Archives for January 2015

చార్లీ హెబ్డో, చారు వాక్కూ …

Charlie_Hebdo_Tout_est_pardonné

The front cover of 14 January 2015 edition, with a cartoon in the same style as the 3 November 2011 cover, uses the phrase “Je Suis Charlie”. (Headline translation: “All is forgiven.”) [

 

“పెద్ద అబ్సర్డ్ డ్రామా లా లేదూ ప్రపంచం అంతా? ‘గోదా’ సినిమాల్లోలా ఎవడెప్పుడు ఎలా చస్తాడో అర్థం కానంత వయొలెన్స్…”

“మనం ఇక్కడ ఈ సోఫాలో కూర్చుని చిప్స్ తింటూ తెలుగు సినిమా ప్రమోషన్ జాతర చూడ్డం కంటే వయొలెన్స్ ఏముందిలే గానీ, నీ గొడవేమిటో అర్థమైందిలే. ఆ ఫ్రెంచి గోల వదిలేయ్”.

“ఫ్రెంచ్ వైన్, ఫ్రెంచ్ సినిమా, ఫ్రెంచ్ కిస్, వాళ్ళ సాహిత్యం, ఆ ఫ్రీ మైండ్స్. కొత్త ఆలోచనల సీతాకోకచిలకలు అక్కడే ఎన్నో పుట్టి ప్రపంచమంతా విహరించాయి…”

“ఇక చాల్లే. వాళ్ళ లోకంలో వాళ్లుండిపోయి కార్టూన్లేసుకుంటూ బైట ఏం జరుగుతోందో తెలుసుకోకుండా బతికేస్తే సరా”

“వాళ్ళకంతా తెలుసు. బతుకుని లెక్క చెయ్యలేదంతే.”

“బతుకునే లెక్క చెయ్యనివాడు పొలిటికల్ కరెక్ట్ నెస్ ని మాత్రం ఏం లెక్క చేస్తాడ్లే. ‘నేనూ చార్లీనే’ అని కొంతమంది అంటుంటే ఆ మాటలో రేసిజం కోసం వెదుకుతూ మరెంతో మంది సున్నిత మనస్కులు బాధ పడుతున్నారు చూడు. ఏ మతం వాళ్ళ మనోభావాలూ దెబ్బ తినకూడదట. ‘ప్రవక్త బొమ్మ వెయ్యటం అపచారం అని వాళ్లంటుంటే మళ్ళీ మళ్ళీ వేస్తారేమిటీ? అంత గనం ఏముందబ్బా చావు కొనితెచ్చుకోడానికి? మాట్లాడక ఊరుకుంటే పోలా’ అంటున్నారు చాలామంది.”

అ…చ్ఛా……

అదేం దీ…..ర్ఘం?

“ఒక్క ‘అచ్ఛా’ ని ఎన్ని రకాల అర్థాలతో వాడతామో చెప్పాడుగా ‘పీకే’ !”

“ఇవాళ అన్నీ నిషిద్ధ ఫలాల గురించే మాట్లాడతావా ఏంటి?”

“కోట్ల డబ్బులు చేసుకుంటోంది ‘పీకే’! దాన్ని జనాలు నిషిద్ధం చెయ్యలేదు. ఆశారాం బాపూ ల్లాంటి కేసుల్లో సాక్షులు రైలు పట్టాల మీదకి పోతున్నారు. ఇవన్నీ అందరూ చూడ్డం లేదనుకుంటున్నావా? Begone Godmen !”

“చచ్చి నాస్తిక స్వర్గానున్న అబ్రహాం కోవూరు గార్ని ఎందుకు కదిలిస్తావ్ లే !”

“నాస్తిక స్వర్గమా ? ఏం తమాషాగా ఉందా?”

“మరి ? ఇరవైల్లో మనిషి నాస్తికుడు అవాలట. ముప్పైయేండ్లక్కూడా ఆధ్యాత్మిక మార్గానికి రాకపోతే ఆ మనిషిలో ఏదో తప్పు ఉన్నట్టేనట. మా ఆరెస్సెస్ అఖిల్ చెప్పాడు”.

“వాళ్ళమాటలకేంలే వినోదం పంచుతున్నారు. ప్లాస్టిక్ సర్జరీలూ, విమానాలు ఆకాశంలో తిప్పడాలూ, అణ్వస్త్రాలూ అన్నీ మన ఖాతాలోవే అంటున్నారు. ఇవన్నీ పురాతనమైనవీ, మనవే కాబట్టి కొత్తగా ఇప్పుడు కనిపెట్టేదేమీ లేదనే బ్రహ్మజ్ఞానంతో సైన్సు డిపార్టుమెంటుకి ఓ అయిదు పైసలు చాలంటున్నాది గవర్మెంటు.”

“అంటే, నీ తిక్క లెక్కల్తో మన ఆర్యభట్టు, మిహిరుడు, చరకుడు, శుశ్రుతుడు ఇంకా మనకి పేర్లు తెలీని గొప్పవాళ్ళు… వీళ్ళనీ గల్లంతు చేస్తున్నట్టున్నావే !”

Je_suis_Charlie.svg

The Je suis Charlie (“I am Charlie”) slogan became an endorsement of freedom of speech and press.

 

“ఛా… అపార్థుడా! లెక్కలకి ప్రాణం సున్నా. అల్లాంటి సున్నాని ప్రపంచానికిచ్చి, గ్రహస్థితుల లెక్కలు అప్పట్లోనే కరెక్టుగా చెప్పేశారుగా. మనవాళ్ళ తెలివిని తక్కువ చేస్తానా ? అలాటివాళ్ళు ఇంకా ఎవరెవరున్నారో తెలుసుకుని వాళ్ళు చేసిన పనేమిటో తవ్వి చూడటానికి చరిత్ర సైన్యాన్ని, సైన్సు సైన్యాన్ని పోషించాలిగానీ అది మానేసి, అన్నీ మావే అని దబాయింపుకి దిగుతుంటే ఎలా? మన పతంజలి, అదే… యోగసూత్రాల పతంజలి చాలడూ మనం ఛాతీ విరిచి పోజు పెట్టడానికి? అమెరికా మన యోగాని నెత్తినెట్టుకుని దాన్లో కొత్త ప్రయోగాలు చేస్తుంటే మనం చూడు… ఇది వాత్స్యాయనుడి భూమి కూడానని ఒప్పుకోడానికి ఇష్టపడరేం వీళ్ళు? పరమ పాశ్చాత్య విక్టోరియన్ ప్రూడరీని నెత్తినేసుకుని హిందూ మతోద్ధారకులం అంటూ పోజులు.”

“పతంజలి అంత పాపులర్ అంటావా అక్కడ?”

“అతను కాకపోతే అతనిచ్చిన యోగా. చాలదా? మన తెలుగు పతంజలి కూడా తక్కువ్వాడా? భూమి బల్లపరుపేనని వాదించి నిలబడ్డ గోపాత్రుడిలాటి గొప్పోడిని సృష్టించిన పతంజలి కంటే గొప్పవాడు ఎవడు? యోగ పతంజలి పేరు పెట్టుకుని, ప్రజాస్వామ్యంలో మందిబలాన్నిబట్టీ కులం పరపతినిబట్టీ భూమి గుండ్రమో బల్లపరుపో డిసైడ్ అవుతుందని బంగారమంటి మాటలు చెప్పి వెళ్ళాడు. ఈ పతంజలిని చదివితే సూర్యనమస్కారాలు చేసినంత రష్ వొచ్చేస్తుంది వొంట్లోకి.”

“అమ్మో పతంజలి పారవశ్యంలో పడకు. ఇక అందులోనే కూరుకుపోతావ్. చార్లీ హెబ్డో అని మొదలు పెట్టావు. దాంతో నా బుర్ర మతాల లోతుల్లోకి లావాలా ప్రవహిస్తోందనుకో.”

“అంతొద్దులే బాబూ. అవన్నీ పండితులకి వదిలేద్దాం. మామూలుగా మాట్లాడుకుందాం. మతాల సారం, అవి చెప్పే నీతులూ గొప్పవే. కాదంటే తంతారు గానీ, తమ మతాల్ని మిగతా మతాలతో తెగ పోల్చుకుని గొప్పలు పోతున్నారబ్బా చాలామంది !”

“అన్ని పాములూ తలెత్తితే లేడిక పాం కూడా తలెత్తిందట. కానీయ్. నీ గొప్పేంటో నువ్వూ చెప్పు.”

“నేను నాస్తికుణ్ణి. కులాన్ని, మతాన్ని నేను వదిలేసినా అవి నన్ను వదలవని గ్రహించిన నాస్తికుణ్ణి నేను.”

“ప్చ్… అదీ ఓ మాటే? పాత ఫాషన్ ! ఎవరి మతపు గనిని వాళ్ళు తవ్వితీసి, దొరికిన వజ్రాల్ని గర్వంగా ప్రదర్శించుకుంటున్న కాలంలో నాస్తికుణ్ణి అనటం చప్పగా చల్లారిన కాఫీలా ఉంది.”

“అది మంచి ఓల్డ్ వైన్ నాయనా, మత పైత్యానికి విరుగుడు.”

“అది కూడా హిందూమతం వైన్ లోని ఓ పెగ్గే.”

“కాదన్నానా? ఎంతైనా హిందూ మతంలో కొన్ని మంచి సౌకర్యాలున్నాయి లెద్దూ ! ‘నేను నాస్తికుడిని’ అని హాయిగా చెప్పేసుకోవచ్చు. ఎవడూ తల తీసేస్తాడన్న భయం లేదు. అది చారు వాక్కు… అంటే మంచి మాట . అదే … చార్వాకుని దారి. ప్రత్యక్ష ప్రమాణం కావాలన్నాడు కదాని ఆయన్ని పాపం హెడోనిస్టుగా ముద్ర వేసెయ్యటానికి తరువాతివాళ్ళు ఏమాత్రం ఆలోచించలేదేమో!

“ఇక ప్రవహించకు ఆగు. మిగతా మతాల్లో నాస్తికులు ఉండరన్నట్టు గొప్పలు పోతున్నవ్. నీ తూకం హిందూ గొప్పతనం వేపు మొగ్గుతోంది చూసుకో.”

“ఆపవో! ఈ ఇజాల గులాబీలతో ముళ్ళ బాధకూడా తప్పట్లేదు! అందరూ ‘బిట్వీన్ ద లైన్స్’ చదూతున్నారు. మనది ఏ కులమో మతమో లెఫ్ట్ రైట్ సెంటర్ లో ఎక్కడ మన్ని సెట్ చెయ్యొచ్చో ఊహించి వెంటనే ఆ పని చేసేస్తున్నారు. ఈ మతంలో ఇది బాగుంది అంటే కూడా తప్పేనా? ఇస్లాం లో వడ్డీ తీసుకోవటం తప్పని చెప్పి ప్రవక్త నిషేధించాడని విన్నాం. అసమానతల్ని చెరపటంలో ఇదెంత ముఖ్యమైన విషయం ! అలాగే క్రిస్టియన్ మతంలో ‘క్షమ’ ఎంత గొప్ప విషయం! ప్రతి మనిషీ సాధించి తీరాల్సిన ఆదర్శం. కానీ దీనికి విరుద్ధంగా చర్చ్ చేసిన దారుణాలు, తీసిన ప్రాణాలు తక్కువా? ఇప్పుడు పోప్ కాస్త అభ్యుదయం చూపిస్తున్నాడు గానీ!. ఇంకో మాట కూడా చెప్పుకోవాల్లే. నెహ్రూ, కమ్యూనిస్టులూ కలిసి రేపిన సెక్యులరిజం హిందూమతాన్ని చక్కటి సాఫ్టీ ఐస్ క్రీంలా తయారు చేసేసింది. అది సరిపోనట్టు ఇంకా ఆక్కుండా ప్రభుత్వాలు, సెక్యులరిస్ట్ లూ ఓవరాక్షన్ చేస్తూ పోతుంటే, అదును చూసి ఆ రెండు పెద్ద వ్యాప్తిమతాలతో సమానంగా దీన్నీ వాటిపక్కన కూర్చోబెట్టే ప్రయత్నంలోకి వచ్చేశారు మన హిందూత్వులు. ఇక హిందూ మతంలో వెరైటీ, ఓపెన్ నెస్ ఏం మిగుల్తాయి? ఘర్ వాపసీలు, ఆడా మగా ఆంక్షలు, నలుగురేసి పిల్లల్ని కనమని బోధలు… స్టాండర్డ్ మత గ్రంథం ఒకటి సెట్ చేసెయ్యాలని ప్రయత్నాలు. ఈ న్యురాసిస్ అంతా ఏమిటో! కాపీ కేట్స్!”

“ఎక్కువ రెచ్చిపోకు. పెరుమాళ్ మురుగన్ లా నీతో కూడా క్షమాపణలు చెప్పించెయ్యగలరు. నీ నాస్తిక మతం ప్రవర్ధిల్లిన తమిళనాట ఆ రచయితకి అలాటి దుర్గతి ఏమిటో ! పెరియార్ వారసులంతా ఏం చేస్తున్నారో! మతాన్నైతే తిడతారు తప్ప కులం అనేసరికి మనుషులంతా ఓట్ల మందల్లా కనిపిస్తారేమో వీళ్ళకి?”

“అబ్బా! పట్టేశావు. ఏ సిద్ధాంతం మాత్రం లొసుగుల్లేకుండా అంత పరిపూర్ణం? మన వంకరల్ని తీర్చి మంచిమనుషులుగా దిద్దటానికి చేసే ప్రయత్నాలు సిద్ధాంతాలవుతాయి. ఒక్కొక్కటి ఏనుగంత భారీగా పెరిగి ఘీంకరిస్తే ఒక్కొక్కటి రామచిలకలా సన్నగా ఓ ముచ్చట చెప్తుంది. నాస్తికత్వం అలాంటి రామచిలకే అనుకో. మతాల అరణ్యంలో అదీ అవసరమే. మనలో మాట! మా నాస్తికుల్లోనూ కొంచెంకొంచెం తేడాలున్నాయి.. నాస్తిక సంఘంవాళ్ళు పూలు పనికి రావని కూరగాయల మాలలు వేసుకోటం లాంటివి నా దృష్టిలో పూర్ ఈస్తటిక్స్ బాబా!”

“అంతేనా! నీ నాస్తిక రామచిలక ఏ దేవుడి గుళ్ళోనో వాలకపోతుందా నేను చూడకపోతానా? దేవుడి గుళ్ళో పులిహోరలూ పరమాన్నాల రుచీ, మీ బషీర్ ఇంట్లో షీర్ ఖుర్మా, హలీం, జార్జి స్వయంగా తయారు చేసి నీ నోట్లో పెట్టే క్రిస్మస్ కేకూ… ఇవి లేకపోతే నీ బతుకు మాత్రం వ్యర్థం కాదూ? మతాలు లేకపోతే నాలిక్కి ఈ రుచులెక్కడ దొరుకుతాయి స్వామీ?”

“నాలిక్కే కాదు, కళ్లకోసం మంచి మంచి శిల్పాలూ చిత్రాలూ నాట్యాలూ, చెవులకోసం చక్కటి సంగీతాలూ … లేవన్నానా? అమ్మో నువ్వు నన్ను సెంటీ లోకి లాగుతున్నావ్. విషయానికి రా. చార్లీ హెబ్డో టీమ్ ని అన్యాయంగా చంపెయ్యటం మరీ కరుడు గట్టిన ముల్లాలకి తప్ప ఎవరికీ నచ్చట్లేదంటున్నారు కానీ, ఆ కార్టూనింగ్ తో చాలామందికి సమస్య ఉందని చెప్తున్నారు. చాలామందిది కండిషనల్ ఖండన. ఈ కండిషనల్ ఖండన చేసేవాళ్ళు ఎక్కువమంది ఏదో ఒక మతాన్ని గట్టిగా నమ్మేవాళ్ళే. మహమ్మద్ మీద కార్టూనేస్తే మన దేవుళ్ళ మీద వేసినా ఒప్పుకోవాలి కదా, అది చెయ్యలేము కదాని ఆలోచనలో పడతారు. ఇంకా చాలామంది సగం సగం సెక్యులరిస్టులు. లేదా మనస్సులో అమెరికా ఘోరాలు గుర్తు తెచ్చుకుంటున్నవాళ్ళు. ఇంత గందరగోళంలో నాస్తికత్వమే సరైన చేదుమందు. మతాలూ, ప్రవక్తలూ, పోప్ లూ, స్వాములూ… ఎవరూ విమర్శకీ కార్టూనింగ్ కీ అతీతులు కారు నాస్తికుడి దృష్టిలో. బ్లాస్ఫెమీ అంటే నాస్తికుడికి తిండి తినడమంత మామూలు సంగతి. జార్జ్ కార్లిన్ ‘Atheism is a Non Prophet Organisation’ అన్నదందుకే. నిజానికది మతాల కేటరాక్ట్ ని కోసి తీసేస్తుంది. అప్పుడే మతాలు శుభ్రమైన కళ్ళతో మనిషిని చూడగలుగుతాయి.”

Indian journalists expressed solidarity with the victims of attack at New Delhi on 9 January 2015. Displayed cartoon by Shekhar Gurera Main article: Charlie Hebdo shooting On 7 January 2015, two Islamist gunmen[50] forced their way into and opened fire in the Paris headquarters of Charlie Hebdo, killing twelve: staff cartoonists Charb, Cabu, Honoré, Tignous and Wolinski,[51] economist Bernard Maris, editors Elsa Cayat and Mustapha Ourrad, guest Michel Renaud, maintenance worker Frédéric Boisseau and police officers Brinsolaro and Merabet, and wounding eleven, four of them seriously.[52][53][54][55][56][57] During the attack, the gunmen shouted "Allahu akbar" ("God is great" in Arabic) and also "the Prophet is avenged".[50][58] President François Hollande described it as a "terrorist attack of the most extreme barbarity".[59] The two gunmen were identified as Saïd Kouachi and Chérif Kouachi, French Muslim brothers of Algerian descent.[60][61][62][63] The "survivors' issue" Main article: Charlie Hebdo issue No. 1178 The day after the attack, the remaining staff of Charlie Hebdo announced that publication would continue, with the following week's edition of the newspaper to be published according to the usual schedule with a print run of one million copies, up significantly from its usual 60,000.[64][65] On 13 January 2015 the news came on BBC that the first issue after the massacre will come out in three million copies.[66] On Wednesday itself it was announced that due to a huge demand in France, the print run would be raised from three to five million copies.[67] The newspaper announced the revenue from the issue would go towards the families of the victims.[68] The French government granted nearly €1 million to support the magazine.[69] The Digital Innovation Press Fund (French: Fonds Google–AIPG pour l’Innovation Numérique de la presse), partially funded by Google, donated €250,000,[70] matching a donation by the French Press and Pluralism Fund.[71] The Guardian Media Group pledged a donation of £100,000.[72] Je suis Charlie Main article: Je suis Charlie

Indian journalists expressed solidarity with the victims of attack at New Delhi on 9 January 2015. Displayed cartoon by Shekhar Gurera 

“హిందూ లిబరల్ కంఫర్ట్ జోన్ లో కూర్చుని ఎంత బాగా పలుకుతోందో ఈ నాస్తిక రామచిలక !”

“కంఫర్ట్ జోన్ లో ఉన్నానన్నమాట కాదన్ను గానీ లిబరల్ హిందువు నిరంతరం ఇలాంటివాటిని వ్యతిరేకిస్తూ ఆ కంఫర్ట్ జోన్ ని కాపాడ్డానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టే ఇన్ని తెగల, జాతుల, కులాల, మతాల మనుషులున్న ఈ నేల ఘనీభవించి ఒకే గడ్డగా అయిపోకుండా వుంది. ‘హైదర్’, ‘పీకే’ లాంటి సినిమాల సక్సెస్ చూస్తే అలా కరడు గట్టే అవకాశం ఉందని కూడా అనిపించట్లేదు. తీవ్రవాదులు ఘోరాలు చేసినప్పుడల్లా మామూలు ముస్లిమ్ లు ఇరకాటంలో పడుతుంటారు. గట్టిగా ఖండించలేకపోగా ఇలాటివి జరిగిన ప్రతిసారీ వాళ్ళు దేశానికి విశ్వాస ప్రకటన చెయ్యాలి. చాలామంది లిబరల్ ముస్లిమ్ లు ఈ చంపుడు పందేలు ఇస్లాం కాదని బాధ పడుతూ ఉంటారు. అంతకంటే ఎక్కువ మాట్లాడి మతాన్ని ఆఫెండ్ చేస్తే దేశాలు దాటి దాక్కోవటానికి అందరూ హుసేన్లూ, రష్డీలూ, తస్లీమాలూ కారు కదా! నాకనిపిస్తుంది వీళ్ళంతా వ్యక్తిగతంగా కాకపోయినా గుంపుగా కరడు గడుతున్న ఇస్లాం గురించి చర్చలు చేసి తీర్మానాలు చెయ్యవచ్చుగదాని !”

“నిజమే, ప్రజాస్వామ్యాల్లో ఆ పాటి స్వేచ్ఛ ఉంటుందిలే. అంతా నీ నాస్తికత్వం ప్రయోజకత్వమే కానక్కర లేదు.”

“అదే అసలు పాయింటు. ప్రజాస్వామ్యాల్లో స్వేచ్ఛ ఉన్నా, పతంజలి చెప్పినట్టు గుంపులే కదా భూమి గుండ్రంగా ఉందో బల్లపరుపుగా ఉందో నిర్ణయించేది ! అన్ని మతాలూ ఆన్ని రకాల ప్రశ్నల్నీ ఎదుర్కోవాలని, అప్పుడే అవి ప్రజాస్వామిక మతాలౌతాయనీ ఎక్కువమంది చెప్పట్లేదే! సూటిగా ఎవరూ మాట్లాడరేం? “మీ పేరేమిటి” అని గురజాడలా దేవుళ్ళనీ మతాలనీ ఇప్పుడు ఎవరూ ప్రశ్నించరేం? చార్లీ హెబ్డో కార్టూన్లు కల్చర్ షాక్ అని చెప్పడానికి వీల్లేదు. ప్రపంచంలో అందరూ ఇంటర్నెట్ ని వాడుకుంటూ అన్నిటి గురించీ తెలుసుకుని ఎవరికి కావలసింది వాళ్ళు ఏరుకుంటున్నప్పుడు, ఏ రకమైన అథారిటీనీ, అహంకారాన్నీ ఉతక్కుండా వొదిలిపెట్టని ఫ్రెంచ్ కార్టూనిస్టుల సెన్సిబిలిటీ స్థాయి మాత్రం ఎందుకు అర్థం కాదు? మతాన్ని ప్రశ్నించకూడదనే శుద్ధ అహంకారాన్ని పెంచి పోషించుకోవటం తప్ప ఏముంది ఇందులో? ఐ. ఎస్. తీవ్రవాదం వైపు వెళ్తున్న వాళ్ళలో ఎక్కువమంది సాఫ్ట్ వేర్ వాళ్ళని వినటం లేదా? క్రూడాయిల్ డబ్బుతో, ఆయుధాలతో రెచ్చిపోయి ప్రపంచాన్ని శాసించాలనే కోరికతో ఇస్లాం పేరుమీద ఇస్లామిస్ట్ స్టేట్, అల్ కాయిదా తీవ్రవాదులు చేస్తున్న తెగల నరమేధాన్ని, అమెరికా చేతుల్లో ముస్లింలు పడిన బాధలకు వాళ్ళు చేస్తున్న ప్రతీకారమని ఇంకా అనుకుంటే అమాయకత్వమే.”

“అది సరేలే. యజిదీ అనే తెగ ఉంది ఇరాక్ లో! వీళ్ళ జనాభా కొన్ని లక్షల్లోపే. ఆ తెగ నీ భాషలో ఐస్ క్రీం తెగ. పాపం ఆ అరిటాకు తెగ మీద ఈ ఐ.ఎస్. ముల్లు పడి చీల్చి పారేసింది. ఉన్మాదంతో వేలల్లో ఆ తెగ జనాభాని చంపేశారు ఐ.ఎస్. వాళ్ళు. యజిదీ ఆడవాళ్ళనీ పిల్లల్నీ బానిసలుగా మార్చారట. ఇవన్నీ చూసి మనకీ న్యురాసిస్ పెరుగుతున్నట్టుంది. మన గురూ రవిశంకర్ గారు వెళ్లి యజిదీలని ఓదార్చి వచ్చాడు. ఇది ఏ కాలం అంటావ్?”

“మతం ఫుల్ సర్కిల్ లోకొచ్చిన పిచ్చి కాలం. ప్రపంచమంతా కుడి వైపుకే నడవటంలో దాగున్న ప్రమాదాన్ని గమనించు. ఇప్పటికైనా తెలుస్తోందా చార్లీ హెబ్డో విలువేంటో! మన నేల మీద ‘పీకే’ గెలవటం కోసం ఆ సినిమావాళ్ళు జాగ్రత్తగా స్క్రిప్ట్ తో చేసిన తాడు మీద నడక లాంటి విన్యాసమేంటో! జనం తెలివిగానే ఉన్నారు. దేవుడి మేనేజర్లకు దేవుడినుంచీ కాకుండా ఇంకెవరో ఆకతాయి దగ్గరినుంచీ ఆదేశాలు వస్తున్నాయని మొదట ఊహిస్తాడు కదా ‘పీకే’! చివరికి మేనేజర్లే ఆకతాయిలని గ్రహిస్తాడు. జనం కూడా ఆకతాయి బాబాల్నీ, ముల్లాల్నీ చీడపురుగుల్లా ఏరి పారేయగలిగినప్పుడు, కరుడు గడుతున్న మతాలు కరిగి వెన్న అయి, ప్రశ్నల్లో కాగి, సమాజానికి ఉపయోగపడే జ్ఞానమనే కమ్మని నెయ్యి బయటపడుతుంది.”

“క్యా బాత్ హై! అలాగే ఊహా స్వర్గంలో విహరించు. ముఖ్యంగా మన నరేంద్ర దభోల్కర్ కీ నివాళులు అర్పించు. నమ్మకానికీ, ద్వేషానికీ తప్ప హేతువుకు కాలం కాదిది.”

“అందుకే ఇప్పుడే హేతువును నెత్తిన పెట్టుకుని ఊరేగాలి. నేనే చార్లీని, నేనే దభోల్కర్ ని, నేనే చార్వాకని, నేనే ప్రశ్నని, హేతువుని.

 

 

                                                                                                ల.లి.త.

చార్లీ హెబ్డో రేంజ్ కోసం ఇక్కడ చూడండి.

http://www.dailykos.com/story/2015/01/11/1357057/-The-Charlie-Hebdo-cartoons-no-one-is-showing-you#

సహచరి

 Kadha-Saranga-2-300x268

ప్రత్యేక తగ్గింపు ధరలు.. అప్ టూ 60%”

అని ఎర్రరంగులో, పెద్ద పెద్ద అక్షరాలు రాసున్న కార్డుముక్కలు ఆ షాపింగ్ మాల్ లో చాలాచోట్ల కనపడుతున్నాయి.

‘మాల్’ పైకప్పు ఎర్రటి హృదయాకారపు బెలూన్లతో నిండిపోయుంది. వాటి తోకలు, కింద నడిచేవాళ్ల తలలకు కొద్దికొద్దిగా తాకుతుండగా, ఇంకో పక్కన అసలు తలలేలేని డిస్ప్లే బొమ్మలు ఇవేమీ పట్టనట్టు వాటి డ్యూటీ అవి చేసుకుంటున్నయి. ఇవ్వాల వాటి డ్యూటీ కూడా ఎర్రరంగులోనే.. ఎర్ర అంగీలు.. ఎర్ర చుడిదార్లు.. ఎర్ర చమికీ చీరలు.. చేతులకు, ఛాతులకు అతికించిన ఎర్రెర్రని గులాబీలూ… అంత ఎర్రగనే..

గోడలపై నిలుచున్న సినిమా హీరోయిన్లు కూడా నుదుట బొట్టునుండి కాలి గోటివరకు ఎర్రరంగులోనే నిలుచున్నారు.. నవ్వుతూ..

ఇంత “ఎరుపు” దేనికయ్యా అంటే..

ఇవ్వాల “ప్రేమికుల రోజు కాబట్టి”అట.. ఎవరో అనుకుంటుంటే విన్నాను..

అందరి సంగతేమో కాని నాకు మాత్రం ఇవ్వాల మా షాపింగ్ మాల్ చాలా మంచిగనిపిస్తోంది..

ఎటు చూసినా చిరునవ్వులు.. యువజంటల మొహాల్లోనివి..

చల్లటి గాలులు… సెంట్రలైజ్డ్ ఏసీ నుంచి వచ్చేవి…

గులాబిల పరిమళం… రూం ఫ్రెష్నర్ ఫ్లేవర్ అది..

బహు సున్నితమైన సంగీతం… స్పీకర్లలో నుండి…

కొత్తగా.. కొంత మత్తుగా… అబ్బా.. చాలా చాలా మంచిగుందీ రోజు.

అదిగో.. అంత మత్తు కూడా చిత్తయిపోయింది.. అతన్ని చూసిన ఆ క్షణంలో…

ఆకాశం లో చుక్క తెగిపడినట్టు “అతను” ఒక్కసారి ఇలా కనిపించి అలా మాయమయ్యాడు…

“చుక్కరాలితే” మొక్కుకోవాలిగా మరీ!

నేను “తను మళ్లీ కనిపిస్తే బాగుండని కోరుకున్నాను”..

కోరిక తీరింది..

కాసేపటికి తను కనిపించాడు..

కనిపించడం అంటే అలా ఇలా కాదు…

ఓ అద్భుతంలా..

కనిపించాడు..

తనే ప్రపంచంలా అనిపించాడు..!

ఎందుకనిపించాడో తెలీదు.. కానీ అనిపించాడు….

తనకూ నేను కనిపించాను..

నాకూ తను కనిపించినట్టే…

తనకూ నాలాగే అనిపించిందనుకుంటాను..

ఎందుకంటే..

నన్ను చూడగానే అతని మొహం ఎర్రబడింది.. అచ్చం ఇవ్వాల్టి మా మాల్ లాగే…

ఆ ఎరుపును సిగ్గుకి గుర్తు అనుకునేరు..

కాదు..

అది ప్రేమ..

మీకు తెల్సుగా.. ప్రేమరంగు ఎరుపని?

నాకు తెలుసు..

తను నన్ను ప్రేమిస్తున్నాడు..

తనకి తెలుసు..

నేను అతనికోసమే పుట్టాను..

ఇంతలో ఒకడొచ్చాడు.. తన పక్కకి..

స్నేహితుడట..

వినిపించింది..

నచ్చిందా?? స్నేహితుడి ప్రశ్న..

“మ్మ్”.. రెప్పవేయకుండా నన్నే చూస్తున్న ఈయన జవాబు..

ఎంత??

చచ్చేంత..

నేనడిగేది అదికాదురా… స్నేహితుడు ఇంకేదో అనబోయాడు..

ఈయన ఆపాడు..

ఆ వెంటనే నా దగ్గరికొచ్చి..

సహ జీవనం అన్నాడు..

“సరే” అన్నాను.. కళ్ళతోనే…

నన్నెత్తుకుని గాల్లో గిరగిరా తిప్పాడు.. సంబురంగా..

నేను గలగలా నవ్వాను.. హాయిగా..

అతడు ఆగలేదు..

నేను ఆపలేదు..

“లవ్ అట్ ఫస్ట్ సైట్” విన్నారుగా??

మాది “లైఫ్ అట్ ఫస్ట్ సైట్”..

ఇకనుంచి తనే నాజీవితం…

నేనిప్పుడు అతని “సహచరిని”..

******

నన్ను వాళ్ళింటికి తీసుకొచ్చాడు..

అక్కడున్నాయన వాళ్ల నాన్న.. ఈయన పిలిస్తే తెలిసింది…

“ఆయనకు” నేను నచ్చలేదు.

దాన్ని ఎక్కడినుంచి తీసుకొచ్చావో, అక్కడే వదిలేసిరాపో.. అన్నాడు.. నిర్దాక్షిణ్యంగా..

“ఈయన” వినలేదు.. నిర్లక్ష్యంగా..

ఆయన తిట్టాడు.. బాగా..

ఈ ఒక్కవిషయం మాత్రం నా ఇష్టానికి విడిచిపెట్టు నాన్న, ప్లీజ్.. అన్నాడు.. ధైర్యంగా..

ఆయన తిడుతూనే ఉన్నడు.. చాలాసేపు.. గొంతు నొచ్చేదాకా.. దగ్గు వచ్చేదాక..

దగ్గు రాగానే ఆమెకూడా వొచ్చింది.. తండ్రికొడుకుల మధ్యలోకి.. ఈయనకు అమ్మ.. ఆయనకు భార్య.. చూస్తే తెలుస్తోంది..

“నాన్న మాట వినొచ్చు కదరా” అని ఈయనతో అంటూనే ఆయనకు గ్లాసుతో నీళ్లు అందించి ఛాతిని అరచేత్తో రుద్దుతోంది..

ఈ ఒక్కసారికి నాన్నే నా మాట వినొచ్చు కదమ్మా..

“అదిగో మళ్ళీ” అంటూ ఆయన లేవబోతూ మళ్ళీ దగ్గాడు..

అప్పుడొచ్చింది ఇంకో ఆమె.. కాస్త చిన్నది.. ఈయనకు చెల్లె… తర్వాత తెల్సింది..

“నాన్నా, ఇంక వదిలెయ్.. ఇంటిదాకా తీస్కొచ్చాడుకదా!! మళ్ళీ వెనక్కెలా పంపిస్తారూ” అని ఆయనకు చెప్తూనే ఈయన దగ్గరికొచ్చి, నన్ను చూసింది.. ముందు పరీక్షగా… తర్వాత ప్రేమగా..

ఆమెకు నేను నచ్చాను…

“వానికి వంతపాడటానికి ఇదొక్కతి తయారయ్యింది”… ఆయన ఏదో తిడుతూనే ఉన్నాడు..

మేం.. కొత్త జంట..

లోపటికి నడిచాం..

******

అలా నడిచి యేడాది గడిచింది..

“మార్పు” సహజమటకదా? ఎక్కడో విన్నాను..

మాలో అలాంటిదేదీ రాలేదు..

ఆరోజు నుండి ఈరోజువరకు..

మేం ఒకర్నివిడిచి ఒకరం ఒక్కక్షణం కూడా ఉండలేదు..

ఉండలేమూ..

మా బంధం “అద్వైతం”…

కానీ..

వాళ్ల అమ్మది అపార్థం.. అమె కంటికి మేం ఇంకొకలా కనిపించాం..

ఒక్కో కంటిది ఒక్కో చూపుమరి!!

మా బంధం ఆమెకు అసహజం..

మేము ఏం చేసినా అనాగరికం..

నన్నేమీ అనలేక రోజూ అరిచేదామె, కొడుకు మీద…. కోపంతో..

ఇలా..

“ఎప్పుడూ అదే లోకమా? ఇంకో పనేం లేదా??”

“దాన్ని వదిలేసి ఇంట్లో మనుషుల్నో, పనుల్నో పట్టించుకోరాదు??”

“ఇంటిమీదెలాగో సోయిలేదు, కొంచం ఆ ఒంటిమీదన్న సోయుంచుకోరాదూ..” అని… రకరకాలుగా..

తన కొడుకును నేను గుప్పిట్లో పెట్టుకున్నానని ఆమె బాధ…

బాధ కాదు, ఈర్ష్య..

వాస్తవానికి…

నేనే ఈయన గుప్పిట్లో ఒదిగిపోయాను..

కానీ ఆమె అది చూడలేదు, తను చూడలనుకున్నదే చూసింది..

ఆమె ఇష్టం..!!    ఎవరు కాదంటారు!!

వీళ్ల నాన్న..

ఆయనకు నమ్మకాలెక్కువ.. కొడుకు చేసే పనులమీద..

వాటిల్లో ముఖ్యమైనవి రెండు.

తనకొడుకు అందరిచేతిలో వట్టిగా మోసపోతాడు ఒకటీ, అతను పనికొచ్చే పనులేవీ చేయడు రెండు..

ఈ రెండు నమ్మకాలూ, నా వల్ల ఇంకొంత బలపడ్డాయి..

ఆయనకు..

మొదట్లో నేనంటే అయిష్టం అనుకున్నాను.. తర్వాత తెల్సింది అసహ్యం కూడా అని..

“నువ్వు దీని పైపై అందాన్ని చూసి మోసపోయావురా” అని మొదలుపెట్టి

“గడియ రికాం లేదు.. నయా పైస సంపాదన లేదు..

అసలీ పనికిమాలింది చెయ్యబట్టే నువ్విట్లా దేనికి పనికిరాకుండా పోతున్నావ్…

గడ్డి పీకేతందుక్కూడ అక్కెరకురావు.. సంకనాకి పోతవ్ చెప్తున్నా..” అని తిట్టడం..

ఆ తర్వాత దగ్గడం.. ఆయనకు అలవాటయ్యింది..

కొత్తలో కొంచం బాధ అనిపించినా..

పోనుపోను అలవాటయ్యింది..

నాక్కూడా..

వాళ్ళ చెల్లె అంటే చాలా ఇష్టం..

చిన్నది..

మంచిది..

అల్లరి చేస్తుంది..

ఇంట్లో అమ్మని, బయట స్నేహితుల్నీ, గదిలో టివీనీ, బ్యాగులో పుస్తకాలనీ, మనసులో ఊహల్నీ.. ఒకటా రెండా, మొత్తం అన్నీటినీ వదిలి వచ్చేస్తుంది.. నాకొసం..

నాతో ఆడిపాడటం కోసం..

చాలా ప్రయత్నిస్తుంటుంది.. నన్ను అర్థంచేస్కోడానికి..

ఏదైనా అర్థమయినట్టు అనిపిస్తే సంబరపడిపోతుంది..చిన్న పిల్లలా..

చిన్న పిల్లే.. కానీ చిన్నవాటికి మురిసిపోయేంత కాదు..

అందుకే ఆమె సంబరం నాకు ప్రత్యేకం..

కానీ వాళ్ల అమ్మ వ్యతిరేకం..

ఆ పిల్ల మీద కాదు..

నా మీద…

అందుకే తిడుతుంది.. ఆ పిల్లని…

“వాడు చెడిపోయింది చాలదా?? నువ్వొకదానివి తయారయ్యవా కొత్తగా??”

“పో..నడూ.. పొయి పుస్తకాలు తియ్యి..” అంటూ…

ఏ మాటకు ఆ మాట..

‘ఈయన’క్కూడ నేను వాళ్ల చెల్లెతో సన్నిహతంగా ఉండడం అంతగా నచ్చదు..

నేను మొత్తంగా మొత్తం తనకొక్కడికే సొంతం..

తనకు అలాగే ఇష్టం..

నాక్కూడా..

ఎంతైనా తన “సహచరి”ని కదా..

తను చూపించే ప్రేమ ముందు వాళ్ల మాటలు నాకు పట్టింపుకాదు..

తను నాకిచ్చే ప్రాధాన్యతముందు మిగిలిన ప్రపంచంతో నాకు పనిలేదు…

******

ప్రపంచం తలక్రిందులయ్యే క్షణమొకటుందని నాకప్పుడు తెలీదు..

కాసేపలా బయటికి వెళ్లొద్దామని సాయంత్రం పూట బయల్దేరాం.. ఎప్పటిలాగే.. బైక్ మీదే..

ఎవరో తుమ్మారు.. పట్టించుకోలేదు..

చల్లటి వాతావరణం కదా..

చాలా హాయిగా ఉందా ప్రయాణం..

అప్పుడప్పుడే వెలుతురు పోయి కొద్ది కొద్దిగా చీకటి పడుతోంది..

చిన్న ప్రయాణం లాంగ్ డ్రైవ్ గా మారుతోంది..

జోరుగా.. హాయిగా..

రయ్ మని ముందుకు పోతున్నాం..

తను అప్పటిదాకా నాతో మాట్లాడుతూనే ఉన్నడు..

కానీ ఇంతలో ఏమనిపించిందో!!

ఓ పాట పాడమన్నాడు.. నన్ను…

నడిరోడ్డుమీద..

తనకు బాగా నచ్చిన పాటొకటి పాడడం మొదలుపెట్టాను..

నిస్సంకోచంగా..

నా పాటలంటే తనకు చాలా ఇష్టం.

అందుకేనేమో, వింటూ లోకాన్నే మైమరిచిపోతున్నడు.. గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో..

ఒక్కపాట తర్వాత మరొకటి.. ఇంకొకటీ.. ఇట్ల ఐదు.. ఆరు… పది..

మా వేగంకూడా అరవై నుండి డెబ్భై.. ఎనభైలుగా.. పెరుగుతోంది..

క్రమక్రమంగా..

పదిహేనో పాట మొదలుపెట్టానోలేదో..

“ముల్లు” ఎనభయ్యైదు దాటింది..

అంతే..

“”ఢాంoo””

పేద్ద శబ్దం…

అంతా శూన్యం..

పాట ఆగింది…

మా ప్రయాణం కూడా..

******

మెల్లగా కళ్ళు తెరిచాను..

బహుశా నరకంలో..

శవాల కంపు…

శవాలనూ, జీవచ్చవాలనూ ఒక్క చోటే చేర్చినట్టు..

కాదు.. పేర్చినట్టున్నారు.. వరుసగా…

కొన్ని దేహాల్లో కొన్ని భాగాలు లేవు..

ఇంకొన్ని దేహాల్లో ఉన్నాయి.. కానీ కొన్నే..

చిన్న చిన్న మూలుగులు..

పెద్ద పెద్ద ఏడుపులు..

వినడానికే ఒక్క మనిషి కూడా లేడు..

తనకోసం చూద్దామనుకున్నను.. కనిపించట్లేదు..

పిలుద్దామనుకున్నాను..

గొంతు రాలేదు.. పోయింది..

నా స్వరం ఒక్కటే కాదు..

సర్వం పోయింది.. నాశనమై..

ఒక్కటి మాత్రం మిగిలుంది..

ప్రాణం..

అదికూడా పోతే మంచిగుండు.. తనని చూసిన తర్వాత..

ఒకే ఒక్కసారి..

 

******

తన గొంతు వినిపించింది..

“లారీ ఆగి ఉండే.. కనీసం ఇండికేటర్ కూడ ఏస్కోలే సాలెగాడు.. చీకటికదా, కనవళ్లే.. అందుకే సడన్ గా.. ”

ఎవరికో చెప్తున్నాడు..

హమ్మయ్యా.. తనకేం కాలేదు…

నా మొహం మళ్ళీ వెలిగింది.. ధైర్యంతో…

ఇద్దరం కలిసి ఇంటికొచ్చేసాం.. ఆటోలో..

అంతా మంచిగనే ఉంది.. కానీ..

తన మొహానికి నాలుగు కుట్లూ, చేతికో కట్టు..

నా సంగతి వేరే..

మనసు తప్ప మిగిలినవన్నీ విరగి ముక్కలయ్యాయి..

అయితే ఏంటి.. తనున్నాడుగా తోడుగా.. కానీ..

తన మొహంలో సంతోషం లేదు..

నా అవస్థ చూసి బాధపడుతున్నాడనుకున్నా.. మురిసిపోయా..

కానీ ఆ మురిపెం, ఇంట్లో నన్నో మూలకు పడుకోబెట్టగానే తీరిపోయింది..

అసలు విషయం తెలిసింది..

ఇకనుంచీ ఆ మూలే నా ఇల్లు..

మొదటిసారి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వాళ్ల నాన్న, అమ్మా నన్ను ఎలా చూసారో ఇప్పుడుకూడా అట్లనే చూస్తున్నారు.. వింతగా..

కాకపోతే.. అసలు వింత అది కాదు..

“ఇప్పుడన్నా మాట విన్నందుకు సంతోషం.. అట్ల బయట విడిచిపెట్టస్తరా ఎవరన్న??

మూలకున్నా మానేగాని, అది మనింట్లనే ఉండాలే.” వాళ్ల నాన్న మొదటిసారి, దగ్గులేకుండా .. నాగురించి, “నాకోసం” మాట్లాడుతున్నడు..

“తీసుకచ్చిండుగదా.. ఇంక ఆ ముచ్చట విడిచిపెట్టుండ్లి..” అని భర్తకు చెప్తూ, నీళ్ళ గ్లాసును కొడుక్కిచ్చింది అమ్మ..

ఈయన నీళ్ళు తాగుతున్నడు.. ఆమె అంటోంది-

“ఎంత పెద్ద గండం గడిచింది కొడుకా.. దేవుని పుణ్యాన చిన్న చిన్న దెబ్బల్తోటి పోయింది.. నా బిడ్డా” అని.. ప్రేమగా దగ్గరకు తీస్కుని నుదుటిన ముద్దుపెట్టుకుంది..”

ఎంత మంచి దృశ్యం..! ఠక్కున ఫోటో తీస్తే బాగుండు అనిపించింది.. కానీ.. నేను లేచే స్థితిలో లేను…

ఇంతలోనే.. ఓ మెరుపు..

“దాని వల్లే ఇదంతా జరిగింది.. అసలది లేకుంటే అన్నకిట్ల యాక్సిడెంటే జరగక పోవును.. దొంగ మొఖం ది..

బయటెక్కడ్నన్న విడిచిపెట్టిరావల్సింది.. అసల్ దాన్ని మళ్లీ ఇంట్లోకెందుకు తెచ్చావ్..” పిడుగుల్లంటి ఆ మాటలు.. తన చెల్లెవి…

మార్పు..

ఆమె గొంతులో.. మనిషిలో కూడా..

“అదేం చేసిందే? దాని తప్పేం లేదు… డ్రైవింగ్ చేసేటపుడు వీనికి జర సోయుండొద్దా..” వాళ్ళ నాన్న తిడుతున్నాడు ..

“అబ్బా.. ఇంక ఈ ముచ్చట విడ్శిపెట్టుమన్నగదా..” అమ్మ అంటోంది..

ఈయన మొహంలో బాధ.. నన్ను చూసి..

“నువ్వేం బాధపడకన్నా.. మనకేం తక్కువ.. అదికాకపోతే ఇంకోటి..” చెల్లెమ్మ సలహా..

నిన్నటిదాకా ఆమె..

చిన్నది.. అల్లరిదీ.. ప్రేమగా నాతో ఆడుకునేది..

కానీ ఇవ్వాల??

ఇవ్వాల కూడా ఆడుకుంటోంది… నా జీవితంతో..

“అది కాకపోతే ఇంకోటట!!”

ఆ మాట వచ్చిన వెంటనే ఈయన ఆమె చెంప చెళ్లుమనిపిస్తాడనుకున్నాను.. కానీ..

“మీ ఇష్టం.. ఈ సారి నాన్న ఎట్లంటే అట్ల.. ఏదంటే అదే..”తనన్నాడు.. నవ్వుతూ..

చెంప చెళ్ళుమంది!!

నాది…

ఈ మాట వినటానికా కొన ఊపిరితో బ్రతికుంది!!

******

తనతో గడిపిన క్షణాలు.. ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి.. కలలో లాగా…

తన మునివేళ్లతో నా పెదాల్ని స్పర్శించినపుడు.. నా మొహం వెన్నెలయ్యేది..

తన పెదాలే నన్నుతాకినపుడు.. స్వర్గపుటంచులకు చేరినట్టుండేది..

తను నా పాదాలకు చెక్కిలిగింతలు పెట్టినప్పుడు..

నేను గల గల నవ్వుతోంటే ఎంత ఆనందించేవాడు తను!

ఎవరైనా నన్ను పొగిడితే ఎంత గర్వపడేవాడు.. తను!

రాత్రి-పగలు తెలీకుండా, ఎర్రటి ఎండల్లో చల్లటి వెన్నెల్లో ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పేవాడు.. తను!

చాటుగా..

తన చేతుల్తో నా నడుమును చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసేవాడు… తను!

తను.. తను.. తను…

నా తనువెల్లా తనే..

నాలో ప్రతి అణువెల్లా అతనే..

ఎన్నిసార్లు వాళ్ళ అమ్మానాన్నల్ని ఎదురించాడు.. నా కోసం..!!

కన్నవాళ్లతోనైనా మాట్లాడకుండా ఉన్నాడేమోకాని, నాతో మాట్లాడకుండా ఉండని క్షణం లేదు..

అదంతా గతం…

అప్పుడు మేం అవిభాజ్య కవలలం..

మా బంధం అద్వైతం..

కాలం ఆగదుకదా..

తిరిగింది.. గిర్రున..

మరొక యేడాది ముందుకు…

నేను అలాగే ఉన్నాను.. ఓ మూలకు.. ఉలుకు పలుకు లేకుండా..

తను కూడా అచ్చం ఇదివరకటిలాగే ఉన్నాడు..

చాలా సంతోషంగా.. ఉత్సాహంగా..

కానీ.. మరొకరితో..

కొత్త “సహచరి”తో..

తను..

కొత్తది.. నాకన్నా..

తెలివైంది.. నాకన్నా..

అందంగలది… నాకన్నా..

గలగలా నవ్వుతోంది.. నాకన్నా..

ఎంతోగొప్పగా వెలిగిపోతోంది.. నాకన్నా…

కానీ..

అది నాకు నచ్చలేదు..

“అది” అంటే ఆ కొత్తదని కాదు..

వాడు చేస్తున్న “వ్యవహారం” అని..

అవును “వాడే”..

ఒకప్పుడు నేను లేకుండా క్షణం ఉండలేకపోయిన వాడు..

అనుక్షణం నన్ను గుండెల్లో పెట్టుకున్న వాడు..

నాకు చిన్న దెబ్బతాకినా విలవిల్లాడిపోయే వాడు…

వాడు..

ఇవ్వాల నేనిట్ల జీవచ్చవంలా పడుంటే, నా కళ్లముందే ఇంకో దానితో.. నవ్వుతూ..

నాకు నచ్చలేదు..

వాడూ, వాడి వ్యవహారం..

నా వొళ్ళు మండిపోతోంది..

కడుపు కాలిపోతోందీ…

ఈ మాటలు మాటవరసకి చెప్పటం కాదు..

నిజంగానే..

దహించుకుపోతుంది… నా శరీరం..

ఏదో జరగబోతోంది..

నాకు తెలుస్తోంది…

చచ్చిపోతానని…

నా నరనరాల్లో కరెంటు పారుతున్నట్టుగా మండుతోంది..

నిజంగానే…

ఒళ్లుపేలిపోయేంత మంట.. ఎర్రనిది..

ఎరుపంటే నాకిష్టం..

ఇప్పుడు చావంటే కూడా..

ఎరుపు రంగులో మృత్యువు..

నాకు నచ్చింది..

నేను సిద్ధమే..

కానీ ఊరికే కాదు..

తోడుగా వాడు కావాలి..

తీసుకుపోనా??

Sahachari60

వాడికి కూడా ఎరుపంటే ఇష్టం మరి!!

తీసుకుపోనా??

వద్దులే..

పాపం ఆ పిచ్చిది.. కొత్తది..

వాడిమీద ఎన్నో ఆశలుపెట్టుకుని వచ్చినట్టుంది..

దానికోసం.. కేవలం దానికోసం..

వదిలెస్తా.. వీడిని…

కానీ ఊరికనే కాదు..

నేను గుర్తుండిపోయేలా..

ఓ కానుక ఇచ్చి..

ఆనందంగా..

వెళ్ళిపోతా..

నా ఎడమ వైపుకొక వైర్ వేలాడుతోంది..

హాస్పిటల్ లో పేషెంట్ చేతికి రక్తమో, సెలైనో ఎక్కించే పైపులాంటిది…

అది నన్ను బ్రతికించడానికి పెట్టాడో, సులువుగా చంపాలని పెట్టాడో.. నాకు అనుమానమే..

కానీ చేసేదేం లేదు..

వెళ్లిపోవల్సిందే..

కాలం ఆగదుకదా.. నాకోసం…

ఈలోపే వాడికి ఆ కానుక ఇచ్చెయ్యాలి…

త్వరగా..

అతి కష్టమ్మీద కళ్లు తెరిచే ప్రయత్నం చేస్తున్నాను..

ఒళ్ళు కాలిపోతోంది.. ముట్టుకుంటే మాడిపోయేంతగా..

ప్రయత్నం ఫలించింది.. కళ్ళు తెరుచుకున్నాయి..

మెల్లగా.. చివరిసారిగా..

నేను కళ్లుతెరవడం చూసి వాడు వెంటనే నాదగ్గరికి ఉరికొచ్చాడు.. కొత్త సహచరిని వదిలేసి..

నా కళ్ళు తెరుచుకున్నాయి..

వాడు నా కళ్లలో కళ్లుపెట్టి చూస్తున్నాడు.. తొలిసారి చూసినట్టు..

కానీ ఆ చూపులో ప్రేమకి బదులు ప్రశ్న కనిపిస్తోంది

“ఇది మళ్లీ లేచిందా??” అని…

అది అనుమానమో.. ఆశ్చర్యమో అర్థంకాలేదు.. నాకు…

ఇంక దగ్గరికి రమ్మని సైగ చేసాను, కళ్లతోనే..

నేను తనకేదో చెప్పలనుకుంటున్నానని దగ్గరగా వచ్చాడు..

నా ఒళ్లు కాలిపోతోంది.. పేలిపోతానన్నంతగా ..

నన్ను చేతిలోకి తీసుకుని పైకి లేపాడు..

తన చెవినీ.. చెంపనీ నాకు దగ్గరగా తెచ్చాడు..

కానుక ఇవ్వాల్సిన సమయం ఇదే…

“”ఢాంoo””

పేద్ద శబ్దం…

******

అప్పుడే తెల్లరుతున్న ఆకాశం ఎర్రగా కనిపిస్తోంది..

ఎక్కడో ఓ ఇల్లు.. ఆ ఇంటి బాల్కనీలో కూచుని ఓ యువకుడు చాయ్ తాగుతూ, న్యూస్ పేపర్ చదువుతున్నాడు..ఒంటరిగా..

పేపర్ లో హెడింగ్..

చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి యువకుడికి స్వల్పగాయాలు”

కింద ఓ ఫోటో..

ఫోటోలో ఉన్న “వాడి” కుడి చెంప ఎర్రగా కనిపిస్తోంది.. రక్తపు రంగులో…

“నీ యవ్.. ఫోన్ కొందామనుకున్న రోజే ఇసొంటి వార్తల్ రావాల్నా.. చత్..

నేన్ మాత్రం పైసలకు సూడకుంట మంచి ఫోన్ కొనుక్కుంట.. ఎప్పటికి ఉండేదిగదా, మంచిదే తీస్కోవాలె ” అని తనలో తానే అనుకుంటూ తర్వాత పేజీ తెరిచాడా ఒంటరి…

అందులో ఎర్రటి ఎరుపు రంగులో పెద్ద పెద్ద అక్షరాలతో ఇంకో హెడింగ్..

ప్రేమికుల రోజు సందర్భంగా..

ప్రత్యేక తగ్గింపు ధరలు.. అప్ టూ 60%”…

అల్లం వంశీ

 

ఆత్మ రంగు తెలుసుకున్న వాడు…

Velturu2

We live unsettled lives

And stay in a place

Only long enough to find

We don’t belong.

ఈ వాక్యాలు తన తొలినాళ్ళలో రాసుకున్నాడు Mark Strand – అంటే, 1960 లలో!

రెండు నెలల  కిందట కన్ను మూసేటప్పుడు కూడా అతని చివరి పదాలు అవే! జీవితంలోని అస్థిరత్వాన్ని, మనిషిని ఎక్కడా ఎప్పుడూ వొక్క క్షణం నిలవనీయని అశాంతినీ, మనం ఎప్పుడూ కోల్పోతూనే వుండే sense of belongingని దాదాపు వెయ్యి పేజీల కవిత్వం చేశాడు మార్క్.

జీవితం పట్ల వొక అంటీముట్టని తనాన్ని (detachedness) యింకో విధంగా చెప్పాలంటే- always living, always dying-లాంటి తత్వాన్ని చివరిదాకా అంటిపెట్టుకొని వుండిపోయాడు మార్క్. కాని, ఎవరూ చెప్పలేని మాటల్ని కవిత్వం అడ్డుపెట్టుకొని ధైర్యంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. 1960ల తరవాతి ఆధునిక జీవితంలోని అంతస్సూత్రాన్ని అతి తేలికైన మాటల్లో ఎంత మృదువుగా పొదుగుతాడో, అంతే పదునుగా కూడా విసుర్తాడు. Everyone who has sold himself wants to buy himself back లాంటి వాక్యాలు వినడానికి తేలికగా వుంటాయి కాని, అలాంటి వాక్యాలు రాయడానికి కవి నరాలు తెగిపోయే బాధనే అనుభవించి వుంటాడు.

మొదటి సారి మార్క్ గురించి వినడం ఆ పైని చెప్పిన నాలుగు ముక్కల ద్వారానే! పదిహేనేళ్ళ కిందట మాడిసన్ లో వొక పాత పుస్తకాల షాపులో మొదటి సారి దొరికిన మార్క్ కవిత్వాన్ని ఆ తరవాత వెతికి  వెతికి పట్టుకొని  యింకొన్ని సార్లు చదువుకున్నప్పుడు అతనేమిటో నాకు  అంతగా అర్థమయ్యాడని అనుకోలేను. మార్క్ చెప్తున్న sense of belonging లో వుండే వేదన తెలీక కాదు. తెలిసిందే అయినా దాన్ని వొక తెలియనితనంగా  గుర్తుచేసే కవిత్వ లక్షణమే అది అనుకుంటా. మొదటి సారి చదివినప్పుడు అందులోని వొక్క అర్థం మాత్రమే రెక్క విప్పుకుంటుంది, పదే పదే చదువుతున్నప్పుడు ఇంకా కొన్ని అర్థాలకు రెక్కలొస్తాయి. ఏ రెక్కలో నిజమైన అర్థం వుందో తెలియకపోవడం కవిత్వంలోని మిస్టరీ. బహుశా, అలాంటి మిస్టరీ కోసమే కవిత్వం చదవాలనిపిస్తుంది. ప్రతీసారీ ఇంకో అర్థాన్ని వెతుక్కోవాలనిపిస్తుంది.

మొదటి సారి మార్క్ కవిత్వం చదివినప్పుడు అది నన్ను నిజంగా అలాంటి తెలిసీ తెలియనితనంలోకి తీసుకెళ్ళి సవాల్ చేసింది. నేను రాయడానికి నిరాకరించే చాలా విషయాలు నిష్పూచీగా రాసి చూపిస్తున్నాడు మార్క్. నా కవిత్వ వ్యాకరణాన్ని మార్చుకోవాలని మందలిస్తున్నాడు. జీవితంలోని బలహీనతలని ఇంకా బలంగా చెప్పవచ్చని, చెప్పి తీరాలని నన్ను నమ్మించాడు చివరికి-

అసలు జీవితంలోని ఖాళీని అప్పటికే చాలా మంది కవులు పాడడం నేను విన్నాను.

నాలోపలి పురుగుని తొలిచిన కాఫ్కా అంటే ఇష్టం అప్పటికే-

అసంబద్దతని తాత్వీకరిస్తూ సాహిత్యీకరించిన Becket ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాను అలవాటైనంత తేలికగా-

Wallace Stevens వాక్య ప్రయోగాల చిక్కుముడులలో అసంతృప్త క్షణాల విచ్చిన్నతని అర్థం చేసుకుంటున్నాను. కష్టమే అయినా-

Walt Whitman పొడుగాటి వాక్యాల వూపిరాడనితనం అంటే ఎందుకో మహా ఇష్టమవుతూ వుంది ఆ సమయంలోనే!

అదిగో, అప్పుడు దొరికాడు మార్క్!

mark2

2

కవిత్వం చేయదగిన పనుల జాబితా ఏమిటో ఇంకా నాకు తెలీదు. ఎప్పటికైనా తెలుస్తుందన్న హామీ లేదు.

కాని, బహుశా అది కొన్ని నిజాలు చెప్పడం నేర్పుతుంది, అలాగే, కొన్ని అబద్ధాలు చెప్పడం కూడా నేర్పుతుంది. అబద్ధాలకు తొందరగా అలవాటు పడే కవులే మనకి ఎక్కువ, అబద్ధానికి వుండే తగరపు ఆకర్షణ వల్ల- అదనపు తక్షణ కీర్తి వల్ల; కాని, మార్క్ లాంటి కవులు ఎప్పుడూ నిర్వచనానికి అందని నిజంలో – కవిత్వం అద్దమే అయినా, ఆ అద్దం- అతనే  అన్నట్టు- The mirror was nothing without you- అన్న ధ్యాన నిమగ్నతలో రాస్తారు. కవి ఈ లోకంలోనే వుంటూ ఈ లోకాన్ని నిరాకరించే ధ్యాని లేదా అంతర్లోకపు పక్షి  అనుకుంటాను ఇలాంటి కవుల్ని చదువుతున్నప్పుడు.

నిజానికి మార్క్ మొదట్లో చిత్రకారుడు. యేల్ స్కూల్లో చిత్రకళ విద్యార్థిగా వున్నప్పుడు అనుకోకుండా Wallace Stevens కవిత్వాన్ని చదివాడు. అంతే, ఇక అతని లోకంలోంచి చిత్రకళ నిష్క్రమించింది; కవిత్వ చిత్కళ ప్రవేశించింది.  ఆ తరవాత చదువుతూ వచ్చిన అమెరికన్ కవిత్వం అతన్ని కట్టి పడేసింది. కవిత్వ విద్యార్థిగా 1960 లో ఇటలీ వెళ్ళాడు. 1964 లో అతని మొదటి కవిత్వ సంపుటి Sleeping with One Eye Open అచ్చయింది. అప్పటి నించీ మొన్న చనిపోయేదాకా మార్క్ వి పదకొండు కవిత్వ సంపుటాలు అచ్చయ్యాయి.

జీవితాన్ని నడిపించే సూత్రం Absence అంటాడు మార్క్. వొక లేనితనంలోంచి వాక్యాల్ని అల్లుకోవడమే కవిత్వం అంటాడు. “మనం అన్నీటికీ అర్థాలు వెతుక్కోగలం అనుకుంటాం. కాని, అలా వెతుక్కోలేకపోవడమే జీవితం అని ఎప్పుడూ అనుకోం. మనకి మిస్టరీ అంటే ఇష్టమే. కాని, జీవితం అన్నిటినీ మించిన మిస్టరీ అంటే మాత్రం వొప్పుకోం,” అంటాడు.

What cannot be seen will define us, and we shall be prompted

To say that language is error, and all things are wronged

By representation. The self, we shall say, can never be

Seen with a disguise, and never been seen without one.

అని వొక కవితలో అంటాడు కూడా-

అయితే, మార్క్ తన కవిత్వం అంతటా చెప్పే అసంపూర్ణత అనే భావనలో ఇదొక కోణం మాత్రమే. సంపూర్ణత అనేది మానవ సాధ్యం కాదని మార్క్ కచ్చితమైన అభిప్రాయం. అందుకే, కవిత రాస్తున్నప్పుడు కూడా కవి తనకే తెలియని వొకానొక స్థితిలోకి ప్రయాణమై వెళ్తాడు. అక్కడ ఎదురుచూడని/వూహించని మిస్టరీలాంటి నిజమే తనకి కనిపిస్తుంది. ఆ స్థితినించి వెనక్కి వచ్చి, దానికి మళ్ళీ అర్థం కల్పించాలని తను తపనపడ్తాడు, కాని- అది తపన మాత్రమే! అలా వెనక్కి చేరుకున్నప్పుడు తను అబద్ధాలు చెప్పడం మొదలెడతాడు, అంటే, ఆ కవిత్వ నిజస్థితిలో మాత్రమే తనకి తాను నిజదర్పణం. మిగిలిన వేళల్లో తను disguise కింద మారిపోతాడు.

mark1

3

ముసుగు తొలగిపోవాలి, ఆ ముసుగు ఎంత నిజాయితీగా ఎంత నిజంగా తొలగిపోతుందన్న దాన్ని బట్టి కవిత్వ తీవ్రత వుంటుంది.

మార్క్ కవిత్వంలో అలాంటి  ముసుగు తన కవిత్వాన్ని తనే  గుచ్చి గుచ్చి అడిగే ప్రశ్నల ద్వారా తొలగిపోయింది. కవిత్వం ఎందుకు రాయాలన్న విషయం మీద కనీసం పది కవితలు రాసుకున్నాడు మార్క్. ఉదాహరణకు చూడండి ఈ కింది వాక్యాలు:

For us, too, there was a wish to possess

Something beyond the world we knew, beyond ourselves,

Beyond our power to imagine, something nevertheless

In which we might see ourselves.

మనిషి తనని తాను నిక్కచ్చిగా చూసుకునే క్షణాలు తప్పకుండా వుంటాయంటాడు, కవికి అలాంటి క్షణాలు అతని వాక్యంలో దర్శనమిస్తాయని మార్క్ నమ్మకం. అలాంటి నమ్మకం గాయపడిన సందర్భాల్లో మార్క్ చాలా సార్లు మౌనంలోకి జారిపోయాడు, అందుకే అతని  కవిత్వ ప్రయాణంలో నిశ్శబ్దాలు ఎక్కువే వున్నాయి. అసలేమీ  తెలియని మౌనంలోకి కూరుకుపోయిన సందర్భాలు  చాలానే అతన్నివుక్కిరిబిక్కిరి చేశాయి. అలాంటి ఏదో  బలమైన బలహీన  సందర్భంలో మార్క్ అంటాడు, రచన అన్నది వొక  నిద్రలో నడకలాంటి స్థితి అని- ఆ వెంటనే అంటాడు మళ్ళీ, అసలు writing అన్నదంతా selfish act అని-

You were mine, all mine; who begged me to write, but always

Of course to you, without ever saying what it was for

Who used to whisper in my ear only the things

You wanted to hear….

మార్క్ కవిత్వం అంతా Self-assertive act – తనని తాను గుర్తుకు తెచ్చుకొని, తను వినాలనుకున్న లోపలి మాటేదో బయటికి నెట్టే మానసిక ప్రక్రియ.

As if there were something

You wanted to know, but for years had forgotten to ask

మార్క్ రోజువారీ జీవిత పదచిత్రాల్ని దాటి ఎక్కడికీ వెళ్ళడు. పైన చెప్పిన ఆ మరచిపోయిన something ఎలా వుండాలో చెప్తున్నాడు ఇలా-

నువ్వు రాసుకుంటున్న టేబుల్ మీద

ఏటవాలుగా వొంగిన సూర్యకాంతి

వొక తెలిసిన చెయ్యి ఎత్తినట్టు

వొక ముఖం నీ వేపు తిరిగినట్టు

దూరం నించి – కొండ మలుపులో వొక కారు మాయమైనట్టు-

మార్క్ కవిత్వం నిండా ఇలాంటి రోజువారీ కదలికలు అతని మానసిక స్థితితో అందంగా లీనమైపోతూ కనిపిస్తాయి. అంటే, ఏది రోజువారీ ప్రతీక, ఏది కవిత్వ భాష అనే గీత చెరిగిపోతుంది అతని కవిత్వంలో-

నాకు తెలిసీ అర్థమయ్యీ, ఇది అతనికి Walt Whitman నించీ, Wallace Stevens నించీ అలవాటైంది. ఇతర కవుల్ని చదవడం అంటే ఇదీ అని నాకు అర్థమైంది ఈ ముగ్గురికీ మధ్య ఏర్పడ్డ పరోక్ష కేవల కవిత్వ సాన్నిహిత్యం చూశాక- ఎప్పుడూ కలవని ఈ ముగ్గురు కవులు కవిత్వంలో వొకరికొకరు ఆత్మబంధువులు, ఆ ముగ్గురి మధ్యా అనురాగ పరాగం మార్క్ ప్రతి వాక్యంలోనూ ఇంకిపోయిన వర్ణ విశేషం.

4

మొన్న నవంబరు చివరి వారంలో మార్క్ చనిపోయినప్పుడు నాకు వొక్కటే అనిపించింది- నాకు తెలిసిన కవిత్వలోకంలో వొక రంగు – నాదైన ఇష్టమైన రంగు వొకటి- వెలిసిపోయిందని –

ఇంకో మార్క్ పుడతాడా అంటే పుట్టవచ్చు. కాని, ఆ రంగు -అదే తాజాదనంతో- మళ్ళీ కనిపించదు కదా అనిపించింది.

 -అఫ్సర్

 

 

 

 

శృంగారం

Sringaram

 

~

ఒక మెరుపు వన్నె ఆకుపచ్చ నేపధ్యం. ఆశా వాగ్దానాల నిండు సారాంశం.

ఇద్దరు కలిసినప్పుడు

మొదట వుండే ఒక అపరిపూర్ణ మనఃస్తితిని  ఎదో చెప్తోంది అది.

ఈ ఆకుపచ్చ నేల మీద తెలుపుని వొంపాను, ఒక వలయంగా.

అప్పుడు ఆ ఇద్దరు వొక్కరై విశ్వ నర్తనం చేస్తున్నారు,

వలయాలు తిరిగే దర్వీషులై-

నిండుదనాన్నీ, కలయికనీ, సత్యాన్నీ వెతుక్కుంటూ.

ఆకుపచ్చ నేపధ్యంలో నృత్య ప్రవాహం;

దాని అంచుల మీద లోతులు కనిపిస్తూనే వుంటాయి మన కళ్ళకి-

అప్పుడిక ఎగసి పడుతుంది ప్రేమ!

Mamata Vegunta

Mamata Vegunta

కుక్క అంటే ఏమిటి?

1

ఈ నడుమ మా చిన్ని పాప తరుచూ ప్రతీ దానికీ కుక్క అనే పదాన్ని చేరుస్తుంది

 

మూడేళ్ళ పిల్ల, బొత్తిగా భాషాపాటవం తెలియనిది

ఇప్పుడిప్పుడే బడికి పోతూనో (హతవిధీ) పోబోతూనో

పోలేకనో, పోకుండా ఉండలేకనో ( దాని చేతుల్లో ఏముంది ) కింద పడి దొర్లి, కాళ్ళూ చేతులను నునుపాటి గట్టి గ్రానైట్ బండ మీద

ఇష్టారాజ్యంగా తపతపా విదిలించి కొడుతూ ఎక్కడ దెబ్బ తగులుతుందేమోనని గుండెలదరింపజేస్తూ

తన రోజు వారీ మాటల సమయాలలో అంటుంది కదా-

 

ఎక్కడికి పోయినావే కుక్కా, కుక్క నాకొడకా-

 

“ఇంక ఏమి తింటవ్ తల్లీ?”

కుక్క తింట-

 

“ఇట్లయితే ఎట్లనే?”

కుక్కనే-

dog

2

 

ఇంతకూ కుక్కా అనేది ఏ భాషావిశేషం?

 

పదే పదే మాటల తొక్కిసలాటలలో ఇరుక్కపోయిన భాషా క్రీడగానో, క్రీడించే సమయాలోకి సంభాషణగా కరిగే భాషగానో

మాటలుగా, వాక్యాలుగా అర్థాలు చెదిరి, అర్థాలతో పాటుగా సన్నివేశమూ అందలి పాత్రలూ చెదిరి

ఎటూ పొసగనీ లేదా ఇమడని ఉధ్విగ్నతలలోనికి పొగమంచుగా పాకి

విఫల యత్నమై బ్రహ్మ రంద్రాన్నిపగలగొట్టుకొని శూన్యంలోనికి పెగిలే నిట్టూర్పులా ప్రయత్నిస్తున్నపుడు

 

మనుషుల రణగొణ ధ్వనులలో మాటల బండరాళ్ళపై పడి

నాకూ కాళ్ళూ చేతుల్ని టపటపా కొట్టుకోవాలనిపిస్తుంది

 

కుక్క మాటలు

కుక్క సంభాషణలు

కుక్క కవిత్వమూ అని రాయాలనిపిస్తుంది.

avvariఅవ్వారి నాగరాజు

 

ఈనాటి అవసరం ‘రాగమయి’

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

స్వాతిశయచిత్తుడైన మగాడు పచ్చటి సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకో సంకల్పించగా, ఆ సంసారాన్ని చక్కదిద్దడానికి ఒక  స్త్రీమూర్తి పడే ఆరాటమే ఈ ‘రాగమయి’ కథ.

పెళ్ళయిన నెలకే పుట్టింటికి చేరిన జానకిచేత – ఎవరూ, ఏవిధంగానూ జరిగినదేమిటో చెప్పించలేక పోయారు. ఆడపిల్ల కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నాలు ఆ ఇంటి మగవారెవరూ చేసిన దాఖలాలు కనపడవు.

ఉమ – తన బహిఃప్రాణాలుగా భావించే పినతల్లి కొడుకు రాజశేఖరానికి, ఆడబడుచు జానకికి వివాహం జరిపించడానికి మధ్యవర్తిత్వం నెరిపి, సంబంధం కుదిర్చిన కారణంగా – జానకి నూరేళ్ళబ్రతుకూ బూడిదపాలు కావడానికి ఆమెనే బాధ్యురాలిని చేశాడు మరిది శేషగిరి. పరస్పర నిందారోపణల క్రమంలో భర్తతో, అత్తగారితో ఘర్షణపడి తాను కూడా తన పుట్టింటికి చేరుకున్న ఉమ, నెలరోజుల తరువాత జానకి నుంచి వెంటనే బయలుదేరి రమ్మని ఉత్తరం అందుకుని, వ్యవహారాన్ని ఒక కొలిక్కి తేకుండా తిరుగుముఖం పట్టరాదని నిశ్చయించుకుని పిన్నిగారింటికి వెళుతుంది.

ఇంగ్లీషు చదువులు చదవలేదని రాజశేఖరంపట్ల శేషగిరికి ఉన్న చిన్నచూపును హేళన చేస్తూ, కోడలి తరఫున వకాల్తా పుచ్చుకుని ఆదినారాయణమూర్తిగారు “తెలుగులో అతను చదవని కావ్యం లేదు….. సంస్కృతంలో పంచకావ్యాలు క్షుణ్ణంగా చదువుకున్నాడు” అంటూ అల్లుడి గొప్పతనాన్ని పొగిడితే –

“నీవేదో గొప్ప పండితుడవనుకుంటున్నావ్….. నిజానికి నీవంటి మూర్ఖుడు ఇంకొకడు లేడు….. నువ్వు చదువుకున్నావనే అనుకున్నానుకానీ నీ ఛాందసపు చదువు నిన్నిలా ఛాందసుణ్ణి చేసి విడుస్తుందనుకోలేదు” అంటూ అన్నమీద మండిపడుతుంది ఉమ. ఇదొక శిల్ప విన్యాసం.

ఉమ నోటిద్వారా పలికించిన సంభాషణలు, ఆమె వ్యక్తిత్వ వర్ణనలు ఆ పాత్రని సమున్నత శిఖరం మీద నిలబెడితే, ఆడబడుచును కూతురుగా ఎంచి, న్యాయం, ధర్మం పక్షాన నిలబడి పోరాటం సాగించిన ఉమ చివరికి “తను తన జీవితంలో ఎదురుపడినవారిలో ఎవ్వరితోనైనా ఎప్పుడో ఒకప్పుడు పోట్లాడకుండా విడిచిపెట్టిందా? తను ప్రతివారితోనూ ఇలా పోట్లాడటానికి ఏం హక్కు వుంది? వాళ్ళు సంబంధాలు తెంచుకోలేక పడి వుంటున్నారు కాని వాళ్ళు నిజంగా తనకు బుద్ధి వచ్చేటట్టు చేస్తే తను చేసేదేముంది? చివరకు గయ్యాళిగంపనే బిరుదు ఏనాడో ఒకనాడు తనమీద పడి ఊరుకుంటుంది. తను చేతులారా బంధువులూ, అత్తమామలూ, చివరికి భర్త మనసుకూడా విరుచుకుంటోంది” అనుకుని రోదించడం కథలోని అతి పెద్ద విషాదం.

ఉమ సేవలు లేందే ఆ ఇంట్లో గడవదన్న సంగతి, ఉమ పుట్టింటికి ప్రయాణమయ్యే సందర్భంలో మామగారు చెప్పనే చెప్పారు – “…..మీ అత్త ముసలిది….. ఇంక మీ ఆయన పరమ సోమరి….. వీళ్ళిద్దరూ క్షణం వేగలేరు. అందుచేత వీలైనంత వేగిరం బయలుదేరిరా” అని.

నిజానికి గృహవాతావరణంలో శారీరకంగా, మానసికంగా ఎవరెంత నొప్పించినా, మమకారాల్ని చంపుకోలేక పడి ఉండేది ఆడదే. కానీ, తానేదో అఘాయిత్యం చేస్తుంటే, చుట్టూ ఉన్నవారంతా పడి ఉంటున్నట్లు భావించుకుని, తనను తాను నిందించుకునే మానసికదౌర్బల్యంలోకి ఆడదాన్నినెడుతున్నాడు ప్రతి అవసరానికీ ఆమెపైనే ఆధారపడే మగాడు.

శేషగిరి – ఇద్దరు పిల్లల తల్లైన వదినను ‘ఆడపెత్తనం’ అని ఈసడించడంగానీ, శేఖరం – ‘స్త్రే బుద్ధిః ప్రళయాంతకః’ అంటూ తన భార్యను తృణీకరించిన తమ్ముణ్ణి దండించవలసింది పోయి భార్యపైనే చెయ్యి చేసుకోబోవడంగానీ, రాజశేఖరం – చేసిన తప్పేంటో చెప్పకుండా భార్యను పుట్టింటికి పంపేసి, అత్తవారు పండక్కి పిలిచినా వెళ్ళక, భార్యను మానసిక హింసకు గురిచెయ్యడంగానీ, పురుషాహంకారానికి నిదర్శనాలే.

భర్త పట్ల చెల్లెలి మనసు విరిచేసి ఆమె సంసారాన్ని అగ్నిగుండంగా మారుస్తున్న శేషగిరిని చిన్నక్క వెనకేసుకు రావడమైనా, కొడుకు దొంగవేషాలను దాచిపెట్టి, తానుగా కొడుకు విషయంలో అబద్ధాలాడి గిరిజమ్మగారు చేజేతులా శేషగిరిని చెడగొట్టడమైనా, కుటుంబవ్యవస్థలో పురుషాధిక్యతను స్థిరీకరించే, పెంచి పోషించే చేష్టితాలే.

జానకి రాజశేఖరంల దాంపత్యజీవనం గాడిన పడటంతో కథ సుఖాంతమైనా, ఉమ పాత్ర మనల్ని కలవరపెడుతూనే ఉంటుంది, గుండెను బరువెక్కిస్తూనే ఉంటుంది.

జానకి పుట్టింటికి రావడానికి కారణమేమిటి? అన్న ప్రశ్న పాఠకులను కథ మొదట్నించి చివరిదాకా వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానాన్ని గొప్ప శైలీనైపుణ్యంతో కథలో హంసబకోపాఖ్యానాన్ని చొప్పించడంద్వారా సూచిస్తారు మాస్టారు. ఈ సందర్భంలో ఉమ, రాజశేఖరంలమధ్య రసవత్తరమైన, అర్థవంతమైన వాదోపవాదాల్ని నడిపించారు. ఒక రోజు కొంత సంభాషణ జరిగాక, మర్నాడు ఉమ ఆ వాదాన్ని కొనసాగించినప్పుడు “అయితే ఈ యుక్తులన్నీ ఆలోచించటానికి ఒక రాత్రీ, ఒక పగలూ పట్టిందా?” అని రాజశేఖరం వ్యంగ్యంగా అడిగితే, “లేదు, లేదు.. నెల్లాళ్ళూ … ఏకాంతంగా మడతకుర్చీలోపడి ఆలోచిస్తేనేగాని స్ఫురించలేదు” అని ఉమ చెప్పిన సమాధానం ద్వారా మగాడికి ఎగతాళిగా కనిపించే విషయాలు స్త్రీలను రోజులతరబడి మనోవేదనకు గురిచేస్తాయన్న కఠోర వాస్తవాన్ని తెలియజేస్తుంది.

ఇటువంటి మార్మిక సంభాషణలు కథంతా పరుచుకుని పాఠకుల ఊహాశక్తికి పదును పెడతాయి. మళ్ళీమళ్ళీ చదివేకొద్దీ కొత్తకొత్త అర్థాలు గోచరిస్తాయి.

తల్లిదండ్రులను, తోడబుట్టినవారిని వదిలి మూడుముళ్ళ బంధంతో అత్తవారింట అడుగుపెట్టిన స్త్రీ ఆ ఇంటివారినుంచి ఎటువంటి ప్రేమాభిమానాలను కోరుకుంటుందో, కోడలితో అత్తింటివారికి ఏవిధమైన అనుబంధం ఉండాలో తెలియజేసే గొప్ప కథ రాగమయి.

కారామాస్టారు ఈ కథ రాసే కాలానికి స్త్రీవాదం అన్న పేరు పుట్టి ఉండకపోవచ్చును గానీ, గృహచ్ఛిద్రాలలో స్త్రీలపై జరిగే మానసిక దాడిని విపులంగా చర్చించిన స్త్రీవాద కథే ఇది. కథ రాసిన కాలంనుండి ‘నేనెందుకు రాసేను?’ రాసేదాకా కూడా తెలుగు సాహిత్యంలో స్త్రేవాద భావజాలం ప్రవేశించకపోవడంవల్ల కారామాస్టారు ఈ కథని ఏ ప్రయోజనం సాధించలేని కథగా పేర్కొని ఉండవచ్చు. అంతమాత్రాన ఎప్పటికీ ఇది ప్రయోజన రహితమైన కథగానే నిలిచిపోతుందనలేం. నాటినుంచి నేటిదాకా కుటుంబ వాతావరణంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు అట్లాగే ఉన్నాయి. పరిష్కారమార్గాలు చర్చనీయాంశాలే అవుతున్నాయి. అందువల్లే ‘ఈనాటి అవసరం రాగమయి.’

-పాలపర్తి జ్యోతిష్మతి

Palaparthi Jyothishmathiపాలపర్తి జ్యోతిష్మతి 17 సంవత్సరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసి 2001లో వి.ఆర్.ఎస్. తీసుకొన్నారు. కధలంటే ఇష్టంతో చిన్నప్పటినుండి వార, మాస పత్రికల్లో వచ్చే కధలు చదవటం అలవాటు చేసుకొన్నారు. ఇప్పటి వరకు 2006లో ‘కాకి గోల’ కవితా సంకలనం, 2014లో ‘సుబ్బలక్ష్మి కధలు’ కధా సంకలనం వచ్చాయి. ఈ రెండు పుస్తకాలు kingie.com లో దొరుకుతాయి. తన మనోభావాలను పదిమందితో పంచుకోవడానికి రచనా వ్యాసాంగాన్ని మాధ్యమంగా భావిస్తున్నానని అంటున్నారు. జ్యోతిష్మతికి బీనాదేవి అభిమాన రచయిత్రి.

వచ్చేవారం ‘ఇల్లు’ కధ గురించి నల్లూరి రుక్ష్మిణి పరిచయం

“రాగమయి” కథ ఇక్కడ:

కలబందమ్

Painting: Rafi Haque

Painting: Rafi Haque

నేలఉసిరి పరిచిన
పరిచిత దారుల్లోంచీ
కనకాంబరాల రెమ్మలనుంచీ
లిల్లీ కోమ్మల వొంపునుంచీ
కానుగ పూ పుప్పొడినుంచీ
పున్నాగ సొంపు నుంచీ
తాటి శిఖ పింఛాల మీంచి
సంజెలో
ఆమె
విరబోసుకున్న
బిగి బిరుసు వంకీల జుత్తులోంచీ
సూరీడుని
తన నీడలోకే
వొంపేసుకుని
అస్తమింపచేజేసుకుంటుంది

*
ఇక అతను

క్రితం లానే
చిక్కుడు తీగల్లో వసించే చీమల్లా
రేకున దాల్చిన మొగిలి గంధంలా
నీరు ఆశించక చనే నాగజెముడులా
నిండా నీరే చవులూరే ఏటి కలబందలా
నింపాదిగా
తీక్షణతో
పిపాసిలా
నిరీక్షణ గురుతెరిగిన భిక్షువులా
ఇప్పటికీ
జాబిలి జాడకే
తచ్చాడుతున్నాడు
అను దినాన

-అనంతు

10375133_676014542464579_8067910570521731147_n

పదును వాక్యాల పరంపర

d1
“Poetry, above all, is a series of intense moments – its power is not in narrative. I’m not dealing with facts, I’m dealing with emotion.” అంటున్న Carol Ann Duffy గురించి ఈ సారి తెలుసుకుందామా ?

400 ఏళ్ళ స్కాటిష్ బ్రిటన్ పోయెట్రీ లో పురుషాధిపత్యం కి ఒక చరమాంకం పలికి 2009 లో మొదటిసారి ఒక స్త్రీ ఆస్థానకవి గా నియమింపబడటం అందునా ఒక ఓపెన్ డిక్లేర్డ్ గే ఆ స్థానంలో ఆస్థాన కవి గా రావటం నిజంగా రాణివాసపు రాజరికం నడిపే బ్రిటిష్ సాహిత్యంలో 8 వ వింతే. Poet laureate గా ప్రస్థానం మొదలు పెట్టిన తరువాత ఒకప్పుడు స్త్రీ లని కవియిత్రులు అని కూడా పిలిచేవారు అని కామెంట్ చేయడం తోనే కవిత్వం లో అప్పటికి ఇప్పటికి ఇంకా మిగిలి ఉన్న, భవిష్యత్తులో ఉండబోయే పురుషాధిపత్యం గురించి చెప్పకనే చెప్పారు అనిపిస్తుంది కదూ.

ఒక ఎకనామిస్ట్ సమీక్షకుడు వాటిని వివరించినట్లు ఆమె కవిత్వం , సాధారణంగా “ప్రపంచ వ్యతిరేకంగా ఉద్భవించిన ఆగ్రహాలు మరియు పగలు చూపటానికి సమాజం యొక్క అంచుల మీద పట్టణ సామ్రాజ్యవాదంతో అసంతృప్తితో ప్రజల మనోభావాలు మాట్లాడే విధంగానే ఉంటాయి . సహజంగా ప్రేమ కవితలు ఎక్కువ రాసుకున్న కారోల్ సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ స్కూల్ లో చదువుతున్న రోజుల నుండి లెస్బియన్ అయినప్పటికీ ఆమె తొలి ప్రేమ కవితల్లో ఎక్కడ స్వలింగ సంపర్కం గురించిన భావనలు కనిపించవు .1994 లో తన సెలెక్తెడ్ పోయెమ్స్ ప్రచురించినప్పుడు కాని హోమో సెక్సుఅల్ ప్రేమల మీద తను రాసుకున్న భావాలు భయటపడలేదు.

కారోల్ కవిత్వం ఎప్పుడు ఒక బలమైన స్త్రీవాదాన్నే సూచించింది . ఆ విషయం తన మొదటి సంకలనం “Standing Female Nude” లోనే కనిపిస్తుంది . టైటిల్లోనే పురుషాధిక్య ప్రపంచం ముందు స్త్రీ వాదపు నగ్న ఆత్మని నిలబెట్టిన సింబాలిజం కనిపిస్తుంది అనిపించడం సహజం కదా మనకి .
“రోజుకో పావలా అర్ధణా కోసం ఎదో ఒక గొప్ప మ్యూజియంలో తగిలించబడి బూర్జువా సంతోషాలని నిలబెట్టడానికి నా వంటి రంగు కొంచం కొంచం తోడుతూ నా స్తనాగ్రాల మీద పడే కాంతి వెలుగులని చిత్రీకరిస్తూ వేశ్యా తనాన్ని అమ్ముకోవటమే ఆర్ట్ ” అని మొట్ట మొదటి కవిత మొదటి స్టాంజాలోనే ఆర్ట్ వరల్డ్ లో స్త్రీ స్థానం ఎక్కడుందో నొక్కి చెప్పగలిగిన ధైర్యం డఫ్ఫీ ది. అంతేనా రెండవ స్టాంజా చూడండి రాణులు ఏలే రాజ్యంలో పొట్ట కూటికోసం నగ్నంగా నిలబడ్డ మోడల్ అందచందాల్లో కొరత వచ్చింది అని బాధ పడే ఆర్టిస్ట్ ని చూసి ఆ మోడల్ నవ్వుకొనే నవ్వులో ఎన్ని అర్ధాలు ఉన్నాయో . మూడవ స్టాంజాకి వచ్చేసరికి శరీరం అమ్ముకుంటూ తాను ఆర్ట్ అమ్ముకుంటూ అతను అందరు ఒకే ఆటలో పావులని ఎంత సత్యంగా ఒప్పుకుంటుందో చూడండి .
d2
తన పదును వాక్యాల పరంపర లో ఇపుడు ఇక్కడ ఇచ్చింది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, ఇంకా చదువుకోవాల్సిన కవితలు ఎన్నో ఉన్నా అన్ని ఒకేసారి చదువుకోవటం కష్టం , అయినా ఆసక్తి ఉంటే మొత్తం చరిత్రలో అలాగే ఫిక్షన్ కథలలో ధీరోదత్తులు అంటూ ఇప్పటికి అందరం చదువుకొనే అన్ని మగ క్యారెక్టర్స్ మీద సెటైరికల్ గా రాసిన” The World’s Wife “ అస్సలు మిస్ అవ్వకండి. King Kong తో సహా Aesop, Pontius Pilate, Faust, Tiresius, Herod, Quasimodo, Lazarus, Sisyphus, Freud, Darwin దాక అందరి మీద వాళ్ళకి ప్రపంచం ఇచ్చే సూడో వాల్యూ మీద ఒక అద్భుతమయిన పోయెమ్స్ కలెక్షన్ అది. అదే కాకుండా ప్రేమ కవితలు రాసుకొనే స్త్రీ వాద రచయిత్రి యుద్ధం అవసరాలు అసహ్యాలు అని రాసుకున్న “ War photographer “ ఇక్కడే ఇమేజి గా ఇచ్చాము తప్పక చదవటానికి చూడండి ,

Standing Female Nude
by Carol Ann Duffy

Six hours like this for a few francs.
Belly nipple arse in the window light,
he drains the colour from me. Further to the right,
Madame. And do try to be still.
I shall be represented analytically and hung
in great museums. The bourgeoisie will coo
at such an image of a river-whore. They call it Art.

Maybe. He is concerned with volume, space.
I with the next meal. You’re getting thin,
Madame, this is not good. My breasts hang
slightly low, the studio is cold. In the tea-leaves
I can see the Queen of England gazing
on my shape. Magnificent, she murmurs,
moving on. It makes me laugh. His name

is Georges. They tell me he’s a genius.
There are times he does not concentrate
and stiffens for my warmth.
He possesses me on canvas as he dips the brush
repeatedly into the paint. Little man,
you’ve not the money for the arts I sell.
Both poor, we make our living how we can.
I ask him Why do you do this? Because
I have to. There’s no choice. Don’t talk.
My smile confuses him. These artists
take themselves too seriously. At night I fill myself
with wine and dance around the bars. When it’s finished
he shows me proudly, lights a cigarette. I say
Twelve francs and get my shawl. It does not look like me.

ఒకసారి కవిత్వం అంటే నిజాలు కాదు కుప్ప పోసుకున్న ఎమోషన్స్ అని చెప్తూనే ఇంకో సారి “ Like the sand and the oyster, it’s a creative irritant. In each poem, I’m trying to reveal a truth, so it can’t have a fictional beginning.” అంటూ కవిత్వం కల్పన కూడా కాకూడదు అని చెప్తున్న మన కాలపు కవయిత్రి కి అభినందనలతో

బోయి భీమన్న ‘పైరుపాట’లో ప్రణయతత్త్వం

ప్రగతిశీల కవితావికాసయుగంలో చైత్యచోదనకు, సామాజిక న్యాయసాధనకు కృషిచేసిన బోయి భీమన్నగారి ‘పైరు పాట’ నృత్య సంగీత గేయరూపకం రచితమై ఇప్పటికి యాభై సంవత్సరాలు కావస్తున్నది. స్వాతంత్ర్యోద్యమం సఫలమైన దశాబ్దినాటి జాతీయ భావస్పందాన్నీ, ఆనాటి అభ్యుదయ కవిత్వాదర్శాలనూ పరిణామక్రమంలో మారుతూ వచ్చిన నేటి సామాజిక వాస్తవికతా దృగ్విషయంతో సరిపోల్చి, ఆ రచన కాలప్రవాహంలో ఎంతవరకు ఎదురీదినదీ పరిశీలిస్తే – దానికి సాహిత్య చరిత్రలో రాదగినంత గుర్తింపు ఈనాటికీ రాలేదనే అనిపిస్తుంది. కవి జీవితకాలంలో వెలువడిన వివాదాస్పద అనుకూల ప్రతికూల విమర్శలు రెండింటికీ అతీతంగా – కవి జీవితాని కంటె సుదీర్ఘమైన కావ్యజీవితాన్ని సమీక్షించి, గుణావగుణాల నిగ్గు తేల్చవలసిన సమయం ఇది. ఆయన సౌందర్యదర్శనాన్ని అధికరించి, సృజనవిజ్ఞానాన్ని ఉపలక్షించి, ప్రగతిశీల కాల్పనిక నవ్యకవిత్వోద్యమ కవులలో ఆయన స్థానాన్ని నిర్ణయింపవలసిన అవసరం ఉంది.

‘పైరు పాట’ తెలుగులో ప్రణయతత్త్వ ప్రతీకీకరణను అభ్యుదయాదర్శాలతో ప్రవేశపెట్టిన ప్రప్రథమ గేయనాటిక. మొదట ‘స్నేహ’ అన్నపేరుతో ఆకాశవాణిలో ప్రసారితమై, ఆ తర్వాత ‘స్నేహసుందరి’ అన్నపేరిట ఒక వారపత్రికలో ప్రకటితమైంది. ముద్రణ నాటికి ‘పైరు పాట’ అన్న నాట్యరంగప్రదర్శనీయమన్న సాంకేతికతతో వినూత్నాభిధానాన్ని సంతరించుకొన్నది. భీమన్నగారు మానవతావాదానుసారం గాంధీయుగచైతన్యంతో రచనలు చేస్తూనే కాల్పనికచైతన్యాన్ని అభిమానించారు. సంప్రదాయబలాన్ని తమ కవితాప్రక్రియలకూ, సిద్ధాంతాలకూ అండదండలుగా నిలుపుకొన్నారు. కాల్పనిక కవితాచైతన్యంలోనూ, సామ్యవాద వాస్తవికతలోనూ స్వీయానుభవాల నేపథ్యాన్ని గుర్తుపట్టారు. ఆ దర్శనసారాన్ని సొంత గొంతుకతో ఆలపించారు. దేశికవితారీతులను అభ్యసించి, తెలుగుదనానికి వెలుగునిచ్చే ప్రక్రియలను మాత్రమే తమ అభివ్యక్తిదీపికలుగా మలచుకొన్నారు. ఆ సంస్కారమంతా ‘పైరు పాట’లో రూపుదిద్దుకొంది. “ఇది నృత్యగాన సాహితి, బ్రదుకున సుఖమిచ్చు పదసరస్వతి, ప్రేమాస్పద…” అని విశ్వశ్రేయం తమ కవితాలక్ష్యమని, ప్రేమ తమ కవిత్వానికి ప్రాణప్రదమని చాటిచెప్పారు.

999394_382232561881202_503972310_n

‘పైరు పాట’కు రంగస్థలం భీమన్నగారికి బాల్యంనుంచి సుపరిచితాలైన గోదావరీతీరంలోని పైరుపొలాలు. ఈ రూపకంలో కథానాయిక స్నేహ ఒక మాల పిల్ల. పేదరికంలో పెరిగి పెద్దయిన యువతి ఆమె. పైరుచేల గట్లలో పచ్చగడ్డి కోసుకొనేందుకు ప్రతిసాయంత్రమూ పొలాల్లోకి వస్తుంటుంది. ఒక కామందు ఇంట్లో పాలేరుతనానికి కుదురుకొంటుంది. యజమాని ఇంటిపనులు నిర్వర్తించడం, పశువుల మేతకోసం ప్రతిరోజూ పంటపొలాల్లో తిరిగి గడ్డి కోసుకొని ఇంటికి తిరిగివెళ్ళటం, పంటతల్లి అందాలకు ఆనందించటం ఆమె దినచర్య. శీల ఆమె స్నేహితురాలు. ఆమెకూడా ఒక కామందు ఇంట్లో పనికి కుదిరినదే. శ్రీవత్స అనే అగ్రకుల విద్యావంతుడు ఆ పొలాల్లోనే షికారుకు వచ్చి స్నేహను చూసి ఆమెతో స్నేహం చేస్తాడు. ఇద్దరి మనస్సులూ ఆకర్షణకు లోనై, స్నేహం ప్రణయంగా మారటాన్ని భీమన్నగారు చాలా సున్నితంగా చిత్రించారు. శీల తన స్నేహితురాలి చిత్తవిభ్రమాన్ని గుర్తించి ఆమెను హెచ్చరిస్తూ ఉంటుంది. స్నేహ తాను గతి తప్పుతున్నానేమో అని భయపడుతుంది. ఎంత అభ్యుదయవాది అయినా అగ్రకులస్థుడు, గొప్పోళ్ళ బిడ్డ అయిన శ్రీవత్స తనను పెళ్ళి చేసుకుంటాడో లేదో అని కలవరపడుతుంది. అందనిదానికోసం ఎగబడుతున్నానేమో అని వెనకాడుతుంది. తన మనస్సును కట్టడి చేసుకొనే ప్రయత్నంలో అతనికి కనబడటం మానేస్తుంది. శీల అయోమయంలో పడుతుంది. శ్రీవత్సకు ఆందోళన కలుగుతుంది. శీలను అడిగి విషయం తెలుసుకొని ఆమె అనుమానాలను, అభ్యంతరాలను పరాస్తం చేసి స్నేహను పెండ్లిచేసుకొంటాడు.

‘పైరు పాట’ రూపకంలో అంకవిభాగానికి మారుగా భీమన్నగారు రంగవిభాగాన్ని అభిమానించారు. ఆ రంగాలు కాలగమనాన్ని సూచించేందుకు మాత్రమే పరికరించాయి. మొదటి ఆరు రంగాలకూ దృశ్యం ఒక్కటే. పచ్చని పైరుపొలం. చివరి రంగంలో నైపథ్యయవనికపై కల్యాణవేదికగా ఒక కుటీరాన్ని చిత్రించటమొకటే మార్పు. పుష్యమాసపు చల్లనివేళలో అననుభూతరతోత్సవులైన నాయికానాయకులు స్నేహ – శ్రీవత్సల మనస్సులలో ప్రేమభావం మొలకెత్తి, అంతలోనే మొగ్గతొడిగి, పూవై పూచి, నిండుగా పండి, పరిపక్వమవుతుంది. మొదట్లో స్నేహ శ్రీవత్సను విమర్శనాదృష్టితో చూస్తుంది. ఉన్నతవిద్యావంతుడైన అతని ప్రేమనిర్భరమైన వాక్యజాతంలోని గంభీరిమ అర్థం కాకపోయినా, క్రమంగా అదే భాషలో అతనికి జవాబు చెప్పటం నేర్చుకొంటుంది. ఆ అభ్యుదయపరిభాష ఆమెకు అలవడటం రూపకంలోని భావశబలతకు పరాకాష్ఠ.

మొదటి రంగంలో నాయికానాయకులకు పరస్పరాకర్షణ సిద్ధిసాధనను పొందినా శ్రీవత్స యెడ స్నేహ ఆభిముఖ్యం రెండవ రంగం దాకా అభివ్యక్తం కాలేదు. ఎంత ప్రార్థించినా ఆమె అతనికి తన పేరుచెప్పదు. శరణ్యాంతరం తోచక అతను తన స్నిగ్ధభావసూచకంగా ఆమెకు ‘స్నేహ’ అని పేరుపెడతాడు. అది ఆమె వాస్తవనామమై ఉండటం రూపకంలోని చిత్రకల్పనాకృతులలో ఒకటి. కథాసంవిధానంలో ‘పైరు పాట’పై కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం నాటకప్రభావం అడుగడుగున గోచరిస్తుంది. సంవాదశిల్పంలో రాయప్రోలు జాడలున్నాయి.

భీమన్నగారు ప్రతిపాదించిన ‘రసాద్వైత సిద్ధాంతం’ కూడా రాయప్రోలు ‘అమలిన శృంగార’ సిద్ధాంతానికి శాఖాంతరితమే. కాళిదాసు కావ్యకళాకమనీయదృశ్యాలను రమ్యంగా ఆధునీకరించారు. దుష్యంతుడు శకుంతలను చూసినప్పటి పుష్పోపమానమే ఈ కథలోనూ శ్రీవత్సకు స్నేహను చూసినప్పుడు స్ఫురిస్తుంది. “పచ్చపచ్చని పైరుచేలో, విచ్చివిచ్చని వింతపువ్వా!, నీకు నాకూ ఇంత దవ్వా, రేక విప్పగదే!” అన్న చరణంతో వారి ప్రేమకు అంకురార్పణ జరుగుతుంది. కాళిదాస నాయకుని వలెనే శ్రీవత్స స్నేహను గురించి, “ఎవరామె! ఎక్కడ పు, ట్టిందామె? ఏమిటి నే, ర్చిందామె? ఏమిటామె, స్థితిగతులు?” అని శీలను ప్రశ్నిస్తాడు.

శీల పాత్రనిర్మాణం అచ్చంగా శాకుంతలంలోని అనసూయ పాత్రనిర్మితికి తులనీయంగా సాగింది. రూపరూపణలో ప్రకృతికి కూడా మానవీయతాప్రకల్పనం, మనోవస్థానురూపమైన స్పందన, భావశబలత శాకుంతలంలో వలె ఇందులోనూ ప్రాకామ్యస్థితిని పొందాలని కవి ప్రయత్నించారు. నాయికానాయకుల ప్రణయసాఫల్యానికి పచ్చని పంటచేలు పరవశించి శ్యామలించిన సస్యాలతో ప్రాభాతిక మంగళగీతాన్ని వినిపించే సన్నివేశం మూలాన ‘పైరు పాట’ అన్న కావ్యనామం అర్థవంతంగా అమరింది.

Pairu Pata Cover Page

కాళిదాసు ప్రభావానికి ‘పైరు పాట’లో ఇంకా ఉదాహరణలను చూడవచ్చు. “పంపరమ్మ దీవించి, పచ్చని లతకూనలార!, పైరుగాలి సందిట్లో, పవళించిన పైరులారా!” అన్న దళం ‘అనుమతగమనా శకుంతలా, తరుభిరియం వనవాసబంధుభిః” అన్న కణ్వ మహర్షి వచనానికి ప్రతిరూపమే. “క్షితిరుహములార! పుష్పితలతికలార!, అనుమతింతురు గాక కల్యాణయాత్ర” అన్న పినవీరన శాకుంతలానువాదం (4-93) చూడండి. “ఎన్ని రాత్రు లీ యొంటరి, తిన్నెపైని కూర్చుండి, నా మది మడతలను విప్పి, మీ ముందర పరచితినో” అన్నది శాకుంతలంలోని “అమీ వేదిం పరితః లుప్తధిష్ణ్యా” అన్న కణ్వమహర్షి వచనానికే అనురణనం. శాకుంతలంలో వలె ‘పైరు పాట’ లోనూ ఏడే అంకాలున్నాయి. కథానాయిక స్నేహ శీలసౌందర్యాన్ని ఉద్దీపింపజేయటానికి భీమన్నగారు వివిధ రసభావాలను శాకుంతలంలో వలెనే ముగ్ధా శృంగారానికి పరిపోషకంగా ప్రవేశపెట్టారు. జానపదుల పవిత్ర ప్రణయానికి ప్రతీకగా శిల్పీకరించారు.

‘పైరు పాట’ సాహిత్యవిజయాన్ని సాధించిన చాలా సంవత్సరాల తర్వాత భీమన్నగారు “రసభావపుష్కలమైన కవితాసౌందర్యానికిది పరాకాష్ఠ” అని స్వయంగా తానే తన జ్ఞాపకాలను స్వీయచరిత్ర ‘పాలేరు నుంచి పద్మశ్రీ దాకా’లో నిండైన సంతృప్తితో నెమరువేసుకొన్నారు. “చిత్తంలో ప్రతిదెబ్బా, సుత్తి దెబ్బగా మలచిన, మానవతామూర్తిని మించి, మహితశిల్ప మేమున్నది?” అన్న దళాన్ని ‘పైరు పాట’లో ఉదాహరణీయమని శిరోవతంసీకరించారు. ప్రముఖ విమర్శకులు శ్రీవాత్సవ గారు ఆ రోజుల్లో దీనినొక విశిష్ట కావ్యవిశేషంగా, కవితా పూజాకుసుమంగా భావించారు. మానవతలో మహోన్నతిని చూపి, దానిని ప్రకృతిలో ప్రతిబింబింపజేసిన గేయకృతిగా ‘పైరు పాట’ను అభివర్ణించారు.

ప్రణయతత్త్వ ప్రతీకీకరణం

ప్రణయాన్ని ప్రతీకీకరించే లక్ష్యంతో వ్రాసినందువల్ల ‘పైరు పాట’లో సామాజికవైరుధ్యాలు, జీవితంలోని ఉత్థానపతనాలు, నిమ్నోన్నతాల భావసంఘర్షణ చిత్రణకు రాలేదు. ఇతివృత్తం కులాంతరవివాహమే అయినప్పటికీ – కులాల మధ్య ఏర్పడిన అడ్డుగోడలు ఇందులో నిజంగా అవరోధాలు కాలేదు. స్నేహ ఆందోళన, శీల హెచ్చరిక నిజానికి ఏ కులానికి చెందిన యువతికైనా వర్తించేవే. నాయిక ఇందులో శాకుంతలంలో జరిగినట్లు వివాహపూర్వపు వర్తనఫలితంగా మానసికోద్వేగానికి, ఒడిదుడుకులకు గురికాలేదు. సమాజం కాని, సంప్రదాయం కాని వీరి స్వచ్ఛందప్రేమకు అడ్డుపడలేదు. తల్లిదండ్రుల మందలింపులు, కులాల అంతరాలు చర్చకు రాలేదు. ఈ ఎన్నుకొన్న సంవిధానాన్ని బట్టి ఏ సందేశమూ ఇందులో లేదు. ఈ కథలో లాగా మనసారా ప్రేమించుకొన్న యువతీయువకులందరూ ఏ కష్టాలూ, కన్నీళ్ళూ లేకుండా నిజంగా హాయిగా పెళ్ళిచేసుకోగలిగితే ఎంత బాగుంటుంది! జీవితం ఇలాగే ఉంటే ఎంత ఆదర్శవంతంగా ఉంటుంది! అనిపించటమే ‘రొమాంటిక్ టైపిఫికేషన్’ అన్న ఈ ప్రణయతత్త్వ ప్రతీకీకరణ పరమోద్దేశం. స్వచ్ఛమూ, స్వచ్ఛందమూ, విమలమూ, విషాదరహితమూ అయిన ఇటువంటి ఆదర్శ మానవసంబంధాన్ని నెలకొల్పటమే విప్లవోద్యమం పార్యంతికఫలమని 1939లో మాక్సిం గోర్కీ రష్యన్ సాహిత్య చరిత్ర ‘ఇస్తోరియా రూస్కోయ్ లితెరతురీ’లో నిర్దేశించాడు. “వాస్తవికజగత్తులో లేని అపూర్వమైన అనుభవాన్ని ఆదర్శంగా లోకానికి అందివ్వడమే కాల్పనిక సాహిత్యోద్యమ లక్ష్యం” అన్నాడు. దీనినే మరికొంత విపులీకరిస్తూ ఎ.కె. ద్రెమోవ్ తన ‘రొమాంటిక్ టైపిఫికేషన్’ అన్న వ్యాసంలో, “సామాజికపురోగమనానికి దోహదం చేసే నూతనస్వప్నాలను కల్పనాజగత్తులోనికి తీసుకొనిరావటం నవ్యసాహిత్య సంప్రదాయాలలో ఒకటి” అని మరింత స్పష్టం చేశాడు. ప్రణయతత్త్వ ప్రతీకీకరణలోని అభ్యుదయాదర్శం వర్తమానం అనే పునాదిపైని ఒక నవసమాజాన్ని నిర్మించటమే” అని చాటిచెప్పాడు.

“వర్తమానపరిస్థితుల పట్ల అసంతృప్తిని కాల్పనిక రచయిత అభ్యుదయ కళాదర్శంగా పరివర్తించి, వాస్తవజగత్తులో చోటుచేసుకోనున్న అనివార్య పరిణామాలను సాహిత్యంలో ఘటితాంశాలుగా నిరూపించటం జరుగుతుంది. ఆ ఆదర్శానికి స్పష్టమైన రూపం లేనప్పటికీ, అందులో సంభావ్యత లోపించినప్పటికీ ఆగామి యుగంలోని దృగ్విషయాలన్నీ పాఠకులకు దృష్టిగోచరం అవుతాయి. కళాప్రపంచం లోని ఆ రసాత్మకత సమ్మోహకంగా భాసించి, సమాజం దానిని వాస్తవీకరించాలనే ప్రయత్నాన్ని మొదలుపెడుతుంది. సంఘజీవితంలో మార్పులు వస్తాయి. మానవప్రవృత్తి సంకుచిత స్వార్థం నుంచి విడివడి విశ్వశ్రేయోభిముఖంగా ప్రయాణిస్తుంది.”

అని ద్రెమోవ్ పేర్కొన్న సంవిధానమే, యాదృచ్ఛికమే అయినప్పటికీ భీమన్న గారి అసంకీర్ణచిత్రీకరణలో ప్రస్ఫుటిస్తుంది. ఈ అభ్యుదయాదర్శానికి అనుభూతి కవితారూపాన్ని ఇచ్చినందువల్ల ‘పైరు పాట’లో “కష్టానికి ఫలమేమిటి, కన్నీరొక్కటి తప్ప, ఇచ్చేవాడినే దోచి, పుచ్చుకుంటదీ లోకం. / మేడలు మిద్దెలు ఉన్నా, మెత్తని పానుపు లున్నా, హృదయం లేకున్నప్పుడు, వృథయే కద బ్రతుకంతా.” వంటి పంక్తులకు నివేశం ఏర్పడింది. కథాశిల్పం, పాత్ర మనోధర్మవిశదిమ, సంవాదశైలి మొదలైనవన్నీ ఈ మార్గానుసారం ప్రవర్తిల్లాయి.

సంగీత నృత్య నాటికగా ప్రదర్శనీయరూపాన్ని సంతరించుకొన్నందువల్ల ‘పైరు పాట’ భావుక మనోధర్మానుసారం స్వరప్రస్తారానికి, రాగవిస్తారానికి, రంగభూమిపై తాళమాధురికి జీవకళను ప్రసాదించే నృత్యాభినయకల్పనకు అనువైన గతిలో సలక్షణంగా సాగింది. సామాజికవాస్తవికతను అభ్యుదయాదర్శాలకు అనుగుణంగా మలిచి, భావిసమాజం తీరుసౌరులు ఈ విధంగా ఉంటాయన్న కాల్పనికచైతన్యాన్ని తెలుగులో ప్రప్రథమంగా ఆవిష్కరించింది. “కాలంతోపాటు సమాజమూ, సమాజంతోపాటు సాహిత్యరీతి, దానితోపాటు విమర్శనాపద్ధతీ పురోగమించాలి. అందుకు దేశం నోచుకోలేదు” అని భీమన్న గారు బాధపడ్డారు. “మళ్ళీ గుచ్చుకొన్నా తీగ లొత్తిగించి చూడగలవారికి ఆకుల మాటున అరుణకాంతులు వెదజల్లే పుష్పాలు లభింపకపోవు” అని భవభూతి లాగా ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఆ సహృదయధర్మానికి సమానధర్ములకు స్వాగతం!

-ఏల్చూరి మురళీధరరావు

murali

నిత్యవిచారిణి!

saaranga 1

1

“సంతూ! నువ్వు అదృష్టవంతురాలివే! పెళ్ళాన్ని క్రిటిసైజ్ చెయ్యడంలో ముందుండే మొగుళ్ళే తప్ప ప్రైజూ, సర్‌ప్రైజూ చేసే మొగుళ్ళు ఎక్కడో కానీ ఉండరే! సర్‌ప్రైజ్‌గా పట్టమహిషికి పట్టుచీర కొనిచ్చే మొగుడు దొరికినందుకు పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోవాలి కానీ ఇంకా ఈ వంకలు పెట్టడం దేనికే?”

“చాల్లేవే వల్లీ! నువ్వు మరీ చెప్తావ్! ఇంత పెద్ద బోర్డర్ ఉన్న చీరలు నాకు నచ్చవని నీకు తెలీదూ? పెళ్ళాన్ని ప్రేమించే మొగుడు పెళ్ళాం ప్రేమించేవి తెలుసుకోలేడూ? మల్లెపూలు తెచ్చిచ్చేస్తే మంచి మొగుడు అయిపోడే వల్లీ, మనసుని పరిమళింపజెయ్యాలి!”

నేను సంతూని సముదాయించడానికి ఏదో చెప్పబోతూ ఉంటే ఓ పెద్ద మెరుపు మెరిసినట్ట్లైంది! చూస్తే సాక్షాత్తూ విష్ణుమూర్తి ప్రత్యక్షమై కనిపించాడు! ఇది కలా నిజమా! విష్ణుమూర్తి వైకుంఠం నుంచి సరాసరి మా వాకిట్లోకి దిగొచ్చెయ్యడం ఏమిటి? ఇంతకీ ప్రత్యక్షమైంది నాకా లేక సంతూకా? అదయితే అసలు భక్తురాలే కాదు. నేను కనీసం “లక్ష్మీకటాక్షం” కోసం చాలాసార్లు ప్రార్థించాను. ఆవిడ మొగుణ్ణి పంపించి ఉండొచ్చు అనుకుని విష్ణుమూర్తి కాళ్ళపై పడబోయాను. అంత విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి –

“కాళ్ళపై పడితేనే భక్తి కాదు తల్లీ! కష్టపడకు! అయినా నేను వచ్చింది నీ ప్రాణస్నేహితురాలు నిత్యసంతోషిణి కోసం!”

ఇప్పుడే దాన్ని అదృష్టవంతురాలివి అని పొగిడాను, అప్పుడే ఇంత మహాదృష్టమా? అయినా సంతూ అంత పుణ్యం ఏమి చేసుకుందో  అని ఆశ్చర్యంగా చూడసాగాను. విష్ణుమూర్తి సంతూ కేసి చూసి –

“అమ్మా నిత్యసంతోషిణీ! ప్రతివారూ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. రోజూ తెలుగు టీవీ సీరియల్సు చూసే వాడి జీవితంలో ఆనందం కరువౌతుంది. అలాగే తెలుగు సినిమాలు ఎక్కువ చూసేవాడికి తెలివితేటలు నశించడం అనివార్యం! ఇలా ప్రతి పనికీ దానికి తగ్గ ఫలితం ఉంటుంది”

ఇలాంటి బోధలు వినడానికి భగవానుడు ప్రత్యక్షమవ్వడం ఎందుకు, భక్తి చానల్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అన్నట్టు సంతూ అసహనంగా చూస్తోంది! సర్వజ్ఞునికి తెలియనిది ఏముంటుంది, సంతూ మనసులోని భావం గ్రహించి ఇలా కొనసాగించాడు –

“ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, చేసిన మంచి కర్మలకు గాను ఎన్నో శుభప్రదమైన ఫలితాలను ఇచ్చినా వాటిని శోకంగా మార్చే అపార నైపుణ్యం నీకే అబ్బింది తల్లీ! పాయసం పంచుతున్నా అది నీ చేతుల్లో విషంగా మారిపోతూ ఉంటే తలరాత రాసిన బ్రహ్మ ఏం చెయ్యాలో తెలియక తికమకలో పడ్డాడు. జాతకాలు, కర్మసిద్ధాంతాలూ నీ పుణ్యమా అని ఎన్నడూ లేని తిరకాసులో పడ్డాయి. ఇలా నిన్ను సృష్టించిన తప్పుకి ప్రాయశ్చితంగా బ్రహ్మ తక్షణం మోక్షం ఇచ్చి నిన్ను సృష్టి నుంచి తప్పించమని నన్ను కోరాడు!”

అదన్న మాట సంగతి! “సంతూ, చాన్స్ కొట్టావే!” అనుకున్నాను నేను కుళ్ళుకుంటూ. కానీ, అది ఏ ఫీలింగూ లేని మొహంతో ఇలా బదులిచ్చింది –

“నాకు బెల్లం పాయసం ఇష్టం, పంచదార పాయసం నచ్చదు! రెండూ తీపే కదా అని నాకు నచ్చని పంచదార పాయసమే నాకిస్తూ ఉంటే కాదనడం తప్పా? ఈ లాజిక్కు నా తోటి మనుషులకి అర్థం కాకపోవడాన్ని సరిపెట్టుకోగలను కానీ దేవుడివైన నీకే అర్థం కాకపోతే ఇంకేం చెయ్యాలి స్వామీ? నేను కోరుకోనివి ఎన్నిస్తే నాకెందుకు?”

అమ్మో! బానే అర్గ్యూ చేస్తోందే! విష్ణుమూర్తి ఏమంటాడా అని చూశాను.

“అదేమిటి తల్లీ! మొన్నే కదా నువ్వు కోరుకున్నట్టు బంగారం ప్రసాదించాను, నువ్వు కాసులపేరు కూడా చేయించుకున్నావు కదా!”

“ఆ! ఇచ్చావులే పెద్ద! నేను కొన్న వెంటనే బంగారం ధర పడిపోయింది. కొన్ని రోజులు ఆగుంటే వడ్డాణమే చేయించుకునేదానిని. టైమింగు కుదరనప్పుడు వరాలిచ్చీ ఏం లాభం!”

చిద్విలాసుడు చిరునవ్వి నవ్వి ఇలా అన్నాడు –

“ఇంతకీ మోక్షం కావాలో వద్దో త్వరగా తేల్చు తల్లీ! నేను వెళ్ళాలి. పాలసముద్రం పైన పవళించి, మురిపాల శ్రీలక్ష్మి నా కాళ్ళు ఒత్తుతూ ఉంటే, అన్నమయ్య కీర్తనలు వింటూ సేద దీరాల్సిన వాడిని!

Kadha-Saranga-2-300x268

“నాకు అర్థం కాని మోక్షాన్ని నేనేమి చేసుకునేది స్వామీ! వెళ్ళి మీ అర్థాంగినే ఏలుకోండి!” అంది సంతూ చిరు కోపంతో.

“సరే, నీ చిత్తమే నీ భాగ్యము. ఒక మాట చెప్తాను, అర్థం కాకపోయినా గుర్తుపెట్టుకో తల్లీ, ఎప్పటికైనా పనికొస్తుంది – తనెంత అదృష్టవంతుడో తెలుసుకోలేనివాడే లోకంలో అందరికన్నా దురదృష్టవంతుడు.”

ఇలా చెప్పి అంతర్ధానమయ్యాడు స్వామి. సంతూ అజ్ఞానానికి నేను అవాక్కయ్యాను. అది మాత్రం విచారంగా మొహం పెట్టి నాతో అంది –

“చూశావే వల్లీ! నేనెంత దురదృష్టవంతురాలినో! సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే దిగొచ్చినా నేను కోరినది ఇవ్వలేకపోయాడు!”

2

ఆ మాటలకి నా కళ్ళు తెరుచుకున్నాయి! ఓహో, ఇది కలన్న మాట! కానీ ఇది నిజంగా జరిగినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే మా సంతూకి నిరాశ నిండిన లాజిక్కులతో దేవుళ్ళనైనా బెంబేలెత్తించే టాలెంట్ ఉంది. మీకు పాత రోజుల్లో ఈటీవీలో “ఓ కళంకిత, కళలకే అంకిత, కన్నీటికి అద్దం నీ చరిత!” అనే టైటిల్ సాంగుతో వచ్చిన “కళంకిత” సీరియల్ గుర్తుంటే అందులో ఏడుపు కోసమే పుట్టినట్టు ఉండే హీరోయిన్ ఉంది చూశారూ, తను మా సంతూకి సరిగ్గా సరిపోతుంది. తను కళంకిత అయితే సంతూ శోకాంకిత, శోకానికే అంకిత!

సంతూ అసలు పేరు నిత్యసంతోషిణి. ఏవిటో కొందరికి పెట్టిన పేర్లు అచ్చిరావు. పేరు “నిత్యసంతోషిణి” అయినా అది ఎప్పుడూ సంతోషంగా ఉన్న దాఖలాలు లేవు. అది పుడుతూనే బిగ్గరగా ఏడుపులంకించుకుంటే “బాలానాం రోదనం బలం” అని ముందు పెద్దవాళ్ళు ముచ్చటపడ్డారు. అయితే ఎంతకీ ఏడుపు ఆపకపోతే కంగారుపడ్డారు. ఆ తర్వాత అది పెరుగుతూనే ఉన్నా, ఏడుపు ఏ మాత్రం తరగకపోయేసరికి చిరాకు పడ్డారు. అలా అది ఏడుస్తూ, అందరినీ ఏడిపిస్తూ పెరిగింది. చిత్రంగా సంతూ నాలుగేళ్ళ వయసొచ్చేసరికి సడన్‌గా ఏడవడం మానేసింది. అందరూ “హమ్మయ్యా!” అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది కన్నీళ్ళు ఆపుకుంది కానీ ఏడుపు ఆపలేదు! పైకి ఎలా ఉన్నా, మౌనంగా తనలో తాను నిత్యం ఏడుస్తూనే ఉంటుందని నాకు తెలుసు. అందుకే దానికి నేను “నిత్యవిచారిణి” అని పేరు పెట్టుకున్నాను!

ఇంతకీ నేనెవరిని అని మీకు సందేహం వచ్చి ఉండాలి. నా పేరు శ్రీవల్లి. సంతూకి ప్రాణస్నేహితురాలిని. దాని కన్నీళ్ళకి కర్చీఫ్‌ని! దానికి, కాదు కాదు, దాని ఏడుపుకి శిష్యురాలిని! ఎలా అంటారా? కొందరిని చూసి – “ఇలా ఉండాలి” అని ఇన్స్పైర్ అవుతాం, కొందరిని చూసి “చచ్చినా ఇలా ఉండకూడదు” అని డిసైడ్ అవుతాం! ఈ రెండు రకాల వాళ్ళూ మనకి గురువులే. సంతూ (సంతూ ఏడుపు) నాకు రెండో రకంగా జీవితం గురించి ఎంతో నేర్పిన గురువు. అసలు మా మొదటి పరిచయమే ఓ పాఠం…

ఆ రోజు నాకు బాగా గుర్తు. నా చిన్నతనంలో మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి మేము సంతూ వాళ్ళ ఊరుకి కొత్తగా వచ్చాము. అదో చిన్న టౌను. సంతూ వాళ్ళు మా అద్దెంటి ఎదురుగానే ఉండేవారు. వాళ్ళది కలవారి కుటుంబం. పెద్ద ఇల్లూ, వెనుక విశాలమైన పెరడూ, అందులో రకరకాల పూలమొక్కలూ అవీ ఉండేవి. అమ్మ ఒక రోజు “పూలుకోసుకు రా” అంటే వాళ్ళింటికి వెళ్ళాను. హాల్లో సంతూ కనిపించింది. అదే మా మొదటి పరిచయం.

“హాయ్! నా పేరు శ్రీవల్లి! అమ్మ పూలు కోసుకు రమ్మంది…”

సంతూ మాట్లాడకుండా నన్ను పెరట్లోకి తీసుకెళ్ళింది.

“అబ్బా! ఎన్ని రంగు రంగుల పువ్వులున్నాయో! ఈ ఎర్రగులాబీలు ఎంత ముద్దొస్తున్నాయో!” – నేను నా ఉత్సాహాన్ని బయటపెడుతూ అన్నాను.

సంతూ ఏ మాత్రం తొణక్కుండా – “తెల్ల గులాబీలు లేవుగా!” అంది.

“నీకు తెలుపు ఇష్టమా?”

“కాదు. తెల్ల పూలు లేవు కాబట్టి తెలుపు కావాలనిపిస్తుంది!”

“అదేంటి?”

“ఉన్న వాటితోనే సంతృప్తి పడిపోతే కొత్తవి, ఇంకా గొప్పవి జీవితంలో ఎలా దొరుకుతాయి?”

“అవునా! ఇన్ని విషయాలు నీకెలా తెలుసు?”

“తెలివుంటే, పుస్తకాలు చదివితే తెలుస్తాయి!”

“ఓహో! చాలా పుస్తకాలు చదివితే బాగా బాధపడొచ్చు అన్న మాట!”

ఈ సమాధానానికి సంతూ నాకేసి తీక్షణంగా చూసి- “నువ్వు ఏ క్లాసు చదువుతున్నావు?” అని అడిగింది.

“8th క్లాస్. ఇంకా జాయిన్ అవ్వలేదు, నాన్న మంచి స్కూల్ చూస్తున్నాడు!”

“నేనూ 8th క్లాసే! మా స్కూల్ బాగుంటుంది. అక్కడే జాయిన్ అవ్వు. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. నాతో తిరిగితే నీకు కొంచెం తెలివితేటలైనా వస్తాయి!”

సరే అనక తప్పింది కాదు, అసలే నాకు మొహమాటం ఎక్కువ! ఆ రోజు నేను నేర్చుకున్న మొదటి పాఠం: జీవితం గులాబి పువ్వు లాంటిది. రంగూ రూపూ నచ్చలేదని ముక్కుమూసుకుని కూర్చోకుండా, ముళ్ళున్నాయని వంకలు పెట్టకుండా, పరిమళాన్ని ఆస్వాదించాలి!

3

అలా మొదలైన మా స్నేహం మూడు ఏడుపులూ, ఆరు ఓదార్పులుగా సాగిపోతోంది. సంతూ కన్నీళ్ళతో నేను నా జీవిత కావ్యాన్ని రాసుకుంటున్నాను. మేము తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా, నాకు గుర్తుండిపోయిన ఇంకో సంఘటన జరిగింది.

స్కూల్లో హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరుగుతున్నాయి. ఆ రోజు లెక్కల పరీక్ష. ఎప్పటికైనా సంతూనైనా అర్థం చేసుకోగలుగుతానేమో కానీ లెక్కల అంతు తేల్చడం నా వల్ల కాదు. అందుకే నేను భయం భయంగా హాల్లోకి అడుగు పెట్టాను. సంతూ కాం గా వచ్చింది. దానికేం, ఇంటెలిజెంటు! లక్కీగా పేపరు చాలా ఈజీగా వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్నప్పుడు మా సంభాషణ –

“పేపరు చాలా ఈజీగా ఉంది కదే! నీకు వందకి వంద ఖాయం అనుకుంటా” – నేను

“నేను పరీక్ష రాయడం సగంలో ఆపేశాను” – సంతూ

“ఏం?” అన్నాను ఆశ్చర్యంగా!

“పెన్ రాయలేదు. బ్రహ్మ నా తలరాతలో వంద మార్కులు రాయలేదు!”

“అయ్యో! చెయ్యెత్తి అడిగితే ఎవరైనా ఇంకో పెన్ ఇచ్చేవారు కదా! అయినా స్పేర్ పెన్ తీసుకురాకుండా ఎగ్జాం కి ఎలా వచ్చావ్?”

“నిన్నే కొత్త పెన్ కొన్నాను. ఇప్పుడే ఫ్రెష్‌గా తెల్లారాక వెంటనే చీకటి పడుతుందని ఎవరు ఊహిస్తారు? అయినా విధి నాతో ఆడుకుంటున్నప్పుడు పావుగా మారి తలొగ్గాలి గానీ పాములా బుసకొడతానంటే గేం రూల్స్ ఒప్పుకోవు!”

నాకు అదన్నదేమిటో ఒక్క ముక్క అర్థం కాలేదు! “ఉన్నదానితో సరిపెట్టుకోకూడదు” అని గతంలో లెక్చర్ పీకిన అది, ఇప్పుడు ఆగపోయిన రీఫిల్తో ఎలా సరిపెట్టుకుందో దానికే తెలియాలి! కాని నాకు మాత్రం తెలిసొచ్చిన పాఠం ఇది – జీవితమనే పెన్లో రీఫిల్ అయిపోతే, రాయడం ఆపెయ్యకూడదు, పెన్ పడెయ్యకూడదు. కొత్తగా రీఫిల్ చేసుకుని ముందుకి సాగాలి!

4

సీతాకోకచిలకలని చూసి ముచ్చటపడి ఆడుకునే వయసు నుంచి సీతాకోకచిలకలుగా మారి అబ్బాయిల గుండెల్లో రెపరెపలాడే వయసులోకి వచ్చాము మేమిద్దరం! నాకంటే సంతూ అందంగా, తీర్చిదిద్దిన చందనశిల్పంలా ఉండేది. సీరియస్‌గా ఉండి ఎప్పుడూ నవ్వదు కానీ నవ్వితే వెన్నెల వర్షమే! ఆ టౌనులోని చిన్న కాలేజీలోనే సాగిన మా ఇంటర్మీడియట్ చదువులో, సంతూ ఎప్పుడైనా కాలేజీకి ఓణీ కట్టుకెళితే కుర్రగుండెల్లో కాంభోజీయే! కాబట్టి సహజంగానే దానికి చాలామంది ఆరాధకులు ఉండేవాళ్ళు. అయితే అది మాత్రం అబ్బాయిలని దూరంగా పెట్టేది, కానీ వాళ్ళ గుండెలని గిలిగింతలు పెట్టేది.

బయటపడదు కానీ సంతూ కూడా మా క్లాసులోని ఒక అబ్బాయంటే ఇష్టపడుతోందని నేను గ్రహించకపోలేదు. అది ఆ అబ్బాయి కేసి చూసే దొంగచూపులు నన్ను దాటిపోలేదు. నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. ప్రేమలో పడుతోంది అంటే అది నార్మల్ గానే ఉందని నాకు నమ్మకం కలిగింది! కానీ వెంటనే ఆ అబ్బాయిపై జాలి కలిగింది!   మొత్తానికి ఈ కథ ఏమౌతుందో అన్న కుతూహలం పెరిగింది. చదువులో ముందుండే అబ్బాయిలు ప్రేమ విషయాల్లో ఎప్పుడూ వెనకబడే ఉంటారు నేనకునేలోపే కథ వేగం పుంజుకుంది. ఓ రోజు మేమిద్దరం నడిచి ఇంటికి వెళుతుంటే ఆ అబ్బాయి మాకేసి వచ్చాడు –

“హాయ్ సంతూ! నీతో కొంచెం మాట్లాడాలి”

అమ్మో ఫర్వాలేదే! నేను కొంచెం పక్కకి వెళ్ళబోయాను, కానీ సంతూ నన్ను చెయ్యిపట్టుకు ఆపి, ఆ అబ్బాయితో ఇలా అంది –

“ఏమిటో చెప్పు! వల్లీ ఉందని వర్రీ వద్దు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఏ విషయం దాచుకోము.”

“నేను కూడా దాచుకోలేకే ఓ విషయం చెబుదామని వచ్చాను!” మృదువుగా చెప్పాడు.

“ఏమిటది”? – కటువుగా అడిగింది సంతూ.

“నువ్వూ తెలివైన దానివి, నేనూ తెలివైన వాడిని. మన తెలివి చెలిమిగా మారితే మన స్నేహం నీ అంత అందంగా ఉంటుంది కదా. ఏమంటావ్? కన్ వీ బీ ఫ్రెండ్స్?” అంటూ చెయ్యి చాచాడు.

“ప్రేమకు స్నేహం తొలిమెట్టు” అని పెద్దలు అన్నారు కాబట్టి ఇదేదో బానే ఉందని నేను సంబరపడుతూ ఉండగా, సంతూ నా కలల్లో కారం పోస్తూ –

“సారీ, నేను అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చెయ్యను”, అని బదులిచ్చి నన్ను చెయ్యిపట్టుకు లాకెళ్ళిపోతూ, మళ్ళీ ఓసారి ఆగి డ్రమాటిక్‌గా తల వెనక్కి తిప్పి ,

“అదీ తమకు తాము చాలా తెలివైన వాళ్ళం అనుకునే అబ్బాయిలతో అస్సలు చెయ్యను” అంటూ ముక్తాయింపిచ్చింది.

ఆ అబ్బాయి నిర్ఘాంతపోయాడు, నేను ఆశ్చర్యపోయాను. మేము  కొంచెం దూరంగా వెళ్ళాక నెమ్మదిగా అడిగాను –

“నిజం చెప్పవే సంతూ! నీకూ ఆ అబ్బాయంటే ఇష్టం కదూ? హాయిగా జట్టు కట్టకుండా ఈ బెట్టెందుకే?”

సంతూ పెద్దగా నిట్టూర్చి – “వాడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానే! నేను క్లాసులో ఆరాధనగా చూసే చూపులు వలపు తెమ్మెరలై వాణ్ణి తాకితే వాడు వెనక్కి తిరిగి నాకేసి చూసి మౌనమందహాసం చెయ్యాలని, అది చూసి నేను సిగ్గుతో తలదించుకోవాలనీ! నా జడలోంచి రాలిన మందార పువ్వుని వాడు పదిలంగా ఏరుకుని ప్రేమ పరిమళాలని ఆస్వాదించాలనీ. సెలయేటి ప్రవాహంలా, కోయిల గానంలా, వెన్నెల మాసంలా మా ప్రేమ సుతారంగా మొగ్గతొడగాలనీ! ఇలా ఎన్నో! కానీ నా దురదృష్టాన్ని మళ్ళీ నిరూపిస్తూ వాడు నా కలలసౌధాన్ని కుప్పకూల్చాడే! ఈ అబ్బాయిలకి తాపత్రయమే కానీ కళాత్మకత ఎందుకు ఉండదో! ప్చ్!”

దానికి ఫిలాసఫిలో పేటెంట్లే కాక పోయెట్రీలో ప్రవేశం కూడా ఉందని అప్పుడే తెలిసింది. మొత్తానికి రొమాన్సు మొదలవ్వకుండానే దాని ప్రేమకథ క్లైమాక్సుకి చేరింది. నాకు మాత్రం ఓ పాఠం మిగిలింది – ప్రతి ఉదయం జీవితం నీకు రాసే ప్రేమలేఖ! ప్రతి నిమిషం లవ్ ప్రపోజల్. పట్టించుకుంటే బ్రతుకు ప్రణయగీతం. నిట్టూర్చిపోతే నిత్యభారం!”

5

ఇంటర్మీడియట్ తర్వాత సంతూ ఇంజనీరింగ్ చదువుకై సిటీకి వెళ్ళిపోయింది, నేను మాత్రం అదే ఊరులో డిగ్రీ చదువుతో సరిపెట్టుకున్నాను. చదువైన వెంటనే పెళ్ళి కుదరడంతో నేను హైదరబాద్‌లో కాపురం పెట్టాను. సంతూ బెంగళూర్‌లో ఉద్యోగం మొదలెట్టింది. ఇంటర్మీడియట్ తర్వాత మేము కలిసి మాట్లాడుకున్నది తక్కువే అయినా ఫోన్ సంభాషణల ద్వారా మా స్నేహబంధం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. సంతూ ఇంజనీరింగ్‌లో, ఉద్యోగంలో ఎదురుకొన్న సవాలక్ష సమస్యలని ఏకరువు పెడుతూనే ఉంది. అన్నిటికంటే పెద్ద సమస్య ఒకటి తయారైంది – దాని పెళ్ళి!

సంతూ అందాన్ని, వాళ్ళ కుటుంబ స్థితిగతులనీ చూసి చాలా మంచి సంబంధాలే వస్తున్నాయి. కాని దానికి ఏదీ ఓ పట్టాన నచ్చి చావట్లేదు. అది పెడుతున్న వంకలకి నెలవంక కూడా నివ్వెరపోతుంది. అబ్బాయి రూపం బాగుంటే హైటు బావులేదంటుంది. హైటూ లుక్కూ బావుంటే బట్టతల వచ్చేటట్టున్నాడంటుంది! బాగా మాట్లాడే వాడు దొరికితే చదువు బాలేదంటుంది, మంచి చదువున్నవాడు వస్తే సంస్కారం లేదంటుంది. అన్నీ బావుంటే కాబోయే అత్తగారి వాలకం అనుమానాస్పదంగా ఉందంటుంది! ఇలా అది తలతిక్కతో కూర్చుంటే ఇంట్లో వాళ్ళు తలపట్టుకుని కూర్చున్నారు. ఈ తతంగం కొన్నేళ్ళు సాగాక దానికి పూర్తిగా నచ్చకపోయినా ఓ అమెరికా సంబంధాన్ని కుదిర్చేశారు.

పెళ్ళి కుదిరాక ఓ సారి అది హైదరాబాద్ వచ్చినప్పుడు మేము కలుసుకున్నాం. అప్పటికే అబ్బాయి ఫొటో నాకు చూపించింది, చక్కగా ఉంటాడతను. కలిసినప్పుడు దానిని నేను టీజ్ చేస్తూ –

“ఏమంటున్నాడే నీ వరుడు, మనోహరుడు? సరసుడేనా?”

“సర్లేవే! పెళ్ళి కాకముందు ప్రేమ కురిపించడంలో పెద్ద గొప్పేముంది? ప్రేయసి పెళ్ళామైపోయాక సరసం నీరసమైపోతుంది!”

“చాల్లేవే! పెళ్ళయ్యాక అమెరికా ఎగిరిపోతావ్, పెద్దల గోల లేదు! ఇక కొన్నేళ్ళు ప్రతిరాత్రీ, వసంతరాత్రీ, బ్రతుకంతా హనీమూనే!”

“నీకేంటే ఎన్నైనా చెప్తావ్! పక్కనే అమ్మానాన్నా, పండుగలూ పబ్బాలూ, పట్టుచీరలూ సందళ్ళూ, ఇంట్లో పనిమనుషులూ! నేను నావాళ్ళకి దూరంగా ఒక్కత్తినే అన్నీ చేసుకుని చావాలి. నాకు H1 వీసా లేదు కాబట్టి ఉద్యోగం కూడా హుష్ కాకీ! గ్రీన్ కార్డ్ లేని మొగుణ్ణి కట్టబెడితే ఇక బ్రతుకులో పచ్చదం ఏముంటుందే! నేను ఫ్లైటెక్కి అమెరికా చేరేలోపే దురదృష్టం నా ఫేట్ ఎక్కి వెళ్ళి వాలిపోయిందే!”

నాకేం చెప్పాలో తెలియలేదు. మొత్తానికి సంతూ పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోయి NRI అయిపోయింది. కాని అది ఎప్పటికైనా నిజమైన NRI (Non Regretting Indian) గా మారాలనే నా ఆకాంక్ష. వెళ్తూ వెళ్తూ అది నేర్పిన పాఠం మాత్రం నాకు గుర్తుండిపోయింది – “జీవితం నిత్యకళ్యాణం పచ్చతోరణమా లేక ఒక్క కళ్యాణం నిత్య రోదనమా అన్నది మనబట్టే ఉంటుంది!”

6

సంతూ అమెరికాలో పడుతున్న అవస్థలని స్కైప్‌లో రోజూ సినిమాలా వివరిస్తూ ఉంటే ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. మేమిద్దరం పిల్లల తల్లులమైపోయి, సంసారకూపంలో నిలువునా కూరుకుపోయాము. కలుసుకునే ఆరేళ్ళు దాటిపోయింది. అది ఆ మధ్యెప్పుడో ఇండియా వచ్చినప్పుడు మేము తొలిసారి పోట్లాడుకున్నాం, ఆఖరిసారి మాట్లాడుకున్నాం.

ఆ రోజు మేము కలిసి, కుశలప్రశ్నలూ అవీ అయ్యాక, నేను అన్నాను –

“సంతూ, నీ అందం ఏ మాత్రం తగ్గలేదే! ఫిగర్ భలే మైంటైన్ చేస్తున్నావ్! నాకు టిప్స్ చెప్పొచ్చు కదే!”

“హా! జీవితం వగరుగా ఏడిస్తే ఫిగరుతో ఏమి చేసుకుంటాం!”

“మరీ చెప్తావే! మంచి భర్తా, ముత్యాల్లాంటి పిల్లలూ, బోలేడు డబ్బూ! నీకేం బాధలున్నాయే!”

“ఇద్దరు కుర్ర రాక్షసులకి తల్లి ఎక్కడైనా ఆనందంగా ఉండడం చూశావే నువ్వు! వాళ్ళ అల్లరితో నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారే! నీకేం అదృష్టవంతురాలివి, బుద్ధిగా ఉండే అబ్బాయి, ముద్దొచ్చే అమ్మాయి. ఐడియల్ కాంబినేషన్! అమ్మాయుంటే ఆ కళే వేరే! ఏం చేస్తాం, దేవుడు నాకా అదృష్టం ఇవ్వలేదు!”

“అదేమిటే, పెళ్ళి కాకముందు అమ్మాయిగా పుట్టడమే పెద్ద దురదృష్టం అనీ, అమ్మాయిలని పెంచడం మహా కష్టం అనీ, అది నీ వల్ల కాదనీ, పిల్లలు పుడితే ఇద్దరూ అబ్బాయిలే కావాలనీ అనేదానివి కదా!”

“అదే చెప్తున్నానే! వరాలని కోరుకోవడం కూడా నాకు సరిగ్గా చేతకాదు! దురదృష్టానికి ఇంతకన్నా దాఖలా కావాలీ? ఇక ఈ జన్మకి ఇంతే. వచ్చే జన్మలోనైనా దేవుడు కొంచెం అదృష్టాన్నీ సుఖాన్నీ ఇస్తే బావుణ్ణు!”

ఇన్నేళ్ళూ దాని డైలాగులకి ఎదురు చెప్పకుండా ఉంటున్నదానిని ఆ రోజు ఉండబట్టలేక దానితో ఓ మాటనేశాను. అదే నేను చేసిన తప్పు.

“విడ్డూరం కాకపోతే నువ్వు దురదృష్టవంతురాలివి ఏమిటే! వింటే దురదృష్టం నవ్వుకుంటుంది. నీకు వచ్చే జన్మంటూ ఉంటే నిజంగా నిన్ను దురదృష్టవంతురాలిగా పుట్టించి ఈ జన్మని జ్ఞాపకం వచ్చేలా చెయ్యమని దేవుణ్ణి కోరుకుంటున్నాను. నిజమైన బాధ, అసలైన కష్టం అంటూ ఒకసారి అనుభవిస్తే అప్పుడు నీకు తెలిసొస్తుంది నువ్వు ఎంత అదృష్టవంతురాలివో!”

ఆ మాటలకి అది అగ్గి మీద గుగ్గిలమే అయ్యింది –

“ఇదన్న మాట నీ నిజస్వరూపం. స్నేహితురాలి కన్నీళ్ళు కోరుకునే నువ్వు ప్రాణ స్నేహితురాలివటే? ఇన్నాళ్ళూ నా దురదృష్టం అంతా దేవుడి రాత అని అనవసరంగా ఆయన్ని తిట్టి పాపం మూటకట్టుకున్నాను కదే! ఇప్పుడు తెలిసొచ్చింది నువ్వే నా దురదృష్ట దేవతవని. నన్ను చూసి నువ్వు కుళ్ళుకుంటూ ఉంటే నాకు కన్నీళ్ళు రాకుండా ఉంటాయీ! చాలమ్మా చాలు! ఇక నువ్వూ వద్దూ నీ స్నేహమూ వద్దు! అమెరికాలో అంట్లు తోముకుంటూ నా పాట్లేవో నేను పడతాను కానీ, ఇక నిన్ను మాత్రం జన్మలో అంటను! సెలవ్, వెళ్ళి రా!”

“ప్రియం పలికేవాడంటే ప్యారు, హితం చెప్పేవాడంటే హేటు, ఇదే జనాల తీరు” అని ఎందుకంటారో నాకు తెలిసొచ్చింది. ఎప్పుడైతే నేను సంతూకి నచ్చచెప్పడం మాని, మంచి చెప్పడం మొదలెట్టానో దానికి నేను చెడ్డదాన్నైపోయాను. నా అవసరం దానికి తీరిపోయింది. మా బంధం చాలా గట్టిది అనుకున్నాను కానీ, మనిషిలోని అహం ఇంకా మొండిది!

ఇదండీ మా సంతూ కథ! ఆలోచిస్తే నాలోనూ, మీలోనూ, మనందరిలోనూ సంతూకున్న “ఏడుపుగొట్టు” లక్షణం అంతో ఇంతో ఉండకపోదు. దాని ఏడుపు సిల్లీగా ఉందని మనం నవ్వుకుంటున్నాం, కాని మనం ఏడ్చిన ఏడుపుల్లో ఎన్ని సిల్లీవి ఉండి ఉంటాయో కదా! ఆ సృష్టికర్త మనని చూసి కూడా నవ్వుకుని ఉండి ఉంటాడు, ఏమంటారు?

 -ఫణీంద్ర

ఫణింద్ర

 

 

 

 

 

 

 

 

 

 

 

కవులూ, కార్టూనిష్టులు, టెర్రరిష్టులూ …!

saranga cartoon 2

Raju

రహస్యప్రపంచ రారాణి… స్త్రీ!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)పిల్లలు Fairy Tales ఎంతో ఇష్టపడతారు. ఒకటి, రెండు తరాల వెనకటి తెలుగు బాలలు చందమామకథలతోనూ, విఠలాచార్య మార్కు సినిమాలతోనూ పెరిగినట్టే; ప్రతి దేశంలోనూ బాలలు వాళ్ళ వాళ్ళ వెర్షన్లకు చెందిన Fairy Tales మధ్య పెరుగుతారు. Fairy Tales అంటే ‘పిల్లల కథలు’ అనే నిఘంటువు నిర్వచిస్తోంది. ఈ మాటకు తెలుగులో కచ్చితమైన సమానార్థకం నాకు వెంటనే స్ఫురించడం లేదు. ‘అద్భుత కథలు’ అనుకుందాం. ఈ అద్భుత కథల గురించి నేనిప్పుడు మీతో ఒక అద్భుతాన్ని పంచుకోబోతున్నాను.

నిజానికి ‘అద్భుత కథలు’, మనం అనుకునేంత అమాయకమైన కథలు కావు. అవి కేవలం పిల్లల కథలూ కావు. ఆ కథల వెనుక ఒక చరిత్ర ఉంది. అంతకంటే ముఖ్యంగా పెద్దల మర్మమూ, పెద్ద తత్వమూ ఉన్నాయి. ఇలా అని పిల్లలకు ఉన్న కథలు కూడా లేకుండా చేస్తున్నానని మీకు అనిపిస్తే మన్నించాలి.

ఇంతకు ముందు మనం ఓడిసస్ అనే వీరుడి కథ చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు బాగా తెలిసిన ఒక సినిమాలోని వీరుడి కథ చూద్దాం. ఆ సినిమా పేరులోనే వీరుడు ఉన్నాడు. దాని పేరు ‘జగదేకవీరుని కథ’. విజయావారు తీసిన ఈ సినిమా అరవై దశకం ప్రారంభంలో వచ్చింది. అప్పుడప్పుడే ఊహ వస్తున్న రోజుల్లో విజయవాడ, దుర్గాకళామందిరంలో కాబోలు చూశాను. ఆ తర్వాత కూడా టీవీలో అప్పుడప్పుడు చూశాను. కానీ ఆ చూడడం వేరు, ఇప్పుడు చూస్తున్న తీరు వేరు. జోసెఫ్ క్యాంప్ బెల్, జార్జి థాంప్సన్ లను చదివేవరకూ, ఈ సినిమా, ఇంకా ఇలాంటి సినిమాల అసలు మర్మం నాకు బోధపడలేదు.

జగదేకవీరునికథకు ఒక తమిళ మాతృక ఉందని, అది కూడా గొప్ప హిట్ సినిమా అని ఇది రాస్తున్నప్పుడే తెలిసింది. దాని పేరు ‘జగదల ప్రతాపన్’. 1944లో వచ్చిన సినిమా అది. మీకు తెలిసిన, లేదా తెలుసుకునే అవకాశం ఉన్న కథే అయినా ప్రస్తుతాంశానికి అవసరమైన మేరకు జగదేకవీరుని కథ క్లుప్తంగా చెబుతాను.

అనగనగా ఒక రాజుగారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ప్రతాప్. అతనొక రోజు తండ్రితో మాట్లాడుతూ తనకు దేవకన్యలను పెళ్ళాడాలని ఉందంటాడు. దాంతో తండ్రికి కోపం వస్తుంది. అతన్ని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. ప్రతాప్ ఒక మిత్రునితో కలసి దేవకన్యలను వెతుక్కుంటూ బయలుదేరతాడు. అడవిలో ఒకచోట ఇంద్రకుమారి, అగ్నికుమారి, వరుణకుమారి, నాగకుమారి జలకాలాడుతూ కనిపిస్తారు. ఇంద్రకుమారి ప్రతాప్ ను చూసి శపిస్తుంది. అతను శిలగా మారిపోతాడు. అతని తల్లి అమ్మవారి భక్తురాలు. కొడుకు క్షేమం కోసం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటుంది. అమ్మవారు అవ్వ రూపంలో వచ్చి ప్రతాప్ కు శాపవిమోచనం కలిగిస్తుంది. అతనికి, అతని మిత్రునికి ఆశ్రయం ఇస్తుంది. ఇంద్రకుమారి జలకాలాడుతున్నప్పుడు ఆమె చీర ఎత్తుకు వస్తే ఆమె నీదవుతుందని ప్రతాప్ కు చెబుతుంది. ప్రతాప్ అలాగే చేస్తాడు.

ఈలోపల ఇంద్రకుమారి చేసిన ఒక తప్పుకు కోపించిన ఓ ముని, మానవమాత్రుడితో నీకు వివాహం అవుగాక అని శపిస్తాడు. అతను దొంగిలించిన నీ వస్త్రం నీకు లభించగానే శాపవిమోచనం అవుతుందంటాడు. ఇంద్రకుమారి ప్రతాప్ ను వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని కలసుకుంటుంది. ఇద్దరికీ వివాహం అవుతుంది. వాళ్ళు ఒక రాజ్యానికి చేరుకుంటారు. ఆ రాజ్యాన్ని పాలించే రాజు ఇంద్రకుమారి పొందు కోరుకుని, తన రోగానికి మందు తీసుకువచ్చే వంకతో ప్రతాప్ ను నాగలోకానికి, వరుణ లోకానికీ పంపిస్తాడు. అతను ఆ లోకాలకు వెళ్ళి నాగకుమారిని, వరుణకుమారినే కాక, అగ్నికుమారిని కూడా వెంటబెట్టుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఈ లోపల తమ్ముడు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. ప్రతాప్ లేనప్పుడు నలుగురు దేవతాస్త్రీలూ కలసి అతని తల్లిని మోసగించి ఆమె దగ్గర ప్రతాప్ దాచిన ఇంద్రకుమారి వస్త్రాన్ని అపహరిస్తారు. ఇంద్రకుమారి దానిని ధరించగానే శాపవిమోచనం కలుగుతుంది. నలుగురు దేవతాస్త్రీలూ దేవలోకానికి వెళ్లిపోతారు. అయినా ప్రతాప్ ను మరచిపోలేక పోతారు. ప్రతాప్ దేవలోకానికి కూడా వెళ్ళి ఇంద్రుని మెప్పించి నలుగురు భార్యలనూ వెంటబెట్టుకుని మానవలోకానికి వస్తాడు. ఆ తర్వాత తన రాజ్యాన్ని గెలుచుకుంటాడు.

ఓడిసస్ కథకు, ఈ కథకు ఉన్న పోలికలు చూడండి. ఓడిసస్ లానే ప్రతాప్ కూడా మానవమాత్రుడు, వీరుడు. అతని లానే సాహసయాత్ర చేస్తాడు. ఓడిసస్ కు ఎదురైనట్టే ప్రతాప్ కూ అనేక పరీక్షలు, కష్టాలు ఎదురవుతాయి. వాటి నుంచి గట్టెక్కడానికి ఓడిసస్ కు లానే దేవత(అమ్మవారు) సాయం లభిస్తుంది. ఓడిసస్ కు సిర్సే, కలిప్సో అనే అప్సరసలతో సంబంధం కలిగినట్టే ప్రతాప్ కు దేవకన్యలతో సంబంధం కలుగుతుంది. ఓడిసస్ ఒక దేవుడి సలహాతో సిర్సేను లొంగదీసుకుని ఆమెతో పడకసుఖాన్ని పొందుతాడు. అలాగే ప్రతాప్ అమ్మవారి సలహాతో ఇంద్రకుమారిని లొంగదీసుకుని పెళ్లిచేసుకుంటాడు. చివరగా ఓడిసస్ మార్మికప్రపంచం నుంచి మానవప్రపంచంలోకి వచ్చి పెనెలోప్ పునస్స్వయంవరంలో వీరత్వం చాటుకుని తిరిగి ఆమెను గెలుచుకుంటాడు. అలాగే ప్రతాప్ కూడా మార్మికప్రపంచం నుంచి మానవప్రపంచంలోకి వచ్చి రాజ్యాన్ని గెలుచుకుంటాడు.

రెండు కథలూ పురుషప్రయత్నాన్నీ, పురుషుడిలోనీ వీరత్వాన్నీ, అతను ప్రతికూల స్త్రీని సైతం అనుకూలంగా మార్చుకోవడాన్నీ చెబుతూనే; ఆ పురుష ప్రయత్నానికి దైవసహాయం కూడా అవసరమని చెబుతున్నాయి. జగదేకవీరుని కథలో ప్రతాప్ పురుషప్రయత్నానికి ప్రతీక అయితే, అతని తల్లి దైవసహాయానికి ప్రతీక. ఆపైన రెండు కథలూ దైవసహాయం, పురుషప్రయత్నాల మధ్య సమతూకాన్ని సూచిస్తున్నాయి. అంటే ఒకవిధంగా మానవుడి ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడమే.

వివరాలలో తేడా ఉండచ్చు, స్థూలంగా ఫార్ములా ఒకటే. ఒకటి గ్రీకు కథ, ఇంకొకటి భారతీయ కథ అనే సంగతిని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ అద్భుత కథల ఖజానాలోకి తొంగి చూస్తే ఇలాంటి ఫార్ములా కథలు ఇంకా మరెన్నో కనిపిస్తాయి. ఆయా దేశాలకు చెందిన ఇలాంటి అనేక కథలలోని వస్తువును, నిర్మాణ రీతులను ఎవరైనా లోతుగా పరిశీలించి, ఉమ్మడి అంశాలను గుర్తించారా అన్నది నాకు తెలియదు. నేను అందులోకి వెళ్లలేదు. ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఈ పోలికలను చూసినప్పుడు Fairy Tales అనేవి ప్రపంచంలో ఒకచోటినుంచి ఇంకోచోటికి వ్యాపిస్తూ వచ్చాయని కూడా అర్థమవుతుంది. Fairy Tales ప్రపంచవ్యాప్తం అవడమంటే, వాటి వెనుక ఉన్న ఒకే తత్వం కూడా ప్రపంచవ్యాప్తం అయిందన్నమాట.

The garden of immortality

The garden of immortality: ఈ సుమేరియన్ చిత్రంలో ముగ్గురు స్త్రీలు, చంద్రుడు, వృక్షాలు, ఫలాలు కనిపిస్తాయి

 

అందులోకి వెళ్లబోయేముందు ఇంకొక సూక్ష్మమైన పోలికను చెప్పుకోవాలి. ఓడిసస్, నలదమయంతుల కథలో ఉన్నట్టే జగదేకవీరునికథాగమనంలో కూడా వస్త్రం(వస్త్రం అన్నప్పుడు నగ్నత్వ సూచన కూడా అందులో గర్భితంగా ఉంటుంది)ఒక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి ఈ కథలో వస్త్రానిది మరింత స్పష్టంగా కనిపించే కీలకపాత్ర కూడా. ఇంద్రకుమారి నీకు లొంగాలంటే ఆమె వస్త్రం అపహరించుకురావాలని అవ్వ వేషంలో ఉన్న అమ్మవారు ప్రతాప్ కు చెబుతుంది. ప్రతాప్ ఇంద్రకుమారి వస్త్రం అపహరించడమంటే ఆమెను నగ్నంగా మార్చడమే. కాకపోతే, ఓడిసస్, నలదమయంతుల కథలో నగ్నత్వం పురుషుడిదైతే ఇక్కడ స్త్రీది. పక్షులు ఎత్తుకుపోయిన తన వస్త్రం తిరిగి తనకు లభించి, దానిని ధరించగానే బాహుకుడు నలుడిగా మారిపోతాడు. నగ్నంగా ఉన్న తనకు నౌసికా అనే రాచబాలిక ఇచ్చిన వస్త్రం ధరించిన తర్వాత ఓడిసస్ కు ఫేషియన్ల సాయం లభించి అతడు స్వస్థలానికి వెళ్లగలుగుతాడు. అలాగే ప్రతాప్ ఎత్తుకుపోయిన తన వస్త్రం తిరిగి పొందిన తర్వాత ఇంద్రకుమారి దేవకన్యగా మారి దేవలోకానికి వెళ్లిపోతుంది.

***

ఇప్పుడు విజయావారిదే ఇంకో ప్రసిద్ధ సినిమా చూద్దాం. అది, ‘పాతాళభైరవి’(1951). ఈ కథ కూర్పులో అనుసరించిన ఫార్ములా కూడా పై కథలోలానే ఉంటుంది. తోటరాముడు ఇందులో హీరో. అతి సామాన్యుడైన అతను ఉజ్జయిని రాకుమారిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. నా తాహతుకు తగినంత సంపదను సాధించుకువస్తే అమ్మాయిని ఇచ్చి పెళ్లిచేస్తానని రాజు షరతు పెడతాడు. తోటరాముడు స్నేహితునితో కలసి సాహసయాత్ర ప్రారంభిస్తాడు. అతనికి పాతాళభైరవిని కొలిచే ఒక నేపాళమాంత్రికుడు తారసపడతాడు. ఒక వీరుని బలి ఇచ్చి శక్తులు పొందే ఆలోచనలో ఉన్న మాంత్రికుడు అతనికి సాయపడుతున్నట్టు నటిస్తూ అతనిచేత అనేక సాహసాలు చేయించి వీరుడే నని ధ్రువీకరించుకుంటాడు. అతని పన్నాగాన్ని తెలుసుకున్న తోటరాముడే మాంత్రికుని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహం పొంది అన్ని సంపదలూ సాధిస్తాడు. అంతలో మాంత్రికుని శిష్యుడు సంజీవిని సాయంతో గురువును బతికిస్తాడు. రాకుమారిని పెళ్లాడాలనుకున్న రాజుగారి బావమరిది తోటరాముని అడ్డు తొలగించుకోవాలనుకుని అతని దగ్గర ఉన్న పాతాళభైరవి శక్తిని అపహరించి మాంత్రికుడికి అందిస్తాడు. మాంత్రికుడు తోటరాముని సంపదను అంతటినీ మాయం చేసేసి, పెళ్లి పీటల మీంచి రాకుమారిని అదృశ్యం చేస్తాడు. అప్పుడు తోటరాముడు మాంత్రికుని గుహకు వెళ్ళి అతన్ని చంపి రాకుమారిని, సంపదనూ కూడా తిరిగి దక్కించుకుంటాడు. అంటే, పైన చెప్పిన ఆయా కథల్లోలానే మంత్రతంత్రాలు, మహిమలతో కూడిన మార్మికప్రపంచంలోకి సాహసయాత్ర జరిపివచ్చిన తర్వాతే, తోటరాముడు వాస్తవిక ప్రపంచంలోకి వచ్చి రాకుమారితోపాటు రాజ్యాన్నీ పొందాడన్నమాట.

ఇప్పుడిక పై రెండు సినిమా కథల తాత్విక మూలంలోకి వెడదాం:

రెండు కథల్లోనూ అమ్మవారి పాత్ర ఉంది. అయితే, జగదేకవీరునికథలోని అమ్మవారు సాత్వికదేవత; పాతాళభైరవి కథలోని అమ్మవారు తామసిక లేదా ఉగ్రదేవత. ఇక్కడ దేవత ఒక్కతే; సాత్వికత, ఉగ్రత అనేవి ఆ దేవతకు గల రెండు అంశలు. అలాగే, జగదేకవీరుని కథలో ప్రతాప్ తల్లి, ప్రతాప్ సాత్వికరూపంలోని అమ్మవారి భక్తులు. పాతాళభైరవిలోని నేపాళమాంత్రికుడు ఉగ్రరూపంలోని అమ్మవారి భక్తుడు. దేవత రూపాలూ, పూజించే పద్ధతులు వేరైనా ఆశించే ఫలితం ఒక్కటే. ఉగ్రపూజలో బలులు, తన అవయవాలను తనే నరుక్కోడాలూ, రక్తతర్పణాలూ ఉంటాయి. అయితే, నరుక్కున్న అవయవం, పోయిన ప్రాణం తిరిగి వస్తాయి! పాతాళభైరవిలోనే చూడండి…మాంత్రికుడు భైరవి ముందు చేతిని నరుక్కుంటాడు. తెగిన చోట సంజీవినీ మూలికను రాయగానే చేయి మళ్ళీ వస్తుంది. మాంత్రికుని తోటరాముడు బలి ఇచ్చినప్పుడు శిష్యుడు సంజీవినితో మాంత్రికుని బతికిస్తాడు.

సాత్విక పూజ బహిరంగం. ఉగ్రపూజ రహస్యం. అది ఏ పాతాళ గుహల్లోనో, నరసంచారం అంతగా లేని వనాలు, లేదా తోపుల్లోనో జరుగుతుంది. పాతాళభైరవిలో నేపాళ మాంత్రికుడి ఆవాసం పాతాళగుహే. అంతేకాదు, సాత్విక పూజ కంటే ఉగ్రపూజ పురాతనం, ఆదిమం.

ఈ ఉగ్ర, సాత్విక పూజా ప్రక్రియలు రెండూ ఒక తాత్విక సూత్రాన్ని చెబుతాయి: సాత్వికత లేదా ప్రసన్నత అనేది జీవం, జీవించడం, లేదా వెలుగు! ఉగ్రత అనేది హింస, ఆత్మహింస, చావు, కష్టాలు, చీకటి! మళ్ళీ ఈ సాత్వికత, ఉగ్రత అనేవి రెండూ ఒకే బొమ్మకు రెండు పక్కలే తప్ప వేర్వేరు కావు. ఎలాగంటే, జీవం నుంచి చావు పుడుతుంది. చావునుంచి జీవం పుడుతుంది. విత్తనాన్ని భూమిలో పాతి పెట్టడం చావు. దాని నుంచి మొక్క రావడం జీవం. కష్టసుఖాలు, చీకటి వెలుగులు ఇదే చక్రభ్రమణాన్ని అనుసరిస్తూ ఉంటాయి. ప్రాణాన్ని, లేదా పునరుజ్జీవనాన్ని పొందాలంటే చావును ఎదుర్కోవాలి. సుఖాలను అందుకోవాలంటే కష్టాల కారడవిలోకి(నలుడు, జగదేకవీరుడు, తోటరాముడు), కడగండ్ల సముద్రంలోకి(ఓడిసస్) సాహసోపేతంగా అడుగుపెట్టాలి. వెలుగులోకి రావాలంటే చీకటిలోకి పయనించాలి.

ఈ చక్రభ్రమణానికి అద్దంపట్టే భౌతికరూపాలు కొన్ని ఉన్నాయి. అవి: చంద్రుడు, సర్పము, పంట లేదా మొక్క మొదలైనవి. చంద్రునికి వృద్ధి, క్షయాలు ఉంటాయి. వృద్ధి అంటే జీవవికాసం, క్షయమంటే చావు. అలాగే వృద్ధి అనేది వెలుగు, క్షయమనేది చీకటి. సర్పం పాత చర్మాన్ని వదిలేసి కొత్త చర్మాన్ని ధరిస్తూ ఉంటుంది. దాన్నే కుబుసం విడవడం అంటాం. పాత చర్మాన్ని వదిలేయడం చావు. కొత్త చర్మాన్ని ధరించడం పునర్జన్మ. ఒక కాలంలో మోడువారిన చెట్టు ఇంకోకాలంలో చిగురిస్తుంది. ఇందులోనూ చావు-పుట్టుకల క్రమం ఉంది. అలాగే, ఒక విత్తనాన్ని భూమిలో సమాధి చేస్తే(చావు) దాని లోంచి మొక్క పుట్టి అనేక విత్తనాలను ఇస్తోంది.

images1

అర్తెమిస్-అక్తియాన్…అక్తియాన్ పై వేటకుక్కలు దాడి చేస్తున్న దృశ్యం

ఇలా చంద్రుడికీ, సర్పానికీ, మొక్కకూ కూడా తనకు ఉన్నట్టే చావు-పుట్టుకల లక్షణం ఉండడం మనిషిని ఆకర్షించింది. అయితే మనిషికి భిన్నంగా చంద్రుడు, సర్పము, మొక్క మళ్ళీ మళ్ళీ చచ్చి, మళ్ళీ మళ్ళీ పుట్టడం ప్రత్యేకించి మనిషిలో ఆలోచనను, ఆశను రేకెత్తించింది. తనకూ అలాగే పునర్జన్మ, బహుశా ఇప్పటికంటే మెరుగైన జన్మ ఉంటుందనిపించింది. అలా మనిషిలో ఒక ఆదిమ తాత్వికత అంకురించింది. ఆ తాత్వికతకు అనుగుణమైన ఆచారకాండ రూపొందింది. చంద్రుడు, సర్పము, పంట లేదా మొక్క గొప్ప తాత్విక ప్రతీకలు అయ్యాయి. ఆ అవడం ఏదో ఒక్క చోట కాదు, ప్రపంచంలో అనేక చోట్ల అయింది. ఒకచోట పుట్టిన ఈ తాత్వికతే ఇతర చోట్లకు విస్తరించిందన్న వాదమూ ఉంది.

మన దేవీ దేవులతోనూ, ఆరాధనా రూపాలతోనూ చంద్రుడికీ, సర్పానికీ, పంటకు లేదా మొక్కకూ ఉన్న ముడి తెలిసినదే. శివుని శిరసు మీద, అమ్మవారి శిరసు మీదా కూడా చంద్రవంక ఉంటుంది. శివుని మెడలో సర్పముంటుంది. సర్పాన్ని, చెట్టును పూజించడం మన దేశంలో ప్రతి ప్రాంతంలోనూ ఉంది. అమ్మవారి చేతిలో చెరుకుగడో లేదా మరో రకమైన పంటరూపమో ఉంటుంది. ఇవే ప్రతీకలు ఇతర పురాతన మత విశ్వాసాలలో, ఆరాధనా ప్రక్రియలలో కూడా ఎలా ఉన్నాయో త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

ఇక్కడ ప్రధానంగా గమనించవలసింది ఏమిటంటే, ఈ ఆదిమ తాత్విక సూత్రంలోనూ, ప్రక్రియలోనూ కీలకభూమిక పురుషదేవుడిదీ, పురుషుడిదీ కాదు; స్త్రీ దేవతదీ, స్త్రీదీ!

ఆదిమకాలంలో స్త్రీ శాసించిన ఆ మతవిశ్వాసరంగం ఓ రహస్యప్రపంచం. ఆ రహస్యప్రపంచానికి స్త్రీ రారాణి. అది చీకటివెలుగులు, భయనిర్భయాలు, కష్టసుఖాలు, చావుపుట్టుకలు అన్నీ కలగలసిన ప్రపంచం. అక్కడి దేవతలోని ఒక అంశ ఉగ్రకాళిగా, మృత్యుదేవతగా, రక్తపిపాసిగా కనిపించి భయపెడుతుంది. అంతర్లీనంగా ఉండే ఆ దేవత మరో అంశ, ప్రసన్నత, సాత్వికత. అది బతుకునీ, సుఖాన్నీ, వెలుగునూ ఇచ్చి నిర్భయుణ్ణి చేస్తుంది. గుహలు, తోపులు,వనాలు ఈ రహస్యప్రపంచ స్థావరాలు. ఆదిమకాలంలో అవే దేవతాలయాలు.

మన పురాణ, ఇతిహాసాలలో ఈ గుహలు, తోపులు, వనాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. విశేషమేమిటంటే, వీటి ప్రస్తావన ఇతర పురాణ, ఇతిహాసకథల్లోనూ రావడం! స్త్రీ రహస్యప్రపంచంలోకి మగవాడు అన్నివేళల్లోనూ ప్రవేశించడానికి వీల్లేదు. ప్రవేశిస్తే శిక్ష తప్పదు. అది మరణశిక్ష కూడా కావచ్చు. ఇప్పటికిప్పుడు స్ఫురించే ఒక కథలో నారదుడు స్త్రీల రహస్యప్రదేశంలోకి అడుగుపెట్టి స్త్రీగా మారిపోతాడు. ఇంకో కథలో పార్వతి తన ఒంటి నలుగుపిండితో గణపతిని చేసి, అతన్ని కాపలా ఉంచి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు శివుడు ప్రవేశించబోతాడు. గణపతి అడ్డుపడతాడు. శివుడు అతని శిరసును ఛేదిస్తాడు. ఆ తర్వాత ఒక ఏనుగు తలను అతనికి తగిలిస్తాడు. ఇది కూడా స్త్రీ రహస్యప్రపంచాన్ని సంకేతిస్తూ ఉండచ్చు. దేవీభాగవతం వంటి అమ్మవారికి సంబంధించిన పురాణాలలో మరిన్ని ఉదాహరణలు లభించవచ్చు.

ఇందుకు సంబంధించిన కథలు మన దగ్గరే కాక, ఇతర ప్రాంతాలలోనూ ఉన్నాయి. ఉదాహరణకు ఒక గ్రీకు పురాణ కథ ఇలా ఉంటుంది: ఓ నడివేసవి రోజున అర్తెమిస్ అనే దేవత ఒక కీకారణ్యపు లోయలో వేటాడి అలసిపోతుంది. కన్యా కూపం(Maiden’s Well), లేదా కన్యా సరోవరంలో జలకాలాడుతూ ఉంటుంది. ఆమెలానే వేటకు వచ్చిన అక్తయాన్ అనే పురుషుడు తన వేటకుక్కల వెంట సరిగ్గా అదే ప్రదేశానికి వచ్చి ఆమెను చూస్తాడు. అతను తను చూసింది ఇంకొకరికి చెప్పకుండా నివారించడానికి అర్తెమిస్ అతన్ని ఒక లేడిగా మార్చివేస్తుంది. అతనితో ఉన్న వేటకుక్కలు లేడి రూపంలో ఉన్న అతని మీద పడి తినేస్తాయి.

జగదేకవీరుని కథలో దేవకన్యలు జలకాలాడుతుండగా చూసిన ప్రతాప్ శిలగా మారిపోతాడు!

ఇంకో గ్రీకు కథలో లూకిపస్ అనే యువకుడు డఫ్నే అనే యువతిని ప్రేమిస్తాడు. స్త్రీ వేషంలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె సన్నిహిత నేస్తాలలో ఒకడిగా అయిపోతాడు. మిగతా నేస్తాలతోపాటు ఆమె వెంట వేటకు వెడుతుంటాడు. ఒకరోజున యువతులందరూ దుస్తులువిప్పి లాడన్ అనే సరోవరంలో జలకాలాడాలనుకుంటారు. లూకిపస్ అందుకు నిరాకరిస్తాడు. దాంతో వాళ్ళకు అనుమానం వస్తుంది. బలవంతంగా అతని చేత దుస్తులు విప్పించి, పురుషుడన్న సంగతి తెలుసుకుంటారు. అప్పటికప్పుడు అతన్ని కత్తితో పొడిచి చంపేస్తారు.

మన దేశంలో స్త్రీ రహస్యప్రపంచపు ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. చాలా వ్యాసాల క్రితం ఒక వ్యాసంలో దీని గురించి రాశాను.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 -కల్లూరి భాస్కరం

 

తాడిగిరి పోతరాజు: అగ్నిసరస్సున వికసించిన వజ్రం

10922018_1044900048857391_1205721763_n

( తాడిగిరి పోతరాజు : 1937-2015 )

 తాడిగిరి పోతరాజు అనగానే వెంటనే ఆయన రాసిన ‘ఎర్రబుట్ట’ కథ గుర్తొస్తుంది. తెలుగు కథ నుదుట దిద్దిన ఎర్రబొట్టు ఎర్రబుట్ట. ఆ కథని ప్రచురించిన కారణంగా విజయకుమార్ , యం.వి. తిరుపతయ్యల సారథ్యంలో కరీంనగర్   సాహితీ మిత్రులు నిర్వహించిన ఉద్యమ మాసపత్రిక ‘విద్యుల్లత’ నిషేధానికి గురైంది. ఆ తర్వాత 1971 లో ‘మెజార్టీ ప్రజలకి మనదేశంలో జరుగుతున్న అన్యాయాలతో , సాహిత్యరంగంలో , రాజీలేని పోరాటం సాగించటం , నిజాయితీని నిర్మాణ మార్గంలో మళ్ళించడం’ లక్ష్యంగా యేర్పడ్డ న్యూవేవ్ సంస్థ ప్రచురించిన ‘హోరు’ సంకలనం ద్వారా ‘ఎర్రబుట్ట’ పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని డొల్లతనాన్ని యెలక్షన్ల సాక్షిగా యెండగట్టిన ఆ కథ అప్పట్లో గొప్ప సంచలనం. నిషేధించడానికి పాలకులకి కావాల్సిన వనరులన్నీదిట్టంగా దట్టించిన కథ అది. దేశంలో జరిగే యెలక్షన్లకి ‘పిచ్చగుంట్ల’ విశేషణం తగిలించి , అవి వొట్టి బోగస్ అనీ ప్రతి మూడు సంవత్సరాలకు వచ్చే జాతర్ల లాంటివనీ – జాతర్లకు మేకలు , గొర్రె పోతులు బలయితే యెలక్షన్ల జాతర్లకి మనుషుల పుర్రెలు యెగిరి పోతుంటాయనీ అపహసించిన పోలీస్ కానిస్టేబుల్ సత్తెయ్య చెప్పిన కథ అది. ఆ తర్వాత చానాళ్ళకి నిద్ర లేచిన పతంజలి ‘ఖాకీ వనం’కీ , స్పార్టకస్ ‘ఖాకీ బతుకులు’ కీ నిప్పు అందించాడు. నిప్పు రవ్వగా వున్నప్పుడే నిషేధించాలని గద్దెలెక్కిన ప్రభువుల ఆరాటం. అది ఉక్రోషంగానో భయంగానో మారి ఎమర్జెన్సీ నాటికి రచయితని నిర్బంధించే వరకు వెళ్ళింది. విప్లవోద్యమలో ఎన్నికల బహిష్కరణ పిలుపుకి సైద్ధాంతికంగా వత్తాసు పల్కిన ఆ కథ ఇప్పటికీ బూటకపు ప్రజాస్వామ్యం అరికాళ్ళ కింద మంటలు పెట్టేదిగానే కనిపిస్తుంది.

‘రచయితలారా మీరెటువైపు?’ అన్న విశాఖ విద్యార్థుల ప్రశ్న సున్నిత మనస్కులైన కవుల్నీ రచయితల్నీ బుద్ధిజీవుల్నీ కుదురుగా కూర్చోనివ్వలేదు. అది కేవలం శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భం మాత్రమే కాదు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం క్రూరమైన అణచివేతకి గురైన సందర్భం. పసి పిల్లల్ని కూడా వదలకుండా కాల్చి చంపి ప్రజా ఉద్యమాన్ని నెత్తుటి మడుగుల్లో ముంచిన సందర్భం. ప్రజల పక్షంలో అక్షరాన్ని సాయుధం చేసిన పాణిగ్రాహి శ్రీకాకుళ పోరాట వారసత్వం ఉత్తర తెలంగాణాకి వ్యాపించడానికి రాజకీయంగా రంగం సిద్ధమైన కాలం. ఉద్దానం మహాదేవపూర్ లో రెక్కలు విప్పుకొంటున్న రోజులు. శ్రీకాకుళం ‘కాక’ శ్రీశ్రీ , కొకు , రావిశాస్త్రి , కారా లాంటి ఆ ప్రాంతపు రచయితల్తో పాటు కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ తాలూకాలో మారుమూలన ‘కోతులనడుమ’ ( వల్లభాపూర్ శివారు గ్రామం) లాంటి పల్లెటూరి వ్యవసాయ కుటుంబం ( తల్లి సారమ్మ – తండ్రి రాయపరాజు) నుంచి వచ్చిన పోతరాజు ని సైతం తాకింది. 1970 నుంచీ విరసంతో కలసి నడుస్తూ – పీడితుల విషాదాశ్రువుల్ని కాదు ; విలాపాగ్నుల్ని అక్షరీకరించాలని అతను నిశ్చయించుకొన్నాడు.

‘1969 తరువాత దేశంలోని రాజకీయ సంక్షోభాల కారణంగా నాలో మానసికమైన మార్పు వచ్చింది. కన్నీటి సాహిత్యం చదువుతూ , కన్నీటి సాహిత్యం సృష్టిస్తూ అన్ని వర్గాల ప్రజలను కదిలించలేమని అభిప్రాయపడ్డాను. కన్నీటికి కారకులైన దోపిడదారులను శిక్షించాలని , ఈ దోపిడీ వ్యవస్థను సమూలంగా మార్చివెయ్యాలన్న సంకల్పంతో కరీంనగర్ జిల్లాలోని ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నాను. తత్ఫలితంగా ఉద్యోగరీత్యా ఎన్నో ఇబ్బందులుపడ్డాను.’( పాతికేళ్ళ క్రితం – 1981 నవంబర్ స్వాతి సచిత్ర మాసపత్రిక కథల పోటీ లో ‘ఆరోహక గీతం’ కథకి బహుమతి వచ్చినప్పుడు చెప్పిన మాటలు).

ఎర్రబుట్ట రాయడానికి పది పన్నెండేళ్లకి ముందునుంచే ఆయన రాసిన కథలు ( తొలి కథ ‘గృహోన్ముఖుడు’ కథ 1958లో భారతి లో వచ్చింది) యెన్నోప్రసిద్ధికెక్కాయి. గాజుకిటికీ (1963) , ‘చివరి అంచున’ (1964) కథలు ఆంధ్ర ప్రభ కథలపోటీల్లో అవార్డులు పొందాయి. ‘మట్టి బొమ్మలు’ నవల ఆంధ్ర పత్రిక ఉగాది సంచిక (1966) పురస్కారాన్ని గెలుచుకొంది( సరిగ్గా కారా యజ్ఞం కథ రాసింది యీ రోజుల్లోనే ). ఎర్రబుట్ట కారణంగా విద్యుల్లత మీద విధించిన నిషేధమే ఆన్నిటికన్నా ‘నాకు పెద్ద అవార్డ’ని ఆయన పేర్కొన్నాడు. నిషేధ – నిర్బంధాలని అవార్డు రివార్డులుగా భావించిన నిబద్ధరచయిత తాడిగిరి పోతరాజు.

అందువల్ల తాడిగిరి రచనాప్రస్థానాన్ని ఎర్రబుట్ట కి ముందు ఎర్రబుట్ట కి తర్వాతగా విడదీసి చూడాలి. తాడిగిరి రచనా ప్రస్థానాన్నే కాదు; మొత్తం తెలంగాణా కథనే ‘ఎర్రబుట్ట కి ముందు ఎర్రబుట్ట కి తర్వాత’ అని అంచనా వేయాల్సి వుంటుంది. కవిత్వంలో ఝంఝా – మార్చ్- తిరగబడు ల్లాగా తెలుగు కథకి అందునా తెలంగాణా కథకి ఎర్రబుట్ట కూడా ఒక మైలురాయి. ఆ తర్వాతే కరీంనగర్ ఉద్యమ సాహితి నుంచి ‘బద్ లా’ కథా సంకలనం (1973) వెలువడింది. అందులోని ‘బ్లాక్ అండ్ వైట్’ కథ ఎర్రబుట్టకి కొనసాగింపులా కనపడుతుంది. ‘బద్ లా’ కోసం అల్లం రాజయ్య రాసిన ‘ఎదురు తిరిగితే…’ ఎమర్జెన్సీ తర్వాత సృజనలో అచ్చయింది. ఉత్తర తెలంగాణా రైతాంగ పోరాటాన్నీ , చరిత్రనీ , చైతన్యాన్నీ సాహిత్యంలోకి సాధికారంగా తీసుకొచ్చిన రాజయ్య లాంటి వాళ్ళు రాసిన కథలకి స్ఫూర్తి ఎర్రబుట్ట ద్వారానే లభించింది. ‘బద్ లా’ కథా సంకలనంలోని రచయితలంతా – ఒక్క పోతరాజు తప్ప – కొత్తవాళ్ళే.

పోతరాజు లాగానే ఎమర్జెన్సీ ‘చీకటి రోజుల్లో’ జైలుకెళ్ళిన  యం.వి. తిరుపతయ్య రాసిన ‘న్యాయం’ కథ కూడా ఈ సంకలనంలోనే వుండడం యాదృచ్ఛికమేమీ కాదు. ఎన్నో కలలతో ఈ నేల ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు ఆశగా దృష్టి సారించింది అనడానికీ , ఆ కలల్ని రాజ్యం పాశవికంగా చిదిమివేయడానికి పూనుకొంది అనడానికీ వుదాహరణ మాత్రమే. ఆ తర్వాత రాజయ్య , సాహూ , రఘోత్తం , రాములు , పి చంద్ … వీళ్ళంతా విప్లవోద్యమ సాహిత్యంలో పోతరాజుకి కొనసాగింపే. సాహిత్య రచనని సామాజిక బాధ్యతగానే కాదు విప్లవాచరణలో భాగంగానూ స్వీకరించిన పోతరాజుకి సాహూ (శనిగరం వెంకటేశ్వర్లు / వెంకన్న) అన్నివిధాలా శిష్యుడే. ముందస్తు జాగ్రత్తల ( పి డి ఆక్ట్ కింద ) కోసమో – భవిష్యత్తుల భద్రత కోసమో (ఎమర్జెన్సీలో) ఇద్దరూ అరెస్టయి జైలుని తరగతి గదిగా మార్చుకొన్నారు.

రెండు రెళ్ళు నాలుగంటే జైళ్ళు నోరు తెరిచిన రోజులవి. దేశమే జైలయిన ఆ కాలంలో ప్రగతి శీలమైన ఆలోచనలుండటమే నేరం. అధ్యాపకులూ న్యాయవాదులూ డాక్టర్లూ పౌరహక్కుల గురించి మాట్లాడే బుద్ధి జీవులూ కవులూ రచయితలూ కార్మికులూ విద్యార్థులూ … ప్రజాస్వామ్య హక్కుల గురించి ప్రశ్నించిన ప్రతి వొక్కర్నీ రాజ్యం శత్రువుగానే పరిగణించింది. తల మీద ఎర్రబుట్ట పెట్టుకొన్న పోలిస్ కానిస్టేబుల్ పాత్రముఖత: తీవ్రవాదులుగా పరిగణించే పీడితుల భాషని పలికించిన పోతరాజు పొలిటికల్ డెటిన్యూ కావడంలో వింతేమీ లేదు. జైలు జీవితం పోతరాజుని రచయితగా మరింత నిబద్ధుడయ్యేలా చేసింది. ఆయన ఎంతగానో అభిమానించే శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే ‘అగ్ని సరస్సున వికసించిన వజ్రమ’య్యాడతను.

వరంగల్ సెంట్రల్ జైల్లో గడిపిన స్వీయ అనుభవాలనూ , తోటి డెటిన్యూల ఖైదీల ఆవేదనలనూ, నిండా రెండు పదుల వయస్సులేని బిడ్డలు జైలు పాలైనప్పుడు వారిని చూడటానికి వచ్చే తల్లుల తండ్రుల మనోవ్యధనూ , భర్తలతో మిలాఖత్ కోసం నెలల తరబడి ఎదురుచూసే భార్యల దైన్యాన్నీ , డబ్బుతో పెరోల్ కొనుక్కొనే బూర్జువా రాజకీయ ఖైదీల డ్రామాలనూ, క్షమాభిక్ష అడిగితే కేసు మాఫీ చేస్తామన్నా తిరస్కరించిన యువకుల ధీరోదాత్తతనూ (ఆరోహక గీతం లో విద్యార్థి ఖైదీ అంభయ్య పాత్ర – సాహూనే కావొచ్చు) , మార్సిస్ట్ లెనినిస్టు రాజకీయ భావజాలాన్ని విశ్వసించిన వాళ్ళని జైలునుంచి మాయం చేసి అడవుల్లో ఎన్ కౌంటర్ పేర్న చంపేసే పోలీసు దురాగతాలనూ వొక రచయితగా , పౌర హక్కుల కార్యకర్తగా తర్వాతి కాలంలో ( 1980ల్లో) పోతరాజు కథలుగా మలిచారు. వట్టికోట ఆళ్వారు స్వామి ‘జైలు లోపల’ కథల్లా కాల్పనికతకి చోటులేకుండా యథార్థ జీవిత గాథల్లాంటి వాటిని ‘కెటిల్(ఎమర్జెన్సీ కథలు)’ పేరుతో హుజూరాబాద్ జనసాహితి సంపుటిగా వేసినప్పుడు (2009) సాహూకి అంకితం యివ్వడం గమనిస్తే విప్లవసాహిత్యోద్యమంతో పోతరాజుకి ఆజీవితం వున్న అనుబంధం , ఉద్యమ సహచరుడై తనతో నడిచిన విద్యార్థికి నివాళి ఘటించడంలో ఆయన వుదాత్త వ్యక్తిత్వం వ్యక్తమయ్యాయి. పాలకుల ఫాసిస్టు స్వభావాన్నీ , రాజ్య హింస వికృత రూపాన్నీ యెంతో బలంగా చెప్పిన యీ కథలు పోతరాజు ప్రాపంచిక దృక్పథాన్ని వెల్లడిస్తాయి.

విద్యార్థి దశలో శ్రీ శ్రీ మహాప్రస్థానం గీతాల స్ఫూర్తితో మార్క్సిజం చదవకుండానే మార్క్సిస్టునయ్యానని చెప్పుకొనే తాడిగిరి పోతరాజు తాను నమ్మిన రాజకీయ భావజాలాన్నే జీవితాంతం విశ్వసించి ఆచరించారు. నాజర్ బుర్రకథలూ , సుంకర ‘మాభూమి’ , వల్లం సాంస్కృతిక ప్రదర్శనలూ విని చూసి తాను కూడా రంగస్థల నటుడు కావాలని ఆశించారు. నటుడికి కావాల్సిన అన్ని హంగులూ ఆయనకున్నాయి. చెయ్యెత్తు మనిషి. స్ఫురద్రూపం. దృఢకాయం. ఉరుము లాంటి కంఠస్వరం. ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు డిక్షన్ , తెలుగులో అనర్గళంగా వుపన్యసించగల వాగ్ధోరణి ( మధ్యలో శ్రీశ్రీ కవితా పంక్తుల్ని వుటంకిస్తూ) యివన్నీ ఆయన్ని మంచి నటుణ్ణి చేసేవి. ఏ కారణంగానో నటుడు కాలేక రచనా రంగానికి పరిమితమై పోయారు.

అయితే నాటక శైలి ఆయన కథలకి అదనపు మెరుగులు తెచ్చింది. దారికి అడ్డొచ్చిన వాణ్ని ఎవర్నయినా ‘నగ్జలైటని కాల్చి పారేస్తే మాత్రం మనని అడిగేవాడెవడు’ అని బహిరంగంగా ప్రకటించే ‘బ్లాక్ అండ్ వైట్’ కథలో పోలీస్ హెడ్ నరసింహం సుదీర్ఘ సంభాషణలు రావిశాస్త్రి తర్వాతి కాలంలో అనితర సాధ్యం అనిపించేలా సృష్టించిన గవర్రాజెడ్డు( రత్తాలూ-రాంబాబు) , సూర్రావెడ్డు (మూడుకథల బంగారం) లకి సైతం పాఠం చెప్పే స్థాయిలో వుంటాయి. పోలీసు రాజ్యం లోతు పాతుల్ని , ధాష్టీకాన్నీ దగ్గరగా చూసి స్వయంగా చవి చూసిన యిద్దరు రచయితల మధ్య యీ పోలికలు సహజమే. 2008లో రాచకొండ రచనా పురస్కారం తీసుకొంటూ రావిశాస్త్రి రచనా శైలి పట్ల తన అభిమానాన్ని పోతరాజు చాలా స్పష్టంగానే పేర్కొన్నారు.

1963లో వొక లంపెన్ పాత్ర సుదీర్ఘ స్వగతంగా గుంటూరుజిల్లా మాండలికంలో రాసిన ‘గాజు కిటికీ’ పోతరాజు రచనా శిల్పానికి నిలువెత్తు నిదర్శనం. మాగోఖలే తర్వాత గుంటూరు భాషని కథల్లో యింత అద్భుతంగా పట్టుకొన్నది పోతరాజేనేమో. ఆ భాషా సౌందర్యానికి ముచ్చటపడే పాపినేని శివశంకర్ తమజిల్లా రచయితగా ఆయన్ని own చేసుకొన్నాడు (దక్షిణ తీరాంధ్ర కథ – నిశాంత , పే.105). ఎర్రబుట్ట రాసేదాకా ఆయన్ని ‘గాజుకిటికీ పోతరాజ’ని పిల్చేవారంటే ఆ కథ వస్తు శిల్పాలు యెలాంటివో అర్థమౌతుంది.

నిజానికి తెలంగాణలో ‘కోతుల నడుమ’ లాంటి కుగ్రామం తన సొంతూరు అని చెప్పుకొన్నప్పటికీ పోతరాజు జీవితం కోస్తా ప్రాంతంతో యేదో వొక మేరకి ముడివడి వుంది ( బాల్యం తణుకు లో గడిచిందనీ , గుంటూరులో చదువులు నడిచాయనీ ఆయనే యెక్కడో పేర్కొన్నట్టు గుర్తు). అందుకే కథల్లో అవసరానుగుణంగా పాత్రోచితమైన కోస్తా భాషని గొప్ప మెలకువతో వుపయోగించడం చూస్తాం.

పోతరాజు కథల్లో యెత్తుగడలూ ముగింపులూ ఆయన ప్రత్యేకతకి కొండగుర్తులు. చాలా కథలు యెత్తుగడ వాక్యంతోనే ముగుస్తాయి. కథల్లో యిటువంటి ముగింపుల్ని తాడిగిరి మార్కు ముగింపులని పేర్కోవడం కూడా వుంది. మంచి కథల్లో రచయిత దృక్పథం ముగింపుల్లో స్పష్టమోతుంది. అయితే దృక్పథాన్ని ఆవిష్కరించే పనిలో ఆయన కళాత్మక విలువలతో యెక్కడా రాజీ పడలేదు. ఏ ముగింపూ స్లోగన్ లానో అవాస్తవికంగానో వుండడమో చూడం.

నికార్సైన రాజకీయ దృక్పథంతో ప్రజాస్వామ్య హక్కులకోసం పిడికిలి బిగించే గొంతులు బలపడాల్సిన యివాల్టి సందర్భంలో మత ఫాసిస్టు శక్తులు సామ్రాజ్య వాద గూండాలూ కొత్త పొత్తుల కోసం దారులు వేస్తున్న దశలో వొక పూనికతో పీడిత జన పక్షం వహించి నూతన మానవ ఆవిష్కరణ కోసం తన సాహిత్యాన్ని అంకితం చేసిన తాడిగిరి పోతరాజుని స్మరించుకోవడం అంటే ఆయన నమ్మిన రాజకీయ భావజాలానికి పునరంకితం కావడమే.

రెండు తరాల విప్లవ రచయితకి ఎర్రెర్రని పూల నివాళి.

  • -ఎ.కె.ప్రభాకర్

 

 

ఒక చారిక

drushya drushyam-5

భుజానికి వేలాడే కన్నుతో రోడ్డుమీదో లేదా వీధిలోనో తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో చేయగలం.
ఒక సీతాకోక చిలుక మరణం కలచివేస్తుంది. ఒక దృశ్యాదృశ్యం.
ఒక కప్ప మట్టిలో అణిగిపోయి, విగతజీవి అయి, ఉట్టి దొప్ప కానవస్తూ ఉంటుంది. అదొక దృశ్యాదృశ్యం.
ఎలుకే కాదు, ఒక పిల్లి కూడా నల్లగా మరణిస్తుంది. అదీ దృశ్యాదృశ్యం.
బతికిన క్షణాలే కాదు, మరణించిన క్షణాలూ బతికిస్తూ ఉంటై, కాళ్లకు తగులుతూ ఉంటై.
నడుస్తూ ఉంటే నడకను మించిన చూపు లేదు.
నడువు, కనిపిస్తుంది జీవన రహదారి.

ఇదీ అదే.
ఒక నడక.

చారిక.

నేను నడుస్తూ ఆగిపోయాను.
అది నడుస్తూ ఉంది, నా వైపు.

గల్లీలో ఒక వైపు.
అది ఇటు…నేను అటు.
అప్పటికే అది దెబ్బ తిని ఉన్నట్టుంది.
రెండు అడుగులు వేసి మళ్లీ అగుతున్నట్టు అడుగు వేయక ఆగుతుంది.

మన దృష్టిలో అడుగు చిన్నదే. కానీ దాన్ని అడిగితే తెలుస్తుందేమో!
అడుగుదామనే ఆగాను.
ఆగిందీ. తీస్తే ఇది.
దృశ్యాదృశ్యం.

+++

అడుగడుగునా దాని కదలిక వేరు.
నిశ్శబ్దంగా ఒక చిన్నప్రాణినే చూస్తూ ఉంటే, దాని ఆయసాన్నే గమనిస్తూ ఉంటే….కెమెరా వ్యూ ఫైండర్ లో అది నాకు ఏనుగే అయింది. దాని మహా విగ్రహాన్ని అర్థం చేసుకుని దాని మహాభినిష్క్రమణం ఎప్పుడో తెలియక, బతుకు జీవుడా అన్నట్టు అది కదులుతూ ఉంటే దాన్ని కనులతో పరికిస్తూ ఆ చారలో గుండా దాన్నికెమెరాతో వెంబడించడానికి నాకు పట్టింది ఒక యుగం.

కదలదే!

ఈ మనిషి దానిపై వేసే వేటు చిత్రమే అని దానికి తెలియక ఆగిందనిపించి, వెనక్కి జరిగి, జ్యూమ్ లెన్స్ ఉందని తోచి వెనుకడుగు వేసి మళ్లీ చిత్రంలో అవసరమైనంత బొమ్మను పట్టడమూ ఒక గ్రఫి. ఫొటోగ్రఫి.

చిత్రమేమిటంటే అది ఆ పగిలిన వాకిలిలోని ఒక సన్నని చారను, ఆ ఛాయను ఆశ్రయించి కదులుతూ ఉండటం. ఆగి ఉండటం. నిలబడిందా కూచుందా చెప్పలేను. కానీ, అప్పుడు తీశానీ చిత్రాన్ని.

ఆ తర్వాత కొన్ని అడుగులే వేసింది.
తర్వాత కుడివైపు తిరిగి ఒకరింట్లోకి వెళ్లింది.
ఆ తర్వాత అదృశ్యం. మిగిలిందే ఈ దృశ్యం.

+++

ఇక మనింట్లో వినిపించేవే. మామూలే.
ఎలుక కనబడుతోంది. బోను వెతకాలి.
ఎలుక వచ్చి పడింది. ర్యాట్ పాడ్ కొనాలి. దాని సంగతి చూడాలి.
ఎన్ని మాటలో. ఎంత చికాకో.
కానీ దానికి వినపడుతుందో లేదోగానీ, ఆ ఇంట్లో అది తప్పక కనిపిస్తుంది వాళ్లకు.
అంటూనే ఉంటారు, ఏవేవో!

కానీ చిత్రం.
ఈ చిత్రం వాళ్లింట్లో ఉండదుగానీ మీ ఇంట్లో ఉంటుంది.
మీరు వేరే తరీఖ చూస్తారు. అది నా అదృష్టం. దాని అదృష్టమూ.
అదే దృశ్యాదృశ్యం.

కానీ, చిత్రాతి చిత్రం పాత ఇళ్లు.
పాత వీధులు. పాత నగరాలు…అక్కడే ఇవి ఎక్కువ.
కానీ, కొత్తగా అవి ఎప్పటికప్పుడు తమ సర్వైవల్ గురించి ఆలోచిస్తాయి.
వాటికీ రంగు తెలుసు. వాసనా తెలుసు. ఎక్కడ నుంచి నడవాలి. ఎలా కదలాలి. ఎలా తప్పించుకోవాలీ…అన్నీ తెలుసు. అందుకే చార అనడం. చారలో ఎలుక నిలకడ అనడం.

అయినా గానీ, ఎంత కొత్త నగరమైనా ఎప్పటికైనా పాతబడేదే కదా!
మరి ఎలుక ఖాయం. ఎప్పటికైనా.

అందుకే అనడం, మనుషుల ప్రపంచంలో మనుషులే వద్దని ఈ చిత్రం.
చావుబతుకుల జీవితంలో బతుకూ ఒక చిత్రమే అని ఈ చిత్రం.
ఒక రహస్యం…వీధుల్లో నడిచేటప్పుడు ఎవరి దిష్టి లేకుండా దృష్టి లేకుండా తనను తాను కానరాకుండా చేసుకోవడం ఒక దృశ్యాదృశ్యం.

మన జీవావరణంలో తప్పించుకోలేని వర్ణం ఈ చార- చిత్రమనీ చెప్పడం.

అయితే ఒక మాట.
ఎలుక, సుందెలుక, పందికొక్కు…
ఏదైనా కానీ, కనిపించడం గురించి ఒక మాట.

మనం కాళ్లతో నడవడం, చక్రాలున్న మోపెడ్ పై వెళ్లడం, మూడు లేదా నాలుగు చక్రాల వాహనంపై పయణించడం -బాగానే ఉంది. కానీ, ఎలాగో ఒకలాగ కాదు, నడిచినప్పుడు కనిపించేవి వేరు. ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్లేప్పుడు వేరు. ఎవరైనా తోడు ఉన్నప్పుడు వేరు.  ఇక కార్లలో ప్రయాణించేటప్పుడు ఇంకా వేరు. దృశ్యాదృశ్యం వేరువేరని!

మనం ఉన్నస్థితి ఒక్కటే ప్రధానం కాదు.
మనం వాహికగా ఉండటంతోనే సరిపోదు.
నడవాలి. నడిచినప్పుడు కనిపించేవి వేరు.
నడక వేరుగా ఉంటుందనడానికీ ఈ చిత్రం ఒక ఉదాహరణ.

నా వరకు నేను మనుషులనే చిత్రిస్తానని అనుకోలేదు.
ఎలుకలని కూడా. పిల్లులని కూడా చిత్రిస్తూ ఉన్నాను..
నా నడక ఇది.

ఐతే,, నడక చిత్రం ఒక చెలగాటం.
అవును. ఒక్కోసారి పిల్లీ ఎలకా చెలగాటం.
చూశారా ఎప్పుడైనా.
అదొక సర్కస్.

పట్టుకుని వదిలి… మళ్లీ పట్టుకుని వదిలి…
పిల్లి ఎంత సాధిస్తుందో, ఎంత ఆనందిస్తుందో తెలుసా, ఎలుకని!
దానికి పిల్లలు పుట్టవచ్చుగాక. అది ఆహార సముపార్జనే కావచ్చు. కానీ ఎలుక ఒక ప్రాణి. దానికీ కథ ఉంది.
అది దాచుకుని దాచుకుని బతకడం…ఒక చీకటి చారను చూసుకుని దానిగుండా బిక్కు బిక్కుమంటూ వెళ్లడం ఒక ఛాయ. అందుకే మనిషికి చెప్పడం. నీలాగే దానికీ క్రీనీడల్లోంచి వెళ్లడం తెలుసని!.

ఇంకా చెబితే…
నడిచి చూడు. దానిలాగా అని!
ఆగిఆగి. మెలమెల్లగా కదిలి చూడు…బతుకుతావు పదికాలాలు.
ఇక ఇంట్లోకి వెళ్లు. అదే దృశ్యాదృశ్యం.

 

–  కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh

దేవుడే కీలుబొమ్మ?!

gopala

గోపాల…గోపాల ….. హిందీ సినిమా “ఓ మై గాడ్ “ కి రీమేక్ గా తెలుగు లో రూపొందిన చిత్రం, హిందీ సినిమాలో మామూలు సినిమా గా విడుదలై, అనూహ్య విజయాన్ని సాధించిన చిత్రం అయితే తెలుగు కు వచ్చే సరికి ఒక మల్టీ స్టారర్ చిత్రం గా మారింది . మల్టీ స్టారర్ అందులోనూ పవన్ కళ్యాణ్, అందులోనూ దేవుడు గా నటించటంతో  ఈ సినిమా ఓపెనింగ్స్ కి ప్రేక్షకులు బారులు తీరారు . దాదాపు సంవత్సర కాలంగా తెలుగు ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చిన ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ మాత్రం హడావుడి, ఉత్సాహం సహజం .

ఇక కథాంశం కి వస్తే , రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఒక వినూత్నమైన పాయింట్ ని బేస్ చేసుకున్న కథ. దేవుడు అస్తిత్వాన్ని ప్రశ్నించే కథ. సంస్కృతి , సాంప్రదాయాలు, భక్తి విపరీతంగా ఉన్న మన దేశంలో ఇలాంటి ఒక కథ ను సినిమాగా మలచాలి అనుకోవటం ఒక పెద్ద సాహసమే.  ఒక వైపు” పీకే” సినిమా పై వివాదం కొనసాగుతుండగా , ఇలాంటి సినిమా ఇక్కడ విడుదల కావటం ఒక విశేషం.  ఈ సినిమా మీద కూడా అప్పుడే వివాదాల నీడ పడింది . దేవుడున్నాడా ! లేదా !! అనే  వాదన తో ప్రారంభం అయి, దేవుడి అస్తిత్వం ద్వారా, అసలు దైవత్వం అంటే ఏంటో తెలియచేసే ప్రయత్నం ఈ సినిమా .

నిజానికి ఇప్పుడు భక్తి అనేది ఒక వ్యాపారం . ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే భక్తి అనేది భయం గా మారి, దెయ్యానికి దేవుడికి ఇద్దరికీ భయపడే పరిస్థితి. ఇద్దరికీ భయపడితే దెయ్యానికి, దేవుడికి తేడా ఏముంటుంది ??. దేవుడిని గౌరవించాలి, అతను చూపించిన  మార్గాన్ని అనుసరిస్తూ జీవనం సాగించాలి , కానీ మనం చేస్తున్నదేమిటి ?? దేవుడిని ఒక వ్యాపార వస్తువు చేసి, మన లోని బలహీనతలను, మన తప్పులను మన్నించమని , మనం చేసిన తప్పులకు బదులుగా దేవుడికి కానుకలు సమర్పిస్తూ , ఆ కానుకల వల్ల మన ఖాతాలో  పాపాలు తగ్గాయి, పుణ్యాలు పెరిగాయి , కాబట్టి మనం పుణ్యాత్ములం అనే ఒక భ్రమ లో బ్రతుకుతున్నాం.

అందుకే దేవాలయాలకు,చర్చిలకు, మసీదులకు  అంత గిరాకీ పెరిగింది,  వీధికొక్క దేవుడు పుట్టకొస్తున్నాడు, ఇంతకు ముందు పురాణాలలోనో, బైబిల్ లోనో, ఖురాన్ లో ఉదహరించిన  దేవుళ్లే కాకుండా , ఆ దేవుళ్ళకు రిప్రజంటేటివ్ గా బాబాలు, ముల్లాలు, ఫకీర్లు , బిషప్ లు …పేరు ఏదైతేనేం ఆ దేవుడి పేరు మీద వ్యాపారం చేసే వాళ్ళతో నిండిపోయింది, దేవుడుని గదిలో బందీని చేసి ఆ దేవుడిని ఒక బొమ్మను చేసి, ఆ బొమ్మ కి ఒక క్రేజ్ వచ్చేలా చేసి , ఆ బొమ్మను ఊరూరా తిప్పి ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకొనే వ్యాపారం, నిజంగా దేవుడున్నాడో లేదో తెలియదు కానీ, ఆ దేవుడి పేరు మీద వ్యాపారం మాత్రం నూటికి నూరు శాతం నిజం . ఇలాంటి వ్యాపారం మీద వ్యంగ్యాస్త్రం ఈ సినిమా . దేవుడు గుళ్ళో లేడు, చర్చిలోనో, మసీదులోనో లేడు , మనిషిలో ఉన్నాడు , మనిషి చేసే మంచిపనే దైవత్వం అని చెప్పే ప్రయత్నం ఈ సినిమా. కథాంశం పరంగా ఈ సినిమా ఒక మంచి సినిమా అనటంలో ఎలాంటి సందేహం లేదు .

దేవుడి బొమ్మలతో వ్యాపారం చేసే గోపాల రావు దుకాణం భూకంపం లో కూలిపోతుంది. దాని కోసం ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం ప్రయత్నం చేస్తాడు, కాకపోతే ఇది ‘యాక్ట్ ఆఫ్ గాడ్ ‘మామూలు భాషలో చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ క్లైమ్ ని తిరస్కరిస్తుంది . ఏమి చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో గోపాలరావు ఆ దేవుడి వల్ల దుకాణం కూలిపోయింది కాబట్టి దేవుడే నష్ట పరిహారం చెల్లించాలి అనే వాదనతో కోర్ట్ ని ఆశ్రయిస్తాడు . ఇక్కడే అసలు దేవుడు అంటే ఎవరు అనే ప్రశ్న ఎదురు అవుతుంది . ప్రత్యేకంగా దేవుడు అంటే ఎవరు అని చెప్పలేనప్పుడు దేవుడి ప్రతినిధులుగా చెప్పుకుంటూ ఆశ్రమాలు నిర్వహిస్తున్న, వాటికోసం దేవుడి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఆశ్రమ నిర్వాహకులు నష్ట పరిహారం చెల్లించాలి అని వాదిస్తాడు, ఇది దేవుడినే ప్రశ్నించటం అని ఆశ్రమ నిర్వాహకులు వాదిస్తారు, కొంతమంది గోపాల రావు పై భౌతిక దాడులకు కూడా ప్రయత్నిస్తారు.

సరిగ్గా అప్పుడే దేవుడే స్వయంగా గోపాలరావును రక్షిస్తాడు. తనని రక్షించింది దేవుడు అని తెలియని గోపాల్రావు అతడిని తనలాగే మామూలు మనిషి అనుకుంటాడు . అప్పటినుండి దేవుడు గోపాలరావుకు తోడుగా ఉంటూ తన అస్తిత్వాన్నే ప్రశ్నిస్తున్న గోపాలరావు ద్వారా తన అస్తిత్వాన్నే తానే స్వయంగా ప్రశ్నించుకోవటం విచిత్రం .  తన అస్తిత్వం ఎక్కడో లేదు . ప్రతి మనిషి లో ఉంది. ఎదుటి మనిషిలోని మానవత్వాన్ని గుర్తించటమే దైవత్వం అని మనకు తెలియ చెప్పటమే స్టూలంగా కథాంశం . కానీ ఆ తెలియచెప్పే పద్దతే ఒక మెసేజ్ లానో, ఉపదేశం లానో కాకుండా ఇప్పటి జనరేషన్ కు తగ్గట్లు ఎక్కడా డైరెక్ట్ గా చెప్పకుండా చెప్పటమే ఈ సినిమాలో ఆకట్టుకొనే అంశం . అసలు దేవుడు బొమ్మలు అమ్ముకొనే గోపాలరావుతో దేవుడినే బొమ్మను చేసి ఆడుకొనే వ్యవస్థను ప్రశ్నించటం అనే ఎత్తుగడలోనే కథకుడి గొప్పతనం కనిపిస్తుంది .

ఇలాంటి గొప్ప ఆలోచన చేసిన ఉమేష్ శుక్లా ,భావేష్ మండాలియా నిజంగా అభినందనీయులు . ఈ సినిమాలో మరో గొప్ప విషయం అసలు  దేవుడిని వ్యాపారం చేసే ఏ వ్యవస్థకు  వ్యతిరేకంగా, గోపాలరావు తన పోరాటం చేశాడో ఆ గోపాల రావునే ఆ వ్యవస్థ దేవుడిని చెయ్యటానికి ప్రయత్నించటం ( నిజానికి సహజంగా ఇదే జరుగుతుంది),  కాకపోతే ఇది సినిమా కాబట్టి ఒక సినిమాటిక్ ఎండ్ తో ఆ ప్రయత్నాన్ని హీరో వమ్ము చేస్తాడు. దైవత్వాన్ని కాక, దేవుడిని నమ్మే సమాజం మీద సంధించిన వ్యంగాస్త్రం ఈ సినిమా ,

ఇక సాంకేతికాంశాల  విషయానికి వస్తే  ఇది కథా బలమున్న సినిమా గా కన్నా, మల్టీ స్టారర్ సినిమాగానే ప్రాచుర్యం పొందింది, ప్రేక్షకులు కూడా దీన్ని అలాగే రిసీవ్ చేసుకున్నారు .  పవన్ కళ్యాణ్ తన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మేన్స్ తో దేవుడిగా ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు అనటం లో సందేహం లేదు  వెంకటేష్ తన పరిధి మేరకు బాగానే నటించాడు కానీ, పరేష్ రావల్ తో పోల్చి చూస్తే కొంచెం నిరాశ తప్పదు . పోల్చక పోతే ఏ బాధా లేదు . శ్రియ కు నటించటానికి పెద్ద ఆస్కారం లేదు. ఇక దర్శకత్వం విషయానికొస్తే హిందీ సినిమాని ఫ్రేమ్ టు ఫ్రేమ్ తెలుగులో సెట్ చేయటంలో సక్సెస్ సాధించాడు అనే చెప్పాలి . చివరకు ఉత్తరాది వారు వాడే డ్రస్సులే తెలుగులో కూడా వాడారు అంటే ఆ సినిమాని తెలుగులోకి అనువదించటానికి  ఎంత ప్రయత్నించారో  తెలుసుకోవచ్చు . అనూప్ రూబెన్స్ సంగీతం , జయన్ విన్సెంట్ ఫోటోగ్రపీ సినిమా స్థాయి కి తగ్గట్లే ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, వెంకటేష్ ఫ్యాన్స్ ని తృప్తి పరుస్తుంది అనటంలో సందేహం లేదు, రెగ్యులర్ కమర్షియల్ అంశాలు లేకపోవటంతో ఈ సినిమా మిగతా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచి చూడాలి.

-మోహన్ రావిపాటి

mohan 

జాయపసేనాని

OLYMPUS DIGITAL CAMERA

 

దృశ్యం  : 3

 

(క్రీ.శ. 1225 జాయప వయస్సు 36 సంవత్సరములు. గుర్రపు డెక్కల, సైన్యసందోహధ్వని..వేయిస్థంబాల దేవాలయంలోకి గణపతిదేవుడు, జాయపనేనాని, గుండనామాత్యులు, రాజనర్తకి మాళవికాదేవి..ప్రవేశం…గర్భగుడిలోని రుద్రేశ్వరాలయంలో శివస్తుతితో కూడిన  మంత్రోచ్ఛారణ…మంగళకర ధ్వని…)

వందిమాగధులు :    జయహో…విజయహో..రాజాధిరాజా…రాజమార్తాండ…సకల దేశ ప్రతిష్ఠాపనాచార్య…కాకతి రాజ్యభార దౌరేయ శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తి…జయహో…విజయహో…

ఆలయ ప్రధాన అర్చకులు : స్వాగతము… మహాచక్రవర్తులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులుం గారికి స్వాగతం..సుస్వాగతం.

గ.ప.దే : రుద్రాలయ ప్రధాన అర్చకులుగారికి అభివాదములు..ఖడ్గాన్ని ధరించిన హస్తంతోనే నాట్యాభినయం చేసి కత్తినీ, కలాన్నీ ఒకే చేత్తో సమర్థవంతంగా ప్రయోగించి ఖ్యాతివంతుడు కావడం మన సేనానీ, గజసైన్య సాహిణి, నాట్యకోవిదుడు, వీరాగ్రేసరుడు, అరివీర భయంకరుడైన జాయపసేనానికే సాధ్యమైనది. వారు గత నాల్గు వత్సరములుగా సృజించిన కావ్యశాస్త్రము…’గీత రత్నావళి’ మహాగ్రంథము ఈనాటికి సంపూర్ణమైనది. దీనిని శివసాన్నిధ్యంలో పరమేశ్వరునికి అంకితమొనర్చుటకై మా రాక..తగువిధముగా ఆ గ్రంథసమర్చనకు ఏర్పాటు చేయండి. జాయనా..పట్టు వస్త్రములో ఒదిగిన ఆ ‘గీత రత్నావళి’ గ్రంథమును దైవసన్నిధిలో సమర్పించి ప్రజాపరం చేయండి..

జాయన : ఆజ్ఞ మహాప్రభూ…గణపతి దేవులుంగారి శుభాశీస్సులతో రూపుదిద్దుకున్న ఈ ‘గీత రత్నావళి’ గ్రంథ సృజనకు కారకులు, పోషకులు, ప్రేరకులు అన్నియును మహాప్రభువులే. వారికి కృతజ్ఞతాభివందన చందనములు అర్పించుకుంటూ..,

ప్ర.అ.: (గ్రంథమును పట్టుబట్టతో సహా అందుకుంటూ…) మహాప్రసాదం…ఈ అక్షరామృత నిధిని శివ కృపార్థం సమర్పించే మహాభాగ్యం మాకు లభించడం మా సుకృతం..ఓం రుద్రాయ…(రుద్రస్తుతి ప్రారంభం..ఆలయం గంటలు…అభిషేకం..సంరంభం… శంఖధ్వని..)

గ.దే : జాయనా…మాపెద్ద తండ్రిగారైన రుద్రదేవుడు 1162 ప్రాంతంలో కాకతీయ స్వతంత్ర సామ్రాజ్యమును ప్రకటించిన సందర్భంలో కట్టించిన త్రికూటాలయమే ఈ సహస్ర స్తంభాలయం. ఇక్కడ రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యదేవుడు కొలువై ఉన్నారు. విష్ణు ఆలయమునకు అద్భుతంగా అదిగో అక్కడే ఉత్తరాభిముఖముగా ఆసీనుడై ఉన్న నంది ”విష్ణునంది”. సర్వాంగ స్వర్ణాభరణ శోభితమై బలిష్టుడైన బసవేశ్వరుడు పొంగివచ్చిన రక్తనాళాలతో సహా సజీవ మహాసౌందర్యంతో మనను ఎప్పడూ పిలుస్తూంటాడు. నంది వెనుక ఉన్నది రంగ మండపము. నందీశ్వరుని అవతారమైన వీరభద్రునికి ప్రతీకగా, రుద్రుడు మన ఇలవేల్పుగా సిద్ధపరుస్తూ ఈ సహస్ర స్తంభాలయములో చెక్కిన ప్రతి శిల్పం మన సమకాలికులైన చాళుక్యుల, హొయసళుల శిల్పరీతులకు భిన్నమై ఉత్తమోత్తమమై , ఉన్నత  ప్రమా ణములతో విరాజిల్లుతున్నది.

గుండనా : సృజనకారులెవరైనా ఎప్పుడూ తన కృతిచేత, విలక్షణ శైలిచేత ప్రత్యేకంగా పరిగణించబడాలి. కాకతీయుల శిల్పం, నృత్యం, గీతం, వాద్యం…అన్నీ విశిష్టమైనవే. కాకతీయ శిల్పంలోని ప్రధాన లక్షణం గతి శీలత. ఇందులోని ప్రతి మూర్తీ ప్రాణ లయతో ప్రకంపిస్తున్నట్టు గోచరిస్తుంది. (అప్పుడే..రుద్రాభిషేకంతో పాటు…ఉచ్చైస్వరంలో పంచమహావాద్యాలు హోరెత్తాయి). మన ప్రత్యేకత..పంచ మహాశబ్దాలు…అవి అనంత విజయం, పౌండ్రము, దేవ దత్తం, సుఘోష, మణి పుష్పకం…మరియు పంచమహావాద్యాలు అవి శృంగము, శంఖము, మృదంగము, భేరి మరియు ఘనము. ఇవిగాక నిస్సహణము, కాంస్య తాళములు, కాహళము, మహామద్దెల…యివన్నీ శబ్ద గంభీరతను తురీయ స్థాయికి చేర్చి రుద్ర  తాండవ రౌద్రతను హెచ్చింపచేస్తాయి. కాకతీయ జీవనం ప్రధానంగా వీర రసభరిత, శౌర్య సమ్మిళితం.

మాళవిక : కాకతీయ నృత్యము కూడా అత్యంతోత్తమమైనది. రంగ మంటప నాట్యస్థలిపై ప్రవేశించి..త్రిభంగిమలో నిల్చి, అంగ సంచలనం చేస్తూ భ్రూ లతలను నర్తింపచేస్తూ, శిరః కంపనము అంగుళీ స్ఫోటనము చేస్తూ వంజళము, ఢాళము, వళి, దిరువు, బాగు, వాహిణి, సాళి, బయగతి, సుగతి, బహుగతి అనే వివిధ గతులను, భంగిమలను అభినయించడం మన కాకతీయుల విలక్షణ దేశీ నృత్యరీతి. యిది సకల జనరంజకమైనది, పరవశ ప్రధానమైనది.

ప్రధాన అర్చకుడు : శివానుగ్రహమునకు ప్రాత్రమైన ఈ ‘గీతరత్నావళి’ గ్రంథం ఆచంద్రార్థం బుధజనరంజకంగా వర్థిల్లుగాక.. స్వీకరించండి.

(జాయన పట్టు దస్త్రమును స్వీకరించి గణపతిదేవుని చేతుల్లో ఉంచి ముందు తలవంచాడు)

గ.దే : మహేశ్వరాశీర్వాద ప్రాప్తిరస్తు..ఈరోజు ఎంతో సుదినము. తెలుగుజాతికి ‘గీతరత్నావళి’ అనే సంగీత, సాహిత్య సమ్మేళనాల ఆత్మరహస్యాలను విప్పిచెప్పగల ఒక ప్రామాణిక గ్రంథము లభించినది. ఈ ఘట్టము చరిత్రలో శాశ్వతమై నిలిచిపోతుంది.

మాళవిక : మహాప్రభువులకొక విన్నపము.

గ.దే.: తెలియజేయుము మాళవికా…మా రాజనర్తికి ఊరికే కల్పించుకోదు

మాళవిక : సూర్యుడొక్కడే ఐనా చీకట్లను చీల్చగల వెలుగులనూ, ప్రాణకోటిని మేల్కొలిపి సృష్టిని జీవన్వంతం చేయగల ఉష్ణకిరణ సందోహాలనూ, ప్రచలిత మార్మిక జీవశక్తినీ ప్రదానం చేసినట్టు.. యిన్నాళ్ళూ నృత్యశాస్త్ర అధ్యయనంలో జాయపసేనానితో సహకరిస్తూ సంగతిస్తున్న నేను అతని యందు నిబిడీకృతమై ఉన్న యితర సృజన రంగాల కళా విశారదకతనూ గమనిస్తున్నాను. ఆయన నృత్య, వాయిద్య రంగాలతోనే కాకుండా కరి గణాధ్యక్షుడుగా ఉంటూనే యుద్ధ తంత్రజ్ఞతతో అనేక విజయాలనుకూడా కాకతీయ సామ్రాట్టులకు సంపాదించినారు కదా…అందుకని..

గ.దే : భళా..మాకర్థమైనది…సరిగ్గా మా మనసులో ఎప్పటినుండో నిప్పుకణికవలె మెరుస్తున్న మహదాలోచననే మాళవిక గ్రహించి వ్యక్తీకరించినది..భళా…జాయనా..,

జాయన : మహాప్రభూ..

గ.దే : ఎప్పుడైనా ప్రతిభాశీలి యొక్క  ప్రజ్ఞ స్వయంగా అతనికి పూర్తిగా తెలియదు. నీలోని బహుముఖ సమర్థత నీకంటే మాకే ఎక్కువ తెలియును. గత పదేళ్లుగా నాట్యాచార్య గుండనామాత్యుల వద్ద నీవు పొందుతున్న నృత్య శిక్షణ, మేము అప్పగించిన అనేక దండయాత్రల బాధ్యులను అద్భుతముగా నిర్వర్తించి మాకు సంప్రాప్తింపచేసిన విజయపరంపర..నీ వాద్య నిర్వహణ పద్ధతి…వీటన్నింటినీ మేము ప్రత్యేకముగా, సునిశితముగా ఎప్పటినుండో పరిశీలిస్తూనే ఉన్నాము…యిప్పుడిక ఒక స్ఫుట నిర్ణయానికొచ్చి నిన్ను ఆదేశిస్తున్నాము. భవిష్యత్తులో నీవు నీ సకల సృజనాత్మకశక్తులన్నింటినీ ప్రోదిచేసుకుని సరస్వతీ కటాక్షముతో మూడు ప్రధాన గ్రంథములను సృజియించవలె. అవి…’నృత్య రత్నావళి’, ‘వాద్య రత్నావళి’ మరియు సకల యుద్దతంత్ర రహస్యాలను, వ్యూహాలనూ, సంపుటీకరించే ‘యుద్ధ రత్నావళి’…ఊఁ.. ఏమందువు జాయనా…

గుండ : యిది చక్రవర్తుల సముచితాదేశము…భళా.

మాళవిక : మహాచక్రవర్తుల ఈ ఆదేశముతో తెలుగునేల చతుర్వేదాల వంటి నాలుగు గ్రంథ రత్నాలతో కాంతివంతమై సంపన్నమవుతుంది మహాప్రభూ..

గ.ప : విన్నావు కదా జాయనా…బుధజన గుప్తాభిప్రాయము…మా అందరి ఆశీస్సులు నిరంతరం నీకుంటాయి. ఈ అపూర్వ గ్రంథాల రచనకు మా సంపూర్ణ సహకారం ఎల్లవేళలా నీకుంటుంది అంగీకరించి అడుగు ముందుకువేయి.

జాయన : మహాప్రసాదం మహాప్రభూ..నా జన్మ తరించినది. మీ అభిమానమునకు పాత్రుడనై, కాకతీయ సామ్రాజ్య బుధజన ఆశీస్సులను పొందగలిగి చరితార్థుడనైన నేను అవశ్యము మీ ఆదేశమును శిరసావహిస్తాను. నాకు కూడా ఈ విభిన్న రంగములందు సమగ్రాధ్యయనము నిర్వహించి నూతన ప్రమాణాల పరికల్పనలతో గ్రంథరచన చేయవలెననే ఉన్నది..తమరి ఆజ్ఞ.

గ.దే.: ప్రధాన అర్చకులుంగారూ.. ఏదీ.. ఆ రుద్రలింగంపై ఉన్న ఆ పూలమాలను మాకందించండి. (ప్ర.అ. లావుపాటి పూమాలను గ.దే. న కందిస్తాడు. గ.ప దేవుడు తన వేలికున్న వజ్రపుటుంగరాన్ని తీసి.)

గ.దే.: జాయనా… యిటురా.. (అని.. దగ్గరకువచ్చిన తర్వాత)..యిదిగో ఈ మా ఆదేశపాలన శుభసందర్భాన్ని పురస్కరించుకుని మా ‘వజ్రపు అంగుళీయ ప్రదానం’.. శివాశీస్సులకు చిహ్నంగా ఈ గులాబీపూమాల. విజయోస్తు.. శీఘ్రమే కలాన్ని కత్తివలె ఝళిపించి  అక్షరాలను కురిపించు.

(చుట్టూ  చప్పట్లు.. శంఖ ధ్వని.. మంగళారావములు.. ఎట్సెట్రా)

జాయన : ధన్యోస్మి ప్రభూ.. ధన్మోస్మి…

దృశ్యం : 4

 

(1240 సం||. జాయప వయస్సు 50 సం.. తామ్రపురి ఆస్థానం (యిప్పటి చేబ్రోలు).గణపతిదేవుడు తన యిద్దరు సతులతో సందర్శన..జాయపసేనాని రాజ్యము..)

వందిమాగధులు : మహారాజాధిరాజ.. మహామండలేశ్వర..పరమమహేశ్వర.. శ్రీ స్వయంభూనాథదేవ దివ్యపాద పద్మారాధక.. ప్రత్యక్ష ప్రమథగణావతార.. లాడచోటకటక చూరకార.. శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తి.. జయహో..విజయహో…

(గణపతి దేవుడు పేరాంబ, నారాంబలతో సహా అంతఃపుర ప్రవేశం.. జాయపసేనాని సకుటుంబంగా.. ఎదురొచ్చి బావగారిని ఆలింగనము చేసుకుని.. ప్రసన్న వదనంతో..)

జాయన : మహాచక్రవర్తలకు మా హృదయపూర్వక స్వాగతము.. బావగారూ, కాకతీయ మహాసామ్రాజ్యంలో ఎల్లరూ సుఖులే కదా.. రాజపరివార, మహామంత్రిగణ, సకలసైన్య వీరసమూహాలూ, ప్రజాశ్రేణులన్నీ సౌఖ్యంగా వర్థిల్లుతున్నాయిగదా..,

గ.దే.: ఎల్లరూ సుఖులే జాయపసేనానీ.. వైరి గోధూమ ఘరట్టా.. మా మహామాత్యులూ, దండనాధులూ, సకలసేనాధిపతిలూ, శ్రీమన్మహాసామంత నామిరెడ్డీ.. నీ స్థానంలో నియమితులైన గజసాహిణి బొల్లమరాజూ..మీదుమిక్కిలి మా సువిశాల కాకతీ సామ్రాజ్యవాసులైన లక్షలమంది ప్రజాశ్రేణులన్నీ సౌభాగ్యముతో అలరారుతున్నాయి.

జాయన : ఈ రత్నఖచిత ఆసనాన్నధిష్టించండి మహాప్రభూ. సోదరీ పేరాంబా, నారాంబా.. అంతా క్షేమమేకదా.., సుఖాసీనులుకండి.

గ.దే.: దాదాపు ఇరవది ఐదు సంవత్సరముల క్రితం రాజ్యవిస్తరణలో భాగంగా అనేక యుద్ధములను గెలుచు బాధ్యతను మీకప్పగించగా.. జాయపసేనానీ, యుద్ధతంత్ర విశారదుడవూ, సకలకళాప్రవీణుడవూ, తంత్ర విద్యా నిపుణుడవూ.. ప్రత్యేకించి గజసైన్య నిర్వహణా ధురీణుడవూ ఐన నీవు సాధించిన విజయముల పరంపర తర్వాత మేము నిన్ను ఈ తామ్రపురికి సామంతులను చేసి పట్టముగట్టితిమి. మీరుకూడా ప్రజా సుభిక్షముగా పరిపాలను నొనరిస్తూ ఉత్తర రాజ్య నాయకుడగు ఇందులూరి సోమమంత్రినీ, రాచెర్ల రుద్రసేనాపతినీ తోడుగా చేసుకుని గజసైన్యమధికముగా గల కళింగ రాజులనోడించి కాకతీయ మహాసామ్రాజ్య పరిధిని అటు కళింగమునుండి యిటు నెల్లూరు వరకు విస్తరించి మాకు మహానందమును కల్గించితివి. ఈ మహాముదమును నీతో పంచుకొనుటకే యిప్పుడు నీవద్దకు మీ సోదరీమణులతో సహా మా రాక. కొద్దిరోజులు నీ అతిథిగా మేము విశ్రమించెదము.

జాయన : మహాభాగ్యము.. గణపతిదేవులకు ఆతిథ్యమొసగుటకంటే, మా  తోబుట్టువులైన పట్టపురాణుల సమక్షములో గడుపుటకంటే మాకు కృతార్థమేమున్నది.

గణ.దే.: జాయపా.. ఈ డెబ్బదిఏండ్ల సుదీర్ఘ జీవితకాలమంతయూ యుద్ధతంత్రములందూ, రాజ్యవిస్తరణయందూ, ప్రజాహితపాలనా ప్రణాళికా రచనయందూ, రక్షణ తంత్రములందూ అహర్నిశలూ శ్రమించి శ్రమించి అలిసితిమి. యిక మా మనము కించిత్తు విశ్రాంతిని కాంక్షిస్తున్నది.. వినోద, సంగీత, సాహిత్య, కళాత్మకరంగాలలో ఏదో చేయవలయునను కోరికా బలీయమౌతున్నది.

జాయప భార్య : అగ్రజులు.. గణపతిదేవులుంగారు మా వదినలను తోడ్కొని మా నేలను పావనం చేయడమే మా అదృష్టము.. రసహృదయులైన మీ బావమరిది జాయపసేనాని యిప్పటికే ఎంతో మగ్నతతో గ్రంథరచన చేస్తూనే ఉన్నారు. మీరు సాలోచనగా ఆ పుటలను అవలోకించవచ్చును.

 

గ.దే : అహాఁ.. ఎంత సంతోషము.. సోదరీ.. ఏమేమి సృజన చేసియున్నాడు జాయన.. చూడు.. ఎంత నిశ్శబ్దముగా గోప్యము నటిస్తున్నాడో.

జాయన : ప్రభువుల వద్ద గోప్యమేమున్నది.. మీరు అప్పగించిన పనినే చేయుచు ప్రత్యేకముగా మీముందు విశేషముగా నుడువుటకేమున్నది..,

గ.దే : అత్యంత విశేషమైనది కానిది మా జాయన అక్షరసృజన చేయడుకదా. ఆ విషయం మాకు తెలుసు.. వివరాలు తెలియజేయుము జాయపా.,

జాయన : మీరు ఆదేశించిన విధముగానే భరతముని ‘నాట్యశాస్త్రము’ లోని సకలశాస్త్ర సమ్మతములైన ‘మార్గ’ నృత్య పద్ధతులను సమగ్రపర్చి నాలుగాధ్యాయములు ‘నృత్తరత్నావళి’ పేర రచించడము పూర్తయినది మహారాజా.. యిక మన..అంటే ప్రధానముగా కాకతీయ సామ్రాజ్య పర్యంత ప్రజాజీవనములో జీవభరితమై ఒప్పుతున్న జానపద, ఆదిమ, గిరిజన, సామాన్య పల్లెప్రజల దేశీ నాట్యరీతులను సంపూర్ణముగా అధ్యయనము చేసి మరో నాలుగు అధ్యాయముల సృజన కొనసాగుతున్నది.

గ.దే.: మాకు కూడా.. ప్రజారంజకమైన ప్రజానాట్యరీతులను ప్రామాణికపర్చవలెనను అభిలాషయున్నది ..కొనసాగింపుము.. ఐతే, మొత్తము ఎనిమిది ప్రకరణములతో ‘నృత్త రత్నావళి’ సంపూర్ణమగునా.?

జాయన : ఔను మహాప్రభూ.. ఇరువది మూడు దేశిస్థానములతో శివారాధకులైన మన ప్రాంత ప్రజల ఉద్దీప్తమూ, ఉత్తేజకరమూ, వీర రౌద్ర రస ప్రధానముగా ఐన ‘ప్రేరణి’ అనే ఒక అతినూతన నృత్త రీతినీ, శివతాండవ తురీయస్థితినీ చాటిచెప్పగల ‘శృంగ నర్తనము’ నొకదానిని సృష్టిస్తున్నాను.

గ.దే : (సంతోషముతో చప్పట్లు చరుచును..) భళా జాయనా భళా.. మేమీ సమాచారము విని కేవలం ఆనందించడమేకాక ముదముతో పొంగిపోవుచున్నాము. శివానుగ్రహ ప్రాప్తిరస్తు.. ఔనూ.. రేచర్ల రుద్రదేవుడు గత రెండు దశాబ్దాలుగా పాలంపేట అను ప్రాంతంలో మహోత్తమ స్థపతి, శిల్పాచార్యులు రామప్పతో ఒక రుద్రాలయమును నిర్మిస్తున్న విషయం తెలుసుకదా. మనమే దానికి సకల నిధులనూ, సదుపాయములనూ, పోషణనూ కల్పిస్తున్నాము.. ఒకసారి నీవు పాలంపేట సందర్శించి నృత్యశాస్త్రము కొరకు సంభావిస్తున్న దేశీ నృత్య భంగిమలను ఎందుకు దేవాలయాలంకారములుగా స్థాపించకూడదు. మన రాజనర్తకి మాళవికా, రేచర్లరుద్రుని స్థానిక నర్తకి కేశికీ నీకు సహకరిస్తారు కదా..

జాయన : మహాప్రసాదం.. తప్పనిసరిగా ఆ విధముగనే చేసెదను.. నేనూహించిన దేశీ నృత్య భంగిమలతో రూపుదిద్దుకునే శిలాకృతులు అవశ్యము ఆ రుద్రాలయశోభను యినుమడింపజేస్తాయి.

గ.దే.: శుభం.. తామ్రపురిని చేరు త్రోవలో ఓరుగల్లు నుండి.. తలగడదీవి, తామ్రపురి వరకు మీ తండ్రిగారి జ్ఞాపకార్థం నిర్మించిన ‘చోడేశ్వరాలయం’..దాని అనుబంధ తటాకము ‘చోడసముద్రము’.. అదేవిధముగా భీమేశ్వరాలయం, గణపేశ్వరాలయం.. ద్రాక్షారామాలయం…వాటి ప్రక్కనున్న చెరువులు.. ఆవిధముగా నూటా ఒక్కటి.. మీ నిర్మాణాలలో నివి చాలావరకు సందర్శించి సంతసించితిమి .. “ఆలయమూ, ప్రక్కనే ప్రజోపయోగకరమగు తటాకము” అన్న కాకతీయ సంస్కృతిని పాటిస్తున్నందుకు అభినందనలు జాయనా.. దేవుడు నిన్ను కరుణించుగాక..

జాయన : మా వేగులవారిద్వారా మీరు మాచే నిర్మితములైన ఆలయములనూ, సరస్సులనూ సందర్శించిన సమాచారము మాకున్నది. మీ ప్రశంసతో, అభినందనలతో నేను ఉత్తేజితుడనైనాను.. మహాచక్రవర్తీ.. మరి మనం..మధ్యాహ్న భోజన ఆరగింపునకు..,

గ.దే.: అవశ్యము.. అంతా ఆనందకరముగా నున్నది..

WEEK-5

 

దృశ్యం : 5

(1241 :పాలంపేట..రామప్ప దేవాలయ నిర్మాణథ.. ప్రాంగణం.. మహాశిల్పి రామప్ప, రేచర్ల రుద్రదేవుడు, జాయపసేనాని, రాజనర్తకి మాళవిక..రుద్రదేవుని ఆలయ నర్తకి కేశికి.. ఉన్నారు.. సందర్భం.. పీఠంవరకు.. అధిష్ఠానం.. చుట్టూ స్తంభాలు, అరుగులు.. వరకు నిర్మాణమై.. అలంకరణ, పై కప్పు విశేషాలపై చర్చ.. ప్రతిపాదనలు..)

(అప్పుడే ఏనుగు అంబారితో కూడిన అలంకృతపీఠంపై నుండి దిగుతున్న జాయపసేనానిని ఉద్ధేశించి..)

రే.రు.: తామ్రపురి రాజులు..మహా గజసాహిణి, వైరి గోధూమ ఘరట్ట, శ్రీశ్రీశ్రీ జాయపసేనానికి రేచర్ల రుద్రమదేవుని ప్రణామములు.. స్వాగతం.. సుస్వాగతం.,

జా.సే.: (దిగి..రుద్రదేవుని స్నేహపూర్వకముగా కౌగలించుకుని..) విజయోస్తు రుద్రదేవా..మీ రాజ్యమును సందర్శించడముతో మా జన్మ పావనమైనది. గణపతిదేవుల ఆజ్ఞమేరకు.. మీరు ఒక జీవితకాల లక్ష్యంతో, శివాజ్ఞకు బద్ధులై నిర్వహిస్తున్న ఈ బృహత్‌ రుద్రేశ్వరాలయ నిర్మాణమునకు అదనపు సొబగులను అద్దడానికి, నాట్యశాస్త్ర సంబంధ వన్నెలు కూర్చడానికి మేమిక్కడికి..,

రే.రు.: మాకు సమాచారమున్నది సేనానీ.., రండి.. భావితరాలను మంత్రముగ్ధుల్ని చేయగల ఈ మహాశివాలయ నిర్మాణాన్ని మరింత జీవవంతం చేయడానికి విచ్చేసిన మీకు స్వాగతం.. యిదిగో వీరి పరిచము.. వీరు ఈ ఆలయ ప్రధానకర్త.. మహాశిల్పి రామప్ప.. అపరబ్రహ్మ.. రాతిని మైనపు ముద్దవలె రూపింపజేసి, శిల్పించగల ప్రజ్ఞాశీలి.. మీ రాకకు ముందే యిక్కడికి చేరుకున్న ఈమె కాకతీయ సామ్రాజ్య రాజనర్తకి మాళవికాదేవి.. మా సంస్థానికి చెందిన మా స్థానిక రాజనర్తకి కేశికి… వీరు ఆలయ అర్చకులు.. సోమశివాచార్యులు ..(చుట్టూ చూపిస్తూ..) వీళ్ళందరూ ముప్పదిరెండుమంది సుశిక్షితులైన యువ శిల్పులు.

జా.సే.: మాళవికాదేవి మాకు ఇదివరకే తెలిసిన అతిసన్నిహిత విదుషీమణి. అందరికీ ప్రణామములు.. మీవంటి మహానుభావుల కలయికతో నేను కృతార్థుడైనాను.. రుద్రదేవా.. ఈ ఆలయనిర్మాణ ప్రధానాంశములు వివరించండి.

రు.దే.: మీరు తొలుత ఈ శిలాసనముపై ఆసీనులుకండి.. కేశికీ, వివరాలు తెలియజేయి.

కేశికి : ఇది తూర్పుముఖ శివాలయం. నల్లరాతి కురివెంద కఠినశిలలతో నిర్మితమౌతున్న ఈ శివాలయమునకు దగ్గర్లోనే మూడు ప్రకృతి సిద్ధమైన కొండలను ఆలంబనగా చేసుకుని ఎనిమిది చదరపుమైళ్ళ విస్తీర్ణములో ఒక ప్రజోపయోగ జలవనరుగా తటాక నిర్మాణం జరుగుతున్నది. ఇసుక ఆధారపీఠంగాగల ఎనిమిది అడుగుల పునాదిపై ఆరు అడుగుల ఎత్తున గర్భగుడిలో శిలాపీఠం ఏర్పాటు చేయబడి లోపల అధిష్టానంపై రెండున్నర అడుగుల పొడవు, అంతే వెడల్పుగల రుద్రేశ్వర లింగం ప్రతిష్టితమౌతున్నది. గర్భగుడికి ఎదురుగా..పశ్చిమాన మహాశిల్పి ప్రత్యేకంగా రూపొందించిన ఈ శివనంది ప్రత్యేకతేమిటంటే.. ఒక్కటి, ఎవరు ఈ నందిని ఎటునుండి వీక్షించినా అది ఆ వీక్షకుణ్ణే చూస్తున్న అనుభూతిని కల్గించడం.. రెండు..ముఖంపై తేలిన రక్తనాళాలు, ఒంటిపై ఆభరణాలు వీక్షకున్ని స్పర్శించకుండా ఉండలేనివిధంగా ముగ్ధుణ్ణి చేయడం..గర్భగుడి ముఖద్వారంవద్ద..లతాలంకృత స్తంభం.. లోహధ్వనులతో సరిగమలను పలికించడం…

జాయన : మహాశిల్పి రామప్పా.. వింటూంటే మేము పులకించిపోతున్నాము.

రామప్ప : ధన్యుణ్ణి మహాసేనానీ.. మీ కూర్పుతో ఈ ఆలయం యింకా శోభిస్తుందని మా ఆకాంక్ష.

జాయన : అవశ్యం.., యింకా,

రామప్ప : ఈ ఆలయ శిల్పం ప్రధానంగా మూడు రకాల శిల్పరీతుల సంగమం.. హోయసళుల, చాళుక్య, చోళ శిల్పవిధానాలను అనుకరిస్తూనే స్థానిక దేశీ జీవనరీతులనూ, మన సంస్కృతినీ మేళవించి ఒక అద్వితీయ సృష్టిని కొనసాగిస్తున్నాము.

జాయన : బాగున్నది.. నేను ప్రధానంగా గజసైన్యాధ్యకక్షుణ్ణి.. అందువల్ల పలు గజవిన్యాసాలనూ, గజశ్రేణులనూ చిత్రించి తెచ్చినాను.. అదీకాక నేను ప్రామాణికంగా రచిస్తున్న ‘నృత్త రత్నావళి’ గ్రంథంలో దేశీ నృత్యరీతులననుసరించి తయారుచేసిన దాదాపు ఇరవై చిత్తరువులను, చిత్రాలను నా పరివారంతో తెప్పించిన పేటికలలో కూర్చి తెచ్చినాను.. వీటిని శిల్పాలుగా చెక్కి ఈ ఆలయ గోపుర పరివేష్ఠితములుగా అమర్చినచో మహాలంకారముగా భాసించునని మా ఊహ..ప్రతీహారీ.. ఆ పేటికలను తెరవండి.,

 

(ఒక సైనికుడు.. ఒక పెద్ద పేటికను తెరుస్తాడు.)

రే.రు.: సైనికా.. యిటివ్వు.. తొందరగా చూడవలెననే ఉత్కంఠ..రామప్పా.. రండి..చూడండి .. ఈ చిత్రాలు.ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాయో. ఒక్కో చిత్రం ..కళ్ళముందు..ఆయా సుందరాంగనలు నిలబడ్డట్టుగానే తోచుచున్నది)

(రే-రుద్రుడు, రామప్ప, కేశికి..అలంకృతమై ఉన్న మాళవికాదేవీ.. చూస్తారు)

జా.సే.: ఉహు..ఆ విధముగా కాదు.. శిల్పిముందు ఈ ఒక్కో భంగిమను ప్రదర్శింపజేస్తాను..అప్పుడుగాని ఆ నృత్త ఆంగికము రూపుకట్టదు.. మాళవికాదేవీ, ఏదీ..సిద్ధపడు..

(జాయన..ఏడెనిమిది చిత్రాలున్న పటాలను చేతిలోకి తీసుకున్నాడు.. ఆహార్యం ధరించిన మాళవికాదేవి పైనున్న సన్నని తెరను తొలగించి..శిలా రంగస్థలిపై చేరి నిలబడింది సిద్ధంగా..)

జా.సే.: చతుర విన్యాసము.,

(మాళవిక..క్షణకాలంలో..మెరుపువలె కదిలి ఒక విశిష్ట భంగిమలో స్థాణువై నిలబడింది.

కర్తరీ నర్తనము (మాళవిక భంగిమ మారింది)    (ఇక్కడ భంగిమల మధ్య శ్రావ్యమైన మ్యూజిక్‌)

భ్రమరీ నర్తనము (మరో భంగిమ)

సువ్యాపక నర్తనము (ఇంకో భంగిమ)

దక్షిణ భ్రమణ నర్తనము (మరో భంగిమ.)

దండలాస్యము (ఇంకో భంగిమ)

నాగిని, (భంగిమ)

రామప్ప : జాయపసేనానీ.. అద్భుతము.. ఈ ఒక్కో రీతి, భంగిమ మా హృదయమును జయించింది. మీరన్నట్లు ఈ ఒక్కో శిల్పమును ఆలయ శిఖర చూరుకు ఒడ్డాణమువలె అమర్చినచో రంజకంగా ఉంటుంది. ఈ దేశీ నృత్తభంగిమలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

జా.సే.: మా అభిలాష కూడా అదే మహాశిల్పీ..యివిగాక యింకా ‘ప్రేరిణి’ అనే శివతాండవ శృంగనర్తనంలో భాగమైన వీరరసప్రధాన భంగిమలు కొన్ని ఈ పటాలలో ఉన్నాయి. వీక్షించండి..

(రామప్ప అందుకుంటాడు చిత్రాలను)

రామప్ప : ‘ ‘ప్రేరిణి’ నృత్యం గురించి చెప్పండి

జా.సే.: మహాశిల్పీ.. సుకుమారమై కేవలం స్త్రీలచేతన నర్తితమయ్యేది లాస్యము.. ఉద్ధతమైన అంగహారములతో వీర, రౌద్ర భావనలు ప్రధానముగా గలిగి పురుషుల చేతమాత్రమే నర్తించబడేది ‘తాండవము, శివతాండవము ప్రధానముగా ఏడు విధములు.. అవి శుద్ధ, దేశి, ప్రేరణ, ప్రేంఖణ, దండిక, కుండలి మరియు కలశ..ఈ భంగిమలన్నీ మన రుద్రేశ్వరాలయ కీలకస్థానాల్లో స్థాపించబడాలి.

రామప్ప : అవశ్యము ఆచార్యా.. అది అర్థవంతముకూడా.. రుద్రునిచుట్టూ శుద్ధ, పూర్ణ పురుష వీర భావనలు పరిఢవిల్లడం సృష్టి ప్రతిఫలనయేకదా..తప్పక ఆ ఆకృతులను తీర్చిదిద్దుదాం.,

రే.రు : జాయపా.. మీరు సంకల్పించిన ఈ ప్రతిపాదనలన్నీ శ్లాఘనీయమైనవి.. వీటిని యథాతథముగా ప్రతిష్టిద్దాం.

జా.సే.:  స్తంభములపై..ప్రాకారములపై..పై కప్పులపై..స్తంభ తలములపై.. వక్రములపై..రామాయణ, భాగవత.. మహాభారతాది ఇతిహాస ఘట్టాలను కూడా శోభింపజేద్దాం రుద్రదేవా..

రే.రు.: అవశ్యము..తప్పక.. మీరు మా ఆతిధ్యమును స్వీకరించుటకు వేళయ్యింది. భోజనానంతరము తటాక నిర్మాణ ప్రాంతమును సందర్శిద్దాం.. జాయపసేనానీ ఈ పక్షము రోజులు యిక్కడే మాతో, రామప్ప మహాశిల్పితో గడిపి మాకు మార్గదర్శనం కావించండి…

జా.సే : మీ ఆతిథ్యం మాకూ అంగీకారమే. యిక్కడ కొద్దిరోజులుండి గణపతి దేవులను కూడా సందర్శించుకుని మా తామ్రపురికేగుతాం.,

దృశ్యం  : 6

(1254వ సం||. జాయప వయస్సు 60 సం||లు.. రామప్ప దేవాలయ ప్రాంగణం.. దేవాలయ ప్రదేశమంతా, సహస్ర దీపాలంకరణతో తేజోవంతమై కాంతిమయంగా, దేదీప్యమానమై ఉంది. రుద్రేశ్వర గర్భగుడి ఎదుట.. రాతి సింహాసనంపై గణపతి దేవుడు..ప్రక్కన  రాణులు.. మరో ఆసనంపై జాయపసేనాని, రేచర్ల రుద్రదేవుడు.. అటువేపు రామప్ప అతని యిద్దరు శిష్యులు.. వెనుక.. రాజనర్తకి మాళవికాదేవి.. కేశిక.. యితర పురప్రముఖులు దండనాయకుల..కోలాహలం..

సందర్భం.. ‘నృత్త రత్నావళి’ గ్రంథావిష్కరణ.. దేవాలయమునకు ‘రామప్ప’ నామప్రతిష్ట..

(రుద్రాభిషేక స్తుతి.. జమకం.. మంగళకర ధ్వని.. మంత్రఘోష..ఘంటలు క్రమంగా..తగ్గుతూండగా..)

ప్రధానార్చకులు సోమాచార్యులు : (శివలింగ సన్నిధి నుండి నృత్తరత్నావళి గ్రంథం ఉన్న పట్టువస్త్రపు మూటను తీసుకొని వచ్చి.. గణపతిదేవుని చేతుల్లో ఉంచి.. నమస్కరించి..) ఈశ్వర  ప్రసాదంగా ఈ మహత్తర కృతి.. భవిష్యత్‌ తరాలూ.. దాక్షిణాత్యులూ గర్వించదగ్గ నాట్యశాస్త్ర ప్రామాణిక గ్రంథం, జాయపసేనాని కృత ‘నృత్తరత్నావళి’ని తమ అమృతహస్తాలతో స్వీకరించండి మహారాజా.

గ.దే.: మహాప్రసాదము.. ఈ గ్రంథమును స్పర్శించిన మా యొల్లము పులకించుచున్నది.. ఎపుడో దాదాపు ముప్పది సంవత్సరముల నాడు ప్రజ్ఞాశాలియైన జాయనను మేము ‘నృత్యము’తో సహా వాద్య, యుద్ధ విద్యలపై ప్రామాణిక గ్రంథములను రచించి ఈ లోకమునకందించమని ఆదేశించియుంటిమి. యిన్నాళ్ళకు మా స్వప్నము సాకారమైనది. జాయపసేనానికి మేము మా కృతజ్ఞతలు తెలియపరుస్తూ..ఈరోజు నిర్వహించ తలపెట్టిన రెండు ప్రధాన కార్యాక్రమములు వివరములను రేచర్ల రుద్రదేవులను ప్రకటించవలసినదిగా అభ్యర్థిస్తున్నాము.

రే.రు.: చిత్తము మహాప్రభూ.. మనందరము ఆసీనులమై ఉన్న ఈ రుద్రేశ్వరాలయమును ఆమూలాగ్రం ఊహించి, రూపొందించి, శిల్పించి.. వన్నెలద్ది..భావితరాలకు అందించినవాడు మహాశిల్పి రామప్ప.. కాబట్టి యింతవరకు ఎక్కడా ఒక శిల్పినామముపై లేనివిధముగా ఈ దేవాలయమునకు ‘రామప్ప దేవాలయము’గా నామకరణం చేయవలసిందిగా మహాచక్రవర్తి శ్రీశ్రీశ్రీ గణపతి దేవులను ప్రార్థిస్తున్నాను.

గ.దే.: తథాస్తు.. భవిష్యత్తులో ఈ శివాలయం సురుచిరమై ‘రామప్ప దేవాలయం’ గా ప్రసిద్ధి పొందుగాక.. మహాశిల్పీ రామప్పా.. నీ జీవితం చరితార్థమైనది.. మీకు మా అభినందనలు.

రామప్ప : ధన్యోస్మి ప్రభూ.. ధన్యోస్మి.

రే.రు.: యిక.. భరతముని రచించిన ‘నాట్యశాస్త్ర’ సకల మార్గపద్ధతులను ఆంధ్రీకరించి, కాకతీయ సామ్రాజ్య స్థానీయ ప్రజానాట్య రీతులను కూడా థాబ్దాలుగా అధ్యయనము చేసి ‘దేశీ’ నృత్యపద్ధతులుగా గ్రంధస్థం చేసిన సకల కళాకోవిదులు శ్రీశ్రీశ్రీ జాయపసేనాని. ఈ దేశీ రీతులలో ప్రపంచ నాట్యచరిత్రలో ఎక్కడాలేని.. మగవారిలోని మగటిమినీ, పురుషుల్లోని పురుషత్వాన్నీ, వీరునిలోని వీరత్వాన్నీ సమ్మిళితం చేసి రుద్ర  ప్రేరణగా రూపొందించి అందిస్తున్న శృంగనర్తనం, శివతాండవం ‘ప్రేరణి’. ప్రేరణి నృత్యాన్ని ఒక బృందముగా పది, ఇరవై..నలభై మంది నర్తకులతో సామూహిక వీరనర్తనముగా ప్రదర్శించడం సముచితం. నిజానికి యిది బృంద నర్తనము. ఈ ప్రేరణి నృత్యాన్ని మన ఆస్థాన నర్తకుడు మల్లయనాథుడు గ్రంథకర్త జాయపసేనాని ప్రవేశిక తర్వాత ప్రదర్శిస్తారు..

(చప్పట్లు..మంగళ ధ్వనులు..)

జాయప : మహాచక్రవర్తులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులకు, సభాసదులైన బుధజనులందరికీ ప్రణామములు. ఏదేని ఒక విషయముపై సాధికారమైన అధ్యయనం జరుపనిది సృజనచేయడం భావ్యముకాదని తలంచి భారతీయ నాట్యశాస్త్రాలన్నింటినీ సంపూర్ణముగా పరిశోధించి ముప్పయ్యేళ్ళ కాలము సాగించిన సుదీర్ఘ కృషి ఫలితమే ఈ ‘నృత్తరత్నావళి’ గ్రంథము. యిక ‘ప్రేరణి’ అనే నామముతో ‘నృత్తరత్నావళి’ గ్రంథంలో ప్రస్తుతించబడినది పూర్తిగా నా స్వీయ సృష్టి. యిది గేయ ప్రాధాన్యంగల నర్తనం కాదు. వాద్య ప్రాధాన్యతగల నర్తనం. యుద్ధసన్నద్ధత కోసం వీరరస ప్రధాన ప్రేరక ఉత్సవాలలోనూ, ఆత్మశక్తిని తెలుసుకోవడం కోసం స్వయంచాలన లక్ష్యంగా రూపొందించబడ్డ పురుష నర్తనం ‘ప్రేరణి’. మార్ధంగికులు మహామద్దెలపై తన్నారకం, తత్కారం, తహనాలు, యతులు, గతులు, జతులు ‘భాం’కార ధ్వనితో పలికిస్తూంటే..నందిమద్దెల, ఉడుక్కు, కంచుతాళ మేళనతో నాదం గాంభీర్యమౌతూండగా రుద్రస్వరూపుడైన నర్తకుడు అంగ, ప్రత్యంగ, ఉపాంగాల సంచలనాల ద్వారా పరమశివుని తాండవకేళిని మన అనుభవంలోకి తీసుకురాగల మహారౌద్రానుభూతి యిది.. వినండి.. వీక్షించండి..,

 

(శబ్దం.. భాంకార ధ్వని.. పేరిణి..సిడి ఒకటుంది .. దాంట్లో పది ట్రాక్స్‌ ఉన్నై.. మొత్తం 3.5 ని||లు బిట్స్‌ బిట్స్ గా వేయాలి)

 

….ముగింపులో

గ.దే.: జాయపసేనాపతీ..మేము ఈ పంచముఖ శబ్ద ప్రపంచంలో ఓలలాడి మైమరిచి, లీనమై రుద్రున్ని మా మనోమయ లోకంలో దర్శించుకున్నాము. దీనిని సృజించి నీ జన్మను చరితార్థం చేసుకున్నావు.. ఏదీ..ఒక్కసారి మా బాహువుల్లో ఒదిగి మమ్మల్ని సంభావించు.

జా.సే: ధన్యుణ్ణి ప్రభూ.. ధన్యుణ్ణి.. మీరన్నట్లు నేను శివకృపతో, మీ అనురాగ స్పర్శతో తరించిపోయినాను.. ఆచంద్రార్కం ఈ నృత్తరత్నాళి కృతి శాశ్వతమై నిలుస్తుంది.. ధన్యోస్మి…

(ప్రేరణి నృత్యము కొనసాగుతూంటుంది.. ఆలయ ఘంటలు.. మంగళధ్వని.. సంతోష సంకేత కోలాహలం)

 -రామాచంద్ర మౌళి

Ramachandramouli 

విదూషక బలి

 

"నీకు ఉజ్జోగమిస్తాను కానీ, నీ.. నీ.. టై రంగు నాకు నచ్చలేదు’’

“నీకు ఉజ్జోగమిస్తాను కానీ, నీ.. నీ.. టై రంగు నాకు నచ్చలేదు’’

కత్తికంటే కుంచె శక్తిమంతమని మరోసారి తేలింది. ఆ వెర్రిబాగుల కార్టూనిస్టుల కుంచెలను మూయించడానికి నీకు ఏకంగా కలాష్నికోవ్ రైఫిళ్లు, షాట్ గన్లు, రాకెట్ లాంచర్లు కావాల్సి వచ్చింది. విదూషకులు కదా, పాపం తమ వెక్కిరింతలకు ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుందని తెలుసుకోలేకపోయారు !

వాళ్లేం చేశారు? ‘నా మతాన్ని, నా ప్రవక్తను కించపరిచారు’ అంటావు, అంతేకదా. కానీ వాళ్లు నువ్వు నరనరానా ద్వేషించే అమెరికా వాడిని, వాడి యూరప్ తొత్తులనూ పరమ అసహ్యంగా గేలి చేశారు కదా. నీ మతదేశాల్లోనే కాకుండా లోకంలోని కష్టజీవులందరి శ్రమఫలాలను దోచుకుంటున్న కేపిటలిస్టుల ముఖానా కాండ్రించి ఉమ్మేశారు కదా. నువ్వు మండిపడే క్రైస్తవ మతపెద్దల బట్టలనూ విప్పేశారు కదా. ఒక్క క్రైస్తవాన్నేనా.. యూదుమతాన్నీ, జాతిపిచ్చి మతాన్నీ, జనాన్నిఆరళ్లుపెట్టే సామ్రాజ్యవాద మతాన్నీ, అవినీతిరాజకీయ మతాన్నీ, మెట్రోసెక్సుమత్తు మతాన్నీ, బాసిజపు మతాన్నీ, నాటోదాడుల మతాన్నీ వాంతికొచ్చేలానూ ఎండగట్టారు కదా. ఇవన్నీ నీకు తెలియదనుకోను. నిజం చెప్పు, నువ్వు కూడా ఆ విదూషకుల బొమ్మలను నీ తుపాకీ మడమపై ఉంచుకుని చూసే వేళ ముసిముసిగా నవ్వుకోలేదా?

ఫ్రాన్స్ లో నీ మతం వాళ్లపై వేధింపులు పెరుగుతున్న మాట నిజమే. రైట్ వింగూలూ, నయా జాత్యున్మాద నేషనల్ ఫ్రంట్లూ జడలు విప్పుతున్నదీ, నీవాళ్లను గెంటేయాలని, కొత్తవాళ్లను రానివ్వకూడదని వెర్రిగా అరుస్తున్నదీ నిజమే. చమురు కోసం నీ మతదేశాలపై, అక్కడి నీ అమాయక ప్రజలపై ఫ్రాన్స్ సహా చప్పన్నారు పడమటి దేశాలు దాడులు చేస్తున్నదీ నిజమే. నువ్వు చిదిమేసిన ఆ  కార్టూనిస్టులు తెలిసో తెలియకో తమ పిచ్చి బొమ్మలతో  ఆ దేశాలకు వకాల్తా పుచ్చుకున్నట్లు అనిపించిందీ నిజమే…

అందుకు పగతీర్చుకోడానికి ఆ పిచ్చుకలపై తుపాకీ ఎక్కుపెడతావా? పోనీ ఆవేశంలో పొట్టనబెట్టుకున్నావులే అని సరిపెట్టుకుందామనుకున్నాను, కానీ వీలుకాలేదు. మొన్నటికిమొన్న పెషావర్ ఆర్మీ స్కూల్లో నువ్వు ముక్కుపచ్చలారని 130 మంది పిల్లల నెత్తురు కళ్లజూసినప్పుడు నీకు గట్టిగానే చెప్పాను కదా, చెవికెక్కలేదా? ఆ నెత్తురింకా ఆరకముందే మరింత అమాయకపు నెత్తురును ఒలికించేశావు కదయ్యా!

Karnika Kahen

సహనం నశిస్తోంది మిత్రమా. నీది పెడదారి అని గోబెల్స్ లు చేస్తున్న ప్రచారం నిజమేనేమోనని నమ్మాల్సి వస్తుందని భయంగా ఉంది. నీతో కొన్నిపేచీలు ఉన్నా దుర్మార్గపు మహాకాయపు రాక్షస గోలియత్ ను వడిసెలతో ఎదుర్కొంటున్న నీ సాహసాన్ని చూసి ముచ్చటపడ్డాను. నీకు రాళ్లందిస్తూ సాయంగా ఉందామనుకున్నాను. కానీ ఇక సాధ్యం కాదేమో. నీ కసిలో ఉన్మాదం పాళ్లు పెరిగింది. నీ ప్రతిఘటన పక్కదారి పట్టింది. నీ గురి పూర్తిగా తప్పింది.

ఆ నెత్తురొలికిన కుంచెల సాక్షిగా ఓ మాట చెబుతున్నాను, బాగా విను. కళ్లు మరింత బాగా తెరువు. గురి చెదరనీకు. శత్రువెవడో, మిత్రుడెవడో, తటస్థుడెవడో మరింత బాగా తెలుసుకో. ప్రాణాలు కాపాడుకోవడానికే తుపాకీ పట్టినవాడివి కనక ప్రాణం విలువ నీకు బాగా తెలుసు. అందుకే నీది ధర్మాగ్రహమంటున్నాను. వ్యర్థ బలులను అల్లా కూడా ఒప్పుకోడు. విదూషకుల బలులను అసలెంతమాత్రం ఒప్పుకోడు.. ! ! !

(ప్యారిస్ లో ఈ నెల 7న వ్యంగ్యపత్రిక ‘షార్లీ హెబ్దో’ కార్యాలయంపై దాడిలో బలైన ప్రధాన సంపాదకుడు, కార్టూనిస్టు షార్బ్(47), కార్టూనిస్టులు కాబూ(76), హనోర్, వోలిన్ స్కీ(80), కాలమిస్టులు, పత్రికా సిబ్బంది, ఇతరులకు నివాళిగా..)

                                                              –  పి.మోహన్

తానా వ్యాసరచన పోటీలకు ఆహ్వానం

రాబోయే 20 వ తానా సమావేశాలలో (జూలై 2-4, 2015) తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహక వర్గం ‘తెలుగు సాహిత్యంలో స్త్రీల పాత్రల స్వభావ పరిణామం’ అనే అంశం పై చర్చావేదిక నిర్వహించనుంది.
తెలుగులో పురాణాల నుండి ఇప్పటి అధునాతన సాహిత్యం వరకు ఎంతో వైవిధ్యమున్న స్త్రీ పాత్రల చిత్రణ జరిగింది. ఇందులో పురాణాలతో పాటు, కావ్యాలు, నాటకాలు, కథలు, నవలలు, కవితలు, మొదలైన ఎన్నో ప్రక్రియలు పాలు పంచుకున్నాయి. ఇంతటి సుదీర్ఘమైన చరిత్ర ఉన్న సాహిత్యంతో పాటు, గత 80 ఏళ్ళుగా చలనచిత్ర రంగం కూడా స్త్రీపాత్రల పరిణతిని ప్రదర్శించడంలో తన వంతు ప్రభావాన్ని చాలానే చూపింది. రచయితల (దృశ్య ప్రక్రియలను నిర్దేశించే వారితో సహా) సృష్టిలో ఆ పాత్రలు, ఆయా స్థల, కాలాల; ఆచార, వ్యవహారాలను బట్టి మారే అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నంలో పాత్రలు సమకాలీన జీవితాన్ని ప్రతిబింబించవచ్చు, భవిష్యదర్శనం చేయవచ్చు, లేదా గతస్మృతులను నెమరు వేసుకుంటూ ఉండవచ్చు.

ఈ నేపధ్యంలో స్త్రీ పాత్రల స్వభావాలలో వచ్చిన మార్పులు వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలలోను, దృశ్య మాధ్యమాలలోను ఎలా ప్రకటితమయ్యాయి? ఎలాంటి పరిణామాలకు లోనయ్యాయి? ఈ మార్పులు సమకాలీన సమాజంలో స్త్రీల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి? అనే విషయాలను చర్చకు తీసుకురావడం, ఈవేదిక నిర్వహణ ప్రధానోద్దేశం. ఇంతటి విస్తృత వస్తువును కేవలం ఒక రెండు గంటల చర్చావేదికలో ఇమిడ్చడం అసాధ్యం. కానీ ఈ వస్తువుకు వీలైనంత విశాల వేదిక కల్పించడం, ఈ వ్యాస రచనా పోటీ ప్రధానోద్దేశం.

పోటీలో పాల్గొన దలుచుకున్నవారు, తమకు నచ్చిన, అనువైన, అభినివేశం ఉన్న, స్పష్టత ఉన్న, లేదా ప్రవేశం ఉన్న, ఏ కోణం నుండైనా, ఏ పరిమితులలోనైనా, ఈ వ్యాస రచన చేయవచ్చు. ఎన్నుకున్న పరిధిలో విషయాన్ని ఎంత కూలంకషంగా, ఎంత విస్తృతంగా పరిశీలించి, ఎంత సరళంగానూ, క్లుప్తంగానూ విశ్లేషించారన్న వాటిపైనే బహుమతి నిర్ణయం ఉంటుంది కానీ, కేవలం వస్తువు పరిమాణ విస్తృతి ఒక్కటే బహుమతికి అర్హత కాజాలదు.

నిబంధనలు:
1. వ్యాసాలు తెలుగులోనే వ్రాయాలి.
2. ఈ చర్చావేదిక నిర్వాహకులు, చర్చలో పాల్గొనడానికి రాబోయే ఆహ్వానితులు తప్ప, మిగిలిన తెలుగు వారందరూ ఈ వ్యాస రచన పోటీకి అర్హులే.
3. వ్యాసాలను చేతి వ్రాతలో కాకుండా కంప్యూటరులో టైపు చేసి, PDF ఫైలుగా మార్చి పంపాలి. (కంప్యూటరులో టైపు చేయడానికి వెసులుబాటు లేనివారు, గడువు తేదీకి కనీసం 30 రోజులు ముందుగా వ్యాస రచన పూర్తి చేసి మమ్మల్ని సంప్రదిస్తే, వీలును బట్టి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము.)
4. మొదటి పేజీలో వ్యాసం పేరు, రచయిత పేరు, చిరునామా, ఫోన్ నంబరు, ఈమెయిల్, వ్యాసం మొత్తం ఎన్ని పేజీలు, వివరాలు మాత్రమే ఉండాలి. తరువాతి పేజీలలో వ్యాసం పేరు, వ్యాసం తప్ప వేరే వివరాలు ఉండకూడదు. న్యాయనిర్ణేతలకు రచయిత వివరాలు తెలియరాదు కనుక వ్యాస రచయితకు సంబంధించిన వివరాలేవీ వ్యాసంలో (అంటే రెండవ పేజీ మొదలుకొని) ఉండకూడదు.
5. వ్యాసం నిడివి 5 పేజీలు మించకూడదు. (పేజీ పరిమాణాలు: 7.5 x 9 అంగుళాలు లేదా 19 x 23 సెంటీ మీటరులు. వాడే లిపి పరిమాణం 12 points కు తక్కువగా ఉండకూడదు). తీసుకున్న వస్తువును విశదీకరించి, విశ్లేషించడానికి అవసరమైనంత మేరకే వ్యాసం ఉండాలి గానీ, గరిష్ట నిడివి వరకు వ్యాసాన్ని పొడిగించనవసరంలేదు.
6. వ్యాసాన్ని ఈమెయిల్ ద్వారా tanavyasamu@gmail.com కు పంపాలి. వ్యాసాన్ని పంపినవారి ఈమెయిల్ తో, వ్యాస రచయితను, వ్యాస కర్తృత్వాన్ని, ఈ వ్యాస రచన పోటీ నిబంధనల్ని, చట్టరీత్యా ధృవీకరిస్తున్నట్టు, అంగీకరిస్తున్నట్టు, భావిస్తాము. వేరే ధృవీకరణల అవసరంలేదు.
7. వ్యాసాలు మాకు చేరవలసిన ఆఖరు తేదీ: ఏప్రిల్ 4, 2015
8. న్యాయనిర్ణేతల దృష్టిలో ఉత్తమమైనవిగా ఎంపికైన మొదటి మూడు వ్యాసాలకు బహుమతులు (రు. 27,232; రు. 17,314; రు. 11,234; లేదా సమానమైన విలువలో రచయిత నివశించే దేశపు ద్రవ్యంలో) ఉంటాయి. బహుమతి పొందిన వ్యాసాలతో పాటు, మిగిలిన వాటిలో ఎన్నదగినవాటిని తానా 20 వ సమావేశాల సందర్భంగా ప్రచురించే హక్కులు నిర్వాహక వర్గానివే.
9. న్యాయనిర్ణేతల అభిప్రాయంలో ఏ వ్యాసానికీ తగిన అర్హతలు లేవని తోస్తే బహుమతిని ఇవ్వడానికి, ప్రచురించడానికి, నిరాకరించే హక్కులు కూడా నిర్వాహకవర్గానివే. ఈ నిబంధన కేవలం ఆషామాషీగా వ్యాస రచన పోటీలో పాల్గొని బహుమతులను ఆశించే వారిని నిరుత్సాహ పరచడానికి; నిబద్ధతతో, క్రమశిక్షణతో, చేసిన రచనలకు తగిన విలువను ఆపాదించడానికి మాత్రమేనని మనవి.

10391436_1519913701605194_6407369527125614767_n

‘కోయీ అకేలా హై కహా..’

Krish.psd

గదిలో కూర్చుంటే చలి. కాని రోడ్డుపై నడుస్తుంటే చలి ఎక్కడిది? నేలపై పాకుతున్న పొగమేఘాలు. సాయంత్రం అయిదింటికే గూళ్లకు చేరాలని తపిస్తున్న పక్షుల చప్పుళ్లు. ఒక వృద్ద చిరు వ్యాపారి ముందు నిప్పుల మధ్య కాలుతున్న పల్లీల వాసన. చెట్టుక్రింద నిలబడి వేటి వేడి టీ తాగుతూ కబుర్ల వేడిలో మునిగిపోయిన ఉద్యోగులు. బస్‌స్టాప్ వద్ద గుంపులు గుంపులుగా ఆతురతతో ఎదురు చూస్తున్న జనం. రోడ్డు దాటడానికి అవస్థ పడుతున్న గృహిణి. దృశ్యాలు మనసు తెరలపై ఇంకిపోతుంటే ఏదో ఒక పాట నిన్ను నిలిపేస్తుంది. పాదాలకు నడుస్తున్న విషయం కూడా తెలియదు.. 

‘ఆభిజా.. ఆభిజా.. ఏ సుబా ఆభిజా.. రాత్‌కో కర్ విదా.. దిల్‌రుబా ఆభిజా..’ ఎక్కడ విన్నాం ఈ పాట. అనువదించగలమా? ‘రావెరా.. రావెరా.. ఉదయమా రావెరా రాత్రినీ సాగనంపీ.. ప్రియతమా.. రావెరా..’ ఈపాట రాసిందెవరు? నిదా ఫాజిలీ కదా? ఎవరీ నిదా ఫాజిలీ? ఏదైనా పాటో, కవిత్వమో నచ్చిందంటే దాని పాదముద్రల వెంట పయనించడం మానవా? 

‘దునియా  జిసే కహతే హై జాదూకా ఖిలోనా హై.. మిల్ జాయెతో మిట్టీ హై, ఖో జాయెతో సోనా హై.’. ( ఈ ప్రపంచమొక అద్భుత ఆటబొమ్మ.. దొరికితే మట్టే.. పోగొట్టుకుంటే బంగారం) అన్న ప్రసిద్ది చెందిన వాక్యాలు రాసిన నిదా ఫాజిలీ గ్వాలియర్ వీధుల్లో సంచరిస్తూ కవిత్వాన్ని మనసులో ఒంపుకున్నాడు. ఒకరోజు వీధుల్లో నడుస్తూ గుడిలోంచి వినిపిస్తున్న సూర్‌దాస్ భజన విన్నాడు. కృష్ణుడికోసం తపిస్తూ రాధ తన చెలికత్తెల వద్ద విషాదంగా ఆలపిస్తున్న మధుర గీతిక అది. గురుదత్ ‘ప్యాసా’ కోసం సాహిర్ లూధియాన్వీ రాసిన ‘ఆజ్ సజన్ మొహె అంగ్ లగాలో.. జనమ్ సఫల్ హోజాయే..’ అని గీతాదత్ గొంతుకతో వహిదా రహమాన్ తపించిన గీతిక లాంటి పాట అది. అంతే. నిదా ఫాజిలీ కవి అయ్యారు. . 

1938లో జన్మించిన నిదా ఫాజిలీ తన తండ్రి దేశ విభజన తర్వాత పాకిస్తాన్ వెళ్లినప్పటికీ భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. సూర్‌దాస్, కబీర్ , మీరా ఆయనను భారత్‌లోనే పట్టి ఉంచారు. ఢిల్లీలో జన్మించి, మన హైదరాబాద్‌లో మరణించిన డాగ్ దెహ్లివీ (నవాబ్ మీర్జాఖాన్) ప్రాచుర్యం పొందిన కవితా శైలిని కాదని తనదంటూ కొత్త శైలిని ప్రవేశపెట్టిన కవి నిదా ఫాజిలీ. నాటి ఉర్దూ కవులు కైఫీ ఆజ్మీ, సాహిర్ లూధియాన్వీ, అలీ సర్దార్ జాఫ్రీ కవితా శైలిని విమర్శిస్తూ సంచలనాత్మక వ్యాసాలు రాశారు. అప్పటివరకూ ఉర్దూ కవిత్వంలో తచ్చాడుతున్న పర్షియన్ ప్రతీకల్ని, పదాల్నీ వదిలిపెట్టి కొత్త ప్రతీకల్ని చిత్రించిన కవి ఫాజిలీ. ‘నా మనసులో ఏముందో నా పెదాలెప్పుడూ చెప్పలేవు… నా మౌనం ఏమంటుందో ఆమె అర్థం చేసుకోలేదు.’. అని ఆయన తప్ప ఎవరు రాయగలరు? 

untitled

ముంబయిలో ఉద్యోగం కోసం వీధుల్లో తిరుగుతూ పత్రికల్లో కవితలు రాస్తున్న ఫాజిలీని కమల్ అమ్రోహి గుర్తించకపోతే ఆయన దశ తిరిగేది కాదు. ‘నీ వియోగమే నా తలరాత… నీ విషాదమే నా జీవితం’ (తేరా హిజ్ర్ మేరా నసీబ్ హై.. తేరా గమ్ హీ మేరా  హయాత్ హై) అని ‘రజీయాసుల్తాన్’ కోసం ఆయన  రాసిన పాట   హిందీ సినీ ప్రపంచంలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. ‘తూ ఇస్ తరా మేరీ జిందగీమే షామిల్ హై’ ( ఈ రకంగా నీవు నా జీవితంలో చేరావు), ‘హోష్‌వాలోంకో ఖబర్ క్యా బేఖుదీ క్యా ఛీజ్ హై- ఇష్క్ కీజే ఫిర్ సమఝియే జిందగీ క్యా చీజ్ హై’ (స్పృహలో ఉన్నవాడికి ఏం తెలుసు మైమరిచిపోవడం, ప్రేమలో పడు అర్థమవుతుంది.. జీవితం అంటే ఏమిటో).. అని ఎన్నో గీతాలు రాశారు. ‘సఫర్ మే దూప్‌తో హోగీ, జో చల్ సకోతే చలో, సభీ హై బీడ్ మే తుమ్ భీ, నికల్ సకోతో చలో- యహా కిసీకో కోయి రాస్తా నహీ దేతా, ముఝే గిరాకే అగర్ తుమ్ సంబల్‌సకోతో చలో..’ ( ప్రయాణంలో ఎండ ఎలాగూ ఉంటుంది, సాగిపోగలితే సాగిపో.. అంతా జనసమ్మర్థంలోనే.. బయటకు రాగలితే సాగిపో, ఇక్కడ ఎవరూ ఎవరికి దారి ఇవ్వరు, నన్ను పడేసి నీవు నిలదొక్కుకోగలిగితే సాగిపో) అన్న అద్భుతమైన గీతాలు రాశారు. ‘గోడలంటే భయపడి దిగిపోయిన నీడలు మాట్లాడుతాయి.’. అన్న వాక్యాలు ఫాజిలీ కవితల్లో వెంటాడుతాయి. జగ్జీత్ సింగ్, చిత్రాసింగ్,కవితా కృష్ణమూర్తి లాంటి వారి గొంతుల్లో ఆయన గీతాలు  నీటిబిందువులను అలంకరించుకున్న గులాబీ పూల లాంటి అసాధారణ అందాన్ని సంతరించుకున్నాయి.

ఫాజిలీ వెంటాడడానికి మరో బలమైన కారణం ఉంది. చాలా మంది కవుల్లాగా ఆయన యదాతథ స్థితిని, యాంత్రిక జీవితాన్నీ ఇష్టపడలేదు. సినిమాల్లో పాటలు రాయడాన్ని తనంతట తాను మానుకొన్నారు. మరింత సీరియస్ కవితల్ని రాయడం మొదలు పెట్టారు. ఆయన భావాలు మరింత దట్టమయ్యాయి. ఆయన ఆలోచనల్లో మరింత గాఢత అలుముకొంది. మతతత్వంపై, ముఖ్యంగా రాజ్యాంగ యంత్రంలో ఉన్న మతతత్వంపై ఆయన కలం ఎక్కుపెట్టారు. మతఘర్షణల్ని, వాటి వెనుక ఉన్న రాజకీయ శక్తుల కుతంత్రాలను ద్వేషించారు. 1992లో ముంబైలో అల్లర్లు జరిగినప్పుడు ఆయన స్వయంగా ఒక స్నేహితుడి ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత జీవితంలోని వైరుధ్యాలను, పట్టణ జీవితంలోని కృత్తిమత్వాన్ని ఎండగడుతూ కవిత్వీకరించారు. గుజరాత్ అల్లర్లైనా, సద్దాం హుస్సేన్‌ను ఉరితీసినా ఆయన ఊరుకోలేకపోయారు. 

‘ఖుదా ఖామోష్ హై’ (దేవుడు మౌనంగా ఉన్నాడు) అన్న కవితలో ఆయన ‘నేను ఒంటరిగా అంతా చేయలేను. నీవు నాతో చేరితే కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం..’ అని ఆయన జనాన్ని సమీకరించే ప్రయత్నం చేశారు. ‘మసీదోం మందిరోంకో దునియా మే, ముఝే పహచాన్‌తే కహా హై లోగ్’ ( మసీదులు, మందిరాల ప్రపంచంలో నన్ను జనం ఎక్కడ గుర్తు పడతారు?) అని ప్రశ్నించిన ఫాజిలీ  ‘ప్రపంచాన్ని చీకట్లో ముంచి ఆకాశంలోకి వెళ్లి దేవుడిగా మారి అంతా దగ్ధం చేస్తాను’ అని ‘ఐలాన్’ అన్న కవితలో రాశారు.. ఈ కవితలు ఇప్పుడు చదువుతున్నప్పుడు మనకు ‘పీకే’ సినిమా గుర్తు రాక మానదు. ‘కరాచీ తల్లిఅయితే ముంబాయి ఆమెనుంచి వేరుపడిన కొడుకు. ఆ పవిత్ర బంధాన్ని ఎవరూ ఈనాటికీ తెంచలేకపోయారు. తెంచలేరు కూడా.. నా తల్లి నాపై కత్తి ఎత్తలేదు.. నేను ఆమె పై తుపాకీ ఎక్కుపెట్టలేదు. ఎవరు ఎవరికోసం మరి యుద్దం చేస్తున్నారు? ఎందుకోసం ఈ ఘర్షణ?’ అని ఆయన రాశారు. ‘మసీదు గుమ్మటాలు మౌనంగా ఉన్నాయి, మందిరం గంటలు మౌనంగా ఉన్నాయి..’ అన్నారు. ‘బృందావన్ కీ కృష్ణ కన్హయ్యా అల్లాహూ.. బంసీ రాధా గీతా గయ్యా అల్లాహూ’ అన్న గీతం. ‘మౌల్వీయోంకా సాజ్దా పండిత్ పూజా, మజ్జూరోంకి హైయ్యా హైయ్యా అల్లాహూ.’. అన్న వాక్యాలతో అంతమై శ్రమైకజీవన సౌందర్యంలో దైవత్వాన్ని చూపిస్తుంది. 

‘ఆద్మీ మరా నహీ, జిందా హై ఆద్మీ షాయద్, బదన్ కి అంధీ గుఫా మే ఛుపా హోగా’ ( మనిషి మరణించలేదు.. బహుశా జీవించే ఉన్నాడు, శరీరపు చీకటి గుహలో దాక్కున్నాడు), , ‘కోయీ  అకేలా హై కహా, సాత్ హై సారా జహా ‘( ఎవ రైనా ఒంటరిగా ఎక్కడున్నారు? మొత్తం ప్రపంచం వెంట ఉంది) అన్న ఆయన కవితా వాక్యాలు విన్నప్పుడు ప్రతిఘటనా ప్రపంచంలో ధిక్కార స్వరాలు వినిపించే వారిలో నేను ఒంటరివాడిని కాదనిపిస్తుంది.


-కృష్ణుడు

పరాయి దేవుడు

Parayi

చిత్రం: మహీ బెజవాడ

మిస్టర్ బ్లూమ్ ఆ వినాయకుడిని చూసేదాకా ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవితం గడిపాడు. బ్లూమ్ లాంటి వాళ్ళంతా ఇంతే. మనసులో సుదూర దేశాలకు ప్రయాణం చెయ్యాలన్న కోరిక బలంగా వున్నా అమ్మ చెప్పిన మాట విని ఆప్థమాలజీ (కంటి వైద్యం) కాలేజీలో చేరతారు. ఇదిగో ఇలాంటివాళ్ళే స్పైస్ ద్వీపాలకో, అందమైన మైదానాలకో వెళ్ళాలని కలలు కంటూనే టెల్మా లాంటి మందుల గుట్టలో పడి బతికేస్తుంటారు.

ఇలాంటివాళ్ళే – చివరికి రిటైరైన కంటి డాక్టర్ లెఫ్కోవిజ్ కూతురు ఎంత లావుగా వున్నా సర్దుకుపోయి పెళ్ళి చేసుకుంటారు. బ్లూమ్ లాంటి వాళ్ళే నీరు కారే కళ్ళని పరీక్షించడం అనే పనిని రోజూ చేస్తూనే సంసారాన్ని ఈదేస్తుంటారు. కుటుంబంతో కలిసి బంగారం రంగు ఇసుక వున్న బీచ్‌కి వెళ్ళాలని, అక్కడ చొక్కా లేకుండా నిలబడి సముద్రపు గాలిని పీల్చాలనీ, మనిషి నడవని చోట నడవాలని, ఏ మనిషీ ప్రేమించనంతగా మరొకరిని ప్రేమించాలనీ  అనుకుంటూ, అవేమీ చెయ్యకుండానే సంవత్సరాలు గడిపేస్తుంటారు.

అలా గడపటం కొంత మందికి అసంతృప్తి ఇవచ్చుగాక, కానీ కొంతమందికి అలా బ్రతకడంలోనే తృప్తి వుంటుంది. సరిగ్గా అలాంటి తృప్తి కలిగివున్న జీవితం గడుపుతున్న బ్లూమ్‌కి ఆ వినాయకుడి ప్రతిమ దొరకటమే ఆశ్చర్యం.

ఆ రోజు అతను గాజులు, చీరలు, అగరుబత్తీలు అమ్ముతున్న ఒక దుకాణం దగ్గర నిలబడ్డాడు. వాటన్నింటి మధ్యలో అనుకోకుండా కనపడిందా విగ్రహం. నాలుగు చేతుల మనిషి శరీరానికి ఏనుగు తల వుందా? లేక ఏనుగుకి మనిషి శరీరం అతికించారా? అని పరిశీలనగా చూశాడు. మెరిసిపోయే గులాబి రంగు శరీఅం, కరుణ కురిపించే కళ్ళు, బంగారు కిరీటం. ఒక చేయ్యి చూపుడు వేలుతో ఏదో సైగ చేస్తున్నట్లు వుంటే, రెండొవది దగ్గరకు రావద్దని వారిస్తున్నట్లు కనపడింది. చూడగానే అది దేవుడి బొమ్మ అయ్యివుంటుందని వూహించాడు బ్లూమ్.

“కాకపోతే మరేమిటి? ఒకేసారి భయం భక్తి రెండూ కలుగుతున్నాయంటే ఆయన ఖచ్చితంగా దేవుడే అయ్యుంటాడు” అనుకుంటూ ఆ నునుపైన విగ్రహాన్ని వేళ్ళ చివర్లతో సుతారంగా అందుకున్నాడు. అది చూసి ఆ పక్కనే నిలబడి స్టాల్ చూసుకుంటున్న కుర్రవాడు ముందుకొచ్చాడు.

“ఏంటి తాతగారూ? జాగ్రత్తగా పట్టుకోండి… బొమ్మ పగలకొట్టినా డబ్బులు కట్టాలి.. అర్థం అయ్యిందా?” అన్నాడతను.

పూర్వం విగ్రహారాధన చేసే తండ్రిని ఎదిరించిన అబ్రహాం కథ గుర్తుకొచ్చింది బ్లూమ్‌కి. చిన్నతనంలోనే దేవుడు సర్వవ్యాప్తమై వున్నాడన్న సత్యం తెలుసుకున్న అబ్రహాం తన తండ్రి పూజించే విగ్రహాలని అన్నింటినీ పగలగొట్టాడు.

“నేను కాదు నాన్నా పగలకొట్టింది.. ఇదంతా ఆ పెద్ద విగ్రహం చేసిన పని. ఆ బొమ్మే కర్ర తీసుకోని మిగిలిన అన్నింటినీ పగలగొట్టింది..” అన్నాడు.

“విగ్రహాలు ఎక్కడైనా కదులుతాయట్రా?” అన్నాడు తండ్రి మరింత కోప్పడి.

“మరి కదలలేని విగ్రహాలకు పూజలెందుకు నాన్నా” అంటూ సమాధానం చెప్పాడు అబ్రహాం.

ఆ కథ అంతటితో అయిపోయింది. ఆ ప్రశ్నతో ఆ తండ్రికి జ్ఞానోదయమైందో లేక తన నమ్మకాల్నే ప్రశ్నించిన కొడుకుని మరింతగా కొట్టాడో తెలియదు. అందులోనూ, ఆ కాలంలో నమ్మకాలు ఇప్పటికన్నా పవిత్రంగానూ బలంగానూ వుండేవి కదా.

వినాయకుడి విగ్రహం చేతిలో పెట్టుకోనే ఇదంతా ఆలొచించాడు బ్లూమ్. ఆ ప్రతిమ అర్థ మిళిత నేత్రాలతో ప్రేమని కురిపించేలా వున్నాయి. ఆయన శరీరం ఎంత దృఢంగా  వుందంటే, ఆ బొమ్మే మన పక్కన వుంటే విజయం తధ్యమని అనిపిస్తోంది. నిజానికి  బ్లూమ్ ఇలాంటి ప్రతిమల్ని ఏనాడూ ముట్టుకోను కూడా లేదు. మతపరంగా నిషేదించిన విగ్రహారాధన చేస్తే ఏ పాపం చుట్టుకుంటుందో అని అతని భయం. ఇప్పుడు చేతిలో వున్న వినాయకుడి వైపు మళ్ళీ చూశాడు. గుండ్రంగా తిరుగుతూ బలంగా వున్న తొండం వైపు చూశాడు. సరిగ్గా అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు.

“నాకు ఇది కావాలి” అన్నాడు స్థిరంగా.

***

ఆ విగ్రహాన్ని తీసుకోని ఇంటికి వెళ్ళిన తరువాత ఎక్కడైనా దాచేయ్యాలని అనుకున్నాడు. ఆ బొమ్మని కళ్ళద్దాలు తుడుచుకునే మెత్తటి గుడ్డలలో చుట్టి, ప్లాస్టిక్ సంచిలో పెట్టి స్టోర్ రూమ్‌లో ఒక అరమర కింద భాగంలో, పగిలిపోయిన పాత్రల వెనక దాచిపెట్టాడు. కాని ఫలితం లేకపోయింది. అతని భార్య నిముషానికి ఒకసారి అదే అరమర తెరిచి ఏదో ఒక వస్తువు తీసుకోవడమో, లేకపోతే పిల్లలు ఆడుకుంటూ ఆ తలుపులు తీసి వదిలేయడం చేస్తుండటంతో దాన్ని అక్కడి నుంచి తీసేయ్యాలనుకున్నాడు. ఆ గది దగ్గరకు వెళ్ళినప్పుడల్లా చుట్టిపెట్టిన సంచీ చిరుగులలోంచి వినాయకుడి తొండం బయటికి వచ్చి, తననే పిలుస్తున్నట్లుగా అనిపించేది.

“ఆయన పూజలు కావాలని అడుగుతున్నట్లున్నాడు” అనుకున్నాడు బ్లూమ్. “దేవుడు కదా… అలాంటి కోరిక వుండటం సహజమే” అని సర్ది చెప్పుకున్నాడు.

“అయితే ఆయన్ను ఎలా పూజించాలి?” బ్లూమ్ కి ఏం తోచలేదు. ఇంతకు ముందెపుడూ విగ్రహాన్ని పూజించనే లేదు కదా. అసలు ఎలా చెయ్యాలో కూడా తెలియదైపోయే. బైబిల్ తీసి ఒకసారి తిరగేశాడు. “దేని రూపమునైననూ విగ్రహమైనైననూ నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు” అని వుంది. ఇంకొక చోట “మంటి (మట్టి) బలిపీఠమును నా కొరకు చేసి, దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను నీ గొర్రలను నీ ఎద్దులను అర్పింపవలెను” అని కూడ వుంది.  బ్లూమ్ దగ్గర గొర్రలూ లేవు, ఎద్దులూ లేవు. అలాగని వృత్తిపరంగా వాటికి సమానమైనవి బలిగా తగలపెట్టడం భావ్యం కాదనిపించింది. ఒకసారి పొరపాటున ఒక జత కళ్ళద్దాలు తగలబడితేనే వాటి వాసననే భరించలేకపోయాడు. అంతకన్నా శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థించడమే తేలిక అని అనిపించింది.

బ్లూమ్ ఆ స్టోర్ రూమ్‌ లోకి ఎవరూ రాకుండా తలుపులు వేశాడు. ఆ వినాయకుణ్ణి తీసి అక్కడే వున్న ఒక వెదురు స్టూల్ మీద వుంచాడు. అప్పుడే వినాయకుడి కళ్ళలో సంతోషం, తను చెయ్యబోతున్న పనికి ఆమోదం కనిపించాయి ఆతనికి. జాగ్రత్తగా మోకాళ్ళ నొప్పులు బాధించకుండా మోకరిల్లి, ముందుకు వంగి నుదిటిని నేలకి ఆనించి తన ప్రార్థన మొదలుపెట్టాడు.

“ఓ గణేశా… నీ రాకతో మా ఇంటిని పావనం చేసిన నీకు నా కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాను. ఈ ఇంటిలో వున్నవారందరినీ నీవు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మరీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మా అమ్మాయి జూడీ లా పరీక్షలలో నీవు సహాయము చెయ్యాలి. ఆ పిల్లకి ఆ లా పుస్తకాలు, సెక్షన్లు అవీ కష్టం అనిపిస్తున్నాయట… ఓ వినాయకా..” అంటూ ఇంకా ఏదో చెప్పాలని అనుకుంటూనే మళ్ళీ మోకాళ్ళ మీదకు లేవబోయాడు. అతని నడుము మాత్రం అతని ప్రార్థనకి సహకరించలేదు. ఎడమ వైపు నడుముకి కొంచెం కింద నరం పట్టేసినట్లై కలుక్కుమనడంతో మళ్ళీ ముందుకే వంగాడు. ఇక లేవనూ లేడు, అలా వుండనూ లేడు. ఓ ఇరవై నిముషాల తరువాత అతని భార్య వచ్చి చూసేదాకా అలాగే, అదే భంగిమలో వున్నాడు  బ్లూమ్.

“బ్లూమ్…!! ఏం చేస్తున్నావక్కడ?” అంటూ అరిచింది ఆమె.

“శాండ్రా… సమయానికి వచ్చావు… నా నడుము మళ్ళీ పట్టేసింది. ఆ అమృతాంజనం తెచ్చిస్తావా” అన్నాడతను. ఆమె అటు వెళ్ళగానే పాక్కుంటూనైనా సరే ఆ వినాయకుణ్ణి మళ్ళీ అలమరలో దాచేయ్యాలని అతని ఆలోచన. కానీ శాండ్రా అతనికంటే రెండాకులు ఎక్కువే తిన్నట్లుంది.

Akkadi MeghamFeatured

“బ్లూమ్… అది విగ్రహమే కదూ. నువ్వు మన ఇంట్లో విగ్రహారాధన చేస్తున్నావా? ఒక పక్క నేను అంట్లు తోముకుంటూ, అతిధులు వస్తారని పరుగులు తీస్తుంటే నువ్వు ఇక్కడ..” అంటుండగానే అందుకున్నాడు బ్లూమ్.

“శాండ్రా… ఎందుకు ఎలా అనుకుంటున్నావు? నేను విగ్రహానికి ఎందుకు మొక్కుతాను? ఈ విగ్రహం బజార్లో అమ్ముతుంటే చూశాను. ఇదిగో ఈ గది గోడలకి వేసిన రంగులకి మంచి మాచింగ్ అవుతుందని కొన్నాను…” అన్నాడు. ఇరవై ఏళ్ళ సంసారంలో  బ్లూమ్ ఇలాంటి ఇంటి విషయాలు పట్టించుకున్నదే లేదు. అలాంటప్పుడు మిసెస్ బ్లూమ్ అతని మాటల్ని ఎలా నమ్ముతుంది? అయినా అతను వదల్లేదు. “ఇది ఎక్కడపెడదామా అని చూస్తూ వున్నాను.. ఇంతలో తూలి ముందుకు పడ్డాను… నడుం పట్టేసింది..” అన్నాడు.

శాండ్రా నమ్మీ నమ్మనట్లు తలాడించింది.

” ప్లీజ్ శాండ్రా… అమృతాంజనం…” అన్నాడతను మాట మారుస్తూ. శాండ్రా మాట కరుకేకానీ మనసు వెన్న. అందుకే అమృతాంజనం తీసుకురావాలని బాత్రూమ్ వైపు పరుగెత్తింది.

ఇదే అవకాశం అని వినాయకుడి బొమ్మని తీసి ఇంతకు ముందున్న సంచిలో పెట్టాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు బ్లూమ్. అప్పటికే చిరిగిపోయిన ఆ సంచిలో నున్నగా జారిపోతున్న బొమ్మ పట్టలేదు. శాండ్రా తిరిగి వచ్చేసరికి వినాయకుడి బొమ్మ ఇంకా అక్కడే నేలమీదే వుంది. పాపం ఆమె బ్లూమ్ నడుము మీద అమృతాంజనం పూసి నెమ్మదిగా మర్దనా చేస్తూ వినాయకుడి బొమ్మ వైపే చూస్తూ వుండిపోయింది. చివరికి ఘాటైన అమృతాంజనం వాసన వస్తున్న చేతులతోనే వినాయకుడి బొమ్మను తీసుకోని పరీక్షగా చూసింది.

“నాకు తెలిసి ఈ బొమ్మ హాల్లో పెడితేనే బాగుంటుందనుకుంటా… చాలా ప్రాచీనంగా కనిపిస్తోంది కదా, అక్కడ బాగుంటుంది…” అంది.

అలా ఆ వినాయకుడి స్థానం ఆ ఇంటి నట్టింట్లోకి మారింది.

***

అందరి పిల్లల్లాగే వాళ్ళ పిల్లలు కూడా అభ్యంతరం చెప్పారు.

“ఆ బొమ్మ నన్నే చూస్తున్నట్లు అనిపిస్తోంది…” అంది జూడీ మర్నాడు బ్రెడ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు.

డెవిడ్ స్కూల్ బాగ్ అందుకుంటూ వేలితో బొమ్మని తాకి – “దీని నిండా మురికి వున్నట్టుంది..” అన్నాడు.

“ఆ విగ్రహం లోపలంతా ఖాళీ… ఏం వుండదు… ఆయన పేరు గణేశ” చెప్పాడు బ్లూమ్. అందమైన పసిపిల్లల్ని ఇలాంటి మాటలనే టీనేజర్లుగా ఎందుకు మారుస్తావు భగవంతుడా అనుకున్నాడు మనసులో.

డేవిడ్ చిత్రంగా కళ్ళు తిప్పాడు. జూడీ నిట్టూర్చింది. ఇద్దరూ స్కూల్‌కి బయల్దేరారు. బ్లూమ్ బ్రేక్‌ఫాస్ట్ గిన్నెలు వంటింటిలోకి తీసుకెళ్తూ ఒక్క క్షణం వినాయకుడి బొమ్మ దగ్గర ఆగాడు. ఒక చిన్న బ్రెడ్ ముక్కను తుంచి ఆ ప్రతిమ దగ్గర సాసర్‌లో వుంచి, తల వంచి నమస్కరించాడు.

ఆ వినాయకుడి బొమ్మ వచ్చిన తరువాత అతని జీవితం బాగున్నట్టు గుర్తించాడు. మిసెస్ రోసెన్‌బ్లట్ అని పెద్ద డ్రై ఫ్రూట్ కంపెనీ అధిపతి భార్య, నాలుగుదఫాలుగా వస్తానని రాకుండా ఎగ్గొడుతోంది. బ్లూమ్ ఆమెకు ఫోన్ చేసినప్పుడు కోపంతో అరిచి బెదిరించలేదు. మనసులో ఒక ప్రశాంతత, స్థిరత్వం ధ్వనిస్తుండగా ఏ మాత్రం జంకకుండా మాట్లాడటం మొదలుపెట్టాడు.

“మిసెస్ రోసెన్‌బ్లట్, మీ అపాయింట్‌మెంట్ సాయంత్రం నాలుగున్నరకి మార్చబడింది. సరిగ్గా నాలుగున్నరకి నా షాప్ ముందు మీరు లేకపోతే బ్లూమ్ ఆప్టిసియన్ మీకు ఎలాంటి సహాయము…”

“అది కాదండీ…” మధ్యలో మాట్లాడబోయింది ఆమె.

“మీరేం చెప్పాల్సిన పనిలేదు…”

“లేదండీ… హలో…”

“థ్యాంక్ యూ, గుడ్ డే…” పెట్టాశాడు బ్లూమ్. సరిగ్గా నాలుగున్నరకి ఠంచనుగా, బిక్కు బిక్కు మంటూ వచ్చింది మిసెస్ రోసెన్‌బ్లట్. ఆమెను కళ్ళు పరీక్షించే టెస్టింగ్ రూమ్‌కి పంపిస్తూనే, నిశబ్దంగా వినాయకుడికి మొక్కాడు.

క్రమంగా ఆ కుటుంబం మొత్తం ఆ దేవుడి మీద ఇష్టం పెంచుకోవడం మొదలైంది. ఆ గణేషుడి చల్లని చూపులు ఆ ఇల్లు మొత్తం ప్రసరిస్తూ వుండేవి. ఇప్పుడు శాండ్రా తో పాటు పిల్లలు కూడా ఎక్కువ సమయం ఆ గదిలోనే గడుపుతున్నారని బ్లూమ్ గ్రహించాడు. జూడీ ఇప్పటికీ నమ్మనట్టే వుంటోంది కానీ మాడ్యూల్ పరీక్షలు రాయటానికి వెళ్ళే రోజు వుదయం మాత్రం తన కోటుపైన బాడ్జి తీసి వినాయకుడి ముందు వుంచింది. ఆ విషయాన్ని బ్లూమ్ గమనిస్తే, ఏమీ ఎరగనట్టు భుజాలు ఎగరేసి – “లక్ కోసం నాన్న” అంది. అయితే ఆ పరీక్షలలో జూడీ ఆమె టీచర్లు అనుకున్నదానికన్నా బాగా రాయటంతో ఆ నమ్మకం ఇంకా బలంగా తయారైంది. ఆమే కాదు, కుటుంబం మొత్తం ఆ వినాయకుడి ప్రతిమని భక్తిగా చూడటం మొదలుపెట్టారు.

మొదట్లో బ్లూమ్ కుటుంబ సభ్యులెవరూ వినాయకుడి గురించి బయట ఎక్కడా అనలేదు. కానీ వాళ్ళుండే హెండన్ ప్రదేశంలో రహస్యాలకు చోటే లేదు. బహుశా జూడీ స్నేహితురాలు మికైలా ఇంటికి వచ్చినప్పుడు, జూడీ హోంవర్క్ చెయ్యడానికి ముందు ప్రతిసారీ ఆ దేవుడి ముందు గుప్పెడు బ్రెడ్ ముక్కలు నైవేద్యం పెట్టడం చూసినట్లుంది. డేవిడ్ స్నేహితుడు బెంజీ కూడా, కప్యూటర్ టెన్నిస్ గేం ఆడుతూ ఫైనల్ రౌండ్‌కి వచ్చిన ప్రతిసారీ డేవిడ్ ఆ విగ్రహాన్ని తాకుతున్న సంగతి గమనించాడు. ఇంకేముంది.. ఒకరి నుంచి ఒకరికి అక్కడి నుంచి ముగ్గురికి అలా అలా హెండన్ మొత్తానికి తెలిసిపోయింది. “ఆ బ్లూమ్స్ లేరూ – అదే కళ్ళజోళ్ళు అమ్మే బ్లూమ్ కుటుంబం… అవును శాండ్రా బ్లూమ్ అనే ఆవిడ, అదే వాళ్ళాబ్బాయి డేవిడ్ బ్లూమ్ అనే పిల్లాడు… వాళ్ళేనండీ – వాళ్ళింట్లో ఒక విగ్రహముందట.”

ఒక సాంప్రదాయకుడైన యూదుని ఇంట్లోకి విగ్రహాన్ని తీసుకురావటాన్ని క్షమించిన దాఖలాలు బైబిల్‌లో లేవు. అందుకే కదా బంగారు ఆవుదూడ విగ్రహానికి పూజ చేశారని 3000 మందిని పొట్టనపెట్టుకున్నారు? జెస్‌బెల్ ఇలాంటి తప్పు చేసినందునే కదా కిటికీ గుండా గిరాటు వేసి కుక్కలకు బలి చేశారు. ఇక్కడ వున్న కౌన్సిల్ కూడా ఈ విషయంలో రాజీ పడే అవకాశమేలేదు.  బ్లూమ్ ఇలా అనుకున్నాడో లేదో ఆ రాత్రే అతనికి ఫోన్ వచ్చింది. చర్చిలో వుండే రబ్బీ (మతపెద్ద)ని వీలైంనంత త్వరగా వచ్చి కలవాలన్నది ఆ ఫోన్ సారాంశం.

***

ఆ వూరి రబ్బి చాలా చిన్నవాడు. ఈ మధ్యనే అతని మతపరమైన విద్యాభ్యాసం పూర్తైంది. అయినప్పటికీ అతను కుదురుగా పెంచిన గడ్డంతో, హుందాగా ఎంతో మర్యాదస్తుడిలా కనిపించాడు బ్లూమ్‌కి.

పిలిపించాడేకానీ మాట్లాడటానికి చాలా సేపు తటపటాయించాడు రబ్బీ. – “అదే.. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని పిలిపించాను… అదే ఆ విగ్రహం గురించి..” అన్నాడు

“సరే మాట్లాడండి” అన్నాడు బ్లూమ్. అతను ఏ మాత్రం ఖంగారు పడలేదు. వినాయకుడి విగ్రహం అతని జీవితంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఇలాంటి విపర్యాలకి అతను ఏ మాత్రం చెలించడంలేదు.

“అవును అదే… విషయం ఏమిటంటే బ్లూమ్‌గారూ… బయట చాలామంది అనుకుంటున్నారు, మీకు తెలిసే వుంటుంది లెండి… అంటే నేను అవన్నీ పట్టించుకుంటున్నానని కాదు కానీ మీలాంటి బాధ్యత కలిగిన వాళ్ళు… పైగా మీరు మన ఆరాధనా సమాజానికి ట్రస్టీ కూడా కదా…” అన్నాడు రబ్బి తడబడుతూ.

“మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పండి” అన్నాడు బ్లూమ్ మరింత స్థిరంగా.

బ్లూమ్ తీరు మరింత ఖంగారు పెట్టడంతో రబ్బీ గబగబా మాట్లాడటం మొదలుపెట్టాడు.

“అదే అదే.. ఆ విగ్రహం గురించి.. మిస్టర్ బ్లూమ్ మీలాంటి ఆరాధనా సమాజం సభ్యుల వద్ద అలాంటిది వుండకూడదు..”

“ఏది?”

“అదే”

“వినాయకుడా?” రెట్టించాడు బ్లూమ్.

“కాదు విగ్రహం… మీలాంటి పెద్దమనుషులు అలాంటివి ఇంట్లో వుంచుకోకూడదు… దాన్నీ తీసిపారేయండి” చెప్పడాయన.

బ్లూమ్ క్షణ కాలం వినాయకుడు తన ఇంటికి వచ్చిన తరువాత వచ్చిన మార్పులను గుర్తుచేసుకున్నాడు. అక్కడికేదో అద్భుతాలు జరిగాయని కాదు. ఇప్పటికీ అతని కుటుంబ సభ్యులు పోట్లాడుకుంటారు, అరుచుకుంటారు, అప్పుడప్పుడూ అపశృతులు వుంటూనే వుంటాయి. కానీ ఆ గజముఖుడు ఉండటం వల్ల కుటుంబం మొత్తంలో ఏదో శక్తి ప్రవేశించినట్లు అనిపిస్తోంది. అది అతని వూహే అయ్యివుండచ్చుగాక అయినా సరే ఆ దేవుణ్ణి వదులుకోవడం ఇష్టం లేదు అతనికి.

“నేను ఆ విగ్రహాన్ని తీసెయ్యలేను” స్థిరంగా చెప్పాడు రబ్బీతో.

రబ్బీ ఆ మాట వింటూనే కళ్ళు చిట్లించి అపనమ్మకంగా ముందుకు వంగాడు.

“అలాకాదు మిస్టర్ బ్లూమ్ మనం కలిసి దీనికి సమాధానం వెతుకుదాం… అయినా నాకూ తెలుసు మీకూ తెలుసు… విగ్రహం ఇంట్లో వున్నంత మత్రాన మీరు దానికేం పూజలు చెయ్యరనుకోండి, అయినా చూసేవారికి ఇదంతా పెద్ద తప్పులా అనిపించకుండా ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి కదా..” అనూనయించబోయాడు.

“నేను చేస్తున్నానుగా” చెప్పాడు బ్లూమ్

“ఏమిటి? అలాంటి ప్రయత్నం చేస్తున్నారా?” అన్నాడు రబ్బీ తృప్తిగా.

“నేను చెప్పేది ప్రయత్నం చేస్తున్నానని కాదు… పూజ చేస్తున్నానని చెప్తున్నాను” సరి చేశాడు  బ్లూమ్.

ఆ మాటలు ముఖానికి కొట్టినట్లు అనిపించండంతో ఏం పాలుపోక వెనక్కి జారిగిలపడ్డాడు రబ్బీ. చాలా సేపు ఏం మాట్లాడకుండా వుండి తరువాత – “ఈ విషయం గురించి మనం మళ్ళీ చర్చించాలి. రేపు ఒకసారి రాగలరా?” అన్నాడు నీళ్ళు నములుతూ.

ఆ మర్నాడు రబ్బీ  బ్లూమ్‌కి మళ్ళీ ఫోన్ చేసి మధ్యాహ్నంగా ఆరాధనా మందిరానికి పిలిపించాడు.

“మిస్టర్ బ్లూమ్ మీతో దేవుడి గురించి చర్చించాలి” అన్నాడు ఖంగారుగా. బ్లూమ్ చిన్నగా నవ్వి –

“అది మీకు బాగా తెలిసిన సబ్జక్ట్ రబ్బీగారూ, నాకేం తెలుసు” అన్నాడు. దానికి రబ్బీ కూడా చిన్నగా నవ్వాడు.

“సరే సరే.. కాకపోతే మిస్టర్ బ్లూమ్…  ప్రభువు విగ్రహారాధన గురించి ప్రత్యేకంగా చెప్పియున్నాడు. రెండొవ ఆజ్ఞ గుర్తులేదా? ‘మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు’, ‘దేని రూపమునయనను విగ్రహమైనయినను నీవు చేసికొనకూడదు’ అని చాలా స్పష్టంగా చెప్పబడివుంది.”

బ్లూమ్ సన్నగా తలవూపాడు.

“అలాంటిది మీరు ఆ విగ్రహానికి పూజలు చేస్తానని చెప్తూ ఈ సమాజం బోర్డులో ఎలా వుంటున్నారో నాకర్థం కావటంలేదు… ఇలాగైతే మిమ్మల్ని ఈ ఆరాధనా సమాజంలోనికి రానివ్వడం కూడా కుదరకపోవచ్చు..”

“అదేమిటండీ… నేను అన్ని నియమాలు పాటిస్తున్నాను. ప్రభువునీ ఆరాధిస్తున్నాను. నా మతం ఇప్పటికీ యూదు మతమే కదా” అన్నాడు  బ్లూమ్ కొంచెం ఆవేశంగా.

రబ్బి అందుకు సమాధానంగా నవ్వి చేతులు వెడల్పుగా చాస్తూ బైబిల్‌లోని మరో వాక్యాన్ని చదివాడు. “మీ దేవుడను యావేను అయిన నేను అసూయగలవాడను”

బ్లూమ్ ఒకసారి వినాయకుణ్ణి, అతని కరుణ పూరితమైన కళ్ళను గుర్తుచేసుకున్నాదు.

“దేవుడు నిజంగా గొప్పవాడైతే… ఆయనకు అసూయ ఎందుకు వుంటుంది? ఇలాంటి రాగద్వేషాలకు అతను అతీతుడు కదా?” సూటిగా అడిగాడు.

రబ్బీ ముఖం పాలిపోయింది. “ఈ విషయం గురించి మనం ఇంకా మాట్లాడాలి మిస్టర్ బ్లూమ్.. రేపు మళ్ళీ కలుద్దాం” అన్నాడు.

మూడోరోజు  బ్లూమ్‌కి మళ్ళీ ఫోన్ వచ్చింది. అదీ తెల్లవారుఝామునే. అంత పొద్దున్నే ఫోన్ చేసినందుకు రబ్బీ క్షమాపణ అడిగి చెప్పాడు –

“మిస్టర్ బ్లూమ్.. మీరు చెప్పిన విషయం గురించి రాత్రంతా తీవ్రంగా ఆలోచించాను. నేను ఒకసారి ఆ విగ్రహాన్ని చూడాలి. మీరు ఇప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకోని మన ఆరాధనా మందిరానికి రాగలరా? అలా చేస్తే అన్ని సమస్యలను అక్కడే పరిష్కరించుకుందాం..”

బ్లూమ్ అందుకు అంగీకరించాడు. ఎన్ని వివాదాలైన తను ఒక యూదుడే కదా, ఆ ప్రార్థనా మందిరం వల్ల, రబ్బీ వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందిన మాటకూడా నిజమే. ఆ విగ్రహం విషయంలో రబ్బీ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా అతనికి గౌరవభంగం కలిగించే పని చెయ్యకూడదని అనుకున్నాడు.

ఆ వినాయకుడి విగ్రహాన్ని మెత్తటి దుప్పటిలో చుట్టి, చిన్న చేతి సంచిలో పెట్టాడు బ్లూమ్. అలా చుడుతున్నప్పుడు కూడా వినాయకుడి నున్నని తోండాన్ని ఒక్కసారి ప్రేమగా నెమిరాడు. బైబిల్ కథల్లో ఎలీజా అనే మేధావిలా రబ్బీ కూడా దేవుడితో వాదప్రతివాదాలు చేస్తాడా అని అనుమానం వచ్చింది. అలా నిజంగా జరిగితే దేముడు ఏం సమాధానాలు చెప్తాడో అని ఆసక్తి కలిగింది.

బ్లూమ్ ప్రార్థనామందిరానికి చేరేసరికే రబ్బీ గుమ్మంలో నిలబడి ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఎళ్ళుగా ప్రార్థనలు, గీతాలను తనలో నిక్షిప్తం చేసుకున్న ఆ పురాతన మందిరంలోనికి  బూమ్‌ను తీసుకెళ్ళాడు. మామూలుగా వసారాగుండా ప్రధాన మందిరంలోకి వెళ్లే దారిలో కాకుండా, దేవదారు మెట్లద్వారా పై అంతస్తులోని పాటకులు కూర్చుండే గదిలోకి తీసుకెళ్ళాడు. సరిగ్గా పవిత్రమైన గదికి పైన వున్న ఆ గదిలోనే పాతనిబంధనము తాలూకు వ్రాతప్రతులు వుంచబడ్డాయి. అక్కడి నుంచి చూస్తే చర్చిలోని ప్రార్థనా మందిరం మొత్తం, అక్కడ వేయబడిన కుర్చీలతో సహా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాలలో ఆ కుర్చీలు మొత్తం భక్తితో వచ్చే వందలాది యూదులతో నిండిపోయి వుంటాయి.

రబ్బీ ఆ పాటకులగది కిటికీ తలుపులు బయటకు తెరిచి గట్టిగా రెండు మూడుసార్లు శ్వాస తీసుకోని ఆ తరువాత బ్లూమ్ వైపు తిరిగాడు. “ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారా?” అడిగాడు. బ్లూమ్ అవునన్నట్లు తలాడించాడు. రబ్బీ మనసులో కూడా అలజడి తగ్గి స్థిరంగా వున్నట్టు బ్లూమ్ గుర్తించాడు.

“ఏది నన్ను చూడనివ్వండి” అన్నాడు రబ్బీ.

బ్లూమ్ తన చేతిసంచిలో వున్న దేవుణ్ణి బయటకు తీసి, చుట్టివున్న మెత్తటి గుడ్డని తొలగించి, వినాయకుణ్ణి సుతారంగా పట్టుకున్నాడు. కొన్న రోజుకన్నా ఈ రోజు విగ్రహం బరువు పెరిగినట్లుగా అతనికి అనిపించింది.

రబ్బి భృకుటి ముడిపడింది.

“ఇది కేవలం ఒక మనిషి తయారు చేసిన బొమ్మ. ఆ విషయం మీకు అర్థం అవుతోందా మిస్టర్ బ్లూమ్? ఇందులో చైనా మట్టి, పెయింటు తప్ప ఇంకేమి లేదు. మనకి మనమే తయారు చేసుకున్న ఇలాంటి వస్తువుకి మనం ఎలా మొక్కగలం చెప్పండి?” అన్నాడు.

రబ్బీకి అర్థం అయ్యేలా సమాధానం చెప్పడం అసాధ్యమనిపించి బ్లూమ్ భుజాలు ఎగరేశాడు. చివరికి ఎదో ఒక సమాధానం చెప్పాలని – “నా కళ్ళను, మనసును నమ్మి పని చేస్తున్నాను అంతే..” అన్నాడు. అనడానికైతే అన్నాడు కానీ, తను చెప్పాలకున్నదాంట్లో కనీసం పదోవంతు కూడా చెప్పలేకపోయాడని అతనికి అర్థం అయ్యింది.

చాలా సేపు రబ్బీ బ్లూమ్ వంకే చూస్తూ వుండిపోయాడు. ఆ తరువాత చిన్న చిరునవ్వుతో అతని దగ్గరకు వచ్చి అతని భుజాలమీద చెయ్యివేసి నడిపించుకుంటూ కిటికీ దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ ప్రార్థనామందిరం ఎత్తైన ప్రదేశంలో కట్టబడటం వల్ల ఆ మరకలు పడ్డ కిటికీ అద్దాలలోంచి చూడగలిగితే హెండన్ నగరం మొత్తం కనపడుతుంది.

“ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీకు తెలుసుకదా?” అడిగాడు రబ్బీ.

బ్లూమ్ నిశబ్దంగా తలాడించి ప్రశాంతమైన వినాయకుడి ముఖం వైపు చూశాడు.

“ఇలాంటి సమస్య నాకు ఎప్పుడూ ఎదురుకాలేదు… అందుకే నిర్ణయం తీసుకునే ముందు నా కన్న పెద్దవాళ్ళను కూడా సంప్రదించాల్సి వచ్చింది..” చెప్పుకుపోతున్నాడు రబ్బి. బ్లూమ్ తలాడిస్తూనే వున్నాడు.

“పెద్దలంతా ఒకే అభిప్రాయం తెలిపారు. మీరు అర్థం చేసుకోవాలి మిస్టర్ బ్లూమ్.. మేం తీసుకున్న నిర్ణయం మీకు మంచే చేస్తుంది..” అన్నాడతను. అంతే… అప్పటిదాకా నెమ్మదిగా మట్లాడుతున్నవాడల్లా ఒక్క ఉదుటున, బ్లూమ్‌కి ప్రతిఘటించే అవకాశం కూడా లేకుండా చప్పున ఆ విగ్రహాన్ని లాగేసుకున్నాడు. ఆ విగ్రహాన్ని ఒక్క క్షణంపాటు తన శరీరానికి దగ్గరగా హత్తుకున్నాడు. ఆ తరువాత కిటికీకి వున్న చిన్న ఖాళీలోనుంచి ఆ విగ్రహాన్ని కిందకి జారవిడిచాడు. భళ్ళున పగిలిన శబ్దం. ఆ కిటికీ కింద వున్న ప్రాంతంలో వినాయకుడి విగ్రహం వెయ్యి ముక్కలై పరుచుకుంది.

“మిస్టర్ బ్లూమ్ ఇప్పుడు ఆ తిరుగుబాటు చిహ్నం బద్దలైపోయింది… మీకు కూడా ప్రశాంతంగా అనిపిస్తోందా?” అడిగాడు రబ్బీ దగ్గరగా వచ్చి.

బ్లూమ్ సమాధానం చెప్పలేదు. కిటికీ దగ్గరగా వెళ్ళి కిందకి తొంగి చూశాడు. వినాయకుడు కింద పడిన చోటు చుట్టూ గులాబి రంగు శకలాలు పరుచుకోని మెరుస్తూ కనిపించాయి. రబ్బీని తప్పించుకుంటూ ఆ కిటికీ నుంచి దూరంగా జరిగి ఇంటి వైపు అడుగులేశాడు బ్లూమ్.

***

గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రార్థనా మందిరానికి కోశాధికారిగా వ్యవహరించిన బ్లూమ్ అప్పటికి ఏం మాట్లాడకుండా వున్నా ఆ తరువాత, బాగా చీకటిపడిన తరువాత మందిరం వెనుక వున్న ఇనుప గేటు తీసుకోని నిశబ్దంగా అడుగుపెట్టాడు. వచ్చేటప్పుడు ఇంటినుంచి తనతోపాటు గుడ్డ బ్రష్, నగిషీలు చెక్కిన చిన్న చెక్క పెట్ట, ఇంకా సంచిలో ఏవో బరువైన వస్తువులు తెచ్చుకున్నాడు. వినాయకుడు పడి పగిలిపోయిన చోట చుట్టూ తిరుగుతూ బ్రషతో ముక్కలను చెక్కపెట్టలోకి చేర్చుకున్నాడు. ఆ తరువాత ఆ పక్కనే వున్న పూలమొక్కల మధ్యలో ఒక చిన్న గుంత తొవ్వి అందులో ఆ పెట్టను వుంచి మట్టితో కప్పేశాడు. అక్కడే నిలబడి వినాయకుడితో ఏదన్నా చెప్పాలా అని ఆలోచింఛాడు కానీ, ఏం చెప్పాలో తెలియక మిన్నకున్నాడు.

ఆ తరువాత అలాగే చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా నడుస్తూ ప్రధాన ద్వారం తెరిచి ప్రార్థనా మందిరంలోకి జారుకున్నాడు. ఇంత రాత్రివేళ ఒంటరిగా అదీ ఎలాంటి స్పష్టమైన అవసరం లేకుండా ఈ మందిరంలో అడుగుపెట్టడం అతనికి ఇదే మొదటిసారి. ఒక్క క్షణం అక్కడే ఆగి ఆ ప్రాంతం అతనికి ఎన్ని గంటల ప్రశాంతతనిచ్చిందో గుర్తుచేసుకున్నాడు. తన సంతోషంలో, బాధలో ఇదే ప్రదేశంలో విన్న ప్రార్థనలు, ప్రత్యేక స్వరంలో పాడిన గీతాలు అన్నీ జ్ఞప్తికి వచ్చాయి.

మర్నాడు ఉదయం ఆ మత పెద్దలు అక్కడికి వచ్చేసరికి తలుపులు తాళాలు వేసి వుండటం, ఆ తాళాలకు మైనం కూరి వుండటం చూసి ఆశ్చర్యపోయారు. ఏదో అనర్థం జరిగి వుంటుందని వూహిస్తూనే తాళాలు బాగుచేసేవారిని పిలిపించి ఆ తాళాలను పగులకొట్టించారు. అప్పటికే అక్కడ జరిగే వింత చూడటానికి గుమికూడిన జనంతో సహా ఆ పెద్దలంతా లోపలికి అడుగుపెట్టి, లోపల జరిగింది చూసి నిశ్చేష్టులైయ్యారు.

లోపల అంతా విధ్వంసం జరిగినట్టు వుంది. అక్కడ బల్లలు విరిగిపోయి, కర్టన్లు చినిగిపోయి, దీపపుసెమ్మలు వంగిపోయి, అద్దాలు పగిలిపోయి వున్నాయి. వాటన్నింటి మధ్యలో చేతిలో గొడ్డలితో అలసిపోయి ఆయాసపడుతూ వున్నాడు – బ్లూమ్. చమటతో అతని బట్టలు తడిసిపోయి వున్నాయి.

“ఇదంతా నువ్వే చేశావా?” ఆడిగారు వాళ్ళు.

“నేనా? నేను కాదు.. ఇదంతా ఆ భగవంతుడు చేశాడు..” చెప్పాడతను.

వాళ్ళు మళ్ళీ చుట్టూ కలియచూశారు. విరిగిన బల్లలన్నింటి మీద గొడ్డలి గుర్తులు కనిపిస్తున్నాయి. పరదాలన్నింటి పైనా ఒక మనిషి అరచేత్తో చించినట్లు గుర్తులున్నాయి.

“దేవుడు చేశాడా? దేవుడు ఇలాంటివి ఎలా చెయ్యగలడు?” అడిగారు వాళ్ళు.

“ఇది కూడా చెయ్యలేని దేవుణ్ణి కొలవాల్సిన పనేముంది?” ప్రశ్నించాడు అతను.

ఇంతవరకే తెలుసు. అతను అడిగిన ఈ ప్రశ్నవల్ల అక్కడున్న మనుషులకు జ్ఞానోదయం అయ్యిందా లేదా అనే విషయం మాత్రం తెలియలేదు.

 మూలం: నయోమి ఆల్డర్మెన్

అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్

  64_1naomi_aldermanలండన్ లో పుట్టిన నయోమి ఆల్డర్మెన్  ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ తరువాత సాహిత్యంలో పట్టభద్రులై ప్రస్తుతం బాత్ స్పా యూనివర్సిటీలో కాల్పనిక సాహిత్యం బోధిస్తున్నారు. 2007లో ఈమె సండే టైమ్స్ పత్రిక “యంగ్ రైటర్ ఆఫ్ ద ఇయర్” అవార్డును సాధించి, ఆ తరువాత వాటర్ స్టోన్స్ సంస్థ ప్రకటించిన “25 రైటర్స్ ఫర్ ది ఫ్యూచర్” జాబితాలో స్థానం సంపాదించారు. ఈమె రాసిన నవలలో “డిస్ ఒబీడియన్స్”, “ది లయర్స్ గాస్పెల్” వంటివి ఈమెకు పేరుతో పాటు ఎన్నో వివాదాలను కూడా అందించాయి. ప్రస్తుతం మీరు చదవబోయే “పరాయిదేవుడు” కూడా అలాంటిదే. 2009 రాసిన ఈ కథ ఆ సంవత్సరం బీబీసి నేషనల్ స్టోరీ అవార్డ్ గెలుచుకుంది.

అనుబంధాల టెక్నాలజీ

chinnakatha
‘ప్చ్’ అన్నాడు అప్రయత్నంగా శేషాచలం.
‘ఏమిటి శేషు అంత నిరాశ గా వున్నావు” పార్కులో పక్కనే కూర్చున్న రామనాధం అన్నాడు శేషాచలం తో.
“ఏమిటో చాలా విషయాలు అర్థం కావటం లేదు”
“రిటైర్ అయినవాళ్ళం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసినవాళ్ళం, ఇప్పుడు అర్థం కాని విషయాలు ఏముంటాయి?” నవ్వుతూ అన్నాడు రామనాధం.
“అది మనజీవితం రామూ, సమస్యలు వచ్చాయి…ప్రయత్నం చేసాము, కష్ట పడ్డాము…ఎన్నో ఎదుర్కున్నాము. కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్నది చిత్రమైన సమస్య….”
“నాకు తెలియకుండా నీకు వచ్చిన చిత్రమైన సమస్య ఏమిటో”
“చిన్నప్పుడు మనమెలా పెరిగామో ఒక సారి గుర్తు చేసుకో.”
“ఎలా పెరిగాము …గవర్నమెంటు స్కూలులో పాఠాలు, రాత్రి పూట నాన్నమ్మ చెప్పే రామాయణ కథలూ, తాతగారితో షికారు వెళ్ళినప్పుడు చెప్పే పులి వేట కథలూ…చెరువులో చేపలు పట్టడం ….. మామిడి చెట్టెక్కి కాయలు కోయడం…ఇంకా గోళీల ఆట, జిల్లకోడి అంటూ కట్టేని ఎగర కొట్టడం….ఓహ్ …ఎంత బాగుండేది కదా”
“అవును కదా ….ఇన్ని విశేషాలతో పెరిగిన మనం ….మన సాంప్రదాయాలు ఎన్నో తెలుసు కున్నాం. మరి ఈతరం వాళ్లకు ఏమి చెప్పబోయినా, ఏది నేర్పబోయినా ఎందుకు నచ్చడం లేదు? పైగా ఈ వయసులో మనవాళ్ళకు దగ్గర కావాలని, వాళ్ళతో ఆడుకోవాలని అనిపిస్తుంది కదా….’
“ఓహ్ ..అదా నీసమస్య…..కాలం మారిందిరా..’
“మారింది కానీ పెద్దమనవడికీ..చిన్న మనవడికీ..మద్య కాలం కూడా చాలా మారింది..”
“ఎలా ?”
“ఇలా ……”

“ఎందుకు విరాజ్ ఇలా ?” అన్నాడు శేషాచలం
“నేనేమీ చెయ్యలేను నాన్నా” చేతులు పైకి ఎత్తేసి అంటూన్న కూతురు భావన ను చూసి నిర్ఘాంతపోయాడు శేషాచలం.
తను చేసింది కంప్లైంటు కాదు…వివరణ మాత్రమె…
ఎంత మార్పు వచ్చింది కాలం లో….
పెద్ద మనవడు తేజ ఆరేళ్ళ ప్పుడు చేపలు పట్టడం నేర్పితే ఎంత సంబర పడ్డాడు!
ఎగిరి గంతేసి తాతయ్యను పట్టుకుని గిరగిరా తిరిగాడు. తిరిగి చేపను వదిలెస్తూ చంపడం మంచిది కాదు అంటే ఎంత ఆసక్తిగా విన్నాడు!
రాత్రిపూట తను చెప్పే హనుమాన్ కథలూ, కృష్ణుడి వెన్న దొంగతనాలు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని ప్రశ్నలు వేసేవాడు…
ఇవన్నీ ఇప్పుడు రెండో మనవడు విరాజ్ కు ఎందుకు నచ్చడం లేదు??
వీడికీ ఇదే వయసు కదా…ఎక్కడ తేడా?…
భావనా వాళ్ళు మూడేళ్ళు అమెరికా వెళ్లి వచ్చాక ఇప్పుడే తన ఇంటికి రావవటం….
తేజా తాతను చూసి సంబరపడ్డా చిన్నవాడు ఆరేళ్ళ విరాజ్ దగ్గర చేరలేదు. కొత్త అనుకున్నా..నెమ్మదిగా చేరువ చేసుకోవాలని చూసాడు శేషాచలం.
దగ్గర కూర్చో బెట్టుకుని “ హనుమాన్ కథలు చెబుతా రారా” అంటే
“వద్దు. నాకు తెలుసు “ అని పారిపోయాడు.
“ తెలుసా అన్నీ?”
“తెలియక పోయినా ఐపాడ్ లో చూసుకో వచ్చు”
“పోనీ ఫిషింగ్ పోదామా “
“వద్దు. ఐ డోంట్ లైక్”
“ఎందుకురా బాగుంటుంది”
“టూ ఈజీ తాతయ్యా”
“టూ ఈజీ నా?”
“ ఎస్ తాతయ్యా, I play in the internet games”
“ఇది real గా నాన్నా”
“నో తాతయ్యా “
అదే చెప్పబోయాడు కూతురితో శేషాచలం “అన్నీ తెలుసనుకుంటే ఎలాగమ్మా, నేర్చుకోవాలి కదా. పెద్దలు చెప్పింది వినాలి కదా….” అని
భావన మాత్రం “ నేనేం చెయ్యలేను నాన్నా” అని చేతులు పైకి ఎత్తేసింది.
ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. మన ఆచారాలూ, సాంప్రదాయాలు…పురాణాలు కథలు కథలుగా నేర్పాలనుకోవడం తప్పేలా అవుతుంది?
మనం చెప్పినది వినే పరిస్థితిలో ఎందుకు లేరు?
ఆలోచిస్తే హనుమాన్ కంటే spiderman …..సూపెర్ గా కనపడతాడే మో.
అలాగే చందమామ కథల కంటే dianosaurus, చెక్క బొమ్మలకంటే బార్బీ బొమ్మలు, బ్యాటరీ తో రయ్ మని పరుగెత్తే ట్రక్కులు, కార్లూ….interesting గా కనబడుతున్నాయి…..
ఇలా అయితే మనవడికి దగ్గర కావడం ఎలా?….
శేషాచలం సమస్య ఏమిటో బాగా అర్థం అయ్యింది.
“ఇలాటివి ఈ రోజుల్లో అందరు బామ్మలూ, తాతలూ ఎదుర్కునేదే. పెరుగుతున్న టెక్నాలజీ తో మనం కూడా ఎదుగుదాం అనుకున్నామంటే సరి…..” రామనాధం సమాధానం నచ్చలేదు శేషాచలం కు.
“ఈ వయసులో మనం ఎదగాలంటావా?”
“ఒక సారి ఆలోచించు…మనం పెరిగిన వాతావరణం వేరు, ఇప్పుడు వీళ్ళు పెరుగుతున్న కాలం వేరు..రామాయణ కథలు లాటివి ఆనిమేటెడ్ క్యారెక్టర్స్ తో చక్కగా వివరించే C D లు వున్నాయి లేదా తీరిక వున్నప్పుడు కంప్యూటర్ లో చూసుకునే అవకాసం వుంది. ఏది తెలియక పోయినా google search చేసుకునే కాలం వీరిది.
అంతెందుకు నేను సైకల్ నేర్చుకోవడానికి పదిరోజులు పట్టింది ఆ రోజుల్లో. నా మనమడు పదినిముషాల్లో నేర్చుకున్నాడు ఎలా అంటే వాడి ఆటల్లో శరీరాన్ని బేలెన్స్ చేసుకునేవి చాలా వున్నాయి. అందుకే సైకల్ ఎక్కగానే బాలెన్స్ చేసుకుని తొక్క గలిగాడు.
అంతేకాదు ఇప్పటి పిల్లలకు, టెన్నిస్, పియానో, చదరంగం అని ఎన్నో క్లాసులకు తీసుకెడతారు..స్కూల్ లో కూడా సైన్స్ క్లబ్బులూ, వారానికి ఒక టాపిక్ మీద మాట్లాడ్డం నేర్పిస్త్తారు. అందుకే వాళ్ళు అంత అడ్వాన్సెడ్ గా వున్నారు…వీళ్ళు చూసే హ్యారీపాటర్ సినిమాలు, డిస్కవరీ చానెళ్ళు మనం చూసామా ?
కాబట్టి వాళ్లకు దగ్గరవ్వాలంటే మనమూ కాస్త అడ్వాన్స్ అవ్వాలి….ఇదీ నేను తెలుసుకున్న థియరీ…..
ఎక్కవగా ఆలోచించి బి.పీ. పెంచుకోకు..”అంటూ భుజం తట్టాడు రామనాథం.
తనను పాత చింతకాయ పచ్చడి అనుకోకుండా మనమడికి దగ్గర అవ్వడం ఎలా అని ఆలోచించాడు ఆరాత్రి.
మరురోజు పొద్దున్న టిఫిన్లు అయ్యాక
“విరాజ్ …ఈ రోజు నీవు నాకు నీ ఐపాడ్ మీద గేమ్స్ ఆడటం నేర్పుతావా?” అని అడిగాడు మనవడిని.
“ఓ” అంటూ తాతయ్య చేతులు పట్టుకున్నాడు విరాజ్.
ఆ రోజు రాత్రి పక్కన పడుకున్న విరాజ్ ని అడిగాడు స్పైడర్ మ్యాన్ కథ చెబుతావా అని.
“నో తాతయ్యా నీవు చెప్పు నాన్నమ్మని ఫస్ట్ టైం ఎలా కలిసావో….”
దానికి విసుక్కోకుండా తను నాన్నమ్మని పెళ్ళిచూపుల్లో మొదటిసారి చూసిన ఘట్టం చెప్పసాగాడు శేషాచలం.
అనుబందాల టేక్నాలజీ కూడా మారాలి మరి!!!

మా అయివార్లు–నా జుట్టుకత!!

photoఇంట్లో గలాట సేస్తే సాలు!”ఈన్ని ఇసుకూలుకు నూకల్ల. అయివారుకు సెప్పి నాలుగు ఏట్లు కొట్టిచ్చల్ల” అని ఇంట్లో యపుడుజూసినా అంటావుండ్రి. అందుకే ఇసుకూలంటే నాకి శానా బయ్యమయితావుండె. నిజముగా ఇసుకూలుకు పోతే ఆడ ఎవురూ ఏమీ అన్లేదు.నేను రాసిన అచ్చరాలని కిట్టప్పయివారు యపుడు మెచ్చుకొన్నో అపుట్నుంచి ఇసుకూలంటే నాకి శానా ఇష్టమయిపాయ. ఒగ ఏటుగూడా తినకుండా ,రాసిచ్చినవన్నీ నేరుస్తావుంటి.

   మా వూరిపేరు సడ్లపల్లి.ఇదేపేర్తో ఇంగొగు వూరుంటే దీనికి ముందు సూగూరు అనే మాపక్కూరిపేర్ను గూడా సేర్సిండారు. ఇట్లా మావూరు యాడో కొండల్లోనో,నగరాల గాలి సోక్కుండ నూరామడల దూరంలోనో లేదు!!
   అయిద్రాబాదునుంచి బెంగులూరుకు రైలు మా వూరి ముందరనుంచే పోతుంది. ఇందూపురం నుంచి బస్సు మా ఇంటిముదరే  పోవల్ల. మాఊరి పొలాలన్నీ పెన్నేటి గట్లోనే వుండివి. ఇందూపురం మావూరికి మూడు మైళ్లు దూరము. అట్లా వూర్లో ఒగటో తరగతి పిల్లోళ్లలో అర్దం మందికి బట్లే వుంటావుండ్లేదు. నాకి అదొగరకం ఆఫారం ఏస్తావుండ్రికాని నిక్కారు తొడిగింది మూడో క్లాసులోనే!!
    అంగీ నిక్కార్ లేకుండా నేను ఇసుకోలుకు పొయ్యేదిలేదని మా యమ్మ దగ్గర శానాసార్లు,ఏడిసి మొత్తుకొంటావుంటి.యాలంటే మాకి కిట్టప్పయివారు మారిపోతూనే రెండో క్లాసుకి సీనివాసరావని ఒగాయప్ప ఒస్తావుండె. ఆయప్ప శానా శడ్డయివారు. ఇసుకోలు ఇడిసినంక నాయట్లా ఇద్దరు,ముగ్గురు పిల్లోళ్లని బడిలోకి పిలుస్తావుండె. మెల్లగా వాకిలి మూసి,యాడాడో పిసుకుతావుండె. దోసిలి నిండా వొంటికి పోపిచ్చుకోని, సెడ్డాట్లు ఆడతావుండె. ఆ పన్లకి ఒగపక్క మాకి నగువు,ఇంగొగుపక్క ఏడుపు ఒస్తావుండె. ఆ అయివారు శానాకాలముంటే ఏమయితావున్నో గానీ,రొన్నాళ్లకే మారిపాయ. నేను పెద్దయ్యి, మీసాలొచ్చినంక గూడా ఆయప్ప ఆడీడ కనబడతావుండెగానీ, ఏమో రోగమంట పెండ్లి సేసుకో కుండానే సచ్చి పాయనంట!!
   మా వూర్లో బోడప్పగారి కురుబ సంజీవయ్య అని వుండె. ఆయప్ప వైదీకం(వైద్యం)సేస్తావుండె. ఇసుకూలుకు ఒంటికిడిసినపుదు,పెద్ద సిప్పతో వొస్తావుండె. పిళ్లోళ్ల దగ్గరికిపొయ్యి ” ఒరే నింపులుసు పొప్పరమెంటిస్తాను దోసెడు వుచ్చులు పోయండ్రా” అని దేబిరిస్తావుండె. మాకయితే శానా సిగ్గి. ఆయప్ప కనిపిస్తే సాలు దూరము పరిగెత్తిపొయ్యి పోస్తావుంటిమి. కొంతమంది గబ్బు నాయాల్లు పోస్తావుండ్రి. వాళ్లని మేము “ఆశపోతు నాకొడుకులు”అని ఎక్కిరిస్తావుంటిమి.
    అపుడు మాకి ఒగిటికి పోసేది ఒగ పెద్దాట. ఇసుకూలు ముందర కంకర రోడ్డులో వర్సగా ఏటవాలుగా బద్దిలు(చిన్న కాలువలు) తవ్వుతా వుంటిమి. ఎవురు పోసినవి ఎక్కువదూరం పోతే వాళ్లు గెల్సినట్ల. అందుకే పోసినవి నేల్లో ఇంకకుండా బోకి పెంచలు,పల్సగావుండే రాల్లు బద్ది అడుక్కు మెత్తిచ్చి శానా అవస్తలు పడతావుంటిమి.
    ఇంగ ఇసుకూల్లో శానామందికి జుట్లే!! యాలంటే మా కాపోల్ల(రెడ్డ్ల) ఇంటి దేవుడు తిరపతి  యంగటరాణస్వామి. అది మా వూరికి శానా దూరము. దాంజతకి,వూరకే షికారుకు పొయ్యినట్ల పొయ్యి కొరిగిచ్చు కొచ్చేది కాదు. సుట్టాలందర్నీ పిల్సల్ల. కొత్త బట్ట్లు కొనిపెట్టల్ల. అంతకు ముందు ఇంట్లో జనాలకి రోగమొచ్చినపుడు, వానలు రాకుంద మొండికేసినపుడు,ఆవుకు కుర్రదూడ,ఎనుముకు ఆడపెయ్యి పుట్టల్లని మొక్కుకొన్నప్పుదు, ఏటివన్న శడ్డపన్లు సేసినపుడు దేవునికి మొక్కుకోని ముడుపులు కట్టి, దొంగలకి సిక్కకుందా దాసిపెడ్తావుండ్రి. అవిట్ని తీసి పూజల్సేసి దాసప్ప కీయల్ల.(మా వూర్లో దాసరితనం కురువ కులస్తులది) దాసప్ప వాట్ని గంతలుగట్టి ఎద్దుమీదకి ఎత్తి నానా శాస్త్రాలు సేయల్ల. పూజార్లకి,బాపనోళ్లకి సంబావనాలియ్యల్ల. సాకలోల్లు బట్టలు తడుపుకొచ్చి దావలో పర్సి(అడుగులకు మడుగు లొత్తడం)గుడికానా నడిపిచ్చుకు పోవల్ల…. అంతా దుడ్ల యవ్వారము!!
   రాత్రీపగలూ కష్టంసేసినా కడుపుకు సాలని కాపుదనమోల్లు, దేవుని మిందబారమేసి “ఆ మానబావుదు సల్లగా సూసినవుడు కొండకిపొయ్యి పుట్టెంటికిలు కొరిగిస్తాములే” అని ఇడిసిపెట్తావుండ్రి. అట్ల నేను ఎనిమిదో కలాసు సదివేదంకా నా జుట్టుని తిరపతి కొండని మోసినట్ల మోసిండాను. ఆ జుట్టు తెచ్చిన అగసాట్లు ఇంగా శానా వుండివి. తిరగ సెబుతాను.
    ఈ జుట్టును మోసే బారము మిగతా కులాల కురబోల్లు,ఉప్పరోల్లు,మాదిగోల్లు,మాలోల్లు,మంగలోల్లు….ఈల్లకి లేదు. యాలంటే వాళ్ల దేవుడు మా ఊరుకి శానా దగ్గిరే వుంటావుండె. అందుకే బిరీన గుండుకొట్టిస్తావుండ్రి.
   అపుడు ఆదపిల్లోల్లు ఇసుకూలుకి వొస్తావుండ్లేదు. ఇంట్లో బోకులు కడిగేది,సన్నపిల్లోల్లను ఎత్తుకొనేదే వాల్ల పని.ఇంటి పన్లయిపోతే ఒగొగు కలాసుకు ఒగురో ఇద్దరో వొస్తావుండ్రి. మగపిల్లోల్లు నున్నగా తలదువ్వుకోని ఒంటిజడలేసుకోని,రిబ్బన్లు కట్టిచ్చుకోని, మల్లి పువ్వులు ముడుసుకోని వొస్తావుండ్రి. నేనూ అట్లే పోవల్ల అని బొలే ఆశపడ్తావుంటి. అయినా మాయమ్మకి పురుసత్తే వుండేదికాదు. ఆదరా బాదరాగా సెక్కదువ్వానితో రెండుసార్లు దిగదున్ని జనుబు దారంతో గట్టిగా ముచ్చిన గుంతలో “సుళ్” అనేటట్ల నిగర గట్తావుండె. కలర్ టేపు కావల్లని యన్నిసార్లు మా నాయన్ని అడిగినా ఇందూపురంలో మా బట్టలుకుట్టే సాయాబు దగ్గర అయిదారు రకాలు రిబ్బన్ల మాదిరీ  కత్తిరిచ్చుకొస్తావుండె గాని, నాజుట్టుకి మల్లి పూలు రిబ్బన్నుల అలంకారమే తెలేదు.
   నేను అచ్చరాల్ని ముత్యాలమాదిరీ గుండ్రంగా రాస్తావుంటి.మిగిల్న పిల్లోల్లని నేను రాసినట్లే రాయమని అయివారు కొడతావుండె. అందుకే నేను ఏడిదైనా రాస్తావుంటే,యనక కొందరు నా జుట్టు పీకుతావుండ్రి.కుల్లు నా కొడుకులు ఇంకొందురు బలపంతో ఈపుమింద పొడుస్తావుండ్రి. దానిజతకి సింపిరెంటికిలు కండ్లకి అడ్దంపడతావుండె. ఇన్నిటినీ మించి పలకనిండా రాసినంక సీమిడి నా ముక్కులో నుంచి”తప్” న పడి,రాసిందాన్నంతా నాశనం సేస్తావుండె. స్వామీ అదేమిరోగమో గాని,ఇరవైనాలుగ్గంట్లూ నా ముక్కుల్లో సీమిడి పాములుమాదిరీ “సర్ బుర్” అని కారి పోతానేవుండె. యంత యగబీకినా దారం తెంపుకొన్న జీరంగి మాదిరీ నిలుస్తానే వుండ్లేదు. ఆపక్కా ఈపక్కా తల తిప్పి బుజాలకి రుద్దుతావుంటి. ఇంటికి పొయ్యే టయానికి అంగీ రెట్లన్నీ ఎండి అట్టగట్టుకు పోతావుండె. అది జూసి మానాయిన ఈపి ఇరగ్గొట్తావుండె.
   నాకే తెలీకుందా “సర్”న జారొచ్చే సీమిడ్ని ఏమి సేసేకీ నా శాత అయితావుండ్లేదు. కానీ, కండ్లకి అడ్డమొచ్చే యంటికిలికి మాత్రం బుద్ది సెప్పుతావుంటి. రాత్రిపొద్దు సదూకొనేతప్పుడు సీమనూనె(కిరోసిన్) బుడ్డీ మిందకి తలకాయని రవంత వొంచితే సాలు,”సుర్  సుర్..” న కాలి పోతావుండె. తిరగ వారానికే సిగిరొస్తావుండె. తిరగా అదేపని సేస్తావుంటి.
   నేను రేండోకలాసులో వున్నపుడు ఒగ అయివారుండె.  యర్రగా సూసేకి బొలేవుండె.ఆయప్పేరు తెలీదుగానీ యపుడు జూసినా సిగరెట్లు తాగుతావుందె. వూర్లో అందరూ ఆయప్పని సిగరెట్ల సిద్దగాడు అని పిలుస్తావుండ్రి. ఆయప్పకీ పెద్దయివారికీ అయితావుండ్లేదు. పామూ ముంగిస యవ్వారము!! ఒగదినం మాతో దూరం దూరం  నిలబెట్టి డికుటీసన్ సెప్పుతావుండాడు. ఆపక్క పెద్దపిల్లొల్లు .”అమ్మరో నేను నీ అబ్బయి కాక,ఆకుపచ్చని ఒక చిలుకనై వున్నయెడల? పంజరంబున నన్ను బంధింతువేమో!! భయపెట్తి పోనీక బాధింతువేమో? రానుపో నేనట్టులైన నీకడకు రాను రాలేను!! తల్లిరో నేను నీ తనయుడగాక! నల్లని ఒక కుక్కపిల్లనై వున్నయెడల? పొత్తున కూర్చుండి భుజి ఇంపనీక థూత్తని పొమ్మంచు తోసి పుచ్చుదుగదా?? రానుపో నేనట్టులయిన …” అనే పద్యాలు సెప్పుకొంటావుండారు. నా తలకాయలోకి అయివారు సెప్పే పదాలకన్నా, ఇవే బాగా దూర్తావుండివి. అట్లా పొద్దులో పెద్దయివారు ఒగ సీటీ పంపిచ్చె సంతకం సేయమని. సిగరెట్టయివారు యగా దిగా దాన్ని సూసి “సిరా పరా” సించి కిటికీలో నుంచి అవతల్కి పారేశ.
   వున్నట్లుండి పెద్దయివారు పొడిసే ఎద్దు మాదిరీ తలకాయి నిలెత్తుకోని,సేతి రెట్లు యగమడ్సుకోని గుడిబారొచ్చె. ఒచ్చినోడు వొచ్చినట్లే శంపల మింద నాలుగంటిచ్చె. ఆయప్పేమీ సన్నోడుగాదు ఆ మూల్లో ఇరిగి పడిండే శర్కా శక్కలుంటే అందుకోని వాంచబట్టె. మేం పిల్లోల్లంతా కేకలేసుకొంటా అవతల్కి పారి పోతిమి.
   వూర్లో జనాలొచ్చి ఇడిపిచ్చిరి. తిరగ సూస్తే మా కలాసులో ఒగ పలకగూడా మిగల్లేదు.అన్నీ వాళ్ల కాళ్లకిందబడి వడకలయిండివి. అవిటింజూసి అందరూ ఏడ్సిరి గాని,నాకి ఆనందమాయ. యాలంటే అది పాతగయ్యి అచ్చరాలు కనపడకుండా సమిసింది,  శానాసిన్నది. తిరగ దినమే మా యన్న  (అప్పుడు నాయనను  “అన్న” అనేవారం.నా+అన్న “నాయన” అయి అందులోని సగం “అన్న” కావచ్చు) రెండణాలు(12 పైసలు) పెట్టి కొత్తపలక తెచ్చె.
    ఈ అయివార్ల గలాట ముగిసి పోలేదు. ఒగదినం సిగరెట్టయివారు సినిమా సూసి రాతిరి తొమ్మిది గంటల్కి ఇందూపురం నుంచి సైకిల్లో వొస్తావుంటే– పెద్దయివారు,ఆయప్ప బావమరిదితో కల్సి మరవ వంకతావ నిలబెట్టి బాగ సితగ్గొట్టిండాడు. తిరగదినం వూర్లో పెద్దరెడ్లనందర్నీ పిల్సి పంచాయితీపెట్రి. అది రెండుమూడు దినాలు జరుగుతానే వుండె. ఒగదినము మామిళ్ల ముసలమ్మ కావొచ్చు అంతదూరంలో నిలబడి “బాపనోళ్లంతా శ్వాములు. స్వాములంటే పెద్దబుద్దు లుండాల్సినోళ్లు. సన్న జనాల మాదిరీ కర్సలాడేకే సరిపోతే ఇంగ పిల్లోల్లకి సదువు లెట్ల సెప్పుతారు” అని, ఇనీ ఇనపడ్నట్ల యక్కడో సూసుకొంట దులిప్పరేశ. ఆయమ్మ మాట్లిన్న జనాలు గట్టిగా నగిరి. అదేమి జరిగినోగాని, సిగరెట్లయివారు మారిపాయ.
   ఇంగొగయివారొచ్చె. ఆయప్ప పేరు శానా బాగుండేకానీ, ఆ మాన్నబావుదు ఇసుకూలుకొస్తూనే కురిసీలో కూకోని గొరకలుపెట్టి నిద్దర పోతావుండె. తూక్కొంటా ముగ్గరిచ్చి,ముందరికి పడతావుండె. పిల్లోల్లు ఆ అయివార్ని తూగుడు కోడి అని పిలుస్తావుండ్రి. (అప్పుడు ఇళ్లలో పెంచే కోళ్లకు కొక్కెర తెగులు అనే రోగం వచ్చేది.అది సోకగానే నిలబడిన కోడి నిలబడినట్లే కళ్లుమూసి తూగుతూ నేలకు పడి చనిపోయేది).ఆ  అయివారుకు పాటం సదివేదే వొస్తావుండ్లేదు. ఒకట్లు(ఎక్కాలు) పదిసార్లు రాయండి,బయట కూకోని పాటం సదివేది నేర్సండి…..మిరప సెట్లు ఏసినోల్లు కాయగూర్లు పీక్కు రాండి…అనే పొద్దు గడుపుతా వుండె.

రౌద్రం

ఈ “మోహనం”- నవరసాలకు ఆధునిక చిత్ర రూపం. నా దృష్టి నించి నాకు తెలిసిన రంగుల భాషలో చేస్తున్న వ్యాఖ్యానం.

మన కళల్లో కలల్లో నిజాల్లో అందంగా వొదిగిపోయిన సౌందర్యం నవరసాలు. మన చిత్రాలు, శిల్పాలు, సాహిత్యాలు అన్నీ నవరసభరితం. ముఖాల కదలికల్లో, శరీర భాషలో, శబ్ద రాగ కాంతిలో లీనమైపోయిన ఈ తొమ్మిది రసాలకు – ఉద్వేగాలకు- దృశ్యానువాదం ఈ ‘మోహనం’. ఒక్కో రసమూ ఒక భావనగా ప్రతిబింబించే ప్రయత్నం ఇది. ప్రతి రసం తనదైన ప్రతీకాత్మక వర్ణంలో, అల్లికతో, శక్తితో మీ ముందు వుంచే ప్రయోగం ఇది. ఇవి డిజిటల్ కాన్వాస్ మీద రూపు వెతుక్కున్న చిత్రాలు, కాబట్టి ఆ రకంగా కూడా ఇదొక ప్రయోగమే! ఇలా ప్రతి గురువారం ఒక రసదృశ్యం మీ ముందు…..

ఈ చిత్రాలు నాన్న – వేగుంట మోహన ప్రసాద్- స్మృతిలో, అందుకే ఇవి “మోహనం” !

Raudram

Mamata

Mamata Vegunta

హింసకీ అపకారానికీ మధ్య నడిచే కథ- వధ

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

“మంచి కథ” అంటే ఏమిటనే విషయం మీద పుంఖాను పుంఖాల చర్చలు విన్నాం, చదివాం. కానీ ఏదో ఒక నిర్ధారణకి రావడం కష్టమే. వ్యక్తిగతంగా నాకు చాలా చర్చలు అర్థం కూడా కావు. దేన్ని మంచి కథ అని అనడానికి వీలవుతుందో అన్న విషయం మీద ఏకాభిప్రాయానికి రావడం కూడా కష్టమే. అయితే ఒకటి మాత్రం అందరమూ ఒప్పుకోక తప్పదు.

కథ చదివి పక్కన పెట్టిన తరవాత కూడా పాఠకుడు దాన్ని గురించి ఆలోచించగలిగితే, ఆ కథలో చర్చకు పెట్టిన విషయాలని నిజ జీవితంలో జరిగే అనేకానేక సంఘటనలకీ, చుట్టూ నడుస్తున్న చరిత్రకీ అన్వయించుకోగలిగితే, అది నిస్సందేహంగా గొప్ప కథ. చెప్పిన విషయం abstract గా వుంటూనే, మన బ్రతుకుల్లోని నిజాలని టార్చి లైటు వేసి మన ముందు నిలబెట్టగలిగితే, ఆ అనుభూతి ఎన్నటికీ మనలని వదిలి పోదు. ఎన్ని సార్లు ఆ కథ చదివినా మనం లోతుగా, లోలోతుగా ఆలోచనలని ఆస్వాదిస్తూనే వుంటాము. మరందుకే కదా సాహిత్యం ఆలోచనామృతమయింది.

1956-67 మధ్య కారా మాస్టారు అయిదు కథలు రాసారు. (తీర్పు, ఇల్లు, వధ, యఙ్ఞం, మహదాశీర్వచనం) సంఖ్యాపరంగా చూస్తే పదకొండేళ్ళల్లో అయిదేనా అనిపించినా, కథలన్నీ వేటికవే ప్రపంచ సాహిత్యంలోని ఆణి ముత్యాల్లో నిలబడ్డ కథలు. ఆ అయిదిటిలో యఙ్ఞం కథ (1964) అన్నిటికంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆ తరవాత సంవత్సరం ఆయన “వధ” రాసారు. అయిదింటిల్లోనూ మనుషుల మధ్య వుండే సంబంధాల్లో లీలగా గోచరమయ్యే ‘ హింస ‘ ఏక సూత్రంగా కనబడుతుంది. మన జీవితాల్లో ఇంత హింస నిండి వుందన్న సంగతి మనకి తెలిసీ వుండకపోవచ్చు, తెలిసినా ఒక రకమైన నిర్లిప్తతతో దాన్ని భరిస్తూ వుండి వుండవచ్చు. ఈ హింసనే బట్టలిప్పి మనముందు నగ్నంగా నిలబెట్టి దాని గురించి ఆలోచించమని మనని సవాలు చేస్తాయి ఈ కథలు.

‘హింస ‘ శారీరకమైనదైనా, మానసికమైనదైనా, ఒకటే! మనిషిని బ్రతుకు కష్టపెట్టినప్పుడు సంఘర్షణ అవుతుంది, పక్క మనిషే కష్టపెట్టినప్పుడు అది హింస అవుతుంది. హింస గురించీ, హింసకి మన ప్రతిచర్యల గురించీ ఆలోచించక తప్పని దశలో వున్నాం మనం!

అసలు పన్నెండు పేజీల “వధ” లోని కథ మనకి తెలియనిదేమీ కాదు. కథంతా ఒక్కటే సంఘటన! తండ్రి ఆనతి తలదాల్చు తనయుడూ, ధర్మ స్వరూపుడూ అయిన రాముడు ఋష్యమూక పర్వతం వద్ద వాలి సుగ్రీవుల యుధ్ధం చూస్తూ ఆలోచిస్తున్నాడు. చెట్టు చాటునుంచి వాలిని చంపడాన్ని ఆయన అంతరాత్మ ఎంత మాత్రమూ సమర్ధించలేకపోతూ వున్నది. అప్పుడాయన ‘ తాను ఏం చేయడమా ‘ అన్న ధర్మ సంకటాన్ని పక్కన పెట్టి ‘వాలి ఏం చేస్తున్నాడూ ‘ అన్న విషయం గురించి ఆలోచించి, వాలి వధకు పూనుకున్నాడు.

రామాయణం లోని కథలకి ఎన్నో వ్యాఖ్యానాలూ, ఉపాఖ్యానాలూ వున్నాయి. స్థూలంగా వింటే ఇదేదో ‘రాముణ్ణి సమర్ధించే కథ కాబోలు ‘ అని అనిపించొచ్చు.

కానీ, లోతుగా చూస్తే, సున్నిత మనస్కుడైన మనిషికీ తప్పొప్పుల విచక్షణ చేయగలిగే మనిషికీ, అందులోనూ బలవంతుడైన వీరుడికీ, అడుగడుగునా ఎదురయ్యే ధర్మ సంకటాలు కనిపిస్తాయి. ఆలోచించనా శక్తీ, భుజబలమూ వున్న మనిషి చేయక తప్పని బాలన్స్ వాక్ అది.

పైకి చూస్తే వాలి సుగ్గ్రీవులది అన్న దమ్ముల కొట్లాట. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదు. కానీ, నిజంగా అంతేనా? తెలిసో తెలియకో తమ్ముడు సుగ్రీవుడు అన్న పట్ల అపచారం చేసాడు. అప్పుడు వాలి ముందు మూడు దారులున్నాయి. తమ్ముణ్ణి మన్నించి అక్కున జేర్చుకోవడం. లేదా తమ్ముణ్ణి ఆ చుట్టు పక్కల లేకుండా వెళ్ళ గొట్టడం, లేదా అతన్ని హత మార్చడం. కానీ, వాలీ ఈ మూడు దారుల్లో వేటినీ ఎన్నుకోలేదు. తమ్ముడి భార్య రుమను చెరపట్టి, సుగ్రీవుడు ఆ చుట్టు పక్కల నుండి పారిపోకుండా చేసాడు. భార్య పరాయి చెరలో వుందన్న రోషంతో సుగ్రీవుడు తనతో తలపడకా మానడు, ఒళ్ళు హూనం చేసుకోకా మానడు. ఈ మానసిక శారీరక హింసలో సుగ్రీవుడు అలిసిపోతూంటే ఆనందిస్తున్నాడు వాలి.

జంతువు ఆకలేసినప్పుడో భయపడ్డప్పుడో తోటి జంతువుని చంపుతుంది. అది అపకారం. ఆలోచనాశక్తి వున్న మానవుడు మాత్రమే తోటి ప్రాణిని చావుకీ బ్రతుక్కీ మధ్య వేలాడదీసి ఆనందించగలడు. అది హింస. బలహీనుణ్ణి బలవంతుడు హింసిస్తూంటే మిగతావారికి ఆ బలహీనుడి పక్షం వహించక తప్పదు. అప్పుడు ధర్మాధర్మ విచక్షణ కూడా పక్కన పెట్టకా తప్పదు. అలా ధర్మా ధర్మ విచకషణ పక్కన పెట్టి దుష్టుణ్ణి శిక్షించకపోవడమే ధర్మాత్రిక్రమణమవుతుందని రాముడు మరణించబోయే వాలితో అంటాడు.

సాంఘిక పరిణామంలో మనం మనిషి మనిషికి అపకారం చేయకుండా కట్టుదిట్టాలు చేసుకున్నాం, కానీ హింసించకుండా పెద్ద ఏర్పాట్లు చేసుకున్నట్టు అనిపించదు. ఇది ఆలోచించాల్సిన విషయం.

వస్తువు తో పాటు సమానమైన గాంభీర్యాన్నీ, గాఢతనీ కథనం సంతరించుకుందీ కథలో. సాధారణంగా కథల్లో వర్ణనలకెక్కువ చోటూ వుండదు. కథలో వర్ణనలు చేయదల్చుకుంటే దానికి తగినంత కారణం వుండాలి. ఈ కథలో మొదటి రెండు పేజీలూ అరణ్యాన్ని వర్ణించడానికే కేటాయించారు మాస్టారు. అయితే, ఆ వర్ణన ప్రపంచంలో వున్న జంతు న్యాయానికి ప్రతీకగా నిలిచి  పైన పచ్చగా అందంగా వున్నా, లోపల భయంకరమైన హింసాకాండ జరుగుతుందన్న విషయాన్ని సూచిస్తుంది.

అరణ్యంలో మూలనో ఒక్క మూలన ఎప్పుడూ కార్చిచ్చు రగులుతూనే వుంటుంది. అయినా తక్కిన అరణ్యమంతా తనకు పట్టనట్టు పచ్చగా కళకళ లాడుతూ చూపరులకు సృష్టి కర్త వైచిత్రి చాటుతూ వుంటుంది. అదే దానిలోని సొబగు…”

అన్న వాక్యాలు కాలానికతీతంగా మానవ సంఘానికి దర్పణం పడుతున్నాయంటే కాదనగలమా? వాలి సుగ్రీవుల వైషమ్యమూ, యుధ్ధరీతీ, రాముని మీమాంసా, నిర్ణయమూ ప్రతిదీ అలా అలా స్పృషిస్తున్నట్టే వున్నాయి, కానీ చాలా స్పష్టంగా వున్నాయి. అది కథనం లో ఆయనకున్న నైపుణ్యమూ, ఆయన గొప్ప హృదయ సౌందర్యమూ తప్ప ఇంకేమీ కాదు.

తన అంతరాత్మ చేస్తున్న మందలింపులనీ, చికాకునీ పక్కన పెట్టిన రాముడు చూసింది, వాలిలో మూర్తీభవించిన క్రౌర్యం, దౌష్ట్యం, మదాంధత గర్వం“, విన్నది “సుగ్రీవుని కంఠంలో అణచి వేయబడుతున్న ఆర్తనాదం“. అంతరాత్మనీ  ధర్మ పన్నాలనీ పక్కన పెట్టి బాణం వేసి వాలిని నేల కూల్చమని రాముడికి మనమే సలహా ఇవ్వమా?

లోకంలో దుష్టులందరూ యిలానే తాము చేయబోయే దౌష్ట్యానికి నేపథ్యం సృష్టిస్తారా,” అని కలవరపడ్డ రాముడినీ, తన తమ్ముడు లక్ష్మణుని ఆపాద మస్తకమూ చూసి, తన తమ్ములెప్పుడూ సుగ్రీవులు కారు. తానెన్నటికీ వాలి కానేరడు ‘ అని తలపోసిన ధర్మమూర్తి రాముడినీ నిలబెట్టి, నేటి సమాజానికి ఎటువంటి ఆదర్శమూర్తుల ఆవశ్యకత వుందో తెలియజేసిన కథ- ‘వధ ‘.

 -శారద

శారద

శారద

 

శారద ఆస్ట్రేలియాలో ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నారు. అడిలైడ్ నగరంలో నివాసం. శారదగారు రాసిన యాభై కధలతో ‘నీలాంబరి’ కధ సంపుటికి గత సంవత్సరం ఆవిష్కారం జరిగింది. శారదకు కుటుంబరావు, తిలక్ ఆంగ్లంలో చెహోవ్, సోమర్ సెట్ మాం ఇష్టం. ఇంకా ఈ మధ్య రాస్తున్న వారిలో చాలా మంది బాగా రాస్తున్నారని అన్నారు. కథా రచనలో మెలకువలని నేర్చుకోవడానికీ, ఆలోచనలని స్పష్టం చేసుకోవడానికీ, జీవితాన్నీ, సాహిత్యాన్నీ మధించడం తప్ప వేరే మార్గం లేదని శారద  అభిప్రాయం. శారద బ్లాగ్ www.sbmurali2007.wordpress.com.

వచ్చే వారం: పాలపర్తి జ్యోతిష్మతి ‘రాగమయి’ కధ గురించిన పరిచయం 

‘వధ’ కథ ఇక్కడ:

లేమి

<
 02 copy

 
అద్దాలు
అక్షరాలు
అనుభవించే శరీరం లేదు

నీడని
నీటిని
తాకే నేత్రం లేదు

శబ్దాలు
మౌనాలు
దాటే మనసు లేదు

శోకాలు
నవ్వులు
దాచే వాక్యం రాయలేను

ఎన్నటికి ప్రేమిస్తాను
విరిగిన కలల్ని
తెలియని పదాల్తో

వొదిలెళ్ళే జ్ఞాపకాల్ని
ఎప్పటికీ మన్నించను

తీరిగ్గా నిద్రపోవాలిక

-ఎం.ఎస్. నాయుడు

naidu

ఎప్పుడన్నా నేను

రాత్రిలా అలంకరించుకోవాలనుకుంటాను నేను
అక్కడక్కడ చుక్కలతో – ఎక్కడో నెలవంకతో
వెలుగుతో చెరచబడి
ఉదయం నెత్తుటితో మొదలయ్యే జీవితం అవుతుంది నాది

గాలిలా స్నేహించాలనుకుంటాను నేను
అక్కడక్కడ స్పర్శలతో – ఇంకో చోట సుడిగుండం బిగి కౌగిలిలో
ఋతువుతో అవమానింపబడి
దిక్కు తోచని దిక్కు లేని తనమే తోడౌతుంది నాకు

కనీసం

చేపలా ఏకాకి తనాన్ని అనుభవించాలనుకుంటాను నేను
ఎప్పుడన్నా కొన్ని నీటి ముద్దులతో – అప్పుడప్పుడు
నీటి బుడగల్లాంటి మనుష్యుల మధ్య ప్రయాణం తో
పారే నీటిలో ప్రతి క్షణం
మొప్పల్లో నా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది

జీవించడం రెండు భూగోళాల మధ్య
రూపమే లేని పాల పుంతలా ఉంది
సరే !
ఆశల విలువ బతుకు కంటే అమూల్యమైనది కదా ! !

-ఆంధ్రుడు

My photo-1

ఎప్పుడు చూసినా నిత్యనూతన నయాగరా!

     ఈమధ్య ఇండియా నించీ మాకు చుట్టాలొచ్చారు. మా తమ్ముళ్ళిద్దరు, మేనకోడలు, వాళ్ళ కుటుంబాలు. అట్లాంటాలోని మా మేనల్లుడితో సహా, మొత్తం పన్నెండు మందిమి, ఒక వాన్ తీసుకుని మా యాత్రా స్పెషల్ మొదలుపెట్టాం. అట్లాంటా నించీ ఎన్నో, ఎన్నెన్నో ప్రదేశాలు చూసుకుంటూ, నయాగరా దాకా వెళ్లి వచ్చాం. మేము చూసిన ఆ ఎన్నో, ఎన్నెన్నో ప్రదేశాల గురించి ఇక్కడ వ్రాస్తే, నేను వ్రాస్తున్నప్పుడూ, మీరు చదువుతున్నప్పుడూ, ఈ కథనం ఇవాళ మొదలుపెడితే, మర్నాడు ప్రొద్దున్న భళ్లుమని తెల్లవారే దాకా, అలా నయాగరా జలపాతంలా పోతూనే వుంటుంది. అందుకని ఈసారికి ఒక్క నయాగరా గురించే వ్రాస్తాను.

ప్రపంచంలో జలపాతాలు గురించి చదివితే, కొన్ని బాగా ఎత్తయినవి, కొన్ని బాగా వెడల్పయినవి, కొన్ని నీటి పారుదల దృష్ట్యా చాల పెద్దవి, కొన్ని ఎంతో అందమైనవి… ఇలా ఎన్నో రకాలున్నాయి. అందుకని, మా గుంటూర్లో పిచ్చి కిష్టయ్యలా, ఇవన్నీ కలిపేసి చూస్తే, నయాగరా జలపాతాలు ప్రపంచంలో తొమ్మిదో రాంకులో వున్నాయి. మొదటి మూడూ ఏమిటంటే, మొదటిది – లావోస్ దేశంలో వున్న ఖోన్ ఫాల్స్. 35,376 అడుగుల వెడల్పు జలపాతం. దీని ఎత్తు మాత్రం 69 అడుగులే! ఇక రెండవది – వెనిజువేలా దేశంలో వున్న, సాల్టోపారా జలపాతం. దీని వెడల్పు 18,400 అడుగులు. మూడవది – మధ్య ఆఫ్రికాలోని గాబన్ అనే దేశంలోని కొంగో ఫాల్స్. ఇవి 10,500 అడుగుల వెడల్పు. ప్రతి నిమిషానికి 1.9 మిలియన్ల ఘనపుటడుగుల నీళ్ళు పారుతుంటాయి.

ఇహ.. నయాగరా ఫాల్స్ సంగతి చూద్దాం. ఇవి అమెరికా దేశానికి ఉత్తరాన, కెనడా దేశానికి దక్షిణాన వున్నాయి. అంటే అమెరికాలో ఈశాన్య దిక్కున, ఈ రెండు దేశాల మధ్యా సరిహద్దుల్లా వున్నాయన్నమాట.

నయాగరా జలపాతం, మూడు జలపాతాల సంగమం. ఒకటి ‘హార్స్ షూ ఫాల్స్’, రెండవది ‘అమెరికన్ ఫాల్స్’, మూడవది ‘బ్రైడల్ వెయిల్ ఫాల్స్’. ఈ మూడూ ఎరీ నదిలోని నీటిని, ఆంటారియో లేక్ లోకి ప్రవహింప చేస్తాయి. దీని ఎత్తు 167 అడుగులే అయినా (కొన్ని చోట్ల 188 అడుగులు కూడా వుంది), నిమిషానికి ఆరు మిలియన్ల ఘనపుటడుగుల నీరు ప్రవహిస్తుంది. నయాగరా జలపాతం వెడల్పు 2,600 అడుగులు మాత్రమే!

నయాగరా అంటే, మొహాక్ ఇండియన్స్ వారు మాట్లాడే భాషలో ‘మెడ’ అని అర్ధం. 1604 ప్రాంతంలోనే దీనిని, కెనడాకి వచ్చిన ఫ్రెంచ్ వారు, అమెరికాకి వచ్చిన పూర్వీకులు కనుగొన్నారు. 18వ శతాబ్దంలోనే నయాగరా జలపాతాన్ని చూడటానికి ఎంతోమంది యాత్రీకులు వచ్చేవారుట. 1897లోనే ఈ రెండు దేశాల్నీ కలుపుతూ, ఒక బ్రిడ్జిని కట్టారు. దాని పేరు, Whirlpool Rapids Bridge. ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద రైళ్ళూ, కారులూ అన్నీ నడిచేవి. కార్ల కోసం కొత్త బ్రిడ్జ్ కట్టినా (దాని పేరు రైన్బో బ్రిడ్జ్), పాత బ్రిడ్జి మీద ఇంకా రైళ్ళు నడుస్తూనే వున్నాయి.

మొదటి ప్రపంచ యుధ్ధం అయిపోయాక, నయాగరా జలపాతం చూడటానికి వచ్చే జనాభా ఎక్కువైనారుట.

నయాగరా జలపాతం అందాలు అమెరికా వేపున చాల బాగుంటాయి. అవి చూడాలంటే, సరిహద్దులు దాటి, కెనడా వేపు వెళ్ళి చూస్తే బాగుంటుంది.

మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు, రెండు పక్కల నించీ చూశాం కానీ, ఈసారి ఒక్క అమెరికా వేపు నించే చూశాం.

satyam1

 

అంతేకాదు, ఈ జలపాతంలోని నీటి శక్తిని ఉపయోగించుకుని, ఇక్కడ రెండున్నర మిలియన్ల కిలోవాట్స్ ఎలక్ట్రిసిటీని ఉద్పాదిస్తున్నారు. ఇది పడమటి ప్రపంచంలో కల్లా ఎంతో పెద్దదయిన హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్టు.

ఇదీ క్లుప్తంగా నయగరా చరిత్ర, సాంకేతిక వివరాలు. ఇక మా యాత్రా విశేషాలు చూద్దాం.

అక్కడికి చేరగానే, హోటల్ గదుల్లో సామానంతా పడేసి, ఇక రంగంలోకి దిగాం. మా హోటల్ కూడా జలపాతానికి నడక దూరంలో, నయాగరా స్టేట్ పార్క్ పక్కనే వుంది.

ఇక్కడ చూడవలసినవి చాల వున్నాయి.

ముందే అనుకున్నట్టుగా, సరాసరి ‘మైడ్ ఆఫ్ ది మిస్ట్’ దగ్గరికి వెళ్ళాం. టిక్కెట్లు అన్నీ హోటల్లోనే కొన్నాం కనుక, అక్కడికి వెళ్ళగానే – లిఫ్ట్ ఎక్కి, అంత ఎత్తు నించీ క్రిందకి దిగి, అక్కడ ఒక బోటు ఎక్కాం. బోటు ఎక్కే ముందు, అందరికీ పాంచోలు (రైన్ కోటు లాంటివి) వాళ్ళే ఇస్తారు. అవి వేసుకుని, తల అంతా పాంచోలో వున్న టోపీతో కప్పుకుని, బోటులో అందరం రైలింగ్ పట్టుకుని నుంచున్నాం. ఈ బోటుకి రెండు అంతస్థులు. ఇది నెమ్మదిగా, ఈ మూడు జలపాతాలు పక్క నించీ వెడుతుంటే, ఆ శబ్దం, గాలి, తల మీద పడే నీటి తుంపరలే కాక, అక్కడక్కడా కుండపోత వర్షంలా పడే నీరూ… అదొక అందమైన అనుభవం. ఆ హడావిడిలోనే, కెమెరాలు, సెల్ఫోనులూ బయటికి తీసి, అందరం ఫొటోలు తీస్తూనేవున్నాం. కొన్నిచోట్ల, మా బోటు గాలికి వూగుతుంటే, జనం

అరుపులు పెడుతుంటే… (భయంతో కాదు, సంతోషంతో), మేమేదో సాహసయాత్ర చేస్తున్నామన్నంత సరదా!

satyam2

 

అక్కడనించీ రాగానే, “కేవ్ ఆఫ్ ది విండ్స్” దగ్గరికి వెళ్ళాం. అక్కడికి కొంచెం దూరమే అయినా, ఆ చల్లటి వాతావరణంలలో నడుస్తుంటే హాయిగా వుంది.

“కేవ్ ఆఫ్ ది విండ్స్” దగ్గర కూడా, మళ్ళీ పాంచోలు వేసుకుని, క్రిందికి దిగి వెళ్ళాం. చిన్న చిన్న చెక్కలతో కట్టిన ప్లాట్ఫారాల మీద నడుచుకుంటూ, ఒక జలపాతం క్రింద దాకా వెడతామన్నమాట. ఇక్కడ గాలి విపరీతంగా వుంటుంది. జలపాతం హోరు చెవుల్ని చిల్లులు పడేట్టు చేస్తుంది. మన మీద పడే నీళ్ళు కూడా, మన మీద మద్దెల దరువు వేస్తుంటాయి. ఎంత పెద్దవాళ్ళయినా, పిల్లల్లాగా ఆడుకోవటానికి అనువైన ప్రదేశం.

satyam3

ఇంకా ఇక్కడ చూడవలసిన వాటిల్లో, డిస్కవరీ సెంటర్. అక్కడ ఎంత సమాచారం కావాలంటే అంత దొరుకుతుంది. అక్కడి నించీ, నడిచి క్రింద దాకా వెళ్ళాలనుకునే వాళ్ళకి, మంచి వాకింగ్ ట్రైల్స్ కూడా వున్నాయి.

హాయిగా సినిమా హాల్లో కూర్చుని నయాగరా అందాలు చూద్దామనుకునే వాళ్ళకి, ఒక అడ్వెంచర్ థియేటర్ కూడా వుంది.

ఆఁ! చెప్పటం మరచిపోయాను. నయాగరా ‘సీనిక్ ట్రాలీ బస్’ కూడా వుంది. ఒకచోటు నించీ, ఇంకా చోటుకి వెళ్ళటానికి బాగుంటుంది. దారిలో ఎన్నో పార్కులు, పూల మొక్కలూ, మధ్యే మధ్యే ఆ జలపాతపు నీటి మీద, రంగురంగుల ఇంద్రధనస్సులు. ఎంతో అందమైన ప్రదేశం.

రాత్రి పూట, అమెరికా వైపునా, కెనడా వైపునా రంగురంగుల లైట్లు వేసి, సౌండ్ అండ్ లైట్ షో వేస్తారు. ఆ నీటి మీద, గాలిలోని తేమ మీద, ఆ దీపాలు పడి, ఎంతో అందంగా వుంటుంది. తప్పక చూడవలసిన వాటిల్లో ఇది ఎంతో ముఖ్యమైనదని నా ఉద్దేశ్యం.

ఈ షో అయిన, కాసేపటికి టపాకాయలు కాల్చి, ఇటు క్రింద నీటిలోనే కాక, ఆకాశంలో కూడా రంగులు పులిమేసి, ఆ రేయిని కాసేపు పగలుగా మార్చేస్తారు. అదంతా అయిపోయినా, అక్కడనించీ కదల బుధ్ధి అవదు.

ఏనాడో నేను ఈ నయాగరా జలపాతం మీద విన్న ఒక జోకు చెప్పి, ఈ వ్యాసం ముగిస్తాను.

నయాగరా జలపాతం చూడటానికి, అందరూ ఆడవాళ్ళే వున్న టూరిస్ట్ బస్ ఒకటి వచ్చిందిట.

ఆ బస్సులో వున్న గైడ్, పెద్దగా కబుర్లు చెప్పుకుంటున్న ఆడవారితో అంటాడు, ‘మీరంతా కాసేపు నిశ్శబ్దంగా వుంటే, ఈ నయాగరా జలపాతం చేస్తున్న హోరు వినవచ్చు’ అని!

ఏది ఏమైనా, అవకాశం దొరికితే తప్పక చూడవలసిన ప్రదేశాల్లో నయాగరా జలపాతం ఒకటి!

-సత్యం మందపాటి

satyam mandapati

 

తెలుపో… నలుపో… జాన్తానై …

“నల్ల మందు తెలుసు. ఈ నల్ల ధనం ఏమిటండీ? ఎక్కడుంటుందండీ?

రాజ్యాంగంలోని 21 వ అధికరణ కింద పౌరులకు లభించిన గోప్యతా హక్కు ఎవరి కొంపైనా ఎలా ముంచుతుందండీ? రాజ్యాంగంలోని 32(1) అధికరణ ప్రకారం ఎలాంటి సమాచారం ప్రకటించలేమని సర్కారు చేతులు ఎందుకు కట్టేసుకుందండీ? ఎన్డియే మొన్న మే మాసంలో సుప్రీం రిటైర్డు జస్టిస్ ఎం బి షా సారథ్యంలో ప్రత్యేక బృందాన్నిఏ తమాషా కోసం నియమించిందండీ? తొందరపడి ఎవరి పేర్లనూ బైట వద్దని అసోచామ్ ఎందుకు అడుగుతుందండీ? ద్వంద్వ పన్నుల విధానం అంటే ఏమిటీ? అది దెబ్బతింటే దేశ ప్రతిష్థకు, విశ్వసనీయతకు ఏ విధంగా విఘాతం కలుగుతుందండీ? ఏ ఆరోపణలు నిరాధారమైనవని తేలితే ఏ వ్యక్తులకు అప్రతిష్ఠ ? నల్లధనానికి ఆస్కారంలేని వ్యవస్థాగత సంస్కరణలా.. అవేమిటండీ?”

పొద్దస్తమానం అలా వార్తా పత్రికలు ముందేసుకుని జోగుతుంటారు గదా శ్రీవారూ.. ఈ చిక్కు ముళ్ళేమన్నా కాస్త విప్పుతారేమోనని దగ్గరికి వెళ్ళడిగా బుద్ధి లేక పొద్దున్నే! ఏ ముడి అనుకున్నారో ఏమో పాడు.. హుషారుగా లేచి నిలబడి ఆనక విషయం విని చారునీళ్ళల్లో అప్పడంలా చప్పడిపోయారు “ప్చ్.. అంతంత పెద్ద విషయాలు నీ కొద్ది బుర్రలో పట్టవులే గానీ.. మీ ఆడాళ్ల కవసరమైన ఓ ముఖ్య సమాచారం మాత్రం చెప్తా విను” అని మాట దాటేశారు. ‘ఇక్కడ సంపాదించిన సొమ్మును ఇక్కడి లెక్కల ప్రకారం పన్నులూ పాడూ కట్టకుండా.. ఇక్కడే ఖర్చు పెట్టకుండా ఇంకెక్కడో దేశంలో పూడ్చి పెడితే దాన్ని విదేశీ నల్ల ధనం అంటారని.. అధికారంలో కొచ్చిన వంద రోజుల్లో ఆ దేశాల్లో ఉన్న నల్లధనాన్నంతా తవ్వి తెచ్చి తలా ఒక పదిహేను లక్షలు దాకా మోదీజీ పంచబోతున్నారనీ’ మా వారు చెప్పిందాన్ని బట్టి నాకు అర్థమైన సమాచార సారాంశం. డబ్బు పంచడం వరకూ సంతోషమే కానీండి.. ఎక్కడ దాచుకోవాలో.. ఎక్కడ పూడ్చుకోవాలో.. సంపాదించుకునే వాడి ఇష్ట ప్రకారం కాదా ఉండేదీ! ఇదేందీ.. ఇందులో ఏదో మతలబు ఉంది.. ఎక్కడో తంతా ఉంది!

నాలుగు రాళ్ళు ఎక్కువొచ్చే చోట.. ఇచ్చిన సొమ్ముకు కాళ్ళు రావన్న గట్టి నమ్మకం ఏర్పడ్డ చోట చూసి మరీ చక్రవడ్డీకి అప్పులిచ్చేది మా ఊళ్ళో వెంకాయమ్మ గారు. మా పేట ఆడాళ్ళందరికీ ఆమే ఆడ చంద్రబాబు. గవర్నమెంటుకు చెప్పనంత మాత్రాన ఆమె దగ్గరున్న చీటీపాటల డబ్బంతా నల్లసొమ్మై పోతుందా.. విడ్డూరం కాక పొతే! ఆ మాటే మా ఇంటాయనతో అంటే ఆయన గారేమో తల గోడకేసి మోదుకున్నారు. “నన్ను చంపక.. పోయి ఓ కప్పు కాఫీ పట్రా! అసలే ఇక్కడ నే టెన్షన్తో చస్తూంటే మధ్యలో నీ టీవీ చర్చలు!” అని విసుగూ! వివరంగా చెప్పే విషయం కరువైనప్పుడల్లా ఇలా కరవ రావడం మా వారికి ఆ జగన్ బాబుకు మల్లే మామూలే లేండి! సరే!.. మా సంబడాలకేం గానీ.. ముందీ నల్లధనం సంగతే ఏందో తేల్చాలి.

ఈయన గారొచ్చి వివరించక పోతే మహా మనకిహ లోకంలో తెలిసే మార్గాలే కరువా! ఇంట్లో ఆయన చూసే టీవీనే నేనూ చూసేది అంతకన్నా ఎక్కువ సేపు. ఆయన గారు చదివవతల పారేసే ‘ఈనాడే’ నేనూ ఆనక తిరగేసేది. కాక పోతే ఎప్పుడూ చూసే సీరియళ్లూ.. సినిమా కబుర్లూ కాస్త పక్కన పెట్టి ఈ నల్లదనం మీదా ఓ సారి దృష్టి పెడితే సరి.. సర్వం మనకే అరటి పండు వలిచినంత సులువుగా అవగతమయి పోతుంది.

అవగతమయింది కూడాను. ఓస్! ఇంతోటి భాగ్యానికే ఇన్ని రోజుల బట్టీ దీని మీదిన్ని కుస్తీ పట్లా! వ్యవహారం సుద్దపిక్కతో ముగ్గేసినంత సుబ్బరంగా కనిపిస్తుంటేనూ! ఓపిక .. సావకాశం ఉన్నవాళ్లేవేవో.. నానా అగచాట్లు పడి.. నాలుగు డబ్బులు గడించారే అనుకోండి.. పోనీ అది డబ్బు కాదబ్బా.. గడ్డే అనుకుందాం.. ఎవరు మాత్రం తినడం లేదీరోజుల్లో ఈ గడ్డీ గాదం! పన్నులు కట్టనంత మాత్రాన పచ్చ నోటు ఎలా నల్లబడుతుందో నా బుర్రకింకా ఎక్కటం లేదమ్మా!

blck

ఏనుగు బరువేయబోతే చీమైనా ఏం చేస్తుంది? పుట్టల్లోనే నక్కుంటుంది. వేలు పెడితే ఠక్కుమని కుట్టేస్తుంది కూడాను. కాల్చినా కాల్చకున్నా మనం పాత బకాయిల్తో సహా కరెంటు బిల్లులు చచినట్లు కడుతున్నామంటే తప్పించుకునే మరో దారి లేకే గదా! దారేదో ఓటి ఉంది కాబట్టే ఆ సంపన్నులంతా తమ సంపాదన్ని దేశం దాటించేస్తున్నారు! ఆ దారి నెందుకు మూసేయడం లేదన్నదే నా పాయింటు. ఎప్పటికప్పుడు ఏవో లోపాయికారీ వ్యవహారాలు అవీ పెట్టేసుకుని.. చూసీ చూడనట్లు పోనిచ్చి.. ఓట్లేసే బికార్ల మెప్పుకోసం విదేశీ నిధులంటూ.. అక్రమాస్తులంటూ అల్లరి పెడతారా! నెలరోజుల బట్టీ చూస్తున్నా.. విచిత్రం! ఒక లెక్కా పత్రం ఏదీ లేనట్లుంది ఈ నల్లధనలక్ష్మి ఆకార వికారాలకి! ఒకడు లక్ష కోట్లంటాడు. ఒకడు అర లక్ష ఖాతా లంటాడు. ఒకడు అర్థ శతాబ్దంబట్టీ సాగే లోపాయికారీ వ్యవహార మంటాడు. ఆ పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని.. ఈ పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని తప్పులు పడుతున్నారు. అసలు ఈ నల్ల ధనంలో ఉన్నతప్పేమిటో ముందు తేల్చమని నాకైతే సుప్రీం కోర్టు కెళ్ళాలన్నంత కచ్చగా ఉంది.

‘గట్టిగా వాగబోకే పిచ్చి మొహమా! ముందే కోర్టుల్లో నలుగుతున్న వ్యవహారాలివన్నీ! ఎతిమతంగా ఏదన్నా వాగితే నిన్నూ మూసేస్తారు” అని మా వారి రుసరుసలిక్కడ. నేనెప్పుడు జైలుకెళ్లి చిప్పకూడు తింటానా అని ఈయనగారికీ తహతహ లాగుంది చూస్తుంటే!

రోజులు బొత్తిగా బాలేవని నాకు మాత్రం తెలీదా? ఎప్పుడో వాడేసిన సర్కారు సొమ్ముకు ఇప్పుడు లెక్కలడిగి బెంగుళూర్లో చిప్పకూడు తినిపించారా జయలలితమ్మ చేత. తుఫాను మీదెవడో పిల్లాడు తెలిసీ తెలీక అవాకులూ చెవాకులూ వాగాడని లోపల వేసేసారు! నేనేమంత మరీ యతిమతం దాన్ని కాదు. అయ్యొరామా! ఇంట్లో నాలుగ్గోడల మద్యా మనసులోని ముచ్చట్లను కూడా బైటపెట్టుకునే రాత లేకపోతే ఇహ ఈ సంసారమెందుకంట? టింగురంగా అంటూ బైట తిప్పుకుంటూ తిరుగుళ్లెందుకంట?

అహ.. మాట వరసకే అనుకుందాం. మా వారు మహనల్లగా ఉంటారు. అయినా మరీ ఏమంత దుర్మార్గులు కారే! నలుపంటే నాకూ ఏమంత పడి చచ్చే మోజు లేదు కానీ.. పన్ను కట్టని సొమ్ముకి నల్ల ధనమని పేరెట్టి ఇలా అల్లరి పెట్టడడమే ఏం బావోలేదని నా ఉద్దేశం.

నల్ల సముద్రం.. మన గుంటూరు నల్లచెరువుల్నేమన్నా మనం అపవిత్రమను కుంటున్నామా? బొగ్గంటే నల్లబంగారం అంటారు మా వారు. నలుపు నారాయణ స్వరూపం. రాముడు నీలమేఘ శ్యాముడు. కృష్ణుడు నల్లనయ్య. మన కంటిగుడ్డు నలుపు. కాటుక నలుపు. నల్లద్రాక్ష యమ తీపి. మా చెల్లాయి జడ నాగుబాములా నల్లగా నిగనిగలాడుతుండ బట్టే కదా మరిదిగారు కాణీ కట్నం లేకుండా చేసుకున్నదీ! దిష్టి తగలకుండా పసిబిడ్డ బుగ్గకి పెట్టే చాదు బొట్టు నలుపే కదండీ! శివరాత్రి అవావాస్యనాడొస్తుంది. దీపావళిదీ అదే తంతు. ‘నల్ల’ అంటే అరవంలో బహు బాగని అర్థంట. మా పక్కింటి ఆండాళమ్మగారు మా పిల్లను పట్టుకుని పద్దస్తమానం ‘నల్ల పొన్ను.. నల్ల పొన్ను’ అని తెగ మెటికలిరిచుకుంటుంది. పచ్చ నోటును పట్టుకుని నల్లడబ్బనడమే.. అన్యాయంగా ఉంది!

‘తెలుపో..నలుపో.. జాన్తానై.. ఆ తేడా లిక్కడ లేనే లేవ్’ అని సినిమాల్లో ఎన్ టీ ఆర్ చిందు లేసినప్పుడు చప్పట్లుకొట్టి.. ఇప్పుడేమో ఆ నల్ల డబ్బునుగురించి .. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడ్డం తగదన్నది నా పాయింటు!

‘ఇప్పుడీ మహాతల్లి నల్ల ధనాన్నిలా వెనకేసుకొస్తుందేందిరా కామెడీగా!’ అని మీరు విస్తుపోతున్నారని తెలుసు! ఉన్న మాట అనుకుంటే కామెడీగానే ఉంటుంది మరి! దార్నే పోతుంటే ఓ రూపాయి బిళ్లే మీ కంట బడ్డదనుకోండి. ఎవరూ చూడకుంటే మీరు మాత్రం లటుక్కని తీసి పర్సులో వేసుకోరూ! అసలుమనిషి వచ్చి అడిగినా తిరిగిచ్చెయ్యడానికి ప్రాణం ఉసూరుమంటుందే! మరి అన్నేసి లక్షలు.. కోట్లు ! ఎట్లా సంపాదించారన్నది ఆనక.. ఓ సారి ‘మనదీ’ అనుకున్నాక ఏ సొమ్మూ సమ్మంధమూ లేకుండా మధ్యలో సర్కారోడొచ్చి పన్నులూ పాడూ కట్టమంటే.. ఎవరికైనా మనసుక్కంష్టంగానే ఉంటుంది కదండీ!

ఇవాళ ఆ జైపూరియానో, లోధీనో, టింబ్లోనో.. ఆ పేర్లే సరిగ్గా మన నోటికొచ్చి చావవు .. ఐనా నోటికొచ్చినట్లు తిట్టి పోస్తున్నాం! న్యాయమా! రేపు మన ఊరి పెద్ద మనిషే.. మన పక్కింటి రామనాథమే.. మన పొరుగూరి పుల్లమ్మక్కే ఈ జాబితాలో దర్శనమీయచ్చు. కోర్టువారి దగ్గర ఆంజనేయుడి తోకంత జాబితా ఉందంటున్నారు మావారు. విడతల వారీగా విఛారణ లుంటాయంట. ఏ రోజు పేపర్లో ఎవరి పేరొస్తుందో.. ఏ పూట ఎవడి పుట్ట ఠపాల్మని పేలిపోతుందో.. ఏ క్షణంలో ఎవరి చరిత్ర అందరం చదివే పుస్తకం తంతవుతుందో.. ఎవరికి తెలుసు?

ఎన్నో విచిత్రాలు నిత్యం జరిగే ఈ పుణ్యభూమిలో టీలమ్ముకునే పిల్లాడు ప్రధాని మంత్రవలా? మునుపటి ప్రభుత్వాల్లో ప్రధాన భూమిక పోషించిన పెద్దమనిషి తాడుతెగి సంపాదనంతా నల్ల ధనమని తేలి చివరికి సర్వం కోలుపోయి టీ నీళ్లక్కూడా దేబిరించ వచ్చు. రాష్ట్రం సరిహద్దులు దాటే పప్పు ధాన్యాల లారీని పట్టుకోలేక పోవచ్చు గానీ.. సర్కారు తలుచుకుంటే పాకిస్తాన్లో దాక్కున్నా దావూద్ ఇబ్రహీం గడ్డం పట్టుకు లాక్కురాగల్దు. స్విర్జర్లాండులో పుట్టక పోవడమే డబ్బున్న వాళ్ళ తప్పంటే ఇహ చేసేదేమీ లేదు.

ఉన్నవాడికే కదా పన్నుల బాధేంటో బోధ పడేది. చెల్లని పావలా కూడా మిగల్చుకోలేని మా ఎదురింటి కుచేల్రావూ నల్లకుబేరులని తూలనాడే వాడే!

దొంగసారా వ్యాపారం చేసి కోట్లకు పడగ లెత్తాడు మా అంకయ్య మామ. సాని పాపల్నితార్చి శరణాలయంపైన అంతస్థుల్లేపాడు మా బల్లిశాస్త్రి బాబాయి. ఇసుకలో దుమ్మే కలిపాడో.. దుమ్ములో ఇసకే పోసాడో.. ధర రెట్టింపయిందాక దాచి కొత్త రాజధాని వస్తుందని ఆశల్లేవంగానే బంగారం రేటుకు అమ్మేసాడు మా వీధి పచారీ కొట్టు సుబ్బయ్య శెట్టి. ఎవరూ బొట్టెట్టి పిలవక పోయినా..లోకుల వ్యవహారాల్లో బలవంతంగా దూరి సెటిల్మెంట్ల వంకతో సింహభాగం కొట్టేసే కోటిరెడ్డి కోట్లకు పడగలెత్తిన కథ మా వాడంతా రామాయణంలా పారాయణం చేస్తుంటాం అందరం. వాళ్లంతా తలా ఓ రాజకీయ పార్టీలో దూరి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు ఓట్లడుక్కోడానికని వస్తే అంతటా ‘ఓహో.. ఆహో’ అన్న నోళ్ళే కానీ.. నొసళ్ళూ ఒహళ్ళూ చిట్లించిన పాపాన పోలేదు! ఐన కాడికి నాలుగు రాళ్లు వెనకేసుకునే సదవకాశం ఇదేనని .. ఇంట్లోనూ ఈయనగారు లక్షా తొంభైసార్లు తహ తహ లాడారు. మళ్లా పొద్దున్నేపత్రిక రాగానే నల్లకుబేరుల జాబితాలో కొత్త పేర్లేవీ బైటపడటం లేదని పెదవి విరుపులు! ఎవరికీ చట్టమంటే పట్టడం లేదని.. కారాలు..మిరియాలు!!

అహ.. నాకు తెలీక అడుగుతున్నా గానీ పేర్లు బైట పెడితే ఏమవుతుందంట? రాత్రికి రాత్రే ఆ కొచ్చారియాలు, జైపురియాలు.. సెలబ్రటీలై పోడానికా! గ్లోబల్ యుగమో .. పాడో.. వార్తొచ్చిన ఉత్తర క్షణంలోనే ఉత్తరమెరికా నుంచి దక్షిణాఫ్రికా అడవుల దాకా పేర్లు పాకిపోతున్నాయీ మధ్య మరీ! పుట్టిన అప్పలపాలెంలోనే మొహాలు సరిగ్గా తెలీని డిప్పకాయలంతా ఇట్లాంటి లప్పనమేదో తగిలి గొప్పోళ్లై పోవడమే తప్ప .. వాళ్ల ముల్లేమన్నా మన చిల్లుజోలెల్లో వచ్చి పడబోతుందా? నల్లధనంమీద నడిపించే ‘బ్లాక్ మెయిల్’ కాదూ ఇదంతా!

డబ్బున్న పెద్దమనుషులతో వ్యవహారాలు! ఎన్ని చూసుకోవాలి? ఎంత గడ్డి కరిస్తే కూడిందో ఈ ముదనష్టం! ఎన్నాళ్లని మురగ బెట్టిందో.. ఎందరెందరి కొంపలు కూల్చి పేర్చిందో.. ఎక్కడెక్కడి గనులు తవ్వినవో.. ఎన్ని వ్యాపారాలకు, కంట్రాక్టులకు తెగిస్తే అంత సొమ్ము పోగయుంటుందీ! అడగంగానే చూపించేసెయ్యడానికి ఇదేమన్నా పెళ్ళి ఆల్బం ఫొటోలా?

నాలుగు డబ్బులు బ్యాంకులో పోగయితే చాలు అదేదో సుమతీ శతకంలో చెప్పినట్లు బెల్లం చూట్టూ ఈగల్లా మూగి పోతారు బంధు మిత్రులు. కాదంటే కారాలు.. లేదంటే మిరియాలు! చే బదుళ్లు ఇచ్చుకుంటూ కూర్చోడానికా ఇన్నిన్ని చేదనుభవాలతో ఆర్జించిందీ! ఊరూ పేరూ కూడా తెలీని దేశాలదాకా పోయి డబ్బలా వూరికే పూడ్చి పెడతారా ఎవరైనా?

‘ఎలుక తోక నలుపు. ఎందాక ఉదికినా తెలుపుకి తిరగేది కాదద’ని మన యోగి వేమనగారు ముందే చెప్పారు. చెవిన బెట్టే నాథుడేడీ?

ఆటల్లో మనమెలగూ పోటీకి పోలేము. పరిశోధనల్లో సైతం మన ప్రోగ్రెసు అంతంత మాత్రంగా ఉంది. అందాల పోటీల్లో గడపదగ్గరే తూలుడు. వ్యాపారాల్లోనైతే చైనా జపాన్లదే ముందడుగు. ఒక్క ఈ నల్లకుబేరుల జాబితాలోనే మనది ముందు వరసలో స్థానం. దానికీ ముప్పం తెచ్చుకునే పనులు ముమ్మర మవుతున్నాయి. అదే బాధ.

అత్తగార్లకు సంఘాలునాయి. అడుక్కునే వాళ్లకు సంఘాలున్నాయి. ఆఖరికి తాగుబోతు దేవదాసులు సైతం సంఘటితమై మత్తు హక్కులకోసం పోరాడుతున్న దేశమిది. ఏ సంఘమూ పెట్టుకోడానికి ఆస్కారం లేదనేగా నల్లకుబేరుల మీదింత విలయ తాండవాలు!

నల్లఖాతాలెవరో ఖాతాదారులకు తెలుసు. డబ్బు దాచుకున్న బ్యాంకులకూ తెలుసు. గతపాలకుల కాలంలోనే ఈ జాబితా వచ్చింది కాబట్టి నాటి ప్రముఖులందరికీ నల్లపేర్లన్నీ కంఠతా వచ్చుండచ్చు. నాటి జాబితానే నేటి ప్రభువుల చేతిలోనూ ఉన్నది. కాబట్టి ఇప్పటి నేతలందరికీ లోపాయికారీగా పాపులెవరో తెలిసుండచ్చు. కోర్టు సమర్పణలూ ముగిసాయి కాబట్టి అక్కడి యావత్ సిబ్బందికీ ఆ పేర్లన్నీ కంఠోపాఠంగా నాలికమీదే ఆడుతుండవచ్చు. విచారణకని దిగిన సిట్టో.. స్టాండో .. వాళ్ల కార్యాలయాల్లో మాత్రం జాబితాలోని ప్రతి వివరమూ చక్కర్లు కొట్టకుండా ఉంటాయా? ఇక తెలియని దెవరికమ్మా? ఈ యావత్ వ్యవహారంతో ఏనాడూ ఏ సంబంధమూ లేని.. సాధారణ పాటకజనానికి.. మీకూ.. నాకూ!

కోర్టుల్లో కేసులు రుజువై శిక్షలు ఖాయమైన పురచ్చి తలైవి ఫొటోలే చట్టసభల గోడల మీదనుంచి ఇంకా కిందకు దిగలేదు. ఓటర్లకి తెలీకుండా ఎన్నెన్ని వ్యవహారలిక్కడ గుట్టు చప్పుడుగా చక్కబడటం లేదూ! శతకోటి బోడిలింగాల్లో ఈ నల్లధనం ప్రహసనం ఒహటీ!

‘చిట్టచివరి చిట్టాలో ఆరొందల పై చిలుకు పేర్లున్నాయోచ్! కోర్టు గడపల దాకా వచ్చాసాయోచ్!’ అని గంతులేస్తునారీ మధ్య మా ఇంటి హనుమంతులవారు. సరే.. మన సోమ్మేం పోయింది మధ్యలో! సీల్డు కవర్లు.. సిట్టులు.. స్టాండప్పులు.. అన్నీ తట్టుకుని.. ఆ నల్లమొత్తాలు మొత్తానికి మన దేశంలోకి తరలివస్తే అదీ మరో అద్బుతమే!

మోదీగారు తలా ఓ ఐదులక్షలిస్తానన్నారు గాబట్టి.. మా వారి వాటాతో ఇంచక్కా వడ్రాణం చేయించుకోవచ్చు! నా వంతంటారా! అది స్త్రీ ధనం. నల్లధనంతో మల్లే ఆడుకుంటానంటే మాడి మసై పోతారు ఎంతటి వారైనా!*

– గుడ్లదొన సరోజినీదేవి

sarojini

See you soon..

drushya drushyam
[‘సారంగ’ కోసం వారం వారం కందుకూరి రమేష్ బాబు  రాస్తోన్న ‘దృశ్యాదృశ్యం’ ఛాయా చిత్రలేఖనంలో సరికొత్త సింగిల్ నరెటివ్. సాహిత్య ప్రక్రియలో ఒక ‘చిత్రలిపి’. ‘సామాన్యత’ నుంచి తాను విశాలం కావడంలో కెమెరా ప్రధానం అయిందంటున్నాడు.Click by click తన చూపు విస్తరిస్తున్నదీ అంటున్నాడు. నిజమో కాదో మున్ముందు మీరే చెప్పాలి.]
*
 ఏది ముందు? ఏది వెనక?ఒక్కోసారి దృక్పథాలు ఎంత దూరం తీసుకెళ్తాయి అంటే ఒకటే చూసేంత.
కానీ, ఎవరైనా తమ నుంచి తాము ముందుకు నడవడం ఒక ప్రయాస. ఒక వినిర్మాణం.

స్రక్చరల్ అడ్జస్ట మెంట్లోనూ ఒక ఒక పొసెసివ్ నెస్. అందలి డిసగ్రిమెంట్.

మళ్లీ అగ్రిమెంటూనూ. విల్లింగ్లీ సస్పెండింగ్ ది డిస్ బిలీఫ్ అంటాంగానీ, సస్పెండ్ చేయకుండా ఉండటం అసలైన చిత్రం.

+++

దృశ్యాదృశ్యంగా లోన ఉన్నది బయట…. బయట ఉన్నది లోన……ఇంకిపోవడం.
అర్బన్ రియాలిటీ. అదే ఈ దృశ్యం. అపనమ్మకాల నమ్మకాలం ఒక చిత్రం.

ఇందలి బొమ్మలు లేదంటే అదృశ్యంగా ఉన్నఆ మెట్రోరైలు నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులు…
అంతా ఒకే బొమ్మ.

బొరుసు ఏదీ? అంటే తెలియదు.
ఏది చిత్తో, ఏది బొత్తో తెలియని దృశ్యాదృశ్య ప్రపంచం…ఈ నగరం. ఈ జీవితం.

మన కాంప్లెక్సులు, అఛీవ్ మెంట్సూనూ.
అవును. చిత్రం.
నగర జీవితంలో వేగంగా ఇమిడిపోతున్న ఆధునికత లేదా నగరమంటేనే ఆధునికత.
అది వేగంగా అర్థమౌతున్న భావన. ఆభివృద్ధి నీడన మెల్లగా ఇమిడిపోతున్న సమస్తం. లేదా నీడలన్నీ జారిపోయి మనిషే నగ్నంగా  నిలబడుతున్న వైనం. అందుకే చిత్రాలు సరికొత్తగా చేయాలంటే ఫోకస్ మార్చుకుని చూడవలసి వస్తోంది. జీవితాన్ని అంగీకరించాలంటే చిత్తు చిత్తుగా ఓడిపోయి మళ్లీ గెలవాల్సి వస్తోంది లేదా గెలవకుండా చూసుకోను ఓడిపోవాల్సి వస్తోంది.+++నడిచివచ్చిన దారంతానూ ఒక ఐడెంటిటీ క్రైసిస్.+++విశేషం ఏమిటంటే దృశ్య మాధ్యమంలో ఒక స్టిల్ లైఫ్ చెప్పగలిగే కాంట్రాస్ట్ చాలా ముఖ్యం.
అది నిలబడుతుంది. నిలబెట్టి చూపును నిలబెడుతుంది. విస్తరింపజేస్తుంది. కన్నుల్ని కలియతిప్పేలా చేస్తుంది. ముందుకు దృష్టి సారించేలా చేస్తుంది.అయితే నమ్మవలసింది మరొకటి ఉంది. ఎవరికీ ఏదీ తెలియదు. ఒక్క దృశ్యానికి తప్ప!
నిజం. ఏది ముందు ఏది వెనకా అన్నది మన సమస్య గానీ దృశ్యంలో చిత్రం అంతా ఒక్కపరి ముద్రితం అవుతుంది. నమోదూ అవుతుంది. అన్నీ ఒకేసారి అచ్చవుతాయి. కానీ చూసుకోము. అది సిసలైన విషాదం.

విషాదమే నిజమైన చిత్రం.
కానీ చూడం.నిరాకరిస్తం.గుడ్డిగా ఆనందస్తం. ఆరాధిస్తం. యవ్వనాన్ని చూసినట్టు.

అందుకే చెప్పడం, దృశ్యాదృశ్యం అంటే చదవడం, ఒక అభ్యాసం.

పిల్లవాడై పలకాబలపం పట్టుకుని అక్షరాలు దిద్దడం, తుడుచుకోవడం. మళ్లీ దిద్దడం.
+++మళ్లీ ఈ పిల్లగాడి చిత్రానికి వస్తే, ఇలాంటి చిత్రాలెన్నో పోయే నగరావరణంలోని ఒక నవ్య చిత్రిక ఇది.
నా వరకు నాకు ఇది కొత్త చిత్రం. మీరు చూసి వుండవచ్చు. కానీ నేను తీసి ఉండలేదు. అదే చిత్రం.ఒకటే చూసి అన్నీ వదిలేయడం.
తలుపులన్నీ మూసి కిటికీలు తెరవడం. లేదా కిటికీలన్నీ మూసి తలుపులు తెరవడం.
కానైతే కావలసింది గోడలన్నీ లేని ఇంటిని విశ్వాన్ని దర్శించడం. అందులో ఇదే నా తొలి చిత్రం.షో కాదు, రియాలిటీ.
అనుకుంటాంగానీ, ప్రతిదీ రియాలిటీ షోగా మారుతున్న స్థితీ గతీ. బొమ్మలు, మనుషులు.
ఈ చిత్రం మటుకు హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట సెంట్రల్ నుంచి చేసిన దృశ్యం.+++సెంట్రల్.
అవును, ఒకప్పటి చౌరస్తాల్లో ప్రతీకలు వేరు. ఇప్పుడు సెంట్రల్ లు ప్రధాన కూడలి. సెంట్రలే ఒక కూడలి.
ఇక్కడా కార్మికులున్నరు. కానీ, అలా అనుకోరు. అక్కడా ఉన్నారు. కానీ వాళ్లూ అనుకోరు,
ఎవరికి వారు నవనిర్మాణంలో ఇనుప రజనులా తాము రాలిపోతున్నామని ఎవరూ అనుకోరు.

అసలు దృశ్యం ఇంత మాట్లాడదు. అదే చిత్రం.
చిత్రంలో చిత్రం అది.మనం అనుకున్నదే చిత్రం కాదు. అది వేరు.
కానైతే, తెలియకుండానే బొమ్మలైపోతున్న జీవితంలో ఏది మొదలు, ఏది ఆఖరో అర్థం కాని ప్రశ్నేలే వద్దు.
అన్నీ చిత్తరువులే. బొమ్మలే. ఒక భిన్నమైన అనుభవం కోసం నేనే ఇటువైపుకు మారి తీసిన అటువైపు చిత్రం. కానీ, ముందే చెప్పినట్టు అన్నీ అచ్చయిన చిత్రం నిజమైన చిత్రం.See you soon…
మరింత చిత్రంగా.
  – కందుకూరి రమేష్ బాబు

బొమ్మను ప్రేమించిన అమ్మాయి

MythiliScaled

 

అనగనగా ఇటలీ లో ఒక ధనవంతుడైన వర్తకుడు. అతనికి బెట్టా అని ఒక్కతే కూతురు. ఆమెకి పెళ్ళి వయసు వచ్చింది. తండ్రి ఎన్ని సంబంధాలు చూసినా తనకి ఒక్కటీ నచ్చలేదు. ఇలా అన్నిటినీ వద్దనుకుంటూ పోతే ఇక తనకి పెళ్ళి కాదేమోనని వర్తకుడు దిగులుపడిపోయాడు, కాని కూతురిని బలవంతపెట్టాలని అనుకోలేదు.

ఒక రోజు అతను నగరం లో జరగబోయే పెద్ద సంతకి బయల్దేరుతున్నాడు. అక్కడినుచి ఏమైనా కావాలా అని కూతుర్ని అడిగాడు. బెట్టా అంది- ” నాన్నా ! ఒక బస్తా మేలిరకం చక్కెర , రెండు బస్తాల తీపి బాదం పప్పు, నాలుగైదు సీసాల పన్నీరు, కొంచెం కస్తూరి, ఇంకొంచెం సాంబ్రాణి, నలభై ముత్యాలు, రెండు ఇంద్రనీలమణులు, గుప్పెడేసి కెంపులూ పుష్యరాగాలూ , బంగారుజరీ దారపు చుట్ట, వీటన్నిటితోబాటు ఒక పెద్ద వెండి గిన్నే చిన్న వెండి తాపీ- ఇవన్నీ కావాలి ” .ఇవన్నీ ఎందుకా అని తండ్రికి ఆశ్చర్యం వేసింది. అన్నీ కలిపితే చాలా ఖరీదవుతాయి కూడా. అయినా , మారుమాట్లాడకుండా వచ్చేప్పుడు వాటన్నిటినీ పట్టుకొచ్చి కూతురికి ఇచ్చాడు.

pinto 1

బెట్టా అన్నీ తీసుకుపోయి తన గదిలో గడియ వేసుకుంది. బాదం పప్పుల పొడిలో చక్కెర , కస్తూరి, సాంబ్రాణి -వెండిగిన్నెలో కలిపి పన్నీరు పోసి ముద్ద చేసి దానితో అపురూపమైన అందం గల యువకుడి నిలువెత్తు బొమ్మని తయారు చేసింది. వెండి తాపీతో ముఖాన్ని తీర్చిదిద్దింది . తెల్లటి పుష్యరాగాలూ ఇంద్రనీలాలూ కళ్ళుగానూ, కెంపులను పెదవులుగానూ ముత్యాలను పలువరుసగానూ అమర్చింది. బంగారు జరీదారాన్ని మెత్తని చిక్కని పోగులుగా పేని జుట్టుగా పెట్టింది. ప్రాణం ఒకటీ లేదేగాని అద్భుతంగా ఉన్నాడు . బెట్టా ఆ బొమ్మయువకుడిని ప్రేమించింది. అతను మనిషిగా మారితే బావుండుననుకుంది.ఒకప్పుడు సైప్రస్ రాజు ప్రార్థిస్తే బొమ్మకి దేవతలు ప్రాణం పోశారని వినిఉంది. ప్రేమ దేవతని భక్తిగా శ్రద్ధగా వేడుకుంది, కొన్ని రోజులపాటు. దేవత కరుణించింది- బొమ్మ యువకుడు మెల్లిగా ఊపిరి తీసుకుని వదలటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పెదవులు కదిపి బెట్టా ని పలకరించాడు. చివరిగా కాళ్ళూ చేతులూ విదిలించి కదిలించి నడిచేశాడు కూడా. బెట్టాని చూస్తూనే అతనికిచాలా ఇష్టం వచ్చింది. అతనికోసమే అప్పటిదాకా బ్రతికిఉన్నానని బెట్టాకి అనిపించింది .

సంతోషంగా యువకుడి చేయిపట్టుకుని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి – ” నాన్నా, నాకు పెళ్ళి చేయాలనే కదా మీ కోరిక ? ఇడుగో, ఇతన్ని ఎంచుకున్నాను ” అని చెప్పింది. కూతురి గదిలోకి ఎవరూ వెళ్ళలేదు, ఇతను ఎలా బయటికి వచ్చాడో తండ్రికి అర్థం కాలేదు. కాని ఎవరూ ఎప్పుడూ ఎక్కడా చూసిఉండనంత అందం గా ఉన్న ఆ యువకుడిని చూసి చాలా ఆనందించాడు.యువకుడికి పింటో స్మాల్టో అని పేరుపెట్టారు.   త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్ళి ఏర్పాటైంది. పెద్ద విందు చేసి ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళలో ఒక దూరరాజ్యపు రాణి కూడా ఉంది. ఆ ఊళ్ళో ఆమె బంధువులు ఉన్నారు, వాళ్ళని బెట్టా తండ్రి విందుకి పిలిచాడు. ఆమె కూడా వాళ్ళతో అక్కడికి వచ్చింది. ఆమెకి పింటో చాలా చాలా నచ్చేశాడు అతని పెళ్ళి విందుకి వచ్చింది కాస్తా అతన్ని తనే పెళ్ళిచేసుకోవాలనుకుంది.పింటో కొత్తగా ప్రపంచం లోకి వచ్చాడు కనుక ఎవరితో ఎలా ప్రవర్తించాలో బెట్టా అతనికి చెప్పి నేర్పించింది. అయితే అతను పసిపాప అంత నిర్మలమైనవాడు, రాణి చెడుబుద్ధి అతనికి తెలియలేదు. అందరికీ ఇచ్చినట్లే రాణికీ వీడ్కోలు చెప్పేందుకు ఆమె కూడా వెళ్ళాడు. బెట్టా తక్కిన అతిథులతో ఇంటిలోపలే ఉండిపోయింది . రాణి అతని చేయి పట్టుకుని తన రథం లో ఎక్కించుకుని తన రాజ్యానికి ప్రయాణమైంది. ఆ రథానికి కట్టిన గుర్రాలు చాలా వేగంగా పరుగెత్తగలవు – అందుకని కన్నుమూసి తెరిచేలోపు రథం   వెళ్ళిపోయింది.

pinto 2

పింటో కోసం బెట్టా చాలాసేపు చూసింది. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండిపోయాడేమో నని కాసేపు, చల్లగాలికి బయటికి వెళ్ళాడేమోనని కాసేపు అనుకుని ఊరుకుంది. వచ్చినవాళ్ళంతా ఒక్కొక్కరూ వెళ్ళిపోయారు. చివరికి వెళ్ళి చుట్టుపక్కలంతా వెదికింది. ఎక్కడా లేడు పింటో. అతన్ని ఎవరో ఎత్తుకుపోయిఉంటారని అప్పటికి బెట్టాకి అర్థమైంది. వర్తకుడు సేవకులని పిలిచి అందినంతమేరా గాలించమని ఆజ్ఞాపించాడు. ఏమీ లాభం లేకపోయింది. బెట్టా ఏడ్చి ఏడ్చి చివరికి ఒకరోజున ధైర్యం తెచ్చుకుని తనే పింటో ని వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. తండ్రికి తెలియకుండా , పేదపిల్లలాగా వేషం వేసుకుని, కావలసినవి తీసుకుని బయల్దేరింది.అన్ని ఊళ్ళూ తిరుగుతూ   కొన్ని నెలలపాటు వెతుకుతూనే ఉంది. అప్పుడు ఒక ఊళ్ళో ఒక పెద్దావిడ కలిసింది. ఆవిడ చాలా దయగలది. బెట్టా కథ అంతా విని జాలిపడింది. బెట్టా కి మూడు మంత్రాల వంటివి నేర్పింది. మొదటిది- ” ట్రిషే వర్లాషే – ఇల్లు కురుస్తోంది ” రెండోది – ” అనోలా ట్రనోలా – ఏరు పొంగుతోంది ” మూడోది – ” స్కటోలా మటోలా – సూర్యుడు వెలుగుతున్నాడు ”. బెట్టా కి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ మాటలు మూడుసార్లుగా పలికితే మేలు జరుగుతుందని హామీ ఇచ్చింది.

బెట్టాకి పెద్దగా నమ్మకమేమీ కలగలేదు. సరే, గుర్తుంచుకుంటే పోయేదేముందనుకుని పెద్దావిడకి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ తనదారిన తను వెళ్తూ ఉంది. పోగా పోగా రౌండ్ మౌంట్ అనే నగరం వచ్చింది. మధ్యలో పెద్ద రాజభవనం. బెట్టా కి ఎందుకో పింటో అక్కడే ఉంటాడనిపించింది. దొడ్డిదారిన వెళ్ళి అక్కడి గుర్రపుసాలలో ఆ రాత్రికి తలదాచుకునేందుకు చోటు అడిగింది. గుర్రాలసాల ను చూసుకునేది ఒక ముసలివాడు. అతను చాలా మంచివాడు. బెట్టాని చూస్తే తన కూతురులాగా అనిపించి సాల పక్కనే ఉన్న తన చిన్న ఇంట్లో ఉండచ్చు, రమ్మని ఆహ్వానించాడు. బెట్టా అనుకున్నట్లే మరుసటి రోజే పింటో రాజభవనపు తోటలోదూరం నుంచి కనిపించాడు. ఏదో కలలో నడుస్తున్నట్లు దేన్నీ పట్టించుకోకుండా ఉన్నాడు అతను . జరిగిందేమిటంటే, పింటో నీ తీసుకొచ్చేశాక రాణి అతన్ని పెళ్ళిచేసుకోమని అడిగింది. పింటో తనకి పెళ్ళైపోయిందనీ బెట్టా దగ్గరికి వెళ్ళిపోతాననీ మొండికేశాడు.

అతన్ని ఒప్పించలేక రాణి ఒక మంత్రగత్తె ని సలహా అడిగింది. ఆమె ఒక మూలిక ఇచ్చి సంవత్సరం పాటు రోజూ అతనికి ఇస్తే జరిగిన దం తా మరచిపోతాడంది. రోజూ పింటోకి ఇచ్చే ఆహారం లో రాణి ఆ మూలిక కలుపుతూ వస్తోంది. పింటో జ్ఞాపకశక్తి చాలావరకు పోయింది. ఇంకా రాణిని పెళ్ళాడేందుకు ఒప్పుకోవటం లేదుకాని, కొద్ది రోజుల్లో సంవత్సరం పూర్తయిపోతుంది. పింటో తన ఇష్టం ప్రకారం అక్కడ ఉండిఉండడని బెట్టా కి తెలుసు, ఎలా అతన్ని అక్కడనుంచి తప్పించాలో తెలియలేదు. పెద్దావిడ చెప్పిన మొదటి మంత్రాన్ని మూడుసార్లు పైకి పలికింది. ” టిషే వర్లాషే- ఇల్లు కురుస్తోంది ” ఆ వెంటనే అక్కడొక చిన్న బంగారురథం ప్రత్యక్షమైంది. దాని మీదంతా రత్నాలు పొదిగి ఉన్నాయి. రథం దానంతట అదే ఆ తోట చుట్టూ ఉన్న కాలిబాట లో తిరగటం మొదలుపెట్టింది.

pinto3చూసినవాళ్ళంతా ఆశ్చర్యపడిపోయారు. అందరూ చూశాక బెట్టా దాన్ని పట్టుకుపోయి తన గదిలో పెట్టేసుకుంది. ఈ సంగతి రాణికి తెలిసింది.రాణికి అందమైన వస్తువులమీద చాలా వ్యామోహం, అవి ఎవరివైనా సరే. గుర్రాలసాల అతని ఇంటికి, బెట్టా గదిలోకి వచ్చి – ఆ బంగారు రథాన్ని తనకు అమ్మమని అడిగింది. బెట్టా అంది ” నేను బీదదాన్నేనండీ, కాని ఎంత డబ్బూ బంగారమూ ఇచ్చినా దీన్ని అమ్మను. ఒకటే కావాలి నాకు – ఇందాక ఒక అందమైన అబ్బాయి మీ భవనం లోకి వెళ్ళటం చూశాను, అతని గది తలుపు ముందు ఒక రాత్రంతా నన్ను గడపనిస్తే మీకిది ఇచ్చేస్తాను ” . ఈ పేదపిల్ల డబ్బూ బంగారమూ వద్దని ఇలా అడిగిందేమిటా అని రాణి విస్తుపోయింది . ” ఉట్టినే ఆ గదిముందు పడుకుంటాననే కదా అడిగింది.. అయినా పింటో ని పలకరిస్తుందో ఏమో, అతనికి నిద్రపోయే మందు ఇచ్చి పడుకోబెట్టేస్తే సరి, ఈమె ఎంత పిలిచినా జవాబు ఇవ్వడు ” అని పథకం వేసుకుంది.

 

రాత్రయింది. నక్షత్రాలు ఆకాశం మీదికీ మిణుగురులు నేల మీదికీ వచ్చాయి. రాణి రోజూ ఇచ్చే మూలికతోబాటు ,ఘాటైన నిద్రమందుని పాలలో కలిపి పింటో చేత తాగించింది. అతను పక్క మీద వాలగానే ఒళ్ళెరగకుండా నిద్రపోయాడు. అప్పుడు బెట్టా ఆ గదిముందుకు వచ్చింది. అతన్ని పిలిచింది, గట్టిగా అరిచింది, ఏడ్చింది- తన బాధనంతా వివరించి చెప్పుకుంది. అతను మాత్రం కళ్ళు విప్పనేలేదు . చూస్తుండగానే తెల్లారిపోయింది. రాణి వచ్చి బెట్టా ని రెక్క పట్టుకు లేపి ” చాలు కదా, ఇక వెళ్ళు ” అని పంపించేసింది. బెట్టా కోపంగా గొణుక్కుంది – ” నీకూ ఎప్పటికీ ఇదే చాలు, పింటో నిన్ను ప్రేమించనే ప్రేమించడు ”- అప్పటికిక చేసేదేమీలేక వెళ్ళిపోయింది.

 

మరుసటిరోజు బెట్టా రెండో మంత్రాన్ని మూడుసార్లు పలికింది – ” అనోలా ట్రనోలా- ఏరు పొంగింది ” . ఈసారి మణులు చెక్కిన బంగారుపంజరం లో ముద్దొచ్చే పక్షి ఒకటి ప్రత్యక్షమైంది. అది కోయిలకన్నా తీయగా పాడుతోంది. విషయం తెలుసుకున్న రాణి మళ్ళీ వచ్చి బెట్టా ని పక్షిని అమ్మమని అడిగింది. బెట్టా నిన్నటిలాగే కోరింది. ఇవాళైనా పింటో కి తన మాటలు వినిపించవా అని ఆమె ఆశ. రాణికి ఇంకాస్త అనుమానం వచ్చింది. పింటోకి రెట్టింపు మోతాదులో నిద్రమందు ఇచ్చింది. ఆ తర్వాత కథంతా నిన్నటిలాగే జరిగింది. అయితే, ఆ గది పక్కనే ఉన్న వసారాలో దర్జీ అతనొకడు పనిచేసుకుంటున్నాడు. అతను ఎవరూలేని ఒంటరివాడు . సంవత్సరం పూర్తవుతూనేజరగబోయే తమ పెళ్ళిబట్టలు కుట్టటం కోసం రాణి అతన్ని అక్కడే ఉంచి రాత్రింబవళ్ళు పనిచేయిస్తోంది. అతను బెట్టా మాటలన్నీ విన్నాడు. పూర్తిగా అర్థం కాకపోయినా బెట్టా కీ పింటోకీ పెళ్ళయిందనీ అతను భార్యని వదిలేసివచ్చాడనీ తెలిసింది. రాణి మీద దర్జీ అతనికి మంచి అభిప్రాయమేమీ అదివరకే లేదు, ఇప్పుడు ఈ సంగతి తెలిసి కోపం కూడా వచ్చింది.

pinto4

 

మూడోరోజు పొద్దునే పింటో కి కుట్టే బట్టలకోసం కొలతలు తీసుకోవాలని కబురు చేశాడు. కొలతలు సరిగ్గా రావాలంటే పింటో తనని ఒంటరిగా కలవాలనీ చెప్పి పంపాడు. రాణి ఒప్పుకుని పింటోని పంపింది. దర్జీ తను విన్నదంతా పింటోకి చెప్పేశాడు. పింటోకి అంతా గుర్తొచ్చీ రానట్లుంది. ఎప్పటినుంచీ ఆపుకోలేనంత నిద్రవస్తోందో అడిగి తెలుసుకున్న దర్జీ ఆ రాత్రి పాలు తాగకుండా ఉండమని సలహా ఇచ్చాడు.

 

బెట్టా ఆ రోజున ఆఖరిప్రయత్నం చేయాలనుకుంది. మూడో మంత్రాన్ని మూడుసార్లు పలికింది – ” స్కటోలా మటోలా-సూర్యుడు వెలుగుతున్నాడు ”. ఈసారి చిన్న బంగారపు ఉగ్గుగిన్నె వచ్చింది. అందులోంచి రంగురంగుల , సుతిమెత్తని పట్టుబట్టలు, సన్ననిముత్యాలు కుట్టినవి బయటికి వచ్చాయి. వాటిని మడిస్తే అన్నీ ఆ ఉగ్గుగిన్నెలో పట్టేస్తున్నాయి, అంత పల్చటివి. రాణి అవీ కావాలంది, బెట్టా ఇదివరకులాగే అడిగింది. రెండు రాత్రులూ ఏమి కాలేదు కదా, ఇప్పుడింకేం ముంచుకొస్తుందిలెమ్మని రాణి సరేనంది. ఆ రాత్రి రాణి ఇచ్చిన పాలని పింటో ఆమె చూడకుండా పారబోశాడు. బెట్టా వచ్చి గదివాకిలిలో కూర్చుంది. ఆమెకేమీ ఆశ మిగల్లేదు. పింటోకి చెబుతున్నట్లు కాకుండా గడిచిందంతా తలుచుకుంటోంది. ”అద్భుతమైనవన్నీ కలిపి అత్యద్భుతమైన అతన్ని మలిచాను. ప్రేమదేవిని అడిగి ప్రాణం తెచ్చాను. అంతా అయాక కోల్పోయాను, అతను తిరిగి కనబడినా నా మాటలు వినబడటం లేదు…ఇదే చివరి రాత్రి   ” మేలుకునే ఉన్న పింటోకి అంతా వినిపించింది, గుర్తొచ్చింది.గబగబావెళ్ళి , బెట్టా ని కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుని ఆనందం పట్టలేక ఏడ్చారు. రాణి , బెట్టా నుంచి సంపాదించిన వస్తువులు తీసేసుకుని ఇద్దరూ రాత్రికి   రాత్రి బయల్దేరి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. దర్జీ ని కూడా లేపి తమతో తీసుకుపోయారు. వీళ్ళని చూసి , బెట్టా తండ్రి సంతోషంతో చిన్నపిల్లవాడిలాగా గంతులు వేశాడు. అంతా సుఖంగా ఉన్నారు.

 

  • ఇటాలియన్ జానపదకథ , by Giambattista Baile      
  •  
  •                                                            [ from Pentamerone ]