ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 18 వ భాగం

24

(గత వారం తరువాయి )

18

రాత్రంతా నిదురలేదు ముఖ్యమంత్రి గార్కి. అతనికి మేధావులను ఆ క్షణం చెప్పుతో కొట్టాలనిపించింది. మనిషికి సుఖాలు, సంపదలు, అధికారం.. యిలాంటివన్నీ ఉంటే సుఖంగా, సౌఖ్యంగా ఆనందకరంగా ఉంటుందని ఈ మేధావులైన రచయితలు, కవులు, యితరేతర సృజనకారులు చెప్పారు. అనేక సందర్భాల్లో అదంతా శుద్ధ అబద్ధమని ముఖ్యమంత్రిగారి గత నలభై సంవత్సరాల వ్యక్తిగత రాజకీయ జీవితం ఎంతో స్పష్టంగా చెబుతోంది.
ఎంతో పెద్ద ముఖ్యమంత్రి నివాసభవనం.. క్యాంప్‌ ఆఫీస్‌ కంప్లీట్లీ ఎయిర్‌ కండిషన్డ్‌, సకల సౌకర్యాలు.. ముట్టుకుంటే మాసిపోయేగోడలు. నడుస్తే అరిగిపోతుందా అన్నట్టు పాలరాతి నేల. వెన్నెల ముద్దవంటి బంగారు రంగు, మెత్తని పట్టు పాన్పు.. కాని..,
మనసునిండా మున్సిపల్‌ చెత్త. పాయఖాన కంపు. తలంతా పాకీవాడి బకెట్‌. ప్రొద్దునలేచినప్పట్నుండి తను ఇతరులను బ్లాక్‌మెయిల్‌ చేయడం, లేదా వెధవలందరూ తనను బ్లాక్‌మెయిల్‌ చేయడం. ఒకర్నొకరు వేటాడ్డం, ఎవడో ఒకడు తమను వెంటాడ్డం.. ఇదంతా నిజానికి అవసరమా మనిషికి.
అధికారం.. కుర్చీ.. పదవి.. మంత్రి పదవి.., ముఖ్యమంత్రి పదవి., ”అధికారంలో ఉన్న మజా.. అది అనుభవించితే తెలియనులే..” ఎక్కడో విన్నపాట.
ఉదయం… ‘అగ్ని’టి.విలో ఆ ‘రామం’ అనేవాడు ప్రసంగిస్తున్నపుడు అన్ని దిక్కుమాలిన కార్యక్రమాలను ప్రక్కనపెట్టి ఎవర్నీ తన చాంబర్‌లోకి రానివ్వద్దని, అన్ని టెలిఫోన్‌ హాట్‌లైన్లను కట్‌చేసి.. ప్రశాంతంగా .. సముద్రంలా పొంగిపోతూ విన్నాడు. విని..” నిజంగా వీడు రామంగాడు అనుకున్నాడు.
మనసు పవిత్రంగా, హృదయం నిష్కల్మషంగా.. తత్వం.. ఏ స్వార్థమూలేని పరిత్యాగకాంతితో నిండి.. మనిషి ఈ సకల తుచ్ఛమైన వాంఛలకు అతీతమైపోయిన తర్వాత.. వాడి ముఖంలో నిజంగా ఎంతో కాంతి, ఎంతో ఆకర్షణ.. ఎంతో జీవకళ.. ఎంత పరిపూర్ణతో.
నిండుపున్నమి చంద్రునిలా ముఖం.
అంటాడు.. ” ఈ తుచ్ఛమైన అధికారాన్నిపట్టుకు వేలాడ్తూ, కోట్లకు కోట్ల రూపాయలను దాచుకుంటూ.. ఎన్నాళ్ళు కొనసాగుతావు.. ఈ వెంపర్లాటకూ, సంపాదనకూ ఒక హద్ధు, ఒక అంతం ఉందా.. ఒక వేళ ఉంటే.. అది ఎంత..?”
తన గుండెలో చటుక్కున గుచ్చుకుందామాట.
ఐతే ఆ మాట డెబ్బయ్యారేండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకు తెలియనిదా.. తెలుసు.. ఐతే చెప్పినవాడు ఎవడో దొంగ సన్యాసి బెంజ్‌కార్లో వచ్చి, ఫైవ్‌స్టార్‌ ప్రవర్తనతో ”ఆర్ట్‌ ఆఫ్‌ లివింగు” గురించి బూటకపు ఉపన్యాసం   చెప్పినట్టుగాకుండా..ఈ రామం అనేవాడు.. తన చదువును, ఉద్యోగ్యాన్ని, హోదాను, ఆస్తిపాస్తులను, సర్వసంపదలనూ వదలి ప్రజాపరం చేసి తను ఊరుబయట.. ఓ అతిసామాన్య పర్ణశాలవంటి కుటీరంలో జీవిస్తూ చెప్పడం.. ఎక్కడో హృదయంలో బాణం గుచ్చుకుని నాటుకుంది.
వాడు.. బమ్మెరపోతన చెప్పినట్టు.. ‘నవ్వు రాజిల్లెడు మోమువాడు, కృపారసమ్ము పై చల్లెడు వాడు..’
ఒక్కోసారి ధర్మాధర్మ విచక్షణ మన మనసును కల్లోల సముద్రంగా మార్చి.. కలవర పరుస్తున్నపుడు సత్యం ఒక కాంతిపుంజంలా విచ్చుకుంటుంది.
ముఖ్యమంత్రికనిపించింది.. ఎక్కడో తను ఓడిపోతున్నాడు.. అధర్మ రక్షణ చేస్తున్న తాను ఎక్కడో బురదలో కూరుకుపోతున్నాడు.. రామం.. ఉదయించే సూర్యునిలా అవక్రపరాక్రమంతో విక్రమించి విజయుడు కాబోతున్నాడు.
సరిగ్గా అప్పుడు ఉదయం ఐదుగంటల పదినిముషాలైంది. కారు మినిస్టర్స్‌ కాలనీలో రివ్వున దూసుకుపోతోంది. సన్నగా చినుకులు. పైన మేఘాలు నిండిన ఆకాశం.
అంతా నిర్మానుష్యం.
కారు ‘ఆ’ గోదాంలోకి పోయింది సూటిగా.
అంతారెడీ అప్పటికే.
రాంబాబు, శివరాజం.. ఢిల్లీ అధిష్టానం బాపతు మోహన్‌ సైగల్‌.. ముగ్గురూ రెడీగా ఉన్నారు.
మొత్తం పది నిముషాల కార్యక్రమం అక్కడ.
కారు ఆగగానే దిగి.. చకచకా లోపలికి .. ఒట్టి రేకులషెడ్డువంటి విశాలమైన గోదాంలోకి నడిచి..
ఎదురుగా.. ఒక గుట్టవలె.. సిమెంట్‌ ప్లాస్టిక్‌ సంచుల్లో కుట్టిన అన్నీ ఐదువందల, వేయిరూపాయల నోట్ల కట్టలు, పదులు, వందలు.. మొత్తం నెలరోజుల లెక్క వారానికి యాభై కోట్ల చొప్పున నాల్గు వారాల్లో రెండు వందల కోట్ల పార్టీఫండ్‌. నగదు. క్యాష్‌.. నోట్లు..
రెండ్రోజుల్లో రెండు లక్షలమంది జనంతో భారీ బహిరంగసభలు నిర్వహించాలన్నా, ఎక్కడన్నా ఏదైనా రాజకీయంగా మతకలహం సృష్టించాలన్నా, అర్జంటుగా ఏ ప్రతిపక్ష, లేదా స్వపక్ష ప్రతిపక్ష సభ్యున్నయినా కొనాలన్నా.. ఎక్కడన్నా ‘పే అండ్‌ యూజ్‌’ పద్ధతి పై రాజకీయం చేయాలన్నా.. అంతా టర్మ్స్‌ ఇన్‌ క్యాష్‌. నగదు దందా. ప్రతి రాష్ట్రం అధిష్టానానికి ఉడతాభక్తిగా వారానికో వందకోట్లు సమర్పించుకోవాలి. అదొక శాశ్వత సంప్రదాయం. ఎవడు ముఖ్యమంత్రయినా అంతే. ఈలోగా బుర్రున ముఖ్యమంత్రిగారి మొబైల్‌ మ్రోగింది.
”హలో..”
”ఊఁ.. నేనండీ.. నళినీ సదాశివం”
”హలో మేడం బాగున్నారా..”
నళినీ సదాశివం అధిష్టానంలో ”ఫండ్స్‌ ప్రాక్యూర్‌మెంట్‌ సెల్‌’ అధిపతి. జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శి (నిర్వహణ)
”బోలీయే మేడం”
”సబ్‌ తయార్‌హై నా.. మోహన్‌సైగల్‌కో హాండోవర్‌ కర్‌దేనా ఓ పూరాపైసా.. అచ్ఛా గాడీ భీ దో ఉస్‌కో.. ఔర్‌ చోడ్‌ దో.. ఓ సంభాల్‌ లేంగే.. ఠీక్‌హై”
”హా మేడం..”
ఫోన్‌ కటైపోయింది అట్నుండి.
పెద్ద పెద్ద రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కువ మాటలుండవు.. చేతలుంటాయంతే.
ముఖ్యమంత్రిగార్కి ఎందుకో ఈ తన దాదాపు యాభైఏండ్ల రాజకీయానుభవంలో .. మార్చిన నాలుగైదు జాతీయ పార్టీల్లో ఎప్పుడూ ఏదో ఓ మంత్రి పదవో, తత్సమానమైన ఇతర పదవేదో ఉండడం వల్ల.. ఏ పార్టీ ఐనా పార్టీ ఫండ్‌ క్రింద ఇండస్ట్రియలిస్ట్స్‌, భూస్వాములు, కాపిటలిస్ట్‌లు, మాఫియాలు, గుండాలు, ప్రభుత్వ పథకాల్లో కమీషన్ల రూపంలో నొక్కేయడాలు.. ఇటువంటి వనరులనుండి కోట్లకుకోట్లు పార్టీఫండ్‌ కింద లెక్కాపత్రంలేని డబ్బను గ్టుటలు గుట్టలుగా సమీకరించడం.. గోదాముల్లో, ప్రత్యేకంగా .. రహస్యంగా నిర్వహించే అపార్ట్‌మెంట్లలో, నేలమాళిగల్లో నగదు రూపంలో దాచి ఉంచడం.. పార్టీలో అత్యంత విశ్వసనీయమైన కుక్కవంటి వ్యక్తి నిర్వహణలో అంతా నడిపించడం.. ఎన్ని చూడలేదు తను.
ముఖ్యమంత్రి అంటే అధిష్టానం దృష్టిలో ఓ కుక్క. బాల్‌ విసిరి తెమ్మంటే తేవాలి. ఛూఁ.. అంటే పరుగెత్తాలి. కరువంటే కరవాలి.. వద్దంటే విడిచిపెట్టాలి.. ఒక్కోసారి ఒట్టిగానే భౌ భౌ అని అరవమంటే అరవాలి. అటు అఖండ అధికార పటాటోపపు మత్తు.. ఇటు ఆత్మాభిమానాన్ని చంపుకుని అధిష్టానం ముందు తలవంచుకుని ఓ కట్టుబానిస.
ఆ ‘జనసేన’ రామం అన్నట్టు.. మనిషికి ఈ దిక్కుమాలిన అధికార వ్యామోహంగానీ, మనసు చచ్చిపోతూండగా నిస్సిగ్గుగా తలదించుకునే బానిసత్వంగానీ అవసరమా. చరిత్రలో ఎవడుమాత్రం ఎన్నాళ్ళు జీవించి శాశ్వతమయ్యాడని. అలెగ్జాండర్‌నుండి బ్రిటిష్‌ సామ్రాజ్యందాకా.. నియంతలందరూ కాలగర్భంలో కలిసిపోయారు గదా.  మరి.,
”సర్‌.. మొత్తం రెండువందల కోట్లు.. అన్నీ రెండు ఇన్నోవాల్లో సర్దుకున్నాన్సార్‌” అన్నాడు పార్టీ కార్యదర్శుల్లో ఒకడైన శివరాజం.
”ఔను.. వీటిని తీస్కొని ఆ సైగల్‌ గాడెక్కడికి పోతాడయ్యా”
”ఏమోసార్‌.. లంజకొడ్కు.. గత నెల మాత్రం చత్తీస్‌గఢ్‌లకెళ్ళిండ్సార్‌. అక్కడ అపోజిషన్‌ గవర్నమెంటుంది గదా.. దాన్ని పడకొట్టడానికి మనుషుల్ని కొనాలని..అంతకు ముందు ఓ చార్టర్డ్‌ ప్లేన్‌లో మన మూడు వందల కోట్లతో జార్ఖండ్‌కు పోయిండు. ఈ నార్త్‌ లంజాకొడ్కులు గింతకూడ వాసనరానీయర్సార్‌.. ఈసారి బహుశా ఈ డబ్బును మన ఎపిలనే ఎక్కడ్నో దాస్తడు.”
”ఫోనీ దొంగముండాకొడ్కు.. కని నెలనెలా ఈ రకంగా డబ్బు సమకూర్చడం కష్టమే శివరాజం..ఎక్కన్నుంచి తెస్తం.. ఎన్నని దొంగపనులు చేస్తం.. అవతల ఆ జనసేన ముండాకొడ్కులు ఒక్కొక్కని భరతంపట్టి జాడిస్తాండ్లు.. వ్చ్‌.. ఏదో కష్టకాలమే దాపురిస్తాంది.. సరేగని వాని వెహికిల్స్‌ పోంగనే జాగ్రత్తగా తాళాలేసి కీస్‌ పంపియ్‌.. ఇంక బ్యాలెన్స్‌ందుందిందుల..”
”ఏఁ. ఎంతసార్‌.. ఇరవై ఏడు కోట్లు..” శివరాజం అంటూండగా.,
‘ఏయ్‌ శివరాజం.. ఇరవై ఎనిమిది కదా.. నీయవ్వ ఎలాగూ లెక్కపత్రం లేదుగదా అని ఒకటి నొకేద్దామనుకుంటానవా..” అన్నాడు రాంబాబు. శివరాజం రాంబాబు దిక్కు గుర్రుగా, ఆల్సేషియన్‌ కుక్కవలె చూచి.. ”నీయవ్వ.. లెక్క ఒకటి తప్పిందన్కో .. యిప్పుడేమైంది. తింటమా..నువ్వు లేవా లెక్క చూచెడానికి.. ఓ ఒకటే తొందర నీ తల్లి..”
” అరెయ్‌.. లెక్కలు కిందిమీదికైతే ఎర్కేగదా.. పిట్టలోల్గె లేచిపోతరు..” ముఖ్యమంత్రి వెనుదిరిగి కారుదిక్కు నడుస్తూండగా.,
”సర్‌సర్‌.. ఈసారి మంత్రివర్గ విస్తరణలనన్న నన్ను ఓ కంట..” ప్రాధేయపూర్వకంగా శివరాజం గొణుగుతూ,
”చూద్దాం లేవయ్య.. అసలు మన సర్వైవలే కష్టంగున్నది..”
ముఖ్యమంత్రి చరాచరావచ్చి కార్లో కూర్చోగానే కారు బయల్దేరింది..పూర్తిగా రహస్యమైన ట్రిప్‌ కాబట్టి ఏ సెక్యూరిటీ, కాన్వాయ్‌, పటాటోపం లేని ప్యూర్‌ పర్సనల్‌ ట్రిప్‌.. చాలా హాయిగా ఉందతనికి.. అప్పటికే ఆయన మొబైల్‌ సైలెంట్‌ మోడ్‌లో అరుస్తూనే ఉంది.
అసహనంగా ఫోన్‌ ఎత్తాడు.. ”హలో..” అని. ఆ ఫోన్‌ హోంమంత్రి అప్పల్నాయుడుది. అప్పటికే ఎనిమిదిసార్లు వచ్చి వచ్చి వెయిటింగులో ఉంది. చాలా చికాకేసింది ముఖ్యమంత్రికి ఆ వ్యక్తి జ్ఞాపకం రాగానే. అతన్ని చూడగానే ఓ పందిని చూచినట్టు పైన ఓ బల్లో, తొండో పడ్డట్టు, ఓ బండెడు పేడ పైనబడ్డట్టు ఓ వికారమైన అనుభూతి. మొదట్నుండీ తనను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ తనతో బలవంతంగా తన పనులన్నీ చేయించుకుంటున్నాడు. పదేండ్లక్రితం ఒట్టి కేబుల్‌ ఆపరేటర్‌ వెధవ అప్పల్నాయుడు.. ఇప్పుడు వాడొక క్యాబినెట్‌ర్యాంక్‌ మంత్రి. వాడి పెళ్ళాం ఎంపి. వాని తమ్ముడు ఎమ్మెల్యే. వేల ఎకరాల భూములు కబ్జా. వేల కోట్లరూపాయల సంపద.. మనిషి.. పశువుకే మాటొస్తే టైపు – నోరు తెరిస్తే అదొక మున్సిపల్‌ మోరి. సారా, లిక్కర్‌, బార్లు, పబ్‌లు, గనులు, హార్బర్‌, ఖనిజం ఎక్ప్‌పోర్ట్‌, ఇరవై రెండు ఇంజినీరింగు కాలేజిలు. రెండు మెడికల్‌ కాలేజీలు, రెండు షిప్పింగు కంపెనీలు. విదేశాల్లో రెండు హోటళ్ళు. యితర రాష్ట్రాల్లో నాల్గు పవర్‌ ప్రాజెక్ట్‌లు.. ఒక సామ్రాజ్యం వాడిది. ఒట్టి వీధిగుండా. ఒకప్పటి రౌడీషీటర్‌ ఇప్పుడు హోంమంత్రి. వాడికింద ఒకనిమీద ఒకడు పడిపడి బూట్లు నాకే ఐపిఎస్‌ ఆఫీసర్లు.. వేలకోట్ల సామ్రాజ్యం. అధిష్టానం దగ్గర పైవాళ్ల కటాక్షవీక్షణాలు వీడికి. డైరెక్ట్‌గా సూట్‌కేస్‌లకుసూట్‌కేసులు పార్టీ పెద్దలకు, సామంతులకు చక్రం తిప్పేవాళ్ళకు, ధనకనక వస్తు వాహనాదులతోపాటు కాంతామధువులు అన్నీ చేయిచాపినంత దూరంలో ఉంచి.. వాడికి ఎవన్ని ఎట్ల మేనేజ్‌ చేయాలో బాగా తెలుసు. తన కంట్రోల్‌ అస్సలే లేదు. వాడు తన మాట వినడు.. తనను ఖాతరు చేయడు.. ఎప్పుడూ ఇరవై ఐదుమంది ఎమ్మెల్యేలను పిల్లివెంట పిల్లల్లా వెంటతిప్పుకుంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. వీడూ పార్టీ రాష్ట్ర అధ్యకక్షుడు జయవిజయులు.. తోడుదొంగలు.. కత్తీ డాలూ.
యిప్పుడు వీడు ఉంచుకున్న ముండ చింతామణికి ‘రాజ్యసభ’ సీటు కావాలి. అధిష్టానంనుండి పైరవీ చేసుకుని అఫీషియల్‌గా రాష్ట్ర పార్టీ అధ్యకక్షుడు, ముఖ్యమంత్రి అంగీకారంతో ఒక లెటర్‌ తెచ్చుకొమ్మని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌తో చెప్పించుకుని.. ఒక లెటర్‌పెట్టి.. నిన్న రాత్రి రాష్ట్ర అధ్యకక్షుని సంతకం చేయించి.. పన్నెండు తర్వాత ఫుల్‌గా ఫుల్‌బాటిల్‌ తాగి తనదగ్గరికొచ్చి సంతకం పెట్టమంటాడా కాగితంపై.. సంతకం పెట్టడం గురించిగాక వాడింకొక మాట మాట్లాడడు. మాట్లాడనీడు. అతి కష్టంమీద ఆ కాగితం అక్కడ పెట్టిపో.. రేప్పొద్దున చూద్దామని పంపించగలిగాడు తను. పోతూ పోతూ ”రేప్పొద్దున చూస్తా కాదు.. రేప్పొద్దున చేస్తా అను” అని అరుచుకుంటూ వెళ్లిపోయాడు.. వాడివెంట పాతికమంది స్పెషల్‌ సెక్యూరిటీ, ప్రొటెక్షన్‌ పోర్స్‌.
”రామం.. నువ్వు చెప్పుతున్నది అక్షరాలా నిజమయ్యా.. మేమిద్దరం బయటికి రాలేని పీతిగుంటలో మునిగిపోయి ఉన్నాం.. సత్యం.. పరమ సత్యం.. సిగ్గుగా ఉంది.. అసహ్యంగా ఉంది.. జుగుప్సగా ఉంది నాపై నాకే.. కాని..?”
”ఏమైంది.. ఎక్కడున్నారు మీకోసం అరగంటనుండి వెయిట్‌ చేస్తున్నా చాంబర్లో.. ఎంతసేపు..” అరుస్తున్నాడా ఆంబోతు హోంమంత్రి అట్నుండి.
”వస్తున్నానయ్యా.. ఐదునిముషాల్లో.. వెయిట్‌ చెయ్‌..” అన్నాడు అసహనంగా. ఆయనకా క్షణం మొన్న టి.వి. ఇంటర్వ్యూలో ‘జనసేన’ రామం పదే పదే చెప్పిన ఆత్మగౌరవం, ఆత్మతృప్తి అనే పదాలు వందసార్లు జ్ఞాపకమొచ్చాయి. ఆ రెండూ ప్రస్తుతం తన దగ్గర అస్సలే లేవని అర్ధమై ఎందుకో అతనికి దుఃఖంముంచుకొస్తున్న ఫీలింగేదో కలిగి గిలగిల్లాడిపోయాడు. నిజంగానే ఈ వయసులో.. తను యాభై ఏండ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చినపుడు పార్టీ ఏదైనా ఋషుల్లాంటి వ్యక్తులుండేవాళ్ళు. శాసనసభలో పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి, చంద్ర రాజేశ్వర్రావు, వందేమాతరం రామచంద్రరావు, పెండ్యాల రాఘవరావు.. మహానుభావులు.. అసలు స్వార్ధమే లేని ఆదర్శజీవులు. శాసనసభ అంటే పవిత్ర దేవాలయం. ప్రతి మనిషి కదలిక, నడక, మాట, ముచ్చట, ఆలోచన..సంభాషణ అన్నీ విశిష్టమే. అందరిలోనూ మానవ పరిమళం అక్కడ్నుండి.. పర్వతంపైనుండి రాయి కింది దొర్లిపడ్తున్నంత వేగంగా విలువలు పతనమై.. నైతికత ధ్వంసమై.. ఒక్క యాభై సంవత్సరాలలో భారతదేశంలోని శాసనసభలన్నీ .. పార్లమెంట్‌తో సహా మైక్‌లు విరిచి, బల్లలు చరిచి, అంగీలు చింపుకుని, పరమ చంఢాలమైన భాషతో తిట్టుకుని.. అంతా రోత. ఏమిటిది.. ఎందుకిలా.. నిజంగానే ఆ రామం అన్నట్టు నేరగాళ్ళందరూ శాసన సభల్లోకి ప్రవేశించారుగదా బాజాప్తాగా. ఆక్రమణ.. దురాక్రమణ జరిగింది.

గుండాలకు ప్రజాస్వామ్యపు అసలు రహస్యం తెలిసిపోయింది. అసలు ప్రజాస్వామ్యమే బూటకం. వంథాతం ఓటర్లలో ఏ ముప్పయ్యయిదు శాతం మందో ఓటేస్తే పద్దెనిమిదిశాతం ఓట్లను సంపాదించినవాడు గెలుస్తే. గెలిచినవాడు ఎంతశాతం ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు.. పదిహేడుశాతం ఓట్లొచ్చి ఓడిపోయినవాడు ఎంతమందితో నిరాకరించబడినట్టు.. ఐనా ఒక నిరక్షరాస్యుడు, ఒక డాక్టర్‌, ఒక కూలీ, ఒక వైస్‌చాన్సలర్‌.. వీళ్ళందరూ పౌరులే ఐనపుడు అందరి ఓటు విలువ ఒకటే ఐనపుడు.. అసలా గణన విధానమే తప్పుకదా.. అందుకే వీధీరౌడీలు కూడా ఎన్నికల్లో అసలు ఓటు వేసే బడుగు ప్రజలను ఎలా లోబర్చుకుని, వశపర్చుకోవాలో, ఎలా భయపెట్టి మభ్యపెట్టాలో.. అన్ని పద్ధతులూ నేర్చుకున్నారు. పోలింగు తేదీకంటే ముందు రెండురోజులు సర్వవిధాలుగా ప్రజలను వెధవలను చేస్తే.. చెల్లు.. యిక ఐదేండ్లు ఆడింది ఆట పాడింది పాట. ఈ దేశంలో ఎలాగూ కోర్టులకు చెవులు, కళ్ళులేవు.. పోలీసులకు హృదయం, చేతులు లేవు.. మేధావులకు ధైర్యం, సమయం లేవు.
ఈ వ్యవస్థ శరీర సర్వాంగాలకూ కేన్సర్‌ చీడపట్టినట్టయి.,
బి.డబ్ల్యు.ఎమ్‌ కారు జారిపోతుంది విడిచిన బాణంలా.

రాజకీయాల్లో.. బ్లాక్‌మెయిల్‌ చేయడం.. బ్లాక్‌మెయిల్‌ చేయబడ్డం.. ఒక గొప్ప నీచమైన జూదక్రీడ.. ఆ పరంపరలో.. యిదివరకు ఎన్నో ప్రభుత్వాల్లో పంచాయితీరాజ్‌, ఎలక్ట్రిసిటీ, ఆర్థిక, రెవెన్యూ, ఆరోగ్య.. ఒకటేమిటి.. దాదాపు అన్ని శాఖలనూ మంత్రిగా నిర్వహించిన తనకు తెలియని రహస్యమేలేదు. తెలియని లోలోతుల విషయాలూ లేవు.. ఐతే జీవిత చరమథలో ముఖ్యమంత్రి కావడం ఒక వరమై.. ఒక అద్భుతావకాశమై.. ఓ అదృష్టమై.,
శేషజీవితమంతా మాజీ ముఖ్యమంత్రి అని అనిపించుకోవచ్చు గదా.. అని ఆశ.
కాని యిది ఒక శాపమై.. క్షణక్షణ నరకం, ఆత్మవంచన, అవమానాలు, క్షోభ.. అన్నింటినీ మించి మనసుకు నచ్చని ఎన్నో తప్పుడు పనులకు ఒడిగడ్తూ.. ఇన్నాళ్ళూ ఏదో కొద్దిగా గుండెల్లో మిగిలిన చెంచాడంత ఆత్మతృప్తికూడా ఇగిరిపోయి.. ముగింపులో ‘ముసలోడు ఛండాలపు పనులన్నీ చేశాడు. చేయనిచ్చాడు’ అన్న మచ్చ శాశ్వతమై.,
అవసరమా ఈ మచ్చ తనకిపుడు. ఈ మచ్చను ఇలాగే ఇంకా ధరిస్తే.. ఇన్నాళ్ళ జీవితమంతా బురదలో పోసిన అమృతమైపోదా.
ఉహుఁ.. లోపల..లోలోపల.. ఎక్కడో.. ఏదో తగలబడిపోతోంది ఎండిన అడవిలా.

ఒక నెలక్రితం గుఢాచార విభాగంలో నీతివంతులూ, తనకు బాగా విశ్వసనీయులైన ఓ పదిమంది అధికారులతో ప్రతి మంత్రి గురించీ, ప్రతి శాసనసభ్యుని గురించీ సమీకరించిన సమగ్ర నివేదిక జ్ఞాపకమొచ్చింది ఆయనకాక్షణం. ఒక రాత్రంతా ఆ వందల నివేదికలను పరిశీలించాడు తను.. ఏమున్నయందులో.. బురద.. చెత్త.. కంపు.. గబ్బు. ఎప్పుడూ ఎవ్వడూ శుభ్రం చేయలేని సముద్రమంత అవినీతి. దాదాపు ఎనభైశాతం మంది .. అందరూ నేరచరిత్రులే. ఓ సరియైన చదువులేదు. చరిత్రలేదు.. సంస్కారం అసలేలేదు. జ్ఞానం అంతకూ లేదు. .. అంతా రాక్షస గణం. తాను దానికి అధిపతి.. అంతే.
మొన్న రాత్రి తనవద్దకు వచ్చిన ఐదారుగురు మంత్రులు, యింకో ఏడెనిమిది మంది పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు.. బృందం గుర్తొచ్చింది ముఖ్యమంత్రిగారికి. వేలకోట్ల సాగునీటి ప్రాజెక్ట్‌లలో జరిగిన వేలకోట్ల అవినీతికి సంబంధించి సవివరమైన సమాచారంతోనే వచ్చారు వాళ్ళు. చాలా బహిరంగమైన దోపిడి. నిస్సిగ్గుగా ఎగబడి తినుడే.. అదీ ప్రపంచబ్యాంక్‌నుండి తెచ్చిన అప్పు డబ్బును.
అంతా నిజమే..నిజమే.. తనకు తెలుసు.
పవర్‌ ప్రాజెక్టులలో ఏ మంత్రి ఏ పార్లమెంట్‌ సభ్యుడు, ఏ బినామీదారు ఎంత దండుకుంటున్నాడో తెలుసు.. ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ను అడ్డంపెట్టుకుని డిస్టిలరీస్‌.. ఎక్కడో అమెరికానుండి ఆంధ్రదేశందాకా విస్తరించడం తెలుసు తనకు. వాళ్లనుండి ఎవనికి అందిందివాడు కోట్లుకోట్లుగా తిని బలవడం తెలుసు. కార్పొరేట్‌ కంపెనీలకు భూముల అలాట్‌మెంట్‌ పేరుతో ఏ ఏ నాయకుడు ఎన్నెన్ని ఎకరాలు, సెజ్‌లపేరుతో గ్రామాలకు గ్రామాలను ఎలా పంచుకుతింటున్నారో.. రోడ్డు, భవనాలు, ఇసుక, బొగ్గు, అడవి, కలప, ఖనిజం, నీరు.. అంతా అంతా దోపిడీకి గురౌతున్నట్టు తెలుసు తనకు.
మొన్న తన చేయించిన సర్వేతో, ఇప్పటికీ ప్రభుత్వ వ్యవస్థలో ఒక అవశేషంగా, మిగిలిన నీతిపరులైన ఏడెనిమిది మంది సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్ల నేతృత్వంలో తయారుచేసిన ‘అవినీతి డాటా బ్యాంక్‌’ ఋజువుల్తోసహా.. తనదగ్గరుంది.. డాక్యుమెంట్లుగా.. అంతా తనకు తెలుసు.
తెలిసీ.. తెలువనట్టు.. కళ్ళు ఉండీ చూడలేనట్టు.. చెవులుండీ వినలేనట్టు.. నటిస్తూ.,
జీవిస్తూ.. మరణించినట్టు.. మరణించికూడా జీవిస్తున్నట్టు నటిస్తూ..థూఁ.. నీయమ్మ .. ఆ ‘జనసేన’ నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో … టి.విలో ఎవరో వేశ్య చెప్పినట్టు.. తమకంటే వేశ్యే నయంకదా.
అధిష్టానం.. పార్టీ.. పార్టీ సభ్యులు..ప్రజాప్రతినిధులు.. అధికారదాహంతో వికృతతాండవం చేస్తున్న వివిధ పార్టీ లాబీలు.. హైద్రాబాద్‌, ఢిల్లీ.. నడుమ వికృత మంత్రాంగం, యంత్రాంగం నడిపేవారు.. అందరూ చెప్పేదేమంటే.. ముఖ్యమంత్రి ఈ రొచ్చును ఈ కంపును, ఈ సర్వదరిద్రాన్ని భరిస్తూ, ధరిస్తూ.. నాయకత్వం వహిస్తూ.. ‘నడిపించండి.. నడిపించండీ రోతను’ అని కదా ఎప్పుడూ చెప్పేది.
కాని.. కాని.. ఉహుఁ.. యిక తనతో కాదు.. ఈ కుర్చీ, ఈ అధికారం.. ఈ నీచాతి నీచమైన పదవీవ్యామోహం.. అప్పులకుప్పపై దొంగ నాటకం.. ఖాళీ ఖజానాతో అబద్దాల పాలన.. వద్దు.. వద్దిక..,
కారు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందాగి.. దిగి.. గబగబాలోపలికి నడచి.,
చుట్టూ ఎందరో విజిటర్స్‌.. ఫైళ్ళతో అధికారులు.. పాత్రికేయులు.. టివివాళ్లు.. లోపల ఆంటీరూంలో హోంమంత్రి అప్పల్నాయుడు.. ఇంకా.. ఇంకా.,
బెల్లం చుట్టూ ఈగలు.
లోపలికి వెళ్ళి సీట్లో కూర్చున్నాడో లేడో.. డోర్‌ దగ్గరగా పెట్టి అప్పల్నాయుడు ఒక వీధి రౌడీ మీదికురికొచ్చినంత రూడ్‌గా పైపైకొచ్చి,
”ఏమైందా కాగితం.. రాత్రిది.. చింతామణి రాజ్యసభ సీట్‌కు రికమెండేషన్‌ లెటర్‌. మీరు దాన్ని సంతకంచేసి నా ముఖాన పారేస్తే.. ఢిల్లీ లెవల్లో అన్ని ఏర్పాట్లూ చేసుకున్న”
”నేను చేయనయ్యా..”
”చేయవా.. ఎందుకు..” మాట ఏకవచనంలోకి దిగింది.
”ఒట్టి రోడ్‌సైడ్‌ మనుషులను పార్లమెంట్‌కు పంపడం సరియైందికాదు”
”ఏంటీ రోడ్‌సైడ్‌ మనిషా చింతామణి.. మరి నువ్వు, నేను, మన మంత్రులు, మనోళ్ళందరెవరు. సత్యహరిశ్చంద్రులా. పోవయ్యా.. ఏదో పెద్దమనిషివిగదా అని నీ సంతకం కావాలన్న. నువ్వు ఆ బోడి సంతకం చేయకుంటే పని ఆగిపోద్దనుకున్నవా. పై లెవల్ల ఎవనెవనికెంతియ్యాల్నో అన్ని ఇచ్చిపెట్టిన.. అందరూ పవర్లో ఉన్నంత సేపే తూర్పారపట్కొని పోతరు. పో.. నీతోనేంగాదు.. చూస్కుంట నీసంగతి..”అని విసవిసా, ఒక మామూలు మనిషిపై వీధిగుండా దాడిచేసి వెళ్లినట్టు.. ఓ వెంట్రుకముక్క పో అన్నంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు.,
ధూఁ.. నీయవ్వ..నిజంగానే ఏ విలువాలేని తనది ఏం బతుకు.,
పార్టీలో ప్రతివాడూ మాట్లాడేవాడే.. అందరూ ఒకర్నొకడు విమర్శించేవాడే.. అందరూ నీతిపరుల్లా మాట్లాడ్తూ ప్రతివాడూ మందికొంపలు ముంచుడే. ప్రతివాని వెనుకా ఎవడో ఒక గాడ్‌ఫాదర్‌.. ఎవనిదో దన్ను.. చివరికి అందరూ అక్కడ పైనుండి ఆడమంటే ఆడి, పాడమంటే పాడి.. కూర్చోమంటే కూర్చుని, నిలబడమంటే నిలబడి.. అంతా తోలుబొమ్మలాట.
ముక్కుతాళ్ళక్కడ.. ఒట్టి ఆడే బొమ్మలిక్కడ.
ఈ తోలుబొమ్మ జీవితం తనకు అవసరమా..?
ముఖ్యమంత్రి.. రాత్రి కూలంకషంగా పరిశీలించిన ఓ ఫైల్‌ఫోల్డర్‌ను తన టేబుల్‌ సొరుగులోనుండి బయటికి తీసి అప్రయత్నంగానే తెరచి ఓసారి తిరగేశాడు యథాలాపంగా. దాదాపు డెబ్బయిరెండు కేసులు.. మంత్రులు, శాసనసభ్యులు.. ఐఎఎస్‌ అధికారులు, వివిధ బోర్డు చైర్మన్లు.. వంటి హై ప్రొఫైల్‌ వ్యక్తుల జాతకాల చిట్టా.. ఋజువుల్తోసహా.,
ఎందుకో ఆయన తనకే అర్ధంగాని ఓ అంతర్వేదనలో.. నిర్వేదంలో.. నిశ్చేష్టలో కంపించిపోతూ.. అప్పుడతను కాలుతున్న కాగితంలా ఉన్నాడు.
కాగితం కాలిపోతూంటే అక్షరాలుకూడా కాలిపోతాయా..?

(సశేషం)

మీ మాటలు

*