రామకృష్ణయ్య వచ్చాడు .
‘‘మనం ఈ రాత్రికే గాంధీజీ హత్యను ఖండిస్తూ సభ జరపాలి’’
‘‘ఈ రాత్రికా?’’
‘‘ఔను. కార్యకర్తలు చాలామంది ఊళ్ళోనే ఉన్నారు. ఆరెస్సెస్ రాజకీయాలను ఎండగట్టాలి. కాస్త పొద్దుబోయిన తర్వాతే పెడదాం. ఇవాళ ఎవరికీ తిండ సహించదు. నిద్ర రాదు’’
‘‘గుర్తుందా నీకు ఉప్పు సత్యాగ్రహానికి ముందు గాంధీ మద్రాసు వచ్చారు . ఎట్లా పని చేశాం ఆ సభ కోసం. గాంధీ మనల్ని చూడాలని, నవ్వాలని ఒక మాట మాట్లాడాలని తపించాను నేను. ఉప్పు సత్యాగ్రహం గుర్తుందా ` అదంత కాదు. గాంధీ 1920లో కోర్టులో చెప్పిన మాటలు ` గుర్తున్నాయా నీకు. నువ్వింకా చిన్నవాడివి అప్పుడు. నాకు పదిహేనేళ్ళు. చదువు మానేసి సహాయనిరాకరణంలోకి వెళ్ళిపోదామని అంత సిద్ధమయ్యా. గాంధీ మాటలు నిరంతరం నా దేహంలో ప్రతిధ్వనిస్తుండేవి. గొప్ప ఆవేశంతో ఊగిపోయేదాన్ని – చదువు, ఇల్లు , తల్లిదండ్రులు అన్నీ ఒదిలి గాంధీ దగ్గరకు వెళ్ళిపోదామనుకున్నాను . కానీ వెళ్ళలేకపొయ్యా. వెళ్ళలేకపొయ్యా’’.
శారద దు:ఖాన్ని తగ్గించటం రామక్రుష్ణయ్య, మూర్తీ ఇద్దరి వల్లా కాలేదు.
‘‘శారదా – ఆనాడు వెళ్ళలేదు గనుకనే నువ్విప్పుడు కమ్యూనిస్టువైనావు. కమ్యూనిస్టు కావటం కంటే గొప్ప సంగతేమీ లేదు’’. రామక్రుష్ణయ్య మందలించాడు కాస్త తీవ్రంగానే.
‘‘నువ్వు మహిళా సంఘ సభ్యులకు కబురు పంపు. రాత్రి తొమ్మిది గంటలకు మీటింగు – ఆరెస్సెస్ హత్యా రాజకీయాన్ని ఉతికి ఆరెయ్యాలి’’ శారద శక్తిని కూడగట్టుకుని లేచింది.
సుబ్బమ్మ శోకాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఒక్క ఇల్లేమిటి, ఊరేమిటి, దేశం దేశమంత ఏడుస్తోంది.
తొమ్మిదిన్నరకంత మీటింగు మొదలైంది. నాయకులంతా మాట్లాడారు. ఆరెస్సెస్ వాళ్ళను కడిగి వదిలారు. మీటింగు పూర్తవుతుందనంగా వార్త వచ్చింది. ఆరెస్సెస్ వాళ్ళు గాంధీ మరణాన్ని ఒక విజయంగా భావించి ప్రదర్శన చేస్తున్నారని . ప్రజలకు, గాంధీని జాతిపితగా భావించే ప్రజలకు, దేశ స్వాతంత్రప్రదాత అని నమ్మిన ప్రజలకు, ఆయన చెప్పిన మాట కోసం, ఆయన చూపిన బాటలో నడవటం కోసం ఆస్తులను, ఆప్తులను, ప్రాణాలను లెక్కచెయ్యక స్వాతంత్రాగ్నిలో దూకిన ప్రజలకు ఈ ఆరెస్సెస్ ప్రదర్శన సహించరానిదయింది. గాంధీ మరణంతో శోక సంద్రాలైన వారి మనసులో కోపకెరటాలు లేచాయి. ప్రదర్శన మీద రాళ్ళు రువ్వారు . పోలీసులు వచ్చి కొందరిని అరెస్టు చేశారు. ఆరెస్సెస్ చేస్తున్న ఈ హీనమైన పనికి సహజంగానే కమ్యూనిస్టు యువకులకు కోపం వచ్చింది. తమ మీటింగుకు వచ్చిన వారిని కొట్టబోయారు. నాయకులు ఒచ్చి ఆపారు. అంత కాస్త గందరగోళమైంది. ప్రతివాళ్ళూ ఉద్రిక్తంగానే ఉన్నారు. ఆ గలాభాలోకి పోలీసులు ఎప్పుడొచ్చారో గమనించేలోగా పోలీసులు లాఠీతో కమ్యూనిస్టులపై పడ్డారు. ఆరెస్సెస్ కార్యకర్తలు పదిమందీ ఎటు పోయారో తెలియదు. కమ్యూనిస్టులను కొట్టటం, అరెస్టు చేయటం మొదలెట్టారు. గాంధీ హత్యను ఖండించేవారిని అరెస్టు చేసి, గాంధీని చంపిన వారిని సమర్థించిన వారిని రక్షించే పనికి వచ్చాము అన్నట్లుంది పరిస్థితి. అప్పటికే ప్రకాశం ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ఒకటుంది కమ్యూనిస్టు అరెస్టుకి. ముఖ్యమైన నాయకులు అక్కడ నుంచి పరిగెత్తారు. మొగల్రాజపురం గుండా పారిపోయి రహస్య స్థావరంకు చేరుకున్నారు. మరునాడు ‘ప్రజాశక్తి’ లో ఆరెస్సెస్ వారిపట్ల చూసీచూడనట్లు మెతకగా ప్రవర్తిస్తున్న పోలీసులను విమర్శిస్తూ వార్తలు, వ్యాసాలూ వచ్చాయి . చేయవలసిన పని చేయకుండా పోలీసులు పత్రికమీద దాడ చేశారు. పత్రికలో పనిచేసే కొందరిని అరెస్టు చేశారు.
ఫిబ్రవరిలో కలకత్తా కమ్యూనిస్టు మహాసభలు జరగబోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఆంధ్రలో ఈ నిర్భంధం. శారదాంబ, మూర్తి కలకత్తా మహాసభకు వెళ్ళటానికి సన్నద్ధమవుతున్నారు. అనేకమంది నాయకులు రహస్య జీవితంలోకి వెళ్ళటంతో బహిరంగంగా పని చేసే వారి లో ముఖ్యమైన వాళ్ళు మహాసభలో పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పవలసిన అవసరం ఉంది. తెలంగాణా పోరాటం ముమ్మరంగా జరుగుతోంది. ఆ పోరాటం గురించి మాట్లాడి ఆ పోరాటం దిశా నిర్దేశం చెయ్యాలి.
మహాసభలో జరిగిన చర్చతో పార్టీలో ఉన్న రెండు భిన్న ధోరణులను ముఖ్యనాయకుందరూ చర్చించక తప్పని పరిస్థితి.
శారదాంబ తను పాల్గొన్న సమావేశంలో ఆంధ్ర ప్రాంత పరిస్థితిని స్పష్టంగా వివరించింది. 1939 నుండి గడచిన పదేళ్ళలో ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు గ్రామీణ ప్రాంత ప్రజలలోకి చొచ్చుకుపోయారు. యుద్ధంలో బ్రిటన్కి మద్దతిచ్చిన ప్రజలు అర్థం చేసుకున్నారు. సోవియట్ సాహిత్యాన్ని న్ని, సోవియట్ విప్లవ క్రమాన్నీ కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు సన్నిహితంగా తీసికెళ్ళింది. రైతు యువకులు పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలై అంకితభావంతో పనిచేస్తున్నారు. . మహిళా సంఘం, యువజన సంఘం, విద్యార్థి సంఘం, ట్రేడ్ యూనియన్లూ అన్నీ చాపకింద నీరులా కమ్యూనిస్టు పార్టీని ప్రజలకు దగ్గరగా తీసుకెళ్తున్నాయి. దీనిని స్థిరపరుచుకుని దీర్ఘకాలం ప్రజల పక్షాన, ప్రజలకు మేలు చేసే చట్టాల కోసం, పరిపాలన పద్ధతుల కోసం పార్టీ ప్రయత్నించాలి. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులకు ప్రజలలో దొరుకుతున్న ఆదరణను చూసి భరించలేకపోతున్నది. బ్రిటీష్ వారి నిర్బంధాన్ని మించిన హింసాకాండ జరపటానికి దాయి వెతుకుతోంది. జమీందార్ల పక్షం నిలబడుతోంది. ఈ పరిస్థితులలో మన వ్యూహాలలో కొత్తదనం ఉండాలి. ప్రజలు మరింతగా మనతో రావాలి . నిర్బంధాన్ని ఎదిరించటానికి మొరటు పద్ధతులు కాకుండా సృజనాత్మక పద్ధతులేమిటని ఆలోచించాలి. లేకపోతే కార్యకర్తలను కోల్పోతాం. కార్యకర్తలు అలాంటి ఇలాంటి వారు కాదు. సాహసం, త్యాగం , అంకితభావం ఉన్నవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళను నిలబెట్టుకోగలిగితే రెండు మూడేళ్ళలో కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రలో అతి బలమైన శక్తిగా మారుతుంది. ఆ వైపుగా పార్టీ తీర్మానాలు , కార్యక్రమాలు
ఉండాలి అని వాదించింది. కానీ రణదివే వర్గం అధిక సంఖ్యలో ఉన్నారు. ఆయననే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. . పొలిట్బ్యూరోలో స్త్రీల ను ఈసారి కూడా తీసుకోలేదు. ఈసారి ఆ విషయాన్ని చర్చకు చేపట్టాలనుకున్న శారదాంబ అది ముఖ్య విషయమని మర్చిపోయేలా చేశాయి పరిస్థితులు . మహాసభ తీర్మానాల్లో ఒక తీర్మానం గా ‘‘నెహ్రూ ప్రభుత్వాన్ని సాయుధ పోరాటం ద్వారా కూలదోయాలి’’ అనేది ప్రవేశపెట్టారు. నెగ్గించుకున్నారు. శారదాంబకది మింగుడు పడలేదు. అది అసాధ్యం, ఆచరణీయం కాదు అని ఆమె మనసు ఘోషిస్తున్నా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడ తీర్మానాన్ని ఆమోదించి వచ్చారు శారద, మూర్తి.
శారద, మూర్తి, రామస్వామి వంటి కొందరికి ఈ మొత్తం పరిణామాల మీద ఆందోళనగా ఉంది. ఎక్కడో ఏదో లోపం జరుగుతోంది. కాంగ్రెస్ ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు ప్రాబ్యల్యం తగ్గించాలని విచక్షణా రహితంగా ప్రవర్తిస్తోంది. ఆ విచక్షణ లేనితనంతో అంతే మూర్ఖంగా తలపడుతున్నామా? వేరే దారిలో మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోవాల్సిన సమయంలో కార్యకర్తల ప్రాణాలను పణంగా పెడితే భయభ్రాంతులైన ప్రజలను సమీకరించేవారెవరు?
శారద మనసు విరుచుకుపడుతోమ్ది . రామక్రుష్ణయ్య దొరకటం అసంభవంగా ఉంది. శారద ఇల్లు ఆసుపత్రి పోలీసు పహారాలో ఉన్నట్లున్నాయి . ఎవరో తెలియని వ్యక్తులు అపుడపుడూ తెచ్చే ఉత్తరాలు తప్ప తన ఆలోచనలను పంచుకునే దారి లేదు.
ఒకరోజు ప్రసవానికని వచ్చిన స్త్రీని పరిక్ష చేస్తుంటే ఆమె పొట్ట దగ్గర కట్టుకు వచ్చిన డాక్యుమెంట్లు కనిపించాయి. నర్సుని కూడా రానివ్వకుండా గబగబా ఆ డాక్యుమెంట్లను దాచేసి ఇంత దూది గాజు గుడ్డతో మళ్ళీ పెద్ద పొట్ట తయారుచేసి పంపింది.
ప్రాణాలకు తెగించి చేస్తున్నారు స్త్రీ పురుషులు ఈ పనిని. వారి ప్రాణాలను రక్షించాల్సిన పని ముఖ్యమైనది కాదా?
ఆ డాక్యుమెంట్లనీ మూర్తీ, శారదా కలిసి రెండు రోజు చదివారు. డాంగే మితవాది – అంటే తెలంగాణా పోరాట విరమణ చేయమంటున్నాడు. రణదివే తెలంగాణా పోరాటం కొనసాగించాల్సిందేనంటున్నాడు.
నిజాం పాలన అంతమయ్యాక సాయుధ పోరాటం అవసరం లేదని తెంగాణా నాయకుడైన రావి నారాయణ రెడ్డి అంటున్నాడు. అనటమే కాదు. తెలంగాణా వదిలి ఆయన బొంబాయి వెళ్ళిపోయాడు.
పోరాటం విరమించాలా ఒద్దా అనే విషయమై పైస్థాయి నాయకులందరిలో విబేధాలున్నాయని ఆ డాక్యుమెంట్లు స్పష్టం చేశాయి. శారదకు ఆ విషయాలు తెలియనివి కావు గానీ ఇప్పుడు డాక్యుమెంట్ల వల్ల స్పష్టంగా ఎవరి వైఖరి ఏమిటనేది సాక్ష్యాధారాల తో తెలిసినట్లయింది.
గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. మలబారు పోలీసులు భయంకరంగా హింసాకాండ కొనసాగిస్తున్నారు. ఎమర్రు కాటూరులో ప్రజలను దిగంబరం చేసి గాంధీ విగ్రహం చుట్టూ నిలబెట్టటం గురించిన వార్తతో ప్రజలందరిలో కాంగ్రెస్ అంటే కోపం అసహ్యం కలిగాయి. ఇళ్ళు తగలబెట్టటం, అనుమానించిన వారిని కాల్చిచంపటం పళనియిప్పన్ పేరంటేనే కొందరిలో భయం మరికొందరిలో అసహ్యం. ఒక్క మహిళా సంఘాన్ని తప్ప కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ప్రజాసంఘాలను, ట్రేడ్ యూనియన్లను నిషెధించారు.
శారద మనసు ఆగ్రహంతో రగులుతోంది. ఈ హింసాకాండను ఎదుర్కోవటానికి కొత్త పోరాట వ్యూహాలు రచించాలని, ప్రజలలో ఉన్న సానుభూతికి ఒక రూపం ఇచ్చి వారి ఆగ్రహంతోనే ఈ బీభత్సానికి తెరదించాలనీ ఆమె అనుకుంది. మూర్తి కూడా శారద ఆలోచనను బలపరిచాడు. రామస్వామి మరికొందరు శారద ఆలోచను సరైనవన్నారు.
ఇంతలో పార్టీని నుంచి ఆదేశం వచ్చింది ‘‘కంటికి కన్ను – పంటికి పన్ను’’ అనేదే మన మార్గమని – ఇది శారదకసలు మింగుడు పడలేదు. ఈ సమయంలో ఆదేశంతో కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకుంటారనే ఆందోళనతో కుంగిపోయింది. దీనిని ఆపేదెలా? తానేమైనా చేయగలదా అనే ఆలోచనతో రగిలిపోయింది.
చివరకు మద్రాసు వెళ్ళాలని నిర్ణయించుకుంది. దుర్గాబాయి తో మాట్లాడి నెహ్రూతో ఇంటర్వ్యూ అడిగి చూడానుకుంది. ప్రకాశం గారితో మాట్లాడి ప్రయోజనం లేదు. ఆయన తను చెప్పినదానికి అంగీకరించి, మర్నాడు ఇంకెవరో తనకు వ్యతిరేకంగా చెబితే మనసు మార్చుకుంటాడు. ఎంత స్థిరమో, అంత అస్థిరం, ఎంత బలమో అంత బలహీనత – ఆయన మనసులో గట్టిగా ఏదైన అనుకుంటే మార్చటం ఎవరితరం కాదు. వీరేశలింగం తాతయ్యకు వ్యతిరేకంగా వాదించి ఆయనను ఓడించటం సరికాదని ఆయన అంతరాత్మకు తెలియదూ? తెలిసిన ఒట్టి తర్కానికి, , తన సామర్ధ్యాన్ని నిరూపించుకోటానికీ ఆ పని చేశాడు. నాన్నకు, హరి బాబాయికి ఎంతో కోపం వచ్చింది. ప్రకాశం గారు నవ్వేసి మరి నేను ప్లీడర్ని – నా వాదన పటిమ నిరూపించుకోవద్దా అన్నారు. హరిబాబాయి చెప్పేవాడు ` కాంగ్రెస్ సభలో ఒకసారి బ్రాహ్మణులకు వేరుగా భోజనాలు ఏర్పాట్లు చేయించాడనీ, హరి బాబాయి మరికొందరూ వెళ్ళి అడిగితే ‘‘అది తప్పంటావా ? సరే తీసేద్దాం’’ అని అదో ప్రిన్సిపల్కి సంబంధించిన విషయం కాకుండా ఏర్పాట్లకు సంబంధించిన విషయమన్నట్లు మాట్లాడారట. అందువల్ల ప్రకాశం గారితో మాట్లాడటం వృధా. దుర్గ అర్థం చేసుకోగలదు. అర్థం చేసుకోక పోయిన ఒక్కసారి నెహ్రూ గారితో ఇంటర్వ్యూ ఇప్పించగలిగితే చాలు . సరోజినీదేవి ఆరోగ్యం బాగోలేదు. లేకుంటే హరీన్ తో వెళ్ళి ఆమె ద్వారా నెహ్రూని కలిసినా బాగుంటుంది. ఇంత ఆలోచించి మద్రాసు ప్రయాణం పెట్టుకుంది.
*
***