గమనమే గమ్యం-14

 

 

olgaదుర్గాబాయి మధుర జైలు  నుంచి విడుదలై కాకినాడ వచ్చిందనీ, ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదనీ కాకినాడ నుంచి అన్నపూర్ణ ఉత్తరం రాసింది. శారదకు ఇంగ్లండ్‌ వెళ్ళేముందు ఒకసారి దుర్గాబాయిను చూసి రావాలనిపించింది. పైగా కృష్ణా గోదావరీ జిల్లాల్లో కూడా కమ్యూనిస్టు భావాలతో యువతీ యువకులు పనిచేస్తున్నారు. అక్కడివాళ్ళను కలిసివస్తే ఉత్సాహం పెరుగుతోంది. తల్లిని అడిగితే రాలేనంది. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఒకసారి విశాలాక్షిని కలిసి వద్దామనుకుంది.

శారద వెళ్ళేసరికి విశాలాక్షి చాలా ఆందోళనతో ఉంది. ఈసారైనా యూనివర్సిటీలో ఎకనామిక్సు శాఖలో సీటు దొరుకుతుందా లేదా అనే దిగులు  పెట్టుకుంది. పైగా కోటేశ్వరి నాటకం కంపెనీ కోసం ఇంకెవరినో ఇంట్లో చేర్చింది. అతన్ని చూస్తుంటే విశాలాక్షి కి   కంపరంగా ఉంది. పాపం అతను విశాలాక్షి  జోలికి రావటం లేదు గానీ విశాలాక్షి  అతని ఉనికిని భరించలేకపోతోంది. అమ్మ ఇట్లా ఎందుకు చేస్తుందనే కోపం, దు:ఖంతో ఉడికిపోతోంది. దానికి తోడు ఇన్నాళ్ళూ ఎక్కడుందో తెలియని ఒకావిడ పిన్నంటూ ఇంట్లో దిగింది. ఆమెకు పద్నాలుగేళ్ళ కూతురు. వాళ్ళిద్దర్నీ తల్లి ఆప్యాయంగా చూసుకుంటుంటే విశాలాక్షి కి  ఒళ్ళు మండిపోతోంది.

‘‘ఇన్నాళ్ళూ ఏమయ్యారమ్మా వీళ్ళూ. నాకెప్పుడూ చెప్పనన్నా లేదు నాకో పిన్ని ఉందని’’ అనడిగింది తల్లిని.

‘‘నా పిన్నమ్మ కూతురమ్మా. మేమూ చిన్నతనంలో చూసుకోటమే. రాజమండ్రిలో ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు కూతురిని పైకి తేవాలని పట్నం వచ్చింది. నాలుగైదు నెలల్లో ఏదో ఒకదారి చూసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళతో మరీ అంటీ ముట్టనట్టు ఉంటావెందుకు’’ అని కూతురిని సముదాయించబోయింది కోటేశ్వరి. విశాలాక్షి కి  ఆ పిల్ల ను చూస్తే ఒంటికి కారం రాసుకున్నట్లుండేది.

‘‘పద్నాుగేళ్ళ పిల్ల.  బళ్ళోకి వెళ్ళి చదువుకునే వయసు. ఎప్పుడూ అద్దం ముందు చేరి సింగారం. ఆ బట్టలు , ఆ తల దువ్వుకోవటం. నాకు చూస్తుంటే చీదరగా ఉంది. ఇల్లు ఒదిలి ఎటన్నా పోదామని ఉంది’’.

విశాలాక్షి  ఈ చిరాకులో ఉండగానే శారద వచ్చింది. విశాలాక్షి  చాటంత ముఖం చేసుకుని.

‘‘నువ్వెంత మంచిదానివి శారదా “ ఇన్నిసార్లు మా ఇంటికి వస్తావు. నేను మీ ఇంటికి రావటం లేదని పట్టించుకోవు’’ అని ఆహ్వానించింది.

‘‘దాన్లో ఏముందోయ్‌ – ఎవరింటికి ఎవరొస్తే ఏంటోయ్‌’’ అని గలగలా నవ్వింది శారద.

‘‘మా ఇంటికి రావటానికి చాలామంది సందేహిస్తారు. వచ్చేవాళ్ళను చూస్తే నాకు చిరాకు’’ అంటూ తన మానసిక పరిస్థితంతా శారదతో చెప్పుకుంది విశాలాక్షి. .

‘‘పోనీ ఒక పని చెయ్యి. నేను దుర్గను చూడటానికి కాకినాడ వెళ్తున్నాను. నువ్వూ నాతో రా. మార్పుగా ఉంటుంది. మనం తిరిగి వచ్చేసరికి నీ సీటు సంగతి కూడా తేలుతుంది’’.

విశాలక్షి కి  కూడా ఆ మాట నచ్చింది. కానీ వెంటనే ఓ సందేహమూ వచ్చింది.

‘‘శారదా –  మనం వెళ్ళే చోట్ల నన్నూ నిన్నూ ఒకేలా చూస్తారా? నిన్నో చోటా నన్నో చోటా భోజనం చెయ్యమంటారా?’’

‘‘అలాంటి చోటికి నేను వెళ్ళనే తల్లి. దుర్గ దగ్గరికే వెళ్దాం. దుర్గ సంగతి నీకెంత తెలుసో నాకు తెలియదు. చిన్నతనంలోనే నువ్వే ఇష్టపడని మీ ఇళ్ళకు వచ్చి గాంధీ పురాణం చెప్తానని, గాంధీ గారి గురించి చెప్పేది. మనకంటే చిన్నదే గాని ఎన్నో విషయాల్లో మనల్ని దాటి ముందుకెళ్ళింది’’.

‘‘నాకా రాజకీయాలు  పడవు తల్లీ’’.

‘‘అనారోగ్యంతో ఉన్న దుర్గను పలకరించడానికి రాజకీయాలక్కర్లేదు గానీ నువ్వు రావాలి. వస్తున్నావు. అంతే’’ తొందర చేసింది.

‘‘మా అమ్మతో చెప్పాలిగా’’

‘‘మీ అమ్మగారితో నే మాట్లాడుతాలే’’ అంటూ శారద లోపలికి వెళ్లింది. శారదంటే కోటేశ్వరికి ఎంతో ఇష్టం. మనసులో ఉన్నదంతా వెళ్ళబోసుకోటానికి ముఖ్యంగా కూతురి గురించి చెప్పుకోటానికి ఆమెకు శారద కంటే ఎవరూ దొరకరు. శారదను చూడగానే కూతురి ఆగడా గురించి మొత్తుకుంది.

‘‘విశాలాక్షి  మనసు వేరుగా ఆలోచిస్తోందమ్మా. కాలేజీలో చేరితే అన్నీ కుదిరిపోతాయి. ఈ లోపల ఒక నెలరోజు నాతోపాటు కాకినాడ తీసుకుపోదామనుకుంటున్నా. మీరు ఒప్పుకుంటే ` ’’

‘‘అయ్యో – నేనెందుకు ఒప్పుకోను. నువ్వడగటం నేను కాదనటమా? బంగారంలా తీసుకుపో. నీకున్న బుద్ధి దానికుంటే ఎంత బాగుండేది. నువ్వెంత గొప్పింటి బిడ్డవు. మీ నాయనమ్మెంత నిష్టాపరురాలు. మీ నాన్నెంత పండితుడు. ఆ ఇంటి పిల్లవు మా ఇంటికొచ్చి నా చేతి వంట తింటున్నావు. దానికింత కంటే ఏం గౌరవం కావాలి? ఎప్పుడూ ఏదో కుములుతుంటుంది. దాని కుముడు చూడలేకుండా ఉన్నాను. తీసుకుపోమ్మా. నెలరోజు నేనూ సుఖపడతాను.’’ అంది.

శారద నవ్వి ‘‘విశాలాక్షి కి  చదువైపోయి పెద్ద ఉద్యోగం వస్తే తనూ మీరు కూడా సుఖపడతారు’’ అంది.

‘‘ఉద్యోగాల్లో నామ్మా సుఖం, శాంతి ఉండేది. మనసులో ఉండాలి. దాని మనసు మంచిది కాదు’’ అంది కోటేశ్వరి.

‘‘అట్లా కాదులే అమ్మా – మంచిదే , నే చెప్తాగా’’ అంటూ విశాలాక్షి  దగ్గరికి వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోమంది.

ఇక కృష్ణా, గోదావరి జిల్లాల్లో పార్టీ సభ్యులను కలుసుకుంటానని పార్టీ అనుమతి కోసం అడిగింది. పార్టీ సభ్యులకు కబుర్లు వెళ్ళాయి. అందరికీ అనుకూలమైన రోజేదో తెలుస్తుంది. శారదకది మహా ఉత్సాహంగా ఉంది. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ చాపకింద నీరులా, నీళ్ళల్లో చేపలా పాకుతోంది. గ్రామాలకు గ్రామాలు  జమీందారీ వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక భావాలతో చైతన్యమవుతున్నాయి. వితంతు వివాహాలు  చేయటం, వయోజన విద్య వంటి కార్యక్రమాలతో ప్రజలోకి చొచ్చుకుపోతూ తమ ప్రత్యేకత చూపుతున్నారు. కాంగ్రెస్‌ సోషలిస్టుగా చలామణి అవుతున్నా అంతర్గతంగా వాళ్ళలో కమ్యూనిస్టు భావాలే జ్వలిస్తున్నాయి. గుంటూరులో ఏర్పడిన కమ్మ హాస్టలు  ఇలాంటి  భావాలున్న యువకులకు కేంద్రమైంది.

ముదునూరు, వీరుపాడు లాంటి గ్రామాలలో మహిళలు  కూడా ఇళ్ళు దాటి ముందుకు వస్తున్నారు.

olga title

అదంతా చూసి రావాలని శారదకు ఉంది. పార్టీ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఓ వారం రోజుల ఎదురుచూపు తర్వాత పార్టీ శారద ఆ ప్రాంత కమ్యూనిస్టులను కలుసుకునేందుకు అంగీకరించటం లేదనే అనంగీకార పత్రం అందుకుంది. అన్ని ప్రాంతాలలో పోలీసు నిఘా చాలా ఎక్కువగా ఉంది. ఇపుడు శారద వెళ్తే సమావేశాలు  ఏర్పాటు చెయ్యగలరనే నమ్మకం లేదు అని రాశారు. శారద ఉత్సాహం సగం చల్లారిపోయింది.

దుర్గ దగ్గర పదిరోజులుండి వస్తే చాలని విశాలతో కలిసి పది రోజులు  గడపటం కూడా మంచిదని అనుకుని సమాధానపడిరది.

కాకినాడలో రైలు  దిగి దుర్గాబాయమ్మ గారిల్లు  అంటే చెప్పలేని వారెవరూ ఉండరు. తేలిగ్గా దుర్గ ఇంటికి చేరారు. దుర్గను చూసి శారద భయపడిరది. ముఖంలో ఆ కళ, వర్చస్సు ఎటు పోయాయో ని;లువెల్లా నీరసంతో ఉంది. సన్నగా, నల్లగా, బహీనంగా ఉంది. శారదను చూసి దుర్గ చాలా సంతోషించింది.

దుర్గవాళ్ళమ్మా, తమ్ముడూ కూడా వీళ్ళకు చాలా మర్యాద చేశారు. విశాల చదువు సంగతి శారద చెప్పగానే దుర్గ ముఖంలో కాంతి వచ్చింది. విశాల  చేతులు  రెండూ గట్టిగా పట్టుకుని ‘‘తప్పకుండా చదువు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానకు’’ అంది.

‘‘ఈ సంవత్సరమన్నా సీటువస్తే’’ అని నిరుత్సాహంగా అంటున్న విశాల నోరు మూసి

‘‘ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. నేను ముత్తులక్ష్మీరెడ్డికి ఉత్తరం రాసిస్తాను. ఇక నీకు సీటు ఇప్పించటం ఆవిడ బాధ్యత. అవసరమైతే ప్రకాశం గారికి, కాశీనాథుని గారికి కూడా ఉత్తరాలు రాసిస్తాను. వాళ్ళూ సాయం చేస్తారు. నీకు సీటు తప్పకుండా వస్తుంది’’. ‘‘ఔను’’ అంది శారద.

‘‘విశాలా –  ముత్తులక్ష్మీరెడ్డి నీకు తప్పకుండా సాయం చేస్తుంది. మీ కులం వాళ్ళు ఆ వృత్తి వదలాలని ఆమె చాలా కృషి చేస్తోంది’’ అంది దుర్గ.

విశాలకు కొత్త ఆశ కలిగింది.

ఆ సాయంత్రం దుర్గని వీణ వాయించమని అడిగింది శారద.

దుర్గ వీణ వాయిస్తుంటే, శారద పాడుతుంటే త్యాగరాజకృతులకు విశాల అభినయం చేసింది.

చాలా రోజుల తర్వాత దుర్గ ఉత్సాహంగా ఉందని తల్లి సంతోషించింది.

‘‘ఈ వీణ నన్ను జైల్లో కాపాడిరది. నాకు పిచ్చెక్కకుండా చేసింది. సంగీతానికున్న శక్తి మరింక దేనికీ లేదు’’ అంది దుర్గ.

‘‘జైల్లోకి వీణ తీసుకెళ్ళారా’’ అంది విశాల ఆశ్చర్యంగా.

‘‘తీసుకెళ్ళలేదు. జైల్లో ఒంటరితనం, భయంకరమైన వాతావరణం భరించలేకపోయా. పిచ్చెక్కుతుందేమో అనిపించింది.ఆ స్థితిలో జైలు  సూపర్నెంటుని ఒక వీణ ఇప్పించమని అడిగా. నన్ను చూసి జాలిపడ్డాడేమో ,  తెప్పించి ఇచ్చాడు. వీణ వాయిస్తుంటే మళ్ళీ మనిషినయ్యాను నెమ్మదిగా. అబ్బా –  ఆ రోజులు   ఆ మనుషులు  ’’

‘‘అదంతా మర్చిపోవాలమ్మా ` ఆ జ్ఞాపకాలు  నీ ఆరోగ్యానికి మంచివికావు. అమ్మా శారదా –  మీ ముగ్గురూ కలిసి ఇంకో కీర్తన పాడండి. దుర్గ వీణ వాయిస్తూ పాడుతుంది’’ అంది అమ్మ.

ముగ్గురూ ఏం పాడదామంటే ఏం పాడదామనుకున్నారు.

ముగ్గురికీ నచ్చిన, వచ్చిన కీర్తన ‘సంగీత జ్ఞానము భక్తి వినా’ హాయిగా గొంతెత్తి పాడుతుంటే, ముగ్గురి గొంతుల  మధ్యనుంచీ వీణ మధురంగా పలుకుతుంటే వాతావరణమంతా ఆనందమయమైంది.

దుర్గ అప్పటికే బెనారెస్‌ మెట్రిక్‌ పరీక్ష ఇవ్వాలని నిర్ణయించుకుంది.

నాస్తిక భావాలు  ప్రచారం చేస్తూ, కాకినాడ కాలేజీలో ఉద్యోగం చేస్తున్న గోరా గారింటికి వెళ్ళి ట్యూషన్‌ చెప్పించుకుంటోంది. శారద తనున్న నాలుగు రోజులూ  దుర్గకు సైన్సు పాఠాలు చెప్పింది. విశాల ఇంగ్లీషు గ్రామరు చెప్పింది.

ముగ్గురూ కలిసి గోరా గారింటికి వెళ్ళారు.

ఆ ఇంటి వాతావరణం విశాలను ఆశ్చర్యపరిచింది. శారదా వాళ్ళ ఇల్లు   కుల మత బేధాలకతీతంగా నడుస్తున్నా ఇంట్లోకి రాగానే అది బ్రాహ్మణుల  ఇల్లని తెలుస్తుంది.  సుబ్బమ్మగారు దేవత విగ్రహాలు, పటాలు  ఇంట్లో అలంకరణగా పెడుతుంది. పెద్ద ఇల్లు .

గోరా గారి ఇల్లు ఒక పాక. విశాలమైన ఆవరణ ఉంది. దాని నిండా రకరకాల మొక్కలు . చెట్లు, పూల చెట్లు విరగబూసి ఉన్నాయి. పాకలో ఒకవైపు గోరాగారి ఇల్లు  ఏ మత చిహ్నాలు  లేకుండా ఉంది. పక్కనే ఉన్న గదిలో గోరాగారి తల్లిదండ్రుల పూజగది ఉంది. సరస్వతి గోరాగారి భార్య. ఆమె నాస్తికురాలు. అయినా అత్తమామల పూజకు కావసిన ఏర్పాట్లు చేసేది.

శారదా, సరస్వతి క్షణాల్లో స్నేహితులయ్యి ఎన్నాళ్ళబట్టో ఎరిగున్న వాళ్లలా కబుర్లు చెప్పుకున్నారు.

గోరా గారితో శారద నాస్తికవాదం గురించి చిన్న వాదన చేసింది. ప్రజలు  ఈ భావాలకు భయపడతారని శారద, ప్రజలలో అనవసర భయాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇవ్వటమే గదా మనం చెయ్యాల్సింది అని గోరాగారూ `

విశాలకిదంతా కొత్త ప్రపంచం. తన ఇంటి వాతావరణానికి ఇక్కడి ఈ ఇళ్ళకూ పోలికే లేదనుకుంది. ఐనా విశాల ఇక్కడ కూడా కలవలేకపోయింది. వీళ్ళు కూడా తనవాళ్ళు కాదనిపించింది. వాళ్ళు శారదను చూసినట్టే విశాలనూ చూస్తున్నారు. కానీ విశాలకు ఎక్కడో ఏదో తేడా ఉందనే అనిపిస్తోంది. ఆ ఆదర్శాలు  విశాలకు ఎక్కటం లేదు. వాళ్ళ మాటల్లో విశాల లీనం కావటం లేదు.

విశాల మనసులో మద్రాసు వెళ్ళగానే తను కలవబోయే ముత్తులక్ష్మీరెడ్డి, ఆమె తనకు ఇప్పించబోయే సీటూ తప్ప మరింకే ఆలోచనా నిలవటం లేదు. శారద మాత్రం కాకినాడ వచ్చి మంచిపని చేశాననుకుంది. కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ గురించి దుర్గతో మాట్లాడదామనుకుంది గానీ ఆమెతో రాజకీయాలు  మాట్లాడవద్దని దుర్గ తమ్ముడు నారాయణరావు హెచ్చరించాడు. చూస్తుండగానే పదిరోజులు  గడిచాయి. దుర్గ బలవంతం మీద మరో ఐదు రోజులు ఉన్నారు. తిరిగి ప్రయాణమవుతుంటే దుర్గ తను ఒడికిన నూలుతో నేసిన చీరొ చెరొకటీ ఇచ్చింది.

‘‘జీవితాంతం ఇది దాచుకుంటా దుర్గ. ఎంతో అమ్యూల్యం నాకిది’’ అంది శారద ఆ చీరెను గుండెకు హత్తుకుంటూ.

ముగ్గురూ కలిసి మళ్ళీ త్యాగరాజ కీర్తన అందుకున్నారు. దుర్గ మధురంగా వీణ వాయించింది.

విశాల, శారద తిరిగి వచ్చీ రాగానే శారద తన పలుకుబడి ఉపయోగించి ముత్తులక్ష్మీరెడ్డిని కలిసే ఏర్పాటు చేసింది.

విశాల ఆమెతో తన పరిస్థితీ, తన కోరికా ఏమీ దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పింది. దుర్గాబాయి రాసిన ఉత్తరం ఇస్తే లక్ష్మీరెడ్డి నవ్వి ‘‘నీ మాటలన్నీ విన్నాక ఇంక ఎవరి సిఫారసూ అక్కర్లేదు. దుర్గాబాయి అంటే నాకెంతో గౌరవం. నిజమే. ఇప్పుడు నువ్వంటే ఎంతో ప్రేమ కలిగింది నాకు. నువ్వు ఏమ్‌.ఏ లో చేరటానికి కావసిన ఏర్పాట్లు చేసుకో –  శారదా. నువ్వు ఇంగ్లండ్‌ వెళ్తావా? మంచి పని –  నాకూ ఇంగ్లండ్‌ రావాని ఉంది.’’

ముగ్గురూ ఎన్నో విషయాలు  మాట్లాడుతూంటే రెండు గంటల  కాలం తెలియకుండా గడిచిపోయింది. ముగ్గురి మధ్యాస్నేహం కుదిరింది.

శారద మనసు ఎపుడెపుడు మూర్తిని చూద్దామా అని తహతహలాడుతోంది. ఆమె రాగానే ఆమె వచ్చినట్లు మూర్తికి కబురుపంపింది. రెండు రోజులు  గడిచినా మూర్తి రాలేదని దిగాలు  పడిరది. మళ్ళీ ఒక మనిషి కోసం ఇంత బలహీనమవుతున్నానేమిటని తనను తాను హెచ్చరించుకుంది.

మూడో రోజు మూర్తి వచ్చాడు.

‘‘మూడు రోజుకు తీరిందా’’ అంది నిష్టూరంగా.

‘‘పదిహేను రోజులు ఒక్కడినే ఒదిలి వెళ్తే నేనేమయ్యానో నీకు తెలియాలిగా’’.

‘‘బాగా తెలిసింది’’ నవ్వేసింది శారద.

గలగలా కాకినాడ కబుర్లన్నీ చెప్పింది. గోరాగారి గురించీ, వాళ్ళింటి గురించీ చెప్తూ ‘‘ఆయన వృక్షశాస్త్రంలో భలే పరిశోధన చేస్తున్నారు తెలుసా? ఒక వింత సంగతి చెప్తా విను. బొప్పాయి చెట్లలో ఆడచెట్లూ, మగచెట్లూ ఉంటాయి. తెలుసుగా?’’

‘‘బొప్పాయి చెట్లలో ఏంటి? సృష్టిలో ప్రతి ప్రాణిలో ఉంటాయి ఆడ, మగ. లేకపోతే సృష్టి సాగేదెట్లా.’’

‘‘అబ్బా ` నీకు లా తెలుసుగానీ వృక్షశాస్త్రం తెలియదు. బొప్పాయి చెట్లలో కొన్ని చెట్లకి ఆడ, మగ పూలు పూస్తాయి. మగపూలు రాలి ఆడపూలు కాయవుతాయి. కొన్ని చెట్లు మగ చెట్లుగానే ఉంటాయి. మగపూలే పూస్తాయి. అవి రాలిపోతాయి. కాయలు కాయవు. కొన్ని ఆడ చెట్లుగా ఉంటాయి. ఆ చెట్టు పూలన్నీ కాయలు కాస్తాయి. గోరాగారు మగచెట్టుని కూడా ఆడచెట్టుగా మార్చాలని పరిశోధన చేస్తున్నారు’’.

మూర్తి తల పట్టుకుని ‘‘మగవాళ్ళని ఆడవాళ్ళుగా మార్చనంతవరకూ ఎవరేం చేసుకున్నా నాకభ్యంతరం లేదు’’ అన్నాడు.

‘‘ఆడవాళ్ళను మగవాళ్ళుగా మారిస్తే’’

‘‘అది నువ్వు చెప్పాలి. నాకు నేను మగవాడిగా ఉంటే చాలు. మారాలని లేదు’’.

‘‘నాకేమనిపిస్తుందో చెప్పనా?’’ ముద్దుగా అడిగింది శారద.

‘‘చెప్పు’’ అన్నాడు ఆమెని రెప్పవాల్చకుండా చూస్తూ.

‘‘బొప్పాయి చెట్లలో కొన్ని చెట్లలాగా ప్రతి మనిషిలో ఆడ, మగ ఇద్దరూ ఉండాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళు అని వేరుగా ఉండనవసరం లేదు. రెండు క్షలణాూ ఉన్న మనుషులుండాలి. అప్పుడు ఈ తేడాలుండవు. ఎన్నో సమస్యలు పోతాయి’’.

‘‘కొత్త సమస్యలు  చాలా వస్తాయి’’ శారద నెత్తి మీద మొట్టికాయవేశాడు.

‘‘ఏమొస్తాయి’’ అమాయకంగా అడిగింది శారద.

‘‘సెక్సు –  సెక్సు ఎట్లా?’’

‘‘ఏముంది? సింపుల్‌. ఉదాహరణకు నీలో ఆడక్షణాలు  ఉద్రేకించినపుడు మగక్షణాలు  ఉద్రేకించిన మనిషి వైపు ఆకర్షించబడతావు. సెక్సు సాధ్యమవుతుంది. నీలో అపుడు అండం విడుదయితే అవతలి నుంచి వీర్యకణాలు  చేరతాయి. రెండూ కలిసి ఎవరి శరీరంలో స్థిరపడితే వారి గర్భంలో బిడ్డ పెరుగుతుంది’’.

‘‘శారదా –  ప్లీజ్‌ ` ఆపు. నువ్వు డాక్టర్‌వి. నిజమే గాని నువ్వు చెప్పేది వింటే నాకు కడుపులో వికారంగా ఉంది. ఇంక ఆపు. లేకపోతే నన్ను వెళ్ళిపొమ్మని సూటిగా చెప్పెయ్‌’’.

శారద గలగలా నవ్వి ‘‘నీతో తప్ప ఇలాంటి విచిత్రపు ఆలోచనలను ఇంకెవరితోనూ చెప్పలేను. అదేంటో –  సరేగానీ నువ్వూ దీని గురించి ఆలోచించవా.’’

‘‘చచ్చినా ఆలోచించను. మగాడు మగాడిలా, ఆడది ఆడదిలా ఉండాలి. వాళ్ళు ప్రేమించుకోవాలి. పెళ్ళాడాలి. ఇప్పటిలా పిల్లల్ని కనాలి. అదే సృష్టిధర్మం. నాకదే ఇష్టం’’.

‘‘సృష్టి ధర్మాలను కమ్యూనిజం మార్చదా? మార్పు ఇష్టం లేకపోతే కమ్యూనిస్టువి కాలేవు’’.

‘కమ్యూనిస్టు కోరేది ఇలాంటి మార్పు కాదు. ప్లీజ్‌ ఆ గోరా గారికో నమస్కారం. నీకో నమస్కారం. ఇంకేదన్నా చెప్పు. దుర్గాబాయి గురించి ఇంకా చెప్పు.’’

‘‘ఆమె చాలా నలిగింది. శారీరకంగా, మానసికంగా. చదువుకుంటోంది. కోలుకుంటుందిలే’’.

‘‘ఆమె జైల్లో గడిపిన దుర్భర జీవితాన్ని ప్రజల్లో ప్రచారం చేసి కాంగ్రెస్‌ పార్టీ తన ప్రతిష్ట పెంచుకుంటోంది’’.

‘‘పెంచుకోని. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టతో పాటు అందులో సోషలిస్టు ప్రతిష్టా పెరుగుతుంది.’’

‘‘దుర్గాబాయి సోషలిస్టు కాదుగా’’

‘‘ఏమో కావచ్చు. మన ఆశయాలు  ఆమెకు నచ్చుతాయి’’.

‘‘ఆమె ఎన్నటికీ కమ్యూనిస్టు కాదు’’.

‘‘కాకపోవచ్చు. కమ్యూనిస్టు కాకుండా మంచి మనుషులు  ఉండకూడదా?’’

‘‘ఉండొచ్చుగానీ – వాళ్ళ మంచితనం ఎవరికీ ఉపయోగపడదు’’.

‘‘ఇపుడు గాంధీ మొదలైన వాళ్ళ మంచితనం వల్ల ఏ ఉపయోగం లేదా?’’

‘‘ఉంది. కొంతవరకే.’’

‘‘ఆ – కొంత, కొంత,  కొంత కలిసి సంపూర్ణమవుతుంది. కొంత లేకుండా సంపూర్ణం లేదు. కాబట్టి కొంత కూడా పూర్ణమే. అందుకే మనవాళ్ళు పూర్ణమిదం పూర్ణమదం అన్నారు.’’

‘‘బాబోయ్‌ –  ఇవాళ నువ్వన్నీ తాత్విక చర్చలు  చేస్తున్నావు. నేను వెళ్ళొస్తా.’’

మూర్తిని ఆపింది శారద. రాత్రి పొద్దుబోయే దాకా చర్చలతో గడిపి భారంగా విడిపోయారిద్దరూ.

***

 

 

 

మీ మాటలు

*