ప్రజల కష్టాలే కొలబద్ద: పి. చంద్

chandగత ముప్పై ఏండ్ల నుంచి సింగరేణి కార్మికుల కష్టాలను, ఆశలను, ఆకాంక్షలను అక్షరీకరిస్తున్న, తెలుగులో మొట్ట మొదటి ఏకైక కార్మిక వర్గ రచయిత పి.చంద్ గారు… శేషగిరి, అంతర్జాతీయ శ్రామిక యోధుడు కే.ఎల్ మహేంద్ర, శ్రామిక యోధుడు, ఒక కన్నీరు, నెత్తుటి ధార, విప్లవాగ్ని, హక్కుల యోధుడు బాల గోపాల్, తెలంగాణ సాయుధ రైతాంగ యోధుడు బండ్రు నర్సింహులు, తెలంగాణ, నల్లమల, మేరా సఫర్(జి.వెంకట స్వామి జీవిత చరిత్ర) వంటి నవలలు మరియు భూనిర్వాసితులు, సమ్మె, జులుం, గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు వంటి కథా సంపుటాలు ప్రచురించి ప్రచారార్భాటాలకు దూరంగా ఉండి పోయారు. సింగరేణి ఉద్యోగానికి గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి, గోదావరిఖని యైట్ ఇంక్లైన్ కాలనీలో తన క్వాటర్ లో ఉండి, సైకిల్ తొక్కుతూ సింగరేణి జీవితాల్ని నిశ్శబ్దంగా గమనించి రచనా ప్రస్థానం కొనసాగిస్తున్న పి.చంద్ ఉరఫ్ యాదగిరి ఈ మధ్య తన జన్మస్థలం వరంగల్ కు మారినారు. వారితో బూర్ల వేంకటేశ్వర్లు జరిపిన ఇంటర్వ్యూ….

ప్ర…చంద్ సార్ మీ సాహిత్యానికి ప్రేరణ ఎక్కడ మొదలైంది?

జ…సాహిత్యానికి గాని దేనికి గాని మనిషి జీవితమే పునాది. మనం బతికిన జీవితం మనం చూసిన రచనలకు ప్రేరణ కలిగిస్తది, ముఖ్యంగ ఏందంటే, కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గాబట్టి, మా నాయిన ఆజంజాహి మిల్లు లోపట పనిజేసిండు గాబట్టి, చిన్నప్పట్నుంచి గూడ కార్మిక కుటుంబాల్లో ఉండే సాధక బాధకాలు ఏందో తెలుసు, రెండోది ఏందంటే ఒక చారిత్రిక దశలోపట మనం బతికినం, డెబ్బై ఎనబై దశకం లోపట సమాజంలో ఒక చలనం మొదలైంది. ఎక్కడో ఒక సామాన్యునికి ఏదో జరిగితే వీథులల్లోకి వచ్చి కొట్లాడే రోజులు. ఇయ్యాల్ల పక్కింటోడు చచ్చిపోతాండంటే గూడ పట్టిచ్చుకొని పరిస్థితి. సమాజం ఒక అలజడికి గురవుతున్న తరంలో పుట్టినం, ఈ సమాజాన్ని అధ్యయనం చేయడమనేది జీవితంలో భాగమైంది. అదిగాకుంట ఆ రోజులల్లోనే ఈ సమాజం మార్పు కోసం ఎంతో మంది యువకులు వచ్చినట్టు మేం గూడ వచ్చినం, ఎమర్జన్సీలో ఎంతోమంది లాకప్ లకు, జైళ్ళకు పోయి వచ్చిన సంఘటనలు గూడ ఉన్నయ్.

ఈ నేపథ్యమేదైతే ఉన్నదో, అంటే కార్మిక వర్గ జీవితం, మనం బతికిన కాలం, దానికి తోడు నిరంతర అధ్యయనం ఇవన్నీ ప్రేరణే. వరంగల్ సెంట్రల్ లైబ్రరీకి సైకిలేసుకొని పొయ్యేది. ఇప్పటిగ్గూడ సైకిలే తొక్కుతున్న, బండి జీవితంల వాడలే!. అప్పుడున్న అన్ని లైబ్రరీలల్ల నాకు మెంబర్ షిప్ ఉండేది. మన అభిరుచికి అనుగుణంగ తత్త్వ శాస్త్రం, ఆ తర్వాత జీవితానికి సంబంధించిన సాహిత్యాన్ని, ప్రామాణికంగా వచ్చిన ‘గోర్కీ’ కావచ్చు , రష్యన్ నవలలు, చైనీస్ నవలలు గూడ వచ్చినయ్. ఇట్లా అనేక పుస్తకాలు చదివే వాణ్ణి.

తర్వాతేమయిందంటే, పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టైంది నా పరిస్థితి. నేనచ్చి మల్ల సింగరేణి ప్రాంతంల ఉన్న, అప్పుడే సింగరేణిల ఎమర్జెన్సీ ఎత్తేసిండ్లు అయితే ఆ అణచివేత నుంచి, తిరుగుబాటు ఉద్యమ రూపం సంతరించుకున్న క్రమంల నేనిక్కడ ఉన్న, అందువల్ల సింగరేణిల విప్లవోద్యమానికి ఒక ప్రత్యక్ష సాక్షిని, ఐ విట్నెస్ అన్నట్టు. దానితోనేమయిందంటే మనం మరింత పదునుదేరడానికి మన ఆలోచన పదునుదేరడానికి సాధ్యమైంది. ఒక విప్లవకారుని గురించి రాయాల్నంటే ఎప్పుడు గూడ ఊహల్లో రాయలేం!, ఒక రిక్షా కార్మికుని గురించి రాయాలంటే వాని సాధక బాధకాలు, వాని కష్టం సుఖం అన్ని గూడ ప్రత్యక్షంగ చూసన్న ఉండాలె, పరిశీలించన్న ఉండాలె, అనుభవించన్న ఉండాలె. అట్ల ఉంటే మాత్రమే లైవ్లీగ వస్తది. లేకుంటే వాళ్ళ జీవితం వేరుంటది, మన బుర్రలో పుట్టినట్టత్తది, ప్రామాణికంగా నిలబడలేదు. యాబై ఏండ్ల కింద నేను పుట్టక ముందు సమయంలోపట ఉన్న శేషగిరిరావు అనే ఒక విప్లవకారుని గురించి నేను లైవ్ లీ గ రాయగలిగిన అంటే, విప్లవకారుల స్వభావం ఏం ఉంటది, వాళ్ళ త్యాగ నిరతి ఎట్ల ఉంటది, ప్రజలకోసం ఎంత అంకిత భావంతో పనిజేస్తరు, ఎటువంటి కష్టాల్నేదురుకుంటరు. అనే దృశ్యాల్ని నేను చూసిన, కాబట్టి నాకు తేలికైపోయింది, శేషగిరిరావు ప్లేస్ లోపట నేను చూసిన ఏదో ఒక విప్లవకారున్ని పెట్టిన కాబట్టి లైవ్లీ గ రాయగలిగిన.

ప్రశ్న… చంద్ సార్! మీరు కార్మికుల  హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి శేషగిరి రావు, కే.ఎల్.మహేంద్ర, బాలగోపాల్, బండ్రు నర్సింహులు మొదలైన వారి జీవితాలను నవలలుగా రాసిండ్రు గద, మీ ఈ కృషి వెనుక నేపథ్యం  గురించి చెప్పుతరా?

జవాబు….. తెలంగాణ సాయుధ పోరాటం మీద చాలా మంది గొప్ప రచయితలు సుమారు ఇరువై రెండు నవలల దాకా రాస్తే, అందులోపట మొట్ట మొదటి సారిగా తె.సా.పోరాటం నేపథ్యం లోపట కార్మిక వర్గ లిటరేచరచ్చింది. అది పందొమ్మిది వందల నలబై లోపట స్టార్టయ్యింది. వాస్తవానికి ఏమైందంటే, పద్దెనిమిది వందల ఎనబై లోపట సింగరేణి స్టార్టయినప్పటికి గూడ పందొమ్మిది వందల నలుబై వరకు ఎటువంటి యూనియన్ యాక్టివిటీస్ లేవు. అంటే, ఒక యాబై సంవత్సరాలు ఎటువంటి యూనియన్ యాక్టివిటీస్ లేవు. ఎందుకంటే, ఫ్యూడల్ రాచరిక వ్యవస్థ, బ్రిటీష్ యాజమాన్యం, ఒకటి వలసవాద పాలన రెండోది ఫ్యూడల్ దోపిడీ, ఇవి రెండు ఎటువంటి ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ లేకుండా అణచివేసినయ్.

అటువంటి నేపథ్యం లోపట, ఎప్పుడైతే ఆంద్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతూ వచ్చిందో వాళ్లు కార్మిక రంగం మీద కాన్ సన్ ట్రేట్ చేసి పని చెయ్యడం మొదలైంది. ఆ నేపథ్యంలోపట మగ్దూమ్ మొహియుద్దీనేమో హైద్రాబాదులోపట పరిశ్రమించిండ్రు. వరంగల్ జిల్లా ఆజం జాహిమిల్ ప్రాంతం లోపట సర్వదేవ భట్ట రామనాథం,  శేషగిరిరావు అనేటాయినేమో సింగరేణి లోపట మొట్ట మొదటి సారి యూనియన్ స్థాపకుడైండు. అయితే అప్పుడు నలబై ఆ ప్రాంతం లోపట  చరిత్రలో దాదాపు ఒక వందమంది ఆనాటి సాయుధ పోరాటం లోపల కార్మికులు పార్టిసిపేషన్ చేసి చనిపోయిండ్రు. కని, వాళ్లకు సంబంధించి రికార్డు ఎక్కడా చరిత్రలో నమోదుగాలే. ఒక సుందరయ్య రాసిన తెలంగాణా సాయుధ పోరాటం గుణపాఠాలు లో మాత్రం శేషగిరిరావు గురించి ఒక పేజీ, పేజీన్నర మ్యాటరున్నది. అంతకుమించి సమాచారం ఎక్కడా చరిత్రలో రికార్డు కాలేదు. ఆ తరం వాళ్ళలోపట శేషగిరిరావు సార్ కు కార్మిక వర్గం లోపట పెద్ద పేరున్నది. ఇప్పటికీ, ఆయన అట్ల చేసిండు, ఇట్ల చేసిండు అని చెప్పుకుంటరు. చనిపోయే నాటికి ఆయన వయసు  ముప్పై ఏండ్ల లోపట్నే. ఆ నేపథ్యం లోపట విప్లవోద్యమం ఏం చేసిందంటే పాత చరిత్రను తవ్వి తీసే క్రమం లోపట కొమురం భీం చరిత్రను తీసుకచ్చింది. అట్లాగే ఇక్కడ గూడ సింగరేణిలో విప్లవోద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో పాత చరిత్రను తవ్వి తీసుకునే క్రమం లోపట శేషగిరిరావు గురించి ఈ కార్మికుల్లో ఉన్న బహుళ ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అన్వేషణ చెయ్యడం జరిగింది. దాదాపు ఒక నూరు నూట యాబై మంది ఆ తరం వాళ్ళను ఇంటర్వ్యూ చేసిన. అసలు ఏంజేశిండు ఆయన, ఎట్ల జేశిండు, ఏ సమస్య మీద ఎట్ల కొట్లాడిండు, అప్పటి పరిస్థితులు ఎట్ల ఉండేది అని సమగ్రంగ, ఒక ఐదారు సంవత్సరాలు ఇదే పనైపోయింది. అంటే, ఒక రిసెర్చ్ వర్క్ లాగ ఐపోయింది. ఆ తర్వాత దాన్ని తీసుకొన్న, అది రిపోర్ట్ గ రాస్తే దానికి విలువ ఉండది.

ఫిక్షన్ మనిషి హృదయానికి సంబంధించిన విషయం మనిషి హృదయం లోపట ఒక ముద్ర వేస్తదన్నమాట. అంటే, అది డాక్యుమెంటేషన్ కు పరిమితం చెయ్యలేదన్న మాట. అట్లగాకుంట ఏం జేసిన్నంటే దీన్ని విశ్లేషణ జెయ్యాల్నని జెప్పి వందలాది పాత్రల తోటి అప్పటి పరిస్థితులు, అప్పటి బొగ్గుబాయి పరిస్థితులు, అప్పటి భౌతిక పరిస్థితులు, అప్పటి కార్మికుల కష్టాలు, వాళ్ళ ఆరాటాలు, వాళ్ళ పోరాటాలు, ఆ నిర్బంధాలు ఇవన్నీ మొత్తం గలిపి శేషగిరి నవల రాసిన. అందుకోసం ఏందంటే తెలుగు సాహిత్యం లోపట వచ్చిన సాహిత్యం లోపల “శేషగిరి” నవల అంత విస్తృత క్యాన్వాస్ తోని, ఒక ఉద్యమం ఎట్ల నిర్మించబడుతుంది, ఉద్యమ కారులు ఎట్లా ఉద్యమాల్ని నిర్మిస్తరనిజెప్పి ఇంత బ్రాడ్ కాన్షియస్ తోని వేరే నవల లేదని చెప్పి విమర్శకులు అంటరు.

ప్ర… “హక్కుల యోధుడు బాల గోపాల్”  ఏ నేపథ్యంతోని రాసిండ్రు?

జ… బాల గోపాల్ ను ఒక ఆలంబనగ చేసుకొని సింగరేణి ప్రాంతంలో స్టేట్ చేసిన రిప్రెషన్ ను రాసిన, రాజ్యం కార్మిక వర్గం మీద చేసిన దాడిని రాసిన, ఆయనను ధారలాగ పెట్టుకొని రాసిన. ఆయనతో వ్యక్తిగతంగా తిరిగిన కాబట్టి ఆయన ఎట్లా విషయాల్లో అప్రోచవుతడనడానికి లైవ్లీనెస్ రావడానికి అది దోహదపడ్డది. ప్రమాదాలు, ఎన్ కౌంటర్లు, ప్రభుత్వ నెగ్లిజెన్స్ ఆధారంగా చేసుకొని రాసిన. ప్రతి విషయాన్ని గూడ ప్రజల పక్షాన తీసుకొని రాసిన.

ఇయ్యాలటి రోజుల్ల సాహిత్యంలో ఉన్న ఈ గ్యాప్ ను పూర్తి చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగ లేరు. బాలగోపాల్ పై స్టేట్ రిప్రెషన్ గురించి రాయాలనుకో అసలు స్టేట్ రిప్రెషన్ ఏం జేసిందో తెల్సి ఉండాలె గద!, తెలిసినా దాన్ని ఆ ఫామ్ లో పెట్టాలె! పాఠకునికి హృదయానికి నాటుకునేలాగ, చొచ్చుకుపొయేలాగ, అయ్యో! గింత ఘోరం జరిగిందా! అని అనిపించేలాగ రాసిన. నేనేదైతే ఫీలయ్యిన్నో , అది పాఠకులకు కన్వేజెయ్యటం కోసం ఈ మాధ్యమాన్ని ఎన్నుకొన్న. స్టేట్ లో ఫలానప్పుడు ఎన్ కౌంటర్ జరిగింది, బాలగోపాల్ సార్ అచ్చి మాట్లాడిండు అన్న విషయం కంటె గూడ, ఆ ఎన్ కౌంటర్, ఆ భీభత్సం, ఆ దుక్కాన్ని పాఠకునికి అందియ్యదల్సుకున్న, అందుకోసం ఈ ఫిక్షన్ ఫామ్ అనేది ఆలంబన చేసుకొని రాయడం జరిగింది.

ప్ర…మీరు కార్మిక వర్గ చరిత్ర నిర్మాణం కోసం కథ, నవల ప్రక్రియలను తీసుకున్నరు, కానీ కార్మికులంటే సామాన్య ప్రజలు వాళ్ళెప్పుడు పనిలోనే నిమగ్నమై ఉంటరు. చదివే అంత తీరిక ఉండదు కదా! పాట దిక్కు మొగ్గు చూపుతరు అనుకుంట – మీరు ఎన్నుకున్న ప్రక్రియ ఎటువంటి ప్రయోజనాల్ని నెరవేర్చింది?

జ…పాటకుండే పరిమితి పాటకుంటది. పాట ఇమిడియేట్ గా మనిషి హృదయంలోకి చొచ్చుక పోతది. కానీ, దాని ప్రయోజనం తాత్కాలికం. నేను కేవలం ఫిక్షనే రాయలే, చరిత్రను కూడ రికార్డు చేసిన. దాదాపు పదిహేను ఇరువై పుస్తకాలు నేను సింగరేణి కార్మికుల జీవితాల మీద రాసిన, ఉదాహరణకు తరతరాల పోరు, సంస్కరణలు ఒక పరిశీలన, వేజ్ బోర్డులు మొ.. వాటిమీద రాసిన. వనరుల తరలింపు క్రమంలోపట, సింగరేణి ప్రాంతంలోపట  ఆంధ్రా వలసవాద దోపిడీ ఏవిధంగా జరుగుతంది, ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా ఎందుకు పోరాటాలు జరుగుతున్నాయి, ఓపెన్ కాస్ట్ వల్ల జరిగే బీభత్సమేమిటి ఇట్లా చాలా పుస్తకాలు రాసిన. అయితే గమ్మతైన విషయమేందంటే సింగరేణి ఎంప్లాయ్ గ ఉండటం వలన వాటిని నాపేరు మీద వేసుకునుటానికి అవకాశం లేకుంట పోయింది. మారుపేర్లతో వచ్చినయ్. ఇంకో గమ్మతేందంటే సంస్కరణలనేవి భారతదేశం మొత్తం మీద పందొమ్మిది వందల తొంబై ఒకటి తర్వాత జరిగినయ్. వీటిని ఒక కేస్ స్టడీ లాగ సింగరేణిలో ఎలాంటి పరిణామాలు వచ్చినాయని ఎవరూ రాయలేదు. సంస్కరణలు ఒక పరిశీలన అని పుస్తకంగ రాసిన. దాన్ని పిట్టల రవీందర్ పేరు మీద ఒక పుస్తకంగ వేస్తె దానిమీద కంపెని బాగ షేకయ్యింది. భావజాల పరంగా ఒక ఆందోళన మనిషికి రావాల్నంటే ముందు మానసికంగా ఆందోళనకు సిద్దం కావాలె . అందుకే జయ శంకర్ సార్ “భావజాల ప్రచారం”, “ఆచరణ” అన్నడు. ముందు మనం చేస్తున్నది న్యాయమైంది, చెయ్యాలనుకునే ఒక ఆకాంక్ష పుట్టినప్పుడు, నువ్వు చేయడానికి సిద్ధపడితే మార్గం అదే దొరుకుతుంది. భావజాల పరమైన మార్పు రాకుంట ఆచరణకు పొయ్యే అవకాశం ఉండదు.

మళ్ళీ మొదటికి వస్తే రచయితకు ఉన్న అభిరుచిని బట్టి కావచ్చు, కాపెబులిటీ కావచ్చు, పాట రాయాల్నంటే పాటగాడై ఉండాలె. పాటగాడై ఉంటే ఆ పాటకు ట్యూన్ దొరుకుతది. చాలా వరకు పాటగాళ్ళు మాత్రమే పాటలు బాగా రాయగలిగిండ్రు. ఎవలన్న ఒకలిద్దరు రాసినప్పటికి గూడ వాళ్ళంత బలంగ రాయలేకపోయిండ్రు. తెచ్చిపెట్టుకున్నట్టై పోయింది. కాబట్టి కథా, నవలా రచన మేధోపరమైనది. ఉద్యమాలు ఆకాశం నుండి ఊడిపడయి, ఉద్యమాలు ఎందుకు పుట్టినయ్, దాని భౌతిక పరిస్థితులేమిటి, సమస్యకు దారితీసిన పరిస్థితులేమిటి దాని నేపథ్యమేమిటి, దాన్ని మార్చుకోవడం కోసం వాళ్ళెటువంటి పోరాటం చేసిండ్రు, వాళ్ళ వైఫల్యాలేమిటి, సక్సెస్ లేమిటి, అంతిమంగ ఏం జరిగింది. ఇట్లాంటి విషయాలను ఎంత లోతుగా అధ్యయనం జేస్తే అంత బాగ చెప్పగలం. ఇలా ప్రతి పుస్తకం వెనుక ఇటువంటి మేధోపరమైన శ్రమ ఉన్నది.

ప్ర… సార్!  ఊరుగొండ యాదగిరి గా ఉండే మీరు పి.చంద్ గా మారడానికి, కార్మిక, వీరమల్లు, కే.రమాదేవి, ఉదయగిరి, ఏ.చంద్ర శేఖర్, వి.హరి, గోపి, వినీల్ చైతన్య మొ..ఇరవై దాకా కలం పెర్లతోని రాయడానికి కారణమేంది?

జ…ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగ లేకుంటే దోపిడీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగ ఉన్నటువంటి భావజాలాన్ని గూడ వాళ్ళు సహించలేని పరిస్థితి, తీవ్రంగ అణచివేసే పరిస్థితి, చిన్న కాయిదం ముక్క దొరుకుతే గూడ చంపేసిన సంఘటనలున్నయ్ సింగరేణి ప్రాంతంలోపట, దేశ వ్యాప్తంగ గూడ… అటువంటి పరిస్థితిలోపట మనం చూస్తున్న జీవితం, మనం అనుభవిస్తున్న జీవితం, మన చుట్టూ జరుగుతున్న వాతావరణం ఒక రచయితగా నన్ను ఖాళీగా ఉంచలేకపోయింది.

ఉదాహరణకు మన రోడ్డు మీద ఎవరో పిల్ల అడుక్కుంటున్నదనుకో చూసే వరకు జాలి అనిపిస్తది. అయ్యో! చిన్నపిల్ల ఆకలితోటి ఉన్నట్టున్నదని రూపాయో రెండో ఇయ్యాలనిపిస్తది ఎందుకు? మానవత్వంతోనే కదా!, అట్లనే మన చుట్టూ జరుగుతున్న జీవితాల్ని చిత్రించే క్రమంలోపట మనం రచనలు చేస్తం. ఉదాహరణకు ఒక వేశ్య గురించి ఒక రచయిత రాసిండు. రాసినంత మాత్రాన ఆ రచయిత వేశ్య కాలేడు గద, ఆమె జీవితం దుర్భరంగ ఉందని ఏదో జాలిపడిపోయి, అరె ఒక ఆడామె ఇంత అధ్వాన్నంగ బతుకుతంది అని, ఆ బాధను తనకు తెలిసిన ఫాం లోపట వ్యక్తీకరిస్తడు… అట్ల వేశ్య గురించి రాస్తే నిన్నెవరు పట్టించుకోరు. కని మార్పు కోసం కొట్లాడుతున్న ఒక కార్మికుని గురించో, ఉద్యమ కారుని గురించో రాస్తే ప్రభుత్వం పట్టించుకుంటది. దీన్ని ఏవిధంగ అర్థం జేసుకోవాలె? అటువంటి పరిస్థితిలోపట ఒక సామాన్యమైన జీవితం గడుపుతూ ఈ స్టేట్ కు వ్యతిరేకంగ రాస్తున్న క్రమంలోపట, మన ఒళ్ళు మనం కాపాడుకోవడానికి ఈ మారుపేర్లు వాడుకోవాల్సి వచ్చింది. కొన్ని త్యాగాలు చెయ్యాల్సి వచ్చింది. ఎవ్వరూ రాయనంతగా విప్లవోద్యమం మీద రాసి గూడ, ఎవరికీ తెలియకుంట ఉన్న పరిస్థితి కొన్నేండ్ల వరకు ఉండిపోయింది. ఈ మధ్య “గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు” కథా సంపుటి వచ్చిన తర్వాతనే ఓహో ఈయనే ఇవన్నీ రాసిండని తెలిసి వచ్చింది.

ప్ర…సరే! అప్పటి అలజడి నుండి, కార్మికోద్యమాల నుండి, అనుభవించిన జీవితం నుండి ఇన్ని రచనలు వచ్చినయ్ గదా! ఇప్పుడు గూడ విధ్వంసం కొనసాగుతనే ఉన్నది? ఓపెన్ కాస్ట్ ల రూపంలో మరింత జీవన విధ్వంసం జరుగుతున్నది. దీనిమీద ఏమన్నా రాసిండ్ర మీరు?

జ…. అసలు ఓపెన్ కాస్ట్ ల మీద జరుగుతున్న విధ్వంసం గురించి మొట్ట మొదట రాసింది నేను. ఇయ్యాల్ల ఓపెన్ కాస్ట్ ల గురించి ఎవరు మాట్లాడుతున్నా, అది చంద్ రాసిన విషయాలను తప్ప అదనంగా ఏం మాట్లాడుతలేరు, ఓపెన్ కాస్ట్ ల విషయంలోపట నేను రాసిన పుస్తకాలే, అంటే రూట్ లెవల్లోపట అధ్యయనం జేసిన చెప్పిన విషయాలే…. “భూ నిర్వాసితులు” అనే కథల సంపుటి నా మొట్టమొదటి కథల సంపుటి. అది మొత్తంగ గూడ ఓపెన్ కాస్ట్ ల వల్ల నిర్వాసితులైన ప్రజల యొక్క జీవితాలను చిత్రించింది. అక్కణ్ణుంచి మొదలుకొని “భూదేవి” అనే నవల (ఇంకా ప్రింట్ కాలేదు) ఏందంటే ఓపెన్ కాస్ట్ వల్ల నిర్వాసితురాలైన ఒక గ్రామాన్ని కేంద్రంగా తీస్కొని, ఒక మధ్య వయస్కురాలైన భూదేవిని పాత్రగా పెట్టుకొని, ఆ మొత్తం భూమికి ఈమెను ఒక రిప్రజెంటేటివ్ గ పెట్టుకొని, ఆమె జీవితాన్ని తీసుకొని రాసిన… అంటే సామాన్యుల జీవితాలు ఎట్లుంటయ్… కొడుకు పిల్లలు మంచిగా బతుకాలనుకుంటరు… కానీ అవన్నీ వీళ్ళ ప్రమేయం లేకుంట, ఉన్న భూములు కోల్పోయి, కూలీ నాలీ జేసుకొని బ్రతికే పరిస్థితులు.. యిట్లైతే మాజీవితం అన్యాయమైపోతది గదా అని, దానికి వ్యతిరేకంగ వాళ్ళు జేసే పోరాటాలు, అవి ఎట్లా నిష్ప్రయోజనమైతున్నయ్, ఎట్లా నిర్బంధాలకు గురైతుండ్రు, ఎట్లా నలిగి పోయిండ్రు అనే విషయాన్ని… అంటే సామాన్యులు భూములు కోల్పోవడం వలన, ఓపెన్ కాస్ట్ ల వల్ల బతుకు కోల్పోవడం వలన ప్రజలు పడే బాధల్ని “భూదేవి” నవలగ రాసిన…

అట్లనే “దేవుని గుట్ట” అనే నవల కరీంనగర్ జిల్లలోని గ్రానైట్ క్వారీస్ గురించి రాసిన. ఇవన్నిట్ల ఉద్యమంల పనిచేసిన వాళ్ళ ప్రత్యక్ష అనుభవాల్నే రాసిన. అందుకే ఇవన్నీ ఎక్కడో ఒకచోట విన్నట్టు, చూసినట్టు  అనిపిస్తయ్. ఇవన్నీ శకలాలు శకలాలుగ ఉన్నయ్… నేను వాటన్నిటినిదీసుకచ్చి ఒక కుర్చీగానో, బెంచీగానో తయారు చేసిన, ఒక కర్ర అక్కడ పడి ఉందంటే, అరె! ఇది వంక కర్ర చెయ్యికి బాగ పనిజేస్తదని తీసుకచ్చుకొని వాడుకున్న… నాకు ఇటువంటి రచనలు చేయడమంటేనే ఇంట్రెస్ట్ అనిపిస్తది… నా మనుసుకు  సంతృప్తి అనిపిస్తది…

ప్ర… అభివృద్దిలో భాగంగా గ్రానైట్ క్వారీస్, సింగరేణి కాలరీస్ ఇట్లా సహజ వనరులను వెలికి తీసి అభివృద్ధి చేస్తున్నమని ప్రభుత్వాలు చెప్తున్నయ్! సింగరేణి ఎట్లనో గ్రానైట్ ను గూడ అట్లనే చూడవలసి వస్తే అది ఎంత వరకు సబబు? అభివృద్ధికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?

జ… ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అందరు అభివృద్ధి గావాలె అభివృద్ధి గావాలె అంటున్నరు. బొగ్గు కావాల్నంటే ఓపెన్ కాస్ట్ లు జేస్తే అభివృద్ధి ఐతది.. అవసరాలు తీరుతయ్ అంటున్నరు. కానీ, ఒక విషయం ఫండమెంటల్ గ గుర్తుంచుకోవల్సిందేందంటే రెండు అంశాలున్నయ్. ఇండ్ల ఒకటేమో అభివృద్ధి గురించి… ఎవరికి అభివృద్ధి? కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు కొద్దిమంది అభివృద్ధి ఒక పక్కకు… ఏదైన అభివృద్దే గాబట్టి, తలసరి ఆదాయం విషయంలో వానికొక లక్షరూపాయలస్తే నీకు పది రూపాయలచ్చినగానీ  ఇద్దరికీ యాభైవేలైతయనేది ఒక అభివృద్ధి సూత్రం.. అదొక అంశం… రెండోది ఏందంటే అభివృద్దంటే ఏంటి… అసలీ ప్రాంతంలోపట వేల సంవత్సరాలుగా మనుషులు బతికిన ప్రాంతాన్ని భవిష్యత్తులోపట మనుషులు బతుకకుండా ఒక ఎడారిగా మార్చేది ఎట్లా అభివృద్ది ఐతది?.. ఒక విధ్వంసాన్ని సృష్టించి, తాత్కాలిక లాభాలకు, గోరంత లాభం కోసం కొండంత నష్టం జేసేది అభివృద్ధి ఐతదా?.. నిజంగా… మనిషి బతుకాల్నంటే వనరులు గావాలె, భూమి ఉండాలె, భూమ్మీద ఫార్మేషన్ ఏర్పడుతా ఉంటది, మానవులు గాని, జంతుజాలం జీవించడానిగ్గాని, వృక్షాలు పెరగటానిగ్గాని, కొన్ని వేల సంవత్సరాల పరిణామ క్రమంల ఆవిర్భవించింది భూమి… అటువంటి భూమిని తలకిందులు జేసి, మనుషులు, జంతువులు,వృక్షాలు బతుకకుండజేసేదాన్ని ఎట్లా అభివృద్ధి అంటం?..తల్లకిందుల అభివృద్ధి అభివృద్ధి గాదు…

ప్ర…మీరు సింగరేణి కార్మికుల గురించి, సంఘాల గురించి ఎన్నో కథలు రాసిండ్రు గద, ఒకప్పుడు చాలా బలంగా ఉండి ఉమ్మడిగా పోరాటాలు చేసిన కార్మిక సంఘాలు  ఇప్పుడు ఎట్ల పనిజేస్తున్నయ్?

జ.. ప్రధానంగ ఏందంటే… మనకు ఒక వంద సంవత్సరాల పైచిలుకు కార్మికోద్యమ చరిత్ర ఉంది. ఒకప్పుడు ప్రభుత్వరంగ పరిశ్రమల్నే గాని, ఇతర పరిశ్రమల్నే గాని కార్మిక వర్గం డిమాండ్ జేసే పరిస్థితి ఉండే.. ఇయ్యాల్ల శాసించే పరిస్థితి నుంచి యాచించే పరిస్థితికచ్చింది.. ఎందుకచ్చిందంటే కార్మిక వర్గ సంఘాలు బలంగా పనిజేయ్యలేకపోవటం వల్ల, ఎదురవుతున్న దాడిని తిప్పికొట్టడంలో నాయకత్వం వైఫల్యంజెందటం వల్ల ఇది జరిగింది.. వాస్తవానికి ఇట్లా జరగడానికి ప్రధాన కారణం ఏందంటే గ్లోబలైజేషన్… ఈ గ్లోబలైజేషన్ ఏంజేసిందంటే లాభాలకోసం పరిశ్రమల స్థాపన దోపిడీ ఒకటేగాక మానసికమైన దాడి గూడ మొదలువెట్టింది. కార్మిక సంఘాలను వీక్ జెయ్యడమనేదాన్ని గూడ ఒక ప్రణాళిక ప్రకారం చొప్పించింది. ఒక ఉదాహరణ చెప్తే.. మా తరం లోపట సామాజిక సమస్యలస్తే మేమంతగూడ వాటికి రెస్పాన్డైనం యువకులంతా సమాజం లోని అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడినం.. ఆ తరం వాళ్ళే ఇవ్వాళ భారతదేశం మొత్తం మీద విప్లవోద్యమాలు నడిపించే పరిస్థితచ్చింది. కాబట్టి దీన్నుంచి గుణపాఠం నేర్చుకొని, సామాజికాంశాల నుంచి విద్యార్థులను దూరం చెయ్యాలె కాబట్టి, ఒక ప్లాన్ ప్రకారం ఎజుకేషన్ అంత గూడ సెల్ఫ్ సెంటర్డ్ విధానంజేసిండ్రు.. నువ్వు చదువుకో నువ్వు బాగుపడు.. చదువుకున్నా బాగుపడుతడా అంటే బాగుపడడు.. అది అర్థం అయ్యే వరకు జీవితం వృథా ఐపోతది… అంటే సమాజం నుంచి ఐసోలేట్ జేసేసి విద్యనేంజేసిండ్రంటే…సెల్ఫ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ చేసిండ్రు… ఎవడెట్లనన్న సావనియ్ మనం బాగుపడాలే… ఇది ఎందుకు జెప్పిండ్రంటే, హార్డ్ కోర్ గా ఉన్న విద్యార్థి రంగాన్ని కరప్ట్ జెయ్యడం కోసం, డైవర్ట్ జెయ్యడం కోసం… గ్లోబలైజేషన్, చేతిలో ఉన్న సాధనాలైన విద్యా విధానం లోపట మార్పుజేసుకున్నది.. ఏ వ్యవస్తైతే అధికారంలో ఉందొ ఆ వ్యవస్థకు అనుకూలమైన భావజాలాన్ని సమాజంలోపట చొప్పిస్తున్నరు.. ఉదాహరణకు క్రికెట్… క్రికెట్ లేకుంటే ఖాళీ సమయం దొరుకుతది.. ఎండాకాలం ఏదో నాలుగు బ్యాట్లిస్తరు… వాడు వీణ్ణి, వీడు వాణ్ణి ఓడిస్తడు.. వీడు ఖాలిగ ఉంటే ఎంజేస్తడు….ఇంకో దిక్కు ఆలోచన పోతది.. అంటే ఒక వ్యవస్థ అధికారంలో ఉన్నప్పుడు, రాజు అధికారంలో ఉన్నప్పుడు రాజే గొప్ప వ్యక్తి, రాజే బాగ చేస్తడు అన్న భావజాలమే ప్రచారంల ఉండాలె… అట్లైతేనే వాళ్ళు నిలబడగలుగుతరు…

అట్లాగే గ్లోబలైజేషన్ ఏంజేసిందంటే ప్రపంచ వ్యాప్తంగ వచ్చిన పరిణామాల్లోపట… కమ్యూనిస్టు ఉద్యమాలు కమ్యూనిస్టుల చేతుల్లోపట ఉన్న తర్వాత ఏర్పడ్డ అంతర్గత పోరులోపట పెట్టుబడి ఆధిపత్యం సంపాయించింది.. పెట్టుబడి ఏంజేసిందంటే అది తన అస్తిత్వం  కొనసాగించడం కోసం.. ఒక వ్యాపారం మీదనే కాదు, మనుషుల మీద, వాళ్ళ ఆలోచనలను గూడ నియంత్రించే ఒక పరిస్థితిని తీసుకచ్చింది… ఆ నేపథ్యంలోపట కార్మిక సంఘాలను గూడ నిర్వీర్యం జేసింది. వ్యాపార దృక్పథంలో ఉండు, నువ్వు సంపాయించుకో అన్నది. సింగరేణి ల సికాస ఏంజేసింది… నువ్వు ఒప్పుకున్న అంశాలు అమలుజేయి అన్నది. పర్మనెంట్ జేస్తా అంటే నూటాటొంబై మస్టర్ల తర్వాత పర్మనెంట్ జెయ్యమన్నది.. నాలుగేండ్లకొకసారి  వేజ్ బోర్డు పరిష్కరిస్త అంటే… నాలుగేండ్లు పోయి రెండేండ్లు గడిచింది నువ్వు ఎందుకు చెయ్యలేదు అన్నది… అట్ల అంటే రాజీలేని పోరాట శక్తులను నిర్దాక్షిణ్యంగ చంపేసింది… రాజీపడ్డ వాళ్ళను మాత్రమే అస్తిత్వంల కొనసాగించింది… ఆవిధంగ నాయకత్వ లేమితోని అవి నిర్వీర్యమైపోయినయ్.. మరి ఏం జేస్తరు ప్రజలు.. ఎన్నిరోజులు ఇట్ల సర్దుకొని బతుకుతరు… సర్దుకొని బతుకలేరుగాబట్టే ఇవాళ దేశవ్యాప్తంగా విప్లవోద్యమానికి నేపథ్యమున్నది.  గ్లోబలైజేషన్ సృష్టించిన ఈ విధ్వంసకర జీవన విధానమే రేపు ఉద్యమాలకు వనరుగ పనిజేస్తది. తాత్కాలికంగ నువ్వు అణిచిపెట్టవచ్చు, నాయకత్వం లేకుంట జేయ్యవచ్చు . ఇయ్యాల్ల ఎందుకు విప్లవోద్యమ నాయకుల మీద టార్గెట్ జేస్తుండ్రు. ఎందుకంటే ఇయ్యాల్ల యాబై రెండు శాతం బీసీలున్నరు. వాళ్లకు సమాజంల ఒక న్యాయం రాలేదు. కని పన్నెండు శాతం ఉన్న ఎస్సీ,ఎస్టీ లకు ఎంతో కొంత న్యాయం జరగడానికి వాళ్ళ తరపున అంబేద్కర్ అనే ఒక నాయకుడున్నడు. అంబేద్కర్ ఏమన్నడు. రాజ్యాధికారం లోపట మా పాత్ర లేకుంట మాకు న్యాయం జరగదు, ప్రభుత్వం లోపట మా వాటా మాకుంటే న్యాయం జరుగుతదని చెప్పిండు. బీసీ కులాలకు నాయకత్వం లేక ఉత్పత్తి కులాలు బతకలేని పరిస్థితి వచ్చింది. అట్లాగే నాయకత్వాన్ని నిర్వీర్యం జేస్తే మొత్తం వ్యవస్థంత కుప్పకూలిపోతుంది. ఇవాళ కేసీఆర్ లాంటి ఒక బలమైన నాయకుడుండడం వల్లగదా కల సాకారమైంది…

ప్ర… కేసీఆర్ ప్రస్తావన వచ్చింది గదా! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి, భవిష్యత్తు గురించి మీ అభిప్రాయం ఏంది?

జ… తెలంగాణ కోసం వేలాదిమంది, కోట్లాది మంది సామాన్యులు గూడ ఉద్యమంల పార్టిసిపేట్ జేసిండ్రు. కేసీఆర్ తో పాటు సామాన్యులు గూడ ఇదే ఆకాంక్షను కలిగి ఉన్నరు. తెలంగాణ వస్తే మన బతుకు బాగుపడుతుందనుకున్నరు. వాళ్ళ కనీస జీవితం… కొంత తిండి, కొన్ని మందులో, ఉండుటానికి ఇల్లో, కనీస వసతులు, అవసరాలు తీరేలాగ ఉండాలనుకున్నరు. ఐతే దాన్ని ఎట్లా ఫుల్ ఫిల్ జేస్తరనే విషయం ఒకటి ముందున్నది. ఎందుకున్నదంటే… ఆంధ్రా వాళ్ళచ్చేసి మన వనరులనుగాని, మన భూములను గాని, నీళ్ళను గాని దోసుకున్నరు. ఈ దోసుకునుడనేది ఒకటి ఉండటం వల్లనే ఈ ఆందోళన మొదలైంది. రేపు ఈ సమాజంలో దోపిడీ స్వరూపం మారి ఇంకో రూపంల కొనసాగుతే ప్రజలకు న్యాయం జరుగది. దోపిడీ స్వభావం లేని సమాజం గావాలె తప్పితే బాగుపడే అవకాశం లేదు. అటువంటి పనేమన్న కేసీఆర్ జేసేదుంటే ప్రజల ఆకాంక్షలు తీరుతయ్. ప్రజలకు ఉపయోగపడే విషయం లోపట ఒక నిర్దిష్టమైన విధానం ఉండాలె. దాన్నే పాలసీ అంటరు. ఏం పాలసీ అనుసరిస్తున్నరు అన్నదాన్ని బట్టి ఉంటది. బూమికి నీళ్ళిత్త అంటున్నడు. కాని బూమిలేని వాళ్లకు నీళ్ళెం పనిజేస్తయ్. ముందు సమస్య బూమి ఉండాలె, బూమికి నీళ్ళు గావాలె. బూమంత ఎవని చేతుల్నో ఉంటే ఈ నీళ్ళిచ్చి ఎవన్ని పెంచి పోషిస్తవు.

తర్వాత ఉద్యమంలోపట ఇయ్యాళ్ళ పదేండ్ల కాన్నుంచి దెబ్బలుదిని అన్నిట్ల పార్టిసిపేట్ జేసినోల్లంత వెనుకకుబోయి, నాలుగు పైసలున్నోళ్ళు, పైసలు కర్చు పెట్టేవాళ్ళు, ఎన్నికల రాజకీయాల్ల్లో ముందుకచ్చిన వాళ్ళు, ఉద్యమానికి ద్రోహం జేసిన వాళ్ళు గూడ ఇవాళ్ళ ప్రజా ప్రతినిధులుగ న్యాయం జేస్తరా, రాత్రికి రాత్రి ఉద్యమకారులైనోళ్ళు ఏ మేరకు న్యాయంజేస్తరన్న దాన్ని బట్టి కేసీఆర్ గారు సక్సెసైతరు…

ప్ర… మీ దృష్టిలో బంగారు తెలంగాణ ఎట్లుండాలె?

జ…  ప్రజలకు ఉపయోగపడే విధంగ ఉండాలె. ప్రజల్ని మెరుగు పరిచే విధంగ ఉండాలె. బ్రాడ్ సెన్స్ ల జెప్పాల్నంటే…. పాలసీల పరంగా వీళ్ళేం భిన్నంగ పోయే పరిస్థితి అగుపిస్తలేదు. కాకుంటే ఏందంటే గతంలో కంటె మరింత మెరుగైన సంస్కరణలు చేపట్టాలె. ఇప్పుడీ వనరుల దోపిడీ, సింగరేణి సంపద మన దగ్గర నుండి అక్కడికి పోకుంట ఇక్కడ మన వనరులు మనం ఉపయోగించుకునే పరిస్థితి వస్తే కొంత అభివృద్ధి జరుగుతది. కాని మౌలికమైన మార్పు సమాజంలో వస్తదని నేననుకోను. కేసీఆర్ ఏమన్నజేసేదుంటే సంతోషం. ఎంతవరకైతే ప్రజలకు న్యాయం జరగదో అంతవరదాక వాళ్ళు ఈ రూపంలో కాకపొతే ఇంకో రూపంలో కొట్లాడుతనే ఉంటరు. ఎందుకంటే వాళ్ళు బతుకాలె. వాళ్ళు బతుకాల్నంటే తప్పనిసరిగ ఐతేనేమో ఆకలికి సావడం, లేకుంటే బతుకడం కోసం పోరాటం జెయ్యడమో మిగిలిపోతుంది. అసమానతలు ఉన్నంత సేపు ఉద్యమాలు పుడుతనే ఉంటయ్. ఉద్యమకారులు పుడుతనే ఉంటరు.

ప్ర… తెలంగాణ సాహిత్యం, చరిత్ర, సంస్కృతి పునర్నిర్మాణం జరుగాలంటున్నరు గదా! ఇది ఎట్లుండాలే?

జ.. సాహిత్యకారులు గాని, సామాజిక వేత్తలుగాని, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవారు గాని, ముందుగా చేయాల్సిందేందంటే, అసలు రోగమేందో తెలుసుకొవాలె, ప్రజల సమస్యలేందో తెలుసుకొవాలె, లోతుగా అధ్యయనం చేయాలె, చేసి, అవి వెలుగులోకి తీసుకస్తే అది ఒక ఎజెండాగా మారుతె దాన్ని పరిష్కరించే మార్గం దొరుకుతది. దాన్ల గూడ రెండు రకాలు! ఒకటి మౌలికంగ మొత్తంగ మార్చడమనేది ఈ వ్యవస్థల సాధ్యం గాదు. వితిన్ ద ఫోల్డ్ లోపటనే చేయగల అంశాలు చాల ఉన్నాయ్. ఉదాహరణకు ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా లోపట మలేరియా వచ్చి వేలాది మంది చచ్చిపోతండ్రు. మలేరియా క్యూరేబుల్, చాలా ప్రైమరీగ చెయ్యచ్చు. అటువంటి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీస్కపోతే ఇంకొన్ని పి.హెచ్.సి లు పెంచడం వల్లనో ఆ చావులను ఆపగలుగుతం… వేలకోట్ల రూపాయలు పెట్టి రోడ్లేస్తండ్రు కని, రైతు పంట పండిచ్చుకొని వస్తే మార్కెట్ల పెట్టుకుందామంటే షెడ్లు లెవ్వు. అట్లాంటి వాళ్లకు మేలు చెయ్యాలె. ప్రజలకోసం ఆలోచించే వాళ్ళు ప్రజలు బతికే మార్గం ఆలోచించాలే. ప్రజల కష్టాలే కొలబద్ద కావాలె..

ప్ర… మీరు ఒక సామాజిక మార్పును ఆశించి చేసిన రచనలు మీరు అనుకున్న పాఠకులకు చేరినయా? మీ పాఠకులు ఎవరు?

జ… సమాజం గురించి ఆలోచించే వారు, సమాజంలో మార్పుకోసం తాపత్రయపడే వాళ్ళే నా రచనలు ఎక్కువగా చదువుతరు. సమాజాన్ని అర్థం చేసుకోవడం, అందులో ఉండే లోటుపాట్లు, కష్టాలు, నష్టాలు తెలుసుకోవాలనుకునే వాళ్లు, నా రచనలు వెతుక్కొని చదువుకుంటండ్రు. ఫలానా పుస్తకం వచ్చిందట చంద్ గారిది, ఏడ దొరుకుతదని తెప్పిచ్చుకొని చదివిండ్రు. నేను ఎంత మంచిగ రాసినప్పటికి గూడ, ఒక వ్యాపార పత్రికో, ఒక సినిమా స్టైల్ సాహిత్యాన్ని చదివే వాళ్ళను ఆకర్షించలేను. నా పాఠకులు నాకున్నరు.

ప్ర… ఏ అవార్డులను ఆశించి మీరు రాయకపోయినప్పటికీ… మీకు సరియైన గుర్తింపు రాలేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా?

జ… ఆర్నెల్లు కష్టపడి పంట పండిచ్చిన వాడు పంట రాకుంటే ఏం జేస్తడు… జీవితమంత బొగ్గు బాయిల పనిజేసి ముసలితనానికి వచ్చినంక అడుక్కుంటున్నోని సంగతేంది? ముప్పై ఏండ్లు బొగ్గుబాయిల కాలం తోటి పోటీ పడి అననుకూలమైన  పరిస్థితిలో సచ్చి పుట్టినోని సంగతేగట్లుంటే నాకు గుర్తింపు గావాల్నని నేననుకోను.. నాకు గుర్తింపునియ్యడానికి వాళ్ళ ప్రమాణాలు వేరు. అట్ల ఆశించడం అర్థం లేని విషయం. ఏ సాహిత్యమైనా మంచిగుంటే నిలబడుతది. లేకుంటే కొట్టుకపోతది. ప్రజల హృదయాల్లో ఉండుడే అసలైన గుర్తింపు…

*

మీ మాటలు

  1. బూర్ల వెంకటేశ్వర్లు says:

    పి. చంద్ గారికి నవలా విభాగంలో తెలుగు విశ్వ విద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని నిన్ననే ప్రకటించింది… వారిని అభినందించి స్పందనను అడిగినప్పుడు ” చేసిన పనికి గుర్తింపు లభిస్తే ఎవరికైనా సంతోషమే కదా!”అన్నారు…

  2. B.RAM NARAYANA says:

    శ్రీ చాంద్ గారి పుస్తకాలు కొన్ని చదివాను.మరుగున ఉన్న రచయిత తో ఇంటర్వ్యూ చాలా బాగుంది కానీ చాంద్ గారికి కూడా ఇతర తెలంగాణవాదులవలె ఇంకా కెసిఆర్ ఫై బ్రమలున్నట్లనిపిస్తుంది .రచయిత అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉంటె ఇవ్వగలరు.అలాగే అతని పుస్తకాలన్నీ ఎచట దొరుకుతాయో తెలుపగలరు.

    • బూర్ల వెంకటేశ్వర్లు says:

      ధన్యవాదాలు రాం నారాయణ గారు వారి ఫోన్ నెం…9573093526

  3. ఎ.కె.ప్రభాకర్ says:

    ‘ప్రజల హృదయాల్లో ఉండుడే అసలైన గుర్తింపు…’
    నిబద్ద రచయితగా పి. చంద్ సాహిత్య గమనాన్ని వెబ్ పాఠకులకు అందించినందుకు చాలా సంతోషం బూర్లా!
    ఇప్పుడు సింగరేణిలో కార్మిక రచయితగా నిలబడింది కొనసాగుతోందీ చంద్ వొక్కడే!!

    • బూర్ల వెంకటేశ్వర్లు says:

      మీ స్పందనకు ధన్యవాదాలు ఎ.కె. ప్రభాకర్ సర్….

మీ మాటలు

*