శారద బాధను మరిపించింది చదువే. మూడేళ్ళ పాటు చదువే లోకంగా గడిపి హైస్కూలు చదువు ముగించింది. కళాశాల శారద కోసం ఎదురు చూస్తోంది. హైస్కూల్లో చివరి సంవత్సరంలోనే శారదకు ఆంధ్రపత్రికతో అనుబంధం ఎక్కువైంది. దేశంలో ఏం జరుగుతోందనే ఆసక్తి పెరిగింది. అందుకే అహమ్మదాబాదులో ఆ సంవత్సరం జరుగుతున్న కాంగ్రెస్ సభల గురించి వస్తున్న వార్తలను అక్షరం ఒదలకుండా చదివి ఒంటబట్టించుకున్నది.
గాంధి భారతప్రజలందరిలాగానే శారద మనసులో క్రమంగా తిష్ట వేసుకుంటున్నాడు. అహమ్మదాబాద్ కాంగ్రెస్లో సహాయ నిరాకరణ స్వదేశీ నినాదాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దీంతో 1922 సంవత్సరం ఆరంభం నుంచీ కలకలం రేగుతూ వచ్చింది. శారద ఒకవైపు పరీక్షలు మరొకవైపు ఈ స్వదేశీ ఉద్యమ వార్తలతో సతమతమయింది. ప్రకాశం పంతులుగారు న్యాయవాదవృత్తి ఒదిలిపెట్టిన రోజున రామారావు మద్రాసులోనే ఉన్నాడు. ఆయనతో ఈ విషయం మాట్లాడటానికి చాలామంది వచ్చారు.
కొందరు ‘‘అదేమిటండీ అంత ఆవేశం. అంత సంపాదన హఠాత్తుగా ఎలా ఒదిలిపెడతాడు’’ అన్నారు. కొందరు ఆయన త్యాగాన్ని పొగిడారు. కొందరు ‘‘ఇప్పటికి ఆయన సంపాదించింది చాలు. రెండు తరాలు గడిచిపోతాయి. ఇంక ఇప్పుడు దేశసేవ చేసుకుని పేరు సంపాదించుకుంటాడు’’ అన్నారు. రామారావు ఆ మాటకి ఒప్పుకోలేదు. ‘‘కొద్దిరోజుల్లోనే ఆయన సంపాదించినదంతా దేశానికి ఇచ్చేస్తాడు. ఆయన పత్రిక పెట్టబోతున్నాడు. చాలా పనులు చేయబోతున్నాడు. ఆయనను తేలికగా అంచనా వేయకండి’’ అన్నాడు.
మొత్తానికి విద్యార్థి లోకంలో పెద్ద అలజడి రేగింది. శారద పరీక్షలు మొదలయ్యేరోజున గాంధి గారిని అరెస్టు చేశారు. ఆ ఆందోళనతోనే శారద పరీక్ష రాసింది. నాలుగు పేపర్లు రాయటం పూర్తయ్యేసరికి గాంధీగారిని విచారించటం, శిక్ష వేయటం కూడా జరిగిపోయాయి. ఆ రోజు గాంధీ కోర్టులో చేసిన ఉపన్యాసం ఆంధ్రపత్రికలో చదివి శారద శరీరమంతా పులకించిపోయింది.
ఎంత ధైర్యం! ఎంత సాహసం. బతికితే ఇలాంటి సాహసంతో బతకాలి. ఎదిరించాలి ఎంతటి అధికారాన్నయినా. ఒక్క చూపుతో, నవ్వుతో, ఒక తిరస్కారపు మాటతో, అనంగీకారంతో అధికారపీఠాన్ని గడగడలాడించాలి. శారద మర్నాడు పరీక్షకు చదవలేకపోయింది.
‘‘భారతదేశంలో జరిగే ఆందోళనలకూ, మరణాలకూ, హత్యలకూ నేనే బాధ్యత వహిస్తున్నాను. ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్నీ, శాసనాధిక్కార ప్రణాళికనూ నడుపుతున్నది నేనే. నా ఉద్యమం వల్ల జరిగే సర్వ అనర్థాలకూ నేనే కారకుడిని. నన్ను మీరు శిక్షించండి. ఏ శిక్ష అయినా, ఆఖరికి మరణశిక్ష అయిన సరే ఆనందంగా అనుభవిస్తాను’’.
శాంతంగా గాంధీ పలికాడని పత్రికలో వచ్చిన ఆ మాటలు శారద మనసులో శిలాక్షరాల్లా నిలిచిపోయాయి. బాధ్యత తీసుకోవటమంటే ఏమిటో చెప్పాడాయన. అది శారదకు అర్థమైంది. గాంధీ కోసం దేశంలోని లక్షలమంది లాగే శారద మనసూ ఆక్రోశించింది. ఆయనను జైలులో పెట్టిన బ్రిటీష్ ప్రభుత్వం మీద తెలియని పగ, కోపంతో శారద మనసు నిండిపోయింది.
పరీక్షలు రాసింది కానీ శారదకు ముందేం చేయాలో పాలు పోలేదు. దేశంలో వేలాదిమంది విద్యార్థులు కళాశాలలు బహిష్కరిస్తుంటే తాను వెళ్ళి చేరాలా? ఛీ! ఎట్లా చేస్తుందాపని. ఎంత అవమానం. కానీ చదువు. చదువుకోవాలనే తన జీవితాశయం. డాక్టర్ కావాలనే ఆశ కాలేజీలో చేరకుండా ఎట్లా ఎట్లా సాధ్యం? ఏం చెయ్యాలి? రాను రానూ ఈ సంఘర్షణ తీవ్రమై శారద తిండి, నిద్రకు కూడా దూరమైంది. చిక్కిపోతోంది. పరీక్ష ఫలితాలు వచ్చాయి. రావలసిన అవసరం కూడా లేదు. శారద ఫస్టున పాసవుతుందనే విషయంలో ఎవరికీ సందేహం లేదు.
సైన్సు గ్రూపుతో మంచి కళాశాలలో చేరేందుకు అప్లికేషన్ తెచ్చాడు రామారావు.
‘‘శారదా. ఇది పూర్తి చేసి ఇవ్వమ్మా. రేపు మనిద్దరం కాలేజీకి వెళ్ళి ఇచ్చివద్దాం’’. అంటూ శారద చేతికి ఇచ్చాడు.
నిప్పుని తాకినట్లు, పాముని పట్టుకున్నట్లు అనిపించింది శారదకు.
తండ్రితో ఏం చెప్పాలో తెలియలేదు. ఆ కాగితాలు అక్కడే బల్లమీద పెట్టి ఏమాటా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది.
మర్నాడు ఉదయం ఆ కాగితాలు ఎట్లా ఉన్నవి అట్లాగే ఆ బల్లమీదనే పడి ఉండటం చూసి రామారావుకేం అర్థం కాలేదు. అప్లికేషన్ నింపకుండా శారద ఏం చేస్తున్నట్లు?
‘‘శారదా! శారదా!’’
తండ్రి పిలుపు కోసం శారద ఎదురు చూస్తూనే ఉంది. రాత్రంతా శారద నిద్రపోలేదు. చిన్నతనం నుంచీ తన చదువు కోసం తల్లిదండ్రులు పెంచుకున్న ఆశలు, వీరేశలింగం గారికిచ్చిన వాగ్దానం, నాయనమ్మ కాశీవాసం ఇవన్నీ శారదను ఒకవైపు అశాంతిలోకి అలజడిలోకి నెట్టాయి. ఇంకోవైపు గాంధీగారి మాటలు, ఆయన వెనక నడుస్తున్న విద్యార్థులు, ప్లీడర్లు, స్వయంగా ఎరిగిన ప్రకాశం గారు, వీళ్ళంతా ఒక వైపు. కురుక్షేత్ర యుద్ధమే జరిగింది ఆ చిన్న మనసులో. చివరకు నిశ్చయించుకుంది. కళాశాలలో చేరే ప్రశ్నలేదు. ఈ నిర్ణయానికి తిరుగులేదు. ఎవరేమన్నా సరే ` ఎవరేమంటారు? తండ్రిని ఒప్పిస్తే చాలు. తండ్రి తన కోరికను కాదనడు. తను ఉద్యమంలో చేరుతుంది. ప్రకాశం గారి దగ్గర, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దగ్గర శిష్యరికం చేస్తుంది. ఖద్దరు తయారు చేస్తుంది. రాట్నం తిప్పుతుంది. శారద మనసు ఈ ఆలోచనలతో ప్రశాంతమయింది. తెల్లవారు ఝామున ఎప్పుడో ఆలస్యంగా నిద్రలేచింది.
తనపనులు చేసుకుంటూ తండ్రి పిలుపు కోసం ఎదురు చూస్తోంది.
రామారావు శారద వంక ఆశ్చర్యంగా చూస్తూ
‘‘ఈ అప్లికేషను ఇలాగే ఉంచావేం. పూర్తి చెయ్యలేదేం. ఇవాళ ఇచ్చిరావాలిగదా’’ అన్నాడు.
‘‘నేను కాలేజీలో చదవాలనుకోవటం లేదు నాన్నా’’ అంది శారద. రామారావు నిర్ఘాంతపోయాడు.
‘‘ఏంటమ్మా’’ అన్నాడు అయోమయంగా.
‘‘దేశంలో అందరూ కళాశాలలు బహిష్కరిస్తుంటే నేను ఇప్పుడు చేరి చదవనా? ఎట్లా చదువుతాను నాన్నా?’’
రామారావుకి అర్థమైంది. భయం వేసింది. శారద ఒక నిర్ణయం తీసుకుంటే మార్చటం కష్టమని ఆయనకు తెలుసు. దేశంలో జరుగుతున్న అలజడీ, దాని ప్రాముఖ్యమూ ఆయనకు తెలియనిది కాదు. ఆయన మిత్రులు, సహచరులు ఎందరో ఆ ఉద్యమంలో ఉన్నారు. ఆయనకు అతి సన్నిహిత మిత్రుడు హరి సర్వోత్తమరావు ఈ స్వదేశీ ఉద్యమం మొదలు పెట్టకముందే, 1908లోనే బిపిన్ చంద్రపాల్ రాజమండ్రికి ఒచ్చినపుడు విద్యార్థిగా పరీక్షలు బహిష్కరించి కళాశాల నుంచి బైటికొచ్చారు. ఆ తర్వాత స్వరాజ్య పత్రికలో సంపాదకీయం రాసి, ఆంధ్ర దేశంలో స్వతంత్రం కోసం మొట్టమొదట జైలుకెళ్ళిన యోధుడయ్యాడు. ఆ జైలు జీవితం గురించి ఆయన చెప్తుంటే రామారావు ఒళ్ళు గరిపొడిచింది. అంత క్రూరం. అంత కఠినం. అదంతా వేరు. దానిలో ఆసక్తి అభినివేశం ఉన్నవారు అటు వెళ్తారు.
శారద ఆవేశంతో ఈ నిర్ణయం తీసుకుని, చదువు పాడుచేసుకుని, జీవితానికి అర్థం లేకుండా చేసుకుంటుందా?
‘‘ఎందుకమ్మా అనవసరంగా ఆవేశపడుతున్నావు’’ కూతురిని కొంచెం మార్చాలనుకున్నాడు రామారావు. ఇంతవరకూ శారద సందేహాలకు సమాధానమివ్వటమే ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన శారదను ప్రశ్నించి మార్చే పనిచేయటం ఎలాగో ఆయనకు కాస్త కష్టంగానే ఉంది.
శారదకూ తండ్రితో ఇలా నచ్చని విషయాలు మాట్లాడాల్సిన అవసరం రాలేదు. ఇంతవరకూ వారిద్దరికీ ఒకటే మాట. ఈ పరిస్థితి శారదకూ తేలికగా లేదు.
‘‘ఆవేశం కాదు నాన్నా. ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చాను’’ అంది శాంతంగా.
‘‘ఆలోచించటానికి నీకేం తెలుసమ్మా’’
శారద ఆ మాట అర్థం కానట్లు చూసింది.
‘‘రోజూ పత్రికలు చదివి, ప్రకాశం పంతులు వంటి వారిని చూసి ఆవేశపడుతున్నావు. అంతేగాని ఈ ఉద్యమం ఏమిటి, దాని మంచి చెడ్డలేమిటి అనేది నీకు తెలుసా?’’
‘‘నాకు తెలుసు నాన్నా. అన్నిటికంటే ముఖ్యం స్వతంత్రం’’.
‘‘నిజమే. కానీ కళాశాల మానేస్తే స్వతంత్రం ఒస్తుందా? మానెయ్యమన్న కాంగ్రెస్ వారికి స్వతంత్రం గురించి పట్టుదల ఉందా? ఇంతవరకూ వాళ్ళు ఆ మాట అనలేదు. మాకు పూర్తిగా స్వతంత్రం కావాలని వారింకా అడగలేదు. సందేహిస్తున్నారు. కాంగ్రెస్లో కూడా రకరకాల ధోరణులున్నాయి. నాయకులంతా ఒకే ఆలోచనతో లేరు. నీకు అన్నీ తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నావని నాకు నమ్మకం లేదు. కేవలం ఆవేశంతో ఒక జీవితకాలపు నిర్ణయం తీసుకుంటే ఎలాగమ్మా?’’.
‘‘గాంధీగారు జైలులో ఉన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం నడవొద్దా నాన్నా’’ శారద కొంచెం బలహీనంగా అంది.
‘‘గాంధీ ఇవాళో కార్యక్రమం ఇస్తాడు. రేపు ఇంకొకటి ఇస్తాడు. అవి రాజకీయాలు. నేను వాటిని తప్పు పట్టను. పట్టేంత పరిజ్ఞానం ఆ రాజకీయాల గురించి నాకు లేదు. కానీ వాటి గురించి ఏమీ తెలియకుండా దాన్లోకి దూకటం మంచిది కాదు. కాలం విలువైంది. ఒకటి రెండు సంవత్సరాలు వృధా చేసుకోవటం తప్ప జరిగేదేం ఉండదమ్మా’’.
‘‘అసలు ఈ చదువే మానేస్తా నాన్నా.’’
‘‘డాక్టరవవా అమ్మా’’ రామారావు అడిగిన తీరుకి శారద గుండె కరిగిపోయింది. తండ్రికి తనమీద ఉన్న ఆశ ఆ పిల్లకు తెలిసినట్లు మరెవరికి తెలుసు? మాట్లాడలేకపోయింది.
‘‘దేశంకోసం కొందరు విద్యార్థులు కళాశాలలు, చదువులు బహిష్కరిస్తున్నారు. అది వారి పద్ధతి. దాని మంచి చెడ్డలు ఎంచొద్దు. స్వతంత్రం కోసం వారు త్యాగం చేస్తున్నారని అనుకుందాం. నువ్వు ఇంకో రకం త్యాగం చెయ్యమ్మా’’ శారదకు ఆ మాట అర్థం కాలేదు.
‘‘రేపు దేశం స్వతంత్రమైతే డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాల చదువులు చదివిన వారూ అవసరం కాదా? ఒక్క లేడీ డాక్టరు కూడా లేకుండా స్వతంత్ర దేశం అభివృద్ధి చెందుతుందా? అప్పుడు చదవటం మొదలు పెడితే ఆలస్యం కాదా? స్వతంత్రం వచ్చేనాటికి నువ్వు సర్వసన్నద్ధంగా ఉంటావు ప్రజలకు సేవ చెయ్యటానికి. దాని కోసం ఇప్పటికిప్పుడు ఉద్యమంలో చేరి నీ స్వతంత్ర కాంక్షను ప్రదర్శించాలనే కోరికను త్యాగం చెయ్యి. ఇవాళ ఏదో ఒక మార్గంలోనే దేశం కోసం పనిచేస్తే సరిపోదమ్మా. అన్నివైపుల నుంచీ సన్నద్ధం కావాలి. నువ్వింకా చిన్నదానివి. ఉద్యమం లోతుపాతులు తెలియాలన్నా ఇంకా కొన్నేళ్ళు పోవాలి. మహా మహా వాళ్ళే ఈ కాంగ్రెస్లో ఇమడలేక, ఈ ఉద్యమంలో ఇమడలేక వేరేవేరే పనులు చేస్తున్నారు. ప్రకాశం అనుభవజ్ఞుడు అపారంగా చదివాడు. అన్నీ తెలిసినవాడు. ఆయనా, నువ్వూ ఒకటి కాదు, అతను నీ ఆదర్శం కాదు. నువ్వు వేరే దారి వెయ్యాలి. నీ ఆదర్శం నీకుండాలి. అది డాక్టరువై ప్రజాసేవ చెయ్యటం. ఎన్ని ఆటంకాలచ్చినా దానిని నువ్వు ఒదలకూడదు. అలాగని నాకు నువ్వు మాట ఇవ్వాలి.’’
శారద తండ్రి మాటలకు ఉక్కిరిబిక్కిరయింది. కళాశాలలో చేరి చదివి డాక్టరవటం త్యాగం అనుకోవటం ఆమెకు బొత్తిగా నచ్చలేదు. తనకెంతో ఇష్టమైనదాన్ని దేశం కోసం ఒదిలెయ్యటం త్యాగం అని ఆమె నమ్మింది. కానీ చదవటం కూడా దేశసేవకు ఒక మార్గమని తండ్రి చెప్పిన మాటను అంత తేలికగా తీసివెయ్యటం కూడా చేతకాలేదు. ఉద్యమం లోతుపాతులు తెలియవన్న మాటా నిజమే! కానీ దిగకుండా లోతు ఎలా తెలుస్తుంది. శారద అంతరాత్మ పోరాటం, శాసన ధిక్కారం వైపే ఉన్నాయి. ఆలోచనలో పడిన శారదను చూస్తే రామారావు మనసులో ఆశ రేకెత్తింది.
‘‘ఆలోచించు శారదా! తొందరేం లేదు. నాలుగు రోజులు ఆగి, ఆలోచించే అప్లికేషన్ ఇవ్వొచ్చు. నువ్వు తెలివైనదానివి. నేను చెప్పిన మాటల గురించి కూడా ఆలోచించు. అవసరమైతే పెద్దవాళ్ళ సలహా తీసుకో. హరిగారితో మాట్లాడు. తొందరపడొద్దు’’.
నిదానంగా నచ్చజెప్పి బైటికి నడిచాడు రామారావు.
ఆ రోజే శారదకు అన్నపూర్ణనుంచి ఉత్తరం వచ్చింది.
ప్రియ శారదా
క్షేమంగా ఉన్నావు కదా? దేశం ఎలా ఉందో చూస్తున్నావా? అందరూ దేశం కోసం నిలబడవలసిన సమయం వచ్చినట్లుంది కదూ. మా ఆయన కూడా చదువు మానేసి వచ్చాడు. రాట్నాలు తెచ్చాడు. నాకొకటి పంపాడు. నేనూ రాట్నం ఒడుకుతున్నాను. మన ఊళ్ళో అందరూ గాంధీని దేవుడిలా పూజిస్తున్నారు. నువ్వు కళాశాలలో ప్రవేశిస్తావా?లేదా? నాకు సందేహంగా ఉంది. ఇదంతా ఎంతో ఉత్సాహంగా ఉంది గానీ చదువులు మానెయ్యటం సరికాదేమోననే అనుమానం కూడా ఒక చెంప నన్ను వేధిస్తోంది. మా ఆయన చదువు ఈ ఏడాదితో పూర్తయ్యేది. ఆ తర్వాత ఉద్యోగం చూసుకుంటే మేమిద్దరం ఒకచోట ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. సంపాదన లేకుండా కాపురం ఒద్దని ఇన్నాళ్ళూ చెప్పారు.
ఇప్పుడు చదువు ఉద్యోగం లేకుండా సంపాదన ఎలా వస్తుంది. మా కాపురం సంగతేమిటి? మా అమ్మానాన్నలను కూడా ఈ ఆందోళన వేధిస్తోంది. నాకు ఒకపక్క ఆయన ఉద్యమంలో ఉన్నారని గర్వం. ఇంకోపక్క మా భవిష్యత్తు తల్చుకుంటే అయోమయం. భయం. ఆయన జైలుకెళ్తారనుకుంటే పట్ట లేని దు:ఖం. మళ్ళీ జైలుకెళ్ళిన వారి గురించి ఆలోచిస్తే చాలా గౌరవంగా ఉంటుంది. అంతా గందరగోళంగా ఉంది. విశాలాక్షి చదువుమానదట. గుంటూరు కాలేజీలోనే చదువుతుందట. వాళ్ళిప్పుడు అక్కడే ఉన్నారుగా. నువ్వు ఏమనుకున్నావో రాయి. నీ చదువు మానొద్దనే నా సలహా. నువ్వు డాక్టర్వి కావాలి.
నీ ప్రియ నెచ్చెలి
అన్నపూర్ణ.
శారదకు ఆ ఉత్తరం చదివి చాలా ఉద్వేగం కలిగింది. అబ్బయ్య చదువు మానేశాడనే విషయం ఎక్కినట్లు ఆ అమ్మాయి మనసులోకి మరేదీ ఎక్కలేదు. తన నిర్ణయానికి బలం వచ్చినట్లనిపించింది.
రామారావు శారదను కళాశాలలో చేర్పించి హైదరాబాదు వెళ్దామనుకున్నవాడు కాస్తా ఆ ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. ఆయనకు ఇంత పెద్ద సమస్య ఎన్నడూ రాలేదనిపించింది. తల్లి కాశీ ప్రయాణం ఆయన మనసుని చాలా బాధించింది గానీ కూతురి భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తుంటే ఆ బాధను తొందరగానే స్థిర నిర్ణయంగా మార్చుకోగలిగాడు.
కానీ కూతురు ఇప్పుడు తన నిర్ణయం మార్చుకోకపోతే ఎలా? కూతురి నిర్ణయం సరికాదని ఆయనకు బలంగా అనిపిస్తోంది. చదువుమాని దేశసేవ చెయ్యనక్కరలేదు. చదువుకుని దేశానికెంతో చెయ్యొచ్చు. అందులో అదెలాంటి చదువు? ప్రజలకు ప్రాణం పోసే చదువు. శారదను ఇంగ్లాండ్ పంపాలనుకున్నాడాయన. ఇక్కడే చదవనంటున్న శారద ఇంగ్లండ్ వెళ్తుందా? ఇంగ్లండ్ వెళ్ళి చదవటం మహాపాపమంటుంది. కానీ గాంధి, నెహ్రూ, ప్రకాశం అందరూ ఇంగ్లండ్ వెళ్ళి చదివాకనే ఇట్లా దేశం కోసం పనిచేస్తున్నారని శారదకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తనమీదనే ఉందనుకున్నాడాయన. తనొక్కడే కాకుండా హరిసర్వోత్తమరావుతో వీలైతే ప్రకాశం గారితో కూడా చెప్పించాలనుకున్నాడు. ప్రకాశం గారు చెబుతారా? ఆయన శారద నిర్ణయాన్ని బలపరుస్తాడేమోననే భయం కూడా రామారావు మనసులో ఓ మూల ఉంది.
రెండేళ్ళుగా ఆయన తన పరిశోధను, చరిత్ర రచనలో పడి శారద గురించి పట్టించుకోలేదనే అపరాధ భావనకు లోనయ్యాడు. ఎప్పటికప్పుడు ఈ ఉద్యమ విషయం శారదతో మాట్లాడి ఆ అమ్మాయి ఆలోచనను ఒక క్రమంలో పెట్టి
ఉండాల్సిందని ఆయనకు బలం గా అనిపించింది. కానీ దేశ పరిస్థితి చూస్తే శారద వయసులోని విద్యార్థులలో చాలా మంది శారదలాగానే నిర్ణయం తీసుకుంటున్నారు. . భయం అంటే తెలియని ఆయన మనసులో మొదటిసారి భయం మొదలై శరీరాన్ని బలహీనం చేసింది. తన భయాన్ని పోగొట్టగలవాడు హరిసర్వోత్తమరావు ఒక్కడే అనిపించి ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో ముమ్మరంగా తిరుగుతున్నాడు . చదువునూ, కోర్టునూ బహిష్కరించమని పిలుపు ఇచ్చిన కాంగ్రెస్ సభలో పాల్గొన్నవాడు. కానీ ఆయన రామారావుకి ఆప్తమిత్రుడు. తన బాధను అర్థం చేసుకుని సరైన దారి చూపగలవ్యక్తి అనిపించింది. అదష్టవశాత్తు ఆయన మద్రాసులోనే ఉన్నాడు. రామారావుని చూసి ఆనందంగా కౌగిలించుకున్నాడు.
కుశల ప్రశ్నలయ్యాక హరిగారు సంభాషణను రాజకీయాల వైపు మళ్ళించాడు.
‘‘దేశం ఉద్యమాల బాట పట్టింది రామారావ్. మనం కూడా శక్తివంచన లేకుండా పనిచెయ్యాలి’’.
రామారావుకి ఆ మాటతో పట్టలేని ఆవేశం వచ్చింది.
‘‘మనం చెయ్యాలి గానీ అభంశుభం తెలియని యువకులు, యువతులు చదువు మానటం మంచిదంటావా?’’
‘‘విదేశీ చదువు స్థానంలో స్వదేశీ చదువు తీసుకురావాలి గదా’’ రామారావుకి ఒక్కసారి అంత ఆవేశమెందుకొచ్చిందో హరి గారికి అర్థం కాలేదు.
‘‘మనలాంటివాళ్ళం స్వదేశీ చదువు గురించి ఆలోచించి ఆ చదువు చెప్పే సంస్థను ఒక పద్ధతి ప్రకారం ఏర్పరిచాక పిల్లలు అటు రావచ్చు. ఇపుడు దారీ తెన్నూ లేకుండా ఏం చేస్తారు?’’
‘‘జాతీయ పాఠశాల ఏర్పాట్లవుతున్నాయి గా?’’
‘‘అవి చిన్నపిల్లలకు, కళాశాలో ఉన్నత విద్య సంగతేమిటి? ఆ జాతీయ పాఠశాల కూడా నిబడటం లేదే వాటికే అంకితమై వాటిని మహా సంస్థగా రూపొందించే సమయం ఎవరి దగ్గరుంది? అందరూ ఉద్యమంలో తలమునకులుగా ఉన్నారు. ఉన్నత విద్యా సంస్థను ఏర్పరచి అభివృద్ధి చేయటం నిర్మాణ కార్యక్రమం. ఇపుడు నిర్మాణాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం నడుస్తోంది. దాంతో పాటు జాతీయ విద్యలాంటి అతిపెద్ద బాధ్యతను అంకితభావంతో చేపట్టగలవారెవరున్నారు? ఈ జాతీయ పాఠశాలలు, కళాశాలలు నిలుస్తాయనే నమ్మకం నాకు లేదు’’.
రామారావు లో పెరుగుతున్న ఆవేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు హరిగారు .
‘‘వాటి గురించి మీరెందుకు ఇంతగా ఆవేశపడుతున్నారు. కాలక్రమాన అన్నీ జరుగుతాయి’’.
‘‘హరీ! శారద చదువు మానేస్తానంటోంది’’.
హరికి వెంటనే రామారావు ఆవేశం అర్థమైంది. రామారావు వంక సానుభూతిగా చూశారు.
‘‘హరీ! శారద చదువు కోసం నేను పడే తపన నీకు తెలుసు. అసలు ఆడపిల్లలని చదివించే వారు ఎంతమంది? నేను మా అమ్మను ఎదిరించటానికి, ఆమెను కాదని, ఆమె ఇల్లు ఒదిలి కాశీవెళ్ళి, మళ్ళీ నా ఇంటికి రానని చెబుతుంటే విని తట్టుకుని ఆమెను కాశీ పంపింది ఎందుకు? శారద డాక్టరవ్వాలనే కదా? ఇప్పుడదంత మర్చిపోయి చదువు మానేస్తానంటే శారద ఏమవుతుంది? ఎక్కడ కి చేరుతుంది? తెలియని మహా సముద్రంలో దూకుతానంటే ఏం చెయ్యను చెప్పు. ఎలాగైనా శారద మనసు మార్చాలి . కళాశాలో చేర్పించాలి .
రామారావులోని ఆవేశం హరిగారికి పూర్తిగా అర్థమైంది.
‘‘నేనేం చెయ్యను రామా?”
‘‘శారదతో మాట్లాడు. డాక్టరయ్యి దేశానికి సేవ చెయ్యటం ఉత్తమమని చెప్పు’’
‘‘నాకా అర్హత ఉందా? నేను గాంధీతో కలిసి ఆంధ్రదేశమంతా తిరిగి సహాయ నిరాకరణ గురించి చెప్పినవాడిని.’’
‘‘అందుకే నిన్ను చెప్పమంటుంది .శారద శక్తీ తెలివి తేటలు ఇంట్లో కూర్చుని రాట్నం ఒడకటానికీ, జైలుకి వెళ్ళి ఏ పనీ లేకుండా కూచోటానికి ఖర్చవ్వాలా? ’’
‘‘నీకు ఆవేశంలో ఏమీ తెలియటం లేదు రామా. మన అభిప్రాయాలు కూడా ఈ విషయంలో వేరు. కానీ శారద తండ్రిగా నాకు నువ్వు అర్థమవుతున్నావు. శారదని చదువుకోమని నేను చెబితే ఆ అమ్మాయి వింటుందా?’’
‘‘వింటుంది. ఆ రాజకీయపు లోతు శారదకు తెలియవు. అక్కడ ఇమడలేదు. డాక్టర్ చదివి దేశానికెంతో సేవ చేయగలుగుతుంది. స్వతంత్ర దేశానికి డాక్టర్లు అక్కర్లేదా?’’
‘‘అందరూ కావాలి. కానీ ఇప్పటి ఉద్యమ అవసరం వేరు.’’
‘‘నా కోసం నువ్వు శారదతో మాట్లాడు హరీ! ఆమెను చదువుకోమను.’’
‘‘డాక్టరవటం వల్ల దేశానికి సేవ చెయ్యొచ్చని మాత్రం చెబుతాను. అంతకు మించి నా వల్ల కాదు’’.
రామారావు ముఖంలో కనిపించిన నిరాశ, కుంగుబాటు చూసి హరి గారికి కళ్ళవెంట నీళ్ళొచ్చాయి.
‘‘రామా! నేను నా ఆశయాలకు భంగం రాకుండా శారదను ఒప్పించటానికి ప్రయత్నిస్తాను.’’
‘‘అదే చాలు. నేనూ శారదను బతిమాలుకుంటాను.’’
రామారావు పరిస్థితి, ఆ తీవ్రత హరిగారికి అర్థమైంది. ప్రాణమిత్రునికి వీలైనంత సహాయం చెయ్యాలనే ఆయనకు అనిపించింది. రామారావు తన పనిలో ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయటం లేదు. ఇపుడు శారద గురించిన మనోవేదన కూడా తోడైతే అది మంచిది కాదనిపించింది. రామారావులాంటి మనుషులు దేశానికి ఎంతో అవసరం. రామారావు ని కాపాడటం స్నేహితునిగా తన కనీస ధర్మం అనుకున్నాడు. కానీ రాజీపడటం ఆయనకు బొత్తిగా చేతకాదు.
కళాశాలను బహిష్కరిస్తాననే నిర్ణయం తండ్రి కి చెప్పిన తరువాత శారదకు పట్టలేనంత ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహం లో అన్నపూర్ణకు ఉత్తరం రాసింది.
ప్రియమైన అన్నపూర్ణ !
నీ ఉత్తరం, అందులోని విషయాలు నాకు ఎంత సంతోషం కలిగించాయో నీకు చెప్పలేను. నీ భర్త ఉత్తముడు. అతను చదువుమానటం చాలా గొప్పపని. మద్రాసు నుంచి అతను వెళ్ళేముందు నన్నొక్కసారి కలిసి ఉంటే ఎంత బాగుండేది. నా నిర్ణయం ఇంకొంచెం ముందుగా ధైర్యంగా, నిస్సందేహంగా తీసుకోగలిగేదాన్ని. ఇంతకూ నా నిర్ణయం ఏమిటంటావు ? మనందరిది ఒకటే మార్గం. నేను కూడా చదువు మానేస్తున్నాను . రాట్నం ఒడుకుతాను. ఖద్దరు ధరిస్తాను. దేశం కోసం పని చెయ్యమని నా మనసు చెబుతోంది. అంతకంటే మహత్తరమైన పని లేదని చెబుతోంది. నా మనసు మాట వింటాను. మా నాన్నకు బాధ కలిగిస్తున్నానని తెలుసు గానీ ఎంతో మంది బాధ పడందే, త్యాగం చెయ్యనిదే దేశానికి స్వతంత్రం వస్తుందా? ఇపుడు నా మనసంత అదే ఆలోచన. ఇన్నాళ్ళు ఇలా ఆలోచించలేదేమిటా అని సిగ్గుపడుతున్నాను.
ఇవాళే కళ్ళు తెరిచి దేశాన్ని కొత్తగా చూస్తున్నాను.. ప్రజల బానిసత్వం, పరాయి పాలకుల దుర్మార్గం నాకు అర్థమవుతోంది. ఈ బానిస బతుకు మనం బతకవద్దు. నువ్వు నీ భర్తను అనుసరించు. ఉద్యమంలోకి రా ! మీ కాపురం గురించే ఆలోచించి విలువైన విషయాలను పక్కన పెట్టకు. నేనింకా నాన్నను ఒప్పించాల్సి ఉంది. ఏం పని చెయ్యాలో నిర్ణయించుకోవాల్సి ఉంది. నేనింకా చిన్నదాన్ని, అనుభవం లేనిదాన్ని అంటారు నాన్న. ఈ వయసు నుంచే పనిచేసి అనుభవం సంపాదించే అవకాశం వచ్చింది కదా అనిపిస్తుంది నాకు. నా రక్తం ఉప్పొంగుతోంది. గాంధీ గారు కోర్టులో చెప్పిన మాటలు పత్రికలో చదివావు కదూ? ఆ మాటలు చదివి నేను రోమాంచితనయ్యాను. ఆ క్షణాన వెళ్ళి బ్రిటీష్ అధికారులు ముందు నిలబడి నన్ను బంధించండి . నన్ను ఉరి తియ్యండి కావాలంటే ? నేనూ ఉద్యమానికి చెందిన దానినే అని అరవానిపించింది. నా ప్రాణాలు ఇవ్వాలనిపించింది దేశం కోసం. గాంధీ గారి కోసం.
అన్నపూర్ణా! నువ్వు, నీ భర్త , నేనూ అందరం దూకుదాం. అందరం కలిస్తే ఎంత బలం?
నా చదువు గురించి నాన్న నాలుగు రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నారు. నాలుగు రోజులు తర్వాత మారని నా నిర్ణయం గురించి నాన్నకు చెప్పి నా కర్తవ్యం నిర్వహిస్తాను. నేనేం చెయ్యాలో చెప్పమని నాయకులను అడుగుతాను. వారు చెప్పిన పని ఆనందంగా, త్రికరణ శుద్ధిగా చేస్తాను.
విశాలాక్షి చదువుకుంటున్నందుకు నాకు సంతోషంగా లేదు. నా లాగా తనెందుకు ఆలోచించటం లేదు? నువ్వు గుంటూరు దగ్గర్లోనే ఉన్నావు గదా విశాలాక్షితో మాట్లాడరాదూ? చదువు మానెయ్యమని చెప్పించు . విశాలాక్షికి కూడా ఉత్తరం రాస్తాను నేను.
నీ ప్రియమైన
శారద.
ఆ ఉత్తరం రాశాక ఇక శారదకు సందేహమే లేదు. ఆనందంగా పత్రిక చదువుతోంది. ఆ వేడిలోనే విశాలాక్షికి ఉత్తరం రాసేసింది.
***
ఏమి ధర్మ సంకటాల గమనం రా బాబూ గమ్యం చేరేలోగా మాకు బి పి పెరిగేల ఉంది అవునూ అన్నపూర్ణ మాగంటి అన్నపూర్ణ దేవి కాదు కదా ?
గడచినా నూరేళ్ళ కాలాని కాన్వాస్ ని ఎంచుకుని, గత వందేళ్ళప్రస్థానాన్ని
నూరేళ్ళ లార్జి కాన్వాస్ మీద ఇపుడిపుడే రూపు దిద్దుకుంటున్న పెయింటింగ్ లా ఉంది ఓల్గా గారి ….గమనమే గమ్యం. ఉప్పల లక్ష్మణరావు గారు, కో.కు, మహీధర లాటి పాత తరం రచయితలు తప్ప ఈ తరం రచయితలు ఎవ్వరూ ఇంత పెద్ద పెద్ద కాన్వాస్ ని ఎన్నుకున్న గుర్తు తగలటం లేదు.