కవి మోహన్ రుషితో కోడూరి విజయ కుమార్ సంభాషణ
- కవిత్వంలో ఆకర్షించింది ఏమిటి ?
మానవ సంవేదనల్ని లోతుగానూ, అత్యంత గాఢంగానూ ప్రతిబింబించే అత్యున్నత సాహిత్య రూపం కవిత్వం. అదే నన్ను కవిత్వానికి దగ్గర చేసింది.
- కవిత్వం ఏమిటి మీకు ?
కవిత్వం నాకు చాలానే. ఆనందం, బాధ, ఇష్టం, కష్టం, ఆర్తి, ఆత్మీయ స్పర్శ… అన్నీ. సీరియస్ గానే చెప్తున్నా, కవిత్వం రాయడం వల్లే బతికిపొయ్యాను.
- నవ తరం కవులు సీరియస్ సాహిత్యాన్ని చదవడం లేదు అంటున్నారు …. నిజమేనా ?
నవతరం అంటే ఇప్పుడిప్పుడే రాస్తున్నవాళ్ళని అనుకోవాలా? అంటే నా తర్వాతి తరమా? నేనప్పుడే పాతతరం అనుకోవాలా? తక్కువ చదువుతున్నట్టుగానే అనిపిస్తుంది. పుస్తకాలు అందుబాటులో వుంటే ఈ సంఖ్య పెరిగే అవకాశం వుందనుకుంటాను.
- మీ కవిత్వంలో తెలంగాణ నగరాల భాష ఎక్కువగా కనిపిస్తుంది – అప్రయత్నంగా జరిగిందా …. లేక ?
అప్రయత్నమే. బతుకుతున్న బతుకును మాత్రమే రాయడం వల్ల అలా జరిగింది.
- తెలంగాణ వొచ్చింది కదా …. ఇప్పుడు తెలంగాణ కవిని ప్రేరేపించే అంశాలు ఏమున్నాయి ?
. తెలంగాణ రాకపోవడమే ఇక్కడి కవులందరినీ ఇన్నాళ్ళూ ప్రేరేపించిన అంశం అని నేను అనుకోను. రావడంతోనే ఇక ప్రేరేపించే అంశాలు వుండబోవనీ అనుకోను. స్పందించే హృదయం తపన ఎప్పుడూ ఒక్కలానే వుంటుంది.
- తెలుగు కవిత్వం తెలంగాణ కవులను పట్టించుకోలేదు అన్న మాటను ఒప్పుకుంటారా ?
అవును. ఇంతకు ముందు పరిస్థితి అదే. తెలుగు కవిత్వం, తెలంగాణ కవిని పట్టించుకోకుండా వుండడం ఇప్పుడు సాధ్యంకాదు.
మీరు కవిత్వం వ్రాయడం ప్రారంభించిన కాలంతో పోల్చుకుంటే తెలుగు కవిత్వం ఇప్పుడెలా వుందని అనుకుంటున్నారు ?
కొందరుంటారు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ. మంచి కవిత్వం రాస్తూ. ఆశ్చర్యచకితుల్ని చేస్తూ. ఆ కొద్దిమందే కవిత్వానికి కొత్త జీవధార. మొత్తంగా చూస్తే గొప్పగా లేకపోయినా, ఈ కోణంలోంచి చూస్తే పరవాలేదేమో.
8. కవిత్వ వాక్యాల నిర్మాణంలో మీరు మామూలు ధోరణి కంటే కొంత భిన్నమైన నడక- కొంచెం వచనంలోని సహజ కవిత్వాన్ని పట్టుకోవాలనే ప్రయత్నం ఏదో కనిపిస్తుంది. ఇది మీరు conscious గా చేస్తున్నారా? మీ భాష ఎంత వరకు మీ నియంత్రణలో వుంటుంది?
సహజ కవిత్వాన్ని పట్టుకోవాలన్న ప్రయత్నం conscious గా చేస్తున్నది కాదు. తీసుకున్న సబ్జెక్ట్ దానికదిగా ఎంచుకునే భాష ఒక ఫ్లోలో వస్తుంది. నియంత్రణ వుండదు, చాలా తక్కువసార్లు మాత్రమే కొన్ని పదాలు ఎడిట్ చెయ్యాల్సి వస్తుంది.
*
అక్షరమొకటే ఊరడించింది!
– హిమజ
1981లో హన్మకొండ పింగళి విమెన్స్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు గ్రంథాలయ వారోత్సవాల్లో సరదాగా వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నందుకు ప్రథమ బహుమతి అందుకోవడం నా తొలి సాహితీ సంబరం.
పలు కాలేజీల్లో జరిగే కవితా పోటీల్లో పాల్గొనడం, కాలేజీ మాగజైన్ సంపాదకురాలిగా ఎంపికై బాధ్యతలు నిర్వహించడం మరిన్ని సంబరాలు.
పెళ్ళయ్యాక జింబో సహచర్యంలో సాహిత్యానికి మరింత చేరువైనా, పరవళ్ళు తొక్కే కుటుంబ బాధ్యతల్లో ఏమీ రాయలేదు.
కొంత ప్రయాణం తర్వాత – జీవితంలోని కొన్ని అలజడుల్ని, న్యూనతల్నీ కప్పిపుచ్చుకొని నార్మల్ గా బతకడానికి నాకో కవచం అవసరమైంది. ఆ ముసుగే కవిత్వమై అందంగా అమరింది. కుదిపేస్తున్న ఆవేదనల్లో అక్షరమొకటే నన్ను తన ఒళ్ళోకి తీసుకుని ఊరడించింది. హృదయవేదనలకీ, అంతరంగపు ఆర్తికి అక్షరాలు తొడగడమే నన్నిలా నిలబెట్టింది.
నా ’’సంచిలో దీపం‘‘ కవిత్వానికి గాను ’రొట్టమాకు రేవు‘ కవిత్వ అవార్డు అందుకోవడం మహా ఆనందంగా ఉంది. అవార్డు నిర్వాహకులు యాకూబ్, శిలాలోలిత గార్లకు నా కృతజ్ఞతలు. పల్లెల గాలుల్లోనే కవిత్వ వాతావరణం ఉంటుంది. దాన్ని మరింతగా పెంపొందింపజేసేందుకు ఈ కవి జంట చేస్తున్న కృషికి అభినందనలు.
కవిత్వం వేరెవరినో ఉద్ధరించడానికి కాదు. మనల్ని మనం వ్యక్తం చేసుకోడానికి, విముక్తమవడానికి అని నమ్ముతూ –
నా ముందు వెనకాల ఉన్న మహా సాహితీ సాగరానికి ఒక నీటిబిందువునై వినమ్రంగా నమస్కరిస్తున్నా.
మంచి సంభాషణలు. వారి హృదయావిష్కరణ చేసారు కోడూరు గారు