ఈ జనరేషన్ జనరేటర్ లోంచి జన్మించిన విద్యుత్తు…

varavara.psd-1

‘రాత్రి’ కవితా సంకలనానికి తర్వాత, ‘దిగంబర కవులు’ కు ముందు, 1965లో రాసిన కవిత జీవనాడి.

‘రాత్రి’ కవితా సంకలనాన్ని ‘దిగంబర కవులు’కు కర్టెన్ రైజర్ అంటాడు చలసాని ప్రసాద్. ఇపుడాలోచిస్తే 1962 నుంచి 1965 దాకా దేశం రెండు యుద్ధాలు చూసింది – భారత-చైనా యుద్ధం, భారత – పాకిస్తాన్ యుద్ధం. మొదటిది మనం ఎన్నడూ గెలవలేమని తెలిసి తెచ్చిపెట్టుకున్నది. రెండవది ఎపుడయినా సరే గెలుస్తామనే గీరతో చేసింది. ఈ రెండూ దేశంలో మధ్యతరగతి, బుద్ధిజీవులను కవులతో సహా దేశభక్తి పూనకలో పడేసినవి. తెలుగు కవుల్లో కె. వి. రమణారెడ్డి, సి. విజయలక్ష్మి తప్ప ఎవరూ మినహాయింపు కారు. ‘స్వప్నలిపి’ లోనే కవిత్వాన్ని అనుభవించే అజంతా కూడ చైనా యుద్ధ సందర్భంలో ‘జెండాలకు కన్నీళ్లు లేవు’ అని ఫక్తు రాజకీయ కవిత రాశాడు. ఆ వాతావరణంలో కమ్యూనిస్టు పార్టీ చీలిక (1964) ఒక కుదుపుకు కారణమైంది. అటు శ్రామికవర్గంలోను, ఇటు యువతరంలోను ఒక అశాంతి నుంచి ఒక ఆన్వేషణ ప్రారంభమైంది. అది వ్యవస్థ మీద, ఎస్టాబ్లిష్ మెంట్ మీద, రివిజనిజం మీద అసహనం నుంచి, ఆగ్రహం నుంచి ఒక ఆశావాదంతో మానవావిష్కరణ కోసం తెగుతున్న సంకెళ్ల స్వరం.

కమ్మిశెట్టి వెంకటేశ్వర రావు ‘అగ్నిశిఖలు -మంచుజడులు’, కేశవరావు ‘ఉదయించని ఉదయాలు’, ఎ రాఘవాచారి ‘మానవుడా’ దీర్ఘకవిత ఇంచుమించు వెనుకా ముందుగా ఇదేకాలంలో వచ్చాయి. వీళ్లే తర్వాతి కాలంలో మహాస్వప్న, నగ్నముని, జ్వాలాముఖి పేర్లతో ‘దిగంబరకవులు’లో చేరారు.

హైదరాబాదులొ దిగంబరకవులు, వరంగల్ లో ‘తిరుగబడు’ కవులు, విశాఖపట్నంలో సాగర గ్రంథమాల, యజ్ఞం, తిరుపతిలో రాడికల్స్ తలెత్తడానికి ముందుకాలం. శ్రీకాకుళం గిరిజనుల్లో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, రాములు అనే మరో టీచర్ తో కలిసి గిరిజన సంఘాలు పెదుతున్న కాలం. నవత కవిత్వ పత్రిక ఆగిపోతూ సృజన కోసం వరంగల్ మిత్రమండలి లోని సాహితీమిత్రులు నలుగురు కవి తిలక్ తో కలిసి ఆధునిక దృక్పథం, ప్రయోగం, సామాజిక చైతన్యం కోసం సాహిత్య పత్రిక పెట్టాలని కలలు కంటున్న రోజులు.

Vv_writing

‘నా యుగస్వరానికి’ నా తరం గాయకుణ్నని అందుకే ప్రకటించి ఉంటుంది. ‘రేపటి వెలుగులపై విశ్వాసం వీడ’కుండా నా తరం అశాంతిని పలుకుతూ, నాలో దాగి ఉన్న సుప్తాగ్నిని వెతుకుతున్న కాలం. ఎంత అస్పష్టమైందయినా, ఎంత అపరిపక్వమైందయినా అప్పటికది యుగవాణి. ఆ స్పష్టత, ఆ పరిపక్వత – ప్రపంచ స్థాయిలో చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం (1966) తో, దేశంలో నక్సల్బరీ (1967) తో వచ్చిందని ఇపుడు స్పష్టంగా చెప్పగలను. అందుకే, ‘ఈ జనరేషన్ జనరేటర్ లోంచి జన్మించిన విద్యుత్తును నేను’.

అవి ప్రపంచమంతా వియత్నామ్ యుద్ధంతో ఉత్తేజం పొందుతున్న రోజులు కూడ. అమెరికాలో బుద్ధిజీవులు, యువతరం, వియత్నామ్ ప్రజల పక్షం వహించి, వాళ్లకు సంఘీభావంగా విశ్వవిద్యాలయాల్లో, సాహిత్యరంగంలో నల్లజాతి ప్రజల పోరాటాలు నిర్మిస్తున్నకాలం. అందుకే రష్యాలో తలెత్తిన రివిజనిజం ‘రాకెట్టుతో చంద్రునిపై విజయాన్ని’ రాయించిన వైజ్ఞానికప్రగతితో గర్వపడుతుంటే ‘వియత్నామ్ ప్రజల విజయాన్ని మానవజాతి విజయం’గా యువతరం భావిస్తున్న కాలమది. ఇటువంటి స్పష్టత అప్పతికింకా నాకు ఏర్పడనప్పతికీ విప్లవమే, అంతే వర్గపోరాటం ద్వారా శ్రామికవర్గం సాధించే విజయమే మానవజాతిని దోపిడీ, పీడనల నుంచి విముక్తం చేస్తుందన్న ఆకాంక్ష హృదయంలో స్పందించి వెలువడినవే ‘జీవనాడి’ సంపుటం లోని ‘జీవనాడి’, ‘రేపు’ మొదలైన కవితలు.

‘1970-71లో రాస్తే ఈ కవిత్వం ఇట్లా ఉండేది కాదేమో.. కానీ నా వ్యక్తిత్వాన్ని తీర్చిందీ మార్గాన్ని పేర్చిందీ ఈ జీవనాడే అని నమ్ముతాను’ అని ‘జీవనాడి’ చరిత్రలో (15 మార్చ్ 1971) ఆనాడే రాసుకున్నాను.

–          వరవరరావు

మే 28, 2014

మీ మాటలు

  1. balasudhakarmouli says:

    కవిత్వం – అదీ నెత్తురు మండించే కవిత్వం పుట్టడానికి వొక సమయం వుంటుంది. అలాంటి సమయాలు దిక్సూచిలాంటివి. ముందుకు దారి చూపుతుంది – ఆ కవి కవిత్వయాత్రకు.. కొత్త తరం కవులకూ –
    మంది మండించే కవిత్వానికి జోహార్లు గురువు గారూ… !
    కొత్త ‘వెంటాడే పద్యం’ గురించి ఎదురు చూస్తూ… !

  2. vidyasagar says:

    srikakulamlo sanghalu pettina kalam adikadu. akkada sanghalu ummadi communist party naayakatvamlo 1959 nunche prarambham ayyayi

మీ మాటలు

*