Archives for 2015

నిత్యవిచారిణి!

saaranga 1

1

“సంతూ! నువ్వు అదృష్టవంతురాలివే! పెళ్ళాన్ని క్రిటిసైజ్ చెయ్యడంలో ముందుండే మొగుళ్ళే తప్ప ప్రైజూ, సర్‌ప్రైజూ చేసే మొగుళ్ళు ఎక్కడో కానీ ఉండరే! సర్‌ప్రైజ్‌గా పట్టమహిషికి పట్టుచీర కొనిచ్చే మొగుడు దొరికినందుకు పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోవాలి కానీ ఇంకా ఈ వంకలు పెట్టడం దేనికే?”

“చాల్లేవే వల్లీ! నువ్వు మరీ చెప్తావ్! ఇంత పెద్ద బోర్డర్ ఉన్న చీరలు నాకు నచ్చవని నీకు తెలీదూ? పెళ్ళాన్ని ప్రేమించే మొగుడు పెళ్ళాం ప్రేమించేవి తెలుసుకోలేడూ? మల్లెపూలు తెచ్చిచ్చేస్తే మంచి మొగుడు అయిపోడే వల్లీ, మనసుని పరిమళింపజెయ్యాలి!”

నేను సంతూని సముదాయించడానికి ఏదో చెప్పబోతూ ఉంటే ఓ పెద్ద మెరుపు మెరిసినట్ట్లైంది! చూస్తే సాక్షాత్తూ విష్ణుమూర్తి ప్రత్యక్షమై కనిపించాడు! ఇది కలా నిజమా! విష్ణుమూర్తి వైకుంఠం నుంచి సరాసరి మా వాకిట్లోకి దిగొచ్చెయ్యడం ఏమిటి? ఇంతకీ ప్రత్యక్షమైంది నాకా లేక సంతూకా? అదయితే అసలు భక్తురాలే కాదు. నేను కనీసం “లక్ష్మీకటాక్షం” కోసం చాలాసార్లు ప్రార్థించాను. ఆవిడ మొగుణ్ణి పంపించి ఉండొచ్చు అనుకుని విష్ణుమూర్తి కాళ్ళపై పడబోయాను. అంత విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి –

“కాళ్ళపై పడితేనే భక్తి కాదు తల్లీ! కష్టపడకు! అయినా నేను వచ్చింది నీ ప్రాణస్నేహితురాలు నిత్యసంతోషిణి కోసం!”

ఇప్పుడే దాన్ని అదృష్టవంతురాలివి అని పొగిడాను, అప్పుడే ఇంత మహాదృష్టమా? అయినా సంతూ అంత పుణ్యం ఏమి చేసుకుందో  అని ఆశ్చర్యంగా చూడసాగాను. విష్ణుమూర్తి సంతూ కేసి చూసి –

“అమ్మా నిత్యసంతోషిణీ! ప్రతివారూ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. రోజూ తెలుగు టీవీ సీరియల్సు చూసే వాడి జీవితంలో ఆనందం కరువౌతుంది. అలాగే తెలుగు సినిమాలు ఎక్కువ చూసేవాడికి తెలివితేటలు నశించడం అనివార్యం! ఇలా ప్రతి పనికీ దానికి తగ్గ ఫలితం ఉంటుంది”

ఇలాంటి బోధలు వినడానికి భగవానుడు ప్రత్యక్షమవ్వడం ఎందుకు, భక్తి చానల్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అన్నట్టు సంతూ అసహనంగా చూస్తోంది! సర్వజ్ఞునికి తెలియనిది ఏముంటుంది, సంతూ మనసులోని భావం గ్రహించి ఇలా కొనసాగించాడు –

“ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, చేసిన మంచి కర్మలకు గాను ఎన్నో శుభప్రదమైన ఫలితాలను ఇచ్చినా వాటిని శోకంగా మార్చే అపార నైపుణ్యం నీకే అబ్బింది తల్లీ! పాయసం పంచుతున్నా అది నీ చేతుల్లో విషంగా మారిపోతూ ఉంటే తలరాత రాసిన బ్రహ్మ ఏం చెయ్యాలో తెలియక తికమకలో పడ్డాడు. జాతకాలు, కర్మసిద్ధాంతాలూ నీ పుణ్యమా అని ఎన్నడూ లేని తిరకాసులో పడ్డాయి. ఇలా నిన్ను సృష్టించిన తప్పుకి ప్రాయశ్చితంగా బ్రహ్మ తక్షణం మోక్షం ఇచ్చి నిన్ను సృష్టి నుంచి తప్పించమని నన్ను కోరాడు!”

అదన్న మాట సంగతి! “సంతూ, చాన్స్ కొట్టావే!” అనుకున్నాను నేను కుళ్ళుకుంటూ. కానీ, అది ఏ ఫీలింగూ లేని మొహంతో ఇలా బదులిచ్చింది –

“నాకు బెల్లం పాయసం ఇష్టం, పంచదార పాయసం నచ్చదు! రెండూ తీపే కదా అని నాకు నచ్చని పంచదార పాయసమే నాకిస్తూ ఉంటే కాదనడం తప్పా? ఈ లాజిక్కు నా తోటి మనుషులకి అర్థం కాకపోవడాన్ని సరిపెట్టుకోగలను కానీ దేవుడివైన నీకే అర్థం కాకపోతే ఇంకేం చెయ్యాలి స్వామీ? నేను కోరుకోనివి ఎన్నిస్తే నాకెందుకు?”

అమ్మో! బానే అర్గ్యూ చేస్తోందే! విష్ణుమూర్తి ఏమంటాడా అని చూశాను.

“అదేమిటి తల్లీ! మొన్నే కదా నువ్వు కోరుకున్నట్టు బంగారం ప్రసాదించాను, నువ్వు కాసులపేరు కూడా చేయించుకున్నావు కదా!”

“ఆ! ఇచ్చావులే పెద్ద! నేను కొన్న వెంటనే బంగారం ధర పడిపోయింది. కొన్ని రోజులు ఆగుంటే వడ్డాణమే చేయించుకునేదానిని. టైమింగు కుదరనప్పుడు వరాలిచ్చీ ఏం లాభం!”

చిద్విలాసుడు చిరునవ్వి నవ్వి ఇలా అన్నాడు –

“ఇంతకీ మోక్షం కావాలో వద్దో త్వరగా తేల్చు తల్లీ! నేను వెళ్ళాలి. పాలసముద్రం పైన పవళించి, మురిపాల శ్రీలక్ష్మి నా కాళ్ళు ఒత్తుతూ ఉంటే, అన్నమయ్య కీర్తనలు వింటూ సేద దీరాల్సిన వాడిని!

Kadha-Saranga-2-300x268

“నాకు అర్థం కాని మోక్షాన్ని నేనేమి చేసుకునేది స్వామీ! వెళ్ళి మీ అర్థాంగినే ఏలుకోండి!” అంది సంతూ చిరు కోపంతో.

“సరే, నీ చిత్తమే నీ భాగ్యము. ఒక మాట చెప్తాను, అర్థం కాకపోయినా గుర్తుపెట్టుకో తల్లీ, ఎప్పటికైనా పనికొస్తుంది – తనెంత అదృష్టవంతుడో తెలుసుకోలేనివాడే లోకంలో అందరికన్నా దురదృష్టవంతుడు.”

ఇలా చెప్పి అంతర్ధానమయ్యాడు స్వామి. సంతూ అజ్ఞానానికి నేను అవాక్కయ్యాను. అది మాత్రం విచారంగా మొహం పెట్టి నాతో అంది –

“చూశావే వల్లీ! నేనెంత దురదృష్టవంతురాలినో! సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే దిగొచ్చినా నేను కోరినది ఇవ్వలేకపోయాడు!”

2

ఆ మాటలకి నా కళ్ళు తెరుచుకున్నాయి! ఓహో, ఇది కలన్న మాట! కానీ ఇది నిజంగా జరిగినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే మా సంతూకి నిరాశ నిండిన లాజిక్కులతో దేవుళ్ళనైనా బెంబేలెత్తించే టాలెంట్ ఉంది. మీకు పాత రోజుల్లో ఈటీవీలో “ఓ కళంకిత, కళలకే అంకిత, కన్నీటికి అద్దం నీ చరిత!” అనే టైటిల్ సాంగుతో వచ్చిన “కళంకిత” సీరియల్ గుర్తుంటే అందులో ఏడుపు కోసమే పుట్టినట్టు ఉండే హీరోయిన్ ఉంది చూశారూ, తను మా సంతూకి సరిగ్గా సరిపోతుంది. తను కళంకిత అయితే సంతూ శోకాంకిత, శోకానికే అంకిత!

సంతూ అసలు పేరు నిత్యసంతోషిణి. ఏవిటో కొందరికి పెట్టిన పేర్లు అచ్చిరావు. పేరు “నిత్యసంతోషిణి” అయినా అది ఎప్పుడూ సంతోషంగా ఉన్న దాఖలాలు లేవు. అది పుడుతూనే బిగ్గరగా ఏడుపులంకించుకుంటే “బాలానాం రోదనం బలం” అని ముందు పెద్దవాళ్ళు ముచ్చటపడ్డారు. అయితే ఎంతకీ ఏడుపు ఆపకపోతే కంగారుపడ్డారు. ఆ తర్వాత అది పెరుగుతూనే ఉన్నా, ఏడుపు ఏ మాత్రం తరగకపోయేసరికి చిరాకు పడ్డారు. అలా అది ఏడుస్తూ, అందరినీ ఏడిపిస్తూ పెరిగింది. చిత్రంగా సంతూ నాలుగేళ్ళ వయసొచ్చేసరికి సడన్‌గా ఏడవడం మానేసింది. అందరూ “హమ్మయ్యా!” అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది కన్నీళ్ళు ఆపుకుంది కానీ ఏడుపు ఆపలేదు! పైకి ఎలా ఉన్నా, మౌనంగా తనలో తాను నిత్యం ఏడుస్తూనే ఉంటుందని నాకు తెలుసు. అందుకే దానికి నేను “నిత్యవిచారిణి” అని పేరు పెట్టుకున్నాను!

ఇంతకీ నేనెవరిని అని మీకు సందేహం వచ్చి ఉండాలి. నా పేరు శ్రీవల్లి. సంతూకి ప్రాణస్నేహితురాలిని. దాని కన్నీళ్ళకి కర్చీఫ్‌ని! దానికి, కాదు కాదు, దాని ఏడుపుకి శిష్యురాలిని! ఎలా అంటారా? కొందరిని చూసి – “ఇలా ఉండాలి” అని ఇన్స్పైర్ అవుతాం, కొందరిని చూసి “చచ్చినా ఇలా ఉండకూడదు” అని డిసైడ్ అవుతాం! ఈ రెండు రకాల వాళ్ళూ మనకి గురువులే. సంతూ (సంతూ ఏడుపు) నాకు రెండో రకంగా జీవితం గురించి ఎంతో నేర్పిన గురువు. అసలు మా మొదటి పరిచయమే ఓ పాఠం…

ఆ రోజు నాకు బాగా గుర్తు. నా చిన్నతనంలో మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి మేము సంతూ వాళ్ళ ఊరుకి కొత్తగా వచ్చాము. అదో చిన్న టౌను. సంతూ వాళ్ళు మా అద్దెంటి ఎదురుగానే ఉండేవారు. వాళ్ళది కలవారి కుటుంబం. పెద్ద ఇల్లూ, వెనుక విశాలమైన పెరడూ, అందులో రకరకాల పూలమొక్కలూ అవీ ఉండేవి. అమ్మ ఒక రోజు “పూలుకోసుకు రా” అంటే వాళ్ళింటికి వెళ్ళాను. హాల్లో సంతూ కనిపించింది. అదే మా మొదటి పరిచయం.

“హాయ్! నా పేరు శ్రీవల్లి! అమ్మ పూలు కోసుకు రమ్మంది…”

సంతూ మాట్లాడకుండా నన్ను పెరట్లోకి తీసుకెళ్ళింది.

“అబ్బా! ఎన్ని రంగు రంగుల పువ్వులున్నాయో! ఈ ఎర్రగులాబీలు ఎంత ముద్దొస్తున్నాయో!” – నేను నా ఉత్సాహాన్ని బయటపెడుతూ అన్నాను.

సంతూ ఏ మాత్రం తొణక్కుండా – “తెల్ల గులాబీలు లేవుగా!” అంది.

“నీకు తెలుపు ఇష్టమా?”

“కాదు. తెల్ల పూలు లేవు కాబట్టి తెలుపు కావాలనిపిస్తుంది!”

“అదేంటి?”

“ఉన్న వాటితోనే సంతృప్తి పడిపోతే కొత్తవి, ఇంకా గొప్పవి జీవితంలో ఎలా దొరుకుతాయి?”

“అవునా! ఇన్ని విషయాలు నీకెలా తెలుసు?”

“తెలివుంటే, పుస్తకాలు చదివితే తెలుస్తాయి!”

“ఓహో! చాలా పుస్తకాలు చదివితే బాగా బాధపడొచ్చు అన్న మాట!”

ఈ సమాధానానికి సంతూ నాకేసి తీక్షణంగా చూసి- “నువ్వు ఏ క్లాసు చదువుతున్నావు?” అని అడిగింది.

“8th క్లాస్. ఇంకా జాయిన్ అవ్వలేదు, నాన్న మంచి స్కూల్ చూస్తున్నాడు!”

“నేనూ 8th క్లాసే! మా స్కూల్ బాగుంటుంది. అక్కడే జాయిన్ అవ్వు. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. నాతో తిరిగితే నీకు కొంచెం తెలివితేటలైనా వస్తాయి!”

సరే అనక తప్పింది కాదు, అసలే నాకు మొహమాటం ఎక్కువ! ఆ రోజు నేను నేర్చుకున్న మొదటి పాఠం: జీవితం గులాబి పువ్వు లాంటిది. రంగూ రూపూ నచ్చలేదని ముక్కుమూసుకుని కూర్చోకుండా, ముళ్ళున్నాయని వంకలు పెట్టకుండా, పరిమళాన్ని ఆస్వాదించాలి!

3

అలా మొదలైన మా స్నేహం మూడు ఏడుపులూ, ఆరు ఓదార్పులుగా సాగిపోతోంది. సంతూ కన్నీళ్ళతో నేను నా జీవిత కావ్యాన్ని రాసుకుంటున్నాను. మేము తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా, నాకు గుర్తుండిపోయిన ఇంకో సంఘటన జరిగింది.

స్కూల్లో హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరుగుతున్నాయి. ఆ రోజు లెక్కల పరీక్ష. ఎప్పటికైనా సంతూనైనా అర్థం చేసుకోగలుగుతానేమో కానీ లెక్కల అంతు తేల్చడం నా వల్ల కాదు. అందుకే నేను భయం భయంగా హాల్లోకి అడుగు పెట్టాను. సంతూ కాం గా వచ్చింది. దానికేం, ఇంటెలిజెంటు! లక్కీగా పేపరు చాలా ఈజీగా వచ్చింది. నా ఆనందానికి అవధులు లేవు. పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్నప్పుడు మా సంభాషణ –

“పేపరు చాలా ఈజీగా ఉంది కదే! నీకు వందకి వంద ఖాయం అనుకుంటా” – నేను

“నేను పరీక్ష రాయడం సగంలో ఆపేశాను” – సంతూ

“ఏం?” అన్నాను ఆశ్చర్యంగా!

“పెన్ రాయలేదు. బ్రహ్మ నా తలరాతలో వంద మార్కులు రాయలేదు!”

“అయ్యో! చెయ్యెత్తి అడిగితే ఎవరైనా ఇంకో పెన్ ఇచ్చేవారు కదా! అయినా స్పేర్ పెన్ తీసుకురాకుండా ఎగ్జాం కి ఎలా వచ్చావ్?”

“నిన్నే కొత్త పెన్ కొన్నాను. ఇప్పుడే ఫ్రెష్‌గా తెల్లారాక వెంటనే చీకటి పడుతుందని ఎవరు ఊహిస్తారు? అయినా విధి నాతో ఆడుకుంటున్నప్పుడు పావుగా మారి తలొగ్గాలి గానీ పాములా బుసకొడతానంటే గేం రూల్స్ ఒప్పుకోవు!”

నాకు అదన్నదేమిటో ఒక్క ముక్క అర్థం కాలేదు! “ఉన్నదానితో సరిపెట్టుకోకూడదు” అని గతంలో లెక్చర్ పీకిన అది, ఇప్పుడు ఆగపోయిన రీఫిల్తో ఎలా సరిపెట్టుకుందో దానికే తెలియాలి! కాని నాకు మాత్రం తెలిసొచ్చిన పాఠం ఇది – జీవితమనే పెన్లో రీఫిల్ అయిపోతే, రాయడం ఆపెయ్యకూడదు, పెన్ పడెయ్యకూడదు. కొత్తగా రీఫిల్ చేసుకుని ముందుకి సాగాలి!

4

సీతాకోకచిలకలని చూసి ముచ్చటపడి ఆడుకునే వయసు నుంచి సీతాకోకచిలకలుగా మారి అబ్బాయిల గుండెల్లో రెపరెపలాడే వయసులోకి వచ్చాము మేమిద్దరం! నాకంటే సంతూ అందంగా, తీర్చిదిద్దిన చందనశిల్పంలా ఉండేది. సీరియస్‌గా ఉండి ఎప్పుడూ నవ్వదు కానీ నవ్వితే వెన్నెల వర్షమే! ఆ టౌనులోని చిన్న కాలేజీలోనే సాగిన మా ఇంటర్మీడియట్ చదువులో, సంతూ ఎప్పుడైనా కాలేజీకి ఓణీ కట్టుకెళితే కుర్రగుండెల్లో కాంభోజీయే! కాబట్టి సహజంగానే దానికి చాలామంది ఆరాధకులు ఉండేవాళ్ళు. అయితే అది మాత్రం అబ్బాయిలని దూరంగా పెట్టేది, కానీ వాళ్ళ గుండెలని గిలిగింతలు పెట్టేది.

బయటపడదు కానీ సంతూ కూడా మా క్లాసులోని ఒక అబ్బాయంటే ఇష్టపడుతోందని నేను గ్రహించకపోలేదు. అది ఆ అబ్బాయి కేసి చూసే దొంగచూపులు నన్ను దాటిపోలేదు. నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. ప్రేమలో పడుతోంది అంటే అది నార్మల్ గానే ఉందని నాకు నమ్మకం కలిగింది! కానీ వెంటనే ఆ అబ్బాయిపై జాలి కలిగింది!   మొత్తానికి ఈ కథ ఏమౌతుందో అన్న కుతూహలం పెరిగింది. చదువులో ముందుండే అబ్బాయిలు ప్రేమ విషయాల్లో ఎప్పుడూ వెనకబడే ఉంటారు నేనకునేలోపే కథ వేగం పుంజుకుంది. ఓ రోజు మేమిద్దరం నడిచి ఇంటికి వెళుతుంటే ఆ అబ్బాయి మాకేసి వచ్చాడు –

“హాయ్ సంతూ! నీతో కొంచెం మాట్లాడాలి”

అమ్మో ఫర్వాలేదే! నేను కొంచెం పక్కకి వెళ్ళబోయాను, కానీ సంతూ నన్ను చెయ్యిపట్టుకు ఆపి, ఆ అబ్బాయితో ఇలా అంది –

“ఏమిటో చెప్పు! వల్లీ ఉందని వర్రీ వద్దు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఏ విషయం దాచుకోము.”

“నేను కూడా దాచుకోలేకే ఓ విషయం చెబుదామని వచ్చాను!” మృదువుగా చెప్పాడు.

“ఏమిటది”? – కటువుగా అడిగింది సంతూ.

“నువ్వూ తెలివైన దానివి, నేనూ తెలివైన వాడిని. మన తెలివి చెలిమిగా మారితే మన స్నేహం నీ అంత అందంగా ఉంటుంది కదా. ఏమంటావ్? కన్ వీ బీ ఫ్రెండ్స్?” అంటూ చెయ్యి చాచాడు.

“ప్రేమకు స్నేహం తొలిమెట్టు” అని పెద్దలు అన్నారు కాబట్టి ఇదేదో బానే ఉందని నేను సంబరపడుతూ ఉండగా, సంతూ నా కలల్లో కారం పోస్తూ –

“సారీ, నేను అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చెయ్యను”, అని బదులిచ్చి నన్ను చెయ్యిపట్టుకు లాకెళ్ళిపోతూ, మళ్ళీ ఓసారి ఆగి డ్రమాటిక్‌గా తల వెనక్కి తిప్పి ,

“అదీ తమకు తాము చాలా తెలివైన వాళ్ళం అనుకునే అబ్బాయిలతో అస్సలు చెయ్యను” అంటూ ముక్తాయింపిచ్చింది.

ఆ అబ్బాయి నిర్ఘాంతపోయాడు, నేను ఆశ్చర్యపోయాను. మేము  కొంచెం దూరంగా వెళ్ళాక నెమ్మదిగా అడిగాను –

“నిజం చెప్పవే సంతూ! నీకూ ఆ అబ్బాయంటే ఇష్టం కదూ? హాయిగా జట్టు కట్టకుండా ఈ బెట్టెందుకే?”

సంతూ పెద్దగా నిట్టూర్చి – “వాడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానే! నేను క్లాసులో ఆరాధనగా చూసే చూపులు వలపు తెమ్మెరలై వాణ్ణి తాకితే వాడు వెనక్కి తిరిగి నాకేసి చూసి మౌనమందహాసం చెయ్యాలని, అది చూసి నేను సిగ్గుతో తలదించుకోవాలనీ! నా జడలోంచి రాలిన మందార పువ్వుని వాడు పదిలంగా ఏరుకుని ప్రేమ పరిమళాలని ఆస్వాదించాలనీ. సెలయేటి ప్రవాహంలా, కోయిల గానంలా, వెన్నెల మాసంలా మా ప్రేమ సుతారంగా మొగ్గతొడగాలనీ! ఇలా ఎన్నో! కానీ నా దురదృష్టాన్ని మళ్ళీ నిరూపిస్తూ వాడు నా కలలసౌధాన్ని కుప్పకూల్చాడే! ఈ అబ్బాయిలకి తాపత్రయమే కానీ కళాత్మకత ఎందుకు ఉండదో! ప్చ్!”

దానికి ఫిలాసఫిలో పేటెంట్లే కాక పోయెట్రీలో ప్రవేశం కూడా ఉందని అప్పుడే తెలిసింది. మొత్తానికి రొమాన్సు మొదలవ్వకుండానే దాని ప్రేమకథ క్లైమాక్సుకి చేరింది. నాకు మాత్రం ఓ పాఠం మిగిలింది – ప్రతి ఉదయం జీవితం నీకు రాసే ప్రేమలేఖ! ప్రతి నిమిషం లవ్ ప్రపోజల్. పట్టించుకుంటే బ్రతుకు ప్రణయగీతం. నిట్టూర్చిపోతే నిత్యభారం!”

5

ఇంటర్మీడియట్ తర్వాత సంతూ ఇంజనీరింగ్ చదువుకై సిటీకి వెళ్ళిపోయింది, నేను మాత్రం అదే ఊరులో డిగ్రీ చదువుతో సరిపెట్టుకున్నాను. చదువైన వెంటనే పెళ్ళి కుదరడంతో నేను హైదరబాద్‌లో కాపురం పెట్టాను. సంతూ బెంగళూర్‌లో ఉద్యోగం మొదలెట్టింది. ఇంటర్మీడియట్ తర్వాత మేము కలిసి మాట్లాడుకున్నది తక్కువే అయినా ఫోన్ సంభాషణల ద్వారా మా స్నేహబంధం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. సంతూ ఇంజనీరింగ్‌లో, ఉద్యోగంలో ఎదురుకొన్న సవాలక్ష సమస్యలని ఏకరువు పెడుతూనే ఉంది. అన్నిటికంటే పెద్ద సమస్య ఒకటి తయారైంది – దాని పెళ్ళి!

సంతూ అందాన్ని, వాళ్ళ కుటుంబ స్థితిగతులనీ చూసి చాలా మంచి సంబంధాలే వస్తున్నాయి. కాని దానికి ఏదీ ఓ పట్టాన నచ్చి చావట్లేదు. అది పెడుతున్న వంకలకి నెలవంక కూడా నివ్వెరపోతుంది. అబ్బాయి రూపం బాగుంటే హైటు బావులేదంటుంది. హైటూ లుక్కూ బావుంటే బట్టతల వచ్చేటట్టున్నాడంటుంది! బాగా మాట్లాడే వాడు దొరికితే చదువు బాలేదంటుంది, మంచి చదువున్నవాడు వస్తే సంస్కారం లేదంటుంది. అన్నీ బావుంటే కాబోయే అత్తగారి వాలకం అనుమానాస్పదంగా ఉందంటుంది! ఇలా అది తలతిక్కతో కూర్చుంటే ఇంట్లో వాళ్ళు తలపట్టుకుని కూర్చున్నారు. ఈ తతంగం కొన్నేళ్ళు సాగాక దానికి పూర్తిగా నచ్చకపోయినా ఓ అమెరికా సంబంధాన్ని కుదిర్చేశారు.

పెళ్ళి కుదిరాక ఓ సారి అది హైదరాబాద్ వచ్చినప్పుడు మేము కలుసుకున్నాం. అప్పటికే అబ్బాయి ఫొటో నాకు చూపించింది, చక్కగా ఉంటాడతను. కలిసినప్పుడు దానిని నేను టీజ్ చేస్తూ –

“ఏమంటున్నాడే నీ వరుడు, మనోహరుడు? సరసుడేనా?”

“సర్లేవే! పెళ్ళి కాకముందు ప్రేమ కురిపించడంలో పెద్ద గొప్పేముంది? ప్రేయసి పెళ్ళామైపోయాక సరసం నీరసమైపోతుంది!”

“చాల్లేవే! పెళ్ళయ్యాక అమెరికా ఎగిరిపోతావ్, పెద్దల గోల లేదు! ఇక కొన్నేళ్ళు ప్రతిరాత్రీ, వసంతరాత్రీ, బ్రతుకంతా హనీమూనే!”

“నీకేంటే ఎన్నైనా చెప్తావ్! పక్కనే అమ్మానాన్నా, పండుగలూ పబ్బాలూ, పట్టుచీరలూ సందళ్ళూ, ఇంట్లో పనిమనుషులూ! నేను నావాళ్ళకి దూరంగా ఒక్కత్తినే అన్నీ చేసుకుని చావాలి. నాకు H1 వీసా లేదు కాబట్టి ఉద్యోగం కూడా హుష్ కాకీ! గ్రీన్ కార్డ్ లేని మొగుణ్ణి కట్టబెడితే ఇక బ్రతుకులో పచ్చదం ఏముంటుందే! నేను ఫ్లైటెక్కి అమెరికా చేరేలోపే దురదృష్టం నా ఫేట్ ఎక్కి వెళ్ళి వాలిపోయిందే!”

నాకేం చెప్పాలో తెలియలేదు. మొత్తానికి సంతూ పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోయి NRI అయిపోయింది. కాని అది ఎప్పటికైనా నిజమైన NRI (Non Regretting Indian) గా మారాలనే నా ఆకాంక్ష. వెళ్తూ వెళ్తూ అది నేర్పిన పాఠం మాత్రం నాకు గుర్తుండిపోయింది – “జీవితం నిత్యకళ్యాణం పచ్చతోరణమా లేక ఒక్క కళ్యాణం నిత్య రోదనమా అన్నది మనబట్టే ఉంటుంది!”

6

సంతూ అమెరికాలో పడుతున్న అవస్థలని స్కైప్‌లో రోజూ సినిమాలా వివరిస్తూ ఉంటే ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. మేమిద్దరం పిల్లల తల్లులమైపోయి, సంసారకూపంలో నిలువునా కూరుకుపోయాము. కలుసుకునే ఆరేళ్ళు దాటిపోయింది. అది ఆ మధ్యెప్పుడో ఇండియా వచ్చినప్పుడు మేము తొలిసారి పోట్లాడుకున్నాం, ఆఖరిసారి మాట్లాడుకున్నాం.

ఆ రోజు మేము కలిసి, కుశలప్రశ్నలూ అవీ అయ్యాక, నేను అన్నాను –

“సంతూ, నీ అందం ఏ మాత్రం తగ్గలేదే! ఫిగర్ భలే మైంటైన్ చేస్తున్నావ్! నాకు టిప్స్ చెప్పొచ్చు కదే!”

“హా! జీవితం వగరుగా ఏడిస్తే ఫిగరుతో ఏమి చేసుకుంటాం!”

“మరీ చెప్తావే! మంచి భర్తా, ముత్యాల్లాంటి పిల్లలూ, బోలేడు డబ్బూ! నీకేం బాధలున్నాయే!”

“ఇద్దరు కుర్ర రాక్షసులకి తల్లి ఎక్కడైనా ఆనందంగా ఉండడం చూశావే నువ్వు! వాళ్ళ అల్లరితో నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారే! నీకేం అదృష్టవంతురాలివి, బుద్ధిగా ఉండే అబ్బాయి, ముద్దొచ్చే అమ్మాయి. ఐడియల్ కాంబినేషన్! అమ్మాయుంటే ఆ కళే వేరే! ఏం చేస్తాం, దేవుడు నాకా అదృష్టం ఇవ్వలేదు!”

“అదేమిటే, పెళ్ళి కాకముందు అమ్మాయిగా పుట్టడమే పెద్ద దురదృష్టం అనీ, అమ్మాయిలని పెంచడం మహా కష్టం అనీ, అది నీ వల్ల కాదనీ, పిల్లలు పుడితే ఇద్దరూ అబ్బాయిలే కావాలనీ అనేదానివి కదా!”

“అదే చెప్తున్నానే! వరాలని కోరుకోవడం కూడా నాకు సరిగ్గా చేతకాదు! దురదృష్టానికి ఇంతకన్నా దాఖలా కావాలీ? ఇక ఈ జన్మకి ఇంతే. వచ్చే జన్మలోనైనా దేవుడు కొంచెం అదృష్టాన్నీ సుఖాన్నీ ఇస్తే బావుణ్ణు!”

ఇన్నేళ్ళూ దాని డైలాగులకి ఎదురు చెప్పకుండా ఉంటున్నదానిని ఆ రోజు ఉండబట్టలేక దానితో ఓ మాటనేశాను. అదే నేను చేసిన తప్పు.

“విడ్డూరం కాకపోతే నువ్వు దురదృష్టవంతురాలివి ఏమిటే! వింటే దురదృష్టం నవ్వుకుంటుంది. నీకు వచ్చే జన్మంటూ ఉంటే నిజంగా నిన్ను దురదృష్టవంతురాలిగా పుట్టించి ఈ జన్మని జ్ఞాపకం వచ్చేలా చెయ్యమని దేవుణ్ణి కోరుకుంటున్నాను. నిజమైన బాధ, అసలైన కష్టం అంటూ ఒకసారి అనుభవిస్తే అప్పుడు నీకు తెలిసొస్తుంది నువ్వు ఎంత అదృష్టవంతురాలివో!”

ఆ మాటలకి అది అగ్గి మీద గుగ్గిలమే అయ్యింది –

“ఇదన్న మాట నీ నిజస్వరూపం. స్నేహితురాలి కన్నీళ్ళు కోరుకునే నువ్వు ప్రాణ స్నేహితురాలివటే? ఇన్నాళ్ళూ నా దురదృష్టం అంతా దేవుడి రాత అని అనవసరంగా ఆయన్ని తిట్టి పాపం మూటకట్టుకున్నాను కదే! ఇప్పుడు తెలిసొచ్చింది నువ్వే నా దురదృష్ట దేవతవని. నన్ను చూసి నువ్వు కుళ్ళుకుంటూ ఉంటే నాకు కన్నీళ్ళు రాకుండా ఉంటాయీ! చాలమ్మా చాలు! ఇక నువ్వూ వద్దూ నీ స్నేహమూ వద్దు! అమెరికాలో అంట్లు తోముకుంటూ నా పాట్లేవో నేను పడతాను కానీ, ఇక నిన్ను మాత్రం జన్మలో అంటను! సెలవ్, వెళ్ళి రా!”

“ప్రియం పలికేవాడంటే ప్యారు, హితం చెప్పేవాడంటే హేటు, ఇదే జనాల తీరు” అని ఎందుకంటారో నాకు తెలిసొచ్చింది. ఎప్పుడైతే నేను సంతూకి నచ్చచెప్పడం మాని, మంచి చెప్పడం మొదలెట్టానో దానికి నేను చెడ్డదాన్నైపోయాను. నా అవసరం దానికి తీరిపోయింది. మా బంధం చాలా గట్టిది అనుకున్నాను కానీ, మనిషిలోని అహం ఇంకా మొండిది!

ఇదండీ మా సంతూ కథ! ఆలోచిస్తే నాలోనూ, మీలోనూ, మనందరిలోనూ సంతూకున్న “ఏడుపుగొట్టు” లక్షణం అంతో ఇంతో ఉండకపోదు. దాని ఏడుపు సిల్లీగా ఉందని మనం నవ్వుకుంటున్నాం, కాని మనం ఏడ్చిన ఏడుపుల్లో ఎన్ని సిల్లీవి ఉండి ఉంటాయో కదా! ఆ సృష్టికర్త మనని చూసి కూడా నవ్వుకుని ఉండి ఉంటాడు, ఏమంటారు?

 -ఫణీంద్ర

ఫణింద్ర

 

 

 

 

 

 

 

 

 

 

 

కవులూ, కార్టూనిష్టులు, టెర్రరిష్టులూ …!

saranga cartoon 2

Raju

రహస్యప్రపంచ రారాణి… స్త్రీ!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)పిల్లలు Fairy Tales ఎంతో ఇష్టపడతారు. ఒకటి, రెండు తరాల వెనకటి తెలుగు బాలలు చందమామకథలతోనూ, విఠలాచార్య మార్కు సినిమాలతోనూ పెరిగినట్టే; ప్రతి దేశంలోనూ బాలలు వాళ్ళ వాళ్ళ వెర్షన్లకు చెందిన Fairy Tales మధ్య పెరుగుతారు. Fairy Tales అంటే ‘పిల్లల కథలు’ అనే నిఘంటువు నిర్వచిస్తోంది. ఈ మాటకు తెలుగులో కచ్చితమైన సమానార్థకం నాకు వెంటనే స్ఫురించడం లేదు. ‘అద్భుత కథలు’ అనుకుందాం. ఈ అద్భుత కథల గురించి నేనిప్పుడు మీతో ఒక అద్భుతాన్ని పంచుకోబోతున్నాను.

నిజానికి ‘అద్భుత కథలు’, మనం అనుకునేంత అమాయకమైన కథలు కావు. అవి కేవలం పిల్లల కథలూ కావు. ఆ కథల వెనుక ఒక చరిత్ర ఉంది. అంతకంటే ముఖ్యంగా పెద్దల మర్మమూ, పెద్ద తత్వమూ ఉన్నాయి. ఇలా అని పిల్లలకు ఉన్న కథలు కూడా లేకుండా చేస్తున్నానని మీకు అనిపిస్తే మన్నించాలి.

ఇంతకు ముందు మనం ఓడిసస్ అనే వీరుడి కథ చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు బాగా తెలిసిన ఒక సినిమాలోని వీరుడి కథ చూద్దాం. ఆ సినిమా పేరులోనే వీరుడు ఉన్నాడు. దాని పేరు ‘జగదేకవీరుని కథ’. విజయావారు తీసిన ఈ సినిమా అరవై దశకం ప్రారంభంలో వచ్చింది. అప్పుడప్పుడే ఊహ వస్తున్న రోజుల్లో విజయవాడ, దుర్గాకళామందిరంలో కాబోలు చూశాను. ఆ తర్వాత కూడా టీవీలో అప్పుడప్పుడు చూశాను. కానీ ఆ చూడడం వేరు, ఇప్పుడు చూస్తున్న తీరు వేరు. జోసెఫ్ క్యాంప్ బెల్, జార్జి థాంప్సన్ లను చదివేవరకూ, ఈ సినిమా, ఇంకా ఇలాంటి సినిమాల అసలు మర్మం నాకు బోధపడలేదు.

జగదేకవీరునికథకు ఒక తమిళ మాతృక ఉందని, అది కూడా గొప్ప హిట్ సినిమా అని ఇది రాస్తున్నప్పుడే తెలిసింది. దాని పేరు ‘జగదల ప్రతాపన్’. 1944లో వచ్చిన సినిమా అది. మీకు తెలిసిన, లేదా తెలుసుకునే అవకాశం ఉన్న కథే అయినా ప్రస్తుతాంశానికి అవసరమైన మేరకు జగదేకవీరుని కథ క్లుప్తంగా చెబుతాను.

అనగనగా ఒక రాజుగారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ప్రతాప్. అతనొక రోజు తండ్రితో మాట్లాడుతూ తనకు దేవకన్యలను పెళ్ళాడాలని ఉందంటాడు. దాంతో తండ్రికి కోపం వస్తుంది. అతన్ని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. ప్రతాప్ ఒక మిత్రునితో కలసి దేవకన్యలను వెతుక్కుంటూ బయలుదేరతాడు. అడవిలో ఒకచోట ఇంద్రకుమారి, అగ్నికుమారి, వరుణకుమారి, నాగకుమారి జలకాలాడుతూ కనిపిస్తారు. ఇంద్రకుమారి ప్రతాప్ ను చూసి శపిస్తుంది. అతను శిలగా మారిపోతాడు. అతని తల్లి అమ్మవారి భక్తురాలు. కొడుకు క్షేమం కోసం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటుంది. అమ్మవారు అవ్వ రూపంలో వచ్చి ప్రతాప్ కు శాపవిమోచనం కలిగిస్తుంది. అతనికి, అతని మిత్రునికి ఆశ్రయం ఇస్తుంది. ఇంద్రకుమారి జలకాలాడుతున్నప్పుడు ఆమె చీర ఎత్తుకు వస్తే ఆమె నీదవుతుందని ప్రతాప్ కు చెబుతుంది. ప్రతాప్ అలాగే చేస్తాడు.

ఈలోపల ఇంద్రకుమారి చేసిన ఒక తప్పుకు కోపించిన ఓ ముని, మానవమాత్రుడితో నీకు వివాహం అవుగాక అని శపిస్తాడు. అతను దొంగిలించిన నీ వస్త్రం నీకు లభించగానే శాపవిమోచనం అవుతుందంటాడు. ఇంద్రకుమారి ప్రతాప్ ను వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని కలసుకుంటుంది. ఇద్దరికీ వివాహం అవుతుంది. వాళ్ళు ఒక రాజ్యానికి చేరుకుంటారు. ఆ రాజ్యాన్ని పాలించే రాజు ఇంద్రకుమారి పొందు కోరుకుని, తన రోగానికి మందు తీసుకువచ్చే వంకతో ప్రతాప్ ను నాగలోకానికి, వరుణ లోకానికీ పంపిస్తాడు. అతను ఆ లోకాలకు వెళ్ళి నాగకుమారిని, వరుణకుమారినే కాక, అగ్నికుమారిని కూడా వెంటబెట్టుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఈ లోపల తమ్ముడు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. ప్రతాప్ లేనప్పుడు నలుగురు దేవతాస్త్రీలూ కలసి అతని తల్లిని మోసగించి ఆమె దగ్గర ప్రతాప్ దాచిన ఇంద్రకుమారి వస్త్రాన్ని అపహరిస్తారు. ఇంద్రకుమారి దానిని ధరించగానే శాపవిమోచనం కలుగుతుంది. నలుగురు దేవతాస్త్రీలూ దేవలోకానికి వెళ్లిపోతారు. అయినా ప్రతాప్ ను మరచిపోలేక పోతారు. ప్రతాప్ దేవలోకానికి కూడా వెళ్ళి ఇంద్రుని మెప్పించి నలుగురు భార్యలనూ వెంటబెట్టుకుని మానవలోకానికి వస్తాడు. ఆ తర్వాత తన రాజ్యాన్ని గెలుచుకుంటాడు.

ఓడిసస్ కథకు, ఈ కథకు ఉన్న పోలికలు చూడండి. ఓడిసస్ లానే ప్రతాప్ కూడా మానవమాత్రుడు, వీరుడు. అతని లానే సాహసయాత్ర చేస్తాడు. ఓడిసస్ కు ఎదురైనట్టే ప్రతాప్ కూ అనేక పరీక్షలు, కష్టాలు ఎదురవుతాయి. వాటి నుంచి గట్టెక్కడానికి ఓడిసస్ కు లానే దేవత(అమ్మవారు) సాయం లభిస్తుంది. ఓడిసస్ కు సిర్సే, కలిప్సో అనే అప్సరసలతో సంబంధం కలిగినట్టే ప్రతాప్ కు దేవకన్యలతో సంబంధం కలుగుతుంది. ఓడిసస్ ఒక దేవుడి సలహాతో సిర్సేను లొంగదీసుకుని ఆమెతో పడకసుఖాన్ని పొందుతాడు. అలాగే ప్రతాప్ అమ్మవారి సలహాతో ఇంద్రకుమారిని లొంగదీసుకుని పెళ్లిచేసుకుంటాడు. చివరగా ఓడిసస్ మార్మికప్రపంచం నుంచి మానవప్రపంచంలోకి వచ్చి పెనెలోప్ పునస్స్వయంవరంలో వీరత్వం చాటుకుని తిరిగి ఆమెను గెలుచుకుంటాడు. అలాగే ప్రతాప్ కూడా మార్మికప్రపంచం నుంచి మానవప్రపంచంలోకి వచ్చి రాజ్యాన్ని గెలుచుకుంటాడు.

రెండు కథలూ పురుషప్రయత్నాన్నీ, పురుషుడిలోనీ వీరత్వాన్నీ, అతను ప్రతికూల స్త్రీని సైతం అనుకూలంగా మార్చుకోవడాన్నీ చెబుతూనే; ఆ పురుష ప్రయత్నానికి దైవసహాయం కూడా అవసరమని చెబుతున్నాయి. జగదేకవీరుని కథలో ప్రతాప్ పురుషప్రయత్నానికి ప్రతీక అయితే, అతని తల్లి దైవసహాయానికి ప్రతీక. ఆపైన రెండు కథలూ దైవసహాయం, పురుషప్రయత్నాల మధ్య సమతూకాన్ని సూచిస్తున్నాయి. అంటే ఒకవిధంగా మానవుడి ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడమే.

వివరాలలో తేడా ఉండచ్చు, స్థూలంగా ఫార్ములా ఒకటే. ఒకటి గ్రీకు కథ, ఇంకొకటి భారతీయ కథ అనే సంగతిని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ అద్భుత కథల ఖజానాలోకి తొంగి చూస్తే ఇలాంటి ఫార్ములా కథలు ఇంకా మరెన్నో కనిపిస్తాయి. ఆయా దేశాలకు చెందిన ఇలాంటి అనేక కథలలోని వస్తువును, నిర్మాణ రీతులను ఎవరైనా లోతుగా పరిశీలించి, ఉమ్మడి అంశాలను గుర్తించారా అన్నది నాకు తెలియదు. నేను అందులోకి వెళ్లలేదు. ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఈ పోలికలను చూసినప్పుడు Fairy Tales అనేవి ప్రపంచంలో ఒకచోటినుంచి ఇంకోచోటికి వ్యాపిస్తూ వచ్చాయని కూడా అర్థమవుతుంది. Fairy Tales ప్రపంచవ్యాప్తం అవడమంటే, వాటి వెనుక ఉన్న ఒకే తత్వం కూడా ప్రపంచవ్యాప్తం అయిందన్నమాట.

The garden of immortality

The garden of immortality: ఈ సుమేరియన్ చిత్రంలో ముగ్గురు స్త్రీలు, చంద్రుడు, వృక్షాలు, ఫలాలు కనిపిస్తాయి

 

అందులోకి వెళ్లబోయేముందు ఇంకొక సూక్ష్మమైన పోలికను చెప్పుకోవాలి. ఓడిసస్, నలదమయంతుల కథలో ఉన్నట్టే జగదేకవీరునికథాగమనంలో కూడా వస్త్రం(వస్త్రం అన్నప్పుడు నగ్నత్వ సూచన కూడా అందులో గర్భితంగా ఉంటుంది)ఒక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి ఈ కథలో వస్త్రానిది మరింత స్పష్టంగా కనిపించే కీలకపాత్ర కూడా. ఇంద్రకుమారి నీకు లొంగాలంటే ఆమె వస్త్రం అపహరించుకురావాలని అవ్వ వేషంలో ఉన్న అమ్మవారు ప్రతాప్ కు చెబుతుంది. ప్రతాప్ ఇంద్రకుమారి వస్త్రం అపహరించడమంటే ఆమెను నగ్నంగా మార్చడమే. కాకపోతే, ఓడిసస్, నలదమయంతుల కథలో నగ్నత్వం పురుషుడిదైతే ఇక్కడ స్త్రీది. పక్షులు ఎత్తుకుపోయిన తన వస్త్రం తిరిగి తనకు లభించి, దానిని ధరించగానే బాహుకుడు నలుడిగా మారిపోతాడు. నగ్నంగా ఉన్న తనకు నౌసికా అనే రాచబాలిక ఇచ్చిన వస్త్రం ధరించిన తర్వాత ఓడిసస్ కు ఫేషియన్ల సాయం లభించి అతడు స్వస్థలానికి వెళ్లగలుగుతాడు. అలాగే ప్రతాప్ ఎత్తుకుపోయిన తన వస్త్రం తిరిగి పొందిన తర్వాత ఇంద్రకుమారి దేవకన్యగా మారి దేవలోకానికి వెళ్లిపోతుంది.

***

ఇప్పుడు విజయావారిదే ఇంకో ప్రసిద్ధ సినిమా చూద్దాం. అది, ‘పాతాళభైరవి’(1951). ఈ కథ కూర్పులో అనుసరించిన ఫార్ములా కూడా పై కథలోలానే ఉంటుంది. తోటరాముడు ఇందులో హీరో. అతి సామాన్యుడైన అతను ఉజ్జయిని రాకుమారిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. నా తాహతుకు తగినంత సంపదను సాధించుకువస్తే అమ్మాయిని ఇచ్చి పెళ్లిచేస్తానని రాజు షరతు పెడతాడు. తోటరాముడు స్నేహితునితో కలసి సాహసయాత్ర ప్రారంభిస్తాడు. అతనికి పాతాళభైరవిని కొలిచే ఒక నేపాళమాంత్రికుడు తారసపడతాడు. ఒక వీరుని బలి ఇచ్చి శక్తులు పొందే ఆలోచనలో ఉన్న మాంత్రికుడు అతనికి సాయపడుతున్నట్టు నటిస్తూ అతనిచేత అనేక సాహసాలు చేయించి వీరుడే నని ధ్రువీకరించుకుంటాడు. అతని పన్నాగాన్ని తెలుసుకున్న తోటరాముడే మాంత్రికుని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహం పొంది అన్ని సంపదలూ సాధిస్తాడు. అంతలో మాంత్రికుని శిష్యుడు సంజీవిని సాయంతో గురువును బతికిస్తాడు. రాకుమారిని పెళ్లాడాలనుకున్న రాజుగారి బావమరిది తోటరాముని అడ్డు తొలగించుకోవాలనుకుని అతని దగ్గర ఉన్న పాతాళభైరవి శక్తిని అపహరించి మాంత్రికుడికి అందిస్తాడు. మాంత్రికుడు తోటరాముని సంపదను అంతటినీ మాయం చేసేసి, పెళ్లి పీటల మీంచి రాకుమారిని అదృశ్యం చేస్తాడు. అప్పుడు తోటరాముడు మాంత్రికుని గుహకు వెళ్ళి అతన్ని చంపి రాకుమారిని, సంపదనూ కూడా తిరిగి దక్కించుకుంటాడు. అంటే, పైన చెప్పిన ఆయా కథల్లోలానే మంత్రతంత్రాలు, మహిమలతో కూడిన మార్మికప్రపంచంలోకి సాహసయాత్ర జరిపివచ్చిన తర్వాతే, తోటరాముడు వాస్తవిక ప్రపంచంలోకి వచ్చి రాకుమారితోపాటు రాజ్యాన్నీ పొందాడన్నమాట.

ఇప్పుడిక పై రెండు సినిమా కథల తాత్విక మూలంలోకి వెడదాం:

రెండు కథల్లోనూ అమ్మవారి పాత్ర ఉంది. అయితే, జగదేకవీరునికథలోని అమ్మవారు సాత్వికదేవత; పాతాళభైరవి కథలోని అమ్మవారు తామసిక లేదా ఉగ్రదేవత. ఇక్కడ దేవత ఒక్కతే; సాత్వికత, ఉగ్రత అనేవి ఆ దేవతకు గల రెండు అంశలు. అలాగే, జగదేకవీరుని కథలో ప్రతాప్ తల్లి, ప్రతాప్ సాత్వికరూపంలోని అమ్మవారి భక్తులు. పాతాళభైరవిలోని నేపాళమాంత్రికుడు ఉగ్రరూపంలోని అమ్మవారి భక్తుడు. దేవత రూపాలూ, పూజించే పద్ధతులు వేరైనా ఆశించే ఫలితం ఒక్కటే. ఉగ్రపూజలో బలులు, తన అవయవాలను తనే నరుక్కోడాలూ, రక్తతర్పణాలూ ఉంటాయి. అయితే, నరుక్కున్న అవయవం, పోయిన ప్రాణం తిరిగి వస్తాయి! పాతాళభైరవిలోనే చూడండి…మాంత్రికుడు భైరవి ముందు చేతిని నరుక్కుంటాడు. తెగిన చోట సంజీవినీ మూలికను రాయగానే చేయి మళ్ళీ వస్తుంది. మాంత్రికుని తోటరాముడు బలి ఇచ్చినప్పుడు శిష్యుడు సంజీవినితో మాంత్రికుని బతికిస్తాడు.

సాత్విక పూజ బహిరంగం. ఉగ్రపూజ రహస్యం. అది ఏ పాతాళ గుహల్లోనో, నరసంచారం అంతగా లేని వనాలు, లేదా తోపుల్లోనో జరుగుతుంది. పాతాళభైరవిలో నేపాళ మాంత్రికుడి ఆవాసం పాతాళగుహే. అంతేకాదు, సాత్విక పూజ కంటే ఉగ్రపూజ పురాతనం, ఆదిమం.

ఈ ఉగ్ర, సాత్విక పూజా ప్రక్రియలు రెండూ ఒక తాత్విక సూత్రాన్ని చెబుతాయి: సాత్వికత లేదా ప్రసన్నత అనేది జీవం, జీవించడం, లేదా వెలుగు! ఉగ్రత అనేది హింస, ఆత్మహింస, చావు, కష్టాలు, చీకటి! మళ్ళీ ఈ సాత్వికత, ఉగ్రత అనేవి రెండూ ఒకే బొమ్మకు రెండు పక్కలే తప్ప వేర్వేరు కావు. ఎలాగంటే, జీవం నుంచి చావు పుడుతుంది. చావునుంచి జీవం పుడుతుంది. విత్తనాన్ని భూమిలో పాతి పెట్టడం చావు. దాని నుంచి మొక్క రావడం జీవం. కష్టసుఖాలు, చీకటి వెలుగులు ఇదే చక్రభ్రమణాన్ని అనుసరిస్తూ ఉంటాయి. ప్రాణాన్ని, లేదా పునరుజ్జీవనాన్ని పొందాలంటే చావును ఎదుర్కోవాలి. సుఖాలను అందుకోవాలంటే కష్టాల కారడవిలోకి(నలుడు, జగదేకవీరుడు, తోటరాముడు), కడగండ్ల సముద్రంలోకి(ఓడిసస్) సాహసోపేతంగా అడుగుపెట్టాలి. వెలుగులోకి రావాలంటే చీకటిలోకి పయనించాలి.

ఈ చక్రభ్రమణానికి అద్దంపట్టే భౌతికరూపాలు కొన్ని ఉన్నాయి. అవి: చంద్రుడు, సర్పము, పంట లేదా మొక్క మొదలైనవి. చంద్రునికి వృద్ధి, క్షయాలు ఉంటాయి. వృద్ధి అంటే జీవవికాసం, క్షయమంటే చావు. అలాగే వృద్ధి అనేది వెలుగు, క్షయమనేది చీకటి. సర్పం పాత చర్మాన్ని వదిలేసి కొత్త చర్మాన్ని ధరిస్తూ ఉంటుంది. దాన్నే కుబుసం విడవడం అంటాం. పాత చర్మాన్ని వదిలేయడం చావు. కొత్త చర్మాన్ని ధరించడం పునర్జన్మ. ఒక కాలంలో మోడువారిన చెట్టు ఇంకోకాలంలో చిగురిస్తుంది. ఇందులోనూ చావు-పుట్టుకల క్రమం ఉంది. అలాగే, ఒక విత్తనాన్ని భూమిలో సమాధి చేస్తే(చావు) దాని లోంచి మొక్క పుట్టి అనేక విత్తనాలను ఇస్తోంది.

images1

అర్తెమిస్-అక్తియాన్…అక్తియాన్ పై వేటకుక్కలు దాడి చేస్తున్న దృశ్యం

ఇలా చంద్రుడికీ, సర్పానికీ, మొక్కకూ కూడా తనకు ఉన్నట్టే చావు-పుట్టుకల లక్షణం ఉండడం మనిషిని ఆకర్షించింది. అయితే మనిషికి భిన్నంగా చంద్రుడు, సర్పము, మొక్క మళ్ళీ మళ్ళీ చచ్చి, మళ్ళీ మళ్ళీ పుట్టడం ప్రత్యేకించి మనిషిలో ఆలోచనను, ఆశను రేకెత్తించింది. తనకూ అలాగే పునర్జన్మ, బహుశా ఇప్పటికంటే మెరుగైన జన్మ ఉంటుందనిపించింది. అలా మనిషిలో ఒక ఆదిమ తాత్వికత అంకురించింది. ఆ తాత్వికతకు అనుగుణమైన ఆచారకాండ రూపొందింది. చంద్రుడు, సర్పము, పంట లేదా మొక్క గొప్ప తాత్విక ప్రతీకలు అయ్యాయి. ఆ అవడం ఏదో ఒక్క చోట కాదు, ప్రపంచంలో అనేక చోట్ల అయింది. ఒకచోట పుట్టిన ఈ తాత్వికతే ఇతర చోట్లకు విస్తరించిందన్న వాదమూ ఉంది.

మన దేవీ దేవులతోనూ, ఆరాధనా రూపాలతోనూ చంద్రుడికీ, సర్పానికీ, పంటకు లేదా మొక్కకూ ఉన్న ముడి తెలిసినదే. శివుని శిరసు మీద, అమ్మవారి శిరసు మీదా కూడా చంద్రవంక ఉంటుంది. శివుని మెడలో సర్పముంటుంది. సర్పాన్ని, చెట్టును పూజించడం మన దేశంలో ప్రతి ప్రాంతంలోనూ ఉంది. అమ్మవారి చేతిలో చెరుకుగడో లేదా మరో రకమైన పంటరూపమో ఉంటుంది. ఇవే ప్రతీకలు ఇతర పురాతన మత విశ్వాసాలలో, ఆరాధనా ప్రక్రియలలో కూడా ఎలా ఉన్నాయో త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

ఇక్కడ ప్రధానంగా గమనించవలసింది ఏమిటంటే, ఈ ఆదిమ తాత్విక సూత్రంలోనూ, ప్రక్రియలోనూ కీలకభూమిక పురుషదేవుడిదీ, పురుషుడిదీ కాదు; స్త్రీ దేవతదీ, స్త్రీదీ!

ఆదిమకాలంలో స్త్రీ శాసించిన ఆ మతవిశ్వాసరంగం ఓ రహస్యప్రపంచం. ఆ రహస్యప్రపంచానికి స్త్రీ రారాణి. అది చీకటివెలుగులు, భయనిర్భయాలు, కష్టసుఖాలు, చావుపుట్టుకలు అన్నీ కలగలసిన ప్రపంచం. అక్కడి దేవతలోని ఒక అంశ ఉగ్రకాళిగా, మృత్యుదేవతగా, రక్తపిపాసిగా కనిపించి భయపెడుతుంది. అంతర్లీనంగా ఉండే ఆ దేవత మరో అంశ, ప్రసన్నత, సాత్వికత. అది బతుకునీ, సుఖాన్నీ, వెలుగునూ ఇచ్చి నిర్భయుణ్ణి చేస్తుంది. గుహలు, తోపులు,వనాలు ఈ రహస్యప్రపంచ స్థావరాలు. ఆదిమకాలంలో అవే దేవతాలయాలు.

మన పురాణ, ఇతిహాసాలలో ఈ గుహలు, తోపులు, వనాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. విశేషమేమిటంటే, వీటి ప్రస్తావన ఇతర పురాణ, ఇతిహాసకథల్లోనూ రావడం! స్త్రీ రహస్యప్రపంచంలోకి మగవాడు అన్నివేళల్లోనూ ప్రవేశించడానికి వీల్లేదు. ప్రవేశిస్తే శిక్ష తప్పదు. అది మరణశిక్ష కూడా కావచ్చు. ఇప్పటికిప్పుడు స్ఫురించే ఒక కథలో నారదుడు స్త్రీల రహస్యప్రదేశంలోకి అడుగుపెట్టి స్త్రీగా మారిపోతాడు. ఇంకో కథలో పార్వతి తన ఒంటి నలుగుపిండితో గణపతిని చేసి, అతన్ని కాపలా ఉంచి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు శివుడు ప్రవేశించబోతాడు. గణపతి అడ్డుపడతాడు. శివుడు అతని శిరసును ఛేదిస్తాడు. ఆ తర్వాత ఒక ఏనుగు తలను అతనికి తగిలిస్తాడు. ఇది కూడా స్త్రీ రహస్యప్రపంచాన్ని సంకేతిస్తూ ఉండచ్చు. దేవీభాగవతం వంటి అమ్మవారికి సంబంధించిన పురాణాలలో మరిన్ని ఉదాహరణలు లభించవచ్చు.

ఇందుకు సంబంధించిన కథలు మన దగ్గరే కాక, ఇతర ప్రాంతాలలోనూ ఉన్నాయి. ఉదాహరణకు ఒక గ్రీకు పురాణ కథ ఇలా ఉంటుంది: ఓ నడివేసవి రోజున అర్తెమిస్ అనే దేవత ఒక కీకారణ్యపు లోయలో వేటాడి అలసిపోతుంది. కన్యా కూపం(Maiden’s Well), లేదా కన్యా సరోవరంలో జలకాలాడుతూ ఉంటుంది. ఆమెలానే వేటకు వచ్చిన అక్తయాన్ అనే పురుషుడు తన వేటకుక్కల వెంట సరిగ్గా అదే ప్రదేశానికి వచ్చి ఆమెను చూస్తాడు. అతను తను చూసింది ఇంకొకరికి చెప్పకుండా నివారించడానికి అర్తెమిస్ అతన్ని ఒక లేడిగా మార్చివేస్తుంది. అతనితో ఉన్న వేటకుక్కలు లేడి రూపంలో ఉన్న అతని మీద పడి తినేస్తాయి.

జగదేకవీరుని కథలో దేవకన్యలు జలకాలాడుతుండగా చూసిన ప్రతాప్ శిలగా మారిపోతాడు!

ఇంకో గ్రీకు కథలో లూకిపస్ అనే యువకుడు డఫ్నే అనే యువతిని ప్రేమిస్తాడు. స్త్రీ వేషంలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె సన్నిహిత నేస్తాలలో ఒకడిగా అయిపోతాడు. మిగతా నేస్తాలతోపాటు ఆమె వెంట వేటకు వెడుతుంటాడు. ఒకరోజున యువతులందరూ దుస్తులువిప్పి లాడన్ అనే సరోవరంలో జలకాలాడాలనుకుంటారు. లూకిపస్ అందుకు నిరాకరిస్తాడు. దాంతో వాళ్ళకు అనుమానం వస్తుంది. బలవంతంగా అతని చేత దుస్తులు విప్పించి, పురుషుడన్న సంగతి తెలుసుకుంటారు. అప్పటికప్పుడు అతన్ని కత్తితో పొడిచి చంపేస్తారు.

మన దేశంలో స్త్రీ రహస్యప్రపంచపు ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. చాలా వ్యాసాల క్రితం ఒక వ్యాసంలో దీని గురించి రాశాను.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 -కల్లూరి భాస్కరం

 

తాడిగిరి పోతరాజు: అగ్నిసరస్సున వికసించిన వజ్రం

10922018_1044900048857391_1205721763_n

( తాడిగిరి పోతరాజు : 1937-2015 )

 తాడిగిరి పోతరాజు అనగానే వెంటనే ఆయన రాసిన ‘ఎర్రబుట్ట’ కథ గుర్తొస్తుంది. తెలుగు కథ నుదుట దిద్దిన ఎర్రబొట్టు ఎర్రబుట్ట. ఆ కథని ప్రచురించిన కారణంగా విజయకుమార్ , యం.వి. తిరుపతయ్యల సారథ్యంలో కరీంనగర్   సాహితీ మిత్రులు నిర్వహించిన ఉద్యమ మాసపత్రిక ‘విద్యుల్లత’ నిషేధానికి గురైంది. ఆ తర్వాత 1971 లో ‘మెజార్టీ ప్రజలకి మనదేశంలో జరుగుతున్న అన్యాయాలతో , సాహిత్యరంగంలో , రాజీలేని పోరాటం సాగించటం , నిజాయితీని నిర్మాణ మార్గంలో మళ్ళించడం’ లక్ష్యంగా యేర్పడ్డ న్యూవేవ్ సంస్థ ప్రచురించిన ‘హోరు’ సంకలనం ద్వారా ‘ఎర్రబుట్ట’ పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని డొల్లతనాన్ని యెలక్షన్ల సాక్షిగా యెండగట్టిన ఆ కథ అప్పట్లో గొప్ప సంచలనం. నిషేధించడానికి పాలకులకి కావాల్సిన వనరులన్నీదిట్టంగా దట్టించిన కథ అది. దేశంలో జరిగే యెలక్షన్లకి ‘పిచ్చగుంట్ల’ విశేషణం తగిలించి , అవి వొట్టి బోగస్ అనీ ప్రతి మూడు సంవత్సరాలకు వచ్చే జాతర్ల లాంటివనీ – జాతర్లకు మేకలు , గొర్రె పోతులు బలయితే యెలక్షన్ల జాతర్లకి మనుషుల పుర్రెలు యెగిరి పోతుంటాయనీ అపహసించిన పోలీస్ కానిస్టేబుల్ సత్తెయ్య చెప్పిన కథ అది. ఆ తర్వాత చానాళ్ళకి నిద్ర లేచిన పతంజలి ‘ఖాకీ వనం’కీ , స్పార్టకస్ ‘ఖాకీ బతుకులు’ కీ నిప్పు అందించాడు. నిప్పు రవ్వగా వున్నప్పుడే నిషేధించాలని గద్దెలెక్కిన ప్రభువుల ఆరాటం. అది ఉక్రోషంగానో భయంగానో మారి ఎమర్జెన్సీ నాటికి రచయితని నిర్బంధించే వరకు వెళ్ళింది. విప్లవోద్యమలో ఎన్నికల బహిష్కరణ పిలుపుకి సైద్ధాంతికంగా వత్తాసు పల్కిన ఆ కథ ఇప్పటికీ బూటకపు ప్రజాస్వామ్యం అరికాళ్ళ కింద మంటలు పెట్టేదిగానే కనిపిస్తుంది.

‘రచయితలారా మీరెటువైపు?’ అన్న విశాఖ విద్యార్థుల ప్రశ్న సున్నిత మనస్కులైన కవుల్నీ రచయితల్నీ బుద్ధిజీవుల్నీ కుదురుగా కూర్చోనివ్వలేదు. అది కేవలం శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భం మాత్రమే కాదు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం క్రూరమైన అణచివేతకి గురైన సందర్భం. పసి పిల్లల్ని కూడా వదలకుండా కాల్చి చంపి ప్రజా ఉద్యమాన్ని నెత్తుటి మడుగుల్లో ముంచిన సందర్భం. ప్రజల పక్షంలో అక్షరాన్ని సాయుధం చేసిన పాణిగ్రాహి శ్రీకాకుళ పోరాట వారసత్వం ఉత్తర తెలంగాణాకి వ్యాపించడానికి రాజకీయంగా రంగం సిద్ధమైన కాలం. ఉద్దానం మహాదేవపూర్ లో రెక్కలు విప్పుకొంటున్న రోజులు. శ్రీకాకుళం ‘కాక’ శ్రీశ్రీ , కొకు , రావిశాస్త్రి , కారా లాంటి ఆ ప్రాంతపు రచయితల్తో పాటు కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ తాలూకాలో మారుమూలన ‘కోతులనడుమ’ ( వల్లభాపూర్ శివారు గ్రామం) లాంటి పల్లెటూరి వ్యవసాయ కుటుంబం ( తల్లి సారమ్మ – తండ్రి రాయపరాజు) నుంచి వచ్చిన పోతరాజు ని సైతం తాకింది. 1970 నుంచీ విరసంతో కలసి నడుస్తూ – పీడితుల విషాదాశ్రువుల్ని కాదు ; విలాపాగ్నుల్ని అక్షరీకరించాలని అతను నిశ్చయించుకొన్నాడు.

‘1969 తరువాత దేశంలోని రాజకీయ సంక్షోభాల కారణంగా నాలో మానసికమైన మార్పు వచ్చింది. కన్నీటి సాహిత్యం చదువుతూ , కన్నీటి సాహిత్యం సృష్టిస్తూ అన్ని వర్గాల ప్రజలను కదిలించలేమని అభిప్రాయపడ్డాను. కన్నీటికి కారకులైన దోపిడదారులను శిక్షించాలని , ఈ దోపిడీ వ్యవస్థను సమూలంగా మార్చివెయ్యాలన్న సంకల్పంతో కరీంనగర్ జిల్లాలోని ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నాను. తత్ఫలితంగా ఉద్యోగరీత్యా ఎన్నో ఇబ్బందులుపడ్డాను.’( పాతికేళ్ళ క్రితం – 1981 నవంబర్ స్వాతి సచిత్ర మాసపత్రిక కథల పోటీ లో ‘ఆరోహక గీతం’ కథకి బహుమతి వచ్చినప్పుడు చెప్పిన మాటలు).

ఎర్రబుట్ట రాయడానికి పది పన్నెండేళ్లకి ముందునుంచే ఆయన రాసిన కథలు ( తొలి కథ ‘గృహోన్ముఖుడు’ కథ 1958లో భారతి లో వచ్చింది) యెన్నోప్రసిద్ధికెక్కాయి. గాజుకిటికీ (1963) , ‘చివరి అంచున’ (1964) కథలు ఆంధ్ర ప్రభ కథలపోటీల్లో అవార్డులు పొందాయి. ‘మట్టి బొమ్మలు’ నవల ఆంధ్ర పత్రిక ఉగాది సంచిక (1966) పురస్కారాన్ని గెలుచుకొంది( సరిగ్గా కారా యజ్ఞం కథ రాసింది యీ రోజుల్లోనే ). ఎర్రబుట్ట కారణంగా విద్యుల్లత మీద విధించిన నిషేధమే ఆన్నిటికన్నా ‘నాకు పెద్ద అవార్డ’ని ఆయన పేర్కొన్నాడు. నిషేధ – నిర్బంధాలని అవార్డు రివార్డులుగా భావించిన నిబద్ధరచయిత తాడిగిరి పోతరాజు.

అందువల్ల తాడిగిరి రచనాప్రస్థానాన్ని ఎర్రబుట్ట కి ముందు ఎర్రబుట్ట కి తర్వాతగా విడదీసి చూడాలి. తాడిగిరి రచనా ప్రస్థానాన్నే కాదు; మొత్తం తెలంగాణా కథనే ‘ఎర్రబుట్ట కి ముందు ఎర్రబుట్ట కి తర్వాత’ అని అంచనా వేయాల్సి వుంటుంది. కవిత్వంలో ఝంఝా – మార్చ్- తిరగబడు ల్లాగా తెలుగు కథకి అందునా తెలంగాణా కథకి ఎర్రబుట్ట కూడా ఒక మైలురాయి. ఆ తర్వాతే కరీంనగర్ ఉద్యమ సాహితి నుంచి ‘బద్ లా’ కథా సంకలనం (1973) వెలువడింది. అందులోని ‘బ్లాక్ అండ్ వైట్’ కథ ఎర్రబుట్టకి కొనసాగింపులా కనపడుతుంది. ‘బద్ లా’ కోసం అల్లం రాజయ్య రాసిన ‘ఎదురు తిరిగితే…’ ఎమర్జెన్సీ తర్వాత సృజనలో అచ్చయింది. ఉత్తర తెలంగాణా రైతాంగ పోరాటాన్నీ , చరిత్రనీ , చైతన్యాన్నీ సాహిత్యంలోకి సాధికారంగా తీసుకొచ్చిన రాజయ్య లాంటి వాళ్ళు రాసిన కథలకి స్ఫూర్తి ఎర్రబుట్ట ద్వారానే లభించింది. ‘బద్ లా’ కథా సంకలనంలోని రచయితలంతా – ఒక్క పోతరాజు తప్ప – కొత్తవాళ్ళే.

పోతరాజు లాగానే ఎమర్జెన్సీ ‘చీకటి రోజుల్లో’ జైలుకెళ్ళిన  యం.వి. తిరుపతయ్య రాసిన ‘న్యాయం’ కథ కూడా ఈ సంకలనంలోనే వుండడం యాదృచ్ఛికమేమీ కాదు. ఎన్నో కలలతో ఈ నేల ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు ఆశగా దృష్టి సారించింది అనడానికీ , ఆ కలల్ని రాజ్యం పాశవికంగా చిదిమివేయడానికి పూనుకొంది అనడానికీ వుదాహరణ మాత్రమే. ఆ తర్వాత రాజయ్య , సాహూ , రఘోత్తం , రాములు , పి చంద్ … వీళ్ళంతా విప్లవోద్యమ సాహిత్యంలో పోతరాజుకి కొనసాగింపే. సాహిత్య రచనని సామాజిక బాధ్యతగానే కాదు విప్లవాచరణలో భాగంగానూ స్వీకరించిన పోతరాజుకి సాహూ (శనిగరం వెంకటేశ్వర్లు / వెంకన్న) అన్నివిధాలా శిష్యుడే. ముందస్తు జాగ్రత్తల ( పి డి ఆక్ట్ కింద ) కోసమో – భవిష్యత్తుల భద్రత కోసమో (ఎమర్జెన్సీలో) ఇద్దరూ అరెస్టయి జైలుని తరగతి గదిగా మార్చుకొన్నారు.

రెండు రెళ్ళు నాలుగంటే జైళ్ళు నోరు తెరిచిన రోజులవి. దేశమే జైలయిన ఆ కాలంలో ప్రగతి శీలమైన ఆలోచనలుండటమే నేరం. అధ్యాపకులూ న్యాయవాదులూ డాక్టర్లూ పౌరహక్కుల గురించి మాట్లాడే బుద్ధి జీవులూ కవులూ రచయితలూ కార్మికులూ విద్యార్థులూ … ప్రజాస్వామ్య హక్కుల గురించి ప్రశ్నించిన ప్రతి వొక్కర్నీ రాజ్యం శత్రువుగానే పరిగణించింది. తల మీద ఎర్రబుట్ట పెట్టుకొన్న పోలిస్ కానిస్టేబుల్ పాత్రముఖత: తీవ్రవాదులుగా పరిగణించే పీడితుల భాషని పలికించిన పోతరాజు పొలిటికల్ డెటిన్యూ కావడంలో వింతేమీ లేదు. జైలు జీవితం పోతరాజుని రచయితగా మరింత నిబద్ధుడయ్యేలా చేసింది. ఆయన ఎంతగానో అభిమానించే శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే ‘అగ్ని సరస్సున వికసించిన వజ్రమ’య్యాడతను.

వరంగల్ సెంట్రల్ జైల్లో గడిపిన స్వీయ అనుభవాలనూ , తోటి డెటిన్యూల ఖైదీల ఆవేదనలనూ, నిండా రెండు పదుల వయస్సులేని బిడ్డలు జైలు పాలైనప్పుడు వారిని చూడటానికి వచ్చే తల్లుల తండ్రుల మనోవ్యధనూ , భర్తలతో మిలాఖత్ కోసం నెలల తరబడి ఎదురుచూసే భార్యల దైన్యాన్నీ , డబ్బుతో పెరోల్ కొనుక్కొనే బూర్జువా రాజకీయ ఖైదీల డ్రామాలనూ, క్షమాభిక్ష అడిగితే కేసు మాఫీ చేస్తామన్నా తిరస్కరించిన యువకుల ధీరోదాత్తతనూ (ఆరోహక గీతం లో విద్యార్థి ఖైదీ అంభయ్య పాత్ర – సాహూనే కావొచ్చు) , మార్సిస్ట్ లెనినిస్టు రాజకీయ భావజాలాన్ని విశ్వసించిన వాళ్ళని జైలునుంచి మాయం చేసి అడవుల్లో ఎన్ కౌంటర్ పేర్న చంపేసే పోలీసు దురాగతాలనూ వొక రచయితగా , పౌర హక్కుల కార్యకర్తగా తర్వాతి కాలంలో ( 1980ల్లో) పోతరాజు కథలుగా మలిచారు. వట్టికోట ఆళ్వారు స్వామి ‘జైలు లోపల’ కథల్లా కాల్పనికతకి చోటులేకుండా యథార్థ జీవిత గాథల్లాంటి వాటిని ‘కెటిల్(ఎమర్జెన్సీ కథలు)’ పేరుతో హుజూరాబాద్ జనసాహితి సంపుటిగా వేసినప్పుడు (2009) సాహూకి అంకితం యివ్వడం గమనిస్తే విప్లవసాహిత్యోద్యమంతో పోతరాజుకి ఆజీవితం వున్న అనుబంధం , ఉద్యమ సహచరుడై తనతో నడిచిన విద్యార్థికి నివాళి ఘటించడంలో ఆయన వుదాత్త వ్యక్తిత్వం వ్యక్తమయ్యాయి. పాలకుల ఫాసిస్టు స్వభావాన్నీ , రాజ్య హింస వికృత రూపాన్నీ యెంతో బలంగా చెప్పిన యీ కథలు పోతరాజు ప్రాపంచిక దృక్పథాన్ని వెల్లడిస్తాయి.

విద్యార్థి దశలో శ్రీ శ్రీ మహాప్రస్థానం గీతాల స్ఫూర్తితో మార్క్సిజం చదవకుండానే మార్క్సిస్టునయ్యానని చెప్పుకొనే తాడిగిరి పోతరాజు తాను నమ్మిన రాజకీయ భావజాలాన్నే జీవితాంతం విశ్వసించి ఆచరించారు. నాజర్ బుర్రకథలూ , సుంకర ‘మాభూమి’ , వల్లం సాంస్కృతిక ప్రదర్శనలూ విని చూసి తాను కూడా రంగస్థల నటుడు కావాలని ఆశించారు. నటుడికి కావాల్సిన అన్ని హంగులూ ఆయనకున్నాయి. చెయ్యెత్తు మనిషి. స్ఫురద్రూపం. దృఢకాయం. ఉరుము లాంటి కంఠస్వరం. ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు డిక్షన్ , తెలుగులో అనర్గళంగా వుపన్యసించగల వాగ్ధోరణి ( మధ్యలో శ్రీశ్రీ కవితా పంక్తుల్ని వుటంకిస్తూ) యివన్నీ ఆయన్ని మంచి నటుణ్ణి చేసేవి. ఏ కారణంగానో నటుడు కాలేక రచనా రంగానికి పరిమితమై పోయారు.

అయితే నాటక శైలి ఆయన కథలకి అదనపు మెరుగులు తెచ్చింది. దారికి అడ్డొచ్చిన వాణ్ని ఎవర్నయినా ‘నగ్జలైటని కాల్చి పారేస్తే మాత్రం మనని అడిగేవాడెవడు’ అని బహిరంగంగా ప్రకటించే ‘బ్లాక్ అండ్ వైట్’ కథలో పోలీస్ హెడ్ నరసింహం సుదీర్ఘ సంభాషణలు రావిశాస్త్రి తర్వాతి కాలంలో అనితర సాధ్యం అనిపించేలా సృష్టించిన గవర్రాజెడ్డు( రత్తాలూ-రాంబాబు) , సూర్రావెడ్డు (మూడుకథల బంగారం) లకి సైతం పాఠం చెప్పే స్థాయిలో వుంటాయి. పోలీసు రాజ్యం లోతు పాతుల్ని , ధాష్టీకాన్నీ దగ్గరగా చూసి స్వయంగా చవి చూసిన యిద్దరు రచయితల మధ్య యీ పోలికలు సహజమే. 2008లో రాచకొండ రచనా పురస్కారం తీసుకొంటూ రావిశాస్త్రి రచనా శైలి పట్ల తన అభిమానాన్ని పోతరాజు చాలా స్పష్టంగానే పేర్కొన్నారు.

1963లో వొక లంపెన్ పాత్ర సుదీర్ఘ స్వగతంగా గుంటూరుజిల్లా మాండలికంలో రాసిన ‘గాజు కిటికీ’ పోతరాజు రచనా శిల్పానికి నిలువెత్తు నిదర్శనం. మాగోఖలే తర్వాత గుంటూరు భాషని కథల్లో యింత అద్భుతంగా పట్టుకొన్నది పోతరాజేనేమో. ఆ భాషా సౌందర్యానికి ముచ్చటపడే పాపినేని శివశంకర్ తమజిల్లా రచయితగా ఆయన్ని own చేసుకొన్నాడు (దక్షిణ తీరాంధ్ర కథ – నిశాంత , పే.105). ఎర్రబుట్ట రాసేదాకా ఆయన్ని ‘గాజుకిటికీ పోతరాజ’ని పిల్చేవారంటే ఆ కథ వస్తు శిల్పాలు యెలాంటివో అర్థమౌతుంది.

నిజానికి తెలంగాణలో ‘కోతుల నడుమ’ లాంటి కుగ్రామం తన సొంతూరు అని చెప్పుకొన్నప్పటికీ పోతరాజు జీవితం కోస్తా ప్రాంతంతో యేదో వొక మేరకి ముడివడి వుంది ( బాల్యం తణుకు లో గడిచిందనీ , గుంటూరులో చదువులు నడిచాయనీ ఆయనే యెక్కడో పేర్కొన్నట్టు గుర్తు). అందుకే కథల్లో అవసరానుగుణంగా పాత్రోచితమైన కోస్తా భాషని గొప్ప మెలకువతో వుపయోగించడం చూస్తాం.

పోతరాజు కథల్లో యెత్తుగడలూ ముగింపులూ ఆయన ప్రత్యేకతకి కొండగుర్తులు. చాలా కథలు యెత్తుగడ వాక్యంతోనే ముగుస్తాయి. కథల్లో యిటువంటి ముగింపుల్ని తాడిగిరి మార్కు ముగింపులని పేర్కోవడం కూడా వుంది. మంచి కథల్లో రచయిత దృక్పథం ముగింపుల్లో స్పష్టమోతుంది. అయితే దృక్పథాన్ని ఆవిష్కరించే పనిలో ఆయన కళాత్మక విలువలతో యెక్కడా రాజీ పడలేదు. ఏ ముగింపూ స్లోగన్ లానో అవాస్తవికంగానో వుండడమో చూడం.

నికార్సైన రాజకీయ దృక్పథంతో ప్రజాస్వామ్య హక్కులకోసం పిడికిలి బిగించే గొంతులు బలపడాల్సిన యివాల్టి సందర్భంలో మత ఫాసిస్టు శక్తులు సామ్రాజ్య వాద గూండాలూ కొత్త పొత్తుల కోసం దారులు వేస్తున్న దశలో వొక పూనికతో పీడిత జన పక్షం వహించి నూతన మానవ ఆవిష్కరణ కోసం తన సాహిత్యాన్ని అంకితం చేసిన తాడిగిరి పోతరాజుని స్మరించుకోవడం అంటే ఆయన నమ్మిన రాజకీయ భావజాలానికి పునరంకితం కావడమే.

రెండు తరాల విప్లవ రచయితకి ఎర్రెర్రని పూల నివాళి.

  • -ఎ.కె.ప్రభాకర్

 

 

ఒక చారిక

drushya drushyam-5

భుజానికి వేలాడే కన్నుతో రోడ్డుమీదో లేదా వీధిలోనో తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో చేయగలం.
ఒక సీతాకోక చిలుక మరణం కలచివేస్తుంది. ఒక దృశ్యాదృశ్యం.
ఒక కప్ప మట్టిలో అణిగిపోయి, విగతజీవి అయి, ఉట్టి దొప్ప కానవస్తూ ఉంటుంది. అదొక దృశ్యాదృశ్యం.
ఎలుకే కాదు, ఒక పిల్లి కూడా నల్లగా మరణిస్తుంది. అదీ దృశ్యాదృశ్యం.
బతికిన క్షణాలే కాదు, మరణించిన క్షణాలూ బతికిస్తూ ఉంటై, కాళ్లకు తగులుతూ ఉంటై.
నడుస్తూ ఉంటే నడకను మించిన చూపు లేదు.
నడువు, కనిపిస్తుంది జీవన రహదారి.

ఇదీ అదే.
ఒక నడక.

చారిక.

నేను నడుస్తూ ఆగిపోయాను.
అది నడుస్తూ ఉంది, నా వైపు.

గల్లీలో ఒక వైపు.
అది ఇటు…నేను అటు.
అప్పటికే అది దెబ్బ తిని ఉన్నట్టుంది.
రెండు అడుగులు వేసి మళ్లీ అగుతున్నట్టు అడుగు వేయక ఆగుతుంది.

మన దృష్టిలో అడుగు చిన్నదే. కానీ దాన్ని అడిగితే తెలుస్తుందేమో!
అడుగుదామనే ఆగాను.
ఆగిందీ. తీస్తే ఇది.
దృశ్యాదృశ్యం.

+++

అడుగడుగునా దాని కదలిక వేరు.
నిశ్శబ్దంగా ఒక చిన్నప్రాణినే చూస్తూ ఉంటే, దాని ఆయసాన్నే గమనిస్తూ ఉంటే….కెమెరా వ్యూ ఫైండర్ లో అది నాకు ఏనుగే అయింది. దాని మహా విగ్రహాన్ని అర్థం చేసుకుని దాని మహాభినిష్క్రమణం ఎప్పుడో తెలియక, బతుకు జీవుడా అన్నట్టు అది కదులుతూ ఉంటే దాన్ని కనులతో పరికిస్తూ ఆ చారలో గుండా దాన్నికెమెరాతో వెంబడించడానికి నాకు పట్టింది ఒక యుగం.

కదలదే!

ఈ మనిషి దానిపై వేసే వేటు చిత్రమే అని దానికి తెలియక ఆగిందనిపించి, వెనక్కి జరిగి, జ్యూమ్ లెన్స్ ఉందని తోచి వెనుకడుగు వేసి మళ్లీ చిత్రంలో అవసరమైనంత బొమ్మను పట్టడమూ ఒక గ్రఫి. ఫొటోగ్రఫి.

చిత్రమేమిటంటే అది ఆ పగిలిన వాకిలిలోని ఒక సన్నని చారను, ఆ ఛాయను ఆశ్రయించి కదులుతూ ఉండటం. ఆగి ఉండటం. నిలబడిందా కూచుందా చెప్పలేను. కానీ, అప్పుడు తీశానీ చిత్రాన్ని.

ఆ తర్వాత కొన్ని అడుగులే వేసింది.
తర్వాత కుడివైపు తిరిగి ఒకరింట్లోకి వెళ్లింది.
ఆ తర్వాత అదృశ్యం. మిగిలిందే ఈ దృశ్యం.

+++

ఇక మనింట్లో వినిపించేవే. మామూలే.
ఎలుక కనబడుతోంది. బోను వెతకాలి.
ఎలుక వచ్చి పడింది. ర్యాట్ పాడ్ కొనాలి. దాని సంగతి చూడాలి.
ఎన్ని మాటలో. ఎంత చికాకో.
కానీ దానికి వినపడుతుందో లేదోగానీ, ఆ ఇంట్లో అది తప్పక కనిపిస్తుంది వాళ్లకు.
అంటూనే ఉంటారు, ఏవేవో!

కానీ చిత్రం.
ఈ చిత్రం వాళ్లింట్లో ఉండదుగానీ మీ ఇంట్లో ఉంటుంది.
మీరు వేరే తరీఖ చూస్తారు. అది నా అదృష్టం. దాని అదృష్టమూ.
అదే దృశ్యాదృశ్యం.

కానీ, చిత్రాతి చిత్రం పాత ఇళ్లు.
పాత వీధులు. పాత నగరాలు…అక్కడే ఇవి ఎక్కువ.
కానీ, కొత్తగా అవి ఎప్పటికప్పుడు తమ సర్వైవల్ గురించి ఆలోచిస్తాయి.
వాటికీ రంగు తెలుసు. వాసనా తెలుసు. ఎక్కడ నుంచి నడవాలి. ఎలా కదలాలి. ఎలా తప్పించుకోవాలీ…అన్నీ తెలుసు. అందుకే చార అనడం. చారలో ఎలుక నిలకడ అనడం.

అయినా గానీ, ఎంత కొత్త నగరమైనా ఎప్పటికైనా పాతబడేదే కదా!
మరి ఎలుక ఖాయం. ఎప్పటికైనా.

అందుకే అనడం, మనుషుల ప్రపంచంలో మనుషులే వద్దని ఈ చిత్రం.
చావుబతుకుల జీవితంలో బతుకూ ఒక చిత్రమే అని ఈ చిత్రం.
ఒక రహస్యం…వీధుల్లో నడిచేటప్పుడు ఎవరి దిష్టి లేకుండా దృష్టి లేకుండా తనను తాను కానరాకుండా చేసుకోవడం ఒక దృశ్యాదృశ్యం.

మన జీవావరణంలో తప్పించుకోలేని వర్ణం ఈ చార- చిత్రమనీ చెప్పడం.

అయితే ఒక మాట.
ఎలుక, సుందెలుక, పందికొక్కు…
ఏదైనా కానీ, కనిపించడం గురించి ఒక మాట.

మనం కాళ్లతో నడవడం, చక్రాలున్న మోపెడ్ పై వెళ్లడం, మూడు లేదా నాలుగు చక్రాల వాహనంపై పయణించడం -బాగానే ఉంది. కానీ, ఎలాగో ఒకలాగ కాదు, నడిచినప్పుడు కనిపించేవి వేరు. ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్లేప్పుడు వేరు. ఎవరైనా తోడు ఉన్నప్పుడు వేరు.  ఇక కార్లలో ప్రయాణించేటప్పుడు ఇంకా వేరు. దృశ్యాదృశ్యం వేరువేరని!

మనం ఉన్నస్థితి ఒక్కటే ప్రధానం కాదు.
మనం వాహికగా ఉండటంతోనే సరిపోదు.
నడవాలి. నడిచినప్పుడు కనిపించేవి వేరు.
నడక వేరుగా ఉంటుందనడానికీ ఈ చిత్రం ఒక ఉదాహరణ.

నా వరకు నేను మనుషులనే చిత్రిస్తానని అనుకోలేదు.
ఎలుకలని కూడా. పిల్లులని కూడా చిత్రిస్తూ ఉన్నాను..
నా నడక ఇది.

ఐతే,, నడక చిత్రం ఒక చెలగాటం.
అవును. ఒక్కోసారి పిల్లీ ఎలకా చెలగాటం.
చూశారా ఎప్పుడైనా.
అదొక సర్కస్.

పట్టుకుని వదిలి… మళ్లీ పట్టుకుని వదిలి…
పిల్లి ఎంత సాధిస్తుందో, ఎంత ఆనందిస్తుందో తెలుసా, ఎలుకని!
దానికి పిల్లలు పుట్టవచ్చుగాక. అది ఆహార సముపార్జనే కావచ్చు. కానీ ఎలుక ఒక ప్రాణి. దానికీ కథ ఉంది.
అది దాచుకుని దాచుకుని బతకడం…ఒక చీకటి చారను చూసుకుని దానిగుండా బిక్కు బిక్కుమంటూ వెళ్లడం ఒక ఛాయ. అందుకే మనిషికి చెప్పడం. నీలాగే దానికీ క్రీనీడల్లోంచి వెళ్లడం తెలుసని!.

ఇంకా చెబితే…
నడిచి చూడు. దానిలాగా అని!
ఆగిఆగి. మెలమెల్లగా కదిలి చూడు…బతుకుతావు పదికాలాలు.
ఇక ఇంట్లోకి వెళ్లు. అదే దృశ్యాదృశ్యం.

 

–  కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh

దేవుడే కీలుబొమ్మ?!

gopala

గోపాల…గోపాల ….. హిందీ సినిమా “ఓ మై గాడ్ “ కి రీమేక్ గా తెలుగు లో రూపొందిన చిత్రం, హిందీ సినిమాలో మామూలు సినిమా గా విడుదలై, అనూహ్య విజయాన్ని సాధించిన చిత్రం అయితే తెలుగు కు వచ్చే సరికి ఒక మల్టీ స్టారర్ చిత్రం గా మారింది . మల్టీ స్టారర్ అందులోనూ పవన్ కళ్యాణ్, అందులోనూ దేవుడు గా నటించటంతో  ఈ సినిమా ఓపెనింగ్స్ కి ప్రేక్షకులు బారులు తీరారు . దాదాపు సంవత్సర కాలంగా తెలుగు ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చిన ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ మాత్రం హడావుడి, ఉత్సాహం సహజం .

ఇక కథాంశం కి వస్తే , రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఒక వినూత్నమైన పాయింట్ ని బేస్ చేసుకున్న కథ. దేవుడు అస్తిత్వాన్ని ప్రశ్నించే కథ. సంస్కృతి , సాంప్రదాయాలు, భక్తి విపరీతంగా ఉన్న మన దేశంలో ఇలాంటి ఒక కథ ను సినిమాగా మలచాలి అనుకోవటం ఒక పెద్ద సాహసమే.  ఒక వైపు” పీకే” సినిమా పై వివాదం కొనసాగుతుండగా , ఇలాంటి సినిమా ఇక్కడ విడుదల కావటం ఒక విశేషం.  ఈ సినిమా మీద కూడా అప్పుడే వివాదాల నీడ పడింది . దేవుడున్నాడా ! లేదా !! అనే  వాదన తో ప్రారంభం అయి, దేవుడి అస్తిత్వం ద్వారా, అసలు దైవత్వం అంటే ఏంటో తెలియచేసే ప్రయత్నం ఈ సినిమా .

నిజానికి ఇప్పుడు భక్తి అనేది ఒక వ్యాపారం . ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే భక్తి అనేది భయం గా మారి, దెయ్యానికి దేవుడికి ఇద్దరికీ భయపడే పరిస్థితి. ఇద్దరికీ భయపడితే దెయ్యానికి, దేవుడికి తేడా ఏముంటుంది ??. దేవుడిని గౌరవించాలి, అతను చూపించిన  మార్గాన్ని అనుసరిస్తూ జీవనం సాగించాలి , కానీ మనం చేస్తున్నదేమిటి ?? దేవుడిని ఒక వ్యాపార వస్తువు చేసి, మన లోని బలహీనతలను, మన తప్పులను మన్నించమని , మనం చేసిన తప్పులకు బదులుగా దేవుడికి కానుకలు సమర్పిస్తూ , ఆ కానుకల వల్ల మన ఖాతాలో  పాపాలు తగ్గాయి, పుణ్యాలు పెరిగాయి , కాబట్టి మనం పుణ్యాత్ములం అనే ఒక భ్రమ లో బ్రతుకుతున్నాం.

అందుకే దేవాలయాలకు,చర్చిలకు, మసీదులకు  అంత గిరాకీ పెరిగింది,  వీధికొక్క దేవుడు పుట్టకొస్తున్నాడు, ఇంతకు ముందు పురాణాలలోనో, బైబిల్ లోనో, ఖురాన్ లో ఉదహరించిన  దేవుళ్లే కాకుండా , ఆ దేవుళ్ళకు రిప్రజంటేటివ్ గా బాబాలు, ముల్లాలు, ఫకీర్లు , బిషప్ లు …పేరు ఏదైతేనేం ఆ దేవుడి పేరు మీద వ్యాపారం చేసే వాళ్ళతో నిండిపోయింది, దేవుడుని గదిలో బందీని చేసి ఆ దేవుడిని ఒక బొమ్మను చేసి, ఆ బొమ్మ కి ఒక క్రేజ్ వచ్చేలా చేసి , ఆ బొమ్మను ఊరూరా తిప్పి ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకొనే వ్యాపారం, నిజంగా దేవుడున్నాడో లేదో తెలియదు కానీ, ఆ దేవుడి పేరు మీద వ్యాపారం మాత్రం నూటికి నూరు శాతం నిజం . ఇలాంటి వ్యాపారం మీద వ్యంగ్యాస్త్రం ఈ సినిమా . దేవుడు గుళ్ళో లేడు, చర్చిలోనో, మసీదులోనో లేడు , మనిషిలో ఉన్నాడు , మనిషి చేసే మంచిపనే దైవత్వం అని చెప్పే ప్రయత్నం ఈ సినిమా. కథాంశం పరంగా ఈ సినిమా ఒక మంచి సినిమా అనటంలో ఎలాంటి సందేహం లేదు .

దేవుడి బొమ్మలతో వ్యాపారం చేసే గోపాల రావు దుకాణం భూకంపం లో కూలిపోతుంది. దాని కోసం ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం ప్రయత్నం చేస్తాడు, కాకపోతే ఇది ‘యాక్ట్ ఆఫ్ గాడ్ ‘మామూలు భాషలో చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ క్లైమ్ ని తిరస్కరిస్తుంది . ఏమి చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో గోపాలరావు ఆ దేవుడి వల్ల దుకాణం కూలిపోయింది కాబట్టి దేవుడే నష్ట పరిహారం చెల్లించాలి అనే వాదనతో కోర్ట్ ని ఆశ్రయిస్తాడు . ఇక్కడే అసలు దేవుడు అంటే ఎవరు అనే ప్రశ్న ఎదురు అవుతుంది . ప్రత్యేకంగా దేవుడు అంటే ఎవరు అని చెప్పలేనప్పుడు దేవుడి ప్రతినిధులుగా చెప్పుకుంటూ ఆశ్రమాలు నిర్వహిస్తున్న, వాటికోసం దేవుడి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఆశ్రమ నిర్వాహకులు నష్ట పరిహారం చెల్లించాలి అని వాదిస్తాడు, ఇది దేవుడినే ప్రశ్నించటం అని ఆశ్రమ నిర్వాహకులు వాదిస్తారు, కొంతమంది గోపాల రావు పై భౌతిక దాడులకు కూడా ప్రయత్నిస్తారు.

సరిగ్గా అప్పుడే దేవుడే స్వయంగా గోపాలరావును రక్షిస్తాడు. తనని రక్షించింది దేవుడు అని తెలియని గోపాల్రావు అతడిని తనలాగే మామూలు మనిషి అనుకుంటాడు . అప్పటినుండి దేవుడు గోపాలరావుకు తోడుగా ఉంటూ తన అస్తిత్వాన్నే ప్రశ్నిస్తున్న గోపాలరావు ద్వారా తన అస్తిత్వాన్నే తానే స్వయంగా ప్రశ్నించుకోవటం విచిత్రం .  తన అస్తిత్వం ఎక్కడో లేదు . ప్రతి మనిషి లో ఉంది. ఎదుటి మనిషిలోని మానవత్వాన్ని గుర్తించటమే దైవత్వం అని మనకు తెలియ చెప్పటమే స్టూలంగా కథాంశం . కానీ ఆ తెలియచెప్పే పద్దతే ఒక మెసేజ్ లానో, ఉపదేశం లానో కాకుండా ఇప్పటి జనరేషన్ కు తగ్గట్లు ఎక్కడా డైరెక్ట్ గా చెప్పకుండా చెప్పటమే ఈ సినిమాలో ఆకట్టుకొనే అంశం . అసలు దేవుడు బొమ్మలు అమ్ముకొనే గోపాలరావుతో దేవుడినే బొమ్మను చేసి ఆడుకొనే వ్యవస్థను ప్రశ్నించటం అనే ఎత్తుగడలోనే కథకుడి గొప్పతనం కనిపిస్తుంది .

ఇలాంటి గొప్ప ఆలోచన చేసిన ఉమేష్ శుక్లా ,భావేష్ మండాలియా నిజంగా అభినందనీయులు . ఈ సినిమాలో మరో గొప్ప విషయం అసలు  దేవుడిని వ్యాపారం చేసే ఏ వ్యవస్థకు  వ్యతిరేకంగా, గోపాలరావు తన పోరాటం చేశాడో ఆ గోపాల రావునే ఆ వ్యవస్థ దేవుడిని చెయ్యటానికి ప్రయత్నించటం ( నిజానికి సహజంగా ఇదే జరుగుతుంది),  కాకపోతే ఇది సినిమా కాబట్టి ఒక సినిమాటిక్ ఎండ్ తో ఆ ప్రయత్నాన్ని హీరో వమ్ము చేస్తాడు. దైవత్వాన్ని కాక, దేవుడిని నమ్మే సమాజం మీద సంధించిన వ్యంగాస్త్రం ఈ సినిమా ,

ఇక సాంకేతికాంశాల  విషయానికి వస్తే  ఇది కథా బలమున్న సినిమా గా కన్నా, మల్టీ స్టారర్ సినిమాగానే ప్రాచుర్యం పొందింది, ప్రేక్షకులు కూడా దీన్ని అలాగే రిసీవ్ చేసుకున్నారు .  పవన్ కళ్యాణ్ తన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మేన్స్ తో దేవుడిగా ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు అనటం లో సందేహం లేదు  వెంకటేష్ తన పరిధి మేరకు బాగానే నటించాడు కానీ, పరేష్ రావల్ తో పోల్చి చూస్తే కొంచెం నిరాశ తప్పదు . పోల్చక పోతే ఏ బాధా లేదు . శ్రియ కు నటించటానికి పెద్ద ఆస్కారం లేదు. ఇక దర్శకత్వం విషయానికొస్తే హిందీ సినిమాని ఫ్రేమ్ టు ఫ్రేమ్ తెలుగులో సెట్ చేయటంలో సక్సెస్ సాధించాడు అనే చెప్పాలి . చివరకు ఉత్తరాది వారు వాడే డ్రస్సులే తెలుగులో కూడా వాడారు అంటే ఆ సినిమాని తెలుగులోకి అనువదించటానికి  ఎంత ప్రయత్నించారో  తెలుసుకోవచ్చు . అనూప్ రూబెన్స్ సంగీతం , జయన్ విన్సెంట్ ఫోటోగ్రపీ సినిమా స్థాయి కి తగ్గట్లే ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, వెంకటేష్ ఫ్యాన్స్ ని తృప్తి పరుస్తుంది అనటంలో సందేహం లేదు, రెగ్యులర్ కమర్షియల్ అంశాలు లేకపోవటంతో ఈ సినిమా మిగతా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచి చూడాలి.

-మోహన్ రావిపాటి

mohan 

జాయపసేనాని

OLYMPUS DIGITAL CAMERA

 

దృశ్యం  : 3

 

(క్రీ.శ. 1225 జాయప వయస్సు 36 సంవత్సరములు. గుర్రపు డెక్కల, సైన్యసందోహధ్వని..వేయిస్థంబాల దేవాలయంలోకి గణపతిదేవుడు, జాయపనేనాని, గుండనామాత్యులు, రాజనర్తకి మాళవికాదేవి..ప్రవేశం…గర్భగుడిలోని రుద్రేశ్వరాలయంలో శివస్తుతితో కూడిన  మంత్రోచ్ఛారణ…మంగళకర ధ్వని…)

వందిమాగధులు :    జయహో…విజయహో..రాజాధిరాజా…రాజమార్తాండ…సకల దేశ ప్రతిష్ఠాపనాచార్య…కాకతి రాజ్యభార దౌరేయ శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తి…జయహో…విజయహో…

ఆలయ ప్రధాన అర్చకులు : స్వాగతము… మహాచక్రవర్తులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులుం గారికి స్వాగతం..సుస్వాగతం.

గ.ప.దే : రుద్రాలయ ప్రధాన అర్చకులుగారికి అభివాదములు..ఖడ్గాన్ని ధరించిన హస్తంతోనే నాట్యాభినయం చేసి కత్తినీ, కలాన్నీ ఒకే చేత్తో సమర్థవంతంగా ప్రయోగించి ఖ్యాతివంతుడు కావడం మన సేనానీ, గజసైన్య సాహిణి, నాట్యకోవిదుడు, వీరాగ్రేసరుడు, అరివీర భయంకరుడైన జాయపసేనానికే సాధ్యమైనది. వారు గత నాల్గు వత్సరములుగా సృజించిన కావ్యశాస్త్రము…’గీత రత్నావళి’ మహాగ్రంథము ఈనాటికి సంపూర్ణమైనది. దీనిని శివసాన్నిధ్యంలో పరమేశ్వరునికి అంకితమొనర్చుటకై మా రాక..తగువిధముగా ఆ గ్రంథసమర్చనకు ఏర్పాటు చేయండి. జాయనా..పట్టు వస్త్రములో ఒదిగిన ఆ ‘గీత రత్నావళి’ గ్రంథమును దైవసన్నిధిలో సమర్పించి ప్రజాపరం చేయండి..

జాయన : ఆజ్ఞ మహాప్రభూ…గణపతి దేవులుంగారి శుభాశీస్సులతో రూపుదిద్దుకున్న ఈ ‘గీత రత్నావళి’ గ్రంథ సృజనకు కారకులు, పోషకులు, ప్రేరకులు అన్నియును మహాప్రభువులే. వారికి కృతజ్ఞతాభివందన చందనములు అర్పించుకుంటూ..,

ప్ర.అ.: (గ్రంథమును పట్టుబట్టతో సహా అందుకుంటూ…) మహాప్రసాదం…ఈ అక్షరామృత నిధిని శివ కృపార్థం సమర్పించే మహాభాగ్యం మాకు లభించడం మా సుకృతం..ఓం రుద్రాయ…(రుద్రస్తుతి ప్రారంభం..ఆలయం గంటలు…అభిషేకం..సంరంభం… శంఖధ్వని..)

గ.దే : జాయనా…మాపెద్ద తండ్రిగారైన రుద్రదేవుడు 1162 ప్రాంతంలో కాకతీయ స్వతంత్ర సామ్రాజ్యమును ప్రకటించిన సందర్భంలో కట్టించిన త్రికూటాలయమే ఈ సహస్ర స్తంభాలయం. ఇక్కడ రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యదేవుడు కొలువై ఉన్నారు. విష్ణు ఆలయమునకు అద్భుతంగా అదిగో అక్కడే ఉత్తరాభిముఖముగా ఆసీనుడై ఉన్న నంది ”విష్ణునంది”. సర్వాంగ స్వర్ణాభరణ శోభితమై బలిష్టుడైన బసవేశ్వరుడు పొంగివచ్చిన రక్తనాళాలతో సహా సజీవ మహాసౌందర్యంతో మనను ఎప్పడూ పిలుస్తూంటాడు. నంది వెనుక ఉన్నది రంగ మండపము. నందీశ్వరుని అవతారమైన వీరభద్రునికి ప్రతీకగా, రుద్రుడు మన ఇలవేల్పుగా సిద్ధపరుస్తూ ఈ సహస్ర స్తంభాలయములో చెక్కిన ప్రతి శిల్పం మన సమకాలికులైన చాళుక్యుల, హొయసళుల శిల్పరీతులకు భిన్నమై ఉత్తమోత్తమమై , ఉన్నత  ప్రమా ణములతో విరాజిల్లుతున్నది.

గుండనా : సృజనకారులెవరైనా ఎప్పుడూ తన కృతిచేత, విలక్షణ శైలిచేత ప్రత్యేకంగా పరిగణించబడాలి. కాకతీయుల శిల్పం, నృత్యం, గీతం, వాద్యం…అన్నీ విశిష్టమైనవే. కాకతీయ శిల్పంలోని ప్రధాన లక్షణం గతి శీలత. ఇందులోని ప్రతి మూర్తీ ప్రాణ లయతో ప్రకంపిస్తున్నట్టు గోచరిస్తుంది. (అప్పుడే..రుద్రాభిషేకంతో పాటు…ఉచ్చైస్వరంలో పంచమహావాద్యాలు హోరెత్తాయి). మన ప్రత్యేకత..పంచ మహాశబ్దాలు…అవి అనంత విజయం, పౌండ్రము, దేవ దత్తం, సుఘోష, మణి పుష్పకం…మరియు పంచమహావాద్యాలు అవి శృంగము, శంఖము, మృదంగము, భేరి మరియు ఘనము. ఇవిగాక నిస్సహణము, కాంస్య తాళములు, కాహళము, మహామద్దెల…యివన్నీ శబ్ద గంభీరతను తురీయ స్థాయికి చేర్చి రుద్ర  తాండవ రౌద్రతను హెచ్చింపచేస్తాయి. కాకతీయ జీవనం ప్రధానంగా వీర రసభరిత, శౌర్య సమ్మిళితం.

మాళవిక : కాకతీయ నృత్యము కూడా అత్యంతోత్తమమైనది. రంగ మంటప నాట్యస్థలిపై ప్రవేశించి..త్రిభంగిమలో నిల్చి, అంగ సంచలనం చేస్తూ భ్రూ లతలను నర్తింపచేస్తూ, శిరః కంపనము అంగుళీ స్ఫోటనము చేస్తూ వంజళము, ఢాళము, వళి, దిరువు, బాగు, వాహిణి, సాళి, బయగతి, సుగతి, బహుగతి అనే వివిధ గతులను, భంగిమలను అభినయించడం మన కాకతీయుల విలక్షణ దేశీ నృత్యరీతి. యిది సకల జనరంజకమైనది, పరవశ ప్రధానమైనది.

ప్రధాన అర్చకుడు : శివానుగ్రహమునకు ప్రాత్రమైన ఈ ‘గీతరత్నావళి’ గ్రంథం ఆచంద్రార్థం బుధజనరంజకంగా వర్థిల్లుగాక.. స్వీకరించండి.

(జాయన పట్టు దస్త్రమును స్వీకరించి గణపతిదేవుని చేతుల్లో ఉంచి ముందు తలవంచాడు)

గ.దే : మహేశ్వరాశీర్వాద ప్రాప్తిరస్తు..ఈరోజు ఎంతో సుదినము. తెలుగుజాతికి ‘గీతరత్నావళి’ అనే సంగీత, సాహిత్య సమ్మేళనాల ఆత్మరహస్యాలను విప్పిచెప్పగల ఒక ప్రామాణిక గ్రంథము లభించినది. ఈ ఘట్టము చరిత్రలో శాశ్వతమై నిలిచిపోతుంది.

మాళవిక : మహాప్రభువులకొక విన్నపము.

గ.దే.: తెలియజేయుము మాళవికా…మా రాజనర్తికి ఊరికే కల్పించుకోదు

మాళవిక : సూర్యుడొక్కడే ఐనా చీకట్లను చీల్చగల వెలుగులనూ, ప్రాణకోటిని మేల్కొలిపి సృష్టిని జీవన్వంతం చేయగల ఉష్ణకిరణ సందోహాలనూ, ప్రచలిత మార్మిక జీవశక్తినీ ప్రదానం చేసినట్టు.. యిన్నాళ్ళూ నృత్యశాస్త్ర అధ్యయనంలో జాయపసేనానితో సహకరిస్తూ సంగతిస్తున్న నేను అతని యందు నిబిడీకృతమై ఉన్న యితర సృజన రంగాల కళా విశారదకతనూ గమనిస్తున్నాను. ఆయన నృత్య, వాయిద్య రంగాలతోనే కాకుండా కరి గణాధ్యక్షుడుగా ఉంటూనే యుద్ధ తంత్రజ్ఞతతో అనేక విజయాలనుకూడా కాకతీయ సామ్రాట్టులకు సంపాదించినారు కదా…అందుకని..

గ.దే : భళా..మాకర్థమైనది…సరిగ్గా మా మనసులో ఎప్పటినుండో నిప్పుకణికవలె మెరుస్తున్న మహదాలోచననే మాళవిక గ్రహించి వ్యక్తీకరించినది..భళా…జాయనా..,

జాయన : మహాప్రభూ..

గ.దే : ఎప్పుడైనా ప్రతిభాశీలి యొక్క  ప్రజ్ఞ స్వయంగా అతనికి పూర్తిగా తెలియదు. నీలోని బహుముఖ సమర్థత నీకంటే మాకే ఎక్కువ తెలియును. గత పదేళ్లుగా నాట్యాచార్య గుండనామాత్యుల వద్ద నీవు పొందుతున్న నృత్య శిక్షణ, మేము అప్పగించిన అనేక దండయాత్రల బాధ్యులను అద్భుతముగా నిర్వర్తించి మాకు సంప్రాప్తింపచేసిన విజయపరంపర..నీ వాద్య నిర్వహణ పద్ధతి…వీటన్నింటినీ మేము ప్రత్యేకముగా, సునిశితముగా ఎప్పటినుండో పరిశీలిస్తూనే ఉన్నాము…యిప్పుడిక ఒక స్ఫుట నిర్ణయానికొచ్చి నిన్ను ఆదేశిస్తున్నాము. భవిష్యత్తులో నీవు నీ సకల సృజనాత్మకశక్తులన్నింటినీ ప్రోదిచేసుకుని సరస్వతీ కటాక్షముతో మూడు ప్రధాన గ్రంథములను సృజియించవలె. అవి…’నృత్య రత్నావళి’, ‘వాద్య రత్నావళి’ మరియు సకల యుద్దతంత్ర రహస్యాలను, వ్యూహాలనూ, సంపుటీకరించే ‘యుద్ధ రత్నావళి’…ఊఁ.. ఏమందువు జాయనా…

గుండ : యిది చక్రవర్తుల సముచితాదేశము…భళా.

మాళవిక : మహాచక్రవర్తుల ఈ ఆదేశముతో తెలుగునేల చతుర్వేదాల వంటి నాలుగు గ్రంథ రత్నాలతో కాంతివంతమై సంపన్నమవుతుంది మహాప్రభూ..

గ.ప : విన్నావు కదా జాయనా…బుధజన గుప్తాభిప్రాయము…మా అందరి ఆశీస్సులు నిరంతరం నీకుంటాయి. ఈ అపూర్వ గ్రంథాల రచనకు మా సంపూర్ణ సహకారం ఎల్లవేళలా నీకుంటుంది అంగీకరించి అడుగు ముందుకువేయి.

జాయన : మహాప్రసాదం మహాప్రభూ..నా జన్మ తరించినది. మీ అభిమానమునకు పాత్రుడనై, కాకతీయ సామ్రాజ్య బుధజన ఆశీస్సులను పొందగలిగి చరితార్థుడనైన నేను అవశ్యము మీ ఆదేశమును శిరసావహిస్తాను. నాకు కూడా ఈ విభిన్న రంగములందు సమగ్రాధ్యయనము నిర్వహించి నూతన ప్రమాణాల పరికల్పనలతో గ్రంథరచన చేయవలెననే ఉన్నది..తమరి ఆజ్ఞ.

గ.దే.: ప్రధాన అర్చకులుంగారూ.. ఏదీ.. ఆ రుద్రలింగంపై ఉన్న ఆ పూలమాలను మాకందించండి. (ప్ర.అ. లావుపాటి పూమాలను గ.దే. న కందిస్తాడు. గ.ప దేవుడు తన వేలికున్న వజ్రపుటుంగరాన్ని తీసి.)

గ.దే.: జాయనా… యిటురా.. (అని.. దగ్గరకువచ్చిన తర్వాత)..యిదిగో ఈ మా ఆదేశపాలన శుభసందర్భాన్ని పురస్కరించుకుని మా ‘వజ్రపు అంగుళీయ ప్రదానం’.. శివాశీస్సులకు చిహ్నంగా ఈ గులాబీపూమాల. విజయోస్తు.. శీఘ్రమే కలాన్ని కత్తివలె ఝళిపించి  అక్షరాలను కురిపించు.

(చుట్టూ  చప్పట్లు.. శంఖ ధ్వని.. మంగళారావములు.. ఎట్సెట్రా)

జాయన : ధన్యోస్మి ప్రభూ.. ధన్మోస్మి…

దృశ్యం : 4

 

(1240 సం||. జాయప వయస్సు 50 సం.. తామ్రపురి ఆస్థానం (యిప్పటి చేబ్రోలు).గణపతిదేవుడు తన యిద్దరు సతులతో సందర్శన..జాయపసేనాని రాజ్యము..)

వందిమాగధులు : మహారాజాధిరాజ.. మహామండలేశ్వర..పరమమహేశ్వర.. శ్రీ స్వయంభూనాథదేవ దివ్యపాద పద్మారాధక.. ప్రత్యక్ష ప్రమథగణావతార.. లాడచోటకటక చూరకార.. శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తి.. జయహో..విజయహో…

(గణపతి దేవుడు పేరాంబ, నారాంబలతో సహా అంతఃపుర ప్రవేశం.. జాయపసేనాని సకుటుంబంగా.. ఎదురొచ్చి బావగారిని ఆలింగనము చేసుకుని.. ప్రసన్న వదనంతో..)

జాయన : మహాచక్రవర్తలకు మా హృదయపూర్వక స్వాగతము.. బావగారూ, కాకతీయ మహాసామ్రాజ్యంలో ఎల్లరూ సుఖులే కదా.. రాజపరివార, మహామంత్రిగణ, సకలసైన్య వీరసమూహాలూ, ప్రజాశ్రేణులన్నీ సౌఖ్యంగా వర్థిల్లుతున్నాయిగదా..,

గ.దే.: ఎల్లరూ సుఖులే జాయపసేనానీ.. వైరి గోధూమ ఘరట్టా.. మా మహామాత్యులూ, దండనాధులూ, సకలసేనాధిపతిలూ, శ్రీమన్మహాసామంత నామిరెడ్డీ.. నీ స్థానంలో నియమితులైన గజసాహిణి బొల్లమరాజూ..మీదుమిక్కిలి మా సువిశాల కాకతీ సామ్రాజ్యవాసులైన లక్షలమంది ప్రజాశ్రేణులన్నీ సౌభాగ్యముతో అలరారుతున్నాయి.

జాయన : ఈ రత్నఖచిత ఆసనాన్నధిష్టించండి మహాప్రభూ. సోదరీ పేరాంబా, నారాంబా.. అంతా క్షేమమేకదా.., సుఖాసీనులుకండి.

గ.దే.: దాదాపు ఇరవది ఐదు సంవత్సరముల క్రితం రాజ్యవిస్తరణలో భాగంగా అనేక యుద్ధములను గెలుచు బాధ్యతను మీకప్పగించగా.. జాయపసేనానీ, యుద్ధతంత్ర విశారదుడవూ, సకలకళాప్రవీణుడవూ, తంత్ర విద్యా నిపుణుడవూ.. ప్రత్యేకించి గజసైన్య నిర్వహణా ధురీణుడవూ ఐన నీవు సాధించిన విజయముల పరంపర తర్వాత మేము నిన్ను ఈ తామ్రపురికి సామంతులను చేసి పట్టముగట్టితిమి. మీరుకూడా ప్రజా సుభిక్షముగా పరిపాలను నొనరిస్తూ ఉత్తర రాజ్య నాయకుడగు ఇందులూరి సోమమంత్రినీ, రాచెర్ల రుద్రసేనాపతినీ తోడుగా చేసుకుని గజసైన్యమధికముగా గల కళింగ రాజులనోడించి కాకతీయ మహాసామ్రాజ్య పరిధిని అటు కళింగమునుండి యిటు నెల్లూరు వరకు విస్తరించి మాకు మహానందమును కల్గించితివి. ఈ మహాముదమును నీతో పంచుకొనుటకే యిప్పుడు నీవద్దకు మీ సోదరీమణులతో సహా మా రాక. కొద్దిరోజులు నీ అతిథిగా మేము విశ్రమించెదము.

జాయన : మహాభాగ్యము.. గణపతిదేవులకు ఆతిథ్యమొసగుటకంటే, మా  తోబుట్టువులైన పట్టపురాణుల సమక్షములో గడుపుటకంటే మాకు కృతార్థమేమున్నది.

గణ.దే.: జాయపా.. ఈ డెబ్బదిఏండ్ల సుదీర్ఘ జీవితకాలమంతయూ యుద్ధతంత్రములందూ, రాజ్యవిస్తరణయందూ, ప్రజాహితపాలనా ప్రణాళికా రచనయందూ, రక్షణ తంత్రములందూ అహర్నిశలూ శ్రమించి శ్రమించి అలిసితిమి. యిక మా మనము కించిత్తు విశ్రాంతిని కాంక్షిస్తున్నది.. వినోద, సంగీత, సాహిత్య, కళాత్మకరంగాలలో ఏదో చేయవలయునను కోరికా బలీయమౌతున్నది.

జాయప భార్య : అగ్రజులు.. గణపతిదేవులుంగారు మా వదినలను తోడ్కొని మా నేలను పావనం చేయడమే మా అదృష్టము.. రసహృదయులైన మీ బావమరిది జాయపసేనాని యిప్పటికే ఎంతో మగ్నతతో గ్రంథరచన చేస్తూనే ఉన్నారు. మీరు సాలోచనగా ఆ పుటలను అవలోకించవచ్చును.

 

గ.దే : అహాఁ.. ఎంత సంతోషము.. సోదరీ.. ఏమేమి సృజన చేసియున్నాడు జాయన.. చూడు.. ఎంత నిశ్శబ్దముగా గోప్యము నటిస్తున్నాడో.

జాయన : ప్రభువుల వద్ద గోప్యమేమున్నది.. మీరు అప్పగించిన పనినే చేయుచు ప్రత్యేకముగా మీముందు విశేషముగా నుడువుటకేమున్నది..,

గ.దే : అత్యంత విశేషమైనది కానిది మా జాయన అక్షరసృజన చేయడుకదా. ఆ విషయం మాకు తెలుసు.. వివరాలు తెలియజేయుము జాయపా.,

జాయన : మీరు ఆదేశించిన విధముగానే భరతముని ‘నాట్యశాస్త్రము’ లోని సకలశాస్త్ర సమ్మతములైన ‘మార్గ’ నృత్య పద్ధతులను సమగ్రపర్చి నాలుగాధ్యాయములు ‘నృత్తరత్నావళి’ పేర రచించడము పూర్తయినది మహారాజా.. యిక మన..అంటే ప్రధానముగా కాకతీయ సామ్రాజ్య పర్యంత ప్రజాజీవనములో జీవభరితమై ఒప్పుతున్న జానపద, ఆదిమ, గిరిజన, సామాన్య పల్లెప్రజల దేశీ నాట్యరీతులను సంపూర్ణముగా అధ్యయనము చేసి మరో నాలుగు అధ్యాయముల సృజన కొనసాగుతున్నది.

గ.దే.: మాకు కూడా.. ప్రజారంజకమైన ప్రజానాట్యరీతులను ప్రామాణికపర్చవలెనను అభిలాషయున్నది ..కొనసాగింపుము.. ఐతే, మొత్తము ఎనిమిది ప్రకరణములతో ‘నృత్త రత్నావళి’ సంపూర్ణమగునా.?

జాయన : ఔను మహాప్రభూ.. ఇరువది మూడు దేశిస్థానములతో శివారాధకులైన మన ప్రాంత ప్రజల ఉద్దీప్తమూ, ఉత్తేజకరమూ, వీర రౌద్ర రస ప్రధానముగా ఐన ‘ప్రేరణి’ అనే ఒక అతినూతన నృత్త రీతినీ, శివతాండవ తురీయస్థితినీ చాటిచెప్పగల ‘శృంగ నర్తనము’ నొకదానిని సృష్టిస్తున్నాను.

గ.దే : (సంతోషముతో చప్పట్లు చరుచును..) భళా జాయనా భళా.. మేమీ సమాచారము విని కేవలం ఆనందించడమేకాక ముదముతో పొంగిపోవుచున్నాము. శివానుగ్రహ ప్రాప్తిరస్తు.. ఔనూ.. రేచర్ల రుద్రదేవుడు గత రెండు దశాబ్దాలుగా పాలంపేట అను ప్రాంతంలో మహోత్తమ స్థపతి, శిల్పాచార్యులు రామప్పతో ఒక రుద్రాలయమును నిర్మిస్తున్న విషయం తెలుసుకదా. మనమే దానికి సకల నిధులనూ, సదుపాయములనూ, పోషణనూ కల్పిస్తున్నాము.. ఒకసారి నీవు పాలంపేట సందర్శించి నృత్యశాస్త్రము కొరకు సంభావిస్తున్న దేశీ నృత్య భంగిమలను ఎందుకు దేవాలయాలంకారములుగా స్థాపించకూడదు. మన రాజనర్తకి మాళవికా, రేచర్లరుద్రుని స్థానిక నర్తకి కేశికీ నీకు సహకరిస్తారు కదా..

జాయన : మహాప్రసాదం.. తప్పనిసరిగా ఆ విధముగనే చేసెదను.. నేనూహించిన దేశీ నృత్య భంగిమలతో రూపుదిద్దుకునే శిలాకృతులు అవశ్యము ఆ రుద్రాలయశోభను యినుమడింపజేస్తాయి.

గ.దే.: శుభం.. తామ్రపురిని చేరు త్రోవలో ఓరుగల్లు నుండి.. తలగడదీవి, తామ్రపురి వరకు మీ తండ్రిగారి జ్ఞాపకార్థం నిర్మించిన ‘చోడేశ్వరాలయం’..దాని అనుబంధ తటాకము ‘చోడసముద్రము’.. అదేవిధముగా భీమేశ్వరాలయం, గణపేశ్వరాలయం.. ద్రాక్షారామాలయం…వాటి ప్రక్కనున్న చెరువులు.. ఆవిధముగా నూటా ఒక్కటి.. మీ నిర్మాణాలలో నివి చాలావరకు సందర్శించి సంతసించితిమి .. “ఆలయమూ, ప్రక్కనే ప్రజోపయోగకరమగు తటాకము” అన్న కాకతీయ సంస్కృతిని పాటిస్తున్నందుకు అభినందనలు జాయనా.. దేవుడు నిన్ను కరుణించుగాక..

జాయన : మా వేగులవారిద్వారా మీరు మాచే నిర్మితములైన ఆలయములనూ, సరస్సులనూ సందర్శించిన సమాచారము మాకున్నది. మీ ప్రశంసతో, అభినందనలతో నేను ఉత్తేజితుడనైనాను.. మహాచక్రవర్తీ.. మరి మనం..మధ్యాహ్న భోజన ఆరగింపునకు..,

గ.దే.: అవశ్యము.. అంతా ఆనందకరముగా నున్నది..

WEEK-5

 

దృశ్యం : 5

(1241 :పాలంపేట..రామప్ప దేవాలయ నిర్మాణథ.. ప్రాంగణం.. మహాశిల్పి రామప్ప, రేచర్ల రుద్రదేవుడు, జాయపసేనాని, రాజనర్తకి మాళవిక..రుద్రదేవుని ఆలయ నర్తకి కేశికి.. ఉన్నారు.. సందర్భం.. పీఠంవరకు.. అధిష్ఠానం.. చుట్టూ స్తంభాలు, అరుగులు.. వరకు నిర్మాణమై.. అలంకరణ, పై కప్పు విశేషాలపై చర్చ.. ప్రతిపాదనలు..)

(అప్పుడే ఏనుగు అంబారితో కూడిన అలంకృతపీఠంపై నుండి దిగుతున్న జాయపసేనానిని ఉద్ధేశించి..)

రే.రు.: తామ్రపురి రాజులు..మహా గజసాహిణి, వైరి గోధూమ ఘరట్ట, శ్రీశ్రీశ్రీ జాయపసేనానికి రేచర్ల రుద్రమదేవుని ప్రణామములు.. స్వాగతం.. సుస్వాగతం.,

జా.సే.: (దిగి..రుద్రదేవుని స్నేహపూర్వకముగా కౌగలించుకుని..) విజయోస్తు రుద్రదేవా..మీ రాజ్యమును సందర్శించడముతో మా జన్మ పావనమైనది. గణపతిదేవుల ఆజ్ఞమేరకు.. మీరు ఒక జీవితకాల లక్ష్యంతో, శివాజ్ఞకు బద్ధులై నిర్వహిస్తున్న ఈ బృహత్‌ రుద్రేశ్వరాలయ నిర్మాణమునకు అదనపు సొబగులను అద్దడానికి, నాట్యశాస్త్ర సంబంధ వన్నెలు కూర్చడానికి మేమిక్కడికి..,

రే.రు.: మాకు సమాచారమున్నది సేనానీ.., రండి.. భావితరాలను మంత్రముగ్ధుల్ని చేయగల ఈ మహాశివాలయ నిర్మాణాన్ని మరింత జీవవంతం చేయడానికి విచ్చేసిన మీకు స్వాగతం.. యిదిగో వీరి పరిచము.. వీరు ఈ ఆలయ ప్రధానకర్త.. మహాశిల్పి రామప్ప.. అపరబ్రహ్మ.. రాతిని మైనపు ముద్దవలె రూపింపజేసి, శిల్పించగల ప్రజ్ఞాశీలి.. మీ రాకకు ముందే యిక్కడికి చేరుకున్న ఈమె కాకతీయ సామ్రాజ్య రాజనర్తకి మాళవికాదేవి.. మా సంస్థానికి చెందిన మా స్థానిక రాజనర్తకి కేశికి… వీరు ఆలయ అర్చకులు.. సోమశివాచార్యులు ..(చుట్టూ చూపిస్తూ..) వీళ్ళందరూ ముప్పదిరెండుమంది సుశిక్షితులైన యువ శిల్పులు.

జా.సే.: మాళవికాదేవి మాకు ఇదివరకే తెలిసిన అతిసన్నిహిత విదుషీమణి. అందరికీ ప్రణామములు.. మీవంటి మహానుభావుల కలయికతో నేను కృతార్థుడైనాను.. రుద్రదేవా.. ఈ ఆలయనిర్మాణ ప్రధానాంశములు వివరించండి.

రు.దే.: మీరు తొలుత ఈ శిలాసనముపై ఆసీనులుకండి.. కేశికీ, వివరాలు తెలియజేయి.

కేశికి : ఇది తూర్పుముఖ శివాలయం. నల్లరాతి కురివెంద కఠినశిలలతో నిర్మితమౌతున్న ఈ శివాలయమునకు దగ్గర్లోనే మూడు ప్రకృతి సిద్ధమైన కొండలను ఆలంబనగా చేసుకుని ఎనిమిది చదరపుమైళ్ళ విస్తీర్ణములో ఒక ప్రజోపయోగ జలవనరుగా తటాక నిర్మాణం జరుగుతున్నది. ఇసుక ఆధారపీఠంగాగల ఎనిమిది అడుగుల పునాదిపై ఆరు అడుగుల ఎత్తున గర్భగుడిలో శిలాపీఠం ఏర్పాటు చేయబడి లోపల అధిష్టానంపై రెండున్నర అడుగుల పొడవు, అంతే వెడల్పుగల రుద్రేశ్వర లింగం ప్రతిష్టితమౌతున్నది. గర్భగుడికి ఎదురుగా..పశ్చిమాన మహాశిల్పి ప్రత్యేకంగా రూపొందించిన ఈ శివనంది ప్రత్యేకతేమిటంటే.. ఒక్కటి, ఎవరు ఈ నందిని ఎటునుండి వీక్షించినా అది ఆ వీక్షకుణ్ణే చూస్తున్న అనుభూతిని కల్గించడం.. రెండు..ముఖంపై తేలిన రక్తనాళాలు, ఒంటిపై ఆభరణాలు వీక్షకున్ని స్పర్శించకుండా ఉండలేనివిధంగా ముగ్ధుణ్ణి చేయడం..గర్భగుడి ముఖద్వారంవద్ద..లతాలంకృత స్తంభం.. లోహధ్వనులతో సరిగమలను పలికించడం…

జాయన : మహాశిల్పి రామప్పా.. వింటూంటే మేము పులకించిపోతున్నాము.

రామప్ప : ధన్యుణ్ణి మహాసేనానీ.. మీ కూర్పుతో ఈ ఆలయం యింకా శోభిస్తుందని మా ఆకాంక్ష.

జాయన : అవశ్యం.., యింకా,

రామప్ప : ఈ ఆలయ శిల్పం ప్రధానంగా మూడు రకాల శిల్పరీతుల సంగమం.. హోయసళుల, చాళుక్య, చోళ శిల్పవిధానాలను అనుకరిస్తూనే స్థానిక దేశీ జీవనరీతులనూ, మన సంస్కృతినీ మేళవించి ఒక అద్వితీయ సృష్టిని కొనసాగిస్తున్నాము.

జాయన : బాగున్నది.. నేను ప్రధానంగా గజసైన్యాధ్యకక్షుణ్ణి.. అందువల్ల పలు గజవిన్యాసాలనూ, గజశ్రేణులనూ చిత్రించి తెచ్చినాను.. అదీకాక నేను ప్రామాణికంగా రచిస్తున్న ‘నృత్త రత్నావళి’ గ్రంథంలో దేశీ నృత్యరీతులననుసరించి తయారుచేసిన దాదాపు ఇరవై చిత్తరువులను, చిత్రాలను నా పరివారంతో తెప్పించిన పేటికలలో కూర్చి తెచ్చినాను.. వీటిని శిల్పాలుగా చెక్కి ఈ ఆలయ గోపుర పరివేష్ఠితములుగా అమర్చినచో మహాలంకారముగా భాసించునని మా ఊహ..ప్రతీహారీ.. ఆ పేటికలను తెరవండి.,

 

(ఒక సైనికుడు.. ఒక పెద్ద పేటికను తెరుస్తాడు.)

రే.రు.: సైనికా.. యిటివ్వు.. తొందరగా చూడవలెననే ఉత్కంఠ..రామప్పా.. రండి..చూడండి .. ఈ చిత్రాలు.ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాయో. ఒక్కో చిత్రం ..కళ్ళముందు..ఆయా సుందరాంగనలు నిలబడ్డట్టుగానే తోచుచున్నది)

(రే-రుద్రుడు, రామప్ప, కేశికి..అలంకృతమై ఉన్న మాళవికాదేవీ.. చూస్తారు)

జా.సే.: ఉహు..ఆ విధముగా కాదు.. శిల్పిముందు ఈ ఒక్కో భంగిమను ప్రదర్శింపజేస్తాను..అప్పుడుగాని ఆ నృత్త ఆంగికము రూపుకట్టదు.. మాళవికాదేవీ, ఏదీ..సిద్ధపడు..

(జాయన..ఏడెనిమిది చిత్రాలున్న పటాలను చేతిలోకి తీసుకున్నాడు.. ఆహార్యం ధరించిన మాళవికాదేవి పైనున్న సన్నని తెరను తొలగించి..శిలా రంగస్థలిపై చేరి నిలబడింది సిద్ధంగా..)

జా.సే.: చతుర విన్యాసము.,

(మాళవిక..క్షణకాలంలో..మెరుపువలె కదిలి ఒక విశిష్ట భంగిమలో స్థాణువై నిలబడింది.

కర్తరీ నర్తనము (మాళవిక భంగిమ మారింది)    (ఇక్కడ భంగిమల మధ్య శ్రావ్యమైన మ్యూజిక్‌)

భ్రమరీ నర్తనము (మరో భంగిమ)

సువ్యాపక నర్తనము (ఇంకో భంగిమ)

దక్షిణ భ్రమణ నర్తనము (మరో భంగిమ.)

దండలాస్యము (ఇంకో భంగిమ)

నాగిని, (భంగిమ)

రామప్ప : జాయపసేనానీ.. అద్భుతము.. ఈ ఒక్కో రీతి, భంగిమ మా హృదయమును జయించింది. మీరన్నట్లు ఈ ఒక్కో శిల్పమును ఆలయ శిఖర చూరుకు ఒడ్డాణమువలె అమర్చినచో రంజకంగా ఉంటుంది. ఈ దేశీ నృత్తభంగిమలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

జా.సే.: మా అభిలాష కూడా అదే మహాశిల్పీ..యివిగాక యింకా ‘ప్రేరిణి’ అనే శివతాండవ శృంగనర్తనంలో భాగమైన వీరరసప్రధాన భంగిమలు కొన్ని ఈ పటాలలో ఉన్నాయి. వీక్షించండి..

(రామప్ప అందుకుంటాడు చిత్రాలను)

రామప్ప : ‘ ‘ప్రేరిణి’ నృత్యం గురించి చెప్పండి

జా.సే.: మహాశిల్పీ.. సుకుమారమై కేవలం స్త్రీలచేతన నర్తితమయ్యేది లాస్యము.. ఉద్ధతమైన అంగహారములతో వీర, రౌద్ర భావనలు ప్రధానముగా గలిగి పురుషుల చేతమాత్రమే నర్తించబడేది ‘తాండవము, శివతాండవము ప్రధానముగా ఏడు విధములు.. అవి శుద్ధ, దేశి, ప్రేరణ, ప్రేంఖణ, దండిక, కుండలి మరియు కలశ..ఈ భంగిమలన్నీ మన రుద్రేశ్వరాలయ కీలకస్థానాల్లో స్థాపించబడాలి.

రామప్ప : అవశ్యము ఆచార్యా.. అది అర్థవంతముకూడా.. రుద్రునిచుట్టూ శుద్ధ, పూర్ణ పురుష వీర భావనలు పరిఢవిల్లడం సృష్టి ప్రతిఫలనయేకదా..తప్పక ఆ ఆకృతులను తీర్చిదిద్దుదాం.,

రే.రు : జాయపా.. మీరు సంకల్పించిన ఈ ప్రతిపాదనలన్నీ శ్లాఘనీయమైనవి.. వీటిని యథాతథముగా ప్రతిష్టిద్దాం.

జా.సే.:  స్తంభములపై..ప్రాకారములపై..పై కప్పులపై..స్తంభ తలములపై.. వక్రములపై..రామాయణ, భాగవత.. మహాభారతాది ఇతిహాస ఘట్టాలను కూడా శోభింపజేద్దాం రుద్రదేవా..

రే.రు.: అవశ్యము..తప్పక.. మీరు మా ఆతిధ్యమును స్వీకరించుటకు వేళయ్యింది. భోజనానంతరము తటాక నిర్మాణ ప్రాంతమును సందర్శిద్దాం.. జాయపసేనానీ ఈ పక్షము రోజులు యిక్కడే మాతో, రామప్ప మహాశిల్పితో గడిపి మాకు మార్గదర్శనం కావించండి…

జా.సే : మీ ఆతిథ్యం మాకూ అంగీకారమే. యిక్కడ కొద్దిరోజులుండి గణపతి దేవులను కూడా సందర్శించుకుని మా తామ్రపురికేగుతాం.,

దృశ్యం  : 6

(1254వ సం||. జాయప వయస్సు 60 సం||లు.. రామప్ప దేవాలయ ప్రాంగణం.. దేవాలయ ప్రదేశమంతా, సహస్ర దీపాలంకరణతో తేజోవంతమై కాంతిమయంగా, దేదీప్యమానమై ఉంది. రుద్రేశ్వర గర్భగుడి ఎదుట.. రాతి సింహాసనంపై గణపతి దేవుడు..ప్రక్కన  రాణులు.. మరో ఆసనంపై జాయపసేనాని, రేచర్ల రుద్రదేవుడు.. అటువేపు రామప్ప అతని యిద్దరు శిష్యులు.. వెనుక.. రాజనర్తకి మాళవికాదేవి.. కేశిక.. యితర పురప్రముఖులు దండనాయకుల..కోలాహలం..

సందర్భం.. ‘నృత్త రత్నావళి’ గ్రంథావిష్కరణ.. దేవాలయమునకు ‘రామప్ప’ నామప్రతిష్ట..

(రుద్రాభిషేక స్తుతి.. జమకం.. మంగళకర ధ్వని.. మంత్రఘోష..ఘంటలు క్రమంగా..తగ్గుతూండగా..)

ప్రధానార్చకులు సోమాచార్యులు : (శివలింగ సన్నిధి నుండి నృత్తరత్నావళి గ్రంథం ఉన్న పట్టువస్త్రపు మూటను తీసుకొని వచ్చి.. గణపతిదేవుని చేతుల్లో ఉంచి.. నమస్కరించి..) ఈశ్వర  ప్రసాదంగా ఈ మహత్తర కృతి.. భవిష్యత్‌ తరాలూ.. దాక్షిణాత్యులూ గర్వించదగ్గ నాట్యశాస్త్ర ప్రామాణిక గ్రంథం, జాయపసేనాని కృత ‘నృత్తరత్నావళి’ని తమ అమృతహస్తాలతో స్వీకరించండి మహారాజా.

గ.దే.: మహాప్రసాదము.. ఈ గ్రంథమును స్పర్శించిన మా యొల్లము పులకించుచున్నది.. ఎపుడో దాదాపు ముప్పది సంవత్సరముల నాడు ప్రజ్ఞాశాలియైన జాయనను మేము ‘నృత్యము’తో సహా వాద్య, యుద్ధ విద్యలపై ప్రామాణిక గ్రంథములను రచించి ఈ లోకమునకందించమని ఆదేశించియుంటిమి. యిన్నాళ్ళకు మా స్వప్నము సాకారమైనది. జాయపసేనానికి మేము మా కృతజ్ఞతలు తెలియపరుస్తూ..ఈరోజు నిర్వహించ తలపెట్టిన రెండు ప్రధాన కార్యాక్రమములు వివరములను రేచర్ల రుద్రదేవులను ప్రకటించవలసినదిగా అభ్యర్థిస్తున్నాము.

రే.రు.: చిత్తము మహాప్రభూ.. మనందరము ఆసీనులమై ఉన్న ఈ రుద్రేశ్వరాలయమును ఆమూలాగ్రం ఊహించి, రూపొందించి, శిల్పించి.. వన్నెలద్ది..భావితరాలకు అందించినవాడు మహాశిల్పి రామప్ప.. కాబట్టి యింతవరకు ఎక్కడా ఒక శిల్పినామముపై లేనివిధముగా ఈ దేవాలయమునకు ‘రామప్ప దేవాలయము’గా నామకరణం చేయవలసిందిగా మహాచక్రవర్తి శ్రీశ్రీశ్రీ గణపతి దేవులను ప్రార్థిస్తున్నాను.

గ.దే.: తథాస్తు.. భవిష్యత్తులో ఈ శివాలయం సురుచిరమై ‘రామప్ప దేవాలయం’ గా ప్రసిద్ధి పొందుగాక.. మహాశిల్పీ రామప్పా.. నీ జీవితం చరితార్థమైనది.. మీకు మా అభినందనలు.

రామప్ప : ధన్యోస్మి ప్రభూ.. ధన్యోస్మి.

రే.రు.: యిక.. భరతముని రచించిన ‘నాట్యశాస్త్ర’ సకల మార్గపద్ధతులను ఆంధ్రీకరించి, కాకతీయ సామ్రాజ్య స్థానీయ ప్రజానాట్య రీతులను కూడా థాబ్దాలుగా అధ్యయనము చేసి ‘దేశీ’ నృత్యపద్ధతులుగా గ్రంధస్థం చేసిన సకల కళాకోవిదులు శ్రీశ్రీశ్రీ జాయపసేనాని. ఈ దేశీ రీతులలో ప్రపంచ నాట్యచరిత్రలో ఎక్కడాలేని.. మగవారిలోని మగటిమినీ, పురుషుల్లోని పురుషత్వాన్నీ, వీరునిలోని వీరత్వాన్నీ సమ్మిళితం చేసి రుద్ర  ప్రేరణగా రూపొందించి అందిస్తున్న శృంగనర్తనం, శివతాండవం ‘ప్రేరణి’. ప్రేరణి నృత్యాన్ని ఒక బృందముగా పది, ఇరవై..నలభై మంది నర్తకులతో సామూహిక వీరనర్తనముగా ప్రదర్శించడం సముచితం. నిజానికి యిది బృంద నర్తనము. ఈ ప్రేరణి నృత్యాన్ని మన ఆస్థాన నర్తకుడు మల్లయనాథుడు గ్రంథకర్త జాయపసేనాని ప్రవేశిక తర్వాత ప్రదర్శిస్తారు..

(చప్పట్లు..మంగళ ధ్వనులు..)

జాయప : మహాచక్రవర్తులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవులకు, సభాసదులైన బుధజనులందరికీ ప్రణామములు. ఏదేని ఒక విషయముపై సాధికారమైన అధ్యయనం జరుపనిది సృజనచేయడం భావ్యముకాదని తలంచి భారతీయ నాట్యశాస్త్రాలన్నింటినీ సంపూర్ణముగా పరిశోధించి ముప్పయ్యేళ్ళ కాలము సాగించిన సుదీర్ఘ కృషి ఫలితమే ఈ ‘నృత్తరత్నావళి’ గ్రంథము. యిక ‘ప్రేరణి’ అనే నామముతో ‘నృత్తరత్నావళి’ గ్రంథంలో ప్రస్తుతించబడినది పూర్తిగా నా స్వీయ సృష్టి. యిది గేయ ప్రాధాన్యంగల నర్తనం కాదు. వాద్య ప్రాధాన్యతగల నర్తనం. యుద్ధసన్నద్ధత కోసం వీరరస ప్రధాన ప్రేరక ఉత్సవాలలోనూ, ఆత్మశక్తిని తెలుసుకోవడం కోసం స్వయంచాలన లక్ష్యంగా రూపొందించబడ్డ పురుష నర్తనం ‘ప్రేరణి’. మార్ధంగికులు మహామద్దెలపై తన్నారకం, తత్కారం, తహనాలు, యతులు, గతులు, జతులు ‘భాం’కార ధ్వనితో పలికిస్తూంటే..నందిమద్దెల, ఉడుక్కు, కంచుతాళ మేళనతో నాదం గాంభీర్యమౌతూండగా రుద్రస్వరూపుడైన నర్తకుడు అంగ, ప్రత్యంగ, ఉపాంగాల సంచలనాల ద్వారా పరమశివుని తాండవకేళిని మన అనుభవంలోకి తీసుకురాగల మహారౌద్రానుభూతి యిది.. వినండి.. వీక్షించండి..,

 

(శబ్దం.. భాంకార ధ్వని.. పేరిణి..సిడి ఒకటుంది .. దాంట్లో పది ట్రాక్స్‌ ఉన్నై.. మొత్తం 3.5 ని||లు బిట్స్‌ బిట్స్ గా వేయాలి)

 

….ముగింపులో

గ.దే.: జాయపసేనాపతీ..మేము ఈ పంచముఖ శబ్ద ప్రపంచంలో ఓలలాడి మైమరిచి, లీనమై రుద్రున్ని మా మనోమయ లోకంలో దర్శించుకున్నాము. దీనిని సృజించి నీ జన్మను చరితార్థం చేసుకున్నావు.. ఏదీ..ఒక్కసారి మా బాహువుల్లో ఒదిగి మమ్మల్ని సంభావించు.

జా.సే: ధన్యుణ్ణి ప్రభూ.. ధన్యుణ్ణి.. మీరన్నట్లు నేను శివకృపతో, మీ అనురాగ స్పర్శతో తరించిపోయినాను.. ఆచంద్రార్కం ఈ నృత్తరత్నాళి కృతి శాశ్వతమై నిలుస్తుంది.. ధన్యోస్మి…

(ప్రేరణి నృత్యము కొనసాగుతూంటుంది.. ఆలయ ఘంటలు.. మంగళధ్వని.. సంతోష సంకేత కోలాహలం)

 -రామాచంద్ర మౌళి

Ramachandramouli 

విదూషక బలి

 

"నీకు ఉజ్జోగమిస్తాను కానీ, నీ.. నీ.. టై రంగు నాకు నచ్చలేదు’’

“నీకు ఉజ్జోగమిస్తాను కానీ, నీ.. నీ.. టై రంగు నాకు నచ్చలేదు’’

కత్తికంటే కుంచె శక్తిమంతమని మరోసారి తేలింది. ఆ వెర్రిబాగుల కార్టూనిస్టుల కుంచెలను మూయించడానికి నీకు ఏకంగా కలాష్నికోవ్ రైఫిళ్లు, షాట్ గన్లు, రాకెట్ లాంచర్లు కావాల్సి వచ్చింది. విదూషకులు కదా, పాపం తమ వెక్కిరింతలకు ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుందని తెలుసుకోలేకపోయారు !

వాళ్లేం చేశారు? ‘నా మతాన్ని, నా ప్రవక్తను కించపరిచారు’ అంటావు, అంతేకదా. కానీ వాళ్లు నువ్వు నరనరానా ద్వేషించే అమెరికా వాడిని, వాడి యూరప్ తొత్తులనూ పరమ అసహ్యంగా గేలి చేశారు కదా. నీ మతదేశాల్లోనే కాకుండా లోకంలోని కష్టజీవులందరి శ్రమఫలాలను దోచుకుంటున్న కేపిటలిస్టుల ముఖానా కాండ్రించి ఉమ్మేశారు కదా. నువ్వు మండిపడే క్రైస్తవ మతపెద్దల బట్టలనూ విప్పేశారు కదా. ఒక్క క్రైస్తవాన్నేనా.. యూదుమతాన్నీ, జాతిపిచ్చి మతాన్నీ, జనాన్నిఆరళ్లుపెట్టే సామ్రాజ్యవాద మతాన్నీ, అవినీతిరాజకీయ మతాన్నీ, మెట్రోసెక్సుమత్తు మతాన్నీ, బాసిజపు మతాన్నీ, నాటోదాడుల మతాన్నీ వాంతికొచ్చేలానూ ఎండగట్టారు కదా. ఇవన్నీ నీకు తెలియదనుకోను. నిజం చెప్పు, నువ్వు కూడా ఆ విదూషకుల బొమ్మలను నీ తుపాకీ మడమపై ఉంచుకుని చూసే వేళ ముసిముసిగా నవ్వుకోలేదా?

ఫ్రాన్స్ లో నీ మతం వాళ్లపై వేధింపులు పెరుగుతున్న మాట నిజమే. రైట్ వింగూలూ, నయా జాత్యున్మాద నేషనల్ ఫ్రంట్లూ జడలు విప్పుతున్నదీ, నీవాళ్లను గెంటేయాలని, కొత్తవాళ్లను రానివ్వకూడదని వెర్రిగా అరుస్తున్నదీ నిజమే. చమురు కోసం నీ మతదేశాలపై, అక్కడి నీ అమాయక ప్రజలపై ఫ్రాన్స్ సహా చప్పన్నారు పడమటి దేశాలు దాడులు చేస్తున్నదీ నిజమే. నువ్వు చిదిమేసిన ఆ  కార్టూనిస్టులు తెలిసో తెలియకో తమ పిచ్చి బొమ్మలతో  ఆ దేశాలకు వకాల్తా పుచ్చుకున్నట్లు అనిపించిందీ నిజమే…

అందుకు పగతీర్చుకోడానికి ఆ పిచ్చుకలపై తుపాకీ ఎక్కుపెడతావా? పోనీ ఆవేశంలో పొట్టనబెట్టుకున్నావులే అని సరిపెట్టుకుందామనుకున్నాను, కానీ వీలుకాలేదు. మొన్నటికిమొన్న పెషావర్ ఆర్మీ స్కూల్లో నువ్వు ముక్కుపచ్చలారని 130 మంది పిల్లల నెత్తురు కళ్లజూసినప్పుడు నీకు గట్టిగానే చెప్పాను కదా, చెవికెక్కలేదా? ఆ నెత్తురింకా ఆరకముందే మరింత అమాయకపు నెత్తురును ఒలికించేశావు కదయ్యా!

Karnika Kahen

సహనం నశిస్తోంది మిత్రమా. నీది పెడదారి అని గోబెల్స్ లు చేస్తున్న ప్రచారం నిజమేనేమోనని నమ్మాల్సి వస్తుందని భయంగా ఉంది. నీతో కొన్నిపేచీలు ఉన్నా దుర్మార్గపు మహాకాయపు రాక్షస గోలియత్ ను వడిసెలతో ఎదుర్కొంటున్న నీ సాహసాన్ని చూసి ముచ్చటపడ్డాను. నీకు రాళ్లందిస్తూ సాయంగా ఉందామనుకున్నాను. కానీ ఇక సాధ్యం కాదేమో. నీ కసిలో ఉన్మాదం పాళ్లు పెరిగింది. నీ ప్రతిఘటన పక్కదారి పట్టింది. నీ గురి పూర్తిగా తప్పింది.

ఆ నెత్తురొలికిన కుంచెల సాక్షిగా ఓ మాట చెబుతున్నాను, బాగా విను. కళ్లు మరింత బాగా తెరువు. గురి చెదరనీకు. శత్రువెవడో, మిత్రుడెవడో, తటస్థుడెవడో మరింత బాగా తెలుసుకో. ప్రాణాలు కాపాడుకోవడానికే తుపాకీ పట్టినవాడివి కనక ప్రాణం విలువ నీకు బాగా తెలుసు. అందుకే నీది ధర్మాగ్రహమంటున్నాను. వ్యర్థ బలులను అల్లా కూడా ఒప్పుకోడు. విదూషకుల బలులను అసలెంతమాత్రం ఒప్పుకోడు.. ! ! !

(ప్యారిస్ లో ఈ నెల 7న వ్యంగ్యపత్రిక ‘షార్లీ హెబ్దో’ కార్యాలయంపై దాడిలో బలైన ప్రధాన సంపాదకుడు, కార్టూనిస్టు షార్బ్(47), కార్టూనిస్టులు కాబూ(76), హనోర్, వోలిన్ స్కీ(80), కాలమిస్టులు, పత్రికా సిబ్బంది, ఇతరులకు నివాళిగా..)

                                                              –  పి.మోహన్

తానా వ్యాసరచన పోటీలకు ఆహ్వానం

రాబోయే 20 వ తానా సమావేశాలలో (జూలై 2-4, 2015) తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహక వర్గం ‘తెలుగు సాహిత్యంలో స్త్రీల పాత్రల స్వభావ పరిణామం’ అనే అంశం పై చర్చావేదిక నిర్వహించనుంది.
తెలుగులో పురాణాల నుండి ఇప్పటి అధునాతన సాహిత్యం వరకు ఎంతో వైవిధ్యమున్న స్త్రీ పాత్రల చిత్రణ జరిగింది. ఇందులో పురాణాలతో పాటు, కావ్యాలు, నాటకాలు, కథలు, నవలలు, కవితలు, మొదలైన ఎన్నో ప్రక్రియలు పాలు పంచుకున్నాయి. ఇంతటి సుదీర్ఘమైన చరిత్ర ఉన్న సాహిత్యంతో పాటు, గత 80 ఏళ్ళుగా చలనచిత్ర రంగం కూడా స్త్రీపాత్రల పరిణతిని ప్రదర్శించడంలో తన వంతు ప్రభావాన్ని చాలానే చూపింది. రచయితల (దృశ్య ప్రక్రియలను నిర్దేశించే వారితో సహా) సృష్టిలో ఆ పాత్రలు, ఆయా స్థల, కాలాల; ఆచార, వ్యవహారాలను బట్టి మారే అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నంలో పాత్రలు సమకాలీన జీవితాన్ని ప్రతిబింబించవచ్చు, భవిష్యదర్శనం చేయవచ్చు, లేదా గతస్మృతులను నెమరు వేసుకుంటూ ఉండవచ్చు.

ఈ నేపధ్యంలో స్త్రీ పాత్రల స్వభావాలలో వచ్చిన మార్పులు వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలలోను, దృశ్య మాధ్యమాలలోను ఎలా ప్రకటితమయ్యాయి? ఎలాంటి పరిణామాలకు లోనయ్యాయి? ఈ మార్పులు సమకాలీన సమాజంలో స్త్రీల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి? అనే విషయాలను చర్చకు తీసుకురావడం, ఈవేదిక నిర్వహణ ప్రధానోద్దేశం. ఇంతటి విస్తృత వస్తువును కేవలం ఒక రెండు గంటల చర్చావేదికలో ఇమిడ్చడం అసాధ్యం. కానీ ఈ వస్తువుకు వీలైనంత విశాల వేదిక కల్పించడం, ఈ వ్యాస రచనా పోటీ ప్రధానోద్దేశం.

పోటీలో పాల్గొన దలుచుకున్నవారు, తమకు నచ్చిన, అనువైన, అభినివేశం ఉన్న, స్పష్టత ఉన్న, లేదా ప్రవేశం ఉన్న, ఏ కోణం నుండైనా, ఏ పరిమితులలోనైనా, ఈ వ్యాస రచన చేయవచ్చు. ఎన్నుకున్న పరిధిలో విషయాన్ని ఎంత కూలంకషంగా, ఎంత విస్తృతంగా పరిశీలించి, ఎంత సరళంగానూ, క్లుప్తంగానూ విశ్లేషించారన్న వాటిపైనే బహుమతి నిర్ణయం ఉంటుంది కానీ, కేవలం వస్తువు పరిమాణ విస్తృతి ఒక్కటే బహుమతికి అర్హత కాజాలదు.

నిబంధనలు:
1. వ్యాసాలు తెలుగులోనే వ్రాయాలి.
2. ఈ చర్చావేదిక నిర్వాహకులు, చర్చలో పాల్గొనడానికి రాబోయే ఆహ్వానితులు తప్ప, మిగిలిన తెలుగు వారందరూ ఈ వ్యాస రచన పోటీకి అర్హులే.
3. వ్యాసాలను చేతి వ్రాతలో కాకుండా కంప్యూటరులో టైపు చేసి, PDF ఫైలుగా మార్చి పంపాలి. (కంప్యూటరులో టైపు చేయడానికి వెసులుబాటు లేనివారు, గడువు తేదీకి కనీసం 30 రోజులు ముందుగా వ్యాస రచన పూర్తి చేసి మమ్మల్ని సంప్రదిస్తే, వీలును బట్టి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము.)
4. మొదటి పేజీలో వ్యాసం పేరు, రచయిత పేరు, చిరునామా, ఫోన్ నంబరు, ఈమెయిల్, వ్యాసం మొత్తం ఎన్ని పేజీలు, వివరాలు మాత్రమే ఉండాలి. తరువాతి పేజీలలో వ్యాసం పేరు, వ్యాసం తప్ప వేరే వివరాలు ఉండకూడదు. న్యాయనిర్ణేతలకు రచయిత వివరాలు తెలియరాదు కనుక వ్యాస రచయితకు సంబంధించిన వివరాలేవీ వ్యాసంలో (అంటే రెండవ పేజీ మొదలుకొని) ఉండకూడదు.
5. వ్యాసం నిడివి 5 పేజీలు మించకూడదు. (పేజీ పరిమాణాలు: 7.5 x 9 అంగుళాలు లేదా 19 x 23 సెంటీ మీటరులు. వాడే లిపి పరిమాణం 12 points కు తక్కువగా ఉండకూడదు). తీసుకున్న వస్తువును విశదీకరించి, విశ్లేషించడానికి అవసరమైనంత మేరకే వ్యాసం ఉండాలి గానీ, గరిష్ట నిడివి వరకు వ్యాసాన్ని పొడిగించనవసరంలేదు.
6. వ్యాసాన్ని ఈమెయిల్ ద్వారా tanavyasamu@gmail.com కు పంపాలి. వ్యాసాన్ని పంపినవారి ఈమెయిల్ తో, వ్యాస రచయితను, వ్యాస కర్తృత్వాన్ని, ఈ వ్యాస రచన పోటీ నిబంధనల్ని, చట్టరీత్యా ధృవీకరిస్తున్నట్టు, అంగీకరిస్తున్నట్టు, భావిస్తాము. వేరే ధృవీకరణల అవసరంలేదు.
7. వ్యాసాలు మాకు చేరవలసిన ఆఖరు తేదీ: ఏప్రిల్ 4, 2015
8. న్యాయనిర్ణేతల దృష్టిలో ఉత్తమమైనవిగా ఎంపికైన మొదటి మూడు వ్యాసాలకు బహుమతులు (రు. 27,232; రు. 17,314; రు. 11,234; లేదా సమానమైన విలువలో రచయిత నివశించే దేశపు ద్రవ్యంలో) ఉంటాయి. బహుమతి పొందిన వ్యాసాలతో పాటు, మిగిలిన వాటిలో ఎన్నదగినవాటిని తానా 20 వ సమావేశాల సందర్భంగా ప్రచురించే హక్కులు నిర్వాహక వర్గానివే.
9. న్యాయనిర్ణేతల అభిప్రాయంలో ఏ వ్యాసానికీ తగిన అర్హతలు లేవని తోస్తే బహుమతిని ఇవ్వడానికి, ప్రచురించడానికి, నిరాకరించే హక్కులు కూడా నిర్వాహకవర్గానివే. ఈ నిబంధన కేవలం ఆషామాషీగా వ్యాస రచన పోటీలో పాల్గొని బహుమతులను ఆశించే వారిని నిరుత్సాహ పరచడానికి; నిబద్ధతతో, క్రమశిక్షణతో, చేసిన రచనలకు తగిన విలువను ఆపాదించడానికి మాత్రమేనని మనవి.

10391436_1519913701605194_6407369527125614767_n

‘కోయీ అకేలా హై కహా..’

Krish.psd

గదిలో కూర్చుంటే చలి. కాని రోడ్డుపై నడుస్తుంటే చలి ఎక్కడిది? నేలపై పాకుతున్న పొగమేఘాలు. సాయంత్రం అయిదింటికే గూళ్లకు చేరాలని తపిస్తున్న పక్షుల చప్పుళ్లు. ఒక వృద్ద చిరు వ్యాపారి ముందు నిప్పుల మధ్య కాలుతున్న పల్లీల వాసన. చెట్టుక్రింద నిలబడి వేటి వేడి టీ తాగుతూ కబుర్ల వేడిలో మునిగిపోయిన ఉద్యోగులు. బస్‌స్టాప్ వద్ద గుంపులు గుంపులుగా ఆతురతతో ఎదురు చూస్తున్న జనం. రోడ్డు దాటడానికి అవస్థ పడుతున్న గృహిణి. దృశ్యాలు మనసు తెరలపై ఇంకిపోతుంటే ఏదో ఒక పాట నిన్ను నిలిపేస్తుంది. పాదాలకు నడుస్తున్న విషయం కూడా తెలియదు.. 

‘ఆభిజా.. ఆభిజా.. ఏ సుబా ఆభిజా.. రాత్‌కో కర్ విదా.. దిల్‌రుబా ఆభిజా..’ ఎక్కడ విన్నాం ఈ పాట. అనువదించగలమా? ‘రావెరా.. రావెరా.. ఉదయమా రావెరా రాత్రినీ సాగనంపీ.. ప్రియతమా.. రావెరా..’ ఈపాట రాసిందెవరు? నిదా ఫాజిలీ కదా? ఎవరీ నిదా ఫాజిలీ? ఏదైనా పాటో, కవిత్వమో నచ్చిందంటే దాని పాదముద్రల వెంట పయనించడం మానవా? 

‘దునియా  జిసే కహతే హై జాదూకా ఖిలోనా హై.. మిల్ జాయెతో మిట్టీ హై, ఖో జాయెతో సోనా హై.’. ( ఈ ప్రపంచమొక అద్భుత ఆటబొమ్మ.. దొరికితే మట్టే.. పోగొట్టుకుంటే బంగారం) అన్న ప్రసిద్ది చెందిన వాక్యాలు రాసిన నిదా ఫాజిలీ గ్వాలియర్ వీధుల్లో సంచరిస్తూ కవిత్వాన్ని మనసులో ఒంపుకున్నాడు. ఒకరోజు వీధుల్లో నడుస్తూ గుడిలోంచి వినిపిస్తున్న సూర్‌దాస్ భజన విన్నాడు. కృష్ణుడికోసం తపిస్తూ రాధ తన చెలికత్తెల వద్ద విషాదంగా ఆలపిస్తున్న మధుర గీతిక అది. గురుదత్ ‘ప్యాసా’ కోసం సాహిర్ లూధియాన్వీ రాసిన ‘ఆజ్ సజన్ మొహె అంగ్ లగాలో.. జనమ్ సఫల్ హోజాయే..’ అని గీతాదత్ గొంతుకతో వహిదా రహమాన్ తపించిన గీతిక లాంటి పాట అది. అంతే. నిదా ఫాజిలీ కవి అయ్యారు. . 

1938లో జన్మించిన నిదా ఫాజిలీ తన తండ్రి దేశ విభజన తర్వాత పాకిస్తాన్ వెళ్లినప్పటికీ భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. సూర్‌దాస్, కబీర్ , మీరా ఆయనను భారత్‌లోనే పట్టి ఉంచారు. ఢిల్లీలో జన్మించి, మన హైదరాబాద్‌లో మరణించిన డాగ్ దెహ్లివీ (నవాబ్ మీర్జాఖాన్) ప్రాచుర్యం పొందిన కవితా శైలిని కాదని తనదంటూ కొత్త శైలిని ప్రవేశపెట్టిన కవి నిదా ఫాజిలీ. నాటి ఉర్దూ కవులు కైఫీ ఆజ్మీ, సాహిర్ లూధియాన్వీ, అలీ సర్దార్ జాఫ్రీ కవితా శైలిని విమర్శిస్తూ సంచలనాత్మక వ్యాసాలు రాశారు. అప్పటివరకూ ఉర్దూ కవిత్వంలో తచ్చాడుతున్న పర్షియన్ ప్రతీకల్ని, పదాల్నీ వదిలిపెట్టి కొత్త ప్రతీకల్ని చిత్రించిన కవి ఫాజిలీ. ‘నా మనసులో ఏముందో నా పెదాలెప్పుడూ చెప్పలేవు… నా మౌనం ఏమంటుందో ఆమె అర్థం చేసుకోలేదు.’. అని ఆయన తప్ప ఎవరు రాయగలరు? 

untitled

ముంబయిలో ఉద్యోగం కోసం వీధుల్లో తిరుగుతూ పత్రికల్లో కవితలు రాస్తున్న ఫాజిలీని కమల్ అమ్రోహి గుర్తించకపోతే ఆయన దశ తిరిగేది కాదు. ‘నీ వియోగమే నా తలరాత… నీ విషాదమే నా జీవితం’ (తేరా హిజ్ర్ మేరా నసీబ్ హై.. తేరా గమ్ హీ మేరా  హయాత్ హై) అని ‘రజీయాసుల్తాన్’ కోసం ఆయన  రాసిన పాట   హిందీ సినీ ప్రపంచంలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. ‘తూ ఇస్ తరా మేరీ జిందగీమే షామిల్ హై’ ( ఈ రకంగా నీవు నా జీవితంలో చేరావు), ‘హోష్‌వాలోంకో ఖబర్ క్యా బేఖుదీ క్యా ఛీజ్ హై- ఇష్క్ కీజే ఫిర్ సమఝియే జిందగీ క్యా చీజ్ హై’ (స్పృహలో ఉన్నవాడికి ఏం తెలుసు మైమరిచిపోవడం, ప్రేమలో పడు అర్థమవుతుంది.. జీవితం అంటే ఏమిటో).. అని ఎన్నో గీతాలు రాశారు. ‘సఫర్ మే దూప్‌తో హోగీ, జో చల్ సకోతే చలో, సభీ హై బీడ్ మే తుమ్ భీ, నికల్ సకోతో చలో- యహా కిసీకో కోయి రాస్తా నహీ దేతా, ముఝే గిరాకే అగర్ తుమ్ సంబల్‌సకోతో చలో..’ ( ప్రయాణంలో ఎండ ఎలాగూ ఉంటుంది, సాగిపోగలితే సాగిపో.. అంతా జనసమ్మర్థంలోనే.. బయటకు రాగలితే సాగిపో, ఇక్కడ ఎవరూ ఎవరికి దారి ఇవ్వరు, నన్ను పడేసి నీవు నిలదొక్కుకోగలిగితే సాగిపో) అన్న అద్భుతమైన గీతాలు రాశారు. ‘గోడలంటే భయపడి దిగిపోయిన నీడలు మాట్లాడుతాయి.’. అన్న వాక్యాలు ఫాజిలీ కవితల్లో వెంటాడుతాయి. జగ్జీత్ సింగ్, చిత్రాసింగ్,కవితా కృష్ణమూర్తి లాంటి వారి గొంతుల్లో ఆయన గీతాలు  నీటిబిందువులను అలంకరించుకున్న గులాబీ పూల లాంటి అసాధారణ అందాన్ని సంతరించుకున్నాయి.

ఫాజిలీ వెంటాడడానికి మరో బలమైన కారణం ఉంది. చాలా మంది కవుల్లాగా ఆయన యదాతథ స్థితిని, యాంత్రిక జీవితాన్నీ ఇష్టపడలేదు. సినిమాల్లో పాటలు రాయడాన్ని తనంతట తాను మానుకొన్నారు. మరింత సీరియస్ కవితల్ని రాయడం మొదలు పెట్టారు. ఆయన భావాలు మరింత దట్టమయ్యాయి. ఆయన ఆలోచనల్లో మరింత గాఢత అలుముకొంది. మతతత్వంపై, ముఖ్యంగా రాజ్యాంగ యంత్రంలో ఉన్న మతతత్వంపై ఆయన కలం ఎక్కుపెట్టారు. మతఘర్షణల్ని, వాటి వెనుక ఉన్న రాజకీయ శక్తుల కుతంత్రాలను ద్వేషించారు. 1992లో ముంబైలో అల్లర్లు జరిగినప్పుడు ఆయన స్వయంగా ఒక స్నేహితుడి ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత జీవితంలోని వైరుధ్యాలను, పట్టణ జీవితంలోని కృత్తిమత్వాన్ని ఎండగడుతూ కవిత్వీకరించారు. గుజరాత్ అల్లర్లైనా, సద్దాం హుస్సేన్‌ను ఉరితీసినా ఆయన ఊరుకోలేకపోయారు. 

‘ఖుదా ఖామోష్ హై’ (దేవుడు మౌనంగా ఉన్నాడు) అన్న కవితలో ఆయన ‘నేను ఒంటరిగా అంతా చేయలేను. నీవు నాతో చేరితే కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం..’ అని ఆయన జనాన్ని సమీకరించే ప్రయత్నం చేశారు. ‘మసీదోం మందిరోంకో దునియా మే, ముఝే పహచాన్‌తే కహా హై లోగ్’ ( మసీదులు, మందిరాల ప్రపంచంలో నన్ను జనం ఎక్కడ గుర్తు పడతారు?) అని ప్రశ్నించిన ఫాజిలీ  ‘ప్రపంచాన్ని చీకట్లో ముంచి ఆకాశంలోకి వెళ్లి దేవుడిగా మారి అంతా దగ్ధం చేస్తాను’ అని ‘ఐలాన్’ అన్న కవితలో రాశారు.. ఈ కవితలు ఇప్పుడు చదువుతున్నప్పుడు మనకు ‘పీకే’ సినిమా గుర్తు రాక మానదు. ‘కరాచీ తల్లిఅయితే ముంబాయి ఆమెనుంచి వేరుపడిన కొడుకు. ఆ పవిత్ర బంధాన్ని ఎవరూ ఈనాటికీ తెంచలేకపోయారు. తెంచలేరు కూడా.. నా తల్లి నాపై కత్తి ఎత్తలేదు.. నేను ఆమె పై తుపాకీ ఎక్కుపెట్టలేదు. ఎవరు ఎవరికోసం మరి యుద్దం చేస్తున్నారు? ఎందుకోసం ఈ ఘర్షణ?’ అని ఆయన రాశారు. ‘మసీదు గుమ్మటాలు మౌనంగా ఉన్నాయి, మందిరం గంటలు మౌనంగా ఉన్నాయి..’ అన్నారు. ‘బృందావన్ కీ కృష్ణ కన్హయ్యా అల్లాహూ.. బంసీ రాధా గీతా గయ్యా అల్లాహూ’ అన్న గీతం. ‘మౌల్వీయోంకా సాజ్దా పండిత్ పూజా, మజ్జూరోంకి హైయ్యా హైయ్యా అల్లాహూ.’. అన్న వాక్యాలతో అంతమై శ్రమైకజీవన సౌందర్యంలో దైవత్వాన్ని చూపిస్తుంది. 

‘ఆద్మీ మరా నహీ, జిందా హై ఆద్మీ షాయద్, బదన్ కి అంధీ గుఫా మే ఛుపా హోగా’ ( మనిషి మరణించలేదు.. బహుశా జీవించే ఉన్నాడు, శరీరపు చీకటి గుహలో దాక్కున్నాడు), , ‘కోయీ  అకేలా హై కహా, సాత్ హై సారా జహా ‘( ఎవ రైనా ఒంటరిగా ఎక్కడున్నారు? మొత్తం ప్రపంచం వెంట ఉంది) అన్న ఆయన కవితా వాక్యాలు విన్నప్పుడు ప్రతిఘటనా ప్రపంచంలో ధిక్కార స్వరాలు వినిపించే వారిలో నేను ఒంటరివాడిని కాదనిపిస్తుంది.


-కృష్ణుడు

పరాయి దేవుడు

Parayi

చిత్రం: మహీ బెజవాడ

మిస్టర్ బ్లూమ్ ఆ వినాయకుడిని చూసేదాకా ఎలాంటి ఒడిదుడుకులు లేని జీవితం గడిపాడు. బ్లూమ్ లాంటి వాళ్ళంతా ఇంతే. మనసులో సుదూర దేశాలకు ప్రయాణం చెయ్యాలన్న కోరిక బలంగా వున్నా అమ్మ చెప్పిన మాట విని ఆప్థమాలజీ (కంటి వైద్యం) కాలేజీలో చేరతారు. ఇదిగో ఇలాంటివాళ్ళే స్పైస్ ద్వీపాలకో, అందమైన మైదానాలకో వెళ్ళాలని కలలు కంటూనే టెల్మా లాంటి మందుల గుట్టలో పడి బతికేస్తుంటారు.

ఇలాంటివాళ్ళే – చివరికి రిటైరైన కంటి డాక్టర్ లెఫ్కోవిజ్ కూతురు ఎంత లావుగా వున్నా సర్దుకుపోయి పెళ్ళి చేసుకుంటారు. బ్లూమ్ లాంటి వాళ్ళే నీరు కారే కళ్ళని పరీక్షించడం అనే పనిని రోజూ చేస్తూనే సంసారాన్ని ఈదేస్తుంటారు. కుటుంబంతో కలిసి బంగారం రంగు ఇసుక వున్న బీచ్‌కి వెళ్ళాలని, అక్కడ చొక్కా లేకుండా నిలబడి సముద్రపు గాలిని పీల్చాలనీ, మనిషి నడవని చోట నడవాలని, ఏ మనిషీ ప్రేమించనంతగా మరొకరిని ప్రేమించాలనీ  అనుకుంటూ, అవేమీ చెయ్యకుండానే సంవత్సరాలు గడిపేస్తుంటారు.

అలా గడపటం కొంత మందికి అసంతృప్తి ఇవచ్చుగాక, కానీ కొంతమందికి అలా బ్రతకడంలోనే తృప్తి వుంటుంది. సరిగ్గా అలాంటి తృప్తి కలిగివున్న జీవితం గడుపుతున్న బ్లూమ్‌కి ఆ వినాయకుడి ప్రతిమ దొరకటమే ఆశ్చర్యం.

ఆ రోజు అతను గాజులు, చీరలు, అగరుబత్తీలు అమ్ముతున్న ఒక దుకాణం దగ్గర నిలబడ్డాడు. వాటన్నింటి మధ్యలో అనుకోకుండా కనపడిందా విగ్రహం. నాలుగు చేతుల మనిషి శరీరానికి ఏనుగు తల వుందా? లేక ఏనుగుకి మనిషి శరీరం అతికించారా? అని పరిశీలనగా చూశాడు. మెరిసిపోయే గులాబి రంగు శరీఅం, కరుణ కురిపించే కళ్ళు, బంగారు కిరీటం. ఒక చేయ్యి చూపుడు వేలుతో ఏదో సైగ చేస్తున్నట్లు వుంటే, రెండొవది దగ్గరకు రావద్దని వారిస్తున్నట్లు కనపడింది. చూడగానే అది దేవుడి బొమ్మ అయ్యివుంటుందని వూహించాడు బ్లూమ్.

“కాకపోతే మరేమిటి? ఒకేసారి భయం భక్తి రెండూ కలుగుతున్నాయంటే ఆయన ఖచ్చితంగా దేవుడే అయ్యుంటాడు” అనుకుంటూ ఆ నునుపైన విగ్రహాన్ని వేళ్ళ చివర్లతో సుతారంగా అందుకున్నాడు. అది చూసి ఆ పక్కనే నిలబడి స్టాల్ చూసుకుంటున్న కుర్రవాడు ముందుకొచ్చాడు.

“ఏంటి తాతగారూ? జాగ్రత్తగా పట్టుకోండి… బొమ్మ పగలకొట్టినా డబ్బులు కట్టాలి.. అర్థం అయ్యిందా?” అన్నాడతను.

పూర్వం విగ్రహారాధన చేసే తండ్రిని ఎదిరించిన అబ్రహాం కథ గుర్తుకొచ్చింది బ్లూమ్‌కి. చిన్నతనంలోనే దేవుడు సర్వవ్యాప్తమై వున్నాడన్న సత్యం తెలుసుకున్న అబ్రహాం తన తండ్రి పూజించే విగ్రహాలని అన్నింటినీ పగలగొట్టాడు.

“నేను కాదు నాన్నా పగలకొట్టింది.. ఇదంతా ఆ పెద్ద విగ్రహం చేసిన పని. ఆ బొమ్మే కర్ర తీసుకోని మిగిలిన అన్నింటినీ పగలగొట్టింది..” అన్నాడు.

“విగ్రహాలు ఎక్కడైనా కదులుతాయట్రా?” అన్నాడు తండ్రి మరింత కోప్పడి.

“మరి కదలలేని విగ్రహాలకు పూజలెందుకు నాన్నా” అంటూ సమాధానం చెప్పాడు అబ్రహాం.

ఆ కథ అంతటితో అయిపోయింది. ఆ ప్రశ్నతో ఆ తండ్రికి జ్ఞానోదయమైందో లేక తన నమ్మకాల్నే ప్రశ్నించిన కొడుకుని మరింతగా కొట్టాడో తెలియదు. అందులోనూ, ఆ కాలంలో నమ్మకాలు ఇప్పటికన్నా పవిత్రంగానూ బలంగానూ వుండేవి కదా.

వినాయకుడి విగ్రహం చేతిలో పెట్టుకోనే ఇదంతా ఆలొచించాడు బ్లూమ్. ఆ ప్రతిమ అర్థ మిళిత నేత్రాలతో ప్రేమని కురిపించేలా వున్నాయి. ఆయన శరీరం ఎంత దృఢంగా  వుందంటే, ఆ బొమ్మే మన పక్కన వుంటే విజయం తధ్యమని అనిపిస్తోంది. నిజానికి  బ్లూమ్ ఇలాంటి ప్రతిమల్ని ఏనాడూ ముట్టుకోను కూడా లేదు. మతపరంగా నిషేదించిన విగ్రహారాధన చేస్తే ఏ పాపం చుట్టుకుంటుందో అని అతని భయం. ఇప్పుడు చేతిలో వున్న వినాయకుడి వైపు మళ్ళీ చూశాడు. గుండ్రంగా తిరుగుతూ బలంగా వున్న తొండం వైపు చూశాడు. సరిగ్గా అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు.

“నాకు ఇది కావాలి” అన్నాడు స్థిరంగా.

***

ఆ విగ్రహాన్ని తీసుకోని ఇంటికి వెళ్ళిన తరువాత ఎక్కడైనా దాచేయ్యాలని అనుకున్నాడు. ఆ బొమ్మని కళ్ళద్దాలు తుడుచుకునే మెత్తటి గుడ్డలలో చుట్టి, ప్లాస్టిక్ సంచిలో పెట్టి స్టోర్ రూమ్‌లో ఒక అరమర కింద భాగంలో, పగిలిపోయిన పాత్రల వెనక దాచిపెట్టాడు. కాని ఫలితం లేకపోయింది. అతని భార్య నిముషానికి ఒకసారి అదే అరమర తెరిచి ఏదో ఒక వస్తువు తీసుకోవడమో, లేకపోతే పిల్లలు ఆడుకుంటూ ఆ తలుపులు తీసి వదిలేయడం చేస్తుండటంతో దాన్ని అక్కడి నుంచి తీసేయ్యాలనుకున్నాడు. ఆ గది దగ్గరకు వెళ్ళినప్పుడల్లా చుట్టిపెట్టిన సంచీ చిరుగులలోంచి వినాయకుడి తొండం బయటికి వచ్చి, తననే పిలుస్తున్నట్లుగా అనిపించేది.

“ఆయన పూజలు కావాలని అడుగుతున్నట్లున్నాడు” అనుకున్నాడు బ్లూమ్. “దేవుడు కదా… అలాంటి కోరిక వుండటం సహజమే” అని సర్ది చెప్పుకున్నాడు.

“అయితే ఆయన్ను ఎలా పూజించాలి?” బ్లూమ్ కి ఏం తోచలేదు. ఇంతకు ముందెపుడూ విగ్రహాన్ని పూజించనే లేదు కదా. అసలు ఎలా చెయ్యాలో కూడా తెలియదైపోయే. బైబిల్ తీసి ఒకసారి తిరగేశాడు. “దేని రూపమునైననూ విగ్రహమైనైననూ నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు” అని వుంది. ఇంకొక చోట “మంటి (మట్టి) బలిపీఠమును నా కొరకు చేసి, దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను నీ గొర్రలను నీ ఎద్దులను అర్పింపవలెను” అని కూడ వుంది.  బ్లూమ్ దగ్గర గొర్రలూ లేవు, ఎద్దులూ లేవు. అలాగని వృత్తిపరంగా వాటికి సమానమైనవి బలిగా తగలపెట్టడం భావ్యం కాదనిపించింది. ఒకసారి పొరపాటున ఒక జత కళ్ళద్దాలు తగలబడితేనే వాటి వాసననే భరించలేకపోయాడు. అంతకన్నా శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థించడమే తేలిక అని అనిపించింది.

బ్లూమ్ ఆ స్టోర్ రూమ్‌ లోకి ఎవరూ రాకుండా తలుపులు వేశాడు. ఆ వినాయకుణ్ణి తీసి అక్కడే వున్న ఒక వెదురు స్టూల్ మీద వుంచాడు. అప్పుడే వినాయకుడి కళ్ళలో సంతోషం, తను చెయ్యబోతున్న పనికి ఆమోదం కనిపించాయి ఆతనికి. జాగ్రత్తగా మోకాళ్ళ నొప్పులు బాధించకుండా మోకరిల్లి, ముందుకు వంగి నుదిటిని నేలకి ఆనించి తన ప్రార్థన మొదలుపెట్టాడు.

“ఓ గణేశా… నీ రాకతో మా ఇంటిని పావనం చేసిన నీకు నా కృతజ్ఞతలు అర్పించుకొనుచున్నాను. ఈ ఇంటిలో వున్నవారందరినీ నీవు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. మరీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మా అమ్మాయి జూడీ లా పరీక్షలలో నీవు సహాయము చెయ్యాలి. ఆ పిల్లకి ఆ లా పుస్తకాలు, సెక్షన్లు అవీ కష్టం అనిపిస్తున్నాయట… ఓ వినాయకా..” అంటూ ఇంకా ఏదో చెప్పాలని అనుకుంటూనే మళ్ళీ మోకాళ్ళ మీదకు లేవబోయాడు. అతని నడుము మాత్రం అతని ప్రార్థనకి సహకరించలేదు. ఎడమ వైపు నడుముకి కొంచెం కింద నరం పట్టేసినట్లై కలుక్కుమనడంతో మళ్ళీ ముందుకే వంగాడు. ఇక లేవనూ లేడు, అలా వుండనూ లేడు. ఓ ఇరవై నిముషాల తరువాత అతని భార్య వచ్చి చూసేదాకా అలాగే, అదే భంగిమలో వున్నాడు  బ్లూమ్.

“బ్లూమ్…!! ఏం చేస్తున్నావక్కడ?” అంటూ అరిచింది ఆమె.

“శాండ్రా… సమయానికి వచ్చావు… నా నడుము మళ్ళీ పట్టేసింది. ఆ అమృతాంజనం తెచ్చిస్తావా” అన్నాడతను. ఆమె అటు వెళ్ళగానే పాక్కుంటూనైనా సరే ఆ వినాయకుణ్ణి మళ్ళీ అలమరలో దాచేయ్యాలని అతని ఆలోచన. కానీ శాండ్రా అతనికంటే రెండాకులు ఎక్కువే తిన్నట్లుంది.

Akkadi MeghamFeatured

“బ్లూమ్… అది విగ్రహమే కదూ. నువ్వు మన ఇంట్లో విగ్రహారాధన చేస్తున్నావా? ఒక పక్క నేను అంట్లు తోముకుంటూ, అతిధులు వస్తారని పరుగులు తీస్తుంటే నువ్వు ఇక్కడ..” అంటుండగానే అందుకున్నాడు బ్లూమ్.

“శాండ్రా… ఎందుకు ఎలా అనుకుంటున్నావు? నేను విగ్రహానికి ఎందుకు మొక్కుతాను? ఈ విగ్రహం బజార్లో అమ్ముతుంటే చూశాను. ఇదిగో ఈ గది గోడలకి వేసిన రంగులకి మంచి మాచింగ్ అవుతుందని కొన్నాను…” అన్నాడు. ఇరవై ఏళ్ళ సంసారంలో  బ్లూమ్ ఇలాంటి ఇంటి విషయాలు పట్టించుకున్నదే లేదు. అలాంటప్పుడు మిసెస్ బ్లూమ్ అతని మాటల్ని ఎలా నమ్ముతుంది? అయినా అతను వదల్లేదు. “ఇది ఎక్కడపెడదామా అని చూస్తూ వున్నాను.. ఇంతలో తూలి ముందుకు పడ్డాను… నడుం పట్టేసింది..” అన్నాడు.

శాండ్రా నమ్మీ నమ్మనట్లు తలాడించింది.

” ప్లీజ్ శాండ్రా… అమృతాంజనం…” అన్నాడతను మాట మారుస్తూ. శాండ్రా మాట కరుకేకానీ మనసు వెన్న. అందుకే అమృతాంజనం తీసుకురావాలని బాత్రూమ్ వైపు పరుగెత్తింది.

ఇదే అవకాశం అని వినాయకుడి బొమ్మని తీసి ఇంతకు ముందున్న సంచిలో పెట్టాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు బ్లూమ్. అప్పటికే చిరిగిపోయిన ఆ సంచిలో నున్నగా జారిపోతున్న బొమ్మ పట్టలేదు. శాండ్రా తిరిగి వచ్చేసరికి వినాయకుడి బొమ్మ ఇంకా అక్కడే నేలమీదే వుంది. పాపం ఆమె బ్లూమ్ నడుము మీద అమృతాంజనం పూసి నెమ్మదిగా మర్దనా చేస్తూ వినాయకుడి బొమ్మ వైపే చూస్తూ వుండిపోయింది. చివరికి ఘాటైన అమృతాంజనం వాసన వస్తున్న చేతులతోనే వినాయకుడి బొమ్మను తీసుకోని పరీక్షగా చూసింది.

“నాకు తెలిసి ఈ బొమ్మ హాల్లో పెడితేనే బాగుంటుందనుకుంటా… చాలా ప్రాచీనంగా కనిపిస్తోంది కదా, అక్కడ బాగుంటుంది…” అంది.

అలా ఆ వినాయకుడి స్థానం ఆ ఇంటి నట్టింట్లోకి మారింది.

***

అందరి పిల్లల్లాగే వాళ్ళ పిల్లలు కూడా అభ్యంతరం చెప్పారు.

“ఆ బొమ్మ నన్నే చూస్తున్నట్లు అనిపిస్తోంది…” అంది జూడీ మర్నాడు బ్రెడ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు.

డెవిడ్ స్కూల్ బాగ్ అందుకుంటూ వేలితో బొమ్మని తాకి – “దీని నిండా మురికి వున్నట్టుంది..” అన్నాడు.

“ఆ విగ్రహం లోపలంతా ఖాళీ… ఏం వుండదు… ఆయన పేరు గణేశ” చెప్పాడు బ్లూమ్. అందమైన పసిపిల్లల్ని ఇలాంటి మాటలనే టీనేజర్లుగా ఎందుకు మారుస్తావు భగవంతుడా అనుకున్నాడు మనసులో.

డేవిడ్ చిత్రంగా కళ్ళు తిప్పాడు. జూడీ నిట్టూర్చింది. ఇద్దరూ స్కూల్‌కి బయల్దేరారు. బ్లూమ్ బ్రేక్‌ఫాస్ట్ గిన్నెలు వంటింటిలోకి తీసుకెళ్తూ ఒక్క క్షణం వినాయకుడి బొమ్మ దగ్గర ఆగాడు. ఒక చిన్న బ్రెడ్ ముక్కను తుంచి ఆ ప్రతిమ దగ్గర సాసర్‌లో వుంచి, తల వంచి నమస్కరించాడు.

ఆ వినాయకుడి బొమ్మ వచ్చిన తరువాత అతని జీవితం బాగున్నట్టు గుర్తించాడు. మిసెస్ రోసెన్‌బ్లట్ అని పెద్ద డ్రై ఫ్రూట్ కంపెనీ అధిపతి భార్య, నాలుగుదఫాలుగా వస్తానని రాకుండా ఎగ్గొడుతోంది. బ్లూమ్ ఆమెకు ఫోన్ చేసినప్పుడు కోపంతో అరిచి బెదిరించలేదు. మనసులో ఒక ప్రశాంతత, స్థిరత్వం ధ్వనిస్తుండగా ఏ మాత్రం జంకకుండా మాట్లాడటం మొదలుపెట్టాడు.

“మిసెస్ రోసెన్‌బ్లట్, మీ అపాయింట్‌మెంట్ సాయంత్రం నాలుగున్నరకి మార్చబడింది. సరిగ్గా నాలుగున్నరకి నా షాప్ ముందు మీరు లేకపోతే బ్లూమ్ ఆప్టిసియన్ మీకు ఎలాంటి సహాయము…”

“అది కాదండీ…” మధ్యలో మాట్లాడబోయింది ఆమె.

“మీరేం చెప్పాల్సిన పనిలేదు…”

“లేదండీ… హలో…”

“థ్యాంక్ యూ, గుడ్ డే…” పెట్టాశాడు బ్లూమ్. సరిగ్గా నాలుగున్నరకి ఠంచనుగా, బిక్కు బిక్కు మంటూ వచ్చింది మిసెస్ రోసెన్‌బ్లట్. ఆమెను కళ్ళు పరీక్షించే టెస్టింగ్ రూమ్‌కి పంపిస్తూనే, నిశబ్దంగా వినాయకుడికి మొక్కాడు.

క్రమంగా ఆ కుటుంబం మొత్తం ఆ దేవుడి మీద ఇష్టం పెంచుకోవడం మొదలైంది. ఆ గణేషుడి చల్లని చూపులు ఆ ఇల్లు మొత్తం ప్రసరిస్తూ వుండేవి. ఇప్పుడు శాండ్రా తో పాటు పిల్లలు కూడా ఎక్కువ సమయం ఆ గదిలోనే గడుపుతున్నారని బ్లూమ్ గ్రహించాడు. జూడీ ఇప్పటికీ నమ్మనట్టే వుంటోంది కానీ మాడ్యూల్ పరీక్షలు రాయటానికి వెళ్ళే రోజు వుదయం మాత్రం తన కోటుపైన బాడ్జి తీసి వినాయకుడి ముందు వుంచింది. ఆ విషయాన్ని బ్లూమ్ గమనిస్తే, ఏమీ ఎరగనట్టు భుజాలు ఎగరేసి – “లక్ కోసం నాన్న” అంది. అయితే ఆ పరీక్షలలో జూడీ ఆమె టీచర్లు అనుకున్నదానికన్నా బాగా రాయటంతో ఆ నమ్మకం ఇంకా బలంగా తయారైంది. ఆమే కాదు, కుటుంబం మొత్తం ఆ వినాయకుడి ప్రతిమని భక్తిగా చూడటం మొదలుపెట్టారు.

మొదట్లో బ్లూమ్ కుటుంబ సభ్యులెవరూ వినాయకుడి గురించి బయట ఎక్కడా అనలేదు. కానీ వాళ్ళుండే హెండన్ ప్రదేశంలో రహస్యాలకు చోటే లేదు. బహుశా జూడీ స్నేహితురాలు మికైలా ఇంటికి వచ్చినప్పుడు, జూడీ హోంవర్క్ చెయ్యడానికి ముందు ప్రతిసారీ ఆ దేవుడి ముందు గుప్పెడు బ్రెడ్ ముక్కలు నైవేద్యం పెట్టడం చూసినట్లుంది. డేవిడ్ స్నేహితుడు బెంజీ కూడా, కప్యూటర్ టెన్నిస్ గేం ఆడుతూ ఫైనల్ రౌండ్‌కి వచ్చిన ప్రతిసారీ డేవిడ్ ఆ విగ్రహాన్ని తాకుతున్న సంగతి గమనించాడు. ఇంకేముంది.. ఒకరి నుంచి ఒకరికి అక్కడి నుంచి ముగ్గురికి అలా అలా హెండన్ మొత్తానికి తెలిసిపోయింది. “ఆ బ్లూమ్స్ లేరూ – అదే కళ్ళజోళ్ళు అమ్మే బ్లూమ్ కుటుంబం… అవును శాండ్రా బ్లూమ్ అనే ఆవిడ, అదే వాళ్ళాబ్బాయి డేవిడ్ బ్లూమ్ అనే పిల్లాడు… వాళ్ళేనండీ – వాళ్ళింట్లో ఒక విగ్రహముందట.”

ఒక సాంప్రదాయకుడైన యూదుని ఇంట్లోకి విగ్రహాన్ని తీసుకురావటాన్ని క్షమించిన దాఖలాలు బైబిల్‌లో లేవు. అందుకే కదా బంగారు ఆవుదూడ విగ్రహానికి పూజ చేశారని 3000 మందిని పొట్టనపెట్టుకున్నారు? జెస్‌బెల్ ఇలాంటి తప్పు చేసినందునే కదా కిటికీ గుండా గిరాటు వేసి కుక్కలకు బలి చేశారు. ఇక్కడ వున్న కౌన్సిల్ కూడా ఈ విషయంలో రాజీ పడే అవకాశమేలేదు.  బ్లూమ్ ఇలా అనుకున్నాడో లేదో ఆ రాత్రే అతనికి ఫోన్ వచ్చింది. చర్చిలో వుండే రబ్బీ (మతపెద్ద)ని వీలైంనంత త్వరగా వచ్చి కలవాలన్నది ఆ ఫోన్ సారాంశం.

***

ఆ వూరి రబ్బి చాలా చిన్నవాడు. ఈ మధ్యనే అతని మతపరమైన విద్యాభ్యాసం పూర్తైంది. అయినప్పటికీ అతను కుదురుగా పెంచిన గడ్డంతో, హుందాగా ఎంతో మర్యాదస్తుడిలా కనిపించాడు బ్లూమ్‌కి.

పిలిపించాడేకానీ మాట్లాడటానికి చాలా సేపు తటపటాయించాడు రబ్బీ. – “అదే.. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని పిలిపించాను… అదే ఆ విగ్రహం గురించి..” అన్నాడు

“సరే మాట్లాడండి” అన్నాడు బ్లూమ్. అతను ఏ మాత్రం ఖంగారు పడలేదు. వినాయకుడి విగ్రహం అతని జీవితంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఇలాంటి విపర్యాలకి అతను ఏ మాత్రం చెలించడంలేదు.

“అవును అదే… విషయం ఏమిటంటే బ్లూమ్‌గారూ… బయట చాలామంది అనుకుంటున్నారు, మీకు తెలిసే వుంటుంది లెండి… అంటే నేను అవన్నీ పట్టించుకుంటున్నానని కాదు కానీ మీలాంటి బాధ్యత కలిగిన వాళ్ళు… పైగా మీరు మన ఆరాధనా సమాజానికి ట్రస్టీ కూడా కదా…” అన్నాడు రబ్బి తడబడుతూ.

“మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పండి” అన్నాడు బ్లూమ్ మరింత స్థిరంగా.

బ్లూమ్ తీరు మరింత ఖంగారు పెట్టడంతో రబ్బీ గబగబా మాట్లాడటం మొదలుపెట్టాడు.

“అదే అదే.. ఆ విగ్రహం గురించి.. మిస్టర్ బ్లూమ్ మీలాంటి ఆరాధనా సమాజం సభ్యుల వద్ద అలాంటిది వుండకూడదు..”

“ఏది?”

“అదే”

“వినాయకుడా?” రెట్టించాడు బ్లూమ్.

“కాదు విగ్రహం… మీలాంటి పెద్దమనుషులు అలాంటివి ఇంట్లో వుంచుకోకూడదు… దాన్నీ తీసిపారేయండి” చెప్పడాయన.

బ్లూమ్ క్షణ కాలం వినాయకుడు తన ఇంటికి వచ్చిన తరువాత వచ్చిన మార్పులను గుర్తుచేసుకున్నాడు. అక్కడికేదో అద్భుతాలు జరిగాయని కాదు. ఇప్పటికీ అతని కుటుంబ సభ్యులు పోట్లాడుకుంటారు, అరుచుకుంటారు, అప్పుడప్పుడూ అపశృతులు వుంటూనే వుంటాయి. కానీ ఆ గజముఖుడు ఉండటం వల్ల కుటుంబం మొత్తంలో ఏదో శక్తి ప్రవేశించినట్లు అనిపిస్తోంది. అది అతని వూహే అయ్యివుండచ్చుగాక అయినా సరే ఆ దేవుణ్ణి వదులుకోవడం ఇష్టం లేదు అతనికి.

“నేను ఆ విగ్రహాన్ని తీసెయ్యలేను” స్థిరంగా చెప్పాడు రబ్బీతో.

రబ్బీ ఆ మాట వింటూనే కళ్ళు చిట్లించి అపనమ్మకంగా ముందుకు వంగాడు.

“అలాకాదు మిస్టర్ బ్లూమ్ మనం కలిసి దీనికి సమాధానం వెతుకుదాం… అయినా నాకూ తెలుసు మీకూ తెలుసు… విగ్రహం ఇంట్లో వున్నంత మత్రాన మీరు దానికేం పూజలు చెయ్యరనుకోండి, అయినా చూసేవారికి ఇదంతా పెద్ద తప్పులా అనిపించకుండా ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి కదా..” అనూనయించబోయాడు.

“నేను చేస్తున్నానుగా” చెప్పాడు బ్లూమ్

“ఏమిటి? అలాంటి ప్రయత్నం చేస్తున్నారా?” అన్నాడు రబ్బీ తృప్తిగా.

“నేను చెప్పేది ప్రయత్నం చేస్తున్నానని కాదు… పూజ చేస్తున్నానని చెప్తున్నాను” సరి చేశాడు  బ్లూమ్.

ఆ మాటలు ముఖానికి కొట్టినట్లు అనిపించండంతో ఏం పాలుపోక వెనక్కి జారిగిలపడ్డాడు రబ్బీ. చాలా సేపు ఏం మాట్లాడకుండా వుండి తరువాత – “ఈ విషయం గురించి మనం మళ్ళీ చర్చించాలి. రేపు ఒకసారి రాగలరా?” అన్నాడు నీళ్ళు నములుతూ.

ఆ మర్నాడు రబ్బీ  బ్లూమ్‌కి మళ్ళీ ఫోన్ చేసి మధ్యాహ్నంగా ఆరాధనా మందిరానికి పిలిపించాడు.

“మిస్టర్ బ్లూమ్ మీతో దేవుడి గురించి చర్చించాలి” అన్నాడు ఖంగారుగా. బ్లూమ్ చిన్నగా నవ్వి –

“అది మీకు బాగా తెలిసిన సబ్జక్ట్ రబ్బీగారూ, నాకేం తెలుసు” అన్నాడు. దానికి రబ్బీ కూడా చిన్నగా నవ్వాడు.

“సరే సరే.. కాకపోతే మిస్టర్ బ్లూమ్…  ప్రభువు విగ్రహారాధన గురించి ప్రత్యేకంగా చెప్పియున్నాడు. రెండొవ ఆజ్ఞ గుర్తులేదా? ‘మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు’, ‘దేని రూపమునయనను విగ్రహమైనయినను నీవు చేసికొనకూడదు’ అని చాలా స్పష్టంగా చెప్పబడివుంది.”

బ్లూమ్ సన్నగా తలవూపాడు.

“అలాంటిది మీరు ఆ విగ్రహానికి పూజలు చేస్తానని చెప్తూ ఈ సమాజం బోర్డులో ఎలా వుంటున్నారో నాకర్థం కావటంలేదు… ఇలాగైతే మిమ్మల్ని ఈ ఆరాధనా సమాజంలోనికి రానివ్వడం కూడా కుదరకపోవచ్చు..”

“అదేమిటండీ… నేను అన్ని నియమాలు పాటిస్తున్నాను. ప్రభువునీ ఆరాధిస్తున్నాను. నా మతం ఇప్పటికీ యూదు మతమే కదా” అన్నాడు  బ్లూమ్ కొంచెం ఆవేశంగా.

రబ్బి అందుకు సమాధానంగా నవ్వి చేతులు వెడల్పుగా చాస్తూ బైబిల్‌లోని మరో వాక్యాన్ని చదివాడు. “మీ దేవుడను యావేను అయిన నేను అసూయగలవాడను”

బ్లూమ్ ఒకసారి వినాయకుణ్ణి, అతని కరుణ పూరితమైన కళ్ళను గుర్తుచేసుకున్నాదు.

“దేవుడు నిజంగా గొప్పవాడైతే… ఆయనకు అసూయ ఎందుకు వుంటుంది? ఇలాంటి రాగద్వేషాలకు అతను అతీతుడు కదా?” సూటిగా అడిగాడు.

రబ్బీ ముఖం పాలిపోయింది. “ఈ విషయం గురించి మనం ఇంకా మాట్లాడాలి మిస్టర్ బ్లూమ్.. రేపు మళ్ళీ కలుద్దాం” అన్నాడు.

మూడోరోజు  బ్లూమ్‌కి మళ్ళీ ఫోన్ వచ్చింది. అదీ తెల్లవారుఝామునే. అంత పొద్దున్నే ఫోన్ చేసినందుకు రబ్బీ క్షమాపణ అడిగి చెప్పాడు –

“మిస్టర్ బ్లూమ్.. మీరు చెప్పిన విషయం గురించి రాత్రంతా తీవ్రంగా ఆలోచించాను. నేను ఒకసారి ఆ విగ్రహాన్ని చూడాలి. మీరు ఇప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకోని మన ఆరాధనా మందిరానికి రాగలరా? అలా చేస్తే అన్ని సమస్యలను అక్కడే పరిష్కరించుకుందాం..”

బ్లూమ్ అందుకు అంగీకరించాడు. ఎన్ని వివాదాలైన తను ఒక యూదుడే కదా, ఆ ప్రార్థనా మందిరం వల్ల, రబ్బీ వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందిన మాటకూడా నిజమే. ఆ విగ్రహం విషయంలో రబ్బీ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా అతనికి గౌరవభంగం కలిగించే పని చెయ్యకూడదని అనుకున్నాడు.

ఆ వినాయకుడి విగ్రహాన్ని మెత్తటి దుప్పటిలో చుట్టి, చిన్న చేతి సంచిలో పెట్టాడు బ్లూమ్. అలా చుడుతున్నప్పుడు కూడా వినాయకుడి నున్నని తోండాన్ని ఒక్కసారి ప్రేమగా నెమిరాడు. బైబిల్ కథల్లో ఎలీజా అనే మేధావిలా రబ్బీ కూడా దేవుడితో వాదప్రతివాదాలు చేస్తాడా అని అనుమానం వచ్చింది. అలా నిజంగా జరిగితే దేముడు ఏం సమాధానాలు చెప్తాడో అని ఆసక్తి కలిగింది.

బ్లూమ్ ప్రార్థనామందిరానికి చేరేసరికే రబ్బీ గుమ్మంలో నిలబడి ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఎళ్ళుగా ప్రార్థనలు, గీతాలను తనలో నిక్షిప్తం చేసుకున్న ఆ పురాతన మందిరంలోనికి  బూమ్‌ను తీసుకెళ్ళాడు. మామూలుగా వసారాగుండా ప్రధాన మందిరంలోకి వెళ్లే దారిలో కాకుండా, దేవదారు మెట్లద్వారా పై అంతస్తులోని పాటకులు కూర్చుండే గదిలోకి తీసుకెళ్ళాడు. సరిగ్గా పవిత్రమైన గదికి పైన వున్న ఆ గదిలోనే పాతనిబంధనము తాలూకు వ్రాతప్రతులు వుంచబడ్డాయి. అక్కడి నుంచి చూస్తే చర్చిలోని ప్రార్థనా మందిరం మొత్తం, అక్కడ వేయబడిన కుర్చీలతో సహా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాలలో ఆ కుర్చీలు మొత్తం భక్తితో వచ్చే వందలాది యూదులతో నిండిపోయి వుంటాయి.

రబ్బీ ఆ పాటకులగది కిటికీ తలుపులు బయటకు తెరిచి గట్టిగా రెండు మూడుసార్లు శ్వాస తీసుకోని ఆ తరువాత బ్లూమ్ వైపు తిరిగాడు. “ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారా?” అడిగాడు. బ్లూమ్ అవునన్నట్లు తలాడించాడు. రబ్బీ మనసులో కూడా అలజడి తగ్గి స్థిరంగా వున్నట్టు బ్లూమ్ గుర్తించాడు.

“ఏది నన్ను చూడనివ్వండి” అన్నాడు రబ్బీ.

బ్లూమ్ తన చేతిసంచిలో వున్న దేవుణ్ణి బయటకు తీసి, చుట్టివున్న మెత్తటి గుడ్డని తొలగించి, వినాయకుణ్ణి సుతారంగా పట్టుకున్నాడు. కొన్న రోజుకన్నా ఈ రోజు విగ్రహం బరువు పెరిగినట్లుగా అతనికి అనిపించింది.

రబ్బి భృకుటి ముడిపడింది.

“ఇది కేవలం ఒక మనిషి తయారు చేసిన బొమ్మ. ఆ విషయం మీకు అర్థం అవుతోందా మిస్టర్ బ్లూమ్? ఇందులో చైనా మట్టి, పెయింటు తప్ప ఇంకేమి లేదు. మనకి మనమే తయారు చేసుకున్న ఇలాంటి వస్తువుకి మనం ఎలా మొక్కగలం చెప్పండి?” అన్నాడు.

రబ్బీకి అర్థం అయ్యేలా సమాధానం చెప్పడం అసాధ్యమనిపించి బ్లూమ్ భుజాలు ఎగరేశాడు. చివరికి ఎదో ఒక సమాధానం చెప్పాలని – “నా కళ్ళను, మనసును నమ్మి పని చేస్తున్నాను అంతే..” అన్నాడు. అనడానికైతే అన్నాడు కానీ, తను చెప్పాలకున్నదాంట్లో కనీసం పదోవంతు కూడా చెప్పలేకపోయాడని అతనికి అర్థం అయ్యింది.

చాలా సేపు రబ్బీ బ్లూమ్ వంకే చూస్తూ వుండిపోయాడు. ఆ తరువాత చిన్న చిరునవ్వుతో అతని దగ్గరకు వచ్చి అతని భుజాలమీద చెయ్యివేసి నడిపించుకుంటూ కిటికీ దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ ప్రార్థనామందిరం ఎత్తైన ప్రదేశంలో కట్టబడటం వల్ల ఆ మరకలు పడ్డ కిటికీ అద్దాలలోంచి చూడగలిగితే హెండన్ నగరం మొత్తం కనపడుతుంది.

“ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీకు తెలుసుకదా?” అడిగాడు రబ్బీ.

బ్లూమ్ నిశబ్దంగా తలాడించి ప్రశాంతమైన వినాయకుడి ముఖం వైపు చూశాడు.

“ఇలాంటి సమస్య నాకు ఎప్పుడూ ఎదురుకాలేదు… అందుకే నిర్ణయం తీసుకునే ముందు నా కన్న పెద్దవాళ్ళను కూడా సంప్రదించాల్సి వచ్చింది..” చెప్పుకుపోతున్నాడు రబ్బి. బ్లూమ్ తలాడిస్తూనే వున్నాడు.

“పెద్దలంతా ఒకే అభిప్రాయం తెలిపారు. మీరు అర్థం చేసుకోవాలి మిస్టర్ బ్లూమ్.. మేం తీసుకున్న నిర్ణయం మీకు మంచే చేస్తుంది..” అన్నాడతను. అంతే… అప్పటిదాకా నెమ్మదిగా మట్లాడుతున్నవాడల్లా ఒక్క ఉదుటున, బ్లూమ్‌కి ప్రతిఘటించే అవకాశం కూడా లేకుండా చప్పున ఆ విగ్రహాన్ని లాగేసుకున్నాడు. ఆ విగ్రహాన్ని ఒక్క క్షణంపాటు తన శరీరానికి దగ్గరగా హత్తుకున్నాడు. ఆ తరువాత కిటికీకి వున్న చిన్న ఖాళీలోనుంచి ఆ విగ్రహాన్ని కిందకి జారవిడిచాడు. భళ్ళున పగిలిన శబ్దం. ఆ కిటికీ కింద వున్న ప్రాంతంలో వినాయకుడి విగ్రహం వెయ్యి ముక్కలై పరుచుకుంది.

“మిస్టర్ బ్లూమ్ ఇప్పుడు ఆ తిరుగుబాటు చిహ్నం బద్దలైపోయింది… మీకు కూడా ప్రశాంతంగా అనిపిస్తోందా?” అడిగాడు రబ్బీ దగ్గరగా వచ్చి.

బ్లూమ్ సమాధానం చెప్పలేదు. కిటికీ దగ్గరగా వెళ్ళి కిందకి తొంగి చూశాడు. వినాయకుడు కింద పడిన చోటు చుట్టూ గులాబి రంగు శకలాలు పరుచుకోని మెరుస్తూ కనిపించాయి. రబ్బీని తప్పించుకుంటూ ఆ కిటికీ నుంచి దూరంగా జరిగి ఇంటి వైపు అడుగులేశాడు బ్లూమ్.

***

గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రార్థనా మందిరానికి కోశాధికారిగా వ్యవహరించిన బ్లూమ్ అప్పటికి ఏం మాట్లాడకుండా వున్నా ఆ తరువాత, బాగా చీకటిపడిన తరువాత మందిరం వెనుక వున్న ఇనుప గేటు తీసుకోని నిశబ్దంగా అడుగుపెట్టాడు. వచ్చేటప్పుడు ఇంటినుంచి తనతోపాటు గుడ్డ బ్రష్, నగిషీలు చెక్కిన చిన్న చెక్క పెట్ట, ఇంకా సంచిలో ఏవో బరువైన వస్తువులు తెచ్చుకున్నాడు. వినాయకుడు పడి పగిలిపోయిన చోట చుట్టూ తిరుగుతూ బ్రషతో ముక్కలను చెక్కపెట్టలోకి చేర్చుకున్నాడు. ఆ తరువాత ఆ పక్కనే వున్న పూలమొక్కల మధ్యలో ఒక చిన్న గుంత తొవ్వి అందులో ఆ పెట్టను వుంచి మట్టితో కప్పేశాడు. అక్కడే నిలబడి వినాయకుడితో ఏదన్నా చెప్పాలా అని ఆలోచింఛాడు కానీ, ఏం చెప్పాలో తెలియక మిన్నకున్నాడు.

ఆ తరువాత అలాగే చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా నడుస్తూ ప్రధాన ద్వారం తెరిచి ప్రార్థనా మందిరంలోకి జారుకున్నాడు. ఇంత రాత్రివేళ ఒంటరిగా అదీ ఎలాంటి స్పష్టమైన అవసరం లేకుండా ఈ మందిరంలో అడుగుపెట్టడం అతనికి ఇదే మొదటిసారి. ఒక్క క్షణం అక్కడే ఆగి ఆ ప్రాంతం అతనికి ఎన్ని గంటల ప్రశాంతతనిచ్చిందో గుర్తుచేసుకున్నాడు. తన సంతోషంలో, బాధలో ఇదే ప్రదేశంలో విన్న ప్రార్థనలు, ప్రత్యేక స్వరంలో పాడిన గీతాలు అన్నీ జ్ఞప్తికి వచ్చాయి.

మర్నాడు ఉదయం ఆ మత పెద్దలు అక్కడికి వచ్చేసరికి తలుపులు తాళాలు వేసి వుండటం, ఆ తాళాలకు మైనం కూరి వుండటం చూసి ఆశ్చర్యపోయారు. ఏదో అనర్థం జరిగి వుంటుందని వూహిస్తూనే తాళాలు బాగుచేసేవారిని పిలిపించి ఆ తాళాలను పగులకొట్టించారు. అప్పటికే అక్కడ జరిగే వింత చూడటానికి గుమికూడిన జనంతో సహా ఆ పెద్దలంతా లోపలికి అడుగుపెట్టి, లోపల జరిగింది చూసి నిశ్చేష్టులైయ్యారు.

లోపల అంతా విధ్వంసం జరిగినట్టు వుంది. అక్కడ బల్లలు విరిగిపోయి, కర్టన్లు చినిగిపోయి, దీపపుసెమ్మలు వంగిపోయి, అద్దాలు పగిలిపోయి వున్నాయి. వాటన్నింటి మధ్యలో చేతిలో గొడ్డలితో అలసిపోయి ఆయాసపడుతూ వున్నాడు – బ్లూమ్. చమటతో అతని బట్టలు తడిసిపోయి వున్నాయి.

“ఇదంతా నువ్వే చేశావా?” ఆడిగారు వాళ్ళు.

“నేనా? నేను కాదు.. ఇదంతా ఆ భగవంతుడు చేశాడు..” చెప్పాడతను.

వాళ్ళు మళ్ళీ చుట్టూ కలియచూశారు. విరిగిన బల్లలన్నింటి మీద గొడ్డలి గుర్తులు కనిపిస్తున్నాయి. పరదాలన్నింటి పైనా ఒక మనిషి అరచేత్తో చించినట్లు గుర్తులున్నాయి.

“దేవుడు చేశాడా? దేవుడు ఇలాంటివి ఎలా చెయ్యగలడు?” అడిగారు వాళ్ళు.

“ఇది కూడా చెయ్యలేని దేవుణ్ణి కొలవాల్సిన పనేముంది?” ప్రశ్నించాడు అతను.

ఇంతవరకే తెలుసు. అతను అడిగిన ఈ ప్రశ్నవల్ల అక్కడున్న మనుషులకు జ్ఞానోదయం అయ్యిందా లేదా అనే విషయం మాత్రం తెలియలేదు.

 మూలం: నయోమి ఆల్డర్మెన్

అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్

  64_1naomi_aldermanలండన్ లో పుట్టిన నయోమి ఆల్డర్మెన్  ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ తరువాత సాహిత్యంలో పట్టభద్రులై ప్రస్తుతం బాత్ స్పా యూనివర్సిటీలో కాల్పనిక సాహిత్యం బోధిస్తున్నారు. 2007లో ఈమె సండే టైమ్స్ పత్రిక “యంగ్ రైటర్ ఆఫ్ ద ఇయర్” అవార్డును సాధించి, ఆ తరువాత వాటర్ స్టోన్స్ సంస్థ ప్రకటించిన “25 రైటర్స్ ఫర్ ది ఫ్యూచర్” జాబితాలో స్థానం సంపాదించారు. ఈమె రాసిన నవలలో “డిస్ ఒబీడియన్స్”, “ది లయర్స్ గాస్పెల్” వంటివి ఈమెకు పేరుతో పాటు ఎన్నో వివాదాలను కూడా అందించాయి. ప్రస్తుతం మీరు చదవబోయే “పరాయిదేవుడు” కూడా అలాంటిదే. 2009 రాసిన ఈ కథ ఆ సంవత్సరం బీబీసి నేషనల్ స్టోరీ అవార్డ్ గెలుచుకుంది.

అనుబంధాల టెక్నాలజీ

chinnakatha
‘ప్చ్’ అన్నాడు అప్రయత్నంగా శేషాచలం.
‘ఏమిటి శేషు అంత నిరాశ గా వున్నావు” పార్కులో పక్కనే కూర్చున్న రామనాధం అన్నాడు శేషాచలం తో.
“ఏమిటో చాలా విషయాలు అర్థం కావటం లేదు”
“రిటైర్ అయినవాళ్ళం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసినవాళ్ళం, ఇప్పుడు అర్థం కాని విషయాలు ఏముంటాయి?” నవ్వుతూ అన్నాడు రామనాధం.
“అది మనజీవితం రామూ, సమస్యలు వచ్చాయి…ప్రయత్నం చేసాము, కష్ట పడ్డాము…ఎన్నో ఎదుర్కున్నాము. కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్నది చిత్రమైన సమస్య….”
“నాకు తెలియకుండా నీకు వచ్చిన చిత్రమైన సమస్య ఏమిటో”
“చిన్నప్పుడు మనమెలా పెరిగామో ఒక సారి గుర్తు చేసుకో.”
“ఎలా పెరిగాము …గవర్నమెంటు స్కూలులో పాఠాలు, రాత్రి పూట నాన్నమ్మ చెప్పే రామాయణ కథలూ, తాతగారితో షికారు వెళ్ళినప్పుడు చెప్పే పులి వేట కథలూ…చెరువులో చేపలు పట్టడం ….. మామిడి చెట్టెక్కి కాయలు కోయడం…ఇంకా గోళీల ఆట, జిల్లకోడి అంటూ కట్టేని ఎగర కొట్టడం….ఓహ్ …ఎంత బాగుండేది కదా”
“అవును కదా ….ఇన్ని విశేషాలతో పెరిగిన మనం ….మన సాంప్రదాయాలు ఎన్నో తెలుసు కున్నాం. మరి ఈతరం వాళ్లకు ఏమి చెప్పబోయినా, ఏది నేర్పబోయినా ఎందుకు నచ్చడం లేదు? పైగా ఈ వయసులో మనవాళ్ళకు దగ్గర కావాలని, వాళ్ళతో ఆడుకోవాలని అనిపిస్తుంది కదా….’
“ఓహ్ ..అదా నీసమస్య…..కాలం మారిందిరా..’
“మారింది కానీ పెద్దమనవడికీ..చిన్న మనవడికీ..మద్య కాలం కూడా చాలా మారింది..”
“ఎలా ?”
“ఇలా ……”

“ఎందుకు విరాజ్ ఇలా ?” అన్నాడు శేషాచలం
“నేనేమీ చెయ్యలేను నాన్నా” చేతులు పైకి ఎత్తేసి అంటూన్న కూతురు భావన ను చూసి నిర్ఘాంతపోయాడు శేషాచలం.
తను చేసింది కంప్లైంటు కాదు…వివరణ మాత్రమె…
ఎంత మార్పు వచ్చింది కాలం లో….
పెద్ద మనవడు తేజ ఆరేళ్ళ ప్పుడు చేపలు పట్టడం నేర్పితే ఎంత సంబర పడ్డాడు!
ఎగిరి గంతేసి తాతయ్యను పట్టుకుని గిరగిరా తిరిగాడు. తిరిగి చేపను వదిలెస్తూ చంపడం మంచిది కాదు అంటే ఎంత ఆసక్తిగా విన్నాడు!
రాత్రిపూట తను చెప్పే హనుమాన్ కథలూ, కృష్ణుడి వెన్న దొంగతనాలు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని ప్రశ్నలు వేసేవాడు…
ఇవన్నీ ఇప్పుడు రెండో మనవడు విరాజ్ కు ఎందుకు నచ్చడం లేదు??
వీడికీ ఇదే వయసు కదా…ఎక్కడ తేడా?…
భావనా వాళ్ళు మూడేళ్ళు అమెరికా వెళ్లి వచ్చాక ఇప్పుడే తన ఇంటికి రావవటం….
తేజా తాతను చూసి సంబరపడ్డా చిన్నవాడు ఆరేళ్ళ విరాజ్ దగ్గర చేరలేదు. కొత్త అనుకున్నా..నెమ్మదిగా చేరువ చేసుకోవాలని చూసాడు శేషాచలం.
దగ్గర కూర్చో బెట్టుకుని “ హనుమాన్ కథలు చెబుతా రారా” అంటే
“వద్దు. నాకు తెలుసు “ అని పారిపోయాడు.
“ తెలుసా అన్నీ?”
“తెలియక పోయినా ఐపాడ్ లో చూసుకో వచ్చు”
“పోనీ ఫిషింగ్ పోదామా “
“వద్దు. ఐ డోంట్ లైక్”
“ఎందుకురా బాగుంటుంది”
“టూ ఈజీ తాతయ్యా”
“టూ ఈజీ నా?”
“ ఎస్ తాతయ్యా, I play in the internet games”
“ఇది real గా నాన్నా”
“నో తాతయ్యా “
అదే చెప్పబోయాడు కూతురితో శేషాచలం “అన్నీ తెలుసనుకుంటే ఎలాగమ్మా, నేర్చుకోవాలి కదా. పెద్దలు చెప్పింది వినాలి కదా….” అని
భావన మాత్రం “ నేనేం చెయ్యలేను నాన్నా” అని చేతులు పైకి ఎత్తేసింది.
ఎందుకిలా అని ప్రశ్నించుకుంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. మన ఆచారాలూ, సాంప్రదాయాలు…పురాణాలు కథలు కథలుగా నేర్పాలనుకోవడం తప్పేలా అవుతుంది?
మనం చెప్పినది వినే పరిస్థితిలో ఎందుకు లేరు?
ఆలోచిస్తే హనుమాన్ కంటే spiderman …..సూపెర్ గా కనపడతాడే మో.
అలాగే చందమామ కథల కంటే dianosaurus, చెక్క బొమ్మలకంటే బార్బీ బొమ్మలు, బ్యాటరీ తో రయ్ మని పరుగెత్తే ట్రక్కులు, కార్లూ….interesting గా కనబడుతున్నాయి…..
ఇలా అయితే మనవడికి దగ్గర కావడం ఎలా?….
శేషాచలం సమస్య ఏమిటో బాగా అర్థం అయ్యింది.
“ఇలాటివి ఈ రోజుల్లో అందరు బామ్మలూ, తాతలూ ఎదుర్కునేదే. పెరుగుతున్న టెక్నాలజీ తో మనం కూడా ఎదుగుదాం అనుకున్నామంటే సరి…..” రామనాధం సమాధానం నచ్చలేదు శేషాచలం కు.
“ఈ వయసులో మనం ఎదగాలంటావా?”
“ఒక సారి ఆలోచించు…మనం పెరిగిన వాతావరణం వేరు, ఇప్పుడు వీళ్ళు పెరుగుతున్న కాలం వేరు..రామాయణ కథలు లాటివి ఆనిమేటెడ్ క్యారెక్టర్స్ తో చక్కగా వివరించే C D లు వున్నాయి లేదా తీరిక వున్నప్పుడు కంప్యూటర్ లో చూసుకునే అవకాసం వుంది. ఏది తెలియక పోయినా google search చేసుకునే కాలం వీరిది.
అంతెందుకు నేను సైకల్ నేర్చుకోవడానికి పదిరోజులు పట్టింది ఆ రోజుల్లో. నా మనమడు పదినిముషాల్లో నేర్చుకున్నాడు ఎలా అంటే వాడి ఆటల్లో శరీరాన్ని బేలెన్స్ చేసుకునేవి చాలా వున్నాయి. అందుకే సైకల్ ఎక్కగానే బాలెన్స్ చేసుకుని తొక్క గలిగాడు.
అంతేకాదు ఇప్పటి పిల్లలకు, టెన్నిస్, పియానో, చదరంగం అని ఎన్నో క్లాసులకు తీసుకెడతారు..స్కూల్ లో కూడా సైన్స్ క్లబ్బులూ, వారానికి ఒక టాపిక్ మీద మాట్లాడ్డం నేర్పిస్త్తారు. అందుకే వాళ్ళు అంత అడ్వాన్సెడ్ గా వున్నారు…వీళ్ళు చూసే హ్యారీపాటర్ సినిమాలు, డిస్కవరీ చానెళ్ళు మనం చూసామా ?
కాబట్టి వాళ్లకు దగ్గరవ్వాలంటే మనమూ కాస్త అడ్వాన్స్ అవ్వాలి….ఇదీ నేను తెలుసుకున్న థియరీ…..
ఎక్కవగా ఆలోచించి బి.పీ. పెంచుకోకు..”అంటూ భుజం తట్టాడు రామనాథం.
తనను పాత చింతకాయ పచ్చడి అనుకోకుండా మనమడికి దగ్గర అవ్వడం ఎలా అని ఆలోచించాడు ఆరాత్రి.
మరురోజు పొద్దున్న టిఫిన్లు అయ్యాక
“విరాజ్ …ఈ రోజు నీవు నాకు నీ ఐపాడ్ మీద గేమ్స్ ఆడటం నేర్పుతావా?” అని అడిగాడు మనవడిని.
“ఓ” అంటూ తాతయ్య చేతులు పట్టుకున్నాడు విరాజ్.
ఆ రోజు రాత్రి పక్కన పడుకున్న విరాజ్ ని అడిగాడు స్పైడర్ మ్యాన్ కథ చెబుతావా అని.
“నో తాతయ్యా నీవు చెప్పు నాన్నమ్మని ఫస్ట్ టైం ఎలా కలిసావో….”
దానికి విసుక్కోకుండా తను నాన్నమ్మని పెళ్ళిచూపుల్లో మొదటిసారి చూసిన ఘట్టం చెప్పసాగాడు శేషాచలం.
అనుబందాల టేక్నాలజీ కూడా మారాలి మరి!!!

మా అయివార్లు–నా జుట్టుకత!!

photoఇంట్లో గలాట సేస్తే సాలు!”ఈన్ని ఇసుకూలుకు నూకల్ల. అయివారుకు సెప్పి నాలుగు ఏట్లు కొట్టిచ్చల్ల” అని ఇంట్లో యపుడుజూసినా అంటావుండ్రి. అందుకే ఇసుకూలంటే నాకి శానా బయ్యమయితావుండె. నిజముగా ఇసుకూలుకు పోతే ఆడ ఎవురూ ఏమీ అన్లేదు.నేను రాసిన అచ్చరాలని కిట్టప్పయివారు యపుడు మెచ్చుకొన్నో అపుట్నుంచి ఇసుకూలంటే నాకి శానా ఇష్టమయిపాయ. ఒగ ఏటుగూడా తినకుండా ,రాసిచ్చినవన్నీ నేరుస్తావుంటి.

   మా వూరిపేరు సడ్లపల్లి.ఇదేపేర్తో ఇంగొగు వూరుంటే దీనికి ముందు సూగూరు అనే మాపక్కూరిపేర్ను గూడా సేర్సిండారు. ఇట్లా మావూరు యాడో కొండల్లోనో,నగరాల గాలి సోక్కుండ నూరామడల దూరంలోనో లేదు!!
   అయిద్రాబాదునుంచి బెంగులూరుకు రైలు మా వూరి ముందరనుంచే పోతుంది. ఇందూపురం నుంచి బస్సు మా ఇంటిముదరే  పోవల్ల. మాఊరి పొలాలన్నీ పెన్నేటి గట్లోనే వుండివి. ఇందూపురం మావూరికి మూడు మైళ్లు దూరము. అట్లా వూర్లో ఒగటో తరగతి పిల్లోళ్లలో అర్దం మందికి బట్లే వుంటావుండ్లేదు. నాకి అదొగరకం ఆఫారం ఏస్తావుండ్రికాని నిక్కారు తొడిగింది మూడో క్లాసులోనే!!
    అంగీ నిక్కార్ లేకుండా నేను ఇసుకోలుకు పొయ్యేదిలేదని మా యమ్మ దగ్గర శానాసార్లు,ఏడిసి మొత్తుకొంటావుంటి.యాలంటే మాకి కిట్టప్పయివారు మారిపోతూనే రెండో క్లాసుకి సీనివాసరావని ఒగాయప్ప ఒస్తావుండె. ఆయప్ప శానా శడ్డయివారు. ఇసుకోలు ఇడిసినంక నాయట్లా ఇద్దరు,ముగ్గురు పిల్లోళ్లని బడిలోకి పిలుస్తావుండె. మెల్లగా వాకిలి మూసి,యాడాడో పిసుకుతావుండె. దోసిలి నిండా వొంటికి పోపిచ్చుకోని, సెడ్డాట్లు ఆడతావుండె. ఆ పన్లకి ఒగపక్క మాకి నగువు,ఇంగొగుపక్క ఏడుపు ఒస్తావుండె. ఆ అయివారు శానాకాలముంటే ఏమయితావున్నో గానీ,రొన్నాళ్లకే మారిపాయ. నేను పెద్దయ్యి, మీసాలొచ్చినంక గూడా ఆయప్ప ఆడీడ కనబడతావుండెగానీ, ఏమో రోగమంట పెండ్లి సేసుకో కుండానే సచ్చి పాయనంట!!
   మా వూర్లో బోడప్పగారి కురుబ సంజీవయ్య అని వుండె. ఆయప్ప వైదీకం(వైద్యం)సేస్తావుండె. ఇసుకూలుకు ఒంటికిడిసినపుదు,పెద్ద సిప్పతో వొస్తావుండె. పిళ్లోళ్ల దగ్గరికిపొయ్యి ” ఒరే నింపులుసు పొప్పరమెంటిస్తాను దోసెడు వుచ్చులు పోయండ్రా” అని దేబిరిస్తావుండె. మాకయితే శానా సిగ్గి. ఆయప్ప కనిపిస్తే సాలు దూరము పరిగెత్తిపొయ్యి పోస్తావుంటిమి. కొంతమంది గబ్బు నాయాల్లు పోస్తావుండ్రి. వాళ్లని మేము “ఆశపోతు నాకొడుకులు”అని ఎక్కిరిస్తావుంటిమి.
    అపుడు మాకి ఒగిటికి పోసేది ఒగ పెద్దాట. ఇసుకూలు ముందర కంకర రోడ్డులో వర్సగా ఏటవాలుగా బద్దిలు(చిన్న కాలువలు) తవ్వుతా వుంటిమి. ఎవురు పోసినవి ఎక్కువదూరం పోతే వాళ్లు గెల్సినట్ల. అందుకే పోసినవి నేల్లో ఇంకకుండా బోకి పెంచలు,పల్సగావుండే రాల్లు బద్ది అడుక్కు మెత్తిచ్చి శానా అవస్తలు పడతావుంటిమి.
    ఇంగ ఇసుకూల్లో శానామందికి జుట్లే!! యాలంటే మా కాపోల్ల(రెడ్డ్ల) ఇంటి దేవుడు తిరపతి  యంగటరాణస్వామి. అది మా వూరికి శానా దూరము. దాంజతకి,వూరకే షికారుకు పొయ్యినట్ల పొయ్యి కొరిగిచ్చు కొచ్చేది కాదు. సుట్టాలందర్నీ పిల్సల్ల. కొత్త బట్ట్లు కొనిపెట్టల్ల. అంతకు ముందు ఇంట్లో జనాలకి రోగమొచ్చినపుడు, వానలు రాకుంద మొండికేసినపుడు,ఆవుకు కుర్రదూడ,ఎనుముకు ఆడపెయ్యి పుట్టల్లని మొక్కుకొన్నప్పుదు, ఏటివన్న శడ్డపన్లు సేసినపుడు దేవునికి మొక్కుకోని ముడుపులు కట్టి, దొంగలకి సిక్కకుందా దాసిపెడ్తావుండ్రి. అవిట్ని తీసి పూజల్సేసి దాసప్ప కీయల్ల.(మా వూర్లో దాసరితనం కురువ కులస్తులది) దాసప్ప వాట్ని గంతలుగట్టి ఎద్దుమీదకి ఎత్తి నానా శాస్త్రాలు సేయల్ల. పూజార్లకి,బాపనోళ్లకి సంబావనాలియ్యల్ల. సాకలోల్లు బట్టలు తడుపుకొచ్చి దావలో పర్సి(అడుగులకు మడుగు లొత్తడం)గుడికానా నడిపిచ్చుకు పోవల్ల…. అంతా దుడ్ల యవ్వారము!!
   రాత్రీపగలూ కష్టంసేసినా కడుపుకు సాలని కాపుదనమోల్లు, దేవుని మిందబారమేసి “ఆ మానబావుదు సల్లగా సూసినవుడు కొండకిపొయ్యి పుట్టెంటికిలు కొరిగిస్తాములే” అని ఇడిసిపెట్తావుండ్రి. అట్ల నేను ఎనిమిదో కలాసు సదివేదంకా నా జుట్టుని తిరపతి కొండని మోసినట్ల మోసిండాను. ఆ జుట్టు తెచ్చిన అగసాట్లు ఇంగా శానా వుండివి. తిరగ సెబుతాను.
    ఈ జుట్టును మోసే బారము మిగతా కులాల కురబోల్లు,ఉప్పరోల్లు,మాదిగోల్లు,మాలోల్లు,మంగలోల్లు….ఈల్లకి లేదు. యాలంటే వాళ్ల దేవుడు మా ఊరుకి శానా దగ్గిరే వుంటావుండె. అందుకే బిరీన గుండుకొట్టిస్తావుండ్రి.
   అపుడు ఆదపిల్లోల్లు ఇసుకూలుకి వొస్తావుండ్లేదు. ఇంట్లో బోకులు కడిగేది,సన్నపిల్లోల్లను ఎత్తుకొనేదే వాల్ల పని.ఇంటి పన్లయిపోతే ఒగొగు కలాసుకు ఒగురో ఇద్దరో వొస్తావుండ్రి. మగపిల్లోల్లు నున్నగా తలదువ్వుకోని ఒంటిజడలేసుకోని,రిబ్బన్లు కట్టిచ్చుకోని, మల్లి పువ్వులు ముడుసుకోని వొస్తావుండ్రి. నేనూ అట్లే పోవల్ల అని బొలే ఆశపడ్తావుంటి. అయినా మాయమ్మకి పురుసత్తే వుండేదికాదు. ఆదరా బాదరాగా సెక్కదువ్వానితో రెండుసార్లు దిగదున్ని జనుబు దారంతో గట్టిగా ముచ్చిన గుంతలో “సుళ్” అనేటట్ల నిగర గట్తావుండె. కలర్ టేపు కావల్లని యన్నిసార్లు మా నాయన్ని అడిగినా ఇందూపురంలో మా బట్టలుకుట్టే సాయాబు దగ్గర అయిదారు రకాలు రిబ్బన్ల మాదిరీ  కత్తిరిచ్చుకొస్తావుండె గాని, నాజుట్టుకి మల్లి పూలు రిబ్బన్నుల అలంకారమే తెలేదు.
   నేను అచ్చరాల్ని ముత్యాలమాదిరీ గుండ్రంగా రాస్తావుంటి.మిగిల్న పిల్లోల్లని నేను రాసినట్లే రాయమని అయివారు కొడతావుండె. అందుకే నేను ఏడిదైనా రాస్తావుంటే,యనక కొందరు నా జుట్టు పీకుతావుండ్రి.కుల్లు నా కొడుకులు ఇంకొందురు బలపంతో ఈపుమింద పొడుస్తావుండ్రి. దానిజతకి సింపిరెంటికిలు కండ్లకి అడ్దంపడతావుండె. ఇన్నిటినీ మించి పలకనిండా రాసినంక సీమిడి నా ముక్కులో నుంచి”తప్” న పడి,రాసిందాన్నంతా నాశనం సేస్తావుండె. స్వామీ అదేమిరోగమో గాని,ఇరవైనాలుగ్గంట్లూ నా ముక్కుల్లో సీమిడి పాములుమాదిరీ “సర్ బుర్” అని కారి పోతానేవుండె. యంత యగబీకినా దారం తెంపుకొన్న జీరంగి మాదిరీ నిలుస్తానే వుండ్లేదు. ఆపక్కా ఈపక్కా తల తిప్పి బుజాలకి రుద్దుతావుంటి. ఇంటికి పొయ్యే టయానికి అంగీ రెట్లన్నీ ఎండి అట్టగట్టుకు పోతావుండె. అది జూసి మానాయిన ఈపి ఇరగ్గొట్తావుండె.
   నాకే తెలీకుందా “సర్”న జారొచ్చే సీమిడ్ని ఏమి సేసేకీ నా శాత అయితావుండ్లేదు. కానీ, కండ్లకి అడ్డమొచ్చే యంటికిలికి మాత్రం బుద్ది సెప్పుతావుంటి. రాత్రిపొద్దు సదూకొనేతప్పుడు సీమనూనె(కిరోసిన్) బుడ్డీ మిందకి తలకాయని రవంత వొంచితే సాలు,”సుర్  సుర్..” న కాలి పోతావుండె. తిరగ వారానికే సిగిరొస్తావుండె. తిరగా అదేపని సేస్తావుంటి.
   నేను రేండోకలాసులో వున్నపుడు ఒగ అయివారుండె.  యర్రగా సూసేకి బొలేవుండె.ఆయప్పేరు తెలీదుగానీ యపుడు జూసినా సిగరెట్లు తాగుతావుందె. వూర్లో అందరూ ఆయప్పని సిగరెట్ల సిద్దగాడు అని పిలుస్తావుండ్రి. ఆయప్పకీ పెద్దయివారికీ అయితావుండ్లేదు. పామూ ముంగిస యవ్వారము!! ఒగదినం మాతో దూరం దూరం  నిలబెట్టి డికుటీసన్ సెప్పుతావుండాడు. ఆపక్క పెద్దపిల్లొల్లు .”అమ్మరో నేను నీ అబ్బయి కాక,ఆకుపచ్చని ఒక చిలుకనై వున్నయెడల? పంజరంబున నన్ను బంధింతువేమో!! భయపెట్తి పోనీక బాధింతువేమో? రానుపో నేనట్టులైన నీకడకు రాను రాలేను!! తల్లిరో నేను నీ తనయుడగాక! నల్లని ఒక కుక్కపిల్లనై వున్నయెడల? పొత్తున కూర్చుండి భుజి ఇంపనీక థూత్తని పొమ్మంచు తోసి పుచ్చుదుగదా?? రానుపో నేనట్టులయిన …” అనే పద్యాలు సెప్పుకొంటావుండారు. నా తలకాయలోకి అయివారు సెప్పే పదాలకన్నా, ఇవే బాగా దూర్తావుండివి. అట్లా పొద్దులో పెద్దయివారు ఒగ సీటీ పంపిచ్చె సంతకం సేయమని. సిగరెట్టయివారు యగా దిగా దాన్ని సూసి “సిరా పరా” సించి కిటికీలో నుంచి అవతల్కి పారేశ.
   వున్నట్లుండి పెద్దయివారు పొడిసే ఎద్దు మాదిరీ తలకాయి నిలెత్తుకోని,సేతి రెట్లు యగమడ్సుకోని గుడిబారొచ్చె. ఒచ్చినోడు వొచ్చినట్లే శంపల మింద నాలుగంటిచ్చె. ఆయప్పేమీ సన్నోడుగాదు ఆ మూల్లో ఇరిగి పడిండే శర్కా శక్కలుంటే అందుకోని వాంచబట్టె. మేం పిల్లోల్లంతా కేకలేసుకొంటా అవతల్కి పారి పోతిమి.
   వూర్లో జనాలొచ్చి ఇడిపిచ్చిరి. తిరగ సూస్తే మా కలాసులో ఒగ పలకగూడా మిగల్లేదు.అన్నీ వాళ్ల కాళ్లకిందబడి వడకలయిండివి. అవిటింజూసి అందరూ ఏడ్సిరి గాని,నాకి ఆనందమాయ. యాలంటే అది పాతగయ్యి అచ్చరాలు కనపడకుండా సమిసింది,  శానాసిన్నది. తిరగ దినమే మా యన్న  (అప్పుడు నాయనను  “అన్న” అనేవారం.నా+అన్న “నాయన” అయి అందులోని సగం “అన్న” కావచ్చు) రెండణాలు(12 పైసలు) పెట్టి కొత్తపలక తెచ్చె.
    ఈ అయివార్ల గలాట ముగిసి పోలేదు. ఒగదినం సిగరెట్టయివారు సినిమా సూసి రాతిరి తొమ్మిది గంటల్కి ఇందూపురం నుంచి సైకిల్లో వొస్తావుంటే– పెద్దయివారు,ఆయప్ప బావమరిదితో కల్సి మరవ వంకతావ నిలబెట్టి బాగ సితగ్గొట్టిండాడు. తిరగదినం వూర్లో పెద్దరెడ్లనందర్నీ పిల్సి పంచాయితీపెట్రి. అది రెండుమూడు దినాలు జరుగుతానే వుండె. ఒగదినము మామిళ్ల ముసలమ్మ కావొచ్చు అంతదూరంలో నిలబడి “బాపనోళ్లంతా శ్వాములు. స్వాములంటే పెద్దబుద్దు లుండాల్సినోళ్లు. సన్న జనాల మాదిరీ కర్సలాడేకే సరిపోతే ఇంగ పిల్లోల్లకి సదువు లెట్ల సెప్పుతారు” అని, ఇనీ ఇనపడ్నట్ల యక్కడో సూసుకొంట దులిప్పరేశ. ఆయమ్మ మాట్లిన్న జనాలు గట్టిగా నగిరి. అదేమి జరిగినోగాని, సిగరెట్లయివారు మారిపాయ.
   ఇంగొగయివారొచ్చె. ఆయప్ప పేరు శానా బాగుండేకానీ, ఆ మాన్నబావుదు ఇసుకూలుకొస్తూనే కురిసీలో కూకోని గొరకలుపెట్టి నిద్దర పోతావుండె. తూక్కొంటా ముగ్గరిచ్చి,ముందరికి పడతావుండె. పిల్లోల్లు ఆ అయివార్ని తూగుడు కోడి అని పిలుస్తావుండ్రి. (అప్పుడు ఇళ్లలో పెంచే కోళ్లకు కొక్కెర తెగులు అనే రోగం వచ్చేది.అది సోకగానే నిలబడిన కోడి నిలబడినట్లే కళ్లుమూసి తూగుతూ నేలకు పడి చనిపోయేది).ఆ  అయివారుకు పాటం సదివేదే వొస్తావుండ్లేదు. ఒకట్లు(ఎక్కాలు) పదిసార్లు రాయండి,బయట కూకోని పాటం సదివేది నేర్సండి…..మిరప సెట్లు ఏసినోల్లు కాయగూర్లు పీక్కు రాండి…అనే పొద్దు గడుపుతా వుండె.

రౌద్రం

ఈ “మోహనం”- నవరసాలకు ఆధునిక చిత్ర రూపం. నా దృష్టి నించి నాకు తెలిసిన రంగుల భాషలో చేస్తున్న వ్యాఖ్యానం.

మన కళల్లో కలల్లో నిజాల్లో అందంగా వొదిగిపోయిన సౌందర్యం నవరసాలు. మన చిత్రాలు, శిల్పాలు, సాహిత్యాలు అన్నీ నవరసభరితం. ముఖాల కదలికల్లో, శరీర భాషలో, శబ్ద రాగ కాంతిలో లీనమైపోయిన ఈ తొమ్మిది రసాలకు – ఉద్వేగాలకు- దృశ్యానువాదం ఈ ‘మోహనం’. ఒక్కో రసమూ ఒక భావనగా ప్రతిబింబించే ప్రయత్నం ఇది. ప్రతి రసం తనదైన ప్రతీకాత్మక వర్ణంలో, అల్లికతో, శక్తితో మీ ముందు వుంచే ప్రయోగం ఇది. ఇవి డిజిటల్ కాన్వాస్ మీద రూపు వెతుక్కున్న చిత్రాలు, కాబట్టి ఆ రకంగా కూడా ఇదొక ప్రయోగమే! ఇలా ప్రతి గురువారం ఒక రసదృశ్యం మీ ముందు…..

ఈ చిత్రాలు నాన్న – వేగుంట మోహన ప్రసాద్- స్మృతిలో, అందుకే ఇవి “మోహనం” !

Raudram

Mamata

Mamata Vegunta

హింసకీ అపకారానికీ మధ్య నడిచే కథ- వధ

 

నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

“మంచి కథ” అంటే ఏమిటనే విషయం మీద పుంఖాను పుంఖాల చర్చలు విన్నాం, చదివాం. కానీ ఏదో ఒక నిర్ధారణకి రావడం కష్టమే. వ్యక్తిగతంగా నాకు చాలా చర్చలు అర్థం కూడా కావు. దేన్ని మంచి కథ అని అనడానికి వీలవుతుందో అన్న విషయం మీద ఏకాభిప్రాయానికి రావడం కూడా కష్టమే. అయితే ఒకటి మాత్రం అందరమూ ఒప్పుకోక తప్పదు.

కథ చదివి పక్కన పెట్టిన తరవాత కూడా పాఠకుడు దాన్ని గురించి ఆలోచించగలిగితే, ఆ కథలో చర్చకు పెట్టిన విషయాలని నిజ జీవితంలో జరిగే అనేకానేక సంఘటనలకీ, చుట్టూ నడుస్తున్న చరిత్రకీ అన్వయించుకోగలిగితే, అది నిస్సందేహంగా గొప్ప కథ. చెప్పిన విషయం abstract గా వుంటూనే, మన బ్రతుకుల్లోని నిజాలని టార్చి లైటు వేసి మన ముందు నిలబెట్టగలిగితే, ఆ అనుభూతి ఎన్నటికీ మనలని వదిలి పోదు. ఎన్ని సార్లు ఆ కథ చదివినా మనం లోతుగా, లోలోతుగా ఆలోచనలని ఆస్వాదిస్తూనే వుంటాము. మరందుకే కదా సాహిత్యం ఆలోచనామృతమయింది.

1956-67 మధ్య కారా మాస్టారు అయిదు కథలు రాసారు. (తీర్పు, ఇల్లు, వధ, యఙ్ఞం, మహదాశీర్వచనం) సంఖ్యాపరంగా చూస్తే పదకొండేళ్ళల్లో అయిదేనా అనిపించినా, కథలన్నీ వేటికవే ప్రపంచ సాహిత్యంలోని ఆణి ముత్యాల్లో నిలబడ్డ కథలు. ఆ అయిదిటిలో యఙ్ఞం కథ (1964) అన్నిటికంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆ తరవాత సంవత్సరం ఆయన “వధ” రాసారు. అయిదింటిల్లోనూ మనుషుల మధ్య వుండే సంబంధాల్లో లీలగా గోచరమయ్యే ‘ హింస ‘ ఏక సూత్రంగా కనబడుతుంది. మన జీవితాల్లో ఇంత హింస నిండి వుందన్న సంగతి మనకి తెలిసీ వుండకపోవచ్చు, తెలిసినా ఒక రకమైన నిర్లిప్తతతో దాన్ని భరిస్తూ వుండి వుండవచ్చు. ఈ హింసనే బట్టలిప్పి మనముందు నగ్నంగా నిలబెట్టి దాని గురించి ఆలోచించమని మనని సవాలు చేస్తాయి ఈ కథలు.

‘హింస ‘ శారీరకమైనదైనా, మానసికమైనదైనా, ఒకటే! మనిషిని బ్రతుకు కష్టపెట్టినప్పుడు సంఘర్షణ అవుతుంది, పక్క మనిషే కష్టపెట్టినప్పుడు అది హింస అవుతుంది. హింస గురించీ, హింసకి మన ప్రతిచర్యల గురించీ ఆలోచించక తప్పని దశలో వున్నాం మనం!

అసలు పన్నెండు పేజీల “వధ” లోని కథ మనకి తెలియనిదేమీ కాదు. కథంతా ఒక్కటే సంఘటన! తండ్రి ఆనతి తలదాల్చు తనయుడూ, ధర్మ స్వరూపుడూ అయిన రాముడు ఋష్యమూక పర్వతం వద్ద వాలి సుగ్రీవుల యుధ్ధం చూస్తూ ఆలోచిస్తున్నాడు. చెట్టు చాటునుంచి వాలిని చంపడాన్ని ఆయన అంతరాత్మ ఎంత మాత్రమూ సమర్ధించలేకపోతూ వున్నది. అప్పుడాయన ‘ తాను ఏం చేయడమా ‘ అన్న ధర్మ సంకటాన్ని పక్కన పెట్టి ‘వాలి ఏం చేస్తున్నాడూ ‘ అన్న విషయం గురించి ఆలోచించి, వాలి వధకు పూనుకున్నాడు.

రామాయణం లోని కథలకి ఎన్నో వ్యాఖ్యానాలూ, ఉపాఖ్యానాలూ వున్నాయి. స్థూలంగా వింటే ఇదేదో ‘రాముణ్ణి సమర్ధించే కథ కాబోలు ‘ అని అనిపించొచ్చు.

కానీ, లోతుగా చూస్తే, సున్నిత మనస్కుడైన మనిషికీ తప్పొప్పుల విచక్షణ చేయగలిగే మనిషికీ, అందులోనూ బలవంతుడైన వీరుడికీ, అడుగడుగునా ఎదురయ్యే ధర్మ సంకటాలు కనిపిస్తాయి. ఆలోచించనా శక్తీ, భుజబలమూ వున్న మనిషి చేయక తప్పని బాలన్స్ వాక్ అది.

పైకి చూస్తే వాలి సుగ్గ్రీవులది అన్న దమ్ముల కొట్లాట. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదు. కానీ, నిజంగా అంతేనా? తెలిసో తెలియకో తమ్ముడు సుగ్రీవుడు అన్న పట్ల అపచారం చేసాడు. అప్పుడు వాలి ముందు మూడు దారులున్నాయి. తమ్ముణ్ణి మన్నించి అక్కున జేర్చుకోవడం. లేదా తమ్ముణ్ణి ఆ చుట్టు పక్కల లేకుండా వెళ్ళ గొట్టడం, లేదా అతన్ని హత మార్చడం. కానీ, వాలీ ఈ మూడు దారుల్లో వేటినీ ఎన్నుకోలేదు. తమ్ముడి భార్య రుమను చెరపట్టి, సుగ్రీవుడు ఆ చుట్టు పక్కల నుండి పారిపోకుండా చేసాడు. భార్య పరాయి చెరలో వుందన్న రోషంతో సుగ్రీవుడు తనతో తలపడకా మానడు, ఒళ్ళు హూనం చేసుకోకా మానడు. ఈ మానసిక శారీరక హింసలో సుగ్రీవుడు అలిసిపోతూంటే ఆనందిస్తున్నాడు వాలి.

జంతువు ఆకలేసినప్పుడో భయపడ్డప్పుడో తోటి జంతువుని చంపుతుంది. అది అపకారం. ఆలోచనాశక్తి వున్న మానవుడు మాత్రమే తోటి ప్రాణిని చావుకీ బ్రతుక్కీ మధ్య వేలాడదీసి ఆనందించగలడు. అది హింస. బలహీనుణ్ణి బలవంతుడు హింసిస్తూంటే మిగతావారికి ఆ బలహీనుడి పక్షం వహించక తప్పదు. అప్పుడు ధర్మాధర్మ విచక్షణ కూడా పక్కన పెట్టకా తప్పదు. అలా ధర్మా ధర్మ విచకషణ పక్కన పెట్టి దుష్టుణ్ణి శిక్షించకపోవడమే ధర్మాత్రిక్రమణమవుతుందని రాముడు మరణించబోయే వాలితో అంటాడు.

సాంఘిక పరిణామంలో మనం మనిషి మనిషికి అపకారం చేయకుండా కట్టుదిట్టాలు చేసుకున్నాం, కానీ హింసించకుండా పెద్ద ఏర్పాట్లు చేసుకున్నట్టు అనిపించదు. ఇది ఆలోచించాల్సిన విషయం.

వస్తువు తో పాటు సమానమైన గాంభీర్యాన్నీ, గాఢతనీ కథనం సంతరించుకుందీ కథలో. సాధారణంగా కథల్లో వర్ణనలకెక్కువ చోటూ వుండదు. కథలో వర్ణనలు చేయదల్చుకుంటే దానికి తగినంత కారణం వుండాలి. ఈ కథలో మొదటి రెండు పేజీలూ అరణ్యాన్ని వర్ణించడానికే కేటాయించారు మాస్టారు. అయితే, ఆ వర్ణన ప్రపంచంలో వున్న జంతు న్యాయానికి ప్రతీకగా నిలిచి  పైన పచ్చగా అందంగా వున్నా, లోపల భయంకరమైన హింసాకాండ జరుగుతుందన్న విషయాన్ని సూచిస్తుంది.

అరణ్యంలో మూలనో ఒక్క మూలన ఎప్పుడూ కార్చిచ్చు రగులుతూనే వుంటుంది. అయినా తక్కిన అరణ్యమంతా తనకు పట్టనట్టు పచ్చగా కళకళ లాడుతూ చూపరులకు సృష్టి కర్త వైచిత్రి చాటుతూ వుంటుంది. అదే దానిలోని సొబగు…”

అన్న వాక్యాలు కాలానికతీతంగా మానవ సంఘానికి దర్పణం పడుతున్నాయంటే కాదనగలమా? వాలి సుగ్రీవుల వైషమ్యమూ, యుధ్ధరీతీ, రాముని మీమాంసా, నిర్ణయమూ ప్రతిదీ అలా అలా స్పృషిస్తున్నట్టే వున్నాయి, కానీ చాలా స్పష్టంగా వున్నాయి. అది కథనం లో ఆయనకున్న నైపుణ్యమూ, ఆయన గొప్ప హృదయ సౌందర్యమూ తప్ప ఇంకేమీ కాదు.

తన అంతరాత్మ చేస్తున్న మందలింపులనీ, చికాకునీ పక్కన పెట్టిన రాముడు చూసింది, వాలిలో మూర్తీభవించిన క్రౌర్యం, దౌష్ట్యం, మదాంధత గర్వం“, విన్నది “సుగ్రీవుని కంఠంలో అణచి వేయబడుతున్న ఆర్తనాదం“. అంతరాత్మనీ  ధర్మ పన్నాలనీ పక్కన పెట్టి బాణం వేసి వాలిని నేల కూల్చమని రాముడికి మనమే సలహా ఇవ్వమా?

లోకంలో దుష్టులందరూ యిలానే తాము చేయబోయే దౌష్ట్యానికి నేపథ్యం సృష్టిస్తారా,” అని కలవరపడ్డ రాముడినీ, తన తమ్ముడు లక్ష్మణుని ఆపాద మస్తకమూ చూసి, తన తమ్ములెప్పుడూ సుగ్రీవులు కారు. తానెన్నటికీ వాలి కానేరడు ‘ అని తలపోసిన ధర్మమూర్తి రాముడినీ నిలబెట్టి, నేటి సమాజానికి ఎటువంటి ఆదర్శమూర్తుల ఆవశ్యకత వుందో తెలియజేసిన కథ- ‘వధ ‘.

 -శారద

శారద

శారద

 

శారద ఆస్ట్రేలియాలో ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నారు. అడిలైడ్ నగరంలో నివాసం. శారదగారు రాసిన యాభై కధలతో ‘నీలాంబరి’ కధ సంపుటికి గత సంవత్సరం ఆవిష్కారం జరిగింది. శారదకు కుటుంబరావు, తిలక్ ఆంగ్లంలో చెహోవ్, సోమర్ సెట్ మాం ఇష్టం. ఇంకా ఈ మధ్య రాస్తున్న వారిలో చాలా మంది బాగా రాస్తున్నారని అన్నారు. కథా రచనలో మెలకువలని నేర్చుకోవడానికీ, ఆలోచనలని స్పష్టం చేసుకోవడానికీ, జీవితాన్నీ, సాహిత్యాన్నీ మధించడం తప్ప వేరే మార్గం లేదని శారద  అభిప్రాయం. శారద బ్లాగ్ www.sbmurali2007.wordpress.com.

వచ్చే వారం: పాలపర్తి జ్యోతిష్మతి ‘రాగమయి’ కధ గురించిన పరిచయం 

‘వధ’ కథ ఇక్కడ:

లేమి

<
 02 copy

 
అద్దాలు
అక్షరాలు
అనుభవించే శరీరం లేదు

నీడని
నీటిని
తాకే నేత్రం లేదు

శబ్దాలు
మౌనాలు
దాటే మనసు లేదు

శోకాలు
నవ్వులు
దాచే వాక్యం రాయలేను

ఎన్నటికి ప్రేమిస్తాను
విరిగిన కలల్ని
తెలియని పదాల్తో

వొదిలెళ్ళే జ్ఞాపకాల్ని
ఎప్పటికీ మన్నించను

తీరిగ్గా నిద్రపోవాలిక

-ఎం.ఎస్. నాయుడు

naidu

ఎప్పుడన్నా నేను

రాత్రిలా అలంకరించుకోవాలనుకుంటాను నేను
అక్కడక్కడ చుక్కలతో – ఎక్కడో నెలవంకతో
వెలుగుతో చెరచబడి
ఉదయం నెత్తుటితో మొదలయ్యే జీవితం అవుతుంది నాది

గాలిలా స్నేహించాలనుకుంటాను నేను
అక్కడక్కడ స్పర్శలతో – ఇంకో చోట సుడిగుండం బిగి కౌగిలిలో
ఋతువుతో అవమానింపబడి
దిక్కు తోచని దిక్కు లేని తనమే తోడౌతుంది నాకు

కనీసం

చేపలా ఏకాకి తనాన్ని అనుభవించాలనుకుంటాను నేను
ఎప్పుడన్నా కొన్ని నీటి ముద్దులతో – అప్పుడప్పుడు
నీటి బుడగల్లాంటి మనుష్యుల మధ్య ప్రయాణం తో
పారే నీటిలో ప్రతి క్షణం
మొప్పల్లో నా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది

జీవించడం రెండు భూగోళాల మధ్య
రూపమే లేని పాల పుంతలా ఉంది
సరే !
ఆశల విలువ బతుకు కంటే అమూల్యమైనది కదా ! !

-ఆంధ్రుడు

My photo-1

ఎప్పుడు చూసినా నిత్యనూతన నయాగరా!

     ఈమధ్య ఇండియా నించీ మాకు చుట్టాలొచ్చారు. మా తమ్ముళ్ళిద్దరు, మేనకోడలు, వాళ్ళ కుటుంబాలు. అట్లాంటాలోని మా మేనల్లుడితో సహా, మొత్తం పన్నెండు మందిమి, ఒక వాన్ తీసుకుని మా యాత్రా స్పెషల్ మొదలుపెట్టాం. అట్లాంటా నించీ ఎన్నో, ఎన్నెన్నో ప్రదేశాలు చూసుకుంటూ, నయాగరా దాకా వెళ్లి వచ్చాం. మేము చూసిన ఆ ఎన్నో, ఎన్నెన్నో ప్రదేశాల గురించి ఇక్కడ వ్రాస్తే, నేను వ్రాస్తున్నప్పుడూ, మీరు చదువుతున్నప్పుడూ, ఈ కథనం ఇవాళ మొదలుపెడితే, మర్నాడు ప్రొద్దున్న భళ్లుమని తెల్లవారే దాకా, అలా నయాగరా జలపాతంలా పోతూనే వుంటుంది. అందుకని ఈసారికి ఒక్క నయాగరా గురించే వ్రాస్తాను.

ప్రపంచంలో జలపాతాలు గురించి చదివితే, కొన్ని బాగా ఎత్తయినవి, కొన్ని బాగా వెడల్పయినవి, కొన్ని నీటి పారుదల దృష్ట్యా చాల పెద్దవి, కొన్ని ఎంతో అందమైనవి… ఇలా ఎన్నో రకాలున్నాయి. అందుకని, మా గుంటూర్లో పిచ్చి కిష్టయ్యలా, ఇవన్నీ కలిపేసి చూస్తే, నయాగరా జలపాతాలు ప్రపంచంలో తొమ్మిదో రాంకులో వున్నాయి. మొదటి మూడూ ఏమిటంటే, మొదటిది – లావోస్ దేశంలో వున్న ఖోన్ ఫాల్స్. 35,376 అడుగుల వెడల్పు జలపాతం. దీని ఎత్తు మాత్రం 69 అడుగులే! ఇక రెండవది – వెనిజువేలా దేశంలో వున్న, సాల్టోపారా జలపాతం. దీని వెడల్పు 18,400 అడుగులు. మూడవది – మధ్య ఆఫ్రికాలోని గాబన్ అనే దేశంలోని కొంగో ఫాల్స్. ఇవి 10,500 అడుగుల వెడల్పు. ప్రతి నిమిషానికి 1.9 మిలియన్ల ఘనపుటడుగుల నీళ్ళు పారుతుంటాయి.

ఇహ.. నయాగరా ఫాల్స్ సంగతి చూద్దాం. ఇవి అమెరికా దేశానికి ఉత్తరాన, కెనడా దేశానికి దక్షిణాన వున్నాయి. అంటే అమెరికాలో ఈశాన్య దిక్కున, ఈ రెండు దేశాల మధ్యా సరిహద్దుల్లా వున్నాయన్నమాట.

నయాగరా జలపాతం, మూడు జలపాతాల సంగమం. ఒకటి ‘హార్స్ షూ ఫాల్స్’, రెండవది ‘అమెరికన్ ఫాల్స్’, మూడవది ‘బ్రైడల్ వెయిల్ ఫాల్స్’. ఈ మూడూ ఎరీ నదిలోని నీటిని, ఆంటారియో లేక్ లోకి ప్రవహింప చేస్తాయి. దీని ఎత్తు 167 అడుగులే అయినా (కొన్ని చోట్ల 188 అడుగులు కూడా వుంది), నిమిషానికి ఆరు మిలియన్ల ఘనపుటడుగుల నీరు ప్రవహిస్తుంది. నయాగరా జలపాతం వెడల్పు 2,600 అడుగులు మాత్రమే!

నయాగరా అంటే, మొహాక్ ఇండియన్స్ వారు మాట్లాడే భాషలో ‘మెడ’ అని అర్ధం. 1604 ప్రాంతంలోనే దీనిని, కెనడాకి వచ్చిన ఫ్రెంచ్ వారు, అమెరికాకి వచ్చిన పూర్వీకులు కనుగొన్నారు. 18వ శతాబ్దంలోనే నయాగరా జలపాతాన్ని చూడటానికి ఎంతోమంది యాత్రీకులు వచ్చేవారుట. 1897లోనే ఈ రెండు దేశాల్నీ కలుపుతూ, ఒక బ్రిడ్జిని కట్టారు. దాని పేరు, Whirlpool Rapids Bridge. ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద రైళ్ళూ, కారులూ అన్నీ నడిచేవి. కార్ల కోసం కొత్త బ్రిడ్జ్ కట్టినా (దాని పేరు రైన్బో బ్రిడ్జ్), పాత బ్రిడ్జి మీద ఇంకా రైళ్ళు నడుస్తూనే వున్నాయి.

మొదటి ప్రపంచ యుధ్ధం అయిపోయాక, నయాగరా జలపాతం చూడటానికి వచ్చే జనాభా ఎక్కువైనారుట.

నయాగరా జలపాతం అందాలు అమెరికా వేపున చాల బాగుంటాయి. అవి చూడాలంటే, సరిహద్దులు దాటి, కెనడా వేపు వెళ్ళి చూస్తే బాగుంటుంది.

మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు, రెండు పక్కల నించీ చూశాం కానీ, ఈసారి ఒక్క అమెరికా వేపు నించే చూశాం.

satyam1

 

అంతేకాదు, ఈ జలపాతంలోని నీటి శక్తిని ఉపయోగించుకుని, ఇక్కడ రెండున్నర మిలియన్ల కిలోవాట్స్ ఎలక్ట్రిసిటీని ఉద్పాదిస్తున్నారు. ఇది పడమటి ప్రపంచంలో కల్లా ఎంతో పెద్దదయిన హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్టు.

ఇదీ క్లుప్తంగా నయగరా చరిత్ర, సాంకేతిక వివరాలు. ఇక మా యాత్రా విశేషాలు చూద్దాం.

అక్కడికి చేరగానే, హోటల్ గదుల్లో సామానంతా పడేసి, ఇక రంగంలోకి దిగాం. మా హోటల్ కూడా జలపాతానికి నడక దూరంలో, నయాగరా స్టేట్ పార్క్ పక్కనే వుంది.

ఇక్కడ చూడవలసినవి చాల వున్నాయి.

ముందే అనుకున్నట్టుగా, సరాసరి ‘మైడ్ ఆఫ్ ది మిస్ట్’ దగ్గరికి వెళ్ళాం. టిక్కెట్లు అన్నీ హోటల్లోనే కొన్నాం కనుక, అక్కడికి వెళ్ళగానే – లిఫ్ట్ ఎక్కి, అంత ఎత్తు నించీ క్రిందకి దిగి, అక్కడ ఒక బోటు ఎక్కాం. బోటు ఎక్కే ముందు, అందరికీ పాంచోలు (రైన్ కోటు లాంటివి) వాళ్ళే ఇస్తారు. అవి వేసుకుని, తల అంతా పాంచోలో వున్న టోపీతో కప్పుకుని, బోటులో అందరం రైలింగ్ పట్టుకుని నుంచున్నాం. ఈ బోటుకి రెండు అంతస్థులు. ఇది నెమ్మదిగా, ఈ మూడు జలపాతాలు పక్క నించీ వెడుతుంటే, ఆ శబ్దం, గాలి, తల మీద పడే నీటి తుంపరలే కాక, అక్కడక్కడా కుండపోత వర్షంలా పడే నీరూ… అదొక అందమైన అనుభవం. ఆ హడావిడిలోనే, కెమెరాలు, సెల్ఫోనులూ బయటికి తీసి, అందరం ఫొటోలు తీస్తూనేవున్నాం. కొన్నిచోట్ల, మా బోటు గాలికి వూగుతుంటే, జనం

అరుపులు పెడుతుంటే… (భయంతో కాదు, సంతోషంతో), మేమేదో సాహసయాత్ర చేస్తున్నామన్నంత సరదా!

satyam2

 

అక్కడనించీ రాగానే, “కేవ్ ఆఫ్ ది విండ్స్” దగ్గరికి వెళ్ళాం. అక్కడికి కొంచెం దూరమే అయినా, ఆ చల్లటి వాతావరణంలలో నడుస్తుంటే హాయిగా వుంది.

“కేవ్ ఆఫ్ ది విండ్స్” దగ్గర కూడా, మళ్ళీ పాంచోలు వేసుకుని, క్రిందికి దిగి వెళ్ళాం. చిన్న చిన్న చెక్కలతో కట్టిన ప్లాట్ఫారాల మీద నడుచుకుంటూ, ఒక జలపాతం క్రింద దాకా వెడతామన్నమాట. ఇక్కడ గాలి విపరీతంగా వుంటుంది. జలపాతం హోరు చెవుల్ని చిల్లులు పడేట్టు చేస్తుంది. మన మీద పడే నీళ్ళు కూడా, మన మీద మద్దెల దరువు వేస్తుంటాయి. ఎంత పెద్దవాళ్ళయినా, పిల్లల్లాగా ఆడుకోవటానికి అనువైన ప్రదేశం.

satyam3

ఇంకా ఇక్కడ చూడవలసిన వాటిల్లో, డిస్కవరీ సెంటర్. అక్కడ ఎంత సమాచారం కావాలంటే అంత దొరుకుతుంది. అక్కడి నించీ, నడిచి క్రింద దాకా వెళ్ళాలనుకునే వాళ్ళకి, మంచి వాకింగ్ ట్రైల్స్ కూడా వున్నాయి.

హాయిగా సినిమా హాల్లో కూర్చుని నయాగరా అందాలు చూద్దామనుకునే వాళ్ళకి, ఒక అడ్వెంచర్ థియేటర్ కూడా వుంది.

ఆఁ! చెప్పటం మరచిపోయాను. నయాగరా ‘సీనిక్ ట్రాలీ బస్’ కూడా వుంది. ఒకచోటు నించీ, ఇంకా చోటుకి వెళ్ళటానికి బాగుంటుంది. దారిలో ఎన్నో పార్కులు, పూల మొక్కలూ, మధ్యే మధ్యే ఆ జలపాతపు నీటి మీద, రంగురంగుల ఇంద్రధనస్సులు. ఎంతో అందమైన ప్రదేశం.

రాత్రి పూట, అమెరికా వైపునా, కెనడా వైపునా రంగురంగుల లైట్లు వేసి, సౌండ్ అండ్ లైట్ షో వేస్తారు. ఆ నీటి మీద, గాలిలోని తేమ మీద, ఆ దీపాలు పడి, ఎంతో అందంగా వుంటుంది. తప్పక చూడవలసిన వాటిల్లో ఇది ఎంతో ముఖ్యమైనదని నా ఉద్దేశ్యం.

ఈ షో అయిన, కాసేపటికి టపాకాయలు కాల్చి, ఇటు క్రింద నీటిలోనే కాక, ఆకాశంలో కూడా రంగులు పులిమేసి, ఆ రేయిని కాసేపు పగలుగా మార్చేస్తారు. అదంతా అయిపోయినా, అక్కడనించీ కదల బుధ్ధి అవదు.

ఏనాడో నేను ఈ నయాగరా జలపాతం మీద విన్న ఒక జోకు చెప్పి, ఈ వ్యాసం ముగిస్తాను.

నయాగరా జలపాతం చూడటానికి, అందరూ ఆడవాళ్ళే వున్న టూరిస్ట్ బస్ ఒకటి వచ్చిందిట.

ఆ బస్సులో వున్న గైడ్, పెద్దగా కబుర్లు చెప్పుకుంటున్న ఆడవారితో అంటాడు, ‘మీరంతా కాసేపు నిశ్శబ్దంగా వుంటే, ఈ నయాగరా జలపాతం చేస్తున్న హోరు వినవచ్చు’ అని!

ఏది ఏమైనా, అవకాశం దొరికితే తప్పక చూడవలసిన ప్రదేశాల్లో నయాగరా జలపాతం ఒకటి!

-సత్యం మందపాటి

satyam mandapati

 

తెలుపో… నలుపో… జాన్తానై …

“నల్ల మందు తెలుసు. ఈ నల్ల ధనం ఏమిటండీ? ఎక్కడుంటుందండీ?

రాజ్యాంగంలోని 21 వ అధికరణ కింద పౌరులకు లభించిన గోప్యతా హక్కు ఎవరి కొంపైనా ఎలా ముంచుతుందండీ? రాజ్యాంగంలోని 32(1) అధికరణ ప్రకారం ఎలాంటి సమాచారం ప్రకటించలేమని సర్కారు చేతులు ఎందుకు కట్టేసుకుందండీ? ఎన్డియే మొన్న మే మాసంలో సుప్రీం రిటైర్డు జస్టిస్ ఎం బి షా సారథ్యంలో ప్రత్యేక బృందాన్నిఏ తమాషా కోసం నియమించిందండీ? తొందరపడి ఎవరి పేర్లనూ బైట వద్దని అసోచామ్ ఎందుకు అడుగుతుందండీ? ద్వంద్వ పన్నుల విధానం అంటే ఏమిటీ? అది దెబ్బతింటే దేశ ప్రతిష్థకు, విశ్వసనీయతకు ఏ విధంగా విఘాతం కలుగుతుందండీ? ఏ ఆరోపణలు నిరాధారమైనవని తేలితే ఏ వ్యక్తులకు అప్రతిష్ఠ ? నల్లధనానికి ఆస్కారంలేని వ్యవస్థాగత సంస్కరణలా.. అవేమిటండీ?”

పొద్దస్తమానం అలా వార్తా పత్రికలు ముందేసుకుని జోగుతుంటారు గదా శ్రీవారూ.. ఈ చిక్కు ముళ్ళేమన్నా కాస్త విప్పుతారేమోనని దగ్గరికి వెళ్ళడిగా బుద్ధి లేక పొద్దున్నే! ఏ ముడి అనుకున్నారో ఏమో పాడు.. హుషారుగా లేచి నిలబడి ఆనక విషయం విని చారునీళ్ళల్లో అప్పడంలా చప్పడిపోయారు “ప్చ్.. అంతంత పెద్ద విషయాలు నీ కొద్ది బుర్రలో పట్టవులే గానీ.. మీ ఆడాళ్ల కవసరమైన ఓ ముఖ్య సమాచారం మాత్రం చెప్తా విను” అని మాట దాటేశారు. ‘ఇక్కడ సంపాదించిన సొమ్మును ఇక్కడి లెక్కల ప్రకారం పన్నులూ పాడూ కట్టకుండా.. ఇక్కడే ఖర్చు పెట్టకుండా ఇంకెక్కడో దేశంలో పూడ్చి పెడితే దాన్ని విదేశీ నల్ల ధనం అంటారని.. అధికారంలో కొచ్చిన వంద రోజుల్లో ఆ దేశాల్లో ఉన్న నల్లధనాన్నంతా తవ్వి తెచ్చి తలా ఒక పదిహేను లక్షలు దాకా మోదీజీ పంచబోతున్నారనీ’ మా వారు చెప్పిందాన్ని బట్టి నాకు అర్థమైన సమాచార సారాంశం. డబ్బు పంచడం వరకూ సంతోషమే కానీండి.. ఎక్కడ దాచుకోవాలో.. ఎక్కడ పూడ్చుకోవాలో.. సంపాదించుకునే వాడి ఇష్ట ప్రకారం కాదా ఉండేదీ! ఇదేందీ.. ఇందులో ఏదో మతలబు ఉంది.. ఎక్కడో తంతా ఉంది!

నాలుగు రాళ్ళు ఎక్కువొచ్చే చోట.. ఇచ్చిన సొమ్ముకు కాళ్ళు రావన్న గట్టి నమ్మకం ఏర్పడ్డ చోట చూసి మరీ చక్రవడ్డీకి అప్పులిచ్చేది మా ఊళ్ళో వెంకాయమ్మ గారు. మా పేట ఆడాళ్ళందరికీ ఆమే ఆడ చంద్రబాబు. గవర్నమెంటుకు చెప్పనంత మాత్రాన ఆమె దగ్గరున్న చీటీపాటల డబ్బంతా నల్లసొమ్మై పోతుందా.. విడ్డూరం కాక పొతే! ఆ మాటే మా ఇంటాయనతో అంటే ఆయన గారేమో తల గోడకేసి మోదుకున్నారు. “నన్ను చంపక.. పోయి ఓ కప్పు కాఫీ పట్రా! అసలే ఇక్కడ నే టెన్షన్తో చస్తూంటే మధ్యలో నీ టీవీ చర్చలు!” అని విసుగూ! వివరంగా చెప్పే విషయం కరువైనప్పుడల్లా ఇలా కరవ రావడం మా వారికి ఆ జగన్ బాబుకు మల్లే మామూలే లేండి! సరే!.. మా సంబడాలకేం గానీ.. ముందీ నల్లధనం సంగతే ఏందో తేల్చాలి.

ఈయన గారొచ్చి వివరించక పోతే మహా మనకిహ లోకంలో తెలిసే మార్గాలే కరువా! ఇంట్లో ఆయన చూసే టీవీనే నేనూ చూసేది అంతకన్నా ఎక్కువ సేపు. ఆయన గారు చదివవతల పారేసే ‘ఈనాడే’ నేనూ ఆనక తిరగేసేది. కాక పోతే ఎప్పుడూ చూసే సీరియళ్లూ.. సినిమా కబుర్లూ కాస్త పక్కన పెట్టి ఈ నల్లదనం మీదా ఓ సారి దృష్టి పెడితే సరి.. సర్వం మనకే అరటి పండు వలిచినంత సులువుగా అవగతమయి పోతుంది.

అవగతమయింది కూడాను. ఓస్! ఇంతోటి భాగ్యానికే ఇన్ని రోజుల బట్టీ దీని మీదిన్ని కుస్తీ పట్లా! వ్యవహారం సుద్దపిక్కతో ముగ్గేసినంత సుబ్బరంగా కనిపిస్తుంటేనూ! ఓపిక .. సావకాశం ఉన్నవాళ్లేవేవో.. నానా అగచాట్లు పడి.. నాలుగు డబ్బులు గడించారే అనుకోండి.. పోనీ అది డబ్బు కాదబ్బా.. గడ్డే అనుకుందాం.. ఎవరు మాత్రం తినడం లేదీరోజుల్లో ఈ గడ్డీ గాదం! పన్నులు కట్టనంత మాత్రాన పచ్చ నోటు ఎలా నల్లబడుతుందో నా బుర్రకింకా ఎక్కటం లేదమ్మా!

blck

ఏనుగు బరువేయబోతే చీమైనా ఏం చేస్తుంది? పుట్టల్లోనే నక్కుంటుంది. వేలు పెడితే ఠక్కుమని కుట్టేస్తుంది కూడాను. కాల్చినా కాల్చకున్నా మనం పాత బకాయిల్తో సహా కరెంటు బిల్లులు చచినట్లు కడుతున్నామంటే తప్పించుకునే మరో దారి లేకే గదా! దారేదో ఓటి ఉంది కాబట్టే ఆ సంపన్నులంతా తమ సంపాదన్ని దేశం దాటించేస్తున్నారు! ఆ దారి నెందుకు మూసేయడం లేదన్నదే నా పాయింటు. ఎప్పటికప్పుడు ఏవో లోపాయికారీ వ్యవహారాలు అవీ పెట్టేసుకుని.. చూసీ చూడనట్లు పోనిచ్చి.. ఓట్లేసే బికార్ల మెప్పుకోసం విదేశీ నిధులంటూ.. అక్రమాస్తులంటూ అల్లరి పెడతారా! నెలరోజుల బట్టీ చూస్తున్నా.. విచిత్రం! ఒక లెక్కా పత్రం ఏదీ లేనట్లుంది ఈ నల్లధనలక్ష్మి ఆకార వికారాలకి! ఒకడు లక్ష కోట్లంటాడు. ఒకడు అర లక్ష ఖాతా లంటాడు. ఒకడు అర్థ శతాబ్దంబట్టీ సాగే లోపాయికారీ వ్యవహార మంటాడు. ఆ పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని.. ఈ పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని తప్పులు పడుతున్నారు. అసలు ఈ నల్ల ధనంలో ఉన్నతప్పేమిటో ముందు తేల్చమని నాకైతే సుప్రీం కోర్టు కెళ్ళాలన్నంత కచ్చగా ఉంది.

‘గట్టిగా వాగబోకే పిచ్చి మొహమా! ముందే కోర్టుల్లో నలుగుతున్న వ్యవహారాలివన్నీ! ఎతిమతంగా ఏదన్నా వాగితే నిన్నూ మూసేస్తారు” అని మా వారి రుసరుసలిక్కడ. నేనెప్పుడు జైలుకెళ్లి చిప్పకూడు తింటానా అని ఈయనగారికీ తహతహ లాగుంది చూస్తుంటే!

రోజులు బొత్తిగా బాలేవని నాకు మాత్రం తెలీదా? ఎప్పుడో వాడేసిన సర్కారు సొమ్ముకు ఇప్పుడు లెక్కలడిగి బెంగుళూర్లో చిప్పకూడు తినిపించారా జయలలితమ్మ చేత. తుఫాను మీదెవడో పిల్లాడు తెలిసీ తెలీక అవాకులూ చెవాకులూ వాగాడని లోపల వేసేసారు! నేనేమంత మరీ యతిమతం దాన్ని కాదు. అయ్యొరామా! ఇంట్లో నాలుగ్గోడల మద్యా మనసులోని ముచ్చట్లను కూడా బైటపెట్టుకునే రాత లేకపోతే ఇహ ఈ సంసారమెందుకంట? టింగురంగా అంటూ బైట తిప్పుకుంటూ తిరుగుళ్లెందుకంట?

అహ.. మాట వరసకే అనుకుందాం. మా వారు మహనల్లగా ఉంటారు. అయినా మరీ ఏమంత దుర్మార్గులు కారే! నలుపంటే నాకూ ఏమంత పడి చచ్చే మోజు లేదు కానీ.. పన్ను కట్టని సొమ్ముకి నల్ల ధనమని పేరెట్టి ఇలా అల్లరి పెట్టడడమే ఏం బావోలేదని నా ఉద్దేశం.

నల్ల సముద్రం.. మన గుంటూరు నల్లచెరువుల్నేమన్నా మనం అపవిత్రమను కుంటున్నామా? బొగ్గంటే నల్లబంగారం అంటారు మా వారు. నలుపు నారాయణ స్వరూపం. రాముడు నీలమేఘ శ్యాముడు. కృష్ణుడు నల్లనయ్య. మన కంటిగుడ్డు నలుపు. కాటుక నలుపు. నల్లద్రాక్ష యమ తీపి. మా చెల్లాయి జడ నాగుబాములా నల్లగా నిగనిగలాడుతుండ బట్టే కదా మరిదిగారు కాణీ కట్నం లేకుండా చేసుకున్నదీ! దిష్టి తగలకుండా పసిబిడ్డ బుగ్గకి పెట్టే చాదు బొట్టు నలుపే కదండీ! శివరాత్రి అవావాస్యనాడొస్తుంది. దీపావళిదీ అదే తంతు. ‘నల్ల’ అంటే అరవంలో బహు బాగని అర్థంట. మా పక్కింటి ఆండాళమ్మగారు మా పిల్లను పట్టుకుని పద్దస్తమానం ‘నల్ల పొన్ను.. నల్ల పొన్ను’ అని తెగ మెటికలిరిచుకుంటుంది. పచ్చ నోటును పట్టుకుని నల్లడబ్బనడమే.. అన్యాయంగా ఉంది!

‘తెలుపో..నలుపో.. జాన్తానై.. ఆ తేడా లిక్కడ లేనే లేవ్’ అని సినిమాల్లో ఎన్ టీ ఆర్ చిందు లేసినప్పుడు చప్పట్లుకొట్టి.. ఇప్పుడేమో ఆ నల్ల డబ్బునుగురించి .. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడ్డం తగదన్నది నా పాయింటు!

‘ఇప్పుడీ మహాతల్లి నల్ల ధనాన్నిలా వెనకేసుకొస్తుందేందిరా కామెడీగా!’ అని మీరు విస్తుపోతున్నారని తెలుసు! ఉన్న మాట అనుకుంటే కామెడీగానే ఉంటుంది మరి! దార్నే పోతుంటే ఓ రూపాయి బిళ్లే మీ కంట బడ్డదనుకోండి. ఎవరూ చూడకుంటే మీరు మాత్రం లటుక్కని తీసి పర్సులో వేసుకోరూ! అసలుమనిషి వచ్చి అడిగినా తిరిగిచ్చెయ్యడానికి ప్రాణం ఉసూరుమంటుందే! మరి అన్నేసి లక్షలు.. కోట్లు ! ఎట్లా సంపాదించారన్నది ఆనక.. ఓ సారి ‘మనదీ’ అనుకున్నాక ఏ సొమ్మూ సమ్మంధమూ లేకుండా మధ్యలో సర్కారోడొచ్చి పన్నులూ పాడూ కట్టమంటే.. ఎవరికైనా మనసుక్కంష్టంగానే ఉంటుంది కదండీ!

ఇవాళ ఆ జైపూరియానో, లోధీనో, టింబ్లోనో.. ఆ పేర్లే సరిగ్గా మన నోటికొచ్చి చావవు .. ఐనా నోటికొచ్చినట్లు తిట్టి పోస్తున్నాం! న్యాయమా! రేపు మన ఊరి పెద్ద మనిషే.. మన పక్కింటి రామనాథమే.. మన పొరుగూరి పుల్లమ్మక్కే ఈ జాబితాలో దర్శనమీయచ్చు. కోర్టువారి దగ్గర ఆంజనేయుడి తోకంత జాబితా ఉందంటున్నారు మావారు. విడతల వారీగా విఛారణ లుంటాయంట. ఏ రోజు పేపర్లో ఎవరి పేరొస్తుందో.. ఏ పూట ఎవడి పుట్ట ఠపాల్మని పేలిపోతుందో.. ఏ క్షణంలో ఎవరి చరిత్ర అందరం చదివే పుస్తకం తంతవుతుందో.. ఎవరికి తెలుసు?

ఎన్నో విచిత్రాలు నిత్యం జరిగే ఈ పుణ్యభూమిలో టీలమ్ముకునే పిల్లాడు ప్రధాని మంత్రవలా? మునుపటి ప్రభుత్వాల్లో ప్రధాన భూమిక పోషించిన పెద్దమనిషి తాడుతెగి సంపాదనంతా నల్ల ధనమని తేలి చివరికి సర్వం కోలుపోయి టీ నీళ్లక్కూడా దేబిరించ వచ్చు. రాష్ట్రం సరిహద్దులు దాటే పప్పు ధాన్యాల లారీని పట్టుకోలేక పోవచ్చు గానీ.. సర్కారు తలుచుకుంటే పాకిస్తాన్లో దాక్కున్నా దావూద్ ఇబ్రహీం గడ్డం పట్టుకు లాక్కురాగల్దు. స్విర్జర్లాండులో పుట్టక పోవడమే డబ్బున్న వాళ్ళ తప్పంటే ఇహ చేసేదేమీ లేదు.

ఉన్నవాడికే కదా పన్నుల బాధేంటో బోధ పడేది. చెల్లని పావలా కూడా మిగల్చుకోలేని మా ఎదురింటి కుచేల్రావూ నల్లకుబేరులని తూలనాడే వాడే!

దొంగసారా వ్యాపారం చేసి కోట్లకు పడగ లెత్తాడు మా అంకయ్య మామ. సాని పాపల్నితార్చి శరణాలయంపైన అంతస్థుల్లేపాడు మా బల్లిశాస్త్రి బాబాయి. ఇసుకలో దుమ్మే కలిపాడో.. దుమ్ములో ఇసకే పోసాడో.. ధర రెట్టింపయిందాక దాచి కొత్త రాజధాని వస్తుందని ఆశల్లేవంగానే బంగారం రేటుకు అమ్మేసాడు మా వీధి పచారీ కొట్టు సుబ్బయ్య శెట్టి. ఎవరూ బొట్టెట్టి పిలవక పోయినా..లోకుల వ్యవహారాల్లో బలవంతంగా దూరి సెటిల్మెంట్ల వంకతో సింహభాగం కొట్టేసే కోటిరెడ్డి కోట్లకు పడగలెత్తిన కథ మా వాడంతా రామాయణంలా పారాయణం చేస్తుంటాం అందరం. వాళ్లంతా తలా ఓ రాజకీయ పార్టీలో దూరి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు ఓట్లడుక్కోడానికని వస్తే అంతటా ‘ఓహో.. ఆహో’ అన్న నోళ్ళే కానీ.. నొసళ్ళూ ఒహళ్ళూ చిట్లించిన పాపాన పోలేదు! ఐన కాడికి నాలుగు రాళ్లు వెనకేసుకునే సదవకాశం ఇదేనని .. ఇంట్లోనూ ఈయనగారు లక్షా తొంభైసార్లు తహ తహ లాడారు. మళ్లా పొద్దున్నేపత్రిక రాగానే నల్లకుబేరుల జాబితాలో కొత్త పేర్లేవీ బైటపడటం లేదని పెదవి విరుపులు! ఎవరికీ చట్టమంటే పట్టడం లేదని.. కారాలు..మిరియాలు!!

అహ.. నాకు తెలీక అడుగుతున్నా గానీ పేర్లు బైట పెడితే ఏమవుతుందంట? రాత్రికి రాత్రే ఆ కొచ్చారియాలు, జైపురియాలు.. సెలబ్రటీలై పోడానికా! గ్లోబల్ యుగమో .. పాడో.. వార్తొచ్చిన ఉత్తర క్షణంలోనే ఉత్తరమెరికా నుంచి దక్షిణాఫ్రికా అడవుల దాకా పేర్లు పాకిపోతున్నాయీ మధ్య మరీ! పుట్టిన అప్పలపాలెంలోనే మొహాలు సరిగ్గా తెలీని డిప్పకాయలంతా ఇట్లాంటి లప్పనమేదో తగిలి గొప్పోళ్లై పోవడమే తప్ప .. వాళ్ల ముల్లేమన్నా మన చిల్లుజోలెల్లో వచ్చి పడబోతుందా? నల్లధనంమీద నడిపించే ‘బ్లాక్ మెయిల్’ కాదూ ఇదంతా!

డబ్బున్న పెద్దమనుషులతో వ్యవహారాలు! ఎన్ని చూసుకోవాలి? ఎంత గడ్డి కరిస్తే కూడిందో ఈ ముదనష్టం! ఎన్నాళ్లని మురగ బెట్టిందో.. ఎందరెందరి కొంపలు కూల్చి పేర్చిందో.. ఎక్కడెక్కడి గనులు తవ్వినవో.. ఎన్ని వ్యాపారాలకు, కంట్రాక్టులకు తెగిస్తే అంత సొమ్ము పోగయుంటుందీ! అడగంగానే చూపించేసెయ్యడానికి ఇదేమన్నా పెళ్ళి ఆల్బం ఫొటోలా?

నాలుగు డబ్బులు బ్యాంకులో పోగయితే చాలు అదేదో సుమతీ శతకంలో చెప్పినట్లు బెల్లం చూట్టూ ఈగల్లా మూగి పోతారు బంధు మిత్రులు. కాదంటే కారాలు.. లేదంటే మిరియాలు! చే బదుళ్లు ఇచ్చుకుంటూ కూర్చోడానికా ఇన్నిన్ని చేదనుభవాలతో ఆర్జించిందీ! ఊరూ పేరూ కూడా తెలీని దేశాలదాకా పోయి డబ్బలా వూరికే పూడ్చి పెడతారా ఎవరైనా?

‘ఎలుక తోక నలుపు. ఎందాక ఉదికినా తెలుపుకి తిరగేది కాదద’ని మన యోగి వేమనగారు ముందే చెప్పారు. చెవిన బెట్టే నాథుడేడీ?

ఆటల్లో మనమెలగూ పోటీకి పోలేము. పరిశోధనల్లో సైతం మన ప్రోగ్రెసు అంతంత మాత్రంగా ఉంది. అందాల పోటీల్లో గడపదగ్గరే తూలుడు. వ్యాపారాల్లోనైతే చైనా జపాన్లదే ముందడుగు. ఒక్క ఈ నల్లకుబేరుల జాబితాలోనే మనది ముందు వరసలో స్థానం. దానికీ ముప్పం తెచ్చుకునే పనులు ముమ్మర మవుతున్నాయి. అదే బాధ.

అత్తగార్లకు సంఘాలునాయి. అడుక్కునే వాళ్లకు సంఘాలున్నాయి. ఆఖరికి తాగుబోతు దేవదాసులు సైతం సంఘటితమై మత్తు హక్కులకోసం పోరాడుతున్న దేశమిది. ఏ సంఘమూ పెట్టుకోడానికి ఆస్కారం లేదనేగా నల్లకుబేరుల మీదింత విలయ తాండవాలు!

నల్లఖాతాలెవరో ఖాతాదారులకు తెలుసు. డబ్బు దాచుకున్న బ్యాంకులకూ తెలుసు. గతపాలకుల కాలంలోనే ఈ జాబితా వచ్చింది కాబట్టి నాటి ప్రముఖులందరికీ నల్లపేర్లన్నీ కంఠతా వచ్చుండచ్చు. నాటి జాబితానే నేటి ప్రభువుల చేతిలోనూ ఉన్నది. కాబట్టి ఇప్పటి నేతలందరికీ లోపాయికారీగా పాపులెవరో తెలిసుండచ్చు. కోర్టు సమర్పణలూ ముగిసాయి కాబట్టి అక్కడి యావత్ సిబ్బందికీ ఆ పేర్లన్నీ కంఠోపాఠంగా నాలికమీదే ఆడుతుండవచ్చు. విచారణకని దిగిన సిట్టో.. స్టాండో .. వాళ్ల కార్యాలయాల్లో మాత్రం జాబితాలోని ప్రతి వివరమూ చక్కర్లు కొట్టకుండా ఉంటాయా? ఇక తెలియని దెవరికమ్మా? ఈ యావత్ వ్యవహారంతో ఏనాడూ ఏ సంబంధమూ లేని.. సాధారణ పాటకజనానికి.. మీకూ.. నాకూ!

కోర్టుల్లో కేసులు రుజువై శిక్షలు ఖాయమైన పురచ్చి తలైవి ఫొటోలే చట్టసభల గోడల మీదనుంచి ఇంకా కిందకు దిగలేదు. ఓటర్లకి తెలీకుండా ఎన్నెన్ని వ్యవహారలిక్కడ గుట్టు చప్పుడుగా చక్కబడటం లేదూ! శతకోటి బోడిలింగాల్లో ఈ నల్లధనం ప్రహసనం ఒహటీ!

‘చిట్టచివరి చిట్టాలో ఆరొందల పై చిలుకు పేర్లున్నాయోచ్! కోర్టు గడపల దాకా వచ్చాసాయోచ్!’ అని గంతులేస్తునారీ మధ్య మా ఇంటి హనుమంతులవారు. సరే.. మన సోమ్మేం పోయింది మధ్యలో! సీల్డు కవర్లు.. సిట్టులు.. స్టాండప్పులు.. అన్నీ తట్టుకుని.. ఆ నల్లమొత్తాలు మొత్తానికి మన దేశంలోకి తరలివస్తే అదీ మరో అద్బుతమే!

మోదీగారు తలా ఓ ఐదులక్షలిస్తానన్నారు గాబట్టి.. మా వారి వాటాతో ఇంచక్కా వడ్రాణం చేయించుకోవచ్చు! నా వంతంటారా! అది స్త్రీ ధనం. నల్లధనంతో మల్లే ఆడుకుంటానంటే మాడి మసై పోతారు ఎంతటి వారైనా!*

– గుడ్లదొన సరోజినీదేవి

sarojini

See you soon..

drushya drushyam
[‘సారంగ’ కోసం వారం వారం కందుకూరి రమేష్ బాబు  రాస్తోన్న ‘దృశ్యాదృశ్యం’ ఛాయా చిత్రలేఖనంలో సరికొత్త సింగిల్ నరెటివ్. సాహిత్య ప్రక్రియలో ఒక ‘చిత్రలిపి’. ‘సామాన్యత’ నుంచి తాను విశాలం కావడంలో కెమెరా ప్రధానం అయిందంటున్నాడు.Click by click తన చూపు విస్తరిస్తున్నదీ అంటున్నాడు. నిజమో కాదో మున్ముందు మీరే చెప్పాలి.]
*
 ఏది ముందు? ఏది వెనక?ఒక్కోసారి దృక్పథాలు ఎంత దూరం తీసుకెళ్తాయి అంటే ఒకటే చూసేంత.
కానీ, ఎవరైనా తమ నుంచి తాము ముందుకు నడవడం ఒక ప్రయాస. ఒక వినిర్మాణం.

స్రక్చరల్ అడ్జస్ట మెంట్లోనూ ఒక ఒక పొసెసివ్ నెస్. అందలి డిసగ్రిమెంట్.

మళ్లీ అగ్రిమెంటూనూ. విల్లింగ్లీ సస్పెండింగ్ ది డిస్ బిలీఫ్ అంటాంగానీ, సస్పెండ్ చేయకుండా ఉండటం అసలైన చిత్రం.

+++

దృశ్యాదృశ్యంగా లోన ఉన్నది బయట…. బయట ఉన్నది లోన……ఇంకిపోవడం.
అర్బన్ రియాలిటీ. అదే ఈ దృశ్యం. అపనమ్మకాల నమ్మకాలం ఒక చిత్రం.

ఇందలి బొమ్మలు లేదంటే అదృశ్యంగా ఉన్నఆ మెట్రోరైలు నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులు…
అంతా ఒకే బొమ్మ.

బొరుసు ఏదీ? అంటే తెలియదు.
ఏది చిత్తో, ఏది బొత్తో తెలియని దృశ్యాదృశ్య ప్రపంచం…ఈ నగరం. ఈ జీవితం.

మన కాంప్లెక్సులు, అఛీవ్ మెంట్సూనూ.
అవును. చిత్రం.
నగర జీవితంలో వేగంగా ఇమిడిపోతున్న ఆధునికత లేదా నగరమంటేనే ఆధునికత.
అది వేగంగా అర్థమౌతున్న భావన. ఆభివృద్ధి నీడన మెల్లగా ఇమిడిపోతున్న సమస్తం. లేదా నీడలన్నీ జారిపోయి మనిషే నగ్నంగా  నిలబడుతున్న వైనం. అందుకే చిత్రాలు సరికొత్తగా చేయాలంటే ఫోకస్ మార్చుకుని చూడవలసి వస్తోంది. జీవితాన్ని అంగీకరించాలంటే చిత్తు చిత్తుగా ఓడిపోయి మళ్లీ గెలవాల్సి వస్తోంది లేదా గెలవకుండా చూసుకోను ఓడిపోవాల్సి వస్తోంది.+++నడిచివచ్చిన దారంతానూ ఒక ఐడెంటిటీ క్రైసిస్.+++విశేషం ఏమిటంటే దృశ్య మాధ్యమంలో ఒక స్టిల్ లైఫ్ చెప్పగలిగే కాంట్రాస్ట్ చాలా ముఖ్యం.
అది నిలబడుతుంది. నిలబెట్టి చూపును నిలబెడుతుంది. విస్తరింపజేస్తుంది. కన్నుల్ని కలియతిప్పేలా చేస్తుంది. ముందుకు దృష్టి సారించేలా చేస్తుంది.అయితే నమ్మవలసింది మరొకటి ఉంది. ఎవరికీ ఏదీ తెలియదు. ఒక్క దృశ్యానికి తప్ప!
నిజం. ఏది ముందు ఏది వెనకా అన్నది మన సమస్య గానీ దృశ్యంలో చిత్రం అంతా ఒక్కపరి ముద్రితం అవుతుంది. నమోదూ అవుతుంది. అన్నీ ఒకేసారి అచ్చవుతాయి. కానీ చూసుకోము. అది సిసలైన విషాదం.

విషాదమే నిజమైన చిత్రం.
కానీ చూడం.నిరాకరిస్తం.గుడ్డిగా ఆనందస్తం. ఆరాధిస్తం. యవ్వనాన్ని చూసినట్టు.

అందుకే చెప్పడం, దృశ్యాదృశ్యం అంటే చదవడం, ఒక అభ్యాసం.

పిల్లవాడై పలకాబలపం పట్టుకుని అక్షరాలు దిద్దడం, తుడుచుకోవడం. మళ్లీ దిద్దడం.
+++మళ్లీ ఈ పిల్లగాడి చిత్రానికి వస్తే, ఇలాంటి చిత్రాలెన్నో పోయే నగరావరణంలోని ఒక నవ్య చిత్రిక ఇది.
నా వరకు నాకు ఇది కొత్త చిత్రం. మీరు చూసి వుండవచ్చు. కానీ నేను తీసి ఉండలేదు. అదే చిత్రం.ఒకటే చూసి అన్నీ వదిలేయడం.
తలుపులన్నీ మూసి కిటికీలు తెరవడం. లేదా కిటికీలన్నీ మూసి తలుపులు తెరవడం.
కానైతే కావలసింది గోడలన్నీ లేని ఇంటిని విశ్వాన్ని దర్శించడం. అందులో ఇదే నా తొలి చిత్రం.షో కాదు, రియాలిటీ.
అనుకుంటాంగానీ, ప్రతిదీ రియాలిటీ షోగా మారుతున్న స్థితీ గతీ. బొమ్మలు, మనుషులు.
ఈ చిత్రం మటుకు హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట సెంట్రల్ నుంచి చేసిన దృశ్యం.+++సెంట్రల్.
అవును, ఒకప్పటి చౌరస్తాల్లో ప్రతీకలు వేరు. ఇప్పుడు సెంట్రల్ లు ప్రధాన కూడలి. సెంట్రలే ఒక కూడలి.
ఇక్కడా కార్మికులున్నరు. కానీ, అలా అనుకోరు. అక్కడా ఉన్నారు. కానీ వాళ్లూ అనుకోరు,
ఎవరికి వారు నవనిర్మాణంలో ఇనుప రజనులా తాము రాలిపోతున్నామని ఎవరూ అనుకోరు.

అసలు దృశ్యం ఇంత మాట్లాడదు. అదే చిత్రం.
చిత్రంలో చిత్రం అది.మనం అనుకున్నదే చిత్రం కాదు. అది వేరు.
కానైతే, తెలియకుండానే బొమ్మలైపోతున్న జీవితంలో ఏది మొదలు, ఏది ఆఖరో అర్థం కాని ప్రశ్నేలే వద్దు.
అన్నీ చిత్తరువులే. బొమ్మలే. ఒక భిన్నమైన అనుభవం కోసం నేనే ఇటువైపుకు మారి తీసిన అటువైపు చిత్రం. కానీ, ముందే చెప్పినట్టు అన్నీ అచ్చయిన చిత్రం నిజమైన చిత్రం.See you soon…
మరింత చిత్రంగా.
  – కందుకూరి రమేష్ బాబు

బొమ్మను ప్రేమించిన అమ్మాయి

MythiliScaled

 

అనగనగా ఇటలీ లో ఒక ధనవంతుడైన వర్తకుడు. అతనికి బెట్టా అని ఒక్కతే కూతురు. ఆమెకి పెళ్ళి వయసు వచ్చింది. తండ్రి ఎన్ని సంబంధాలు చూసినా తనకి ఒక్కటీ నచ్చలేదు. ఇలా అన్నిటినీ వద్దనుకుంటూ పోతే ఇక తనకి పెళ్ళి కాదేమోనని వర్తకుడు దిగులుపడిపోయాడు, కాని కూతురిని బలవంతపెట్టాలని అనుకోలేదు.

ఒక రోజు అతను నగరం లో జరగబోయే పెద్ద సంతకి బయల్దేరుతున్నాడు. అక్కడినుచి ఏమైనా కావాలా అని కూతుర్ని అడిగాడు. బెట్టా అంది- ” నాన్నా ! ఒక బస్తా మేలిరకం చక్కెర , రెండు బస్తాల తీపి బాదం పప్పు, నాలుగైదు సీసాల పన్నీరు, కొంచెం కస్తూరి, ఇంకొంచెం సాంబ్రాణి, నలభై ముత్యాలు, రెండు ఇంద్రనీలమణులు, గుప్పెడేసి కెంపులూ పుష్యరాగాలూ , బంగారుజరీ దారపు చుట్ట, వీటన్నిటితోబాటు ఒక పెద్ద వెండి గిన్నే చిన్న వెండి తాపీ- ఇవన్నీ కావాలి ” .ఇవన్నీ ఎందుకా అని తండ్రికి ఆశ్చర్యం వేసింది. అన్నీ కలిపితే చాలా ఖరీదవుతాయి కూడా. అయినా , మారుమాట్లాడకుండా వచ్చేప్పుడు వాటన్నిటినీ పట్టుకొచ్చి కూతురికి ఇచ్చాడు.

pinto 1

బెట్టా అన్నీ తీసుకుపోయి తన గదిలో గడియ వేసుకుంది. బాదం పప్పుల పొడిలో చక్కెర , కస్తూరి, సాంబ్రాణి -వెండిగిన్నెలో కలిపి పన్నీరు పోసి ముద్ద చేసి దానితో అపురూపమైన అందం గల యువకుడి నిలువెత్తు బొమ్మని తయారు చేసింది. వెండి తాపీతో ముఖాన్ని తీర్చిదిద్దింది . తెల్లటి పుష్యరాగాలూ ఇంద్రనీలాలూ కళ్ళుగానూ, కెంపులను పెదవులుగానూ ముత్యాలను పలువరుసగానూ అమర్చింది. బంగారు జరీదారాన్ని మెత్తని చిక్కని పోగులుగా పేని జుట్టుగా పెట్టింది. ప్రాణం ఒకటీ లేదేగాని అద్భుతంగా ఉన్నాడు . బెట్టా ఆ బొమ్మయువకుడిని ప్రేమించింది. అతను మనిషిగా మారితే బావుండుననుకుంది.ఒకప్పుడు సైప్రస్ రాజు ప్రార్థిస్తే బొమ్మకి దేవతలు ప్రాణం పోశారని వినిఉంది. ప్రేమ దేవతని భక్తిగా శ్రద్ధగా వేడుకుంది, కొన్ని రోజులపాటు. దేవత కరుణించింది- బొమ్మ యువకుడు మెల్లిగా ఊపిరి తీసుకుని వదలటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పెదవులు కదిపి బెట్టా ని పలకరించాడు. చివరిగా కాళ్ళూ చేతులూ విదిలించి కదిలించి నడిచేశాడు కూడా. బెట్టాని చూస్తూనే అతనికిచాలా ఇష్టం వచ్చింది. అతనికోసమే అప్పటిదాకా బ్రతికిఉన్నానని బెట్టాకి అనిపించింది .

సంతోషంగా యువకుడి చేయిపట్టుకుని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి – ” నాన్నా, నాకు పెళ్ళి చేయాలనే కదా మీ కోరిక ? ఇడుగో, ఇతన్ని ఎంచుకున్నాను ” అని చెప్పింది. కూతురి గదిలోకి ఎవరూ వెళ్ళలేదు, ఇతను ఎలా బయటికి వచ్చాడో తండ్రికి అర్థం కాలేదు. కాని ఎవరూ ఎప్పుడూ ఎక్కడా చూసిఉండనంత అందం గా ఉన్న ఆ యువకుడిని చూసి చాలా ఆనందించాడు.యువకుడికి పింటో స్మాల్టో అని పేరుపెట్టారు.   త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్ళి ఏర్పాటైంది. పెద్ద విందు చేసి ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళలో ఒక దూరరాజ్యపు రాణి కూడా ఉంది. ఆ ఊళ్ళో ఆమె బంధువులు ఉన్నారు, వాళ్ళని బెట్టా తండ్రి విందుకి పిలిచాడు. ఆమె కూడా వాళ్ళతో అక్కడికి వచ్చింది. ఆమెకి పింటో చాలా చాలా నచ్చేశాడు అతని పెళ్ళి విందుకి వచ్చింది కాస్తా అతన్ని తనే పెళ్ళిచేసుకోవాలనుకుంది.పింటో కొత్తగా ప్రపంచం లోకి వచ్చాడు కనుక ఎవరితో ఎలా ప్రవర్తించాలో బెట్టా అతనికి చెప్పి నేర్పించింది. అయితే అతను పసిపాప అంత నిర్మలమైనవాడు, రాణి చెడుబుద్ధి అతనికి తెలియలేదు. అందరికీ ఇచ్చినట్లే రాణికీ వీడ్కోలు చెప్పేందుకు ఆమె కూడా వెళ్ళాడు. బెట్టా తక్కిన అతిథులతో ఇంటిలోపలే ఉండిపోయింది . రాణి అతని చేయి పట్టుకుని తన రథం లో ఎక్కించుకుని తన రాజ్యానికి ప్రయాణమైంది. ఆ రథానికి కట్టిన గుర్రాలు చాలా వేగంగా పరుగెత్తగలవు – అందుకని కన్నుమూసి తెరిచేలోపు రథం   వెళ్ళిపోయింది.

pinto 2

పింటో కోసం బెట్టా చాలాసేపు చూసింది. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండిపోయాడేమో నని కాసేపు, చల్లగాలికి బయటికి వెళ్ళాడేమోనని కాసేపు అనుకుని ఊరుకుంది. వచ్చినవాళ్ళంతా ఒక్కొక్కరూ వెళ్ళిపోయారు. చివరికి వెళ్ళి చుట్టుపక్కలంతా వెదికింది. ఎక్కడా లేడు పింటో. అతన్ని ఎవరో ఎత్తుకుపోయిఉంటారని అప్పటికి బెట్టాకి అర్థమైంది. వర్తకుడు సేవకులని పిలిచి అందినంతమేరా గాలించమని ఆజ్ఞాపించాడు. ఏమీ లాభం లేకపోయింది. బెట్టా ఏడ్చి ఏడ్చి చివరికి ఒకరోజున ధైర్యం తెచ్చుకుని తనే పింటో ని వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. తండ్రికి తెలియకుండా , పేదపిల్లలాగా వేషం వేసుకుని, కావలసినవి తీసుకుని బయల్దేరింది.అన్ని ఊళ్ళూ తిరుగుతూ   కొన్ని నెలలపాటు వెతుకుతూనే ఉంది. అప్పుడు ఒక ఊళ్ళో ఒక పెద్దావిడ కలిసింది. ఆవిడ చాలా దయగలది. బెట్టా కథ అంతా విని జాలిపడింది. బెట్టా కి మూడు మంత్రాల వంటివి నేర్పింది. మొదటిది- ” ట్రిషే వర్లాషే – ఇల్లు కురుస్తోంది ” రెండోది – ” అనోలా ట్రనోలా – ఏరు పొంగుతోంది ” మూడోది – ” స్కటోలా మటోలా – సూర్యుడు వెలుగుతున్నాడు ”. బెట్టా కి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ మాటలు మూడుసార్లుగా పలికితే మేలు జరుగుతుందని హామీ ఇచ్చింది.

బెట్టాకి పెద్దగా నమ్మకమేమీ కలగలేదు. సరే, గుర్తుంచుకుంటే పోయేదేముందనుకుని పెద్దావిడకి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ తనదారిన తను వెళ్తూ ఉంది. పోగా పోగా రౌండ్ మౌంట్ అనే నగరం వచ్చింది. మధ్యలో పెద్ద రాజభవనం. బెట్టా కి ఎందుకో పింటో అక్కడే ఉంటాడనిపించింది. దొడ్డిదారిన వెళ్ళి అక్కడి గుర్రపుసాలలో ఆ రాత్రికి తలదాచుకునేందుకు చోటు అడిగింది. గుర్రాలసాల ను చూసుకునేది ఒక ముసలివాడు. అతను చాలా మంచివాడు. బెట్టాని చూస్తే తన కూతురులాగా అనిపించి సాల పక్కనే ఉన్న తన చిన్న ఇంట్లో ఉండచ్చు, రమ్మని ఆహ్వానించాడు. బెట్టా అనుకున్నట్లే మరుసటి రోజే పింటో రాజభవనపు తోటలోదూరం నుంచి కనిపించాడు. ఏదో కలలో నడుస్తున్నట్లు దేన్నీ పట్టించుకోకుండా ఉన్నాడు అతను . జరిగిందేమిటంటే, పింటో నీ తీసుకొచ్చేశాక రాణి అతన్ని పెళ్ళిచేసుకోమని అడిగింది. పింటో తనకి పెళ్ళైపోయిందనీ బెట్టా దగ్గరికి వెళ్ళిపోతాననీ మొండికేశాడు.

అతన్ని ఒప్పించలేక రాణి ఒక మంత్రగత్తె ని సలహా అడిగింది. ఆమె ఒక మూలిక ఇచ్చి సంవత్సరం పాటు రోజూ అతనికి ఇస్తే జరిగిన దం తా మరచిపోతాడంది. రోజూ పింటోకి ఇచ్చే ఆహారం లో రాణి ఆ మూలిక కలుపుతూ వస్తోంది. పింటో జ్ఞాపకశక్తి చాలావరకు పోయింది. ఇంకా రాణిని పెళ్ళాడేందుకు ఒప్పుకోవటం లేదుకాని, కొద్ది రోజుల్లో సంవత్సరం పూర్తయిపోతుంది. పింటో తన ఇష్టం ప్రకారం అక్కడ ఉండిఉండడని బెట్టా కి తెలుసు, ఎలా అతన్ని అక్కడనుంచి తప్పించాలో తెలియలేదు. పెద్దావిడ చెప్పిన మొదటి మంత్రాన్ని మూడుసార్లు పైకి పలికింది. ” టిషే వర్లాషే- ఇల్లు కురుస్తోంది ” ఆ వెంటనే అక్కడొక చిన్న బంగారురథం ప్రత్యక్షమైంది. దాని మీదంతా రత్నాలు పొదిగి ఉన్నాయి. రథం దానంతట అదే ఆ తోట చుట్టూ ఉన్న కాలిబాట లో తిరగటం మొదలుపెట్టింది.

pinto3చూసినవాళ్ళంతా ఆశ్చర్యపడిపోయారు. అందరూ చూశాక బెట్టా దాన్ని పట్టుకుపోయి తన గదిలో పెట్టేసుకుంది. ఈ సంగతి రాణికి తెలిసింది.రాణికి అందమైన వస్తువులమీద చాలా వ్యామోహం, అవి ఎవరివైనా సరే. గుర్రాలసాల అతని ఇంటికి, బెట్టా గదిలోకి వచ్చి – ఆ బంగారు రథాన్ని తనకు అమ్మమని అడిగింది. బెట్టా అంది ” నేను బీదదాన్నేనండీ, కాని ఎంత డబ్బూ బంగారమూ ఇచ్చినా దీన్ని అమ్మను. ఒకటే కావాలి నాకు – ఇందాక ఒక అందమైన అబ్బాయి మీ భవనం లోకి వెళ్ళటం చూశాను, అతని గది తలుపు ముందు ఒక రాత్రంతా నన్ను గడపనిస్తే మీకిది ఇచ్చేస్తాను ” . ఈ పేదపిల్ల డబ్బూ బంగారమూ వద్దని ఇలా అడిగిందేమిటా అని రాణి విస్తుపోయింది . ” ఉట్టినే ఆ గదిముందు పడుకుంటాననే కదా అడిగింది.. అయినా పింటో ని పలకరిస్తుందో ఏమో, అతనికి నిద్రపోయే మందు ఇచ్చి పడుకోబెట్టేస్తే సరి, ఈమె ఎంత పిలిచినా జవాబు ఇవ్వడు ” అని పథకం వేసుకుంది.

 

రాత్రయింది. నక్షత్రాలు ఆకాశం మీదికీ మిణుగురులు నేల మీదికీ వచ్చాయి. రాణి రోజూ ఇచ్చే మూలికతోబాటు ,ఘాటైన నిద్రమందుని పాలలో కలిపి పింటో చేత తాగించింది. అతను పక్క మీద వాలగానే ఒళ్ళెరగకుండా నిద్రపోయాడు. అప్పుడు బెట్టా ఆ గదిముందుకు వచ్చింది. అతన్ని పిలిచింది, గట్టిగా అరిచింది, ఏడ్చింది- తన బాధనంతా వివరించి చెప్పుకుంది. అతను మాత్రం కళ్ళు విప్పనేలేదు . చూస్తుండగానే తెల్లారిపోయింది. రాణి వచ్చి బెట్టా ని రెక్క పట్టుకు లేపి ” చాలు కదా, ఇక వెళ్ళు ” అని పంపించేసింది. బెట్టా కోపంగా గొణుక్కుంది – ” నీకూ ఎప్పటికీ ఇదే చాలు, పింటో నిన్ను ప్రేమించనే ప్రేమించడు ”- అప్పటికిక చేసేదేమీలేక వెళ్ళిపోయింది.

 

మరుసటిరోజు బెట్టా రెండో మంత్రాన్ని మూడుసార్లు పలికింది – ” అనోలా ట్రనోలా- ఏరు పొంగింది ” . ఈసారి మణులు చెక్కిన బంగారుపంజరం లో ముద్దొచ్చే పక్షి ఒకటి ప్రత్యక్షమైంది. అది కోయిలకన్నా తీయగా పాడుతోంది. విషయం తెలుసుకున్న రాణి మళ్ళీ వచ్చి బెట్టా ని పక్షిని అమ్మమని అడిగింది. బెట్టా నిన్నటిలాగే కోరింది. ఇవాళైనా పింటో కి తన మాటలు వినిపించవా అని ఆమె ఆశ. రాణికి ఇంకాస్త అనుమానం వచ్చింది. పింటోకి రెట్టింపు మోతాదులో నిద్రమందు ఇచ్చింది. ఆ తర్వాత కథంతా నిన్నటిలాగే జరిగింది. అయితే, ఆ గది పక్కనే ఉన్న వసారాలో దర్జీ అతనొకడు పనిచేసుకుంటున్నాడు. అతను ఎవరూలేని ఒంటరివాడు . సంవత్సరం పూర్తవుతూనేజరగబోయే తమ పెళ్ళిబట్టలు కుట్టటం కోసం రాణి అతన్ని అక్కడే ఉంచి రాత్రింబవళ్ళు పనిచేయిస్తోంది. అతను బెట్టా మాటలన్నీ విన్నాడు. పూర్తిగా అర్థం కాకపోయినా బెట్టా కీ పింటోకీ పెళ్ళయిందనీ అతను భార్యని వదిలేసివచ్చాడనీ తెలిసింది. రాణి మీద దర్జీ అతనికి మంచి అభిప్రాయమేమీ అదివరకే లేదు, ఇప్పుడు ఈ సంగతి తెలిసి కోపం కూడా వచ్చింది.

pinto4

 

మూడోరోజు పొద్దునే పింటో కి కుట్టే బట్టలకోసం కొలతలు తీసుకోవాలని కబురు చేశాడు. కొలతలు సరిగ్గా రావాలంటే పింటో తనని ఒంటరిగా కలవాలనీ చెప్పి పంపాడు. రాణి ఒప్పుకుని పింటోని పంపింది. దర్జీ తను విన్నదంతా పింటోకి చెప్పేశాడు. పింటోకి అంతా గుర్తొచ్చీ రానట్లుంది. ఎప్పటినుంచీ ఆపుకోలేనంత నిద్రవస్తోందో అడిగి తెలుసుకున్న దర్జీ ఆ రాత్రి పాలు తాగకుండా ఉండమని సలహా ఇచ్చాడు.

 

బెట్టా ఆ రోజున ఆఖరిప్రయత్నం చేయాలనుకుంది. మూడో మంత్రాన్ని మూడుసార్లు పలికింది – ” స్కటోలా మటోలా-సూర్యుడు వెలుగుతున్నాడు ”. ఈసారి చిన్న బంగారపు ఉగ్గుగిన్నె వచ్చింది. అందులోంచి రంగురంగుల , సుతిమెత్తని పట్టుబట్టలు, సన్ననిముత్యాలు కుట్టినవి బయటికి వచ్చాయి. వాటిని మడిస్తే అన్నీ ఆ ఉగ్గుగిన్నెలో పట్టేస్తున్నాయి, అంత పల్చటివి. రాణి అవీ కావాలంది, బెట్టా ఇదివరకులాగే అడిగింది. రెండు రాత్రులూ ఏమి కాలేదు కదా, ఇప్పుడింకేం ముంచుకొస్తుందిలెమ్మని రాణి సరేనంది. ఆ రాత్రి రాణి ఇచ్చిన పాలని పింటో ఆమె చూడకుండా పారబోశాడు. బెట్టా వచ్చి గదివాకిలిలో కూర్చుంది. ఆమెకేమీ ఆశ మిగల్లేదు. పింటోకి చెబుతున్నట్లు కాకుండా గడిచిందంతా తలుచుకుంటోంది. ”అద్భుతమైనవన్నీ కలిపి అత్యద్భుతమైన అతన్ని మలిచాను. ప్రేమదేవిని అడిగి ప్రాణం తెచ్చాను. అంతా అయాక కోల్పోయాను, అతను తిరిగి కనబడినా నా మాటలు వినబడటం లేదు…ఇదే చివరి రాత్రి   ” మేలుకునే ఉన్న పింటోకి అంతా వినిపించింది, గుర్తొచ్చింది.గబగబావెళ్ళి , బెట్టా ని కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుని ఆనందం పట్టలేక ఏడ్చారు. రాణి , బెట్టా నుంచి సంపాదించిన వస్తువులు తీసేసుకుని ఇద్దరూ రాత్రికి   రాత్రి బయల్దేరి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. దర్జీ ని కూడా లేపి తమతో తీసుకుపోయారు. వీళ్ళని చూసి , బెట్టా తండ్రి సంతోషంతో చిన్నపిల్లవాడిలాగా గంతులు వేశాడు. అంతా సుఖంగా ఉన్నారు.

 

  • ఇటాలియన్ జానపదకథ , by Giambattista Baile      
  •  
  •                                                            [ from Pentamerone ]

గుర్తుందా?

పెరట్లో నందివర్ధనం చెట్టు ప్రక్కన
నా ఎదురుగా నిలబడిన నువ్వు
నీ మొహాన కొంటెదనం కలగలిసిన
పెదాలు విచ్చని ఓ చిరు నవ్వు
నా కళ్ళలోనికి మాత్రమే చూస్తూ 
నీ పయోధరాల కోమలత్వానికి హత్తుకుంటూ 
నా చేయిని నొక్కి పట్టిన నీ చెయ్యి
నాకు మాత్రమే వినబడేంత మంద్రంగా
నీకే వినిపించనంత లలితంగా …
మెల్లగా ముందుకు వంగి
నా చెవిలో నీ పెదాలతో
యేమని వేణుగానం ఊదావు?
 
నువ్వో సగం నేనో సగం 
అన్లేదూ?
 
గాలి తన అలికిడిని, అల్లరిని ప్రక్కకు పెట్టి 
కళ్ళు, పెదవుల ఉనికిని లెక్క చేయకుండా
తమకంతో చేసుకుంటున్న మూగ బాసల సాక్ష్యాన్ని
ఎలాగైనా సరే నమోదు చెయ్యాల్సిందే అని నిశ్చలంగా
ఎదురు చూపులు చూస్తున్న వేళ …
 
జరిగింది నాకు తెలిసే లోపే
తటాలున నా చెయ్యి వదిలి
రెండు చేతుల్తోనూ నన్ను పెనవేస్తూ
నాతో పాటు చుట్టూరా వున్నా చెట్టూ చేమల్నీ,
కలం విదుల్చుకుంటూ దొంగ చూపులు 
చూస్తున్న వాయు దేవుడ్ని,
నిశ్చేష్టుల్ని చేస్తూ   
ఘాడంగా
అమృత మధనాన్ని అర క్షణం లో 
జ్ఞప్తికి తెస్తూ
చేసిన మోహినీ చుంబనం …
 
ఆలంబన లేక తొట్రుపడిన నా తనువుకు
నీ లేత తనువు ఆలంబనను 
అప్పటికప్పుడే అరువిస్తూ …
 
గుర్తుందా ???
 
ఎన్నేళ్ళు గడిచింది కాలం ???
ఒంటరితనం ప్రతిధ్వనిస్తూనే వుంది నీ వెచ్చని తలపు …
 
 
లీలగా, కల చెదురుతూ వినబడింది ‘తాతయ్యా’ అంటూ 
మళ్ళీ మనవరాలిగా తిరిగి వచ్చి, 
నువ్వు చెవిలో ఊదిన పిలుపు …
కంటి మసకను భుజాలకు అద్దుకుంటూ
చేతుల్లోకి తీసుకున్నాను …
నిన్ను … నా మనవరాల్ని …
అచ్చం నువ్వు నన్ను పొదువుకున్నట్లుగానే …

-ఎన్ ఎం రావ్ బండి
bsr

అణచినవాడే శూరుడు! లొంగిపోతే పతివ్రత!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నలదమయంతులు, ఓడిసస్ పెనెలోప్ ల కథల మధ్య పోలికల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, తేడాలు కూడా ఉన్నాయి కనుకే. అంటే, తేడాల మధ్యనే పోలికలను గుర్తిస్తున్నామన్నమాట. ఆ సంగతిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు సుసూక్ష్మమైన పోలికలను చూద్దాం:

మొదటి పోలిక

రెండు కథలూ ఎటువంటి దేవతారోపాలూ లేని ఇద్దరు మానవుల గురించి, అందులోనూ ఇద్దరు పురుషుల గురించి చెబుతున్నాయి. ఆ చెప్పడంలో మళ్ళీ ఒక తేడా ఉంది. నలుని ఉదాసీనంగానూ, విధి లేదా ఒక అదృశ్యశక్తి అతని కష్టాలకు కారణమైనట్టుగానూ కథకుడు చిత్రిస్తున్నాడు. అతణ్ణి విధి చేతిలో పావుగానే తప్ప, కష్టాల నుంచి గట్టెక్కడానికి పురుష(మానవ) ప్రయత్నం చేసినవాడిగా చూపించడం లేదు. ఇందుకు భిన్నంగా, ఇంతకుముందు చెప్పుకున్నట్టు, దమయంతి క్రియాశీలగా కనిపిస్తుంది. అంటే, దమయంతి అనే స్త్రీకి గల క్రియాశీల స్వభావాన్ని కథకుడు బహిర్గతం చేస్తూనే, దానిమీద పలచని తెర వేసి, నలుడు అనే పురుషుడి ముఖంగా కథ చెబుతున్నాడన్న మాట.

స్త్రీ, పురుష స్వామ్యాల కోణం నుంచి చూస్తే, భారతీయ తాత్వికతకు గల ప్రత్యేకతను ఇది వెల్లడిస్తుంది. ఎలాగంటే, సామాజిక స్థాయిలో స్త్రీ స్వామ్యం మీద పురుషస్వామ్యాన్ని ప్రతిష్టించడమే ఇక్కడ జరిగింది కానీ, తాత్విక స్థాయిలో స్త్రీస్వామ్యాన్ని పూర్తిగా అణగదొక్కలేదు. అంతర్లీనంగా రెండు స్వామ్యాల మధ్య ఒక రాజీసూత్రం కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం భారతీయ స్వభావంలోనూ, చరిత్రలోనూ ఉంది. మనది నేటికీ బహుళ దేవీ, దేవుల ఆరాధనా రూపంలో బహురూప ఆస్తికత కొనసాగుతున్న దేశమని చెప్పుకున్నాం.

ఓడిసస్ నలుడికి భిన్నం. నలుడిలో ఉదాసీనత కనిపిస్తే, ఓడిసస్ లో క్రియాశీలత కనిపిస్తుంది. నలుడు ఎంత యోధుడో మనకు తెలియదు. కథకుడు ఆ కోణానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ ఓడిసస్ ను యోధుడిగా చూపించడానికి కథకుడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అతను ట్రాయ్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత పన్నెండు ఓడలలో సహచరులను వెంటబెట్టుకుని సాహసయాత్ర ప్రారంభించాడు. ఒక పట్టణం మీద పడి జనాన్ని చంపి స్త్రీలను, సంపదను సహచరులతో కలసి పంచుకున్నాడు. యోధలక్షణంతోపాటు ఇది అతని పురుష, లేదా మానవ ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత అతనికి పరీక్షలు, కష్టాల పరంపర ప్రారంభమవుతుంది. నలుడు ఎదుర్కొన్న పరీక్షలు, కష్టాల వెనుక ప్రతికూల(కలి), అనుకూల(కర్కోటకుడు) శక్తులు ఉన్నట్టే, ఓడిసస్ వెనుక కూడా (జియస్, పోసిడియన్, అయోలస్, హెర్మెస్) ఉన్నారు. అయితే, నలునికి భిన్నంగా ఓడిసస్ మానవీయమైన తెలివితోనూ, వీరత్వంతోనూ, పురుషకార్యంతోనూ కష్టాలనుంచి గట్టెక్కడానికి ప్రయత్నిస్తాడు. నలుని విషయంలో కథకుడు విధిపాత్రను ప్రముఖంగా సూచిస్తున్నట్టు కనిపిస్తే; ఓడిసస్ విషయంలో పురుషయత్నాన్ని ప్రముఖంగా సూచిస్తాడన్నమాట.

ఓడిసస్ ఒంటి కన్ను రాక్షసుడైన పోలిఫెమస్ బారినుంచి బయటపడిన తీరే చూడండి. అతని చేత మద్యం తాగించి నిద్రపుచ్చడంలో, అతని కన్ను పొడిచేసిన తర్వాత పొట్టేళ్ళ కడుపుకు వేలాడుతూ తప్పించుకోవడంలో ఓడిసస్ బుద్ధిబలాన్ని ఉపయోగించుకుంటాడు. ఆ తదుపరి ఘట్టంలో అయోలస్ అనే వాయుదేవుడినుంచి సహాయం పొందుతాడు. అయితే సహచరులు చేసిన తప్పువల్ల మళ్ళీ కష్టాల్లో పడతాడు. ఆ తర్వాత నరమాంసభక్షకులు ఉండే దీవికి చేరుకుని అక్కడ ఒక అందమైన యువతిని చూసి సమ్మోహితుడవుతాడు. పదకొండు ఓడలను, ఎంతోమంది సహచరులను కోల్పోవడం రూపంలో అందుకు ప్రతిఫలం చెల్లించుకుంటాడు.

download

అక్కడినుంచి సిర్సే అనే అప్సరస ఉండే దీవికి చేరుకుని, తన సహచరులను ఆమె పందులుగా మార్చివేసినట్టు తెలిసి ఆమెను శిక్షించడానికి ఒక కత్తి తీసుకుని బయలుదేరతాడు. అప్పుడతనికి హెర్మెస్ అనే దేవుడి సాయం లభిస్తుంది. సిర్సేను లొంగదీసుకుని సహచరులను రక్షించుకోవడమే కాక, ఆమెతో పడకసుఖం కూడా పొందుతాడు. ఆమె సూచనపై అధోలోకానికి వెళ్ళి పితృదేవతలకు తర్పణం ఇస్తాడు. ఆ తర్వాత సౌరద్వీపానికి వెడతాడు, మరోసారి తుపానులో చిక్కుకుని, ఉన్న కొద్దిమంది సహచరులనూ, ఓడనూ కూడా కోల్పోతాడు. ఒంటరిగా ఇంకో దీవికి చేరి అక్కడ కలిప్సో అనే అప్సరసతో ఎనిమిదేళ్ళు కాపురం చేస్తాడు. మళ్ళీ తెప్ప మీద బయలుదేరి విధ్వంసానికి గురై ఈదుకుంటూ వెళ్లి కొందరు బాలికల సాయంతో ఫేషియన్లను కలుస్తాడు. వారు అతణ్ణి ఓడలో క్షేమంగా స్వస్థలానికి పంపిస్తారు. అక్కడ అతను పెనెలోప్ స్వయంవరపరీక్షను వీరోచితంగా ఎదుర్కొని తిరిగి ఆమెను గెలుచుకుంటాడు.

ఇలా అనుకూల శక్తులనుంచి సాయం పొందుతూనే ప్రతికూలశక్తులను బుద్ధిబలంతోనూ, భుజబలంతోనూ ఎదుర్కొంటూ అనేక కష్ట నష్టాలనుంచి పురుషప్రయత్నంతో బయటపడిన మానవమాత్రుడిగా ఓడిసస్ ను చిత్రించే కథకుని వ్యూహం అడుగడుగునా స్ఫురిస్తూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా నలదమయంతుల కథలో ఇటువంటి బుద్ధిబలాన్ని సమయస్ఫుర్తిని దమయంతి ప్రదర్శిస్తుంది. రెండు కథల్లోనూ దేవతలపై మనిషిది పైచేయిగా చూపడం కనిపిస్తుంది. ఇంకొక విధంగా, చెప్పాలంటే దేవతల మధ్యలోంచి క్రియాశీలుడైన నరుడు ఆవిర్భవించడం గురించి ఈ కథలు చెబుతున్నాయి.

రెండవ పోలిక

ఇది మరింత సుసూక్ష్మంగా అర్థం చేసుకోవలసిన పోలిక. ఇక్కడ జోసెఫ్ క్యాంప్ బెల్ తన విశ్లేషణలో పేర్కొన్న female principle అడుగుపెడుతుంది. ఆ మాటను ‘స్త్రీ సూత్రం’ గా అనువదించుకుందాం. ఓడిసస్ కథలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది కనుక ముందు దాని గురించి చెప్పుకుందాం. ఓడిసస్ కు– నీళ్ళు పట్టుకుంటున్న ఒక అందమైన యువతి; సిర్సే, కలిప్సో అనే అప్సరస,లు నౌసికా అనే బాలిక, ఎథెనా అనే అనుకూల దేవత వరసగా తారసపడతారు. అందమైన యువతి రూపంలో అతనికి ఎదురై, సమ్మోహన పరచిన తొలి అనుభవం నరమాంసభక్షకుల రూపంలో పెద్ద ప్రమాదాన్ని కొనితెచ్చింది. ఆ తర్వాత ప్రతికూలశక్తిగా ఓడిసస్ కు ఎదురైన సిర్సే చివరికి అతనికి లొంగిపోయి అనుకూలశక్తిగా మారిపోయింది. అతను ఆమె పొందును అనుభవించడమే కాక ఆమె నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని మార్గదర్సనం కూడా పొందాడు. సిర్సే దగ్గరే అతని నగ్నత్వం గురించిన ప్రస్తావన వస్తుంది.

ఇక కలిప్సో మొదటినుంచీ అనుకూలత పాటించిన అప్సరస. ఆమెతో అతను ఎనిమిదేళ్ళు కాపురం చేయడానికి కారణం, మోహపాశంతో తనను బంధించివేసింది కనుకనే. ఆమెకు ఇష్టంలేకపోయినా ఆ పాశాన్ని తెంచుకుని బయటపడ్డాడు. సిర్సే దగ్గర ఎదురైన నగ్నత్వ భయానికి భిన్నంగా కలిప్సో దగ్గర అతనికి వస్త్రం లభించింది. మళ్ళీ నౌసికా అనే బాలిక తారసపడిన సందర్భంలో నగ్నత్వప్రస్తావన వచ్చింది. అప్పుడతను పూర్తి నగ్నంగా మారాడు. అయితే, ఆ బాలిక అతనికి వస్త్రం కూడా ఇచ్చి రాజభవనానికి తీసుకువెడుతుంది. చివరగా అతను కొడుకును, భార్యను కలసుకోడానికి ఎథెనా సాయపడుతుంది. ఈ ‘స్త్రీ సూత్రా’నికి కీలకమైన తాత్వికమైన వివరణ ఉంది. దాని గురించి త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

నలదమయంతుల కథకు వస్తే; ఈ స్త్రీ సూత్రం అన్నది ఓడిసస్ కథలో కనిపించినంత స్పష్టంగానూ, వివరంగానూ కాక, లీలగా ధ్వనిస్తూ ఉంటుంది. ఈ కథలో ప్రధాన స్త్రీపాత్ర దమయంతి ఒక్కతే. ఆమె అప్సరసో, లేక అందమైన అపరిచిత యువతో కాదు, నలునికి అర్థాంగి. కాసేపు ఆ సంగతిని పక్కన పెట్టి ఓడిసస్ కథలోని స్త్రీ సూత్రాన్ని ఆమెకు అన్వయించుకుని చూద్దాం. దమయంతిని వివాహమాడాకే నలునికి కష్టాలు మొదలయ్యాయి. ఆమెతో ఉన్నప్పుడే అతడు నగ్నంగా మారాడు. ఆమె చీరలోని అర్థభాగంతోనే తన నగ్నత్వాన్ని కప్పుకున్నాడు. చివరికి ఆ చీరను తెంచుకుని బయటపడ్డాడు. తిరిగి దమయంతిని కలసుకున్న సందర్భంలోనే పోగొట్టుకున్న తన వస్త్రాన్ని మళ్ళీ సంపాదించుకుని, ధరించి నలుడిగా మారాడు. ఓడిసస్ కథలోనూ, ఈ కథలోనూ కూడా స్త్రీ సమక్షంలో పురుషుడి నగ్నత్వానికీ, వస్త్రానికీ ఏదో ప్రతీకాత్మక, తాత్విక ప్రాముఖ్యం ఉన్నట్టు అనిపిస్తుంది.

oedipus

ఈ నగ్నత్వ ప్రస్తావన వచ్చే మరో ప్రసిద్ధ కథ ఊర్వశీ-పురూరవులది. ‘నువ్వు ఎప్పుడైతే నాకు నగ్నంగా కనిపిస్తావో అప్పుడే నిన్ను విడిచి వెళ్లిపోతాను’ అని ఊర్వశి పురూరవుడికి షరతు పెడుతుంది. ఒకరోజున పురూరవుడు నగ్నంగా కనిపించేసరికి అతణ్ణి విడిచి వెళ్లిపోతుంది. ఈ కథకు వేరే అన్వయాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత చూద్దాం.

ఇక్కడ ఇంకొక విషయం గుర్తుచేసుకోవాలి. పైన చెప్పిన స్త్రీ సూత్రమూ, లేదా స్త్రీ స్వామ్య, పురుష స్వామ్యాలలో గ్రీకు తాత్వికతకు, భారతీయ తాత్వికతకు తేడా ఉందని చెప్పుకున్నాం. గ్రీకు తాత్వికతలోనే కాక సామాజిక స్థాయిలో కూడా స్త్రీ-పురుష స్వామ్యాల మధ్య తీవ్ర ఘర్షణా, ఒకదానిపై ఒకటి పై చేయిని చాటుకునే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో పురుషుడు విజయం సాధించి వీరుడిగా, క్రియాశీలిగా ఆవిర్భవించడం ఉన్నాయి. భారతీయ తాత్వికతలో స్త్రీ-పురుష స్వామ్యాల మధ్య ఘర్షణతోపాటు సర్దుబాటు, సయోధ్య ఉంటూనే; సామాజిక స్థాయిలో స్త్రీ స్వామ్యంపై పురుషస్వామ్యం పై చేయిని చాటుకోవడం ఉంది. అయితే, పురుషుని నరుడిగా, వీరుడిగా, క్రియాశీలిగా అవతరింపజేయడం భారతీయ, గ్రీకు సందర్భాలు రెండింటిలోనూ ఉమ్మడి అంశం.

ఈ కోణంలోకి వెళ్లినప్పుడు భారతీయ, గ్రీకు పురాణ కథలలోనే కాక; ప్రపంచ పురాణ కథలు అనేకంలో ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక బాబిలోనియా పురాణ కథలో మర్దుక్ అనే దేవుడు తియామత్ అనే స్త్రీశక్తిని, లేదా దేవతను చంపుతాడు. తియామత్ పై రాక్షసి అన్న ముద్ర పడుతుంది. అది, స్త్రీ స్వామ్యం నుంచి పురుషుడు వీరత్వంతో బయటపడి క్రియాశీలి అవడానికి ప్రతీక. మన రామాయణానికి వస్తే, రాముడు తాటక అనే రాక్షసిని చంపుతాడు. లక్ష్మణుడు శూర్పణఖ అనే రాక్షసి ముక్కు చెవులు కోస్తాడు. కృష్ణుడు పూతన అనే రాక్షసిని చంపుతాడు. ఇంద్రుడు ఉష అనే దేవతను చంపుతాడు. నరుడిగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన అర్జునుడు పులోమ, కాలక అనే రాక్షసస్త్రీలను కాకపోయినా వారి సంతానాన్ని చంపుతాడు. ఊర్వశి అనే అప్సరసతో పొందుకు నిరాకరిస్తాడు. ఓడిసస్ సిర్సేను చంపకపోయినా ఆమెపై కత్తి దూస్తాడు.

అర్జునుని నరుడు అన్నట్టుగానే రామాయణంలో రాముని నరాంశను నొక్కి చెప్పడం కనిపిస్తుంది. ‘నేను దశరథ మహారాజు కొడుకుని, మనిషిని మాత్రమే’ నని రాముడు ఒక సందర్భంలో చెప్పుకుంటాడు. అలాగే రాముని ‘పురుషోత్తముడు’ అన్నారు. అంటే ప్రపంచ పరిణామంలో ఒక దశలో స్త్రీ స్వామ్యంపై పురుష స్వామ్యాన్ని స్థాపించి వీరుడు, సాహసి, క్రియాశీలుడైన నరుని ఆవిర్భవింపజేయవలసిన అవసరం కలిగిందని ఈ కథలన్నీ సూచిస్తున్నాయన్న మాట.

స్త్రీపై రాక్షసి అన్న ముద్ర వేయడమే కాక, పురుషుడి కష్టాలకు, అతడు ఆత్మన్యూనతలోకి, నిష్క్రియత్వంలోకి జారిపోవడానికి స్త్రీయే కారణమన్న సూచనను ఉద్దేశపూర్వకంగానో, అనుకరణప్రాయంగానో ఆయా పురాణ కథలు అందిస్తున్నట్టు కనిపిస్తుంది. కొన్ని పోలికలు చూడండి…నలదమయంతుల కథలో నలుడు దమయంతిని పెళ్లాడిన తర్వాతే రాజ్యం కోల్పోయి కష్టపరంపరలో చిక్కుకుంటాడు. ప్రవాస జీవితం గడుపుతూనే బాహుకుడనే పేరుతో, వికృత వేషంలో, అంటే మారువేషంలో దమయంతి ‘పునస్స్వయంవరా’నికి వెడతాడు. పెనెలోప్ తో వివాహం అయిన తర్వాతే ఓడిసస్ యుద్ధానికీ, అక్కడినుంచి సముద్రంలో సాహసయాత్రకు బయలుదేరి వెళ్ళి పదేళ్లపాటు అనేక కష్టానష్టాలకు గురై చివరికి నోమన్ అనే మారుపేరుతో బిచ్చగాడి వేషంలో పెనెలోప్ పునస్స్వయంవరానికి వెడతాడు.

రాముడు విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్ళి అక్కడినుంచే నేరుగా సీతాస్వయంవరానికి వెళ్ళి సీతను వరిస్తాడు. ఆ తర్వాత పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేస్తాడు. అలాగే, పాండవులు ద్రౌపది స్వయంవరానికి వెళ్లే ముందు బ్రాహ్మణ వేషాలలో అరణ్యవాసమే చేస్తున్నారు. ద్రౌపదితో వివాహం తర్వాతే వారు అర్థరాజ్యం పొందారు, ఆ రాజ్యాన్ని కోల్పోయి ఈసారి ద్రౌపదితోపాటు మళ్ళీ అడవుల పాలయ్యారు. వారు రాజ్యం కోల్పోవడం వెనుక ద్రౌపది పాత్ర కూడా ఎంతో కొంత ఉంది.

అయితే, ఈ పోలికలు అన్నీ అచ్చు గుద్దినట్టు ఒకే సూత్రాన్ని అనుసరించడంవల్ల కాకపోవచ్చు. కొన్ని కథానిర్మాణంలో అనుకరించిన స్థూలమైన పోలికలు కావచ్చు. స్త్రీ స్వామ్యంపై పురుష స్వామ్యాన్ని స్థాపించే ప్రయత్నం మాత్రం అన్నింటిలోనూ సమానం. ఉదాహరణకు, నలదమయంతులు, ఓడిసస్ పెనెలోప్ ల కథల నిర్మాణం స్థూలంగా ఒకలానే ఉంటుంది. కానీ నలదమయంతుల కథలో వాస్తవంగా క్రియాశీల అయిన దమయంతి ముఖంగా కాక, ఉదాసీనుడైన నలుని ముఖంగా కథ చెబుతుంటే; ఓడిసస్ కథలో ఓడిసస్ నే క్రియాశీలుడిగా చూపిస్తూ అతని ముఖంగా కథ చెబుతున్నాడు. స్త్రీ స్వామ్యంమీద పురుష స్వామ్యం పైచేయిని నొక్కి చెప్పడం రెండింటా సమానం. అదే మిగతా ఉదాహరణలలోనూ కనిపిస్తుంది.

రామాయణకథ తెలిసిన వారికి ఒక సందేహం కలిగితీరాలి. అదేమిటంటే, తాటక, పూతన తదితరులే కాక, రావణుని చెల్లెలు అయిన శూర్పణఖ కూడా రాక్షసి అయినప్పుడు రావణుని భార్య అయిన మండోదరి ఎందుకు కాలేదన్నది. పౌరాణిక సంప్రదాయం మండోదరిని పతివ్రతగానూ, ఉత్తమురాలిగానూ గుర్తిస్తుంది. దీనికి మనం చెప్పుకోగలిగిన తార్కిక సమాధానం బహుశా ఒక్కటే: స్త్రీస్వామ్యంలో ఉన్న స్త్రీలు రాక్షసులు, పురుష స్వామ్యాన్ని, పురుషుడి ఆధిపత్యాన్ని అంగీకరించిన వారు ఉత్తమురాళ్ళు, పతివ్రతలు అయ్యారన్నమాట!

అదలా ఉంచితే, ఇక్కడినుంచి మనం మరిన్ని తాత్వికపు లోతుల్లోకి వెళ్లవలసి ఉంటుంది. అది తర్వాత…

 -కల్లూరి భాస్కరం

ఈమె ‘చేతల’ సరస్వతి…

సరస్వతి

 

“ప్రగతి, పురోగమనం ఎందుకు సాధించాలి? ఆర్థిక ప్రగతి అయిదు శాతమో పది శాతమో ఉంటే సంతోషం రెట్టింపు అవుతుందా? సున్నా శాతం ఎదుగుదల ఉంటే ఏమవుతుంది? ఇది ఒక రకంగా స్థిరమయిన ఆర్థిక విధానం కాదా? సాధారణమైన జీవనం గడుపుతూ అన్నిటినీ తేలికగా తీసుకోగలగటం కంటే మించినది మరేదైనా ఉందా?” — మసనోబు ఫుకుఒకా.

ఈరోజు కొంతమంది మాట్లాడే ఈ మాటలు జపాన్ ప్రకృతి సేద్యకారుడు ఫుకుఒకా నలభై ఏళ్ల కిందటే చెప్పాడు.

మేడిన్ చైనా విశ్వరూపం చూసి మురిసి , అమెరికన్ డాలర్ మెరుపు కలల్లో తూగి, మేక్ ఇన్ ఇండియా సంస్కృతిలోకి రాకెట్ వేగంతో “ఆ విధంగా ముందుకు పోతున్న” మనకు, ఫుకు ఒకా ఓ ఆదిమానవుడిలా కనిపిస్తాడు. కొన్ని వేల సంఖ్యలో మాత్రమే ఉన్న పర్యావరణ వాదులనబడే జీవులు కూడా అలాగే కనిపిస్తారు. మనమే చేతులారా పెంట పోగులా తయారు చేసుకున్న భూమ్మీదనుంచి, పోగేసుకున్న డబ్బుతో సహా పారిపోయి (బడుగు జీవాత్మలను ఇక్కడే వదిలేసి) ఏ గాలక్సీ ల్లో ఇళ్ళు కడదామా అనేంత ప్రగతి యుగంలో ఉన్నప్పుడు ఒక్క అడుగు వెనక్కు వెయ్యడమంటేనూ, ఒక్క రోజైనా ఎండని గానీ చలిని గానీ భరించడమంటేనూ డబ్బు చేసుకున్నవాళ్ళలో చాలా ఎక్కువమందికి ఎంతో కష్టం. ఆర్ధిక ప్రగతి రాల్చే చుక్కలు సరిగ్గా ఇంకని బతుకుల్లో మాత్రమే మిగిలిన పంచభూతాల తీవ్రతను నిజానికి అందరూ సమానంగా అనుభవించాలని చెప్పే పర్యావరణ వాదులను దూరం పెట్టేవాళ్ళే ఎక్కువ.

***

‘సరస్వతి కవుల’ అసలైన పర్యావరణ వాది. పర్యావరణ సంరక్షణ గురించిన చర్చలు పూర్తయిన తరువాత ఆ విషయాలు మాట్లాడేవాళ్ళ లో ఒక్కరు కూడా ఆ మీటింగ్ గదిలో ఫ్యాన్లూ లైట్లను ఆపకుండా వెళ్ళిపోతే ఎంతో చిరాగ్గా ‘ఇదేం అన్యాయం?’ అంటూ వ్యాసం రాసేసే సున్నితమైన మనసున్న మనిషి. రకరకాల సంస్థల్లో పనిచేసేవాళ్ళలో, చెప్పిన విషయాన్ని తమ జీవితంలో చేసి చూపించేవాళ్ళు అరుదు. చెప్పిందే చేసే సరస్వతి అందువల్లేనేమో, సంస్థల్లో కంటే ఒంటరిగానే తనపని తను చేసుకుంటూ పోతోంది.

నర్సీపట్నం దగ్గర రంగురాళ్ళ కోసం తవ్వకాలు విపరీతంగా జరిగే రోజుల్లో ధైర్యంగా అక్కడికి ఓ కామెరా పట్టుకుని వెళ్ళిపోయి ఆ విషయం మీద, అక్కడ జరిగే అన్యాయాలమీద 2004 లో చిన్న డాక్యుమెంటరీ తీసింది. దీనితో ఆమె చాలామంది దృష్టిలో పడింది. కొన్నేళ్ళపాటు ఆ ప్రాంతం మీద జరిగిన రేప్ ను కొద్ది రోజుల్లోనే ఒక్క విషయమూ వదలకుండా రికార్డ్ చేసింది. ఆ రోజుల్లో పత్రికలూ బాగానే రాశాయి. కానీ సరస్వతి కామెరాతో రికార్డ్ చేసింది కాబట్టి ఆ విషయమేమిటో పూర్తిగా తెలుసుకోవాలనుకునే భవిష్యత్తుకి అది ‘కుప్పుసామయ్యర్ మేడీజీ’… ఈ మేడీజీ లు డాక్యుమెంటరీల వల్లే సాధ్యమౌతున్నాయి కాబట్టే మనం బతుకుతున్న కాలంలో ఇవి గొప్పవి. విషయంతో బాటు ‘కలాపోసన’ కూడా చేయగల్గితే డాక్యుమెంటరీలను మించినవి ఏముంటాయి ? హోషంగ్ మర్చంట్ మీద “My  Dear Gay Teacher” అంటూ సరస్వతి తీసిన డాక్యుమెంటరీ లో కాస్త కళాపోషణ కూడా కనిపిస్తుంది. సరే ఇదిలా ఉంచితే, “Behind The Glitter” అనే రంగురాళ్ళ కథ ఏమిటో సరస్వతి డాక్యుమెంటరీ ద్వారా గుర్తు చేసుకుంటే …

తొంభైల్లో విశాఖ దగ్గర, నర్సీపట్నం దాపునున్న కొండల్లో వజ్రాల్లాంటి రంగురాళ్ళు దొరుకుతున్నాయని తెలియగానే నెమ్మదిగా తవ్వకాలు మొదలయ్యాయి. 2000 సం. లో alexandrite అనే మరీ విలువైన, నగల్లో వాడే రాయి దొరుకుతోందని తెలియగానే అక్కడి ఘరానా మనుషులే కాకుండా పక్క రాష్ట్రాలవాళ్ళు కూడా దిగిపోయేరు. అక్కడే ఉండే చిన్న చిన్న గూండాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, అందరూ సిండికేట్లు గా తయారైపోయి తవ్వకాలు జోరు చేశారు. అక్కడే బ్రతికే కొండవాళ్లకు, ఎక్కడినుండో కూలిపనికి వచ్చిన వాళ్లకు ఆ రాళ్ల విలువేమిటో తెలీదు; దొరికిన రాళ్ళను యజమానులకు అప్పచెప్పటం, రెండొందలో మూడొందలో తీసుకుంటూ, వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన బందెల దొడ్లలో బతకటం తప్ప… నిదురలో ఆదమరుపుగా వున్న ఆ కొండ పల్లెల్లోకి ఒక్కసారిగా ప్రైవేటు బస్సులూ, గుళ్ళూ గోపురాలూ, జీన్ పేంటులూ, కాస్మెటిక్స్, సెక్స్ అవసరాలు తీర్చే ఆడవాళ్ళూ, ఎయిడ్స్ రోగాలూ, అన్నీ బారులు తీరాయి. కాస్త డబ్బులు కళ్ళ చూసిన వాళ్ళు ఆ గ్రామాల్లోనే పక్కా ఇళ్ళు కట్టుకుంటే, ఎక్కువమంది వెర్రివాళ్ళు కూలోళ్లుగానే మిగిలారు. ఈ వరసనంతా అక్కడి జనం పూర్తిగా ఎరుక పరిచారు సరస్వతి డాక్యుమెంటరీలో.

“మా పరంటాన వజ్రాలు పడ్డాయి. మా కుర్రోలు ఓ పదిమంది ఎల్నారు. ఎల్తే ఒకో పదిమంది నాలుగు ఉజ్జీలు కట్టుకొని ఆలే తవ్వుకుంటన్నారు గానీ ఈలని తవ్వనివ్వలేదు” – అంటాడు అమాయకంగా ఓ మనిషి.

“ఇదంతా అయిపోయేక మా బాధలేటి? మొత్తానికి అడివి పీకేస్తుంటే మా పిల్లలకేముంటదక్కడ?” అనెంతో బాధగా అడుగుతుంది మరో కొండ మనిషి.

ఇంకో ఆడమనిషి భర్త అనుమతితోనే తను కుటుంబ కష్టాలు తీర్చటం కోసం అక్కడికొచ్చి వ్యభిచారం చేస్తున్నట్టు సామాన్యంగా చెప్తుంది.

ఎర్ర చందనం స్మగ్లర్లు రాయలసీమ అడవుల్లో చేసిన ప్రకృతి భీభత్సం లాటిదే ఇదీ అయినా, సరస్వతికి కాస్త జాగ్రత్తగానైనా ధైర్యంగానే ఈ డాక్యుమెంటరీ తీసే అడ్డంకులు లేని వెసులుబాటు 2004 లో దొరికింది. ఫారెస్టు అధికారుల్ని కూడా చంపి పారేసేంత క్రౌర్యం చందనం స్మగ్లర్లు చూపిస్తే, అంత అవసరం లేకుండా అమాయకుల్ని ఉపయోగించి ‘కరక’ లాంటి గ్రామాల్లో రంగురాళ్ళు తవ్వేసుకున్నారు పెద్దమనుషులూ వ్యాపారులూ. ఎవడికో ఆ రాళ్ళను ఇవ్వటం కోసం కొండ తవ్వుతూ కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.

సరస్వతి ఇంకా రకరకాల సమస్యల మీద NGOల కోసం పది పన్నెండు డాక్యుమెంటరీలు తీసింది. వీటిలో ఆమె రైతుల సమస్యలు చర్చించింది. రసాయనిక వ్యవసాయంతో రైతు పడే పాట్ల లోతులను తాకింది. సేంద్రీయ వ్యవసాయం మంచిదని హితబోధ చేసింది. మూసీనదిని పాడు చేసిన మనుషుల, అధికార్ల మురికితనాన్ని బైటపెట్టింది. చేపలు పట్టేవాళ్ళ జీవితాల్లో మరపడవలు రేపిన కల్లోలాన్ని కాస్త చూడమంది. ఈమధ్య పోలవరం బాధితుల గోడును రికార్డు చేసింది. థర్మల్, అణు విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు చేసే నిరసనల్లో పాల్గొంది. కొవ్వాడలో రాబోయే అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టడానికి ప్రయత్నం చేసింది.

ప్రజల బాధల్ని డాక్యుమెంటరీలుగా చేస్తూ సంపాదించే ఆ కాస్తడబ్బుమీద బతకటం కూడా సరైనపని కాదని భావించేంత రొమాంటిక్ సరస్వతికి సమస్య తమ ఇంటి గుమ్మం దాకా వచ్చేవరకూ మనుషులు ఎందుకు మాట్లాడరో అర్థం కాదు. ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ బతికే భద్ర జీవితాలను ఉతికి ఆరేసే తత్వంతో ఎదుటి మనిషి ఇబ్బందిగా అటూ ఇటూ చూసి నత్తగుల్లలా ముడుచుకుపోయే పరిస్థితి కల్పిస్తుందీమె. అయినా ఆమె నిజాయితీకి మాత్రం ఎవరూ వంక పెట్టలేరు.

***

“నీ స్నానానికి ఒక్క బకెట్ నీళ్ళు మాత్రం ఇవ్వగలను” – అంది సరస్వతి.

ఆమె ఇప్పుడు ఓ కొండరాళ్ళ వరుస నానుకున్న చిన్న పొలంలో వ్యవసాయం చెయ్యటానికి ప్రయత్నిస్తోంది. ఇది అన్ని సౌకర్యాలతో ఫార్మ్ హౌస్ లు కట్టుకుని పచ్చిగాలి పీల్చటం కోసం చేసే డబ్బున్న హాబీ వ్యవసాయం కాదు. పట్నాల్లో పరుగులతో విసుగెత్తి పల్లెస్వర్గానికి వెళ్ళిపోవాలని కలలు కనే మధ్యతరగతి రొమాన్స్ కూడా కాదు. అసలైన రైతు తత్వాన్ని ఇంకించుకుని, ఆధునికత్వాన్ని వదిలించుకుని, నేలతో మనసును ముడేసుకోవాలనుకునే ఆలోచన నుండి పుట్టిన ఆచరణ. పొలంలోనే ఓ రెండు గదులూ, చిన్న వరండా, పైన రేకుల కప్పు. మట్టి, ఇటుక, పైన సన్నని సిమెంట్ పూతతో కట్టిన ఆమె చిన్న ఇంటి ముందు వేప, సీతాఫలం చెట్లు, వంటింటి వాడకం నీళ్ళతో పచ్చగా మెరిసే అరటి చెట్లు… మెరిసే మూడు సోలార్ పానెల్స్ నుంచీ వచ్చే శక్తి ఓ రెండు బల్బులూ, ఓ ఫ్యాన్ వాడుకుందుకు సరిపోతుంది. ఈ చక్కటి నిరాలంకారమైన దృశ్యం అమరేముందు ఆమె పడిన పాటు తక్కువేమీకాదు.

ఆ ఉదయపు పచ్చి గాలుల్లో వరండా ముందు ఏపుగా ఎదిగి చిన్నగా ఊగుతున్న కంది మొక్కలు. కొన్నేళ్లలో తప్పక చెట్లయి నీడా, పళ్ళూ ఇస్తామని చెప్తున్న మామిడి మొక్కలు. ఎప్పటికీ నీ తోడు వదలం అంటున్న మొండి ఆముదం చెట్లు. ట్రాక్టర్ చాళ్ళ వెంట పురుగుల్ని హుషారుగా ఏరుకుంటున్న కొంగల వయ్యారి నడకలు … చిన్న హైకూ కవితలా బతికేస్తే సరిపోదా?

ముందురోజు రాత్రి దబదబా తలుపులు కొడుతున్న చప్పుడయి ఉలిక్కి పడ్డాను. ఊరికి దూరంగా ఉన్న ఆ పొలంలో ఇద్దరమే ఉన్నామన్న ధ్యాస టకీమని నెత్తిమీద కొట్టింది నన్ను. ఇంతకీ అది ఉడతలు చేసే హంగామా అట. రేకులమీదా తలుపులమీదా కొడుతూ సరస్వతి ప్రపంచంలో మేమూ సభ్యులమే అని ప్రకటన చేస్తూ ఉంటాయట. దూరంగా ఉన్న నల్లటి ఎత్తయిన రాళ్ళ వరుసలో ఉన్న రంగులున్న, రంగుల్లేని పిట్టలూ, నెమళ్ళూ అలా ఓ సారి పొలాన్ని పరామర్శించి, పాట కచేరీలు కూడా చేసి వెళ్తూ ఉంటాయి.

ఆ కొండలో ఎన్నో పక్షులూ జీవాలూ ఉన్నాయని, దానిని అలాగే వదిలెయ్యమని సరస్వతి అధికారులతో, కోర్టుతో ఎంత మొత్తుకున్నా విదేశాలకు సమాధిరాళ్ళు పంపించి డబ్బు చేసుకునే మనుషులు దాన్ని వదలలేదు. ఆ రాళ్ళ అదృష్టం బాగుండి అవి ఆ విదేశీ సమాధుల షోకుకు పనికిరాక పోవటంతో కాంట్రాక్టర్ ఆ పని వదిలి వెళ్ళాడు. ఇంకే నరుడి దృష్టికి ఆ నల్ల రాళ్ళు మళ్ళీ పగులుతాయో చెప్పలేం.

వర్షాధారపు భూముల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ నిలబడటానికి అమ్మ సాయంతో నడుం వంచి తను చేస్తున్న ప్రయత్నం ఒక్కో సంవత్సరం ఒక్కో రకం ఫలితాన్ని ఇస్తోంది. ఆ ఊళ్ళో ఉన్న రైతులంతా కొర్రలు, జొన్నలు వంటి పంటలు ఉంటాయని కూడా మర్చిపోయిన గ్రీన్ రెవల్యూషన్ తరం. వాళ్ళంతా నీళ్ళ కోసం తాపత్రయపడుతూనే మందులు జల్లి జోరుగా వరి మాత్రమే పండిస్తూ ఉన్నపుడు సరస్వతి కొర్రలు పండించింది. “మా దేశానికి కొర్రలు మల్ల తెచ్చినవా బిడ్డా” అని అనుభవాల ముడతలతో మొహాన్ని సింగారించుకున్న ఓ పండు ముసలామె మురిస్తే, ఆ మొహంలోని ముడతలన్నీ సాగి ఆనందంతో మెరవటం మరవలేను.

ఏదెలా ఉన్నా, ఏ శక్తులు ఎంత భయపెట్టినా, తను సమాజంలో కోరుకుంటున్న మార్పే తానయి బతికే ఇలాంటి సరస్వతులు చేస్తున్న పనే వృధా పోకుండా ఎప్పటికైనా భూమిని బతికిస్తుంది.

సరస్వతి డాక్యుమెంటరీల కోసం ఇక్కడ చూడండి.

http://saraswatikavula.weebly.com/

-ల.లి.త.

lalitha parnandi

 

 

 

 

 

 

 

 

‘పాత్రో’చితంగా…

images

నిన్న ఆహుతి ప్రసాద్
ఇవ్వాళ గణేష్ పాత్రో…మొన్నటి బాలచందర్ విషాదం నించి కోలుకోకముందే…!
మృత్యువు ఎంత గడుసుదీ!
అది మనతోనే పుట్టింది. మనతోటే పెరుగుతుంది. వుండీ వుండీ మనకీ తెలియకుండా ‘మన’ని ‘తన’లోకి లాగేసుకుంటుంది.
పొద్దున్నే ఒకరు ఫోన్ చేసి, “సార్, గణేష్ పాత్రో గారూ…” అని నానిస్తే, “ఏమైందీ” అని అడిగాను.
“అహ! వారి ఫోన్ నంబరు తెలిసేమోననీ…” అన్నారు. వెంటనే ఫోన్ పెట్టేశారు.
గంట తరవాత హైదరాబాద్ నించి ఓ ఫోను. “GP…మరి లేరు!” అని.
మరో గంటకి వరసగా ఫోన్లు.
“సారీ…బాడీ హాస్పిటల్లో ఉందా? ఇంటికి తెచ్చారా?” అని.
ఎంత విచిత్రం!

శ్వాస ఉన్ననాళ్ళూ యీ శరీరం ‘శివం’
శ్వాస ఆగిన మరుక్షణం ‘శవం’
అప్పటిదాకా మనిషికి అన్ని పేర్లూ, బిరుదులూ, లాంచనాలూ అన్నీ పోయి కేవలం “బాడీ” అనే పదం మాత్రం మిగుల్తుంది. అప్పుడెప్పుడో శోభన్ బాబు గారు పోయినప్పుడూ అంతే!
“సార్…బాడీ హాస్పిటల్లో ఉందా? ఇంటికి తెచ్చారా?” అని ఇది సర్వ సహజం. ఈ ఒక్కదాన్నీ మించిన వేదాంతం ఎక్కడుంది? ‘బాడీ’ కేవలం body…! పేరెత్తరు! తెచ్చుకున్న పేరూ, పెట్టుకున్న పేరూ, పెట్టిన పేరూ అన్నీ శ్వాస ఆగగానే క్షణంలో మాయమవుతాయి.
సరే…

ఎక్కడో పార్వతీపురం దగ్గిర పుట్టారు. నాటకాలు రాశారు. నటించారు, స్పురద్రూపి కనుక! మధ్యతరగతీ, దిగువ మధ్య తరగతి జీవితాల్ని ఆపోశన పట్టారు. చెన్నపట్నం గమ్యం అయింది. ‘రాజీ పడడం’ అనే మాట గణేష్ పాత్రోకి తెలీదు.
మాట మనిషిని చంపుతుంది.
మాట మనసుని చంపుతుంది.
మాటే- మనిషినీ మనసునీ కూడా బతికిస్తుంది.
మాట నిన్ను గెలిపిస్తుంది. నిన్ను చిత్తుగా ఓడిస్తుంది. మాటే నిన్ను హిమాలయ శిఖరం మీద కూడా నిలబెదుతుంది. ఆ ‘మాట’ ని ఎలా వాడాలో, ఎంత వాడాలో, ఎప్పుడు వాడాలో తెలిసిన రచయిత – మాటల రచయితా, కథా రచయితా గణేష్ పాత్రో గారు.

ఈ చలనచిత్ర పరిశ్రమలో సముద్రాల వంటి సీనియర్ల ‘యుగాన్ని’ అలాగే ఉంచితే (వారిని జడ్జ్ చేయడం సముద్రాన్ని చెంచాతో కొలవడం లాంటిది గనక) ఆ తరవాత మనకి కొందరు మాటల మాంత్రికులు కనపడతారు- పింగళి నాగేంద్ర రావు, ఆచార్య ఆత్రేయ, ముళ్ళపూడి రమణ- ఇలాంటి మహానుభావులు.
వారికంటూ వారొక ‘పంధా’ ను సృష్టించి మనకి ‘సంభాషణా రచన’ ఎలా చేయాలో పాఠాలుగా బోధించారు. గణేష్ పాత్రో కూడా నిస్సందేహంగా ఆ కోవకి చెందినవాడే.
ఓ అక్షరం ఎక్కువుండదు.
ఓ అక్షరం తక్కువుండదు.
తూచినట్టు వుంటాయి మాటలు.
తూటాల్లా వుంటాయి మాటలు.
ఏ పాత్రకి ఏ భాష వాడాలో, స్పష్టంగా తెలిసిన రచయిత గణేష్ పాత్రో. అందుకే, ఆయన మాటలు ‘పాత్రో’చితంగా – ఒక ఎక్స్పర్ట్ టైలర్ కొలతలు తీసి కుట్టిన వస్త్రాల్లా వుంటాయి.
నటుడి హావభావాల్ని బాగా అబ్సర్వ్ చేస్తారు.

ఏ పదాలు ఆ నటుడి ముఖతా వస్తే పండుతాయో పరకాయ ప్రవేశం చేసి మరీ రాస్తారు.
అందుకే- ఆయన సంభాషణలకి అలవాటు పడ్డ నటులందరూ అనేది ఒకే మాట- “ఆయన డైలాగులే ఎలా నటించాలో మాకు నేర్పుతాయని”
ఇంతకంటే గొప్ప మెప్పుదల ఏముంటుందీ?
ఆ మెప్పుని వందల సార్లు పొందారు పాత్రో.

ఆయన కెరీర్లో ఒక్క పాటే రాశారు – “హలో గురూ ప్రేమ కోసమే” అని- నేననే వాడ్ని “పాత్రో గారు ఇంకొన్ని పాటలు రాయచ్చుగా” అని- ఆయన నవ్వి, “మీరూ ఇంకొన్ని సినిమాలకి సంభాషణలు రాయొచ్చుగా? మరెందుకు రాయలేదూ? మీరు డైలాగ్స్ రాస్తే, నేను పాటలు రాస్తా!” అనే వారు. (‘అలజడి’ అనే ఏకైక సినిమాకి నేను మాటలు రాసా. దర్శకత్వం: తమ్మారెడ్డి భరద్వాజ)

గ్రాఫ్ చూస్తే-
రుద్రవీణ, సీతరామయ్య గారి మనవరాలు, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ముద్దుల కిట్టయ్య, ముద్దుల మావయ్య (భార్గవ్ ఆర్ట్స్ అన్ని సినిమాలకి ఆయనే మాటలు రాసారు)- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – ఇలా ఎన్నెన్ని హిట్స్! మధ్యతరగతి, కింది తరగతి వాళ్ళ ప్రతి కదలికనీ గమనించారు. ప్రతి ఉద్వేగాన్నీ అక్షరాలుగా మలిచారు. మనని మనకి కొత్తగా చూపించారు. వాడిన డైలాగ్ వాడలేదు. సన్నివేశాలు ఒక్కోసారి ఒకేలా వున్నా “డైలాగ్స్”లో వైవిధ్యాన్ని చూపించి “శభాష్” అనిపించుకున్నారు.

వ్యక్తిగా ఆయనది ప్రత్యేకమైన వ్యక్తిత్వం.
ఆయన “సంభాషణ”లకి కూడా తనదైన “వ్యక్తిత్వం’ వుంది. ఇది స్పష్టంగా మనం చూడొచ్చు. ఇదో విచిత్రమైన లక్షణం. మరొకరి దగ్గిర కనబడదు. ఎవరినీ అడగరు, ఎవరినీ పొగడరు. ‘పని’ కోసం- వస్తే, ప్రాణం పెట్టి రాయడం, లేకపొతే హాయిగా చదువుకోవడం. ఆయనతో అనేక సాహిత్య చర్చల్లో పాలు పంచుకునే భాగ్యం కలిగింది. మంచి వక్త.
ఏమని చెప్పనూ? నాలుగేళ్ళుగా మెల్లమెల్లగా నీరసపరుస్తున్న కేన్సర్ తో పోరాడి- ఇక దాని ‘బాధ’ నన్నేం చేయలేదంటూ, శరీరాన్ని ఇక్కడే వదిలేసి మరో నూతన ‘వస్త్రం’ ధరించడానికి ఎక్కడి నించి వచ్చారో ఆ పుట్టింటికి వెళ్లిపోయారు.

“జో జాయేగే ఉస్ పార్ కభీ లౌట్ కే …న ఆయే…” (ఆ వొడ్డుకి వెళ్ళిన వారెవరూ ఈ వొడ్డుకి తిరిగి రాలేరు)
“ఓ జానే వాలో …హో సకే తో లౌట్ కే ఆనా” (వీలుంటే మా కోసం మరో సారి తిరిగి వస్తారా?”)
బస్…

‘రాం తేరి గంగా మైలీ’ చిత్రంలో ఓ అద్భుత దృశ్యం వుంది.
ఓ పెద్ద మంచు గడ్డ పాక మీంచి కింద పడుతుంది. ఆ క్షణమే ‘కెవ్వు’ మన్న బిడ్డ ఏడుపు – అప్పుడే పుట్టింది- వినిపిస్తుంది. రాజ్ కపూర్ ఎంత గొప్ప సింబాలిజం చూపించాడూ..
మన జీవితం అనేది పెద్ద మంచు ముద్ద.
అది క్షణక్షణం కరిగిపోతూనే వుంటుంది. (జీవితంలాగే చివరంటా)
గాలి గాలిలో, మట్టి మట్టిలో, నిప్పు నిప్పులో నీరు నీటిలో ఆత్మ ఆకాశంలో-
గణేష్ పాత్రోజీ, మీ పాత్రని ఈ భూమ్మీద అద్భుతంగా పోషించారు. మాకివాల్సింది అక్షరాల రూపంలో అద్భుతంగా ఇచ్చేసారు.

అందుకే, అల్విదా.

మీ ఆత్మ పరమాత్మలో లీనమగు గాక
అనంత శాంతి మీకు లభించు గాక.

– భువన చంద్ర

bhuvanachandra (5)

నగ్నదేహాలతో నలుడూ, ఓడిసస్…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఓడిసస్, అతని సహచరులు మళ్ళీ యాత్ర ప్రారంభించారు. ఈసారి సౌర(సూర్య)ద్వీపం వారి గమ్యం. అక్కడికి వెళ్లడానికి సిల్లా(Scylla), చరిబ్దిస్(Charybdis) అనే రెండు పరస్పర విరుద్ధాల మధ్య నుంచి సాగే ఒక మార్గం ఉంది. ఓడిసస్ దానిని ఎంచుకున్నాడు. ఈ మార్గాన్ని మనకు తెలిసిన భాషలో ‘ద్వైతమార్గం’ అందాం.

సౌరద్వీపం చేరుకున్నాక ఓడిసస్ నిద్రపోతుండగా అతని సహచరులు మానవ సహజమైన ఆకలితో ఆ ద్వీపంలోని అనేక పశువులను నరికి వండుకు తిన్నారు. ఆ తర్వాత అక్కడినుంచి తిరిగి ప్రయాణం ప్రారంభించారు. అంతలో ప్రచండమైన పడమటి గాలి వీచి పెనుతుపాను సృష్టించింది. ఓడనూ, ఓడిసస్ సహచరులనూ కూడా ముంచి వేసింది. ఓడ స్తంభానికి వేల్లాడి ఓడిసస్ ఒక్కడే ప్రాణాలు దక్కించుకున్నాడు.

అతని యాత్రలో ఇది పతాకఘట్టం!

ఓడిసస్ నీళ్ళ మీద తేలుతూ సిల్లా, చరిబ్దిస్ ల మధ్యగా తొమ్మిదిరోజులపాటు ప్రయాణించి పదో రోజున ఒగీగియా అనే దీవికి చేరుకున్నాడు. అక్కడ లేత పచ్చిక బయళ్ళు, పూతోటలు, ద్రాక్షతోటలు, పక్షుల కిలకిలారావాల మధ్య ఒక గుహలో కలిప్సో అనే అప్సరస నివసిస్తోంది. ఆమె తియ్యని గొంతుతో పాటలు పాడుతూ తన మగ్గం ముందు అటూ ఇటూ తిరుగుతూ బంగారపు కండెతో వస్త్రం నేస్తోంది.

ఓడిసస్ కు ఆమె ఆతిథ్యమిచ్చి తిరిగి అతను శక్తిని పుంజుకునేలా చేసింది . ఆమెతోనే అతను ఎనిమిదేళ్లు గడిపేశాడు. సిర్సే నేర్పిన పాఠాలను కలిప్సో సాహచర్యంలో మరింత ఒంటబట్టించుకున్నాడు. ఎట్టకేలకు ఆమెను విడిచి వెళ్ళే సమయం వచ్చింది. త్వరగా అతన్ని తదుపరి యాత్రలోకి ప్రవేశపెట్టమని హెర్మెస్ ద్వారా జియస్ కలిప్సోకు కబురుచేశాడు. ఆమె అయిష్టంగానే అంగీకరించింది. ఓడిసస్ ఒక తెప్పను నిర్మించుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఆమె అతనికి స్నానం చేయించి చక్కటి దుస్తులు కట్టబెట్టింది. అతను వెడుతుంటే ఆమె ఒడ్డున నిలబడి వీడ్కోలు చెప్పింది.

అయితే, తన కొడుకు పోలిఫెమస్ కన్ను పొడిచేసినందుకు ఇప్పటికీ ఓడిసస్ మీద పోసిడిన్ కోపంగానే ఉన్నాడు. ఒక పెను తుపానును ప్రయోగించి ఓడిసస్ ఉన్న తెప్పను ధ్వంసం చేయించాడు. ఓడిసస్ రెండు పగళ్ళు, రెండు రాత్రులు ఈదుకుంటూ వెళ్ళి, ఫేషియన్లు అనే నౌకా నిపుణులు ఉండే ఒక దీవికి చేరుకున్నాడు. అప్పుడతను పూర్తి నగ్నంగా ఉన్నాడు. అదే సమయంలో నౌసికా అనే రాచబాలిక తన నేస్తాలతో కలసి ఆడుకోడానికి సముద్రతీరానికి వచ్చింది. వాళ్ళు ఆడుతున్న బంతి నీళ్ళలో పడిపోయింది. దాంతో అంతా కేకలు పెట్టారు. ఒక గుబురు మాటున ఉన్న ఓడిసస్ ఆ కేకలు విని, చెట్టుకొమ్మతో తన నగ్నత్వాన్ని కప్పుకుంటూ ఇవతలకు వచ్చాడు. అప్పుడా బాలికలు అతనికి కట్టుకోడానికి వస్త్రమిచ్చి రాజప్రాసాదానికి తీసుకెళ్ళారు.

ఆరోజు రాత్రి ఫేషియన్లు అతనికి విందు ఇచ్చారు. ఆ పదేళ్ళలో తను చేసిన సాహసయాత్రల గురించి, పడిన కష్టాల గురించి ఓడిసస్ వాళ్లకు చెప్పాడు. అతనిపై సానుభూతి చూపిన ఫేషియన్లు, అతను స్వస్థలానికి వెళ్ళడానికి ఒక ఓడను, సిబ్బందిని ఏర్పాటుచేశారు. అతను ఒళ్ళు మరచి సుఖంగా నిద్రపోయేవిధంగా ఓడను తీర్చిదిద్దారు. ఓడ కెరటాలపై ఊయలలూగుతూ సాగిపోతుంటే ఓడిసస్ తీయని గాఢనిద్రలోకి జారిపోయాడు. అదెంత గాఢనిద్ర అంటే, చావుతో సమానమైనంత! అంటే, ఓడిసస్ ఇప్పుడు మార్మిక జగత్తు నుంచి బాహ్యప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడన్నమాట. ఈ దశలో అతనికి మార్గదర్శనం చేసే బాధ్యతను ఎథెనే అనే దేవత స్వీకరించింది.

ఇలా ఉండగా, అక్కడ ఓడిసస్ భార్య పెనెలోప్ కు పునస్స్వయంవరం ఏర్పాటైంది. ఎంతోమంది వీరులు వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ పెనెలోప్ ప్రాసాదంలో ఆతిథ్యం పొందుతున్నారు. దాసీలతో వాళ్ళు కామకలాపాలలో మునిగి ఉన్నారు. దాంతో ఆ ప్రాసాదం ఓ వ్యభిచారగృహంగా మారిపోయింది. ఓడిసస్ కొడుకు తెలెమాకస్ వాళ్ళ మధ్య బరువెక్కిన హృదయంతో నిట్టూర్పులు పుచ్చుతూ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఎథెనా మారువేషంలో వెళ్ళి తెలెమాకస్ కు కనిపించింది. అతనామెకు స్వాగతం చెప్పాడు. రాత్రి భోజనాలు అయిన తర్వాత, ‘నీ తండ్రి వస్తున్నాడు. అతనికి ఎదురువెళ్ళు’ అని ఎథెనా అతనికి సలహా ఇచ్చి ఫలానా మార్గంలో వెళ్ళమని చెప్పింది. అలా తండ్రీ-కొడుకు కలసుకునే ఏర్పాటు చేసింది.

untitled

 

ఆ తర్వాత ఆమె ఒక అందమైన రాకుమారుని వేషంలో సముద్రపు ఒడ్డున ఓడిసస్ కు కనిపించింది. ఆమె చేతుల్లో ఒక పొడవాటి ఈటె ఉంది. ఆమెను చూడగానే ఓడిసస్ కు ఎంతో సంతోషం కలిగింది. ఎథెనా అతన్ని ఒక బిచ్చగాడి రూపంలోకి మార్చేసింది. తండ్రీ, కొడుకులు ఒక పందుల కాపరి గుడిసెలో కలసుకున్నారు. ఆ తర్వాత ఓడిసస్ స్వగృహంలోకి అడుగుపెట్టాడు. అతన్ని అతని కుక్క, ఒక వృద్ధదాది తప్ప ఇంకెవరూ గుర్తుపట్టలేదు. అతని మీద గూఢచర్యం సాగించిన వృద్ధ దాది అతని మోకాలి మీద ఒక పంది చేసిన గాయాన్ని చూసి గుర్తుపట్టింది. ఓడిసస్ ఆమెను చూపులతోనే వారించి, అక్కడి అతిథులు దాసీలతో నిస్సిగ్గుగా సాగించే కామకలాపాలను కాసేపు గమనిస్తూ ఉండిపోయాడు.

ఆ తర్వాత స్వయంవరఘట్టం మొదలైంది. ఓడిసస్ కు చెందిన అత్యంత శక్తిమంతమైన వింటిని ఎత్తి పన్నెండు గొడ్డళ్లను ఎవడైతే ఛేదిస్తాడో అతన్ని పెనెలోప్ వరిస్తుంది… అదీ పరీక్ష! లక్ష్యాన్ని ఛేదించడం కాదు సరికదా, కనీసం వింటికి నారి కూడా బిగించలేక అంతా తెల్ల మొహం వేశారు. అప్పుడు బిచ్చగాడి రూపంలో ఉన్న ఓడిసస్ ముందుకు వచ్చాడు. అవలీలగా వింటిని పైకెత్తి నారి బిగించి పన్నెండు గొడ్డళ్ళనూ ఛేదించాడు. అతనికి దేవతల సహకారం కూడా లభించింది. ఆ తర్వాత అతను స్వయంవరంలో పాల్గొన్న వీరులను కూడా అంతం చేశాడు.

అతనే ఓడిసస్ అన్న సంగతి తెలిసిపోయింది. పెనెలోప్ భర్తను సమీపించి, ’శయ్యాగారం సిద్ధమవుతోం’దని చెప్పింది. ఆపైన, ‘ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకుంటూనే ఉన్నాను. మీ యాత్ర గురించీ, మీరు పడ్డ కష్టాల గురించీ అన్నీ నాకు చెప్పాలి’ అంది.

download

ఎథెనా

 

***

జోసెఫ్ క్యాంప్ బెల్ తన Occidental Mythology లో విశ్లేషించిన ఓడిసస్ కథ చదువుతున్నప్పుడు నలదమయంతుల కథ గుర్తొచ్చి ఆశ్చర్యంతో తలమునకలయ్యాను. సరే, పరిమిత స్థాయిలో సీతా, ద్రౌపదీ స్వయంవరాలను కూడా ఈ కథ గుర్తు చేస్తున్న సంగతి తెలుస్తూనే ఉంది. ఇంకో ఆశ్చర్యమేమిటంటే, నేను గమనించినంతవరకూ, మన పండిత లోకం ఈ పోలికలను గుర్తించి విస్తృతంగా చర్చించిన దాఖలా లేకపోవడం!

కేవలం స్థూలమైన పోలికలకే ఇంత ఆశ్చర్యపోవాలా, అవి యాదృచ్ఛికం కావచ్చు, లేదా మన కథలనే వాళ్ళు తీసుకుని ఉండచ్చని పాఠకులలో కొందరైనా ఈపాటికి అనుకుంటూ ఉంటారు. కానీ నాకు అర్థమైనంతవరకూ ఈ పోలికలు అంత ఆషామాషీ వ్యవహారం కావు. వాటి వెనుక కొన్ని సిద్ధాంతాలు, సూత్రీకరణలూ ఉన్నాయి. అంతకన్నా విశేషంగా కొన్ని తాత్విక సామ్యాలు ఉన్నాయి.

ఆ రకంగా చూసినప్పుడు నలదమయంతులు-ఒడిసస్ పెనెలోప్ ల కథలలో ఉన్న పోలికలను మూడు అంచెలలో చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అవి: 1. స్థూలమైన పోలికలు. 2. సూక్ష్మమైన పోలికలు. 3. సుసూక్ష్మమైన పోలికలు.

స్థూలమైన పోలికలు

రెండు కథల్లోనూ భార్యాభర్తల మధ్య వియోగం సంభవించింది. భర్త ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. రెండు కథల్లోనూ దేవతల ప్రమేయం ఉంది. రెండింటిలోనూ భార్య పునస్స్వయంవరం ఉంది. కాకపోతే, దమయంతి పునస్స్వయంవరం భర్తను తన దగ్గరకు రప్పించుకోడానికి అనుసరించిన ఒక చిట్కా మాత్రమే. కానీ పెనెలోప్ స్వయంవరం నిజంగా జరిగింది. అదొక్కటే తేడా. భర్త ఏళ్ల తరబడి దేశాలు పట్టిపోయి భార్యకు దూరమైనప్పుడు భార్య పునర్వివాహం చేసుకోవచ్చునన్న సామాజిక నీతిని రెండు కథలూ ప్రతిబింబిస్తూ ఉండచ్చు కానీ, నలదమయంతుల కథలో కథకుడు దమయంతి పునర్వివాహప్రయత్నాన్ని ఒక చిట్కాగా మార్చేసి దమయంతి పాతివ్రత్యానికి ప్రాధాన్యమిచ్చాడు. ఓడిసస్-పెనెలోప్ ల కథలో ఇందుకు భిన్నంగా జరిగింది. నిజానికి పెనెలోప్ కూడా పునస్స్వయంవరాన్ని ఒక చిట్కాగానే ప్రయోగించి ఉండచ్చు, ఆమె కూడా దమయంతిలానే పతివ్రత కావచ్చు. అలా అనుకున్నప్పుడు మహాభారత కథకుడు కథనంలో చూపిన ఒడుపును హోమర్ (పెనెలోప్ కు నిజంగా పున్స్స్వయంవరం జరిపించడం ద్వారా) చూపించలేకపోయాడనాలి. మొత్తానికి రెండుకథల్లోనూ భార్యాభర్తలు చివరికి ఒకటయ్యారు. కథ సుఖాంతమైంది. కథాచట్రానికి సంబంధించినంతవరకూ ఇవీ రెండుకథల మధ్య ఉన్న స్థూలమైన పోలికలు.

సూక్ష్మమైన పోలికలు

రెండు కథల వివరాలలోకి వెడితే తేడాలు కొట్టొచ్చినట్టు కనిపించే మాట నిజమే. కానీ సూక్ష్మంగా చూస్తే పోలికలూ కనిపిస్తాయి. ఉదాహరణకు, నలుడి కష్టాలకు అడవి వేదికైతే, ఓడిసస్ కష్టాలకు సముద్రం వేదికైంది. బహుశా ఉభయుల ప్రాదేశిక నేపథ్యంలో ఉన్న తేడా ఇందుకు కారణం కావచ్చు. విస్తారమైన అడవులు ఉన్న భారతదేశ నేపథ్యం నలుడిది. గ్రీకులకు ఉన్న నౌకాయాన నేపథ్యం ఓడిసస్ ది.

ఇక రెండు కథల్లోనూ నగ్నత్వం, వస్త్రాల ప్రస్తావన ఏదో ఒక రూపంలో రావడం ఒక పోలిక. నలుడు పక్షులను పట్టుకోడానికి తన కట్టుబట్టను తీసి వాటిపై విసురుతాడు. అవి వస్త్రంతో సహా ఎగిరిపోతాయి. అప్పుడు నలుడు నగ్నంగా అయిపోతాడు. దమయంతి చీరలో అర్థభాగాన్ని కట్టుకుని నగ్నత్వాన్ని కప్పుకుంటాడు. కథ చివరిలో దమయంతిని తిరిగి కలసుకునే సందర్భంలో, తను దావానలం నుంచి కాపాడిన కర్కోటకుని తలచుకోవడం, పోయిన తన వస్త్రం తిరిగి అతని వద్దకు రావడం, దానిని కట్టుకోగానే నలునిగా మారిపోవడం జరుగుతాయి.

K11.11Hermes

హెర్మెస్

ఓడిసస్ కథకు వస్తే, అతడు సిర్సే అనే అప్సరస దగ్గరకు బయలు దేరినప్పుడు హెర్మెస్ అనే దేవుడు ఎదురై, ‘సిర్సేతో నువ్వు నిరభ్యంతరంగా పడకసుఖం అనుభవించు కానీ, ఆమె నిన్ను నగ్నంగా మార్చడానికి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోకు’ అని హెచ్చరిస్తాడు. ఓడిసస్ కలిప్సో అనే మరో అప్సరస దగ్గరికి వెళ్లినప్పుడు ఆమె బంగారు కండెతో వస్త్రం నేస్తూ ఉంటుంది. ఎనిమిదేళ్లపాటు తనతో కాపురం చేసి ఓడిసస్ తిరిగి యాత్ర ప్రారంభించబోయే ముందు కలిప్సో అతనికి స్నానం చేయించి చక్కని వస్త్రం కట్టబెడుతుంది. పోసిడిన్ తను ప్రయాణించే తెప్పను ధ్వంసం చేయించినప్పుడు సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళిన ఓడిసస్, ఫేషియన్ల దీవికి నగ్నంగానే చేరుకుంటాడు. అక్కడ బాలికల కేకలు విని చెట్టు కొమ్మతో నగ్నత్వాన్ని కప్పుకుంటూ గుబురులోంచి బయటకు వస్తాడు. అప్పుడా బాలికలు అతనికి వస్త్రమిచ్చి రాజప్రాసాదానికి తీసుకువెడతారు.

పేరు మార్పులోనూ నలునికీ, ఓడిసస్ కూ పోలిక ఉంది. కర్కోటకుడు నలుని రూపాన్ని వికృతంగా మార్చివేయడమే కాకుండా అతని పేరు బాహుకుడిగా మార్చివేస్తాడు. ఓడిసస్ ఒంటికన్ను రాక్షసుడైన పోలిఫెమెస్ ను కలసినప్పుడు తన పేరు ‘నోమన్’ అని చెబుతాడు.

కథ చివరిలో దమయంతిని కలవబోయే ముందు నలుడూ, పెనెలోప్ ను కలవబోయే ముందు ఓడిసస్ మారువేషంలోనే ఉండడం ఇంకొక పోలిక. కర్కోటకుడు నలుని వికృతరూపిగా మార్చివేస్తే, ఎథెనా అనే దేవత ఓడిసస్ ను బిచ్చగాడిగా మార్చివేస్తుంది. బాహుకుడే నలుడు కావచ్చుననే అనుమానంతో దమయంతి కొడుకును, కూతురినీ కేశిని అనే పరిచారికతో బాహుకుని దగ్గరకు పంపించినట్టే, ఎథెనా ఓడిసస్ దగ్గరికి అతని కొడుకు తెలెమాకస్ ను పంపిస్తుంది. నలదమయంతుల కథలో కేశిని అనే పరిచారిక నలుని గుర్తించే ప్రక్రియలో భాగస్వామి అవుతుంది. అలాగే ఒక వృద్ధదాది ఓడిసస్ ను గుర్తుపడుతుంది. ఇది వేరొక పోలిక.

సుసూక్ష్మమైన పోలికల గురించి తర్వాత…

 -కల్లూరి భాస్కరం

ఈమె…అలిశెట్టి ప్రభాకరూ…

drushya drushyam-alisetti

అదృష్టమో దురదృష్టమో నగర జీవితంలో ఉంటూ ఉండటం వల్ల ఎన్ని చిత్రాలని!
కానైతే, ఉంటున్నఈ ‘సిటిలైఫ్’ ని ఎంత చూసినా, మరెంత చదివినా, ఎన్నెన్ని దృశ్యాదృశ్యాలుగా చేసినా ఒకరు మాత్రం రోజూ గుర్తుకు వస్తూనే ఉంటారు.

ప్రతి ఛాయాచిత్రం ముగింపులో ఆయన్ని తల్చుకుంటూనే ఉంటాను.
ఆయనే ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్.

‘మరణం నా చివరి చరణం కాదు’ అన్న కవి కావడం వల్ల కాబోలు, జీవితంలోని ఏ ఘడియను చిత్రించినా, సామాన్యుడి స్థితీ, గతీని ఎలా చిత్రికపట్టినా ఆయన గుర్తుకు వస్తూనే ఉంటాడు.

ఇదొకటే కాదు, ఇలాంటి నా దృశ్యాదృశ్యాలను జీవితంగా చదువుకోవడానికి నేను చాలు.
కానీ, ఇవే చిత్రాలను విప్లవీకరించడానికి మాత్రం అలిశెట్టిని మించిన దృశ్యకారుడిని తెలుగు నేల ఇంకా కనలేదు. చూడనూ లేదు.

నిజానికి అతడు ఒకరే.
పేరుకు కవీ, చిత్రకారుడూ. ఫొటోగ్రాఫరూ.
కానీ, ఆయన పనంతా ఒకటే. ఒక దృశ్యం పరచడం.

కవిత్వంలోనూ, చిత్రాల్లోనూ, తీసిన ఛాయాచిత్రాల్లోనూ ఒకే ఒక అంశం అంతర్లీనం.
అదేమిటీ అంటే కళ్లకు కట్టడం. మంట పెట్టడం. మన లోవెలుపలి నెగడు ఆవరణ అంతా కూడా కాలిపోయేటట్టు అందులోంచి మన ఆత్మలు లేచి శత్రువు మెడను పట్టుకునేటట్లు చేయడం.

దృశ్యాన్ని విప్లవీకరించడం.
మనలో జీవితాన అదృశ్యంగా ఉన్న విప్లవశక్తిని చేతనలోకి తేవడం.
అవును మరి. ఆయన ఒక దృశ్య పాతర.

చిత్రమేమిటంటే, తీస్తున్న నా ప్రతి చిత్రంలో జీవితాన్ని మించి విప్లవం కనిపిస్తే నేను చిత్రించడం ఆపేస్తాను.
ఎందుకూ అంటే అది వేరు. అది ఆయన పని. ప్రతి ఒక్కరూ విప్లవకారులు కాలేరు. నిజం.
alisetti photo frame ion his home
ఇంకో విషయం. ఎవరు కూడా ఆయనంత ఆరోగ్యంగా ఉండలేరు. నమ్మండి.
కావాలంటే ఆయన కవిత్వాన్ని చదవండి. బొమ్మలు చూడండి. తీసిన ఫొటోలనూ గమనించండి.
అతడొక లైఫ్. రెడ్ సల్యూట్.

నిజానికి తెలుగు నేలపై ఒక మనిషి విప్లవాన్ని జీవితం స్థాయిలో బతికించాడూ అంటే అది ఆయనే. ఆయనకు నా దృశ్యాంజలి.

ఒక్కమాటలో ఆయన సామాన్యత విప్లవం
నా పరిమితి సామాన్యతే.
అందుకే దృశ్యాదృశ్యం వేరు. ఒక విప్లవ దృశ్యాదృశ్యం వేరు.
అది ఆయన.

క్లుప్తంగా చెప్పాలంటే…ఎర్ర పావురాలు. మంటల జెండాలు. చురకలు. రక్తరేఖ, సంక్షొభగీతం, సిటీలైఫ్. మరణం నా చివరి చరణం కాదు- ఇవన్నీ ఆయన కవితా సంపుటులు. చిత్రలేఖనాలు. ఛాయా చిత్రణలు.

ఒక పరంపరగా ఆయన రచనా దృశ్యాలు ఒక శర పరంపర.

+++

తాను ఒక కవిత రచించినా, చిత్రం గీసినా, ఛాయాచిత్రం చేసినా దాన్ని కొల్లోజ్ చేసి మరొకటి చేసినా ఒకటే చేశేవాడు. ఆ వస్తువు ఇతివృత్తం మార్చేవాడు. దాన్నికొత్త అర్థాలతో విప్లవీకరించేవాడు. అందుకే అనడం, నేను చిత్రిస్తున్న ప్రతి చిత్రం ప్రభాకర్ ను గుర్తు చేస్తుందని!  కానీ ఆయన దాన్ని ఎంత గొప్ప కవితగా మలిచేవాడూ అంటే అది చదివితే మళ్లీ నేను చూపే దృశ్యాదృశ్యాలను పదే పదే చూడాల్సిన అవసరమే లేదు.

ఉదాహరణకు వేశ్య గురించి ఆయన రాసింది ఎవరైనా మర్చిపోయారా?
లేదు.

నిజం.
ఎందుకంటే ఆయనది విజువల్ మీడియం.
చలనగీతం.

నాది జీవితం.
నిశ్చలన చిత్రం.

+++

చిత్రం ఒకటి చేస్తుంటే ఆ చిత్రంలో జీవితం యధాతథంగా ప్రతిఫలించడమే పనిగా పెట్టుకుని రచన గావిస్తుంటే అది దృశ్యాదృశ్యం. నేను.

కానీ, అదే దృశ్యాన్ని విప్లవీకరిస్తే అది వేరు. ఇక్కడే మనిషికీ విప్లవకారుడికీ ఉన్న తేడా అవగతం అవుతుంది. అది అలిశెట్టి ఫ్రభాకర్.

ఇద్దరిదీ జీవితమే.
కానీ, ఆయనది కల. నావంటి వారిది ఇల.

మొహమాటం లేదు. గులాంగిరీ లేదు. భద్రజీవి కానేకాదు.
అందుకే అతడు లేడు. ఉంటాడు. బతికే చరణం.

సమాజంలో వర్గకసిని ఆయన అంత తీవ్రంగా చెప్పనోడు మరొకడు కనిపించడు.
అట్లే, జీవితంలోని ద్వంద స్వభావాన్ని ఆయన అంత నిశితంగా ఎద్దేవా చేసినవాడూ మరొకడు లేడు.
అయినా ఆయన ఎంచుకున్నది మాత్రం సామాన్యమైన వస్తువును. మనిషిని. అధోజగత్ సహోదరులను.

జనవరి 12 న ఆయన జయంతీ, వర్థంతి.
ఒకటే రోజు చావు పుట్టుకల మనిషాయన.
ఆయన్ని గుర్తు చేసుకోవాలి.

జీవితాంతం తన వాక్యాన్ని, చిత్రాన్ని, ఛాయాచిత్రాన్ని పూర్తిగా దృశ్యాదృశ్యాల పరంపరగా రచించాడని చెప్పడానికి కూడా ఆయన్ని గుర్తు చేసుకోవాలి.

కొత్త సంవత్సరమే. కానీ, ప్రతి కొత్త చిత్రం తీస్తున్నప్పుడూ ఆయనుంటాడని చెబుతూ, దినదినం మరణించకుండా జీవిస్తున్న ప్రతి చిత్రంలోనూ ఆయనుంటాడని గుర్తుచేస్తూ, ఆయన సారస్వతాన్ని దృశ్యాదృశ్యంగా భావించడం నాకు ఎప్పటినుంచో తెలుసని కూడా మనవి చేస్తూ ఈ మహిళ ఛాయా చిత్రం ఈ వారం.

చూస్తూనే ఉండండి.
దారికి ఇరుపక్కలా ఇలాంటి చిత్రాలను చూస్తూనే ఉండండి.
అవి విప్లవిస్తే అలిశెట్టి లేకపోతే ఇవే. ఇంతే.

కానీ, ఈ వేళ, ఈ మహిళా మూర్తిని చూస్తూ ఉంటే, ‘మరణం నా చివరి చరణం’ కాదన్న అలిశెట్టి ప్రభాకర్ ఆమెనే కాబోలనే అనిపిస్తుంది.

ఒక నిద్ర. దీర్ఘనిద్ర.
ఎర్రగా మేలుకొలుపే చిత్రం.

కందుకూరి రమేష్ బాబు

(షొటో క్యాప్షన్…అలిశెట్టి ఇంట్లో అలిశెట్టి ప్రభాకర్ ఫొటోఫ్రేం)