జీవితానుభవాలే కథలు

కథలు ఎలా రాయాలి అనే ప్రశ్నకు కారా గారి కథల నుండి సమాధానం

 

ఒజ్జ పంక్తి

photo(2)జీవితానుభవం నుండి జాలువారే సృజనానుభవం కథగా రూపుదిద్దుకుంటుంది. కవి కూడా ఋషిలాగా క్రాంతదర్శనం చేసి, సమాజంలో రాబోయే పరిణామాలను ముందుగానే ఊహించి, వాటిని కథలలో పొందుపరుస్తాడు. మార్పు వలన కలిగే కష్టనష్టాలపై ముందుగానే హెచ్చరించే  ‘సాహితీ పోలీస్’  రచయిత . ఈ లక్షణాలన్నీ కారా మాస్టారి కథలకు వర్తిస్తుంది. తెలుగు కథకు మారుపేరైన ‘యజ్ఞం’  కథ నుండి ఆయన కలం నుండి రూపుదిద్దుకున్న ప్రతి కథలోనూ, సమాజంలోని భిన్న పార్శ్వాలను ‘మల్టీవిటమిన్ టాబ్లెట్’ లాగా పఠితలకు అందించారు. రంగురాయిలా కనబడే కథావస్తువును ‘కారా’ తన శిల్పనైపుణ్యంతో పాలిష్ చేసిన రత్నంలాగా మలచి కథాత్మకంగా తయారుచేశారు .

చిన్నతనంలో గుంట ఓనమాలు దిద్దుతూ అక్షరాలను నేర్చుకుంటాము. అలాగే కథలు రాయాలనుకునే వారికి ‘కారా మాస్టారి’ కథలు గుంట ఓనమాలుగా  ఉపయోగపడతాయి. కమండలంలో  సాగరాన్ని బంధించినట్లుగా పెద్ద నవలలు చేయలేని పనిని ‘ సామాజికస్పృహ’  కలిగిన కారా కథలు/ కథానికలు  చేశాయి. పదాడంబరం లేని శైలితో , దిగువ , మధ్య తరగతి సమస్యల నేపధ్యంగా రాసిన కారా కథలు సమాజంపై బులెట్ల  లాగా పేలాయి. రచయితలను, పఠితలను ఆలోచింప చేశాయి. అనుసరించేటట్లు చేశాయి. వర్థమాన రచయితలకు నిఘంటువుగా నిలిచాయి. రాస్తే కథానికలే రాయాలి అన్నంత స్ఫూర్తిని నింపాయి.

స్వచ్ఛత, స్వేచ్ఛ, నిరాడంబరత, భవిష్యత్ దర్శనం అనేవి కారా కథల ప్రత్యేకత. ఈనాటి సమాజ స్వరూపాన్ని 50 సంవత్సరాల ముందే  ‘టైం మిషన్’ లో చూపినట్లుగా ఆయన కథలలో మనకి చూపించారు.  కాళీపట్నం రామారావు మాస్టారు ఒక ప్రాంతానికి, వర్గానికి, భావజాలానికి ప్రతినిధి అయ్యి కూడా కలంలో బలం, నిబద్ధత, నిమగ్నతలతో ఆయన చేసిన సాహితీసేవ ‘కేంద్ర సాహితీ అకాడమీ  పురస్కారాన్ని’  పొందేట్లు చేసింది. సమాజం పట్ల రచయితలకు గల గురుతర బాధ్యతలను తెలుసుకొని ,  ‘కారా‘  కథలను ఒజ్జ పంక్తిగా  చేసుకొని కలం పట్టే రచయితలు స్వాతి ముత్యం లాంటి అచ్చ తెలుగు కథా సాహిత్యాన్ని సృష్టించగలుగుతారు. అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకోగలుగుతారు.

డా. నీరజ అమరవాది .

 

 

మీ మాటలు

*