పితృ, దేవ హత్య అనివార్యం!

Art: Rafi Haque

Art: Rafi Haque

‘తండ్రీలేనీ, దేవుడు లేనీ అనాథ లోకం’ ఒక అన్‌ఫిలసాఫికల్‌ మెటాఫిజికల్‌ కాక్‌టేయిల్‌ ఎక్స్‌ప్రెషన్‌. గాడ్‌ ఈజ్‌ డెడ్‌ అని నీష్చే ప్రకటించిన నేపథ్యం విస్మరించి రాణిశివశంకర శర్మ తండ్రీ, దేవుడీ అవసరాన్ని వక్కాణించటం ఆలోచించాలి.
సోక్రటీసు ఆస్తిక‌త్వాన్నీ, దేవుడు ఉనికినీ ప్ర‌శ్నించింది  మొదలు హెగెల్‌ వరకు ఫిలాసఫీలో దేవుడు, మతానిదే కేంద్రస్థానం. మెటాఫిజికల్‌ ఫిలాసఫీని భౌతికవాదం వైపు మార్క్స్‌ నడిపించడానికి కాంట్‌, హెగెల్ త‌త్వం ఉపయోగపడ్డది నిజమే. కానీ, గాడ్‌ ఈజ్‌ డెడ్‌ అని నీష్చే ప్రకటించటానికి మాత్రం కాంట్‌, హెగెల్‌ తాత్విక అన్వేషణ కారణం కాదు. నీష్చేను ఆ మాట అనేలా మనుస్మృతి ప్రేరేపించింది. బ్రాహ్మణిజం చాకచాక్యంగా దేవుణ్ణి తప్పించి బ్రాహ్మణున్ని కేంద్ర స్థానంలో నిలిపింది. బ్రాహ్మణుడే దేవుడని మనుధర్మం ప్రకటించింది. మ‌మ దేవః, అహం బ్ర‌హ్మ‌స్మి అన్న‌ది అందుకే. అతడి సంక్షేమమే రాజ్య సంక్షేమ‌మం, అదే రాజ్యం యొక్క బాధ్యతనీ, అతడిని రక్షించటమే రాజధర్మమని మనుధర్మం ప్రకటించింది. ఈ ప్రపంచాధిపతి విప్రుడని అది చేసిన ప్రకటన నీష్చేని అబ్బురపర్చింది.
మనుస్మృతిలోని అధిమానవుడు (సూపర్‌ హూమన్‌ బీయింగ్‌) తనకు ఆదర్శమని అతడు భావించేలా ప్రేరణిచిందది. అందుకే దేవుడు మరణించాడనీ, ఇక ఈ లోకాన్ని అధిమానవుడైన ఆర్యుడే ఏలి రక్షిస్తాడని పారవశ్యంతో ఏడ్చే ఒక సంభ్రమాశ్చర్య దుఃఖస్థితికి అతడు చేరుకున్నాడు. ఇంచుమించు వివేకానందుడిదీ అదే మనోస్థితి. అతడి చేష్టలు, వ్యాఖ్య‌లు,  భ్రాంతిపూరిత ప్రకటనలూ ఆ అధిమానవుడిని తండ్రిగా అంగీకరించిన ఫలిత‌మే! కాబట్టే నీష్చే, వివేకానందుల‌ మధ్య వుండే డిస్కర్సివ్‌ సిమిలారిటీస్‌ను డా. అంబేద్కర్‌ వివరించాడు. నీష్చే తాత్వీకరించిన ఆ అధిమానువుడు ఆర్యుడు. నీష్చే ప్ర‌వ‌చించిన రేసిస్టు ఫిలాసఫీ హిట్లర్‌ (శర్మగారు చెప్పిన ‘తండ్రి’) నాజీయిజానికి, తద్వారా రెండు కోట్లమంది మానవ హననానికీ కారణమైంది.
నీష్చే ఈ లోకానికి అధిమానవున్ని తండ్రిగా ఇవ్వానుకొని దేవుడనే భావనకు ఫిలాసఫీలో ప్రాధాన్యత తగ్గించాడు. అయితే, మనువు చెప్పిన అధిమానవుడే ప్రపంచానికి తండ్రిగా, దేవుడు (భూసురుడు)గా  ఎంత విధ్వంసం సృష్టించాడో చరిత్ర సాక్ష్యం చెప్తూనే వుంది. తండ్రి తన పిల్ల‌ల‌ను తప్ప ఇతరుల పిల్ల‌ల‌ పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడన్న హామీ ఏమీ లేదు. హిట్లర్‌ అనే తండ్రి యూదుల‌ను శత్రువుగా భావించాడు కాబట్టే కాన్‌సెంట్రేషన్‌ క్యాంపుల్లో పెట్టి దారుణమైన జాతి హననానికి ఒడిగట్టాడు. ఒక చెడ్డ తండ్రి వల్ల‌ సంభవించిన క్రైం అగనెస్ట్‌ హుమానిటీని శిక్షించే పేరుతో రిలేటివ్‌లీ మంచి తండ్రి అయిన స్టాలిన్‌ పుట్టుకొచ్చాడు. ఈ సాపేక్ష సద్గుణ తండ్రి చేతిలో రష్యాలోని తన సొంతబిడ్డలు ఎంత హింసను అనుభవించారో తెలిసిందే. ఈ తండ్రి చేతిలోనే రోజా ల‌గ్జంబ‌ర్గ్ హ‌త‌మైంది. ఇందిరాగాంధీ నియంతృత్వంలోని క్రూరత్వాన్ని చవిచూసిన వాళ్లే ఆమేలోని దైవ‌త్వాన్ని ఎరుగుదురు. నియంతల‌ నిజాయితీ ఆధారంగా పితృ, పుత్ర సంబంధాల‌ను అంచనా వేయటం నయా మనువాదం.
మిషేల్‌ ఫుకో, డెరిడా, రార్టీ వంటి ఉత్తరాధునికవాదులు, ప్రాగ్మాటిస్టులు అన్ని రకాల‌ ఆధిపత్య కేంద్రాల‌ను తిరస్కరించారు. తండ్రి, కొడుకు అనే  ద్వైధీకృత సంబంధంలోని ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు డెరిడా. తండ్రికి లోబడి కొడుకు లేదా కూతురు వుండాల‌న్నది ఆధిపత్య సంబంధమే తప్ప సమానత్వాన్ని స్థాపించే ప్రజాస్వామిక సంబంధం కాదని ఆయన అభిప్రాయం. దీన్నే వాచకానికి వర్తింప చేసి ముందుమాటను వాచకం అప్రధానం చేయటమో లేదా ముందుమాటే తనను తాను ప్రధాన వాచకానికి లోబడి, కుదించుకుపోవటమో చేస్తుందని వివరిస్తాడు. అందుకే పితృహత్యకు డెరిడా పిలుపునిస్తాడు. తండ్రి పాత్ర పూర్తిగా ఆధిపత్యానికీ, పితృస్వామ్య ఆధిపత్యానికి నెల‌వని సైమన్‌ డిబోవా అభిప్రాయం.
కౌటుంబిక వ్యవస్థలో తండ్రి పోషించే బాధ్యతాయుతమైన పాత్రను వర్ణ, కుల‌ సమాజం గ్లోరిఫై చేస్తుందేమో గానీ, యూరపు సమాజాలు మాత్రం తిరస్కరిస్తాయి. వర్ణ, కుల‌ వ్యవస్థలోని ఆధిపత్యం వల్ల‌ అనేక ప్రయోజనాలు పొందుతున్న సవర్ణ పితృస్వామ్యవాదులు సమర్ధిస్తారేమో గానీ ఆధిపత్య వ్యవస్థను తిరస్కరిస్తున్న ప్రజాస్వామికవాదులు లేదా ఎగాలిటేరియన్‌, యాంటీ ఫాసిస్టు శక్తులు సుతారమూ అంగీకరించవు. ఎంతో పాతబడినదీ, తిరస్కరించబడినదీ, వ్యతిరేకించబడినదీ, అస్తిత్వవాదుల‌ చేతా, ప్రగతిశీవాదుల‌ చేతా, అంబేద్కర్‌వాదుల‌ చేతా ఖండించబడీ, తిరస్కరించబడిన పితృవాదం, దైవవాదాల‌ను తిరిగి బాధితుల‌ శిరస్సు మీద రుద్దడం అనంగీకారం. పితృ/దైవ కేంద్ర సిద్ధాంతమే గొప్పదనీ, అవసరమైనదనీ ఒప్పుకొంటే, శర్మ తర్కం వల్ల‌ ఉత్ఫన్నమయ్యే ఫలితాల‌ను భరించాలి. తండ్రి పాత్ర పోషించాడని చెప్పిన రాముడి చేతిలో ఈ దేశ మూల‌వాసుల‌ శిరస్సు ఖండితమై, జ్ఞానార్జనా క్షేత్రాల‌కు దూరంగా కుళ్లిన కళేబరాలై చితికిపోవాలి. రాముడి ధర్మం ప్రాసంగికత ఎంత అసందర్భమైనదైనా సరే,  ఆ రాముడి ధర్మాన్నే తండ్రిబాధ్యతగా, దైవకార్యంగా ఈ దేశ రాజ్యం యొక్క సారభూతతత్వం (ఆంటలాజికల్‌ ఫిలాసఫీ) గా స్థాపించాల‌ని హిందూ జాతీయవాదం తపిస్తున్నది.
నిజానికీ, తండ్రి లేదా ధర్మకర్త పాత్ర పోషించాల‌ని చెప్పిన గాంధీ హితవాదాన్ని డా. అంబేద్కర్‌ తిరస్కరించి, రాజ్యాన్ని రక్షకుడి స్థానంలో నిబెట్టడం వల్లే బాధిత సమూహాల‌కు ‘అనాథ’ స్థితినించి ‘పౌర’ హోదా దక్కింది.  రాజ్యాంగంలో నిర్వచించుకొన్నట్టుగా పౌరుల‌ను రాజ్యమే రక్షించుకోవాలి తప్ప ఏ దేవుడూ లేదా ఏ అధిమానవుడూ రక్షించరాదు. శిక్షించరాదు కూడా. కానీ, పితృస్థానంలో వున్న రాజ్యాంగాన్ని తోసిరాజని తండ్రి పేరుతో బ్రాహ్మణున్నీ, దేవుడి పేరుతో బ్రాహ్మణ్యాన్నీ రాజ్యంగా ప్రతిష్టాపించే కృషిని నెహ్రూ మొదలుకొని నరేంద్ర మోడీ వరకు కొనసాగిస్తూనే వున్నారు.
శర్మ వగస్తున్నట్టు ఈ దేశానికీ లేదా ఈ లోకానికీ తండ్రి, దేవుడు లేడని ఎవరైనా భ్రమిస్తే అది వాళ్ల జువైనలిజమే అవుతుంది. రాజ్యాంగ విరుద్ధంగా మ‌నువు ఆకృతినిచ్చిన తండ్రినీ, దేముడినీ ఈ స‌మాజంలో బ‌లంగా నిల‌బెడుతూనే వున్నారు. వాటిక‌న్ సిటీ దేవుడూ, అమెరికా తండ్రి క‌లిసి త‌యారు చేసిన హింస‌కు ప్ర‌తిహింస‌గా బ‌య‌ల్దేరిన తీవ్ర‌వాదం నెత్తుటి వాన‌ను కురిపిస్తూనే వున్న‌ది. దేవుడే లేని వెలివాడ‌ల్లోకి తండ్రి అయిన యేసును ప‌ర‌లోక ప్ర‌వేశానికి క‌చ్చిత‌మైన హామీ ఇస్తూ ప్ర‌వేశ‌పెట్టి చాలాకాల‌మైంది. ప‌ర‌లోకం త‌ప్ప ఇహ‌లోకం ప‌ట్ట‌ని ఒక ఉన్మ‌త్త స్థితికి తీసుకెళ్తున్న‌ది ప‌చ్చి నిజం. ఏది అస‌లైన ఇస్లామో చెప్ప‌లేనంత‌గా మారిపోయిన కాలంలో త‌బ్లిక్‌లాంటి జ‌మాతులు ముస్లిం స‌మాజాన్ని తిరోగ‌మింప చేస్తున్నదీ నిజ‌మే. తండ్రుల మ‌ధ్య‌, దేవుళ్ల మ‌ధ్య జ‌రుగుతున్న స‌మ‌రంలో సామాన్యుడు బంధీగా మారుతున్నాడ‌ని ఒక‌వైపు వేద‌న‌ప‌డుతుంటే శ‌ర్మ మ‌ళ్లీ పాత‌పాటే పాడ‌టం ఏ సాంస్కృతిక చాణ‌క్య నీతి?
 మనది జాతి రాజ్యం కాదన్న నిజాన్ని మేధాల‌వుంతా ఎందుకు గుర్తించ నిరాకరిస్తున్నారో అర్థం కాదు. యూరపులోని జాతి రాజ్యాల‌ లాంటిది కాదు మన రాజ్యం. జాతి భావనే లేని సమాజం మనది. కులం తప్ప జాతికి పుట్టగతుల్లేని అవ్యవస్థ ఇది. జాతి అనే అమూర్త భావనను నిజం చేయలేమని గ్రహించిన రాజ్యాంగ నిర్మాత గణతంత్ర రాజ్యంగా నిర్ధారించాడు. గణతంత్ర విధానంలోనే వివిధ జాతుల‌, కులాల‌, తెగల‌, మత బృందాల‌, భాషా సమూహాల‌, లింగ సమాజాల‌కు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ల‌భిస్తుంది. జాతి రాజ్యాల్లో ఇది అసంభవం. పాలిత జాతికి చెందని సమూహాల‌కు, బృందాల‌కు, గణాల‌కు, తెగల‌కు, జాతుల‌కు రాజ్యం కల్పించే హక్కులు, రక్షణలు, ప్రాతినిధ్యం తప్పనిసరిగా దక్కే అవకాశం లేదు. అవి జాతి రాజ్యం యొక్క దయాదాక్షిణ్యాల‌ మీద ఆధారపడి జీవించాలి. కానీ, మనది గణతంత్ర రాజ్యం కావటం వల్ల‌ అలాంటి నిరంకుశ జాతి దురహంకారానికి బాధితులుగా మిగల‌కపోగా, స్టేక్‌ హ్డోర్లు కాగలిగారు. శర్మ మన రాజ్యాన్ని జాతి రాజ్యాల‌ సరసన నిబెట్టి బోనెక్కించటం సమర్ధనీయం కాదు.
కౌటుంబికవాదం మరో కాల్ప‌నికవాదం. అది తండ్రినీ, పిల్ల‌ల వికాసాన్నీ, తండ్రి పడే కష్టాల‌నూ రొమాంటిసైజ్‌ చేస్తుంది. పిల్ల‌ల‌ ఎదుగుదల‌కు తండ్రి, తల్లి మధ్య సామరస్య సంబంధాలు దోహదం చేస్తాయనీ, పిల్ల‌ల‌ను పెంచే బాధ్యతను తండ్రి భుజామీద మోపి, తల్లిని వారిని సాకే యంత్రంగా మార్చేస్తుందనీ ఈ కాల్ప‌నిక‌వాదం గుర్తించనీదు. తండ్రిని ఒక కులానికీ, ఒక వర్గానికీ బంధీని చేసిన దేవుడు ఆ పిల్ల‌ల‌ శారీరక, మానసిక ప్రగతికి తండ్రి యొక్క ఆర్థిక స్థితినీ లేదా ఆర్థికబలాన్ని పొందే ప్రతిభా సామర్ధ్యాల‌ను హేతువుగా చూపి తప్పించుకుంటున్నాడు. ఈ కుల‌ సమాజంలోని న‌ల‌భై కోట్ల పీడితులు రోజుకు ఒక్క పూట తిండి మాత్రమే తింటున్నారంటే, ఎనభైశాతంకు పైగా బడీడు పిల్ల‌లు స్కూలు డ్రాపవుటవుతున్నారంటే, తల్లిదండ్రుల‌ అజ్ఞానం, పేదరికం, అసమర్ధత వ‌ల్ల‌ నిత్యం కౌటుంబిక హింసకు గురై బాల్యాన్ని పోగొట్టుకుంటున్నారంటే తండ్రి కేంద్ర వ్యవస్థే కారణం. కానీ, యూరపులోని అనేక దేశాలు గర్భస్థ శిశువు నుండి టీనేజీ వరకు పోషణ, విద్యాబుద్ధులు, బాల్యాన్ని అనుభవించే హక్కును గ్యారంటీ చేయటమే కాదు, మన కుల‌ సమాజం ఇచ్చిన పెత్తనపు హక్కు స్వభావంతో కన్నపిల్ల‌ల‌ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేసి ఖైదు చేసిన సంఘటనలున్నాయి. తండ్రి వున్నంత మాత్రానే బిడ్డకూ, త‌ల్లుల‌కూ స్వేచ్ఛ వుంటుందనుకోవటం పెద్ద దగా. నిజానికీ, స్వేచ్ఛకు తండ్రీ, దేవుడు పెద్ద అడ్డంకని ఎన్ని సామాజిక పరిణామ దశలు చూపించాయో మర్చిపోతే ఎట్లా?
శర్మ ఆర్థికవాదాన్ని నిరసించినంతనే తన వాదన‌ ఆమోదనీయమైనదని నిరూపించలేరు. స్వేచ్ఛా మార్కెట్ వ‌ల్ల‌ దళితుల‌ జీవితాల్లో పెద్ద మార్పులొస్తాయని ఎవరూ ఆశించలేదు. కానీ, కుల‌ సంబంధాల్లో స్వ‌ల్ప‌మైన మార్పులైనా వొస్తాయనీ, ముఖ్యంగా జైలుగదిగా మారిన గ్రామరాజ్యం విచ్ఛినమై, సుదీర్ఘకాలం కట్టుబానిసలుగా బంధితులైన దళితుల‌కు సాపేక్షమైన స్వేచ్ఛనిచ్చే సోషల్‌ మొబిలిటీ దొరుకుతుందని మాత్రమే ఆకాంక్షించారు. అన్ని దశల్లో అమలైన ఆర్థికఒప్పందాల వ‌ల్ల‌, వేగంగా విస్తరించిన టచ్‌స్క్రీన్‌ టెక్నోయిజం వల్లా, ఎక్ట్రో కమ్యూనికేషన్‌ ప్రగతివల్ల‌ బ్రాహ్మణ, వైశ్య మార్కెట్‌ లాభపడ్డది. కాస్టిస్ట్‌ మార్కెట్‌ స్వభావం, ప్రవర్తన పీడిత సమూహాల‌ను కనీసం వినియోగదారునిగా కూడా పరిగణించదనీ, అది అనేక మాయాజాల‌ పద్ధతుల‌తో జేబుదొంగకన్న హీనంగా ప్రవర్తిస్తుందన్న ఎరుక అంబేద్కరైట్‌ మేధావుల‌కు వుంది.
సవర్ణ సరుకుల‌ సంతను విస్తరింప చేయటానికీ, దేశ సహజ వనరుల‌ను సవర్ణ సంపన్నుల‌కు కట్టబెట్టడం ద్వారా ప్రపంచ కుబేరుల‌ను చేసి, ప్రపంచ మార్కెట్‌ను గుప్పిట్లోకి తెచ్చుకోవటం ద్వారా వైష్ణవ, వైదిక, సనాతన ధర్మపరంపరాగతమైన హిందూత్వ జాతీయవాదాన్ని ఆర్యజాతి ఐక్యత పేరుతో ప్రపంచమంతా వ్యవస్థాపితం చేయాల‌ని తపిస్తున్న సత్యం కనిపిస్తూనే వున్నది. సంఫ్‌పరివార్‌ సంస్థలు మొదలుకొని హరేక్రిష్ణ మిషన్‌, రామక్రిష్ణ మిషన్‌ వరకు ఎన్నో సంస్థలు ఆ దిశగా పనిచేస్తూనే వున్నాయి. ఆ ల‌క్ష్యం కోసమే పేద (హిందూపేదల‌) పితరగా ప్రకటించుకొన్న నరేంద్ర మోఢీ నిద్రాహారాలుమాని పనిచేస్తున్నాడు. ఆ ల‌క్ష్యం కోసమే ముస్లింల‌ను, దళితుల‌ను సామూహిక హనన కేంద్రాకు స్వ‌యంగా తరలిపోయి క్యూలో నిల‌బడే బలిమేకలుగా త‌యారు చేసే మానసిక ప్రపంచాన్ని నిర్మిస్తున్నాడు. ఆ సామూహిక హననక్రియకు అవసరమైన తలారుల‌ను శూద్ర, శూద్రఅగ్రకులాల‌ నుంచి తయారు చేసి శిక్షణిస్తున్నాడు.
ఇందుమూలంగా నిర్ధారించనైనది ఏమనగా, ఈ లోకాన్నీ, పీడిత సమూహాల‌ను సర్వనాశనం చేసిన, చేస్తున్న, భవిష్యత్తులో చేయబోయే తండ్రి ` అతడు ఎంతటి ఉదాత్తుడు, శీల‌వంతుడు, సద్గుణుడు, నిర్గుణుడు అయినప్పటికీ  తాత్వికంగా గానీ, కనీస ఇంగితజ్ఞానంతో గానీ అంగీకరించేది లేదని ప్రకటిస్తున్నాం. వేల‌ యేళ్లుగా ఈ ప్రపంచాన్నీ, ఈ దేశాన్నీ సర్వనాశనం చేసిన దేవుడు ఎంతటి దయామయుడైనా, ఎంతటి బల‌మైన దేహదారుఢ్యమూ, ఆయుధసంపత్తిని చేబూనివాడైననూ, ఎంతటి ధర్మనిరపేక్షమైనవాడైననూ, ఎంతటి కరుణామృత హృదయుడైననూ, అతడెంత నిర్గుణుడైనా, సద్గుణుడైనా, నిరాకారుడైనా, సాకారుడైనా సరే, తాత్వికంగాగానీ, సాధారణ బుద్ధితోగానీ, అసాధారణ బుద్ధిహీనతతో గానీ అంగీకరించేది లేదని ప్రకటించనైనది.
*

మీ మాటలు

  1. మీ ప్రకటన తో గొంతు కలుపుతున్నాము. పితృస్వామ్య వ్యవస్థను కూలదోయకుండా ఈ దేశంలో పేద దళితులకు, స్త్రీలకూ విముక్తి లేదని నొక్కివక్కాణిస్తున్నాము

  2. rani siva sankara sarma says:

    రాణి శివ శంకర శర్మ చేసిన నేరం భారత దేశంలో హిందూజాతీయ నిరంకుశత్వం రాజ్యం చేస్తోందనడం. భారత ప్రజాస్వామ్యమే నిజమైన ప్రజాస్వామ్యం. అగ్రవర్ణాల నుంచి దళితులూ ముస్లింల దాక అందరికి చక్కని సమానప్రతినిధ్యం యిక్కడే, పవిత్ర భారత భూమిలోనే, యీహిందూరాజ్యంలోనే లభిస్తోంది. దాన్ని కాదనడం శర్మ చేసిన పెద్ద తప్పు అంటున్నారు జిలకర శ్రీనివాస్ . నిజమా?

    మనది జాతి రాజ్యం కాదన్న నిజాన్ని మేధాల‌వుంతా ఎందుకు గుర్తించ నిరాకరిస్తున్నారో అర్థం కాదు. యూరపులోని జాతి రాజ్యాల‌ లాంటిది కాదు మన రాజ్యం. జాతి భావనే లేని సమాజం మనది. కులం తప్ప జాతికి పుట్టగతుల్లేని అవ్యవస్థ ఇది. జాతి అనే అమూర్త భావనను నిజం చేయలేమని గ్రహించిన రాజ్యాంగ నిర్మాత గణతంత్ర రాజ్యంగా నిర్ధారించాడు. గణతంత్ర విధానంలోనే వివిధ జాతుల‌, కులాల‌, తెగల‌, మత బృందాల‌, భాషా సమూహాల‌, లింగ సమాజాల‌కు జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ల‌భిస్తుంది. జాతి రాజ్యాల్లో ఇది అసంభవం. పాలిత జాతికి చెందని సమూహాల‌కు, బృందాల‌కు, గణాల‌కు, తెగల‌కు, జాతుల‌కు రాజ్యం కల్పించే హక్కులు, రక్షణలు, ప్రాతినిధ్యం తప్పనిసరిగా దక్కే అవకాశం లేదు. అవి జాతి రాజ్యం యొక్క దయాదాక్షిణ్యాల‌ మీద ఆధారపడి జీవించాలి. కానీ, మనది గణతంత్ర రాజ్యం కావటం వల్ల‌ అలాంటి నిరంకుశ జాతి దురహంకారానికి బాధితులుగా మిగల‌కపోగా, స్టేక్‌ హ్డోర్లు కాగలిగారు. శర్మ మన రాజ్యాన్ని జాతి రాజ్యాల‌ సరసన నిబెట్టి బోనెక్కించటం సమర్ధనీయం కాదు.

    • హిందూ రాజ్యమని జిలకర శ్రీనివాస్ అనలేదు కదా రాణి గారు. ఆయన అన్నది మనది జాతి రాజ్యం కాదు అన్నారు. మీరు ఉదహరించిన వాక్యాలే చూపుతున్నాయి కదా. రాజ్యాంగం లోని 13, 14 ఆర్టికల్స్ తో పాటు ఫండమెంటల్ రైట్స్ విభాగం జిలకర శ్రీనివాస్ రాసిన వాక్యాలనే సమర్ధిస్తున్నాయి. మనది సర్వ సత్తాక ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యమనే కదా ప్రియాంబుల్ లో రాసుకున్నది. అందులో హిందూ రాజ్యమని రాయలేదు కదా. కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీ ల భావజాలం హిందూ మతానిది కావొచ్చు. ఆ పార్టీ భావజాలాన్ని రాజ్యాంగం మీద పులిమితే ఎలా చెప్పండి. ఇలాంటి చిన్న విషయాలను మీలాంటి మేధావులు ఒక ప్రశ్నగా అడగటం బాగా లేదండి.

  3. rani siva sankara sarma says:

    పరస్పర వైరుధ్యాలూ అసంగతాలు
    మనకు జాతి భావనలేదని , కులం మాత్రమే ఉందంటారు జిలకరశ్రీనివాస్.మళ్ళీ తరవాత పేరాలోనే మాట మారుస్తారు. జాతిభావం ఎప్పటినుంచో పరంపరగా వస్తోందంటారు.
    యీ వాక్యం చూడండి.
    ప్రపంచ మార్కెట్‌ను గుప్పిట్లోకి తెచ్చుకోవటం ద్వారా వైష్ణవ, వైదిక, సనాతన ధర్మపరంపరాగతమైన హిందూత్వ జాతీయవాదాన్ని ఆర్యజాతి ఐక్యత పేరుతో ప్రపంచమంతా వ్యవస్థాపితం చేయాల‌ని తపిస్తున్న సత్యం కనిపిస్తూనే వున్నది. [జిలకర శ్రీనివాస్]వైరుధ్యాలపుట్ట, డాం భికత్వపు ప్రయాస యీవ్యాసం.

    • ఇందులో అసంగతం ఏముంది? మనకు జాతి భావన లేదన్నది నిజం. అంటే భారత జాతి అన్న భావన లేదని జిలకర శ్రీనివాస్ గారి అర్థం కావొచ్చు. అది ఆయన అభిప్రాయం అయినా కాకపోయినా సామాజిక, రాజకీయ శాస్త్రాలు చదువుకున్న వాళ్లందరికీ ఈ విషయం తెలుసు కదా. కానీ మీరంటున్న హిందూ జాతీయవాదం ఆర్య జాతి సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతుంది. ఆర్య బ్రాహ్మణులు, ఆర్య వైశ్యులు, ఆర్య క్షత్రియులు అన్నారు గాని ఆర్య శూద్రులు, ఆర్య చండాలురు అనలేదు కదా? ఆర్యులు, అనార్యులు, నాగులు, మ్లేచ్చులు లాంటి జాతి వాచకాలు ప్రాచీన గ్రంథాలుగా చెప్పబడే వాటిలో ఉన్నాయి కదా. రాజ్యాంగం లో ఎక్కడా ఇది పాలనా జాతి రాజ్యం అంటే హిందూ జాతి లేదా భారత జాతి రాజ్యం అని రాసి లేదు. కానీ హిందుత్వ జాతీయవాదులు ప్రపంచం అంతటా ఆర్య జాతి గొప్పదనే కదా ప్రచారం చేస్తున్నది? హిందూ మతాన్ని ప్రపంచం వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నది నిజం కదా? అది నిజమని ఎందుకు ఒప్పుకోలేక పోతున్నారో నా లాంటి వాళ్లకు తెలవటం లేదు. జిలకర శ్రీనివాస్ వ్యాసం చదివి భయపడినట్టే ఉంది మీ వాలకం. నిజం ఒప్పుకోవడానికి సిగ్గెందుకు సార్?

  4. rani siva sankara sarma says:

    మనుస్మృతిని ఎవరెవరు చదివారు?
    నీషే మనుస్మృతి చదివి , యాంటీ సెమిటిక్ అయ్యారన్నారు జిలకర శ్రీనివాస్. మరి అనేకమంది యూరోపియన్ ప్రగతి శీల మేధావుల్లో జాతివివక్ష , యాంటిసెమిటిక్ భావాలు పుష్కలంగా వున్నాయి. హిట్లర్ మెయిన్ కేంఫ్ లో గోథె లోఉన్న యూదువ్యతిరేక జాతివివక్ష భావాలని గురించి మాట్లాడాడు. మీరు మెచ్చిన హెగెల్, ప్రొటెస్టెంటు సంస్కర్త మార్టిన్ లూథర్ లు జాతివివక్ష[యూదువ్యతిరేకత] రాజ్య నియంతృత్వాలని సమర్థించారు[ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ థర్డ్ రీక్ ] వీళ్ళందరూ మనుస్మృతి చదివారా? ఒకవేళ వాళ్ళు మ ను స్మృతి చదవకపోతే వారికీ భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీరు కొంపముంచి నీషే శిష్యులా? డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారిని సమాధానం కోరుతున్నాను.

  5. rani siva sankara sarma says:

    పరస్పరవైరుధ్యాలూ – అసంగతాలు -2
    యివ్యాసంలోని వైరుధ్యాలని అసంగతత్వాన్ని ఎత్తిచూపడమే కష్టంగా ఉంది. ఎందుకంటే వ్యాసం మొత్తం అలాగే ఉంది. యీయన భాషే మొత్తంగా లోపభూయిష్టం.
    తండ్రి అనే పదాన్నే వ్యతిరేకిస్తారు. మరోవైపు రాజ్యాంగం పితృస్థానంలో ఉందంటారు.మరి యీయన రాజ్యాంగాన్ని తిడ్తున్నారా, పొగుడుతున్నారా/ ఎందుకంటే తండ్రిని హత్య చేస్తానని యీయన బయలు దేరారు. ఆపితృస్థానంలోవున్న రాజ్యాంగాన్ని నెట్టేసి నెహ్రూ నుంచి నేటి మోడీ వరకు అందరూ పాలకులూ బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణ్యాన్ని నిలుపుతున్నారని బాధపడతాడు జిలకర శ్రీనివాస్. [చూసారా ఒకవైపు పితృస్థానం దెబ్బతిందని బాధపడుతున్నారు.యిది ఫ్రాయిడియన్ స్లిప్?] రాజ్యాంగం ఏమాత్రం అమలుకాలేదంటున్నారు. బాగుంది . మరితర్వాతి పేరాలో మనది ఘనత వహించిన సమానత్వంతో కూడిన గణతంత్రరాజ్యం అని ఎలా అన్నారు?యింతకీ రాజ్యాంగం అమలు కాలేదు కదా? పైగా బ్రాహ్మణరాజ్యం. అదేగణతంత్రమా?
    ఒకవైపు భారతరాజ్యాన్ని పొగుడుతారు, యూరోపియన్ జాతిరాజ్యం నియంతృత్వ పూరితం అంటారు . మరోవైపు అక్కడ పిల్లలని తండ్రిప్రమేయం లేకుండా ప్రజాస్వామికంగా పెంచుతున్నారు అంటారు. నార్వేలో పిల్లలని సరిగా పెంచడం లేదని తల్లిదండ్రులని అరెస్టు చేయడాన్ని మెచ్చుకొంటాడు. నిజానికి యూరప్ పిల్ల పెంపకంలోనూ కనబడని రాజ్య ఆధిపత్యం ఉంది.అందరి సంస్కృతులని నిర్ములించి తమలా ఒకే మూసలోకి మార్చెయ్యాలనే తపన ఉంది. దానివల్లే ఫ్రాన్సులో బురఖా వివాదం మొదలయింది.
    అంతేకాదు ఆస్ట్రేలియాలో స్థానిక గిరిజన పిల్లలని తల్లిదండ్రులనుంచి వేరు చేసి పెంచడం అనే పద్ధతిఉండేది. ప్రముఖ తెలుగు రచయిత కవనశర్మగారి మాటల్లో అసంగతి తెలుసుకొండి.[జాతిరాజ్యంలో నియంతృత్వం ఉందనే యీ వ్యాసరచయిత యీనియంతృత్వన్ని నాగరియకతగా భ్రమింపజేస్తారు]
    Kandula V N Sarma
    2 hrs ·
    I and my family were in Australia during the period from 1970-72.I was teaching at Monash university Melbourne. The Children of Aborigines were separated from their parents ,at that time , to bring them up in modern Australian Way.(Assimilation of Aborigines in to the white Australian Main stream) One needed permission to visit the places of Aboigine habitats. like Alice Springs

    • suresh bottu says:

      మాకు జిలకర శ్రీనివాస్ గారి వ్యాసం బాగానే అర్థమైంది. మీరెందుకిలా గావరా పడుతున్నారు రాణి గారు? మీరే నిషే మాటలను మీ వ్యాసం లో ప్రస్తావించారు. దేవుడు మరణించాడని నిషే అన్నాడని. ఆయన అన్నది నిజం. అది ఫిలాసఫీ విద్యార్థులకు తెలిసిన సంగతే. దేవుడి స్థానం లో మనిషిని అంటే ఆర్యుణ్ణి నిలిపింది నిజమే కదా. రోలాండ్ బార్తెస్ డెత్ అఫ్ ది ఆథర్ అదే స్ఫూర్తి తో రాసాడని అంటారు. మనుస్మ్రితి ని 1776 లో ఇంగ్లీష్ లోకి అనువాదం చేసారు. ఆ తర్వాత అది జర్మనీ భాషలోకి వెళ్ళింది. నిషే ఆ పుస్తకం చదువుకున్నది నిజమేనని ఆయన జీవత చరిత్ర చెప్తుంది. అంబెడ్కర్ గారు కూడా నిషే ను చదువుకున్నట్టు ఆయన రచనలు చెప్తున్నాయి. దేవుడే మనుషులను చాతుర్వర్ణాలుగా విభజించడాని బ్రాహ్మణా సాహిత్యం చెప్పిన సంగతి మీరు కాదనగలరా? అది నిజమని నమ్మే కదా, అస్పృశ్యులు జంతువుల కన్నా చూడబడ్డది? ఆవును దేవతగా ప్రచారం చేయటం వల్లే కదా దళితులూ, ముస్లిం ల మీద హింస జరుగుతున్నది? దేవుడు, ధర్మం పేరుతొ సనాతన ధర్మం పేరుతొ జాతీయోద్యమ కాలం లో సంఘ సంస్కరణలను, చట్టాలను బ్రాహ్మణులు వ్యతిరేకించింది? తండ్రి అనే భావనకు జైవిక విలువ మాత్రమే ఉంటే ఇబ్బంది లేదు. తండ్రి ని దేవుడు స్థానం లో నిలపడం గురించే జిలకర శ్రీనివాస్ అభ్యంతరం చెప్తున్నాడు? రాజ్యం దేవుడిని, తండ్రిని భర్తీ చేయటం వల్లే కులం వాళ్ళ పీడించబడిన ప్రజలకు రక్షణలు, హక్కులు దొరికాయి. దేవుడు, తండ్రి, నియంతలు ఒకేలా ప్రవర్తిస్తారు. అది మిమ్మల్ని కాపాడటానికే అని కూడా వాదిస్తారు. ఇవన్నీ మీ లాంటి పండితులకు తెలియవని కాదు. తెలిసి కూడా ఒక ప్రముఖ విమర్శకుని వ్యాసాన్ని అన్ని మాటలు అనడం ఎందుకో చెప్పండి. ఇలాంటి మీ రాతల వాళ్ళ ఇప్పటి దాకా మిమ్మల్ని అభిమానించే దళితులు ఏ మనుకుంటారో ఆలోచించ లేదా?

  6. క్రీ.శ. 1844లో జర్మనీలో పుట్టిన ఫ్రియడ్రిచ్ నియట్జెస్కీ తాత్త్విక చింతనను క్రీ.పూ.నాటినుంచి ఉన్న ఆర్యులకు ఆపాదించడం సరైన ఆలోచన కాదు. “. బ్రాహ్మణిజం చాకచాక్యంగా దేవుణ్ణి తప్పించి బ్రాహ్మణున్ని కేంద్ర స్థానంలో నిలిపింది. బ్రాహ్మణుడే దేవుడని మనుధర్మం ప్రకటించింది “ అని మీరన్నమాట సరైనది కాదు. బ్రాహ్మణులు తామే దేవుళ్ళమని చెప్పలేదు. వాళ్ళు పూర్వకాలం నుండీ విష్ణుభక్తులే. వాళ్ళ చరిత్ర మీరనుకుంటున్నదికాదు.
    అలాగే హిట్లర్ని కొందరు మెచ్చుకుంటున్నారుగనుక హిట్లర్ చెడ్డవాడుకాడు. హిట్లర్ చరిత్ర కూడా మీరనుకున్నది కాదు. కాబట్టి బ్రాహ్మణులు, హిట్లరు, ఇందిరాజీ, స్టాలిన్లు చెడ్డ తండ్రి పాత్ర పోషించారని కనుక మీరు తండ్రి పాత్రని నిషేధిస్తే బ్రాహ్మణులు కనుమరుగౌతారని భ్రమపడుతున్నట్లున్నారు. మీరు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు చెబుతున్నారు. దేవుడు/తండ్రి లేడంటారూ, బ్రాహ్మణులు , హిట్లరూ, స్టాలినూ చెడ్డ తండ్రిపాత్రలో ఉన్నారంటారు, ఐరోపాలో తండ్రిపాత్రలేదంటారు. కానీ తండ్రి పాత్ర ఎప్పటికీ ఉంటుంది. ఐరోపాలో శాస్త్రీయ విద్యాబోధనను తండ్రిపాత్ర లేనిదిగా భావించవద్దు. డాక్టర్ బియ్యారంబేద్కర్ కూడా శ్రామిక కులాలకు తండ్రే. దేశప్రజలందరికీ మంచితండ్రే. మనకు నచ్చని వారు తండ్రి స్థానంలో ఉన్నంతమాత్రాన తండ్రిపాత్రే తప్పుకాదు. మనదేశంలో మంచి తండ్రులకు కొదవలేదు. కానీ వారొక కూటమిగా ఏర్పడి శ్రామికసంక్షేమరాజ్యాన్ని నిర్మించవచ్చు. మంచి తండ్రి పాత్రను సమర్ధవంతంగా పోషించవచ్చు. మీరనుకుంటున్నట్లుగా ప్రజల పేదరికానికి బాధలకు కారణం తండ్రిపాత్రకాదు. మతవాదం. కేవలం బ్రాహ్మణులేకాదు మతాన్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ మానసిక వికలాంగులే. మన దేశంలో 80 శాతం మంది ప్రజలు వివిధ మతాలను నమ్ముతున్నారు. కనుక అసలు కారణమైన మతభావనలనుండి ప్రజలను విముక్తి చేసే తండ్రులు నేడు కనిపించడంలేదు. తండ్రిలేని భౌతికవాదులకు దిశానిర్దేశం కరువైంది. సామూహిక హనన క్రియకు అవసరమైన తలారులను తయారు చేస్తున్నది కేవలం హిందూ మతానికి చెందినవారే కాదు. అన్ని మతాలకు చెందిన తండ్రులు చేసేపని అదే. ఒక మతానికి చెందినవారే మరో మతం వారితో ఘర్షణ పడుతుంటారు. తమలోతాము ఘర్షణ పడుతుంటారు . ఎందుకంటే వారు మానసిక వికలాంగులు. వారేంచేస్తున్నారో వారికి తెలీదు. అటువంటి వారిని రక్షించే తండ్రులు నేడు అవసరం.
    మీరు తండ్రి లేడంటూనే ఓ తండ్రిపై తొడగొట్టి యుధ్ధం ప్రకటిస్తున్నారు… అది తప్పు.

    • suresh bottu says:

      క్రీస్తు పూర్వం నాటి ఆర్య జాతి భావన నీషేకు అప్పుడే తెలిసింది కావొచ్చు. ఇంగ్లీషులోకి, జర్మనీలోకి మనుస్ర్ముతి అనువాదం అయ్యాకే ఒక జాతి సిద్ధాంతంగా అతడికి తెలిసిందేమో. జిలకర శ్రీనివాస్ గారు కూడా మతవాదం వద్దని అంటున్నాడు. దేవుడు లేని, తండ్రి లేని అనాథ లోకమిదని అనడంలో మీకు మతవాదం కనిపించక పోవటం విడ్డూరం. కేవలం మార్కెట్ మాత్రమే కనిపించటంలో అర్థం ఏమిటి? రాణి శివ శంకర శర్మను వెనకేసుకు రావటం, జిలకర శ్రీనివాస్ గారిని తిట్టడమా మీ ఉద్దేశం?

  7. హారతి వాగీశన్ says:

    మనుషులకు బాధ్యత వహించ వలిసిన వారు ఎవరూ బాధ్యత వహించడం మాని వేసి, ఇక మార్కెట్ ఒక్కటే సర్వాధిపతి అయిపోయిన స్థితి ని బహుశా శర్మ గారి వ్యాసం ప్రస్తావించింది అనిపిస్తున్నది ( అయన మార్కెట్టుని తన ఒపెన్ గా ప్రస్తావించక పోయినా) . విషాదం ఏమిటంటే బాద్యత వహించ వలిసిన వారు వ్యక్తులు గానీ వ్యవస్థలు గానీ ( అవి భౌతికమైనవైనా కాకపోయినా ) బాధ్యత వహించడం అనే గీత దాటి అధిపతులు గా మారి మనుషుల నెత్తికెక్కి తొక్కుతుంటే స్వేచ్ఛ మటు మాయమై పోతుంది . తండ్రి ,రాజ్యం దైవం అన్నీ వీటికి అతీతం కాదు . మార్కెట్టు ఇప్పుడు అన్నింటినీ తనలో ఇముడ్చుకొని ఉన్న ఒక అతి వాద స్థితి ఉన్నది . ఈ స్థితి ని ఎట్లా అధిగామించాలే అంది ప్రశ్న . పితృస్వామ్య కుటుబం ,మతం, రాజ్యం అన్నీ మార్కెట్టు సూత్రాలకు అనుగుణంగా ఉండటం కనిపిస్తున్నది .మనుషులు దిక్కులేని స్థిత లోకి ( మార్కెట్టు దాని లాభ నష్టాల నైతికత మాత్రమె ప్రధానమైన స్థితిలోకి ) అందు వల్ల స్వేచ్చ లేని స్థితిలోకి .నేట్టివేయబడుతున్న స్థితి ఉన్నది .ఇప్పుడు విమోచన గురించి సక్ర్తియాత్మకంగా పనిచేసిన అంబేద్కర్ వంటి మహా చింతనా కార్య శూరుల వంటి వారు అటువంటి వారి అనుయాయులూ ఈ విషయాన్ని గుర్తించాల్సి ఉన్నది . ప్రస్తుతం రాసిన వ్యాసాన్ని దాటి జిలుకర శ్రీనివాస్ గారు మరింత లోతుగా ఈ సంకటాన్ని గుర్తించి రాయగలరనే అనుకుంటున్నాను .

    • ఇక్కడ శర్మగారు ప్రస్తావించిన ‘తండ్రి, దేవుడు’ అధికారానికి ప్రతీ కలు. ఫ్యూడల్ భావజాలం తండ్రిని రక్షకుడు అని మొదలుపెట్టి అధికార స్వబావిగా మార్చేసింది. మధ్యయుగాల (యూరోపియన్ సమాజం కూడా) సమాజం రాజును నిరపేక్ష కుడుగా, దైవాంశసంబూతుడుగా, దైవప్రతినిదిగా భావించింది. దాని మూలాలే ఈనాడు వేల్లూనుకొని, అది మార్కెట్ గాని, సామ్రాజ్య వాదంగాని,.. అది ఏపేరు పెట్టినా .. దాని విస్తరణ కాంక్ష ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి పోతుంది. దాన్ని సమర్దంచడం శర్మగారి ఉద్దేశం అయితే అది ఖండనార్హమే!

  8. Dr.Pasunoori Ravinder says:

    రాణి శివశంకర శర్మగారి వ్యాసం సరే, వ్యాసానికి కౌంటర్ గా వచ్చిన వ్యాసాన్ని వక్రీకరించడం సరైనది కాదు.
    శర్మ గారి అభిప్రాయాలను డా.జిలుకర శ్రీనివాస్ గారి అభిప్రాయాలుగా చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఇలా కామెంట్ల రూపంలో అసహనాన్ని వెలిబుచ్చే బదులు డా.జిలుకర శ్రీనివాస్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం వ్యాసంగా రాస్తే బాగుంటుంది.
    -డా.పసునూరి రవీందర్

  9. స్వాభిప్రాయ బృ ణ హత్య
    స్వవచోవ్యాఘాతాలకి, అంటే తనని తానే ఖండించుకొనే రీతిలో రాసిన ఈ వ్యాసానికి వేరే సమాధానాలు ఎందుకు? మొదటి వాక్యాన్ని రెండో వాక్యంతో ఖండించుకోవడం ద్వారా వేరే వాళ్ళకి శ్రమ లేకుండా చేసారు డాక్టర్ జిలకర శ్రీనివాస్ .ఆయన వ్యాసంలోనే ,దాని ఖండన వ్యాసంకూడా ఉంది రవిందర్ గారూ.

    • suresh bottu says:

      జిలకర శ్రీనివాస్ గారి వ్యాసం పట్ల అంత వెగటు ఎందుకు రాజు గారు? వొకవేళ ఆయనను ఆయనే ఖండించుకుంటే, మీరెందుకు యింతలా బెదిరిపోతున్నారు? అసలు రాణి శివశంకర శర్మకు బేసిక్స్ కూడా తెలియవేమో అన్న అనుమానం వస్తుంది. మీకు రావటం లేదా? రాజుగారు…

  10. rani siva sankara sarma says:

    నేను పితృస్వామ్య నియంతృత్వం నుంచి, మార్కెట్ అరాచకంలోకి జరుగుతున్న మార్పుని వర్ణించానంతే. యిక డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు నామీదకి పదును లేని కత్తి తీసుకొని బయలుదేరారు.కొంచెం పదును పెట్టుకొండి అని మాత్రమే చెప్తున్నాను.
    బేసిక్స్ గురించి పాఠాలు
    suresh bottu చెప్పినట్లు బేసిక్స్ గురించి మాట్లాడుకోవడం మంచిది.
    vinay గారూ నిజమే. హిందూవాదులు హిందూజాతి అని వాడుతున్నారు. మరో జాతి అని వాడచ్చు కూడా . ఎందుకంటే వాళ్ళు జాతిని అంగీకరిస్తున్నారు. అది అనాదిగా వస్తోంది. యీనాడు పుట్టిందికాదు అని వాదిస్తున్నారు కూడా. కానీ జిలకర శ్రీనివాస్ కూడా అంగీకరిస్తారా? లేదు . ఆయన యిక్కడ జాతి లేదు. కులమే ఉంది అన్నారు. మళ్ళీ మాట మార్చారు . రాజీవ్ మల్హోత్రాలాంటి హిందూవాదుల్లా హిందూ జాతి ప్రాచీనకాలం నుంచి పరంపరగా వస్తోంది అన్నారు.యిది హిందూవాదమే.
    యింకా జిలకర శ్రీనివాస్ గారూ నాకు లేని సాహసాన్ని నాలో చూపిస్తున్నారు. మన ఘోరవనీయమైన రాజ్యాన్ని నేను బోనెక్కించానంటున్నారు. అంత శక్తి నాకులేదు. చెరబండరాజుకి ఉంది . అందుకే దిగంబరుడు నన్నెక్కనివ్వండి బోను అని రాజ్యాన్ని బోనులో నిలబెట్టాడు. చెరబండ రాజు చూపినట్లు దుండగులచే సామ్రాజ్యవాదులచే చెరచబడ్తున్న దేశం మనది. మన రాజ్యం స్వతంత్రం కాదు. మన రాజ్యంపై జిలకర వారి నమ్మకానికో” నమో’ నమహ హా
    అయ్యా జిలకర చెప్పే జాతి కి ప్రాచీన జాతివాచకాలకి సంబంధం లేదు. జాతి అనేపదాన్ని కుల వాచకంగా వాడేవారు. అంటే పుట్టుకని బట్టివచ్చేది అని అర్థం. బ్రాహ్మణ జాతి, వైశ్యజాతి యిలా వాడేవారు. అలాగే మ్లేచ్ఛజాతి. కులం అనే పదం సంస్కృత గ్రంధాల్లో తక్కువ. కులం అంటే నివాసం అని అర్థం. గురుకులం అలాగే వచ్చ్చింది
    ఆధునిక కాలంలో జాతి అనేపదాన్ని నేషన్ ,రేస్ లేక రెండూ కలగలిసిన అర్థాల్లో వాడుతున్నారు. హిందూజాతి అనేపదం కూడా ఆధునికమే. ముఖ్యంగా యిప్పుడు అన్నికులాలని కలిపి వాడుతున్న అర్థంలో పూర్తిగా ఆధునికం. బ్రిటిష్ వారు వచ్చాక వచ్చ్చింది. యిలా పదాలని అర్థాలని కలగలిపేసి పరోక్షం గ హిందూ వాదులకే సహకరిస్తున్నారు జిలకర శ్రీనివాస్. హిందూ జాతికి ప్రాచీన హోదా కల్పిస్తున్నారు.
    నాదొక చివరి ప్రశ్న . దళిత వాదం , నాస్తికత్వం ఒకటేనా?ఐడెంటిటీ పాలిటిక్స్ హేతువాదానికి కొనసాగింపేనా? ఐతే జాషువా కంటే గురజాడ ప్రగతిశీలుడా/ దళితులకు ఆదర్శమా?

  11. ఆర్య
    ఆర్య శబ్దానికి యింతటి ప్రచారం ఆధునిక కాలంలోనే లభించింది. sureSh botTu అంటున్నట్లు ఆర్యబ్రాహ్మణులు , ఆర్యక్షత్రియులు వంటి ప్రయోగాలు ఎప్పుడు లేవు. ఆర్య వైస్యులు అనే పదం ఆధునిక కాలంలో వచ్చిఉండచ్చు. ప్రాచీన గ్రంధాల్లో కానరాదు. సంస్కృత నాటకాల్లో ఆర్యపుత్ర అనేది రాజకుటుంబాల్లో గౌరవ వాచకంగా కనబడుతుంది.శంకరాచార్యుని కానీ మరే బ్రాహ్మణ ధర్మానికి చెందిన గురువు కి కానీ ఆర్య అని విశేషణం కనబడదు. బౌద్ధ గురువుకి యీవిశేషణం కనబడుతుంది. ఉ; ఆర్య నాగార్జున . అంతే కాదు బౌద్ధ ధర్మానికి ,బౌద్ధ సూత్రాలకి, ధర్మాలకి ఆర్య విశేషణం చేర్చడం కనబడుతుంది.ఆర్య శబ్దం బ్రాహ్మణ ధర్మంలో తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంది.
    ఆధునిక కాలంలో ఆర్యజాతి సిద్దాంతాన్ని పాశ్చాత్య చరిత్ర కారులు ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆర్యజాతి అనే సిద్దాంతం ప్రపంచ వ్యాప్తం గా ప్రాచుర్యంలోకి వచ్చ్చింది. కానీ ఇప్పుడా సిద్దాంతాన్ని ప్రగతిశీల చరిత్రకారులు అందరూ తిరస్కరిస్తున్నారు.యిప్పుడు సంకరం కానీ జాతి ఏదీ లేదు. ఆర్యుల దాడి సిద్దాంతం కూడా ప్రశ్నకి గురి అయింది. బ్రాహ్మలు ఆర్యులు అనేది కూడా అంతే.[ఇర్ఫాన్ హబీబ్ , రొమిల్లా థా పర్ మొదలైవారి రచనలు చూడండి.]
    ఆర్య శబ్దాన్ని భారత దేశంలో ఆర్యసమాజ్ ప్రాచుర్యంలోకి తెచ్చిమ్ది. హిట్లర్ ఆర్య జాతి గొప్పది అని వాదించాడు. ఆయన దృష్టిలో ఆర్యులు అంటే యూరోపియన్స్ మాత్రమే. భారతీయులు ఆర్యులు కాదు సరికదా హీన జాతివాళ్ళు అని అన్నాడు హిట్లర్.
    https://en.wikipedia.org/wiki/Arya_(Buddhism)

  12. rani siva sankara sarma says:

    పితృ స్థానంలో రాజ్యాంగం
    ‘ అయ్యా మీరే రాజ్యాంగాన్ని రచించినది అని జనం నాతో అంటుంటారు. నిజానికి నేను పనిముట్టుని మాత్రమే. ఏం చేయమని నన్ను ఆజ్ఞాపించారో చాలావరకు దానినే నా మనస్సాక్షికి విరుద్ధంగా చేశాను’ అని స్పష్టం చేసారు అంబేద్కర్.[the indian ideology ఇండియాలో దాగిన హిందుస్థాన్. పెరి అండర్ సన్ . హెచ్ బి టి ]

మీ మాటలు

*