Archives for September 2014

ఇది open university..

drushya drushyam 47ప్రపంచ ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ sebastiao salgado పంచుకున్న ఒక అనుభవాన్ని మరచిపోలేం.

అదొక పాఠం.

+++2004లో ఆయన ‘Genesis’ అన్న ఒక అరుదైన ఫొటోగ్రఫి ప్రాజెక్టును చేపట్టి 2011లో పూర్తి చేశారు.
అదేమిటీ అంటే, ప్రకృతి ఇంకా వికృతి గాని స్థితి ఎక్కడుందో అక్కడకు పోయి ఫొటోలు తీయడం.

పర్వతాలు, సముద్రాలు, ఎడారులు, మైదాన ప్రాంతాలు…వీటన్నిటినీ సంచరిస్తూ పురాతన, అనాది లేదా ‘ఓం ప్రథమం’ అన్న అంశాన్ని ఇముడ్చుకున్న ప్రకృతిని, జీవజాలాన్ని పరిశుద్ధ స్థితిని తన కెమెరాతో ఒడిసి పట్టుకుని మనకోసం ఆవిష్కరించడం. ఆ పనిలో ఆయన ఎనిమిదేళ్ల సుదీర్ఘకాలం భూగోళంలో సగభాగాన్ని చుట్టివచ్చారు. పని పూర్తయ్యాక ఆయన చెబుతారు, తన ప్రాజెక్టు ప్రారంభంలో తాను నేర్చుకున్న ఒక అపూర్వమైన పాఠాన్ని, అదీ ఒక తాబేలు నుంచి నేర్చుకున్న విధానాన్నితాను ఎంతో బాధ్యతతో వివరిస్తారు.

+++

ఫొటో షూట్ ప్రారంభంలో తాను ముందుగా ఒక తాబేలును ఫొటో తీయాలని నిశ్చయించుకున్నరట.
దానికి ఎదురుగా వెళ్లి నిలబడ్డాడట.
చిత్రం.
దాన్ని తాను ఎంతటి కుతూహలంతో చూస్తున్నాడో అదీ అంతే కుతూహలంతో తనను చూస్తున్నదట.
ఇరువైపులా కుతూహలం.
అప్పుడనిపించిందట! ‘జెనిసిస్’ లేదా ‘సృష్టి…తాను చేయబోతున్న పనికి తాను అలా పేరు పెట్టుకున్నాడు గానీ తాను మళ్లీ ‘సృష్టి’ మొదలుకు వెళ్లవలసిందే అని!
అవును. తన పని ప్రారంభం కావాలంటే తాను చాలా మారాలనీ అవగతం అయిందట.
నిజం. తాను జంతుజాలాన్ని గనుక ఫొటోగ్రఫీ చేయాలంటే ‘నేను మనిషిని’ అన్న భావన వదిలి, సృష్టిలో ‘నేనూ ఒక జంతువునే’ అన్న సంగతిని యాది చేసుకోవాల్సి వచ్చిందట.
తాబేలు వల్ల కలిగిన ఆ మెలుకువతో ఆయన ఫొటోగ్రఫి చేయడం మొదలెట్టి నిజంగానే గొప్ప కుతూహలం కలిగించిండు మానవాళికి. అది అదృష్టమే. తన జీవితంలో ఒక యాభై ఏళ్లు ఛాయాచిత్రణంలో ఉన్నప్పటికీ, ఆ వయసులో మళ్లీ తానొక పాఠం నేర్చుకుంటేగానీ ఒక గొప్ప ప్రాజెక్టు పూర్తి చేయలేనని గ్రహించగలగడం. అదీ తాను ‘మనిషిని’ అన్న స్పృహను కోల్పోవడంతోనే సాధ్యం అని అంగీకరించగలగడం. అదృష్టం.
ఇలాంటి అదృష్టాలు మన ప్రపంచంలో కూడా చాలా అవసరం.

+++

అవును.
మనిషి గురించి ఫొటోగ్రఫీ చేస్తున్నప్పుడు మనిషిగా ప్రవర్తించడం మామూలు విషయం కాదు
ఒక వీధి మనిషిని, చెత్త కాగితాలు ఏరుకునే మనుషులను తీస్తున్నప్పుడు మనదైన ప్రపంచంలోంచి ఆ మనుషులను చూస్తాంగానీ కేవలం మనిషిగా తోటి మనిషిగా వాళ్లను చూడగలగడం కష్టం.

అందుకోసమూ మారాలి.

నా స్వీయానుభవం ఏమిటంటే వారిని ‘అధోజగత్ సహోదరులు’ అన్నభావం నుంచి చూడటం మనం చెరిపేయగలగాలి.
రావూరి భరద్వాజ గారిలా వారిది ‘జీవన సమరం’ అన్న దృక్పథం కూడా వదలాలి.
మనం ‘పైన’, వాళ్లు ‘కింద’ …అన్నఅభిప్రాయమూ తొలగించుకోవాలి..
అంతేకాదు, ‘మనం భద్రజీవులం’ – ‘వాళ్లు కాదు’ అన్న ఆలోచనా కూడదు.

జస్ట్. మనిషిగా ప్రవర్తించడం మంచిది.
sebastiao salgado అనుభవం నుంచి మనం అదే గ్రహించాలి.
జంతుజాలాన్ని చేస్తున్నప్పుడు ఎట్లాగైతే జంతువు కావాలో మనిషిని చేస్తున్నప్పుడు మనిషే కావాలి.
ఎక్కువా తక్కువా వద్దు.

పాఠం అని కాదుగానీ ఒక పరామర్శ.
‘హ్యూమన్ డిగ్నిటీ’ ఎక్కడున్నా దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి.
అప్పుడే వాళ్లూ మనం ఉన్నది ‘ఒకే విశ్వం’ అన్న సంగతి తెలుస్తుంది.
‘తారతమ్యం’ అన్నది ‘ధనికా- పేదా’ అన్నది వాస్తవమేగానీ, నేటి గురించి తెలుసుకోవడం, రేపటి గురించి ఆశ పడటం అన్నది, ఒక కూతూహలం అన్నది ఇంకా సత్యం.

+++

పఠనం. అది దిన పత్రికా పఠనం.
అది దెబ్బతీయని చిత్రం కోసం మనిషిగా ఎంతో హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలి.
అప్పుడే ఇలాంటి చిత్రాలు- ఏ న్యూనతా లేని అన్యోన్య చిత్రాలను ఒడిసి పట్టుకోగలం.

నా వరకు నాకు ఈ చిత్రం ఒక ఓపెన్ యూనివర్సిటీ.
ఒక సారస్వత విశ్వవిద్యాలయం.
వీధి బాట  నిశ్చయంగా ఒక విశ్వవిద్యాలయమే.

+++

మన చదువూ సంధ్య సరేగానీ, వాళ్ల జీవన సారస్వతమూ ఒకటున్నదన్న గ్రహింపుతో చేసిన చిత్రం ఇది.
వాళ్లు చెత్త కాగితాలే ఏరవచ్చుగాక. కానీ, అదే వారి దైనందిన జీవితం కాదన్న స్పృహతొ కూడిన చిత్రణ ఇది.
నేటి పేపర్ రేపటి చిత్తు కాగితమే అవుతుంది. నిజమే. అది వారికి ఉపయోగమే కావచ్చుగాక. కానీ, రేపటి విలువ తెలిసిన వాళ్లే నేటి విలువనూ గ్రహిస్తారు. అదే ఈ చిత్రం. అదే వాళ్లనూ, మననూ కలిపే దృశ్యాదృశ్యం. Genesis.

~  కందుకూరి రమేష్ బాబు

ramesh

ఎగిరే పావురమా!-9

egire-pavuramaa9-banner

నా కోసం ఎవరో మనిషి ‘ఊతకర్రలు’ తెస్తారని తెలుసును గాని ఇలా డాక్టరుగారు, ఓ పెద్దావిడ కూడా వస్తారని ఊహించని మేము ఆశ్చర్య పోయాము.
**
అదే సమయానికి ఉమమ్మ కూడా వచ్చి వారికి ఎదురెళ్ళింది. తాత భుజం మీద చేయి వేసి నా దిశగా నడిపించుకు వచ్చారు డాక్టరుగారు. అంతా కలిసి నేనున్న రావి నీడకి చేరారు.

“అమ్మా, ఈమె ఉమాదేవి, వీళ్ళ నాన్నగారే ఈ గుడి బాధ్యతలు నిర్వహించేది,” అంటూ ముందుగా ఉమమ్మని, తరువాత నన్ను, తాతని కూడా వాళ్ళమ్మగారికి పరిచయం చేసారు డాక్టరుగారు.
హుందాగా, అందంగా ఉన్న ఆ పెద్దావిడకి అందరం నమస్కారం చేసాము.

“మా అమ్మగారు. పేరు సరోజిని దేవి. అమ్మకి దేవాలయాలు, పూజలు అంటే శ్రద్ధ. ఇక్కడ ఈ గుడి ఉందని తెలుసును గాని చూడలేదట.
అందుకే ఈ గుడి చూస్తారని అమ్మని కూడా ఇలా తీసుకొచ్చాను.
గాయత్రి కోసం నేను అడిగిన ‘ఊతకర్రలు’ కూడా రావడంతో, స్వయంగా చూసి అమర్చవచ్చని వచ్చాను,” అంటూ మాకు వివరించారాయన.

“అయ్యో ఎంత మాట. మీరు రావడం మాకు చాలా సంతోషం. నాన్నకి మంగళగిరి గుడిలో హోమం ఉండడంతో అక్కడికి వెళ్లారు. మీరు వచ్చినందుకు సంతోషిస్తారు. పదండమ్మా దేవుడిని చూద్దురుగాని,” అంటూ సరోజినిగారితో ఉమమ్మ గుడివైపుకి దారి తీసింది.

“రాజమ్మా, నువ్వు పెట్టిలోంచి ‘క్రచ్చస్’ తీసి, గాయత్రికి సరిగా ఉన్నాయో లేదో చూడు. నేనిప్పుడే వస్తా,” వెంట వచ్చిన స్త్రీకి పురమాయించారు డాక్టరుగారు.
**
రాజమ్మ ప్యాకేజీ ఇప్పి ‘ఊతకర్రలు’ బయటకి తీసి, పరిశీలించింది.
కొలతలు సరిచేయ్యాలంటూ డ్రైవరుకి మరలు పెట్టమని పురమాయించి, తాతతో మాట కలిపింది.
సరిజిని గారి ‘శ్రీ సత్యశారద చారిటీ’ కి ఇరవై ఏళ్లగా పని చేస్తుందంట ఆమె.

“అస్పత్రులకి వచ్చే ఎందరో బీదవారికి సహాయం చేస్తారు మా మేడం సరోజినమ్మ, సార్ జనార్ధన్ గార్లు. వారు గుంటూరు వైద్య కళాశాల యజమానులు.
ఈ సంస్థ ద్వారానే గుంటూరు శివారుల్లో పెద్ద ఆసుపత్రి కట్టబోతున్నారు మా అయ్యగారు,”
గర్వంగా చెప్పింది రాజమ్మ.
నేను, తాత వింటున్నామో లేదో అని ఓ సారి మా వంక చూసిందామె.

“వారి రెండో అబ్బాయే, డాక్టరు మల్లిక్ బాబు.
ఆయన అసలు పేరు మల్లికార్జునరావు,” అందామె.
త్వరలో మల్లిక్ గారు అమెరికా వెళ్ళబోతున్నారని, చెప్పింది.

ఇలా రాజమ్మ మాటల్లో, డాక్టరు మల్లిక్ గురించి, ఆయన కుటుంబం గురించి, ఎన్నో సంగతులు తెలిసాయి మాకు.
మరలు బిగించిన ‘ఊతకర్రలు’ నా పక్కగా ఉంచెళ్ళాడు డ్రైవర్.
**
ఇంతలో ఉమమ్మ వాళ్ళు తిరిగొచ్చారు. నాకు సాయంపట్టి నిలబెట్టి, ఊతకర్రలు సరిచేసి, వాటి సాయంతో ఎలా కదలాలో, ఎంత ప్రయత్నం చెయ్యాలో చూపించారు డాక్టరుగారు. వాటితో అరుగు మీదనుండి లేవడం, కూచోడం, ఎంతో వీలుగా, సుళువుగా ఉందనిపించింది నాకు. కొంత ఉషారుగా అనిపించింది కూడా.

కొబ్బరి ప్రసాదాలు తింటూ నా ఎదురుగా అరుగు మీద కూచున్నారందరు. ఇంతలో అతిధుల్ని చూడాలన్నట్టు మా పావురాళ్ళు కూడా వచ్చాయి. అరుగులకి కాస్త దూరంగా వయ్యారంగా గింగిరాలు తిరుగుతూ కువకువలాడాయి. ఉమమ్మతో పాటు సరోజినిగారు కూడా వాటికి పిడికిళ్ళతో గింజలు జల్లారు.
సరదాగా తలా ఓ మాట, ఓ కబురు చెబుతున్నారు. నేను వింటూ కూచున్నాను.
“చూడండి ఉమాగారు, మీరు ప్రస్తావించిన ‘ప్రత్యేక విద్యావిధాన క్రమం’ ప్రాధమికంగా మన గుంటూరు కాలేజీల్లో ఉన్నాయట. వాటి తరువాత హైదరాబాదులో మరో రెండేళ్ళ చదువు కూడా పూర్తిచేసి పట్టా పొందాలట. మా అమ్మగారు చెప్పారు.
ఈ కవర్లో మీకు కాలేజీ దరఖాస్తు, సమాచారం ఉన్నాయి. అమ్మే తెప్పించారు,” అంటూ రాజమ్మ దగ్గరున్న బ్యాగు నుండి ఉమమ్మకి ఓ పెద్ద కవరు అందించారు మల్లిక్ గారు.
కవరందుకొని సరోజినిగారికి కృతజ్ఞతలు చెప్పింది ఉమమ్మ.

“అవునమ్మా ఉమా, నీకు ఈ విషయంలో ఏ సహాయం కావాలన్నా నేను చేయగలను. అసలు ఈ చదువు ఎన్నుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. నీకు లాగ సేవా దృక్పథంతో అలోచించి ఉన్నత విద్యలను ఎన్నుకునేవారు అరుదుగా ఉంటారు.
మల్లిక్ బాబు వచ్చే నెలలో అమెరికా వెళతాడు. అక్కడ చదువు ముగించుకొని ముడేళ్ళకి వస్తాడు. ఈ లోగా నీకు గాని, గాయత్రికి గాని ఏ సహాయం కావాలన్నా నా వద్దకు రండి. నా ఫోను నంబర్లు ఇస్తాను,” అన్నారు ఉమమ్మతో సరోజినిగారు.

తరువాత మా వంక చూసారు ఆమె. “ఇక పోతే, గాయత్రి విషయంలో – ఇక్కడ మీకు దగ్గర్లోనే డాక్టరు శివారెడ్డి ఉన్నారు. ఆయన వద్దనుండి ఓ మనిషి ఇంటికే వచ్చి నెల రోజులపాటు గాయత్రి కాళ్ళకి చికిత్స, వ్యాయామం చేయించేలా ఏర్పాటు చేయించాము,” అన్నారు సరోజినిగారు.
“మా సంస్థ వాళ్ళు ఇవన్నీ ఎప్పుడూ చేసేవే. మీరేమీ మొహమాట పడవద్దు,” అని కూడా అన్నారామె.
ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు తాత. అందరి వద్ద శెలవు తీసుకొని మల్లిక్ గారు, సరోజినిగారు వెళ్ళిపోతుండగా వచ్చింది కమలమ్మ.
**
మరునాటి నుండి, సరోజినిగారు అన్నట్టుగానే ఓ ఆయా కొట్టాంకి వచ్చి నా కాళ్ళని రకరకాల నూనెలతో మర్దనా చేసిన తరువాత వ్యాయామం, కర్రల సాయంతో పైకి లేచి కొంత దూరం మెసలడం కూడా చేయిస్తుంది.
అలా నెలరోజులు పాటు జరిగింది ఆ చికిత్స.
నాకు సహాయపడిందనే అనిపించింది అందరికీ.

“ఇకనుండి ఈ కర్రలే నీకు సహకరించే కాళ్ళ లాటివి కాబట్టి, ఎప్పుడూ మనిషిలో భాగంగా నీ వెంటే ఉండాలి. గుర్తుపెట్టుకో. నూటికి నూరుపాళ్ళు వాడాలి వీటిని,” అని కూడా చెప్పింది వెళ్లేముందు ఆయమ్మ.

illustration 9
**
మల్లిక్ గారిని, సరోజినిగారిని, వారి మంచితనాన్ని, తాత తలవని రోజుండదు.
ఈ నెలలోపే సొంతగా ఊతకర్రల సాయంతో పైకి లేవడం, నిలదొక్కుకొని మెల్లగా ముందుకు కదలడం మొదలెట్టాను.
అరికాళ్ళు ఒక్కోటి నేల మీద ఆన్చి ముందుకు కదలాలని కూడా ప్రయత్నిస్తున్నాను. కర్రల సాయంతో నిలబడినప్పుడు సరిగ్గా ఉమమ్మంత ఎత్తు ఉన్నాననుకుని గర్వంగా అనిపించింది.
**
కొత్తగా ఊతకర్రల సాయంతో నేను కదలగలగడం చూస్తే కమలమ్మ ఆశ్చర్య పోతుందేమో నని అనుకుంటూ మొదటిసారి కర్రలని తీసుకొని గుడికి బయలుదేరాను రిక్షాలో. దారిపొడవునా ఆమె గురించే ఆలోచించాను.

నెలక్రితం మల్లిక్ గారు గుడికి వచ్చెళ్ళారని తెలిసినప్పటి నుండి, వారి వివరాలు, వచ్చిన కారణాలు కమలమ్మ నన్ను ఎన్నోరకాల అడిగింది.
సమాధానంగా – వచ్చినాయన నాకు వైద్యం చేసిన డాక్టరని, నాకు ఊతకర్రలు ఇప్పించినవారని, వాళ్ళమ్మగారితో ఈ గుడి చూడ్డానికి వచ్చారని తెలియజెప్పాను. ఎప్పటిలాగానే నేను చెప్పింది చాల్లేదు ఆమెకి.
**
నేను సొంతంగా పైకి లేచి మెసల గలగడం చూసి, నేననుకున్నంత ఆశ్చర్యపోలేదు కమలమ్మ.
“ఇట్టా కాదుగా నేననుకున్నది. నీ కాళ్ళు నేలమీద ఆనించి నడవ గలుగుతావని కదా నేనానుకున్నా,” అని పెదవి విరిచింది.
‘ఈమె అనుకున్నంత మార్పు రావడం అయ్యేనా? అట్లా వస్తే ఎంత బావుండునో’ అనుకున్నాను.
**
మళ్ళీ ఆదివారం. మళ్ళీ మధ్యానం. ఈ సారి కూడా కమలమ్మ గుళ్ళో లేకుండా పోయినప్పుడే – డాక్టర్ మల్లిక్ గారు కార్లో వచ్చి దిగారు.
ఈ మారు ఉమమ్మ, పూజారయ్య కూడా ఆయనకి ఎదురెళ్ళారు.

నాకు అమడ దూరంలోనే వాళ్ళతో మాట్లాడుతూ నా వంక చూసి, ‘నేనే అక్కడికి వస్తా’నని సైగ చేసారు డాక్టర్ గారు. వాళ్ళ మాటలు వినబడుతున్నాయి.

డాక్టరుగారిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు పూజారయ్య.
“మా గాయత్రికి, ఉమాకి కూడా మీరు, మీ అమ్మగారు అందించిన సహాయ సలహాలకి ధన్యవాదాలు డాక్టరుబాబు,” అన్నారాయన.

ఆ మాటలకి ఆయన చేతులు జోడించి, “అంత మాటెందుకు సోమయాజులుగారు? నా వృత్తి ధర్మం అది. ఎల్లుండి అమెరికా ప్రయాణమయ్యే ముందు గాయత్రిని చూసి, మిమ్మల్నందరిని కలిసి, చెప్పి వెళదామని వచ్చాను,” అంటూ తన చేతిలోని తెల్లని కవర్ పూజారయ్యకి అందించారు.

పూజారయ్య అది విప్పి చదువుతూ, “సంతోషం బాబు. ఈ ఆహ్వానంకి ధన్యవాదాలు. మీకు మా శుభాకాంక్షలు, ” అంటూ దాన్ని ఉమమ్మ చేతికందించారు.

“నా ప్రయాణంకి ముందుగా ఎల్లుండి మంగళవారం నాడు, ఇంట్లో వ్రతం, భోజనాలు ఏర్పాటు చేసారు అమ్మావాళ్ళు.
మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించాలని కూడా వచ్చాను. మీరంతా తప్పక రావాలి,” అన్నారు మల్లిక్ గారు పూజారయ్యతో.

ఉమమ్మ వంక చూస్తూ, “మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి, అలాగే ఎల్లుండి పొద్దునే తొమ్మిదింటికి కారు ఏర్పాటు చేశామని కూడా చెప్పమంది అమ్మ,” అన్నాడాయన.

“ఇక గాయత్రి సంగతికి గాని, మీ కాలేజి సంగతి గాని, మొహమాట పడకుండా ఎప్పుడైనా అమ్మకు ఫోను చెయ్యండి. పర్వాలేదు,” అంటూ వారిద్దరితో పాటు నా అరుగుల కాడికి వచ్చారు మల్లిక్ గారు.

నా అంతట నేను కర్రల సాయంతో లేచి నిలబడ్డం చూసి ఆయన సంతోషించారు.
డాక్టరుగారిని కలవడానికని తాత కూడా బయటనుండి వచ్చాడు. డాక్టరు బాబుకి దణ్ణాలెట్టి కృతజ్ఞతలు చెప్పాము.
రెండు నిముషాలు మాతో మాట్లాడి, దేవుడి దర్శనం చేసుకొని మా అందరి వద్ద శలవు తీసుకొని వెళ్ళారాయన.
**
మళ్ళీ తాను లేనప్పుడే, డాక్టరుగారు వచ్చి వెళ్ళారని తెలిసిన కమలమ్మ చాలా కష్టపెట్టుకుంది. చాలాసేపు మాట్టాడకుండా ఉండిపోయింది.
**
మరునాడు మధ్యానం నేను, తాత సెనగలు తింటుండగా మా కాడికి వచ్చి కూచుంది కమలమ్మ.
“నాతో పాటు ఈ వారంలో గాయత్రిని మంచి సినిమాకి తీసుకెడతానన్నా,” అని తాత సమ్మతి అడిగింది.
తాత కిమ్మనలేదు. కొబ్బరినీళ్ళు తాగి ఏమనకుండానే వెళ్ళిపోయాడు.

“అసలు దేనికీ మాట్లాడడు సత్యమన్న. అంటే సరేనని అన్నట్టే లెక్క,” అనుకుంటూ వెళ్ళింది కమలమ్మ.

సాయంత్రమయ్యాక కాలేజీ నుండి వెళ్తూ, ఉమమ్మ నా వద్దకి వచ్చింది. కాడలు తీసిన గులాబీలు, చేమంతులతో ఓ పూలబుట్ట తయారుగా ఉంచితే, మరునాడు తాము సరోజినీగారింటికి పూజకి వెళ్తూ తీసుకుంటామంది.
**
పొద్దున్నే భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. పుజసామాను కొనుగోళ్ళతో హడావిడిగా గడిచింది కాసేపు.
తొమ్మిది గంటల సమయంలో ఉమమ్మ, పూజారయ్యలు కారులో గుడి ముందాగారు.

ఉమమ్మ వచ్చి నాకాడనున్న పువ్వులబుట్ట తీసుకొంది. నేను సొంతగా తయారుచేసిన ఓ మల్లెలదండతో పాటు ఆమె అడిగిన గులాబీలు, చేమంతులతో నింపే ఉంచాను.

చూసేవాళ్ళ కళ్ళు చెదిరిపోయేంత అందంగా ముస్తాబయ్యింది ఆమె. ఆకుపచ్చ రంగు చీర, బంగారు రంగు రవిక వేసుకొంది. పచ్చని పూసల దండ, జుమ్కాలు, చేతులకి బంగారు గాజులు ఎంతో బాగున్నయి.
కమలమ్మయితే చేతిలోని పని కూడా మానేసి ఉమమ్మని చూస్తూండిపోయింది. వాళ్ళు కారులో వెళ్ళిపోయేంత మటుకు కిమ్మనలేదు కమలమ్మ.

ఆ తరువాత తేరుకుని, “ఉమమ్మ కన్ను చెదిరే అందచందాల అప్సరస” అంటూ ఆపకుండా మెచ్చుకొంది. “కథల్లో యువరాణిలా ఉందామె,” అంది.
**
భక్తులతో కిక్కిరిసిపోయింది ఆలయం. సందడిగా గడిచింది పగలంతా.
సాయంత్రం ఐదయ్యాక గాని సద్దుమణగి కాస్త ఊపిరి సలపలేదు. వెనక్కి పెట్టుకున్న కొబ్బరి నీళ్ళు తీసుకొని తాగాను.
చీకటి పడుతుండగా పుస్తకం చేత పట్టుకొని తాత కోసం చూస్తున్న నా వద్దకి పరుగున వచ్చింది కమలమ్మ.

“పద, పద, మీ తాతకి కబురెట్టానులే. గుడిలో మన పని ముగిసిందిగా! ఇయ్యాల నిన్ను ఓ మాంచి సినిమాకి తీసుకెడతానని తాతకెరుకే.
సినిమాకి టైమయ్యింది. గోవిందు టికెట్లు తీసుకొన్నాడు. నీ లాటి వారి గురించి కూడా ఉండాది ఆ సినిమాలో,” అంటూ నన్ను హడావిడిగా బయలుదేర తీసింది ఆమె.
తాత కోసం గేటు వైపు చూస్తున్న నన్ను, “తాతకి, కబురంపానని చెబుతున్నాగా! పద టైం లేదు మనకి,” అంటూ తొందర చేసింది….
**
దారిపొడుగునా, తాను గుల్బర్గాలో ఉన్నప్పుడు హిందీ సినిమాలు చూసానని, అప్పుడు చూసిన సినిమానే ఇప్పుడిక్కడ ఆడుతుందని, పెద్ద పేరున్న సినమాని చెప్పింది. అన్నట్టే నన్నేదో హిందీ సినిమాకి తీసుకెళ్ళింది. అంత రద్దీగా లేదు. అదే మొదటిసారి నేను సినిమా చూడ్డం. ఏ భాషైనా పర్లేదులే అనుకున్నా. కమలమ్మ పట్ల కృతజ్ఞతగా అనిపించింది. ఉడికించిన వేరుసెనగలు, నిమ్మకాయి సోడా తెప్పించింది. సినిమా మొదలయిన క్షణం నుండీ కళ్ళు పెద్దవిగా చేసుకొని చూసాను.

(ఇంకా ఉంది)

బాపూ గారూ- నేనూ అతి క్లుప్తంగా

మా ఇంట్లో బాపూ గారు -1996

మా ఇంట్లో బాపూ గారు -1996

ఆయన నిర్యాణం వార్త వినగానే ముందుగా కళ్ళ ముందు మెదిలింది ఆయన నవ్వే. అది ఎక్కడా కల్మషం లేకుండా అత్యంత సహజమైన ఆహ్లాద కరమైన, విశాలమైన నవ్వు. విశాలం అని ఎందుకు అంటున్నాను అంటే ….ఆ బూరి బుగ్గలకి ఇవతలి నుండి అవతలి దాకా పూర్తిగా, హాయిగా నవ్వడం, నవ్వించడం ఆయన స్వభావం. ఆయనతో నా పరిచయం కేవలం ముఫై సంవత్సరాల పైనే. వ్యక్తిగతంగా కలుసుకుని ఆయన తో పూర్తిగా గడిపిన రోజులు మహా అయితే 30 ఉంటాయేమో. ఫోన్ లో మాట్లాడినది సుమారు 60 గంటల పైగానే. ఇక ఉత్తర ప్రత్యుత్తరాలు పరవా లేదు.

తన గురించి “గొట్టాం గాణ్ణి” అనుకునే ఏకైక కారణ జన్ముడు, కేవలం తెలుగు జాతి జాతకం బావుండి తెలుగు వాడిగా పుట్టి “పద్మశ్రీ “ బిరుదుతో సద్దుకున్న అసల, సిసలు “భారత రత్న” బాపు గారు. ఆయన ఎంత “సింపుల్” మనిషి అంటే ఆయనకి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు అని తెలిసి ఫోన్ చేసి “గురువు గారూ…మీకు ధన్య వాదాలే కానీ మీకు ఇలాంటివి చాలా చిన్న గుర్తింపులే కదా.” అని అప్రస్తుత ప్రసంగం లాంటిది చేశాను.

దానికి నవ్వేసి “అలా అనకండి. ఇది కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే మొన్నటి దాకా స్వామి దర్శనం చేసుకోవాలంటే పదేసి గంటలు లైన్ లో నుంచో వలసి వచ్చేది. ఇప్పుడు వాళ్ళే వచ్చి, నాకు ప్రత్యేక దర్శనం చేయించారు” అన్నారు.

“కానీ…అదేమిటో, నాకూ, రమణ గారికీ ఒకటే దండ వేశారు. అదేదో గజమాలట. ఈ సభల్లో అన్ని పువ్వులు ఎందుకు వేస్ట్ చేస్తారో?” అని కూడా అనగానే “అవును సుమా” అని నాకు అనిపించి ఆ తరువాత ఆయన వచ్చిన మా సభ కి పువ్వులు బదులు పుస్తకాలు బహుమతిగా ఇచ్చాను. ఆయన భలే సంతోషించి…”తెలివైన వాడివే” అన్నారు.

అదే సభ లో మేము తొలి అంశంగా మేము ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న చాలా జిల్లాల నుంచి ఎంపిక చేసిన “ఉపాధ్యాయుల సత్కారం” అనే కార్యక్రమం తలపెట్టి, అ విషయం ఆ సభ ప్రధాన అతిథులైన బాపు-రమణ లకి తెలియజేశాను. వెనువెంటనే బాపు గారి దగ్గర నుంచి ఎప్పటి లాగానే క్లుప్తంగా ఒక ఇ-మెయిల్ వచ్చింది. అందులో ఒకే ఒక్క మాట….”అద్భుతం”…ఆ తరువాత ఫోన్ లో ఆ ఆలోచన ఎంత బావుందో ఆయనా, రమణ గారూ వివరంగా చెప్పారు.

అదే సభలో రమణ గారి కథ – బాపు గారి బొమ్మ తొలి సారి గా ప్రచురణ కి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా మేము నిర్వహించిన బాపు-రమణ ల మైత్రీ షష్టి పూర్తి సందర్భంగా మరొక తమాషా జరిగింది. “మీ సన్మానం సందర్భంగా నారాయణ రెడ్డి గారు, మరి కొందరు మాట్లాడతారు” అని నేను ఇంకా ఆ సన్మాన కార్యక్రమం ఎలా జరుగుతుందో చెప్తూ ఉండగా “వాళ్ళంతా మమ్మల్ని పొగుడు తారా?” అని అడిగారు బాపు గారు.

నేను సమాధానం చెప్పే లోగానే “ఒకటే కండిషన్. మా గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నేను చస్తే స్టేజ్ మీద కూచోను. ఎందుకంటే వాళ్ళ మైక్ స్టేజ్ ముందు ఉంటుంది. మా కుర్చీలు వెనకాల ఉంటాయి. అంచేత వాళ్ళ వాగుడు అంతా ఆడియన్స్ కే కానీ నాకు వినపడి చావదు. వాడు తిడుతున్నాడో, పొగుడుతున్నాడో తెలిసి చావదు. అంచేత నేను నేనూ, రమణ గారూ కింద కూచుని ఆ వాగుడు వింటాం. అందరి స్పీచ్ లూ అయ్యాక అప్పుడు మమ్మల్ని స్టేజ్ మీదకి పిలు” అన్నారు.

“సరే, సార్.” అని ఆ మాట సి. నారాయణ రెడ్డి గారితో చెప్పాను. ఆయనకి భలే కోపం వచ్చింది.

“బాపుకేం తెలుసూ..వాళ్ళు ఆడియన్స్ లో కూచుని . స్టేజ్ ఖాళీగా ఉంటే నాకు అవమానం. పైగా అది సంతాప సభ అవుతుంది కానీ , సన్మాన సభ ఎలా అవుతుందీ” అని కోప్పడ్డారు.

నేను ఏం చెయ్యాలో తెలియక, ఇద్దరికీ నచ్చ చెప్పా లేక మొత్తానికి “నేను మిమ్మల్ని ఇద్దరినీ ఒకే సారి వేదిక మీదకి ఆహ్వానిస్తాను. ఆ తర్వాత మీరు, మీరూ చూసుకోండి” అని అలాగే చేశాను. ఆఖరి క్షణంలో నారాయణ రెడ్డి గారు ఎంత బతిమాలినా, బాపు-రమణలు ముందుగా స్టేజ్ మీదకి రాకుండా అన్ని ప్రసంగాలూ అయ్యాకే వేదిక మీదకి వచ్చారు. చికాకులో ఉన్నా, ఆ రోజు బాపు-రమణ ల మీద సి. నారాయణ రెడ్డి గారు అద్భుతంగా ప్రసంగించారు.

డిశంబర్ 31, 2006 – జనవరి 1, 2007 తారీకులలో “మొట్ట మొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” జరిగిన ఆ మహా సభలో నా కథల పుస్తకాన్ని బాపు-రమణ లో ఆహ్వానించారు. ఆ నాటి ఫోటో ఒకటి, 1996 లో బాపు గారు మా ఇంట్లో వారం రోజుల పైగా ఉన్నప్పటి ఫోటో ఒకటి, ఆయన కేవలం నా ఫోటో చూసి వేసి నాకు బహుకరించిన ఒక కేరి కేచర్ ఇందుతో జత పరుస్తున్నాను.

మరొక సారి ఏమయిందంటే…బాపు గారిని మా హ్యూస్టన్ లో ఉన్న నాసా అంతరిక్ష కేంద్రం చూడ్డానికి తీసుకెళ్ళాను. అది ఆయనకీ చాలా నచ్చింది. అక్కడ విజిటర్స్ పుస్తకంలో “ఇందులో తెలుగులో సంతకం పెడితే అదేదో తురకం అనుకుని నన్ను జైల్లో పెడతారా” అని అడిగి, నవ్వేసి ఇంగ్లీషులోనే పొడి సంతకం పెట్టారు.

మరొక సారి అమెరికా ఆహ్వానిస్తే “వద్దు లెండి. మీ అమెరికా ఎయిర్ పోర్ట్ లో బట్టలు విప్పేసి మగాళ్ళ ముందు నగ్నంగా నుంచోడానికి అంత దూరం ఎందుకూ? మా ఇండియాయే బెటరు” అన్నారు. “పోనీ ఆడ సెక్యూరిటీ వాళ్ళని ఏర్పాటు చేస్తాను లెండి” అనగానే అరగంట సేపు నవ్వారు బాపు గారు. నేను అమెరికాలో “శ్రీ రామరాజ్యం” విడుదల ఆట చూసి, హాలు నుంచి బయటకి రాగానే ఆనందం పట్ట లేక బాపు గారికి ఫోన్ చేశాను.

మాములుగా క్లుప్తంగా మాట్లాడే బాపు గారు మహానందపడి ఎన్నడూ లేనిది అనేక విషయాల మీద …ముఖ్యంగా రమణ గారు లేని లోటు గురించి …గంట సేపు మాట్లాడారు.

ఎంతో “సెన్సిటివ్” మనిషి అయిన బాపు గారు, తనకే ఏదైనా విషయం బాధిస్తే, దానిని కార్టూన్ రూపంలో వెలిబుచ్చే వారు. ఉదాహరణకి మొట్టమొదటి సారి ఒక జాతీయ సంఘం అమెరికా పిలిచినప్పుడు ఆయనకి చాలా అవమానం జరిగింది..అని ఆయన చెప్పకుండా చెప్పిన మాటలు. అప్పుడు ఆయన చేత ఆ కన్వెన్షన్ సెంటర్ లో “స్త్రీల మరుగు దొడ్డి” లాంటి సైన్ బోర్డులు బాపు గారు అమెరికాలో మొట్టమొదటి సారి అడుగు పెట్టగానే రాయించారుట. అప్పటి నుంచీ బాపు గారికి అమెరికా రావడం అంటే ఎలర్జీ యే. ఆయన అమెరికా అనుభావాల మీద కొన్ని కార్టూన్ లు వేసి మా బోటి గాళ్ళకి చూపించారు బాపు గారు. అవి చూస్తే ఆయన ఎంత బాధ పడ్డారో తెలుస్తుంది.

అలాగా లూయీ మాలే అనే ఫ్రెంచ్ దర్శకుడు “మహాభారత” అనే సినిమాని ..పాండవులు, కౌరవులు. కృష్ణుడు ఐదు వేల ఏళ్ల క్రితం ఆటవిక జాతుల కుటుంబ కలహంగా, అందులో పాత్రధారులని అసహజమైన రీతిలో చిత్రీకరిస్తూ తీసిన చిత్రం బాపు గారిని చాలా బాధ పెట్టింది. అందులో భీష్ముడి పాత్ర ఒక సౌత్ ఆఫ్రికా నల్ల వాడి చేతా, ఇతర పాత్రలు ఇతర దేశాల నటుల చేతా వేయించి మొత్తానికి హిందువుల మనోభావాలని దెబ్బతినేటట్టుగా ఆ సినిమా ఉంది. దానికి స్పందనగా బాపు గారు ఒక కార్టూన్ లో జంధ్యము, బొట్టు, పిలకా ఉన్న ఒక బ్రాహ్మణుడి ని శిలువ మీద క్రీస్తు గానూ, మిగిలిన పాత్రలని, నల్ల జాతి మొదలైన వారి లా చిత్రీకరించి “ఇది చూస్తే క్రైస్తవ మతస్తులు ఏమనుకుంటారో?” అని అనుమాన పడుతూ ఆ కార్టూన్ పంపించారు. ఆయనకీ అర్థం అవని మరొక విషయం అమెరికాలో విరాళాల మీద ఆధారపడి సాంస్కృతిక కార్యక్రమాలు చెయ్యడం. “నన్ను ఏదో జూలో కోతిని కూచో బెట్టి అందరి చేతా డబ్బులు వేయించినట్టు, మీరు విరాళాలు అడుక్కుని నన్ను పిలవడం ఎందుకూ, ఏదో యాయవారం బ్రాహ్మడికి దక్షిణ పారేసినట్టు నాకు మీ దాన ధర్మాలు ఎందుకూ?” అనే వారు ఎప్పుడు అమెరికా రమ్మని పిలిచినా.

Bapu & Chitten Raju
ఇలా బాపు గారి గురించి వ్యక్తిగతంగా నాకు తెలిసినవి చెప్పుకుంటూ పోవాలంటే చాలా విషయాలే ఉన్నాయి. కానీ మనసు బాగా లేదు. నేను, ఆ మాట కొస్తే తెలుగు వారు ఎంతో అదృష్ట వంతులు. రమణ గారి సాయుజ్యంలో ఇప్పుడు బాపు గారు మళ్ళీ స్వాంతన పొందుతున్నారు. ఆయన జ్జాపకాలు నన్ను ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటాయి. అంత కంటే ఆయనకి ఇవ్వగలిగిన నివాళి ఇంకేమీ లేదు.

-వంగూరి చిట్టెన్ రాజు