తెలుగులో రాయడమే గొప్ప తృప్తి!

 

 

– జగద్ధాత్రి

~

 

తమిళం మాతృ భాష , మలయాళం విద్యాభ్యాసం చేసిన భాష , తెలుగు నేర్చుకుని పట్టు సాధించిన భాష . అందుకే నాకు ముగ్గురమ్మలు అని చెప్తారు స్వామి గారు. తెలుగు భామనే కాక తెలుగు భాషను కూడా స్వంతం చేసుకుని , అందులో మంచి రచనలు చేసి తనకంటూ ఒక ముద్ర వేసుకోగలిగిన వారు స్వామి గారు. అలాగే అనువాదకునిగా తెలుగు భాషలో సాహిత్య అకాడెమీ పురస్కారం సాధించడం  ఆనందదాయకం ఆశ్చర్యకరం కూడా. ఈ సందర్భంలో  రండి ఆయన మనసు విప్పి చెప్పే నాలుగు మాటలు విందాం. నిరంతర కృషీవలుడు , నిగర్వి ఎన్ని సాధించినా , ఎన్ని అవార్డులు వచ్చినా నిర్మమంగా తన పని చేసుకుంటూ పోయే స్వామి గారు మనందరికీ ఆదర్శంగా నిలుస్తారనడం లో అతిశయోక్తి లేదు. 2015 కు గాను “సూఫీ చెప్పిన కథ “ రామన్ ఉన్ని నవల తెలుగు అనువాదానికి సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారాన్ని స్వామి గారికి ప్రకటించింది. ఇది మన తెలుగు వారికి అందరికీ గర్వ కారణం. నేనెప్పటికీ తెలుగు రచయితగానే ఉంటాను అని చెప్పే స్వామి గారి మనో భావాలు మనం కొన్ని ఇక్కడ తెలుసుకుందాం.

1 . కధకుడిగా మీ ప్రారంభాలు, అనువాదకుడిగా ప్రారంభాలు ఒకే సారి జరిగాయా ?

       లేదు. ఒకే సారి జరగలేదు. నా మాతృభాష కాని తెలుగులో సాహిత్య రచన చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు.   కధకుడిగా ఆరంగేట్రం చేసిన పది సంవత్సరాల తరువాతనే అనువాదకుడి పాత్ర ధరించాను. నిజం చెప్పాలంటే ఒక అనువాదాలు చేయటం మొదట్లో నాకు ఇష్టం లేని పని గానే వుండేది. విశాఖలో స్దిరపడ్డాక తెలుగు నేర్చుకుంటే నా మిత్రులతో,  సహోద్యోగులతో కలసి మెలసి తిరగటం సుళువుగా వుంటుందనుకొని  తెలుగు నేర్చుకున్నాను. భాషా పరిజ్ఞానంతో తెలుగు సాహిత్యం చదివి ఆనందించేవాడ్ని. దీనికి ఒక కారణం ఉంది. నేను పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టీ సమాజాన్ని బట్టి సాహిత్యం చదవటం బాగా అలవాటైంది. విశాఖలో ఆ రోజుల్లో మలయాళ పుస్తకాలు దొరికేవి కావు . నాకు ఆంగ్ల సాహిత్యం చదివే అలవాటు అప్పుడు –ఇప్పుడు కూడా లేదు –అందువల్ల తెలుగు సాహిత్యమే అందుబాటులో వుండేది. 1980 తరువాతనే తెలుగు బాగా చదవటం నేర్చుకున్నాను. అయినా కధలు వ్రాయాలని కానీ సాహిత్య రచన చేయాలని కానీ అనిపించలేదు.1988 ప్రారంభంలో ఒకానొక సందర్భమున  పోటీలో బహుమతి పొందిన ఒక కధ గురించి మా సహోద్యోగుల మధ్య జరిగిన వేడి వేడి చర్చ , తద్ఫలితంగా వాళ్ళు  విసిరిన సవాలు వల్ల తెలుగులో మొదటి కధ వ్రాసాను –నన్ను నా భాషా పరిజ్ఞానాన్ని రుజువు చేయటం కోసం –అదే నా మొదటి తెలుగు కధ –జవాబులేని ప్రశ్న –ఆ కధకి అలనాటి ఆంధ్రజ్యోతి వార పత్రిక నిర్వహించిన కధల పోటీలో బహుమతి వచ్చింది [1988 ]. ఆ హుషారులో ఎన్నో కధలు వ్రాసాను . అప్పుడే కొందరు పత్రికా సంపాదకులు మలయాళ కధలు తెలుగులోకి అనువాదం చేయమని నన్ను అడగటం జరిగింది. కాని ఒక సృజనాత్మక రచయితగా కొనసాగాలనుకునే నేను ఏ అనువాదమూ చేయలేదు. ఆ తరువాత 2000 ప్రాంతంలో కే. అయ్యప్పపనికర్ సంకలనం చేసిన మలయాళ జానపద గేయాలను తెలుగులోకి అనువదించమని   సాహిత్య అకాడెమి కోరటం వల్ల తప్పనిసరిగా ఒప్పుకున్నాను. ఆ పని పూర్తి అవగానే ప్రముఖ మలయాళ కవి కే. సచ్చిదానందన్ తన 96 కవితలను తెలుగులోకి అనువాదం చేయమని కోరారు [శరీరం ఒక నగరం]సమయాభావం వల్ల కొంత ఆలస్యం చేసినా మొత్తానికి అనువాదం పూర్తి చేసాను. నా అనువాదాలు బాగున్నాయనే పేరు రావటం వల్ల అనువాదాలు చేయమనే ఒత్తిడి పెరిగింది.మరో రెండేళ్ళు తరువాత పదవి విరమణ చేసాను కనుక ,సమయం అందుబాటులో వచ్చి,  వరసగా అనువాదాలు చేసి తెలుగులోకి 17 పుస్తకాలనూ మలయాళంలోకి 13 పుస్తకాలనూ అనువాదం చేసాను; ఇంకా చేస్తున్నాను.

swami 1

2 –    మలయాళ భాషలో మీరు రచనలు చేసారా ?మీ చిన్నతనం లో అటువంటి విశేషాలు వివరించండి

నేను విశాఖ రాక ముందు మలయాళంలో ఎన్నో రచనలు చేసాను. చిన్నప్పటినుంచి అంటే ఎనిమిదో తరగతి చదివే రోజుల్లోనుంచి మలయాళం లో కవిత్వం వ్రాసేవాడ్ని. కాని అచ్చైన మొదటి మలయాళ రచన నేను వ్రాసిన ఏకాంక నాటిక. ఈ నాటిక నేను పదో తరగతి చదివేటప్పుడు [1960] వ్రాసాను. ప్రముఖ మలయాళ వార పత్రిక వారు విద్యార్ధులకోసం [కాలేజీ స్కూల్ పిల్లలకోసం ] నిర్వహించిన ఏకాంక నాటక రచన పోటీలో మొదటి బహుమతి పొందింది ఈ నాటిక. 1960 నుంచి 1970 వరకు సుమారు 100 కవితలు వ్రాసి వుంటాను ,మలయాళంలో. కవితలు మాతృభూమి మలయాళ మనోరమ మొదలగు పత్రికల్లో వెలుబడ్డాయి. జాతీయ చంధసులో వ్రాయబడిన భావ కవితలే వాట్లో ఎక్కువ.

  1. మీరు ఎరిగిన, జీవించిన, మలయాళ సమాజంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వారి గురించి చెబుతారా ?

అలనాడు నేను జీవించిన మలయాళ సమాజం మొత్తం నన్ను ప్రభావితం చేసిందనే నేను అనుకుంటున్నాను. గుండెలో కవిత్వపు బీజం దాగివుంటే మొలకెత్తి చిగురించి విస్తరించడానికి అనువైన సామాజిక వాతావరణం సమాజంలో వుండేది. ప్రతి పల్లెలోని గ్రంధాలయం, అక్కడ చేరేవాళ్ళ చర్చలు, ఏదో ఒకటి వ్రాస్తే దాన్ని సరిదిద్ది ప్రోత్సాహించే పెద్దలు ,రచయితకి ఇచ్చే గౌరవం వగైరాలు చెప్పుకోదగ్గవి. అంతే కాదు మలయాళ భాషా భోదకులు [స్కూల్ లోనూ కాలేజీలో కూడా ] భాషా సాహిత్యాల పట్ల ఆసక్తి పెరిగేలా పాఠాలు చెప్పేవారు . ఇక రచనల విషయానికి వస్తే నేను మౌలికంగా కవిని. కవి హృదయం కలిగినవాడని నేను భావిస్తున్నాను. మలయాళం లో కవిత్వమే వ్రాసే వాడ్ని.ఆధునిక మలయాళ సాహిత్యం  మహాకవి పి. కుంజీరామన్ నాయర్ నన్ను కొంతవరకు ప్రభావితం చేసాడనే చెప్పాలి , కవిత్వ రచనలో-

4 . తెలుగులో కధలు వ్రాసినప్పుడు, అనువాదకులుగా మీకొక  భవిష్యత్తు ఊహించారా ?

  కధకుడిగా కాని అనువాదకుడిగా కాని ఏదో ఒకటి సాధిద్దామనుకొని రచన కాని అనువాదం కాని చేయలేదు. ఎవరూ ఎవరినీ రచన చేయమని బలవంతం చేయరు ఇష్టమైతే చేస్తారు అంతే. Just for the pleasure చేస్తారు. అలాంటప్పుడు ఆశలు పెట్టుకోవటం అనవసరం.

SufiBookFrontCover

5 . మలయాళం లోని సూఫీ పరంజ కధ అనువాదానికి ఎంచుకున్నారు –ఈ నవల వివరాలు చెప్పండి

1993 లో వెలుబడిన సూఫీ చెప్పిన కధ అనే నవల మలయాళ సాహిత్యంలో గొప్ప సంచలనం రేపింది. వస్తు పరంగానూ భాషా పరంగానూ కొత్త పోకడలతో కూడిన ఈ నవల పాఠకుల హృదయాన్ని ఆకట్టుకుంది. 2010 వరకు పది ముద్రణలు పొందింది. అంతే కాదు ఆంగ్ల, ఫ్రెంచ్,  హింది తమిళ్ కన్నడ భాషల్లోకి అనువదింపబడి పాఠకుల మన్ననలు కూడా పొందింది. మానవ జాతికి ఉమ్మిడి పైతృకం ఉందనేది చక్కగా గుర్తు చేస్తుంది ఈ నవల. గతంలో రెండు సంస్కృతుల మధ్య నిలిచిన సమన్వయాన్ని కూడా గుర్తు చేస్తుంది గతం సలిపే గాయాల పుట్ట కాదు ఇక్కడ. దయార్ద్రమైన స్నేహ శిలలు –సంఘర్షణా భరితమైన ఈ కాలం లో అది ఒక ఔషదంగా పరిణమిస్తుంది. గుడి అయినా మసీదు అయినా మానవుని అధ్యాత్మిక అవసరాలను తీర్చే మార్గమేననే స్పృహ కలుగుతుంది. విగ్రహారాధనను గౌరవించని వారు కూడా విగ్రహారాధన పట్ల వున్న వైమనస్యపు పట్టు సడలిస్తున్నారు. తెలియని ఒక సత్యం గురించిన ఆలోచన మనసులో ఒక వెలుగు రేఖగా కదులుతుంది కత్తులు నూరి గొడవ పడటానికి సిద్ధంగా నిలిచిన రెండు మతాల మధ్య అతి ప్రాచీనమైన సహవర్తిత్వం ఉండేదని సూఫీ చెప్పినప్పుడు ఏవేవో అడ్డుగోడలు కూలిపోతున్నాయి . ఈ సూక్ష్మ స్వరాన్ని మనకు వినబడే విధంగా వినిపించ గలిగింది ఈ నవల. ఈ నవలను అనువాదం చేయాలనుకోవడానికి ఇదొక్క కారణమైతే, ఈ నవలలో కనబడే అతి సుందరమైన కావ్యాత్మకమైన భాష. ఈ పుస్తకాన్ని నేను అనువాదం చేసి ప్రచురణ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అనుకోకుండా కల్పనా రెంటాల గారు ఈ పుస్తకాన్ని పంపమని,  చదివి వెంటనే తమ సారంగా బుక్స్ వారే ఈ పుస్తకాన్ని ప్రచురిస్తామని మాట ఇచ్చారు. అంతే కాకుండా ఈ పుస్తకం ఇంత వేగం వెలుగు చూసేలా చేయడం, దానికి ఇలా అవార్డ్ రావడం రెండు నాకు చాలా ఆనందం కలిగించాయి. ఇందుకు కల్పన గారికి నా కృతజ్ఞతలు. తెలుగు లో కూడా ఈ పుస్తకం మంచి పేరు తీసుకొచ్చింది.

6 మలయాళం నుంచి తెలుగులోకి, తెలుగునుంచి మలయాళం లోకి ఎన్ని రచనలు వెలుబడ్డాయి ఏ ప్రముఖ రచయితలను అనువదించారు ?

మలయాళం నుంచి తెలుగులోకి 17 పుస్తకాలనూ తెలుగునుంచి మలయాళంలోకి 13 పుస్తకాలనూ అనువదించాను. నేను అనువదించిన రచయితలు ,మలయాళం నుంచి తెలుగులోకి  మహాకవి అక్కితం నంబూద్రి “ఇరవయ్యవ శతాబ్దం” [ ఒక దీర్ఘ కవిత ], ఆధునిక మలయాళ కవి సచ్చిదానందన్ [రెండు కవితా సంపుటాలు ], జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత ,కవి ,ఓ.ఎన్.వి . కురుప్ [ఒక కవితా సంపుటం ],  నారాయణన్ [ ఒక నవల .ఒక కధా సంపుటి ], సేతు [ మూడు నవలలు ,20 కధలు ], శ్రీనారాయణ గురు,  సి . రాధాకృష్ణన్ [నవల ],  జెక్కేరియా [97 కధలు ],  తకలి, బాషీర్, కారుర్, హరికుమార్, సంతోష్ ఎచ్చికాణం, వైశాఖన్, కె .ఆర్ . మీర, పొంకున్నం వర్కి మొదలైనవారి కధలు

తెలుగు నుంచి మలయాళం లోకి, ఇక తెలుగు నించి  గోపి ,శివారెడ్డి ,కేతు విశ్వనాధ రెడ్డి ,సలీం ,జయంతి పాపారావు గురజాడ వారి కధలు , దివాకర్ల వేంకటావధాని గారి ఆంధ్ర వాగ్మయ చరిత్ర ,శ్రీ శ్రీ మోనోగ్రాఫ్ ,చక్రపాణి మోనోగ్రాఫ్  చాగంటి సోమయాజులు వగైరా.

స్వామి గారితో జగద్ధాత్రి

స్వామి గారితో జగద్ధాత్రి

7 .కధకుడిగా ఒక కధ మీరు వ్రాసినప్పుడా మంచి కధను అనువాదం చేసినప్పుడా మీకు ఎక్కువ సంతృఫ్తీ కలిగింది ?

కచ్చితంగా మంచి కధ వ్రాసినప్పుడే నాకు సంతృప్తి కలుగుతుంది.

8 తెలుగు సాహిత్య అనువాద రంగపు అభివృద్ధికి మనం ఎటువంటి చర్యలు చేపెట్టాలని మీరు భావిస్తున్నారు ?

 పూర్వంకన్నా ఇప్పుడు తెలుగునుంచి ఇతర భాషల్లోకి ఇతర భాషల్లోనుంచి తెలుగులోకి చేసే అనువాదాల సంఖ్య పెరిగింది . ఎప్పుడైనా ఎన్ని అనువాదాలు చేసివున్నా ప్రతి సారి అనువాదం ఒక సవాలే, మూల లక్ష్య భాషల సంస్కృతుల పట్ల మంచి పట్టు లేనివాడు మంచి అనువాదం చేయలేరు. తెలుగు  మాతృభాష గలవాడు హింది నుంచి తెలుగులోకి అనువాదం చేసినప్పుడు మూల భాషా సమాజం గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల అనువాదం మూల కృతికి న్యాయం చేయకపోవచ్చు. అందువల్ల అనువాదాన్ని ఒక సాధనగా భావించి మూల లక్ష్య భాషల సమాజాల గురించీ వాళ్ళ సంస్కృతుల గురించి వాట్లో చోటు చేసుకునే పరిణామాల గురించి నిరంతరం అధ్యయనం చేస్తూ వుండాలి-దానికి తగిన వాతావరణం వుండాలి, లేకపోతే కల్పించాలి.

  1.  మలయాళ సాహిత్య రంగం, పాఠకుల అభిరుచి ఇటువంటి రంగాల్లో తెలుగు సంస్కృతిక సమాజం అలవర్చుకోవలసిన ముఖ్యమైనవేమన్నా గమనించారా ?

గమనించాను. మలయాళీలకు సాహిత్యం పుస్తక పఠనం జీవితంనుంచి విడదీయలేని ఒక భాగం. చిన్నప్పటినుంచి పిల్లలకు సాహిత్య పుస్తకాల పఠనం అలవాటు చేస్తారు.  మలయాళ రచనలు బాగా చదివించేవిగా  ఎక్కువగా ఆర్ద్రంగా వుంటాయి. 300 –400 వందల పేజీల నవలలు కూర్చుని ఏకదాటిగా చదివేస్తారు. అందుకే అలాంటి నవలలు లక్షల  కాపీలు అమ్మకమవుతున్నాయేమో !

10 . అనువాద రంగంలో ప్రస్తుతం మీరు చేస్తున్న, అకాడెమి అప్పగించిన కర్తవ్యాలు గురించి చెప్పండి

   2013 లో అకాడెమి అవార్డు పొందిన కే . సచ్చిదానందన్ గారి మలయాళ కవితా సంపుటి MARANNU VECHA VASTHUKKAL AND OTHER POEMS  అనే పుస్తకం తెలుగులోకి అనువాదం చేస్తున్నాను . అంతే కాక ఒక మలయాళం తెలుగు నిఘంటువు  కూడా తయారు చేస్తున్నాను

  1.  కధకుడిగా అనువాదకుడిగా మీ సాహిత్య జీవితం మీకు సంతృప్తి నిచ్చిందా ?

 కొంత వరకు…పూర్తిగా సంతృప్తి పొందినవాడు తరువాత పని చేయడు.  నేను ప్రస్తుతానికి సంతృప్తి పొందినా ఇంకా ఈ రంగంలో కృషి చేయాలననుకుంటున్నాను కనుక మానసికంగా పూర్తి సంతృప్తి పొందానని చెప్పలేను . ఇంత క్రితం పలు మార్లు చెప్పినట్లు నాకు ప్రత్యేకమైన టార్గెట్ లేదు సాహిత్యంలో. ఒక టార్గెటు అంటూ వుంటే అది అందగానే సంతృప్తి చెందుతారు. ఆ తరువాత కొందరు నిష్క్రమిస్తారు కూడా. నాది నిరంతర సాధన.

  1. సమాజం లో సాహిత్యం పాత్ర ఎంతవరకు ఉందని మీరు అభిప్రాయపడుతున్నారు ?

 సాహిత్యం తాలూకు పాత్ర ఎంతో ఉంది –ముఖ్యంగా అనువాద సాహిత్య పాత్ర –ఎక్కువ భాషలు నేర్చుకోవటం వల్ల ఇతర భాషా సాహిత్యం చదవటం వల్ల,భిన్న సంస్కృతులు తెలుసుకోవటం వల్ల మనిషి మనోభావాలు వాడు ఎక్కడున్నా ఒకటేనని అర్ధం చేసుకోగలుగుతారు. మనిషి తన లోపల వున్న మనిషిని డిస్కవర్ చేస్తాడు. భాషా ,వేషం ఆహారం కళా రూపాలు బ్రతుకుతున్న వాతావరణాన్ని బట్టి వచ్చేవేనని అవి కేవలం బాహ్యమేనని తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్నప్పుడు ప్రాంతాల మధ్య మనుషుల మధ్య సఖ్యత పెరిగి మనుషులందరూ కలసి మెలసి బ్రతికే అవకాశం ఉంది.

peepal-leaves-2013

 

 

కొత్త మందు

Kadha-Saranga-2-300x268

”శర్మకి యా క్సిడెంటయింది  ,తెలుసా —?”ఇంటిలోకి అడుగు పెట్టగానే అంది నా శ్రీమతి.

”ఎక్కడ  –?”కంగారుగా అడిగాను.

”ఇంకెక్కడా –ఫెక్టరీలోనే —మీకు తెలియి దా ? మీ ఫెక్టరీలోనేగా అతడూ  పని చేసేది —”

నిజమే! శర్మమా ఫెక్టరీలోనే పని చేస్తాడు. — గంధకామ్లం తయారు చేసే విభాగంలో —పైగా నాకు ఆప్త మిత్రుడు. అయినా నాకు ఆ సంగతి తెలియికపోవటం ఆశ్చర్యంగా అనిపించింది.

”ఎప్పుడైంది యాక్సిడెంటు —-”

”రెండు మూడు వారాలైనట్లుంది ”

గత మూడు వారాలుగా నేను ఆఫీసు పని మీద ఉర్లు  తిరుగుతునాను. మార్కెటింగ్ మేనేజరుగా పని చేసేవాడికి ఉర్లు తిరగటం తప్పదు కదా !అయితే మాత్రం —-

”ఫోను చేసినప్పుడు చెప్పలేదేమిటీ ?”కొంత కంగారుగానూ కోపంగానూ అడిగాను.

శ్రీమతి మాట్లాడలేదు.

”ఎక్కడవున్నాడిప్పుడు ?”

”పట్నంలో —ప్రభుత్వాసుపత్రిలో —-”

విప్పే షూలేసు సు మళ్ళీ కట్టుకొని ,వెంటనే బైకెక్కి  ఇంటి గేటు దాటాను.

పశ్చిమాంబరాన ప్రమాదానికి గురైన  సూర్యుని నెత్తురికి తడిసి న మబ్బులు ఎర్రగా కనబడ్డాయి. ఎక్కడనుంచో వచ్చిన చీకటి ప్రపంచాన్ని మెల మెల్లగా తన గుప్పటిలోకి తీసుకుంటోంది. మా ఉరివాళ్ళ బ్రతుకులాంటి గతుకుల రోడ్డు మీద జాగ్రత్తగా ముందుకు సాగాను.

రోడ్డు మలుపు తిరిగి పెద్ద రోడ్డెక్కగానే ఎదురుగా కనబడింది ప్రత్యేక ఆర్ధిక మండలి. ఊరిలోవుండవలసిన వెలుగు మొత్తం అక్కడేవున్నట్లు విద్యుత్తు దీపాలతో కళకళలాడుతోంది.

నేనూ ,శర్మ ఉద్యోగం చేసే కర్మాగారం అక్కడేవుంది. మనుషుల జబ్బులకు మందు తయారుచేసే కర్మాగారం మాది. మందులు తయారు చేయడమే కాక ,కొన్ని పాత జబ్బులకు కొత్త మందులు ,కొత్త జబ్బులకు కొత్త మందులు కనిపెట్టడానికి విస్తృతంగా రీసెర్చు కూడా చేస్తువుంటారు.

కొంత దూరం వెళ్ళగానే మళ్ళీ రోడ్డు నిండా చీకటి. ప్రత్యేక ఆర్ధిక మండలిలోని వెలుగు కార్మికుల నివాసాలదాకు చేరటం లేదు –రోడ్డుకి ఎడంవైపు ఆర్ధిక మండలిలో పని చేసేవారికోసం ఎవ్వరో నిర్మించిన అగ్గిపెట్టెలాంటి అద్దె ఇళ్ళు –వాటి చుట్టూ  మసక మసక వెలుతురు –శర్మ అక్కడే వుంటాడు. ఒకసారి అటు చూశాను –శర్మ ఇంటిలో దీపం వెలగటం లేదు.

రోడ్డుకి కుడివైపు గుడెసెలు. మండలిలో రోజువారీ కూలికి పనిచేసేవారి నివాసాలు అవి. అక్కడ హడావిడిగా ఉంది. ఆ రోజు సంపాదించిన డబ్బు ఖర్చు చేసే హడావిడి అక్కడ. డబ్బు సంపాదించడానికీ ,సంపాదించినది ఖర్చు చేయడానికీ చేసే హడావిడియేగా జీవితం !

గట్టిగా నిట్టూర్చాను. నాకు నా చిన్ననాటి ఊరు గుర్తు వచ్చింది అప్పుడు ఊరిలోని వెలుగు మొత్తం ఊరి జమీందార్ గారి ఇంటిలోనేవుండేది. ఇప్పుడూ అంతే అనిపించింది. నాడు పంట పొలాల ఆస్తి కలిగినవారు  జమీందార్లు –నేడు ఆర్ధిక మండలీలు వున్నవారు  జమీందార్లు –అంతే తేడా !

రోడ్డువైపు దృష్టి వుంచి జాగ్రత్తగా సాగాను. పాపం,శర్మ!ఏం ఇబ్బంది పడుతున్నాడో ,ఏమో ! అసలే వాడి ఆర్ధిక పరిస్థితులు అంతంతమాత్రం. ప్రమాదం ఫాక్టరీలోనే జరిగింది కనుక ఖర్చు యజమాన్యంవారే  భరించాలి. అలాంటప్పుడు కార్పోరేటు ఆసుపత్రిలో కాక ప్రభుత్వాసుపత్రిలోచేర్చారెందుకో !

నేనూ శర్మ చిన్నప్పటినుంచి కలసి చదువుకున్నాం; అడుకున్నాం; కలిసే తిరిగేవాళ్లం. శర్మ చాలా ప్రతిభావంతుడు. రాబోయే సమస్యలను ముందే పసి కట్టేవాడు. కాలానికి ముందే ఆలోచించే వాడి ప్రతిభకి సరైన గుర్తుంపు రాలేదని బాధ పడుతువుంటాను నేను. లేకపోతే వుత్త మట్టి బుర్రైన నేను —రెండు మూడు సార్లు పరీక్ష వ్రాసి పాస్ అయ్యానని అనిపించుకున్న నేను –మార్కెటింగ్ మేనేజర్ కావటమేమిటీ –ఇంజినీరింగు డిప్లొమా పాసైన శర్మ నట్టులు బొల్టులు విప్పే మెకానికుగా పని చేయడమేమిటి !

డిప్లొమా పాస్ ఆయిన తరువాత కొన్ని సంవత్సరాలు శర్మ నాకు కనబడలేదు. ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తున్నాడని విన్నాను. హటాత్తుగా ఒక రోజు మా కర్మాగారంలోని కేంటీనులో ప్రత్యక్షమయ్యాడు.

‘నువ్వేమిటి,ఇక్కడ —” ఆశ్చర్యంగా అడిగాను నేను.

”ఈ కాపెనీలో చేరానురా ”

‘అదెప్పుడు —ఏ సెక్షన్ —”

”గంధకామ్లం తయారుచేసే ప్లాంటులో –మెకానిక్కుని  –ఓ నెల అవుతోంది చేరి ”

”సరేలే –సాయంత్రం ఇంటికిరా ”భోజనం బల్ల వద్ద  మిగతా మేనేజర్లు నా  చుట్టూ  కూర్చున్నారని గుర్తిస్తు అన్నాను.

”ఏ జెమ్ ఒఫ్ ఏ వర్కర్ !”శర్మ వెళ్ళగానే నా పక్కనే కూర్చున్న జి.యం. గారన్నారు ”ఉద్యోగంలో చేరి నెల రోజులైనా కాలేదు ,అప్పుడే పని అట్లా పట్టేసాడు. హి  ఇస్ యువర్ ఫ్రంట్ –?”

”యెస్ ; చిన్ననాటి స్నేహితుడు ”

”వెరీ గుడ్ ; అతడు పని రాక్షసుడు.చేతిలోవున్న పని పూర్తి అయినంత వరకు పనినుంచి కదలడు ”

”మనకు కావాలిసింది అదే కదా  –”ఫైనాన్స్  మేనేజర్ మాట కలిపాడు.”కార్మికులు ఓ , టి. చేసినా మనం డబ్బులు ఇవ్వం కదా. అందువల్ల పని వత్తిడి వున్నప్పుడు ఓ. టి.చేయమని గడ్డంపట్టుకొని బతిమాలవలసి వస్తుందట. శర్మ లాంటివారు కొందరువుంటే లాభానికి లోటు వుండదు.

మేనేజర్లు అందరూ శర్మ పనితనం గురించి గొప్పగా మాట్లాడారు. నాకు చాలా సంతోషం కలిగింది.

” చిన్నప్పటినుంచివాడు  చాలా ప్రతిభావంతుడండి. ”అనే మాటలతో  మొదలు పెట్టి శర్మ చరిత్ర మొత్తం వివరించాను.

కాని ,ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు.ఒక సారి టూరుకి వెళ్ళి రాగానే ,వెంటనే కేబిన్ లోకి రమ్మని కబురు పెట్టారు జి. యం. గారు. భయం భయంగా వెళ్ళాను. ఎందుకంటే ఆ సారి టూరులో పెద్దగా ఆర్డర్లు సంపాదించలేక పోయాను. ఉద్యోగులు చేసిన మంచి పనులనూ ఆర్జించి పెట్టిన లాభాలనూ వెంటనే మరిచిపోతారు యజమాన్యం వారు –పైగా అది వాళ్ళ బాధ్యత అంటారు. చేయలేకపోయినవాటిని అసలు మరిచిపోరు.

టూరు విషయం ఎత్తలేదు జి. యం. గారు. అది నా అదృష్టం అని అనుకున్నాను.

‘’సీ ,మిస్టర్ రావ్ –‘ తన బల్లమీదవున్న గ్లోబుని వ్రేలుతో తిప్పుతూ అన్నారు జి.యం.’’నేను చెప్పే విషయం ప్రత్యక్షంగా మీకు సంబంధించినది కాదు అని నాకు తెలుసు. అయినా మీకు  చెబుతే మంచిదేమోనని అనిపించింది. ఎందుకంటే ఒక మంచి వర్కరుని కోల్పోవటం నాకు ఇష్టం లేదు’’

పరీక్షా హాలులో అర్ధం కాని ప్రశ్నాపత్రం అందుకున్న విద్యార్ధిలా కంగారు బడ్డాను నేను.

‘’అదే మీ  ఆప్తమిత్రుడు ఉన్నాడు కదా –అదే శర్మ –అతని గురించే —‘’

బల్లమీదవున్న ఫోను మ్రోగింది. ఫోనులో మాట్లాడిన జి. యం. ముఖం యెర్రగా కందిపోయింది. ‘’ఇస్తారయ్యా –ఇస్తారు’’

జి. యం. ఫోనులో అన్నాడు.’’పని మొదలుపెట్టమని చెప్పవయ్యా –కాగితం వచ్చినంతవరకు అంటే –నేను చెబుతానులే –కానీ –‘’

ఫోను గట్టిగా పెట్టి విసుక్కున్నారు జి. యం. ‘’తెలివి మీరిపోతునారు . ప్రతి పనికీ అడ్డుపెడుతున్నారు.—లేటు చేస్తున్నారు. ‘’కోపంగా కుర్చి వెనకు జారి అన్నారు’’ఇదిగో ,ఇదండి వరస –భద్రత గురించి వర్కర్లకు అవసరానికి మించిన అవగాహన కల్పించాడు మీ శర్మ. ఇప్పుడు వర్కర్లు పంపులకి గార్డులు పెట్టాలని,అంటునారు. పంపు మరామత్తుకి ఇచ్చే ముందు పూర్తిగా ‘’డ్రైన్ ‘’ చేసినటు సంతకం పెట్టిన కాగితం ఇమ్మని అడుగుతున్నారు  పనులు ఆలస్యమవుతున్నాయి. ఉత్పత్తి తగ్గే చోట కొద్దిగా చూసి చూడనట్లు  ఉండాలి కదా. మీ శర్మ ఇక్కడకి రాక ముందు ఇలాంటి గొడవలు లేవు ‘’

నేను మౌనం పాటించాను.

బల్లమీదవున్న పైపు అందుకున్నాడు జీ. యం. పైపులోని బూడిద దులిపి కొత్త పొగాకు నింపుకుంటూ అన్నాడు. ‘’పెళ్ళాం పిల్లలూ వున్న  వాడు కదా అని ఆలోచిస్తున్నాను. పైగా మంచి వర్కరు కూడానూ –లేకపోతేనా —‘’గట్టిగా పొగ పీల్చి అన్నారు జి. యం. ‘’మీరు ఒక సారి శర్మతో మాట్లాడండి .గోరుతో పోయేదానికి గొడ్డలిదాకా ఎందుకు ?’’

బాధగా కేబిన్ బయటికి వచ్చాను. బరువెక్కిన పాదాలతో అడుగులు వేసి వెళ్ళింది సమయం.

సాయంత్రం శర్మ ఇంటికి వెళ్ళాను.జరిగినదంతా వివరంగా చెప్పాను. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను,కూడా. కాని నా మాటలు పట్టించుకోలేదు శర్మ. పనిలో భద్రత గురించి, వర్కర్లకు పూర్తి అవగాహన కలిగించటం అవసరమన్నాడు. అందువల్ల ఉత్పత్తి పెరుగుతుందని అన్నాడు. యాజమాన్యం వారుకూడా ఆత్మార్ధంగా భద్రతకి పెద్ద పీట వేయాలని అన్నాడు.

నాకు శర్మ పట్ల జాలి కలిగింది. పనిలో ప్రతిభావంతుడైన వాడు యాజమాన్యం ఆలోచనలను పసి కట్టలేక పోతున్నాడెందుకని !

“ ఒరేయి  ‘’ నేను అన్నాను. ‘’ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయ,రా.కాని ప్రయోగిగంకా ఆలోచించాలి. ఎవ్వరు ఏం చెప్పినా ,ఎంత చెప్పినా ,భద్రత గురించి పర్యావరణం గురించి ఖర్చు చేయడానికి ఏ యాజమాన్యమైనా కొద్దిగా వెనకాడుతుందిరా .వాటి మీద ఖర్చు చేసే డబ్బుకి రిటర్న్ ఉండదు కదా . చట్ట ప్రకారం ఎంత తక్కువ చేయాలంటే అంతే’’

శర్మ తలయెత్తి నన్ను ప్రశ్నార్థకం గా   చూసాడు.నే ను మళ్ళీ అన్నాను. ‘’పైగా ఈ ఆర్ధిక మండలి అలనాటి ఈస్ట్ ఇండియ కంపెని లాంటిది. అందువల్ల నీ వేగం కొద్దిగా  తగ్గించు.నేను ఎందుకు చెబుతున్నానని  అర్ధంచేసుకో . మంచి వర్కరనే పేరుంది నీకు.  జి. యం.గారికి కూడా నీ మీద అభిమానమే. నీ తెలివి తేటలనూ మంచి పేరునీ ఉద్యోగంలో పైకి రావటం కోసం ఉపయోగించు . ఇలాంటి అనవసరమైన —–‘’

‘’ నేను అనుకోవటం లేదు అనవసరమని . ‘’శర్మ గొంతు లేచింది. ‘’పాపం కూలి కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పని చేస్తునారు  . మొన్న ఏమైందో తెలుసా –గంధకామ్లం పంపు చేసే పంపు ,పూర్తిగా డ్రైన్ చేయకుండా మరామత్తుకి ఇచ్చేసారు. హెల్పరు ,బొల్టు విప్పగానే వానలా బయటికి దూకింది ఆమ్లం –అతని అదృష్టం బాగుండటం వల్ల కళ్ళు పోలేదు అంతే. తప్పు చేసినవాడు పొరపాటు ఒప్పుకుంటాడా —అందుకే పూర్తిగా డ్రైన్ చేశారని సంతకం పెట్టి కాగితం ఇమ్మంటున్నాం. ‘’

‘’అలాంటి చోట పని చేసేటప్పుడు వేసుకోవలసిన ప్రత్యేక దుస్తులూ వాడవలసిన భద్రతాపరికరాలు ఉంటాయి కదా ‘’

‘’ఆయనే ఉంటే మంగలివాడు ఎందుకురా —‘’

శర్మలాగే కర్మాగారంలోని యంత్రాలు  కూడా నిర్విరామంగా తిరిగాయి. ఉత్పత్తిలోనూ కొత్త మందులు కనిపెట్టడంలోనూ మా సంస్ధ ముందడుగు వేసింది. కొత్తగా కనిపెట్టిన మందులు మనుషుల మీద ప్రయోగించడానికి సిద్ధమైంది  .

అప్పుడు జరిగింది ఆ సంఘటన —

పొగ గొట్టం మరామత్తు కోసం పైకి ఎక్కిన ఒక వర్కర్ క్రిందపడి చనిపోయాడు. పెద్ద గొడవకి దారి తీసింది ఆ సంఘటన. ఎత్తులో పని చేసేటప్పుడు సేఫ్టీ బెల్టు వాడటం తప్పనిసరి. అతడు బెల్టు వాడాడు. కాని అది బలంగా ఒక చోట తగిలించలేదని ,అందువల్ల పడిపోయాడని యాజమాన్యం వారు అన్నారు. పైగా అతడు మద్యం మత్తులో ఉండేవాడని కూడా ఋజువు చేసారు. కాని కార్మికులు ఒప్పుకోలేదు. వాడిన బెల్టు పాతదని అలాంటివే కర్మాగారంలో లభ్యమని ,వాటి బలాన్ని టెస్టు చేయించకపోవటం వల్లనే ప్రమాదం జరిగిందని వాదించారు. వర్కర్లను ఉసికొల్పేది శర్మే నని నమ్మింది యాజమాన్యం. సమస్య సమ్మేకి దారి తీస్తుందేమో నని భయపడిన యాజమాన్యం జి. యం. గారిని ఉద్యోగంనుంచి తొలిగించి శాంతి కుదుర్చుకున్నారు.

కొత్త జి. యం. చేరగానే కార్మికులతోనూ వర్కర్లతోనూ సమావేశమైనాడు.  జరిగిందేదో జరిగిపోయిందని ఇక మీదట అలా జరగదని హామీ ఇచ్చారు. అంతే కాదు , పనిలో భద్రత ను త్యాగం చేస్తే ఊరుకునేది లేదని నొక్కి వక్కాణించాడు. ఎవ్వరైనా  భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినా  ,ఉల్లంఘించ డానికి ప్రోత్సాహం ఇచ్చినా వెంటనే –అర్ధరాత్రీ అయినా –తనకి ఫోను చేసి మాట్లాడమని నిర్దేశించారు .అంతే కాదు శర్మని ప్రత్యేకంగా తన కేబినులోకి పిలిచి అభినందించాడు కూడా  .

‘’సీ ,మిస్టర్ శర్మా –‘’కొత్త జి.యం.అన్నారు. ’’మీరు పని చేసే ఈ కర్మాగారంలో పని చేయటం నా అదృష్టం. ప్రతి కర్మాగారంలోను మీలాంటివాడు ఒకడైనా వుంటే పరిశ్రమల్లో ప్రమాదాలకు తావుండదు. వాట్ ఏ డెడికే ట్టడ్ మాన్ యు ఆర్ !ఉత్పత్తి తగ్గితే  మరో రోజు సాధించవచ్చు –కాని ప్రమాదానికి గురైన  వాడ్ని తెచ్చుకోగలమా —‘’

శర్మతో పాటుకార్మికులు కూడా ఆ మాటకి పొంగి పోయారు.  భద్రతపట్ల అంకింత భావంగల జి. యం. వచ్చినందుకు సంతోషించారు. ఆ ఆదివారం కలిసినప్పుడు అదే మాట అన్నాడు శర్మ.

‘’నువ్వు పొరపడుతున్నావురా ‘’నేను అన్నాను ’’నువ్వు ఎంత ప్రతిభావంతుడు వైనా యాజమాన్యం వారి ధోరణి పట్టుకోలేకపోతున్నావు ‘’

“ ఏంటిరా   , అలా అనేసావు ? ’’

‘’నువ్వు ఒకటి అర్ధం చేసుకోవాలి శర్మా  –పాత జి. యం. అయినా కొత్త జి.యం.అయినా , జి.యం. జి.యం.నే . వాళ్ళ ఆలోచనలు బయట కనబడినా ,కనబడక పోయినా ఒకే లాగానే ఉంటాయి.పనికి సంబంధించిన ఆలోచనలు మనిషిని బట్టి మారవు. పదవినిబట్టి మారుతాయి. ‘’

‘’నాకు అర్ధం కాలేదురా –‘’

‘’జి.యం.ఎవ్వరైనాసరే , ఆలోచనా ధోరణిలో మార్పువుండదు. నీకు ఒకటి తెలుసా – జి. యం.ఉద్యోగాల మార్పిడి కుండ మార్పుల పెళ్ళిలాంటిది. ‘’

‘’అంటే —‘’

‘’ఆ  జి.యం. ఎక్కడకి వెళ్లారనినీకు  తెలుసా —మన కొత్త జి.యం.ఖాళీ చేసి వచ్చిన పోస్టుకి—మన యజమాన్యంవారే సర్దుబాటు చేసారట. ‘’

‘’సార్ ,ఇక్కడే  —‘’ఎవ్వరో కేక వేసి పిలవటం విని బైకు అపాను. ప్రభుత్వాసుపత్రి గేటు వద్దవున్నాను నేను. మా కర్మాగారంలో పనిచేసే ఇద్దరు ముగ్గురు నా  చుట్టూ  చేరారు.

‘’ఎలావుంది శర్మకి —‘’బైకు పార్కు చేసి  అడిగాను.

‘’ఎలావుంది అంటే —-‘’

‘’ఏమైందని  చెప్పరేం —?’’నా మనసు కీడు శంకించింది .

‘’ఏం చెప్పను ,సార్ ,’’ ఒకడు కళ్ళు వత్తుకొని అన్నాడు.

‘’పోనీ ,ఆ రోజు ప్రమాదం ఎలా జరిగింది ?’’

‘’ఆ రోజు రాత్రి —మరిగించిన గంధకం పంపు చేసే  పంపు పని చేయటం మానేసింది  సార్. ఎంత ప్రయత్నించినా స్టార్టు కాలేదు. జి.యం.గారు శర్మని తీసుకురమ్మంటే ఇంటికెళ్ళి తీసుకొచ్చాం. ఇంత వరకెప్పూడూ రాత్రి పూట  అతన్ని తీసుకురావలిసిన అవసరం రాలేదు. శర్మ ఎప్పుడూ పగలేగా పని చేసేది —‘’

‘’ఏమైందని చెప్పండి ‘’

‘’వస్తూనే పంపువద్దకు  పరిగెత్తాడు శర్మ. మరిగే గంధకం నిలువు చేసే టాంకు పైన వుంటుంది పంపు. దానిమీద వుండే పలక ఒకటి –పంపుదగ్గరదే  –ఎప్పుడో ఎవ్వరో తీసి వుండడం శర్మ గమనించలేదు. హడావిడిగా వెళ్తూ ఒక కాలు మరిగే గంధకంలో కి —‘’

‘’అమ్మ బాబోయి —‘’

‘’కాని గంధకం కాళ్ళకు  తగలలేదండి. వ మరిగించడానికి వాడే ‘’స్టీమ్ ‘’తగిలింది. మోకాళ్ళ దాకా కాలింది. ‘’

‘’ఏ గదిలో వున్నాడు ?’’

‘’నూరో నెంబరులో —‘’

ఒక ఉదుటున లోపలకి వెళ్ళాను. ఒక కుర్చీలో కూర్చుని బయటికి చూస్తునాడు శర్మ. ‘

“ ఒరేయి  ,శర్మా —-‘’

వాడు వెనక్కు  తిరిగి చూడలేదు. వెక్కి వెక్కి ఏడవటం వినబడింది.

‘’అన్యాయమై పోయానురా –నేను అన్యాయమై పోయానురా –‘’

‘’ఊరుకోరా –ఇప్పుడు ఏమైందని –ఒక నెల రోజుల్లో మళ్ళీ మామూలు అవుతావురా –‘’

ఒక నిమిషం మాట్లాడలేదు శర్మ. ఆ తరువాత అన్నాడు.

‘’ఒక సారి నా దగ్గరకి వచ్చి కిటికీనుంచి చూడరా –‘’

‘’ అక్కడ ఏముందిరా చూడడానికి  —‘’ నేను శర్మ దగ్గరకి వెళ్ళాను.

‘’అదిగోచూడు  ,ఆ కనబడేది బీచురోడ్డు కదూ –‘’

‘’అవును ‘’

‘’ఈ రోజు పున్నమి కాబోలు –పిచ్చెక్కిన సముద్ర కెరటాలు బీచులో నిలబడినవాళ్ళ పాదం క్రింత ఇసుకను లాగేస్తునాయి . పున్నమి వెన్నెల లో వెండి పూత పోసుకున్న సముద్రం —‘’

‘’అవునవును ‘’

‘’దూరంగా బెర్తు కోసం ఎదురు చూసే నావలు ,మన బ్రతుకులలా –అయ్యో చూడు ,ఆ చంటి పిల్ల రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుతోంది. పరిగెత్తుకొచ్చే కారు క్రింద —-‘’

‘’ఏంటిరా ,ఈ పిచ్చి మాటలు —‘’

‘’నాకు అంతా బాగానే కనబడుతున్నాయి కదురా ‘’

‘’ఎవ్వరన్నారురా నీకు కనబడటం లేదని —‘’

‘’డాక్టర్ అన్నారురా నాకు రేచీకటి అని –రాత్రి పూట నాకు ఏది కనబడదని –అందుకే యాక్సిడెంటు జరిగిందని —‘’

నేను తుళ్ళి పడ్డాను.

‘’ఇది మెడికల్ కాలేజీ తాలూకు ఆసుపత్రి కదా –ఇక్కడ డాక్టర్ సర్టిఫికటు ఇచ్చేసారు రా –ఇక నాకు ఫాక్టరీ ఉద్యోగానికి అర్హత లేదట.ఇక ఫాక్తరికి రానవసరం లేదన్నారురా ‘’

నా గుండె తరుక్కుపోయింది –అంటే శర్మ ఇలా—బుర్ర పిచ్చెక్కినటైంది. గది బయటికి పరిగెత్తుకొస్తూ   అనుకున్నాను.

అవును ,మా కంపెని వారు కొత్త మందులు కనిపెడుతునారు !

***

LR-SWamy-240x300 –ఎల్. ఆర్. స్వామి

 

 

 

 

 

 

 

 

 

 

 

 

నిష్క్రమణ అంటే…

 ఎల్. ఆర్. స్వామి

ఎల్. ఆర్. స్వామి

ఒక రోజు ,

ఇంటి తలుపులు తెరిచేవుంటాయి

చిరు జల్లు కురిస్తూ ఉంటుంది .

కొలువు మూసిన సూర్యుడు

ఒక సారి తొంగి చూసి నిష్క్రమిస్తాడు

యెర్ర మబ్బుల గాయాలతో ,

పొగమంచుల స్వేద బిందువులతో ,

మరో ఉదయం కోసం ,మరునాటి యుద్ధం కోసం ,

కొత్త వెలుగు నింపుకోవటం కోసం .

నా  మిత్రుడు ,అల్లరి గాలి

ఇంటి లోపకి చొరబడుతాడు

లోలోపల ఇర్రుకు పోతాడు

ఇంటిలో నేను ఉండను –

కాని నా ప్రపంచం ఉంటుంది

అక్షరాల ప్రపంచం ఉంటుంది

నా చూపులుంటాయి ,కళ్ళద్దాలుగా

నా ఇంటి గొడలూ వుంటాయి

కాని వాటికి నేను పామిన రంగులుండవు

ప్రపంచపు రంగులుంటాయి

మా ఇంటి గోడ రంగు

ప్రపంచపు రంగు వైనప్పుడు

ఇక నేనుండను –నిష్క్రమిస్తాను

నిష్క్రమణ అంటే ఒక విస్తరణ

నూతనత్వం కోసం వేసే తొలి అడుగు .

-ఎల్. ఆర్.స్వామి

విఫల స్వప్నాలు, వైయక్తిక వేదనల ప్రతిబింబం ఆధునిక మళయాళ కథ

A house hotel boat on the backwaters in Kerala

రెండో భాగం

ఆధునిక మలయాళ కధ  

ఒకానొక కాలంలో చోటు చేసుకున్న సామాజిక పరిణామాలు మలయాళ కధా సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి .ఆ సామాజిక పరిణామాలు వల్ల ఏర్పడిన సామాన్య ప్రజల జీవిత వ్యధను శక్తివంతంగా చిత్రీకరించగలగింది అనేదే ఆధునిక మలయాళ కధ తాలూకు విజయం –కీర్తికి కారణం కూడా. అందువల్ల కేరళలో నెలకొన్న సామాజిక స్దితిగతులు గురించి సంక్షిప్తంగా నైనా  సమగ్రంగా చెప్పటం తప్పదు. ఈ సామాజిక స్దితిగతులు భారత దేశంల్లోని ఇతర ప్రాంతాల్లో నెలకొన్నవాటికన్నా చాలా భిన్నము . గొప్ప రచయితులైన ఎం. టి. వాసుదేవన్ నాయర్ మొదలగువారి రచనల తెలుగు అనువాదాలను చదివి ఆస్వాదించాలంటే అలనాటి సామాజిక స్దితి గతులు గురించి ఒక కనీస పరిజ్ఞానం  ఉండాలిసిందే.

కేరళలోని అగ్రకులస్తులు [హిందువులుగురించే ఇక్కడ ప్రస్తావిస్తునాను ],నంబుద్రి ,నాయర్[మీనోన్ ,పణిక్కర్ మొదలగువారు  వారు కూడా నాయర్లే –అగ్రకులస్తులు ]నంబుద్రి అంటే బ్రాహ్మణుడు –ఈ కులంవాళ్ళు తరతరాలుగా భూస్వాములు  –పితృసామ్య వ్యవస్ద గలవాళ్ళు- ఉమ్మిడి కుటుంబంగా జీవించిన వీళ్ళ కుటుంబాల్లో అన్నదమ్ములు కలిసి వుంటేవారు –ఆస్తి పెంపకం ఉండదు -. ఇంటికి పెద్దవాడు –తండ్రి లేదా  తండ్రి లేకపోతే పెద్దన్న ఆస్తి వ్యవహారాలు ఇంటి విషయాలు చూసుకునేవారు.  అలనాటి సాంప్రదాయనుసారంగా కావ్యాలు నాటకాలు తర్కం మొదలైనవి నేర్చుకున్న వీళ్ళు విద్యావంతులు –కవులు ,కళా సాంస్కృతిక పోషకులు. కాని వీళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇంటికి పెద్ద కొడుకు మాత్రమే నంబుద్రి యువతిని పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకొస్తారు –పెళ్ళి ఒకటో రెండో ,ఎన్నో –ఆ నంబుద్రి భార్య ద్వారా కలిగిన పిల్లలకే ఆస్తి హక్కు ఉంటుంది . మిగతా కొడుకులు వాళ్ళుకు తోచినటు ఇష్టమైన ఇతర కులస్తులతో [ముఖ్యంగా నాయర్ మీనోన్ యువతులతో] సంబంధం పెట్టుకుంటారు.సంబంధం అంటే అందరికీ తెలిసిన లైంగిక సంబంధమని అర్ధం . మంత్ర తంత్రాలతో కూడిన పెళ్ళి కాదు. తాళి కట్టు ఉండదు –అసలు తాళియే ఉండదు. అలా సంబంధం చేసుకున్న యువతి తన ఇంటిలోనే ఉంటుంది. నంబుద్రి, ఆ పిల్ల ఇంటికి రాత్రి వచ్చి పొద్దునే లేచి వెళ్ళి పోతాడు. పిల్లలు కలిగినా ఆ పిల్లలు తల్లితో పాటు తల్లి ఇంటిలోనే ఉంటారు –నంబుద్రి ఇచ్చినది పుచ్చుకోవటమే తప్ప హక్కు ఏది లేదు. అలనాటి నాయర్ సమాజంలోని వివాహ వ్యవస్ద దీనికి అనుగుణంగానే ఉంటేది .ధనవంతులైన గొప్ప నాయర్ కుటుంబాలు ఉంటేవి ఆ రోజుల్లో. మాతృస్వామ్య వ్యవస్ద పాటించేవారు నాయర్ ,మీనోన్ సమాజాలు . ఆస్తి మొత్తం ఆడపిల్ల పేరు మీదే ఉంటేది.మేనమామ ఇంటి పెద్ద –ఆస్తి వ్యవహారలంతా అతడే చూసేవారు. తరవాడు అనబడే నాయర్ మాతృస్వామ్య వ్యవస్డలోని ఉమ్మిడి కుటుంబంలో ఇంటి పెద్ద మేనమామ ,అతని తల్లి అక్కచెల్లిల్లు, తమ్ముళ్ళు,  మేనకోడళ్ళు , మేనల్లళ్ళు –అందరూ కలిసి ఉంటేవారు –నాయర్ మీనోన్ సమాజంలోని వివాహ వ్యవస్ద, సంబంధమే. ఇంటి పెద్దవైన మేన మామ భార్య ఆవిడ ఇంటిలోనే ఉంటుంది. ఇంటివ్యవహారాలు చక్కబెట్టుకున్న అతడు రాత్రి భార్య ఇంటికి వెళ్ళి పడుకొని పొద్దునే తిరిగి తన ఇంటికి వస్తాడు . తరవాడులోని ఆడవాళ్ళకు పుట్టిన పిల్లలందరూ ఆ తరవాడులోనే బ్రతుకుతారు. ప్రతి ఆడపిల్లకి కూడా ఆస్తి మీద హక్కు ఉండేది ఇరవై ముప్పై మనుషులు వున్న తరవాడు సాధారణమే . వాళ్ళు కోసం పెద్ద పెద్ద ఇల్లు /వాటాలు ఒకే ప్రాంగణంలో ఉండేవి ,ఒకే వంట గదితో.

ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు ముఖ్యంగా తీయలు శ్రీ నారాయణగురు వల్ల ప్రభావితులై సామాజిక రంగంలో ముందడుగు వేసారు అప్పటికే. ముస్లింలు క్రిస్టియనులు ముఖ్య ధారలో కలిసిపోయినవాళ్ళే  . వీళ్ళు కాక తమిళ నాడు నుంచి వలస వెళ్ళి కేరళలో స్ధిరబడ్డ అరవ బ్రాహ్మణులు [అయ్యర్ ]కర్నాటకవాళ్లు కూడా సమాజంలో ఉండేవారు కనుక సాహిత్యంలో కూడా కనబడుతారు .

ఉమ్మిడి కుటుంబపు ఉక్కు హస్తాలనుంచి వ్యక్తి స్వతంత్రుడైన కాలం ఇది .అలా ఉమ్మిడి కుటుంబ వ్యవస్థ  నుంచి బయిటికి వచ్చి తన విధి తనే స్వయం నిర్ణయించడానికి ప్రయత్నించే మేనల్లుళ్ళ వైయక్తిక అనుభవాల నుంచి పుట్టుకొచ్చిన భావుకతే ఈ తరం రచయితుల బలం . జీవితాన్ని గెలవాలనే ఆతృత ,ఆ ప్రయత్నంలో అందిన స్వల్ప విజయాలు ఎక్కువ నైరాశ్యం ,ఆత్మనింద ,ఛవి చూసిన మోసాలు కక్ష మొదలైన భావాలు ఈకాలం కధల్లో కనబడుతాయి .

ఆర్ధిక సామాజిక సమస్యలు అప్రసక్తం కాలేదు కాని సామాజిక సమస్యలకన్నా సొంత సమస్యలకూ కలలకూ వేదనలకు ప్రాధాన్యం ఇచ్చారుఈ కాలపు కధకులు .  ఆకలి బాధ కన్నా హృదయ బాధ భరించలేనిదిగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే కధ ‘’మానసిక జీవితానికి   ప్రచురణా కేంద్రమైంది ‘’ తన హృదయం మీద తగిలి  ప్రతిఫలించే అనుభవాలకు తన గుండె రంగు కలిపి చిత్రీకరించారు రచయితలు –అలా కధ ఒక భావ గీతానికి దగ్గరైంది.

కొన్ని మానసికావస్థలను అనుభవ ముహూర్తాలను ఆవిష్కరించవలసి వచ్చినప్పుడు నిర్మాణ చాతుర్యం అనిర్వార్యమైంది. అంతర్భావావిష్కారం కోసం మాటలనూ  బింబాలనూ ఆశ్రయించవలసి వచ్చింది. ఎత్తు గడ కధ ,ముగింపు మొదలైనవాటితో బంధించబడిన ఒక కధ చెప్పడానికి కాదు ,కధ ద్వారా కొన్ని వైయక్తికానుభూతులు అందించడానికి ప్రయత్నించారు ఈ కాలపు రచయితలు . ఇలా కధలకు కావ్యాత్మ ఇచ్చిన రచయితలు టి.పద్మనాభన్ ,ఎం.టి.వాసుదేవన్ నాయర్ ,కమలాదాస్ -1950 దశకపు ద్విదీయార్ధంలో జరిగిన పరిణామం ఇది. కాని వైయక్తికానుభవాల ఆవిష్కారం అని చెప్పగానే వాళ్ళు సామాజిక సమస్యలను నిర్లక్ష్యం చేశారని అనుకోకూడదు వైయక్తికానుభవం సామాజిక సమస్యనుంచి ఉత్పన్నమైనదే.

Mt_vasudevan_nayarఎం. టి. వాసుదేవన్ నాయర్ కధలు :[1933—జననం ]

ఈ కలఘటపు కధా చరిత్ర వీక్షణం  ఎం. టి. గారి కధలతోనే ప్రారంభించాలి.శిధిలావస్దకి చేరే ఒక సామాజిక స్దితిని దానివల్ల ఉత్పన్నమైన మానసిక సంఘర్షణలను కవితాత్మకంగా పాఠకుల  గుండెకి అంటుకునే విధంగా చిత్రీకరించగలగటమే   ఎం. టి. కధల గొప్పతనం.శిధిలావస్దకి చేరే తరవాడులు ,వాటిలో అవగణనకీ పీడనకీ గురయే మేనల్లళ్ళు వాళ్ళ వైయక్తిక ప్రపంచం –ఇవీ ఎం. టి. కధా ప్రపంచం. అతడు ఒంటరివాడైన వ్యక్తి కధే చెబుతున్నాడు . చిన్నపిల్లవాడుగా వున్నప్పుడు అనుభవించిన నిర్లక్ష్యమూ దారిద్ర్యమూ దీనికి కారణాలు. చిన్న పిల్లాడుగా వున్నప్పుడు అవసరాలు ఆనందాలు నిషేధింపబడిన వాడు యవ్వనంలో జీవితాన్ని గెలవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్రమశిక్షణతో కూడిన బ్రతుగు గడిపే శక్తిని కోల్పోయి తీవ్ర జీవితాశక్తి తో ముందుకు సాగుతునాడు –శాంతి పర్వం ,సంధ్య వెలుగు, నీలి కొండలు ,మొదలగు మొదటి కధల్లో ఇలాంటి పాత్రలు కనబడుతాయి –సామాజిక పరిస్డితుల పట్ల కక్ష ,ఆత్మ నింద వాళ్ళ ముఖ ముద్రలు. మానసిక సంఘర్షణల చిత్రీకరణ అనే విశేషణానికి అర్హమైన ఇతని కధల్లో శిధిలమయే తరవాడు ఎప్పుడూ  ఉంటుంది.

కధా నేపధ్యం నగరమైనా ఎలాగోలా తరవాడు గ్రామీణ జీవితం ,గ్రామీణ వాతావరణం మొదలైనవి కధల్లోకి చొచ్చుకువస్తాయి –ఇతని కధలకు నిడివి ఎక్కువ. ప్రతి కధలోను కచ్చితమైన సామాజిక నేపధ్యం ఉంటుంది. స్థల కాల సామాజిక స్ధితులు కధల్లోని విడతీయలేని అంశాలు –అందువల్లనేమో కధను మనం అనుభవిస్తాం –అనుభూతి పొందుతాం. భావాత్మకమైన బింబాత్మక మైన  కధలు ఎం. టి. వ్రాసిన కధలు. ఎక్కువ కధలు ‘’అతడు ‘’అనే మాటతోనే మొదలవుతాయి –కధా నాయకుడు అతడే –పేరుకుడా ఉండదు. అనవసరమైన ,అర్ధ రహితమైన ఒక మాట కూడా అతని కధల్లో కనబడవు.

ఆత్మలో కవిత్వం లేనివాడు కధ వ్రాయకూడదు అనే తన నమ్మకాన్ని బయిట చెప్పటమే కాదు తన రచనలు ద్వారా ఋజువు చేసినవాడు కూడా టి. పద్మనాభన్ [జననం 1931]అనే రచయిత. సరళమైన కధాఖ్యాన శైలి ఇతనిది.

ఈ ఇద్దరి రచనా వారసత్వాన్ని కొనసాగించినా ,ఈ కధకులంత సహృదయామోదం పొందని రచయితలు కొందరున్నారు. గొప్ప కధలు వ్రాసినా మర్రి చెట్టుకృంత మొక్కల్లా నిలిచిన ఈ రచయితలు కూడా మలయాళ కధా వికాసానికి బాట వేసినవారే.ప్రముఖ రచయిత్రి మాధవికుట్టి [కమలా దాస్]గురించి ప్రస్తావించే ముందు ఇలాంటి కొందరు ప్రముఖ రచయితలు గురించి ప్రస్తావించాలి. –వాళ్ళలో ముఖ్యుడు ఎన్. పి. మొహమ్మదే. మతం తాలూకు సరిహద్దులు దాటిన అధికారం,జీవితం తాలూకు మానసిక ప్రశాంతతను పోగొట్టే మూఢ నమ్మకాలు ఆచార సాంప్రదాయాలు,మామూలు మనుషులను ప్రలోభాలు వల్ల మోసగించే తంగళ్ [ముస్లిం పెద్దలు ] బహుభార్యాత్వం వల్ల కలిగే నష్టాలు ,భోగాలకు ముసుగుగా నిలిచే మత నియమాలు వగైరాలను కొన్ని కధల్లో హాస్యంతోనూ ,మరి కొన్ని కధల్లో నిశిత విమర్శ తోను మిళితం చేసి రచన చేసాడు ఇతడు. ముస్లిం మిత్రుల  వ్యాఖ్యానాలు ద్వారా సామాజిక జీవితం తాలూకు అర్ధం వెతుకుతునాడు ఈ కధకుడు . ఒక కధలో రచయిత ఇలా అంటాడు

‘’మరణం ఎదుగుదలను మేం జీవితం అని అంటున్నాం –మీకు తెలియనిది అల్లాహుకు తెలుస్తుంది –మొక్కలను చూడండి. అవి ఎదుగుతున్నవి ,పుష్పించడానికీ కాయలు ఇవ్వడానికీ మాత్రమే.  మరణించడంకోసం ఎదుగుతున్నారు మీరు.  మీరు పుట్టగానే నిజంగా మీరు చనిపోతున్నారు –మీ జననమే మీమరణం ‘’

సామాజిక జీవితమే ఇతని కధావస్తువు

విషాద భావంతో మిళితమైన తీక్ష్ణ వైయక్తిక ప్రపంచం ఎన్. మోహనన్[1933 –1999 ] కధా ప్రపంచం –ఆత్మనిష్ట మైన అనుభవాల ప్రపంచం –వైయక్తికమైన సత్యాన్వేషణలు అవి. మరణం సృష్టించే విషాదం ఇతని కొన్ని కధల్లో చూడవచ్చు. రాజకీయభావాలకు ,కులానికి మతానికి అతీతమైన మానవతా కోణం ఇతని కధల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది. అతి తక్కువ కధలు వ్రాసిన ఇతడు కధా నిర్మాణంలో  ,మనసులోని భావానికి అనుగుణ మైన రూపం కధే తీసుకుంటుందని వదిలేసేవాడు. క్షేత్రోద్యోగి కనుక ,తనకు సుపరిచితమైన క్షేత్ర జీవితంలోని అనుభవాలనూ అలనాటి సంబంధం వ్యవస్థ వల్ల నెలకొన్న’ లూస్ ‘  లైంగిక సదాచారం  మొదలైనవాటిని ఆధారంగా చేసుకొని మంచి కధలు వ్రాసిన రచయిత ఉన్నికృష్ణన్ ,పుతూర్. సీదాసాదాగా కథనూ  పాత్రల మానసిక స్డితులనూ  వివరిస్తాడు ఈ కధకుడు.

కేవలం 12 కధలు వ్రాసి 34వ ఏట చనిపోయిన రాజలక్ష్మి షి [1930—1965] ఈ తరంలోని ఒక గొప్ప రచయిత్రి. స్త్రీల బాధలు ఆత్మ వ్యధలు ,అలనాటి సామాజిక గృహ వాతావరణంలో స్త్రీలు ఎదుర్కొనే సవాళ్ళు సంఘర్షణలు ఆమె కధలకు ఆధారం.

సంపూర్ణం కాని వ్యక్తిత్వాలూ ఆశ్చర్యకరమైన జీవిత సంఘటనలూ సి.వి. శ్రీరామన్ కధలకు ప్రాణంపోసే అంశాలు. వ్యక్తులకు సంఘటనలకు ఇతని కధల్లో సవిశేషమైన ప్రాధాన్యం ఉంటుంది.చాలా శ్రద్ధతో కధకి ఇతివృత్తం  అల్లుతాడు ఈ రచయిత. ఇతని కధానేపద్యం కేవలం కేరళ రాష్ట్రానికే పరిమితం కాదు. అతని ప్రసిద్ధ కధ ‘వాస్తు హార ‘ కి నేపధ్యం బెంగాల్. వ్యత్యస్తమైన రెండు సంస్కృతుల సంఘర్షణల సమన్వయ తలాలను ఆవిష్కరిస్తోంది ఈ కధ. వృతి రీత్యా వక్కీలైన ఇతడు న్యాయవృత్తికి సంబంధించిన మంచి కధలు కూడా వ్రాసారు. తమ దృక్పథా నికి  అనుగుణంగా మంచి కధలు వ్రాసి మలయాళీ పాఠకుల  మన్నెన పొందిన రచయితలు ఎందరో ఉన్నారు ఈ తరంలో –కాని రచయితుల పేర్లు వారి కధలు, సంపుటాలు ,వివరించటం ఈ వ్యాసం తాలూకు ఉద్దేశం కాదు కనుక కొత్త భావాలకు కాని కొత్త రూపాలకు కాని ఊపిరి పోసి మలయాళ కధను ఒక మలుపు తిప్పిన రచయితలు గురించే వివరించాలని అనుకున్నాను కనుక కొందరి పేర్లు [వాళ్ళూ గొప్ప రచయితులే– అయినా ప్రస్తావించటం లేదు ]

Kamala_dasభావుకతే మాధవికుట్టి[1934—2007] [కమలాదాస్ ]ప్రత్యేకత  అని చెబుతే అది నిజం కాదు. జీవితమంటే ఆమెకున్న కచ్చితమైన వాస్తవిక స్పృహ,రుచికరంకాని నిజాల ముఖాలను దాచే ఆదర్శవాదుల తిరస్కారం —ఇవీ ఆమె కధలను అస్వస్డత రేకెత్తే  అనుభవాలుగా మలిచాయి. అందమైన జీవితనిమిషాలు చాలా అరుదుగా కనబడుతాయి ఆమె కధల్లో. ఆమె కధల్లో ఎక్కువ కధలు నగర నేపధ్యం తో వ్రాసినవే –కపట భరిత జీవితాలు గురించి జీవితాన్ని అడ్జస్ట్ మెంట్ గా  మార్చిన బ్రతుకులు గురించి వ్రాసారు ఆమె . పల్లెలు ,పల్లె మధురిమలు ఆ కధల్లో అప్పుడప్పుడు జ్ఞాపకాలుగా స్వప్నాలుగా కనబడవచ్చు.తమది కాని బ్రతుకు బ్రతక వలసిన ధనికుల ధర్మ సంకటాలు ఆమె కధా ప్రపంచానికి ఒక  ప్రతేక పరివేషంగా నిలిస్తోంది.

దారితప్పిన దాంపత్యాల అణిచివేసిన రోధనా స్వరాలు కమలా దాస్ వ్రాసిన ఎక్కువ కధల్లో అంతర్ధారగా కనబడుతాయి. పరస్పరం మోసగించి బ్రతికే  భార్యా భర్తలు –భర్త నుంచి తనకు సంపూరణమైన ప్రేమ అందనప్పుడు భార్య ఒక ప్రియుడు కోసం వెతుకుతుంది. –భర్తను మోసం చేస్తుంది.  భర్తను  మోసగించాననే నేర చింత వల్ల సతమతమయే వాళ్ళు కొందరు –నేరచింత కలగనివాళ్ళు రతీలోకంలో స్వతంత్రంగా విహరిస్తారు –ప్రేమ ,రతి –రెండూ ఒకటి కాదు అని చెబుతాయి ఈమె కధలు – తన కధలు ద్వారా కమలా దాస్ మన ముందు వుంచే ప్రశ్న ఒకటుంది. అది –

తనను ఎన్నెడూ మనస్ఫూర్తిగా ప్రేమించని  భర్తకి లైంగికంగా లొంగిపోవట మనేదా లేకపోతే తనను నిజంగా ప్రేమించే పరపురుషుడికి సంతోషం తో స్వయం అర్పించుకోవటమా  న్యాయం అనే ప్రశ్న అది. కామాసక్తి లేని ప్రేమ వాస్తవికమా? స్త్రీ తాలూకు జీవిత దృకోణం వేరు. ఆమె జీవితాన్ని, పురుషుడు చూసినట్లు చూడదు;అనుభవించదు. ఆమె కోరికలను ఆశలను పోల్చటంలో పురుషుడు విఫలమవుతునాడు –ఈ విశాల దృక్కోణం నుంచి వీక్షిస్తే కమలాదాస్ స్త్రీ వాదియే. సరళంగా గుండెను హత్తుకునే  రీతిలో వ్రాస్తారు. కమలాదాస్ కధల్లోని స్త్రీ పాత్రలు అలనాటి మలయాళీ సమాజానికి సంబంధించినవని చెప్పలేము –ఆమె కధల్లో కనబడే స్త్రీపాత్రలు విశ్వ మహిళలు. అందువలనే ఆమె కధలు ప్రపంచ ప్రాచుర్యం పొందాయి . కమలాదాస్ రచించిన  కొన్ని ముఖ్య కధలు తెలుగులో లభ్యం .

220px-Sara అభ్యుదయ ఆదర్శాల వెలుగులో కూర్చుని రచన చేసిన కధా రచయిత్రి సారా జోసెఫ్ [జననం 1934 ]జీవిత బంధాల్లోని కాలుష్యమూ వ్యక్తి జీవితంలోని దర్మ సంకటాలు ఈమె కధలకు ఇతివృత్తం. అలాగైనా సరే బ్రతుకు బ్రతకటం కోసమే అనేది ఆమె అభిప్రాయం. స్త్రీవాదానికి సంబంధించిన కధలు ఈమె వ్రాయలేదు ;కాని భారతీయ సామాజిక పరిస్డితిల్లో స్త్రీలు అనుభవించే అణిచివేతలనూ దురితాలనూ పోలిస్తునారు ఈవిడ. కధ చెప్పే టెక్నికు కన్నా కధ మీదే ఈ రచయిత్రి తన శ్రద్ధ కేంద్రీకరిస్తునారు.

ఈ తరానికి చెందిన మరో ముఖ్య కధకుడు పద్మరాజన్ [1945—1991 ]. ఎం.టి.లా కాల్పనికుడు కాదు. ఆధునికత యొక్క దర్శనము ప్రయోగాత్మకత కనబడదు అతని రచనల్లో. అతి సాధారణ జీవితాల్లోని  అసాధారణ ముహూర్తాలు  కనిబెట్టే అతని రచనలు వాస్తవికతకి అతి దగ్గరగా వుంటాయి. విషయం ఏదైనా –మనకు నచ్చనివైనా నిరాడంబరంగా ఆవిష్కరించే రీతి అతనిది.  ఇతడు చాలా తెర కధలు కూడా వ్రాసారు కొన్ని కధల్లో రతి యొక్క విస్తృత ఆవిష్కారం కనబడుతుంది

ఈ కధా రచయితల్లో ఎందరో ఇంకా రచనా రంగం మీద సజీవంగానే వున్నారు –కాని 1960లోనే వ్యత్యస్త రూపభావాలతో కూడిన వీళ్ళ రచనలు వెలుబడ్డాయి.  కవిత్వంలోనూ నవలలోనూ అలా కధల్లో కూడా ఆధునికత రూపు దిద్దుకుంటూనే ఉంది –కాని కధలోని ఆధునికతకి సమాంతరంగా రూపు దిద్దుకున్న నవీన కధ వైపు తిరుగుతాం ఇక

పైన చెప్పబడిన రచయితలు రచనా రంగం మీద అడుగు పెట్టిన కాలంలోనే రచనలు ప్రారంభించిన కొందరు కధా రచయితలున్నారు –అలనాటి మలయాళ సాహిత్యంలో నవీనధార సృష్టించినది ఆ  ధారని  సజీవంగా నిలిపినదీ వీరే. ఓ. వి.విజయన్ ,ఎం. ముకుందన్,కాక్కనాడన్ ,సేతు పునత్తిల్, కుంజబ్దుల్లా, ఆనంద్ మొదలైనవాళ్ళు వీరు –ఆధునిక కధకులు అని చెప్పబడే కధకులతో పాటు రచన ప్రారంభించిన వీళ్ళు భిన్నమైన ఒక భావుకతను  సృష్టించారు –అంతే .

ఫ్రెంచ్ ,జెర్మన్ ఆంగ్ల భాషల్లోని ఆధునిక సాహిత్య ప్రభావం వీళ్ళలో కనబడుతుందిసార్త్రే,  కాఫ్కా,  నీషే  మొదలగు రచయితుల దార్శనికత్వం కొంతవరకు వీళ్ళ అభిరుచిని ప్రభావితం చేసిందనే చెప్పాలి

“ అప్పటకే సమాజంలో నెలకొన్న మూల్యాలను సామాజిక వ్యవస్దనూ తిరస్కరించిన ఈ కధకులు జీవితం తాలూకు అర్ధ రాహిత్యం గురించి వ్యర్ధత గురించి వ్యక్తపరచడానికి ప్రయత్నించారు. వాళ్ళు యదార్థ్యంగా దర్శించినది వ్యక్తిని కాని సమాజాన్ని కాని కాదు ,మానుషి అనే ప్రతిభాసాన్ని– ఆలంబ రహితమైన మానవావస్థ  తాలూకు దైన్యాన్ని –ప్రేమ వాళ్ళ దృష్టిలో కేవలం ఒక దైవ  ప్రేరణ – నగరాల్లో వేర్లు కోల్పోయిన మానుషి యొక్క ఒంటరీతనం  అతని నిసహాయ అస్తిత్వవేదన ,అస్థిత్వం గురించిన అన్వేషణ మొదలైనవి కధా వస్తువులుగా మారాయి. అస్తిత్వ వాద జన్యమైన ఆతృతలను వ్యధలనూ ఆవిష్కరించటం కోసం కధలను కట్టుకధలుగానో ‘ఇకువేషన్ ‘గానో మార్చారు వాళ్ళు “.

కాని ఇది అతి కొంత కాలం మాత్రమే నిలిచింది. ప్రతిభావంతులైన ఈ కధకులు అతి తక్కువ కాలంలోనే తమదైన రచనా మార్గాలు కనిబెట్టారు –మలయాళ కధకి వ్యత్యస్తమైన అనుభూతుల  కవాటాలు తెరిచారు.

ఆధునిక కధకుల్లో ప్రాతస్మరణీయుడు కాక్కనాడన్ [జోర్జ్ వర్గేస్]. ఆధునికత యొక్క కొన్ని లక్షణాలు మాత్రమే ఇతని కధల్లో కనబడుతాయి. కాని ఎం. టి. తో పాటు అందరి సమకాలీన రచయితుల దృకోణాలనిర్మాణ శైలీల ప్రభావం ఇతని కధల్లో కనబడుతుంది . ఎంతో కాలం తనను మోసుకు తిరిగిన తరువాత  పాతదై నిష్ప్రయోజనమైన  పాదరక్షలను ప్రతీకగా తీసుకొని ఒక వృద్ధుని  మనోభావాలను చిత్రీకరించిన ‘’పాతబడటం’’ అనే కధ [1960కన్నా ముందు]చెప్పుకోదగ్గది. సమాజంలోని సదాచారపు డొల్లతనం బయిట పెడుతాయి ఇతని కధలు .

మరో ముఖ్య కధకుడు ఓ. వి. విజయన్ [1931 –2005]—ఇతడు గొప్ప కార్టూనిస్టు కూడా. ప్రతీకాత్మకంగా  కధ చెబుతాడు ఇతడు. ఆకస్మికం  గానో అప్రతీక్షితం గానో జీవితాన్ని పరిణతిలోకి తీసుకొని వెళ్ళే భౌతీకాతీత  నియోగాలు గురించిన అస్వస్థతలు ఇతని కధల్లో అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతాయి. ఇతని కధలను రెండు విభాగాలుగా విభజించవచ్చు. సమకాలీన జీవితానుభవాలను ఒక కార్టూనిస్టు దృక్పదంతో అతిశయోక్తితో కాని  న్యూ నోక్తితో కాని గీసినకధా చిత్రాలు  ఒక విభాగానికి చెందినవి అయితే జీవితంలోని  మనశ్శాంతిని పోగొట్టే దార్శనిక సమస్యల నుంచి పుట్టుకొచ్చిన  కధలు రెండో విభాగానికి చెందుతాయి

చాలా భిన్నమైన ఇతివృత్తాలతో రచన చేసిన కధకుడు ఆనంద్ [పేరు –పి. సచ్చిదానందన్ – జననం 1936]220px-Sachidanandan

కధకుడుకన్నా నవలిస్టుగానే ఇతనికి కీర్తి ప్రతిష్టలు ఎక్కువ. కధల్లోనైనా ,నవలోనైనా తన చారిత్రిక దృక్పదం ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాడు ఈ రచయిత. మౌలికంగా ఇతడు ఒక త్వాత్వికుడు. తన ఆలోచనలను వెలువరించే  మాధ్యమం అతని సాహిత్యం. వ్యాసాలు వ్రాసే బదులు సంఘటనలను కాని కధాపాత్రలను కాని ఆధారం చేసుకొని తన ఆలోచనా ధోరణిని వ్యక్తపరిస్తాడు అతడు. తన ఆలోచనా ధోరణికి అనుగుణమైన పాత్రలనూ సంఘటనలనూ సృష్టిస్తాడు.

పాఠకులను  తన ఆలోచనా ధోరణికి తీసుకురాగలిగిన నిర్మాణ శైలి వున్నందువల్ల వాళ్ళు అతని కధలను ఆస్వాదిస్తారు.

విషాద మిళితమైన ఒక నిస్సహాయ వాతావరణం ఇతని కధల్లో కనబడు తుంది. రాజకీయ చరిత్ర ఎప్పుడూ దోపిడీల,ఆధిపత్యాల చరిత్రే. దోపిడీ  శక్తులు రూపం మార్చుకుంటాయి తప్ప , దోపిడీకి కాని పీడనానికి కాని ముగింపు ఉండదు. పీడించేవాళ్ళు పీడనకి లోనయే వాళ్ళు ఎల్ల కాలంలోనూ ఉంటారు.వాళ్ళ చేతులనుంచి విముక్తి పొందామని అనుకుంటే అది కేవలం తాత్కాలికమే—ఇది ఈ కధకుడు ఆలోచనా ధోరణి . కొన్ని చోట్ల ఈ కధకుడు కధకుని పరిమితి దాటాడేమో నని కూడా అనిపిస్తుంది.

M_mukundanసమాజంలో నెలకొన్న మూల్యాలనూ సదాచార వ్యవస్థలను ప్రశ్నించిన రచయిత ముకుందన్. మత్తుమందుల పొగ నిండిన ఒక వాతావరణం ఇతని కధల్లో చూడవచ్చు. హరిద్వార్ కి వెళ్ళేట ప్పుడు కూడా మూడు పైపులు ఒక పెట్టె పొగాకు పెట్టెలో ఉంచుకోవడానికి మరవని పాత్రలు ఇతని కధల్లో సాధారణం .  బ్యాంగ్ తాగి ‘’పరిశుద్దులైన’’ వాళ్ళు వేశ్యలకు గుడి కట్టేవాళ్ళు కూడా కనబడుతారు ఇతని కధల్లో  –వీటి ద్వారా మూల్యాలను తిరస్కరిస్తునాడు కాని సమాజాన్ని విమర్శించటం లేదు కధకుడు. ఇతని కధల్లో ప్రేమ ఉండదు ;లైంగికత్వమే ఉంటుంది. తను అనుభవించినవి కావు ,తెలుసుకున్నవి ఇతడు కధల్లో ప్రస్తావిస్తునట్లు అనిపిస్తుంది.

ఇలాంటి రచయితుల కధలతో పోలిస్తే చాలా భిన్నంగా వుంటుంది సేతు కధా ప్రపంచం[జననం 1942]మధురమైన జీవితనుబంధాలు కానీ హృద్యమైన  జీవితానుభవాలు కానీ అతని చైతన్యానికి స్పందన అందించటం లేదు. కాల్పనిక సౌందర్యానికి అసలే ఆ కధా ప్రపంచంలో చోటు లేదు. బాహ్య జీవితం ఇతని రచనల్లో అడుగు పెట్టదు –అంతగా అడుగు పెట్టినా అవి ఫాంటసిగా మారుతాయి

జీవిత మహా ప్రవాహాన్ని ఉత్సుకతతో వీక్షించే వాడు కాదు సేతు. అతన్ని అస్వస్థత కు గురి చేసేది మనిషి అనే స్థితి  –దానివల్ల ఏర్పడే దురంత పూరిత పరిణామాలు . అరవై ఎనభై సంవత్సరాలకాలంలో అనావృతమయే ఒక దురంతాన్ని కొన్ని నిమిషాల్లో లేకపోతే ,కొన్ని గంటల్లో చూపించవలసి వచ్చినప్పుడు వాస్తవికత యొక్క మార్గం స్వీకరించటం కుదరదు. అలాంటప్పుడు ఫాంటసియోక్క మార్గం లోకి దారి మళ్లుతున్నాడు  ఇతడు. సేతు కధల్లోని మనుషులు పీడితలు –వివిధ బంధాల సంకేళ్ళల్లో ఇరుకున్నవాళ్ళు. ఇవి తప్పించుకోలేని స్ధితి అని, దానికి కారణం ప్రాకృతికం [నేచురల్ ]అని రచయిత నమ్ముతున్నాడు. జనన మరణాలు కలువలని మరణం బతుకుని మింగడానికి సమయం చూస్తూ వెంటాడుతుందని రచయిత భావం.  తప్పించుకోలేని ఏదో నియోగానికి తలవంచి నిర్ణయింపబడిన ఒక భ్రమణ పధంలో విఫలంగా తిరిగి తన దూరాంతాలను చేరడమే మానవావస్థ  అనే ఆలోచన రచయితను విడిచి పెట్టదు. ఆతని ఎక్కువ కధల్లో మరణం ఒక ముఖ్య పాత్ర. మరణాన్ని వివిధ కోణాల్లోనుంచి వీక్షిస్తాడు సేతు.

సక్కరియ గారి[జననం 1945] కధలు ఒక విచిత్ర ప్రపంచం.  మానవ మనస్తత్వాల సంక్లిష్ట భావాలను ఆవిష్కరించే కధలే కాక నేటి మానవుని ఆత్మస్తుతినీ కపట మనస్తత్వాన్ని హాస్య ధోరణితో నిశితంగా విమర్శించే కధలు కూడా వ్రాశాడు ఇతడు. మాటల్లో గొప్ప ఆదర్శాలు ఒలకపోసినా ,ని జ జీవితంలో అసలు వాటిని పట్టించుకోని క్రైస్తవ సమాజాన్ని చూసి నవ్వుతాడు ఈ రచయిత. మనో సంఘర్షణలను కాని మానసిక భావాలను కాని వ్యక్తపరిచేటప్పుడు ఆచి తూచి మాటలు వాడే సక్కరియ ,ఆక్షేప హాస్యం వ్రాసినప్పుడు మాటలు కుమ్మరిస్తాడు .

కొత్తదీ సంక్లిష్టమూ వైన ఆఖ్యాన శైలి వెతికి కనిబెట్టి ప్రయోగించిన కధా రచయిత మేథిల్ రాధా కృష్ణన్. ఇతని కధలు నిడివిలో చాలా పెద్దవి –శిధిలమైన సంఘటనా వివరాలు –కధా రూపంగురించి ప్రయోగాలు చేసిన ఇతడు ప్రత్యేకమైన టెక్నిక్ ద్వారా అతి సాధారణమైన సంఘటనకి అపరిచితత్వం ప్రసాదించి   భిన్నమైన ఒక వాతావరణం సృష్టించడానికి  ప్రయత్నిస్తున్నాడు. సృజన యొక్క  అందం కాదు రచనా నైపుణ్యమే ఈ కధల అస్తిత్వానికి కారణం.

ఆధునిక  కధా వికాసం గురించి సంక్షిప్తంగా ప్రస్తావించినప్పుడు కొందరు ప్రశస్త రచయితల పేరులు ప్రస్తావించక పోయివుండవచ్చు. శైలిపరంగా గాని దృక్కోణ పరంగా గాని మరే విధంగా గాని భిన్నమైన రచయితలు గురించే ప్రస్తావించటం జరిగింది –అంటే ఇక్కడ ప్రస్తావించబడని  ఎందరో, మలయాళ కధకి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అస్తిత్వ దర్శనం ఆధునిక కధకులను ప్రభావితం చేసింది కాని , ఆ ప్రభావం ఒకొక్క రచయితలోనూ ఒకొక మోతాదులో ఉంటుంది . కొందరు తొలి రోజుల్లో అస్తిత్వ వ్యధలను ఆవిష్కరించారు కాని తరువాత జీవితానుభవాల్లోకి తిరిగి వెళ్ళిపోయారు . 1980 నాటికి, 1960లో వ్యక్తమైన ఆధునికత యొక్క ప్రసక్తి  కోల్పోయింది మలయాళ కధ .

1980 తరువాత రచన ప్రారంభించిన కధకులు మూల్యాల అకారణ తిరస్కారాన్ని హర్షించలేదు. ఆధునికులు బోధ పూర్వంగా నిర్లక్ష్యం చేసిన సామాజిక స్పృహ ప్రదర్శించారు వాళ్ళు. నాగరీక జీవిత పరిస్థితుల్లో అనుబంధాలకు, మూల్యాలకూ వ్యక్తిత్వాలకు జరిగే పరిణామాల వైపు  సంఘర్షణా త్మకమైన జీవితపు సందర్భాల వైపు  మళ్ళీ తన ఆసక్తిని మళ్ళించింది మలయాళ కధ. కధ పూర్తిగా యుక్తి సహజంగా ఉంటాలని కాని నమ్మశక్యంగా ఉంటాలని కాని ఈ రచయితలూ అనుకోవటం లేదు. పూర్తిగా వాస్తవికమైనవీ ,కాల్పనికమైనవీ భావాత్మకమైన  కధలు కూడా ఈ కాలం కధకులు వ్రాస్తున్నారు .ఇతర ప్రాంతీయ భాషల్లో లా  స్త్రీవాద రచయిత్రులు కూడా తమ సాన్నిధ్యాన్ని తెలియపరిచారు ఈ కాలంలో.

lalithambikaనంబుద్రి కుటుంబాల అంతపురాల్లో మొగ్గే స్త్రీల గురించి యాబైల్లో వచ్చిన అంతర్జనం కధలతో –లేకపోతే దానికన్నా ముందే స్త్రీవాద రచనలు వెలుబడినా స్త్రీవాద రచయిత్రులు అనే ముద్ర పడిన రచయిత్రులు  కనబడేది ఈ కాలంలోనే. చంద్రమతి ,ఆషిత ,ప్రియ ఏ. ఎస్. , గీతా హిరణ్యన్,కే.ఆర్.మీర ,ఇందు మీనోన్ మొదలగు రచయిత్రులు వీళ్ళలో కొందరు. తను ఒక ఫెమినిస్టు కాదని గట్టిగా చెబుతూనే ఫెమినిజం  తాలూకు గొప్పతనాన్ని విమర్శించారు చంద్రమతి .  ఇతివృత్తాల్లోనూ  నిర్మాణంలోనూ వున్న వైవిధ్యం ఆమె మాటలను కొంత వరకు సమర్థిస్తుంది కూడా.  కాని ఆమె గొప్ప కధల్లో కొన్ని స్త్రీల సంకటాలను ఆవిష్కరించేవే. నేటి దాంపత్యం  తెలుసుకొని చేసే ఒక పరస్పర వంచన కదా అనే ప్రశ్నను ఒక గొప్ప కధలో ఆవిష్కరించారు ఆమె. స్త్రీల వ్యక్తి గత అనుభవాలను సరళంగా ఆవిష్కరించే ఆషిత [జననం 1956 ]టెక్నిక్ గురించి పెద్దగా పట్టించుకోరు.  తాళికి  ట్రాఫిక్ కానిస్టేబుల్  వేసుకున్న చొక్కాకి వున్న సురక్షితత్వం కూడా లేదని వ్రాస్తారు ఆమె ఒక కధలో.పురుషుని బాధ్యతా రాహిత్యం గురించి కూడా ఆమె అక్షర శిల్పాలు చెక్కారు. ఒంటరి స్త్రీలను గురించి వ్రాసారు ప్రియ .  జనాలమధ్య జబ్బువల్లనో పేదరికం వల్లనో స్నేహ రాహిత్యం వల్లనో ఒంటరిగా మారినవాళ్ళు ,జీవితంలో అమూల్యమైన ఏవేవో పోగొట్టుకున్న వాళ్ళు చిన్న చిన్న ఇష్టాల తీగలు పట్టుకొని బ్రతుగు సాగిస్తున్నవారు  –ఇలాంటి పాత్రలు ఆమె కధల్లో చూడవచ్చు –దాంపత్య జీవితంలోని నమ్మక రాహిత్యం కూడా ఈమెకి కధా వస్తువే. స్త్రీల మనసులోని సంఘర్షణలూ ధర్మ సంకటాలు ఆవిష్కరిస్తున్నాయి గీతా హిరణ్యన్ కధలు.

గొప్ప రచనా శైలి గల రచయిత్రి కే. ఆర్.మీర[1970] పరిశుద్ధమైన జీవిత బంధాలను గౌరవిస్తున్నారు ఈ రచయిత్రి –సమాజంలోని సదాచార నియమాలను సవాల్ చేస్తున్నాను  అనే భావం ధ్వనించ కుండానే  మానవ సహజమైన ఒక వాస్తవికత అనే రీతిలో సమీక్షిస్తున్నారు  ఆమె లైంగికతను.  కొన్ని కధల్లో ఫెమినిజం  తాలూకు కొన్ని పోకడలను నిశితంగా విమర్శిస్తున్నారు కూడా.  ఈమె కధ లు కూడా  కొన్ని తెలుగులో లభ్యం .

చివరికి ఒక మాట చెప్పాలి. పేజీ కధలు ,  కాలమ్ దాటని కధలు ,కార్డు కధలు మొదలైనవి  మలయాళం లో ప్రాచుర్యం పొందని కధా రూపాలు. ప్రఖ్యాత కధా రచయితలు కొందరు [కమలా దాస్ ,టి. పద్మనాభన్ మొదలగువారు ] పేజీ కధలు వ్రాసి ఉన్నారు. కాని వాటి సంఖ్య చాలా తక్కువ. 2000 సంవత్సరం తరువాత పి,కే. పారక్కడవ్ అనే రచయిత అయిదారు వాక్యాల్లో కధలు వ్రాస్తునాడు. సామాజిక ఐరనీ,రాజకీయ మోసాలు,  స్త్రీ పీడనం ,ప్రపంచీకరణ మొదలగు విషయాలగురించి చాలా ‘ క్రిస్ప్” గా  వ్రాస్తాడు అతడు. కొన్ని కధలు ప్రతీకాత్మకంగా ఉంటాయి. పాఠకుడి పెదవి పై ఒక చిరునవ్వు విరియించి కధలు ఇలా కూడా గొప్పగా వ్రాయవచ్చా అని అనిపించేలా చేస్తాయి ఇతని కధలు. ఉదాహరణకి ఒకటి :

అడుగుల సవ్వడి :

 

తరువాత ఒక గర్జనం లాంటి కాలింగ్ బెల్ మ్రోత

తలుపు సగం తెరిచి చూశాను —అతడే !

కాగితం నాకు అందిస్తూ అతడు అన్నాడు

‘’మీరు పీల్చిన గాలి తాలూకు బిల్ ‘’

 

చివరికి సంక్షిప్తంగా చెప్పాలంటే మలయాళ కధకి సంబంధించిన వరకు మూడు పరిణామాలు జరిగాయి అని చెప్పాలి. వాస్తవిక సామాజిక జీవితంనుంచి వ్యక్తి తాలూకు సొంత దు:ఖాలవైపు మారటం మొదటి పరిణామం. కధ అంతర్ముఖం కావటమే కాక ఆర్ద్రత సంతరించుకుంది ఈ కాలంలో.  మానవావస్థనూ జీవితాన్నీ తాత్విక విమర్శతో వీక్షించేది విశ్లేషించేది  రెండో పరిమాణం. ఈ తాత్విక బరువు వదిలేసి కచ్చితమైన వాస్తవిక దృక్కోణంతో జీవితానుభవాలనూ  అనుబంధాలనూ విశ్లేషించి సర్గాత్మక సాఫల్యం పొందుతునారు నేటి కధకులు.

సమకాలీన మలయాళ కధల్లో ఆధునికానంతర సాహిత్య ధోరణీలు కనబడుతున్నాయా ?ఫెమినిజం  దళిత అవగాహన,  ఇతర సంస్కృతుల దాడి గురించిన అవగాహన ,ఆ దాడిని ఎదురుకోవాలనే ఆతృత వగైరాలు ఆధునికానంతర సాహిత్యపు లక్షణాలని అనుకుంటే అలాంటి ధోరణి మలయాళ కధల్లో కూడా కనబడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా అతి శక్తి వంతంగా కనబడేది ఫెమినిజం  .ఎందరో ఫెమినిస్ట్ రచయిత్రులు పురుషాధిక్యత గురించి స్త్రీ లైంగికత గురించి నేటి కట్టుబాటులకు సదాచార ఆలోచనలకు వ్యతిరేకంగా వ్రాస్తున్నారు . జీవితమే తమ సిరాబుడ్డి అని అంటునారు. ఒకొక్కప్పుడు  ఈ కధలు వాస్తవికతకి భిన్నంగానూ దూరంగానూ కనబడుతున్నాయి. ఇప్పడు నెలకొన్నవాటిని తిరస్కరిస్తునారు కాని వాటికన్నా ప్రయోజనకరమైనవాటిగురించి  ఫలదాయకమైనవాటి  గురించి ఆలోచించలేకపోతునారు వాళ్ళు .

దళిత స్పృహ కధల్లో అంత శక్తివంతం కాదు . టి. కే. సి.వాడుతల తోనూ అంతకన్నా ముందూ మొదలైన ఈ ప్రక్రియ వేరు తన్నలేదు. బహుశా కేరళ లో వున్న సామాజిక స్థితి గతులు కావచ్చు దానికి కారణం –రచనలను వర్గీకరించి చూసేదానికన్నా సమగ్రంగానే వీక్షిస్తునారు రచయితలూ ,పాఠకులు.

ఆదివాసీ జీవితంగురించి ఆదివాసిఅయిన  నారాయణ్  వ్రాసిన కధలు,  నవలలు నేటి సాహిత్యంలో ముఖ్యమనే చెప్పాలి. అయినా నేటి మలయాళ కధ కొంతవరకు ఇతివృతపరంగానూ పాత్రలపరంగానూ కేరళ సరిహద్దులు దాటిందనే ది వాస్తవం –మలయాళీల క్రియారంగం విశ్వ వ్యాప్తమైనప్పుడు కధ,కధా పాత్రలు కూడా విస్తరించటం సహజమే కదా !

 

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

–ఎల్. ఆర్. స్వామి

 

 

ఆత్మలో కవిత్వం వున్నవాళ్ళు రాసిన కథలు ఇవి!

మళయాళ కథా ప్రస్థానం – 1

Secular Theatre in Kerala

నేడు కథ  అంటే ,ఏ సాహితీవేత్త కాని విమర్శకుడు కాని ఉద్దేశించేది ఒక శతాబ్ధానికి అటో ఇటో పుట్టిన కథ  , లేకపోతే కథానిక అనే సాహిత్య ప్రక్రియగురించే. కాని అతిపురాతన కాలంనుంచే  కథలు ఉన్నాయి.బి. సి 320 నుంచి  సమాజంలో కథ లు  చలామణి లో ఉన్నాయి  అనేదానికి రుజువులు కనబడుతున్నాయి . బి.సి. 320 కి చెందిన ‘’ఇద్దరు సోదరులు’’ అనే కథ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు మనకు లభ్యమైన కథ ల్లో అతి పురాతనమైనదని చెప్పాలి .బి. సి. ఆరో శతాబ్దంలో గ్రీకు రాష్ట్రంలో ప్రాచుర్యంలో వుండేవని నమ్మే ఈసోపు కథ లు ,బుద్ధుని పూర్వ జన్మల గురించని నమ్మే జాతక కథలు  [563—483 బి. సి .] ఏ. డి. 300 –500 కి మధ్య కాలంలో రచింపబడినవి అని అనుకుంటున్నపంచతంత్ర కథలు మొదలైనవాటిని  ఆధునిక కథ లుగా పరిగణించలేం .  కాని కధావిర్భావానికి అప్పుడే బీజం పడిందని చెప్పాలి. మనిషి మాట్లాడటం ప్రారంభించాక తన అనుభవాలను ఇతరులకు తెలియపరిచాలని అనుకున్న నిమిషమే కథావిర్భావ  ముహూర్తం. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి తాలూకు జీవితానుభవాలనూ ఆలోచనలనూ ఇతరులకు చెప్పాలనే తపన నుంచే కథ పుట్టుకొస్తుంది. ఎదురుగా  ఉన్నవాడికి మౌక్తికంగా చెప్పవచ్చు –కాని లేనివాడికి అక్షర బద్దం చేసి చెప్పాలి . అందువల్ల కథ అనేది రచయిత తన జీవితానుభవాలగురించి  తన ఎదుట లేని పాఠకుడి తో జరిపే సంభాషణ కథ అని  కూడా భావించవచ్చు—కాని ఏకపక్షీయమైన సంభాషణ.

ప్రాంతీయ భారతీయ భాషల్లో నేడు మనం కథ అని కాని కధానిక అని కాని వ్యవహరించే సాహిత్య ప్రక్రియ ప్రారంభమైనది 19 వ శతాబ్దపు చివరి దశలో కాని,  ఇరవయో శతాబ్దపు ప్రారంభం లో  కాని మాత్రమే అనేది వివాదరహితమైన వాస్తవం. దక్షిణాది భాషల విషయంలో కూడా ఇది నిజమే. మలయాళ భాషలో సాహిత్య విమర్శకి సాహిత్య పత్రికకి పునాది వేసిన.సి. పి. అచ్యుత  మీనోన్ [1863 –1933] సారధ్యంలో వెలుబడిన విద్యావినోదిని అనే మాస పత్రికలో1891 లో  వెలుబడిన ‘’వాసనా వికృతి’’ అనే కధ మలయాళ భాషలో వెలువడిన తొలి కథ. ఈ కథ వ్రాసినవారు వెంగయిల్ కుంజీరామన్ నాయర్.[1869 –1914]. ఈ కథ వారసత్వం అనే పేరుతో  తెలుగులో  అనువదింపబడింది . కధాకేరళం అనే సంకలనంలో ఈ కధ లభ్యం [అనువాదకుడు –ఎల్. ఆర్. స్వామి]. ఇది ఒక దొంగ కథ. వారసత్వంగా దొంగతనం చేయటం అలవరిచుకున్న ఒకడు , రాజ్యంలో పోలీసు వ్యవస్ద ఏర్పడటంవల్ల ఊరిలో ఉండలేక మదిరాసుకి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు తను దొంగలించిన నగల పెట్టె తన ప్రేయసికి ఇచ్చి వెళ్తాడు. అందులోని ఒక ఉంగరం  ఆమె అతని  తొడుగుతుంది. మదరాసులో  దొంగతనాలు చేయకుండా మంచిగా బ్రతగాలని అనుకుంటాడు . కాని అందగత్తే అయిన  ఒక వేశ్యను అలా చూస్తూ నిలబడినప్పుడు ఆ ఉంగరం  ఎవరో కొట్టేస్తారు.పోలీసుకి ఫిర్యాదు చేస్తాడు . అందువల్ల పోలీసు అతన్ని పట్టుకుంటారు . ఆరు నెలల శిక్ష అనుభవించిన తరువాత జైల్ బయటికి వచ్చిన అతడు చెప్పుకున్నదే ఈ కథ .

రెండో కథ ‘’చెడుఅదృష్టం ‘’కూడా ఇతడు వ్రాసినదే. తిండికి కూడా లేని ఒక యువకుడు ధన వంతుడుగా మారిన జీవిత యాత్రని చిత్రీకరిస్తోంది ఈ కథ. మాతృసామ్య వ్యవస్ధలో వున్న అలనాటి ఉమ్మిడి కుటుంబాల సజీవ చిత్రీకరణ ఈ కథ. ‘’సెంట్రల్ జైల్ తప్ప గొడవలు లేని ఉమ్మిడి కుటుంబాలు వేరే ఎక్కడా  లేవు ‘’మొదలైన అలనాటి సామాజిక జీవనానికి అద్దం పట్టేఎన్నో మాటలు కథ ప్రారంభంనుంచి కనబడుతాయి.ఈ రెండు కథ లూ చాలా చిన్నవే. సుమారు అయిదు పేజీలు వుండవచ్చు. నాటకీయమైన ఎత్తుగడతో కూడిన కథ లు ఇవి. రెండు కథలూ బ్రతుకులోని చీకటి కోణాలను చూపిస్తున్నాయి. మొదటి కథ లో కథానాయకుడు స్వయంగా తన కథ చెబుతునాడు –రెండో కథ లో రచయిత కథ చెపుతాడు . రెండో కథ లో రచయిత ప్రత్యక్షంగా సమాజాన్ని విమర్శిస్తూన్నాడు. రెండు కథ ల్లోనూ సామాజిక నేపధ్యం ప్రస్ఫుటంగా కనబడుతుంది .పాఠకుకులను కూర్చోపెట్టి చదివించేవే ఈ రెండు కథలూ.

A house hotel boat on the backwaters in Kerala

మలయాళ కథ సాహిత్యంలోని ఈ తొలి దశ 1925 వరకు సాగింది. ఈ దశలో  కథ రచన  చేసినవాళ్ళలో ముఖ్యలు ఏడుగురు. మొదటి కథ బయిటికి వచ్చాక రెండు కథలు వ్రాసారు ఒడువిల్ కుంజీకృష్ణ మీనోన్ [1869—1916] .చాలా నిడివిగల కథ లు వ్రాసాడు ఇతడు –సంభాషణల నిడివి కూడా ఎక్కువే ఉంటాయి . వర్ణనలు కూడా ఎక్కువే ఇతని కధల్లో.కాని ఒక కథ లో నాయిక మనో సంఘర్షణను అత్యద్భుతంగా వర్ణించాడు అతడు. ఇతని మొదటి కధ 1902 లో అచ్చైంది. మదిరాసు మైసూర్ పట్నాల నేపధ్యంలో కధలు వ్రాసాడు ఇతడు.

అంబాడి నారాయణ పొడువాల్ [1871—1936] వ్రాసిన రెండు కధల్లో జీవితావగాహన ,హాస్యం ,వ్యంగధోరణి మొదలగు అంశాలు కనబడుతాయి. వర్ణనలతో కూడిన ఇతని కధల్లో తుది మలుపు గోచరిస్తుంది.

సి. ఎస్. గోపాల పణిక్కర్ [1872—1930]హాస్య రసాత్మకమైన కధలు వ్రాసారు. మూర్కొత్తు కుమారన్[1874—1941] వ్రాసిన రెండు కధలూ చిన్నవే . ఆధునిక మలయాళ కధల స్వభావం ప్రస్ఫుటంగా కనబడేది కే. సుకుమారన్[1876—1956] అనే రచయిత రచనలలోనే. ఇరవై ముప్పై పేజీల కధలు అతనివి.అయినా ఆసక్తిగా చదివించేవి అవి. దానికి కారణం కధలో కనబడే తుది మలుపే. పరోక్షం గా సామాజిక స్దితిగతులను విమర్శించాయి ఈ కధలు. ‘’పరాయివాడి బిడ్డ ‘’అనే కధ అయితే నేటి అంకురం సినిమాలంటిదే . ఈ కధలో రెల్వే స్టేషనుకి వెళ్ళిన ఒక యువకుడికి ఒక యువతి ఒక చిన్న పిల్లని ఇచ్చి కాస్త చూసుకో అని చెప్పి మాయమవటం అతడు ఆ పిల్లను ఇంటికి తీసుకురావటం భార్య అతన్ని అనుమానించటం అలా అలా సాగుతుంది కధ.మానవ స్వభావాన్నిఅతి వాస్తవికంగా చిత్రీకరించటమే కాక స్త్రీ హృదయానికి అద్దం పడుతుంది ఈ కధ. నేడూ ఇలాంటివి జరగవచ్చు అనిపిస్తుంది మనకు ఈ రోజు కూడా ,ఆ కధలు చదువుతే . కిట్టుణ్ణి నాయర్ 1882—1959] రసిక రంజిని అనే మాసపత్రిక కోసం వ్రాసిన ‘’అప్పున్ని మూప్పీల్ నాయర్ అనే కధ అలనాటి ఉమ్మిడి కుటుంబాల్లో నెలకొన్న పగ కక్ష తీర్చుకోవటం మొదలగు అంశాలను అతి తక్కువ నిడివిలో చిత్రీకరించిన కధ. తొలి నాటికధా రచయితల్లో ప్రస్తావించవలసిన మరో పేరు ఎం. ఆర్. కే. సి. [1881 –1939 ]

తొలి దశలో వచ్చిన కధల్లో ఎక్కువ కధలు విద్యావినోదిని అనే పత్రికలోనే వెలుబడ్డాయి. సామాజిక దృక్పదం కలిగిన కధలతో పాటు హాస్య వ్యంగ్య రచనలు కూడా కనబడుతాయి. తొలి నాటి కధలను ఆధునిక మలయాళ కధలతో కలిపే శృంఖలాలుగా నిలిచిన వారు ఇ. వి. కృష్ణ పిళ్ళ [1894 –1938],వి. టి. భట్టతిరిపాడ్ [1896—1982]భవత్రాధాన్ నంబూతిరిపాడ్[1902 –1944]. ఇ. వి. కృష్ణ పిళ్ళ గారి కధలు కేళీ సౌదమ్ అనే పేరుతో నాల్గు సంపుటాలుగా ప్రచురిపబడ్డాయి. కధ చెబుతూనే అప్పుడప్పుడు పాఠకులతో  స్వయంగా సంభాషించే శైలి ఇతనిది. అంతే కాక శైలి ప్రౌడ గంభీరం కూడా. వర్ణనలప్పుడు అలంకారాలతో కూడిన సాహిత్య భాష వాడినప్పట్టికి సంభాషణ లో వాడుక భాషే వాడాడు ఇతడు. మానసిక సంఘర్షణలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు ఇతడు.

నంబూద్రి కుటుంబాల్లోని స్త్రీల దురవస్థలే వి. టి. భట్టతిరి పాడే, కీ భవత్రాధాన్ నంబుద్రి కీ  కధా వస్తువులు. అంత: పురంలో మగ్గిపోయే  నంబూద్రి స్త్రీల విషాదాన్ని కళాత్మకంగా చిన్న చిన్న  మాటలతో చిత్రీకరించారు వి. టి. స్వభావికత ఉట్టిపడే సంభాషణ రచన భవత్రాధాన్ నంబూద్రి ప్రత్యేకత. . అతని కధల్లో కధ చెప్పేది రచయితే. సంభాషణలు ద్వారా , కధా పాత్రల ఆలోచనలు ద్వారా పాత్రల మనసు బహిర్గతం  చేస్తాడు అతడు.

పలుగురు ప్రముఖ కధా రచయితలు రచన చేసిన 1925 నుంచి 1960 వరకు మలయాళ కధల రెండో దశగా పెరుకోవచ్చు. జాతీయంగానూ అంతర్జాతీయంగానూ పేరు ప్రఖ్యాతులు గడించిన రచయితులు  రచన చేసారు ఈ కాలంలో. కారుర్ నీలకండ పిళ్ళ [1898—1975], పి. కేశవ దేవ్[1904—1983], లలితాంబిక అంతర్జనం [1909—1987 ],వైకం మహమ్మద్ బషీర్[1910—1994], పోంకున్నాం వర్కి[1910—2004], తకళి  శివశంకర పిళ్ళ,[1912—1999 ], ఎస్. కె. పొట్టేకాడ్[1913 –1982], పి. సి. కుట్టికృష్ణన్[ఊరూబ్ –1915 –1979]పులిమాన పరమేశ్వరన్ పిళ్ళ[1916—1947],నాగవళ్లి ఆర్. ఎస్. కురుప్ [1917—2003], ముట్టత్తు వర్కి[1917 –1989],వెట్టూర్ రామన్ నాయర్,కే.సరస్వతి అమ్మ[1919—1975], టి. కె. సి.వడుతల[1921—1988] మొదలైనవారు ఈ కాలంలో రచన చేసినవాళ్ళల్లో ప్రఖ్యాతులు. ఎన్. పి. చెల్లప్పన్ నాయర్ [1903—1972], ఈ. ఎం. కోవూర్ [1906—1983] ఎం. ఎన్,గోవింధన్ నాయర్[1910—1997] చెరుకాడ్[ 1914—1976] ,ఎం.గోవింధన్[1919 –1989]. ఐ.కె.కె. ఎం. మొదలగు కధా రచయితలు కూడా ఈ కాలంలో రచన చేసినవాళ్ళే.

ఈ కాలంలో ,అంటే 1925 నుంచి 1960 వరకు వున్న కాలంలో కేరళలో సజీవమైన ఒక సాంస్కృతిక వాతావరణం ఉంటేది. 1927లో సమస్త కేరళ సాహిత్య పరిషత్తు రూపు దిద్దుకుంది. పరిషత్తు వార్షిక సమావేశాలు సాహిత్య సంస్కృతిక రంగాల్లో ఒక కదలిక సృష్టించింది. 1937 మూడు ముఖ్య సంఘటనలకు సాక్షిగా నిలిచింది. అవి తిరువితాంకూరు మహా రాజు వారి [మొదటిలో నేటి కేరళ ,తిరువితాంకూరు ,కొచ్చి మలబార్ అని మూడు ప్రాంతాలుగా ఉండేవి ]క్షేత్ర ప్రవేశ ప్రకటన, తిరువితాంకూరు విశ్వ విద్యాలయ  స్థాపన ,సజీవ సాహిత్య సమితి స్థాపన మొదలైనవి ఆ మూడు. 7 సంవత్సరాలు తరువాత 1944లో ఆ సాహితి సంస్ద అభ్యుదయ సాహిత్య సమితిగా మారింది. రచయితుల మొదటి సహాయ సహకార సంఘం 1945లో స్థాపించబడింది. 1946లో కేరళ సంస్కృతిక చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిన గ్రంధాలయ సంస్ధ ఏర్పాటైంది .

భారతీయ రాజకీయాలను కూడా కుదిపి వేసే రోజులు అవి. 1920నుంచే రాజకీయ తలంలో గాంధీజీ సాన్నిధ్యం ప్రస్ఫుటంగా కనబడటం మొదలైంది. గాంధీజి సాన్నిధ్యం భారతీయ రాజకీయానికి కొత్త చూపు రూపు ఇచ్చింది. రౌలెట్ అక్టుని వ్యతిరేకించమని గాంధీజీ ఇచ్చిన పిలుపుని మన్నించి లక్షల కొద్ది జనం నిరసనగా రోడ్డెక్కారు  1919లో. అహింస ,సత్యాగ్రహం నిరాహార దీక్ష, సహాయ నిరాకరణ మొదలైన ఆశయాలు ప్రజల ఆలోచనల్లోకి పాకాయి. ఈ ఆలోచనల ప్రతిధ్వనులు తిరువితాంకూర్ ,కొచ్చి మలబార్[ అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సి లో ఒక భాగం ]ప్రాంతాల్లో కూడా వినబడ్డాయి. ఈ కాలంలో జాతీయం గానూ అంతర్జాతీయంగానూ నెలకొన్న వాతావరణం,  జరిగిన సంఘటనలు,  ప్రపంచ మహాయుద్ధం ,స్వాతంత్ర సమరం తద్ఫలితంగా ఏర్పడిన దేశ విభజన వగైరాలు రచయితలను ప్రభావితం చేసాయి. అంతే కాదు స్వాతంత్రానంతర కాలంలో సాయుధ విప్లవం ,ఆ తరువాత పొరపాటు గ్రహించి ప్రజాసామ్య మార్గం అవలంబించి కమ్మునిస్టు పార్టి అధికారం కైవసం చేసుకోవటం [1957 ,ఏప్రిల్ 5] .ఆ తరువాత ఒక అపూర్వ ప్రజా పోరాటం వల్ల [విమోచన సమరం]ప్రభుత్వాన్ని తొలగించడటం ఆ తరువాత ఎన్నికలో కమ్మునిస్టు పార్టి గెలవకపోవటం మొదలైన సంఘటనలు సామాజిక జీవితంలో కల్లోలాలు  సృష్టించాయి. ఈ సామాజిక సంఘటనల కుదుపు కొంత వరకు జీర్ణించుకున్న వారే ఆ కాలంలో రచన చేసిన కారూర్ ,కేశవ దేవ్ ,బషీర్ వర్కి, తకళి, మొదలైన రచయితలు.

కధా స్వభావాన్ని బట్టి పరిగణిస్తే ,కారుర్ లలితాంబిక ,బషీర్ ,ఊరూబ్ మొదలైనవారిని ఒక చోట కట్టవచ్చు. కేశవ దేవ్ వర్కి, తకళి –ముగ్గురూ ఒకే గూటికి చెందినవారు. పొట్టేక్కాడ్,స్వరస్వతి అమ్మ,వెట్టూర్ రామన్ నాయర్, నాగవల్లి,ముట్టత్తు వర్కి, టి. కె. సి. వడుతల  మొదలగువరు మరో రో కోవకి చెందినవారని చెబుతునారు సాహిత్య చరిత్రకారులు.

మలయాళ కధా సాహిత్యంలో ఎలా చూసిన అగ్రగణ్యుడు కారుర్. ప్రభుత్వ అధ్యాపకుడుగా  బ్రతుకు గడిపిన అతడు ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించలేదు . కాని సమకాలీన సమాజం తాలూకు గుండె సవ్వడి నిజాయితితో చిత్రీకరించాడు తన కధల్లో. అతనికి ఆంగ్ల పరిజ్ఞానం లేకపోవటం వల్ల ఆంగ్ల ప్రభావం అతని కధల్లో అసలు కనబడదు.ఇంచు మించి 500 కధలు రాశాడు ఇతడు. అతని మొదటి కధ 1932 లో అఛైన భర్తృవాత్సల్యం. ఇరవై సంపుటాలు వెలువరించారు  –ఇతని కధల్లోని పాత్రలు సగటు మనుషులే. మామూలు మనుషుల రోజువారీ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలే కధలకు ఇతివృతం. అపూర్వమైన రచనాశిల్పమూ తొణికిసలాడే మానవీయత ఇతని కధల ప్రత్యేకతలు. అధ్యాపకుల జీవితం గురించి అతడు వ్రాసిన కధలు చాలా ప్రసిద్ధం. ఈ కధలు కొంత’’ ఐరనీ ’ కొంత అతిశయోక్తి మిళితం చేసి వ్రాసారు,కారూర్. తన కధలకు నాటకీయ ప్రారంభం ఇస్తాడు ఈ రచయిత. మధ్యాహ్న భోజనం అనే కధ దీనికి ఉదాహరణ [ఈ కధ తెలుగులో లభ్యం –కధా కేరళం సంకలనం అనువాదకుడు –ఎల్. ఆర్. స్వామి ] ఇరవై ఎనిమిది గంటలు ఏమి తినక ,తినడానికి లేక ,పని చేసి అలసిపోయిన అధ్యాపకుడు ఒకవిద్యార్ధి [అతడు రెండు మూడు గంటలక్రితం ఏదైనా తినివుండవచ్చు] తెచ్చుకున్న అన్నం పొట్లం విప్పి తింటాడు. అలనాటి బడిపంతుల హృదయ విదారక స్దితినికాక ,అలనాటి దుర్భిక్షం గురించి కూడా పాఠకులకు  తెలియచేస్తుంది ఈ కధ. అలనాటి ఆకలి వత్సరాలను  చిత్రీకరించే కధలు ఎన్నో వ్రాసారు కారూర్. అతడే ఎప్పుడూ కధ చెబుతాడు. సంభాషణలు అతని కధలకు ప్రాణం. సంఘటనలుద్వారా  కధా పాత్రల  ప్రత్యేకతల గురించి తెలియపరిస్తాడు. రచయితే మన పక్కన కూర్చుని మనకు కధ చెపుతున్నడనే అనుభూతి కలుగుతుంది అతని కధలు చదువుతువుంటే.

లలితాంబికా అంతర్జనం

లలితాంబిక అంతర్జనం :

సాహిత్య రంగంలో కవయిత్రిగా అడుగు పెట్టారు లలితాంబిక అంతర్జనం[1919—1987] .చెప్పదలచుకున్నది మొత్తం కవిత్వంలో చెప్పలేక పోవటం వల్లనే ఆమె కధలు వ్రాయటం ప్రారంభించారు.బాధలు భరించే ఆత్మల పట్ల తనకున్న సానుభూతియే తను రచన చేయడానికి  కారణం అని ఆమె ఒక సందర్భంలో ప్రస్తావించారు. నంబూద్రి సమాజంలోని దురాచారాలను తేట తెల్లం చేసారు ఆమె. ముఖ్యంగా నంబూద్రి యువతుల దురవస్థను చక్కగా చిత్రీకరించి సమాజానికి అవగాహన కల్పించారు. 1966 లో ఆమె ఇలా వ్రాసారు’’ఒక మారుమూల పల్లెలో కర్షక కుటుంబంలో పుట్టి పొలాల మధ్య జీడి మామిడి తోటల మధ్య ఎదిగిన నాకు కాళీ ,నీలి ,అలగన్ [దళిత వర్గానికి చెందినవారి పేరులు ] మొదలగువారు ఫాషన్ కోసం స్వీకరించిన పాత్రలు కావు. ఆ పల్లె ప్రకృతి తో పాటు నా ప్రకృతిలో ఒక భాగమై మారిన మంచి స్నేహితులు. అంతర్జనాల బ్రతుకుకన్నానేను  ముందు తెలుసుకున్నది వాళ్ళ బ్రతుకు గురించే ‘’. ఈమె వ్రాసిన మొదటి కధ [ముసుగులో]నంబుద్రి సమాజంలో నెలకొన్న బహు బార్యత్వం గురించి ,ఆ సమాజంలోని ఆడపిల్లలను ,అతి చిన్న వయసులోనే నాల్గో పెళ్ళిగానూ అయిదో పెళ్ళిగానూ ముసలివాళ్ళకిచ్చి చేయటం ,భర్త ఇంటిలో సవతులతో వంట ఇంటిలోనే మొగ్గే వాళ్ళ జీవితం వగైరాలు చిత్రీకరించారు. 1938లో ఈమె వ్రాసిన మనోవిశ్లేషణాత్మక కధ చాలా ప్రసిద్ధం. కధ పేరు ‘’ప్రతీకార దేవత’. ఈ కధ కేరళ లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇందులోని నాయిక నువ్వూ  ఒక లంజయేగా అనే మాట భరించలేక వెలయాలుగా మారుతుంది. కాని ఆమె మాటలు గమనార్హం ‘’జనం చూడనీ –మగాళ్ళే కాదు స్త్రీలు కూడా దిగ జారవచ్చని –న్యాయంగా ఆలోచిస్తే నంబూద్రి సమాజంలో వెలి వేయవలసినది మగాళ్లను కదా ‘’[ఒకొక్కరూ నాల్గైదు వివాహాలు చేసుకోవటమే కాక కొందరిని ఉంచుకునేవారు కూడా ]castme out if you will

ఈ కధ వ్రాసినప్పుడు రచయిత్రి వయసు ముప్పైకన్నా తక్కువే.

మాతృత్వపు మధిరిమ గురించి బాలల నినిష్కల్మషం  గురించి కూడా కధలు వ్రాసి వున్నారు ఈమె. రాజకీయ పరిణామాలు వల్ల భూసవరణ చట్టం వల్ల నిరుపేదలుగా మారిన  ఎందరో నంబుద్రి జమీందార్ల బ్రతుకులు కూడా ఈమె కు  కధా వస్తువే.  ‘ఒక మాటలో చెప్పాలంటే ఆమె బ్రతికిన నాటి సమాజపు [ముఖ్యంగా నంబుద్రి సమాజం ] గుండె సవ్వడి ఈమె కధల్లో వినబడుతుంది  .

Vaikom_Muhammad_Basheer

వైకోమ్ మహమ్మద్ బషీర్

వైకం మహమ్మద్ బషీర్ : మలయాళ సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం బషీర్ ది  . ఇతని కధలు ,నవలలు చాలా ఎక్కువగానే వివిధ భాషల్లోకి అనువాదం చేయబడింది కనుక ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యాభిమానులకు బషీర్ అపరిచితుడు కాదు. ఇతని కధలకు నిడివి ఎక్కువ. నవలైనా , నవలికలైనా  ,కధ లైనా  ఇంచు మించు ఒకే పరిమాణంలోనే ఉంటాయి. భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంచరించి జీవితం తాలూకు చీకటి కోణాలు స్వయంగా చూసి అనుభవించినవాడు బషీర్. కాని ఆశ్చర్యం ఏమిటంటే అతను వ్రాసిన కధలన్నీ తనకీ తన కుటుంబానికీ పరిచయమున్నవారిదే. అతని కధల్లో కనబడే  హాస్యం  అప్పుడప్పుడు సరిహద్దు దాటి పరిహసించటం వరకు చేరుతుంది. కాని ఆ హాస్యం  అతను తన మీద కూడా ప్రయోగించు కొంటూ  వుంటాడు. మానవీయత అతని ఏ కధలోనైనా  తేట తెల్లమవుతుంది. సునాయసంగానూ స్వాభావికంగానూ ప్రవహించే సుమధుర భాష అతని రచనల ఆస్తి. బషీర్ గారి ఏ ఒక కధ వివరించాలన్నా ,వ్యాసం నిడివి  దాటిపోతుంది కనుక ,బషీర్ రచనలన్ని [ఇంచుమించు ] తెలుగులో లభ్యంకనుక ఆ పని చేయటం లేదు. ముస్లిం జీవితవిధానాలు ఇతని కధల్లో ఎక్కువగా ప్రస్ఫుటమవుతాయి.

ఉరూబ్ [పి.సి. కుట్టి కృష్ణన్]కధను భావగీతానికి దగ్గరగా చేర్చిన రచయిత. మనిషిలో వున్న మంచితనం గురించిన అచంచల విశ్వాసం అతని కధల్లో కనబడుతుంది. ప్రతి మనిషి ఏదో రకంగా సుందరి లేకపోతే సుందరుడు అని నమ్మాడు అతడు. జీవితపు ప్రసాద మధుర భావాల్లో మునిగి తేలేది అతనిమనసు. అందహీనమని వ్యవహరించే వాటిలో కూడా అందం కనిపెట్టే ,దేనిని నిస్సారమని పరిగణించని దృకోణంఅతనిది. నిండు సానుభూతి ఈ దృకోణం కి కారణం. వేసిన వేషాల మీద కోపం తెచ్చుకోవటం అర్ధరహితమని అతని ఉద్దేశ్యం.ఇతని కధల్లో ప్రకృతి కధా నేపధ్యంగా కలిసిపోతువుంటుంది.

సామాజిక పరిణామాలను లక్ష్యంగా భావించి అవసరమైతే ఆ పరిణామాల గురించి కొంత చెప్పవచ్చు అనే అభిప్రాయం కలిగిన రచయితలు ,పి. కేశవ దేవ్,పొంకునం వర్కి,తకళి, మొదలైనవారు. కమ్మునిస్టు పార్టీకి ప్రచురణ కర్తగా ,కేరళలో సాంస్కృతిక ట్రేడ్యూనియునుల వేదికల పై మొదటిసారిగా తన గళం విప్పాడు కేశవదేవ్. కాని సోవియటు యూనియనులో కార్మిక సర్వాధిపత్యం స్టాలిన్ అనే ఒక వ్యక్తి స్వేచ్చాధిపత్యంగా మారటం గమనించి కమ్యునిజానికి  వీడ్కోలు పలికి కమ్మ్యూనిస్టు వ్యతిరేకుల వర్గంలో చేరారు. పొంకున్నం వర్కి వైతే తన వామపక్ష భావ జాలంతోనే కొనసాగాడు. కాని తకళి గురించి ఇవి రెండూ చెప్పలేము. వామపక్ష పద జాలం వైపు మొగ్గున్నవాడే తకళి. కాని వంద శాతం వామ పక్ష పదజాల వాది కాదుఅతడు. వామ పక్షాలను విమర్శించినప్పుడు కూడా వ్యతిరేకుల గుంపులో ఉంటేవాడు కాదు..ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా నిలిచాడు అతడు. కాని ఒకటుంది. ఈ ముగ్గురు రచయితలు సమాజంలోని అట్టడుగు వర్గాల జీవిత సమస్యలు గురించి  వాదించినవాళ్లే –వాళ్ళజీవితాలు మెరుగు పరచటం కోసం నిలబడినవాళ్ళే –ముగ్గురూ మంచి కధా రచయితులే కాక గొప్ప నవలా రచయితలు  కూడా.

పి. కేశవ దేవ్.;[1904—1983]

ఇతడు రచించిన ఎక్కువ కధలకు ఇతివృతం మధ్య తరగతి వాళ్ళ అట్టడుగు వర్గం వాళ్ళ జీవితమే. ఆకలి బాధల గురించి కాని దరిద్రం గురించికానీ బషీర్ కాని తకళి కాని ఇన్ని కధలు వ్రాయలేదు. జమీందారులకు  ,పెట్టుబడుల దారులకు వ్యతిరేకంగా పొర వదలి లేచే అట్టడుగు వర్గ పు పాత్రలు ఇతని కధల్లో కనబడుతాయి. అధికారుల ప్రభుత్వాధికారుల అణిచివేతకి గురై ప్రాణం కోల్పోయిన వారి చిత్రీకరణ కూడా ఉంటుంది. వీళ్ళ వ్యక్తి గత  బంధాల పట్లే రచయిత శ్రద్ధ .ఏ కధ నైనా  ఒకే ఒక ఆశయం కోసం వ్రాసాడు దేవ్ . కుల మతాలకు అతీతంగా ఆలోచించే పాత్రలు ఇతని  కధా పాత్రలు.సంఘటిత శ్రమ శక్తియొక్క ఎదుగుదల ,  రాజకీయ కక్ష సాధింపులు వగైరాలు చిత్రీకరించే కొన్ని కధలు కూడా వ్రాసి వున్నాడు కేశవ దేవ్. కుల మత సంఘటనలకు అతీతంగా వ్రాసిన రెండు కధలు ‘’నాయర్ –ఇళవ గొడవ మరియు ’గుస్తి ‘’చాలా చిన్న నిప్పు రవ్వలు పెద్ద మంటగా మారే విధానాన్ని చిత్రీకరిస్తున్నాయి ఈ కధలు.వ్యక్తి నుంచి ప్రారంభమయే పగ అగ్నిగా మారి సమాజాన్ని ఎలా మింగేస్తుందో చూపిస్తాడు దేవ్ ఈ కధలల్లో. రాజకీయంగా విభేదించేవాళ్ళు సొంత పార్టీ వాళ్ళైనా చంపే హత్యల రాజకీయానికి వ్యతిరేకంగా వ్రాసిన కధ ‘’చంపకు ,తమ్ముడు చంపకు ‘’. అతడు 1965లో [అప్పడు అతని వయసు అరవై ] వ్రాసిన  స్వర్గంలో ఒక సైతాన్ అనే మనోవిశ్లేషణాత్మక కధ కూడా చాలా ప్రసిద్ధం.

పోంకున్నాం వర్కి : పెట్టుబడిదార్ల వ్యవస్థ,జమీందారివ్యవస్థ , పౌరోహిత్యపు వ్యవస్థ [క్రిస్టియన్ సమాజంలో ]మొదలగు మూడు వ్యవస్థలను శక్తి వంతంగా ప్రతిగటిస్తూ రచన చేసాడు  పోంకున్నాం వర్కి. ఇతడు అభ్యుదయ రచయితుల మార్గం అనుసరించాడు. యేసు ప్రేమను మార్క్స్ మానవీయతను ఒకటిగా భావించాడు  . స్వభావికంగానే పెత్తందార్లను పౌరోహిత్యాన్ని పెట్టుబడిదార్లను ఘోరంగా విమర్శించాడు. అందువల్ల వాళ్ళందరూ అతనికి వ్యతిరేకులుగా మారారు. ఏం చెప్పాలి అనేది ఎలా చెప్పాలి అనేదానికన్నా ముఖ్యంగా భావించాడు అతడు. అతడు ఒక సారి అన్నాడు’’రోడ్డు మీద జరిగే దోపిడి గురించి వ్రాసినప్పుడు కొన్ని పరుష మాటలు పడివుండవచ్చు. ఎవ్వరినైనా ఆక్షేపించే బదులు బాగు చేయాలనేదే నా కోరిక. ‘’

‘’నా నిరసన ప్రకటించటం కోసమే నేను రచయితగా మారాను నిరసన తెలుపవలసిన విషయాలు ఉన్నాయి,నాకు “ . నిజమే, నిరసన అతని కధలకు ప్రాణం

Thakazhi_1

తగలి శివశంకర పిళ్ళై

తకళి శివశంకర పిళ్ళ : [1912 -1999]

జీవితసమస్యలు గురించి వ్రాసిన కధకుడే తకళి కూడా . కాని నిరసన ప్రదర్శించడంలోనూ సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించడంలోనూ వర్కి వెళ్ళినంత దూరం వెళ్ళడు తకళి . తన ఏ కధలోనైనా ఒక ప్రశ్న అంతర్లీనంగా ఉంటుందని తకళియే చెప్పారు ఒక సారి. మోపోసొ ,చెకోవ్ స్టీఫాన్ స్వైగ్ మొదలగు పాశ్చాత్య రచయితుల ప్రభావం తకళి లో వుందనేది నిజం. కాని ఈ ప్రభావం కధా కదన రీతికి మాత్రమే పరిమితం.అతనికి తనదైన జీవిత దృకోణం ఉంది. మానవ సంబంధాల్లోని దైన్యానికి కారణం దారిద్రమే అని అతని నమ్మకం. వరద అనే కధ చాలా ప్రసిద్ధమైనది [తెలుగులో లభ్యం ] మానవ మనస్తత్వాన్ని విశ్లేషించిన మరో మంచి కధ ‘’మిలిటరివాడు’’ తకళి రచించిన ఎక్కువ కధలకు కుట్టనాడు నేపధ్యం [కుట్టనాడు –వరి సుభిక్షంగా పండే భూమి గల ఒక చిన్న ప్రాంతం.] తగళి పేరు వినగానే ఎవ్వరికైనా వెంటనే గుర్తు వచ్చేది అతని నవలలే.  కాని తకళి గొప్ప కధా రచయిత కూడా .

ఈ కాలంలోనే తమదైన ప్రత్యేక రచనా వ్యక్తిత్వంతో సాహిత్యానికి సేవ చేసిన మరి కొందరు కూడా వున్నారు. వాళ్ళలో ముఖ్యడు ఎస్. కె. పొట్టేకాడ్. [1913—1982]. తకళిలా కాని ,దేవ్ లా కాని నిరసనతో మండిపడి  అరవలేదు ఇతడు . ఇతరులుకు కోపం వచ్చే చోట అతనికి కొంత తమాషా అనిపించేది. భారత దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా పలు చోట్ల సంచారిలా తిరిగిన ఇతడు ప్రకృతి వైవిధ్యాన్ని ,మానవ జీవిత వైవిధ్యాన్ని దర్శించిన రచయిత. అందువల్లనే ఇతని కధలో కనబడెంత వైవిధ్యం గల కధాపాత్రలు ,కధా నేపధ్యం ఇతర కధా రచయితుల రచనల్లో కనబడవు. కధా నిర్మాణంలో దేవ్ కన్నా తకళి కన్నా ఎక్కువ శ్రద్ధ తీసుకొనేవారు .  అద్భుతమైన కొస మెరుపు ఉంటుంది కధల్లో. చాలా నిడివిగల కధలు ఇతనివి .రెండు మూడు దశాబ్దాల్లో నడిచే కధని కూడా కధగా వ్రాసారు ఇతడు . పుళిమాన అనే అతడు వ్రాసిన కధలు కవి వ్రాసిన కధలు. ఒక భావ గీతంలా ఉంటాయి అతని కధలు.  కధా వస్తువు అతి తక్కువే ఉంటుంది ఇతని కధల్లో. అతి చిన్న వయసులో చనిపోయిన ఈ కధా రచయిత [1916—1947]ఆ తరం రచయితుల ముందు ఉంటేవాడు.

నాగవళ్లి [1917—2003] నవలలూ కధలూ రచించారు. సామాజిక విమర్శ అతని రచనల్లోని అంతరార్థం . మనకు రోజు ఎదురయే జీవిత సంఘటనలకు హాస్యం జోడించి జీవితముయొక్క ఐరనీ   బోధపడే విధంగా వ్రాస్తాడు నాగవళ్లి. అతని ఒక పాత్ర ఇలా అడుగుతుంది ‘’నాకు అర్ధం కావటం లేదు. శాశ్వతమైన దివ్య ప్రేమకి నశ్వరమైన శరీరమూ లౌకికమైన వివాహమూ ఎందుకు ? ’’నిరుపేద కుటుంబాల్లోని [ఏ కులానికి చెందినదైనా ]సంఘటనలను ఆధారం చేసుకొని రచన చేసిన కధకుడు వెట్టూర్. కాని అట్టడుగు వర్గంవారి కధలు హాస్య రసంతో మిళితం చేసి వ్రాసిన రచయిత టి. కే. సి.వడుతల. [1921-1988 ]. పులయ [మాల ]సమాజానికి చెందిన వారి స్వప్నాలు ,స్వప్న భంగాలు,పులకింతలు ,ధర్మ సంకటాలు ఇతని కధల్లో నిండా కనబడుతాయి .  కుట్టనాటి మాలను  ఆవిష్కరించిన తకళి  కాని , మాల సమాజానికి చెందినవారిని రైతు కూలీల నాయకులుగా ఆవిష్కరించిన తోప్పీల్ భాసి కాని [ప్రముఖ నాటక రచయిత –తులాభారం తెలుగులో మనుషులు మారాలి ,రచయిత ] చిత్రీకరించిన దానికన్నావాళ్ళ జీవిత సమస్యలూ సంకీర్ణతలూ చిత్రీకరించ గలిగాడు ఈ రచయిత . క్రైస్తవులుగా మతం మార్చుకున్న మాలల ధర్మ సంకటాలను వివరించి ఇతడు వ్రాసిన కధ చాలా ప్రసిద్ధం .

హాస్య కధలు :

తమ హాస్య కధలతో మలయాళ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కధకుల ఆవిర్భావం కూడా ఇంచుమించి ఈ కాలంలోనే. ఎన్. పి. చెల్లప్పన్ నాయర్ [1903 –  1973],ఎం.న్.గోవిందన్నాయర్[19101997],ఆనందకుట్టన్[1920 –2000]మొదలైనవారు ముఖ్యలు. ఈ రచయితల్లో జీవితపు సంక్లిష్ట కోణాలకు హాస్యం మిళితం చేసి శక్తి వంతంగా రచన చేసిన వారు చెల్లప్పన్ నాయర్. అతి తక్కువ రచనలే చేశాడు ఇతడు. సహృదయుడైన ఒక మాన్యుడు జీవితంలోఇంకివున్న హాస్యం దర్శించి మనకు చెబుతునట్లు ఉంటాయి ఇతని కధలు. ఆనందకుట్టన్ రచించిన కధలు పూర్తి గ్రామ్య భాషలో ఉంటాయి. అతని హాస్యం వెనక సామాజిక విమర్శ దాగివుంటుంది. పి. కె.రాజ రాజ వర్మ 1907 –1987 ]వేళూర్ కృష్ణన్ కుట్టి కూడా [1927—2003]ఈ కోవకి చెందిన రచయితులే. దేవ్ ,తకళి కాలఘట్టానికి ఆధునిక మలయాళ కధకు పునాది వేసిన ఎన్. పి. మహమ్మద్,టి. పద్మనాభన్, మాధవికుట్టి [కమలాదాస్ ]ఎం. టి. మొదలగు కధకులకు మధ్య ఒక లింకు లా వర్తించే గొప్ప కధకులు కోవిలన్ [1923]జి.వివేకానందన్ [1923-1999],పొంజీకర రాఫీ [1924 -1993 ]పారపురత్ [1924-1981]నందనార్ [1926-1974 ]కే. టి. మహమ్మద్ 1929—2008 ]  పట్టత్తు విల కరుణాకరన్ [1926 -1985 ]మొదలైనవారు .

నందనార్ ,కోవిలన్, పారపురత్ ,–ఈ ముగ్గురికి మిలిటరీ కధల రచయితలుగా కూడా గొప్ప కీర్తి లభించింది మిలిటరీ జీవితానికి సంబంధించిన కధలు ఎన్నో రచించి ప్రజలకు జవానుల జెవితం గురించి వాళ్ళ కుటుంబ జీవిత సమస్యల  గురించి మంచి అవగాహన కల్పించారు వీళ్ళు . కధకుడుకన్నా గొప్ప నాటక రచయితగా ప్రసిద్ధుడు కే.టి.మహమ్మద్.

రాజకీయ విషయాలు ఇతివృత్తంగా స్వీకరించి మంచి కధలు రచించిన కధకుడు పట్టత్తు విల కరుణాకరన్. వామ పక్ష భావ జాలాన్నే కాదు అన్ని రాజకీయ భావ జాలాన్ని ప్రశ్నించే ధోరణి అతని కధల్లో కనబడుతుంది . రచనా పరమైన సాహసాలు చేయటంలో ముందు ఉండేవాడు అతడు .

( వచ్చే వారం ఆధునిక మళయాళ కథ )

LR-SWamy-240x300— ఎల్. ఆర్. స్వామి

ఉరిమిన మబ్బు

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

అనువాదకులు ఎల్. ఆర్. స్వామి

ఫోను మాట్లాడిన నాకు ఎగిరి గంతేయాలని అనిపించింది. రోడ్డు మీద దొరికిన టికెటుకి లాటరీ తగిలినంత ఆనందం కలిగింది. అగ్ని కర్తీరిలో చల్లని వాన కురిసినట్లు తోచింది.

ఒక ఊదటున లేచి ‘సేల్స  బ్యాగు ‘చంకకి తగిలించుకున్నాను. షూ లెసు ముడి వేసుకుంటూ వుంటే ,మా ఆవిడ

కేకేసింది. ‘’ఏమండోయ్   ,టిఫిను రెడి. తిని వెళ్ళండి.మళ్ళీ ఎప్పుడు ఇల్లు చేరుతారో ,ఏమూ —–‘’

వాచీ చూశాను. టైం పావు తక్కువ తొమ్మిది !

కచ్చితంగా తొమ్మిది గంటలకు రమ్మన్నాడు అతడు. తొమ్మిది దాటుతే అతడు  ఉండడట !

గేటు వైపు నడిచాను. చాలా ఉక్కగా వుంది. ఆకాశం నిండా నల్లని మబ్బు. చినుకు రాల్చని ఆ నల్లని మబ్బు ఆర్డర్లు రాల్చని కస్టమర్లను గుర్తు చేసాయి.

‘’ఏమండోయ్  —‘’ మళ్ళీ కేకేసింది మా ఆవిడ.

పట్టించుకోలేదు. మగడికి తిండి పెట్టె విషయంలో ఆడది చూపే ప్రేమ మరే విషయంలోనూ చూపదు కదా !

బైకు ఎక్కాను. టైముకి వెళ్ళాలి. వెళ్తే ఒక ఆర్డరు రావచ్చు.

ఆర్డరే కదా ,మాలాంటి ‘సేల్స్ మేను’ల ఉద్యోగానికి ప్రాణవాయువు !

మా మేనేజర్ కూడా అదే మాట అన్నాడు. ‘’ఎలాగోలా ఆర్డర్లు సంపాదించాలయ్యా.రెండు నెలలుగా ఒక ఆర్డరైనా తేలేదు నువ్వు’’

నిజమే !తల దించుకున్నాను.

‘’ఈ నెలలోనైనా ఆర్డరు తేలేకపోతే —–‘’

ఏమవుతుందో నాకు తెలుసు.’సేల్స్  బ్యాగు ‘ తిరిగి ఇచ్చేయాలిసిందే.

‘’ఒక పని చేయి ‘’మేనేజర్ సానుభూతితో అన్నాడు. ‘’నేను ఒక వెయ్యి  కరపత్రాలు అచ్చు వేయిస్తాను. అవి పంచు.గోడల మీద ,స్తంబాల మీద అంటించు. మన కంపెనీ గురించి జనానికి తెలియాలి కదా ‘’

అలాగే చేసాను. ఊరిలోని ప్రహారి గోడలు నిండా మా కరపత్రాలే !

మాది అంతర్జాలం అద్దికిచ్చే కంపెని . వెంటనే ఫలితం కనబడింది. ఫోను వచ్చింది.

నవ్వుతూ ఆత్మీయంగా స్వాగతం పలికాడు అతడు. ఇంటిలోపలకి తీసుకొని వెళ్ళి కూర్చోమని చెప్పాడు

అరవై సంవత్సరాలు దాటిన మనిషి అతడు. వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అతని మాట తీరు చూస్తువుంటే ఆర్డరు ఇస్తారనే అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చాను.

‘’సరే ,వెంటనే కనెక్షన్ ఇచ్చేస్తావు. ‘’అతడు అన్నాడు ‘’మరి ఏదైనా సమస్య వస్తే —-‘’

‘’నేను ఈ ఊరిలోనే ఉంటాను కదండీ సార్.ఒక ఫోను కొట్టండి.చాలు వెంటనే స్పందిస్తాను ‘’

‘’కచ్చితంగా ——‘’

‘’కచ్చితంగా స్పందిస్తాను సార్ ‘’

‘’అయితే సరే ఫోను చేస్తాను ,ఈ రోజే ‘’

నాతో పాటు గేటు దాకా వచ్చాడు అతడు.

‘’మా ప్రహారీగోడ మీద అంటించిన కరపత్రం మీదే కదా —‘’

‘’అవును ,సార్ ‘’

‘’శుభ్రంగా పైంటు చేసి వుంచిన గోడ పాడు చేసారెమిటి ? ‘’అతని గొంతు మారింది ‘’ఆ కరపత్రం పీకెసి గోడ శుభ్రం చేసి వెళ్ళండి ‘’

నేను ఖంగు తిన్నాను. ఒక నిమిషం పోయాక అన్నాను ‘’అలాగే సార్ . కుర్రవాడ్ని పంపుతాను ‘’

‘’ఈ మాత్రం దానికి కుర్రవాడేందుకు ?’’

నేను మాట్లాడలేదు.

‘’అంటే మీరు చెయరన్న  మాట. అంతేగా. –ఇప్పుడేగా చెప్పారు సమస్యకి వెంటనే స్పందిస్తారని. ఇదేనా మీ స్పందన—‘’

ఇరకాటంలో పడ్డాను.

గోడ మీద కరపత్రం చించి గోడ శుభ్రం చేసి బైకు ఎక్కాను.

ఆకాశం నిండా మబ్బే !కాని మబ్బు కురవలేదు ;ఉరిమింది.

    –ఎల్. ఆర్ . స్వామి

*

 

 

 

కడలిని దాటిన కార్తి

ఎల్. ఆర్. స్వామి

మళయాళ రచయిత కె.పి. రామనున్ని

 

(మళయాళ భాష లో 1993 లో వెలువడిన సంచలనాత్మక నవల “ సూఫీ పరాంజే కథ” కు ప్రముఖ అనువాదకుడు , రచయిత ఎల్. ఆర్. స్వామి చేసిన తెలుగు అనువాదం “ సూఫీ చెప్పిన కథ” పుస్తకాన్ని సగర్వం గా ప్రచురిస్తోంది సారంగ పబ్లికేషన్స్. త్వరలో పుస్తకం గా బయటకు రానున్న ” సూఫీ చెప్పిన కథ” నవల నుంచి కొంత భాగాన్ని ప్రత్యేక వ్యాసం గా ఈ వారం సారంగ పాఠకులకు అందిస్తున్నాము. కేరళ సాహిత్య ఆకాడమీ అవార్డ్ తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ( సినిమా గా కూడా విడుదలై అవార్డులు సాధించింది) ఈ నవల ఇప్పటికే హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదమయింది. )

 

***

 

సముద్ర దేవతలు శృంగలావిముక్తం చేసిన గాలిలా ఇసుక తిన్నెలను దాటి వచ్చాడు ముసలియార్‌. మఠానికి చెందిన మమ్ముటి మగతనమూ, పురుష బలమూ తొణికిసలాడే అతడు ‘భారతప్పుళ’ దాటి వచ్చాడు.

పొడుగుగా ఎదిగిన చేతులతో రాక్షసుడిలా కనబడ్డాడు అతడు. అడవి దాటి కొండలను దొర్లించి రెండు మూడు అడుగులతో పొలాలను కొలిచి కొండల నుండి దూకి వచ్చాడు. ధమనుల్లో వేడితో, నరాల్లో బలంతో గుండెలో జాలితో మమ్ముటి పరిగెత్తుకొచ్చాడు. దేనికీ జంకని కనులతో పెదవుల నిండా నవ్వుతో మమ్ముటి తలవంచకుండా వచ్చాడు.

శంకుమీనన్‌కి ఆ సంగతి చెప్పినది వేలాయుధమే. పొన్నాని ఊరి ముస్లిం ఒకరు కొబ్బరికాయలూ, పోకలూ కొని వ్యాపారం చేయడం కోసం ఊరిలోకి వచ్చాడని చెప్పాడు. మశూచి విత్తనాలను పట్టించుకోకుండా మిగతావి కొని ఒక చోట నింపుతున్నాడట!

పంటలు కొనేవాళ్ళు లేక డబ్బుకు బాగా ఇబ్బంది పడే రోజులు అవి. శంకు మీనన్‌ చాలా సంతోషించాడు. కళ్ళంలోనూ, అటకపైనా పోకలూ, ఎండుకొబ్బరి నిండుగా ఉన్నాయి. అంతేకాక పన్నును సవరించడంవల్ల డబ్బు కట్టవలసిన బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి.

మమ్ముట్టిని పత్తాయపురంలోకి తీసుకొచ్చాడు వేలాయుధం. పడకకుర్చీలో పడుకొని ఉన్న శంకుమీనన్‌ అతన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. ఒకటిన్నర మనిషింత పొడుగున్న మమ్ముటి  వినమ్రంగా వంగి నమస్కారం చేస్తూ నిలబడి వున్నాడు. ఎదుట సరుకు బాగుంటే మొత్తం కొనడానికి తాను సిద్ధమేనని అన్నాడు. పొన్నాని సముద్రతీరం నుండి ఇతర దేశాలకు సరుకులు ఎగుమతి చేయటమేనట అతని వృత్తి.

కొత్తగా ఆర్జించిన సంపద తాలూకు మెరుపు మమ్ముటి ముఖం మీద ప్రస్ఫుటంగా గోచరించింది. దగ్గరకు కత్తిరించిన జుట్టు, గుండ్రంగా ఉండే గడ్డం, గంభీరంగా వున్నా నవ్వుతూ కనబడే పెద్ద పడవలాంటి పెదవులు .. ఇది అతని రూపం. కొన్ని వస్తువులను ఒకచోట చేర్చడానికి, విడతీసి కట్టలు కట్టడానికి ఒక చోటు గురించి వెతుకుతున్నాడు అతడు.

తన ‘కళప్పుర’ (పొలాలను ఆనుకొని వుండే చిన్న ఇల్లు) వాడుకోమని శంకు మీనన్‌ అనగానే మనస్ఫూర్తిగా నవ్వాడు మమ్ముటి  కాళ్ళు చేతులు ఒకసారి సవరించుకొని వసారాలో నేల మీద కూర్చున్నాడు. మశూచి రోగమేఘాలను దూరంగా తీసుకెళ్ళే ఒక గాలి అక్కడ నీరసంగా కదులుతూ ఉండేది. ఆ గాలికి మమ్ముటి జుట్టు ఎగిరెగిరి పడింది.

‘‘నువ్వు అనుకున్నంతా కొనుక్కోవచ్చు. కాని సరుకుకు తగినంత ధర ఇవ్వాలి,’’ శంకుమీనన్‌ లేని గౌరవం తెచ్చుకొని మరోసారి అన్నాడు.

గట్టిగా నవ్వాడు మమ్ముటి.  అప్పుడు పొన్నాని కడలి తరంగాలు గర్జించాయి. తరంగాల లోపల ఉండే అమ్మమ్మ కడలి ఇగిళ్ళు బయటపెట్టింది. కడలి ఒడ్డున మంచి చెడు జిన్నులు చేతులు కలిపి నాట్యం చేశాయి.

హఠాత్తుగా కడలిలోని కెరటాలు శాంతించాయి. అంతా ప్రశాంతత నిండుకుంది. కార్తి మజ్జిగ్గ  గ్లాసుతో శంకుమీనన్ని సమీపించింది. ఆమెను చూస్తూ  అలాగే ఉండిపోయాడు మమ్ముటి.  ఎంత ప్రయత్నించినా ఆ అందాలరాణి నుండి దృష్టి మళ్ళించలేకపోయాడు.

SufiBookFrontCover

తన కళ్ళలోకి, వొంటిలోకి ఒక మగాడు రెప్పవాల్చకుండా చూస్తున్నాడని ప్రప్రథమంగా గమనించింది కార్తి.  పైపైకి తేలిన ఆమె శరీరం మెల్లగా భూమి మీదకు దిగింది. నిప్పురవ్వలు వెదజల్లే ముఖంతో రక్తప్రసారం పెరిగిన నరాలతో కూర్చున్న మమ్ముటిను ఆమె గమనించలేదు. కాని…

అతని చూపుతో తాను వివస్త్ర అయినట్లు తోచింది ఆమెకు. అది మమ్ముటి దృష్టిలో పడినట్లు… ఇంత అందమైన అద్భుత శరీరం తనకుందా? మదమెక్కిన ఏనుగులా తన గురించిన కొత్త విషయాలు కార్తి మదిలో మెదిలాయి.

తనకంటూ ఒక అస్తిత్వమూ, శరీరమూ లభించాయి. మరొకరిలోకి విద్యుత్తులా ప్రవహించే రూపం, ఏ భీతి లేకుండా ఏ సందేహానికి లోనుకాకుండా కళ్ళలో నక్షత్రాలు విరిసే అందం.

‘‘కార్తీ… నువ్వు వెళ్ళు…’’

మొద్దుబారి నిలబడిపోయిన కార్తిని శంకుమీనన్‌ మాటలు లేపాయి.

మమ్ముటి హృదయంలోనూ కెరటాలు లేచాయి. శంకుమీనన్‌తోనూ, వేలాయుధంతోనూ మాట్లాడుతూనే ఉన్నాడు కాని మధ్యలో మాటల తాడు తెగింది. ఎంత అణిచివేసినా ఆగని కెరటాల శక్తీ, సుడుల లోతూ తనలో ఉన్నాయని తెలుసుకున్నాడు మమ్ముటి.  ధమనుల నుంచి వేడి కెరటాలు లేచాయి. హాయిగా నవ్వుతూ పొన్నాని నుండి వచ్చిన మమ్ముటి  మనసులోన ఏదో సలుపుడు.` తనకీ ఆశ్చర్యం కలిగేలా నిశ్శబ్దుడై శంకుమీనన్‌గారి కళప్పురలో నిద్రపోయాడు.

నూతన ప్రపంచాల తలుపులు తన ఎదుట తెరుచుకున్నట్టు తోచింది కార్తికి. తన రూపం గురించి, శరీరం గురించీ అదుపులోకి రాని ఊహాలు ఏర్పడ్డాయి. అంతవరకు ఒక మగాడిని  మత్తెక్కిస్తూ అతని కళ్ళు నక్షత్రాలుగా మార్చే వింత విద్య తనలో ఎక్కడో దాగి ఉందని ఆమెకు తెలియలేదు.

మేడమీదకు పరిగెత్తుకెళ్ళిన ఆమె జిజ్ఞాసతో సతమతమైంది. నిలువుటద్దం ముందు నిలబడి మెల్లమెల్లగా పై దుస్తులు జారవిడిచింది.

ఆ తరవాత ఒక ఆతృత ప్రప్రథమంగా కట్టలు తెంచుకుని దూకే స్వయంకామన యెక్క సూతి పొడుపులు` గబగబా మిగతా దుస్తులు కూడా తీసి విసిరేసింది. ముందుకు దూకే రొమ్ముల నుండి జ్ఞానపరిమళం ఇంటినిండా పాకింది. ఆ లహరిలో సీతాకోకచిలుకలూ, కీటకాలూ, పాములూ, ఎలుకలూ, తోడు కోసం పరుగెత్తాయి.

ఎంత తీసినా, తీరనన్ని చుట్లు తన చీరకి ఉన్నట్లు తోచింది కార్తికి. అద్దం ముందు నించున్న ఆమె చెమటతో తడిసి ముద్దైంది. చీర పూర్తిగా జారవిడిచి ఒక నిమిషం ఆలోచించింది. ఇది చేయాలా? మత్తెక్కిన తన మనసు ఇది భరించగలుగుతుందా? చివరికి తెగించి లో దుస్తులు కూడా విడిచింది. అద్దంలో కనబడిన ప్రతిబింబం రంగులోనూ, రూపులోనూ పరిపూర్ణంగా ఉంది. ఆ రూపాన్ని ఆవహించి మత్తెక్కిన కార్తి బలహీనతతో ఆ రూపాన్ని ప్రేమించి లాలించడానికి తొందరపడిరది. ఈ ప్రపంచంలోని ఏ క్రూరత్వానైనా సానుభూతితో అందుకునే భూదేవి యొక్క జాలితో ఆమె నేలపై వెల్లకిలా పడుకుంది.

  ఉచ్ఛ్వాసాలతోపాటు రొమ్ముల కొసలు పైకి కదిలాయి. కళ్ళు మెల్లగా మూతలు పడ్డాయి. కనురెప్పల లోపలి వర్ణ ప్రపంచంలో తన ప్రతి అవయవమూ కరిగిపోయి మళ్ళీ పునర్జన్మ ఎత్తుతున్నట్లు గమనించింది.

పెదవులు సీతాకోకచిలుకలాగా సంకీర్ణ అరణ్యాలను వెతుకుతున్నాయి. బుగ్గలు వసంత పుష్పాలుగా వికసిస్తున్నాయి. స్తనాలు జోడించిన చేతులతో విడిపోయి గుండె నుండి దిగి పర్వత సానువు లెక్కి అమృత నదులను స్రవిస్తున్నాయి. ఏదో శక్తి యొక్క విస్ఫోటనాన్ని మనసు ధ్యానిస్తోంది. బ్రహ్మాండమంతా తనలో గర్భస్తమైన నిండు అనుభవం. అప్పటికి ఆమె శరీరం దేశాల సరిహద్దులు దాటి ఖండాంతరాల్లోకి వ్యాపించింది.

ఏమిటీ అస్తిత్వపు లహరి! విశాలత యొక్క గర్వం! ఒడ్డు కనబడని కడలి యొక్క ఆత్మవిశ్వాసం! ఆనందంతో గర్వంతో కార్తి మనసు పులకించింది.

కాసేపటికి తాను మేలేప్పురం తరవాడులోని చిన్నమ్మాయి కార్తి అనే వాస్తవం గుర్తు రాగానే ఆమెకు తన మీద తనకే జాలి కలిగింది. ఇప్పటివరకు తన మీద తను ఏర్పరచుకున్న గౌరవం ఒక్కసారిగా సానుభూతిగా మారిపోయింది. కార్తి కళ్ళ నుండి కన్నీరు జాలువారింది.

జ్ఞాపకాల అడుగుదాకా వెళ్ళి చూసింది కార్తి. నష్టపోయిన వాటి, పగిలిన వాటి అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆత్మా శరీరమూ ముక్కలై ఎన్నో సంవత్సరాలుగా చీకటిలో ఒంటరిగా పడి వున్నాయి. అది తెలుసుకున్నవారు కాని, వాటిని కలిపేవారు కాని ఎవ్వరూ లేకపోయారు.

ఉత్సాహంగా  ఉన్నప్పుడు  మామయ్య  దగ్గరకు  వెళ్ళేది  కార్తి. కాని అప్పుడు ఉబ్బసంతో బాధపడేవాడి ముఖకవళికలతో వుంటాడు అతడు. అయినా కాసేపు అక్కడక్కడే తచ్చాడుతూ ఉంది కార్తి. ఆమె దగ్గర అవుతున్న కొద్దీ దూరంగా వెళ్ళేవాడు ఆమె మామయ్య. చివరికి జుట్టు ఊడి తోక ముడిచి దయనీయంగా మరణించే జంతువుగా మారుతాడేమో, తన మామయ్య అనే అనుమానం కలిగినప్పుడు వెనక్కు తిరుగుతుంది కార్తి.

ఆ తరవాత తల్లిని సమీపించినప్పుడు ఆమె శరీరం, అవయవాలు కరిగి అంతా కలిసి ప్రవహించి ఒక అద్భుతమూర్తిగా తనను ఆరాధించే రెండు కళ్ళు మాత్రం మిగిలేవి. అప్పుడు పట్టరాని కోపం వచ్చేది కార్తికి. వెంటనే పరిగెత్తేది అమ్మమ్మ సమాధి వైపు. అక్కడకెళ్ళి అమ్మమ్మను పిలిస్తే, ‘నువ్వు భయపడతావు తల్లీ,’ అని ఆమె కూడా లేవడానికి నిరాకరించేది. చనిపోయినందువల్లనో, లేకపోతే శరీరంలో కురుపులున్నందు వల్లనో తెలియదు. తను బాగానే ఉన్నానని వందసార్లు ఒట్టువేసి చెప్పినా, అమ్మమ్మ నమ్మేది కాదు.

చనిపోయిన వారు లేచి రాకూడదట! ఎంత మూఢనమ్మకం!

మమ్ముటి ఎవరని కానీ ఎందుకు వచ్చాడని కానీ తెలుసుకోవలసిన అవసరం రాలేదు కార్తికి. తన అవయవ సౌందర్యాన్ని కుతూహలంతోనూ నిశితంగానూ అతడు చూస్తూ ఉంటే తను బ్రతికే ఉన్నానని పదేపదే గుర్తు చేస్తున్నాడని అనుకుంది. మళ్ళీమళ్ళీ ఆమె స్వయం పరిచయమవుతుంది. అతడు ఇంటి పెరటిలో వున్నా కళ్ళప్పుర అరుగులో పడుకొని వున్నా అతని దృష్టి తన చుట్టూనే వుందని కార్తి తెలుసుకుంది.

రోజులు గడిచిన కొద్దీ సరుకులు సేకరించడం పట్ల శ్రద్ధ తగ్గింది మమ్ముటికి.  కొబ్బరికాయలను, పోకలను వాటి నాణ్యత ఆధారంగా విడతీస్తూ రోజంతా మేలేప్పురం తరవాడులోనే గడిపాడు.

మమ్ముటి పని చేస్తూ వుంటే నిర్భీతితో నిస్సంకోచంగా అతని వద్ద నిలబడడానికి కార్తి జంకలేదు. చేయకూడని పనియేదో చేస్తున్నట్లు అనిపించలేదు. ప్రేమవల్ల విరిసే లజ్జ కాని, పిచ్చిచేష్టలు కాని ఆమె ముఖాన్ని కలుషితం చేయలేదు. మానవ సహజమైన మైత్రీభావం ఆమె కళ్ళలో తొణికిసలాడుతూ ఉండేది.

కార్తి మమ్ముటి వెంట ఉంటుందనే సంగతి శంకుమీనన్‌ దృష్టిలో పడింది. ఆమెను అడ్డుకోవాలనే ఒక సామాజిక స్పృహ తాలూకు స్పందన అప్పుడప్పుడు శక్తివంతమైన అతని మనసుని పడగగా మారుస్తుంది. ధమనుల గోడలు పగిలి నెత్తురు కారే నొప్పితో మనసు పడగ విప్పి ఆడుతుంది. వెంటనే వాస్తవంలోకివచ్చి సమస్యను తనలోకి తీసుకుంటాడు.

కార్తి గృహస్థితి వల్ల ఇలాంటిదేదో జరుగుతుందని అనుకున్నదేకదా? కార్తి తన సంరక్షణకు అతీతంగా కదా ప్రవర్తిస్తున్నది? పన్నును సవరించడం కోసం వచ్చిన వారు దేవుడు గదిలో ప్రవేశించినప్పుడు కార్తి అది రుజువు చేసింది కూడా. ఆమెను తిట్టే శక్తి కాని, ఆపేశక్తి కాని తనకు లేదుకదా అని అనుకున్నాడు శంకుమీనన్‌. అంతేకాదు కార్తి తల్లియైన అమ్మాళుకు కూడా ఆ శక్తి ఉందని అనుకోలేదు అతడు.

మమ్ముటిని వెంటనే పెట్టే బేడా సర్దుకొని బయలుదేరమని చెప్పాలనే ఆలోచన వచ్చింది అతనికి. కాని అది అనివార్య దురంతాన్ని వేగిర పరిచినట్లు అవుతుందని అనుకున్నాడు. కార్తి కావాలని అనుకున్న దాన్ని ఆపటం, ఎవ్వరివల్లా సాధ్యంకాదని అతనికి ఖచ్చితంగా తెలుసు. తన బలమూ, బలహీనతా, సౌందర్యమూ అంతా అయిన కార్తి కదలికలను ఆమెకు తెలియకుండా గమనిస్తూ వచ్చాడు. జీవితం అందించే వేదన అనుభవించాడు. అనుభవించి అనుభవించి దాన్ని కొంచం కొంచంగా దిగమింగడం నేర్చుకున్నాడు.

సన్మార్గపు వెలుగుతో ముసురులేకుండా చివరికి ఆనాటి ప్రభాతం వికసించింది. ప్రాణానికి ఊపిరి పొయ్యడానికి అన్నట్లు కార్తి ఏటిలోకి వెళ్ళింది. స్వచ్ఛమైన గాలిలో ఆమె ముంగురులూ, ఒంటి మీద దుస్తులూ తేలియాడాయి. మమ్ముటిని వెతుకుతూ వెళ్ళే ఆ యాత్ర ఆమెకు ఒక రోజువారీ కార్యక్రమం. తల్లీ మామయ్యలూ తనను గమనిస్తున్నారనే జంకు కూడా లేదు ఆమెకు.

ఒక కొబ్బరికాయల గుట్ట క్రింద నిలబడి కాయల పీచు తీస్తున్నాడు మమ్ముటి. కార్తి రావటం చూసి కాయలు వలిచే గునపంపై తుఫాను రేపాడు. భుజాల ఎముకలకు రెక్కలు మొలిచాయి. చేతి ధమనుల్లో నుంచి గుర్రాలు లేచాయి. నిమిష నిమిషానికి తరిగే కొబ్బరికాయల గుట్టను చూసి ఆశ్చర్యపోయింది కార్తి. ఒక హిమాలయ పర్వతం నిమిషాల్లో కరిగి కొన్ని కొబ్బరికాయలుగా మిగిలిపోయింది.

మొత్తం కాయలు వలిచి గునపం నేల మీద నుండి లాగి పారేసి క్రింద కూర్చున్నాడు మమ్ముటి.  మెల్లమెల్లగా మనసును అదుపులోకి తెచ్చుకున్నాడు. చాలా మామూలుగా చిరునవ్వైనా నవ్వకుండా రెప్పవాల్చకుండా తనను చూస్తూ నిలబడిన కార్తిని అడిగాడు.

‘‘నువ్వు వస్తావా…?’’

‘‘వస్తాను,’’  కార్తి జవాబిచ్చింది.

‘‘ఎక్కడికి?’’

‘‘నాకు తెలుసుకోవాలని లేదు.’’

పొన్నానిలోని సముద్రపు ఘోష అప్పుడు అక్కడ వినిపిస్తున్నట్లు తోచింది మమ్ముటికి.

తన బలమూ మగతనమూ సౌందర్యరాశిని సొంతం చేసుకోవడం కోసమే పుట్టినవి కదా? పొన్నాని పిల్లలకు ఆరాధనామూర్తియైన తను వాళ్ళ నుండి తప్పించుకొని తిరిగినది ఈ పిల్ల కోసమేనని ఇప్పుడు తెలుస్తోంది.

కాని ఆమె ముందు ఎంత హుషారు ప్రదర్శించినా ఆమె కళ్ళ నుండి ప్రసరించే కాంతిధారల ముందు తను కేవలం ఒక చిన్నపిల్లాడై మారిపోతున్నట్లు… తప్పటడుగులు వేసే పిల్లాడిలాగా ఏవో పిచ్చి పనులు చేసి భయపడుతున్నట్లు. వాత్సల్యపు కుంభాలు తెరిచిపోసిన నవ్వు నవ్వి కార్తి వెళ్ళగానే ఆ చల్లతనానికి మనశ్శాంతి  చేకూరుతుంది.

భారతప్పుళ దాటి వచ్చిన మమ్ముటి  సేకరించిన సామానుతో కళప్పుర నిండి పోయింది. బంగారురంగులోకి మారిన పోకలూ,  నూనెతో నిండిన కొబ్బరికాయలూ వాడుకకు తయారైనాయి. బాధ్యతాయుతంగా వుండే మమ్ముటి తను బయలుదేరడానికి వారంరోజులు ముందే శంకుమీనన్ని కలిసి అన్నాడు. ‘‘దొరా పొన్నానికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. లెక్కచూడండి మిగిలినవి ఇచ్చేస్తాను.’’

ఆరోజు రాత్రి ‘పత్తాయప్పుర’ మేడ మీద పడుకున్న శంకుమీనన్‌కు నిద్ర పట్టలేదు. గంటగంటకీ ఒకసారి తలుపు బయటికి వచ్చి చూశాడు. అంతవరకూ సంతరించుకున్న సంయమనపు ఆత్మసంపద వాకిటిలో పడిన వాననీరులా కారి దూరమవుతున్నది. ఏదైనా విషాద సంఘటన అనివార్యమని తెలిస్తే దాన్ని స్వీకరించగల మనోబలం ఉండాలి. లేకపోతే ఎదుర్కోగల ధైర్యం ఉండాలి. కార్తికి వ్యతిరేకంగా వేలెత్త లేని తాను, పట్టించుకోకుండా ఉండడమే మేలని అనుకున్నాడు. అలా ఉండాలంటే మనసు దృఢంగా ఉండాలి. కాని అంతవరకు ఎరుగని ఎత్తుపల్లాల్లో, సుడుల్లో ప్రవహించే తన మనసు తనదేనా అనే అనుమానం కలిగింది శంకుమీనన్‌కి. హతాశుడైన కొన్ని వేళల్లో పరుగెత్తుకెళ్ళి అమ్మాళుకు వివరాలు చెప్పి సలహా తీసుకోవాలని అనిపించేది. లేకపోతే మేనేజర్‌ వేలాయుధానికి అంతా చెప్పి ఏడ్చి ఏదైనా దారి చూపమని అడగాలని అనిపించేది. కాని ఎంతో ఉన్నతుడుగా పరిగణింపబడే తను చెల్లెలి ముందూ, మేనేజర్‌ ముందూ విలపించటమేమిటిని ఊరుకున్నాడు.

కిటికి వద్దకు వచ్చి చూసిన ప్రతిసారి వెన్నెల యొక్క తెల్ల మచ్చ, చీకటి యొక్క మసి నలుపు స్త్రీ పురుష రూపాలుగా కనబడ్డాయి. కనబడేవి నీడా, తెలుపూ అని ఖచ్చితంగా తెలిసినా అతని మనసు వాటిని స్త్రీ పురుష రూపాలుగా మలచుకుంటుంది. మళ్ళీ మళ్ళీ  స్త్రీ పురుష రూపాలు దిగిరావడం ఊహించిన అతని కండరాలు పత్తాయప్పుర నుండి దూకడానికి ప్రయత్నించింది.

ఎంత ప్రయత్నించినా కిటికీ వద్ద నుండి జరగటం కానీ, నిద్రపోవడం కానీ కుదరదని అతనికి తెలుసు. కాని అలాగే నిలబడి ఆలోచిస్తే తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటానేమోననే భయం కలిగింది.

గాలివానలో చిక్కుకున్న మనసులో హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. గబగబా మెట్లు దిగాడు. క్రింద వసారాలో పడుకుని ఉన్న వేలాయుధాన్ని తట్టిలేపాడు. అటక మీద వెతికించి ఒక లావుపాటి ఇనుపగొలుసూ, తాళమూ తీయించాడు. కిటికికి ఎదురుగా పడకకుర్చీలో కూర్చుని గొలుసుతో తనను కట్టమని ఆజ్ఞాపించాడు. మారు మాట పలకకుండా యజమాని మాటల్ని అనుసరించే వేలాయుధం ఒక రోబోలా ఆ పని చేశాడు. ఇనుపగొలుసుతో కాళ్ళు చేతులు బంధించబడిన శంకుమీనన్‌ స్త్రీ పురుష రూపాల కోసం ఎదురుచూస్తూ కూర్చుని ఆలోచించాడు. తాత్విక చింతన యొక్క అరిటి నారుతో ఎంత బలంగా కట్టిపడేసినా ఆ సమయంలో కట్టలు తెంచుకుంటుంది కోపం. చెడు చూడకుండా దూరంగా వుండే శక్తిలేదు మనసుకి. చూస్తే ఏం జరుగుతుందని ఊహించనూ లేదు. స్వయంగా తెలుసుకోలేనివాడి శరీరం ఇనుపగొలుసులకు బానిసవుతుంది.

మరునాడు తెల్లవారగానే వేలాయుధం వచ్చి గొలుసు విప్పాడు. ఆ తరవాత మరో అయిదు రాత్రులు కూడా అలాగే గొలుసుతో బంధించుకుని రెప్పవాల్చకుండా కిటికి నుండి చూస్తూ కూర్చున్నాడు శంకుమీనన్‌.

ఆరో రోజు రాత్రి` వెన్నెల మసకమసకగా మారిన వేళ` రాత్రి పూట మరో సంధ్య వెలుగు చిక్కపడే లక్షణాలు కనబడ్డాయి. గత అయిదారురోజులుగా శంకుమీనన్‌ తన మనసులో చెక్కుకున్న రూపాలు బయటికి వచ్చాయి. మమ్ముటి నీడ కార్తిని పూర్తిగా కమ్మేసినట్లు కనబడింది.

హఠాత్తుగా ఒళ్ళు మొద్దుబారిపోయినట్టు తోచింది అతనికి. అయినా సంభాళించుకున్నాడు. కిటికి ఊచల్ని గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు. పీడకలల్లో ప్రత్యేక్షమయ్యే దుర్భర బాధలే కదా నిజజీవితంలో జరిగే సంఘటనలు. ఇంటి వాకిలి దాటి కార్తి గేటు దగ్గరకు చేరగానే కేవలం  అస్థికలతో  మిగిలిన  ఒంటరి గుండెలా ఉండిపోయాడు.

ఆ తరవాత ఏమైందని గుర్తులేదు. ఎలాగోలా కార్తిని పోగొట్టుకోకుండా చూడమనే సందేశాలు వేలకు వేలు అతని ధమనుల్లో పాకాయి. కోశాలు మొక్కలుగా విభజించి లేపిన శక్తి యొక్క ప్రళయంలో అతడు రాక్షసుడుగా మారాడు. పత్తాయప్పుర మేడ మీద నుండి గాలిలోకి పాదాలు వేసి గేటులోకి దూకడానికి శరీరం ముందుకు వంగింది.

ఇనుపగొలుసులు గర్జించాయి. ఆ ఎదురుదాడికి అవి వేడెక్కి పెద్ద సవ్వడి చేశాయి. గది నేలపై నిలబెట్టిన పడకకుర్చీ విరిగిపోయింది.

చివరి యుద్ధంలో అతని మనసు మరో మార్గం లేక శరీరం నుండి బయటపడి నియంత్రణాతీతమై గేటు దాటే కార్తిని సమీపించింది.

‘‘నువ్వు వెళ్తున్నావా…’’

ఎవరో కుదిపి పిలిచినట్లు కార్తి చివరగా ఒకసారి వెనక్కు తిరిగి చూసింది. ఆ సమయానికి రక్తసిక్తమైన కాళ్ళూ చేతులుతో కుర్చీలోనే స్పృహ కోల్పోయి పడి వున్నాడు శంకుమీనన్‌.

మసక వెన్నెలలో మేలేప్పురం ఇంటి రూపురేఖలు ఒక అస్థిపంజరంగా మిగిలాయి. ఆజానుబాహువులైన వృక్షాలు చీకటికి కాపలాదార్లుగా మేలేప్పురం ఇంటి పెరటిలో కాపలా కాసాయి. ‘పంది పరంబు’లోని మట్టిపొరల్లో నుండి మశూచి యొక్క వేడి నిట్టూర్పులు ఎగిశాయి. చూపులకతీతమైన దూరంలో ఎక్కడో దాగి ఉండే ఒక లేత ఉదయపు పొరల్లోకి నడిచారు మమ్ముటి, కార్తీలు.

మమ్ముటి పాదాలను ఏకాగ్రత రూపమెత్తినట్లు కనబడిన కార్తి ఒక నీడలా అనుసరించింది. ఇంత త్వరలో ఆమె తనతో నడిచి వస్తోందనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోయిన మమ్ముటి ఒకే ఒక నిమిషంలో ఆమెను భుజానికి ఎత్తుకున్నాడు. అప్పుడు అతనికి నమ్మకం కుదిరింది తనపై, తన అవయవాలపై. తొడలోని కండరాలు అలలా కదిలాయి.

శాప విముక్తులైన ధూళి మేఘాలు మమ్ముటి నడిచిన బాటలో లేచి మిగిలిన జ్ఞాపకాల్లా మేలేప్పురం తరవాడు దాకా పాకాయి.

పొలం గట్టుల మీద నుండి ఇరుకు సందుల్లోకి సందుల్లో నుండి కొండలెక్కి దిగే దారుల్లోకి వాళ్ళు సాగారు.

మమ్ముటి నిశ్వాసాలు వెచ్చని ధారలుగా మారి కార్తి తొడల్ని వెచ్చగా చేస్తున్నాయి. ఒక నిమ్నమ్ నుండి పరిగెత్తుకెళ్ళి సమతలం చేరితే పాదాలు తడబడ్డాయి. మట్టినీళ్ళతో నురుగులు కక్కే భారతప్పుళ్ల దూరం నుండి కనబడగానే అతడు ఆగి ఊపిరి పీల్చుకున్నాడు. నదిని చూసిన కార్తి భుజం మీద నుండి దింపమంది. అతని శరీరాన్ని రాసుకుంటూ క్రిందకి జారుతూ వుంటే అతని నాసిక నుంచి, నోటి నుంచి విడుదలవుతున్న వేడి గాలి తగిలింది ఆమెకు. దాన్ని ఆస్వాదించింది ఆమె. ఆయాసంతో, తడిసిన నేలమీద తడబడే అడుగులతో నడిచారు.

నురగల పెద్దకూటమిలు పగిలి మళ్ళీకలిసి ప్రవాహ విస్తృతిలో ప్రవహిస్తున్నాయి. నదిలో విలీనమై వచ్చేది ఏ పర్వతమో! తన అమూల్యనిధితో ఈది నదికి అవతల ఒడ్డు చేరగలననే దాన్ని గురించి మమ్ముటికి అసలు అనుమానం కలగలేదు. తన శక్తిని ఊది జ్వలింపచేసి అతడు తయారైనాడు.

వంగినప్పుడు బండరాయిగా మారిన తన వీపు మీద ఎక్కమని అతడు కార్తికి చెప్పాడు. ఆమె కదలలేదు, సుడులు తిరిగే ప్రవాహం చూస్తూ నిలబడింది.

‘‘భయపడక, ఎక్కు. నిన్ను మోస్తూ రెండుసార్లు నది దాటగలను, నాకంత బలం ఉంది,’’ మమ్ముటి అన్నాడు.

‘‘నిజమే… కాని పిచ్చి యెక్కిన నదికి అది తెలియదుకదా. నేను వస్తున్నానని దానికన్నా ముందు…’’

మాటలు పూర్తి చేయకుండానే హోమకుండంలో అర్పించే హవిస్సులా కార్తి మమ్ముటి తాపంలో అంటుకుపోయింది. అది ఆమెకు అవసరం, అత్యవసరం. కోరిక నిండిన పెదవులతో ఆమె మమ్ముటి వక్షస్సులోకి ఈదింది.

నది దాటకపోతే… అలాంటి సాధ్యత గురించి ఆలోచించలేకపోయింది కార్తి. అంత సాహసం చేస్తే… జీవితం అభాసుపాలైతే… అలాంటి దిశల్లో సాగాయి కార్తి ఆలోచనలు.

వణికే పెదవులతో మమ్ముటి గుండెలో తల దాచుకుంది. అతని చేతులు ఆమెను వాటేసుకున్నాయి. అంతా అందుకోవడం కోసం ఆమె పడుకుంది. మూర్తీభవించిన సంపూర్ణ స్త్రీ సౌందర్యం యొక్క మూస తడిసిన ఇసుకలో తయారైంది. మమ్ముటి ఒంటిలోని వేడి ఆమె ప్రతి అణువులోనూ పాకింది.  మెడలో, పెదవుల్లో, రొమ్ముల మధ్య, ఊరువులో… ఒకచోట తరవాత మరోచోట రసానందపు మొగ్గలు వికసించి ముడుచుకున్నాయి. చివరికి జననాంగంలోకి పాకిన ఉష్ణంతో ఆమె మైకపు సరిహద్దుల్లోకి జారుకుంది. ముక్కలు చెయ్యబడే తన శరీర సీమలను తెలుసుకుంది. భరించింది.

లొంగిపోవటమనే ఆనంద శిఖరాల్లో నించుని కార్తి తొంగి చూసింది, కోటాను కోటి ఆనందాల సూర్యులు.

‘‘ రా ఇంక పద. ఇక ప్రమాదపు నది కానీ, సముద్రం కానీ… ఏదైనా కానీ… కలిసి దాటుదాం.’’

అవరోహణపు మెట్ల నుండి జారే మమ్ముటి శరీరాన్ని ఆమె తట్టి లేపింది. అభినందనలు అందుకున్న బాలుని అల్లరి నవ్వుతో అతడు కార్తి నుండి ముఖం తిప్పుకున్నాడు. నదీ జలంలోకి శయన ప్రదక్షిణం చేసి తన నగ్నతను దాచుకున్నాడు. అతని స్వచ్ఛమైన నవ్వుని నదిలోని అలలు అందుకొని అద్దంలో లాగా పలుచోట్ల ప్రతిబింబించాయి.

జలస్ఫటికం నుండి వంకరగా తిన్నగా పెరిగిన మమ్ముట్టి యొక్క శరీర చిత్రాలను చూస్తూ కూర్చుంది కార్తి.

ఎంత అందం! ఆమె ఆశ్చర్యబోయింది.

కొన్ని నిమిషాల క్రితం ఇంత అందం తన ఒంటిని కప్పి వేసిందనే విషయం నమ్మలేకపోయింది. ఆమె ఆ అపనమ్మకంలోని భాగంగా నది తన ప్రియుడిని తస్కరిస్తుందేమోననే భయం రాగానే ఆమె నీటిలో దిగి మమ్ముటిని బయటకు లాగింది.

కార్తిని వీపు మీద ఎక్కించుకుని, ఒక తెప్పలా భారతప్పుళ దాటాడు మమ్ముటి. వీపును అంటుకొని ఉండే కార్తీ బరువు తక్కువ ఉండటం వల్ల ఆమె మత్స్యకన్నెగా మారిపోయిందేమోనని ఊహించి సరదాపడ్డాడు. నదిలో ఈదేటప్పుడు ఆమె శరీర స్పర్శకి పులకరించాడు.

ప్రవాహపు శక్తికి తట్టుకొని నది మధ్య ఈదేటప్పుడు కూడా మమ్మటికి ఇబ్బంది అనిపించలేదు.  మేలేప్పురం  తరవాడులో  అంతవరకు  మండిన ఉత్కంఠ, భయాందోళనలు ఎప్పుడో ఎక్కడో కాటువేసి పడగ ముడుచుకున్నాయి. మరణ భయం కూడా కొన్ని నిమిషాల క్రితం జరిగిన స్కలనంతో కొట్టుకుపోయింది. అంతవరకు అనుభవం లోకి రాని ఒక ప్రశాంతత అతన్ని స్థితప్రజ్ఞుణ్ణి చేసింది.

గుర్రాలు

LR SWamy

  ఎల్.ఆర్. స్వామి కేరళలో పుట్టారు. ఉద్యోగరీత్య విశాఖ వచ్చి స్థిరపడ్డారు. మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు మీద మక్కువతో ఆ భాషను నేర్చుకుని రచనలు చేస్తున్నారు. అనువాదకులుగా, కథారచయితలుగా తనదైన ముద్ర కనబరిచారు. ఇప్పటిదాక ఐదు కథాసంపుటాలు ప్రచురించారు. మలయాళం నుంచి తెలుగులోకి తొమ్మిది పుస్తకాలను అనువదించారు. అంతేకాదు ఇక్కడి నుంచి కూడా తొమ్మిది పుస్తకాలను మలయాళం లోకి అనువాదం చేశారు. మలయాళంలోకి అనువాదం చేసిన వాటిలో గురజాడ, శ్రీశ్రీ, శివారెడ్డి, డా.ఎన్ గోపి, కేతువిశ్వనాథరెడ్డి మొదలైన వారి రచనలు ఉన్నాయి. మరోవైపు తమిళం నుంచి తెలుగులోకి ఒక పుస్తకాన్ని అనువదించారు. ఇటీవలే ఆయన సరికొత్త కథల పుస్తకం కథాకాశం విడుదలైంది. ఇది పాలపిట్ట పబ్లికేషన్స్ వారు వేశారు. అధ్యయంతోనే మంచి కథ రాయడం సాధ్యమంటారు ఎల్ ఆర్ స్వామి. – వేంపల్లె షరీఫ్ 

గుర్రాలు పరిగెడుతున్నాయి. మెడ తిప్పకుండా, అట్టూ ఇట్టూ చూడకుండా, పక్క ట్రాకులో పరిగెత్తే గురాలను పట్టించుకోకుండా పరిగెడుతోంది ప్రతి గుర్రం. తన లక్ష్యం చేరటమే  జీవిత పరమావధిగా తన ట్రాకులోనే పరిగెడుతోంది.గుర్రాలను పోషించేవారు, గుర్రాలమీద డబ్బు పెట్టుబడిగా పెట్టినవారు దూరదర్శిని ద్వారా తమ గుర్రాలను వీక్షిస్తూ,అవి ముందుకు దూకుతే ఆనందంతో కేరింతలు కొడుతూ, ఈల వేస్తూ, గెంతుతూ ప్రోత్సాహం అందిస్తున్నారు. ఒకటే గోల!

ఆ గోల భరించలేక పోయాను. చిననాటినుండి అలవాటైనదే ఆ గోల. ఆ గోలలోనే కళ్ళు తెరిచాను, పెరిగాను, బ్రతిగాను. కానీ, ఈ మధ్యఎందుకో ఆ గోల అసహ్యంగా అనిపిస్తోంది, భరించలేక పోతున్నాను .

మంచం మీద లేచి కూర్చున్నాను, మెల్లగా మంచం అంచుకు జరిగి అక్కడ ఉంచిన చేతికర్ర అందుకున్నాను. చేతికర్ర సహాయంతో బలవంతంగా లేచి నిలబడ్డానికి ప్రయత్నించాను. మోకాళ్ళు వణికాయి. అయినా, శక్తి కూడపెట్టుకుని, నీరు దిగిన పాదాలు ఈడ్చుకుండూ ముందుకు సాగి, రేస్కోర్సు వైపువున్న కిటికీ గట్టిగా మూసివేశాను.

గోల కొద్దిగా తగ్గినటు అనిపించింది. కొంత హాయిగా తోచింది.

కిటికీ బిగించి గదిలో కుదించుకుపోవటం నాకు ఇష్టంఉండదు. బాహ్యప్రపంచపు వెలుగు తగలనివాడు బ్రతికేవున్నా శవమేనని నా అభిప్రాయం. అయినా ఎందుకో నేటి పరుగు పందెం చూడలేకపోతున్నాను.  ఇతరులను – వాళ్ళు బంధువులైనా మిత్రులైనా సరే – ఓడించడంకోసం పరుగెత్తటం, అన్యాయంగానైనా ఓడించాలనే తపన పెంచుకోవటం, గెలిచిన పిదప ఓడిపోయినవాడ్ని కించపరిచటం, అందువల్ల గొడవలు తలయెత్తటం – ఇవి చూస్తున్నప్పుడు ఏదో కంగారు, తల తిరుగుతున్నటు, నాలుక ఎండిపోతున్నటు, ఒక చుక్క నీరు తాగుతే బాగుండు. మంచం వద్ద ఉన్న నీళ్ళ కూజా అందుకున్నాను. కూజా ఖాళీగా ఉంది!

నీరు నిండిన పాదాలు ఈడ్చుకుంటూ ముందుకి సాగాను. ఫ్రీడ్జ్ వద్దకు చేరి  తలుపు తీసాను. అది ఎప్పుడో తుదిశ్వాస విడిచేసింది కదా! ఆ మాట గుర్తురాని నా మతిమరుపుని మనసులో తిట్టుకున్నాను. అవును మరీ! ఈ మద్య ఏది గుర్తుండటం లేదు.

నా యవ్వనంలో నా చేతులతో తెచ్చుకున్న ఫ్రీడ్జ్కు కూడా నాతోపాటు ముసలితనం రాదూ…నాలా జబ్బు చేయదూ! డాక్టరులాంటి మెకానికుల అవసరం రాదూ…! ఇంకా ఊపిరి పీల్చే నన్నే పట్టించుకోని అయినవాళ్ళు నా ఫ్రీడ్జ్ గురించేం పట్టించుకుంటారు…?

గట్టిగా నిట్టూర్చాను. కాళ్ళు ఈడ్చుకుంటూ మళ్ళీ మంచంవద్దకి వస్తుంటే రోడ్డు కనబడింది.

ఒక ఇరుకైన రేస్కోర్సులా ఉంది రోడ్డు. చాలా రద్దీగా ఉంది. నియమ నిబంధనలు పాటించకుండా పరిగెడుతున్నాయి గుర్రాలు. రంగురంగుల గుర్రాలు…తమ గురించి మాత్రమే పట్టించుకునే గుర్రాలు…రంగురంగుల బొట్టుల మచ్చలతో కూడిన గుర్రాలు…నుదుటిమీద నామాలువుండే గుర్రాలు…మేడకి ఇరువైపుల వేలాడే జూలుతో కూడిన గుర్రాలు…వీపు మీద బరువు మోసే పిల్ల గుర్రాలు…

గొంతు తడియారిపోయింది. తల తిరుగుతున్నటు, మైకం లోకి జారిపోతున్నట్టు…

ఈ మధ్య తరచూ ఇలా జరుగుతోంది. డాక్టరుని కలవాలని అనుకుంటాను. కానీ తెసుకెళ్ళేవారెవ్వరు?

డాక్టరు వద్దకు వెళ్లాలంటే అబ్బాయి అరుస్తాడు. వారం రోజులక్రితం అదే జరిగింది.

”నీకు ఇప్పుడు డాక్టరు కావలసి వచ్చాడా…?” అబ్బాయి కేకలు వేసాడు.”ఒంటిలో బాగోలేకపోతే కళ్ళు మూసుకొని పడుకో.ఒంటిలో బాగుంటే మాత్రం నువ్వు చేసేదేముంది?”

నిజమే! నేను చేసేదేముంది…తిని పడుకోవటం తప్ప…!

”అది కాదురా —-” అయినా ఏదో చెప్పబోయాను.

”నువ్వు ఏమి చెప్పక, నోరు మూస్కోని పడుకో. నిన్ను,నేను డాక్టర్ల చూటూ తిప్పలేను.ఆ ఖర్చు కూడా నేను భరించలేను. ఇప్పటి నీ ఖర్చులే తట్టుకోలేకపోతున్నా.”

ఏం చెప్పగలను! నేనేమైనా పరిగెత్తే గుర్రమా…పరిగెత్తే గుర్రాలకైతే, ఒంటిలో ఏ మాత్రం బాగోలేకపోయినా డాక్టర్లను తీసుకొస్తారు. వైద్య పరీక్షలు చేయిస్తారు. అవసరం ఉన్నా లేకపోయినా బలం మాత్రలు ఇప్పిస్తారు. వాటిమీద ఖర్చు చేస్తే లాభం రావచ్చు. ఆదాయం తేలేని గుర్రాలకోసం, ముసలి గుర్రాల కోసం ఖర్చు చేస్తే ప్రయోజనం ఏమిటీ! వాటికి పెట్టె గుగ్గిళ్లూ నీరు కూడా దండుగని అనుకుంటూ వుంటే వైద్యం చేయించటం కూడానా…తుపాకీలోని ఒక తూటా ఖర్చు చేస్తే గుగ్గిళ్లూ,  నీరు కూడా మిగులు కదా!

తుపాకి గుర్తుకు రాగానే నా దృష్టి గోడ మీదకి మళ్ళింది.  ఉంది!  తుపాకి ఇంకా అక్కడే ఉంది!  నైస్సాం నాటి తుపాకి అది.  ఆ తుపాకిని పురావస్తుశాఖావారికి అప్పగించాలని గొడవ పెడుతున్నాడు అబ్బాయి.  ఒకటి రెండు సార్లు కలయబడి లాగేసుకోబోయాడు కూడా.  నేను వదులుతానా…!

గోడకి దగ్గరగా జరిగి తుపాకిని ఆప్యాయంగా తడిమాను.  నా తుపాకి!  నాకు ప్రియమైన తుపాకి!   నాకు తిండిపెట్టి బ్రతుకునిచ్చిన తుపాకి!   ఆ తుపాకితో ఎన్నెన్ని ముసలిగుర్రాల బాధను తుడిచేయలేదు!  ఒక తూటా సరిపోయేది.  గురి తప్పేది కాదు!   కాని ఇప్పుడు…

తుపాకి చేతులోఉంది.   తూటా కూడా ఉంది.   అయినా, బాధలతో సతమతమయ్యే  ఎన్నో ప్రాణాలకు విముక్తి ప్రసాదించిన చేతులు సొంత బాధలను తొలిగించుకోలేక పోతున్నాయి .
అయినా మనిషీ,  గుర్రామూ ఒకటేనా?  ఏమో!  ఈ రోజుల్లో గుర్రానికి మనిషికి తేడా ఏముంది! పరుగు పందెం కోసమే పుట్టిన జీవులు!

డాక్టరుని కలవాలి.  కలిస్తే…

డాక్టరు మాత్రం ఏం చెబుతాడు కొత్తగా అప్పుడెప్పుడో చెప్పిన మాటలే మళ్ళీ చెబుతాడేమో…

‘’ఏం చెప్పను రావుగారు” డాక్టరు అప్పుడు అన్నాడు “అలా, అలా, గడుపుకోవటమే.  ఇంచుమించు పుచ్చిపోయిన చెట్టుకి మళ్ళీ చిగురు పుట్టించగలమా…?’’

‘’నిజమే డాక్టరుగారు. నా బాధ కూడా అదే.  పుచ్చిపోయిన శరీరంతో పని చేయని మనసుతో,  మత్తిమరుపుతో,  లక్ష్యం లేకుండా,  అయినవాళ్ళకు సమాజానికి బరువుగా ఇంకా బ్రతకటం ఎందుకు,డాక్టరుగారు?  తనవారికీ, సమాజానికీ ప్రయోజనం లేని బ్రతుకుకు ముగింపు పలుకుతే…?’’

‘’ఏం చేస్తాం రావుగారు? అయినా ఆయువు ఉన్నంత కాలం  బ్రతగాలి కదా.”

‘’అది అలనాటి మాట.  ఇప్పుడు చావు మనిషి చేతిలోనే ఉంది కదా. ఊపిరి పీలుస్తున్నాను  కనుక నేను బ్రతికే ఉన్నానని మీరంటున్నారు, కానీ నేనెప్పుడో చనిపోయాను డాక్టరుగారు.  నన్ను ఒక అంటురోగిలా,  కాళ్ళు విరిగిన కుర్చీలా, మా అబ్బాయి ఇక్కడ పడేసినప్పుడే నేను చనిపోయాను, సర్ .’’ నా కళ్లనుంచి జాలువారిన కన్నీరు రాతినేల మీద పడి చెదిరాయి. “ఇప్పుడు నాఆలోచన ఒకటే. ఎలా నిష్క్రమించటం?‘’

“తప్పు, రావుగారూ, తప్పు, అలా ఆలోచించకూడదు. ఆత్మహత్య నేరం, పాపం కూడానూ.”

“కావచ్చు కాని అది మా లాంటి ముసలి గుర్రాలకు వర్తించదేమో! అడుగు తీసి అడుగు వేయలేని మేం సామాజిక వనురులు మింగుతూ క్రియాత్మక సేవలు చేయక, బ్రతకటమే  మహాపాపం. అసలే అయినవారి అప్యాయతలకు దూరమై ఇంకా…”

“ఆప్యాయత,” డాక్టరు గట్టిగా నవ్వాడు. “అది వుత్త బూటకపు మాట రావుగారూ. అలనాటి మనుషులని నడిపించింది అది. ఇప్పుడు మనిషిని నడిపేది స్వప్రయోజనం. మీ బ్రతుకు మీది. ఎవ్వరూ వేరెవ్వరు గురించి బ్రతకటం లేదు. మీరు ఈ ఆలోచనకి రావాలి. లేకపోతే నేటి బ్రతుకు నరకమే. మొత్తం బ్రతుకు  గుర్రశాలలోనే గడిపారు మీరు. తమ పిల్లలు పట్టించుకోవటం లేదని అవి బాధ పడుతున్నాయా? ఈ రోజుల్లో మనిషి బ్రతుకు గుర్రాల బ్రతుకేనండి.’’

నేనేమీ అనలేదు మగత నిద్రలోకి జారిపోయాను.

ఏదో పెద్ద శబ్దం విని ఉలిక్కిపడి లేచాను. ఒళ్ళు చెమటతో తడిసి ఉంది. ఆస్బెస్టాస్  వేసిన ఇంటి పైకప్పునుంచి వేడి దిగుతోంది. మంచం వద్ద ఉన్న ఫాన్ స్విచ్ నొక్కాను. ఫాన్ తిరగలేదు.

బాగా దాహం వేసింది—ఆకలి కూడా –గది తలుపు వైపు చూశాను.

సాధారణంగా గది తలుపు కొద్దిగా తెరిచి అన్నమూ నీరూ లోపలకు నెట్టేస్తారు. గదిలోకి ఎవ్వరూ రారు.

ఆశగా మళ్ళీ చూశాను. లేదు, లేదు, అన్నమూ నీరూ లేదు!

బహుశా నేటి పరుగుల తొందరలో మరిచిపోయిఉంటారు! పరిగెత్తలేని గుర్రాలకు గుగ్గిళ్లూ నీరూ పెట్టకపోతే మాత్రం అడిగేదెవ్వరు?

నాలుక తడియారింది . కళ్ళు మళ్ళీ మూతలు పడ్డాయి.

మెలుకువ వచ్చినప్పుడు కొంత చల్లగా ఉన్నటు తోచింది.

టైం తెలుసుకోవాలని గోడ గడియారం వైపు చూశాను. గడియారంలోని ముళ్ళు కదలటం లేదు!

మెల్లగా కదలి కిటికీ రెక్కలు తీశాను.చల్లని గాలి ముఖాన్ని తాకింది.

పరిగెత్తి అలసిపోయిన సూర్యుని గుర్రాలు కక్కిన నురుగు, నెత్తురు పచ్చిమాన పడివుంది.

ఆ నాటి రేసు ముగిసినట్టుంది. గెలిచిన గుర్రాలు యాజమాన్యం వారి మన్నెనలు పొందినందువల్ల, వెలిగే ముఖాలతో తిరుగుతున్నాయి. గెలవని గుర్రాలు వేలాడే పాలిపోయిన ముఖాలతో, అక్కడక్కడ తచ్చాడుతున్నాయి. భవిష్యత్తులోని పరుగుల పందెం గురించి తెలియని పసిగుర్రాలు గంతులు వేసి ఆడుకుంటున్నాయి. ముసలి గుర్రాల బ్రతుకుకి స్వస్తి పలకటానికి, తుపాకి సిద్దం చేసుకుంటున్నాడు గుర్రాల ప్రదర్శనకి బాధ్యత వహించేవాడు.

అప్రయత్నంగా నా చేతులు గోడ మీద ఉన్న తుపాకి  మీదకి వెళ్లింది. తుపాకి తీసి ఒడిలో పెట్టుకుని దాన్ని ఆప్యాయంగా తడిమాను. ట్రిగర్ నొక్కి చూశాను,పని చేస్తోంది! ఈ తుపాకిని లాగేసుకోవటానికి ఎంత ప్రయత్నం చేశాడు అబ్బాయి! నేను దీన్ని వదులుతానా!

మరోసారి తలుపు వైపు చూశాను…అన్నమూ నీరు కనబడలేదు. తుపాకిని ఒడిలో పెట్టుకొని కూర్చున్నాను.

మెల్లగా తలుపు తెరిచినటైంది. పిల్లిలా అడుగులు వేసి లోపలకు వచ్చాడు అబ్బాయి. నా వద్దకి వచ్చి తుపాకి మీద చేయి వేసాడుతుపాకి లాగేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. నేను వదులుతానా, కలియబడ్డాను. తుపాకి పేలింది.

ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. అబ్బాయి కనబడలేదు. గది తలుపు వేసే ఉంది! గదినిండా వెన్నెల! ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంది. రేపటి పరుగు కోసం తయారయ్యే  గుర్రాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ముసలి గుర్రాలు, నాలా మగత నిద్రలోనుంచి లేచి మూలుగుతున్నాయి. ప్రాణవిముక్తి కలిగించే తూటా కోసం ఎదురు చూస్తున్నాయి.

ఆశగా తలుపు వైపు చూశాను. తలుపు తెరిచినట్టు లేదు.

రేస్కోర్స్  చూస్తూ కూర్చున్నాను. రేస్కోర్స్ లో తుపాకి పేలిన శబ్దం. గుర్రాల రోదనలు.

నా చేతులు అప్రయత్నంగానే తుపాకి అందుకుంది  ట్రిగర్ నొక్కాను. తుపాకి పేలలేదు. అప్పుడు గుర్తువచ్చింది, అబ్బాయి తుపాకీలోని తూటా తీసి పారేశాడనేది!

విసుగుగా తుపాకిని విసిరిపారేశాను . మంచం మీద వాలి ఒకవైపు తిరిగి పడుకున్నాను. అప్పుడు కనబడింది,గో డ మీద మా మనవుడు ఫోటో.  వాడు నన్ను చూసి ఆప్యాయంగా నవ్వుతున్నాడు! వాడి ఆ నవ్వుని కాపాడాలి! వాడినైనా ఈ రేస్కోర్సుకు దూరంగా ఉంచాలి!

అవును! నా పని ఇంకా ఉంది.

 

 Front Image: Mahy Bezawada