కళింగాంధ్ర కవిత్వ ‘పాయ’ల మురళీకృష్ణ

మా కళింగాంధ్ర ప్రాంతం నుండి చాన్నాళ్ళుగా కవిత్వం రాస్తున్న పాయల మురళీ కృష్ణ గత ఆగస్టులో ’అస్తిత్వం వైపు’ అన్న కవితా సంకలనం ప్రచురించారు. ఈ ప్రాంతం నుండి రాస్తున్న వాళ్ళలో తొంభై తొమ్మిది శాతం ఉపాధ్యాయ వృత్తిలోని వారే కావడం గమనార్హం. టీచర్ గా పనిచేస్తూన్న వారికి నిత్యమూ గ్రామాలలో జరుగుతున్న విధ్వంసం వివిధ వృత్తుల జీవన విధానం ప్రజల దైనందిన జీవితంతో అనుబంధం వారిని రచయితలుగా కవులుగా బాధ్యతతో వ్రాసే వారిగా నిలుపుతుందనుకుంటాను. మిగతా వృత్తులలోని వారి కంటే వీళ్ళకు పిల్లలతో అనుబంధం వుండడం కూడా అదనపు సౌకర్యమే.
MURALI_PHOTO025-page-001

ఒక కుటుంబ నేపథ్యం తెలుసుకొనే అవకాశం వారి పిల్లల చదువు వారి కుటుంబ ఆర్థిక సామాజిక స్థితి గతులను తెలుసుకొనేందుకు, పిల్లలను చూస్తూ వారితో సంభాషిస్తూ వారి రోజువారీ సమయంలో అత్యధికంగా వారితో గడవడం మూలంగా మంచి అవగాహన కలిగిస్తుంది. నిబద్ధత కలిగిన రచయిత కవికి ఇది ముడిసరుకుగా ఉపయోగపడుతుంది. దీనిని కవిత్వీకరించడం ద్వారా సామాజిక ప్రస్తుత వాతావరణాన్ని మన కళ్ళముందు పద చిత్రాలుగా బ్లాక్ అండ్ వైట్ లో స్పష్టంగా చూపించే ప్రయత్నం మురళీ కృష్ణ కవిత్వంలో చూడవచ్చు. అనుభూతి చెంది ఆలోచనలకు ప్రేరణనిస్తాడు కవి.

ఈ సంకలనం ముందు మాటలో శివారెడ్డి గారన్నట్టు కవిత్వం జీవితంలో అన్ని పార్శ్వాలను వెలిగించే దివ్యశక్తి. లోలోన గుణించుకొని కవిత్వాన్ని అల్లే పద్ధతి మురళీలో వుంది. అది ఒక చిక్కని నేతగా అతని కవిత్వంలో కన్పడుతుందంటారు. ఈ కవితలు చదువుతుంటే ఇది అక్షర సత్యం అని ఒప్పుకోక తప్పదు.

 

’అత్యవసరం’ కవితలో

ప్రపంచం ఒక కుటుంబమౌతుంటే

మనిషి మాత్రం ఒంటరిగా చీలిపోతున్నాడు

ఒకప్పుడు హృదయాలను కలిపిన సాయంకాలాలు

ఇప్పటి ఏకాంతాలై శోకిస్తున్నాయి…. అంటూ సమూహం నుండి విడివడి పోతున్న మనిషి పట్ల ఆవేదనను వ్యక్తపరుస్తాడు.

 

“ఈ రోజేం కథ చెప్తారు మాష్టారూ!?” కవితలో

 

ఎన్ని విషాదాలనైనా

ఒక పసి నవ్వు కడిగి పారేస్తుంది

బడి ప్రాంగణంలో మాత్రమే

బ్రతుకు కల్మష రహితమై కన్పిస్తుంది

 

బడి చివరి గంట తర్వాత

బడి భవనం, నేనూ ఇద్దరం నిస్సహాయులమే

రేపటి ఉదయం వరకూ

రెక్కలు తెగిన పక్షులమే… అంటూ ఈ కవితలో మాస్టారుగా కాన్వెంటు బడులు సర్కారు బడులను మింగేస్తున్న వైనాన్ని చెపుతు టీచరుగా వృత్తి ధర్మాన్ని ఎంత నిబద్ధతతో పాటించాలో సవివరంగా వ్యక్తపరుస్తాడు.

 

పర్యావరణాన్ని మింగేస్తున్న విధ్వంసకర అభివృద్ధి మేకప్ వేసుకొని చేస్తున్న వినాశనం తద్వారా మనిషి కోల్పోతున్న సహచర సంపద పట్ల మక్కువను చూపే ప్రయత్నం “మొక్క” కవితలో ఇలా చెప్తాడు

PAYALA MURALI KRISHNA-page-001

భూమికీ ఆకాశానికి తేడా చెప్పమంటే

నేను మొదట మొక్కనే చూపిస్తాను

ఎన్ని చుక్కలున్నా

ఒక్క మొక్కను కూడా సరిపోవు కదా! అంటూ

 

మనుష్యుల మధ్యున్నప్పుడు

చాలా సార్లు పీడించే ఒంటరితనం

మొక్కల మధ్య నన్ను చూస్తే అంతర్ధానం అంటాడు.

 

“రేపటి సూర్యోదయానికి ముందు..” కవితలో బెస్త వారి బతుకుల్లో కంపెనీలు పెట్టిన చిచ్చు తద్వారా వారి జీవిక కోల్పోయినతనాన్ని మన కళ్ళముందు తడిగా ఆవిష్కరిస్తూనే వారికి విముక్తి మార్గాన్ని వారి ఐక్య పోరాటంలోనే సాధ్యమని చెపుతాడు.

 

అతడక్కడే ఉండేవాడు

ఎగసే కెరటాల సాక్షిగా

పగలంతా ఇసుక తిన్నెల మీద

ఈ సముద్రం ఒడ్డునే కూర్చుండేవాడు

నైలాన్ దారాలు ముందేసుకుని

సరికొత్త వస్తువును సృష్టించబోయే

శ్రామికత్వాన్ని ప్రేమించేవాడు

ఓ దారాన్ని తీసి మరో దారానికి కలుపుతూ

సునిశితంగా, వేగంగా

అతడు ముడివేయడం చూసేటప్పుడు

మనిషినీ మనిషినీ అంతే వేగంగా

కలపగలిగే వాడు ఎవరైనా ఉంటే బావుణ్ణనిపించేది

 

చివరిగా ఇలా

 

ఇప్పుడు కూడా అతడక్కడే ఉన్నాడు

తన వాళ్ళ పిడికిళ్ళు ముడివేస్తూ

సరిక్రొత్త మానవ వల అల్లుతున్నాడు

“వేట సముద్రం మీదకి కాదురా

ఒకానొక స్వార్థం మీదకని” చెప్పి

తెప్పల్ని నడిపే తెడ్లన్నీ

తిరుగుబాటు జెండాలు చేసాడు….. అంటాడు మురళీ.

 

అలాగే రైతు పొలాలకు దూరమై వలస బాట పట్టడాన్ని తనదైన శైలిలో “ఒక నిష్క్రమణకు ముందు” కవితలో చిత్రిస్తాడు మురళీ ఇలా

 

భవిష్యత్ ఛిద్రమై పోతున్న ఒకానొక దృశ్యం

ఎవరు మాత్రం ముందుగా ఊహించగలరు?

నడిచే దారులే కంటతడి తుడవలేక

వలసపొమ్మని సాగనంపుతుండడం

ఎవరు మాత్రం జీర్ణించుకోగలరు..!?

 

ఊరూ ఊరంతా భూమిని కరెన్సీగా మార్చేసుకుంటుంటే

విస్తరించే విధ్వంసానికి

విచ్చుకుంటున్న పచ్చదనం బలికాదని ఎలా నిర్ధారించగలరు!?

 

సమూహం నుండి తప్పని సరిగా విడివడుతూ మనిషి తన అస్తిత్వంవైపు ఎలా అడుగులేస్తూ ఉనికిని కోల్పోతాడో ఈ సంకలనం శీర్షిక “అస్తిత్వం వైపు” కవితలో తనదైన శైలిలో ఇలా ఆవేదనగా ఆవిష్కరిస్తాడు

 

కొంత విరామం తర్వాత

అతడలా నడిచి వెళ్తుంటాడు

ఆ రాదారుల కఠినమైన రాళ్ళల్లో

ఏవో చిగురించిన జ్నాపకాలు

సుతిమెత్తగా తగుల్తుంటాయి..

 

ఇంటికెళ్ళేసరికి

సాయంత్రమైపోతుంది

ఇంటి ముందు ఎవరో

దీపాలు పెట్టడం గమనిస్తాడు

వేగంగా అడుగులేస్తాడు

ఒక్క దీపమూ కనిపించదు

 

తన ఇరుగ్గదిలో

తన కోసం ఎవరో పరిచిన చాప మీద

అలాగే నిద్రపోతాడు

 

తెల్లవారిన తరువాత

అతడు లేడు

తనలో ఇంకెవరో తప్ప………….

 

చివరిగా “దారిలో ఒకవేళ…..” కవితలో

 

తంగేడు చెట్టు పసుపు పచ్చగా నవ్వే

ఏదో ఒక వేళ

ఈ దారిలో నా నడక ఆగిపోవచ్చు

అక్కడక్కడా ఉన్న రక్తపు చారలు

చెబుతున్న నిజాలను

కొన్ని పాద స్పర్శలు పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు… అంటూనే

 

ఇప్పుడు

నాతో కవిత్వం నడుస్తోంది

అప్పుడు

కవిత్వంతో నేను నడుస్తాను… అంటాడు కవి ఆశావహంగా…

 

ప్రతులకు..

పి. మురళీకృష్ణ

మెంటాడ – 535 273,

విజయనగరం జిల్లా. 9441026977 సంప్రదించవచ్చు.

-కేక్యూబ్ వర్మ

 varma

 

మీ మాటలు

  1. రెడ్డి రామకృష్ణ says:

    బావుంది వర్మగారు ,మురళీ కృష్ణ కవిత్వ పరిచయం .ఉత్తరాంద్ర లో మంచి కవులున్నారని చెప్పడానికి మురళి కూడా ఒక మంచి ఉదాహరణ.అభినందనలు.

  2. మంచి కవిత్వాన్ని చక్కగా పరిచయం చేశారు వర్మ గారు. అభినందనలు మీకూ మరియు పాయల గారికి. నారాయణ.

  3. కెక్యూబ్ వర్మ says:

    రామకృష్ణ గారు, నారాయణ గారు ధన్యవాదాలండీ..

  4. జగదీశ్ మల్లిపురం says:

    వర్మ గారూ! ధన్యవాదాలు. కవిత్వ పరిచయం బాగుంది. మురళీ నాకు నచ్చిన కవుల్లో ఒకడు. మీ మాట చదివాక మళ్లీ చదవాలనిపించింది…. ”అస్థిత్వం వైపు”

Leave a Reply to కెక్యూబ్ వర్మ Cancel reply

*