ధర్మగ్రహానికి భాష్యం!

 

పతంజలి కథల గురించి ఏం రాస్తాం? రాయటం అంటే, మళ్ళీ మనల్ని, మన బలహీనతల్నీ, బోలుతనాల్నీ, ఇంకెన్ని పరమ అధర్మాలూ ఘోరాలూ, చేయగలమో, అలాంటివాటిని, పాస్సీసాలో కొస్సారాలా చదువుకోవటమే. అయినా ఇక్కడ రెండు కథలు, నాకిష్టమైన రెండు కథల్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.

చూపున్న పాట :

ఇదొక మార్మిక కధనం. వొక గుడ్డివాడి పాట విన్న, వొక పోలీసు వాడి అసహనం..ఎందుకంటె, గుడ్డి లంజాకొడుకు పాడుతున్నది గద్దరు పాట.. అది చెప్తూ పతంజలి ఇలా అంటారు- “గుడ్డి వాడి పాటలు గరికపూలై ఆ రోడ్డునిండా గుట్టలు గుట్టలైతే విశ్వనాధం వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. గుడ్డివాడి పాటలు సీతాకోక చిలుకలై మబ్బుల్లాగా వీధినంతా ఆవరిస్తే విశ్వనాదం వాటిని చీల్చుకొని వెళ్ళిపోతాడు”

ఇంతకంటే, ఒక వాక్యంలో  విశ్వనాధం పాత్ర పరిచయం అవసరం కూడా లేదు. గుడ్డివాడు, ఏ దేవుడి పాటలో పాడాలి గానీ, ఈ గద్దర్ పాటలేంటి, పోలీసు బెదిరిస్తే, “గుడ్డికళ్ళ గుహల నుండి చీకటి చిమ్ముకొచ్చింది” అంటారు పతంజలి ..ఇంతకంటే వొక వల్నరబిలిటీని హృద్యంగా చెప్పటం కూడా ఆయనకే చెల్లింది.

దేవుడి పాటలు పాడితే భత్యం ఇప్పిస్తానన్న పోలీసు మాటకి.. మురళి వాయించే గుడ్డివాడి సమాధానం “..నేర్పిస్తే రాదండీ పాట.. మనం ఇనీసరికీ పాట మనల్ని తగులుకోవాలండీ .. అదండీ పాటంటే..”

గాయపడినా, రక్తం స్రవిస్తున్నా, వేణువు అణువణువునా కన్నాలైనా .. ఇష్టమైన పాట, వొక అస్తిత్వ వేదంలా, అదుముతున్న దాష్టీకాన్ని అడ్డుకోనేలా, పాట స్రవిస్తూనే ఉంటుంది.. పాట ఎన్నో అణచివేతల్నీ, వెతల్నీ ప్రశ్నిస్తూనే ఉంటుంది.. అధర్మాన్ని పాట భయపెట్టినంతగా మరేదీ భయపెట్టదు.

పతంజలి ధార్మిక ఆవేశం, ఈ కథలో మనల్ని మార్మికంగా కమ్ముకుంటుంది. నిస్సహాయత్వం తిరగబడితే, ఆ గాయం ఎంత భయపెట్టేదిగా ఉంటుందో చెప్పకనే చెప్తుంది ..!

 

మోటు మనిషి:

One of the easiest ways to Analyse a Peson is to Pre-judge him or her from the Apearance..! ఆ మాట ఎంత నిజం అనిపిస్తుంది , ఈ కథ చదివితే, ఇది ఎక్కువమంది చదివారో లేదో నాకు తెలీదు. వేట కథల చప్పుళ్ళలో ఇలాంటి కొన్ని మంచి కథలు పతంజలి గారివి మరుగున పడ్డాయి అన్న మాట మాత్రం నిజం.

సోడారం బస్సు ఎక్కినవాళ్లకి ఎలా ఉందో లేదో తెలీదు గానీ, ఇజీనారం పెజల్లో వొకదానిగా ..సోడారం బస్సు వాసన గుమ్మని తగిలీసినట్టుగా రాస్సీరు పతంజలి గోరు ఈ కతని. వొకానొక మోటుమనిషి, ఆ మనిషిని కించపరుస్తూ, చూసే మరో చదువుకున్న జీనియస్సు (అతని మాట్లల్లోనే ) .. అలాంటి మోటుమనిషి పక్కన కూర్చున్న జీనియస్సు మనస్సు ఎలా ఉంటుంది .. పెళ్లికెళ్ళి జోడు పోగొట్టుకున్నవాడిలాగ ఉంటుంది ( ఇవి కూడా రాజు గోరి మాటలే సుమండీ )

శుభ్రంగా భోంచేసి బస్సెక్కిన ఈ జీనియస్సు గారి భళ్ళున కక్కితే .. పతంజలి మాటల్లో చెప్పాలంటే  “.. నా తలని, గడ్డి తవ్వటానికీ, కట్టెలు చీల్చటానికీ, వేరు శెనగ మోటుగా వోలవటానికీ పుట్టాయనుకున్న మోటు చేతులే జాలిపడి ఆప్యాయంగా పట్టుకొని, దుమ్ముపట్టిన, తెగ మాసిన, అసహ్యకరమైన వొడిలోనే పడుకో బెట్టుకున్నాయి.”

సమాజంలో వైకల్యం అనాలో, నపుంసకత్వం అనాలో, లేదా ఇంకేం అనాలో తెలీని జాడ్యాల్ని, ఇంత నిండైన ధార్మిక ఆవేశంతో కడిగేయటం రావి శాస్త్రి తర్వాత పతంజలి గారి సొంతం అనాలి.

ఇది కేవలం వ్యంగ్యం మాత్రమే అనటం, వొక పవర్ఫుల్ సోషల్ స్నోబరీ ని .. డైవర్ట్ చేయటమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది ..!

ధర్మాగ్రహాన్ని, నిస్సహాయుల పట్ల కరుణనీ.. అంతే బాలన్సుడ్ గా చెప్పిన పతంజలిగారి ఋణం తెలుగు భాష, తెలుగు చదువరులు ఎప్పటికీ తీర్చుకోలేరు..!

అంతటి గొప్ప మనసుకి..ఆ అక్షరాల అనంత శక్తికీ..

వినమ్రతతో,

సాయి పద్మ

మీ మాటలు

*