దేవతల కుక్క

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

 

మళ్ళీ కథలోకి వెడదాం…

ఉపయాజుడు సహాయకుడిగా ద్రుపద దంపతుల చేత యాజుడు పుత్రకామేష్టి చేయించాడని చెప్పుకున్నాం. అప్పుడు మంత్ర, ఆహుతులతో తృప్తుడైన అగ్ని వల్ల ఒక పుత్రుడు పుట్టాడు. అతని దేహం అగ్నిజ్వాలలా ఉంది. ఒక చేతిలో కత్తి,                                 ఇంకో చేతిలో విల్లు ధరించాడు. నెత్తి మీద కిరీటం ఉంది. రథాన్ని అధిరోహించి ఉన్నాడు.

ఆ తర్వాత యజ్ఞకుండం లోంచి ఒక అమ్మాయి పుట్టింది. ఆమె దేహం నల్ల కలువలా, కోమలంగా, ఎలాంటి వంక లేకుండా, కలువ గంధంతో ఉంది. ఆమె కళ్ళు కలువపత్రాలలా ఉన్నాయి. ఆమె దివ్యతేజస్సుతోనూ, ప్రసన్నంగానూ, సంతోషంగానూ ఉంది.

కొడుకుకి ధృష్టద్యుమ్నుడనీ, కూతురికి కృష్ణ అనీ ఆకాశవాణే నామకరణం చేసింది. ఈ విధంగా కొడుకును, కూతురిని పొందినందుకు సంతోషించిన ద్రుపదుడు యాజునికి దక్షణలిచ్చి, బ్రాహ్మణులను పూజించాడు. ఆ తర్వాత ధృష్టద్యుమ్నునికి ధనుర్వేదం నేర్పించాడు. కృష్ణకు యుక్తవయసు రాగా వివాహప్రయత్నం ప్రారంభించాడు.

ధృష్టద్యుమ్న, ద్రౌపదుల (ద్రుపదుడి కూతురు కనుక కృష్ణ ద్రౌపది అయింది) పుట్టుక గురించి ఆదిపర్వం, సప్తమాశ్వాసంలో నన్నయ కథనం ఇంత మేరకే ఉంది. కానీ సంస్కృత భారతంలో ఆసక్తికరమైన అదనపు సమాచారం ఉంది. అందులోకి వెళ్ళే ముందు నన్నయ కథనం విడిచిపెట్టిన కొన్ని సందేహాల జాగాలను చూద్దాం.

***

మొదటిది, తన అన్న యాజునితో పుత్రకామేష్టి జరిపించుకోమని ద్రుపదునికి సలహా ఇవ్వడానికి ఉపయాజుడు ఏకంగా ఏడాది సమయం ఎందుకు తీసుకున్నట్టు? ఈ ఏడాదిలో ఏం జరిగి ఉంటుంది? ద్రుపదుని కోరికకు తగిన అబ్బాయిని, అమ్మాయిని వెతకడానికి అంత సమయం పట్టిందనుకోవాలా? వారిద్దరినీ ద్రుపదుడు దత్తు తీసుకున్నాడనీ, పుత్రకామేష్టి అన్నది దత్తత స్వీకార ప్రక్రియను సూచిస్తోందనుకుంటే ఆ ఏడాది వ్యవధి అర్థవంతంగానే కనిపిస్తుంది.

ఇంతకన్నా ఎక్కువ అనుమానాన్నే కాక, ఆశ్చర్యాన్ని కూడా రేకెత్తిస్తున్నవి; ఉపయాజుడు తన అన్న గురించి అన్న మాటలు. నాకు సంపద మీద కోరిక లేకపోయినా మా అన్నకు ఉందని అతను చెబుతున్నాడు. పైగా, సంపద కోరుకునేవాడు అది మంచిదా, చెడ్డదా అన్నది పట్టించుకోడనీ, తన అన్న అలాంటివాడే ననీ- ఒక పండు ఉదాహరణద్వారా ఉపయాజుడు చెబుతున్నాడు. ఆపైన యాజుడు కుటుంబభారాన్ని మోస్తున్నాడని కథకుడే ఆ తర్వాత అంటున్నాడు. (కుటుంబ పోషణకోసం) తన అన్న ఎలాంటి అపవిత్రధనానికైనా ఆశపడతాడని ఉపయాజుడు అనడంలో ద్రుపదుని ధనం అలాంటిదే నన్న సూచన స్పష్టంగా ఉంది. ఈ సందర్భంలో, అంటే ధృష్టద్యుమ్న, ద్రౌపదుల పుట్టుక సందర్భంలో, ద్రుపదుని ధనం ఎందుకు దోషభూయిష్ఠం అయినట్టు? ఈ ప్రశ్నకు ఇతరత్రా నమ్మశక్యమైన సమాధానం దొరకనప్పుడు అంతిమంగా, అనివార్యంగా కలిగే అతిపెద్ద అనుమానం; ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏదైనా ‘గూడుపుఠాణీ’ ఉందా అన్నదే!

గూడుపుఠాణీ ఉందనే ఉనుకుంటే, అన్న కంటే ఎక్కువ తపశ్శాలి అన్న కీర్తి తనకు ఉంది కనుక, అందులో తను భాగస్వామి కావడానికి ఉపయాజుడు నిరాకరించి అన్న పేరు సూచించడం అర్థవంతంగానే ఉంటుంది. అన్నకు కుటుంబభారం ఉండడం ఒక వెసులుబాటు. కుటుంబపోషణకోసం అన్నప్పుడు మంచి ధనం, చెడ్డ ధనం అన్న విచక్షణలో కొంత మినహాయింపు ఉంటుంది. అయితే, స్వయంగా పుత్రకామేష్టి చేయించడానికి నిరాకరించిన ఉపయాజుడు అన్నకు సహాయంగా ఎందుకు వెళ్లాడన్న ప్రశ్న వస్తుంది. తనే ద్రుపదునితో క్రతువు చేయిస్తే ఉపయాజుడు అందులో ప్రత్యక్షభాగస్వామి అవుతాడు. అన్నకు సహాయకుడిగా పాల్గొంటే పరోక్షభాగస్వామి మాత్రమే అవుతాడు. తీవ్రతలో రెండింటి మధ్యా సహజంగానే తేడా ఉంటుంది. దానికి తోడు సోదరధర్మం అనే అదనపు కవచం ఉపయాజునికి ఉంది.

‘గూడుపుఠాణీ’ అనకపోతే, ఇప్పుడు అంతకంటే ఒకింత ఎక్కువ మర్యాదగా ధ్వనించే ‘రాజకీయం’ అనుకున్నా అనుకోవచ్చు. ద్రోణుడి మీద పగ తీర్చుకోడానికి సమర్థుడైన కొడుకునూ, అర్జునుని వరించగల కూతురునూ కనాలనే ద్రుపదుని నిర్ణయం, రాజకీయ నిర్ణయం! ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ద్రుపదుడు చేసిన పని, ప్రతిరోజూ బ్రాహ్మణుల నివాసాలకు వెడుతూ వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయడం! ఈ సందర్భంలో ద్రుపదునికి బ్రాహ్మణులతో రెండు రకాల అవసరం ఉంది. మొదటిది సరే, ప్రతీకారం తీర్చుకోవడం కూడా ఒక ‘యజ్ఞ’మే కనుక దానిని జరిపించవలసింది బ్రాహ్మణులే. గణసమాజంలో లేదా పురాతన సమాజంలో మతకర్మ, లౌకిక కర్మ అంటూ విడి విడిగా లేవనీ; ప్రతిదీ మతకర్మే ననీ ఇంతకుముందు చెప్పుకున్నాం.

రెండోది, ద్రుపదుని పగకు లక్ష్యమైన ద్రోణుడు బ్రాహ్మణుడు. కనుక బ్రాహ్మణులను మంచి చేసుకుని వారి మద్దతును కూడగట్టుకోవడం ద్రుపదునికి ఒక రాజకీయ అవసరం.

ఇక్కడ ద్రుపదుడికి సర్పయాగఘట్టంలోని జనమేజయునితో పోలిక అచ్చుగుద్దినట్టు కనిపించి ఆశ్చర్యం కలిగిస్తుంది. జనమేజయుడు అర్జునుని మునిమనవడు, అభిమన్యుని మనవడు. అతని తండ్రి పరీక్షిత్తును నాగప్రముఖులలో ఒకడైన తక్షకుడు చంపుతాడు. అందుకు తక్షకుని మీదే కాక నాగులందరి మీదా జనమేజయుడు పగబడతాడు. దీని పూర్వాపరాల గురించి నా సర్పయాగవ్యాసాలలో వివరంగా రాశాను కనుక ఇప్పుడు వాటిలోకి పూర్తిగా వెళ్ళకుండా ప్రస్తుత సందర్భానికి అవసరమైన ఒకటి, రెండు అంశాలకు పరిమితమవుతాను.

మొదట దీర్ఘసత్రయాగం చేసిన తర్వాత జనమేజయుడు సర్పయాగానికి పూనుకుంటాడు. అంతకంటే ముందు అతడు చేసిన మొదటి పని-పురోహితుని కోసం అన్వేషణ. ద్రోణునిపై పగ తీర్చుకునే ప్రయత్నంలో ద్రుపదుడు చేసింది కూడా అదే. బ్రాహ్మణులను మంచి చేసుకుంటూ తనతో పుత్రకామేష్టి చేయించగల యాజ్ఞికుని అన్వేషణలో పడతాడు. జనమేజయుని విషయానికి వస్తే, అప్పుడప్పుడే అంత పెద్ద సత్రయాగం (సత్రయాగం పన్నెండేళ్ళపాటు జరిగే యాగం) చేసినవాడు అంతలోనే పురోహితుని వెతుకులాటలో పడడమేమి టనిపిస్తుంది. అందులోనే ఉంది అసలు మర్మం. అతనికి కావలసింది ఎవరో ఒక పురోహితుడు కాదు, నాగులతో సంబంధం ఉన్న పురోహితుడు! ఎందుకంటే తను నాగసంహారానికి బయలుదేరుతున్నాడు. తన రాజ్యంలోని బ్రాహ్మణులలో అనేకమంది అప్పటికే నాగులతో బంధుత్వాలు కల్పించుకున్నారు. కనుక నాగుల వధలో వారి మద్దతు అతనికి కీలకం అవుతుంది.

పురోహితుని అన్వేషణలో జనమేజయుడు అనేక మున్యాశ్రమాలను సందర్శిస్తాడు. అలాగే శ్రుతశ్రవుడు అనే మునిని కలసుకుని, అతని కుమారుడు సోమశ్రవసుని తనకు పురోహితునిగా ఇమ్మని అడుగుతాడు. కొన్ని షరతులమీద ఇవ్వడానికి శ్రుతశ్రవుడు ఒప్పుకుంటాడు. జనమేజయుడు సోమశ్రవసుని పురోహితుని చేసుకుని నాగులపై ప్రతీకార చర్యకు పూనుకుంటాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, సోమశ్రవసుని తల్లి నాగజాతిస్త్రీ. ఆ విధంగా అతనికి నాగులతో సంబంధం. నాగసంబంధీకుడు పురోహితుడుగా ఉండగా తను నాగులను ఊచకోత కోస్తే తన రాజ్యంలోని నాగసంబంధీకులలో తన చర్యపట్ల ఆగ్రహం కొంతైనా పలచనవుతుంది. కొంత మేరకైనా తన చర్యకు నైతిక ఆమోదం లభిస్తుంది. ఇదీ పురోహితుని ఎంపికలో జనమేజయుడు పాటించిన రాజకీయపు మెళకువ.

నేటి ప్రజాస్వామిక రాజకీయాలలో కూడా ఇలాంటి మెళకువలను పాటించడం మనం చూస్తుంటాం. ఉదాహరణకు, ఒక ప్రభుత్వమో పార్టీయో తమపట్ల వివక్షతోనో, వ్యతిరేకతతోనో వ్యవహరిస్తోందని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర వర్గాల వారు, లేదా ఆయా కులాల వారు ఆరోపించినప్పుడు; ఆ ఆరోపణను ఖండించడానికి ఆ వర్గాలవారినీ, కులాలవారినే బరిలోకి దింపుతుంటారు. ద్రుపదుడు, జనమేజయుడు పాటించినది సరిగ్గా ఇలాంటి రాజనీతినే.

Snakesacrifice

***

నన్నయ అనువాదం మీద నాకు అతి పెద్ద ఫిర్యాదు ఏమిటంటే, సంస్కృత భారతంలో ఉన్న కొన్ని కీలకమైన అంశాలను ఆయన తన అనువాదంలోకి తీసుకురాకపోవడం. ఆయన ఏ ఉద్దేశంతో వాటిని పరిహరించాడో తెలియదు. ఏ ఉద్దేశంతో పరిహరించినా సంస్కృతభారతానికి ఉన్న పురాచారిత్రకతా లక్షణం తెలుగు భారతంలో చాలాచోట్ల లోపించింది. ఉదాహరణకు, జనమేజయుడు ఎవరో ఒక పురోహితుడి కోసం కాక, నాగజాతితో సంబంధం ఉన్న పురోహితుని కోసం అన్వేషణలో పడ్డాడన్న వివరం సంస్కృత భారతంలో ఉంది తప్ప తెలుగు భారతంలో లేదు. దాంతో కొందరు బ్రాహ్మణులకు నాగజాతీయులతో సంబంధం ఏర్పడిందన్న పురాచారిత్రక సమాచారం, జనమేజయుని చర్యలోని రాజకీయకోణం ఆ మేరకు మరుగున పడ్డాయి. అలాగని తెలుగు భారతం వాటిని పూర్తిగా మరుగుపరచిందా అంటే అదీ జరగలేదు. వాటిని ఎత్తి చూపే సాక్ష్యాలు తెలుగు భారతంలోనూ, అదే ఘట్టంలో వేరే చోట్ల కనిపిస్తూనే ఉంటాయి.

ఇలాగే, ద్రుపదునితో జరిపించిన పుత్రకామేష్టి గురించి కూడా సంస్కృత భారతంలో ఉన్న అదనపు సమాచారాన్ని, చిత్రణను నన్నయ పరిహరించాడు.

అదలా ఉంచితే, ద్రుపద, జనమేజయులు ఇద్దరి ఉదంతాలనూ కూడా ఇంతకు ముందు చెప్పుకున్న జార్జి థాంప్సన్ పరిశీలనల వెలుగులో చర్చించవలసిన అవసరం ఉంది. అంతేకాదు, జనమేజయుని సందర్భంలో కోశాంబీని కూడా ఉటంకించుకోవలసిన అవసరం ఉంది.

సర్పయాగానికి ముందు జనమేజయుడు కురుక్షేత్రంలో సత్రయాగం జరుపుతుండగా ఒకరోజున సరమ అనే దేవశుని(దేవతల కుక్క) కొడుకు సారమేయుడు అనేవాడు ఆ యాగప్రదేశానికి ఆడుకోడానికి వెడతాడు. అప్పుడు జనమేజయుని తమ్ముళ్ళు ముగ్గురు-శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు-అనేవారు సారమేయుని కొడతారు. సారమేయుడు ఏడుస్తూ వెళ్ళి ఆ సంగతి తల్లి సరమకు చెబుతాడు. సరమ కోపంతో జనమేజయుని దగ్గరకు వెళ్ళి, ‘నీ తమ్ముళ్ళు ఏమాత్రం కనికరం, వివేకం లేకుండా నిరపరాధుడైన నా కొడుకును కొట్టారు. మంచి, చెడు ఆలోచించకుండా సాధుజీవులకు హాని చేసేవారికి అనుకోని ఆపదలు వస్తాయి’ అని హెచ్చరించి వెళ్లిపోయింది.

సరమ మాటలకు జనమేజయుడు ఆశ్చర్యపోయాడు. యాగం పూర్తి చేసిన తర్వాత హస్తినాపురానికి వెళ్ళి సరమ హెచ్చరికకు ప్రతిక్రియగా శాంతి, పౌష్టిక విధులు నిర్వహించడానికి పురోహితుని అన్వేషణలో పడతాడు. ఆ తర్వాతి ఘట్టాలు అన్నీ అతని సర్పయాగానికి పూర్వరంగాన్ని కల్పించడానికి ఉద్దేశించినవి. నన్నయ భారతం చెబుతున్నది ఇంతవరకే. జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో కొన్ని లింకులు తెగిపోయి స్పష్టత లోపించిన సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు భారతంలో తెగిపోయిన లింకులు’ అనే శీర్షికతో దీనిని నేను నా సర్పయాగవ్యాసాలలో చర్చించాను.

ఇందుకు భిన్నంగా సంస్కృత భారతంలో స్పష్టత కనిపిస్తుంది. ప్రధానంగా సంస్కృత భారతాన్ని ఆధారం చేసుకున్న పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘మహాభారత చరిత్రము’ ప్రకారం, జనమేజయుడు సత్రయాగం పూర్తి కాగానే తక్షకుని నివాసమైన తక్షశిల(నేటి పాకిస్తాన్ లో ఉన్న తక్షశిల ఒకప్పటి విద్యాకేంద్రం)పై దాడిచేసి దానిని స్వాధీనం చేసుకుంటాడు. యుద్ధానికి ముందు యాగం జరిగింది చూడండి…ఇంతకుముందు చెప్పుకున్నట్టు, వాస్తవికంగా జరగబోయే యుద్ధంలో విజయాన్ని భ్రాంతిపూర్వకంగా ముందే సాధించడానికి ఈ యాగం. అయితే తక్షకుని, మరికొందరు ముఖ్యనాగులను అతను చంపలేదు. బహుశా వాళ్ళు తప్పించుకుని ఉంటారు. ఆ తర్వాత తన సహాధ్యాయి ఉదంకునితో ప్రోద్బలంతో తక్షకుని, ఇతర నాగులను చంపి శత్రుశేషం లేకుండా చేయడానికి సర్పయాగం తలపెడతాడు. అయితే బ్రాహ్మణులలోని నాగసంబంధీకుల మధ్యవర్తిత్వంతో అది మధ్యలో ఆగిపోతుంది.

తెలుగు భారతంలోనే కాక సంస్కృత భారతంలో కూడా ఒక విషయంలో స్పష్టత లోపించింది. అది సరమ హెచ్చరికకు సంబంధించినది. నీ తమ్ముళ్ళు నా కొడుకును అన్యాయంగా కొట్టారు కనుక నీకు అనుకోని ఆపదలు సంభవిస్తాయని జనమేజయుని సరమ హెచ్చరించినా, నిజానికి ఆ తర్వాత ఆపద సంభవించింది జనమేజయునికి కాదు; తక్షకునికీ, ఇతర నాగులకూ! కనుక సరమ మాటలు కథకు అన్వయించడం లేదు. అయితే, కోశాంబీ(The Culture & Civilization of Ancient India in Historical Outline) వివరణనుంచి చూసినప్పుడు కొంత అన్వయానికి వీలు కలుగుతుంది. ఎలాగంటే…

శత్రువులనుంచి కప్పం గుంజుకోడానికి ముందు దూతను పంపించి వారిని భయపెట్టడం ఆర్యులు అనుసరిస్తూ వచ్చిన ఒక పద్ధతి. సరమ దౌత్యం దానినే సూచిస్తుంది.

మహాభారతంలో కంటే ముందు సరమదౌత్యం ఋగ్వేదంలో కనిపిస్తుంది. అది చాలా ప్రసిద్ధం కూడా. ఇంద్రుడు దూతగా పంపిన సరమ అనే శునక దేవతకు, పణులకు మధ్య జరిగిన సంభాషణ రూపంలో అది ఉంటుంది. ఇంద్రుడికి పశువులను కప్పంగా చెల్లించమని సరమ అడుగుతుంది. పణులు అందుకు తిరస్కరిస్తారు. అప్పుడు, మీకు ఆపదలు సంభవిస్తాయని సరమ వారిని హెచ్చరిస్తుంది. తదనంతర పరిణామం, ఇంద్రుడు వాళ్లమీద దాడి చేయడం.

దీనికి వ్యాఖ్యాతల వివరణ మరో విధంగా ఉంటుంది. దాని ప్రకారం, పణులు ఇంద్రుడి పశువులను దొంగిలించారు. వాటిని తిరిగి తనకు అప్పగించమనీ, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయనీ సరమను పంపి ఇంద్రుడు వారిని హెచ్చరించాడు. వాస్తవంగా సరమ-పణుల సంభాషణ రూపంలోని ఆ మంత్రంలో పణుల దొంగతనం గురించి లేదు. కనుక అది వ్యాఖ్యాతల కల్పన కావచ్చు.

దానిని అలా ఉంచితే, మన ప్రస్తుత సందర్భానికి అవసరమైన ఒక ముఖ్యమైన వివరాన్ని ఇక్కడ కోశాంబీ అందిస్తున్నారు. ఋగ్వేదంలోని ఈ సరమ-పణుల సంభాషణ, నిజంగా జరిగిన ఒక చారిత్రక ఘటనను తంతు రూపంలో స్మరించుకుంటోంది. అంటే, ఒక సందర్భంలో అలా దూతను పంపి శత్రువును కప్పం అడగడం, ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం, శత్రువు తిరస్కరించడంతో దాడి చేయడం, ఆ దాడిలో విజయం సాధించడం జరిగి ఉంటాయి. ఆవిధంగా ఈ దౌత్యప్రక్రియ ఒక ఆనవాయితీగా, లేదా మతకర్మగా మారిపోయింది. పురాసమాజంలో లౌకిక కర్మకు, మతకర్మకు తేడా లేదన్న సంగతిని ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఒక మంచి ఫలితం ఇచ్చిన ఏ కర్మ అయినా మతకర్మగా మారిపోతుంది. అది మతపరమైన తంతులో భాగమవుతుంది. అందుకే సరమ-పణుల సంభాషణ ఋగ్వేద మంత్రంగా మారిపోయింది.

ఇక్కడ ఇంకొక ముఖ్య విశేషమేమిటంటే, ఈ సరమ-పణుల సంభాషణ రూపంలోని మంత్రం ఉచ్చరించడానికి మాత్రమే ఉద్దేశించినది కాదు, అందులో అభినయం కూడా ఉంటుంది (“The exchange of words was not merely chanted, but obviously meant to be acted out, therefore the ceremonial commemoration of some historical event” అని కోశాంబీ వివరణ). అంటే, యుద్ధానికి ముందు విజయాన్ని అపేక్షిస్తూ చేసే యాగంలో ఈ సరమ-పణుల సంభాషణ ఒక తంతు రూపంలో మంత్రపూర్వకంగానూ, అభినయపూర్వకంగానూ భాగమవుతుందన్న మాట. జనమేజయుడు తక్షశిల పై దాడికి ముందు చేసిన సత్రయాగ సందర్భంలోనే అతనితో సరమ సంభాషణ జరగడం గమనార్హం.

పైన చెప్పుకున్నట్టు, ‘నీకు అనుకోని ఆపదలు వస్తా’యని సరమ జనమేజయుని హెచ్చరించినా, వాస్తవానికి ఆపద సంభవించింది తక్షకునికీ, ఇతర నాగులకూ కనుక, సరమ మాటలు కథకు అన్వయించని మాట నిజమే. అయితే, ఒక తంతులో భాగమైన ఆనవాయితీగా దానిని చూసినప్పుడు అన్వయం కుదురుతుంది.

ఒకానొక చారిత్రక ఘటన అనంతరకాలంలో మంత్రరూపంలోకి, అభినయరూపంలోకి మారి తంతులో ఎలా భాగమవుతుందో చెప్పడానికి కోశాంబీ ఇంకో ఉదాహరణ ఇస్తారు. అది, ‘సీమోల్లంఘన’. పూర్వం ఆశ్వయుజమాసంలో, అంటే శరత్కాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరేవారు. ఆ రోజుల్లోనే విజయదశమి పండుగ వస్తుంది. ఆ పండుగ పేరులోనే యుద్ధ సూచన ఉంది. ఈ సందర్భంలో ఆయుధాలను పూజిస్తారు. యుద్ధానికి వెళ్ళేముందు రాజులు ఒక తంతు రూపంలో సీమోల్లంఘన జరుపుతారు. అంటే తమ రాజ్యం సరిహద్దులను దాటతారు. అది యుద్ధానికి వెడుతున్నట్టు అభినయపూర్వకంగా సంకేతించడం. మహారాష్ట్ర మొదలైన చోట్ల ఇప్పటికీ దసరా సందర్భంలో సీమోల్లంఘనను అభినయిస్తారు. శమీపత్రాలను(జమ్మి ఆకులను) ఒకరికొకరు ఇచ్చుకోవడమూ ఉంది. పూర్వం శూలం, గద, విల్లు మొదలైన ఆయుధాలను జమ్మి కొయ్యతోనే తయారు చేసేవారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లబోయేముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదే దాచుకున్నారు…

సరే, దీనిపై మరిన్ని వివరాలలోకి ఇప్పుడు వెళ్లలేం కనుక, విషయానికి వద్దాం. సంస్కృత భారతంలో జనమేజయుని సర్పయాగ ఘట్టం, సరమ దౌత్యఘట్టం లానే నాటకీయంగానూ, అభినయంతోనూ ఉంటుంది. నన్నయ అనువాదంలో ఈ రెండూ లోపించాయి. అలాగే, సంస్కృత భారతంలో ధృష్టద్యుమ్న, ద్రౌపదుల జన్మ ఘట్టం కూడా అంతే నాటకీయంగానూ, అభినయంతోనూ ఉంటుంది. మళ్ళీ నన్నయ అనువాదంలో ఇవి లోపించాయి. వాటి గురించి చెప్పుకునే ముందు, విషయాంతరంలా కనిపించినా ఒక ఆసక్తికరమైన చరిత్రను పాఠకులతో పంచుకోవాలనిపిస్తోంది. అది, పైన సరమ ఉదంతంలో చెప్పుకున్న ‘పణు’ల గురించి.

అది వచ్చే వారం…

 

 

మీ మాటలు

  1. సర్, సర్ప యాగం గురించిన వ్యాసముల links నాకు పురా గమనం లో దొరకలేదు. దయ చేసి, వాటి లింక్స్ తెలుపగలరు.

    • kalluri bhaskaram says:

      ‘సూర్య’ దినపత్రిక ఆదివారం ఎడిట్ పేజీలో ఫిబ్రవరి 17, 2013 నుంచి ప్రతి ఆదివారం చూడగలరు. మొత్తం 21 వ్యాసాలు ఉంటాయి.

      • మంగు శివ రామ ప్రసాద్ says:

        భాస్కరంగారు నమస్కారం. రెండు రోజుల క్రిందట శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్ గారు ఆంధ్ర విశ్వ విద్యాలయం దూర విద్యా కేంద్రం సెమినార్ హాలులో, కవి– కవి సమయం’ అనే అంశం మీద మాట్లాడుతూ మహా భారత ప్రస్తావన వచ్చినప్పుడు వ్యాసుడు మహాభారతంలో విదురిని తల్లి పాత్రకు పేరు పెట్టలేదన్నారు. మీ అభిప్రాయం దయచేసి తెలుపమని మనవి.
        మంగు శివ రామ ప్రసాద్, విశాఖపట్నం. (సెల్:9866664964)

      • సూర్య archivesలో వార్తలున్నాయే గానీ ఆదివారపు ఎడిషన్లు కనిపించటం లేదే!
        భాస్కరం గారూ, దయచేసి లంకె వుంటే ఇవ్వగలరు.

  2. kalluri bhaskaram says:

    నమస్కారం శివరామ ప్రసాద్ గారూ…విదురుని తల్లి పేరు చెప్పకపోవడంలో ఆశ్చర్యం ఏమీలేదండీ. వ్యాసుని ద్వారా అంబిక(ధృతరాష్ట్రుని తల్లి) దాసికి విదురుడు పుట్టాడు. దాసి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మరి దాసి కొడుకైన విదురుని పేరు ఎందుకు చెప్పారంటే, అతను రాచకుటుంబ సంబంధంతో పుట్టాడు కనుక, ధృతరాష్ట్ర, పాండురాజులతో కలసి పెరిగాడు కనుక, తెలివి తేటలు కలిగి మంత్రాంగానికి పనికొచ్చాడు కనుక కావచ్చు. అందులోనూ ధృతరాష్ట్రునికి అతను మరింత సన్నిహితుడు. కవితాప్రసాద్ గారు ఏ సందర్భంలో ఆ ప్రస్తావన చేశారో మీరు చెప్పాలి.

  3. kalluribhaskaram says:

    చరసాల ప్రసాద్ గారూ…ఈ లింక్ పనికొస్తుందేమో దయచేసి చూడండి

    http://www.suryaa.com/archives/

  4. ch.venkateswarlu. says:

    సీమోల్లంఖన కార్య క్రమం మన దగ్గర కూడా ఉందండీ. నా చిన్న తనంలో దసరాకు దేవుడి పార్వేట ఉఉరేగింపులో సేమోల్లంఖన జరిపేవారు. మీరు చెప్పినవన్నీ అక్కడ చేసేవారు.

మీ మాటలు

*