టర్కీ ప్రభుత్వంతో ‘ట్రోజన్ వార్’

 

స్లీమన్ కథ-18

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఎటు తిరిగినా అడ్డంకులే. మైసీనియా చుట్టుపక్కల బందిపోట్ల బెడద ఎక్కువగా ఉందన్న కారణం చూపించి అక్కడ తవ్వకాలకు గ్రీకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఫ్రాంక్ కల్వర్ట్ ను చూస్తే, తీవ్ర అనారోగ్యంతో తీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సాయం చేయగల స్థితిలో లేడు. సోఫియా ఇంకా అస్వస్థంగానే ఉంది.  స్లీమన్ ఈలోపల ట్రయాడ్ లో తన పది రోజుల సాహసం గురించి కొల్నిషో సైతూంగ్ కు రాశాడు. యజమానుల అనుమతి లేకుండానే ఆ దిబ్బ మీద తను తవ్వకాలు జరిపిన సంగతిని కూడా బయటపెట్టాడు. టర్కిష్ అధికారులు ఆ కథనాన్ని చదివారనీ, తన చర్యను తప్పు పట్టారనీ అతనికి తెలిసింది. ఎథెన్స్ లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోడం తప్ప ప్రస్తుతానికి చేయగలిగిందేమీ అతనికి కనిపించలేదు.

అతను అమితంగా ద్వేషించేది ఒక్కటే, పనీపాటా లేకుండా గడపడం. ఫ్రాంక్ కల్వర్ట్ ఎందుకిలా మొండికేసాడనుకుంటూ అసహనానికి లోనయ్యాడు. ఆ ఇద్దరు టర్కులకూ వంద పౌండ్లు చెల్లించి వాళ్ళ భూమిని కొనాలనుకున్నాడు. కానీ వాళ్ళు పడనివ్వలేదు. ఇంకో తెలివి తక్కువ ప్రతిపాదన కూడా చేశాడు. అంతకన్నా తక్కువకు బేరం కుదిర్చితే, ఆ మిగిలిన మొత్తాన్ని మీకు వదిలేస్తానని కల్వర్ట్ కు రాశాడు. ఆ భూమి ఎప్పుడైతే తన సొంతమైందో, అప్పుడు తవ్వకాలు నిరాటంకంగా జరుగుతాయనీ; ఏటా మూడు మాసాలు తను అక్కడే గడుపుతూ, అయిదేళ్లలో అక్కడి శిథిల నిర్మాణాల చుట్టూ ఉన్న చెత్తను తరలించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడానికి కూడా తను సిద్ధపడగలననీ-ఏవేవో ఊహించుకున్నాడు.

అలా ఊహలతోనే రోజులు భారంగా గడుస్తున్నాయి. తీవ్ర నిరాశానిస్పృహలు స్లీమన్ ఉత్సాహాన్ని అణగదొక్కుతున్నాయి. కల్వర్ట్ కు ఉత్తరాల మీద ఉత్తరాలు గుప్పిస్తూ అదేపనిగా ఊదరగొడుతున్నాడు. టర్కిష్ ప్రభుత్వంతో మాట్లాడి పని జరిగేలా చూడమని ప్రాధేయపడుతున్నాడు. ప్రతి ఉత్తరాన్నీ, “మీరు దయతో అందించబోయే సానుకూల సమాచారం కోసం అత్యంత ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటా”నని ముగిస్తున్నాడు. అయితే, కల్వర్ట్ చేయగలిగిందేమీ లేదు, చేయాలన్న సుముఖతా ఆయనలో లేదు. తమ జాగాలో పెద్ద పెద్ద కందకాలు తవ్వించిన స్లీమన్ మీద ఇప్పటికీ కారాలు మిరియాలు నూరుతున్న టర్కులిద్దరూ సహకరించే స్థితిలో అసలే లేరు.

అంతలో వేసవి అడుగుపెట్టి, స్లీమన్ నిరీక్షణకు తాత్కాలికంగా తెరదించింది. తవ్వకాలకు అది ఎటూ అనువైన సమయం కాదు. స్లీమన్ తిరిగి పారిస్ వెళ్లిపోయి ఇతర వ్యవహారాలలో పడిపోయాడు. అక్కడ అతనికి విస్తారమైన ఆస్తులున్నాయి. అతను అద్దె కిచ్చిన భవనాలలో 200 మంది నివసిస్తున్నారు. మధ్య మధ్య తన ఆస్తి వ్యవహారాలను చూసుకోవడం అతనికి సంతృప్తితోపాటు కాలక్షేపాన్ని కలిగిస్తోంది. అలా ఉండగా, జూన్ మధ్యలో ఒకరోజున సెయింట్ పీటర్స్ బర్గ్ లోని కొడుకు సెర్గీనుంచి ఉత్తరం వచ్చింది. స్కూల్లో తన చదువు పెద్దగా ముందుకు సాగడంలేదని అతను రాశాడు.

దానికి స్లీమన్ ఫ్రెంచిలో జవాబు రాశాడు. అందులో తన గురించి గొప్పలు చెప్పుకున్నాడు కానీ, నిజానికది అతనప్పుడున్న నైరాశ్యస్థితికే అద్దంపట్టింది:

నీ చదువు ముందుకు సాగడంలేదని రాయడం నాకు చాలా విచారం కలిగించింది. జీవితంలో ప్రతిఒకడూ నిరంతరం ముందుకు సాగుతూ ఉండవలసిందే. లేకపోతే నిరుత్సాహంతో కుంగిపోవలసివస్తుంది. బ్రహ్మాండమైన శక్తియుక్తులు కలిగిన ఒక మనిషి ఎంత ఎత్తుకు వెళ్లగలడో, తను ఎక్కిన ప్రతి మెట్టులోనూ నిరూపించుకుంటూ వచ్చిన నీ తండ్రిని ఆదర్శంగా తీసుకో. 1842-1846 మధ్య ఏమ్ స్టడామ్ లో ఉన్న నాలుగేళ్లూ నేను అద్భుతాలు చేశాను. ఎవరూ చేయనివీ, చేయలేనివీ నేను చేశాను. ఆ తర్వాత సెయింట్ పీటర్స్ బర్గ్ లో వర్తకుడిగా ఎదిగి, ఇంతటి సాఫల్యం, ఇంతటి తెలివీ ఉన్న వర్తకుడు ఇంకొకడు లేడని నిరూపించుకున్నాను. ఆ తర్వాత యాత్రికుడిగా మారాను; మామూలు యాత్రికుడిగా కాదు, విశిష్ట ప్రావీణ్యాలు కలిగిన ఓ అద్భుతయాత్రికుడిగా! సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఏ వర్తకుడూ ఓ వైజ్ఞానికరచన చేయలేదు; నేను చేశాను. అది నాలుగు భాషల్లోకి అనువాదమై, ప్రపంచ ప్రశంసలు అందుకుంది. ఈరోజున నేనొక పురాతత్వశాస్త్రవేత్తను.  అన్ని దేశాలలోని పురాతత్వశాస్త్రవేత్తలూ రెండువేల ఏళ్లపాటు వెతికి వేసారిన ప్రాచీన నగరం ట్రాయ్ ని; యావత్ యూరప్, అమెరికాల కళ్ళు జిగేలుమనేలా  నేను కనిపెట్టాను…

ఈ గొప్పలు అతనప్పుడున్న నిస్సహాయతనుంచి పుట్టినవి. నైరాశ్యం నుంచీ, ఒంటరితనం నుంచీ పెల్లుబికినవి. తన జీవితానికి ఒక అర్థం వెతుక్కునే పెనుగులాటలో అతనున్నాడు. ఇతిహాసప్రసిద్ధమైన ట్రాయ్ ని తవ్వి తీయాలని తహతహలాడుతున్నాడు. కానీ, ఆ హిస్సాలిక్ దిబ్బ మీద గొర్రెల మందల్ని మేపుకునే ఇద్దరు అనామకులైన టర్కిష్ రైతులు, తనేదో మామూలు చొరబాటుదారైనట్టు, అడ్డుపడుతున్నారు. తక్షణం తమ జాగా నుంచి వెళ్లిపొమ్మని కళ్ళు ఉరుముతున్నారు. వాళ్ళకా హక్కు లేదు! తను, స్లీమన్ అనే తను, భూస్థాపితమైన ఆ నగరాన్ని వెలికి తీశాడు. కనుక ఆ నగరం మీద అన్ని హక్కులూ తనవి! ప్రపంచ విజ్ఞానానికి దోహదం అందించడం కోసం లక్ష ఫ్రాంకులు ఖర్చు పెట్టి తవ్వకాలు జరిపించడానికి తను సిద్ధమయ్యాడు. తనకు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. అలాంటిది, టర్కీలో ఓ మారుమూల ఉన్న చిన్న దిబ్బ తనకు కొరకరాని కొయ్య కావడమేమిటి? వంతెన కోసం ఆ పవిత్రమైన రాళ్ళను తీసుకుని తన నగరాన్ని అపవిత్రపరచడానికి ఆ టర్కు లిద్దరికీ ఎంత ధైర్యం! వాళ్ళ వదులు పంట్లాములూ(Baggy Trousers), వాళ్ళూ! తను హిస్సాలిక్ దిబ్బను విడిచిపెట్టి వచ్చేముందు, తను కలిగించిన నష్టానికి వంద పౌండ్లు ఇమ్మని వీళ్ళే అడిగారు. తను తిరస్కరించాడు.

1870 జూలై 19న నెపోలియన్-3 ప్రష్యాపై యుద్ధం ప్రకటించాడు. ఆ ఇద్దరు టర్కులపై ఆగ్రహంతో కుతకుతలాడుతూ అప్పటికి స్లీమన్ పారిస్ లోనే ఉన్నాడు. యుద్ధం ప్రకటించగానే బులోన్-సుర్-మేర్ కు చేరుకుని, అక్కడినుంచి ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు.  ట్రాయ్ లో తను వెలికి తీసిన ప్రాసాదం గోడలకు చెందిన రాళ్ళు ఎవరూ ఎత్తుకు పోకుండా చూడవలసిందనీ, మూడు వేల ఏళ్ల నాటి ఆ నిక్షేపాలను ఆ రైతులిద్దరూ ధ్వంసం చేయకుండా చూడడానికి ఏదో ఒక మార్గం ఉండకుండా ఉండదనీ అందులో విన్నవించాడు.

ఆగస్టు చివరిలో, టర్కీ విద్యామంత్రి సఫ్వెట్ పాషాకు తన తవ్వకాల గురించి ఓ సుదీర్ఘమైన వేడికోలు ఉత్తరం రాశాడు. ఏవో నిధి నిక్షేపాలకోసం తను హిస్సాలిక్ దిబ్బను తవ్వలేదనీ, అవి దొరుకుతాయని తను అనుకోవడంలేదనీ, “శాస్త్రవిజ్ఞానం పట్ల నిస్వార్థ ప్రేమతోనే” తవ్వకాలు జరిపించాననీ, ఆ దిబ్బ అడుగున ట్రాయ్ నగరం ఉనికిని నిరూపించడమే తన ధ్యేయమనీ అందులో రాశాడు. తను రచించిన Ithaka, der Peloponnes and Troja  అనే పుస్తకం ప్రతిని ఆ ఉత్తరానికి జతపరిచాడు. టర్కిష్ ప్రభుత్వం దయాదాక్షిణ్యాల పైనే తను పూర్తిగా ఆధారపడుతున్నాననీ, తన పరిశోధనల ప్రాముఖ్యాన్ని ప్రభుత్వం తప్పకుండా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నాననీ అన్నాడు. హోమర్ పట్ల తనకున్న వల్లమాలిన ఆరాధనాభావమే హిస్సాలిక్ తవ్వకాలకు పురిగొల్పిందనీ, ఇంతాజేసి తను జరిపింది ఆషామాషీ తవ్వకాలే అయినా, ప్రియాం ప్రాసాదాన్ని, బ్రహ్మాండమైన ఆ నగర ప్రాకారాల ఉనికిని అది బయటపెట్టింది కనుక ప్రభుత్వం తన చర్యను తప్పు పట్టబోదని ఆశిస్తున్నా నన్నాడు.

“గాలివానను కూడా లెక్క చేయకుండా వేసవిలోనా అన్నట్టుగా పనిచేశాను. రెండు పూటలా భోజనం చేసినట్టు ఊహల్లోనే తృప్తి పడుతూ, తిండీ తిప్పలు లేకుండా రోజంతా నడుం వంచాను. నేను వెలుగులోకి తెచ్చిన ప్రతి చిన్న మృణ్మయపాత్రా చరిత్రకు మరో పుటను జోడించిందని నేను నమ్ముతున్నాను” అన్నాడు. తను దుందుడుకుగా వ్యవహరించినందుకు ఏలినవారు క్షమించవలసిందనీ, తవ్వకాలను కొనసాగించడానికి అనుమతి లభిస్తుందన్న ఆశ లేశమైనా కలిగితే, ఏలినవారిని దర్శించుకోడానికి ఏ క్షణంలోనైనా తను సిద్ధంగా ఉంటాననీ ఉత్తరం ముగించాడు.

అయితే, అటునుంచి సమాధానం లేదు. స్లీమన్ లానే ఆ మంత్రి కూడా గడుసుపిండమే. తనది నిస్వార్థ ప్రయత్నమని స్లీమన్ అంతగా నమ్మబలకడం, ‘మనిద్దరి ఆరాధ్యదేవతా శాస్త్రవిజ్ఞానమేననీ, శాస్త్రవిజ్ఞాన ప్రగతికోసమే ఇద్దరం జీవితాలను అంకితం చేశామనీ, ఇద్దరం దానిపట్ల ఒకేవిధమైన ఉత్సాహాన్ని నింపుకున్నవాళ్ళమే ననీ’ మంత్రిని ఉబ్బేయడం అతను ఆశించినదానికి సరిగ్గా వ్యతిరేకఫలితాన్ని ఇచ్చాయి. అతని ప్రయత్నమంతా అక్కడ పాతిపెట్టిన నిక్షేపాల కోసమే నని మంత్రి నిశ్చయానికి వచ్చాడు.

ఎట్టకేలకు స్లీమన్ డిసెంబర్ లో కాన్ స్టాంట్ నోపిల్ కు వచ్చి పడ్డాడు. మంత్రిని దర్శించుకున్నాడు. మంత్రి అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. తన నుంచి ఎలాంటి సహాయమైనా అందుతుందని హామీ ఇచ్చాడు. శాస్త్రవిజ్ఞాన ప్రయోజనాలపట్ల తన సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. అయితే, ఇంకోవైపు తవ్వకాలను ఆపడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. గడుగ్గాయి అనిపించుకున్న అంతటి స్లీమన్ కూడా మంత్రి  పై మెరుగు మాటలకు బోల్తా పడిపోయి, కొద్ది రోజుల్లోనే తవ్వకాలను అనుమతిస్తూ టర్కిష్ ప్రభుత్వం నుంచి తనకు ఫర్మానా అంది, హిస్సాలిక్ దిబ్బ తన అధీనంలోకి వస్తుందనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.

కాన్ స్టాంట్ నోపిల్ లో అతనలా ఎదురు తెన్నులు చూస్తుండగానే, ఆ సమస్యతోపాటు, పారిస్ ఏ క్షణంలోనైనా శత్రువుల చేజిక్కవచ్చునంటూ అందిన సమాచారం అతని ఆలోచనల్ని కమ్మేసింది. అంతలో, వెయ్యి ఫ్రాంకులకు తమ భూమిని అమ్మడానికి టర్కులిద్దరూ నోటి మాటగా ఒప్పుకున్నట్టు కల్వర్ట్ నుంచి సమాచారం అందింది. సరిగ్గా అప్పుడే, ఆసంతృప్తిని, నిస్పృహను ప్రకటిస్తూ భార్య రాసిన ఉత్తరమూ చేరింది. నీకు పట్టిన అదృష్టాలను ఒక్కొక్కటే లెక్కపెట్టుకుంటే, నువ్విలా నిస్పృహ చెందడానికి ఎలాంటి కారణమూ కనిపించదని, అతను కొంత పరుషంగానే  సమాధానం రాశాడు… నిన్ను ఆరాధించే భర్త ఉన్నాడు, జీవితంలో ఒక ఉన్నతస్థితికి చేరావు, ఎథెన్స్ లో నీకు ఒక ఇల్లు, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే యోగ్యులైన పరివారం ఉన్నారు. అక్కడ ఫ్రాన్స్ లో, ఎలాంటి రక్షణా లేని తమ ఇళ్లపై శత్రువులు తూటాలు కురిపిస్తుంటే;  తినడానికి రొట్టె తునకకు కూడా గతి లేక, చలి కాచుకోడానికి చిన్నపాటి కట్టె పుల్ల కూడా కరవై ఆడా, మగా, పిల్లలు సహా ఇరవై లక్షల మంది ఆకలిచావులు చస్తున్నారు. ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలపై నీ ఆలోచన మళ్లిస్తే నీకే అర్థమవుతుంది…

ఆ తర్వాత, తను సఫ్వెట్ పాషాను కలసుకున్నాననీ, తనను ఎంతో ఆదరంగా ఆహ్వానించాడనీ, ఎంతో కాలంగా తను ఎదురుచూస్తున్న ఫర్మానాను జారీ చేయడానికి హామీ ఇచ్చాడనీ, అది నేడో రేపో తన చేతికి వస్తుందనీ రాశాడు. అది అందగానే తను హిస్సాలిక్ కు వెళ్ళి, భూమి కొనుగోలు లావాదేవీ పూర్తిచేసుకుని, ఓసారి పారిస్ వెళ్ళి వస్తాననీ, ఆ ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాల గురించి లేనిపోనివి ఊహించుకుని ఆందోళన చెందవద్దనీ అన్నాడు. ఇంకా ఇలా రాశాడు:

నువ్వు వెంటనే భగవంతుడి ముందు మోకరిల్లి నీకు ఆయన కట్టబెట్టిన అదృష్టా లన్నింటికీ కృతజ్ఞతలు చెప్పుకో. ఈరోజుల్లో నువ్వు పడుతున్న కష్టాన్నే తలచుకుంటూ నీపై ఆయన కురిపించిన కనకవర్షాన్ని మరచిపోయినందుకు క్షమాపణ అడుగు.

ఇంకోటి కూడా నువ్వు మరచిపోతావేమో…అనుకోకుండా నేనిక్కడ మకాం పెట్టిన ఈ పద్దెనిమిది రోజుల్లో టర్కిష్ నేర్చుకున్నాను. ధారాళంగా మాట్లాడడం, రాయడం కూడా చేస్తున్నాను. ఇప్పటికే 6వేల మాటలు నాకు పట్టుబడ్డాయి.

మరో వారం గడిచింది. అయినా సఫ్వెట్ పాషా నుంచి ఉలుకూ, పలుకూ లేదు. తవ్వకాలకు అనుమతి కోరుతూ 1871, జనవరి 8న స్లీమన్ లాంఛనంగా ప్రభుత్వానికి ఉత్తరం రాశాడు. పది రోజుల తర్వాత విద్యా మంత్రిత్వశాఖనుంచి అతనికి పిలుపు వచ్చింది. తవ్వకాలను కొనసాగించడానికి అనుమతి మంజూరు చేస్తూనే, ఆ భూమిని మంత్రిత్వశాఖ తరపున కొనుగోలు చేయవలసిందిగా దర్దనెల్లెస్ గవర్నర్ కు సఫ్వెట్ పాషా తంతి పంపినట్టు అక్కడ తెలిసింది.

స్లీమన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. “అతని ప్రవర్తన ఎంత రోతగా ఉందో కుండబద్దలు కొట్టినట్టు ఎత్తి చూపి కడిగేశాను” అని ఆ తర్వాత రాసుకున్నాడు. ఆ భూమిని కొనడానికి రెండున్నర ఏళ్లపాటు తను చేయని ప్రయత్నం లేదని వివరించుకుంటూ వచ్చాడు. కేవలం వైజ్ఞానిక ఆసక్తితో ఈ భారం తలకెత్తుకున్నాననీ; ట్రోజన్ యుద్ధం కట్టుకథ కాదు, ట్రాయ్ ఉనికి వాస్తవమని నిరూపించడమే తన ఆశయమనీ మరోసారి వాదించాడు. అందుకు చేయవలసిందల్లా ఆ దిబ్బను తవ్వడం, దానికయ్యే విపరీతమైన ఖర్చును భరించడానికి తను సిద్ధపడ్డాడు, అలాంటిది, డబ్బు చెల్లించి ఆ చిన్న ముక్కను తను సొంతం చేసుకోడానికి అడ్డుపడడం దుస్సహం, దుర్మార్గం అంటూ విరుచుకుపడ్డాడు.

ఈ మాటలు జరుగుతున్న సమయంలో, నేషనల్ మ్యూజియం డైరక్టర్ గా ఉన్న ఒక ఆంగ్లేయుడు మంత్రి దగ్గర కూర్చుని ఉన్నాడు. స్లీమన్ విజృంభణకు సఫ్వెట్ పాషా తెల్లబోయాడు. తలవంపుగా కూడా అనిపించినట్టుంది. కానీ, అంతలోనే తేరుకుని, అన్నీ సవ్యంగానే జరుగుతాయంటూ అతన్ని శాంతింపచేయడానికి ప్రయత్నించాడు. మీరు నిరభ్యంతరంగా హిస్సాలిక్ కు వెళ్లచ్చు, భూమిని కొనుక్కోవచ్చు, తవ్వకాలు కొనసాగించవచ్చు. “నిధినిక్షేపాలు ఏవైనా బయటపడిన పక్షంలో ఒట్టోమన్ సామ్రాజ్య నియమనిబంధనలను పాటించినంతవరకూ” మీకు ఎవరినుంచీ ఎలాంటి ఆటంకమూ రాదన్నాడు.

చర్చ ఈ కొత్త మలుపు తిరిగేసరికి స్లీమన్ కృతజ్ఞతాభావంతో తలమునకలైపోయాడు. తను కోరినవన్నీ మంజూరైనట్టు ఊహించుకున్నాడు. మంత్రికి ధన్యవాదాలు చెప్పాడు. ట్రాయ్ తవ్వకాలపై తను రాయబోయే పుస్తకంలో మీ పేరు ప్రస్తావిస్తానని వాగ్దానం చేశాడు. మంత్రి మాటల్లోని మతలబు ఆ తర్వాత అతనికి తెలిసొచ్చింది. లేదా అప్పుడే తెలిసినా కావాలనే వాటిని తనకు అనుకూలంగా అన్వయించుకునీ ఉండచ్చు.

మూడు రోజుల తర్వాత, భోరున వర్షం పడుతుండగా, ట్రోజన్ మైదానంలోని కుమ్ కేల్ అనే ఓ చిన్న గ్రామానికి చేరుకున్నాడు. వర్షంలో పూర్తిగా నానిపోయాడు, ఆపైన ప్రయాణం బడలిక. ఆ భూమి కొనుగోలుకు మంత్రి జనవరి 10న తంతి ఉత్తర్వులు ఇచ్చాడనీ, రెండు రోజుల తర్వాత ఆ భూమి యాజమాన్య హక్కు మంత్రికి బదిలీ అయిందని తెలిసింది. స్లీమన్ హుటాహుటిన దర్దనెల్లెస్ గవర్నర్ ను కలసుకున్నాడు. మంత్రి తన వెనకటి ఉత్తర్వును రద్దు చేయలేదా అని అడిగాడు. “లేదు, ఆ ఉత్తర్వే అమలులో ఉంది” అని గవర్నర్ సమాధానం చెప్పాడు. మోసగించారని భావించిన స్లీమన్ కోపంతో రగిలిపోతూ ఎథెన్స్ కు చేరుకున్నాడు.

అతనంత తేలిగ్గా మడమ తిప్పే మనిషి కాదు. ఆ భూమిపై పురావస్తు తవ్వకాలు ప్రారంభించి దానిపై తనదైన చెరగని ముద్ర వేశాడు కనుక, అది తనకే చెందాలని ఎప్పుడో నిర్ణయానికి వచ్చాడు. మంత్రి ఆ భూమిని 600 ఫ్రాంకులకు కొన్నట్టు తెలిసింది. కానీ తను 1,000 ఫ్రాంకులు ఇవ్వజూపాడు. ఆవిధంగా చూసినా భూమి తనకే దక్కాలి. అయినా తనకు ఆ హక్కును నిరాకరించారంటే,  వైజ్ఞానిక పరిశోధనలపై వాళ్ళకు గౌరవం లేదు. వాళ్ళు బొత్తిగా అనాగరికులు. పురాతత్వవేత్తగా తను కీర్తిశిఖరాలను అందుకోవడం, తన పేరు యూరప్ అంతా మారుమోగుతుండడం  చూసి వాళ్ళు భయపడ్డారు. ఇలా వాళ్ళను తిప్పికొట్టే ప్రయత్నంలో అన్ని రకాల వాదనలనూ, అన్ని స్థాయిలలోనూ ముందుకు తేవడానికి; అన్ని వైపుల నుంచీ దాడి చేయడానికి  సిద్ధమైపోయాడు.

(సశేషం)

 

 

సీజర్ ను భయపెట్టిన ‘ప్రేతాత్మ’ల నగరం…ట్రాయ్

 

స్లీమన్ కథ-17

 

కల్లూరి భాస్కరం

స్లీమన్ వెళ్ళేటప్పటికే, ట్రాయ్ నలిగిన బాట. ఆ బాటలో పిచ్చి పిచ్చిగా పెరిగిన ముళ్ల పొదలు, శిథిల వృక్షాలు. వాటికింద పాడుబడిన బలిపీఠాలు. ఆ పీఠాల వద్ద ఘనతవహించిన ఎంతోమంది మొక్కులు చెల్లించుకున్నారు. తరం వెంట తరంగా ఆ దుర్గమ ఫ్రిజియన్ తీరాన్ని సందర్శించిన అనేకమంది అక్కడి కూలుతున్న గోపురాల మధ్య తిరిగారు. హెలెన్ (గొప్ప సౌందర్యవతి. మైసీనియన్ స్పార్టాను పాలించే మెనెలాస్ భార్య. ఈమెను ట్రాయ్ రాకుమారుడు పారిస్ అపహరించుకుని వెళ్ళాడు. అది ట్రోజన్ యుద్ధానికి దారితీసింది) నిర్బంధానికీ, పదేళ్ళ యుద్ధానికీ సాక్షులుగా నిలిచిన జీర్ణ శిలల మీద సేదతీరారు.

హెరోడొటస్ మాటలనే విశ్వాసంలోకి తీసుకుంటే, ప్రపంచంలోని అత్యధికభాగాన్ని ఏలిన పర్షియన్ చక్రవర్తి గ్జెరెక్సెస్(క్రీ.పూ. 519) టర్కీ నుంచి గ్రీస్ కు దండు వెడలుతూ ఇక్కడ ఒకరోజు ఆగాడు. కొండ ఎక్కి దుర్గాన్ని చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి చెందిన విజ్ఞులను పిలిపించి అక్కడ జరిగిన ముట్టడుల కథలు చెప్పించుకుని విన్నాడు. ఆ తర్వాత ట్రోజన్ ఎథెనాకు వెయ్యి వృషభాలను బలిచ్చాడు. అక్కడి పూర్వజులైన మహనీయుల ఆత్మశాంతికి మద్యతర్పణాలు ఇవ్వవలసిందిగా పురోహితులను ఆదేశించాడు. ఏవో భయానక ప్రేతాత్మలు భూమిని చీల్చుకుంటూ వచ్చి మీద పడతాయన్న ఊహతోనే పర్షియన్ సేనలు ఆ రాత్రంతా వణికిపోతూ గడిపాయి.

పర్షియన్లకూ, ఇతరులకూ కూడా అది రకరకాల కథలూ, పీడకలలూ కలగలిసిన విచిత్ర భయాలను రేపే ప్రదేశం. అన్ని యుద్ధక్షేత్రాలలోలానే, ఈ ప్రాంతాన్ని కూడా ప్రతీకారదాహంతో ప్రేతాత్మలు పెట్టే పెడబొబ్బలు వెంటాడుతూ ఉంటాయి.  గ్జెరెక్సెస్ కూడా పాత పగలు తీర్చుకోవడమే తన లక్ష్యమని చెప్పుకున్నాడు. ట్రాయ్ పతనమే గ్రీకులకూ, తమకూ మధ్య శాశ్వతశత్రుత్వాన్ని రగిల్చిందని పర్షియన్లు అంటారు.

ట్రాయ్ గడ్డ మీద అడుగుపెట్టగానే, ఆసియా మొత్తం తమ చేజిక్కిందని గ్రీకులు అనుకున్నారు. హెల్స్ పాంట్ మీదుగా అలెగ్జాండర్ పర్షియన్లపై దండయాత్రకు వెడుతూ సెజియమ్(ఒక పురాతన నగరం)లోని ఓ గుట్టమీద ఉన్న అఖిలెస్ (ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్న గ్రీకు వీరుడు) సమాధిని దర్శించుకున్నాడు. ఒంటి నిండా నూనె పట్టించి ఆ సమాధి చుట్టూ నగ్నంగా ప్రదక్షిణ చేశాడు. ఎథెనా ఆలయంలో భద్రపరచిన కొన్ని ఆయుధాలను తను ధరించాడు. ఆ నగరాన్ని తీర్చిదిద్దడానికి బ్రహ్మాండమైన ప్రణాళికలు వేసుకున్నాడు.

భూ, సముద్రమార్గాలలో పాంపే(క్రీ. పూ. 106: రోమన్ సేనాని, రాజకీయ నేత)ను వేటాడుతున్న జూలియస్ సీజర్(క్రీ.పూ.100: రోమన్ సేనాని, రాజకీయనేత) ఇక్కడి రోటియన్ గుట్ట మీదికి చేరుకున్నాడు. అప్పటికి నలభై ఏళ్లక్రితం రోమన్ దళాల చేతుల్లో దగ్ధమైన ఈ నగర శిథిలాల మధ్య తిరిగాడు. చుట్టూ కమ్మేసిన అడవీ; రాజప్రాసాదాలపైనా, ఆలయాలపైనా దట్టంగా పెరిగిపోయిన ఓక్ చెట్లు తప్ప అతనికేమీ కనిపించలేదు. అక్కడక్కడ ఇసుక మేటలు వేసిన ఒక ప్రవాహాన్ని అతడు దాటుతుండగా, “ప్రసిద్ధ నది జంతస్ ఇదే” నని ఎవరో చెప్పారు. అతనో పచ్చిక నేల మీద అడుగుపెట్టినప్పుడు; “హెక్టర్(ట్రోజన్ రాకుమారుడు, ప్రియామ్ కొడుకు, వీరుడు) భౌతికకాయాన్ని తీసుకొచ్చిన ప్రదేశం ఇది. అతని ప్రేతాత్మ కోపగిస్తుంది, జాగ్రత్త” అని ఎవరో బిగ్గరగా అరిచారు. అతను ఒక రాళ్ళగుట్టను సమీపించబోయినప్పుడు, ఎవరో అతని చొక్కా పుచ్చుకుని లాగి,”కనబడడం లేదా? అది హెర్కయన్ జూపిటర్ బలిపీఠం” అని గుడ్లు ఉరిమాడు.

చుట్టూ శిథిలాలూ, అలముకున్న అంధకారం తప్ప ఏమీ కనిపించకపోయినా అదో పవిత్రస్థలి అని సీజర్ కు తెలుసు. అక్కడి ప్రేతాత్మలను తలచుకుని భయపడ్డాడు. అప్పటికప్పుడు మట్టితో ఒక బలిపీఠాన్ని నిర్మింపజేసి, దాని మీద ధూపం వెలిగించాడు. తనకు గొప్ప శ్రేయస్సును ప్రసాదించమని ఆ క్షేత్రపాలకులైన దేవతలను ప్రార్థించాడు. అక్కడి కుప్పకూలిన నిర్మాణాలను పునర్నిర్మించి వాటికి పూర్వవైభవం తీసుకోస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంతలో తన బద్ధశత్రువైన పాంపే గుర్తొచ్చి, అతన్ని చంపే తహతహలో ఓడ ఎక్కి ఎక్కడా ఆగకుండా హడావుడిగా ఆసియాలోని సుసంపన్న నగరాల మీదుగా ఈజిప్టు రాజధాని అలెగ్జాండ్రియాకు వెళ్లిపోయాడు.

ఉన్మాదులూ, చక్రవర్తులూ కూడా ట్రాయ్ ను దర్శించుకున్నాడు. ‘కరకలా’ అనే పేరుతో ప్రసిద్ధుడైన ఉన్మత్త రోమన్ చక్రవర్తి ఆంటోనినూస్(క్రీ.శ. 188) ఇక్కడి ఆలయాలకు వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నాడు. ఈ ప్రాంత గతవైభవస్మరణతో మతిభ్రమించి, మేసిడోనియాలో తనను అలెగ్జాండర్ ది గ్రేట్ గా ఊహించుకున్నట్టే, ఇక్కడ అఖిలెస్ గా ఊహించుకున్నాడు. తన ఆప్తమిత్రుడు పెట్రాక్లస్ మరణానికి అఖిలెస్ అంతులేని దుఃఖంలో కూరుకుపోయిన సంగతి గుర్తొచ్చి, తను కూడా అలాంటి దుఃఖాన్ని అనుభవించాలనుకున్నాడు. తనెంతో అభిమానించే ఫెస్టస్ అనే ఒక మాజీబానిసకు విషం పెట్టి చంపించి అతనికి బ్రహ్మాండమైన చితిని పేర్చవలసిందిగా ఆదేశించాడు. తను స్వయంగా జంతువులను బలిచ్చి, మృతదేహాన్ని చితి మీదికి చేర్చి, నిప్పు అంటించాడు. ఆ తర్వాత ఆ మంటలపై మద్యాన్ని చిలకరించి, తన ప్రాణమిత్రుడి మరణాన్ని పండుగ చేసుకోవలసిందిగా వాయువులను ప్రార్థించాడు. కరకలా ప్రభుత్వంలో చిన్న అధికారిగా ఉన్న హెరోడియన్ ఈ ముచ్చట వివరిస్తూ, తను కూడా పట్టలేని దుఃఖంతో తన తలవెంట్రుక నొకదానిని చితికి అర్పించబోయాననీ, తీరా తనది పూర్తిగా బట్టతల కావడంతో అక్కడ ఉన్నవాళ్ళందరూ నవ్వారనీ చెప్పుకున్నాడు.

ఆ తర్వాత, అఖిలెస్ సమాధి చుట్టూ అలెగ్జాండర్ నగ్నంగా ప్రదక్షిణ చేశాడన్న సంగతి గుర్తొచ్చి కరకలా కూడా అదే చేశాడు.

ఆ తర్వాతి కాలంలోనూ, పర్షియాకో, జెరూసలెంకో నిరంతర ప్రవాహంలా వెళ్ళే యాత్రికుల బృందాలు విధిగా ఆ పవిత్రస్థలి మీద కాలు మోపాయి. తూర్పు భూముల్లో రోమన్ సామ్రాజ్యానికి కొత్త రాజధానిని నిర్మించాలనుకున్న కాన్ స్టాంటీన్(క్రీ.శ.270) అందుకు బైజాంటియమ్ ను ఖరారు చేసేముందు, ట్రాయ్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశాడు. నోవమ్ ఇలియమ్(ట్రాయ్ సమీపంలోని ఒక గ్రామం) ను సందర్శించిన రోమన్ చక్రవర్తి జూలియన్(క్రీ.శ.336), ఏజాక్స్(గ్రీకు వీరుడు)అస్థికలకు కొత్త సమాధిని నిర్మింపజేశాడు. మృతవీరుల అస్థికలను ఆరాధించే క్రైస్తవులను చూసి ఎగతాళి చేసిన ఈ చక్రవర్తే, ఏజాక్స్ సమాధిని భక్తితో కొలిచాడు. ట్రోజన్లు ఆ తర్వాత కూడా మరి కొన్నేళ్లపాటు పురాతన బలిపీఠాల వద్ద రహస్యంగా బలులు ఇస్తూవచ్చారు. రోమ్ లో క్రైస్తవ చక్రవర్తుల రాకతో అది క్రమంగా తగ్గుముఖం పట్టి, ట్రాయ్ మతపరమైన ప్రాముఖ్యం కొల్పోయింది.

greek goddess pallas athena

దర్దనెల్లెస్ కు వెళ్ళే దారులకు పదిహేనువందల ఏళ్లపాటు ట్రాయ్ కాపలా కాయగలిగింది. ఇప్పుడా వీధుల నిండా గడ్డి గాదం పెరిగిపోయాయి. ఆలయాలు, ప్రాసాదాల గోడలు కూలిపోయాయి. ఇప్పుడక్కడ ముళ్ళపొదలు, గడ్డితో నిండిన ఓ పెద్ద దిబ్బ మాత్రమే ఉంది. ట్రయాడ్ తీరం వెంబడి ప్రయాణించిన ఆంగ్లో-శాగ్జన్ చరిత్రకారుడు సావూఫ్ (క్రీ.శ. 1100), ట్రాయ్ శిథిలాలు అనేక మైళ్ళ దూరం వ్యాపించి ఉన్నాయని రాశాడు. ట్రాయ్ పూర్తిగా ధ్వంసమైందనీ, ఏమీ మిగలలేదనీ సర్ జాన్ మండవిల్ అనే మరో పర్యాటకుడు రాశాడు.

నిజమే, ట్రాయ్ ధ్వంసమైంది, అయినా మిగిలింది. జనం ఊహల్ని జ్వాజ్వల్యమానం చేయగలిగిన శక్తి ట్రాయ్ కు ఉన్నట్టు మరే నగరానికీ లేదు. బహుశా ఒక్క జెరూసలెం ఇందుకు మినహాయింపు. సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో ట్రాయ్ స్మృతిని హోమర్, వర్జిల్ సజీవం చేశారు. అఖిలెస్ నడిచిన బాటల మీద తాము కూడా నడిచే రోజు కోసం ఇటలీ పండితులు ఎందరో కలలు గన్నారు. రోమన్లు అనుకున్నట్టే, తాము కూడా ట్రోజన్ల వారసులమనీ, లండన్ అసలు పేరు ట్రాయ్ నోవంట్(నూతన ట్రాయ్) అనీ ఇంగ్లీష్ జనం అనుకుంటారు.

ట్రాయ్ కల్పన కాదు, నిజమనీ; హిస్సాలిక్ దిబ్బ కింద ఆ నగరం తాలూకు గోడలు, ప్రాసాదాలు, అలంకరణసామగ్రితోపాటు ట్రోజన్ల సాహిత్యం కూడా సమాధైందనీ 1870 లలో గట్టిగా నమ్మినవాళ్ళు ఇద్దరే: ఫ్రాంక్ కల్వర్ట్, హైన్ రిచ్ స్లీమన్.  ట్రాయ్ ఉనికి హిస్సాలిక్ దగ్గరే నని 1822లోనే నిరూపించే ప్రయత్నంచేసిన పురాతత్వనిపుణుడు చార్లెస్ మెక్లారెన్ 1870ల నాటికి జీవించిలేడు. బునర్ బషీయే ట్రాయ్ అనీ, హిస్సాలిక్ దిబ్బ మీద తవ్వకాలు జరపడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదనేది దాదాపు అప్పటి పండితులందరి ఏకాభిప్రాయం.

హిస్సాలిక్ దిబ్బ మీద పూర్తిస్థాయిలో తవ్వకాలను చేపట్టగల ఆర్థికస్తోమత ఫ్రాంక్ కల్వర్ట్ కు లేదు, అతనికంత ఆసక్తీలేదు. ఆ దిబ్బలోని తూర్పు భాగం అతని సొంతం. పశ్చిమభాగం కమ్ కేల్ లో ఉంటున్న ఇద్దరు టర్కులకు చెందింది.

సముద్రం వైపు తిరిగి ఉన్న పశ్చిమ భాగంలోనే అతి ముఖ్యమైన నిర్మాణాలూ, విలువైన నిధినిక్షేపాలూ బయటపడతాయని స్లీమన్ నిర్ధారణకు వచ్చాడు. టర్కుల అధీనంలో ఉన్న ఆ ప్రదేశంలోనే మొదట తవ్వకాలు జరుపుదామనీ, కల్వర్ట్ కు చెందిన ప్రాంతంలో తర్వాత ఎప్పుడైనా జరపచ్చనీ అనుకున్నాడు. తను బయటపెట్టబోయే నిర్మాణాలను, నిధినిక్షేపాలను చూసిన తర్వాత; తమ అనుమతి లేకుండా తవ్వకాలు జరిపించిన తన తెంపరితనాన్ని ఆ టర్కులిద్దరూ క్షమిస్తారని భావించాడు.

ఏప్రిల్ 9 న, దగ్గర్లోని రెంకోయ్ అనే గ్రామానికి చెందిన పదిమంది టర్కిష్ కూలీలతో మొదటి కందకాన్ని తవ్వించాడు. ఒక్కొక్కరికి పది పియాస్టెర్ల(పియాస్టెర్: మధ్యప్రాచ్యంలో అనేక చోట్ల చలామణిలో ఉన్న ఒక ద్రవ్యకొలమానం. పౌండులో నూరోవంతు)చొప్పున చెల్లించాడు. పని జరుగుతున్నంత సేపూ బెల్టులో పిస్టల్ తోనూ, చేతిలో కొరడాతోనూ వాళ్ళ నెత్తి మీద నిలబడ్డట్టు నిలబడ్డాడు. తను ‘స్కెయిన్ గేట్’(ట్రాయ్ పశ్చిమ ద్వారం. ఇక్కటే గ్రీకులకు, ట్రోజన్లకు అనేక యుద్ధాలు జరిగాయి) ఉంటుందని ఊహించుకున్న వాయవ్య భాగంలో ఒకచోట మొదటి పలుగు దెబ్బ పడింది. ఒక గంటసేపు తవ్విన తర్వాత రెండు అడుగుల లోతున ఒక ప్రాకారం తాలూకు శిథిలాలు కనిపించాయి. స్లీమన్ ఉత్తేజితుడయ్యాడు. సూర్యాస్తమయానికల్లా 60 అడుగుల పొడవూ, 40 అడుగుల వెడల్పూ ఉన్న ఒక భవనం తాలూకు పునాదులు బయటపడ్డాయి.

మరునాడు మరో పదకొండు మందిని పనిలోకి తీసుకున్నాడు. క్రమంగా బయటపడుతున్న ఆ భవనం ఆగ్నేయ, నైరుతి మూలల్లో తవ్వకాలు ప్రారంభించాడు. చదరపు రాళ్ళు తాపడం చేసిన భవనం పై కప్పు పైకి తేలింది. దాని మీద రెండడుగుల మందంలో మట్టి, వందల ఏళ్ల నాటి గొర్రె పెంటికలు, మొక్కల శిథిలాలు, వాతావరణం తాలూకు ధూళి పేరుకుపోయి ఉన్నాయి. కుండపెంకులేవీ కనిపించలేదు. ఆ చదరపు రాళ్ళ అడుగున తవ్వించాడు. సరిగ్గా అతను ఊహించినట్టే అడుగున అగ్నిప్రమాదాన్ని సూచిస్తూ బూడిద కుప్పలూ, కాలిపోయిన పదార్థాలూ కనిపించాయి. ఒక పద్ధతిగా ఉన్న వాటి అమరికను బట్టి అక్కడ కనీసం పది కొయ్య ఇళ్ళు ఉండేవనీ, అగ్ని ప్రమాదంలో అవి తగలబడి పోయాయనీ, ఆ శిథిలాల మీద ఆ తర్వాత రాతి కట్టడం అవతరించిందనీ అతను నిర్ధారణకు వచ్చాడు. ఆ బూడిద కుప్పల్లో ఒకచోట ఒక నాణెం దొరికింది. దానికి ఒక పక్క రోమన్ చక్రవర్తి కమొడస్(క్రీ.శ. 161) చిత్రం, ఇంకో పక్క యుద్ధంలో ట్రోజన్ సేనలకు నాయకత్వం వహించిన ట్రాయ్ రాకుమారుడు హెక్టర్ చిత్రం ఉన్నాయి. ‘హెక్టర్ ఇలియోన్’ (ట్రాయ్ కి చెందిన హెక్టర్) అని రాసి ఉన్న ఆ నాణెం అత్యంత శుభసంకేతంగా స్లీమన్ కళ్లకు కనిపించింది.

రెండు రోజులపాటు ఆ భవనం చుట్టూనే తవ్వించాడు. మూడో రోజున, ఆ స్థలం యజమానులైన ఆ టర్కులిద్దరూ ఏ క్షణంలోనైనా వచ్చిపడతారనిపించి; తూర్పు నుంచి పశ్చిమానికీ; దక్షిణం నుంచి ఉత్తరానికీ రెండు పొడవైన కందకాలను హడావుడిగా తవ్వించడం ప్రారంభించాడు. అందువల్ల ఆ నగరం తాలూకు పూర్తి చిత్రం ఏర్పడుతుందని అనుకున్నాడు.

అవడానికి అతని ప్రణాళిక పక్కాగానే ఉంది. కానీ పని మొదలెట్టించాడో లేదో, ఆ టర్కులిద్దరూ వచ్చిపడ్డారు. తమ స్థలంలో తవ్వకాలు జరుపుతున్న ఈ చిన్నపాటి సైన్యాన్ని చూసి విస్తుపోయారు. తను శాస్త్రీయ ప్రాముఖ్యమున్న పని చేస్తున్నాననీ, ఇందులో తనకు ఎలాంటి స్వార్థం లేదనీ, నిజానికి తను చేస్తున్న పని టర్కీ గౌరవాన్ని ఎంతైనా పెంచుతుందనీ స్లీమన్ దుబాషీ ద్వారా వారికి వివరించాడు. అప్పటికీ దిగ్భ్రాంతి నుంచి తేరుకోని ఆ టర్కులిద్దరూ ఈ పని చేసేందుకు మీ కెలాంటి హక్కూ లేదు, తక్షణం ఇక్కడినుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దాంతో స్లీమన్ వాళ్ళను బుజ్జగిస్తూ, బతిమాలుతూ తను తవ్వకాలు జరిపిన చోటికి తీసుకెళ్లి చూపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతత్వ శాస్త్రవేత్తలందరూ రేపు పొగడ్తలతో ముంచెత్తబోయే తన పరిశోధనాంశాల గురించి ఓ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు. ఇప్పటికే తను పల్లస్ ఎథెనా ఆలయం గోడలో కొంత భాగాన్ని, అసంఖ్యాకమైన అస్థికలను, తాపడం రాళ్ళను, పంది దంతాలను, అగ్నిప్రమాదం తాలూకు ఆనవాళ్లను బయటపెట్టానని చెప్పాడు.

టర్కులు కొంత మెత్తబడ్డారు. అన్నిటినీ మించి అక్కడ తవ్వి తీసిన పెద్ద బండరాళ్ళ మీద వాళ్ళ దృష్టి పడింది. సిమోయిస్ అనే చోట ఒక రాతి వంతెన కట్టించాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ బండ రాళ్ళు అందుకు బాగా పనికొస్తాయనిపించింది. ఈ రాళ్ళను తమ వంతెనకు వాడుకునే షరతు మీద ఆ రెండు పొడవైన కందకాలను తవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. స్లీమన్ వాళ్ళకు నలభై ఫ్రాంకులు చెల్లించాడు. అవి తీసుకుని వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

స్లీమన్ తను తవ్వి తీసిన వాటికి వెంటనే ఏదో ఒక చారిత్రకనామం ఉంచేవాడు. ఓ పెద్ద గోడ బయటపడగానే, ఆ కట్టడానికి పల్లస్ ఎథెనా ఆలయం అని పేరు పెట్టేశాడు. ఉత్తరపు కందకాన్ని తవ్వుతున్నప్పుడు అడుగున ఇరవై రెండు బూడిద పొరల కింద ఒక మృణ్మయ స్త్రీమూర్తి కనిపించగానే, దానికి హెలెన్ అని పేరు పెట్టాడు. తగిన ఆధారాలతోనే అలా పేర్లు పెడుతున్నాడా అన్నది అతనెప్పుడూ ఆలోచించుకోలేదు.

అయితే, టర్కులు వచ్చి వెళ్ళిన తర్వాత దీర్ఘాలోచనలో పడిపోయాడు. తన అదుపులో లేని శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి తప్ప తను ముందుకు వెళ్లలేడని అతనికి అర్థమైంది. నలభై ఫ్రాంకులు చెల్లించి, వంతెన కట్టుకోడానికి రాళ్ళు ఇస్తానని చెప్పి తను వాళ్ళతో తాత్కాలికంగా ఒప్పందం చేసుకున్నాడు కానీ, అది భగ్నమవదన్న నమ్మకం ఏమిటి? ఈ టర్కులు తమ హక్కులకోసం పట్టుబడితే ఏం చేయాలి? అక్కడికీ తను ఆ మొత్తం స్థలాన్ని కొనేయాలనుకుని బేరమాడాడు. వాళ్ళు చాలా ఎక్కువ ధర చెప్పారు. పైగా ఆ దిక్కుమాలిన వంతెన కోసం రాళ్ళు అడుగుతున్నారు. అంతకన్నా అపచారం ఉంటుందా? వీళ్లతో ఎలా వేగాలి? ఈ స్థలం మీద పూర్తి హక్కులు ఎలా సంపాదించాలి?

అతనిలాంటి ఆలోచనలతో సతమతమవుతుండగానే ఏప్రిల్ 21 న ఆ ఇద్దరు టర్కులూ మళ్ళీ వచ్చారు. ఇప్పటివరకూ తవ్విన రాళ్ళు వంతెనకు సరిపోతాయి, ఇక తవ్వకాలు ఆపేయండని హుకుం జారీచేశారు.

ఈ హుకుంను తోసిపుచ్చగల ఎలాంటి ఆయుధాలూ స్లీమన్ దగ్గర లేవు. వీళ్ళతో ఇక పోరాడి లాభం లేదు, వేరే మార్గాలు చూడాల్సిందే ననుకున్నాడు. తను ఇంతవరకూ చేసిన పనేమిటో, ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో వివరిస్తూ జర్మనీ, ఫ్రాన్స్, ఎథెన్స్, కాన్ స్టాంటినోపిల్ లో ఉన్న మిత్రులకు వరసపెట్టి ఉత్తరాలు రాశాడు. ఒక జర్మన్ మిత్రుడికి ఇలా రాశాడు:

అతి పురాతన ప్రాసాదాలు, ఆలయాల శిథిలాలను నేను బయటపెట్టాను. పదిహేను అడుగుల లోతున, ఒక అద్భుత నిర్మాణానికి చెందిన ఆరడుగుల మందమైన పెద్ద పెద్ద గోడల్ని కనుగొన్నాను. ఇంకా ఏడున్నర అడుగుల లోతున ఇవే గోడలు ఎనిమిదిన్నర అడుగుల మందమైన గోడలపై ఆని ఉండడం చూశాను. ఇవి ప్రియాం ప్రాసాదం గోడలో, లేదా ఎథెనా ఆలయం గోడలో అయుంటాయని అనుకుంటున్నాను.

అయితే, దురదృష్టవశాత్తూ ఈ స్థలానికి యజమానులైన ఇద్దరు టర్కులు అదేపనిగా చికాకు పెడుతున్నారు. బహుశా  రేపటితో వాళ్ళు నా పని ఆపేస్తారు. ఈ లోపల ఆ స్థలం కొనేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఏమైనా ప్రియాం ప్రాసాదాన్ని వెలికితీసే వరకూ విశ్రమించకూడదని నిర్ణయించుకున్నాను.

అలా రాశాడే కానీ, ఆ క్షణాన తను ఇక చేయగలిగిందేమీ లేదని అతనికి తెలుసు. పరిస్థితులకు తలవంచుతూ, పనివాళ్ళకు వేతనాలు చెల్లించి పంపేశాడు. ఈలోపల మైసీనియా తవ్వకాలకైనా అనుమతి వస్తుందని ఆశపడుతూ  ఎథెన్స్ కు వెళ్లిపోయాడు. కొన్ని వారాలు మైసీనియాలో గడిపి, టర్కిష్ ప్రభుత్వం నుంచి ఫర్మానాను, హిస్సాలిక్ దిబ్బ మీద యాజమాన్య హక్కును సాధించుకున్న తర్వాత  ట్రాయ్ వచ్చి తిరిగి తవ్వకాలను ప్రారంభిచవచ్చనుకున్నాడు.

(సశేషం)

 

 

 

 

 

 

హోమర్ ను చదువుకుంటూ అతడు-ఆమె

స్లీమన్ కథ-16

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

సోఫియా తల్లిదండ్రులు, తోబుట్టువులు, దగ్గరి బంధువులతో సహా కుటుంబం అంతా అక్కడే ఉంది. అందరూ ఒక టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. ఒకింత విషాదం తొంగి చూసే చిరునవ్వు, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, బట్టతల, వేస్టుకోటుకు వేల్లాడుతున్న బరువైన బంగారపు వాచీ చైనుతో ఉన్న ఈ విచిత్రమైన జర్మన్ వైపు అంతా కళ్ళప్పగించి చూశారు.

కాసేపటికి సోఫియా వచ్చింది. తెల్లని దుస్తులు ధరించింది. జుట్టు రిబ్బన్ తో ముడేసుకుంది. చాలా గంభీరంగా ఉంది. అందరిముందూ వైనూ, కేకులూ ఉంచారు. సోఫియా తలవంచుకుని కూర్చుంది. స్లీమన్ తన ప్రపంచయాత్రా విశేషాలను చక్కని గ్రీకులో చెప్పడం ప్రారంభించాడు. మధ్యలో ఉన్నట్టుండి సోఫియావైపు తిరిగి, “నీకు దూరప్రయాణాలు ఇష్టమేనా?” అని అడిగాడు. ఇష్టమేనని ఆమె చెప్పింది. “రోమన్ చక్రవర్తి హేడ్రియన్ ఎథెన్స్ ను ఎప్పుడు సందర్శించాడు?” అని అడిగాడు. సోఫియా తేదీతో సహా ఠకీమని చెప్పింది. “హోమర్ పంక్తులు కొన్ని అప్పజెప్పగలవా?” అని అడిగాడు. గడగడా అప్పజెప్పింది. పరీక్ష నెగ్గింది.

ఆ తర్వాతి మూడురోజులూ స్లీమన్ పగలంతా ఆ ఇంటి చుట్టూనే వేల్లాడి రాత్రి హోటల్ కు వెళ్ళేవాడు. అతని కళ్ళు తనను కనిపెట్టి చూస్తున్నాయని సోఫియాకు తెలుసు. అయినా తత్తరపడలేదు. తన చెల్లెళ్లతోనూ, బంధువుల అమ్మాయిలతోనూ ఆటపాటల్లో మునిగితేలింది. టేబుల్ సర్దడంలో సాయం చేసింది. మధ్య మధ్య, చమురు డబ్బాలు, వెన్న, ఆలివ్ లు ఉంచిన సెల్లార్ లోకి పరుగుతీసింది. ఇంటినిండా బంధువులు. స్లీమన్ ఓ చిన్న ఉత్తరం రాసి ఎలాగో ఆమెకు అందేలా చూశాడు.

ఇద్దరూ ఏకాంతంగా కలసుకున్నప్పుడు, “నన్ను పెళ్లి చేసుకోడానికి నువ్వు ఎందుకు ఇష్టపడ్డావ”ని హఠాత్తుగా అడిగాడు.

“మీరు ధనవంతులని మా అమ్మానాన్నా చెప్పారు కనుక” అని సోఫియా తటాలున సమాధానం చెప్పింది.

ఆ మాట స్లీమన్ ను నొప్పించింది. కోపంతో విసవిసా హోటల్ కు వెళ్లిపోయాడు. ఈ అమ్మాయిలో ఒక సహజమైన ఉదాత్తత ఏదో ఉందని అతను అంతవరకూ అనుకున్నాడు. కానీ తన ప్రశ్నకు ఒక బానిసలా సమాధానం చెప్పింది. హోటల్ కు వెళ్ళిన తర్వాత వెంటనే ఆమెకు ఉత్తరం రాశాడు:

మిస్ సోఫియా, నువ్విచ్చిన సమాధానం నన్ను తీవ్రంగా గాయపరిచింది. ఒక బానిస మాత్రమే అలాంటి సమాధానం ఇవ్వగలదు. అందులోనూ నీలాంటి ఒక చదువుకున్న అమ్మాయి అలాంటి జవాబు ఇవ్వడం మరింత దిగ్భ్రాంతి కలిగించింది. నేను చాలా సీదాసాదా మనిషిని. గౌరవమర్యాదలు కలిగిన ఓ ఇంటిపక్షిని. మనం పెళ్లి చేసుకోవడమే జరిగితే ఇద్దరం కలసి పురావస్తు తవ్వకాలు జరపచ్చనీ, హోమర్ మీద పరస్పరాభిమానాన్ని పంచుకోవచ్చనీ, ఏవేవో అనుకున్నాను.

నేను ఎల్లుండి నేపుల్స్ కు వెడుతున్నాను. బహుశా మనం మళ్ళీ కలసుకోలేకపోవచ్చు. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక స్నేహహస్తం కావాలనిపిస్తే నీపట్ల అంకితభావం కలిగిన నన్ను గుర్తుచేసుకో.

                                                                                                                  హైన్ రిచ్ స్లీమన్

                                                                                                               డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ,

                                                                                               స్థలం: సెయింట్  మిషెల్, 6, పారిస్ 

ఆ ఉత్తరాన్ని హోటల్ మెసెంజర్ ద్వారా సోఫియాకు పంపించాడు. అది చదివి ఆమె ఉక్కిరిబిక్కిరైంది. అతని కోపం పోయేలా ఒక ఉత్తరం రాయమని కుటుంబం అంతా ఆమెపై ఒత్తిడి తెచ్చింది. ఆమెకు సహకరించడానికి ప్రభుత్వాధికారిగా ఉన్న ఓ దగ్గరిబంధువును కూడా రప్పించారు. అప్పటికప్పుడు ఓ దుకాణం నుంచి కొని తెచ్చిన చవకబారు కాగితం మీద సోఫియా ఇలా రాసింది:

ప్రియమైన హెర్ హైన్ రిచ్:  మీరు వెళ్లిపోతానన్నందుకు విచారిస్తున్నాను. మధ్యాహ్నం నేనన్న మాటలకు కోపం తెచ్చుకోవద్దు. ఆడపిల్లలు అలాగే మాట్లాడాలేమో ననుకున్నాను. రేపు మళ్ళీ మీరు మా ఇంటికి వస్తే మా అమ్మానాన్నా, నేనూ ఎంతో సంతోషిస్తాం.

స్లీమన్ దాంతో తేలికపడ్డాడు. అయినాసరే, ఆమె తనను ఇష్టపడే పెళ్ళికి ఒప్పుకుందా లేదా అన్నది తేల్చుకోడానికి  ఉత్తరాల మీద ఉత్తరాలు రాశాడు. ఆమె ప్రతి ఉత్తరానికి జవాబిచ్చింది. అలా ఆరు రోజులపాటు సాగిన ఆ ఉత్తరాయణంలో చివరికి ఆమె తానుగా వివాహ ప్రతిపాదన చేసిన తర్వాతే అతను బెట్టు వీడాడు. పదిహేడేళ్ళ సోఫియాకు, నలభై ఏడేళ్ళ స్లీమన్ కు సెప్టెంబర్ 24న వివాహం జరిగింది,

స్లీమన్ ఫ్రాక్ కోటు వేసుకున్నాడు. సోఫియా తెల్లని దుస్తులు ధరించి, కొలొనస్ పువ్వులతో అలంకరించిన పెళ్లి కూతురి ముసుగు వేసుకుంది. ఆమె బంధువులందరూ గ్రీకు జాతీయ ఆహార్యంలో పెళ్ళికి హాజరయ్యారు. ఆ తర్వాత సాయంత్రం దాకా విందు జరిగింది. అదే రోజు రాత్రి వధూవరులు ఇద్దరూ ఎథెన్స్ రేవు ప్రాంతమైన పిరయాస్ కు వెళ్ళి, తెల్లవారుజామున మూడు గంటలకు నేపుల్స్ వెళ్ళే ఓడ ఎక్కారు. తన ఆటబొమ్మలు కూడా తెచ్చుకుంటానని సోఫియా పట్టుబట్టింది. స్లీమన్ వద్దని వాదించే స్థితిలో లేడు. అలా అతనిపై ఆమె తొలి విజయం సాధించింది. ఆ తర్వాత చివరివరకూ ఆమె విజయపరంపర కొనసాగింది.

అందంతోపాటు ఆమెలో పసితనం ఉంది. ఆమె నడకలో ఒక సహజమైన హుందాతనం ఉట్టిపడేది. ఆమె జీవితాంతమూ అది చెక్కుచెదరలేదు. అతనిమీద పెత్తనం చేస్తున్నట్టు కనిపించకుండానే పెత్తనం చేసేది. ఆమె అతన్ని తదేకంగా ప్రేమించింది. కానీ ఆ ప్రేమలో పెద్దవాళ్ళపట్ల పిల్లలకు ఉండే ఒక మంకుతనం ఉండేది. సన్నిహితమిత్రులతో కూడా అంటీ అంటనట్టు ఉండే స్లీమన్ సైతం ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె మనస్థితి వెంట వెంటనే మారిపోతూ ఉండేది. నవ్వుతూ నవ్వుతూనే అంతలో గంభీరంగా మారిపోయేది. అది కూడా పిల్లల్లో కనిపించే గాంభీర్యం. అదతనికి ఆహ్లాదం కలిగించేది. “ఆమెలో భర్తపట్ల ఒక అలౌకిక ఆరాధనాభావం ఉంది” అని అతను హానీమూన్ రోజుల్లోనే రాసుకున్నాడు.

నిజానికి, అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య తన జీవితంలోకి అనుకోకుండా అడుగుపెట్టిన ఆమెపై అతనికీ అలాంటి ఆరాధనాభావమే ఉంది. తన తుదిక్షణాలవరకూ ఆమెను అలాగే ఆరాధించాడు. అయితే, వారు కీచులాడుకున్న సందర్భాలు లేకపోలేదు. అతనిలో వెనకటి అసహనం, ఆవేశం తన్నుకొచ్చిన ఘట్టాలూ ఉన్నాయి. అతని అహానికీ, అతిశయానికీ, డాంబికానికీ ఆమెలోని ప్రశాంతతా, ఉల్లాసమూ అడ్డుకట్ట అయ్యేవి. ఆమె సాహచర్యం అతనికి మృదుత్వాన్నీ, మర్యాదనూ మప్పింది. మొత్తానికి ఆమె తన సహచరి కావడం అతనికి ఓ అంతుబట్టని అద్భుతంలా అనిపించేది. తన గొప్ప అదృష్టాన్ని చూసుకుని తనే దిగ్భ్రమ చెందేవాడిలా ఒక్కోసారి ఆమెనే చూస్తూ ఉండిపోయేవాడు.

అదో విచిత్రమైన హానీమూన్. నేపుల్స్…పాంపే…ఫ్లోరెన్స్…మ్యూనిక్…వెంట వెంటనే ఒకచోటినుంచి ఒక చోటికి నిరంతర ప్రయాణం. అందులో విధిగా మ్యూజియంల సందర్శన ఉంటుంది. వాటిలోని కళాకృతులపై స్లీమన్ పెద్ద గొంతుతో ప్రత్యక్షవ్యాఖ్యానం వినిపిస్తూ ఉండేవాడు. విని విని ఇక భరించలేక సోఫియా చెవులు మూసుకునేది. అయినా అతనలా చెప్పడం ఆమెకు ఇష్టంగానే ఉండేది. జనం ఆగిపోయి ఈ నలభయ్యేడేళ్ళ ప్రొఫెసర్ ను, అతని పడచు భార్యను వింతగా చూసేవారు. కళాకృతుల పరిశీలనలో ఇద్దరిలోనూ ఒకే గాంభీర్యం, ఏకాగ్రత. సాయంత్రం హోటల్ గదికి తిరిగి వెళ్ళాక హోమర్ నుంచి రెండువందల పంక్తులు వల్లించమని ఆమెను కోరేవాడు. ఆమె వల్లిస్తూ వల్లిస్తూనే అప్పుడప్పుడు నిద్రలోకి జారిపోయేది. ఆమె అతనిలోని అధ్యాపకుణ్ణి మేలుకొలిపింది.

ఆమెను తన అభిరుచులకు అనుగుణంగా మలచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె భాషావేత్త కావాలని పట్టుబట్టాడు. ఒక ఏడాదిలో జర్మన్, ఇంకో ఏడాదిలో ఫ్రెంచ్ నేర్చేసుకోవాలన్నాడు. అది నీకేమంత కష్టం కాదని బోధించాడు. ఆమెను పారిస్ లోని సువిశాలమైన తన అపార్ట్ మెంట్ కు తీసుకెళ్ళాడు. అది చలికాలం. బాగా మంచుపడుతోంది. ఆమెలో బంధువులకు దూరమయ్యానన్న దిగులు. భర్త రకరకాల ఫ్యాషన్ దుస్తులు తెచ్చి పడేసి వాటిని వేసుకొమంటున్నాడు. కొప్పు ధరించమన్నాడు. కొంతమంది గ్రీకు అమ్మాయిలు ఇంటికి వచ్చినప్పుడు, ఆమె కొప్పు విప్పేసి మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళకు తన ఆటబొమ్మలు చూపిస్తూ మురిసిపోయింది.

పారిస్ ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. మంచుతో వాతావరణం అంతా తడి తడిగా ఉంది. కత్తితో కోస్తున్నట్టు చలిగాలులు. అతని స్నేహాలు, ఆసక్తులు; తరచు జియోగ్రాఫికల్ సొసైటీ సందర్శనలు; ట్రాయ్ గురించీ, మైసీనియా గురించీ, గ్రీకు ద్వీపకల్పంలోని దీవుల గురించీ అతను అదేపనిగా మాట్లాడుతుండడం, అక్కడ భూమిలో కప్పడిన నిధినిక్షేపాల గురించిన అతని ఊహలూ-అన్నీ క్రమంగా ఆమెకు విసుగు తెప్పిస్తున్నాయి. స్లీమన్ బుర్రకు విశ్రాంతి అన్న ప్రశ్నే లేదు. అది గడియారంలా ఎప్పుడూ పనిచేస్తూ ఉండాల్సిందే. తనేమిటో నిరూపించుకోవాలన్న అంతులేని తపనతో ఒక కార్యక్షేత్రం కోసం ఇప్పటికీ అతను వెతుకుతూనే ఉన్నాడు.

స్లీమాన్ & సోఫియా

జనవరి చివరికల్లా మళ్ళీ అస్తిమితంలోకి జారిపోయాడు. ట్రాయ్ కి తిరిగివెళ్లే ఆలోచన ప్రారంభించాడు. అంతలో, కూతురు నడేజ్దా చనిపోయినట్టు పిడుగుపాటులాంటి వార్త! దుఃఖంతో కుప్పకూలిపోయాడు. మళ్ళీ ఏవేవో భూతాలు అతన్ని వెంటాడసాగాయి. కూతురి మరణానికి తనే కారణమనుకుంటూ తనను నిందించుకున్నాడు. ఆమెను దక్కించుకోడానికి తను ఏమైనా చేసి ఉండేవాడు. పెద్ద పెద్ద డాక్టర్లను ఇంటికే రప్పించి వైద్యం చేయించి ఉండేవాడు. అమ్మాయి అస్వస్థ గురించి ముందే తనకు చెప్పి ఉంటే ఎంత బాగుండేదనుకున్నాడు. మిగతా పిల్లల్ని ఓదార్చడానికి అప్పటికప్పుడు సెయింట్ పీటర్స్ బర్గ్ కు బయలుదేరాలనుకున్నాడు కానీ, ఇక్కడ సోఫియా జబ్బుపడింది.

మనిషి పాలిపోయి, నిస్తేజంగా అయిపోయింది. డాక్టర్లకు మాత్రం ఆమెలో ఎలాంటి లోపం కనిపించలేదు. ఫ్రెంచీ, జర్మనూ ఒకేసారి నేర్చుకోవాలని అతను ఒత్తిడి తేవడంతో ఆమె ఎక్కువ కష్టపడుతోంది. ఆమెలో ఇంత మందకొడితనం ఏమిటని అతను అనుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఆమెను సర్కస్ కు తీసుకెళ్లేవాడు, దానిని బాగా ఆనందించింది. కానీ ఎక్కువగా థియేటర్ కు తీసుకెళ్ళేవాడు. వజ్రపు నగలు వేసుకుని, బాక్స్ లో బాసింపట్టు వేసుకుని కూర్చుని, తనకు ఏమాత్రం అర్థం కాని ఉపన్యాసాలు వింటూ విసుగుతో కన్నీళ్ళ పర్యంతం అయ్యేది. చివరికి డాక్టర్లు ఇంటిబెంగ అని తేల్చారు.

ఫిబ్రవరి మధ్యకల్లా ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఉన్నట్టుండి ఏడవడం మొదలెట్టేది. ఆమెను ఎథెన్స్ లో దింపి తను ట్రాయ్ కి వెళ్లాలని స్లీమన్ నిర్ణయించుకున్నాడు. తవ్వకాలకు అనుమతిస్తూ టర్కిష్ ప్రభుత్వం నుంచి ఫర్మానా తెప్పిస్తానని కల్వర్ట్ వాగ్దానం చేశాడు. కానీ ఇంతవరకూ అది రాలేదు.  భార్యతో కలసి నీమన్ అనే స్టీమర్ మీద మార్సే నుంచి పిరయాస్ వెడుతూ, 1870 ఫిబ్రవరి 17న కల్వర్ట్ కు ఇలా ఉత్తరం రాశాడు. అందులో ఎప్పటిలా అతని అసహనం తొంగిచూసింది:

మీకు ఫర్మానా వచ్చిందీ లేనిదీ దయచేసి వెంటనే నాకు తెలియజేయండి. వచ్చి ఉంటే తక్షణమే హిస్సాలిక్ దగ్గర తవ్వకాలు ప్రారంభిస్తాను. పూర్తి అనుకూల వాతావరణం రాకుండా ఇంత ముందే పని ప్రారంభించడం అడ్డంకి అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే, ఇక్కడి వాతావరణం అనుకూలంగా, ఆహ్లాదకరంగా ఉంది. ట్రయాడ్(ట్రాయ్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు)లో ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. అదీగాక, ఆ తర్వాత నాకు వేరే అత్యవసరమైన పనులు కూడా ఉన్నాయి కనుక వెంటనే తవ్వకాలు ప్రారంభించాలనుకుంటున్నాను.

కనుక, మీకు ఫర్మానా వచ్చి ఉంటే దయచేసి అవసరమైన పరికరాలు, సాధనాల జాబితా మరోసారి రాసి పంపగలరు. పారిస్ నుంచి బయలుదేరే హడావుడిలో మీరు కిందటి సారి రాసిన లేఖలోని జాబితాను కాపీ చేసుకోవడం మరచిపోయాను…

స్లీమన్ ఎథెన్స్ కు చేరుకున్నాడు. అప్పటికీ ఫర్మానా రాలేదు. దాంతో మైసీనియాలో కొన్ని తవ్వకాలు జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు. అయితే, అప్పటికి కొన్ని మాసాల క్రితమే ఏడుగురు ఆంగ్లేయుల బృందాన్ని బందిపోట్లు హత్య చేయడంతో మారుమూల ప్రాంతాలలో ఒంటరిగా తిరిగే పురావస్తుపరిశోధకుల మీద గ్రీకు ప్రభుత్వం మండిపడుతోంది. దాంతో నిస్పృహ చెందిన స్లీమన్ ఫర్మానా వచ్చేవరకూ ఎజియన్ సముద్రపు దీవుల మధ్య పడవలో తిరుగుతూ కాలక్షేపం చేయాలనుకున్నాడు.

అదొక దుస్సాహసంగా పరిణమించింది. అతనికి పడవ ప్రయాణంలో అనుభవంలేదు. దానికితోడు, తను కుదుర్చుకున్న గ్రీకు పడవవాడి అనుభవం కూడా అంతంతమాత్రమే అనిపించింది. అపోలో(గ్రీకు దేవుడు) జన్మస్థలమైన డీలోస్ ను, పాలరాతి గుట్టలకు ప్రసిద్ధమైన పారొస్ ను, బాకస్ (రోమన్ దేవుడు)కు పవిత్రస్థలమైన నెక్సాస్ ను సందర్శించాడు. ఆ తర్వాత అతని పడవ తుపానులో చిక్కుకుంది. నాలుగురోజులపాటు రొట్టెతోనూ, మంచినీళ్ళతోనూ గడిపాడు. అక్కడినుంచి చిన్న దీవి అయిన తేరా(సెంటోరీనో)కు వెళ్లాడు. అది అన్నింటికన్నా ఎక్కువగా అతన్ని ఆకట్టుకుంది. ఎజియన్ సముద్రంలో విసిరేసినట్టు ఉన్న చిన్న చిన్న దీవుల్లో దాదాపు దక్షిణం కొసన ఉన్న ఈ దీవికి ఒక చరిత్ర ఉంది. క్రీ.పూ. 631 లో, ఆఫ్రికాలోని సంపన్న ప్రాంతమైన సైరీన్ ను తమ వలసగా మార్చుకోవడానికి గ్రీకులు ఈ దీవినుంచే బయలుదేరి వెళ్లారు. అది అగ్నిపర్వత ప్రాంతం కూడా. లావా పొరలతో; ఎరుపు, నలుపు, పసుపు, గోధుమ వంటి వివిధ రంగుల్లో ఏర్పడిన విచిత్ర శిఖరాలను చూసి స్లీమన్ ఆనందించాడు. ఈ శిఖరాలు ఏడువందల అడుగుల ఎత్తువరకూ ఉన్నాయనీ, “సంభ్రమం గొలిపే ఒక అద్భుతదృశ్యా”న్ని అవి ఆవిష్కరించాయనీ రాశాడు. ఆ దీవిలోని జనం కూడా అతనికి నచ్చారు. మూడు లావా పొరల కింద ఆమధ్యనే దొరికిన కొన్ని రాతి యుగపు కలశాలను వారి దగ్గర కొన్నాడు. అలా ఒక్కొక్క దీవినే చుట్టేసి తిరిగి ఎథెన్స్ కు వచ్చాడు.

ఇంతకుముందు గాలివాన, తుపానులాంటి ఒక పెద్ద విపత్తునుంచి బయటపడిన ప్రతిసారీ అతన్ని అదృష్టం వరిస్తూవచ్చింది. డచ్చి తీరానికి దగ్గరలో టెక్సెల్ దీవి దగ్గర అతను ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోయినప్పుడు అదే జరిగింది. అట్లాంటిక్ మధ్యలో సంభవించిన పెను తుపాను నుంచి బయటపడిన కొన్ని రోజులకే కాలిఫోర్నియా బంగారం వేటలో పెద్ద ముల్లెను మూటగట్టాడు. ఇప్పుడు కూడా తనను తేరా దీవిలోకి నెట్టుకుంటూ వెళ్ళిన నాలుగురోజుల తుపాను, ట్రాయ్ లో తనకోసం ఎదురుచూస్తున్న మరో గొప్ప అదృష్టాన్ని సంకేతిస్తూ ఉండచ్చని అతను భావించి ఉంటాడు.

అప్పటికీ కాన్ స్టాంట్ నోపిల్ నుంచి రావలసిన ఫర్మానా రాలేదు. అయినాసరే, తెగించాడు. తను ట్రయాడ్ కు వెళ్ళి తీరాలనీ, పనివాళ్ళను నియమించుకోవాలనీ, స్వయంగా చేతి గొడ్డలిని అందుకోవాలనీ, తనను ఏ శక్తీ ఆపలేదనీ నిర్ణయానికి వచ్చాడు. సోఫియాను ఎథెన్స్ లో ఉంచేసి, ఒంటరిగా, ఎవరి సాయమూ లేకుండా ట్రాయ్ మీద తుపానులా విరుచుకుపడడానికి బయలుదేరాడు.

(సశేషం)

 

 

 

 

గ్రీకు పెళ్లి కూతురు అన్వేషణలో…

స్లీమన్ కథ-15     

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ప్రముఖులకు, హోదాలో ఉన్నవారికి ఇచ్చే పురస్కారాలు స్లీమన్ కు ఎంతో విలువైనవిగా కనిపిస్తూ వచ్చాయి. అతనికీ బిరుదులు, సత్కారాల యావ పట్టుకుంది. తనను ఎవరైనా “హెర్ డాక్టర్” అని సంబోధిస్తేచాలు, అంతకన్నా తను కోరుకునేదేమీ ఉండదనుకున్నాడు. తను పారిస్ లో మకాం పెట్టి, సర్బాన్ యూనివర్సిటీలో చేరడానికి డాక్టరేట్ తెచ్చుకోవాలన్న తపన కూడా ఒక ప్రధాన కారణం. అయితే దురదృష్టవశాత్తూ, సర్బాన్ యూనివర్శిటీ నిబంధనల ప్రకారం అతను అతిథి విద్యార్థే తప్ప నిత్యవిద్యార్థి కాడు. కనుక, ఆ యూనివర్సిటీనుంచి డాక్టరేట్ పొందే అవకాశం లేదు. దాంతో యూనివర్సిటీ ఆఫ్ రాష్టాక్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఏ విషయం మీద సిద్ధాంతవ్యాసం సమర్పిస్తారని ఆ యూనివర్సిటీ అడిగినప్పుడు, తన జీవితకథనే ప్రాచీన గ్రీకుభాషలో రాసి సమర్పిస్తానని చెప్పాడు. విచిత్రం!-విశ్వవిద్యాలయాల చరిత్రలోనే అపూర్వం, అసాధారణం అయిన ఈ ప్రతిపాదనను ఆ యూనివర్సిటీ ఆమోదించింది.  ఆవిధంగా స్లీమన్ సొంతకథను రాసి డాక్టరేట్ తెచ్చుకున్నాడు. తన పేరుకు ముందు ఎవరైనా ‘డాక్టర్’ తగిలించకపోయినా, తనను ‘డాక్టర్ స్లీమన్’ అని సంబోధించకపోయినా  చాలా బాధ పడేవాడు.

పారిస్ లోని తన అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటూ పురావస్తు విషయాల రచనతోనూ, ఆత్మకథా రచనతోనూ నవంబర్, డిసెంబర్ మాసాలు గడిపాడు. ఆ తర్వాత ట్రాయ్ తవ్వకాల వ్యవహారం అతని బుర్రను మళ్ళీ తొలవడం ప్రారంభించింది. అసలు పురావస్తు తవ్వకాల గురించి తనకు ఎంత తెలుసు? ఎక్కడ, ఎలా ప్రారంభించాలి? ఎంతమంది పనివాళ్లను పెట్టుకోవాలి? ఎంత ఖర్చవుతుంది? బందిపోట్ల బెడదను ఎలా ఎదుర్కోవాలి? చివరికి…తవ్వకాలు జరిపేటప్పుడు ఎలాంటి టోపీ ధరించాలి?-ఇలా అనేక ప్రశ్నలు, సందేహాలు అతని ముందు వేళ్లాడాయి.

ఓ పందొమ్మిది ప్రశ్నలను దండగుచ్చుతూ, వెంటనే సమాధానం రాయమని అర్థిస్తూ 1868, డిసెంబర్ చివరిలో ఫ్రాంక్ కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు:

  1. పని ప్రారంభించడానికి ఏది అనువైన సమయం?
  2. వసంతంరాగానే వీలైనంత త్వరగా ప్రారంభించడం మంచిదా?
  3. నాకు తరచు జ్వరం వస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో వసంతకాలంలో జ్వరాలు వచ్చే అవకాశం ఉందా?
  4. నాతో ఏయే మందులు పట్టుకెళ్లాలి?
  5. ఇక్కడినుంచే ఓ నౌకరును తీసుకుని వెళ్లనా? లేక ఎథెన్స్ లోనే నమ్మకస్తుడు ఎవరైనా దొరుకుతాడా? టర్కిష్ మాట్లాడగలిగే నమ్మకస్తుడైన గ్రీకు అయితే మంచిదనుకుంటాను.
  6. ట్రాయ్ ప్రాంతంలోని అన్ని ఇళ్ళలో పురుగూపుట్రా ఎక్కువ కనుక, మార్సే (Marseille: ఫ్రాన్స్ లోని ఒక పురాతన రేవు పట్టణం)నుంచే ఓ గుడారాన్ని, ఇనపమంచాన్ని, దిండును తీసుకెళ్ళమంటారా?
  7. నాతో ఏయే పరికరాలు, అత్యవసరాలు పట్టుకుని వెళ్ళాలో దయచేసి వివరంగా రాయగలరు.
  8. పిస్టల్స్, బాకు, రైఫిల్ దగ్గరుంచుకోవాలా?
  9. కొండమీద తవ్వకాలు జరపడానికి ఆ స్థలయజమానులు అభ్యంతరం చెబుతారా?
  10. అవసరమైనంతమంది పనివాళ్లు దొరుకుతారా? వాళ్ళను ఎక్కడినుంచి తెచ్చుకోవాలి, ఎంత కూలి ఇవ్వాలి?
  11. ఎంతమందిని తీసుకోవాలి? గ్రీకులో, టర్కులో అయితే మంచిదా?
  12. ఆ కొండను తవ్వడానికి ఎంత సమయం పట్టచ్చని మీరు అనుకుంటున్నారు?
  13. ఎంత ఖర్చవుతుంది?
  14. మొదట ఓ సొరంగాన్ని తవ్వమని మీరు సూచించారు. అదంత ఆచరణయోగ్యం కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అక్కడ పురాతన ఆలయాలు, ఇతర కట్టడాల శిథిలాలు ఉంటే అవి దెబ్బతినే ప్రమాదముంది.
  15. ఆ కొండ సహజంగా ఏర్పడింది కాదనీ, కృత్రిమమైనదనీ మీరు ఎలా నిర్ధారణకు వచ్చారు?
  16. ఆ కొండ విస్తీర్ణం 700 చదరపు అడుగులు ఉంటుందని మీరు సూచించారు. ఫ్రెంచివాళ్ళ లెక్క ప్రకారం అది 26.5 అడుగుల పొడవూ, అంతే వెడల్పూ అవుతుంది. మీ ఉద్దేశం, 700 అడుగుల పొడవూ, అంతే వెడల్పూ ఉంటుందని చెప్పడం అనుకుంటున్నాను. ఫ్రెంచి లెక్కలో అప్పుడది 4,90,000 చదరపు అడుగులు అవుతుంది. కానీ నా పుస్తకంలో దాని పొడవు, వెడల్పులు 233 మీటర్లని రాశాను. అప్పుడది 54,000 చదరపు మీటర్లు అవుతుంది.
  17. ఆ కొండ మీద ఎంత ఎత్తున తవ్వాలి?
  18. కాన్ స్టాంట్ నోపిల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం మంచిదని నాకు అనిపిస్తోంది. అప్పుడు దర్దనెల్స్ లోని ఆ బ్యాంక్ శాఖ ద్వారా రుణం పొందే వెసులుబాటు నాకు ఉంటుంది.
  19. మండుటెండలో పని చేసేటప్పుడు ఎటువంటి టోపీ పెట్టుకుంటే మంచిది?

ఫ్రాంక్ కల్వర్ట్ వెంటనే ఎంతో ఓర్పుతో సమాధానం రాశాడు.  మెత్తని చురకలు వేస్తూనే జాగ్రత్తలు చెప్పాడు. ఆయన పురాతత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి. నినవా(ప్రాచీన మెసొపొటేమియా నగరం. అసీరియన్ల రాజధాని. నేటి ఇరాక్ లో టైగ్రిస్ నది తూర్పుతీరంలో ఉంది)ను తవ్వి తీసిన ఆస్టెన్ హెన్రీ లయర్డ్(క్రీ.శ 1817-1894)ను విస్తృతంగా చదివినవాడు. కందకాలను ఎలా తవ్వాలో తన ఉత్తరంలో పూస గుచ్చినట్టు స్లీమన్ కు బోధించాడు. వసంతం ప్రారంభానికీ, వేసవికీ మధ్య తవ్వకాలను చేపడితే మంచిదన్నాడు. పనివాళ్లను ఎక్కడినుంచి తెచ్చుకోవాలో, ఎంత కూలి చెల్లించాలో కూడా రాశాడు. హిస్సాలిక్ కొండలో సగభాగం తన ఆస్తి అనీ, అక్కడ తవ్వకాలు జరపడానికి తన అనుమతి తప్పనిసరిగా ఉంటుందనీ మరోసారి గుర్తుచేశాడు. మిగిలిన సగభాగంలో తవ్వకాలు జరపాలనుకుంటే దాని యాజమానులను ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మాట ఇస్తూ, ఆ విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నానన్నాడు.  స్లీమన్ కు ఉన్న తేనీటి వ్యసనం గురించి తనకు తెలుసు కనుక; తేయాకును వెంట తీసుకుని వెడితే మంచిదనీ, అక్కడ కాఫీ, చక్కెర మాత్రం పుష్కలంగా దొరుకుతాయనీ రాశాడు. అవసరమైన సంబారాలన్నీ దర్దనెల్స్ నుంచి తీసుకువెళ్లచ్చన్నాడు. ఆపైన, ఆ ప్రాంతం పొడవు, వెడల్పులకు సంబంధించిన స్లీమన్ లెక్కలను సరిదిద్దాడు. పిస్టల్స్, బాకుల్లాంటి కాల్పనిక ఆయుధాలేవీ అవసరం లేదనీ, తుపాకులు వెంట ఉంటే చాలనీ అన్నాడు. ఇక వసతి విషయానికి వస్తే, సిప్లక్(టర్కీలో ఒక పట్టణం)లో ఇల్లు అద్దెకు తీసుకోమనీ, దానికి వెల్ల వేయిస్తే పురుగూ పుట్రా సమస్య ఉండదనీ సలహా ఇచ్చాడు. చివరిగా, టర్కులు ధరించే తెల్లని మజ్లిన్ తలపాగా మండుటెండ నుంచి తలకు మంచి రక్షణ ఇస్తుందన్నాడు.

కల్వర్ట్ లేఖలోని అంశాలను మననం చేసుకుంటూనే స్లీమన్ ఓసారి చుట్టం చూపుగా జర్మనీ వెళ్ళాడు. తను పచారీ కొట్టు నౌకరుగా పనిచేసిన పస్టెన్ బర్గ్ ను సందర్శించి, డాక్టరేట్ తీసుకోడానికి రాష్టాక్ వెళ్ళాడు. తన పుస్తకం ప్రచురణకర్తల చేతుల్లో ఉంది, ట్రాయ్ తవ్వకాలకు సమయం ఉంది కనుక, విడాకుల పని మీద ఇక ఇండియానాపోలిస్ కు వెళ్ళడమే తరవాయి అనుకుని అమెరికాకు ప్రయాణం కట్టాడు. వెంటనే విడాకులు లభిస్తాయని ఆశించాడు కానీ, తీరా వెళ్ళాక అదంత త్వరగా తెమిలే వ్యవహారంలా కనిపించలేదు. చట్టంలో కొన్ని ముఖ్యమైన సవరణలను సూచించాడు కానీ, చట్టసభ వాటిని తిరస్కరించింది. హోటల్ జీవితంతో విసుగెత్తి ఇండియానాపోలిస్ లోని ఓ సంపన్న ప్రాంతంలో ఇల్లు కొనుక్కున్నాడు. ఇంట్లో ఆఫ్రో-అమెరికన్ పనివాళ్లను, వంటమనిషిని పెట్టుకున్నాడు. అయిదుగురు న్యాయవాదులను నియమించుకున్నాడు. తన విడాకుల కేసును తనే వాదించుకుంటున్నాడా అన్నట్టుగా అందులో పూర్తిగా కూరుకుపోయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన పరిచితులైన న్యాయనిపుణులకు సుదీర్ఘమైన ఉత్తరాలు రాశాడు.  జూన్ లోగా విడాకులు పొందే అవకాశం కనిపించడం లేదనీ, ట్రాయ్ తవ్వకాలను వచ్చే వసంతానికి వాయిదా వేయవలసిరావచ్చనీ ఏప్రిల్ 14న కల్వర్ట్ కు ఉత్తరం రాశాడు.

అవే రోజుల్లో అతనోసారి న్యూయార్క్ లో స్ట్రీట్ కార్ లో ప్రయాణం చేస్తుండగా, ఓ ఎనిమిదేళ్ళ కుర్రాడు పుస్తకాలు అమ్ముతూ కనిపించాడు. “రెండు సెంట్లకు ఒక పుస్తకం” అని అరుస్తూ, ప్రయాణికుల చేతుల్లో పుస్తకాలు పెట్టాడు.  “అయిదు సెంట్లకు మూడు పుస్తకాలు” అని వాళ్ళ చెవిలో చెబుతున్నట్టు చెప్పి, ఆ తర్వాత అందరినుంచీ పుస్తకాలో, డబ్బులో వసూలు చేసుకున్నాడు. స్లీమన్ కు ముచ్చటేసి ఆ కుర్రాడి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఏడాది క్రితం తండ్రి చనిపోయాడనీ, తల్లి జబ్బుమనిషి అనీ, తాము ఆరుగురు సంతానమనీ, కుటుంబానికి సాయంగా తనిలా పుస్తకాలు అమ్ముతున్నాననీ అతను చెప్పాడు. అయ్యో అనుకున్న స్లీమన్ అతని చేతిలో ఓ డాలర్ ఉంచబోతే, తిరస్కరించాడు. “నా దగ్గర మీరు అరవై పుస్తకాలు తీసుకుంటేనే మీ డబ్బు తీసుకుంటాను. నేను వ్యాపారిని, బిచ్చగాణ్ణి కాదు” అన్నాడు పౌరుషంగా. ముగ్ధుడైపోయిన స్లీమన్ అతనికి డాలరిచ్చి అరవై పుస్తకాలు తీసుకున్నాడు. ఆ తర్వాత, “రేపు నీకు పట్టబోయే అదృష్టానికి ఈ డాలరే పెట్టుబడి కావాలని ఆశిస్తున్నాను. నువ్వు ఏదో ఒక రోజున గొప్ప ధనవంతుడివి కావాలనీ; నీలాంటి ఉత్తమపౌరుల కారణంగా ఆత్మగౌరవంతోనూ, వైభవంతోనూ వెలిగిపోయే ఈ ఘనతవహించిన దేశం, చరిత్రలోని మహోజ్వల సామ్రాజ్యాలను అన్నింటినీ మించిపోవాలనీ కోరుకుంటున్నాను” అంటూ చిన్న ఉపన్యాసం ఇచ్చాడు.

స్లీమన్ తనదైన పద్ధతిలో ఇండియానాపోలిస్ లో బిజీ అయిపోయాడు. అతని పిండి పదార్థాల ఫ్యాక్టరీ బాగా నడుస్తోంది. ఎప్పటిలా మనీ మార్కెట్ ను అధ్యయనం చేస్తున్నాడు. బ్రదర్స్ ష్రోడర్స్ కు సుదీర్ఘమైన వ్యాపార నివేదికలు పంపిస్తున్నాడు. తన అరబ్బీ పరిజ్ఞానానికి మెరుగులు దిద్దుకుంటున్నాడు.The Arabian Nights Entertainment  పై చిన్న పుస్తకం రాశాడు. ‘వివిధ భాషలను త్వరగా నేర్చుకోవడం ఎలా?’ అన్న అంశం మీద ఒక పెద్ద వ్యాసం రాసి పకిప్సీ(న్యూయార్క్ రాష్ట్రంలోని ఒక నగరం)లో జరుగుతున్న అమెరికా భాషాశాస్త్రవేత్తల సదస్సుకు పంపించాడు. ట్రాయ్ ను తాత్కాలికంగా పక్కన పెట్టేశాడు. నార్త్-వెస్ట్ పాసేజ్(ఉత్తర అట్లాంటిక్ ను ఆర్కిటిక్ సముద్రం మీదుగా పసిఫిక్ తో కలిపే మార్గం) మీదా, ఉత్తర ధృవాన్ని కనుగొనడం మీదా ఉత్సుకతను రంగరిస్తూ వరసపెట్టి ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు. వీటి అన్వేషకులకు ఆర్థికసాయం చేయడానికి కూడా ముందుకొచ్చాడు. ఇవన్నీ అలా ఉండగా, విడాకుల కేసు నానుతూ ఉండగానే, ఎకతెరీనా స్థానంలో కొత్త వధువు కోసం తనూ అన్వేషణ మొదలుపెట్టాడు. అది కూడా అసాధారణ రీతిలో!

గ్రీకు అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. గ్రీకు భాషలోని శ్రావ్యత అతన్ని కట్టి పడేయడమే కాకుండా, ఆడవాళ్ళు మాట్లాడితే అది మరింత శ్రావ్యంగా అనిపించింది. అయితే గ్రీకు వధువును ఎలా వెతికి పట్టుకోవాలనేది ప్రశ్న.  స్వయంగా గ్రీస్ కు వెళ్ళి, క్షుణ్ణంగా గాలించి యోగ్యమైన వధువును గుర్తించడం ఒక మార్గం. అంతలో, అంతకన్నా తేలిక మార్గం అతనికి తట్టింది. ఫిబ్రవరిలో అతని గ్రీకుయాత్రా గ్రంథం తాలూకు బౌండ్ చేయని ప్రతులు కొన్ని అందాయి. రెండు ప్రతులను తన మిత్రుడు థియోక్లిటస్ విమ్పోస్ కు పంపిస్తూ, అందులో ఒకటి అతన్ని తీసుకోమనీ, రెండోది ఎథెన్స్ యూనివర్సిటీ గ్రంథాలయానికి ఇవ్వమనీ కోరాడు. వాటిని బైండ్ చేయడానికి అయ్యే ఖర్చు కోసం 100 ఫ్రాంకులకు చెక్కును జతపరిచాడు. అందులో ఏమైనా మిగిలితే ఎథెన్స్ లోని బీదలకు వెచ్చించమని కోరాడు.

ఆ తర్వాత హఠాత్తుగా విషయానికి వచ్చాడు. దయచేసి ఒక గ్రీకు అమ్మాయి ఫోటో పంపగలరా అని అడిగాడు. ఆమె ఎవరైనా సరే, అందగత్తె అయితే చాలన్నాడు. ఫొటో స్టూడియోల అద్దాలపై ప్రదర్శించే ఫోటోలైతే మంచిదనీ, అప్పుడామె ఏ ఫ్రెంచ్ యువతో అయే ప్రమాదం తప్పుతుందనీ, ఫ్రెచ్ యువతులు ప్రమాదకారులన్న సంగతి అందరికీ తెలిసిందేననీ అన్నాడు. మొదట తటపటాయిస్తూనే ఈ విషయం ఎత్తుకున్నాడు కానీ, పోను పోను ధైర్యం చిక్కి తన మనసులోని అసలు కోరికను బయటపెట్టాడు. దయచేసి విమ్పోస్ స్వయంగా తనకు ఓ గ్రీకు వధువును చూసి పెట్టాలన్నదే ఆ కోరిక. ఆమెకు ఉండాల్సిన అర్హతల విషయానికి వస్తే, ఆమె అందగత్తే కాక, పేద కుటుంబానికి చెందినదై ఉండాలి. నల్లని జుట్టు, మంచి చదువు, ప్రేమించగల హృదయంతో పాటు; హోమర్ మీద ఆసక్తి కలిగినదై ఉండాలి. విమ్పోస్ సోదరి అయితే అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఆమెకు పెళ్లైపోయింది. బహుశా ఓ అనాథనో, ఒక పండితుని కుమార్తెనో, ఎవరింట్లో నైనా పిల్లలకు చదువు చెబుతూ నాలుగు రాళ్ళు తెచ్చుకుంటున్న అమ్మాయినో గుర్తించడం కష్టం కాకపోవచ్చు. చివరగా, మనసు విప్పి మాట్లాడడానికి ప్రపంచంలో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారంటూ, ఎథెన్స్ లోని పేదల కోసమని చెప్పి మరో 100 ఫ్రాంకులకు చెక్కు జోడించాడు.

ఆ ఉత్తరానికి విమ్పోస్ కోపగించలేదు. వెంటనే ఎథెన్స్ కు వెళ్ళి ఫొటోలు సేకరించి స్లీమన్ కు పంపించాడు. వాటిలో ఒక ఫొటో స్లీమన్ ను ఆకట్టుకుంది. ఆమె పేరు సోఫియా ఎంగస్త్రోమెనస్. నల్లని జుట్టు, లేతగా ఉన్న కోలముఖం, పెద్ద కళ్ళు, దట్టమైన, ఒంపు తిరిగిన కనుబొమలు… అసాధారణమైన అందం ఉట్టిపడుతోంది. ఆ ముఖంలో గాంభీర్యం ఉంది కానీ, చిన్నపిల్లల తరహా చిరునవ్వుతో అది చటుక్కున కాంతిమంతమయ్యే చిన్నెలూ తొంగి చూస్తున్నాయి. స్లీమన్ ఆ ఫొటోకు పన్నెండు కాపీలు తయారు చేయించి ఒక కాపీని వెంటనే తండ్రికి పంపిస్తూ, దానికి ఒక ఉత్తరం జతపరిచాడు. ఈ ఫొటోలోని అమ్మాయి నీకు నచ్చుతుందనుకుంటున్నాననీ; అయితే, ఆమెలో చదువుసంధ్యలపట్ల ఉత్సాహం కనిపించకపోతే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాననీ అందులో రాశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై లో తను ఎథెన్స్ కు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుని జర్మనీకి తీసుకోస్తానని అన్నాడు.

కానీ విడాకుల కేసు ముందుకు సాగకపోవడంతో అతను జులైలో ఎథెన్స్ కు వెళ్లలేకపోయాడు. కాకపోతే, కేసు తనకు అనుకూలంగా పరిష్కారం కాదన్న భయం ఇప్పుడతనికి లేదు. మార్చిలో అతనికి అమెరికా పౌరసత్వం లభించింది. విడాకుల పత్రంపై సంతకాలు జరిగే రోజుకోసం ఓపికగా ఎదురుచూడడం మాత్రమే తనిప్పుడు చేయవలసింది. ఎట్టకేలకు జులై చివరిలో అతనికి విడాకులు మంజూరయ్యాయి. వెంటనే న్యూయార్క్ కు వెళ్ళి, అందుబాటులో ఉన్న మొదటి ఓడలో గ్రీస్ కు బయలుదేరాడు.  సోఫియాను పెళ్లి చేసుకునే విషయంలో అప్పటికీ అతను ఒక నిర్ణయానికి రాలేదు. ఓడ లోంచే ఒక మిత్రుడికి ఉత్తరం రాస్తూ, దేవుడు దయదలిస్తే గ్రీస్ లో తనకు వధువు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయనీ, అక్కడి అమ్మాయిలు ఈజిప్టు పిరమిడ్లలా అందంగా ఉంటారనీ అన్నాడు. తనను అలా పిరమిడ్ తో పోల్చడం సోఫియాకు నచ్చే అవకాశం లేదు.

అతను ఆగస్టులో, సెయింట్ మెలిటస్ ఫీస్టు రోజున గ్రీస్ చేరుకున్నాడు. ఎథెన్స్ కు వాయవ్యంగా మైలుదూరంలో కొలొనస్ అనే చిన్నపట్టణంలో ఎంగస్త్రోమెనస్ కుటుంబానికి ఒక తోట ఇల్లు, దానికి దగ్గరలో ఓ చిన్న చర్చి ఉన్నాయి. సెయింట్ మెలిటస్ ఆ చర్చికి పోషకుడు. కొలొనస్- గ్రీకు సంగీత, నాటక కర్త సోఫోక్లీస్ జన్మస్థలం కూడా. ఈడిపస్ అనూహ్యంగా అంతర్ధానమైన చోటు కూడా ఇదేనని చెబుతారు. “మంచు బిందువులతో తడిసి కొలొనస్ తెల్లగా మెరిసిపోతూ ఉంటుందనీ, ద్రాక్షమద్యం రంగులో ఉన్న మొక్కల లోంచి స్వచ్చమైన గొంతుతో నైటింగేళ్ళ పాట వినిపిస్తూ ఉంటుం”దనీ సోఫోక్లీస్ వర్ణిస్తాడు.

థియోక్లిటస్ విమ్పోస్ తో కలసి కొలొనస్ లోని ఆ చర్చి దగ్గరికి స్లీమన్ వెళ్ళేసరికి అక్కడ అనూచానంగా వస్తున్న మెలిటస్ పండుగ జరుగుతోంది. అమ్మాయిలు పూలదండలు తీసుకుని చర్చికి వస్తూ కనిపించారు. ఇంతకన్నా పునీతమైన ప్రాంగణం, పవిత్రమైన రోజు ఉండదనుకుని స్లీమన్ సంతోషించాడు.

సోఫియా ఓ అనాథా కాదు, ఆమెకు ఎవరింట్లోనో పిల్లలకు చదువు చెప్పి నాలుగు రాళ్ళు తెచ్చుకోవలసిన అవసరమూ లేదు, ఆమె కుటుంబం పేదదని చెప్పడానికీ లేదు. ఆమె తండ్రి ఒక వస్త్రవ్యాపారి. ఎథెన్స్ లొ అతనికో దుకాణమూ, ఇల్లూ ఉన్నాయి. మంచి శారీరక దారుఢ్యంతో, గ్రీకుశిల్పంలా ఉన్న అతను స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని పతకం తెచ్చుకున్నాడు. స్లీమన్ వెళ్ళేసరికి సోఫియా చర్చిలోనే ఉంది. ఒక స్టూలు మీద నిలబడి పూలదండలు కడుతోంది. అంతలో “జర్మన్ వచ్చా”డని కేకలు వినిపించాయి. అంత త్వరగా వస్తాడని ఊహించని సోఫియా వెంటనే స్టూలు మీంచి దూకి దుస్తులు మార్చుకోడానికి ఇంట్లోకి పరుగెత్తింది.

(సశేషం)

 

 

 

ఎట్టకేలకు ట్రాయ్ నేల మీద…

 

స్లీమన్ కథ-14

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

స్లీమన్ గ్రామస్తులను కలసి, ఆ కొండ మీద ఇంతకుముందు ఎవరికైనా నిధినిక్షేపాలు దొరికాయా అని వాకబు చేశాడు. ఎప్పుడో 1811-14 ప్రాంతంలో కెప్టన్ గితారా అనే వ్యక్తి అక్కడ గాలింపులు జరిపాడనీ, అతనికి బంగారు చెవిపోగులు, మురుగులు దొరికినట్టు విన్నామనీ, అంతకుమించి తమకేమీ తెలియదనీ కొందరు చెప్పారు.

తను ‘లయర్టిస్ పొలం’ అనుకున్నచోట నిలబడి ఒడిస్సే లోని చివరి అధ్యాయాన్ని వల్లిస్తూ, దానిని వాళ్ళ మాండలికంలో గ్రామస్తులకు అనువదించి చెప్పడం ప్రారంభించాడు. అతని చుట్టూ మూగిన గ్రామస్తులు, ఒక విదేశీయుడు తమ పురాణకథల్ని తమ భాషలో అలా అనర్గళంగా అప్పజెబుతుంటే ఆశ్చర్యానందాలతో తలమునకలైపోయారు. తన ఇథకా మకాంలో అత్యంత మహత్తర క్షణాలు ఇవే ననుకుంటూ ఆ అనుభవాన్ని స్లీమన్ ఇలా గుర్తుచేసుకున్నాడు:

మూడు వేల ఏళ్ల క్రితం వైభవోపేతులైన తమ పూర్వీకులు మాట్లాడిన భాషలో హోమర్ అత్యంత శ్రావ్యంగా రాసిన ఆ ఘట్టాలను వింటుంటే వాళ్ళలో ఉత్సుకత, ఉద్వేగం కట్టలు తెంచుకున్నాయి. ఆ క్షణంలో తాము నిలబడి ఉన్నచోటే లయర్టిస్ ఎదుర్కొన్న దుర్భరమైన కష్టాల గురించీ, చనిపోయాడనుకున్న కొడుకు ఇరవయ్యేళ్ళ తర్వాత తిరిగి వచ్చినప్పుడు అతను పట్టలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవడం గురించీ విని అందరూ కన్నీటి ప్రవాహంలో మునిగిపోయారు. నా వల్లింపు పూర్తి కాగానే ఆడ, మగ, పిల్లలతో సహా అంతా నా దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకున్నారు. “మాకు ఎంత సంతోషం కలిగించావో చెప్పలేం. వెయ్యి సార్లు నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం” అన్నారు. నన్ను తమ భుజాల మీద మోసుకుంటూ ఊళ్ళోకి తీసుకెళ్లారు.

అక్కడి తవ్వకాల్లో ఇంకేవీ దొరక్కపోవడంతో ఓడమీద కోరింత్ కు బయలుదేరి వెళ్ళాడు. అదో అధ్వాన్న ప్రదేశం. హోటళ్లు లేవు. మరోసారి ఓ చీకటి గుయ్యారం లాంటి సత్రంలో నల్లుల మధ్య గడిపాడు. పొద్దుటే లేచి సముద్రానికి వెళ్ళి ఓ అరగంటసేపు ఈత కొట్టాడు. ఆ తర్వాత ఓ మార్గదర్శిని, తనకు రక్షణగా ఇద్దరు సైనికులను నియమించుకున్నాడు. ఒక గాడిదను సంపాదించుకున్నాడు. అక్కడినుంచి దక్షిణంగా బయలుదేరి, చర్వాటి అనే గ్రామంలో మార్గదర్శినీ, సైనికులనూ ఉంచేసి తను మైసీనియాకు వెళ్ళాడు. అక్కడి సింహద్వారం(Lion Gate)తప్ప ఇంకేవీ అతన్ని అంతగా ఆకట్టుకోలేదు. మధ్యాహ్నానికి తిరిగి చర్వాటి వచ్చేసరికి మార్గదర్శి, సైనికులు నిద్రపోతున్నారు. వాళ్ళ ముఖం మీద నీళ్ళు చిలకరించి లేపాడు. వెంటనే బయలుదేరి ఆర్గోస్ కు వెడదామన్నాడు. సాయంత్రానికల్లా ఆర్గోస్ చేరుకోవడం అసాధ్యమని వాళ్ళు అన్నారు. ఈ ఊళ్ళో నిమిషం కూడా ఉండలేననీ, ఇంత దరిద్రంగా, మురికిగా ఉన్న ఊరు గ్రీస్ లోనే ఎక్కడా చూడలేదనీ, మంచి ఆహారం కాదు సరికదా స్వచ్ఛమైన నీళ్ళు కూడా లేవనీ అంటూ వాళ్ళకు నచ్చజెప్పి, సైనికులకు చిన్న చిన్న కానుకలు ఎరేసి ఆర్గోస్ కు బయలుదేరదీశాడు. దూర ప్రయాణం, దానికితోడు ఎండ… ఆర్గోస్ చేరేసరికి బాగా అలసిపోయాడు.  ప్రాచీన గ్రీస్ లో ఆర్గోస్ గొప్ప నగరమనీ, ఈ నగరవాసులు లలితకళలకు, ముఖ్యంగా సంగీతానికి ప్రసిద్ధులనీ రాసుకున్నాడు. అక్కడ దొరికే ‘మంచి నాణ్యమైన, మధురమైన మద్యా’ల గురించి రాస్తున్నప్పుడు మరింత మైమరచిపోయాడు.

మరునాడు మధ్యాహ్నం టిరిన్స్ కు బయలుదేరాడు. బ్రహ్మాండమైన గోడలతో అదో పెద్ద కోట. అయితే అదేమంత గొప్పగా అతన్ని ఆకట్టుకోలేదు. టిరిన్స్ గురించి రాసిన రెండు పేజీలను భాషాశాస్త్రసంబంధమైన ప్రశ్నలతో నింపేశాడు. శిథిలాలతోనూ, వెంట ఉన్న సిబ్బందితోనూ విసిగిపోయినట్టున్నాడు; దగ్గరలోని నాప్లియా అనే పట్టణానికి ఒంటరిగా నడిచివెళ్ళాడు. మరోసారి సముద్రతీరానికి చేరుకున్నందుకు సంతోషించాడు. అక్కడి వాతావరణం కూడా చల్లగా హాయిగా అనిపించి ఉల్లాసం నింపింది. జీను లేకుండా గాడిద మీద తిరిగే బాధ తప్పింది. మంచి హోటల్, రుచికరమైన తిండి దొరికాయి. దాంతో అంతవరకూ ఉన్న ప్రయాణం బడలిక తీరేలా కొన్ని రోజులు విశ్రాంతిగా గడిపాడు. ఆ తర్వాత హైడ్రా దీవికి వెళ్లాలనుకున్నాడు.

ఓడకోసం ఎదురుచూస్తూ, ఓ రోజు మధ్యాహ్నం కొన్ని పుస్తకాలు చేతిలో పట్టుకుని ప్రధాన రహదారి మీద నడిచి వెడుతున్నాడు. కాళ్ళకు సంకెళ్ళు ఉన్న అయిదుగురు ఖైదీలు దుమ్ము కొట్టుకున్న ఆ రోడ్డు మీద వెడుతూ కనిపించారు. స్లీమన్ చేతిలో ఉన్న పుస్తకాలను చూసి ఓ ఖైదీ అతన్ని సమీపించి, ఓ పుస్తకం కానీ, వార్తాపత్రిక కానీ ఇవ్వగలరా అని అడిగాడు. అతను చక్కని రూపురేఖలతో, భారీగా, హుందాగా, ఒక రైతులా కనిపించాడు. స్లీమన్ వెంటనే ఓ పుస్తకం ఇచ్చాడు. అతను ధన్యవాదాలు చెప్పి, ఆ పుస్తకాన్ని తలకిందులుగా పట్టుకుని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. విస్తుపోయిన స్లీమన్, “చదవగలవా?” అని అడిగాడు. “ఒక్క ముక్క కూడా చదవలేను. కానీ త్వరలోనే నేర్చుకోవాలని ఉం” దని అతను సమాధానం చెప్పాడు. అంతలో మిగిలిన ఖైదీలు కూడా వారిని సమీపించారు. మీకు  సంకెళ్ళు ఎందుకు వేశారని స్లీమన్ అడిగాడు. మేము కొండ ప్రాంతానికి చెందిన రైతులమనీ, నిష్కారణంగా పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి హింసిస్తున్నారనీ వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటల్లో ఎంతో మర్యాద ఉట్టిపడింది. చదువుమీద వారి ఆసక్తి స్లీమన్ ను ప్రత్యేకించి ఆకట్టుకుంది. ఆ అయిదుగురూ ఓ హత్యానేరాన్ని ఎదుర్కొంటున్నారనీ, త్వరలోనే వారికి మరణశిక్ష అమలుచేయబోతున్నారనీ ఆ తర్వాత తెలిసింది.

అక్కడినుంచి ఓడలో బయలుదేరి ఎథెన్స్ కు చేరుకున్నాడు. తనకు సెయింట్ పీటర్స్ బర్గ్ లో గ్రీకు బోధించిన థియోక్లిటస్ విమ్పోస్ ఇప్పుడు మాంటినీయాలో బిషప్ గా, ఎథెన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఇక్కడే ఉంటున్నాడు. ప్రాణం లేచొచ్చిన స్లీమన్ అతనితో స్నేహయాత్రను పునః ప్రారంభించాడు. ఇద్దరూ విడదీయలేని జంటలా కొన్ని రోజులపాటు తిరిగారు. ఆగస్టులో కాన్ స్టాంటినోపిల్ మీదుగా ట్రాయ్ కి దారితీశాడు. కాన్ స్టాంటినోపిల్ లోని రష్యన్ కాన్సూల్ అతనికి ఒక మార్గదర్శిని, రెండు గుర్రాలను సమకూర్చాడు.

sliiman

ఏవో స్వప్నలోకాల్లో విహరిస్తున్నట్టుగా ట్రాయ్ మైదానంలో తిరిగాడు. అది ఎత్తుపల్లాలు, మలుపులతో ఉన్న మెత్తని నేల. అక్కడక్కడ సింధూరం, సూచీపత్రం చెట్ల తోపులున్నాయి. నీళ్ళు తియ్యగా ఉన్నాయి. గాలి మద్యంలా మత్తెక్కిస్తోంది. అక్కడి బునర్ బషీ అనే ప్రాంతమే ఒకప్పటి ట్రాయ్ అని చాలాకాలంగా భావిస్తూవచ్చారు. కిక్కిరిసినట్టు ఉన్న చిన్న చిన్న ఇళ్లతో ఆ ప్రాంతం ఇప్పుడు పేదరికం ఓడుతూ కళావిహీనంగా ఉంది. అక్కడ టర్కులు, అల్బేనియన్ గ్రీకులు ఎక్కువమంది నివసిస్తున్నారు. దోమల వల్ల ఇళ్ల గోడల నిండా నల్లటి మచ్చలు పడ్డాయి. ఓ ఇంటి వాళ్ళు ఓ పాత్రతో స్లీమన్ కు పాలు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ పాత్రను చూడగానే అతనికి కడుపులో తిప్పినట్టు అయింది. దానిని శుభ్రం చేసి కనీసం పదేళ్ళు అయుంటుందనుకున్నాడు. ఆ అపరిశుభ్రత, అనాగరిక జీవన శైలీ; మార్గదర్శుల అజ్ఞానం అతన్ని బెంబేలెత్తించాయి. అయితే, ఇళ్ల కప్పుల మీద రెక్కలార్చుతూ తిరుగుతున్న గూడకొంగల్ని చూసి సంతోషించాడు. తను బాల్యాన్ని గడిపిన అంకెర్షాగన్ ను ఆ పరిసరాలు గుర్తుచేశాయి. “గూడకొంగల వల్ల ఎన్నో ఉపయోగాలు. అవి పాములను, కప్పలను తింటాయి” అని రాసుకున్నాడు.

ట్రాయ్ తెల్లగా మెరిసిపోయే పాలరాతి నిర్మాణాలతో, హుందాగా, ఠీవిగా, అజరామరంగా ఉంటుందని అతను ఊహించుకున్నాడు. కానీ బునర్ బషీని చూడగానే నీరుగారిపోయాడు. ప్రతిచోటా మురికీ, చెత్తకుప్పలూ. చుట్టుపక్కల ఉన్న చిత్తడినేలలనుంచి ఒకవిధమైన దుర్గంధం వీస్తోంది. అక్కడికి సముద్రం పదిమైళ్ళ దూరంలో ఉంది. అఖియన్లు రోజూ ఏడెనిమిదిసార్లు ట్రాయ్ నుంచి సముద్రతీరానికి వెళ్లివచ్చేవారని హోమర్ రాసిన సంగతి గుర్తొచ్చింది. దాంతో బునర్ బషీయే ట్రాయ్ కాకపోవచ్చనీ, ఆ లోయకు పశ్చిమం కొసన ఉన్న హిస్సాలిక్ కొండే కచ్చితంగా ట్రాయ్ అయుంటుందనీ అనుకున్నాడు. Dissertation on the Topography of Troy(1822) రాసిన ఆంగ్లపండితుడు చార్లెస్ మెక్లారెన్ కూడా అలాగే భావించాడు.

దర్దనెల్స్(టర్కీలో ఒక నగరం)లో అమెరికా వైస్-కాన్సూల్ గా పనిచేసిన మరో ఆంగ్లేయుడు ఫ్రాంక్ కల్వర్ట్ అభిప్రాయం కూడా అదే. హిస్సాలిక్ కొండలో సగభాగం అతని ఆస్తి. ఆస్ట్రియా కాన్సూల్ వాన్ హాన్ తో కలసి కల్వర్ట్ ఆ ప్రదేశంలో ప్రాథమికమైన తవ్వకాలు చేపట్టి, రెండు కందకాలు తవ్వించాడు. ఆ కొండకు తూర్పు వాలున, పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించిన ఓ ప్రాసాదం లేదా దేవాలయం తాలూకు అవశేషాలు బయటపడ్డాయి. ట్రాయ్ ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టానన్న నిర్ధారణకు వచ్చి, తన పరిశోధన ఫలితాల గురించి ఆర్కియలాజికల్ జర్నల్ కు రాశాడు. ట్రాయ్ ని కనిపెట్టిన గౌరవం బ్రిటిష్ కు దక్కాలనే ఆకాంక్షతో ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున తవ్వకాలను చేపట్టవలసిందిగా బ్రిటిష్ మ్యూజియంను కోరాడు. కానీ ఆ వైపునుంచి స్పందన లేదు. ఇక, కల్వర్ట్ తమ్ముడు ఫ్రెడరిక్ కూడా బునర్ బషీకి దగ్గరలో అయిదువేల ఎకరాల ఎస్టేట్ కు యజమాని. తన ద్రాక్షతోటలకు సమీపంలో ఉన్న ప్రదేశమే ట్రాయ్ అని అతనూ అంతే గట్టిగా నమ్మాడు.

స్లీమన్ చేసిందల్లా కల్వర్ట్ అడుగుజాడల్లో వెళ్లడమే. హిస్సాలిక్ కొండ మీద దృష్టి పెట్టాడో లేదో; మబ్బులన్నీ ఇట్టే విడిపోయి, అంతా తేటతెల్లంగా ఉన్నట్టు అతనికి అనిపించింది. ఆ కొండకు వెళ్ళే దారులు, దాని ఆకారం, పరిమాణం, చివరికి ఫ్రాంక్ కల్వర్ట్ తవ్వించిన కందకాల దగ్గర కనిపించిన ఆధారాలతో సహా అన్నీ ట్రాయ్ ఇదేనని నిరూపిస్తున్నాయనుకున్నాడు. ఆ కొండ పై భాగంలో తవ్వితే ప్రియామ్(ట్రోజన్ యుద్ధసమయంలో ట్రాయ్ ను పరిపాలించే రాజు) ప్రాసాదం తాలూకు శిథిలాలు బయటపడచ్చని అనుకున్నాడు. అతని ఊహ ప్రకారం ఆ కొండమీదే కోట ఉండేది. ఆ కొండను చుట్టుకుని, కోటకు దిగువున ఎథెన్స్ నగరం విస్తరించి ఉండేది. కొండ చుట్టూ భూమిలో ఎన్నో శిథిలాలు సమాధై ఉండచ్చనీ, ఆ కొండ మీదే అనేక పాలరాతి భవనాలు, నిధినిక్షేపాలు, గ్రీకు హీరోల సమాధులు ఉండి ఉండచ్చనీ భావించాడు. రెండు వారాలు కూడా తిరక్కుండానే హడావుడిగా ఆగస్టు 21న కాన్ స్టాంట్ నోపిల్ కు తిరిగి వెళ్ళి, ఫ్రాంక్ కల్వర్ట్ ను కలసుకుని తన సూత్రీకరణలపై చర్చలు జరిపాడు.

లేడికి లేచిందే పరుగులా తక్షణమే రంగంలోకి దిగిపోవాలన్న స్లీమన్ అత్యుత్సాహం; భారీ ప్రణాళికలతో, హఠాత్ నిర్ణయాలతో హిస్సాలిక్ కొండ మీద అతను అక్షరాలా మెరుపుదాడికి సిద్ధమైనట్టు కనిపించడం కల్వర్ట్ కు వింత గొలిపాయి. ఆయన నిదానస్తుడు, ఆచి తూచి నిర్ణయాలు తీసుకునే మనిషి. ఇది తవ్వకాలకు అనువైన సమయం కాదనీ, వచ్చే వసంతం దాకా ఆగడం మంచిదనీ సలహా ఇచ్చాడు. ఈలోపల జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలనీ, ముఖ్యంగా టర్కీ ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవాలనీ చెప్పాడు. హిస్సాలిక్ కొండలో సగభాగానికి తనే యజమాని అయినప్పటికీ, అడ్డురాబోనని హామీ ఇచ్చాడు. కల్వర్ట్ ఔదార్యం, మంచితనం స్లీమన్ ను విచలితుణ్ణి చేసి ఆయనపై గౌరవాన్ని పెంచాయి. ఇంకొకరైతే ఇదే అవకాశం అనుకుని తనతో బేరసారాలకు దిగి ఉండేవారని అనుకున్నాడు.

కల్వర్ట్ సలహా పాటిస్తూ తన ఉత్సాహానికి కళ్ళెం వేయక తప్పలేదు. అందుకు ఇంకో కారణం కూడా ఉంది. అది, ఎకతెరీనాతో విడాకుల వ్యవహారం. వచ్చే వసంతం నాటికే అది సానుకూలమయ్యేలా చూస్తామని ఇండియానాపొలిస్ లోని మిత్రులు అతనికి మాట ఇచ్చారు. ఆ ప్రకారం వసంతం నాటికి అమెరికా వెళ్ళి ఆ పని పూర్తి చేయాలనీ, ఆ వెంటనే ట్రాయ్ కి తిరిగి రావాలనీ, ఈ లోపల పారిస్ వెళ్ళిపోయి శీతాకాలం అంతా అక్కడే గడుపుతూ గ్రీస్ లో తన ఆరువారాల పర్యటన విశేషాలతో పుస్తకం రాయాలనీ నిర్ణయించుకున్నాడు.

అనుకున్నట్టే, Ithaka, der Peloponnes und Troja అనే పేరుతో ఆ పుస్తకం పూర్తి చేశాడు. పురాతత్వ పరిశోధకుడిగా, భాషాశాస్త్రవేత్తగా, పురావస్తు తవ్వకాల నిపుణుడిగా, చరిత్రకారుడిగా, వ్యాపారవేత్తగా, ఉత్సుకత ఉరకలేసే బాలుడిగా తన అవతారాలన్నింటినీ అందులో గుప్పించేశాడు. అక్కడక్కడ మెరుపులున్నా, మొత్తం మీద ఆ పుస్తకం ఓ పరిశోధక విద్యార్థి రాసిన పత్రంలా చప్ప చప్పగా తయారైంది. దేవుడతనికి మంచి ఐశ్వర్యం, గొప్ప స్ఫురణ, బహుభాషా పాండిత్యం ఇచ్చాడు కానీ; దురదృష్టవశాత్తూ చక్కని శైలిని ఇవ్వలేదు. చాలాచోట్ల అతని రాత డబ్బు లావాదేవీల నమోదులా ఉంటుంది. దానికితోడు, అతని ఆలోచనల్లో స్పష్టత లోపించింది. నోయ్ స్ట్రీలిజ్ లో చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్ అతని శ్రద్ధాసక్తులను మెచ్చుకుంటూనే ఈ లోపాన్ని ఎత్తి చూపించాడు కూడా. ఆపైన తన పుస్తకంలో అసలు విషయం నుంచి పక్కకు వెళ్ళి భాషాశాస్త్ర సంబంధమైన చర్చలను అదే పనిగా సాగదీశాడు.  మధ్య మధ్య విశాలమైన అతని మెదడు లోతుల్లోంచి కొంత సరుకు ఉన్న ఆలోచనల బుడగలూ పైకి తేలాయి.

అతనిలో ఒకవైపు కీర్తి దాహం, ధనదాహం, అహం, అతిశయం, దాదాపు పరిచితులందరి పట్లా తృణీకారభావం; మరోవైపు అతి సామాన్యులతో కూడా కలసిపోయే తత్వం, వారిపై సానుభూతి, మెచ్చుకోలు వంటి మానవీయస్పందనలు! తనలోని ఇలాంటి వైరుధ్యాలను దాచుకోడానికి అతను ఏనాడూ ప్రయత్నించలేదు. ఈ పుస్తకమూ వాటికి అద్దం పట్టింది. తన జ్ఞానాన్ని అంతటినీ అందులో ఆడంబరంగా ప్రదర్శించాడు. తన వాదాన్ని వ్యతిరేకించే ఉటంకింపులను పూర్తిగా పక్కన పెట్టేసి, సమర్ధించే ఉటంకింపులను వరసపెట్టి ఇచ్చుకుంటూ పోయాడు. భాషాశాస్త్ర పరమైన ప్రతి జటిలమైన అంశాన్నీ తనదైన పద్ధతిలో చీల్చి చెండాడేశాడు. హోమర్ ను స్ట్రాబో(క్రీ.పూ. 64-క్రీ.శ. 24: గ్రీకు భౌగోళికశాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, చరిత్రకారుడు)వ్యతిరేకించిన ఘట్టాలలో హోమర్ ను కాపాడే బాధ్యతను తన భుజస్కంధాలపైకి తీసుకుని స్ట్రాబోను దుమ్మెత్తిపోశాడు. ఆయా ప్రదేశాలగురించి తన ఆరాధ్యకవి అందించిన సమాచారంలో ఏ ఒక్కరు ఏ చిన్న లోపాన్ని ఎత్తి చూపినా వాళ్లమీద విపరీతమైన అసహనాన్ని కుమ్మరించాడు. ఒక మతఛాందసుడి తరహాలో అతను హోమర్ ను సాక్షాత్తు దేవుడిగా ఆకాశానికి ఎత్తడం, ప్రతిపక్షవాదాలను గుడ్డిగా నరికి పోగులు పెట్టడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

ఇంగ్లీష్ లో హడావుడిగా రాసిన ఈ పుస్తకాన్ని జర్మన్ లోకి అనువాదం చేసి లీప్జిగ్ పబ్లిషర్ కు పంపించాడు. ఆ సంస్థ అతని ఖర్చుతోనే 750 కాపీలు ప్రచురించింది. ఒక రచయితగా తన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, ఆ పాత్రను ఎంత గాఢంగా తీసుకున్నాడో పదమూడేళ్ళ కొడుకు సెర్గీకి రాసిన ఈ ఉత్తరం వెల్లడిస్తుంది:

నా పురావస్తుపరిశోధనను పుస్తకరూపంలోకి తేవడంలో పగలూ, రాత్రీ శ్రమిస్తున్నాను. ఈ పుస్తకం రచయితగా నాకు పేరు తెస్తుందని ఆశపడుతున్నాను. నేను జియోగ్రాఫిక్ అండ్ ఆర్కియలాజికల్ సొసైటీలో సభ్యుణ్ణి. నా పుస్తకంలోని ముప్పై పేజీలను మిగతా సభ్యులకు చదివి వినిపించాను. నా పరిశోధనాంశాలపై వాళ్ళు ఎంతో ఉత్సుకతను చూపించారని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

ఈ పుస్తకం పాఠకాదరణ పొందితే నా శేషజీవితం అంతా పుస్తకాలు రాస్తూనే గడపాలని నిర్ణయించుకున్నాను. మంచి పుస్తకాలు రాయడం కన్నా ఆసక్తికరమైన వ్యాసంగం ఇంకొకటి లేదని నేను నమ్ముతున్నాను. ఒక రచన చేసేటప్పుడు రచయిత ఎంతో సంతోషాన్నీ, సంతృప్తినీ, శాంతినీ పొందుతాడు. ఆ మనస్థితిలోంచి సమాజంలోకి వచ్చిన తర్వాత తన పరిశోధనా ఫలాల గురించీ, తన తపస్సు గురించీ వేలాది విషయాలు ఇతరులకు బోధించగలుగుతాడు. ప్రతి ఒకరూ రచయితల మార్గదర్శనాన్ని కోరుకుంటారు, వాళ్ళను నెత్తిన పెట్టుకుంటారు. ఈ వ్యాసంగంలో నేనింకా అభ్యాసదశలోనే ఉన్నాను కానీ, పదింతల మంది మిత్రుల్ని మాత్రం సంపాదించుకోగలిగాను…

నిజానికి అతనికి సన్నిహిత మిత్రులంటూ ఎవరూ దాదాపు లేరు. అలాంటి స్నేహంకోసం, తనను అర్ధం చేసుకునే ఒక తోడు కోసం అతను రహస్యంగా పడే తపనా, ఆర్తీ అతని ఉత్తరాలన్నింటిలో కనిపిస్తాయి. గ్రీస్ అనుభవం అతన్ని జనసామాన్యానికి ఎంతో కొంత దగ్గర చేసింది కానీ, ఇప్పటికీ తనదైన ఏకాంతదుర్గంలో తను ఉంటున్నాడు. ఎదుటి వాళ్ళ మనోభావాలపై బొత్తిగా ఖాతరు లేకపోవడం, అదిలించి బెదిరించి పని చేయించుకోవడం, ముక్కోపం, ఎదుటివాళ్లకు ఎంతో హాస్యాస్పదమనిపించేలా తన గురించి తను గొప్పగా ఊహించుకోవడం…అన్నీ మామూలే.

అదలా ఉండగా, తన పేరుకు ముందు ‘డాక్టర్’ అని ఉండాలని అతని చిరకాలవాంఛ. ఒక విశ్వవిద్యాలయంనుంచి డాక్టరేట్ తెచ్చుకున్నాడు కూడా.

(సశేషం)

 

 

 

 

తొలి తవ్వకాలలో చితాభస్మం దొరికింది!

స్లీమన్ కథ-13

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

క్రిస్టమస్ రోజును పిల్లలతో గడపే అవకాశం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఉండేవాణ్ణని వాషింగ్టన్ లో ఉన్నప్పుడు అనుకున్నాడు. తనను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పిన సోఫీ ప్రాణాలు కాపాడడానికి, ఆకాశమే హద్దుగా ఏమైనా చేసి ఉండేవాడినని ఇప్పుడు అనుకుంటున్నాడు. హాంబర్గ్, బెర్లిన్ లలో ఉన్న పేరుమోసిన డాక్టర్ల నందరినీ ఆమె మంచం దగ్గరికే రప్పించి ఉండేవాడు. తను స్వయంగా ఆమెకు అహర్నిశలూ పరిచర్యలు చేసి ఉండేవాడు. ఆమె పట్ల తన ఆర్తీ, అంకితభావమూ బహుశా ఆమె ప్రాణాలను కాపాడి ఉండేవి. ఎంతో నైర్మల్యం, నిష్కల్మష హృదయం కలిగిన ఈ దేవతపై తన ప్రేమలో ఎలాంటి స్వార్థమూ, లైంగికవాంఛా లేవనీ; అది పూర్తిగా అమలిన ప్రేమ అనీ మనసుకు చెప్పుకున్నాడు.

ఆమె శవపేటిక ఫోటో పంపమని ఉత్తరం రాశాడు. ఆమెతో కలసి ప్రపంచాన్ని పది సార్లైనా చుట్టిరావడానికి తన ఆస్తి నంతటినీ కరిగించి ఉండేవాణ్ణని తోబుట్టువులకు రాశాడు. తను అమెరికా వెళ్లబోయేముందు సోఫీ తన తలవెంట్రుకనొకదానిని తనకు పంపితే దానిని నిర్లక్ష్యంగా ఓ పెట్టెలో పడేసిన సంగతిని గుర్తు చేసుకుని తన కృతజ్ఞతారాహిత్యానికి కుమిలిపోయాడు. ఆ తలవెంట్రుకను తన జీవితం మొత్తంలోనే ఒక పవిత్రనిధిగా భావిస్తాననీ, దానిని వజ్రాలు పొదిగిన బంగారు తొడుగులో ఉంచి జీవితాంతం గుండెలకు హత్తుకుంటాననీ అనుకున్నాడు.

సోఫీని అతను ప్రేమించింది స్వల్పకాలమే. ఆ తర్వాత తన మనసులోంచి ఆమెను తుడిచేసుకున్నాడు. అతని హృదయానికి దగ్గరైన అతి కొద్దిమందిలో ఆమె ఒకతె. మిన్నా మెయింక్, సోఫీ స్లీమన్…ఈ ఇద్దరే తనను నిస్వార్థంగా ప్రేమించారనుకున్నాడు. తన జీవనగమనంలోని అనేక ఘట్టాలలో సోఫీని ఎంతో ఇష్టంగా గుర్తుచేసుకున్నాడు. ఎకతెరీనాతో పెళ్ళికి ముందు తోబుట్టువులకు ఉత్తరం రాస్తూ ఆమె గురించి వాకబు చేశాడు. ఆమెను పెళ్లాడడం గురించి ఆలోచిస్తున్నట్టు అందులో సూచించాడు. అది, పదిహేనేళ్ళ క్రితం. అయితే, ఆమెపై ఒక స్పష్టమైన అభిప్రాయం ఏదీ అతనికి లేదు. ఇప్పుడామె హఠాత్తుగా కన్ను మూసింది. అంతే హఠాత్తుగా సమాధిలోంచి లేచి వచ్చి అతన్ని వెంటాడుతోంది.

మతం మీద, పరలోకం మీద అతనికి పెద్ద నమ్మకం లేదు. మానవప్రయత్నాన్నే నమ్మాడు. మనిషే అన్నిటికీ కొలమానం అనుకున్నాడు. తగిన పరిశ్రమా, నైపుణ్యాలే పెట్టుబడిగా సంపద గడించి ఈ భూమ్మీద లభించే సకల సౌఖ్యాలను అనుభవించే హక్కు ప్రతివారికీ ఉందని అనుకునేవాడు. కానీ ఇప్పుడా తాత్వికత పునాదులు కదిలిపోతున్నట్టు అనిపిస్తోంది. సోఫీ మరణంపై అతని దుఃఖవివశత్వంలో అతిశయం, స్వానుభూతి ఉన్న మాట నిజమే. వాటితోపాటు, ఆ వెంటనే జర్మనీకి వరసపెట్టి రాసిన ఉత్తరాల్లో అతనప్పుడన్న నైరాశ్యస్థితీ ఉట్టిపడుతోంది. సోఫీ తన జీవితం చివరి ఆరునెలలలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించిందని తెలిశాక అతనిలోని దుఃఖం, అపరాధభావం మరింతగా కట్టలు తెంచుకున్నాయి. తన సంపదలో లక్షో వంతు ధారపోసినా ఆమె సుఖంగా జీవించి ఉండేదన్న ఊహ ఛెళ్ళున చరచినట్టై తన పట్ల తనకే ఏవగింపు కలిగి, సిగ్గుతో చితికిపోయాడు. ఒక్కసారిగా ఆత్మపరిశీలనలో కూరుకుపోయాడు. అసలు తనెందుకు జీవిస్తున్నాడు, ఇన్ని ఆస్తిపాస్తులుండి కూడా తనకు సంతోషం ఎందుకు కరవైపోయింది; ఇంటికీ, ఇల్లాలికీ, పిల్లలకీ, వెచ్చని ఆత్మీయస్పర్శకూ దూరంగా, ఓ బిచ్చగాడిలా దేశదిమ్మరి జీవితం ఎందుకు గడుపుతున్నాడన్న ప్రశ్నలతన్ని ముంచెత్తాయి. ఎక్కడో భగవంతుడున్నాడు, ప్రపంచంలో ఏమూలో ఇంత శాంతి దొరుకుతుందనుకున్నాడు.

అలా కలగుండు పడుతున్న సమయంలోనే, తన బాల్యాన్ని మంత్రముగ్ధం చేసిన హోమర్ అతనికి హఠాత్తుగా గుర్తుకొచ్చాడు. ట్రాయ్ కథను పొందుపరిచిన ఇలియడ్ కర్తగా కాదు; ఒడిస్సే కర్తగా! అందులోని నాయకుడు ఒడీసియస్ కూడా తనలానే  దేశదిమ్మరి. తిరిగి తిరిగి చివరికి స్వస్థలమైన ఇథకా చేరుకుంటాడు. అయోనియన్ సముద్ర తీరంలో ఎత్తైన కొండమీద ఉన్న తన కోటకు వెళ్ళి భార్య పెనొలోపిని కలసుకుంటాడు. తను కూడా వెంటనే బయలుదేరి ఇథకాకు వెళ్ళాలి! అక్కడి ఒడీసియస్ కోటను అధిరోహించాలి. ఏమో ఎవరు చెప్పగలరు…ఏదో అద్భుతం జరిగి తను వెతికే తన పెనొలోపి అక్కడ కనిపించినా కనిపించవచ్చు. తన దేశదిమ్మరి జీవితానికి అంతటితో తెర పడినా పడచ్చు.

***

స్లీమన్ ఏ విషయంలో నైనా సత్వర నిర్ణయాలు తీసుకునే మనిషిగా పైకి కనిపిస్తాడు. కానీ అది కొంతవరకే నిజం. డబ్బుకు సంబంధించిన విషయాల్లోనూ, ఎంతో జటిలమైన వ్యాపార లావాదేవీల్లోనూ అతని బుర్ర పాదరసంలా పనిచేసి, అప్పటికప్పుడు తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటాడు. వ్యాపారపు లెక్కలు కట్టడంలోనూ అంటే చురుగ్గా పనిచేస్తాడు. కానీ ఇతర విషయాల్లో, ముఖ్యంగా వ్యక్తిగత విషయాల్లో చాలా మందకొడిగానూ, అనిశ్చితంగానూ వ్యవహరిస్తాడు. తన బలహీనతలు, లోపాలు ఆ సమయంలో జుట్టు విరబోసుకుని అతని ముందు ప్రత్యక్షమవుతాయి. ఇంతవరకూ సాగిన అతని జీవిత క్రమాన్ని చూస్తే, అది తిరిగిన ప్రతి ముఖ్యమైన మలుపు వెనకా ఒక విచిత్రమైన పోలిక కనిపిస్తుంది. తన చేతిలో లేని ఏ అదృశ్యశక్తులో ప్రతిసారీ అతన్ని ఆ మలుపు వైపు నెట్టాయి.

ఇప్పుడు కూడా అతనికి హఠాత్తుగా హోమర్ గుర్తొచ్చి ఆయన ఇతిహాసాలకు రంగస్థలమైన గ్రీస్ కు బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకోడానికి, చరిత్ర మీద మొదటినుంచీ తనకున్న ఆసక్తి ఒక్కటే కారణం కాదు. పురాతత్వశాస్త్రంలో తనకు గొప్ప పరిజ్ఞానం, ప్రావీణ్యం ఉన్నాయనీ కాదు. చనిపోయి దయ్యంలా వెంటాడుతున్న సోఫీ, భార్య తిరస్కృతీ, ఒంటరితనం అతన్ని అటువైపు బలవంతంగా తోశాయి. సోఫీ మరణం కలిగించిన దుఃఖం అతనిలో అంతర్మథనాన్ని రేపి తనకంటే అన్నివిధాలా శక్తిమంతమైన భగవంతుని ఉనికి గురించి ఆలోచింపజేసింది. ఆ దివ్యశక్తికి దాసోహమై తన జీవితాన్ని దాని చేతుల్లో పెట్టడం తప్ప మరో మార్గం లేదనిపించింది. తన జీవితశోధన; ఎంతో ఉత్సాహం, ఉత్సుకత నిండిన బాల్యంవైపు, బాల్యంలో తనను సూదంటురాయిలా ఆకర్షించిన హోమర్ వైపు అతన్ని నడిపించింది. ఈ సంక్షోభ క్షణాలలో హోమర్ అతనికి గుర్తొచ్చింది ఒక కవిగానో, తన భాషాశాస్త్ర అధ్యయనానికి ప్రేరణ అయిన ఒక సంక్లిష్ట భాషలో సిద్ధహస్తుడిగానో, అటిక్ నాటకకర్తలకు పితామహుడిగానో కాదు…మనిషి శిరసెత్తుకుని జీవించగలిగిన ఒక అద్భుత సమ్మోహకర సత్య ప్రపంచాన్ని సృష్టించిన దేవుడిగా!

1868 వేసవిలో అతను గ్రీసుకు బయలుదేరాడు. అప్పటికే తనో పురాతత్వశాస్త్ర కావాలని నిర్ణయించుకున్నాడు. ఇథకా వెళ్ళి అక్కడ ఐటియొస్ కొండ మీద ఒడీసీయస్ కోటను తవ్వి తీయాలని సంకల్పించుకున్నాడు. ఒడీసియస్ తన సుదీర్హయాత్రను ముగించుకున్నాక చింకిపాతలతో ఒక బిచ్చగాడి వేషంలో ఆ కోటలోకే ప్రవేశించాడు.

స్లీమన్ ముందుగా రోమ్ కు, నేపుల్స్ కు వెళ్ళి అక్కడినుంచి ఓడలో కోర్ఫుకు దారితీశాడు. అక్కడ ఒకరోజు మాత్రమే ఉన్నాడు. కోర్ఫు పురాతన నామం కొర్సైరా. హోమర్ పేర్కొన్న స్చేరియా దీవి బహుశా అదే నని ఊహ. అది ఫెయేషియన్ల నివాసప్రదేశం. ఫెయేషియన్ల రాజు అల్సినొవస్ కు అక్కడ అద్భుతమైన సౌధం ఉంది. ఒడీసియస్ సముద్రతీరానికి నగ్నంగా కొట్టుకు వచ్చినప్పుడు అల్సినొవస్ కూతురు నౌసికాయే అతనికి ఎదురై దుస్తులిచ్చి చక్కటి రథం మీద రాజసౌధానికి తీసుకెళ్లింది. ఆ సౌధం ఆనవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తాయేమోనని స్లీమన్ వెతికాడు కానీ కనిపించలేదు. దగ్గరలో ఉన్న ఒక ప్రవాహాన్ని చూసి, నౌసికా తన దుస్తులు ఉతుక్కుని చెలికత్తెలతో విహరించిన ఇతిహాసప్రసిద్ధమైన ప్రవాహం అదే కావచ్చనుకున్నాడు. అందులో నగ్నంగా ఈతకొట్టాడు. ఆ తర్వాత, అక్కడే ఉన్న పొదలను చూశాడు. నౌసికాను, ఆమె చెలికత్తెలను చూడగానే ఒడీసియస్ దాక్కొన్న పొదలు అవే అయుంటాయనుకుని వాటి వెనక నగ్నంగా నిలబడి కాసేపు తనను ఒడీసియస్ గా ఊహించుకుని సంతోషించాడు. కాకపోతే అతనికోసం ఏ కన్యలూ వచ్చి అక్కడ వాలలేదు. అతన్ని తీసుకెళ్లడానికి ఏ అద్భుతరథమూ రాలేదు!

మరునాడు ఆవిరిపడవ ఎక్కి సెఫలోనియా వెళ్ళాడు. అయోనియా దీవులలో అదే పెద్దది. దాని పురాతన రాజధానిని రోమన్లు ధ్వంసం చేశారు. అక్కడ ఆసక్తికరమైన దేదీ అతనికి కనిపించలేదు. అక్కడినుంచి  ఓ చిన్న సముద్రపు పాయను దాటి ఇథకాలో అడుగుపెట్టాడు. ఇతర దీవులను చూసినప్పుడు హోమర్ పేర్కొన్నవేనా అన్న అనుమానం కలిగింది కానీ, ఇథకాలో మాత్రం ప్రతిదీ హోమర్ ను గుర్తుచేసింది. “ప్రతి కొండ, గుట్ట, సెలయేరు, ఆలివ్ తోపు అచ్చంగా హోమర్ వర్ణించినట్టే ఉన్నాయి. ఒక్క గెంతులో వందతరాల వెనక్కి, గ్రీకు వీరుల ఉజ్వల యుగంలోకి వెళ్ళి పడ్డాను” అని రాసుకున్నాడు.

ఇథకాలో అడుగుపెట్టిన మరుక్షణం ఎవరో మంత్రించినట్టు అయిపోయాడు. దేనినీ విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క చోటుకీ వెళ్ళాడు. ప్రతిదీ కళ్ళు విప్పార్చుకుని చూశాడు. 120 డిగ్రీల ఎండ కాస్తోంది. అయినాసరే పట్టలేని సంతోషంతో పిచ్చెత్తినట్టు తిరిగాడు. హోటళ్లు లేవు. ఇద్దరు వృద్ధకన్యలు నడిపే సత్రంలో వసతి దొరికింది. ఓ మిల్లు పనివాడు పరిచయమయ్యాడు. అతని దగ్గర ఓ గాడిద ఉంది. స్లీమన్ ను ఆ దీవి అంతా తిప్పి చూపిస్తానన్నాడు. దీవి సన్నగా, ఎత్తుపల్లాలతో ఎనిమిది(8) అంకె ఆకారంలో ఉంది. హోమర్ ఇతిహాసం ప్రకారం ఒడీసియస్ కోట ఈ దీవిలోనే ఉంది.

ఆ మిల్లు పనివాడి పేరు పానగిస్ ఆస్ప్రైరికా. ఒడీసియస్ కు చెందిన కథలన్నీ అతనికి కరతలామలకం. వాటిని విరామం లేకుండా వల్లిస్తూపోయాడు. స్లీమన్ మధ్య మధ్య అతని వాక్ప్రవాహానికి అడ్డుతగిలి, “ఫోర్సిస్ ఓడరేవు అదేనా? అప్సరసల గుహలు ఎక్కడున్నాయి? లయర్టిస్(ఇతను ఒడీసియస్ తండ్రి అనీ, లేదా తండ్రి లాంటివాడనీ రెండు వాదాలు ఉన్నాయి)పొలం ఎక్కడుంది” అంటూ ప్రశ్నలు గుప్పించేవాడు. ఆ మిల్లు పనివాడు ఓ కథల పుట్ట. అవి తప్ప అతనికింకేమీ తెలియవు. స్లీమన్ కు విసుగొచ్చి, “ఇక్కడి రోడ్లు అంతూపొంతూ లేకుండా సాగుతున్నాయి. అలాగే ఇతగాడి కథలు కూడా” అని రాసుకున్నాడు. అయితే స్లీమన్ కు అతను బాగా నచ్చాడు. ఇద్దరూ జంటగా తిరిగారు. ఆ గ్రామస్తులు కూడా అతనికి నచ్చారు. అక్కడి రైతులు సీదా సాదాగానూ, స్నేహపాత్రులుగానూ, శ్రమజీవులుగానూ కనిపించారు. వాళ్ళలో సహజమైన ఉదాత్తత ఉట్టిపడుతోందనీ, వాళ్ళ కళ్ళలో నిజాయితీ ప్రతిఫలిస్తోందనీ, తమ పూర్వీకుడైన ఒడీసియస్ కు అన్నివిధాలా తగిన వారసులనీ అనుకున్నాడు. అన్నింటినీ మించి, ఒడీసియస్ నివసించిన కోటను తవ్వి తీయబోతున్నానన్న ఊహ అతనిలో అంతులేని ఆనందోత్సాహాలు నింపింది. రెండు రోజుల తర్వాత ఐటియొస్ కొండ ఎక్కాడు.

అది పెద్దగా ఖర్చులేని చిన్న ప్రారంభం. వెంట నలుగురు పనివాళ్లు, ఒక గాడిద. ఏడాది మొత్తంలోనే ఎండలు బాగా మండే కాలం కనుక, ఉదయం అయిదుకే బయలుదేరాలని ఉత్తర్వు చేశాడు. తను నాలుగుకే లేచి, సముద్రస్నానం చేసి, ఓ కప్పు బ్లాక్ కాఫీ తాగి బయలుదేరాడు. కొండ ఎక్కడానికి రెండు గంటలు పట్టింది. పైకి వెళ్ళాక పెలొపనీసెస్ పర్వతాలను ఆనుకుని ద్రాక్షమద్యం రంగులో ఉన్న సముద్రం కనిపిస్తుందనుకున్నాడు(హోమర్ తన ఇలియడ్ లో అలా వర్ణించాడు). ఆ ఎత్తునుంచి గ్రీస్ మొత్తాన్ని చూడచ్చేమో నని కూడా అనిపించింది.

మొదటిరోజు తవ్వకాల్లో చెప్పుకోదగినవేవీ దొరకలేదు. ఓ రైతు ఒక పురాతన కలశాన్ని, ఓ వెండి నాణేన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. కోరింత్ కు చెందిన ఆ నాణేనికి ఒకపక్క మినర్వా(ఒక గ్రీకు దేవత) శిరస్సు, ఇంకో పక్క ఓ గుర్రపు బొమ్మ ఉన్నాయి. మరునాడు, ఓ వలయాకారపు గోడ లోంచి మొలుచుకొచ్చిన చెట్ల కొమ్మలను పీకించి, దాని ఈశాన్యం దిక్కులో తవ్వమని పనివాళ్ళకు చెప్పాడు. సరిగ్గా అక్కడే ఒడీసియస్ తన శోభనం గదిని నిర్మించి ఉంటాడని అతనికి మెరుపులా తోచింది.

పనివాళ్లు అక్కడ తవ్వకుంటూ పోయారు. మూడు గంటల తర్వాత, 3 మీటర్ల వెడల్పు, 4.75 మీటర్ల పొడవు ఉన్న ఒక భవనం తాలూకు పునాదిరాళ్ళు బయటపడ్డాయి. ఒడీసియస్ శోభనం గదిని కనిపెట్టాననుకుని స్లీమన్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. అక్కడ, మట్టి కప్పేసిన ఒక అర్ధచంద్రాకారపు రాయి కనిపించింది. దానిని జాగ్రత్తగా పైకి తీసి, తనే చేతిగొడ్డలితో అక్కడ తవ్వడం ప్రారంభించాడు. నాలుగు అంగుళాల లోతున ఓ సున్నితమైన కలశం తగిలింది. గొడ్డలి దెబ్బకు అది ముక్క ముక్కలైపోయింది. ఆ తర్వాత మరో ఇరవై కలశాలు బయటపడ్డాయి. కొన్ని నిటారుగానూ, కొన్ని పక్కలకు ఒరిగిపోయీ ఉన్నాయి. వాటన్నింటిలో బూడిద ఉంది. అది కచ్చితంగా మనుషుల చితాభస్మమే అనుకున్నాడు. వాటి పక్కనే బలికి ఉపయోగించే ఆరంగుళాల కత్తి, పెదవులకు రెండు వేణువులను ఆనించుకుని ఉన్న అమ్మవారి మట్టిబొమ్మ, కొన్ని జంతువుల ఎముకలు కనిపించాయి. శాసనాలేవీ కనిపించలేదు.

స్లీమన్ ఉత్సాహానికి పట్టపగ్గాలు లేవు. పనివాళ్ళ వైపు తిరిగి, ఈ కలశాల్లో ఒక దాంట్లో ఒడీసియస్ చితాభస్మం ఉండి ఉంటుందన్నాడు. “క్యుమై నుంచి తెచ్చి, నేపుల్స్ మ్యూజియంలో భద్రపరచిన పురాతన కలశాల కన్నా కూడా ఇవి చాలా పురాతనమని నేను నమ్ముతున్నాను. వీటిలో ఉన్నది ఒడీసియస్, పెనొలోపిల చితాభస్మమో, వాళ్ళ వారసుల చితాభస్మమో కావడానికి ఎంతైనా అవకాశముం”దని డైరీలో రాసుకున్నాడు.

ఈ తొలి ఫలితాలు అతనిలోని పురావస్తుదాహాన్ని అమాంతం పెంచేశాయి. మొదటిసారి తనో పవిత్రస్థలిలో నిలబడి ఉన్నాననీ, ఎన్నో రహస్యాలను పొదవుకున్న పురాతనగతం ఆ భూమిలోంచి తననే తేరిపార చూస్తోందనీ అనుభూతి చెందాడు. అతనూహించినట్టు, బయటపడింది శోభనం గది కాదు; చితాభస్మం. అయినాసరే, కృతజ్ఞతాభావం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అనాయాసంగా లభించిన ఈ తొలి ఫలితాలు అతనికొక నష్టమూ కలిగించాయి. తనలో స్వభావసిద్ధంగానే ఒక గొప్ప పురాతత్వశాస్త్రవేత్త ఉన్నాడని ఇప్పుడు మరింత గట్టిగా నమ్మడం ప్రారంభించాడు. ఆ తదుపరి తవ్వకాలలో కూడా ఇదే ప్రణాళికను అనుసరిస్తూవెళ్ళాడు. ప్రతిచోటా ఓ ‘ఈశాన్యం మూల’ ఉండనే ఉంటుంది. హోమర్ పంక్తుల్ని పదే పదే నెమరువేసుకుంటూ, ఒకవిధమైన స్ఫురణతో ఒక ప్రదేశాన్ని ఎంచుకునేవాడు. ఇక్కడ నిధి నిక్షేపాలు ఉండచ్చని నిర్ణయానికి వచ్చేవాడు. అక్కడ తవ్వమని పనివాళ్ళకు చెప్పేవాడు. ఒక ప్రదేశాన్ని తను ఎందుకు ఎంచుకున్నాడో, ఎప్పుడో కానీ సహేతుకమైన వివరణ ఇచ్చేవాడు కాదు. స్ఫురణతోపాటు, తను గతంలోకి పయనిస్తున్నానన్న ఉత్సుకతా, ఉత్సాహాలే అతన్ని ముందుకు నడిపించాయి.

తొలి ఫలితాల రోజున అతను ఎంత ఉత్తేజితుడైపోయాడంటే; దహించే ఎండనూ, దప్పికనూ కూడా మరచిపోయాడు. మధ్యాహ్నం అయ్యేసరికి, పొద్దుటినుంచీ తాము ఏమీ తినలేదన్న సంగతి గుర్తొచ్చింది. పనివాళ్లను భోజనానికి పంపేసి తను ఆ కొండ కొనకు కొంచెం దగ్గరలో ఉన్న ఒక ఆలివ్ చెట్టు నీడలోకి వెళ్ళాడు. అంతలో ఒక విషయం అతనికి మెరుపులా స్ఫురించింది. ఇరవయ్యేళ్ళ తర్వాత స్వగృహానికి వచ్చిన యజమాని ఒడీసియస్ ను గుర్తుపట్టి అతని పెంపుడు కుక్క ఆర్గస్ పట్టలేని సంతోషంతో మరణిస్తుంది. అది చూసి ఒడీసియస్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సరిగ్గా తను నిలబడ్డ చోటే ఆ ఘటన జరిగి ఉంటుందని స్లీమన్ అనుకున్నాడు. ఆ ఊహతోపాటు మరికొన్ని ఊహలూ గొలుసుకట్టుగా అతని బుర్రను తాకాయి. బహుశా ఇక్కడే, లేదా ఇక్కడికి దగ్గరలోనే పందుల కాపరి యూమస్ ఈ మాటలు అనుంటాడనుకున్నాడు: ”ఒక మనిషి ఎప్పుడైతే దాస్యంలోకి జారిపోయాడో అప్పుడే సర్వసాక్షి అయిన ఆ జియస్ అతని విలువలో సగం హరించేస్తాడు.”

బ్రెడ్డుతోనూ, వైన్ తోనూ భోజనం చేశాక పనివాళ్లు కునుకుతీశారు. స్లీమన్ తవ్వకాన్ని కొనసాగించాడు. మద్యం ప్రభావం చూపించింది. ఇథకా వైను, బోర్డా వైనుకన్నా మూడురెట్లు ఘాటుగా ఉందనుకున్నాడు. ఆ రోజు తవ్వకాల్లో ఇంకేమీ దొరకలేదు. ఆ మరునాడూ అంతే…

(సశేషం)

 

 

 

ఒంటినిండా ఒంటరితనాన్ని కప్పుకుంటూ…

స్లీమన్ కథ-12

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పందొమ్మిదో శతాబ్ది, అరవయ్యవ దశకం నాటి ఫ్రాన్స్ బూర్జివాయిజీకి లొంగిపోయి ఉంది. నెపోలియన్-3 గద్దె మీద ఉన్నాడు. జబ్బు మనిషి. మాట నత్తి. ఎక్కడికెడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అతనికే తెలిసేది కాదు. ఎవరూ ఆయనను లెక్క చేసేవారు కాదు. చక్రవర్తినీ, ఆయన అందాల భార్య యుజినీని పరివేష్టించి ఉండే ఆస్థానసభ్యులు కూడా ప్రజలకుదూరంగా, ఎందుకూ పనికిరాని బాపతుగా ఉండేవారు. ఆ రోజుల్లో ఫ్రాన్స్ నిద్రమత్తులో జోగుతున్నట్టు ఉండేది. వృద్ధిలోనూ, తెలివిలోనూ యూరప్ మొత్తంలోనే మొదటివరసలో ఉన్నారనుకునే ఫ్రెంచి ప్రజలు కాస్తా అప్పటికి సెడాన్ విధ్వంసం దిశగా క్రమంగా అడుగులేస్తున్నారు.

సర్బాన్ లో చదువు ప్రారంభించిన స్లీమన్ చెరువులో చేపలా ఫ్రాన్స్ జీవనసరళిలో కలసిపోయాడు. సంపన్నుడు కనుక తను కోరుకున్న విధంగా జీవించే వెసులుబాటు అతనికుంది. ఓ ఉంపుడుగత్తె, విలాసవంతమైన రెస్టారెంట్లు, ఉన్నతవర్గాలతో సావాసం… ఏవీ అతనికి అందని పండ్లు కావు. పండితుడిగా సాటి పండితుల్లో అంతే తేలిగ్గా కలసిపోగలడు. ఆపైన; అమెరికా, క్యూబా, జర్మనీ, రష్యాలలో భారీ పెట్టుబడులు ఉన్న వర్తకప్రముఖుడిగా పారిస్ లోనూ యధేచ్ఛగా ఆస్తుల కొనుగోళ్ళు, అమ్మకాలు జరుపుకోగలడు.

బోయిస్డ్ బొలోని అనే చోట కొన్ని ఇళ్ళు కొన్నాడు. వాటికి అవసరమైన మరమ్మతులు జరిపించడం, సదుపాయాలు కల్పించి అద్దె కివ్వడం ఇప్పుడతని వ్యాపకాల్లో ఒకటి. మరమ్మతులకు, ఫర్నిచర్ కు అయ్యే ఖర్చు చూసి గుండెలు బాదుకునేవాడు. నిన్నటివరకూ ప్రతిక్షణాన్నీ నగదుగా మార్చుకుంటూ తీరిక లేకుండా గడిపిన ఈ అంతర్జాతీయ వ్యాపారవేత్త ఇప్పుడు ఇళ్ల ఏజెంట్ గా మారి గంటల తరబడి వాల్ పేపర్ చర్చలతో కాలం దొర్లించడం అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతుంది. సంసారజీవితం నింపిన చేదు, దుర్భరమైన ఒంటరితనం అతన్ని దిక్కుతోచని స్థితికి నెట్టాయి. వ్యాపారాలు కట్టిపెట్టడమే తన సమస్యలన్నింటికీ పరిష్కారమనుకున్నాడు. ఐశ్వర్యం తెచ్చిపెట్టే సుఖాలను దోసిళ్లతో జుర్రుకుంటూ ఫ్రాన్స్ లో ఉల్లాసంగా గడపచ్చనుకున్నాడు. కానీ ఆ రెండు అంచనాలూ తప్పాయి. నిస్సారంగా రోజులు గడుస్తున్నాయి.

అయితే, రోజువారీ కార్యక్రమాలను పద్ధతిగా జరుపుకునే అలవాటులో మార్పులేదు. ఇన్ని గంటలు చదువుకీ, ఇన్ని గంటలు ఇళ్ల బాడుగ వ్యవహారాలకూ, ఇన్ని గంటలు విందు వినోదాలకు కేటాయించుకుంటున్నాడు. థియేటర్లకు, గుర్రప్పందేలకూ వెడుతున్నాడు. గొప్పింటి మహిళల ఇళ్లనుంచి కూడా ఆహ్వానాలు అందుకుంటున్నాడు. తన లాంటి దేశదిమ్మరులందరికీ స్వర్గధామమైన పారిస్ లో ఎంతో కొంత ఓదార్పును పొందుతున్నాడు కానీ, మొత్తానికి అతని జీవితం చుక్కాని లేని నావ అయింది. తరచుగా సెయింట్ పీటర్స్ బర్గ్ వైపు గాలి మళ్ళుతోంది.

అన్నింటినీ మించి పిల్లల మీద బెంగపడుతున్నాడు. వాళ్ళు ఎకతెరీనా పెంపకంలో ఉన్న సంగతిని తలచుకున్నప్పుడల్లా కోపంతో రగిలిపోతున్నాడు. ఆమెకు ఉత్తరాలు రాస్తూ నయానా భయానా తనవైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నువ్వు వస్తానంటే డ్రెస్డన్ ఇంటికి మకాం మార్చేస్తాననీ, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాననీ రాశాడు. గుర్రపు బళ్ళు, గుర్రాలు, నగలు, పారిస్ లో లభించే అత్యంత ఖరీదైన దుస్తులతో సహా నువ్వు ఏది అడిగితే అది ఇస్తాననీ; నీ జీవితాన్ని నాతో పంచుకుంటే చాలనీ అన్నాడు. “నేనిప్పుడు పూర్తిగా పారిస్ వాసిని అయిపోయాను. కనుక డ్రెస్డన్ లో మనం చిలకా గోరింకల్లా సంతోషంగా గడప”చ్చని హామీ ఇచ్చాడు.

ఆమె ఎప్పుడో కానీ జవాబిచ్చేది కాదు. నీ మొహం చూడననీ, నీతో కాపురం చేయననీ, ఎట్టి పరిస్థితిలోనూ పిల్లలు నా కళ్ల ముందు ఉండాల్సిందేననీ ఓ ఉత్తరంలో ఖండితంగా చెప్పింది. దానికతను, “భార్యనుంచి కోరేది ఏదీ నీనుంచి కోరను. ఇద్దరం అన్నా, చెల్లెల్లా ఉందాం. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. నువ్వు నా కళ్ల ముందు ఉంటే చాలు. ఇప్పుడు నేనున్న అపార్ట్ మెంట్ అద్దెకిచ్చేసి, బోయిస్డ్ బొలోనిలో ఓ బ్రహ్మాండమైన భవంతిని కొంటాను. 40వేల ఫ్రాంకులు ఖర్చుపెట్టి దానిని అందంగా తీర్చిదిద్దుతాను. సెయింట్ పీటర్స్ బర్గ్ లో, డ్రెస్డన్ లో నేను కొన్న భవనాలు, ఇప్పుడు పారిస్ లో కొనబోతున్నదీ-అన్నీ నీవే. నీ ఆనందం కోసమే. నువ్వు ఎప్పుడనుకుంటే అప్పుడు ఈ మూడింటి మధ్యా తిరుగుతూ ఉండచ్చు” అని రాశాడు.

ఈ ప్రలోభాలేవీ పనిచేయకపోవడంతో బెదిరింపులు అందుకున్నాడు. నీకూ, పిల్లలకూ పంపే డబ్బు ఆపేస్తానన్నాడు. “మరీ మూర్ఖంగా మతిలేకుండా ప్రవర్తిస్తూ నీకు నువ్వే చెరుపు చేసుకుంటున్నావు. నువ్విలాగే ఉంటే నా ఆస్తి లోంచి పిల్లలకు కూడా చిల్లిగవ్వ ఇవ్వను. అందువల్ల రేపు వాళ్ళు అడుక్కుతినే పరిస్థితి వస్తే అందుకు నీదే బాధ్యత. మరీ తెగే దాకా లాగుతున్నావు. నీతో పూర్తిగా విసిగిపోయాను. ఇదే చివరి ఉత్తరం. జీవితంలో మళ్ళీ నీకు ఉత్తరం రాయను” అన్నాడు.

కానీ, మళ్ళీ మళ్ళీ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. వేడికోళ్ళు, బుజ్జగింపులు, బెదిరింపులు…అన్నీ మామూలే. “నీ కోసం, పిల్లలకోసం నా జీవితాన్నే సంతోషంగా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాను. అయినాసరే మొండిగా బండగా ప్రవర్తిస్తున్నావు. పిల్లల పేర రాసిన లక్షల ఆస్తిని, ఇదిగో ఇప్పుడే రద్దు చేసేస్తున్నాను” అని రాశాడు. ఎకతెరీనాలో ఎలాంటి చలనమూ లేదు. ఆమెకు సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఓ పెద్ద ఇల్లు, అత నామె పేర రాసిన భారీ మొత్తాలు ఉన్నాయి. ఆపైన మంచి ఆస్తిపాస్తులున్న బంధువర్గం ఉంది.

బట్టతల, నెరిసిన జుట్టుతో అసలు వయసు కంటే పెద్దవాడిలా కనిపిస్తున్న స్లీమన్; లోపల ఇంత అశాంతినీ, ఒంటరితనాన్నీ మోస్తూనే పైకి మాత్రం ఓ విద్యార్థిలా బుద్ధిగా సర్బాన్ యూనివర్సిటీకి వెళ్ళొస్తున్నాడు. వ్యాపారం జోలికి ఇక వెళ్లకూడదని ఎన్నోసార్లు అనుకున్నాడు. అన్నిసార్లూ ఆ మాట తప్పుతూనే వచ్చాడు. రోజూ విధిగా లండన్ టైమ్స్ లోని ఫైనాన్షియల్ పేజీలు చదివేవాడు. మనీ మార్కెట్ ను అధ్యయనం చేసేవాడు. కొన్ని రకాల బాండ్లకు కాగితం డబ్బు రూపంలో చెల్లింపులు జరపాలని అమెరికా రాజకీయనాయకులు ఒత్తిడి తెస్తున్నట్టు చదివాడు. అందువల్ల లక్షల డాలర్ల మేరకు లావాదేవీలు జరుగుతాయనీ, బంగారం విలువ విపరీతంగా పెరిగిపోతుందనీ, కాగితం డబ్బు చలామణిలోకి రావడంతో బాండ్ల చెల్లుబాటు పడిపోతుందనీ అనుకున్నాడు. అమెరికాలో తనకు భారీగా ఆస్తులు ఉన్నాయి కనుక వాటి విలువ ఎక్కడ తరిగిపోతుందో నని భయపడి వెంటనే అమెరికాకి ప్రయాణం కట్టాడు.

1868లో న్యూయార్క్ వెళ్ళి, అక్కడినుంచి వాషింగ్టన్ చేరుకున్న వెంటనే ఖజానా మంత్రిని కలసుకున్నాడు. బాండ్ల చెల్లుబాటును తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పడంతో ఊరట చెందాడు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ను మర్యాదపూర్వకంగా కలసుకున్నాడు. “జాన్సన్ చాలా సీదా సాదా మనిషి. ఆయనకు యాభై అయిదేళ్ళుంటాయి. క్యూబా గురించి కాంగ్రెస్ లో ఇటీవల ఆయన చేసిన ప్రసంగం సంతోషం కలిగించిందని చెప్పాను. అమెరికావైపు క్యూబా మొగ్గు చూపుతోందనీ, అది అమెరికాలో విలీనమయ్యే రోజు ఎంతో దూరంలో లేదనీ ఆయన చెప్పాడు” అని ఓ జర్మన్ మిత్రుడికి రాశాడు. క్యూబాలో తనకున్న భూములు సురక్షితంగా ఉంటాయన్న నమ్మకం అతనికి చిక్కింది.

వాషింగ్టన్ అతనికి నచ్చింది. కిందటిసారి వచ్చినప్పుడు న్యూయార్క్ ఎంతో బాగున్నట్టు అనిపించినా, ఇప్పుడు పారిస్ ను చూసిన కళ్ళతో చూశాక వీధులు ఇరుకిరుగ్గా ఉన్నాయనీ, వీధి దీపాల ఏర్పాటు సరిగా లేదనీ, మొత్తం న్యూయార్క్ నగరమే గంద్రగోళంగా ఉందనీ అనుకున్నాడు. నగరం అంతర్యుద్ధ ప్రభావం కింద ఇంకా నలుగుతూనే ఉన్నట్టు అనిపించింది. ఎంతోమంది యూరోపియన్లలానే దక్షిణాది రాష్ట్రాల దుస్థితికి జాలిపడ్డాడు. “ఇప్పటికీ ఇక్కడి ప్రజల్ని పరాజితులుగా చూస్తున్నారు. వాళ్ళు రాజకీయప్రాతినిధ్యం లేకుండా  సైనికపాలన కింద మగ్గిపోతున్నారు. డబ్బు లేదు, బ్యాంకులు లేవు, తమ బాగోగులు తాము చూసుకునేందుకు సాయపడే వ్యవస్థ ఒక్కటీ లేదు” అని రాశాడు.

ఆఫ్రో-అమెరికన్లపై అతనికి ఎంతో ఆసక్తీ, ఇష్టమూ కలిగాయి. కొన్నాళ్ళపాటు వాళ్ళ స్కూళ్లను సందర్శించాడు. చర్చిలకు వెళ్ళి మతప్రసంగాలు విన్నాడు. వాళ్ళ గుణగణాలను ఆకాశానికి ఎత్తుతూ డైరీలో పేజీలకు పేజీలు నింపేశాడు. అయితే, అంతే హఠాత్తుగా వారిపై ఆసక్తి తగ్గిపోయింది. ఆ స్థానాన్ని అమెరికా రైల్వే వ్యవస్థ ఒక్కసారిగా ఆక్రమించుకుంది. మహా సరస్సు(Great Lakes)ల వరకూ విస్తరించిన అన్ని రైలు మార్గాలలోనూ ఓ డైరక్టర్ లా ప్రయాణం చేసి, వాటిని సునిశితంగా తనిఖీ చేశాడు. ఇంతకుముందు వచ్చినప్పుడు అమెరికన్ రైల్వేలు నష్టాల మీద నడుస్తున్నాయనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం తప్పనుకున్నాడు. పెట్టుబడి మీద పది శాతం లాభం వస్తున్నట్టు గుర్తించి సంతోషించాడు.

డైరీలో ఇతర విషయాలు కూడా రాసుకున్నాడు. వాటిలో నీలిమందు ధర, ఎగుమతి అవుతున్న ఆహారధాన్యాల పరిమాణం, అప్పటికి ముప్పై ఏళ్ల చికాగో అభివృద్ధికి సంబంధించిన గణాంకాలు, ఇండియానాపొలిస్ లోని భవనాల సైజు, ప్రస్తుత మార్కెట్ రేట్లలో కలప విలువ మొదలైనవి ఉన్నాయి. మళ్ళీ తను వ్యాపారప్రపంచంలోకి వెడుతున్నట్టు అతనికి అనిపించింది. నిజానికి అతనెప్పుడూ ఆ ప్రపంచానికి దూరంగా లేడు. ఇండియానాపొలిస్ అతనికి నచ్చింది. అక్కడ ఎంతోమంది వ్యాపారవేత్తలను, రాజకీయముఖ్యులను పరిచయం చేసుకున్నాడు. వాళ్ళతో సంభాషణ అప్పుడప్పుడు విడాకుల చట్టం మీదికి మళ్లుతూ ఉండేది. ఇండియానా రాష్ట్రం ఆ చట్టంలో సవరణలు తెస్తోంది.

స్లీమన్ కాలిఫోర్నియాలో ఉన్నప్పుడే ఆ రాష్ట్రం యూనియన్ లో చేరింది. తను అమెరికా పౌరుణ్ణి అయ్యానని అతను చెప్పుకునేవాడు కానీ, అధికారికంగా పౌరసత్వం తీసుకోలేదు. భార్యకు విడాకులివ్వడానికి ఇండియానా చట్టం అనుకూలంగా ఉన్నట్టు కనిపించడంతో అక్కడి మిత్రుల సాయంతో పౌరసత్వం పొందడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇండియానాపొలిస్ లో ఓ ఇల్లు కొనుక్కుని పిండి పదార్థాల వ్యాపారంలో ఆసక్తి చూపించాడు. ఎకతెరీనాతో తెగతెంపుల ప్రయత్నాలు అతనిలో ఆశాభావాన్నీ, ఉత్సాహాన్నీ నింపాయి. అమెరికా యాత్ర పొడవునా ఎంతో ఉల్లాసంగా గడిపాడు. ఓ రైల్వే అధికారిలా సర్వే చేస్తూ రైలు మార్గాలను చుట్టబెట్టడమే కాదు; ఎన్నో లాభసాటి పెట్టుబడులు పెట్టాడు. ప్రభుత్వంలో ముఖ్యులనుకున్న వాళ్లందరినీ కలసుకున్నాడు. మంచి తెలివీ, నిశితదృష్టీ ఉన్న ఈ వ్యాపారవేత్తను చూసి అంతా ముగ్ధులయ్యారు.

పైకి ఉల్లాసంగా ఉన్నా లోలోపల ఒంటరితనం కుంగదీస్తూనే ఉంది.  సెయింట్ పీటర్స్ బర్గ్ కూ, జర్మనీకీ అతను రాస్తున్న ఉత్తరాలు; తన డైరీ రాతల్లో వెల్లివిరిసే ఉత్సాహానికి భిన్నమైన చిత్రం చూపిస్తున్నాయి. ఎకతెరీనాకు విడాకులివ్వాలని అతను మనస్ఫూర్తిగా అనుకోడంలేదు. ఆమె తననా పరిస్థితికి నెడుతోందని అనుకుంటున్నాడు. వేడికోళ్ళు, బుజ్జగింపులతోపాటు; తను తప్పులు చేశానని ఒప్పుకుంటూ, ఇకముందు నిన్ను నెత్తినపెట్టుకుంటానని హామీ ఇస్తూ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. రష్యాలో క్రిస్టమస్ రోజైన జనవరి 6వ తేదీన వాషింగ్టన్ హోటల్ గదిలో ఒంటరిగా గడుపుతూ తన ముగ్గురు పిల్లల్నీ, క్రిస్టమస్ ట్రీనీ తలచుకున్నాడు. పిల్లలకి కానుకలిచ్చి వాళ్ళతో సంతోషంగా గడిపే అదృష్టం లేనందుకు కంట తడి పెట్టుకున్నాడు. తన మీద తనకే విసుగూ, కోపమూ ముంచెత్తాయి. పిల్లల సంతోషాన్ని పంచుకుంటూ వాళ్ళతో గడపడంలో పొందే ఆనందం ముందు లక్ష అమెరికన్ డాలర్లు కూడా దిగదుడుపే ననుకున్నాడు. పైగా ఆ మరునాడే తన 46వ పుట్టినరోజు కావడం అతని మనోవ్యధను మరింత పెంచింది. తన దుఃఖాన్ని వెళ్లబోసుకునేందుకు మనిషి కనిపించక ఒంటి నిండా ఒంటరి తనాన్ని కప్పుకుని ఆరోజంతా వాషింగ్టన్ వీధుల్లో దయ్యంలా తిరిగాడు.

ఓ మిత్రుడిచ్చిన పరిచయలేఖను తీసుకుని వాషింగ్టన్ లోని ప్రష్యా రాయబారి బేరన్ వన్ గెరోల్ట్ ను కలసుకున్నాడు. ఆయన సాదరంగా ఆహ్వానించి అతని వ్యాపారాల గురించి అడిగాడు. మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చానని చెప్పి స్లీమన్ తన పారిస్ జీవితం గురించి, సెయింట్ పీటర్స్ బర్గ్ లో తను గడించిన సంపద గురించీ చెప్పడం ప్రారంభించాడు. దాంతో ఉన్నట్టుండి ఆ రాయబారి కోపంతో కేకలు లంకించుకున్నాడు.”అలా అయితే ఫ్రెంచి రాయబారినో, రష్యన్ రాయబారినో కలవకపోయారా? ఇక్కడ అమెరికాలో రష్యన్లు ఎక్కువమంది లేరు. జర్మన్లు చాలామంది ఉన్నారు. మీతో మాట్లాడే తీరిక నాకు లేదు” అనేశాడు. తన్నుకొచ్చే కోపాన్ని దిగమింగుకుంటూ స్లీమన్ తక్షణమే బయటికి నడిచాడు. ఫిబ్రవరిలో న్యూయార్క్ లో ఫ్రాన్స్ కు వెళ్ళే ఓడ ఎక్కబోతూ తన చివరి ఉత్తరాన్ని ఆ ప్రష్యన్ రాయబారికే రాశాడు.  తను కలవడానికి వచ్చినప్పుడు ఎలా అవమానించిందీ, ఎలాంటి మాటలన్నదీ, తన ఆత్మాభిమానం ఎలా దెబ్బతిన్నదీ అందులో పూసగుచ్చినట్టు రాస్తూ తూలనాడాడు. చివరగా, “యువర్ ఎక్సెలెన్సీ, మీరు నాపట్ల చూపించిన దారుణ అమర్యాదే నా అమెరికా పర్యటన మొత్తంలో ఒక చేదుజ్ఞాపకంగా మిగిలిపోయిందని విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిలోనూ సభ్యత, సంస్కారం, మర్యాద వెల్లివిరిసే దేశంగా అమెరికాను కలకాలం గుర్తుపెట్టుకుంటాను. కానీ, ఈ ప్రతి ఒక్కరిలోనూ మీరు మాత్రం ఉండరు” అని రాశాడు.

తిరిగి పారిస్ చేరుకున్నాడు. అప్పటికి ఫ్రాన్స్ క్షితిజాన్ని యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. భాషాశాస్త్ర అధ్యయనాన్ని పునఃప్రారంభించి ఎప్పటిలా సర్బాన్ యూనివర్సిటీలో క్లాసులకు వెళ్లివస్తున్నాడు. థియేటర్ ను సందర్శిస్తున్నాడు. మరోవైపు మరిన్ని ఇళ్ళు కొంటూ ఇళ్ల యజమాని పాత్రనూ గొప్పగా రక్తి కట్టిస్తున్నాడు. గ్యాస్ బర్నర్లు, స్నానాల గదులు వగైరాల గురించిన తన అధ్యయన సమాచారంతో పేజీలకు పేజీలు నింపేస్తున్నాడు. అంతలోనే వీటన్నింటిపై విసుగు పుట్టింది. మరోసారి అతని జీవన దిక్సూచి చంచలించడం ప్రారంభించింది. తన జీవితమంతా కిరాయిదార్లకోసం మెరిసిపోయే స్నానాల తొట్టెలు, అద్దాలు కొనుగోలు చేయడంతో ముగిసిపోవలసిందేనా అనిపిస్తోంది.

అస్థిమితంగా, అశాంతిగా రోజులు గడుస్తుండగా; ఏకకాలంలో హఠాత్తుగా జరిగిన రెండు ఘటనలు అతని జీవనగమనాన్ని మార్చేశాయి. మొదటిది, అతను సర్బాన్ యూనివర్సిటీలో పురాతత్వశాస్త్రానికి సంబంధించిన కొన్ని తరగతులకు హాజరయ్యాడు. రెండోది, అతని దగ్గరి బంధువైన సోఫీ స్లీమన్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆమెకు యాభై ఏళ్ళు ఉంటాయి. పెళ్లి చేసుకోలేదు. నిన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాననీ, నీతో కలసి ప్రపంచయాత్ర చేయాలని ఉందనీ ఆమె రాసింది. దానికతను జవాబు రాస్తూ, చిన్నప్పుడు కల్కోస్ట్ లో ఇద్దరూ కలసి ఆడుకున్న రోజుల్ని నిరాసక్తంగా గుర్తుచేసుకున్నాడు. ఆపైన ప్రష్యా రాయబారికి రాసిన ఉత్తరంలోలానే ఎత్తిపొడుపులు జోడిస్తూ పరుషవాక్యాలు గుప్పించాడు. ఒకప్పుడు నీ ప్రేమను అర్థిస్తే తిరస్కరించావనీ, ఇప్పుడు వయసులో నా కంటే పెద్ద అయిన నీతో అవారాలా తిరిగే ఉద్దేశం లేదనీ అన్నాడు. నీలాంటి ఓ అనుభవజ్ఞురాలితో కలసి ప్రపంచయాత్ర చేసే అవకాశాన్ని అదృష్టంగానే భావిస్తాను కానీ, ఒక సన్యాసినితో కలసి తిరగలేననీ, అంతకంటే దుర్భరస్థితి ఇంకొకటి ఉండదనీ, నీలాంటివాళ్లకు ఈ సువిశాల ప్రపంచం కన్నా ముక్కు మూసుకుని ఒక మూల కూర్చునే ఆశ్రమజీవితమే సరిపోతుందనీ నిష్టురమాడాడు.

సోఫీ స్లీమన్ కు ఆ ఉత్తరం చేరనేలేదు. సరిగ్గా అతనా ఉత్తరం రాసిన రోజునే ఆమె మరణించింది. ఆ కబురు తెలియగానే స్లీమన్ దుఃఖంలోనూ, పశ్చాత్తాపంలోనూ కూరుకుపోయాడు.

(సశేషం)

 

 

 

చైనా గోడ మీంచి ఇటుక తెచ్చుకున్నాడు! 

 

స్లీమన్ కథ-11

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

పర్వతాలు, ఎడారి మీదుగా మెలికలు తిరుగుతూ 14వందలమైళ్ళ దూరం వ్యాపించిన చైనా గోడ గురించి స్లీమన్ కు చిన్నప్పటినుంచీ తెలుసు. తను అక్కడికి వెళ్ళినట్టు, ఆ గోడ ఎక్కినట్టు కలలుగనేవాడు. అంతకంటే విశేషంగా, అతి పురాతనకాలంలో ఈ భూమ్మీద గొప్ప సృజనాత్మక నైపుణ్యాలు కలిగిన ఓ అద్భుతమైన జాతి ఉండేదనీ, అది అంతర్ధానమైపోయిందనీ, చైనా గోడ దగ్గరికి వెడితే ఆ జాతికి సంబంధించిన రహస్యాలను పట్టుకోవచ్చుననీ అనుకునేవాడు.

పెకింగ్ ను సందర్శించిన మరునాడే నౌకరును వెంటబెట్టుకుని మంచూరియా సరిహద్దుల్లో, చైనా గోడకు సమీపంలో ఉన్న కౌ-పా-కౌ కు బయలుదేరాడు. రెండు రోజుల తర్వాత అక్కడికి చేరాడు. అతనిలో ఉల్లాసం, ఉత్సాహం ఉరకలేస్తున్నాయి. ఎండ బాగా కాస్తోంది. తలకు అరబ్ తలపాగ చుట్టుకున్నాడు. దారి పొడవునా ఉన్న గ్రామాల వాళ్ళు అతనివైపు వింతగా చూశారు. ఆయన చైనా గోడ చూడడానికే ఏకంగా యూరప్ నుంచి వచ్చాడని నౌకరు చెప్పినప్పుడు అతనేదో తమాషా చేస్తున్నాడనుకుని అంతా నవ్వేశారు. ఆ సరిహద్దు గ్రామాలవాళ్లు స్లీమన్ కు ఎంతో నచ్చారు. అమాయకత్వం, ఔదార్యం మూర్తీభవించిన ఈ జనాలు పెకింగ్ లో తను చూసిన క్షీణజాతికన్నా భిన్నంగా ఉన్నారనుకున్నాడు.

ఎండ మొహం మీద పడి చురుక్కుమనిపిస్తోంది. పైగా ప్రయాణంతో అలసిపోయాడు. అయినాసరే, గోడ దగ్గరికి చేరుకోగానే ఎండ తీవ్రతా, అలసటా అన్నీ మరచిపోయాడు. అప్పటికప్పుడు దానిని ఎక్కడానికి సిద్ధమయ్యాడు. గోడ దిగువున ఉన్న గుట్ట ఎగుడు దిగుడుగా, పైకి పొడుచుకొచ్చిన రాళ్ళతో అడుగు తీసి అడుగు పెట్టలేనట్టుగా ఉంది. ఎవరైనా సహాయకులు తోడు వస్తారేమోనని వాకబు చేశాడు. చివరికి నౌకరుతో సహా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఒంటరిగానే ఎక్కడానికి సిద్ధమై అతి కష్టం మీద పైకి చేరుకున్నాడు.

తనతో ఒక కొలతబద్దను తీసుకెళ్లాడు. గోడకు ఉపయోగించిన ఇటుకల పరిమాణాన్ని కొలిచాడు. అవి 67 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల ఎత్తు, 17 సెంటీమీటర్ల మందం ఉన్నాయి. ఆ తర్వాత గోడ ఎత్తు కొలిచాడు. అది కొన్ని చోట్ల 20 అడుగులు, కొన్నిచోట్ల 30 అడుగుల ఎత్తుంది. కాపలా బురుజుల మధ్యదూరం 300 అడుగులుంది. ఆ ఇటుకలు కచ్చితంగా క్రీ.పూ 200 నాటి హన్ రాచరిక కాలానికి చెందినవనుకున్నాడు. కానీ నిజానికవి క్రీ.శ. 1400 నాటి మింగ్ రాచరిక కాలానికి చెందినవి. ఆ ఎత్తైన గోడ మీంచి కింద దూరదూరాలకు వ్యాపించిన కొండలు, గుట్టలు చూస్తూ అతను పట్టలేని తమకంతో మైమరచిపోయాడు.

ఆ ఎత్తునుంచి ప్రపంచం చాలా చిన్నదిగానూ, ఓ నీడలానూ కనిపిస్తున్న ఆ అద్భుత దృశ్యాన్ని ఎంతసేపు చూసినా అతనికి తనివితీరలేదు. సాయంత్రంవరకూ ఆ గోడమీదే ఉండిపోయాడు. మధ్యాసియానుంచి విరుచుకుపడుతున్న ఆటవికపు దాడులనుంచి ఆ గోడను కాపాడడానికి చేసిన వీరోచిత పోరాటాల గురించి తను చదివినవన్నీ గుర్తుచేసుకున్నాడు. జావాలో, సియేరా నెవాడాలో ఎత్తైన ప్రదేశాలనుంచి తను కిందికి చూసినప్పుడు కనిపించిన అద్భుత దృశ్యాలను నెమరేసుకున్నాడు.

sliiman

చీకటి పడుతున్న సమయానికి గోడనుంచి ఓ ఇటుకను జాగ్రత్తగా వేరుచేసి దానిని ఓ తాడుతో ఎలాగో వీపుకి కట్టుకున్నాడు. ఆ తర్వాత పొట్టను గోడకానించి నెమ్మదిగా కిందికి జారాడు. దిగిన వెంటనే ఇటుకను చూసుకున్నాడు. అది భద్రంగా ఉన్నందుకు పొంగిపోయాడు. విపరీతమైన దాహంతో మంచినీళ్ళకోసం కేకలు పెట్టేటప్పటికి అక్కడి రైతులు పరుగుపరుగున నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకు తను తెచ్చిన ఇటుకను సగర్వంగా చూపించాడు. ఆ ఒక్క ఇటుక కోసం అంత దూరం నుంచి వచ్చి ఇంత కష్టపడాలా అనుకుంటూ వాళ్ళు పగలబడి నవ్వేశారు. “నేను మంచినీళ్లు అడగ్గానే వెంటనే తీసుకొచ్చి ఇచ్చిన ఔదార్యం, దయా కలిగిన ఈ జనం కచ్చితంగా తమ జీవితంలో ఎప్పుడూ నల్లమందు సేవించి ఉండ”రని డైరీలో రాసుకున్నాడు.

తన ప్రయాణానుభవాలను అతను వెంటనే కాకుండా కొన్నిరోజుల తర్వాత డైరీలో పొందుపరిచాడు. ఒకప్పుడు చైనాకు రక్షణ కుడ్యంగా ఉండి ఇప్పుడు శిథిలమవుతున్న ఈ అద్భుతనిర్మాణం తనను ఆకట్టుకున్నంతగా ప్రపంచంలో మరేదీ ఆకట్టుకోలేదన్నాడు. జావా అగ్నిపర్వతాలను, హిమాలయాలను, సియేరా నెవాడా శిఖరాలను, దక్షిణ అమెరికాలోని కార్డిల్లేరా పీఠభూమిని అధిరోహించానని చెబుతూ తన పర్వతారోహణ నైపుణ్యాలను అతిశయోక్తులతో చాటుకున్నా; చైనా గోడ మీంచి కిందికి చూసినప్పుడు తను పొందానని చెప్పిన భావోద్వేగాలు మాత్రం నిజం.

చైనా గోడ తను చిన్నప్పటినుంచీ ఊహించుకుంటున్నదానికంటే కూడా వందరెట్లు వైభవోపేతంగా ఉందనీ, తనను ఆశ్చర్యచకితం చేసిందనీ, మతిపోగొట్టిందనీ, తనలో గొప్ప ఆరాధనాభావాన్నీ, ఉత్తేజాన్నీ నింపిందని రాశాడు. ఎత్తైన పర్వతశిఖరాలతో పోటీపడుతున్న బురుజులతో ఈ బ్రహ్మాండమైన గోడను చూస్తున్నకొద్దీ జలప్రళయానికి ముందునాటి ఓ మహోన్నతజాతి ఏదో దీనిని నిర్మించినట్టు తోస్తూ వచ్చిందనీ అన్నాడు. ఇంకా ఇలా రాశాడు:

క్రీ.పూ. 220 ప్రాంతాలలో దీనిని నిర్మించినట్టు నాకు తెలుసు. అయినాసరే, మామూలు మనుషులు దీనిని నిర్మించారంటే నాకు నమ్మశక్యం కావడంలేదు. అంత పెద్ద పెద్ద బండరాళ్లను, భారీ గ్రానైట్ శిలలను, అన్నన్ని ఇటుకలను అక్కడికి ఎలా రవాణా చేశారో, వాటిని అంత పైకి ఎలా తరలించారో అంతుబట్టలేదు. గోడ దిగువనే ఉన్న లోయలో ఆ ఇటుకల్ని కాల్చి ఉంటారని అనిపించింది. ఉత్తరం వైపునుంచి వచ్చిపడుతున్న శత్రువులను నిలవరించడానికి ఉద్దేశించిన ఇంత పెద్ద నిర్మాణం చేయాలంటే హెర్క్యులస్ కు ఉన్నంత శక్తి కావాలి.

ఈరోజున ఇంత ఘనమైన నిర్మాణమూ నిర్లక్ష్యానికి గురై పాడుబడినట్టు ఉంది. సైనికులకు బదులు బురుజుల్లో పావురాలు ప్రశాంతంగా గూడు కట్టుకుంటున్నాయి. వసంతాగమనాన్ని సంకేతిస్తున్న పసుపు, ఊదారంగు పువ్వుల మధ్య తొండలు తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. ఇప్పుడీ కట్టడం భూమ్మీంచి ఎప్పుడో నిష్క్రమించిన ఒక యుగం తాలూకు అంత్యక్రియల చిహ్నమా అన్నట్టు మిగిలిపోయింది.

ఇప్పటినుంచీ తన డైరీని అతను చాలా జాగ్రత్తగా రాశాడు. ముందే ప్రచురణకు ఉద్దేశించాడా అన్నట్టుగా చక్కని మాటలు, వాక్యాలు పొదుగుతూ వర్ణనాత్మకశైలిలో రాసుకుంటూ వెళ్ళాడు. ఇవే రోజుల్లో మిత్రులకు రాసిన ఉత్తరాల్లో కూడా రచయిత కావాలన్న తన ఆకాంక్షను నొక్కి చెప్పేవాడు. కావలసినంత సంపాదించుకున్న తర్వాత రచయితగా గడపడాలన్నదే మొదటినుంచీ తన జీవితాశయమనీ; రష్యాను విడిచిపెట్టి యూరప్ లో ఎక్కడో ఒకచోట స్థిరపడి సహరచయితలతో పరిచయాలు పెంచుకుంటూ రచనకే అంకితమైపోవాలనుకుంటున్నాననీ, నా దృష్టిలో ఇంతకన్నా గొప్ప వ్యాసంగమేదీలేదనీ రాసేవాడు. ఈ తూర్పు దేశాల యాత్రానుభవాలను పొందుపరుస్తూ తన నలభై మూడో ఏట వెలువరించిన మొదటి పుస్తకం తొలి పుటల్లోనే తన భావిజీవితంలో ప్రాధాన్యం వహించబోయే ఇతివృత్తమేమిటో సూచించాడు. అవి—కూలుతున్న శిథిలాలు, బ్రహ్మాండమైన పురాతనపు రాతి కట్టడాలు, సమాధైపోయిన ఉత్సవపూరిత గతం…

ఓసారి చైనా గోడను చూసి, దానిమీద నిలబడిన తర్వాత  ఇక ఆ దేశం మీద అతనికి ఆసక్తి తగ్గింది. మిగతా యాత్రావిశేషాలను క్లుప్తంగా, యధాలాపంగా రాసుకుంటూ వెళ్ళాడు. చైనా మహిళల విలక్షణమైన నడక మీద మాత్రం కాస్త ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. వాళ్ళ పాదాలను దగ్గరగా చూశాననీ, గెంతుతున్నట్టు వాళ్ళు ఎలా నడుస్తారో కచ్చితంగా చెప్పగలిగిన యూరోపియన్ రచయితలెవరూ తనకు కనిపించలేదనీ రాశాడు. ఆ తర్వాత, మూడు కాలివేళ్ళను అరికాళ్ళలోకి ఎలా చొప్పిస్తారో, ఆ విలక్షణమైన నడకను ఎలా సాధిస్తారో వివరించాడు. చైనీయుల నాటకాల గురించి కూడా రాశాడు. నటులు ధరించే బరువైన జలతారుదుస్తులు, ముసుగులు, వారి హావభావాలు, పురుషపాత్రధారులు పెద్ద గొంతుతో మాట్లాడడం-అన్నీ అతనికి విచిత్రంగానే అనిపించాయి.

అక్కడినుంచి జపాన్ వెళ్ళాడు. ఆ దేశం అతన్ని మత్తులో ముంచెత్తింది. ఎంతో ఆహ్లాదభరితంగానూ, ఓ నిగూఢప్రదేశంగానూ, నమ్మశక్యం కాని ఓ దేవకన్యల కథలానూ అనిపించింది. తరచు వర్షం పడుతున్నా, రాబర్ట్ థామస్ లాంటి స్నేహపాత్రుడైన దుబాషీ వెంట లేకపోయినా  అక్కడ ఉన్నన్ని రోజులూ చాలా ఉల్లాసంగా గడిపాడు. అక్కడి కబుకీ నాటకాలకు వెళ్ళాడు. బహిరంగస్నానశాలలను సందర్శించాడు. జపాన్ మహిళలు ధరించే సిల్కు కిమోనాలను, వాళ్ళ స్నేహశీలతను చూసి ఆనందించాడు. అక్కడి విదేశీ రాయబారులతోనూ స్నేహంగా మెలిగాడు. స్నానశాలకు వెళ్లినప్పుడు అతని వాచీ ఛైనుకున్న ఎర్రని పగడం కుతూహలం కలిగించడంతో దానిని చూడడానికి అక్కడి యువతులు చుట్టూ మూగడం, వాళ్ళ చొరవా అతన్ని ముగ్ధుణ్ణిచేశాయి. తను దిగిన చిన్న చిన్న సత్రాలు, అక్కడి సిబ్బంది మాటి మాటికీ వంగి అభివాదం చేయడం, ఎక్కడికి వెళ్ళినా సభ్యత, గౌరవం వెల్లివిరిసే వాతావరణం అతనికి ఎంతగానో నచ్చాయి. తన జపాన్ అనుభవాలను చాలా తీరుబడిగానూ, అక్కడ గడిపిన ప్రతిక్షణాన్నీ నెమరేసుకుంటూనూ ఒకవిధమైన మైకంతో రాశాడు. అతని పుస్తకంలో ఆ భాగాలే అత్యుత్తమంగా నిలిచాయి.

అదృష్టవశాత్తూ జపాన్ మికాదో[చక్రవర్తి]కి, షొగున్[సైనిక గవర్నర్: చక్రవర్తే నియమించినా 1192-1867 మధ్యకాలంలో సైనిక గవర్నర్లే పూర్తి అధికారాన్ని చలాయిస్తూ వచ్చారు. సైనిక గవర్నర్ కీ, చక్రవర్తికీ మధ్య తరచు ఘర్షణలు తలెత్తుతూ ఉండేవి]కూ మధ్య స్వల్పకాలిక శాంతి నెలకొనే అరుదైన రోజుల్లో స్లీమన్ జపాన్ ను సందర్శించాడు. అప్పటికి పన్నెండేళ్ళ క్రితమే అమెరికా నౌకాదళాధికారి కమొడోర్ పెరీ(1794-1858) ఎడో(Yedo)అఖాతం మీదుగా జపాన్ చేరుకుని తన డిమాండ్ల పత్రాన్ని చక్రవర్తికి ఇవ్వబోయినప్పుడు, అక్కడ ఇద్దరు చక్రవర్తులున్న సంగతి తెలిసి తెల్లబోయాడు. స్లీమన్ అక్కడికి వెళ్లడానికి ముందు సంవత్సరమే చోషును పాలించే దైమ్యో(సామంతరాజు) విదేశీ నౌకలపై అదే పనిగా కాల్పులు జరిపించినందుకు ప్రతీకారంగా బ్రిటిష్, ఫ్రెంచ్, అమెరికా, డచ్ నౌకాబలగాలు షిమొనోసెకీ(ఒక జపాన్ నగరం)పై పెద్దయెత్తున దాడిచేశాయి.

అయితే, సమకాలీనచరిత్రపై స్లీమన్ కు ఆసక్తి లేదు. జపాన్ అతని కళ్ళముందు ఉత్సవభరితంగా ఆవిష్కృతమైంది.  చరిత్రప్రసిద్ధమైన తోకైదో రాజమార్గం మీదుగా వర్ణరంజితంగా సాగిన షొగున్ ఊరేగింపును చూసి మైమరచిపోయాడు. దాని అద్భుతత్వానే కాక, ఆటవికత్వాన్ని కూడా కళ్ళకు కట్టిస్తూ ఎంతో జాగ్రత్తగా చిత్రించుకుంటూ వచ్చాడు.

 ఆ ఊరేగింపు ముందుభాగంలో వెదురు కర్రల మీద పెద్ద పెద్ద సామాను మోస్తూ కూలీలు నడిచారు. వారి వెనకాల తెలుపు, నీలం, నలుపు రంగు దుస్తులు ధరించి, విల్లమ్ములు తదితర ఆయుధాలు పట్టుకున్న సైనికులు నడిచారు. వారి వెనక వాళ్ళ అధికారులు అధికార లాంఛనాలతో పసుపు, నీలం, లేదా తెలుపు కోట్లు ధరించి గుర్రం మీద వచ్చారు. వారి వెనకాల సామాన్లు మోస్తూ మళ్ళీ కొందరు కూలీలు, వారి వెనకాల గుర్రం మీద తెలుపు దుస్తులతో మరింత పెద్ద అధికారులు; వారి వెనకాల బల్లేలు ధరించిన సైనికులు, శతఘ్ని, పదాతి దళాలు; వారి వెనక కూలీలు, వారి వెనక గుర్రాల మీద మరింత పెద్ద హోదా ఉన్న వారు; వారి వెనక మళ్ళీ సైనికులు, వారి వెనక నాలుగు అలంకృత అశ్వాలు, వాటి వెనక అశ్వపాలకులు వచ్చారు.

చివరగా ఓ అందమైన గోధుమరంగు గుర్రం మీద షొగున్ వచ్చాడు. అతనికి ఇరవయ్యేళ్లు ఉంటాయి. చక్కని ముఖం. రంగు కొంచెం నలుపు. బంగారు జలతారు పని చేసిన తెల్లని అంగరఖా ధరించాడు. మెరుగుపెట్టిన టోపీ పెట్టుకున్నాడు. అతని బెల్టుకు రెండు కృపాణాలు వేలాడుతున్నాయి. అతనికి అటూ ఇటూ ఇరవైమంది ప్రముఖులు తెల్లని అంగరఖాలు ధరించి గుర్రాల మీద వచ్చారు.

ఆ ఊరేగింపు స్లీమన్ మనసుకు ఎంతగా హత్తుకుపోయిందంటే, మరునాడు ఆ ప్రదేశాన్ని చూడడానికి గుర్రం మీద వెళ్ళాడు. ముందురోజు తను నిలబడ్డ చోటుకు దగ్గరలోనే, దుమ్ముధూళితో నిండిన రోడ్డు మీద పూర్తిగా ఛిద్రమైపోయిన మూడు మృతదేహాలను చూసి విస్తుపోయాడు.  రైతులో, సైనికులో గుర్తుపట్టడానికి వీల్లేనంతగా అవి చిన్నాభిన్నమైపోయి ఉన్నాయి. ఎవరో, ఏమిటో అర్థం కాక ఆ భీకరదృశ్యాన్ని గుడ్లప్పగించి చూస్తూ కాసేపు ఉండిపోయాడు. అదే చోట రెండువేలమంది సైనికులతో, సేవకులతో మిరుమిట్లు గొలిపేలా సాగిన షొగున్ ఊరేగింపును తను కళ్ళారా చూశాడు. కానీ ఆ ఊరేగింపు ఈ మూడు మృతదేహాలను తొక్కుకుంటూ సాగినట్టు తనకు తెలియనే తెలియలేదు!

అప్పటికే అస్వస్థుడిగా ఉండి ఓ ఏడాదిలో మరణించబోతున్న బక్కపలచని షొగున్ ఆదేశాల మీదే ఆ ముగ్గురినీ నరికి చంపారా?! మృతదేహాలను అక్కడే ఎందుకు వదిలేశారు? వాటిని తొక్కుకుంటూ ఎందుకు వెళ్లారు? కుతూహలం చంపుకోలేక యొకొహామాకు తిరిగొచ్చి దీని గురించి జాగ్రత్తగా ఆరా తీశాడు. చివరికి అతనికి అందిన సమాచారం ఏమిటంటే, షొగున్ ఊరేగింపుగా వెడుతున్నప్పుడు పొరపాటున కూడా ఎవరూ రోడ్డుకు అడ్డంగా వెళ్లకూడదు. మామూలుగా అయితే ముందుగా హెచ్చరిక సిబ్బందిని పంపించి ఊరేగింపుకు ఎవరూ అడ్డు రాకుండా చూస్తారు. కానీ ఆరోజు ఎలా జరిగిందో కానీ పొరపాటున ఓ రైతు రోడ్డుకు అడ్డంగా వచ్చాడు. అప్పుడు ఒక అధికారి చూసి, అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేయమని తన సైనికుల్లో ఒకరిని ఆదేశించాడు. ఆ సైనికుడు అందుకు తిరస్కరించాడు. అప్పుడా అధికారి పెద్ద కరవాలం తీసి మొదట సైనికుణ్ణీ, తర్వాత రైతునీ నరికి చంపేశాడు. సరిగ్గా అదే క్షణంలో గుర్రంమీద అక్కడికి వచ్చిన అతని కంటే పై అధికారి ఇది చూసి ఇతనికి మతిచలించిందేమో అనుకుని అప్పటికప్పుడు అతన్ని చంపేశాడు. అలా ఆ రోడ్డు మీద పడున్న మృతదేహాలలో ఒకటి రైతుది, ఒకటి సైనికుడిది, ఇంకొకటి సైనికాధికారిదీ అన్నమాట!

యొకొహామా నుంచి ఎడో నగరానికి వెళ్ళాడు. అక్కడి పెద్ద పెద్ద కోట బురుజుల్ని, ప్రాసాదాలను, కిక్కిరిసిన రోడ్లను చూసి ముగ్ధుడయ్యాడు. సెప్టెంబర్ ప్రారంభానికల్లా జపాన్ మొహంమొత్తింది. తన యాత్రానుభవాలను వెంటనే కాగితం మీద పెట్టాలని కూడా అనుకున్నాడు. దాంతో ‘ది క్వీన్ ఆఫ్ ది ఏవాన్’ అనే ఓ చిన్న ఇంగ్లీష్ నౌక ఎక్కి పసిఫిక్ మీదుగా శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరాడు. కావలసినంత సమయం చిక్కడంతో చైనా-జపాన్ యాత్రా విశేషాలను రాయడం ప్రారంభించాడు. అది 220 పేజీల పుస్తకం అయింది. రెండేళ్ల తర్వాత దానిని La chine et le Japon au temps present అనే శీర్షికతో పారిస్ లో ముద్రింపజేశాడు. ఈ తొలి పుస్తకం అతనిలో సంతృప్తిని, గర్వాన్ని నింపింది.

జపాన్ నుంచి బయలుదేరిన కొన్ని రోజుల తర్వాత, తను సెయింట్ పీటర్స్ బర్గ్ కు వ్యతిరేక దిశలో సరిగ్గా భూమి అంతానికి చేరుకున్నా ననుకున్నాడు. కానీ అతని ఊహ తప్పు. కనీసం ఓడ కెప్టెన్ ను అడిగి ఉంటే ఆ సంగతి చెప్పేవాడు.

ఇప్పటికీ ఇల్లూ వాకిలీ పట్టని ఈ దేశదిమ్మరి కొన్ని రోజులు మాత్రం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండి, తర్వాత ఓడలో నికరాగువాకు బయలుదేరాడు. మరోసారి పనామా మీదుగా వెళ్ళడం ఇష్టంలేక నికరాగువాను దాటి హవానా వెళ్ళాడు. అక్కడ కొంత ఆస్తిని కొన్నాడు. కొన్ని వారాలు అక్కడ గడిపిన తర్వాత మెక్సికో వెళ్ళాడు. ఆ నగరంలో ప్రతిదీ అతనికి నిరుత్సాహమే కలిగించింది. చివరికి 1866 వసంతంలో పారిస్ చేరుకున్నాడు. అక్కడ సైనే, కెతీడ్రా ఆఫ్ నోట్రె డేమ్ కు దగ్గరలో ఒక అపార్ట్ మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు, తన నలభై నాలుగో ఏట, తనేం కాదలచుకున్నాడో స్పష్టత వచ్చినట్టు అనిపించింది. విద్యార్థిగా మారి సర్బాన్ యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతూ భాషాశాస్త్రవేత్త కావాలని నిర్ణయించుకున్నాడు. విరామ సమయంలో తన చైనా, జపాన్ యాత్రావిశేషాలను ప్రచురించాలనుకున్నాడు.

మూడు విడతలుగా అపారమైన సంపదను మూటగట్టి, ప్రపంచంలోని సగం దేశాలను చుట్టి, ఏమాత్రం అనుకూలించని భార్యతో ముగ్గురు పిల్లల్ని కని, పదమూడు భాషలు నేర్చి, ఓ పెద్ద గ్రంథాలయాన్ని సమకూర్చుకున్న ఈ పెద్దమనిషికి తన జీవితాన్ని ఎటు తీసుకెళ్ళాలో ఇప్పటికీ తెలియడం లేదు.

కాకపోతే, క్రమంగా అతని అడుగులు ట్రాయ్ వైపు పడుతున్నాయి…

(సశేషం)

 

 

 

భారత్ ను చూసి భయపడ్డాడు…చైనాలో నరకం చూశాడు!

స్లీమన్ కథ-10

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

భార్య ఎకతెరీనాతో అన్యోన్యక్షణాలు మళ్ళీ వెనకబెట్టాయి. ఎప్పటిలా ఎడమొహం, పెడమొహం. వాళ్ళ కాపురం చాలావరకూ భోజనం బల్లకు, ముక్తసరి మాటలకు పరిమితమవుతోంది. అయినా 1858లో రెండో సంతానం కలిగింది. ఈసారి ఆడపిల్ల, పేరు నతాల్య.  భార్యనుంచి దూరంగా పారిపోవాలన్న తహతహ ఆ ఏడాది వేసవిలో అతన్ని మరీ ఊపిరాడనివ్వకుండా చేసింది. మళ్ళీ సంచారానికి సిద్ధమయ్యాడు. ఈసారి తను చూడాలనుకున్న దేశాలన్నీ చూసిరావాలనుకున్నాడు.

మొదట స్వీడన్, డెన్మార్క్ లకు వెళ్ళాడు. వ్యాపార అవసరాలకోసం అప్పటికే అతను స్వీడిష్, డేనిష్ భాషల్ని నేర్చుకున్నాడు. ఈ దేశాల్లో తను అదనంగా నేర్చుకోవాల్సిందేమీ కనిపించలేదు. ఆ వెంటనే జర్మనీ వెళ్ళి తండ్రినోసారి చూసి ఇటలీ వెళ్ళాడు. అక్కడినుంచి గ్రీస్ వెళ్లాలనుకున్నాడు కానీ, అంతలో మనసు మార్చుకుని ఈజిప్టుకు దారితీశాడు. అక్కడ ఓ సాధారణ యాత్రికునిలా నైలు నదిపై దహబియాలో సెకండ్ కాటరాక్ట్ వరకూ ప్రయాణిస్తూ అరబ్బీ నేర్చుకున్నాడు. కైరో నుంచి వర్తకుల గుంపుతో కలసి జెరూసలెం వెళ్ళాడు. ఆ నగరం అతని కేమంత ఆసక్తిని కలిగించలేదు. స్మిర్నా, కిక్లాడెస్ దీవుల మీదుగా ఎథెన్స్ కు చేరుకున్నాడు.

[దహబియా: నైలునదిపై నడిపే ఒక రకం బోటు] [సెకండ్ కాటరాక్ట్: నదుల్లో ఎత్తైన గుట్టలు, రాళ్ళమీంచి నీళ్ళు వేగంగా కిందికి పడదాన్ని కాటరాక్ట్ అంటారు. నైలు నదిలో ఆశ్వాన్ నుంచి ఖార్టూమ్ వరకూ అలాంటి కాటరాక్టులు ఆరు ఉన్నాయి.]

ఎథెన్స్ లో ఒక మంచి హోటల్ లో దిగాడు. కొండ ఎక్కి పురాతనగిరిదుర్గా[ఎక్రోపోలిస్]న్ని చూశాడు. ఈ సందర్శన అతనికి పూర్తి సంతృప్తినిచ్చింది. ఎథెన్స్ ఎలా ఉంటుందని తను ఊహించుకున్నాడో సరిగ్గా అలాగే ఉందనుకున్నాడు. వెలుగులు విరజిమ్ముతున్న ఆ నగరం తనలోని నైరాశ్యపు చీకట్లను తరిమికొట్టిన అనుభూతి అతనికి కలిగింది. థియోక్లిటస్ విమ్పోస్ ఇచ్చిన పరిచయలేఖల సాయంతో కొంతమంది గ్రీకు పండితులను కలసుకున్నాడు. అతని గ్రీకు ఉచ్చారణ ఎక్కడా వంక పెట్టడానికి వీల్లేనట్టు ఉందని వాళ్ళు అభినందించారు. ట్రాయ్ వీరుడు ఓడిసస్ నివసించిన ఇథకా దీవిలో కొన్ని మాసాలు గడపాలని అనుకుంటున్నాననీ, దానిపై ఓ పుస్తకం రాసే ఉద్దేశం కూడా ఉందనీ అతను చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించి భుజం తట్టారు. మరికొందరు పండితులకు పరిచయలేఖలు ఇచ్చారు.

తీరా అతను ఆ దీవికి బయలుదేరి వెళ్లబోతుండగా సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి తంతి వచ్చింది. 1857 ఆర్థికసంక్షోభంలో దివాళా తీసిన ఓ వర్తకుడు అతనిపై  హై కోర్టులో దావా వేసినట్టు అందులో ఉంది. నిజానికి ఆ వర్తకుడే స్లీమన్ కు కొంత మొత్తం బాకీపడ్డాడు. దానిని చెల్లించే బదులు స్లీమనే తనను మోసగించాడంటూ ఎదురు అభియోగం తెచ్చాడు. దావాను కొంతకాలం వాయిదా వేయచ్చునా అని అడుగుతూ స్లీమన్ తంతి పంపించాడు. కోర్టు వీల్లేదని చెప్పింది. దాంతో అతను హుటాహుటిన సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగి వచ్చాడు. ఆ రావడం రావడం అయిదేళ్లపాటు మళ్ళీ అక్కడినుంచి కదలలేకపోయాడు.

దావాలో అతనే గెలిచాడు. కానీ ఇతర ఆసక్తులకు మళ్ళీ దూరమయ్యాడు. యధాప్రకారం వ్యాపారంలో పీకల్లోతున కూరుకుపోయాడు. అదే అసహనం, చిటపటలు, ఏజెంట్లను దుమ్మెత్తిపోస్తూ ఉత్తరాలు…అయినాసరే ఏజెంట్లు అతన్ని సహించేవారు. కారణం-ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద దిగుమతి వ్యాపారుల్లో అతనొకడు. చెల్లింపులు సక్రమంగా జరిపేవాడు. పైగా అతనిప్పుడు వ్యాపారాన్ని ఇంకా విస్తరిస్తున్నాడు. ఇంతవరకూ ఆలివ్ నూనె, నీలిమందు వ్యాపారానికే ప్రధానంగా పరిమితమయ్యాడు. ఇప్పుడు కాటన్, తేయాకు వ్యాపారంలోకి కూడా పెద్ద ఎత్తున అడుగుపెట్టాడు.

1861లో అతను కీలకమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాడు. వ్యాపారం బహుముఖాలుగా వృద్ధి చెందింది. ఆ ఏడాదే మూడో సంతానం కలిగింది. ఈసారి కూడా ఆడపిల్లే. వ్యాపారవృద్ధిని దృష్టిలో ఉంచుకుని అమ్మాయికి నడేజ్దా అని పేరు పెట్టారు. ‘ఆశ’ అని ఆ మాటకు అర్థం. 1862-63లో పోలండ్ లో తిరుగుబాట్లు సంభవించి ఆ దేశంతో రష్యా వాణిజ్యాన్ని దెబ్బతీసినా, విచిత్రంగా స్లీమన్ వ్యాపారం మాత్రం అనూహ్యస్థాయిని అందుకుని అతనికి మూడో భాగ్యాన్ని మూటగట్టింది. కాలిఫోర్నియా బంగారం భూముల నుంచి, క్రిమియా యుద్ధం నుంచి గడించిన మొత్తాల కన్నా ఇది చాలా పెద్దది. ఒక్క నీలిమందులోనే పెట్టుబడి మీద 6 శాతం వడ్డీ గిట్టి, 15 లక్షల పౌండ్ల వార్షికలాభం సమకూడింది. తనింక ఎట్టి పరిస్థితుల్లోనూ దివాళా తీయబోనన్న భరోసా అతనికి చిక్కింది.

గృహజీవితం మాత్రం ఎప్పటిలా అశాంతిని రేపుతూనే ఉంది. ఇద్దరి మధ్యా ఎడతెగని కీచులాటలు. వాళ్ళ కలహ కాపురంలో ఇప్పుడు కొత్తగా పిల్లల పెంపకం, చదువు వచ్చి చేరాయి. సెర్గీ లో మంచి చురుకుదనం, తెలివీ ఉట్టిపడుతూ చదువులో బాగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రికి ఎంతో ఇష్టుడూ అయ్యాడు. పిల్లల పెంపకం, చదువే స్లీమన్ కు ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం విరమించడమే కాదు, ఏకంగా రష్యానుంచే పూర్తిగా మకాం ఎత్తేసి జర్మనీ వెళ్లిపోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. భార్యతో విభేదాలు, పంతాలు కూడా అందుకు ప్రేరణ అయ్యాయి.

డ్రెస్డెన్[తూర్పు జర్మనీ నగరం]లో స్థిరపడే ఉద్దేశంతో అక్కడో ఇల్లు కొనుక్కున్నాడు. పిల్లల్ని తీసుకుని వెంటనే డ్రెస్డెన్ కు రమ్మని భార్యకు తంతి మీద తంతి పంపించాడు. ఆమె ససేమిరా రానంది. ‘నీతో దాంపత్యం నెరపాలన్న కోరిక నాకెంతమాత్రం లేదు, నువ్వు ఎవత్తెనైనా ఉంచుకున్నా నాకు అభ్యంతరం లే’దని తెగేసి చెప్పింది. దాంతో అతను బెదిరింపులు ప్రారంభించాడు. తను సెయింట్ పీటర్స్ బర్గ్ కు వచ్చి పోలీసుల సాయంతో పిల్లల్ని బలవంతంగా తీసుకుపోతాననీ, వాళ్ళను డ్రెస్డెన్ లో ఉంచి జర్మన్ చదువు చదివిస్తాననీ హెచ్చరించాడు. ఓ ఉన్నతాధికారికి కూడా భార్యపై ఫిర్యాదు చేశాడు. కానీ అతని గోడు ఎవరూ వినిపించుకోలేదు. ఏ ఒక్కరి నుంచీ సానుభూతి దక్కలేదు. వట్టి నిరంకుశుడివనీ, తిరుగుబోతువనీ భార్య దుర్భాషలాడింది.

అతను దిక్కు తోచని స్థితిలో పడ్డాడు. అంతలో స్టెఫన్ సొలొవీఫ్ అనే వ్యక్తినుంచి అతనికి రావలసిన ఓ భారీ మొత్తం అందింది. అది చేతిలో పడగానే రష్యానుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. వ్యాపారాన్ని అమ్మేశాడు. కొంత మొత్తాన్ని భార్య పేరున, పిల్లల పేరున పెట్టాడు. తీరా అవన్నీ అయిన తర్వాత అతనికి ఏం చేయాలో తోచలేదు. అయిదేళ్ళ క్రితం ఆగిపోయిన సంచారాన్ని పునఃప్రారంభించడం తప్ప మరో దారేదీ అతనికి కనిపించలేదు. దానికీ ఓ ప్రణాళికంటూ ఏమీలేదు. యాత్రానుభవాలను గ్రంథస్థం చేస్తూ తనో రచయితగా మారితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు. అయితే తన రచనలమీద అతని కేమంత గొప్ప అభిప్రాయంలేదు. తనవన్నీ పైపై రాతలే తప్ప లోతున్నవి కావనీ, అవి పునాదుల్లేని ఇంటిలా కుప్పకూలిపోతాయనీ ఓ సందర్భంలో రాసుకున్నాడు.

1864 ఏప్రిల్ లో ట్యూనిస్(ట్యునీసియా రాజధాని)లో ఉన్నాడు. కార్తేజ్ శిథిలాలను నోరు వెళ్లబెట్టుకుని చూశాడు. ఆ తర్వాత మరోసారి ఈజిప్టును సందర్శించాడు. అక్కడినుంచి భారతదేశానికి వచ్చాడు. ఇక్కడ అతని భాషానైపుణ్యాలేవీ పనిచేయలేదు. ఉర్దూ కానీ, ఇతర భారతీయభాషలు కానీ అతనికి ఆసక్తి కలిగించలేదు. సిలోన్, మద్రాస్, కలకత్తా, బెనారెస్, ఆగ్రా, లక్నో, ఢిల్లీ చూశాడు. హిమాలయ పాదాలదగ్గరికి వెళ్ళాడు. భారత్ లోని విపరీతమైన వేడి, రణగొణధ్వనులు అతన్ని భయభ్రాంతం చేశాయి. సింగపూర్ మాత్రం ఉల్లాసం కలిగించింది. చైనా వెడుతూ మధ్యలో ఆగిన జావా కూడా అతనిలో ఆనందం నింపింది. చైనా యాత్ర సుదీర్ఘంగానూ, తీరుబడిగానూ సాగింది. ఆ దేశం మీద అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కనీసం అక్కడ గొప్ప పండితులు, విద్వత్తును గౌరవించేవారూ ఉంటారని తలపోశాడు.

కానీ చైనా పర్యటన అతనికి నరకం చూపించింది. అక్కడి తిండి, వసతి, దుమ్మూధూళీ, దృశ్యాలు వాసనలు- ప్రతిదీ అతని సహనాన్ని పరీక్షించాయి. చిన్నపాటి రెండు చక్రాల బళ్ళలో ప్రయాణం మరింత కంపరం కలిగించింది. చైనాలో తను కలసుకున్న ఒకే ఒక వ్యక్తిపై మాత్రం డైరీలో ప్రశంసలు కురిపించాడు. అతను చైనాలో స్థిరపడిన ఒక ఆంగ్లేయుడు. పేరు, రాబర్ట్ థామస్. అతను క్రైస్తవప్రచారకుడిగా ఉండేవాడు. తర్వాత మతం మీద నమ్మకం పోయి, చీఫూలోని కస్టమ్స్ హౌస్ దగ్గర దుబాషీగా ఉంటున్నాడు. స్లీమన్ అతన్ని ఇష్టపడడానికి కారణం, తనలానే అతనికీ చాలా భాషలు తెలుసు. రష్యన్, స్వీడిష్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీస్, ఇటాలియన్, జపనీస్, చైనీస్ భాషల్లో ధారాళంగా మాట్లాడగలడు. ఇంకా విశేషం ఏమిటంటే, స్లీమన్ నేర్చుకున్న పద్ధతిలోనే ఇతను కూడా ముందుగా మాటల్ని, వాక్యాల్ని రాసుకుంటూ వాటినుంచి కథలు అల్లుతూ ఈ భాషల్ని నేర్చుకున్నాడు. “వినమ్రత, తెలివీ మూర్తీభవించిన ఈ వ్యక్తి” కాస్త సంపాదన వైపు కూడా దృష్టి పెట్టి ఉంటే మరింత రాణించేవాడని స్లీమన్ రాసుకున్నాడు.

రెండు చక్రాల బండి మీద నానా అవస్థలు పడుతూ 1865 ఏప్రిల్ 30న తీసితిన్ నుంచి రాజధాని పెకింగ్ చేరుకున్నాడు. ఆ ప్రయాణంలో ప్రతి క్షణాన్నీ ఏవగించుకున్నాడు. బండిలో లోపల కూర్చోడానీకీ, నిలబడడానికీ కూడా వీలు కాక ఎక్కువ సేపు బండి మొగ దగ్గర రాట మీద కూర్చునే ప్రయాణం చేశాడు. సాయంత్రానికి పెకింగ్ చేరుకున్నాడు. అప్పటికి అతనిలో సహనమూ పూర్తిగా సన్నగిల్లిపోయింది. ఆ నగరం చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాతిగోడల్ని చూసి ముగ్ధుడయ్యాడు కానీ, లోపలికి వెళ్ళగానే మాత్రం భయపడిపోయాడు. హోటళ్లు లేవు. ఓ బౌద్ధ మఠంలో గది దొరికింది. కిరాయి 12 ఫ్రాంకులన్నారు. గీచి గీచి బేరమాడితే 6 ఫ్రాంకులకు తగ్గించారు. ఆ గదిని చూడగానే నీరుగారిపోయాడు. ఇటుకలతో పేర్చిన పడక. సన్యాసులు నీళ్ళు చల్లడంతో నేల అక్కడక్కడ బురద బురదగా ఉంది. చిన్న చిన్న టేబుళ్లు, స్టూళ్లు. గోడలమీద పెద్ద పెద్ద రాతపత్రాలు వేలాడుతున్నాయి. వాటి మీద చైనా భాషలో కన్ఫ్యూషియస్ సూక్తులు రాసి ఉన్నాయి. ఒక బౌద్ధమఠంలో వాటిని ప్రదర్శించడం అతనికి వింతగా అనిపించింది.

భోజనం కోసం వాకబు చేశాడు. ఈ సమయంలో భోజనం దొరకదని సన్యాసులు చెప్పారు. ఆకలితో, అలసటతో నిద్రలోకి జారిపోయాడు. పొద్దుటే అయిదు గంటలకు నౌకరు వచ్చి లేపాడు. ఓ గిన్నెలో చద్దివాసన కొడుతున్న అన్నం, గ్రీన్ టీ తీసుకొచ్చాడు. వాటిని చూడగానే అతను బిత్తరపోయాడు. దానికితోడు అది ఉప్పులేని చప్పిడి కూడు. టీలో పాలూ, చక్కెరా లేవు. ఇక్కడ పాలూ, చక్కెరా దొరకవని నౌకరు చెప్పాడు.  అతని చేత ఉప్పు తెప్పించుకున్నాడు. చోప్ స్టిక్స్ తో తినడం చేతకాక, వేళ్ళతోనే తీసుకుని తిన్నాడు. కత్తులు, ఫోర్కులే కాదు సరికదా; పాలూ, చక్కెరా కూడా లేకుండా వీళ్ళు ఎలా బతికేస్తున్నారనుకుని ఆశ్చర్యపోయాడు. వట్టి అడవిజనాలనుకున్నాడు.

నౌకర్ని పంపించి గుర్రాలు తెప్పించాడు. రోజంతా నగరంలో తిరుగుతూ గడిపాడు. ఎక్కడబడితే అక్కడ ముష్టివాళ్లు, చెత్త ఏరుకునే వాళ్ళు కనిపించారు. మరణశిక్షలు అమలు చేసే ఓ బహిరంగప్రదేశంలో తెగిపడిన శిరస్సులను చూసి భయవిహ్వలుడైపోయాడు. అర్థంపర్థంలేని అంత్యక్రియల తంతు చూసి విస్తుపోయాడు. కొన్ని దేవాలయాలను దర్శించాడు. వెలిసిపోయి పెచ్చులూడుతున్న దేవుళ్ళ వర్ణచిత్రాలు చూసి పూజార్లను తిట్టుకున్నాడు. దేవుళ్ళకు తొడిగిన పట్టు గౌన్లు చీలికలు పేలికలై దారప్పోగుల్లా వేలాడుతున్నాయి. అట్ట కిటికీలు కూడా ఎక్కడికక్కడ చిరిగిపోయి ఉన్నాయి. చుట్టూ దట్టంగా అల్లుకుపోయిన తీగలు ఆలయం మొత్తాన్నే తినేస్తున్నట్టు అనిపించింది.

మధ్యలో వర్షం పడి వీథులన్నీ బురద బురద అయిపోయాయి. అతనెక్కిన గుర్రానికి అడుగు తీసి అడుగువేయడం కష్టమైపోయింది. దాంతో అతనిలో కోపం నసాళానికి అంటింది.

అప్పటికి చైనా యువ సామ్రాజ్ఞి త్సూ షీ సింహాసనం మీద ఉంది. యాంగ్సీ లోయలో తైపింగ్ తిరుగుబాటు సాగుతోంది. మొత్తం దేశమే విస్తృతమైన మార్పుల దిశగా పయనిస్తోంది. కానీ స్లీమన్ డైరీ రాతల్లో ఆ ఊసు కొంచెమైనా లేదు. అతను పెకింగ్ లో గడిపింది, చూసింది ఒక్కరోజు. ఆ ఒక్క రోజు సందర్శనతోనే ఆ నగరం గురించి అనేక తొందరపాటు నిర్ణయాలు చేసేశాడు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ఊహించుకుంటూ కాగితాలు నింపేశాడు.

ఉదాహరణకు, అతనికా నగరంలో అక్కడక్కడ తెల్ల గ్రానైటుతో నిర్మించిన పేవ్ మెంట్ల తాలూకు శిథిలాలు, ప్రతిచోటా పురాతనకాలపు మురుగు కాల్వల శిథిలాలు, స్తంభాలపై వెలిసిపోయి తునకలు తునకలైన కళాకృతులూ, మట్టిలో సగం కూరుకుపోయిన విగ్రహాలు కనిపించాయి. ఈ నగరంలో అనేకచోట్ల బ్రహ్మాండమైన గ్రానైట్ వంతెనలున్నాయనీ, వాటిలో సగం శిథిలావస్థలో ఉన్నాయనీ ; ఈ శిథిలాలను బట్టి చూస్తే ఒకప్పుడు ఈ నగరంలో రకరకాల నైపుణ్యాలు కలిగిన గొప్ప నాగరికులు ఉండేవారని తెలుస్తుందనీ, ఇప్పుడీ నగరవైభవం అన్ని విధాలా క్షీణించిపోయి, అనాగరికులతో నిండిపోయిందన్నాడు. చప్టా చేసిన పరిశుభ్రమైన వీథులతో, అద్భుత ప్రాసాదాలతో, చక్కని మురుగు నీటి పారుదల వ్యవస్థతో విలసిల్లిన ఈ నగరం ఇప్పుడు మురికి ఓడే చవకబారు ఇళ్లతో తనే ఓ పెద్ద మురుగుకాల్వగా మారిపోయిందన్నాడు. మొత్తానికి నగరం మొత్తం భూమిలో సమాధై తవ్వకాలకు ఎదురుచూస్తున్నట్టు అతనికి కనిపించింది. అన్నింటినీ మించి శిథిలాలపై అతని కున్న మక్కువా, ఆసక్తీ ఈ రూపంలో బయటపడింది.

వాస్తవం ఏమిటంటే పెకింగ్ లో అప్పటికేనాడూ చప్టా చేసిన వీథులు, రాతితో నిర్మించిన మురుగునీటి కాల్వలు, గ్రానైట్ వంతెనలు లేనేలేవు.  చైనా గురించి, చైనీయుల అలవాట్ల గురించి ముందుగా తెలుసుకుని వాటిని సక్రమంగా అర్థం చేసుకుని ఉంటే అతని రాతలో ఇలాంటి పొరపాట్లు దొర్లేవి కావు. ఆ సహనం లోపించడమే అతనిలో సమస్య.  మెరిసిపోయే ప్రాసాదాలు కూడా అతనికి శిథిలాలుగా కనిపించడానికి కారణం, చుట్టూ ఉన్న చెట్ల ఆకులు వాటిని కప్పేయడం. బాహ్యపరిసరాలను సాదాసీదాగా ఉంచుకుని, లోపల అందంగా, కళాత్మకంగా తీర్చిదిద్దడం చైనీయుల అలవాటు. తను నగరంలో తిరిగినప్పటి వాతావరణం, తన అలసట, విసుగు కూడా తన పరిశీలనను ప్రభావితం చేస్తాయని అతనికి తట్టలేదు. తగిన అధ్యయనం, శిక్షణ లోపించడంతో అపోహలను, తప్పుడు అభిప్రాయాలనే నిజమని నమ్మి కాగితం మీద పెట్టడం ఇలాంటి విడ్డూరపు చిత్రణకు దారితీసింది.

ఆ తర్వాత అతను ప్రపంచ వింతలలో ఒకటైన చైనా గోడను సందర్శించాడు. అక్కడో చిన్న దొంగతనానికి కూడా పాల్పడ్డాడు…

(సశేషం)

 

గ్రీకు మద్యం సేవించి మత్తెక్కిపోయాడు!

స్లీమన్ కథ-9

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

1854 శిశిరంలో ఏమ్ స్టడామ్ లో జరిగిన నీలిమందు వేలంలో పాల్గొని అతను రష్యాకు తిరిగొస్తున్నాడు. అప్పుడే క్రిమియా యుద్ధం బద్దలైంది. రష్యన్ రేవులను దిగ్బంధం చేస్తున్నారు. సెయింట్ పీటర్స్ బర్గ్ కు చేరాల్సిన సరకును నౌకల్లో కోనిగ్స్ బర్గ్ కు, మేమల్ కు తరలించి అక్కడినుంచి భూమార్గంలో పంపిస్తున్నారు. ఏమ్ స్టడామ్ లో ఉన్న స్లీమన్ ఏజెంట్ నీలిమందు నింపిన వందలాది పెట్టెల్ని, భారీ పరిమాణంలో ఉన్న ఇతర సరకుల్ని నౌకలో మేమల్ కు పంపించాడు.

స్లీమన్ అక్టోబర్ 3న కోనిగ్స్ బర్గ్ చేరుకుని ఎప్పటిలా గ్రీన్ గేట్ సమీపంలోని ఓ హోటల్ లో దిగాడు. ఉదయం లేవగానే కిటికీలోంచి బయటికి చూశాడు. ఆ హోటల్ ద్వారగోపురం మీద బంగారు అక్షరాల్లో రాసి ఉన్న జర్మన్ పంక్తులపై అతని దృష్టి పడింది.

Vultus fortunae variatur imagine lunae:

Crescit, decresit, constans persistere nescit.

 

The face of fortune varies as the image of the moon

Waxes and wanes, and knows not how to remain constant.

(ఐశ్వర్యపు ముఖం చంద్రబింబంలానే మారిపోతూ ఉంటుంది

పెరగడం, తరగడం తప్ప దానికి స్థిరత్వం తెలియదు.)

ఈ పంక్తులు అతను ఎరిగున్నవే. అప్పుడప్పుడు తండ్రి దగ్గర ఉటంకించేవాడు. తండ్రి కూడా తరచు ఇవే మాటలు కొడుక్కి అప్పగించేవాడు. కానీ ఈసారి మాత్రం ఈ మాటలు ఆశ్చర్యకరమైన ఉధృతితో స్లీమన్ ను తాకాయి.  వాటిలో ఓ హెచ్చరిక ధ్వనిస్తున్నట్టు అనిపించింది.  కచ్చితంగా ఏదో దారుణం జరగబోతోందనుకున్నాడు. వెంటనే టిల్సిట్ కు, అక్కడినుంచి మేమల్ కు బయలుదేరివెళ్ళాడు. ముందురోజు రాత్రి మేమల్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగి అనేక ప్రాంతాలు బూడిదైనట్టు అతనికి మార్గమధ్యంలో తెలిసింది. అతను వెళ్ళేటప్పటికి ఆ నగరమంతా ఇంకా పొగ పరచుకునే ఉంది. తగలబడిన గిడ్డంగులు సెగలు చిమ్ముతూనే ఉన్నాయి.

‘అయిపోయింది… అంతా అయిపోయింది…వందలాది నీలిమందు పెట్టెలు దగ్ధమైపోయాయి… సర్వనాశనమైపోయాను’ అనుకున్నాడు స్లీమన్. అతనికి పిచ్చిపట్టినట్టు అయిపోయింది. వెంటనే తన  ఏజెంట్ దగ్గరకు పరుగెత్తాడు. అతను ఏమీ మాట్లాడకుండా పొగలు కక్కుతున్నవైపు చేయి చూపించాడు.

స్లీమన్ బుర్ర కాసేపు మొద్దుబారిపోయింది. వెర్రి చూపులు చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అతని ఆలోచనలు పరి పరి విధాలుగా పోయాయి. తను పూర్తిగా దివాళా తీశానని నిర్ణయానికి వచ్చాడు. మళ్ళీ మొదటి నుంచీ ప్రారంభించాల్సిందే ననుకున్నాడు. ఇలా అడుగంటిన ప్రతిసారీ తిరిగి పైకి లేవగలిగానని తనకు తనే ధైర్యం చెప్పుకున్నాడు. కాస్త రుణసాయం చేయమని కోరుతూ తను ష్రోడర్స్ కు ఉత్తరం రాస్తాడు…ఇంటిని, ఎస్టేట్లను అమ్మేస్తాడు…ఇకమీదట కూడుకు, గుడ్డకు సరిపోయేంత అతి తక్కువ ఖర్చుతో ఎలాగో బతికేస్తాడు…!

ఇప్పుడిక్కడ ఉండి చేసేదేమీలేదు, వెంటనే సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్ళిపోయి పరిస్థితిని చక్కదిద్దుకోమని మనసు తొందరపెట్టింది. సరిగ్గా అతను తిరుగుప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో వెనక నుంచి ఎవరో భుజం తట్టారు. వెనుదిరిగి చూశాడు. మేమల్ లో స్లీమన్స్ కు ఏజంట్ గా ఉన్న మేయర్ & కోలో హెడ్ క్లెర్క్ నని అతను పరిచయం చేసుకున్నాడు. అంతకంటే ముఖ్యంగా, నీలిమందు పెట్టెల్లో ఏ ఒక్కటీ నష్టపోలేదనీ, అన్నీ భద్రంగా ఉన్నాయన్న శుభవార్తను చెవిన వేశాడు. అదెలా జరిగిందంటే, నీలిమందుతో నౌకలు మేమల్ చేరిన సమయానికి అక్కడి గిడ్డంగులన్నీ వేరే సరకుతో నిండిపోయి ఉన్నాయి. దాంతో వాటికి కొంత దూరంలో అప్పటికప్పుడు చెక్కతో కొన్ని గిడ్డంగులను ఏర్పాటు చేసి సరకును వాటిలో ఉంచారు. అదృష్టవశాత్తూ మంటలు ఈ తాత్కాలిక గిడ్డంగులదాకా వ్యాపించలేదు!

ఇది వినగానే ముంచెత్తిన సంతోషంతో స్లీమన్ ఉక్కిరి బిక్కిరైపోయాడు. కొన్ని నిమిషాలపాటు నోటి వెంట మాటరాలేదు. ఏదో అదృశ్యశక్తి మరోసారి విధ్వంసం అంచుల నుంచి తనను వెనక్కి లాగిందని అనుకున్నాడు. పట్టలేని ఆనందం అతన్ని పసిపిల్లాణ్ణి చేసింది.

ఇప్పుడు హడావుడిగా సెయింట్ పీటర్స్ బర్గ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. మేమల్ లోనే మకాం పెట్టి తన సరకు అమ్మకాన్ని దగ్గరుండి చూసుకున్నాడు. ఎడాపెడా లాభం చేసుకున్నాడు. ఒక్కోసారి తనకే నమ్మశక్యం కానంత మొత్తాలకు బేరాలు కుదుర్చుకున్నాడు. యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని లాభాలు గుంజుకోడానికి అతను కొంచెమైనా సందేహించలేదు. నీలిమందు, ఇతర అద్దకాలు కాక; తుపాకీమందుకు, తూటాల తయారీకీ వాడే సూరేకారం, గంధకం, సీసం వగైరాలను కూడా అమ్మి భారీగా సొమ్ముచేసుకున్నాడు.  ఇంతకుముందు కాలిఫోర్నియా బంగారు భూములనుంచి అదృష్టాన్ని మూటగడితే ఇప్పుడు క్రిమియా యుద్ధం నుంచి మూటగట్టాడు. 1855 చివరినాటికి అతని సంపద విలువ 10 లక్షల డాలర్లకు చేరింది.

***

ఇతర విషయాల్లో కూడా అతనికి అదృష్టం  కలిసొచ్చింది. ముఖ్యంగా, సంసారజీవితంలోని సంతోషాన్ని ఇప్పుడే మొదటిసారి చవిచూస్తున్నాడు. ఎందుకోగానీ ఎకతెరీనా అతని మీద ఇష్టం చూపించడం ప్రారంభించింది. ఆ ఏడాదే  కొడుకు పుట్టాడు. పేరు, సెర్గీ. కొన్ని మాసాలపాటు భార్యపట్ల కృతజ్ఞతాభావం అతనిలో పొంగిపొర్లింది. జార్ వేసవి విడిది అయిన పీటర్ హాఫ్ కు దగ్గరలో ఒక ఎస్టేట్ తోపాటు భార్యకు నగానట్రా కొనిపెట్టాడు. కొన్నిరోజులు విశ్రాంతిగా గడపడానికి ఫ్రాన్స్ తీసుకెడతానని మాట ఇచ్చాడు.

ఇవే రోజుల్లో అతను పోలిష్, స్వీడిష్ భాషలు నేర్చుకున్నాడు. అంతకు మించిన విశేషం ఇంకొకటుంది. క్రిమియా యుద్ధం అందించిన రెండో భాగ్యానికీ, పుత్రలాభానికీ అదనంగా అతనికి మరో మహత్తరమైన కానుక అందింది. అది, గ్రీకు భాష!

ఫస్టెన్ బర్గ్ లో తను పచారీకొట్టులో పనిచేస్తున్నప్పుడు ఒక తాగుబోతు నోట హోమర్ పంక్తులు విన్నప్పటినుంచీ అతనికి గ్రీకు భాషపై విపరీతమైన ఇష్టం ఏర్పడింది. ఎప్పటికైనా ఆ భాష నేర్చుకోవాలని అప్పుడే అనుకున్నాడు. నాయ్ స్ట్రీలిజ్ లోని జిమ్నాజియంలో సరిగ్గా గ్రీకు క్లాసులోకి అడుగుపెట్టబోతున్నప్పుడే తన చదువుకు విఘ్నం కలగడం అతని మనసులో ఒక వెలితిగా ఉండిపోయింది. అయితే ఈ మధ్యలో పది భాషలు నేర్చుకున్నాడు కానీ; తను అమితంగా ప్రేమించే గ్రీకులోకి తలదూర్చే ధైర్యం చేయలేకపోయాడు. ఆ భాష తనను పూర్తిగా మంత్రించి వశం చేసుకుంటుందని భయపడ్డాడు.

ఇన్నేళ్లలో హోమర్ కు, గ్రీకు హీరోలకు సంబంధించి అనేక భాషల్లో వచ్చిన పుస్తకాలను సేకరించి పెట్టుకున్నాడు కానీ, కావాలనే గ్రీకు పుస్తకాల జోలికి వెళ్లలేదు. వెడితే ఆ భాషలోని హోమర్ రచనలన్నింటినీ కంఠతా పెట్టేవరకూ తను ఇంకే పనీ చేయలేననుకుని వెనకాడాడు. ఇప్పుడా ఖరీదైన వ్యాసంగంలోకి దిగడానికి తగిన తాహతు తనకు వచ్చిందనుకున్నాడు. అయినాసరే, తన వ్యాపారబాధ్యతల్లోకి గ్రీకు మరీ చొరబడకుండా జాగ్రత్త తీసుకుంటూనూ వచ్చాడు.

వారంలో ఆరు రోజులు ఆఫీసుకు అంకితమవుతూనే, ఆదివారాలు మాత్రం రోజంతా ఇంట్లో తన చదువు గదిలో తలుపులేసుకుని అధ్యయనంలో గడిపేవాడు. అప్పుడప్పుడు అధ్యాపకుని పక్కన పెట్టుకునేవాడు. అలా ఆరు ఆదివారాల్లో ప్రాచీన గ్రీకుభాషలో పొడవైన, సంక్లిష్టమైన వాక్యాలు రాయగలిగిన స్థితికి వచ్చాడు. ఆ వెంటనే ఆధునిక గ్రీకులో రాయడమూ నేర్చుకున్నాడు. అతనిలోంచి ఆ భాష ఊటలా ఉబికిరావడం ప్రారంభించింది. ఆ భాష సౌందర్యానికీ, అందులోని స్పష్టతకూ పరవశించిపోయాడు. అంతవరకూ తను ఊహించినదానికంటే కూడా ఉజ్వలంగానూ, అద్భుతంగానూ ఆ భాష తోస్తూవచ్చింది. ఆనందం పట్టలేక, నాయ్ స్ట్రీలిజ్ లో చిన్నప్పుడు తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడికి, హోమర్ మాట్లాడిన ఆ పురాతన భాషలో ఓ పెద్ద ఉత్తరం రాశాడు. అందులో అప్పటివరకూ సాగిన తన జీవితగమనాన్ని వివరించాడు. తీవ్రనైరాశ్యంలో కూరుకుపోయిన చీకటి క్షణాలలో కూడా గ్రీకుభాషలోని పవిత్ర షట్పదులు(షట్పది: ఆరు పాదాలు కలిగిన ‘హెక్సామీటర్’), సోఫొక్లీస్(క్రీ.పూ. 497-406: గ్రీకు సంగీత, నాటకకర్త) సంగీతం తనను “ఉత్తేజశిఖరాలకు ఎత్తేసా”యన్నాడు. “ఆ భాషతో నేను మత్తెక్కిపోయా” ననీ, ఒక భాష ఇంత ఉదాత్తంగా ఉండగలదా అనిపించి ఆశ్చర్యచకితుణ్ణయిపోయాననీ రాశాడు. “ఇతరులు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నాకు మాత్రం గ్రీసుకు గొప్ప భవిష్యత్తు ఉన్నట్టు అనిపిస్తోంది. శాంటా సోఫియాపై గ్రీకు జెండా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అన్నింటికన్నా నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది, మూడు శతాబ్దాల టర్కీ ఆధిపత్యం తర్వాత కూడా గ్రీకులు తమ జాతీయభాషను పదిలంగా కాపాడుకుంటూ ఉండడం” అన్నాడు.

ఎప్పటిలానే అతని ఉత్సాహానికి పట్టపగ్గాలు లేకపోయాయి. సోఫొక్లీస్ మూలంతో తృప్తిపడకుండా దానిని ఆధునిక గ్రీకులోకి అనువదించితీరాలనుకున్నాడు. ప్లేటో(క్రీ.పూ. 4వ శతాబ్ది: గ్రీకు తత్వవేత్త, గణితశాస్త్రజ్ఞుడు) రాసిన ప్రతి రచననూ, డెమొస్తనీస్(క్రీ.పూ. 384-322: గ్రీకు రాజనీతిజ్ఞుడు, వక్త) చేసిన ప్రతి ప్రసంగాన్నీ తప్పనిసరిగా చదవాలనుకున్నాడు. గ్రీకు పదాల జాబితాలతో, వాక్యాలతో, ఆ భాషలో తనతో తనే జరిపే సంభాషణలతో, సుదీర్ఘమైన స్వగతాలతో నోటుబుక్కులు నింపేశాడు. ప్రసిద్ధమైన నిజ్నీ నొవ్ గ్రాడ్ తిరునాళ్ళకు వెళ్లినప్పుడు, తను బస చేసిన సత్రంలో రాత్రంతా కూర్చుని ఆ తిరునాళ్ళు తనలో రేపిన భావపరంపరను ప్రాచీన గ్రీకులో వర్ణించుకుంటూ వెళ్ళాడు.

ఆ తర్వాత ఆ భాషలో ఆత్మభారాన్ని దింపుకోవడమూ ప్రారంభించాడు. ఉద్రేకం, కర్కశత్వం, డబ్బు యావతో సహా– తన లోపాల జాబితాను తనే రాసుకున్నాడు. మెక్లంబర్గ్ కో, అమెరికాకో; చివరికి డబ్బూదస్కంతో పనిలేకుండా పండ్లు తిని బతికే ఆదివాసులు నివసించే భూమధ్యరేఖా ప్రాంతాలకో పారిపోవాలన్న తన విచిత్రమైన కోరిక గురించి కూడా రాసుకున్నాడు. గొప్ప శ్రావ్యత, సౌందర్యం నిండిన గ్రీకును దేవతల భాషగా అతను జీవితాంతం నమ్మాడు. ఆ భాష అతనికి ఎలా సర్వస్వం అయిందంటే; దానితో గడిపే ఆదివారాల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేవాడు. సూట్ కేసులో గ్రీకు పుస్తకాలు నింపుకుని తిరునాళ్ళ వెంట తిరునాళ్ళను చుట్టబెడుతూ భార్యకు దూరంగా సంచారం జరిపే క్షణాలకోసమే జీవించేవాడు.

రెండేళ్లపాటు అతను రాసుకున్న గ్రీకు నోట్సు 35 నోటు బుక్కులకు విస్తరించింది. తన అత్యంత రహస్య ఆలోచనలను కూడా వాటిలో రాసుకున్నాడు. తన అంతరంగంలోని చీకటి కోణాలను బయటపెట్టుకున్నాడు. తనమీద తనే వ్యాఖ్యలు చేసుకున్నాడు. “నాకు తెలుసు, నేనో అల్పబుద్ధిని, పిసినారిని. ఈ డబ్బుపిచ్చి నుంచి, లోభత్వం నుంచి నేను బయటపడాలి. యుద్ధకాలమంతా డబ్బు గురించి తప్ప నేనింకొకటి ఆలోచించలేదు” అని ఒకచోట రాసుకున్నాడు. తనపై తనే అసహ్యాన్ని కుమ్మరించుకున్నాడు. బయటిశక్తులు మాత్రమే తననీ రంధినుంచి బయపడవేయగలవని అనుకున్నాడు. పైకి నైతిక కాఠిన్యాన్ని ప్రదర్శించే తనలో గుప్తంగా స్త్రీచాపల్యం ఎలా ఉందో; తిరునాళ్ళలో అందరు వర్తకుల్లానే తను కూడా తప్పతాగి ఆడవాళ్ళ గురించి అశ్లీల సంభాషణల్లో వాళ్ళతో ఎలా పోటీ పడేవాడో వెల్లడించుకున్నాడు.

రాను రాను అతను ప్రపంచాన్ని గ్రీకు కళ్ళతో చూడడం ప్రారంభించాడు. కాన్ స్టాంటినోపుల్(టర్కీ లోని నేటి ఇస్తాంబుల్) పై తమకే హక్కు ఉందన్న గ్రీకుల వాదనను అతను గట్టిగా సమర్ధించేవాడు. రష్యన్లు కూడా ఆ నగరంపై హక్కును చాటుకునేవారు కనుక స్లీమన్ వైఖరి వాళ్ళకు నచ్చేది కాదు. తన ఉద్యోగుల్లో ఒక్కరైనా గ్రీకుజాతీయుడు ఉండాలని అతను కోరుకున్నాడు. రష్యన్ మాట్లాడగల గ్రీకుజాతీయుని కోసం కొన్ని మాసాలపాటు వెతికాడు. ఒక్కరూ దొరకలేదు. చివరికి ఒక ట్యూటర్ ను పట్టుకున్నాడు. అతని పేరు థియోక్లిటస్ విమ్పోస్. సెయింట్ పీటర్స్ బర్గ్ లో చదువుకున్న విమ్పోస్,  గ్రీక్ ఆర్థడాక్స్ చర్చిలో ప్రీస్టుగా ఉన్నాడు. మంచి స్నేహపాత్రుడు. ఏథెన్స్ యాసలో స్వచ్ఛమైన గ్రీకు మాట్లాడగలడు.

నేరుగా స్లీమన్ చదువు గదిలోకి వెళ్ళి పుస్తకాలను తిరగేసే చొరవ ఉన్న అతి కొద్దిమందిలో అతనూ ఒకడు. స్లీమన్ ఆదివారాల్లో ఇచ్చే సాయం విందులకు విమ్పోస్ తోపాటు మరికొందరు పండితులు హాజరయ్యేవారు. అలా వాళ్లమధ్య గడుపుతున్నకొద్దీ ప్రపంచంలోని ఏ మారుమూల ప్రాంతానికో పారిపోవాలన్న కోరిక స్లీమన్ లో అడుగంటుతూవచ్చింది. ఎంతైనా తనొక యూరోపియన్ ననీ, సాధ్యమైనంత త్వరగా వ్యాపారాన్ని వదిలేసి  శేషజీవితాన్ని పండితునిగా గడపాలనీ ఇప్పుడు అనుకుంటున్నాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి పూర్తిగా నిష్క్రమించి జర్మనీలోని ఓ పెద్ద యూనివర్సిటీలో చేరి చదువుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశాడు. అయితే ఏ ఒక్క విద్యార్హత కానీ, శిక్షణ కానీ లేని తనను చేర్చుకుంటారా అన్న సందేహం కలిగి ఆ ఆలోచనను పక్కన పెట్టేశాడు. ఓ వ్యవసాయక్షేత్రాన్ని కొనుక్కుని శాస్త్రవిజ్ఞాన ఆసక్తులకు అంకితమైతే ఎలా ఉంటుందన్న ఆలోచన మళ్ళీ బుర్రను తొలవడం ప్రారంభించింది. రైన్ నది వెంబడే ఓ వ్యవసాయక్షేత్రం కోసం గాలిస్తున్నానని 1856 జూలైలో ఓ మిత్రుడికి ఉత్తరం రాశాడు. అయితే ఆ ఉత్తరం రాయడానికి కొన్ని వారాలముందు మరో మిత్రుడికి ఉత్తరం రాస్తూ; తను ప్రపంచాన్ని చూసింది తక్కువనీ, మొత్తం ప్రపంచమంతా చుట్టిరావాలనుకుంటున్నాననీ, ఒక రచయితగా రాణించగలనేమో ఆలోచిస్తున్నాననీ రాశాడు.

వ్యాపారాన్ని ఇక కట్టిపెట్టాలని 1857లో గట్టిగానే అనుకున్నాడు. అయితే సరిగ్గా అప్పుడే యూరప్ ఆర్థికసంక్షోభంలో చిక్కుకుంది. దాంతో అతను వ్యాపారాన్ని పొడిగించకతప్పలేదు. ఎన్నో విదేశీ కంపెనీలు దివాళా తీసాయి. లండన్, పారిస్, హాంబర్గ్, ఏమ్ స్టడామ్ ల నుంచి తనకు రావలసిన బకాయిలు 30 లక్షల టేలర్ల మేరకు పేరుకుపోయాయి.  ఉన్నదంతా పెట్టుబడి పెట్టిన తను ఈ దెబ్బతో చితికిపోయానని అనుకున్నాడు. అంకెలు తారుమారుచేసీ, పెద్ద పెద్ద ప్రమాదాలకు ఎదురొడ్డీ; ముఖ్యమా, కాదా అని చూడకుండా వ్యాపారం తాలూకు ప్రతి కోణాన్నీ స్వయంగా పర్యవేక్షించీ వ్యాపారం మూలపడకుండా చూసుకోగలిగాడు.

1858 ప్రారంభానికి గండం గట్టెక్కి స్థిమితపడ్డాడు. ఇక ఇప్పుడు గ్రీస్ ను సందర్శించే సమయం వచ్చిందనుకున్నాడు.

                                                                                                                          (సశేషం)

 

 

 

 

 

వివాహం జరిగింది…విషాదం మిగిలింది

స్లీమన్ కథ-8

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు, అష్ట్రఖాన్ కాలర్ తో లాంగ్ కోటు, తార్తార్ తరహా మీసకట్టు, చేతిలో నల్లమద్దికర్రతో చేసిన బెత్తం…విజయశిఖరాలకు ఎగబాకిన ఒక వ్యాపారవేత్తకు ముమ్మూర్తులా సరిపోయే వేషం అతనిది!

[అష్ట్రఖాన్ కాలర్:  నైరుతి రష్యాలో, ఓల్గా డెల్టాలోని ఒక నగరం అష్త్రఖాన్. ఇక్కడి ‘కేరకుల్’ గొర్రెలు మంచి బిగువైన, వంకీలు తిరిగిన ఉన్నికి ప్రసిద్ధి. కొన్ని రోజుల వయసు మాత్రమే ఉన్న గొర్రెనుంచి తీసిన ఉన్ని మరింత శ్రేష్ఠం.  పిండదశలో ఉన్నప్పుడే ఉన్ని తీయడమూ జరుగుతుంటుంది. అలాంటి ఉన్నితో చేసిన కాలర్ ను అష్ట్రఖాన్ కాలర్ అంటారు. ఆ కాలర్ తో కోటు ధరించడాన్ని సంపన్నవర్గాలు హోదాకు, ప్రతిష్టకు చిహ్నంగా భావిస్తాయి]

అతనికి సొంత గుర్రపు బండి ఉంది. సువిశాలమైన అతని నివాసం, సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఓ అత్యుత్తమ వీధిలో ఉంది. అందులో రెండు డ్రాయింగ్ రూములు, ఏడు పడగ్గదులు, అయిదు ఇతర గదులు, ఓ పెద్ద వంటగది, గుర్రపుశాల, ఓ పెద్ద నేలమాళిగ, గుర్రపు బండి ఉంచడానికి ఒక గ్యారేజి…! అత్యంత శ్రేష్ఠమైన అన్ని రకాల మద్యాలూ ఆ నేలమాళిగలో అందుబాటులో ఉంటాయి. ఎంతో ఖరీదు చేసే మూడు జాతిగుర్రాలు ఆ గ్యారేజిలో సిద్ధంగా ఉంటాయి.

అతను కాలిఫోర్నియా బంగారం భూములనుంచి ఓ పెద్ద సంపదను కొల్లగొట్టుకొచ్చాడన్న ప్రచారం నగరమంతటా మోతెక్కిపోయింది. దాంతో, సాహసికుడైన ఈ వ్యాపారవేత్తనుంచి ఆహ్వానం అందుకోడానికి రాచకుటుంబీకులు, వ్యాపార ప్రముఖులు తహతహలాడారు.  అతనిలో డాబుకూ, దర్పానికీ లోటులేదు. ఉన్నతవర్గాలలో కలసిపోవడానికి అవసరమైన నాజూకు పద్ధతులను అప్పటికే అలవరచుకున్నాడు. ఒక్కోసారి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు. ఒకే ఒక్క అతిథి గదిని అలంకరించడానికి ఓసారి వెయ్యి రూబుళ్ళు వెచ్చించాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ మొత్తంలో అతనంత అదృష్టవంతుడు, అంత స్నేహయోగ్యుడు ఇంకొకరు లేరని అందరూ అనుకుంటున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు అధ్యక్షుడు కాదగిన వాళ్ళ జాబితాలో అతని పేరు కూడా ఉంది!

ఇదంతా పైకి కనిపించే మనిషి గురించి. కానీ లోపలి మనిషి వేరు. ఇద్దరి మధ్యా పోలిక లేదు. అతని లోపల జ్వాలలు రేగుతున్నాయి. తీరని లైంగికేచ్ఛ అతనికి పిచ్చెక్కిస్తోంది. ఇల్లు అమరింది కానీ, ఇల్లాలు, పిల్లల కోసం తపిస్తున్నాడు. గతంలో ఓసారి ఎకతెరీనా లిషిన్ ముందు పెళ్లి ప్రతిపాదన చేశాడు. అప్పటికే తను సంపన్న వర్తకులలో ఒకడు. కానీ లిషిన్ ఇష్టపడలేదు. అయినా అతనిలో ఆశ చావలేదు.

Ikaterina Lishin

సెయింట్ పీటర్స్ బర్గ్ కు వచ్చిన మరునాడే ఆమె ఇంటికి వెళ్ళాడు.  ఆ తర్వాత కూడా కొన్ని వారాలపాటు తరచు ఆమెను కలసుకుంటూనే వచ్చాడు. రాను రాను ఆమెను తను గాఢంగా ప్రేమిస్తున్నట్టు అనిపించింది. తన జీవితాంతం ఆమెను ప్రేమిస్తూనే ఉండాలని కూడా అనుకున్నాడు. మంచితనం, దయ, నిరాడంబరత, ఏం చెప్పినా శ్రద్ధగా వినే తత్వం సహా తను కోరుకునే సుగుణాలు అన్నీ ఆమెలో అతనికి కనిపించాయి. తన ఇంట్లో ఉన్నా, వర్తకప్రముఖుల ఇళ్ళల్లో విందు వినోదాలలో పాల్గొంటున్నా ఆమె ఒకే తీరుగా నిండుకుండలా ఉంటుందనుకున్నాడు. అతనామెను అమితంగా ఆరాధించాడు. ఆమె సంతోషం కోసం ఏమైనా చేస్తానని వాగ్దానం చేశాడు.

ఆమె పెళ్ళికి ఒప్పుకుంది!

ఆ క్షణంనుంచీ అతను భూమికి ఆమడ ఎత్తున ఊరేగాడు. 1852 అక్టోబర్ 12- పెళ్లిరోజున ఇంటికి ఇలా ఉత్తరం రాశాడు:

ఈరోజు ఎకతెరీనా లిషిన్ అనే ఒక రష్యన్ యువతికి భర్తనయ్యే సంతోషం నాకు దక్కింది. శారీరకంగా, మానసికంగా కూడా నా భార్య ఓ పరిపూర్ణస్త్రీ. మంచితనం, నిరాడంబరత, తెలివి, వివేకం మూర్తీభవించినది. ఆమెపై నా ప్రేమ, గౌరవాలు రోజు రోజుకీ ఇనుమడిస్తున్నాయి. ఈ సంతోషభరితమైన వివాహాన్ని పురస్కరించుకుని జీవితాంతం సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను.

అయితే, తన వివాహం గురించిన ఇంత అందమైన ఊహా ఇసుకగూడు కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. “ఈ పెళ్లి పూర్తిగా ఒక తప్పుడు నిర్ణయం. నాకిప్పుడు పిచ్చెక్కేలా ఉం”దని…ఆ తర్వాత కొన్ని వారాలకే తోబుట్టువులకు ఉత్తరం రాశాడు. కొంతమందిలో కోరికల మంట మృదువుగా, కనిపించీ కనిపించని జ్వాలలా ఉంటుందనీ, కానీ నాలోని తీరని కోరికల మంట దావాగ్నిలా మారి నన్నే దహించివేస్తోందనీ ఆవేదన చెందాడు.

భార్యనుంచి అనురాగపు వెచ్చదనాన్ని ఆశించాడు. కానీ ఆమె దేనికీ లొంగని జడపదార్థం అయింది.  అంతమంది రష్యన్ యువతుల నుంచి తను ఏరికోరి వరించిన ఈ యువతి; స్త్రీ సహజమైన ఎలాంటి సున్నితత్వమూ, స్పందనా లేని పరమ గయ్యాళి అతనికి అర్థమైంది. అతనితో పడకను పంచుకోవడానికి ఆమె నిరాకరించింది. మాటి మాటికీ అతన్ని సూటిపోటి మాటలతో హింసిస్తూవచ్చింది. ఆమె కేవలం డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకుందనీ, తను చస్తే ఆస్తిని ఎగరేసుకుపోవడానికి చూస్తోందనే భావన అతనిలో బలపడిపోయింది.

మిన్నా మెయింక్ తో అతని ప్రేమ, పెళ్ళికి దారితీయలేదు. ఎకతెరీనా లిషిన్ తో పెళ్లి, ప్రేమకు దారితీయలేదు. మొత్తానికి ప్రేమా, పెళ్లీ…రెండూ అతనికి కలసి రాలేదు!

ఈ పెళ్లి అతనికి ఎంతటి ఆఘాతం అయిందంటే; సలహాను, ఓదార్పునూ కోరుకుంటూ తోబుట్టువులతోపాటు మిత్రులకు కూడా వరసపెట్టి ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు. అయితే ఎవరి నుంచీ ఎలాంటి ఓదార్పూ దొరకలేదు. “నువ్వన్నట్టు ఎకతెరీనాకు నీ మీద ప్రేమ లేదనే అనుకుందాం. అయినాసరే నిన్ను పెళ్లాడిన మేరకు ఆమె తన జీవితాన్ని త్యాగం చేసిందన్న వాస్తవాన్ని నువ్వు మరచిపోకూడదు” అని ఏమ్ స్టడామ్ నుంచి ఒక మిత్రుడు రాశాడు. “బహుశా ఆమె మరీ అంత చెడ్డది కాకపోవచ్చు, నీ పిసినారితనం చూసి భయపడి ఉంటుంది, ఆమె పట్ల మరింత ఉదారంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఆమె నీపై ప్రేమాభిమానాలు చూపవచ్చు”అని  సలహా ఇచ్చాడు. తోబుట్టువుల నుంచి వచ్చిన స్పందన కూడా ఇదే ధోరణిలో ఉంది. “నువ్వో పెద్ద జడపదార్థానివి కనుకే నీ భార్య అలా అయుంటుంది, కాస్త మనిషిలా ప్రవర్తించడం నేర్చుకొ, నువ్వు ఒకరికి ప్రేమ ఇస్తేనే ప్రేమ పొందగలుగుతా”వని హితవు చెప్పారు.

అయితే, మనిషిగా జీవించడం ఎలాగో నేర్పే స్కూలు ఏదీ అతనికి దొరకలేదు!

దాంతో చేసేది లేక పూర్తిగా తన వ్యాపారప్రపంచంలో కూరుకుపోయాడు. ఆ ప్రపంచానికి తనే యజమాని. అక్కడ ఎలా వ్యవహరించాలో, ఎలా రాణించాలో అతనికే బాగా తెలుసు, ఎవరూ నేర్పనక్కర్లేదు.

స్వభావరీత్యానే అతనిలో ఓ జూదగాడు ఉన్నాడు. రష్యాకు తిరిగొచ్చాక తన సంపదనంతటినీ నీలిమందు వ్యాపారం మీద పెట్టేసాడు. మార్కెట్ ను తనే నియంత్రించే స్థాయికి వెళ్ళాడు. పెళ్ళైన కొన్ని వారాలకే మాస్కోలో తన కార్యాలయ శాఖను తెరిచి దాని నిర్వహణ బాధ్యతను మిత్రుడు అలెగ్జీ మద్వీవ్ కు అప్పగించాడు. ఇప్పటికీ రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేస్తున్నాడు. ఇంటికి వెళ్లడం చాలా అరుదైపోయింది. ఎప్పుడూ ధుమధుమలాడుతూ పెడసరపు మాటలతో నొప్పించే భార్యకు ఎదుట పడడానికి జంకి, సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తన ముఖ్యకార్యాలయంలోనే ఎక్కువగా గడుపుతున్నాడు. మధ్య మధ్య దేశదిమ్మరిలా రష్యా చుట్టివస్తున్నాడు.

మనసుకింత ఆనందాన్నీ, విశ్రాంతినీ కలిగించే ఇతరేతర ఆసక్తులేవీ అతనికి లేకుండా పోయాయి. చిన్నప్పటినుంచీ తను అభిమానిస్తూ వచ్చిన హోమర్ కూ; గ్రీకు, రోమన్ పురాతన చరిత్రకూ కూడా దూరమైపోయాడు. ఇప్పుడతనికి పూర్తిగా వ్యాపారమే మత్తుమందూ, వ్యసనమూ  అయిపోయింది. క్రోన్ స్టట్ షిప్పింగ్ జర్నల్  ప్రతులను తండ్రికి పంపడంలో మాత్రం ఆనందం పొందేవాడు. అందులో; వచ్చి పోయే సరకు రవాణా నౌకల పేర్లు; ఆ సరకు యజమానులు, దానిని అందుకోబోయే వాళ్ళ పేర్లు ఉంటాయి. వాటన్నింట్లోనూ హెచ్. స్లీమన్ & కోకు నీలిమందు తీసుకువెడుతున్న నౌకల జాబితాయే పెద్దది. 1853లో ఆ కంపెనీకి పదమూడు నౌకల్లో నీలిమందు రవాణా జరిగినట్టు, ఆ కంపెనీ నుంచి మూడు నౌకలు బయటికి వెళ్ళినట్టు అప్పటి నివేదిక చెబుతోంది.

అయితే ఇది పాక్షిక సమాచారం మాత్రమే. ఇంకా వేలాది వాహనాల్లో కోనిగ్స్ బర్గ్ నుంచీ, మేమల్ నుంచీ అతని కంపెనీకి సరకు రవాణా అవుతుండేది. తన వ్యాపార పరిమాణం ఇప్పుడు నెలకు పది లక్షల సిల్వర్ రూబుళ్లనీ, అంతూపొంతూ లేకుండా అది ఇంకా పెరుగుతూనే ఉందనీ, డబ్బు సంచుల మీద డబ్బు సంచులు, బంగారం మీద బంగారం వచ్చిపడుతున్నాయనీ తండ్రికి ఉత్తరం రాశాడు. అయినాసరే, జీవితంలో తను కోరుకున్న సంతోషం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించని సంగతినీ బయటపెట్టుకున్నాడు.

వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతజీవితం గడపాలన్న పాత కల ఇప్పుడు కొత్తగా తిరగబెడుతోంది. అయితే ఒక తేడా: మెక్లం బర్గ్ కు బదులు అమెరికా వెళ్ళిపోయి, అక్కడో వ్యవసాయకభూమిని కొనుక్కుని అక్కడే ఉండిపోవాలని  ఇప్పుడు అనుకుంటున్నాడు. “పల్లె జీవితాన్నే నేను ఎక్కువ ఆనందించగలననిపిస్తోంది. వ్యవసాయంలోనూ, దానిని అభివృద్ధి చేసుకోడంలోనూ చేతినిండా పని ఉంటుందనే నేను నమ్ముతున్నాను” అని అమెరికాలోని ఓ మిత్రుడికి రాశాడు.

నిజానికి ఒక వ్యవసాయదారునిలో ఉండవలసిన లక్షణాలేవీ అతనిలో లేవు. ముఖ్యంగా విత్తు నాటి అది పంట అయ్యేవరకూ ఓపికగా ఎదురుచూడడం అతనివల్ల కాదు. ఉరుకులూ పరుగుల జీవితం అతనిది. ఊపిరి సలపనంత వేగంగా నిరంతరం పని చేస్తూ ఉండవలసిందే. రోజులో ఏ కొన్ని క్షణాలైనా వ్యాపార సంబంధమైన పనిలో గడపకపోతే అతనికి వల్లమాలిన కోపం వస్తుంది. వ్యవసాయం గురించిన ఊహల్లో మరోసారి మునిగి తేలుతున్న ఈ రోజుల్లోనే తండ్రికి ఉత్తరం రాస్తూ, “ఇక వ్యాపారం కట్టిపెట్టి ప్రశాంత జీవితం గడపమని మంచి ఉద్దేశంతోనే నువ్వు సలహా ఇచ్చావు కానీ, దానిని నేను పాటించలేను. క్షణం తీరిక లేని కార్యకలాపాల్లో కూరుకుపోవడానికి నేను అలవాటు పడిపోయాను. ఎలాంటి అనుకూల పరిస్థితుల్లోనైనా సరే, కాస్సేపు స్తబ్ధంగా గడిపితే పిచ్చాసుపత్రిలో చేరాల్సివస్తుంది” అన్నాడు.

అప్పటికే అతను ఒక్కొక్కసారి పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఉద్యోగులు, పనివాళ్లు ఏ చిన్న పొరపాటు చేసినా ఆగ్రహంతో ఊగిపోతూ కేకలు లంకించుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఏజంట్లు తన ఆదేశాలను వెంటనే అమలు చేయనప్పుడు వాళ్ళకు రాసే ఉత్తరాల్లో కూడా ఓ రాక్షసుడిలా విరుచుకుపడుతున్నాడు.

అమెరికాకు పారిపోవాలన్న ఊహ అతన్ని వెంటాడుతూ వచ్చింది పెళ్ళైన ప్రారంభ సంవత్సరాలలో! అయితే, 19వ శతాబ్ది మధ్యకాలంలో రష్యాలో ఉంటూ అమెరికా కలలు కనడమంటే విధ్వంసాన్ని కొని తెచ్చుకోవడమే. ప్లేటో (క్రీ.పూ. 428-348)సృష్టించిన ఊహాద్వీపం ‘అట్లాంటిస్’లానే అప్పటికింకా అమెరికా చాలామంది దృష్టిలో ఒక పౌరాణిక ఊహా ప్రదేశమే. అక్కడి జనం సంపూర్ణ స్వేచ్ఛతో జీవిస్తూ ఉంటారు. కోపమూ, క్రౌర్యమూ నిండిన అధికారవర్గపు నిఘా చూపుల కింద నిరంతరం జీవించే దుస్థితి వారికి ఉండదు. దోస్తోయెస్కీ రాసిన ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవలలో స్విద్రిగైలోవ్ అనే పాత్ర అమెరికా వెళ్లాలని ఎప్పుడూ కలలు కంటూ ఉంటాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఓ శీతాకాలం రోజున అతను ఓ పెద్ద అధికార భవనం దగ్గర తచ్చాడుతూ ఉంటాడు. ఆ భవనం కాపలాదారుకూ, అతనికీ ఇలా సంభాషణ జరుగుతుంది:

schliemann

కాపలాదారు: ఇక్కడ నీకేం పని?

స్విద్రిగైలోవ్: అవును, నాకిక్కడ పనేం లేదు.

కాపలాదారు: అయితే ఎందుకొచ్చావ్?

స్విద్రిగైలోవ్: వెళ్లిపోతున్నాను.

కాపలాదారు: ఎక్కడికి?

స్విద్రిగైలోవ్: అమెరికాకు.

కాపలాదారు:  అబ్బో, అమెరికాకే!?

స్విద్రిగైలోవ్ రివాల్వర్ తీస్తాడు. కాపలాదారు నిర్ఘాంతపోతాడు.

కాపలాదారు: వద్దు, వద్దు, నువ్విక్కడ ఇలాంటి పని చేయకూడదు. ఏం, వేళాకోళంగా ఉందా?

స్విద్రిగైలోవ్: నేను చేస్తున్నది మంచిపనే.

కాపలాదారు: కాదు, కచ్చితంగా కాదు.

స్విద్రిగైలోవ్: ఇందువల్ల ఎవరికీ ఎలాంటి అపకారం లేదు. ఇదీ మిగతా చోట్ల లాంటిదే. వాళ్ళు నిన్నేమైనా ప్రశ్నిస్తే, అతను అమెరికా వెడుతున్నాడని చెప్పు.

స్విద్రిగైలోవ్ రివాల్వర్ ను తన కణతలకు గురిపెట్టుకున్నాడు.

కాపలాదారు: వద్దు, వద్దు, ఆ పని చేయద్దు. ఇది నిజంగానే తగిన చోటు కాదు.

స్విద్రిగైలోవ్ ట్రిగ్గర్ నొక్కాడు.

రష్యన్ సాహిత్యం మీద కానీ, అక్కడి తాత్విక వాతావరణంలో సంభవిస్తున్న కల్లోలం మీద కానీ స్లీమన్ ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. కాకపోతే రష్యన్ భావోద్రేకాలలో అనివార్యంగా అతనూ పాలుపంచుకుంటున్నాడు. రష్యన్లలానే అతను కూడా అమెరికా తరహా స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. కాలిఫోర్నియాలో కొన్ని మాసాలపాటు దానిని చవి చూశాడు కూడా. అదే సమయంలో రష్యన్లలానే అమెరికా జీవన విధానాలను కొన్నింటిని ఏవగించుకుంటున్నాడు. అమెరికా గురించిన కలల్ని తన ఉత్తరాలలో అతను యధాలాపంగా ప్రస్తావిస్తూ రావడం వెనుక వివాహ వైఫల్యం తాలూకు విషాదం ఉంది.

ఇప్పుడైతే వ్యాపారం ఒక్కటే అతన్ని పట్టుకుని నడిపిస్తోంది. ఆందోళనతో అప్పుడప్పుడు ఉన్మాదం అంచులు తాకుతూ, భార్యను ద్వేషిస్తూ, ఏజంట్లతో గొడవ పడుతూనే; తన ఆవర్జాల(లెడ్జర్లు)ను ముందేసుకుని కూర్చోడంలో భద్రతను, ఓదార్పును పొందుతున్నాడు. సంపద పెరుగుతున్న కొద్దీ, అతనికి దాని అవసరం తగ్గిపోతోంది. అయినప్పటికీ, అతనికి ఉనికీ, ఊపిరీ అన్నీ వ్యాపారమే అయింది. అదే అతని ధ్రువతార. అతని చూపు పడిన ప్రతిదీ లాభంగా మారాల్సిందే. చాలా అరుదైన తీరిక సమయాల్లో మాత్రం తండ్రికి, తోబుట్టువులకు ఉత్తరాలు రాస్తూ, వాటిలో నీతులూ, నిత్యసత్యాలూ బోధిస్తూ, అన్నింట్లోనూ మితంగా జీవించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఉపశమనం పొందేవాడు. అతని ఉత్తరాల్లో తప్పనిసరిగా పుల్ల విరుపు ధోరణి ఉండేది. అయినాసరే, అతను పంపే స్వల్ప మొత్తాలకు వాళ్ళు ప్రతిసారీ కృతజ్ఞతలు చెప్పేవారు. ఓసారి తండ్రికి ఇలా ఉత్తరం రాశాడు:

నీ ఖాతాలో 500 టేలర్లు జమ చేయమని ఈరోజే పోస్ట్ లో ఉత్తర్వులు పంపించాను. హైన్ రిచ్ స్లీమన్ తండ్రిగా నీ హోదాకు తగినట్టు డేంజింగ్ లోని నీ కొత్త నివాసంలో అన్ని హంగులూ సమకూర్చుకోడానికి వినియోగిస్తావన్న అత్యంత ఆశాభావంతో ఈ మొత్తం పంపుతున్నాను.

ఈ డబ్బును పంపడంలో నా ఉద్దేశం, నీ ఇంట్లో చక్కని పరిశుభ్రతను పాటిస్తూ, భవిష్యత్తులో ఒక యోగ్యుడైన సేవకుణ్ణీ, యోగ్యురాలైన సేవకురాలినీ నువ్వు నియమించుకునితీరాలనే. నీ పళ్లేలూ, పాత్రలూ, కప్పులూ, కత్తులూ, ఫోర్కులూ అన్నీ శుభ్రంగా, మెరిసిపోతూ ఉండాలనీ; ఇంటి నేలను వారానికి మూడుసార్లు శుభ్రంగా కడిగిస్తావనీ, ఇప్పటి నీ వయోభారానికి తగినట్టుగా టేబుల్ మీదే భోజనం చేస్తూ ఉంటావనీ ఆశిస్తున్నాను.

కోట్లకు పడగెత్తిన అతని ఆదాయంతో పోల్చితే తండ్రికి పంపిన ఈ 500 టేలర్లు చిల్ల పెంకులతో సమానం. అదలా ఉంచితే, ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టకుండా తన వ్యాపారాన్ని శాఖోపశాఖలుగా అతను విస్తరిస్తున్నాడు. జార్ కొత్త శిక్షాస్మృతిని జారీ చేయబోతున్నట్టు అతనికి తెలిసింది. దాని ముద్రణకు తప్పనిసరిగా మంచి నాణ్యమైన కాగితం వాడతారనీ, వేలాది ప్రతులు అచ్చువేస్తారనీ అతనికి వెంటనే స్ఫురించింది. దాంతో అందుబాటులో ఉన్న నాణ్యమైన కాగితాన్ని కొనేసి ప్రభుత్వానికి అమ్మజూపాడు. ప్రభుత్వం అతని ప్రతిపాదనను అంగీకరించింది.

అయితే, అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యమూ కుప్పకూలి, అతన్ని మళ్ళీ బికారిగా మార్చగల భయోద్విగ్నక్షణాలూ త్వరలోనే ఎదురయ్యాయి…

                                                                                                                         (సశేషం)

 

 

 

 

 

పనామా అడవుల్లో…పద్నాలుగు రోజుల నరకంలో…

 

స్లీమన్ కథ-7

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

సెక్రామెంటో అతనికి నచ్చింది కానీ, అక్కడే ఉండిపోవాలని మాత్రం అనుకోవడంలేదు. భవిష్యత్తు గురించిన సందిగ్ధంలో గడుపుతూనే, తనఖా మీద  తక్కువ కాలపరిమితికి చిన్న చిన్న మొత్తాలను అప్పుగా ఇవ్వడం ప్రారంభించాడు.  తూర్పు దేశాలను చుట్టొస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు.  కొన్ని బలహీనక్షణాలలో అయితే, శాన్ ఫ్రాన్సిస్కోలో బయలుదేరి పసిఫిక్ మీదుగా చైనా, భారత్, ఈజిప్టులకు వెళ్ళి; అక్కడినుంచి ఇటలీ మీదుగా రైల్లో జర్మనీ వెళ్లిపోదామా అనిపించింది.  క్రమంగా అలాంటి ఊహల నుంచీ, కొత్త చోటు కలిగించిన ఉత్సుకతనుంచీ బయటపడ్డాడు. సెక్రామెంటోలోనే ఉండి భారీ అదృష్టాన్ని మూటగట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు..

ఏప్రిల్, మే మాసాలు రెండూ అందుకు సంబంధించిన ప్రాథమిక ఆలోచనలతోనూ, సన్నాహాలతోనూ గడిచిపోయాయి. జూన్ కల్లా బంగారం రజను కొనుగోలుదారుగా అవతారమెత్తి, సెక్రామెంటోలో జే అండ్ ఫ్రంట్ స్ట్రీట్స్ లో ముఖ్యకార్యాలయాన్ని తెరిచాడు.

అదే నెలలో శాన్ ఫ్రాన్సిస్కో వచ్చి మెస్సర్స్ రోత్స్ చైల్డ్ ఏజంట్లతో, ఇతర వర్తకులతో సమావేశాలు జరిపాడు. ఓ రోజు పగలంతా ఇలాంటి సమావేశాలతో గడిపింతర్వాత హోటల్ గదికి వచ్చి విశ్రమించాడు. అంతలో ఉన్నట్టుండి నగరమంతా అగ్నిజ్వాలలు భగ్గుమన్నాయి. హోటల్ మంటల మధ్య చిక్కుకుంది. గంటల మోతకు మేలుకుని హడావుడిగా దుస్తులు వేసుకుని రోడ్డు మీదికి పరుగెత్తాడు.  ఓ వైపునుంచి గాలి వీస్తూ మంటల్ని ఎగదోస్తోంది. చుట్టూ ఉన్న ఇళ్ళు తన కళ్ల ముందే ఆహుతవడం చూశాడు. అక్కడినుంచి టెలిగ్రాఫ్ హిల్ కు పరుగెత్తాడు. “ ఆ అగ్నితుపాను హోరు, తుపాకీమందు పేలుళ్ళు, రాతిగోడలు బద్దలై కుప్పకూలుతున్న చప్పుళ్ళు, జనం ఆర్తనాదాలు, అంత పెద్ద నగరమూ తగలబడిపోతున్న ఆ దృశ్యమూ…ఓ మహావిలయాన్ని కళ్ళకు కట్టించా”యని మరునాడు డైరీలో రాసుకున్నాడు.

విదేశీ విద్రోహులెవరో ఆ చిచ్చు పెట్టారన్న వదంతులు వ్యాపించాయి. దాంతో విదేశీయుల్ని, ముఖ్యంగా ఫ్రెంచివారిని శాన్ ఫ్రాన్సిస్కో జనం నరికి పోగులు పెట్టారని… అదేదో మామూలు విషయమన్నట్టు స్లీమన్ రాశాడు. ఓ పక్క మంటలు ఆరకుండానే, బూడిదకుప్పలు సెగలు కక్కుతుండగానే అమెరికన్లు ఏమీ జరగనట్టు నిర్లిప్తంగా నగర పునర్నిర్మాణంలో మునిగిపోవడం చూసి విస్తుపోయాడు. రాత్రంతా టెలిగ్రాఫ్ హిల్ మీదే గడిపి మరునాడు పొద్దుటే సెక్రామెంటోకు వెళ్లిపోయాడు.

అగ్నిప్రమాదానికి భయపడి, సెక్రామెంటోలో రాతితో, ఇనుముతో కట్టిన ఒకే ఒక భవంతికి తన కార్యాలయాన్ని మార్చుకున్నాడు. దొంగల భయంతో ఓ పెద్ద ఇనప్పెట్టెను కొనుక్కున్నాడు. ఉదయం ఆరునుంచి రాత్రి పదివరకూ దాని పక్కనే మఠం వేసుకుని కూర్చునేవాడు. ఇద్దరు గుమస్తాలను కుదుర్చుకున్నాడు; ఒకరు స్పానిష్, ఇంకొకరు అమెరికన్. ఆ రోజుల్లో బంగారు రజను వేటలో ప్రపంచం నలుమూలలనుంచీ జనం కాలిఫోర్నియాకు బారులుతీరేవారు. ఆవిధంగా ఒకే రోజున తనకు తెలిసిన ఎనిమిది భాషల్లోనూ మాట్లాడే అవకాశం స్లీమన్ కు లభిస్తూ ఉండేది. అప్పటికీ అతనికి రాని భాషలవాళ్ళూ ఎదురయ్యేవారు. శాండ్ విచ్ దీవుల్లోని స్థానికులు మాట్లాడే ‘కెనకా’ భాష వాటిల్లో ఒకటి. ఆ దీవి జనం సెక్రామెంటోకు ఎలా వచ్చారన్నది ఓ పెద్ద మిస్టరీ.

తనకు తీరిక దొరికిన అరుదైన క్షణాలలో అతను కాలిఫోర్నియా ఇండియన్లను పరిశీలిస్తూ ఉండేవాడు. “ఈ రాగి రంగు జనం చిన్నగా, పొట్టిగా, మురికి ఒడుతూ, సిఫిలిస్ తో తీసుకుంటూ మట్టికుప్పల మీద పాకే చీమల బారులా” అతనికి కనిపించారు.

శాక్ర మెంటో 1850

శాక్ర మెంటో 1850

అతను కలలుగన్న భాగ్యరాశి కొన్ని మాసాల్లోనే చేతికి అందింది. ఏకంగా 180 పౌండ్ల బరువైన బంగారం అతని ద్వారా చేతులు మారిన రోజులున్నాయి. రోజు రోజుకీ అతని సంపద ఎలా పెరిగిపోతూ వచ్చిందంటే, దాన్ని చూసి అతను భయపడ్డం ప్రారంభించాడు. గుమస్తాలూ, అతనూ ఎప్పుడూ కోల్ట్ రివాల్వర్ చేతిలో పట్టుకునే ఉండేవారు. తమ్ముడిలానే తను కూడా టైఫాయిడ్ వచ్చి చనిపోతానేమోనని అప్పుడప్పుడు అనిపించేది. అయితే ఆఫీసులో తన డెస్క్ దగ్గర గడిపే అన్ని గంటల సేపూ అతనిలో ఎలాంటి భయచిహ్నాలూ కనిపించేవి కావు.

అక్టోబర్ లో నిజంగానే పడకేసాడు. అదేపనిగా వాంతులు, సంధి ప్రేలాపనలు. ఒంటి మీద పసుపు మచ్చలు వచ్చాయి. డాక్టర్ క్వినైన్, కాలమెల్ ఇచ్చాడు. ఆరోజుల్లో యెల్లో ఫీవర్ కు ఇచ్చే మందులు అవే. అలాంటి సమయాల్లో గుమస్తాలే వ్యాపార వ్యవహారాలు చూస్తూ తనివితీరా కొల్లగొట్టేవారు. ఏ కొంచెమో కోలుకుని అతను తిరిగి డెస్క్ దగ్గరికి రాగానే సంపద గురించిన భయాలు మళ్ళీ పట్టుకునేవి. ఓ పెద్ద ఐశ్వర్యానికి వలేయడంలో ఉండే కష్టాలు, ఒంటరితనం ఎలాంటివో వర్ణిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో లోని ఓ మిత్రుడికి ఉత్తరం రాశాడు:

ఈ వారమంతా చచ్చే చావు అయింది. ఓ నల్లజాతి బానిస కూడా నేను పడ్డంత కష్టం పడడు. అయితే, బంగారం మూటల్ని, నగదును పక్కన పెట్టుకుని రాత్రిపూట ఒంటరిగా నిద్రించడంలో ఉండే ప్రమాదం ముందు శారీరకంగా పడే ఎంత కష్టమైనా దిగదుడుపే. నిండా తూటాలు నింపిన పిస్టల్స్ ను రెండు చేతుల్లో పట్టుకుని రాత్రంతా విపరీతమైన భయాందోళనలతో గడుపుతున్నాను. చీమ చిటుక్కుమన్నా వణికిపోతున్నాను. రోజూ ఒక్క పూటే, సాయంత్రం 6.30కు తినగలుగుతున్నాను. మిగతా కాలకృత్యాలను పూర్తిగా పక్కన పెట్టేయక తప్పడంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ కష్టం పగవాడికి కూడా వద్దు.

అస్వస్థత అతన్ని విడవకుండా వెంటాడుతోంది. కోలుకున్నాడనుకునే లోపల మళ్ళీ జ్వరం పట్టుకుంటోంది. అనారోగ్యం అతని సత్తువను పూర్తిగా తోడేసింది. స్వస్థత కోసం 1852 జనవరిలో శాంటక్లారా వ్యాలీకి వెళ్ళాడు. “నీ తమ్ముడి శరీరధర్మం, నీదీ ఒకటే. అతనిలానే నువ్వూ మరణించే ప్రమాదముం”దన్న డాక్టర్ హెచ్చరిక అతన్ని మరింత కుంగదీసింది.

అయినా అంతలోనే ధైర్యాన్ని కూడదీసుకున్నాడు. తన జవసత్త్వాలెలాంటివో అతనికి తెలుసు. ఓ పెద్ద అదృష్టాన్ని మూటగట్టుకునితీరాలన్న దృఢసంకల్పమే అతనిలో తిరిగి ఎక్కడలేని శక్తినీ నింపింది. ఫిబ్రవరి ప్రారంభానికల్లా వచ్చి సెక్రామెంటోలోని తన కార్యాలయంలో వాలిపోయాడు. ఉదయం 5 గం.లకల్లా లేవడం, డెస్క్ దగ్గర కూర్చోవడం, బంగారం రజను తూచడం, బ్యాంకు డ్రాఫ్టులు రాయడం, ఎనిమిది భాషల్లో మాట్లాడడం…అన్నీ షరా మామూలే.

వ్యాపారలావాదేవీలప్పుడు అతను మహా బిర్రుగా ఉండేవాడు. మొహంలో చిన్న నవ్వు మొలక కూడా ఉండేది కాదు. అంతా పద్ధతిగానూ, తూచినట్టూ వ్యవహరించేవాడు. విచిత్రమైన కీచుగొంతుతో మాట్లాడేవాడు. సంపదకు సంబంధించిన అన్ని రహస్యాలనూ ఛేదించడానికి కంకణం కట్టుకున్న ఓ శాస్త్రవేత్తలానూ, ఏవో గొప్ప ప్రయోజనం కోసం దానిని పోగేయడానికి పూనుకున్నవాడిలానూ కనిపించేవాడు. అయితే ఎలాంటి  ప్రయోజనం కోసం అన్నది అతనికే తెలియదు.

శాన్ ఫ్రాన్సిస్కో లో 1851 అగ్ని ప్రమాదం

శాన్ ఫ్రాన్సిస్కో లో 1851 అగ్ని ప్రమాదం

తనను ఓ అమెరికన్ గానే పిలుచుకునేవాడు. “మన బంగారం భూములు”, “మన శ్మశానవాటిక” అని అంటుండేవాడు.  అమెరికాలోనే స్థిరపడి భావిజీవితాన్ని ఇక్కడే గడిపేయాలని ఒక్కోసారి అనిపించేది. అంతలోనే, జర్మనీకి వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతజీవితం గడుపుతున్నట్టు కలలు కనేవాడు.  రష్యా అయితే ఇప్పుడతని ఆలోచనల్లోంచి పూర్తిగా తప్పుకుంది. బంగారం మూటల పక్కన కూర్చుని తనకే తెలియని ఒక నిస్పృహలో, తనతో తనే విరోధిస్తూ గడుపుతున్నాడు. అయితే ఒక విషయంలో మాత్రం అతనిలో ఎలాంటి సందిగ్ధతా లేదు: తను ఓ పెద్ద ముల్లెను చేజిక్కించుకోనైనా చేజిక్కించుకోవాలి, లేదా ఇక్కడే చావనైనా చావాలి!

మార్చి చివరినాటికి దాదాపు రెండోదే నిజమయ్యే పరిస్థితి వచ్చింది. మళ్ళీ జ్వరం తిరగబెట్టింది. ఒంటి మీద పసుపుమచ్చలు వచ్చాయి. “నేనింక ఏమాత్రం వ్యాపార వ్యవహారాలు చూసుకోలేనని మీకు అనిపించినా వెంటనే నన్నో దుప్పట్లో చుట్టబెట్టి స్టీమర్ మీద శాన్ ఫ్రాన్సిస్కో పంపించేయం”డని గుమస్తాలకు చెప్పాడు.

అయితే, ఏదో అద్భుతం జరిగినట్టుగా కోలుకున్నాడు. అంతకుముందే అతను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రకారం, కోలుకున్న వెంటనే నేరుగా శాన్ ఫ్రాన్సిస్కోలోని రోత్స్ చైల్డ్ బ్యాంకుకు వెళ్ళాడు. తన ఆస్తుల బదిలీకీ, వ్యాపారం కట్టిపెట్టడానికీ ఏర్పాటు చేసుకున్నాడు. ఫర్వాలేదు, తను డబ్బు సంచుల్ని బాగానే పోగేసాననుకుని సంతృప్తి చెందాడు. కొంతమంది కాలిఫోర్నియా బంగారం భూములనుంచి ఇంతకంటే భారీగానే సొమ్ము చేసుకుని ఉండచ్చు. కానీ తనంత వేగంగానూ, అతి తక్కువ రిస్కుతోనూ ఎవరూ సంపాదించి ఉండరు. కేవలం తొమ్మిది నెలల్లో తను సంపాదించిన మొత్తం 4 లక్షల డాలర్లు! ఇది ఎవరి కళ్ళకైనా మిరుమిట్లు గొలిపే మొత్తమే కానీ తనకు కాదు, తన శక్తియుక్తులకు ఇది ఏమాత్రం తులతూగదనుకున్నాడు.

అమెరికన్లను అతను ఇప్పటికీ మెచ్చుకుంటున్నాడు. కాకపోతే, వాళ్ళు మరీ మొరటువాళ్ళనీ, మంచీ మర్యాదా లేనివాళ్ళనీ ఇప్పుడతనికి అనిపిస్తోంది. ఇక్కడి ఆడవాళ్ళు బొత్తిగా ఆకర్షణ లేనివాళ్లని ముందే అనుకున్నాడు. విచిత్రంగా ఇప్పుడతనికి రష్యావైపు మళ్ళీ గాలి మళ్ళుతోంది. తన భావిజీవితాన్ని ఇంకెక్కడా కాదు, రష్యన్ల మధ్యే గడిపేస్తానన్న నిర్ణయానికి కూడా మరోసారి వచ్చేశాడు. ఎంతైనా రష్యన్లు మర్యాదస్తులనీ, వాళ్ళ ఆడవాళ్ళు ఇక్కడివాళ్లలా కాకుండా తనకు నచ్చే విధంగా బాధ్యతగా, ఒబ్బిడిగా ఉంటారనీ అనుకున్నాడు. ఇప్పుడు తను ఓ పెద్ద ఐశ్వర్యాన్ని వెంటబెట్టుకుని వెడుతున్నాడు కనుక మాస్కోలోనో, సెయింట్ పీటర్స్ బర్గ్ లోనో మరింత హుందాగా, వైభవంగా జీవించవచ్చు కూడా.

అందుకు తగ్గట్టే ఈసారి రష్యాకు మంచి పటాటోపంగా వెళ్లాలనుకున్నాడు. 600 డాలర్లు చెల్లించి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి పనామా వెళ్ళే స్టీమర్లో అన్ని హంగులూ ఉండే ఓ ప్రైవేట్ క్యాబిన్ ను బుక్ చేసుకున్నాడు. పనామా జలసంధిని దాటి, న్యూయార్క్ వెళ్ళే ఓడ అందుకుని, అక్కడినుంచి తీరుబడిగా రష్యా వెళ్లాలని అతని ఆలోచన.

అయితే, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన వారం రోజుల తర్వాత, టొవాంటెపెక్ గల్ఫ్ దగ్గర ఓడ తుపానులో చిక్కుకుంది. దాదాపు మునిగిపోయేంత పనైంది. ఆ గండం గడిచి పనామా నగరంలో అడుగుపెడితే మరో గండం ఎదురైంది. దొంగలు అతని సామాను కాజేయబోయారు. ఒకచేతిలో కోల్ట్ రివాల్వర్, మరో చేతిలో పొడవాటి బాకు పట్టుకుని స్లీమన్ రెప్పవాల్చకుండా కాపలా కాయాల్సివచ్చింది. అప్పటికి పనామా రైలురోడ్డు నిర్మాణం కొన్ని మైళ్ళ మేరకు మాత్రమే జరిగింది. ఆ తర్వాత కంచరగాడిదల మీద ప్రయాణం చేయాల్సిందే.

అంత జాగ్రత్తపరుడూ ఓ పెద్ద తప్పు చేశాడు. బొత్తిగా ప్రయాణానికి అనువు కాని సమయంలో బయలుదేరాడు. విడవకుండా వర్షం పడుతూనే ఉంది.  మీ చావు మీరు చావండని మార్గదర్శకులు మధ్యలో వదిలేశారు. తిండి లేదు. ఉడుముజాతి తొండల్ని చంపీ, తుపాకులతో కోతుల్ని వేటాడి వాటి చర్మం ఒలిచీ పచ్చిమాంసం తిన్నారు. తేళ్ళు, పొడపాములు దాడి చేశాయి. స్లీమన్ కాలికి గాయమై కుళ్లుపట్టింది. దాంతో నరాల్ని మెలిపెట్టేస్తున్నంత నొప్పి. మందులూ, బ్యాండేజీ లేవు. ఇంకోవైపు, ఇండియన్లు ఏ క్షణంలోనైనా దాడి చేస్తారన్న భయం…

చివరికి మ్యాపు సాయం కూడా లేని స్థితిలో ఆ అడవిదారి వెంట జీవచ్చవాల్లాంటి తమ దేహాలను తోసుకుంటూ వెళ్లారు. వర్షం నిరంతరాయంగా పడుతూనే ఉంది. దుర్భరమైన ఆ చలివాన వాళ్ళ మూలుగుల్ని కడంటా పీల్చిపారేసింది.  గమ్యస్థానమైన కోలన్ కు చేరతామన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయింది. ఒకళ్లతో ఒకళ్ళు రేచుకుక్కల్లా కాట్లాడుకున్నారు, కొట్టుకున్నారు. కొంతమంది జిగట విరేచనాలతో, మరికొందరు యెల్లో ఫీవర్ తో మధ్యలోనే కన్నుమూశారు. వాళ్ళ మృతదేహాలను అడవి జంతువుల భక్షణకు వదిలేసి మిగతావాళ్లు ముందుకు వెళ్లారు. సముద్రంలో మునిగిపోయినవాళ్ళు దాని అట్టడుగుకి వెళ్ళి దిక్కుతోచని స్థితిలో తిరిగినట్టుగా పద్నాలుగు రోజులపాటు సాగిన ప్రయాణభీభత్సం అది!

స్లీమన్ పరిస్థితి మరీ ఘోరం. అతను కనీసం కునుకు తీయడానికి కూడా లేదు. బాకూ, రివాల్వరూ పుచ్చుకుని తన సామానుకు కాపలా కాయక తప్పదు. అందులో బంగారం కడ్డీలు, రోత్స్ చైల్డ్ బ్యాంకు మీద తీసుకున్న డ్రాఫ్టులు, యూరప్ అంతటా ఉన్న వర్తకప్రముఖులకు ఉద్దేశించిన పరిచయలేఖలు ఉన్నాయి.

అతను తన భావోద్వేగాలను ఉన్నవున్నట్టు ప్రకటించిన సందర్భాలు చాలా అరుదు. వాటిలో ఇదొకటి. ఒళ్ళు జలదరింపజేసే ఈ అనుభవం గురించి ఒక చిన్న పేరాలో ఇలా రాసుకొచ్చాడు:

మృత్యువు మాకెంత మాలిమి అయిపోయిందంటే, దాన్ని చూసి అసలు భయపడ్డమే మానేశాం. పైగా దాన్ని ఇష్టపడడం ప్రారంభించాం. మా కళ్ళముందే కొంతమంది కళ్ళు తేలేస్తూ మృత్యుముఖంలోకి వెళ్లిపోతుంటే మాలో మేము నవ్వుకుంటూ వినోదించాం. ఒకరిపై ఒకరం ఘాతుకాలకు పాల్పడ్డాం. అవెంత దారుణమైనవంటే, ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటే భయంతో నిలువునా గడ్డకట్టిపోతాను.

అవి ఎలాంటి ఘాతుకాలు, వాటిలో తను స్వయంగా పాల్గొన్నాడా అన్నది అతను ఏనాడూ వెల్లడించలేదు. మానభంగం, హత్య, నరమాంసభక్షణ…ఇలా ఊహించవలసిందే కానీ అవేమిటో తెలియదు. తదుపరి సంవత్సరాలలో తన జీవితం గురించి ఎప్పుడు రాసినా అమెరికాలో తను గడిపిన కాలాన్ని త్వర త్వరగా దాటేసేవాడు. పనామా జలసంధిపై తను చేసిన ప్రయాణం గురించైతే మళ్ళీ ఎక్కడా ప్రస్తావన కూడా చేయలేదు. ఆ పద్నాలుగు రోజుల భయానక అనుభవాన్ని మరచిపోవడానికే ప్రయత్నించాడు.

కాకపోతే ఆ తర్వాత అతను మరింత నిర్దాక్షిణ్యంగానూ, ఇతరుల పట్లే కాక తన పట్ల తనే మరింత కరకుగానూ     మారినట్టు కనిపిస్తుంది. నీది బొత్తిగా తడిలేని రాతిగుండె అనీ, ఎంతసేపూ స్వార్థమే తప్ప ప్రపంచం ఏమైపోతున్నా నీకు పట్టదనీ ముందునుంచీ తోబుట్టువులు నిష్టురమాడేవారు. ఇప్పుడు మరింత బండరాయిగానూ, కర్కశంగానూ మారాడు. డబ్బు పిచ్చి కూడా వెనకటి కంటే ముదిరిపోయింది.  రాను రాను అతను తన ఊహల లోతుల్లో నిద్రిస్తున్న గ్రీకు వీరుల్లా మారుతూ వచ్చాడు.  మెలికలు తిరుగుతూ మృత్యుముఖంలోకి వెడుతున్న వాళ్ళను చూసి వాళ్ళు కూడా నవ్వుకుంటూ వినోదిస్తూ గడిపినవాళ్లే. అతనిలానే సంపద వేటలో ఆటవికత అంచులు దాటినవాళ్ళే.

మొత్తానికి అతను యూరప్ కు తిరుగుముఖం పట్టాడు. కాలి గాయానికి కట్టు కట్టించుకునేంత సేపే            న్యూయార్క్ లో  ఆగాడు. లండన్ లో దిగి  గాయానికి కాల్పుల చికిత్స చేయించుకున్నాడు. మెక్లంబర్గ్ లో కొన్ని వారాలు ఆగి పాత పరిచయాలను పునరుద్ధరించుకున్నాడు. తన ధనబలాన్ని ఆడంబరంగా ప్రదర్శించుకున్నాడు. తండ్రికి, చిన్నాన్నకు, తోబుట్టువులకు ఖరీదైన కానుకలు ఇచ్చాడు. తీరా మెక్లంబర్గ్ వచ్చాక, వ్యవసాయదారుడిగా స్థిరపడాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పేశాడు. రష్యాకు వెళ్లిపోవాలనీ, అక్కడో పెద్ద భవంతిని, లేదా కనీసం ఓ పెద్ద అపార్ట్ మెంట్ ను కొనుక్కోవాలనీ; మంచి కుటుంబం నుంచి వచ్చిన ఓ రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనీ, బహుశా కొంత కాలానికి తను రష్యన్ ప్రభువర్గంలో చేరే స్థాయికి ఎదుగుతాననీ అనుకుంటున్నాడు.

తన వయసు ఇప్పుడు ముప్పై ఏళ్ళు. భావిజీవితం బంగారు బాటపై సాగిపోగలిగినంత సంపదను ఇప్పటికే గడించుకున్నాడు. తనిప్పుడు ఎవరికీ, దేనికీ తలవంచాల్సిన అవసరం లేదు. స్లై మీద సెయింట్ పీటర్స్ బర్గ్ కు వెడుతూ, ప్రపంచంలో తనంత అదృష్టవంతుడు లేడనుకున్నాడు. తను ఫస్టెన్ బర్గ్, ఏమ్ స్టడామ్ లలో కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న రోజుల్లో; పుస్తకాలు, మద్యం, మగువ, పనివాళ్లు, ఇళ్లతో సహా పగటికలలు అనుకున్నవన్నీ ఇప్పుడు  చిటికెనవేలు ఆడిస్తే చాలు, రెట్టింపు లెక్కలో తన ముందు వాలిపోతాయనుకున్నాడు.

కానీ, గడిచిన పదిహేడేళ్ళ జీవితంలో డబ్బు తనకేనాడూ సుఖాన్నీ, సంతోషాన్నీ ఇవ్వలేదన్న సంగతిని అతను గమనించుకోలేకపోయాడు.

త్వరలోనే అతని జీవితకథలో కొత్తపుటలు చేరబోతున్నాయి.  ఎట్టకేలకు అతను ఒక ఇంటివాడు కాబోతున్నాడు….!

  (సశేషం)

 

అతని డైరీ రాతల్లో మానవ అనుభవాల పచ్చిదనం…

 

స్లీమన్ కథ-6

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

తమ్ముడు మరణించిన వార్త స్లీమన్ కు చేరింది 1850 ఆగస్టులో…

ఆ ఏడాది మిగతా రోజుల్ని తన వ్యాపార పర్యవేక్షణలోనూ, ఏం చేయాలో తోచని అనిశ్చితస్థితిలోనూ గడిపేశాడు. తమ్ముడి మరణం అతన్ని చలింపజేసింది. మృత్యువు గురించిన ఊహ భయపెట్టింది. దుఃఖభారం తన మీద హఠాత్తుగా పడినట్టుగా కుటుంబ సభ్యుల మీద పడకూడదనుకుని ఒక విచిత్రమైన ఉత్తరం రాశాడు. తమ్ముడు చనిపోయినట్టు తనకు కల వచ్చిందనీ, ఈ ఇరవయ్యేళ్లలో ఎప్పుడూ ఏడవని తను ఆ కలను తలచుకుని మూడు రోజులపాటు దుఃఖించాననీ అందులో రాశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అసలు విషయం రాస్తూ, తమ్ముడు ఓ పెద్ద ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళిన సంగతిని కూడా తెలియజేశాడు.

ఏడాది చివరిలో అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. తమ్ముడి ఆస్తిని సంరక్షించవలసిన బాధ్యత తనకు ఉంది. దాంతోపాటు అతని అడుగుజాడల్లో నడుస్తూ తను కూడా కాలిఫోర్నియా బంగారు భూముల దగ్గరకు వెళ్ళి అతని డబ్బుతోనే వ్యాపారం చేసి సెయింట్ పీటర్స్ బర్గ్ లో కన్నా వేగంగా కోట్లు సంపాదించచ్చు. అంతకన్నా ముందు తమ్ముడికి తగిన సమాధిని నిర్మించాలి. తనింక అమెరికాలోనే స్థిరపడిపోతాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో తనను కట్టి పడేసేవేమీ లేవు. కాకపోతే ఎకతెరీనా లిషిన్ ను తను ఇప్పటికీ ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఆమెను తను పెళ్లి చేసుకుంటే మళ్ళీ రష్యా రావలసి ఉంటుంది. ఆమె పెళ్ళికి ఇష్టపడాలన్నా తను అమెరికా వెళ్ళి ఆమె కళ్ళకు జిగేలుమనిపించేటంత ఐశ్వర్యాన్ని గడించవలసిందే.

సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే జీవితాంతం పాతుకు పోవాలని ఇంతకుముందు అనుకున్నాడు. ఇప్పుడది పొరపాటు నిర్ణయం అనుకుంటున్నాడు. మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలనీ, ఆగిన చోట ఆగకుండా మరోసారి సంచారజీవిగా మారాలనీ తలపోస్తున్నాడు.

1850 డిసెంబర్ 10న సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తన వర్తక మిత్రులకు చివరి విందు ఇచ్చి ఆ నగరానికి వీడ్కోలు చెప్పాడు. నేవా నది గడ్డకట్టి ఉంది. సెయింట్ ఇసాక్ స్క్వేర్ మీదుగా మంచు గాలులు వీస్తున్నాయి. మిత్రులు అతన్ని సాగనంపడానికి పోస్టాఫీస్ దాకా వచ్చారు. అక్కడినుంచే జర్మనీకి దూరప్రయాణం చేసే స్లై బళ్ళు బయలుదేరతాయి. అక్కడి వింటర్ ప్యాలెస్, నౌకాదళ భవనం, అశ్వాన్ని అధిష్టించి ఉన్న పీటర్ ది గ్రేట్ విగ్రహం పక్కగా వెడుతూ అదే చివరిసారి అన్నట్టు వాటికి శాల్యూట్ చేశాడు.

ప్రయాణంలో ఎప్పటిలానే డైరీ రాసుకున్నాడు. ఆ డైరీ రాతలు చాలావరకూ టైమ్ టేబుల్ కు పొడిగింపే. వాటిలో రైళ్ల రాకపోకల వేళలు, ప్రయాణంలో తగిలిన రైల్వే స్టేషన్ల పేర్లు, తను బస చేసిన హోటల్ వివరాలు, ఆరో అంతస్తులో తను దిగిన గదికి చెల్లించిన కిరాయి, బ్యాంక్ లో తను మారకం చేసిన మొత్తం, తన అనుమతితో కలసుకున్న వర్తకుల పేర్లు వగైరాలు ఉంటాయి.

1850 డిసెంబర్ 15న డైరీలో ఇలా రాసుకున్నాడు:

ఉదయం 7గం. లకు ఎల్బింగ్ లో బ్రేక్ ఫాస్ట్ చేశాం. 11గం.లకు మేరియన్ బర్గ్ దాటాం. సాయంత్రం 4గం.లకు ఓ పెద్ద తేలుడు వంతెన మీంచి విష్టులా మీదుగా డిషావ్ చేరుకున్నాం. డిసెంబర్ 18న మధ్యాహ్నానికి ఓడెన్ బర్గ్ చేరాం. అక్కడ డిన్నర్ చాలా అధ్వాన్నంగా ఉంది. 1గం.కు రైల్లో బయలుదేరి సాయంత్రం 5.30గం.లకు స్టార్ గాడ్ మీదుగా స్టెటిన్ చేరాం. అక్కడినుంచి మళ్ళీ 6.30గం. లకు రైల్లో బయలుదేరి రాత్రి 9.30గం.లకు బెర్లిన్ చేరాం.

అదృష్టవశాత్తూ అతని డైరీ రచన ప్రతిసారీ ఇలాగే లేదు. తన అమెరికా ప్రయాణం డైరీని అతను ఇంగ్లీష్ లో రాశాడు.   అందులోని కొన్ని భాగాలు అతని అత్యుత్తమ రచనల్లో ఒకటిగా మిగిలిపోతాయి. ప్రచురణకూ, ఇంకొకళ్ళు చదవడానికీ ఉద్దేశించకపోయినా వాటినతను ఎంతో శ్రద్ధగా రాశాడు. కొన్నిచోట్ల కథనంలో గొప్ప నిజాయితీ, నిర్మొహమాటం ఉట్టిపడుతూ అతని అనుభవప్రపంచంలోకి మనల్ని ఇట్టే తీసుకుపోతాయి.

డైరీ తెరవగానే, ఓ పెద్ద ముల్లెను చేజిక్కించుకోడానికి అంగలార్చుతూ బయలుదేరిన అసలుసిసలు వ్యాపారవేత్తగానే అతను కనిపిస్తాడు. తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకోగల తన వ్యాపారపు మెళవకుల గురించిన డాంబికత; గురి తప్పని తన అంచనాల గురించిన ఆత్మవిశ్వాసమూ ఆ రాతల్లో వ్యక్తమవుతాయి. కానీ ముందుకు వెడుతున్నకొద్దీ అతన్ని మొదలంటా వణికింపజేసిన మానవ అనుభవాల పచ్చిదనం కనిపిస్తుంది. తుపాను, గాలివాన, అస్వస్థత అతనిలోని అతిశయపు గాలి తీసేసి అణిగి ఉండేలా చేశాయి. భయభీభత్సాల ముఖాన్ని అతి దగ్గరగా చూసి అతను  మామూలు మనిషయ్యాడు.

అతని డైరీ తొలి పుటల్ని తిరగేసేవారెవరూ, కాన్ రాడ్ రాసిన Heart of Darkness తో పోల్చదగిన ఒక మానవీయ అనుభవపత్రాన్ని ముందు ముందు చదవబోతున్నామని అనుకోలేరు

పనామా జలసంధిలో చాగరెస్ నది

పనామా జలసంధిలో చాగరెస్ నది

స్లీమన్ ఏమ్ స్టడామ్ చేరుకుని బి. హెచ్. ష్రోడర్ &కో ను సందర్శించాడు. అమెరికాలోని ఏజెన్సీలకు, బ్యాంకులకు పరిచయలేఖలు తీసుకున్నాడు. అక్కడినుంచి బయలుదేరి డిసెంబర్ 23న లండన్ చేరుకున్నాడు. “బ్లాక్ ఫ్రయర్స్ బ్రిడ్జి” దగ్గర, “రాయల్ హోటల్” లో బస చేశాడు.  తను సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి తెచ్చుకున్న బిల్లులను నగదుగా మార్చుకున్నాడు. తన దగ్గరున్న బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కు అమ్మేశాడు. మధ్యాహ్నం క్రిస్టల్ ప్యాలెస్ ను దర్శించి ఆనందించాడు. ఇంగ్లండ్ పారిశ్రామిక ప్రగతికి అది కూడా ఒక తిరుగులేని ఉదాహరణగా కనిపించింది.

క్రిష్టమస్ రోజున వెస్ట్ మినిస్టర్ యాబేలో చర్చి సేవల్లో పాల్గొన్నాడు. అదే రోజున ప్రముఖ విషాదాంత నాటక నటుడు మెక్రాడే రంగస్థలంనుంచి విరమించుకునే ముందు నటించిన చివరి నాటకాన్ని చూశానని డైరీలో రాసుకున్నాడు. నిజానికి మెక్రాడే క్రిష్టమస్ రోజంతా పూర్తిగా తన కుటుంబంతో గడిపాడు తప్ప ముఖానికి రంగు వేసుకోలేదు. అతను చివరిసారి నటించింది అప్పటికి రెండు నెలల తర్వాత! 1851 ఫిబ్రవరి 26న ప్రిన్స్ థియేటర్ లో జరిగిన ఆ బ్రహ్మాండమైన ప్రదర్శనను తిలకించినవారిలో డికెన్స్, బుల్వర్-లిటన్ లాంటి ప్రముఖులు ఉన్నారు. స్లీమన్ మరెవరి నాటకమో చూసి మెక్రాడేదిగా పొరబడి ఉంటాడు.

క్రిష్టమస్ మరునాడే రైల్లో లివర్ పూల్ చేరుకుని తను ఎప్పుడూ దిగే అతి పెద్ద హోటల్ అడెల్ఫీలో బసచేశాడు. 35 పౌండ్లు చెల్లించి న్యూయార్క్ ప్రయాణానికి ఏర్పాటు చేసుకున్నాడు. రాత్రి వరకూ లివర్ పూల్ లో అక్కడా అక్కడా తిరిగాడు.

ss atlantic (1)

ఎస్.ఎస్. అట్లాంటిక్

3వేల టన్నుల బరువైన ఎస్.ఎస్. అట్లాంటిక్ ఆ మరునాడే న్యూయార్క్ కు బయలుదేరింది. ఆ రోజుల్లో అత్యంత వేగంగా ప్రయాణించే ఓడల్లో అదొకటి. బయలుదేరిన ఎనిమిది రోజులకు తుపానులో చిక్కుకుంది. ఓ పెద్ద అల ముందుచక్రాన్ని ధ్వంసం చేసి ప్రధాన స్తంభాన్ని విరిచేసింది. అలలు ఓడను తలోవైపుకీ విసిరేయడం ప్రారంభించాయి. ఇంజన్లు రెండూ పనిచేయడం మానేశాయి. అప్పటికి ఓడ లివర్ పూల్ నుంచి 1,800 మైళ్ళు ప్రయాణించి, న్యూయార్క్ కు 1,400 మైళ్ళ దూరంలో దాదాపు అట్లాంటిక్ నడి మధ్యలో ఉంది.

ఉధృతంగా వీస్తున్న పడమటి గాలిని ఆసరా చేసుకుని సముద్రానికి అడ్డంగా ప్రయాణించి అమెరికా తీరానికి చేరుకోవచ్చుననుకుని కెప్టెన్ ప్రధాన తెరచాపల్ని ఎగరేశాడు. “తెరచాపలు జేబురుమాళ్లను తలపించాయి” అని స్లీమన్ డైరీలో రాసుకున్నాడు. తుపాను గాలులకు అభిముఖంగా ప్రయాణించాలన్న కెప్టెన్ ఆలోచనను ప్రయాణీకులంతా వ్యతిరేకించారు. ఇంగ్లండ్ కు తిరిగి వెళ్ళడం మంచిదన్నారు. పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. చివరికి ప్రయాణీకుల ఒత్తిడికి తలవొగ్గి కెప్టెన్ ఓడను వెనక్కి తిప్పాడు.

సముద్రపు గాలి పడక స్లీమన్ అంతవరకూ అస్వస్థతతో ఉన్నాడు. తుపాను కలిగించిన ఉద్రిక్తత పుణ్యమా అని ఆ  అస్వస్థత మంత్రించినట్టు మాయమైపోయింది. పైగా అంతవరకూ లేనంత ఉల్లాసాన్ని తను పుంజుకోవడం గమనించి స్లీమన్ ఆశ్చర్యపోయాడు. ఘనత వహించిన ఆ ఓడ చీలికలు పీలికలైన తెరచాపలతో ఇంటిముఖం పడుతుంటే వింతగా చూస్తూ ఉండిపోయాడు.

పదహారు రోజుల తర్వాత క్వీన్స్ టౌన్ లో ఓడకు లంగరేశారు. స్లీమన్ వెంటనే బయలుదేరి డబ్లిన్ మీదుగా లివర్ పూల్ కు తిరిగి వచ్చాడు. అంతలో ఏమ్ స్టడామ్ లో ఓ ముఖ్యమైన వ్యాపారలావాదేవీకి తను అత్యవసరంగా హాజరు కావాలన్న కబురు అందింది. హడావుడిగా అక్కడికి వెళ్ళి ఫిబ్రవరి 1 కల్లా మళ్ళీ లివర్ పూల్ వచ్చి న్యూయార్క్ ప్రయాణానికి తిరిగి సిద్ధమైపోయాడు.

ఈసారి అతను ఎస్.ఎస్. ఆఫ్రికాలో ప్రయాణం చేశాడు. ఎటువంటి ఆటంకాలూ లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోయింది. అతనికి న్యూయార్క్ నచ్చింది. యూరోపియన్ రాజధానులతో పోల్చదగింది కాకపోయినా, “సొగసైన భారీ భవంతులతో ఓ పద్ధతిగా, చూడముచ్చటగా, శుభ్రంగా నిర్మించిన నగరం” అనుకున్నాడు. న్యూయార్క్ లోని ఆడవాళ్ళలో మాత్రం మెచ్చుకోదగింది ఏమీ అతనికి కనిపించలేదు. “16-18 ఏళ్ల వయసులో ఎంత అందంగా, కుదిమట్టంగా ఉంటారో, 22 ఏళ్ళు వచ్చేసరికి అంత వయసుమీరినవాళ్లలా, నలిగిపోయినట్టు కనిపిస్తారు” అని డైరీలో రాసుకున్నాడు. వినోదాలకు, పనికిమాలిన విషయాలకు వాళ్ళు వెంపర్లాడతారని కూడా అతనికి అనిపించింది.

అక్కడి రైలురోడ్లు కూడా అతనికి నచ్చలేదు. రైల్లో ఫిలడెల్ఫియాకు వెళ్లొచ్చిన తర్వాత, “అమెరికాలో రైలురోడ్లు కేవలం డబ్బు చేసుకోడానికే నిర్మించారు. ప్రయాణీకులకు అవసరమైన సదుపాయాలపై కనీసమైన దృష్టి కూడా పెట్టలేదు” అని రాశాడు. అలా అన్నవాడే ఆ తర్వాతి కాలంలో అమెరికా రైలు రోడ్లపై భారీగా పెట్టుబడులు పెట్టాడు.

వాషింగ్టన్ వెళ్ళి అధ్యక్షుడు ఫిల్ మోర్ ను కలసుకున్నాడు. “ఈ అందమైన పడమటి దేశాన్ని చూడడానికీ, దీనిని పాలించే మహనీయుల్ని పరిచయం చేసుకోడానికీ వచ్చా”నని అధ్యక్షుడితో చెప్పినట్టు రాశాడు. ఆ వెంటనే వైట్ హౌస్ లో జరిగిన ‘స్వయిరీ’(soiree: సాధారణంగా ఒక ప్రైవేట్ గృహంలో జరిగే సాయం విందు. దీనికి నిర్దిష్టమైన దుస్తులతో హాజరవుతారు)లో పాల్గొని, పనామా జలసంధి(Isthamus of Panama)కి దారితీసే ఓడ ఎక్కాడు. ఆ రోజుల్లో సుదూర పశ్చిమానికి వెళ్లడానికి అదొక్కటే దారి. అప్పటికింకా పనామా రైలురోడ్డు లేదు. జలసంధికి చేరుకున్నాక కంచర గాడిదల మీద ప్రయాణం చేసేవారు. ఆ ప్రాంతంలో యెల్లో ఫీవర్ లాంటి మన్య జ్వరాల బెడద ఎక్కువగా ఉండేది. చుట్టుపక్కల అడవుల్లో బందిపోట్ల సమస్యా ఉండేది.

స్లీమన్ ఓ రివాల్వర్ ను, పొడవాటి బాకును వెంటబెట్టుకుని వెళ్ళాడు. చాగరెస్ నదిలో మొసళ్ళను చూశాడు. అక్కడి సీతాకోకచిలుకలు పావురాలంత పెద్దవిగా ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతంలో అడుగుపెట్టడం అతనికి ఇదే మొదటిసారి. అక్కడి ఆదివాసుల గురించి కొంత వ్యంగ్యం మేళవిస్తూ ఇలా రాసుకొచ్చాడు:

పనామా జలసంధి ఓ సువిశాలమైన ఈడెన్. ఇక్కడి ఆదివాసులు అచ్చంగా ఆదమ్, ఈవ్ ల వారసులే. నగ్నంగా తిరుగుతూ, ఇక్కడ విస్తారంగా లభించే పండ్ల మీద ఆధారపడుతూ తమ పూర్వీకుల పద్ధతులను, ఆచారాలను పూర్తిగా పాటిస్తున్నారు. వీళ్లలో కొట్టొచ్చినట్టు కనిపించేది దారుణమైన సోమరితనం. వేరే ఏ పనీ చేయకుండా ఉయ్యాలలో పడుకుని తింటూ, తాగుతూ గడుపుతారు. మొత్తానికి అద్భుతమైనవాళ్ళు.

అద్భుతం అలా ఉంచి, వాళ్ళ సోమరితనాన్నీ, వాళ్ళనూ చూసి అతను భయపడ్డాడు. దారి పొడవునా ఇండియన్ల చేతుల్లో హతులైన బాటసారుల ఎముకల పోగులు కనిపించాయి. పనామా చేరాడు కానీ ఆ నగరం అతనికి ఏమాత్రం సంతోషం కలిగించలేదు. అక్కడి స్పానిష్ జనం కూడా అతనికి “సోమరిపోతుల్లానూ; న్యూయార్క్ లోని ఆడవాళ్ళలానే  వినోదాలకు, పనికిమాలిన ఆసక్తులకు పాకులాడేవాళ్లుగానూ, పెద్దగా శీలసంపద లేనివాళ్ళుగానూ” కనిపించారు. ఇలా చూసీ చూడగానే మనుషుల మీద తొందరపాటు తీర్పులు ఇవ్వబోయాడే కానీ, ఉష్ణమండల ప్రాంతాలలో జనజీవితం చాలావరకూ ప్రకృతి దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతుందనీ, వారి ఆకాంక్షలకు అదే హద్దులు గీస్తుందన్న సంగతి అతనికి తట్టలేదు.

పనామాలో అతనికి ఏదీ నచ్చకపోయినా, విచిత్రంగా ఒకవిధమైన సంతృప్తినీ చెందాడు. ప్రయాణం దాదాపు ముగిసి, కాలిఫోర్నియా బంగారం చేతికి అందబోయే అవకాశం అతనిలో ఉత్సాహం నింపింది. అక్కడికి వెళ్ళే ఓడకు ఇంకా కొన్ని రోజుల వ్యవధి ఉంది కనుక ఈలోపల పనామా పాతనగరం చూద్దామని వెళ్ళాడు. మోర్గాన్, అతని సముద్రపు దొంగల ముఠా ధ్వంసం చేయడంతో సగం నగరం పాడుబడి ఓ పెద్ద అడవిలా తయారైంది.

అంకెర్షాగన్ విడిచిపెట్టాక అతను శిథిలాలను చూడడం ఇదే మొదటిసారి. ఆ దృశ్యం అతనికి పెద్దగా ఉత్తేజం కలిగించలేదు కానీ, ఆ పురాతనపు గోడల్లో చెట్ల వేళ్ళు ఎలా పాతుకున్నాయా అనుకుంటూ వింతగా వాటినే చూస్తూ ఉండిపోయాడు. పనామా పాతనగరం సందర్శనను పురావస్తు అన్వేషణలో అతని తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. తన వెంట వచ్చిన గైడ్ ఓ మొద్దావతారమనీ, ఆ శిథిలాల గురించి అతనికేమీ తెలియదనీ, సమయం వృథా అవడం తప్ప ఈ ప్రయాణంతో ఒరిగిందేమీ లేదనీ రాసుకున్నాడు.

1851 మార్చి 15న ఎస్.ఎస్. ఓరెగన్ మీద కాలిఫోర్నియాకు బయలుదేరాడు. ప్రయాణంలో ప్రతి క్షణాన్నీ అసహ్యించుకున్నాడు. భోజనం పరమ రోతగా ఉందంటూ పళ్ళు నూరాడు. ఎంతసేపూ ఉప్పులో ఊరేసిన పందిమాంసం, గొడ్డు మాంసం తప్ప; ఐసుకానీ, తాజా మాంసంకానీ లేదు. సముద్రస్నానాన్ని మాత్రం చాలా ఇష్టపడ్డాడు. అయితే ఓడలోని పనివాళ్లు అందుకు సహకరించకపోవడం అతనికి విచిత్రంగా అనిపించింది.

వారం రోజుల తర్వాత ఓడ అకపుల్కో చేరింది. స్పానిష్ జనంపై అతనిలో ఏర్పడిన అవిశ్వాసం ఇప్పుడు మెక్సికన్లవైపు మళ్ళింది. వాళ్ళు వట్టి అబద్ధాలకోరులు, అజ్ఞానులు, పొగరుబోతులు అనుకున్నాడు. అకపుల్కో “ఓ ఆఫ్రికా గ్రామం”లా కిక్కిరిసిన గుడిసెల గుంపులా ఉందన్నాడు. పసుపురంగు సముద్రపు కలుపుతో నిండిన అఖాతం చుట్టూ కొన్ని చెక్కఇళ్ళు మాత్రమే ఉన్న కుగ్రామంగా శాన్ డియేగోను తీసిపారేశాడు. ఆ నేలను, తోటి ప్రయాణీకులను ఏవగించుకుంటూ, ఖగోళ గ్రంథాలు చదువుతూ, రాత్రిపూట గంటల తరబడి నక్షత్రాలను పరిశీలిస్తూ గడిపాడు. అతనిలో అసహనం ఎంత తారస్థాయికి వెళ్ళిందంటే, ఓడ గోల్డెన్ గేట్ (శాన్ ఫ్రాన్సిస్కోను మెరీన్ కౌంటీతో కలిపే జలమార్గాన్ని గోల్డెన్ గేట్ అంటారు. 1933లో అక్కడ గోల్డెన్ గేట్ వంతెన నిర్మించారు)కు చేరడం ఏ కొంచెం ఆలస్యమైనా భగ్గున పేలిపోయి ఉండేవాడు.

శాన్ ఫ్రానిస్కోను చూసి మాత్రం చాలా సంతోషించాడు. అయినా సమయం వృథా చేయడానికి లేదనుకుంటూ తమ్ముడి సమాధిని చూడడానికి వెంటనే సెక్రామెంటోకు దారితీశాడు. అప్పటికి సెక్రామెంటో ఇంకా బాల్యదశలోనే ఉంది. చెక్క గోడలతో నిర్మించిన ఇళ్లతో ఈ విచిత్రమైన పట్టణం, పొరుగునే ఉన్న బంగారు భూముల పుణ్యమా అని ఉనికిలోకి వచ్చింది. మొదటిసారి సెయింట్ పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టినప్పుడు తనలోంచి ఆశ్చర్యకరమైన ఉధృతితో తోసుకొచ్చిన అనుభూతి లాంటిదే ఈ పట్టణంలో అడుగుపెట్టగానే అతనికి కలిగింది.  ఈ పట్టణ జనాభా కన్నా, ఇక్కడి శ్మశానంలోని సమాధులే ఎక్కువ సంఖ్యలో ఉండడం అతను గమనించాడు.

తమ్ముడి సమాధిని చూశాడు. అక్కడ ఎలాంటి స్మారకచిహ్నాలూ లేవు. “ఒక చక్కని పాలరాతి సమాధి”ని నిర్మించమని చెప్పి ఓ శవవాహకుడికి 15 పౌండ్లు ఇచ్చాడు. తమ్ముడు విడిచి వెళ్ళిన సంపద గురించి వాకబు చేశాడు. అతని భాగస్వామి దాన్ని పుచ్చుకుని పారిపోయాడని అక్కడి వాళ్ళు చెప్పారు. పోలీసుల సాయంతో అతన్ని పట్టుకోవచ్చేమో నని కొంత భోగట్టా చేశాడు. చివరికి అదో వృథా ప్రయాస అన్న నిర్ణయానికి వచ్చి విరమించాడు. అలా తమ్ముడు సంపాదించానని చెప్పిన ముల్లె కాస్తా గాలిలో కలిసిపోయింది.

స్లీమన్ కు సెక్రామెంటో మామూలుగా నచ్చడం కాదు, మత్తెక్కించింది. కొత్తచోట ప్రతిసారీ చేసినట్టే చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ ఎలాంటి అవకాశాలుంటాయో పరిశీలించాడు. సటర్ విలాను, యుబా నది దగ్గరి బంగారు భూముల్ని, నెవాడా నగరాన్నీ దర్శించాడు. నెవాడా “చీదర పుట్టించే చిన్నపాటి ప్రదేశం”గా అతనికి కనిపించింది. ప్రయాణాల్లో తనలా బహుభాషా పరిచయం ఉన్నవాళ్లను గాలించి పట్టుకునే అలవాటు కూడా అతనికుంది. సొనోమా వ్యాలీలో అలాంటి వ్యక్తి తారసపడ్డాడు. అతను ప్రొఫెసర్ రీగర్. అతనికి ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్, డచ్చి భాషలు తెలుసు. ఒక భాషనుంచి ఇంకో భాషలోకి అవలీలగా లంఘించే ఆ అపరిచితునితో అర్థరాత్రి వరకూ కబుర్లాడుతూ స్లీమన్ ఆనందించాడు.

కొన్ని రోజులు అనిశ్చితంగా గడిపిన తర్వాత, బంగారం రజను(gold dust)కొనే వ్యాపారిగా అవతారమెత్తాడు. ఆ వ్యవహారంలోనే జూన్ లో శాన్ ఫ్రాన్సిస్కో వచ్చాడు. అగ్నిప్రమాదాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆ నగరంలో అతను ఉన్నప్పుడే ఓ పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది…

                                                                                                                     (సశేషం)

 

 

 

 

 

 

 

వ్యాపార శిఖరంపై…ఒంటరితనం లోయలో…

 

స్లీమన్ కథ-5

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మిన్నాతో అతని పరిచయం పదహారేళ్ళ క్రితం. ఇన్నేళ్లలో వాళ్ళు కలసి తిరిగింది మాత్రం మూడు, నాలుగేళ్లే, అది కూడా బాల్యంలో!  కానీ ఇంతవరకూ అతని జీవితంలో మనసుకు దగ్గరైంది మిన్నా ఒక్కతే. అతని ఊహల్ని, కలల్ని పంచుకున్నదీ; అతనేం చెప్పినా ఆసక్తిగా, శ్రద్ధగా ఊకొడుతూ విన్నదీ ఆమె ఒక్కతే.

ఆమెకు దూరమైన ఈ పన్నెండేళ్లలోనూ ఎక్కువ కాలం, అతను పేదరికంతో ముఖాముఖి పోరాటంలోనే గడిపాడు. ఆ ప్రయత్నంలో మృత్యుముఖంలోకీ వెళ్ళి వచ్చాడు. అంతటి కష్టజీవితం కూడా అతన్ని మానసికంగా  ఏనాడూ కుంగదీయలేదు. కుంగదీయకపోగా అతనిలో పైకి ఎదగాలన్న పట్టుదలను, కార్యదీక్షను పెంచింది. మిన్నా సాహచర్యంలో తను గడపబోయే భావిజీవితం గురించిన ఊహ బతుకు పోరాటంలో అతను విజేతగా నిలవడానికి స్ఫూర్తి నిచ్చింది. మిన్నా తలపులతో అతను జీవనోత్సాహాన్ని పుంజుకోని రోజు ఈ పదహారేళ్లలో ఒక్కటీ లేదు. కడగండ్ల లోయలోంచి ఒక్కసారిగా అతను వైభవశిఖరాన్ని అందుకోగలిగాడంటే; దాని వెనుక మిన్నా అదృశ్యహస్తం తప్పనిసరిగా ఉంది.

తీరా జీవితంతోపాటు మిన్నాను కూడా గెలుచుకోగలిగిన దశలో ఆమె చేజారిపోయింది. తనదనుకున్న మిన్నా ఇంకొకరి సొత్తు అయిపోయింది. ఆమెకు పెళ్లి జరిగిపోయిందన్న చేదునిజం మొదటిసారి అతని మనసుకు పెనుగాయం చేసింది.  పంచుకునే మనిషి లేనప్పుడు ఈ డబ్బు, పలుకుబడి, ప్రతిష్టా దేనికన్న ప్రశ్న అతనికి మొదటిసారి ఎదురైంది. మిన్నాతో శాశ్వతవియోగ రూపంలో మనసులోకి నిశ్శబ్దంగా జారిన ఒక వెలితి ఒంటరితనంగా మారి క్రమంగా పెద్దదవుతూ అతని భావిజీవితం అంతా పరచుకుంటూ వచ్చింది. అతనిలో ఇప్పుడు విచారంతోపాటు అసహనం, చికాకు పెరుగుతున్నాయి.

పైకి మాత్రం ఒక వ్యాపారవేత్తగా అతని జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. సెయింట్ పీటర్స్ బర్గ్ కు వచ్చి  ఏడాది తిరక్కుండానే ప్రథమ శ్రేణి(First Guild) వర్తకుల జాబితాలో అతని పేరు చేరింది. చిరకాలంగా పాతుకుపోయిన పెద్ద వర్తకుల్లానే ఇప్పుడతను బ్యాంకులనుంచి కావలసినంత రుణం పొందచ్చు. నెల నెలా జరిగే గిల్డ్ సమావేశానికి హాజరు కావచ్చు. కోట్లకు పడగెత్తిన వర్తకులతో సమాన ఫాయీలో మాటలు, మంతనాలు జరపచ్చు. విందు వినోదాల్లో పాల్గోవచ్చు.

తను జర్మన్ అయినా స్వచ్ఛమైన రష్యన్ లో అనర్గళంగా ప్రసంగించగలగడం అతని అదనపు ఆకర్షణ. అతన్ని గిల్డ్ క్లబ్ లోకి సాదరంగా ఆహ్వానించిన బడా వర్తకుల్లో పీటర్ అలెగ్జీఫ్ ఒకడు. అతనిది పది కోట్ల రూబుళ్ల విలువైన వ్యాపారం అదిగాక కోటి రూబుళ్లకు పైగా వ్యక్తిగత ఆస్తి ఉంది. పొనోమరెఫ్ ప్రముఖ చక్కెర, కలప వ్యాపారి. అతనికి స్లీమన్ వ్యాపారదక్షత మీద మంచి గురి కుదిరింది. తనతో భాగస్వామ్యం కుదుర్చుకుంటే లక్ష సిల్వర్ రూబుళ్లు పెట్టుబడి పెడతానంటూ ముందుకొచ్చాడు. ఇక ఏమ్ స్టడామ్ లో తనకు పరిచయమైన  పాత మిత్రుడు జివాగో ఉండనే ఉన్నాడు. అతనిది కూడా కోట్ల విలువైన వ్యాపారం. స్లీమన్ రష్యా రావడానికి చాలావరకూ అతనే కారణం. మాస్కోలో అతనికి ఓ బ్రహ్మాండమైన భవంతి ఉంది. ఎప్పుడు మాస్కో వెళ్ళినా స్లీమన్ బస అక్కడే.

జివాగోకు పిల్లలు లేరు. మేనగోడలు ఎకెతెరీనా అతని దగ్గరే ఉంటోంది. వయసు పదహారేళ్లు. అందంలోనూ గుణంలోనూ  అచ్చం “దేవకన్యే”.  స్లీమన్ తో వ్యాపార భాగస్వామ్యాన్నే కాదు, మేనగోడలినిచ్చి అతనితో బంధుత్వం కూడా కలుపుకోవాలని జివాగో అనుకున్నట్టున్నాడు, స్లీమన్ తన ఇంటికి వచ్చినప్పుడల్లా బ్రహ్మరథం పట్టేవాడు. ఒకసారైతే మూడు, నాలుగు నెలలు ఇక్కడే ఉండిపొమ్మని కూడా పట్టుబట్టాడు.

స్లీమన్ అతని ఆలోచనల్ని పసిగట్టాడు. ఎకెతేరీనా అతనికి నచ్చకపోలేదు. ఆమెది కట్టి పడేసే అందమే. కానీ ఎటూ తేల్చుకోలేకపోయాడు. మెక్లంబర్గ్ లో ఉన్న సోదరికి ఉత్తరం రాశాడు. ఒకసారి రష్యా వచ్చి సెయింట్ పీటర్స్ బర్గ్ లో తన దగ్గర కొన్ని వారాలు ఉండమనీ; ఆ తర్వాత నిన్ను మాస్కో తీసుకెడతాననీ, ఎకెతెరీనాను దగ్గరగా చూసి ఆమె ఎలాంటిదో, ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో, ఆమెకు వంట చేయడం వచ్చో రాదో తెలుసుకుని తనకు చెప్పాలనీ కోరాడు. “పెళ్లికూతుళ్ల కేం చాలామంది ఉన్నారు. వందలమందిలో తగిన అమ్మాయిని ఎంచుకోవడమే అసలు సమస్య. ఈ విషయంలో నీ సహాయం కావాలి. నాకు ఆడవాళ్ళలో గుణాలే కానీ లోపాలు కనిపించవు” అన్నాడు.

విదేశాల్లో ఉన్న తన ఏజెన్సీలనుంచి వ్యాపార నివేదిక అడిగినట్టుగా ఎకెతెరీనా మీద నివేదిక ఇమ్మని సోదరిని అడిగాడన్నమాట. పైగా తనింట్లో పెద్ద స్నానాల తొట్టెతో సహా అన్ని సదుపాయాలూ ఉన్నాయనీ, నువ్వు చాలా సుఖంగా గడపచ్చని కూడా రాశాడు.

ఎందుకోగానీ సోదరి నుంచి ఉలుకూ పలుకూ లేదు. స్లీమన్ హతాశుడయ్యాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప మిన్నా లాంటి అమ్మాయి తనకు భార్యగా లభించడం అసాధ్యమనుకున్నాడు. అయినా చూద్దామని బాగా డబ్బూ, ప్రతిష్టా ఉన్న వర్తకుల అమ్మాయిలను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. అలాంటి ప్రతి ప్రయత్నం చివరికింత మనస్తాపాన్నో, అయోమయాన్నో మిగిల్చేది. చిటపటలకు, అసహనానికి తోడు తను చెప్పిందే వేదమనే స్వభావం అతనిది. శాసించి పనులు జరిపించుకోడానికి అతను అప్పటికే అలవాటు పడిపోయాడు. అయితే వ్యాపారరంగంలో కలిసొచ్చిన లక్షణాలు అమ్మాయిల దగ్గర పనికిరాలేదు. వాళ్ళు అతనికో పెద్ద పజిల్ గా మారారు. వాళ్ళే ఏమిటి, ఈ విషయానికి వచ్చేసరికి తనకు తానే ఓ పజిల్ గా మారాడు. అసలు తనకు ఏం కావాలో తనే నిర్ణయించుకోలేకపోయాడు. ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అతని ఊహ. కానీ అందమూ, నిరాడంబరతా, హుందాతనం రాశిపోసిన మిన్నా లాంటి అమ్మాయి అతనికి ఒక్కరూ దొరకలేదు.

మొత్తానికి మిన్నా దూరమవడం అతని వ్యక్తిగత జీవితాన్ని గాడి తప్పించింది…

అతని వృత్తి జీవితం మాత్రం ఎప్పటిలా నల్లేరు మీద నడకలా సాగిపోతోంది. ష్రోడర్ తో తన సంబంధాలను కొనసాగిస్తూనే సొంత వ్యాపార సంస్థను ప్రారంభించాడు. అన్ని రకాల వ్యాపారాలను అందిపుచ్చుకుంటూ వెళ్ళాడు. ఎంతటి నష్టాలకైనా ఎదురొడ్డాడు. అగ్రశ్రేణి వర్తకులైతే తప్ప సరుకు అరువివ్వకపోవడం అతను అనుసరించిన ఒక పద్ధతి. తను రెక్కలు ముక్కలు చేసుకుని మీ సంస్థకు లాభాలు తెచ్చిపెడుతున్నాననీ, తనిప్పుడు ప్రపంచవ్యాప్తి కలిగిన ప్రముఖ వర్తకుల్లో ఒకడిగా గుర్తింపు పొందాననీ, కనుక తనకు ఇంతవరకూ ఇస్తున్న అర్థ శాతం కమీషన్ కంటే ఎక్కువ ఇవ్వవలసిందనీ ష్రోడర్ కు ఉత్తరం రాశాడు. ష్రోడర్ వెంటనే కమీషన్ ను ఒక శాతానికి పెంచాడు. దాంతో తను అపారమైన సంపదను గడించే రోజు ఎంతో దూరంలో లేదని స్లీమన్ అనుకున్నాడు.

1848 చివరిలో స్లై మీద అతను అయిదోసారి మాస్కో వెళ్ళాడు. క్రిష్టమస్ ను, న్యూ ఇయర్ ను జివాగో కుటుంబంతో గడిపాడు. ఈ సందర్శన అతనిలో ఎంతో సంతోషాన్ని నింపింది. కానీ తిరుగు ప్రయాణంలో మంచు తుపాను ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఇన్ఫ్లూయెంజాతో మంచం పట్టాడు. తను చనిపోతాడేమోనని కూడా అనిపించింది. నాలుగు మాసాల తర్వాత కాస్త ఆరోగ్యం చిక్కింది అనిపించగానే ఎప్పటిలానే ఊపిరి సలపనంత పనిలోకి దిగిపోయాడు. దాంతో జూన్ కల్లా మళ్ళీ కుప్పకూలాడు. కొన్నిరోజులు వ్యాపారాలు కట్టిపెట్టమని డాక్టర్లు గట్టిగా చెప్పి అతన్ని ఓ చీకటి గదికి పరిమితం చేశారు. వాళ్ళ మీద మొదట మండిపడ్డాడు కానీ, వారి కట్టడిలో న్యాయముందని త్వరలోనే అర్థం చేసుకున్నాడు.

ఎకతెరీనా లిషిన్

ఈసారి కోలుకునే సమయానికి  డాక్టర్ల పాఠం పూర్తిగా తలకెక్కింది. పని తగ్గించుకుని విందులు వినోదాలకు సమయం కేటాయించడం ప్రారంభించాడు. తను స్వయంగా వర్తకప్రముఖులను, వాళ్ళ అమ్మాయిలను ఆహ్వానించి పార్టీలు ఇచ్చాడు. అత్యుత్తమ మద్యాలతో అలరించాడు. ఈ క్రమంలోనే సోఫియా అనే అమ్మాయితో గాఢమైన ప్రేమలో పడిపోయాడు. ఆమె పెద్ద ఆస్తిపరురాలు కాదు, కానీ పొదుపరి. మూడు యూరోపియన్ భాషల్ని ధారాళంగా మాట్లాడుతుంది. తను కలలు గనే అమ్మాయి దొరికిందని వెంటనే తండ్రికి ఉత్తరం రాసేశాడు. ఆమెతో సంబంధం తెంచేసుకున్నానన్న ఉత్తరమూ ఆ వెంటనే తండ్రి చేతికి అందింది. ఇద్దరూ కలసి ఓ పార్టీకి వెళ్లినప్పుడు ఆమె ఒక యువ అధికారిపై విపరీతమైన ఆసక్తిని చూపించడం అందుకు కారణం.

ఆమెను అంతటితో వదిలించుకున్నందుకు అతను సంతోషించాడు. ఈ అనుభవం ఎకెతెరీనా గురించి అతన్ని సరికొత్తగా ఆలోచింపజేసింది. ఈమె కన్నా ఆమె వెయ్యిరెట్లు నయమనిపించింది. పైగా జివాగో కుటుంబం తనను మాస్కో రమ్మని ఎప్పుడూ పిలుస్తూనే ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారీ నెత్తిన పెట్టుకుంటుంది. ఒక మాదిరి నిర్ణయంతో అతను 1850 ఫిబ్రవరిలో మరోసారి స్లై మీద మాస్కో వెళ్ళాడు. ఎప్పటిలా జివాగోల ఇంట్లో దిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, నెలరోజులు గడిచాయోలేదో, అతను శరవేగంతో యూరప్ అంతా చుట్టబెట్టడం ప్రారంభించాడు. పీకల్లోతున వ్యాపార వ్యవహారాల్లో కూరుకుపోవడం తప్ప మరో ఊసులేదు. ఏ ఒక్క చోటా కొద్ది రోజులు మినహా ఆగింది లేదు. రాసిన ఉత్తరాలు అన్నింట్లో వ్యాపార విషయాలే తప్ప వ్యక్తిగత విషయాలు మచ్చుకైనా లేవు.

ఒక్కమాటలో చెప్పాలంటే పోలీసులు వెంటాడుతున్న నేరస్తుడిలా ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్ కు జారుకుంటూ వచ్చాడు. కాకపోతే ఇంగ్లండ్ లో కాస్త ఎక్కువ రోజులు గడిపాడు. ఎడింబరో, గ్లాస్గో, లివర్ పూల్, బాంగర్, చెస్టర్, లండన్ లను సందర్శించాడు. తను చూసిన ప్రతి దాని గురించీ నోట్సు రాసుకున్నాడు. రోజూ రాత్రి పడుకునేముందు డైరీ రాసుకునేవాడు. ఇంగ్లండ్ పారిశ్రామిక ప్రగతి ఇప్పటికీ అతనికి ఆశ్చర్యం గొలుపుతూనే ఉంది.

కొన్ని వారాల తర్వాత అతను సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగి వచ్చాడు. అతని జేబుల నిండా లెక్కలేనన్ని వ్యాపార ఒప్పందాలు. కానీ అతని వ్యక్తిగత జీవితం నిండా తీరని అశాంతి, అసంతృప్తి, దుర్భరమైన ఒంటరితనం. ఎన్ని ఉన్నా అతనికి ఆడతోడు లేదు. ప్రకృతి సహజమైన అనుభవానికి దూరమవడం నిశ్శబ్దంగా అతన్ని నిస్తేజం చేస్తోంది. దాంతో అతని వ్యక్తిగత జీవితం చుక్కాని లేని నావ అయింది. తను ఎంతగానో ఆకాశానికి ఎత్తిన సెయింట్ పీటర్స్ బర్గ్ లో నివసించడం కూడా ఉండి ఉండి అతనికి కంపరం కలిగిస్తోంది. మెక్లంబర్గ్ కు వెళ్ళిపోయి ఓ పేదింటి రైతు అమ్మాయిని పెళ్లిచేసుకుని వ్యవసాయం చేసుకుంటూ గడిపితే బాగుండు ననుకునే క్షణాలూ ఉంటున్నాయి.

కానీ ఎంతైనా తన అదృష్టానికి పునాది పడింది సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే. కనుక మరికొన్ని మాసాలు ఇక్కడే గడుపుదామనుకున్నాడు. మళ్ళీ పనిలోకి దిగిపోయాడు. పార్టీలకు వెడుతున్నాడు. ఈ మధ్యలో 1850 వేసవిలో కాబోలు, ఎకెతెరీనా లిషిన్ అనే అమ్మాయి అతనికి పరిచయమైంది. తను మరో స్నేహితుడికి దగ్గరి బంధువు. ఎత్తుగా తీర్చిదిద్దిన శిల్పంలా ఉంటుంది. కోలముఖం, నీలి కళ్ళు, ప్రవర్తనలో రాకుమారిని తలపించే హుందాతనం. స్లీమన్ కు ఆమె నచ్చింది. పెళ్లి మాటలు కూడా జరిగాయి. కానీ వెంటనే ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఆమెలోని మితిమీరిన ఆభిజాత్యం, పెద్దగా ఆస్తిపరురాలు కాకపోవడం  అతన్ని వెనక్కి లాగాయి.

వేసవి గడిచి ఆకురాలు కాలం అడుగుపెట్టింది. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. కానీ ఈ జీవితాన్నీ, చాలావరకూ నీలిమందు వ్యాపారంతో గడించిన ఈ సంపదనూ ఏం చేసుకోవాలన్న ప్రశ్న అతని ముందు వేలాడుతూనే ఉంది.

వ్యక్తిగత విషయాల్లో త్వరగా ఒక నిర్ణయానికి రాలేని అశక్తత అతన్ని వెంటాడుతోంది. మెక్లంబర్గ్ వాసుల్లో సహజంగా ఉండే మితిమీరిన జాగ్రత్త అది. దానికితోడు అతను ప్రపంచం తాలూకు కఠోర పార్స్వాన్ని అతి దగ్గరగా చూశాడు. పేదరికం, సంపద; ఆకలి, అన్నం… అన్నీ చవి చూశాడు. ఉజ్వలమైన నగరజీవితమూ, మారు మూల పల్లె జీవితమూ-రెండూ అతనికి తెలుసు.

సెయింట్ పీటర్స్ బర్గ్ లోని తన ఆఫీసులో డెస్క్ దగ్గర నిలబడి నరాలు తెగిపోయేంత ఒత్తిడిని ఎదుర్కొంటూ యూరప్ అంతటా ఉన్న తన వర్తక ప్రతినిధులకు హడావుడిగా తంతి సందేశాలు పంపడం లాంటి అతని దినచర్యలో మార్పు లేదు. అయితే, ఇంతకన్నా తేలిక మార్గంలో సంపద గడించలేమా అన్న ప్రశ్నా మధ్య మధ్య అతన్ని ఆలోచనలో పడేస్తోంది.

అతని తమ్ముడు లుడ్విగ్ కాలిఫోర్నియా బంగారు గనుల ప్రాంతానికి చేరుకున్నట్టు 1850 ప్రారంభంలో సమాచారం అందింది. లుడ్విగ్ కొంతకాలంపాటు ఏమ్ స్టడామ్ లో అన్నకు వ్యాపారప్రతినిధిగా ఉన్నాడు. తెలివిలో అన్నకు సాటి కాకపోయినా స్వభావం అతనిదే. అదే తలబిరుసు, దుడుకుతనం. వివిధ భాషలు నేర్చుకోవడంలో కూడా అతను ముమ్మూర్తులా అన్నే. ఫ్రెంచి, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో అతను అన్నకు ఉత్తరాలు రాసేవాడు. అన్నకు ఉన్నట్టే ధనదాహం అతనికీ ఉంది.

california gold rush

ఓసారి అతను ఓ షాపు ప్రారంభిద్దామనుకుని తగినంత పెట్టుబడిని అప్పుగా ఇమ్మని అన్నను అడిగాడు. స్లీమన్ 500 టేలర్లు ఇవ్వజూపితే, నీకు మరీ ఇంత పిసినిగొట్టుతనం పనికిరాదంటూ తిరస్కరించాడు. ఇంకో సందర్భంలో, తనను సెయింట్ పీటర్స్ బర్గ్ లోని నీ వ్యాపారంలో చేర్చుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఉత్తరం రాసి రక్తంతో సంతకం పెట్టాడు. దానికి స్లీమన్ ఓ సుదీర్ఘమైన జవాబు రాశాడు. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని జటిలమైన తన వ్యాపార వ్యవహారాల్లోకి ఓ భాగస్వామిని తీసుకురావడం అంత తేలికైన విషయం కాదన్నాడు. కాదూ కూడదూ నువ్వు వస్తానంటే, కొన్నేళ్లు తీసుకునే నీ శిక్షణ సమయంలో నీ పోషణ బాధ్యత నేను తీసుకోనని చెప్పాడు. రష్యన్ భాషను ఓ మోస్తరుగా నేర్చుకోడానికే నాలుగేళ్ళు పడుతుందన్నాడు. ఆపైన నువ్వు మంచి వ్యాపారవేత్తవు అవుతావన్న హామీ ఏమీ లేదనీ, నీలో అందుకు అవసరమైన చురుకుదనం లేదనీ అనేశాడు. చివరగా, “పదమూడేళ్ళపాటు ఒకరి ముందు చేయి చాచకుండా నా కాళ్ళ మీద నేను నిలబడే ప్రయత్నం చేశాను” అంటూ, నువ్వు కూడా నా ఒరవడినే అనుసరించాలని ముగించాడు.

నిస్పృహ, ఆగ్రహం ముసురుకున్న క్షణాలలో లుడ్విగ్ ఓ రోజున రోటర్ డామ్ లో  ఓ కాలువ ఒడ్డునే నడుస్తుండగా తక్షణమే ఓడ ఎక్కి అమెరికా వెళ్లిపోవాలన్న ఆలోచన వచ్చింది. న్యూయార్క్ చేరుకుని ఫ్రెంచ్ టీచర్ గా ఉంటూ ఆ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తగినంత డబ్బు సమకూడగానే కాలిఫోర్నియా బంగారు గనుల ప్రాంతానికి వెళ్ళి అక్కడ వడ్డీవ్యాపారం ప్రారంభించాడు. త్వరలోనే ఒక మోస్తరు సంపదను గడించాడు. అంతవరకూ అన్న నీడలో జీవించి పైకి వచ్చిన అందరూ తమ్ముళ్ళలానే తన ఘనతను గొప్పగా చెప్పుకుంటూ, మధ్య మధ్య ఎత్తిపొడుపులతో స్లీమన్ కు పెద్ద ఉత్తరం రాశాడు. ఆ పైన డబ్బు సంపాదనకు కాలిఫోర్నియాలో ఉన్నన్ని అవకాశాలు భూమ్మీద ఇంకెక్కడా లేవనీ, తన ఆస్తులన్నీ అమ్మేసుకుని వెంటనే సెక్రామెంటోకు రావలసిందనీ సలహా ఇచ్చాడు.

ఆ ఉత్తరం స్లీమన్ ను ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. అందులోని ఎత్తిపొడుపులతోపాటు, నీకన్నా నేనే గొప్ప అన్నట్టు తమ్ముడు విసిరిన సవాలు, కొన్ని మాసాల్లోనే పెద్ద ముల్లె మూటగట్టానని అతను అలవోకగా అనడం స్లీమన్ ను ఆలోచనలో పడేశాయి. తన నేర్పులో, క్రమశిక్షణలో, అంకితభావంలో పదోవంతు లేనివాళ్ళకు కూడా ఇలా ఆకస్మిక ధనయోగం పట్టిన ఉదాహరణలు అతనికి తెలుసు. ఇన్నేళ్లలో తను గడించినదానికన్నా ఎక్కువగా కొన్ని వారాల్లోనే తమ్ముడు గడించినట్టు అతనికి అర్థమైంది. దానికితోడు, కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే పూర్తి బాధ్యత తనే తీసుకుంటాననే కాక; నీకు కూడా త్వరలోనే పెద్ద మొత్తం పంపాలని అనుకుంటున్నానన్న ఆ ఉత్తరంలోని వాక్యాలు   మరింత నొప్పించేలా ఉన్నాయి.

అతను చెప్పిన పెద్ద మొత్తం ఏదీ రాలేదు కానీ, సెక్రామెంటోలోని ఓ పత్రికలో ప్రచురితమైన ఒక వార్త తాలూకు కత్తిరింపు మాత్రం వచ్చింది. “న్యూయార్క్ లో ఉంటున్న లూయీ స్లీమన్ అనే పాతికేళ్ళ జర్మన్ యువకుడు 1850 మే 25వ తేదీన సెక్రామెంట్ నగరంలో టైఫాయిడ్ తో మరణించా”డని ఆ వార్త చెబుతోంది. దానికి జతపరచిన ఓ ఉత్తరం, లుడ్విగ్ ఓ పెద్ద ఎస్టేట్ ను విడిచివెళ్లాడని తెలియజేసింది.

                                                                                                                          (సశేషం)

 

 

 

 

 

జోరుగా హుషారుగా జారిస్టు రష్యాలో…

స్లీమన్ కథ 

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

1844, మార్చి1…హైన్ రిచ్ స్లీమన్ 22వ పుట్టినరోజు…

ఇప్పటినుంచి అతన్ని ‘స్లీమన్’ అన్న ఇంటిపేరుతోనే పిలుచుకుందాం.

స్లీమన్ ఆరోజు హెర్ హైన్ రిచ్ ష్రోడర్ (మనదగ్గర శ్రీ లా జర్మన్ భాషలో ‘హెర్’ గౌరవవాచకం) కార్యాలయంలోకి అడుగుపెట్టాడు. ఏమ్ స్టడామ్ లో పెద్ద ఎత్తున ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు సాగించే ఓ సంస్థకు ష్రోడర్ అధిపతి. స్లీమన్ ఓ ఉద్యోగానికి దరఖాస్తు ఇచ్చాడు. అందులో తన అర్హతలను పొందుపరిచాడు… ఏడు భాషలు తెలుసు. అంకెల్లో నేర్పు ఉంది, మెసెంజర్ బాయ్ గా రెండేళ్ళ అనుభవం…

వెంటనే అతన్నిఇంటర్వ్యూ చేశారు. ఈ కుర్రాడు తనకు బాగా పనికొస్తాడని ష్రోడర్ తొలి చూపులోనే గ్రహించాడు. ఇతను వ్యాపార సూక్ష్మాలను బాగా పట్టుకోగలడని కూడా ఆయనకు అనిపించింది. పైగా తన క్రిష్టియన్ పేరే అతనిది కూడా!

కొన్ని నిమిషాల్లోనే అతన్ని బుక్-కీపర్ గా నియమిస్తూ కాగితం ఇచ్చారు. జీతం నెలకు 600 గోడెన్లు. కొన్ని వారాల్లోనే జీతాన్ని1,000 గోడెన్లకు పెంచారు.

స్లీమన్ భాషల అధ్యయనాన్ని కొన్ని మాసాలపాటు పక్కన పెట్టాడు. దానికి బదులు తన బహుభాషా పరిచయాన్ని వినియోగంలోకి తేవడం ప్రారంభించాడు. అందులో త్వరత్వరగా దూసుకు వెళ్ళాడు కూడా. చూస్తుండగానే ఆ కార్యాలయంలోని ప్రధాన లేఖకుల్లో ఒకడైపోయాడు. ఇప్పుడతను ష్రోడర్ ఆంతరంగిక బృందంలో సభ్యుడు!

రష్యానుంచి తమ ఆఫీసుకు రష్యన్ భాషలో ఉత్తరాలు రావడం స్లీమన్ గమనించాడు.  తన భాషాధ్యయనం మళ్ళీ మొదలెట్టాల్సిన అవసరం అతనికి కనిపించింది. కొన్ని వారాల్లోనే రష్యన్ నేర్చుకుని ఆ భాషలోనే ఆ ఉత్తరాలకు సమాధానం రాస్తానని ఆఫీసులో ప్రకటించాడు. దాదాపు ఇంగ్లీష్ నేర్చుకున్న పద్ధతిలోనే రష్యన్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైనా, మరీ అవసరమనుకుంటే తప్ప వ్యాకరణం జోలికి వెళ్లకపోవడం అతను అనుసరించిన పద్ధతి.

ఫ్రెంచ్ రచయిత ఫినెలున్ రాసిన ఉలిసిస్ కొడుకు కథ(Les Aventures de Telemaque)కు పేలవమైన రష్యన్ అనువాదాన్ని సంపాదించాడు. అది  సుదీర్ఘమైన చుట్టుతిరుగుడు వాక్యాలతో ఉంది. ఓ నిఘంటువును, ఓ పాత గ్రామర్ ను కొనుక్కున్నాడు. నిఘంటువులో అర్థాలు చూసుకుంటూ మొదటిసారి కథంతా చదివాడు. ఆ అర్థాలను కూడబలుక్కుంటూ స్థూలంగా కథను అర్థంచేసుకున్నాడు. అతని జ్ఞాపకశక్తి ఎంత అమోఘమంటే, ఒక మాటకు నిఘంటువులొ ఒకసారి అర్థం చూసిన తర్వాత రెండోసారి చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు.

అతను రష్యన్ నేర్పే ఒక ట్యూటర్ కోసం వెతికాడు. ఎవరూ దొరకలేదు. దాంతో పనిగట్టుకుని ఏమ్ స్టడామ్ లోని రష్యన్ కాన్సూల్ కు వెళ్ళి తనకు రష్యన్ నేర్పవలసిందిగా అక్కడి వైస్-కాన్సూల్ ను అర్థించాడు. నాకంత తీరిక లేదంటూ అతను నిరాకరించాడు. అయినాసరే, పట్టు వదలకుండా తను సొంతంగా నేర్చిన తప్పుల తడక రష్యన్ లోనే చిన్న కథలూ, వ్యాసాలూ రాస్తూ సాధనచేశాడు. ఫినెలున్ రచనను కంఠతా పట్టేశాడు. ఆ భాషలోని గాంభీర్యానికీ, శ్రావ్యతకూ అతనెంత ముగ్ధుడైపోయాడంటే, పేరాలకు పేరాలను బిగ్గరగా చదివి ఆనందించేవాడు.

తనకో శ్రోత కూడా ఉంటే మరీ బాగుంటుందనిపించింది. గంటకు నాలుగు ఫ్రాంకుల చొప్పున ఇచ్చేలా ఓ పేద యూదును శ్రోతగా కుదుర్చుకున్నాడు. రాత్రిపూట అతన్ని ఎదురుగా పెట్టుకుని రష్యన్ లో అనర్గళంగా దంచి మాట్లాడుతుంటే లాడ్జీ టొపారం లేచిపోయేది. లాడ్జీ లోని మిగతా వాళ్ళకు అది తీవ్ర అసౌకర్యంగానూ, నిద్రాభంగంగానూ ఉండేది. దాంతో వాళ్ళు యుద్ధానికి వచ్చేవాళ్లు. ఆ కారణంగా అతను రెండుసార్లు లాడ్జీ మారాల్సివచ్చింది.

ఆరువారాలు గడిచేసరికల్లా  అతను రష్యన్ లో తొలి ఉత్తరం రాశాడు. అది కూడా ఆ భాషకు చెందిన అన్ని మర్యాదలనూ పాటిస్తూ! వాసిలీ ప్లొట్నికోవ్ అనే అతనికి రాసిన ఉత్తరం అది. మాస్కోకు చెందిన ఓ అతిపెద్ద నీలిమందు వ్యాపారసంస్థకు ప్లొట్నికోవ్ లండన్ ఏజెంట్ గా ఉన్నాడు.

విచిత్రంగా ఆ ఉత్తరమే స్లీమన్ ఇరవయ్యేళ్ళ భావి జీవితానికి రూపునిచ్చింది.

ఆ రోజుల్లో భారత్, ఆగ్నేయాసియా దేశాలనుంచి నీలిమందును దిగుమతి చేసుకునేవారు. ఏమ్ స్టడామ్ అతి పెద్ద నీలిమందు వర్తకకేంద్రాలలో ఒకటిగా ఉండేది. ఆ నగరంలో తరచు నీలిమందు వేలం జరుగుతూ ఉండేది. స్లీమన్ కు ఎనిమిది భాషలు తెలుసు కనుక అతని కంపెనీ అతన్నే వేలానికి పంపించేది. రష్యాకు సంబంధించిన అన్ని విషయాలపై ఆసక్తి ఉన్న స్లీమన్ వేలానికి వచ్చిన రష్యన్ వర్తకులను పరిచయం చేసుకుని మాటామంతీ సాగించేవాడు. రష్యా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునేవాడు. అక్కడి వ్యాపార అవకాశాల గురించి వాకబు చేసేవాడు. తను మాస్కో వచ్చి ఓ రష్యన్ సంస్థ భాగస్వామ్యంతో దిగుమతుల వ్యాపారం  చేస్తే ఎలా ఉంటుందని అడిగేవాడు.

హాలెండ్ లో ఓ జర్మన్, తమతో తమ భాషలో మాట్లాడడం వాళ్ళకు ఆశ్చర్యం కలిగించేది. క్రమంగా అతని మీద వాళ్ళకు ఇష్టం ఏర్పడింది.

అయితే, ఈ ఉద్యోగంలోకి వచ్చాక కూడా రెండేళ్లపాటు అతను ఇరుకిరుకు లాడ్జీ గదుల్లోనే గడిపాడు. ఇతర ఖర్చులు కూడా కనీసస్థాయికి తగ్గించుకుంటూ ఎప్పటిలానే డబ్బు కూడబెడుతూ వచ్చాడు.  చక్కెర ఎక్కువ వేసుకుని కప్పుల కొద్దీ టీ తాగే ‘దురలవాటు’ మాత్రం అతనికి ఉండేది. చక్కెర అతనిలో ఉండి ఉండి శక్తినీ, ఉత్తేజాన్నీ నింపేది. రాత్రిళ్ళు నిద్ర కాచుకుని చదువుకోడానికీ, ఆలోచించుకోడానికీ అందువల్ల వీలయ్యేది.

ఈరోజుల్లోనే వాళ్ళ నాన్నకు తరచు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. బాధ్యతగా నడచుకోమనీ, ప్రయోజనకరమైన జీవితం గడపమనీ ఆ ఉత్తరాల్లో తండ్రికి హితబోధ చేస్తూ తనే తండ్రి పాత్ర పోషించేవాడు. తనను చూసైనా నేర్చుకోమని చెప్పేవాడు. కుటుంబం నాశనమైపోకుండా కాపాడుకోవాలన్న తపన ఆ ఉత్తరాల్లో ఉండేది. మరోవైపు తండ్రికి రకరకాల కానుకలూ పంపిస్తూ ఉండేవాడు. తను పొదుపు చేసిన తొలి మొత్తాలతో రెండు పెట్టెల బార్డో వైన్ సీసాలు(Bordeaux: ఫ్రాన్స్ లోని ఓ నగరం. వైన్ పరిశ్రమకు ప్రపంచప్రసిద్ధి చెందింది), ఓ పెట్టెడు సిగార్లు తండ్రికి పంపించాడు.

ఆర్థికంగా స్థిమిత పడుతున్న కొద్దీ మిన్నాతో పెళ్లి తలపులు మళ్ళీ అతన్ని ముసురుకోవడం ప్రారంభించాయి. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ తో పెళ్లి చేసుకుని స్థిరపడడం ఇప్పుడతనికి ‘పగటికల’ కాదు. ‘బ్రదర్స్ ష్రోడర్’ స్థాయిని అందుకోబోయే వ్యాపారవేత్తగా కూడా తననిప్పుడు ఊహించుకుంటున్నాడు. ఎనిమిది భాషల్లో పరిజ్ఞానం తనకో ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని కట్టబెట్టగలదని కూడా నమ్ముతున్నాడు.

నీలిమందు వేలానికి వెడుతున్న సందర్భంలోనే జివాగో అనే ఓ రష్యన్ దిగుమతుల వ్యాపారి అతనికి పరిచయమయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా మారింది.  కలసి వ్యాపారం  ప్రారంభించే దిశగా మంతనాలు మొదలుపెట్టారు. “జివాగో & స్లీమన్” అనే పేరుతో ఓ వ్యాపారసంస్థను ప్రారంభించడానికీ, లాభాలు ఇద్దరూ సమానంగా పంచుకునే షరతు మీద తను 60 వేల సిల్వర్ రూబుళ్లను పెట్టుబడి పెట్టడానికీ జివాగో ముందుకొచ్చాడు.

ఈ సంగతి యజమాని హైన్ రిచ్ ష్రోడర్ చెవిదాకా పాకింది. పనికొస్తాడనే ఉద్దేశంతో మంచి జీతమిచ్చి తెచ్చుకున్న ఈ కుర్రాడు చేజారిపోతాడని ష్రోడర్ అనుకున్నాడు.  ఓ రోజున తన దగ్గరకు పిలిపించుకుని, “సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఉంటూ రష్యాలో మన వ్యాపార లావాదేవీలు చూస్తావా?” అని అడిగాడు. దాంతోపాటు బ్రెమన్, ట్రియెస్ట్, స్మిర్నా, లె ఆఫ్రే, రియో డిజెనీరో లలోని మన కంపెనీ శాఖలకు కూడా నువ్వే ముఖ్యప్రతినిధిగా ఉంటావన్నాడు. ఆ ప్రతిపాదన స్లీమన్ కు ఎంతగానో నచ్చింది. వెంటనే ఆమోదం తెలిపాడు.

1845 జనవరిలో, ఏమ్ స్టడామ్ లో తన చివరి రోజుల్ని సెయింట్ పీటర్స్ బర్గ్ లో తను ప్రాతినిధ్యం వహించబోయే వ్యాపారసంస్థల అధిపతులతో మాట్లాడుతూ గడిపాడు. తన వ్యాపారదక్షత మీద అతనికి ఎంత నమ్మకం చిక్కిందంటే, మీకు లాభాలు చూపించేవరకూ నాకెలాంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదని వాళ్ళకు ఖండితంగా చెప్పాడు.

మిన్నా గురించి వాకబు చేయమనీ, తనిప్పుడు ఆమెను పెళ్లాడే స్థితిలో ఉన్నట్టు తెలియజేయమనీ కోరుతూ న్యూ స్ట్రెలిజ్ లో తనకు పరిచయమైన సంగీత విద్వాంసుడు హెర్ లవాకు సెయింట్ పీటర్స్ బర్గ్ కు బయలుదేరేముందు ఉత్తరం రాద్దామనుకున్నాడు.  అంతలో, తనక్కడ స్థిరపడ్డాకే ఆ పని చేయచ్చనిపించి విరమించుకున్నాడు.  తనకు పట్టిన అదృష్టం గురించి వివరిస్తూ తండ్రికి ఉత్తరం రాశాడు.  ఇది కూడా పట్టుదలతో, ఏకాగ్రతతో తను చేసిన కృషి ఫలితమనీ, “ఏ  అదృష్టమైనా  ఓ అనర్హుడిమీద ఆకాశం మీంచి ఊడిపడ”దనీ అందులో ఎత్తిపొడిచాడు.

ఓడ మునిగిపోయి, చావు బతుకుల మధ్య వేలాడుతూ అతను హాలెండ్ తీరానికి కొట్టుకొచ్చి అప్పటికి నాలుగేళ్లే అయింది. ఇప్పుడతను పాతికేళ్ళ యువకుడు. ఏమ్ స్టడామ్ లో చెప్పుకోదగ్గ మిత్రులెవరూ లేరు. ఆ నగరాన్ని విడిచి వెడుతున్నందుకు అతనేమంత బాధపడలేదు.  మొదట కోచ్ లోనూ, తర్వాత మంచు మీద నడిచే స్లై బండి మీదా పదహారు రోజులపాటు ఒళ్ళు హూనమయ్యే ప్రయాణం చేసి, ప్రపంచంలోని అతి పెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన ‘బ్రదర్స్ ష్రోడర్’ కు ముఖ్యప్రతినిధిగా 1845 ఫిబ్రవరి 1న సెయింట్ పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టాడు.

***

సెయింట్ పీటర్స్ బర్గ్ అప్పటికింకా శైశవదశలోనే ఉంది. నికొలస్-I గద్దె మీద ఉన్నాడు. అతనిది కాఠిన్యం ఉట్టిపడే నలుచదరపు మొహం. ఆరడుగుల ఎత్తరి.  అంతకుముందు అతను ఆశ్విక దళాధికారిగా ఉండేవాడు.  దేవుడి దయవల్ల జార్ చక్రవర్తి కాగలిగిన ఓ ఆశ్విక దళాధికారిగానే తనను భావించుకునేవాడు. చక్రవర్తి పదవిని తుదికంటా అనుభవించే హక్కు తనకొక్కడికే ఉందని అతనికి అనిపించేది. దాంతో తన మంత్రుల్ని చూడగానే మొహం చిట్లించుకునే వాడు. తెల్లగా తళ తళా మెరిసిపోయే ఇటాలియన్ తరహా ప్రాసాదాలను వరసపెట్టి నిర్మింపజేయడం అతని ప్రధాన వ్యాపకాలలో ఒకటి. అతను తన ఆహార్యంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. ఒక ఆశ్వికదళాధికారికి తగినట్టుగా అతని ఛాతీ ఒద్దికగా నొక్కుకుపోయినట్టు ఉండేది. ఉచ్చనీచాలు లేకుండా అంతఃపుర స్త్రీలను అనుభవించేవాడు. అతన్ని చూడగానే దాదాపు అందరూ భయంతో వణికేవారు. ఎందుకంటే, అతని ఎడమకన్ను కుడి కన్ను కన్నా ఎక్కువ ఎర్రగా, చింతనిప్పుల్లా ఉండేది. అమానుషత్వం కరడుగట్టిన మనిషన్న భావన కలిగించేది. ఈ విషయంలో అతనికి అలెగ్జాండర్ ది గ్రేట్ తో పోలిక కుదిరింది. అలెగ్జాండర్ కళ్ళు కూడా భీకరంగా ఉండేవి. ఉక్కు పోతపోసినట్టు ఉండే సైనికులకు కూడా అతన్ని చూడగానే పాదాలు చల్లబడేవి.

జార్ చక్రవర్తి నికొలస్-1 (1796-1855)

నీకొలస్-I హయాంలో సెయింట్ పీటర్స్ బర్గ్ వైపరీత్యాలకు చిరునామాగా ఉండేది. వెడల్పాటి వీథులు, ఒకటీ అరా ఫ్యాక్టరీలు, లెక్కలేనన్ని ప్రాసాదాలూ, పేదల పూరిళ్లూ…రోడ్లమీద రద్దీ ఉండేదికాదు. అంత విశాలమైన వీథులూ పాడుపెట్టినట్టు నిర్మానుష్యంగా ఉండేవి. చిత్తడినేలల మీద పీటర్ ది గ్రేట్ నిర్మించిన ఈ నగరాన్ని పునర్నిర్మించే బాధ్యత తనకుందనీ, తను పీటర్ ది గ్రేట్ వారసుణ్ణనీ నికొలస్-I అనుకునేవాడు. శీతాకాలంలో నగరమంతా మంచు దుప్పటి కప్పినట్టుగా తెలుపు ఓడుతూ ఉంటుంది.

రాజోద్యోగులు ఆస్థానం తాలూకు అంతూపొంతూలేని పనికిమాలిన వ్యాపకాల్లోనూ వ్యవహారాల్లోనూ మునిగితేలుతూ ఉండేవారు. సేవకులు దుస్సహమైన పీడన కింద అణగారిపోయేవారు. విద్యార్థులు నిరంకుశ రాచరికాన్ని అంతమొందించే ఆలోచన అప్పటికే చేస్తున్నారు. ఆ ఏడాదే దోస్తోయెస్కీ రాసిన తొలి నవల Poor Folk వెలువడింది. పెట్రాషయెస్కీ వర్గంగా ప్రసిద్ధిలోకి వచ్చిన ఓ బృందం జార్ కు వ్యతిరేకంగా కుట్ర చేస్తోంది. యువకుడైన దోస్తోయెస్కీ కూడా అందులో సభ్యుడు. రష్యా అంతటా సామాజిక చైతన్యం క్రమంగా మేలుకుంటోంది. కట్టు బానిసల్లా బతుకుతున్న జనంలో ఆగ్రహావేశాలు రగలుకొంటున్నాయి.

స్లీమన్ మాత్రం పీటర్స్ బర్గ్ గురించి దీనికి పూర్తిగా విరుద్ధమైన ఊహల్లో మునిగితేలుతున్నాడు. ప్రపంచంలోనే ఓ అత్యుత్తమ ప్రదేశంలో తాను నివసిస్తున్నాననుకుంటున్నాడు. అతని ఉద్దేశంలో పీటర్స్ బర్గ్ వాసయోగ్యమే కాక; వ్యాపారానికి బాగా అనువైన, సురక్షితమైన నగరం. అక్కడి ఇళ్ళు, వీథులు ఎంతో అందంగానూ, శుభ్రంగానూ, ఆహ్లాదకరంగానూ అతనికి కనిపించాయి. అతను రాసే ఉత్తరాల్లో కూడా జార్ నికొలస్ ను మంచి తెలివైన, వైభవోపేతుడైన చక్రవర్తిగా పొగడ్తలతో ముంచెత్తేవాడు. రష్యన్ వర్తకుల గురించి మాత్రం అతనికి ఎలాంటి భ్రమలూ లేవు. అందరు వర్తకుల్లానే వాళ్ళు కూడా వ్యాపారపు మెళకువలు బాగా తెలిసిన కొరకరాని కొయ్యలే. కాకపోతే వాళ్ళ మీద తను రెండాకులు ఎక్కువే చదివానని అతను అనుకుంటున్నాడు. ష్రోడర్ ముఖ్యప్రతినిధిగా తన గొంతు గట్టిగా వినిపించగల స్థితిలో కూడా ఉన్నాడు. దానికితోడు ఉరకలేసే ఉత్సాహం, అంతులేని దాహం…కాళ్లలో చక్రాలు ఉన్నాయా అన్నట్టుగా నిర్విరామంగా ఒకచోటి నుంచి ఒకటికి కదలి వెళ్లిపోతూ ఉండడమే.

పీటర్స్ బర్గ్ లో ఏడు రోజులున్నతర్వాత, తను లావాదేవీలు జరపబోయే సంస్థలతో సంబంధాలను కల్పించుకోడానికి స్లై మీద మాస్కో వెళ్లిపోయాడు. పెద్ద పెద్ద వర్తకప్రముఖులతో కూడా తేలిగ్గా కలసిపోయి, త్వరలోనే వాళ్ళ తలలో నాలుకలా మారిపోగల చాకచక్యం అతనికి ఉంది. పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టిన క్షణం నుంచే అంతర్జాతీయ వర్తక ప్రతినిధిగా తన పాత్రను విజయవంతంగా పోషించాడు. ష్రోడర్ తో పాటు మరో ఆరేడు సంస్థలకు అతను ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. ప్రారంభ సంవత్సరాలలో అతనికి కమీషన్ గా ఇచ్చింది అర్థశాతమే. తొలి ఏడాదిలోనే 1,500,000 గోడెన్ల వ్యాపారం జరిగి, ఆ అర్థశాతం కమీషన్ నుంచే అతనికి 7,500 గోడెన్ల ఆదాయం సమకూడింది. అప్పటికి రెండు మూడేళ్ళ క్రితం అతను కలలో కూడా ఊహించలేని రాబడి అది. పొద్దుట చీకటితోనే లేచి, దాదాపు అర్థరాత్రివరకూ తన డెస్క్ దగ్గర నిలబడి ప్రతి చిన్న వివరం మీదా దృష్టి పెట్టి, లాభం ఎక్కువా తక్కువా అని చూడకుండా దానిని సాధించే ప్రతి ఉపాయాన్నీ అనుసరిస్తూ పోయిన ఫలితమే ఈ విజయం.

Heinrich Schliemann. Portrait of Heinrich Schliemann (1822-90), German archaeologist and discoverer of the ruins of the legendary city of Troy. After finishing his formal education at 14, Schliemann went into business and made his fortune. In 1863 he reti

ఆ ఏడాదిలోనే అతను నాలుగుసార్లు మాస్కోకు వెళ్ళి వచ్చాడు. అక్టోబర్ నాటికి వ్యవహారాలు ఎంత సాఫీగా సాగిపోతూవచ్చాయంటే, వ్యాపార పర్యటనకు విహారయాత్రను కూడా జోడిస్తూ జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ లను ఓసారి చుట్టివచ్చాడు. మధ్యలో కొన్ని గంటలు ఏమ్ స్టడామ్ లో ఆగి హైన్ రిచ్ ష్రోడర్ ను కలిసి తమ పాత సంబంధానికి కొత్త తళుకు నద్దాడు. ఆయన మీద అతనికి గాఢమైన కృతజ్ఞతాభావం ఉంది.

తన పర్యటనలో అతన్ని ఎక్కువ ఆకట్టుకున్నది పారిశ్రామిక అభివృద్ధి. రైళ్లు, వంతెనలు, ఫ్యాక్టరీలు, టెలిగ్రాఫ్ వగైరాలతో యూరప్ నూతన పారిశ్రామిక శకంలోకి శరవేగంతో దూసుకువెడుతోందనీ, రష్యా మాత్రం వెనకబడిపోయిందనీ అనుకున్నాడు. తన దత్తత దేశానికి పారిశ్రామిక ప్రయోజనాలు తెచ్చిపెట్టడం కోసమే తనను ప్రత్యేకంగా ఎంచుకున్నారని కూడా అతనికి అనిపించేది. క్రమంగా తనను ఓ రష్యన్ గానే భావించుకోవడం ప్రారంభించాడు. జార్ గురించి మాట్లాడేటప్పుడు “మన జార్” అనీ; రష్యాను “మన రష్యా” అనీ అనేవాడు.

సంపదను అనుభవిస్తున్నా అతని పొదుపు అలవాటు పోలేదు. ప్రయాణాలలో అతను పెద్ద పెద్ద హోటళ్లలోనే దిగేవాడు. కానీ అతి తక్కువ కిరాయి ఉన్న గదినే ఎంచుకునేవాడు, అది కూడా సాధారణంగా చిట్టచివరి అంతస్తులో. సరిగ్గా పైకప్పు కింద ఉండడమే అతనికి ఇష్టంగా ఉండేది. ఏమ్ స్టడామ్ లో చవకబారు లాడ్జీలలో మిద్దె కింద ఉంటూ రెండేళ్లలో ఏడు భాషలు నేర్చుకున్నప్పటినుంచీ అతనికి కలిగిన ఇష్టం అది.

లండన్ అతనికి నచ్చింది. కాకపోతే అక్కడి విలక్షణమైన విక్టోరియన్ తరహా ఆదివారాలను గడపడం మాత్రం నచ్చలేదు. బ్రిటిష్ మ్యూజియం అంతా కలయ తిరిగి శవపేటికల్లోని మమ్మీలు; గ్రీకు, రోమన్ కళాత్మక కలశాల జాబితాను జాగ్రత్తగా రాసుకున్నాడు. మాంచెస్టర్ కు రైలు ప్రయాణం అతనికి చాలా ఆహ్లాదం కలిగించింది. యూరప్ మొత్తంలో అతి వేగంగా వెళ్ళే రైలు అదే. ఆ రోజుల్లో మాంచెస్టర్ ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక కేంద్రం. ఎక్కడ చూసినా కణకణా మండే బొగ్గు కొలుముల, పొగ గొట్టాలతో ఫ్యాక్టరీల సందడే సందడి. జర్మనీకి పంపడం కోసం అక్కడ నిర్మిస్తున్న ఓ అతి పెద్ద రైలును, “ కాగితాన్ని కత్తిరించించినంత అవలీలగా” ఇనుమును కత్తిరించడాన్ని అతను విప్పారిన కళ్ళతో చూశాడు. ఆవిరి ఓడలు, ఓడ రేవులు, ఇనప కర్మాగారాలు, ఇంగ్లండ్ లో ఈ చివర దక్షిణం నుంచి, ఆ చివర ఉత్తరపు కొసన ఉన్న స్కాట్లాండ్ కు సందేశాన్ని పంపగలిగే టెలిగ్రాఫ్…ప్రతిదీ అతనికి ఆశ్చర్యానందాలు కలిగించాయి. నమ్మశక్యం కానంత అద్భుతంగా తోచాయి. ‘సృష్టికర్త’ చేసిన ఈ అమోఘమైన ఏర్పాట్లన్నీ వ్యాపారాభివృద్ధి కోసమే ననుకున్నాడు. పారిశ్రామిక విప్లవాన్ని అంత నిర్మలంగా ఎవరూ చూసి ఉండరు.

స్వస్థలమైన మెక్లంబర్గ్ లో ఆగకుండా లే అఫ్రే, పారిస్, బ్రస్సెల్స్, కొలోన్ , డుస్సేడార్ఫ్, హాంబర్గ్, బెర్లిన్ మీదుగా అతను సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగివచ్చాడు. మెక్లంబర్గ్ కు వెళ్లకపోవడానికి ఓ కారణం ఉంది. మిన్నా గురించి వాకబు చేయమనీ, ఆమెను తను పెళ్లాడే స్థితిలో ఉన్నాననీ న్యూ స్ట్రెలిజ్ లోని హెర్ లవాకు ఆ ఏడాదిలోనే ఉత్తరం రాశాడు. అతని నుంచి వచ్చిన జవాబు అతనికి పిడుగుపాటు అయింది. ఆ ఆఘాతం అతనిని చంపినంత పని చేసింది.

అతనా ఉత్తరం రాయడానికి కొన్ని వారాల ముందే మిన్నా మెయింకేకు ఓ స్థానిక రైతుతో పెళ్లి జరిగిపోయింది!!!

                                                                                                                     (సశేషం)

 

 

 

 

చావు తప్పి జీవనతీరానికి…

 

స్లీమన్ కథ-3

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

డొరోతియా 1841 నవంబర్ 28న హాంబర్గ్ లో బయలుదేరింది. అప్పటికి వాతావరణం బాగుంది. గాలి అనుకూలంగా వీస్తోంది.

హైన్ రిచ్ అంతవరకూ ఓడ ప్రయాణం చేసి ఎరగడు. ఓడ గురించి ఏమీ తెలియదు. ఓడలో పద్దెనిమిదిమంది సిబ్బంది; ముగ్గురే ప్రయాణికులు- హైన్ రిచ్, ఓ వడ్రంగి, అతని కొడుకు. అంత అనుకూల వాతావరణంలో కూడా సముద్రప్రయాణం అతనికి పడలేదు. మూడు రోజుల తర్వాత కక్సావెన్ అనే చోట స్వల్పకాలం ఓడకు లంగరేసారు. అప్పటికే అతను అస్వస్థతతో ఉన్నాడు. అక్కడినుంచి ఓడ బయలుదేరి ఉత్తర సముద్రంలోకి అడుగుపెట్టింది. రెండురోజులకే గాలివాన మొదలైంది. ఓడలోకి నీరు ఎక్కసాగింది. సిబ్బంది అదేపనిగా తోడిపొయ్యడం ప్రారంభించారు.

హైన్ రిచ్ ఆకలితో నకనకలాడిపోతున్నాడు. ఓడలో ఇచ్చిన బిస్కట్లతో అతికష్టం మీద ఆకలి చల్లార్చుకుంటున్నాడు. ఓ బెంచీకి తనను కట్టేసుకుని స్పానిష్ గ్రామర్ సాయంతో ఆ భాష నేర్చుకుంటూ ఉండిపోయాడు. ఒక్కోసారి ఓడ కుదుపుకి వచ్చి డెక్ మీద పడిపోతున్నాడు.

తుపాను ప్రచండంగా ఉంది. అలలు ఓడ అంచుల్ని విరగ్గొడుతున్నాయి. ఓడ మునిగిపోయే ప్రమాదం భయపెడుతోంది. పెద్ద తెరచాప సాయంతో ఓడ దారితప్పకుండా మాత్రం కొంతసేపు కెప్టెన్ చూడగలిగాడు. కానీ డిసెంబర్ 10 సాయంత్రానికి ఓడ దారితప్పి దక్షిణం వైపుకి కొట్టుకుపోవడం ప్రారంభించింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల తాకిడినుంచి ఓడను కాపాడడం కష్టమని అందరికీ అర్థమైపోయింది. ఇంకోవైపు మంచు భయంకరంగా కురుస్తోంది. సముద్రపు కొంగలు మందల కొద్దీ వచ్చి ఓడ చుట్టూ తిరగసాగాయి. అలా తిరగడం అపశకునం.

మరునాటి మధ్యాహ్నానికి తుపాను మరింత తీవ్రం అయింది. అలలు పర్వతప్రమాణంలో లేచి ఓడ మీద పడుతున్నాయి. అలలు అటూ ఇటూ ఎగరగొడుతుంటే ఓడ అక్షరాలా షటిల్ కాక్ లా మారిపోయింది. సాయంత్రానికల్లా పెద్ద తెరచాప విరిగిపోయింది. వెంటనే తుపాను తెరచాపను ఎగరేశారు. అదీ విరిగిపోయింది. అంతలో ఒక విచిత్రం జరిగింది. లిప్తకాలంపాటు మబ్బులు విడిపోయి అస్తమిస్తున్న సూర్యుడు కనిపించాడు. మళ్ళీ వెంటనే మబ్బులు మూసేశాయి. సూర్యుణ్ణి చూడడం అదే కడసారి అవుతుందని అందరూ అనుకున్నారు.

ఆ సమయానికి హైన్ రిచ్ మృత్యువు గురించి కూడా ఆలోచించలేనంత అస్వస్థతతో ఉన్నాడు. వడ్రంగి భయంతో వణికిపోతూ ఏవేవో మాట్లాడుతుంటే అతనివైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ వడ్రంగికి కలల మీద నమ్మకం ఎక్కువ. ముందురోజు రాత్రంతా దారుణమైన పీడకలలు. దానికితోడు రోజంతా పిల్లి శోకాలు పెడుతూనే ఉంది. కెప్టెన్ కుక్క మొరుగుతూనే ఉంది.

ఏడింటికి క్యాబిన్ బాయ్ టీ, బిస్కట్లు తీసుకొచ్చాడు. “ఇదే చివరిసారి, ఇంకెప్పుడూ ఏమీ తేలేను” అంటూ ఏడ్చేశాడు. మరి కాసేపటికి కెప్టెన్, అతని రెండో సహాయకుడు క్యాబిన్ లోకి వచ్చారు. దేనికైనా సిద్ధమవమని ఆ ముగ్గురికీ చెప్పారు. వారి మాటల్లో విషాద, గాంభీర్యాలు గూడుకట్టుకున్నాయి. అంతలో మొదటి సహాయకుడు వచ్చి దూరంగా రెండు దీపాలు కనిపించాయని కెప్టెన్ కు చెప్పాడు.  వెంటనే లంగర్లు దించమని కెప్టెన్ ఉత్తర్వు చేశాడు. దించిన క్షణాలలోనే అవి దారపు ముక్కలా తెగిపోయాయి. అప్పటికే సొమ్మసిల్లిపోయిన హైన్ రిచ్ దుస్తులు విప్పేసి పడుకుండిపోయాడు.

అర్థరాత్రివేళ క్యాబిన్ తలుపులు దడాలున తెరచుకున్నాయి. “అందరూ డెక్ మీదికి రండి. ఓడ మునిగిపోతోంది” అంటూ కెప్టెన్ పెద్ద పెట్టున అరిచాడు. మరుక్షణంలోనే ఓ బ్రహ్మాండమైన అల కిటికీలను ధ్వంసం చేసేసింది. క్యాబిన్ లోకి నీరు వరదెత్తింది.  ఓడ ఊగిపోతూ రేవు వైపు కొట్టుకుపోతోంది. హైన్ రిచ్ తన పడక మీంచి ఎగిరి పడ్డాడు. దుస్తులకోసం తడుముకున్నాడు. కనిపించలేదు. అలా నగ్నంగానే డెక్ మీదికి పరుగెత్తాడు. ఒంటి మీద గాయాలు. ఓడ అంచుల్ని ఎలాగో దొరకపుచ్చుకుని పై భాగం దాకా పాక్కుంటూ వెళ్ళి తాటి కొసల్ని పట్టుకున్నాడు. దేవుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబసభ్యుల్ని తలచుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.  మేరీ మాతను ఉద్దేశించి వడ్రంగి చేస్తున్న ఆర్తనాదాలు అతని చెవిన పడుతున్నాయి. సొరచేపల్ని చూసి అతనెక్కువ భయపడ్డాడు. తుపాను విరుచుకుపడగానే అవి పైకి వచ్చాయి. ఓడ గంట నిరంతరాయంగా మోగుతూనే ఉంది. అది మృత్యుఘంటలా వినిపిస్తోంది.

ఏమ్ స్టడామ్ లో ఇంగ్లీష్ చర్చి

ఆ ఏడాది మొత్తంలోనే అతి శీతలరాత్రి అది. అతను నగ్నంగా ఉన్నాడు. చుట్టూ మంచు ముంచెత్తుతోంది. ఆకాశం ఓ పెద్ద కాలమేఘంలా ఉంది. అతను మీద పడబోయే మృత్యువును నిరీక్షిస్తూ ఉండిపోయాడు. ఓడ మునిగిపోతోంది. లైఫ్ బోట్లలోకి జనాన్ని ఎక్కించమని కెప్టెన్ ఆదేశించాడు. ఒక లైఫ్ బోట్ నీళ్ళలో నిట్టనిలువుగా పడి కొట్టుకుపోయింది. రెండోది ఓడ పక్కభాగాన్ని ఢీకొని నుగ్గునుగ్గు అయిపోయింది, ఓ చిన్న బోటు మాత్రం మిగిలింది. సిబ్బంది దానిని నీళ్ళలోకి దింపే సాహసం చేయలేకపోయారు.

అలాగే రెండు గంటలు గడిచాయి. నీళ్ళతో నిండిపోయి మునుగుతూ మునుగుతూ ఉన్న ఓడ ఎట్టకేలకు ఓ పెద్ద కుదుపుతో రేవువైపు దొర్లుకుంటూ వెళ్ళి కూరుకుపోయింది.  అప్పటికే హైన్ రిచ్ నీళ్ళలోకి జారిపోయాడు, కానీ వెంటనే పైకి తేలాడు. అంతలో ఓ ఖాళీ పెట్టె అతనివైపు తేలుకుంటూ వచ్చింది. అతను దాని అంచుల్ని పట్టుకుని ఉండిపోయాడు.

అలా సగం రాత్రి వరకూ ఆకాశానికి, సముద్రానికీ మధ్య వేల్లాడాడు. ఆ తర్వాత మొదటి సహాయకుడు వచ్చి అతణ్ణి నీళ్ళలోంచి లాగి లైఫ్ బోటులోకి ఎక్కించాడు. తెడ్లు కూడా లేని ఆ బోటు పద్నాలుగుమందితో పొద్దుటివరకూ దారీ తెన్నూ లేకుండా కొట్టుకెళ్లి చివరికి డచ్చి తీరానికి దూరంగా టెక్సెల్ అనే దీవిలోని ఇసుకతిప్పల మీదికి వచ్చి ఆగింది.

అప్పటికి తుపాను నెమ్మదించింది. ఒడ్డువైపు తేలుకుంటూ వస్తున్న సరకుకోసం ఆ దీవిజనం బిలాబిల్లాడుతూ వచ్చి వాలిపోయారు. హైన్ రిచ్ గాయాల నొప్పులతో గిలగిల్లాడుతున్నాడు. అతని ముందు పళ్ళు మూడు ఊడిపోయాయి. ముఖం మీదా ఇతర శరీరభాగాలమీద లోతైన గాట్లు పడ్డాయి. పాదాలు వాచిపోయాయి. బతికున్న వాళ్ళు అందరూ రొప్పుతూ ఇసుకతిప్ప మీద వాలిపోయారు. అంతలో ఓ దయగల రైతు ఓ బండి తీసుకుని అక్కడికి వచ్చాడు. వాళ్లందరినీ తన పొలం ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళు చలి కాచుకోడానికి పెద్ద మంట రాజేశాడు. వారికి వేడి వేడి కాఫీ, నల్ల రొట్టె అందించాడు. ఒంట్లో సత్తువను కూడదీసుకునేవరకూ మూడు రోజులు వాళ్ళు అక్కడే ఉండిపోయారు.

హైన్ రిచ్ కు కొయ్య బూట్లు, ఓ జత చినిగిపోయిన పంట్లాములూ, ఓ దుప్పటి, ఓ ఊలు టోపీ ఇచ్చారు. అతనికి ఆ రైతు మీద ఎంతో ఇష్టం కలిగింది. తన సముద్రపు పెట్టె ఒడ్డుకు కొట్టుకు రావడం అంతకంటే ఎక్కువ సంతోషం కలిగించింది. అందులో తన చొక్కాలు, స్టాకింగులు, పాకెట్ బుక్కు, లా గ్వైరా లో తన పరిచయస్తులకు హెర్ వెంట్ రాసిన సిఫారసు ఉత్తరం ఉన్నాయి. మిగతా అందరి పెట్టెలూ కొట్టుకుపోయి, హైన్ రిచ్ పెట్టె ఒక్కటే ఒడ్డుకు రావడంతో అతన్ని ‘జోనా’ అని పిలవడం ప్రారంభించారు(ఓల్డ్ టెస్టెమెంట్ ప్రకారం జోనా ఒక దేవదూత. అతను ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోతుంది. అతన్ని ఓ తిమింగలం మింగేస్తుంది. మూడురోజుల తర్వాత అతను ప్రాణాలతో బయటపడతాడు). సరకుతో ఉన్న ఓ పెట్టె తనను చంపినంత పనిచేసి జీవితాన్ని మలుపు తిప్పింది, ఓ ఖాళీ పెట్టె తన ప్రాణాలు కాపాడింది, ఏదో అదృష్టం తన వెనక పనిచేస్తోందని అతను అనుకున్నాడు.

అతనక్కడ బోటు ఎక్కాడు. ముఖంలో అలసట, అస్వస్థత ఇంకా తాండవిస్తూనే ఉన్నాయి. బరువైన కొయ్య బూట్లతో, చంకలో పెట్టెతో అతను హాలెండ్ గడ్డ మీద అడుగుపెట్టాడు. బూటు పాలిష్ కుర్రాళ్ళు అతని వేషం చూసి తమ లాంటివాడే అనుకుని కేరింతలు కొడుతూ ఆహ్వానించారు.

మృత్యుముఖం నుంచి బయటపడడం, అస్వస్థత, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా దేశం కాని దేశంలో అడుగుపెట్టడం… ఆలోచించకొద్దీ తను బతికి ఉండడమే ఓ అద్భుతంగా అతనికి అనిపిస్తోంది.  హాంబర్గ్ లో చన్నీళ్ళ స్నానాలతో శరీరాన్ని గట్టి పరచుకోవడం వల్లనే ఓడ మునక వల్ల కలిగిన విపత్తునుంచి బయటపడ్డానని అనుకున్నాడు. మిగతావాళ్ళు తిరిగి హాంబర్గ్ కు బయలుదేరుతుంటే, తనను అంతులేని కష్టాల్లోకి నెట్టిన ఆ నగరానికి రానని చెప్పేశాడు. తన అదృష్టాన్ని హాలెండ్ లోనే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు.

ఎముకలు కొరికేసే ఆ చలిలో  చింకిపాతతో నేరుగా ఏమ్ స్టడామ్ లోని మెక్లంబర్గ్ కాన్సూల్ కు వెళ్ళాడు. హెర్ క్వాక్ అనే అతను కాన్సూల్ గా ఉన్నాడు. తలుపు తీసిన నౌకరు, బిచ్చగాడనుకుని అతని మొహం మీదే తలుపు మూసేశాడు. తను మెక్లంబర్గ్ పౌరుణ్ణనీ, సాయం కోసం వచ్చాననీ ఓ కాగితం మీద రాసి మళ్ళీ బెల్లుకొట్టాడు. ఈసారి  నౌకరు అతను రాసిన నోటు తీసుకెళ్లి హెర్ క్వాక్ కు ఇచ్చాడు. అది చూసి రెండు గోడెన్లను, అంటే యాభై సెంట్లను నౌకరు చేతికిచ్చి పంపించాడు. దాంతో అతను మళ్ళీ తన దగ్గరికి రాడనుకున్నాడు. ఆ మొత్తాన్ని చూసి విస్తుపోయిన హైన్ రిచ్ తో, “ఈ మాత్రమైనా ఇచ్చినందుకు సంతోషించు” అని ఎకసెక్కంగా అని నౌకరు తలుపు మూసేశాడు.

ఏమ్ స్టడామ్-1840లలో

హైన్ రిచ్ కోపంతో కుతకుత లాడిపోయాడు. అది పేదవాడి కోపమని అతనికి తెలుసు. ఏమ్ స్టడామ్ లో రామ్స్కో అనే చోట ఉన్న నావికుల లాడ్జీకి వెళ్ళాడు. గ్లామెన్ అనే ఓ వితంతువు దానిని నడుపుతోంది. అద్దె రోజుకు ఒక గోడెన్. తన దగ్గరున్న మొత్తంతో మహా అయితే ఒకరోజు గడుపుకోవచ్చు. కానీ రేపేలా? అంతలో అతనికో ఉపాయం తట్టింది. తను తీవ్ర అస్వస్థతో ఉన్నానని, ఆసుపత్రిలో చేర్చవలసిందని హెర్ క్వాక్ కు ఉత్తరం రాసి పంపాడు. ఆ దరిద్రుడు తనకు చేయగలిగిన సాయం ఇదే ననుకున్నాడు. అతని భారం తన మీద ఎక్కడ పడుతుందోనని భయపడ్డ గ్లామెన్ ఆ ఉత్తరాన్ని హెర్ క్వాక్ కు అందించే ఏర్పాటు చేసింది. ఆ ఉపాయం ఫలించింది. ఎనిమిదిరోజులు ఆసుపత్రిలో గడిపాడు.

ఈలోపున హాంబర్గ్ లో తనకు పరిచయమైన ఓడల దళారీ హెర్ వెంట్ కు ఉత్తరం రాశాడు. అందులో ఓడ మునక గురించి, తన ప్రస్తుత దుస్థితి గురించి వివరించాడు. అతని అదృష్టం కొద్దీ ఆ ఉత్తరం అందే సమయానికి హెర్ వెంట్ కొంతమంది అతిథులకు విందు ఇస్తున్నాడు. ఆ ఉత్తరాన్ని బిగ్గరగా చదివాడు. అతనితోపాటు అతిథులందరూ అతని మీద జాలిపడ్డారు. అప్పటికప్పుడు 240 గోడెన్ల మొత్తం సమకూడింది. హెర్ వెంట్ ఆ మొత్తాన్నీ, అతనికి సాయం చేయవలసిందిగా అర్థిస్తూ ప్రష్యా కాన్సూల్-జనరల్ కు రాసిన ఉత్తరాన్నీ హైన్ రిచ్ కు పంపాడు.

కొద్ది రోజులకే అతనికి ఎఫ్.సి. క్వెన్ & కొ లో అకౌంట్స్ విభాగంలో మెసెంజర్ బాయ్ గా ఉద్యోగం దొరికింది. డిమాండ్ డ్రాఫ్టులను స్టాంపింగ్ చేసి నగదుగా మార్చడం అతను చేయవలసిన పని. ఈ ఉద్యోగంతో పచారీ కొట్టు జీవితం నుంచి తను శాశ్వతంగా బయటపడ్డాడనీ, అదృష్టాన్ని వెతుక్కునే మార్గంలో తొలి అడుగు పడిందనీ అనుకున్నాడు.

అంతే…ఆ క్షణం నుంచి అతను మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు.

అపారమైన డబ్బు సంపాదించాలంటే, జీవితం మొత్తాన్ని అందుకు ధారపోయడం మినహా మరో మార్గం లేదని అతనికి అప్పటికే అర్థమైంది. తన తెలివితేటలకు మరింత సాన పట్టాడు. ఇదే తన జీవితం, ఇందుకు భిన్నంగా తను జీవించలేడని అనుకునే టంతగా తన లక్ష్యానికి అంకితమవడం అతనికి అలవడింది. ఖర్చును కనీస స్థాయికి తగ్గించుకున్నాడు. ఇప్పుడతని జీతం నెలకు 36 గోడెన్లు. అందులో ఎనిమిది గోడెన్లు లాడ్జీలో తనుంటున్న చవకబారు గది అద్దెకు పోతాయి. విందు వినోదాల ప్రశ్నే లేదు. సాయంత్రాలు ఊరంతా తిరగడం, గ్యాస్ దీపాల వెలుగులో జిగేలుమనే దుకాణాలను మెరిసే కళ్ళతో చూసి ఆనందించడం; లేదా రైల్వే స్టేషన్ కు వెళ్ళి, వచ్చిపోయే రైళ్లను చూస్తూ గడపడం…ఇవే అతని కాలక్షేపాలు. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే, హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్లలోని రంగు రంగుల మైనపు బొమ్మల్ని తనివితీరా చూసేవాడు. మిన్నాను తలచుకుంటూ ఉండేవాడు.

అతని దినచర్యలో ఉద్యోగం తర్వాత చదువుకే ప్రాధాన్యం. పుస్తకాలపైనా, తన చదువును ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కదానిపైనా ధారాళంగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. జర్మన్ అక్షరాలను దిద్దడంతో సహా మళ్ళీ కొత్తగా చదువు మొదలెట్టాడు. జర్మన్ లో తప్పులు లేకుండా ఒక మాదిరిగా రాయడమెలాగో ఇరవై పాఠాలతో నేర్చుకున్నాడు. ఆ తర్వాత డచ్చి, ఇంగ్లీష్ నేర్చుకోడానికి ఓ ట్యూటర్ ను పెట్టుకున్నాడు. పదాలను, వాక్యాలను బిగ్గరగా ఉచ్చరించేవాడు. వ్యాసాలు రాసి ట్యూటర్ తో దిద్దించుకునేవాడు. ఆపైన ఇంగ్లీష్ పై పట్టు సంపాదించడానికి ప్రతి ఆదివారం రెండుసార్లు ఏమ్ స్టడామ్ లోని ఇంగ్లీష్ చర్చికి వెళ్ళేవాడు. అక్కడి పాస్టర్ పలికే ప్రతి మాటనూ పదే పదే ఉచ్చరించేవాడు. అంకెర్షగన్ చర్చిలో వాళ్ళ నాన్న పలికిన ప్రతి మాటనూ, అర్థం తెలియకపోయినా ఉన్నదున్నట్టు అద్భుతంగా వల్లించగలిగిన హాపింగ్ పీటర్ ఒరవడిలో-తనూ తెలియకుండానే వెళ్ళాడు.

రాత్రిళ్లు అతని బుర్ర పాదరసంలా పనిచేసేది. నిద్ర కాచుకుంటూ పుస్తకపఠనం సాగించేవాడు. దాంతో నిద్ర తక్కువై పాలిపోయి జబ్బుమనిషిలా కనిపించేవాడు.  ఆ పుస్తకాలు కూడా అంతవరకూ తనకు విపరీతమైన ఆసక్తి కలిగిస్తూ వచ్చిన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలకు సంబంధించినవి కావు. వ్యాపారరంగంలో తను పైకి రావడానికి సాయపడే భాషలకు సంబంధించినది. ఇప్పుడు డబ్బు యావలో పడిపోయి ట్రాయ్ ని, చివరికి మిన్నాతో పెళ్లి తలపులనూ కూడా పక్కన పెట్టేశాడు.

వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్, ఇవాన్ హొలను… అవి దాదాపు కంఠస్థమయ్యేవరకూ చదివిందే చదువుకుంటూ పోయేవాడు. అలా ఆరునెలల్లో ఇంగ్లీష్ అతనికి ఒంటబట్టేసింది. మరోవైపు తను చదివింది, విన్నది గుర్తుండిపోయేలా; బుర్రలో పడిన ఒక్క అంకె కూడా జారిపోని విధంగా తన జ్ఞాపకశక్తికి శిక్షణ ఇచ్చుకుంటూ వచ్చాడు. నామవాచకాలు, క్రియాపదాలతో సహా అన్నీ వల్లె వేసుకుంటూ క్రమంగా ఓ జ్ఞాపక యంత్రంలా మారిపోయాడు.

ఇంగ్లీష్ నేర్చుకున్న పద్ధతిలోనే తర్వాతి ఆరునెలల్లో ఫ్రెంచ్ నేర్చుకున్నాడు. ఏడాది తిరిగేసరికి అతనిలో ఏకాగ్రత ఎంత పదునెక్కిందంటే; డచ్చి, స్పానిష్, ఇటాలియన్, పోర్చుగీస్ భాషల్ని ఆశ్చర్యం గొలిపేటంత త్వరగా నేర్చేసుకున్నాడు. గట్టిగా దృష్టి పెట్టి ఈ భాషల్లో ధారాళంగా చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకోడానికి నాకు ఆరువారాల్ని మించి పట్టలేదని అతను చెప్పుకున్నాడు. దీనిని సాధించడానికి అతను కఠోరమైన కాలనియమాన్ని పాటించాడు. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా పొడవైన పదాల పట్టికను ఎదురుగా ఉంచుకుని అదేపనిగా వల్లించేవాడు. పోస్టాఫీస్ లో స్టాంపుల కోసం ఎదురుచూస్తున్నప్పుడు పేరాలకు పేరాలను గుర్తుచేసుకుంటూ ఉండేవాడు. ఈ విషయంలో ఒక్క క్షణం కూడా అతను రాజీపడలేదు.  ఈవిధంగా ఏమ్ స్టడామ్ లో తన చుట్టూ ఉన్న సాధారణ ప్రపంచానికి దూరంగా తన ప్రపంచంలో తాను గడిపాడు.

ఏమ్ స్టడామ్ కు రావడానికి ముందు అతనికి జర్మన్…అది కూడా మెక్లంబర్గ్ మాండలికం, తగుమాత్రం లాటిన్ మాత్రమే తెలుసు. ఇప్పుడతను ఏడు భాషల్ని చదవగలడు, మాట్లాడగలడు, రాయగలడు; ఈ భాషల్లో వ్యాపార నివేదికలు తయారుచేయగలడు.

తనపై  తాను కఠిన క్రమశిక్షణను విధించుకుని చేసిన ఇంతటి కసరత్తుకూ త్వరలోనే తగిన ప్రతిఫలం ఉంటుందన్న  ఆత్మవిశ్వాసమూ అతనిలో ఉంది.

అతను ఊహించినట్టే మరోసారి అదృష్టం అతణ్ణి వెతుక్కుంటూ వచ్చింది…!!!

    (సశేషం)

 

 

 

 

బతుకు ‘బస్తా’ అయింది!

స్లీమన్ కథ-2

కల్లూరి భాస్కరం
కల్లూరి భాస్కరం

హైన్ రిచ్ తల్లి అప్పటికి చాలాకాలంగా అస్వస్థతతో ఉంది.  వంటమనిషిని ఉంచుకున్న భర్త ఆమెకు ఖరీదైన కానుకలు, నగలు, దుస్తులు, డబ్బు దోచి పెడుతుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోవడం తప్ప ఆమె ఏమీ చేయలేకపోయింది. మనోవ్యథ ఆమె శారీరక ఆరోగ్యాన్నీ దెబ్బతీసింది.

తను చనిపోవడానికి ముందు పెద్ద కూతురికి ఒక ఉత్తరం రాసింది. అది రక్తంతో రాసినట్టుగా కనిపించింది. దురదృష్టవంతురాలైన తల్లి మీద అంతకాలం చూపించిన ప్రేమకు అందులో కృతజ్ఞతలు చెప్పింది. తను జీవన్మరణ పోరాటం చేస్తున్నాననీ, తను చనిపోయినట్టు తెలిస్తే దుఃఖించవద్దనీ, ఎట్టకేలకు కష్టాలనుంచి విముక్తి లభించిందనుకుని సంతోషించమనీ కోరింది. ఇది కొంచెమైనా కనికరం లేని ప్రపంచమనీ; ఈ కడగండ్ల నుంచి తనను గట్టెక్కించమని రాత్రిళ్ళు నిశ్శబ్దంగా చేసిన ప్రార్థనలను ఆ దేవుడు ఆలకించలేదనీ, తన ఓరిమి నిష్ఫలమైపోయిందనీ నిష్టురమాడింది…

ఇదే ఆమె రాసిన చివరి ఉత్తరం. కొన్ని వారాలకే ఓ కొడుకును కని ఆమె కన్నుమూసింది.

ఆమె మరణానికి భర్తే కారణమని గ్రామస్తులకు తెలుసు. అతని మీద కోపంతో రగిలిపోయారు. తగిన శాస్తి చేయాలనుకున్నారు. కానీ అది చివరికి పిల్లలకు శిక్షగా పరిణమించింది. వారిని బంధువుల ఇళ్లకు పంపించే ఏర్పాటు చేశారు. హైన్ రిచ్ ను కల్కోస్ట్ అనే ఊళ్ళో పాస్టర్ గా ఉన్న అతని చిన్నాన్న ఫ్రైడ్ రిచ్ స్లీమన్ ఇంటికి పంపడానికి నిర్ణయం జరిగింది.

ఆ ఏర్పాటు ఒక కొలిక్కి రావడానికి ముందు కొన్ని వారాలు అతడు అంకెర్షగన్ లోనే ఉండిపోయాడు. ఇప్పుడతనికి దెబ్బ మీద దెబ్బ. అతన్ని కలవకుండా మిన్నాను తల్లిదండ్రులు కట్టడి చేశారు. గాట్ ఫ్రైడ్ రిచ్ కూతురు ఇంటికి వెళ్ళి, అచ్చం మిన్నా లానే ఉండే ఆమె తల్లి ఓల్గార్తా చిత్రపటం ముందు నిలబడి హైన్ రిచ్ నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవాడు. “మిన్నా ఎడబాటు అమ్మ మరణం కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ బాధించింది. నా అనంతర జీవితంలో అనేక దేశాలు తిరిగి అంతులేని కష్టాలు పడ్డాను. కానీ, నా తొమ్మిదో ఏట మిన్నాకు దూరమై నేను అనుభవించిన దుఃఖానికి అవేవీ సాటిరావు” అని ఆ తర్వాత అతను రాసుకున్నాడు.

తన జీవితమంతా అతను మిన్నా సాహచర్యాన్ని కలలు కంటూనే గడిపాడు. ఎప్పటికైనా ఆమెను కలసుకుంటానన్న ఆశ అతనిలో నిరంతరం తళుకుమంటూనే ఉండేది. మిన్నా, ట్రాయ్…రెండూ అతని కలల ప్రపంచంలో ఒకేలా భాగమైపోయాయి.

కల్కోస్ట్ లో చిన్నాన్న అతన్ని స్కూల్లో చేర్చాడు. ఆ స్కూల్లో ఉన్న హోమర్ శిలా విగ్రహం హైన్ రిచ్ ను ప్రత్యేకించి ఆకట్టుకుంది. చిన్నాన్న అతన్ని కన్నకొడుకులానే చూసుకున్నాడు. హైన్ రిచ్ చదువులో బాగా రాణిస్తున్నాడు. లాటిన్ అతనికి బాగా పట్టుబడుతోంది. లాటిన్ టీచర్ కార్ల్ ఆండ్రెస్ అది గుర్తించి అతని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. అతనికి ఆసక్తి ఉన్న విషయాల మీద సొంతంగా లాటిన్ లో రాయిస్తూ, వ్యాకరణ దోషాలు దిద్దుతూ సానపట్టాడు. తండ్రి వల్ల తమ కుటుంబం చెదిరిపోవలసివచ్చినా హైన్ రిచ్ ఆయనను ఇప్పటికీ అభిమానిస్తూనే ఉన్నాడు. 1832 క్రిస్టమస్ రోజున ట్రోజన్ యుద్ధాల పై లాటిన్ లో ఓ సుదీర్ఘ వ్యాసం రాసి తండ్రికి కానుకగా పంపాడు. అక్కడక్కడ దోషాలు ఉన్నా ఆ వ్యాసం తండ్రికి సంతృప్తి కలిగించింది.

చదువులో హైన్ రిచ్ తన ఈడు పిల్లలను మించిపోయాడు. దాంతో మరుసటేడు అతన్ని న్యూ స్ట్రెలిజ్ అనే ఊళ్ళోని జిమ్నాజియంలో మూడో తరగతిలో చేర్చారు. మిన్నా ఎడబాటు, కుటుంబ పరిస్థితులు ఒకపక్క కుంగదీస్తున్నా; పై పైకి ఎదగాలన్న తపన, అందుకు అవసరమైన పట్టుదల, శ్రమించే తత్వం అతనిలో నిలకడగా ఉన్నాయి. ఏ ఆటంకం లేకుండా చదువు సాగితే ఏ రోష్టాక్ యూనివర్సిటీలోనో ఉద్యోగం సంపాదించుకునేవాడు. రోష్టాక్ యూనివర్సిటీ జర్మనీలో అతి పురాతన, ప్రసిద్ధ యూనివర్శిటీలలో ఒకటి.

కానీ జిమ్నాజియం చదువు మూడు నెల్ల ముచ్చటే అయింది. గ్రామస్తులు తన మీద కత్తి కట్టినా తీరు మార్చుకోని తండ్రే అందుకు కారణం. దాంతో గ్రామస్తులు అతన్ని పూర్తిగా పట్టి పల్లార్చడానికి కంకణం కట్టుకున్నారు. ఇతర నిందలతోపాటు, చర్చి నిధులు దుర్వినియోగం చేశాడన్న అభియోగం తెచ్చారు. పాస్టర్ గా ఉండడానికి పనికిరాడని తేల్చారు. బిషప్ అతన్ని అభిశంసించి సస్పెండ్ చేశాడు. చర్చి నుంచే బహిష్కరిస్తామని హెచ్చరించాడు. రాబడి తగ్గిపోవడంతో కొడుకు జిమ్నాజియం చదువు అతనికి తలకు మించిన భారం అయింది.

హైన్ రిచ్ ఓ మామూలు స్కూలుకు మారాల్సి వచ్చింది. ఆ స్కూల్లో అతను మూడేళ్లు గడిపాడు. అక్కడా చక్కగా రాణించాడు. అంతలో మరో పిడుగుపాటు. ఆర్థికంగా పూర్తిగా అడుగంటిపోయిన తండ్రి  ఆ స్కూలు ఫీజు కూడా కట్టలేనని చేతులెత్తేశాడు. అప్పటికి హైన్ రిచ్ కు పద్నాలుగేళ్లు. చదువు సంగతి దేవుడెరుగు, తిండికోసం వెతుక్కోవలసిన పరిస్థితి. ఆ వయసులో అతను చిన్నాన్న మీద ఆధారపడలేడు. ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుని తన బతుకును తన చేతుల్లోకి తీసుకోవలసిందే.

తక్షణ సమస్య తిండి గడవడం. కనుక ఎంత చిన్న ఉద్యోగమైనా చేయకతప్పదు.  ఏ పచారీ కొట్లోనో కుదురుకుంటే కనీసం తిండి కైనా లోటు ఉండదనుకున్నాడు. ఈష్టర్ సెలవులు కాగానే పొరుగునే ఉన్న ఫర్ష్టెన్ బర్గ్ గ్రామంలో ఓ పచారీ కొట్టును వెతుక్కోవాలనుకున్నాడు. అంతలో అనుకోని ఓ ఘటన జరిగింది. అతనో రోజున న్యూ స్ట్రెలిజ్ గ్రామంలోని ఓ సంగీతవిద్వాంసుడి ఇంటికి వెళ్ళాడు. ఆశ్చర్యం… అక్కడతనికి మిన్నా కనిపించింది!

నల్లని దుస్తులతో చాలా నిరాడంబరంగా ఉంది.  ఆ నిరాడంబరతే ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. అతనిలానే ఆమెకూ పద్నాలుగేళ్లు. కానీ ఈడును మించి ఎదిగినట్టు కనిపించింది. ఒకరి చేతుల్లో ఒకరు వాలిపోయారు. నిస్సహాయంగా ఒకరినొకరు చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఇద్దరి చెక్కిళ్ళ వెంట కన్నీళ్లు ధారలు కట్టాయి. ఎంత ప్రయత్నించినా ఒక్కరికీ మాట పెగల్లేడు. అంతలో మిన్నా తల్లిదండ్రులు వచ్చి వారిని బలవంతంగా విడదీశారు.

అయిదేళ్ల వియోగం తర్వాత ,అదే వాళ్ళు మొదటిసారి కలసుకోవడం. అతను దుర్భరమైన ఏకాంతాన్ని, క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ఆ అమ్మాయి మెరుపు తీగలా కనిపించి మాయమైంది. చెక్కిళ్లపై కన్నీరు జారుతుండగా ఆ సంగీత విద్వాంసుని ఇంట్లో ఆమె నిలబడి ఉన్న దృశ్యం అతనికి జీవితాంతం గుర్తుండిపోయింది. “మిన్నా ఇప్పటికీ నన్ను గాఢంగా ప్రేమిస్తోందన్న నమ్మకం నా ఆశలకు, ఆకాంక్షలకు గొప్ప ఇంధనం అందించింది. నాలో అంతులేనంత శక్తీ, ఉత్సాహం కట్టలు తెంచుకున్నాయి. అలుపెరుగని కృషితో జీవితంలో అన్నివిధాలా పైకి వచ్చి ఆమెకు తగిన వాడిగా నన్ను నేను నిరూపించుకోగలనన్న తిరుగులేని ఆత్మవిశ్వాసం నాలో నిండిపోయింది. నా కాళ్ళ మీద నేను నిలబడేవరకూ ఆమెకు పెళ్లి కాకుండా చూడమని ఆ దేవుణ్ణి వేడుకున్నాను” అని ఆ తర్వాత అతను రాసుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత అతను ఫర్ష్టెన్ బర్గ్ కు ప్రయాణం కట్టాడు. అక్కడ హేర్ హోట్జ్ అనే ఓ వ్యక్తికి చెందిన పచారీ కొట్టులో నౌకరీకి కుదిరాడు. ప్రొఫెసర్ కావాలనుకున్నవాడు కాస్తా అలా పచారీ కొట్టులో తేలాడు.

***

ఆ కొట్టూ, దానికి సంబంధించిన ప్రతిదీ అతనికి కంపరం కలిగించాయి. యజమాని తన పేరులానే ఓ కొయ్య మనిషి. పొద్దుటే అయిదింటికి లేచి కొట్టు తెరవాలి. తుడిచి శుభ్రం చేయాలి. కౌంటర్ల దుమ్ము దులపాలి. యజమాని బూట్లు పాలిష్ చేయాలి. రాత్రి పొద్దుపోయేవరకూ పనే పని. ఆ తర్వాత  అక్కడే నిద్ర. అప్పుడైనా  కాసేపు పుస్తకం పట్టుకుందామనుకుంటె అలసటతో కళ్ళు వాలిపోయేవి. స్కూల్లో బట్టీ పట్టించిన వర్జిల్ పంక్తుల్ని కూడా మరచిపోతున్నాడు. ఆ పచారీ కొట్టు లోపల చీకటిగా, చలి చలిగా, దుర్భరంగా ఉండేది. అతని ఊహలకు మేత వేసే ఎలాంటి కథలూ అక్కడ వినబడవు. తగలబడుతున్న ట్రాయ్ లాంటి పురాతన చిత్రాలు కనబడవు.

రోజంతా ఒళ్ళు హూనం చేసుకున్నా గిట్టేది నామమాత్రం. ఊరు పేదది. ఒక్కోసారి యజమానికి కూడా పూట గడవడం కష్టమయ్యేది. రోజు మొత్తం మీద 12 టేలర్లు, అంటే ఇంచుమించు 3 పౌండ్ల విలువైన సరుకు అమ్మితే, అక్కడికి అదృష్టవంతులే. ఏడాదిలో 3,000 టేలర్ల వ్యాపారం జరగడం కనాకష్టం. లాభాలు తక్కువ, పని గంటలు ఎక్కువ.  త్వరగా ధనవంతుడైపోయి మిన్నా సాహచర్యాన్ని గెలుచుకోవాలనుకుంటున్న హైన్ రిచ్ కు అంతూపొంతూ లేని ఆ వెట్టి చాకిరీనుంచి బయటపడే దారి కనిపించలేదు.

పొద్దుట లేవగానే ఏకాంతంగా గడిపే ఒకటి రెండు గంటలు మాత్రమే అతని సొంతం. ఎనిమిదింటికల్లా యజమాని వచ్చి   బస్తాడు ఆలుగడ్డల మోతతో డిస్టెలరీకి పంపించేవాడు. మెక్లంబర్గ్ లో అంతా ఆలుగడ్డలనుంచి తీసిన విస్కీయే తాగుతారు. ఆ వెంటనే పరుగు పరుగున వచ్చి కౌంటర్ దగ్గర నిలబడాలి. చేపలు, వెన్న, పాలు, ఉప్పు, కాఫీ, చక్కెర, నూనెలు, కొవ్వొత్తులు, ఆలుగడ్డల విస్కీ వగైరాలు అమ్ముతూ రాత్రి పదకొండు వరకూ అక్కడే వేల్లాడాలి. సరకుతో వచ్చిన బరువైన పెట్టెలను కొట్లోకి దొర్లించడం, చేపల కేసుల్ని లెక్కపెట్టడం, సరకు సర్దడం చేస్తూ ఉండాలి. చదువుకోడానికి సమయం చిక్కకపోగా, అంకెలతో బుర్ర అరణ్యంలా తయారయ్యేది. చేప నూనెతో చేతులు జిడ్డోడుతూ ఉండేవి. బట్టల నిండా రంపంపొడి అతుక్కుని ఉండేది. ఉన్నది ఒకటే జత. దానికి కూడా మాసికలు. వేసవైనా, చలికాలమైనా అదే గతి.

ఇంతటి దుస్సహ పరిస్థితుల మధ్య కూడా అతని కలల ప్రపంచం పదిలంగానే ఉంది. దానికి అతనే రారాజు. చదువులో తను ఉన్నతశిఖరాలను అధిరోహించినట్టు, విపరీతంగా డబ్బు సంపాదించినట్టు, మిన్నాను పెళ్లాడి ఆమెతో కలసి ప్రణయసామ్రాజ్యాన్ని ఏలుతున్నట్టు ప్రతిక్షణం ఊహించుకునేవాడు. ఇప్పుడు అతని ఏకైక లక్ష్యం…డబ్బు, అంతులేనంత డబ్బు!

అరుదుగానైనా అతనిలో సంతోషాన్నీ, సంతృప్తినీ నింపిన క్షణాలు లేకపోలేదు. ఓ రోజు రాత్రి ఓ తాగుబోతు తూలుకుంటూ దుకాణానికి వచ్చాడు. చమురు దీపం ముందు నిలబడి హఠాత్తుగా హోమర్ నుంచి కొన్ని గ్రీకు పంక్తులు వల్లించడం ప్రారంభించాడు. హైన్ రిచ్ మంత్రముగ్ధుడై వింటూ ఉండిపోయాడు. అతను గ్రీకు చదవలేడు, అర్థంచేసుకోలేడు. కానీ ఆ భాషలోని లయ అతని హృదయతంత్రిని మీటింది. అలా ఆ తాగుబోతు వంద పంక్తులు పూర్తిచేశాడు. హైన్ రిచ్ మరోసారి …అప్పటికీ తనివి తీరక మూడోసారి అతని చేత వల్లింపజేసి విన్నాడు. సంతోషం పట్టలేక మూడు గ్లాసుల విస్కీ అతనికి ఉచితంగా తాగబొశాడు. దాని ఖరీదు, అంతవరకు తను పొదుపు చేసిన స్వల్పమొత్తంతో సమానం.

హైన్ రిచ్ ఆ తాగుబోతుతో పరిచయం పెంచుకున్నాడు. అతని కోసం రోజూ ఎదురుచూస్తూ ఉండేవాడు. అతని పేరు నీడర్ హోఫర్. వయసు ఇరవై నాలుగేళ్ళు. రోబెల్ కు చెందిన ఓ ప్రొటెస్టెంట్ పాస్టర్ కొడుకు. ఎందులోనూ రాణించలేకపోయాడు. చెడునడత కారణంగా అతన్ని స్కూలునుంచి బహిష్కరించారు. స్కూల్లో ఉండగా బట్టీ పట్టించిన ఆ వంద పంక్తులు మాత్రం అతనికి గుర్తుండిపోయాయి. వాటినే శ్రావ్యంగా వల్లిస్తూ ఉండేవాడు. ఆ పంక్తులు వింటున్నప్పుడు తన కళ్ల వెంట ఆనందబాష్పాలు జల జలా రాలాయనీ, తనకు గ్రీకు భాష తెలిసేలా చేయమని “ఆ క్షణం” నుంచే దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాననీ హైన్ రిచ్ ఆ తర్వాత రాసుకున్నాడు.

ఆ రోజుల్లోనే అతను అమెరికాకు పారిపోవాలని అనుకునేవాడు. అక్కడి వీథుల్ని బంగారంతో తాపడం చేశారనీ, ఆ దేశంలో కరువు తీరేలా కావలసినన్ని పుస్తకాలు కొనుక్కోవచ్చనీ చెప్పుకుంటుండగా విన్నాడు. అప్పట్లో పడమటి భూములనుంచి వేల సంఖ్యలో జనం అమెరికాకు వలసపోతూ ఉండేవారు. కొంత ఖర్చు భరించే మేరకైనా తన దగ్గర డబ్బు సమకూడితే న్యూయార్క్ పంపే ఏర్పాటు చేసేలా ఒక ఏజెంట్ తో ఒప్పందం చేసుకున్నాడు. అప్పుడతని వయసు పద్దెనిమిదేళ్లు. కొంత డబ్బు అప్పుగా ఇవ్వమని తండ్రికి రాశాడు. ఆయన సమస్యల్లో ఆయనున్నాడు. ఒకామెను పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత వదిలేసి మళ్ళీ తెచ్చుకున్నాడు. ఇద్దరి మధ్యా ఎడతగని కీచులాట. చివరికి వ్యవహారం కోర్టువరకూ వెళ్లింది. తండ్రి నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో హైన్ రిచ్ తీవ్ర ఆశాభంగం చెందాడు. ఇక ఈ పచారీ కొట్టును, వెట్టి చాకిరీనీ తప్పించుకునే మార్గంలేదనుకున్నాడు. అంతలో అతని జీవిత గమనాన్నే మార్చేసే ఓ ఘటన జరిగింది.

heinrich

అతనో పెద్ద చికోరీ పెట్టెను దొర్లించబోయాడు. పెద్దదే కానీ మరీ అంత బరువైందేమీ కాదు. అదే అతనికి కష్టమై హఠాత్తుగా రక్తం కక్కుకున్నాడు. నేల మీద ఉన్న రంపంపొడి రక్తంతో ఎర్రబడిపోయింది. ఇంక తను ఆలుగడ్డల బస్తాలను, వెన్న చిలికే పెద్ద పెద్ద కవ్వాలను మోయగల స్థితిలో లేడని అతనికి అర్థమయింది. ఆ చీకటి కొట్లోనే తన జీవితం తెల్లారిపోతుందనుకుని భయపడ్డాడు.

వెంటనే హాంబర్గ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అది సముద్రతీరంలో ఉంది కనుక అక్కడినుంచి అమెరికాకు తేలిగ్గా వెళ్లిపోవచ్చు. అప్పటికతను 30 ప్రష్యన్ డాలర్లను, అంటే దాదాపు 7 పౌండ్లను పొదుపు చేశాడు. ఆ డబ్బు తీసుకుని కట్టుబట్టలతో కాలినడకన రోష్టాక్ మీదుగా హాంబర్గ్ కు బయలుదేరాడు. రోష్టాక్ లో కొన్ని రోజులు ఆగి బుక్-కీపింగ్ నేర్చుకున్నాడు. సాధారణ విద్యార్థులకు ఏడాది నుంచి ఏణ్ణర్థం పట్టే ఆ కోర్సును కొన్ని రోజుల్లోనే పూర్తిచేశాడు.

రోష్టాక్ నుంచి హాంబర్గ్ కు బయలుదేరిన హైన్ రిచ్ కు చిన్నాన్న కూతురు సోఫీ స్లీమన్ వీడ్కోలు చెప్పింది. హాంబర్గ్ లోని అయిదు ఎత్తైన బురుజుల్ని దూరం నుంచే చూసి ముగ్ధుడయ్యాడు. నిజానికి అతను తన చరమ జీవితం అంతా ఎత్తైన కోట బురుజుల్ని చూస్తూ ముగ్ధుడవుతూనే గడిపాడు. శివార్లలో నిలబడి సెప్టెంబర్ ఆకాశపు గొడుగు కింద ఆ నగర దృశ్యాన్ని చూస్తూ “హాంబర్గ్…హాంబర్గ్’’ అని మాటి మాటికీ గొణుగుతూ ఉండిపోయాడు. ఒక నగరాన్ని చూడడం అదే అతనికి మొదటిసారి. అక్కడి విశాలమైన ఆవరణల మధ్య ఠీవి ఒలికే వర్తక ప్రాసాదాలు, ఎక్కడబడితే అక్కడ మార్కెట్లు, తీర్చి దిద్దిన రహదారుల మీద చప్పుడు చేసుకుంటూ సాగిపోయే బళ్ళు, గడియారపు మోతలు, ఎత్తైన చర్చి గోపురాలపై గంటల గలగలలు…ప్రతిదీ అతన్ని ఉత్తేజితుణ్ణి చేశాయి. చెవులు చిల్లులు పొడిచే ఆ రణగొణ ధ్వనుల మధ్య తనను తాను మరచిపోయాడు. తన కష్టాలను మరచిపోయాడు. నిద్రలో నడుస్తున్నట్టు నడిచాడు. ఇక్కడ తన అదృష్టాన్ని ఎలా పండించుకోవాలన్న ఆలోచన చేశాడు. “హాంబర్గ్ నన్ను ఆకాశానికి ఎత్తేసింది. నన్నో స్వాప్నికుడిగా మార్చేసిం”దని సోదరికి ఉత్తరం రాశాడు.

అదృష్టం పండించుకోవడం అలా ఉంచి, మాటి మాటికీ రక్తం కక్కుకుంటున్న ఈ జబ్బుమనిషికి పని దొరకడమే గగనమైపోయింది. ఎట్టకేలకు నెలకు 14 పౌండ్ల జీతం మీద ఓ పచారీ కొట్టులో పని దొరికింది. ఎనిమిది రోజులకే అది ఊడిపోయింది. ఆ తర్వాత బుక్-కీపర్ గా ఉద్యోగం వచ్చింది. అదీ వారం రోజులకే ముగిసింది. దాంతో క్లిష్టపరిస్థితిలోకి జారిపోయిన హైన్ రిచ్ క్రిష్టమస్ వరకు కాలక్షేపం చేయడానికి సరిపోయే మొత్తాన్ని అప్పుగా పంపమని ఓ బంధువుకి ఉత్తరం రాశాడు. అతను వెంటనే కొద్దిపాటి మొత్తాన్ని పంపుతూ, అంతగా అవసరం లేకపోతే  ఆ డబ్బు తిప్పి పంపమని ఉత్తరం రాశాడు. ఆ మాట హైన్ రిచ్ కు అవమానంగా తోచింది. ఏమైతేనేం, ఆ స్వల్పమొత్తం అతన్ని చావకుండా మాత్రం కాపాడింది. తనను అంత మంత్రముగ్ధం చేసిన హాంబర్గ్ ను క్రిష్టమస్ నాటికి శాశ్వతంగా విడిచిపెట్టేశాడు.

అదెలా జరిగిందంటే…అతని తల్లికి పరిచయస్తుడైన హెర్ వెంట్ అనే ఒక  ఓడల దళారీ అనుకోకుండా తారసపడ్డాడు. అతన్ని ‘డొరోతియా’ అనే ఓడ కెప్టెన్ కు పరిచయం చేశాడు. ఆ ఓడ వెనెజులా లోని లా గ్వైరా అనే చోటికి బయలుదేరబోతోంది. దక్షిణ అమెరికాపై అప్పటికే ఆసక్తి పెంచుకున్న హైన్ రిచ్ ఈ ప్రయాణం గురించి తెలియగానే ఎగిరి గంతేశాడు. అయితే అతని ఆరోగ్యం దెబ్బతినిపోయింది. మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేదు. చివరికి ఒక దుప్పటి కొనుక్కోగల స్తోమత కూడా లేదు. అంతలో అతనికి తన వెండి వాచీ గుర్తొచ్చింది. దానిని మూడు డాలర్లకు అమ్మేసి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో రెండు చొక్కాలు, ఒక కోటు, రెండు పంట్లాములూ, ఒక పరుపు, ఓ మాదిరి దుప్పటి కొనుక్కున్నాడు. ఓడ ఎక్కే సమయానికి జేబు ఖాళీ అయిపోయింది.

బయలుదేరిన కొన్ని రోజులకే ఓడ పెనుతుపానులో చిక్కుకుంది. హైన్ రిచ్ మరణం అంచులవరకూ వెళ్ళాడు…

                                                                                                               (సశేషం)

 

 

 

 

 

స్లీమన్ కథ:కలలు కంటూ…కథలు వింటూ…అతని బాల్యం!

కల్లూరి భాస్కరం 

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మెక్లంబర్గ్…ఉత్తర జర్మనీలో ఒక చారిత్రక ప్రదేశం. పోలండ్ సరిహద్దులకు అది ఆట్టే దూరంలో లేదు. ఒకప్పుడు స్లావ్ లకు, ట్యూటన్లకు అక్కడో పెద్ద యుద్ధం జరిగింది. అయితే, పందొమ్మిదో శతాబ్ది ప్రారంభం నాటికి మెక్లంబర్గ్ ఎదుగూ బొదుగూ లేకుండా నిలవ నీటి తీరుగా  మిగిలిపోయింది.

మెక్లంబర్గీయుల గురించి బెర్లిన్ వాసుల్ని కదిపితే, “వాళ్ళా? శుద్ధ బుర్ర తక్కువ జనాలు” అని తీసిపారేస్తారు. కానీ అందులో వాస్తవం లేదు. ఈ ప్రాంతం కూడా చెప్పుకోదగిన కళాకారుల్ని, కవుల్ని అందించింది. అంతకన్నా ముఖ్యంగా  అన్నదాత అనిపించుకుంది. ఇక్కడి వాళ్ళలా భూమితో గాఢంగా పెనవేసుకున్న వాళ్ళు  జర్మనీ మొత్తంలోనే మరొకళ్ళు లేరు. వీరు అసలు సిసలు భూమిపుత్రులు.

ప్రధానంగా వీళ్ళు ఆలుగడ్డల్ని పండిస్తారు. పశువుల్ని పెంచుతారు. ఇక వీళ్ళ అలవాట్లకు వస్తే, విపరీతంగా తాగేస్తారు. . అట్టహాసంగా నవ్వుతారు. శీతాకాలపు దీర్ఘ సాయంత్రాలలో నెగడు చుట్టూ కూర్చుని కమ్మ కమ్మగా కథలు చెప్పుకుంటారు.

మెక్లంబర్గ్ లో న్యూ బకౌవ్ అనే ఓ కుగ్రామం. అక్కడో చర్చి. ఆ చర్చి ప్రాంగణంలోనే పాస్టర్ కుటుంబం నివసించే ఓ ఇల్లు. ఆ ఇంట్లో 1822, జనవరి 6న పుట్టాడు ఓ అబ్బాయి. అతనికి నలుగురు అక్కచెల్లెళ్ళు, ఒక అన్న. పుట్టిన ఏడాదికే అన్న చనిపోయాడు. అతని జ్ఞాపకార్ధం తమ్ముడికి అతని పేరే పెట్టారు. అతనే  హైన్ రిచ్ స్లీమన్!

హైన్ రిచ్ పుట్టిన రెండేళ్లకు అంకేర్షగన్ అనే గ్రామానికి తండ్రి పాస్టర్ గా వెళ్ళాడు. అదెంత అనామక గ్రామమంటే, మ్యాపు మీద దాని పేరు కనిపించదు. అక్కడో చిన్నపాటి చర్చి. అందులో చెర్రీ పండ్లతోట. ఆ ఊరికి గుర్తింపు లేకపోతేనేం, అక్కడి గాలి నిండా వింత వింత ఊసులూ; దెయ్యాలు, భూతాలు, గుప్తనిధుల కథలూనూ. అక్కడికి దగ్గరలోనే నిధులు పాతిపెట్టారనీ, అక్కడ దెయ్యాలు తిరుగుతూ ఉంటాయనీ చెప్పుకునేవారు. చర్చి తోటలో ఉన్న చిన్న ఇంట్లో నిమ్మచెట్టు కింద ఒక దెయ్యం ఉందట. హైన్ రిచ్ నాన్న ఎర్నెస్ట్ స్లీమన్ కు ముందు పాస్టర్ గా ఉన్న రుష్టార్బ్ దెయ్యం అది. చర్చికి ఇంకో పక్కన ఓ చెరువు. రోజూ అర్థరాత్రి వేళ ఓ అమ్మాయి చేతుల్లో వెండి పాత్ర ఉంచుకుని ఆ చెరువులోంచి పైకి వస్తుంది. అక్కడికి మైలు దూరంలో ఓ సమాధి ఉంది. చనిపోయిన ఓ శిశువును బంగారు ఊయెలలో ఉంచి పాతిపెట్టిన సమాధి అది.

ఆ ఊరి నడిమధ్యలో మధ్యయుగాల నాటి ఓ కోట. దాని అడుగున రహస్యమార్గాలు. ఒకప్పుడు ఆ కోట హెన్నింగ్ వాన్ హోస్టీన్ అనే ఓ బందిపోటు అధీనంలో ఉండేది. అలా ఉండగా, మెక్లంబర్గ్ డ్యూక్ అతని మీదికి యుద్ధానికి వచ్చాడు. హోస్టీన్ అతనితో సంధి రాయబారాలు జరుపుతూనే, అతన్ని చంపడానికి పథకం వేశాడు. ఓ గోవుల కాపరి దీనిని పసిగట్టి డ్యూక్ చెవిన వేశాడు. హోస్టీన్ ఆ గోవుల కాపరిని పట్టుకుని సజీవదహనం చేసి, అప్పటికీ కసి తీరక మృతదేహాన్ని ఒక్క తన్ను తన్నాడు. డ్యూక్ పెద్ద సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. తప్పించుకునే మార్గం దొరక్క హోస్టీన్ తన ఖజానా అంతటినీ ఓ శిథిల గోపురం కింద దాచి ఆత్మహత్య చేసుకున్నాడు.

చర్చి ప్రాంగణంలో పొడవైన రాళ్ళు పరచి ఉన్న చోటే అతని సమాధి. గోవుల కాపరిని తన్నిన అతని కాలు ఏటా ఒకసారి సమాధి లోంచి పొడుచు వస్తుందని, అదొక వింత పువ్వులా కనిపిస్తుందనీ చెప్పుకునేవారు. నల్లని సిల్కు తొడుగుతో ఉన్న ఆ కాలును నేనొకసారి చూశానని చర్చి పనివాడు చెప్పేవాడు. అతను తప్ప చూశామని చెప్పినవాళ్లు ఇంకెవరూ లేరు.

***

దెయ్యాలు, భూతాల కథలూ…మధ్యయుగాలనాటి కోటా…రహస్యమార్గాలలూ…గుప్తనిధులూ…!

హైన్ రిచ్ ఆసక్తులను, ఊహలను పుష్కలంగా పండించడానికి బాల్యంలోనే కావలసినంత ఎరువు.  అతనా కోటను చూశాడు. దాని ఉత్తరపు గోడ మీద, గుర్రమెక్కి యుద్ధానికి వెడుతున్న హోస్టీన్ చిత్రాన్ని చూశాడు. గోవుల కాపరిని సజీవ దహనం చేసిన ప్రదేశం చూశాడు. మెక్లంబర్గ్ డ్యూక్ ను హెచ్చరించడం కోసం గోవుల కాపరి కొండ మీద దాగి ఉన్న చోటు అతనికి తెలుసు. ఆ కోట అడుగున ఉన్న రహస్యమార్గాలను గాలించాడు. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆ రహస్యమార్గాల తలెక్కడో, తోక ఎక్కడో తనకు తెలుసు ననుకునేవాడు. ఇక అతని బుర్ర నిండా గుప్తనిధుల గురించిన కథలే.

నిజానికి అంతవరకు హైన్ రిచ్ ఆ ఊళ్ళోంచి కాలు కదిపింది లేదు. ఆ చర్చి ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టిన సందర్భాలూ తక్కువే. కిటికీకి అతుక్కుపోయి మంచుపొగలోంచి బాహ్యప్రపంచాన్ని చూస్తూ, దానిని ఓ అద్భుతంగానూ, నిగూఢమైందిగానూ ఊహించుకుంటూ ఆనందంతో పులకించిపోయేవాడు. ఆ పసితనపు ఉత్కంఠ అతని జీవితాంతమూ అలాగే ఉండిపోయింది.

అతను ప్రతిచోటా దెయ్యాలు ఉన్న్తట్టు ఊహించుకునేవాడు. ప్రతి సందు మలుపులో ఏదో భయోత్పాతం కాచుకుని ఉన్నట్టు అనుకునేవాడు. రాత్రిపూట విచిత్రమైన గుసగుసలు వినిపిస్తున్నట్టు, తోటలో దీపాలు కదిలి వెడుతున్నట్టు, హోస్టీన్ భూతం కోటలోంచి కిందికి దిగి వస్తున్నట్టు భావించుకునేవాడు. చెట్ల మీదా, బెంచీల మీదా, కిటికీ రెక్కల మీదా, చర్చి గోడల మీదా తన పేరు రాసి, ఉనికిని చాటుకునే అలవాటు అతనికి ఉండేది. యాభై ఏళ్ల తర్వాత అతను ఆ ఊరు వెళ్లినప్పుడు, చిన్నతనంలో చర్చి తోటలోని నిమ్మచెట్టు మీద తను చెక్కిన పేరు ఉందా లేదా అని చూసుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పేరు అలాగే ఉంది!

తన నలుగురు అక్కచెల్లెళ్లలోనూ డొరోతియా, విల్హెమైన్ లకు అతను ఎక్కువ మాలిమిగా ఉండేవాడు. వాళ్ళమ్మ ఓ మెజిస్ట్రేట్ కూతురు. చాలా నెమ్మదస్తురాలు. పెళ్లయేనాటికి ఆమెకు పదహారేళ్లు. భర్త ఎర్నెస్ట్ కన్నా పదమూడేళ్లు చిన్న. ఆమె దాంపత్యజీవితాన్ని ఏనాడూ ఆనందించలేదు. భర్త ఆమెను పురుగులా చూసేవాడు. పెత్తనం చేసేవాడు. పిల్లలకు మాత్రం తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమె అల్లికలు, కుట్లు చేసేది. పియానో వాయించేది. డాబుసరి మనిషిగా ఊహించుకుని గ్రామస్తులు కూడా ఆమెపట్ల అయిష్టంగా ఉండేవారు. పెత్తందారీకి తోడు భర్త వంట మనుషులతో అక్రమసంబంధాలు పెట్టుకోవడంతో ఆమె మరింత కుంగిపోయింది.

తొంభయ్యేళ్లు జీవించిన ఎర్నెస్ట్  స్త్రీలోలుడిగా అపకీర్తినే మూటగట్టుకున్నాడు. పాస్టర్ కావడానికి ముందు అతను స్కూలు టీచర్ గా పనిచేశాడు. బోధన లో అతనికి మంచి నేర్పు ఉండేది. పిల్లలచేత తనే అక్షరాలు దిద్దించాడు. తన పుస్తకాలలోని చక్కని బొమ్మల్ని పిల్లలకు చూపించి ఆనందించేవాడు. ఓ రోజు అతను తమ పేదరికం మీద మండిపడ్డాడు. అప్పుడు, “ ఓ వెండి గిన్నెనో, బంగారు ఊయెలనో తవ్వి తీయచ్చుగా” అన్నాడు హైన్ రిచ్ అమాయకంగా. ఆ మాటకు తండ్రి నవ్వేశాడు.

ఎర్నెస్ట్ కళాకళల మనిషి. ఒక్కోసారి చాలా ఉదారంగా ఉండేవాడు. ఒక్కోసారి పిసినారిలా వ్యవహరించేవాడు. హఠాత్తుగా కాఠిన్యం తెచ్చుకునేవాడు. అది ఎదుటి వాళ్ళకు వింతగానూ, వినోదంగానూ ఉండేది. కథలు మాత్రం మహా రంజుగా చెప్పేవాడు. పిల్లల్ని ఊరి వెంట, పొలాల  వెంట షికారుకు తీసుకెళ్ళడం అతనికి ఎంతో ఇష్టమైన వ్యాపకం. దారిలో ఎదురయ్యే ప్రదేశాలు, పొలాలు, కట్టడాల చరిత్రను వాళ్ళకు ఎంతో ఆసక్తిగా చెబుతూ ఉండేవాడు. ఆ చెప్పడంలో కూడా అప్పటికప్పుడు కథలు అల్లేవాడు.  ఆ అల్లిక రాను రాను హాస్యాస్పదంగా పరిణమించేది. అయినాసరే, పిల్లలకు అది నమ్మశక్యంగానే అనిపించేది. వారు ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టుకుని వింటుంటే ఉన్నట్టుండి పెద్ద పెట్టున నవ్వేసేవాడు. శీతాకాలపు సాయంత్రాలలో పిల్లలు అల్లరి చేయకుండా హోమర్ నుంచి కథలు చెప్పేవాడు. ఆ చిన్నపాటి చర్చి కాస్తా ట్రోజన్ యుద్ధారావాలతో కంపించిపోయేవరకూ ఆ కథనం సాగుతూ ఉండేది.

అతనికి గ్రీకు తెలియదు. హోమర్ రచనల మూలాన్ని ఎప్పుడూ చదవలేదు. అయినాసరే, ఇలియద్, ఒడిస్సేలపై అతని ఆసక్తికి అవి అడ్డురాలేదు. జర్మన్లు అందరికీ హోమర్ బాగా తెలుసు. గథే, షిల్లర్ లాంటి ఎందరో జర్మన్ కవులు హోమర్ ను అనుకరించారు, ఆరాధించారు, కవిగా ఆయనను ఆకాశానికి ఎత్తారు. హోమర్ రచనలకు జర్మన్ లో అద్భుతమైన అనువాదాలు వచ్చాయి. వాటన్నింటిలోనూ ప్రసిద్ధమైనది జె. హెచ్, వాస్ అనువాదం. విశేషమేమిటంటే, వాస్ యువకుడిగా ఉన్నప్పుడు, హోస్టీన్ ఆ గోవుల కాపరిని సజీవదహనం చేసిన కోటలోనే  కొన్ని మాసాలపాటు ట్యూటర్ గా గడిపాడు.

ఆవిధంగా హోమర్ హీరోలను పిల్లలు సొంత ఆస్తిగా భావించుకునేవారు. అచియన్లకు, ట్రోజన్లకు మధ్య జరిగిన యుద్ధాల కథలను ఊపిరి బిగబెట్టి వింటుండేవారు. వాళ్ళ ఊహలో అంకెర్షగన్ కోటకు చెందిన శిథిలమైన బురుజులు, యుద్ధప్రదేశాలలోనే ట్రోజన్ యుద్ధం జరిగిపోతూ ఉండేది. అంకెర్షగనే  వాళ్ళ ట్రాయ్ నగరం. అలాగే ట్రాయ్ హీరోల జీవితాలు, వాళ్ళ జీవితాలు ఒకటిగా కలసిపోయేవి.

1829 క్రిస్టమస్ రోజున హైన్ రిచ్ కు వాళ్ళ నాన్న లుడ్విగ్ జెర్రర్ రాసిన సచిత్ర ప్రపంచ చరిత్ర(Illustrated History of the World)ను కానుకగా ఇచ్చాడు. అప్పటికి హైన్ రిచ్ కు ఏడేళ్లు. వెంటనే పేజీలు తిరగేస్తుంటే, ట్రాయ్ నగరం దగ్ధమైపోతున్న దృశ్యం కనిపించింది. తురాయితో ఉన్న శిరస్త్రాణాన్ని, కవచాన్ని ధరించిన ఇనియెస్; తండ్రి ఎంకైసిస్ ను వీపున మోస్తూ, కొడుకు అస్కేనియెస్ చేయి పట్టుకుని ఆ పొగలోంచీ, మంటల్లోంచీ ముందుకు నడుస్తూ ఉంటాడు. ఆ చిత్రం హైన్ రిచ్ ను ఎంతో ఆకట్టుకుంది. అందులోని ప్రతి వివరం అంకెర్షగన్ నే ట్రాయ్ గా ఊహించుకోడానికి అతనికి సాయపడింది. గుండ్రని బురుజులు, ఎత్తైన కోట గోడలు,  అతిపెద్ద సింహద్వారం-అన్నీ అంకెర్షగన్ లో ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఇంతకు ముందున్న పాస్టర్ కు, ఇనియెస్ కు మధ్య పోలికలు కొట్టొచ్చినట్టు కనిపించడం. ఎత్తైన నుదురు, విశాలమైన కళ్ళు, బండ ముక్కుతో ఇద్దరూ సరిగ్గా ఒకేలా ఉన్నారు. ఇనియెస్ తగలబడుతున్న ట్రాయ్ నుంచి భయంతో పారిపోతున్నవాడిలా లేడు. నెమ్మదిగా, ప్రశాంతంగా, వెనుదిరిగి చూడకుండా పొగ లోంచి బయటికి వస్తున్నవాడిలా ఉన్నాడు.

ఈ చిత్రాన్ని చూడడం తన జీవితంలో ఒక మలుపు అంటాడు, పెద్దైన తర్వాత హైన్ రిచ్. భూమిలో కప్పడిపోయిన  ట్రాయ్ నగరాన్ని ఎప్పటికైనా తవ్వి తీయాలని, ఆ చిత్రాన్ని చూసిన క్షణంలోనే  అతను నిర్ణయించుకున్నాడు. నగరం తగలబడిపోయినా కోట గోడలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని వాళ్ళ నాన్నతో అన్నాడు. బహుశా జెర్రర్ ఆ నగరాన్ని చూసి ఉంటాడని కూడా అన్నాడు.

“లేదు, లేదు. మొత్తం ట్రాయ్ అంతా తగలబడి బూడిదైపోయింది. నువ్వు చూసింది వట్టి ఊహాచిత్రం” అన్నాడు ఎర్నెస్ట్.

“కానీ ట్రాయ్ లో ఆ బొమ్మలో చూపిన గోడల్లాంటివే ఉండి ఉంటాయి” అన్నాడు అబ్బాయి.

“అవును”

“అంత పెద్ద పెద్ద గోడల్ని మంటలేం చేస్తాయి? వాటిలో కొన్నైనా మిగిలే ఉంటాయి”

“లేదు, మిగిలే అవకాశమే లే”దని తండ్రి ఖండితంగా అన్నాడు. కానీ అబ్బాయి మాత్రం తన అభిప్రాయానికే కట్టుబడి ఉండిపోయాడు. ఏదో ఒక రోజున తను ట్రాయ్ కి వెళ్ళి జెర్రర్ తన పుస్తకంలో కళ్ళకు కట్టేలా వర్ణించిన గోడల్ని, బురుజుల్ని కనిపెట్టి తీరతానని అనుకున్నాడు.

యాభై ఏళ్ల తర్వాత ముక్క ముక్కలుగా తను రాసుకున్న ఆత్మకథలో హైన్ రిచ్ ఈ బాల్యస్మృతులను నెమరువేసుకున్నప్పుడు పండితులు కనుబొమలు ఎగరేశారు. తన ఏడో ఏట తండ్రితో జరిగినట్టు చెబుతున్న ఆ సంభాషణ ఆయనకు అంతగా గుర్తుండడం నమ్మశక్యంగా లేదన్నారు. ట్రాయ్ ని తవ్వి తీయడం గురించి తను కలలు కనని క్షణం, ఆలోచించని రోజు తన జీవితం మొత్తంలోనే లేవనీ; ఎత్తైన ట్రోజన్ గోడలపై విజయగర్వంతో నిలబడే రోజు కోసమే తన శక్తియుక్తులన్నీ వెచ్చించాననీ హైన్ రిచ్ సమాధానం చెప్పినప్పుడు కూడా పండితులు ఆయనను అనుమానంగా చూశారు. కానీ బాల్యం నుంచీ ఆయన ఆసక్తులను, జీవన గమనాన్ని పట్టి చూస్తే ఆయన మాటలు అతిశయోక్తులనిపించవు.

ఆ అబ్బాయి అలా కలలు కంటూనే స్కూలుకు వెళ్ళి వస్తున్నాడు. ఇంకా విచిత్రంగా తన ఏడో ఏటే అతను ప్రేమలో కూడా పడ్డాడు. ఆ అమ్మాయి పేరు మిన్నా మెయింక్. సరిగ్గా అతని వయసే. ఓ రైతు కూతురు. పసుపు రంగు జుట్టు, నీలి కళ్ళు-ఓ అందమైన బొమ్మలా ఉంటుంది. ఓ రోజు ఇద్దరూ డ్యాన్సింగ్ క్లాసులో కలసుకున్నారు. అప్పటినుంచీ విడదీయలేని జంటగా మారిపోయారు. హైన్ రిచ్ చెప్పే కథల్ని ఆ అమ్మాయి ఎంతో ఇష్టంగా వింటూ ఉండేది. ఓ రోజు మెయింక్ కుటుంబం అంతా చర్చికి వచ్చారు. దూరం నుంచి వాళ్ళను చూస్తూనే హైన్ రిచ్ అక్కడినుంచి మాయమైపోయాడు. సాధారణంగా చింపిరి జుట్టుతో ఉండేవాడు కాస్తా, సబ్బుతో నిగనిగలాడేలా మొహం తోముకుని, చక్కగా తల దువ్వుకుని, ఉన్నంతలో మంచి సూటు వేసుకుని పెళ్లికొడుకులా వాళ్ళ ముందుకు వచ్చాడు. ఇంట్లో వాళ్ళు అతన్ని వింతగా గుడ్లప్పగించి చూశారు. ఆ అమ్మాయిని మెప్పించడం కోసమే ఇంత వేషం కట్టాడని ఆ తర్వాత కానీ వాళ్ళకు తట్టలేదు.

ఆ ఏడేళ్ళ వయసులోనే మిన్నాపై అతనికి ఎంత అచంచలమైన ప్రేమంటే, ఎప్పుడూ ఆ అమ్మాయి పక్కనే ఉండేవాడు. స్కూలులో పక్కనే కూర్చునేవాడు.  కలసి డ్యాన్సింగ్ క్లాసుకు వెళ్ళేవాడు. ఇద్దరూ పుట్టలు, గుట్టలవెంట కలసి తిరిగేవారు. కోట దగ్గర, శ్మశానం దగ్గర వేళ్లాడుతూ ఉండేవారు. హెన్నింగ్ వన్ హోస్టీన్ కాలు రాళ్లనుంచి పొడుచుకొచ్చిన చోటు కూడా వాళ్ళు చూశారు. గోవుల కాపరిని సజీవదహనం చేసిన ప్రదేశాన్ని, రహస్యమార్గాలను జంటగా పరిశీలించారు. ఆ కోటలో హోస్టీన్ అనే బందిపోటు నిజంగా ఉండేవాడా అని కనిపించిన వాళ్ళ నందరినీ అడిగారు. ఏటా ఒకసారి అతని కాలు కనిపించేదనీ, ఈ మధ్యనే ఎవరో చెట్ల పండ్లు రాల్చడం కోసం దానిని ఊడబెరికాడనీ చర్చి పనివాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటల్ని వాళ్ళిద్దరూ నమ్మేశారు. ఆ ఊళ్ళో పీటర్ హప్పర్ట్ అనే దర్జీ ఉండేవాడు. అతనికి ఒకే కన్ను, ఒకే కాలు. దాంతో అతని నడక గెంతీనట్టుగా ఉండేది. అందరూ అతన్ని ‘గెంతుల పీటర్’ అనేవారు. మళ్ళీ కథలు చెప్పడంలో అంతటి మొనగాడు లేడు. దానికితోడు అతనిది అధ్బుతమైన జ్ఞాపకశక్తి. చాలామంది నిరక్షరాస్యుల్లానే అతను కూడా విన్నది ప్రతిదీ గుర్తుపెట్టుకునేవాడు. గడిచిన ఆదివారం పాస్టర్ స్లీమన్ చేసిన మొత్తం ప్రబోధాన్ని ఉన్నదున్నట్టు అప్పజెప్పేవాడు.

అతనో రోజున ఓ ముచ్చట చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఊళ్లో వేసవిలో కనిపించే గూడకొంగలు శీతాకాలంలో ఎక్కడికి వెడతాయన్న సందేహం అతనికి కలిగిందట. చర్చి పనివాడి సాయంతో ఓ కొంగను పట్టుకున్నాడు. “వేసవిలో ఈ కొంగ షివేరిన్-మెక్లంబర్గ్ లోని అంకెర్షగన్ లో గూడుకట్టుకుంది. దీనిని చూసినవారు శీతాకాలంలో ఇది ఎక్కడ గడిపిందో దయచేసి తెలియజేయగలరు” అని ఒక తోలు కాగితం మీద రాసి, కొంగ కాలికి కట్టాడు. మరుసటి వేసవికి ఆ కొంగ తిరిగివచ్చింది. దాని కాలికి ఒక చర్మపత్రం కట్టి ఉంది. దాని మీద,  “మాకు షివేరిన్-మెక్లంబర్గ్ ఎక్కడుందో తెలియదు. ఈ కొంగ కనిపించిన ప్రదేశాన్ని సెయింట్ జాన్స్ లాండ్ అంటారు” అని చిత్రలిపిలో రాసిన వాక్యాలు ఉన్నాయి.

near ankershagen castle

“మేము పీటర్ మాటల్ని నమ్మాం . సెయింట్ జాన్స్ లాండ్ అనే ఆ మార్మిక ప్రదేశం ఎక్కడుందో కనిపెట్టడానికి మా జీవితకాలం మొత్తాన్ని ధారపోసి ఉండేవాళ్లం” అని ఆ తర్వాతి కాలంలో ఆ అబ్బాయి రాసుకున్నాడు. బహుశా అది ట్రాయ్ కి మరో పేరు అయుంటుంది!

ఇక చర్చికి తిరిగొస్తే అక్కడా వింతలు, విశేషాలకు లోటులేదు. ఎప్పుడో చనిపోయినవారి పేర్లను నమోదు చేసిన పురాతన, భారీ రిజిస్టర్లు అందులో ఉన్నాయి. అవి బరువైన గోతిక్ రాతలో ఉన్నాయి. 1709-1799 మధ్యకాలంలో 90 ఏళ్లపాటు పాస్టర్లుగా ఉన్న జొహాన్ క్రిస్టియన్ వాన్ ష్రోడర్, అతని కొడుకు గాట్ ఫ్రైడ్ రిచ్ స్వహస్తాలతో రాసిన రిజిస్టర్లు అవి. పిల్లలు అప్పుడప్పుడు ఆ పేజీలు తిరగేసేవారు. వాటి సంరక్షణ హక్కు తనకు ఉన్నట్టు హైన్ రిచ్ కు అనిపించేది. గాట్ ఫ్రైడ్ రిచ్ కూతురు 84 ఏళ్ల వయసులో అప్పటికింకా జీవించే ఉంది. పుట్టుకలు, పెళ్లిళ్లు, చావుల నమోదుతో అంతూపొంతూ లేకుండా సాగే ఆ రిజిస్టర్లను తిరగేసి అలసిపోయిన తర్వాత గాట్ ఫ్రైడ్ రిచ్ కూతురింటికి వెళ్ళేవారు. ఆమెకు ఆ ఊరి గురించి, గ్రామస్తుల గురించి తెలియని దంటూ లేదు. పిల్లలకు తన పూర్వీకుల చిత్రపటాలు చూపిస్తూ ఉండేది. ప్రత్యేకించి వాళ్ళ అమ్మ ఓల్గార్తా క్రిస్టైన్ వాన్ ష్రోడర్ చిత్రం హైన్ రిచ్ కు ఎంతగానో నచ్చేసింది. ఆమె అచ్చం మిన్నా లానే ఉంది.

అలా హైన్ రిచ్, మిన్నాలు రెండేళ్లపాటు చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. ఒకరి రహస్యాలు ఒకరు చెప్పుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలసి ఉండాలనుకున్నారు. అది కూడా అంకెర్షగన్ లోనే. అక్కడి ఎత్తైన చర్చి గోపురం, తోట, శ్మశానం, కొండ మీద పెద్ద కోట—ఇవే వాళ్ళకు తెలిసిన ఏకైక ప్రపంచం. తమ కలల్లో ఇంకొకరి జోక్యానికి ఒప్పుకోకూడదని కూడా ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నారు.

కానీ వారి కలలకు హఠాత్తుగా అంతరాయం కలిగింది. ఉన్నట్టుండి తమ చుట్టూ ఉన్న ప్రపంచం ఓ బూడిద కుప్పగా వారికి తోచింది…

  (సశేషం)

 

 

స్లీమన్ కథ: అతను తవ్విన దంతా బంగారం

 స్లీమన్ జీవితధారావాహిక

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

మనకు వాల్మీకి, వ్యాసుడు ఎలాగో పాశ్చాత్యులకు హోమర్ అలాగ!

మనం… కనీసం మనలో అనేకమందిమి… రామాయణ, మహాభారత కథలను వింటూ, చదువుతూ, చూస్తూ, నెమరువేసుకుంటూ పెరుగుతాం. వాటిలోని పాత్రలు మన కుటుంబసభ్యులంత దగ్గరైపోతాయి. మనమే కాదు, ప్రతి దేశమూ, ప్రతి జాతీ తనకు చెందిన పురాగాథల వారసత్వాన్ని ఉగ్గుపాలతోపాటు అందుకుంటూనే పెరుగుతుంది. పాశ్చాత్యుల విషయానికి వస్తే, ఇలియడ్, ఒడిస్సేలు వారి ‘రామాయణ, భారతా’లు.

సంగతేమిటంటే, జర్మనీలో పుట్టిన ఓ కుర్రాడికి అప్పుడప్పుడే ఊహ వికసిస్తున్న వయసులో వాళ్ళ నాన్న హోమర్ ను పరిచయం చేశాడు. అప్పటినుంచీ హోమర్ ఆ అబ్బాయి హృదయస్పందనలో భాగమైపోయాడు. ఆ తర్వాత అతను తన జీవితమంతా హోమర్ తోనూ; అతని ఇలియడ్, ఒడిస్సేలతోనూ సహజీవనం చేశాడు.

అతని పేరు హైన్ రిచ్ స్లీమన్!

sliiman

ఇలియడ్ కథాస్థలి అయిన ట్రాయ్ లో, మైసీనియాలో తవ్వకాలు జరిపించి పురాచరిత్ర తాలూకు అద్భుత నిధి నిక్షేపాలను వెలికి తీసిన వ్యక్తిగా స్లీమన్(1822-1890) ప్రపంచప్రసిద్ధుడు. విచిత్రమైన మలుపులతో గొప్ప నాటకీయతను పండిస్తూ సాగిన అతని జీవితం కూడా అంతే అద్భుతం. ఆపైన అతని వ్యక్తిత్వంలోనూ, వృత్తిప్రవృత్తులలోనూ ఊహకందని  వైరుధ్యాలు. అవన్నీ కలసి ఒక ఆసక్తికరమైన ఒక ‘టైపు’గా కూడా అతణ్ణి మనకు పరిచయం చేస్తాయి.

***

రెండేళ్లపాటు ధారావాహికంగా సాగి రెండు వారాలు విరామం తీసుకున్న ‘పురా’గమనం కాలమ్ లో ముందు అనుకున్న అజెండాను పూర్తి చేయకుండానే మధ్యలో ఈ స్లీమన్ ముచ్చటేమిటనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాను. ఇప్పటికే మీకు అర్థమయ్యుంటుంది, ‘పురా’గమనం ఒక సుదీర్ఘయాత్ర.  వ్యక్తిగత కారణాలు అడ్డు రాకపోతే ఇంకో రెండేళ్ళు… ఇంకా అంతకంటె ఎక్కువ కాలమే కొనసాగగలిగిన సరుకు అందులో ఉంది. అయితే ఇది ఎలాగూ సుదీర్ఘయాత్ర కనుక స్లీమన్ అనే మజిలీ దగ్గర కొన్ని వారాలు ఆగితే ఎలా ఉంటుంది?!

quote

***

స్లీమన్ జీవితగాథ ‘పురా’గమనం శీర్షికలో ఒదిగిపోతుందన్న నమ్మకం కూడా ఈ కోరికకు ఒక కారణం. ఒక పక్క హోమర్ ను వింటూ, ఇంకో పక్క తన ఊళ్ళోని చారిత్రక శిథిలాల మధ్య తిరుగుతూ, వాటి గురించిన అద్భుతత్వ కథనాలకు ఆసక్తిగా చెవి యొగ్గుతూ బాల్యాన్ని గడిపాడు స్లీమన్.  ఇలియడ్, ఒడిస్సే లను కేవలం పురాణంగానో, ఇతిహాసంగానో కాకుండా; చరిత్రగా భావించుకోవడం ప్రారంభించాడు. ఆ చరిత్రను తవ్వి తీయాలని కలలు కన్నాడు. చివరికి ఆ కలల్ని నిజం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేశాడు.

excavations at troy

రామాయణ, మహాభారతాలలో పేర్కొన్న ప్రదేశాలలో తవ్వకాలు జరిపించి;  వాటిలోని పాత్రలు ఉపయోగించిన ఆయుధాలు, ధరించిన నగానట్రా వగైరాలను వెలికి తీసినప్పుడూ; నేటి భౌగోళిక పటం పై ఆ ప్రదేశాలను గుర్తించినప్పుడూ అది మనకు ఎంత అద్భుతంగా తోస్తుంది? స్లీమన్ అలాంటి అద్భుతత్వాన్నే అనుభవించాడు. ఇతరులను అనుభవింపజేశాడు.

“గతం తాలూకు అవశేషాలను తవ్వి తీయడాన్ని మించి మన జీవితాలలో సంతోషాన్ని నింపగలిగింది మరొకటి లే” దంటాడు స్లీమన్. ఇలా అనడం విపరీతంగా ధ్వనించే మాట నిజమే. అయితే అతని జీవితగాథలోకి వెడుతున్న కొద్దీ ఈ మాట పురాచరిత్రతో అతని తాదాత్మ్యాన్ని చెబుతుంది.  ప్రపంచాన్ని విప్పారిన కళ్ళతో ఒక అద్భుతంగా దర్శించే ఒక పసిమనసునూ బయటపెడుతుంది.

అలాంటి పసిమనసు కలిగిన వారందరినీ అతని జీవితగాథ ఆకట్టుకుంటుంది!

***

THE GOLD OF TROY  పేరుతో ROBERT PAYNE  చేసిన రచనే ఆ విశ్వాసానికి ప్రేరణ. ఆ రచన ఆధారంగా  చెప్పబోయే స్లీమన్ జీవితగాథతో అతిత్వరలోనే ‘పురా’గమనం తిరిగి కొనసాగుతుంది…

 

 

 

 

 

 

‘నరు’ని అవతరణా ప్రపంచీకరణలో భాగమే

కల్లూరి భాస్కరం

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)రాముడు నిజమా, కల్పనా; చారిత్రక పురుషుడా, పురాణపురుషుడా; నరుడా, దేవుడా…అని అడిగితే ఏదో ఒకటి తేల్చి చెప్పడం కష్టం. ఎందుకంటే, రాముడి వీటిలో అన్నీనూ. దశరథుడనే రాజుకు రాముడనే కొడుకు పుట్టడం, తండ్రి ఆదేశం మీద ఆయన అరణ్యవాసం చేయడం, రావణుడనే వాడు ఆయన భార్యను ఎత్తుకుపోవడం, ఆయన రావణుని చంపి భార్యను తిరిగి తెచ్చుకోవడం నిజం కావడం అసాధ్యమూ కాదు, అందులో ఆశ్చర్యమూ లేదు. దాంతోపాటు నిజం కావడానికి అవకాశం లేని అద్భుతాలు, అతిశయోక్తులు ఆయన కథలో అనేకం ఉన్నాయి. రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి ముందు రాముడు పద్నాలుగు వేలమంది రాక్షసులను ఒంటరిగా చంపాడన్న చిత్రణే చూడండి. కావ్యశైలిలో అలాంటివి సహజమే కానీ, రామాయణం విశ్వాసంలో భాగం అవడం వల్ల వాటిని నిజమని నమ్మే సంప్రదాయం ఏర్పడింది.

రాముడు చారిత్రకపురుషుడా, పురాణపురుషుడా అన్న ప్రశ్నకూ ఇదే వర్తిస్తుంది. ఆయన చారిత్రక పురుషుడు కావడం అసంభవమేమీ కాదు; అదే సమయంలో పురాణపురుషుడు కూడా! చరిత్రకూ, పురాణానికీ మధ్య తేడాను పాటించని దశలో అలా రెండూ కావడంలో వింత ఏమీలేదు. చరిత్ర, పురాణాల మధ్య తేడాను పాటించకపోవడం మన దగ్గరే కాక ప్రాచీన సమాజాలలో చాలా చోట్ల ఉంది. హోమర్ ను ఇంతకుముందు ఉదహరించుకున్నాం.

రాముడు నరుడనీ, పురుషోత్తముడనీ రామాయణం అడుగడుగునా నొక్కి చెబుతోంది. కాలగతిలో ఆ నరుడే దేవుడిగా మారడం మనకు తెలుసు.

ఇలా నిజానికీ, కల్పనకీ; చరిత్రకీ, పురాణానికీ; నరత్వానికీ, దైవత్వానికీ మధ్య వేలాడవలసిన ఓ త్రిశంకుస్థితి ఇది!  కృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు మొదలైన మహాభారత పాత్రలకీ ఇదే వర్తిస్తుంది.  పురాణ, ఇతిహాసాలు వాస్తవికార్ధంలో చరిత్ర కావు, నిజమే. కానీ అవి చారిత్రకాంశాలను ప్రతిఫలిస్తాయి. అలా అనుకున్నప్పుడు త్రిశంకుస్థితి ఉండదు. ఈ సూత్రీకరణ నిజానికి సాహిత్యానికీ వర్తిస్తుంది. సాహిత్యంలో ఎంతో కల్పన ఉంటుంది. అయితే సాహిత్యం ప్రతిఫలించే సమాజమూ, ఆ సాహిత్యాన్ని సృష్టించే వ్యక్తీ నిజాలు కనుక అందులో ఎంతో నిజమూ ఉంటుంది. ఆ విధంగా అందులో చారిత్రకాంశాల ప్రతిఫలనమూ ఉంటుంది.

మనకిప్పుడు తెలిసిన మానవ కాలమానం రీత్యా చూస్తే రామాయణం ఎప్పటిదో తెలియదు. కోశాంబీ తదితర ఆధునిక చరిత్రకారుల ఊహ ప్రకారం  మహాభారతకథ ఇప్పటికి మూడువేల ఏళ్ల క్రితం జరిగి ఉండచ్చు. అసలు ఋగ్వేదం చెబుతున్న దశరాజయుద్ధమే మహాభారతకథగా రూపొంది ఉండచ్చన్న అభిప్రాయమూ ఉంది(రాంభట్ల, జనకథ). కాలం గురించిన చర్చను అలా ఉంచితే రామాయణ, మహాభారతాలు రెండూ ‘నరు’డి గురించి చెబుతున్నాయి. నరుడే ఆ రెండింటిలోనూ నాయకుడు. రాముడు నరుడైతే, అర్జునుడు ఏకంగా ‘నరు’డనే పేరు కూడా ఉన్నవాడు. అందులోనూ రాముడు సూర్యవంశ క్షత్రియుడు, సౌరవీరుడు.

రాముడు, అర్జునుల చారిత్రకత స్పష్టంగా తెలియకపోయినా; స్పష్టమైన చారిత్రకత కలిగిన ఇద్దరు ముఖ్యులు మనకు తెలుస్తున్నారు. వారు కూడా రాముడు, అర్జునుడిలానే నరవీరులు. క్యాంప్ బెల్ మాటల్లో చెప్పాలంటే సౌరపుత్రులు (sons of light) సాధించిన విజయానికి ప్రతీకలు. తాత్వికార్ధంలో చెప్పాలంటే ఆ విజయం వెలుగు- చీకట్ల(చంద్రుడు)మిశ్రమమైన మాతృస్వామ్యంపై పితృస్వామికమైన వెలుగు(సూర్యుడు) సాధించిన విజయం. వారిలో మొదటివ్యక్తి సారగాన్. ఇతని కాలం క్రీ.పూ. 2350.  అగదకు చెందిన ఇతడు మెసొపొటేమియాను పాలించాడు. రెండోవ్యక్తి హమ్మురాబి. ఇతని కాలం క్రీ.పూ. 1728-1686. బాబిలోన్ కు చెందిన ఇతను కూడా మెసొపొటేమియాను పాలించాడు.hammurabi

వీరికి చెందిన పూర్వరంగం ఇదీ: సమీపప్రాచ్యానికి చెందిన అమ్మవారి ఆరాధన అక్కడికి  ఉత్తరంగా ఉన్న పచ్చికభూముల్లోనూ, దక్షిణంగా ఉన్న సైరో-అరేబియా ఎడారుల్లోనూ నివసించే ఆటవిక జనంలోకి వ్యాపించింది. వీరు స్థిర వ్యవసాయదారులు కారు. అర్ధసంచారదశలో ఉన్న పశుపాలకులు. క్రీ.పూ. 3500 నాటికి వీరు వ్యవసాయగ్రామాలకు, పట్టణాలకు ప్రమాదకరంగా మారారు. హఠాత్తుగా దాడులు చేసి దోచుకుని వెళ్లిపోయేవారు. క్రీ.పూ. 300 నాటికి వీరు రాజ్యాలను స్థాపించే స్థాయికి ఎదిగారు. ఈవిధంగా మెసొపొటేమియా క్రీ.పూ. 2500 నాటికి సైరో-అరేబియా నుంచి వచ్చిన సెమెటిక్ జాతీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సారగాన్, హమ్మురాబి ఈ జాతికి చెందినవారే.

saraganసారగాన్ అమ్మవారి ఆరాధనకు చెందినవాడే అయినా, ఆమెతో అతనిది భిన్నమైన సంబంధం అంటారు క్యాంప్ బెల్. తన తండ్రి ఎవరో తెలియదనీ, నిమ్నవర్గానికి చెందిన తల్లి తనను కని ఒక బుట్టలో ఉంచి నదిలో విడిచిపెడితే అక్కు అనే సాగునీటిదారుకి దొరికాననీ, అతడు తనను పెంచి పెద్ద చేసి తోటమాలిని చేశాడని, అప్పుడు దేవత ఇష్టార్ తనను ప్రేమించడంతో రాజునయ్యాననీ సారగాన్ చెప్పుకుంటాడు. ఆదిమ పౌరాణికతకు చెందిన దేవత-ఆమె కొడుకు సంబంధం లాంటిదే ఇది కూడా. అయితే క్యాంప్ బెల్ వివరణ ప్రకారం, ఆదిమ పౌరాణికతలో ప్రాముఖ్యం దేవతదైతే ఇందులో కొడుకుది. ఈ కొడుకు దేవుడూ కాదు, బలి పశువూ కాదు; అనామకస్థితి నుంచి హఠాత్తుగా రాజకీయ ఉన్నతిని అందుకున్నవాడు. ఆదిమ పౌరాణికత అహాన్ని వదులుకుని దేవతతో తాదాత్మ్యం (mythic identification) కావడానికి సంబంధించినదైతే, సారగాన్ ఉదంతంలో జరిగింది దానికి వ్యతిరేకం. ఇందులో కొడుకు, అంటే రాజు అహాన్ని పెంచుకుని(mythic inflation) దేవుడి ప్రతిరూపం అవుతాడు. రాజు తనను దేవుడిగా చెప్పుకోవడానికి ఇదే ప్రారంభం. అంటే రాచరికాన్ని పూజారుల ఆధిపత్యం నుంచి, రాజ్యాన్ని మతాధిపత్యం నుంచి తప్పించి ఆనువంశిక రాజకీయవ్యవస్థను తీసుకురావడం.

దీని తదుపరి పరిణామమే భూమి మీది రాజు నమూనాలో దేవతలకు కూడా ఒక రాజును సృష్టించడం! హమ్మురాబి ఉదంతం ఈ పరిణామాన్ని సూచిస్తుంది. మన దగ్గర ఇంద్రుడు దేవతలకు రాజు. ఇప్పటికీ ఆలయాలలో దేవుడికి జరిపే సేవలను ‘రాజో’పచారాలనే అంటాం. హమ్మురాబి మన మనువులా శిక్షాస్మృతిని రూపొందించిన రాజు.  అందులో అతను చెప్పుకున్న ప్రకారం, ఆకాశాన్ని ఏలే ‘అను’, స్వర్గాన్ని, భూమిని ఏలే ‘బెల్’ అనే దేవుళ్ళు  బాబిలోనియా నగరదేవుడు అయిన మర్డుక్ కు ప్రజలందరి మీదా సార్వభౌమత్వాన్ని అప్పగించారు. బాబిలోనియాను ప్రపంచంలోనే దుర్భేద్యంగా మార్చి అందులో మర్డుక్ కోసం పది కాలాలపాటు నిలిచే ఒక పటిష్టమైన సామ్రాజ్యాన్ని నెలకొల్పారు.  ఆ తర్వాత ఆ దేవుళ్ళు ఇద్దరూ ఎంతో పవిత్రత, దైవభక్తి కలిగిన తనను(హమ్మురాబీని) పిలిచి భూమి మీద ధార్మికమైన పాలనను చేపట్టమనీ, అధర్మాన్నీ, చెడును తుడిచిపెట్టమనీ, బలవంతుల అణచివేతనుంచి బలహీనులను కాపాడమనీ, మానవజాతిలో సూర్యుడిలా ప్రకాశిస్తూ భూమి అంతటా వెలుగు నింపమనీ, మానవాళి శ్రేయస్సుకు పాటుపడమనీ ఆదేశించారు.

తూర్పు దేశాలలో అప్పటికే ఏర్పడిన నిరంకుశ రాజ్యాల నమూనాకు ఈ వాక్యాలు అద్దంపడతాయని క్యాంప్ బెల్ అంటారు. అందులో మానవప్రయత్నంతో రాజ్యాధికారాన్ని సాధించిన వ్యక్తి, సృష్టికర్త సంకల్పానికి, అనుగ్రహానికి తను ప్రతినిధినని చెప్పుకుంటాడు. అతనిలోని పవిత్రత, న్యాయం, ప్రజాశ్రేయస్సు పట్ల తపన ధార్మికపాలనకు హామీ ఇస్తాయి. ఈ మాటలు వినగానే మనకు వెంటనే ‘రామరాజ్యం’ గుర్తుకువస్తుంది. రామాయణం, బాలకాండ, ప్రథమసర్గలోని మూడు ప్రారంభ  శ్లోకాలు రాముణ్ణి ఇటువంటి లక్షణాలు కలిగినవాడుగా పరిచయం చేస్తాయి. వాటి ప్రకారం రాముడు సకలసద్గుణవంతుడు, ఎలాంటి విపత్తులు ముంచెత్తినా తొణకనివాడు, గొప్ప కార్యశీలి, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్కు, దృఢనిశ్చయం కలిగినవాడు, ధైర్యశాలి, మహావీరుడు.

ఇంకా విశేషమేమిటంటే, ఈ రాచరిక నమూనాలో రాజును పోల్చవలసింది వృద్ధి, క్షయాలను; చీకటి, వెలుగులను సంకేతించే చంద్రుడితో కాదు; నిత్యం వెలుగునిచ్చే మండే సూర్యుడితో! ఈ సూర్యప్రతాపం ముందు అన్ని రకాల చీకట్లూ, అసురులూ, శత్రువులూ, సందిగ్ధాలూ పలాయనం చిత్తగించవలసిందే. ఈవిధంగా సూర్యభగవానుడు కేంద్రంగా నూతన యుగం ప్రారంభమైందని క్యాంప్ బెల్ అంటారు.  రాముడు ప్రధానంగా చేసింది రాక్షస సంహారమే. ఆయన సూర్యవంశ క్షత్రియుడే కాక, యుద్ధసమయంలో అగస్త్యుడు వచ్చి ‘ఆదిత్యహృదయం’ ఉపదేశించిన తర్వాతే  రావణుని చంపగలుగుతాడు. పైన పేర్కొన్న హమ్మురాబి శిక్షాస్మృతిలోని వాక్యాలలో కూడా “మానవజాతిలో సూర్యుడిలా ప్రకాశిస్తూ భూమి అంతటా వెలుగు నింప”మని హమ్మురాబీతో దేవతలు అనడం గమనించండి.

ఈ సూర్యయుగంతోనే పౌరాణిక ప్రపంచంలో ‘సౌరీకరణ'(solarization)గా పేర్కొనే ఒక ఆసక్తికరమైన పరిణామం అడుగుపెట్టిందని క్యాంప్ బెల్ అంటారు. అది, ఆదిమపౌరాణికతకు చెందిన మొత్తం ప్రతీకల వ్యవస్థను తలకిందులు చేయడం! ఎలాగంటే, దేవతా ప్రాధాన్యం కలిగిన ఆదిమ పౌరాణికతలో చంద్రుడు, చంద్రవృషభమూ ముఖ్య ప్రతీకలు అయితే; పురుషుడు, పురుషదేవుడు ప్రాధాన్యం వహించే నవీన పౌరాణికతలో సూర్యుడూ, సింహమూ ముఖ్యప్రతీకలయ్యాయి.

రాజు అధిష్టించే ఆసనాన్ని ఇప్పటికీ ‘సింహాసన’మనే అంటాం. ఈ ‘సింహాసనం’ కేవలం మన రాచరిక సంప్రదాయానికి చెందిన దనుకుంటారేమో, కాదు. ప్రాచీన సమీప ప్రాచ్య దేశాల రాజులందరూ ‘సింహాసనా’న్నే అధిష్టించారు.

విషయానికి వస్తే, ఆదిమ పౌరాణికతకు చెందిన స్త్రీదేవతలపై రాక్షసులు, లేదా దుష్టశక్తులు అన్న ముద్రవేసి చంపడం; ఆ పౌరాణికతకు చెందిన ప్రతీకలను చిన్నబుచ్చడం లేదా పురుషదేవుళ్ళకు అన్వయించడం; మొత్తంగా స్త్రీ వెనకటి ప్రాధాన్యాన్ని కోల్పోవడం వంటివి ఈ సౌరయుగ పరిణామాలే. ఒక బాబిలోనియా పురాణకథలో జగజ్జనని అయిన తియామత్ అనే దేవత, రాక్షసస్వభావం కలిగిన దుష్టశక్తిగా మారిపోతుంది. ఆమెను మర్డుక్ అనే పురుషదేవుడు చంపుతాడు. అలాగే, రాముడు తాటకను చంపడం; హనుమంతుడు నాగమాతను, సింహిక అనే రాక్షసిని, లంకిణిని జయించడం; కృష్ణుడు పూతనను లొంగదీసుకోవడం, కాళీయుని మర్దించడం మనకు తెలిసిన మన ఉదాహరణలు. ఓడిసస్ సిర్సే, కలిప్సో అనే అప్సరసలను ఎలా లొంగదీసుకున్నాడో చెప్పుకున్నాం. మన పురాణాలలోని దేవాసురయుద్ధాలు కూడా సౌరయుగ పరిణామాలే.

ఇక్కడ ప్రత్యేకించి గమనించాల్సింది ఏమిటంటే, ఆదిమ పౌరాణికతతో మొదలుపెట్టి, నవీన పౌరాణికత వరకూ ఈ పరిణామక్రమం అంతా  ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితమైంది కాదు. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తం. ఆపైన, చరిత్రకు అందని ఆదిమ కాలం నుంచి, నేటి ఆధునిక కాలం వరకూ ఈ పౌరాణికతా చరిత్ర అంతా ఒక క్రమగతిలో సాగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. క్యాంప్ బెల్ నే ఉటంకించుకుంటే, ప్రపంచంలోని ప్రధాన ఆస్తిక/మతవిశ్వాసాలకు  పునాదిగా ఉన్న సృష్టిగురించిన ఆలోచనాక్రమాన్ని ఇలా నాలుగు దశలలోకీ, నాలుగు వాక్యాలలోకీ కుదించుకోవచ్చు :

  1. (ఆదిమ పౌరాణికతలో) ఈ విశ్వమంతటినీ పురుష ప్రమేయం లేకుండా జగజ్జననే సృష్టించింది.
  2. పురుష ప్రమేయంతో జగజ్జనని (ఆది దంపతులు) ఈ విశ్వాన్ని సృష్టించింది.
  3. (నవీన పౌరాణికతలో)పురుషుడు, యోధుడు అయిన దేవుడు జగజ్జనని దేహం నుంచి ఈ విశ్వాన్ని సృష్టించాడు.
  4. ఈ విశ్వమంతటినీ స్త్రీ ప్రమేయం లేకుండా పురుషదేవుడు ఒక్కడే సృష్టించాడు.

సామాజికంగా చూస్తే ఇవే దశలు మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మళ్లిన క్రమాన్నీ చెబుతాయి.

***

ప్రపంచీకరణపై ముమ్మరంగా చర్చ జరుగుతున్న రోజుల్లో ప్రముఖ ఆర్థికవేత్త మేఘ్ నాథ్ దేశాయి రాసిన ఒక వ్యాసం నన్ను ఆకర్షించింది(Globalisation and Culture, The Little Magazine, Globalisation and its contents, Volume V: Issue 4&5, Editor: Antara Dev Sen).  ప్రపంచీకరణ ఇదే మొదటిసారి కాదనీ, రోమన్ సామ్రాజ్యంతో మొదలుపెట్టి అది అనేక అవతారాలలో సాగిందనీ ఆయన అంటారు. నేనైతే ఇంకా వెనక్కి వెళ్ళి, చరిత్రపూర్వకాలంలోనే మత/ఆస్తిక రంగంలో ప్రపంచీకరణ జరిగిందని అంటాను. ఆదిమ పౌరాణికతలో జగజ్జనని ఆధిపత్యంలో ఉన్న పురుషుడు క్రమంగా ఆ సంకెళ్లనుంచి బయటపడుతూ నరుడిగా/వీరుడిగా/రాజుగా అవతరించి తన ఆధిపత్యాన్ని స్థాపించుకోవడం కూడా ప్రపంచీకృత పరిణామమే. మాతృస్వామ్యం స్థానంలో పితృస్వామ్యం పాదుకోవడం దాని సామాజిక రూపం. భారతీయ, గ్రీకు పురాణ ఇతిహాసాలతో సహా అనేక పౌరాణికగాథలు ఈ ప్రపంచ పరిణామాన్నే చిత్రిస్తున్నాయి.

epic of gilgamesఇంతకీ నరవిముక్తి రూపంలో జగజ్జననిపై పురుషదేవుళ్లు మహత్తరవిజయం సాధించిన తర్వాత, నరుడి భవితవ్యం ఎలా పరిణమించిందని ప్రశ్నిస్తూ, గిల్గమేశ ఇతిహాసం(The Epic of Gilgames)లో దీనికి జవాబు దొరుకుతుందని క్యాంప్ బెల్ అంటారు. సంగ్రహంగా కథ చెప్పుకుంటే, సుమేరియా నగరమైన ఉరుక్ ను పాలించిన గిల్గమేశుడు ఇందులో నాయకుడు. ఇతనిలో మూడువంతులు దైవాంశ, ఒక వంతు మానవాంశ ఉంటాయి.  ఇతని చండశాసనాన్ని భరించలేక జనం ఇతనికి సమవుజ్జీని సృష్టించమని అమ్మవారిని వేడుకుంటారు. అప్పుడు అమ్మవారు స్వర్గదేవుడైన అను రూపాన్ని మనసులో తలచుకుని, (పార్వతి నలుగుపిండి నుంచి వినాయకుణ్ణి సృష్టించినట్టు) కాస్త మట్టి చేతుల్లోకి తీసుకుని దానినుంచి ఒక వీరుణ్ణి సృష్టిస్తుంది. అతని పేరు ఎంకిడు.

అడవిమనిషిగా పెరిగిన ఎంకిడుకి పశువులు తప్ప మనుషులు తెలియదు. అతని గురించి విన్న గిల్గమేశ్,(రామాయణంలోని ఋష్యశృంగుడి కథలోలా) అతన్నిఆకర్షించి నగరానికి తీసుకురమ్మని ఒక వేశ్యను పంపిస్తాడు.  ఆమె వలకు చిక్కుకున్న ఎంకిడు ఆమెతో నగరానికి వస్తాడు. గిల్గమేశ్ దేవత ఇష్టార్ పొందు కోసం వెడుతున్నప్పుడు ఎంకిడు అతన్ని అడ్డుకుంటాడు. ఇద్దరికీ యుద్ధం జరుగుతుంది. తనకు సమవుజ్జీ అని గ్రహించిన గిల్గమేశ్ అతనితో స్నేహం చేస్తాడు. కొంతకాలానికి ఎంకిడు మరణిస్తాడు. దుఃఖించిన గిల్గమేశ్ తను మరణాన్ని జయించాలనుకుంటాడు. అమరత్వం పొందే మార్గాన్ని అన్వేషిస్తూ (ఓడిసస్ లానే) సాహసయాత్ర ప్రారంభిస్తాడు. అడ్డంకులను వీరోచితంగా ఎదుర్కొని అమరత్వాన్ని ఇచ్చే ఒక మూలిక గురించి తెలుసుకుంటాడు. విశ్వసముద్రం అడుగున ఉన్న ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తూ ఒక నది దగ్గర ఆగి మూలికను గట్టున ఉంచి స్నానానికి దిగుతాడు. అప్పుడు(మహాభారతంలో ఉదంకుని కుండలాలను తక్షకుడు అనే నాగరాజు అపహరించినట్టు) ఆ మూలిక వాసన పసిగట్టిన ఒక సర్పం నీళ్ళలోంచి పైకి వచ్చి దానిని మింగేసి కుబుసం విడిచిపెడుతుంది. గట్టు మీదికి వచ్చిన గిల్గమేశ్ మూలిక కనిపించకపోవడంతో కుప్పకూలి భోరున విలపిస్తాడు.

అమరత్వాన్నిఇచ్చే సర్పశక్తి(కుండలినీశక్తి) అంతవరకూ పురుషుడి ఆస్తిగా ఉందనీ, దానినిప్పుడు ‘దుష్ట’సర్పమూ, ‘ప్రతిష్ట కోల్పోయిన’ దేవతా తిరిగి తీసేసుకున్నాయనీ, దాంతో మనిషికి దుఃఖమూ, చావు భయమూ మిగిలాయనీ  ఈ కథ కు క్యాంప్ బెల్ వివరణ. క్రీ.పూ. 650 నాటి మట్టిపిడకలపై దొరికిన ఈ రచన హమ్మురాబి(క్రీ.పూ.1750)కాలానికి చెందినదిగా కనిపిస్తుందనీ, చాలామంది ఉద్దేశంలో మనిషి గురించి చెప్పే తొలి ఇతిహాసం ఇదేననీ ఆయన అంటారు.

***

నరుడితోనూ, నలదమయంతుల కథతోనూ మొదలై, ఓడిసస్ కథ మీదుగా వివిధ అంశాలను స్పృశిస్తూ సాగిన వ్యాసపరంపరలో ప్రస్తుతానికి ఇది చివరి వ్యాసమే తప్ప ముగింపు కాదు. వీటిలో చర్చించిన అనేక అంశాలకు పూర్తి న్యాయం చేశానని నేను అనుకోవడంలేదు. ‘నరు’డి అవతరణా, దానితో జమిలిగా అల్లుకున్న పితృస్వామికతలే పురాణఇతిహాసాలకు ప్రధాన ఇతివృత్తాన్ని అందిస్తున్నాయి కనుక, ఏవో కొన్ని వ్యాసాలతో వాటికి ముగింపు పలకడం సాధ్యమూ కాదు. అసలు పురాచరిత్ర అనే సముద్రంలో అవతలి ఒడ్డుకు చేరడం దేవుడెరుగు, నేను ఇంకా ఇవతలి ఒడ్డు దగ్గరే ఉన్నాను…

*

అలా ఉండగానే ‘పురా’గమనం శీర్షిక ప్రారంభించి నేటితో (జూన్ 19)తో సరిగ్గా రెండేళ్ళు గడిచిపోయాయి.  చివరి వాక్యం రాయడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఈ క్షణాన నాకే అంచనా లేదు. దానిని కాలానికి విడిచిపెడితే…ఈ వ్యాసాలను ప్రచురిస్తున్న ‘సారంగ’ సంపాదకవర్గానికీ, మొదటినుంచీ ఈ వ్యాసాలపై అమితమైన ఆసక్తిని చూపుతూ ఉత్సాహకరమైన స్పందనను, సవిమర్శక అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న ఎందరో పాఠకులకూ కృతజ్ఞత చెప్పుకోవడానికి ఇదొక సందర్భం.

షరా మామూలుగా ఇప్పుడు మళ్ళీ క్రాస్ రోడ్స్ కు చేరాను. దారపు ఉండకు వేలాడుతున్న అనేక కొసలలో ఏ కొసను పట్టుకోవాలన్న విచికిత్సలోకి మరోసారి జారిపోయాను…

*

 

 

 

 

రాముడు, ఓడిసస్…ఇద్దరూ సౌరవీరులే!

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)తూర్పు, పడమరల మధ్య ఆశ్చర్యకరమైన అనేక పోలికల గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే…

భాగవతం ప్రకారం; అపారమైన రక్తపాతం, విధ్వంసం నిండిన మహాభారతాన్ని చెప్పిన తర్వాత వ్యాసుడు తీవ్ర మానసిక అశాంతికి లోనయ్యాడు. అప్పుడు నారదుడు ఆయన దగ్గరకు వచ్చి విష్ణుభక్తి ప్రధానమైన భాగవతాన్ని చెప్పమనీ, అప్పుడు నీ మనసుకు శాంతి కలుగుతుందనీ చెప్పాడు. వ్యాసుడు అలాగే చేసి శాంతి పొందాడు.

గ్రీకుల హోమర్ కూడా మొదట యుద్ధ ప్రధానమైన ‘ఇలియడ్’ ఇతిహాసాన్ని చెప్పాడు. ఆ తర్వాత తత్వ ప్రధానమైన ‘ఒడిస్సే’ చెప్పాడు. ఈ రెండింటి కాలిక నేపథ్యం క్రీ.పూ. 1250-1150.  మూడు శతాబ్దాల తర్వాత, క్రీ.పూ. 850లో ఇలియడ్, క్రీ.పూ. 750లో ఒడిస్సే రూపొందాయి. వ్యాసుడు అనే పేరు కేవలం ఒక్క వ్యక్తిని కాక ఒక పదవిని సూచిస్తుందనీ, ఆ పదవిలో ఉన్నవారిని అందరినీ వ్యాసులనే అంటారనీ చెప్పే సంప్రదాయం మనకు ఉంది. హోమర్ విషయంలోనూ గ్రీకులలో అలాంటి సంప్రదాయమే ఉంది. ఇది వ్యాస, హోమర్ ల మధ్య ఇంకొక పోలిక.

మహాభారతానికీ, ఇలియడ్ కూ ఉన్న పోలికలు చూద్దాం.  కురు-పాండవ వీరులందరూ  దేవతాంశతో(దుర్యోధనుడు లాంటి కొంతమంది రాక్షసాంశతో లేదా కలిఅంశతో) పుట్టినట్టు మహాభారతం చెబుతోంది. ఇలియడ్ లోని వీరులు కూడా దేవతాంశ(“divine race of heroes”)కలిగినవారే. మహాభారతం ప్రధానంగా పితృస్వామిక వ్యవస్థను, అందులో ప్రాధాన్యం వహించే పురుషుడిలో ఉండవలసిన ఉత్తమగుణాలను నొక్కి చెబుతుంది. అతడు అధర్మాన్ని అణగదొక్కి ధర్మస్థాపన చేయవలసిన వీరుడు, సాహసి, కష్టసుఖాలను సమంగా తీసుకునే స్థిరచిత్తుడు, ప్రజలను చల్లగా చూసే పాలకుడు, మాట తప్పనివాడు, నీతిమంతుడు, గొప్ప సహనం, సంయమనం ఉన్నవాడు…ఇలాంటి ఇంకా అనేకానేక సుగుణాల రాశి.  స్థూలంగా ధర్మరాజు, అర్జునుడు తదితరులు ఈ సుగుణాలకు ప్రాతినిధ్యం వహిస్తే; వీటికి విరుద్ధమైన గుణాలకు దుర్యోధనుడు, కొంతవరకు కర్ణుడు మొదలైనవారు  ప్రాతినిధ్యం వహిస్తారు.

ఈవిధంగా ధర్మం-అధర్మం, నీతి-అవినీతి, మంచి-చెడు అనే పరస్పర వ్యతిరేకమైన జంట పదాలూ; వాటికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు, శక్తుల మధ్య సంఘర్షణా; ఆ సంఘర్షణలో ధర్మం, నీతి, మంచి విజయం సాధించడం అనే ఒక సూత్రం లేదా ఒక మూస క్రమంగా రూపొందింది.  ఇంతకుముందు చెప్పుకున్నది ‘స్త్రీసూత్రం’ అయితే, దీనిని ‘పురుషసూత్రం’ అందాం. ఇది పితృస్వామికం నుంచి రూపొందిన సూత్రం. ఎందుకంటే, మాతృస్వామికానికి చెందిన ఆదిమ పౌరాణికతలో ఇలాంటి ద్వంద్వాలు లేవు. ఈ విషయం ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగని నేటి కొలమానంలో చూసి, ధర్మానికీ, నీతికీ, మంచికీ చోటులేని వ్యవస్థగా దానిని భావించడం తొందరపాటు అవుతుంది. అది తనదైన, ప్రకృతిసిద్ధమైన ఒక ధర్మాన్ని అనుసరించిన వ్యవస్థగా కనిపిస్తుంది.  

ఇలియడ్ కు వస్తే, మహాభారతంలానే అది కూడా పైన చెప్పిన పితృస్వామిక పురుషుడిలో ఉండవలసిన ఉత్తమ లక్షణాలకు, పురుషోచిత కార్యాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇలియడ్ లో ప్రధాన దైవం అపోలో. ఈయన వెలుగు నిచ్చే దేవుడు. అంటే సూర్యునిలాంటివాడు.  అలాగే, వీరత్వంలాంటి గుణాలను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లి పురుషుని పురుషోత్తముడిగా మలచేది ఈయనే. వీరరస ప్రధానమైన ఇలియడ్ లో మృత్యువు ఒక్కటే చరమసత్యం; అందులో భయాశ్చర్యాలకు తావు లేదు. ఆ మృత్యువుకు అవతల, దానిని దాటలేని నిస్సహాయత తప్ప మరే శక్తీ లేదు. జీవితం తాలూకు అందాలు, అత్యున్నత సాఫల్యాలు, ఉత్తమశ్రేణికి చెందిన అందగత్తెల ప్రేమ, పొందుతో సహా నిజమైన పురుషుడికి అర్హమైనవి ఎన్ని అనుభవించినప్పటికీ మృత్యువు అనే చెలియలికట్ట వాటన్నింటినీ నీటి బుడగలుగా మార్చివేస్తుంది. అంతిమంగా చూసుకుంటే మిగిలేది బూడిదే. ఈ విషాద ధ్వని ఇలియడ్ అంతటా పరచుకుని ఉంటుందని క్యాంప్ బెల్ అంటారు.

విచిత్రంగా మహాభారతానికీ ఇక్కడ చాలావరకూ పోలిక కుదురుతోంది. ప్రధానంగా ధర్మరాజు, అర్జునుడు, కృష్ణుడు పురుషోత్తమత్వం అనే కొలమానానికి దగ్గరగా ఉంటారు(ప్రత్యేకించి కృష్ణుడికి పురుషోత్తముడు అనే పేరు ఉంది, దానిని అలా ఉంచుదాం). అర్జునుడు వీరుడే గాక, ఎందరో అందగత్తెల ప్రేమను, పొందును అందుకున్నవాడు. ఒక కోణం నుంచి చెప్పుకుంటే అర్జునుడే మహాభారతంలో నాయకుడు. శత్రువును చంపడం, లేదా శత్రువు చేతిలో చావడాన్ని మించిన ధర్మం వీరుడికి(క్షత్రియుడికి) మరొకటి లేదని మహాభారతం అడుగడుగునా చెబుతుంది. చివరికి కురుక్షేత్రయుద్ధ రూపంలో మృత్యుతాండవం విపరీతమైన రక్తపాతాన్ని, విధ్వంసాన్ని సృష్టించింది. తదుపరి మహాభారత కథలో చివరివరకు ఒక విషాదపు నీడ పరచుకుని ఉంటుంది. అంతటి ధర్మరాజు కూడా జనం మెప్పు పూర్తిగా పొందలేకపోయాడనీ, అర్జునుడంతటి మహావీరుడు కూడా దారిదోపిడీ దొంగల చేతిలో ఓడిపోయాడనీ మహాభారతమే చెబుతోంది. ఎంతో వివరంగా చెప్పుకోవలసిన ఈ అంశాలలోకి మరీ లోతుగా వెళ్లడానికి ఇది సందర్భం కాదు.

ఇక విష్ణుభక్తిని, తత్వాన్ని ప్రతిపాదించే భాగవతం ఒకవిధంగా మహాభారతానికి తాత్వికమైన కొనసాగింపు అనుకుంటే,  ఇలియడ్ కు ఒడిస్సే తాత్వికమైన కొనసాగింపు.

ఒడిస్సే లో ప్రధానదైవం హెర్మెస్. ఆయన అధోజగత్తుకు, లేదా రహస్యజగత్తుకు  దారి చూపే దేవుడు. పునర్జన్మకు, మరణానంతర జ్ఞానానికీ, ఒకదానినొకటి పెనవేసుకున్న జంటపాముల ప్రతీకకు చెందినవాడు. విధిని నిర్దేశించే అఫ్రోడైట్, హేరా, ఎథెనే అనే దేవతాత్రయంతో సంబంధం కలిగిన పురుషదైవం. ఒకరకంగా మహాభారత యుద్ధానికి భూదేవి, ద్రౌపది కారణమైనట్టుగా ట్రోజన్ యుద్ధానికి ఈ ముగ్గురు దేవతలే కారణమవుతారు.

‘ఇలియడ్’ వీరత్వానికి చెందిన పురుషసూత్రం మీద ఆధారపడినదైతే, ‘ఒడిస్సే’ స్త్రీపై విజయాన్ని సూచించే స్త్రీసూత్రం మీద ఆధారపడిన రచన. ట్రోజన్ యుద్ధం పదేళ్లపాటు జరుగుతుంది. ఆ యుద్ధంలో పాల్గొన్న ఓడిసస్ మరో పదేళ్లపాటు స్త్రీ సూత్రానికి చెందిన అధోజగత్తులో లేదా రహస్యజగత్తులో సంచరిస్తాడు.  పురుషసూత్రానికి అనుగుణంగా స్త్రీ సృష్టించే అనేక ప్రతికూలతలను వీరోచితంగానూ, యుక్తితోనూ అధిగమిస్తాడు. అదే సమయంలో ఎంతో విధ్వంసాన్ని ఎదుర్కొని, సహచరులను నష్టపోతాడు. చివరికి ఒంటరిగా ఇంటికి చేరి భార్య పెనెలోప్ ను మరోసారి స్వయంవరంలో గెలుచుకుంటాడు. పెనెలోప్ అంతవరకూ అతనికోసం(పతివ్రతలా) నిరీక్షిస్తూనే ఉంటుంది. అది తన యాత్రలో ఓడిసస్ స్త్రీసూత్రంపై సాధించిన విజయానికి కొనసాగింపు.

పోలిక చూడండి. రామాయణంలో సీత కూడా లంకలో రాముడికోసం నిరీక్షిస్తూ ఉంటుంది. రాముడు యుద్ధం తర్వాత సీతను కలుసుకుంటాడు. ఆయన విధించిన శీలపరీక్షలో నెగ్గి సీత పాతివ్రత్యాన్ని స్థాపించుకుంటుంది. అలాగే దమయంతి కూడా(పతివ్రతాధర్మం) నలుని కోసం నిరీక్షిస్తుంది. అనేక ప్రతికూల పరిస్థితులతో పురుషోచితంగా పోరాడిన తర్వాత నలుడు చివరికి దమయంతిని కలసుకుంటాడు.

స్త్రీసూత్రాన్ని జయించడంలోనే కాక, సూర్యసంబంధంలోనూ మన కథలకు, ఓడిసస్ కథకు పోలిక ఉందని  వెనకటి వ్యాసాలలో చెప్పుకున్నాం. ఓడిసస్ సౌరద్వీపానికి వెళ్ళినతర్వాతే ఒంటరిగా మిగిలి తిరిగివస్తాడు. ఆవిధంగా అతడు సౌరవీరుడు. సూర్యవంశీకుడైన మన రాముడూ సౌరవీరుడే. మాతృస్వామ్యానికి చెందిన దేవత ప్రతీకలలో వెలుగు, చీకట్ల మిశ్రమమైన చంద్రుడు ముఖ్యుడైతే, పితృస్వామ్యంలో పూర్తిగా వెలుగునిచ్చే సూర్యుడు ముఖ్యప్రతీక అన్న సంగతి గుర్తుచేసుకుని ఇంకో ఉదాహరణ చూద్దాం.

చాంద్రమానం, సౌరమానం అనే రెండు కొలమానాలు మనకు తెలుసు. చాంద్రమానం ప్రకారం ఏడాదికి 12 నెలలు, 354 రోజులు+కొన్ని గంటలు ఉంటాయి. సౌరమానం ప్రకారం ఏడాదికి 364 రోజులు+కొన్ని గంటలు. గ్రీకు ఇతిహాసకాలంలో చాంద్ర, సౌరమానాలు రెంటినీ సమన్వయం చేసే ప్రయత్నం జరిగింది. దానిప్రకారం 19 ఏళ్ళకు ఒకసారి చంద్ర, సూర్యులు కలసుకుంటారు. ఇరవయ్యేళ్లు ఇంటికి, భార్యకు దూరంగా ఉన్న ఓడిసస్ 19వ ఏట చివరిరోజున ఇంటికి చేరుకుంటాడు. సరిగ్గా అదే రోజున వెలుగుకు అధిదేవత అయిన అపోలోకు చెందిన పండుగ, సూర్యుని పండుగ వస్తాయి. ఓడిసస్ అధోజగత్తులో పశ్చిమంగా ప్రయాణించి, అక్కడి పితృదేవతలను సందర్శించి(ఇది మరో పోలిక. పితృదేవతలను సందర్శించడం మన కథలలో కూడా ఉంది), తూర్పు కొసకు చేరుకుంటాడు. అది సూర్యుడు ఉదయించే ప్రదేశమే కాక, ఉషోదేవత నర్తించే ప్రదేశం కూడా. ఇంటి దగ్గర పెనెలోప్ చంద్రునిలా వస్త్రం అల్లుతూ, అల్లినది విప్పుతూ ఉంటుంది. నేతపనికి చంద్రుడికి సంబంధం ఉందని ఇంతకుముందు చెప్పుకున్నాం.

19, 20వ శతాబ్ది ప్రారంభ కాలానికి చెందిన పండితులకు ఈవిధంగా సూర్య, చంద్రులను ఆయా విషయాలకు అన్వయించడం పరిపాటిగా ఉండేదని క్యాంప్ బెల్ అంటారు. ప్రపంచ పౌరాణిక వారసత్వం తాలూకు భావచిత్రాలు చాలావరకూ కంచు యుగానికి చెందిన విశ్వసంబంధ(cosmological) ప్రతీకలనుంచి పుట్టినవి కావడమే అందుకు కారణం. క్రీ.పూ. ప్రథమ సహస్రాబ్దికి వెడితే, మనసును లోపలికి తిప్పడంవల్ల , అంటే అంతర్ముఖత్వం వల్ల వ్యక్తి అనే సూక్ష్మరూపానికీ, విశ్వమనే బృహద్రూపానికీ తేడా లేదనే ఎరుక కలుగుతుందనే విశ్వాసం తూర్పు, పడమటి దేశాలకు చెందిన బహుళదేవతారాధకులు అందరిలోనూ ఉండేదని క్యాంప్ బెల్ అంటారు. ఆ ఎరుక సిద్ధించినప్పుడు నిత్యత్వమూ- కాలమూ; సూర్య- చంద్రులూ, స్త్రీ-పురుషులూ—ఇలా రెండుగా కనిపించేవి అన్నీ ఒకటిగా మారిపోతాయి. అలాగే, ఓడిసస్ కథలో సూర్య-చంద్రులు ఒకటవుతారు. ఇందులో సూర్యాస్తమయం అంతర్ముఖత్వానికీ, సూర్యోదయం పైన చెప్పిన ఎరుకకూ ప్రతీకలు.

ఇదే సందర్భంలో మన దగ్గర ఉన్న కుండలినీయోగాన్ని క్యాంప్ బెల్ ప్రస్తావిస్తారు. వెన్నెముకకు రెండువైపులా రెండు శక్తి మార్గాలు ఉంటాయి. మనసును, ఊపిరిని నియంత్రించడంద్వారా సర్పశక్తిని పైకి తీసుకువెళ్లే ఈ మార్గాలలో  ఒకదానిని చంద్రనాడి, రెండవ దానిని సూర్యనాడి అంటారు. సర్పం, సూర్యచంద్రులతో సహా వివిధ పౌరాణిక ప్రతీకలను పొందుపరచిన అనేక చిత్రాల గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. కంచుయుగానికి చెందిన ఈ ప్రతీకాత్మక చిత్రాలు ఏ ఒక్క సంస్కృతికో కాక, బహుళ సంస్కృతులకు చెందినవని కూడా అనుకున్నాం. ఇవి యూరప్, చైనా, జపాన్, అజ్టెక్ లకు కూడా తెలిసిన ప్రతీకాత్మకత అంటారు క్యాంప్ బెల్.

కనుక, ఇరవయ్యేళ్ళ తర్వాత, సూర్య-చంద్రులు కలసుకునే రోజున ఓడిసస్ తన భార్య పెనెలోప్ ను కలసుకోవడం వెనుక ఇంత  తాత్వికార్ధం ఉంది. అంతకుముందు పదేళ్లపాటు అధోజగత్తులో అతను ఎదుర్కొన్న అనుభవాలు; మాంత్రిక ప్రపంచానికి చెందిన సిర్సే, కలిప్సో, నౌసికాలతో అతని కలయికలు మానసిక శిక్షణను, సాహసాలను సూచిస్తాయి. ఒక్క పెనెలోప్ మాత్రమే ఈ కథలో మాంత్రికప్రపంచానికి చెందని సాధారణస్త్రీ.  అంటే పురుషుడు స్త్రీకి సంబంధించిన పై అనుభవాలను అన్నింటినీ పొందితేనే నిజ జీవితంలో స్త్రీని పరిపూర్ణంగా కలసుకోగలడని ఇందులోని ధ్వని. మన కథల్లో ఈ స్త్రీవిజయానికి సంబంధించి ఇప్పటికే ఇచ్చిన అనేక ఉదాహరణలను ఇక్కడ అన్వయించుకోవచ్చు.

***

ఈ పోలికలు యాదృచ్ఛికం కావనీ, వీటి వెనుక కంచుయుగానికి చెందిన ఉమ్మడి పౌరాణిక వారసత్వం ఉందనీ, అంతకంటే ముఖ్యంగా ఉమ్మడి చారిత్రకత ఉందనీ ఈపాటికి అర్థమై ఉండాలి. అంతేకాదు, అది ఒకనాటి ముఖ్య చారిత్రక పరిణామాన్ని కూడా సూచిస్తోంది. దాని గురించి చెప్పుకునే ముందు ఓడిసస్ కథ నేపథ్యంలో భారతీయ, గ్రీకు తాత్వికతల సారూప్యతనూ, తేడానూ కూడా చూపుతూ క్యాంప్ బెల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటితో ఎవరు ఎంతవరకు ఏకీభవిస్తారన్నది అలా ఉంచితే, భారతీయుల గురించిన పాశ్చాత్యుల ఆలోచనాసరళిని అవి పట్టి చూపుతాయి:

మొదటిది, ఓడిసస్ సౌరద్వీపం నుంచి ఏకాకిగా తిరిగిరావడం భారతీయ తాత్వికతలోని అంతిమ ఆదర్శమైన ఆత్మజ్ఞానాన్ని సూచిస్తుందని ఆయన అంటారు. అదే ఓడిసస్ ఒక భారతీయ ఋషి అయుంటే సౌరద్వీపం వరకూ వెళ్ళినవాడు ఏకాకిగా మారి, సముద్రం మీద తేలుతూ ఇంటికి తిరిగివచ్చి భార్య కలసుకునేవాడు కాదనీ, సూర్యుడిలో ఐక్యమయ్యేవాడనీ; విరక్తి(disengagement)కీ, రక్తి(tragic engagement)కీ మధ్య ఉన్న ఆ అంతరమే భారతీయ, గ్రీకు తాత్వికతల మధ్య ఉందనీ ఆయన అంటారు.

రెండోది, సిర్సే మార్గదర్శనంలో ఓడిసస్ ఒకవైపు పితృలోకానికీ, ఇంకోవైపు సౌరద్వీపానికి వెళ్లడం; భారతీయ ఉపనిషత్తులు చెప్పే ధూమ(smoke), అగ్ని(fire)మార్గాలు రెంటినీ సూచిస్తుంది.  నిజానికి ఈ రెండు మార్గాల సంప్రదాయం భారతీయులదీ కాదు, గ్రీకులదీ కాదు; ఆదిమ పౌరాణికతనుంచి అందిన ఉమ్మడి సంప్రదాయం. కేనోపనిషత్తులోని ఒక కథప్రకారం ఈ సంప్రదాయాన్ని పితృస్వామిక దేవుళ్ళకు కాళికాదేవికి సాత్వికరూపమైన ఉమా హైమవతి బోధిస్తుంది.

మూడోది, గ్రీసు, భారతదేశాలలో పరస్పర విరుద్ధ వ్యవస్థలైన పితృస్వామ్య, మాతృస్వామ్య తాత్వికతల మధ్య సంభాషణకు, సమన్వయానికి అవకాశం ఏర్పడింది. కానీ బైబిల్ సంప్రదాయం పూర్తిగా పురుషుడివైపు మొగ్గుతూ ఉద్దేశపూర్వకంగా ఆ అవకాశాన్ని తుడిచిపెట్టింది. అయితే, భారత్, గ్రీసులలో మాతృస్వామ్య, పితృస్వామ్యతాత్వికతల  మధ్య సర్దుబాటు, సమన్వయం జరిగినా వాటి ఫలితాలు మాత్రం రెండు ప్రాంతాలలోనూ ఒకలాంటివి కావు. భారత్ లో అంతిమంగా అమ్మవారితాత్వికతే పై చేయిని సాధించి, ఆ మేరకు పురుష ఆహాన్ని, పురుషుడి చొరవను కుదించివేసింది. గ్రీసులో ఇందుకు భిన్నంగా పురుష సంకల్పమూ, అహమూ పై చేయిని సాధించడమే కాక; ఒక దశలో గ్రీసును ప్రపంచంలోనే అద్వితీయస్థానంలో నిలబెట్టాయి. జగత్తుకు చెందిన ప్రత్యక్షవాస్తవాలను హేతుబద్ధంగా పరిశీలిస్తూ, బాధ్యతాయుతంగా నిర్ధారణలు చేస్తూ; దేవుళ్ళను సేవించుకోవడం కాక, మనిషి అభివృద్ధిని, పరిణతిని అంతిమ లక్ష్యంగా చేసుకుంది. కార్ల్ కెరెన్యి మాటల్లో చెప్పాలంటే, “గ్రీకు ప్రపంచం ప్రధానంగా సూర్యరశ్మి నిండిన ప్రపంచం. అయితే దాని కేంద్రస్థానంలో ఉన్నది మాత్రం సూర్యుడు కాదు, మనిషి”.

తీగ కదిపితే డొంకంతా కదలడం అంటే ఇదే… ఈ తాత్విక అంతరాల తేడాలను పట్టుకుని  ఎంత దూరమైనా పోవచ్చు. చారిత్రకంగా చెప్పుకుంటే, సమీప ప్రాచ్యం నుంచి వ్యాపించిన దేవతా ప్రధానమైన ఆదిమ పౌరాణికతకు తూర్పు-పడమరలు రెండూ వారసులే ననుకున్నాం. విశేషమేమిటంటే, తూర్పు-పడమరల మధ్య పైన చెప్పిన తాత్వికమైన చీలికకు కూడా పుట్టిల్లు సమీప ప్రాచ్యమే. అందులోంచే వైయక్తిక ప్రాధాన్యం కలిగిన నరుడు పుట్టుకొచ్చాడు. తాత్వికమైన చీలిక అంటే ఇక్కడ ప్రాధాన్యాలలో తేడాగానే అర్థం చేసుకోవాలి కానీ, కత్తితో కోసినట్టు రెండు తాత్వికతలూ పూర్తిగా వేరయ్యాయని కాదు. అందుకే మన దేశంలో దేవతా ప్రాధాన్యం కలిగిన మాతృస్వామిక ఆదిమ పౌరాణికత, పితృస్వామిక పౌరాణికత రెండూ కొనసాగుతూ ఒక మిశ్రమ తాత్వికతను ముందుకు తెచ్చాయి. అలాగే పడమటి దేశాలలో పితృస్వామిక పౌరాణికత క్రమంగా మనిషి కేంద్రమైన వ్యక్తివాదానికి, వ్యక్తి చొరవకూ దారితీసినా; మాతృస్వామిక ఆదిమ పౌరాణిక ఛాయలు అంతర్లీనంగా కొనసాగుతూనే ఉన్నాయని క్యాంప్ బెల్ అంటారు.

నరుడితో మొదలుపెట్టి నలుడి గురించి చెప్పుకుని అక్కడినుంచి ఓడిసస్ మీదుగా అనేక విషయాలను చుట్టబెడుతూ సాగిన వ్యాసప్రస్థానం ఇక ముగింపునకు వస్తోంది…

 

 

 

 

 

 

 

నీలగిరి తోడాలు…చరిత్ర విడిచిన ఖాళీలు!

కల్లూరి భాస్కరం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

వ్యక్తులతోనైనా, వస్తువులతోనైనా, మరి దేనితోనైనా  కానివ్వండి… చిరపరిచయం మన చూపులకు, ఆలోచనలకు సంకెళ్ళు వేస్తుంది. వాటి వైశాల్యాన్ని తగ్గించివేస్తుంది. అలాకాకుండా చిరపరిచయం నుంచి చూపును తప్పించి వివిధ కోణాలలోంచి నిశితంగానూ, కొత్తగానూ చూడడం ప్రారంభించామనుకోండి…ఆ చూపులోంచి కొత్త విశేషాలు, సరికొత్త ఆశ్చర్యాలు పుట్టుకొస్తాయి. అలా ఆ రెండు చూపుల మధ్యనే ఆశ్చర్యాల పుట్టుక!

దేవాలయాలనే తీసుకుందాం. మన దేశంలో అవి అసంఖ్యాకాలు. మనలో చాలామంది దగ్గరలో ఉన్న దేవాలయాలను తరచు సందర్శిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తీర్థ యాత్రల పేరుతో దూర దూర ఆలయాలను కూడా దర్శించి వస్తూ ఉంటారు. చిరపరిచయం వల్ల దేవాలయం ఫలానా విధంగా ఉంటుందన్న కల్పనకు మనం అలవాటు పడిపోతాం కనుక, ఫలానా విధంగా ఎందుకు ఉంది, అసలు దీని చరిత్ర ఏమిటి అనే ఆలోచన సర్వసాధారణంగా చేయం. చేసే వాళ్ళు అసలే ఉండరని కాదు.  వాళ్ళు మినహాయింపులు. నేను అంటున్నది జనసామాన్యం గురించి.

దేవాలయ నిర్మాణాన్నే కాస్త పట్టి చూడండి. దానికొక నిర్దిష్టత ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే, చిన్న చిన్న గుళ్ళు, మందిరాలను అలా ఉంచితే ఇంచు మించు ప్రతి దేవాలయానికీ చుట్టూ ప్రహరీగోడ ఉంటుంది. ఓ ప్రవేశద్వారం, లోపలికి వెళ్ళాక ఒక ధ్వజస్తంభం, ఆ తర్వాత ఎత్తుగా ఒక నలుచదరపు అరుగు, దానికి మెట్లు, ఆ అరుగు తర్వాత గర్భగుడి ఉంటాయి. గర్భగుడి పైన, పోను పోను సన్నబడే శిఖర నిర్మాణం ఉంటుంది. ప్రహరీ గోడకు, ప్రధాన నిర్మాణానికీ మధ్య నలువైపులా ప్రదక్షిణ మార్గం ఉంటుంది. కొన్ని పెద్ద ఆలయాలలో అయితే వంటశాల ఉంటుంది. గోశాల కూడా ఉండచ్చు. అలాగే పూజారుల నివాసగృహాలు కూడా. స్థూలంగా నని ముందే అన్నాను కనుక  కొన్ని వివరాలు తప్పిపోవచ్చు.

చిరపరిచయం నుంచి చిరభావనలూ పుట్టుకొస్తాయి. ఇలాంటి ఈ దేవాలయ నిర్మాణం మన దేశానికే, మన సంస్కృతికే ప్రత్యేకమనీ, ఇంకెక్కడైనా ఉన్నా మన దగ్గరనుంచే వెళ్లిందనే భావన వాటిలో ఒకటి. కానీ పురాచరిత్రకారుల పరిశీలనలు ఈ అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నాయి.  జోసెఫ్ క్యాంప్ బెల్(Oriental Mythology)నే ఉటంకించుకుంటే…

మెసొపొటేమియాలో దక్షిణంగా ఒబెయిద్(Obeid), ఉరుక్(Uruk), ఎరిడు(Eridu) అనే చోట్లా; మెసొపొటేమియాలోనే నేటి బాగ్దాద్ కు ఉత్తరంగా ఉన్న ఖఫజా(Khafajah), దక్షిణంగా ఉన్న ఉకైర్(Uqair) అనే చోట్లా; మెసొపొటేమియాకు దూరంగా తూర్పు సిరియాలో టెల్ బ్రాక్(Tel Brak) అనే చోటా జరిపిన తవ్వకాలలో మొత్తం ఆరు దేవాలయ సముదాయాలు బయటపడ్డాయి. ఇవి ఉజ్జాయింపుగా క్రీ. పూ. 4000-3500 ఏళ్ల నాటివని నిర్ణయించారు. సిరియాలో పుట్టిన మూలరూపమే ఇతర ప్రాంతాలకు విస్తరించినట్టు టెల్ బ్రాక్ ఆలయసముదాయం సూచిస్తోంది.

Near East

ఒబెయిద్ ఆలయంలో దేవత పేరు నిన్ హుర్ సగ్(Ninhursag). ఖపజాలో దేవత పేరు ఇనన్న(Inanna). మిగతా ఆలయాలలోని దేవతల పేర్లు తెలియవు. ఒబెయిద్, ఖఫజా, ఉకైర్ ఆలయ సముదాయాలు రెండు వైపులా ఎత్తైన ప్రహరీ గోడలతోనూ, అండాకారంలోనూ ఉండి యోని ఆకారాన్ని సూచిస్తూ ఉంటాయి. భారతదేశంలోని అమ్మవార్ల ఆలయంలో గర్భగుడిలో యోని ఆకారంలో ఉండే నిర్మాణంలానే ఇది కూడా ప్రకృతిలోని పునరుత్పాదక శక్తికి; అంటే సంతానాన్ని కని, పెంచి, పోషించే స్త్రీత్వానికి ప్రతీక.

ఈ ఆలయ సముదాయంలో ప్రధాన నిర్మాణం పది నుంచి ఇరవై అడుగుల ఎత్తైన అరుగు మీద ఉంటుంది. ఆ అరుగుకు మెట్లు ఉంటాయి. అన్నీ ఇటుకతో కుదిమట్టంగా పెట్టె ఆకారంలో నిర్మితమై ‘ఆధునిక’ శైలిని తలపిస్తూ ఉంటాయి. మూలలు రంగు రంగుల నునుపు రాళ్ళతోనూ, రంగుల అద్దకాలతోనూ అలంకృతమై కనిపిస్తాయి. పూజారుల నివాసాలు, ఆలయసేవలకు ఉద్దేశించిన ఇతర ప్రదేశాలు, వంటశాలలు, ముఖ్యంగా పశువుల కొట్టాలు ఈ సముదాయంలో భాగాలు. ఒబెయిద్ శిథిలాలలో వివిధ రంగుల్లోని నునుపురాళ్ళు తాపడం చేసిన తావులు కనిపించాయి. పూజారుల బృందం అక్కడే పవిత్ర గోమాతల పాలు పితికి, నిల్వ చేసేవారని అవి సూచిస్తున్నాయి.  అనంతర కాలానికి చెందిన అసంఖ్యాక లిఖిత పత్రాల ప్రకారం, ఈ ఆలయసముదాయంలో కొలుపులు అందుకుంటూ వచ్చిన నిన్ హుర్ సగ్ జగజ్జనని.  మనుషులు, దేవతలు, పశువులతో సహా అందరికీ, అన్నింటికీ తల్లి.  ముఖ్యంగా రాజులకు సంపదను అందించి, వారి రక్షణకు బాధ్యత వహించేది ఆ తల్లే.  ఆమె తన క్షీరధారలతో అందరినీ పోషిస్తుంది. ఆలయ సముదాయంలోని గోమాతలే ఆమె ప్రతిరూపాలు. వాటి పాలే ఆమె ప్రసాదం.

భారతదేశంలో అమ్మవారి ఆలయాలలో ఇప్పటికీ అన్నం పాయసాన్నో, పాల ఉత్పత్తులతో చేసిన మరో పదార్ధాన్నో ప్రసాదంగా ఇస్తారని క్యాంప్ బెల్ అంటారు. సరే, ఆ సంగతి మనకూ తెలిసినదే. ఆయన అంతకంటే ఆసక్తికరమైన ప్రస్తావన చేశారు. అదేమిటంటే, దక్షిణభారతంలో(తమిళనాడులో)ని నీలగిరులలో ‘తోడా’లని పిలిచే ఒక నిగూఢమైన తెగ ఉంది. ఇరుగు పొరుగు వారితో ఈ తెగ వారికి జాతిపరమైన ఎలాంటి సంబంధాలు లేకపోవడమే ఆ నిగూఢతకు కారణం. పైన చెప్పిన మెసొపొటేమియా ఆలయ సముదాయాల్లానే వీరికి కూడా చిన్న చిన్న ఆలయసముదాయాలు ఉంటాయి. వాటిలో కూడా పశువుల్ని ఉంచి పూజిస్తూ ఉంటారు. లేగ దూడ వీరు బలి ఇచ్చే ప్రధాన జీవి. అమ్మవారి కుమారుడికి అది ప్రతీక. వీరి దేవత పేరు తోగోర్ష్. విశేషమేమిటంటే ఈ దేవతను ఉద్దేశించిన ప్రార్థనలో ‘నిన్ కుర్ షగ్’ అనే మాట కనిపిస్తుంది. ఆ మాటకు అర్థం వారికి తెలియదు. పైన చెప్పిన ఒబెయిద్ అమ్మవారు ‘నిన్ హుర్ సగ్’ కు, ఈ ‘నిన్ కుర్ షగ్’ అనే మాటకూ పోలిక స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

అంటే, ఇరాన్ కు తూర్పుగా వ్యవసాయ-పశుపాలక నాగరికత వ్యాపించడానికి పదిహేను వందల ఏళ్ల క్రితమే రాజు గారికి చెందిన పశువుల కొట్టాలు కూడా భాగమైన నిన్ హుర్ సగ్, ఇనన్న అమ్మవార్ల ఆలయాలలో గంటల గణగణలు, దీపాలను తిప్పడం వంటి అర్చనా సేవలూ, ప్రార్థనలూ, మంత్రాలు, బలులతో కూడిన పూర్వరంగం అంతా ఏర్పడిందనీ; ఈ తంతు భారతదేశంలోని అమ్మవారి వరకూ చేరుకుని వేల సంవత్సరాలుగా ఇప్పటికీ కొనసాగుతోందనీ క్యాంప్ బెల్ అంటారు.

నీలగిరి ‘తోడా’ల గురించిన పై సమాచారంతో సహా ఈ మొత్తం వివరాలు ఎంతో విపులంగానూ, వివరంగానూ చెప్పుకోవలసిన మరో నిగూఢ చరిత్ర వాకిట మనల్ని నిలబెడుతున్నాయి. అయితే, ఆ వాకిలి దాటి మరింత లోపలికి వెళ్లడానికి నేనిప్పుడు సిద్ధంగా లేను కనుక ఒకటి రెండు అంశాలను మాత్రం ప్రస్తావించి ఆపేస్తాను:

ప్రముఖ చరిత్రకారుడు నీలకంఠశాస్త్రి తన A HISTORY OF SOUTH INDIA (Fourth Edition, Oxford India Paperbacks, 1995)లో, The earliest peoples and culture అనే అధ్యాయంలో నీలగిరుల గురించి కొంత స్పృశించారు. దాని ప్రకారం, అక్కడ చనిపోయినవారి స్మారకార్ధం నిలిపిన శిలాకృతులు(cairns), ముందు ఒక్క చక్రం మాత్రమే ఉండే చిన్న చిన్న తోపుడు బళ్ళు(barrows), కుండలు(pottery) మైదాన ప్రాంతాలలో వాటికంటే భిన్నంగా ఉంటాయి. అక్కడి కంచు పాత్రలు ఊర్(Ur-మెసొపొటేమియా)లో దొరికిన బంగారు పాత్రను పోలి ఉంటాయి. ఇంకా మరికొన్ని అంశాలలో కూడా మెసొపొటేమియాకు, నీలగిరులకు ఉన్న అజ్ఞాత సంబంధాన్ని సూచించే సామ్యాలు  పురాతత్వశాస్త్రజ్ఞులకు దొరికాయి.

అదలా ఉంచితే, చాలా ఏళ్ల క్రితమే వచ్చిన ఎస్.ఎస్. రాజమౌళి సినిమా ‘మర్యాద రామన్న’ ఈ మధ్య టీవీలో వస్తుంటే యధాలాపంగా చూశాను. అందులో ఒక సన్నివేశం మెసొపొటేమియా, నీలగిరులలోని పశువుల కొట్టాలను గుర్తుచేసింది. రాయలసీమ ముఠా హత్యలు, గ్రామీణ నేపథ్యంతో తీసిన ఆ సినిమాలో ముఠా నాయకుడి విశాలమైన ఇంటి చావిడిలోనే పశువుల కొట్టం కూడా ఉంటుంది. అదేమిటని హీరో అడిగినప్పుడు, పశువులు మాకెంతో పూజనీయాలనీ, అందుకే ఇంట్లోనే ఉంచుకుని వాటితో మేము సహజీవనం చేస్తామనీ ముఠా నాయకుడు జవాబు చెబుతాడు. ఇప్పటికీ అక్కడక్కడ కొనసాగుతున్న ఆ పురా చారిత్రక వారసత్వం తాలూకు ఆనవాయితీని(కాకపోతే పై ఉదాహరణలలో దేవాలయం అయితే, ఇక్కడ ఇల్లు అయింది) దర్శకుడు ఎక్కడి నుంచో తీసుకుని సినిమాలో వాడుకున్నారని అనిపించింది.

***

తొలి ఆలయ ఆవరణలు

తొలి ఆలయ ఆవరణలు

దేవాలయనిర్మాణమే కాదు; అనేక సాంస్కృతిక అంశాలు, మతవిశ్వాసాలు, ఆరాధనా పద్ధతులు, పురాణగాథలు, వ్యవసాయ-పశుపోషణలు, శాస్త్ర, సాంకేతిక విషయాలు సమీప ప్రాచ్యం నుంచే నేల నలుచెరగులకూ వ్యాపించాయని పురాచరిత్ర కారులు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, నేటి ప్రపంచ భౌతిక, ఆధ్యాత్మిక జీవితపు నమూనాకు పుట్టిల్లు సమీప ప్రాచ్యం! ఏ ఒక్కరో కాదు; గార్డన్ చైల్డ్, సర్ జేమ్స్ ఫ్రేజర్, జోసెఫ్ క్యాంప్ బెల్, జార్జి రాక్స్ సహా ఎందరో అంటున్న మాట ఇది. క్యాంప్ బెల్ (Occidental Mythology) మాటల్లోనే చెప్పుకుంటే…

తూర్పు, పడమటి దేశాల పౌరాణిక చింతనకు సంబంధించిన అనేక మౌలిక అంశాలు కంచు యుగ వారసత్వాలే. అయితే ఇప్పటికీ చాలామంది అనుకుంటున్నట్టు ఈ వారసత్వానికి పుట్టిల్లు భారతదేశమో, చైనాయో కాదు; సమీప ప్రాచ్యం, లెవెంట్. ఇందుకు సంబంధించిన పూర్వరంగం ఈ ప్రాంతంలో క్రీ.పూ. 7500 నాటికే ఏర్పడిందని ఇక్కడ జరిగిన పురాతత్వ పరిశోధనలు చెబుతున్నాయి. ఆ కాలానికే ఆసియా మైనర్, సిరియా, ఇరాక్ ఉత్తర ప్రాంతం, ఇరాన్ లలోని సురక్షిత స్థితిలో ఉన్న పర్వత లోయలలోనే వ్యవసాయ, పశుపోషణ నైపుణ్యాలు అభివృద్ధి చెందాయి. ఇవే మనిషి అస్తిత్వంలోనూ, సామర్ధ్యాలలోనూ విప్లవాత్మకమైన పరివర్తన తీసుకొచ్చాయి. అప్పటివరకూ అనిశ్చితం, ప్రమాదకరం అయిన ఆహారసేకరణ(వేట, అటవీ ఉత్పత్తులు)పై ఆధారపడుతూ వచ్చిన మనిషి ఇప్పుడు వ్యవసాయదారుడిగా మారాడు. స్వయంపోషక గ్రామాలు అవతరించాయి. అవి క్రమంగా తమ సంఖ్యను పెంచుకుంటూ  క్రీ.పూ. 2500 నాటికి తూర్పు, పశ్చిమాలకు విస్తరించాయి.

ఈ మధ్యలో, క్రీ.పూ. 3500 లో ఈ అభివృద్ధికి కేంద్రమైన సమీప ప్రాచ్యంలోని మెసొపొటేమియాలో రెండవ విప్లవాత్మక పరివర్తన సంభవించింది. లిఖిత సంప్రదాయం, గణితం, నిర్మాణశైలులు, శాస్త్రీయ పద్ధతులలో ఖగోళ పరిశీలన, దేవాలయ నిర్మాణం; అన్నింటినీ మించి పరిపాలనా కళ అవతరించాయి. ఈ పరిజ్ఞానమూ, వీటి అనుసరణా క్రీ.పూ. 2850 నాటికి ఈజిప్టుకు, క్రీ.పూ. 2500 నాటికి క్రీటుద్వీపానికీ, సింధు లోయకూ, క్రీ.పూ. 1500 నాటికి చైనాకు, క్రీ.పూ. 1000-500 నాటికి మెక్సికో, పెరూ లకూ చేరుకున్నాయి.

భారతదేశాన్ని, ఈ దేశ సంస్కృతీ నాగరికతలను ఇప్పటి సరిహద్దుల మధ్య ఊహించుకోడానికి అలవాటు పడి, మొత్తం ప్రపంచ నాగరికతకు, అభివృద్ధికి పుట్టిల్లు ప్రాచీన భారతదేశమేనని భావించుకునేవారిని  పై వాక్యాలు నొప్పించి, కోపం తెప్పించే మాట నిజమే. వీటిని ఖండించే పటిష్టమైన వాదనను ఎవరు ముందుకు తెచ్చినా తెరచిన బుద్ధితో దానిని స్వీకరించవలసిందే. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. పురా మానవుడి ప్రపంచానుభవం, నేటి మన ప్రపంచానుభవం ఒకలాంటివి కావు. నేడు మనం భావిస్తున్నట్టు; ఆయా  దేశాల సరిహద్దులు, సాంస్కృతిక, మత విభజనలు, జాతీయతలను స్థిరమైనవిగా భావించడం అతనికి తెలియదు. నాటి జీవన పరిస్థితులలో అందుకు అవకాశం కూడా లేదు. ఎప్పటికప్పుడు సరిహద్దులను చెరిపివేయడం, కొత్త సరిహద్దులను నిర్మించడం అతను చేస్తూ వచ్చిన పని. అలాగే అతను భిన్న భిన్న మత సంస్కృతులలో కలసిపోయాడు. ఇతరులకు తన మత సంస్కృతులను ఇచ్చి వారివి తను తీసుకున్నాడు. అలా మిశ్రమ మతసంస్కృతులను నిర్మించుకుంటూ వెళ్ళాడు. కనుక పురాకాలపు అభివృద్ధి, నాగరికతలతో సహా అన్నీ ఉమ్మడి సృష్టి. అందులో మన వాటా కచ్చితంగా ఉంది.

సమీప ప్రాచ్య వారసత్వం మనకు ఎలా అందిందో చెప్పుకోవలసింది చాలా ఉంది. దానిని మరో సందర్భానికి వాయిదా వేసి కొంత విలక్షణత కలిగిన క్రీటు ద్వీపం మీద అది ఎలా ప్రసరించిందో చెప్పడానికి ప్రస్తుతం పరిమితమవుతాను.

***

 

రాంభట్ల(జనకథ) ప్రకారం, పశ్చిమార్యుల లెక్కలో ప్రథమ ధర్మశాస్త్రకర్త పేరు మినోస్. ఆయన క్రీ.పూ. 15వ శతాబ్దికి చెందినవాడు, క్రీటు దీవిలోని నోసోస్ నగరపాలకుడు. ఆయన ధర్మశాస్త్రకర్త మాత్రమే కాదు, నౌకాదళ నిర్మాత కూడా. మనకు కూడా చిరపరిచితుడైన ఒక ధర్మశాస్త్రకర్త ఉన్నాడు. ఆయన పేరు మనువు. ఆయన జలప్రళయ సమయంలో ఓడను నిర్మించి జీవులను రక్షించా డంటుంది శతపథబ్రాహ్మణం. ఈవిధంగా మినోస్ కు, మనువుకు నామసామ్యం మాత్రమే కాదు; ధర్మశాస్త్ర కర్తృత్వం, నౌకా నిర్మాణంలో కూడా సామ్యం ఉంది.

అయితే, మనకు మనువులు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మనువు వైవస్వత మనువు. నడుస్తున్నది వైవస్వతమన్వంతరం. 36 లక్షల సంవత్సరాలు ఒక చాతుర్యుగం అయితే, అలాంటి 71 చాతుర్యుగాలు ఒక మన్వంతరం అవుతుంది. కనుక మానవ కాలమానంలో మనువుల కాలాన్ని లెక్కగట్టడం అసాధ్యం. స్థూలంగా అతి ప్రాచీను డనుకుందాం. అలాగే, క్రీటు పాలకుడు మినోస్ కూడా ప్రాచీనుడై ఉండచ్చు.  మన దగ్గర చాలామంది మనువులు ఉన్నట్టే క్రీటులోనూ చాలామంది మినోస్ లు ఉండి ఉండచ్చు. మొదటి మినోస్ పేరే తర్వాతి పాలకులకు పదవీ నామంగా సంక్రమించి ఉండచ్చు. వీరిలో ఒకరు ధర్మశాస్త్రకర్త అయుండచ్చు.  క్రీటు నాగరికతా కాలాన్ని మినోస్ పేరిటే మూడు దశలుగానూ, మళ్ళీ ఒక్కొక్క దశను మూడు అంతర్దశలుగానూ విభజించారు. ఈ దశలు అన్నీ క్రీ.పూ. 2600తో ప్రారంభమై, క్రీ.పూ. 1100లతో గ్రీకుల ఆక్రమణతో ముగుస్తాయి. అక్కడ కొత్త రాతి యుగం ఇంకా ముందే క్రీ.పూ. 4000లో మొదలైంది.

క్రీటు నాగరికత గ్రీకు పితృస్వామిక నాగరికతకే కాక, ఈజిప్టు, మెసొపొటేమియా పూజారి నాగరికతకు కూడా కొన్ని విషయాల్లో భిన్నంగా ఉంటుంది. ఇది మాతృస్వామికం. దేవతకు, పూజారిణులకే ప్రాముఖ్యం. పురుషదేవుళ్లు చాలా తక్కువ. మతపరమైన తంతులు కూడా దేవతలకు, స్త్రీలకు చెందినవే. ఇంకా విశేషమేమిటంటే, ఈ తంతులలో లైంగిక సంబంధమైనవి లేవు. అలాగే లింగ చిహ్నాలు కనిపించవు. ఆ విధంగా క్రీటు నాగరికతలో ఇప్పుడు మనం చెప్పుకునే ‘సభ్యత’ ఉట్టిపడుతూ ఉంటుంది.

ఇక స్త్రీలు పురుషులకు అన్ని విధాలా సమానులు. హుందాగా, స్వేచ్ఛగా పురుషులతో కలసిపోయి సంచరించేవారు. వారి దుస్తులు కూడా ఆధునికమైన దుస్తుల్ని తలపిస్తాయి. వారు కూడా వృషభ యుద్ధాల(Bull Fights)లో పాల్గొనేవారు. ఎద్దు కొమ్ముల మీంచి, దాని పృష్ఠభాగం మీంచి పిల్లి మొగ్గలు వేసేవారు. అథ్లెటిక్ బెల్టులు ధరించేవారు. అంతటి స్త్రీ-పురుష సమానత్వం కలిగిన సభ్యనాగరికత తర్వాతి కాలంలో కనిపించదని క్యాంప్ బెల్ అంటారు.

ఇంకా విశేషమేమిటంటే, గ్రీకు ఆక్రమణదారులు అడుగుపెట్టేవరకూ క్రీటులో కోటల వంటి రక్షణలు లేవు. ఆయుధసంపద ఉన్నట్టు సాక్ష్యాలు లేవు. నోసోస్ నగరం తలుపులన్నీ తెరచి ఉంచిన ఒక పెద్ద రాజప్రాసాదం మాత్రమే. క్రీటు వాసులు అందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. ఈ వివరాలన్నీ, ధర్మం నాలుగు పాదాలతో నడిచినట్టు మన పురాణాలు చెప్పే ‘కృత’యుగాన్ని గుర్తుచేస్తూ ఉండచ్చు. ‘కృత’యుగం అనే మాటే ‘క్రీటు’యుగంలా ధ్వనిస్తున్నా ఆశ్చర్యంలేదు.

అదలా ఉండగా, క్రీటులో కొత్త రాతి యుగ అవశేషాలు ఆసియా మైనర్ సంబంధాన్ని సూచిస్తాయి. నైరుతి అనటోలియా(టర్కీ)లో దొరికిన క్రీ.పూ. 5500 నాటి మృణ్మయ సామగ్రి క్రీటుకు చెందిన తొలినాటి అమ్మవారి ఆరాధన నేపథ్యాన్ని సూచిస్తాయి. వీటిలో దేవతల నగ్నరూపాలున్నాయి. ఆగ్నేయ అనటోలియాను ఆనుకుని ఉన్న ఉత్తర సిరియాలో క్రీ.పూ. 4500-3500 నాటి స్త్రీమూర్తులు విస్తారంగా దొరికాయి. ఇక్కడ దొరికిన ప్రతీకాత్మక మూర్తులలో అనేకం తర్వాతి కాలంలో క్రీటులో ప్రముఖంగా మారాయి. వాటిలో వృషభ శిరస్సు, జంటగొడ్డలి, తేనెతుట్ట సమాధి(beehive tomb), పావురాలు, గోవు, గొర్రె, మేక, పంది ఉన్నాయి.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

 

చరిత్ర, అచరిత్రల మధ్య మనం!

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)రెండేళ్ళు పైనే అయింది…

ఏదో పని మీద నాకు బాగా పరిచయమున్న ఒక ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళాను. ఆయన ఫ్రాక్, పశ్చిమ సాహిత్యాలలో తాత్వికధోరణులలో లోతైన అధ్యయనం ఉన్నవారు. ఎన్నో పుస్తకాలు రచించినవారు. నేను ఎంతో గౌరవించే వ్యక్తి. అప్పటికి ఈ వ్యాసపరంపర ప్రారంభించకపోయినా వీటిలో చర్చకు వస్తున్న అనేక విషయాలను యధాలాపంగా ఆయనతో ముచ్చటించడం ప్రారంభించాను. ఆయన మధ్య మధ్య స్పందిస్తూ ఎంతో ఆసక్తితో వింటున్నట్టు కనిపించారు. అలా గంటన్నర కాలం దొర్లిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చేశాను.

వచ్చిన కాసేపటికి ఆయన ఫోన్ చేశారు. “మీరు మాట్లాడిన విషయాలు చాలా ఆలోచింపచేసేలా ఉన్నాయి. వాటిని మీరు తప్పకుండా పుస్తకరూపంలోకి తేవాలి. అది మంచి పుస్తకం అవుతుంది” అన్నారు. నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పాను.

మూడు, నాలుగు రోజుల తర్వాత మరోసారి ఆయన ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళిన వేరే పని గురించి కాసేపు మాట్లాడి సెలవు తీసుకున్నాను. ఆయన నన్ను సాగనంపడానికి గుమ్మం దాకా వచ్చారు. నేను చెప్పులు వేసుకుంటుంటే, ఉన్నట్టుండి ఆయన, “మీరు నాతో కిందటిసారి మాట్లాడిన విషయాలు రాయకండి” అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యానికి రెండు కారణాలు. మొదటిది, అంతకుముందు స్వయంగా ఫోన్ చేసి మరీ నన్ను అభినందించి, పుస్తకరూపంలోకి తేవాలని నొక్కి చెప్పి, అది మంచి పుస్తకం అవుతుందని అన్నవారే ఇంతలో అభిప్రాయం మార్చుకోవడం! రెండవది, అసలు రాయనే వద్దని అనడం!

ఈ మధ్యలో ఇంకో నిజం కూడా ఉంది. అది: నేను మాట్లాడిన విషయాల గురించే ఈ మూడు నాలుగురోజులుగా ఆయన ఆలోచిస్తూ, ఇంకా చెప్పాలంటే, మథనపడుతూ ఉండడం!

నేను ఆశ్చర్యం నుంచి తేరుకోడానికి క్షణకాలం పట్టినట్టుంది. ఆపైన, “చరిత్ర…” అంటూ ఏదో అనబోయాను.

ఆయన వెంటనే తుంచేస్తూ, “మనకు చరిత్ర అవసరం లేదండీ” అన్నారు.

అనేసి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. నేను బయటికి నడిచాను.

***

రెండేళ్ళు దాటిపోయినా అప్పటి ఆ సన్నివేశం నా జ్ఞాపకాలలో నిన్న మొన్నటి దన్నంత స్పష్టంగా ఇప్పటికీ ఉండిపోయింది. “మనకు చరిత్ర అవసరం లేదండీ” అన్న ఆయన మాటలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.  ఆ మాటల్ని తప్పుపట్టడానికో, విమర్శించడానికో నేనీ విషయం ప్రస్తావించడంలేదు. వాటిని వీలైనంత తటస్థంగా పరిశీలించడం నా ఉద్దేశం.

“మనకు చరిత్ర అవసరం లేదండీ” అన్న ఆ వాక్యం వెనుక-ఆలోచించిన కొద్దీ- ఒక విలక్షణమైన భారతీయ మనస్తత్వం ఉన్నట్టు అనిపిస్తోంది. అంతేకాదు, కొన్ని వేల సంవత్సరాలుగా మన రక్తంలో లోతుగా ఇంకిపోయిన ఒక తాత్వికత కూడా.  కాలాన్ని గతం, వర్తమానం, భవిష్యత్తుగా విభజించడమే చూడండి. అది కేవలం వ్యావహారిక సౌలభ్యం కోసం. ఆవిధంగా అది ‘వ్యావహారిక సత్యం’ మాత్రమే. అయితే మన తాత్వికత ప్రధానంగా మూడు కాలాలకూ అతీతమైన సత్యానికి చెందినది. దానిని ‘పారమార్ధిక సత్యం’ అందాం. అందులో గతం, వర్తమానం, భవిష్యత్తు అనే విభజన కుదరదు. అక్కడ కాలాన్ని అఖండంగా చూడవలసిందే.  అందులోకి వెళ్లినప్పుడు వ్యావహారిక సత్యం లానే వ్యావహారిక సౌలభ్యం కోసం ఏర్పరచుకున్న కాలం కూడా మాయగా లేదా మిథ్యగా పరిణమిస్తుంది.

కనుక పారమార్థిక సత్యానికి భంగం కలగకుండా ఎంత మేరకు వాడుకోవాలో అంత మేరకే వ్యావహారిక కాలాన్ని వాడుకోవాలి తప్ప మరీ లోతుగా వెళ్లకూడదు. పురాణాలు కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలుగా కాలాన్ని విభజించి ఒక్కొక్క యుగానికీ లక్షలాది సంవత్సరాలను ఆపాదించడం, లక్షల సంవత్సరాల వ్యాప్తి ఉన్న మన్వంతరాలను కల్పించడం వ్యావహారిక కాలాన్ని అప్రధానంగా మార్చే ప్రయత్నంలో భాగమనే నేను అనుకుంటాను. దశరథమహారాజు అరవై వేల సంవత్సరాలు పరిపాలించాడనీ, రాముడు పదివేల సంవత్సరాలు పరిపాలించాడనీ రామాయణం చెబుతోంది. వ్యావహారిక కాలానికి ప్రాధాన్యం లేదని– చెప్పకనే చెప్పడం ఇది.

తాత్విక స్థాయిలో కాలాన్ని అఖండంగా చూడడమంటే కాలానికి గల చలనశీల స్వభావాన్ని కూడా నిరాకరించడమే. అందులో కాలం స్థాణువుగా మారిపోతుంది. పారమార్థిక రంగానికి చెందిన ఆ స్థాణుత్వం అక్కడితో ఆగకుండా వ్యావహారిక రంగం మీదా; అంటే సమాజ, సాహిత్య, ఆర్థిక, రాజకీయాల మీదా ప్రభావం చూపుతుంది. అంటే అవి కూడా స్థాణుత్వాన్ని పొందుతాయి. ఉదాహరణకు ఒక రచన ఒకానొక కాలంలో, సమాజంలో, చారిత్రక పూర్వాపరాల మధ్య అవతరిస్తుంది. కానీ అవతరించిన వెంటనే అది చలన శీలత కలిగిన కాలంతో సంబంధాన్ని తెంచుకుని ఒక కాలాతీత స్వతంత్ర అస్తిత్వాన్ని తెచ్చుకుంటుంది. ఆ రచనకు సంబంధించిన పఠనపాఠన వ్యాఖ్యాన సంప్రదాయమూ దానికి అనుగుణంగానే ఉంటుంది. రామాయణ, మహాభారతాలనే తీసుకుంటే; ఇప్పటికీ వాటిని వ్యాఖ్యానించేటప్పుడు సంప్రదాయ పండితులు వాటి పాఠాన్ని, వాటికి సంబంధించిన వ్యాఖ్యాన సంప్రదాయాన్ని దాటి వాటి వెనుక ఉన్న సమాజమూ, చరిత్రలలోకి తొంగి చూసే సాహసం చేయరు. ఏ కాస్త స్వతంత్రించినా అది సంప్రదాయం అంగీకరించిన పరిధిలోనే. నా ‘కాలికస్పృహ-మరికొన్ని సాహిత్యవ్యాసాలు’(2006)లో కూడా దీని గురించి కొంత చర్చ చేశాను.

భారతదేశం ఇప్పటికీ క్రీస్తుపూర్వకాలంలోనే ఉందనీ, క్రీస్తుశకంలోకి రాలేదనీ ఈ వ్యాసపరంపరలో ఆయా సందర్భాలలో అంటూ వచ్చాను. అది పైన చెప్పిన స్థాణుత్వాన్ని సూచించడమే.

చరిత్ర విషయానికి వస్తే, అది చలనశీలత కలిగిన వ్యావహారిక కాలానికి చెందినది కనుక అందులోకి వెళ్ళడం; కాలాన్ని అఖండంగా చూసే తాత్వికతకు విరుద్ధం అవుతుంది. ఆ అఖండతా సూత్రం మీద ఆధారపడే రచనలకు అవాంఛనీయ వ్యాఖ్యానాలూ, వివరణలూ పుట్టుకొస్తాయి. దాంతో సంప్రదాయపాఠమే కాక మన విశ్వాసాలూ దెబ్బతింటాయి. “మనకు చరిత్ర అవసరం లేదండీ” అని ప్రొఫెసర్ గారు అనడం వెనుక ఇంత లోచూపు ఉందని నేను అనుకుంటున్నాను.

సరే, కాలం గురించిన ఈ దృష్టిభేదం వల్ల, అనువుగా ఉన్నప్పుడు వ్యావహారిక కాలాన్ని, లేనప్పుడు పారమార్థిక కాలాన్ని ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది కనుక దానిని దుర్వినియోగం చేసేవారూ ఉంటారు.

***

కొన్ని ఇతర పురాతన నాగరికతల పరిస్థితి వేరు. వాటితో పోల్చితే “మనకు చరిత్ర అవసరం లేదు” అన్న ప్రొఫెసర్ గారి వ్యాఖ్య ఎంత సనాతన సత్యమో; మనల్ని అది ఎంత విలక్షణ స్థితిలో నిలబెడుతుందో అర్థమవుతుంది. అవి తమ చరిత్రను పదిలపరచడంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాయి. వాటికి చెందిన కనీసం నాలుగైదు వేల సంవత్సరాల నాటి ఉత్తర ప్రత్యుత్తరాలు, యుద్ధాల వివరాలు, జామా ఖర్చులు, భూమి పంపకాలు, భూదానాలు, కూలీలకు ఇచ్చిన వేతనాలతో సహా అనేక లిఖిత ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇక తవ్వకాలలో దొరికిన పురావస్తు ఆధారాల సంగతి చెప్పనే అక్కర్లేదు. వీటి ఆధారంగా ఈ నాగరికతలకు సంబంధించిన  చరిత్రరచన పెద్ద ఎత్తున జరిగింది.

Heinrich Schliemann

కొన్ని పురాతన లిపులను ఛేదించడానికి ఎందరో పండితులు ఒక జీవితకాల తపస్సుగా ఎంత కృషి చేశారో; ఎండనకా, కొండనకా శ్రమిస్తూ తవ్వకాలు జరిపించి పురా చరిత్ర ఖజానాను వెలికి తీయడానికి జీవితాలను ఎలా ధారపోశారో చెప్పే పుస్తకాలు కూడా వచ్చాయి. ప్రాచీన గ్రీసులో భూగర్భంలో సమాధి అయిన నగరాలను తవ్వి తీసిన Heinrich Schilemann పై Robert Payne రాసిన THE GOLD OF TROY, C.W. Ceram రాసిన THE SECRET OF THE HITTITES ఇప్పటికిప్పుడు నాకు గుర్తొస్తున్న రెండు పుస్తకాలు. ప్రాచీన సమీప ప్రాచ్యంలోని వివిధ దేశాలకు చెందిన పత్రాలు, ఆ దేశాల రాజుల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు వగైరాల ఇంగ్లీష్ అనువాదాన్ని పొందుపరచిన THE ANCIENT NEAR EAST(MARK W. CHAVALAS సంపాదకత్వంలో) లాంటి పుస్తకాలూ వచ్చాయి.THE SECRET OF THE HITTITES

అదే మన విషయానికి వస్తే కొన్ని వాస్తవాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఉదాహరణకు, చరిత్రకు తెలిసినంతవరకు ఇంచుమించు భారతదేశం మొత్తాన్ని ఏలిన తొలి రాజు అశోకుడి గురించి వందేళ్ల క్రితం వరకూ మనకు స్పష్టంగా తెలియకపోవడమే చూడండి. ఒక పాశ్చాత్య శాసన పరిశోధకుడు బయటపెట్టిన ఆధారాన్నిబట్టి  ప్రాచీన సింహళ పత్రాలను గాలించిన తర్వాతే అశోకుడు అనే గొప్ప రాజు గురించి నికరంగా మనకు తెలిసింది. దీనిపై రొమీలా థాపర్ (A HISTORY OF INDIA, Volume.one)ఇలా అంటారు:

Until a hundred years ago, Ashoka was merely one of the many kings mentioned in the Mauryan dynastic list included in the Puranas.  But in 1837, James Princep deciphered an inscription written in the earliest known Indian script, Brahmi. The inscription referred to a king called Devanamapiya Piyadassi(the beloved of gods, Piyadassi). The mysterious king Piyadassi remained a puzzle, since the name did not tally with any mentioned in the sources. Some years later the Buddhist chronicles of Ceylon were examined and were found to refer to a great and benevolent Mauryan king as Piyadassi. Slowly the clues were put together and seemed to make sense, but the final confirmation came in 1915 with the discovery of another inscription in which the author calls himself King Ashoka, Piyadassi. It was evident that Piyadassi was a second name used by Ashoka.

“మనకు చరిత్ర అవసరం లేదు” అనే నమ్మకాన్ని పట్టుకుని అలా ఉండిపోతే ఆ దారి వేరు. కానీ పాశ్చాత్య గవాక్షం నుంచి చరిత్ర కిరణాలు వేడి వేడిగా మన కళ్ల మీద పడి చురుక్కు మనిపించడం ప్రారంభం కాగానే ఒక విచిత్రమైన పరిస్థితిలోకి జారిపోయాం. మాకూ చరిత్ర ఉంది, మా దగ్గరా చరిత్ర రచనలు ఉన్నాయని చెప్పుకోడానికి పోటీ పడ్డాం. తీరా చూస్తే చరిత్ర లక్షణాలు బొత్తిగా లేని కల్హణుడి రాజతరంగిణి తప్ప మన దగ్గర నిక్కమైన చరిత్ర రచన ఒక్కటీ లేదు. ఇది కోశాంబీ మాట.  ఆయన (AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY) ఇలా అంటారు:

India, for all its great literary heritage, has produced no historical writers comparable to Herodotus, Thucydides, Polybius, Livy, Tacitus. Many Indian kings of the middle ages were incomparably superior in their education and literary ability to contemporary rulers in Europe; they personally led great armies to victory in heavy warfare. Nevertheless, not one seems ever to have thought of composing a narrative like Caesar’s Commentaries or Xenophon’s Anabasis. The tradition was of graceful drama, an occasional hymn in praise of gods, or a witty epigram. There remains only one Indian chronicle worth the name, the Rajatarangini  by a Kasmiran named Kalhana, composed in Sanskrit verse during A.D. 1149-50, and continued by two successors. This chronicle suffers from all the mannered conventions of Sanskrit poetry, in particular the fatal double entendre that manages only to obscure whatever reality the author meant to portray. The period was of desperate struggle between the central power and feudal lords in Kasmir, but even the portion dealing with the actual time and place can hardly be compared in quality, depth, content to the account by Thucydides Peloponnesian war. For the rest of the country, till the Muslim period, we have nothing even as good as Kalhana,…

The sources for the older period survive as Puranas,  which in their present form, are only religious fables and cant, with whatever historical content the works once possessed heavily encrusted by myth, diluted with semi-religious legends, effaced during successive redactions copied by innumerable, careless scribes; so that one finds great difficulty in restoring as much as the king-lists. Cuneiform records, even the Sumerian, yield much more information, particularly about social conditions in their respective countries.

పై వాక్యాల సారాంశాన్ని చెప్పుకుంటే…గొప్ప సారస్వత వారసత్వం ఉండి కూడా భారతదేశం హెరొడోటస్ తదితరులతో పోల్చదగిన చరిత్రకారులని సృష్టించలేకపోయింది. మధ్యయుగాలనాటి మన రాజులు, తమ కాలం నాటి యూరప్ రాజులతో పోల్చితే విద్యలోనూ, సాహిత్య నైపుణ్యాలలోనూ మిన్న అయినప్పటికీ  సీజర్ కామెంటరీస్, క్జెనోఫోన్ అనబాసిస్ లాంటి రచనలను రూపొందించే ఆలోచన చేయలేదు. ఎంతోకొంత చరిత్రగా చెప్పదగిన కల్హణుని రాజతరంగిణి కూడా శ్లేషతో సహా సంస్కృత కావ్య మర్యాదలను పాటించడంవల్ల రచయిత చెప్పదలచుకున్న వాస్తవాలు కూడా వాటికింద కప్పడిపోయాయి. తూసిడైడ్స్ రచించిన ‘పెలోపొనేసియన్ వార్’ కు అది ఏవిధంగానూ సాటి కాలేకపోయింది. పురాణాలలో ఏ కొంచెం చరిత్ర ఉందనుకున్నా; మతపరమైన కథలు, పరిభాష, కల్పనలు వాటిలో విపరీతంగా పేరుకుపోవడం వల్లా ,లేఖకుల నిర్లక్ష్యం వల్లా  అది కూడా తుడిచిపెట్టుకుపోయింది. వీటికి భిన్నంగా సుమేరియాకు చెందిన క్యూనీఫామ్ పత్రాలు ప్రత్యేకించి ఆయా దేశాలలోని సామాజిక పరిస్థితులతో సహా ఎంతో సమాచారాన్ని ఇస్తున్నాయి.

పై వాక్యాలను చూసినప్పుడు నాకు వెంటనే మహాభారతంలోని ఒక ముచ్చట గుర్తొస్తోంది. పాండవులు జూదంలో రాజ్యం కోల్పోయి వనవాసం చేస్తున్నప్పుడు కృష్ణుడు వారిని చూడడానికి వెడతాడు. జూద సమయంలో తను ద్వారకలో లేననీ, ఆనర్తదేశంలో సాళ్వుడితో యుద్ధం చేస్తున్నాననీ, ఒకవేళ తనే ద్వారకలో ఉండి ఉంటే, దుర్యోధనుడు పిలవకపోయినా హస్తినాపురం వచ్చి జూదం ఆపించేవాడిననీ ధర్మరాజుతో అంటాడు. మహాభారత కథ నిజంగా జరిగిందా అన్న చర్చను అలా ఉంచితే, కృష్ణుడి ఈ మాటల్లో నాకు అరుదైన చరిత్రస్పర్శ తోచి ప్రాణం లేచొచ్చింది.

తీరా మహాభారతవ్యాఖ్యాత నీలకంఠాచార్యులు ఆ మాటలకు ఇచ్చిన వివరణ చూడగానే నీరుగారి పోయాను. దానికి ఆయన తాత్వికమైన అర్థం చెప్పి ఆ చరిత్రస్పర్శను కాస్తా తుడిచిపెట్టేశారు. ఆయన ప్రకారం, ఇక్కడ ద్వారక అంటే నవద్వారాలు కలిగిన దేహమనే నగరం. అంటున్నది ధర్మరాజుతో కనుక అది అతని దేహనగరం అన్నమాట. తను ద్వారకలో లేడంటే అర్థం, జూదమాడే సమయంలో ధర్మరాజు తనను తలచుకోలేదనీ, తలచుకుని ఉంటే వచ్చి జూదం ఆపించేవాడిననీ కృష్ణుడు చెబుతున్నాడు!

వ్యావహారిక కాలమానాన్ని అనుసరించే చరిత్ర మనకు లేకపోవడం, అది మనకు అలవాటులేని ఔపోసన కావడం; అయినా సరే మాకు చాలా చరిత్ర ఉందని చెప్పుకోవలసి రావడం మనల్ని చాలా గంద్రగోళం లోకీ, ఒక్కోసారి హాస్యాస్పద పరిస్థితులలోకీ నెడుతోంది. మరోవైపు మనది అన్నింటికంటే కూడా అతి పురాతన నాగరికత అని చెప్పుకునే అవకాశాన్నీ చరిత్ర లేమి ఇచ్చింది. అలాగే, మానవ కాలమానానికి లొంగకుండా  దివ్యకాలమానాన్ని అనుసరించే చరిత్రనే అసలు చరిత్రగా చెప్పుకోడానికీ దారి తీయించింది. దానికి మళ్ళీ మన జాతీయతా భావన, ఆత్మగౌరవం లాంటివి కూడా జతపడి దానినో భావోద్వేగ విషయంగానూ, రాజకీయ అంశంగానూ మార్చి వేశాయి.

ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే, పురా ప్రపంచంలో మన ఉనికి ఎలా ఉందో తెలుసుకోడానికి ప్రధానంగా ఇతర పురాతన నాగరికతలకు చెందిన ఆకరా(సోర్సులు)లే గతవుతున్నాయి. అవి ఒక్కోసారి మన గురించి మనం కల్పించుకున్న ఊహల్ని తలకిందులు చేసేలానూ ఉన్నాయి. ఒకటి చెప్పాలంటే, మన దగ్గర ఉన్న అనేక మతవిశ్వాసాలు, ఆరాధనాపద్ధతులు, సాంస్కృతిక ధోరణులు వాస్తవానికి సమీపప్రాచ్యం(నేటి టర్కీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలు)నుంచి వ్యాపించినవని ఆధునిక పురాచరిత్రకారుల నిర్ధారణ. ఆ క్రమంలో అవి క్రీటులోకీ  ప్రసరించాయి.

దాని గురించి తర్వాత…

 

 

 

 

 

గణపతి కొమ్ము కిరీటం చెప్పే ‘శృంగార’గాథ

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ప్రపంచ పురాచరిత్రలోకి వెడుతున్న కొద్దీ మత, తాత్విక, సాంస్కృతికరంగాలలో భారతీయ ప్రత్యేకత గురించి, విశిష్టత గురించి మనం కల్పించుకునే ఊహలు మంచు బిందువుల్లా కరిగిపోయే మాట నిజమే.  అలాగని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇప్పటిలా వేగవంతమైన ప్రయాణసాధనాలు, సమాచార వినిమయ సదుపాయాలు లేని కాలంలో కూడా దాదాపు ప్రపంచం అంతా ఒకే రకమైన విశ్వాసాలను, తంతులను, తాత్వికతను పంచుకున్న తీరు ఆశ్చర్యచకితం చేసి, మన ఆలోచనావైశాల్యాన్ని అనేకరెట్లు పెంచుతుంది. మనకు పురాప్రపంచాన్ని వినూత్నంగా పరిచయం చేస్తుంది.

సుమేరు పురాణకథ ప్రకారం, మొదట అర్థనారీశ్వరులుగానూ, ‘అంకి’ అనే పర్వతరూపంలోనూ ఒకటిగా ఉన్న స్త్రీపురుషులను ‘ఎన్ లిల్’ అనే కొడుకు విడదీశాడని చెప్పుకున్నాం. బైబిల్ కథలో కూడా ఇలాంటిదే జరుగుతుంది.  మొదట ఈవ్ కూడా ఆడమ్ లో భాగంగా ఉంది. అంటే అర్థనారీశ్వర రూపమన్నమాట. అప్పుడు యెహోవా ఆడమ్ నుంచి ఈవ్ ను వేరు చేశాడు.  వారు వేరు పడగానే సృష్టి ప్రారంభమైంది. ఈవ్ నిషిద్ధఫలాన్ని తినడం దీనికి నాంది. బైబిల్ పూర్తిగా సెమెటిక్ పితృస్వామిక పురాణం కనుక అందులో ఆడమ్ అనే పురుషుని నుంచే ఈవ్ అనే స్త్రీ పుట్టింది. మన పురాణకథలు మాతృస్వామ్య/పితృస్వామ్యాల మధ్య రాజీకీ, సమన్వయానికీ చెందినవి కనుక మొదట జగజ్జననే పురుషుణ్ణి సృష్టిస్తుంది. ఆ పురుషుడు మిగతా సృష్టి నంతటినీ చేస్తాడు.

అంకి, ఆడమ్ ల గురించిన పై వివరాలు వెంటనే మన పురాణకథను ఒకదానిని గుర్తుచేస్తాయి. అది, కుమారస్వామి పుట్టుక.  ‘కుమారసంభవం’ పేరుతో సంస్కృతంలో కాళిదాసు, తెలుగులో నన్నెచోడుడు ఈ కథను గొప్ప కావ్యాలుగా మలిచారు. శివపార్వతులు కూడా అర్థనారీశ్వరులు. పార్వతికి మరో రూపం సతీదేవి. ఆమె దక్షయజ్ఞ సందర్భంలో యోగాగ్నిని కల్పించుకుని అందులో ఆహుతవుతుంది. దాంతో శివుడు విరక్తుడై తపస్సులో మునుగుతాడు. సతీదేవి హిమవంతుడి కూతురుగా జన్మించి పార్వతి పేరుతో పెరుగుతుంది.  అంతలో, తారకుడనే రాక్షసుడి బాధలు పడలేకపోతున్న దేవతలు, శివపార్వతులకు జన్మించే కుమారుడే అతన్ని చంపగలడు కనుక వారిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. తపస్సులో ఉన్న శివుడిపై మన్మథుని ప్రయోగిస్తారు. శివుడు మూడో కన్ను తెరిచేసరికి మన్మథుడు బూడిదవుతాడు. అతని అర్థాంగి రతీదేవి శోకిస్తుంది. ఈలోపల అక్కడ పార్వతి కూడా శివుని పెళ్లాడడం కోసం తపస్సు ప్రారంభిస్తుంది. చివరికి శివుడు మెత్తబడతాడు. పార్వతి తపస్సు ఫలించి, శివపార్వతుల పెళ్లి జరుగుతుంది. మన్మథుడు మళ్ళీ పుడతాడు. కుమారుడు జన్మిస్తాడు.

ఈ కుమారసంభవ కథ కేవలం ఒక భారతీయ పురాణ ’కథ’ను మాత్రమే చెబుతోందనుకుంటే అంతకన్నా పొరపాటు ఉండదు. క్లుప్తంగా చెప్పాలంటే, అది ప్రపంచమంతటా ఉన్న ఒకానొక ఆదిమ తాత్వికతను, దానిని అంటిపెట్టుకుని ఉన్న ఒక తంతును చెబుతోంది. అది కూడా వ్యవసాయసంస్కృతితో గాఢంగా అల్లుకున్న తంతు. సర్ జేమ్స్ ఫ్రేజర్ తన Golden Bough లో ఇందుకు సంబంధించి విస్తారంగా దండగుచ్చిన వివరాలన్నింటిలోకీ ఇప్పుడు వెళ్లలేం కానీ, ఒకటి చూద్దాం:

సుమేరుల మహాదేవుడు దుముజీ; ఇతర చోట్ల తమ్మూజ్, అడోనిస్, డయోనిసస్ అనే దేవుళ్లూ శివునికి ప్రతిరూపాలని చెప్పుకున్నాం. బాబిలోనియా, సిరియాలకు చెందిన సెమెటిక్ ప్రజలు అడోనిస్ ను పూజించేవారు. సెమెటిక్ భాషల్లో అడోన్ అంటే ప్రభువు అని అర్థం. ఆ దేవుని అసలు పేరు తమ్మూజ్. ప్రాచీన గ్రీకులు ఈ సెమెటిక్ దేవుడినే తాము కూడా పూజించడం ప్రారంభించి ‘ప్రభువు’ అనే ఆయన బిరుదునే అసలు పేరుగా మార్చుకున్నారు. బాబిలోనియా పురాణాలలో జగజ్జనని అయిన ఇష్టార్ కు తమ్మూజ్ ప్రియుడు, భర్త. ప్రకృతిలోని పునరుత్పాదక శక్తులకు ప్రతీక ఇష్టార్. అలా ఉండగా, తమ్మూజ్ ఏటా మరణించి అధోలోకానికి వెళ్ళిపోతాడు. అది దుమ్ము, ధూళీ నిండిన ఓ చీకటి గుయ్యారం. దాంతో ఇష్టార్ శోకంలో మునిగిపోయి ప్రియుణ్ణి వెతుకుతూ అధోలోకానికి వెడుతుంది.

ఆమె కనుమరుగవడంతో మనుషులు, పశువులన్న తేడా లేకుండా ప్రతిజీవిలోనూ పునరుత్పాదనకు అవసరమైన పరస్పర వాంఛ అంతరించిపోతుంది. ఫలితంగా సృష్టి స్తంభించిపోతుంది.  ఇష్టార్ అధోలోకంలో ఉన్నట్టు ‘ఈ’ అనే(మన బ్రహ్మదేవుడి లాంటివాడు)దేవదేవుడు తెలుసుకుని ఆమెను పైలోకానికి రప్పించడానికి వార్తాహరుని పంపిస్తాడు. అల్లతు లేదా ఎర్ష్-కిగల్ అనే రాణి అధోలోకాన్ని ఏలుతూ ఉంటుంది.  జీవజలంతో తమ్మూజ్ ను బతికించి ఇష్టార్ తనతో తీసుకువెళ్లడానికి రాణి అయిష్టంగానే ఒప్పుకుంటుంది. ఇష్టార్ ప్రియుని వెంటబెట్టుకుని సంతోషంగా పైలోకానికి తిరిగివస్తుంది. ఇష్టార్ రాకతో ప్రకృతి అంతా పునరుజ్జీవనం పొందుతుంది. స్త్రీపురుషులలో తిరిగి వలపులూ, మోహాలూ విజృంభిస్తాయి. సృష్టి యథావిధిగా సాగుతుంది.

తమ్మూజ్ మరణాన్ని సంకేతించే విషాదపూరితమైన తంతును ఏటా వేసవి మధ్యలో జరుపుతారు. ఆ సందర్భంలో స్త్రీ, పురుషులందరూ శోకాలు పెడతారు. బాబిలోనియా పురాణాలలో ఇలాంటి శోకగీతాలు ఎన్నో కనిపిస్తాయి. ఆ సందర్భంలో తమ్మూజ్ బొమ్మను చేసి, దానిని నీటితో శుద్ధి చేసి, తైలంతో అభిషేకించి, ఎర్రని వస్త్రం చుట్టబెట్టి, దాని ముందు ధూపం వెలిగిస్తారు. ఒక ప్రస్తావన ప్రకారం, జెరూసలెం ఆలయం ఉత్తరద్వారం దగ్గర స్త్రీలు తమ్మూజ్ కోసం శోకాలు పెట్టేవారు.  తమ్మూజ్ మరణం వాడిపోయే మొక్కలకు ప్రతీక. ఆవిధంగా ఇది వ్యవసాయసంబంధమైన తంతు. తమ్మూజ్  బతికి ఇష్టార్ వెంట పైలోకానికి రావడం; వారి రాకతో ప్రకృతి అంతా పునరుజ్జీవనం పొందడం పంటలకు, మొక్కలకు అనుకూలమైన పరిణామానికి సూచన. ఆవిధంగా అది సంతోషాన్ని వ్యక్తపరిచే సందర్భం కూడా. అప్పుడిక జరగవలసిన తంతు, కళ్యాణం.

పై కుమారసంభవం కథకు, ఇష్టార్-తమ్మూజ్ ల కథకు మధ్య కొన్ని తేడాలు ఉన్నా పోలికలూ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. కుమారసంభవం కథలో శివపార్వతులు, రతీమన్మథులు అనే రెండు జంటలు ఉంటే; ఇష్టార్-తమ్మూజ్ ల కథలో ఒక్క జంటే ఉంది.  తమ్మూజ్ ను వెతుక్కుంటూ ఇష్టార్ వెళ్లిపోవడంతో జీవుల్లో లైంగికేచ్ఛ అంతరించి పునరుత్పత్తి ఆగిపోయినట్టు సూటిగా ఉంటే, కుమారసంభవంలో సూచ్యంగా ఉంది. తారకాసురుణ్ణి చంపగల కొడుకును కనడం కోసమే అయినా, మొత్తం మీద దేవతల ప్రయత్నం శివునిలో శృంగారభావన రేకెత్తించి పార్వతిని పెళ్లాడేలా చూసి సృష్టికార్యానికి ఉన్ముఖణ్ణి చేయడమే. మొదట ఆ ప్రయత్నం బెడిసికొట్టి, అక్కడ తమ్మూజ్ మరణించినట్టే ఇక్కడ మన్మథుడు బూడిదయ్యాడు. అంటే, సృష్టి స్తంభించే ప్రమాదం తలెత్తిందన్నమాట. ఇక్కడ మన్మథుని మరణానికి రతీదేవి శోకించినట్టే, తమ్మూజ్ కోసం ఇష్టార్ శోకించింది.  తమ్మూజ్ ను ఇష్టార్ కోరుకున్నట్టే పార్వతి శివుని కోరి తపస్సు ప్రారంభించింది. చివరికి శివుడు మెత్తబడి పార్వతిని పెళ్లాడడానికి అంగీకరించాడు. దాని పర్యవసానంగా మన్మథుడు మళ్ళీ పుట్టాడు. ఈవిధంగా మన్మథుడు ఓడి గెలిస్తే, శివుడు గెలిచి ఓడాడు.

అక్కడ తమ్మూజ్ తిరిగి పుట్టడం, ఇష్టార్ తో కలసి పై లోకానికి రావడం ప్రకృతి పునరుజ్జీవనానికి సంకేతమైనట్టే; ఇక్కడ శివపార్వతుల కళ్యాణం, మన్మథుని పునరుజ్జీవనం ప్రకృతి పునరుజ్జీవనానికి సూచనలు. ఇందులో జరిగింది ఏమిటంటే, వ్యవసాయ సంబంధమైన ఒక తంతుతోనూ, తాత్వికతతోనూ ముడిపడిన ఒక ఆదిమ పురాణ కథ పునాది మీదే శివపార్వతుల కళ్యాణమూ-కుమారస్వామి పుట్టుకా అనే కథను నిర్మించడం! అదలా ఉంచితే, కుమారస్వామి పార్వతికి పుట్టలేదని చెప్పే కథ కూడా ఉంది. ఇప్పుడు అందులోకి వెళ్ళడం లేదు.

వ్యవసాయ సంబంధమంటే, భౌతిక వాస్తవికతతోనూ, ప్రయోజనంతోనూ ముడిపడినదన్నమాట. క్రమంగా ఆ భౌతికమైన పునాది నేలలో కప్పడిపోయి పై నిర్మాణం మాత్రం మిగిలింది. ఆ నిర్మాణం మీద మళ్ళీ రకరకాల తాత్విక భాష్యాలు అవతరించాయి. అవి భౌతికమైన పునాదితో ఎలాంటి సంబంధం లేని భాష్యాలు. ఇక కావ్యప్రియులకు ‘కుమార సంభవం’ అనగానే రసం, అలంకారం మొదలైన కావ్యసామగ్రి అంతా అమరిన ఒక గొప్ప కావ్యం మాత్రమే  గుర్తొస్తుంది.

ఇప్పుడొకసారి రాంభట్లగారిని పలకరించడం సందర్భోచితంగా ఉంటుంది. ఆదిమకాలంలో రసాలంకారా లనేవి మనిషి మనుగడనుంచి, అంటే భౌతికవాస్తవికత నుంచి ఎలా అవతరించాయో ఆయన(జనకథ)చాలా ఆసక్తికరంగా వివరిస్తారు. ఎలాగంటే, గణదశలో గుంపు మనువులు ఉండేవి. మనువుకు అర్హమైన గణంలోని ప్రతి మగవాడూ ‘గణపతి’. ప్రతి మగువా గణపత్ని. గణపతులలో శృంగార సామర్థ్యం కలిగిన ఒకరిని ప్రధాన గణపతిగా ఎన్నుకునేవారు. గణకన్యలు అతనిని పూలతో అలంకరించేవారు. తలపై శృంగ(కొమ్ము) కిరీటం పెట్టేవారు. ఈ ‘శృంగం’ అనే మాటనుంచే అలంకరించడం అనే అర్థంలో ‘శృంగారం’, ఆపైన రసరాజమైన శృంగారరసం పుట్టాయి. కొమ్ములు దర్పానికి, అంటే మగటిమికి చిహ్నాలు. మన్మథుడికి కందర్పుడనే పేరు ఉంది. దర్పకలీలకు శృంగారమని పేరు. గణపతికి గణకన్యలు జరిపే అలంకారం నుంచే ఇప్పుడు గుళ్లల్లో జరిపే నిత్య వార మాసాద్యలంకారాలు పుట్టాయని రాంభట్ల అంటారు.

BH-7-ISHTAR-&-TAMMUZ

ఏ కన్య అయినా గణపతి శృంగారసామర్థ్యం మీద పెదవి విరిస్తే, గణకన్య లందరూ అతన్ని చుట్టుముట్టి మెడలో వేసిన పూలమాలలు పీకి పారేస్తారు. కిరీటం తీసేసి కొమ్ములు విరుస్తారు. ‘అవమానించడం’ అనే అర్థంలో ‘శృంగభంగం’ అనే మాటకు ఇదే మూలం కావచ్చు. గణదాయీలు అడ్డుపడకపోతే అతని ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ గణపతి ఆచారాలు నిన్నమొన్నటి వరకూ చాలా తండాలలో ఉండేవి. మన సాహిత్యంలో రసరాజు అయిన శృంగారం పుట్టిన వైనం ఇదీ. శృంగారంతోపాటు హాస్యకరుణలు కూడా గణపతి నుంచే పుట్టాయి. ఈ మూడూ మూల రసాలని రాంభట్ల అంటారు.

ఇప్పుడు వీటి పుట్టుకకుగల భౌతిక నేపథ్యాన్ని చూద్దాం.

మోర్గాన్ పురాచరిత్రను శావేజీ, బర్బర అనే రెండు దశాలుగా విభజించారు. మళ్ళీ ఒక్కొక్క దశలో మూడు అంతర్దశలు ఉంటాయి. శావేజీ మహాదశ ముగిసి, బర్బర ప్రథమదశలోకి అడుగుపెట్టే నాటికి జనం స్థిరనివాసానికి అలవాటుపడి గ్రామాలు ఏర్పరచుకున్నారు. పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని ప్రారంభించేముందు పెరటిసాగు, కంచె పశుపాలన చేపట్టారు. గ్రామాలలో ప్రతి గణానికీ నివేశనస్థలంతోపాటు శ్మశానం కూడా ఉండేది. పురాతత్వ ఆధారాలను బట్టి మొదట్లో మృతదేహాలను పాతిపెట్టేవారు. దహనం చేయడం ఆ తర్వాత వచ్చింది.

గణ మానవుడికి ఇద్దరు తల్లులు. అతను ఒక తల్లి గర్భం నుంచి పుడతాడు. చనిపోయిన తర్వాత ఖననం చేస్తారు కనుక, మరో తల్లి గర్భంలోకి చేరతాడు. భూమి కూడా తల్లే. అందుకే భూమాత అంటాం. గణపతికి ‘ఇద్దరు తల్లులు కలిగినవాడా’(ద్వైమాతుర గణాధిపా) అన్న సంబోధన ప్రసిద్ధమే. ఇది జనన మరణ చక్రం. పుట్టుకకు ముందు శృంగారం, చావుకు తర్వాత కరుణ. ఇదీ ఆ రెండు రసాల పుట్టుక క్రమం. ఇవి రెండూ హాస్యం ద్వారా వ్యక్తమవుతాయని రాంభట్ల అంటారు.

దీనిని వ్యవసాయానికి అన్వయించండి. విత్తనాలను భూమిలో పాతి పెట్టడం చావుకు సూచన. కనుక అది శోకించవలసిన సందర్భం. అయితే అది నిజ శోకం కాదు, కల్లశోకం, లేదా భావశోకం. అది హాస్యం ద్వారా వ్యక్తమవుతుంది. అంటే, అది హాస్యకరుణ. మరణించి తల్లి గర్భం చేరిన విత్తనాలు తిరిగి ఆ తల్లి గర్భం నుంచే పుట్టాలి. అంటే వెంటనే శృంగార చర్యలు మొదలవాలన్నమాట. అది కూడా కల్ల శృంగారం లేదా భావశృంగారం. అదీ హాస్యం ద్వారానే వ్యక్తమవుతుంది కనుక హాస్యశృంగారం.

ఈవిధంగా కరుణశృంగారాల ప్రదర్శన నాడు గణాల మనుగడతో నేరుగా ముడిపడింది. ఎందుకంటే, పాతిపెట్టిన విత్తనాలు మొలకలై తిరిగి పుడతాయి. ఒక విత్తనం నుంచి వంద విత్తనాలు ఆవిర్భవిస్తాయి. ఈ ఎరుక ఆనాటి జనం చేత ఆనందతాండవం చేయించిందని రాంభట్ల అంటారు. ఇలా ఒక భౌతికచర్యతో ముడిపడి, ఒక ప్రయోజనం కోసం అనుకరణ, లేదా అభినయ రూపంలో పుట్టి, హాస్యం ద్వారా వ్యక్తమైనవే కరుణశృంగారాలు. అవే ఆ తర్వాత కావ్యరసాలుగా మారాయి.

ఈ కరుణ శృంగారాల అభినయమే ఆయా పంటల పండుగలకూ మూలమైంది. గణపతి విత్తనాలకు ప్రతిరూపమయ్యాడు. ఖననం స్థానంలో దహనం మొదలైనప్పుడు ఈ పండుగల్లో కామదహనమూ చేరింది. మనం హోలీ పేరుతో జరుపుకునేది అదే. కామదహనమప్పుడు బూడిద ఎత్తిపోసుకోవడం, రంగులు, నీళ్ళు చల్లుకోవడం శృంగార హాస్య కరుణాభినయాలలో ప్రధానాంశమయ్యాయి.

ఈ కామదహనం మన దగ్గరే కాక, యూరప్, మధ్యాసియాలలో కూడా ఉంది. యూరప్ లో ‘కార్నివాల్’ పేరుతో దీనిని జరుపుతారు. కార్నివాల్ అంటే పంటల పండుగ. కేవలం ఖననం చేయడమే ఆనవాయితీగా ఉన్న సెమెటిక్ జనంలో కరుణాభినయం మాత్రమే చేసే పండుగలు ఉన్నాయి. శృంగారం వారి సామాజిక నీతికి విరుద్ధం. ఇలా ప్రపంచమంతటా జరిగే ఈ పంటల పండుగల గురించి జేమ్స్ ఫ్రేజర్ విస్తారమైన సమాచారం ఇచ్చారు. అది భారతీయ విలక్షణత, విశిష్టత, ప్రత్యేకతల గురించి మనం కల్పించుకునే ఊహల్ని పటాపంచలు చేయడమే కాదు; ప్రపంచ మతసాంస్కృతిక రేఖాపటంలో మనల్ని భాగస్వామిని చేస్తుంది.

ఇలా చూసినప్పుడు కుమారసంభవకథకు  ఏ ఆదిమ భౌతికవాస్తవికత మూలమో అర్థమవుతుంది. అది కేవలం కు’మారు’ని పుట్టుక గురించి మాత్రమే కాక, ‘మారు’ని పుట్టుక గురించి కూడా చెబుతోంది. మారుడంటే మన్మథుడు. బహుశా ఇష్టార్-తమ్మూజ్ కథలో లానే ఇందులో కూడా మన్మథుడు మరణించడం, రతీదేవి శోకించడం, మన్మథుడు మళ్ళీ పుట్టడమే మూల కథ అయుంటుంది. ఆ మూల కథను అలా ఉంచుతూనే దాని మీద శివపార్వతుల కథను నిర్మించి, దానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే, మూలకథలో మన్మథుడితోపాటే ప్రకృతి పునరుజ్జీవనం పొందడం ప్రధానం కాగా; దానిని అప్రధానం చేసి, తారకాసురుణ్ణి చంపడం కోసం శివపార్వతులకు కుమారస్వామి పుట్టడాన్ని ప్రధానం చేసి ఉండచ్చు. భౌతికమూలాలనుంచి పురాణకథలను తప్పించి భావాంబరవీథిలో వాటిని ఎలా విహరింపజేశారో గ్రహించడానికి ఇదొక నిదర్శనమూ కావచ్చు.

***

మొదట అద్వైతస్థితిలో ఒకటిగా ఉండి; ఆ తర్వాత కొడుకు పుట్టడంతో ఇద్దరుగా విడిపోయిన స్త్రీ పురుషులను మళ్ళీ ఒకటి చేసే ప్రక్రియే ఏటా దేవీ దేవతలకు జరిపే కళ్యాణమని క్యాంప్ బెల్ అంటారు. ఈ అద్వైతస్థితిని, అర్థనారీశ్వర మూర్తిని పునర్నిర్మించడం రెండు రకాలుగా జరుగుతుంది. మొదటిది, ధ్యానం ద్వారా భావన చేయడం. రెండవది, సౌభాగ్యవర్ధనంతో ముడిపడిన మాంత్రిక చర్యల ద్వారా ప్రకృతిని పునరుజ్జీవింప జేయడం. మరోవైపు కంటికి, బుద్ధికి రెండు(ద్వైతం)గా కనిపిస్తున్నా; ఒక అంతరవులో లేదా విధానంలో ఆదిమ అద్వైతస్థితినీ గుర్తించడం లేదా భావన చేయడం జరుగుతూనే ఉంటుంది.

ఇది ద్వైత-అద్వైతాల మధ్య నిరంతర ఘర్షణ. ఇదే పురాతన కంచుయుగానికి చెందిన తాత్వికత. నటరాజులోనూ, సుమేరు మట్టిపలక మీదా కనిపించేది ఇదే ననీ, తూర్పుదేశాలలో ఇది ఇప్పటికీ అస్తిత్వంలో ఉందనీ, దీని మూలాలు క్రీటు నాగరికతలో ఉన్నట్టు కనిపిస్తుందనీ క్యాంప్ బెల్ అంటారు.

దాని గురించి తర్వాత…

 

 

 

 

సుమేరులోనూ ఉన్నాడు శివుడు!

కల్లూరి భాస్కరం

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)చెప్పబోయే విషయం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నదే కానీ, మరోసారి గుర్తుచేసుకోవలసిన అవసరం వచ్చింది…

ఏదైనా ఒక రచనను– ఇద్దరో ముగ్గురో కలసి రాసినట్టు ప్రత్యేకంగా చెప్పకపోతే– ఒక్కరు రాసింది(ఏకకర్తృకం)గానే  అనుకుంటాం. నిజానికి ఏ రచనైనా అనేకమంది రాసినదే(బహుకర్తృకం) అవుతుంది కానీ, ఏకకర్తృకం కాదు.  ఆ అనేకమంది మరెవరో కాదు; పాఠకులే! ఆ పాఠకులలో మళ్ళీ వేర్వేరు అభిరుచులు, అవగాహన భేదాలు ఉన్నవాళ్ళు ఉంటారు. కనుక ఒక రచన చేస్తున్నప్పుడు రచయిత దృష్టిలో కేవలం ఆ రచనావస్తువు మాత్రమే ఉండదు. వేర్వేరు అభిరుచులూ, అవగాహన భేదాలూ ఉన్న పాఠకులు కూడా ఉంటారు. తెరముందుకు వచ్చి రాస్తున్నది రచయితే అయినా, తెరవెనుక ఉండి ఆ రచన ఎలా ఉండాలో, తమకు ఎలా అందాలో నిర్దేశించేది ఈ వైవిధ్యం కలిగిన పాఠకులే. అందుకే రచయిత తన రచన ఎవరిని ఎలా తాకుతోందో నిరంతరం పరిశీలించుకుంటూనే ఉంటాడు. వారిని చేరేందుకు వీలైన వ్యూహాలు, ఎత్తుగడలు ఎప్పటికప్పుడు అప్రయత్నంగా రచించుకుంటూనే ఉంటాడు. రచనలో అవి కూడా భాగమవుతాయి.

ఆ మాటకొస్తే జీవితంలో కానీ, రచనా జీవితంలో కానీ ప్రతిదీ ఒక వ్యూహాన్ని అనుసరించే వెడుతుంది. అసలు రచన అంటేనే ఒక వ్యూహం. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం, లేదా సంభాషణ ఎప్పుడు ప్రారంభమవుతుందో  అప్పుడే వ్యూహం అడుగుపెడుతుంది. ఇక్కడ వ్యూహం అనే మాటను తటస్థార్థంలోనే తీసుకోవాలి తప్ప వ్యతిరేకార్థంలో కాదు.

ఈ బహుకర్తృత్వ సూత్రం సినిమా, నాటకం లాంటి దృశ్యరచనలకూ వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ పాఠకుల స్థానంలో ప్రేక్షకులు వస్తారు. ఇదే మౌఖిక వాఙ్మయంలోనూ, నాటకం వంటి దృశ్య కళా రూపాలలోనూ అయితే శ్రోతలు, లేదా ప్రేక్షకులు ప్రత్యక్షంగా ఉండి కథకునీ, నటునీ, ఒక్కోసారి వస్తువునూ ప్రభావితం చేస్తారు. లిఖిత వాఙ్మయంలోనూ, సినిమా వంటి ఆధునిక దృశ్యకళారూపాలలోనూ పాఠకులు, ప్రేక్షకులు పరోక్షంగా ప్రభావితం చేస్తారు. అంతే తేడా!

తన రచన ఏయే పాఠకులను ఎలా తాకుతుందో, లేదా తాకాలని తను అనుకుంటున్నాడో చెప్పుకున్న కవి నాకు ఇప్పటికిప్పుడు ఒక్కరే గుర్తుకొస్తున్నారు. ఆయన, నన్నయభట్టు. పాఠకులను మూడు రకాలుగా వర్గీకరించుకుని ఆ మూడు రకాలవారినీ సంతృప్తి పరచేలా తన రచన ఉంటుందని, లేదా ఉండాలని ఆయన అనుకున్నారు. అంటే ‘వ్యూహ’ రచన ముందే చేసుకున్నారన్న మాట. ఆయన వర్గీకరణ ప్రకారం, కవీంద్రులు మొదటి రకం. వీరు తన రచనలోని ప్రసన్నకథతో కూడిన అర్థయుక్తిని లోతుగా చూసి మెచ్చుకుంటారు.  కవీంద్రులు కాకపోయినా శ్రావ్యతను ఆనందించేవారు రెండవ రకం. వీరు తన అక్షరరమ్యతను ఆదరిస్తారు. కవీంద్రులూ, శ్రావ్యతను ఆనందించేవారూ కాని ఇతరులు మూడవ రకం. చక్కని అర్థవంతమైన తన సూక్తులను వీరు ఇష్టపడతారు.

***

ఇంతకీ ఈ ఉపోద్ఘాతం దేనికంటే, 21 వ్యాసాల క్రితం నలదమయంతుల కథతో ప్రారంభమై, అక్కడినుంచి ఓడిసస్ కథకు, ఆ తర్వాత అమ్మ తాత్వికతకు మళ్లిన ఈ వ్యాసాలు ఒక  పెద్ద గొలుసుకట్టు తంతుగా సాగిపోతున్నాయి. ఇది ఎక్కడ తెగుతుందో ఈ క్షణాన నాకు కూడా తెలియదు. అదలా ఉంచితే, ఈ వ్యాసపరంపర రాను రాను మరీ తాత్విక విషయాల్లోకి జారిపోవడమూ మీరు చూస్తూనే ఉన్నారు. దానికితోడు ఇంకా ‘అమ్మ తాత్వికత’ చుట్టూనే ఈ వ్యాసాలు తిరుగుతున్నాయి. ఇక్కడనుంచి  ‘అయ్య తాత్వికత’ లోకి వెళ్ళడం నా ప్రణాళిక. తీరా వెళ్ళిన తర్వాత అందులోంచి కూడా ఎప్పటికి పైకి తేలగలనో తెలియని పరిస్థితి. దాంతో ఇప్పుడు నేను కూడా పనిగట్టుకుని నన్నయభట్టులా పాఠకులను వర్గీకరించుకుని,  వీలైనంత ఎక్కువమందితో అనుసంధానం(connect) అవుతానో, లేదో చూసుకోవలసిన అగత్యంలో పడ్డాను(అంతటి వ్యక్తితో నన్ను పోల్చుకుంటున్నానని చటుక్కున అపార్థం చేసుకోవద్దు. ఆయన ఎదుర్కొన్న పరిస్థితితో మాత్రమే ఈ పోలిక).

తాత్విక విషయాల మీద అందరికీ రుచి ఉండదని నాకు తెలుసు. ఎవరివరకో ఎందుకు, నాకు కూడా నేల విడిచి సాము చేసే శుద్ధతాత్వికత మీద గొప్ప రుచి ఉందని చెప్పలేను. నావరకు అది రుచికరం కావాలంటే, చరిత్ర అనే తాలింఫును జోడించాల్సిందే. అప్పటికీ తాత్విక విషయాలు పడని పాఠకులు ఉండిపోతారనుకుంటే బహుశా చరిత్రాంశాలు వారికి రుచి కలిగించవచ్చు. పోనీ అదీ కాదనుకుంటే మన పురాణకథలు, దేవీ దేవతలు, ప్రతీకలతో; ఇతర పురాణ కథలకు, దేవీ దేవతలకు, ప్రతీకలకు ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలు ఆకట్టుకోవచ్చు. ఇలా పాఠకులను ఇంకా అనేక రకాలుగా వర్గీకరించుకునే అవకాశం ఉంది కానీ, దానిని మీ ఊహకే వదిలేసి ప్రస్తుతానికి ఒక ఆశ్చర్యకరమైన పోలికలోకి వెడతాను.

ఇంతకుముందు ఒక వ్యాసంలో ‘జంటగొడ్డలి చెప్పే జగజ్జనని తత్వం’ గురించి చెప్పుకున్నాం. జంటగొడ్డలి కాకపోయినా, గొడ్డలి ప్రస్తావన లలితాసహస్రనామాలలో రెండు చోట్ల వస్తుంది. ఒకచోట అమ్మవారు ‘భవారణ్య కుఠారిక’. అంటే, సంసారమనే అరణ్యానికి గొడ్డలి. ఇంకోచోట ‘మృత్యుదారు కుఠారిక’. అంటే, మృత్యువు అనే చెట్టుకు గొడ్డలి. ఈ గొడ్డలి  కాకతాళీయంగా చేసిన ఆలంకారిక ప్రయోగం కావడానికి ఎంత అవకాశం ఉందో, ‘జంట గొడ్డలి’ని సూచించే ప్రతీక కావడానికీ అంతే అవకాశం ఉంది. ఎలాగో ముందు ముందు స్పష్టం కావచ్చేమో చూద్దాం.

 ‘జంట గొడ్డలి’ క్రీటు(మినోవన్)మతానికి చెందిన ప్రతీకలలో ఒకటి. అలాగే స్తంభమూ, ఎద్దు కొమ్ములూ కూడా. క్రీటు మతంలో సర్పం, పావురం వగైరాలతో పాటు వృషభం కూడా ముఖ్యమైన జంతువు. పంది లానే వృషభం కూడా పురుషుడిలోని పునరుత్పాదక శక్తికి ప్రతీక. పశువుల మందకు ప్రభువుగా దానిని పశుపతి అని కూడా అనచ్చు.  మనదేశంతో సహా వివిధ పశుపాలక, వ్యవసాయ సమాజాలలో నేటికీ ఎద్దును, ఆవును పూజించడం ఉంది.  యూరప్ కు చెందిన నూతన శిలాయుగ అవశేషాలలో వృషభ మూర్తులు కనిపించడం, అక్కడ కూడా వృషభ ఆరాధన ఉండేదనడానికి సూచన.

ఇక స్తంభం పవిత్ర వృక్షానికి సంకేతం. ఆదిమ సమాజాలలో వంటచెరుకు కోసం గొడ్డలితో చెట్లు నరకడం స్త్రీలే చేసేవారనీ, ఆవిధంగా గొడ్డలికి పవిత్రత వచ్చి ఉండచ్చనీ జార్జి థాంప్సన్ అంటారు. నిజానికి అన్న ఉత్పాదనకు ఉపయోగించే ప్రతి సాధనమూ పవిత్రమే. చెట్లను కూల్చుతుంది కనుక గొడ్డలికి పిడుగుపాటుతో పోలిక కుదిరి, వర్షానికి సంబంధించిన మాంత్రిక చర్యలలో భాగమైంది. ఆ తర్వాత గొడ్డలి యుద్ధసాధనం అయింది. మనకు బాగా తెలిసిన పరశురాముడి ఆయుధం గొడ్డలి.  పరశురాముని పోలిన పాత్ర గ్రీకు పురాణాలలోనూ ఉంది. ఇప్పుడు అందులోకి వెళ్లలేం. ‘పరశువు’ అంటే గొడ్డలి.  అది జంతువును బలి ఇవ్వడానికి ఉపయోగించే సాధనం కూడా. క్రీటు మతంలో బలి ఇచ్చే జంతువులలో ముఖ్యమైనది వృషభం. పవిత్ర వృషభ రక్తంతో స్పర్శ వల్ల గొడ్డలికి పవిత్రత సిద్ధించి దాని శక్తి మరింత పెరిగింది.

క్రీటు అమ్మవారి సేవలలో ప్రధానంగా పాల్గొనేది స్త్రీలే, అంటే పూజారిణులు. వీరికి సహకరించడమే పురుషులు చేయవలసిన పని. ఈ పూజారిణులు కొన్ని తంతులలో నృత్యం చేస్తారు. మైసీనియాలో దొరికిన ఒక బంగారు ఉంగరంపై ఉన్న చిత్రంలో ఒక పూజారిణి నృత్యం చేస్తుంటే, ఇంకొక పూజారిణి ఒక పీఠం మీద తలవాల్చి శోకిస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఒక పురుష సేవకుడు వంగి ఒక చెట్టు ఫలాన్ని తెంపుతూ ఉంటాడు. సరే, మన పురాణాలలో శివుడు నటరాజు.

ఇప్పుడు మనం ఒకసారి క్రీ.పూ. 2500 నాటి సుమేరుకు వెడదాం. ఫిలడెల్ఫియా లోని యూనివర్సిటీ మ్యూజియంలో ఆ కాలానికి చెందిన ఒక మట్టిపలక ఉంది. దాని మీద ఒక చిత్రం ఉంది. దాని పేరు, Moon-Bull and Lion-Bird. అందులో మానవ ముఖం కలిగిన ఒక వృషభమూ, దానిని చంపుతున్న సింహముఖం కలిగిన ఒక గరుడపక్షీ కనిపిస్తాయి. అయినాసరే, వృషభ ముఖంలో ఒకవిధమైన ప్రశాంతతా, ఆనందమూ ఉట్టిపడుతూ ఉంటాయి.  జోసెఫ్ క్యాంప్ బెల్ (Occidental Mythology) వివరణ ప్రకారం, చంద్ర సంబంధి అయిన వృషభం, చంద్రుడిలానే జనన మరణ చక్రానికి ప్రతీక. దానిని చంపుతున్న గరుడపక్షి సూర్య(సౌర) సంబంధి. ఆ వృషభం నాలుగు కాళ్లనుంచీ దివ్యశక్తి మెరుపులు జాలువారుతూ ఉంటాయి. దాని మానవ ముఖానికి నలుచదరపు ఆకారంలో గడ్డం ఉంటుంది. అది ప్రాచీన సుమేరు, ఈజిప్టులకు చెందిన చిత్రశైలిని సూచిస్తుంది. సర్పమూ, వృషభమూ లాంటి దేవతా సంబంధులకు ఇలాంటి గడ్డమే ఉంటుంది. భూమిలో విత్తనాలు నాటడానికి ఇది ప్రతీక.

ఈ వృషభం ముంగాలు ఒకటి ఒక గుట్ట మీద ఆని ఉంటుంది. ఈ గుట్ట పవిత్ర విశ్వపర్వత శిఖరానికీ, భూదేవి దేహానికీ ప్రతీక. కింది భాగంలో కొమ్ములు లాంటివి కనిపిస్తున్నాయి. అవి క్రీటుకు చెందిన పవిత్ర శృంగాలను పోలి ఉన్నాయి. వృషభదేవునికీ, భూదేవికీ మధ్య అనుసంధానం కలిగిస్తున్నవి ఈ కొమ్ములే. ఆ కొమ్ముల మధ్యలో వృషభం కాలు ఒకటి చొప్పించబడి ఉంది. రెండు కొమ్ముల మధ్య ఆ కాలు ఒక త్రిశూలాకారాన్ని కల్పిస్తోంది. వృద్ధి క్షయాలకు ప్రతీక అయిన ఈ వృషభచంద్రుడి నుంచే, చంద్రుడి నుంచి కురుస్తున్నట్టుగా, జీవుల పునరుత్థానానికి అవసరమైన మంచు, వాన కురుస్తున్నట్టు ఈ చిత్రం సూచిస్తుంది. మంచు, వాన అనేవి భూగర్భాన్ని ఫలవంతం చేసే వీర్యాలు.

క్యాంప్ బెల్ ప్రత్యేకించి చెప్పకపోయినా, సింహముఖం కలిగి, సూర్య సంబంధి అయిన గరుడపక్షి వృషభాన్ని కబళించడమంటే జీవిని కాలం కబళించడమే. మన పురాణాల ప్రకారం కూడా కాలానికి సూర్యుడే కారకుడు. కాలంలోనే చావు, పుట్టుకలు సంభవిస్తూ ఉంటాయి. ‘కాలుడు’ అనే పేరు కూడా కలిగిన యముడు సూర్యుని కొడుకే.

sun lion

మళ్ళీ క్యాంప్ బెల్ వివరణకు వెడితే, భూమి అడుగున నీరు ఉంది. క్రీటు-మైసీనియాకు చెందిన దేవుడు పోసెడియన్. అతని వాహనం వృషభం. అతను త్రిశూలం ధరిస్తాడు. సముద్రాలు, ఊటబావులు, పాతాళ జలాలు అతని నివాసాలు. అలాగే, భారతీయ దేవుడు శివుడి వాహనం కూడా వృషభమే. ఆయన చేతిలో కూడా త్రిశూలం ఉంటుంది. ఆయన అర్థాంగి పార్వతి పేరు పర్వత పుత్రిక అని సూచిస్తుంది. ఆమె వాహనం సింహం. శివుడు పార్వతితో కలసి కైలాసపర్వతం మీద ఉంటాడు. ఆయన ప్రధానంగా లింగరూపంలో పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆయన పాతాళ జలాల నుంచి పైకి వచ్చే లింగమైతే, భూమి యోని.

శివుడు నటరాజు కూడా. ఆయన తన కుడి పాదాన్ని అజ్ఞానమనే మరుగుజ్జు మీద ఉంచి అణగదొక్కుతూ ఉంటాడు. ఎడమకాలిని కుడికాలికి అడ్డంగా పైకి ఎత్తుతాడు. కుడిపాదంతో జీవసృష్టికి అవసరమైన తన సృష్టిశక్తిని అందిస్తున్నాడనీ, ఎడమపాదంతో జీవులను జన్మ నుంచి విముక్తుల్ని చేస్తున్నాడనీ ఈ భంగిమ సూచిస్తుంది, ఆవిధంగా నటరాజమూర్తి జననమరణ చక్రానికి ప్రతీక. పై సుమేరు చిత్రంలోని వృషభం తన ముందు కాళ్లను చాపిన తీరు కూడా ఆ భంగిమనే సూచిస్తోంది.

నటరాజు గురించి మరికొన్ని వివరాలు చెప్పుకునే ముందు, ఇంకొకటి చూద్దాం. సుమేరు పట్టణమైన ఊర్(ఊరు)లోని రాచసమాధులలో షుబ్-అద్ అనే రాణిని సమాధి చేసిన చోట వెండితో చేసిన గోముఖం ఒకటి కనిపించింది. ఆమె భర్త అ-బర్-గి సమాధిలో బంగారు వృషభ ముఖం దొరికింది. దానికి కూడా నలుచదరపు గడ్డం ఉంది. దానిని చిన్న వీణమీద తాపడం చేశారు. ఈ వీణ వృషభచంద్రుని ఆహ్వానించే గీతికి ప్రతీక. అలాగే, తన ప్రియుడైన భర్తతో కలసి మృత్యులోకానికి రమ్మని రాణిని ఆహ్వానించడానికి కూడా ప్రతీక. రాణి తన పరివారంతో కలసి భర్తతో సహగమనం చేసినట్టు ఈ మొత్తం వివరాలు సూచిస్తాయని క్యాంప్ బెల్ అంటారు.

nataraju

మెసపొటేమియాకు చెందిన వేరొక ఉదంతం వృషభాన్ని ఎలా బలి ఇచ్చేవారో చెబుతుంది. ఢంకా, లేదా డమరుకాన్ని వృషభచర్మంతో తయారు చేస్తారు. ఇది వృషభం ప్రాముఖ్యాన్నే కాక, పురా ప్రపంచం తాలూకు తంతులలో కళా రూపాలకు, వాద్యాలకు గల ప్రాధాన్యాన్ని కూడా సూచిస్తుంది. ఒక దేవాలయంలో కొత్త డమరుకాన్ని తయారు చేసుకోవలసి వచ్చింది. అందుకు ముందుగా చేయవలసింది ఒక వృషభాన్ని బలి ఇవ్వడం. బలికి అన్ని వృషభాలూ పనికిరావు. వాటికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఉదాహరణకు, దానికి సంపూర్ణంగా రూపొందిన కొమ్ములు, మూపురం ఉండాలి. అది నల్లటిదై ఉండాలి. ఒంటి మీద ఎటువంటి గాయాల గుర్తులూ ఉండకూడదు.

నేలమీద దర్భలు పరచి వృషభాన్ని వాటి మీద ఉంచుతారు. మేక వెంట్రుకలతో పేనిన తాళ్ళతో దాని కాళ్ళు కట్టేస్తారు. వృషభ బలికి ముందు ఒక గొర్రెను బలి ఇస్తారు. ఆ తర్వాత వృషభం నోటిని నీటితో శుద్ధి చేసి దర్భలు పట్టుకుని దాని చెవిలో గుసగుసగా మంత్రాలు చదువుతారు.  తర్వాత దానిని దేవదారు చెట్టునుంచి స్రవించే జిగురు లాంటి ద్రవంతో సంప్రోక్షిస్తారు. ఆ తర్వాత నిప్పుల పాత్రతో, కొరకంచుతో ప్రతీకాత్మకంగా వృషభాన్ని మంత్రపూతం చేస్తారు. ఆ తర్వాత వృషభం చుట్టూ పిండితో ముగ్గు పెట్టి కత్తితో దానిని వధిస్తారు. గుండెను వేరు చేసి, దానిని పాత డమరుకం ముందు ఉంచి, ఒక ప్రత్యేక తరహాకు చెందిన పిండితో కలిపి దేవదారు, సైప్రెస్ కలపతో దగ్ధం చేస్తారు. దాని ఎడమ భుజం నుంచి స్నాయువులను(ఎముకతో కండరాన్ని అతికే తంతులు) తొలగించి, చర్మాన్ని ఒలిచి, మిగతా కళేబరాన్ని పశ్చిమ ముఖంగా ఉంచి సమాధి చేస్తారు. చర్మాన్ని ఒలవడానికి కూడా కొన్ని కచ్చితమైన నిర్దేశాలూ, పద్ధతులూ ఉంటాయి. ఆ చర్మాన్ని కొత్త డమరుకం చేయడానికి ఉపయోగిస్తారు.

ఈ బలి ఇచ్చే ప్రక్రియ అచ్చంగా మన వైదికమైన తంతును గుర్తు చేయడమే కాక, ఆదిమ సమాజాలలో ప్రతి చిన్న కర్మకూ (ఇక్కడ కొత్త డమరుకం చేయడానికి అవసరమైన ఎద్దు చర్మం కోసం) ముందు ఎంత పెద్ద తంతు జరిపేవారో కూడా చెబుతోంది.

ఇప్పుడు క్యాంప్ బెల్ వివరణలోకి మరోసారి వెడితే…

వృషభచంద్రుడు విశ్వంలోని లయ(rhythm)కు కర్త. అతని గీతికి అనుగుణంగా జీవులన్నీ జననమరణాల వలయంగా ఏర్పడి నృత్యం చేస్తూ ఉంటాయి. డమరుక ధ్వనులు, ఆలయంలోని ఇతర వాద్యధ్వనులు అందులో భాగమే. గరుడపక్షి కబళిస్తున్న వృషభం ముఖంలో కనిపించే ప్రశాంతత మరణానంతర జ్ఞానానికీ, కాలాతీత జ్ఞానానికీ సూచన. వృషభ మరణం నిజానికి మరణం కాదు. అది భూమిపైన జీవులకు సంజీవిని. అది పైకెత్తిన ముంగాలూ, క్రీటు పౌరాణిక చిహ్నమైన ఎడమ కొమ్మూ దీనినే సూచిస్తాయి. ఈ చిహ్నం భూమ్యాకాశాలకు; అంటే దేవీ, దేవుళ్ళ కలయికకు కూడా ప్రతీక. వీరు రెండుగా కనిపించినా, ఒక్కరే. అంటే, అర్థనారీశ్వరం. రెండుగా కనిపించడం ద్వైతం. ఒకరుగా కనిపించడం అద్వైతం.

ప్రాచీన సుమేరు పురాణ కథలో ‘అన్’ అంటే స్వర్గం. ‘కి’ అంటే భూమి. దానినే స్త్రీ పురుషులకు అన్వయిస్తే, స్వర్గం పురుషుడు. భూమి స్త్రీ. వీరు మొదట అవిభాజ్యంగా ‘అంకి’ అనే పర్వతరూపంలో ఉన్నారు. ఆ తర్వాత ‘ఎన్ లిల్’ అనే కొడుకు పుట్టి వీరిని రెండుగా విడదీశాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం మాత్రం చెప్పుకుని మిగతా వివరాలలోకి తర్వాత వెడదాం. అదేమిటంటే, ఈ సుమేరు ‘అంకి’ నుంచే ‘ఎంకి’, ‘వెంకి’, ‘వెంకటేశ్వరుడు’ అవతరించాడని రాంభట్ల అంటారు.

అదలా ఉంచితే, సుమేరు మట్టిపలక మీది వృషభంలో కనిపించే లక్షణాలే నటరాజులోనూ కనిపిస్తాయి. ఆయన ఒకచేతిలో డమరుకం పట్టుకుంటాడు. డమరుక ధ్వని కాలానికి సంకేతం. అది సృష్టిని సంకేతించే ధ్వని కూడా. ఇంకొక చేతిలో అగ్ని ఉంటుంది. అది మృత్యుంజయత్వాన్ని సూచించే జ్ఞానాగ్ని. అది జీవికి కాలంతో ఉండే ముడిని దహిస్తుంది. వృషభం తన నాలుగు కాళ్లనుంచి జ్వాలలు విరజిమ్ముతున్నట్టే, శివుడు కూడా విరజిమ్ముతుంటాడు. తన జటాజూటంలో మృత్యుసూచిక అయిన కపాలాన్ని, చావు పుట్టుకల సంకేతమైన చంద్రవంకను ఆభరణాలుగా ధరిస్తాడు. శివుడు పశుపతి. అలాగే సుమేరు మహాదేవుడైన దుముజి, ఇతర చోట్ల ఆయన ప్రతి రూపాలైన తమ్ముజ్, అడోనిస్ లు కూడా పశుపతులే. శివుడికి నందిలానే వీరి జంతువు కూడా వృషభమే. గ్రీకుదేవుడు డయోనిసస్ కూడా శివుడిలానే నటరాజు. వధిస్తున్న సింహమూ, వధింపబడుతున్న వృషభమూ కూడా ఆయన రూపాలే.

మన శివుడి ప్రతిరూపాలు, శివతత్వం దాదాపు ప్రపంచవ్యాప్తమని ఈ వివరాలు చెబుతున్నాయి.

మిగతా విశేషాలు తర్వాత….

 

 

 

 

గ్రీకు అమ్మవారు కూడా ‘కదంబ ప్రియే’!

కల్లూరి భాస్కరం 

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)అమ్మవారి స్తుతులలో ‘లలితా సహస్రనామాలు’ సుప్రసిద్ధాలు. అవి భౌతిక, భావవాదాల అంతస్సంబంధాన్ని వెల్లడించే అమ్మవారి తాత్వికతను చెబుతున్నాయని నాకు అనిపిస్తుంది.  వాటిలో అమ్మవారి ఆరాధనకు చెందిన చంద్రుడు, సర్పము మొదలైన ప్రతీకలు కూడా విస్తారంగా కనిపిస్తాయి. వాటిలోకి వెళ్ళకుండా ఇప్పుడు ఒక్క అంశానికి మాత్రమే పరిమితమవుతాను. అదేమిటంటే…

లలితా సహస్రనామాలలో పూవులు, వనాల ప్రస్తావన చాలాచోట్ల వస్తుంది. కొన్ని చెప్పాలంటే, అమ్మవారి కురులు చంపకా(సంపెంగ పూలు)లతోనూ, అశోకాలతోనూ, పున్నాగ పువ్వులతోనూ, సౌగంధికాలతోనూ ప్రకాశిస్తూ ఉంటాయి. ఆమె మహాపద్మాల వనంలో ఉంటుంది. కదంబ(పొన్న)వనంలోనూ ఉంటుంది. కదంబ పూల గుత్తిని చెవికి అలంకరించుకుంటుంది. కదంబ కుసుమాలే కాక; చాంపేయ (నాగకేసరి), పాటలీ(కలిగొట్టు) కుసుమాలు కూడా ఆమెకు  ప్రియమైనవి. ఆమె దానిమ్మ పువ్వు కాంతితో ఉంటుంది. పువ్వులు ఆమె బాణాలు…

ఈ ఆహ్లాదకరమైన పూల నేపథ్యం నుంచి ఒకసారి జార్జి థాంప్సన్ వైపు తొంగిచూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయనకు మన లలితా సహస్రనామాలతో పరిచయం ఉందని చెప్పలేం. ఆయన తనకు బాగా తెలిసిన గ్రీకు అమ్మవార్ల గురించి చెప్పుకుంటూ వచ్చారు. విచిత్రంగా ఆ వివరాలు మన అమ్మవారి గురించే చెబుతున్నట్టు అనిపిస్తాయి. గ్రీకు అమ్మవార్లలో మన అమ్మవారి పోలికలు కనిపిస్తాయి.

ఆయన The Making of a Goddess అనే అధ్యాయంలో, Herbal Magic అనే ఉపశీర్షిక కింద, గ్రీకు దేవతా సమూహంలోని అధికారిక దేవతలైన అమ్మవార్ల ఆరాధనలో అంతర్లీనంగా ఉన్న ఆదిమ మాంత్రికతను చర్చిస్తారు. మొక్కలు, మూలికలు, పువ్వులకు(herbal)చెందిన మాంత్రికతపై ప్రతి చోటా స్త్రీలదే అధికారమని ఆయన అంటూ, వాలెంగే తెగ మహిళలపై అధ్యయనం జరిపిన మిస్ ఎర్తీ మాటల్ని ఉదహరిస్తారు:

“దాదాపు అన్ని చెట్లు, మొక్కలు మాంత్రిక విలువ ఉన్నవే. నేను ఎప్పుడైనా వృక్షజాతులను సేకరిస్తుంటే వాళ్ళలో ఒక్కసారిగా కుతూహలం రేగేది. మొక్కలంటే మాంత్రికతకు, మందులకు సంబంధించినవే నన్న భావన వాళ్ళలో జీర్ణించుకుపోవడమే అందుకు కారణం” అని ఆమె అంటారు.

ఈ సందర్భంలో థాంప్సన్ ఇంకొక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. ప్రాచీన గ్రీకు వృక్షజాతుల గురించి డయోస్కరైడ్స్, ప్లినీ విస్తారమైన సమాచారం ఇచ్చారనీ, అయితే, గ్రీకు మతాన్ని అధ్యయనం చేసేవారు వాటిపై తగినంత దృష్టి పెట్టరని  ఆయన అంటారు. ఆదిమ కాలంలో మతపరమైన తంతులకూ, ప్రకృతి రూపంలోని భౌతికవాస్తవికతకూ ఉన్న పీటముడి ఆ తర్వాత తెగిపోయి; మతమూ, భౌతికవాస్తవికతా వేర్వేరు అయిపోయిన ఫలితమే ఇదని నాకు అనిపిస్తోంది. మన దగ్గర కూడా అదే జరిగింది. మన పౌరాణికులు, పండితులు కూడా మతాన్ని భౌతికవాస్తవికతనుంచి వీలైనంత దూరంగా తీసుకువెడతారు.

గ్రీకులకు చెందిన పూల రకాలలో ‘పియోని’(peony) అనే పువ్వు ఉంది. అది ఎర్రగా, మనకు తెలిసిన గులాబీ పువ్వులా ఉంటుంది. ఆ పువ్వు తొడిమెలో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయని భావిస్తారు.  దానిని ఋతుస్రావమప్పుడూ, పురిటి సమయంలోనూ ఉపయోగిస్తారు. ఈ ఔషధ గుణాలు చంద్రుని నుంచే సంక్రమించాయనే భావనతో ఈ పువ్వును ‘మెన్యన్’(menion) లేదా ‘సెలెనోగొనన్’(selenogonon) అని కూడా పిలుస్తారు. ‘మెన్’ అంటే చంద్రుడు. ‘సెలెనే’ అంటే చంద్రదేవత.

అలాగే, ‘డిక్తామ్నోస్’(diktamnos) అనే ఒక తరహా కూరాకును ప్రసవసమయంలో ఉపయోగిస్తారు. ఆ కూరాకులను దండగా గుచ్చి, ప్రసవదేవత అయిన ఎయిలీతియా(Eileithiia) మెడలో వేస్తారు. విశేషమేమిటంటే, కదంబం లేదా పొన్న(ఇక్కడ థాంప్సన్ ఉపయోగించిన myrtle అనే మాటకు కదంబమని, పొన్న అనీ నిఘంటువు అర్థం ఇచ్చింది) మన అమ్మవారికి ఎంత ప్రియమైనదో గ్రీకు అమ్మవారు అఫ్రోడైట్ కు కూడా అంతే ప్రియమైనది. ఇది గర్భాశయాన్ని మూసి ఉంచి నెలలు నిండకుండా ప్రసవం జరిగే అవకాశాన్ని నివారిస్తుంది. అలాగే కలువపువ్వు కూడా అఫ్రోడైట్ కు ప్రియమైనది. ఇది ఋతుస్రావాన్ని అదుపు చేస్తుందని నమ్మకం. దృఢంగానూ, వంచడానికి వీలుగానూ ఉండే ఒక తీగ జాతి(withy)కి చెందిన ‘లిగోస్’(lygos) కూడా ఋతుస్రావాన్ని అదుపు చేస్తుందని భావిస్తారు.

కదంబం

స్పార్టా లో అర్తెమిస్ అనే అమ్మవారిని ‘లిగోడెస్మా’ (Lygodesma) అని పిలుస్తారు. ఈ దేవత మూర్తి లిగోస్ తీగల మీద వెలియడం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ తీగలతో చేసిన దండను దేవత మెడలో వేస్తారు.  సామోస్ అనే ప్రాంతానికి చెందిన హేరా అనే దేవత కూడా తన వనం లోని ఇలాంటి ఒక తీగ చెట్టు కిందే అవతరించింది. ప్రసవ సమయంలో గర్భం తెరచుకోవడం కష్టమైనప్పుడు ఒక రకమైన దుంప(galingale)తో కషాయం చేసి తాగిస్తారు. ఋతుస్రావంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఒక జాతికి చెందిన పసుపురంగు పువ్వుల(helichryse)ను ఉపయోగిస్తారు. స్పార్టాలోని అమ్మాయిలు ఈ పూలతో కిరీటం చేసి హేరాకు అలంకరిస్తారు. “తల్లీ! నీకు పసుపు పూల దండనూ, గలింగలే దండను సమర్పించుకుంటున్నాను. నన్ను కరుణించు” అని అమ్మాయిలు దేవతను ప్రార్థిస్తారు. హేరా, అర్తెమిస్, అఫ్రోడైట్లను గ్రీకులు ప్రసవదేవతలుగా కొలిచేవారు.

ప్రాచీన గ్రీకులకు బాగా తెలిసిన చెట్లలో దానిమ్మ చెట్టు ఒకటి. డిమీటర్ అనే దేవత, చేతిలో గసగసాల (లేదా నల్లమందు) గుత్తినో, దానిమ్మ పండునో పట్టుకుని కనిపిస్తుంది. ఒక్కోసారి రెండూ పట్టుకుని ఉంటుంది. ఏథెన్స్ లో విజయచిహ్నంగా నిలబెట్టిన ఎథెనా అనే దేవత కుడి చేతిలో శిరస్త్రాణాన్ని, ఎడమ చేతిలో దానిమ్మ పండును పట్టుకుని ఉంటుంది. ఒలింపియాలో మిలన్ అనే ఒక అథ్లెట్ విగ్రహం దానిమ్మ పండును పట్టుకుని కనిపిస్తుంది. ఈ అథ్లెట్ హేరా అనే దేవతకు పూజారిణి. అర్గోస్ అనే చోట హేరా విగ్రహం ఒక చేతిలో రాజదండాన్ని, ఇంకో చేతిలో దానిమ్మ పండును పట్టుకుని ఉంటుంది,  “దానిమ్మ గురించి నేను ఎక్కువగా చెప్పను. ఎందుకంటే, దానికి సంబంధించిన కథ ఓ రహ  స్యం” అని, పౌసానియా(క్రీ. శ. 110-180) అనే గ్రీకు యాత్రికుడూ, భౌగోళిక నిపుణుడూ అనడాన్ని ఈ సందర్భంలో థాంప్సన్ ప్రస్తావిస్తారు.

ఇంతకీ ఆ రహస్యం ఏమిటంటే, దానిమ్మ పండు ఎర్రటి రంగులో ఉంటుంది. అలాగే దాని గింజలు కూడా.  వాటిని గ్రీకు భాషలో ‘కొక్కోస్’(kokkos) అంటారు. దానిమ్మ పండు రక్తాన్ని సంకేతిస్తుంది. అది హింసాత్మక, లేదా బలవన్మరణానికి కూడా సంకేతం. టైటాన్ల చేతిలో మరణించిన డయోనిసస్ రక్తం నుంచి దానిమ్మ మొలకెత్తిందనే భావన గ్రీకు పురాణాలలో కనిపిస్తుంది. దానిమ్మ కలలో కనిపిస్తే గాయాల పాలవుతారనే నమ్మకం ఉండేది. అయితే ఇలాంటివి రెండో పక్షం. ప్రధానంగా దానిమ్మ రంగు ఒకరిని చంపినప్పుడో, గాయపరచినప్పుడో కారే రక్తానికి సూచన కాదు. అది ఋతురక్తానికి, పురిటి రక్తానికి సూచన. దానిమ్మను ఋతుస్రావమప్పుడు, ప్రసవమప్పుడు ఔషధంగా వాడతారు. గసగసాల గుత్తి కూడా సంతానసంబంధమైన ప్రతీకే. అందుకే డిమీటర్ చేతిలో దానిమ్మ, గసగసాల గుత్తి ఉంటాయి.

గ్రీకు అమ్మవార్లకే కాదు, బాబిలోనియా అమ్మవారు ఇష్టార్ కూ దానిమ్మ పండు ప్రియమైనదే. ఆమె దానిమ్మనే కాక యాపిల్ నూ ఇష్టపడుతుంది. ఇష్టార్ ప్రేమదేవత కూడా. స్త్రీ, పురుషులలో లైంగికవాంఛ రేకెత్తించేది ఈ దేవతే. మెసపొటేమియాలో దొరికిన వేలాది మట్టిపిడకలలో ఒకదానిపై ఇష్టార్ ను ఉద్దేశించిన ఒక మంత్రం ఉంది. యాపిల్ నో, దానిమ్మనో చేతిలో ఉంచుకుని మూడు సార్లు ఈ మంత్రాన్ని పఠించి తను ఇష్టపడిన స్త్రీ చేత దానిని కొరికిస్తే ఆమె వెంటనే వశమవుతుందని ఆ మట్టిపిడక మీది రాత చెబుతోంది.

 

డిమీటర్ కు స్త్రీలు కొన్ని రహస్యమైన తంతులు జరుపుతారు. వాటిలో ఒక తంతు పేరు ‘థెస్మొఫోరియా’(Thesmophoria).  ఈ తంతు జరిపే రోజుల్లో స్త్రీలు రాత్రిపూట ఒకరకమైన తీగలతో చేసిన పడక మీద పడుకోవాలి. లైంగికచర్యకు దూరంగా ఉండాలి. దానిమ్మ తినకూడదు. తీగలతో చేసిన పడక మీద పడుకోవడం వల్ల రెండు లాభాలు ఉంటాయి. మొదటిది, లైంగిక స్పందనలను అది నివారిస్తుంది. రెండోది, పాముల్ని అది దూరంగా ఉంచుతుంది. దానిమ్మపై నిషేధానికి కారణం కూడా, అది లైంగిక ఉద్రేకాన్ని రెచ్చగొడుతుందన్న భావనే.

అమ్మవారికి సంబంధించిన వ్రతాలలో, పూజలలో మనదగ్గర కూడా స్త్రీలకు ఇలాంటి నియమాలు, నిషేధాలు ఉంటాయి కనుకనే వీటి గురించి ఈ ప్రస్తావన.

దానిని అలా ఉంచితే, ‘థెస్మొఫోరియా’లో ఇంకొకటి కూడా జరుగుతుంది. అది, స్త్రీలు పందులను బలి ఇవ్వడం! నిజానికి ఇది పంటల వృద్ధిని ఉద్దేశించిన తంతు. అంటే సౌభాగ్యవర్ధనానికి సంబంధించినదన్నమాట.  అలాంటప్పుడు ఈ తంతు జరిపే స్త్రీలు సౌభాగ్య సంబంధమైన లైంగికత్వానికి దూరంగా ఎందుకు ఉంటారని థాంప్సన్ ప్రశ్నిస్తూ, ఈ ఆదిమ కాలపు తంతులోని అసలు ఉద్దేశాన్ని మరచిపోవడం వల్లనే నంటారు.

ఈ తంతు ఏటా అక్టోబర్ చివరిలో జరుగుతుంది. స్త్రీలు డిమీటర్ కు నివేదించడం కోసం కొన్ని పందుల్ని బలి ఇచ్చి వాటి కళేబరాలను ఒక గుహలో భద్రపరుస్తారు. మూడు రోజుల తర్వాత పాములను తరమడానికి చప్పట్లు చరుస్తూ గుహలోకి వెళ్ళి కుళ్ళుతున్న స్థితిలో ఉన్న పందుల అవశేషాలను తీసుకెళ్లి మరుసటి పంటకు ఉపయోగించే విత్తనాలలో కలుపుతారు. స్త్రీలకు చెందిన కుందేలు, పావురం మొదలైన వాటిలానే పంది కూడా ఎక్కువ సంతానాన్ని కంటుంది. ఆ విధంగా సంతాన వృద్ధికేకాక; మగవాడి పుట్టుకకు, పంటలకు కూడా పంది ప్రతీక. ఇంకా చెప్పాలంటే, థాంప్సన్ ప్రకారం పంది అంతకంటే కూడా ఎక్కువ. అది సాక్షాత్తూ స్త్రీకి ప్రత్యామ్నాయం!

ఎలాగంటే, ఋతు రక్తానికీ, ప్రసవరక్తానికీ పంటలను పోషించే లక్షణం ఉన్నట్టు భావించేవారని చెప్పుకున్నాం. మొదట్లో ఈ రెండు రకాల రక్తాలను రహస్యంగా భద్రపరచి, విత్తనాలలో కలిపేవారు. ఆ తర్వాత వాటి స్థానంలో  పంది రక్తాన్ని వాడడం ప్రారంభించారు. అప్పటినుంచే స్త్రీల లైంగికతకు సంబంధించిన చర్యలు సానుకూల విలువను కోల్పోవడం, వాటిని మైలగానూ, అపవిత్రాలుగానూ చూడడం మొదలైందని థాంప్సన్ వివరణ. లేదా, ఋతురక్తాన్ని, ప్రసవరక్తాన్ని మైలగానూ, అపవిత్రంగానూ చూడడం మొదలైన తర్వాత, వాటికి ప్రత్యామ్నాయంగా పంది రక్తాన్ని వాడుతూ వచ్చారనీ అనుకోవచ్చు.

స్త్రీకి పంది ప్రత్యామ్నాయం కావడం వల్ల స్త్రీపట్ల ఏర్పడిన అపవిత్రతా లేదా ఈసడింపు భావనే పంది మీదకు విస్తరించి అది కూడా నిందార్థకంగా మారిందని థాంప్సన్ అంటారు. విచిత్రంగా మన దగ్గర కూడా ‘పంది’ అనే మాట తిట్టుపదమే. అలాగే,  గ్రీకులో దానిమ్మ గింజలను సూచించే ‘కొక్కోస్’ అనే మాట కూడా అశ్లీలవాచకంగా మారింది. మనకు తెలిసిన కొక్కోకమనే కామశాస్త్రానికీ, ఈ మాటకూ ఏమైనా సంబంధం ఉందా అన్నది తెలియదు.

మన లలితా సహస్రనామాలలో ధాన్యాలు, రకరకాల అన్నాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. అలాగే, డిమీటర్ ప్రధానంగా తృణధాన్యాలకు చెందిన దేవత. అర్తెమిస్ అటవీభూములకు, చిత్తడి నేలలకు, పచ్చిక భూములకు చెందిన దేవత.  అర్తెమిస్ విల్లమ్ములు ధరించి కొండల మీద తిరుగుతూ ఉంటుంది. అడవిలోని అప్సరసలతో కలసి ఆడుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒక కథ ప్రకారం, లెట్రినోయి అనే చోట ‘అర్తెమిస్ అల్ఫియా’ అనే గుడి ఉంది. ఆ పక్కనే  ‘అల్ఫియాస్’ అనే నది ప్రవహిస్తోంది. ఆ నది అర్తెమిస్ ను ప్రేమించింది. అయితే, కన్యాత్వానికి అంకితమైన అర్తెమిస్ తన ప్రేమను అంగీకరించదనుకున్న అల్ఫియాస్, ఆమె అప్సరసలతో కలసి రాత్రంతా జరిగే ఒక జాతరకు వెళ్లినప్పుడు రహస్యంగా ఆమెను సమీపించాలనుకున్నాడు. అర్తెమిస్, ఆమె నేస్తాలు దీనిని పసిగట్టి అతను గుర్తు పట్టకుండా ముఖాలకు బురద పూసుకున్నారు.

పెళ్లీడు వచ్చిన అమ్మాయిలు నదికి వెళ్ళి అందులోని బురదను ఒంటికి పూసుకోవడం ద్వారా నీటిలోని జీవశక్తిని సంగ్రహించే ఒక రహస్యమైన తంతును ఈ కథ వెల్లడిస్తుందని థాంప్సన్ అంటారు. బురదలో ఔషధగుణాలు ఉంటాయనీ, అల్ఫియాస్ అనే పేరు ఆ గుణాలనే సూచిస్తుందనీ ఆయన వివరణ. అల్ఫియాస్ నదీజలాలు కుష్టు లాంటి చర్మరోగాలను నివారిస్తుందని ప్రాచీన గ్రీకులు అనుకునేవారు. మన దగ్గర కూడా నదీజలాలకు ఇటువంటి ఔషధగుణాలను ఆపాదిస్తాం.

గ్రీకు పల్లె ప్రాంతాలలో ప్రతిచోటా ఊటబావులు, సెలయేళ్లు ఉన్నాయి. వాటిని ‘పార్థేనియా’ లేదా ‘పార్థెనోయిస్’ అని పిలుస్తారు. మతపరమైన ఉత్సవాలకు ముందు కన్యలు వాటిలో స్నానం చేసి పరిశుద్ధులవుతారు. పెళ్ళికి ముందు నదికి తీసుకువెళ్ళో, లేదా నదీజలాలను తెప్పించో వధువుకు స్నానం చేయించే ఆనవాయితీ అక్కడ ఉండేది. మన దగ్గర కూడా పెళ్ళికి ముందు మంగళస్నానం చేయించడం ఉంది.  థాంప్సన్ ప్రకారం, మొదటిసారి ఋతుమతి అయినప్పుడు నదిలో స్నానం చేసి శుద్ధి పొందే ఆచారమే పెళ్లికి విస్తరించింది. అంతేకాదు, పెళ్ళికి ముందు నదిలో స్నానం చేయడంవల్ల ఆమె సంతానయోగ్యం అవుతుందని భావించేవారు. నీటికి జీవం పోసే శక్తి ఉందనీ, నీటివల్లనే స్త్రీ గర్భం ధరిస్తుందనే విశ్వాసం గ్రీసులోనే కాక అనేక దేశాలలో ఉందని ఆయన అంటారు. స్నానానికి ముందు కన్యలు, “ఓ నదీదేవుడా! మా కన్యాత్వాన్ని హరించు” అని ప్రార్థించడమూ గ్రీసులో కొన్ని చోట్ల ఉంది. పెళ్ళికి ముందు నదీస్నానం చేసిన వధువులు ‘అప్సరస’(nymphs)లు అవుతారనీ, నదీ దేవుణ్ణి కౌగలించుకోవడం వల్ల వారికి వీరపుత్రులు కలుగుతారనీ నమ్మేవారు. గ్రీకు భాషలో వధువులను nimphai అంటారు.

సరే, మన పురాణ ఇతిహాసాల నిండా కనిపించే అప్సరసల గురించి చెప్పనే అవసరం లేదు. ‘అప్సు’ అంటే నీరుకనుక, అప్సరసకు, నదికి లేదా నీటికి ఉన్న సంబంధం స్పష్టమే. అదలా ఉంచితే, పై వివరాలు చదువుతున్నప్పుడు; ముఖ్యంగా నదీదేవుణ్ణి కౌగలించుకోవడం వల్ల వీరపుత్రులు కలుగుతారన్నప్పుడు మహాభారతంలోని కుంతికథ, గంగా-శంతనుల కథ చటుక్కున గుర్తొచ్చి ఉండాలి. కుంతి కన్యగా ఉన్నప్పుడే కర్ణుని కని నదిలో విడిచిపెట్టింది. కర్ణుడు వీరపుత్రుడే. అలాగే, గంగ అనే ‘నది’కి శంతనుని వల్ల కలిగిన భీష్ముడు కూడా మహావీరుడే. కాకపోతే, నదిని మనం స్త్రీ రూపంగా భావిస్తే, గ్రీకులు పురుషరూపంలో భావించారు. మెసొపొటేమియాను పాలించిన సారగాన్(క్రీ.పూ. 2350)ను అతని తల్లి రహస్యంగా కని, ఒక బుట్టలో ఉంచి దానిని తారుతో మూసి నదిలో విడిచిపెట్టింది. అతను కూడా వీరుడే. హిబ్రూ మోజెస్ పుట్టుక కూడా ఇలాంటిదే. ఇటువంటి పుట్టుకలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా డెబ్బైకి పైగా ఉదంతాలు ఉన్నాయని జోసెఫ్ క్యాంప్ బెల్ అంటారు.

కుంతికి ‘పృథ’ అనే పేరు, అర్జునుడికి ‘పార్థు’డనే పేరు ఉన్నట్టు మనకు తెలుసు. గ్రీసులో కన్యలు స్నానం చేసే ఊటబావులను, సెలెయేళ్లను ‘పార్థేనియా’ అంటారని చెప్పుకున్నాం. ఈ పేర్ల మధ్య సామ్యం కనిపించడం లేదా అని నేను అంటే, “ఇక ఆపండి. మరీ ఎక్కువగా ఊహాగానాలు చేస్తున్నా”రని మీరు అనచ్చు. కనుక ఆపేస్తాను.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

,

ఆఫ్రికా మహిళలూ కుంకుమ ‘భరిణె’లే!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఆదిమ సమాజాలలో ఋతుస్రావం చుట్టూ అల్లుకున్న ఊహలు, నిషేధాలు, మాంత్రిక చర్యల గురించి రాస్తున్నప్పుడే కాకతాళీయంగా ఒక టీవీ చానెల్ కు చెందిన వెబ్ మేగజైన్ లో ఒక వ్యాసం కనిపించింది. దాని శీర్షిక, ‘Dear Universities, Is Menstruation Unacceptable?’. రచయిత్రి, ఢిల్లీ ఐఐటిలో ప్రొఫెసర్ గా ఉన్న రుక్మిణీ భయా నాయర్.  

సందర్భం ఏమిటంటే, విద్యార్థినుల పట్ల చూపుతున్న వివక్షను నిరసిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థినులు శానిటరీ నేప్ కిన్స్ మీద వివిధ నినాదాలు రాసి శాంతియుత ప్రదర్శన జరిపారు. ఇది కోల్కతా లోని జాదవ్ పూర్ యూనివర్సిటీకి కూడా పాకింది. శానిటరీ నేప్ కిన్స్ ను ప్రదర్శించడాన్ని రెండు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలూ తప్పు పట్టాయి. జామియా మిలియా అయితే విద్యార్థినులకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. “ఇది సామాజిక ఆమోదం కలిగిన నిరసన మార్గం కాదు. దేనిని ప్రదర్శించవచ్చో, దేనిని ప్రదర్శించకూడదో మీరు తెలుసుకోవాలి” అని జాదవ్ పూర్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ అన్నారు. దానిపై, “దేనికి సామాజిక ఆమోదం లేదు? శానిటరీ నేప్ కిన్స్ కా, ఋతుస్రావానికా, లేక మొత్తం స్త్రీలకేనా?” అని ఒక విద్యార్థిని అడిగింది.

“మా నిరసన కేవలం శానిటరీ నేప్ కీన్స్ ను అధికధరకు అమ్మడం మీదా, క్యాంపస్ లో వాటిని అమ్మే దుకాణాలు లేకపోవడం మీదా కాదు. స్త్రీని న్యూనతతో చూసే ఇటువంటి విషయాల చుట్టూ అల్లుకున్న మౌనాన్ని బద్దలు కొట్టడం కోసం” అని ఇంకో విద్యార్థిని అంది.

దీనిపై అందరు బురోక్రాట్లూ చేస్తున్నట్టే వైస్-ఛాన్సలర్ కూడా ఒక కమిటీని వేసి చేతులు దులుపుకున్నారని వ్యాసరచయిత్రి అంటారు.

ఋతుస్రావం, ఋతుకాలం, ప్రసవకాలాలకు చెందిన తంతులు, నిషేధాలే తదుపరి తంతులకు, నిషేధాలకు మాతృకలనుకుంటే; ఆదిమ కాలం నుంచి నేటి అత్యాధునిక కాలంవరకూ అవి ఎలా నిరంతరాయంగా కొనసాగుతున్నాయో పై ఉదంతం ఆశ్చర్యకరంగా వెల్లడిస్తోంది. మనం ఆధునికతలోకి వచ్చామన్నది కేవలం భ్రమ మాత్రమే, ఇంకా ఆదిమ కాలంలోనే ఉన్నాం.

ఈ వ్యాసంలోనే, మనం నిషేధం అనే అర్థంలో వాడుతున్న ‘టేబూ’(Taboo) అనే మాట గురించి రచయిత్రి కొంత చర్చ చేశారు. ఇది టోగాన్-పొలినేసియన్ పదమనీ, ఇంగ్లీషు దానినే స్వీకరించిందనీ ఆమె అంటారు. రాంభట్ల గారినే ఉటంకించుకుంటే(జనకథ), ‘తప్పు’ అనే తెలుగు మాటే ‘టేబూ’ అయింది. లేదా ‘టేబూ’ అనే మాటే తెలుగులో ‘తప్పు’ అయిందనుకున్నా అనుకోవచ్చు. న్యూజీలాండ్ లోని మావోరీ తెగవారు సరిగ్గా తెలుగు ‘తప్పు’నే, అదే అర్థంలో వాడతారు. పోలినేసియన్లలో హవాయి దీవుల వాళ్ళు ‘తాపు’ అంటారు. మొత్తం మీద మన తెలుగు ‘తప్పు’ అతి పురాతన పదమే కాక, ఒకవిధంగా ప్రపంచభాషాపదం అన్నమాట.

వైరుధ్యం, అంతకన్నా విచిత్రం ఏమిటంటే; ఈ టేబూ అనేది రెండంచుల కత్తిలాంటిది. ఒక అంచు ‘పవిత్రత’కు సూచన, ఇంకొక అంచు ‘అపవిత్రత’కు సూచన. ‘Sacra’ అనే రోమన్ మాటకు కూడా ఇలాగే రెండర్థాలున్నాయని కిందటి వ్యాసంలో అనుకున్నాం. అన్ని మతాలూ స్త్రీలను చూసే చూపులో కూడా ఇదే వైరుధ్యం ఉందని పై వ్యాసరచయిత్రి అంటారు. ఒక పక్క స్త్రీలకు అత్యంత గౌరవం ఇస్తామని చెబుతాం, ‘దేవత’గా భావిస్తాం; మరో పక్క ప్రకృతిధర్మంగా ఆమె శరీరంలో సంభవించే మార్పులను అశుభ్రంగానూ, అపవిత్రంగానూ చూస్తాం. స్త్రీ పట్ల ఉన్న ఈ చులకన భావానికీ, ఈసడింపుకు కొనసాగింపే ఆమెపై జరిపే హింస, అత్యాచారాలంటారు వ్యాస రచయిత్రి.

***

అదలా ఉంచితే, మన జ్ఞానశూన్యతకు ఎల్లలు లేవు. నెల నెలా మూడురోజులపాటు బయట చేరడం అనేది మనలోనే, అందులోనూ ఒకటి, రెండు పై కులాలలలోనే ఉందని అనుకుంటాం. కానీ ఇది దాదాపు ప్రపంచమంతటా అన్ని ఆదిమ సమాజాలలోనూ ఉంది. ఇంకా చెప్పాలంటే, మనకు తెలిసినదానికంటే కూడా కర్కశంగా, పట్టువిడుపులు లేనంతగా ఉండేది. కొన్ని చోట్ల మూడు రోజులు కాక, వారం, నెల, చివరికి ఏళ్ల తరబడి ‘బయట’ ఉంచేవారంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.

సర్ జేమ్స్ ఫ్రేజర్ ‘The Golden Bough’ లో ఈ ఆచారం ఎక్కడెక్కడ ఉందో విస్తృతంగా చెప్పుకుంటూ వచ్చారు. ఋతుమతులైన అమ్మాయిలు నేలను తాకరాదనీ, సూర్యుణ్ణి చూడరాదనే నిషేధం ప్రపంచంలో అనేక చోట్ల ఉందని ఆయన అంటారు. లొవాంగోలోని నల్ల జాతి అమ్మాయిలను ఋతుమతులు కాగానే విడిగా పూరిళ్లలో ఉంచుతారు. వారి శరీరం నేలకు తాకకూడదు. మన దగ్గర కూడా అమ్మాయిలను తాటాకు చాప మీద కూర్చోబెడతారు. దక్షిణాఫ్రికాలోని జులూ, తదితర తెగల్లో అమ్మాయిలు పగలు పని పాటలు చేసుకుంటున్నప్పుడు మొదటిసారి ఋతుసూచనలు కనిపిస్తే వెంటనే నది వైపో, చెరువు వైపో పరుగెత్తి, మగవాళ్ళ కంటబడకుండా పగలంతా పొదల్లో దాక్కుంటారు. తమపై సూర్యకాంతి పడకుండా శరీరాన్ని దుప్పటితో కప్పుకుంటారు. చీకటి పడిన తర్వాతే ఇంటికి వెళ్ళి వేరుగా కూర్చుంటారు. లేక్ న్యాసా అనే ప్రాంతానికి ఉత్తరం కొసన జీవించే అవాన్ కొండే అనే తెగలో అమ్మాయి ఋతుమతి అయినప్పుడు, మరికొందరు అమ్మాయిలతో కలిపి ఒక చీకటి గుయ్యారంలో, కింద అరిటాకులు పరచి కూర్చోబెడతారు.

న్యూ ఐర్లాండ్ లోని అమ్మాయిల పరిస్థితి నమ్మశక్యం కానంత ఘోరంగా ఉంటుంది. అమ్మాయిలను ఒక వయసు రాగానే పాతిక అడుగులు ఎత్తున వెదురుకర్రల మీద నిర్మించిన ఒక ఇంట్లో, ఒక్కో పంజరంలో ఉంచుతారు. ఆ పంజరం భూమిని తాకకుండా నాలుగు అడుగుల ఎత్తున, శంఖం ఆకారంలో ఉంటుంది. వెలుతురు, గాలి కొంచెమైనా చొరడానికి వీలు లేకుండా దగ్గరగా కుట్టిన దట్టమైన ఆకులతో దానిని నిర్మిస్తారు. అందులో కూర్చోడానికి, ముడుచుకుని పడుకోడానికి మాత్రమే చోటు ఉంటుంది. నేల మీద కాలు మోపకుండా, సూర్యరశ్మి సోకకుండా అమ్మాయిలు అలా రోజులు, వారాలు కాదు; ఏకంగా నాలుగైదేళ్లు గడపాలి! అన్నేళ్లూ వాళ్ళు మగపురుగును కూడా చూడడానికి వీల్లేదు. ఆ పంజరాల దగ్గర ఒక వృద్ధస్త్రీ కాపలా ఉంటుంది. కొస మెరుపు ఏమిటంటే, వేరే ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడికి ఈ వింత ఆచారం మీద ఆసక్తి కలిగి ఆ పంజరాలను, అందులోని అమ్మాయిలను చూడాలనుకున్నాడు. తెగ ముఖ్యుని అడిగితే అది కుదరదన్నాడు. అప్పుడా ఉపాధ్యాయుడు ఆ అమ్మాయిలకు కొన్ని పూసల్ని కానుకగా ఇస్తాననే సరికి మెత్తబడ్డాడు. అతి కష్టం మీద ఆ వృద్ధస్త్రీ ఒప్పుకుని కింద దట్టమైన ఆకులు పరచి ఆ అమ్మాయిలను పంజరాల లోంచి బయటికి రప్పించిందట. అప్పుడా ఉపాధ్యాయుడు పంజరం లోపలికి తొంగి చూసేసరికి లోపల విపరీతమైన వేడిగానూ, ఉక్కపోతగానూ ఉందట. ఈ ఉపాధ్యాయుడే తనకు ఈ వివరాలు చెప్పాడని ఫ్రేజర్ అంటారు.

ఇలాంటి అజ్ఞానానికి అద్దం పట్టే దేశ దేశాల ఉదాహరణలను ఇంకా అనేకం ఆయన ఇచ్చుకుంటూ వచ్చారు కానీ వాటన్నింటిలోకీ వెళ్లలేం. ఇప్పటి సంగతి ఏమో కానీ నిన్న మొన్నటి వరకూ మనదేశంలో పరిస్థితి ఏమంత భిన్నం కాదు. బాలెంతల విషయమే తీసుకుంటే, వారిని గాలీ, వెలుతురూ చొరని చీకటి కొట్టాలలో ఉంచి పుష్టికరమైన ఆహారం పెట్టకుండా మాడ్చే మూర్ఖత్వాన్ని—నాకు గుర్తున్నంతవరకూ—‘సత్యవతీ చరిత్రము’ అనే రచనలో కందుకూరి వీరేశలింగంగారే వదలగొట్టే ప్రయత్నం చేశారు.  పై ఉదంతంలో పూసల మీద ఆశపడి కట్టుబాటును సడలించినట్టుగా; స్త్రీల చదువూ, ఉద్యోగం, చిన్న కుటుంబాల అవసరం పెరగడంతో చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు కానీ, వెనకటి రోజులే అయితే ఇలాంటి పద్ధతులను మనవాళ్లు ఇప్పటికీ అమలు చేస్తూనే ఉండేవారు.

ఇప్పుడు మళ్ళీ జార్జి థాంప్సన్ దగ్గరికి వస్తే;

ఋతురక్తంలోనూ, ప్రసవరక్తంలోనూ ప్రాణం పోసే గుణం ఉందన్న నమ్మకం ప్రపంచమంతటా ఎంత బలంగా ఉండేదో, వాటి పట్ల భయమూ, వైముఖ్యమూ అంతే బలంగా ఉండేవని ఆయన అంటారు. ఋతుకాలంలోనూ, ప్రసవ కాలంలోనూ ఉన్న స్త్రీని తాకడమంటే శవాన్ని తాకడంతో సమానం. వారిని కచ్చితంగా దూరంగా ఉంచవలసిందే. ఇటువంటి స్థితిలో ఉన్న స్త్రీని చూస్తే మగవాడు చనిపోతాడని నమ్మేవారు. వారి చెయ్యి కానీ, కాలు కానీ తగిలితే పంటలు మాడిపోతాయనీ, పశువులు అంగవైకల్యం చెందుతాయనీ అనుకునేవారు. బాలెంతను ఉంచిన చోటికి మంత్రసాని తప్ప ఇంకెవ్వరూ వెళ్లకూడదు. ఆ బందిఖానా పూర్తి కాగానే బాలెంత దుస్తులు, దుప్పట్లు, ఆమెకు వండి పెట్టడానికి వాడిన పాత్రలు, బొడ్డు తాడు, మాయ(placenta), రక్తపు మరకలతో సహా అన్నింటినీ జాగ్రత్తగా ధ్వంసం చేయడం, తుడిచిపెట్టడం చేయాలి. లేదా ఎవరూ తాకడానికి అవకాశం లేని చోట పారేయాలి. కొంతమంది రోడ్డు మీదో, నాలుగు రోడ్ల కూడలిలోనో పారేస్తారు. బాటసారులు ఆ మైలను మోసుకుపోతారని అందులో ఉద్దేశం. శుద్ధి స్నానమూ, ఆయా తంతులూ జరిగిన తర్వాతే బాలెంత తిరిగి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికీ మనదగ్గర ఇంచుమించు ఇలాంటివే జరుగుతాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

saffrongatherers

మొదటిసారి ఋతుమతి అయినప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు, తంతులు ఉంటాయి. అమ్మాయికి లైంగిక జీవితాన్ని పరిచయం చేయడం కూడా అందులో భాగం. ఉదాహరణకు, దక్షిణాఫ్రికాలోని బంటూ తెగకు చెందిన  అమ్మాయి తను ఋతుమతి అయ్యే సమయం సమీపించినప్పుడు  పొరుగూరికి చెందిన ఒక వివాహితను పెంపుడు తల్లిగా ఎంచుకుంటుంది. ఆ రోజు రాగానే పెంపుడు తల్లి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళి ఆమెతో కలసి శోకాలు పెడుతుంది. ఆ అమ్మాయిని  నెలరోజులు దూరంగా ఉంచుతారు. సాధారణంగా ముగ్గురు, నలుగురు అమ్మాయిలను కలిపి ఒక పూరిపాకలో ఉంచుతారు. ప్రతిరోజూ ఉదయమే వారు నదికో, కాలువకో వెళ్లి స్నానం చేస్తారు. వారి వెంట కొంతమంది మహిళలు అశ్లీలమైన పాటలు పాడుతూ వెడతారు.  మగవాళ్ళు ఎదురు పడకుండా అదిలించడానికి వాళ్ళ చేతుల్లో కర్రలు ఉంటాయి. మగవారు కనుక ఆ అమ్మాయిలను చూస్తే అప్పటికప్పుడు అంధులైపోతారని నమ్మకం. ఆ అమ్మాయిలు స్నానం చేసి తడిబట్టలతోనే వణకుతూ తిరిగి రావాల్సిందేకానీ, పొడి బట్టతో తుడుచుకోవడం కానీ, మంట దగ్గర చలి కాచుకోవడం కానీ చేయడానికి వీల్లేదు. వెంట ఉన్న మహిళలు  అశ్లీలగీతాలు పాడుతూ, వారిని రక రకాలుగా అల్లరి పెడుతూ లైంగిక విషయాలలో శిక్షణ ఇస్తారు. ఋతుస్రావం గురించి మగవాడికి తెలియకూడదని ఆదేశిస్తారు. నెల రోజుల తర్వాత అమ్మాయిలు ఇంటికి చేరుకున్నాక తెగలో అందరికీ సమర్త భోజనం పెడతారు. ఋతుమతి అయినప్పుడు మన దగ్గర కూడా అచ్చంగా ఇలాంటిదే కాకపోయినా, పెద్ద తంతే జరుగుతుంది.

ప్రాచీన గ్రీసులో కూడా పురిటి మైలను, బహిష్టు మైలను కచ్చితంగా పాటించేవారు. ఆ స్థితిలో ఉన్న స్త్రీలు దేవాలయానికి వెళ్లకూడదు. నలుగురిలోకీ రాకూడదు. మన దేశంలో ఇప్పటికీ తగుమాత్రం మడీ, ఆచారం పాటించే కుటుంబాలలో ఇలాంటి నిషేధాలే ఉన్నాయి.

ఇదే సమయంలో, ఋతుస్రావానికీ, ప్రసవరక్తానికీ ప్రాణం పోసే లక్షణం ఉందన్న విశ్వాసం ఎలా వ్యక్తమయ్యేదో చెప్పుకుందాం. ఉత్తర అమెరికాలో మొక్కజొన్న పంటకు చీడ ఆశించినప్పుడు, ఋతుకాలంలో ఉన్న స్త్రీలు రాత్రిపూట నగ్నంగా పొలంలో తిరిగేవారు. ఇదే ఆచారం ఇప్పటికీ యూరప్ రైతాంగంలో ఉందని థాంప్సన్ అంటారు. పంటను విషక్రిములు ఆశించినప్పుడు ఋతుకాలంలో ఉన్న మహిళలు జుట్టు విరబోసుకుని, దుస్తులు పైకెత్తుకుని, చెప్పులు లేకుండా పొలంలో తిరగాలని ప్లినీ అంటాడు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఋతుకాలంలో ఉన్న స్త్రీలు చెప్పులు లేకుండా మూడుసార్లు పొలం చుట్టూ తిరగాలని డెమోక్రిటస్ అనే మరో పండితుడు అంటాడు. ఋతుకాలంలో స్త్రీలలో ఉండే ప్రాణశక్తి పంటకు అందుతుందని దీనివెనుక ఉద్దేశం. స్త్రీలు ఋతుకాలంలో ఉన్నా లేకపోయినా వారు నగ్నంగా పొలంలో తిరిగితే పంటలను చీడపీడలు అంటవన్న నమ్మకం దక్షిణాఫ్రికాలోని జులూ తెగవారిలో ఉంది.

***

ఇప్పుడిక పసుపు, కుంకుమల గురించి చూద్దాం. ఇవి మనదగ్గర మంగళ ద్రవ్యాలు. పవిత్రతకు సంకేతాలు. స్త్రీల జీవితంలో విడదీయలేని భాగాలు. పసుపు, కుంకుమల చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్లకు అంతే ఉండదు. వివాహిత అయిన స్త్రీ పసుపు, కుంకుమలతో జీవించడం, ముత్తైదువగా మరణించడాన్నే గొప్ప వరంగా భావిస్తుంది. తన జీవితానికి అంతకన్నా ఇంకేమీ అక్కర్లేదనుకుంటుంది. పెళ్ళైన అమ్మాయికి పుట్టింటివారు ఇచ్చే తగుమాత్రం ఆస్తిపాస్తులను పసుపు, కుంకుమల కింద ఇచ్చినట్టు చెప్పుకోవడమూ కనిపిస్తుంది. సెంటిమెంటుకు ఇది ఆర్థిక వ్యక్తీకరణ.

అంతేకాదు; పసుపు, కుంకుమలు మన చారిత్రక జ్ఞానశూన్యతకు కూడా గొప్ప వ్యక్తీకరణలే. అవి స్త్రీ జీవితంతో గాఢంగా పెనవేసుకోవడమే కాక; పూజలు, ఇతర శుభకార్యాలలో ముఖ్యమైన సామగ్రి కావడం కేవలం మన మత,సంస్కృతులకే చెందిన విశిష్టతలని అనుకుంటాం. పసుపును అలా ఉంచి, కుంకుమనే తీసుకుంటే ఇదెంత అపోహో అర్థమవుతుంది.

కుంకుమ మంగళ ద్రవ్యం కావడం వెనుక ‘అమంగళ’మైన గతం ఉంది. ఎలాగంటే; ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత గర్భాశయంలో మిగిలిపోయే రక్తం నుంచే పిండం రూపొందుతుందని పురాతన, మధ్యయుగాలకు చెందిన అరిస్టాటిల్, ప్లినీ తదితర నేచురలిస్టులు భావించారని థాంప్సన్ అంటారు. అంటే, అది ప్రాణి పుట్టుకకు కారణమైన రక్తం. ఋతుకాలంలో, ప్రసవ కాలంలో ఉన్న స్త్రీల పట్ల నిషేధాలను అమలు చేయాలంటే; వారు ఆ స్థితిలో ఉన్నట్టు ఇతరులకు తెలియాలి. ఆ అవసరం రీత్యా రక్తాన్నో, లేదా రక్తం రంగులో ఉన్న మరో పదార్థాన్నో నుదుట అలదుకోవడం, ఒంటికి రాసుకోవడం అనే ఆనవాయితీ ప్రారంభమైంది. ఇలా చేయడంలో నిషేధానికి ఉన్న అనుకూల/ప్రతికూల లక్షణాలు రెండూ వ్యక్తమవుతాయని థాంప్సన్ అంటారు. ఎలాగంటే, రక్తధారణ లేదా రక్తం రంగులో ఉండే మరో ద్రవ్యాన్ని ధరించడం అనేవి ఒకవైపు పునరుజ్జీవన శక్తిని సంకేతిస్తూనే, మరోవైపు మైలను, అమంగళతను సంకేతిస్తాయి. ఋతుకాలంలోనో, ప్రసవ కాలంలోనో ఉన్న స్త్రీలు తమ శరీరానికి ఎరుపు రంగు పులుముకోవడం ప్రపంచమంతటా ఉన్న ఆచారం. అది మగవారిని వారినుంచి దూరంగా ఉంచుతూనే, సౌభాగ్యవర్ధనంగానూ ఉంటుంది,

ఈ ఆచారమే క్రమంగా ఇతర నిషేధాలకూ పాకింది. వివాహ సమయాల్లోనూ, వివాహం తర్వాతా వధువు లేదా వివాహిత నుదుట సిందూర ధారణ చేయడం అనేది రెండు సూచనలు చేస్తుందని థాంప్సన్ అంటారు: మొదటిది, ఆమె భర్తకు తప్ప ఇతర మగవాళ్ళకు నిషిద్ధం. రెండోది, ఆమె భర్తకు మాత్రమే సంతానం కంటుంది. ఈ సిందూర ధారణే అలంకరణ ద్రవ్యాలకు మూలం.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, కుంకుమ, తిలకం వగైరాల రూపంలో ఎరుపు రంగును శరీరానికి అలదుకోవడం, నుదుట ధరించడం అనేవి కేవలం మన ప్రత్యేకతలు కాక; విశ్వజనీనం కావడం! మన స్త్రీల దగ్గర బొట్టు పెట్టె, కుంకుమ భరిణె ఉన్నట్టుగా, బంటు తెగకు చెందిన వాలెంగే మహిళల దగ్గర జేగురు రంగు పదార్థం కలిగిన కుండ ఉంటుంది. అది వారికి మంగళద్రవ్యం. ఉత్సవసమయాల్లో దానిని ఒంటికి అలదుకుంటారు. పురిటి మైల అయిన తర్వాత తల్లీ, బిడ్డలకు దానినే అలది స్నానం చేయిస్తారు.  మన దగ్గర కూడా ఇలాంటి తంతులే ఉన్నాయి.

ఇంకా వెనక్కి వెడితే, ఎరుపు రంగు పునరుజ్జీవనానికి సంకేతం అన్న భావన పాతరాతి యుగం నుంచీ ఉంది. అది కొత్త రాతి యుగంలోనూ కొనసాగింది. ఎరుపు రంగు అలదిన ఆ కాలపు ఎముకలు తవ్వకాలలో లభించడమే ఇందుకు నిదర్శనం.

తమాషా ఏమిటంటే, మన స్త్రీల జీవితంతో, మతసంస్కృతులతో గాఢంగా అల్లుకుపోయిన ‘కుంకుమ’ సంస్కృత భాషా పదం కానీ, ఇతర ప్రాంతీయ భాషా పదం కానీ కాదు. పండితుల నిర్ధారణ  ప్రకారం అది అన్యదేశ్యం. ఇంకా చెప్పాలంటే, Merriam-Webster నిఘంటువు ప్రకారం, అది సెమెటిక్ మూలం కలిగిన పదం. హిబ్రూలోని ‘కర్కోమ్’ అనే మాటతో తుల్యమైన మాట ఇది. ఈ మాట కుంకుమ పువ్వు(saffron)ను సూచిస్తుంది. కుంకుమపువ్వునే కొన్ని చోట్ల ‘కేసర్’ అంటున్నారు. కుంకుమపువ్వుకు జన్మస్థానాలు గ్రీసు, టర్కీ, పర్షియా తదితర మధ్యధరాతీరప్రాంతాలు.

మరికొన్ని విశేషాలు తర్వాత… 

 

అమ్మ భక్తుడు ఆదిశంకరుడు 

 కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)నాకు తత్వశాస్త్రంతో పరిచయం తక్కువ. ఇతరేతర ఆసక్తులది పై చేయి అవడంవల్ల అందులోకి పెద్దగా తలదూర్చే అవకాశం కలగలేదు. కానీ ఈ వ్యాసాల క్రమంలో రేఖామాత్రంగానైనా తత్వశాస్త్ర అంశాలలోకి వెళ్లవలసిన అవసరం కనిపిస్తూ వచ్చింది. పరిమిత పుస్తకజ్ఞానానికి  అనుభవజ్ఞానాన్ని జోడించి వీలైనంతవరకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయినా పొరపాట్లు దొర్లే అవకాశాన్ని కాదనలేను. దిద్దుబాటుకు జాగా కల్పించుకుంటూ విషయంలోకి వస్తాను.

మనకిప్పుడు స్థూలంగా రెండురకాల తాత్విక ధోరణులతో పరిచయం ఉంది. సందర్భాన్ని బట్టి వాటిని భౌతిక, భావవాదాలుగానూ; నిరీశ్వర, ఈశ్వరవాదాలుగానూ పిలుచుకుంటున్నాం. సగటు జనంలో ఒక అలవాటు ఉంది.  కాలగతిలో వారు ఎలాంటి గొప్ప నినాదాన్ని అయినా, భావనను అయినా చిలుక పలుకులుగా మార్చివేస్తారు. అవి ఏనుగు మింగిన వెలగ పండులా గుజ్జును కోల్పోయి డొల్లలుగా మారతాయి. ఇదో మానవసహజమైన అలవాటు కనుక తప్పు పట్టడానికి లేదు. తప్పు పట్టి ప్రయోజనమూ లేదు.

అలాగే, నిరీశ్వర, ఈశ్వరవాదాలు కూడా చిలుకపలుకుల్లా మారాయి. ఆ మారడంలో వాటిమధ్య ఉన్న అంతస్సంబంధం   తెగిపోయి అవి రెండూ భిన్నమైన విషయాలుగా పరిణమించాయి. ఒక పోలిక చెప్పాలంటే, మనం రెడీమేడ్ దుకాణానికి వెళ్ళి చొక్కా కొనుక్కోవాలనుకుంటాం.  దుకాణంలో మనకు నచ్చిన రంగులో ఉన్న చొక్కాలు, నచ్చని రంగులో ఉన్న చొక్కాలు ఉంటాయి. ఎంచుకునేటప్పుడు వాటిని వేర్వేరు రంగుల చొక్కాలుగానే చూసి, నచ్చిన రంగులో ఉన్న చొక్కాను కొనుక్కుంటాం. అంతేకానీ, ఆ వేర్వేరు రంగుల చొక్కాలు ఒకే ముడిసరకుతో తయారైనవనీ, వాటిని ఒక దర్జీయే కుట్టి ఉండవచ్చుననే ఊహ రాదు. ఆ క్షణంలో ఆ ఊహ రావాలని కూడా ఆశించలేం. ఒకవేళ ఆ ఊహే కనుక వస్తే, అప్పుడు రంగు చొక్కాల గురించిన మన అవగాహన భిన్నమైన మలుపు తీసుకుంటుంది.

ఇలా రెండు ధోరణుల మధ్య ఉన్న అంతస్సంబందాన్ని తెంచేసి, వాటిని వేర్వేరు రెడీమేడ్ వస్తువులుగా తయారు చేసి సగటు మనిషికి అందించడాన్నే మనం సంప్రదాయం అంటాం. ఆయా కాలాలలో అప్పటి అవసరాలను బట్టి జ్ఞానాన్ని గడ్డకట్టించి, శిలాశాసనాలను తయారు చేయడమే సంప్రదాయం పని.  పై రెండు ధోరణుల అంతస్సంబందాన్ని తెలుసుకోవాలంటే, సంప్రదాయమనే ఇనప తెరలను ఛేదించి లోపలికి తొంగి చూడడమే మార్గం. పురాచరిత్రలోకి వెళ్ళడం కూడా ఆ ఇనపతెరలను ఛేదించే సాధనాలలో ఒకటి.

నేనిప్పుడు రాంభట్ల కృష్ణమూర్తి గారి ‘సొంతకథ’ నుంచి కొన్ని ఆశ్చర్యకరమైన వాక్యాలను ఉటంకిస్తాను. అవి ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయంటే సాంప్రదాయికమైన ఊహను అవి పూర్తిగా తలకిందులు చేసి, షాకిస్తాయి. తీవ్రవివాదాస్పదంగానూ, చర్చనీయంగానూ కనిపిస్తాయి. ఆయన అంటారు:

“నేను నిరీశ్వరవాదిని, భౌతికవాదిని కూడా. ఈ రెండింటినీ ఒకరి నుంచే నేర్చాను. అతడే శంకరాచార్యుడు. అతడి తత్వం నాలుగు మహావాక్యాల్లో ఉందంటారు పెద్దలు. తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి… ఇవీ ఆ మహావాక్యాలు. ఆయన వాదం నుంచే నేను మరో మహావాక్య చతుష్టయాన్ని ఎంచుకున్నాను. అవి: ఆవిద్య, భ్రాంతి, మాయ, మిథ్య. చారిత్రకంగా చూస్తే మన దేశాన దేవుడు లేడు. క్రీస్తు శకం ప్రథమ సహస్రాబ్దిలోనే మనకు దేశవిజేతల ద్వారా దేవునితో పరిచయం కలిగింది.”

తను శంకరాచార్యుల నుంచే నిరీశ్వరవాదాన్ని, భౌతికవాదాన్ని నేర్చాననడం; శంకరాచార్యులు ఈశ్వరవాది అన్న  సాంప్రదాయిక ఊహను ఒక్కసారిగా తలకిందులు చేయడమే. అంటే, శంకరాచార్యులను నిరీశ్వరవాది అనీ, భౌతికవాది అనీ అనడమే. ‘చారిత్రకంగా చూస్తే మన దేశాన దేవుడు లే’ డనడం కూడా అలాంటిదే.  ఇవి ఏదో అలవోకగా చెప్పుకుని వదిలేయవలసిన విషయాలు కావని తెలిసిపోతూనే ఉంది. నిజానికి చాలాకాలంగా నాలో కుతూహలాన్ని రేపుతున్న రాంభట్లగారి ఈ దృక్కోణం లోకి మరింత తీరుబడిగా, వివరంగా అడుగుపెట్టాలన్న ఉత్సాహం ఈక్షణాన ఉరకలేస్తున్నా;  దానిని మరో సందర్భానికి వాయిదా వేయక తప్పడం లేదు.

ఆయన ఇంకా ఇలా అంటారు:

“శంకరుడు నిర్వచించిన భౌతికవాదం ఏ రూపాన ఉంటుంది? అమ్మ రూపాన ఉంటుంది. లాటిన్లు అమ్మను ‘మాతర్’ అంటారు. ఇంగ్లీషు, జర్మన్ భాషల్లో ‘త’కారం లేదు. అందుకని వారు దాన్ని ‘మేటర్’ అంటారు. ఫారసీ ఆర్యభాషలో కూడా ‘త’కారం లేదు. అందుకని వారు ‘మాదర్’ అంటారు. ఆర్యభాషల్లో ‘మాతర్’ అంటే ‘పదార్థం’ అనే అర్థం ఉంది. అందుకని శంకరుడు దేవుని ‘అవిద్య’ అన్నాడు కానీ, దేవతను అనేకవిధాల స్తుతించాడు. దేవుడు అవిద్య కానీ దేవత  అవిద్య కాదు. అది కంటికి కనిపించే పదార్థం.”

భౌతికవాదాన్నే పదార్థవాదం అంటారని మనకు తెలుసు. దానినే ఇంగ్లీషులో ‘Materialism’ అంటున్నాం. ‘మాతర్, మాదర్, మేటర్, మదర్, సంస్కృతంలో మాతృ’ అనే పేర్లతో పదార్థాన్ని కూడా సంకేతిస్తున్న అమ్మవారినే శంకరాచార్యులు అనేకవిధాలుగా స్తుతిస్తున్నారు కనుక, ఆయన భౌతికవాది లేదా పదార్థవాది అని సారాంశం. అంటే, భౌతికవాస్తవికతపైనే మాంత్రిక వాస్తవికతను, తద్వారా దైవభావనను ఆపాదిస్తూ రెండింటి మధ్యా ఒక అభేదాన్ని స్థాపిస్తున్న ఆదిమపౌరాణికతకు చెందిన అమ్మతాత్వికతనే శంకరాచార్యులు ప్రతిపాదిస్తున్నారు. అమ్మ తాత్వికతలో భౌతిక, భావ వాదాల మధ్య తేడాలేదు. అవి పరస్పర ఆధారితాలు. రాంభట్లగారి అభిప్రాయాన్నే ప్రామాణికంగా తీసుకుంటే, క్రీస్తుశకం ప్రథమ సహస్రాబ్దిలో దేశవిజేతల ద్వారా మన దేశానికి దేవుని పరిచయం కలిగిన తర్వాత, భౌతిక, భావవాదాలు వేరుపడ్డాయి. అంటే పైన చెప్పుకున్నట్టు వేర్వేరు రంగులు కలిగిన రెండు రెడీమేడ్ చొక్కాలు అయ్యాయి. ఆ రెండింటిలోనూ ఉన్న ముడిసరకు ఒక్కటేననీ, ఆ రెండింటినీ కుట్టిన దర్జీ ఒక్కడే ననీ చెప్పేది ఆదిమ పౌరాణికతకు చెందిన అమ్మతత్వం.

భౌతిక, భావవాదాలను గీత గీసినట్టు సంప్రదాయం ఎంత వేర్వేరు విషయాలుగా చెబుతుందంటే; దాని ప్రకారం రావణుడు భౌతికవాది, రాముడు భావవాది. వారు పరస్పర విరుద్ధ శక్తులు. రావణుడిపై రాముడు విజయం సాధించడం భౌతికవాదంపై భావవాదం విజయం సాధించడమే. ఆవిధంగా సంప్రదాయ బలం వల్ల భౌతికవాదం ఒక తిట్టు పదంగానూ, భావవాదం ఉత్తమగుణంగానూ మారాయి. మళ్ళీ సంప్రదాయం రావణుని నిరీశ్వరవాది అనదు. ఆవిధంగా చూసినప్పుడు భౌతికవాది అయిన రావణుడు ఈశ్వరవాది కూడా కనుక ఆదిమ పౌరాణికతకు దగ్గరగా ఉంటాడు. బహుశా అందుకే అతడు రాక్షసుడు అయ్యాడు. సరే, దీనిని ఇక్కడితో ఆపుదాం.

మళ్ళీ రాంభట్లగారిని పలకరిస్తే, ఆయన భౌతిక, భావవాద (లేదా ఆధ్యాత్మికవాద) చర్చను సాహిత్యంలోకి తీసుకొచ్చి మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు:

“సామాజిక చైతన్యరూపమైన సాహిత్యం ఎవరు సృష్టించినా అందులో మూడు అంశాలు ఉండి తీరుతాయి. అవి, ఒకటి సౌందర్యం. రెండు వాస్తవికత. మూడు తాత్వికత. ఈ మూడూ పాఠకునికి విజ్ఞానదాయకాలు. అందులో సౌందర్యాంశ చదవాలన్న కోరికను కలిగిస్తుంది. వాస్తవికాంశం విజ్ఞానదాయకం. తాత్వికాంశం వివేకదాయకం. అంటే సాహిత్యం వల్ల ఆనందం, విజ్ఞానం, వివేకం కలుగుతుంది.

సంప్రదాయకవులు విజ్ఞాన, వివేకాంశాలను విస్మరించి కవిత్వలక్షణం ఆనందమొక్కటే అన్నారు. కావ్యంలో వాస్తవికతా, తాత్వికతా ఉన్నా వాటిని సంప్రదాయపండితులు గుర్తించలేకపోయారు. ఆలంకారికుల్లో క్షేమేంద్రుడు మాత్రం విజ్ఞానదాయకమైన వాస్తవికతను గుర్తించాడు. దానికి ఆయన ఔచిత్యం అని పేరుపెట్టాడు…సదృశాన్ని చిత్రిస్తే దాన్ని ఔచిత్యమంటారని క్షేమేంద్ర మతం.  వాస్తవమైనప్పుడే సదృశత్వం అలవడుతుంది. ఔచిత్యాన్నే నేను వాస్తవికత అంటాను.”

visvanatha

ఈ సందర్భంలోనే విశ్వనాథవారి ‘వేయి పడగలు’ నవలపై ఆయన ఇలా అంటారు:

“వాస్తవికత అధిభూతం. దాన్ని అనుసరిస్తే కవి ఆధ్యాత్మిక దృష్టికి విరుద్ధంగా తయారవుతుంది కావ్యం. విశ్వనాథ సత్యనారాయణగారు వేయిపడగల్లో వాస్తవికతను అనుసరించారు. ఫలితం వేయిపడగలుగా విస్తరిల్లిన సాంప్రదాయిక కథలో ఒక్కొక్క పడగను పోగొట్టుకుని ధర్మారావు రూపంలో ఆఖరి పడగ ఒక్కటే మిగిలింది. అందుకనే ప్రాచీన కవులు వాస్తవికతను దూరంగా ఉంచుతారు. అభూతవర్ణనలతోనే కాలక్షేపం చేస్తారు కానీ వాస్తవికత జోలికి వెళ్ళే సాహసం చేయరు. వాస్తవికత అధిభూతం. వారి ఆధ్యాత్మికతకు విరుద్ధం. ఆ సంగతి పూర్వులకు తెలుసు.”

ఒకరికి నచ్చడం, నచ్చకపోవడం వేరే విషయం కానీ; సాహిత్య పరిశీలనలో ఇవి ఒక తరహా గీటురాళ్ళు. దానిని అలా ఉంచి ప్రస్తుతానికి వస్తే, చేతిలో దారాన్ని భద్రంగా పట్టుకుని గాలిపటాన్ని గాల్లోకి ఎగరేయడం భౌతిక, భావవాదాల అభేదాన్ని చెప్పే అమ్మ తాత్వికత. దారాన్ని వదిలేసినప్పుడు, లేదా దానంతట అదే తెగిపోయినప్పుడు గాలిపటం నేలకు పూర్తిగా దూరమైపోయి ఏటెటో కొట్టుకుపోవడం భౌతిక, భావవాదాలను వేర్వేరుగా, పరస్పర విరుద్ధాలుగా చెప్పే తాత్వికత.

***

చెప్పొచ్చేదేమిటంటే, ఆదిమ పౌరాణికతకు చెందిన అమ్మతత్వంలోకి తలదూర్చే ఏ పురా చరిత్రకారుడైనా అందులోని భౌతిక, భావవాదాల అంతస్సంబంధాన్ని గుర్తించక తప్పదు.  పైన చెప్పుకున్న రాంభట్ల గారైనా, జార్జి థాంప్సన్ అయినా, జోసెఫ్ క్యాంప్ బెల్ అయినా చేసింది అదే.

జార్జి థాంప్సన్ తన STUDIES IN ANCIENT GREEK SOCIETY, THE PREHISTORIC AEGEAN లో The Making of a Goddess అనే అధ్యాయాన్ని Childbirth and Menstruation అనే మొదటి ఉపశీర్షికతో ఇలా ప్రారంభిస్తారు:

మానవ సమాజపు తొలి దశలలో ఉమ్మడి శ్రమ అనేది జీవించడానికి ఒక షరతు. ఆహార సేకరణ, వేట అనేవి అప్పటికి ఇంకా అతి తక్కువ సాంకేతిక స్థాయిలో ఉండి, ఎక్కువ చేతులు అవసరమయ్యేవి. జనాభా పెరుగుదల అప్పుడో ప్రమాదకరమైన విషయం కాదు. జనాభా తక్కువైతే మాత్రం చావే.  కనుక ఏదైనా ఒక గుంపులో జనాభాను పెంచుకోవడం, జీవికకు అవసరమైన ఉత్పత్తి సాధనాలను సమకూర్చుకోవడంరెండూ ఒకటే. ఆహారోత్పత్తికి చెందిన సాంకేతికత అస్థిరంగానూ, అభద్రంగానూ ఉండడ మంటే; మనుషుల పునరుత్పత్తి కూడా ఉండడమే. ఆదిమ తెగలలో శిశుమరణాలు విపరీత స్థాయిలో ఉండేవి. ప్రతి చోటా శిశువు పుట్టుక చుట్టూ మాంత్రిక మైన తంతులు అల్లుకుపోవడానికి ఈ భౌతిక అవసరమే మూలం.

ఇలా భౌతిక పరిస్థితులతో ఈ అధ్యాయాన్ని ప్రారంభించి , మాంత్రిక మైన తంతులకు మూలం భౌతిక అవసరమేనని చెప్పడం ద్వారా ఆదిమ పౌరాణికతలోని భౌతిక, భావ వాదాల అంతస్సంబంధాన్ని వివరించడానికి థాంప్సన్ శ్రుతి చేస్తున్నారు. ఈ తంతులు మనుషుల మనుగడ కోసం ఉద్దేశపూర్వకంగా కల్పించినవి కావనీ, కేవలం అమ్మతనానికి చెందిన స్పందనలకు భావనాత్మక(ideological) వ్యక్తీకరణలని కూడా ఆయన అంటారు.

ఆయన ప్రకారం ఇంకా చెప్పుకోవాలంటే, వ్యవసాయాన్ని కనిపెట్టాక పై పరిస్థితులే మరింత ఉన్నత ప్రమాణంలో పునరావృతమయ్యాయి. ఈ కొత్త సాంకేతికత ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పుడు అడవుల్ని నరికి వ్యవసాయ యోగ్యం చేయడానికి బ్రహ్మాండమైన ప్రయత్నం అవసరమయ్యేది. వ్యవసాయ జనావాసాల చుట్టూ అంటురోగాలు, అడవి జంతువులతో సహా రకరకాల అజ్ఞాత ప్రమాదాలు పొంచి ఉండేవి. వీటిని అన్నింటినీ ఎదుర్కొంటూ వ్యవసాయం చేయడం ఆరోజుల్లో సామాన్య విషయం కాదు. అందుకే జర్మానిక్ భాషల్లోనూ, సెమెటిక్ భాషల్లోనూ కూడా భూమిని దున్నడ మంటే, ఒక పెద్ద నిర్మాణం (to build) చేయడమే. ఎంతో ఆటవికంగా ఎదురు తిరిగే అడవిని లొంగదీసుకోవడం మాటలు కాదు. ఈ పరిస్థితులలో ఏ ఒక్క కుటుంబమో ఒంటరిగా అడవిలో స్థిరపడడం కష్టం. ఎక్కువ జనసంఖ్యలోనే భద్రత. ప్రారంభంలో స్త్రీలే పంటలు పండించడానికి చెమటోడ్చేవారు. పంటల ఉత్పత్తికి, సంతానం కనడానికి వారికి ఒక స్పష్టమైన పోలిక కనిపించేది. పంట పండినా, ఎండినా; కడుపుపంట బతికినా, మరణించినా ప్రసూతి దేవతే కారణమనుకునేవారు.

స్త్రీ ప్రసవం చుట్టూ అల్లుకున్న మాంత్రిక తంతులే అన్ని తంతులకూ మాతృకలైనట్టు కనిపిస్తాయి. అవే వ్యవసాయానికీ విస్తరించాయి. ప్రసవ కాలంలోనూ ఋతుకాలంలోనూ కూడా రక్తస్రావం జరుగుతుంది. ఆదిమ సమాజాల దృష్టిలో అది సాధారణ రక్త స్రావం కాదనీ, మరో జీవికి ప్రాణం పోసే స్త్రీలోని అంతర్గతశక్తికి వ్యక్తీకరణ అనీ థాంప్సన్ అంటారు. ఋతుకాలాన్ని విఫలం చేస్తే భ్రూణహత్యాపాపం చుట్టుకుంటుందన్న విశ్వాసానికి మూలం ఇక్కడే ఉంది. దీని గురించి ఇంతకుముందు యయాతి-శర్మిష్టల కథలో చెప్పుకున్నాం. ఋతు, లేదా ప్రసవ రక్తం జీవిని పుట్టించే ఒక శక్తి వనరు అయినప్పుడు దానిని సక్రమంగా నియంత్రించడం అవసరం. లేకపోతె అది తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. ఆ నియంత్రణకు ఉద్దేశించినవే మాంత్రికమైన తంతులు.

ఈ మాంత్రికమైన తంతులతోపాటే అన్ని నిషేధాలకు మాతృక అయిన తొలి నిషేధం పుట్టిందని థాంప్సన్ అంటారు. అది, గర్భవతితో లేదా ఋతుకాలంలో ఉన్న స్త్రీతో లైంగిక క్రియ జరపకూడదన్న నిషేధం. అలాగే, కొత్తగా ఋతుమతి అయిన, ఆ తర్వాత నెల నెలా ఋతుకాలాన్ని ఎదుర్కొనే స్త్రీని శుద్ధి అయ్యేవరకూ పురుషుడు చూడకూడదనీ, ఎవరూ తాకకూడదనీ, దూరంగా ఉంచాలనే ఆనవాయితీ వచ్చింది.

విశేషమేమిటంటే, ఋతు సంబంధమైన ఇలాంటి కట్టడుల వెనుక రెండు పరస్పర విరుద్ధమైన దృష్టికోణాలు ఉన్నాయి. మొదటి కోణం ప్రకారం, ఋతు కాలంలో లేదా ప్రసూతి స్థితిలో ఉన్న స్త్రీ ఎవరూ తాకకూడని పవిత్రురాలు. ఎలాగంటే, దక్షిణాఫ్రికాలోని హెరేరే తెగలలో ఒక ఆచారం ఉంది. రోజూ పొద్దుటే పాలు పితికిన తర్వాత వాటిని తీసుకొచ్చి బాలెంతరాలు ముందు పెడతారు. ఆమె వాటిని తన పెదవులతో తాకి పవిత్రం చేస్తుంది. మరోకోణం ప్రకారం ఋతుకాలంలో లేదా ప్రసూతి స్థితిలో ఉన్న స్త్రీ అపవిత్రురాలు. రోమన్ భాషలో sacra అనే పదం ఆమెను పవిత్రురాలిగానూ, అపవిత్రురాలిగానూ కూడా చెబుతుంది. పితృస్వామిక సమాజంలో స్త్రీ మతం మీద ఆధిపత్యాన్ని కోల్పోయాక ఋతుకాలాన్ని, ప్రసవ కాలాన్ని అపవిత్రాలుగా వ్యతిరేక దృష్టితో చూడడం మొదలైందని థాంప్సన్ అంటారు. ఆ అపవిత్ర, వ్యతిరేక భావనలనే స్త్రీత్వానికి ఆపాదించి ఈసడించడమూ మొదలైంది. చెడు అంతటికీ మూలంగా, మంత్రగత్తెగా స్త్రీ పరిగణన పొందుతూ వచ్చింది.

ఇటువంటి భావాలు ఏ ఒక్కచోటో కాదు, ప్రపంచమంతటా పుట్టాయని థాంప్సన్ అనడాన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. ఋతుకాలంలోనూ, ప్రసవ కాలంలోనూ ఉన్న స్త్రీ పట్ల వ్యవహరించే తీరులో ఉన్నంత ఏకీభావం మానవజీవితంలోని మరే ఇతర అంశంలోనూ కనిపించదని కూడా ఆయన అంటారు.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

 

పాంచాలి పెరటి సాగు!

కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)చంద్రుడి గురించి మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో ఒకసారి మహాభారతంలోకి వెళ్లవలసిన అవసరం కనిపిస్తోంది. అరణ్యపర్వం, ప్రథమాశ్వాసంలోని ఈ ఘట్టం చూడండి…

పాండవులు రాజ్యం కోల్పోయి, ద్రౌపదిని వెంటబెట్టుకుని అరణ్యవాసానికి బయలుదేరాడు. వారి వెంట కొంతదూరం పౌరులు కూడా వెళ్లారు. వారిని వెనక్కి పంపించివేసిన తర్వాత గంగాతీరానికి వెళ్ళి, ఒక పెద్ద మర్రిచెట్టుకింద ఆగి, గంగలో స్నానం చేసి, ఒక పగలూ, రాత్రీ  పాండవులు అక్కడే గడిపారు. అంతలో వారిని అభిమానించే బ్రాహ్మణులు అగ్నిహోత్రాలను, బంధువులను, శిష్యులను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు. మేము కూడా మీతో వనవాసం చేయడానికి నిర్ణయించుకున్నామని వారు ధర్మరాజుతో అన్నారు.

“ఘోరారణ్యంలో కందమూలాలు తింటూ గడపడం మాకు ఎలాగూ తప్పదు. మీ కెందుకీ కష్టం? క్రూరమృగాల మధ్య వనవాసం మీకు తగదు. దయచేసి  మీ ఇళ్లకు తిరిగివెళ్ళండి” అని ధర్మరాజు వారితో అన్నాడు.

అప్పుడు బ్రాహ్మణులు దుఃఖిస్తూ, “మీలాంటి ధార్మికులను విడిచి ఎలా వెడతాం? మేము మీకు ఆశ్రితులం, భక్తులం. మా పోషణ గురించి ఆలోచించవద్దు. మా కందమూలాలు మేమే సంపాదించుకుంటాం. జపాలు, హోమాలు మొదలైన పుణ్యకార్యాలు చేస్తూ మీ శ్రేయస్సుకు పాటుపడతాం. అంతే తప్ప మీకు అపకారం చేసిన ఆ ధార్తరాష్ట్రుల రాజ్యంలో మేము ఉండలేం” అన్నారు.

వారి ఇష్టాన్ని ధర్మరాజు కాదనలేకపోయాడు. అయితే, వీరు కందమూలాలు తింటుంటే తను ఎలా చూడగలననుకుని బాధపడ్డాడు. ఈ అడవిలో వీరికి ఆహారం సమకూర్చే మార్గం చెప్పమని పురోహితుడైన ధౌమ్యుని కోరాడు. అప్పుడు ధౌమ్యుడు,

“పూర్వం జీవులన్నీ పుట్టిన తర్వాత అవి ఆకలితో బాధపడుతుండడం చూసి సూర్యుడికి జాలి కలిగింది. తను ఉత్తరాయణంలో ఉన్నప్పుడు భూమిలోని రసాన్ని స్వీకరించి దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఆ రసాన్ని మేఘాలలో నింపి, దాని ద్వారా ఓషధులను(ఆహారాన్ని ఇచ్చే మొక్కలను) పొందాడు. రాత్రి పూట చంద్ర కిరణాలనే అమృతంతో వాటిని పెరిగేలా చూసి వాటినుంచి అన్నం పుట్టించి జీవుల ప్రాణం నిలిపాడు. కనుక అన్నం నిండా ఉన్నది సూర్యుడే. భీముడు, వైన్యుడు, కార్తవీర్యుడు, నహుషుడు మొదలైన పూర్వ రాజులందరూ సూర్యుని ఆరాధించి, అన్నాన్ని సంపాదించి దానితో ప్రజలను పోషించారు. కనుక నువ్వు కూడా సూర్యుణ్ణి ప్రార్ధించు” అన్నాడు.

పౌరాణిక శైలిలో చెప్పిన ఈ మాటలు మనకు బాగా తెలిసిన ఒక భౌతికధర్మాన్ని చెబుతున్నాయి. ఉత్తరాయణంలో వచ్చే వేసవి కాలంలో సముద్రాలు, నదులలోని నీరు ఆవిరై మేఘాలు ఏర్పడతాయి. దక్షిణాయనంలో వచ్చే వర్షాకాలంలో ఆ మేఘాలు వర్షించి ఆహారపు పంటలను ఇస్తాయి. పైన చెప్పిన పూర్వపు రాజులందరూ సూర్యుని ఆరాధించి అన్నం సంపాదించి ప్రజలను పోషించారంటే అర్థం– వ్యవసాయం  ద్వారా ఆహారోత్పాదన చేశారనే. ఈవిధంగా ధౌమ్యుడి మాటల్ని మనకు తెలిసిన భాషలోకి తర్జుమా చేసుకుంటే, అవి వ్యవసాయం గురించి చెబుతున్నాయి. సూర్యుణ్ణి ప్రార్థిస్తే ఆహారం లభిస్తుందనడం; సూర్యగమనంతో ముడిపడిన ఒక భౌతికధర్మంపైనా, వ్యవసాయమనే భౌతికచర్యపైనా పురుషభావారోపణ చేయడమే.  ఏతావతా ధౌమ్యుడు అంటున్నది ధర్మరాజును వ్యవసాయం చేయమనే!

అదలా ఉండగా, ధౌమ్యుడి మాటల్లో మనకు ప్రస్తుత విషయానికి అవసరమైన అదనపు వివరం, మేఘాల ద్వారా తను పొందిన ఓషధులను సూర్యుడు రాత్రిపూట చంద్రకిరణాలనే అమృతంతో తడిపి వాటిని పెరిగేలా చూశాడన్నది!

పురోహితుడు చెప్పినట్టే ధర్మరాజు సూర్యుని పువ్వులతో పూజించి, ఆ రోజు ఉపవాసముండి, భాగీరథీ జలాలలో నిలబడి ఇంద్రియాలను అదుపు చేసుకుని వివిధ సూర్యనామాలతో జపం చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. “(అరణ్యవాసం చేసే) ఈ పన్నెండేళ్లూ నీ వంటశాలలో ద్రౌపది సమకూర్చిన వన్యఫల మూలకాలు అక్షయాలై, నాలుగు రకాల ఆహారాలు అవుతా”యన్నాడు.

పురాకాలంలో లౌకిక కర్మ, మత కర్మ అనే తేడాలు లేవనీ; ప్రతి లౌకిక కర్మా విధిగా మతపరమైన తంతుతో మొదలు కావలసినదేననీ గతంలో అనుకున్నాం. ఆ దృష్ట్యా చూసినప్పుడు, పురోహితుని సారథ్యంలో ధర్మరాజు మతపరమైన  తంతు జరిపి వ్యవసాయం ద్వారా ఆహార సంపాదనకు పూనుకున్నాడన్న ఒక సాధారణ విషయాన్నే పై ఘట్టం సూచిస్తోంది. కాకపొతే పౌరాణిక శైలికి అనుగుణంగా దానికి కొంత మాంత్రికతను జోడించి కథకుడు చెబుతున్నాడు. ఆ మాంత్రికతను మరింత ముందుకు తీసుకువెళ్లి, ధర్మరాజుకు సూర్యుడు ‘అక్షయపాత్ర’ను ఇచ్చాడనీ, దాని ప్రభావంతో ద్రౌపది అన్ని రకాల ఆహార పదార్థాలను సృష్టించి పూటపూటా ఎంతమందికైనా షడ్రసోపేతమైన భోజనం పెట్టేదనే ఊహకు రెక్కలు తొడిగారు.

గమనించండి…ధర్మరాజుకు సూర్యుడు అక్షయపాత్రను ఇచ్చినట్టు పై కథనంలో లేదు. ద్రౌపది సమకూర్చిన(‘ద్రుపదరాజపుత్రిచేత సాధితంబులై’- అని కవి ప్రయోగం) వన్యఫల మూలకాలే అక్షయాలు అవుతాయని మాత్రమే సూర్యుడు అన్నాడు. అంటే, మానవప్రయత్నంతోనే ఆహారం పండించుకోవాలని అర్థం. ఇంకా విశేషమేమిటంటే  ఇక్కడ ఆ మానవప్రయత్నం కూడా పాండవ సోదరులది కాదు; ద్రౌపదిది! వన్యఫల మూలకాలను సమకూర్చవలసింది ద్రౌపదే.

నా ఉద్దేశంలో, మహాభారతంలోని ఈ వివరం ఒక అపురూపమైన పురాచారిత్రక సత్యాన్ని చెబుతోంది. అది, వ్యవసాయం, పశుపాలన అనేవి పెద్ద ఎత్తున విస్తరించి పూర్తిగా పురుషుడి అధీనం కావడానికి ముందు స్త్రీల చేతుల్లో ఉండేవన్నది. పురుషుడు వాటిని తన చేతుల్లోకి తీసుకున్నాక కూడా పరిమిత స్థాయి కలిగిన పెరటి సాగును, కంచె పశుపాలనను స్త్రీలే నిర్వహించేవారు. ద్రౌపది సమకూర్చిన వన్యఫలమూలకా లన డంలో అదీ మర్మం.

మహాభారత మూలకథలోని కొన్ని ముఖ్యమైన కథాంశాలు ప్రచారంలో లేకపోవడం నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, పాండవులు, ద్రౌపది పన్నెండేళ్ళ అరణ్యవాసమూ ఒంటరిగా చేశారనే ఊహకు మనం అలవాటు పడిపోయాం. కానీ అది నిజం కాదు.  వారి వెంట పరివారమూ, పరిచారకులే కాక, రథాలూ, గుర్రాలూ వగైరాలు ఉన్నాయి. ఇందుకు విరాటపర్వం, ప్రథమాశ్వాసమే సాక్ష్యం.

అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి ఉపక్రమించేముందు; ధర్మరాజు తమ్ముళ్లతో కలసి ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. వాటి ప్రకారం, అజ్ఞాతవాసం ఏడాదీ తమ అగ్నిహోత్రాలను ధౌమ్యుడు సంరక్షించాలి. వంటలవారు, వారి అధిపతి(మహానసాధ్యక్షుడు), ద్రౌపది పరిచారికలు ద్రుపదపురానికి వెళ్ళాలి. ఇంద్రసేనుడు మొదలైన రథసారథులందరూ ద్వారకానగరానికి వెళ్ళాలి! ఆ సమయంలో ధర్మరాజు ఎంత జాగ్రత్త తీసుకుంటాడంటే, “మా గురించి ఎవరైనా మిమ్మల్ని సమాచారం అడిగితే, ద్వైతవనంలోనే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారనీ, ఆ తర్వాత వారి గురించి మాకు తెలియదనీ” చెప్పమంటాడు. అజ్ఞాతవాస కాలంలో తమ ఉనికిని శత్రువు కనిపెడితే,మళ్ళీ అరణ్య,అజ్ఞాతవాసాలు చేయవలసివస్తుంది.

పాండవులు ఇలా మందీ మార్బలంతో అరణ్యవాసం చేశారన్నప్పుడు, వారికి అడవే ఒక మోస్తరు రాజ్యంగానూ, వారున్న ప్రదేశమే తాత్కాలిక ‘రాజధాని’గానూ ఉండేదన్నమాట. ఇందుకు ఇప్పటికిప్పుడు గుర్తొచ్చే ఒక పోలిక, టిబెట్ బౌద్ధ మతగురువు దలైలామా. 1959లో ఆయన టిబెట్ నుంచి శరణార్థిగా మన దేశానికి చేరుకున్న తర్వాత, ఇక్కడి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆయన ప్రవాస ప్రభుత్వా(Government in Exile)న్ని, ప్రవాస మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకున్న సంగతి మనకు తెలుసు.    

ప్రస్తుతానికి వస్తే,  ‘ద్రౌపది సమకూర్చిన వన్యఫలమూలకాలు’  ద్రౌపది స్వయంగా పండించినవి కాకపోవచ్చు. వాటి సాగుపై ద్రౌపది అజమాయిషీ వహించి ఉండచ్చు. అలాగే,  ద్రౌపదే స్వయంగా వండి పెట్టేదనడానికీ అవకాశం లేదు. అక్కడ కూడా ఆమెది పర్యవేక్షణ బాధ్యతే.

***

‘రాత్రి పూట చంద్రకిరణాలనే అమృతంతో ఓషధులు వృద్ధి పొందేలా (సూర్యుడు)చూడడం, ‘ద్రౌపది సమకూర్చిన వన్యఫల మూలకాలు అనే పై రెండు వివరాలను పట్టుకుని ఇప్పుడు జార్జి థాంప్సన్ ను పలకరిద్దాం:

పంటల వృద్ధికి కారణమైన తేమ చంద్రుడి నుంచే లభిస్తుందని గ్రీసులోనే కాక, ప్రతిచోటా విశ్వసిస్తారని ఆయన అంటారు. మంచు లేదా తుషారం పౌర్ణమి రోజునే ఎక్కువగా కురుస్తుందన్న ప్లూటార్క్ మాటను ఆయన ఉదహరిస్తారు. కవులు తుషారాన్ని చంద్రుని కుమార్తెగా చెబుతారు. మన సంస్కృతంలో కూడా చంద్రుడు ‘హిమ’కరుడు, ‘తుహిన’కరుడు! హిమమన్నా, తుహినమన్నా మంచే.  సిసిరో(క్రీ.పూ. 106), ప్లినీ(క్రీ.శ. 23) అనే రోమన్ పండితుల మాటలు, పైన పేర్కొన్న ధౌమ్యుడి మాటలకు ఇంకా దగ్గరగా ఉంటాయి. సిసిరో ప్రకారం, భూమిలోంచి పుట్టే ప్రతి ఒక్కటీ ఎదగడానికి అవసరమైన తేమ చంద్రుడి నుంచే ప్రవహిస్తుంది. ఇక, సూర్యుడు హరించే తేమను అంతటినీ చంద్రుడు మళ్ళీ ఉత్పత్తి చేస్తాడని ప్లినీ అంటాడు.

పైరు పంటలను వృద్ధి చెందించేవాడే కాదు, అన్ని రకాల జీవజలాలను అందించేవాడూ చంద్రుడే. ‘విత్తనాలకు, మొక్కలకు వాహకుడు’ చంద్రుడే నని భారతీయులు భావిస్తే, వృక్షజీవులన్నిటికీ అధిపతి చంద్రుడని బాబిలోనియన్లు విశ్వసించేవారని థాంప్సన్ అంటారు. భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే ఒక మొక్కకు ‘సోమ’ అని చంద్రుడి పేరు పెడితే, ఉత్తరఅమెరికావాసులు మొక్కజొన్నను చంద్రసంబంధిగా భావించేవారని కూడా ఆయన అంటారు. ‘చంద్రుడు వృద్ధి చెందుతున్న కొద్దీ మొక్కలో రస స్రావం పుంజుకుంటూ ఉంటుం’దని –రియో గ్రాండే (అమెరికాలోని కొలరాడోలో ఉన్నఒక నదీ, దాని తీరప్రాంతం) లోని స్థానిక తెగలలో వ్యాప్తిలో ఉన్న నుడికారం.

చెట్ల నుంచి వచ్చే జిగురు లాంటి పదార్థాలలో, ముఖ్యంగా ధూపం వేయడానికి ఉపయోగించే సువాసన గల వాటిలో, ఆ లక్షణాలకు కారణం చంద్రుడే. అలాగే తుమ్మచెట్టును స్త్రీ గానూ, దానినుంచి స్రవించే జిగురును గడ్డకట్టిన ఋతురక్తం గానూ కొన్ని చోట్ల భావిస్తారు. దానికి మహిమ ఉంటుందన్న నమ్మకంతో తాయెత్తుగా ధరిస్తారు.

నాట్లు వేయడానికి, మొక్కలు నాటడానికి , పెళ్లిళ్లకు యోగ్యమైన సమయం పౌర్ణమే నని గ్రీకులు భావించేవారు. అదే సూత్రాన్ని అనుసరించి పంట కోతకు, మొక్కలు, చెట్లు నరకడానికి, గొర్రెల ఉన్ని కత్తిరించడానికి, చివరికి కేశఖండనకు చంద్రుడు క్షీణదశలో ఉన్న రోజులు(కృష్ణపక్షం) మంచివని అనుకునేవారు, రోమన్ చక్రవర్తి టిబెరియస్ కేశఖండన విషయంలో ఈ నియమాన్ని కచ్చితంగా పాటించేవాడు. మన దగ్గర కూడా సన్యాసులు, శ్రోత్రియులు కేశఖండనకు తిథి వారాలు చూసుకోవడంతో సహా ఇలాంటి నియమాలనే పాటిస్తారు. ఇక నూతన శిశువులను దాదులు ఆరుబయటకు తీసుకెళ్ళి చందమామకు చూపిస్తారని ప్లూటార్క్ అనడం ప్రత్యేకించి మనకు ఆసక్తికరం. మనదగ్గర అచ్చంగా ఇలాంటి ఆచారమే ఉందో లేదో కాని, పసిపిల్లలకు ‘చందమామరావే, జాబిల్లి రావే’ అంటూ చందమామను చూపించడం ఉంది. బహుశా పసిపిల్లలను చంద్రుడికి చూపించే ఆచారమే, పసిపిల్లలకు చంద్రుణ్ణి చూపించే అలవాటుగా మారిందేమో తెలియదు.

సంగతేమిటంటే, స్త్రీల లైంగిక జీవితంతో ముడిపడిన చంద్రుని ఆరాధననుంచే వారి సామాజిక విధులు కూడా పుట్టాయని థాంప్సన్ అంటారు. ఉదాహరణకు, నీళ్ళు తేవడం, మొక్కలను పెంచడం, మంచును, వర్షపు నీటిని సమీకరించడం ప్రధానంగా స్త్రీల బాధ్యతే. ఆవిధంగా పెరటి సాగు వారి చేతుల మీదుగానే జరిగేది. ‘ద్రౌపది సమకూర్చిన వన్యఫల మూలకాలు’ అనే మాట ఆ పెరటి సాగునే సూచిస్తున్నాఆశ్చర్యంలేదు.

అలాగే, కంచె పశుపాలనను కూడా స్త్రీలు నిర్వహించేవారు. కంచె పశుపాలన అంటే ఇంటిదగ్గరే పశువుల పెంపకం. వేటకు వెళ్ళిన మగవాళ్ళు అక్కడ పట్టుకున్న చిన్న చిన్న జంతువులను ఇంటికి తీసుకొస్తే స్త్రీలు వాటిని పెంచేవారు. అలా కొన్ని జంతువులు మనిషికి మాలిమి అయ్యాయి. అదలా ఉంచితే, చంద్రుని ఆరాధనలో బలులు ఇవ్వడం కూడా ఉండేది. స్త్రీలు బలి ఇచ్చే జంతువులు కూడా ప్రతిచోటా చిన్నవిగానే ఉంటాయి. ఈ బలిచ్చే జంతువుల ఎంపిక ప్రతిచోటా ఒకేలా ఉండడం కొట్టొచ్చినట్టు కనిపించే విశేషమని థాంప్సన్ అంటారు.

selene-moon goddess

చంద్రునికి బలి ఇచ్చే జంతువులు ప్రధానంగా కుందేలు, మేక, పంది. నేడు క్షుద్రంగా భావించే నిన్నటి మాంత్రికచర్యలలో (witch craft) ప్రాముఖ్యం కలిగినవి ఇవే. సెమెటిక్ స్త్రీల తంతులలో పావురం కూడా ఇలాంటిదే. అలాగే, పిల్లి! పురాతన ఈజిప్టులో పిల్లిని పూజించేవారు. అది అనేక రంగుల్లో ఉండడం, రాత్రిళ్ళు  విలక్షణమైన అలవాట్లను కనబరచడం, అది పిల్లల్ని పెట్టే తీరు కూడా విలక్షణంగా ఉండడం చంద్రునికి అన్నివిధాలా సరిపోయే చిహ్నంగా దానిని చూపిస్తాయని ప్లూటార్క్ అంటాడు. అలాగే పిల్లి తన జీవిత కాలంలో మొత్తం 28 పిల్లల్ని పెడుతుంది. చాంద్రమానానికి చెందిన నెలకు కూడా 28 రోజులు. పౌర్ణమి రోజున పిల్లి కళ్ళు చాలా పెద్దవి గానూ, ప్రకాశవంతంగానూ ఉండి, చంద్రుని క్షీణదశలో చిన్నవిగానూ, కాంతిహీనంగానూ మారుతుంటాయి.

మన దగ్గర కూడా పిల్లి ఒక మార్మిక జీవిగానే కనిపిస్తుంది. దానికితోడు మనం పిల్లిని ఒక తరహా క్షుద్ర జంతువుగానే చూస్తాం. పిల్లి ఎదురవడాన్ని అపశకునంగా భావిస్తాం. మళ్ళీ, పిల్లిని చంపడం మహాపాపమన్న సెంటిమెంటూ మన దగ్గర కనిపిస్తుంది. స్త్రీ ప్రధానమైన పురాకాలపు మాంత్రిక తంత్రాలలో పిల్లికి పాత్ర ఉండడమే, దానిపట్ల మనలో అజ్ఞాతంగా గూడుకట్టుకున్న వ్యతిరేకతకు కారణమేమో తెలియదు. అదే సమయంలో పిల్లికి గల మార్మిక లక్షణం కూడా మనకు తెలియకుండానే మనపై ప్రభావం చూపి దానిని చంపడం పాపమన్న సెంటిమెంటుకు దారి తీయించి ఉండచ్చు.

మళ్ళీ చంద్రుడి విషయానికి వస్తే, చంద్రుడిలో ఉందనుకునే  పునరుజ్జీవకగుణమే రాళ్లలో, ముఖ్యంగా స్ఫటికాలలో, జాతిరాళ్లలో కూడా ఉంటుందనే విశ్వాసమూ చాలాచోట్ల ఉంది. అలాగే, మనిషి ఎముకల్లోనూ, కేశాలలోనూ కూడా. అందుకే ఆయా సంస్కారాలు జరిపేటప్పుడు పన్ను పీకించడం, జుట్టు తీయించడం చేస్తూ ఉంటారనీ, శరీరంలోని ఈ భాగాలకు స్వయం పునరుజ్జీవక లక్షణం ఉండడమే దీనికి కారణమని థాంప్సన్ అంటారు. మన దగ్గర అనేక తంతులలో కేశఖండనం జరుగుతుందన్న సంగతి తెలిసినదే.

ఇటువంటి అనేక ఆచారాలకు గల విశ్వజనీనతే ఇక్కడ ప్రధానంగా గుర్తించవలసిన అంశం.

మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

 

 

 

 

ఇంకా తెలియని చందమామ కథలెన్నో!

                                                                                        కల్లూరి భాస్కరం 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)పురా ప్రపంచపు లోలోపలికి వెడుతున్నకొద్దీ ఆ ప్రపంచమూ, నేడు మనం జీవిస్తున్న ప్రపంచమూ  రెండు వేర్వేరు గ్రహాలనిపిస్తాయి.  ఆవిధంగా ఈ వ్యాసాలలో నేను చేస్తున్నది గ్రహాంతరయానమే.

పురాప్రపంచం, భౌతికవాస్తవికతను మాంత్రికవాస్తవికత కప్పేసిన ప్రపంచం.  రెండూ ఒకదానితో ఒకటి తాదాత్మ్యం చెందిన ప్రపంచం. నేటి మన ప్రపంచం వేరు. ఇది పురాప్రపంచంతో నేటికీ వదులు వదులుగా నైనా అనుసంధానం కలిగిన ప్రపంచమే కానీ, ఆ సంగతి తెలియని అజ్ఞానం దానిది. అలాగే నేటి ప్రపంచం తనకు మాంత్రిక వాస్తవికత ఏమిటో, భౌతికవాస్తవికత ఏమిటో తెలుసుననుకుంటూ ఉంటుంది. అయితే రెండూ పాలూ, నీళ్లలా వేర్వేరు అనుకుంటుందే తప్ప; పాలూనీళ్లలా అవి కలసిపోయి ఉన్న పురాప్రపంచాన్ని అది పోల్చుకోలేదు….

ఇంతకుముందు అనేకసార్లు చెప్పుకున్నట్టు;  పురాకాలపు మాంత్రిక ప్రపంచం, దాదాపు ప్రపంచమంతా ఒకేలా పంచుకున్న ప్రపంచం!

ఈ సందర్భంలో పద్దెనిమిదేళ్ళ క్రితం వచ్చిన ‘నాగమండల’ అనే సినిమా గుర్తొస్తోంది.  మూడుసార్లైనా దానిని చూసి ఉంటాను. గుర్తొచ్చినప్పుడల్లా అందులోని కథా, చిత్రీకరణా, సన్నివేశాలూ, పాటలూ ఆవిష్కరించిన అద్భుత మాంత్రిక ప్రపంచం నా కళ్ళముందు ఇప్పటికీ పచ్చ పచ్చగా కదలాడుతూ ఉంటుంది. ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్ అదే పేరుతో రాసిన కన్నడ నాటకానికి ఇది చిత్రానువాదం.

అప్పన్న ఒక మొరటోడు. అతనికో ఉంపుడుగత్తె. చనిపోయిన అతని తల్లి మీద అభిమానం కలిగిన ఒక ముసలామె అతనికి పెళ్లి చేయాలనుకుంటుంది. పొరుగూరికి వెళ్ళి ఒక సంబంధం ఖాయం చేసుకుని, అప్పన్నను ఒప్పించి పెళ్లి జరిపిస్తుంది. ముగ్ధత్వం, అమాయకత్వం, భయం నిండిన బాల్య కౌమార దశలను దాటి పూర్తిగా యవ్వనంలోకి రాని రాణి కాపురానికి వస్తుంది. ఇంట్లో తనూ, భర్తే. తొలిరేయి అప్పన్న భార్యతో మొరటుగా ప్రవర్తించేసరికి భయపడిపోయి అతన్ని నెట్టేస్తుంది. దాంతో కోపం వచ్చిన అప్పన్న అప్పటికప్పుడు ఇంటికి తాళం వేసి ఉంపుడుగత్తె దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పటినుంచి రోజూ అదే వరస.

ముసలామెకు ఇది తెలిసి ఒక మూలికను తెచ్చి రాణికి ఇచ్చి, దానితో కషాయం చేసి పాలల్లో కలిపి నీ మొగుడిచేత తాగిస్తే నీకు అతను లొంగుతాడని చెప్పింది. తీరా దానిని సిద్ధం చేసినా మొగుడికి ఇవ్వడానికి భయపడి రాణి ఒక పాము పుట్ట మీద పోస్తుంది. అందులోని పాము దానిని తాగి రాణిపై మరులుగొంటుంది. రోజూలా భర్త రాత్రి కాగానే ఇంటికి తాళం వేసి ఉంపుడుగత్తె ఇంటికి వెళ్ళగానే, ఆ పాము కిటికీలోంచి ఇంట్లోకి ప్రవేశించి అప్పన్న రూపంలోకి మారిపోయి రాణితో సంభోగిస్తుంది.

olymias

కొంతకాలం తర్వాత రాణి గర్భవతి అవుతుంది. అప్పన్నకు అదెలా సాధ్యమో అర్థంకాలేదు. భార్య శీలాన్ని శంకించి పంచాయితీ పెడతాడు. “నా భర్తను, ఈ పామును తప్ప”  నేను మరో మగాణ్ణి తాకి ఎరగను అంటూ పాముపుట్టలోకి చేయి పెట్టి పామును తీసి పట్టుకుని రాణి ప్రమాణం చేస్తుంది. పాము ఆమెను ఏమీ చేయదు. ఆమె నిర్దోషి అని, అప్పన్నే అనవసరంగా భార్యమీద నిందవేస్తున్నాడని పంచాయితీ పెద్దలు నిర్ణయిస్తారు. చివరికి అతని ఉంపుడుగత్తెకు కూడా రాణిపై గౌరవం ఏర్పడి, అప్పన్నే అబద్ధమాడుతున్నాడని భావించి అతన్ని దూరంగా ఉంచుతుంది. అప్పటికీ సమాధానపడని అప్పన్న ఒకరోజు రాత్రి మాటువేసి, పాము తమ పడకగదిలోకి వెళ్ళడం, తన రూపంలోకి మారిపోవడం చూస్తాడు. పాము మీద పగ పెంచుకుని చివరికి దానిని సజీవదహనం చేస్తాడు. ఆ తర్వాత అతను రాజీపడి పామువల్ల భార్యకు కలిగిన కొడుకును తన కొడుకుగా గుర్తించడం, భార్యను ఏలుకోవడం ఈ కథకు ముగింపు.

ఈ సినిమాను చూసిన ప్రతిసారీ, ప్రతిక్షణం ఒక మాంత్రిక ప్రపంచంలో విహరిస్తున్నట్టు… ఒకే అనుభూతి! పరిసరాలు, సన్నివేశాల కల్పన, పాత్రల చిత్రణ, సంగీతం, పాటలలోని సాహిత్యంతో సహా అన్నింటిలోనూ మాంత్రికవాస్తవికత ఉట్టిపడేలా చేయడంలో దర్శకుడు (టి.ఎస్. నాగాభరణ)చూపిన స్పృహ, ప్రతిభ ఆశ్చర్యచకితం చేస్తాయి. అలాగే ఫోటోగ్రఫీ! అది భౌతిక ప్రపంచంపై పలచని తెర కప్పి మనల్ని పగలూ, రాత్రీ కానీ ఒక సంధిలో వేలాడదీస్తూ మన ముందు పూర్తిగా ఒక స్వాప్నిక, మార్మిక జగత్తును ఉంచుతుంది.

ప్రకృతీ, మనిషీ ఒక్కచోట ఒదిగిపోయి సహజీవనం చేయడాన్ని ఈ సినిమా చూపిస్తుంది. ఇందులోని ముసలామె ప్రకృతికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టే కాక, ఒక మంత్రగత్తెలా రూపుకడుతుంది. ఆమె ప్రకృతిలోని సౌకుమార్య, ముగ్ధత్వాలకూ; పురుషుడిలోని మొరటుదనంతో కూడిన లైంగికవిజృంభణకూ పెళ్లి చేయాలనుకుంటుంది.  ఆ రెండు విరుద్ధ లక్షణాల మధ్య జరిగే నిరంతర సంఘర్షణలోంచే పునరుత్పత్తి రూపంలో ప్రకృతి తనను తాను పొడిగించుకుంటూ ఉంటుంది.  ఆ మొరటోడి తల్లి మీద ఉన్న అభిమానంతో  అతని మీదా, పెళ్లీడు వచ్చిన ఆ అమ్మాయి మీదా కలిగిన ప్రేమవల్ల ముసలామె వాళ్ళిద్దరికీ ముడిపడేలా చూస్తుంది. ఒక జంటను కూర్చడమంటే తద్వారా జరిగే సృష్టికార్యాన్నీ, పునరుత్పత్తినీ ప్రకృతి ఉత్సవీకరించుకోవడమే. అతణ్ణి వశపరచుకునే ఉపాయాన్ని అమ్మాయికి ముసలామె ప్రకృతినుంచే అందిస్తుంది. ఆమెకు బిడ్డ కలగడంలో కూడా పాము రూపంలో ప్రకృతి భాగస్వామి అవుతుంది. అనివార్యమైన ప్రకృతిలోని పునరుత్పత్తి ధర్మానికి ఇది సూచన.

నేనిక్కడ నేల విడిచి ఏదో తాత్వికమైన సాము చేస్తున్నానని అనుకోవద్దు. ఆదిమ పౌరాణికతలో మనిషి జీవితం ప్రకృతితో, అందులోని భయబీభత్సాలతో సహా, ఎలా మమేకంగా అల్లుకుందో మరోసారి సూచించడమే ఉద్దేశం.

***

పాముతో ముడిపడిన జానపదవిశ్వాసం నుంచి పలుకుతున్న ఈ కథ మూలాలు మన దేశాన్ని దాటి ప్రపంచ పురాచరిత్రలోకి ఎలా విస్తరిస్తున్నాయో చూడండి…

ప్రాచీన గ్రీకు సమాజం గురించి రాస్తున్న జార్జి థాంప్సన్.  స్త్రీతో పాము సంభోగించడం అనేది చాలా తరచుగా ఎదురయ్యే ఇతివృత్తం అంటారు. గ్రీసులో ఎపిడారస్ అనే చోట సర్పవీరుడైన అస్క్లేపియస్ ఆలయం ఉంది. అందులో కొన్ని శాసనాలు ఉన్నాయి. ఒక శాసనంలోని ఇతివృత్తం ప్రకారం, సంతానం కలగని ఒక స్త్రీ  అప్పటి నమ్మకాన్ని బట్టి ఆ ఆలయానికి వెళ్ళి, ఒక రాత్రి అక్కడ గడిపింది. దేవుడు ఒక పామును తీసుకుని తన దగ్గరకు వచ్చినట్టు ఆమె కలగంది. ఆ పాము ఆమెతో సంభోగించింది. తొమ్మిది నెలల తర్వాత ఆమెకు మగ కవలలు కలిగారు. పాము పాత చర్మం విడిచి కొత్త చర్మం ధరించడం ద్వారా ఎప్పటికప్పుడు జీవితాన్ని, యవ్వనాన్ని పొడిగించుకుంటూ ఉండడమే దానికి ఇటువంటి మహిమను ఆపాదించడానికి మూలం.

పశ్చిమ ఆఫ్రికాలో పోంగ్వే స్త్రీలు రహస్య సమాజంగా ఏర్పడి పాముతో ముడిపడిన సౌభాగ్య తంత్రాలు జరుపుతూ ఉంటారు. అందుకోసం వాళ్ళు అడవిలో బాగా లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ తంతులు ఎంత రహస్యంగా జరుగుతాయంటే, ‘అమ్మ’(Mother) అని పిలిచే ఒక నాయకురాలు వారికి ఉంటుంది కానీ, ఆమె ఎవరో వాళ్ళకే తెలియదు. ప్రతి మహిళా మడఅడవి (mangrove) చెట్ల మూలంలో ఉండే చిన్న పామును పట్టుకోవాలి. ఆ తర్వాత వారు నగ్నంగా మారి పామును చేతిలో ఉంచుకుని అలసిపోయే వరకూ రాత్రంతా కాముకత్వం నిండిన పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ గడుపుతారు.

గ్రీసు ఉత్తరభాగంలోని మేసెడోనియాలో కూడా మహిళలు ఇలాంటి తంతులే జరుపుతూ ఉండేవారు. అలెగ్జాండర్ ది గ్రేట్ మేసెడోనియాకు చెందినవాడే. ఈ ప్రాంతానికి రాజుగా ఉన్న రెండవ ఫిలిప్స్(క్రీ.పూ. 359-336)కు నాలుగవ భార్య ఒలింపియస్. ఆమె కొడుకే అలెగ్జాండర్.

థాంప్సన్ ఉటంకించిన ప్లూటార్క్ కథనం ప్రకారం, అతి పురాతనకాలం నుంచీ మేసెడోనియా మహిళలు ఆర్ఫిక్, డయోనిసస్ లకు చెందిన సామూహిక లైంగిక సర్ప తంత్రాలలో పాల్గొంటూ ఉండేవారు. ఇతరులను మించి ఒలింపియస్ అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఈ తంతులను మరింత ఆటవికంగానూ, భయంగొలిపేలానూ మార్చింది. ఆమె నాయకత్వంలో మహిళలు  పెద్ద పెద్ద పెంపుడు సర్పాలను చేతిలో ఉంచుకుని నృత్యం చేసేవారు. వాళ్ళ చేతిలోని మంత్ర దండాలకు, వారి కిరీటాలకు భారీ సర్పాలు చుట్టుకుని ఉండేవి. అలెగ్జాండర్ పుట్టుకకు ముందు ఒలింపియస్ తన పక్కలో ఒక పామును ఉంచుకుని నిద్రపోతూ ఫిలిప్స్ కు కనిపించిందట. ఈ కథనాలలో అతిశయోక్తులు ఉండచ్చు కానీ, ఇక్కడ గమనించాల్సింది పాములతో కూడిన తంతుల విషయంలో వివిధ ప్రాంతాల మధ్య ఉన్న పోలిక.  ఒలింపియస్, ఫిలిప్స్ లది కలతల కాపురం కావడం; ఫిలిప్స్ హత్యకు గురైనప్పుడు అందుకు బాధ్యురాలిగా ఒలింపియస్ ను అనుమానించడం వగైరాలు వేరే కథ.

asklepios

***

సర్పం తర్వాత, బహుశా సర్పం కన్నా ఎక్కువగా స్త్రీలతో ముడిపడిన ఆరాధనా రూపం చంద్రుడు. సర్పానికి ఉన్నట్టే, చంద్రుడికి కూడా పునరుజ్జీవన లక్షణం ఉందని చెప్పుకున్నాం. సర్పం విషయంలో ఉన్నట్టే, చంద్రుని విషయంలోనూ ఆయా ప్రాంతాల పురాణకథలు, విశ్వాసాల మధ్య ఆశ్చర్యకరమైన పోలికలను కొన్నింటిని ఇప్పటికే గుర్తించాం. ఇప్పుడు మరికొన్ని విశేషాలు చూద్దాం:

స్త్రీలోని పునరుత్పత్తి ప్రక్రియను నియంత్రించేది చంద్రుడేనని ప్రపంచమంతటా అనాదిగా ఉన్న విశ్వాసం. ఋతుస్రావానికి, చంద్రుడికి సంబంధం ఉందన్న ఆదిమ విశ్వాసం నుంచే చంద్రుడితో ముడిపడిన తంతులు పుట్టాయి. ఈ ఆదిమ కాలపు తంతులు మనిషి చైతన్యంపై ఎంత గాఢంగా ముద్రవేసుకున్నాయంటే, చంద్రుని ఆరాధనకు కాలదోషం పట్టినా ఇప్పటికీ జానపదుల స్థాయిలో, మూఢనమ్మకాల రూపంలో ఇవి చాలావరకూ మిగిలి ఉన్నాయని థాంప్సన్ అంటారు.

మాంత్రికత సూర్యుని కన్నా ప్రధానంగా చంద్రునే అల్లుకుని ఉంటుంది. ప్రపంచమంతటా కాలానికి తొలి కాపలాదారు చంద్రుడే. కేలెండర్ లో మొట్టమొదట ఏర్పడిన విభాగం, మాసం.  చంద్రుడి వల్లనే అది ఏర్పడింది. చంద్రుని ఆధారంగా జరిగే కాలగణనాన్ని చాంద్రమానమనీ, సూర్యుని ఆధారంగా జరిగేదాన్ని సౌరమానమనీ అన్నారు. చాంద్రమానంలో నెలకు 28 రోజులు. పదిహేను రోజులకు ఒకసారి వచ్చే పౌర్ణమి, అమావాస్యలనుబట్టి నెలను మళ్ళీ శుక్లపక్షమనీ, కృష్ణపక్షమనీ రెండు భాగాలు చేశారు. చంద్రుడు వృద్ధిని పొందే రోజులు శుక్లపక్షమైతే, క్షీణతను పొందే రోజులు కృష్ణపక్షం. చివరగా నెలను నాలుగు భాగాలు చేసి వారాలను ప్రవేశపెట్టింది బాబిలోనియన్లు. ఈ చాంద్ర, సౌర మానాలకు సంబంధించిన ఇతర అనేక వివరాలలోకి ఇప్పుడు వెళ్లలేం.

స్త్రీలలో ఋతుస్రావా(menstruation)నికి చంద్రుడే కారణమనుకున్నాం. చంద్రుడు ఒక యువకుడనీ, అతడు స్త్రీలపై లైంగిక చర్యకు పాల్పడి ఋతుస్రావానికి కారణమవుతాడనీ ముర్రే దీవుల్లోని ప్రజలు భావిస్తారు. ఋతురక్తం నుంచే పిండం రూపొందుతుందని విశ్వాసం కనుక, ఋతుస్రావాన్ని ఒకవిధమైన గర్భస్రావంగానూ భావిస్తారు. దానినుంచే ‘moon-calf’ అనే మాట పుట్టింది. అది అంగవైకల్యాన్ని సూచిస్తుంది, ఇలా చూసినప్పుడు స్త్రీ గర్భం ధరించడానికి కారణమూ చంద్రుడే. ఈవిధంగా ‘స్త్రీకి చంద్రుడే భర్త’ అన్న ఆదిమ విశ్వాసం పుట్టింది. మావోరీ తెగవారు స్త్రీకి చంద్రుడే అసలు భర్త అని నమ్ముతారు. స్త్రీ గర్భానికి పురుషుడు కారణమనే భావన, పితృత్వం సాంఘిక ప్రతిపత్తిని సంపాదించుకున్న తర్వాతే మొదలైందని థాంప్సన్ అంటారు. అంతవరకూ స్త్రీ గర్భానికి కారణం చంద్రుడే.

వ్యవస్థ మారినంత త్వరగా విశ్వాసమూ, చైతన్యమూ మారవు. కనుక ఆదిమ విశ్వాసాలు వివిధ రూపాలలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు, అనేక ఆదిమభాషలలోని పదాలు ఇప్పటికీ చంద్రుని పురుషుడిగానూ, స్త్రీలకు భర్తగానూ చెబుతాయి. గతంలో కెల్టిక్, గ్రీక్, లాటిన్ భాషల్లోనూ; నేటికీ స్లావోనిక్, జెర్మానిక్ భాషల్లోనూ చంద్రశబ్దం పురుషవాచకమే. చంద్రుని Men అనే పేరుతో పురుషునిగా పేర్కొంటూ వచ్చిన గ్రీకులు, ఆ తర్వాత స్త్రీని చేసి ‘సెలెనే’(selene) అన్నారు. men నుంచి పుట్టిన స్త్రీ వాచకం’mene’ కు selene పర్యాయపదం అయింది. ఈ mene అనే మాట monthకు పర్యాయపదంగా ఇప్పటికీ మిగిలింది.

మన దగ్గర సంస్కృతంలోనూ, తెలుగుతో సహా ప్రాంతీయ భాషల్లోనూ ఇప్పటికీ చంద్రుడు పురుషుడే. అంతేకాదు, స్త్రీకి చంద్రుడే అసలు భర్త, లేదా తొలి భర్త అన్న ఆదిమవిశ్వాసం ఇప్పటికీ మన వైదిక వివాహమంత్రాలలో మిగిలి ఉంది. ఉదాహరణకు, కన్యాదాత వధువును వరునికి అప్పగిస్తూ ‘సోమః ప్రథమో వివిదే గంధర్వో వివిద ఉత్తరః తృతీయో అగ్నిష్టే పతిస్తురీయస్తే మనుష్యజాః’’అంటాడు. ఈమె తొలి భర్త సోము(చంద్రు)డనీ, రెండో భర్త గంధర్వుడనీ, మూడవ భర్త అగ్ని అనీ, నాలుగవ భర్త మనుష్యుడనీ దీనికి అర్థం. సోమలతను నలగ్గొట్టి రసం పిండి, వడగొట్టి, కొయ్యతొట్టెల్లో నిల్వ చేసేపని కన్యాశాలల్లోనే జరిగేదనీ, ఈ పనిని చేసేవారినీ సోములు అనే వారనీ, “సోమః ప్రథమో వివిదే” అనే మాట వీరిని ఉద్దేశించినదే నని రాంభట్లగారు (జనకథ) అన్నప్పటికీ, చంద్రుడే స్త్రీకి అసలు భర్త అన్న ఆదిమ విశ్వాసాన్నీ ఇది సూచిస్తూ ఉండచ్చు.

చంద్రునివల్లనే స్త్రీ గర్భవతి అవుతుందన్న ఊహ నుంచే స్త్రీని చంద్రుడు ఆవహిస్తాడనీ, లేదా పూనతాడనే ఊహ పుట్టింది. అందుకే పూనకం, మూర్ఛ, మహిమలను ఆపాదించే ఇతర రుగ్మతలను చంద్రుడితో ముడిపెట్టడం సాంప్రదాయికంగా వస్తోంది. lunacy (ఉన్మాదం)కి, lunar (చంద్ర సంబంధమైన)కి ఉన్న సంబంధం స్పష్టమే.

ఈజిప్షియన్లు చంద్రదేవతను ‘నిట్’ అంటారు. వారి విశ్వాసం ప్రకారం మగ్గాన్ని ప్రవేశపెట్టింది ఈ దేవతే. యూరప్ జానపదాలలో ఇప్పటికీ నూలు వడికేది చంద్రుడే. ఇక్కడ ఆసక్తికరం ఏమిటంటే, చంద్రుడిలో ఒక ముసలమ్మ కూర్చుని నూలు వడుకుతూ ఉంటుందన్న కల్పన మన దగ్గర కూడా ఉంది. నూలు వడకడం ఒకప్పుడు స్త్రీల పని. అనేక ఆదిమ సంప్రదాయాలలో పిండి విసరడం, కుండలు చేయడం, వంట చేయడం మొదలైనవి చంద్రుడే చేస్తాడు.

అలాగే ఒకప్పుడు మంత్రవిద్య(మాంత్రికత) స్త్రీల చేతుల్లోనే ఉండేది. లైంగికక్రీడపై అది అత్యంత సమ్మోహనకరమైన ప్రభావాన్ని చూపుతూ ఉండేది. అయితే మంత్రవిద్య పురుషుడి చేతుల్లోకి వెళ్ళిన తర్వాత స్త్రీల తంతులు చేతబడి వంటి క్షుద్రవిద్యలుగా తిరస్కృతికి గురవుతూ వచ్చాయని థాంప్సన్ అంటారు.

మరిన్ని విశేషాలు తర్వాత….