జాయపసేనాని -2

 

OLYMPUS DIGITAL CAMERAదృశ్యం-2

 

స్వయంభూ దేవాలయం..రంగ మండపం

( గణపతిదేవుని అజ్ఞానుసారము గుండామాత్యులు జాయనను తనకు అభిముఖముగా కూర్చుండబెట్టుకుని నాట్యశాస్త్ర బోధనను ప్రారంభిస్తున్న రోజు..జాయన గురువుగారికి పాదాభివందనం చేసి..అశీస్సులను పొంది..ఎదుట కూర్చుని..)

 గుండామాత్యులు:నాయనా “గురు సాక్షాత్ పరబ్రహ్మ..కాబట్టి ఈరోజునుండి కాకాతీయ మహాసామ్రాజ్య చక్రవరులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులుంగారి ఆదేశానుసారము   నేను నీకు  బోధించడానికి ఉపక్రమిస్తున్న ఈ నాట్యశాస్త్ర రహస్యాలను అతిజాగ్రత్తగా గ్రహించు..ఓం….దైవస్వతమన్వంతరము తొల్లి త్రేతాయుగమందు,కామక్రోధాది అరిషడ్వర్గములకు లొంగి లోకులందరును సుఖదుఃఖములననుభవించుచుండగా,ఇంద్రుడు మున్నగు దేవతలు బ్రహ్మను “అందరూ చూడదగిన,వినదగిన వినోద సాధనమును” అపేక్షించుచున్నామని అర్థించగా బ్రహ్మ ఆత్మాంతర భావనచేసి అన్ని వర్ణముల,వర్గముల వారికిని హితమైన సారమును వేదములనుండి సంగ్రహించి “నాట్యవేదము”ను సృజించినాడు.తర్వాత ఆంగికాది అభినయములందు మనుషులకు గల చాతుర్యమును గమనించి తన మానసపుత్రుడైన భరతమునికి ఆ నాట్యకళను నేర్పించినాడు.భరతుడు తన కుమారుడు శాండిల్యుడు మొదలైనవారికి దానిని నేర్పెను.వారితోను,అప్సరసలతోను,భరతముని నాట్యవేదమును ప్రయోగించి ప్రవర్తింపజేసెను.

       జాయప:ఊ…ఆచార్యా..ఈ నృత్యకళకు ఆధారభూతములైన మూలభావనలేమిటి.?

గుండా:మంచి ప్రశ్న జాయపా..ఎప్పుడైనా మూలమునూ,కేంద్రకమునూ స్పృశిస్తేగాని అసలు రహస్యం బట్టబయలు కాదు..సృష్టిలోని పంచభూతముల ప్రతీకాత్మక వ్యక్తీకరణే నృత్తము.భూమిలోని రత్నకాంతుల తళతళలు,నీటి తరంగముల లాలిత్యము,అగ్నిజ్వాలల ఊపు,వాయుసహజమైన వింతనడక,ఆకాశంలోని మెరుపుతీగల విన్యాసము..యివే నాట్యవేదమునకు పునాది భావనలు.ఐతే సుఖ దుఃఖ మిశ్రమమైన లోకస్వభావముననుకరించి నాలుగు విధముల అభినయములతో ఏర్పడినదే నాట్యవిద్య.ఆంగికము,వాచికము,ఆహార్యము,సాత్వికము అని అభినయము నాల్గు విధములు.నాట్యకళ అంతయూ వీటియందే నెలకొని ఉన్నది.

   జాయప:ఆచార్యా..నాట్యము..నృత్యము..మున్నగు ఏకరీతి భావనలవలె,పర్యాయపదములవలె ధ్వనింపజేయు రూపాలన్నీ ఒకటేనా.?

గుండా:నాయనా..శాస్త్రరీతిలో భరతమునిచే నిర్వహించబడ్డ ఈ విశేషణాలన్నీ అతి సూక్ష్మ భిన్నతలతో స్పష్టముగా చెప్పబడి ఉన్నాయి…ప్రధానమైన “నర్తనము” మూడు విధములు.ఒకటి..పాట,వాద్యములు మొదలగువానితోగలిసి,లయనుమాత్రము ఆశ్రయించి,అభినయములేక,అంగముల నాడించుట ‘ నృత్తము ‘. రెండవది..భావముల నాశ్రయించినది,పదార్థములను అభినయించు స్వరూపముగలది ‘ నృత్యము ‘.మూడవది..సాత్త్విక భావములతోనిండి,రసాశ్రయమై,వాక్యార్థమును అభినయించునదై ఉన్నచో అది ‘ నాట్యము ‘.

జాయప:గురువర్యా..నా సంశయములు సూర్యసమక్షములో మేఘ శకలాలవలె తొలగిపోయినవి.

   గుండా:జాయనా..నాట్య,నృత్య,నృత్తములలోని ప్రధానమైన చేష్టలను నిర్వహించు అంగ,ప్రత్యంగ,ఉపాంగములు మొత్తము 18..ఒక్కొక్కటి ఆరు.శిరస్సు,చేతులు,వక్షము,ప్రక్కలు,మొల మరియి పాదములు అంగములనబడును.ప్రత్యంగములు మెడ,భుజములు,కడుపు,వెన్ను,తొడలు మరియుపిక్కలు.మొత్తము ఆరు.కన్నులు,బొమ్మలు,ముక్కు,పెదవులు,చెక్కిళ్ళు మరియు గడ్డము..ఇవి ఉపాంగములు.

జాయప:శాస్త్రసారము ఇసుకలోనికి నీరువలె నాలోకి ప్రవహిస్తున్నది గురుదేవా..ధన్యుడను.

  గుందన:నృత్తము మార్గము..దేశీ అని రెండు విధములు.నాట్యవేదమునుండి మహర్షులచేత వెలికితీయబడి,సజ్జనుల ద్వారా ప్రచారము చేయబడినదిగా ఉన్న శాస్త్రానుగుణ పద్ధతిని బుధులు ‘ మార్గము ‘ అనీ,దేశ కాల స్థితిగతులనుబట్టి ఎప్పటికప్పుడు కొంగ్రొత్త విధానాలతో ఆయా దేశ రాజుల,జనుల యిష్టానుసారము చెల్లుబాటు ఐన నృత్త విధానమును ‘ దేశీ ‘ అని వ్యవహరించినారు.

 జాయప: ఉహూ..

  గుండన:కాగా నృత్య,నృత్తములు లాస్యమని,తాండవమని మరల రెండు విధములు. అందు మొదటిది లాస్యము..సుకుమారముగా ఉండునది.రెండవది..తాండవమైనది.స్త్రీ పురుషుల పరస్పర విషయములైన భావనలు లాసము.దానికొరకైనది,లేదా దానికి తగినది అను అర్థము గలది లాస్యము.అది కామోల్లాసమునకు హేతువులగు మృదువైన అంగవిక్షేపములు గలది.పార్వతీదేవికి శివుడుపదేశించినది కనుక ప్రాయికముగా దీనిని స్త్రీలే ప్రయోగింతురు.

  జాయప:గురువర్యా..లాస్య సంబంధ నృత్యములు కేవలము స్త్రీలచేతనే నిర్వర్తింపబడ్తాయా.?

గుండన :ఔను జాయనా..సందర్భోచిత పురుష ప్రవర్తనను ప్రయోగాత్మకంగా నర్తించడము అప్పుడప్పుడు జరిగినా లాస్యము ప్రధానముగా స్త్రీల నృత్యక్రియే.ఉద్ధతము పురుషులచే ప్రదర్శింపబడునది.

లాస్యాంగములు పది.గేయపదము,స్థిత పాఠ్యము, ఆసీనము, పుష్పగంధిక, ప్రచ్ఛేదకము, త్రిమూఢము, సైందవము, ద్విమూఢకము, ఉత్తమోత్తకము, ఉక్త ప్రత్యుక్తము..అనేవి ఆ అంగములు.వీటిలో సంక్లిష్టమైనవి .. విరహమందు స్త్రీ కామాగ్నిచే దేహము తపించగా, ఆసనమందుండి ప్రాకృతభాషతో వ్యవహరించునది స్థితపాఠ్యము..నానావిధములైన నృత్తగీత వాద్యములతో మగవానివలె స్త్రీ వివిధ చేష్టలు చేయుట పుష్పగంధిక..వెన్నెలవేడి తాళలేక కామినులు సిగ్గువదిలి,తప్పుచేసిన ప్రియులనైననూ వెన్నాడుట ప్రచ్ఛేదకము.ముఖ ప్రతిముఖములు గలది,చతురశ్రమైన నడక గలది,భావరసములు శ్లిష్టముగా నుండు,విచిత్రములైన అర్థములు గలది ద్విమూఢకము.

ఇకపోతే..ఉద్ధతము మహేశ్వరుని ఆజ్ఞచే భట్టతండువు భరతమునికి చెప్పినది.అందువలన అది “తాండవము” అని వ్యవహరింపబడుతున్నది.దానిని ప్రాయికముగా ఉద్ధతమైన అంగహారములతో పురుషులే నెరవేర్తురు.

        జాయన:గురుదేవా..కేవలము కొన్ని స్త్రీలచేతనే,మరికొన్ని పురుషుల చేతనే నిర్వర్తించబడవలెనన్న నియమము ఎందుకు విధించబడినది.

 గుండన:ఏలననగా .. నాట్యక్రియలో కొన్ని శరీర పటుత్వ, శక్తి, సమర్థతా సంబంధ విషయములతో కూడిఉన్నవి.ఉదాహరణకు ..ఉద్ధత నృత్యములో ఎంతో దుష్కరమైన ప్రదర్శనను..అంటే గాలిలోకి పైకి ఎగిరి, గాలిలోనే పద్మాసనం వేసి,వెంటనే కాళ్ళను విడదీసి నేలమీద నిలుచోవడమో, కూర్చోవడమో చేయగల ‘ అంతరపద్మాసనం’,’ ఊరుద్వయ తాడితం ‘,’ లవణి ‘ వంటి సంక్లిష్ట భంగిమలను ప్రేక్షకులకందించి నర్తకుడు మన్నన పొందుతాడు.దీనికి బలిష్ఠమైన,సౌష్ఠవమైన,శరీరం,దారుఢ్యం అవసరం.

జాయప:ఆచార్యా..పరమ ఆసక్తికరమైన ఈ అంశములను వింటున్నకొద్దీ సముద్రాంతర లోలోతులను సందర్శిస్తున్న మహానందానుభూతి కలుగుతున్నది.నేనదృష్టవంతుడను.

     గుండన: అతి విసృతమైన నాట్యశాస్త్ర వివరాలు ఇంకెన్నో ఉన్నాయి జాయనా.26 రకముల శిరోభేదములు,36 రకముల దృష్టిభేదములు,స్థాయిదృష్టులు.సంచారి దృష్టులు,దర్శనరీతులు,పుటకర్మలు,భ్రూకర్మలు,నాసాకర్మలు,ఓష్ఠకర్మలు,68 రీతుల హస్తలక్షణములు,వక్షో,పార్శ్వ,జఠర,కటి,జాను,ఊరు,జంగా,పాదాంగుళీ కర్మలు,108 రకముల నృత్తకరణములు..ఈ విధముగా నృత్యశాస్త్రము ఒక అనంతాకాసము వంటిది పుత్రా.దీని అధ్యయనము తపస్సమానమైనది..ఉత్కృష్టమైనది.

 జాయన:ఈ మధుర శాస్త్రాన్ని మీనుండి ముఖతః వినే భాగ్యము నాకు కలుగడము నా పూర్వజన్మ సుకృతము ఆచార్యా.ధన్యుడను.

( రాజనర్తకి మాళవిక ప్రవేశము)

మాళవిక:ఆచార్య గుండనామాత్యులకు కాకతీయ సామ్రాట్టుల రాజనర్తకి మాళవికాదేవి ప్రణామములు.

     గుండన:ఆయుష్మాన్ భవ..చిరంజీవ.రా మాళవికా.ఈతడు జాయప…(పరిచయం చేస్తూందగా..)

మాళవిక:గణపతిదేవ చక్రవర్తులు మాకు విషయమంతా చెప్పి జాయనకు శాస్త్ర బోధన జరుపుతున్నపుడు మీతో సహకరించమని మమ్మల్ని అదేశించి ఉన్నారు.తమరి ఆజ్ఞ గురుదేవా.

 గుండన:జాయనా..కొద్దిరోజులు ఈ ప్రాథమికాంశాల చర్చ తర్వాత మన రాజనర్తకి మాళవికాదేవి స్వయముగా మూడు రకముల గతులు..అంటె నదక,ద్రుతము,మధ్యము మరియు విళంబితముల గురించీ,శుద్ధ సంకీర్ణ గతుల గురించీ ప్రదర్శించి అవగతపరుస్తుంది.

జాయన:సరే గురుదేవా..మాళవికాదేవి గారికివే మా నమోవాకములు.

మాళవిక: శివానుగ్రహ ప్రాప్తిరస్తు..చిరంజీవ.

     గుండన:ఈ నాటికీ పాఠం చాలు నాయనా..నీవిక విశ్రమించుము.

( తెర..)

మీ మాటలు

*