానపదాలు, ఫైర్‌, ‌నెగడు, తిండీ అంతా అయ్యేటప్పటికి అర్ధరాత్రి అయ్యింది. పొద్దున్నే ఎల్లొచ్చులే అని బండల మీద వాలాము. డేవీని ఆనుకుని మొదటిసారి, చాలా దగ్గిరగా పడుకోడం, వీపు నిమురుతా ‘స్లీప్‌ ‌మై ఏంజల్‌’ అం‌టా దగ్గరకి జరిగాం. కానీ కాసేపటికి ఇద్దరి పరిస్ధితీ చాలా ఇబ్బంది. ఇలా కాదు, ఇంకేదో కావాలి, ఈరోజు డేవీ తీసుకున్న ముద్దు తేడాగా ఉంది. తనే తేరుకుని, నేను మీ ఫ్యామిలీకి, మీ పద్ధతులకీ రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్లు ఎస్‌ ‌చెప్పేదాకా ఎదురుచూస్తాను. శారీరకంగా పెళ్లికి ముందు కలవటం మీ పద్ధతి కాదు, అని దూరంగా ఎల్లి పది నిమిషాల తరవాత వచ్చాడు.

‘ఎక్కడికి వెల్లావు? ఈ పది నిమిషాలూ ఏం చేశావు?’
‘నిన్ను ఊహించుకుని రిలీవ్‌ అయ్యాను’
‘అంటే’
‘మాస్టర్‌ ‌బేట్‌ ‌చేసుకున్నా. క్రిటికల్‌ ‌కండిషన్స్‌లో సెక్స్ ‌వీలుకానప్పుడు ఇలా చేసుకోవచ్చని నేర్చుకున్నా’.
‘అందరు అబ్బాయిలూ అలానే చేస్తారా మీ దేశంలో’
‘ఏమో, కాదనుకుంటా, కొందరు నా ఫ్రెండ్స్ ‌నా వయసుకే సెక్స్ ‌చేస్తారు’
‘అలా చేస్తే ఎలా ఉంటది’

‘ఇవన్నీ నా సొంత అనుభవాలు, సెన్సెస్‌ ‌హాయిగా, ఇరిటేషన్‌ ‌నించీ విముక్తి, అయినా ప్యారెట్‌ ‌మన పెళ్లి అయ్యే వరకూ నిన్ను నేను ఏమీ చెయ్యను. మీ ఇంట్లో ఒప్పిచ్చి నిన్ను నాతో తీసుకుని ఎలతా’

‘నేను రాను, నువ్వే ఇక్కడ ఉండు, చుట్టాలు, స్నేహితులు, తుంగభద్ర, పడవలు, గేదలు నేనెక్కడా ఉండలేను’
‘నేనున్నాను కదా. నీకు అన్నీ నేనే కదా. నా లైఫ్‌ ‌పార్టనర్‌ అయ్యేదీ నువ్వే కదా. చదువు అయ్యేదాకా వెయిట్‌ ‌చెయ్యి చాలు. ప్రతీ సంవత్సరం నిన్ను ఇక్కడికి తీసుకొస్తా’.

అట్లతద్దె రోజు చీర కట్టుకుని ఉయ్యాల ఊగుతున్నా. ఊపే వాళ్లని పక్కకి జరగమని ఉయ్యాల ఎక్కి ఎదురు ఊపు అందుకున్నాడు. ఆనంద్‌ ‌మిగతా ఫ్రెండ్స్, ‌కేకలు, ఈలలు. మా పిన్ని కూతురు దిగు నేను ఊగాలి అని దించింది. దాన్ని యువర్‌ ‌బొంద, యువర్‌ ‌దెవసం అని తిట్టాడు. నా చెవిలో ‘నువ్వు ఇలాంటి సెక్సీ డ్రస్‌ ‌వేసుకుంటే (చీర) నా వర్జినిటీ పోగొట్టుకోవటం అసలు పోస్ట్‌పోన్‌ ‌చేసుకోలేను’

టీనేజ్‌లో నా అందాన్ని పొగుడుతా, కొంత నేర్పుతా. ఆకాశంలో వెలుగు ఆశల పల్లకిలో ఊరేగించే వాడు. ఎంతయినా నేను మెచ్చిన వాడు కదా. ఎతికి, ఎతికి ఒక పుస్తకం గిఫ్ట్ ఇచ్చాడు. ‘అది ‘యూజెస్‌ ఆఫ్‌ ‌నీమ్‌ ‌ట్రీ’, ఇంటి చుట్టూ ఉన్న యాప చెట్లతో ఇన్ని ఉపయోగాలా అని నోరు తెరుచుకుని చదివా. కాలివేళ్లకి మధ్యలో దూది ఉంచి గోళ్లరంగు వేసేవాడు. తల్లిదండ్రుల స్ధానాన్ని లాగేసుకున్నాడు. అభద్రత, భయంతో కలిసిన ఈ వయసునీ, శారీరక మార్పుల్నీ, తన వలన, తన స్నేహంతో తేలికగా ఎదుర్కొన్నా. ఎన్నో రాత్రుల ఉద్రేకం వచ్చేది.

ఒకసారి ఇద్దరం కలిసి చూద్దాం అని అడిగా..
చాలా ఆశ్చర్యపోయి ‘సిరీ ఇట్స్ ‌నాట్‌ ‌మ్యా•రాఫ్‌ ‌రిలీఫ్‌, ‌మ్యాటరాఫ్‌ ‌లైఫ్‌ ‌టైం సెన్సిటివ్‌ ‌ఫీలింగ్స్, ‌నీ మీద పడి బ్యాడ్‌ ‌బాయ్‌లాగా మిగలను. మనకి మన పెద్ద వాళ్లు ఉన్నారు’
మాకు ఒకళ్లంటే ఒకళ్లకి ఇష్టం అని తెలిసి నా ఫ్రెండ్‌ ‌కమ్‌ ‌సీనియర్‌ ఆనంద్‌ ఎప్పుడూ మాకు ముందు చదువు కంప్లీట్‌ ‌చెయ్యండి అని సలహా ఇచ్చేవాడు.
‘సిరీ నీ జీవితం ఈ తెల్లాడితో తెల్లారాలని రాసి ఉంది’ అనేవాడు.


కాలం యవ్వనంలో వచ్చే శారీరక మార్పుల్లా మారిపోయింది. కాలేజ్‌లో చేరా. అమ్మకి ఆరోగ్యం బాగుండక హాస్పిటల్స్ ‌చుట్టూ తిరిగితే లివర్‌ ‌సిరోసిస్‌ ‌నెలల మనిషి అన్నారు. తన ఆరోగ్యం గురించి అర్ధం అయ్యి నా పెళ్లి చూడాలని అడిగింది. దగ్గర బంధువుతో పెళ్లి మాటలు, హడావిడిగా జరిగాయి. తను నాకన్నా పదేళ్లు పెద్ద. బొంబాయిలో ఉద్యోగం, అమ్మమ్మ దగ్గరకి వెళ్లు డేవిడ్‌ ‌విషయం చెప్పి నాకీ పెళ్లి ఇష్టం లేదని ఏడ్చాను. అమ్మమ్మ ఇలా అంది.

‘సిరి తల్లీ మా అందరికీ ప్రేమలు లేవా, హృదయాలు, ప్రియుడు, తలపులూ, స్పర్శలూ, తొలిముద్దులూ అందరికీ ఉంటయ్యి. మేం వాళ్లని పెళ్లి చేసుకోకలిగామా. కనీసం వాళ్లు ఎదురయితే మాట్లాడ కలుగుతున్నామా? అలా అని ఇప్పుడు ఉన్న భర్తలతో ఆనందంగా లేమా, జీవితాన్ని తేలిక చేసుకోవటం, వచ్చిన జీవితాన్ని, మనపాలిట పడ్డ మనిషిని మనతో కలుపుకోవటమే బతుకంటే. డేవిడ్‌ ‌గురించీ, నీ గురించీ, మీ ఇద్దరి దగ్గరతనం నాకు తెలుసు. యవ్వనంలో ఆమాత్రం ఆనందం, జీవితాన్ని అందంగా చూపిచ్చే ఓ స్నేహితుడు అవసరమో, అయినా మనం, మన అలవాట్లు, పద్ధతులూ వేరు. నిన్ను అరచి గీపెట్టి నా అంత దూరం ఇచ్చి పెళ్లి చెయ్యరు. అదే అలవాటవుతుంది. అన్నీ కాలమే నేర్పుద్ది. అమ్మకోసం ఈ పెళ్లి ఒప్పుకో. ఇంతకన్నా ఏం చెప్పలేను’.

డేవిడ్‌ని ఏం చెయ్యాలో, ఎక్కడ పారబొయ్యాలో అర్ధం కాలేదు. నన్ను నేనెక్కడ దాచుకోవాలో అంతకన్నా అర్ధంకాలా. ఈ జ్ఞాపకాలని ఏ ఊడని కొక్కాలకి తగిలించాలి. కాసేపటికి తేరుకున్నా. ఫొటోలు, ఉత్తరాలు, బ్యాగులు, గవ్వల ఆభరణాలు, గ్రీటింగ్‌ ‌కార్డులు, వాక్‌మెన్‌, ‌క్యాసెట్‌లు అన్నీ రంగం పెట్టెలో వేసి తాళం వేశా.

అబద్ధం ఆడటం ఇష్టంలేక తనకి విషయం అంతా ఉత్తరం రాసి శుభలేఖని పోస్ట్ ‌చేశా. పడని అలమరా తలుపులు మూసినట్టుగా అతి కష్టంమ్మీద ఆ జ్ఞాపకాల అరని మూసేశా.

కానీ ఆనంద్‌ ‌మాత్రం తన కళ్లతో డేవీ వెదికే కొండ కోనల్నీ, తుంగభద్రనీ ఇనిపించేవాడు.
‘ఆమె నా కోసం హంపీగా మారింది. నిరంతరంగా పారే తుంగభద్రే ఆమె. నేను నదిలో పాదంపెడితే తను నన్ను చుట్టుకున్నట్టుగా ఉంటంది’ ఇలా సాగేది అతని విరహపు బాధ.

పెళ్లి తరవాత బొంబాయి జీవితం, హడావిడి పరుగులు, బుల్లి పొట్ట. అమ్మ దూరం అయినాక బుల్లి బొజ్జతో కబుర్లు, పసికందుగా బయటకొచ్చిన అమ్మ. బాబుతో పాటుగా పేరు పక్కన పెరిగిన డిగ్రీలు.

ఫ్యాక్టరీ ఫ్లోర్‌ ‌పైనించీ పడిన ప్రమాదంలో మళ్లీ ఒకసారి తోడుని దూరం చేసిన కాలం. అదే ఫ్యాక్టరీలో అతని ఉద్యోగం, పెద్దమ్మ తోడుగా పెరిగిన కొడుకు మనిషిగా ఎదిగి గాళ్‌ ‌ఫ్రెండ్‌ని పరిచయం చెయ్యటం, కాలం రాగాలనీ కొత్త కొత్తగా పాడుద్ది. వాడికీ ఫారినర్‌ ‌తోడుగా దొరకటం ఏ రాగమో. మళ్లీ ఆ బుల్లెట్‌ ‌సీటు కవరు నా పాత పాటని తిరగతోడి పాడింది.

ఆనంద్‌, ‌ఫ్రెండ్స్, ‌మా కజిన్‌ అం‌దరూ రేపటి నా పుట్టినరోజుకి వచ్చారు. తింటా, మాట్లాడతా గడిపాము. డేవీ గురింఇ అడుగుదాం అని నోటిదాకా వచ్చింది. తను నా నించీ వేరుకాదు అనిపించింది.

గోధుమ రంగుకి నిండు మట్టిరంగు అంచున్న పట్టుచీర మెడలో నవాబుల ముత్యాల హారం, లూజుగా గాలికి వదిలిన జుట్టుతో నా పుట్టిన రోజుకి తయారయ్యాను. రాత్రి పదకొండుకి వీనస్‌ ‌నా కొడుకూ ఇద్దరూ పడవ ఎక్కిచ్చారు. బంగ్లా శరణార్ధి రవీంద్ర సంగీతం పాడుతా తెడ్డు వేస్తున్నాడు. డిసెంబర్‌ ‌చలి. కవర్‌లోనించీ తెల్లటి షాల్‌ ‌తీసి కప్పింది వీనస్‌.  ఇద్దరూ చెరోసారి కెమెరాతో ఫొటోలు దిగారు. ఆ పిల్లని దగ్గరకి తీసుకున్నా. ‘లవ్‌ ‌యు మామ్‌’ అం‌ది.

చావులోనూ, వేదనలోనూ నవ్వులు పూయించి ఆశలు కల్పించే వాళ్లు పిల్లలే కదా’.
పడవ దిగి ముత్యాల బజారు చేరేటప్పటికి ఆనంద్‌ ఎదురొచ్చాడు. అంతా ముందే చేరుకున్నారు. మంచు పొగలో అర్ధరాత్రి నా కోసం ఎదురు చూస్తన్నారు. చాలు, ఈ నలుగురూ చాలు, నేను అదృష్టవంతురాల్ని అనుకున్నా.

ఓ రాతి బల్లమీద కేక్‌ ఒక క్యాండిల్‌ ‌వీనస్‌ ‌వెలిగించి నా చేతికి చాకు ఇచ్చింది.
‘మమ్మీ మిగతా కాలం మొత్తం హ్యాపీగా ఉండటానికి ఈ కేక్‌ ‌కట్‌చెయ్యి అన్నాడు’.
ఆ వెలుగులో కేక్‌ ‌చూశా. నిజమా అని మళ్లీ మళ్లీ చూశా.
హ్యాపీ బర్త్‌డే టు సిరీ.
డేవిడ్‌ ‌స్పెన్సర్‌ అని.

సన్నటి వణుకు మొదలయ్యింది. తల ఎత్తి చూస్తే పొడుగుకాళ్ల మంటపం నించీ ఓ నీడ వచ్చింది. ఆ నీడ చేతులు నన్ను చుట్టుకున్నయ్యి.

దగ్గరగా వచ్చిన నా కొడుకు ‘ఆనంద్‌ ‌మావయ్య, చెప్పాడు. పర్మిషన్‌ ‌లేకుండా రంగం పెట్టి తెరిచి తనని కాంటాక్ట్ ‌చేసి కలిశాను. నువ్వు మనస్పూర్తిగా నవ్వటం చూడాలని ఉందిమా. మాకన్నా ఇప్పుడు నీకే తోడు అవసరం. అందుకే నా గిఫ్ట్ ‌డేవీ అంకుల్‌’.
‌డేవీ వైపు చూశా.

నా చెవిలో గుసగుసగా
‘నౌ ఐయామ్‌ ‌రెడీ టు లూజ్‌ ‌మై వర్జినిటీ’ అన్నాడు.

అది అర్ధం అయిన ఆనంద్‌,
‌నవ్వుతా ఉన్నాడు.

*

నీవూ నేనూ వలచితిమీ…

konni sephalikalu

 

బాల మురళీ గారు ‘దివిజ సంగీతవరు గుండియల్ దిగ్గురనగ’ అన్నట్టుగా అమరపురిని చేరగానే సంగీత ప్రియులందరూ ఆయన పాటల్ని అవిరామంగా పంచుకున్నారు. అలాగ వాట్సాప్ లో నన్ను చేరిన పాట  వింటుండగా రకరకాల ‘జాలి గాధలు, విషాద గాధలు’ గుర్తొచ్చాయి.  “నీవూ నేనూ వలచితిమీ, నందనమే ఎదురుగ చూచితిమీ’’ అన్నఆ పాట భీష్మ సినీమా లో సుశీలమ్మ గారితో అనుకుంటాను కలిసి పాడిన పాట.  బాల మురళీ గొంతులో మిగిలిన అన్నింటితో పాటు ‘రసం’ కూడా నిర్భరంగా నిండి జాలుగా ప్రవహించి మననీ అందులోకి లాక్కెళ్ళి ‘పరవశం’ అనే మత్తు కలిగిస్తుంది, అది అనురాగరసం అయితే ఇంకా తొందరగా.

అందుకే ‘నీవూ నేనూ వలచితిమీ’ అని ఆయన నోటి వెంట గాత్ర సమ్మిళితంగా రాగానే ఆ స్వరంలోంచి ఆ పరస్పర అనురాగ మాధుర్యం సాంబ్రాణి పొగలా కమ్ముకుంది. సాధారణమైన ప్రేమికుల భాష ‘ఐ లవ్ యు’ అనగానే వెంటనే ‘ఐ టూ’ అన్నది ఎంత వికారంగానేనా ఉంటుంది వెంటనే అప్పు తీర్చేసుకున్నట్టు.  అలాంటి కృతక వాతావరణంలో ఒక్కసారి ప్రణయ మాధ్వీ రసం జాలువారే స్వరంతో ఆయన ‘నీవూ నేనూ వలచితిమీ’ అనగానే ఎన్నో ప్రణయ హృదయాల సంవేదనలు మదిలో కదిలేయి.

ఈ విషాద ప్రపంచంలో ఏ ఇద్దరేనా సమాన హృదయం ఉన్న స్త్రీ పురుషులు ‘నీవూ నేనూ వలచితిమీ’ అనుకోగలిగితే అది ఎంత గొప్ప అనుభవం. అది కొద్ది కాలమే అగుగాక.  ఎల్ల కాలమూ ఎలాగూ నిలవదు నూరు శాతం.  కాని ఎంత కొద్ది కాలమయినా పరస్పరానురాగం ఆ జీవితాలను గొప్పగా కాంతివంతం చేసి తీరుతుంది.

అలా కానివాళ్ళు, ఒకవేపే ప్రేమించి ఎదుటివారి ప్రేమ కోసం అలమటించే వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు పాపం ఆశోపహతులు, ఎప్పటికీ ఆ ప్రేమ పొందలేని వాళ్ళు , నీవూ నేనూ వలచితిమీ అనుకోలేని వాళ్ళు గుర్తొచ్చారు. అందులో మొదటి వ్యక్తి మహా భారత కథలో దేవయాని.

దేవయాని రాక్షస గురువు శుక్రాచార్యుడి గారాల కూతురు. తల్లి లేని పిల్ల.  స్వంత వ్యక్తిత్వంతో ఠీవిగా జీవిస్తున్న స్త్రీ.  తన ఇంటికి వచ్చి, తన తండ్రికి శిష్యుడై, ఆయన కనుసన్నల్లో ఉంటూ తన పట్ల ‘అటెన్షన్’ తో ఉండే  బృహస్పతి కొడుకు కచుణ్ణి ప్రేమించింది.  కచుడిదంతా అవసరం.  కానీ అందులో స్వార్ధం లేదు.  అది పూర్తిగా దేవకార్యం.  కాని దేవయాని తన యవ్వనపు ప్రధమ ప్రణయంలో కచుడిని గాఢతరం గా ప్రేమించింది.  ఆ తన ప్రేమ మాట మాట తండ్రి తో ఎంతో ధైర్యంగా చెప్పింది .ఆ మాటల్ని నన్నయ గారు పద్యాలలోకి ఎలా పట్టి తెచ్చారో చూద్దాం.

అడవికి గోవుల వెంట వెళ్ళిన కచుడు ఇంకా రాలేదు. సాయంత్రం అయినప్పటినుంచీ ఆమె ప్రతి క్షణమూ ఎదురు చూస్తూనే ఉంది.  చీకటి పడి చిక్కబడింది.  అయినా రాకపోతే సరాసరి తండ్రి దగ్గరకే వెళ్లి ఇలా అడిగింది.

వాడి మయూఖముల్ కలుగువాడ పరాంబుధి గ్రుంకె, ధేనువుల్

నేడిట వచ్చె నేకతమ నిష్టమెయిన్ భవదగ్నిహోత్రముల్

పోడిగ వెల్వగా బడియె ప్రొద్దును పోయె కచుండు నేనియున్

రాడు వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధ నందెనో

భారతీయ సాహిత్యంలోనే ఇది అరుదయిన పద్యం. తన ప్రియుడి కోసం ఎదురుచూసి ఆ ఎదురు చూపు గురించి కన్న తండ్రికే చెప్తూ ప్రశ్నించిన నాయిక దేవయాని .  వెంటనే ఏ తండ్రి అయినా” నీకేమిటి అతని మీద అంత శ్రద్ధ?” అని అడిగి తీరుతాడు . ఎందుకంటే పై పద్యంలోని  ఆమె ఎదురు చూపులో కాలమానం ఉంది. క్షణక్షణమూ ఆమె పడుతున్న ఆందోళన ఉంది. ఆమె ఇలా అంటోంది. “సూర్యుడు అస్త మించాడు.  రోజూ ఆలోపే కచుడు ధేనువులతో ఇంటికొస్తున్నాడు.  కానీ ఆ సమయం దాటి పోయింది.  పైగా ధేనువులు వంటరిగా వచ్చేశాయి.  అయినా నీ అగ్నిహోత్రాన్ని వెలిగించుకుని నువ్వు నీ నిష్టలోనే ఉన్నావు తప్ప పట్టించుకోలేదు. చివరికి పొద్దు పోయింది కూడా.  అతనికేదయినా ఆపద రాలేదు కదా?” అని అడిగింది.”నీ శిష్యులు ఏమీ చెయ్యలేదు కదా ?”అని కూడా. నిజానికి వాళ్ళే చంపేశారు అతన్ని.

తర్వాత తండ్రి అడగబోయే ప్రశ్నకు కూడా ఆమె వద్ద సమాధానం ఉంది.  ఆమె దుఖం చూసి తండ్రి అన్నాడు కదా” రాక్షసులు అతన్ని చంపేసి ఉండవచ్చు. నీకెందుకు దుఃఖం” అని.  అపుడు ఆమె సాక్షాత్తు తండ్రితో ఇలా చెప్పింది. “ నాన్నా కచుడంటే ఎవరనుకున్నావు.

మతి లోకోత్తరుడైన అంగిరసు మన్మండు, ఆశ్రితుండు, ఆ బృహ

స్పతికిం పుత్రుడు, నీకు శిష్యుడు, సురూప బ్రహ్మచర్యాశ్రమ

వ్రత సంపన్నుడు, అకారణంబ దనుజువ్యాపాదితుండైన, న

చ్యుత, ధర్మజ్ఞ, మహాత్మఅక్కచున కే శోకింపకెట్లుండుదున్ .

లోకోత్తరుడైన ఒకే ఒక వ్యక్తి అంగీరసుడు.అంతటి వాడి మనుమడు ఇతడు. దేవగురువూ, బుద్దిమంతుడు అయిన బృహస్పతి పుత్రుడు, నీలాంటి వాడికి శిష్యుడు, సుందరుడు, ఇవన్నీ జన్మ వల్ల వచ్చిన అర్హతలు.  నడవడిక వల్ల వచ్చిన అర్హత బ్రహ్మచర్యాశ్రమం,అది వ్రతంగా గలవాడు.  అలాంటి వాడి కోసం కాకపోతే ఇక ఎవరికోసం దుఃఖించాలి అని అంది. ఇంత కన్నా నీకు వివరంగా చెప్పాలా ? నువ్వు అచ్యుతుడివి, ధర్మజ్నుడివి,మహాత్ముడివి కూడా అనీ అంది.

ఆమె వల్ల కచుడు బతికాడు, దేవకార్యం నెరవేర్చాడు. కానీ ఆమె భగ్న మనోరధ అయింది. పై రెండు పద్యాలు దృఢమైన వ్యక్తిత్వం ఉన్న దేవయానిని చూపిస్తాయి.  అలాంటి స్త్రీ కచుడు లాంటి పురుషుడ్ని చూసాక, ప్రేమించాక, అది విఫలమైతే ఇక ఎవరితోనైనా జీవించగలదా? ఎవరైనా ఇష్టమవుతారా ? సాక్షాత్తూ పురూరవ వంశ చక్రవర్తి యయాతే ఆమె భర్త అయ్యాడు.  కానీ ఆమె అతనితో ‘నీవూ నేనూ వలచితిమీ’ అనలేక పోయింది.  జీవితాన్ని అలాగే శుష్క హృదయంతో, దాహంతో ఎండ బెట్టుకుంది.  ఇంకెలాగూ సమాధాన పడలేకపోయింది.

windఎక్కడి భారతం, ఎక్కడి ‘గాన్ విత్ ద విండ్’ నవల. దూరాలు కాలాల తాలూకు ఎంత వ్యవధి . కానీ గాన్ విత్ ద విండ్ లో స్కార్లెట్ అనే అందగత్తె అయిన అమ్మాయి కూడా ఇలా తను అమితంగా ప్రేమించిన వ్యక్తి తనకు దక్కకపొతే  జీవితంతో  పెనుగులాడుతూ, రాజీపడలేక, జీవితాన్ని అనుభావించాలనే తపనతో ఎక్కడికక్కడ చేజార్చుకుంటూ నవల పొడుగునా ప్రయాణిస్తుంది.

మనకి కోపమూ, జాలీ, ఏవగింపు, ఆశ్చర్యమూ, ఒకానొకచో ఆరాధనా అన్నీ కలుగుతాయి. యాష్లీ  ని ప్రేమించిన ఆమె అతను దక్కకపోవడంతో జీవితమంతా ఆ దాహంతోనే బతికింది.  ఆ పెనుగులాటలో ఆమెలో ఉన్న సామర్ద్యాలు బయటికీ వచ్చాయి. మోస ప్రవృత్తి పెరుగుతూనూ వచ్చింది.  దాంతోపాటు దేవయానిలాగే ఆమెలో నిర్భీతి, రాజీపడని తత్వమూను.

చివరకు మరెంతో సమర్ధుడైన, తనలాంటి వ్యక్తిత్వమే ఉన్న ‘రెట్ బట్లర్’ అనే మహారాజు లాంటి వ్యక్తి ఆమె జీవితంలోకి వచ్చి ఆమెను అందలం మీద కుర్చోబెట్టినా, యాష్లీని మరవలేకపోయింది. అటు దేవయాని సవతి శర్మిష్ట గానీ, యాష్లీ భార్య మెలనీ గానీ పురుషుల్ని రెచ్చగొట్టే అందాలూ, విలాసాలు ఉన్న స్త్రీలు కారు. శాంతి, సహనాలకు ప్రతీకలు.  అలాంటి వారిని చూస్తే దేవయానికీ, స్కార్లెట్ కీ ఇష్టం లేదు.  వాళ్ళ మీద వారికి చిన్న చూపు.

ఇవాళ స్త్రీ వాదులు ఆడవాళ్ళ నిటారయిన వెన్నుముక యొక్క అవసరం గురించి మాట్లాడిన సందర్భంలో అలాంటి వెన్నుదన్ను ఉన్న ఈ నాయికలిద్దరూ పాపం జీవితం నుంచి ఏం పొందారనిపిస్తుంది. పైగా బాలమురళీ గారు పాడిన లాంటి పాట విన్నపుడు మరీనూ.

అయితే జీవితానికి ప్రణయ సాఫల్యత ఒక్కటే అర్ధాన్నిస్తుందా ? జీవితం అర్ధవంతం కావడానికి ఇలా స్త్రీల వలె పురుషులు కూడా మిధున జీవనమే ఫలప్రదమని భావిస్తారా? అంటే కాదేమో అనిపిస్తుంది. ఒక్క శరత్ దేవదాసు లాంటి మినహాయింపులు తప్పిస్తే.

కచుడు తర్వాత జీవితంలో ప్రేమకోసం వెతకలేదు. తాత్వికుడయ్యాడు. యాష్లీ కుడా మెలనీ లాంటి ప్రశాంత హృదయమున్న స్త్రీతో సరళ జీవనం గడిపాడు. ఈ స్త్రీలు మాత్రమే తమ జీవితాలల్లో తాము కోరుకున్న వ్యక్తులు లభించకపోవడం వల్ల జీవన యుద్ధం చేస్తూనే వచ్చారు.

ఇలాంటప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అంటే స్త్రీలకు, ముఖ్యంగా సొంత వ్యక్తిత్వం ఉన్న స్త్రీలకు తప్పనిసరిగా తాము ఎంచుకున్న పురుషుడితో గడిపే ప్రణయ జీవనం, లేదా కుటుంబ జీవనం మాత్రమే ప్రధానమా? మిగిలిన ఎన్ని సామర్ద్యాలు సంపాదించినా ఆ లోటును మర్చిపోలేరా? అన్నది ఆ ప్రశ్న.

వీళ్ళ ఇద్దరి నమునాల్లోంచి కాస్త దగ్గరగా కాలాతీత వ్యక్తులు నవలలోని ఇందిర కనిపిస్తుంది. అదే ధైర్యం, అదే చొరవ, అదే గాఢమయిన జీవితేచ్ఛ.  ఇందిర కుడా దేవయాని లాగే తల్లిలేని పిల్లే.

ఆమెకు ప్రేమ గురించి పెళ్లి గురించి ఖచ్చితమయిన అభిప్రాయాలున్నాయి. ఈ సంక్లిష్ట సమాజంలో బతక నేర్వడం గురించి కూడా. ధైర్యమయిన వాడు, అన్నివేళలా అండగా నిలబడ గలవాడు విశాలమయిన చాతీ ఉన్నవాడు (ఇది ప్రతీక) దొరికితే తప్ప పెళ్లి చేసుకోనంటుంది. ఆమెకు తారసపడిన వాళ్ళు పిరికివాళ్ళే.  వాళ్ళను ఏవగించు కుంటుంది. చివరకు తనలాగే స్వేచ్చ కోరుకొంటూ, తన స్వేచ్చను గౌరవించగలిగే కృష్ణమూర్తి తో సమాధానపడుతుంది తప్ప దేవయాని, స్కార్లెట్ లలాగా వేసారిపోదు. కానీ ఆమె కూడా కృష్ణమూర్తి తో కలిసి ‘నీవూ నేనూ వలచితిమీ, నందనమే ఎదురుగా చూచితిమీ ’ అని పాడుకుంటుందనుకోను.

ఏది ఏమయినా దేవయాని తండ్రితో మాట్లాడిన మాటలతో నింపిన నన్నయ భారతం లోని ఆ రెండు పద్యాలు నన్ను ఎప్పుడూ కదిలిస్తో ఉంటాయి.  కచుడి కోసం ఒక సంధ్యా సమయాన ఆశ్రమంలో చెట్ల కింద నిలబడి మాయమవుతున్న సూర్య కిరణాల్ని, మూగుతున్న చీకట్లనీ బెంగతో చూస్తూ, ఆశ్రమంలో వెలుగుతున్న హోమాగ్ని లాగ మండుతున్న గుండెతో వెళ్లి, తండ్రిని ప్రశ్నిస్తూ ఆందోళన పడుతున్న దేవయాని,సౌందర్యవతి అయిన ఆ యువతి, కళ్ళముందు మెదులుతూ ఉంటుంది.

ప్రణయ జీవన సాఫల్యం కన్నా విరహ వ్యధే ఒక్కొక్క సారి జీవితాన్ని ఎక్కువ వెలిగిస్తుందేమో, దాన్ని వెలుగు అనుకోవాలే గానీ.కానీ ఈ స్త్రీలది విరహ వ్యధ కూడా కాదు.వాళ్ళ కోసం మనం ఏం చెయ్యగలం . తలచుకోవడమూ ఆ తర్వాత  మరువలేక పోవడమూ  తప్ప.

*

అన్వేషణ ఇంకా ఆగలేదు!

ఎద లయలో ఇళయ”రాగం”-2

ilaya1

ప్రముఖ దర్శకుడు బాల్కి (పా,షమితాబ్) ఒకసారి అంటాడు.. “ఇళయరాజా BGM లతో పాటలు చేసేసుకోవచ్చు “అని. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

** స్వాతిముత్యం సినిమా లోని BGM తో వంశీ గారి “శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్” సినిమాలోని “ఏనాడు విడి పోనీ ముడి వేసేనే..ఈ పసుపుతాడు” అన్న పాట అలా వచ్చిందే..

** శివ సినిమా లోని BGM తో “సంగీత దర్శకుడు కోటి,”పాపే నా ప్రాణం” (జె డి చక్రవర్తి) సినిమా లో “నీకు తెలుసా….” అన్న పాటా అలా చేసిందే.

ప్రయోగాలకి మాత్రం ఎప్పుడు ఇళయరాజా ముందుంటారు. అందులో కొన్నిటిని ఇక్కడ ప్రస్తావిస్తాను.

~~స.రి.గ  అన్న మూడు స్వరాలతో ఒక పాట కి బాణీ సమకూర్చారు. దాదాపు దశాబ్దం క్రితం జరిగిన సంగీత విభావరిలో ఇళయరాజా తన “మూడు స్వరాల ” పాట ని తాను తమిళం లో పాడి , శ్రేయ ఘోషల్ తో తెలుగు లో పాడించారు.

~~ “హరికథ, కోలాటం, చెక్క భజన,కీర్తన ” ఈ నాలుగు కలిపి ఒక పాటని స్వరపరిచారు. అది “రామకానవేమిరా” అన్న పాట, స్వాతిముత్యం సినిమా లోనిది.

~~విషాద రాగం గా భావించే “మాయ మాళవ గౌళ ” రాగం లో రొమాంటిక్ డ్యూయెట్ ని కంపోస్ చేసాడు. అది జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా లోని “యమహా నీ యమా యమా అందం”.

~~వంశీ దర్శకత్వం లో వచ్చిన మహర్షి సినిమా లో ” సంస్కృత డిస్కో” పాట మొత్తం “సంస్కృతం” లోనే ఉంటుంది.”అస్మద్ విస్మద్ విధ్యుత్ దీపిక త్వం ఏవా”.పాట-సంస్కృతం”, “బాణీ-డిస్కో”.

~~ ఒకసారి అప్రయత్నంగా వస్తున్న ట్యూన్లకి బాణీలు కట్టి , R సుందర్ రాజన్ ని పిలిచి “బాణీలు ఇస్తున్నా,కథ తయారు చేస్కో అని ఇచ్చారు.ఆ సినిమా “వైదేహి కాత్తి మందాల్”, సూపర్ డూపర్ హిట్ అయింది తమిళం లో.అదే తెలుగులో “మంచి మనసులు” గా రీమేక్ చేశారు.

ఇలా చెప్పుకుంటూ పోతే తన స్వర ప్రవాహం లో ఎన్నో ప్రయోగాలు. హృదయానికి హత్తుకునే పల్లవులతో ఇళయరాజా ఒక “స్వర ఇంద్రజాలమే” చేసేస్తాడు. ఆ పాటలు, వింటున్నప్పుడు “శ్రోతల మనసుల్ని” వశీకరణం చేసేసుకుంటాయి. స్వరాల్ని ఆవాహన చేస్కుని సంగీత సృష్టి చేస్తాడు కనకే , తన పాటలకి అంత ఆకర్షణ శక్తి ఉంటుందేమో అనిపిస్తుంది.అందుకే ఆయన పాటలు జీవితాంతం హృదయ తంత్రుల్ని నిరంతరంగా మీటుతూ పారవశ్యంలో ముంచేస్తూనే ఉంటాయి.

ఒక సందర్భం లో ఇళయరాజా ఇలా అంటారు.” పాట అంటే ఏమిటి? ఒక పాటలా ఇంకో పాట ఉండకూడదు. అలా ఉంటే అది పాట అనబడదు. “కాపీ” అనబడుతుంది.

ఇమిటేషన్ వేరు , ఇన్స్పిరేషన్ వేరు. ఇమిటేషన్ అంటే యథాతథంగా పాటని వాడుకోటం.

ఇన్స్పిరేషన్ అంటే ఒక పాట లోని “ఆత్మ” ని పట్టుకుని ఆ ప్రేరేపణతో ఇంకో పాటని కంపోజ్ చేయటం.

ఈ పద్దతిలో ఇన్స్పైర్ అయిన పాటకి,తరువాత బాణీ కట్టిన పాటకి సంబంధం ఉండదు, అని అంటారు. ఎలాంటి భేషజం లేకుండా తాను ఏ పాటని ఇన్స్పైర్ అయి చేసాడో, ఏ పాటని ఇమిటేట్ చేసాడో కూడా చెప్తాడు.

ఇళయరాజా దక్షిణ తమిళనాడు లోని ” మధురై జిల్లా” , “పన్నైప్పురం” లో జన్మించాడు. కుటుంబం పెద్దది కావటం వల్ల తల్లితో పాటు పొలం పనులకి వెళ్ళేవాడు. అక్కడ వారు పాడుకునే “జానపదాలు” బాలుడిగా ఉన్న ఇళయరాజా మీద చెరగని ముద్ర వేసాయి.కొడుక్కి సంగీతం మీద ఉన్న మక్కువ ని గమనించి పాత హార్మోనియం కొనిపెట్టి ఇచ్చింది తల్లి చిన్నతాయమ్మాళ్.

అప్పటినుండి ఇళయరాజా కి ప్రథమ గురువు ఆ హార్మోనియం అయింది. 1957 లో తండ్రి మరణం ఇళయరాజా కుటుంబాన్ని బాగా కుంగదీసింది. ఇంటి భాద్యతలు తనమీదా పడ్డాయి. 1958 లో అన్న పావలార్ వరదరాజన్ తో కలిసి “పావలార్ బ్రదర్స్” పేరిట ఆర్కెస్ట్రా ట్రూప్ ని స్థాపించారు. డ్రామా కంపెనీలకు, వివిధ రకాలయిన ప్రోగ్రామ్స్ కి సంగీతాన్ని అందించేవారు.ఇది దాదాపుగా పది సంవత్సరాలు కొనసాగింది.

1968 లో మద్రాస్ ప్రయాణం. అక్కడే క్లాసిక్ గిటార్, పియానో నేర్చుకున్నాడు. 1970 లో ధనరాజ్ సలహాతో “లండన్ ట్రినిటీ కాలేజీ ” ఎగ్జామ్స్ కి కూర్చుని, ” క్లాసిక్ గిటార్” లో “గోల్డ్ మెడల్” సంపాదించాడు.

ఈ ప్రతిభని గమనించి బెంగాలీ సంగీత దర్శకుడు “సలీల్ చౌదరి” తన ఆర్కెస్ట్రా లో స్థానం ఇచ్చాడు. ఆ తరువాత “జయ కాంతన్” సలహా తో, సంగీత దర్శకుడు జి.కే. వెంకటేష్ పరిచయం అయ్యాడు. తెలుగు వాడయిన జి.కే వెంకటేష్, అప్పటికే కన్నడ సినీ రంగం లో అగ్రస్థానం లో ఉన్నాడు అప్పుడు.

జి.కే వెంకటేష్ కి అసిస్టెంట్ గా దాదాపు 200 సినిమాలకి ఇళయరాజా పని చేసాడు. ఇలా అసిస్టెంట్ గానే జీవితం గడిచిపోతుంది అనుకున్న సమయంలో, నిర్మాత పంజు అరుణాచలం తన “అన్నక్కిళి” సినిమా కి “సంగీత దర్శకుడి” గా అవకాశం ఇచ్చాడు. 1976  లో  వచ్చిన సినిమా సూపర్ హిట్ గా నిలిచి ఇళయరాజా ని అగ్రస్థానం లో నిలబెట్టింది. ఆ సినిమా తరువాత మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇళయరాజా అన్ని భాషల్లో కలిపి సుమారుగా వెయ్యి సినిమాలకి బాణీలు అందించాడు.

1000 వ సినిమా బాలా దర్శకత్వం లో వచ్చిన ” తారై తప్పట్టై ” .ఇళయరాజా కి దేశం మొత్తం అభిమానులు ఉన్నారు.

 

ఇళయరాజా సంగీత ప్రస్థానంలో  కొన్ని విశేషాలు :::

**దళపతి సినిమా లోని “రక్కమ్మ” (చిలకమ్మా చిటికేయంగా) పాట బీబీసీ 166 దేశాల్లో నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో “బీటిల్స్ ” ని అధిగమించి 4 వ స్థానం లో నిలచింది.

**లండన్ లోని రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా కి సంగీతం రచించిన మొట్ట మొదటి “ఆసియా వాసి”.ఇది 1993  లో జరిగింది.

** మాణిక్య వాచకర్ రచించిన తిరువాసగం(తిరువాచకం) కి ఇళయరాజా సింఫనీ రచన. ఇవి దాదాపుగా లక్ష ఆల్బమ్స్ అమ్ముడుపోయాయి.

మాణిక్య వాచకర్ గానం చేయగా శ్రీ చిదంబర నటరాజ స్వామి స్వహస్తాలతో రాసుకుని తన ఆమోద ముద్ర వేసి భక్తులకు అందించిన అపురూప భక్తి-జ్ఞాన గ్రంథం “తిరువాచకం”

**ఫ్రెంచ్ నటుడు , గాయకుడు పాస్కల్ హెని , హిందీ భాష నేర్చుకుని బాలీవుడ్ పాటలు పాడుతూ దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అతను “ఇళయరాజా ” స్వరపరచి, పాడిన ఒక పాట( “ఊళ్లకుళ్ళ చక్రవర్తి” ) ని పాడాడు. “పన్నక్కారన్” అన్న రజినీకాంత్ సినిమా లోనిది.

ఇళయరాజాకు బాగా ఇష్టమైన సంగీత దర్శకుల్లో ఖేం చంద్ర ప్రకాష్ , మదన్ మోహన్,సి రామచంద్రన్, రోషన్,సలీల్ చౌదరి, S D బర్మన్ , R D బర్మన్ ముఖ్యులు. “బీతోవెన్, మొజార్ట్, బాక్” లని అయితే ఆరాధిస్తాడు.

ఇళయరాజా చేసిన మిగతా ఆల్బమ్స్:: “హౌ టు నేమ్ ఇట్, నథింగ్ బట్ విండ్, తిరువాసగం “.

రమణ మహర్షి తన ఆధ్యాత్మిక గురువు అవటం వల్ల రమణుని, ఆ అరుణాచలేశ్వరుడిని స్తుతిస్తూ పలు ఆల్బమ్స్ చేసాడు,. అలాగే షిర్డీ సాయి మీదా ఆల్బం చేసాడు.

“సంగీతం అంటే నాకు అస్సలు తెలియదు. తెలియదు కాబట్టే చేస్తున్నా. తెలిస్తే, హాయిగా ఇంట్లో కూర్చునేవాణ్ణి. నాకు సంగీతం వచ్చేసిందని కాలుమీద కాలు వేసుకుని దర్జాగా ఉండేవాణ్ణి. కానీ అలా ఉండటంలేదే?. సంగీతం అంటే ఏంటో తెలుసుకోవాలనే ప్రయత్నమే నేను చేస్తున్న క్రతువు. అన్వేషిస్తూ… ఈ ప్రయాణం కొనసాగాల్సిందే “అంటాడు ఇళయరాజా

తన సంగీత యజ్ఞాన్ని ఇలాగే సాగిస్తూ, తన అన్వేషణ కొనసాగిస్తూ, తన అభిమానులకు,భక్తులకు ఆ యజ్ఞ ఫలాన్ని ఇలా అందిస్తూనే ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ…!  ఇట్లు ..ఇళయరాజా భక్తుడు.

*

 

శిల్పంపై దృష్టిపెట్టిన కవిత

 

padam.1575x580 (2)

 

సామాజికప్రయోజనమనేది ఒకటి కవిత్వానికి ప్రధాన లక్ష్యమయ్యాక సమాజంలో భిన్నవర్గాలలో ఉనికి సంబంధమైన పోరాటాలు మొదలయ్యాయి.ఈ మార్గంలో వస్తుగతంగా చైతన్యం వివిధమార్గాలలో కనిపిస్తుంది.ప్రాంతం ,జెండర్,సామాజిక మూలాల్లోంచి భిన్నమైన ఉనికి వ్యక్తిలో ఉండడం వలన కవితావస్తువుల్లోనూ ఈ లక్షణాలు కనిపిస్తాయి.ప్రధానంగా అణచి వేయబడుతున్న వర్గాలనుంచి ఇలాంటి కవిత్వం ఎక్కువ.మెర్సీ మార్గరేట్ కవిత కూడా ఇందుకు మినహాయింపు కాదు.వస్తుతః మెర్సీలో స్త్రీ సంబంధమైన గొంతు,సమస్యలు,సంఘర్షణ దాని తాలుకు సారం కనిపిస్తుంది.ఒకింత దళిత సామాజిక వర్గానికి చెందిన భావజాలమూ కొన్ని వాక్యాల్లో ఉంది.రూపం శిల్పం వీటి విషయంలో ప్రధానంగా పైరెండు మార్గాల్లో కనిపించే కవిత్వానికి ,మెర్సీ కవిత్వానికి మధ్య అభివ్యక్తిసంబంధమైన వైరుధ్యాలున్నాయి.సమస్య వస్తువుగా కన్నా,అది మనసు మీదవేసే ప్రతిఫలనాలమేరకు కలిగే సంవేదనా సారం కళాకృతిలో ఈ కవితలో  కనిపిస్తుంది.

 

అనేకమంది కవులు,రచయితలు ఉనికి పోరాటలనుంచి ధిక్కరిస్తున్నది అణచివేతనే.వస్తువు కేంద్రాన్ని బట్టి వీటి రూపాలు వేరు.ఈ ధిక్కారం స్థానంలో సున్నితమైన సంవేదనత్మక వచనంతో మెర్సీ స్వేచ్ఛను అన్వేషిస్తుంది.”అణచివేయబడ్డానికీ,జయించబడ్డానికి మధ్య(133పే)రియానేవ్ కోసం(127పే)సముద్రాంబర(123పే)లాంటివి ప్రధానంగా స్త్రీ స్వేఛ్చను ప్రశాంత జీవనాన్ని ప్రతిపాదించేకవితలు.స్వేఛ్ఛను అస్తిత్వ వాదులు మానవ వాస్తవికతగా చెప్పారు.ఇది దాని చుట్టు ఉండే వర్గాలు,పదార్థాలు మూసలను ఛేదించుకుని వస్తుంది.స్వేఛ్ఛ నిర్వచనానికి లొంగనిది.వాస్తవమూ కాదు యథాతథమూ కాదు.కాని అలా నిర్వచించుకోకపోతే అర్థం చేసుకోలేం. బేర్డియేవ్ స్వేఛ్ఛను ప్రాక్తన అహేతుక స్వేఛ్ఛ(లేని అణచివేతను ఊహించేదిగా)అంతిమ హేతుబద్ధ స్వేఛ్చ(సంఘటన ద్వారా అణచి వేతను ఎరుకలోనికి తెచ్చుకునేదిగా)చెప్పాడు.మెర్సీలో అణచివేతను ప్రత్యక్షంగా చెప్పడం తక్కువే.ఈ రెంటి ప్రతిఫలనాల సారాన్ని కవిత్వం చేయడం ఎక్కువ.

mercy1

1.”నీతల్లికి నువ్వు రాసిన ఉత్తరం మొలకెత్తింది/ఏడేళ్ళు నిన్ను ఇనుప ఊచలమధ్య నొక్కి పెట్టినా/చావే మనిషికి అంతం కాదు అని నువ్వన్న మాటలున్నాయే/ఆ మాటలు మనిషితనం ఉన్న ప్రతీచోట/మొలకెత్తుతున్నయ్/నువు చనిపోయాక మాట్లాడుతున్న నీ ఉనికిని/నేను అందరికీ చేర్చబోతున్నా”-(రియానేవ్ కోసం-127)

 

2.ఆపుకోలేని ఆగ్రహావేశాలను/కాళ్ళు,చేతులు దేహం మొత్తం ఆక్రమింపబడ్డ/అ వృక్షపు అధికార బల ప్రయోగం నుండి/విమోచింపబడ్డానికి/స్వేఛ్ఛా పోరాటం చేసి ప్రాణాలొదిలిన గాలిచేసిన ఆర్తనాదాలు విన్నాను”-(అణచివేయబడ్డానికి జయించబడ్డానికి మధ్య-133పే)

 

ఈ రెండు భావాంశాలు స్వేఛ్ఛను గురించి మాట్లాడినవే.నిర్మాణ గతంగా మొదటిది అఖ్యాన పద్ధతి(Narrative structure)లోని ఉద్దేశిత నిర్మాణం(intend structure)లో కనిపిస్తుంది.వాక్యాల్లో “నీ/రెహనాయ్”అనే సంబోధనలు కనిపించడం వల్ల ఈ నిర్మాణం కనిపిస్తుంది.”మొలకెత్తడం”ఈ భావనలోని ప్రధాన కేంద్రం(Focal point) గతంలోని అణచివేతను ఉద్దేశిస్తుంది.అందుకే భావంశంలో ఇది ముందుకు వెళ్ళింది.వస్తుగతంగా ఇది స్వేఛ్ఛను,అణచివేత మూలాల గురించి మాట్లాడింది.రెండవ భావాంశంలో ఉపవాక్యనిర్మాణం(Clausal structure)కనిపిస్తుంది.

వాక్యమంతా ఒకే వాక్యంలా కనిపించే కొన్ని ఉపవాక్యాలుగల వాక్యం.భావ ధార ఎక్కువగా ఉండటం వల్ల ,ఒకదానిపై ఒకటిగా అనుభవాలు సంలీనమవటం వల్ల అలాంటి వాక్యాలు వస్తాయి.ఈ గాఢాభినివేశం వల్ల కొన్ని వాక్యాలు ఒక వాక్యంగా రూపొందింపబడుతాయి.ఇలాంటి వాక్యాలు మెర్సిలో కొంత ఎక్కువగానే కనిపిస్తాయి.పై వాక్యంలో కర్మార్థకాలు ఎక్కువ.అందువల్ల పై వాక్యంలో “బడు”ప్రత్యయాలు కనిపిస్తాయి.పాత్రల స్థానాలను వాక్యరూపంలోకి ఊహించుకోవడంలో కొన్ని సార్లు ఇలాంటివి కలుగుతాయి.సాధనవల్ల అధిగమించడం కష్టం కాదుకూడా.మెర్సీలో ఒకింత పొడుగువాక్యాలు కనిపించడంలో కారణం ఇదే.

 

జీవితం నుంచి రాయడానికి ప్రేరేపించే వస్తువును,అంశం అదివేసిన ముద్రను కవిత్వం చేయడంకోసం మెర్సీపడే శ్రమ గమనించదగింది.సృజనసాంద్రత కోసం సంప్రదాయపద్ధతిలోనే సంకేతనిర్మాణం(encode structure)ఏర్పాటుచేసుకుంటుంది.ఈ క్రమంలో ప్రతీకను,ధ్వనిని నేర్పుగా ఉపయోగించుకోవడం కనిపిస్తుంది.

వృక్షం- పాతుకుపోయిన అధికారం(అణచివేతకు గురిచేసేది),గాలి-స్వేచ్ఛకు-సంకేతాలుగా కనిపిస్తాయి.అదేక్రమంలో ధ్వనిగత అర్థాన్ని సూచించే భాష(elliptical language)ను ఆధారం చేసుకుని నిర్మించిన వాక్యం-“కాళ్ళు,చేతులు,దేహం మొత్తం ఆక్రమింపబడ్డ”-లోకూడా స్త్రీని వ్యక్తం చేస్తాయి.

 

ఉద్వేగసంబంధంగా మాత్రమే కాక ఈ భావధార కళాసంబంధంగా కూడా దొంతరలు దొంతరగా వాక్యాలను రూపొందించడం కనిపిస్తుంది.ఒక అనుభవాన్ని,పలికోణాలను పలుమార్లు అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా వాక్యాల్లో ఈ విన్యాసం కనిపిస్తుంది.ఈ పునరవలోకనం (retrospection)ఒక సమానభావచ్ఛాయ గల వాక్యాలు రాసేందుకు ప్రేరేపిస్తుంది.

“ఎండిపోయిన విత్తనాల్లాంటి ప్రశ్నలు/చిక్కులు చిక్కులుగా ఉండలుచుట్టిపడేఅసిన ఊలు దారాల్లాంటి ప్రశ్నలు/రాయడానికి వాడనందుకు జబ్బుచేసి సిరా కక్కుకున్న ప్రశ్నలు/వెలుతురును మింగేస్తూ /గాజులోనే బందీ చేస్తున్న చిమ్నీలాంటి ప్రశ్నలు/గాలికూడా రెపరేపలాడకుండా /జీవాన్ని ఆవిరిచేసుకుంటూ/శ్వాస పీల్చుకోలేక వ్రేలాడుతున్న క్యాలెండరులాంటి ప్రశ్నలు/తెచ్చిపెట్టుకుని తినలేక వదిలేస్తే/కుళ్లిపోయి కంపుకొడుతున్న ప్రశ్నలు”-(ప్రశ్నల గది-)

 

ఇలా ఒక అనుభవంలో నిలబడి అనేక వాక్యాలను రాయడం అందులో ఉద్వేగాన్ని ,కళను ప్రసారం చేయడం కనిపిస్తుంది. కవిత్వీకరించడంలో కొన్ని పనులుమాత్రమే కాక మానసికంగా మెర్సీమార్గరేట్‌కు కొన్ని భావనాముద్రలున్నాయి”చీకటి”అలాంటిది.చీకటి అనేభావన చుట్టూ అనేక ఊహలు చేయడం కనిపిస్తుంది.చీకటి వరం(35పే)చీకటి దండెం(81పే)లాంటి కవితలు వాటి శీర్శికలతోపాటు ఉదయంవైపు నడక(47పే)వెంటిలేట్(106పే)చేతికంటికున్న మాటలు(87పే)దోసిలో నది(75పే)వీడ్కోలు(60పే)మొదలైనవి చీకటిని ప్రతిమలుగా ప్రతీకలుగా వాడుకున్న కవితలు

1.ఘనీభవించిన చీకటిపై జ్ఞాపకాల దారుల్లో నడిచొచ్చిన పాదముద్రలు

2.కనురెప్పల చీకటి-(106పే)

3.చీకటి అలలు(87పే)

4.రాత్రుళ్ళు చీకట్లో నిశ్శబ్దం నాట్యం చేసేది గోడలపై-(75పే)-ఇలాంటివి మరికొన్ని గమనించవచ్చు.కొత్తగా కవిత్వం రాసేవాళ్లకు సృజనశక్తి ఉండదనే అపోహ ఒకటుంటుంది.దాన్నుంచి తన కవితను తప్పించడానికి మెర్సీ బలమైన ప్రయత్నం చేసింది.వస్తువుతో పాటు శిల్పంపై దృష్టిపెట్టిన కవిత మెర్సీ మార్గరేట్”మాటల మడుగు”

 

(అనంత కవుల వేదిక-“చం”స్పందన-ఆత్మీయపురస్కారం పొందిన సందర్భంగా)

వెంటాడే ప్రశ్నల పెరుమాళ్ నవల!

murugan

పెరుమాళ్ మురుగన్ గానీ ఆయన రచనలు గానీ నాకు తెలిసింది ఆయన రాసిన “మాధుర్భగన్” వివాదాస్పదమయ్యాకే. దీన్ని అనిరుద్దన్ వాసుదేవన్ ఆంగ్లంలోకి “One Part Woman” పేరుతో అనువదించారు. తమిళం మాతృక పేరు “మాధుర్‌భగన్”, “మాదోర్‌భగన్”, “మాధోర్‌భాగన్” ఇలా వేర్వేరుగా అక్కడక్కడా రాయబడింది. ఏదీ సరైనదో తమిళం తెలిసిన వారు చెప్పాలి.

కథంతా తృతీయ పురుషలో వుండినా అక్కడక్కడా ఆయా పాత్రల స్వగతంతో ప్రథమపురుషలోనూ వుంటుంది. వరుసక్రమంలో కథ నడిచినట్లున్నా సందర్బాన్నిబట్టి ఆయా పాత్రల ఆలోచనల్లో, సంబాషణల్లో వెనక్కి, ముందుకూ వెళుతూ వుంటుంది. అయినా ఎక్కడా వర్తమానాన్ని వదిలిపెట్టిన స్పృహ వుండదు. చాలా సహజంగా కథ నడుస్తూ వుంటుంది. నాకు అలవాటులేని పాత్రల పేర్లు కావడం వల్లనేమో కథ మొదలయిన చాలా సేపు “కాళి” అనగానే నాలో అమ్మాయి మెదిలేది. కాళి పేరులో అబ్బాయిని చూడటం కాస్తా యిబ్బంది పెట్టింది.

పిల్లలు లేని యువదంపతుల ఆవేదన ప్రతి దృశ్యంలోనూ కనిపిస్తుంది. కాసే చెట్టు, ఈనే ఆవు, పిల్లల కోడి, ఆడే పిల్లలు … ఇలా ప్రతిదీ ఆ కోణంలోనే వారికి కనిపిస్తుంటుంది. పిల్లలు నిజంగా వారికోసం కావాలా? లేక కేవలం సమాజపు మెప్పుకోసం, అంగీకారం కోసం కావాలా అన్న ప్రశ్న మనలను వెంటాడుతూవుంటుంది.

నవలా నేపథ్యం స్వాతంత్య్ర పూర్వం తిరుచెంగోడ్ పట్టణ పరిసర పల్లెలు, తిరుచెంగోడ్ తిరునాళ్ళు. కాళి, పొన్నయి అనే దంపతుల చుట్టూ అల్లబడిన నవల. పెళ్ళి అయిన మూడు నెలల నుండీ ప్రారంభమవుతుంది కథనం. పెళ్ళి అయి నెలలు గడిచేకొద్దీ పిల్లలు కలగని దంపతుల అవస్థలు ఎలా వుంటాయో ఈ ఆధునిక యుగంలో కూడా నాకు కొంత పరిచయమే. అలాంటిది ఎటువంటి వైద్యపరమైన చికిత్సలూ, బిడ్డలు కలగకపోవడానికి గల కారణాలు కనుక్కోగల పనిముట్టులూ లేని ఆ రోజుల్లో ఓ పల్లెటూరిలోనిలోని దంపతుల వ్యథ ఎలావుంటుందో చెప్పనలవిగాదు. కొంతమంది తెలిసీ, మరికొంతమంది తెలియకా పిల్లలు కలగని వారిని మానసిక వత్తిడికి గురిచేస్తూ వుంటారు. ఆ వత్తిడి ఎన్ని మార్గాల్లో, ఎన్ని విధాలుగా వుంటుందో తెలిస్తే ఓ విధమైన షాక్‌కు గురవుతాము.  

కథలోకి వస్తే కాళి, పొన్నయి ఒకరిపై ఒకరికి అనురాగమున్న కొత్త దంపతులు. పెళ్ళి అయిన మరుసటి నెల నుండే నెల తప్పలేదేంటని కంగారు మొదలవుతుంది. పిల్లలు పుట్తకపోవటమన్న బెంగ పీడిస్తూవుంటుంది. వూరి జనాలవల్ల రకరకాలుగా అవమానింపబడతారు. కాళి పెళ్ళికి ముందు తన మిత్రబృందంతో ఎంతో కలివిడిగా, హుషారుగా తిరిగినవాడు. కానీ పెళ్ళయిన కొన్ని నెలలనుండీ ఏదో సందర్భంలో మిత్రులనుండి తను నపుంసకుడు అన్న అర్థంలో మాటలు పడాల్సి వస్తుంది. అప్పటినుండి మెల్లమెల్లగా తనలోకి కుచించుకుపోతాడు. మొదట తన తల్లి రెండోపెళ్ళి గురించి మాట్లాడినా తన భార్య స్థానంలో మరో స్త్రీని వూహించుకోలేడు. అదీగాక తనలోనే లోపముండీ ఆమెకూ పిల్లలు పుట్టకుంటే ..అన్న ఆలోచనే భయంకరంగా అనిపిస్తుంది. తను కేవలం ఇంటికీ, పొలానికే పరిమితమయి ఈ బయటి హేళనల నుండి కాస్తా వుపశమనం పొందినా, పొన్నయి అవమానపడిన ప్రతిసారీ ఆమెను ఓదార్చలేక కృంగిపోతూవుంటాడు. ఇద్దరూ ఒకరిలోఒకరు కరిగిపోవడం ద్వారా వుపశమనం పొందుతూ వుంటారు.

ఆమె గొడ్రాలుతనాన్ని అలుసుగా తీసుకొని ఆమెను పొందాలని ప్రయత్నిస్తాడొకడు. వాళ్ళకు ఎలాగూ పిల్లలు లేరు కదా వారి తదనంతరం ఆస్తి తమపిల్లలకు చేజిక్కించుకోవచ్చని దూరపు బంధువులు తమ పిల్లలను వీరింటికి పంపుతూ వీరికి చేరువ చేయాలని చూస్తూ వుంటారు. ఓ అమ్మాయి పెద్దమనిషి అయినప్పుడు జరిపిన వేడుకలో పొన్నయిని దూరంగా వుంచుతారు. ఓ గొడ్రాలు దీవిస్తే ఆ అమ్మాయికి అశుభం అని వాళ్ళ నమ్మకం.

“కూడబెట్టి కూడబెట్టి ఏమి చేసుకుంటారు డబ్బుని, బాగా తిని, మంచి బట్టలు వేసుకొని హాయిగా వుండండి.” అంటుంది ఆమె ఆడపడచు ఒకసారి. “ఏం, ఇప్పుడు మేము ఆకలితో ఛస్తున్నామా? బట్టలు లేకుండా మీయింటిముందు బిత్తల తిరుగుతున్నామా?” అని పొన్నయి విరుచుకుపడుతుంది. పక్కవూరిలో తన స్నేహితురాలి ఇంట్లో పెళ్ళికి వెళుతుంది ఓసారి. ఆ స్నేహితురాలు ఈమెను తనకు సహాయపడటం కోసం పెళ్ళి సమయం కంటే బాగా ముందే రమ్మన్నా, ఎవరూ తోడులేకపోవడంతో అందరితో పాటే వెళుతుంది. “ముందే రమ్మని చెప్పినా ఇప్పుడు వస్తున్నావు, నీ కూతుర్లను తయారుచేసేసరికి ఇంత ఆలస్యమయ్యిందా?” అని నిష్టూరమాడుతుంది ఆమె. పొన్నయి అక్కడ కోపంతో ఏమేమో అని పెళ్ళి చూడకుండానే తిరిగి వెళ్ళిపోతుంది.

పొన్నయి ఎన్నోసార్లు తన పొలంలో ఏమి నాటినా విరగ్గాసింది. ఏ కోడిని పెంచినా పిల్లల్లని తెగ పొదిగింది. తన యింట్లో మేక, గేదె దూడలని కంటూనే వున్నాయి. తన పొరుగువారి పొలంలో ఒకసారి గొర్రులకు విత్తనం అందించే పనిచేస్తుంది పొన్నయి. అదికూడా ఆ పొలం యజమాని కోరితేనే! అయితే అదనులో విత్తకపోవడంవల్ల పంట ఆశించినట్లు రాదు. వూరంతా గొడ్రాలు చేయి తగిలిన విత్తనం ఎలా పైకి వస్తుందని గుసగుసలు పోతుంది.

గొర్రెలు తనపొలంలో పడి తింటున్న ఆక్రోశంలో పొన్నయి ఆ గొర్రెల కాపరిని తిడుతుంది. ఆ గొర్రెల కాపరి “వారసులు లేని ఆస్తిని మూటగట్టుకొని పోతావా” అని నిందిస్తుంది.

తన యింటికి వచ్చి ఆడుకునే పిల్లలను బాగానే చూసేది పొన్నయి. కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఆడుకుంటూ దెబ్బ తగిలించుకుంటే “పిల్లలుంటే కదా తెలిసేది పిల్లలని ఎలా చూసుకోవాలో” అని ఆ పిల్లాడి తల్లి రుసరుసలు పోతుంది.

ఇలా అనుదినమూ అవమానాలు పడే వాళ్ళకు నల్లుపయ్యన్ మామ ఒకడే ఊరట. అతను పెళ్ళిచేసుకోకుండా వుండిపోయివుంటాడు. పిల్లలు లేనంత మాత్రాన ఏ నష్టమూ లేదని, వూరి మాటలని పట్టించుకోవద్దని వీళ్ళకి స్వాంతన కలిగిస్తూ వుంటాడు.

చివరికి వీళ్ళకు ఇక పుట్టరని నిర్ణయానికి వచ్చిన పొన్నయి తల్లి, తండ్రి, అన్న, కాళి అమ్మ కలిసి పొన్నయిని తిరుచెంగోడు తిరునాళ్ళకు పదులాలుగవ రోజు తీసుకెళ్ళాలని యోచన చేస్తారు. కానీ అది పొన్నయికి, కాళికి ఎలా చెప్పాలో తెలియక తర్జనభర్జన పడతారు. చివరికి ఆ ఆలోచనని కాళి తల్లి కాళితో చెబుతుంది. కాళి సుతారామూ అందుకు ఒప్పుకోడు. ఓ ఏడాది పైగా పొన్నయితో ఆమాట చెప్పడానికి కూడా ఒప్పుకోడు. చెబితే తన ప్రతిస్పందన తీవ్రంగా వుంటుందని, ఒప్పుకోదన్న అంచనాలో వుంటాడు. కానీ ప్రతిసారి తిరునాళ్ళ పండగ రోజులని అత్తవారింట్లో గడిపే వాళ్ళకు ఆ ఏడాది నుండీ ఎందుకు కాళి వద్దంటున్నాడో పొన్నయికి అర్థంగాక నిలదీస్తుంది. అప్పుడు కాళి పెద్దవాళ్ళ ఆలోచనని బయటపెట్టి “పద్నాలుగవ రోజు నిన్ను పంపుతామంటున్నారు. వెళతావా?” అని కోపంగా అడుగుతాడు. అయితే భర్త అంతరంగాన్ని సరిగ్గా అర్థం చేసుకోని పొన్నయి “నువ్వు వెళ్ళమంటే వెళతానంటుంది”. అందులో భర్త పట్ల ప్రేమ, బిడ్డల పట్ల కాంక్ష తప్ప తనకింకో దురుద్దేశం లేదు. అయితే ఈ సమాధానంతో కాళి నిరుత్తరుడవుతాడు.

ఇలా భార్యాభర్తల మధ్య, ఇరుగుపొరుగు మధ్య జరిగే మాటల ఘర్షణ, మనోభావాల ఘర్షణ, అంతరంగాల ఘర్షణ ఈ నవలంతా! ఇంతకీ ఆ తిరునాళ్ళలో పద్నాలుగవ రోజు విశేషమేమిటంటే… పెళ్ళయిన, పిల్లలు కలగని ఆడవాళ్ళు ఆరోజు ఏ అపరిచుడితోనే సంగమించి పిల్లలని కలగడమనే ఆచారం. దాన్నెవరూ తప్పుగా అనుకోరు. ఆ దేవుడే ఆ అపరిచితుడి రూపంలో వచ్చి గర్భదానం చేశాడనుకుంటారు. దాన్ని అప్పటి సంఘం ఆమోదించింది.

పొన్నయి వెళ్ళిందా? కాళి పంపించాడా? ఆ తర్వాత ఏమి జరిగింది అన్నదానికోసమే కాకుండా ఓ పిల్లలులేని దంపతుల ఆవేదన, అవమానాలు, అప్పటి పల్లె జీవితం చుడాలంటే తప్పక చదవాల్సిన నవల ఇది. amazon.comలో కొన్ని ప్రతులు ఇంకా దొరుకుతున్నాయి.

అయిదు మంది భర్తలను కలిగిన ద్రౌపదిని అంగీకరించి, ఇదే పద్దతిలో పుట్టిన పాండవులను, కౌరవులను అంగీకరించిన సమాజంలో, అలాంటి ఒక ఆచారం గురించి చెప్పినంతమాత్రానికి ఈ నవల మీద రచ్చ జరగడం ఆక్షేపణీయం. ఆ ఆచారాన్ని పక్కనబెట్టి ఓ గొడ్రాలు (ఈమాట అనాలంటే మనసు రావట్లేదు, కేవలం పిల్లలు కలగని స్త్రీ అనే అర్థంలో మాత్రమే అంటున్నాను) పడే రోజువారీ అవమానాలు, ఆ భర్త ఎదుర్కొనే అవమానాలు వీటిని గురించి చర్చ చేయాలి. కానీ అది పక్కన బెట్టి కేవలం తనకు నచ్చని ఓ కోణాన్ని మాత్రమే పైకి తెచ్చి రచ్చ చేశారు. ఈరోజుకీ పిల్లలు లేని ఆడవాళ్లని, భర్త చనిపోయిన ఆడవాళ్లని ఎన్నెన్నో మాటలతో అవమానించడం మనం చూడవచ్చు. ఆ విషయమై చర్చ జరిగివుంటే ఈ రచన ఆ బాధలు పడే స్త్రీలకు కొంతైనా స్వాంతన కలిగించి వుండేది!

*

విప్లవంలో స్వేచ్ఛా సమానత్వాల సాహచర్యం

karuna

 

‘విప్లవ రాజకీయాలు చదువుకున్నవారికి చేరాలంటే మార్గం సాహిత్యమే’ అని నమ్మి ఆచరించిన  ఆమె అసలు పేరు పద్మ. పదిహేనేళ్ళ వుద్యమ జీవితంలో అన్నీ వొదులుకొన్నట్టే సొంత పేరును కూడా వదిలేసింది. 1994లో తాయమ్మ కథ రాసి కరుణగా సాహిత్య లోకానికి పరిచయమైంది. అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి పదేళ్ళు కావొస్తున్నా , అటు తర్వాత మరో ముప్ఫైకి పైగా కథలు రాసినా ఆ తొలి  కథే  కరుణకు చిరునామా అయ్యింది. ‘తాయమ్మ’ ఆమె యింటి పేరయ్యింది. ఆ కథ పొడవునా వున్న కఠోర జీవన వాస్తవికత పాఠకుల బుద్ధిని రాపాడితే , ముగింపులోని తాయమ్మ దు:ఖం మాత్రం  గుండెను మెలిపెడుతుంది.  కరుణ చిత్రించిన తాయమ్మ , కవులమ్మ , లచ్చుమమ్మ మొదలైన గ్రామీణ స్త్రీ  పాత్రలు మన కళ్ళముందు కదలాడే  నిజ జీవితంలోని వ్యక్తులే  కావడం వల్ల వాటికి యెంతో  సహజత్వం అబ్బి  పది కాలాలపాటు నిలచిపోయేలా రూపొందాయి. ఒక రచయిత పేరు చెప్పగానే వాళ్ళ రచనల్లోని పాత్రలు వెంటనే స్ఫురించడం ఆ రచయిత సాధించిన విజయంగానే భావించాలి.

విప్లవాచారణలో తలమునకలై  సాహిత్యం  గురించి తీరిగ్గా ఆలోచించటానికీ, నగిషీలు చెక్కటానికీ వీలులేని జీవితంలో – నిత్య నిర్బంధాల మధ్య అణచివేతల మధ్య  కథా శిల్పానికి  మెరుగులు దిద్దడానికి సరైన వనరులు అందుబాటు లేని పరిస్థితుల్లో , యెవరికైనా చదివి వినిపించి దిద్దుకోడానికి సైతం వెసులుబాటు దొరకని సందర్భం లో కథ పట్ల అందులో తాను చెప్పదల్చుకొన్న విషయం పట్ల వొక ప్రత్యేక శ్రద్ధ, దాని రూపం పట్ల కూడా అంతర్గతంగా వొక అదృశ్య స్పృహ వుండటం వల్ల కరుణ కథలు విప్లవ సాహిత్యంలో సైతం ప్రత్యేకగా నిలుస్తున్నాయి. సరళమైన నిరాడంబర శైలి ,   కథనంలో సూటిదనం స్వీకరించిన వస్తువునే కాదు;  రచయిత దృక్పథాన్ని సైతం దీప్తిమంతం చేస్తాయి అనడానికి కరుణ యిటీవల రాసిన ‘సహచరులు’ కథ చక్కటి వుదాహరణ(అరుణతార, మే 2016).

[కథ లింక్ : http://virasam.org/article.php?page=57  ; పే.20 – 26]

విప్లవోద్యమాల్లో స్త్రీపురుష సంబంధాల గురించి లోపలా బయటా యెన్నో సందేహాలు , అపోహలు. వాటిలో  పాలక వర్గాలు పనిగట్టుకొని చేసే దుష్ప్రచారం వొక యెత్తయితే , వుద్యమ భావజాలాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక వుద్యమకారుల నైతిక వర్తనపై బురద జల్లడానికి మరీ ముఖ్యంగా  పితృస్వామ్య విలువలతో స్త్రీల శీల హననానికి చేసే కువిమర్శలు మరో యెత్తు. ఇవి గాక కొన్నాళ్ళు వుద్యమ జీవితం గడిపి బయటకు వచ్చిన స్త్రీలు జెండర్ పరంగా విధాన నిర్ణయాల్లో , యితరత్రా తామెదుర్కొన్న వివక్షతల గురించి లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించిన అంశాలు కూడా సాహిత్యంలో విస్తృతమైన చర్చలకి కారణమయ్యాయి.

ఆ నేపథ్యంలో వుద్యమాల్లో నూతన మానవ ఆవిష్కరణ లక్ష్యంగా  వొకే మార్గంలో పయనించే క్రమంలో యిద్దరు స్త్రీ పురుషుల మధ్య యేర్పడే సాన్నిహిత్యం సాహచర్యంగా మారినప్పుడు ఆ బంధం యెంత బలంగా వుంటుందో స్వేచ్ఛా సమానత్వ భావనలతో యెంత ప్రజాస్వామికంగా వుంటుందో అతి సున్నితంగా ఆవిష్కరించిన కథ ‘సహచరులు’.

విప్లవోద్యమ జీవితంలో సహచరులకి కష్టాలే గానీ సుఖాలుండవు. సొంత సుఖాలపైకి వారి ఆలోచనలు పోవు. అడవిలో కేంప్ లో డెన్ లో యెక్కడ యెన్నాళ్ళుంటారో తెలీదు. ఎప్పుడు కలిసుంటారో యెప్పుడు విడిపోతారో తెలీదు. ఒకే దళంలో వున్నా ప్రశాంతంగా మాట్టాడుకొనే అవకాశమే చిక్కకపోవచ్చు. శత్రునిర్బంధంలో అసలుంటారో పోతారో తెలీని అభద్ర జీవితం. కార్యాచరణకి అనుగుణంగా  సహచరుల మధ్య ప్రేమనీ యెడబాటునీ పార్టీయే ఆదేశిస్తుంది. వారి వుద్వేగాల్ని ఆలోచనల్నీ జీవన గమనాన్నీ  వుద్యమావసరాలే నిర్దేశిస్తాయి. అనుక్షణం ప్రమాదాల  కత్తి అంచున నిలబడి కూడా సాహచర్యంలోని సాధకబాధకాల్ని అర్థంచేసుకున్న దీప అనిల్ అనే యిద్దరు వుద్యమకారుల జీవిత శకలాల ద్వారా విప్లవోద్యమాల్లో స్త్రీ పురుష సంబంధాలు వుద్వేగభరితంగా యెంత మానవీయంగా వుంటాయో యీ కథలో  కరుణ చాలా ‘ఆత్మీయం’గా పాఠకుల ముందుంచింది.

దీప, అనిల్ ఉద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తలుగా వచ్చాకనే సహచరులయ్యారు. దీప గ్రాడ్యుయేట్, అనిల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. పార్టీలోకి దీపకన్నా ఎనిమిదేండ్లు ముందు అనిల్ వచ్చాడు. అతను సెక్రటేరియట్ మెంబర్. ఆమె జిల్లా కమిటీ సభ్యురాలు. ఎవరి ఏరియాల్లో వాళ్ళు పని చేస్తున్నారు. పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి విపరీతమైన అభిమానం, ప్రేమ. ముఖ్యంగా దీపకు అనిల్ మీద గౌరవం.’ అతను ఆమెకి జీవితంలోనూ , వుద్యమంలోనూ వొక విధంగా మెంటర్ , మార్గదర్శకుడూ.  ‘అనిల్ దగ్గర ఉంటే దీప తల్లికోడి చుట్టూ తిరిగే పిల్లకోడే.’ రవికిరణం తాకిన పద్మమే. వారి మధ్య ఆధిపత్యాలకి తావులేదు.  అభిప్రాయాల్ని  పంచుకుంటారు. వాటిని పరస్పరం మన్నించుకుంటారు. డెన్ లో వుంటే యింటి పనులన్నీ ఆడుతూ పాడుతూ చేసుకుంటారు. ఒకరి క్షేమం పట్ల మరొకరికి  లోలోపల వొక ఆతురత , కన్సర్న్.

అలా అన్జెప్పి వారి మధ్య వైరుధ్యాలు లేవని కాదు. ‘ఒకరికొకరు ఎంత అర్థమైనా కొన్నిసార్లు కొన్నిమాటలు ఇబ్బందిగానే ఉంటాయి. కాకపొతే ఆ ఇబ్బంది దీప అనిల్ ల మధ్య కొద్దిసేపే. పొరపాటును గుర్తించడం , క్షమాపణలు చెప్పుకోవడం .. లేదా క్షమాపణలు చెప్పుకోకున్నా లోపల బాధపడుతున్న విషయం ఇద్దరికీ అర్థమవడం …’  ఆ క్రమంలో వైరుధ్యాల్ని యే విధంగా పరిష్కరించుకుంటారన్నదే కథలో ప్రధానాంశం.

నిజానికి కథ వొక  వైరుధ్యంతోనే మొదలవుతుంది. అలా మొదలు పెట్టడంలోనే కథా నిర్మితిలో రచయిత పరిణతి తెలుస్తుంది. దళం నుంచి ‘సైడ్’ కి వెళ్ళినప్పుడు (అలా సైడ్ కి వెళ్ళాడానికి వుండే యిబ్బందుల్నీ దళ కమాండర్ కి తెలియజేయకుండా వెళ్తే  యెదురయ్యే ప్రమాదాల్నికూడా రచయిత కథలో ప్రస్తావించింది) వర్షంలో టెంట్ సరిగ్గా కట్టడం చేతకాలేదని  దీప అనిల్ పై విసుక్కుంటుంది. అక్కడనుంచి కథ గతంలోకి ప్రయాణం చేస్తుంది. రహస్య జీవితంలో వాళ్ళిద్దరూ నడిచిన తొవ్వలోకి రచయిత స్వయంగా మన చెయ్యిపట్టి యెటువంటి కుదుపూ లేకుండా నెమ్మదిగా  తీసుకెళ్తుంది.

అనిల్ మృదు స్వభావి. శారీరికంగా కూడా సున్నితంగా వుంటాడు. అంతర్ముఖుడు. పనిలో యెటువంటి వూగిసలాటా వుండదు. కేడర్ కు అతనంటే ప్రాణం. కేడర్ కి గానీ తన గార్డుకి గానీ పనులు చెప్పడు. నాయకత్వ స్థానంలో వుంటూ యెప్పటి కప్పుడు స్వయం విమర్శకి సిద్ధంగా వుండేవాడు.

దీపది బడాబడా మాట్లాడే స్వభావం. మాటల పోగు. మనసులో ఏదీ దాచుకోదు. కొద్దిపాటి అసహనాన్నైనా వెంటనే వ్యక్తం చేసేస్తుంది.  ఒక్కోసారి ‘పుసుక్కున మాట జారుతుంది.’ అసలు ‘లౌక్యం’ తెలీదు. ఆమెకు తన సహచరుడితో వీలైనంత యెక్కువసేపు గడపాలనీ మనసారా మాట్లాడాలనీ వుంటుంది.

కానీ అనిల్ కి ప్రేమని ప్రదర్శించడం రాదు. ఇంట్లో యిద్దరే వున్నా మాట్టాడేది తక్కువే. ఇక నలుగురిలోనో మూడో వ్యక్తి సమక్షంలోనో  భార్యాభర్తలుగా మెసలడానికి అతనికి యిష్టం వుండదు. మరీ ముడుచుకు పోతాడు. దీపతో కాసిన్ని మాటలు కూడా బందై పోతాయి. దాంతో చాలాసార్లు ఆమె నొచ్చుకుంటుంది. అవమానంగా భావిస్తుంది.  అతని యీ తత్త్వాన్ని యితరుల ముందు తనని లెక్కజేయనట్టు ప్రవర్తించే ‘మొగుడి అహంకారం’గా భావించి తప్పు పడుతుంది. ఒకసారి ఆ కారణంగా అనిల్ ఆమెని ‘బుద్ధిలేద’ని తిడడతాడు. బయట కుటుంబాల్లో స్త్రీ పురుషుల మధ్య వుండే  వుండే అసమ సంబంధాలని చూసి విసిగి  ‘వాటిని ఎదిరించి , మార్పును ఆశించి పార్టీలోకి వస్తే అక్కడా అదే పరిస్థితా’  అని ఆమె కోపించింది, బాధపడింది, దు:ఖించింది. ఆత్మాభిమానతో నిరసన ప్రకటించింది.  తన ప్రవర్తనకి అనిల్ సంజాయిషీ యిచ్చుకొంటే గానీ దీప శాంతించలేదు.

ఇటువంటి సంఘటనల్ని కేవలం మనస్పర్థగా భావించకుండా ఆత్మ విమర్శతో కుటుంబ సంబంధాల్లోని వైరుధ్యాల్ని అర్థంచేసుకొనే తమని తాము సవరించుకొనే ప్రయత్నం చేస్తారిద్దరూ. తమ ప్రవర్తనకి తాము పుట్టి పెరిగిన నేపథ్యాలెంత వరకు కారణమో విశ్లేషించుకుంటారు. అభివృద్ధి నిరోధకమైన భావజాలాన్ని వదిలించుకోడానికి సిద్ధంగా వుంటారు.  నిజానికి సహచరులు యిద్దరూ నిరంతరం యెంతో చైతన్యవంతంగా వుంటేనే గానీ వారి మధ్య అడపా తడపా చోటు చేసుకొనే వైరుధ్యాల్ని పరిష్కరించుకోలేరు.  అందుకు అవసరమైన పరిణతి కూడా వారికి వుద్యమభావజాలం నుంచే లభించిందని కథలో సూచ్యంగా పాఠకులకి తెలుస్తూ వుంటుంది. పురుషాధిపత్య భావజాలంతో నడిచే బయటి సమాజంలోని పరిస్థితికి భిన్నంగా ప్రగతిశీల శిబిరాల్లో స్త్రీ పురుష సంబంధాలు వుదాత్తంగా ఆదర్శవంతంగా వుంటాయనీ – వుండాలనీ రచయితకున్న బలమైన ఆకాంక్ష వొకటి కథ పొడవునా అంతస్సూత్రంగా కనిపిస్తుంది.

భార్య మెత్తగా ఉంటే భర్త ఆడించడం, భర్త మెత్తగా ఉంటే భార్య పెత్తనం చెలాయించడం … ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలనుకోవడం … ఒకరిని మరొకరు అణచాలని చూడటం. భార్యాభర్తల సంబంధం ఇల్లనే చిన్న రాజ్యంలో అధికారపీఠం కోసం జరిగే యుద్ధంలా’  పరిణమించడానికి గల కారణాల్ని తాత్త్వికంగా అన్వేషించే ప్రయత్నం కూడా కథలో చోటుచేసుకొంది.

భార్యా భర్తలు కూడా యెవరి స్వేచ్ఛా పరిధుల్లో వాళ్లుండాలనీ , భార్య అయినా భర్త అయినా ఎవరైనా కావచ్చు కొన్ని ‘గిరులు’ ఉండాల్సిందేననీ ,  ఆ గీతలు దాటితే ‘నేను చెప్పినట్టల్లా అవతలి వ్యక్తి వినాలి’ అనే వరకు వెళ్లి ఒకరిపై మరొకరి ఆక్రమణ ఆధిపత్యాలు చోటు చేసుకోవచ్చనీ , అది మొదలయ్యేది ప్రేమ పేరుతోనే  అనీ అనిల్ ముఖత: రచయిత చేసిన సూత్రీకరణలు వుద్యమ జీవితంలోనే కాదు స్త్రీ పురుష సమభావనలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేని  యే కుటుంబానికైనా అన్వయించుకోవచ్చు. possessiveness లోనే వొకరిపై మరొకరు అధికారాన్ని ప్రకటించే వైఖరి దాగి వుంటుందని మరోకోణాన్ని చూడగలం.

‘విప్లవకారుల్లో పరిమితులు దాటిన ప్రేమ ఏవిధంగా చూసినా అనర్థమే. ‘తామిద్దరే’ అనే స్పృహ వస్తే విప్లవోద్యమాన్ని వీడటానికి కూడా వెనుకాడక పోవచ్చు. లేదా సహచరున్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళలేని  స్థితి రావచ్చు. పార్టీలో భార్యా భర్తలిద్దరూ ఒకే దగ్గర ఉండటం అనేది అసాధ్యం.’

అనిల్ మాటల్లో భార్యా భర్తల సంబంధం కన్నా వుద్యమావసరాలూ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని బలమైన ధ్వని వుంది. లొంగుబాటుల కారణాల విశ్లేషణ వుంది. ఉద్యమకారులకి వుండాల్సిన  కర్తవ్య నిష్ఠ త్యాగ నిరతి కూడా అతని మాటల్లో వ్యక్తమవుతాయి. అదీగాక యెప్పుడు యెవరికి యేమౌతుందో తెలీని వుద్యమ జీవితంలో హద్దుల్లేని  ప్రేమ మంచిది కాదని అనిల్ ఆలోచన. సాన్నిహిత్యం పెరిగితే వుద్యమ కార్యాచరణలో అది ఆటంకంగా పరిణమిస్తుందేమోనని అతని భయం. అనిల్ ఆలోచనతో భయంతో  ఏకీభావం వున్నప్పటికీ   ‘ఎప్పుడో ఏమో అవుతదని ఉన్నంతకాలమూ మనసును కష్టపెట్టుకుంటూ ఉంటామా ?’ అని దీప వాదన.

జీవితం పట్ల ప్రేమాభిమానాల పట్ల స్త్రీ పురుషుల ఆలోచనల్లో సహజంగా వుండే తేడాని ఆవిష్కరించడానికి కరుణ కథలో యెంతో సున్నితమైన సన్నివేశాల్ని కల్పించింది.అనిల్ దీపల మధ్య యేకాంత సందర్భాల్ని చక్కగా వుపయోగించుకొంది. భావ వినిమయానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించింది. అందుకు యే మాత్రం కాఠిన్యానికి తావులేని మృదువైన  సంభాషణాత్మకమైన నిరాడంబరమైన శైలిని ఆశ్రయించింది.  కథాంశంలోని సంక్లిష్టతని కథచెప్పే పద్ధతిలోకి రానీయకుండా జాగ్రత్తపడింది.

సర్వసాక్షి కథనంలో రచయితే కథ చెప్పడంవల్ల అనిల్ దీపాల ప్రవృత్తిలోని మంచిచెడ్డల్ని, మనోభావాల్ని, బలాల్నీ బలహీనతల్నీ నిశితంగా విశ్లేషించగలిగింది. వారి అంతరంగాల లోతుల్ని తడమగలిగింది. సందర్భానుసారంగా వారి మాటల ద్వారా రాజకీయ సిద్ధాంత చర్చల్ని సైతం నడపగలిగింది. వారిద్దరి మధ్య సంభాషణలు సంవాదాలుగానో వివాదాలుగానో  పరిణమించకుండా వుద్వేగ ప్రధానంగా నడపడంలో గొప్ప సంయమనాన్ని ప్రదర్శించింది. కరుణ కంఠం దీపలో విన్పించకుండా తాటస్థ్యాన్ని పాటించింది. కానీ యిదంతా ఆమె అనుభూతిలోకి వచ్చిన విషయమేనని కథ చదువుతోన్నంతసేపూ  అనిపిస్తుంది.  జీవితాన్ని సిద్ధాంతాలతో గాక అనుభవాలతో వ్యాఖ్యానించడం వల్ల విప్లవోద్యమానికి చెందిన కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తూ కథ ఫ్రెష్ గా వుంది.

కరుణ స్వీయ వుద్యమ జీవితానుభవం నుంచే వచ్చిన కథ కావడం వల్ల ‘సహచరులు’ లో పార్టీ నిర్మాణంలో వుండే క్రమశిక్షణ గురించి దాన్ని పాటించడంలో వ్యక్తుల బలాబలాల గురించి లోటుపాట్ల గురించి , అడవిలోపల  దళాల కదలికల గురించి , బయట  డెన్  లో రహస్య పరిరక్షణ కోసం తీసుకొనే టెక్ జాగ్రత్తల గురించి పాటించాల్సిన  గోప్యత గురించి  ఆమె నిర్దిష్టంగా ప్రస్తావించిన అంశాలకు ప్రామాణికత లభించింది.    

ఆ క్రమంలో తాను నడిచి వచ్చిన వుద్యమాల బాటలో యెదురైన సవాళ్ళని చర్చకి పెట్టడానికి కూడా రచయిత్రి యెక్కడా వెనుకాడలేదు. పార్టీలో అమలయ్యే కేంద్రీ కృత ప్రజాస్వామ్య విలువల గురించి , పాత కొత్త ఆలోచనల మధ్య రేగే వైరుధ్యాల గురించి , దీర్ఘకాలిక ప్రజా యుద్ధం పట్ల నాయకత్వ స్థానంలో వున్న వారి తప్పుడు అవగాహన గురించి , క్రమశిక్షణ విషయంలో వైయక్తికంగా నాయకులు ప్రదర్శించే వుదార వైఖరి వల్ల కలిగే అనర్థాల గురించి , గ్రామాల నుంచి పట్టణాలకి వుద్యమ స్ఫూర్తి వ్యాపించాల్సిన అవసరాల గురించి దీపా అనిల్ ల మధ్య నడిచిన మాటలు సైద్ధాంతికంగా లోతుగా ఆలోచింపదగినవి. ఆ సందర్భంలో  ‘ఒక మనిషి జీవిత కాలంలో విప్లవ విజయాన్ని చూడాలి’   వంటి వ్యాఖ్యలు ప్రత్యేకంగా పరిశీలించాల్సినవి.

నిజమే అటువంటి బలీయమైన ఆశ వుంటేనే విప్లవాచారణలో స్థిరంగా నిలబడగల్గుతాం. కానీ రాజ్యాధికారమే అంతిమ విజయమైతే అది వొక మనిషి జీవిత కాలంలో సాధ్యం కావచ్చు – కాకపోవచ్చు. విప్లవ విజయాన్ని తమ జీవితంలో చూడలేక ఆచరణనే తప్పుబట్టే ప్రమాదం వుంది. అందుకే విప్లవాచారణలో స్వల్పకాలిక లక్ష్యాలనూ దీర్ఘకాలిక లక్ష్యాలనూ యెప్పటికప్పుడు నిర్వచించుకుంటూ ఫలితాల్ని మూల్యాంకనం చేసుకుంటూ ముందుకు సాగాల్సి వుంటుంది.

రహస్యోద్యమాల్లో పనిచేసే ఆడ మగా మధ్య లైంగిక విశృంఖలత్వం గురించి జరిగే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా కథలో వొక సందర్భాన్ని రచయిత ప్రత్యేకంగా సృష్టించుకొంది. వస్త్వైక్యత చెడకుండా అది కథలో వొదిగి పోయింది. కథకి లోతుతో పాటు విస్తృతిని కల్గించింది. నిండుదనాన్నిచ్చింది.

స్త్రీ పురుషులు విచ్చలవిడి సంబంధాలకోసం  చావుకు సిద్ధపడి విప్లవం బాట పట్టాల్సిన అవసరం లేదనీ , నిజంగా అటువంటి సంబంధాలు పార్టీలో ఉంటే అందులో పడి కొట్టుకుపోతారు తప్ప విలువలకోసం  ప్రజల తరపున నిలబడి పోరాడలేరు – నిర్బంధాన్ని తట్టుకోలేరనీ చెబుతూ దీప అటువంటి ‘సంబంధాల కోసమైతే బయటే ఉండొచ్చుగా’  అని మరో మాట అదనంగా అంటుంది.

‘ఉద్యమంలో దోపిడీ పీడనల అంతం ఒక్కటే కాదు. పురుషుడికి మల్లే స్త్రీకి స్వేచ్ఛా సమానత్వం ఉండాలని కోరుతున్నామంటే అర్థం  …  అనైతిక సంబంధాల విషయంలో కాదు. దంపతీ వివాహం ఉన్నతమైందని పార్టీ నమ్ముతుంది. అమలు చేస్తుంది.  ఊహల్లో ప్రేమతో కాదు , నిజమైన ప్రేమతో సహచరులు కలిసి ఉంటారు.’ అని ఆమె ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్య గమనించదగింది.

పార్టీలో యెట్టి పరిస్థితుల్లోనూ అనైతిక సంబంధాల్ని అంగీకరించరని బలంగా చెప్పడమే  ఆమె వుద్దేశం. నిజానికి యే యిద్దరు స్త్రీ పురుషుల మధ్య సాన్నిహిత్యం ఏర్పడినా వెంటనే వాళ్లకి పెళ్లి చేసేయడం కమ్యూనిష్టు వుద్యమాల్లో మొదటి నుంచీ వుంది. దీన్ని నైతికత విషయంలో భూస్వామ్య విలువల నుంచీ బయటపడక పోవడంగానే భావించే వీలున్నప్పటికీ బయటి వాళ్లకి వేలెత్తి చూపే అవకాశం యివ్వడం పార్టీకి కీడు చేస్తుందని వాళ్ళ నమ్మకం.

 విప్లవ పార్టీల రాజకీయ ఎజెండాలో స్త్రీల నిర్దిష్ట సమస్యలకి చోటులేకుండా పోతుందనే విమర్శకి కూడా రచయిత దీప ఆలోచనల ద్వారా సమాధానం చెప్పించి వుంటే బాగుండేది కానీ కథలో ఫోకస్ పాయింట్ పక్కకి పోయే ప్రమాదం వుంది. అది మరో కథకి వస్తువౌతుంది. కథ మాత్రమే చెప్పాలన్న స్పృహ కథా రచయితకి వుండటం వల్ల ప్రయోజనమిది.

 

దీప అనిల్ మధ్య మాటల్లో సాహిత్య విషయాలెన్నో చోటు చేసుకునేవి. నిజానికి మాటల్లో యెంతో పొదుపరి అయిన అనిల్ సాహిత్యం గురించి , సిద్ధాంతం గురించి మాట్టాడాల్సి వస్తే మాత్రం గొప్ప ప్రవాహ శీలి అయిపోతాడు. కథ గురించి అతనికి నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. ‘ఎవరూ ఎన్నుకోని వస్తువుని ఎన్నుకున్నప్పుడే కథ నిలుస్తుందనేవాడు. వస్తువు పాతదాన్నే ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు కొత్త ముగింపునో , కొత్త శైలినో ఎన్నుకోవాలి అనేవాడు. శిల్పం గురించి అవసరం లేదంటారు కానీ చెప్పే పధ్ధతి బాగుండాలి…’ కథలో వస్తు శిల్పాల ప్రాధాన్యాల గురించిన అనిల్ ఆలోచనలు రచయిత్రివే  ( వాటి వెలుగులో కరుణ కథల్ని ప్రత్యేకంగా  అధ్యయనం చెయ్యొచ్చు ).

అందుకే కథ ముగింపు విషయంలో కూడా కరుణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. చివరికి సామరస్య వాతావరణంలో  ‘కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ’ అని అనిల్ నవ్వుతూ అంటే  , ‘పితృస్వామ్యం నశించాలి’ అని దీప రిటార్ట్ యివ్వడంతో కథ ముగుస్తుంది. ఐక్యత – ఘర్షణ – ఐక్యత అన్న గతితార్కిక అవగాహనని అతి సున్నితంగా ఆవిష్కరించిన ముగింపు పెదాలపై నవ్వు పూయిస్తుంది. ఉద్యమాల్లోనే కాదు ; యెక్కడైనా స్త్రీ పురుష సంబంధాలు అసమానతలకీ ఆధిపత్యాలకీ తావులేకుండా సంతోషమయంగా వుంటే బావుంటుంది గదా అని అనుకోకుండా వుండలేం.

ఇప్పుడిహ  యిది యే అస్తిత్వ వాదానికి చెందిన కథో అని విమర్శకులు విద్యాత్మక పరిశోధనలు మొదలెట్టొచ్చు. ఇదంతా శత్రు వైరుధ్యమా మిత్ర వైరుధ్యమా అని తలలు బద్దలుకొట్టుకొనే వాళ్ళని వాళ్ళ  మానానికి  వొదిలేసి కరుణ తన యెరుకలోకి వచ్చిన  జీవితాన్ని కథలుగా మలిచే కృషిని యిలాగే నిరంతరం కొనసాగించాలని  కోరుకుంటున్నాను. విప్లవోద్యమ సాహిత్యానికి కరుణ లాంటి రచయితల అవసరం యెంతైనా వుంది.